ఖుర్బానీ ఆదేశాలు & ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్


వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/repdu4saKmM [46 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో ఖుర్బానీ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన విధివిధానాలను వివరంగా తెలియజేశారు. ఖుర్బానీ ఎప్పుడు చేయాలి, అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు, పశువులో భాగస్వామ్య పద్ధతులు వంటి నిబంధనలను ఖురాన్, హదీసుల ఆధారంగా స్పష్టం చేశారు. అలాగే, అఖీఖా మరియు ఖుర్బానీ కలిపి చేయవచ్చా, మరణించిన వారి పేరిట ఖుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా వంటి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఖుర్బానీ పశువు మాంసాన్ని, చర్మాన్ని ఎలా పంపిణీ చేయాలో వివరిస్తూ, ఖుర్బానీ మాంసం, రక్తం కాకుండా కేవలం మనలోని భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అల్లాహ్ కు చేరుతాయని ఉద్ఘాటించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. ఈనాటి ప్రసంగంలో మనం ఖుర్బానీ ఆదేశాలు తెలుసుకుందాం. ముందుగా ఖుర్బానీ అంటే ఏమిటి? తెలుసుకుందాం.

ఖుర్బానీ అంటే జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి జుల్ హిజ్జా నెల 13వ తేదీన సూర్యాస్తమయానికి ముందు వరకు రేయింబవళ్ళలో ఎప్పుడైనా నిర్ధారిత పశువులను అల్లాహ్ ప్రసన్నత కోసం జిబాహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.

ఈ ఖుర్బానీకి ఉన్న ఘనత, విశిష్టత ఏమిటంటే… ఖురాన్ లోని 108వ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (108:2)

అలాగే ఖురాన్ లోని 6వ అధ్యాయము 162వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(ఖుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

ఓ ప్రవక్తా! ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.(6:162)

ఈ రెండు ఆయతులలో ఒక విషయాన్ని గమనించారా? ఈ రెండు ఆయతులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు ముఖ్యమైన ఆరాధనల ప్రస్తావన చేసి ఉన్నాడు. ఒకటి నమాజు అయితే, రెండవది ఖుర్బానీ. నమాజుతో పాటు ఖుర్బానీ ప్రస్తావన కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు ఆయతులలో చేసి ఉన్నాడు. నమాజ్ ఎంత గొప్ప ఆరాధన అన్న విషయము మనందరమూ తెలుసుకొని ఉన్నాము. అలాంటి గొప్ప ఆరాధనతో పాటు ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేయడం వల్ల ఖుర్బానీ కూడా గొప్ప ఆరాధన, అల్లాహ్ కు ఇష్టమైన కార్యము అనే విషయము ఈ రెండు వాక్యాల ద్వారా మనము గ్రహించాలి.

ఖుర్బానీ యొక్క విశిష్టతను ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూచినట్లయితే, ఆయన ప్రతి సంవత్సరము ఖుర్బానీ చేశారు. ఆయన తన కుటుంబీకుల తరఫున ఖుర్బానీ చేయటమే కాకుండా, ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుండి కూడా ఆయన ఖుర్బానీ చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన ఆయన కుటుంబీకుల సభ్యుల తరపున ఖుర్బానీ చేసుకోవటంతో పాటు, అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుంచి కూడా ఖుర్బానీ చేశారు. అందరికీ ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన కృషి చేశారు అంటే ఆ ఖుర్బానీ ఎంత విశిష్టమైనదో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.

అలాగే ఖుర్బానీ ఎంత ముఖ్యమైన ఆరాధన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉల్లేఖనం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిస్తూ ఇలా తెలియజేశారు: “స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ చేయుటలేదో, వారు మన ఈద్ గాహ్ పండుగ నమాజు ఆచరించే స్థలం దరిదాపులకు కూడా రావద్దు” అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా మామూలు విషయాల గురించి ఆయన ఆగ్రహించరు, వారించరు. ఆయన ఆగ్రహిస్తున్నారు, వారిస్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఆ ప్రకారంగా స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు ఆచరిస్తున్న స్థలానికి, దాని దరిదాపులకు కూడా రావద్దు అని కఠినంగా ఆయన వారిస్తున్నారు అంటే ఖుర్బానీ ఎంత విశిష్టత గలదో ఎంత ముఖ్యమైన ఆరాధనయో మనము ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఖుర్బానీ అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యము తెలుసుకోవాలంటే… ఖురాన్ లో 22వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ
(వ లికుల్లి ఉమ్మతిన్ జఅల్నా మన్సకల్ లియజ్ కురుస్మల్లాహి అలా మా రజకహుమ్ మిమ్ బహీమతిల్ అన్ ఆమ్)

తమకు అల్లాహ్‌ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్‌ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము“. (22:34)

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి అనుచర సమాజానికి ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అంటే ప్రతి అనుచర సమాజానికి ఆ ఆరాధన చేయమని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు అంటే అది అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యమై ఉంటే అల్లాహ్ ఆ విధంగా ఆదేశించి ఉంటాడు కదా?

మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా విని ఉన్నాము. ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ వద్ద పెళ్లి విషయంలో గొడవ జరిగినప్పుడు, ఖుర్బానీ చేయమని తండ్రి ఆదేశించగా వారిద్దరూ ఖుర్బానీ సమర్పించారు. ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఒకరి ఖుర్బానీ తిరస్కరించబడింది. అదంతా మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకొని ఉన్నాము ఇక్కడ అదంతా ప్రస్తావించే ఆస్కారము లేదు. కాకపోతే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వారి కుమారులు ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలైన దశలో ప్రారంభంలో వారు ఈ భూమి మీద జీవించారు. ఆ ప్రకారంగా మానవులు ఈ భూమి మీద జీవించిన ప్రారంభము నుండే ఖుర్బానీ ఆదేశాలు మానవులకు ఇవ్వబడి ఉన్నాయి అన్న విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రతి అనుచర సమాజానికి కూడా అల్లాహ్ ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అన్న విషయము కూడా మనకు బోధపడుతుంది.

