సుత్రా (అడ్డంకి) లేకుండా నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి ఎవరైనా దాటి వెళ్ళవలసి వస్తే, ఎంత ఖాళీ స్థలం వదిలి వెళ్ళాలి?
షేక్ అరఫాత్ ఇబ్న్ హసన్ అల్-ముహమ్మదీ:
సున్నత్ ఏమిటంటే, మీరు నమాజులో నిలబడి ఉన్నప్పుడు, మీకు మరియు సుత్రాకు మధ్య మూడు మూరల దూరం ఉండాలి. మరియు మీరు సజ్దా (సాష్టాంగం) లో ఉన్నప్పుడు, మీ తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె దాటి వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం ఉండాలి.
ఉదాహరణకు, సుత్రా ఇక్కడ ఉండి, నమాజు చేసే వ్యక్తి ఇక్కడ ఉంటే, అతను ఫలానా చోట సజ్దా చేస్తాడు. కాబట్టి సజ్దా స్థితిలో అతని తలకు మరియు సుత్రాకు మధ్య ఒక గొర్రె లేదా మేక వెళ్ళడానికి సరిపడేంత ఖాళీ స్థలం మిగిలి ఉండాలి.
కాబట్టి, మీరు (నమాజు చేసే వ్యక్తి ముందు నుండి) దాటి వెళ్ళాలనుకుంటే, సుత్రా ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రదేశానికి అవతలి వైపు (వెలుపల) నుండి వెళ్ళాలి. ఉదాహరణకు, ఆ వ్యక్తి సజ్దా లో ఉన్నట్లయితే, ఒక గొర్రె వెళ్ళడానికి ఎంత స్థలం పడుతుందో అంచనా వేయండి, ఆ తర్వాత సుత్రా ఎక్కడ ఉంటుందో (అది ఒక చిన్న వస్తువు అయినప్పటికీ) అంచనా వేసి, దానికి ఆవల (వెనుక) నుండి వెళ్ళండి. ఇది మాత్రమే అనుమతించబడినది. ఈ స్థితిలో మీరు ఆ విధంగా దాటి వెళ్ళడం మీకు అనుమతించబడుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఒక అవసరం తీరాలనే ఉద్దేశ్యంతో ప్రవక్త (ﷺ) పై సలాహ్ పంపితే, ఆ అవసరం నెరవేరుతుందనేది ప్రామాణికమైన (ఆథెంటిక్) విషయమేనా?
షేఖ్ అరఫాత్ ఇబ్న్ హసన్:
అవును. ఎవరైతే అల్లాహ్ తమ అవసరాన్ని తీర్చాలని కోరుకుంటారో, వారు ప్రవక్త (ﷺ) పై తరచుగా ఎక్కువగా సలాహ్ పంపాలి. దీనికి సంబంధించి ఒక ‘సహీహ్’ (ప్రామాణిక) హదీసు ఉంది.
ప్రవక్త (ﷺ) ఒకసారి ఉబయ్ ఇబ్న్ కఅబ్ (రజియల్లాహు అన్హు) తో మాట్లాడారు, ఆయన ఎక్కువగా ప్రార్థిస్తూ మరియు (ప్రవక్త పై) సలాహ్ పంపుతూ ఉండేవారు. ఆయన (ఉబయ్) ఇలా అడిగారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నా దుఆ (ప్రార్థన) లో మీపై సలాహ్ పంపడానికి నేను ఎంత సమయాన్ని కేటాయించాలి?” ప్రవక్త (ﷺ) ఇలా బదులిచ్చారు: “నీ ఇష్టం (ఎంతైనా చేసుకోవచ్చు), కానీ నువ్వు ఇంకా ఎక్కువ చేస్తే అది నీకే మరింత మంచిది.” ఉబయ్ (రజియల్లాహు అన్హు) ఆ సమయాన్ని మరింత పెంచుకుంటూ పోయి చివరకు ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ ప్రవక్తా, నేను నా ప్రార్థన (దుఆ) అంతటినీ మీపై సలాహ్ పంపడానికే కేటాయిస్తాను.” (అప్పుడు) ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: “అయితే నీ కష్టాలన్నీ (విచారాలు) తీర్చబడతాయి మరియు నీ పాపాలు క్షమించబడతాయి.”
ఈ హదీసు ఇమామ్ తిర్మిజీ ప్రకారం ‘హసన్’ (ఆమోదయోగ్యమైనది).
ఒక వ్యక్తి దుఆ చేస్తూ (ప్రవక్తపై సలాహ్ పంపినప్పుడు), అల్లాహ్ వారి అవసరాన్ని నెరవేరుస్తాడని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యమని పండితులు అన్నారు — ఎందుకంటే మనిషికి విచారం (కష్టం) అనేది ఒక అవసరం తీరకపోవడం (లేదా ఒక ఆవశ్యకత) వల్లే వస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
Rules of Buying and Selling క్రయవిక్రయాల ఆదేశాలు [1] – క్రయవిక్రయాల ఆదేశం, ఔచిత్యం & అర్కాన్ వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/LLp42A0vsB8 [14 నిముషాలు]
ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో క్రయ విక్రయాల (కొనుగోలు మరియు అమ్మకం) నియమాల గురించి వివరించారు. ముఖ్యంగా వ్యాపారం యొక్క ధార్మిక ఆదేశం (హుకుం), అందులోని మర్మం లేదా ఔచిత్యం (హిక్మత్), మరియు వ్యాపారం సక్రమంగా జరగడానికి కావలసిన ఐదు ప్రధాన మూలస్తంభాల (అర్కాన్) గురించి ఖురాన్ ఆయతులు మరియు ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసుల వెలుగులో విపులంగా తెలియజేశారు.
ప్రియ వీక్షకులారా! మరో కొత్త శీర్షికతో మీ ముందుకు హాజరయ్యాను. ప్రారంభం నుండి చివరి ఎపిసోడ్ వరకు మీరు ఈ అంశాలన్నీ కూడా ఈ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్లు కూడా తప్పకుండా చూడండి. ఏమిటి అది? క్రయ విక్రయాల ఆదేశాలు. అల్లాహు అక్బర్. అవును ఇస్లాం ధర్మం మన జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన విషయంలో ఉత్తమ ఆదర్శం, చాలా మంచి స్పష్టమైన మనకు మార్గం చూపుతుంది. రోజువారి జీవితంలో పిల్లల నుండి పెద్దల వరకు, పురుషుల నుండి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరమైన వస్తువు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కొనడం, అమ్మడం, క్రయ విక్రయాల గురించి ఇస్లాం ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఈరోజు మొదటి పాఠం మీ ముందుకు వస్తుంది. క్రయ విక్రయాలు అంటే అమ్మకం మరియు కొనుగోలు యొక్క ఆదేశం ఏమిటి? దాని యొక్క అంతరార్థం, హిక్మత్, ఔచిత్యం మరియు మర్మం ఏమిటి? దాని యొక్క అర్కాన్, పిల్లర్స్, మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయి? రండి ముందు దాని యొక్క ఆదేశం గురించి హుకుం అనేది ఏమిటో తెలుసుకుందాం.
క్రయ విక్రయాల ఆదేశాలు (హుకుం)
క్రయ విక్రయాలు చేయడం అంటే అమ్మడం మరియు కొనడం పవిత్ర ఖురాన్ ద్వారా ధృవీకరించబడినది. ఖురాన్ లో దీని గురించి అల్లాహ్ త’ఆలా మనకు అనుమతించాడు. కనుక సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 275 లో తెలిపాడు:
وَأَحَلَّ ٱللَّهُ ٱلْبَيْعَ وَحَرَّمَ ٱلرِّبَوٰاْ [వ అహల్లల్లాహుల్ బయ్య వ హర్రమర్రిబా] కాని అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేసి, వడ్డీని హరామ్ (నిషిద్ధం) చేశాడు. (2:275)
అల్లాహ్ త’ఆలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు మరియు వడ్డీని నిషేధించాడు. కనుక వడ్డీ దగ్గరికి వెళ్ళకండి. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి బోధనలు మరియు ఆచరణ రెండూ కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. ప్రవక్త వారి వాచా, కర్మ సున్నతులు దీనికి అనుమతిస్తున్నాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా అమ్మారు, కొనుగోలు చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ క్రయ విక్రయాల గురించి ఎన్నో ఆదేశాలు ఇచ్చారు. వాటిలో ఒకటి ఏమిటి? అబూ దావూద్ లో వచ్చినటువంటి హదీస్:
అంటే ఏమిటో తెలుసు కదా, ఎందరో పల్లెల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారు, తోటలు ఉంటాయి వారికి వ్యవసాయాలు ఉంటాయి, వారు తమ యొక్క పంటను అమ్మడానికి నగరానికి వస్తారు, సిటీలోకి వస్తారు. అయితే అక్కడ రైతు బజార్ అని ఏదైతే ఉంటుందో అక్కడి యొక్క రేట్ తెలుసుకొని ఎవరి వద్ద ఎలా అమ్మితే మనకు మంచి లాభం ఉంటుందో వారు స్వయంగా వచ్చి అమ్ముకోవచ్చు. కానీ కొందరు దలాల్ అని అంటాము కదా వారు ఏం చేస్తారు దారిలో మధ్యలోకి వెళ్తారు లేదా మార్కెట్ కు ఆ పల్లెవాసి రాకముందే మధ్యలో కలిసి ఏదో ఒక తక్కువ రేట్లో వ్యాపారం చేసేసుకుంటారు. అలా చేయకండి, ప్రతి ఒక్కరికి వారి సొమ్ము వారి వాటా లభించనివ్వండి.
అలాగే మరొక హదీస్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలిపారు, సహీహ్ బుఖారీలో ఉంది:
الْبَيِّعَانِ بِالْخِيَارِ مَا لَمْ يَتَفَرَّقَا [అల్ బయ్యిఆని బిల్ ఖియారి మా లమ్ యతఫర్రఖా] అమ్మేవారు మరియు కొనేవారు ఇరువురు విడిపోనంత వరకు (ఆ బేరాన్ని రద్దు చేసుకునే లేదా ఒప్పుకొని తీసుకునే) ఎంపిక వారికి ఉంటుంది.
అమ్మేవారు మరియు కొనేవారు ఇరువురు విడిపోనంత వరకు ఆ బేరాన్ని రద్దు చేసుకునే లేదా ఒప్పుకొని తీసుకునే అటువంటి ఖియార్, ఆ చాయిస్ వారికి ఉంటుంది. ఎప్పటి వరకైతే వారు కలిసి ఉంటారో. విడిపోయారు, ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు, అమ్మేవారు వెళ్ళిపోయారు, కొనేవారు వెళ్ళిపోయారు, తర్వాత వచ్చి ఇది నాకు వద్దు అని అంటే ఆ చాయిస్ తీసుకోవాలా వద్దా అన్నటువంటి ఒక నిర్ణీత గడియ దానికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హద్దు తెలిపారు. ఈ హదీసుల అసలు ఉద్దేశ్యం మీకు అర్థమైంది కదా, అంటే మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటల ద్వారా ఈ క్రయ విక్రయాలు అమ్మడం కొనడానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా కొన్నారు, స్వయంగా అమ్మారు కూడా.
వ్యాపారం యొక్క అంతరార్థం మరియు ఔచిత్యం (హిక్మత్)
అయితే ఇక రండి, ఇప్పుడు ఈ క్రయ విక్రయాల, Buy and Sell, దీని యొక్క అంతరార్థం ఏమిటి? హిక్మత్ ఏమిటి? ఇందులో ఔచిత్యం, మర్మం ఏమున్నది? మనిషి ఇతరుల వద్ద ఉన్న తన అవసరాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నష్టం వేరే వారికి చేకూర్చకుండా, స్వయం తాను నష్టంలో పడకుండా, సులభంగా తన ఆ అవసరాన్ని తీర్చుకోవడం. నాకు కావలసిన ఒక వస్తువు ఫలానా వ్యక్తి వద్ద ఉంది, అతడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను వెళ్లి దానికి సంబంధించిన రుసుము, డబ్బు, ధర, వెల ఎంత ఉన్నదో ఇచ్చేసి అది తీసుకోవడం. ఈ విధంగా ప్రతి ఒక్కరు తమ అవసరాన్ని తీర్చుకుంటున్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరినీ ఏ నష్టంలో పడవేయుకుండా. హిక్మత్ తెలిసింది కదా, ఎన్నో హిక్మతులు ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషి జీవితంలో అవసరం ఉండేది.
వ్యాపారం యొక్క ఐదు మూలస్తంభాలు (అర్కాన్)
ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోబోతున్నాము. అదేమిటి? ఈ క్రయ విక్రయాలకు సంబంధించిన అర్కాన్ ఎన్ని? అవి ఐదు. జాగ్రత్త సుమా, ఇస్లాం యొక్క అర్కాన్ ఐదు అని విన్నాము, షహాదతైన్, నమాజ్, రోజా, జకాత్, హజ్. అయితే అవి ఇస్లాం యొక్క అర్కాన్, ప్రతి బిల్డింగ్ కి ప్రతి వస్తువుకు పిల్లర్ అనేది పునాది అనేది దానికి సంబంధించిన మూల పిల్లర్లు అనేవి ఉంటాయి కదా, మూల స్తంభాలు, అలాగే ఈ క్రయ విక్రయాలకు సంబంధించి ఐదు ఉన్నాయి. బాయె, ముష్తరీ, మబీఈ, సీగతుల్ అఖ్ద్ మరియు అత్-తరాదీ.
ఏంటి వీటి భావం? బాయె అంటే అమ్మేవారు. అమ్మే వ్యక్తి తాను అమ్మే వస్తువుకు అసలు యజమాని అయి ఉండాలి లేదా దానిని అమ్మడానికి అతనికి అనుమతి లభించి ఉండాలి. అలాగే అమ్మే వ్యక్తి తెలివితేటలు కలిగి మతిస్థిమితం ఉన్న వాడు అయి ఉండాలి. అంటే అతను పిచ్చివాడు కానీ ఇంకా వేరే కొనడానికి అమ్మడానికి ఏ బుద్ధి జ్ఞానాలు అవసరమో అవి లేకుండా ఉంటే అతడు నష్టంలో పడిపోతాడు, బహుశా ఇతరులను కూడా నష్టంలో పడవేస్తాడు కావచ్చు. ఇది బాయె, అమ్మే వ్యక్తి.
ఇక ముష్తరీ, కొనే వ్యక్తి ఏంటి? రెండవ రుకున్, రెండవ పిల్లర్, రెండవ మూలస్థంభం కొనేవారు. లావాదేవీలు చేసే అటువంటి విచక్షణ కలిగి ఉండాలి. కొనే వ్యక్తి కూడా మతిస్థిమితం లేనివాడు లేదా పెద్దల అనుమతి లేని బాలుడు కాకూడదు. ఎవరైనా పిల్లవాడు ఒక ఐదు రూపాయలు తీసుకొచ్చేసి నాకు చాక్లెట్ ఐస్క్రీం ఇలాంటిది ఏదైనా కొనుక్కుంటున్నాడు అంటే బహుశా అది అంత పెద్ద సమస్య కాదు. చిన్న బాలుడు, పిల్లవాడు 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇలా తీసుకొచ్చాడు, ఏదో నేను కొనాలి అనుకుంటున్నాను. ఏం కొంటావు బాబు? ఈ విధంగా చిన్న పిల్లలకు సరైన బుద్ధి జ్ఞానాలు ఉండవు. కనుక కొనే వ్యక్తి కూడా బుద్ధి జ్ఞానముడై మరీ పిల్లలు కాకుండా, ఒకవేళ పిల్లలు అయి ఉంటే పెద్దల అనుమతి అందులో ఉండి తప్పకుండా ఈ రెండు రుకున్లు పాటించాలి.
ఇక మూడవ రుకున్ వచ్చేసి ఏమిటి? మబీఈ అంటే ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో. ఆ వస్తువు ధర్మబద్ధమైనది, నాజాయజ్ కాకూడదు, జాయజ్ వస్తువై ఉండాలి. తాహిర్ అంటే పవిత్రమైనదిగా ఉండాలి, నాపాక్ వస్తువు ఉండకూడదు. అలాగే ఆ వస్తువును కొనే వారికి ఇచ్చే అటువంటి అవకాశం ఉండాలి. ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో కొనే వ్యక్తి ఆధీనంలో వచ్చే అటువంటి అవకాశం ఉండాలి. అంతే కాదు వాటి యొక్క అంటే ఏ వస్తువు కొనడం జరుగుతుందో దాని వివరాలు, దాని మంచి చెడులు కొనే వ్యక్తికి తెలిసి కూడా ఉండాలి. ఎవరైనా వ్యక్తి వచ్చాడు ఒక బాక్స్ మూసి ఉన్నది, నేను అమ్ముతున్నాను అని, అందులో ఏమున్నది, ఎలాంటిది ఏమీ తెలియకుండా ఇలా అమ్మడం ఇలా కొనడం సరైన విషయం కాదు. అర్థమైంది కదా.
ఇక నాలుగవ రుకున్, నాలుగవ మూలస్థంభం సీగయే అఖ్ద్, ఒప్పంద రూపం. అంటే ఏమిటి ఇది మాటల ద్వారా కావచ్చు, ప్రాక్టికల్ గా కూడా కావచ్చు. మాటల ద్వారా అంటే ఏమండీ ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి నాకు ఆ వస్తువు కావాలి, సరే తీసుకోండి మీకు ఈ వస్తువు ఇచ్చేసాను. కొనే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాకు ఇది కావాలి అన్నప్పుడు అమ్మే వ్యక్తి ఇదిగోండి మీరు తీసుకోండి నేను మీకు అమ్మేసాను అని ఇలా మాటల ద్వారా జరగడం కానివ్వండి. లేదా ప్రాక్టికల్ గా ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్ లు కానివ్వండి, లేదా డిమార్ట్ ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సామాన్లు అన్నీ పెట్టి ఉంటాయి అల్మారాలలో రేట్లు రాసి ఉంటాయి, ర్యాకులలో పెట్టి ఉంటాయి కదా. మనిషి తనకు అవసరం ఉన్న వస్తువు చూస్తాడు, దాని రేటు చూస్తాడు, అనుకూలంగా ఉంటే తీసుకుంటాడు క్యాషియర్ వద్దకు వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాడు, లేదా కార్డు ద్వారా పే చేస్తాడు. ఇటు కొనే వ్యక్తి అటు అమ్మే వ్యక్తి ఏ ఒక్క మాట మాట్లాడకుండా వ్యాపారం పూర్తవుతుంది. ఏంటిది ప్రాక్టికల్. ఇలా ప్రాక్టికల్ గా లేదా మాట ద్వారా అది పూర్తి అవ్వడానికి అవకాశం ఉండాలి.
ఇక ఐదవది, ఇది చాలా ముఖ్యమైనది. క్రయ విక్రయాల అర్కాన్ మూల స్తంభాల్లో ఐదవది ఉభయ పక్షాల అంగీకారం, ఇష్టం, తరాదీ. అంటే ఏమిటి? ఇరు పక్షాలు, కొనేవారు మరియు అమ్మేవారు వారి ఇష్టపూర్వకంగా, వారి ఇష్టం ఉన్నప్పుడే అది చెల్లుతుంది. ఏ ఒక్కరి తరఫు నుండి ఎలాంటి బలవంతం అనేది జరగకూడదు. ఇదే విషయం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:
إِنَّمَا الْبَيْعُ عَنْ تَرَاضٍ [ఇన్నమల్ బయ్యు అన్ తరాదిన్] వ్యాపారం అనేది ఇరు పక్షాల అంగీకారం మీదనే ఆధారపడి ఉన్నది.
