నరకవాసుల పడకలు మరియు ఇతర శిక్షలు [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 7] – నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు
[మరణానంతర జీవితం – పార్ట్ 61 [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=jcQ-5KK6IMk
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[డౌన్లొడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగంలో నరకవాసుల గురించి తీవ్రమైన హెచ్చరికలు చేయబడ్డాయి. నరకంలో వారికి లభించే పడకలు, దుప్పట్లు నరకాగ్నితో కూడుకున్నవని, వారి తలల పైనుండి, పాదాల క్రింది నుండి శిక్ష కమ్ముకుంటుందని వివరించబడింది. నరకవాసులను బంధించే సంకెళ్లు, ఇనుప గదలు, వేడి నీటితో చర్మం కాలిపోవడం, తిరిగి కొత్త చర్మం రావడం వంటి భయంకరమైన శిక్షల గురించి ఖురాన్ ఆయతుల ద్వారా తెలపబడింది. ముఖం కిందికి లాగబడటం, గాడిదలా తిరగడం, పాములు, తేళ్లు కుట్టడం వంటి శిక్షలను వివరిస్తూ, ఈ నరక యాతనల నుండి ఏ విధంగానూ ఉపశమనం లేదా మరణం ఉండదని వక్త హెచ్చరించారు. చివరగా, అల్లాహ్ దయతో ఇహలోకంలో ప్రసాదించిన వరాన్ని సద్వినియోగం చేసుకుని నరక శిక్ష నుండి రక్షణ పొందాలని కోరారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. నరక శిక్షలు, నరకవాసులకు ఇవ్వబడే ఆహారం, పానీయాలు, దుస్తులు వీటన్నిటి వివరాలు మనం తెలుసుకున్నాము.

ఇక ఈ రోజు మనం వారి గురించి ఎలాంటి పడక ఉంటుంది? ఎలాంటి పరుపు అనేది పడుకోవడానికి వారికి ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయాలు మనం తెలుసుకుందాము. అయితే, నరకం అనేది విశ్రాంతి స్థలం కాదు కదా పడుకొని ఉండడానికి! నరకం అనేది ఏదైనా ఆనందకరమైన ప్రదేశం కాదు, అక్కడ మనిషి కొంతసేపటి గురించి ఏదైనా ఎంజాయ్మెంట్ చేసుకోవాలని. అది శిక్షలతో కూడిన స్థలం. అయినా, అక్కడ ఇవ్వబడే తిండి, పానీయం, దుస్తులు ఇవన్నీ శిక్షలతో కూడి ఉంటాయి. ఈ విధంగా వారి గురించి ఏ పరుపులైతే ఉంటాయో, అవి కూడా శిక్షలతో కూడి ఉంటాయి.

సూరహ్ అల్ ఆరాఫ్, ఆయత్ నంబర్ 41 లో అల్లాహ్ తెలిపాడు:

لَهُم مِّن جَهَنَّمَ مِهَادٌ وَمِن فَوْقِهِمْ غَوَاشٍ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الظَّالِمِينَ
[లహుమ్ మిన్ జహన్నమ మిహాదువ్ వమిన్ ఫౌకిహిమ్ గవాష్. వ కజాలిక నజ్ జిజ్ జాలిమీన్]
వారి క్రింద నరకాగ్నితో చేయబడిన పాన్పుఉంటుంది. పైన దుప్పటి కూడా (దానితోనే తయారైనదయి ఉంటుంది). దుర్మార్గులకు మేము విధించే శిక్ష ఇలాగే ఉంటుంది. (7:41)

నరకమే నరకం. మరియు వారు కప్పుకోవడానికి పైనుండి ఏ దుప్పట్లయితే వేసుకుంటారో, అవి కూడా నరకానికి సంబంధించినవే,

సూరహ్ అన్ కబూత్, ఆయత్ నంబర్ 55 లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
[యౌమ యగ్ షాహుముల్ అజాబు మిన్ ఫౌకిహిమ్ వమిన్ తహ్ తి అర్జులిహిమ్ వ యకూలు జూకూ మా కున్తుమ్ త’మలూన్]

ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్‌) వారితో “మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి” అని అంటాడు. (29:55)

ఇక వారు ఆ నరకం నుండి పారిపోయి ఏ నీడ పొందాలని కోరుతారో, ఆ నీడ కూడా నరకం యొక్క నీడ! అందులో కూడా వారికి ఎలాంటి ప్రశాంతత అనేది, సౌఖ్యం అనేది ఉండదు. వారు నీడను చూసి, ఆ నీడలోకి వచ్చినప్పుడు, అక్కడ వారికి నరకం నుండి ఏదైతే పారిపోయి వచ్చారో, నరకాగ్ని నుండి రక్షణ పొందాము అన్నట్లుగా వారికి అర్థమవుతుందో, నీడలో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఈ విధంగా పొగ వారిని కమ్ముకొని ఉంటుంది మరియు దుర్వాసన అనేది వారు భరించలేకపోతారు. అలాంటి ఆ స్థితిలో, నరకంలో నరకాగ్నిని భరిస్తూ ఏదైతే ఉన్నారో దానికంటే మరీ ఘోరమైన పరిస్థితి వారిది ఉంటుంది.

ఇంకా మహాశయులారా, నరకంలో ఇన్ని కష్టాలు వారు భరిస్తూ ఉంటారు, కానీ ఇంతటితో వారి యొక్క కష్టాలకు అంతం అనేది ఉండదు. నరకంలోనే ఇంకా ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి. కొందరిని బందీలుగా ఖైదు చేయడం జరుగుతుంది. మరికొందరిని చాలా ఇరుకు ప్రదేశంలో వారిని వేయడం జరుగుతుంది. ఎంతటి ఇరుకు ప్రదేశం అంటే, వారు అక్కడ కదలడానికి కూడా అవకాశం ఉండదు.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
[వ ఇజా ఉల్కూ మిన్హా మకానన్ దయ్యికమ్ ముఖర్రనీన దఅవ్ హునాలిక సుబూరా]

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది: “ఏమిటి ఒక్క చావును? ఎన్నో చావులను మీరు పిలిచినా, కేకలు వేసినా ఏ ఒక్క చావు కూడా మీకు రాదు, మీరు అసలు అక్కడ చనిపోనే చనిపోరు.”

మరో రకమైన శిక్ష ఎలా ఉంటుందో సూరహ్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 49 లో తెలపడం జరిగింది:

وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
[వతరల్ ముజ్రిమీన యౌమఇజిమ్ ముకర్రనీన ఫిల్ అస్ ఫాద్]
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. (14:49)

మరియు సూరహ్ ఇన్సాన్ ఆయత్ నంబర్ 4 లో ఉంది:

إِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَلَاسِلَ وَأَغْلَالًا وَسَعِيرًا
[ఇన్నా అఅతద్ నా లిల్ కాఫిరీన సలాసిల వ అగ్లాలవ్ వసయీరా]
అవిశ్వాసుల కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. (76:4)

అబూ లహబ్ యొక్క భార్య, ఆమె గురించి ప్రస్తావిస్తూ అల్లాహ్ ఏం చెప్పాడు?

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో (ఖర్జూర ఆకుతో) గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది (111:5)

మరియు సూరహ్ హాక్కా లో ఇంతకుముందే మీరు విని ఉన్నారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఎడమ చేతిలో ఎవరైతే తమ కర్మపత్రాన్ని తీసుకుంటారో వారు ఎలా బాధపడుతూ అరుస్తారో, ఆ తర్వాత వారిని ఎలా బంధించడం జరుగుతుందో తెలియజేస్తూ:

ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
[సుమ్మ ఫీ సిల్సిలతిన్ జర్ఉహా సబ్ ఊన జిరాఅన్ ఫస్లుకూహ్]
మరి వాణ్ణి డెభ్భై మూరల పొడవు గల సంకెళ్ళతో బిగించి కట్టండి. (69:32)

ఇంకా మహాశయులారా, మరో రకమైన శిక్ష అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెద్ద పెద్ద ఇనుప గదలతో, ఇనుప రాళ్లతో, ఇనుప సలాకులతో నరకవాసులను కొట్టడం జరుగుతుంది.

وَلَهُم مَّقَامِعُ مِنْ حَدِيدٍ
[వలహుమ్ మకామిఉ మిన్ హదీద్]
ఇంకా, వారి కొరకు (వారిని చితక బాదటానికి) ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. (సూరహ్ హజ్ 22:21)

మరియు అక్కడి శిక్షల్లో ఒక రకమైన శిక్ష, నరకవాసుల తలల మీదుగా బాగా వేడిలో, మితిమీరి వేడిగల నీళ్లు వారిపై పోయడం జరుగుతుంది. ఆ నీళ్లు వారి శరీరంపై పడిన వెంటనే తోలు అంతా కాలిపోతూ కాలిపోతూ లోపల కడుపులోని ప్రేగులు కూడా ముక్కలు ముక్కలు అవుతూ ఉంటాయి.

ఇంకా నరకంలో ఒక రకమైన శిక్ష మరీ ఘోరంగా ఉంది. చూడడానికి అంతం సమాప్తం అని ఏర్పడుతుంది కానీ అలా జరగదు. ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఎవరైతే మదీనా వాసుల పట్ల చెడుగా చూస్తాడో, చెడుగా ప్రవర్తిస్తాడో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నరకంలో అతన్ని ఎలాంటి శిక్షకు గురి చేస్తాడు అంటే, ఉప్పు నీళ్లలో ఎలా కరిగిపోతుందో అతడు అలా నరకంలో కరిగిపోతా ఉంటాడు. ఇలాంటి శిక్ష అతనికి జరుగుతూనే ఉంటుంది.

ఇంకా మహాశయులారా, అక్కడి శిక్షల్లో మరొక ఘోరమైన శిక్ష ఏమిటంటే, ఎప్పుడెప్పుడు శిక్షించబడి తోలు కాలిపోతూ ఉంటుందో, అప్పుడప్పుడు మరొక కొత్త తోలు వారిపై వేయడం జరుగుతుంది. వారికి కొత్త తోలు పుట్టుకొస్తుంది. మళ్లీ శిక్షించడం జరుగుతుంది. తోలు కాలిపోతుంది, మళ్లీ కొత్తగా వారికి తోలు వస్తూ ఉంటుంది.

كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَاهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا الْعَذَابَ
[కుల్లమా నజిజత్ జులూదుహుమ్ బద్దల్నాహుమ్ జులూదన్ గైరహా లియజూకుల్ అజాబ్]
వారి చర్మాలు బాగా ఉడికిపోయినప్పుడల్లా, వాటికి బదులుగా, వారు శిక్ష యొక్క రుచి చూసేందుకు వేరే చర్మాలను సృష్టిస్తాము (4:56)

మరి ఈ రోజుల్లో సైంటిఫిక్ పరంగా కూడా, మనిషి యొక్క తోలులో కొన్ని కణాలు ఉన్నాయి, అవి మనిషికి కలిగే బాధను గ్రహించగలుగుతాయి. ఎప్పుడైతే అవి కాలిపోతూ ఉంటాయో, వాటిని మార్చడం జరుగుతూ ఉంటుంది.

ఇంకా సోదరులారా, నరకంలో వారిని ఎలా పడవేయడం జరుగుతుందో దాని ప్రస్తావన కూడా వచ్చి ఉంది మహాశయులారా.

తల క్రిందులుగా చేసి అవమానకరంగా వారిని నరకంలో వేయడం జరుగుతుంది.

يَوْمَ يُسْحَبُونَ فِي النَّارِ عَلَىٰ وُجُوهِهِمْ
[యౌమ యుస్ హబూన ఫిన్నారి అలా వుజూహిహిమ్]
వారిని ముఖం క్రిందులుగా చేసి నరకం వైపునకు లాగుతూ ఉండడం జరుగుతుంది. (54:48)

మరి కొందరికి శిక్ష అక్కడ ఎలా ఉంటుంది? బహుశా కొన్ని పల్లెటూర్లలో మనం చూసి ఉంటాము, నూనె తీయడానికి ఎద్దు గాని, గాడిద గాని గుండ్రంగా త్రిప్పుతూ ఉండడం జరుగుతుంది. అటు ఇటు చూసి అది తన పని వదలకూడదు అని కొన్ని సందర్భాల్లో దాని ముఖం మొత్తం కప్పి ఉంచడం కూడా జరుగుతుంది. కేవలం ఒక విషయం అర్థం కావడానికి మన గ్రామాల్లో జరిగే ఒక విషయం ఉదాహరణగా చెప్పాను. కానీ నవూజుబిల్లాహ్, నరకంలో ఉండే నరక శిక్షల యొక్క పోలిక కాదు ఇది. విషయం ఏంటంటే, నరకంలో కొందరికి శిక్ష ఈ విధంగా జరుగుతుంది.

