నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు] వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.
అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.
ముక్తికి మార్గం
ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?
“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,
مَنِ النَّجَاةُ؟ (మన్ నజాత్?)” “ముక్తికి మార్గం ఏది?”
ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:
أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ (అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక) నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి
ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.
అంటే ఈ హదీస్లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.
దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.
నాలుక ప్రాముఖ్యత
ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.
ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:
مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ (మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్) “ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”
ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.
ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,
ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:
مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ (మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ) “ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”
ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.
నాలుక ఉపద్రవాలు
మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟ (అతద్రూన మల్ గీబహ్?) “గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”
సహాబాలు అన్నారు,
اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ (అల్లాహు వ రసూలుహూ అ’అలమ్) “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”
సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,
ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ (దిక్రుక అఖాక బిమా యక్రహ్) “నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”
అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),
أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟ (అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?) “ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”
“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,
إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ (ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు) “అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”
అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.
وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ (వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు) “ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”
అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.
కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.
అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్లో ఇలా తెలియజేశాడు:
…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ “… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)
అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.
ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.
రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.
మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్లోని చివరి భాగం ఇది:
وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ “ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”
ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.
నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ “నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”
సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.
ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.
ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.
అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
విశ్వాసం & విశ్వాస మాధుర్యం (Emaan & Halawatul Emaan) [34 నిముషాలు] వక్త: ముహమ్మద్ అబూబక్ర్ బేగ్ ఉమ్రీ (ఏలూరు) – Speaker : Muhammad Abubaker Baig Omeri (Eluru) https://youtu.be/nGEEpqhFH9c
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు, విశ్వాస మాధుర్యాన్ని రుచి చూసేందుకు అవసరమైన మూడు గుణాల గురించి ఈ ప్రసంగం వివరిస్తుంది. విశ్వాసం ఒకసారి హృదయంలో ప్రవేశించాక స్థిరంగా ఉంటుందని, కానీ మంచి పనులు మరియు పాపాలను బట్టి అది హెచ్చుతగ్గులకు లోనవుతుందని సహాబాల ఉదాహరణలతో వివరించబడింది. విశ్వాస మాధుర్యాన్ని రుచి చూడాలంటే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం; కేవలం అల్లాహ్ కొరకే ఒకరినొకరు ప్రేమించడం మరియు ద్వేషించడం; మరియు విశ్వసించిన తర్వాత అవిశ్వాసం వైపు తిరిగి వెళ్లడాన్ని అగ్నిలో పడవేయబడటమంత తీవ్రంగా ద్వేషించడం అనే మూడు లక్షణాలు అవసరమని చెప్పబడింది. హజ్రత్ అబూబక్ర్, ఉమర్, బిలాల్, మరియు హంజలా (రదియల్లాహు అన్హుమ్) వంటి సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు వారి ప్రేమ, త్యాగం మరియు విశ్వాస స్థిరత్వాన్ని తెలియజేస్తాయి.
అల్ హమ్దులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద, అమ్మా బఅద్. ఫ అవూజు బిల్లాహిస్సమీయిల్ అలీమ్ మినష్షైతానిర్రజీమ్ మిన్ హమ్దిహీ వ నఫ్ఖిహీ వ నఫ్సిహీ, బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] (ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి.)
سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنْتَ الْعَلِيمُ الْحَكِيمُ [సుబ్ హా నక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్] (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞానివి, వివేకవంతుడవు.)
رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي [రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్లిసానీ యఫ్ఖహూ ఖౌలీ] (ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కోసం విశాలపరచు. మరియు నా కార్యాన్ని నాకు సులభతరం చేయి. మరియు నా నాలుకలోని ముడిని విప్పు, తద్వారా వారు నా మాటను అర్థం చేసుకోగలరు.)
اللهم رب زدني علما [అల్లాహుమ్మ రబ్బి జిద్నీ ఇల్మా] (ఓ అల్లాహ్, ఓ నా ప్రభూ, నా జ్ఞానాన్ని వృద్ధి చేయి).
ప్రియ సోదరులారా, తొలగింప బడిన షైతాన్ యొక్క కీడు నుండి రక్షింపబడుటకై అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు, సకల స్తోత్రములు అల్లాహ్ తబారక వ తఆలాకే అంకితము. ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్టించి, ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలిచాడు.
వారి వైపునకు సందేశాన్ని జారీ చేసేటటువంటి ఉద్దేశముతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు. ఈ ప్రవక్తల యొక్క పరంపర హజ్రత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ఆదర్శ మహామూర్తి, హృదయాల విజేత, జనాబె ముస్తఫా, అహ్మదే ముజ్తబా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తన దైవదౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ధరణిపై ఎంతమంది దైవ ప్రవక్తలనైతే ప్రభవింపజేశాడో వారందరిపై కూడా అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కారుణ్యాలు కురిపింపజేయుగాక. ముఖ్యంగా, చిట్టచివరి ప్రవక్త, మహనీయుడైనటువంటి ప్రవక్త, ముహమ్మదే అక్రం సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క కోటానుకోట్ల దరూద్లూ సలాములూ, శుభాలూ మరియు కారుణ్యాలూ కురిపింపజేయుగాక, ఆమీన్.
సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మూడో సూరా, సూరా ఆలి ఇమ్రాన్ 102వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ [యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్] ఓ విశ్వాసులారా! అల్లాహ్కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా! సోదర మహాశయులారా, ఎక్కడైతే అల్లాహ్ తబారక వ తఆలా ఈ పదాలను వినియోగిస్తున్నాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ, దాని అర్థము ఓ విశ్వసించినటువంటి ప్రజలారా అని. అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, “ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి, ఏ విధంగానైతే ఆయనకు భయపడాల్సినటువంటి హక్కు ఉన్నదో. వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్, మరియు మీరు విశ్వాసులుగా తప్ప, అవిశ్వాసులుగా మీరు మరణించకండి. సోదర మహాశయులారా, ఈ వాక్యంలో ప్రస్తావించబడినటువంటి విషయము విశ్వాసుల గురించి, విశ్వాసం గురించి.
విశ్వాసం (ఈమాన్) యొక్క లక్షణాలు
అయితే, విశ్వాసానికి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, విశ్వాసం ఎప్పుడైతే ఒకరిలో ప్రవేశిస్తుందో, దానిని వారి మనసుల నుంచి తీయటము, అది ఎవరి తరం కానటువంటి పని అయిపోతుంది. అబూ సుఫియాన్ను హిరకల్ అనేటటువంటి రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు:
ఎవరైతే ఆయనను విశ్వసించారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాంను స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అందులో ప్రవేశించిన తర్వాత, అందులో ఉన్నటువంటి వారు ఎవరైనా గాని, వారు వెనక్కు మరలారా? లేకపోతే దాన్ని వదిలివేశారా?
అంటే అబూ సుఫియాన్, ఇస్లాంకు బద్ధశత్రువు అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఇంకా ఇస్లాం స్వీకరించనప్పుడు, జవాబు పలుకుతూ అంటున్నాడు, “లా”, వారిలో ఏ ఒక్కరూ కూడా వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి పాల్పడలేదు, వారు ఏ విధంగా కూడా ఇర్తిదాద్కు పాల్పడలేదు, ధర్మభ్రష్టతకు పాల్పడలేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు హిరకల్ రాజు అంటున్నాడు, “కధాలికల్ ఈమాన్ హీన తుఖాలితు బషాషతుహుల్ ఖులూబ్.” విశ్వాసం అంటే ఇదే, అది ఎప్పుడైతే మనిషి యొక్క హృదయంలో ప్రవేశిస్తుందో, దానిని హృదయంలో ఎలా నాటుకుంటుందంటే, దాన్ని తీయటం ఎవరివల్లా కాదు.
అదే విధంగా, విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే సోదరులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రతి వ్యక్తిలోనూ ఒకే స్థాయిలో ఉండదు. కొందరిలో ఉచ్చ స్థాయికి చెంది ఉంటే, మరికొందరిలో అతి తక్కువ స్థాయికి చెందినదై కూడా ఉండవచ్చు. సహాబాల యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వారిపై ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు చేసినా కూడా, వారిని వారి విశ్వాసం నుంచి ఏ విధంగా ఎవరూ తొలగింపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ సూరా ఇబ్రాహీం, 14వ సూరా, 46వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ [వ ఖద్ మకరూ మక్రహుమ్ వ ఇందల్లాహి మక్రుహుమ్ వ ఇన్ కాన మక్రుహుమ్ లితజూల మిన్హుల్ జిబాల్] వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.
అల్లాహ్ తబారక వ తఆలా అంటున్నాడు, వారు ఎన్ని కుట్రలు పన్నారంటే, వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఈ పర్వతాలను, కొండలను వారి స్థాయి నుంచి, వారి ప్రదేశం నుంచి వారు కదపలేకపోయారన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ కొండలు, పర్వతాలు అన్నటువంటి విషయాన్ని సహాబాల యొక్క విశ్వాసంతో పోల్చటం జరిగింది. అదే విధంగా అల్లాహ్ తబారక వ తఆలా సూరతుల్ హుజరాత్, 49వ సూరా, మూడో వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
أُولَٰئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ [ఉలాయికల్లజీనమ్ తహనల్లాహు ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్ మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమ్] వారే వీరు, వీరి హృదయాలను అల్లాహ్ తబారక వ తఆలా తఖ్వా, భయభక్తుల కొరకు పరీక్షించి ఉంచాడు, వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయి.
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము పెరగటము మరియు తరగటము. అంటే సోదరులారా, విశ్వాసము ఒక్కొక్కసారి మనిషి చేసేటటువంటి ఆచరణకు అది పెరుగుతూ ఉంటుంది. మరి అదే విధంగా, మనిషి చేసేటటువంటి పాప కార్యాలకు గాను విశ్వాసము తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.
అందుకనే, ఖురాన్ గ్రంథంలో ఎన్నోసార్లు, పలుసార్లు అల్లాహ్ తబారక వ తఆలా మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలన చేసుకోవలసిందిగా మనకు సెలవిస్తూ, ఖురాన్లో సూరా నిసా, నాలుగవ సూరా, 136వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలా ప్రస్తావిస్తున్నాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا آمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَالْكِتَابِ الَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِ وَالْكِتَابِ الَّذِي أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ وَالْيَوْمِ الْآخِرِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا ఓ విశ్వాసులారా! అల్లాహ్ను, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను, ఆయన తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం))పై అవతరింపజేసిన గ్రంథాన్నీ, అంతకు మునుపు ఆయన అవతరింపజేసిన గ్రంథాలన్నిటినీ విశ్వసించండి. ఎవడు అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించాడో వాడు మార్గం తప్పి చాలాదూరం వెళ్ళిపోయాడు.
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, ఏ విధంగానైతే అల్లాహ్ తబారక వ తఆలాపై విశ్వసించాలో, ఆ విధంగా విశ్వసించండి. మరియు ఆ గ్రంథంపై విశ్వసించండి ఏదైతే మీ ప్రవక్తపై అవతరింపజేయబడిందో.
కాబట్టి సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్లో పలుసార్లు మన యొక్క విశ్వాసాన్ని పునఃపరిశీలించుకోవలసిందిగా ఈ విధంగా సెలవిస్తున్నాడంటే, మూడో సూరా 102వ వాక్యం ఏ విధంగానైతే ఈ అంశంలో ప్రారంభంలో పఠించడం జరిగిందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో అంటున్నాడు:
ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు ఆ విధంగా భయపడండి ఏ విధంగానైతే భయపడాలో, మరియు అవిశ్వాసులుగా మీరు మరణించకండి, విశ్వాస స్థితిలోనే మీరు మరణించండి సుమా అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు.
తబరానీలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ మాటను ఉల్లేఖించడం జరిగింది:
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఏ విధంగానైతే మీ ఒంటిపై, మీ శరీరంపై దుస్తులు ఏ విధంగానైతే మాసిపోతూ ఉంటాయో, అదే విధంగా మీ విశ్వాసము కూడా మాసిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు దుఆ చేస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, “అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుమ్,” అల్లాహ్ తబారక వ తఆలా మీ హృదయాలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయవలసిందిగా మీరు అల్లాహ్ తబారక వ తఆలాకు వేడుకోండి అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీ అల్-జామియాలో సహీ హదీసుగా ధృవీకరించారు.
సహీ ముస్లింలో హదీస్ నెంబర్ 6966లో మనం చూసినట్లయితే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచరులలో ఒక సహచరుడైనటువంటి, ఒక అగ్రగణ్యుడైనటువంటి సహచరుడు హజ్రత్ హంజలా రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఒక ప్రస్తావన వస్తుంది. ఎవరండీ ఈ హంజలా అంటే? ఆ హంజలాయే ఎవరి గురించైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారో, “హంజలా గసీలుల్ మలాయికా” (హంజలాను దైవదూతలు స్నానం చేయించారు). ఏ రోజైతే హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి వివాహము జరిగిందో, అదే రోజు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకటించినటువంటి యుద్ధ ప్రకటనకు జవాబిస్తూ ఆయన అందులో పాల్గొని మరణించగా, షహాదత్ పొందగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “మీరు హంజలాకు శవస్నానము చేయించవలసిన అవసరము లేదు, గుసుల్ స్నానం చేయించిన అవసరము లేదు ఎందుకంటే హంజలా గసీలుల్ మలాయికా, ఎందుకంటే హంజలాకు దైవదూతలే స్వయానా గుసుల్ ఇచ్చి ఉన్నారు అని.”
అటువంటి హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబీ అయినటువంటి అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసినప్పుడు,
لَقِيَنِي أَبُو بَكْرٍ فَقَالَ كَيْفَ أَنْتَ يَا حَنْظَلَةُ అబూబక్ర్ రదియల్లాహు తలా అన్హు వారు నాతో కలిశారు, కలిసిన తర్వాత ఆయన నాతో అడిగారు, “ఓ హంజలా, నీవు ఎలా ఉన్నావు?” అని.
قَالَ قُلْتُ نَافَقَ حَنْظَلَةُ అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, నేను హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు గారితో అన్నాను, “హంజలా కపటవిశ్వాసి అయిపోయాడు” అని.