వ్యాపారం అనేది కేవలం ఇరు పక్షాల అంగీకారం మీదనే ఆధారపడి ఉన్నది. దీనికి సంబంధించిన ఆయత్ కూడా ఉంది కదా ఖురాన్ లో, అన్ తరాదిమ్ మిన్కుమ్.
ముగింపు
ఈ విధంగా సోదర మహాశయులారా, సోదరీమణులారా క్రయ విక్రయాల ఆదేశాలు, కొనే అమ్మే అటువంటి ఆదేశాలు ఈ మన సిరీస్ లో మొదటి పాఠం పూర్తిగా విన్నారు. మూడు విషయాలు ఇందులో వచ్చాయి. మొదటిది దాని ఆదేశం, రెండవది దాని హిక్మత్ అంతరార్థం, మూడవది దాని యొక్క ఐదు పిల్లర్లు. మంచిగా గుర్తుంచుకోండి ఈ విషయాలు ఇన్షాఅల్లాహ్ రెండవ పాఠంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో నరకవాసుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు నరకాగ్నితో కూడుకున్నవని, వారి తలల పైనుండి, పాదాల క్రింది నుండి శిక్ష కమ్ముకుంటుందని వివరించబడింది. నరకవాసులను బంధించే సంకెళ్లు, ఇనుప గదలు, వేడి నీటితో చర్మం కాలిపోవడం, తిరిగి కొత్త చర్మం రావడం వంటి భయంకరమైన శిక్షల గురించి ఖురాన్ ఆయతుల ద్వారా తెలపబడింది. ముఖం కిందికి లాగబడటం, గాడిదలా తిరగడం, పాములు, తేళ్లు కుట్టడం వంటి శిక్షలను వివరిస్తూ, ఈ నరక యాతనల నుండి ఏ విధంగానూ ఉపశమనం లేదా మరణం ఉండదని వక్త హెచ్చరించారు. చివరగా, అల్లాహ్ దయతో ఇహలోకంలో ప్రసాదించిన వరాన్ని సద్వినియోగం చేసుకుని నరక శిక్ష నుండి రక్షణ పొందాలని కోరారు.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరక శిక్షలు, నరకవాసులకు ఇవ్వబడే ఆహారం, పానీయాలు, దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము.
నరకవాసుల పడకలు మరియు శిక్షల తీవ్రత
ఇక ఈ రోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది? ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అయితే, నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి! నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు, అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని. అది శిక్షలతో కూడిన స్థలం. అయినా, అక్కడ ఇవ్వబడే తిండి, పానీయం, దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి. ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో, అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి.
సూరహ్ అల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 41 లో అల్లాహ్ తెలిపాడు:
لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ [లహుమ్ మిన్ జహన్నమ మిహాదువ్ వమిన్ ఫౌకిహిమ్ గవాష్. వ కజాలిక నజ్ జిజ్ జాలిమీన్] వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. (7:41)
నరకమే నరకం. మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో, అవి కూడా నరకానికి సంబంధించినవే,
సూరహ్ అన్ కబూత్, ఆయత్ నంబర్ 55 లో అల్లాహ్ తెలిపాడు:
ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు. (29:55)
ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలని కోరుతారో, ఆ నీడ కూడా నరకం యొక్క నీడ! అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది, సౌఖ్యం అనేది ఉండదు. వారు నీడను చూసి, ఆ నీడలోకి వచ్చినప్పుడు, అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారిపోయి వచ్చారో, నరకాగ్ని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో, నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు. అలాంటి ఆ స్థితిలో, నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది.
ఇరుకు ప్రదేశాల్లో బంధించబడడం మరియు ఇనుప గదలు
ఇంకా మహాశయులారా, నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు, కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతం అనేది ఉండదు. నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి. కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది. మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది. ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే, వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు.
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)
అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది: “ఏమిటి ఒక్క చావును? ఎన్నో చావులను మీరు పిలిచినా, కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు, మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు.”
మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూరహ్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 49 లో తెలపడం జరిగింది:
وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ [వతరల్ ముజ్రిమీన యౌమఇజిమ్ ముకర్రనీన ఫిల్ అస్ ఫాద్] ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. (14:49)
మరియు సూరహ్ ఇన్సాన్ ఆయత్ నంబర్ 4 లో ఉంది:
إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا [ఇన్నా అఅతద్ నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలవ్ వసయీరా] అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. (76:4)
అబూ లహబ్ యొక్క భార్య, ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏం చెప్పాడు?
فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ [ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్] ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (111:5)
మరియు సూరహ్ హాక్కా లో ఇంతకుముందే మీరు విని ఉన్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మపత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో, ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ:
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ [సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ ఊన జిరాఅన్ ఫస్లుకూహ్] మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి. (69:32)
ఇంకా మహాశయులారా, మరో రకమైన శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద ఇనుప గదలతో, ఇనుప రాళ్లతో, ఇనుప సలాకులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది.
وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ [వలహుమ్ మకామిఉ మిన్ హదీద్] ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. (సూరహ్ హజ్ 22:21)
మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష, నరకవాసుల తలల మీదుగా బాగా వేడిలో, మితిమీరి వేడిగల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది. ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తోలు అంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి.
ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరీ ఘోరంగా ఉంది. చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఎవరైతే మదీనా వాసుల పట్ల చెడుగా చూస్తాడో, చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి చేస్తాడు అంటే, ఉప్పు నీళ్లలో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతా ఉంటాడు. ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది.
ఇంకా మహాశయులారా, అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో, అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేయడం జరుగుతుంది. వారికి కొత్త తోలు పుట్టుకొస్తుంది. మళ్లీ శిక్షించడం జరుగుతుంది. తోలు కాలిపోతుంది, మళ్లీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది.
كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ [కుల్లమా నజిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్] వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము (4:56)
మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా, మనిషి యొక్క తోలులో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి. ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో, వాటిని మార్చడం జరుగుతూ ఉంటుంది.
ముఖం క్రిందులుగా లాగబడటం మరియు పేగులు బయటపడే శిక్ష
ఇంకా సోదరులారా, నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా.
తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది.
يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ [యౌమ యుస్ హబూన ఫిన్నారి అలా వుజూహిహిమ్] వారిని ముఖం క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది. (54:48)
మరి కొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది? బహుశా కొన్ని పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము, నూనె తీయడానికి ఎద్దు గాని, గాడిద గాని గుండ్రంగా త్రిప్పుతూ ఉండడం జరుగుతుంది. అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది. కేవలం ఒక విషయం అర్థం కావడానికి మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను. కానీ నవూజుబిల్లాహ్, నరకంలో ఉండే నరక శిక్షల యొక్క పోలిక కాదు ఇది. విషయం ఏంటంటే, నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది.
ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది. నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి. కడుపు చాలా పెద్దగా అయిపోతుంది. అతడు లేచి నిలబడాలి అనుకుంటాడు, కానీ నిలబడలేడు, తిరుగుతాడు. ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు అతన్ని చూసి, “నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవాడివి కదా! చెడు నుండి ఆపుతూ ఉండేవాడివి కదా! నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు?” అని అంటే, అతను అంటాడు:
كُنتُ آمُرُكُم بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ وَأَنْهَاكُمْ عَنِ الْمُنكَرِ وَآتِيهِ [కున్తు ఆమురుకుమ్ బిల్ మఅరూఫి వలా ఆతీహి వ అన్హాకుమ్ అనిల్ మున్కరి వ ఆతీహ్] “ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాడినో, అది నేను పాటించేవాడిని కాదు. ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో, ఆ చెడు నేను చేసేవాడిని.”
అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు. అల్లాహ్ ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించు గాక. ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
నరకవాసుల ఆక్రందనలు మరియు భయంకరమైన సర్పాలు
నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే, ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు, ఎవరూ వారి యొక్క ఏడ్పుబొబ్బలను వినేవారు ఉండరు.
حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ [హత్తా ఇజా అఖజ్ నా ముత్రఫీహిమ్ బిల్ అజాబి ఇజా హుమ్ యజ్ అరూర్] ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.(23:64)
لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ [లా తజ్ అరుల్ యౌమ ఇన్నకుమ్ మిన్నా లా తున్సరూన్] వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది: “మీరు ఈ రోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి, ఈ రోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు.” (23:65)
నరకంలో ఒక రకమైన శిక్ష: మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి, నీళ్లు త్రాగడానికి అని పక్కకు వస్తాడు, వేడి వేడి నీళ్లు, మితిమీరిన వేడి నీళ్లు!
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ [యతూఫూన బైనహా వబైన హమీమిన్ ఆన్] అటు అది త్రాగలేడు, ఇటు దీనిని భరించలేడు, ఈ విధంగా ఇటునుండి అటు, అటునుండి ఇటు తిరుగుతూనే ఉంటాడు. (55:44)
అంతేకాదు నరకంలో, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్లు ఉంటాయి. నరకవాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ముస్నద్ అహ్మద్ మరియు సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని ప్రస్తావించారు: నరకంలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము “బుఖ్త్” ఒంటె (చాలా పెద్ద, ఎత్తుగా ఉండే ఒంటె) అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి.
ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని యొక్క బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు అల్లాహు అక్బర్. మరియు నరకంలో సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచర గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్లు కూడా ఉంటాయి. ఆ తేళ్లు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం, దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది.
నరకవాసుల బాధాకరమైన శ్వాసలు మరియు భయంకర ముఖాలు
ఇంకా సోదరులారా, సోదరీమణులారా, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది. ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది.
سَأُرْهِقُهُ صَعُودًا [స ఉర్హికహు సఊదా] దానిని వారు ఎక్కలేరు, పడుతూ ఉంటారు, మళ్లీ ఎక్కడం జరుగుతుంది. “త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను.“ (74:17)
అల్లాహ్ ఆయత్లలో తిరస్కరించి, ఖురాన్ గ్రంథాన్ని “ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి” అన్నటువంటి ఎగతాళి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి.
నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష: నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో, మళ్లీ వదులుతాడో, పీల్చుకునే, వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహా భయంకరమైన ధ్వని, చప్పుడు అనేది ఉంటుంది.
فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ [ఫఅమ్మల్ లజీన షకూ ఫఫిన్నారి లహుమ్ ఫీహా జఫీరువ్ వషహీక్] ఎవరైతే దౌర్భాగ్యులో వారు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో విలపిస్తూ, కేకలు వేస్తూ (భయంకరమైన శ్వాసలు తీస్తూ) ఉంటారు. (11:106)
అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఈ మస్జిద్ లో లక్ష, లక్షకు పైగా మంది ఉన్నారంటే, వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే, అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దానివల్ల ఈ లక్ష, లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు, చనిపోతారు. అల్లాహు అక్బర్.
నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, వారి ముఖాన్ని మరీ అంధకారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి. ఒక హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఆజర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సహీహ్ హదీసులో వచ్చి ఉంది.
నరకంలో మరణం లేదు మరియు సహాయం అందదు
అయితే మహాశయులారా, ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా? వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది అనా? వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా? ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు. ఇవన్నీ కూడా అసంభవం.
فَلَا يُخَفَّفُ عَنْهُمُ [ఫలా యుఖఫ్ఫఫు అన్హుము] వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు, అని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ లో చెప్పడం జరిగింది. మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరూ ఉండడు.
మరియు వారికి చావు వస్తుందా?
لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ [లా యమూతు ఫీహా వలా యహ్యా] అక్కడ చావు రాదు, హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు. (87:13)
గమనించండి, ఇహలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు, మనిషి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదో జరుగుద్ది, కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు. నరకవాసులు అందరూ నరకంలో, స్వర్గవాసులు అందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, స్వయంగా చావును అల్లాహ్ త’ఆలా ఒక పొట్టేలు రూపంలో తీసుకొస్తాడు. వారందరూ దానిని గుర్తుపడతారు, ఇది చావు అని ఒప్పుకుంటారు. అల్లాహ్ త’ఆలా ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరికీ ఏ చావు అనేది ఉండదు.
అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఉండదు.
كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا [కుల్లమా అరాదూ అయ్ యఖ్ రుజూ మిన్హా ఉఈదూ ఫీహా] ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని అనుకుంటారో, ఏదైనా కొంచెం పైకి వస్తారో, కొంచెం బయటికి రావాలనుకుంటారో, వారిని తిరిగి అందులోనే వేయడం జరుగుతుంది. (32:20)
మరియు వారు నరకం నుండి బయటికి వెళ్లడానికి ఏ అవకాశమూ లేదు అని కూడా అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు.
మహాశయులారా, సమయం సమాప్తం కానుంది, ఇక్కడ ఒక హదీస్ తప్పకుండా మీరు వినండి. వాటిపై శ్రద్ధ వహించండి. అవకాశం అల్లాహ్ ఏదైతే మనకు ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ భాగ్యం నాకు, మీకు మనందరికీ ప్రసాదించుగాక.
ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఒక వ్యక్తిని హాజరు పరుస్తాడు. అతనితో ప్రశ్నిస్తాడు:
أَلَمْ أَجْعَل لَّكَ سَمْعًا وَبَصَرًا وَمَالًا وَوَلَدًا [అలమ్ అజ్ అల్ లక సమ్ అన్ వ బసరన్ వ మాలన్ వ వలదా] “నేను నీకు చెవులు, కళ్లు, డబ్బు ధనం, సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా?” ఆ మనిషి అంటాడు: “అవును ఓ అల్లాహ్! అన్నీ నీవే ప్రసాదించావు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.”
وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْثَ وَتَرَكْتُكَ تَرْأَسُ وَتَرْبَعُ [వ సఖ్ఖర్తు లకల్ అన్ ఆమ వల్ హర్స వ తరకుక తర్ అసు వ తర్బఉ] “నీకు పంటలు, పొలాలు, జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను. వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు. వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు, అవునా?” అతను అంటాడు: “అవును ఓ అల్లాహ్!”
“అయితే ఈ రోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండెనా ఇహలోకంలో?” అని అడుగుతాడు.
అప్పుడు అతను అంటాడు: “లేదు ఓ అల్లాహ్! చనిపోయేది ఉంది, నీవు మళ్లీ నన్ను లేపుతావు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది.”
అప్పుడు అంటాడు అల్లాహ్:
الْيَوْمَ أَنْسَاكَ كَمَا نَسِيتَنِي [అల్యౌమ అన్సాక కమా నసీతనీ] “ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో, ఇక ఈ రోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను.”
అంటే ఏమిటి భావం? అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాల్లో స్వర్గం, అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు, నరకంలోనే ఉండవలసి వస్తుంది.
గమనించారా సోదరులారా? ఇహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఎలా లాభాన్ని తీసుకొచ్చాయి? ఒకవేళ మనం అల్లాహ్ ను తిరస్కరిస్తే, అల్లాహ్ చెప్పినట్లుగా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే. అందుగురించి అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తల్ని విశ్వసించి, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ, పరలోక దినాన్ని విశ్వసించాలి.
అల్లాహ్ త’ఆలా మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించు గాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో నరకవాసుల ఆహారం మరియు పానీయాల గురించి వివరించబడింది. జఖూమ్, దరీ, మరియు ఘిస్లీన్ వంటి భయంకరమైన ఆహార పదార్థాలు, అలాగే అల్ ముహ్ల్, హమీమ్, ఘస్సాఖ్ మరియు సదీద్ వంటి పానీయాలు నరకంలో పాపాత్ములకు ఎలా ఇవ్వబడతాయో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. నరకవాసుల వస్త్రాల గురించి మరియు అహంకారులకు కలిగే శిక్షల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. మనిషి ఈ లోకంలో చేసే పాపాల నుండి దూరంగా ఉండి, నరక శిక్ష నుండి తప్పించుకోవాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్ హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మ బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా! నరకవాసులకు ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో దాని గురించి తెలుసుకుంటూ జఖూమ్ (జముడు వృక్షం) గురించి మనం గత కార్యక్రమంలో తెలుసుకున్నాము.
ఇక రెండో రకమైన ఆహారం వారికి ఇవ్వబడేది ‘దరీ‘. దీని ప్రస్తావన సూరహ్ గాషియాలో వచ్చి ఉంది. దరీ ఒక చెట్టు, దానికి ముళ్లు ఉంటాయి. అందులో చాలా దుర్వాసన ఉంటుంది మరియు దానివల్ల ఆకలి అనేది మనిషికి దూరం కాదు. అలాంటిది ఆ రోజు నరకవాసులకు తినడానికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు:
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ (లైస లహుమ్ త’ఆమున్ ఇల్లా మిన్ దరీ’. లా యుస్మిను వలా యుగ్నీ మిన్ జూ’) వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. (88:6-7)
ఇలాంటిది వారికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏదైతే వారికి ఆహారంగా ఉంటుందో అది ‘ఘిస్లీన్‘. దీని ప్రస్తావన సూరహ్ హాక్కా లో వచ్చి ఉంది. ఘిస్లీన్ అంటే రక్తము మరియు పుండు నుండి వెళ్ళే పదార్థము. అది నరకవాసుల పుండ్ల నుండి వారికి అగ్ని తగలడం వల్ల అక్కడ నుండి ఏదైతే చీము కారుకుంటూ వస్తుందో అది. ఇది ఎలాంటి వారికి ఆహారం అవుతుంది? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హాక్కా లో తెలుపుతూ:
فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ (ఫలైస లహుల్ యౌమ హాహునా హమీమ్. వలా త’ఆమున్ ఇల్లా మిన్ గిస్లీన్) “కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు” (69:35-36)
అల్లాహ్ మనందరినీ ఆ ఘిస్లీన్ నుండి కూడా కాపాడుగాక. ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలిపారు: ఘిస్లీన్ అంటే నరకవాసుల చెమట, చీము అవన్నీ కలిపి వచ్చే పదార్థాలు అని.
