షిర్క్ యొక్క మూలాలు (The Origins of Shirk) – షేక్ అల్-అల్బానీ 

షిర్క్ యొక్క మూలాలు (The Origins of Shirk) [1]
రచయిత: షేక్ అల్-అల్బానీ (Shaykh al-Albaanee)
https://abdurrahman.org/2014/01/17/the-origins-of-shirk/
అల్-ఇబానా మ్యాగజైన్, సంచిక నం.3 – దుల్-ఖాదహ్ 1416H / ఏప్రిల్ 1996

షరీఅత్ (ధర్మశాస్త్రం)లో నిర్ధారించబడిన అంశం ఏమిటంటే, మానవాళి – ప్రారంభంలో – స్వచ్ఛమైన ‘తౌహీద్’ (ఏకదైవారాధన)పై ఉన్న ఒకే సమాజంగా ఉండేది. ఆ తరువాత ‘షిర్క్’ (ఆరాధనలోని ఏ భాగాన్నైనా, రూపాన్నైనా, లేదా కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందాల్సిన హక్కును అల్లాహ్ యేతరులకు ఆపాదించడం/సాటి కల్పించడం) క్రమంగా వారిని ఆవహించింది. దీనికి ఆధారం మహోన్నతుడు, శుభకరుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్యం:

كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنْذِرِينَ

మానవులంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లాహ్‌ ప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా, భయపెట్టే వారుగా చేసి పంపాడు. (సూరహ్ అల్-బఖరహ్ 2:213)

ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు:

నూహ్ మరియు ఆదమ్ (అలైహిమస్సలాం) ల మధ్య పది తరాల అంతరం ఉండేది. వారందరూ సత్యధర్మమైన షరీఅత్ పైనే స్థిరంగా ఉండేవారు, ఆ తరువాత వారు విభేదించుకున్నారు. అప్పుడు అల్లాహ్ శుభవార్తనిచ్చేవారిగా మరియు హెచ్చరించేవారిగా ప్రవక్తలను పంపాడు.” [2]

ఇబ్న్ ఉర్వా అల్-హంబలీ (మరణం హి.శ 837) ఇలా అన్నారు:

“ఖాబిల్ (Cain) మరియు అతని కుమారులు అగ్ని ఆరాధకులు అని దావా చేసే గ్రంథ ప్రజలలోని (People of the Book) చరిత్రకారుల వాదనను ఈ మాట ఖండిస్తుంది.”.” [3]

నేను (రచయిత) చెబుతున్నాను: మానవుని (సహజ) మూల స్వభావం షిర్క్ అని, మరియు తౌహీద్ మానవునిలో క్రమంగా పరిణామం చెందిందని వాదించే కొందరు తత్వవేత్తలకు మరియు నాస్తికులకు కూడా ఇందులో ఒక ఖండన ఉంది! పైన పేర్కొన్న ఆయత్ (ఖుర్ఆన్ వాక్యం) ఈ వాదనను అబద్ధమని రుజువు చేస్తుంది, అలాగే ఈ క్రింది రెండు ప్రామాణికమైన (సహీహ్) హదీసులు కూడా దీనిని ఖండిస్తున్నాయి:

మొదటిది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువు (అల్లాహ్) నుండి ఉల్లేఖించిన మాట (హదీసే ఖుద్సీ) ఇలా ఉంది:

إِنِّي خَلَقْتُ عِبَادِي حُنَفَاءَ كُلَّهُمْ، وَإِنَّهُمْ أَتَتْهُمُ الشَّيَاطِينُ فَاجْتَالَتْهُمْ عَنْ دِينِهِمْ، وَحَرَّمَتْ عَلَيْهِمْ مَا أَحْلَلْتُ لَهُمْ، وَأَمَرَتْهُمْ أَنْ يُشْرِكُوا بِي مَا لَمْ أُنْزِلْ بِهِ سُلْطَانًا

నేను నా దాసులందరినీ సత్యధర్మంపై (షిర్క్ లేని తౌహీద్ పై) సృష్టించాను. ఆ తరువాత షైతాన్లు వారి వద్దకు వచ్చి, వారిని వారి సత్యధర్మం నుండి దారి తప్పించాయి. నేను వారికి ధర్మసమ్మతం (హలాల్) చేసినవాటిని, అవి వారికి నిషిద్ధం (హరామ్) చేశాయి. నేను ఎలాంటి ఆధారాన్ని దించని వాటిని వారు నా పట్ల భాగస్వాములుగా (షిర్క్) చేయాలని ఆ షైతాన్లు వారిని ఆదేశించాయి.” [4]

