అత్-తహియ్యాత్ (తషహ్హుద్) గురుంచి ఒక లోతైన పరిశీలన – షేక్ అబ్దుర్రజ్జాక్ అల్-బద్ర్

Reflecting Over the Tahiyyāt (Tashahud)
Shaykh ‘Abdurrazzāq al Badr حفظه الله
https://youtu.be/Vqy0FWKrsSU [35 min]

షేక్ అబ్దుర్రజ్జాక్ అల్-బద్ర్:

గౌరవనీయులైన నా ప్రియ సోదరులారా! ఈ రాత్రి మన సమావేశపు ప్రసంగానికి నేను ‘అత్తహియ్యాత్ (తషహ్హుద్) – ఒక లోతైన పరిశీలన’ అని పేరు పెట్టాను.

ఒక ముస్లిం తన నమాజులో ఖియామ్ (నిలబడటం), రుకూ (వంగడం) మరియు సజ్దాలు చేసిన తరువాత, నమాజు ముగింపు దశలో సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్ ఎదుట అత్యంత భక్తిశ్రద్ధలతో కూర్చుంటాడు. ఆ గొప్ప స్థితిలో కూర్చుని చదివే ప్రార్థననే ‘తహియ్యాత్’ అంటారు. ఆ కూర్చోవడాన్ని అతను ‘అత్తహియ్యాతు లిల్లాహి…’ అనే వాక్యంతో ప్రారంభించి దాని చివరి వరకు చదువుతాడు.

ఈరోజు ‘అత్తహియ్యాత్’ గురించి నేను మీతో పంచుకోబోయే విషయాలు మీకు ఏదో కొత్తగా బోధించాలన్న ఉద్దేశ్యంతో చెబుతున్నవి కావు; కేవలం ఒక మంచి విషయాన్ని మీకు గుర్తుచేయాలన్న (రిమైండర్) ఉద్దేశ్యంతో మాత్రమే చెబుతున్నాను.

నేను ఇక్కడ ఒక ఉపాధ్యాయుడిలా కాకుండా, కేవలం ఒక గుర్తుచేసేవాడిగా ఉంటూ… ముందుగా నాకై నేను గుర్తుచేసుకుంటూ, ఆ తర్వాత వింటున్న నా సోదరులందరికీ ఈ విషయాలను గుర్తుచేస్తున్నాను. అల్లాహ్ మనందరినీ ఆశీర్వదించుగాక! సకల సత్కార్యాలలో అల్లాహ్ మనకు సాఫల్యాన్ని (విజయాన్ని), సన్మార్గాన్ని ప్రసాదించాలని నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.

సహీహైన్‌లో అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) హదీసులో ఇలా ఉంది, ఆయన అన్నారు:

(كُنَّا إِذَا صَلَّيْنَا خَلْفَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قُلْنَا: السَّلَامُ عَلَى اللَّهِ مِنْ عِبَادِهِ، السَّلَامُ عَلَى جِبْرِيلَ وَمِيكَائِيلَ، السَّلَامُ عَلَى فُلَانٍ وَفُلَانٍ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: لَا تَقُولُوا السَّلَامُ عَلَى اللَّهِ، فَإِنَّ اللَّهَ هُوَ السَّلَامُ، وَلَكِنْ قُولُوا: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، فَإِنَّكُمْ إِذَا قُلْتُمُوهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ)

“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నమాజు చేస్తున్నప్పుడు ఇలా అనేవాళ్ళము: ‘ఆయన దాసుల తరపున అల్లాహ్‌కు శాంతి కలుగుగాక, జిబ్రీల్ మరియు మీకాయీల్‌పై శాంతి కలుగుగాక, ఫలానా ఫలానా వ్యక్తులపై శాంతి కలుగుగాక.’

అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీరు ‘అల్లాహ్‌కు శాంతి కలుగుగాక’ అని అనకండి, ఎందుకంటే అల్లాహ్ స్వయంగా ‘అస్-సలామ్’ (శాంతికి మూలం / శాంతి ప్రదాత). దానికి బదులుగా మీరు ఇలా చదవండి:

‘అత్-తహియ్యాతు లిల్లాహి వస్-సలవాతు వత్-తయ్యిబాత్, అస్సలాము అలైక అయ్యుహన్-నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలై‌నా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్’

(అర్థం: సకల మౌఖిక, శారీరక, ఆర్థిక ఆరాధనలు మరియు పవిత్రమైన మాటలన్నీ అల్లాహ్‌కే చెందినవి. ఓ ప్రవక్తా! మీపై శాంతి, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు కురియుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క సజ్జనులైన (పుణ్యాత్ములైన) దాసులందరిపై శాంతి కలుగుగాక).

ఎందుకంటే, మీరు ఇలా అన్నప్పుడు, ఆకాశంలో మరియు భూమిపై ఉన్న అల్లాహ్ యొక్క ప్రతి పుణ్యాత్ముడైన దాసుడికి అది (ఈ శాంతివచనం) చేరుతుంది.

(తరువాత ఇలా చదవండి): ‘అష్-హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్-హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’
(అర్థం: అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వారు మరెవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, సందేశహరుడు (ప్రవక్త) అని నేను సాక్ష్యమిస్తున్నాను).”

ప్రవక్త ﷺ తన ఉమ్మత్ (సమాజం)కి నేర్పించిన ఈ గొప్ప తహియ్యాత్‌ను పేర్కొనడంలో ఇది ఒక అద్భుతమైన హదీసు. దీని నుండి మనం ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని పొందుతాము.

హదీసు ప్రారంభంలోనే, ‘తహియ్యాత్’ విషయంలో సహాబాలకు (ప్రవక్త అనుచరులకు) ఉన్న ప్రాథమిక అవగాహన ఎలాంటిదో మనం గమనించవచ్చు. వారు నమాజులో కూర్చున్నప్పుడు మొదట్లో ‘అల్లాహ్‌పై అస్-సలాం (శాంతి) కలుగుగాక’ అని చదివేవారు. సహాబాల సద్గుణాలు, వారి అపారమైన జ్ఞానం, వారి ఉన్నత స్థానం ఎంత గొప్పవో మనందరికీ తెలుసు. అయినప్పటికీ, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఆ పొరపాటును సరిదిద్ది, వారికి సరైన పద్ధతిని నేర్పించారు. (వారు దరూద్ పంపే విధానం గురించి కూడా ప్రవక్తను ఎలా అడిగారో ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా – “మీపై సలాం ఎలా చేయాలో మాకు తెలుసు, మరి మీపై సలాత్ (దరూద్) ఎలా చదవాలో నేర్పండి” అని వారడిగారు).

దీని నుండి మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన పాఠం ఒకటుంది. అదేమిటంటే – ప్రార్థనలు (దుఆలు) మరియు స్మరణలు (జిక్ర్) అనేవి పూర్తిగా ఇస్లామిక్ ధర్మం (దీన్) లోని ప్రధాన భాగాలు. కాబట్టి వాటిని తప్పనిసరిగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండే నేర్చుకోవాలి. ధార్మిక విషయాల్లో ఎవరైనా తన సొంత ఆలోచనలు లేదా నిర్ణయాలపై ఆధారపడితే, అతను కచ్చితంగా తప్పులు చేస్తాడు, పొరపాట్ల బారిన పడతాడు. కానీ అతను ప్రవక్త ﷺ నేర్పిన విధానాన్ని అనుసరిస్తే, అందులో ఎలాంటి లోపం ఉండదు. ఎందుకంటే, ప్రవక్త ﷺ ద్వారా వచ్చిన ప్రతిదీ అల్లాహ్ అవతరింపజేసిన ‘వహీ’ (దివ్యజ్ఞానం) కాబట్టి అది దోషరహితమైనది!

ఒకప్పుడు నమాజులో ప్రవక్త ﷺ వెనుక ఉన్న సహాబాలు ‘అల్లాహ్‌పై అస్-సలాం’ అనేవారు కదా! అసలు ‘సలాం’ అంటే అర్థం ఏమిటి? అదొక ప్రార్థన (దుఆ). మనం ఎవరికైతే సలాం చేస్తున్నామో, వారి క్షేమాన్ని, భద్రతను కోరుతూ చేసే ప్రార్థన అది. కానీ అల్లాహ్ స్వయంగా ‘అస్-సలాం’ (శాంతి ప్రదాత)! ఆయనే తన దాసులకు శాంతిని, భద్రతను ప్రసాదించేవాడు. కాబట్టి మనం శాంతిని ఆయన వద్ద అడగాలే తప్ప, ఆయనకే శాంతి కలగాలని కోరకూడదు.

‘అస్-సలాం’ అనేది అల్లాహ్ యొక్క పవిత్ర నామాలలో ఒకటి. ఖురాన్‌లోని సూరా అల్-హష్ర్ ముగింపులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(هُوَ اللَّهُ الَّذِي لَا إِلَهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ)
“ఆయనే అల్లాహ్! ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన వాడు మరెవడూ లేడు. ఆయనే సర్వాధికారి (రాజు), అత్యంత పవిత్రుడు, అస్-సలాం (శాంతికి మూలం)…” (ఖురాన్ 59:23).

అల్లాహ్ యొక్క ఇతర పేర్లైన ‘అల్-ఖుద్దూస్’ (మహా పవిత్రుడు), ‘అస్-సుబ్బూహ్’ (సకల లోపాలకు అతీతుడు) లాగానే ఈ ‘అస్-సలాం’ అనే పేరు కూడా, అల్లాహ్‌కు ఎలాంటి లోపాలు, అసంపూర్ణతలు లేవని, ఆయనను సృష్టిరాశులతో పోల్చలేమని స్పష్టం చేస్తుంది. అల్లాహ్ యొక్క వైభవానికి, పరిపూర్ణతకు, గొప్పతనానికి విరుద్ధమైన ప్రతి లోపాన్ని ఈ పేర్లు తిరస్కరిస్తాయి.

కాబట్టి, అల్లాహ్‌పై సలాం కలుగుగాక అనడం ఏమాత్రం సరైనది కాదు. ఎందుకంటే సకల శాంతులకు మూలం ఆయనే, శాంతిని ప్రసాదించేవాడు ఆయనే, మరియు మనం శాంతిని కేవలం ఆయన నుండే వేడుకుంటాము.

అందుకే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని వారిస్తూ ఇలా స్పష్టమైన ఆదేశం ఇచ్చారు:

(لَا تَقُولُوا السَّلَامُ عَلَى اللَّهِ، فَإِنَّ اللَّهَ هُوَ السَّلَامُ)
“మీరు ‘అల్లాహ్‌కు సలాం కలుగుగాక’ (అస్సలాము అలల్లాహ్) అని అనకండి, ఎందుకంటే నిశ్చయంగా అల్లాహ్ స్వయంగా ‘అస్-సలాం’ (శాంతికి మూలం).”

“దానికి బదులుగా… ‘అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాత్’ (సకల మౌఖిక, శారీరక, ఆర్థిక ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్‌కే అంకితం) అని చదవండి” అని ప్రవక్త ﷺ వారికి బోధించారు..

1. ‘అత్తహియ్యాత్’ (అత్తహియ్యాతు లిల్లాహి):

దీని అర్థం – సర్వవిధాలైన మర్యాదలు, వినయ విధేయతలు, రుకూ, సజ్దాల వంటి ఆరాధనా రూపాలన్నీ ఏకైక అల్లాహ్‌కే చెందుతాయి. ఇవన్నీ కేవలం ఆయనకు మాత్రమే సమర్పించబడాలి, ఆయన తప్ప మరెవరికీ నిర్దేశించబడకూడదు.

2. ‘అస్-సలవాత్’ (వస్సలవాతు):

దీనికి ప్రధానంగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి: రుకూ, సజ్దాలతో కూడిన ‘నమాజు’ అని, రెండవది: భాషాపరంగా ‘దుఆ’ (ప్రార్థన) అని. వాస్తవానికి ఈ రెండు అర్థాలూ ఇక్కడ వర్తిస్తాయి. ఈ ఆరాధనలన్నీ కేవలం అల్లాహ్ కోసమే! కాబట్టి ఒక దాసుడు అల్లాహ్‌కు తప్ప మరెవరికీ సజ్దా లేదా రుకూ చేయడు, అలాగే తన అవసరాలు తీర్చమని అల్లాహ్‌ను తప్ప మరెవరినీ ప్రార్థించడు.

ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ)
“అల్లాహ్‌ను వదలి, తీర్పుదినం వరకు తమ ప్రార్థనను అంగీకరించలేని (బదులివ్వలేని) వారిని ప్రార్థించేవాని కంటే గొప్ప మార్గభ్రష్టుడు మరెవడుంటాడు? పైగా వారు (ఈ కల్పిత దేవుళ్ళు) వీరి ప్రార్థనల పట్ల పూర్తి అజ్ఞానంలో ఉన్నారు.” (ఖురాన్ 46:5).

3. ‘అత్-తయ్యిబాత్’ (వత్తయ్యిబాత్):

పవిత్రమైన మాటలు, సత్కార్యాలు మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యాలన్నీ కేవలం అల్లాహ్ కోసమే అని దీని అర్థం. ఇది అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లకు, ఆయన ఉన్నతమైన లక్షణాలకు కూడా వర్తిస్తుంది. అల్లాహ్ పేర్లన్నీ ‘తయ్యిబా’ (అత్యంత పవిత్రమైనవి, శ్రేష్టమైనవి). అల్లాహ్ పేర్లలో ఒకటి ‘అత్-తయ్యిబ్’.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

(إِنَّ اللَّهَ طَيِّبٌ لَا يَقْبَلُ إِلَّا طَيِّبًا)
“నిశ్చయంగా అల్లాహ్ ‘తయ్యిబ్’ (మహా పవిత్రుడు). మరియు ఆయన ‘తయ్యిబ్’ (పవిత్రమైన) దానిని తప్ప మరేదీ అంగీకరించడు.”

పవిత్రమైన, అత్యుత్తమమైన లక్షణాలన్నీ అల్లాహ్‌కే చెందుతాయి. అలాగే దాసులు చేసే పవిత్రమైన సత్కార్యాలు, మంచి మాటలు, స్వచ్ఛమైన ఉద్దేశ్యాలన్నీ ఏకైక అల్లాహ్ సామీప్యాన్ని (దగ్గరవడాన్ని) పొందే మార్గాలు. ఆయన తయ్యిబ్ (పవిత్రుడు) మరియు ఆయనకు సంబంధించిన ప్రతిదీ పవిత్రమైనదే!

అందువల్ల, ఒక వ్యక్తి అల్లాహ్ సామీప్యాన్ని కోరుతూ తన మాటల్లో, చేతల్లో మరియు ఉద్దేశ్యాల్లో ‘తయ్యిబ్’ (స్వచ్ఛంగా, పవిత్రంగా) జీవిస్తే, తీర్పు దినాన స్వర్గద్వారాల వద్ద దేవదూతలు వారితో అద్భుతమైన స్వాగతం పలుకుతూ ఇలా అంటారు:

(طِبْتُمْ فَادْخُلُوهَا خَالِدِينَ)
“(తిబ్తుమ్) మీరు ఎంతో పవిత్రమైన జీవితం గడిపారు, కాబట్టి ఇందులో (స్వర్గంలో) శాశ్వతంగా నివసించడానికి ప్రవేశించండి…” (ఖురాన్ 39:73).

సంక్షిప్తంగా చెప్పాలంటే… అల్లాహ్ తన పేర్లు, లక్షణాలలో అత్యంత పవిత్రుడు (తయ్యిబ్). తన దాసుల నుండి కేవలం పవిత్రమైన మాటలు, సత్కార్యాలు, మరియు స్వచ్ఛమైన ఉద్దేశ్యాలను (తయ్యిబాత్ ను) మాత్రమే ఆయన స్వీకరిస్తాడు.

అల్లాహ్‌కు ‘అత్తహియ్యాత్’ ద్వారా సర్వ విధాలైన ఆరాధనలు, గొప్పదనాన్ని సమర్పించిన తరువాత, నమాజులో మొట్టమొదటి ప్రాధాన్యత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఇవ్వబడుతుంది. సృష్టిలోని ఇతర దాసులందరికంటే ముందుగా ఆయనపైనే ప్రత్యేకంగా సలాం పంపబడుతుంది:

‘అస్సలాము అలైక అయ్యుహన్-నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’
(ఓ ప్రవక్తా! మీపై సలాం, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాలు కురియుగాక).

సమస్త ముస్లిం సమాజం (ఉమ్మత్) మరియు దాసులందరిపై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు ఉన్న అపారమైన హక్కును, ఆయన ఉన్నత స్థానాన్ని ఇది తెలియజేస్తుంది. ఎందుకంటే, ఆయన ద్వారానే అల్లాహ్ ప్రజలను అజ్ఞానపు చీకట్ల నుండి వెలుగులోకి తీసుకువచ్చి, వారికి సన్మార్గాన్ని (రుజుమార్గాన్ని) చూపాడు.

ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(لَقَدْ جَاءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِالْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ)
“మీ దగ్గరకు స్వయంగా మీలోనుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల యెడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు.” (ఖురాన్ 9:128).

మరొక చోట అల్లాహ్ ఇలా అన్నాడు:

(النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ)
“దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది…” (ఖురాన్ 33:6)[1].

ఒక విశ్వాసికి తన సొంత ప్రాణం (ఆత్మ) కంటే దైవప్రవక్తే అత్యంత ముఖ్యుడు, హక్కుదారుడు కాబట్టే… ఈ తహియ్యాత్ లోని ‘సలాం’ లో కూడా ఆయనకే మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఆయనపై సలాం పంపిన తరువాత మాత్రమే, నమాజు చేసే వ్యక్తి తనపై తాను సలాం పంపుకునే అవకాశం వస్తుంది.

అందుకే ముందుగా “ఓ ప్రవక్తా! మీపై అస్-సలాం, అల్లాహ్ కారుణ్యం, ఆశీర్వాదాలు కురియుగాక” అని ప్రార్థించి, ఆ తర్వాతే తన కోసం దుఆ చేసుకుంటూ “మాపై అస్-సలాం కలుగుగాక” (‘అస్సలాము అలై‌నా…’) అని అంటాడు.

దైవప్రవక్త ﷺ కు ఈ విధంగా మనకంటే ముందు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే… మన పట్ల మనకున్న శ్రద్ధ కంటే ఆయనకే మన పట్ల ఎక్కువ శ్రద్ధ ఉండేది. మనం మనకోసం ఎంత మేలు కోరుకుంటామో, అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఆయన మన మేలును, సాఫల్యాన్ని కాంక్షించారు.

అందువల్ల, మీ సొంత ప్రాణం (ఆత్మ) పై మీకున్న ప్రేమ కంటే దైవప్రవక్త ﷺ పట్ల మీకున్న ప్రేమే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోవాలి. మీ ప్రేమకు అత్యంత అర్హుడు ఆయనే! నమాజులో మనకంటే ముందుగా ఆయనపై సలాం పంపాలన్న ఈ అద్భుతమైన ప్రాధాన్యతా క్రమం (నియమం) ఖురాన్ లోని ఈ వాక్యం నుండే ఉద్భవించింది:

(النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ)
“దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది…” (ఖురాన్ 33:6)[1].”

అందువల్లే, నమాజులో ఒక వ్యక్తి తనపై తాను సలాం పంపుకునేదానికంటే ముందుగా, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై సలాం పంపడానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. నమాజీ ముందుగా “ఓ ప్రవక్తా! మీపై అస్-సలాం, అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన ఆశీర్వాదాలు కురియుగాక” అని చదివి, ఆ తరువాతే “మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులపై అస్-సలాం కలుగుగాక” అని తనపై, ఇతర సజ్జనులైన దాసులపై సలాం పంపుతాడు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలకు ఈ వాక్యాన్ని నేర్పించినప్పుడు, ఆయన దాని గొప్పతనాన్ని వివరిస్తూ ఇలా అన్నారు:

(فَإِنَّكُمْ إِذَا قُلْتُمُوهَا أَصَابَتْ كُلَّ عَبْدٍ لِلَّهِ صَالِحٍ فِي السَّمَاءِ وَالْأَرْضِ)
“ఎందుకంటే, మీరు ఇలా అన్నప్పుడు, ఆకాశాలలో మరియు భూమిపై ఉన్న అల్లాహ్ యొక్క ప్రతి పుణ్యాత్ముడైన దాసుడికీ ఆ సలాం చేరుతుంది (వర్తిస్తుంది).”

ఇక్కడొక అద్భుతమైన విషయాన్ని గమనించండి. ఒక ముస్లిం నమాజులో “మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులపై అస్-సలాం కలుగుగాక” అని సామూహికంగా అన్నప్పుడు ఎంత గొప్ప ప్రయోజనం ఉందో చూడండి! మొదట్లో సహాబాలు నమాజులో “ఫలానా వారికి సలాం, ఫలానా వారికి సలాం” అని విడివిడిగా వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ సలాం పంపేవారు. ఉదాహరణకు, “జిబ్రీల్ పై సలాం, మీకాయీల్ పై సలాం” అని అనేవారు. కానీ సృష్టిలో వీరే కాకుండా ఇంకా అసంఖ్యాకమైన దేవదూతలు ఉన్నారు కదా!

ఒకవేళ నమాజులోని ‘తహియ్యాత్’ లో ప్రతి ఒక్కరి పేరు చెప్పి సలాం పంపే ఈ పద్ధతినే ధర్మంలో శాశ్వతంగా ఉంచేసి ఉంటే ఎంత కష్టమయ్యేదో ఆలోచించండి! సహజంగా మనం కొంతమంది పేర్లను మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, మరికొందరిని మర్చిపోతాం. ప్రతి నమాజులోనూ మనం దేవదూతల పేర్లను, మనకు తెలిసిన వారి పేర్లను, మనపై హక్కులు ఉన్న ఎందరో పుణ్యాత్ముల పేర్లను ఒక్కొక్కటిగా లెక్కపెట్టుకుంటూ పోతే… అసలు ఎంతమంది పేర్లని మనం అలా లెక్కించగలం? ఇది మానవమాత్రులకు సాధ్యపడే పనేనా?”

ఈ సందర్భం నాకు ఒక విషయాన్ని గుర్తుచేస్తోంది. దానిని ప్రస్తావించి మళ్ళీ మన అసలు అంశానికి వస్తాను.

మదీనాలోని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మస్జిద్‌ను సందర్శించడానికి వెళ్ళేవారికి సంబంధించి పలు దేశాల్లో ఒక ఆచారం ఉంది. ఎవరైనా అక్కడికి ప్రయాణమవుతున్నారని తెలిస్తే చాలు, తమ తరఫున కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం తెలియజేయమని ఆ వ్యక్తికి చెబుతుంటారు. ఈ విధంగా ఆ బాధ్యతను అతనిపై మోపుతారు. కానీ పాపం ఆ వెళ్ళే వ్యక్తి ఎంతమంది పేర్లని గుర్తుపెట్టుకోగలడు? ఆ ప్రజల కోరికను తీర్చడం కోసం, చాలామంది ఆ పేర్లన్నింటినీ ఒక కాగితంపై రాసుకుని వెళుతుంటారని కొందరు నాతో చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: ‘ఓ షేఖ్! చాలామంది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సలాం తెలియజేయమని నాకు బాధ్యత అప్పగించారు. వాళ్ళ పేర్లన్నీ ఒక కాగితం మీద రాసుకున్నాను, అవి చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్లి నిలబడి ఫలానా ఫలానా వ్యక్తుల తరఫున సలాం అని చెప్పాలనుకున్నాను. కానీ, దురదృష్టవశాత్తు ఆ కాగితం నా దగ్గర పోయింది! ఇప్పుడు దాని గురించి నేనేం చేయాలి?’ అని అడిగాడు. చూశారా! ధర్మం ఆజ్ఞాపించని ఒక భారాన్ని అతను అనవసరంగా తన మీద ఎలా వేసుకున్నాడో!

ప్రవక్త ﷺ ఇలా అన్నారు:

(إِنَّ لِلَّهِ مَلَائِكَةً سَيَّاحِينَ فِي الْأَرْضِ يُبَلِّغُونِي مِنْ أُمَّتِي السَّلَامَ)
“నిశ్చయంగా, అల్లాహ్ కు భూమిపై సంచరించే దేవదూతలు ఉన్నారు. వారు నా ఉమ్మత్ (సమాజం) యొక్క సలాంను నాకు చేరవేస్తారు.”

దీనికోసం కాగితాలు వాడాల్సిన లేదా పేర్లు రాసి ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తన ఉమ్మత్ (సమాజం) పంపే సలాంను దేవదూతలు తనకు చేరవేస్తారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టంగా తెలిపారు. కాబట్టి, ఎవరైనా తమ ప్రాంతం నుంచి మదీనాకు వెళ్లే వరకు ఎదురుచూసి, ‘ప్రవక్తకు నా తరఫున సలాం చెప్పండి‘ అని వారికి బాధ్యత అప్పగించాల్సిన పనే లేదు. అసలు దాని అవసరమే లేదు. పగలు లేదా రాత్రి, ఏ సమయంలోనైనా, ఎక్కడి నుంచైనా సరే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ‘సలాత్ మరియు సలాం’ (దరూద్) పంపవచ్చు. మీరు పంపే ఆ సలాంను అల్లాహ్ నియమించిన దేవదూతలు స్వయంగా ఆయనకు చేరవేస్తారు.”

ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న ప్రధానమైన పోలిక ఏమిటంటే, వ్యక్తుల పేర్లను ఒక్కొక్కటిగా లెక్కపెడుతూ చెప్పడం అనేది మనిషిపై అనవసరమైన పెద్ద భారాన్ని మోపుతుంది. ఒకవేళ మదీనాను సందర్శించే వ్యక్తికి నిజంగానే ఇలా పేర్లు చెప్పాలని ధర్మంలో ఆదేశించి ఉంటే అది ఎంత కష్టమో ఆలోచించండి! పోనీ మన దైనందిన జీవితంలో చూసుకున్నా, ఎవరైనా వేరే ఊరికి వెళ్తున్నప్పుడు, ‘అక్కడ మనవాళ్ళు కలిస్తే, మన ఆత్మీయులకు, సోదరులకు, బంధువులకు నా తరపున సలాం చెప్పండి’ అని కోరడం మనకు ఒక అలవాటు. కానీ వెళ్లే వ్యక్తి, చెప్పిన ప్రతి ఒక్కరి పేరును గుర్తుపెట్టుకుని మరీ సలాం చేరవేయాలనే భారాన్ని తనపై వేసుకుంటే, అది అతనికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇక్కడే మనం నమాజులో చదివే ‘తహియ్యాత్’ (అత్తహియ్యాతు…) నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. అదేమిటంటే, ఎవరైనా ‘సలాం చెప్పండి’ అని మనకు బాధ్యత అప్పగించినప్పుడు, ప్రతి ఒక్కరి పేరును విడివిడిగా వరుసగా ప్రస్తావించాలన్నది దాని ఉద్దేశం కాదు. సాధారణంగా వ్యక్తుల మధ్య సలాం చేరవేసుకోవడం అనేది కేవలం బంధుత్వాన్ని, పరస్పర సంబంధ బాంధవ్యాలను (కమ్యూనికేషన్) కొనసాగించడానికి మాత్రమే ఉద్దేశించబడింది.”

ఇప్పుడు మనం మళ్ళీ అసలు హదీసు వద్దకు వద్దాం. నమాజులో మనం చదివే ‘అస్సలాము అలై‌నా వ అలా ఇబాదిల్లాహిస్-సాలిహీన్’ (మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులందరిపై శాంతి కలుగుగాక) అని మీరు అన్నప్పుడు, ఆకాశాల్లో మరియు భూమిపై ఉన్న ప్రతి పుణ్యాత్ముడైన దాసుడికీ ఆ సలాం వర్తిస్తుంది (చేరుతుంది). ఇందులో ఎంత గొప్ప పుణ్యం దాగి ఉందో ఒకసారి గమనించండి! దీని ద్వారా, మీరు భూమ్యాకాశాల్లో ఉన్న సజ్జనులైన దాసులందరి కోసం ఒక్కసారిగా ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్కరి పేరును విడివిడిగా చెప్పుకుంటూ పోవడం లాంటి అసాధ్యమైన, సుదీర్ఘమైన పద్ధతులు లేకుండా, అల్లాహ్ తన దాసుల కోసం ఎంతో సంక్షిప్తమైన వాక్యంతో ఈ గొప్ప ప్రయోజనాన్ని ప్రసాదించి సులభతరం చేశాడు.

ఈ విషయం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన ప్రార్థనలతో (దుఆలతో) మనల్ని మరింత బలంగా అనుసంధానించే ఒక గొప్ప వాస్తవాన్ని గుర్తుచేస్తోంది. అదేమిటంటే, అల్లాహ్ దైవప్రవక్తకు ‘జవామిఉల్ కలిమ్’ (అంటే చాలా తక్కువ పదాల్లో అత్యంత విస్తృతమైన, గంభీరమైన భావాన్ని పలికే సామర్థ్యాన్ని) ప్రసాదించాడు. అందుకే, ఆయన నుండి ఉల్లేఖించబడిన (నేర్పబడిన) దుఆలు చూడటానికి చాలా సంక్షిప్తంగా, చిన్నవిగా ఉన్నప్పటికీ, వాటన్నింటిలోనూ ఇహపరాలకు సంబంధించిన సకల శుభాలు, విశేషమైన ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.

దీని తరువాత చదివే వాక్యం: ‘అష్-హదు అల్-లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్-హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు’

ఇందులో ప్రధానంగా రెండు సాక్ష్యాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది అల్లాహ్ ఏకత్వాన్ని (తౌహీద్‌ను) ధృవీకరించే సాక్ష్యం కాగా, రెండవది ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశాన్ని చేరవేసిన ప్రవక్త అని ధృవీకరించే సాక్ష్యం.

సాటిలేని, భాగస్వామి లేని ఏకైక అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వారు మరెవరూ లేరని నేను మనస్ఫూర్తిగా సాక్ష్యమిస్తున్నాను. ఇది అల్లాహ్ ఏకత్వానికి (తౌహీద్) మరియు ఆయన ఆరాధనలో మనకున్న చిత్తశుద్ధికి (ఇఖ్లాస్) సజీవ సాక్ష్యం.

‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వారు మరెవరూ లేరు’ (లా ఇలాహ ఇల్లల్లాహ్) అనే ఈ విశ్వాస ప్రమాణం రెండు మూలస్తంభాలపై ఆధారపడి ఉంటుంది. అవే: తిరస్కరణ (Nafy) మరియు ధృవీకరణ (Ithbaat).

తిరస్కరణ: అల్లాహ్‌ను కాదని ఇతరులను ఆరాధించడాన్ని పూర్తిగా తిరస్కరించడం. (‘లా ఇలాహ’ – ఆరాధ్యులెవరూ లేరు).
ధృవీకరణ: అన్ని రకాల ఆరాధనలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే అని ధృవీకరించడం. (‘ఇల్లల్లాహ్’ – అల్లాహ్ తప్ప).

ఇదే నిజమైన తౌహీద్ (ఏకదైవోపాసన)! తౌహీద్ అంటేనే తిరస్కరణ, ధృవీకరణల కలయిక. ధృవీకరణ లేకుండా కేవలం తిరస్కరించినంత మాత్రాన అది తౌహీద్ అనిపించుకోదు; అలాగే తిరస్కరణ లేకుండా కేవలం ధృవీకరించినా అది తౌహీద్ కాదు. పరిపూర్ణమైన తౌహీద్ ఏర్పడాలంటే ఈ రెండూ ఒకేచోట తప్పనిసరిగా ఉండాలి.ఇందులో తిరస్కరణ అనేది సాధారణమైనది (అంటే సృష్టిలో దేనికీ ఆరాధనా అర్హత లేదని సామూహికంగా తిరస్కరించడం), మరియు ధృవీకరణ అనేది నిర్దిష్టమైనది (అంటే ఆ ఆరాధనా అర్హత కేవలం ఒక్క అల్లాహ్‌కే ఉందని నిశ్చయించడం). సంక్షిప్తంగా చెప్పాలంటే… అల్లాహ్ తప్ప మరేదానినైనా సరే ఆరాధించడాన్ని సాధారణంగా తిరస్కరించి, అన్ని రకాల ఆరాధనలను పూర్తి చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో కేవలం అల్లాహ్‌కే నిర్దిష్టంగా సమర్పించడమే అసలైన తౌహీద్.

రెండవ సాక్ష్యం: దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు చేరవేశారని ధృవీకరించే సాక్ష్యం. వాస్తవానికి ఇది కూడా ఒక రకమైన తౌహీదే (ఏకత్వమే).

ఇస్లామిక్ పండితులు ఈ సందర్భంలో తౌహీద్‌ను రెండు రకాలుగా వివరిస్తారు:

  1. సందేశాన్ని పంపిన అల్లాహ్ పట్ల తౌహీద్: అంటే మన ఆరాధనలన్నింటినీ కేవలం ఆయనకే స్వచ్ఛంగా అంకితం చేయడం.
  2. పంపబడిన సందేశహరుని పట్ల తౌహీద్: అంటే ధర్మ మార్గదర్శకత్వం కోసం కేవలం ఆయన్ను (ప్రవక్తను) మాత్రమే అనుసరించడం.

దీని అర్థం ఏమిటంటే, మనం ధర్మాన్ని కేవలం ఆయన ద్వారానే గ్రహిస్తాము, కేవలం ఆయనను మాత్రమే అనుసరిస్తాము మరియు ధర్మజ్ఞానాన్ని ఆయన నుండే నేర్చుకుంటాము. కాబట్టి, ధర్మం (దీన్) అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా మనకు ఏదైతే చేరిందో అదే! ఎందుకంటే, ప్రజలకు అల్లాహ్ సందేశాన్ని చేరవేసే ఏకైక మాధ్యమం ఆయనే.
ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: `

(وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ * إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ)
“మరియు ఆయన తన ఇచ్ఛానుసారం (సొంతంగా) ఏదీ మాట్లాడరు. అది ఆయనకు అవతరింపబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.” (ఖురాన్ 53:3,4).

ఈ రెండవ సాక్ష్యంలో ప్రవక్త గారికి సంబంధించిన రెండు ప్రధాన లక్షణాలు మిళితమై ఉన్నాయి. ఒకటి ఆయన ‘అల్లాహ్ దాసుడు’ కావడం, రెండవది ‘అల్లాహ్ సందేశహరుడు’ (రసూల్) కావడం.

ఆయన అల్లాహ్ యొక్క ‘దాసుడు’. కాబట్టి ఆయన్ను ఆరాధించకూడదు.

ఆయన అల్లాహ్ పంపిన ‘సందేశహరుడు’. కాబట్టి ఆయన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ ధిక్కరించకూడదు (అబద్ధమని అనకూడదు). దానికి బదులుగా, ఆయనను విశ్వసించాలి, ఆయనకు విధేయత చూపాలి.

ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ సమతుల్యతను (బ్యాలెన్స్) పాటిస్తాడు. అతను అతిశయోక్తి (హద్దు మీరడం) మరియు నిర్లక్ష్యం (తక్కువ చేయడం) అనే రెండు తీవ్రతల మధ్య మధ్యస్థంగా ఉంటాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవదాసుడు కాబట్టి, ఆయన స్థానాన్ని పొగిడే విషయంలో అతను ఎన్నటికీ హద్దులు మీరడు. కేవలం అల్లాహ్‌కు మాత్రమే చెందాల్సిన హక్కులను లేదా లక్షణాలను అతను ఎన్నడూ ప్రవక్తకు ఆపాదించడు. ఎందుకంటే ఆయన ఒక దాసుడు, మరియు దాసుడు ఎప్పటికీ ఆరాధనలకు అర్హుడు కాడు.

అలాగే ఆయన దైవసందేశహరుడు కాబట్టి, ఆయన నేర్పిన ధర్మాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడు. బదులుగా, ఆయనకు సంపూర్ణ విధేయత చూపుతాడు.

ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

(وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ اللَّهِ)
“మేము పంపిన ప్రతి సందేశహరుడు, అల్లాహ్ ఆజ్ఞతో ప్రజలు ఆయనకు విధేయత చూపటానికి మాత్రమే పంపబడ్డాడు.” (ఖురాన్ 4:64).

కాబట్టి, ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు’ అని సాక్ష్యమివ్వడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటంటే:

ఆయన దేనినైతే నిషేధించారో, వారించారో ఆ పనులకు పూర్తిగా దూరంగా ఉండటం.
ఆయన ఆజ్ఞాపించిన ప్రతి దానిలోనూ ఆయనకు విధేయత చూపడం.
ఆయన తెలియజేసిన ప్రతి విషయాన్ని (ఎలాంటి సందేహం లేకుండా) విశ్వసించడం.

“నమాజులో తషహ్హుద్ చదివిన తరువాత ‘దరూదె ఇబ్రాహీం’ (ఇబ్రాహీమియా ప్రార్థన) చదవాలి. ఇది హదీసులలో పలు విభిన్న రూపాల్లో ఉల్లేఖించబడింది. అయితే, వాటన్నింటిలో అత్యంత ప్రామాణికమైనది, సమగ్రమైనది బుఖారీ మరియు ముస్లిం (సహీహైన్) గ్రంథాలలో అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబీ లయ్లా ద్వారా ఉల్లేఖించబడిన హదీసు.

ఆయన ఇలా వివరించారు: ఒకసారి ప్రముఖ సహాబీ కబ్ ఇబ్న్ ఉజ్రా (రజియల్లాహు అన్హు) నన్ను కలిసి, నేను నీకు ఒక బహుమతి ఇవ్వనా?” అని అడిగారు. సాధారణంగా ఎవరైనా ‘బహుమతి ఇస్తాను’ అంటే, జేబులో చెయ్యి పెట్టి ఏదైనా వస్తువు తీసి ఇస్తారని ఎవరైనా ఎదురుచూస్తారు. కానీ ఆయన అడిగిన వెంటనే, “తప్పకుండా, ఆ బహుమతి నాకు ఇవ్వండి” అని నేను అన్నాను.

అప్పుడు కబ్ ఇబ్న్ ఉజ్రా (రజియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “(ఇదే ఆ బహుమతి). ఒకసారి మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ఇలా అడిగాము: ‘ఓ దైవప్రవక్తా! మీపై సలాం ఎలా పంపాలో మాకు తెలుసు. కానీ మేము మీపై సలాత్ (దరూద్) ఎలా పంపాలి?’

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై సలాత్ ఎలా పంపాలి అన్న ఈ ప్రశ్న అనేకమంది సహాబాల ద్వారా, వేర్వేరు హదీసులలో పలుమార్లు ఉల్లేఖించబడింది.

ఈ సంఘటన ద్వారా నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాను. అదేమిటంటే – సహాబాలకు (ప్రవక్త అనుచరులకు) ఉన్న అపారమైన జ్ఞానం, అరబిక్ భాషపై వారికున్న అద్భుతమైన పట్టు, ధర్మం పట్ల వారికి ఉన్న లోతైన అవగాహన దృష్ట్యా, ప్రవక్త ﷺ పై దరూద్ పంపడానికి వారంతట వారు ఒక అందమైన వాక్యాన్ని సొంతంగా సృష్టించలేరా? కచ్చితంగా సృష్టించగలరు!

అయినప్పటికీ, వారు ప్రతిరోజూ చదువుకోవడానికి తమ సొంతంగా ఎలాంటి ప్రార్థననూ కల్పించలేదు! దానికి బదులుగా నేరుగా ప్రవక్త ﷺ వద్దకే వెళ్లి, “మేము మీపై సలాత్ ఎలా పంపాలి?” అని అడిగారు.

కానీ ఈ రోజుల్లో పరిస్థితి గమనిస్తే, ప్రవక్త ﷺ పై సలాత్ పంపే పేరుతో కల్పితమైన (బిద్అత్) దరూద్‌లతో నిండిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు వాటిని చాలా గొప్పగా ప్రచారం చేస్తున్నారు, కానీ అవన్నీ ధర్మంలో కొత్తగా కల్పించబడినవే.

సహాబాల ఉన్నత స్థానం, వారి భాషా ప్రావీణ్యం, అపారమైన ధార్మిక జ్ఞానం, ప్రవక్త ﷺ కు అత్యంత సన్నిహితంగా ఉండటం, ఆయన నుండి నేరుగా ధర్మాన్ని నేర్చుకోవడం… ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, వారు ప్రవక్త ﷺ పై దరూద్ పంపడానికి ఏనాడూ తమ సొంత మార్గాన్ని కనుగొనలేదు. “మేము మీపై సలాత్ ఎలా పంపాలి?” అని వినయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆయనపై సలాత్ (దరూద్) ఎలా పంపాలో ఆయన వారికి నేర్పించిన తర్వాత వారు ఏం చేశారు? ఆ పద్ధతిని మాత్రమే స్వీకరించి తమ జీవితాల్లో ఆచరించారు.

“మేము మీపై సలాత్ ఎలా పంపాలి?” అని వారు అడిగినప్పుడు, ప్రవక్త ﷺ ఈ విధంగా నేర్పించారు:

(قُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ)

“ఇలా చదవండి: అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్-మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వఅలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్-మజీద్.

“దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనపై దరూద్ (సలాత్) పంపే ఈ విధానాన్ని వారికి నేర్పించారు, మరియు వారు దానిని ఆయన నుండి అలాగే స్వీకరించి ఆచరించారు. ప్రవక్త ﷺ పై దరూద్ పంపడానికి ఇతర పద్ధతులు కూడా ఉల్లేఖించబడ్డాయి. అయితే, వాటన్నింటిలో ఇది అత్యంత పరిపూర్ణమైనది మరియు సమగ్రమైనది. కాబట్టి హదీసులలో ఉల్లేఖించబడిన ఏ దరూద్ చదివినా సరే దాని అసలు ఉద్దేశం నెరవేరుతుంది.

సారాంశం ఏమిటంటే, నమాజులో అత్తహియ్యాత్ (తషహ్హుద్) చదివిన తరువాత, నమాజీ ప్రవక్త ﷺ పై ఈ దరూద్ పంపుతాడు. కారుణ్యం, శాంతి మరియు శుభాలను మేళవించిన గొప్ప దరూద్ ఇది. ఇందులో ముందుగా “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్” అని, ఆ తరువాత “వ బారిక్ అలా ముహమ్మద్” అని చదువుతారు.

అల్లాహ్ తరఫున ప్రవక్తపై ‘సలాత్’ పంపబడటం అంటే… అత్యున్నతమైన దేవదూతల సభలో (మలఉల్ ఆలా లో) అల్లాహ్ ఆయనను ప్రశంసించడం అని అర్థం. ఇక విశ్వాసులు మరియు దేవదూతలు ఆయనపై పంపే సలాత్ విషయానికి వస్తే… ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

(إِنَّ ٱللَّهَ وَمَلَـٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّ ۚ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا) 
“నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దేవదూతలు ప్రవక్తపై సలాత్ (కారుణ్యం) పంపుతారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై సలాత్ పంపండి, మరియు ఆయనకు భక్తిశ్రద్ధలతో సలాం చేయండి.” (ఖురాన్ 33:56).

కాబట్టి మనం చదివే ఈ దరూద్, ఆయనపై సలాత్ పంపమని అల్లాహ్‌ను కోరే ఒక దుఆ (అభ్యర్థన).

ఇక ‘బరకత్’ (శుభాలు / ఆశీర్వాదాలు) విషయానికి వస్తే, దీని అర్థం వృద్ధి మరియు స్థిరత్వం. కాబట్టి మనం చదివే దరూద్, ప్రవక్త ﷺ పై అల్లాహ్ కారుణ్యం, శుభాలు ఎల్లప్పుడూ ఉండాలని చేసే ఒక గొప్ప ప్రార్థన.

ఈ దరూద్ చదివిన తర్వాత నమాజులో తర్వాతి ఘట్టం ఏమిటి? ఒకసారి నమాజు క్రమాన్ని గమనించండి… ఒక దాసుడు అల్లాహ్ ముందు భక్తితో నిలబడతాడు, తక్బీర్ అంటాడు, సనా చదువుతాడు, సూరా అల్-ఫాతిహా మరియు తనకు వచ్చిన ఏదైనా ఖురాన్ సూరాను పఠిస్తాడు. ఆ తర్వాత రుకూ (వంగడం) చేస్తాడు, తిరిగి నిలబడతాడు, సజ్దా చేస్తాడు. ఇలా నమాజు ముగింపు దశకు చేరుకునే వరకు అన్ని విధులు నిర్వర్తించి, చివరికి భక్తితో కూర్చుంటాడు. అల్లాహ్ అతనికి ప్రసాదించిన ఈ గొప్ప ఆరాధనా భాగ్యం తరువాత, ఆ చివరి కూర్చోవడాన్ని అతను ‘అత్తహియ్యాత్’ తో ప్రారంభిస్తాడు. అల్లాహ్‌ను కీర్తిస్తాడు, దైవప్రవక్త ﷺ పై, మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులందరిపై సలాం పంపుతాడు. ఆ తరువాత ‘దరూదె ఇబ్రాహీం’ చదువుతాడు.

ఇదంతా పూర్తయిన తర్వాత ఇక మిగిలింది ఏమిటి?

దుఆలు (ప్రార్థనలు) స్వీకరించబడే అద్భుతమైన అవకాశం! అవును, అల్లాహ్ సన్నిధిలో ప్రార్థనలు అంగీకరించబడే అత్యంత ముఖ్యమైన సమయాలలో ఇదీ ఒకటి. ప్రార్థనలు తప్పక స్వీకరించబడతాయని ఆశించే అత్యుత్తమ సమయాలు ప్రధానంగా రెండు ఉన్నాయి: ఒకటి అర్ధరాత్రి సమయం (తహజ్జుద్ వేళ), రెండవది నమాజు చివరలో సలాం (తస్లీమ్) చేయడానికి ముందున్న సమయం.
అందువల్ల, దైవప్రవక్త ﷺ హదీసులో ఇలా అన్నారు: 

(ثُمَّ لِيَتَخَيَّرْ مِنَ الدُّعَاءِ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُوَ) 
“ఆ తరువాత (తషహ్హుద్, దరూద్ తర్వాత), తనకు నచ్చిన దుఆను ఎంచుకుని అతను ప్రార్థించాలి.”

దీనికి సంబంధించి ఒక ఇమామ్ గారు, తన వెనుక నమాజు చేసిన ఒక వ్యక్తి గురించి ఒక సంఘటనను వివరించారు. ఆ వ్యక్తి నమాజు పూర్తయిన తర్వాత ఇమామ్ వద్దకు వచ్చి, “ఓ షేఖ్! మీరు చివరి తషహ్హుద్‌ను చాలా సేపు పొడిగించారు. మీరు సలాం చేసేలోపు నేను దానిని రెండుసార్లు చదివేశాను” అని అన్నాడు. అప్పుడు ఆ ఇమామ్, “తషహ్హుద్‌ను రెండుసార్లు పఠించమని నీకు ఎవరు చెప్పారు?! ఒకసారి తషహ్హుద్, దరూద్ పూర్తి చేస్తే, ఆ తర్వాత నీకు కావలసిన దుఆ చేసుకునే అద్భుతమైన అవకాశం దొరుకుతుంది కదా! ఆ సమయంలో నమాజీ తనకు ఇష్టమైన ప్రార్థనలను అల్లాహ్ తో మొరపెట్టుకోవాలి” అని సమాధానమిచ్చారు.

సాధారణంగా నమాజు ముగింపులో ఇమామ్ సలాం (తస్లీమ్) చేస్తున్నప్పుడు, కొంతమంది “ఇమామ్ గారు మరికాసేపు సమయం ఇస్తే బాగుండు, నా దుఆ పూర్తిగా చేసుకునేవాడిని కదా” అని అనుకుంటారు. ఎందుకంటే, ఆ నిర్దిష్ట సమయంలో చేసే దుఆకు ఉన్న విలువ వారికి తెలుసు. కానీ మరికొందరు, ఇమామ్ కొంచెం సమయం తీసుకున్నా సరే అశాంతికి గురవుతారు. “ఇమామ్ ఎంత త్వరగా సలాం చేస్తే అంత తొందరగా వెళ్ళిపోవచ్చు” అని వారు కోరుకుంటారు. ఈ రెండు రకాల మనస్తత్వాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది!

సారాంశం ఏమిటంటే, నమాజులో సలాం చేయడానికి ముందున్న సమయం దుఆ చేసుకోవడానికి ఒక అద్భుతమైన, అమూల్యమైన అవకాశం. కొందరు వ్యక్తులు సున్నత్ లేదా నఫిల్ నమాజు చేస్తున్నప్పుడు, వారికి అల్లాహ్‌ను ఏదైనా కోరుకోవాల్సిన అవసరం ఉంటే, ముందుగా నమాజును వేగంగా ముగించి (సలాం చేసేసి), ఆ తర్వాత చేతులెత్తి దుఆ చేస్తుంటారు. వాస్తవానికి, నమాజు ముగించిన తర్వాత కన్నా, సలాం చేయడానికి ముందే మీకు ఇష్టమైన ప్రార్థనను ఎంచుకుని అల్లాహ్‌ను అడిగే గొప్ప అవకాశం నమాజులోనే ఉంది కదా!

దైవప్రవక్త ﷺ సరిగ్గా ఇదే విషయాన్ని బోధిస్తూ, 

(ثُمَّ لِيَتَخَيَّرْ مِنَ الدُّعَاءِ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُوَ) 
“ఆ తరువాత, అతను తనకు నచ్చిన ప్రార్థనలను ఎంచుకుని దుఆ చేయాలి” అని స్పష్టంగా చెప్పారు.”

“అయితే, నమాజు చివరలో (తషహ్హుద్ మరియు దరూద్ చదివిన తర్వాత) తప్పనిసరిగా చేయాల్సిన ఒక నిర్దిష్టమైన దుఆ ఉంది. అదే అల్లాహ్ శరణు (ఆశ్రయం) కోరడం!

సహీహ్ బుఖారీ మరియు ముస్లిం (సహీహైన్) గ్రంథాలలో అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనల్ని ముఖ్యంగా నాలుగు విషయాల నుండి అల్లాహ్ ఆశ్రయం కోరాలని ఆజ్ఞాపించారు.