అంతే కాకుండా మరో భయంకరమైన, వింటేనే వికారం కలిగేటటువంటి విషయం ఏమిటంటే ఏ వ్యభిచారిణీలను నరకంలో వేయడం జరుగుతుందో వారి యొక్క మర్మాంగాల నుండి వచ్చే చెడు, అలాంటిది కొందరి పాపాత్ములకు ఆహారంగా ఉంటుంది. అల్లాహ్ మనందరికీ అలాంటి చెడు విషయాల నుండి రక్షణ కలిగించుగాక. ఇక్కడ ఇంత చెడు ఉంటుందా అని అడ్డప్రశ్నలు వేసి మరింత విశ్వాసాన్ని పాడు చేసుకునే దానికి బదులు మనం నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి దూరం ఉండటం మేలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
అయితే మహాశయులారా! ఈ రకరకాల ఆహారాల గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో, జఖూమ్ గాని, ఘిస్లీన్ గాని లేదా దరీ గాని మరియు కొన్ని ఆయతులలో ‘జా గుస్సహ్’ అనే ఒకటి ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వివిధ రకమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే సందర్భంలో ఇవ్వబడతాయా? వేరువేరు సందర్భాల్లో ఇవ్వబడతాయా? మరియు ప్రతి ఒక్కటి ఒక రకమైన పాపాత్ములకు ఇవ్వబడుతుందా? ఇవన్నీ వివరాలు పరలోకంలో అల్లాహ్ కు బాగా తెలుసు. ఇవన్నీ కూడా పరలోక విషయాలు వాటి వివరాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మనం వాటి ద్వారా అర్థం చేసుకునే విషయాలు ఏమిటంటే ఏ పాపాలకు కూడా ఎలాంటి అవిశ్వాసానికి కూడా మనం గురి కాకూడదు మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు. వీటన్నిటిలో ఏ ఒక్క చెడైనా గాని మనల్ని నశింపచేయడానికి, మనల్ని అవమానపరచడానికి మహా ఎక్కువగా ఉంటుంది. అందుగురించి మనం సత్యాన్ని స్వీకరించి నరకం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే మన గురించి ఇందులో ఉన్నటువంటి గొప్ప బోధ.
నరకవాసుల పానీయాలు
ఇక రండి మహాశయులారా! వారికి త్రాగడానికి ఇవ్వబడే పానీయాలు ఎలాంటివి అవి కూడా కొంచెం మనం తెలుసుకుందాము. అయితే ఎప్పుడైతే వారికి దాహం కలుగుతుందో అప్పుడు కొన్ని జంతువులు దాహంతో తల్లడిల్లుతూ దూరం నుండి నీళ్లను చూస్తే పిచ్చివారిగా ఎలా పరిగెత్తుతాయో, వారు పరిగెత్తడంలో ఒకరిని ఒకరు త్రోసుకుంటూ మరియు ఎటువైపున ఏ నష్టం జరుగుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే వైపున పరిగెడతారో అలా ఆ రోజు నరకవాసుల పరిస్థితి అవుతుంది.
وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا (వనసూఖుల్ ముజ్రిమీన ఇలా జహన్నమ విర్దా) అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము (19:86)
ఇంకా ఆ రోజు దాహం ఎక్కువగా ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నరకవాసులకు స్వర్గవాసులు సేవిస్తున్న పానీయాలు కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు వారు అరుస్తారు:
నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు. (7:50)
ఇది ఎంతటి అవమానం గమనించండి. కళ్లారా చూస్తున్నాము వారు ఎంతో తీయటి నీళ్లు త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారు ఆ విషయం మనకు కనబడుతుంది. కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీకొరకు ఇది నిషిద్ధమని అక్కడ నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది. ఆ రోజు అంత బాధ కలగకూడదు అంటే ఈ రోజు విశ్వాసం పై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి.
మహాశయులారా! నరకవాసులకు దాహం కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో ‘అల్ ముహ్ల్’ ఒకటి. అల్ ముహ్ల్ అంటే నూనె అడుగున నూనె యొక్క మడ్డి ఏదైతే ఉంటుందో దానిని అల్ ముహ్ల్ అంటారు. అయితే అదే ఒకవేళ బాగా కాగిన నూనె ఉండేదుంటే దాని యొక్క వేడి ఎంత ఉంటుందో, ఆ మడ్డి, మడ్డిలోని వేడి మీది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది. సూరహ్ కహఫ్ లో దాని ప్రస్తావన వచ్చింది.
وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ (వ ఇన్ యస్తగీసూ యుగాసూ బిమాయిన్ కల్ ముహ్ల్ యష్విల్ వుజూహ్) ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. (18:29)
ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో ముఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది. అల్లాహు అక్బర్.
రెండో రకమైన పానీయం ‘హమీమ్‘. దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు:
لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ (లహుమ్ షరాబుమ్ మిన్ హమీమ్) వారి కొరకు మరిగే నీటి పానీయం ఉంది. (6:70)
وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ (వసుఖూ మాఅన్ హమీమన్ ఫఖత్త’ఆ అమ్’ఆఅహుమ్) మరియు మరిగే నీరు త్రాగించబడే వారికి (పోలిక ఉందా)? ఆ నీరు వారి పేగులను ముక్కలు ముక్కలు చేస్తుంది. (47:15)
హమీమ్ ఎలా ఉంటుంది దాని యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాం. నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో రెండో రకమైనది హమీమ్. దేనినంటారు నీళ్లు వేడికి ఎక్కి దాని యొక్క చివరి భాగం ఏదైతే ఉండగలుగుతుందో దానిని హమీమ్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి అది త్రాగుతాడో కేవలం మీది శరీరం యొక్క పై భాగమే కాదు లోపలి భాగాన్ని కూడా అది చాలా చెడ్డమైన విధంగా పాడు చేస్తుంది. ఒకసారి సూరహ్ హజ్ లోని ఆయత నెంబర్ 19 మరియు 20 వినండి మరియు శ్రద్ధ వహించండి.
يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ (యుసబ్బు మిన్ ఫౌఖి రుఊసిహిముల్ హమీమ్. యుస్ హరు బిహీ మా ఫీ బుతూనిహిమ్ వల్ జులూద్) సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. (22:19-20)
అల్లాహ్ ఇలాంటి హమీమ్ నుండి మనందరినీ రక్షించుగాక.
ఇక మూడో రకమైన పానీయం అది ‘ఘస్సాఖ్‘. సూరహ్ నబా లో ‘హమీమన్ వ ఘస్సాఖ’ అని రెండు కలిపి వచ్చాయి, హమీమ్ మరియు ఘస్సాఖ్. హమీమ్ అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా! అతి వేడి. ఇక ఘస్సాఖ్ అన్నది దానికి ఆపోజిట్ విరుద్ధమైనది. చలి మరియు ఐస్ లో ఎంత ఎక్కువ చల్లదనం ఉండగలుగుతుందో దానికి మితిమీరినది. మరియు మనకు తెలుసు చల్లదనం మితిమీరిన రీతిలో ఉంటే అది కూడా మహా నష్టపరుస్తుంది. దానివల్ల కూడా మనిషి యొక్క శరీరంలో తోలు ఇదంతా కాలిపోతుంది మరియు అదంతా చిదిరిపోతుంది. విపరీతమైన చలి పడినప్పుడు పచ్చని చెట్లు కూడా నల్లగా అయినట్లు మనం చూస్తూనే ఉన్నాం.
ఈ విధంగా మహాశయులారా! నరకంలో ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జమ్హరీర్ చల్లదనంలో మితిమీరినది ఉంది. అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీమ్ వేడిలో మితిమీరినదైతే ఘస్సాఖ్ చల్లదనంలో మితిమీరినది.
మహాశయులారా! నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది ‘సదీద్‘. సదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి ఏదైతే వస్తుందో దానినంటారు. ఇది కూడా కొందరి నరకవాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? సూరహ్ ఇబ్రాహీమ్ ఆయత నెంబర్ 16, 17 లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు.
وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ (వయుస్ఖా మిన్ మాఇన్ సదీద్. యతజర్రఉహు వలా యకాదు యుసీగుహ్) అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది. అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు. (14:16-17)
ఇక ఎవరైతే ఇహలోకంలో మత్తు సేవిస్తారో అలాంటి వారికి ఇలాంటి సదీద్ త్రాగించడం జరుగుతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది. అయితే హదీసుల్లో సదీద్ అన్న పదం కాకుండా ‘తీనతుల్ ఖబాల్’ అన్న పదం వచ్చి ఉంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు మరియు చీము అని దాని వివరణ తెలిపారు.
అయితే మహాశయులారా! నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి.
అలాగే మహాశయులారా! ఎవరైతే ఇహలోకంలో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ గర్వంతో పొగరుబోతుతనం వహిస్తారో ప్రళయ దినాన వారు ఏ స్థితిలో వస్తారో మరియు వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో తెలిపారు. ఆ హదీసు జామె తిర్మిజి లో ఉంది షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్ లో పేర్కొన్నారు. ‘ప్రళయ దినాన అహంకారులను చీమల పరిమాణంలో తీసుకురావడం జరుగుతుంది. అన్ని వైపుల నుండి వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది మరియు ఒక రకమైన జైలులో బందిఖానాలో వారిని తోలుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారికి తీనతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.’
అయితే నరకవాసులు నరకంలో హమీమ్, ఘస్సాఖ్, ఘిస్లీన్, సదీద్, తీనతుల్ ఖబాల్ ఇవన్నీ అవి అంత చెడుగా ఉన్నప్పటికీ ఎందుకు త్రాగుతారు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే విషయం ఏమిటంటే వారికి ఎప్పుడెప్పుడు దాహం కలుగుతుందో వారికి ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ కలుగుతుందో కనీసం ఇలాంటి నీటితో మనం దాహం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ అది త్రాగడం వల్ల ఇంత నష్టం ఏర్పడుతుంది అని వారు ముందు ఊహించలేరు తర్వాత ఆ విషయం వారికి తెలిసి వస్తుంది. అయితే మహాశయులారా! వారు త్రాగడానికి ఏదైతే ఇలాంటి పానీయాలు ఇవ్వబడతాయో వాటిని వారు ఎలా త్రాగుతారు? దాని యొక్క ప్రస్తావన కూడా ఖురాన్ లో వచ్చి ఉంది.
فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ (ఫషారిబూన షుర్బల్ హీమ్) దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు మీరు దానిని త్రాగుతారు. (56:55)
మహా దాహం కలిగి ఉన్న ఒంటెలు ఎలా నీళ్లు చూసిన వెంటనే పరిగెడతాయో ఆ విధంగా వారు ఆ నీరు వైపునకు పరిగెడతారు.
నరకవాసుల వస్త్రాలు
నరకవాసులకు ఎలాంటి వస్త్రాలు ధరింపజేయబడతాయో దాని ప్రస్తావన కూడా ఖురాన్ హదీసులో వచ్చి ఉంది. సూరహ్ హజ్ లో అల్లాహ్ తెలిపాడు:
فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ (ఫల్లజీన కఫరూ ఖుత్తిఅత్ లహుమ్ సియాబుమ్ మిన్నార్) అందుచేత అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. (22:19)
దుస్తులు కూడా నరకంలోనివే. ఇక ఎలా ఉంటుంది వారి పరిస్థితి గమనించండి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక బానిస ఉన్నాడు ఒక యుద్ధంలో. తెలియని ప్రదేశం నుండి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రజలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీద్ అయిపోయాడు అమరవీరుడు అయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “అతడు యుద్ధ ఫలంలో నుండి మాలే ఘనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదర్ ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు అనేటివి వచ్చి పడుతూ ఉన్నాయి“
అలాగే సోదరులారా! ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “నౌహ చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తౌబా చేసుకోకుంటే ప్రళయ దినాన వారిని లేపడం జరుగుతుంది వారి యొక్క శరీరంపై తార్ (డాంబర్) కు సంబంధించిన షర్ట్ ఉంటుంది మరియు వారి యొక్క పైజామా అనేది గంధకముతో చేయబడినదిగా ఉంటుంది“. ఇలా తార్ డాంబర్ తో చేయబడిన షర్ట్ మరియు గంధకముతో తయారు చేయబడిన పైజామా అంటే ఎంత వేడి ఎక్కుతుందో ఎలా శిక్ష వారికి ఉంటుందో వారికి ఏ దుస్తులైతే ధరింపజేయబడుతున్నాయో అవి కేవలం వారిని దాచి పెట్టడానికి వారి యొక్క ప్రదేశాలను రక్షణ కొరకు కాదు వాటి ద్వారా కూడా వారికి ఎంతో శిక్ష అనేది లభిస్తూ ఉంటుంది.
ఈ విధంగా సోదరులారా! వారి యొక్క ఆహారం, వారి యొక్క పానీయాలు, వారి యొక్క దుస్తులు ఇవన్నీ వివరాలు ఏదైతే వచ్చాయో ఎందుకు? మనం వాటి పట్ల భయపడి మనకు మనం ఆ నరకానికి దూరం ఉంచే ప్రయత్నం ఇహలోకంలోనే చేసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగం ఇస్లాంలోని పవిత్ర మాసాల (ముహర్రం, రజబ్, జుల్ ఖాదా మరియు జుల్ హిజ్జా) విశిష్టతను మరియు ఆ మాసాలలో పాపాలకు దూరంగా ఉండవలసిన ఆవశ్యకతను వివరిస్తుంది. అల్లాహ్ పన్నెండు నెలల్లో నాలుగింటిని ప్రత్యేకంగా పవిత్రమైనవిగా ప్రకటించారని, ఈ కాలంలో చేసే సత్కార్యాలకు ప్రతిఫలం పెరగడమే కాకుండా, చేసే పాపాల తీవ్రత మరియు వాటి శిక్ష కూడా ఇతర సమయాల కంటే అధికంగా ఉంటాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. పాపాలు సంఖ్యాపరంగా పెరగకపోయినా, పవిత్ర స్థలాలు మరియు కాలాల గౌరవాన్ని బట్టి వాటి ప్రభావం తీవ్రమవుతుందని, ఇవి హృదయాలకు తుప్పు పట్టించి మనిషిని అల్లాహ్ కరుణకు దూరం చేస్తాయని ఆయన హెచ్చరించారు.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అల్ హమ్దులిల్లాహి మలికిల్ ఖుద్దూసిస్సలాం, ముజ్రిల్లయాలి వల్ అయ్యాం, వ ముజద్దిదిష్ షుహూరి వల్ ఆవాం. వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), వ అలా ఆలిహిల్ కిరాం, వ సహ్ బిహిల్ బరరాతిల్ ఆలాం, వత్తాబియీన లహుమ్ బి ఇహసాన్.
సర్వస్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
పవిత్ర మాసాల ప్రాముఖ్యత
అభిమాన సోదరులారా! ఈరోజు అంశం మీకందరికీ తెలిసిందే, “పవిత్ర మాసాలలో పాపాల ప్రమాదం“. ఇస్లాంలో నాలుగు మాసాలను అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రత్యేక పవిత్రతతో గౌరవించాడు. అవి జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం మరియు రజబ్. ఇందులో జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం వరుసగా వచ్చే మూడు నెలలు. రజబ్ ఇది జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉంటుంది. దీని ప్రస్తావన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ తౌబా ఆయత్ 36 లో ఇచ్చాడు:
నిశ్చయంగా అల్లాహ్ వద్ద నెలల సంఖ్య పన్నెండు. ఆకాశాలనూ, భూమినీ సృష్టించిన రోజు నుండి అల్లాహ్ గ్రంథంలో అవి పన్నెండే. వాటిలో నాలుగు పవిత్రమైనవి. ఇదే సరైన ధర్మం. కాబట్టి ఆ నెలలలో మీరు మీపై అన్యాయం చేసుకోకండి. (9:36)
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి. వాటిలో నాలుగు పవిత్రమైనవి. వాటిలో మూడు వరుసగా వచ్చే జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. మరొకటి జుమాదా మరియు షాబాన్ మధ్యలో ఉన్న రజబ్ మాసం.” ఇది సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం లో ఉన్న హదీసు.
సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత
అభిమాన సోదరులారా! పవిత్ర మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. అంటే పవిత్ర మాసాలలో పుణ్యాలు చేసినా వాటి ప్రతిఫలం ఎన్నో రెట్లు పెరుగుతుంది. అలాగే పాపాలు చేసినా పాపాల శిక్ష వాటి గొప్పతనం మరియు తీవ్రత పరంగా పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి పవిత్ర మాసాలలో చేసే ఒక సత్కార్యం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే సత్కార్యం కంటే అల్లాహ్ వద్ద మరింత గొప్పది. అలాగే పవిత్ర మాసాలలో చేసే ఒక పాపం ఇతర సాధారణ కాలాలలో చేసే అదే పాపం కంటే మరింత తీవ్రమైనది మరియు భారమైనది.
ఒక ప్రశ్న: పవిత్ర మాసాలలో పాపం రెట్టింపు అవుతుందా? అంటే ఒక పాపం రెండు పాపాలకి సమానంగా, నాలుగు పాపాలకి సమానంగా, పది పాపాలకి సమానంగా అవుతుందా? ఈ ప్రశ్న. దీనికి సమాధానం ధార్మిక పండితులు ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో సత్కార్యాలు మరియు పాపాలు రెట్టింపు అవుతాయని స్పష్టంగా తెలిపే సహీహ్ మరియు స్పష్టమైన హదీసులు లేవు. అయితే కొందరు పండితులు అల్లాహ్ ఈ విధంగా చెప్పినందున ఈ మాసాలలో సత్కార్యాల ప్రతిఫలం మరియు పాపాల తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. సూరహ్ తౌబా ఆయత్ 36: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కాబట్టి ఆ పవిత్ర మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి.
ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ ను వివరిస్తూ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా పేర్కొన్నారు:
ఆ మాసాలలో మీపై మీరు అన్యాయం చేసుకోకండి అంటే ఈ పవిత్ర మాసాలలో పాపాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ మాసాలలో పాపం చేయడం ఇతర సమయాల్లో పాపం చేయడం కంటే మరింత తీవ్రమైనది మరియు ఎక్కువ భారమైనది. ఎలాగైతే పవిత్ర నగరమైన మక్కాలో చేసిన పాపాలు మరింత ఘోరమైనవిగా పరిగణించబడతాయో, అలాగే ఈ పవిత్ర మాసాలలో చేసిన పాపాలు కూడా మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హజ్ లో సెలవిచ్చాడు:
ఎవడు అందులో (మస్జిదే హరామ్ లో) అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. (22:25)
అంటే పవిత్ర మాసాలలో పాపాల తీవ్రత, పాప భారం మరియు అల్లాహ్ దృష్టిలో వాటి ఘోరత పెరిగిపోతుంది. అందువల్ల ఈ మాసాలలో పాపాలకు దూరంగా ఉండి తౌబా, నమాజ్, ఖురాన్ పఠనం, జిక్ర్ మరియు ఇతర సత్కార్యాలను ఎక్కువగా చేయాలి.
హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఇలా వివరించారు: పవిత్ర మాసాలలో పాపాలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల ఇమామ్ షాఫీ రహ్మతుల్లాహి అలైహి మరియు అనేకమంది పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ మాసాలలో హత్య జరిగినట్లయితే ‘దియత్’ (రక్త పరిహారం) మరింత కఠినంగా పరిగణించబడుతుంది. అలాగే హరమ్ ప్రాంతంలో హత్య చేసిన వారికి లేదా నిషిద్ధ బంధుత్వం (మహరమ్) కలిగిన వ్యక్తిని హత్య చేసిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ తర్వాత ఆయన ఖతాదా గారి మాటలను ఉటంకించారు. అవేమిటి? పవిత్ర మాసాలలో జరిగే అన్యాయం ఇతర సమయాల్లో జరిగే అన్యాయం కంటే మరింత పెద్ద పాపం మరియు ఎక్కువ భారమైనది.