قَالَ سُبْحَانَ اللَّهِ مَا تَقُولُ “ఓ హంజలా, ఏమంటున్నావ్? అల్లాహ్ తలా యొక్క పవిత్రతను నేను కొనియాడుతున్నాను. నీవు మునాఫిక్ అయిపోవటం ఏమిటి?” అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు,
قُلْتُ نَكُونُ عِنْدَ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم يُذَكِّرُنَا بِالنَّارِ وَالْجَنَّةِ حَتَّى كَأَنَّا رَأْىَ عَيْنٍ فَإِذَا خَرَجْنَا مِنْ عِنْدِ رَسُولِ اللَّهِ صلى الله عليه وسلم عَافَسْنَا الأَزْوَاجَ وَالأَوْلاَدَ وَالضَّيْعَاتِ فَنَسِينَا كَثِيرًا
మనము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద కూర్చుని ఉండగా, ఆయన సమక్షంలో ఉన్నప్పుడు, ఆయన మనకు పరలోకం గురించి హితబోధ చేస్తున్న సమయంలో, స్వర్గము మరియు నరకము గురించి ఆయన హితబోధ చేస్తున్న సమయంలో, మా కళ్ళ నుంచి కన్నీళ్లు కారేవి, మా హృదయాలలో మా విశ్వాసము ఉవ్వెళ్లూరుతూ ఉండేటటువంటిది. కానీ, ఎప్పుడైతే మేము అక్కడి నుంచి కదిలి మా ఇళ్లకు వచ్చేసేటటువంటి వాళ్ళమో, మా యొక్క ఇళ్లలో ప్రవేశించేటటువంటి వాళ్ళం, మా భార్య, పిల్లలు, ఇంటివారు ఇందులో పడిపోయే, ఫనసీనా కసీరా (మేము చాలా వరకు మర్చిపోయాము). ఆయన చెప్పినటువంటి మాటల్లో అత్యధికంగా వాటిని మేము మర్చిపోయేటటువంటి వారము. కాబట్టి, మా ఈ పరిస్థితిని గమనించి, నేను అనుకుంటున్నాను నేను మునాఫిక్నై పోయాను అని అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారితో హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారిని తీసుకుని, ఇలా అయితే మరి మా పరిస్థితి ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకొచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ హంజలా, ఏమయ్యింది?” అని చెప్పేసి అంటే, అప్పుడు హంజలా రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు, “నాఫఖ హంజలా యా రసూలల్లాహ్,” ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హంజలా మునాఫిక్ అయిపోయాడు, కపటవిశ్వాసి అయిపోయాడు అని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అదేమిటి? అలా ఎందుకు జరిగింది?” అంటే, హంజలా రదియల్లాహు తలా అన్హు వారు ఆ జరిగినదంతా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హంజలా రదియల్లాహు తలా అన్హు వారికి జవాబు పలుకుతూ అంటున్నారు:
“ఆ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క సాక్షి, ఎవరి చేతిలో అయితే నా ప్రాణాలు ఉన్నాయో, నేను అల్లాహ్ తబారక వ తఆలాపై ప్రమాణం చేస్తూ అంటున్నాను, మీరు ఏ విధంగానైతే నా సమక్షంలో ఉన్నప్పుడు మీ విశ్వాసం ఏ విధంగా ఉందో, అదే విధంగా గనక ఎల్లప్పుడూ మీరు ఉండగలిగితే, దైవదూతలు మీరు నడిచేటటువంటి మార్గాలలోనూ, మీరు పరుండేటటువంటి మీ పడకల పైనను వారు వచ్చి మీతో కరచాలనం చేయాలనుకునేటటువంటి వారు. కానీ ఓ హంజలా, ఈ విశ్వాసము యొక్క స్థితి ఒక్కొక్కసారి అది ఎలా ఉంటుందంటే, అది ఒక్కొక్కసారి ఉవ్వెళ్లూరుతూ ఉంటుంది ఎప్పుడైతే దాని గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుందో.”
కాబట్టి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసం అన్నటువంటిది ఎప్పుడూ నిలకడగా ఉండదు, అది ఒక్కొక్కసారి, ఎప్పుడైతే మనం విశ్వాసం గురించి ప్రస్తావించుకుంటామో ఆ సమయాల్లో మన యొక్క విశ్వాసము ఉచ్చ స్థాయికి చెందుకుంటుంది, మరి అదే విధంగా ఒక్కొక్కసారి ఆ విశ్వాసము మనము చేసేటటువంటి పాప కార్యాల వల్ల కూడా అది తరుగుతూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.
విశ్వాస మాధుర్యాన్ని రుచి చూచుటకు మూడు లక్షణాలు
విశ్వాసం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించటం. విశ్వాసం యొక్క మాధుర్యం ఏమిటా అని మీరు ఆలోచించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنِ الْعَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ، أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم يَقُولُ “ ذَاقَ طَعْمَ الإِيمَانِ مَنْ رَضِيَ بِاللَّهِ رَبًّا وَبِالإِسْلاَمِ دِينًا وَبِمُحَمَّدٍ رَسُولاً ” (సహీ అల్-ముస్లిం, కితాబుల్ ఈమాన్, హదీస్ నెంబర్ 34).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ విధంగా ఉల్లేఖిస్తున్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఆ వ్యక్తి విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలడు, ఎవరైతే అల్లాహ్ను తన దైవంగా, ఇస్లామును తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రవక్తగా అంగీకరించి నడుచుకున్నటువంటి వాడు, తన ఆచరణాత్మకంగా తన జీవితాన్ని గడుపుకున్నటువంటి వాడు కచ్చితంగా విశ్వాసం యొక్క మాధుర్యాన్ని, విశ్వాసం యొక్క రుచిని అతను ఆస్వాదించగలడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
సోదర మహాశయులారా, ఎలాగైతే మనము తినేటటువంటి రుచిని ఆస్వాదించగలుగుతున్నామో, ఏదైనా ఒక తియ్యటి పదార్థాన్ని తిని మనం దాని యొక్క తియ్యదనాన్ని రుచి చూడగలుగుతున్నాము. మరి అదే విధంగా, మనము సుగంధ ద్రవ్యాలను కూడా వాసన ద్వారా మనము వాటిని ఆస్వాదించగలుగుతున్నామో, వాటి యొక్క రుచిని మనం ఆస్వాదించగలుగుతున్నాము. మరి అదే విధంగా, ఒక తియ్యటి పలుకులను విని వింటూ కూడా మనము ఆ పలుకులలో ఉన్నటువంటి రుచిని కూడా ఆస్వాదించగలుగుతున్నామో, అదే విధంగా విశ్వాసానికి కూడా ఒక లక్షణం ఉంది, అదేమిటంటే వాస్తవానికి మనం విశ్వాసులమైతే, వాస్తవానికి మనలో ఈ లక్షణాలు ఉంటే, ఏదైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారో, మనం కచ్చితంగా, తప్పకుండా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని కూడా రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో సెలవిస్తున్నారు.
అయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడాలి అని అనుకుంటే, మనలో ఏ లక్షణాలు ఉంటే మనం విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము? ఏ స్థాయికి మన విశ్వాసము చేరుకుంటే మనం విశ్వాసము యొక్క తియ్యదనాన్ని, మాధుర్యాన్ని రుచి చూడగలము? అనేటటువంటి ప్రశ్న మీ మనసులలో కలుగుతుంది కాబట్టి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ “ ثَلاَثٌ مَنْ كُنَّ فِيهِ وَجَدَ حَلاَوَةَ الإِيمَانِ
మూడు లక్షణాలు ఉన్నాయి, మూడు లక్షణాలు, మూడు గుణాలు ఉన్నాయి. ఒకవేళ మీలో గనుక ఈ మూడు లక్షణాలను మీరు పెంపొందించుకోగలిగితే, ఒకవేళ మీలో ఈ మూడు లక్షణాలు గనక ఉంటే, మీరు కచ్చితంగా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఆ మూడు లక్షణాలు ఏమిటి?
ఒకటి, ఆ మూడు లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే:
أَنْ يَكُونَ اللَّهُ وَرَسُولُهُ أَحَبَّ إِلَيْهِ مِمَّا سِوَاهُمَا [అన్ యకూనల్లాహు వ రసూలుహూ అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా] అల్లాహ్ మరియు ప్రవక్త వారి వద్ద అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి అనేది మొదటి లక్షణం.
మరియు ఒక వ్యక్తి తన తోటివారితో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు మాత్రమే ప్రేమించగలిగినప్పుడు, అల్లాహ్ తబారక వ తఆలా కోసము ప్రేమించటము, అల్లాహ్ తబారక వ తఆలా కోసమే ద్వేషించటం అన్నటువంటిది రెండవ లక్షణంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు.
మూడవ లక్షణం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ అంటున్నారు:
وَأَنْ يَكْرَهَ أَنْ يَعُودَ فِي الْكُفْرِ كَمَا يَكْرَهُ أَنْ يُقْذَفَ فِي النَّارِ ” [వ అన్ యక్రహ అన్ యఊద ఫిల్ కుఫ్రి కమా యక్రహు అన్ యుఖ్దఫ ఫిన్నార్] ఎలాగైతే విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటము అతనికి అంత అయిష్టకరంగా ఉండాలి, ఎలాగైతే ఒక వ్యక్తిని అగ్నిగుండంలో పడవేయటం ఎంత అయిష్టంగా ఉంటుందో.
(ఈ హదీసు సహీ అల్-బుఖారీ, కితాబుల్ ఈమాన్, బాబు హలావతిల్ ఈమాన్లో దీనిని ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గారు అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం ద్వారా ఈ విధంగా పేర్కొనటం జరిగింది).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలియజేసినటువంటి మూడు లక్షణాలు గనక మనలో మనం పెంపొందించుకోగలిగితే, కచ్చితంగా మనము విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలము అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. అందులో, మొదటి లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ మరియు ప్రవక్త అతని వద్ద అత్యధికంగా అందరికంటే ఎక్కువగా ప్రియతములై ఉండాలి అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదటి లక్షణంగా పేర్కొన్నారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, తొమ్మిదవ సూరా, సూరా తౌబా, 24వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఒకవేళ మీ తండ్రులు, మీ కుమారులు, మీ సోదరులు, మీ భార్యలు, మీ సమీప బంధువులు, మీరు సంపాదించిన సిరిసంపదలు, కుంటుపడుతుందేమోనని మీరు భయపడే మీ వర్తకం, మీకెంతో ప్రియమైన మీ గృహాలు మీకు అల్లాహ్ కన్నా, ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గంలో సలిపే పోరాటం కన్నా ఎక్కువ ప్రియమైనవైతే అల్లాహ్ తీసుకువచ్చే తీర్పు (శిక్ష) కొరకు ఎదురుచూడండి. అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.
అల్లాహ్ ఈ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు: వారితో ఇలా అను, మీ తాతలు, తండ్రులు, కుమారులు, మీ భార్యాపిల్లలు మరియు మీరు సంపాదించేటటువంటి సంపద, మీరు ఎక్కడ నష్టపోతారనుకునేటటువంటి మీ వ్యాపారాలు, అదే విధంగా మీరు ఎంతగానో ఇష్టపడేటటువంటి మీ స్వగృహాలు, ఇవన్నీ కూడా మీకు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కన్నా, ఆయన మార్గములో పోరాటం కన్నా ఇవన్నీ కూడా మీకు అత్యధికమైనప్పుడు, అల్లాహ్ తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లాహ్ అవిధేయులైనటువంటి జాతికి సన్మార్గముని చూపడు అని అల్లాహ్ తబారక వ తఆలా ఈ వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు.
అల్లాహ్ తబారక వ తఆలా విశ్వాసులు అల్లాహ్ తబారక వ తఆలాను ఎంతగా ప్రేమిస్తారన్నటువంటి విషయాన్ని సెలవిస్తూ సూరా అల్-బఖరా, రెండవ సూరా, 165వ వాక్యంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు:
وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ కాని అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు.
ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్కు సాటి కల్పించుకుని, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తున్నారు. కానీ విశ్వాసులు అత్యధికంగా అల్లాహ్ తబారక వ తఆలాను ప్రేమిస్తారు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ తఆలాను ఒక విశ్వాసి అయినటువంటి వాడు అత్యధికంగా ప్రేమిస్తాడు.
అదే విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీసులో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు:
عَنْ أَنَسٍ قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم “ لاَ يُؤْمِنُ أَحَدُكُمْ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْهِ مِنْ وَالِدِهِ وَوَلَدِهِ وَالنَّاسِ أَجْمَعِينَ ”
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “మీలో ఏ వ్యక్తి కూడా అప్పటివరకు విశ్వాసి కాలేరు, ఎప్పటివరకైతే నన్ను మీరు అత్యధికంగా ప్రేమించరో, మీ ఆలుబిడ్డల కన్నా, మీ బంధుమిత్రుల కన్నా, సమస్త మానవాళి కన్నా అత్యధికంగా మీరు ఎప్పటివరకైతే నేను మీకు ప్రియతముణ్ణి కానో, అప్పటివరకు మీరు విశ్వాసులు కారు” అన్నటువంటి విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. (సహీ బుఖారీ, హదీస్ నెంబర్ 15).
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారితో కలిసి ఉన్నప్పుడు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు ఈ హదీసు విన్న తర్వాత అంటున్నటువంటి మాట ఏమిటంటే, “యా రసూలల్లాహ్, మీరు అన్నట్లుగానే నేను మిమ్మల్ని సమస్త మానవాళి కన్నా, బంధుమిత్రుల కన్నా, తల్లిదండ్రుల కన్నా అత్యధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా మనసు, నా ఆత్మ, నా ప్రాణం కన్నా అధికంగా కాదు” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు.
فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” لاَ وَالَّذِي نَفْسِي بِيَدِهِ حَتَّى أَكُونَ أَحَبَّ إِلَيْكَ مِنْ نَفْسِكَ ”. فَقَالَ لَهُ عُمَرُ فَإِنَّهُ الآنَ وَاللَّهِ لأَنْتَ أَحَبُّ إِلَىَّ مِنْ نَفْسِي. فَقَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ” الآنَ يَا عُمَرُ ”.
అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “ఓ ఉమర్, నీవు ఎప్పటివరకైతే నీ ప్రాణం కంటే అధికంగా నన్ను మీరు ప్రేమించినటువంటి వారు కారో, అప్పటివరకు కూడా మీరు పూర్తి విశ్వాసి కాలేరు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడు నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే కూడా అధికంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారు అన్నారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, “అల్ ఆన యా ఉమర్,” ఓ ఉమర్ రదియల్లాహు తలా అన్హు, ఇప్పుడు మీరు పూర్తిగా విశ్వాసి అయ్యారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది.
చూశారా సోదర మహాశయులారా, హజ్రత్ ఉమర్ రదియల్లాహు తలా అన్హు వారికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాటని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అన్నిటికంటే ముందు ఒక విశ్వాసి అత్యధికంగా అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమను అత్యధికంగా కలిగి ఉండాలి. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతరుల కంటే అత్యధికంగా ప్రియతములు కానంత వరకు ఏ వ్యక్తి కూడా విశ్వాసి కాలేడు, మరి అదే విధంగా ఏ వ్యక్తి కూడా విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడలేడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు.
సోదర మహాశయులారా, తబూక్ యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో అల్లాహ్ తబారక వ తఆలా కొరకు తమ యొక్క దానాలను తమ స్తోమత మేరకు అర్పించవలసిందిగా కోరినప్పుడు, ఎంతోమంది సహాబాలు తమ తమ స్తోమత మేరకు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క మార్గంలో తమ తమ దానమును అర్పిస్తున్నటువంటి సమయంలో హజ్రత్ అబూబక్ర్ అస్స్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తమ ఇంటిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఊడ్చి, ఆయన ముందు సమర్పించుకుంటూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు తీసుకొచ్చి పెట్టగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగుతున్నారు, “ఓ అబూబక్ర్, నీ ఇంటి వారి కొరకు నీ ఇంటిలో ఏమైనా వదిలి పెట్టావా?” అంటే, హజ్రత్ అబూబక్ర్ నిస్సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు అంటున్నారు, “నేను అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్తను నా ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను” అని హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తలా అన్హు వారు జవాబు పలికారు.
సోదరీ సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన యొక్క ప్రేమ, సహచరుల యొక్క జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే, ఇటువంటి సంఘటనలు మనకు వేల కొద్దీ దొరుకుతాయి సోదర మహాశయులారా. అదే విషయాన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే మూడు లక్షణాలు ఉంటాయో వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు. అందులో మొదటి విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాము, అదేమిటంటే అల్లాహ్ మరియు ఆయన యొక్క ప్రవక్త పట్ల ప్రేమ, మిగతా వారందరికన్నా కూడా ఎక్కువగా ప్రియతములై ఉండటము.
అయితే సోదర మహాశయులారా, మనం అల్లాహ్ తబారక వ తఆలాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నామని నోటితో ఎన్నిసార్లు మనం ప్రకటించినా కూడా, అది కేవలం నోటి మాటే అవుతుంది గానీ, అప్పటివరకు అది నిజం కాదు, ఎప్పటివరకైతే వారు చూపించినటువంటి మార్గంలో మనం నడవమో. అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో, మూడవ సూరా, 31వ వాక్యంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు:
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ”మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.”
ఇలా అను, మీకు నిజంగా అల్లాహ్ తబారక వ తఆలా పట్ల ప్రేమే ఉన్నట్లయితే, మీరు నాకు విధేయత చూపవలసిందిగా వారికి ఆజ్ఞాపించు. అల్లాహ్ తబారక వ తఆలా వారి పాపాలను క్షమిస్తాడు మరియు నిస్సందేహంగా అల్లాహ్ తబారక వ తఆలా ఎంతో క్షమాశీలి మరియు అనంత కరుణామయుడు అన్నటువంటి విషయాన్ని అల్లాహ్ తబారక వ తఆలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి, నిజంగానే మనం అల్లాహ్ తబారక వ తఆలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళమే అయితే, అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అత్యధికంగా ప్రేమించేటటువంటి వాళ్ళమే అయితే, ఆయన చూపినటువంటి మార్గములో మనం నడుస్తూ మన జీవితాన్ని గడుపుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది.
సోదర మహాశయులారా, అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఆధారంగా, అందులో మొట్టమొదటి విషయము అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా వారందరికన్నా కూడా ఎక్కువ ప్రియతములై ఉండటము.
ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు, ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి వారిని కూడా అల్లాహ్ కొరకు ప్రేమించేటటువంటి వారై ఉండాలి. అదే విధంగా, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం ప్రేమిస్తున్నాము. అదే విధంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులతో మనం ప్రేమిస్తున్నాము. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమ కారణంగానే సమస్త మానవాళి విశ్వాసులతో కూడా మనం ప్రేమిస్తున్నాము. ఇదే విషయాన్ని దైవం ప్రస్తావిస్తూ, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావిస్తూ ఒక హదీసులో ఈ విధంగా సెలవిస్తున్నారు:
“ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా కొరకు ప్రేమిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ద్వేషిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే ప్రసాదిస్తారో మరియు అల్లాహ్ తబారక వ తఆలా కొరకే నిషేధిస్తారో, వీరు వాస్తవానికి తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నటువంటి వారు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట అబూ దావూద్లో ఈ విధంగా ప్రస్తావించబడింది.
కాబట్టి దీని ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, సహాబాలు ఏ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాను మరియు ఆయన యొక్క ప్రవక్తను ప్రేమించేటటువంటి వారు మరియు వారి యొక్క ప్రేమ, వారి యొక్క ద్వేషము అల్లాహ్ కొరకు మరియు అల్లాహ్ యొక్క మార్గంలోనే ఉండేటటువంటిది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు.
సోదర మహాశయులారా, ఇక మూడో విషయానికి వస్తే, మూడో లక్షణానికి వస్తే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అంటున్నారు, “మరి విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది వారికి ఎంత అయిష్టకరమైనదై ఉండాలంటే ఎలాగైతే వారిని అగ్నిగుండంలో పడవేయటం అయిష్టకరమై ఉంటుందో ఆ విధంగానే అవిశ్వాసానికి పాల్పడటం వారికి అయిష్టకరమై ఉంటుంది” అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
ఈ విషయంలో హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారిని చూసుకున్నట్లయితే, హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఎప్పుడైతే ఆయన విశ్వసించారో, ఆయన విశ్వసించిన తర్వాత మలమల మాడేటటువంటి మండుటెండల్లో ఆయనను ఈడ్చి, రాళ్లమయమైనటువంటి ప్రదేశంపై ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి, ఆయన యొక్క గుండెలపై ఒక పెద్ద బండరాయిని పెట్టి, దేవుడు ఒక్కడే అన్నటువంటి విశ్వాసాన్ని నీవు విడనాడుతావా? ఇప్పుడైనా ఒప్పుకుంటావా దేవుడు ఒక్కడు కాదు అని అన్నప్పుడు, అప్పటికీ కూడా ఆయన హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు “అల్లాహు అహద్, అల్లాహు అహద్, అల్లాహు ఒక్కడే, అల్లాహు ఒక్కడే, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరూ లేరు, నేను ఇస్లాంను వదిలిపెట్టను, నా విశ్వాసాన్ని విడనాడను” అని హజ్రత్ బిలాల్ రదియల్లాహు తలా అన్హు గారు ఏ విధంగానైతే నిలబడిపోయారో విశ్వాసంపై, ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు.
అదే విధంగా హజ్రత్ సుమయ్య రదియల్లాహు తలా అన్హా, అదే విధంగా హజ్రత్ ఖబ్బాబ్ బిన్ అర్ద్ రదియల్లాహు తలా అన్హు, వీరు చేసుకున్నటువంటి త్యాగాలు మరియు వీరు ఏ విధంగా ఇస్లాంపై నిలకడగా ఉన్నారో, ఎలాగైతే వారు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం వారికి ఎంత అయిష్టకరంగా ఉండిందంటే, ఎలాగైతే వారికి జీవించి ఉండటంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే ఎక్కువగా వారు అయిష్టకరంగా భావించేటటువంటి వారు.
కాబట్టి సోదర మహాశయులారా, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విశ్వాసము యొక్క లక్షణాలలో ఒక లక్షణము, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడటము. అయితే ఈ విశ్వాసము యొక్క మాధుర్యాన్ని అప్పుడే మనం ఆస్వాదించగలము, అప్పుడే మనం రుచి చూడగలము, ఎప్పుడైతే మనలో ఈ మూడు లక్షణాలు కూడా ఉంటాయో, ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయో. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరిలో అయితే ఈ మూడు లక్షణాలు ఉంటాయో, ఈ మూడు గుణాలు ఉంటాయో, వారు అల్లాహ్ తబారక వ తఆలా యొక్క దయతో విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకోగలరు, విశ్వాసము యొక్క ఉచ్చ స్థాయికి చేరుకున్నవారు విశ్వాసము యొక్క మాధుర్యాన్ని రుచి చూడగలరు అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు.
అందులో మొట్టమొదటిది, అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువ ప్రియతములై ఉండాలి. ఇక రెండవ విషయము, ఎవరిని ప్రేమించినా కూడా అల్లాహ్ కొరకే ప్రేమించేటటువంటి వారై ఉండాలి, అల్లాహ్ కొరకే ద్వేషించేటటువంటి వారై ఉండాలి. మరి అదే విధంగా మూడో విషయాన్ని, విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడటం అన్నటువంటిది ఎంత అయిష్టకరంగా ఉండాలంటే, ఎలాగైతే నిజ జీవితంలోనే వారిని అగ్నిగుండంలో పడవేయటం కంటే బాధగా, అగ్నిగుండంలో పడవేయటం కంటే అయిష్టమైనదిగా ఉండాలి అన్నటువంటి ఈ మూడు లక్షణాల్ని కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హలావతుల్ ఈమాన్, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని గురించి తెలియజేస్తూ పలికినటువంటి పలుకులు ఈరోజు మనం తెలియజేసుకున్నాము.
కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలాతో దుఆ ఏమనగా, ఏ విధంగానైతే ఇప్పటి వరకు కూడా మనం మాట్లాడుకున్నామో విశ్వాసము గురించి, విశ్వాసము యొక్క లక్షణాల గురించి, విశ్వాసము యొక్క రుచిని ఆస్వాదించడం గురించి, అల్లాహ్ తబారక వ తఆలా మనకు వీటన్నిటిపై ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తబారక వ తఆలా మనలో విశ్వాసాన్ని పెంపొందించుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో ఖుర్బానీ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన విధివిధానాలను వివరంగా తెలియజేశారు. ఖుర్బానీ ఎప్పుడు చేయాలి, అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు, పశువులో భాగస్వామ్య పద్ధతులు వంటి నిబంధనలను ఖురాన్, హదీసుల ఆధారంగా స్పష్టం చేశారు. అలాగే, అఖీఖా మరియు ఖుర్బానీ కలిపి చేయవచ్చా, మరణించిన వారి పేరిట ఖుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా వంటి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఖుర్బానీ పశువు మాంసాన్ని, చర్మాన్ని ఎలా పంపిణీ చేయాలో వివరిస్తూ, ఖుర్బానీ మాంసం, రక్తం కాకుండా కేవలం మనలోని భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అల్లాహ్ కు చేరుతాయని ఉద్ఘాటించారు.
ఖుర్బానీ అనగానేమి?
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. ఈనాటి ప్రసంగంలో మనం ఖుర్బానీ ఆదేశాలు తెలుసుకుందాం. ముందుగా ఖుర్బానీ అంటే ఏమిటి? తెలుసుకుందాం.
ఖుర్బానీ అంటే జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి జుల్ హిజ్జా నెల 13వ తేదీన సూర్యాస్తమయానికి ముందు వరకు రేయింబవళ్ళలో ఎప్పుడైనా నిర్ధారిత పశువులను అల్లాహ్ ప్రసన్నత కోసం జిబాహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.
ఖుర్బానీ ప్రాముఖ్యత మరియు విశిష్టత
ఈ ఖుర్బానీకి ఉన్న ఘనత, విశిష్టత ఏమిటంటే… ఖురాన్ లోని 108వ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (ఫసల్లి లిరబ్బిక వన్ హర్) కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (108:2)
అలాగే ఖురాన్ లోని 6వ అధ్యాయము 162వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు:
قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (ఖుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
ఓ ప్రవక్తా! ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే.(6:162)
ఈ రెండు ఆయతులలో ఒక విషయాన్ని గమనించారా? ఈ రెండు ఆయతులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు ముఖ్యమైన ఆరాధనల ప్రస్తావన చేసి ఉన్నాడు. ఒకటి నమాజు అయితే, రెండవది ఖుర్బానీ. నమాజుతో పాటు ఖుర్బానీ ప్రస్తావన కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు ఆయతులలో చేసి ఉన్నాడు. నమాజ్ ఎంత గొప్ప ఆరాధన అన్న విషయము మనందరమూ తెలుసుకొని ఉన్నాము. అలాంటి గొప్ప ఆరాధనతో పాటు ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేయడం వల్ల ఖుర్బానీ కూడా గొప్ప ఆరాధన, అల్లాహ్ కు ఇష్టమైన కార్యము అనే విషయము ఈ రెండు వాక్యాల ద్వారా మనము గ్రహించాలి.
ఖుర్బానీ యొక్క విశిష్టతను ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూచినట్లయితే, ఆయన ప్రతి సంవత్సరము ఖుర్బానీ చేశారు. ఆయన తన కుటుంబీకుల తరఫున ఖుర్బానీ చేయటమే కాకుండా, ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుండి కూడా ఆయన ఖుర్బానీ చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన ఆయన కుటుంబీకుల సభ్యుల తరపున ఖుర్బానీ చేసుకోవటంతో పాటు, అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుంచి కూడా ఖుర్బానీ చేశారు. అందరికీ ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన కృషి చేశారు అంటే ఆ ఖుర్బానీ ఎంత విశిష్టమైనదో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.