ప్రళయ దినాన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నరకంలో వేయడం జరుగుతుంది. నరకంలో అతను పడిన తర్వాత అతని పేగులన్నీ బయటికి వచ్చి ఉంటాయి. కడుపు చాలా పెద్దగా అయిపోతుంది. అతడు లేచి నిలబడాలి అనుకుంటాడు, కానీ నిలబడలేడు, తిరుగుతాడు. ఇలా ఆ గాడిద లేదా ఎద్దు తిరిగే విధంగా అలాగే అతనికి శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు అతన్ని చూసి, “నీవు మంచిని గురించి ఆదేశిస్తూ ఉండేవాడివి కదా! చెడు నుండి ఆపుతూ ఉండేవాడివి కదా! నీవు ఇలాంటి శిక్షకు ఎందుకు గురయ్యావు?” అని అంటే, అతను అంటాడు:

كُنتُ آمُرُكُم بِالْمَعْرُوفِ وَلَا آتِيهِ وَأَنْهَاكُمْ عَنِ الْمُنكَرِ وَآتِيهِ
[కున్తు ఆమురుకుమ్ బిల్ మఅరూఫి వలా ఆతీహి వ అన్హాకుమ్ అనిల్ మున్కరి వ ఆతీహ్]
“ఏ మంచిని గురించి మీకు ఆదేశిస్తూ ఉండేవాడినో, అది నేను పాటించేవాడిని కాదు. ఏ చెడు నుండి మిమ్మల్ని వారిస్తూ ఉండేవాడినో, ఆ చెడు నేను చేసేవాడిని.”

అందుకే ఇలాంటి శిక్ష జరుగుతుంది అని అంటాడు. అల్లాహ్ ఈ విధంగా మనకు చెప్పే బోధనలను స్వయంగా ఆచరించే భాగ్యం కలిగించు గాక. ఏ విషయాల నుండి మనం వారిస్తున్నామో వాటి నుండి స్వయంగా మనం ముందు దూరంగా ఉండే అటువంటి భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

నరకంలోని శిక్షల్లో ఒక రకమైన శిక్ష ఏమిటంటే, ఆ శిక్షలను భరించలేక వారు పెడబొబ్బలు పెడతారు. ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండి ఏ సహాయం అందదు, ఎవరూ వారి యొక్క ఏడ్పుబొబ్బలను వినేవారు ఉండరు.

حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
[హత్తా ఇజా అఖజ్ నా ముత్రఫీహిమ్ బిల్ అజాబి ఇజా హుమ్ యజ్ అరూర్]
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.(23:64)

لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
[లా తజ్ అరుల్ యౌమ ఇన్నకుమ్ మిన్నా లా తున్సరూన్]
వారికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది: “మీరు ఈ రోజు ఎలాంటి సహాయానికై మీరు కేకలు వేయకండి, ఈ రోజు మా వైపు నుండి మీకు ఎలాంటి సహాయం అందదు.” (23:65)

నరకంలో ఒక రకమైన శిక్ష: మనిషి నరకాగ్నిలో ఉండి ఉండి, నీళ్లు త్రాగడానికి అని పక్కకు వస్తాడు, వేడి వేడి నీళ్లు, మితిమీరిన వేడి నీళ్లు!

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
[యతూఫూన బైనహా వబైన హమీమిన్ ఆన్]
అటు అది త్రాగలేడు, ఇటు దీనిని భరించలేడు, ఈ విధంగా ఇటునుండి అటు, అటునుండి ఇటు తిరుగుతూనే ఉంటాడు. (55:44)

అంతేకాదు నరకంలో, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో అక్కడ కూడా భయంకరమైన పాములు మరియు తేళ్లు ఉంటాయి. నరకవాసులకు అవి వాతలు పెడుతూ ఉంటాయి, కుడుతూ ఉంటాయి. ముస్నద్ అహ్మద్ మరియు సహీహ్ ఇబ్న్ హిబ్బాన్ లోని ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహ్ అని ప్రస్తావించారు: నరకంలో పెద్ద పెద్ద పాములు ఉంటాయి. ఒక్కొక్క పాము “బుఖ్త్” ఒంటె (చాలా పెద్ద, ఎత్తుగా ఉండే ఒంటె) అలాంటి ఒంటెల మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఉంటాయి.

ఒక్కసారి అది కాటు వేసిందంటే నలభై సంవత్సరాల వరకు దాని యొక్క బాధను మనిషి భరిస్తూనే ఉంటాడు అల్లాహు అక్బర్. మరియు నరకంలో సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచర గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్లు కూడా ఉంటాయి. ఆ తేళ్లు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం, దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది.

ఇంకా సోదరులారా, సోదరీమణులారా, నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, పెద్ద పెద్ద పర్వతాల మీద ఎక్కడానికి బలవంతం చేయబడుతుంది. ఇది కూడా ఒక రకమైన వారికి శిక్ష ఉంటుంది.

سَأُرْهِقُهُ صَعُودًا
[స ఉర్హికహు సఊదా]
దానిని వారు ఎక్కలేరు, పడుతూ ఉంటారు, మళ్లీ ఎక్కడం జరుగుతుంది. త్వరలోనే నేను వాణ్ణి కఠినమైన ఎత్తుకు ఎక్కిస్తాను. (74:17)

అల్లాహ్ ఆయత్లలో తిరస్కరించి, ఖురాన్ గ్రంథాన్ని “ఓ మనిషి లాంటి మాటలే కదా ఇందులో ఉన్నవి” అన్నటువంటి ఎగతాళి చేసే వారి గురించి ఇలాంటి శిక్షలు కూడా జరుగుతాయి.

నరకంలో ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష: నరకంలో ఉన్న వ్యక్తి ఏ శ్వాస పీలుస్తాడో, మళ్లీ వదులుతాడో, పీల్చుకునే, వదులుకునే ప్రతి ఒక్క శ్వాసకు మహా భయంకరమైన ధ్వని, చప్పుడు అనేది ఉంటుంది.

فَأَمَّا الَّذِينَ شَقُوا فَفِي النَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ
[ఫఅమ్మల్ లజీన షకూ ఫఫిన్నారి లహుమ్ ఫీహా జఫీరువ్ వషహీక్]
ఎవరైతే దౌర్భాగ్యులో వారు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో విలపిస్తూ, కేకలు వేస్తూ (భయంకరమైన శ్వాసలు తీస్తూ) ఉంటారు. (11:106)

అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఒక సందర్భంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: ఈ మస్జిద్ లో లక్ష, లక్షకు పైగా మంది ఉన్నారంటే, వీరి మధ్యలో కేవలం ఒకే ఒక వ్యక్తి నరకవాసుల్లోని వ్యక్తి ఉండి అతను శ్వాస తీసుకుంటే, అతని శ్వాస ఏదైతే అతను బయటికి వదిలాడో దానివల్ల ఈ లక్ష, లక్షకు పైగా ఉన్న వారందరూ కాలిపోతారు, చనిపోతారు. అల్లాహు అక్బర్.

నరక వాసులకు ఇవ్వబడే శిక్షల్లో ఒక రకమైన శిక్ష, వారి ముఖాన్ని మరీ అంధకారంగా చేసి భయంకరమైనవిగా కూడా చేయబడతాయి. ఒక హదీసులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క తండ్రి ఆజర్ విషయంలో ఇలాంటి ప్రస్తావన ఒక సహీహ్ హదీసులో వచ్చి ఉంది.

అయితే మహాశయులారా, ఇంతటి ఘోరమైన శిక్షలు వారు అనుభవిస్తున్నప్పుడు వారికి అక్కడ చావు వస్తుందనా? వారి యొక్క శిక్షల్లో ఏదైనా తగ్గింపు జరుగుతుంది అనా? వారికి ఏదైనా సహాయం దొరుకుతుందా? ఇవన్నీ ఏమాత్రం అవకాశం లేదు. ఇవన్నీ కూడా అసంభవం.

فَلَا يُخَفَّفُ عَنْهُمُ
[ఫలా యుఖఫ్ఫఫు అన్హుము]
వారి యొక్క శిక్షల్లో ఎలాంటి తగ్గింపు జరగదు, అని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ లో చెప్పడం జరిగింది. మరియు మీకు ఎలాంటి సహాయం అందించేవాడు కూడా అక్కడ ఎవరూ ఉండడు.

మరియు వారికి చావు వస్తుందా?

لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
[లా యమూతు ఫీహా వలా యహ్యా]
అక్కడ చావు రాదు, హాయిగా బ్రతికినట్లు కూడా ఉండదు. (87:13)

గమనించండి, ఇహలోకంలో ఎంత పెద్ద శిక్ష జరిగినా కనీసం చచ్చిపోదాము అని భావిస్తాడు, మనిషి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, ఏదో జరుగుద్ది, కానీ అక్కడ నరకంలో చావు కూడా రాదు. నరకవాసులు అందరూ నరకంలో, స్వర్గవాసులు అందరూ స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, స్వయంగా చావును అల్లాహ్ త’ఆలా ఒక పొట్టేలు రూపంలో తీసుకొస్తాడు. వారందరూ దానిని గుర్తుపడతారు, ఇది చావు అని ఒప్పుకుంటారు. అల్లాహ్ త’ఆలా ఆ చావుకే చావు ఇచ్చేస్తాడు. ఇక ఆ తర్వాత ఎవరికీ ఏ చావు అనేది ఉండదు.

అయితే నరకం నుండి ఏదైనా పారిపోవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అది కూడా ఉండదు.

كُلَّمَا أَرَادُوا أَن يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا
[కుల్లమా అరాదూ అయ్ యఖ్ రుజూ మిన్హా ఉఈదూ ఫీహా]
ఎప్పుడెప్పుడు వారు బయటికి వెళ్ళాలని అనుకుంటారో, ఏదైనా కొంచెం పైకి వస్తారో, కొంచెం బయటికి రావాలనుకుంటారో, వారిని తిరిగి అందులోనే వేయడం జరుగుతుంది. (32:20)

మరియు వారు నరకం నుండి బయటికి వెళ్లడానికి ఏ అవకాశమూ లేదు అని కూడా అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు.

మహాశయులారా, సమయం సమాప్తం కానుంది, ఇక్కడ ఒక హదీస్ తప్పకుండా మీరు వినండి. వాటిపై శ్రద్ధ వహించండి. అవకాశం అల్లాహ్ ఏదైతే మనకు ఇచ్చాడో దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అల్లాహ్ ఈ భాగ్యం నాకు, మీకు మనందరికీ ప్రసాదించుగాక.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఒక వ్యక్తిని హాజరు పరుస్తాడు. అతనితో ప్రశ్నిస్తాడు:

أَلَمْ أَجْعَل لَّكَ سَمْعًا وَبَصَرًا وَمَالًا وَوَلَدًا
[అలమ్ అజ్ అల్ లక సమ్ అన్ వ బసరన్ వ మాలన్ వ వలదా]
“నేను నీకు చెవులు, కళ్లు, డబ్బు ధనం, సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా?” ఆ మనిషి అంటాడు: “అవును ఓ అల్లాహ్! అన్నీ నీవే ప్రసాదించావు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.”

وَسَخَّرْتُ لَكَ الْأَنْعَامَ وَالْحَرْثَ وَتَرَكْتُكَ تَرْأَسُ وَتَرْبَعُ
[వ సఖ్ఖర్తు లకల్ అన్ ఆమ వల్ హర్స వ తరకుక తర్ అసు వ తర్బఉ]
“నీకు పంటలు, పొలాలు, జంతువులు ఇంకా ఎన్నో రకాల వరాలు ప్రసాదించాను. వాటన్నిటిపై నీవు అధికారం కలిగి ఉన్నావు. వాటన్నిటితో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీ జీవితం గడిపావు, అవునా?” అతను అంటాడు: “అవును ఓ అల్లాహ్!”

“అయితే ఈ రోజు వచ్చి నన్ను నీవు కలుసుకుంటావు అన్నటువంటి నమ్మకం నీకు ఉండెనా ఇహలోకంలో?” అని అడుగుతాడు.

అప్పుడు అతను అంటాడు: “లేదు ఓ అల్లాహ్! చనిపోయేది ఉంది, నీవు మళ్లీ నన్ను లేపుతావు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నటువంటి నమ్మకం నాకు లేకుండినది.”

అప్పుడు అంటాడు అల్లాహ్:

الْيَوْمَ أَنْسَاكَ كَمَا نَسِيتَنِي
[అల్యౌమ అన్సాక కమా నసీతనీ]
“ఇహలోకంలో నీవు నన్ను ఎలా మర్చిపోయావో, ఇక ఈ రోజు కూడా నేను నిన్ను మర్చిపోతాను.”

అంటే ఏమిటి భావం? అల్లాహ్ యొక్క కరుణాకటాక్షాల్లో స్వర్గం, అక్కడి యొక్క వరాలు ఏమీ కూడా అతనికి లభించవు, నరకంలోనే ఉండవలసి వస్తుంది.

గమనించారా సోదరులారా? ఇహలోకంలోని వరాలన్నీ కూడా మనకు ఎలా లాభాన్ని తీసుకొచ్చాయి? ఒకవేళ మనం అల్లాహ్ ను తిరస్కరిస్తే, అల్లాహ్ చెప్పినట్లుగా అల్లాహ్ యొక్క ఆదేశం మేరకు మన జీవితం గడపకుంటే. అందుగురించి అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తల్ని విశ్వసించి, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ, పరలోక దినాన్ని విశ్వసించాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించు గాక.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46128

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

నరకవాసుల ఆహారం, పానీయాలు & వస్త్రాలు [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 6] – నరకవాసుల ఆహారం, పానీయాలు & వస్త్రాలు
[మరణానంతర జీవితం – పార్ట్ 60] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=N4VPIs8xrlQ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[డౌన్లొడ్ పిడిఎఫ్]

ఈ ప్రసంగంలో నరకవాసుల ఆహారం మరియు పానీయాల గురించి వివరించబడింది. జఖూమ్, దరీ, మరియు ఘిస్లీన్ వంటి భయంకరమైన ఆహార పదార్థాలు, అలాగే అల్ ముహ్ల్, హమీమ్, ఘస్సాఖ్ మరియు సదీద్ వంటి పానీయాలు నరకంలో పాపాత్ములకు ఎలా ఇవ్వబడతాయో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరించారు. నరకవాసుల వస్త్రాల గురించి మరియు అహంకారులకు కలిగే శిక్షల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించారు. మనిషి ఈ లోకంలో చేసే పాపాల నుండి దూరంగా ఉండి, నరక శిక్ష నుండి తప్పించుకోవాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మ బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకవాసులకు ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో దాని గురించి తెలుసుకుంటూ జఖూమ్ (జముడు వృక్షం) గురించి మనం గత కార్యక్రమంలో తెలుసుకున్నాము.