ప్రవక్త ﷺ ఇచ్చిన ఈ ఖచ్చితమైన ఆదేశం కారణంగా, కొంతమంది పండితులు నమాజులో ఈ నాలుగు విషయాల నుండి రక్షణ కోరడం ‘వాజిబ్’ (తప్పనిసరి) అని అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ పండితులు దీనిని ‘ముస్తహబ్’ (తప్పనిసరి కాదు గానీ, అత్యుత్తమమైన సున్నత్) గా పరిగణించారు. ఏది ఏమైనప్పటికీ, ఒక దాసుడు నమాజులో ఈ క్రింది నాలుగు విషయాల నుండి అల్లాహ్ ఆశ్రయం కోరడంలో అత్యంత శ్రద్ధ వహించాలి:

(1) నరక శిక్ష నుండి
(2) సమాధి శిక్ష నుండి
(3) జీవితం మరియు మరణం యొక్క పరీక్షల (ఫిత్నాల) నుండి
(4) దజ్జాల్ యొక్క పరీక్ష (ఫిత్నా) నుండి

దీనిని సూక్ష్మంగా గమనిస్తే, ఈ నాలుగు విషయాలు రెండు ప్రధాన అంశాల కిందికి వస్తాయి:

మొదటిది ‘శిక్ష’: ఈ హదీసులో ప్రవక్త ﷺ రెండు రకాల శిక్షల నుండి శరణు కోరారు – ఒకటి నరక శిక్ష, రెండవది సమాధి శిక్ష. దైవప్రవక్త ﷺ స్పష్టం చేసినట్లుగా సమాధిలో విధించబడే శిక్ష పరమ సత్యం.

రెండవది ‘పరీక్షలు (ఫిత్నాలు)’: ఇవి కూడా రెండు రకాలు. పెద్దవి మరియు చిన్నవి. ప్రవక్త ﷺ చదివిన దుఆలో ఇవి ఇమిడి ఉన్నాయి:

(وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَأَعُوذُ بِكَ مِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ)
“జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి నేను నీ ఆశ్రయం కోరుతున్నాను, మరియు మసీహుద్-దజ్జాల్ యొక్క పరీక్షల నుండి నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.”

ఇక్కడ పేర్కొన్న ప్రధానమైన (పెద్ద) పరీక్షలు రెండు: 1) దజ్జాల్ ఫిత్నా, 2) మరణ సమయపు ఫిత్నా. వీటిని పెద్ద పరీక్షలు అని ఎందుకంటారు? ఎందుకంటే మరణ సమయంలో ఒక వ్యక్తికి ఎదురయ్యే పరీక్షలో అతను ఒకవేళ విఫలమైతే, ఆ వెంటనే అతను మరణిస్తాడు కాబట్టి తన తప్పును సరిదిద్దుకోవడానికి లేదా పశ్చాత్తాపపడటానికి (తౌబా చేయడానికి) అతనికి ఎలాంటి అవకాశం ఉండదు. అతను ఆ పరీక్షలో విఫలమైన స్థితిలోనే ప్రాణాలు విడుస్తాడు (అల్లాహ్ మనల్ని దీని నుండి రక్షించుగాక). అలాగే దజ్జాల్ యొక్క పరీక్ష కూడా అంతే భయంకరమైనది; దీని బారిన పడిన వారు కూడా తిరిగి కోలుకోవడం అసాధ్యం.

ఇక జీవిత పరీక్షల విషయానికొస్తే అవి చిన్న తరహా పరీక్షలు. ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనేవి. అతను వాటి నుండి గుణపాఠం నేర్చుకుని, పశ్చాత్తాపపడి తిరిగి తనను తాను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అవి చిన్న పరీక్షలు. తమ జీవితంలో అవాంఛిత కోరికలు మరియు ధార్మిక సందేహాలతో ఎంతమంది వ్యక్తులు పరీక్షించబడలేదు? కానీ వారు అల్లాహ్ వైపు మళ్ళినప్పుడు, అల్లాహ్ వారిని ఆ పాపాల నుండి రక్షించాడు! కానీ మరణం మరియు దజ్జాల్ యొక్క పరీక్షలు అలా కాదు, వాటిని దాటలేకపోతే సరిదిద్దుకునే అవకాశం ఎప్పటికీ రాదు.

కాబట్టి, ఈ నాలుగు భయంకరమైన విషయాల నుండి అల్లాహ్ ఆశ్రయం పొందిన తరువాత, నమాజీ తనకు ఇష్టమైన, అవసరమైన ఏ దుఆనైనా ఎంచుకుని, ఈ లోకం మరియు పరలోకం యొక్క సాఫల్యం కోసం అల్లాహ్‌ను మనస్ఫూర్తిగా వేడుకుంటాడు.

నమాజు ముగింపులో చేసే దుఆలకు సంబంధించి ఇది ఒక సంక్షిప్త వివరణ. నేను ముందే చెప్పినట్లుగా ఇదొక రిమైండర్ (గుర్తుచేయడం) మాత్రమే.

ఈ జ్ఞానం ద్వారా అల్లాహ్ మనందరికీ ప్రయోజనం చేకూర్చాలని, సకల సత్కార్యాలలో మనకు విజయాన్ని ప్రసాదించాలని మరియు ఎల్లప్పుడూ మనల్ని రుజుమార్గంలో (సరైన మార్గంలో) నడిపించాలని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. ఆమీన్.”

ఇప్పుడు మన అసలు అంశానికి సంబంధం లేని ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది గతానికి సంబంధించినదే అయినప్పటికీ, నాకది చాలా అందమైన మరియు మధురమైన జ్ఞాపకం.

ఇక్కడ నా కుడి వైపున కూర్చున్న షేఖ్ అలీ అల్-ముహన్నా (అల్లాహ్ వారిని కాపాడుగాక), మా నాన్నగారి సహవిద్యార్థి (క్లాస్‌మేట్). వారిద్దరూ రియాద్‌లోని షరియా ఫ్యాకల్టీలో కలిసే చదువుకున్నారు. ఆ రోజుల్లో వారి తరగతి గదిలో ముగ్గురు విద్యార్థులు ఒకే డెస్క్ పై కలిసే కూర్చునేవారు. వారి చదువు పూర్తయిన తర్వాత (గ్రాడ్యుయేషన్ ఫలితాలలో), మొత్తం విద్యార్థులలో మా నాన్నగారు మొదటి స్థానంలో నిలవగా, షేఖ్ అలీ గారు రెండవ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు.

మా నాన్నగారు (అల్లాహ్ వారిని మరియు షేఖ్ అలీ గారిని కాపాడుగాక) నాతో ఒకసారి ఇలా చెప్పారు: ‘పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు నేను ఖాసిం ప్రాంతంలో ఉన్నాను. అప్పుడు మా మిత్రులలో ఒకరు నన్ను అభినందిస్తూ ఒక టెలిగ్రామ్ పంపాడు.’ మీ అందరికీ తెలిసిందే, టెలిగ్రామ్ పంపేటప్పుడు పదాలు చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా ఉండేలా చూసుకుంటారు. ఆ మిత్రుడు మా నాన్నగారికి పంపిన టెలిగ్రామ్‌లో కేవలం ఇలా రాశాడు: ‘అత్యుత్తమ స్థానాల్లో ఉత్తీర్ణులైనందుకు మీకు, అల్-ముహన్నాకు మరియు అరఫాకు (వారితో పాటు కూర్చునే మూడవ విద్యార్థికి) నా అభినందనలు.’

అందుకే, నా హృదయంలో షేఖ్ అలీ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. నేను వారిని నా సొంత తండ్రిలాగే భావిస్తాను. వారు స్వయంగా ఇక్కడ ఉపస్థితులై ఉన్న ఈ సమావేశంలో నేను ప్రసంగించడం నాకెంతో దక్కిన గొప్ప గౌరవం. వారి అమూల్యమైన సలహాలు, సూచనల నుండి నేను ఎంతగానో ప్రయోజనం పొందుతాను. అల్లాహ్ వారికి ఉత్తమమైన ప్రతిఫలం ప్రసాదించుగాక.

“సుబ్ హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్-హదు అల్-లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక్”

(ఓ అల్లాహ్! నీవు సకల లోపాల నుండి పవిత్రుడవు మరియు సర్వ ప్రశంసలు నీకే చెందుతాయి. నీవు తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను నీ క్షమాపణ వేడుకుంటున్నాను మరియు పశ్చాత్తాపంతో నీ వైపుకే మరలుతున్నాను.).

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు సందేశహరుడైన మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై మరియు ఆయన సహచరులందరిపై నీ కారుణ్యం, శాంతి (సలాత్ మరియు సలాం) వర్షించుగాక! ఆమీన్

ఈ వీడియో ప్రసంగం నమాజు (ప్రార్థన) చివరలో కూర్చుని చదివే ‘తహియ్యాత్’ (తషహ్హుద్) లోని పదాల వెనుక ఉన్న లోతైన అర్థాలను, మరియు ఆ సమయం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. దీని సంక్షిప్త సారాంశం క్రింది విధంగా ఉంది:

అల్లాహ్ కు మాత్రమే సమస్త స్తోత్రాలు: ప్రారంభంలో కొందరు సహాబాలు నమాజులో “అల్లాహ్ పై సలాం” అని అనేవారు. ప్రవక్త ﷺ వారిని సరిదిద్ది, అల్లాహ్ స్వయంగా ‘అస్-సలాం’ (శాంతికి మూలం) అని, ఆయనను ఎవరూ రక్షించాల్సిన అవసరం లేదని చెప్పారు. దానికి బదులుగా ‘అత్-తహియ్యాత్’ (సకల గౌరవ మర్యాదలు, ఆరాధనలు), ‘సలవాత్’ (నమాజులు/ప్రార్థనలు), మరియు ‘తయ్యిబాత్’ (పవిత్రమైన మాటలు, చేతలు, ఉద్దేశ్యాలు) అన్నీ ఏకైక అల్లాహ్ కే చెందుతాయని నేర్పించారు.

ప్రవక్త ﷺ పై సలాం: “ఓ ప్రవక్తా! మీపై సలాం ఉండుగాక…” అని మనకంటే ముందుగా ప్రవక్త ﷺ పై సలాం పంపుతాము. ఎందుకంటే, మన ప్రాణాల కంటే ప్రవక్తే మనకు ఎక్కువ హక్కుదారుడు మరియు ఆయన మన శ్రేయస్సును తీవ్రంగా కాంక్షించేవారు.

సజ్జనులందరికీ సలాం: “మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులపై సలాం ఉండుగాక” అనే ఒక్క చిన్న వాక్యం ద్వారా, ఆకాశాలలో మరియు భూమిపై ఉన్న ప్రతి పుణ్యాత్ముడికి (దేవదూతలు, ప్రవక్తలు, సజ్జనులు) మన సలాం చేరుతుంది. పేర్లన్నీ ఒక్కొక్కటిగా చెప్పాల్సిన భారం లేకుండా అల్లాహ్ ఈ చిన్న వాక్యంలో గొప్ప ప్రయోజనాన్ని పొందుపరిచాడు.

విశ్వాస ప్రమాణం (షహాదహ్): అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారెవరూ లేరని (తౌహీద్) సాక్ష్యమివ్వడం. అలాగే, ముహమ్మద్ ﷺ అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని సాక్ష్యమివ్వడం. ఆయన ‘దాసుడు’ కాబట్టి ఆయనను దేవునిగా ఆరాధించకూడదు, ‘సందేశహరుడు’ కాబట్టి ఆయన మాటను ధిక్కరించకుండా పూర్తిగా అనుసరించాలి అని ఇది మతంలో సమతుల్యతను నేర్పుతుంది.

దరూద్ (సలాత్): సహాబాలు అపారమైన భాషా జ్ఞానం కలవారైనా, సొంతంగా సలవాత్ (దరూద్) ను కల్పించకుండా ప్రవక్త ﷺ నేర్పించిన “దరూద్-ఎ-ఇబ్రాహీమియ్యా” ను మాత్రమే పఠించారు. మతపరమైన విషయాలలో సొంత కల్పనలు పనికిరావని, ప్రవక్త ﷺ నేర్పినదే పరిపూర్ణమైనదని ఇది తెలియజేస్తుంది.

దుఆ (ప్రార్థన) చేయడానికి ఉత్తమ సమయం: తహియ్యాత్ మరియు దరూద్ చదివిన తర్వాత, నమాజు ముగించే ముందు (తస్లీమ్ కు ముందు) చేసే దుఆలు అంగీకరించబడే అవకాశాలు చాలా ఎక్కువ. ఆ సమయంలో తొందరపడకుండా అల్లాహ్ ను మనకు కావలసినవి అడగాలి.

నాలుగు విషయాల నుండి ఆశ్రయం కోరడం: నమాజు చివరలో ఈ నాలుగు విషయాల నుండి అల్లాహ్ ఆశ్రయం కోరాలని ప్రవక్త ﷺ ఆదేశించారు: 1. నరక శిక్ష, 2. సమాధి శిక్ష, 3. జీవితం మరియు మరణం యొక్క పరీక్షలు, 4. దజ్జాల్ యొక్క పరీక్షలు (ఫితనా).

ముగింపు: ప్రవక్త ﷺ నేర్పిన ప్రార్థనలు పదాలకు చాలా సంక్షిప్తంగా ఉన్నప్పటికీ, వాటిలో ఇహలోక మరియు పరలోక సకల శుభాలు, అనంతమైన అర్థాలు ఇమిడి ఉన్నాయని ఈ ప్రసంగం తెలియజేస్తుంది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45657

అజ్కార్ చదవడంలో తొందరపడే వారికి సలహా – షేక్ అల్-అల్బానీ

Advice To Those Who Rush Their Adhkār
By Shaykh Muḥammad Nāṣiruddin al Albānī رحمه الله
https://youtu.be/gUvqx7zOpDA
[6 min] [Arabic | English Subtitles]

షేక్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్):

చాలా మంది ప్రజలు, కేవలం ఫరాయిద్ (తప్పనిసరి చర్యలు) మాత్రమే కాకుండా నవాఫిల్ (ఐచ్ఛిక చర్యలు) మరియు ముస్తహబ్ (సిఫార్సు చేయబడినవి) విషయాలలో కూడా కట్టుబడి ఉండడాన్ని నేను గమనిస్తున్నాను. ఉదాహరణకు, నమాజు తర్వాత చేసే జిక్ర్, తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్), తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్), తక్బీర్ (అల్లాహు అక్బర్) మరియు ఇలాంటివి. కాబట్టి, వారిలో కొందరు ప్రవక్త (ﷺ) గారి ఈ మాటను ఆచరించాలనుకున్నప్పుడు నేను గమనించినదేమిటంటే,

“من سبح الله دبر كل صلاة ثلاثا وثلاثين وحمد الله ثلاثا وثلاثين وكبر الله ثلاثا وثلاثين ثم قال تمام المائة لا إله إلا الله وحده لا شريك له، له الملك وله الحمد وهو على كل شيء قدير غفرت له ذنوبه وإن كانت مثل زبد البحر”

(“ప్రతి నమాజు తర్వాత ఎవరైతే 33 సార్లు ‘సుబ్ హా నల్లాహ్’, 33 సార్లు ‘అల్ హమ్ దు లిల్లాహ్’, మరియు 33 సార్లు ‘అల్లాహు అక్బర్’ అని చదివి, ఆ తర్వాత వంద పూర్తి చేయడానికి ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. సార్వభౌమాధికారం ఆయనదే, సర్వ స్తోత్రాలు ఆయనకే మరియు ఆయన ప్రతిదానిపై పూర్తి అధికారం కలిగినవాడు) అని అంటారో, వారి పాపాలు సముద్రపు నురగ అంత ఉన్నప్పటికీ క్షమించబడతాయి.“)

ఈ హదీసు ప్రామాణికమైనది (సహీహ్), దీనిని ఇమామ్ ముస్లిం తన సహీహ్‌లో ఉల్లేఖించారు.

వారు ఈ హదీసును ఆచరించాలనుకున్నప్పుడు, వారిలో కొందరు ‘సుబ్ హా నల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’, మరియు ‘అల్లాహు అక్బర్’ అని తమ నాలుకతో కనీసం స్పష్టంగా పలకకపోవడాన్ని మీరు చూస్తారు. మరి మీరు ఏమి వింటారు?… మీరు చూసినట్లే నేను కూడా చూశానని అనుకుంటున్నాను. ఈ వాదనలో నేను ఒంటరిని కాదు. దీనిని మనం ఏమని పిలుస్తాము?… అప్పుడు… ఇది తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్) కాదు, తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్) కాదు… కొన్ని క్షణాల్లో లేదా కొన్ని సెకన్లలోనే వంద పూర్తి చేసేస్తారు.

ఈ వంద, ఎవరైతే (సరైన విధంగా) చేస్తారో, దానికి ప్రతిఫలం ఏమిటి? వారి పాపాలు సముద్రపు నురగ అంత ఉన్నప్పటికీ అల్లాహ్ క్షమిస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ విధంగా (అజ్కార్‌ను చాలా వేగంగా) చేస్తే, అల్లాహ్ రక్షించుగాక! దీన్ని నెమ్మదిగా, సమయం తీసుకుని చేయడం తప్పనిసరి. కాబట్టి చివర వరకు ‘సుబ్ హా నల్లాహ్’, ‘సుబ్ హా నల్లాహ్’, ‘సుబ్ హా నల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’, ‘అల్ హమ్ దు లిల్లాహ్’ అంటూ స్పష్టంగా చదవాలి.

నా తదుపరి మాటల ద్వారా, ప్రజలు 33 సార్లు తస్బీహ్ చేయడం మరియు హదీసులో మిగిలిన దానిని ఆచరించడం నుండి వారిని దూరం చేయాలని నేను అనుకోవడం లేదు. ఇస్లామీయ చట్టం ప్రకారం వారికి ఏది ఉత్తమమో మరియు ఏది చేయడానికి సులభమో దానికి వారిని చేరువ చేయాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను.

మీరందరూ లేదా మీలో కనీసం కొందరైనా ఈ హదీసును మొదటిసారిగా వింటారని నేను భావిస్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన హదీసు. ఇది కూడా ఇమామ్ నసాయి, ఇమామ్ హాకిమ్ మరియు ఇతరులచే ఉల్లేఖించబడిన ప్రామాణికమైన (సహీహ్) హదీసు. ఇది సహాబాల (ప్రవక్త అనుచరుల) నుండి రెండు ప్రామాణికమైన ఉల్లేఖన గొలుసుల (సనద్‌ల)తో వచ్చింది.

“أن رجلا من أصحاب النبي صلى الله عليه وآله وسلم رأى في المنام شخصا يسأله ما الذي علمكم الرسول عليه السلام قال علمنا سبحان الله وذكر هذا العدد الذي سبق بيانه في الحديث السابق فقال ذلك الشخص للرائي في المنام قال اجعلوهن خمسا وعشرين اجعلوهن خمسا وعشرين”

(“ప్రవక్త (ﷺ) గారి సహచరులలో ఒకరు కలలో ఒక వ్యక్తి తనను ఇలా అడగడం చూశారు, ‘దైవప్రవక్త (ﷺ) మీకు ఏమి నేర్పించారు?’ దానికి అతను, ‘ఆయన మాకు సుబ్ హా నల్లాహ్ నేర్పించారు’ అని చెప్పి, మునుపటి హదీసులోని సంఖ్యను పేర్కొన్నాడు. అప్పుడు కలలోని ఆ వ్యక్తి, ‘వాటిని 25 చేయండి’ అని అన్నాడు. అంటే: సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్ అని (ప్రతిదీ 25 సార్లు) చెప్పండి.“)

కాబట్టి వంద వరకు లెక్కించే దానిని ఇరవై ఐదుకు మార్చండి. ఇరవై ఐదు సార్లు నెమ్మదిగా మరియు శ్రద్ధగా చదవాలి, మనం తీవ్రంగా వ్యతిరేకించే ఆదుర్దా మరియు వేగంతో కాదు. కాబట్టి అతను సుబ్ హా నల్లాహ్ మరియు అల్ హమ్ దు లిల్లాహ్ చెప్పడంలో తొందరపడడు. అతను తొందరపడడు, మరియు అతను చదవడం మీరు వింటే.. సుబ్ హా నల్లాహ్, సుబ్ హా నల్లాహ్, సుబ్ హా నల్లాహ్… లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్… అని వేగంగా చదవడం కంటే ఇది మరింత పరిపూర్ణంగా ఉంటుంది.. ఎందుకంటే వేగంగా చదివేవారి నుండి తర్వాత మీరు అల్లాహ్, అల్లాహ్, అల్లాహ్.. అని మాత్రమే వింటారు.

మొదటి హదీసులో పేర్కొన్న తస్బీహ్ మరియు తహ్మీద్ విషయంలో, నమాజు తర్వాత తొందరపడే వారికి ఇది ఒక రక్షణ. వారు ఈ నాలుగింటిని (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్) కలిపి 25 సార్లు చదవాలి. సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, 25 సార్లు.

ఆ వ్యక్తి తన కలలో చూసిన పూర్తి హదీసును సాక్ష్యంగా తీసుకుంటే, ఇది మరింత ఉత్తమమైనది. కలలను అర్థం చేసుకోవడంలో మనకు నైపుణ్యం లేదు కాబట్టి, అది కలగలిపిన అబద్ధపు కల కావచ్చు మరియు వివరణ (తఫ్సీర్) కాకపోవచ్చు అని ఎవరైనా అనుకోవచ్చు.

“لكن هذا الرجل الرائي للرؤيا قصها على النبي صلى الله عليه وسلم فكان جوابه فافعلوا إذن”
(“అయితే, కల కన్న ఈ వ్యక్తి దానిని ప్రవక్త (ﷺ) కు వివరించగా, ఆయన ఇచ్చిన సమాధానం, ‘అలాగే, దానిని ఆచరించండి’ అనేది.“)

ఇక్కడ మనకు ఫిఖ్హ్ కు సంబంధించిన ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది మొదటి హదీసును రద్దు చేస్తుందా? తస్బీహ్ (సుబ్ హా నల్లాహ్) 33 సార్లు, తహ్మీద్ (అల్ హమ్ దు లిల్లాహ్) 33 సార్లు, తక్బీర్ (అల్లాహు అక్బర్) 33 సార్లు మరియు తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) 1 సారి. కాదు! ఇది దానిని రద్దు చేయదు. ఇది కేవలం ప్రాధాన్యత మాత్రమే.

నమాజు చేసే వ్యక్తి తన నమాజు తర్వాత అజ్కార్‌ను 33 సార్లు ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా చేస్తే, అందులో ఎలాంటి సమస్య లేదు. అయితే, మరింత ఉత్తమమైనది ఏమిటంటే ఈ నాలుగింటిని (సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, మరియు అల్లాహు అక్బర్) కలిపి 25 సార్లు చదవడం. మునుపటి హదీసు ప్రకారం ఆచరించడం కంటే ఇది అతనికి మరింత ఉత్తమమైనది.

నమాజు తర్వాత అజ్కార్ చదవడంలో తొందరపడే వారికి షేక్ అల్-అల్బానీ గారి సలహా సారాంశం:

సమస్య: నమాజు తర్వాత చదివే అజ్కార్ (సుబ్ హా నల్లాహ్ 33 సార్లు, అల్ హమ్ దు లిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు) చదవడంలో చాలా మంది ప్రజలు తీవ్రంగా తొందరపడుతున్నారని షేక్ అల్-అల్బానీ గారు గమనించారు. వారు పదాలను స్పష్టంగా పలకకుండా, కేవలం 100 సంఖ్యను వేగంగా పూర్తి చేయాలనే ఆరాటంలో ధ్వనులను మింగేస్తూ తప్పుగా చదువుతున్నారు.

సరైన విధానం: వాస్తవానికి అల్లాహ్ స్మరణను ఎలాంటి తొందర లేకుండా, నెమ్మదిగా, భక్తితో మరియు అక్షరాలు స్పష్టంగా పలికేలా చదవాలి.

ప్రత్యామ్నాయ పరిష్కారం (హదీసు ఆధారంగా): ఇలా తొందరపడే వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన ఒక ప్రామాణికమైన (సహీహ్) హదీసును సూచించారు. ఒక సహాబీ కన్న కలను ప్రవక్త (ﷺ) ఆమోదించిన ఈ విధానం ప్రకారం: ‘సుబ్ హా నల్లాహ్, అల్ హమ్ దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్’ – ఈ నాలుగింటిని కలిపి ఒకేసారి 25 సార్లు చదవాలి (అప్పుడు మొత్తం 100 అవుతుంది).

దీని ప్రయోజనం: ఇలా 25 సార్లు చదవడం వల్ల వేగంగా, అర్థం లేకుండా పలికే అవకాశం ఉండదు. ప్రతి పదాన్ని స్పష్టంగా, నెమ్మదిగా మరియు శ్రద్ధగా చదవడానికి ఇది సహాయపడుతుంది.

ఫిఖ్హ్ ముగింపు: ఈ 25 సార్ల విధానం, మునుపటి 33 సార్ల విధానాన్ని రద్దు చేయదు. ఎవరైతే ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా 33 సార్లు చదువుతారో వారు ఆ పద్ధతినే పాటించవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, తొందరపడే అలవాటు ఉన్నవారికి ఈ 25 సార్ల పద్ధతి మరింత ఉత్తమమైనది మరియు వారి అజ్కార్ వృధా కాకుండా కాపాడే ఒక రక్షణ లాంటిది.