అలాగే ఖుర్బానీ ఎంత ముఖ్యమైన ఆరాధన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉల్లేఖనం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిస్తూ ఇలా తెలియజేశారు: “స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ చేయుటలేదో, వారు మన ఈద్ గాహ్ పండుగ నమాజు ఆచరించే స్థలం దరిదాపులకు కూడా రావద్దు” అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా మామూలు విషయాల గురించి ఆయన ఆగ్రహించరు, వారించరు. ఆయన ఆగ్రహిస్తున్నారు, వారిస్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఆ ప్రకారంగా స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు ఆచరిస్తున్న స్థలానికి, దాని దరిదాపులకు కూడా రావద్దు అని కఠినంగా ఆయన వారిస్తున్నారు అంటే ఖుర్బానీ ఎంత విశిష్టత గలదో ఎంత ముఖ్యమైన ఆరాధనయో మనము ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఖుర్బానీ అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యము తెలుసుకోవాలంటే… ఖురాన్ లో 22వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:
“తమకు అల్లాహ్ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము“. (22:34)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి అనుచర సమాజానికి ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అంటే ప్రతి అనుచర సమాజానికి ఆ ఆరాధన చేయమని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు అంటే అది అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యమై ఉంటే అల్లాహ్ ఆ విధంగా ఆదేశించి ఉంటాడు కదా?
మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా విని ఉన్నాము. ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ వద్ద పెళ్లి విషయంలో గొడవ జరిగినప్పుడు, ఖుర్బానీ చేయమని తండ్రి ఆదేశించగా వారిద్దరూ ఖుర్బానీ సమర్పించారు. ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఒకరి ఖుర్బానీ తిరస్కరించబడింది. అదంతా మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకొని ఉన్నాము ఇక్కడ అదంతా ప్రస్తావించే ఆస్కారము లేదు. కాకపోతే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వారి కుమారులు ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలైన దశలో ప్రారంభంలో వారు ఈ భూమి మీద జీవించారు. ఆ ప్రకారంగా మానవులు ఈ భూమి మీద జీవించిన ప్రారంభము నుండే ఖుర్బానీ ఆదేశాలు మానవులకు ఇవ్వబడి ఉన్నాయి అన్న విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రతి అనుచర సమాజానికి కూడా అల్లాహ్ ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అన్న విషయము కూడా మనకు బోధపడుతుంది.
ఈ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాల ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసుల ద్వారా ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనకు అర్థమవుతుంది. ఇవి కాక వేరే ఉల్లేఖనాలు ఉన్నాయి, అవి బలహీనమైనవి, కాబట్టి వాటి ప్రస్తావన నేను ఇక్కడ చేయుటలేదు. చాలామంది పండితులు బలహీనమైన వాక్యాలు, బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు… ఖుర్బానీ చేయగానే ఆ ఖుర్బానీ రక్తము భూమి మీద పడకముందే అల్లాహ్ వద్ద ఆమోదం పొందుతుంది, ఆ రక్తపు చుక్క భూమి మీద పడకముందే ఖుర్బానీ ఇచ్చే వ్యక్తుల పాపాలు మన్నించబడతాయి, ఖుర్బానీ ఇచ్చే పశువు చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖాతాలో లిఖించబడతాయి… ఇలాంటి ఉల్లేఖనాలు ఉన్నాయి కదండీ, అవన్నీ బలహీనమైన ఉల్లేఖనాలు అని ధార్మిక పండితులు నిర్ధారించి ఉన్నారు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుటలేదు.
ఇస్లాంలో ఖుర్బానీ ఆదేశం (ఫర్జ్ లేదా సున్నత్?)
ఇక రండి, ఖుర్బానీ అంటే ఏమిటి, ఖుర్బానీ విశిష్టత ఏమిటి అని మనము తెలుసుకున్న తర్వాత, ఖుర్బానీ ఆదేశం ఏమిటి? ఇస్లామీయ శాసనంలో ఖుర్బానీకి ఉన్న విలువ ఏమిటి? అంటే అది ఫరజా లేదా సున్నతా?
ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరచి ఉన్నారు. కొంతమంది ధార్మిక పండితులు ఖుర్బానీ సున్నత్ అని తెలియజేసి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం.
మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, స్తోమత ఉన్న వారిపై ఖుర్బానీ చేయటం విధి, తప్పనిసరి, వాజిబ్ అంటున్నారు. వారి ఈ వాదనకు ఆధారం ఏమిటంటే, ఖురాన్ లోని 108వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఫసల్లి లిరబ్బిక వన్ హర్” (నీ ప్రభువు కొరకు నమాజు ఆచరించు, నీ ప్రభువు కొరకు ఖుర్బానీ చెయ్యి) ఖుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు ఖుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్.
అలాగే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే, ఖుర్బానీ చేయటం స్తోమత ఉన్న వారిపై వాజిబ్, తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.
ఖుర్బానీకి అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు
ఇక రండి, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు, వాక్యాలు దృష్టిలో పెట్టుకుని చూచినట్లయితే, మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు, ఆవు, ఎద్దు, ఒంటె (ఆడది అయినా మగది అయినా) – ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే, అయినప్పటికినీ వాటి ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు. ఎందుకంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ, ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల ఖుర్బానీ చేయలేదు. కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే ఖుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
అయితే, ఈ ఎనిమిది పశువులలో ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు.
కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు ఖుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు.
మరి కొంతమంది ధార్మిక పండితులు పశువు, ఖుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు, దాని మాంసము, తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ వారు తెలియజేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా:
ఒకటి, ఒంటె ఒక వ్యక్తి తరఫు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ ఖుర్బానీ ఉత్తమమైనది.
తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరఫున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన ఖుర్బానీ.
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన ఖుర్బానీ.
ఆ తర్వాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు, పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక ఒంటెలో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన ఖుర్బానీ.
ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది ఐదవ ఉత్తమమైన ఖుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు. ఇంక అసలు విషయము అల్లాహ్ కు తెలుసు.
ఇక రండి, ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేసిన విషయం: ఖుర్బానీ కోసం ఇవ్వబడుతున్న పశువు తాజాగా, బాగా లావుగా, కొమ్ములు కలిగిన, ఖసీ చేయబడిన పశువు అయి ఉండటం మంచిది అని తెలియజేశారు.
అలాగే, ఖుర్బానీ ఇవ్వబడుతున్న పశువుల వయస్సు ఎంత ఉండాలి? ఎంత వయస్సు గల పశువుని ఖుర్బానీ ఇవ్వవచ్చు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి:
ఒంటె 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఒంటె ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
ఆవు లేదా ఎద్దు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఆవు లేక ఎద్దు ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
పొట్టేలు, గొర్రె విషయం గురించి చూడండి. పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండీ, అలా పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె అయి ఉండాలి. ఒకవేళ పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె దొరకని యెడల సంవత్సరము దాని దరిదాపుల వయస్సు కలిగిన పొట్టేలు, గొర్రె ఉన్నా గాని ఖుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది.
ఆ తర్వాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు. అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి. అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండీ పళ్ళు, ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక, మేకపోతు. పళ్ళు వేయని మేక, మేకపోతు అయితే ఖుర్బానీ ఎట్టి పరిస్థితిలో చెల్లదు. దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక, మేకపోతు ఖుర్బానీ మాత్రం చెల్లదు. అది పొట్టేలు, గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది.
లోపాలు ఉన్న పశువుల ఖుర్బానీ చెల్లుతుందా?
ఇకపోతే, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు కాదు? ఏ పశువుల ఖుర్బానీ చెల్లదు?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: కుంటి పశువు ఖుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటికంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి, ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది.
ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు ఖుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూచినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు. కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు ఖుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే అది సమస్య కాదు, దాని ఖుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
పశువులో భాగస్వామ్యం (ఎంతమంది పాల్గొనవచ్చు?)
ఇక రండి, ఏ పశువులో ఎంతమంది భాగస్తులు కాగలరు? అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…
ఒంటెలో 10 మంది భాగస్తులు కావచ్చు, 10 కుటుంబాలు కూడా భాగస్తులు కావచ్చు. ఆవు లేదా ఎద్దులో 7 వ్యక్తులు భాగస్తులు కావచ్చు లేదా 7 కుటుంబాలు భాగస్తులు కావచ్చు.
పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు… వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే ఖుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే (ఒక కుటుంబం తరఫున మాత్రమే) ఖుర్బానీ ఇవ్వబడుతుంది. పొట్టేలు, గొర్రె, మేక మరియు మేకపోతులో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు భాగస్తులు అవ్వడానికి అనుమతి లేదు.
“ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు, ఒక మేక సరిపోతుంది” అని చెబుతున్నారు, ఒక కుటుంబం అంటే ఎంతమంది? అనే సందేహం రావచ్చు. ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు: ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో, ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు, ఆ తండ్రి, భార్యలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఎవరూ సంపాదించుటలేదు, తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు, వారందరి బాధ్యత ఆయన ఒక్కరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండే ఆ పూర్తి కుటుంబం తరపున ఖుర్బానీ అయిపోతుంది.
కానీ, ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరువేరుగా సంపాదించుకుని, ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు. సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికినీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే, వారు ప్రతి ఒక్కరు ఎవరైతే సంపాదన వేరు వేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా ఖుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి.
మనం చూచినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో ఖుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జిబాహ్ చేస్తూ “ఓ అల్లాహ్ ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున” అని ఖుర్బానీ చేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబాలు కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున” అని పూర్తి కుటుంబం తరపున ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చేవారు.
అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారితో ఈ విధంగా అడగడం జరిగింది: “దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఖుర్బానీలు చెల్లించుకునేవారు?” అంటే, అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జిబాహ్ చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు” అని ఆయన బదులిచ్చారు. ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరఫున ఒక పశువుని జిబాహ్ చేసి వారు స్వయంగా మాంసం భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు. ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున ఖుర్బానీ ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది.
ఖుర్బానీ మరియు అఖీఖా ఒకే పశువులో చేయవచ్చా?
మిత్రులారా, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖీఖా ఏడు రోజులలో చేయకుండా, తరువాత ఖుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో ఖుర్బానీ మరియు అఖీఖా రెండు అయిపోయేలాగా ఉపాయము పన్నుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం. అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండీ. ఒక భాగం ఖుర్బానీ కోసం, ఒక భాగం అఖీఖా కోసం తీసుకుంటూ ఉంటారు. అలా ఉపాయం పన్నిన వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకే పశువులో ఖుర్బానీ, ఒకే పశువులో అఖీఖా చెల్లదు. ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు. అఖీఖా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జబాహ్ చేయవలసి ఉంటుంది. ఖుర్బానీ పశువులో అఖీఖాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు, ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు.
ఖుర్బానీకి బదులు దానం చేయవచ్చా?
అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు. అంత డబ్బు పెట్టి పశువు తీసుకుని ఖుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు, అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన వ్యర్థమైనది. ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఫర్జ్ సదఖా, ఫర్జ్ దానం (జకాత్) అని ఒకటి ఉంది. అలాగే నఫిల్ సదఖా, నఫిల్ దానము కూడా ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ వాక్యాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు, నిరుపేదలకు అందిస్తూ ఉంటారు, అవి చేయమని ప్రోత్సహించాలి. ఖుర్బానీ ఆపి సదఖా చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి. ఖుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది. ఆ ప్రకారంగా ఖుర్బానీ చేసుకొని ఖుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి. ఆరాధనలు జీవితాంతము సంవత్సరము మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి.
ఖుర్బానీ పశువులో లోపం వస్తే లేదా దొంగిలించబడితే?
అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు. కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు: అతని వద్ద స్తోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని ఖుర్బానీ చేయటము ఉత్తమం. ఒకవేళ అతని వద్ద స్తోమత లేదు అంటే, సమయము లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే, అదే పశువుని అతను జబాహ్ చేయవచ్చు, ఖుర్బానీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి, అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు. అలాగే ఖుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత. మరి అలాంటప్పుడు వారేం చేయాలి? స్తోమత ఉంటే మరొక పశువు కొని ఖుర్బానీ చేయాలి, స్తోమత లేకపోతే వారికి ఖుర్బానీ పుణ్యము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా దక్కుతుంది.
ఖుర్బానీ ఎప్పుడు, ఎలా చేయాలి?
అలాగే మిత్రులారా, ఇప్పుడు ఖుర్బానీ సమయం ఏమిటి, ఎప్పుడు ఖుర్బానీ చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం.
ఖుర్బానీ ఎప్పుడు చేయాలి అంటే, పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. ఒకవేళ తొందరపడి ఎవరైనా జుల్ హిజ్జా 10వ తేదీన పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే, అది హలాల్ ధర్మసమ్మతమే కానీ అతనికి ఖుర్బానీ పుణ్యము దక్కదు. అతను మామూలు రోజుల్లో మాంసం కోసము పశువుని జిబాహ్ చేసుకొని మాంసం తింటారు కదండీ, అలా అతనికి అది ధర్మసమ్మతమైన మాంసం మాత్రమే అతనికి హలాల్ దక్కుతుంది. ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి దక్కదు. అతను మళ్ళీ మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత జిబాహ్ చేసుకుంటే అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.
ఒకవేళ ఎవరైనా మర్చిపోయి పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే? అతనికి కూడా ఖుర్బానీ పుణ్యము దక్కదు. ఆ పశువు అతని కోసం హలాల్ ధర్మసమ్మతమే, అతను ఆ పశువు మాంసాన్ని తినవచ్చు. కానీ ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి ఇవ్వబడదు. అతను మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత మళ్ళీ జిబాహ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.
అయితే, జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి చేయబడే ఖుర్బానీ (ఆ రోజు, అంటే 10వ తేదీన చేయబడే ఖుర్బానీ) ఉత్తమమైనది. ఆ తర్వాత 11, 12, 13 తేదీలలో కూడా ఖుర్బానీ చేసుకోవచ్చు. 10వ తేదీన చేసే ఖుర్బానీ ఎక్కువ పుణ్యము మరియు ఎక్కువ గౌరవప్రదమైనది అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.