రెండవది: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనం:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ، أَوْ يُنَصِّرَانِهِ، أَوْ يُمَجِّسَانِهِ، كَمَثَلِ البَهِيمَةِ تُنْتَجُ البَهِيمَةَ جَمْعَاءَ، هَلْ تُحِسُّونَ فِيهَا مِنْ جَدْعَاءَ

ప్రతి శిశువూ ఫిత్రా (ఇస్లాం/తౌహీద్ యొక్క సహజ స్వభావం)[5] పైనే జన్మిస్తాడు. అయితే అతని తల్లిదండ్రులు అతనిని యూదునిగానో, క్రైస్తవునిగానో లేదా మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో మారుస్తారు. ఇది ఒక జంతువు పూర్తి అవయవాలున్న ఆరోగ్యవంతమైన పిల్లకు జన్మనివ్వడం లాంటిది. మీరు దాని చెవిని కోయడానికి ముందు (పుట్టుకతోనే) చెవి కోయబడి ఉండడాన్ని మీరెప్పుడైనా చూశారా?

ఆ తరువాత అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “మీరు కావాలంటే (ఈ ఖుర్ఆన్ వాక్యాన్ని) పఠించండి:

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ

అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! (సూరహ్ అర్-రూమ్ 30:30) [6]

ఈ స్పష్టమైన వివరణ తరువాత, మువహ్హిదీన్ (తౌహీద్ పై ఉన్న ప్రజలు) గా ఉన్నప్పటికీ, విశ్వాసులలో షిర్క్ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడం ఒక ముస్లింకు అత్యంత ఆవశ్యకమైన విషయం. అత్యంత పరిపూర్ణుడైన అల్లాహ్ నూహ్ (అలైహిస్సలాం) జాతి గురించి చెప్పిన మాటలను పరిశీలిస్తే:

وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

ఇంకా వారిలా అన్నారు – ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్ద్ ను గానీ, సువాను గానీ, యగూస్, యవూఖ్, నస్ర్ లను గానీ వదలి పెట్టకండి.” (సూరహ్ నూహ్ 71:23)

సలఫ్ (సజ్జనులైన పూర్వీకుల) బృందం నుండి అనేక ఉల్లేఖనాలలో ఇలా తెలుపబడింది: దైవాలని భావించే ఈ ఐదుగురు నిజానికి సజ్జనులైన ఆరాధకులు. అయితే వారు మరణించినప్పుడు, వారి సమాధుల వద్ద ఆశ్రయం పొంది కూర్చోవాలని షైతాన్ ఆ ప్రజల మనస్సులలో వసవసా (దురాలోచన) కలిగించాడు. ఆ తరువాత వారి తర్వాతి తరానికి, వారిని విగ్రహాలుగా మలచుకోవాలని వసవసా కలిగించాడు. విగ్రహాల వల్ల వారిని గుర్తుంచుకుంటారని తద్వారా వారు చేసిన సత్కార్యాలనే అనుకరిస్తారని వారికి అందంగా భ్రమింపజేశాడు. ఆ తరువాత వచ్చిన మూడవ తరానికి, వారు సర్వోన్నతుడైన అల్లాహ్ తో పాటు ఈ విగ్రహాలను కూడా ఆరాధించాలని షైతాన్ దురాలోచన కలుగజేశాడు. “మీ పూర్వీకులు కూడా ఇలాగే చేసేవారు కదా!!!” అని వారిని నమ్మించాడు.

అప్పుడు అల్లాహ్ మాత్రమే ఆరాధించబడాలని ఆదేశించడానికి వారి వద్దకు నూహ్ (అలైహిస్సలాం) ను అల్లాహ్ పంపాడు. కానీ కొద్దిమంది తప్ప ఇంకెవరూ ఆయన పిలుపుకు స్పందించలేదు. సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడైన అయిన అల్లాహ్ ఈ సంఘటన మొత్తాన్ని సూరహ్ నూహ్ లో వివరించాడు. ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన విధంగా: “నిశ్చయంగా ఈ ఐదు పేర్లు నూహ్ జాతికి చెందిన పుణ్యాత్ములైన వ్యక్తులవి. వారు చనిపోయినప్పుడు, షైతాన్ వారి ప్రజలకు వారి విగ్రహాలను తయారు చేసి వారిని గుర్తుంచుకోవడానికి వారి సమావేశ మందిరాలలో ప్రతిష్టించాలని వసవసా (దుర్బోధ) కలిగించాడు, వారు అలాగే చేశారు. అయితే, వారు ఆ విగ్రహాలను ఎన్నడూ ఆరాధించలేదు. కానీ ఆ తరం వారు చనిపోయిన తరువాత, ఆ విగ్రహాల అసలు ఉద్దేశ్యం మరచిపోబడింది. అప్పుడు (ఆ తర్వాతి తరం వారు) వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు.” [7]

