అనుచర సమాజం (ఉమ్మత్)పై దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హక్కులు | జాదుల్ ఖతీబ్

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/rights-of-the-prophet-on-ummah
[PDF [31 పేజీలు]

ఖుత్బా లోని ముఖ్యాంశాలు: 

తన అనుచర సమాజం (ఉమ్మత్) పై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హక్కులు: 

  • 1) అల్లాహ్ దాసుడిగా మరియు ప్రవక్తగా విశ్వసించడం. 
  • 2) తగిన విధంగా గౌరవించడం, 
  • 3) అల్లాహ్ తర్వాత, అత్యధికంగా ప్రేమించడం. 
  • 4) ఆదర్శాలను, సద్గుణాలను ఆచరించడం. 
  • 5) విధేయత చూపడం. 
  • 6) అభిప్రాయ భేదాలలో న్యాయనిర్ణేతగా స్వీకరించడం. 
  • 7) ఖుర్ఆన్ మరియు హదీసులకనుగుణంగా ఆచరించడం, 
  • 8) అత్యధికంగా దరూద్ పఠించడం. 

గడిచిన జుమా ఖుత్బాలో, మేము ప్రవక్తల నాయకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాయి, మహత్యం, అద్భుతాలు మరియు ఆయన ప్రత్యేకతలలో కొన్నింటిని గూర్చి వివరించాము. మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ప్రవక్తకు తన అనుచర సమాజం (ఉమ్మత్)పై ఉన్న హక్కులేంటి? రండి, ఖురాను మరియు హదీసుల వెలుగులో ఆ హక్కుల గురించి నేటి జుమా ఖుత్బాలో తెలుసుకుందాం. 

దైవ ప్రవక్త ﷺ మహత్యం , అద్భుతాలు మరియు ప్రత్యేకతలు | జాదుల్ ఖతీబ్

ఖత్బా యందలి ముఖ్యాంశాలు:

  • 1) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మహత్యం
  • 2) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలు అద్భుతాలు
  • 3) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రత్యేకతలు

[ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/greatness-miracles-of-the-holy-prophet
[PDF [32 పేజీలు]

మొదటి ఖుత్బా 

ఇస్లామీయ సహోదరులారా! 

దైవప్రవక్తలలో శ్రేష్టులయిన దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) వంశంలో జన్మించారు. ఆయన అల్లాహ్ దాసులు మరియు అంతిమ దైవప్రవక్త. ప్రళయం వరకు రాబోయే మానవులందరి కోసం ఆయనను ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఆయన రాకతో దైవప్రవక్తల పరంపర సమాప్తమయ్యింది. ఆయన ఇతర ప్రవక్తలపై విశిష్టత మరియు ఆధిక్యతను పొందివున్నారు. ఇలాగే ఆయన ఉమ్మత్ స్థాయి కూడా ఇతర ఉమ్మత్ (అనుచర సమాజం)ల కన్నా ఎక్కువగా వుంది. ఆయన విధేయతను అల్లాహ్ తప్పనిసరి చేశాడు. ఆయనకు గల ప్రత్యేకతలు ఇతర ప్రవక్తలకు లేవు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని రండి! మన ప్రియ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మహత్యం, ఆయన అద్భుతాలు మరియు 

కొన్ని ప్రత్యేకతలను గూర్చి తెలుసుకొందాం. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్థాయి మరియు ఆయన విశిష్టత 

1) శ్రేష్ట వంశము 

తన వంశము (కుటుంబం) రీత్యా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతో ఉన్నత స్థానం కలిగి వున్నారు. 