ఖుర్బానీ చేసే విధానం మరియు దుఆలు
ఇక, ఖుర్బానీ చేసే విధానం ఏమిటి అంటే, పశువుని జిబాహ్ చేసే ముందు కత్తి బాగా పదును పెట్టుకోవాలి. పశువు ముందర కత్తి నూరరాదు. అలాగే పశువుని జిబాహ్ చేసేటప్పుడు ఎడమ వైపుకి పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఆవు, ఎద్దు, పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఉంటే వాటిని పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఒంటె అయితే నిలబెట్టి అతని గొంతు మరియు మునుపటి కాళ్ళ మధ్యలో ఒక ప్రదేశంలో నహర్ చేస్తారు. అలా నిల్చోబెట్టి ఒంటెకు మాత్రమే నహర్ చేయాలి. ఇతర పశువులకు మాత్రము పడుకోబెట్టి జిబాహ్ చేయాలి.
జిబాహ్ చేస్తున్నప్పుడు పశువు ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరైతే జిబాహ్ చేస్తున్నారో, ఖుర్బానీ చేస్తున్నారో వారు కూడా వారి ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జిబాహ్ చేస్తున్న వ్యక్తి అవసరార్థం తన కాలు పశువు శరీరం మీద ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే జిబాహ్ చేస్తున్న వ్యక్తి పదునైన కత్తిని తీసుకొని తొందరగా జిబాహ్ చేయాలి.
ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పశువుని జిబాహ్ చేయాలి. ఒకవేళ వారి వల్ల కావట్లేదు అనేటట్లయితే ఇతరులతో కూడా ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చు. అలాగే మహిళలు కూడా వారి ఖుర్బానీ వారు వారి స్వహస్తాలతోనే జిబాహ్ చేసుకోవచ్చును. ఒకవేళ వారి వల్ల కుదరదు అనేటట్లయితే ఇతరుల చేత కూడా వారు ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చును.
ఖుర్బానీ పశువుని జిబాహ్ చేసేటప్పుడు:
بِسْمِ اللَّهِ اللَّهُ أَكْبَرُ (బిస్మిల్లాహి అల్లాహు అక్బర్) అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.
అని పఠించడంతో పాటు,
اللَّهُمَّ إِنَّ هَذَا مِنْكَ وَلَكَ، اللَّهُمَّ تَقَبَّلْ مِنَّا (అల్లాహుమ్మ ఇన్న హాజా మిన్ క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నా) ఓ అల్లాహ్! ఇది నీ వైపు నుంచే, నీ కోసమే. ఓ అల్లాహ్! మా నుండి దీనిని స్వీకరించు. అని కూడా పఠించవచ్చును.
“నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్ చేసేవారిలోని వాణ్ణి కాను.” (6:79)
అని ఒక దుఆ ఉంది కదండీ, ఆ పూర్తి దుఆ కూడా పఠించవచ్చును అని తెలుపబడింది.
జిబాహ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పశువులు బెదిరిపోయి తప్పించుకుని పారిపోతాయి. తర్వాత చేతికి చిక్కవు. అవి పారిపోతూ ఉంటే అలాంటప్పుడు ఏమి చేయాలంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, ఎలాగైతే పశువుని షికారు చేస్తారో (వేటాడుతారో) బాణాల ద్వారా లేదా ఇతర పరికరాల ద్వారా, ఆ విధంగా పదునైన బాణంతో గాని లేదా వేరే పరికరాలతో గాని అల్లాహ్ నామము స్మరించి ఆ పారిపోతున్న పశువుని గాయపరచాలి. అదే గాయంలో ఒకవేళ అది మరణిస్తే, అతని ఖుర్బానీ అయిపోయినట్లే. ఒకవేళ అది మరణించకముందే చేతికి దక్కితే, అప్పుడు దాన్ని జిబాహ్ చేసేయాలి, తద్వారా అతని ఖుర్బానీ పూర్తి అవుతుంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
మాంసం మరియు చర్మం పంపిణీ నియమాలు
ఇక రండి, ముఖ్యమైన విషయం. ఖుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి? దీని సమాధానం ఏమిటంటే, ఖుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు స్వయంగా తినవచ్చును, ఇతరులకు కూడా తినిపించవచ్చును, భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును (ఎండబెట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే).
ఖురాన్ లో 22వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ (ఫకులూ మిన్ హా వ అతయిముల్ ఖానిఅ వల్ ముఅ తర్) వాటి మాంసాన్ని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. (22:36)
అడిగేవారు అంటే ఎవరు? అడగని వారు అంటే ఎవరు? నిరుపేదలు చేతులెత్తి అడిగేవారు, వారికి ఇవ్వండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, వారు చేతులెత్తి అడగరు, అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది. ఆ ప్రకారంగా ఖుర్బానీ ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకుని, బంధుమిత్రులకు కొంచెం పంచి, నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా ఖుర్బానీ మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
అయితే, ఈ విధంగా మూడు భాగాలు చేయాలి, ఆ మూడు భాగాలు సరైన పరిమాణంలోనే ఉండాలి, కొంచెం కూడా హెచ్చుతగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా పుణ్యం కోసము పూర్తి మాంసము అనాధలకు, పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసము పంచేయవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకుని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది, కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం. ఎందుకంటే, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించుటలేదు, పేదవారి గురించి మనం ఆలోచించటలేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం, భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయటం సమంజసం కాదు. అందరి గురించి ఆలోచించాలి. బంధుమిత్రుల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే ఖుర్బానీ పశువు మాంసము ముస్లిమేతరులకు ఇవ్వవచ్చునా అంటే, ఇవ్వవచ్చును. నా సలహా ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లిమేతరులలో ముస్లింల పట్ల అపోహలు సృష్టిస్తున్నారు దుష్టశక్తులు. విషం కక్కి ముస్లింలకు వ్యతిరేకంగా వారి మెదడులలో బాగా నూరి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అపోహలు తొలగిపోవడానికి, వారిలో ఉన్న అనుమానాలు దూరం అవ్వటానికి, మనము స్వయంగా రెండు అడుగులు ముందుకు వేసి మన సమీపంలో ఇరుగు పొరుగులో ఉంటున్న మన ముస్లిమేతర సోదరులకు వెళ్లి సగౌరవంగా ఆహ్వానించి ఈ ఖుర్బానీ పశువు మాంసము అందజేయాలి.
అలాగే మరొక ముఖ్యమైన విషయం, మనం ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్న ముస్లిమేతరుల సోదరుల మనోభావాలు గాయపడకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో ఉన్న ధార్మిక పండితులు ఖుర్బానీ విషయంలో ఏ నియమాలు అయితే బోధిస్తున్నారో ఆ నియమాలకు అనుగుణంగా ఖుర్బానీ చేసుకోండి, ఇది శ్రేయస్కరమైన విధానము.
అలాగే మిత్రులారా, ఖుర్బానీ పశువు చర్మము ఏమి చేయాలి? ఆ చర్మము మనము స్వయంగా ఉపయోగించుకోవటానికి అవకాశము ఉంటే ఉపయోగించుకోవచ్చును. మనకు ఉపయోగించుకోవటం రాదు అంటే ఇతరులకు దానం చేసేయాలి. లేదా అమ్మేసి వచ్చిన సొమ్ముని దానం చేసేయాలి అంతేగాని పశువుని జిబాహ్ చేసిన తర్వాత ముక్కలు చేసి ఇవ్వటానికి వచ్చిన కసాయికి కూలీ రూపంలో మాత్రము ఇవ్వటానికి అనుమతి లేదు. కూలీ రూపంలో జేబు నుంచి డబ్బు చెల్లించండి, కానీ ఆ ఖుర్బానీ ఇవ్వబడిన పశువు చర్మాన్ని కూలీ రూపంలో కసాయికి ఇవ్వటానికి అనుమతి లేదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.
చనిపోయిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చా?
ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చునా లేదా? అంటే ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.
ఎవరైతే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చును అని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారో వారు చూపిస్తున్న ఆధారాలన్నీ బలహీనమైనవి. ప్రామాణికమైన ఆధారాలలో ఎక్కడా ఆ విషయం బోధపడలేదు.
ఇక ఎవరైతే ఖుర్బానీ ఇవ్వటానికి అనుమతి ఉంది అని చెబుతూ వేరే మార్గాలు చూపిస్తున్నారో వారేమంటున్నారంటే, ఒకవేళ మరణించిన వ్యక్తి మరణించే ముందు “నేను మరణించిన తర్వాత నా తరపున ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేస్తూ ఉండండి” అని వసీయత్ (హితవు) చేసి ఉంటే, అప్పుడు అతని తరపున ఖుర్బానీ చేయడానికి అనుమతి ఉంటుంది అని కొంతమంది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.
మరి కొంతమంది అయితే అది కూడా ఒక దానం కదండీ, అది చేయవచ్చును అంటున్నారు.
అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమారులు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలు మరణించారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఇంతమంది మరణించి ఉన్నా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరము కూడా “మరణించిన నా సతీమణి ఖదీజా పేరున నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమారుల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమార్తెల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను” అని చేయలేదు. కాబట్టి మరణించిన వ్యక్తుల పేరిట ప్రత్యేకంగా ఖుర్బానీ చేయడానికి అనుమతి లేదు.
కాకపోతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మనము పాటిస్తే, ఇన్ షా అల్లాహ్ బ్రతికి ఉన్న వారికి మరణించిన వారికి అందరికీ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది. అది ఎలాగంటే చూడండి: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమని దుఆ పటించేవారు అంటే,
اللَّهُمَّ تَقَبَّلْ مِنْ مُحَمَّدٍ، وَآلِ مُحَمَّدٍ (అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ముహమ్మద్ వ ఆలి ముహమ్మద్) “ఓ అల్లాహ్! నేను ఇస్తున్న ఈ ఖుర్బానీ నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసేవారు.
ఇక ఆయన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్నవారు ఉన్నారు, మరణించి ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన తరఫున, ఆయన కుటుంబీకుల్లో బ్రతికి ఉన్న, మరణించిన వారందరి తరపున ఖుర్బానీ అయ్యింది, అందరికీ ఖుర్బానీ పుణ్యము బహుశా ప్రాప్తమయింది అని ధార్మిక పండితులు ఆశాభావం వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే, మనము కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసుకుంటే మన తరఫున ఖుర్బానీ అయిపోతుంది, మన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్న, మరణించి ఉన్న వారందరి తరఫున కూడా ఖుర్బానీ అయిపోతుంది. అందరికీ కూడా ఇన్ షా అల్లాహ్ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.
అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా?
చివరిలో ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయవలసిందేనా? అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అప్పు చేసి మరి తప్పనిసరిగా ఖుర్బానీ చేయమని ఆదేశించలేదు కానీ, మనకు అల్లాహ్ శక్తి ఇచ్చి ఉంటే… ఖుర్బానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాత్రమే అవుతుంది, మిగతా రోజుల్లో ఖుర్బానీ అవ్వదు. అయితే అనుకోకుండా ఆ సమయానికి మన వద్ద డబ్బు లేదు అనేటట్లయితే అప్పటికప్పుడు ఎక్కడినుంచైనా డబ్బు తీసుకొని తర్వాత ఇన్ షా అల్లాహ్ మనము చెల్లించుకోగలము అనే ధైర్యము ఉంటే అప్పుడు అప్పు తీసుకుని ఖుర్బానీ చేసుకోవటం మంచిది, ఉత్తమం. చూడండి డబ్బులు లేకపోయినా స్నేహితులకు పార్టీలు ఇస్తాం బాకీలు చేసి, వేరే చాలా కార్యాలు చేస్తాం. మరి పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో ఎందుకు వెనకడుగు వేయాలి? బేకారు విషయాలలో ధైర్యము చేస్తాం పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో మాత్రము కంగారుపడతామంటే ఇది సరికాదు మిత్రులారా. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇస్తాడు నేను బాకీ చెల్లించుకోగలను అని అల్లాహ్ మీద నమ్మకంతో అప్పు చేసి ఖుర్బానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చును, అది మంచిదే అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.
వెంట్రుకలు, గోర్లు, చర్మము కత్తిరించరాదు
అలాగే ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నాడో అతను జుల్ హిజ్జా మాసం ప్రారంభము నుండి ఖుర్బానీ ఇచ్చేంత వరకు కూడా వెంట్రుకలు కత్తిరించరాదు, గోర్లు కత్తిరించరాదు, చర్మము కత్తిరించరాదు. ఒకవేళ మర్చిపోయి ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న వ్యక్తి మధ్యలో గోర్లు కత్తిరించేసాడు లేదా చర్మం కత్తిరించేసాడు అంటే అతను అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, ఎలాంటి కఫ్ఫారా పరిహారము చెల్లించాల్సిన అవసరమైతే లేదు.
అల్లాహ్ కు కావలసినది కేవలం భక్తి మాత్రమే
అలాగే ఖుర్బానీ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసము ఇఖ్లాస్ తో చిత్తశుద్ధితో చేయాలి. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. అలాగే పిసినారితనము కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్లు, షావుకార్లు కూడా ఖుర్బానీ విషయంలో పిసినారితనము చూపిస్తూ ఏదో ఒక సాధారణమైన చిన్న పశువు తీసుకొని ఖుర్బానీ చేసేసి చెల్లించేద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారు పిసినారితనం ప్రదర్శిస్తూ ఉంటారు, సంవత్సరంలో ఒక్కసారి చేయబడే ఖుర్బానీ విషయంలో పిసినారితనము ప్రదర్శించకండి.
సంతోషంగా అల్లాహ్ మార్గంలో ధనము ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మనము ఇస్తున్న ఖుర్బానీ పశువు యొక్క మాంసము అవసరము లేదు, రక్తము అవసరము లేదు, మనము అల్లాహ్ చిత్తము కోసము సంతోషంగా ఖుర్బానీ చేస్తామా లేదా అనేది అల్లాహ్ చూస్తున్నాడు.
لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ (లయ్యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహుత్ తఖ్వా మిన్ కుమ్) వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (22:37)
అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు కాబట్టి, పిసినారితనము ప్రదర్శించకుండా సంతోషంగా పశువు కొని మంచి పశువు కొని అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ చేయాలి.
