సులభమైన పనులకు లభించే గొప్ప ప్రతిఫలాల కొరకు ఎంపిక చేయబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు
షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా రాసిన ‘అల్-కలిమత్ అత్-తయ్యిబ్’ నుండి తీసుకోబడిన సహీహ్ హదీసులు పరిశీలన: షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ
సంకలనం: హజ్జాజ్ బిన్ అబ్దుల్లా అల్-అరీనీ ఇంగ్లీష్అనువాదం: అబ్బాస్ అబూ యహ్యా https://abdurrahman.org/?p=21341 తెలుగు అనువాదం : teluguislam.net
పరిచయం (Introduction)
సకల స్తోత్రాలు సకల లోకాల ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక.
తదుపరి (Then to proceed), నిశ్చయంగా అల్లాహ్ తాలా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అత్యంత అనర్గళమైన ప్రసంగంతో పంపాడు, అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తున్నాడు:
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ ، إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ (వమా యన్ తిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా) “మరియు ఆయన తన మనోవాంఛను అనుసరించి మాట్లాడడు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు.”(అన్-నజ్మ్ 53 : 3-4)
మరియు ఆయన ఇలా అన్నాడు:
وَمَا آتَاكُمُ الرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَاكُمْ عَنْهُ فَانتَهُوا (వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్ తహూ) “దైవప్రవక్త మీకు ఇచ్చిన దానిని (సంతోషంగా) పుచ్చుకోండి. ఆయన ఏ విషయం నుండైన మిమ్మల్ని వారిస్తే, దాన్ని వదిలిపెట్టండి.” (అల్-హష్ర్ 59 : 7)
అల్లాహ్ ఈ ఉమ్మత్ను తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గదర్శకత్వంతో అనుగ్రహించాడు. ఈ మార్గదర్శకత్వంలోని గొప్ప విశేషమేమిటంటే, ఆరాధనలు సులభంగా ఉండటమే కాకుండా, వాటిని ఆచరించినందుకు లభించే ప్రతిఫలాలు అత్యంత గొప్పవిగా ఉండటం.
సత్కార్యాల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికి అల్లాహ్ యొక్క రసూల్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేక హదీసుల ద్వారా కొన్ని పనులను, ప్రార్థనలను మనకు తెలియజేశారు. వీటిని ఆచరించడం వల్ల గొప్ప మరియు సుపరిచితమైన ఫలితాలు లభిస్తాయి.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించిన అమూల్యమైన అణిముత్యాల వంటి కొన్ని ప్రార్థనలను ఈ హదీసుల సంకలనంలో చేర్చడం జరిగింది. అల్లాహ్ అనుగ్రహం పొందిన వారికి ఇవి చాలా సులభమైన పనులు అయినప్పటికీ, ఇవి ఇచ్చే ప్రతిఫలాలు మాత్రం అపారమైనవి.
నేను ఈ హదీసులను షేఖుల్ ఇస్లాం ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) రాసిన ‘అల్-కలిమత్ అత్-తయ్యిబ్‘ పుస్తకం నుండి ఎంపిక చేశాను. దీనిని షేఖ్ ముహమ్మద్ నాసిరుద్దీన్ అల్-అల్బానీ (రహిమహుల్లాహ్) పరిశోధించి, అందులోని ప్రామాణికమైన హదీసులను మాత్రమే సేకరించి ‘సహీహ్ అల్-కలిమత్ అత్-తయ్యిబ్‘గా రూపొందించారు. ఈ సంకలనంలో పేర్కొన్న హదీసులన్నీ షేఖ్ అల్-అల్బానీ గారి పరిశోధన ప్రకారం పూర్తిగా ప్రామాణికమైనవి (సహీహ్).
విషయం క్లుప్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కరపత్రంలో కేవలం హదీసుల మూల పాఠ్యాన్నే అందించడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేసిన గొప్ప ప్రతిఫలాల ఆధారంగా, నేను ఈ సంకలనానికి ‘హవిజ్ అలా జవాయిజ్’ (ప్రతిఫలాల సముపార్జన) అని నామకరణం చేశాను.