ఈ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాల ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసుల ద్వారా ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనకు అర్థమవుతుంది. ఇవి కాక వేరే ఉల్లేఖనాలు ఉన్నాయి, అవి బలహీనమైనవి, కాబట్టి వాటి ప్రస్తావన నేను ఇక్కడ చేయుటలేదు. చాలామంది పండితులు బలహీనమైన వాక్యాలు, బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు… ఖుర్బానీ చేయగానే ఆ ఖుర్బానీ రక్తము భూమి మీద పడకముందే అల్లాహ్ వద్ద ఆమోదం పొందుతుంది, ఆ రక్తపు చుక్క భూమి మీద పడకముందే ఖుర్బానీ ఇచ్చే వ్యక్తుల పాపాలు మన్నించబడతాయి, ఖుర్బానీ ఇచ్చే పశువు చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖాతాలో లిఖించబడతాయి… ఇలాంటి ఉల్లేఖనాలు ఉన్నాయి కదండీ, అవన్నీ బలహీనమైన ఉల్లేఖనాలు అని ధార్మిక పండితులు నిర్ధారించి ఉన్నారు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుటలేదు.

ఇక రండి, ఖుర్బానీ అంటే ఏమిటి, ఖుర్బానీ విశిష్టత ఏమిటి అని మనము తెలుసుకున్న తర్వాత, ఖుర్బానీ ఆదేశం ఏమిటి? ఇస్లామీయ శాసనంలో ఖుర్బానీకి ఉన్న విలువ ఏమిటి? అంటే అది ఫరజా లేదా సున్నతా?

ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరచి ఉన్నారు. కొంతమంది ధార్మిక పండితులు ఖుర్బానీ సున్నత్ అని తెలియజేసి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం.

మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, స్తోమత ఉన్న వారిపై ఖుర్బానీ చేయటం విధి, తప్పనిసరి, వాజిబ్ అంటున్నారు. వారి ఈ వాదనకు ఆధారం ఏమిటంటే, ఖురాన్ లోని 108వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఫసల్లి లిరబ్బిక వన్ హర్” (నీ ప్రభువు కొరకు నమాజు ఆచరించు, నీ ప్రభువు కొరకు ఖుర్బానీ చెయ్యి) ఖుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు ఖుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్.

అలాగే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే, ఖుర్బానీ చేయటం స్తోమత ఉన్న వారిపై వాజిబ్, తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు, వాక్యాలు దృష్టిలో పెట్టుకుని చూచినట్లయితే, మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు, ఆవు, ఎద్దు, ఒంటె (ఆడది అయినా మగది అయినా) – ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే, అయినప్పటికినీ వాటి ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు. ఎందుకంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ, ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల ఖుర్బానీ చేయలేదు. కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే ఖుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

అయితే, ఈ ఎనిమిది పశువులలో ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు.

కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు ఖుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు.

మరి కొంతమంది ధార్మిక పండితులు పశువు, ఖుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు, దాని మాంసము, తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ వారు తెలియజేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా:

  1. ఒకటి, ఒంటె ఒక వ్యక్తి తరఫు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ ఖుర్బానీ ఉత్తమమైనది.
  2. తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరఫున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన ఖుర్బానీ.
  3. పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన ఖుర్బానీ.
  4. ఆ తర్వాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు, పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక ఒంటెలో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన ఖుర్బానీ.
  5. ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది ఐదవ ఉత్తమమైన ఖుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు. ఇంక అసలు విషయము అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేసిన విషయం: ఖుర్బానీ కోసం ఇవ్వబడుతున్న పశువు తాజాగా, బాగా లావుగా, కొమ్ములు కలిగిన, ఖసీ చేయబడిన పశువు అయి ఉండటం మంచిది అని తెలియజేశారు.

అలాగే, ఖుర్బానీ ఇవ్వబడుతున్న పశువుల వయస్సు ఎంత ఉండాలి? ఎంత వయస్సు గల పశువుని ఖుర్బానీ ఇవ్వవచ్చు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి:

  • ఒంటె 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఒంటె ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • ఆవు లేదా ఎద్దు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఆవు లేక ఎద్దు ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • పొట్టేలు, గొర్రె విషయం గురించి చూడండి. పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండీ, అలా పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె అయి ఉండాలి. ఒకవేళ పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె దొరకని యెడల సంవత్సరము దాని దరిదాపుల వయస్సు కలిగిన పొట్టేలు, గొర్రె ఉన్నా గాని ఖుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది.
  • ఆ తర్వాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు. అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి. అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండీ పళ్ళు, ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక, మేకపోతు. పళ్ళు వేయని మేక, మేకపోతు అయితే ఖుర్బానీ ఎట్టి పరిస్థితిలో చెల్లదు. దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక, మేకపోతు ఖుర్బానీ మాత్రం చెల్లదు. అది పొట్టేలు, గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది.

ఇకపోతే, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు కాదు? ఏ పశువుల ఖుర్బానీ చెల్లదు?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: కుంటి పశువు ఖుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటికంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి, ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది.

ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు ఖుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూచినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు. కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు ఖుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే అది సమస్య కాదు, దాని ఖుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ఏ పశువులో ఎంతమంది భాగస్తులు కాగలరు? అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

ఒంటెలో 10 మంది భాగస్తులు కావచ్చు, 10 కుటుంబాలు కూడా భాగస్తులు కావచ్చు. ఆవు లేదా ఎద్దులో 7 వ్యక్తులు భాగస్తులు కావచ్చు లేదా 7 కుటుంబాలు భాగస్తులు కావచ్చు.

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు… వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే ఖుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే (ఒక కుటుంబం తరఫున మాత్రమే) ఖుర్బానీ ఇవ్వబడుతుంది. పొట్టేలు, గొర్రె, మేక మరియు మేకపోతులో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు భాగస్తులు అవ్వడానికి అనుమతి లేదు.

“ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు, ఒక మేక సరిపోతుంది” అని చెబుతున్నారు, ఒక కుటుంబం అంటే ఎంతమంది? అనే సందేహం రావచ్చు. ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు: ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో, ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు, ఆ తండ్రి, భార్యలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఎవరూ సంపాదించుటలేదు, తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు, వారందరి బాధ్యత ఆయన ఒక్కరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండే ఆ పూర్తి కుటుంబం తరపున ఖుర్బానీ అయిపోతుంది.

కానీ, ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరువేరుగా సంపాదించుకుని, ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు. సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికినీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే, వారు ప్రతి ఒక్కరు ఎవరైతే సంపాదన వేరు వేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా ఖుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి.

మనం చూచినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో ఖుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జిబాహ్ చేస్తూ “ఓ అల్లాహ్ ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున” అని ఖుర్బానీ చేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబాలు కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున” అని పూర్తి కుటుంబం తరపున ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చేవారు.

అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారితో ఈ విధంగా అడగడం జరిగింది: “దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఖుర్బానీలు చెల్లించుకునేవారు?” అంటే, అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జిబాహ్ చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు” అని ఆయన బదులిచ్చారు. ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరఫున ఒక పశువుని జిబాహ్ చేసి వారు స్వయంగా మాంసం భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు. ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున ఖుర్బానీ ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది.

మిత్రులారా, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖీఖా ఏడు రోజులలో చేయకుండా, తరువాత ఖుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో ఖుర్బానీ మరియు అఖీఖా రెండు అయిపోయేలాగా ఉపాయము పన్నుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం. అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండీ. ఒక భాగం ఖుర్బానీ కోసం, ఒక భాగం అఖీఖా కోసం తీసుకుంటూ ఉంటారు. అలా ఉపాయం పన్నిన వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకే పశువులో ఖుర్బానీ, ఒకే పశువులో అఖీఖా చెల్లదు. ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు. అఖీఖా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జబాహ్ చేయవలసి ఉంటుంది. ఖుర్బానీ పశువులో అఖీఖాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు, ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు.

అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు. అంత డబ్బు పెట్టి పశువు తీసుకుని ఖుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు, అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన వ్యర్థమైనది. ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఫర్జ్ సదఖా, ఫర్జ్ దానం (జకాత్) అని ఒకటి ఉంది. అలాగే నఫిల్ సదఖా, నఫిల్ దానము కూడా ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ వాక్యాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు, నిరుపేదలకు అందిస్తూ ఉంటారు, అవి చేయమని ప్రోత్సహించాలి. ఖుర్బానీ ఆపి సదఖా చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి. ఖుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది. ఆ ప్రకారంగా ఖుర్బానీ చేసుకొని ఖుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి. ఆరాధనలు జీవితాంతము సంవత్సరము మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి.

అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు. కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు: అతని వద్ద స్తోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని ఖుర్బానీ చేయటము ఉత్తమం. ఒకవేళ అతని వద్ద స్తోమత లేదు అంటే, సమయము లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే, అదే పశువుని అతను జబాహ్ చేయవచ్చు, ఖుర్బానీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి, అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు. అలాగే ఖుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత. మరి అలాంటప్పుడు వారేం చేయాలి? స్తోమత ఉంటే మరొక పశువు కొని ఖుర్బానీ చేయాలి, స్తోమత లేకపోతే వారికి ఖుర్బానీ పుణ్యము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా దక్కుతుంది.

అలాగే మిత్రులారా, ఇప్పుడు ఖుర్బానీ సమయం ఏమిటి, ఎప్పుడు ఖుర్బానీ చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం.

ఖుర్బానీ ఎప్పుడు చేయాలి అంటే, పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. ఒకవేళ తొందరపడి ఎవరైనా జుల్ హిజ్జా 10వ తేదీన పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే, అది హలాల్ ధర్మసమ్మతమే కానీ అతనికి ఖుర్బానీ పుణ్యము దక్కదు. అతను మామూలు రోజుల్లో మాంసం కోసము పశువుని జిబాహ్ చేసుకొని మాంసం తింటారు కదండీ, అలా అతనికి అది ధర్మసమ్మతమైన మాంసం మాత్రమే అతనికి హలాల్ దక్కుతుంది. ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి దక్కదు. అతను మళ్ళీ మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత జిబాహ్ చేసుకుంటే అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

ఒకవేళ ఎవరైనా మర్చిపోయి పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే? అతనికి కూడా ఖుర్బానీ పుణ్యము దక్కదు. ఆ పశువు అతని కోసం హలాల్ ధర్మసమ్మతమే, అతను ఆ పశువు మాంసాన్ని తినవచ్చు. కానీ ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి ఇవ్వబడదు. అతను మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత మళ్ళీ జిబాహ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

అయితే, జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి చేయబడే ఖుర్బానీ (ఆ రోజు, అంటే 10వ తేదీన చేయబడే ఖుర్బానీ) ఉత్తమమైనది. ఆ తర్వాత 11, 12, 13 తేదీలలో కూడా ఖుర్బానీ చేసుకోవచ్చు. 10వ తేదీన చేసే ఖుర్బానీ ఎక్కువ పుణ్యము మరియు ఎక్కువ గౌరవప్రదమైనది అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

ఇక, ఖుర్బానీ చేసే విధానం ఏమిటి అంటే, పశువుని జిబాహ్ చేసే ముందు కత్తి బాగా పదును పెట్టుకోవాలి. పశువు ముందర కత్తి నూరరాదు. అలాగే పశువుని జిబాహ్ చేసేటప్పుడు ఎడమ వైపుకి పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఆవు, ఎద్దు, పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఉంటే వాటిని పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఒంటె అయితే నిలబెట్టి అతని గొంతు మరియు మునుపటి కాళ్ళ మధ్యలో ఒక ప్రదేశంలో నహర్ చేస్తారు. అలా నిల్చోబెట్టి ఒంటెకు మాత్రమే నహర్ చేయాలి. ఇతర పశువులకు మాత్రము పడుకోబెట్టి జిబాహ్ చేయాలి.