అలాగే రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది డబ్బు ఖర్చు చేస్తారు, మంచి పశువుని కొంటారు, కాకపోతే “నేను ఇంత మంచి పశువుని కొన్నాను” అని ఆ పశువు మెడలో దండలు వేసి ఊరిలో ఊరేగింపు చేస్తూ ఉంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్రదర్శనా బుద్ధితో అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఫోటోలు దింపి, దండలు వేసి, ఇంకా ఏమేమో హంగులు చేసి ఆ ఫోటోలను ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, ఇంకా వీడియోలు తీసి యూట్యూబ్ లలో ఎక్కడెక్కడో వారు ప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా మనిషిలో చిత్తశుద్ధి అనేది లేకుండా పోతుంది. ప్రదర్శనా బుద్ధి అక్కడ వచ్చేస్తుంది, దీనినే ఇస్లామీయ పరిభాషలో రియాకారీ అంటారు. రియా ఉద్దేశంతో, ప్రదర్శనా ఉద్దేశంతో, ప్రదర్శనా బుద్ధితో చేసిన ఏ పుణ్యకార్యము అల్లాహ్ స్వీకరించడు, ఈ ఖుర్బానీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొద్ద స్వీకరించబడదు.
కాబట్టి ఖుర్బానీ చేస్తున్నవారు అటు పిసినారితనము ప్రదర్శించకుండా, ఇటు ప్రదర్శనా బుద్ధిని కూడా ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ చేయాలి. అలాగే ధర్మసమ్మతమైన హలాల్ సంపదతోనే ఖుర్బానీ పశువు కొని ఖుర్బానీ చేయాలి. హరామ్ సంపదతో పశువు కొని ఖుర్బానీ చేస్తే ఆ ఖుర్బానీ ఆమోదించబడదు. హరామ్ సంపదతో ఏ పుణ్యకార్యము చేసినా అది ఆమోదించబడదు, స్వీకరించబడదు.
ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు సూచనలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరికీ హలాల్ సంపదతో, చిత్తశుద్ధితో, సంతోషంగా మంచి పశువుని అల్లాహ్ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ఎవరెవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్తోమత ఇచ్చారో వారందరూ ఖుర్బానీ చేసుకునే భాగ్యం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఎవరికైతే స్తోమత లేదో వారందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్బానీ చేయటానికి అర్హత, స్తోమత ప్రసాదించుగాక. ఆమీన్ తకబ్బలల్లాహు మిన్నా వమిన్ కుమ్ వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah) వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]
ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.
నవ్వు మరియు ఏడుపు అల్లాహ్ నుండి వచ్చినవే
వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ (వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా) మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)
అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.
అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.
అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.
దైవ భీతితో కార్చే కన్నీరు
అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.
لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ “లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా” దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!
మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే
ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.
మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.
రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”
ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”
దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.
ప్రవక్తలు మరియు సహాబాల దైవ భీతి
ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.
ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!
అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.
అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?
ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!
ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!
అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.
అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.
అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.
ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.
కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.
కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.
أَلْحَمْدُ لِلّٰهِ (అల్ హందులిల్లాహ్) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ (వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్) మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)
సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.
సుత్రా అంటే ఏమిటి?
సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.
అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.
సుత్రా యొక్క పరిమాణం
మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.
మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.
వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రా
సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.
అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.
నమాజు చేసే వ్యక్తి ముందు నుండి వెళ్ళడం గురించి ముఖ్య సూచనలు
ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.
రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.
ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)” అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)
సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]
ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్ చేయకండి.”
“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్ ఉంటాడు.” [40]
ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]
కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని స్తంభం దగ్గర నమాజ్ చేయటానికి ప్రయత్నించేవారు. [42]
అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;
“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]
ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]
తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]
ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్ చేస్తున్నారు. (నమాజ్లోనే) పిడికిలి బిగించారు. నమాజ్ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]
ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]
హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :
[38] బుఖారీ, అహ్మద్
[39] బుఖారీ, ముస్లిం
[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.
[41] అబూదావూద్, జవాయెద్ బజ్జార్ – 54 పేజీ, హాకిమ్ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.
[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అయినా, ఒంటరిగా నమాజ్ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్ ఇమామ్ అహ్నద్”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్ అహ్మద్ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.
నేను చెప్పేదేమిటంటే – ఇమామ్ అహ్మద్ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.
నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్ మాసంలో వెళ్లాను.
అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.
[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా
[44][45] బుఖారీ, అహ్మద్
[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్
[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.
[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.
[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.
[53] అహ్మద్, దారెఖు,త్నీ తబ్రానీ – సహీ పరంపరతో.
ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.
ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్ఆన్లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్: 1) ఆయత్లో ‘జిన్నును మానవ జిన్న్గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.
ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!
54, బుఖారీ, ముస్లిం.
55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah) https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు] వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.
ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.
అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటి?
ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.
మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:
وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.
అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:
وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.
అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు
అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.
అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.
అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.
అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:
الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.
ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.
ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.
ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.
అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.
అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.
అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.
మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.
ధర్మవేత్తల జీవితాల నుండి ఉదాహరణలు
అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ
ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.
సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.
మూసా అలైహిస్సలాం వారి ఉదాహరణ
అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:
قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో
అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:
قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.
అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరొక ఉదాహరణ
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఉదాహరణ
అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:
حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ (హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్) మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.
అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:
يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ (యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్) ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.
ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.
హాజిరా అలైహస్సలాం వారి ఉదాహరణ
అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.
ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.
ముగింపు: సాధనాలతో కూడిన నమ్మకం
ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.
అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.
ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.
ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.
మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.
కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.
ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రసంగం యొక్క ఈ భాగంలో, అల్లాహ్ యొక్క ఆయతులను (వచనాలను) ఎగతాళి చేసే వ్యక్తులతో కూర్చోవడం చేయడం నిషేధించబడిన విషయం గురించి చర్చించబడింది. ఎవరైనా అలాంటి వారిని ఆపగల శక్తి, జ్ఞానం, మరియు సదుద్దేశంతో వారి మధ్య కూర్చుంటే తప్ప, కేవలం వారి ఎగతాళిని వింటూ వారితో ఉండటం కూడా పాపంలో భాగస్వామ్యం అవ్వడమేనని వక్త స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, సూరతున్నసా (4వ అధ్యాయం)లోని 140వ ఆయతును పఠించి, దాని భావాన్ని వివరించారు. ఆ ఆయతు ప్రకారం, అల్లాహ్ ఆయతులను తిరస్కరించడం లేదా పరిహసించడం విన్నప్పుడు, ఆ సంభాషణను విడిచిపెట్టాలి, లేకపోతే వారు కూడా ఆ పాపులతో సమానం అవుతారు. వక్త ఈనాటి ముస్లింల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియా, సినిమాలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇలాంటి పాపభూయిష్టమైన విషయాలను చూస్తూ, వాటిలో పాల్గొంటూ, కనీసం ఖండించకుండా మౌనంగా ఉండటం ఎంతటి ప్రమాదకరమో హెచ్చరించారు. చెడును చేతితో, లేదా మాటతో ఆపాలని, కనీసం మనసులోనైనా దానిని ద్వేషించాలని చెప్పే హదీసును ఉటంకిస్తూ, విశ్వాసంలోని బలహీన స్థాయిని కూడా కోల్పోకూడదని ఉద్బోధించారు.
అల్లాహ్ ఆయతులను ఎగతాళి చేసేవారితో కూర్చోవద్దు
39వ విషయం: అల్లాహ్ ఆయతులతో వేళాకోళం చేస్తున్న వారితో నీవు కూర్చోకు.
శ్రద్ధ వహించండి, కన్ఫ్యూజ్ కాకండి. 38వ విషయం ఏమి విన్నారు? అల్లాహ్, అతని ఆయతులు, ఆయన ప్రవక్త పట్ల ఎగతాళి చేయకూడదు. కానీ ఇక్కడ 39వ విషయం, ఎవరైతే ఇలా ఎగతాళి చేస్తూ ఉన్నారో, అలాంటి వారికి తోడుగా ఉండకు. ఆ ఎగతాళి చేస్తున్న సందర్భములో వారితో కలిసి కూర్చోకు. ఆ సందర్భములో వారితో కలిసి ఉండకు. ఒకవేళ, నీవు వారిని ఆపగలుగుతున్నావు, అతను మాట పూర్తి చేసే వరకు మధ్యలో ఆపేది ఉంటే మన మాటను శ్రద్ధ వహించడు అందుకొరకే, కొంచెం మాట పూర్తి చేసిన వెంటనే, అతన్ని బోధ చేస్తాను, అతనికి నేను నసీహత్ చేస్తాను, అతను చేసిన ఈ పాపం ఎగతాళి నుండి నేను అతన్ని ఆపుతాను, ఇలాంటి సదుద్దేశం ఉండి, ఆపే అంతటి శక్తి ఉండి, ఆపే అంతటి జ్ఞానం ఉండి, అక్కడ కూర్చుంటే పాపం లేదు. కానీ అలా కాకుండా, ఆపడం అయితే లేదు, కానీ వారితో కలిసి కూర్చోవడం, ఇది కూడా పాపంలో వస్తుంది, ఇది కూడా ఒక నిషేధం, మనం దీనిని వదులుకోవాలి.
ముందు దీనికి సంబంధించి సూరతున్నసా, సూర నెంబర్ నాలుగు, ఆయత్ నెంబర్ 140 వినండి, ఆ తర్వాత దీనికి సంబంధించిన మరి చిన్నపాటి వివరణ కూడా మనం తెలుసుకుందాం.
అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు: అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లైయితే, అలా చేసేవారు (ఆ సంభాషణ వదలి) వేరే మాట ప్రారంభించనంత వరకు మీరు వారితో కలసి కూర్చోకండి. ఇప్పుడు మీరు గనక అలా చేస్తే మీరూ వారి లాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయమని తెలుసుకోండి[. (నిసా 4: 140).
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ ఎంతటి హెచ్చరిక ఇందులో ఉంది ఈ రోజుల్లో మనం ఇలాంటి ఆయతులు చదవడం లేదు. అల్లాహ్ ఈ గ్రంథంలో మీకు ఇదివరకే ఈ ఉత్తరువు ఇచ్చి ఉన్నాడు, అల్లాహ్ ఈ దివ్య గ్రంథము ఖురాన్ లో మీకు ఇంతకు ముందే ఆదేశం ఇచ్చి ఉన్నాడు దీనికి సంబంధించి. ఏంటి? అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా, తిరస్కార వచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే, అలా చేసే వారితో మీరు, వారు తమ ఆ సంభాషణ వదిలే వరకు వారితో కూర్చోకండి. ఫలా తఖ్’ఉదూ, గమనించండి, ఫలా తఖ్’ఉదూ, మీరు వారితో కూర్చోకండి. హత్తా యఖూదూ ఫీ హదీసిన్ గైరిహ్. వారు వేరే మాట ఎప్పటివరకైతే మాట్లాడారో మీరు వారితో, ఖురాన్ కు ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ పట్ల ఎగతాళి జరిగినప్పుడు, అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి జరిగినప్పుడు, వారితో పాటే అక్కడ కూర్చోవడం, ఇది మీకు తగని విషయం. అంతే కాదు, ఇక్కడ గమనించండి, ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. మీరు గనక నా ఈ ఆదేశాన్ని వినలేదంటే, మీరు కూడా వారిలో కలిసిపోయినవారే. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎగతాళి చేస్తున్నాడు, నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు. అతన్ని ఆపడం లేదు. నీకు చెప్పే అధికారం లేదు, అయ్యో నేను ఎగతాళి చేస్తలేనండి అని. నీవు కూడా ఇతనితో సమానం అని నేను అనడం లేదు, అల్లాహ్ అంటున్నాడు. ఇన్నకుమ్ ఇదమ్ మిస్లుహుమ్. నిశ్చయంగా మీరు కూడా వారితో సమానం.
అంతేనా? అల్లాహ్ ఇంకా హెచ్చరించాడు, గమనించండి. ఇన్నల్లాహ జామిఉల్ మునాఫిఖీన వల్ కాఫిరీన ఫీ జహన్నమ జమీఆ. అల్లాహ్ త’ఆలా వంచకులను మరియు అవిశ్వాసులను, కపట విశ్వాసులను, అవిశ్వాసులను కలిపి నరకంలో ఉంచుతాడు అని. వాస్తవానికి మనలో విశ్వాసం ఉంటే, వాస్తవానికి విశ్వాసం పట్ల కపటత్వం, వంచకపుతనం మనలో లేకుంటే, మనం ఆపాలి వారిని, లేదా అక్కడి నుండి వెళ్ళిపోవాలి.
సహీహ్ ముస్లిం యొక్క హదీస్ కూడా ఇక్కడ మీకు గుర్తొస్తుంది కదా? మన్ రఆ మిన్కుమ్ మున్కరన్. మీలో ఎవరైతే ఒక చెడు పనిని చూస్తారో, ఫల్ యుగయ్యిర్హు బియదిహ్. తన శక్తి ఉండేది ఉంటే తన చెయ్యితో అతన్ని ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబిలిసానిహ్. చెయ్యితో ఆపే శక్తి లేకుంటే, నోటితో ఆపాలి. ఫ ఇల్లమ్ యస్తతి’ ఫబికల్బిహ్. ఆ శక్తి లేకుంటే హృదయంలో దాన్ని చెడుగా భావించి అక్కడి నుండి దూరం ఉండాలి. వ దాలిక అద్’అఫుల్ ఈమాన్. ఇదే విశ్వాసం యొక్క చివరి మెట్టు. ఇది బలహీన స్థితి విశ్వాసం యొక్క. ఈ పని కూడా కనీసం చేయలేదు అంటే ఇక విశ్వాసం లేనట్టే భావం.
సోదర మహాశయులారా, ఈ విషయంలో మనం అల్లాహ్ తో భయపడుతున్నామా నిజంగా? ఈ విషయంలో మనం నిజంగా అల్లాహ్ తో భయపడుతున్నామా? ఎంత ఘోరానికి మనం పాల్పడుతున్నాము. ఈ రోజుల్లో మన సమాజంలో, మన వాట్సాప్ గ్రూపులలో, మన సోషల్ మీడియాలో, ఎన్ని చెడులైతే చూస్తూ ఉన్నామో, ఆ చెడును ఖండించే అటువంటి శక్తి, ఆ చెడును ఖండించే అంతటి జ్ఞానం లేకపోతే, దానిని చూసుకుంటూ ఉండడం… అల్లాహు అక్బర్… అల్లాహు అక్బర్ అస్తగ్ ఫిరుల్లాహ్.
