అల్లాహ్ సామీప్య మార్గాలు (వసీలా) – అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కు దగ్గర కావాలనుకుంటున్నారా? అల్లాహ్ ప్రేమించేవారిలో, ఇష్టపడేవారిలో చేరాలనుకుంటున్నారా? మరి అల్లాహ్ సామీప్యం పొందడానికి మార్గాలు ఏమిటి? అల్లాహ్ సామీప్యం పొందితే కలిగితే గొప్ప ప్రయోజనాలు ఏమిటి? తప్పక విని ప్రయోజనం పొందండి. మరియు మీ బంధుమిత్రులకు షేర్ చెయ్యండి ఇన్ షా అల్లాహ్

అల్లాహ్ సామీప్య మార్గాలు
https://youtu.be/CiCtBSNqJAI [38 నిముషాలు]
వక్త: అబ్దుల్ గఫ్ఫార్ ఉమరీ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ సామీప్యాన్ని (వసీలా) ఎలా పొందాలో ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. ప్రసంగం ప్రారంభంలో, విశ్వాసులు అల్లాహ్ సామీప్యాన్ని అన్వేషించాలని సూచించే ఖురాన్ ఆయతును ఉదహరించారు. అల్లాహ్ సామీప్యం పొందడానికి పది ముఖ్యమైన మార్గాలు వివరించబడ్డాయి: సమయానికి నమాజ్ చేయడం, ఫర్జ్ నమాజులతో పాటు సున్నత్ మరియు నఫిల్ నమాజులు అధికంగా చేయడం, అల్లాహ్ పట్ల విధేయత చూపడంలో ఉత్సాహం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ అల్లాహ్ ను స్మరించడం (జిక్ర్), అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండటం, చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందడం, ఖురాన్ ను పారాయణం చేయడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడం, సజ్జనులతో స్నేహం చేయడం, మరియు పేదవారికి దానం చేయడం. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి అల్లాహ్ కు ప్రియమైన వాడిగా మారి, అతని ప్రార్థనలు అంగీకరించబడతాయని మరియు ఇహపరలోకాలలో సాఫల్యం పొందుతాడని నొక్కి చెప్పబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్.

ఫ అ’ఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్.

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
కరుణామయుడు, కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

سُبْحَٰنَكَ لَا عِلْمَ لَنَآ إِلَّا مَا عَلَّمْتَنَآ ۖ إِنَّكَ أَنتَ ٱلْعَلِيمُ ٱلْحَكِيمُ
(సుబ్ హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అన్తల్ అలీముల్ హకీమ్)
“(ఓ అల్లాహ్‌!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే!” (2:32)

వ ఖాలల్లాహు తబారక వ త’ఆలా

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి.  (5:35)

ప్రియమైన సోదరులారా! సోదరీమణులారా! అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కృతజ్ఞత, ఆయన దయతో ఈరోజు మనమంతా ఒక కొత్త అంశాన్ని తీసుకొని సమావేశమై ఉన్నాము. అల్లాహ్ తో దుఆ ఏమనగా, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఏవైతే వాక్యాలు మనకు వినబడతాయో వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మాకు ప్రసాదించు గాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి అందరినీ ఒకేచోట సమావేశపరుస్తున్న వారందరికీ అల్లాహ్ త’ఆలా మంచి ఫలితాన్ని ఇహపరలోకాలలో ప్రసాదించు గాక. ఆమీన్.

ప్రియమైన మిత్రులారా! ఖురాన్ గ్రంథంలోని ఒక ఆయత్.

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَٱبْتَغُوٓا۟ إِلَيْهِ ٱلْوَسِيلَةَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగూ ఇలైహిల్ వసీలహ్)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి అని అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో సెలవిచ్చాడు.

ఈరోజు మన అంశం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్య మార్గాలు. అల్లాహ్ సామీప్యం ఎలా పొందగలము? వాటి యొక్క మార్గాలు ఏమిటి? దాని ఫలితంగా మనకు అల్లాహ్ త’ఆలా కల్పించే భాగ్యాలు ఏమిటి? దీనిపై ఈరోజు సవివరంగా మీ ముందు ఉంచబోతున్నాను.

సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనల్ని అందరినీ సృష్టించారు. సరైన మార్గం కూడా అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు సూచించాడు. సర్వ జనుల్లో అనేకమంది అనేక అభిప్రాయాలు, అనేక ఆలోచనలతో జీవిస్తున్నారు. కొంతమందికి కొన్ని విషయాల వల్ల ప్రేమ, మరి కొంతమందికి కొన్ని విషయాల పట్ల ఆకర్షణ, మరికొంతమందికి కొన్ని విషయాల పట్ల సంతుష్టి ఉంటుంది. అయితే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక వ త’ఆలా ఏమి చెబుతున్నాడంటే, ఓ విశ్వాసులారా! నా యొక్క సామీప్యాన్ని మీరు అన్వేషించండి.

అల్లాహ్ యొక్క సామీప్యం ఎంతో ఉన్నతమైన స్థానం. విలువైన స్థానం. ఆ ఉన్నతమైన స్థానానికి, ఆ విలువైన స్థానానికి మనిషి చేరుకోగలిగితే, ఇక అక్కడి నుంచి అల్లాహ్ తబారక వ త’ఆలా ను ఆ మనిషి ఏది కోరుకుంటాడో, ఆ దాసుడు ఏది కోరుకుంటాడో దాన్ని అల్లాహ్ త’ఆలా ప్రసాదిస్తాడు. ఆ విలువైన స్థానం, ఆ విలువైన సామీప్యాన్ని పొందడానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు సూచించారు. ఆ సామీప్యం మనిషికి దొరికినట్లయితే ఆ మనిషి యొక్క విలువ కూడా పెరిగిపోతుంది. అతని భక్తి కూడా పెరిగిపోతుంది. అల్లాహ్ వద్ద ఉన్నత స్థానాల్లో ఉంటాడు.

అయితే ఆ సామీప్యం మనకు ఎలా లభిస్తుంది? దాని కోసం మనం ఎన్నుకోవలసిన మార్గాలు ఏమిటి? ఇది మీరు, మేము చెప్పుకుంటే వచ్చేది కాదు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ప్రవక్తా! మీకు ఏ దేవుడైతే, ఏ అల్లాహ్ అయితే మీకు ప్రవక్తగా చేసి పంపించాడో అతని సాక్షిగా నేను చెబుతున్నాను. అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశం ఏమిటో నాకు వివరించండి.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “షహాదతైన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్.” దాన్ని “అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్.” నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప మరి నిజమైన ఏ దేవుడు లేడు. అలాగే నేను సాక్ష్యమిస్తున్నాను మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని తర్వాతే మిగతా విషయాలన్నీ అక్కడ వస్తాయి. ఆ వ్యక్తి దాన్ని విశ్వసించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అంటున్నాడు, రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మాపై విధించిన విషయాలు ఏమిటో చెప్పండి.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదేశించారు. రేయింబవళ్ళలో అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై విధించిన విషయం ఏమిటంటే, ఐదు పూటల నమాజు విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేశాడు. ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! ఇంకేమైనా ఉందా? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఐదు పూటల నమాజు తర్వాత నీకిష్టమైతే ఇంకా ఎక్కువైనా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, ప్రవక్తా! అల్లాహ్ తబారక వ త’ఆలా మీకు అందజేసిన సందేశంలో ఇంకేమైనా చేయవలసి ఉంటే అది కూడా చెప్పండి. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రమజాన్ మాసములో ఉపవాసాలు ఉండుట, పూర్తి మాసంలో ఉపవాసాలు ఉండుట. ఆ వ్యక్తి అన్నాడు, ఇంకేమైనా ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఆ పూర్తి మాసం తర్వాత నీకు ఇష్టమైతే మిగతా రోజుల్లో కూడా నువ్వు ఉపవాసాలు ఉండవచ్చు.

మీకు అందజేసిన ఆదేశాల్లో ఇంకేమైనా ఉందా అని అడిగాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జకాత్ చెల్లించటం, సంవత్సరానికి ఒకసారి జకాత్ చెల్లించటం. ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు చాలా క్లుప్తంగా వివరించారు. అన్ని విషయాలు విన్న ఆ వ్యక్తి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అన్నాడు, ఓ ప్రవక్తా! ఏవైతే మీరు నాకు వినిపించారో, ఏవైతే సందేశం నాకు ఇచ్చారో ఆ సందేశంలో నేను రవ్వంత కూడా ఎక్కువ చేయను, రవ్వంత కూడా తగ్గించను. ఏదైతే నేను నాపై విధిగా ఉందో అది మాత్రమే నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను, ఇంకా తక్కువ చేయను అని ఆ వ్యక్తి పలకరించి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వెళ్తుండగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏదైతే ఈ మనిషి అన్నాడో, ఏదైతే ఈ మనిషి వాంగ్మూలం ఇచ్చాడో దాన్ని సరిగ్గా నెరవేరిస్తే ఇతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్తను ఇచ్చారు.

ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా! ఇది బుఖారీ, ముస్లింలో ఉంది, ఈ ఒక్క హదీస్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువు. కానీ మనం కాస్త గ్రహించట్లేదు. ఒకవేళ మనం గ్రహిస్తే అల్లాహ్ సామీప్యం పొందటం చాలా సులువైన విషయం. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగిన విషయాల్లో ఏవైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో అవి మాత్రమే నేను చేస్తాను అని చెప్పాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త వినిపించారు, ఈ వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని. అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి మనిషికి కావలసినది ఏమిటంటే, అత్యంత విలువైన, అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే అతనిపై విధిగా చేశాడో దాన్ని అమలు పరచటం. అల్లాహ్ త’ఆలా విధిగా చేయనిది మనము ఎంత చేసుకున్నా అది విధికి సమానంగా ఉండదు. ధార్మిక పండితులు, ధార్మిక విద్వాంసులు అనేక విషయాలు దీనికి సంబంధించి చెప్పారు. అందులో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. అవి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందడానికి మార్గాలు అన్నమాట.

మొట్టమొదటిదిగా అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందటానికి కావలసింది ఏమిటంటే, ‘అదావుస్ సలాతి ఫీ అవ్ఖాతిహా’. నమాజుని దాని యొక్క సమయంలో ఆచరించటం.