జిబాహ్ చేస్తున్నప్పుడు పశువు ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరైతే జిబాహ్ చేస్తున్నారో, ఖుర్బానీ చేస్తున్నారో వారు కూడా వారి ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జిబాహ్ చేస్తున్న వ్యక్తి అవసరార్థం తన కాలు పశువు శరీరం మీద ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే జిబాహ్ చేస్తున్న వ్యక్తి పదునైన కత్తిని తీసుకొని తొందరగా జిబాహ్ చేయాలి.

ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పశువుని జిబాహ్ చేయాలి. ఒకవేళ వారి వల్ల కావట్లేదు అనేటట్లయితే ఇతరులతో కూడా ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చు. అలాగే మహిళలు కూడా వారి ఖుర్బానీ వారు వారి స్వహస్తాలతోనే జిబాహ్ చేసుకోవచ్చును. ఒకవేళ వారి వల్ల కుదరదు అనేటట్లయితే ఇతరుల చేత కూడా వారు ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చును.

ఖుర్బానీ పశువుని జిబాహ్ చేసేటప్పుడు:

بِسْمِ اللَّهِ اللَّهُ أَكْبَرُ
(బిస్మిల్లాహి అల్లాహు అక్బర్)
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.

అని పఠించడంతో పాటు,

اللَّهُمَّ إِنَّ هَذَا مِنْكَ وَلَكَ، اللَّهُمَّ تَقَبَّلْ مِنَّا
(అల్లాహుమ్మ ఇన్న హాజా మిన్ క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నా)
ఓ అల్లాహ్! ఇది నీ వైపు నుంచే, నీ కోసమే. ఓ అల్లాహ్! మా నుండి దీనిని స్వీకరించు. అని కూడా పఠించవచ్చును.

మరొక ఉల్లేఖనంలో,

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఇన్నీ వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ హనీఫన్ వ మా అనా మినల్ ముష్రికీన్)

నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.” (6:79)

అని ఒక దుఆ ఉంది కదండీ, ఆ పూర్తి దుఆ కూడా పఠించవచ్చును అని తెలుపబడింది.

జిబాహ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పశువులు బెదిరిపోయి తప్పించుకుని పారిపోతాయి. తర్వాత చేతికి చిక్కవు. అవి పారిపోతూ ఉంటే అలాంటప్పుడు ఏమి చేయాలంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, ఎలాగైతే పశువుని షికారు చేస్తారో (వేటాడుతారో) బాణాల ద్వారా లేదా ఇతర పరికరాల ద్వారా, ఆ విధంగా పదునైన బాణంతో గాని లేదా వేరే పరికరాలతో గాని అల్లాహ్ నామము స్మరించి ఆ పారిపోతున్న పశువుని గాయపరచాలి. అదే గాయంలో ఒకవేళ అది మరణిస్తే, అతని ఖుర్బానీ అయిపోయినట్లే. ఒకవేళ అది మరణించకముందే చేతికి దక్కితే, అప్పుడు దాన్ని జిబాహ్ చేసేయాలి, తద్వారా అతని ఖుర్బానీ పూర్తి అవుతుంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ముఖ్యమైన విషయం. ఖుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి? దీని సమాధానం ఏమిటంటే, ఖుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు స్వయంగా తినవచ్చును, ఇతరులకు కూడా తినిపించవచ్చును, భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును (ఎండబెట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే).

ఖురాన్ లో 22వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
(ఫకులూ మిన్ హా వ అతయిముల్ ఖానిఅ వల్ ముఅ తర్)
వాటి మాంసాన్ని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. (22:36)

అడిగేవారు అంటే ఎవరు? అడగని వారు అంటే ఎవరు? నిరుపేదలు చేతులెత్తి అడిగేవారు, వారికి ఇవ్వండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, వారు చేతులెత్తి అడగరు, అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది. ఆ ప్రకారంగా ఖుర్బానీ ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకుని, బంధుమిత్రులకు కొంచెం పంచి, నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా ఖుర్బానీ మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

అయితే, ఈ విధంగా మూడు భాగాలు చేయాలి, ఆ మూడు భాగాలు సరైన పరిమాణంలోనే ఉండాలి, కొంచెం కూడా హెచ్చుతగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా పుణ్యం కోసము పూర్తి మాంసము అనాధలకు, పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసము పంచేయవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకుని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది, కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం. ఎందుకంటే, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించుటలేదు, పేదవారి గురించి మనం ఆలోచించటలేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం, భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయటం సమంజసం కాదు. అందరి గురించి ఆలోచించాలి. బంధుమిత్రుల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి.

అలాగే ఖుర్బానీ పశువు మాంసము ముస్లిమేతరులకు ఇవ్వవచ్చునా అంటే, ఇవ్వవచ్చును. నా సలహా ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లిమేతరులలో ముస్లింల పట్ల అపోహలు సృష్టిస్తున్నారు దుష్టశక్తులు. విషం కక్కి ముస్లింలకు వ్యతిరేకంగా వారి మెదడులలో బాగా నూరి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అపోహలు తొలగిపోవడానికి, వారిలో ఉన్న అనుమానాలు దూరం అవ్వటానికి, మనము స్వయంగా రెండు అడుగులు ముందుకు వేసి మన సమీపంలో ఇరుగు పొరుగులో ఉంటున్న మన ముస్లిమేతర సోదరులకు వెళ్లి సగౌరవంగా ఆహ్వానించి ఈ ఖుర్బానీ పశువు మాంసము అందజేయాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం, మనం ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్న ముస్లిమేతరుల సోదరుల మనోభావాలు గాయపడకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో ఉన్న ధార్మిక పండితులు ఖుర్బానీ విషయంలో ఏ నియమాలు అయితే బోధిస్తున్నారో ఆ నియమాలకు అనుగుణంగా ఖుర్బానీ చేసుకోండి, ఇది శ్రేయస్కరమైన విధానము.