ముస్లిం యువకులు, ముస్లిం యువతులు, ఏ ఫిలింలు చూస్తూ ఉంటారో, ఏ పాటలు వింటూ ఉంటారో, ఏ సీరియల్ లు చూస్తూ ఉంటారో, ఏ కార్టూన్లు చూస్తూ ఉంటారో, ఏ గేమ్ లు ఆడుతూ ఉంటారో, ఏ వాట్సాప్ గ్రూపులలో ఉన్నారో, ఏ సోషల్ మీడియాలోని అప్లికేషన్లలో ఫాలో అవుతున్నారో, షేర్ చేస్తున్నారో, వీరందరూ కూడా గమనించాలి, అల్లాహ్ కు ఇష్టమైన వాటిలో వారు పాల్గొన్నారంటే, అల్ హందులిల్లాహ్. అల్లాహ్ కు ఇష్టం లేని వాటిలో పాల్గొన్నారంటే, అక్కడ ఖురాన్ పట్ల, హదీసుల పట్ల, ప్రవక్త పట్ల మరియు అల్లాహ్ యొక్క ఆయతుల పట్ల ఎగతాళి, పరిహాసం జరుగుతూ ఉన్నది. వారితో పాటు నవ్వులో నవ్వు మీరు కలిసి ఉన్నారు, లేదా కనీసం వారిని ఖండించకుండా మౌనం వహించి ఉన్నారు, వారి యొక్క సబ్స్క్రైబర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి యొక్క ఫాలోవర్స్ పెరిగే మాదిరిగా ఉన్నారు, వారి సంఖ్య పెద్దగా కనబడే విధంగా ఉన్నారు. ఆలోచించండి, ఈ పాపంలో మనం కలిసిపోతలేమా? ఖురాన్, హదీసులను మనం ఈనాటి కాలంలో ఎక్కువ ప్రచారం చేయాలి, మంచిని మనం ఎక్కువగా ప్రజల వరకు చేరవేయాలి. అలా కాకుండా ఏ చెడులోనైతే మనం పాల్గొంటామో, దాని వల్ల మనం ఎంత పాపానికి గురి అవుతామో ఎప్పుడైనా గమనించారా? అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.
అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.
ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం
జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?
لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ (లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్) మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).
మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.
చెడు తలంపు ఘోరమైన పాపం
ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:
أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ (అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి) ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.
ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:
سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది
సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.
అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.
“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్కు కూడా తెలియవని అనుకునేవారు.”
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఐదు విషయాల కంటే ఎంతో మేలైన, ఉత్తమ ఆ ఒక్క విషయమేమిటి? https://youtu.be/w7ANEdrN2IU [6:53 నిమిషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో యజమాని-దాసుడి సంబంధాన్ని ఉదాహరణగా తీసుకుని, మానవునికి మరియు సృష్టికర్త అయిన అల్లాహ్కు మధ్య ఉండవలసిన దాస్యత్వం గురించి వివరించబడింది. నిజమైన దాస్యత్వం అంటే ప్రతి క్షణం, ప్రతి స్థితిలో అల్లాహ్ను స్మరించుకోవడం (ధిక్ర్ చేయడం) మరియు ఆయనకు ఇష్టమైన పనులే చేయడం. అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక హదీథ్ ద్వారా నొక్కిచెప్పబడింది. బంగారం, వెండి దానం చేయడం మరియు ధర్మయుద్ధంలో పాల్గొనడం కన్నా అల్లాహ్ స్మరణ ఎంతో ఉత్తమమైనదని, అది హోదాలను పెంచి, ప్రభువు వద్ద అత్యంత పరిశుద్ధమైనదిగా పరిగణించబడుతుందని ఈ హదీథ్ స్పష్టం చేస్తుంది.
అబూ దర్దా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అడిగారు:
“మీ సదాచరణాల్లో అత్యుత్తమమైనది, మీ చక్రవర్తి అయిన అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మీ స్థానాలను ఎంతో రెట్టింపు చేయునది, మరి మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దాని కంటే ఉత్తమమైనది మరియు మీరు మీ శత్రువులను కలిసి మీరు వారి మెడలను వారు మీ మెడలను నరుకుతూ ఉండే దానికంటే ఉత్తమమైనది తెలియజేయనా?” వారన్నారు ఎందుకు లేదు! తప్పకుండా తెలియజేయండి, అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “అల్లాహ్ స్మరణ“
حكم الحديث: صحيح سنن ابن ماجه ( 3790 )، موطأ مالك ( 564 )، مسند أحمد ( 21702, 21704, 27525 ).
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
الْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ (అల్ హందులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అమ్మా బాద్) సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఇక ఆ తర్వాత…
ప్రియ వీక్షకుల్లారా, యజమాని మరియు దాసుడు. వారిద్దరి మధ్యలో సంబంధం ఎలాంటిది ఉంటుంది? దాసుడు ఎల్లవేళల్లో చాలా చురుకుగా, ఎప్పుడు ఏ సమయంలో యజమాని ఆదేశం ఏముంటుంది, నేను దానిని పాటించాలి, ఆజ్ఞాపాలన చేయాలి అన్నటువంటి ధ్యానంలో ఉంటాడు. అలాంటి వారినే మనం మెచ్చుకుంటాము. అవునా కాదా?
అయితే ఈ రోజుల్లో మనం మన అసలైన యజమాని, సర్వ సృష్టికి సృష్టికర్త, ఈ సర్వ సృష్టికి పోషణకర్త అల్లాహ్, ఎంతటి గొప్పవాడు! ఆయనే సార్వభౌమాధికారుడు. ఆయనే చక్రవర్తి. సోదర మహాశయులారా, ఎల్లవేళల్లో మనం అల్లాహ్ యొక్క ధ్యానంలో ఉండటం, అల్లాహ్ను గుర్తు చేసుకుంటూ ఉండటం, అల్లాహ్ యొక్క స్మరణలో ఉండటం, మనం ఎక్కడ ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా గానీ అక్కడ ఆ సందర్భంలో, ఆ స్థితిలో మన సృష్టికర్త అల్లాహ్ మనం ఎలా ఉండటం, మనం ఎలా మాట్లాడటం, మనం ఎలా చూడటం, మనం ఎలా వినడం ఇష్టపడతాడో, ఆయనకు ఇష్టమైనవే మనం చేసుకుంటూ ఉండటం, ఇదే అసలైన నిజమైన దాస్యత్వం. దీన్నే ఈ రోజుల్లో చాలా మంది మరిచిపోయి ఉన్నారు.
అయితే, ఇలాంటి స్మరణలో ఉంటూ ప్రత్యేకంగా ఆయన యొక్క గొప్పతనాలను కీర్తిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధత, పవిత్రతలను కొనియాడుతూ, ఆయన యొక్క ప్రశంసలు, పొగడ్తలను మనం స్తుతిస్తూ,
سُبْحَانَ اللَّهِ (సుబ్ హా నల్లాహ్) అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు.
الْحَمْدُ لِلَّهِ (అల్ హందులిల్లాహ్) సర్వస్తోత్రాలు అల్లాహ్ కే శోభాయమానం.
اللَّهُ أَكْبَرُ (అల్లాహు అక్బర్) అల్లాహ్ యే గొప్పవాడు.
لَا إِلَهَ إِلَّا اللَّهُ (లా ఇలాహ ఇల్లల్లాహ్) అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు.
ఇంకా ఇలాంటి పలుకులు పలుకుతూ ఉంటే, ఇహలోకంలో మనకు ఎంత లాభం కలుగుతుందో, పరలోకంలో దీని యొక్క సత్ఫలితం ఎంత గొప్పగా లభిస్తుందో మనం ఊహించలేము.
అల్లాహ్ స్మరణ (ధిక్ర్) యొక్క గొప్పతనం
రండి, ఒకే ఒక హదీథ్ వినిపిస్తాను. ఆ తర్వాత మీరు సెలవు తీసుకోవచ్చు. శ్రద్ధగా వినండి. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. సునన్ తిర్మిజీలో వచ్చిన హదీథ్, 3377 హదీథ్ నంబర్. షేఖ్ అల్బానీ రహిమహుల్లా దీనిని ప్రామాణికమైనదిగా చెప్పారు.
ఏంటి హదీథ్? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ స్మరణ గురించి, అల్లాహ్ ధ్యానంలో ఉండటం గురించి ఎంత గొప్ప శుభవార్త ఇస్తున్నారో మీరే గమనించండి. ఐదు రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఎలా ప్రోత్సహిస్తూ చెబుతున్నారో గమనించండి.
أَلَا أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ (అలా ఉనబ్బిఉకుమ్ బి ఖైరి అఅమాలికుమ్) మీ కర్మలలో అత్యుత్తమమైనది ఏమిటో మీకు తెలుపనా?
وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ (వ అజ్కాహా ఇంద మలీకికుమ్) మీ ప్రభువైన అల్లాహ్ వద్ద అత్యంత పరిశుద్ధమైనది,
وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تُنْفِقُوا الذَّهَبَ وَالْوَرِقَ (వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తున్ఫికూ అజ్జహబ వల్ వరిఖ్) మీరు వెండి బంగారాలు ఖర్చు పెట్టే దానికంటే కూడా ఉత్తమమైనది,
وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ (వ ఖైరుల్ లకుమ్ మిన్ అన్ తల్ ఖౌ అదువ్వకుమ్ ఫ తజ్రిబూ అఅనాఖహుమ్ వ యజ్రిబూ అఅనాఖకుమ్) మరియు మీరు మీ యొక్క శత్రువులను ధర్మపరమైన యుద్ధంలో కలుసుకోవడం, వారు మీ మెడలను నరుకుతూ ఉండటం, మీరు వారి మెడలను నరుకుతూ ఉండటం, దీనికంటే కూడా ఎంతో ఉత్తమమైనది.
అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! గమనించారా? ఎన్ని విషయాలు చెప్పారు ప్రవక్త? ఐదు విషయాలు. మీ సదాచరణల్లో అన్నిటికంటే ఉత్తమమైనది, మరియు ప్రభువు అల్లాహ్ వద్ద ఎంతో పరిశుద్ధమైనది, మరియు మీ యొక్క స్థానాలను ఉన్నతంగా చేయునది, మీరు వెండి బంగారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టే దానికంటే ఉత్తమమైనది, మీరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయడానికి కంటే కూడా ఎంతో ఉత్తమమైనది, మీకు తెలుపనా? అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.
ఈ ఐదు విషయాల కంటే ఉత్తమమైన మరో విషయం మీకు తెలపాలా? అని ప్రశ్నించారు. సహాబాలు, ప్రవక్త సహచరులు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృత కలిగి ఉండేవారు. వారందరూ ఏకంగా అన్నారు,
بَلَى يَا رَسُولَ اللَّهِ (బలా యా రసూలల్లాహ్) తప్పకుండా, ఓ అల్లాహ్ ప్రవక్తా! ప్రవక్తా ఎందుకు తెలుపరు? తప్పకుండా తెలుపండి!
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
ذِكْرُ اللَّهِ (ధిక్రుల్లాహ్) అల్లాహ్ యొక్క ధిక్ర్. అల్లాహ్ యొక్క స్మరణ.
చూశారా? గమనించారా? ఈ హదీథ్ను ఎల్లవేళల్లో మదిలో నాటుకోండి. ఇలాంటి ఈ ధిక్ర్ ద్వారా ఈ ఐదు రకాల మంచి విషయాల కంటే గొప్ప పుణ్యం పొందగలుగుతారు. అల్లాహ్ మనందరికీ ఎల్లవేళల్లో, అన్ని సమయ సందర్భాల్లో, అన్ని స్థితుల్లో కేవలం అల్లాహ్ను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల షిర్క్ల నుండి, అన్ని రకాల బిద్అత్ల నుండి అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ జననానికి ముందు అరబ్ ద్వీపకల్పం యొక్క మత, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను వివరిస్తుంది. బహుదేవతారాధన, అజ్ఞానం మరియు అన్యాయం ప్రబలంగా ఉన్న ఆ కాలాన్ని ఇది విశ్లేషిస్తుంది. ప్రవక్త గారి తండ్రి అయిన అబ్దుల్లా మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లను ‘ఇబ్నుద్-దబీహైన్’ (బలి ఇవ్వబడిన ఇద్దరి కుమారుడు) అని ఎందుకు అంటారో చారిత్రక సంఘటనలతో వివరిస్తుంది. అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి, అబ్దుల్లా వివాహం, ఆయన మరణం, మరియు చివరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం గురించి చర్చిస్తుంది. ప్రవక్త జననానికి కొద్ది కాలం ముందు జరిగిన ‘ఏనుగుల సంఘటన’ (ఆముల్ ఫీల్) గురించి కూడా ఇది వివరంగా తెలియజేస్తుంది, దీనిలో అబ్రహా మరియు అతని సైన్యం కాబాగృహాన్ని కూల్చివేయడానికి వచ్చి అల్లాహ్ యొక్క అద్భుత శక్తి ద్వారా ఎలా నాశనమయ్యారో వివరిస్తుంది.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) (మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ، أَمَّا بَعْدُ (అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్) (సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…)
సీరత్ పాఠాలు. మొదటి పాఠం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననానికి పూర్వపు అరబ్ స్థితి.
సోదర సోదరీమణులారా! అల్లాహ్ తర్వాత ఈ సర్వ సృష్టిలో అత్యంత శ్రేష్ఠులైన, సర్వ మానవాళి కొరకు కారుణ్య మూర్తిగా, ఆదర్శ మూర్తిగా పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జీవిత చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), చిన్న చిన్న పాఠాలు మనం వింటూ ఉందాము. చివరి వరకు మీరు ప్రతి ఎపిసోడ్ పూర్తి శ్రద్ధాభక్తులతో విని, ఒక ఆదర్శవంతమైన, మంచి జీవితం గడపడానికి ఉత్తమ గుణపాఠాలు పొందుతారని ఆశిస్తున్నాను.
ఈనాటి మొదటి పాఠంలో మనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అరబ్ యొక్క స్థితిగతులు ఎలా ఉండినవి తెలుసుకుందాము.