ఈ పోస్ట్ లింక్:
https://teluguislam.net/?p=45644

హృదయ ప్రశాంతతను పొందే మార్గాలు – షేక్ అబ్దుర్రజ్జాక్ అల్-బద్ర్

The Means in Attaining the Heart’s ease – Shaykh Abdurrazzaq al Badr
https://youtu.be/k3ixE30gsjk [17:29 min] [Arabic|English Subtitles]

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ. الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ.

సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన వేరొక ఆరాధ్య దేవుడు లేడని, ఆయన ఒక్కడేనని మరియు ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. అలాగే ముహమ్మద్ ﷺ ఆయన దాసుడు మరియు సందేశహరుడు (ప్రవక్త) అని నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన పై, ఆయన కుటుంబం పై మరియు ఆయన సహచరులందరి పై ఉండుగాక.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ (రజియల్లాహు అన్హు) గారి కథనం ప్రకారం, అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:

«مَا أَصَابَ أَحَدًا قَطُّ هَمٌّ وَلَا حَزَنٌ، فَقَالَ:

اللَّهُمَّ إِنِّي عَبْدُكَ، وَابْنُ عَبْدِكَ، وَابْنُ أَمَتِكَ، نَاصِيَتِي بِيَدِكَ، مَاضٍ فِيَّ حُكْمُكَ، عَدْلٌ فِيَّ قَضَاؤُكَ، أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ، سَمَّيْتَ بِهِ نَفْسَكَ، أَوْ عَلَّمْتَهُ أَحَدًا مِنْ خَلْقِكَ، أَوْ أَنْزَلْتَهُ فِي كِتَابِكَ، أَوِ اسْتَأْثَرْتَ بِهِ فِي عِلْمِ الْغَيْبِ عِنْدَكَ، أَنْ تَجْعَلَ الْقُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنُورَ صَدْرِي، وَجِلَاءَ حُزْنِي، وَذَهَابَ هَمِّي، إِلَّا أَذْهَبَ اللَّهُ هَمَّهُ وَحُزْنَهُ، وَأَبْدَلَهُ مَكَانَهُ فَرَحًا»

అల్లాహుమ్మ ఇన్నీ అబ్దుక, ఇబ్ను అబ్దిక, ఇబ్ను అమతిక, నాసియతీ బియదిక, మాదిన్ ఫియ్య హుక్ముక, అద్లున్ ఫియ్య ఖదాఉక, అస్అలుక బికుల్లిస్మిన్, హువలక సమ్మైత బిహీ నఫ్సక, అవ్ అన్ జల్తహూ ఫీ కితాబిక అప్ అల్లమ్తహూ అహదన్ మిన్ ఖల్ ఖిక అవ్ ఇస్తాసర్త బిహి ఫీ ఇల్మిల్ గైబి ఇన్దక, అన్ తజ్అలల్ ఖుర్ ఆన రబీఅ ఖల్చీ, వ నూర సద్రీ, వ జలాఅ హుజ్నీ, వదహాబ హమ్మీ

“ఎవరికైనా ఎప్పుడైనా కష్టం లేదా విచారం కలిగి, వారు ఇలా ప్రార్థిస్తే:

ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను నీ దాసుడిని, నీ దాసుడి కుమారుడిని, నీ దాసురాలి పుత్రుడను, నా నొసలు, ముంగురులు నీ చేతిలో ఉన్నాయి. నీ ఆజ్ఞ నాలో కొనసాగుతున్నది నా కొరకై నీ తీర్పు న్యాయసమ్మతమైనది నీ నామములన్నింటితో, వేటినైతే నీవు నీ కొరకు పెట్టుకున్నావో, లేదా నీ గ్రంథంలో అవతరింపజేసావో, లేదా నీ సృష్టిలో ఎవరికైనా తెలిపావో లేదా నీ అగోచర జ్ఞానంలోనే ఉంచాలని నిశ్చయంచుకున్నావో నామములన్నింటితో నిన్ను అడుగుచున్నాను – ఖుర్ఆన్ ను నా మనసుకు వసంతముగా, హృదయానికి కాంతిగా, నా మనోవేదనను దూరం చేసే దానిగా, నా దుఃఖాన్ని దూరం చేసేదిగా చేయమని వేడుచున్నానుఅని వేడుకుంటే అల్లాహ్ అతని కష్టాన్ని మరియు విచారాన్ని తొలగించి వాటి స్థానంలో సంతోషాన్ని ప్రసాదించకుండా ఉండడు.”

అప్పుడు ఇలా అడగబడింది: ఓ అల్లాహ్ ప్రవక్తా, మనం దానిని నేర్చుకోకూడదా? ఆయన ఇలా అన్నారు:

«بَلَى، يَنْبَغِي لِمَنْ سَمِعَهَا أَنْ يَتَعَلَّمَهَا»
“అవును, దానిని విన్న ప్రతి ఒక్కరూ తప్పక నేర్చుకోవాలి.” (అహ్మద్)

నిశ్చయంగా, హృదయ ప్రశాంతత (انشراح الصدر – ఇన్షిరాహ్ అస్-సదర్) మరియు కష్టాలు, విచారాల నుండి విముక్తి పొందడం అనేది చాలా గొప్ప సాధన, ఉన్నతమైన లక్ష్యం మరియు ఇది సకల లోకాల ప్రభువు నుండి లభించే గొప్ప వరం. హృదయ ప్రశాంతత (ఇన్షిరాహ్ అస్-సదర్) అంటే దానిలోని సౌకర్యం మరియు నిశ్చలత్వం. అంతేకాకుండా, దాని నుండి ఆందోళన మరియు కష్టాలు తొలగిపోవడం, ఉన్నతమైన మరియు స్వచ్ఛమైన జీవితంలో సంతోషంగా ఉండటం.

అల్లాహ్ తన దాసుడికి దీనిని ప్రసాదిస్తే, ఆయన అతని హృదయాన్ని తెరుస్తాడు, అతని వ్యవహారాలను సులభతరం చేస్తాడు మరియు అతని నుండి కష్టాలను, బాధలను తొలగిస్తాడు. అప్పుడు అతను ఇహలోక మరియు మతపరమైన ప్రయోజనాలను పొందుతాడు. అతను తన లక్ష్యాలను కూడా చేరుకుంటాడు. ఆరాధనలు మరియు విధేయత క్రియలు అతనికి సులభతరం చేయబడతాయి. అతను తన వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకోగలుగుతాడు.

అదే సమయంలో, అధికమైన కష్టాలు మరియు బాధల వల్ల అతని హృదయం కుంచించుకుపోతే, ఆ దాసుడికి లభించవలసిన అనేక ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి అతను ఏ పనినీ ఫలప్రదంగా చేయలేడు. ధర్మబద్ధమైన మార్గంలోకి ప్రవేశించే బలం అతనికి ఉండదు. బదులుగా, అతను ఒక రకమైన కష్టం నుండి మరొక దానికి మరియు ఒక రకమైన దుఃఖం నుండి మరొక దానికి వెళ్తూ ఉంటాడు.

కాబట్టి, దాసుడు తన లక్ష్యాలను చేరుకోవడానికి మరియు తనకు ప్రయోజనకరమైన వాటిని పొందడానికి హృదయ ప్రశాంతత అనేది అత్యంత గొప్ప సహాయకం.

అందువల్ల, ఇస్లాం వైపు పిలవడానికి మరియు అతని అక్రమాల గురించి హెచ్చరించడానికి దుర్మార్గుడైన ఫిరౌన్ వద్దకు వెళ్ళమని అల్లాహ్ తన ప్రవక్త మూసాకు ఆజ్ఞాపించినప్పుడు, మూసా అల్లాహ్ వైపు మళ్లి ఇలా ప్రార్థించారు:

قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي * وَيَسِّرْ لِي أَمْرِي

“నా ప్రభువా, నా హృదయాన్ని ప్రశాంతపరచు. నా పనిని సులభతరం చేయి…” (తాహా: 25-26).

మరియు అల్లాహ్ తన దాసుడు, సందేశహరుడు మరియు ఎంపిక చేయబడిన ముహమ్మద్ ﷺ పై తన అనుగ్రహాలను కురిపిస్తూ ఇలా అన్నాడు:

أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ

“మేము నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచలేదా…” (అష్-షర్హ్:1).

దీని అర్థం, ఇది అల్లాహ్ మీకు ప్రసాదించిన దైవిక వరం మరియు బహుమతి.

కాబట్టి హృదయ ప్రశాంతత అనేది మార్గదర్శకత్వానికి (హిదాయత్) అత్యంత గొప్ప సాధనాలలో ఒకటి. మరియు దాని సంకోచం (ఇరుకుగా మారడం) అనేది దారి తప్పడానికి గల కారణాలలో ఒకటి. హృదయ ప్రశాంతత అనేది అత్యున్నత ఆశీర్వాదాలలో ఒకటి అయినట్లే, దాని సంకోచం అనేది అత్యంత దారుణమైన శిక్షలలో ఒకటి.

ఈ ధర్మానికి ప్రాధాన్యతనిచ్చి, దానిని నెలకొల్పడం ద్వారా తప్ప ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. కాబట్టి దాసుడు ఈ మతాన్ని ఆచరించడంలో మరియు దానిలోని విషయాలకు కట్టుబడి ఉండటంలో ఎంత శ్రద్ధ చూపిస్తాడో, అతని హృదయంలోని ప్రశాంతత యొక్క వాటా కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.

కాబట్టి, ఒకరి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచేలా చేసే అన్ని మార్గాలను రెండు విషయాలుగా సంగ్రహించడం సాధ్యమవుతుంది. ఒకటి మరొకదాని యొక్క పర్యవసానం. మొదటి విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం మరియు అనుగ్రహం ద్వారా తప్ప హృదయ ప్రశాంతత లభించదు. రెండవ విషయం ఏమిటంటే, అల్లాహ్ నుండి వచ్చే ఈ ఆశీర్వాదం మరియు బహుమతి ఆయనకు విధేయత చూపడం మరియు ఆయన చట్టానికి (షరియత్) కట్టుబడి ఉండటం ద్వారా తప్ప మరొక విధంగా రాదు. కాబట్టి ఈ రెండు విషయాలే ఈ వ్యవహారానికి పునాదులు.

అందువల్ల, హృదయాలు అల్లాహ్ చేతుల్లోనే ఉన్నాయి, ఆయన వాటిని తాను కోరుకున్నట్లుగా తిప్పుతాడు మరియు అవి ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ ఏమి కోరుకుంటే అది జరుగుతుంది మరియు ఆయన కోరుకోనిది జరగదు. సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ

“అల్లాహ్ ఎవరికైతే మార్గదర్శకత్వం చేయాలని కోరుకుంటాడో, ఆయన వారి హృదయాన్ని ఇస్లాం కోసం తెరుస్తాడు. మరియు ఎవరినైతే ఆయన దారితప్పేలా చేయాలని కోరుకుంటాడో, ఆయన వారి హృదయాన్ని మూసివేసి, ఆకాశంలోకి ఎక్కుతున్నట్లుగా ఇరుకుగా (సంకోచంగా) చేస్తాడు. విశ్వసించని వారి పై అల్లాహ్ ఆ విధంగా కోపాన్ని (శిక్షను) విధిస్తాడు.” (అల్-అన్ఆమ్: 125).

మరియు సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

أَفَمَن شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِين

“అల్లాహ్ ఎవరి హృదయాన్నైతే ఇస్లాం కోసం తెరిచాడో, తద్వారా అతను తన ప్రభువు నుండి ఒక వెలుగులో ఉన్నాడో (అతను అవిశ్వాసి లాంటివాడా)? కాబట్టి అల్లాహ్ స్మరణ పట్ల తమ హృదయాలను కఠినం చేసుకున్న వారికి వినాశనం తప్పదు! వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నారు!” (అజ్-జుమర్: 22).

కాబట్టి హృదయ ప్రశాంతత అనేది అల్లాహ్ తౌఫీఖ్ (దయ)తో మాత్రమే లభిస్తుంది. అందువల్ల, దానిని ఆయన నుండి మాత్రమే, ఆయన చట్టం మరియు దైవవాణి (వహీ) మార్గంలో వెతకాలి. కాబట్టి విశ్వాసి తన హృదయం ప్రశాంతంగా ఉండాలని, తన వ్యవహారాలు సులభతరం కావాలని, మరియు ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో అల్లాహ్ యొక్క సంతోషకరమైన దాసులలో తనను కూడా రాయాలని అల్లాహ్ ను చిత్తశుద్ధితో ప్రార్థిస్తూ మరియు శరణు వేడుకుంటూ కృషి చేస్తాడు. మరియు విశ్వాసి తన ప్రార్థనతో పాటుగా, ఈ ఉన్నతమైన మరియు గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి దారితీసే మార్గాలను అవలంబించడానికి కూడా కృషి చేస్తాడు.

హృదయ ప్రశాంతత అనేది విశ్వాసికి స్పష్టమైన సంకేతాలను కలిగి ఉంటుంది. కాబట్టి దాని ఫలితం ఈ లోకంలోనూ మరియు పరలోకంలోనూ ప్రశంసించబడుతుంది. మరియు అవి మూడు వ్యవహారాలుగా సంగ్రహించబడ్డాయి:

  • మొదటిది, అతను శాశ్వతమైన నివాసం (పరలోకం) పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాడు.
  • రెండవది, అతను తాత్కాలిక నివాసం (ఇహలోకం) పట్ల విముఖత చూపుతాడు.
  • మూడవది, అతను మరణానికి మరియు ఆ తర్వాత వచ్చే దానికి సన్నద్ధమవుతాడు.

కాబట్టి దాసుని హృదయంలో ఈ మూడు లక్షణాలు ఉన్నట్లయితే, అతని హృదయం ప్రశాంతంగా మరియు నెమ్మదిగా ఉందనడానికి ఇదే నిదర్శనం.

ఇబ్న్ అల్-ఖయ్యిమ్ ఇలా అన్నారు: మరియు దాని సంకేతాలు: హృదయ ప్రశాంతత అనేది ఈమాన్ (విశ్వాసం) యొక్క స్థానాల నుండి, అల్లాహ్ ఆదేశాల పట్ల దాని విశాలత మరియు ప్రశాంతత నుండి, ఆయన స్మరణ వైపు మళ్లడం, ఆయన ప్రేమ, ఆయనను కలుసుకోవాలనే ఆనందం మరియు భ్రమతో కూడిన ఈ లోకం పట్ల విముఖత చూపడం నుండి ఉద్భవిస్తుంది. ఒక ప్రసిద్ధ ఉల్లేఖనంలో ఇలా చెప్పబడింది: హృదయంలోకి కాంతి ప్రవేశిస్తే, అది విశాలంగా మరియు ప్రశాంతంగా మారుతుంది. దీనికి సంకేతాలు ఏమిటి? అని అడగబడింది. దానికి ఆయన: భ్రమ కలిగించే ఈ లోకం పట్ల విముఖత చూపడం, శాశ్వత నివాసం వైపు మళ్లడం మరియు మరణం రాకముందే దానికి సన్నద్ధమవ్వడం అని చెప్పారు.

మరియు దాసుడు హృదయ ప్రశాంతతను పొందేందుకు గొప్ప మార్గాలు ఉన్నాయి. కింది వాటిలో, నేను అత్యంత ముఖ్యమైనవి పేర్కొంటాను.

మొదటిది అల్లాహ్ యొక్క తౌహీద్ మరియు ధర్మాన్ని ఆయన కోసమే చిత్తశుద్ధితో పాటించడం. అల్లాహ్ యొక్క తౌహీద్ మరియు ఆయన కొరకే ధర్మాన్ని నిష్కల్మషంగా పాటించడం అనేది హృదయ ప్రశాంతతను పొందడంలో అత్యంత గొప్ప సాధనంగా పరిగణించబడుతుంది. అల్లాహ్ సృష్టిని సృష్టించడానికి మరియు దానిని ఉనికిలోకి తీసుకురావడానికి కారణం కూడా ఇదే. సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ

“మరియు నేను (అల్లాహ్) జిన్నులను మరియు మానవులను కేవలం వారు నన్ను (మాత్రమే) ఆరాధించడానికే సృష్టించాను” (అజ్-జారియాత్: 56).

దాసుడు తన తౌహీద్‌ను ఎంత ఎక్కువగా స్థాపిస్తాడో, దాని పట్ల శ్రద్ధ చూపుతాడో, దాని హక్కులు మరియు బాధ్యతలను కాపాడతాడో, మరియు దానిని చెల్లుబాటు కాకుండా చేసి లోపభూయిష్టంగా మార్చే విషయాలకు దూరంగా ఉంటాడో, అతని హృదయం అంత ఎక్కువగా ప్రశాంతంగా ఉంటుంది, అతని ఆత్మ అంత నెమ్మదిగా ఉంటుంది మరియు ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో అతని ఆనందం అంత గొప్పగా ఉంటుంది.

రెండవది అల్లాహ్ తన దాసుని హృదయం పై ప్రసరింపజేసే కాంతి. సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

أَفَمَن شَرَحَ اللَّهُ صَدْرَهُ لِلْإِسْلَامِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِ ۚ فَوَيْلٌ لِّلْقَاسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ اللَّهِ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ

“అల్లాహ్ ఎవరి హృదయాన్నైతే ఇస్లాం కోసం తెరిచాడో, తద్వారా అతను తన ప్రభువు నుండి ఒక వెలుగులో ఉన్నాడో (అతను అవిశ్వాసి లాంటివాడా)?” (అజ్-జుమర్: 22).

దీని అర్థం, అల్లాహ్ తన దయ మరియు అనుగ్రహం ద్వారా అతనికి ప్రసాదించిన కాంతిలో అతను ఉన్నాడు.

మరియు ఈ కాంతి ఈమాన్ (విశ్వాసం) యొక్క కాంతి. నిశ్చయంగా ఇది హృదయాన్ని ప్రశాంతపరుస్తుంది, దానిని విశాలంగా మరియు సంతోషంగా మారుస్తుంది. ఒకవేళ దాసుని హృదయం నుండి ఈ కాంతి లోపిస్తే, అది సంకోచించి, వేదనకు గురవుతుంది. మరియు అది అత్యంత ఇరుకైన మరియు అత్యంత కష్టతరమైన జైలులా మారుతుంది. కాబట్టి దాసుని హృదయంలోని ప్రశాంతత యొక్క వాటా ఈ కాంతిలో అతనికి ఉన్న వాటాకు అనుగుణంగా ఉంటుంది.

అల్-హాఫిజ్ ఇబ్న్ రజబ్ ఇలా అన్నారు: ఈమాన్ (విశ్వాసం) యొక్క కాంతి ఏ హృదయంలోకి అయితే ప్రవేశిస్తుందో అది ప్రశాంతంగా మరియు విశాలంగా మారుతుంది. మరియు అది సత్యం నివసించే, భరోసా పొందే మరియు దానిని అంగీకరించే ప్రదేశంగా మారుతుంది. మరియు అది అసత్యం నుండి పారిపోతుంది, దానిని అసహ్యించుకుంటుంది మరియు దానిని అంగీకరించదు.

మూడవది ప్రయోజనకరమైన జ్ఞానాన్ని పొందడం. అల్లాహ్ గ్రంథం మరియు ఆయన ప్రవక్త ﷺ సున్నత్ ఆధారంగా దాసుడు ధర్మబద్ధమైన జ్ఞానాన్ని ఎంతగా పొందుతాడో, అతని హృదయం అంతగా ప్రశాంతంగా ఉంటుంది మరియు అతని స్థితి అంతగా సరిదిద్దబడుతుంది. జ్ఞానంలో దాసునికి ఉన్నత స్థానం మరియు ఆనందం ఉన్నాయి మరియు అందులో ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో అతని విజయం దాగి ఉంది. మరియు ఇది అతని మార్గంలో ఒక కాంతి లాంటిది కూడా.

సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

﴿يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ﴾

“మీలో విశ్వసించిన వారి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ పెంచుతాడు.” (అల్-ముజాదిలహ్: 11).

అదనంగా, ఇది జ్ఞానార్జన చేసే విద్యార్థి నివసించే స్వర్గం, పండ్లతో నిండిన వికసించే ఉద్యానవనం, అక్కడ అతను ఆనందం, సాన్నిహిత్యం, సౌకర్యం మరియు సంతోషాన్ని కనుగొంటాడు. మరియు అందులో అతను రుచికరమైన పండ్లను మరియు వివిధ రకాల పూలను కోసుకుంటాడు.

నాలుగవది అల్లాహ్ వైపు మళ్లడం, ఆయనకు భక్తితో ఉండటం మరియు ఆయన విధేయత మరియు ఆరాధనలో ఆనందాన్ని పొందడం. నిశ్చయంగా, విధేయత మరియు ఆరాధన క్రియలు హృదయాలకు ఓదార్పు, ఆత్మలకు సాన్నిహిత్యం, కళ్ళకు చలువ మరియు హృదయాలకు సంతోషం.

ఇబ్న్ అల్-ఖయ్యిమ్ ఇలా అన్నారు: హృదయపూర్వకంగా అల్లాహ్ వైపు మళ్లడం మరియు ఆయనను ప్రేమించడం, ఆయనకు భక్తితో ఉండటం మరియు ఆయన ఆరాధనలో ఆనందాన్ని పొందడం కంటే మరేదీ హృదయానికి ఎక్కువ ప్రశాంతతను తీసుకురాదు. ఏ స్థాయి వరకు అంటే, కొన్నిసార్లు అతను ఇలా అనేవాడు: ఒకవేళ నేను స్వర్గంలో ఉండి, అది కూడా ఇలాగే ఉంటే, అప్పుడు నేను మంచి జీవితాన్ని గడుపుతున్నట్లే.

దీనికి ఒక ఉదాహరణ నమాజు (ప్రార్థన). అది విశ్వాసి హృదయానికి తీసుకువచ్చే ఓదార్పు, మానసిక శాంతి, ప్రశాంతత. ప్రవక్త ﷺ ఏ స్థాయికి చెప్పారంటే:

«قُمْ يَا بِلَالُ فَأَرِحْنَا بِالصَّلَاةِ»
“ఓ బిలాల్, నిలబడి నమాజుతో మాకు ప్రశాంతతను (ఉపశమనాన్ని) కలిగించు.”

మరియు మరొక హదీసులో, ఆయన ﷺ ఇలా అన్నారు:

«وَجُعِلَتْ قُرَّةُ عَيْنِي فِي الصَّلَاةِ»
“నా కళ్ళ చలువ నమాజులో ఉంచబడింది.”

ఐదవది ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్). నిశ్చయంగా దాసుడు ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం అనేది ప్రశాంతమైన హృదయాన్ని, ఆత్మ యొక్క ఓదార్పును పొందడంలో మరియు కష్టాలు, విచారాలను తొలగించుకోవడంలో అత్యంత గొప్ప మార్గాలలో ఒకటి. బదులుగా, అల్లాహ్ ను స్మరించడం మరియు ఆయనను చిత్తశుద్ధితో శరణు వేడుకోవడం ద్వారా తప్ప ఎలాంటి పరీక్ష లేదా కష్టమైనా తొలగిపోదు.

అల్లాహ్ ﷻ ఇలా అన్నాడు:

الَّذِينَ آمَنُوا وَتَطْمَئِنُّ قُلُوبُهُم بِذِكْرِ اللَّهِ ۗ أَلَا بِذِكْرِ اللَّهِ تَطْمَئِنُّ الْقُلُوبُ

“విశ్వసించిన వారు, మరియు అల్లాహ్ స్మరణతో ఎవరి హృదయాలైతే ప్రశాంతత పొందుతాయో, (వారే సన్మార్గంలో ఉన్నారు). నిశ్చయంగా, అల్లాహ్ స్మరణతోనే హృదయాలకు ప్రశాంతత లభిస్తుంది.” (అర్-రాద్: 28).

అల్లాహ్ ను స్మరించడం అనేది అందులో నిమగ్నమైన వారికి ఓదార్పు మరియు మానసిక శాంతి. మరియు ఇది తీర్పు దినాన వ్యక్తి పొందే సమృద్ధి మరియు రెట్టింపు ప్రతిఫలం. మరియు దానికి ప్రతిఫలంగా అతనికి లభించేది ప్రశంసనీయమైనది మరియు ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో దాసుడు పొందే అనేక ప్రయోజనాలు అందులో ఉన్నాయి. బదులుగా, ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో ప్రతి రకమైన మేలు, సంతోషం, సాన్నిహిత్యం, సౌకర్యం మరియు ప్రశాంతత అనేది అల్లాహ్ ﷻ స్మరణను స్థాపించడం పైనే ఆధారపడి ఉంటుంది.

ఆరవది అల్లాహ్ దాసుల పట్ల దయతో (ఉపకారం చేస్తూ) ఉండటం. అల్లాహ్ సర్వోన్నతుడు ఇలా అన్నాడు:

وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ

“మరియు సత్కార్యాలు (ఉపకారాలు) చేయండి, నిశ్చయంగా అల్లాహ్ సత్కార్యాలు చేసేవారిని ప్రేమిస్తాడు.” (అల్-బఖరహ్: 195).