ఫజర్ నమాజ్ ఫజర్ సమయంలో, జోహర్ నమాజ్ జోహర్ సమయంలో, అసర్ నమాజ్ అసర్ సమయంలో, మగ్రిబ్ నమాజ్ మగ్రిబ్ సమయంలో, ఇషా నమాజ్ ఇషా సమయంలో. ఏ నమాజ్ ఏ సమయంలో అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో ఆ నమాజ్ ని ఆ సమయంలో విధిగా భావించి ఆచరించాలి. కొంతమంది ఫజర్ నమాజ్ ని హాయిగా పడుకొని జోహర్ నమాజ్ తో కలిపి చదువుతారు. ఇది అల్లాహ్ తబారక వ త’ఆలాకి నచ్చదు. సమయాన్ని తప్పించి నమాజ్ ఆచరించటం అనేది విధిగా అల్లాహ్ తబారక వ త’ఆలా చేయలేదు. కనుక అల్లాహ్ యొక్క సామీప్యం పొందాలంటే ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా విధిగా చేశాడో, ఎప్పుడు చేశాడో దాన్ని ఆ ప్రకారంగానే అమలు చేయటం. ఇస్లాం ధర్మంలో రెండో మౌలిక విధి నమాజ్ ది ఉంది. మొదటిది షహాదతైన్, ఆ తరువాత నమాజ్ అన్నమాట. నమాజ్ ని దాని సమయంలో పాటించటం, ఆచరించటం ఉత్తమం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు, మనిషి చనిపోయిన తర్వాత అన్నిటికంటే ముందు అల్లాహ్ వద్ద అతనితో ప్రశ్నించబడేది నమాజే. నమాజ్ గురించి అతను సమాధానం ఇవ్వగలిగితే మిగతా విషయాల్లో అతను విజయం, సాఫల్యం పొందుతాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోవాలి. అల్లాహ్ సామీప్యం పొందడానికి కావలసినది విధిగా చేసి ఉన్న నమాజులని సమయం ప్రకారం ఆచరించటం, పాటించటం.

ఇక రెండోది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒక వ్యక్తి, ప్రవక్తా! స్వర్గంలో నేను మీతో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అయితే నువ్వు ఎక్కువగా నమాజ్ ఆచరించు. విధిగా ఉన్న నమాజులని ఆచరించిన తర్వాత సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను ఇలాంటి నమాజులను ఎక్కువగా ఆచరించటం వలన అల్లాహ్ యొక్క సామీప్యం మనకు లభిస్తుంది. ఎంతవరకు అయితే మనిషి అల్లాహ్ యొక్క భక్తిని తన హృదయంలో, తన మనసులో పెంపొందించుకుంటాడో, అల్లాహ్ తబారక వ త’ఆలా అతనికి తన సామీప్యానికి దరికి తీసుకుంటాడు. కనుక సున్నత్ నమాజులను, నఫిల్ నమాజులను, అలాగే రాత్రిపూట ఏకాంతంలో చదివే తహజ్జుద్ నమాజులను కూడా వదలకూడదు. ఈ నమాజులు మన స్థాయిని పెంచుతాయి. అల్లాహ్ సన్నిధిలో మన యొక్క విలువ పెరుగుతుంది.

ఆ తర్వాత మూడో మార్గం ఏమిటంటే అల్లాహ్ యొక్క విధేయతను పాటించడంలో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆశతో ఉండాలి. విధేయత అంటే ఇతాఅత్. ఏదైతే అల్లాహ్ తబారక వ త’ఆలా ఈ పని చేయమని, ఆ పని చేయమని అల్లాహ్ త’ఆలా మాకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞను శిరసా వహించటానికి ఇతాఅత్ అంటాము. ఆ ఇతాఅత్ చేయటానికి మనము ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండాలి. ఉత్సాహం కలిగి ఉండాలి. ఉత్సాహం లేకుండా ఏదీ మనిషి చేయలేడు, ఇష్టం లేకుండా ఏది మనిషి చేయలేడు. అల్లాహ్ విధేయత పట్ల మనిషి ఉత్సాహం కలిగి ఉంటే ఆ విశ్వాసంలో కలిగే రుచే వేరుగా ఉంటుంది. ఇది మూడో మార్గం అన్నమాట.

ఇక నాలుగో మార్గం ఏమిటంటే అల్లాహ్ తబారక వ త’ఆలాని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. అంటే జిక్ర్. జిక్ర్ అంటే అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామము యొక్క జపము. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక దుఆలతో నామాలతో, జపాలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించారు. మనిషి కూర్చొని ఉన్నా, నమాజ్ తర్వాత అయినా, ఏదైనా వస్తువు మన చేతి నుండి కింద పడిపోయినా, ఏదైనా వస్తువు మనకు ఆకర్షణను కలిగించినా, అనేక విధాలుగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. సుబ్ హా నల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, మాషాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క నామాలను స్మరిస్తూ ఉండాలి. దీని ద్వారా మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, తద్వారా అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం మనకు లభిస్తుంది.

ఇక ఐదోది ఏమిటంటే, అల్లాహ్ ప్రసన్నత కోసం ఉపవాసం ఉండుట. ఉపవాసం అనేది ఎవరికీ కానవచ్చేది కాదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మనిషి ఉపవాసం ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి చెప్పారంటే, ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం ఒక రోజు ఉపవాసం ఉండినట్లయితే, అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ముఖాన్ని 70 సంవత్సరాల దూరంగా నరకాగ్ని నుండి ఉంచుతాడు. ఇది కేవలం ఒక రోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి 70 సంవత్సరాల దూరం వరకు తప్పిస్తాడు. ఆ విధంగా అల్లాహ్ ప్రసన్నత కోసం ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ఉపవాసాలు చూపించారు. వారంలో రెండు రోజులు ఉపవాసం ఉండుట, ఒక మాసములో, ఒక నెలలో మూడు రోజులు, 13, 14, 15 వ తేదీలలో ఉపవాసాలు ఉండుట. అలాగే అరఫా రోజున ఉపవాసం ఉండుట, ముహర్రం రోజులో 9, 10 ఈ రెండు రోజులు ఉపవాసాలు ఉండుట. రమజాన్ మాసములో విధిగా చేయబడిన ఒక నెల ఉపవాసాలు ఉండుట. ఈ విధంగా అనేక ఉపవాసాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఉపదేశించారు. ఈ ఉపవాసాల ద్వారా మనిషిలో విశ్వాసము, ఈమాన్ పెరుగుతుంది. దాని మూలంగా అతను అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందగలుగుతాడు.

ఇక ఆరోది ఏమిటంటే పశ్చాత్తాపం, ‘అత్తౌబతు అనిల్ మ’ఆసీ’. పశ్చాత్తాపం. ఏవైతే మనము చెడు కర్మలు చేసి ఉన్నామో, నేరాలు చేసి ఉన్నామో, దాని పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. అల్లాహ్ త’ఆలాతో ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా వైపు మరలుతూ ఉండాలి. ఎల్లప్పుడూ అల్లాహ్ త’ఆలాతో క్షమాపణ, మన్నింపు కోరుతూ ఉండాలి. దీని మూలంగా మన యొక్క పాపాలు అల్లాహ్ తబారక వ త’ఆలా తుడిచి పెడతాడు. దాని ద్వారా మన యొక్క ఈమాన్ పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం మనకు కలుగుతుంది. మనిషి ఏ సమయంలో ఎలాంటి పాపం చేస్తాడో అతనికే తెలుసు. కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా ఉంటాయి, అతను పాపాలు చేస్తాడు, ఆ పాపాలు అతనికి గుర్తు ఉండవు. కనుక అల్లాహ్ తబారక వ త’ఆలాతో దుఆ ఏమని చేయాలంటే, ఏ పాపాలైతే నేను తెలిసి చేశానో, తెలియక చేశానో అన్నిటినీ నువ్వు క్షమించు అని అల్లాహ్ త’ఆలాతో మన్నింపు కోరుతూ ఉండాలి.

పశ్చాత్తాపం చేయటానికి, క్షమాపణ కోరటానికి, మన్నింపు కోరటానికి గడువు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, రాత్రిళ్ళలో ఎవరైతే పాపాలు చేస్తారో, నేరాలు చేస్తారో అతని కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా పగలు తన రెండు హస్తాలను చాచి, ఓ నా భక్తులారా! ఎవరైతే రాత్రిళ్ళలో మీరు పాపాలు చేసి ఉన్నారో, నేరాలు చేసి ఉన్నారో, నేను మిమ్మల్ని క్షమిస్తాను, రండి. ఆ సమయంలో ఎవరైతే అల్లాహ్ తబారక వ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతారో, అల్లాహ్ త’ఆలా వారిని క్షమిస్తాడు, మన్నించి వేస్తాడు. అదే విధంగా పగటి పూట ఎవరైతే పాపాలు చేస్తూ ఉంటారో, వారి కోసం అల్లాహ్ తబారక వ త’ఆలా రాత్రి తన హస్తాలు చాచి, ఓ నా దాసులారా! మీరు పగటిపూట ఏమైనా నేరాలు చేసి ఉంటే, పాపాలు చేసి ఉంటే, రండి, క్షమాపణ కోరండి, మీ పాపాలను నేను తుడిచి వేస్తాను, మన్నించి వేస్తాను. కానీ మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పాపం పట్ల పశ్చాత్తాపం చెందితే మళ్ళీ బహుశా నాతో పాపం జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే పశ్చాత్తాపం చెందకూడదు. జీవితంలో చివరి కాలంలో, శేష జీవితంలో నేను పాపాల నుండి విముక్తి పొందటానికి అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరాలి అనే భావన అతనిలో కలిగి ఉంటుంది. ఇది ముమ్మాటికీ తప్పు, పొరపాటు. మనిషి అన్న తర్వాత చిన్న పాపాలు గాని, పెద్ద పాపాలు గాని, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లాహ్ తబారక వ త’ఆలా క్షమిస్తూనే ఉంటాడు. గఫూరుర్ రహీం. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడు, అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఎల్లప్పుడూ తమ పాపాల పట్ల అల్లాహ్ త’ఆలాతో పశ్చాత్తాపం కోరుతూ ఉండాలి.

ఇక ఏడో మార్గం ఏమిటంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా అవతరింపజేసిన ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, కంఠస్థం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అల్లాహ్ తబారక వ త’ఆలా మహత్తరమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. మన సాఫల్యం కోసం, పరలోకంలో మనం విజయం సాధించాలనే ఉద్దేశ్యముతో అల్లాహ్ త’ఆలా మన కోసం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈనాడు మన స్థితి కాస్త గ్రహించినట్లయితే మనకు అర్థమవుతుంది, అదేమిటంటే ఖురాన్ చదవటం వచ్చిన వాళ్ళు అయినా సరే, ఖురాన్ చదవటం రాని వాళ్ళు అయినా సరే సమానమయ్యారు. ఖురాన్ చదవటానికి వారి వద్ద సమయం లేదు. ఖురాన్ నేర్చుకోవడానికి వారి వద్ద సమయం లేదు. ఇది అంతిమ దైవ గ్రంథం. నిజమైన గ్రంథం. ఈ భూమండలంలో ఏదైనా నిజమైన గ్రంథం, అల్లాహ్ యొక్క దైవ గ్రంథం ఉండినట్లయితే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. అసలైన స్థితిలో అలాగే భద్రంగా ఉంది.