వారి యొక్క ధార్మిక జీవితం
అరబ్బులు ఏకదైవారాధనను వదులుకొని బహుదేవతారాధన మీదనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల, వారి ఆ కాలాన్ని అజ్ఞాన కాలం అని చెప్పడం జరిగింది. అరబ్బులు ఏ విగ్రహాలనైతే పూజించేవారో, వాటిలో ప్రఖ్యాతి గాంచినవి లాత్ (اللَّات), ఉజ్జా (الْعُزَّى), మనాత్ (مَنَاة) మరియు హుబుల్ (هُبَل). అయితే వారిలో కొంతమంది యూదుల మతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించిన వారు కూడా ఉండిరి. అలాగే కొందరు పార్శీలు, అగ్ని పూజారులు కూడా ఉండిరి. బహు తక్కువ మంది బహుదేవతారాధనకు అతీతమైన, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సవ్యమైన, సన్మార్గమైన సత్య ధర్మంపై కూడా ఉండిరి.
ఆర్థిక జీవితం
ఇక వారి ఆర్థిక జీవితం, ఎడారి వాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారు వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడి ఉండిరి. ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి కొంచెం ముందు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతరు ప్రవక్తలైతే వచ్చారో వారందరూ తీసుకువచ్చిన ధర్మం ఒకే ఒక సత్యమైన ధర్మం ఇస్లాం. కాకపోతే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు కాలంలో ఆ సత్యమైన ధర్మం ఇస్లాం యొక్క రూపు మాపేశారు. దానిని దాని అసలు రూపంలో తెలుపుతూ సంపూర్ణం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడం జరిగింది. అయితే ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి ముందు, ఈ జ్యోతిని తీసుకువచ్చినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ జననానికి ముందు, మక్కా అరబ్ ద్వీపంలో ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా పేరు దాల్చింది. తాయిఫ్ మరియు మదీనా లాంటి కొన్ని నగరాల్లో మంచి నాగరికత ఉండినది.
సామాజిక వ్యవస్థ
ఇక వారి సామాజిక వ్యవస్థను చూసుకుంటే, చాలా బాధాకరంగా ఉండినది. అన్యాయం విపరీతంగా వ్యాపించి, బలహీనులకు ఏ హక్కు లేకుండా ఉండింది. ఆడబిడ్డలను కొందరు సజీవ సమాధి చేసేవారు. మానభంగాలకు పాల్పడేవారు. బలహీనుల హక్కులను బలవంతుడు కాజేసేవాడు. హద్దు లేకుండా భార్యలను ఉంచుకోవడం సర్వసామాన్యమైపోయి ఉండినది. వ్యభిచారం కూడా కొన్ని తెగలలో విచ్చలవిడిగా మొదలైపోయింది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు ఒకే తెగకు సంబంధించిన సంతానంలో కూడా కొంత కాలం వరకు యుద్ధం జరుగుతూ ఉండేది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి ముందు ఉన్నటువంటి ధార్మిక, ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ యొక్క సంక్షిప్త రూపం.
ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి
ఇక రండి మనం తెలుసుకుందాము ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి. అంటే ఏమిటి? ఇబ్న్ (ابْن) అంటే కుమారుడు, దబీహైన్ (الذَّبِيحَيْنِ) అంటే బలి చేయబడటానికి సిద్ధమైనటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒకరైతే తెలుసు కదా? ఇస్మాయీల్ దబీహుల్లాహ్ (إِسْمَاعِيلُ ذَبِيحُ اللهِ) అని చాలా ఫేమస్. ఇబ్రాహీం అలైహిస్సలాం వృద్ధాప్యంలో చేరినప్పుడు మొట్టమొదటి సంతానం ఇస్మాయీల్ ప్రసాదించబడ్డారు. అయితే ఎప్పుడైతే ఇస్మాయీల్ తండ్రి వేలు పట్టుకొని, తండ్రితో పాటు పరిగెత్తే అటువంటి వయసుకు చేరుకున్నాడో, “నీ ఏకైక సంతానాన్ని నీవు జిబహ్ (ذِبْح – బలి) చేయమని” అల్లాహు తఆలా స్వప్నంలో చూపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశం మేరకు సిద్ధమయ్యారు, కానీ అల్లాహు తఆలా ఒక పొట్టేలును పంపించేశాడు. ఇస్మాయీల్ కు బదులుగా దానిని జిబహ్ చేయడం జరిగింది. ఈ సంఘటన చాలా ఫేమస్. మరి రెండవ దబీహ్ (ذَبِيح – బలి ఇవ్వబడినవాడు) ఎవరు? అదే విషయం ఇప్పుడు మనం వినబోతున్నాము.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తాత అబ్దుల్ ముత్తలిబ్, అధిక ధనం, అధిక సంతానం వల్ల ఖురైషులు అతన్ని చాలా గౌరవించేవారు. ఒకప్పుడు అబ్దుల్ ముత్తలిబ్, “అల్లాహ్ గనక నాకు పది మంది మగ సంతానం ప్రసాదిస్తే వారిలో ఒకరిని నేను జిబహ్ చేస్తాను, బలిదానం ఇస్తాను” అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మగ సంతానం కలిగారు అతనికి. వారిలోనే ఒకరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి అబ్దుల్లా.
అబ్దుల్ ముత్తలిబ్ తన మొక్కుబడిని పూర్తి చేయడానికి తన పది మంది సంతానంలో పాచిక చీటీ వేశారు. వారిలో అబ్దుల్లా యొక్క పేరు వచ్చింది. ఇక అబ్దుల్లాను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఖురైషులు అడ్డుకున్నారు. “ఇలా జిబహ్ చేయకూడదు, బలిదానం ఇవ్వకూడదు” అని. తర్వాత కాలాల్లో ఇదే ఒక ఆచారంగా మారిపోతే ఎంత ప్రమాదం అన్నటువంటి భయాందోళనకు గురి అయ్యారు. అయితే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అబ్దుల్లాకు బదులుగా పది ఒంటెలను నిర్ణయించి, వారి మధ్యలో చీటీ వెయ్యాలి. మరియు ఒంటెలను అబ్దుల్లాకు బదులుగా జిబహ్ చేయాలి. చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. అయితే వారు పది ఒంటెలను ఇంకా పెంచి ఇరవై చేశారు. మళ్ళీ చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారీ అబ్దుల్లా పేరు వస్తుంది, పది ఒంటెలను పెంచుతూ పోయారు. ఎప్పుడైతే అబ్దుల్లా ఒకవైపు మరియు వంద ఒంటెలు ఒకవైపు పూర్తి అయ్యాయో, అప్పుడు ఒంటెల పేరు మీద చీటీ వెళ్ళింది. అయితే అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెలను జిబహ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిబహ్ నుండి, బలిదానం నుండి అబ్దుల్లాను తప్పించడం జరిగింది. అందుకొరకే ఈ రెండవ వ్యక్తి జిబహ్ కు సిద్ధమైన తర్వాత కూడా తప్పించబడిన వారు. మరియు ఈయనకి బదులుగా జంతువును బలిదానం ఇవ్వడం ఏదైతే జరిగిందో, ఈ రకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటు అబ్దుల్లా కుమారుడు మరియు వీరి యొక్క వంశంలోనే ఇస్మాయీల్ అలైహిస్సలాం వస్తారు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్… ఈ విధంగా పూర్తి వంశావళి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం
అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండే అతని సంతానంలో అబ్దుల్లా తన హృదయానికి అతి చేరువుగా ఉండి, ఎక్కువ ప్రేమగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ బలిదానం యొక్క సంఘటన తర్వాత మరింత చాలా దగ్గరయ్యారు, ఇంకా అధికంగా అతన్ని ప్రేమించగలిగారు. అబ్దుల్లా యువకుడై, పెళ్ళీడుకు వచ్చిన తర్వాత, పెళ్ళి వయస్సుకు చేరిన తర్వాత, అబ్దుల్ ముత్తలిబ్, జొహ్రా వంశానికి చెందినటువంటి ఒక మంచి అమ్మాయి, ఆమినా బిన్తె వహబ్ ను ఎన్నుకొని అబ్దుల్లాతో వివాహం చేసేశారు.
అబ్దుల్లా తన భార్య ఆమినాతో ఆనందమైన వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆమినా మూడు నెలల గర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మోస్తూ ఉండగా, అబ్దుల్లా ఒక వ్యాపార బృందంతో సిరియా వైపునకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే మదీనాలో వారి యొక్క మేనమామలు ఉంటారు. అందుకని బనీ నజ్జార్ లోని వారి మేనమామల దగ్గర అక్కడ ఆగిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడే వారు చనిపోయారు. మదీనాలోనే వారిని ఖననం చేయడం, సమాధి చేయడం జరిగింది.
ఇటు ఆమినాకు నెలలు నిండినవి. సోమవారం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆమినా జన్మనిచ్చింది. అయితే నెల మరియు తారీఖు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోయింది. అయినా, తొమ్మిదవ తారీఖు, రబీఉల్ అవ్వల్ (رَبِيع ٱلْأَوَّل) యొక్క మాసం అని పరిశోధనలో తేలింది. ఎందుకంటే సోమవారం అన్న విషయం ఖచ్చితమైనది. అయితే ఈ రోజుల్లో పన్నెండవ రబీఉల్ అవ్వల్ అని కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. మరో ఉల్లేఖనం రమదాన్ ముబారక్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా, క్రీస్తు శకం ప్రకారం 571 అన్న విషయం ఖచ్చితం.
ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) – ఏనుగుల సంవత్సరం
అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) అని అంటారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి కేవలం 50 రోజుల ముందు ఏనుగుల సంఘటన జరిగింది. అదేమిటి? అదే ఇప్పుడు మనం విందాము.
నజ్జాషీ అను రాజు యొక్క గవర్నర్ యమన్ లో ఉండేవాడు. అతని పేరు అబ్రహా. అతడు అరబ్బులను చూశాడు, వారు హజ్ చేయడానికి మక్కా వస్తున్నారు. అయితే అతడు సన్ఆ (صَنْعَاء) (యమన్ లోని ప్రస్తుత క్యాపిటల్) అక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాడు. అరబ్బులందరూ కూడా హజ్ చేయడానికి ఇక్కడికి రావాలి అన్నటువంటి కోరిక అతనిది. అప్పట్లోనే అక్కడ అరబ్బుకు సంబంధించిన కినానా తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఈ విషయం తెలిసి ఒక సమయంలో వెళ్లి ఆ చర్చి గోడలను మలినం చేసేసాడు. ఈ విషయం అబ్రహాకు తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. చాలా కోపానికి వచ్చి ఒక పెద్ద సైన్యం సిద్ధపరిచాడు. మక్కాలో ఉన్న కా’బా గృహాన్ని (నవూదుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) ధ్వంసం చేద్దామని, కూలగొడదామన్న యొక్క దురుద్దేశంతో 60,000 సైన్యంతో బయలుదేరాడు. తొమ్మిది ఏనుగులను కూడా వెంట తీసుకున్నాడు. అతి పెద్ద ఏనుగుపై స్వయం తాను ప్రయాణమయ్యాడు.
మక్కాకు సమీపంలో చేరుకొని అక్కడ తన సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. పూర్తి సంసిద్ధతలు, సంసిద్ధతలన్నీ కూడా పూర్తయ్యాక, ఇక తన ఏనుగును కా’బా వైపునకు ముఖం చేసి లేపాడు. కానీ అది ముమ్మాటికీ లేవకుండా కూలబడిపోయింది. ఎప్పుడైతే కా’బా దిశకు కాకుండా వేరే దిశలో దాన్ని లేపుతున్నారో, పరుగెడుతుంది. కానీ అదే ఎప్పుడైతే దాని ముఖం కా’బా వైపునకు చేస్తారో, అక్కడే కూలబడిపోతుంది. వారు ఈ ప్రయత్నాల్లోనే ఉండగా, అల్లాహు తఆలా గుంపులు గుంపులుగా పక్షులను పంపాడు. నరకంలో కాల్చబడినటువంటి శనగ గింజంత పరిమాణంలో మూడు మూడు రాళ్లు ప్రతి పక్షి వెంట. ఒకటి వారి చుంచువులో, రెండు వాళ్ళ పంజాలలో. ఎవరిపై ఆ రాళ్లు పడుతున్నాయో, వాడు అక్కడే ముక్కలు ముక్కలు అయ్యేవాడు. ఈ విధంగా సైన్యం పరుగులు తీసింది. కొందరు అటు, కొందరు ఇటు పరుగెత్తుతూ దారిలో నాశనం అవుతూ పోయారు.
కానీ అల్లాహు తఆలా అబ్రహా పై ఎలాంటి శిక్ష పంపాడంటే, అతని వేళ్లు ఊడిపోతూ ఉండేవి. అతడు కూడా పరుగెత్తాడు, చివరికి సన్ఆ చేరుకునేసరికి అతని రోగం మరీ ముదిరిపోయి, అక్కడ చేరుకున్న వెంటనే అతడు కూడా నాశనమైపోయాడు. ఇక ఇటు ఖురైషులు, ఎప్పుడైతే అబ్రహా తన సైన్యంతో, (నవూదుబిల్లాహ్) కా’బా గృహాన్ని పడగొట్టడానికి వస్తున్నారని తెలిసిందో, వీళ్ళందరూ కూడా పర్వతాల్లో, లోయల్లో తమను తాము రక్షించుకోవడానికి పరుగెత్తారు. ఎప్పుడైతే వారికి తెలిసిందో, అబ్రహా అతని యొక్క సైన్యంపై అల్లాహ్ యొక్క ఈ విపత్తు కురిసింది అని, శాంతిగా, క్షేమంగా తిరిగి తమ ఇండ్లల్లోకి వచ్చారు.
ఈ విధంగా ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ జననం కంటే 50 రోజుల ముందు జరిగిన సంఘటన. అందుకొరకే ఆ సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ – ఏనుగుల సంవత్సరం అని అనడం జరిగింది. ఈ విధంగా మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జీవిత చరిత్రలోని మొదటి ఘట్టం పూర్తిగా విన్నాము. ఇంకా మిగతా ఎన్నో ఇలాంటి ఎపిసోడ్స్ వినడం మర్చిపోకండి.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) (మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.