ఈ విషయాన్నే వాయిలా బిన్ అసఖా (రదియల్లాహు అన్హు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా ఇలా ఉల్లేఖించారు: 

నిస్సందేహంగా అల్లాహ్, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతానంలో ‘కనాన’ ను ఎన్నుకున్నాడు. తదుపరి ‘కనాన’ నుండి ఖురైష్ ను, వారి నుండి బనూ హాషిమ్ ను ఎన్నుకున్నాడు. బనూ హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు.” (సహీ ముస్లిం : 2276) 

ఇలాగే, రోము చక్రవర్తి (హెరిక్లెస్), అబూసుఫ్యాన్ (అప్పటి వరకు ఆయన ఇంకా ముస్లిం కాలేదు)ను దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వంశావళిని గూర్చి అడగ్గా – ఆయన జవాబిస్తూ, “అతను మాలో ఎంతో ఉన్నతమైన వంశానికి చెందిన వ్యక్తి” అని అన్నారు. దీని పై హెరిక్లెస్ స్పందిస్తూ – దైవప్రవక్తలు (సాధారణంగా) తమ జాతుల్లోని ఉన్నత వంశానికి చెందినవారై వుంటారు అని అన్నాడు. (సహీ బుఖారీ : 7, సహీ ముస్లిం : 1773) 

2) మానవాళి కొరకు గొప్ప కటాక్షం 

వాస్తవానికి మానవాళి పై అల్లాహ్ ఉపకారాలు లెక్కలేనంతగా వున్నాయి. కానీ వాటిలో అన్నింటి కన్నా ప్రత్యేక ఉపకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆగమనం. ఈ విషయాన్ని అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: 

“అల్లాహ్ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే – ఆయన, వారిలోనుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు, వారిని పరిశుద్దుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందు వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై వున్నారు.” (ఆలి ఇమ్రాన్ : 164) 

ఈ ఆయత్ లో అల్లాహ్ సెలవిచ్చినట్లు, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు దైవదౌత్య బాధ్యతలు అప్పగించబడ్డ సమయంలో మానవ జాతి స్పష్టమైన అపమార్గానికి లోనై అజ్ఞానపు అంధకార లోయలలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో అల్లాహ్ వారి వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను పంపి, వారిని అంధకారం నుండి బయటకు తీసి, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ద్వారా వారిని రుజుమార్గం వైపునకు దారి చూపాడు. ఇలా, దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సర్వ మానవాళి కొరకు ఒక కారుణ్యంగా వున్నారు. 

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: 

“మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము.” (అంబియా : 107) 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు. 

“ప్రజలారా! నేను ప్రజల కొరకు (అల్లాహ్ తరఫు నుండి) బహుమానంగా పంపబడిన కారుణ్యాన్ని”

(హాకిమ్: 1/91 – సహీ) 

దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్) – “అర్రహీఖుల్‌ మఖ్ తూమ్” పుస్తకం నుండి

బిస్మిల్లాహ్
మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – అంతిమ హజ్ – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/IrogXl0z-uY [42నిముషాలు]

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్)

దైవసందేశం అందించే కార్యం పరిపూర్తి అయింది. అల్లాహ్ ఏకత్వం, ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడన్న సత్యాన్ని ధృవీకరించడం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి దైవదౌత్యం పునాదులపై ఓ క్రొత్త సమాజ నిర్మాణ, రూపకల్పన అమల్లోనికి వచ్చేసింది. అంటే, ఇప్పుడు ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనోఫలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గరపడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయనారంభించింది. అందుకేనేమో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను హిజ్రీ శకం 10లో యమన్ కు గవర్నరుగా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)తో, “ఓ ముఆజ్! బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తరువాత మళ్ళీ కలుసుకోలేవు అని అనిపిస్తోంది! నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు నా సమాధిని మాత్రమే చూడగలవేమో!” అని చెప్పారు, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ పలుకులు విన్నంతనే దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా రోదించడం కూడా జరిగింది.

అసలు యదార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ అదృశ్య వాణి ద్వారా ఇస్లామ్ ధర్మసందేశం వలన ఒనగూడిన సత్ఫలితాలేమిటో చూయించదలిచాడు. ఏ దైవసందేశ ప్రచారం కోసమైతే ఆయన అహర్నిశలు ఇరవై సంవత్సరాలకు పైన్నే కష్టాలను, కడగండ్లను అనుభవిస్తూ వచ్చారో దాని ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించాడన్నమాట. ఇందుకు అల్లాహ్ ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి, తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాల్లో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ చోట సమావేశపరిచి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడానికి, ఏ అమానతు భారమైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజస్కంధాలపై వేయబడిందో దాన్ని ఇప్పుడు వీరు మోయవలసి ఉంటుందని చెప్పడానికి, దైవసందేశాన్ని అందించడం, ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ చారిత్రాత్మకమైన ‘హజ్జె మబ్రూర్’ (దైవం మెచ్చిన హజ్) చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జనసందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ చేరనారంభించింది. ప్రతి వ్యక్తీ, తాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని పరితపించిపోతున్నాడు.[1] జిల్-ఖాదా నెల ఇంకా నాల్గు రోజులకు ముగుస్తుందనగా శనివారం రోజున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కోసం బయలుదేరారు.[2]