అల్లాహ్ అనుమతితో ఇటువంటి పరిశోధనలు మరిన్ని జరిగితే అవి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రజలకు సరైన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించడానికి హదీసు గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
హజ్ ఘనత
ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.
కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్
హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్
హజ్ ప్రాముఖ్యత – ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటి
అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.
దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:
“ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.“
ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.
ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.
హజ్ ఎవరిపై విధి?
ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.
ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.
అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.
హజ్ ఘనతలు మరియు విశిష్టతలు
ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.
స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం
హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ (అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్) “స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.“
అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.
హజ్ పాపాలను తుడిచివేస్తుంది
రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.
ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.
ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.
మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.
హజ్ పాపాలను & పేదరికాన్ని తొలగిస్తుంది
అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.
గొప్ప సత్కార్యాలలో హజ్ ఒకటి
అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:
أَيُّ الْعَمَلِ أَفْضَلُ (అయ్యుల్ అమలి అఫ్దల్) ఏ సత్కార్యము గొప్పది?
అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:
إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ (ఈమాను బిల్లాహి వ రసూలిహి) అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.
గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:
جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ (జిహాదున్ ఫీ సబీలిల్లాహ్) అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.
మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.
వృద్ధులకు, బలహీనులకు మరియు మహిళలకు హజ్ ఒక జిహాద్
అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:
لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ (లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్) “మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]
మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ (జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా) వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.
అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.
హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు
అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.“
అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.
మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.
దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.
హజ్ మార్గంలో మరణించిన వారి పుణ్యం
అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:
ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)
“అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:
“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”
అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను
لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ (లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్) “ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”
అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.
హజ్ లోని ప్రతి క్రియకు లభించే పుణ్యం
ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.
ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,
“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.
మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.
ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.
కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.
హజ్ యాత్రికుల కొరకు ముఖ్యమైన సూచనలు
అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.
హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:
స్తోమత ఉన్నప్పుడు హజ్ చేయడంలో ఆలస్యం చేయరాదు
స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.
కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.
చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.
అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.
ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”
అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.
ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనతోనే హజ్ చేయాలి
ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا (యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,
“ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:
“అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?“
అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.
హజ్ సమయంలో గొడవలు మరియు అశ్లీలతకు దూరంగా ఉండాలి
అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ (మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు) “ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”
ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
జీవితంలో ఒక్కసారి హజ్ విధి
అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:
يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا (యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”
ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:
لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ (లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్) “నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”
నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.
వ్యాధిగ్రస్తుల తరఫున హజ్ చేయటం
అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:
لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ (లబ్బైక్ అన్ షుబ్రుమా) “ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ (హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా) “ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”
కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.
పసి పిల్లలకు హజ్ చేయించడం
అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
نَعَمْ وَلَكِ أَجْرٌ (నఅమ్ వలకి అజ్ర్) “అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”
“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.
అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
హజ్ లోని గుణపాఠాలు
ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.
మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.
అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.
అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.
అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.
ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు] https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
కోపాన్ని దిగమింగటం
త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.
ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.
ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.
مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ (మా మిన్ జుర్అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్హిల్లాహ్) “అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.“
గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.
ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.
الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ (అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్) “వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)
కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.
ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.
أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ (ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్) “తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)
అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.
ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.
ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.
“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”
ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.
దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.
“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”
ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.
ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.
జనాజా నమాజ్ & ఖననం
మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.
సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.
“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”
గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్లో పాల్గొందామా?
అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.
జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.
“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”
పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.
ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.
ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.
రాత్రి నమాజ్ (తహజ్జుద్)
మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.
“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.“
అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్లో దీనిని పేర్కొన్నారు.
ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.
“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్లో లిఖించబడుతుంది.”
ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.
ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్) https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]
ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.
أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا [అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా] మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ [మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు] అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ [వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు] మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ [వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు] మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ [అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్] ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ [వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం] మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.
وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ [వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్] మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.
స్వర్గంలో ప్రవేశించే నాలుగు రకాల వారు
స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.
మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.
రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.
మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.
నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.
ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.
విచారణ లేకుండా స్వర్గానికి వెళ్ళేవారు
వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.
ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.
అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:
هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.
ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.
هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ [హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన] “వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”
వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.
దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?
అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.
ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.
ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?
إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ [ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి] “నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”
ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.
అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.
పాపాలు చేసి పశ్చాత్తాపం చెందిన వారు
ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?
وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ వారు అల్లాహ్తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)
అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:
يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)
ఇక మూడోవ ఆయత్.
إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)
అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.
మూడవ రకం వారు – అస్ హాబుల్ ఆరాఫ్
ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, వక్త ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తులు), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల యొక్క ఉన్నత స్థానం మరియు ప్రత్యేకతలను వివరిస్తారు. సాధారణ స్త్రీల కంటే వారి స్థాయి ఎంతో ఉన్నతమైనదని, అల్లాహ్ వారిని ప్రత్యేకంగా ప్రవక్త కోసం ఎంపిక చేశారని ఖురాన్ ఆయతుల ఆధారంగా తెలియజేస్తారు. వారు విశ్వాసులందరికీ తల్లులని, ప్రవక్త మరణానంతరం వారిని వివాహం చేసుకోవడం నిషిద్ధమని స్పష్టం చేస్తారు. వారి సత్కార్యాలకు రెండింతల పుణ్యం లభిస్తుందని మరియు అల్లాహ్ వారిని అన్ని రకాల మాలిన్యాల నుండి పరిశుభ్రపరిచాడని వివరిస్తారు. ఈ ప్రపంచంలోనే కాక, స్వర్గంలో కూడా వారు ప్రవక్త భార్యలుగానే ఉంటారనే గౌరవాన్ని కూడా ప్రస్తావించారు.
సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
ఉమ్మహాతుల్ ము’మినీన్ (విశ్వాసుల మాతలు) యొక్క ఘనత
ఉమ్మహాతుల్ ము’మినీన్ అందరి ఘనత, ప్రత్యేకత. ఉమ్మహాతుల్ ము’మినీన్ ఖదీజా రదియల్లాహు అన్హా నుంచి మైమూనా రదియల్లాహు అన్హా వరకు, వారందరి విశిష్టతలు, ఘనతలు, ప్రత్యేకతలు.