ఇబ్న్ జరీర్ అత్-తబరీ మరియు ఇతరులు అనేక మంది సలఫ్‌ల (సజ్జనులైన పూర్వీకుల) నుండి ఇలాంటి విషయాలనే ఉల్లేఖించారు. అద్-దుర్రుల్-మన్సూర్ (6/269)లో: అబ్దుల్లాహ్ ఇబ్న్ హుమైద్, అబూ ముత్తహర్ ద్వారా ఉల్లేఖించారు, ఆయన ఇలా అన్నారు: యజీద్ ఇబ్న్ అల్-ముహల్లబ్ గురించి అబూ జాఫర్ అల్-బాఖిర్ (మరణం హి.శ 114) తో ప్రస్తావించబడినప్పుడు ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కాకుండా మొదటిసారిగా ఎవరినైతే ఆరాధించారో ఆ ప్రదేశంలోనే అతడు చంపబడ్డాడు”. ఆ తరువాత ఆయన ‘వద్ద్’ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు:

వద్ద్ ఒక ముస్లిం వ్యక్తి, అతనిని అతని ప్రజలు ఎంతగానో ప్రేమించేవారు. అతను మరణించినప్పుడు, బాబిల్ (బాబిలోన్) ప్రాంతంలో ప్రజలు అతని సమాధి చుట్టూ గుమిగూడి విలపిస్తూ, శోకించడం ప్రారంభించారు. వారు అతని కోసం శోకిస్తూ విలపించడాన్ని ఇబ్లీస్ (షైతాన్) చూసినప్పుడు, ఒక మనిషి రూపం ధరించి వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ‘మీరు అతని కోసం దుఃఖిస్తూ విలపించడాన్ని నేను చూస్తున్నాను. అయితే మీరు అతని చిత్రాన్ని (అనగా విగ్రహాన్ని) తయారు చేసి, అతన్ని గుర్తుంచుకోవడానికి మీ సమావేశ మందిరాలలో ఎందుకు ఉంచకూడదు?’. దానికి వారు: ‘సరే’ అన్నారు, మరియు అతని చిత్రాన్ని (విగ్రహాన్ని) తయారు చేసి వారి సమావేశ మందిరంలో ఉంచారు; అది వారిని అతన్ని గుర్తుచేసేలా చేసింది. వారు అతన్ని (అతిగా) స్మరించుకోవడాన్ని చూసిన ఇబ్లీస్, ఇలా అన్నాడు: ‘మీలో ప్రతి ఒక్కరూ మీ ఇళ్ళలో ఉంచుకోవడానికి ఇలాంటి చిత్రాన్ని ఎందుకు తయారు చేయకూడదు, తద్వారా మీరు అతనిని (నిరంతరం) స్మరించుకోవచ్చు’. దానికి వారందరూ ‘సరే’ అన్నారు. కాబట్టి ప్రతి ఇంటి వారు అతని చిత్రాన్ని (విగ్రహాన్ని) తయారు చేశారు, వారు దానిని పూజించడం మరియు భక్తితో ఆరాధించడం ప్రారంభించారు, అది వారికి నిరంతరం అతనిని గుర్తుచేసేది.” అబూ జాఫర్ ఇలా అన్నారు: “ఆ తరువాత వచ్చిన తరం వారు (తమ పూర్వీకులు) చేసినదానిని చూసి వారు అతనిని అల్లాహ్ తో పాటు ఆరాధించబడే ఇలాహ్ (ఆరాధ్య దైవంగా) స్వీకరించే స్థాయికి చేరుకున్నారు.” ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ కాకుండా ఆరాధించబడిన మొట్టమొదటి విగ్రహం ఇదే, ఆ విగ్రహాన్ని వారు ‘వద్ద్’ అని పిలిచారు.”[8]

ఈ విధంగా శుభకరుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క జ్ఞానం (హిక్మత్) పరిపూర్ణమైంది. ఆయన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అంతిమ ప్రవక్తగా పంపినప్పుడు మరియు దైవికమైన అన్ని ధర్మశాస్త్రాల ముగింపుగా ఆయన షరీఅత్ ను పరిపూర్ణం చేసినప్పుడు, మహా పాపమైన షిర్క్ లో ప్రజలు పడిపోయే అన్ని మార్గాలను మరియు దారులను ఆయన నిషేధించాడు. ఈ కారణంగానే, సమాధులపై కట్టడాలు (దర్గాలు/మజార్లు) నిర్మించడం, ప్రత్యేకంగా వాటి సందర్శన కొరకే ప్రయాణించడం, వాటిని పండుగలు మరియు సమావేశాల స్థలాలుగా మార్చుకోవడం, మరియు సమాధిలో ఉన్నవారి పేరిట ప్రమాణాలు చేయడం; ఇవన్నీ ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఇవన్నీ మితిమీరిన భక్తికి (అతివాదానికి) దారితీస్తాయి మరియు తద్వారా సర్వోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధనకు (షిర్క్ కు) దారితీస్తాయి.

జ్ఞానం క్షీణిస్తున్న, అజ్ఞానం పెరుగుతున్న ఈ యుగంలో ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. (సత్యాన్ని బోధించే) చిత్తశుద్ధి గల సలహాదారులు చాలా తక్కువగా ఉన్నారు మరియు మానవాళిని దారి తప్పించడానికి, శుభకరుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఒక్కడి ఆరాధన నుండి వారిని దూరం చేయడానికి షైతాన్ మానవులతో మరియు జిన్నాతులతో సహకరిస్తున్నాడు.

  1. తహ్దీరుస్-సాజిద్ మిన్ ఇత్తిఖాదిల్-ఖుబూరి మసాజిద్ (పేజీలు 101-106)
  2. ఇబ్న్ జరీర్ అత్-తబరీ తన తఫ్సీర్ (4/275) లో మరియు అల్-హాకిమ్ (2/546) ఉల్లేఖించారు. హాకిమ్ దీని గురించి ఇలా అన్నారు: “ఇది అల్-బుఖారీ ప్రమాణాల ప్రకారం ప్రామాణికమైనది.” అజ్-జహబీ కూడా దీనితో ఏకీభవించారు.
  3. అల్-కవాకిబుద్-దురారీ ఫీ తర్తీబ్ ముస్నదుల్-ఇమామ్ అహ్మద్ ‘అలా అబ్వాబిల్-బుఖారీ (6/212/1), వ్రాతప్రతి (మాన్యుస్క్రిప్ట్) రూపంలో.
  4. ముస్లిం (8/159) మరియు అహ్మద్ (4/162) ద్వారా ఇయాజ్ ఇబ్న్ హిమార్ అల్-ముజాషిఈ (రదియల్లాహు అన్హు) నుండి ఉల్లేఖించబడింది.
  5. [సంపాదకుల వివరణ] ఇబ్న్ అల్-అసీర్ అన్-నిహాయా (3/457) లో ఇలా అన్నారు: “అల్-ఫిత్ర్: అంటే ప్రారంభించడం మరియు సృష్టించడం, మరియు అల్-ఫిత్రా అనేది దాని ఫలితంగా ఏర్పడే పరిస్థితి (స్వభావం). దీని అర్థం ఏమిటంటే మానవాళి సత్యధర్మాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న (స్వచ్ఛమైన) స్వభావం పైనే జన్మిస్తుంది. కాబట్టి అతనిని ఈ స్వభావం పైనే వదిలేస్తే, అతను దానిపైనే కొనసాగుతాడు. అయితే, దీని నుండి దారి తప్పేవారు మానవ బలహీనతలను అనుసరించడం మరియు ఇతరులను గుడ్డిగా అనుకరించడం వల్లే అలా చేస్తారు…

    అల్-హాఫిజ్ ఇబ్న్ హజర్ అల్-ఫత్ (3/248) లో ఇలా అన్నారు: “అల్-ఫిత్రా అంటే ఏమిటి అనే విషయంపై పండితుల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అత్యంత ప్రసిద్ధ అభిప్రాయం ఏమిటంటే దాని అర్థం ఇస్లాం.

    ఇబ్న్ అబ్దుల్-బర్ర్ ఇలా అన్నారు: “సలఫ్ లలో అత్యధికులకు ఇదే ప్రసిద్ధమైనది, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క వాక్యం “అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం” అనేదాని భావం ఇస్లాం అని ముఫస్సిరీన్ (తఫ్సీర్ పండితులు) ఏకాభిప్రాయానికి వచ్చారు.”
  6. అల్-బుఖారీ (11/418) మరియు ముస్లిం (18/52) ఉల్లేఖించారు.
  7. అల్-బుఖారీ (8/534) ఉల్లేఖించారు.
  8. ఇబ్న్ అబీ హాతిమ్ కూడా ఉల్లేఖించారు, ఇది ఇబ్న్ ఉర్వా అల్-హంబలీ యొక్క అల్-కవాకిబుద్-దురారీ (6/112/2) లో అబూ ముత్తహర్ వరకు ‘హసన్’ అయిన ఇస్నాద్‌ తో ఉంది. అయితే, అద్-దౌలాబీ యొక్క అల్-కునా వల్-అస్మా లో కానీ, ముస్లిం యొక్క అల్-కునా లో కానీ, మరెవరి గ్రంథాలలో కానీ అతని జీవిత చరిత్ర కనుగొనబడలేదు. ఇందులో ఉన్న దాగివున్న లోపం ఏమిటంటే అతను షియా వర్గానికి చెందినవాడు, కానీ అతని జీవిత చరిత్ర అత్-తూసీ యొక్క అల్-కునా (షియా ఉల్లేఖకుల సూచిక) లో కూడా చేర్చబడలేదు.

అల్లాహ్ (సుబ్ హానహూవ తఆలా) ఎక్కడ ఉన్నాడు? – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ (సుబ్ హానహూవ తఆలా) ఎక్కడ ఉన్నాడు ? – ధర్మ అవగాహనం [5]
https://youtu.be/Oqb0hBPo3ZE [ 5 నిముషాలు]

ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లాహ్ ఎక్కడ ఉన్నాడో వివరించడం ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతిచోటా ఉన్నాడనే అపోహను ఖండిస్తూ, ఆయన అర్ష్ (సింహాసనం) పై ఉన్నాడని, అయితే ఆయన జ్ఞానం మాత్రం విశ్వమంతటా వ్యాపించి ఉందని వక్త స్పష్టం చేశారు. సూరా తాహాలోని 5 మరియు 46 వచనాలను, అలాగే సహీహ్ బుఖారీలోని హదీసును ఉటంకిస్తూ ఈ విషయాన్ని వివరించారు.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్ లా నబియ్య బ అ దహు అమ్మ బాద్, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ ఐదవ ఎపిసోడ్‌లో మనం ఒక ముఖ్యమైన విషయం గురించి, ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. అదేమంటే సకల లోకాలకు సృష్టికర్త అయిన, ఆరాధనలకు అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎక్కడ ఉన్నాడు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన సమాజంలో చాలామంది ఇతర మతాల ప్రభావం వలన లేదా అజ్ఞానం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతిచోటా ఉన్నాడు అంటారు. కానీ ఈ నమ్మకం, ఈ విశ్వాసం ఖురాన్ మరియు హదీసులకు విరుద్ధమైన విశ్వాసం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా తెలియజేశాడు ఆయన ఎక్కడ ఉన్నాడో. ఈ విషయం గురించి మన నమ్మకం, మన అఖీదా, మన విశ్వాసం చాలా స్పష్టంగా ఉండాలి. ఖురాన్ మరియు హదీసు పరంగా ఉండాలి. లేకపోతే మార్గాన్ని తప్పే అవకాశం ఉంది.

అభిమాన సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా తన గురించి ఇలా తెలియజేశాడు, సూరా తాహా, ఆయత్ నంబర్ 5:

الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
(అర్రహ్మాను అలల్ అర్షిస్తవా)
ఆ కరుణామయుడు అర్ష్‌ (సింహాసనము) పై ఆసీనుడై ఉన్నాడు. (20:5)

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అర్ష్ పై ఉన్నాడు అనే విషయాన్ని స్పష్టంగా అల్లాహ్ తెలియజేశాడు ఈ ఆయత్ లో.

అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

لَمَّا قَضَى اللَّهُ الْخَلْقَ كَتَبَ فِي كِتَابِهِ فَهُوَ عِنْدَهُ فَوْقَ الْعَرْشِ إِنَّ رَحْمَتِي غَلَبَتْ غَضَبِي
(లమ్మా కజల్లాహుల్ ఖల్క కతబ ఫీ కితాబిహి ఫహువ ఇన్ దహు ఫౌఖల్ అర్ష్, ఇన్న రహ్మతీ గలబత్ గజబీ)

ఈ హదీసు బుఖారీ గ్రంథంలో ఉంది. ఈ హదీసు యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టిని సృష్టించిన తర్వాత ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ఎక్కడ ఉంది? ఫహువ ఇన్ దహు ఫౌఖల్ అర్ష్ – ఇది ఆయన వద్ద గల అర్ష్ మీద రాసి ఉంది. అంటే ఈ హదీసు ద్వారా కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అర్ష్ పై ఉన్నాడు అని ఉంది. ఈ హదీసు యొక్క చివరి భాగం ‘ఇన్న రహ్మతీ గలబత్ గజబీ’ – నిశ్చయంగా నా కారుణ్యం నా క్రోధాన్ని జయించింది. అంటే ఈ హదీసులో కూడా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ద్వారా ఏం తెలిసింది అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అర్ష్ పై ఉన్నాడు.

కాకపోతే అల్లాహ్ యొక్క జ్ఞానం ప్రతిచోటా ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అస్తిత్వంతో ప్రతిచోటా లేడు. అల్లాహ్ అర్ష్ పై ఉన్నాడు, అల్లాహ్ యొక్క జ్ఞానం ప్రతిచోటా ఉంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా తాహాలోని ఆయత్ 46లో ఇలా తెలియజేశాడు, అది మూసా మరియు హారూన్ అలైహిస్సలాం గురించి:

قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
(ఖాల లా తఖాఫా ఇన్ననీ మ అకుమా అస్మ ఉ వ అరా)
“మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను” అని సమాధానమిచ్చాడు ఆయన.
(20:46)

అంటే అల్లాహ్ అస్తిత్వంతో ఉన్నాడా మూసా అలైహిస్సలాం తో పాటు, హారూన్ అలైహిస్సలాం తో పాటు? కాదు, అల్లాహ్ జ్ఞానంతో ఉన్నాడు. నిశ్చయంగా నేను మీతో పాటు ఉన్నాను, నేను వింటాను మరియు చూస్తాను.

అభిమాన సోదరులారా! ఈ సూరా తాహా ఆయత్ ద్వారా మరియు ఈ బుఖారీ హదీసు ద్వారా మనకు స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అర్ష్ పై ఉన్నాడు, అల్లాహ్ యొక్క జ్ఞానం ప్రతిచోటా ఉంది. మన మనసులో ఊహ కూడా అల్లాహ్ ఎరిగినవాడు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పట్ల నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండే సద్బుద్ధిని, సామర్థ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించు గాక! ఆమీన్. మరెన్నో వివరాలతో వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. అప్పటివరకు సెలవు, వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా):
https://teluguislam.net/allah/

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]
https://teluguislam.net/2026/01/02/dharma-avagahanam/

ధర్మ అవగాహనం యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3CRoRRZhxlcQFsZpOPs2Sg

సమాజ సంస్కరణ – ధార్మిక బహిరంగ సభ [వీడియో & టెక్స్ట్] 

సమాజ సంస్కరణ – ధార్మిక బహిరంగ సభ
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Htvm7QPyjI4 [47 నిముషాలు]

ఈ ప్రసంగం ఖురాన్ మరియు హదీసుల జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా స్వర్గ మార్గాన్ని సులభతరం చేసుకోవడం గురించి వివరిస్తుంది. సమాజ సంస్కరణ అనేది వ్యక్తిగత సంస్కరణ మరియు అల్లాహ్ పట్ల బలమైన విశ్వాసం (అఖీదా)తో మొదలవుతుందని వక్త ఉద్ఘాటించారు. షాబాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అధికంగా ఉపవాసాలు ఉండేవారని, ఇది ప్రజలు నిర్లక్ష్యం చేసే నెల అని పేర్కొన్నారు. షబే బరాత్ (షాబాన్ 15వ రాత్రి) పేరుతో సమాజంలో ఉన్న బిద్అత్ (కొత్త ఆచారాల)ను, ప్రత్యేక నమాజులు, సమాధుల సందర్శన వంటి వాటిని ఆధారాలతో ఖండించారు. చివరగా, ప్రామాణికమైన ఇస్లాం ధర్మాన్ని నేర్చుకోవడానికి ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 18] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]


ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారిసు చెల్లుతుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 18] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=5Hpmj-eG9oE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబీయ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్ .అమ్మాబాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి అంశం: ప్రళయ దినాన సిఫారసు చేసే హక్కు ఎవరెవరికి లభిస్తుంది? ఎవరి సిఫారసు చెల్లుతుంది?

మహాశయులారా ఈ శీర్షిక కూడా చాలా ముఖ్యమైనది. దీనిని తెలుసుకోవడం ద్వారా మనకు లాభం ఏమిటంటే ఎవరెవరి సిఫారసు ప్రళయ దినాన చెల్లుతుంది అని అల్లాహ్ ఖురాన్ ద్వారా గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీ హదీసుల ద్వారా గాని మనకు తెలియజేశారో వాటి పట్ల మన బాధ్యత ఏమిటో అవి కూడా తెలియజేశారు. ఉదాహరణకు ప్రళయ దినాన ఖురాన్ సిఫారసు చేస్తుంది. ఖురాన్ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అని మనకు తెలుసు. అయితే ఖురాన్ ఎవరి పట్ల సిఫారసు చేస్తుంది? ఎవరైతే దానిని ఎల్లవేళల్లో చదువుతూ ఉంటారో, దాని పారాయణం చేస్తూ ఉంటారో, దాని పారాయణంతో పాటు అర్థ భావాలను కూడా అర్థం చేసుకుంటూ వాటిలో యోచిస్తూ ఆచరణలో ఉంచడమే సరిపుచ్చుకోకుండా ఈ ఖురాన్ యొక్క దావత్ ఖురాన్ వైపునకు ఇతరులను కూడా ఆహ్వానిస్తారో మరియు ఏదైనా రోగానికి, అవస్థకు గురి అయినప్పుడు ఖురాన్ ద్వారా స్వస్థత పొందుటకు ఏ ఆయతులు ఏ సందర్భంలో చదవాలో వాటిని పాటిస్తారో, ఈ విధంగా ఖురాన్ చదువుతూ దాని ప్రకారం ఆచరించే వారి పట్ల అది సిఫారసు చేస్తుంది. ఇక ఈ విషయం ఎవరికైతే తెలుస్తుందో వారు ఖురాన్ చదవడం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపవచ్చు. అలాగే మిగతా విషయాలు కూడా. అందుగురించి ఈ శీర్షికను కూడా వినడం, దీనిని గ్రహించడం చాలా అవసరం. ,

మహాశయులారా! మొట్టమొదటి విషయం ఎవరికైతే ప్రళయ దినాన సిఫారసు చేయడానికి అర్హత కలుగుతుందో వారు మన గౌరవనీయులైన, ప్రియులైన మనందరి ప్రియ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయం మనం ఇంతకుముందు భాగంలో కూడా విని ఉన్నాము. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి షఫాఅతె ఉజ్మా ఆ మహా మైదానంలో మకామె మహమూద్ అన్నటువంటి గొప్ప స్థానంలో ప్రశంసనీయబడిన స్థానంలో వారికి ఈ సిఫారసు యొక్క హక్కు లభిస్తుంది. అక్కడ ఆయనకు పోటీ సమానులు ఎవరూ ఉండరు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఒక్క సందర్భంలోనే కాదు వివిధ సందర్భాల్లో సిఫారసు చేసే హక్కు లభిస్తుంది అని కూడా మనం తెలుసుకున్నాము. ఉదాహరణకు నరకంలో పడిపోయిన వారిని వారి తౌహీద్, నమాజ్ ఇలాంటి మంచి కార్యాల వల్ల వారికి బయటికి తీయడం, స్వర్గంలో చేరే ముందు స్వర్గం తెరవబడటానికి సిఫారసు చేయడం. స్వర్గంలో చేరిన వారికి ఎలాంటి శిక్షా మరీ ఎలాంటి లెక్కా తీర్పు లేకుండా స్వర్గంలో పోవడానికి సిఫారసు ఎక్కువ హక్కు. అలాగే స్వర్గంలో చేరిన వారు వారికి ఉన్నత స్థానాలు లభించాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడం. ఈ విధంగా ఎన్నో రకాల సిఫారసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేస్తారు అని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనం విని ఉన్నాము. అందుగురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకునే అవసరం లేదు అని భావిస్తున్నాను.