[1]. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్న హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం. చూడండి, ప్రవక్త హజ్ అధ్యాయం – 1/394.

[2]. హాఫిజ్ ఇబ్నె హజర్ పరిశోధించి చెప్పిన విషయం ఇది. కొన్ని ఉల్లేఖనాల్లో జిల్ ఖాదా నెల ఇంకా అయిదు రోజులకు ముగుస్తుందనగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయలుదేరారనే అని వచ్చిన వివరాలను ఆయన సరిదిద్దారు. చూడండి, ఫత్ హుల్ బారి – 8/104.

తలపై నూనె వేసి మర్ధించుకొని దువ్వుకున్నారు. ‘తహ్బంద్’ (లుంగీ) కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. ఖుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జొహ్ర్ నమాజు చేసి హజ్ కోసం బయలుదేరారు. అస్ర్ నమాజుకు ముందే ‘జుల్ హులైఫా’ వాదీ (లోయ)లోనికి చేరుకుని అక్కడాగి రెండు రకాతుల ‘అస్ర్’ నమాజు చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా (రదియల్లాహు అన్హుమ్) (అనుచరగణం) ను సంబోధిస్తూ, “రాత్రి నా ప్రభువు వద్ద నుండి వచ్చేవాడు ఒకడొచ్చి నాతో, ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్ లో ‘ఉమ్రా’ కూడా ఉందని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు” అని తెలిపారు.[3]

[3] ఇది హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించినట్లు బుఖారీ గ్రంథంలో ఉంది. 1/207.

జొహ్ర్ నమాజుకు ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కోసం ‘గుస్ల్’ చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శరీరం మీదా, తలపైనా తన చేతులతో ‘జరీరా’తో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తళుకు, గుబాళింపు ఆయన తల పాపిటలో, గెడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు. అయితే ఆ సువాసనా పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తరువాత తహ్బంద్ కట్టుకొని, శరీరం పై ఓ దుప్పటిని కట్టుకొని “లబ్బైక్’ వాక్యాలను బిగ్గరగా పలికారు. బయటకు వచ్చి తన ‘కస్వా’ అనే ఆడ ఒంటె పై ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలను బిగ్గరగా పలికారు. అలా ఒంటెనెక్కి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మైదానం వైపునకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాల్ని అందరికీ వినబడేటట్లు పలికారు.

ఆ తరువాత పయనమై ఓ వారం తరువాత ప్రొద్దుగ్రుంకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జీతువా’లో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజ్ర్ నమాజు తరువాత ‘గుస్ల్’ (స్నానం) చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు. అది హిజ్రి శక సంవత్సరం 10, జిల్ హిజ్జా మాసం 4వ తేది, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం ఎనిమిది రాత్రిళ్ళు గడిచాయి- సరాసరి ప్రయాణానికి పట్టేకాలం అదే- నేరుగా మస్జిదె హరామ్ (కాబా మస్జిద్)కు చేరి ఆయన మొదట దైవగృహం కాబా తవాఫ్ చేశారు. ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ ‘సయీ’ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలు రెంటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం ‘హదీ’ (ఖుర్బానీ) పశువులను వెంట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయక అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయీ రెంటిని ముగించుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో విడిది చేశారు. అయితే, హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వచ్చిన ఏ సహాబాలైతే తమ వెంట ‘హదీ’ తీసుకురాలేకపోయారో, వారికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఇహ్రామ్ ను ఉమ్రా ఇహ్రామ్ గా మార్చుకొమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ ‘సయీ’ చేసిన తరువాత వాటిని తీసేసి పూర్తిగా ‘హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహాబాలు కొంత ఇరుకునబడ్డారు. అది చూసిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో, “నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేనసలు హదీ తెచ్చేవాడినే కాదు. మీతోపాటే హలాల్ అయి ఉండేవాణ్ణి” అని అనగా సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హదీ పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. (హలాల్ కావడం అంటే, ఇహ్రామ్ కట్టుకున్న తరువాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదలనంతవరకు హరామ్ అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తరువాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని అర్థం.)