ఉమ్మహాతుల్ ము’మినీన్, వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కాదు. వారి ప్రత్యేకత ఇది. ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటి? వారందరూ సాధారణ స్త్రీల వంటి వారు కారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల గురించి ఖురాన్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించాడు. ముఖ్యంగా సూరతుల్ అహ్జాబ్ లో కొంచెం వివరంగా ఉంటుంది.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
يَا نِسَاءَ النَّبِيِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ النِّسَاءِ (యా నిసాఇన్ నబియ్యి లస్తున్న కఅహదిమ్ మినన్ నిసా) ఓ ప్రవక్త సతీమణులారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. (33:32)
గౌరవంలో, మర్యాదలో, ఘనతలో, విశిష్టతలో, మంచి విషయాలలో, అన్ని విషయాలలో మీరు సాధారణమైన స్త్రీలు కారు , వారు ఎవ్వరైనా సరే, గొప్ప గొప్ప సహాబియాతులు అయినా, గొప్ప ప్రముఖ సహాబాల సతీమణులైనా, తాబయీన్లు, ముహద్దసీన్లు, సామాన్య ప్రజలు, ఎవరైనా సరే, ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత, అలాగే ఇతరుల వారు సమానులు కారు. ఇది వారి ప్రత్యేకత.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొరకే ఎంపిక చేయబడ్డారు
అలాగే రెండవ విషయం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని, ఉమ్మహాతుల్ ము’మినీన్లని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకై ఎంపిక చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
لَّا يَحِلُّ لَكَ النِّسَاءُ مِن بَعْدُ وَلَا أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ ఇక దీని తరువాత, వేరితర స్త్రీలు నీ కొరకు ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా ఇతర స్త్రీలను భార్యలుగా చేసుకోవటం కూడా నీకు సమ్మతం కాదు – వారి అందచందాలు నీకు ఎంత నచ్చినాసరే! (33:52)
ఓ ప్రవక్తా! ఇక, అంటే మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణులు, ఉమ్మహాతుల్ ము’మినీన్, 11 మంది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా వివాహం చేసుకునింది మైమూనా బిన్తె హారిత్ రదియల్లాహు అన్హాని. మైమూనా రదియల్లాహు అన్హా వివాహం తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆదేశం ఇచ్చాడు. ఓ ప్రవక్తా! ఇక నుంచి ఇంకో వివాహం చేసుకోవటం నీకు సమ్మతం కాదు, ఇక నువ్వు చేసుకోలేవు. ఈ 11 మంది మాత్రమే నీ కోసం ఎంపిక చేశాను, ఇక నీకు అనుమతి లేదు. ఇక తర్వాత ఏ స్త్రీని అయినా నువ్వు వివాహం చేసుకోలేవు. ఒక సతీమణిని విడాకులు ఇచ్చి దానికి బదులుగా కూడా నువ్వు చేసుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ గౌరవం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ప్రసాదించాడు.
విశ్వాసులందరికీ తల్లులు
మూడవది, వారు ఉమ్మహాతుల్ ము’మినీన్ల స్థానం అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. విశ్వాసుల కొరకు తల్లులు. మూడవ ప్రత్యేకత.
النَّبِيُّ أَوْلَىٰ بِالْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَاجُهُ أُمَّهَاتُهُمْ దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. అతని భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. (33:6)
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువగా హక్కు ఉంది. ఆయన భార్యలు విశ్వాసుల కొరకు తల్లులు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ స్థానం, ఆ గౌరవం వారికి ప్రసాదించాడు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తర్వాత వారితో వివాహం నిషిద్ధం
ఏ గొప్ప సహాబీ సతీమణి అయినా, భర్త మరణించిన తర్వాత ఇంకో వివాహం చేసుకునే అనుమతి ఉంది. కానీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుమతి ఉమ్మహాతుల్ ము’మినీన్లకి ప్రసాదించలేదు. ఎందుకు? వారు తల్లులు మనకు. ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరికీ ఉమ్మహాతుల్ ము’మినీన్ తల్లులు. ఆ గౌరవం అల్లాహ్ వారికి ప్రసాదించాడు.
నాలుగవ ప్రత్యేకత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వారు వివాహమాడడం ధర్మసమ్మతం కాదు, ఈ విషయం చెప్పింది ఇప్పుడు.
وَلَا أَن تَنكِحُوا أَزْوَاجَهُ مِن بَعْدِهِ أَبَدًا (వలా అన్ తన్కిహు అజ్వాజహూ మిమ్ బ’అదిహీ అబదా) అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటంగానీ ఎన్నటికీ మీకు ధర్మసమ్మతం కాదు. (33:53)
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఇంకో వివాహం చేసుకోలేరు, సమ్మతం లేదు. వారి ప్రత్యేకత ఇది.
స్వర్గంలో కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం ) భార్యలే
ఐదవది, వారు ఈ ప్రపంచంలోనే కాదు, స్వర్గంలో కూడా ప్రవక్త గారికి భార్యలుగానే ఉంటారు, సతీమణులుగానే ఉంటారు.