సృష్టి పట్ల దయతో ఉండటం అనేది తన హోదా, సంపద, సలహా ఇవ్వడం ద్వారా మరియు ఇతర వివిధ రకాల సహాయాల ద్వారా కనిపించే మరియు కనిపించని అనేక మార్గాల్లో చేయవచ్చు.

నిశ్చయంగా, అల్లాహ్ తన దాసుల పట్ల దయతో ఉండే దాసునికి అతని హృదయంలో ప్రశాంతతను బహుమతిగా ఇస్తాడు, ఆయన అతని వ్యవహారాలను సులభతరం చేస్తాడు మరియు అతనికి మంచి ముగింపును ఇస్తాడు. ప్రవక్త ﷺ ఇలా అన్నారు:

«مَنْ نَفَّسَ عَنْ مُؤْمِنٍ كُرْبَةً مِنْ كُرَبِ الدُّنْيَا، نَفَّسَ اللَّهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ، يَسَّرَ اللَّهُ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَمَنْ سَتَرَ مُسْلِمًا، سَتَرَهُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَاللَّهُ فِي عَوْنِ الْعَبْدِ مَا كَانَ الْعَبْدُ فِي عَوْنِ أَخِيهِ»

“ఈ ఇహలోకంలో ఎవరైతే ఒక విశ్వాసి కష్టాన్ని తొలగిస్తారో, తీర్పు దినాన అల్లాహ్ అతని కష్టాన్ని తొలగిస్తాడు. ఈ ఇహలోకంలో ఎవరైతే ఒక విశ్వాసికి సులభతరం చేస్తారో, పరలోకంలో అల్లాహ్ అతనికి సులభతరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లిం లోపాలను కప్పిపుచ్చుతాడో, ఈ ఇహలోకంలో మరియు పరలోకంలో అల్లాహ్ అతని లోపాలను కప్పిపుచ్చుతాడు. దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు అల్లాహ్ తన దాసుని సహాయంలో ఉంటాడు.”

ఏడవది హృదయ రోగాలు మరియు రుగ్మతల నుండి దూరంగా ఉండటం, మరియు ఇవి చాలా ఉన్నాయి. మరియు శరీరాలు అనారోగ్యానికి గురైనట్లే హృదయాలు కూడా అనారోగ్యానికి గురవుతాయి. కానీ హృదయ వ్యాధులు వ్యక్తి పై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి, అసూయ, ద్వేషం, పగ మరియు హృదయ సంబంధిత వ్యాధుల వంటివి.

నిశ్చయంగా ఈ నిందించదగిన లక్షణాలు మరియు సిగ్గుచేటు వ్యాధులు హృదయాలలోకి ప్రవేశించినప్పుడు, అవి హృదయాలను నాశనం చేస్తాయి. మరియు అవి ఛాతీలలోకి ప్రవేశించినప్పుడు, అవి వాటిని చీకటిగా చేస్తాయి మరియు ఫలితంగా, అది వ్యక్తి యొక్క హృదయాన్ని ఇరుకుగా చేస్తుంది మరియు అది చెడు పర్యవసానాలతో కూడిన దయనీయ స్థితిలో అతనిని ఉంచుతుంది. ఈ వ్యాధుల నుండి విముక్తి పొంది, దానికి విరుద్ధంగా నమ్మకం, విధేయత, నిజాయితీ మరియు నిస్వార్థం వంటి వాటితో హృదయాన్ని నింపుకునే వ్యక్తి విషయానికొస్తే, ఈ వ్యవహారాలు హృదయం ప్రశాంతంగా మరియు సౌకర్యవంతమైన స్థితిలో ఉండేలా చేస్తాయి మరియు అతని ఆత్మ నెమ్మదిస్తుంది.

ఎనిమిదవది అతిగా వ్యవహరించడాన్ని వదిలివేయడం. కాబట్టి హృదయ ప్రశాంతతకు గల మార్గాలలో అతిగా మాట్లాడకుండా నాలుకను కాపాడుకోవడం, అతిగా వినకుండా చెవులను కాపాడుకోవడం మరియు అతిగా చూడకుండా కళ్లను కాపాడుకోవడం వంటివి ఉన్నాయి. నిశ్చయంగా, ఇహపరలోకాలలో తన ఆనందానికి, విజయానికి మరియు సరిదిద్దుకోవడానికి కారణమయ్యే ముఖ్యమైన వ్యవహారాలను వదిలి అనవసరమైన అతి వ్యవహారాలలో వ్యక్తి మునిగిపోవడం అనేది అతని జీవితం పై ఇరుకుదనం, దుఃఖం మరియు బాధను కలిగించడం ద్వారా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

బదులుగా వినడం, చూడటం మరియు మాట్లాడటంలో అతిగా వ్యవహరించడం అనేది కష్టాలను మరియు బాధలను తీసుకురావడానికి కారణమవుతుంది మరియు ఇది వ్యక్తి తన ఇహలోకంలో మరియు పరలోకంలో ప్రశంసించని చెడు పర్యవసానాలకు దారితీస్తుంది. మరియు చూడటం, వినడం మరియు మాట్లాడటంలో అతిగా ప్రవర్తించడం ఒక వ్యక్తికి ఎంత వినాశనాన్ని మరియు నష్టాన్ని తీసుకువచ్చిందో. అందువల్ల, విశ్వాసి తన ఆత్మను క్రమశిక్షణలో ఉంచుకోవడానికి మరియు మంచి ప్రవర్తనతో దానిని అలంకరించుకోవడానికి కృషి చేయాలి. అతను మర్యాదలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనూ, అలాగే తన నాలుకను కాపాడుకోవడంలోనూ, మరియు తనకు హాని కలిగించే లేదా నాశనం చేసే ప్రతి దానికి దూరంగా ఉండటంలోనూ కృషి చేయాలి.

తొమ్మిదవది గౌరవప్రదమైన ప్రవక్త ﷺ ను అనుసరించడం. ప్రవక్త ﷺ సున్నత్ ను అనుసరించడం, ఆయన సరైన మార్గానికి కట్టుబడి ఉండటం మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించడం హృదయ ప్రశాంతతను పొందే అతి గొప్ప మార్గాలలో ఉన్నాయి. బదులుగా ఇది ఈ వ్యవహారాలన్నింటిని కలుపుకొని ఉంటుంది. మరియు దీనికి కారణం, ఎవరి హృదయమైతే అత్యంత ప్రశాంతంగా ఉందో, ఎవరైతే ఉత్తమమైన స్వభావాన్ని, అత్యంత అందమైన మర్యాదలను మరియు స్వచ్ఛమైన హృదయాలను కలిగి ఉన్నారో దానికి ఆయన ﷺ ఒక ప్రధాన ఉదాహరణ.

అల్లాహ్ ఇలా అన్నాడు:

أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
“మేము నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచలేదా…” (అష్-షర్హ్: 1).

మరియు అల్లాహ్ ప్రవక్త ﷺ హృదయంలో ప్రశాంతతను ఉంచడం అనేది, దానిని విశాలపరచడం ద్వారా మరియు దానిలోని అన్ని సద్గుణాలను, పరిపూర్ణతను మరియు అన్ని రకాల అందమైన మర్యాదలను ఒకచోట చేర్చడం ద్వారా జరుగుతుంది.

కాబట్టి, ప్రతిసారీ దాసుడు అల్లాహ్ యొక్క సందేశహరుడు ﷺ యొక్క గొప్ప మార్గదర్శకత్వాన్ని అనుసరించినప్పుడు, అతని హృదయ ప్రశాంతత, అతని మానసిక శాంతి మరియు అతని హృదయంలోని నిశ్చలత్వం దానికి అనుగుణంగా ఉంటాయి.

ఇబ్న్ అల్-ఖయ్యిమ్ ఇలా అన్నారు: ఉద్దేశ్యం ఏమిటంటే అల్లాహ్ యొక్క సందేశహరుడు ﷺ హృదయ ప్రశాంతతను మరియు దాని విశాలతను, కళ్ళ చలువను, మరియు ఆత్మ జీవాన్ని తీసుకువచ్చే ప్రతి లక్షణంలోనూ సృష్టిలో అత్యంత పరిపూర్ణుడు. ఆయన ﷺ తన అన్ని శారీరక లక్షణాలతో పాటుగా ఈ విషయాలలో కూడా సృష్టిలో అత్యంత పరిపూర్ణుడు.

మరియు ఆయనను ఎక్కువగా అనుసరించే వారు హృదయ ప్రశాంతతలో, ఆనందాన్ని మరియు సౌకర్యాన్ని అనుభవించడంలో అత్యంత పరిపూర్ణులు. కాబట్టి దాసుడు ఆయనను ﷺ ఎంతగా అనుసరిస్తాడో దానికి అనుగుణంగా హృదయ ప్రశాంతతను, కళ్ళ చలువను మరియు ఆత్మ ఆనందాన్ని పొందుతాడు. హృదయ ప్రశాంతతకు సంబంధించి, ఆయన ప్రస్తావన పెంచబడటంలో, భారాన్ని తగ్గించబడటంలో ఆయన ﷺ పరిపూర్ణతకు శిఖరాగ్రం లాంటివారు. మరియు ఆయనను అనుసరించే వారు ఒకరు ఆయనను ﷺ ఎంతగా అనుసరిస్తారో మరియు అల్లాహ్ సహాయాన్ని ఎంతగా కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈ వ్యవహారాలను పొందుతారు.

اللَّهُمَّ اشْرَحْ صُدُورَنَا، وَيَسِّرْ أُمُورَنَا، وَأَعِنَّا عَلَى سُلُوكِ الصِّرَاطِ الْمُسْتَقِيمِ، صِرَاطِ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ، وَحَسُنَ أُولَئِكَ رَفِيقًا.

ఓ అల్లాహ్, మా హృదయాలలో ప్రశాంతతను ఉంచు, మా వ్యవహారాలను సులభతరం చేయి మరియు సరైన మార్గంలో పయనించడానికి మాకు సహాయం చేయి, ఏ మార్గంలో అయితే నీవు ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ముల పై నీ అనుగ్రహాన్ని ప్రసాదించావో ఆ మార్గంలో. మరియు వీరు ఎంత అద్భుతమైన సహచరులు!

وَصَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَى عَبْدِهِ وَرَسُولِهِ نَبِيِّنَا مُحَمَّدٍ وَآلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ.

అల్లాహ్ తన దాసుడు మరియు సందేశహరుడు, మన ప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబం పై మరియు ఆయన సహచరులందరి పై తన శాంతిని మరియు శుభాలను కురిపించుగాక.

السلام عليكم و رحمة الله و بركاته
(అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45626

అరఫా దినం – షేక్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

The Day of ‘Arafah – by Shaykh ‘Abdurrazzāq al Badr [Video|Ar-En Subtitles]
https://youtu.be/b_laOsp-N6Y [56 min]

గౌరవనీయ సోదరులారా, అరఫా దినం చాలా గొప్ప దినం. దానికి ఇవ్వాల్సిన సరైన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి, దాని స్థాయిని మనం తెలుసుకోవాలి. దాని స్థానం మరియు ప్రాధాన్యత పట్ల మనం స్పృహతో ఉండాలి. తద్వారా దాని అపారమైన ప్రాముఖ్యతను, ఉన్నత స్థాయిని అలాగే దాని గొప్ప అంతస్తును స్పష్టంగా అర్థం చేసుకుని మనం ఆ రోజులోకి ప్రవేశించగలము. ఇది మరే ఇతర దినం లాంటిది కాదు, ప్రత్యేకంగా అరఫాలో నిలబడే భాగ్యాన్ని అల్లాహ్ ఎవరికైతే ప్రసాదించాడో వారికి ఇది మరింత ప్రత్యేకం, అయితే ఈపుణ్యం కేవలం వారికి మాత్రమే పరిమితం కాదు.

ఎందుకంటే, మీ అందరికీ తెలిసినట్లుగా, అరఫా రోజున ఉపవాసం ఉండటం గురించి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేను ఆశిస్తున్నాను.” ఇది సాధారణ ముస్లింలకు వర్తిస్తుంది. హజ్ యాత్రికుల (హాజీల) విషయానికొస్తే, వారు అరఫా రోజున ఉపవాసం ఉండక పోవడమే వారికి ఉత్తమం. ప్రవక్త (సల్లల్లాహు అలైహివసల్లం)ను ఆదర్శంగా తీసుకుని, ఆ గొప్ప మరియు పవిత్రమైన రోజున అల్లాహ్ స్మరణలో (జిక్ర్), దుఆలు చేయడంలో మరియు అల్లాహ్ ధ్యానంలో గడపడానికి వారు తమను తాము, తమ శరీరాలను బలోపేతం చేసుకోవాలి. ఉమ్ముల్ ఫజ్ల్ బింత్ అల్-హారిస్(రజియల్లాహు అన్హా) ఉల్లేఖించిన హదీసు సహీహైన్ (బుఖారీ, ముస్లిం)లో ఉంది, ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపవాసం ఉన్నారా లేదా అనే విషయమై కొందరు ఆమె దగ్గర చర్చిస్తున్నారు, అది అరఫా రోజు. కాబట్టి, ఆమె ఒక కప్పు పాలు తీసుకుని ప్రవక్తకు అందించగా, ఆయన దానిని త్రాగారు. ‘మీరు చూస్తున్నదే సమాధానం’ అని ఆమె చెప్పినట్లుగా అది ఉంది. ప్రవక్త దానిని త్రాగారు, కాబట్టి ఆయన ఉపవాసం లేరని తెలిసింది. కాబట్టి, అరఫా రోజున హాజీలు ఉపవాసం ఉండక పోవడమే సున్నత్. హాజీలు కాని ఇతరుల విషయానికొస్తే, అరఫా రోజున ఉపవాసం ఉండటం అనేది ఐచ్ఛిక (నఫిల్) ఉపవాసాలలో అత్యుత్తమమైనది. నిశ్చయంగా, ప్రవక్త ఇలా అన్నారు: “గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నేనుఆశిస్తున్నాను.”

దిల్ హిజ్జా పది రోజులలో నాలుక మరియు హృదయం యొక్క తక్బీర్ – షేక్ సాలెహ్ సిందీ

The Takbir of the Tongue & Heart During the Ten Days of Dhil Hijjah
Shaykh Saleh Sindi حفظه الله
https://youtu.be/u1LD6Yvgab0 [17 min] – Arabic | English Subtitles

సకల ప్రశంసలు మరియు కృతజ్ఞతలు ఆ అల్లాహ్‌కే చెందుతాయి; ఆయనకు సంతానం లేదు, ఆయన సార్వభౌమత్వంలో ఎవరికీ భాగస్వామ్యం లేదు, మరియు ఆయనకు అండగా నిలిచే ఏ సహాయకుడూ లేదా రక్షకుడూ అవసరం లేదు. అటువంటి అల్లాహ్‌ను అపారమైన గొప్పతనంతో ఘనపరచండి.

దారిచూపేవాడిగా, శుభవార్తలు వినిపించేవాడిగా మరియు మందలించేవాడిగా తన ప్రభువు ద్వారా పంపబడిన ఆ ప్రవక్తపై అల్లాహ్ అంతులేని శాంతి, ఆశీర్వాదాలను ప్రసాదించుగాక. ఆయన తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా, మరియు వెలుగును ప్రసరించే దీపంగా పంపబడ్డారు. ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులపై అల్లాహ్ పరిపూర్ణమైన మరియు సమృద్ధియైన శాంతి, ఆశీర్వాదాలు కురిపించుగాక.

ఓ గౌరవనీయ సోదరులారా! ఈ పవిత్రమైన పది రోజులను చేరుకునే భాగ్యాన్ని, ఆయుష్షును అల్లాహ్ మీకు ప్రసాదించినందుకు మీకు శుభాకాంక్షలు. దుల్-హిజ్జా నెలలోని మొదటి పది రోజులు ఆధ్యాత్మిక లాభాలు గడించే రుతువు, సత్కార్యాల వాణిజ్య కేంద్రం మరియు మంచితనం కోసం పోటీపడే క్షేత్రం. కాబట్టి, ఈ అదృష్టాన్ని పొందిన ప్రతి ఒక్కరూ అల్లాహ్‌ను మనసారా స్తుతించాలి. ఆయనకు ఇష్టమైన సత్కార్యాలు చేస్తూ ఈ రోజుల్లో విజయం ప్రసాదించమని వేడుకోవాలి. అల్లాహ్ మీ ఆరాధనలను అంగీకరించి మిమ్మల్ని అనుగ్రహించుగాక.

గౌరవనీయ సోదరులారా, ఈ పది రోజులలో ప్రతి గంట, ప్రతి సెకను ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మరియు దీని పుణ్యానికి సంబంధించి అల్లాహ్ ఈ పది రోజుల మీద ప్రమాణం చేయడం ఒక్కటి చాలు: “తెల్లవారుజాము సాక్షిగా, పది రాత్రుల సాక్షిగా (అంటే దుల్-హిజ్జా నెల మొదటి పది రోజులు).” [అల్-ఫజ్ర్:1-2]. ఇవి అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన రోజులు అని ప్రవక్త గారు అనేక హదీసులలో పేర్కొన్నారు. మరియు ఈ పది రోజులలో చేసిన పనులు అల్లాహ్‌కు ఇతర రోజులకంటే అత్యంత పవిత్రమైనవి మరియు ప్రియమైనవి. కాబట్టి, ఎటువంటి మినహాయింపు లేకుండా ఇవి సంవత్సరంలో అత్యుత్తమ పగళ్లు మరియు రాత్రులు. త్వరలో ముగియనున్న ఈ గంటలు మరియు ఈ క్షణాల ప్రాముఖ్యతను గుర్తించి, విజయం సాధించిన వారికి అభినందనలు. మన జీవితాలు త్వరలో అంతం కానున్నట్లే. ఓ విజేతా, కచ్చితమైన జ్ఞానం ఉన్నవాడిగా, తెలివైనవాడిగా, పవిత్రుడిగా, మేధావిగా ఉండు. ఈ జీవితకాలం యొక్క ప్రాముఖ్యతను మరియు నీ నిజమైన భవిష్యత్తు కోసం దాని ఆవశ్యకతను తెలిసినవాడిగా ఉండు.

ఈ పది రోజులలో చేసే సత్కార్యాలు అల్లాహ్ ఇష్టపడే మరియు తన దాసుల కోసం శాసించిన ప్రతిదానిని కలిగి ఉంటాయి. ఈ పది రోజులలో, సున్నత్‌పై ఆధారపడి మరియు అల్లాహ్‌కు ఇష్టమైన ప్రతి సత్కార్యానికి, అల్లాహ్ వద్ద దొరికే ప్రతిఫలం, ఇతర రోజులలో కంటే ఈ పది రోజులలో చాలా ఎక్కువ. ఇది ఈ పది రోజుల యొక్క విశిష్ట లక్షణం. అల్లాహ్ తాను కోరుకున్నది సృష్టిస్తాడు మరియు ఆయన ఎంచుకుంటాడు. ఆయన ఈ పది రోజులను ఈ విశిష్టతతో ప్రత్యేకపరిచాడు.

మరియు ఈ పది రోజుల యొక్క అత్యంత గొప్ప కార్యాలలో ఒకటి అల్లాహ్‌ను స్మరించడం. “… మరియు ఆయన వారికి ప్రసాదించిన పశువులపై నిర్ణీత రోజులలో అల్లాహ్ పేరును స్మరించండి…” [అల్-హజ్: 28]. కాబట్టి ఇవి అల్లాహ్‌ను స్మరించే రోజులు. కనుక అల్లాహ్‌ను స్మరించడాన్ని పెంచండి.

ఇమామ్ అహ్మద్ యొక్క ముస్నద్‌లో, ఇబ్న్ ఉమర్ (అల్లాహ్ అతని పట్ల ప్రసన్నుడగుగాక) హదీసులో, ప్రవక్త ఈ రోజుల గురించి ఇలా చెప్పారని ఉంది: “ఈ పది రోజుల కంటే అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన రోజులు, మరియు సత్కార్యాలు చేయడానికి ఇంతకంటే ఇష్టమైన రోజులు మరొకటి లేవు. కాబట్టి వాటిలో తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ అని చెప్పడం), తక్బీర్ (అల్లాహు అక్బర్ అని చెప్పడం) మరియు తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్ అని చెప్పడం) ఎక్కువగా చేయండి.” దీనిని ప్రవక్త చెప్పినట్లుగా అల్-ముంధిరి దీని పరంపర జయ్యిద్ (మంచిది) అని అన్నారు. కాబట్టి ఈ పది రోజులలో తన క్షణాలను గడపడానికి అల్లాహ్ స్మరణే అత్యుత్తమమైనది.

మరియు అల్లాహ్ స్మరణలో భాగమే తక్బీర్, ఇది ఈ పది రోజుల చిహ్నం. ప్రవక్త సహచరుల కాలం నుండి ఇప్పటి వరకు, ముస్లింలు ఈ పది రోజులలో తరచుగా అల్లాహ్ యొక్క తక్బీర్ చేస్తూనే ఉన్నారు. ఇబ్న్ ఉమర్, అబూ హురైరా మార్కెట్ ప్లేస్‌కు వెళ్లి తక్బీర్ చేసేవారని, మరియు వారి తక్బీర్‌తో పాటు ప్రజలు కూడా తక్బీర్ చేసేవారని అల్-బుఖారీ తన సహీహ్‌లో పేర్కొన్నారు. మరొక ఉల్లేఖనలో: ఈ ప్రయోజనం కోసం తప్ప వారిని మార్కెట్‌కు తీసుకువచ్చేది మరేదీ లేదు అని ఉంది. వారికి క్రయ విక్రయాలు జరపాలనే లక్ష్యం ఉండేది కాదు. కాకుండా, తక్బీర్ అనే ఈ పుణ్యం గురించి ప్రజలకు గుర్తు చేయడం కోసమే వారు వచ్చేవారు. గొప్ప తాబియీ అయిన మైమూన్ ఇబ్న్ మిహ్రాన్ ఇలా అన్నారు: ఈ పది రోజులలో తక్బీర్‌ను అధికంగా చేస్తున్న ప్రజలను నేను చూశాను, వారి తక్బీర్‌ల సమృద్ధి వల్ల అవి అలల వలె అనిపించేవి. మరియు ఈ పది రోజులలో సలఫ్‌ల (పూర్వీకుల) సున్నత్ నుండి బిగ్గరగా తక్బీర్‌ను పదేపదే చేయడం అనేది స్పష్టమవుతోంది. మరియు ఆరాధన కోసం ఉన్న ఈ రెండు సున్నత్‌లు ఈ కాలంలో ప్రజలలో మరుగున పడిపోవడం చాలా విచారకరం. తక్బీర్‌ను పెద్ద స్వరంతో పదేపదే చదవడం. మరియు దీనిపైనే సలఫ్‌లు (పూర్వీకులు) ఉండేవారు, అల్లాహ్ వారిని కరుణించుగాక.

పది రోజులు ప్రారంభమైనప్పటి నుండి అవి పూర్తయ్యే వరకు తక్బీర్ మొదలవుతుంది. మరియు దీనికి అత్యుత్తమ సమయం అరఫా రోజు మరియు బలిదానపు రోజు (ఈద్ రోజు). కాబట్టి సహచరుల ఉల్లేఖనలు సూచించినట్లుగా ఈ రెండు రోజులలో మరియు తష్రీఖ్ రోజుల నుండి అనుసరించే రోజులలో ఉత్తమ తక్బీర్ చేయబడుతుంది. ప్రవక్త నుండి ఉల్లేఖించబడిన నిర్దిష్ట తక్బీర్ రూపం ఏదీ లేదు. బదులుగా, ఈ పది రోజులలో ఎలాంటి షరతులు లేకుండా తక్బీర్ చేయడానికి సంబంధించి సహచరుల నుండి ఉల్లేఖనలు ఉన్నాయి. మరియు అరఫా రోజు, బలిదానపు రోజు మరియు తష్రీఖ్ రోజుల కొరకు, సహచరుల ద్వారా నిర్దిష్ట రూపాల్లో తక్బీర్ తెలుపబడింది. కాబట్టి ఈ విషయంలో సడలింపు ఉంది. మీరు కోరుకుంటే, సలఫ్‌ల (పూర్వీకుల) నుండి నేటి వరకు వచ్చిన ప్రసిద్ధ తక్బీర్‌ను మీరు చదవవచ్చు:

‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్’
(الله اكبر الله اكبر لا اله الا الله و الله اكبر الله اكبر ولله الحمد).

ఇది ఇబ్న్ మస్ఊద్ యొక్క తక్బీర్. మరియు ఇది అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మరియు ఇతరుల నుండి కూడా ఉల్లేఖించబడింది. మరియు దీనినే సలఫ్‌లు ఉపయోగించేవారు. జఫర్ అల్-ఫిర్యాబీ యజీద్ ఇబ్న్ జియాద్ ద్వారా ఉల్లేఖించారు: సయీద్ ఇబ్న్ జుబైర్, అబ్దుర్రహ్మాన్ ఇబ్న్ అబీ లైలా, ముజాహిద్, లేదా ఈ ముగ్గురిలో ఇద్దరు – ఆయనకు కచ్చితంగా గుర్తులేదు – మరియు ఫికహ్ పండితులు ఈ పది రోజులలో ఇలా తక్బీర్ చేయడం నేను చూశాను: ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్’. హదీసు ప్రోత్సహించిన తక్బీర్, తహ్మీద్ మరియు తహ్లీల్ అన్నీ ఈ రూపంలో కలగలిపి ఉన్నాయి. కాబట్టి తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహు అక్బర్) మరియు తహ్మీద్ (అల్హమ్దులిల్లాహ్) లను ఎక్కువగా చదవండి.