ఎనిమిది జిల్ హిజ్జా తేదీన – తర్వియా రోజున – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’కు వెళ్ళారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ ఉదయం వరకు విడిది చేశారు. జొహ్ర్,అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు (అయిదు పూటలు) అక్కడనే చేశారు. సూర్యోదయం అయిన వరకు ఆగి ‘అరఫా’కు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికే ఆయన కోసం ‘వాదియె నిమ్రా’లో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గుడారం లోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిన తరువాత ఆయన ఆదేశం మేరకు కస్వా పై కజావా కట్టబడింది. దాని పైనెక్కి ‘బత్న్’ లోయలోనికి అరుదెంచారు. అప్పుడు ఆయన చుట్టూ ఒక లక్షా ఇరవై నాల్గు వేలు లేదా లక్షా నలభై నాల్గు వేల మంది చేరారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నడుమన నిలుచొని ఓ సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! నా మాటలను ఆలకించండి! ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు.[4]

ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా, మీ ప్రాణం, మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. బాగా వినండి! అజ్ఞాన కాలంనాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్తపరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్తపరిహారం దేన్నయితే నేను అంతమొందిస్తున్నానో అది రబీయా బిన్ హారిస్ కుమారునిది – ఈ పిల్లవాణ్ణి బనూ సఅద్ పాలు త్రాగడానికి వదలినప్పుడు హుజైల్ వంశానికి చెందినవారు అతణ్ణి హతమార్చారు – అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తున్నాను. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ అంతా లేనట్లే.

అయితే, స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి. ఎందుకంటే వారిని మీరు అల్లాహ్ అమానతుగా పొందినవారు. అల్లాహ్ వచనం ద్వారా మీ కోసం వారు ధర్మసమ్మతం అయినవారు. మీకు ఇష్టం కాని వారినెవరినీ వారు మీ పడకల పైకి రాకుండా ఉంచాలి. అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు. అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండీ బట్టా అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు.

ఇంకా, మీ కోసం దేన్నయితే వదిలి వెళుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకొని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అది అల్లాహ్ గ్రంథం.

ప్రజలారా! గుర్తుంచుకోండి! నా తరువాత మరే ప్రవక్త ఉండడు. అలాగే నా తరువాత మరే సమాజమూ లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి. అయిదు పూటలా నమాజు చేయండి. రమజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి. మనస్పూర్తిగా జకాత్ చెల్లించండి. మీ ప్రభువు గృహ (కాబా) హజ్ చేయండి మరియు మీ పాలకులను విధేయించండి. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. [6]

ఇంకా, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహాబా (రదియల్లాహు అన్హుమ్), “మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు. ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు” అన్నారు. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన చూపుడు వ్రేలిని ఆకాశం వైపునకు ఎత్తి దాన్ని ప్రజల వైపునకు వంచుతూ ‘ఓ అల్లాహ్ దీనికి నీవే సాక్షివి’ అని మూడు మార్లు పలికారు.[7]

[4] ఇబ్నె హిషామ్ -2/603
[5] సహీహ్ ముస్లిమ్ – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి హజ్ అధ్యాయం – 1/397.
[6] ఇబ్ను మాజా; ఇబ్ను అసాకర్; రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/263.

[7] సహీహ్ ముస్లిమ్ – 1/397

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలుకుల్ని రబీయా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉచ్ఛస్వరంతో ప్రజలకు వినిపించనారంభించారు.[8] ప్రసంగం పూర్తి చేసిన తరువాత అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అల్ యౌమ అక్-మల్తు లకుం దీనుకుమ్. వ అత్-మంతు అలైకుం నిఇమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా.”(5 : 3)

(ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నాపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ ను మీ ధర్మంగా అంగీకరించాను.)