ఆరవ ప్రత్యేకత, ఆయతె తఖ్ఈర్, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్లను ఒక సందర్భంలో రెండు అవకాశాలు ఇచ్చాడు. ఈ రెండింటిలో ఒకటి మీరు నిర్ణయించుకోండి అన్నాడు. ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా? ఈ రెండింటిని ఏదో ఒకటి ఎన్నుకోండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఈ ఆప్షన్ ఇచ్చాడు. ఈ ప్రాపంచిక జీవితం కావాలా? పరలోకం కావాలా? ప్రాపంచిక జీవితమా, పరలోక నిలయమా?
అల్లాహ్ ఈ ఆయతును సెలవిచ్చాడు సూరహ్ అహ్జాబ్ లోనే.
يَا أَيُّهَا النَّبِيُّ قُل لِّأَزْوَاجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا ఓ ప్రవక్తా! నీ భార్యలకు ఇలా చెప్పు: “మీరు గనక ప్రాపంచిక జీవితాన్ని, దాని తళుకు బెళుకులను కోరుకుంటూ ఉన్నట్లయితే, రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చి, మిమ్మల్ని ఉత్తమరీతిలో సాగనంపుతాను –(33:28)
ప్రపంచం కోరుకుంటే, ఈ ప్రాపంచిక జీవితం కోరుకుంటే మీకు ఎంతో కొంత మొత్తం నేను ఇచ్చేస్తాను, ప్రపంచానికి సంబంధించిన విషయాలు, ధనము, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే.
وَإِن كُنتُنَّ تُرِدْنَ اللَّهَ وَرَسُولَهُ وَالدَّارَ الْآخِرَةَ فَإِنَّ اللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَاتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا “కాని ఒకవేళ అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోక నిలయాన్ని పొందాలన్నదే మీ లక్ష్యమైతే, మీలోని సద్వర్తనుల కోసం అల్లాహ్ గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.” (33:29)
ఒకవేళ మీకు అల్లాహ్ కావాలా, ఆయన ప్రవక్త కావాలా, పరలోకం ఎన్నుకుంటారా, అటువంటి స్థితిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సద్వర్తనుల కొరకు గొప్ప ప్రతిఫలం ప్రసాదించి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లలో అందరూ, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు విషయాలు అవకాశాలు ఇచ్చాడో, ప్రాపంచిక జీవితం కావాలా, పరలోకం కావాలా అంటే, ఉమ్మహాతుల్ ము’మినీన్లో అందరూ ఉమ్మడిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా వారు ఎన్నుకునింది ఏమిటి? పరలోక జీవితమే.
అల్లాహ్ చే పరిశుద్ధులుగా చేయబడ్డారు
ఉమ్మహాతుల్ ము’మినీన్లను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని షిర్క్ నుండి, షైతాన్ నుండి, చెడు పనుల నుండి, అన్ని కీడుల నుండి అన్ని అశుద్ధతల నుండి అల్లాహ్ వారిని పరిశుద్ధం చేశాడు, పవిత్రులుగా చేశాడు.
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا ఓ ప్రవక్త ఇంటివారలారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లాహ్ అభిలాష.(33:33)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది, ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి షిర్క్ యొక్క మాలిన్యం, చెడు మాలిన్యం, అన్ని రకాల మాలిన్యం దూరం చేయాలన్నది అల్లాహ్ అభిలాష. కావున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేశాడు. ఇది వారి ప్రత్యేకత.
సత్కార్యాలకు రెండింతల పుణ్యం
ఇక ఎనిమిదవది, వారు ఏ సదాచరణ చేసినా, ఏ మంచి పని చేసినా, ఏ సద్వర్తన, ఏ పుణ్య కార్యం ఏది చేసినా వారికి రెండింతల పుణ్యం ప్రసాదించబడుతుంది. ఇది వారి ప్రత్యేకత. రెండింతల పుణ్యం.