మీరు కోరుకుంటే, మీరు తక్బీర్‌ను మరొక రూపంలో కూడా చేయవచ్చు. సల్మాన్ యొక్క తక్బీర్ లాగా:

‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ కబీరా’
(الله اكبر الله اكبر الله اكبر كبيرا).

మీరు కోరుకుంటే, మీరు ఇబ్న్ అబ్బాస్ యొక్క తక్బీర్ చేయవచ్చు:

‘అల్లాహు అక్బర్ కబీరా అల్లాహు అక్బర్ కబీరా అల్లాహు అక్బర్ వాజల్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్’
(الله اكبر كبيرا الله اكبر كبيرا الله اكبر واجل الله اكبر ولله الحمد).

మీరు కోరుకుంటే మరో రూపంలో తక్బీర్ చేయవచ్చు. లేదా మీరు కోరుకుంటే కేవలం ‘అల్లాహు అక్బర్’ (الله اكبر) అని పునరావృతం చేయవచ్చు. కాబట్టి ఈ ఉల్లేఖనల వైవిధ్యాలు ఈ విషయంలో అనుకూలత ఉందని చూపుతున్నాయి. మరియు సర్వ ప్రశంసలు అల్లాహ్‌కే దక్కుతాయి. సోదరులారా, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ఈ పది రోజులలో తక్బీర్‌ను ఎక్కువగా చదవడం మీకు శ్రేయస్కరం మరియు అనుకూలమైనది.

మరియు దీనికంటే ఉత్తమమైనది ఏమిటంటే, మీరు దాని అర్థాన్ని గ్రహించి, ఆ అర్థాన్ని మీ హృదయంలో నెలకొల్పుకోవడం. ‘అల్లాహు అక్బర్’. ఈ వాక్యాన్ని మీరు పదేపదే ఎలా పునరావృతం చేస్తున్నారో గమనించండి.

అసలు ‘అల్లాహు అక్బర్’ అర్థం ఏమిటి?

ఇబ్న్ అత్తియ్యా మరియు అల్-ఖుర్తుబీ వంటి జ్ఞానవంతులు మరియు తఫ్సీర్ పండితులు ఇలా అంటారు: “అరబ్బులు అల్లాహ్ మహిమను మరియు గొప్పతనాన్ని వ్యక్తీకరించడానికి చెప్పగలిగే అత్యంత గాఢమైన పదం తక్బీర్ వాక్యం: అల్లాహు అక్బర్ (الله اكبر).” “మరియు ఆయనను సర్వోన్నతమైన వైభవంతో కీర్తించండి” [అల్-ఇస్రా: 111] అని అల్లాహ్ ఆజ్ఞాపించింది కూడా దీనినే. అల్లాహ్ తన అస్తిత్వం పరంగా అన్నింటికంటే గొప్పవాడు. అల్లాహ్ తన గుణగణాల పరంగా అన్నింటికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన వినికిడి ప్రతి వినికిడి కంటే గొప్పది. మరియు ఆయన చూపు ప్రతి చూపు కంటే గొప్పది. ఆయన గౌరవం, దయ, ప్రేమ మరియు శక్తి ఆయన కాని ఇతరుల లక్షణాల కంటే గొప్పవి. కాబట్టి ఆయన తన లక్షణాల విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. మరియు ఆయన తన శక్తి విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. మరియు ఆయన తన స్తుతికి సంబంధించి (అన్నింటికంటే) గొప్పవాడు. ఆయన సృష్టిలో అత్యంత జ్ఞానవంతుడైన మన ప్రవక్త ముహమ్మద్ కూడా, అల్లాహ్‌ను స్తుతించాల్సిన రీతిలో స్తుతించలేకపోయారు. ఆయన ఇలా అన్నారు: “నిన్ను స్తుతించాల్సిన రీతిలో నేను నిన్ను స్తుతించలేను, నిన్ను నీవు స్తుతించుకున్నట్లుగానే నీవు ఉన్నావు.” అల్లాహ్ తన కరుణ విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. అల్లాహ్ తన స్మరణ విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. అల్లాహ్ తన కోపం విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. అల్లాహ్ తన ప్రతీకారం విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. అల్లాహ్ తన శిక్ష విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. అల్లాహ్ ప్రతిదాని విషయంలో (అన్నింటికంటే) గొప్పవాడు. మరియు ఈ పరిమితి లేకపోవడం అనేది సార్వత్రికతను సూచిస్తుంది. కాబట్టి సోదరులారా, తక్బీర్ యొక్క అర్థం ఇదే.

నాలుకతో తక్బీర్ చేయడం అనేది మంచి విషయం మరియు అది ఒక సున్నత్ అని తెలుసుకోండి, అయితే హృదయంతో తక్బీర్ చేయడం అనేది మరింత గొప్పది మరియు మరింత తప్పనిసరి (విధి). నమాజు కాకుండా ఇతర సమయాల్లో నాలుకతో తక్బీర్ చేయడం అనేది సున్నత్. అయినప్పటికీ, హృదయంతో చేసే తక్బీర్ అనేది తప్పనిసరి. నాలుక యొక్క తక్బీర్ కొన్ని సమయాల్లో మాత్రమే అవసరం, కానీ హృదయపు తక్బీర్ ఎల్లప్పుడూ తప్పనిసరి.

మరియు తక్బీర్ యొక్క ఈ పునరావృతం: ‘అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్’ (الله اكبر الله اكبر الله اكبر) ఈ అర్థాన్ని మీ హృదయంలో నెలకొల్పుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, తద్వారా అఖీదా (విశ్వాసం) దృఢంగా నాటుకుపోతుంది. ఇది హృదయాన్ని ప్రభావితం చేస్తుంది మరియు దానికి బదులుగా అది అవయవాలను ప్రభావితం చేస్తుంది. ముస్లిం ఈ వాస్తవాన్ని గుర్తించి, దానిని దృఢంగా విశ్వసించి, లోపల మరియు వెలుపల దాని ఆవశ్యకతకు అనుగుణంగా ప్రవర్తిస్తే, అల్లాహ్ సాక్షిగా, అతను ఇతరులకు భిన్నమైన జీవితాన్ని గడుపుతాడు. అతను వేరొక జీవితాన్ని జీవిస్తాడు.

ఎవరు తన హృదయంలో అల్లాహ్‌ను గొప్పగా భావిస్తాడో, అతని హృదయం నుండి అల్లాహ్ తప్ప మిగతావన్నీ మాయమయ్యేంత వరకు ఆ గొప్పతనం పెరుగుతూనే ఉంటుంది. అతను ఆయనకు తప్ప మరెవరికీ ఎలాంటి ఆరాధన చేయడు, ఆశ లేదా భయం, ప్రేమ లేదా ప్రార్థన, లేదా త్యాగం ఏదీ కూడా ఇతరుల కోసం చేయడు. అలాంటప్పుడు హృదయం అల్లాహ్ కాని వారి వైపు ఎందుకు మళ్లుతుంది? మరియు అల్లాహ్ కాని వారి చేత అవయవాలు ఎందుకు ప్రేరేపించబడతాయి? కాబట్టే, బహుదేవతారాధకులు (ముష్రిక్కులు) తమ హృదయాలలో అల్లాహ్‌ను గొప్పగా భావించలేదు. “అల్లాహ్‌ను ఏ విధంగా గౌరవించాలో వారు ఆ విధంగా గౌరవించలేదు…” [అజ్-జుమర్: 67]. అవును, అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ కాని వారిని ప్రార్థించేవాడు. ఓ అల్లాహ్ ప్రవక్తా, నాకు ఉపశమనం ప్రసాదించు అనేవాడు. మానవాళిలో అత్యంత దయగలవాడా, విస్తృతమైన విపత్తు సంభవించిన సమయంలో నాకు నీవు తప్ప ఆశ్రయం ఇవ్వడానికి ఎవరూ లేరు అని అనేవాడు. అల్లాహ్ సాక్షిగా, వారు తమ హృదయాలలో అల్లాహ్‌ను గొప్పగా భావించలేదు. తన హృదయంలో అల్లాహ్‌ను గొప్పగా భావించేవాడి హృదయం నుండి అల్లాహ్ తప్ప మిగతావన్నీ మాయమవుతాయి. అతనికి మట్టిపైన ఉన్నదంతా మట్టే. ఎందుకంటే అల్లాహ్‌యే అత్యంత గొప్పవాడని అతను నమ్ముతాడు కాబట్టి.

ఎవరు తన హృదయంలో అల్లాహ్‌ను గొప్పగా భావిస్తాడో, అతని అవయవాలు అల్లాహ్‌కు విధేయత చూపడానికి ప్రేరేపించబడతాయి. అతను ఆయన ఆజ్ఞలను మరియు నిషేధాలను గౌరవిస్తాడు. అతను అల్లాహ్ ఆజ్ఞను అమలు చేయడానికి పిలువబడితే, అతను నమాజుకు పిలువబడితే, అతనికి ‘అల్లాహు అక్బర్’ అని గుర్తు చేయబడుతుంది. అతనికి భయం కలిగి లేచి నిలబడతాడు. ఎందుకంటే అల్లాహ్‌యే అత్యంత గొప్పవాడు కాబట్టి. మీ ప్రాపంచిక జీవితం, మీ కోరికలు, మీ వ్యాపారం, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ చదువులు, ఈ జీవితంలో ఉన్న ప్రతిదాని కంటే ఆయనే గొప్పవాడు. అందువల్ల, ఆయన ఆజ్ఞ గొప్పది. మీరు ఆయన నిషేధాలను గౌరవించడం దీనికి అవసరం. ఆయన నిషేధాలు ఎంత భయంకరమైనవో మీకు తెలుసు కాబట్టి మీరు అల్లాహ్ నిషేధించిన వాటిని నివారిస్తారు. మరియు దానికి పర్యవసానంగా వచ్చే శిక్ష కూడా చాలా భయంకరమైనది. తన హృదయంలో ఆయనను గొప్పగా భావించే వాని హృదయంలో, తనకు ప్రియమైనవి తగ్గిపోతాయి. కాబట్టి అతను అల్లాహ్‌ను, లేదా అల్లాహ్ ఇష్టపడే వాటిని, లేదా ఆయన అనుమతించిన వాటిని తప్ప దేనినీ ప్రేమించని స్థాయికి చేరుకుంటాడు.

ఎవరు తన హృదయంలో అల్లాహ్‌ను గొప్పగా భావిస్తాడో, తన ప్రభువుపై అతని ఆధారపడటం, అతని నమ్మకం మరియు అతని విశ్వాసం నిజమని రుజువు అవుతాయి. అతను ఆయన తప్ప వేరెవరి పట్లా ఆసక్తి చూపడు. మరియు అతను ఆయన తప్ప వేరెవరి గురించి పట్టించుకోడు. అందువల్ల, ప్రాపంచిక జీవితం యొక్క ఆందోళనలు మరియు సమస్యలు హృదయంలో అల్పంగా మారిపోవడాన్ని మీరు కనుగొంటారు ఎందుకంటే అతను అన్నింటికంటే గొప్పవాడైన ఆయనపైనే ఆధారపడి ఉంటాడు. ఎవరు అల్లాహ్‌ను తన హృదయంలో గొప్పగా భావిస్తాడో, నేను చెప్పినట్లుగా, అతను ఈ జీవితం కంటే భిన్నమైన జీవితాన్ని గడుపుతాడు. అతను అల్లాహ్‌తో జీవిస్తాడు మరియు అల్లాహ్ కోసం జీవిస్తాడు.

మతం, దాని ప్రారంభం నుండి అంతం వరకు, తౌహీద్ (ఏకదైవారాధన) స్థాపన అంతా ఈ వాక్యంలోనే సేకరించబడింది: అల్లాహు అక్బర్. అయితే ఒకరు దానిని నాలుకతో ఉచ్ఛరించినా, దాని అర్థం అతని హృదయంలోకి చొచ్చుకుపోకపోతే, అతని హృదయంలో అది దృఢంగా స్థిరపడకపోతే, అది సత్యం కాదు.

అందువల్ల, ఓ అల్లాహ్ దాసుడా, ఈ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో, మరియు నీ హృదయంలో అల్లాహ్‌ను అన్నింటికంటే గొప్పగా చేయడానికి నీ ఆత్మపై పోరాడు. నీ నాలుకతో ఆయనను ఎంత గొప్పగా కీర్తిస్తావో, నీ హృదయంతో కూడా అల్లాహ్‌ను అంతే గొప్పగా కీర్తించడానికి నీ ఆత్మపై పోరాడు.

ఈ అపారమైన, ఉన్నతమైన మరియు గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం పొందిన వారిలో మనల్ని చేర్చమని నేను అల్లాహ్‌ను వేడుకుంటున్నాను. అలాగే ఆయన మన హృదయాలను ఆయన ప్రేమతో నింపాలని మరియు ఆయనకు విధేయత చూపడంలో మనకు విజయాన్ని ప్రసాదించాలని ఆయనను వేడుకుంటున్నాను. అల్లాహ్ తన దాసుడు మరియు సందేశహరుడు అయిన మన ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు వారిని అనుసరించే వారిపై శాంతి, శుభాలు మరియు ఆశీర్వాదాలు కురిపించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45572

జిల్-హిజ్జా మొదటి పది రోజులు – షేక్ ముహమ్మద్ ఇబ్న్ సాలెహ్ అల్-ఉతైమీన్

The First Ten Days of Dhil Hijjah
by Shaykh Muhammad ibn Sāleh al Uthaymīn [Video|Ar-En Subtitles]
https://youtu.be/hnTr-xr7yGA [3 min]

జిల్-హిజ్జా నెల ప్రవేశించగానే జిల్-హిజ్జా మొదటి పది రోజులు ప్రారంభమవుతాయి. ఇది బలిదానం చేసే పండుగ అయిన ‘ఈద్ (బక్రీద్) రోజుతో ముగుస్తుంది. ఈ రోజుల్లో చేసే సత్కార్యాల గురించి అల్లాహ్ ప్రవక్త ﷺ ఇలా అన్నారు: “ఈ పది రోజులలో చేసే సత్కార్యాల కంటే అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన సత్కార్యాలు చేసే రోజులు మరొకటి లేవు.” అప్పుడు ప్రజలు, “అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్ కూడా కాదా?” అని అడిగారు. దానికి ఆయన ﷺ ఇలా బదులిచ్చారు, “అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్ కూడా కాదు. కానీ, తన ప్రాణాన్ని, సంపదను పణంగా పెట్టి (అల్లాహ్ మార్గంలో) పోరాడటానికి వెళ్లి, ఏమీ తిరిగి తీసుకురాని (అనగా ప్రాణత్యాగం చేసిన) వ్యక్తి మినహా.”

అందువల్ల, నా ముస్లిం సోదరులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరియు ఈ జిల్-హిజ్జా పది రోజులలో సత్కార్యాలను పెంచుకోవాలని నేను ప్రోత్సహిస్తున్నాను. ఖుర్ఆన్ పఠించడం, వివిధ రకాలుగా అల్లాహ్ స్మరణ (జిక్ర్) చేయడం (అంటే అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, మరియు సుబ్హానల్లాహ్ అని పఠించడం), దానధర్మాలు, ఉపవాసం వంటి ప్రతి సత్కార్యం చేయడానికి కృషి చేయండి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ పది రోజుల విషయంలో ప్రజలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. రమజాన్ చివరి పది (రాత్రుల)లో వారు ఎంతగానో శ్రమిస్తారో (కృషి చేస్తారో) మీరు గమనిస్తారు కదా? అవును, వారు ఎంతో శ్రమిస్తారు! కానీ ఈ జిల్-హిజ్జా పది (రోజుల)లో, వీటికి మరియు ఇతర రోజులకు మధ్య వ్యత్యాసం చూపే వారు చాలా అరుదుగా కనిపిస్తారు! అయితే, ఎవరైనా ఈ పది (రోజుల)లో సత్కార్యాలు చేస్తే, అతను అల్లాహ్ ప్రవక్త ﷺ మార్గనిర్దేశం చేసిన సత్కార్యాల విధానాన్ని పునరుజ్జీవింపజేసినవాడవుతాడు.

ఈ పది (రోజులు) ప్రారంభమైన తర్వాత ఎవరైనా ఖుర్బానీ (బలిదానం) చేయాలనుకుంటే, అతను తన జుట్టు, గోర్లు లేదా చర్మం నుండి దేనినీ కత్తిరించకూడదు. అతను వీటిలో దేనినీ కత్తిరించుకోడు. అతను స్వయంగా ఖుర్బానీ చేయాలనుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఒకవేళ తాను వేరొకరి తరఫున ఖుర్బానీ చేస్తుంటే, అప్పుడు ఎలాంటి సమస్య లేదు. కాబట్టి ఒక వ్యక్తి తన ఇంటి సభ్యులందరి తరఫున ఖుర్బానీ చేయాలనుకుంటే, సున్నత్ ప్రకారం అతను ఒక్క ఖుర్బానీ చేస్తే సరిపోతుంది. జుట్టు, గోర్లు లేదా చర్మాన్ని కత్తిరించుకోకుండా ఉండాలనే నియమం ఇంట్లోని మిగతా సభ్యులపై తప్పనిసరి (విధి) కాదు. మరి ఇది ఎవరికి తప్పనిసరి? ఖుర్బానీ ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రమే, అనగా (ఇంటి పెద్ద అయిన) తండ్రికి.

ఇక మీరు వినే ఒక మాట—”ఖుర్బానీ చేసే వ్యక్తి మరియు ఎవరి తరపున ఖుర్బానీ చేయబడుతోందో ఆ వ్యక్తులందరికీ (జుట్టు, గోర్లు, చర్మం కత్తిరించుకోవడం) నిషేధించబడింది” అనేది—కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. అయితే హదీసు విషయానికొస్తే, ప్రవక్త ﷺ ఇలా అన్నారు, “మీలో ఎవరైనా ఖుర్బానీ చేయాలనుకుంటే, అతను తన జుట్టు లేదా గోర్ల నుండి దేనినీ కత్తిరించుకోకుండా ఉండనివ్వండి.” ఆయన ﷺ తన మాటను కేవలం ఖుర్బానీ చేయాలనుకునే వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే చెప్పారు.

అలీ (రదియల్లాహు అన్హు) హితబోధ : ధర్మ జ్ఞానం యొక్క విశిష్టత

అల్-ఇస్తిఖామహ్ మ్యాగజైన్, సంచిక నం.6 – జుల్-ఖైదా 1417 హిజ్రీ / మార్చి 1997
మూలం: https://abdurrahman.org/2014/01/15/advice-of-alee/

హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) కుమైల్ ఇబ్న్ జియాద్ కు చేసిన ఈ హితబోధలో జ్ఞానం (ఇల్మ్) యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు: సత్యమార్గాన్ని చూపే నిజమైన పండితులు, జ్ఞానాన్ని అభ్యసించేవారు, మరియు సరైన అవగాహన లేకుండా ఇతరులను గుడ్డిగా అనుసరించే సామాన్యులు. సంపదను మనమే రక్షించుకోవాలని, ఖర్చు చేస్తే అది తగ్గిపోతుందని, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుందని, ఆచరించిన కొద్దీ అది పెరుగుతుందని తెలుపుతూ సంపద కంటే జ్ఞానమే అత్యుత్తమమైనదని ఆయన నొక్కి చెప్పారు. ధర్మాన్ని ప్రాపంచిక ప్రయోజనాల కోసం వాడుకునే వారి గురించి హెచ్చరిస్తూనే, అల్లాహ్ యొక్క సత్య మార్గాన్ని మరియు ఆయన ఆధారాలను కాపాడే అత్యంత విలువైన పండితులు భూమిపై ఎల్లప్పుడూ కొద్దిమందైనా ఉంటారని, వారే ఈ లోకంలో అల్లాహ్ యొక్క రాయబారులని ఆయన స్పష్టం చేశారు.

కుమైల్ ఇబ్న్ జియాద్ ఇలా అన్నారు: ‘అలీ ఇబ్న్ అబీ తాలిబ్ నా చేయి పట్టుకుని నన్ను ఎడారి వైపు తీసుకువెళ్ళారు. మేము అక్కడికి చేరుకోగానే, ఆయన కూర్చుని, ఒక దీర్ఘశ్వాస తీసుకుని ఇలా అన్నారు:

ఓ కుమైల్ ఇబ్న్ జియాద్! హృదయాలు పాత్రల లాంటివి. వాటిలో ఏది ఉత్తమంగా భద్రపరుస్తుందో అదే అత్యుత్తమమైనది. కాబట్టి నేను నీకు చెబుతున్నది జ్ఞాపకం పెట్టుకో.

ప్రజలు మూడు రకాలు: రబ్బానీ[1] అయిన పండితుడు (ఆలిమ్), మోక్ష మార్గంలో జ్ఞానాన్ని అభ్యసించేవాడు, మరియు పిలిచే ప్రతి ఒక్కరినీ గుడ్డిగా అనుసరించే గందరగోళానికి గురైన సామాన్య జనం. వీరు వీచే ప్రతి గాలికి వంగిపోతారు, వీరు జ్ఞానపు కాంతితో ప్రకాశించరు మరియు ఏ విధమైన దృఢమైన పునాది (ఆధారం) కలిగి ఉండరు.

సంపద కంటే జ్ఞానం అత్యుత్తమమైనది. జ్ఞానం నిన్ను రక్షిస్తుంది, కానీ సంపదను నువ్వే రక్షించుకోవాలి. జ్ఞానానికి జకాత్ ‘ఆచరణ’, అయితే ఖర్చు చేయడం వల్ల సంపద తగ్గిపోతుంది. పండితుడిని ప్రేమించడం ధర్మంలో (దీన్‌లో) ఒక భాగం. జ్ఞానం పండితునికి అతని జీవితకాలంలో విధేయతను తెచ్చిపెడుతుంది మరియు మరణం తర్వాత అతనికి సత్కీర్తిని కలిగిస్తుంది, కానీ సంపద వల్ల కలిగే ప్రయోజనం అది నశించగానే ఆగిపోతుంది. సంపదను కూడబెట్టే వారు బ్రతికి ఉన్నప్పటికీ చనిపోయినవారితో సమానం, కానీ కాలం ఉన్నంత కాలం పండితులు సజీవంగానే ఉంటారు – వారి దేహాలు మాయమైనా, వారి ఆదర్శాలు (ఉదాహరణలు) హృదయాలలో నిలిచిపోతాయి.

ఇక్కడ, నిశ్చయంగా ఇక్కడే – (అని ఆయన తన ఛాతీ వైపు చూపించారు) – అపారమైన జ్ఞానం ఉంది, దీనిని మోయగలిగే వారు (వారసులు) నాకు దొరికితే ఎంత బాగుండు! కానీ దానికి బదులుగా తొందరగా గ్రహించే సామర్థ్యం ఉండి కూడా, నమ్మకానికి పాత్రులు కాని వారిని నేను చూశాను. వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం ధర్మాన్ని ఉపయోగిస్తారు. సత్యవంతులను అనుసరిస్తున్నప్పటికీ, దాన్ని స్వీకరించే విషయంలో వారికి ఎలాంటి అంతర్దృష్టి (సరియైన అవగాహన) లేదు. వీరు అల్లాహ్ గ్రంథానికి వ్యతిరేకంగా, అల్లాహ్ యొక్క ఆధారాలనే వాడుకోవాలని ప్రయత్నిస్తారు.

ఏదైనా సమస్యాత్మకమైన విషయం ఎదురైనప్పుడు సందేహం వారి హృదయాలను చీలుస్తుంది. వారు ఇటు గానీ అటు గానీ ఉండరు. సత్యం ఎక్కడ ఉందో వారికి తెలియదు, ఒకవేళ వారు తప్పు చేస్తే ఎందుకు చేశారో కూడా వారికి తెలియదు. వారు తమకు ఏమాత్రం వాస్తవం తెలియని ఏదో ఒకదానితో తీవ్రమైన వ్యామోహంలో పడతారు – అందువల్ల వారు ఇతరులకు ఒక ఫితనా (పరీక్ష/విపత్తు) గా మారతారు.

నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికైతే ధర్మం (దీన్) పట్ల అవగాహన ప్రసాదిస్తాడో అతనే అత్యుత్తముడు. ఒక వ్యక్తికి తన ధర్మం గురించి తెలియకపోవడమే అతని అజ్ఞానానికి తగిన నిదర్శనం. అటువంటి వ్యక్తి ప్రాపంచిక సుఖాలకు తీవ్రంగా బానిస అవుతాడు, మనోవాంఛలను అనుసరించడానికి అలవాటు పడతాడు లేదా సంపదను పోగుచేయడం, కుప్పలు తెప్పలుగా కూడబెట్టడానికే అంకితమవుతాడు. అటువంటి వ్యక్తులు ధర్మం వైపు పిలిచే వారు కారు, వారు కేవలం మేత మేసే పశువుల లాంటి వారు. ఈ విధంగా జ్ఞానాన్ని మోసేవారు మరణించడంతో జ్ఞానం కూడా అంతరించిపోతుంది.