ఇక రెండో రకమైన ఆహారం వారికి ఇవ్వబడేది ‘దరీ‘. దీని ప్రస్తావన సూరహ్ గాషియాలో వచ్చి ఉంది. దరీ ఒక చెట్టు, దానికి ముళ్లు ఉంటాయి. అందులో చాలా దుర్వాసన ఉంటుంది మరియు దానివల్ల ఆకలి అనేది మనిషికి దూరం కాదు. అలాంటిది ఆ రోజు నరకవాసులకు తినడానికి ఇవ్వడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు:

لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
(లైస లహుమ్ త’ఆమున్ ఇల్లా మిన్ దరీ’. లా యుస్మిను వలా యుగ్నీ మిన్ జూ’)
వారికి తినడానికి ముండ్ల చెట్టు తప్ప వేరొకటి ఆహారంగా దొరకదు.అది వారిని లావుగానూ చేయదు, వారి ఆకలిని కూడా తీర్చదు. (88:6-7)

ఇలాంటిది వారికి ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడో విషయం ఏదైతే వారికి ఆహారంగా ఉంటుందో అది ‘ఘిస్లీన్‘. దీని ప్రస్తావన సూరహ్ హాక్కా లో వచ్చి ఉంది. ఘిస్లీన్ అంటే రక్తము మరియు పుండు నుండి వెళ్ళే పదార్థము. అది నరకవాసుల పుండ్ల నుండి వారికి అగ్ని తగలడం వల్ల అక్కడ నుండి ఏదైతే చీము కారుకుంటూ వస్తుందో అది. ఇది ఎలాంటి వారికి ఆహారం అవుతుంది? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సూరహ్ హాక్కా లో తెలుపుతూ:

فَلَيْسَ لَهُ الْيَوْمَ هَاهُنَا حَمِيمٌ وَلَا طَعَامٌ إِلَّا مِنْ غِسْلِينٍ
(ఫలైస లహుల్ యౌమ హాహునా హమీమ్. వలా త’ఆమున్ ఇల్లా మిన్ గిస్లీన్)
“కాబట్టి ఈ రోజు ఇక్కడ వీడి (స్థితిపై సానుభూతి చూపే) స్నేహితుడెవడూ లేడు.గాయాల కడుగు నీరు తప్ప మరొకటేదీ వీడికి ఆహారంగా లభించదు” (69:35-36)

అల్లాహ్ మనందరినీ ఆ ఘిస్లీన్ నుండి కూడా కాపాడుగాక. ఇమామ్ ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి తెలిపారు: ఘిస్లీన్ అంటే నరకవాసుల చెమట, చీము అవన్నీ కలిపి వచ్చే పదార్థాలు అని.

అంతే కాకుండా మరో భయంకరమైన, వింటేనే వికారం కలిగేటటువంటి విషయం ఏమిటంటే ఏ వ్యభిచారిణీలను నరకంలో వేయడం జరుగుతుందో వారి యొక్క మర్మాంగాల నుండి వచ్చే చెడు, అలాంటిది కొందరి పాపాత్ములకు ఆహారంగా ఉంటుంది. అల్లాహ్ మనందరికీ అలాంటి చెడు విషయాల నుండి రక్షణ కలిగించుగాక. ఇక్కడ ఇంత చెడు ఉంటుందా అని అడ్డప్రశ్నలు వేసి మరింత విశ్వాసాన్ని పాడు చేసుకునే దానికి బదులు మనం నరకంలో తీసుకెళ్లే పాపాల నుండి దూరం ఉండటం మేలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.

అయితే మహాశయులారా! ఈ రకరకాల ఆహారాల గురించి ఏదైతే ప్రస్తావన వచ్చిందో, జఖూమ్ గాని, ఘిస్లీన్ గాని లేదా దరీ గాని మరియు కొన్ని ఆయతులలో ‘జా గుస్సహ్’ అనే ఒకటి ప్రస్తావన వచ్చింది. ఇలాంటి వివిధ రకమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే సందర్భంలో ఇవ్వబడతాయా? వేరువేరు సందర్భాల్లో ఇవ్వబడతాయా? మరియు ప్రతి ఒక్కటి ఒక రకమైన పాపాత్ములకు ఇవ్వబడుతుందా? ఇవన్నీ వివరాలు పరలోకంలో అల్లాహ్ కు బాగా తెలుసు. ఇవన్నీ కూడా పరలోక విషయాలు వాటి వివరాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మనం వాటి ద్వారా అర్థం చేసుకునే విషయాలు ఏమిటంటే ఏ పాపాలకు కూడా ఎలాంటి అవిశ్వాసానికి కూడా మనం గురి కాకూడదు మరియు సత్యాన్ని తిరస్కరించకూడదు. వీటన్నిటిలో ఏ ఒక్క చెడైనా గాని మనల్ని నశింపచేయడానికి, మనల్ని అవమానపరచడానికి మహా ఎక్కువగా ఉంటుంది. అందుగురించి మనం సత్యాన్ని స్వీకరించి నరకం నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే మన గురించి ఇందులో ఉన్నటువంటి గొప్ప బోధ.

ఇక రండి మహాశయులారా! వారికి త్రాగడానికి ఇవ్వబడే పానీయాలు ఎలాంటివి అవి కూడా కొంచెం మనం తెలుసుకుందాము. అయితే ఎప్పుడైతే వారికి దాహం కలుగుతుందో అప్పుడు కొన్ని జంతువులు దాహంతో తల్లడిల్లుతూ దూరం నుండి నీళ్లను చూస్తే పిచ్చివారిగా ఎలా పరిగెత్తుతాయో, వారు పరిగెత్తడంలో ఒకరిని ఒకరు త్రోసుకుంటూ మరియు ఎటువైపున ఏ నష్టం జరుగుతుందో ఏమాత్రం ఆలోచించకుండా ఒకే వైపున పరిగెడతారో అలా ఆ రోజు నరకవాసుల పరిస్థితి అవుతుంది.

وَنَسُوقُ الْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
(వనసూఖుల్ ముజ్రిమీన ఇలా జహన్నమ విర్దా)
అపరాధులను తీవ్రంగా దప్పికగొన్న స్థితిలో నరకం వైపుకు తోలుకుపోతాము (19:86)

ఇంకా ఆ రోజు దాహం ఎక్కువగా ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నరకవాసులకు స్వర్గవాసులు సేవిస్తున్న పానీయాలు కూడా చూపించడం జరుగుతుంది. అప్పుడు వారు అరుస్తారు:

وَنَادَىٰ أَصْحَابُ النَّارِ أَصْحَابَ الْجَنَّةِ أَنْ أَفِيضُوا عَلَيْنَا مِنَ الْمَاءِ أَوْ مِمَّا رَزَقَكُمُ اللَّهُ ۚ قَالُوا إِنَّ اللَّهَ حَرَّمَهُمَا عَلَى الْكَافِرِينَ

నరకవాసులు స్వర్గవాసులను పిలుస్తూ, “మాపైన కొద్దిగా నీళ్ళయినా పోయండి లేదా అల్లాహ్‌ మీకు ప్రసాదించిన దాంట్లోంచి ఏ కాస్తయినా ఇటు పడేయండి” అని ప్రాధేయ పడతారు. దానికి సమాధానంగా వారు, “ఈ రెండింటినీ అల్లాహ్‌ అవిశ్వాసుల కొరకు నిషేధించాడు” అని అంటారు. (7:50)

ఇది ఎంతటి అవమానం గమనించండి. కళ్లారా చూస్తున్నాము వారు ఎంతో తీయటి నీళ్లు త్రాగుతూ ఆనందిస్తూ ఉన్నారు ఆ విషయం మనకు కనబడుతుంది. కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీకొరకు ఇది నిషిద్ధమని అక్కడ నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది. ఆ రోజు అంత బాధ కలగకూడదు అంటే ఈ రోజు విశ్వాసం పై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

మహాశయులారా! నరకవాసులకు దాహం కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో ‘అల్ ముహ్ల్’ ఒకటి. అల్ ముహ్ల్ అంటే నూనె అడుగున నూనె యొక్క మడ్డి ఏదైతే ఉంటుందో దానిని అల్ ముహ్ల్ అంటారు. అయితే అదే ఒకవేళ బాగా కాగిన నూనె ఉండేదుంటే దాని యొక్క వేడి ఎంత ఉంటుందో, ఆ మడ్డి, మడ్డిలోని వేడి మీది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది. సూరహ్ కహఫ్ లో దాని ప్రస్తావన వచ్చింది.

وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ
(వ ఇన్ యస్తగీసూ యుగాసూ బిమాయిన్ కల్ ముహ్ల్ యష్విల్ వుజూహ్)
ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. (18:29)

ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో ముఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది. అల్లాహు అక్బర్.

రెండో రకమైన పానీయం ‘హమీమ్‘. దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది. ఉదాహరణకు:

لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ
(లహుమ్ షరాబుమ్ మిన్ హమీమ్)
వారి కొరకు మరిగే నీటి పానీయం ఉంది. (6:70)

وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
(వసుఖూ మాఅన్ హమీమన్ ఫఖత్త’ఆ అమ్’ఆఅహుమ్)
మరియు మరిగే నీరు త్రాగించబడే వారికి (పోలిక ఉందా)? ఆ నీరు వారి పేగులను ముక్కలు ముక్కలు చేస్తుంది. (47:15)

హమీమ్ ఎలా ఉంటుంది దాని యొక్క వివరణ ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాం. నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో రెండో రకమైనది హమీమ్. దేనినంటారు నీళ్లు వేడికి ఎక్కి దాని యొక్క చివరి భాగం ఏదైతే ఉండగలుగుతుందో దానిని హమీమ్ అని అంటారు. ఎప్పుడైతే మనిషి అది త్రాగుతాడో కేవలం మీది శరీరం యొక్క పై భాగమే కాదు లోపలి భాగాన్ని కూడా అది చాలా చెడ్డమైన విధంగా పాడు చేస్తుంది. ఒకసారి సూరహ్ హజ్ లోని ఆయత నెంబర్ 19 మరియు 20 వినండి మరియు శ్రద్ధ వహించండి.

يُصَبُّ مِن فَوْقِ رُءُوسِهِمُ الْحَمِيمُ يُصْهَرُ بِهِ مَا فِي بُطُونِهِمْ وَالْجُلُودُ
(యుసబ్బు మిన్ ఫౌఖి రుఊసిహిముల్ హమీమ్. యుస్ హరు బిహీ మా ఫీ బుతూనిహిమ్ వల్ జులూద్)
సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. (22:19-20)

అల్లాహ్ ఇలాంటి హమీమ్ నుండి మనందరినీ రక్షించుగాక.

ఇక మూడో రకమైన పానీయం అది ‘ఘస్సాఖ్‘. సూరహ్ నబా లో ‘హమీమన్ వ ఘస్సాఖ’ అని రెండు కలిపి వచ్చాయి, హమీమ్ మరియు ఘస్సాఖ్. హమీమ్ అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా! అతి వేడి. ఇక ఘస్సాఖ్ అన్నది దానికి ఆపోజిట్ విరుద్ధమైనది. చలి మరియు ఐస్ లో ఎంత ఎక్కువ చల్లదనం ఉండగలుగుతుందో దానికి మితిమీరినది. మరియు మనకు తెలుసు చల్లదనం మితిమీరిన రీతిలో ఉంటే అది కూడా మహా నష్టపరుస్తుంది. దానివల్ల కూడా మనిషి యొక్క శరీరంలో తోలు ఇదంతా కాలిపోతుంది మరియు అదంతా చిదిరిపోతుంది. విపరీతమైన చలి పడినప్పుడు పచ్చని చెట్లు కూడా నల్లగా అయినట్లు మనం చూస్తూనే ఉన్నాం.

ఈ విధంగా మహాశయులారా! నరకంలో ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జమ్హరీర్ చల్లదనంలో మితిమీరినది ఉంది. అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీమ్ వేడిలో మితిమీరినదైతే ఘస్సాఖ్ చల్లదనంలో మితిమీరినది.

మహాశయులారా! నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది ‘సదీద్‘. సదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి ఏదైతే వస్తుందో దానినంటారు. ఇది కూడా కొందరి నరకవాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది? సూరహ్ ఇబ్రాహీమ్ ఆయత నెంబర్ 16, 17 లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలిపాడు.

وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ
(వయుస్ఖా మిన్ మాఇన్ సదీద్. యతజర్రఉహు వలా యకాదు యుసీగుహ్)
అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది. అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు.  (14:16-17)

ఇక ఎవరైతే ఇహలోకంలో మత్తు సేవిస్తారో అలాంటి వారికి ఇలాంటి సదీద్ త్రాగించడం జరుగుతుంది అని హదీసుల ద్వారా తెలుస్తుంది. అయితే హదీసుల్లో సదీద్ అన్న పదం కాకుండా ‘తీనతుల్ ఖబాల్’ అన్న పదం వచ్చి ఉంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు మరియు చీము అని దాని వివరణ తెలిపారు.

అయితే మహాశయులారా! నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే ఇహలోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి.

అలాగే మహాశయులారా! ఎవరైతే ఇహలోకంలో అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ గర్వంతో పొగరుబోతుతనం వహిస్తారో ప్రళయ దినాన వారు ఏ స్థితిలో వస్తారో మరియు వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో తెలిపారు. ఆ హదీసు జామె తిర్మిజి లో ఉంది షేక్ అల్బాని రహిమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్ లో పేర్కొన్నారు. ‘ప్రళయ దినాన అహంకారులను చీమల పరిమాణంలో తీసుకురావడం జరుగుతుంది. అన్ని వైపుల నుండి వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది మరియు ఒక రకమైన జైలులో బందిఖానాలో వారిని తోలుకుపోవడం జరుగుతుంది. అక్కడ వారికి తీనతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు.’

అయితే నరకవాసులు నరకంలో హమీమ్, ఘస్సాఖ్, ఘిస్లీన్, సదీద్, తీనతుల్ ఖబాల్ ఇవన్నీ అవి అంత చెడుగా ఉన్నప్పటికీ ఎందుకు త్రాగుతారు అని కూడా ఒక ప్రశ్న రావచ్చు. అయితే విషయం ఏమిటంటే వారికి ఎప్పుడెప్పుడు దాహం కలుగుతుందో వారికి ఎప్పుడెప్పుడు వేడి ఎక్కువ కలుగుతుందో కనీసం ఇలాంటి నీటితో మనం దాహం తీర్చుకుందాం అన్నటువంటి ఆలోచన వారికి ఉంటుంది. కానీ అది త్రాగడం వల్ల ఇంత నష్టం ఏర్పడుతుంది అని వారు ముందు ఊహించలేరు తర్వాత ఆ విషయం వారికి తెలిసి వస్తుంది. అయితే మహాశయులారా! వారు త్రాగడానికి ఏదైతే ఇలాంటి పానీయాలు ఇవ్వబడతాయో వాటిని వారు ఎలా త్రాగుతారు? దాని యొక్క ప్రస్తావన కూడా ఖురాన్ లో వచ్చి ఉంది.

فَشَارِبُونَ شُرْبَ الْهِيمِ
(ఫషారిబూన షుర్బల్ హీమ్)
దప్పికగొన్న ఒంటెలు త్రాగినట్లు మీరు దానిని త్రాగుతారు. (56:55)

మహా దాహం కలిగి ఉన్న ఒంటెలు ఎలా నీళ్లు చూసిన వెంటనే పరిగెడతాయో ఆ విధంగా వారు ఆ నీరు వైపునకు పరిగెడతారు.

నరకవాసులకు ఎలాంటి వస్త్రాలు ధరింపజేయబడతాయో దాని ప్రస్తావన కూడా ఖురాన్ హదీసులో వచ్చి ఉంది. సూరహ్ హజ్ లో అల్లాహ్ తెలిపాడు:

فَالَّذِينَ كَفَرُوا قُطِّعَتْ لَهُمْ ثِيَابٌ مِّن نَّارٍ
(ఫల్లజీన కఫరూ ఖుత్తిఅత్ లహుమ్ సియాబుమ్ మిన్నార్)
అందుచేత అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. (22:19)

దుస్తులు కూడా నరకంలోనివే. ఇక ఎలా ఉంటుంది వారి పరిస్థితి గమనించండి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఒక బానిస ఉన్నాడు ఒక యుద్ధంలో. తెలియని ప్రదేశం నుండి ఒక బాణం వచ్చి గుచ్చుకుంది అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ప్రజలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీద్ అయిపోయాడు అమరవీరుడు అయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్తా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “అతడు యుద్ధ ఫలంలో నుండి మాలే ఘనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదర్ ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు అనేటివి వచ్చి పడుతూ ఉన్నాయి

అలాగే సోదరులారా! ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు: “నౌహ చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తౌబా చేసుకోకుంటే ప్రళయ దినాన వారిని లేపడం జరుగుతుంది వారి యొక్క శరీరంపై తార్ (డాంబర్) కు సంబంధించిన షర్ట్ ఉంటుంది మరియు వారి యొక్క పైజామా అనేది గంధకముతో చేయబడినదిగా ఉంటుంది“. ఇలా తార్ డాంబర్ తో చేయబడిన షర్ట్ మరియు గంధకముతో తయారు చేయబడిన పైజామా అంటే ఎంత వేడి ఎక్కుతుందో ఎలా శిక్ష వారికి ఉంటుందో వారికి ఏ దుస్తులైతే ధరింపజేయబడుతున్నాయో అవి కేవలం వారిని దాచి పెట్టడానికి వారి యొక్క ప్రదేశాలను రక్షణ కొరకు కాదు వాటి ద్వారా కూడా వారికి ఎంతో శిక్ష అనేది లభిస్తూ ఉంటుంది.

ఈ విధంగా సోదరులారా! వారి యొక్క ఆహారం, వారి యొక్క పానీయాలు, వారి యొక్క దుస్తులు ఇవన్నీ వివరాలు ఏదైతే వచ్చాయో ఎందుకు? మనం వాటి పట్ల భయపడి మనకు మనం ఆ నరకానికి దూరం ఉంచే ప్రయత్నం ఇహలోకంలోనే చేసుకోవాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46108

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

యూట్యూబ్ – ప్లే లిస్ట్ (మరణానంతర జీవితం)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

నీకు నాశనం తప్పదు, ఓ దీనార్!

దీనార్ అల్-అయార్ గురించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. దీనార్‌కు ఒక పుణ్యాత్మురాలైన తల్లి ఉండేది. ఆమె ఎప్పుడూ తన పాపపు జీవితం గురించి, దారి తప్పిన ప్రవర్తన గురించి పశ్చాత్తాపపడమని అతనికి సలహా ఇస్తూ ఉండేది. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె మాటలు అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు.

ఒకరోజు, అతను ఒక స్మశానం గుండా వెళుతుండగా, ఒక ఎముకను తీయడానికి ఆగాడు. ఆ ఎముక అతని చేతిలోనే పొడిపొడిగా మారి మట్టిలో కలిసిపోవడం చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ దృశ్యం దీనార్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అతను తన జీవితం మరియు తన గత పాపాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, “ఓ దీనార్, నీకు వినాశనం తప్పదు! నువ్వు కూడా ఈ నలిగిపోయిన ఎముకలాగే అంతం కాబోతున్నావు, నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది.” అతని గత పాపాలన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి, అతను పశ్చాత్తాపపడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆకాశం వైపు చూసి, “ఓ నా ప్రభూ, నేను ఇప్పుడు నీకు పూర్తిగా లొంగిపోతున్నాను (శరణు కోరుతున్నాను), కాబట్టి నన్ను స్వీకరించు మరియు నాపై దయ చూపించు” అని వేడుకున్నాడు.

పూర్తిగా మారిన హృదయంతో మరియు మానసిక స్థితితో, దీనార్ తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, “అమ్మా, తన నుండి పారిపోయిన బానిసను పట్టుకున్నప్పుడు యజమాని ఏం చేస్తాడు?” ఆమె, “[శిక్షించడానికి] ఆ యజమాని అతనికి ముతక బట్టలు మరియు నాసిరకం ఆహారాన్ని ఇస్తాడు; అతను మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించకుండా అతని కాళ్ళు చేతులు కట్టేస్తాడు” అని చెప్పింది. అప్పుడు దీనార్, “అయితే నాకు ముతక ఉన్నితో చేసిన వస్త్రం, నాసిరకం బార్లీ మరియు రెండు గొలుసులను ఇవ్వు. అమ్మా, పారిపోయిన బానిసకు చేసినట్లే నాకూ చెయ్యి. బహుశా నా ప్రభువు, నా అవమానం మరియు వినయాన్ని చూసి, నాపై దయ చూపిస్తాడేమో.” తన కొడుకు పట్టుదలగా మరియు నిశ్చయంగా ఉండటం చూసి, ఆమె అలాగే చేసింది.

ప్రతి రాత్రి ప్రారంభంలో, దీనార్ ఆగకుండా ఏడవడం మరియు రోధించడం మొదలుపెట్టేవాడు. అతను తనలో తాను ఇలా అనుకునేవాడు, “ఓ దీనార్, నీకు వినాశనం! నరకపు మంటలను తట్టుకోగల శక్తి నీకు ఉందా? సర్వశక్తిమంతుడైన దేవుని ఆగ్రహానికి అర్హులయ్యేలా నువ్వు ఎంత తెగించి జీవించావు!” అతను ఉదయం వరకు ఆ స్థితిలోనే ఉండేవాడు.

దీనార్ శరీరం మెల్లగా చిక్కిపోయి, పాలిపోయింది. అతన్ని ఆ దయనీయ స్థితిలో చూడలేక, అతని తల్లి, “నా కొడుకా, నీపై నువ్వు కాస్త దయ చూపించుకో,” అని చెప్పింది. అతను ఇలా బదులిచ్చాడు, “అమ్మా, నన్ను కొద్దిసేపు ఇలాగే కట్టివేయనివ్వు, బహుశా తర్వాత నేను దీర్ఘకాలిక సుఖాన్ని పొందే అవకాశం ఉంది. రేపు నేను నా మహోన్నత ప్రభువు ముందు చాలా సేపు వేచి ఉండాల్సి ఉంటుంది, ఆయన నన్ను అందమైన నీడ ఉండే ప్రదేశాలకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడో లేక వర్ణించలేని భయానక ప్రదేశాలకు (నరకానికి) పంపుతాడో నాకు తెలియదు.”

ఆమె, “నా కొడుకా, కనీసం కాసేపు విశ్రాంతి తీసుకో,” అని చెప్పింది. అతను, “నేను వెతుకుతున్నది ఇప్పటి విశ్రాంతి లేదా సౌకర్యం కాదు. అమ్మా, రేపు నువ్వు మరియు ఇతర ప్రజలు స్వర్గం వైపు వెళుతున్నట్లు, నేను మరియు నరకవాసులు నరకాగ్ని వైపు వెళుతున్నట్లు నాకు కనిపిస్తోంది,” అని అన్నాడు. ఆమె అతన్ని వదిలేసింది, అతను ఏడుస్తూ, ఆరాధన చేస్తూ, ఖురాన్ పఠించడంలో మునిగిపోయాడు. ఒక రాత్రి, అతను ఖురాన్ పఠిస్తుండగా, ఈ వచనాలు వచ్చాయి:

فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ
కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.”
[అల్-హిజ్ర్ : 92-93]

ఈ వచనాల అర్థాలు మరియు భావాలను అతను ఆలోచిస్తుండగా, అతను ఎంతగా ఏడ్చాడంటే సొమ్మసిల్లి పడిపోయాడు. అతని తల్లి పరుగున వచ్చి అతన్ని లేపడానికి చాలా ప్రయత్నించింది, కానీ అతను స్పందించలేదు. అతను చనిపోయాడని ఆమె భావించింది. తన కొడుకు ముఖం వైపు చూసి, “ఓ నా ప్రియమైన వాడా, నా హృదయ ఆనందమా, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం?” అని అన్నది. వాస్తవానికి, దీనార్‌లో ఇంకా కొంచెం ప్రాణం మిగిలి ఉంది, తన తల్లి మాటలు విని, అతను బలహీనమైన గొంతుతో, “అమ్మా, తీర్పు దినాన విశాలమైన మైదానాల్లో నేను నీకు కనిపించకపోతే, నా గురించి నరకపు రక్షకుడైన ‘మాలిక్’ను అడుగు,” అని అన్నాడు. ఆ తర్వాత అతను గొంతులో నుండి ఒక శబ్దం చేస్తూ (తుది శ్వాస విడిచి) మరణించాడు.

అతని మృతదేహాన్ని శుభ్రం చేసిన తర్వాత, దీనార్ తల్లి అతని అంత్యక్రియలకు సిద్ధం చేసింది. ఆమె బయటకు వెళ్లి, “ఓ ప్రజలారా, నరకాగ్ని భయంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అంత్యక్రియల ప్రార్థనకు రండి,” అని ప్రకటన చేసింది. అన్ని దిశల నుండి ప్రజలు రావడం ప్రారంభించారు. ఆ కాలంలో, అంతకంటే గొప్ప జనసమూహం ఎప్పుడూ రాలేదని మరియు ఆ రోజు చిందించినంత కన్నీళ్లు మరే రోజు చిందించలేదని చెబుతారు.

అతని అంత్యక్రియలు జరిగిన రాత్రే, దీనార్ స్నేహితుల్లో ఒకరు అతన్ని కలలో చూశారు. దీనార్ ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను స్వర్గంలో ఆనందంగా విహరిస్తూ ఈ వచనాన్ని పఠిస్తున్నాడు:

فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِين عَمَّا كَانُوا يَعْمَلُونَ َ
కావున, నీ ప్రభువు సాక్షిగా [ఓ ముహమ్మద్], వారు చేసిన పనులన్నింటి గురించి మేము వారిని తప్పక విచారిస్తాము.”

