Tag: hadeeth
నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?
344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.
అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.
“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”
ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]
(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.
ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
నా (ఉమ్మత్) లో ఒక వర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది
1250. హజ్రత్ ముఆవియా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-
నా అనుచర సమాజం (ఉమ్మత్) లో ఒకవర్గం ఎల్లప్పుడూ ధైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగా ఉంటుంది. ఎవరైనా వారిని అవమాన పరచదలిచినా లేదా వ్యతిరేకించ దలచినా వారా వర్గం (ముస్లింల) కు ఎలాంటి హాని కలిగించలేరు. ఆ విధంగా చివరికి ప్రళయం వచ్చినా అప్పుడు కూడా ఆ వర్గం వారు దైవాజ్ఞలను పాటిస్తూ వాటిపై స్థిరంగానే ఉంటారు.
[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 28 వ అధ్యాయం – హద్దసనీ ముహమ్మదుబ్నుల్ ముసన్నా]
పదవుల ప్రకరణం : 53 వ అధ్యాయం – నా అనుచర సమాజంలో ఒక వర్గం ఎల్లప్పుడూ ధర్మంపై స్థిరంగా ఉంటుంది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?
429. హజ్రత్ మస్రూఖ్ (రహ్మతుల్లా అలై) కధనం :-
నేను (ఓసారి) హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ని “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అన్నిటికంటే ఎక్కువగా ఏ పని అంటే ఇష్టం?” అని అడిగాను. దానికామె “ఆయనకు నిత్యం క్రమం తప్పకుండా చేసేపని అంటే ఎంతో ఇష్టం” అని సమాధానమిచ్చారు.
“మరి రాత్రివేళ ఆయన (తహజ్జుద్ నమాజు చేయడానికి) ఎప్పుడు లేస్తారు? అని అడిగాను మళ్ళీ. అందుకామె “కోడికూత వినగానే లేస్తారు” అని అన్నారు.
[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 7వ అధ్యాయం – మన్ నామ ఇన్ద స్సహార్]
ప్రయాణీకుల నమాజు ప్రకరణం – 17 వ అధ్యాయం – ఇషా నమాజులో పఠించవలసిన రకాతుల సంఖ్య
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు
1702. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-
ప్రతి పిల్లవాడు (ఏ మతస్థుడైనా) ప్రకృతి ధర్మంపై (అంటే ఇస్లాం ధర్మంపై) పుడతాడు. కాని తరువాత అతని తల్లిదండ్రులు అతడ్ని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేదా మజూసీ (అగ్ని పూజారి)గానో మారుస్తారు, జంతువుల్ని మార్చినట్లు. జంతువులు పుట్టేటప్పుడు వాటి అవయవాలన్నీ సక్రమంగానే ఉంటాయి. (ఆ తరువాత ఈ మానవులు వాటి చేవులనో, కొమ్ములనో కోసి పారేస్తారు) ఏ జంతు పిల్లయినా తెగిపోయిన చెవులతో పుట్టడం మీరెప్పుడైనా చూశారా?
హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) పై హదీసు ఉల్లేఖించిన తరువాత ఈక్రింది (ఖుర్ఆన్) సూక్తిని పఠించే వారు.
“అల్లాహ్ మానవులను ఏ ప్రకృతి ధర్మంపై పుట్టించాడో అది మార్చనలివి కానిది”. ఇదే సవ్యమైన, స్థిరమైన ధర్మమార్గం. (30:30)
[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయిజ్, 8 వ అధ్యాయం – ఇజా అస్లమస్సబియ్యు ఫమాత హల్ యుసల్లా అలైహి]
విధివ్రాత ప్రకరణం : 6 వ అధ్యాయం – ప్రతి పిల్లవాడు ప్రకృతి ధర్మంపై పుడతాడు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
జ్ఞానులు అంతరించిన కారణంగా అల్లాహ్ జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు
1712. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-
అల్లాహ్ (ధర్మజ్ఞానాన్ని) ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకెత్తుకోడు, జ్ఞానులు (అంటే ధర్మవేత్త్లలు) అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు. అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని (మూర్ఖుల్ని) నాయకులుగా చేసుకుంటారు. ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు. వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్వాలు (తీర్పులు) ఇస్తారు. ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే గాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు.
[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 34 వ అధ్యాయం – కైఫ యుఖ్బుజుల్ ఇల్మ్]
విద్యా విషయక ప్రకరణం : 5 వ అధ్యాయం – ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
ఆహారంలో లోపం ఎత్తి చూపకూడదు
1336. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నడూ ఏ ఆహారంలో కూడా లోపం ఎత్తి చూపలేదు. ఆయనకు ఇష్టమయితే తినేవారు, ఇష్టం లేకపోతే మానేసేవారు. (అంతేగాని అందులో అది బాగా లేదు, ఇది బాగా లేదని లోపం ఎత్తి చూపేవారు కాదు).