అయితే అన్యాయం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్ప పాపమే. అన్యాయం అన్యాయమే, ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలో అది గొప్ప పాపమే అవుతుంది, ఘోరమైన పాపమే అవుతుంది. కానీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన ఇష్టానుసారం కొన్ని విషయాలకు మరింత గొప్పతనాన్ని మరియు ప్రాముఖ్యతను ప్రసాదిస్తాడు. అలాగే ఈ ప్రత్యేకత ఈ నాలుగు మాసాలకు అల్లాహ్ ప్రసాదించాడు.
ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు:
“ఈ పవిత్ర మాసాలలో పాపాలు చేసి మీరు మీపై అన్యాయం చేసుకోకండి. ఎందుకంటే అల్లాహ్ ఒక విషయాన్ని ఒక కోణం నుండి గౌరవప్రదంగా చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకత, పవిత్రత ఉంటుంది. కానీ రెండు లేదా అంతకంటే ఎక్కువ కోణాల నుండి దానిని గొప్పదిగా చేసినప్పుడు దాని పవిత్రత, దాని యొక్క గౌరవం మరింత పెరిగిపోతుంది. అందువల్ల అలాంటి సమయాల్లో లేదా ప్రదేశాల్లో చేసిన చెడు పనికి శిక్ష మరింత తీవ్రమైపోతుంది. అలాగే చేసిన సత్కార్యానికి ప్రతిఫలం కూడా మరింత గొప్పదిగా ఉంటుంది.”
అభిమాన సోదరులారా! పవిత్ర మాసంలో పవిత్ర స్థలమైన మక్కాలో అల్లాహ్ కు విధేయత చూపిన వారి ప్రతిఫలం సాధారణ నెలలలో అదే మక్కాలో విధేయత చూపిన వారి ప్రతిఫలంతో సమానం కాదు. అలాగే సాధారణ నెలలో మక్కాలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలం, సాధారణ నెలలో సాధారణ ప్రదేశంలో చేసిన సత్కార్యానికి లభించే ప్రతిఫలంతో సమానం కాదు.
సారాంశం ఏమిటంటే పవిత్ర కాలాలు అంటే ఇది ముహర్రం, రజబ్, జుల్ ఖాదా, జుల్ హిజ్జా. పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా వగైరా అల్లాహ్ వద్ద ప్రత్యేక గౌరవం కలిగినవి. అందువల్ల వాటిలో చేసే సత్కార్యాలకు మరింత గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. వాటిలో చేసే పాపాలు మరింత తీవ్రమైనవిగా పరిగణించబడతాయి. కాబట్టి ఈ పవిత్ర మాసాలలో ముస్లింలు పాపాలకు దూరంగా ఉండాలి. సత్కార్యాలలో అధికంగా పాల్గొనాలి. పాపం ఎప్పుడూ చేయకూడదు. పూర్తి సంవత్సరం పన్నెండు మాసాలు చేయకూడదు. ముఖ్యంగా, ప్రత్యేకంగా పవిత్ర మాసాలలో ఎందుకంటే దాని యొక్క తీవ్రత పెరిగిపోతుంది.
షరియత్ ఆధారాల ద్వారా నిరూపితమైన విషయం ఏమిటంటే పవిత్ర కాలాలలో మరియు పవిత్ర ప్రదేశాలలో సత్కార్యాల ప్రతిఫలం మరింత పెరుగుతుంది. ఉదాహరణకు రంజాన్ మాసం, జుల్ హిజ్జా మాసం అలాగే ఈ ముహర్రం మాసం వంటి పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం అధికంగా ఉంటుంది. అలాగే మస్జిదుల్ హరామ్ మక్కా, మస్జిద్ నబవీ మదీనా వంటి పవిత్ర ప్రదేశాలలో కూడా సత్కార్యాలకు ప్రత్యేకమైన గొప్ప ప్రతిఫలం లభిస్తుంది.
జాబిర్ రజియల్లాహు అన్హు ద్వారా వచ్చిన ఒక సహీహ్ హదీసులో ఇలా ఉంది: మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “నా మస్జిద్ అంటే మస్జిద్ నాబవి లో చేసిన ఒక నమాజ్, మస్జిదుల్ హరామ్ తప్ప ఇతర ఏ ప్రదేశంలో చేసిన వెయ్యి నమాజుల కంటే ఉత్తమమైనది. మరియు మస్జిదుల్ హరామ్ లో చేసిన ఒక నమాజ్ ఇతర ప్రదేశాలలో చేసిన లక్ష నమాజుల కంటే ఉత్తమమైనది.” ఈ హదీసును ప్రముఖ ముహద్దిసీన్లు సహీహ్ గా నిర్ధారించారు. ఈ హదీసు యొక్క సనద్ పరంపర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
అభిమాన సోదరులారా! పవిత్ర కాలాలలో సత్కార్యాల ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది, పవిత్ర ప్రదేశాలలో చేసిన ఆరాధనలు మరింత గొప్ప ఫలితాన్ని కలిగిస్తాయి. అందువల్ల రంజాన్ మాసం, జుల్ హిజ్జా ముఖ్యంగా జుల్ హిజ్జా మొదటి పది రోజులు, ముహర్రం వంటి పవిత్ర కాలాలను మరియు మక్కా మదీనా వంటి పవిత్ర ప్రదేశాలను సత్కార్యాలతో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి దూరంగా ఉండాలి. దుష్ట క్రియలు పాపాలు గురించి పండితుల అభిప్రాయం ప్రకారం, ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారం మనం చేసే పాపాలు ఈ పవిత్ర కాలాలలో మాసాలలో అవి సంఖ్యాపరంగా పెరగవు. సంఖ్యాపరంగా పెరగవు అంటే ఒక పాపం పది పాపాలుగా లెక్కించబడవు. కానీ వాటి తీవ్రత లేదా స్వభావం పరంగా పెరుగుతాయి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ అన్ ఆమ్ లో సెలవిచ్చాడు:
ఎవరైనా ఒక పుణ్యం చేస్తే అతనికి దాని పదింతల ప్రతిఫలం లభిస్తుంది. కానీ ఎవరైనా ఒక చెడు చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు. (6:160)
కాబట్టి రంజాన్ మాసంలో గానీ, ముహర్రం మాసంలో గానీ లేదా మరెక్కడైనా గానీ పాపాలు సంఖ్యాపరంగా పెరగవు, పాపం ఎప్పుడూ ఒకటిగానే లెక్కించబడుతుంది. ఇది అల్లాహ్ యొక్క అపారమైన కరుణ మరియు అనుగ్రహం. అయితే, అయితే ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. పాపం యొక్క తీవ్రత ప్రదేశం మరియు సమయాన్ని బట్టి మారుతుంది. సాధారణమైన మాసంలో చేసే పాపం, పవిత్ర మాసంలో చేసే పాపం సమానం కావు. తీవ్రత పెరిగిపోతుంది. దాని ప్రభావం పెరిగిపోతుంది. పవిత్ర స్థలాలు మక్కా హరమ్ లో చేసే పాపం ఇతర నగరాలలో చేసే పాపం కంటే చాలా తీవ్రమైనది, పెద్దది. అలాగే పవిత్ర మాసాలలో చేసే పాపం ఇతర నెలలలో చేసే పాపం కంటే అత్యంత ఘోరమైనది మరియు తీవ్రమైనది అని మనం మర్చిపోకూడదు.
పాపాలు మక్కాలో కూడా పుణ్యాల వలే రెట్టింపు మొత్తం పరంగా అవుతాయని సామాన్య ప్రజలు చెబుతుంటారు. ఈ మాట సరైనది కాదు. ఎందుకంటే పాపాలు రెట్టింపు కావడం ఖచ్చితంగా నిషిద్ధం. అల్లాహ్ ఎలా సెలవిచ్చాడు: “ఎవరైనా ఒక పాపం చేస్తే అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది.” ఇది పాపాలు రెట్టింపు కావు అని స్పష్టంగా చెబుతున్న ఖురాన్ ఆయత్. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే మక్కా వంటి పవిత్ర స్థలాల్లో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఎందుకంటే సమయం మరియు స్థలం యొక్క పవిత్రతను బట్టి పాపం యొక్క తీవ్రత మారుతుంది. పాపం ఎంత తీవ్రమైతే శిక్ష కూడా అంత ఎక్కువగా ఉంటుంది. పాపం ఎంత చిన్నదైతే శిక్ష అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ శిక్ష పెరగడం అనేది పాపం యొక్క తీవ్రత పెరగడం వల్ల జరుగుతుంది.
అందుకే మక్కా హరమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు – ఇది సూరహ్ హజ్ లో ఉంది ఆయత్ 25 లో: “మరియు ఎవరైనా అందులో అన్యాయంతో కూడిన ధర్మ విరుద్ధమైన పనిని చేయాలని సంకల్పిస్తే వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.” అలాగే పవిత్ర మాసాల గురించి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” కావున ఆ మాసాలలో మీరు మీకు అన్యాయం చేసుకోకండి. దీని అర్థం ఏమిటి? పవిత్ర మాసాలు కానీ ఇతర సమయాల్లో కూడా తమకు తాము అన్యాయం చేసుకోవడం, పాపం నిషిద్ధమే. కానీ పవిత్ర మాసాల్లో దాని తీవ్రత మరియు శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది.
పాపాల ప్రభావం మరియు అల్లాహ్ హెచ్చరిక
అభిమాన సోదరులారా! షేక్ ఇబ్నె ఉసైమీన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా అన్నారు: మక్కాలో చేసిన పాపాలు సంఖ్యాపరంగా పెరగవు అయితే వాటి తీవ్రత గొప్పతనం పరంగా పెరుగుతాయి. అంటే వాటికి విధించబడే శిక్ష మరింత కఠినంగా మరియు బాధాకరంగా ఉంటుంది. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆయత్ సూరహ్ అన్ ఆమ్ 160: “ఎవడు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది మరియు ఎవడు ఒక పాపం చేస్తాడో అతనికి దాని సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వబడుతుంది. వారికి ఎటువంటి అన్యాయం చేయబడదు.” ఈ ఆయత్ స్పష్టంగా పాపాలు సంఖ్యాపరంగా రెట్టింపు కావు అని తెలియజేస్తుంది.
అయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరొక చోట ఇలా సెలవిచ్చాడు: “వ మయ్ యురిద్ ఫీహి బి ఇల్ హాదిమ్ బిజుల్మిన్ నుజిఖ్ హు మిన్ అజాబిన్ అలీమ్.” ఎవడు హరమ్ ప్రాంతంలో అన్యాయపూర్వకంగా మార్గభ్రష్టతను కోరుకుంటాడో అతనికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము. అంటే మక్కాలో చేసిన పాపానికి వచ్చే శిక్ష అదే పాపాన్ని మక్కా వెలుపల చేసినప్పుడు వచ్చే శిక్ష కంటే మరింత కఠినంగా ఉంటుంది. ఇందులో మక్కాలో పాపాల నుండి దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక ఉంది. ఈ ఆయత్ ద్వారా తెలిసేది ఏమిటంటే హరమ్ లో చేసిన పాపం అత్యంత ఘోరమైనది. కేవలం పాపం చేయాలనే సంకల్పం లేదా ఉద్దేశం కూడా తీవ్రమైన హెచ్చరికకు కారణమవుతుంది. మరి వాస్తవంగా ఆ పాపాన్ని చేసిన ఆ వ్యక్తి యొక్క పాప భారం ఎంత తీవ్రమై ఉంటుందో ఊహించవచ్చు.
అభిమాన సోదరులారా! ఇక సారాంశం ఏమిటంటే మక్కా లేదా హరమ్ ప్రాంతంలో పాపాల యొక్క తీవ్రత పెరిగిపోతుంది. హరమ్ ప్రాంతంలో పాపం చేయాలనే ఆలోచనకే అల్లాహ్ తీవ్రమైన హెచ్చరిక చేశాడు. అలాగే పవిత్ర మాసాలలో కూడా పాపం చేస్తే దాని తీవ్రత, దాని ప్రభావం పెరిగిపోతుంది ఎక్కువగా ఉంటుంది. కావున మనము ఈ పవిత్ర మాసాలను గౌరవించాలి. పవిత్ర మాసాలను గౌరవించడం అంటే ఏంటి? ప్రతి చిన్న పెద్ద పాపం నుండి అవిధేయత నుండి తప్పుల నుండి దూరంగా ఉండాలి. సదాచారాలు, సత్కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి పనులు ఎక్కువగా చేయాలి. దుఆ లు, జిక్ర్, నఫిల్ ఉపవాసాలు, ఖురాన్ పారాయణము వగైరా వగైరా.
“ఫలా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్.” ఈ ఆయత్ లోని జుల్మ్ (దౌర్జన్యం) అంటే ఏమిటి? దౌర్జన్యం యొక్క అర్థం ఏమిటంటే ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాలలో మీరు అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఎందుకంటే వీటిలో అవిధేయత పాపం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.
హాఫిజ్ ఇబ్నె కసీర్ రహ్మతుల్లాహి అలైహి హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనాన్ని హదీసును ఇలా తెలియజేశారు:
“అల్లాహ్ దౌర్జన్యాన్ని సంవత్సరపు పన్నెండు మాసాల్లోనూ నిషేధించాడు. తదుపరి నాలుగు మాసాలను వాటిలో ప్రత్యేకంగా ఖరారు చేశారు. ఎందుకంటే వీటిలో చెడు, అవిధేయతల పాపం పెరుగుతుంది మరియు మంచి సదాచారణల పుణ్యం కూడా ఎన్నో రెట్లు పెరుగుతుంది.”
ఇమామ్ ఖతాదా ఈ ఆయత్ గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా వివరించారు: దౌర్జన్యం పాపం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉన్నప్పటికీ, కానీ ప్రత్యేకంగా నిషిద్ధ మాసాలలో దీని పాపం మరియు బరువు ఇతర మాసాల కన్నా ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. తీవ్రత పెరిగిపోతుంది.
దైవదూతల్లో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దైవదూతల్లో కొందరిని ప్రత్యేకంగా సందేశహరులుగా చేశాడు. గ్రంథాలలో దివ్య ఖురాన్ ను, యావత్ భూమిలో మసీదులను, అలాగే మాసాల్లో రంజాన్ నెల మరియు నిషిద్ధ మాసాలతో పాటు అనుకున్నట్లే దినాలలో శుక్రవారాన్ని, రాత్రుల్లో లైలతుల్ ఖదర్ ను అల్లాహ్ అనుకున్నట్లే ఏ మాసంలో పాప ఫలాన్ని అధికం చేయాలో మరియు దేనికి గొప్పతనం ప్రసాదించాలో పూర్తిగా అల్లాహ్ ఇష్టం. అంటే ఏ విధంగానైతే అల్లాహ్ మాసాలలో రంజాన్ యొక్క ప్రత్యేకత ఎంచుకున్నాడో ఖురాన్ గురించి, అలాగే పవిత్ర నాలుగు మాసాలు అల్లాహ్ ఎంచుకున్నాడో, దైవదూతల్లో జిబ్రయీల్ ను అల్లాహ్ ఎంచుకున్నాడో ఆ విధంగా ఈ మాసాలలో. అల్లాహ్ తన ఇష్టానుసారం అది పూర్తిగా అతని ఇష్టం. అందుకే అల్లాహ్ దేన్నైతే గొప్పదిగా భావిస్తాడో మీరు కూడా దానిని గొప్పదిగా భావించండి అని ఖతాదా రహ్మతుల్లాహి అలైహి వివరించాడు. అల్లాహ్ దేనికి గొప్పదిగా భావించాడో మనం కూడా దానిని గొప్పదిగా భావించాలి. ఈ వివరం ఇబ్నె కసీర్ భాగం రెండులో ఉంది.
ప్రియ సోదరులారా! సంవత్సరం పొడుగునా ప్రత్యేకించి ఈ నాలుగు మాసాల్లో మనం అల్లాహ్ అవిధేయత నుండి దూరంగా ఉండాలి మరియు పాప కార్యాలను త్యజించాలి. ఎందుకంటే అవిధేయత మరియు పాప కార్యాల మూలంగా హృదయాలకు తుప్పు పడుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ ముతఫ్ఫిఫీన్ లో సెలవిచ్చాడు:
كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ (కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్ మా కానూ యక్ సిబూన్) ఎంతమాత్రం కాదు! అసలు వారి హృదయాలకు వారు చేసిన దుష్కార్యాల తుప్పు పట్టింది. (83:14)
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
“ఇన్నల్ ముఅమిన ఇజా అజ్ నబ జంబన్ కానత్ నుఖ్ తతన్ సౌదా ఫీ ఖల్ బిహి, ఫ ఇన్ తాబ వ నజఅ వస్తఘ్ ఫర సఖల మిన్ హా.” అంటే ఈ హదీసు తిర్మిజీ, నసాయి, ఇబ్నె మాజా లో ఉంది. దానికి అర్థం ఏమిటంటే: విశ్వాసి ఏదైనా దుష్కార్యం పాపం చేసినప్పుడు అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తదుపరి ఒకవేళ అతను పశ్చాత్తాపం చెంది ఆ దుష్కార్యాన్ని త్యజించి పాపాన్ని వదిలి క్షమించమని అల్లాహ్ ను వేడుకుంటే అతని హృదయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఆ నల్లటి మచ్చ అల్లాహ్ తీసేసి కడిగేస్తాడు హృదయం నుంచి. ఒకవేళ అతను ఒక దుష్కార్యం తర్వాత మరో దుష్కార్యం ఒక పాపం తర్వాత మరో పాపం ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే అతని హృదయంలో నల్లటి మచ్చ పెరుగుతూ పోయి చివరికి పూర్తి హృదయాన్ని ఆక్రమించుకుంటుంది. దీనినే అల్లాహ్ ఖురాన్ లో రాన్ అన్నాడు: “కల్లా బల్ రాన అలా ఖులూబిహిమ్.” హృదయాలకు తుప్పు పట్టడం.
అభిమాన సోదరులారా! ఇక పాపాల ప్రమాదం లేకపోతే ప్రభావం సాధారణంగా ఎప్పుడు చేసినా చాలా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను సారాంశంగా, వివరణకు పోకుండా. పాపాల మూలంగా అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతాము ఎప్పుడు పాపం చేసినా. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఇయ్యాక వల్ మాసియ ఫ ఇన్న బిల్ మాసియతి హల్ల సఖతుల్లాహి అజ్జ వజల్ల.” అల్లాహ్ కు అవిధేయత చూపకండి అంటే పాపం చేయకండి. ఎందుకు పాపాల వల్ల అల్లాహ్ ఆగ్రహానికి గురవుతాము. ఈ హదీసు ముస్నద్ అహ్మద్ లో ఉంది.