ఎంత అభాగ్యులు వారు, ఎవరైతే ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి తన జీవితాన్ని సాగిస్తున్నారో. చాలా దురదృష్టవంతులు. అల్లాహ్ యొక్క గ్రంథం ఈ భూమండలం మీద ఉన్నప్పుడు మనలో విశ్వాసం దాన్ని చదవడానికి, దాన్ని పారాయణం చేయడానికి, కంఠస్థం చేయడానికి ఎలా తహతహలాడాలంటే అంత ఉత్సాహంతో ఉండాలి. ఖురాన్ గ్రంథం పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి ఉన్నారు, ఎవరైతే ఒక అక్షరం చదువుతాడో దానికి బదులుగా అల్లాహ్ తబారక వ త’ఆలా పది పుణ్యాలు లభింపజేస్తాడు. ఖురాన్ గ్రంథంలో వాక్యాలు, పదాలు అనేక అక్షరాలతో కూడి ఉన్నాయి. అది చదవంగానే అల్లాహ్ తబారక వ త’ఆలా వారికి ఎంతో విలువైన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. దాని మూలంగా వారి యొక్క విశ్వాసం పెరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం వారికి లభిస్తుంది. కనుక ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి. ఏదైతే మనకు వస్తుందో, ఒక సూరా వచ్చినా, మొత్తం ఖురాన్ వచ్చినా, నిరంతరంగా చదువుతూ ఉండాలి.

అల్లాహ్ తబారక వ త’ఆలా సూరె ఫుర్ఖాన్ లో ఈ విధంగా చెప్తున్నాడు, ప్రళయ దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సన్నిధిలో అంటారు, “యా రబ్బీ ఇన్న హాజల్ కౌమీత్తఖజూ ఖురాన మహ్జూరా”. ఓ నా ప్రభువా! ఈ నా జాతి వారు ఖురాన్ గ్రంథాన్ని చదవటం విడిచిపెట్టారు. కనుక ఈ స్థితి రాకుండా మనం ఏం చేయాలంటే, ఖురాన్ గ్రంథాన్ని ఎల్లప్పుడూ పారాయణం చేస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. దాని దాని కారణంగా మనకు మేలు జరుగుతుంది, అల్లాహ్ యొక్క సామీప్యం దొరుకుతుంది.

ఎనిమిదో మార్గం ఏమిటంటే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తబారక వ త’ఆలా మన సన్మార్గం కోసం పంపించాడు. ఆయన్ని ప్రవక్తగా చేసిన అల్లాహ్ తబారక వ త’ఆలా మనపై పెద్ద ఉపకారమే చేశాడు. ఆయన చెప్పకపోతే, ఆయన మార్గాన్ని సూచించకపోతే నిజమైన మార్గం మనకు దొరికేది కాదు. అర్థమయ్యేది కాదు. కనుక మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ చదువుతూ ఉండాలి.

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయిత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్.

ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చదివే దరూద్, పంపే దరూద్ అన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించి ఉన్నారు, మీలో ఎవరైతే నాపై ఎక్కువ దరూద్ పంపుతారో, చదువుతారో అతను నాకు సమీపంగా ఉంటాడు. అల్లాహ్ సామీప్యం పొందడానికి ఈ దరూద్ కూడా మనకు తోడ్పాటు అవుతుంది.

అలాగే తొమ్మిదో మార్గం ఏమిటంటే, మంచి వ్యక్తులతో స్నేహం కలిగి ఉండాలి. స్నేహం అన్నది కేవలం ప్రపంచంలో మనం చెప్పుకుంటా స్నేహం కాదు. సద్వర్తుల స్నేహం. ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉంటాడో, ఎల్లప్పుడూ అల్లాహ్ ని గుర్తు చేస్తూ ఉంటాడో, అల్లాహ్ యొక్క విధేయతను పాటిస్తూ ఉంటాడో, అల్లాహ్ తో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారి యొక్క స్నేహాన్ని మనము చేసుకోవాలి. మనము ఇటువంటి వారిని స్నేహించము. మన జీవిత కాలంలో మనకున్న స్నేహాలు, స్నేహితులు వేరు. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏదైతే సూచిస్తున్నాడో అది వేరు. కనుక గుర్తుంచుకోవాలి, స్నేహం చేసేటప్పుడు మనలో ఉన్న గుణం ఏమిటి, అది మన స్నేహం ద్వారా వ్యక్తమవుతుంది. ఒక మంచి మనిషి అల్లాహ్ తో భయపడేవాడు, అల్లాహ్ పట్ల సంతుష్టుడయ్యేవాడు, అల్లాహ్ యొక్క దాసులతో ప్రేమిస్తాడు, స్నేహం చేస్తాడు. కనుక మంచి స్నేహితులని ఎన్నుకోవాలి. దాని మూలంగా వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న కర్మలు మనకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దాని ద్వారా మన విశ్వాసం కూడా, ఈమాన్ కూడా పెరుగుతుంది. తద్వారా అల్లాహ్ సన్నిధిలో మనము కూడా ఒక సామీప్యాన్ని పొందగలుగుతాం.

పదోది ఏమిటంటే, దానము చేయటం, పేదవారిపై దానము చేయటం. దానం చేయడాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా ఎంతో మెచ్చుకుంటాడు. అల్లాహ్ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ఏదైతే మీకు నేను ప్రసాదించి ఉన్నానో అందులో నుంచి మీరు ఖర్చు పెట్టండి పేదవారిపై. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే, మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు, ఏదైతే అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించి ఉన్నాడో, అది కొంత అయినా ఎంతైనా సరే, అందులో నుంచి ఖర్చు పెట్టి అల్లాహ్ ప్రసన్నత కోరటం అనేది ఇక్కడ మాట. ఎల్లప్పుడూ అల్లాహ్ తబారక వ త’ఆలా కోసం, అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం మనము దానధర్మాలు చేస్తూ ఉండాలి. దీని మూలంగా అల్లాహ్ యొక్క సామీప్యం మనకు దొరుకుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరులు, సహాబాలు ఎంతో శ్రమపడి అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క ప్రసన్నత కోరేవారు. ఒక సందర్భంలో హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఆయన వద్ద ఉన్న అన్ని వస్తువులు తీసుకొచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ప్రవేశపెట్టారు. వారి స్థితిని గమనించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు త’ఆలా అన్హు తో అన్నారు, ఓ అబూబకర్! ఇవన్నీ ఇక్కడికి తీసుకువచ్చావు, ఇంట్లో ఏమి పెట్టుకున్నావు? ఆయన అన్నారు, ప్రవక్తా! నేను ఇంట్లో అల్లాహ్ మరియు ప్రవక్తను వదిలేసి వచ్చాను.

ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు అల్లాహ్ ప్రసన్నత కోసం అనేక విధాలుగా ఖర్చు పెట్టేవారు. అల్లాహ్ యొక్క ప్రసన్నతను పొందాలని.

ఈ పది సూత్రాలు, పది మార్గాలు ఉన్నాయి అల్లాహ్ యొక్క సామీప్యం పొందడానికి.

అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే, అప్పుడు అల్లాహ్ తబారక వ త’ఆలా మా యొక్క ప్రతి మాటను వింటూ ఉంటాడు, మేము కోరేదానికి అల్లాహ్ తబారక వ త’ఆలా ప్రసాదిస్తూ ఉంటాడు. ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ‘లవ్ అఖ్సమ అలల్లాహి ల అబర్రహ్’. అల్లాహ్ సామీప్యం పొందినవాడు ఎప్పుడైనా అల్లాహ్ మీద ప్రమాణం చేస్తే అల్లాహ్ తబారక వ త’ఆలా అతని యొక్క ప్రమాణాన్ని పూర్తి చేస్తాడు.

అదే విధంగా మరో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, అల్లాహ్ తబారక వ త’ఆలా యొక్క సామీప్యం పొందినవాడు అల్లాహ్ యొక్క స్నేహితుడు అవుతాడు, వలీ అవుతాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క వలీతో ఏదైనా విషయం పట్ల హాని కలిగించినట్లయితే అల్లాహ్ తబారక వ త’ఆలా అంటున్నాడు, అతను తోనే అతనితో నేను యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నాను. అల్లాహ్ మిత్రుల పట్ల, అల్లాహ్ యొక్క సామీప్యం పొందిన వారి పట్ల అల్లాహ్ తబారక వ త’ఆలా ఏం చెప్తున్నాడంటే, అతనిని నేను మెచ్చుకుంటాను, అతనిని నేను ఇష్టపడతాను, అతను ఏ చేతిలోనైతే పట్టుకుంటుంటాడో ఆ చేతిని నేను అయిపోతాను. ఏ కాలి ద్వారా అయితే అతను నడుస్తూ ఉంటాడో ఆ కాలును నేను అయిపోతాను. ఏ కళ్ళ ద్వారా అతను చూస్తూ ఉంటాడో ఆ కళ్ళు నేను అయిపోతాను. అని ఎంతో ప్రేమతో, ఎంతో ప్రసన్నతతో అల్లాహ్ తబారక వ త’ఆలా చెప్తున్నాడు.

అల్లాహ్ యొక్క సామీప్యం మనం పొందినట్లయితే మన యొక్క ప్రతి మాట అల్లాహ్ తబారక వ త’ఆలా వింటాడు. మేము ఏది కోరితే అల్లాహ్ తబారక వ త’ఆలా అది మాకు ప్రసాదిస్తాడు.

కనుక చివరిగా అల్లాహ్ తబారక వ త’ఆలా తో దుఆ ఏమనగా, ఏవైతే మనం విన్నామో ఆ మాటలని గుర్తించి సరైన మార్గంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తబారక వ త’ఆలా మాకు ప్రసాదించు గాక. అల్లాహ్ తబారక వ త’ఆలా ఏవైతే విధిగా చేసి ఉన్నాడో వాటిని ఆచరించి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ త’ఆలా మనకు ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17147


మక్కా విశిష్టత [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మక్కా విశిష్టత (Importance of Makkah)
https://youtu.be/TLNWmdSKxEk [43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, మక్కా నగరం యొక్క ఇస్లామీయ ప్రాముఖ్యత, ఘనత మరియు పవిత్రత గురించి వివరించబడింది. అల్లాహ్ తన సృష్టిలో కొన్ని ప్రదేశాలకు, కాలాలకు మరియు వ్యక్తులకు ఇతరులపై ఘనతను ప్రసాదించాడని, ఇది ఆయన సంపూర్ణ వివేకం మరియు శక్తికి నిదర్శనమని ప్రసంగం మొదలవుతుంది. మక్కా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశమని, అది మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధన గృహం (కాబా) ఉన్న నగరమని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, ఆయన తన భార్య హాజర్ మరియు కుమారుడు ఇస్మాయిల్ ను ఆ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళడం, జమ్ జమ్ బావి ఆవిర్భావం మరియు మక్కా నగరం ఎలా ఏర్పడిందో వివరించబడింది. మక్కా యొక్క పవిత్రత (హరమ్), అక్కడ వర్తించే ప్రత్యేక నియమాలు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దానికున్న ప్రాముఖ్యత కూడా చర్చించబడ్డాయి. చివరగా, కాబా మరియు హజర్ అల్-అస్వద్ (నల్లరాయి) గురించి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, వాటి వాస్తవ ఇస్లామీయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు.  (3:96-97)

సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా మనందరి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయనే మనందరి ఏకైక, ఏ భాగస్వామి లేని నిజమైన ఆరాధ్యుడు. ఆ తర్వాత, లెక్కలేనన్ని సలాత్ సలాం, కరుణలు, శాంతులు ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త, దయామయ మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై కురియు గాక.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహు త’ఆలా సర్వ సృష్టికర్త, సర్వ అధికారుడు, ఎలాంటి ఏ భాగస్వామి లేనివాడు. ఆయన కోరినది సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో ఎవరికి ఏ హోదా, అంతస్తు, ఎవరికి ఎలాంటి ప్రత్యేకత ఇవ్వాలో ఇస్తాడు. అందులో అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.

لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ
ఆయన తన చేష్టలకు ఎవరికీ జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు, కాని వారే (మానవులే) జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. (21:23)

అల్లాహ్ చేసిన దానిలో అల్లాహ్ ను ప్రశ్నించేవాడు ఎవడూ లేడు.

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.  (28:68)

అల్లాహు త’ఆలా కోరినది సృష్టిస్తాడు, యఖ్తార్, ఎన్నుకుంటాడు. అల్లాహు త’ఆలా ఈ విధంగా తన సృష్టిలో ఎన్నుకోవడంలో అద్వితీయుడు, అతనికి ఏ భాగస్వామి లేడు. అతడు ఒకరితో ఏదైనా సలహా, సంప్రదింపులు చేసి, వారి కోరికలను అనుసరించడానికి ఏదైనా లొంగిపోయి ఉంటాడు, న’ఊదు బిల్లాహ్, ఇలాంటి ప్రసక్తి ఏ మాత్రం లేదు. అయితే ఇలా అల్లాహు త’ఆలా అద్వితీయుడు కావడం, ఎన్నుకునే విషయంలో ఇది అతని యొక్క, అతని యొక్క రుబూబియ్యత్, ఆ అల్లాహ్ యొక్క సంపూర్ణ వివేకం మరియు అతడే సర్వశక్తిమంతుడు అన్నదానికి గొప్ప నిదర్శనం.

అయితే అల్లాహు త’ఆలా కొందరి ప్రజలను మరికొందరిపై, కొందరు ప్రవక్తలను మరికొందరి ప్రవక్తలపై, కొన్ని ప్రాంతాలను మరికొన్ని ప్రాంతాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై, కొన్ని రోజులను మరికొన్ని రోజుల పై, కొన్ని రాత్రులను మరికొన్ని రాత్రులపై, కొన్ని సత్కార్యాలను మరికొన్ని సత్కార్యాలపై ఘనత ప్రసాదించాడు. సర్వ సృష్టిలో, అంటే అల్లాహ్ తప్ప సర్వమూ వాటిలన్నింటిలోకెల్లా, వాటన్నిటిలోకెల్లా అత్యుత్తములు, అతి గొప్పవారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసాల్లో, సత్కార్యాల్లో, అన్ని విషయాల్లో అతి గొప్ప ఘనత గలది తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ మాత్రమే ఏ భాగస్వామి లేకుండా ఆరాధ్యనీయుడు అని నమ్మడం, విశ్వసించడం, అలా ఆచరించడం.

ఇస్లామీయ 12 నెలల్లో రమదాన్ మాసానికి చాలా గొప్ప ఘనత ఉంది. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ కి చాలా గొప్ప ఘనత ఉంది. మరియు రోజుల్లో, పగల్లో యౌమున్నహర్, ఖుర్బానీ చేసేటటువంటి రోజు, ఈదుల్ అద్ హా అది చాలా గొప్ప ఘనత గల రోజు. అయితే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అల్లాహ్ కు అత్యుత్తమ, అతి ప్రియమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి స్థానంలో అది మక్కతుల్ ముకర్రమా.

మక్కతుల్ ముకర్రమా గురించి ఈ రోజు నేను జియోగ్రాఫికల్ పరంగా నేను మాట్లాడను. మక్కాకు అల్లాహు త’ఆలా ఈ రకంగా కూడా ఏ ఘనతలు ప్రసాదించి ఉన్నాడో దాని యొక్క వివరణలోకి వెళ్ళను. కానీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశం ఇది అని మనకు అంటే మక్కా అని ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?

వల్లాహి, ఇన్నకి లఖైరు అర్దిల్లాహ్, వ అహబ్బు అర్దిల్లాహి ఇలల్లాహ్.
అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ మక్కా, నీవు అల్లాహ్ భూమిలో అత్యంత ఖైర్, మేలు, శుభం ఉంది నీలో మరియు అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఈ భూమిలో అత్యంత ప్రియమైన ప్రదేశం నీవు.

వలవ్ లా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు.
నన్ను ఈ మక్కా నుండి వెలివేయడం జరిగింది, లేదా అంటే నేను మక్కా నుండి వెళ్లి మదీనాలో స్థావరం అక్కడ వలస చేసి అక్కడ ఉండటం అలా చేసేవాడిని కాదు.

అల్లాహు త’ఆలా ఈ మక్కా నగరం, దీని యొక్క ప్రమాణాలు చేసి ఉన్నాడు, లా ఉక్సిము బిహాదల్ బలద్ అని.

అల్లాహు త’ఆలా ఈ సర్వ భూమండలంపై తన ఆరాధనా కేంద్రంగా నిర్మించడానికి ఆదేశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం మక్కాలో ఉంది. ఆ ఆయతులే నేను ఆరంభంలో చదివాను, సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నెంబర్ 3, ఆయత్ నెంబర్ 95.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. (3:96)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూ దర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ వుది’అ ఫిల్ అర్ది అవ్వల్. ప్రప్రథమంగా ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి మస్జిద్ ఏ మస్జిద్ అని అడిగినప్పుడు, అల్ మస్జిదుల్ హరాం. కాబతుల్లాహ్, దాని చుట్టూ ఉన్నటువంటి మస్జిద్-ఎ-హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీస్.

సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం కంటే ముందు ఎందరో ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం ఆది మానవులతో పాటు ప్రవక్త కూడా. ఆదం అలైహిస్సలాం తర్వాత ఇద్రీస్, షీత్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ షిర్క్ ను ఖండిస్తూ, తౌహీద్ ను ధ్రువపరుస్తూ, తౌహీద్ వైపునకు ప్రజలను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ తర్వాత హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం ఎందరో వచ్చారు. మనకు కొన్ని ఉల్లేఖనాల ద్వారా వారు కూడా హజ్ చేశారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన తూఫాన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే కాబతుల్లాహ్ ఉన్నదో దాని చుట్టుపక్కల ఆ మక్కా నగరం, ఆ కాబతుల్లాహ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు ఉండినవి కానీ కాలాల తరబడి ఎవరూ కూడా అక్కడ వచ్చి నివసించేవారు కాదు.

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతని యొక్క పనులలో ఎలాంటి హిక్మత్, ఔచిత్యాలు ఉంటాయో, ఎలాంటి వివేకాలు ఉంటాయో అన్నీ మనము గ్రహించలేము. కేవలం అల్లాహు త’ఆలా తన దయ కరుణతో తెలిపిన కొన్ని విషయాలు తప్ప.

అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య సారాతో ఏ సంతానము కలగలేదు. ఆ తర్వాత రెండో భార్య హాజర్ తో అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి ఒక సుపుత్రున్ని ప్రసాదిస్తాడు. ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉంటాడు. అప్పుడు అల్లాహ్ యొక్క అనుమతితో ఇబ్రాహీం అలైహిస్సలాం పాలు త్రాగే బాలుడైన ఇస్మాయిల్ మరియు అతని యొక్క తల్లి హాజర్ ఇద్దరినీ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేస్తారు. అదే విషయాన్ని స్వయంగా ఖురాన్ లో తెలిపాడు. స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తూ అంటున్నారు, ఇంద బైతికల్ ముహర్రమ్. ఓ ప్రభువా, నేను నా యొక్క భార్య మరియు కుమారున్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలాను. ఎక్కడ? గైరి జీ జర్’ఇన్. అక్కడ ఎలాంటి ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు. మరియు అక్కడ నీటి యొక్క సౌకర్యం కూడా లేదు. కానీ అల్లాహు త’ఆలా చూడడానికి ఇలాంటి ఈ పరీక్ష పెట్టినా, ఇక ముందుకు ఇక్కడ ఈ నగరాన్ని ప్రజలు వచ్చి నివసించడానికి సౌలభ్యంగా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏర్పాటు చేశాడు.

ఇక్కడ సహీ బుఖారీలో ఆ వివరణ ఏదైతే వచ్చి ఉందో, ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీసులు, వాస్తవంగా పూర్తి మనం వినాలి. అందులో తండ్రికి, భార్యకు, భర్తకు ప్రతి ఒక్కరికి మన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. గమనించండి. ఆ గుణపాఠాల గురించి ఇప్పుడు నేను వివరాలు ఇవ్వలేను ఎందుకంటే నా అంశం ఫద్లు మక్కా, మక్కా విశిష్టత ఉంది. కానీ అక్కడ చిన్న విషయం ఒకటి ఏం తెలియజేస్తున్నానంటే, హాజర్ అలైహస్సలాం తన కుమారుడు పాలు త్రాగే వాడు, ఏమైనా ఎదిగినటువంటి బాలుడు కాదు. తీసుకొని ఆ ప్రదేశంలో ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇబ్రాహీం, ఎవరి ఆధారంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అంటే, అల్లాహ్ వైపున చూపిస్తే, ఆ తల్లి హాజర్ ఎంత గొప్ప మాట అంటుంది, ఎంతటి గొప్ప విశ్వాసం, అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం, ఎలాంటి ప్రగాఢమైన బలమైన విశ్వాసమో గమనించండి. “అలాంటప్పుడు అల్లాహు త’ఆలా మమ్మల్ని వృధా చేయడు.” అక్కడి నుండి మొదలవుతుంది మక్కా నగరం. ఆ తర్వాత జుర్హుమ్ వంశానికి సంబంధించిన వారు వస్తారు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మక్కాలో జన్మించారు. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ రావడం ప్రారంభమైంది. సుమారు 53 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జీవించారు. ప్రవక్త పదవి పొందడానికి 40 సంవత్సరాలు ముందు, ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు. అక్కడే అనేక మంది గొప్ప సహాబాలు వచ్చారు. ఆ సహాబాల యొక్క ప్రస్తావన ముహాజిరీన్ అని, వస్సాబిఖూనల్ అవ్వలూన్ అని అల్లాహు త’ఆలా సూరతు తౌబాలో కూడా వారిని ప్రశంసిస్తూ ప్రస్తావించాడు.

అల్లాహు త’ఆలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నుండే బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి మళ్ళీ ఆకాశాల వైపునకు, గగన ప్రయాణం, ఇస్రా వ మి’రాజ్ జరిగినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నగరాన్ని చాలా ప్రేమించేవారు. బుఖారీ, ముస్లిం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సహాబాలు, వారి యొక్క ఆరోగ్యాలు కొంచెం అనారోగ్యానికి గురి అవ్వడం, అక్కడి యొక్క వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, ఆ సందర్భంలో ప్రవక్త దుఆ ఏం చేశారు? అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనత కమా హబ్బబ్త మక్కత అవ్ అషద్ద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల ఎలాంటి ప్రేమ మాకు నీవు కలుగజేశావో, అలాంటిది అంతకంటే ఎక్కువ ప్రేమ నీవు మాకు మదీన విషయంలో కూడా… సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనం మక్కా గురించి తెలుసుకుంటున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారని.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు ఈ మక్కా నగరం గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆలను గమనించండి, మక్కా యొక్క విశిష్టతను మీరు గ్రహించండి. ఒక దుఆ చేశారు, సూరత్ ఇబ్రాహీం 37,

فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ
ఫజ్’అల్ అఫ్’ఇదతమ్ మినన్నాసి తహ్వీ ఇలైహిమ్.
కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి (14:37)

ఓ అల్లాహ్, ప్రజల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు ఈ మక్కా వైపునకు తిరిగి రావాలి. మక్కా యొక్క ప్రేమ వారి హృదయాల్లో నాటుకోవాలి. అలాంటి భాగ్యం నీవు కలుగజేయి.