ఆ కలలో, అతను ఇలా చెప్పడం స్నేహితుడు విన్నాడు: “ఆయన శక్తి మరియు గొప్పతనం సాక్షిగా, ఆయన నన్ను [నా కర్మల గురించి] అడిగాడు. నాపై దయతో, ఆయన నన్ను క్షమించాడు మరియు నా పాపాలను మన్నించాడు. ఇదిగో! ఈ వార్తను మా అమ్మకు చేరవేయ్యి.”

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 5 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 5]
[మరణానంతర జీవితం – పార్ట్ 59] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=Dh-tkJ9A784
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త నరకాగ్ని (జహన్నం) యొక్క భయంకరమైన స్వభావాన్ని వివరిస్తారు. తీర్పుదినాన నరకం కళ్ళు, చెవులు, నాలుక కలిగిన ఒక సజీవ ప్రాణిగా మారి, అహంకారులు, బహుదైవారాధకులు మరియు చిత్రకారుల వంటి పాపాత్ములను గుర్తిస్తుందని హదీసుల ఆధారంగా తెలియజేస్తారు. నరకవాసుల శరీరాలు శిక్షను తీవ్రతరం చేయడానికి ఎంతగానో పెంచబడతాయని, వారి భుజాల మధ్య దూరం, చర్మం మందం, దవడ పళ్ళ పరిమాణం ఊహించలేనంతగా ఉంటాయని వర్ణిస్తారు. వారి ముఖాలు నల్లబడి, అవమానంతో కప్పబడి ఉంటాయని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేస్తారు. చివరగా, నరకవాసులకు అందించే ఆతిథ్యం, వారి ఆహారం (జక్కూమ్ అనే చేదు వృక్షం) మరియు పానీయాల గురించి వివరిస్తూ, ఈ శిక్షల నుండి రక్షణ పొందడానికి విశ్వాసం మరియు సత్కార్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి వహద వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, నరకం, నరకవాసులు, నరక శిక్షల గురించి మనం వింటూ ఉన్నాము.

నరకం, దానికి రెండు కళ్ళు ఉంటాయి, వాటి ద్వారా అది చూస్తుంది. నరకానికి రెండు చెవులు ఉంటాయి, వాటి ద్వారా అది వింటుంది. మరియు దానికి నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. అవిశ్వాసులు, పాపాత్ములు వచ్చి అందులో పడినప్పుడల్లా అది అరుస్తుంది, గర్జిస్తుంది, మహా పెద్ద అరుపులతో శబ్దాన్ని వెలికితీస్తుంది.

మహాశయులారా, ఆ నరకాగ్ని ఎంత భయంకరమైన శిక్ష అంటే దానిని ఇహలోకంలో ఉండి మనం ఊహించలేము. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ముస్నద్ అహ్మద్, తిర్మిజీ లోని హదీస్:

يَخْرُجُ عُنُقٌ مِنَ النَّارِ يَوْمَ الْقِيَامَةِ
(యఖ్రుజు ఉనుఖున్ మినన్నారి యౌమల్ ఖియామ)
ప్రళయదినాన నరకంలో నుండి ఒక మెడ బయటికి వస్తుంది.

لَهُ عَيْنَانِ يُبْصِرَانِ
(లహు ఐనాని యుబ్సిరాన్)
దానికి రెండు కళ్ళు ఉంటాయి వాటితో చూస్తుంది.

وَأُذُنَانِ يَسْمَعَانِ
(వ ఉదునాని యస్మఆన్)
రెండు చెవులు ఉంటాయి, వాటితో అది వింటుంది.

وَلِسَانٌ يَنْطِقُ
(వ లిసానున్ యన్తిఖ్)
మరియు నాలుక ఉంటుంది దానితో మాట్లాడుతుంది.

అది ఇలా అరుస్తూ ఉంటుంది:

إِنِّي وُكِّلْتُ بِثَلاَثَةٍ
(ఇన్నీ ఉక్కిల్తు బి సలాస)
“మూడు రకాల మనుషులను నాకు అప్పగించడం జరిగింది.”

వారు నాలో ఉంటారు. ఒకరు,
بِكُلِّ جَبَّارٍ عَنِيدٍ
(బికుల్లి జబ్బారిన్ అనీద్)
అహంకారి మరియు సత్య తిరస్కారి మరియు సత్యం పట్ల విరోధం ప్రకటించే వ్యక్తి.

రెండో రకమైన వారు,
وَبِكُلِّ مَنْ دَعَا مَعَ اللَّهِ إِلَهًا آخَرَ
(వ బికుల్లి మన్ దఆ మఅల్లాహి ఇలాహన్ ఆఖర్)
ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను కూడా ఆరాధించేవారో వారిని,

وَالْمُصَوِّرِينَ
(వల్ ముసవ్విరీన్)
మరియు చిత్రాలు చిత్రీకరించే వారిని.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ మనల్ని ఎంత భయపెట్టిస్తుందో గమనించగలము. నరకం అనేది ఏదో ఒక కేవలం అగ్ని మాత్రమే కాదు. అల్లాహు తాలా దానికి ఎన్నో రకాల శక్తి ప్రసాదిస్తాడు. దాని మూలంగా ప్రజలు ఆ రోజు ప్రళయదినాన దాని దగ్గరికి వచ్చిన తర్వాత, అందులో పడిన తర్వాత దాని యొక్క భయంకరత్వాన్ని గుర్తుపడతారు. కానీ ఆ రోజు దాన్ని గుర్తుపట్టడం వల్ల మనకు ప్రయోజనం ప్రయోజనం ఏమిటి? ఈ రోజు అల్లాహ్ తెలిపే ఈ విషయాల్ని, ఈ వివరాల్ని తెలుసుకొని మనం దానికి భయపడి ఉంటే దాని నుండి మనం రక్షింపబడగలతాము.

ఇంకా మహాశయులారా, నరకం చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, గర్జిస్తుంది, ఇంకా అది దాని యొక్క వేడి వల్ల, అందులో వచ్చి పడే అవిశ్వాసులు మరియు పాపాత్ముల వల్ల ఉడికిపోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఎవరైతే అందులో పడిపోతారో వారికి ఎంత కష్టం కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో అట్లే మనం ఊహించగలము.

సూరహ్ ఫుర్ఖాన్ ఆయత్ నెంబర్ 12లో అల్లాహు తాలా తెలిపాడు:

إِذَا رَأَتْهُمْ مِنْ مَكَانٍ بَعِيدٍ سَمِعُوا لَهَا تَغَيُّظًا وَزَفِيرًا
(ఇదా రఅత్ హుమ్ మిమ్ మకానిమ్ బయీదిన్ సమీఊ లహా తగయ్యుదౌ వ జఫీరా)
దూరం నుంచే అది (నరకాగ్ని) వారిని చూసినప్పుడు, ఆగ్రహంతో అది ఉడికిపోతూ, గర్జిస్తూ ఉండటాన్ని వారు వింటారు.(25:12)

ఎప్పుడైతే అవిశ్వాసులను, పాపాత్ములను దూరం నుండే అది చూస్తుందో, ఇదా రఅత్’హుమ్, వారిని దూరం నుండే చూస్తుందో అప్పుడు వారు ఆ నరకం యొక్క ధ్వనులను, గర్జనలను వింటూ ఉంటారు. గమనించారా? దూరం నుండే అవిశ్వాసులను, నరకంలో వచ్చి పడే వారిని చూసినప్పుడు అది గర్జిస్తూ ఉంటుంది. అంత దూరాన ఉండే ఈ నరకవాసులు దాని గర్జన, దాని భర్జన, దాని యొక్క ధ్వనులను వింటూ ఉంటారు.

ఇమామ్ దహాక్ రహిమహుల్లాహ్ తెలిపారు, ప్రళయ దినాన నరకం గర్జిస్తుంది, దాని గర్జన ఏ సమీపంలో ఉన్న దైవదూత గాని, ప్రవక్తగా పంపబడిన సందేశహరులు గాని దానిని విని సజ్దాలో పడిపోతారు. అప్పుడు, “ఓ ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు,” అని వారు అల్లాహ్ తో మొరపెట్టుకుంటూ ఉంటారు.

ఇదే విషయాన్ని మరో రకంగా అల్లాహు తాలా సూరహ్ ముల్క్ లో కూడా తెలిపాడు. ఆ సూరహ్ ముల్క్ ప్రతి రాత్రి పడుకునే ముందు పఠించాలని మనకు ఆదేశం ఇవ్వబడినది.

إِذَا أُلْقُوا فِيهَا سَمِعُوا لَهَا شَهِيقًا وَهِيَ تَفُورُ
(ఇదా ఉల్ఖూ ఫీహా సమీఊ లహా షహీఖవ్ వహియ తఫూర్)
వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. (67:7)

تَكَادُ تَمَيَّزُ مِنَ الْغَيْظِ
(తకాదు తమయ్యజు మినల్ గైద్)
ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది.  (67:8)

ఈ విధంగా నరకం అనేది అంత ఆగ్రహానికి గురి అవుతుంది.

ఇక మహాశయులారా, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తర్వాత వారి యొక్క ఆకారం మారిపోతుంది. ఇహలోకంలో శరీరం ఎంత పొడవుగా, ఎంత లావుగా ఉండెనో అలా ఉండదు, అంతకంటే ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఆ వివరాలు కూడా మనకు ఖురాన్ మరియు హదీస్ లో తెలుపబడినవి.

ప్రళయదినాన నరకంలో నరకవాసుల శరీరం ఇహలోకంలో ఉన్నట్లు ఉండదు. వారి యొక్క శరీరంలో చాలా మార్పు వచ్చేస్తుంది, వారి ఆకారం కూడా మారిపోతుంది. వారి యొక్క శరీరం ఎంత లావుగా చేయబడుతుందో, సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَا بَيْنَ مَنْكِبَىِ الْكَافِرِ مَسِيرَةُ ثَلاَثَةِ أَيَّامٍ لِلرَّاكِبِ الْمُسْرِعِ
(మా బైన మన్కిబైల్ కాఫిరి మసీరతు సలాసతి అయ్యామిల్ లిర్రాకిబిల్ ముస్రిఅ)

అవిశ్వాసుని ఈ రెండు భుజాల మధ్యలో, ఇటు నుండి ఇటు వరకు ఈ భుజాల మధ్యలో పొడవు ఎంత పెద్దగా ఉంటుందంటే ఎవరైనా గుర్రపు రౌతు గాని, ఇంకా వేరే ప్రయాణికుడైనా గాని అతి వేగంగా పరిగెత్తుతే మూడు రోజుల ప్రయాణం దీని మీద చేయవచ్చు. అంత లావుగా వారి శరీరాన్ని పెంచబడుతుంది.

మరియు జామే తిర్మిదీ లో అబూ హురైరా రది అల్లాహు తాలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఉంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ غِلَظَ جِلْدِ الْكَافِرِ اثْنَانِ وَأَرْبَعُونَ ذِرَاعًا
(ఇన్న గిలద జిల్దిల్ కాఫిరి ఇస్నాని వ అర్బఊన దిరాఆ)

అవిశ్వాసుల తోలు యొక్క మందము అనేది నలభై రెండు గజాలు ఉంటుంది. మరియు అతని యొక్క దవడ పన్ను ఉహద్ పర్వతం మాదిరిగా పెద్దగా ఉంటుంది, మరియు అతడు కూర్చుంటే అతని యొక్క వైశాల్యం అనేది మక్కా, మదీనా మధ్యలో ఎంత పొడవు ఉందో అంత వెడల్పుగా అతను కూర్చుంటాడు.

మహాశయులారా, ఒక్కసారి మీరు గమనించండి, ఇటు భుజం నుండి ఇటు భుజం వరకు అతివేగంగా పరిగెత్తే ప్రయాణికుడు మూడు రోజులు నడవవచ్చు. దవడ పన్ను ఉహద్ కొండంత ఉంటుంది, మరియు అతని యొక్క ఈ నడుము అనేది, నడుము కింది భాగం కూర్చున్నప్పుడు మక్కా, మదీనా అంటే సుమారు 430 కిలోమీటర్ల దూరం. అంత వెడల్పు ఉంటుంది.

ముస్తద్రక్ హాకిమ్ మరియు ముస్నద్ అహ్మద్ లో వచ్చిన ఉల్లేఖనం ప్రకారం, హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు, నరకం యొక్క వైశాల్యం చాలా పెద్దది, చాలా విశాలమైనది నరకం. నరకం యొక్క వైశాల్యం ఎంతదో కేవలం ఒక అంచనా వేసుకోవడానికి, అందులో ఏ అవిశ్వాసులను, పాపాత్ములను వేయడం జరుగుతుందో, ఒక పాపాత్ముని ఈ చెవి మరియు ఈ భుజముల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది, ఎంత స్థలం ఉంటుందో తెలియబరుస్తూ ఇబ్ను అబ్బాస్ రది అల్లాహు తాలా అన్హు చెప్పారు:

سَبْعِينَ خَرِيفًا
(సబ్ఈన ఖరీఫా)
డెబ్బై సంవత్సరాలు నడిచిపోవచ్చు. మరియు అందులో చీము, నెత్తురు ఇలాంటి ఎన్ని ఎన్నో నదులు ప్రవహిస్తూ ఉంటాయని.

ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ సహీహ్ ముస్లిం యొక్క వ్యాఖ్యానంలో పాపాత్ముల, అవిశ్వాసుల శరీరాన్ని ఇంత వైశాల్యంగా, ఇంత లావుగా ఎందుకు చేయడం జరుగుతుందో దాని యొక్క సబబు తెలుపుతూ ఇలా చెప్పారు: వారు ఇహలోకంలో ఎలాంటి ఘోరమైన పాపాలకు పాల్పడ్డారో, దాని యొక్క శిక్ష వారికి సరియైన విధంగా లభించాలంటే ఇహలోకంలో ఉన్న వారి యొక్క ఆ చిన్నపాటి శరీరం సరిపోదు. వారికి వారి పాపాలకు తగ్గట్టు బాధ కలగాలి, శిక్ష దొరకాలి, వారు ఆ శిక్ష యొక్క రుచి చూడాలి మరియు నరకం యొక్క జ్వాలలు, దాని యొక్క అగ్ని వారికి తగిలి వారు దానిని అర్థం చేసుకోవాలి, అందుకొరకు అల్లాహు తాలా ఇలాంటి లావుపాటి శరీరాలు వారికి ఆ రోజు ఇస్తాడు. ఇది వారి శరీరం యొక్క లావుతనం, వారి యొక్క పన్ను, వారి యొక్క భుజం, వారి యొక్క చెవి మరియు భుజాల మధ్యలోని స్థలం, వారు కూర్చుంటే ఎంత వెడల్పు ఉంటారో ఇవన్నీ వివరాలు ఏదైతే తెలుసుకున్నామో, ఇక రండి మహాశయులారా, వారి ముఖం అనేది ఎలా ఉంటుంది ఆ రోజు.

ఆ రోజు వారి యొక్క ముఖం ఎలా ఉంటుంది? అల్లాహు అక్బర్. ఖురాన్ లోని ఎన్నో ఆయతులలో దాని యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ముఖం అనేది క్రిందికి వాలి ఉంటుంది. ముఖము నల్లగా అయిపోతుంది, చీకటి మాదిరిగా. అవమానం అనేది వారిని క్రమ్ముకుంటుంది. వారు తలెత్తి ఒకరిని చూడడానికి, మాట్లాడడానికి యమ సిగ్గుపడుతూ ఉంటారంటే దానికి అంతు లేదు.

సూరహ్ జుమర్ లో అల్లాహు తాలా తెలిపాడు:

وَيَوْمَ الْقِيَامَةِ تَرَى الَّذِينَ كَذَبُوا عَلَى اللَّهِ وُجُوهُهُمْ مُسْوَدَّةٌ
(వ యౌమల్ ఖియామతి తరల్లదీన కదబూ అలల్లాహి ఉజూహుహుమ్ ముస్వద్ద)
ప్రళయదినాన నీవు చూస్తావు ఎవరైతే అల్లాహ్ పై అసత్యాన్ని మోపారో వారి యొక్క ముఖాలు నల్లబడి ఉంటాయి. (39:60)

సూరహ్ అబస, 30వ ఖాండంలో అల్లాహు తాలా తెలిపాడు:

وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
(వ ఉజూహున్ యౌమఇదిన్ అలైహా గబర)
ఆ రోజు కొన్ని ముఖాలపై దుమ్ము ధూళి పడి ఉంటుంది. (80:40)

تَرْهَقُهَا قَتَرَةٌ
(తర్హఖుహా ఖతర)
అవమానం అనేది వారిని కమ్ముకుని ఉంటుంది. (80:41)

أُولَئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
(ఉలాయిక హుముల్ కఫరతుల్ ఫజర)
వారే సత్యాన్ని తిరస్కరించిన వారు, పాపాల్లో కూరుకుపోయిన వారు. (80:42)

ఈ భావంలో ఆయత్ లు ఖురాన్ లో ఇంకా అనేక చోట్ల ఉన్నాయి.

خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ
(ఖాషిఅతన్ అబ్సారుహుమ్ తర్హఖుహుమ్ దిల్లా)
వారి యొక్క కళ్ళు కిందికి వాలి ఉంటాయి, వారిని అవమానం అనేది క్రమ్ముకొని ఉంటుంది. (సూరతుల్ ఖలమ్: 68:43)

సూరతుష్ షూరా ఆయత్ నెంబర్ 45 లో అల్లాహు తాలా తెలిపాడు:

وَتَرَاهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَاشِعِينَ مِنَ الذُّلِّ يَنْظُرُونَ مِنْ طَرْفٍ خَفِيٍّ
(వ తరాహుమ్ యుఅ’రదూన అలైహా ఖాషియీన మినద్’దుల్లి యందురూన మిన్ తర్ఫిన్ ఖఫియ్యిన్)

నీవు ఆ రోజు చూస్తావు వారిని నరకాగ్ని ముందు తీసుకురావడం జరుగుతుంది. అవమానాన్ని భరించలేక తల క్రిందులు చేసుకొని ఉంటారు. మరియు మెలికన్నుతో ఎవరైనా చూస్తున్నారా అన్నట్లుగా మెలికన్నుతో వారు ఒక పక్కన ఈ విధంగా చూస్తూ ఉంటారు.” (42:45)

ఇక మహాశయులారా, ఎవరైనా అతిథులు వచ్చారంటే వారిని ఎలా సత్కరించడం జరుగుతుంది, ఎంత గౌరవంతో వారికి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించడం జరుగుతుంది. కానీ నరకవాసులు నరకంలో వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆహ్వానం లభిస్తుంది మరియు ఎలా వారిని స్వీకరించడం, ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందో ఈ ఆయతులలో కొంచెం మీరు కూడా శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

إِنَّا أَعْتَدْنَا جَهَنَّمَ لِلْكَافِرِينَ نُزُلًا
(ఇన్నా అఅ’తద్నా జహన్నమ లిల్ కాఫిరీన నుజులా)
మేము నరకాన్ని సత్య తిరస్కారుల కొరకు అతిథి మర్యాదల స్థానంగా చేసి ఉంచాము.(18:102)

సూరహ్ తూర్ లో అల్లాహ్ తెలిపాడు:

يَوْمَ يُدَعُّونَ إِلَى نَارِ جَهَنَّمَ دَعًّا
(యౌమ యుదవ్వూన ఇలా నారి జహన్నమ దఅ’అ)
ఎప్పుడైతే వారిని నరకం వైపునకు త్రోక్కుతూ మరియు వారిని త్రోసిపుచ్చడం జరుగుతుందో, (52:13)

هَذِهِ النَّارُ الَّتِي كُنْتُمْ بِهَا تُكَذِّبُونَ
(హాదిహిన్నారుల్లతీ కున్తుమ్ బిహా తుకద్దిబూన్)
“మీరు ధిక్కరిస్తూ వచ్చిన నరకాగ్ని ఇదే” (52:14)

ఇదే ఆ నరకం, ఇదే ఆ నరకాగ్ని, దేనినైతే మీరు ఇహలోకంలో తిరస్కరించేవారో ఆ నరకం వైపునకే మిమ్మల్ని త్రోసివేయడం జరుగుతుంది, ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పబడుతుంది.

అందుగురించి సోదరులారా, నరకాన్ని తిరస్కరించి మనం ఏమీ సంపాదించలేము. నరకాగ్నిని విశ్వసించాలి కూడా, దాని నుండి రక్షణ పొందడానికి ఏ విశ్వాసం, ఏ సత్కార్యాలు అవసరం ఉన్నాయో అవి చేస్తూ ఉండాలి కూడా.

ఇహలోకంలో కొందరు మరికొందరిని అనుసరించి సత్యాన్ని తిరస్కరిస్తారు. కానీ నరకంలో వారందరూ కూడా ఒకరి వెనుక ఒకరు నరకంలో ప్రవేశింపజేయబడుతున్నప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఆహ్వానం వారికి ఇవ్వబడుతుందో ఈ ఆయతులను మీరు శ్రద్ధగా వినండి. సూరహ్ సాద్, ఆయత్ నెంబర్ 55 నుండి 60 వరకు:

هَذَا فَوْجٌ مُقْتَحِمٌ مَعَكُمْ لَا مَرْحَبًا بِهِمْ إِنَّهُمْ صَالُوا النَّارِ
(హాదా ఫౌజుమ్ ముఖ్తహిముమ్ మఅకుమ్ లా మర్హబమ్ బిహిమ్ ఇన్నహుమ్ సాలున్నార్)
ఇదిగో! మీతోపాటే (నరకానికి) ఆహుతి అయ్యే మరో జట్టు వచ్చింది. వారి కొరకు ఎలాంటి స్వాగత సన్నాహాలు లేవు. వారు అగ్నికి ఆహుతి కానున్నారు. (38:59)

ఇదిగో మరొక జట్టు, నరకానికి ఆహుతి అయ్యే మరొక జట్టు వచ్చేసింది. ‘లా మర్హబమ్ బిహిమ్’ వారికి ఎలాంటి స్వాగతం లేదు, వారికి ఎలాంటి మర్యాదలు లేవు. ‘ఇన్నహుమ్ సాలున్నార్’ వారు తప్పకుండా నరకంలో ప్రవేశించవలసినదే.

ఇక రండి మహాశయులారా, నరకంలో ఎవరికి ఎలాంటి తిండి లభిస్తుంది, త్రాగడానికి ఎలాంటి పానీయాలు లభిస్తాయో వాటి వివరణ కూడా అల్లాహ్ ఖురాన్ లో మనకు తెలియబరిచాడు.

ఇహలోకంలో ఎవరైనా అపరాధిని పట్టుకోవడం జరిగి అతన్ని ఒక జైలులో పంపిస్తారు అని తెలిస్తే, ఆ జైలులో తినడానికి తిండి సరిగా లభించదు, అక్కడ పడుకోవడానికి సరియైన పడకలు ఉండవు అని తెలిస్తే, మరియు అక్కడ చాలా ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది అని తెలిస్తే, ఆ అపరాధి ఏ కొంచెమైనా అవకాశం పొందినప్పుడు ఏం చేస్తాడు? దారిలోనే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా అవకాశం ఉంటే ఎవరి సిఫారసులు అయినా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది ఇహలోకంలో కొన్ని సందర్భాల్లో జరుగుతుంది కావచ్చు.

కానీ నరకంలో అలాంటిది ఏదైనా అవకాశం ఉందా? నరకంలో పడి ఉన్నారు అంటే అక్కడ చాలా ఇరుకైన స్థలంలో, బాధాకరమైన స్థలంలో, అక్కడ ఎలాంటి ఏ సిఫారసు పనిచేయదు, ఏ ప్రాణ స్నేహితుడు కూడా సహాయం చేయడు, ఏ జట్టు కూడా, ఏ గ్రూప్ కూడా, ఏ గ్యాంగ్ లీడర్ కూడా, ఏ పెద్ద నాయకులు కూడా ఎవరికీ ఏ ప్రయోజనం చేకూర్చరు. అందుగురించి అక్కడి ఆ కష్టాల నుండి, ఆపదల నుండి మనం తప్పించుకోవాలంటే తప్పకుండా మనకు మనం సరిదిద్దుకోవాలి, విశ్వాస మార్గాన నడుస్తూ, సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

రండి ఒకసారి మనం, నరకవాసులకు ఎలాంటి తిండి ఇవ్వడం జరుగుతుందో ఖురాన్ ఆయతుల ద్వారా తెలుసుకుందాము. అయితే మహాశయులారా, మీరు కనీసం ఒక రెండు మూడు రోజుల నుండి నరకవాసులకు ఇవ్వబడే శిక్షల గురించి వివరాలు ఏవైతే వింటున్నారో ఇక పుణ్యాత్ములకు, మహా భక్తులకు, సత్కార్యాలు చేసే వారికి, విశ్వాసంపై నడిచే వారికి ఎలాంటి ఏ స్వాగతం అనేది, ఎలాంటి ఏ మంచి స్థలం అనేది లేదా అని భావించకండి. క్రమంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది గనుక, ప్రతిరోజు కొన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది గనుక ఇప్పుడు నరకానికి సంబంధించిన వివరాలు తెలుపుతున్నాము. బహుశా ఇది ఒక వారం వరకు నడవవచ్చు, ఆ తర్వాత స్వర్గ శుభవార్తలను గురించి కూడా మనం తెలుసుకొనన్నాము. స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు, స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు ఏమిటి. కానీ అతి ముఖ్యమైనది అక్కడ మనకు పనికి వచ్చేది విశ్వాసం మరియు సామాన్యంగా సర్వ సత్కార్యాలు చేస్తూ ఉండడం. అయితే రండి, నరకవాసులకు ఎలాంటి తిండి, ఎలాంటి ఆహారం లభిస్తుందో, ఎలాంటి ఆహారం ఇవ్వబడుతుందో తెలుసుకుందాము.