అలాగే అల్లాహ్ సెలవిచ్చాడు సూరహ్ హజ్ లో: అల్లాహ్ పరాభవం పాలుజేసిన వాడికి ఎవ్వరూ ఆదరించరు. అలాగే పాపాల మూలంగా దాసుడు సైతాన్ బందీ అయిపోతాడు సూరహ్ జుఖ్రుఫ్ ఆయత్ 36:
وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ (వ మయ్ యఅషు అన్ జిఖ్రిర్ రహ్మాని నుఖయ్యిజ్ లహు షైతానన్ ఫహువ లహు ఖరీన్) కరుణామయుని స్మరణ పట్ల గుడ్డిగా వ్యవహరించే వ్యక్తిపై మేము షైతానును నియమిస్తాము, ఇక వాడు అతనికి సహవాసిగా ఉండిపోతాడు. (43:36)
సైతాన్. అలాగే పాపాల వల్ల మనిషి తన్ను తానే మర్చిపోతాడు సూరహ్ హషర్ ఆయత్ 19:
وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَٰٓئِكَ هُمُ ٱلْفَٰسِقُونَ (వలా తకూనూ కల్లజీన నసుల్లాహ ఫ అన్సాహుమ్ అన్ఫుసహుమ్ ఉలాయిక హుముల్ ఫాసిఖూన్) మరియు మీరు అల్లాహ్ ను మరిచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. వారి ఈ విస్మరణ కారణంగా అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరిచిపోయిన వారిగా చేసేశాడు. అలాంటి వారే పరమ అవిధేయులు. (59:19)
అలాగే పాపాల వల్ల జీవితం దుర్భరమైపోతుంది, మనశ్శాంతిని కోల్పోతాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరహ్ తాహా లో:
وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِى فَإِنَّ لَهُۥ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُۥ يَوْمَ ٱلْقِيَٰمَةِ أَعْمَىٰ (వ మన్ ఆరజ అన్ జిక్రీ ఫ ఇన్న లహు మఈషతన్ జంకా వ నహ్ శురుహూ యౌమల్ ఖియామతి అమా) మరియు ఎవడు నా స్మరణ (ఖురాన్) పట్ల వైముఖ్యత చూపుతాడో అతని బ్రతుకు దుర్భరమవుతుంది. మరియు ప్రళయ దినాన మేము అతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. (20:124)
ప్రపంచంలో శిక్ష ఏమిటి? దుర్భరమైపోతుంది, అశాంతి ఉంటుంది, అలజడి ఉంటుంది, సమస్యలు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, టెన్షన్ లో ఉంటాము ఈ ప్రపంచంలో. పరలోకంలో గుడ్డివానిగా లేపుతాము. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ కు అడుగుతాడు:
قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِىٓ أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا (ఖాల రబ్బి లిమ హషర్ తనీ అమా వ ఖద్ కుంతు బసీరా) “ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!” అని అతను అంటాడు“ (20:125)
“జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు” అని అనబడుతుంది. (20:126)
ఇది పాపాల ప్రభావం. పాపాల వల్ల ప్రస్తుతం అనుభవించే వరాలు అల్లాహ్ లాక్కుంటాడు. దీనికి ఉదాహరణ ఆదమ్ అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం స్వర్గంలో ఉన్నారు. దీని వివరణ సూరహ్ బఖరా లో ఉంది ఆయత్ 30, 31, 32. అల్లాహ్ వరాలను అనుభవిస్తూ ఉన్నారు అల్లాహ్ నేమత్ లను సుఖంగా సంతోషంగా హాయిగా టెన్షన్ లేదు ఏమీ లేదు. అక్కడ తప్పు జరిగింది అల్లాహ్ ఆ వరం తీసేసుకున్నాడు భూమిపైన వేసేశాడు. అంటే ఇది ఉదాహరణ. అలాగే ఉహుద్ సంఘటన, ఉహుద్ లో కొంతమంది సహాబాలకి వారు చేసిన ఆ పొరపాటు మూలంగా ఇది అయిపోయింది మనకు తెలిసిన విషయమే. అభిమాన సోదరులారా చెప్పడం ఏమిటంటే పాపాల వల్ల ఉపాధిలో కొరత వస్తుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “వ ఇన్నర్ రజుల ల యుహ్రముర్ రిజ్ ఖ బి ఖతీఅతిన్ యఅ మలుహా.” అంటే మనిషి పాపం వల్ల అతనికి ఇవ్వబోయే ఆ రిజ్క్ కి మహ్రూమ్ అయిపోతాడు. అల్లాహు అక్బర్.
అభిమాన సోదరులారా ఇవి ఎప్పుడు పాపం చేసినా దాని ప్రభావం. మరి ఇటువంటి పాపాలు, ఇటువంటి అన్యాయాలు, ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి అవిధేయతలు, ఇటువంటి ఘోరాలు, ఇటువంటి నేరాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను పాపాల ప్రభావం ప్రభావాలు కొన్ని చెప్పాను కొన్ని మాత్రమే. పాపం వల్ల రిజ్క్ మహ్రూమ్ అవుతాము. పాపం వల్ల అల్లాహ్ మనకు ఇప్పుడు ఇచ్చిన వరం ఇవ్వబోయే వరం రెండింటికి అల్లాహ్ దూరం చేసేస్తాడు. మనశ్శాంతి ఉండదు, శాంతి తీసేస్తాడు. ఇలాంటివి ఉన్నాయి కదా ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా ఇవి ఎప్పుడు పాపం చేసినా. ఇటువంటి పాపాలు పవిత్ర మాసాలలో చేస్తే దాని ప్రభావం, దాని తీవ్రత ఎలా ఉంటుంది? మనం ఊహించుకోగలము.
ఇప్పుడు సుకూన్ అనేది శాంతి అనేది సుఖమైన జీవితం అనేది టెన్షన్ లేని జీవితం అనేది సాధారణంగా లేదు. ఎందుకు? డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా పేదవారు ధనవంతులు, మంచి హోదాలో ఉన్నవారు హోదా లేని ఉద్యోగం లేని వారు – అంటే పేదవారు మిడిల్ క్లాస్ వారు ధనవంతులు అందరూ మనశ్శాంతి కోల్పోయారు. అంటే డబ్బు ఉన్న వారికి శాంతి లేదు, డబ్బు లేని వారికి శాంతి లేదు. ఉద్యోగం ఉన్న వారికి శాంతి లేదు, ఉద్యోగం లేని వారికి శాంతి లేదు. కారణం ఏమిటి? కారణం ఈ పాపాలే.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ నాకు చెప్పడం కంటే ఎక్కువగా మీకు వినడం కంటే ఎక్కువగా ఇస్లాంను అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి ప్రదేశంలో ప్రతి మాసంలో ముఖ్యంగా పవిత్ర మాసాలలో ప్రతి చిన్న పెద్ద పాపం నుండి మనల్ని అల్లాహ్ రక్షించుగాక. ఓ అల్లాహ్ అన్ని మాసాలలో ముఖ్యంగా ఈ పవిత్ర మాసాలలో మమ్మల్ని పాపాలు మరియు అవిధేయతల నుండి కాపాడు. నీ విధేయత మరియు నీ సంతృప్తిని పొందే సత్కార్యాలకు మాకు తౌఫీక్ ప్రసాదించు. మమ్మల్ని నీ సత్ ప్రవర్తన గల దాసులలో చేర్చు. ఆమీన్.
వ ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
సుబ్ హానకల్లాహుమ్మ వ బి హమ్దిక అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/H-0-b8o_u2M [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో సురయే లుఖ్మాన్ ఆధారంగా ‘జీవన విద్య’ గురించి వివరించారు. లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన ఉపదేశాలను ఈ క్రింది విధంగా చర్చించారు: అల్లాహ్ పట్ల ఏకత్వాన్ని కలిగి ఉండటం (తౌహీద్), తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత చూపడం, అల్లాహ్ యొక్క సర్వవ్యాప్త జ్ఞానాన్ని గుర్తించి తఖ్వాతో జీవించడం, నమాజును నిలబెట్టడం, సమాజంలో మంచిని ప్రబోధించి చెడును నిరోధించడం, కష్ట సమయాల్లో సహనం (సబర్) పాటించడం, అహంకారాన్ని వీడి వినయాన్ని అలవరచుకోవడం మరియు మాట తీరులో, నడకలో మర్యాదను పాటించడం. చివరగా ఈ ఐదు సూత్రాలు—తౌహీద్, నమాజ్, అఖ్లాక్, సబర్, వినయం—మానవ జీవితానికి మరియు సమాజ శ్రేయస్సుకు పునాదులని ఆయన సారాంశం ఇచ్చారు.
(ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వ మిన్ సయ్యిఆతి ఆ’మాలినా, మన్ యహదిహిల్లాహు ఫలా ముజిల్ల లహు, వ మన్ యుజ్లిల్ ఫలా హాదియ లహు, వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.)
అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను కురిపించు గాక.
లుఖ్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు: జీవన విద్య
అభిమాన సోదరులారా! ఈ రోజు మనం పరిశీలించబోయే విషయం: లుఖ్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు – జీవన విద్య. మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన మార్గదర్శకత్వం లుఖ్మాన్ అలైహిస్సలాం వారి ఉపదేశాలలో ఉంది. ఖురాన్ లో ఒక సూరా పేరే ‘లుఖ్మాన్’. ఇందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలను పేర్కొన్నాడు. కానీ ఆ ఉపదేశాలు కేవలం ఒక తండ్రి సలహాలు కాదు, ఇవి సమగ్ర జీవన విద్య.
1. తౌహీద్ మరియు షిర్క్ ఖండన
అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఇస్లాం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన బోధన తౌహీద్. ఇదే విషయం ముస్లిములు మరియు ముష్రికుల మధ్య స్పష్టమైన తేడాను ఏర్పరుస్తుంది. దీనిని నిరాకరించే వ్యక్తి ముష్రిక్ అవుతాడు. అలాంటి వ్యక్తికి లోకంలోనూ, పరలోకంలోనూ అవమానం మరియు అపకీర్తి తప్పదు. ఎందుకంటే షిర్క్ చేయడం అంటే ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన అస్తిత్వాన్ని నిరాకరించడం అవుతుంది. మరోవైపు షిర్క్ చేసే వ్యక్తి తనలాంటి లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సృష్టుల ముందు తల వంచి, తనను తాను అవమానించుకుంటాడు మరియు హీన స్థితికి దిగజారుతాడు.
లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన మొదటి హితబోధ, మొదటి నసీహత్ ఇదే తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి:
లుఖ్మాన్ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్ చేయటం) ఘోరమైన అన్యాయం.”(31:13)
లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన మొట్టమొదట ఉపదేశం షిర్క్ నుండి వారించడం. దీనిని బట్టి విదితమయ్యేదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు హితోపదేశం చేసినా ప్రధాన స్థానంలో షిర్క్ ఖండన, తౌహీద్ అంగీకారం గురించే అయి ఉండాలి. షిర్క్ నుండి వారించే మాటలు తప్పకుండా చెప్పాలి. తమ పిల్లలలో అల్లాహ్ ఏకత్వాన్ని నూరిపోయాలి.
జీవన విద్యలో మొదటి పాఠం తౌహీద్. ఇది మనం బాగా తెలుసుకోవాలి. విశ్వాసం సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” అందుకే మనము చదివే, పఠించే కలిమా – ‘కలిమతుత్ తౌహీద్’ – లా ఇలాహ ఇల్లల్లాహ్ లో మొదటి భాగం ఏమిటి? షిర్క్ ఖండన. రెండవ భాగం తౌహీద్ అంగీకారం ఉంటుంది. నఫీ – ఇస్ బాత్. లా ఇలాహ (దేవుడు లేడు), ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప). అంటే మొదటి భాగం ఏమి ఉంది? షిర్క్ ఖండన ఉంది. రెండవ భాగంలో తౌహీద్ అంగీకారం గురించి ఉంటుంది.
కావున లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి బోధించిన మొదటి విషయం, నసీహత్ చేసిన మొదటి నసీహత్ అది తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి ఉంది. ఎందుకంటే ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మించినది ఏదీ లేదు.
2. తల్లిదండ్రుల గౌరవం
ఇక రెండో విషయానికి వస్తే, తౌహీద్ తర్వాత అమ్మ నాన్న గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల గౌరవానికి అత్యున్నత స్థానం ఉంది. అల్లాహ్ ఆరాధన తర్వాత వెంటనే తల్లిదండ్రుల పట్ల దయ, విధేయతను ఖురాన్ ఆదేశిస్తుంది. లుఖ్మాన్ సూరాలో, ఆయత్ 14 లో ఇలా ఉంటుంది:
(వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి హమలత్ హు ఉమ్ముహు వహ్నన్ అలా వహ్నిన్ వ ఫిసాలుహు ఫీ ఆమైని అనిష్కుర్ లీ వ లివాలిదైక ఇలయ్యల్ మసీర్)
మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.(31:14)
ఈ ఆయతులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సహనం, దయ చూపాలని స్పష్టంగా బోధిస్తాయి.
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “అల్లాహ్ సంతృప్తి తల్లిదండ్రుల సంతృప్తిలో ఉంది. అల్లాహ్ అసంతృప్తి తల్లిదండ్రుల అసంతృప్తిలో ఉంది.”
ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని అడిగాడు: “నా మంచి సహవాసానికి ఎవరు ఎక్కువ అర్హులు?” మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “నీ తల్లి“. అతను మూడు సార్లు అడిగితే, మూడు సార్లు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. నాలుగవ సారి “నీ తండ్రి” అని సమాధానం ఇచ్చారు.
అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి అవసరాలు తీర్చాలి, వారి కోసం దుఆ చేయాలి. ఈ విధంగా రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసింది అది తల్లిదండ్రుల గురించి.
ఖురాన్ మరియు హదీసు ప్రకారం తల్లిదండ్రుల గౌరవం ఒక మహత్తర ఇబాదత్. వారిని సంతోషపరచడం ద్వారా అల్లాహ్ సంతోషాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి ముస్లిం తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, విధేయతతో ఉండాలి. ఇది రెండవ విషయం. లుఖ్మాన్ అలైహిస్సలాం యొక్క ఉపదేశాల విషయంలో ‘వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి’ అని ఉంటుంది.
మొదటిది ఏంటి? తౌహీద్, నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన. రెండవది ఏమిటి? తల్లిదండ్రుల గురించి. అంటే తల్లి కష్టాలు, తండ్రి పోషణ – ఇది మనకు ఏమి నేర్పుతుంది? కుటుంబ విలువలు సమాజానికి పునాది.
3. అల్లాహ్ సర్వజ్ఞుడు & బాధ్యతా భావం (తఖ్వా)
ఇక మూడవ విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సర్వజ్ఞుడు. బాధ్యతా భావం కలుగుతుంది దీనివల్ల. అంటే లుఖ్మాన్ అలైహిస్సలాం చేసిన మూడవ హితోపదేశం:
(లుఖ్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. (31:16)
అంటే ఒక ఆవగింజంత పని అయినా అల్లాహ్ గమనిస్తాడు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అన్న మాట. సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏకాంతంలో ఉన్నా ఎలాగైనా సరే, రాత్రి పగలు ఎక్కడైనా సరే అల్లాహ్ గమనిస్తున్నాడు. ఏదీ కూడా అల్లాహ్ తో గోప్యంగా లేదు. ప్రతి విషయం అల్లాహ్ కు తెలుసు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అని బోధపడుతుంది మనకు.
ఈ కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేది మొబైల్. కావున అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. హరామ్ కంటెంట్ చూడకూడదు, చెడు చాటింగ్ చేయకూడదు, చెడు సంబంధాలు నివారించాలి. రహస్యంగా చేసిన పాపం కూడా అల్లాహ్ కు చాలా బాగా తెలుసు. ఇది మనలో తఖ్వా పెంచుతుంది ఈ భావన. ఈ హితోపదేశం ఆవగింజంత కూడా అల్లాహ్ కు తెలుసు అంటే నేను ఏది చేసినా, నేను ఏది ఊహించినా అల్లాహ్ ఎరుగుతాడు. అన్ని విషయాలు అల్లాహ్ కు తెలుసు. కావున ఈ భావన కలిగి ఉంటే ఏమవుతుంది? తఖ్వా పెరుగుతుంది, దైవభీతి పెరుగుతుంది.
4. నమాజు స్థాపన
ఇక నాలుగవ ఉపదేశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశం నాలుగవది: నమాజ్ స్థాపన.
ఇస్లాం ధర్మంలో సలాహ్ (నమాజు) అత్యంత ముఖ్యమైన ఇబాదత్. ఇది ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒక స్తంభం. అర్కానుల్ ఇస్లాం లోని ఒక రుకున్. అల్లాహ్ పై విశ్వాసం తర్వాత అత్యంత ప్రధానమైన కర్తవ్యం అస్సలాహ్.
నమాజ్ గురించి ఖురాన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. “నమాజ్ ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి” – సూరయే బఖరాలో, సూరయే అన్కబూత్ లో, సూరయే తాహాలో అనేక సూరాలలో ఉంది. నమాజ్ అసభ్య కార్యాల నుండి, చెడు పనుల నుండి నివారిస్తుంది. అంటే ఈ ఆయత్ కి చాలా వివరంగా చెప్పవచ్చు – ‘ఇన్నస్ సలాత తన్ హా అనిల్ ఫహ్ షాయి వల్ మున్ కర్’. నమాజ్, నమాజ్ చేసే వ్యక్తిని చెడు పని నుండి, పాపం నుండి, ఫహ్ షా నుండి, మున్ కర్ నుండి కాపాడుతుంది అని ఇది ఖురాన్ వాక్యం, ఖురాన్ ఆయత్. మరి ఇప్పుడు మనం సమాజంలో గమనిస్తున్నాము – నమాజులు చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము. నమాజ్ చేస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము. నమాజ్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు, అనేక పాపాలకి పాల్పడుతున్నారు. అంటే మరి అల్లాహ్ వాగ్దానం కదా అది ఖురాన్ లో, ఆయత్ లో ఉంది కదా! ప్రతి ప్రవక్త నమాజ్ గురించి హెచ్చరించారు. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం పోయే ఆ సమయంలో కూడా ‘అస్సలాత్ అస్సలాత్’ అని చెప్పారు. మరి ఇటువంటి నమాజ్ మరి నమాజ్ చేసే వ్యక్తిని పాపాల నుండి, దుర్మార్గాల నుండి, మోసాల నుండి, చెడు నుండి ఎందుకు కాపాడటం లేదు అంటే – నమాజ్ చేసే రీతిలో, ఏ విధానంలో నమాజ్ చేయాలో, ఏ హక్కులతో నమాజ్ చేయాలో, ఏ రీతిలో నమాజ్ చేయాలో, ఏ భక్తితో, ఏ భావనతో నమాజ్ చేయాలో, ఎటువంటి విశ్వాసంతో నమాజ్ చేయాలో, ఏ విధానంతో నమాజ్ చేయాలో ఆ విధానం లేదు కాబట్టి. “నన్ను స్మరించుటకై నమాజ్ స్థాపించు”. ఈ ఆయతులు నమాజ్ మనిషిని పాపాల నుండి దూరంగా ఉంచి అల్లాహ్ స్మరణలో ఉంచుతుందని తెలియజేస్తాయి.
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా నమాజ్ గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా తెలియజేసి ఉన్నారు. “మన మధ్య మరియు కుఫ్ర్ మధ్య తేడా అనేది నమాజ్.” రేపు ప్రళయ దినాన మనిషి నుండి మొదట అడగబడేది నమాజ్ గురించే.
ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నమాజ్ వల్ల కలిగే ప్రయోజనాలలో అల్లాహ్ కు దగ్గరవ్వడం, హృదయానికి శాంతి, పాపాల క్షమాపణ, క్రమశిక్షణ మరియు సమయపాలన, సమాజంలో ఐక్యత (జమాత్ నమాజ్ ద్వారా). ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం నమాజ్ ముస్లిముల జీవితానికి ఆధారం. ఇది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నమాజ్ అనేది కేవలం ఆచారం కాదు. ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. క్రమంగా ఖుషూ (భక్తి), వినయంతో నమాజ్ ఆచరించడం ద్వారా ఈ లోకంలో శాంతి, పరలోకంలో విజయం లభిస్తాయి.
5. మంచిని ఆదేశించడం, చెడును నిరోధించడం
ఇక ఐదవ హితోపదేశం: మంచి ఆజ్ఞాపన, చెడు నిరోధం – అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్. మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం.
…وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ… (…వ ముర్ బిల్ మ’రూఫి వన్ హ అనిల్ మున్కరి…)
“…మంచిని ఆదేశించు, చెడును వారించు…” (31:17)
అంటే సమాజ బాధ్యత అని అర్థం దీనికి. సమాజ బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ వలన ఏం జరుగుతుంది? సమాజంలో న్యాయం జరుగుతుంది, సమాజంలో శాంతి ఉంటుంది, సమాజంలో సమానత్వం ఉంటుంది.
ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కర్తవ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ముస్లిం కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజ మేలు కోసం జీవించాలని ఖురాన్ మరియు హదీసులు బోధిస్తాయి.
ఖురాన్ లో సూరయే మాయిదాలో ఉంది: “నీతి, భయభక్తుల విషయాల్లో పరస్పరం సహకరించండి. పాపం, దుర్మార్గంలో సహకరించవద్దండి.” ‘తఆవనూ అలల్ బిర్రి వత్ తఖ్వా, వ లా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్’. మంచి విషయాలలో, పుణ్యానికి సంబంధించిన విషయాలలో, సత్కార్యాలలో ఒకరికొకరు సహాయంగా, తోడుగా ఉండాలి. పాపంతో కూడిన విషయాలలో సహాయం చేయకూడదు. ఈ విధంగా నిజమైన నీతి అనేది తన సంపదను బంధువులకు, అనాధలకు, నిరుపేదలకు ఇవ్వడం. అలాగే సూరయే ఆలి ఇమ్రాన్ లో ఉంటుంది: “మీరు ఉత్తమ సమాజం, మీరు మంచి పనులను ఆజ్ఞాపించి చెడు పనులను నిరోధిస్తారు.” ఈ ఆయతులు సమాజంలో న్యాయం, దయ, సహాయం, ధర్మం స్థాపించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి.
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “మీలో ఎవరికైనా తన సోదరుడికి ఇష్టమైనదే తనకూ ఇష్టమైతే అతడు నిజమైన విశ్వాసి.” తన కోసం ఏది ఇష్టపడతాడో, సోదరుని కోసం కూడా అదే ఇష్టపడాలి. అటువంటి వ్యక్తే నిజమైన విశ్వాసి.
ప్రజలకు అత్యంత మేలు చేసేవారే ఉత్తములు. ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరు చెడు చూడగలిగితే దానిని చేతితో ఆపాలి. సాధ్యం కాకపోతే మాటతో ఆపాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే హృదయంలో అసహ్యించుకోవాలి. ఇది ఈమాన్ లో అత్యంత బలహీనమైన స్థాయి.”
ముస్లిముల సామాజిక కర్తవ్యాలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలు, అనాధలు, వితంతువులకు సహాయం చేయడం, నిజాయితీతో వ్యాపారం చేయడం, పొరుగువారిని గౌరవించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, సమాజంలో శాంతి ఐక్యత పెంపొందించడం. ఇవన్నీ అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ ద్వారా జరుగుతాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమాజ సేవ కూడా ఒక ఇబాదత్. దయ, న్యాయం, సహకారం, సత్యం – ఇవే ఇస్లాం బోధించే సామాజిక బాధ్యతల మూల సూత్రాలు.
6. సహనం (సబర్)
ఇక ఆరవ ఉపదేశం: సబర్, సహనం.
…وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ… (…వస్ బిర్ అలా మా అసాబక…)
“…మరియు నీపై వచ్చి పడే (కష్టాలను) సహనంతో భరించు…” (31:17)
జీవితం అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇష్టం లేని విషయాలు చాలా వస్తా ఉంటాయి. వాటిలో సహనం వహించాలి. పరీక్షలు ఉంటాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పాపాల మూలంగానో లేకపోతే పరీక్ష నిమిత్తమో పరీక్షిస్తాడు. పరీక్షలు అంటే జీవితంలో భాగమే అవి. సబర్ విజయానికి మార్గం. సహనం ఇస్లాం ధర్మంలో అత్యున్నత గుణాలలో ఒకటి. కష్టకాలంలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహ్ పై నమ్మకంతో ఉండటం ఇవన్నీ సబర్ లోని భాగాలు.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు: “ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్నవారితో ఉంటాడు.” ఇంకా సూరయే ఆలి ఇమ్రాన్ లో ఇలా ఉంటుంది: “ఓ విశ్వాసులారా! సహనం పాటించండి, స్థిరంగా ఉండండి.” సూరయే జుమర్ లో ఉంటుంది: “సహనం పాటించే వారి ప్రతిఫలం లెక్క లేనిది.”
ఈ ఆయతులు సబర్ ఉన్న వాడికి అల్లాహ్ ప్రత్యేకత ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సబర్ గురించి చాలా విషయాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “నిజమైన సహనం కష్టం మొదటి దెబ్బలోనే కనిపిస్తుంది.” అంటే సహనం యొక్క రకాలు అనేక రకాలుగా ఉంటాయి: ఆజ్ఞాపాలనలో సబర్ (ఇబాదత్ లో సబర్ – నమాజ్, ఉపవాసం వంటి ఇబాదత్ లో స్థిరంగా ఉండటం), పాపాల నుండి దూరంగా ఉండటంలో సబర్, అలాగే కష్టకాలంలో సహనం (అనారోగ్యం, నష్టం, పరీక్షలు వచ్చినప్పుడు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండటం). ఖురాన్ మరియు హదీసు ప్రకారం సహనం ఒక విశ్వాసి యొక్క బలమైన ఆయుధం. సబర్ ద్వారా మనం అల్లాహ్ కు దగ్గరవుతాము, ఈ లోకంలో శాంతిని పరలోకంలో విజయాన్ని పొందుతాము.
7. వినయం మరియు అహంకార నిరాకరణ
ఇక ఏడవ ఉపదేశం: అహంకారం, దాన్ని విడిచిపెట్టడం.
وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا… (వ లా తుసఇ’ర్ ఖద్దక లిన్నాసి వ లా తమ్ షి ఫిల్ అర్జి మరహన్…)
“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు…” (31:18)
ఓ నా కుమారా! అహంకారం – కిబ్ర్ – ఇస్లాం ధర్మంలో తీవ్రంగా నిషేధించబడిన దోషం. మనిషి తనను తాను గొప్పవాడిగా భావించి ఇతరులను తక్కువగా చూడటం ఇది అల్లాహ్ కు ఇష్టం లేని గుణం. వినయం మాత్రమే విశ్వాసి యొక్క లక్షణం. ప్రజల పట్ల నీ చెంపను తిప్పవద్దు, గర్వంగా చూడవద్దు, భూమిపై అహంకారంగా నడవవద్దు. అల్లాహ్ గర్విష్టులను ఇష్టపడడు అని లుఖ్మాన్ అలైహిస్సలాం బోధించిన విషయం ఇది.
ఇంకా వేరే చోట్ల ఉంది ఖురాన్ లో: “నిస్సందేహంగా అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.” ఇంకో చోట ఇలా ఉంది: “భూమిపై అన్యాయంగా అహంకారం ప్రదర్శించే వారిని నా ఆయతుల నుండి తిప్పివేస్తాము.” ఈ ఆయతులు అహంకారం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుందని స్పష్టం చేస్తాయి.
మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా దీని గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పారు. “ఎవరి హృదయంలో ఆవగింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గంలో ప్రవేశించడు.” సహాబాలు అడిగారు: “ఓ ప్రవక్తా! ఒక మనిషి తన దుస్తులు చెప్పులు అందంగా ఉండాలని కోరుకోవడం కూడా అహంకారమేనా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం ఇచ్చారు: “అల్లాహ్ సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అనేది సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడడం.” కావున అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి సత్యాన్ని అంగీకరించకపోవడం, అలాగే ఇతరులను తక్కువగా చూడడం, సమాజంలో విభేదాలు ఏర్పరచడం. ఇవన్నీ అల్లాహ్ కోపానికి గురవడం అవుతుంది. దానికి విరుద్ధంగా కిబ్ర్ కి విరుద్ధంగా వినయం – వినయం ఉన్న వారిని అల్లాహ్ ఉన్నత స్థాయికి చేరుస్తాడు. వినయం విశ్వాసిని ప్రజల హృదయాల్లో ప్రియంగా చేస్తుంది. ఇది ప్రవక్తల లక్షణం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం అహంకారం ఒక ప్రమాదకరమైన పాపం. మనిషి తన సంపద, జ్ఞానం, స్థానం వల్ల గర్వపడకూడదు. అన్నీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తించి వినయంతో జీవించడం నిజమైన విశ్వాసి లక్షణం.
8. మిత భాషణ మరియు మర్యాద
అలాగే ఎనిమిదవది: మిత భాషణ. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్.
“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.” (31:19)
నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిద స్వరం. మిత భాషణ అంటే మన మాటల్లో నియంత్రణ, దయ, నిజాయితీ మరియు మర్యాదతో మాట్లాడటం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం మాటల శక్తి సమాజంలో శాంతి మరియు ఐక్యతకు మూలం. నిజమైన ముస్లిం – మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాట – నిజమైన ముస్లిం వ్యక్తి తన చేతులతో మరియు తన భాషతో ఇతరులకు హాని చేయడు. ‘అల్ ముస్లిము మన్ సలీమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి’. ఒక ముస్లిం అనేవాడు తన చేతి ద్వారా, తన బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా ఇతరులకు హాని కల్పించడు. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తే నిజమైన ముస్లిం అని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అలాగే సదా మంచి మాట చెప్పడం కూడా సదఖా. మంచి మాట – అది కూడా సదఖా కిందకు వస్తుందని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.
ఖురాన్ మరియు హదీసు ప్రకారం మిత భాషణ ఒక మహత్తర మానవ గుణం. మాటల ద్వారా హాని కలిగించకుండా సమాజంలో శాంతి మరియు ఐక్యతను కొనసాగించడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం. మంచి మాటలు వాడటం కూడా ఒక ఇబాదత్ మరియు అది మన వ్యక్తిత్వానికి మెరుగుపరుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి.
సారాంశం
అభిమాన సోదరులారా! ఈ విధంగా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశాలు దానికి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవసరం పడుతుంది. క్లుప్తంగా దీని యొక్క సారాంశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలలోని సారాంశం ఐదు పదాలలో చెప్పాలంటే:
తౌహీద్ (అల్లాహ్ పట్ల నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన)
నమాజ్ (క్రమశిక్షణ)
అఖ్లాక్ (వ్యక్తిత్వం)
సహనం (స్థిరత్వం)
వినయం (గొప్పతనం)
ఇదే జీవన విద్య. అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే:
అల్లాహ్ తో సంబంధం
కుటుంబంతో సంబంధం
సమాజంతో సంబంధం
ఇదే కదా ప్రపంచం, ప్రాపంచిక జీవితం. అంటే పూర్తి జీవితం దీంట్లో ఇమిడిపోయింది. ఈ విధంగా జీవితం గడిపితే ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల్లో, బంధువుల్లో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమానత్వం ఉంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది.
అల్లాహ్ తో సంబంధం ఎలా ఉండాలి, కుటుంబంతో సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం ఎలా ఉండాలి. ఇదే ఈ ఉపదేశాలకి సారాంశం, ఇదే జీవన విద్య.
అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఈ విలువలను మన కుటుంబాల్లో ఈ విధంగా అమలు చేసి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. లుఖ్మాన్ అలైహిస్సలాం కు ఇచ్చిన హిక్మత్ తో హిక్మత్ లో మాకు భాగం ఇవ్వు, ప్రసాదించు గాక. మన పిల్లలను సాలిహీన్లుగా చేయు గాక. మన జీవితాలను ఖురాన్ తో అలంకరించు గాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్జ్ & ఖుర్బానీ తర్వాత | షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | షేఖ్ నసీరుద్దీన్ జామి’ఈ https://youtu.be/eHKR0eeKYjA [18 నిముషాలు]
మొదటి ఖుత్బా
الحمدُ للهِ الذي هدانا لنعمة الإسلام وكفي بها نعمة، والحمد لله أن جعلنا موحدين، لا نسجد للحجر، ولا نعبد البقر. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله ﷺ تسليما كثيرا، أما بعدُ
మనం అల్లాహ్కు భయభక్తులు కలిగి ఉండాలి (తక్వాను అవలంబించాలి) మరియు అల్లాహ్ మనకు ఈ పుణ్యకాలాలను చేరుకునే అవకాశం కల్పించినందుకు ఆయనను ఎక్కువగా స్తుతిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఈ కాలాలలో మంచి కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది. ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు మహా వరం. అల్లాహ్ అపారమైన అనుగ్రహాలు కలవాడు.
అల్ హందులిల్లాహ్! అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు తెలిసిన ఆ తొమ్మిది (జిల్ హిజ్జా తొలి తొమ్మిది) పుణ్యదినాలను, ఆ తర్వాత లెక్కించబడే నాలుగు దినాలను (ఈదుల్ అజ్హా రోజు మరియు తష్రీక్ మూడు రోజులు) చేరుకునే అవకాశం కల్పించాడు.
అల్ హందులిల్లాహ్! అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు సహాయం చేసినందువల్ల మనం అరఫా రోజున ఉపవాసం ఉండగలిగాము మరియు ఆ రోజున ఆయనను ప్రార్థించగలిగాము (దుఆ చేయగలిగాము).
అల్ హందులిల్లాహ్! అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ధనసంపదలో విశాలతను ప్రసాదించినందువల్ల మనం ఖుర్బానీ చేయగలిగాము లేదా హజ్ చేయగలిగాము.
అల్ హందులిల్లాహ్! అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు ముస్లింల రెండు పండుగలను – ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హాను – చేరుకునే (జరుపుకునే) అవకాశం ఇచ్చాడు.
అల్ హందులిల్లాహ్! అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఆయన మనకు రమజాన్ను చేరుకునే అవకాశం కల్పించి, భద్రతతో మరియు ఆరోగ్యంతో ఉపవాసాలు పాటించే తౌఫీఖ్ ప్రసాదించాడు. అదే సమయంలో కొందరు భయభ్రాంతులతో రమజాన్ను గడిపారు; మరికొందరు అనారోగ్యం లేదా అశక్తత కారణంగా ఉపవాసం ఉండలేకపోయారు. కాబట్టి, ఓ అల్లాహ్! నీవు అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నట్లే, మేము కూడా నీకు అపారమైన స్తోత్రాలు అర్పిస్తున్నాము.
అల్ హందులిల్లాహ్! ప్రతి పుణ్యకాలం కోసం కూడా అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ఎందుకంటే వాటిలో సత్కార్యాలకు అనేక రెట్లు ప్రతిఫలం లభిస్తుంది, హోదా, అంతస్తు ఉన్నతమవుతుంది. మా ప్రభువా! నీవు మాపై కరుణ చూపి మా పశ్చాత్తాపాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నావు. నీవు నీ మహోన్నత గ్రంథం(నిసా 4:27)లో ఇలా ప్రకటించావు:
(وَاللهُ يُرِيدُ أَنْ يَتُوبَ عَلَيْكُمْ). అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు.
అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! సుమ్మ, అల్ హందులిల్లాహ్! ఎందుకంటే ఆయన మనల్ని తౌహీద్ (ఏకదైవారాధన) మరియు సున్నత్పై జీవింపజేశాడు; తౌహీద్ మరియు సున్నత్కు ప్రాధాన్యత ఉన్న దేశంలో నివసింపజేశాడు. అందువల్ల మన మస్జిద్లలో, మన ఖబ్రస్తాన్ (స్మశానం)లో, లేదా మన హజ్ ఆచరణల్లో సమాధుల పట్ల అతిశయ గౌరవం, ఖబ్రిస్తాన్లలో నిర్మాణాలు, షిర్క్ సంబంధిత ఆచారాలు, బిద్అత్లు లేదా పక్షపాత వర్గీయత కనిపించవు.
అల్లాహు తఆలా (హజ్జ్ 22:78)లో ఇలా సెలవిచ్చాడు:
مِّلَّةَ أَبِيكُمْ إِبْرَاهِيمَ ۚ هُوَ سَمَّاكُمُ الْمُسْلِمِينَ مِن قَبْلُ وَفِي هَٰذَا “(ఈ ధర్మం) మీ తండ్రి ఇబ్రాహీమ్ ధర్మమే. ఆయన (అల్లాహ్) ఇంతకుముందే మీకు ‘ముస్లింలు’ అనే పేరు పెట్టాడు, మరియు ఈ (ఖుర్ఆన్)లో కూడా (అదే పేరుతో పిలిచాడు).”
అల్ హందులిల్లాహ్! హజ్ విజయవంతంగా పూర్తయినందుకు కూడా అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. హజ్ ముగిసి ఒక వారం గడిచిన తర్వాత, గర్వంతో కూడిన కృతజ్ఞతతో ఇలా చెప్పవచ్చు: హజ్ యథావిధిగా విజయవంతమైంది. సామాన్య రీతిలో విజయవంతమవడమే కాదు, అల్లాహ్ అనుగ్రహంతో మరెంతో అద్భుతంగా విజయవంతమైనది.
ఎందుకంటే అల్లాహ్ తన పవిత్ర గృహానికి సేవ చేస్తూ, హజ్ నిర్వహణ కొరకు అపారమైన ధనాన్ని మరియు శ్రమను వెచ్చించే వారి కృషిని ఎన్నడూ వృథా చేయడు.
فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ “నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలు (మేలు) చేసే వారి ప్రతిఫలాన్ని వృథా చేయడు.” (యూసుఫ్ 12:90)
అందువల్ల, అల్లాహ్ గృహానికి సేవ చేస్తూ, హాజీల సౌకర్యం మరియు భద్రత కోసం కృషి చేసే వారి శ్రమ మరియు సేవలకు అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాడు.
ఓ విశ్వాసులారా! కరుణతో మరియు దృఢత్వంతో కూడిన చేతులు హజ్ వ్యవస్థను నిర్వహిస్తాయన్న విషయం తెలుసా?
కరుణతో కూడిన చేతుల విషయానికి వస్తే, “ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ అతిథుల కార్యక్రమం” గురించి మీరు విన్నారా? ఈ కార్యక్రమంలో రెండువేల ఐదు వందల మంది హాజీలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి, వారి అవసరాలన్నింటినీ చూసుకుంటారు. అంతేకాక, వారి హద్య్ (హజ్ ఖుర్బానీ జంతువు) ఖర్చును కూడా ఖాదిముల్ హరమైనిష్ షరీఫైన్ భరిస్తారు.
అలాగే, హాజీల సేవ మరియు భద్రత కొరకు నాలుగు లక్షల మందికి పైగా సైనిక మరియు పౌర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించిన విషయం మీకు తెలుసా?
మషాఇర్ (హజ్ పవిత్ర ప్రదేశాలు) మరియు ప్రవేశ కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ సిబ్బంది సంఖ్య యాభై రెండు వేల మందికి చేరిందని మీకు తెలుసా? వీరందరినీ హాజీల ఆరోగ్యం మరియు వైద్య సేవల కోసం ముందు నుండే ఒక నెలపాటు ప్రత్యేకంగా శిక్షణలు ఇవ్వడం జరిగినది.
హజ్ కాలంలో సుమారు మూడు వందల శస్త్రచికిత్సలు నిర్వహించబడ్డాయని మీకు తెలుసా? వాటిలో గుండెకు సంబంధించిన క్యాథెటరైజేషన్ (Catheterization) చికిత్సలు మరియు ఓపెన్-హార్ట్ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి.
అంతేకాదు, ప్రభుత్వం -అల్లాహ్ దానికి సద్భాగ్యం ప్రసాదించుగాక- హాజీలకు సేవలను మరింత సులభతరం చేయడానికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ సాంకేతికతలను వినియోగించిన విషయం మీకు తెలుసా?
రద్దీని నివారించడానికి, హజ్ బృందాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, అనుమతి లేకుండా ప్రవేశించే వారిని గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ను ఉపయోగించింది. అలాగే, మందులను అత్యంత వేగంగా చేరవేయడానికి డ్రోన్లను కూడా వినియోగించింది.
మిలియన్ల సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, హాజీలను అత్యంత క్రమబద్ధంగా మరియు సాఫీగా తరలించడం వంటి అసాధారణ విజయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని సుమారు 165 దేశాల నుండి వచ్చిన హాజీల ప్రశంసల ద్వారా దీనిని వినవచ్చు. వారు ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఈ ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారు.
కాబట్టి, ఈ యథావిధి విజయానికి అల్లాహ్కే సర్వ స్తోత్రాలు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన హాజీలందరూ భద్రంగా, కృతజ్ఞతతో, ప్రశంసలతో తమ తమ దేశాలకు తిరిగి వెళ్తున్నందుకు కూడా అల్లాహ్కే సర్వ స్తోత్రాలు.
ప్రపంచమంతా విమానాశ్రయాలలో, తనిఖీ కేంద్రాలలో మరియు సరిహద్దు ప్రవేశ ద్వారాలలో హాజీలకు అందించిన ఆతిథ్యం, స్వాగతం మరియు వీడ్కోలు కార్యక్రమాలకు సంబంధించిన ఆనందకర దృశ్యాలను, వీడియోలను మరియు ఇంటర్వ్యూలను చూసింది.
అవును, హజ్ విజయవంతమైంది. కాబట్టి మనం ఈ మహత్తర సౌదీ రాజ్యపు సంరక్షణలో ఉన్నందుకు సంతోషించాలి. అల్లాహ్ దాని రాజులకు అపారమైన ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఇస్లాం మరియు హరమైన్ షరీఫైన్ సేవల ద్వారా వారికి గౌరవాన్ని కలిగించుగాక. ఫిత్నాలను రగిలించే వారి చెడు నుండి వారిని రక్షించుగాక.
ఈ ద్వీపకల్పపు గద్ద ‘సఖ్రుల్ జజీరా Sakhrul Jazeera’, ఈ రాజ్య స్థాపకుడు, ఏకీకర్త, తౌహీద్ మరియు సున్నత్పై ఈ దేశాన్ని నిర్మించిన మలిక్ అబ్దుల్ అజీజ్ (King Abdulaziz) గారిపై అల్లాహ్ కరుణ కురిపించుగాక.
రెండవ ఖుత్బా
الحمدُ للهِ يُعطِينا، ويَشكرُ لنا إن أَعطَينا، والصلاةُ والسلامُ على هادِينَا، أما بعدُ:
ఓ మక్కా నుండి హజ్ పూర్తి చేసి తిరిగి వచ్చిన హాజీలారా! మరియు అల్లాహ్ కొరకు సమృద్ధిగా ఖుర్బానీ చేసిన వారలారా!
కృతజ్ఞతతో పాటు అల్లాహ్ స్మరణ కూడా ఉండాలి. కాబట్టి మీ ప్రభువును ఎక్కువగా స్తుతించండి, ఆయనను ఎక్కువగా స్మరించండి. ఎందుకంటే మన ప్రభువు అయిన అల్లాహ్ (బఖర 2:200)లో ఇలా సెలవిచ్చాడు:
“హజ్ క్రియలన్నింటినీ నిర్వర్తించిన తరువాత అల్లాహ్ను స్మరించండి. మీ తాతముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే, ఇంకా అంతకంటే అధికంగానే అల్లాహ్ను స్మరించండి.”
ఈ ఆయత్ హజ్ చేసిన వారికీ, ఖుర్బానీ చేసిన వారికీ సాధారణంగా వర్తిస్తుంది. ఇక్కడ “مَنَاسِكَكُمْ మనాసికకుమ్” అనే పదం ద్వారా హజ్ ఆచారాలు మరియు ఖుర్బానీ రెండూ ఉద్దేశించబడ్డాయి. (తఫ్సీర్ తబరీ 4/196).
అయితే, ఖర్చు చేయడానికి సామర్థ్యం లేని వారు, అంటే: ఖుర్బానీ చేయడానికి ధనం లేనివారు, హజ్ చేయడానికి మార్గం లేదా అవకాశం లేనివారి విషయానికి వస్తే — అలాంటి వారికి కూడా అల్లాహ్ వారి సత్సంకల్పాల కారణంగా హజ్ చేసినవారికి, ఖుర్బానీ చేసినవారికి ఇచ్చే ప్రతిఫలాల వంటి ప్రతిఫలాలను ప్రసాదించాలని మనం ప్రార్థిస్తున్నాము.
ఓ విశ్వాసులారా! ఎన్నో పుణ్యకాలాలు (మవాసిముల్ ఖైరాత్) ముగిసిన తరువాత కూడా ఇలా చెప్పబడుతుంది:
జిల్ హిజ్జా తొలిదశలో మనం శ్రద్ధగా ఆరాధనలు చేయడంలో అలసత్వం చూపి ఉంటే, జుముఆ (జుమ్మా) మరియు జమాఅత్ నమాజుల కోసం ముందుగానే వెళ్లడం, నడుచుకుంటూ వెళ్లడం వంటి కార్యాలకు ఎంతో గొప్ప ప్రతిఫలం ఉంది. వాటి పుణ్యం తరచూ లభించే అవకాశమూ ఉంది. (కనుక అశ్రద్ధగా ఉండకండి).
అలాగే, అరఫా రోజున ప్రభువు తన దాసులకు అత్యంత సమీపంగా ఉండే ఆ మహోన్నత సమయంలో మనం దుఆ చేయడంలో కొరత చేసి ఉంటే, ఇంకా మన ముందు దుఆల ద్వారాలు తెరిచి ఉన్నాయి; అల్లాహ్ ప్రసాదించే అనుగ్రహం కూడా కొనసాగుతూనే ఉంది. ప్రతి జుముఆ రోజున ఒక “స్వీకరించబడే ప్రత్యేక సమయం” (సాఅతుల్ ఇస్తిజాబా) ఉంటుంది. ఆ సమయంలో ముస్లిం చేసే దుఆ అల్లాహ్ అనుగ్రహంతో స్వీకరించబడుతుంది.
ఆ సమయం గురించి ఒక అభిప్రాయం ఏమిటంటే:
مَا بَيْنَ أَنْ يَجْلِسَ الْإِمَامُ إِلَى أَنْ تُقْضَى الصَّلَاةُ “ఇమామ్ మింబర్పై కూర్చున్న సమయం నుండి జుముఆ నమాజు పూర్తయ్యే వరకు ఉన్న సమయం.” (ముస్లిం 853).
మరొక అభిప్రాయం ప్రకారం:
آخِرَ سَاعَةٍ بَعْدَ الْعَصْرِ
“అస్ర్ నమాజు తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఉండే చివరి ఘడియ.” (అబూ దావూద్ 1048లో ప్రామాణికమైన (సహీహ్) ఆధారంతో పేర్కొనబడింది.)
కాబట్టి, ఒక పుణ్యకాలం ముగిసిపోయిందని నిరాశ చెందకుండా, అల్లాహ్ మన కోసం తెరిచి ఉంచిన ఇతర సత్కార్యాల ద్వారాలను ఉపయోగించుకోవాలి. ఆయన స్మరణ, దుఆ, జుముఆ మరియు జమాఅత్ నమాజుల ద్వారా నిరంతరం ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నించాలి.
فاللهم اجعلنا منَ {الذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ. ఫల్లాహుమ్మ జఅల్నా మినజ్ జాకిరీనల్లాహ కసీరన్ వజ్ జాకిరాత్. ఓ అల్లాహ్! నిన్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో మమ్మల్ని కూడా చేర్చు.
اللهم لكَ الحمدُ كالذي تقولُ وخيرًا مما نقولُ అల్లాహుమ్మ లకల్ హందు కల్లజీ తఖూలు వ ఖైరమ్ మిమ్మా నఖూల్ ఓ అల్లాహ్! నీవు నీ గురించి చెప్పుకున్న విధంగా, ఇంకా మేము చెప్పే స్తోత్రాల కంటే ఎంతో ఉత్తమమైన స్తోత్రాలన్నీ నీకే చెందుతాయి.
اللهم إنا عاجزونَ عن شُكرِكَ، فنُحيلُ إلى عِلمِكَ وفضلِكَ అల్లాహుమ్మ ఇన్నా ఆజిజూన అన్ షుక్రిక్, ఫ నుహీలు ఇలా ఇల్మిక వ ఫద్లిక్ ఓ అల్లాహ్! నీ అనుగ్రహాలకు తగిన విధంగా కృతజ్ఞతలు తెలపడానికి మేము అశక్తులము. కాబట్టి మా స్థితిని నీ జ్ఞానానికి మరియు నీ అపార కరుణకు అప్పగిస్తున్నాము.
اللَّهُمَّ وَهَبْتَنَا مَالًا، فَبَذَلْنَا مِنْهُ بِفَضْلِكَ نُسُكًا وَمَنْسَكًا అల్లాహుమ్మ వహబ్తనా మాలన్, ఫ-బజల్నా మిన్హు బిఫద్లిక నుసుకన్ వ మన్సకా ఓ అల్లాహ్! నీవు మాకు సంపదను ప్రసాదించావు. నీ అనుగ్రహంతోనే దానిలో కొంత భాగాన్ని ఖుర్బానీ మరియు ఇతర ఆరాధనా కార్యాల కోసం ఖర్చు చేయగలిగాము.
اللَّهُمَّ اكْتُبْنَا فِيمَنْ أُعْتِقَتْ رِقَابُهُمْ، وَكُفِّرَتْ خَطِيئَاتُهُمْ لِسَنَتَيْنِ. అల్లాహుమ్మక్-తుబ్నా ఫీమన్ ఉతిఖత్ రిఖాబుహుమ్, వ కుఫ్ఫిరత్ ఖతీఆతుహుమ్ లిసనతైన్ ఓ అల్లాహ్! నరకాగ్ని నుండి విముక్తి పొందిన వారిలో మమ్మల్ని చేర్చు. అలాగే రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడిన వారిలో కూడా మమ్మల్ని చేర్చు.
اللَّهُمَّ احْفَظْ دِينَنَا وَبِلَادَنَا وَأَدِمْ أَمْنَنَا، وَادْحَرْ أَعْدَاءَنَا، وَأَجِبْ دُعَاءَنَا అల్లాహుమ్మహ్-ఫజ్ దీననా వ బిలాదనా వ అదిమ్ అమ్ననా, వద్-హర్ అదాఅనా, వ అజిబ్ దుఆఅనా ఓ అల్లాహ్! మా ధర్మాన్ని, మా దేశాన్ని రక్షించు. మా భద్రతను శాశ్వతంగా కొనసాగించు. మా శత్రువులను ఓడించు మరియు మా ప్రార్థనలను స్వీకరించు.
اللَّهُمَّ وَارْحَمْنَا وَوَالِدِينَا، وَهَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ అల్లాహుమ్మర్-హమ్నా వ వాలిదీనా, వ హబ్ లనా మిన్ అజ్వాజినా వ జుర్రియ్యాతినా ఖుర్రత అయూన్ ఓ అల్లాహ్! మాపై మరియు మా తల్లిదండ్రులపై కరుణ చూపు. మా భార్యాభర్తలు మరియు మా సంతానం ద్వారా మా కళ్లకు చల్లదనాన్ని, ఆనందాన్ని ప్రసాదించు.
అల్లాహుమ్మహ్-ఫజ్ వ సద్దిద్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్ షరీఫైన్, అల్ మలిక సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, వ వలియ్య అహ్దిహిల్ అమీన్ అల్ అమీర ముహమ్మద్ బిన్ సల్మాన్, వర్జుఖుమ్ బితానతస్ సలాహి వల్ ఫలాహ్
ఓ అల్లాహ్! రెండు పవిత్ర మస్జిద్ల సేవకుడైన కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ సఊద్ గారిని మరియు ఆయన విశ్వసనీయ యువరాజు ముహమ్మద్ బిన్ సల్మాన్ గారిని రక్షించి, వారికి సరైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. వారికి ధర్మపరులైన, యోగ్యులైన మరియు విజయాన్ని అందించే సహచరులను కల్పించు.
అల్లాహుమ్మజ్-జిహిమ్ అలా ఖిద్మతిల్ హరమైన్ వ రాహతిల్ హుజ్జాజ్, వజ్-జి జునూదనా వ మునజ్జిమిల్ హజ్జి అలా మసాఈహిమ్ మఅ దుయూఫిర్ రహ్మాన్
ఓ అల్లాహ్! హరమైన్ సేవకై మరియు హాజీల సౌకర్యార్థం కృషి చేస్తున్న వారికి ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించు. అలాగే అల్లాహ్ అతిథులైన హాజీల సేవలో శ్రమిస్తున్న మా సైనికులకు మరియు హజ్ నిర్వాహకులకు కూడా తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించు.
اللهم صلِ وسلمْ على عبدِكَ ورسولِكَ محمدٍ అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్ ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై నీ కరుణలను, శాంతిని మరియు ఆశీర్వాదాలను కురిపించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
To Those Who Perform Multiple Umrahs in One Journey Shaykh Abdurrazzaq al-Badr [Video|Ar-En Subtitles] https://youtu.be/40fnJJgrRBg [ 7 min]
ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా, హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఇతర భార్యల వలె ‘తమత్తు‘ (Tamattu’) ఉద్దేశ్యంతో మొదట ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టారు. అయితే ప్రయాణ సమయంలో ఆమెకు రుతుస్రావం మొదలైంది. దాంతో గుస్ల్ (స్నానం) ఆచరించి, హజ్ కోసం ఇహ్రామ్ కట్టాల్సిందిగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమెకు సూచించారు. ఆమె ‘దుల్-హులైఫా’ వద్ద సంకల్పించిన ఉమ్రా ఆమె హజ్లో కలిసిపోవడం వల్ల, ఆమె ఒక ‘ఖారిన్‘ (Qarin – ఉమ్రా మరియు హజ్ కలిపి చేసేవారు) అయ్యారు. ఆమె ఉమ్రా హజ్లోనే కలిసిపోయినందున, హజ్ పూర్తయిన తర్వాత ఇతర భార్యల వలె తాను కూడా ప్రత్యేకంగా ఒక ఉమ్రా చేస్తానని ఆమె ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుమతి అడిగారు. అప్పుడు ఆమె ఉమ్రా కోసం ఇహ్రామ్ కట్టడానికి వీలుగా, హరమ్ సరిహద్దుల వెలుపల ఉన్న ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి ఆమె సోదరునితో కలిసి వెళ్లాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచించారు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా చేయాలని కోరినప్పుడు, ఆమె ఇహ్రామ్ కట్టడానికి వీలుగా పవిత్ర హరమ్ సరిహద్దులకు ఆవల ఉన్న ప్రదేశానికి ఆమెను తీసుకువెళ్లమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ను ఆదేశించారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి: ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెకు తోడుగా వెళ్లి, తవాఫ్, సయీలలో ఆమెకు సహాయపడి, ఆ తర్వాత ఆమెతో పాటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు తిరిగి వచ్చారు. కానీ, ఆయన స్వయంగా ఇహ్రామ్ కట్టలేదు. పుణ్యకార్యాలు చేయాలనే బలమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఈ విషయం గురించి విన్న సహచరులు (సహాబా) (రదియల్లాహు అన్హుమ్) ఎవరూ కూడా, నేటి కాలంలో పదేపదే ఉమ్రా చేసే కొందరి వలె “హజ్ తర్వాత మరో ఉమ్రా చేయడానికి ఇదొక మంచి అవకాశం” అని భావించలేదు. అసలు సహచరులు (రదియల్లాహు అన్హుమ్) ఇలా పదేపదే ఉమ్రాలు చేసేవారే కాదు.
ఈ సంఘటన ద్వారా మనకొక విషయం స్పష్టమవుతోంది: సత్కార్యాలు చేయడంలో మనకంటే సహచరులకే (రదియల్లాహు అన్హా)ఎక్కువ ఆసక్తి ఉండేది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతితో ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉమ్రాకు వెళ్లినప్పుడు, ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ ఆమెతో పాటు వెళ్లినా ఇహ్రామ్ కట్టలేదు. “ఎలాగూ వెళ్తున్నాను కదా, నేనూ ఒక ఉమ్రా చేసేస్తాను” అని ఆయన అనుకోలేదు. అలాగే, అక్కడ వేచి ఉన్న ఇతర సహచరులు కూడా “మనం ఎలాగూ ఇక్కడే ఉన్నాం కదా, మనమూ ఉమ్రా చేద్దాం” అని అనలేదు. నేడు కొందరు తమకోసం లేదా తమ తల్లిదండ్రులు, బంధువుల తరపున చేస్తున్నట్లుగా వారిలో ఎవరూ పదేపదే ఉమ్రా చేయలేదు. కాబట్టి, కొంతమంది యాత్రికులు హజ్ పూర్తయ్యాక రెండు, మూడు లేదా నాలుగుసార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకూ జుట్టును కొద్దికొద్దిగా కత్తిరించడం లాంటి ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు. ఒక వ్యక్తి ఒక ఉమ్రా కోసం తలలో సగం గుండు చేయించుకున్నాడని, మరో ఉమ్రా కోసం మిగిలిన సగం గుండు చేయించుకున్నాడని కూడా కొన్ని కథనాలు ఉన్నాయి—కానీ వాటి ప్రామాణికత సందేహాస్పదమే.
సరైన అవగాహన లేకపోవడం, అజ్ఞానంతో వ్యవహరించడం వల్ల హజ్ సమయంలో అనేక వింతైన, అసాధారణమైన ఆచరణలు మనకు కనిపిస్తుంటాయి. షేక్ (ఇబ్న్ బాజ్) (రహిమహుల్లాహ్) జీవించి ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. నేను ఒకసారి ఆయన వద్దకు వెళ్లినప్పుడు, నన్ను కలిసి సందేహం అడిగిన ఒక యాత్రికుడి గురించి షేక్ గారికి వివరించాలని కొందరు పండితులు నాతో అన్నారు. నేను మదీనాలోని మీఖాత్లో ఉన్నప్పుడు ఒక యాత్రికుడు నా వద్దకు వచ్చి, “నాకు సహజంగానే బట్టతల ఉంది, పైగా నేను ఎప్పుడూ గడ్డం కూడా గీసుకుంటాను” అని చెప్పాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “నేను అల్-మర్వాకు చేరుకుని ఉమ్రా పూర్తి చేసేసరికి నా తలపై జుట్టు ఏమీ లేదు. అప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించి, ‘నీ తల మీద జుట్టు లేదు కదా, ఇప్పుడు నువ్వు ఇహ్రామ్ నుండి ఎలా బయటపడతావు? వెళ్లి నీ మీసాలు గీసుకో‘ అని సలహా ఇచ్చాడు. దాంతో నేను మంగలి వద్దకు వెళ్లి నా మీసాలు గీసుకుని, తద్వారా ఇహ్రామ్ నుండి బయటపడ్డాను” అని చెప్పాడు. కొందరు పండితుల సూచన మేరకు ఈ విషయాన్ని నేను షేక్ ఇబ్న్ బాజ్తో ప్రస్తావించగా, ఆయన తీవ్ర ఆవేదన, కోపం వ్యక్తపరిచారు. సరైన జ్ఞానం లేకుండా యాత్రికులకు ఫత్వాలు (మతపరమైన తీర్పులు) ఇవ్వడానికి కొందరు చూపే సాహసమే ఆయన కోపానికి కారణం.
దీనికి సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన ఒక హదీసు ఉంది:
مَنْ أُرْشِدَ إِلَى غَيْرِ رُشْدٍ فَإِنَّمَا إِثْمُهُ عَلَى مَنْ أَرْشَدَهُ (ఎవరైనా మార్గభ్రష్టత్వం వైపు దారిచూపితే, దాని పాపం దారిచూపిన వారిపైనే పడుతుంది.)
కాబట్టి, సరైన జ్ఞానం లేకుండా “ఫలానా విధంగా చేయండి” అని సలహా ఇచ్చే వ్యక్తి, అల్లాహ్ పేరుతో తప్పుగా మాట్లాడినందుకు పాపభారాన్ని మూటగట్టుకుంటాడు. కొందరు వ్యక్తులు, సుబహానల్లాహ్ (అల్లాహ్ ఎంతో పవిత్రుడు), ఇలాంటి పరిస్థితుల్లో కేవలం భావోద్వేగాలకు లోనై “ఏమీ పర్వాలేదులే” అంటూ తప్పుడు సమాధానాలు ఇస్తుంటారు. ఇతరుల పట్ల దయ చూపడానికి ముందు, ఒకరు తమ పట్ల తాము దయ కలిగి ఉండాలి. ఇతరులపై జాలి చూపించే ముందు మీపై మీరు జాలి చూపించుకోండి—అంటే, జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మాట్లాడి పాపాల్లో పడవద్దు. ఫత్వా (మతపరమైన తీర్పు) అనేది భావోద్వేగాలపై కాకుండా, పరిపూర్ణమైన జ్ఞానం, స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఒకరికి సరైన జ్ఞానం ఉంటేనే వారు తీర్పు ఇవ్వాలి; లేదంటే, ఆ విషయమై జ్ఞానం ఉన్న పండితులను సంప్రదించమని ఇతరులకు సూచించాలి.
—
సారాంశం (Summary):
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉమ్రా: హజ్రత్ ఆయిషా ఉమ్రా ఉద్దేశ్యంతో వెళ్ళినప్పుడు రుతుస్రావం మొదలవడంతో, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సూచన మేరకు ఆమె హజ్ మరియు ఉమ్రా రెండింటినీ కలిపి (ఖారిన్) చేశారు.
అల్-తన్ఈమ్ ప్రయాణం: హజ్ పూర్తయిన తర్వాత ఆమె కోరిక మేరకు, ప్రత్యేకంగా ఉమ్రా చేయడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతించారు. ఇహ్రామ్ కట్టడం కోసం ఆమెను తన సోదరుడు అబ్దుర్రహ్మాన్తో కలిసి ‘అల్-తన్ఈమ్’ ప్రాంతానికి పంపారు.
పదేపదే ఉమ్రాలు చేయకపోవడం: ఆయిషా (రదియల్లాహు అన్హా) కి తోడుగా వెళ్లిన ఆమె సోదరుడు అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) స్వయంగా ఉమ్రా చేయలేదు. దీనిని బట్టి ఒకే ప్రయాణంలో పదేపదే ఉమ్రాలు చేసే ఆచారం సహాబాలలో (ప్రవక్త అనుచరులలో) లేదని స్పష్టమవుతుంది.
ఆధారం లేని ఆచరణలు: హజ్ తర్వాత రెండు మూడు సార్లు పదేపదే ఉమ్రాలు చేయడం, ప్రతి ఉమ్రాకు కొద్దికొద్దిగా జుట్టు కత్తిరించడం లాంటి నేటికాలపు ఆచరణలకు ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేదు.
అజ్ఞానం వల్ల తప్పులు: సరైన జ్ఞానం లేకపోవడం వల్ల కొందరు వింతైన పనులు చేస్తుంటారు. ఉదాహరణకు, బట్టతల ఉన్న ఒక వ్యక్తి ఉమ్రా పూర్తి చేశాక ఇహ్రామ్ నుండి బయటపడటానికి మీసాలు గీసుకోమని ఒకరు తప్పుడు సలహా ఇచ్చారు.
జ్ఞానం లేకుండా ఫత్వా ఇవ్వరాదు: ఈ సంఘటన విన్న షేక్ ఇబ్న్ బాజ్, సరైన జ్ఞానం లేకుండా మతపరమైన తీర్పులు (ఫత్వాలు) ఇచ్చే వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుదారి పట్టిస్తే పాపం: హదీసు ప్రకారం, ఒకరికి మతపరంగా తప్పుడు మార్గం చూపితే దాని పాపం ఆ సలహా ఇచ్చిన వారిపైనే పడుతుంది. కాబట్టి, అవగాహన లేకుండా కేవలం భావోద్వేగాలతో ఫత్వాలు ఇవ్వకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అయ్యాముత్ తష్రీఖ్ అనగా ఇస్లామీయ క్యాలెండర్ లోని 12వ నెల అయిన జుల్ హిజ్జా యొక్క 11, 12 మరియు 13 తేదీలు. ఇవి ఖుర్బానీ, అల్లాహ్ స్మరణ, తక్బీరాత్ మరియు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపే రోజులు. ఈ రోజులకు ఇస్లాంలో గొప్ప మహిమ ఉంది.
1) లెక్కించిన రోజులలో అల్లాహ్ ను స్మరించండి
అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి (సూరహ్ అల్-బఖరా: 203).
ముఫస్సిరీన్లలో (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలలో) ముఖ్యంగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా మరియు జుమ్హూర్ ఉలమా అభిప్రాయం ప్రకారం “అయ్యామిన్ మఅదూదాత్” అనగా అయ్యామె తష్రీఖ్.
2) ఖుర్బానీ మరియు ఇబాదత్ సంబంధం
అల్లాహు తఆలా ఇలా సెలవిచ్చాడు:
لِيَشْهَدُوا مَنَافِعَ لَهُمْ وَيَذْكُرُوا اسْمَ اللَّهِ فِي أَيَّامٍ مَعْلُومَاتٍ వారు తమ ప్రయోజనాలు పొందటానికి (హజ్ కు) రావాలి. ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి. (సూరహ్ అల్-హజ్: 28).
అధిక ముఫస్సిరీన్ల ప్రకారం “అయ్యామిమ్ మఅలూమాత్” అంటే జుల్ హిజ్జా మొదటి పది రోజులు; “అయ్యామిమ్ మఅదూదాత్” అంటే అయ్యాముత్ తష్రీఖ్. ఇక్కడ ఖుర్బానీ ప్రస్తావన వచ్చింది గనక, ఈ ఖుర్బానీ ఎన్ని రోజులు చేయవచ్చు అన్నది కూడా స్పష్టంగా తెలుసుకుందాం.
అయితే పండుగ రోజు (10వ జిల్ హిజ్జా) మరియు ఆ తర్వాత మూడు రోజులు, మొత్తం నాలుగు రోజులు ఖుర్బానీ చేయవచ్చు. దీనికి మొదటి ఆధారం ప్రవక్తవారి ఈ హదీసు «كُلُّ أَيَّامِ التَّشْرِيقِ ذَبْحٌ» అయ్యాముత్ తష్రీఖ్ యొక్క అన్ని రోజులు జిబహ్ చేయవచ్చును అంటే ఖుర్బానీ ఇవ్వవచ్చును. (ముస్నద్ అహ్మద్ 1651, సహీహ్ 2476).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:
«إِنَّ يَوْمَ عَرَفَةَ وَيَوْمَ النَّحْرِ وَأَيَّامَ التَّشْرِيقِ عِيدُنَا أَهْلَ الْإِسْلَامِ ، وَهِيَ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ» నిశ్చయంగా అరఫా రోజు, నహ్ర ఖుర్బానీ రోజు మరియు అయ్యాముత్ తష్రీఖ్ ముస్లింల పండుగ రోజులు మరియు తినే త్రాగే రోజులు. (అబూ దావూద్ 2419. చివరి పదాలు ముస్లిం 1141లోనివి).
ఇమాం ఇబ్నె తైమియా, ఇమాం ఇబ్నె ఖయ్యిమ్, ఇమాం షౌకానీ, షేఖ్ బిన్ బాజ్ మరియు షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ ఈ మాటనే బలపరిచారు, మరియు రాజిహ్ అని చెప్పారు. సూర బఖరలోని 203వ ఆయతు ద్వారా కూడా ఈ మాట గ్రహించడం జరిగినది. (వివరాలు ఆ ఆయతు వ్యాఖ్యానం మరియు హదీసుల్లో చూడవచ్చు).
3) అయ్యాముత్ తష్రీక్ తినడం, త్రాగడం మరియు అల్లాహ్ స్మరణ రోజులు
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
أَيَّامُ التَّشْرِيقِ أَيَّامُ أَكْلٍ وَشُرْبٍ وَذِكْرِ اللَّهِ అయ్యాముత్ తష్రీక్ అనేవి తినే, త్రాగే మరియు అల్లాహ్ స్మరణ చేసే రోజులు. (ముస్లిం: 1141).
ఈ హదీస్ స్పష్టంగా తెలియజేస్తుంది: ఈ రోజుల్లో అల్లాహ్ అనుగ్రహాలపై సంతోషం వ్యక్తం చేయడం షరియత్ లో సమ్మతం.
విశ్వాసులారా! లెక్కలేనన్ని సత్కార్యాలలో ఏదైనా సత్కార్యం గురించి అధికంగా చేయండి అని అల్లాహ్ చెప్పి ఉన్నాడా అంటే, అవును జిక్ర్ గురించి చెప్పి ఉన్నాడు. శ్రద్ధ వహించండి సురతుల్ జుముఅలోని ఈ ఆయత్:
﴿ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ ﴾ [الجمعة ١٠] ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి.
పైన ఉన్న ఆయతు అనువాదం ఇంతేనా, కాదు. అల్లాహ్ మరో శుభవార్త ఇచ్చాడు. అదే: మీరు సాఫల్యం పొందవచ్చు. అల్లాహు అక్బర్! మనం అల్లాహ్ ను ఎక్కువగా, అధికంగా స్మరిస్తూ ఉంటే సాఫల్యం లభించేది మనకే.
﴿ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا ﴾ అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు. (అహ్జాబ్ 33:35).
4) ఈ రోజుల్లో ఉపవాసం నిషేధం
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఆదేశించారు:
అందువల్ల సాధారణ ముస్లింలకు 11, 12, 13 జుల్ హిజ్జా రోజుల్లో ఉపవాసం పాటించడం యోగ్యం కాదు. అయితే హజ్ తముత్తు లేదా ఖిరాన్ చేసిన హాజీలకు ఖుర్బానీ చేయలేని పరిస్థితిలో ఉపవాసం పాటించే అనుమతి ఉంది.
5) అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజులు
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:
إِنَّ أَعْظَمَ الْأَيَّامِ عِنْدَ اللَّهِ يَوْمُ النَّحْرِ، ثُمَّ يَوْمُ الْقَرِّ అల్లాహ్ వద్ద అత్యంత గొప్ప రోజు యౌమున్ నహర్ (10వ జుల్ హిజ్జా), తరువాత యౌముల్ ఖర్ర్ (11వ జుల్ హిజ్జా). (అబూ దావూద్: 1765.
ఇమామ్ అల్బానీ రహిమహుల్లాహ్ దీనిని సహీహ్ అన్నారు.) “యౌముల్ ఖర్ర్” అనగా అయ్యాముత్ తష్రీక్ మొదటి రోజు; ఈ రోజున హుజ్జాజ్ మినా లో నివసిస్తారు.
6) తక్బీరాత్ అయ్యాముత్ తష్రీఖ్ ప్రాముఖ్యత – ఖుర్ఆన్ ఆధారం
وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَعْدُودَاتٍ “గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్ దినాలలో) అల్లాహ్ ను స్మరించండి ” (సూరహ్ అల్-బఖరా: 203)
ఈ ఆయత్ ఆధారంగా సహాబాయె కిరామ్ రజియల్లాహు అన్హుమ్ అయ్యాముత్ తష్రీఖ్ రోజుల్లో గట్టిగా (బిగ్గరగా) తక్బీరాత్ పలికేవారు.
సహాబాయె కిరామ్ ఆచరణ
[1] హజ్రత్ ఇబ్ను ఉమర్ మరియు హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హుమా మార్కెట్ లోకి వెళ్లి తక్బీర్ పలికేవారు; వారిని విని ప్రజలు కూడా తక్బీర్లు పలికేవారు. (బుఖారీ, కితాబుల్ ఈదైన్, బాబ్ ఫజ్జుల్ అమల్ ఫీ అయ్యామిత్ తష్రీక్).
[2] హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు మినా లో తన గుడారంలో గట్టిగా తక్బీర్ పలికేవారు; అది మినాలోని మస్జిదె ఖైఫ్ లో ఉన్నవారికి వినబడేది, అప్పుడు వారు తక్బీర్ పలికేవారు. ఇలా మొత్తం మస్జిద్ తక్బీర్లతో మారుమ్రోగేది, తరువాత బజార్ల వరకు ఆ ధ్వని వినిపించేది. (బుఖారీ, కితాబుల్ ఈదైన్).
తక్బీరాతె తష్రీఖ్ పదాలు
సహాబాయె కిరామ్ నుండి భిన్నమైన పదాలు మనకు లభించాయి. ప్రసిద్ధ పదాలు ఇవి:
الله أكبر الله أكبر لا إله إلا الله، والله أكبر الله أكبر ولله الحمد (అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, వల్లాహు అక్బర్ , అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ )
అయ్యాముత్ తష్రీఖ్ లో చేయవలసిన అమలు
అధికంగా జిక్ర్ చేయడం – తక్బీర్, తహ్లీల్, తహ్మీద్, తస్బీహ్, దురూద్ షరీఫ్.
నమాజ్ ల తర్వాత తక్బీరాత్. (దీనినే తక్బీరె ముఖయ్యద్ అంటారు). ఉమ్మత్ యొక్క ఫుఖహా అభిప్రాయం ప్రకారం ఫర్జ్ నమాజ్ ల తరువాత తక్బీరాత్ పలకడం మష్రూ.
ఖుర్బానీ మాంసం తినడం మరియు పంచడం.
సంతోషం మరియు కృతజ్ఞత వ్యక్తం చేయడం.
ఈ రోజులు ఇబాదత్ తో పాటు ఆనందానికి కూడా సంబంధించినవి. ఇస్లాం సన్యాసాన్ని కాదు, షుక్ర్ మరియు జిక్ర్ తో కూడిన సమతుల్య జీవనాన్ని బోధిస్తుంది.
ఈ జుమా ఖుత్బా ద్వారా ప్రభావవంతమైన సందేశం
గౌరవనీయులైన ముస్లిములారా!
ఇమాం ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ ఈ రోజుల గురించి తెలిపిన ఆణిముత్యాలు కొన్ని ఇలా ఉన్నాయి.
[1] అయ్యాముత్ తష్రీఖ్ లో విశ్వాసుల కొరకు శారీరక అనుగ్రహం మరియు మానసిక అనుగ్రహం రెండూ ఏకంగా లభిస్తాయి. శారీరక అనుగ్రహాలంటే తిను, త్రాగుట మరియు హృదయ అనుగ్రహాలంటే జిక్ర్ మరియు షుక్ర్.
[2] పండుగ రోజులలో తినడం, త్రాగడం అనేవి కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు; వాటివల్ల మనకు శక్తి వచ్చి, ఆ శక్తితో అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం. ఇదే నిజమైన కృతజ్ఞత. కానీ ఎవరు ఆ వరాలను పాపాలకు ఉపయోగిస్తారో, వారు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపినవారవుతారు. అలాంటి వారు ఆ అనుగ్రహాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు.
[3] మరో చోట చెప్పారు: ఈ రోజుల్లో మనం ఏ జంతువులను ఖుర్బానీ చేస్తామో అవి స్వయంగా అల్లాహ్ ను ఆరాధిస్తాయి, ఆయనకు విధేయులుగా ఉంటాయి. అయితే వాటి మాంసం తినడం ద్వారా మనలో విశ్వాసం పెరిగి, అల్లాహ్ ఆరాధన మరింత ఎక్కువగా చేసే బుద్ధి, ఎల్లవేళల్లో ఆయనకు విధేయులుగా ఉండే బుద్ధి కలగాలి. (ఇక్కడ అరబీ ఇవ్వలేకపోయాము మరీ సంక్షిప్తంగా చేసి అనువదించాము గనక).
[4] ఈ లోక జీవితం అంతా హజ్ యాత్ర రోజుల్లాంటిదే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మోమిన్ (విశ్వాసి) అల్లాహ్ నిషేధించిన కోరికలు, పాపాల నుండి దూరంగా ఉండాలి; ఇది ఇహ్రామ్ లో ఉన్న హజ్ యాత్రికుడిలా ఉంటుంది.
ఎవరు తమ జీవిత ప్రయాణంలో సహనంతో ఉండి, తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారో, వారు జీవిత యాత్ర ముగిసినప్పుడు తమ ఆశల గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వారు తమ బాధ్యతను పూర్తి చేసి, అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినవారవుతారు. ఆ తర్వాత వారి రోజులు అన్నీ మినా రోజుల్లా మారిపోతాయి — ఆనందం, తినడం, త్రాగడం, మరియు అల్లాహ్ స్మరణతో నిండిన రోజులుగా.
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ “గత కాలంలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా హాయిగా తినండి, త్రాగండి” (అని వారితో అనబడుతుంది)“. (అల్ హాఖ్ఖహ్ 69:24).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.