[8] ఇబ్నె హిషామ్ -2/605

[9]. బుఖారి, ఇబ్నె ఉమర్ గారి ఉల్లేఖనం. చూడండి, రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/265

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ ఆయత్ ను విన్నంతనే దుఃఖించనారంభించారు. మీరెందుకు రోదిస్తున్నారని అడుగగా, “పరిపూర్ణత తరువాత మిగిలేది లోపమే కదా!” అని బదులిచ్చారు ఆయన.[9]

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ పలికి నమాజు కోసం ఇఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మరోసారి ఇఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్యకాలంలో మరే నమాజు చేయలేదు. ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లే ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె) ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు.

సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన ఒంటె పై వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్ దల్ఫాలో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే అజాన్ మరియు రెండు ఇఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా అజాన్ కాగానే ఇఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజ్ చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్ అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ ఖిబ్లా దిశగా (కాబాభి ముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతించారు. అలా ఇక్కడా బాగా తెల్లవారిపోయిన వరకు అలా నిలబడి అల్లాహ్ ను ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు. ఈసారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నే ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు.

జమ్రయె కుబ్రాకు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా జమ్రయె కుబ్రాను జమ్రయె అక్బా మరియు జమ్రయె ఊలాగా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదీలో నిలబడి విసిరారు.

ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని తవాఫె ఇఫదః అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటిని తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందులో నుండి తనవితీరా నీరు త్రాగారు.” [10]

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హిజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ప్రొద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన కంచర గాడిద (ఖచ్చర్) నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు), సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా( (రదియల్లాహు అన్హుమ్)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు.” [11] ప్రవక్త శ్రీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు ప్రసంగం లోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లిమ్ గ్రంథాల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు), యౌమున్నహ్ర్ (పదవ జిల్ హిజ్జా) నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు:

“కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసు” అన్నాం. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచెం సేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హిజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును. ఎందుకు కాదు” అన్నాం మేము. ఆయన మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి. మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నిం చారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

“అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే బాగా తెలుసు” అన్నాం మేము.

మా సమాధానం విన్న ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హిజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు.

“ఔను. ఎందుకు కాదు” అని అన్నాం మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్తకంఠంతో ‘అవును’ అని పలికారు.

అప్పుడు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి! అంటూ, ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.” [12]

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చి నట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరంచేయడనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారుని పైగాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రి పైగాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరగదు అని). జ్ఞాపకముంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” [13] (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో వారు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం.)

[10] ముస్లిమ్- అధ్యాయం , ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హజ్ – 1/397 – 400.
[11] అబూ దావూద్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఖుత్బాల అధ్యాయం – 1/270.

[12] సహీహ్ బుఖారి- మినాలో చేసిన ఖుత్బా అధ్యాయం-1/234.
[13] తిర్మిజీ-2/38, 135; ఇబ్ను మాజా, కితాబుల్ హజ్ మిష్కాత్-1/234.

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హిజ్జా తేదీలు) లో మినాలోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపివేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రదియల్లాహు అన్హా) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రఊస్’[14] రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” [15] అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్ ) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హిజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా నుండి బయలు దేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ , ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలు దేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హలో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం. ” [16]

[16] హజ్జతుల్ విదా వివరాల కోసం ఈ గ్రంథాలను చూడండి: సహీ బుఖారి- కితాబుల్ మనాసిక్, సంపుటి 1, సంపుటి-2/631; సహీహ్ ముస్లిమ్ – బాబుల్ హజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఫత్ హుల్ బారి – సంపుటం 3, షరహ్ కితాబుల్ మనాసిక్ మరియు సంపుటం-8/103 – 110; ఇబ్నె హిషామ్ 2/601 – 605; జాదుల్ ముఆద్ 1/196, 218 – 240

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి [పుస్తకం]

%d bloggers like this: