మూల స్తంభాలు మన లక్ష్యం స్వచ్ఛమైన ఇస్లామీయ తౌహీద్, పవిత్ర ఖురాన్ యొక్క ప్రామాణికత, మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుచరుల (సహాబాల) గౌరవాన్ని కాపాడటం.
ఈ ప్రదర్శన ఉద్దేశ్యం గ్రంథాల ఆధారంగా రాఫిజా (షియా) అఖీదాలోని ప్రధాన లోపాలను, అతివాద (ఘులువ్) ధోరణులను శాస్త్రీయంగా విశ్లేషించడం.
చారిత్రక మూలాలు: పునాది ఎక్కడ పడింది?
ఈ విభేదాల మూలాలు అబ్దుల్లాహ్ బిన్ సబా అనే ఒక యూదుడి నుండి ప్రారంభమయ్యాయి, అతను ఇస్లాంను లోపల నుండి నాశనం చేయడానికి ముస్లింగా నటించాడు. ఈ పునాది నుండి అనేక ప్రధాన విభేదాలు ఉద్భవించాయి:
అలీ (రజియల్లాహు అన్హు) పట్ల అతివాదం (ఘులువ్): అలీ (రజియల్లాహు అన్హు) పట్ల మితిమీరిన గౌరవం చూపడం.
దైవప్రవక్త వారసత్వం: వారసత్వం కేవలం అలీ (రజియల్లాహు అన్హు) కే చెందుతుందనే వాదన.
మనుషులకు దైవత్వాన్ని ఆపాదించడం: మానవులకు దైవిక లక్షణాలను ఆపాదించడం.
‘రాఫిజా’ – ఆ పేరు వెనుక ఉన్న వాస్తవం
‘రాఫిజా’ అనే పదం జైద్ బిన్ అలీ (రజియల్లాహు అన్హు) జీవితంలో జరిగిన ఒక సంఘటన నుండి వచ్చింది. కొందరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చి, అబూబకర్ (రజియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రజియల్లాహు అన్హు) లను దూషించాలని షరతు పెట్టారు.
జైద్ (రజియల్లాహు అన్హు) దానికి నిరాకరించి, ‘వారు నా తాత (ప్రవక్త) కు ఆప్తులు, నేను వారిని ప్రేమిస్తాను’ అని స్పష్టం చేశారు.
అందుకు వారు, ‘అయితే మేము నిన్ను తిరస్కరిస్తున్నాము’ (ఇదన్ నర్ఫుజుక) అని చెప్పి ఆయనను వదిలిపెట్టారు. అప్పటి నుండి వారిని ‘రాఫిజా‘ (తిరస్కరించినవారు / Rejectors) అని పిలుస్తారు.
ప్రధాన విశ్వాసాలు: ఒక పోలిక
1. అల్లాహ్ పట్ల విశ్వాసం: ఖదర్ వర్సెస్ అల్-బదా
ఇస్లామీయ విశ్వాసం (ఖదర్): ఇస్లాం ప్రకారం, అల్లాహ్ కు సంపూర్ణ జ్ఞానం (Absolute Knowledge) ఉంది. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి ప్రతిదీ ఆయనకు ముందుగానే తెలుసు. అల్లాహ్ జ్ఞానంలో ఎటువంటి లోపం లేదు.
రాఫిజా విశ్వాసం (అల్-బదా): ‘అల్-బదా’ సిద్ధాంతం ప్రకారం, అల్లాహ్ కు కొన్ని విషయాలు ముందుగా తెలియవని, పరిస్థితులను బట్టి ఆయన తన నిర్ణయాలను మార్చుకుంటాడని ఆరోపించడం. ఇది అల్లాహ్ కు అజ్ఞానాన్ని ఆపాదించడమే!
2. పవిత్ర ఖురాన్: పరిరక్షణ వర్సెస్ మార్పుల ఆరోపణ
సున్నీ విశ్వాసం: ఖురాన్ అల్లాహ్ చేత పూర్తిగా సంరక్షించబడిన గ్రంథం. ఒక్క అక్షరం కూడా మార్చబడలేదు. ‘దీనిని మేమే అవతరింపజేశాము, మేమే సంరక్షిస్తాము.’ (ఖురాన్ 15:9).
షియా వాదన: వారి ప్రామాణిక గ్రంథాల ప్రకారం, ప్రస్తుత ఖురాన్ లో మార్పులు (తహ్రీఫ్ అల్-ఖురాన్) జరిగాయని, కొన్ని సూరాలు (విలాయత్ వంటివి) తొలగించబడ్డాయని వాదిస్తాయి. ఇది ఇస్లాం మూలాలకే విరుద్ధం.
3. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాల పట్ల వైఖరి
ఖురాన్ సాక్ష్యం: అల్లాహ్ ముహాజిర్లు మరియు అన్సార్ల పట్ల ప్రసన్నుడయ్యాడు (రజియల్లాహు అన్హుమ్). వారు ఇస్లాం కోసం తమ ప్రాణాలను, సంపదను త్యాగం చేశారు.
అతివాద వాదన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత ముగ్గురు మినహా మిగిలిన సహాబాలందరూ ఇస్లాం నుండి వైదొలిగారని నిరాధారమైన ఆరోపణ. ముఖ్యంగా అబూబకర్ (రజియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రజియల్లాహు అన్హు) లను అత్యంత ద్వేషించడం.
4. ఇమామ్ ల హోదాలో అతివాదం
సత్య మార్గం: అల్లాహ్ (సృష్టికర్త,అగోచర జ్ఞాని), ప్రవక్తలు (సందేశహరులు), ఇమామ్ లు (గౌరవనీయులైన మానవులు, కానీ తప్పులకు అతీతులు కారు)
షియా విశ్వాసం: ఇమామ్ లు వందశాతం పాపాలు చేయనివారు (మఅసూమ్), మరియు వారికి సృష్టి అణువులపై నియంత్రణ ఉంటుంది. ఖొమైనీ మాటల్లో: “మా ఇమామ్ లకు ఉన్న హోదా ఏ ప్రవక్తకూ, ఏ దేవదూతకూ లేదు.”
5. అర్-రజ్అ (పునరాగమనం) – ఒక కల్పిత సిద్ధాంతం
ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రళయ దినానికి ముందే కొందరిని తిరిగి బ్రతికించి ప్రతీకారం తీర్చుకుంటారు.
అంతిమ కాలంలో ‘మహదీ’ రాక.
గతించిన ఇమామ్ లు మరియు వారి శత్రువులు (సహాబాలు) తిరిగి బ్రతికించబడటం.
ప్రతీకారం తీర్చుకోవడం.
ఈ సిద్ధాంతం ఇస్లామీయ అఖీదాలో లేదు. ఇది కేవలం విద్వేషాన్ని రగిలించడానికి సృష్టించబడిన కల్పన.
6. తఖియ్యా: విశ్వాసాన్ని దాచడం
కనిపించేది: పైకి సోదరభావం, ఇస్లామీయ ఐక్యతా నినాదాలు ప్రదర్శించడం.
దాగి ఉన్న వాస్తవం: సహాబాలను దూషించడం, విలక్షణమైన అఖీదాను నమ్మడం.
షియా మత గ్రంథాల ప్రకారం: “తఖియ్యా (అబద్ధం చెప్పి లేదా నిజం దాచి వ్యవహరించడం) అనేది మతంలో తొమ్మిది వంతులు. తఖియ్యా లేనివాడికి మతం లేదు.” ఇది ఇస్లాం బోధించే సత్యసంధతకు పూర్తి విరుద్ధం.
7. పవిత్ర స్థలాలు మరియు కర్మల్లో అతివాదం
ఇస్లామీయ పవిత్రత: మక్కా, మదీనా మరియు మస్జిద్ అల్-అక్సాలు మాత్రమే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ప్రార్థనలు అల్లాహ్ కు మాత్రమే చేయాలి.
దారి తప్పిన ఆచారాలు: కర్బలా, నజఫ్ లను మక్కా కంటే పవిత్రంగా భావించడం. హుస్సేన్ (రజియల్లాహు అన్హు) సమాధి మట్టిలో రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్మడం, మరియు ఆపదల్లో చనిపోయిన ఇమామ్ లను సహాయం కోసం పిలవడం.
ప్రధాన భేదాలు – ఒకే చూపులో
విషయం
అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్
షియా/రాఫిజా విశ్వాసం
పవిత్ర ఖురాన్
సంపూర్ణంగా సంరక్షించబడింది
మార్పులు, చేర్పులు జరిగాయి (తహ్రీఫ్)
అల్లాహ్ జ్ఞానం
సర్వజ్ఞాని, అన్నీ ముందుగానే తెలుసు (ఖదర్)
కొన్ని విషయాలు తర్వాతే తెలుస్తాయి (బదా)
ప్రవక్త సహాబాలు
అందరూ గౌరవనీయులు, దైవప్రసన్నత పొందినవారు
కొందరు మినహా అందరూ మార్గం తప్పారు, దూషించదగినవారు
సత్యసంధత
సత్యం మాట్లాడటం ఇస్లాం పునాది
అవసరమైతే అబద్ధం చెప్పడం (తఖియ్యా) మతంలో భాగం
గత జాతుల తప్పిదాలతో పోలికలు
షేక్ అల్-ఇస్లాం ఇబ్న్ తైమియా (రహ్మతుల్లాహి అలైహి) ఈ అతివాద వర్గాల సిద్ధాంతాలను గత జాతులతో పోల్చారు.
యూదులు వారి గ్రంథం (తౌరాత్) లో మార్పులు చేశారు. రాఫిజా: షియాలు ఖురాన్ లో మార్పులు జరిగాయని వాదిస్తారు.
క్రైస్తవులు: ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) కు దైవత్వాన్ని ఆపాదించారు. రాఫిజా: వీరు అలీ (రజియల్లాహు అన్హు) మరియు ఇమామ్ లకు దైవిక లక్షణాలను ఆపాదిస్తారు.
యూదులు: నక్షత్రాలు కనిపించే వరకు మగ్రిబ్ నమాజును ఆలస్యం చేసేవారు. రాఫిజా: వీరు కూడా సరిగ్గా అదే పద్ధతిని పాటిస్తారు.
ముగింపు: సత్య మార్గాన్ని హత్తుకుందాం
తౌహీద్: కేవలం ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం, ఆయనకు సాటి ఎవరినీ కల్పించకపోవడం.
ఖురాన్ & సున్నత్: పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రామాణిక సున్నత్ ను గట్టిగా పట్టుకోవడం.
సహాబాల పట్ల ప్రేమ: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబ సభ్యులను (అహ్లల్ బైత్) మరియు సహాబాలందరినీ సమానంగా గౌరవించడం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
షేక్ ఇబ్న్ ఉసైమీన్ (రహిమహుల్లాహ్) ఈ విధంగా చెప్పారు:
అర్-రాఫిదా – వీరు ప్రవక్తగారి కుటుంబ సభ్యుల (ఆల్-బైత్) విషయంలో మితిమీరి ప్రవర్తించేవారు (అతివాదులు). తమను వ్యతిరేకించిన సహచరులను (సహాబాలను) వీరు అవిశ్వాసులుగా (కాఫిర్లుగా) ప్రకటిస్తారు లేదా వారిపై చెడు (ఫిస్క్) మోపుతారు. వీరు అనేక వర్గాలుగా విడిపోయారు. వారిలో అలీ (రజియల్లాహు అన్హు) దేవుడు అని వాదించే అతివాదులు ఉన్నారు, అలాగే వారి కంటే భిన్నమైన ఇతర వర్గాలు కూడా ఉన్నాయి.
అలీ బిన్ అబీ తాలిబ్ ఖిలాఫత్ (పాలనా) కాలంలో అబ్దుల్లాహ్ బిన్ సబా ఆయనతో “నీవే దేవుడివి” అని అన్నప్పుడు వీరి నూతన కల్పన (బిదఅత్) మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా, వారిని అగ్నికి ఆహుతి చేయాలని అలీ ఆదేశించారు. అయితే, వారి నాయకుడు అబ్దుల్లాహ్ బిన్ సబా వేరొక నగరానికి పారిపోయాడు.
అల్లాహ్ యొక్క లక్షణాలకు సంబంధించి వారు వివిధ అభిప్రాయాలను కలిగి ఉంటారు, కాబట్టి వారిలో ‘తష్బీహ్‘ (సృష్టితో పోల్చడం) చేసేవారు, ‘తఅతీల్‘ (లక్షణాలను తిరస్కరించడం) చేసేవారు, మరియు (లక్షణాల గురించి సరైన అభిప్రాయంతో) ఏకీభవించేవారు కూడా ఉన్నారు. వీరిని ‘రాఫిదా‘ అని ఎందుకు పిలుస్తారంటే, వీరు జైద్ బిన్ అలీ ఇబ్నుల్-హుసైన్ బిన్ అలీ బిన్ అబీ తాలిబ్ ను తిరస్కరించారు (రఫ్ద్). వీరు అబూ బకర్ మరియు ఉమర్ ల గురించి ఆయన్ని అడిగినప్పుడు, ఆయన వారిద్దరి కోసం “రహిమహుల్లాహ్” (అల్లాహ్ వారిపై కరుణ కురిపించుగాక) అని అన్నారు. అందువల్ల వారు ఆయన్ని తిరస్కరించారు.
కాబట్టి వారు అతడిని తిరస్కరించి, అతనికి దూరమయ్యారు. వారు ఆల్-బైత్ (ప్రవక్త కుటుంబం) పక్షాన నిలబడతామని (తషయ్యు), వారికి మద్దతు ఇస్తామని, మరియు ఇమామ్ పదవి (ఇమామత్) పై వారి హక్కును తిరిగి పొందుతామన్న వారి వాదన మరియు భావన కారణంగా తమకు తాము ‘షియా‘ అని పేరు పెట్టుకున్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.
మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.
“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)
సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.
అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,
“నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్ సెలవిస్తాడు).” (23:111)
అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.
అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.
కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.
అల్లాహ్ ప్రేమ
సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,
وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ (వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్) సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)
అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.
సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.
అల్లాహ్ తోడు
అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.
అపరిమిత పుణ్యం
అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.
ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.
అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.
సహనం ఒక గొప్ప అనుగ్రహం
మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.
సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ (వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్) “సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)
అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.
అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?
“ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)
ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.
అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.
అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్.మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.
అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.
కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.
సహనం పాటించవలసిన సందర్భాలు
అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.
1. నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు
మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
“మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)
ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.
అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.
2. పేదరికం మరియు గడ్డు పరిస్థితులలో
మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا (ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా) “ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)
మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.
ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.
అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.
కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.
3. శత్రువును ఎదుర్కొనేటప్పుడు
సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
“వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)
ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.
4. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు
నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,
“ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.
అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.
కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.
5. వ్యతిరేకులు విమర్శించినప్పుడు
ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا (వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా) “వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)
వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.
6. ఆత్మీయులను కోల్పోయినప్పుడు
అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.
ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,
మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా. “విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.“
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.
7. ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు
అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
8. వ్యాధి సోకినప్పుడు
ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.
దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
9. సేవ చేసేటప్పుడు
అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?
ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.
ముగింపు
చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.
మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.
మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.
ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.
ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.
అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఐ లవ్ ముహమ్మద్ ﷺ” మనతో ఏమి కోరుతుంది? ప్రవక్త ముహమ్మద్ ﷺ వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? https://youtu.be/HVwTB7FS8Dw [46 నిముషాలు] షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, షేక్ సలీం జమఈ హఫిజహుల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తారు. కేవలం బ్యానర్లు, సోషల్ మీడియా స్టేటస్ల ద్వారా ప్రేమను ప్రదర్శించడం కాకుండా, ఆ ప్రేమ మన నుండి ఏమి ఆశిస్తుందో ఆయన విశ్లేషించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన నిదర్శనం, ఆయన తెచ్చిన ధర్మాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం (ఇతా’అత్), ఆయనపై దరూద్ పఠించడం, ఆయన జీవిత చరిత్ర (సీరత్)ను తెలుసుకోవడం, ఆయన ప్రవర్తనను మన జీవితంలో అలవర్చుకోవడం, ఆయన ఇష్టపడిన వాటిని ఇష్టపడటం మరియు ఆయన కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం అని స్పష్టం చేశారు. హంజా (రదియల్లాహు అన్హు)), అబ్దుల్లాహ్ బిన్ మసూద్ (రదియల్లాహు అన్హు) వంటి సహాబాల ఉదాహరణలతో నిజమైన విధేయతను వివరిస్తూ, కేకులు కోయడం, ర్యాలీలు చేయడం వంటివి ప్రవక్త ప్రేమకు నిదర్శనం కాదని, అవి ధర్మంలో లేని పనులని ఆయన హెచ్చరించారు.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
నేటి కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఇదివరకే మీరు ఈనాటి ప్రసంగ అంశాన్ని విని ఉన్నారు. ఈరోజు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద ఉన్న ప్రేమ మనతో ఏమి కోరుతుంది? అనే అంశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
మనమంతా సోషల్ మీడియాలో, అంతర్జాల మాధ్యమాలలో గత కొద్ది రోజులుగా ఒక హాట్ టాపిక్ చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రతిచోట ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అని బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే స్టేటస్లలో, ప్రొఫైల్ పిక్చర్లలో కూడా ‘ఐ లవ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’ అనే ఇమేజ్లు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. చాలా చోట్ల ర్యాలీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలాచోట్ల కొన్ని ఊహించని సంఘటనలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి.
అయితే మిత్రులారా, ఒక్క విషయం మాత్రము ప్రపంచానికి అర్థమయింది. అదేమిటంటే, ముఖ్యంగా మనము ఏ దేశంలో అయితే నివసిస్తూ ఉన్నామో ఆ దేశ ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద చాలా ప్రేమ, అభిమానం కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకు ఉన్న ప్రేమ, అభిమానం ఏమి కోరుతూ ఉంది? ప్రవక్త వారి ప్రేమ మాకు ఏమి కోరుతూ ఉంది, ఏమి చేయమని చెబుతూ ఉంది? మనము ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారు, ప్రవక్త వారి ప్రేమ మాతో ఏమి కోరుతూ ఉంది, మేము ఏమి చేయాలి వాస్తవానికి? కానీ చేయాల్సిన పనులు చేయకుండా పక్కన పెట్టేసి మేము ఏమి చేస్తున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకుంటారన్న ఉద్దేశము, అలాగే సరైన విధంగా ప్రవక్త వారిని అభిమానిస్తారు అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ ఎన్నుకోబడింది. ఎవరినీ ఉద్దేశించటమో లేదా ఎవరినీ కించపరచటమో లేదంటే ఎవరి మనోభావాలను మనము బాధపరచటము గాని, గాయపరచటము గాని ఉద్దేశము కానేకాదు. ఇది నేను ముందుగానే వ్యక్తపరుస్తూ ఉన్నాను, తెలియజేసేస్తూ ఉన్నాను.
చూడండి, మనమంతా పండితుల నోట అనేక సందర్భాలలో, అనేక ప్రసంగాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం అని విన్నాం. అవునా కాదా? ఆ ప్రకారంగా పండితులు మనకు ఖురాన్లోని వాక్యాలు వినిపించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు వినిపించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తౌబా 24 వ వాక్యంలో తెలియజేశాడు, మీరు ప్రవక్త వారి కంటే ఎక్కువగా మీ వర్తకాన్ని లేదంటే మీ ఆస్తిపాస్తుల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇలాంటి వారిని మీరు అభిమానించేటట్లయితే మీరు అల్లాహ్ శిక్ష కొరకు ఎదురు చూడండి అని అల్లాహ్ హెచ్చరించి ఉన్నాడు. అంటే మనము ప్రవక్త వారినే ఎక్కువగా అభిమానించాలి కానీ ప్రాపంచిక విషయాలు లేదంటే ఇతర వ్యక్తులను ఎక్కువగా అభిమానించరాదు, అందరికంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆజ్ఞ అని ఆ వాక్యం ద్వారా మనకు పండితులు వివరించారు.
అలాగే ప్రవక్త వారి ఒక హదీస్, ప్రవక్త వారి ఉల్లేఖనం, ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఒకానొక సందర్భంలో ప్రవక్త వారి చేయి పట్టుకొని ఉండి ప్రవక్త పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఓ దైవ ప్రవక్త, నేను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే నా ప్రాణము నాకు మీకంటే ప్రియమైనది అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారు ఆయనకి? ఓ ఉమర్, లేదు లేదు, ఏ వ్యక్తి కూడాను ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువగా చివరికి తన ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానిస్తేనే సంపూర్ణ విశ్వాసి అవగలుగుతాడు లేదంటే అతని విశ్వాసం అసంపూర్ణం అవుతుంది జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు వారు వారిని వారు సంస్కరించుకున్నారు. ప్రవక్త వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించడం ప్రారంభించేశారు. ఆ విషయాన్ని మళ్ళీ ప్రవక్త వారితో తెలియజేశారు. ఓ ప్రవక్త, ఇప్పుడు నేను నా ప్రాణము కంటే ఎక్కువగా మిమ్మల్ని అభిమానిస్తున్నాను అని చెప్పగానే ప్రవక్త వారు ఏమన్నారంటే, ఓ ఉమర్ ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అన్నారు.
ఇలాంటి సంఘటనలు తెలియజేసి ధార్మిక పండితులు మనకు ఏమని చెప్పారంటే, మనము ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, మన భార్యాబిడ్డల కంటే ఎక్కువగా, బంధుమిత్రుల కంటే ఎక్కువగా, మన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా, మన ప్రాణము కంటే ఎక్కువగా ప్రవక్త వారిని ప్రేమించాలి, అభిమానించాలి అని తెలియజేశారు. అల్హమ్దులిల్లాహ్ ఆ విషయాలను మనం బాగా అర్థం చేసుకున్నాము. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే ఈ అభిమానం మనకు కొన్ని శుభవార్తలు కూడా ఇస్తూ ఉంది, మనతో కొన్ని విషయాలు కూడా కోరుతూ ఉంది.
ప్రవక్త వారి అభిమానం మనకు ఇస్తున్న శుభవార్త ఏమిటి? మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనసారా ప్రేమిస్తే, అభిమానిస్తే మనము స్వర్గానికి చేరుకుంటాము అని శుభవార్త ఇస్తూ ఉంది. దానికి ఆధారము, ఒక పల్లెటూరి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది? అంటే ఖియామత్, యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నువ్వు యుగాంతం గురించి ప్రశ్నిస్తూ ఉన్నావు, బాగానే ఉంది. అయితే దాని కొరకు నువ్వు ఏమి సిద్ధము చేశావు? అని అడిగారు. యుగాంతం గురించి అడుగుతున్నావ్, పరలోకం గురించి, ప్రళయం గురించి అడుగుతున్నావ్ బాగానే ఉంది. అయితే ఆ ప్రళయం కొరకు, ఆ యుగాంతం కొరకు, ఆ పరలోకం కొరకు నువ్వు ఏమి సిద్ధం చేసుకున్నావ్, అది చెప్పు అన్నారు. దానికి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఎక్కువగా చెప్పుకోదగ్గ నమాజులు, చెప్పుకోదగ్గ దానధర్మాలు ఏమి చేసుకోలేదు కానీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల హృదయము నిండా అభిమానము, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పాడు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనికి శుభవార్త ఇచ్చారు. ఏమని?
قَالَ أَنْتَ مَعَ مَنْ أَحْبَبْتَ (ఖాల అంత మ’అ మన్ అహబబ్త) “నీవు ప్రేమించిన వారితోనే ఉంటావు.” అన్నారు.
అల్లాహు అక్బర్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండే స్థలం స్వర్గం. ప్రవక్త వారి అభిమానులు కూడా ఇన్షాఅల్లాహ్ చేరుకునే స్థలం స్వర్గం ఇన్షాఅల్లాహ్. అల్లాహ్ సుబ్ హాన వ త’లా మనందరికీ ప్రవక్త వారి అభిమానంతో పాటు ప్రవక్త వారితో పాటు స్వర్గంలో చేరుకునే భాగ్యం ప్రసాదించుగాక, ఆమీన్.
అయితే మిత్రులారా, ప్రవక్త వారి అభిమానము మనకు స్వర్గానికి చేర్చుతుంది అన్న శుభవార్త ఇస్తూ ఉంది. ఆ అభిమానంతోనే, ఆ ఆశతోనే మనము ప్రవక్త వారిని ప్రేమిస్తున్నాము, అభిమానిస్తూ ఉన్నాం. మన విశ్వాసం కోసం, స్వర్గం కోసం, అల్లాహ్ ను ప్రవక్త వారిని నమ్ముతూ ఉన్నాము, ప్రేమిస్తూ ఉన్నాము, అభిమానిస్తున్నాం, ఓకే బాగానే ఉంది. అయితే మరి ఆ ప్రేమ ఏమి కోరుతుందో అది తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ప్రవక్త వారి పేరు మీద ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, బ్యానర్లు పెట్టుకుంటూ ఉన్నారో, స్టేటస్లు పెడుతూ ఉన్నారో, ప్రొఫైల్ పిక్చర్లు పెడుతూ ఉన్నారో, వారిలో ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఎన్ని విషయాలు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ విషయాలు మనము జాగ్రత్తగా విని ఇన్షాఅల్లాహ్ ఆత్మ పరిశీలన చేసుకుందాం.
1. ప్రవక్త తెచ్చిన ధర్మాన్ని విశ్వసించడం
చూడండి, ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ప్రథమ విషయం ఏమిటంటే, ఏ ధర్మాన్ని, ఏ శాసనాన్ని అయితే ప్రవక్త వారు తీసుకుని వచ్చారో ఆ ధర్మాన్ని, ఆ శాసనాన్ని మనమంతా మనసారా స్వీకరించాలి, ఆమోదించాలి, విశ్వసించాలి, నమ్మాలి.
దీనికి ఒక రెండు ఉదాహరణలు మనము ఇన్షాఅల్లాహ్ తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాసనము తీసుకుని వచ్చి ప్రజల ముందర వినిపించినప్పుడు, ముఖ్యంగా మక్కా వారిలో కొంతమంది ఇస్లాం స్వీకరించారు. అధిక శాతం ప్రజలు ప్రవక్త వారి మీద తిరగబడ్డారు.
ఇలాంటి సందర్భాలలో ఒకసారి ఏమైందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు. అంతలోనే ముస్లింల బద్ధ శత్రువు, ప్రవక్త వారి బద్ధ శత్రువు అయిన అబూ జహల్ చూసుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే ఉన్నారు, నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. అది చూసి ఎంతగా అతనికి మండింది అంటే, అతను ప్రవక్త వారి మీద నోరు పారేసుకున్నారు, లేనిపోని మాటలు ప్రవక్త వారి గురించి మాట్లాడాడు. కానీ ప్రవక్త వారు ఎలాంటి ఏకాగ్రతను కోల్పోకుండా ప్రశాంతంగా, ఏకాగ్రతతో నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నారు.
అతనికి సైతాను ఎంతగా రెచ్చగొట్టాడంటే, నోటికి పని చెప్పినవాడు అక్కడికి సంతృప్తి పడలేదు. తర్వాత పక్కనే ఉన్న ఒక రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరి, చేయికి పని చెప్పాడు. ముందు నోటికి పని చెప్పాడు, కానీ మనసు కుదుట పడల, మనశ్శాంతి దొరకలా అతనికి. తర్వాత చేయికి పని చెప్పాడు, రాయి తీసుకుని ప్రవక్త వారి మీద విసిరాడు. ప్రవక్త వారికి గాయమయింది. ఆయన కారుణ్యమూర్తి కదా, ప్రజల కోసం కరుణగా పంపించబడ్డారు కదా, ఆయన మాటలు భరించారు, బాధను కూడా భరించారు, గాయాన్ని కూడా ఆయన భరించారు.
ఇదంతా ఒక బానిసరాలైన మహిళ చూసుకున్నారు. ఆమె ఏమి చేశారంటే, ప్రవక్త వారి మీద జరుగుతున్న ఆ దౌర్జన్యాన్ని చూసి ఊరుకుండలేక, చక్కగా ప్రవక్త వారి బంధువు అయిన హంజా రజియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్లారు. హంజా రజియల్లాహు అన్హు వారు ఎవరండీ? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వయాన పినతండ్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి దగ్గరకు వెళ్లి, “ఏవండీ, మీ తమ్ముడి కుమారుడు మక్కాలోని కాబా పుణ్యక్షేత్రం వద్ద నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే, ఈ దుర్మార్గుడు అబూ జహల్ వచ్చి ముందు తిట్టాడు, ఆ తర్వాత మీ తమ్ముడి కుమారుడి మీద చేయి చేసుకుని కొట్టాడండి” అని చెప్పేశారు.
ఆయన ఏమన్నారంటే, “నా తమ్ముడి కుమారుడు ఏం తప్పు చేశాడబ్బా? ఎందుకు అతను ఆ విధంగా ప్రవర్తించాడు?” అని అడిగారు. ఆవిడ ఏమన్నారంటే, “లేదండీ, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన ఒక్కరే ఒంటరిగా అక్కడ నమాజ్ ఆచరించుకుంటున్నారు అంతే. ఎవరితో ఏమీ మాట్లాడలేదు, ఎవరితో ఆయన ఏమీ చేయలేదు. ఆయన చేసిన తప్పు, నేరం ఏమీ లేదు. కానీ అనవసరంగా ఆయన మీద నోరు పారేసుకున్నాడు, ఆ తర్వాత కొట్టి గాయపరిచాడు” అని చెప్పగానే, ఆయనలో కుటుంబీకుల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం ఎంతగా ఉప్పొంగిందంటే, అక్కడి నుంచి విల్లు తీసుకొని చక్కగా అక్కడికి వచ్చేశారు కాబతుల్లాహ్ దగ్గరికి.
ఆ సమయానికి ప్రవక్త వారు అక్కడ నమాజ్ ముగించుకొని వెళ్లిపోయారు ఇంటికి. ప్రవక్త వారు లేరు. కానీ ఈ అబూ జహల్ మాత్రము అక్కడ వేరే వాళ్లతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉన్నాడు. హంజా, అప్పటికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, ప్రవక్త వారి పినతండ్రి, చక్కగా అబూ జహల్ దగ్గరికి వెళ్లి విల్లు తీసుకొని తల మీద కొట్టగా గాయమైంది, రక్తం కారింది, కింద పడి విలవిల్లాడాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “నీకు అంతగా పోరాడాలని, కొట్లాడాలని ఉంటే నాతో తలపడురా మూర్ఖుడా! నా తమ్ముని కుమారుడి మీద ఏందిరా నువ్వు చూపించేది నీ మగతనము? నాతో ఉంటే, నీకు అంతగా ఉంటే నాతో తలపడు, నాతో పోరాడు చూద్దాము” అని చెప్పారు. ఆయన బలవంతుడు హంజా రజియల్లాహు అన్హు, అప్పటికీ ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేదు కానీ మక్కాలోనే బలవంతులలో ఒక బలవంతుడు ఆయన. కాబట్టి అబూ జహల్ కి నూట మాట రాలేదు, గమ్మునుండి పోయాడు.
తర్వాత హంజా రజియల్లాహు అన్హు వారు చక్కగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఇంటికి వెళ్లి, “బిడ్డా, నువ్వు సంతోషించు, నువ్వు బాధపడవద్దు. నీ మీద చేయి చేసుకున్న వ్యక్తితో నేను ప్రతికారము తీర్చుకున్నాను, నువ్వు సంతోషించు” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నగా చిరునవ్వు చిందిస్తూ పినతండ్రితో ఏమన్నారో తెలుసా? “చిన్నాన్నా, మీరు ప్రతికారము తీర్చుకున్నారు అని చెబుతున్నారు, ఆ విషయము నాకు సంతోషం కలిగించదు. నిజంగా మీరు నన్ను సంతోషపరచాలనుకుంటుంటే నేను తీసుకుని వచ్చిన శాసనాన్ని, ధర్మాన్ని మీరు అంగీకరిస్తే, ఆమోదిస్తే, నమ్మితే, విశ్వసిస్తే అప్పుడు నేను సంతోషిస్తాను చిన్నాన్నా” అన్నారు. అల్లాహు అక్బర్. అప్పటికప్పుడే హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే కలిమా చదివి ఇస్లాం స్వీకరించారు, విశ్వాసిగా మారారు, అల్హమ్దులిల్లాహ్.
అయితే ప్రవక్త వారి పినతండ్రులలోనే మరొక పినతండ్రి ఉన్నారండి. ఆయన పేరు అబూ తాలిబ్. ఆయన గురించి తెలియని వ్యక్తి ఉండరు. అయితే అబూ తాలిబ్ వారు ఎలా మరణించారో ఒకసారి మనము చూద్దాం. అబూ తాలిబ్ వారు మరణ సమయం వచ్చింది, కొద్దిసేపు తర్వాత ఆయన ప్రాణం పోతుంది అన్నట్టుగా ఉంది. చివరి ఘడియలు అంటాము కదా? ఆ చివరి ఘడియల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పినతండ్రి అయిన అబూ తాలిబ్ దగ్గరికి వెళ్లి, “చిన్నాన్నా, ఒక్కసారి మీరు నోటితో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్’ సాక్ష్య వచనము పలకండి. నేను అల్లాహ్ వద్ద మీ కొరకు సిఫారసు చేస్తాను” అని కోరారు.
అంతలోనే ఈ మక్కా పెద్దలు అనిపించుకునే కొంతమంది అబూ తాలిబ్ వారి సహచరులు వచ్చేశారు. వచ్చేసి ఆ పెద్ద మనుషులు అనిపించుకునే, స్నేహితులు అనిపించుకునే వాళ్ళు ఏమి చేశారంటే, “ఏమండీ, మీరు బ్రతికినంత కాలము తాత ముత్తాతల ధర్మం మీద బ్రతికి, మరణించే సమయాన మీరు తాత ముత్తాతల ధర్మానికి ద్రోహం చేసి వెళ్తారా? ఇది మీకు సమంజసమేనా? ఇది మీకు సరిపోతుందా?” అని రెచ్చగొట్టేశారు. చివరికి ఏమైందంటే, ఆయన “నేను తాత ముత్తాతల ధర్మం మీదనే ఉంటున్నాను” అని చెప్పేసి శ్వాస విడిచారు. అంటే ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని ఆయన అంగీకరించలేదు, విశ్వసించలేదు. సరే. ఆయన మరణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బంధువుల్లో ఎవరైతే ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారో వారిలో ఒకరు ప్రవక్త వారితో ప్రశ్నించారు. ఏమండీ, మీ చిన్నాన్న అబూ తాలిబ్ వారు మీకు ఇంచుమించు 40 సంవత్సరాలు సేవలు చేశారు, సపోర్ట్గా నిలబడ్డారు, మీ కొరకు మక్కా వారి శత్రుత్వాన్ని కొనుక్కున్నారు, మీకు మాత్రము ఆయన సపోర్ట్గా నిలబడ్డారు కదా? అంతగా మీకు పోషించిన, మీకు సపోర్ట్ చేసిన మీ చిన్నాన్నకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఆయన స్వర్గవాసా లేదంటే నరకవాససా? అని అడిగారు.
ప్రవక్త వారు ఏమన్నారండి? ఆయన నరకానికే వెళ్తారు. అయితే నరకంలోనే చిన్న శిక్ష ఉంటుంది అన్నారు. అది వేరే విషయం. కానీ ఎక్కడికి వెళ్తారు అన్నారు? ఆయన నరకానికే వెళ్తారు అని చెప్పారు. ఇక్కడ ప్రవక్త వారి ఇద్దరు పినతండ్రులు. ఒకరు హంజా రజియల్లాహు అన్హు వారు, ఒకరు అబూ తాలిబ్ వారు. హంజా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి శాసనాన్ని, ఆయన తీసుకుని వచ్చిన ధర్మాన్ని విశ్వసించారు. అబూ తాలిబ్ వారు ప్రవక్త వారిని ప్రేమించారు, అభిమానించారు, సపోర్ట్గా నిలబడ్డారు కానీ ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రము ఆమోదించలేదు, విశ్వసించలేదు. ఏమైందండి ఫలితం? హంజా రజియల్లాహు అన్హు వారేమో స్వర్గవాసి అయ్యారు, అబూ తాలిబ్ వారు మాత్రము నరకానికి చేరుకున్నారు.
దీన్నిబట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుకుంటుంది అంటే ప్రవక్త వారు తీసుకుని వచ్చిన ధర్మాన్ని మనసారా మనము స్వీకరించాలి, విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో ఒక విషయాన్ని మనము పాటించిన వాళ్ళం అవుతాం, లేదంటే నష్టపోతాం. ఇప్పుడు చెప్తారు మీరు చాలామంది. “ఆ, మేమంతా ముస్లింలమే కదండీ, మేమంతా కలిమా చదివిన వాళ్ళమే కదండీ, ఈరోజు ఐ లవ్ ముహమ్మద్ అని చెప్పుకుంటున్న వాళ్ళము, మరి మాకు ఇవన్నీ విషయాలు చెప్తున్నారు ఏంటి మీరు?” అంటారు. ఆ, అవ్వలేదు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒక్క విషయంతోనే సరిపోదు. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. అప్పుడు మాట్లాడదాం ఇన్షాఅల్లాహ్. అప్పుడు ఆత్మ విమర్శ చేసుకుందాం.
2. ప్రవక్తను అనుసరించడం (ఇతా’అత్)
ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలలో మరొక విషయం ఏమిటంటే, మనము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి, ఇతా’అత్ చేయాలి. ప్రవక్త వారిని అనుసరించాలి.
చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని 59 వ అధ్యాయము ఏడవ వాక్యంలో తెలియజేశాడు,
అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఇచ్చిన దానిని పుచ్చుకోండి, ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టేయండి. ఎవరు చెబుతున్నారు? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త వారిని అనుసరించాలి అంటే అర్థం ఏమిటి? ప్రవక్త వారు ఏ పని అయితే చేయమని చెప్పారో అది మనము చేయాలంట. ప్రవక్త వారు ఏ పని అయితే చేయవద్దు అని వరించారో అది మనము వదిలేయాలంట. ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్లో ఆ వాక్యంలో మాకు తెలియజేస్తున్న విషయం.
అలాగే రెండవచోట ఖురాన్ గ్రంథం మూడవ అధ్యాయం 31వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’లా తెలియజేశాడు,
قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ (ఖుల్ ఇన్ కున్తుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబి’ఊనీ యుహ్బిబ్కుముల్లాహ్) ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పండి, “మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి, తత్ఫలితంగా అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.” (3:31)
అంటే అర్థం ఏమిటండీ? మనమంతా అల్లాహ్ దాసులం. మనము అల్లాహ్ ప్రేమ పొందాలి అంటే ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రవక్త వారి అడుగుజాడల్లో నడుచుకుంటే, ప్రవక్త వారిని అనుసరిస్తే మనకు అల్లాహ్ యొక్క ప్రేమ దక్కుతుంది అని ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది. అల్లాహు అక్బర్.
అంటే అర్థం ఏమిటండీ? అర్థం ఏమిటంటే మనము అల్లాహ్ ప్రేమ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళమైతే అల్లాహ్ చెప్పినట్టు విని నడుచుకోవాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు విని నడుచుకోవాలి అనేది మనకు స్పష్టమవుతుంది. ఏ విధంగా నడుచుకోవాలి? దానికి కొన్ని ఉదాహరణలు పెడతాను చూడండి. ఏ విధంగా ప్రవక్త వారి మాట విని మనము నడుచుకోవాలో దానికి కొన్ని ఉదాహరణలు మీ ముందర పెడతాను. దాన్నిబట్టి ఇన్షాఅల్లాహ్ మనము విషయం బాగా వివరంగా తెలుసుకుందాం.
మొదటి ఉదాహరణ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారిది. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగించటానికి మింబర్ పైకి ఎక్కారు. ఎక్కి ప్రజలను ఉద్దేశించి “అందరూ కూర్చోండి” అని ప్రకటించారు. ఆ పలుకు వినగానే అందరూ ప్రశాంతంగా, ఎవరు నిలబడి ఉన్నచోట వాళ్ళు అక్కడ కూర్చున్నారు.
ప్రవక్త వారు ఎప్పుడైతే ఈ మాట “అందరూ కూర్చోండి” అని పలికారో ఆ సమయానికి అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారు వుజూ చేసుకొని మస్జిద్ లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక అడుగు మస్జిద్ లోపల ఉంది, ఒక అడుగు మస్జిద్ బయట ఉంది. అంటే గుమ్మం దగ్గర ఉన్నారు ఆయన. ప్రవక్త వారి మాట ఎప్పుడైతే చెవిలో పడిందో “అందరూ కూర్చోండి” అని, అక్కడే గుమ్మం మీద కూర్చుండిపోయారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసంగం ప్రారంభించేసి, ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ అటు ఇటు చూస్తూ ఆయన్ని చూసుకున్నారు. ఆయన్ని చూసుకొని, “ఏంటయ్యా మీరు అక్కడే కూర్చున్నారు, లోపలికి వచ్చేయండి” అని చెప్పగానే అప్పుడు ఆయన వెంటనే లోపలికి వస్తూ, “ఓ దైవ ప్రవక్త, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అంటే, మీరు కూర్చోండి అని చెప్పగానే వెంటనే మీ మాటను అనుసరిస్తూ నేను ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా ఇక్కడే కూర్చుండి పోయాను” అని చెప్పేశారు.
మొత్తానికి ప్రవక్త వారు ఆయనను లోపలికి రమ్మని చెప్పారు. ఆయన ఆ ప్రవక్త వారి ఆదేశంతో ఆయన లోపలికి వచ్చేశారు. కాకపోతే, మనము తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత ఆయన తన ఇష్టానుసారంగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు చూశారా? అలా మనము ప్రవక్త వారి మాటను అనుసరించాలి.
ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త వారు చెప్పారు, ప్రవక్త వారి పద్ధతి ఇది అని మనము ప్రజలకు చెబితే, వారు వెంటనే ప్రవక్త వారి మాట మీద అనుసరించరు. ఏమి చేస్తారు? వారి కోరికలు వారికి అడ్డుపడతాయి. వారి కుటుంబ సభ్యుల ప్రేమ వారికి అడ్డుపడుతుంది. తత్కారణంగా వారు ప్రవక్త వారి మాటల్ని, ప్రవక్త వారి పద్ధతుల్ని వెనక్కి పెట్టేసి కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అల్లాహు అక్బర్.
ఇక్కడ అబ్దుల్లాహ్ బిన్ మసూద్ వారు చూడండి. ప్రవక్త వారి మాట వచ్చిన తర్వాత తన ఇష్టానుసారంగా ఒక అడుగైనా ముందుకు వేశారా? లేదే. వెంటనే అమలు పరిచేశారు. మనము కూడా ఆ విధంగా ఉండాలి. ఏదైనా ప్రవక్త వారి హదీస్, ఏదైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ మన ముందర చెప్పబడింది, వినిపించబడింది అంటే అది విని మనము వెంటనే అమలు పరచాలి గాని, ప్రవక్త వారి మాటను పక్కన పెట్టేసి మా కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, భార్య బిడ్డల కోరికలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం, కుటుంబ సభ్యుల మాటలు వింటూ ముందుకు వెళ్ళిపోవటం, ప్రవక్త వారి మాటను మాత్రం పక్కన పెట్టేయడం ఇలా చేయడం సరికాదండి.
అలాగే ప్రవక్త వారి మాట ఎంతగా వినాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది సహాబాలు ఆ రోజుల్లో చేసి చూపించారు. ఒక ఉదాహరణ విన్నాము అబ్దుల్లాహ్ బిన్ మసూద్ రజియల్లాహు అన్హు వారి గారిది. మరొక ఉదాహరణ…
ప్రారంభంలో అక్కడ మక్కా పరిసరాలలో, మక్కా వాసులు మరియు పరిసరాల వాసులు విపరీతంగా సారాయి తాగేవారు. వారిలో ఆ అలవాటు ఉండింది ముందు నుంచి. అజ్ఞానపు కాలం నుండి ఆ అలవాటు నడుస్తూ వస్తూ ఉంది. చాలా విపరీతంగా వారు సారాయి తాగేవారు. పోటాపోటీగా వారు మద్యాలు సేవించేవారు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎప్పుడైతే మద్యం సేవించడం నిషేధం అని నిషేధ ఆజ్ఞ అవతరింపజేశాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చేశారంటే, శిష్యుల్ని పిలిపించి ప్రకటన చేయించేశారు. “మీరు వెళ్ళండి, అందరికీ ఈ మాట వినిపించేయండి” అని చెప్పగానే, ప్రవక్త వారి శిష్యులు వీధుల్లో తిరిగి పరిసరాల్లో ఉన్న వారందరికీ కూడా “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ వద్ద నుంచి ఆజ్ఞ వచ్చేసింది, మద్యం నిషేధం, మద్యం సేవించరాదు” అని చెప్పేశారు.
ప్రవక్త వారి మాట, ప్రవక్త వారి శిష్యులు వినిపిస్తూ ఉంటే ఆ సమయానికి కొంతమంది కూర్చొని మద్యం సేవిస్తూ ఉన్నారు, కొంతమంది ఇండ్లలో మద్యం స్టాక్ చేసి పెట్టుకొని ఉన్నారు. కొంతమంది అయితే సభలు ఏర్పాటు చేసుకొని, మన మొరటు భాషలో చెప్పాలంటే పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ప్రవక్త వారి ప్రకటన వినిపించింది. వెంటనే ఏం చేశారండి? ఇది లాస్ట్ పెగ్గులే, ఈ ఒక్క పెగ్గు తాగేసి తర్వాత మానేద్దాం అనుకోలేదు. వెంటనే అప్పటికప్పుడే వారి ముందర ఉన్న సారాయిని పక్కన పడేశారు. తాగుతున్న వ్యక్తి కూడా అప్పటికప్పుడే ఆపేసి ఆ మిగిలిన సారాయి మొత్తం కింద పడేశాడు. ఇళ్లల్లో స్టాక్ చేసి పెట్టుకున్న ఆ సారాయి మొత్తం వీధుల్లోకి కుమ్మరించేశారు. అలాగే దాచిపెట్టుకున్న మద్యం మొత్తము కూడా తీసి వీధుల్లో కుమ్మరించేశారు. చరిత్రకారులు తెలియజేశారు, ఈ ప్రకటన తెలియజేసిన తర్వాత ఆ రోజు వీధుల్లో మద్యము ఏరులై పారింది, ఆ విధంగా అసహ్యించుకుని వెంటనే అది ఇక నిషేధం మనకు పనికిరాదు దాన్ని మనము ముట్టుకోరాదు, సేవించరాదు, మన ఇళ్లల్లో పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, సహాబాలు వీధుల్లో దాన్ని కుమ్మరించేశారు. అల్లాహు అక్బర్.
చూసారా? ఈ రోజు తాగుతాంలే రేపటి నుంచి ఆపుదాంలే, ఇది ఒక్కటి తాగుదాంలే ఆ తర్వాత ఆపుదాంలే, ఈ వారము తాగేసి వచ్చే వారం నుంచి ఆపేద్దాంలే, అలా వారు సాకులు వెతకలేదండి. ప్రవక్త వారి ఆదేశం వచ్చిందా? వెంటనే అమలు పరిచేశారు. సాకులు వెతకలేదు. అలా ఉండాలి. ఆ విధంగా మనము చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము ప్రవక్త వారి ప్రేమికులము, అభిమానులము అని చెప్పేసి ప్రవక్త వారి ప్రేమ ప్రకటన చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాము. సరే, ప్రవక్త వారి మాట వినడానికి, ప్రవక్త వారి పద్ధతిని ఆచరించడానికి అంతే ప్రేమతో మనము ముందుకు వస్తూ ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమ మనకు ప్రవక్త వారిని అనుసరించండి అని చెబుతూ ఉంది. మరి మనం అనుసరించట్లేదే? ప్రేమ ప్రకటించడానికి ముందుకు వస్తున్నాం. కానీ ప్రవక్త వారిని అనుసరించడానికి మాత్రం వెనకడుగు వేస్తూ ఉన్నాం, సాకులు వెతుకుతూ ఉన్నాం, ఏమేమో చెబుతూ ఉన్నాం. ఇది సరైన విధానము కాదు, గమనించండి మిత్రులారా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఒక శిష్యుడు తెలియక ఒకసారి బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్నారు. బంగారపు ఉంగరాన్ని ధరించి ఉన్న ఆయన ఒకసారి ఒకచోట ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొద్దిసేపటికి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఆయన్ని చూసి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని గమనించారు.
ఆయనతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి వచ్చి ఆ ఉంగరము తీసేసి ఏమన్నారంటే, పురుషులు బంగారం ధరించటం నిషేధం అని చెప్పి ఆయన తొడిగి ఉన్న ఆ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు బోధించాల్సిన విషయాలు బోధించేశారు. పురుషులు బంగారము ధరించరాదు అన్న విషయాన్ని బోధించేసి అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంటికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత ఈయన, ఎవరి చేతిలో నుంచి అయితే ప్రవక్త వారు బంగారపు ఉంగరాన్ని తీసి పక్కన పడేశారో, ఆయన కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది చూసిన కొంతమంది ఆయన మిత్రులు ఆయనతో ఏమన్నారంటే, “ఏమండీ, మీ బంగారపు ఉంగరం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మీరు మీ వెంట తీసుకెళ్ళండి, ఏదైనా పనుల కోసం, అవసరాల కోసం ఉపయోగించుకోండి” అని చెప్పారు.
దానికి ఆయన ఏమన్నారో తెలుసా? “ఏ వస్తువుని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి స్వ హస్తాలతో తీసి పక్కన పడేశారో దాన్ని నేను ముట్టుకోను అంటే ముట్టుకోను” అని చెప్పేశారు. అల్లాహు అక్బర్.
అదండీ ప్రవక్త వారి మాట పట్ల, ప్రవక్త వారి ఆదేశం పట్ల గౌరవం అంటే. చూశారా? కాబట్టి ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండీ? ప్రవక్త వారి ప్రేమ, ప్రవక్త వారిని అనుసరించండి, ప్రవక్త వారి ఆదేశాలను పాటించండి అని మనతో కోరుతూ ఉంది. అది మనము చేయాలి. అది మనము చేస్తున్నామా? గమనించండి మిత్రులారా.