అంతేకాదు, సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126 లో తెలుస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు,

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا
రబ్బిజ్’అల్ హాదా బలదన్ ఆమినా.
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.  (2:126)

ఓ మా ప్రభువా, ఈ మక్కా నగరాన్ని నీవు అమ్న్ ఓ అమాన్, శాంతి నిలయంగా చేయు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా దానిని ఎలా శాంతి నిలయంగా చేశాడో గమనించండి.

సూరత్ అన్ కబూత్ ఆయత్ నెంబర్ 67 లో చెప్పాడు,

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. (29:67)

వారు గమనించడం లేదా? మేము హరమ్ ని ఎంత శాంతి నిలయంగా చేశాము, ఎంత ప్రశాంతతమయిన ప్రదేశంగా చేశాము, ఈ మక్కా చుట్టుపక్కల ఉన్నవారు దొంగతనాలు, దోపిడీలు, లూటీలు ఇంకా కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మక్కా వారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సూరత్ అన్ కబూత్ లో ఉన్నటువంటి ఆయత్ మీరు ఒకవేళ వినకుంటే, చిన్న సూరా మీకు కూడా గుర్తు ఉంది కదా,

لِإِيلَافِ قُرَيْشٍ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. (106:1-4)

చుట్టుపక్కన మక్కా నగరానికి చుట్టుపక్కన ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ మక్కాలో ఉండే వారు, అల్లాహు త’ఆలా వారికి ఎంతటి గొప్ప ప్రశాంతత, అమ్న్ ఓ అమాన్ ప్రసాదించాడు. ఇమాం ఖుర్తుబి రహిమహుల్లాహ్ తమ తఫ్సీర్ లో తెలియజేశారు, ఇన్న మక్కత లమ్ తజల్ హరమన్ ఆమినన్ మినల్ జబాబిరతి వ మినజ్ జలాజిల్. అల్లాహు త’ఆలా మక్కాను చాలా కాపాడాడు. అక్కడ ఎంతటి గొప్ప శాంతి ప్రసాదించాడంటే ఇంతటి వరకు, ఇప్పటి వరకు ఏ దుర్జన్యపరుడైన రాజు వశపరచుకోలేకపోయాడు మరియు అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి భూకంపాలు కూడా రాలేదు.

అల్లాహు త’ఆలా సూరత్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97 లో ఈ ఆయత్ ఏదైతే స్టార్టింగ్ లో తిలావత్ చేయబడిందో, అక్కడ ఈ అమ్న్ ఓ అమాన్, ప్రశాంతత, శాంతి గురించి ఎంత గొప్ప విషయం చెప్పాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఎవరైతే ఈ మక్కా నగరం, మస్జిదుల్ హరాం, ఇందులో ప్రవేశిస్తాడో అతనికి శాంతియే శాంతి ఉంది.

కనుక చూడండి, అల్లాహు త’ఆలా ఇక్కడ ఈ మక్కా నగరానికి ఇంతటి గౌరవం ఏదైతే ప్రసాదించాడో అది ఎప్పటి నుండి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి కాదండి. ఎప్పటి నుండి? అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించాడో అప్పటి నుండి. సహీ బుఖారీ లోని హదీస్, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఫహియ హరామున్ బి హురామిల్లాహి ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించినప్పటి నుండి మక్కాకు ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాడు. అల్లాహు త’ఆలా ఈ గౌరవాన్ని ప్రళయ దినం నాటికి ఉంచుతానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ఏ కొన్ని క్షణాల గురించి అయితే అనుమతి ఇవ్వడం జరిగిందో, ఆ విషయాన్ని కూడా మనం గమనించామంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇక్కడ ఏ రక్తపాతం గురించి అనుమతి లేకుండినది, ప్రళయం వరకు కూడా లేదు అని.

అంతేకాదు సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం దాని చుట్టుపక్క ప్రాంతాలకు ఎన్నో కిలోమీటర్ల వరకు ప్రశాంతత ఉండాలని అల్లాహు త’ఆలా తో దుఆ ఏదైతే చేశారో, సహీ బుఖారీ, సహీ ముస్లిం లో వచ్చి ఉంది, ఇన్న ఇబ్రాహీమ హర్రమ మక్కా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి ప్రశాంతత గురించి ఇచ్చిన బోధనల్లో, సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన ఈ హదీస్ కూడా చాలా ప్రాముఖ్యత గలది. లా యహిల్లూ లిమ్ రి’ఇన్ యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అన్ యస్ఫిక బిహా దమా. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి కూడా అక్కడ రక్తం ప్రవహింప చేయడు, రక్తపాతానికి ఒడిగట్టడు. అంతేకాదు, సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ను గమనించండి, లా యహిల్లూ లి అహదికుమ్ అన్ యహ్మిల బి మక్కత అస్సిలాహ్. మీరు మక్కాలో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు ధరించి అక్కడ నడవడం ఇది సమంజసం కాదు.

అంతేకాదండి, అల్లాహు అక్బర్, మక్కాకు అల్లాహు త’ఆలా ప్రసాదించినటువంటి విశిష్టత కేవలం మానవులకే కాదు, అక్కడి యొక్క ఆ ప్రాంతానికి, అక్కడ వచ్చే, తిరిగే అటువంటి పక్షులకు, అక్కడ పెరిగే అటువంటి వృక్షాలకు, ఇంకా ఎవరి నుండి ఏదైనా వస్తువు తప్పిపోయి పడిపోతే దానికి కూడా ఎంతటి మర్యాద అనండి, గౌరవం అనండి, ఎంతటి రెస్పెక్ట్ ఉందో మనకు సహీ హదీసుల్లో తెలుస్తుంది.

సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడి వృక్షాలను నరికేయరాదు. అక్కడ వేట, షికారీ చేయరాదు. మరియు ఎవరికైనా ఏదైనా పడిపోయిన వస్తువు దొరికినా, దానిని అతను ఎత్తుకోకూడదు. ఎవరైనా దాన్ని తీసుకున్నాడంటే, సంవత్సరం అయినా గానీ తన వద్ద ఉంచి, భద్రంగా అది ఎవరిది అని వెతుకుతూ ఉండి, అతని వరకు చేర్పించే ప్రయత్నం చేయాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా?

అందు గురించే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో, ఏ సందర్భంలో అండి? ప్రవక్త ఏదైతే హజ్ చేశారో, లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట ఉన్నారో, అందులో హ్యూమానిటీ కి సంబంధించిన, మానవత్వానికి సంబంధించిన గొప్ప నియమ, నిబంధనలు, సూత్రాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలిపారో, ఒక్కసారి ఈ హదీస్ ను గమనించండి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీస్,

ఇన్న దిమా అకుమ్, వ అమ్వాలకుమ్, వ అ’రాదకుమ్, అలైకుమ్ హరామున్, క హుర్మతి యౌమికుమ్ హాదా, ఫీ బలదికుమ్ హాదా, ఫీ షహ్రికుమ్ హాదా.

ప్రజలారా, ఈ మక్కా నగరం ఎంత గౌరవ, మర్యాద గల ప్రదేశమో తెలుసు కదా? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామో, జిల్ హిజ్జా నెల, ఇది కూడా ఎంతటి గౌరవ, ప్రాముఖ్యత గల నెలనో తెలుసు కదా? మరియు ఈ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాలో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతటి గౌరవప్రదమైన రోజో తెలుసు కదా? ఇక గౌరవప్రదమైన రోజు, గౌరవప్రదమైన నెల, గౌరవప్రదమైన ప్రదేశంలో ఉండి, వీటన్నింటిని గుర్తిస్తూ నేను చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మీ యొక్క రక్తం అంటే మీ యొక్క ప్రాణం, మీ యొక్క ధనం, మీ యొక్క పరువు, మానాలు కూడా చాలా గౌరవమైనవి, విలువ గలవి. వాటిని ఎవరూ కూడా అక్రమంగా దాడి చేయడం, ఒకరిని నరికేయడం, హత్య చేయడం, ఒకరి ధనం పై అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేయడం, ఒకరి యొక్క మానవ పరువులో ఏదైనా జోక్యం చేసుకోవడం, హరాం, ఎంతమాత్రం కూడా దీనికి అనుమతి లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తిని తిట్టకూడదు, ఒక వ్యక్తిని హత్య చేయకూడదు, ఒకరి సామాను, ఒకరి యొక్క వస్తువులను దొంగలించకూడదు అన్న విషయాన్ని ప్రవక్త, క బలదికుమ్ హాదా, మీ యొక్క ఈ బలద్, ఈ నగరం యొక్క గౌరవం ఎలా ఉందో అంతకంటే గొప్పగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తున్నారు.

అందుకొరకే, ముస్లిమేతరులలో ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ కాబతుల్లాహ్, న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అసల్ ఒక విగ్రహాల గృహం అని. అయితే హదీస్ తో దీనిని వారు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహాలను అయితే పడేశారో, దానిని తీసుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క విగ్రహాలు, వాటిని ప్రస్తావిస్తారు. కానీ మనం ఒకవేళ నిజంగా చూస్తే, ఖురాన్ ఆయతులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మానవ చరిత్ర, ఏ చరిత్రనైతే భద్రంగా ఉందో దానిలో తెలుస్తున్న విషయం ఏమిటి? మొట్టమొదటి మానవుడు ఆది మానవుడు, ఆదం అలైహిస్సలాం, వారి యొక్క సంతానం కాలాల తరబడి షిర్క్ కు పాల్పడలేదు.

كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً
మానవులందరూ ఒకే ఒక సమాజంగా ఉండేవారు. (2:213)

ఒకే ఒక ధర్మం, ఏకదైవారాధనపై అందరూ నిలిచి ఉన్నారు. ఎంతవరకు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వారిలో షిర్క్ అనేది పాకింది. దానిని ఖండించడానికే ప్రవక్తలను పంపడం జరిగింది. కాబతుల్లాహ్, దీని యొక్క పునాది తౌహీద్ పై, ఏకదైవారాధనపై ఉండినది. అమర్ బిన్ లుహై మొట్టమొదటి చెడ్డ వ్యక్తి, అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నరకంలో చూసినట్లు కూడా హదీస్ లో తెలియపరిచారు. అతడు మొట్టమొదటిసారిగా షిర్క్ కు పునాది వేశాడు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు, షిర్క్ నుండి పరిశుభ్రం చేశారు కాబా గృహాన్ని. కానీ ఇది వాస్తవానికి విగ్రహాలయం మాత్రం కాదు. సోదర మహాశయులారా, చివరిలో సూరతుల్ నమ్ల్ ఆయత్ 91 ద్వారా మన యొక్క ఈ నాటి ప్రసంగాన్ని సమాప్తం చేద్దాము.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (27:91)

నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ నగరం యొక్క ప్రభువుని ఆరాధించాలి అని. ఆయనే ఈ నగరానికి చాలా గొప్ప గౌరవప్రదమైన స్థానం కలుగజేశాడు. అతనికే సర్వాధికారం ఉంది, సర్వ సర్వమూ అతని యొక్క ఆధీనంలో ఉంది. మరియు నేను విధేయులలో, ముస్లింలలో ఉండాలి, అయి ఉండాలి అని కూడా నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది.