అల్లాహ్ సెలవిచ్చాడు:
وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِ وَتَعْمَلْ صَالِحًا نُّؤْتِهَا أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا మరి మీలో ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరుస్తారో, సదాచరణ చేస్తారో ఆమెకు మేము రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఆమె కోసం మేము గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము.(33:31)
మీలోని వారు అల్లాహ్ కు విధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్తకు విధేయత చూపుతారో, మంచి పనులు చేస్తారో, సదాచారాలు చేస్తారో, సత్కార్యాలు చేస్తారో, మేము రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాము. గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధం చేసి ఉంచాము. ఇది ఉమ్మహాతుల్ ము’మినీన్ల ప్రత్యేకత ఏమిటంటే, వారు చేసే సదాచరణకి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండింతల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఇది వారి ప్రత్యేకత.
వారి గృహాల ప్రస్తావన
అలాగే, వారి ఇండ్ల ప్రస్తావన పారాయణం మరియు హిక్మత్ తో చేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ ఖురాన్ పారాయణంతో, హిక్మత్ తో చేశాడు. అదే సూరా 34వ ఆయత్.
وَاذْكُرْنَ مَا يُتْلَىٰ فِي بُيُوتِكُنَّ مِنْ آيَاتِ اللَّهِ وَالْحِكْمَةِ ۚ إِنَّ اللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు.(33:34)
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్ ఆయతులను, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మృదు స్వభావి, అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉమ్మహాతుల్ ము’మినీన్ల ఇండ్ల ప్రస్తావన ఖురాన్ పారాయణం మరియు హిక్మత్, ప్రవక్త గారి ప్రవచనాలతో, వహీ జలీ అయినా, వహీ ఖఫీ అయినా, ఖురాన్ మరియు హిక్మత్ తో వారి ఇండ్ల ప్రస్తావన అల్లాహ్ చేశాడు, ఇది వారి ప్రత్యేకత.
అలాగే, స్వర్గంలో కూడా వీరు ప్రవక్తకి భార్యలుగానే ఉంటారు అని ఇంతకుముందే తెలుసుకున్నాము. ఒకసారి ఆయిషా రదియల్లాహు అన్హా కథనం, ఈ ఉల్లేఖనం, ఈ హదీస్ ఇబ్నె హిబ్బాన్, హాకిమ్ మరియు తబరానీలో ఉంది. ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సందర్భంలో అడిగారు. ఓ దైవ ప్రవక్తా, స్వర్గంలో ఏ సతీమణి మీ తోడుగా ఉంటారు అని ప్రశ్న. ఉమ్ముల్ ము’మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా అడిగిన ప్రశ్న ఏమిటి? ఓ దైవ ప్రవక్తా, ఏ సతీమణి స్వర్గంలో మీకు తోడుగా ఉంటారు అని అడిగితే, దానికి సమాధానంగా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ ఆయిషా, వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఇంకా ఇతర రివాయతుల ఆధారంగా, ఉమ్మహాతుల్ ము’మినీన్ ఈ ప్రాపంచిక జీవితంలో ఎలాగైతే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సతీమణులుగా, భార్యలుగా ఉన్నారో, స్వర్గంలో కూడా వారు మహా ప్రవక్తకి సతీమణులుగానే ఉంటారు.
అభిమాన సోదరులారా! ఇంతవరకు మనము ఉమ్మడిగా ఉమ్మహాతుల్ ము’మినీన్లకు సంబంధించిన ఘనత తెలుసుకున్నాము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.
మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.
వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా. (وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا) అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.
మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.
మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:
బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్. (بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ) అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.
ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.
త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.
ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.
وَوُضِعَ الْكِتَابُ కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.
فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.
وَيَقُولُونَ మరియు అంటారు:
يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.
لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.
إِلَّا أَحْصَاهَا ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.
وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.
وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని, ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు? [మరణానంతర జీవితం – పార్ట్ 17] [25 నిముషాలు] https://www.youtube.com/watch?v=x27-UYBIOU4 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక అల్లాహ్ తో దుఆ చేయడంలో ఎవరిని ఏ విషయాల్ని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు.