అవును! అల్లాహ్ యొక్క ఆధారాలు మరియు స్పష్టమైన సంకేతాలు అంతరించిపోకుండా ఉండటం కోసం, అల్లాహ్ కొరకు ఆధారాలతో నిలబడే వారు లేకుండా ఈ భూమి ఎప్పుడూ ఉండదు. వారు సంఖ్యలో చాలా తక్కువగా ఉంటారు, కానీ అల్లాహ్ దృష్టిలో అత్యంత విలువైనవారు. వారి ద్వారా, అల్లాహ్ తన ఆధారాలను వారి సమకాలీనులలో స్థిరపరుస్తాడు మరియు వాటిని వారిలాంటి వారి హృదయాలలో నాటుతాడు. వారితో, జ్ఞానం వాస్తవ పరిస్థితులను ఛేదిస్తుంది, తద్వారా సులభమైన జీవితానికి అలవాటు పడిన వారికి ఏది కష్టంగా అనిపిస్తుందో, దానిని వీరు తేలికగా భావిస్తారు; అజ్ఞానులను భయపెట్టే విషయాలతో వీరు ప్రశాంతంగా ఉంటారు. వారు ఈ లోకంలో తమ దేహాలతో జీవిస్తారు, కానీ వారి ఆత్మలు ఉన్నతమైన విషయాలకు అనుసంధానించబడి ఉంటాయి. వారు అల్లాహ్ భూమిపై ఆయన రాయబారులు మరియు ఆయన ధర్మం వైపు పిలిచేవారు (దాఈలు). ఆహా! వారిని చూడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నేను నా కోసం, నీ కోసం అల్లాహ్ క్షమాపణ కోరుతున్నాను. నీకు ఇష్టమైతే, నువ్వు ఇక వెళ్ళవచ్చు.” [2]

[1] రబ్బానీ (Rabbaanee): తన జ్ఞానానికి అనుగుణంగా ఆచరించే పండితుడు (ఆలిమ్) మరియు ప్రజల పరిస్థితి పట్ల అంతర్దృష్టి కలిగినవాడు – అతను ప్రజలకు లోతైన మరియు కష్టమైన విషయాల కంటే ముందు, జ్ఞానం యొక్క ప్రాథమిక విషయాలను నేర్పి, వారి స్థాయిని పెంచుతాడు.

[2] అబూ నుయైమ్ చే ‘హిల్వతుల్-ఔలియా‘ (1/79-80) లో, అల్-ఖతీబ్ అల్-బగ్దాదీ చే ‘అల్-ఫఖీహ్ వల్-ముతఫక్కిహ్‘ (1/49-50) లో, మరియు ఇబ్న్ కసీర్ చే ‘అల్-బిదాయహ్ వన్-నిహాయహ్‘ (9/47) లో ఉల్లేఖించబడింది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45477

అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు) | షేక్ అబ్దుర్రహ్మాన్ అల్-సఅదీ | షేక్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

[6] Al-Quddus (The Holy) , As-Salam (The One Free From all Defects) – The Names of Allah
Shaykh Abdurahman al-Si’di — Explained by Shaykh Abdurrazzaq al-Badr
https://youtu.be/fRvZPM9L9nQ [Arabic | English Subtitles] [19 Min]

ఆయన (షేక్ అబ్దుర్రహ్మాన్ అల్-సఅదీ, రహిమహుల్లాహ్) చెప్పారు:

ఇవి అల్లాహ్ యొక్క రెండు పేర్లు: అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు). ఇవి అల్లాహ్ ను లోపరహితుడిగా (పరిపూర్ణుడిగా) ప్రకటించే పేర్లు. ఎందుకంటే సాధారణంగా అల్లాహ్ పేర్లను అవి సూచించే అర్థాల ఆధారంగా వర్గీకరించవచ్చు. కొన్ని పేర్లు ఆయన ఉనికికి సంబంధించిన గుణాలను సూచిస్తాయి, కొన్ని పేర్లు ఆయన చర్యలకు సంబంధించిన గుణాలను సూచిస్తాయి, మరియు కొన్ని పేర్లు ఒకే అర్థాన్ని కాకుండా బహుళ అర్థాలను సూచిస్తాయి. రచయిత ‘అత్యున్నతమైన పేరు’ (ఇస్మె ఆజమ్) గురించి మాట్లాడినప్పుడు ఇదివరకే ప్రస్తావించబడింది.

బహుళ అర్థాలను సూచించే పేర్లు కూడా ఉన్నాయి, ఉదాహరణకు: అల్-ముహీత్ (సర్వవ్యాపకుడు), అల్-మజీద్ (మహిమాన్వితుడు), అల్-హమీద్ (సర్వ స్తోత్రాలకు అర్హుడు) మరియు అస్-సమద్ (స్వయం సమృద్ధుడు, ఎవరి అవసరం లేనివాడు). ఇవన్నీ ఒకే అర్థాన్ని కాకుండా బహుళ అర్థాలను సూచిస్తాయి.

అల్లాహ్ ను లోపరహితుడిగా (పరిశుద్ధుడిగా) ప్రకటించే పేర్ల వర్గం కూడా ఒకటి ఉంది, వాటిలో ఖుర్ఆన్ లో ప్రస్తావించబడిన ఈ రెండు పేర్లు కూడా ఉన్నాయి: అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు). వీటికి సమానమైన మూడవ పేరు మన ప్రవక్త ﷺ సున్నత్ లో ప్రస్తావించబడింది, అదే: అస్-సుబ్బూహ్ (సర్వ లోపాలకు అతీతుడు). ఇది కూడా అల్లాహ్ పేర్లలో ఒకటి, మరియు ఇది కూడా అల్లాహ్ ను లోపరహితుడిగా ప్రకటిస్తుంది.

ప్రవక్త ﷺ తన రుకూ మరియు సుజూద్ లలో ఈ విధంగా అనేవారని ప్రామాణికంగా నివేదించబడింది: “సుబ్బూహున్ (సర్వ లోపాలకు అతీతుడు), ఖుద్దూసున్ (పరమ పవిత్రుడు), రబ్బుల్ మలాయికతు వర్రూహ్ (దూతలకు మరియు రూహ్ కు ప్రభువు).” ఆయన తన రుకూ మరియు సుజూద్ లలో అస్-సుబ్బూహ్, అల్-ఖుద్దూస్ అనే రెండు పేర్లను కలిపి పఠించేవారు. ఈ స్థానంలో ఈ రెండు పేర్లను కలపడం అనేది అల్లాహ్ దూతల గురించి ప్రస్తావించిన దానికి సరిపోలుతుంది:

﴿وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ﴾
“మేము నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!!” [అల్-బఖరహ్ 2:30]
ఇక్కడ వారు (దూతలు) స్తోత్రము (తస్బీహ్) మరియు పవిత్రీకరణ (తఖ్ దీస్) లను కలిపారు.

సారాంశంలో, అల్లాహ్ యొక్క ఈ మూడు పేర్లు – అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు) మరియు అస్-సుబ్బూహ్ (సర్వ లోపాలకు అతీతుడు) – ఇవన్నీ అల్లాహ్ ను లోపరహితుడిగా ప్రకటించే పేర్లు, మరియు ఆయనకు తగని ప్రతి దానికంటే అల్లాహ్ ఎంతో ఉన్నతుడని ధృవీకరిస్తాయి.

షేక్ అన్నారు:

వారిలో మేధస్సును, వినగల శక్తిని, చూడగల శక్తిని మరియు బాహ్య, అంతర్గత శక్తులను సృష్టించినవాడు ఆయనే; వారికి బోధించినవాడు మరియు ప్రేరణ ఇచ్చినవాడు ఆయనే; వారిని బాహ్యంగా మరియు అంతర్గతంగా ఎదగనిచ్చి, వారిని పరిపూర్ణం చేసినవాడు ఆయనే. ప్రవక్తలు మరియు దూతలు ఇలా అన్నారు:

﴿لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا﴾
“నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు.”[అల్-బఖరహ్ 2:32]

మరియు హదీసే ఖుద్సీలో, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఓ నా దాసులారా, నేను మార్గదర్శకత్వం చేసిన వారు తప్ప మీరంతా దారి తప్పినవారే, కాబట్టి నా నుండి మార్గదర్శకత్వాన్ని వేడుకోండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా, నేను ఆహారం పెట్టిన వారు తప్ప మీరంతా ఆకలితో ఉన్నవారే…”

కాబట్టి ఆయన కీర్తి, గొప్పతనం మరియు పరిపూర్ణత వంటి గుణాలకు విరుద్ధమైన ప్రతి దానికీ అతీతుడు. మరియు ఆయనకు ఏ వ్యతిరేకత, ప్రత్యర్థి, సమానుడు లేదా పోలిక ఉండటానికి ఆయన అతీతుడు. ఇదంతా ఆయన పేర్లలో చేర్చబడింది: అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు).

షేక్ అన్నారు: “ఆయన ఏయే విషయాలకు అతీతుడో, వాటిని మొత్తం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు…”

అల్-ఖుద్దూస్, అస్-సలామ్ అనే ఈ రెండు పేర్లు, అలాగే సున్నత్ లో నిర్ధారించబడిన మూడవ పేరు అస్-సుబ్బూహ్ ఇవన్నీ అల్లాహ్ సర్వ లోపాలకు అతీతుడని సూచిస్తున్నాయని మనం తెలుసుకున్నాము. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

﴿سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ ۝ وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ ۝ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ﴾
“వారు వర్ణించే (దుర్లక్షణాల) నుండి నీ ప్రభువు, సర్వాధికారాల ప్రభువు, ఎంతో పవిత్రుడు. ۝ మరియు ప్రవక్తలందరిపై శాంతి కలుగుగాక. ۝ మరియు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.”[అస్-సాఫ్ఫాత్ 37:180-182]

﴿వారు వర్ణించే (దుర్లక్షణాల) నుండి నీ ప్రభువు, సర్వాధికారాల ప్రభువు, ఎంతో పవిత్రుడు…﴾ అనగా ప్రవక్తల శత్రువులు మరియు ఆయన ధర్మానికి శత్రువులు అయిన వారు, ఆయన ఘనతకు, పరిపూర్ణతకు మరియు గొప్పతనానికి తగని విషయాలను ఆయనకు ఆపాదిస్తున్నారు, వాటన్నింటికీ అల్లాహ్ అతీతుడు మరియు పరిశుద్ధుడు అని అర్థం.

అందువల్ల, అల్లాహ్ కు తగనిది ఏదైనా ఆయనకు ఆపాదించబడినప్పుడు, విశ్వాసి యొక్క కర్తవ్యం ఏమిటంటే, తన ప్రభువును దానికి అతీతుడిగా ప్రకటించడం మరియు తన యజమానిని పవిత్రపరచడం.

﴿وَقَالُوا اتَّخَذَ الرَّحْمَٰنُ وَلَدًا ۗ سُبْحَانَهُ﴾
“మరియు వారు అన్నారు: అనంత కరుణామయుడు ఒక కుమారుని సంతానంగా చేసుకున్నాడని. (కానీ) ఆయన ఎంతో పవిత్రుడు…” [అల్-అంబియా 21:26]. అనగా ఆయన దీనికి అతీతుడు మరియు పరిశుద్ధుడు అని అర్థం.

కాబట్టి ఆయనకు తగనిది ఆయనకు ఆపాదించబడినప్పుడు, దానికి సరైన ప్రతిస్పందన ఆయనను దానికి అతీతుడిగా ప్రకటించడమే. ఇది ఖుర్ఆన్ నుండి మనం నేర్చుకునే మార్గదర్శకత్వం:
﴿వారు వర్ణించే (దుర్లక్షణాల) నుండి నీ ప్రభువు, సర్వాధికారాల ప్రభువు, ఎంతో పవిత్రుడు…﴾

అల్లాహ్ కు తగని వర్ణన ఏదైనా ఇవ్వబడితే, ఈమాన్ (విశ్వాసం) యొక్క స్థానం ఏమిటంటే, అల్లాహ్ ను దానికి అతీతుడిగా ప్రకటించడం మరియు ఆయనను పవిత్రపరచడం. ఆ విధంగా ఈ పేర్లు అల్లాహ్ ను అన్ని లోపాల నుండి రహితుడిని చేసే పేర్లు.

ఒకవేళ ఎవరైనా ఇలా అంటే: ‘ఈ పేర్లు అల్లాహ్ ను సర్వ లోపాలకు అతీతుడిగా ప్రకటించే పేర్లు అని మనకు తెలుసు, కానీ కచ్చితంగా ఆయన దేనికి అతీతుడు?’ దానికి షేక్ ఇలా సమాధానమిచ్చారు: “ఆయన ఏయే విషయాలకు అతీతుడో వాటిని మొత్తం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు…” అంటే, అల్లాహ్ ఏ విషయాలకు అతీతుడో అవన్నీ అంతిమంగా రెండు మూలాలకు తిరిగి వస్తాయి.

మొదటిది, ఆయన తన పరిపూర్ణ గుణాలకు విరుద్ధమైన ప్రతి దానికీ అతీతుడు. ఆయన ఈ భాగం చివరన ఇలా కూడా పేర్కొన్నాడు: “ఆ విధంగా ఆయన గుణాలన్నీ వాటికి విరుద్ధమైన లేదా వ్యతిరేకమైన ప్రతి దానికీ అతీతంగా ఉంటాయి.” దీనిని బట్టి పవిత్రీకరణ, పరిశుద్ధత, మరియు అస్-సలామ్ అనే పేరు సూచించేది, లోపరహితుడిగా ఉండటం అనే అర్థం అల్లాహ్ పేర్లన్నింటినీ కలుపుతుందన్న మాట. అల్లాహ్ యొక్క ప్రతి పేరు ఆయన మహిమ మరియు గొప్పతనానికి తగిన పరిపూర్ణ గుణాన్ని నిర్ధారిస్తుంది, దానికి విరుద్ధమైన దానిని ఆయన నుండి నిరాకరిస్తుంది. తన పరిపూర్ణ గుణాలకు విరుద్ధమైన ప్రతి దానికీ ఆయన అతీతుడు.

ఉదాహరణకు, అల్లాహ్ యొక్క ఈ వాక్యం:

﴿وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ﴾
“మరియు నీ ప్రభువు తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేసేవాడు కాడు.” [ఫుస్సిలత్ 41:46]

ఇది అల్లాహ్ ను అన్యాయానికి అతీతుడిగా ప్రకటిస్తుంది, ఎందుకంటే అన్యాయం అనేది ఆయన పరిపూర్ణమైన న్యాయానికి విరుద్ధం. ఆయన పరిపూర్ణమైన న్యాయాన్ని కలిగి ఉన్న ఏకైక న్యాయవంతుడు.

అదేవిధంగా, ఆయన వాక్యం:

﴿وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ﴾
“మరియు మాకు ఎలాంటి అలసట (నీరసం) రాలేదు.”[ఖాఫ్ 50:38]

ఇది అల్లాహ్ ను అలసటకు అతీతుడిగా ప్రకటిస్తుంది, ఎందుకంటే ఇది ఆయన బలానికి మరియు పరిపూర్ణమైన శక్తికి విరుద్ధం.

ఆయన వాక్యం:

﴿لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ﴾
“ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.” [అల్-బఖరహ్ 2:255]

ఇది ఆయన పరిపూర్ణ జీవితానికి మరియు అన్ని వస్తువుల నిర్వహణకు (స్వయం సమృద్ధతకు) విరుద్ధంగా ఉంటుంది కాబట్టి ఆయన వాటికి అతీతుడు.

అదేవిధంగా, ఆయన వాక్యం:

﴿وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا﴾
“మరియు నీ ప్రభువు మరచిపోయేవాడు కాడు.” [మర్యం 19:64]

ఇది ఆయన పరిపూర్ణమైన జ్ఞానానికి విరుద్ధం.

అందువలన, ఈ మూడు పేర్లు అస్-సుబ్బూహ్, అల్-ఖుద్దూస్, అస్-సలామ్ సూచించే వాటిలో ఆయన తన పరిపూర్ణ గుణాలకు విరుద్ధమైన ప్రతి దానికీ అతీతుడై ఉన్నాడనేది కూడా ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి పరిపూర్ణ గుణంలో అత్యున్నతమైనవాడు. ఆయన పరిపూర్ణమైన జ్ఞానం మరియు పరిపూర్ణమైన శక్తితో వర్ణించబడ్డాడు, మరియు మతిమరుపు లేదా అజాగ్రత్త వంటి దానికి విరుద్ధమైన వాటికి అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న ఒక అణువు బరువు కూడా ఆయన దృష్టి నుండి తప్పించుకోలేదు, లేదా దాని కంటే చిన్నది లేదా పెద్దది కూడా తప్పించుకోలేదు. ఆయన అసమర్థత, అలసట, బలహీనత మరియు నీరసం వంటి వాటికి అతీతుడు.

ఆయన పరిపూర్ణమైన జీవనంతో మరియు స్వయం సమృద్ధితో వర్ణించబడ్డాడు, మరియు వాటి వ్యతిరేకాలైన మరణం, కునుకు మరియు నిద్ర వంటి వాటికి అతీతుడు. ఆయన పరిపూర్ణమైన న్యాయం మరియు సంపూర్ణ స్వయం-సమృద్ధితో వర్ణించబడ్డాడు, మరియు అన్యాయం మరియు ఎవరిపైనా ఏ రకమైన అవసరం ఉండటానికి అతీతుడు. ఆయన పరిపూర్ణమైన జ్ఞానం మరియు కరుణతో వర్ణించబడ్డాడు…

﴿وَمَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَاعِبِينَ﴾
“మేము భూమ్యాకాశాలను మరియు వాటి మధ్య ఉన్న వాటిని ఆట కోసం సృష్టించలేదు.”[అద్-దుఖాన్ 44:38]

﴿وَمَا خَلَقْنَا السَّمَاءَ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَاطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ الَّذِينَ كَفَرُوا ۚ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا مِنَ النَّارِ﴾
“మరియు మేము ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని వృథాగా సృష్టించలేదు! అది సత్య తిరస్కారుల అపోహ మాత్రమే! కాబట్టి తిరస్కారులకు నరకాగ్ని వినాశనం (తప్పదు)!” [సాద్ 38:27]

అల్లాహ్ వీటికి అతీతుడు, ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన వివేకం మరియు పరిపూర్ణమైన కరుణతో వర్ణించబడ్డాడు. ఇది మొదటి విషయం.

రెండవది…

వారిలో మేధస్సు, వినికిడి, చూపు మరియు బాహ్య, అంతర్గత శక్తులను సృష్టించినవాడు ఆయనే; వారికి బోధించి, ప్రేరణ ఇచ్చినవాడు ఆయనే; వారిని బాహ్యంగా మరియు అంతర్గతంగా ఎదిగేలా చేసి వారిని పరిపూర్ణం చేసినవాడు ఆయనే. ప్రవక్తలు మరియు దూతలు ఇలా అన్నారు:

﴿لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا﴾
“నీవు పవిత్రుడవు. నీవు మాకు నేర్పినది తప్ప మాకు మరే జ్ఞానమూ లేదు.”[అల్-బఖరహ్ 2:32]

మరియు హదీసే ఖుద్సీలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఓ నా దాసులారా, నేను మార్గదర్శకత్వం చేసిన వారు తప్ప మీరంతా దారి తప్పినవారే, కాబట్టి నా నుండి మార్గదర్శకత్వాన్ని వేడుకోండి, నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను. ఓ నా దాసులారా, నేను ఆహారం పెట్టిన వారు తప్ప మీరంతా ఆకలితో ఉన్నవారే…”

ఈ రెండవ అర్థం అల్లాహ్ ను లోపరహితుడిగా ప్రకటించడం, మరియు ఇది రెండు విషయాలను సూచిస్తుంది.

రెండవ అర్థం ఏమిటంటే, అల్లాహ్ తన సృష్టిలోని దేనితోనూ పోలి ఉండటానికి అతీతుడు, అల్లాహ్ ఇలా అన్నాడు:

﴿لَيْسَ كَمِثْلِهِ شَيْءٌ ۖ وَهُوَ السَّمِيعُ الْبَصِيرُ﴾
“ఆయనను పోలినది ఏదీ లేదు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడు.” [అష్-షూరా 42:11]

మరియు అల్లాహ్ ఇలా అన్నాడు:

﴿فَلَا تَضْرِبُوا لِلَّهِ الْأَمْثَالَ﴾
“కాబట్టి అల్లాహ్ కు (ఇతరులతో) ఉదాహరణలు ఇవ్వకండి.”[అన్-నహ్ల్ 16:74]

మరియు అల్లాహ్ ఇలా అన్నాడు:

﴿وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ﴾
“మరియు ఆయనకు సాటి అయిన వాడు ఎవ్వడూ లేడు.”[అల్-ఇఖ్లాస్ 112:4]

మరియు అల్లాహ్ ఇలా అన్నాడు:

﴿هَلْ تَعْلَمُ لَهُ سَمِيًّا﴾
“ఆయనకు సాటి అయిన వారు ఎవరైనా నీకు తెలుసా?” [మర్యం 19:65]

ఇక్కడ ప్రశ్న నిరాకరణ అనే అర్థాన్ని సూచిస్తుంది, అంటే ఆయనకు సమానులు లేరు, పోలిక లేదు మరియు సాటి ఎవరూ లేరు అని అర్థం.

అందువల్ల, అల్లాహ్ యొక్క ఈ పేర్లు అస్-సుబ్బూహ్, అల్-ఖుద్దూస్, అస్-సలామ్ సూచించే రెండవ అర్థం ఏమిటంటే, ఆయన ఎలాంటి ఉదాహరణ, ప్రత్యర్థి లేదా పోలికకు అతీతుడు. ఆయన అస్-సుబ్బూహ్, అల్-ఖుద్దూస్, ఆయన గుణాలలో ఆయనకు పోలిక ఎవరూ లేరు. ఆయన అస్-సుబ్బూహ్, అల్-ఖుద్దూస్, ఆయన గుణాలలో ఏ లోపం లేదు, అన్ని లోపాల కంటే ఆయన ఉన్నతుడు. కాబట్టి, అల్లాహ్ ను లోపరహితుడిని చేయడం ఈ రెండు అర్థాలకు తిరిగి వస్తుంది: అల్లాహ్ ను లోపాలు మరియు బలహీనతలకు అతీతుడిగా ప్రకటించడం, మరియు అల్లాహ్ కు ఏ సమానులు, పోలిక లేదా సాటి ఉన్నారనే దాని నుండి అతీతుడిగా ప్రకటించడం. ఆయన వీటన్నింటికంటే ఎంతో ఉన్నతుడు.

ఆయన అన్నారు:

వాస్తవానికి, ఒక వ్యక్తి తన మనస్సులో ఊహించుకోగలిగే దానికంటే, ఒక మనస్సు ఊహించగల అత్యున్నత పరిపూర్ణత కంటే అల్లాహ్ ఎంతో గొప్పవాడు. అల్లాహ్ దానికంటే ఎంతో గొప్పవాడు.

ఈ కారణంగా, ముస్లింలు చెప్పే “అల్లాహు అక్బర్” (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు) అనే దాని నుండి గ్రహించిన అర్థాలలో ఒకటి ఏమిటంటే, ఆయన ప్రతిదాని కంటే గొప్పవాడు, మరియు వర్ణించేవారు ఆయన గుణాల నిజమైన వాస్తవికతను గ్రహించగల సామర్థ్యం కంటే గొప్పవాడు, వారు తమ మనస్సులలో ఎంత పరిపూర్ణతను ఊహించినప్పటికీ సరే. ఒక వ్యక్తి తన మనస్సులో ఎలాంటి పరిపూర్ణతను ఊహించి, దానిని అల్లాహ్ గుణంగా భావించినా, అల్లాహ్ దానికంటే గొప్పవాడు మరియు ఎంతో మహిమాన్వితుడు. మనస్సులు అల్లాహ్ పరిపూర్ణత యొక్క వాస్తవికతను ఎప్పటికీ గ్రహించలేవు.

అందువల్ల, అల్లాహ్ తన గుణాల ‘స్వభావం’ (ఎలా ఉన్నాయి) అనే దాని గురించి లోతుగా ఆలోచించడానికి (తఖ్ యీఫ్) అతీతుడు. ఆయన గుణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకోవడం అసంబద్ధం, అల్లాహ్ దానికి అతీతుడు. ఎందుకంటే మనిషి తన మనస్సులో ఎలాంటి పరిపూర్ణతను ఊహించి దానిని అల్లాహ్ గుణంగా భావించినా, అల్లాహ్ దానికంటే గొప్పవాడు, మహిమాన్వితుడు మరియు ఎంతో ఔన్నత్యం గలవాడు.