అయితే ఈ ఆయత్ ను చివరిలో ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటి? మనం ఎప్పుడైనా అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని, అది ప్రాంతానికి సంబంధించినా, ఏ వ్యక్తికి సంబంధించినా, ఏదైనా నెలకు సంబంధించినా, ఏదైనా కార్యానికి సంబంధించినా ప్రస్తావిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క గౌరవంలో మనం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు. మనం వాస్తవంగా అల్లాహ్ ను గౌరవిస్తున్నాము. అందుకొరకే అల్ హుబ్బు ఫిల్లాహ్ వల్ బుగ్దు ఫిల్లాహ్. అల్లాహ్ ఏ ఏ విషయాలను ప్రేమిస్తాడో వాటన్నిటినీ ప్రేమించడం. అల్లాహ్ ఏ ఏ విషయాలను ద్వేషిస్తాడో వాటన్నిటినీ ద్వేషించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. అర్థమైంది కదా?

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నేను దుఆ చేస్తున్నాను. ఈ మక్కా విశిష్టత గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో దాని యొక్క గౌరవాన్ని కాపాడే అటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. దీని విషయంలో ఎవరు ఏ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17091

హజ్, ఉమ్రా – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


నమాజ్ లో సుత్రా నిబంధన [వీడియో & టెక్స్ట్]

నమాజ్ చదివేటప్పుడు మనిషి తన ముందు ఏదైనా అడ్డంకిని పెట్టుకోవడాన్ని సుత్రా (తెర) అంటారు

నమాజ్ లో సుత్రా నిబంధన
https://youtu.be/jZgcgvh3Aho [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నమాజు చేసేటప్పుడు ప్రార్థన చేసే వ్యక్తికి ముందు ఉంచే అడ్డంకి అయిన ‘సుత్రా’ యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. సుత్రా అంటే ఏమిటి, దాని ఉద్దేశ్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ (విధానం)లో దాని స్థానం మరియు దాని సరైన పరిమాణం గురించి చర్చించబడింది. వ్యక్తిగత మరియు సామూహిక నమాజులో సుత్రాను ఎలా ఉపయోగించాలో కూడా వివరించబడింది; సామూహిక ప్రార్థనలో, ఇమామ్ యొక్క సుత్రా జమాఅత్ మొత్తానికి సరిపోతుంది. నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుండి నడిచి వెళ్లడం యొక్క తీవ్రమైన పాపం గురించి మరియు ప్రార్థన చేసే వ్యక్తికి వారిని ఆపడానికి ఉన్న హక్కు గురించి కూడా ప్రసంగంలో హెచ్చరించబడింది. ఇరుకైన ప్రదేశాలలో ప్రార్థన చేసే సందర్భంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం నుండి ఉదాహరణలతో పాటు, కొన్ని మినహాయింపులు కూడా చర్చించబడ్డాయి.

أَلْحَمْدُ لِلّٰهِ
(అల్ హందులిల్లాహ్)
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللّٰهِ
(వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్)
మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. (ఆమీన్)

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం సుత్రా గురించి తెలుసుకుందాం.

సుత్రా అంటే ఏమిటి? ఒక వ్యక్తి నమాజు ఆచరిస్తున్నప్పుడు ఖిబ్లా వైపు నిలబడి నమాజు ఆచరిస్తున్న ప్రదేశంలో ఎంత దూరం వరకు అయితే అతను సజ్దా చేయగలుగుతాడో, అంత దూరపు ప్రదేశానికి కొంచెం ముందర ఒక వస్తువుని ఉంచుకోవటాన్ని సుత్రా అని అంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనా విధానాలలో ఇది కూడా ఒక సున్నతు, ఒక బోధనా విధానము. నమాజు ఒక వ్యక్తి ఒక విశాలమైన ప్రదేశంలో ఆచరించుకుంటూ ఉంటే అతను అతని ముందర ఖిబ్లా దిశలో ఒక వస్తువుని ఏదైనా, అది కర్ర కావచ్చు లేదా కుర్చీ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు, ఒక వస్తువుని అక్కడ ఉంచుకోవాలి.

అది ఒక రకంగా అటూ ఇటూ ఎవరైనా నడిచే వారికి ఒక సూచన లాంటిది. ఇంతటి ప్రదేశం వరకు నేను నమాజు చేస్తున్న ప్రదేశము, దీని పక్క నుంచి మీరు వెళ్ళండి, దీని లోపల అయితే నేను నమాజు చేస్తున్న ప్రదేశము అనేటట్టుగా ఒక సూచన ఉంటుంది. చూసే వ్యక్తి కూడా ఆ, ఆ ప్రదేశం వరకు అతను నమాజ్ చేసుకుంటున్నాడు అని దాని పక్క నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. దీనిని సుత్రా అంటారు.

మరి ఆ సుత్రా ఎంతటి వస్తువు ఉండాలి అంటే హదీసు గ్రంథాలలో తెలుపబడిన విషయం, పల్లకి వెనుక భాగంలో ఉన్న వస్తువు అంత అయితే సరిపోతుంది అని తెలుపబడింది. ధార్మిక పండితులు దాన్ని వివరిస్తూ ఏమన్నారంటే, ఒక మూర కంటే కొంచెం చిన్నదైనా సరే సరిపోతుంది అని చెప్పారు. మూర కంటే తక్కువ ఎత్తు గల వస్తువు అయినా సరే దానిని ఉంచుకొని మనిషి నమాజ్ ఆచరించుకోవాలి.

మరి సుత్రా పెట్టుకోవటం ఇది సున్నత్ అని కూడా ధార్మిక పండితులు వివరించి ఉన్నారు.

సుత్రా ఉంచుకున్న విషయాలలో మనం చూసినట్లయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమాజ్ ఆచరించుకుంటూ ఉంటే అతను ప్రత్యేకంగా అతని కోసము సుత్రా ఉంచుకోవాలి. ఒకవేళ సామూహికంగా మనిషి నమాజ్ ఆచరించుకుంటూ ఉన్నట్లయితే ఇమామ్ ముందర సుత్రా ఉంచుకుంటే సరిపోతుంది, వెనుకల నిలబడిన ప్రతి వ్యక్తి ముందర సుత్రా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇమామ్ ముందర ఉంచుకోబడిన సుత్రాయే అతని వెనుక, ఆయన వెనుక నిలబడిన ముక్తదీలందరికీ కూడా సరిపోతుంది అని కూడా ధార్మిక పండితులు తెలియజేశారు.

అలాగే నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతని ముందర వేరే వ్యక్తి, పురుషుడైనా, మహిళ అయినా పడుకొని ఉంటే స్థలం లేని సందర్భంలో వారి వెనుక కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. మస్జిదులో మనం చూస్తూ ఉంటాం. కొందరు వ్యక్తులు కూర్చొని ఉంటారు. వారి వెనుక మనము కూడా నిలబడి నమాజ్ ఆచరించుకోవచ్చు. అలాగే ఇరుకైన గది ఉంటే అక్కడ సతీమణి ఎవరైనా కూర్చొని ఉన్నా లేదా పడుకొని ఉన్నా, మిగిలిన కొద్ది స్థలంలోనే వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే ఆచరించుకోవచ్చు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని చూడండి, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిపూట తహజ్జుద్ నమాజు కోసం లేచి నిలబడినప్పుడు, నేను ఖిబ్లా దిశలో పడుకొని ఉంటాను, మిగిలిన ప్రదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిలబడి నమాజ్ ఆచరించుకునేవారు. ఒక్కొక్కసారి అనుకోకుండా నా కాలు ఆయన సజ్దా చేసే స్థితికి వెళ్ళిపోతే ఆయన సజ్దా చేసేటప్పుడు అలా తట్టి నాకు సైగ చేస్తే నేను వెంటనే కాలు ముడుచుకునే దానిని అని కూడా తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఖిబ్లా దిశలో పడుకొని ఉంటే నమాజ్ ఆచరించుకునేవారు, పూర్తి నమాజ్ అయిపోయాక వితర్ నమాజ్ ఆచరించుకునే సమయానికి ఆమెకు కూడా లేపి వారు ఇద్దరూ కలిసి చివరిలో వితర్ నమాజు కలిసి ఆచరించుకునేవారు అని తెలియజేశారు. కాబట్టి పురుషుడు గాని మహిళ గాని ఖిబ్లా దిశలో పడుకొని ఉన్నా మిగిలిన ప్రదేశంలో వ్యక్తి నిలబడి నమాజ్ ఆచరించుకోవాలంటే కూడా ఆచరించుకోవటానికి అనుమతి ఉంది.

ఇక్కడ రెండు విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి అతను సజ్దా చేసే ప్రదేశం ఎంత దూరం వరకు అయితే ఉంటుందో, ఆ లోపు నుంచి దాటుకునే ప్రయత్నం చేయరాదు. అది ఒక పాపంగా పరిగణించబడుతుంది. దాని నష్టం ఎంత పెద్దది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి 40 రోజులు లేదా 40 వారాలు లేదా 40 నెలలు లేదా 40 సంవత్సరాలు ఒంటి కాలు మీద నిలబడిపోవడానికైనా సరే సిద్ధపడిపోతాడు గానీ ఆ పాపం చేయటానికి సిద్ధపడడు. అంత కఠినమైనది ఆ తప్పు అని చెప్పారు. కాబట్టి నమాజ్ ఆచరిస్తున్న వ్యక్తి ముందర నుంచి, అతను సజ్దా చేసే ప్రదేశం ఎంతవరకు అయితే ఉంటుందో, దాని లోపలి నుంచి దాటుకునే ప్రయత్నం ఎప్పటికీ చేయరాదు. అది ఒక కఠినమైన తప్పుగా మనము తెలుసుకొని దాని నుంచి దూరంగా ఉండాలి.

రెండో విషయం ఏమిటంటే, తెలియక, చూడకుండా ఎవరైనా ఒక వ్యక్తి అక్కడి నుంచి దాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, నమాజ్ ఆచరించే వ్యక్తికి ఆ వ్యక్తిని చేతితో అడ్డుకునే అనుమతి ఉంది. అతను చేతితో అడ్డుకోవాలి. అతను మూర్ఖంగా ముందుకే సాగటానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటించి అతన్ని పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి, వదలకూడదు అని కూడా తెలియజేయడం జరిగింది.

ఏది ఏమైనప్పటికిని మనిషి ఒక గోడ వెనుక గాని లేదా ఏదైనా వస్తువు వెనుక గాని సుత్రాగా ఏర్పరచుకొని నమాజ్ ఆచరించుకోవాలి. ఇది ఒక విధానము, ఒక సున్నత్ విధానము మనకు తెలుపబడింది. అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధానాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

క్రింది విషయం “దైవ ప్రవక్త నమాజు స్వరూపం – షేఖ్ అల్ అల్బానీ (రహిమహుల్లాహ్)”  అనే పుస్తకం నుండి తీసుకోబడింది (పేజీలు: 100-104)

సుత్రా మరియు, దాన్ని పాటించటం విధి అన్న విషయం గురించి:

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సుత్రాకు ఎంత దగ్గరగా నిలబడే వారంటే ఆయనకు – గోడ (సుత్రా)కు మధ్య మూడు చేతుల దూరం మాత్రమే ఉందేది.[38] ఆయన సజ్దా చేసే చోటికి – గోడ (సుత్రా)కు మధ్య ఒక మేక దూరి పోయేంత స్థలం మాత్రం ఉందేది. [39]

ఆయన ఇలా ప్రబోధించేవారు: “మీరు సుత్రా లేకుండా నమాజ్‌ చేయకండి.”

“మీ ముందు నుంచి ఎవర్నీ నడచి వెళ్ళనివ్వకండి. ఒకవేళ అతను అందుకు ఒప్పుకోక పోతే అతనితో తలపడండి. ఎందుకంటే అతనితోపాటు షైతాన్‌ ఉంటాడు.” [40]

ఆయన ఇంకా ఇలా అంటుండేవారు: “మీలో ఎవరైనా (ఎదుట) సుత్రా పెట్టుకుని నమాజ్‌ చేస్తున్నట్లయితే అతను దానికి దగ్గరగా ఉండాలి. షైతాన్‌ తన నమాజును చెడగొట్టకుండా ఉండాలంటే అతను అలా చెయ్యాలి మరి!”[41]

కొన్ని సార్లు ఆయన తన మస్జిద్ లోని  స్తంభం దగ్గర నమాజ్‌ చేయటానికి ప్రయత్నించేవారు. [42]

అడ్డు (సుత్రా)గా ఏ వస్తువూ లేనటవంటి విశాల మైదానంలో నమాజ్‌ చేయాలనుకున్నప్పుడల్లా ఆయన తన ఎదుట ఒక బరిసెను పాతుకునేవారు. దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు. ఆయన వెనుక జనం బారులు తీరేవారు. [43] అప్పుడప్పుడూ తన ఆడ ఒంటెను ఎదుట అడ్డంగా నిలబెట్టి దాని వైపు తిరిగి నమాజ్‌ చేసేవారు.[44] ఈ విధంగా నమాజ్‌ చేయటం అనేది ఒంటెల కొట్టంలో నమాజ్‌ చేయటం వంటిది కాదు. ఎందుకంటే ఆయన అసలు “ఆ ప్రదేశంలో నమాజ్‌ చేయటాన్నే వారించారు.”[45] కొన్నిసార్లు ఆయన ఒంటె అంబారీ నిటారుగా నిలబెట్టి దాని వెనుక భాగాన్ని అడ్డంగా ఉంచి నమాజ్‌ చేసేవారు [46] మరియు ఇలా అంటుండేవారు;

“మీలో ఎవరైనా తన ఎదుట ఒంటె అంబారీ వెనుక భాగపు కర్ర వంటిది ఏదయినా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నట్లయితే ఆ కర్రకు ఆవల నుంచి ఏ వస్తువు నడిచి వెళ్ళనా ఇక దాన్ని అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు” [48]

ఒకసారి ఆయన ఒక చెట్టు వైపు తిరిగి నమాజ్‌ చేశారు. (అంటే ఆ చెట్టుని సుత్రాగా పెట్టుకొని నమాజ్‌ చేశారు). [49] కొన్నిసార్లు ఆయన మంచానికి ఎదురుగా నిలబడి నమాజ్‌ చేసేవారు. ఆ సమయంలో ఆయేషా (రజిఅల్లాహు అన్హ) మంచం మీద తన దుప్పట్లో పడుకొని ఉండేవారు. [50]

తనకూ – తన సుత్రాకు మధ్య నుంచి ఏ వస్తువునీ వెళ్ళనిచ్ఛేవారు కాదు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). ఒకసారి ఏమయిందంటే, ఆయన నమాజ్‌ చేస్తున్నారు. అప్పుడే ఒక మేక పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు నుంచి వెళ్ళబోయింది. కాని ఆయన కూడా తొందరగా ముందుకుపోయి [51] ఉదరభాగంతో గోడకు ఆనుకున్నారు. దాంతో ఆ మేక పిల్ల ఆయన వెనుక నుంచి దాటి వెళ్ళిపోయింది. [52]

ఒకసారి ఆయన ఫర్జ్ నమాజ్‌ చేస్తున్నారు. (నమాజ్‌లోనే) పిడికిలి బిగించారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ప్రజలు “దైవప్రవక్తా! నమాజులో ఏదైనా కొత్త విషయం జరిగిందా?” అని అడిగారు. అందుకాయన “కొత్త విషయం ఏమీ లేదుగాని షైతాన్‌ నా ముందు నుంచి దాటి వెళ్ళబోయాడు. దాంతో నేను వాడి గొంతు పిసికాను. అప్పుడు నా చేతికి వాడి నాలుక చల్లదనం కూడా తగిలింది. దైవంసాక్షి నా సోదరుడు సులైమాన్‌ నా కంటే ముందు ప్రార్ధన చేసి ఉండకపోతే ఆ పైతాను మస్జిద్ లోని ఏదో ఒక స్తంభానికి కట్టబడి ఉండేవాడు. మదీనా నగర పిల్లలు సయితం వాణ్ని చూసుండేవారు. (కనుక నేను చెప్పేది ఏమంటే) తనకూ-ఖిబ్లాకు మధ్య నుంచి ఎవర్నీ వెళ్ళకుండా ఆపగలిగే వీలున్నవాడు తప్పకుండా అలా చేయాలి. ” [53]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెబుతుండేవారు: “మీలో ఎవరైనా ఏదైనా వస్తువును అడ్డుగా పెట్టుకొని నమాజ్‌ చేస్తున్నప్పటికీ ఇంకెవరైనా అతని ముందు నుంచి వెళ్ళగోరితే వాణ్ణి గొంతుపట్టుకొని వెనక్కి నెట్టాలి. వీలైనంత వరకు వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయాలి. (మరో ఉల్లేఖనంలో రెండోసారి కూడా వాణ్ణి ఆపాలి అని ఉంది. ) అప్పటికి వాడు వినకపోతే ఇక వాడితో తలపడాలి. ఎందుకంటే వాడు షైతాను” [54]

ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇంకా ఇలా అంటుండేవారు: “నమాజు చేస్తున్న వ్యక్తి ముందు నుంచి వెళ్ళటం ఎంత పాపమో తెలిస్తే ఆ వ్యక్తి నమాజ్‌ చేస్తున్న వాని ముందు నుంచి వెళ్లటం కంటే నలభై వరకు అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోవటం తన కొరకు శ్రేయస్కరం అనుకుంటాడు.” (హదీసు ఉల్లేఖకులు అబూ నద్ర్‌ కథనం: నలభై అంటే దైవప్రవక్త రోజులు, నెలలు, సంవత్సరాలలో దేనిని సెలవిచ్చారో నాకు గుర్తులేదు. – అనువాదకులు) [55]

హదీసు రిఫరెన్సులు & అల్బానీ వ్యాఖ్యలు :

[38] బుఖారీ, అహ్మద్‌

[39] బుఖారీ, ముస్లిం

[40] సహీ ఇబ్నె ఖుజైమా (1/93/1) – మంచి పరంపరతో.

[41] అబూదావూద్‌, జవాయెద్‌ బజ్జార్‌ – 54 పేజీ, హాకిమ్‌ – తను దీనిని సహీగా ఖరారు చేశారు. జహబీ, నవవీ దీనితో ఏకీభవించారు.

[42] నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అయినా, ఒంటరిగా నమాజ్‌ చేసే వ్యక్తి అయినా, ఒకవేళ మస్జిద్ పరిమాణం పెద్దదైనప్పటికీ, అందరికోసం ‘సుత్రా’ తప్పనిసరి. ఇబ్నె హానీ తన గ్రంథం ‘మసాయల్‌ ఇమామ్‌ అహ్నద్‌”-1/66 నందు యిలా పేర్కొన్నారు: అబూ అబ్దుల్లా అంటే ఇమామ్‌ అహ్మద్‌ ఓ రోజు నన్ను, సుత్రా లేకుండా నమాజు చేయడం చూసి ‘దేనినయినా సుత్రాగా ఉపయోగించుకో‘ అని ఉపదేశించారు. తదుపరి నేను ఒక వ్యక్తిని సుత్రాగా ఉపయోగించుకున్నాను.

నేను చెప్పేదేమిటంటే – ఇమామ్‌ అహ్మద్‌ తన మాటల ద్వారా – మస్జిద్ పరిమాణం పెద్దదైనా, చిన్నదైనా – సుత్రా ఉపయోగించడంలో వ్యత్యాసం చూపకూడదు అన్న విషయం సూచించారు. ఇదే సత్యం కూడాను.

నేను సందర్శించిన దేశాలలో గమనించిందేమిటంటే – సాధారణంగా నమాజీలు – వారు ఇమాములైనా లేదా సాధారణ వ్యక్తులైనా, సుత్రా విషయంలో తగిన శ్రద్ధ వహించడం లేదు. ఈ దేశాల్లో సౌది అరేబియా కూడా చేరి ఉంది. అక్కడికి నేను 1410 హి. రజబ్‌ మాసంలో వెళ్లాను.

అందుకే, ఉలమాలపై వున్న బాధ్యత ఏమిటంటే – వారు ఈ విషయం గురించి ప్రజలకు హెచ్చరించాలి మరియు సుత్రాకు సంబంధించిన అన్ని వివరాలను వారికి తెలియజేయాలి. సుత్రా ఆజ్ఞల విషయంలో మస్జిదె హరాం మరియు మస్జిదె నబవి కూడా చేరి వున్నాయన్న విషయం వారికి బోధపరచాలి.

[43] బుఖారీ, ముస్లిం, ఇబ్నె మాజా

[44][45] బుఖారీ, అహ్మద్‌

[46] ముస్లిం, ఇబ్నె ఖుజైమా – 2/92, అహ్మద్‌

[47] అంబారీ వెనుకభాగంలో వుండే కర్రను ‘మోఖిరా’ అంటారు.

[48] ముస్లిం, అబూదావూద్‌

[49] నసాయి, అహ్మద్‌ – సహీ పరంపరతో

[50] బుఖారీ,ముస్లిం, అబూ యాలా – 3/107 – తఫ్సీర్ అల్‌ మక్తబతుల్‌ ఇస్లామీ 

[51] హదీసులో ‘సా ఆహా’ అన్న పదం వచ్చింది. అంటే “ఇతరులను మించిపోవడం” అన్నమాట.

[52] సహీ ఇబ్నె ఖుజైమా (1/95/1), తటబ్రానీ (3/140/3), హాకిమ్‌ దీనిని సహీగా ఖరారు చేశారు, జహబీ దీనితో ఏకీభవించారు.

[53] అహ్మద్‌, దారెఖు,త్నీ  తబ్రానీ – సహీ పరంపరతో.

ఈ అర్ధాన్ని స్ఫురించే ఉల్లేఖనాలు బుఖారీ, ముస్లింలలో వున్నాయి. అంతేకాక, సహాబాల ఒక సమూహం ద్వారా కూడా ఈ అర్ధంతో కూడుకున్న ఉల్లేఖనాలు ఇతర గ్రంథాల్లో వచ్చాయి.

ఖాదియానీలు తిరస్కరించే హదీసులలో ఇదొకటి. ఎందుకంటే ఖురాను, హదిసులలో వివరించబడ్డ జిన్నుల లోకాన్ని వారు విశ్వసించరు. షరీయత్తులోని స్పష్టమైన ఆధారాలను వారు తిరస్కరించడం అనేది ఎవరికీ తెలియని విషయం కాదు. ఒకవేళ ఆధారం ఖుర్‌ఆన్‌లో వుంటే – వారు దాని అర్ధాన్నే మార్చిస్తారు. ఉదాహరణకు : “ఓ ప్రవక్తా! జిన్నాతుల సమూహం ఒకటి (శ్రద్ధగా విని, ఆ తర్వాత …… (జిన్న్‌: 1) ఆయత్‌లో ‘జిన్నును మానవ జిన్న్‌గా తలపోన్తారు మరియు ‘జిన్న్’ పదాన్ని మానవమాత్రులుగా ఖరారు చేస్తారు.

ఇలా, ఈ విషయంలో వారు నిఘంటువు మరియు షరియత్తుల నుండి దూరం వెళ్ళి పోయారు. ఒకవేళ ఆధారాలు గనక హదీసుల్లో ఉంటే-వీలయితే వాటి అసలు అర్ధాన్నే మార్చేస్తారు లేదా అతి తేలికగా వాటిని అసత్యమని ఖరారు చేశారు. ఇలా, హదీసువేత్తలు, వారి వెనుక మొత్తం అనుచర సమాజం వాటి ప్రామాణికతపై ఏకాభిప్రాయం కలిగి వున్నప్పటికీ వీరు వాటిని తిరస్కరిస్తారు. అల్లాహ్‌ వారికి సన్మార్గం ప్రసాదించుగాక!

54, బుఖారీ, ముస్లిం.

55. బుఖారీ, ముస్లిం. ఈ ఉల్లేఖనం ఇబ్నె ఖుజైమా (1/94/1)లో వుంది.

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ [తప్పక వినండి] [ఆడియో & టెక్స్ట్]

రుకూ, సజ్దా సరిగా నెరవేర్చని వ్యక్తి యొక్క ఉదాహరణ
https://youtu.be/Pj0-SewzPaA [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తిని చూసి, అతనిని చాలా ఆకలితో ఉండి ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే తిన్న వ్యక్తితో పోల్చారు. ఎలాగైతే ఆ కొద్దిపాటి ఆహారం ఆకలిని తీర్చదో, అలాగే అసంపూర్ణమైన రుకూ మరియు సజ్దాలతో చేసే నమాజ్ ఆత్మకు పోషణ ఇవ్వదని వివరించారు. నమాజ్ అనేది విశ్వాసుల హృదయాలకు ఆహారం లాంటిదని, దానిని సంపూర్ణంగా, ఉత్తమ రీతిలో చేయడం ద్వారానే ఆత్మకు, మనస్సుకు కావలసినంత పోషణ లభిస్తుందని తెలిపారు. సరిగ్గా నమాజ్ చేయని వ్యక్తి తన ఆత్మను పస్తులు ఉంచినట్లేనని, దానివల్ల ఆత్మ అనారోగ్యానికి గురై చివరకు “చనిపోతుందని” (ఆధ్యాత్మికంగా నిర్జీవమవుతుందని) హెచ్చరించారు. ఈ “ఆత్మ మరణం” అనేది భౌతిక మరణం కాదని, అల్లాహ్ స్మరణ, ఆరాధనల నుండి దూరం కావడం అని స్పష్టం చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక వ్యక్తిని చూశారు, నమాజ్ చేస్తున్నది. కానీ ఆ వ్యక్తి ఎలా నమాజ్ చేస్తున్నాడు?

لَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(లా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
అతను రుకూ మరియు సజ్దాలను సరిగ్గా చేయడం లేదు.

يَنْقُرُ صَلَاتَهُ كَمَا يَنْقُرُ الْغُرَابُ
(యన్ఖురు సలాతహు కమా యన్ఖురుల్ గురాబ్)
కాకి ఎలా చుంచు కొడుతుందో విత్తనం ఎత్తుకోవడానికి, ఆ విధంగా అతను నమాజ్ చేస్తున్నాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

إِنَّ مَثَلَ الَّذِي يُصَلِّي وَلَا يُتِمُّ رُكُوعَهُ وَلَا سُجُودَهُ
(ఇన్న మసలల్లదీ యుసల్లీ వలా యుతిమ్ము రుకూఅహూ వలా సుజూదహూ)
ఎవరైతే ఈ విధంగా నమాజ్ చేస్తున్నారో, అందులో రుకూ కూడా సరిగ్గా చేయడం లేదు, సజ్దా కూడా సరిగ్గా చేయడం లేదు,

كَمَثَلِ الَّذِي يَأْكُلُ التَّمْرَةَ وَالتَّمْرَتَيْنِ
(క మసలిల్లదీ య’కులుత్తమ్రత వత్తమ్రతైన్)
అతని ఉదాహరణ, దృష్టాంతం ఎలాంటిదంటే, చాలా ఆకలిగా ఉండి కేవలం ఒక్క ఖర్జూరము లేదా రెండు ఖర్జూరపు ముక్కలు తిన్న వాని మాదిరిగా,

لَا يُغْنِيَانِ عَنْهُ شَيْئًا
(లా యుగ్నియాని అన్హు షైఆ)
ఆ ఒక్క రెండు ఖర్జూరపు ముక్కలు అతని యొక్క ఆకలిని తీర్చవు.

فَأَتِمُّوا الرُّكُوعَ وَالسُّجُودَ
(ఫఅతిమ్ముర్రుకూఅ వస్సుజూద్)
మీరు నమాజులలో రుకూ సజ్దాలు పూర్తిగా చెయ్యండి, సంపూర్ణంగా చెయ్యండి, సరిగ్గా చెయ్యండి.

ఇమామ్ ముందిరి రహిమహుల్లాహ్ ఈ హదీథ్ ను హసన్ కోవకు చెందినది అని చెప్పారు. అయితే ఇమామ్ ఇబ్ను రజబ్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ హదీథ్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ ఉదాహరణ, దృష్టాంతం తెలియజేశారో అది చాలా గొప్పది, చాలా ఉత్తమ రీతిలో తెలియజేశారు.

ఎలాగైతే ఆకలి ఉన్న వానికి ఒక ఖర్జూరపు, రెండు ఖర్జూరపు ముక్కలు అతని ఆకలిని తీర్చలేవో, ఇలా రుకూ సజ్దాలు సరిగ్గా చేయకుండా నమాజును తొందరపాటుతో చేసేవాడు వాస్తవానికి అతడు నమాజ్ ఏదైతే విశ్వాసుల హృదయాలకు ఆహారంగా ఉందో, ఆ ఆహారం అతడు తీసుకోని వాడవుతాడు.

వాస్తవానికి నమాజ్ అల్లాహ్ యొక్క ధిక్ర్, అల్లాహ్ తో వేడుకోలు, అల్లాహ్ సాన్నిధ్యానికి చేరవేసే, అల్లాహ్ కు చాలా దగ్గరగా చేసే సత్కార్యాల్లో గొప్ప సత్కార్యం. ఇక ఎవరైతే ఈ నమాజ్ సంపూర్ణంగా, మంచి ఉత్తమ రీతిలో చేస్తారో అతడే తన ఆత్మకు, తన మనస్సుకు కావలసినంత ఆహారం ఇచ్చిన వాడవుతాడు. మరి ఎవరైతే నమాజ్ సరియైన రీతిలో చెయ్యడో, టక్కు టిక్కు మని, ఎక్స్ప్రెస్ నమాజ్, ఇలా చూసి అలా చూసేసరికి అల్లాహు అక్బర్ అని మొదలవుతుంది, అస్సలాము అలైకుం అని పూర్తయిపోతుంది, ఇలాంటి నమాజ్ ద్వారా అతడు తన హృదయ, తన మనస్సుకు కావలసిన, తన ఆత్మకు కావలసిన ఆహారాన్ని సరిగా ఇవ్వలేదు. ఇక ఎలాగైతే మనిషికి కావలసినంత ఆహారం దొరకకుంటే చనిపోతాడో, అనారోగ్యానికి గురవుతాడో అలాగే ఎప్పుడైతే హృదయానికి, ఆత్మకు, మనస్సుకు దాని ఆహారం దొరకదో అది కూడా అనారోగ్యానికి గురి అవుతుంది మరియు అది కూడా చనిపోతుంది. మనిషి యొక్క చావు అంత నష్టమైనది కాదు, ఆత్మ చనిపోయిందంటే అది చాలా పెద్ద నష్టం.

ఏమైనా అర్థమైందా అండీ మీకు ఇప్పుడు చెప్పిన మాటలతో?

ప్రశ్న మరియు జవాబు

ఆత్మ చనిపోవడం అంటే, ఇది ఒక ఉదాహరణగా. ఆత్మ చనిపోవడం అంటే ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వకపోవడం. ప్రాపంచిక పరంగా బ్రతికి ఉన్నప్పటికీ, అల్లాహ్ యొక్క ధిక్ర్ తో, అల్లాహ్ యొక్క ఆరాధనతో, అల్లాహ్ యొక్క స్మరణతో, ఖురాన్ యొక్క తిలావత్ తో దానికి ఏ ఆహారం అవసరం ఉంటుందో, అది దానికి చేరనీయకపోవడం. ఇక్కడ ఆత్మ చనిపోవడం అంటే మనం ఫిజికల్ గా, లేదా కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ పరంగా ఏదైతే మాటలు మాట్లాడతారో ఇతని యొక్క మెదడు చనిపోయింది, ఆ మైండ్ డెత్ అని, ఆత్మ డెత్, ఇలాంటి విషయం ఇక్కడ కాదు. ఇక్కడ చనిపోవడం అంటే, “అరే ఏందిరా, నువ్వు జీవితం, ఏదైనా జీవితమా? నీదే బ్రతుకు, ఏదైనా బ్రతుకా? చనిపోయిన శవం కంటే అధ్వానం రా నువ్వు!” ఇలా మనం ఎప్పుడు అంటాము? ఆ మనిషి బ్రతికి కూడా సరియైన పనులు చేయకుంటే అంటాము కదా, ఆ విధంగా. ఇన్షా అల్లాహ్ మాట అర్థమైందని భావిస్తున్నాను.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=15701

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705