3. ప్రవక్త వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్న మనము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకు వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేర్చాలి. ఇది మన బాధ్యత అండి. అవును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త. ఆయన తర్వాత ఇక ప్రళయం వరకు ప్రవక్తలు రారు. మరి ధర్మ ప్రచార బాధ్యత ఎవరు నిర్వహించాలి? ఆ బాధ్యత ఎవరు నిర్వహించమని ప్రవక్త వారు మనకు తెలియజేసి వెళ్లారు? నేను వెళ్తూ ఉన్నాను. నా తర్వాత మీరు, మీలో ఎవరికి ఎంత తెలుసో ఆ విషయాలను మీరు తెలియని వారి వద్దకు చేర్చండి, తెలియపరచండి. ఒక్క విషయం అయినా మీకు తెలిస్తే, ఆ ఒక్క విషయాన్నే మీరు ఇతరుల వరకు తెలియని వారికి నేర్పండి, తెలియజేయండి అని బోధించి వెళ్లారు. అల్లాహ్ సుభానహు వ తఆలా కూడా మనకు మీరు ఉత్తమమైన సమాజం, మీరు ప్రజలకు మంచిని ఆదేశిస్తారు, చెడు నుంచి వారిస్తారు అని చెప్పి బాధ్యత ఇచ్చి ఉన్నాడు. అల్లాహ్ మరియు ప్రవక్త వారు ఇచ్చిన బాధ్యత మనము నెరవేర్చాలి. ప్రవక్త వారి ప్రేమ మనతో ఆ విషయం కోరుతూ ఉంది. మనము నిజమైన ప్రవక్త వారి ప్రేమికులమైతే, ప్రవక్త వారి అభిమానులమైతే, ప్రవక్త వారి ధర్మాన్ని, ప్రవక్త వారు తీసుకొని వచ్చిన ధర్మాన్ని ప్రజల వద్దకు చేరవేయాలి. మరి ఆ పని మనము చేస్తున్నామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తీసుకొని వచ్చిన ధర్మాన్ని మన నోటితో మనము చేయగలిగితే నోటితో చేయాలి. వెళ్లి ప్రజలకు విషయాలు బోధించాలి. అంత శక్తి లేదండీ. ఆ విధంగా మీకు మాట్లాడడానికి రాదు అని మీరు భావిస్తూ ఉన్నట్లయితే, అల్హందులిల్లాహ్ పుస్తకాలు ఉన్నాయి, కరపత్రాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి. అవి మీరు ఇతరుల వద్దకు చేరవేయండి అయ్యా. ఆ విధంగా ప్రవక్త వారి నిజమైన అభిమానులనిపించుకోండి. కానీ ఆ విధంగా చేస్తున్నామా? స్టేటస్ లు పెడుతున్నాం. స్టేటస్ లు పెట్టడం కాదండి. ప్రవక్త వారి సందేశాలు, ఆ ధర్మాన్ని ఇతరుల వరకు చేరవేయండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం.
4. ప్రవక్తపై దరూద్ పఠించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి మీద మనము ఎక్కువగా దరూద్ పఠిస్తూ ఉండాలి. ఎంతమందికి దరూద్ వస్తుందండి? అల్హమ్దులిల్లాహ్, చాలా మందికి వస్తుందండి, నేను ఆ విధంగా విమర్శించట్లేదు. ముఖ్యంగా ఎవరైతే వీధుల్లో ర్యాలీలు చేస్తూ ఉన్నారో, జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారో, వారిలో మీరు వెళ్లి అడిగి చూడండి. ఒకసారి దరూద్ పఠించి వినిపించండయ్యా అని అడిగి చూడండి. దరూద్ వస్తుందేమో వాళ్ళకి? ప్రేమికులము, మేము ప్రవక్త వారి అభిమానులము అని ఏమేమో చేస్తూ ఉన్నారే, అలా చేసే వారు ఒక్కసారి ప్రవక్త వారి మీద దరూద్ పఠించి వినిపించండి అని చెప్పండి. వస్తుందేమో చూద్దాం? చాలా మందికి రాదండి. అయినా మేము ప్రవక్త వారి ప్రేమికులమని నోటితో చెప్పుకుంటూ ఉంటారు. నోటితో చెప్పుకుంటే సరిపోదండి, ఇవన్నీ చేయాలి. ప్రవక్త వారి మీద ప్రేమ ఉంటే దరూద్ నేర్చుకొని దాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు దరూద్ పఠిస్తూ ఉండాలి. దరూద్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఒక ప్రసంగం ఉందండి, ‘దరూద్ లాభాలు’ అని, అది వినండి తెలుస్తుంది ఇన్షాఅల్లాహ్. అయితే మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటండీ ఇక్కడ? మనము నిజమైన ప్రవక్త ప్రేమికులమైతే, అభిమానులమైతే మనము ప్రవక్త వారి మీద ఎక్కువగా దరూద్ పఠించాలి.
5. ప్రవక్త జీవిత చరిత్ర (సీరత్) తెలుసుకోవడం
అలాగే ప్రవక్త వారి అభిమానులమైనప్పుడు, ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్ర మనము తెలుసుకోవాలి. అవును, మనం ప్రవక్త వారి అనుచర సమాజం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానులం, ఓకే. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులమైనందుకు, ప్రవక్త వారి అభిమానులము అయినందుకు మనకు ప్రవక్త వారి చరిత్ర తెలియకపోతే ఎలా? మీరు ప్రవక్త వారి ప్రేమికులు అనుకుంటున్నారు, మరి ప్రవక్త వారి గురించి మీకు ఏమి తెలుసయ్యా? మీ ప్రవక్త వారి చరిత్ర క్లుప్తంగా రెండు మాటల్లో చెప్పండి అని ఎవరైనా అడిగాడు అనుకోండి, తల ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు మనం? కదా? కాబట్టి ప్రవక్త వారి ప్రేమ ఏమి కోరుతూ ఉంది అంటే ప్రవక్త వారి జీవిత చరిత్రను మనము తెలుసుకోవాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, వారి తల్లిదండ్రులు ఎవరు, వారి తాతలు ఎవరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాల్యము ఎలా గడిచింది, ప్రవక్త వారి యవ్వనము ఎలా గడిచింది, ప్రవక్త వారు ఎక్కడ వివాహం చేసుకున్నారు, ఎంతమంది బిడ్డలు కలిగారు, ఎప్పుడు ఆయనకు దైవదౌత్య పదవి దక్కింది, ఆయన దైవదౌత్య పదవి దక్కిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఏ విధంగా ధర్మ సేవ చేశారు, తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఆ తర్వాత ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఎదురయ్యాయి, చివరికి ఆయన ఎక్కడికి చేరుకున్నారు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన మరణం సంభవించింది, ఎక్కడ ఆయన సమాధి ఉంది, ఇవన్నీ విషయాలు ఒక ప్రవక్త వారి అనుచరునిగా, ప్రవక్త వారి అభిమానిగా, ప్రేమికునిగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసి ఉంది మిత్రులారా. అయితే అల్లాహ్ దయ ఏమిటంటే ప్రవక్త వారి జీవిత చరిత్ర చదువు వచ్చిన వాళ్ళు పుస్తకాలలో ‘అర్రహీఖుల్ మఖ్తూమ్‘ అని ఒక పుస్తకం ఉంది. అది ఉర్దూలో, అలాగే తెలుగులో అనేక భాషల్లో అల్హమ్దులిల్లాహ్ అనువాదం చేయబడి ఉంది. అది చదివి తెలుసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు వారి వారి భాషల్లో ప్రవక్త వారి జీవిత చరిత్రను వీడియోల రూపంలో విని తెలుసుకోవచ్చు. అల్హమ్దులిల్లాహ్ ‘మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర’అని పూర్తి ప్రవక్త వారి జీవిత చరిత్ర అల్హమ్దులిల్లాహ్ YouTube లో తెలుగు భాషలో ఉంది. అది కూడా మీరు వినవచ్చు, ఇతరులకు అల్హమ్దులిల్లాహ్ షేర్ చేయవచ్చు. అలాగే హిందీలో, అలాగే ఇంగ్లీష్ లో ప్రతి భాషలో ప్రవక్త వారి జీవిత చరిత్ర ఉంది. అది తెలుసుకోవాలి.
6. ప్రవక్త ప్రవర్తనను అలవర్చుకోవడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారి ప్రవర్తన ఎలా ఉండేదో మన ప్రవర్తనను కూడా మనము ఆ విధంగా మార్చుకోవాలి. మూర్ఖత్వంగా ప్రవర్తించటం, ఆ తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం అది సరికాదు. మూర్ఖత్వం ప్రదర్శించటం, తర్వాత మేము ప్రవక్త వారి అభిమానులం అని చెప్పుకోవటం సరికాదండి.
ప్రవక్త వారి అభిమానులు అయితే, ప్రవక్త వారి ప్రేమికులు అయితే, ప్రవక్త వారి మీద ఉన్న మీ ప్రేమ నిజమైనది అయితే, ప్రవక్త వారి వ్యక్తిత్వం ఎలా ఉండేదో, ఆయన వ్యవహారాలు ఏ విధంగా ఉండేవో, ఆ విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన వ్యవహారాలను మనము మార్చుకోవాలి. ప్రవక్త వారు కుటుంబీకులతో ఎలా ప్రవర్తించేవారు? ప్రవక్త వారు ఇరుగుపొరుగు వారితో ఎలా ప్రవర్తించేవారు? పిల్లలతో ఎలా ప్రవర్తించేవారు? పెద్దలతో ఎలా ప్రవర్తించేవారు? మహిళలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లింలతో ఎలా ప్రవర్తించేవారు? ముస్లిమేతరులతో ఎలా ప్రవర్తించేవారు? బంధువులతో ఎలా ప్రవర్తించేవారు? శత్రువులతో ఎలా ప్రవర్తించేవారు? అలాంటి ప్రవర్తన మనము కూడా కలిగి ఉండాలి.
మరి మనం అలా ఉన్నామా? ప్రవక్త వారి ప్రేమికులం అని చెప్పుకుంటున్నాం, ఒక పక్క బిడ్డల్ని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క భార్యని హింసిస్తూ ఉన్నాం, ఒక పక్క తల్లిదండ్రులకు సేవ చేయట్లేదు, పెద్దల్ని గౌరవించట్లేదు, అన్నీ పక్కన పెట్టేశాం, ప్రవక్త వారి ప్రేమికులమని చెప్పి మళ్ళా స్టేటస్ పెట్టుకుంటూ ఉన్నాం. ఇది ఎంతవరకు సబబు అండి? కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎవరితో ఏ విధంగా ఉండేదో తెలుసుకొని మనము కూడా ఆ విధంగా మనల్ని మనము సంస్కరించుకోవాలి, మార్చుకోవాలండి. ఇది ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం.