అయితే మహాశయులారా మన అంశం మరణానంతర జీవితం. మనం సీరియల్ వారీగా పరలోకంలో ఏ ఏ మజిలీలు ఉన్నాయి, ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము.అయితే అల్లాహుతాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు చివరికి వస్తారు. ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం.
ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనుక, దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరైన విశ్వాసాన్ని, సరైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని విడిపోయాము అని ఏమాత్రం భావించకండి. అయితే మహాశయులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాహ్ తో దుఆ చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థాన, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి స్వర్గం గురిచి తెలుసుకున్నాం. ఈ రోజు మనం నరకం గురించి తెలుసుకుందాం.
1. ఓ అల్లాహ్ దాసులారా! అంతిమ దినం పై విశ్వాసంలో స్వర్గనరకాలను విశ్వసించడం కూడా ఉంది. ఈ రెండూ శాశ్వతమైన నివాసాలు, స్వర్గం ఆనందాల నిలయం, విశ్వాసులు మరియు పవిత్రమైన దాసుల కోసం అల్లాహ్ సిద్ధం చేశాడు. నరకం శిక్షా స్థలం, ఇది రెండు రకాల వ్యక్తుల కోసం అల్లాహ్ సిద్దం చేశాడు: అవిశ్వాసులు మరియు పెద్ద పాపాలకు పాల్పడ్డ విశ్వాసులు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! అల్లాహ్ తో భయపడండి, ఎల్లవేళలా ఆయన దైవ భీతిని కలిగి ఉండండి. మనసులో ఆయన భయాన్ని సజీవంగా ఉంచండి. ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుంచి దూరంగా ఉండండి. .
మరియు తెలుసుకోండి! అల్లాహ్ తన ధర్మస్థాపనలో తాను లిఖించినటువంటి విధిరాతలో మరియు శిక్షించడంలో, ప్రతిఫలం ప్రసాదించడంలో ఆయన ఎంతో వివేకవంతుడు. మరియు అల్లాహ్ తఆలా యొక్క వివేకం ఏమిటంటే ఆయన తన సృష్టి కొరకు అంతిమ దినాన్ని నియమించాడు. ఆ రోజున ఆయన సమస్త సృష్టిరాశులకు తమ ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్తల ద్వారా తన దాసులకు చేరవేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు.
(మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా? అల్లాహ్యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు.) (సూరా అల్ మూ ‘మినూన్ 23:115-116)
ఓ విశ్వాసులారా! గడిచిన ఖుత్బాలో మనం అంతిమ దినంపై విశ్వాసంలో భాగంగా శంఖం పూరించడం, ప్రళయ సూచనలు, సృష్టి పునరుత్థానం, ప్రజలు హష్ర్ మైదానంలో సమీకరించబడటం, లెక్కల పత్రము శిక్ష ప్రతిఫలం గురించి తెలుసుకున్నాం ఈ రోజు మనం విశ్వాసుల కొరకు సృష్టించబడిన స్వర్గం గురించి తెలుసుకుందాం.
1. స్వర్గనరకాలను విశ్వసించడం అంతిమ దినాన్ని విశ్వసించడంలో భాగం మరియు ఇది మానవుల మరియు జిన్నాతుల శాశ్వత నివాసం. స్వర్గం అనేది అనుగ్రహాల నిలయం, దీనిని విశ్వాసులకు మరియు పవిత్రమైన దాసుల కోసం తయారు చేయబడింది. దీని కొరకు అల్లాహ్ మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించడం, వారి ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి. స్వర్గం లోపల ఏ కన్ను చూడని, ఏ చెవి వినని మరియు ఏ మనసు అలోచించ లేనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:
(అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు; నిశ్చయంగా సృష్టిలో వారే అందరికన్నా ఉత్తములు. వారికి ప్రతిఫలంగా వారి ప్రభువు దగ్గర శాశ్వతమైన స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు.) (98:7-8)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.