కాబట్టి ఆయన కీర్తి, గొప్పతనం మరియు పరిపూర్ణత వంటి గుణాలకు విరుద్ధమైన ప్రతి దానికీ అతీతుడు. మరియు ఆయనకు ఏ వ్యతిరేకత, ప్రత్యర్థి, సమానుడు లేదా పోలిక ఉండటానికి ఆయన అతీతుడు…

సూచించబడిన రెండు అర్థాల సారాంశం ఇదే: మొదటిది: కీర్తి, గొప్పతనం మరియు పరిపూర్ణత యొక్క గుణాలకు విరుద్ధమైన ప్రతిదానికీ అతీతుడై ఉండటం. రెండవది: ఏ వ్యతిరేకికి, ప్రత్యర్థికి, సమానుడికి లేదా పోలికకు అతీతంగా ఉండటం.

అవన్నీ ఆయన పేర్లలో ఇమిడి ఉన్నాయి: అల్-ఖుద్దూస్ (పరమ పవిత్రుడు), అస్-సలామ్ (సర్వ లోపాలకు అతీతుడు).

అలాగే నేను వివరించినట్లుగా, ఆయన పేరు అస్-సుబ్బూహ్ (సర్వ లోపాలకు అతీతుడు), ఇది సున్నత్ ద్వారా నిర్ధారించబడింది.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguisla.net/?p=45459

ఖుర్ఆన్‌లో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క అందమైన పేర్లు [పరిచయం] – షేక్ అబ్దుర్రహ్మాన్ అల్-సఅదీ | షేక్ అబ్దుర్రజ్జాఖ్ అల్-బద్ర్

The Beautiful Names of Allah that are mentioned in the Qur’an (Introduction)
Shaykh Abdurahman al-Si’di — Explained by Shaykh Abdurrazzaq al-Badr
https://www.youtube.com/watch?v=9iQP3n13WxY [Arabic | English Subtitles] [20 min]

సమస్త ప్రశంసలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే దక్కుతాయి. ఆయన దాసుడు మరియు సందేశహరుడైన మన ప్రవక్త ముహమ్మద్, ఆయన కుటుంబం మరియు ఆయన సహచరులందరిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కలుగుగాక.

గొప్ప పండితుడైన షేక్ అబ్దుర్రహ్మాన్ అల్-సఅదీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం “ఫత్హ్ అర్-రహీమ్ అల్-మలిక్ అల్-అల్లామ్”లో ఇలా అన్నారు:

సమస్త ప్రశంసలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కే దక్కుతాయి. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరూ లేరని, ఆయన అద్వితీయుడని, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ ﷺ ఆయన దాసుడు మరియు సందేశహరుడని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ ఆయనపై, ఆయన కుటుంబంపై మరియు ఆయన సహచరులందరిపై కారుణ్యం మరియు శాంతిని కురిపించుగాక. ఓ అల్లాహ్, మా ప్రభూ! మాకు ధార్మిక అవగాహనను ప్రసాదించు.

ఈ అధ్యాయం ఈ పుస్తకంలోని గొప్ప అధ్యాయాలలో ఒకటి. అత్యంత ప్రయోజనకరమైనది మరియు విలువలో అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే ఇది అల్లాహ్ పేర్ల వివరణ, వాటి అర్థాలు మరియు సూచనల స్పష్టీకరణ, అలాగే అవి అల్లాహ్ పట్ల ఎటువంటి దాస్యాన్ని (విధేయతను) కోరుతున్నాయో తెలియజేస్తుంది. అల్లాహ్ యొక్క ప్రతి పేరు, ఆయనను విశ్వసించడం ద్వారా ఏర్పడే ఒక విధేయతను తప్పనిసరి చేస్తుంది.

దీనిని సాధించడానికి అల్లాహ్ పేర్ల యొక్క అర్థాలు మరియు సూచనల జ్ఞానం అవసరం. తద్వారా దాసుడు ప్రతి పేరుతో ముడిపడి ఉన్న నిర్దిష్ట ఆరాధన/విధేయతను నెరవేర్చగలుగుతాడు.

ఆయన పేర్లు మరియు గుణగణాల ద్వారా అల్లాహ్ ను తెలుసుకోవడం అనేది అన్ని శాస్త్రాలలోకెల్లా అత్యున్నతమైనది మరియు గొప్పది. ఎందుకంటే ఒక జ్ఞానం యొక్క గొప్పదనం, ఏ విషయం గురించి తెలుసుకుంటున్నామో దాని గొప్పదనంపై ఆధారపడి ఉంటుంది. అల్లాహ్, ఆయన పేర్లు మరియు ఆయన గుణగణాల గురించిన జ్ఞానం కంటే గౌరవప్రదమైనది మరొకటి లేదు.

అల్లాహ్ పేర్ల గురించిన ఈ అవగాహన మతం యొక్క ప్రాథమిక మూలస్థంభాలలో ఒకటి, దీనిపైనే మతం మరియు ఆరాధన రెండు నిర్మించబడ్డాయి.

ఒక దాసుడు అల్లాహ్ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఆయన పట్ల అతని భయభక్తులు అంతగా పెరుగుతాయి, ఆయన పట్ల అతని అంకితభావం అంత దృఢంగా ఉంటుంది మరియు అతను ఆయనకు అవిధేయత చూపడం నుండి అంతగా దూరంగా ఉంటాడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు:

 إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ
అల్లాహ్‌ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు.” (ఫాతిర్ 35:28)

అల్లాహ్ తన దాసులను తన పేర్లను తెలుసుకోవాలని మరియు వాటి అర్థాలను అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నాడు:

 أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ وَأَنَّ اللَّهَ قَدْ أَحَاطَ بِكُلِّ شَيْءٍ عِلْمًا
అల్లాహ్ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడనీ, ఇంకా అల్లాహ్ తన జ్ఞానంతో అన్నింటినీ పరివేష్టించి ఉన్నాడని మీరు తెలుసుకోవటానికి..” (అత్ తలాఖ్ 65:12)

దాసుడికి అల్లాహ్ యొక్క పేర్లు మరియు గుణగణాల గురించిన ఈ జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటే, అతను అంత గొప్ప మేలు పొందుతాడు. దాసుడికి ఎంత తక్కువ జ్ఞానం ఉంటే, అంత తక్కువ మేలు ఉంటుంది.

షేక్ (అబ్దుర్రహ్మాన్ అల్-సఅదీ) ఇలా అన్నారు:

అందమైన పేర్లను తెలుసుకోవడం, అవి సూచించే అర్థాలను అర్థం చేసుకోవడం మరియు ప్రతి పేరుతో ముడిపడి ఉన్న విధేయతా చర్యలతో అల్లాహ్ ను ఆరాధించడం ఇవన్నీ దాసులందరిపై విధిగా ఉన్నాయి. గ్రంథకర్త తన రచనలో తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టీకరణను ఇస్తారు.

సహీహైన్ (బుఖారీ, ముస్లిం గ్రంథాలు) లో మన ప్రవక్త ﷺ నుండి ఈ గొప్ప హదీసు ఉల్లేఖించబడింది, ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా, అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఒకటికి తక్కువ వంద. వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” ఇది అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది పేర్లను లెక్కించడాన్ని (గ్రహించి ఆచరించడాన్ని) ప్రోత్సహించే హదీసు.

ఈ హదీసు అల్లాహ్ పేర్లను కేవలం ఈ సంఖ్యకే పరిమితం చేయదు, ఎందుకంటే అల్లాహ్ పేర్లు ఈ సంఖ్య కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ హదీసులోని అర్థం ఏమిటంటే, అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, మరియు వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. కాబట్టి, ఈ హదీసు ఒకే వాక్యం: అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.

మరియు ఈ సంఖ్యలో ఉన్న ఈ పేర్లు, ఇది ఒక బేసి సంఖ్య. అల్లాహ్ విత్ర్ (ఏకైకుడు) మరియు ఆయన బేసి సంఖ్యను ఇష్టపడతాడు… అల్లాహ్ ఎవరికైతే వాటిని లెక్కించడానికి సద్బుద్ధిని ప్రసాదిస్తాడో, మరియు “లెక్కించడం” అనే అర్థం తర్వాత వస్తుంది, వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, ఎందుకంటే అల్లాహ్ పట్ల విధేయత మరియు ఆయన ఆరాధన ద్వారా తప్ప స్వర్గం లభించదు.  ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ “మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి.” (అన్ నహ్ల్ 16:32)

అల్లాహ్, ఆయన గొప్పదనం, మహిమ మరియు పరిపూర్ణత గురించిన జ్ఞానం ద్వారా తప్ప విధేయత సాధ్యం కాదు. అల్లాహ్ పేర్లు మరియు గుణగణాల గురించిన ఈ జ్ఞానంలో దాసుడి వాటా ఎంత పెరిగితే, అల్లాహ్ ను ఆరాధించడంలో మరియు ఆయనకు చేరువ కావడంలో అతని వాటా అంత గొప్పగా ఉంటుంది.

ఆయన అన్నారు: “నిశ్చయంగా, అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.”

ఈ తొంభై తొమ్మిది పేర్లను ఒక వరుస క్రమంలో తెలుపుతూ ఎలాంటి ప్రామాణిక (సహీహ్) హదీసు రాలేదు. అవును, కొన్ని ఉల్లేఖనలు వచ్చాయి, కానీ పండితులు స్పష్టం చేసినట్లుగా అవి బలహీనమైనవి, మరియు వాటిని ప్రవక్త ﷺ కు ఆపాదించడం సరైనది కాదు. బదులుగా, అవి కొంతమంది ఉల్లేఖకుల (కథకుల) చేర్పులు. అవి దైవప్రవక్త ﷺ మాటలని అనుకోబడింది, కానీ అవి ఆయన మాటలు కావు. అంతేకాకుండా, అల్లాహ్ ﷻ పేర్లలో కొన్నింటిని లెక్కించడంలో విమర్శనాత్మక అంశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి, ఈ పేర్లను జాబితా చేస్తూ మన ప్రవక్త ﷺ నుండి ఎటువంటి ప్రామాణిక హదీసూ రాలేదు.

అయినప్పటికీ, ప్రజలు ఈ ఉద్దేశిత అర్థాన్ని సాధించడం సులభతరం చేయడానికి పండితులు వాటిని జాబితా చేయడానికి మరియు ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి వాటిని సేకరించడానికి కృషి చేశారు.

పండితులు అల్లాహ్ పేర్లను సేకరించడంతో పాటు, వాటి అర్థాలను వివరించడానికి, వాటి సూచనలను స్పష్టం చేయడానికి, వాటికి సంబంధించిన దాస్యపు చర్యలను మరియు వాటి వలన కలిగే ఈమాన్ (విశ్వాసం) మరియు ఆధ్యాత్మిక ప్రభావాలను వివరించడానికి కూడా శ్రద్ధ వహించారు.

ఈ జ్ఞానంలో మరియు ఈ అవగాహనలో నిమగ్నమై ఉండటం అనేది దాసుడికి అత్యంత ప్రయోజనకరమైన విషయాలలో ఒకటి. అతను అల్లాహ్ పేర్లను, వాటి అర్థాలను లోతుగా గ్రహించడానికి కృషి చేయాలి, తద్వారా ఈ గొప్ప హదీసులో ప్రోత్సహించబడిన విషయాన్ని అతను ఆచరణలో పెట్టగలుగుతాడు.

ఆయన అన్నారు: “నిశ్చయంగా, అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.”

జ్ఞానవంతుల (పండితుల) ప్రకారం, వాటిని లెక్కించడం అంటే కేవలం వాటిని లెక్కపెట్టడం కాదు, లేదా కేవలం తొంభై తొమ్మిది పేర్లను కంఠస్థం చేయడం కూడా కాదు. కొంతమంది సామాన్య ప్రజలు చేస్తున్నట్లుగా, ఈ పేర్లను ఒక కాగితంపై వ్రాసి జేబులో పెట్టుకోవడం, ఆ తర్వాత ఉదయం మరియు సాయంత్రం వేళల్లో బయటకు తీసి చదవడం లాంటిది కాదు.

ఈ పేర్లను కేవలం పఠించడం అనేది మన ప్రవక్త ﷺ నుండి వచ్చిన ప్రార్థనలలో లేదు, కాబట్టి ఇది ఎలాంటి ఆధారం లేని ఆచరణ. ఇదంతా మన ప్రవక్త ﷺ చెప్పిన “….వాటిని లెక్కించిన వారు స్వర్గంలో ప్రవేశిస్తారు” అనే మాటల ఉద్దేశ్యం కాదు.

పండితులు స్పష్టం చేసినట్లుగా, అల్లాహ్ పేర్లను లెక్కించడం (అహ్సా) అనేక విషయాలను కలిగి ఉంటుంది, అవన్నీ లెక్కించడం కిందకే వస్తాయి.

[1] పేర్లను తెలుసుకోవడం మరియు వాటిని కంఠస్థం చేయడం. ఆయన పేర్లలో السميع (అస్-సమీఅ్ – అంతా వినేవాడు), البصير (అల్-బసీర్ – అంతా చూసేవాడు), العليم (అల్-అలీమ్ – సర్వజ్ఞాని), الحكيم (అల్-హకీమ్ – మహా వివేకవంతుడు), الخبير (అల్-ఖబీర్ – సర్వం తెలిసినవాడు) తదితరాలు ఉన్నాయని తెలుసుకోవడం. వాటిని తెలుసుకోవడం మరియు అవి ప్రభువు యొక్క పేర్లలో భాగమని తెలుసుకోవడం.

[2] ఈ పేర్ల అర్థాలను మరియు వాటి సూచనలను తెలుసుకోవడం, ఎందుకంటే అల్లాహ్ పేర్లు కేవలం అర్థం లేని సాధారణ నామవాచకాలు కావు, బదులుగా అవి పేర్లు మరియు గుణగణాలు. అవి అర్థాలను సూచించే పేర్లు. కాబట్టి, అల్లాహ్ పేర్లను లెక్కించడంలో, వాటిని లెక్కించేవాడు వాటి అర్థాలను మరియు సూచనలను తెలుసుకోవడం భాగం, మరియు అల్లాహ్ యొక్క ప్రతి పేరు అది సూచించే ఒక నిర్దిష్ట అర్థాన్ని కలిగి ఉంటుంది.

[3] ఈ పేర్లలో ప్రతి ఒక్కదానికీ సంబంధించిన దాస్యాన్ని (ఆరాధనను/విధేయతను) ఆచరణలో పెట్టడం, వాటిని అమలు పరచడం మరియు ఈ విధేయతా చర్యలను నెరవేర్చడానికి తనతో తాను పోరాడతాడు.

ఈ కారణంగా అల్లాహ్ ఇలా అన్నాడు:

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
“అల్లాహ్‌కు అత్యుత్తమమైన పేర్లున్నాయి. కాబట్టి మీరు ఆయన్ని ఆ పేర్లతోనే పిలవండి…” (అల్ ఆరాఫ్ 7:180)

మరియు మహోన్నతుడైన ఆయన ఇలా అన్నాడు:

قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَٰنَ ۖ أَيًّا مَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
వారికి చెప్పు : “అల్లాహ్‌ను అల్లాహ్‌ అని పిలిచినా, రహ్మాన్‌ అని పిలిచినా – ఏ పేరుతో పిలిచినా – మంచి పేర్లన్నీ ఆయనవే.” (అల్ ఇస్రా 17:110)

కాబట్టి ఈ ప్రార్థన (Supplication) ను ఆచరణలో పెట్టబడాలి. మరియు “వాటితో ఆయనను ప్రార్థించండి…” అనే మాటలో ఆరాధనా ప్రార్థన మరియు వేడుకునే ప్రార్థన (దుఆ) రెండూ కలిసి ఉన్నాయి. ఇదంతా అల్లాహ్ యొక్క అత్యంత అందమైన పేర్లను లెక్కించడాన్ని ఆచరణలో పెట్టడంలో భాగమే.

ఆ తర్వాత హదీసు అర్థాన్ని వివరించడంలో షేక్ యొక్క గొప్ప మాటలను గురించి ఆలోచించండి. ఆయన ఇలా అన్నారు: మరియు వాటిని లెక్కించడం అంటే వాటి అర్థాలను హృదయంలో గ్రహించడం… కేవలం నోట్‌బుక్‌లో (పుస్తకంలో) కాదు. నోట్‌బుక్ మీకు సహాయం చేస్తుంది, కానీ వాటి అర్థాలను హృదయంలో గ్రహించడం అనేది అల్లాహ్, ఆయన పేర్లు, ఆయన గుణగణాలు, ఆ పేర్ల అర్థాలు మరియు అవి అల్లాహ్ పట్ల ఎటువంటి విధేయతను కోరుతున్నాయో ఆ జ్ఞానంతో హృదయం నిండిపోయేలా కృషి చేయడం ద్వారానే సాధ్యమవుతుంది.

హృదయం ఇలా ఉంటే, ప్రతి పరిస్థితిలోనూ హృదయంలో స్థిరపడిన జ్ఞానానికి అనుగుణంగా ఒక దాస్యం (విధేయత) ఉత్పన్నమవుతుంది. ఆయన మాట్లాడుతున్న ఈ హృదయంలోని జ్ఞానం, అల్లాహ్ పేర్ల అవగాహన, వాటి అర్థాలు మరియు సూచనల గురించి ప్రామాణిక పండితులు వ్రాసిన విషయాలపై తరచూ లోతుగా ఆలోచించడం ద్వారా పొందబడుతుంది. మరియు ఎవరైతే ఇలాంటి ఆలోచనను పెంచుకుంటారో, ఈ జ్ఞానం వారి హృదయంలో అంత దృఢంగా స్థిరపడుతుంది.

ఆయన అన్నారు:

ప్రతి పేరు హృదయంపై తన ప్రభావాన్ని చూపుతుంది.

ఉదాహరణకు, అల్లాహ్ السميع (అస్-సమీఅ్ – అంతా వినేవాడు) అని దాసుడి హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడు, భాషల తేడాలు మరియు కోరికల వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఆయన అన్ని స్వరాలను వింటాడని అతను నమ్ముతాడు. ఎంతలా అంటే, మానవ జాతి అంతా, మానవులు మరియు జిన్నులు అందరూ ఒకే సమయంలో ఒకే చోట నిలబడి, ఒక్కొక్కరు తమ అవసరాన్ని తమ స్వంత మాండలికంలో మరియు భాషలో అల్లాహ్ ను వేడుకుంటే, ఒకరి స్వరం మరొకరితో, ఒకరి అవసరం మరొకరితో, లేదా ఒక భాష మరొక భాషతో కలిసిపోకుండా ఆయన వారందరినీ స్పష్టంగా వినగలడు.

(سُبْحَانَ الَّذِي وَسِعَ سَمْعُهُ الأَصْوَاتَ)
సమస్త స్వరాలను వినగలిగే అల్లాహ్ ఎంతో పవిత్రుడు.” అని విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) అన్నారు.

హదీస్ ఖుద్సీలో ఇలా ఉంది: “ఓ నా దాసులారా! మీలో మొదటి వారు, చివరి వారు, మానవులు మరియు జిన్నులు అందరూ ఒకే చోట నిలబడి నన్ను అడిగితే, నేను ఒక్కొక్కరికి వారు అడిగినది ఇస్తే, సముద్రంలో సూదిని ముంచినప్పుడు అది ఎంత నీటిని తగ్గిస్తుందో, అంతే నా రాజ్యంలో అది (నా సంపదను) తగ్గిస్తుంది.”

అప్పుడు ఈ పేరు యొక్క అర్థానికి సంబంధించిన ఈ గొప్ప జ్ఞానం అతనిలో ఏర్పడుతుంది. ఆ తర్వాత అతను అల్లాహ్ పట్ల అది కోరే విధేయతను ఆచరణలో పెట్టడానికి పనిచేస్తాడు.

అల్లాహ్ السميع (అస్-సమీఅ్ – అంతా వినేవాడు) కాబట్టి, అతను అల్లాహ్ ను ఎక్కువగా స్మరించడం, ఆయన్ను స్తుతించడం, ఆయన వాక్యాన్ని (ఖుర్ఆన్) పఠించడం మరియు దానిని పరిపూర్ణంగా పఠించడం పట్ల శ్రద్ధ వహిస్తాడు. అల్లాహ్ దృష్టిలో దీనికి మించిన ఇష్టమైన పని మరొకటి లేదు, కాబట్టి అతను దానిపై ఆసక్తి చూపుతాడు. అతను అల్లాహ్ స్మరణను ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తాడు మరియు అల్లాహ్ వింటున్నాడని తెలిసి కూడా పాపపు మాటలు, వృథా మాటలు, చాడీలు, అబద్ధాలు మరియు అలాంటి వాటిని మాట్లాడుతూ ఉండే ఒక దాసుడికి తగని ప్రతి నిషిద్ధమైన మాటల నుండి దూరంగా ఉండటానికి అతను అత్యంత శ్రద్ధ వహిస్తాడు.

అల్లాహ్ البصير (అల్-బసీర్ – అంతా చూసేవాడు) అని అతను విశ్వసిస్తే, అల్లాహ్ అన్నింటినీ చూస్తాడని అతను నమ్ముతాడు. ఏదీ ఆయన నుండి దాచబడదు. ఆయన ప్రతిదాని గురించి పూర్తి ఎరుక కలిగి ఉన్నాడు. అందువల్ల, అల్లాహ్ నిషేధించిన ప్రదేశాలలో ఆయన తనను చూడకూడదని దాసుడు శ్రద్ధ వహిస్తాడు, మరియు ఆయన ఆజ్ఞాపించిన చోట ఆయన తనను చూడాలని అతను కోరుకుంటాడు. అల్లాహ్ ను ఆరాధించడంలో ‘ఇహ్సాన్’ (పరిపూర్ణత) కలిగి ఉండటానికి అతను శ్రద్ధ వహిస్తాడు, “నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించాలి, ఒకవేళ నువ్వు ఆయనను చూడలేకపోతే, నిశ్చయంగా ఆయన నిన్ను చూస్తున్నాడు.”

అల్లాహ్ التواب (అత్-తవ్వాబ్ – పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు) అని అతనికి తెలిస్తే, ఈ పేరు ద్వారా కోరబడే విధేయతను ఆచరణలో పెట్టడానికి అతను శ్రద్ధ వహిస్తాడు. ఈ పేరు అల్లాహ్ కు ఆపాదించబడిన రెండు రకాల పశ్చాత్తాపాలను సూచిస్తుంది: దాసుడికి పశ్చాత్తాపపడే సద్బుద్ధిని ప్రసాదించడం ద్వారా పశ్చాత్తాపం, మరియు దాసుడి పశ్చాత్తాపాన్ని అంగీకరించడం ద్వారా పశ్చాత్తాపం. “తరువాత వారు పశ్చాత్తాపపడాలని ఆయన వారి వైపుకు కరుణతో మళ్లాడు…” (అత్ తౌబా: 118) మరియు “ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు మరియు తప్పులను క్షమించేవాడు.” (అష్ షూరా: 25).

ఈ విధంగా అతను అల్లాహ్ పేర్లను తెలుసుకోవడం, వాటి అర్థాలను మరియు సూచనలను అర్థం చేసుకోవడం మరియు అవి కోరే దాస్యపు/ఆరాధనా చర్యలను ఆచరణలో పెట్టడం ద్వారా ముందుకు సాగుతాడు.

ఆయన ఇలా అన్నారు:

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=45440

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే! [పుస్తకం]

హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!
తఖ్రీజ్: హాఫిజ్ సలాహుద్దీన్ యూసుఫ్ రహిమహుల్లాహ్, షోబా తహ్రీఖ్ వతాలీఫ్, దారుస్సలామ్, లాహోర్
తెలుగు అనువాదం, సమర్పణ: ఇక్రాముద్దీన్ ముహమ్మద్
పరిశీలన: షేఖ్ నసీరుద్దీన్ జామి’ ఈ మరియు సోదరులు అబ్దుల్ ఖాదిర్ హఫిజహుముల్లాహ్

[బుక్ డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [21 పేజీలు]

“హదీసులు కూడా కేవలం అల్లాహ్ యొక్క వహీనే!” అనే ఈ పుస్తకం, ముస్లింల జీవితంలో ఖురాన్‌తో పాటు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులు (సున్నత్) కూడా అల్లాహ్ చేత అవతరింపబడిన దివ్యజ్ఞానమే (వహీ) అని స్పష్టంగా నిరూపిస్తుంది. ప్రవక్త ధర్మవిషయంలో ఏదీ తన ఇష్టానుసారం చెప్పలేదని, అవన్నీ వహీ ద్వారానే వచ్చాయని ఖురాన్ ఆయతుల ఆధారంగా గ్రంథకర్త వివరించారు. ఖిబ్లా మార్పు, ముగ్గురు వ్యక్తుల పశ్చాత్తాపం, ఉపవాసం, జకాత్ మరియు నమాజు విధానాలు వంటి అనేక విషయాలు ఖురాన్‌లో ప్రస్తావించబడినప్పటికీ, వాటి పూర్తి వివరాలు కేవలం హదీసులలోనే లభిస్తాయని ఉదాహరణలతో సహా నిరూపించారు. కేవలం ఖురాన్‌ను మాత్రమే నమ్ముతాము అని చెబుతూ “హదీసులను తిరస్కరించే వారి” (మున్కిరీనె హదీసు) వాదనలను ఖండిస్తూ, హదీసుల ప్రామాణికత లేకుండా దైనందిన ఇస్లామిక్ విధులను ఆచరించడం అసాధ్యమని ఈ పుస్తకం ఉద్ఘాటిస్తుంది.