7. ప్రవక్త ఇష్టాఇష్టాలను పాటించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ఏ విషయాలను ప్రేమించారో, ఇష్టపడ్డారో, ఆ విషయాలను మనము కూడా ఇష్టపడాలి. ప్రవక్త వారు ఏ విషయాలను అయితే అసహ్యించుకున్నారో, ప్రవక్త వారికి ఏ పనులు, ఏ విషయాలు నచ్చలేదో, ఆ పనులు, ఆ విషయాలను కూడా మనము వదిలేయాలి, మనము కూడా వాటిని ఇష్టపడకూడదు.
ప్రవక్త వారు ఇష్టపడిన విషయాన్ని మనం కూడా ఇష్టపడతాం. ప్రవక్త వారికి నచ్చని విషయాలను కూడా మనము పక్కన పెట్టేద్దాం, మనము ఆ విషయాలను ఇష్టపడకూడదు. ఈరోజు మనం ఏమి చేస్తున్నాం? ప్రవక్త వారికి నచ్చిన విషయాలు మనకు నచ్చట్లేదు. ప్రవక్త వారికి నచ్చని విషయాలు మనకు నచ్చుతా ఉన్నాయి. మాకు నచ్చుతూ ఉన్నాయి, మా బిడ్డలకు నచ్చుతూ ఉన్నాయి, మా కుటుంబీకులకు నచ్చుతూ ఉన్నాయి. ఏమన్నా చెప్తే ఇది చేయకూడదు కదా, ఇది ప్రవక్త వారు చేయవద్దు అని వరించారు కదా మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్తే, “హజరత్, అలా కాదు హజరత్. మా బిడ్డ అలా కోరుతూ ఉంటే అలా చేశాను హజరత్. లేదంటే మా తల్లిదండ్రులు చెప్తే చేశాను హజరత్. లేదంటే మా ఇంట్లో చెప్తే నేను చేశాను హజరత్” అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అండి? ప్రవక్త వారి ప్రేమికులు అని చెప్పేవాళ్ళు చెప్తున్న మాట ఇది. ప్రవక్త వారిని మీరు నిజంగానే ప్రేమిస్తూ ఉంటే ప్రవక్త వారు ఇష్టపడిన విషయాలను ఇష్టపడండి, వాటిని అభిమానించండి, వాటిని మీ జీవితంలోకి తీసుకొని రండి. ప్రవక్త వారికి నచ్చని విషయాలు వాటిని చేయటం, ఆ తర్వాత వారు చెప్పిన కారణంగా చేశాను, వీళ్ళు చెప్పిన కారణంగా చేశాను అని చెప్పటం సరికాదు.
8. ప్రవక్త కుటుంబీకులను (అహలె బైత్) గౌరవించడం
అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులు ఎవరు? అహలె బైత్ అంటారు. ఒక ప్రత్యేకమైన ప్రసంగము ఉంది, అది కూడా మీరు వినవచ్చు. అహలె బైత్ అంటే ఎవరు? అహలె బైత్ వారి యొక్క విశిష్టతలు అని ప్రసంగాలు ఉన్నాయండి, అవి వినండి ఇన్షాఅల్లాహ్, విషయాలు వివరంగా తెలుస్తాయి. కాబట్టి ప్రవక్త వారి ప్రేమ మనతో కోరుతున్న విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము ప్రేమించాలి, అభిమానించాలి, గౌరవించాలి. ఏ ఒక్కరినీ కూడా కించపరచటం సబబు కాదు, సరికాదు. నిజమైన ప్రేమికులమైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల్ని మనము గౌరవించాలి, అభిమానించాలి.
ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు
మిత్రులారా, ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమ మనతో కోరుతున్న విషయాలు అనే అంశం మీద కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీ ముందర ఉంచాను. అయితే నేడు ప్రవక్త వారి ప్రేమ కోరుతున్న విషయాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఆ విధంగా చేస్తూ ఉన్నామా లేదా అనేది మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి. అయితే సమాజాన్ని చూస్తే మాత్రము ఒక విషయం మన ముందర వస్తుంది, అదేమిటంటే, ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలు అయితే మనతో కోరుతూ ఉందో, ఆ విషయాలు చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ కోరని విషయాలు చాలామంది చేస్తూ ఉన్నారు.
ప్రవక్త వారి ప్రేమ ర్యాలీలు చేయమని చెప్పలేదండి. ప్రవక్త వారి ప్రేమ డీజేలు వాయిస్తూ పచ్చని జెండాలు చేతిలో పట్టుకొని ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ ఎగరండి, అక్కడ పాడండి అని మనకు చెప్పలేదండి. కానీ చేస్తున్నారు, ఏమంటే ప్రవక్త వారి ప్రేమ అంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మసీదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు బ్యానర్ మీద పెట్టి, స్టేజ్ ని అలంకరించి, ఆ తర్వాత అక్కడ అశ్లీలమైన పాటలు వాయిస్తూ అక్కడ నృత్యాలు చేస్తూ ఉన్నారు. ప్రవక్త వారి ప్రేమ ఈ పనులు చేయమని చెప్పిందా అండి మనకు? లేదు లేదు. ఇది ప్రవక్త వారి ప్రేమకు విరుద్ధమైన విషయాలు.
అలాగే ప్రవక్త వారి ప్రేమ అని చెప్పి చాలామంది ఏమి చేస్తున్నారంటే, పెద్ద పెద్ద కేకులు తయారు చేస్తూ ఉన్నారు. ఆ కేకులు తయారు చేస్తూ, అల్లాహ్ మన్నించు గాక, ఇంగ్లీష్ లో “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చెప్పి కూడా కేకులు కోస్తూ ఉన్నారు, అదేదో పెద్ద ఘన కార్యం అని చెప్పేసి మళ్లీ దాన్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. ఇది చేయమని చెప్పిందండి మన ప్రవక్త వారి ప్రేమ మనకు? కేకులు సింగారించి “హ్యాపీ బర్త్డే యా రసూలుల్లాహ్” అని చేయమని మనకు ప్రవక్త వారి ప్రేమ చెప్పిందా అండి? లేదు మిత్రులారా.
ప్రవక్త వారి ప్రేమ సాకుతో అసభ్యమైన కార్యాలు చేయరాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే పనులు చేయరాదు, అలాగే అసంఘాకికమైన విషయాలకు దరిదాపుగా వెళ్ళకూడదు, అలాగే మన ధర్మంలో లేని విషయాలకు కూడా మనము చేయకూడదు ప్రవక్త వారి ప్రేమ సాకుతో.
ఇంతటితో నా మాటలు ముగిస్తూ, నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ నిజమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానుల్లాగా తీర్చిదిద్దు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరుతూ ఉందో ఆ విషయాలను తూచా తప్పకుండా మనందరికీ పాటించే భాగ్యం ప్రసాదించు గాక. ప్రవక్త వారి ప్రేమ ఏ విషయాలైతే కోరట్లేదో అలాంటి విషయాల నుండి దూరంగా ఉండే అనుగ్రహం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు, ముఖ్యంగా మన యువకులకు ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.
وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ (వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్) ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ (వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్) మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…
رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ (రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ) “ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)
సహాబాల విధానం, దాని అవసరం
మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.
సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.
“ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)
ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
అధర్మమైన వసీలా
అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.
ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆరాధన ఎవరి కోసం? ఎలా?
అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:
مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟ (మన్ త’అబుద్? కైఫ త’అబుద్?) ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?
ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.
మృతులను వసీలాగా తీసుకోవటం
అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.
అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.
ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.
కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.
ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.
దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.
అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.
దైవ ప్రవక్త హోదాను వసీలాగా చేసుకోవడం
అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:
ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.
అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.
సహాయం కోరటంలోని రకాలు
అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:
وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى (వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా) పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)
ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.
సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.
అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.
ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) “సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ https://youtu.be/pOXV3-6CJEg [20 నిముషాలు]
ఈ ప్రసంగంలో, వక్త హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు తాలా అన్హు) యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వివరిస్తారు. ప్రవక్త సహచరుల జీవితాలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. అబూబక్ర్ (రది అల్లాహు తాలా అన్హు) ఇస్లాం కోసం చేసిన సేవలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన స్థిరత్వం, విశ్వాసం మరియు ఆయన గొప్పతనాన్ని వివరించే వివిధ సంఘటనలు ఇందులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా, వలస ప్రయాణంలో గుహలో ప్రవక్తతో పాటు ఉండటం, తన సంపదనంతా ఇస్లాం కోసం ఖర్చు చేయడం, మరియు ప్రవక్త మరణం తర్వాత సమాజాన్ని ఏకతాటిపై నిలపడంలో ఆయన పోషించిన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఖలీఫాగా ఆయన సాధించిన విజయాలు, మతభ్రష్టులతో పోరాడటం మరియు ఖురాన్ను సంకలనం చేయించడం వంటి చారిత్రాత్మక విజయాలను కూడా వక్త వివరించారు.
అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
نَحْمَدُهُ وَنُصَلّي عَلى رَسُولِهِ الكريم، أما بعد! నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్.
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా. షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ హఫిజహుల్లాహ్ జామిఅ అల్-గనాంలో ఇచ్చారు, అక్టోబర్ 31, 2025న.
ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందిన వారు. ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్.”
ఈ రోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు. గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు.
మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతలు మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ , అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్-ఖురషీ. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, ఆయన పేరు అబ్దుల్లాహ్. తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్-ఖురషీ రదియల్లాహు తాలా అన్హు.
అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు, ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు, ఆయన సత్య ప్రవక్త అని ధ్రువీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ‘అస్-సిద్దీఖ్’ (సత్యవాది) అని వర్ణించారు (బిరుదునిచ్చారు).
సహీహ్ బుఖారీలో (3675) ఒక సంఘటన గమనించండి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఘనతను గ్రహించండి.
“ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హుమ్) లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఓ ఉహుద్! స్థిరంగా ఉండు. నీపై ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీద్లు (అమరవీరులు) ఉన్నారు.” (బుఖారీ 3675).
ఇస్లాంలో ఆయన సేవలు
ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు. సహాబాలలో అల్లాహ్ వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు (అంటే ప్రవక్త తర్వాత అని భావం). ఆయన ద్వారా హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ జుబైర్, హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సాద్ బిన్ అబీ వక్కాస్ (రదియల్లాహు తాలా అన్హుమ్) వంటి చాలా మంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషర-ఎ-ముబష్షరాలో పరిగణించబడతారు.