అలాగే మిత్రులారా, ఖుర్బానీ పశువు చర్మము ఏమి చేయాలి? ఆ చర్మము మనము స్వయంగా ఉపయోగించుకోవటానికి అవకాశము ఉంటే ఉపయోగించుకోవచ్చును. మనకు ఉపయోగించుకోవటం రాదు అంటే ఇతరులకు దానం చేసేయాలి. లేదా అమ్మేసి వచ్చిన సొమ్ముని దానం చేసేయాలి అంతేగాని పశువుని జిబాహ్ చేసిన తర్వాత ముక్కలు చేసి ఇవ్వటానికి వచ్చిన కసాయికి కూలీ రూపంలో మాత్రము ఇవ్వటానికి అనుమతి లేదు. కూలీ రూపంలో జేబు నుంచి డబ్బు చెల్లించండి, కానీ ఆ ఖుర్బానీ ఇవ్వబడిన పశువు చర్మాన్ని కూలీ రూపంలో కసాయికి ఇవ్వటానికి అనుమతి లేదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.

ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చునా లేదా? అంటే ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.

ఎవరైతే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చును అని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారో వారు చూపిస్తున్న ఆధారాలన్నీ బలహీనమైనవి. ప్రామాణికమైన ఆధారాలలో ఎక్కడా ఆ విషయం బోధపడలేదు.

ఇక ఎవరైతే ఖుర్బానీ ఇవ్వటానికి అనుమతి ఉంది అని చెబుతూ వేరే మార్గాలు చూపిస్తున్నారో వారేమంటున్నారంటే, ఒకవేళ మరణించిన వ్యక్తి మరణించే ముందు “నేను మరణించిన తర్వాత నా తరపున ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేస్తూ ఉండండి” అని వసీయత్ (హితవు) చేసి ఉంటే, అప్పుడు అతని తరపున ఖుర్బానీ చేయడానికి అనుమతి ఉంటుంది అని కొంతమంది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

మరి కొంతమంది అయితే అది కూడా ఒక దానం కదండీ, అది చేయవచ్చును అంటున్నారు.

అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమారులు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలు మరణించారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఇంతమంది మరణించి ఉన్నా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరము కూడా “మరణించిన నా సతీమణి ఖదీజా పేరున నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమారుల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమార్తెల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను” అని చేయలేదు. కాబట్టి మరణించిన వ్యక్తుల పేరిట ప్రత్యేకంగా ఖుర్బానీ చేయడానికి అనుమతి లేదు.

కాకపోతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మనము పాటిస్తే, ఇన్ షా అల్లాహ్ బ్రతికి ఉన్న వారికి మరణించిన వారికి అందరికీ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది. అది ఎలాగంటే చూడండి: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమని దుఆ పటించేవారు అంటే,

اللَّهُمَّ تَقَبَّلْ مِنْ مُحَمَّدٍ، وَآلِ مُحَمَّدٍ
(అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ముహమ్మద్ వ ఆలి ముహమ్మద్)
ఓ అల్లాహ్! నేను ఇస్తున్న ఈ ఖుర్బానీ నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసేవారు.

ఇక ఆయన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్నవారు ఉన్నారు, మరణించి ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన తరఫున, ఆయన కుటుంబీకుల్లో బ్రతికి ఉన్న, మరణించిన వారందరి తరపున ఖుర్బానీ అయ్యింది, అందరికీ ఖుర్బానీ పుణ్యము బహుశా ప్రాప్తమయింది అని ధార్మిక పండితులు ఆశాభావం వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే, మనము కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసుకుంటే మన తరఫున ఖుర్బానీ అయిపోతుంది, మన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్న, మరణించి ఉన్న వారందరి తరఫున కూడా ఖుర్బానీ అయిపోతుంది. అందరికీ కూడా ఇన్ షా అల్లాహ్ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

చివరిలో ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయవలసిందేనా? అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అప్పు చేసి మరి తప్పనిసరిగా ఖుర్బానీ చేయమని ఆదేశించలేదు కానీ, మనకు అల్లాహ్ శక్తి ఇచ్చి ఉంటే… ఖుర్బానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాత్రమే అవుతుంది, మిగతా రోజుల్లో ఖుర్బానీ అవ్వదు. అయితే అనుకోకుండా ఆ సమయానికి మన వద్ద డబ్బు లేదు అనేటట్లయితే అప్పటికప్పుడు ఎక్కడినుంచైనా డబ్బు తీసుకొని తర్వాత ఇన్ షా అల్లాహ్ మనము చెల్లించుకోగలము అనే ధైర్యము ఉంటే అప్పుడు అప్పు తీసుకుని ఖుర్బానీ చేసుకోవటం మంచిది, ఉత్తమం. చూడండి డబ్బులు లేకపోయినా స్నేహితులకు పార్టీలు ఇస్తాం బాకీలు చేసి, వేరే చాలా కార్యాలు చేస్తాం. మరి పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో ఎందుకు వెనకడుగు వేయాలి? బేకారు విషయాలలో ధైర్యము చేస్తాం పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో మాత్రము కంగారుపడతామంటే ఇది సరికాదు మిత్రులారా. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇస్తాడు నేను బాకీ చెల్లించుకోగలను అని అల్లాహ్ మీద నమ్మకంతో అప్పు చేసి ఖుర్బానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చును, అది మంచిదే అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

అలాగే ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నాడో అతను జుల్ హిజ్జా మాసం ప్రారంభము నుండి ఖుర్బానీ ఇచ్చేంత వరకు కూడా వెంట్రుకలు కత్తిరించరాదు, గోర్లు కత్తిరించరాదు, చర్మము కత్తిరించరాదు. ఒకవేళ మర్చిపోయి ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న వ్యక్తి మధ్యలో గోర్లు కత్తిరించేసాడు లేదా చర్మం కత్తిరించేసాడు అంటే అతను అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, ఎలాంటి కఫ్ఫారా పరిహారము చెల్లించాల్సిన అవసరమైతే లేదు.

అలాగే ఖుర్బానీ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసము ఇఖ్లాస్ తో చిత్తశుద్ధితో చేయాలి. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. అలాగే పిసినారితనము కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్లు, షావుకార్లు కూడా ఖుర్బానీ విషయంలో పిసినారితనము చూపిస్తూ ఏదో ఒక సాధారణమైన చిన్న పశువు తీసుకొని ఖుర్బానీ చేసేసి చెల్లించేద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారు పిసినారితనం ప్రదర్శిస్తూ ఉంటారు, సంవత్సరంలో ఒక్కసారి చేయబడే ఖుర్బానీ విషయంలో పిసినారితనము ప్రదర్శించకండి.

సంతోషంగా అల్లాహ్ మార్గంలో ధనము ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మనము ఇస్తున్న ఖుర్బానీ పశువు యొక్క మాంసము అవసరము లేదు, రక్తము అవసరము లేదు, మనము అల్లాహ్ చిత్తము కోసము సంతోషంగా ఖుర్బానీ చేస్తామా లేదా అనేది అల్లాహ్ చూస్తున్నాడు.

لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ
(లయ్యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహుత్ తఖ్వా మిన్ కుమ్)
వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (22:37)

అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు కాబట్టి, పిసినారితనము ప్రదర్శించకుండా సంతోషంగా పశువు కొని మంచి పశువు కొని అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ చేయాలి.

అలాగే రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది డబ్బు ఖర్చు చేస్తారు, మంచి పశువుని కొంటారు, కాకపోతే “నేను ఇంత మంచి పశువుని కొన్నాను” అని ఆ పశువు మెడలో దండలు వేసి ఊరిలో ఊరేగింపు చేస్తూ ఉంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్రదర్శనా బుద్ధితో అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఫోటోలు దింపి, దండలు వేసి, ఇంకా ఏమేమో హంగులు చేసి ఆ ఫోటోలను ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, ఇంకా వీడియోలు తీసి యూట్యూబ్ లలో ఎక్కడెక్కడో వారు ప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా మనిషిలో చిత్తశుద్ధి అనేది లేకుండా పోతుంది. ప్రదర్శనా బుద్ధి అక్కడ వచ్చేస్తుంది, దీనినే ఇస్లామీయ పరిభాషలో రియాకారీ అంటారు. రియా ఉద్దేశంతో, ప్రదర్శనా ఉద్దేశంతో, ప్రదర్శనా బుద్ధితో చేసిన ఏ పుణ్యకార్యము అల్లాహ్ స్వీకరించడు, ఈ ఖుర్బానీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొద్ద స్వీకరించబడదు.

కాబట్టి ఖుర్బానీ చేస్తున్నవారు అటు పిసినారితనము ప్రదర్శించకుండా, ఇటు ప్రదర్శనా బుద్ధిని కూడా ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ చేయాలి. అలాగే ధర్మసమ్మతమైన హలాల్ సంపదతోనే ఖుర్బానీ పశువు కొని ఖుర్బానీ చేయాలి. హరామ్ సంపదతో పశువు కొని ఖుర్బానీ చేస్తే ఆ ఖుర్బానీ ఆమోదించబడదు. హరామ్ సంపదతో ఏ పుణ్యకార్యము చేసినా అది ఆమోదించబడదు, స్వీకరించబడదు.

ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు సూచనలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరికీ హలాల్ సంపదతో, చిత్తశుద్ధితో, సంతోషంగా మంచి పశువుని అల్లాహ్ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ఎవరెవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్తోమత ఇచ్చారో వారందరూ ఖుర్బానీ చేసుకునే భాగ్యం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఎవరికైతే స్తోమత లేదో వారందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్బానీ చేయటానికి అర్హత, స్తోమత ప్రసాదించుగాక. ఆమీన్ తకబ్బలల్లాహు మిన్నా వమిన్ కుమ్ వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16954

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ స్మరణ విశిష్టత & దాని వల్ల కలిగే ప్రయోజనాలు (Dhikr of Allah) [ఆడియో]

బిస్మిల్లాహ్
అల్లాహ్ స్మరణ విశిష్టత & దాని వల్ల కలిగే ప్రయోజనాలు (Dhikr, Zikr of Allah) – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[జిక్ర్ ,దుఆ] -మెయిన్ పేజీ
https://teluguislam.net/dua-supplications

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057

ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు| విశ్వాస పాఠాలు | హదీసు 13 [వీడియో]

బిస్మిల్లాహ్

[8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ قَالَ: قَالَ رَسُولُ اللهِ : (إِذَا أَسْلَمَ الْعَبْدُ فَحَسُنَ إِسْلَامُهُ كَتَبَ اللهُ لَهُ كُلَّ حَسَنَةٍ كَانَ أَزْلَفَهَا وَمُحِيَتْ عَنْهُ كُلُّ سَيِّئَةٍ كَانَ أَزْلَفَهَا ثُمَّ كَانَ بَعْدَ ذَلِكَ الْقِصَاصُ الْحَسَنَةُ بِعَشْرَةِ أَمْثَالِهَا إِلَى سَبْعِ مِائَةِ ضِعْفٍ وَالسَّيِّئَةُ بِمِثْلِهَا إِلَّا أَنْ يَتَجَاوَزَ اللهُ عَزَّ وَجَلَّ عَنْهَا)

13- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఏ దాసుడు ఇస్లాం స్వీకరించి, దాని ప్రకారం ఆచరిస్తాడో అతను గతంలో చేసిన ప్రతి పుణ్యాన్ని అల్లాహ్ వ్రాసి పెడతాడు. గతంలో చేసిన అతని ప్రతి పాపం మన్నించబడుతుంది. ఆ తర్వాత పుణ్యపాపాల ఫలితాల లెక్క కొత్తగా మొదలవుతుంది. ఒక సత్కార్య పుణ్యం పది రెట్ల నుండి ఏడువందల వరకు లభిస్తుంది. దుష్కార్య పాపము దానంతే లభిస్తుంది. అల్లాహ్ దయతలుస్తే మన్నించనూవచ్చు”. (నిసాయీ 4912).


ఈ హదీసులో:

కొందరు సంపూర్ణంగా ఇస్లాం ప్రకారం నడిచేవారుంటే మరికొందరు అసంపూర్ణంగా నడిచేవారుంటారు. అందుచేత వారిలో ఒకరిపై మరొకరికి ఘనత ఉంటుంది. అందుకే అది (ఇస్లాం, ఈమాన్) తరుగుతుంది, పెరుగుతుంది. ఇస్లాంలో ప్రవేశం ద్వారా పూర్వ పాపాలన్నీ మన్నించబడతాయి. అలాగే తౌబా (నిజమైన పశ్చాత్తాపంతో కూడిన క్షమాభిక్ష) ద్వారా పాపాలు మన్నించబడతాయి. అంతేకాదు సంకల్పశుద్ధి మరియు ప్రవక్త పద్ధతిని అనుసరించి చేసిన సత్కార్యాలు కూడా దుష్కార్యాలకు పరిహారమవుతాయి. అల్లాహ్ కారుణ్యం చాలా విశాలమైనది. అందుకే సత్కార్య పుణ్యాన్ని పది రెట్ల నుండి ఏడువందల రెట్ల వరకు పెంచాడు. దుష్కార్య పాపం దానంతే ఉంచాడు. ఒక్కోసారి అల్లాహ్ దయతలచి సత్కార్యాలకు బదులుగా కాకుండా తనిష్టంతో పాపాల్ని మన్నిస్తాడు. కాని పెద్ద పాపాల మన్నింపుకై తప్పనిసరిగా తౌబా చేయవలసిందేనని ఆధారాలుగలవు. అవిశ్వాసుని ఏ ఒక్క కార్యం స్వీకరించబడదు అన్న విషయం తెలిసినదే. అయినా ఈ హదీసు ద్వారా కూడా తెలిసింది. ఈ హదీసులో దాసుడు అని సాధారణంగా చెప్పబడినది, అయితే స్త్రీలకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

విశ్వాసి, అవిశ్వాసి కన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు | విశ్వాస పాఠాలు | హదీసు 12 [వీడియో]

బిస్మిల్లాహ్

[10 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ عَائذِ بنِ عَمرو أَنَّهُ جَاءَ يَومَ الْفَتحِ مَعَ أبِي سُفيانَ بنِ حَربٍ وَرَسُولُ اللهِ حَولَه أصْحَابُهُ فَقَالُوا: هَذَا أبُو سُفيانَ وَعَائِذُ بنُ عَمرو فَقَالَ رَسُولُ اللهِ : (هَذَا عَائِذُ بنُ عَمرو وَأبو سُفيَانَ ، الإسْلاَمُ أَعَزُّ مِنْ ذَلِكَ، الإسلاَمُ يَعْلُو وَلاَ يُعلى).

12- ఆయిజ్ బిన్ అమ్ర్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం, మక్కా జయింపబడిన రోజు అతను అబూ సుఫ్యాన్ (*) తో కలసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్న సహచరులు (వీరు వస్తున్నది చూసి) అదిగో అబూ సుఫ్యాన్ మరియు ఆయిజ్ బిన్ అమ్ర్ అని అన్నారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు:

“వీరు ఆయిజ్ బిన్ అమ్ర్ మరియు అబూ సుఫ్యాన్. ఇస్లాం ధర్మం ఇతనికంటే గౌరవనీయమైనది, గొప్పది. ఇస్లాం ధర్మం ఎన్నటికీ అగ్రస్థానం లో ఉంటుంది తప్ప క్రిందికి వంగి ఉండదు సుమా”.

(సునన్ దార్ ఖుత్నీ, సుననుల్ కుబ్రా బైహఖీ. అల్ ఇర్వా 1268).

(*) ఆ సమయాన అబూ సుఫ్యాన్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. కాని ఆయిజ్ బిన్ అమ్ర్  అప్పటికే ఇస్లాం స్వీకరించిఉన్నారు.


ఈ హదీసులో:

సర్వ మతాల్లోకెల్లా ఇస్లాం మాత్రమే అల్లాహ్ యొక్క సత్య ధర్మం. విశ్వాసి, అవిశ్వాసికన్నా ఎక్కువ గౌరవ, మర్యాదలకు అర్హుడు. ఆ అవిశ్వాసి ఎంత గొప్ప స్థానం, హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడైనా సరే. ఎందుకంటే ఇస్లాం వీటన్నిటికంటే గొప్పది. గౌరవం, ప్రతిష్ట, ప్రేమ మర్యాదల్లో విశ్వాసి, అవిశ్వాసులు సమానులు కాజాలరు. ముస్లిం వద్ద ఇస్లాం ఉన్నందువల్ల అతని మాటే వేరు.

విశ్వాసి, అవిశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడవుతాడు కాని అవిశ్వాసి, తన విశ్వాస బంధువుల ఆస్తిలో హక్కుదారుడు కాడని కొందరు పండితులు సిద్ధాంతీకరించారు. కాని నిజమైన మాటేమిటంటే విశ్వాసి, అవిశ్వాసులిద్దరూ పరస్పరం ఆస్తిలో హక్కుదారులు కాజాలరు.


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

రధీతు బిల్లాహి రబ్బన్, వ బిల్ఇస్లామి దీనన్, వబి ముహమ్మదిన్ రసూలన్ | విశ్వాస పాఠాలు | 11వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ أَنَّ رَسُولَ اللهِ قَالَ: (يَا أَبَا سَعِيدٍ مَنْ رَضِيَ بِاللهِ رَبًّا وَبِالْإِسْلَامِ دِينًا وَبِمُحَمَّدٍ نَبِيًّا وَجَبَتْ لَهُ الْجَنَّةُ).

11- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం )ఉపదేశించారని, అబూ సఈద్ ఖుద్రీ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

“ఓ అబూ సఈద్! అల్లాహ్ ను తన పోషకునిగా విశ్వసించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా నమ్మినవాడు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాడు”. (ముస్లిం 1884).

ఈ హదీసులో:

ఈ మూడింటిని ఎవరైతే పూర్తి విశ్వాసముతో, స్వచ్ఛత, సంకల్పశుద్ధితో నోటి ద్వారా పలుకుతాడో తప్పక అల్లాహ్ అతనిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఎందుకనగా మూడు విషయాల్ని అతడు వాస్తవం చేసిచూపాడు. మరియు ధర్మానికి సంబంధించిన ముఖ్య పునాదుల్ని నమ్మాడు. అవిః అల్లాహ్ పట్ల విశ్వాసం. సత్యధర్మ స్వీకారం. సత్యవంతులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమ్మకం.

—-

رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ نَبِيًّا ، وَجَبَتْ له الجنَّةُ
“రధీతుబిల్లాహి రబ్బా, వబిల్ ఇస్లామి దీనా, వబి ముహమ్మదిన్ నబియ్యా“ ఎవరు ఈ దుఆ ఉదయం చదువుతారో, అతని చేయిని పట్టుకొని స్వర్గంలో ప్రవేశింపజేస్తానని ప్రవక్త పూచీ తీసుకున్నారు

والحديث فيه أخرجه الطبراني في “المعجم الكبير” (20/355) ، من طريق الْمُنَيْذِرِ صَاحِبِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ – وَكَانَ يَكُونُ بِإِفْرِيقِيَّةَ – قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ قَالَ إِذَا أَصْبَحَ: رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِالْإِسْلَامِ دِينًا ، وَبِمُحَمَّدٍ نَبِيًّا ، فَأَنَا الزَّعِيمُ لِآخُذَ بِيَدِهِ حَتَّى أُدْخِلَهُ الْجَنَّةَ . والحديث حسنه بهذا اللفظ الشيخ الألباني في “السلسلة الصحيحة” (2686) .

ఎవరు అజాన్ లో షహాదతైన్ సందర్భంలో (లేదా చివరిలో) చదువుతారో వారి పాపాలు మన్నించబడతాయి. (సహీ ముస్లింలో 386)

أخرجه مسلم في “صحيحه” (386) ، من حديث سَعْدِ بْنِ أَبِي وَقَّاصٍ ، عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:

مَنْ قَالَ حِينَ يَسْمَعُ الْمُؤَذِّنَ: أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ ، رَضِيتُ بِاللهِ رَبًّا ، وَبِمُحَمَّدٍ رَسُولًا ، وَبِالْإِسْلَامِ دِينًا ، غُفِرَ لَهُ ذَنْبُهُ .

మరెవరయితే ఎప్పుడైనా (సమయం నిర్థారిత కాకుండా, స్వచ్ఛమైన మనస్సుతో, అర్ధభావాలను తెలుసుకోని, ఆచరించి) చదువుతాడో అతని కొరకు స్వర్గం తప్పనిసరి. (అబూదావూద్ లోని సహీ హదీస్ 1368)

من حديث أبي سعيدِ الخدريَّ ، أن رسولَ الله – صلَّى الله عليه وسلم – قال: مَنْ قال: رَضيتُ بالله رَبّاً ، وبالإسلامِ ديناً ، وبمحمَدِ رَسولاً ، وَجَبَتْ له الجنَّةُ . والحديث صححه الشيخ الألباني في “صحيح أبي داود” (1368) .


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw

అన్ని ధర్మాల్లో అల్లాహ్ కు అతి ప్రియమైన ధర్మం | విశ్వాస పాఠాలు | 9వ హదీస్ [వీడియో]

బిస్మిల్లాహ్

[20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

عَنِ ابْنِ عَبَّاسٍ قَالَ: قِيلَ لِرَسُولِ اللهِ : أَيُّ الْأَدْيَانِ أَحَبُّ إِلَى اللهِ قَالَ: (الْحَنِيفِيَّةُ السَّمْحَةُ).

9- ఇబ్ను అబ్బాస్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం ప్రకారం, ధర్మాల్లో ఏ ధర్మం అల్లాహ్ కు చాలా ప్రియమైనదని ప్రవక్త వద్దకు వచ్చిన ప్రశ్నకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం

అతిసులభమైన, షిర్క్ కు దూరమైన ఇస్లాం ధర్మం (హనీఫియ్య) ” అని సమాధానమిచ్చారు.

(అహ్మద్ 1/236. హాఫిజ్ ఇబ్ను హజర్ రహిమహుల్లాహ్ ఫత్హుల్ బారి (హ. 38 తర్వాత) లో ఈ హదీసును “హసన్” అని చెప్పారు).

ఈ హదీసులో:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పంపబడిన ఇస్లాం ధర్మం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కు ఇవ్వబడిన సవ్యమైన ధర్మమే. అది చాలా సులభమైనది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మెత్తగా ప్రవర్తించుటకు, వారిపై మోపబడిన భారాన్ని తగ్గించుటకు, వారి శృంఖలాలను తెంచుటకు పంపబడ్డారు. అల్లాహ్ ప్రేమిస్తాడని తెలిసింది. కాని అది ఆయనకు తగిన రీతిలో అని నమ్మాలి. సృష్టిరాసుల పరస్పర ప్రేమతో పోల్చరాదు.

ఘనత పరంగా ధర్మాల్లో వ్యత్యాసం గలదు. ఇబ్రాహీం అలైహిస్సలాం కు అతి చేరువుగా ఉన్నవారు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మెత్తగా ప్రవర్తించుట, శుభవార్త వినిపిస్తూ మెలగుట మంచిదని, కష్టం కలిగించకుండా, విరక్తి కలిగించకుండా ఉండాలని చెప్పబడింది. ఈ విషయంలో ఈ హదీసు చాలా స్పష్టంగా ఉందిః

“మెత్తగా మెలగండి, కఠినంగా మెలగకండి. సంతృప్తి కలిగించండి. విరక్తి కలిగించకండి”.
(బుఖారి 69, ముస్లిం 1732)


విశ్వాస పాఠాలు [పుస్తకం] & వీడియో పాఠాలు:
https://teluguislam.net/2019/11/14/aqeeda-lessons/

విశ్వాస పాఠాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3zyecdeAcRg4nd8ZRnA2Uw