[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం)]
పానీయాల ప్రకరణం : 35 వ అధ్యాయం – అన్నంలో లోపం ఎత్తి చూపకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
జుమా నమాజ్ కి తొందరగా వెళ్ళటం వల్ల వచ్చే గొప్పపుణ్యం
493. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-
శుక్రవారం రోజు ఎవరు జనాబత్ గుస్ల్ (పూర్తి స్థాయి స్నానం) చేసి (పెందలాడే) జుమా నమాజు చేయడానికి వెళ్తాడో, అతను ఒక ఒంటెను బలి ఇచ్చిన వాడవుతాడు. (తర్వాత) రెండవ వేళలో ఇలా వెళ్ళిన వ్యక్తికి ఒక ఆవును బలి ఇచ్చిన పుణ్యం లభిస్తుంది. మూడవ వేళలో వెళ్ళే వాడికి ఒక పోట్టేలును బలిచ్చిన పుణ్యం, నాల్గవ వేళలో వెళ్ళే వాడికి ఒక కోడిని బలిచ్చిన పుణ్యం లభిస్తుంది. అయిదవ వేళలో వెళ్ళేవాడు దైవమార్గంలో ఒక కోడిగ్రుడ్డును దానం చేసిన వాడవుతాడు. ఆ తరువాత ఇమామ్ మస్జిదులో ప్రవేశించగానే దైవదూతలు కూడా అతని ప్రసంగం వినడానికి వస్తారు. (ఆ తరువాత వచ్చే వారికి దైవదూతలు హాజరు వేయరు).
[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 4 వ అధ్యాయం -ఫజ్లిల్ జూముఆ]
జుమా ప్రకరణం – 2 వ అధ్యాయం – శుక్రవారం రోజు సువాసనలు పూసుకోవడం, మిస్వాక్ చేయటం మంచిది.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
Read English Version of this Hadeeth
కలత చెందినపుడు పఠించే దుఆ
1741. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :- భయాందోళనలు కలిగినప్పుడు, కలత చెందినపుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ దుఆ (వేడుకోలు) పఠించేవారు
“లా ఇలాహ ఇల్లల్లాహుల్ అజీముల్ హలీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బుల్ అర్షిల్ అజీం – లా ఇలాహ ఇల్లల్లాహు రబ్బు స్సమావాతి వరబ్బుల్ అర్జి వ రబ్బుల్ అర్షిల్ కరీం”
[మహోన్నతుడు, మృదు మనస్కుడైన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అత్యున్నత సింహాసనాధిపతి (విశ్వసామ్రాజ్యాధినేత) అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. భూమ్యాకాశాల ప్రభువు, ప్రతిష్ఠాత్మక సింహాసనాధిపతి అయిన అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు].
[సహీహ్ బుఖారీ : 80 వ ప్రకరణం – అధ్దావాత్, 27 వ అధ్యాయం -అద్దుఆ ఇన్దల్ కర్బ్]
ప్రాయశ్చిత్త ప్రకరణం : 21 వ అధ్యాయం – కలత చెందినపుడు పఠించే దుఆ
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్
Read English Version of this Hadeeth
స్వల్పదానం చేసే వారిని చిన్నచూపు చూడటం, కించపరిచే మాటలనడం నిషిద్ధం
598. హజ్రత్ అబూ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-
మమ్మల్ని దానం చేయాలని ఆదేశించినపుడు మేము బరువులు మోసి సంపాదన చేసే వాళ్లము (అందులో నుంచే కొంతదానం చేసే వాళ్లము). ఒకరోజు హజ్రత్ అబూ అఖీల్ (రధి అల్లాహు అన్హు) తనకు కూలి క్రింద లభించిన అర్ధ ‘సా’ (తూకం) ఖర్జూర పండ్లను (దానంగా ఇవ్వడానికి) తీసుకు వచ్చారు. మరొక వ్యక్తి అంతకంటే ఎక్కువ తీసుకు వచ్చాడు. అప్పుడు కొందరు కపట విశ్వాసులు (కారుకూతలు కూస్తూ) “దేవునికి అతని (అంటే అబూ అఖీల్ తెచ్చిన) దానం అవసరంలేదు (ఆయన ఇలాంటి అల్పదానాన్ని ఖాతరు చేయడు), రెండవ వ్యక్తి పేరు ప్రతిష్ఠల కోసం (దానం) చేశాడు” అని అన్నారు. ఆ సందర్భంలో ఈ ధైవవచనం అవతరించింది:
“మనస్పూర్తిగా విశ్వాసులు చేస్తున్న ధన త్యాగాలను గురించి వారు ఎత్తిపొడుస్తూ మాట్లాడుతున్నారు. కష్టపడి చెమటోడ్చి ఎంతో కొంత దైవమార్గంలో దానమిస్తున్న (నిరుపేద) విశ్వాసుల్ని ఎగతాళి చేస్తున్నారు. (అలా ఏకసక్కెం, ఎగతాళి చేస్తున్న ఈ పిసినారుల సంగతి అల్లాహ్ కి బాగా తెలుసు). దేవుడే వారిని ఎగతాళి చేస్తున్నాడు. వారి కోసం దుర్భరమైన (నరక) శిక్ష కాచుకొని ఉంది.” (ఖుర్ఆన్ – తౌబా : 79 )