సూరతుద్ దుఖాన్, ఆయత్ నెంబర్ 43 నుండి 46 వరకు:

إِنَّ شَجَرَتَ الزَّقُّومِ
(ఇన్న షజరతజ్ జక్కూమ్)
నిశ్చయంగా జముడు యొక్క వృక్షం, (44:43)

طَعَامُ الْأَثِيمِ
(తఆముల్ అతీమ్)
పాపాత్ములకు అది ఆహారంగా ఉంటుంది. (44:44)

يَغْلِي فِي الْبُطُونِ
(యగ్లీ ఫిల్ బుతూన్)
పొయ్యి మీద కుండ పెడితే కాగి కాగి ఎలా ఉడుకుతుందో, ఆ జముడు వృక్షాన్ని మనిషి తిన్న వెంటనే కడుపులో ఆ విధంగా మంట లేపుతుంది, ఆ విధంగా అది ఉడుకుతుంది. (44:45)

كَغَلْيِ الْحَمِيمِ
(కగల్ యిల్ హమీమ్)
(సలసల కాగే నీరు మరుగుతున్నట్లు). (44:46)

ఈ జముడు వృక్షం అనేది నరకంలోని అతి కింది స్థలంలో నుండి అది పుట్టుకు వస్తుంది, అది చాలా దుర్వాసన గలది మరియు తినే వారి గురించి అతి చెడ్డ ఆహారం.

అల్లాహు తాలా ఒక సందర్భంలో స్వర్గవాసులకు ఇవ్వబడే వరాలను తెలుపుతూ:

أَذَلِكَ خَيْرٌ نُزُلًا أَمْ شَجَرَةُ الزَّقُّومِ
(అదాలిక ఖైరున్ నుజులన్ అమ్ షజరతుజ్ జక్కూమ్)
స్వర్గవాసులకు లభించే ఈ స్వర్గంలో ఆతిథ్యం ఇది చాలా మంచిగా ఉందా లేక జముడు వృక్షం ఎవరికైతే తినడానికి ఇవ్వబడుతుందో అది ఉత్తమంగా ఉందా? (37:62)

జక్కూమ్, ఈ జముడు వృక్షం అనేది దాని యొక్క ఒక చుక్క, ఒక బిందువు కూడా ఎంత చేదు మరియు ఎంత చెడుగా ఉంటుందో దానిని అర్థం చేసుకోవడానికి ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:

لَوْ أَنَّ قَطْرَةً مِنَ الزَّقُّومِ قُطِرَتْ فِي دَارِ الدُّنْيَا لأَفْسَدَتْ عَلَى أَهْلِ الدُّنْيَا مَعَايِشَهُمْ فَكَيْفَ بِمَنْ تَكُونُ طَعَامُهُ

జక్కూమ్ యొక్క ఒక బిందు, ఒక చుక్క కూడా ఇహలోకంలో ఉన్న వారిపై వేయడం జరిగితే వారి యొక్క జీవితాలు, వారి యొక్క సంసారాలు అనేటివన్నీ కూడా చెడిపోతాయి. ఇక అవి తినే వారి గురించి ఎలా ఉంటుందో, వారి యొక్క గతి ఎలా అవుతుందో.
(ముస్నద్ అహ్మద్, తిర్మిదీ మరియు నిసాయీ యొక్క ఉల్లేఖనం, షేక్ అల్బానీ రహిమహుల్లాహ్ గారు సహీహుల్ జామిఅలో ప్రస్తావించారు)

ఈ విధంగా మహాశయులారా, జముడు వృక్షం అలాంటి పాపాత్ములకు తినడానికి ఇవ్వబడుతుంది.

అల్లాహు తాలా నరకంలోని అన్ని రకాల శిక్షల నుండి మనల్ని కాపాడుగాక. నరకంలోకి తీసుకువెళ్లే పాపాల నుండి మనల్ని అల్లాహు తాలా దూరం ఉంచుగాక. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44355

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1) – మరణానంతర జీవితం : పార్ట్ 42 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (1)
[మరణానంతర జీవితం – పార్ట్ 42]
https://www.youtube.com/watch?v=lATws_WFGpM [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయదినాన కర్మల త్రాసు (మీజాన్) గురించి మరియు దానిని తేలికగా చేసే కార్యాల గురించి వివరించబడింది. పుణ్యాల బరువును పెంచుకోవాలనే ఆకాంక్షతో పాటు, పాపాల వల్ల త్రాసు తేలిక అవుతుందనే భయం కూడా విశ్వాసికి ఉండాలి. పాపాలు రెండు రకాలు: పెద్ద పాపాలు (గునాహె కబీరా) మరియు చిన్న పాపాలు (గునాహె సగీరా). పెద్ద పాపాలు క్షమించబడాలంటే స్వచ్ఛమైన పశ్చాత్తాపం అవసరం, అయితే చిన్న పాపాలు సత్కార్యాల ద్వారా క్షమించబడతాయి. ప్రసంగం ముగింపులో, కొన్ని ఘోరమైన పాపాల ఉదాహరణలు ఇవ్వబడ్డాయి మరియు అన్ని రకాల పాపాల నుండి దూరంగా ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, వ’అలా ఆలిహీ వ’సహ్బిహీ వ’మన్ వాలా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి నుండి మనం త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకుందాము. త్రాసు పుణ్యాలతో బరువుగా ఉండాలి అన్నటువంటి కాంక్ష, కోరిక, తపన, ఆలోచన కలిగి ఉన్న విశ్వాసి, త్రాసును తేలికగా చేసే కార్యాల గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే పుణ్యాలతో త్రాసు బరువుగా అవుతూ ఉంటే, పాపాలు పెరుగుతూ ఉండడం వల్ల మన పుణ్యాల త్రాసు తేలికగా అవుతూ ఉంటుంది. అందుకు ఇహలోకంలో మన ఆత్మ శరీరాన్ని వీడక ముందే పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసుకోవాలి. మాటిమాటికీ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండాలి.

ఈ శీర్షిక వింటూ మీరు ఎలాంటి బాధ, చింత, ఆవేదనకు గురి కాకండి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మీలో ప్రతి ఒక్కరూ ఏదైనా చిన్నపాటి వ్యాపారంలో ఉన్నారు లేదా చేసి ఉన్నారు లేదా కనీసం దాని యొక్క అవగాహన ఉంది కదా? కొంత డబ్బు పెట్టి ఒక చిన్న కొట్టు తెరుచుకున్న తర్వాత అందులో ఒకటి మూలధనం, ఆ మూలధనంతో కొంత సరుకు తీసుకొచ్చాము. ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభం చేశాము. ప్రతి సరుకుపై ఏదో కొంత లాభం, ప్రాఫిట్ దాన్ని నిర్ణయించాము. అయితే సామాన్, సరుకు అంతా అమ్ముడు పోతూ ఉన్నది, పోతూ ఉన్నది, మంచి లాభాలు వస్తున్నాయి అని సంతోషపడిపోతామా? లేక మరేదైనా విషయంలో మనం జాగ్రత్త కూడా పడుతూ ఉంటామా? జాగ్రత్త పడుతూ ఉంటాము కదా? ఏదైనా సామాన్ చెడిపోయి, అమ్ముడు కాకుండా అలా నష్టపోతామా అని, దుకాన్లో సామాన్ ఏదైనా ఎలుకలు కొరికి, ఇంకా వేరే రకంగా నష్టమై మనకు ఏదైనా లాస్ జరుగుతుందా? లేదా ప్రాఫిట్ మంచిగానే ఉంది, దందా చాలా మంచిగా నడుస్తూ ఉన్నది, కానీ మన యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఆ ఖర్చుల విషయంలో కూడా మనం తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాము. తీసుకుంటామా లేదా?

అలాగే విశ్వాసం ఒక మూలధనం అయితే, సత్కార్యాలన్నీ కూడా మనకు ప్రాఫిట్ ని, లాభాన్ని, మంచి ఆదాయాన్ని తీసుకొస్తూ ఉంటే, ఈ పాపాలు అనేటివి లాస్ కు గురి చేసేవి. అయితే వాటి నుండి జాగ్రత్త పడి ఉండడం, ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండి పాపాలు చేయకుండా ఉండడం, ఏదైనా పాపం జరిగిన వెంటనే దాని పరిహారం ఏంటో తెలుసుకొని దాన్ని చెల్లించి, పశ్చాత్తాప రూపంలో గాని, వేరే సత్కార్యాలు చేసే రూపంలో కానీ, ఏ రూపంలో ఉన్నా గానీ మరింత పెద్ద లాస్ కు గురి కాకుండా వెంటనే సర్దుకోవడం చాలా అవసరం.

ఒక సందర్భంలో ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా ఇలా తెలిపారు. “నీవు పరలోకాన అల్లాహ్ తో కలుసుకున్నప్పుడు ఎంత తక్కువ పాపాలతో కలుసుకుంటావో అంతే నీ కొరకు మేలు. ఇహలోకంలో ఎవరైనా పుణ్యాత్ములను చూసి వారికంటే మరీ ముందుగా మనం ఉండాలి అన్నటువంటి కోరిక గల వ్యక్తి పాపాల నుండి తప్పకుండా దూరం ఉండాలి.”

ప్రళయదినాన త్రాసు నెలకోల్పడం జరుగుతుంది. దానికి రెండు పళ్ళాలు ఉంటాయి. ఒక పళ్లెంలో పుణ్యాలు, మరొక పళ్లెంలో పాపాలు. ఒక పళ్లెంలో సత్కార్యాలు, మరో పళ్లెంలో దుష్కార్యాలు తూకం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పాపాలు ఎక్కువగా ఉండేది ఉంటే, ఆ పళ్లెం బరువుగా కిందికి జారిపోతుంది మరియు ఈ పుణ్యాల త్రాసు తేలికగా అయి మీదికి పోతుంది. అప్పుడు ఏం జరుగుద్ది?

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.

ఎవరి పుణ్యాల త్రాసు బరువుగా ఉంటుందో అతను తనకు ఇష్టమైన మనోహరమైన జీవితం గడుపుతాడు. మరెవరి పుణ్యాల త్రాసు తేలికగా ఉంటుందో అతని స్థానం హావియా అవుతుంది. ఏంటి హావియా? నారున్ హామియా. అది చాలా రగులుతున్నటువంటి అగ్ని. అందులో పడవలసి వస్తుంది.

అయితే పాపాలు అనేటివి రెండు రకాలుగా ఉన్నాయి. పెద్ద పాపాలు, చిన్న పాపాలు. గునాహె కబీరా, గునాహె సగీరా. ఘోరమైన పాపాలు, పెద్ద పాపాలు చాలా ఘోరమైనవి. మరికొన్ని చిన్న పాపాలు అని అనబడతాయి. ఘోర పాపాల జాబితా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. వాటిలో కొన్ని ఘోర పాపాలు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే సర్వ సత్కార్యాల్ని భస్మం చేసేస్తాయి, చివరికి ఏ ఒక్క పుణ్యం కూడా మిగలదు. ఇక పుణ్యమే లేనప్పుడు, పుణ్యాల త్రాసులో ఏమి మిగులుతుంది? అందుకు మనిషి స్వర్గంలో పోవడానికి అవకాశం కూడా నశించిపోతుంది.

అయితే గమనించండి, మరిన్ని వివరాలు ఇక ముందుకు రానున్నాయి. కానీ చిన్న పాపాలు అంటే, అయ్యో చిన్నవియే కదా అని విలువ లేకుండా మీరు చూడకండి. ఎలాంటి భయం లేకుండా మెదలకండి. చిన్న పాపాల విషయంలో ఒక భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక సామెత ద్వారా చెప్పాలా? ఒక్కొక్క పుల్ల కలిసి మోపెడు అవుతాయి. ఒక్కొక్క చుక్కనే కదా వర్షపు పడేది? వర్షం ఎలా కురుస్తుంది? కానీ ఆ ఒక్కొక్క చుక్కనే సముద్రం, సైలాబ్, పెద్ద తుఫాన్ తీసుకొస్తుంది. పర్వతం దేన్ని అంటారు? ఒక్క రాయినా? కొన్ని రాళ్ల సముదాయాన్ని. మహాశయులారా, చిన్న పాపాల్ని మాటిమాటికీ చేస్తూ ఉంటే అవి కూడా ఘోర పాపాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

అయితే ఇక ముందు కార్యక్రమాల్లో మనం ఘోర పాపాలు, వాటి నష్టాలతో పాటు, ఆ ఘోర పాపాలు ఏమేమి ఉన్నాయి? ఏ పాపాలు పుణ్యాలను నశింపజేసి, త్రాసు బరువును తగ్గిస్తాయి, అవి ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము.

మహాశయులారా, పాపాలు రెండు రకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. అయితే ముందు చిన్న పాపాల గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాము. చిన్న పాపాలు, వీటి గురించి అల్లాహు త’ఆలా మనకు ఒక వాగ్దానం చేశాడు, శుభవార్త ఇచ్చాడు. అదేమిటంటే చిన్న పాపాల్ని మన్నించేస్తాడు, క్షమించేస్తాడు అని మనకు తెలిపాడు. మరి ఈ క్షమించడం, ఈ మన్నించడం అనేది స్వయంగా అల్లాహ్ తరఫున, అంటే ఏ పుణ్యానికి బదులుగా కాకుండా స్వయంగా అల్లాహ్ యే క్షమించడం, అట్లనే. మరొక రకం, మనం కొన్ని విధులు నిర్వహిస్తాము, కొన్ని పుణ్యాలు చేస్తాము, ఉదాహరణకు ఉదూ చేయడం, నమాజ్ చేయడం, ఉపవాసం ఉండడం, హజ్ చేయడం, ఇంకా. అలాంటి సత్కార్యాల ద్వారా కూడా చిన్న పాపాలు మన్నించబడతాయి అని కూడా మనకు అల్లాహు త’ఆలా శుభవార్త ఇచ్చాడు.

కానీ ఈ శుభవార్త మనం అందుకోవడానికి రెండు షరతులు, రెండు నిబంధనలు కూడా ఉన్నాయి. ఏమిటి అవి? మొదటి నిబంధన, చిన్న పాపాలు మన్నించబడాలంటే, మొదటి నిబంధన, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి. ఘోర పాపాలు చేస్తూ ఉన్నాము, చిన్న పాపాలు కూడా మన్నించబడవు. రెండవ నిబంధన, ఈ చిన్న పాపాల్ని కూడా చిన్నవియే కదా అన్నటువంటి భావన ఉండకూడదు. దీనికి ఒక చిన్న సామెత ఇవ్వాలా? ఒక మనిషి మీ ముందు ఒక చిన్న తప్పు చేశాడు అనుకుందాం. చేసి, మీరు చూసిన వెంటనే, “సారీ, క్షమించండి” అతను “సారీ” అని నోటితో చెప్పక ముందు అతని యొక్క, “అరె, సారీ చెప్తున్నట్లు ఉంది”. “లేదండి, పర్వాలేదు, పర్వాలేదు, అట్లేం లేదు” అని స్వయంగా మనమే అతన్ని క్షమించేసే ప్రయత్నం చేస్తాము.

చేసింది అతను చిన్న తప్పే కావచ్చు, కానీ మీరు అతని వెంట చూస్తేనే, “ఏంటి?” తిరిగేసి, గుడ్లు తెరిచి, అయితే ఏంది? ఈ విధంగా ఎదురుమాట, అంటే చేసింది చిన్నదైనప్పటికీ, “అయ్యో, తప్పు జరిగింది కదా” అన్న భావన లేకుండా విర్రవీగడం, గర్వం చూపడం ఇది మన మానవులకే నచ్చదు. విషయం అర్థమైంది అనుకుంటాను.

ఈ విధంగా మహాశయులారా, మన చిన్న పాపాలు మన్నించబడాలంటే, ఘోర పాపాల నుండి మనం దూరం ఉండాలి మరియు చిన్న పాపాల్ని “అరె, చిన్నవియే కదా” అన్నటువంటి భావనలో ఉండకూడదు. చదవండి ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్:

الَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ إِلَّا اللَّمَمَ ۚ إِنَّ رَبَّكَ وَاسِعُ الْمَغْفِرَةِ
[అల్లజీన యజ్తనిబూన కబాయిరల్ ఇస్మి వల్ ఫవాహిష ఇల్లల్ లమమ్, ఇన్న రబ్బక వాసివుల్ మగ్ ఫిరహ్]

ఎవరైతే పెద్ద పాపాలకు దూరంగా ఉంటారో, చిన్న చిన్న తప్పులు మినహా నీతిబాహ్యతను కూడా విడనాడతారో (వారి పాలిట) నిశ్చయంగా నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు.” (53:32)

ఎవరైతే చిన్న చిన్న తప్పులు, పాపాలు తప్ప ఘోరమైన పాపాల నుండి మరియు అశ్లీలమైన కార్యాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి పట్ల నీ ప్రభువు ఎంతో ఉదారంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఏమర్థమైంది? పెద్ద పాపాల నుండి, మహా అశ్లీల కార్యాల నుండి దూరం ఉంటేనే చిన్న పాపాలను మన్నిస్తాడు అన్నటువంటి శుభవార్త ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది సూర నజ్మ్ లోని ఆయత్, ఆయత్ నంబర్ 32.

అయితే సూర నిసా, ఆయత్ నంబర్ 31 లో ఇలా తెలియబరిచాడు:

إِن تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا
[ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్హు నుకఫ్ఫిర్ అన్కుమ్ సయ్యిఆతికుమ్ వనుద్ ఖిల్కుమ్ ముద్ ఖలన్ కరీమా]

“మీకు వారించబడే మహాపరాధాలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీ చిన్న చిన్న పాపాలను మేము మీ (లెక్క) నుండి తీసేస్తాము. ఇంకా మిమ్మల్ని గౌరవప్రద స్థానాల్లో (స్వర్గాలలో) ప్రవేశింపజేస్తాము”. (4:31)

ఈ రెండు ఆయతులకు తోడుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును కూడా వినండి. మ’జమ్ కబీర్, తబరానీలో ఈ హదీస్ ఉంది, షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామి’ లో ప్రస్తావించారు, 2687.

إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ
[ఇయ్యాకుమ్ వ ముహఖ్ఖరాతిజ్ జునూబ్]

فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَمَثَلِ قَوْمٍ نَزَلُوا بَطْنَ وَادٍ
[ఫ ఇన్నమా మసలు ముహఖ్ఖరాతిజ్ జునూబి క మసలి ఖౌమిన్ నజలూ బత్న వాదిన్]

మీరు చిన్న పాపాలను అల్పమైనవిగా భావించడం మానుకోండి. అల్పమైనవియే కదా, చిన్నవియే కదా అనుకోవడం ఎంత భయంకరమో దాని యొక్క దృష్టాంతం ఇలా ఉంది. కొందరు ఒక ప్రాంతంలో దిగారు, వారు అక్కడ వంట చేసుకోవడానికి ఏ అగ్ని లేదు. కొంతమందిని పంపారు, ఒక వ్యక్తి ఒక పుల్ల, మరొక వ్యక్తి ఒక చిన్న కట్టె, ఈ విధంగా కొందరు కొన్ని పుల్లలు, కొన్ని చిన్న చిన్న కట్టెలు, కొన్ని ముక్కలు తీసుకొని వచ్చారు. అవన్నీ జమా చేసిన తర్వాత ఏమైంది? మంచి మంట, మంచి వంటకాలు చేసుకున్నారు. ఈ విధంగా చిన్న పాపాలను కూడా అల్లాహు త’ఆలా పట్టడం, వాటి గురించి మందలించడం మొదలుపెట్టాడంటే, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి కలిసి అవన్నీ మనిషిని వినాశనానికి కూడా గురి చేస్తాయి. అందుగురించి చిన్నవియే కదా అన్నటువంటి అల్పమైన భావంలో పడకూడదు. మనిషి చిన్న పాపాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం.

హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు తెలిపారు, ఒక వ్యక్తి కొన్ని పాపాలు చేసి మరిచిపోతాడు, సత్కార్యాల్లో ఉంటాడు, ఆ పాపాల పట్ల క్షమాపణ కోరుకోవడం, మన్నింపు వైఖరి అవలంబించడం ఏదీ పాటించడు. అదే స్థితిలో అల్లాహ్ ను కలుసుకుంటాడు, చివరికి ఆ పాపాలు అతన్ని వినాశనానికి గురి చేస్తాయి. మరొక వ్యక్తి, అతని నుండి పాపం జరుగుతుంది, కానీ అతడు భయపడుతూ ఉంటాడు, అల్లాహ్ తో క్షమాపణ కోరుతూ ఉంటాడు, చివరికి అల్లాహ్ ను కలుసుకున్నప్పుడు అల్లాహు త’ఆలా అతన్ని మన్నించి, అతనికి మోక్షం కలిగిస్తాడు. హజ్రత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు త’అన్హు గారి యొక్క ఈ కొటేషన్ ని హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహమతుల్లాహ్ అలైహ్ ఫత్హుల్ బారీలో ప్రస్తావించారు, సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6492 యొక్క వ్యాఖ్యానంలో.

ఇప్పుడు మహాశయులారా, ఘోర పాపాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఘోర పాపాన్ని దేన్ని అంటారు? ఈ విషయం అర్థమైంది అంటే మిగితవి చిన్న పాపాల్లో లెక్కించబడతాయి అన్న విషయం కూడా బోధపడుతుంది. ఖుర్ఆన్ మరియు హదీస్ లో ఏ పాపాన్ని ఘోర పాపం అని తెలపడం జరిగిందో, పెద్ద పాపం అని తెలపడం జరిగిందో, అవి ఘోర పాపాలు. మరియు ఏ పాపం గురించి అయితే ఇహలోకంలో హద్దు నిర్ణయించడం జరిగినదో, ఉదాహరణకు, దొంగ యొక్క చేతులు కట్ చేయడం, వ్యభిచారం చేసిన వారిని వంద కొరడా దెబ్బలు, ఒకవేళ వివాహితుడైతే రాళ్లతో కొట్టి చంపడం, ఇలాంటి హద్దులు ఏవైతే నిర్ణయించబడినవో ఆ పాపాలు, మరియు ఏ పాపాల గురించి అయితే నరకం యొక్క శిక్ష అని హెచ్చరించబడిందో, మరియు ఏ పాపాలు చేసే వారి గురించి అయితే శాపనార్థాలు పెట్టడం జరిగినదో, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. అలాగే ఏ పాపాలు చేసే వారిని ఫాసిఖ్, అపరాధి, అని అనడం జరిగిందో ఆ పాపాలు కూడా ఘోర పాపాల్లో లెక్కించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఏమిటి? అలాంటి హదీసులను, అలాంటి ఆయతులను మనం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, వాటికి దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఉదాహరణకు ఒక హదీస్ వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

إِنَّ أَعْظَمَ الذُّنُوبِ عِنْدَ اللَّهِ
[ఇన్న అ’జమజ్ జునూబి ఇందల్లాహ్]
అల్లాహ్ వద్ద పాపాల్లో అతి ఘోరమైనవి,

رَجُلٌ تَزَوَّجَ امْرَأَةً
[రజులున్ తజవ్వజమ్ ర అతన్]
ఒక వ్యక్తి ఒక స్త్రీతో పెండ్లాడాడు,

فَلَمَّا قَضَى حَاجَتَهُ مِنْهَا طَلَّقَهَا
[ఫలమ్మా ఖదా హాజతహూ మిన్హా తల్లఖహా]
అతను ఆమెతో రాత్రి గడిపి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు,

وَذَهَبَ بِمَهْرِهَا
[వ జహబ బి మహ్రిహా]
ఆమె యొక్క మహర్ ను కూడా తినేశాడు, మహర్ కూడా తీసుకున్నాడు రిటర్న్, లేదా ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వలేదు. ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడింది.

وَرَجُلٌ اسْتَعْمَلَ رَجُلًا فَذَهَبَ بِأُجْرَتِهِ
[వ రజులున్ ఇస్త’మల రజులన్ ఫ జహబ బి ఉజ్రతిహి]
ఒక మనిషి మరో మనిషికి, మనిషిని ఒక మజ్దూరీగా తీసుకున్నాడు, మరి అతనికి ఇచ్చే మజూరీ ఏదైతే ఉందో, బత్తెం ఏదైతే ఉందో అది ఇవ్వకుండా తానే ఉంచుకున్నాడు, తినేశాడు.

మూడో వ్యక్తి,

وَآخَرُ يَقْتُلُ دَابَّةً عَبَثًا
[వ ఆఖరు యఖ్తులు దాబ్బతన్ అబసన్]
ఎవరైతే ఏదైనా పశువును, ఏదైనా పక్షిని వృధాగా చంపేస్తున్నాడు. షికారీ చేయడం పేరుతో, లేదా కొందరికి అలవాటు ఉంటుంది, కుక్కలను, పిల్లులను పరిగెత్తించి, వెనక రాళ్లతో కొట్టి ఇంకా వేరే విధంగా.

అయితే మహాశయులారా, ఇవన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి. ఇది ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహాశయులారా, పాపాల విషయాల్లో ఖుర్ఆన్ లో గాని, హదీస్ లో గాని మరొక విషయం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. వాటిని అంటారు,

مُحْبِطَاتُ الْأَعْمَالِ
[ముహ్బితాతుల్ అ’మాల్]
సత్కార్యాలను నశింపజేసే పాపాలు అని.

వాటి నుండి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇన్షా అల్లాహ్, తర్వాయి భాగాల్లో అలాంటి కార్యాల గురించి, దేని ద్వారానైతే మన త్రాసు తేలికగా అవుతుందో, దేని ద్వారానైతే త్రాసు యొక్క బరువు తగ్గిపోతుందో, ఆ పాపాలను తెలుసుకొని, వాటి నుండి దూరం ఉండే మనం ప్రయత్నం చేద్దాము.

అల్లాహు త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అన్ని రకాల పాపాల నుండి, ఘోర పాపాల నుండి, చిన్న పాపాల నుండి మరియు مُحْبِطَاتُ الْأَعْمَالِ [ముహ్బితాతుల్ అ’మాల్] సత్కార్యాలను నశింపజేసే పాపాల నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43771

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు [మరణానంతర జీవితం – పార్ట్ 55] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.

మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:

  • అన్నార్ (النَّار) – అగ్ని
  • జహన్నమ్ (جَهَنَّم) – నరకం (అత్యంత ప్రసిద్ధమైన పేరు)
  • జహీమ్ (جَحِيم) – ప్రజ్వలించే అగ్ని
  • సఈర్ (سَعِير) – మండుతున్న జ్వాల
  • లజా (لَظَىٰ) – భగభగమండే అగ్ని
  • సఖర్ (سَقَر) – కాల్చివేసేది
  • హుతమా (حُطَمَة) – ముక్కలు ముక్కలుగా నలిపివేసేది
  • హావియా (هَاوِيَة) – అగాధం, పాతాళం

ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.