ఖుర్బానీ ఆదేశాలు & ఘనత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్


వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/repdu4saKmM [46 నిముషాలు]

ఈ ప్రసంగంలో వక్త ఇస్లాంలో ఖుర్బానీ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దానికి సంబంధించిన విధివిధానాలను వివరంగా తెలియజేశారు. ఖుర్బానీ ఎప్పుడు చేయాలి, అర్హమైన పశువులు మరియు వాటి వయస్సు, పశువులో భాగస్వామ్య పద్ధతులు వంటి నిబంధనలను ఖురాన్, హదీసుల ఆధారంగా స్పష్టం చేశారు. అలాగే, అఖీఖా మరియు ఖుర్బానీ కలిపి చేయవచ్చా, మరణించిన వారి పేరిట ఖుర్బానీ ఇవ్వవచ్చా, అప్పు చేసి ఖుర్బానీ చేయవచ్చా వంటి పలు సందేహాలను నివృత్తి చేశారు. ఖుర్బానీ పశువు మాంసాన్ని, చర్మాన్ని ఎలా పంపిణీ చేయాలో వివరిస్తూ, ఖుర్బానీ మాంసం, రక్తం కాకుండా కేవలం మనలోని భక్తి, చిత్తశుద్ధి మాత్రమే అల్లాహ్ కు చేరుతాయని ఉద్ఘాటించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు. ఈనాటి ప్రసంగంలో మనం ఖుర్బానీ ఆదేశాలు తెలుసుకుందాం. ముందుగా ఖుర్బానీ అంటే ఏమిటి? తెలుసుకుందాం.

ఖుర్బానీ అంటే జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి జుల్ హిజ్జా నెల 13వ తేదీన సూర్యాస్తమయానికి ముందు వరకు రేయింబవళ్ళలో ఎప్పుడైనా నిర్ధారిత పశువులను అల్లాహ్ ప్రసన్నత కోసం జిబాహ్ చేయడాన్ని ఖుర్బానీ అంటారు.

ఈ ఖుర్బానీకి ఉన్న ఘనత, విశిష్టత ఏమిటంటే… ఖురాన్ లోని 108వ అధ్యాయము రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు:

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. (108:2)

అలాగే ఖురాన్ లోని 6వ అధ్యాయము 162వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు:

قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(ఖుల్ ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

ఓ ప్రవక్తా! ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం – ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.(6:162)

ఈ రెండు ఆయతులలో ఒక విషయాన్ని గమనించారా? ఈ రెండు ఆయతులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండు ముఖ్యమైన ఆరాధనల ప్రస్తావన చేసి ఉన్నాడు. ఒకటి నమాజు అయితే, రెండవది ఖుర్బానీ. నమాజుతో పాటు ఖుర్బానీ ప్రస్తావన కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ రెండు ఆయతులలో చేసి ఉన్నాడు. నమాజ్ ఎంత గొప్ప ఆరాధన అన్న విషయము మనందరమూ తెలుసుకొని ఉన్నాము. అలాంటి గొప్ప ఆరాధనతో పాటు ఖుర్బానీ యొక్క ప్రస్తావన చేయడం వల్ల ఖుర్బానీ కూడా గొప్ప ఆరాధన, అల్లాహ్ కు ఇష్టమైన కార్యము అనే విషయము ఈ రెండు వాక్యాల ద్వారా మనము గ్రహించాలి.

ఖుర్బానీ యొక్క విశిష్టతను ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవచ్చును. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో మనం చూచినట్లయితే, ఆయన ప్రతి సంవత్సరము ఖుర్బానీ చేశారు. ఆయన తన కుటుంబీకుల తరఫున ఖుర్బానీ చేయటమే కాకుండా, ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారికి కూడా ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుండి కూడా ఆయన ఖుర్బానీ చేసి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన ఆయన కుటుంబీకుల సభ్యుల తరపున ఖుర్బానీ చేసుకోవటంతో పాటు, అనుచర సమాజంలోని స్తోమత లేని వారి తరపు నుంచి కూడా ఖుర్బానీ చేశారు. అందరికీ ఖుర్బానీ పుణ్యము లభించేలాగా ఆయన కృషి చేశారు అంటే ఆ ఖుర్బానీ ఎంత విశిష్టమైనదో మనము ఇట్టే అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.

అలాగే ఖుర్బానీ ఎంత ముఖ్యమైన ఆరాధన అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉల్లేఖనం ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిస్తూ ఇలా తెలియజేశారు: “స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ చేయుటలేదో, వారు మన ఈద్ గాహ్ పండుగ నమాజు ఆచరించే స్థలం దరిదాపులకు కూడా రావద్దు” అని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధారణంగా మామూలు విషయాల గురించి ఆయన ఆగ్రహించరు, వారించరు. ఆయన ఆగ్రహిస్తున్నారు, వారిస్తున్నారు అంటే అది చాలా ముఖ్యమైన విషయమై ఉంటుంది. ఆ ప్రకారంగా స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు ఆచరిస్తున్న స్థలానికి, దాని దరిదాపులకు కూడా రావద్దు అని కఠినంగా ఆయన వారిస్తున్నారు అంటే ఖుర్బానీ ఎంత విశిష్టత గలదో ఎంత ముఖ్యమైన ఆరాధనయో మనము ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఖుర్బానీ అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యము తెలుసుకోవాలంటే… ఖురాన్ లో 22వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلِكُلِّ أُمَّةٍ جَعَلْنَا مَنسَكًا لِّيَذْكُرُوا اسْمَ اللَّهِ عَلَىٰ مَا رَزَقَهُم مِّن بَهِيمَةِ الْأَنْعَامِ
(వ లికుల్లి ఉమ్మతిన్ జఅల్నా మన్సకల్ లియజ్ కురుస్మల్లాహి అలా మా రజకహుమ్ మిమ్ బహీమతిల్ అన్ ఆమ్)

తమకు అల్లాహ్‌ ప్రసాదించివున్న పశువులపై అల్లాహ్‌ పేరును స్మరించటానికిగాను మేము ప్రతి అనుచర సమాజం కోసం ఖుర్బానీ ఆచారాన్ని నిర్థారించాము“. (22:34)

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి అనుచర సమాజానికి ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అంటే ప్రతి అనుచర సమాజానికి ఆ ఆరాధన చేయమని అల్లాహ్ ఆదేశించి ఉన్నాడు అంటే అది అల్లాహ్ కు ఎంత ప్రియమైన కార్యమై ఉంటే అల్లాహ్ ఆ విధంగా ఆదేశించి ఉంటాడు కదా?

మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా విని ఉన్నాము. ఆదం అలైహిస్సలాం వారి ఇద్దరు కుమారులు హాబీల్ మరియు ఖాబీల్ వద్ద పెళ్లి విషయంలో గొడవ జరిగినప్పుడు, ఖుర్బానీ చేయమని తండ్రి ఆదేశించగా వారిద్దరూ ఖుర్బానీ సమర్పించారు. ఒకరి ఖుర్బానీ స్వీకరించబడింది, ఒకరి ఖుర్బానీ తిరస్కరించబడింది. అదంతా మనం ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో వివరంగా తెలుసుకొని ఉన్నాము ఇక్కడ అదంతా ప్రస్తావించే ఆస్కారము లేదు. కాకపోతే తద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదం అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వారి కుమారులు ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద మానవుల చరిత్ర మొదలైన దశలో ప్రారంభంలో వారు ఈ భూమి మీద జీవించారు. ఆ ప్రకారంగా మానవులు ఈ భూమి మీద జీవించిన ప్రారంభము నుండే ఖుర్బానీ ఆదేశాలు మానవులకు ఇవ్వబడి ఉన్నాయి అన్న విషయం మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఆ తర్వాత ప్రతి అనుచర సమాజానికి కూడా అల్లాహ్ ఖుర్బానీ చేయమని ఆదేశించి ఉన్నాడు అన్న విషయము కూడా మనకు బోధపడుతుంది.

ఈ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాల ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన హదీసుల ద్వారా ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత, విశిష్టత మనకు అర్థమవుతుంది. ఇవి కాక వేరే ఉల్లేఖనాలు ఉన్నాయి, అవి బలహీనమైనవి, కాబట్టి వాటి ప్రస్తావన నేను ఇక్కడ చేయుటలేదు. చాలామంది పండితులు బలహీనమైన వాక్యాలు, బలహీనమైన ఉల్లేఖనాలు కూడా ప్రస్తావిస్తూ ఉంటారు… ఖుర్బానీ చేయగానే ఆ ఖుర్బానీ రక్తము భూమి మీద పడకముందే అల్లాహ్ వద్ద ఆమోదం పొందుతుంది, ఆ రక్తపు చుక్క భూమి మీద పడకముందే ఖుర్బానీ ఇచ్చే వ్యక్తుల పాపాలు మన్నించబడతాయి, ఖుర్బానీ ఇచ్చే పశువు చర్మం మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పుణ్యాలు ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖాతాలో లిఖించబడతాయి… ఇలాంటి ఉల్లేఖనాలు ఉన్నాయి కదండీ, అవన్నీ బలహీనమైన ఉల్లేఖనాలు అని ధార్మిక పండితులు నిర్ధారించి ఉన్నారు కాబట్టి వాటిని నేను ఇక్కడ ప్రస్తావించుటలేదు.

ఇక రండి, ఖుర్బానీ అంటే ఏమిటి, ఖుర్బానీ విశిష్టత ఏమిటి అని మనము తెలుసుకున్న తర్వాత, ఖుర్బానీ ఆదేశం ఏమిటి? ఇస్లామీయ శాసనంలో ఖుర్బానీకి ఉన్న విలువ ఏమిటి? అంటే అది ఫరజా లేదా సున్నతా?

ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తపరచి ఉన్నారు. కొంతమంది ధార్మిక పండితులు ఖుర్బానీ సున్నత్ అని తెలియజేసి ఉన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించారు కాబట్టి అది సున్నత్ అని కొంతమంది ధార్మిక పండితుల అభిప్రాయం.

మరి కొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, స్తోమత ఉన్న వారిపై ఖుర్బానీ చేయటం విధి, తప్పనిసరి, వాజిబ్ అంటున్నారు. వారి ఈ వాదనకు ఆధారం ఏమిటంటే, ఖురాన్ లోని 108వ అధ్యాయము 2వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఫసల్లి లిరబ్బిక వన్ హర్” (నీ ప్రభువు కొరకు నమాజు ఆచరించు, నీ ప్రభువు కొరకు ఖుర్బానీ చెయ్యి) ఖుర్బానీ చెయ్యి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి, ఆయన ఆదేశం ప్రకారము స్తోమత ఉన్నవారు ఖుర్బానీ చేయటం తప్పనిసరి వాజిబ్.

అలాగే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్తోమత ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మన ఈద్ గాహ్ కు పండుగ నమాజు చేసే స్థలం దరిదాపులకు రావద్దు అని వారించారు అంటే, ఖుర్బానీ చేయటం స్తోమత ఉన్న వారిపై వాజిబ్, తప్పనిసరి అని ఆ వాక్యము మరియు ఉల్లేఖనం ద్వారా వారు ఆ విధంగా అభిప్రాయపడుతున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు, వాక్యాలు దృష్టిలో పెట్టుకుని చూచినట్లయితే, మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు, ఆవు, ఎద్దు, ఒంటె (ఆడది అయినా మగది అయినా) – ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి, అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే, అయినప్పటికినీ వాటి ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు. ఎందుకంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ, ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల ఖుర్బానీ చేయలేదు. కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే ఖుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల ఖుర్బానీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

అయితే, ఈ ఎనిమిది పశువులలో ఏ పశువు ఖుర్బానీ ఉత్తమమైనది? ఇక్కడ కూడా ధార్మిక పండితులు రెండు రకాల అభిప్రాయం వ్యక్తపరిచి ఉన్నారు.

కొంతమంది ఏమంటున్నారంటే పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది, ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరము పొట్టేలు ఖుర్బానీ చేసి ఉన్నారు కాబట్టి పొట్టేలు ఖుర్బానీ ఉత్తమమైనది అని అంటున్నారు.

మరి కొంతమంది ధార్మిక పండితులు పశువు, ఖుర్బానీ రూపంలో ఇవ్వబడుతున్న పశువు, దాని మాంసము, తద్వారా ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక లిస్ట్ వారు తెలియజేశారు. ఆ లిస్ట్ ప్రకారంగా:

  1. ఒకటి, ఒంటె ఒక వ్యక్తి తరఫు నుంచి ఇవ్వబడుతూ ఉంటే ఆ ఖుర్బానీ ఉత్తమమైనది.
  2. తరువాత ఆవు లేదా ఎద్దు ఒక వ్యక్తి తరఫున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది రెండవ ఉత్తమమైన ఖుర్బానీ.
  3. పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఇవి ఒక వ్యక్తి తరపున ఖుర్బానీ ఇవ్వబడుతూ ఉంటే అది మూడవ ఉత్తమమైన ఖుర్బానీ.
  4. ఆ తర్వాత ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు, పది వ్యక్తులు లేదా పది కుటుంబాలు ఒక ఒంటెలో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది నాలుగవ ఉత్తమమైన ఖుర్బానీ.
  5. ఏడు వ్యక్తులు లేదా ఏడు కుటుంబాలు కలిసి ఒక ఆవులో భాగస్తులై ఖుర్బానీ చేస్తూ ఉంటే అది ఐదవ ఉత్తమమైన ఖుర్బానీ అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు. ఇంక అసలు విషయము అల్లాహ్ కు తెలుసు.

ఇక రండి, ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఖుర్బానీ పశువులో ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు తెలియజేసిన విషయం: ఖుర్బానీ కోసం ఇవ్వబడుతున్న పశువు తాజాగా, బాగా లావుగా, కొమ్ములు కలిగిన, ఖసీ చేయబడిన పశువు అయి ఉండటం మంచిది అని తెలియజేశారు.

అలాగే, ఖుర్బానీ ఇవ్వబడుతున్న పశువుల వయస్సు ఎంత ఉండాలి? ఎంత వయస్సు గల పశువుని ఖుర్బానీ ఇవ్వవచ్చు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు స్పష్టమయ్యే విషయం చూడండి:

  • ఒంటె 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఒంటె ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • ఆవు లేదా ఎద్దు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరము నడుస్తూ ఉండాలి, అలాంటి ఆవు లేక ఎద్దు ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది.
  • పొట్టేలు, గొర్రె విషయం గురించి చూడండి. పొట్టేలు మరియు గొర్రె పాల పళ్ళు ఊడిన తర్వాత వచ్చిన పళ్ళు ఉంటాయి కదండీ, అలా పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె అయి ఉండాలి. ఒకవేళ పళ్ళు వేసిన పొట్టేలు, గొర్రె దొరకని యెడల సంవత్సరము దాని దరిదాపుల వయస్సు కలిగిన పొట్టేలు, గొర్రె ఉన్నా గాని ఖుర్బానీ కోసం చెల్లుబాటు అవుతుంది.
  • ఆ తర్వాత మేక మరియు మేకపోతు విషయం గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు. అది తప్పనిసరిగా పళ్ళు వేసినదై ఉండాలి. అంటే పాలు పళ్ళు ఊడిన తర్వాత వస్తాయి కదండీ పళ్ళు, ఆ పళ్ళు వేసినదై ఉండాలి మేక, మేకపోతు. పళ్ళు వేయని మేక, మేకపోతు అయితే ఖుర్బానీ ఎట్టి పరిస్థితిలో చెల్లదు. దొరకట్లేదు అని పళ్ళు ఊడని మేక, మేకపోతు ఖుర్బానీ మాత్రం చెల్లదు. అది పొట్టేలు, గొర్రెకు మాత్రమే ఆ నిబంధన వర్తిస్తుంది.

ఇకపోతే, ఏ ఏ పశువుల ఖుర్బానీ చెల్లుబాటు కాదు? ఏ పశువుల ఖుర్బానీ చెల్లదు?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: కుంటి పశువు ఖుర్బానీ చెల్లదు. అలాగే ఒక కంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక కన్ను కనిపించుటలేదు, ఒక కంటితోనే చూస్తూ ఉంది అంటే ఒంటికంటితో చూస్తున్న పశువు ఖుర్బానీ చెల్లదు. వ్యాధి బారిన పడిన పశువు ఖుర్బానీ చెల్లదు. ఒక పశువు వ్యాధి బారిన పడిపోయింది, అలా వ్యాధి బారిన పడిపోయిన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు. అలాగే బాగా బలహీనమైపోయి, ఎముకలు కనిపిస్తున్న బలహీనమైన పశువు ఖుర్బానీ కూడా చెల్లదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా స్పష్టమవుతుంది.

ఈ ఉల్లేఖనాలను దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తెలియజేశారు, ఇవి కాకుండా వేరే ఏమైనా స్పష్టంగా కనిపించే లోపాలు ఉన్నా అలాంటి పశువు ఖుర్బానీ చెల్లదు అన్నారు. ఉదాహరణకు మనం చూచినట్లయితే కొన్ని పశువులకు తోక కత్తిరించేసి ఉంటారు. కొన్ని పశువులకు చెవులు కత్తిరించేసి ఉంటారు. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది లోపము. అలా స్పష్టంగా కంటికి లోపం కనిపిస్తూ ఉంటే అలా లోపము ఉన్న పశువు ఖుర్బానీ చెల్లదు. చిన్న లోపం ఉంది అది కంటికి స్పష్టంగా కనిపించుటలేదు అంటే అది సమస్య కాదు, దాని ఖుర్బానీ చెల్లుతుంది. స్పష్టంగా కంటికి కనిపించే అంత పెద్ద లోపము ఉంటే అప్పుడు ఆ పశువు ఖుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ఏ పశువులో ఎంతమంది భాగస్తులు కాగలరు? అనే విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే…

ఒంటెలో 10 మంది భాగస్తులు కావచ్చు, 10 కుటుంబాలు కూడా భాగస్తులు కావచ్చు. ఆవు లేదా ఎద్దులో 7 వ్యక్తులు భాగస్తులు కావచ్చు లేదా 7 కుటుంబాలు భాగస్తులు కావచ్చు.

పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు… వీటిలో మాత్రము ఒక వ్యక్తి మాత్రమే ఖుర్బానీ ఇస్తాడు లేదా ఒక కుటుంబీకులు మాత్రమే (ఒక కుటుంబం తరఫున మాత్రమే) ఖుర్బానీ ఇవ్వబడుతుంది. పొట్టేలు, గొర్రె, మేక మరియు మేకపోతులో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలు, ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు భాగస్తులు అవ్వడానికి అనుమతి లేదు.

“ఒక కుటుంబం తరపున ఒక పొట్టేలు, ఒక మేక సరిపోతుంది” అని చెబుతున్నారు, ఒక కుటుంబం అంటే ఎంతమంది? అనే సందేహం రావచ్చు. ఇక్కడ వివరణ ఈ విధంగా ధార్మిక పండితులు తెలియజేశారు: ఒకే వ్యక్తి సంపాదన మీద ఎంతమంది అయితే జీవితం గడుపుతూ ఉంటారో, ఒకే వ్యక్తి పోషణలో ఎంతమంది వ్యక్తులు అయితే ఉంటారో, వారందరూ కూడా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఉదాహరణకు ఇంట్లో తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు, ఆ తండ్రి, భార్యలు, బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఇతరులు ఎవరూ సంపాదించుటలేదు, తండ్రి ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ పోషిస్తున్నారు, వారందరి బాధ్యత ఆయన ఒక్కరే మోస్తున్నారు అంటే వారు ఎంతమంది ఉన్నా సరే అప్పుడు ఆ ఒక్క పశువు తరపు నుండే ఆ పూర్తి కుటుంబం తరపున ఖుర్బానీ అయిపోతుంది.

కానీ, ఒకవేళ ఒకే తండ్రికి చెందిన ఇద్దరు లేకంటే ఎక్కువ మంది కుమారులు ఒకే ఇంట్లోనే ఉంటున్నారు, కానీ వేరువేరుగా సంపాదించుకుని, ఎవరి సంపాదన వారు వేరువేరుగానే ఉంచుకుంటున్నారు అనేటట్లయితే అప్పుడు అది ఒక కుటుంబంగా పరిగణించబడదు. సంపాదన ఎవరైతే వేరుగా పెట్టుకుంటున్నాడో అతను సపరేటుగా ఒక కుటుంబంగా పరిగణించబడతారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికినీ సంపాదన వేరుగా ఉంచుకున్న వారందరూ కూడా వేరే వేరే కుటుంబీకులే, వారు ప్రతి ఒక్కరు ఎవరైతే సంపాదన వేరు వేరుగా ఉంచుకుంటున్నారో వారు వారు వేరువేరుగా ఖుర్బానీలు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఈ విషయము మనము బాగా అర్థం చేసుకోవాలి.

మనం చూచినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో ఖుర్బానీ చేసేటప్పుడు ఒక పశువుని జిబాహ్ చేస్తూ “ఓ అల్లాహ్ ఇది నా తరపున మరియు నా కుటుంబీకుల తరపున” అని ఖుర్బానీ చేసేవారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు సహాబాలు కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరపున నా కుటుంబీకుల తరపున” అని పూర్తి కుటుంబం తరపున ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చేవారు.

అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారితో ఈ విధంగా అడగడం జరిగింది: “దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ప్రజలు ఏ విధంగా ఖుర్బానీలు చెల్లించుకునేవారు?” అంటే, అబూ అయ్యుబ్ అన్సారీ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “మనలోని ప్రతి వ్యక్తి తన తరపున తన కుటుంబం తరపున ఒక పశువుని జిబాహ్ చేసి స్వయంగా తినేవాడు ఇతరులకు కూడా తినిపించేవాడు” అని ఆయన బదులిచ్చారు. ఆ ప్రకారంగా ప్రవక్త మరియు సహాబాల విధానం ఏమిటంటే ఒక కుటుంబం తరఫున ఒక పశువుని జిబాహ్ చేసి వారు స్వయంగా మాంసం భుజించి ఇతరులకు కూడా తినిపించేవారు. ఆ ప్రకారంగా ఒక పశువు ఒక కుటుంబం తరపున ఖుర్బానీ ఇవ్వబడేది అనేది మనకు స్పష్టమవుతుంది.

మిత్రులారా, ఇక్కడ కొంతమంది అతి తెలివి ఉపయోగిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారంటే, బిడ్డలు పుట్టినప్పుడు ఏడు రోజులలో చేయవలసిన అఖీఖా ఏడు రోజులలో చేయకుండా, తరువాత ఖుర్బానీ సమయం వచ్చినప్పుడు ఒకే పశువులో ఖుర్బానీ మరియు అఖీఖా రెండు అయిపోయేలాగా ఉపాయము పన్నుతూ ఉంటారు. ఉదాహరణకు ఆవు లేక ఎద్దు ఉందనుకుందాం. అందులో ఏడు భాగాలు అవకాశం ఉంది కదండీ. ఒక భాగం ఖుర్బానీ కోసం, ఒక భాగం అఖీఖా కోసం తీసుకుంటూ ఉంటారు. అలా ఉపాయం పన్నిన వారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకే పశువులో ఖుర్బానీ, ఒకే పశువులో అఖీఖా చెల్లదు. ఇది ఏ ప్రామాణికమైన ఆధారంలో కూడా లేదు. అఖీఖా కోసము ఒక ప్రత్యేకమైన పశువును జబాహ్ చేయవలసి ఉంటుంది. ఖుర్బానీ పశువులో అఖీఖాను తీసుకుని వచ్చి జొప్పించే ప్రయత్నము చేయరాదు, ఇది అతి తెలివి ఉపయోగించటము అలా చేయటం సమంజసము కాదు.

అలాగే చాలామంది కొత్తగా వాదిస్తూ ఉంటారు. అంత డబ్బు పెట్టి పశువు తీసుకుని ఖుర్బానీ చేసి మాంసం మెక్కటం ఎందుకు, అదే డబ్బుతో పేదలకు దానం చేయొచ్చు కదా అని వాదిస్తూ ఉంటారు. వాళ్ళ వాదన వ్యర్థమైనది. ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ ఫర్జ్ సదఖా, ఫర్జ్ దానం (జకాత్) అని ఒకటి ఉంది. అలాగే నఫిల్ సదఖా, నఫిల్ దానము కూడా ఉంది. వాటి గురించి ప్రత్యేకంగా అల్లాహ్ వాక్యాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా ముస్లింలు జకాత్ మరియు ఇతర సదఖాలు చేస్తూ ఉంటారు, నిరుపేదలకు అందిస్తూ ఉంటారు, అవి చేయమని ప్రోత్సహించాలి. ఖుర్బానీ ఆపి సదఖా చేయమని చెప్పాల్సిన అవసరము లేదు అన్న విషయం వారు గ్రహించాలి. ఖుర్బానీ ఒక ప్రత్యేకమైన ఆరాధన, సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయబడుతుంది. ఆ ప్రకారంగా ఖుర్బానీ చేసుకొని ఖుర్బానీ పుణ్యము మనము సపరేటుగా పొందాలి. ఆరాధనలు జీవితాంతము సంవత్సరము మొత్తము ఎప్పుడైనా ఎక్కడైనా మనము చేసుకొని పుణ్యం సంపాదించుకోవచ్చు ఆ విషయం కూడా వారు గ్రహించాలి.

అలాగే ఒక వ్యక్తి బాగా చూసి ఎలాంటి లోపాలు లేని ఒక పశువుని కొన్నాడు. కొన్న తర్వాత కొద్ది రోజులకు ఏదో ఒక సంఘటన కారణంగా అందులో లోపం ఏర్పడింది. మరి అలాంటప్పుడు అతను ఏం చేయాలి అంటే, ధార్మిక పండితులు తెలియజేశారు: అతని వద్ద స్తోమత ఉంటే ఆ పశువు అమ్మేసి లోపము లేని మంచి సురక్షితమైన పశువుని ఒకటి కొని ఖుర్బానీ చేయటము ఉత్తమం. ఒకవేళ అతని వద్ద స్తోమత లేదు అంటే, సమయము లేదు లేదా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయి, ఇక అతను ఆ పశువుని అమ్మి వేరే పశువు కొనలేడు అనేటట్లయితే, అదే పశువుని అతను జబాహ్ చేయవచ్చు, ఖుర్బానీ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొనేటప్పుడు అందులో ఎలాంటి లోపము లేదు కాబట్టి, అతని ఖుర్బానీ చెల్లుబాటు అవుతుంది అని తెలియజేసి ఉన్నారు. అలాగే ఖుర్బానీ కోసము పశువు కొన్న తర్వాత ఆ పశువు దొంగలించబడింది లేదా తప్పిపోయింది కనిపించనే లేదు ఆ తర్వాత. మరి అలాంటప్పుడు వారేం చేయాలి? స్తోమత ఉంటే మరొక పశువు కొని ఖుర్బానీ చేయాలి, స్తోమత లేకపోతే వారికి ఖుర్బానీ పుణ్యము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా దక్కుతుంది.

అలాగే మిత్రులారా, ఇప్పుడు ఖుర్బానీ సమయం ఏమిటి, ఎప్పుడు ఖుర్బానీ చేయాలి? ఇది చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం.

ఖుర్బానీ ఎప్పుడు చేయాలి అంటే, పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత ఖుర్బానీ చేయాలి. ఒకవేళ తొందరపడి ఎవరైనా జుల్ హిజ్జా 10వ తేదీన పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే, అది హలాల్ ధర్మసమ్మతమే కానీ అతనికి ఖుర్బానీ పుణ్యము దక్కదు. అతను మామూలు రోజుల్లో మాంసం కోసము పశువుని జిబాహ్ చేసుకొని మాంసం తింటారు కదండీ, అలా అతనికి అది ధర్మసమ్మతమైన మాంసం మాత్రమే అతనికి హలాల్ దక్కుతుంది. ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి దక్కదు. అతను మళ్ళీ మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత జిబాహ్ చేసుకుంటే అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

ఒకవేళ ఎవరైనా మర్చిపోయి పండుగ నమాజు కంటే ముందే జిబాహ్ చేసేస్తే? అతనికి కూడా ఖుర్బానీ పుణ్యము దక్కదు. ఆ పశువు అతని కోసం హలాల్ ధర్మసమ్మతమే, అతను ఆ పశువు మాంసాన్ని తినవచ్చు. కానీ ఖుర్బానీ పుణ్యం మాత్రం అతనికి ఇవ్వబడదు. అతను మరొక పశువుని కొని పండుగ నమాజు తర్వాత మళ్ళీ జిబాహ్ చేసుకోవాలి, అప్పుడే అతనికి ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది.

అయితే, జుల్ హిజ్జా నెల 10వ తేదీన పండుగ నమాజు తరువాత నుండి చేయబడే ఖుర్బానీ (ఆ రోజు, అంటే 10వ తేదీన చేయబడే ఖుర్బానీ) ఉత్తమమైనది. ఆ తర్వాత 11, 12, 13 తేదీలలో కూడా ఖుర్బానీ చేసుకోవచ్చు. 10వ తేదీన చేసే ఖుర్బానీ ఎక్కువ పుణ్యము మరియు ఎక్కువ గౌరవప్రదమైనది అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

ఇక, ఖుర్బానీ చేసే విధానం ఏమిటి అంటే, పశువుని జిబాహ్ చేసే ముందు కత్తి బాగా పదును పెట్టుకోవాలి. పశువు ముందర కత్తి నూరరాదు. అలాగే పశువుని జిబాహ్ చేసేటప్పుడు ఎడమ వైపుకి పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఆవు, ఎద్దు, పొట్టేలు, గొర్రె, మేక, మేకపోతు ఉంటే వాటిని పడుకోబెట్టి జిబాహ్ చేయాలి. ఒంటె అయితే నిలబెట్టి అతని గొంతు మరియు మునుపటి కాళ్ళ మధ్యలో ఒక ప్రదేశంలో నహర్ చేస్తారు. అలా నిల్చోబెట్టి ఒంటెకు మాత్రమే నహర్ చేయాలి. ఇతర పశువులకు మాత్రము పడుకోబెట్టి జిబాహ్ చేయాలి.

జిబాహ్ చేస్తున్నప్పుడు పశువు ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఎవరైతే జిబాహ్ చేస్తున్నారో, ఖుర్బానీ చేస్తున్నారో వారు కూడా వారి ముఖాన్ని కిబ్లా దిశలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జిబాహ్ చేస్తున్న వ్యక్తి అవసరార్థం తన కాలు పశువు శరీరం మీద ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు. అలాగే జిబాహ్ చేస్తున్న వ్యక్తి పదునైన కత్తిని తీసుకొని తొందరగా జిబాహ్ చేయాలి.

ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో వారే స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పశువుని జిబాహ్ చేయాలి. ఒకవేళ వారి వల్ల కావట్లేదు అనేటట్లయితే ఇతరులతో కూడా ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చు. అలాగే మహిళలు కూడా వారి ఖుర్బానీ వారు వారి స్వహస్తాలతోనే జిబాహ్ చేసుకోవచ్చును. ఒకవేళ వారి వల్ల కుదరదు అనేటట్లయితే ఇతరుల చేత కూడా వారు ఖుర్బానీ జిబాహ్ చేయించుకోవచ్చును.

ఖుర్బానీ పశువుని జిబాహ్ చేసేటప్పుడు:

بِسْمِ اللَّهِ اللَّهُ أَكْبَرُ
(బిస్మిల్లాహి అల్లాహు అక్బర్)
అల్లాహ్ పేరుతో, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు.

అని పఠించడంతో పాటు,

اللَّهُمَّ إِنَّ هَذَا مِنْكَ وَلَكَ، اللَّهُمَّ تَقَبَّلْ مِنَّا
(అల్లాహుమ్మ ఇన్న హాజా మిన్ క వలక అల్లాహుమ్మ తకబ్బల్ మిన్నా)
ఓ అల్లాహ్! ఇది నీ వైపు నుంచే, నీ కోసమే. ఓ అల్లాహ్! మా నుండి దీనిని స్వీకరించు. అని కూడా పఠించవచ్చును.

మరొక ఉల్లేఖనంలో,

إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
(ఇన్నీ వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్ సమావాతి వల్ అర్జ హనీఫన్ వ మా అనా మినల్ ముష్రికీన్)

నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.” (6:79)

అని ఒక దుఆ ఉంది కదండీ, ఆ పూర్తి దుఆ కూడా పఠించవచ్చును అని తెలుపబడింది.

జిబాహ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో కొన్ని పశువులు బెదిరిపోయి తప్పించుకుని పారిపోతాయి. తర్వాత చేతికి చిక్కవు. అవి పారిపోతూ ఉంటే అలాంటప్పుడు ఏమి చేయాలంటే, ధార్మిక పండితులు తెలియజేశారు, ఎలాగైతే పశువుని షికారు చేస్తారో (వేటాడుతారో) బాణాల ద్వారా లేదా ఇతర పరికరాల ద్వారా, ఆ విధంగా పదునైన బాణంతో గాని లేదా వేరే పరికరాలతో గాని అల్లాహ్ నామము స్మరించి ఆ పారిపోతున్న పశువుని గాయపరచాలి. అదే గాయంలో ఒకవేళ అది మరణిస్తే, అతని ఖుర్బానీ అయిపోయినట్లే. ఒకవేళ అది మరణించకముందే చేతికి దక్కితే, అప్పుడు దాన్ని జిబాహ్ చేసేయాలి, తద్వారా అతని ఖుర్బానీ పూర్తి అవుతుంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

ఇక రండి, ముఖ్యమైన విషయం. ఖుర్బానీ చేసిన తర్వాత ఆ పశువు మాంసము మరియు చర్మము ఏమి చేయాలి? దీని సమాధానం ఏమిటంటే, ఖుర్బానీ చేయబడిన పశువు మాంసము వారు స్వయంగా తినవచ్చును, ఇతరులకు కూడా తినిపించవచ్చును, భవిష్యత్తు కోసము దాన్ని భద్రపరుచుకోవచ్చును (ఎండబెట్టి అయినా సరే వేరే విధంగానైనా సరే).

ఖురాన్ లో 22వ అధ్యాయము 36వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
(ఫకులూ మిన్ హా వ అతయిముల్ ఖానిఅ వల్ ముఅ తర్)
వాటి మాంసాన్ని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి. (22:36)

అడిగేవారు అంటే ఎవరు? అడగని వారు అంటే ఎవరు? నిరుపేదలు చేతులెత్తి అడిగేవారు, వారికి ఇవ్వండి. ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు, వారు చేతులెత్తి అడగరు, అలాంటి వారికి కూడా ఇవ్వండి అని అక్కడ పేర్కొనబడింది. ఆ ప్రకారంగా ఖుర్బానీ ఇవ్వబడిన పశువు మాంసము మన కోసము కూడా కొంచెం ఉంచుకుని, బంధుమిత్రులకు కొంచెం పంచి, నిరుపేదలకు కూడా పంచి ఆ విధంగా ఖుర్బానీ మాంసాన్ని మనము పంచుకొని మనం స్వయంగా కూడా తింటే మంచిది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

అయితే, ఈ విధంగా మూడు భాగాలు చేయాలి, ఆ మూడు భాగాలు సరైన పరిమాణంలోనే ఉండాలి, కొంచెం కూడా హెచ్చుతగ్గులు అవ్వకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరైనా పుణ్యం కోసము పూర్తి మాంసము అనాధలకు, పేదలకు లేదా ఇతరులకు పంచాలనుకుంటే పూర్తి మాంసము పంచేయవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. అలాగే ఎక్కువ మాంసము అవసరాల కోసం ఉంచుకుని కొద్ది మాంసం మాత్రము పంచాలనుకుంటే అనుమతి ఉంది, కానీ అది భక్తికి విరుద్ధమైన విషయం. ఎందుకంటే, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించుటలేదు, పేదవారి గురించి మనం ఆలోచించటలేదు అంటే అది విశ్వాస లోపానికి నిదర్శనం, భక్తికి విరుద్ధమైన విషయం కాబట్టి అలా చేయటం సమంజసం కాదు. అందరి గురించి ఆలోచించాలి. బంధుమిత్రుల గురించి ఆలోచించాలి, పేదల గురించి ఆలోచించాలి, మన కుటుంబ సభ్యుల గురించి కూడా మనము శ్రద్ధ తీసుకోవాలి.

అలాగే ఖుర్బానీ పశువు మాంసము ముస్లిమేతరులకు ఇవ్వవచ్చునా అంటే, ఇవ్వవచ్చును. నా సలహా ఏమిటంటే ఈ రోజుల్లో ముస్లిమేతరులలో ముస్లింల పట్ల అపోహలు సృష్టిస్తున్నారు దుష్టశక్తులు. విషం కక్కి ముస్లింలకు వ్యతిరేకంగా వారి మెదడులలో బాగా నూరి పోస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అపోహలు తొలగిపోవడానికి, వారిలో ఉన్న అనుమానాలు దూరం అవ్వటానికి, మనము స్వయంగా రెండు అడుగులు ముందుకు వేసి మన సమీపంలో ఇరుగు పొరుగులో ఉంటున్న మన ముస్లిమేతర సోదరులకు వెళ్లి సగౌరవంగా ఆహ్వానించి ఈ ఖుర్బానీ పశువు మాంసము అందజేయాలి.

అలాగే మరొక ముఖ్యమైన విషయం, మనం ఏ ప్రదేశంలో అయితే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉన్న ముస్లిమేతరుల సోదరుల మనోభావాలు గాయపడకుండా ఉండటానికి ఆ ప్రదేశంలో ఉన్న ధార్మిక పండితులు ఖుర్బానీ విషయంలో ఏ నియమాలు అయితే బోధిస్తున్నారో ఆ నియమాలకు అనుగుణంగా ఖుర్బానీ చేసుకోండి, ఇది శ్రేయస్కరమైన విధానము.

అలాగే మిత్రులారా, ఖుర్బానీ పశువు చర్మము ఏమి చేయాలి? ఆ చర్మము మనము స్వయంగా ఉపయోగించుకోవటానికి అవకాశము ఉంటే ఉపయోగించుకోవచ్చును. మనకు ఉపయోగించుకోవటం రాదు అంటే ఇతరులకు దానం చేసేయాలి. లేదా అమ్మేసి వచ్చిన సొమ్ముని దానం చేసేయాలి అంతేగాని పశువుని జిబాహ్ చేసిన తర్వాత ముక్కలు చేసి ఇవ్వటానికి వచ్చిన కసాయికి కూలీ రూపంలో మాత్రము ఇవ్వటానికి అనుమతి లేదు. కూలీ రూపంలో జేబు నుంచి డబ్బు చెల్లించండి, కానీ ఆ ఖుర్బానీ ఇవ్వబడిన పశువు చర్మాన్ని కూలీ రూపంలో కసాయికి ఇవ్వటానికి అనుమతి లేదు, ఇది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం.

ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం చెప్పిన మాటను ముగిస్తాను. అదేమిటంటే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చునా లేదా? అంటే ధార్మిక పండితులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.

ఎవరైతే మరణించిన వారి తరపున ఖుర్బానీ ఇవ్వవచ్చును అని చెబుతూ ఆధారాలు చూపిస్తున్నారో వారు చూపిస్తున్న ఆధారాలన్నీ బలహీనమైనవి. ప్రామాణికమైన ఆధారాలలో ఎక్కడా ఆ విషయం బోధపడలేదు.

ఇక ఎవరైతే ఖుర్బానీ ఇవ్వటానికి అనుమతి ఉంది అని చెబుతూ వేరే మార్గాలు చూపిస్తున్నారో వారేమంటున్నారంటే, ఒకవేళ మరణించిన వ్యక్తి మరణించే ముందు “నేను మరణించిన తర్వాత నా తరపున ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేస్తూ ఉండండి” అని వసీయత్ (హితవు) చేసి ఉంటే, అప్పుడు అతని తరపున ఖుర్బానీ చేయడానికి అనుమతి ఉంటుంది అని కొంతమంది ఒక రకమైన అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.

మరి కొంతమంది అయితే అది కూడా ఒక దానం కదండీ, అది చేయవచ్చును అంటున్నారు.

అయితే మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మిత్రులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇద్దరు కుమారులు మరణించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుమార్తెలు మరణించారు. సొంత కుటుంబ సభ్యుల్లో ఇంతమంది మరణించి ఉన్నా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ సంవత్సరము కూడా “మరణించిన నా సతీమణి ఖదీజా పేరున నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమారుల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను, మరణించిన నా కుమార్తెల పేరిట నేను ఖుర్బానీ చేస్తున్నాను” అని చేయలేదు. కాబట్టి మరణించిన వ్యక్తుల పేరిట ప్రత్యేకంగా ఖుర్బానీ చేయడానికి అనుమతి లేదు.

కాకపోతే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని మనము పాటిస్తే, ఇన్ షా అల్లాహ్ బ్రతికి ఉన్న వారికి మరణించిన వారికి అందరికీ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమవుతుంది. అది ఎలాగంటే చూడండి: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు ఏమని దుఆ పటించేవారు అంటే,

اللَّهُمَّ تَقَبَّلْ مِنْ مُحَمَّدٍ، وَآلِ مُحَمَّدٍ
(అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ ముహమ్మద్ వ ఆలి ముహమ్మద్)
ఓ అల్లాహ్! నేను ఇస్తున్న ఈ ఖుర్బానీ నా తరఫున మరియు నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసేవారు.

ఇక ఆయన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్నవారు ఉన్నారు, మరణించి ఉన్నవారు ఉన్నారు. ఆ ప్రకారంగా ఆయన తరఫున, ఆయన కుటుంబీకుల్లో బ్రతికి ఉన్న, మరణించిన వారందరి తరపున ఖుర్బానీ అయ్యింది, అందరికీ ఖుర్బానీ పుణ్యము బహుశా ప్రాప్తమయింది అని ధార్మిక పండితులు ఆశాభావం వ్యక్తపరుస్తూ ఏమంటున్నారంటే, మనము కూడా ఖుర్బానీ ఇచ్చేటప్పుడు “ఓ అల్లాహ్ ఇది నా తరఫున నా కుటుంబ సభ్యుల తరఫున స్వీకరించు” అని దుఆ చేసి ఖుర్బానీ చేసుకుంటే మన తరఫున ఖుర్బానీ అయిపోతుంది, మన కుటుంబ సభ్యుల్లో జీవించి ఉన్న, మరణించి ఉన్న వారందరి తరఫున కూడా ఖుర్బానీ అయిపోతుంది. అందరికీ కూడా ఇన్ షా అల్లాహ్ ఖుర్బానీ పుణ్యము ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు.

చివరిలో ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, అప్పు చేసి మరీ ఖుర్బానీ చేయవలసిందేనా? అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అప్పు చేసి మరి తప్పనిసరిగా ఖుర్బానీ చేయమని ఆదేశించలేదు కానీ, మనకు అల్లాహ్ శక్తి ఇచ్చి ఉంటే… ఖుర్బానీ ఒక మూడు నాలుగు రోజుల్లో మాత్రమే అవుతుంది, మిగతా రోజుల్లో ఖుర్బానీ అవ్వదు. అయితే అనుకోకుండా ఆ సమయానికి మన వద్ద డబ్బు లేదు అనేటట్లయితే అప్పటికప్పుడు ఎక్కడినుంచైనా డబ్బు తీసుకొని తర్వాత ఇన్ షా అల్లాహ్ మనము చెల్లించుకోగలము అనే ధైర్యము ఉంటే అప్పుడు అప్పు తీసుకుని ఖుర్బానీ చేసుకోవటం మంచిది, ఉత్తమం. చూడండి డబ్బులు లేకపోయినా స్నేహితులకు పార్టీలు ఇస్తాం బాకీలు చేసి, వేరే చాలా కార్యాలు చేస్తాం. మరి పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో ఎందుకు వెనకడుగు వేయాలి? బేకారు విషయాలలో ధైర్యము చేస్తాం పుణ్యం ప్రాప్తమయ్యే విషయంలో మాత్రము కంగారుపడతామంటే ఇది సరికాదు మిత్రులారా. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇస్తాడు నేను బాకీ చెల్లించుకోగలను అని అల్లాహ్ మీద నమ్మకంతో అప్పు చేసి ఖుర్బానీ చేయాలనుకుంటే చేసుకోవచ్చును, అది మంచిదే అని ధార్మిక పండితులు అభిప్రాయపడి ఉన్నారు.

అలాగే ఏ వ్యక్తి అయితే ఖుర్బానీ చేయాలని సంకల్పించుకున్నాడో అతను జుల్ హిజ్జా మాసం ప్రారంభము నుండి ఖుర్బానీ ఇచ్చేంత వరకు కూడా వెంట్రుకలు కత్తిరించరాదు, గోర్లు కత్తిరించరాదు, చర్మము కత్తిరించరాదు. ఒకవేళ మర్చిపోయి ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న వ్యక్తి మధ్యలో గోర్లు కత్తిరించేసాడు లేదా చర్మం కత్తిరించేసాడు అంటే అతను అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి, ఎలాంటి కఫ్ఫారా పరిహారము చెల్లించాల్సిన అవసరమైతే లేదు.

అలాగే ఖుర్బానీ కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసము ఇఖ్లాస్ తో చిత్తశుద్ధితో చేయాలి. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు. అలాగే పిసినారితనము కూడా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చూస్తూ ఉంటాం సమాజంలో చాలామంది ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్లు, షావుకార్లు కూడా ఖుర్బానీ విషయంలో పిసినారితనము చూపిస్తూ ఏదో ఒక సాధారణమైన చిన్న పశువు తీసుకొని ఖుర్బానీ చేసేసి చెల్లించేద్దాము అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే వారు పిసినారితనం ప్రదర్శిస్తూ ఉంటారు, సంవత్సరంలో ఒక్కసారి చేయబడే ఖుర్బానీ విషయంలో పిసినారితనము ప్రదర్శించకండి.

సంతోషంగా అల్లాహ్ మార్గంలో ధనము ఖర్చు పెట్టండి. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మనము ఇస్తున్న ఖుర్బానీ పశువు యొక్క మాంసము అవసరము లేదు, రక్తము అవసరము లేదు, మనము అల్లాహ్ చిత్తము కోసము సంతోషంగా ఖుర్బానీ చేస్తామా లేదా అనేది అల్లాహ్ చూస్తున్నాడు.

لَن يَنَالَ اللَّهَ لُحُومُهَا وَلَا دِمَاؤُهَا وَلَٰكِن يَنَالُهُ التَّقْوَىٰ مِنكُمْ
(లయ్యనాలల్లాహ లుహూముహా వలా దిమావుహా వలాకిన్ యనాలుహుత్ తఖ్వా మిన్ కుమ్)
వాటి మాంసంగానీ, రక్తంగానీ అల్లాహ్‌కు చేరవు. అయితే మీలోని భక్తి పరాయణత (తఖ్‌వా) మాత్రం ఆయనకు చేరుతుంది. (22:37)

అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు కాబట్టి, పిసినారితనము ప్రదర్శించకుండా సంతోషంగా పశువు కొని మంచి పశువు కొని అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ చేయాలి.

అలాగే రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొంతమంది డబ్బు ఖర్చు చేస్తారు, మంచి పశువుని కొంటారు, కాకపోతే “నేను ఇంత మంచి పశువుని కొన్నాను” అని ఆ పశువు మెడలో దండలు వేసి ఊరిలో ఊరేగింపు చేస్తూ ఉంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ప్రదర్శనా బుద్ధితో అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఫోటోలు దింపి, దండలు వేసి, ఇంకా ఏమేమో హంగులు చేసి ఆ ఫోటోలను ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, ఇంకా వీడియోలు తీసి యూట్యూబ్ లలో ఎక్కడెక్కడో వారు ప్రసారం చేస్తూ ఉంటారు. తద్వారా మనిషిలో చిత్తశుద్ధి అనేది లేకుండా పోతుంది. ప్రదర్శనా బుద్ధి అక్కడ వచ్చేస్తుంది, దీనినే ఇస్లామీయ పరిభాషలో రియాకారీ అంటారు. రియా ఉద్దేశంతో, ప్రదర్శనా ఉద్దేశంతో, ప్రదర్శనా బుద్ధితో చేసిన ఏ పుణ్యకార్యము అల్లాహ్ స్వీకరించడు, ఈ ఖుర్బానీ కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొద్ద స్వీకరించబడదు.

కాబట్టి ఖుర్బానీ చేస్తున్నవారు అటు పిసినారితనము ప్రదర్శించకుండా, ఇటు ప్రదర్శనా బుద్ధిని కూడా ప్రదర్శించకుండా చిత్తశుద్ధితో అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ చేయాలి. అలాగే ధర్మసమ్మతమైన హలాల్ సంపదతోనే ఖుర్బానీ పశువు కొని ఖుర్బానీ చేయాలి. హరామ్ సంపదతో పశువు కొని ఖుర్బానీ చేస్తే ఆ ఖుర్బానీ ఆమోదించబడదు. హరామ్ సంపదతో ఏ పుణ్యకార్యము చేసినా అది ఆమోదించబడదు, స్వీకరించబడదు.

ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు సూచనలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరికీ హలాల్ సంపదతో, చిత్తశుద్ధితో, సంతోషంగా మంచి పశువుని అల్లాహ్ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. ఎవరెవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్తోమత ఇచ్చారో వారందరూ ఖుర్బానీ చేసుకునే భాగ్యం అల్లాహ్ అందరికీ ప్రసాదించుగాక. ఎవరికైతే స్తోమత లేదో వారందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్బానీ చేయటానికి అర్హత, స్తోమత ప్రసాదించుగాక. ఆమీన్ తకబ్బలల్లాహు మిన్నా వమిన్ కుమ్ వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16954

ఖుర్బానీ ఆదేశాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3FDVDGQYnF0UMyD7YjGNZm

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


నమాజ్ లో సుత్రా నిబంధన [వీడియో & టెక్స్ట్]

నమాజ్ చదివేటప్పుడు మనిషి తన ముందు ఏదైనా అడ్డంకిని పెట్టుకోవడాన్ని సుత్రా (తెర) అంటారు

నమాజ్ లో సుత్రా నిబంధన
https://youtu.be/jZgcgvh3Aho [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.

أَلْحَمْدُ لِلّٰهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ
(వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్)
మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.

సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.

అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.

మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.

మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.

సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.

అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.

ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.

రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.

ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ [తప్పక వినండి] [ఆడియో & టెక్స్ట్]

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ
https://youtu.be/Pj0-SewzPaA [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తిని చూసి, అతనిని చాలా ఆకలితో ఉండి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తిన్న వ్యక్తితో పోల్చారు. ఎలాగైతే ఆ కొద్దిపాటి ఆహారం ఆకలిని తీర్చదో, అలాగే అసంపూర్ణమైన రుకూ మరియు సజ్దాలతో చేసే నమాజ్ ఆత్మకు పోషణ ఇవ్వదని వివరించారు. నమాజ్ అనేది విశ్వాసుల హృదయాలకు ఆహారం లాంటిదని, దానిని సంపూర్ణంగా, ఉత్తమ రీతిలో చేయడం ద్వారానే ఆత్మకు, మనస్సుకు కావలసినంత పోషణ లభిస్తుందని తెలిపారు. సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి తన ఆత్మను పస్తులు ఉంచినట్లేనని, దానివల్ల ఆత్మ అనారోగ్యానికి గురై చివరకు “చనిపోతుందని” (ఆధ్యాత్మికంగా నిర్జీవమవుతుందని) హెచ్చరించారు. ఈ “ఆత్మ మరణం” అనేది భౌతిక మరణం కాదని, అల్లాహ్ స్మరణ, ఆరాధనల నుండి దూరం కావడం అని స్పష్టం చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, నమాజ్ చేస్తున్నది. కానీ ఆ వ్యక్తి ఎలా నమాజ్ చేస్తున్నాడు?

لَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(లా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
అతను రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు.

يَنْقُرُ صَلَاتَهُ كَمَا يَنْقُرُ الْغُرَابُ
(యన్ఖురు సలాతహు కమా యన్ఖురుల్ గురాబ్)
కాకి ఎలా చుంచు కొడుతుందో విత్తనం ఎత్తుకోవడానికి, ఆ విధంగా అతను నమాజ్ చేస్తున్నాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

إِنَّ مَثَلَ الَّذِي يُصَلِّي وَلَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(ఇన్న మసలల్లదీ యుసల్లీ వలా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
ఎవరైతే ఈ విధంగా నమాజ్ చేస్తున్నారో, అందులో రుకూ కూడా సరిగ్గా చేయడం లేదు, సజ్దా కూడా సరిగ్గా చేయడం లేదు,

كَمَثَلِ الَّذِي يَأْكُلُ التَّمْرَةَ وَالتَّمْرَتَيْنِ
(క మసలిల్లదీ య’కులుత్తమ్రత వత్తమ్రతైన్)
అతని ఉదాహరణ, దృష్టాంతం ఎలాంటిదంటే, చాలా ఆకలిగా ఉండి కేవలం ఒక్క ఖర్జూరము లేదా రెండు ఖర్జూరపు ముక్కలు తిన్న వాని మాదిరిగా,

لَا يُغْنِيَانِ عَنْهُ شَيْئًا
(లా యుగ్నియాని అన్హు షైఆ)
ఆ ఒక్క రెండు ఖర్జూరపు ముక్కలు అతని యొక్క ఆకలిని తీర్చవు.

فَأَتِمُّوا الرُّكُوعَ وَالسُّجُودَ
(ఫఅతిమ్ముర్రుకూఅ వస్సుజూద్)
మీరు నమాజులలో రుకూ సజ్దాలు పూర్తిగా చెయ్యండి, సంపూర్ణంగా చెయ్యండి, సరిగ్గా చెయ్యండి.

ఇమామ్ ముందిరి రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను హసన్ కోవకు చెందినది అని చెప్పారు. అయితే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఉదాహరణ, దృష్టాంతం తెలియజేశారో అది చాలా గొప్పది, చాలా ఉత్తమ రీతిలో తెలియజేశారు.

ఎలాగైతే ఆకలి ఉన్న వానికి ఒక ఖర్జూరపు, రెండు ఖర్జూరపు ముక్కలు అతని ఆకలిని తీర్చలేవో, ఇలా రుకూ సజ్దాలు సరిగ్గా చేయకుండా నమాజును తొందరపాటుతో చేసేవాడు వాస్తవానికి అతడు నమాజ్ ఏదైతే విశ్వాసుల హృదయాలకు ఆహారంగా ఉందో, ఆ ఆహారం అతడు తీసుకోని వాడవుతాడు.

వాస్తవానికి నమాజ్ అల్లాహ్ యొక్క ధిక్ర్, అల్లాహ్ తో వేడుకోలు, అల్లాహ్ సాన్నిధ్యానికి చేరవేసే, అల్లాహ్ కు చాలా దగ్గరగా చేసే సత్కార్యాల్లో గొప్ప సత్కార్యం. ఇక ఎవరైతే ఈ నమాజ్ సంపూర్ణంగా, మంచి ఉత్తమ రీతిలో చేస్తారో అతడే తన ఆత్మకు, తన మనస్సుకు కావలసినంత ఆహారం ఇచ్చిన వాడవుతాడు. మరి ఎవరైతే నమాజ్ సరియైన రీతిలో చెయ్యడో, టక్కు టిక్కు మని, ఎక్స్ప్రెస్ నమాజ్, ఇలా చూసి అలా చూసేసరికి అల్లాహు అక్బర్ అని మొదలవుతుంది, అస్సలాము అలైకుం అని పూర్తయిపోతుంది, ఇలాంటి నమాజ్ ద్వారా అతడు తన హృదయ, తన మనస్సుకు కావలసిన, తన ఆత్మకు కావలసిన ఆహారాన్ని సరిగా ఇవ్వలేదు. ఇక ఎలాగైతే మనిషికి కావలసినంత ఆహారం దొరకకుంటే చనిపోతాడో, అనారోగ్యానికి గురవుతాడో అలాగే ఎప్పుడైతే హృదయానికి, ఆత్మకు, మనస్సుకు దాని ఆహారం దొరకదో అది కూడా అనారోగ్యానికి గురి అవుతుంది మరియు అది కూడా చనిపోతుంది. మనిషి యొక్క చావు అంత నష్టమైనది కాదు, ఆత్మ చనిపోయిందంటే అది చాలా పెద్ద నష్టం.

ఏమైనా అర్థమైందా అండీ మీకు ఇప్పుడు చెప్పిన మాటలతో?

ప్రశ్న మరియు జవాబు

ఆత్మ చనిపోవడం అంటే, ఇది ఒక ఉదాహరణగా. ఆత్మ చనిపోవడం అంటే ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వకపోవడం. ప్రాపంచిక పరంగా బ్రతికి ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క ధిక్ర్ తో, అల్లాహ్ యొక్క ఆరాధనతో, అల్లాహ్ యొక్క స్మరణతో, ఖురాన్ యొక్క తిలావత్ తో దానికి ఏ ఆహారం అవసరం ఉంటుందో, అది దానికి చేరనీయకపోవడం. ఇక్కడ ఆత్మ చనిపోవడం అంటే మనం ఫిజికల్ గా, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ పరంగా ఏదైతే మాటలు మాట్లాడతారో ఇతని యొక్క మెదడు చనిపోయింది, ఆ మైండ్ డెత్ అని, ఆత్మ డెత్, ఇలాంటి విషయం ఇక్కడ కాదు. ఇక్కడ చనిపోవడం అంటే, “అరే ఏందిరా, నువ్వు జీవితం, ఏదైనా జీవితమా? నీదే బ్రతుకు, ఏదైనా బ్రతుకా? చనిపోయిన శవం కంటే అధ్వానం రా నువ్వు!” ఇలా మనం ఎప్పుడు అంటాము? ఆ మనిషి బ్రతికి కూడా సరియైన పనులు చేయకుంటే అంటాము కదా, ఆ విధంగా. ఇన్షా అల్లాహ్ మాట అర్థమైందని భావిస్తున్నాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15701

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీల సజ్దా పురుషుల సజ్దా కంటే భిన్నంగా ఉందా? సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం ఒకటేనా?
https://youtu.be/-wurwxOMX1A [5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో సజ్దా (సాష్టాంగ ప్రణామం) చేసే సరైన పద్ధతి గురించి వివరించబడింది. సజ్దా సమయంలో ఏడు శరీర భాగాలు నేలను తాకాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని, ఆ ఏడు భాగాలు ఏవో స్పష్టంగా చెప్పబడింది. పురుషులు మరియు స్త్రీల సజ్దా పద్ధతిలో ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇద్దరికీ ఒకే విధానం వర్తిస్తుందని నొక్కి చెప్పబడింది. ఇస్లామిక్ సజ్దాకు మరియు ఇతర సంప్రదాయాలలో కనిపించే సాష్టాంగ నమస్కారానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ ప్రసంగం వివరిస్తుంది, ముఖ్యంగా భంగిమ మరియు ఉద్దేశ్యం పరంగా. చివరగా, సజ్దాలో సరైన భంగిమను, అంటే అవయవాలను ఎలా ఉంచాలో దృశ్య సహాయంతో వివరించడం జరిగింది.

ప్రశ్న : సజ్దా చేసినప్పుడు ఎన్ని బాడీ పార్ట్స్ టచ్ అవ్వాలి ? పురుషుల సజ్దా, స్త్రీల సజ్దా ఒకటేనా? అలాగే సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం అనేది ఒకటేనా?

చూడండి, ఆ సజ్దాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీస్, బుఖారీలో ఉంది:

أُمِرْتُ أَنْ أَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ
[ఉమిర్తు అన్ అస్జుదా అలా సబ’అతి ఆ’దా]
ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది.

ఏడు అంగములపై నేను సజ్దా చేయాలి అని నాకు ఆదేశం ఇవ్వబడింది. ఆ ఏడింటిలో ముక్కు మరియు నొసటి కలిసి ఒకటి, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు భూమికి తాకి ఉండడం, ఈ ఏడు అంగములు భూమికి తాకి ఉండాలి. కావాలని, తెలిసి, ఉద్దేశపూర్వకంగా వీటిలో ఏ ఒక్కటి భూమికి తాకకున్నా, మన యొక్క నమాజ్ నెరవేరదు.

అయితే, ఈ సజ్దా యొక్క పద్ధతి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ ఒకటే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలు సజ్దా చేసినప్పుడు ఇలా ముడుచుకొని చేయాలి అని, పురుషులు చేసినప్పుడు ఇలాగ వెడల్పు చేయాలి అని వేరు వేరు చెప్పలేదు. అందరికీ ఒకే పద్ధతి నేర్పారు.

ఇక మీ ప్రశ్నలో రెండవ అంశం ఏదైతే ఉందో, సజ్దా మరియు సాష్టాంగ నమస్కారం రెండూ ఒకటేనా? సజ్దా అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా? కావాలంటే దీనికి సంబంధించి ఇంతకుముందు మనం నమాజ్ యొక్క పద్ధతి అని ఏదైతే చూపించామో, అందులో కూడా వివరణ మీరు చూసి ఉండవచ్చును. ఆ ప్రకారంగా మనం సజ్దా చేయాలి. అది సజ్దా, సజ్దాలో ఏడు అంగములు స్త్రీలైనా, పురుషులైనా భూమికి తాకించాలి.

కానీ సాష్టాంగ నమస్కారం అన్నది ఏదైతే ఉందో, ఒకవేళ ఉద్దేశంగా, ఉద్దేశం ఏది, సాష్టాంగం, ఇక్కడ అష్టాంగం అని అంటున్నారా? సా అని తీసుకున్నారైతే ఏడు అని వస్తుందా? అష్ట అని ఎనిమిదిని కూడా అంటారు. అయితే ఈ ఎనిమిది అవయవాలు భూమికి తాకాలి, ఆ ఉద్దేశ పరంగా చెప్పడం జరిగిందా?

ఒకసారి యోగాలోని కొన్ని విషయాలు ఒక వ్యక్తి చూపిస్తూ, సాష్టాంగ నమస్కారం అని చూపించాడు. అందులో ఏం చేశాడు? పడుకున్నాడు. ముఖము, కడుపు ఇది మొత్తం భూమికి తాకి ఉండి, ఈ విధంగా చేతులు ఇలా ముందుకు చేసి, ఇలా అందులో అతను చూపిస్తున్నాడు. ఒకవేళ అతను అలా చూపిస్తున్నాడంటే మరి ఇది సరైన పద్ధతి కాదు. ఇస్లాం ఏదైతే చూపుతుందో, దాని ప్రకారంగా ఒకవేళ మనం చూసుకుంటే ఇది సరైన విషయం కాదు. అందుకొరకు నేను చెప్పేది ఏమిటి? మనం ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తికి అర్థం కావడానికి తెలుగులో, సంస్కృతంలో, వేరే భాషలో వచ్చిన ఏదైనా పదం వాడుతున్నప్పటికీ, ఇస్లామీయ ఇస్తిలాహాత్, ఇస్లామీయ పదాలను మనం తప్పకుండా వాడాలి, తప్పకుండా అర్థం చేసుకోవాలి మరియు వాటినే పలుకుతూ ఉండడం చాలా మంచి విషయం.

సజ్దా చేసే సరైన విధానం

ఇక్కడ సంక్షిప్తంగా మీకు సజ్దా విషయం చూపించడం జరుగుతుంది, గమనించండి. సజ్దా చేయు విధానంలో, అల్లాహు అక్బర్ అంటూ మొదటి సజ్దాలోకి వెళ్ళాలి. ఏడు అంగములపై సజ్దా చేయాలి. నొసటి, ముక్కు, చూస్తున్నారు కదా ఇక్కడ? ఇక్కడ గమనిస్తున్నారా? ఆ తర్వాత రెండు అరచేతులు. ఆ తర్వాత రెండు మోకాళ్ళు. ఆ తర్వాత రెండు పాదముల వేళ్ళు, ఎలా ఉన్నాయో ఇక్కడ గమనిస్తున్నారు కదా? ఇందులో,

سُبْحَانَ رَبِّيَ الْأَعْلَى
[సుబ్ హా న రబ్బియల్ ఆ’లా]
మహోన్నతుడైన నా ప్రభువు పరమ పవిత్రుడు

అని చదవాలి అని, ఇంకా వేరే దువాలు కూడా ఉన్నాయి.

సజ్దా చేసే సరైన విధానం

ఆ తర్వాత ఇక్కడ గమనించండి. సజ్దాలో ఈ క్రింది విషయాల్ని గమనించాలి. తొడలను పిక్కల నుండి వేరుగా ఉంచాలి, గమనిస్తున్నారు కదా? మోచేతులను ప్రక్కల నుండి వేరుగా ఉంచాలి. కడుపు తొడలకు తాకకుండా ఉండాలి, ఇక్కడ. ఇంకా మోచేతులు భూమికి తాకకుండా లేపి ఉంచాలి. చేతులు, చేతుల వ్రేళ్ళు మరియు కాళ్ళ వ్రేళ్ళు ఖిబ్లా దిశలో ఉండాలి. ఇది సజ్దా యొక్క వివరణ ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా మీరు సజ్దా చేయండి.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

సహాబాలు – వారి గొప్పతనం, వారి గురించి మనకు ఉండ వలసిన అఖీదా (విశ్వాసము) [ఆడియో & టెక్స్ట్]

సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్‌) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్‌ చేసినవారని, షరీయత్‌ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్‌). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]


వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

భాగం 01: సహాబా అంటే ఎవరు? (2:06నిముషాలు)

భాగం 02: సహాబా యొక్క ప్రాముఖ్యత  (1:11నిముషాలు)

భాగం 03: ఇస్లాంలో సహాబాల గొప్పతనం (1:43నిముషాలు)

భాగం 04: తౌరాతు మరియు ఇంజీలు గ్రంధాలలో సహాబాల ప్రస్థావన (3:28నిముషాలు)

భాగం 05: సహాబాల గురించి ప్రవక్త గారు ఏమి చెప్పారు? (1:48 నిముషాలు)

భాగం 06: మన మీద సహాబాల హక్కులు ఏమిటి? (2:05 నిముషాలు)

భాగం 07: సహాబాల గురించి ఖురాన్ ఏమి చెబుతుంది? (0:49నిముషాలు)

భాగం 08: సహాబాల స్వర్ణయుగపు రోజులు (1:31నిముషాలు)

భాగం 09: సలఫ్ సాలిహీన్ దృష్టిలో సహాబాల గొప్పతనం (3:21 నిముషాలు)

భాగం 10: సహాబాలను ప్రేమించడం విశ్వాసంలో ఒక భాగం (2:04నిముషాలు)

భాగం 11: ఇమాం అహ్మద్ సహాబాల గురుంచి ఏమి చెప్పారు? (1:09నిముషాలు)

పూర్తి ఆడియో క్రింద వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి 

సహాబా : పూర్తి ఆడియో (21:21నిముషాలు)

ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.

అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?

“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు

ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,

أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا
(అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా)
సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.

وَأَعْمَقُهَا عِلْمًا
(వ అ’మఖుహా ‘ఇల్మా)
చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.

وَأَقَلُّهَا تَكَلُّفًا
(వ అఖల్లుహా తకల్లుఫా)
చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.

وَأَقْوَمُهَا هَدْيًا
(వ అఖ్వముహా హద్యా)
సన్మార్గంపై, సన్మాగంపైన అందరికంటే ఎక్కువగా ఉత్తమంగా నడిచేవారు.

وَأَحْسَنُهَا حَالًا
(వ అహ్సనుహా హాలా)
అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.

اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ
(ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి)
అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు

గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.

సూరతుల్ ఫతహ్ లో:

مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)

గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.

అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,

تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ

ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?

وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:

لَا تَسُبُّوا أَصْحَابِي
(లా తసుబ్బూ అస్ హాబీ)
నా సహాబాలను మీరు దూషించకండి.

అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?

“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.”
మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.

గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?

మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.

ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.

సూరతుల్ అహ్జాబ్, ఆయత్ నంబర్ 58లో అల్లాహు తాలా తెలిపాడు:

وَالَّذِينَ يُؤْذُونَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتَانًا وَإِثْمًا مُّبِينًا

ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.

అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:

خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ
(ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్)
అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.

అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.

మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.

హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.

అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.

అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?

అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.

సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي
(అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ)
నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.

ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”

فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ
(ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్)
ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు

وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ
(వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా)
ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.

గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?

మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:

مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
(మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్)
ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.

ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”

ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.

ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది

ఇతరములు:

సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్