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజ్రత్ బిలాల్, హజ్రత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.
ప్రవక్తకు అత్యంత ప్రియమైనవారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హును ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజ్రత్ అమర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను అడిగారు, “ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆయిషా రదియల్లాహు తాలా అన్హా.” హజ్రత్ అమర్ అంటున్నారు, “నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆమె యొక్క తండ్రి” (అంటే హజ్రత్ ఆయిషా యొక్క తండ్రి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు). (సహీహ్ బుఖారీ, 4358).
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సంపదను తమ సొంత సంపద వలే ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పారు:
“నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబక్ర్. నా ఉమ్మత్లో ఒక స్నేహితుడిని (ఖలీల్) చేసుకోవాలని వస్తే, నేను అబూబక్ర్ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజ్రత్ అబూబక్ర్ తలుపు తప్ప మస్జిదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి.” (సహీహ్ బుఖారీ 466, సహీహ్ ముస్లిం 2382).
ఈ హదీసు యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?
తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ, ‘అమన్’ – హజ్రత్ అబూబక్ర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకుని ఉంటే, (ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, ‘అల్లాహ్ నన్ను ఖలీల్గా చేసుకున్నాడు’) ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్గా చేసుకుంటే, అబూబక్ర్ని చేసుకునేవానిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబక్ర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబక్ర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్-ఎ-నబవీ ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో, మస్జిద్-ఎ-నబవీకి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇళ్లు కూడా ఉండినవి. అయితే, ఆ మస్జిద్ యొక్క మెయిన్, ముఖ ద్వారం, ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు.
ఇంకా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు ఘనతలో, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన మాట వినండి. (సహీహ్ బుఖారీ 3685, సహీహ్ ముస్లిం 2389). అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజ్రత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో, అబూబక్ర్, ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమాను ఏదైతే దూషిస్తారో, వారు ఈ లోకంలో అతి చెడ్డవారు మరియు హజ్రత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా చెప్పడం నేను విన్నాను: ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ ప్రవేశించాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ బయలుదేరాము.'” (బుఖారీ 3685, ముస్లిం 2389).
(ఇక్కడ ‘కున్తు అస్మ’ఉ’ అనేది నిరంతరంగా వినేవాడిని అని సూచిస్తుంది). ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో “నేను, అబూబక్ర్, ఉమర్” అని మాటిమాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబక్ర్లను, ఉమర్ హజరత్లను చాలా ప్రేమించే, గౌరవించేవారు.
సత్కార్యాలలో అగ్రగామి
అల్లాహ్ దాసులారా, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సత్కార్యాలలో మరియు మంచి పనులలో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు.
ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ఇలా అన్నారు, “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ‘ఈ రోజు నేను అబూబక్ర్ను అధిగమిస్తాను.’ ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే… నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?’ నేను చెప్పాను, ‘అంతే మిగిల్చాను’ (అంటే సగం). అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హు తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు?’ ఆయన చెప్పారు, ‘వారికి అల్లాహ్ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిల్చి వచ్చాను.’ హజ్రత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, ‘«لَا أُسَابِقُكَ إِلَى شَيْءٍ أَبَدً» నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను.’” (అబూ దావూద్, 1678, షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:
“మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్యే వారికి తోడ్పడ్డాడు.” (తౌబా 9:40).
ఈ ఆయతులో గమనించండి “సానియస్ నైన్” అన్న పదాన్ని, అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి! ఎవరు ఆయన? ఆయనే అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంత గొప్ప బిరుదు, ఘనత! ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి! ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించారు, భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు, తబూక్కు ఆయనతో పాటు ప్రయాణించారు, ఆయనతో పాటు హజ్ చేశారు, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశమేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్ చేయించారు. మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు.
అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు (సవ్వామ్), రాత్రుల్లో ఎక్కువ ఆరాధన, నమాజ్ చేసేవారు (ఖవ్వామ్), ప్రజలకు చాలా మేలు చేసేవారు (ముహ్సిన్), అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపపడేవారు, మృదు మనస్కుడు (అవ్వాహ్) [1]. ఆయన చాలా ఎక్కువగా ఏడ్చేవారు (బక్కా).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు జనాజాలో (అంత్యక్రియలకు) హాజరయ్యారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు పేదవాడికి తినిపించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:
مَا اجْتَمَعْنَ فِي امْرِئٍ إِلاَّ دَخَلَ الْجَنَّةَ (మజ్తమ’న ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్నహ్) ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (సహీహ్ ముస్లిం 1028).
అల్లాహ్, అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు పట్ల సంతోషించు గాక. మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వు గాక. నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు.
దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు, (ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు). మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. (లైల్ 92:17-21).
ఈ ఆయతులు అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లాహ్ అవతరింపజేశాడు.
రెండవ ఖుత్బా
الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمدٍ وعلى آله وصحبه أجمعين أما بعد
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.
ఓ ముస్లిములారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రజలను ఓదార్చారు, ఆ తర్వాత నిలబడి అల్లాహ్ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, “ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్ను పూజిస్తున్నారో, నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించడు.” ఆపై హజ్రత్ అబూబక్ర్ ఈ ఆయత్ పఠించారు:
“ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు (ఇస్లాం నుంచి) వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి- పోయేవాడు అల్లాహ్కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3:144).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హును వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది.
ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు, మతభ్రష్టులు (ముర్తద్దీన్ల)తో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ ప్రతులను జమా చేయించారు.
మరణం
హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు హిజ్రీ 13వ సంవత్సరంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా, 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ రెండు సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించు గాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక.
చివరగా, ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శప్రాయులు.
“సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్ల పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు.” (మువత్తా మాలిక్ 1/255. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్నహ్ వల్ జమాఅహ్ 2325. 7/1313).
అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించు గాక. ఆమీన్.
వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
Footnotes:
[1] ‘అవ్వాహ్’ అన్న పదంలో ఈ క్రింది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి:
ఎక్కువగా ప్రార్థించేవాడు/ప్రార్థనల్లో మునిగిపోయేవాడు: అల్లాహ్ను చాలా ఎక్కువగా స్మరించేవాడు, వినయంతో, దీనంగా ఆయనను ప్రార్థించేవాడు.
ఆయన దయను కోరేవాడు: అల్లాహ్ దయ కోసం తీవ్రంగా కోరుకునేవాడు.
పశ్చాత్తాపపడేవాడు: తన పాపాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడి, అల్లాహ్ను క్షమాపణ వేడుకునేవాడు.
దీనంగా, వినయంగా ఉండేవాడు: అల్లాహ్ పట్ల అమితమైన భయం, గౌరవం కలిగి, వినయంగా ప్రవర్తించేవాడు.
మంచివాడు/దయాగుణం కలవాడు: ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి, వారికి సహాయం చేసేవాడు.
నిట్టూర్చేవాడు: అల్లాహ్ పట్ల తన ప్రేమ, భయం లేదా ఇతరుల పట్ల తన కరుణ వల్ల దీర్ఘంగా నిట్టూర్చేవాడు.
[2] ఖురాన్ సంకలన చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నప్పుడు ఖురాన్ వివిధ పద్ధతులలో వ్రాయబడింది. ఖురాన్ వచనాలు (ఆయత్లు) మరియు సూరాలు రాసిన కొన్ని వస్తువులు:
తోలు పత్రాలు (چرم): జంతువుల తోలుపై రాసినవి. ఎముకలు (كتف): ఒంటె వంటి జంతువుల భుజం ఎముకలు లేదా ఇతర ఎముకలు. తాటి ఆకులు (سعف النخيل): తాటి చెట్టు ఆకులపై రాసినవి. రాతి పలకలు (حجارة): సన్నని, చదునైన రాళ్లపై రాసినవి. కలప పలకలు (ألواح خشبية): చెక్క పలకలపై రాసినవి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత, యమామా యుద్ధంలో చాలా మంది ఖురాన్ హాఫిజ్లు (ఖురాన్ను కంఠస్థం చేసినవారు) మరణించారు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) అబూబకర్ అస్-సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)కు ఖురాన్ను ఒకే గ్రంథంగా సంకలనం చేయాలని సూచించారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ను ఈ పనికి నియమించారు. జైద్, తన బృందంతో కలిసి, పైన పేర్కొన్న వివిధ వస్తువులపై వ్రాయబడిన ఖురాన్ వచనాలను సేకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, కనీసం ఇద్దరు సాక్షులతో ధృవీకరించిన తర్వాత, వాటిని ఒక క్రమంలో సంకలనం చేశారు. ఈ సంకలన పత్రాలను “సుహుఫ్” (పత్రాలు/పేజీలు) అని పిలిచేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.
مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ] ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ [వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ] మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ [అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.
وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.
ఇస్లాంలో మస్జిదుల స్థానం
అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.
మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.
ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.
ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.
మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.
అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.
మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?
فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ (ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)
ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.
అలాగే,
رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ (కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)
ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.
لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ తమ సత్కార్యాలకు అల్లాహ్ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)
అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,
“అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)
ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.
ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.
అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.
మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.
ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.
ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,
مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ “మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.” ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.
ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.
అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا “అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.” “అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు“
ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.
అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,
سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్ రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.
ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?
رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్. ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.
ఇది మస్జిద్ అంటే.
అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.
మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.
మస్జిద్ లో పాటించవలసిన నియమాలు
కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.
ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.
أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا [అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా] మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు] అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ [వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు] మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు] మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ [అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్] ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ [వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.
وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.
స్వర్గంలో ప్రవేశించే నాలుగు రకాల వారు
స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.
మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.
రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.
మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.
నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.
ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.
విచారణ లేకుండా స్వర్గానికి వెళ్ళేవారు
వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.
ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.
అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:
هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.
ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.
దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?
అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.
ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.
ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?
إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ [ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి] “నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”
ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.
అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.
పాపాలు చేసి పశ్చాత్తాపం చెందిన వారు
ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?
وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ వారు అల్లాహ్తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)
అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:
يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)
ఇక మూడోవ ఆయత్.
إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)
అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.
మూడవ రకం వారు – అస్ హాబుల్ ఆరాఫ్
ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు] షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.