“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు?
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/9G8MWDYNSwo [7 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్)
వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)

ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.

ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.

నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.

అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.(10:63)

ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.

అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.

కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.

అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.

అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44244

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు? [ఆడియో & టెక్స్ట్]

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా?? [వీడియో & టెక్స్ట్]


హజ్జ్ ఘనత – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

హజ్జ్ ఘనత
షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YE1Djv32h40 [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.

اَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.

చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.

కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్

హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్

అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.

దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:

بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ
(బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్: షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, వఇకామిస్సలాతి, వఈతాయిజ్జకాతి, వహజ్జు బైతిల్లాహి, వసౌమి రమదాన్)

ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.

ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.

ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.

ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.

అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.

ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.

హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ
(అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్)
స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.

అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.

రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.

ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.

ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا، وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ

“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.

మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.

అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

أَدِيمُوا الْحَجَّ وَالْعُمْرَةَ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوبَ كَمَا تَنْفِي الْكِيرُ خَبَثَ الْحَدِيدِ

మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.

అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:

أَيُّ الْعَمَلِ أَفْضَلُ
(అయ్యుల్ అమలి అఫ్దల్)
ఏ సత్కార్యము గొప్పది?

అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:

إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ
(ఈమాను బిల్లాహి వ రసూలిహి)
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.

గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:

جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ
(జిహాదున్ ఫీ సబీలిల్లాహ్)
అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.

మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

حَجٌّ مَبْرُورٌ
(హజ్జున్ మబ్రూర్)
స్వీకరించబడిన హజ్.

అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.

అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ
(లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్)
మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]

మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ
(జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా)
వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.

అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.

అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:

الْغَازِي فِي سَبِيلِ اللَّهِ، وَالْحَاجُّ، وَالْمُعْتَمِرُ وَفْدُ اللَّهِ، دَعَاهُمْ فَأَجَابُوهُ وَسَأَلُوهُ فَأَعْطَاهُمْ

అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.

అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.

మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.

దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.

అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:

مَنْ خَرَجَ حَاجًّا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْحَاجِّ إِلَى يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ خَرَجَ مُعْتَمِرًا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْمُعْتَمِرِ إِلَى يَوْمِ الْقِيَامَةِ

ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)

అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:

اغْسِلُوهُ بِمَاءٍ وَسِدْرٍ، وَكَفِّنُوهُ فِي ثَوْبَيْهِ، وَلاَ تُخَمِّرُوا رَأْسَهُ، وَلاَ تُحَنِّطُوهُ، فَإِنَّهُ يُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ مُلَبِّيًا

“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”

అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ
(లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్)
“ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”

అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.

ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.

ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,

“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.

మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.

ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.

కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.

అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.

హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:

స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

مَنْ أَرَادَ الْحَجَّ فَلْيَتَعَجَّلْ، فَإِنَّهُ قَدْ يَمْرَضُ الْمَرِيضُ، وَتَضِلُّ الضَّالَّةُ، وَتَعْرِضُ الْحَاجَةُ
(మన్ అరాదల్ హజ్జ ఫల్ యతఅజ్జల్, ఫఇన్నహు ఖద్ యమ్రదుల్ మరీదు, వ తదిల్లుజ్జాలతు, వ త’అరిదుల్ హాజతు)

ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.

కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.

చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.

అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.

ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”

అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.

ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا
(యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,

ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:

وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ

అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?

అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.

అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ
(ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల ఫిల్ హజ్జ్)
హజ్‌ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.” (2:197)

ప్రవక్త వారు తెలియజేశారు:

مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ
(మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు)
“ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”

ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:

يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا
(యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”

ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:

لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ
(లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్)
“నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”

నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.

అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:

لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ
(లబ్బైక్ అన్ షుబ్రుమా)
“ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ
(హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా)
“ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”

కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.

అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

نَعَمْ وَلَكِ أَجْرٌ
(నఅమ్ వలకి అజ్ర్)
“అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”

“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.

మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.

అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.

అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.

ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్

వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43235

హజ్జ్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/


త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) – మరణానంతర జీవితం : పార్ట్ 47 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.

మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)

ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.

అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,

فما ظنكم
(ఫమా జన్నుకుమ్)

చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.

ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.

ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.

ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,

ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.

మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.

అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?

తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.

కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.

17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.

ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)

“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)

దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.

18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.

ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.

ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.

అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

దౌర్జన్యం (జుల్మ్) దుష్పరిణామాలు – సలీం జామయి [వీడియో & టెక్స్ట్]

దౌర్జన్యం దుష్పరిణామాలు
https://youtu.be/EHyOccjO-54 [18 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దౌర్జన్యం (జుల్మ్) మరియు దాని భయంకరమైన పరిణామాల గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. దౌర్జన్యాన్ని అల్లాహ్ తనపై తాను నిషేధించుకున్నాడని, మరియు ఇతరుల పట్ల దౌర్జన్యానికి పాల్పడవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని వివరించబడింది. అణచివేతకు గురైన వ్యక్తి యొక్క శాపం (బద్దుఅ) నేరుగా అల్లాహ్ ను చేరుతుందని, దానికి మరియు అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డు ఉండదని చెప్పబడింది. దీనికి ఉదాహరణలుగా సహాబీ సయీద్ బిన్ జైద్ (రజియల్లాహు అన్హు), ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ (రహిమహుల్లాహ్), మరియు ఫిరౌన్ ల గాథలు వివరించబడ్డాయి. దౌర్జన్యం చేసేవారికి సహాయపడటం లేదా వారి వైపు మొగ్గు చూపడం కూడా నరకాగ్నికి దారితీస్తుందని ఖురాన్ ఆయత్ ద్వారా హెచ్చరించబడింది. దౌర్జన్యపరుడైనా, బాధితుడైనా తన సోదరునికి సహాయం చేయాలని, దౌర్జన్యపరుడికి సహాయం చేయడమంటే అతనిని ఆ దౌర్జన్యం నుండి ఆపడమని ఇస్లాం బోధిస్తుందని ప్రసంగం ముగించబడింది.


أَسْتَغْفِرُهُ وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، أَمَّا بَعْدُ

فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ

అస్తగ్ ఫిరుహు వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్, వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’మాలినా, మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మై యుద్ లీల్ ఫలా హాదియ లహ్. వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా, అమ్మా బాద్

ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్అ, వ కుల్ల బిద్అతిన్ దలాలహ్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్

قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ
(ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్)

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنْتُمْ مُسْلِمُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహీ వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి..” (ఆలి ఇమ్రాన్‌ 3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ مِنْ نَفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا

మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.” (అన్నిసా 4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَمَنْ يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (అల్ అహ్ జాబ్ 33:70-71)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు, పండితులు మరియు ఇస్లామీయ సోదరులారా.

‘దౌర్జన్యం – దుష్పపరిణామాలు’ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ ఈ జుమా ప్రసంగంలో ఖురాన్, హదీస్ మరియు చరిత్ర ఆధారంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం.

దౌర్జన్యం చేయటాన్ని, దౌర్జన్యానికి పాల్పడటాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేసి ఉన్నారు. మనం చూసినట్లయితే, ముస్లిం గ్రంథంలోని హదీసె ఖుద్సీలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు.

يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا فَلَا تَظَالَمُوا
(యా ఇబాదీ ఇన్నీ హర్రమ్ తుజ్ జుల్మ అలా నఫ్సీ వ జ’అల్తుహూ బైనకుమ్ ముహర్రమన్ ఫలా తజాలమూ)

“ఓ నా దాసులారా! నిశ్చయంగా నేను నా మీద దౌర్జన్యాన్ని నిషేధించుకున్నాను. ఇంకా దానిని మీ మధ్య కూడా నిషిద్ధం చేశాను. కాబట్టి మీరు ఒకరిపై ఒకరు దౌర్జన్యం చేసుకోకండి.” (ముస్లిం గ్రంథంలోని హదీసె ఖుద్సీ)

అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా భక్తులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, “ఓ నా దాసులారా, దౌర్జన్యం చేయటాన్ని నేను నా మీద నిషేధం చేసుకున్నాను. అలాగే మీ కొరకు కూడా దౌర్జన్యం చేయటాన్ని నిషేధం చేసేశాను కాబట్టి, మీరు ఎవరూ కూడా దౌర్జన్యానికి పాల్పడవద్దు.”

ముస్లిం గ్రంథంలోని మరొక ఉల్లేఖనంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు,

اتَّقوا الظُّلْمَ، فإِنَّ الظُلْمَ ظُلُماتٌ يَوْمَ القِيامَةِ
(ఇత్తఖుజ్ జుల్మ ఫ ఇన్నజ్ జుల్మ జులుమాతున్ యౌమల్ ఖియామా)

“దౌర్జన్యానికి దూరంగా ఉండండి. ఎందుకంటే దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లుగా పరిణమిస్తుంది.” (ముస్లిం గ్రంథం)

దౌర్జన్యం నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే దౌర్జన్యానికి పాల్పడిన వారు రేపు పరలోకాన అంధకారాలలో ఉంచివేయబడతారు అన్నారు.

ఈ రెండు ఉల్లేఖనాలలో మనము గమనించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎప్పుడూ, ఎవరి మీద దౌర్జన్యము చేయడు. ఆయన న్యాయం చేయువాడు, ఎవరి మీద కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దౌర్జన్యం చేయడు. అలాగే గమనించాల్సిన రెండో విషయం ఏమిటంటే, మానవులు కూడా ఎవరూ ఎవరి మీద దౌర్జన్యానికి పాల్పడకూడదు, అల్లాహ్ నిషేధం చేసి ఉన్నాడు. అయితే మిత్రులారా, ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, అలాంటి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇష్టపడడు అని ఖురాను గ్రంథంలో తెలియజేశాడు.

وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
(వల్లాహు లా యుహిబ్బుజ్ జాలిమీన్)
అల్లాహ్‌ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు.” (ఆలి ఇమ్రాన్‌ 3:57)

ఖురాను గ్రంథం, మూడవ అధ్యాయము 57వ వాక్యంలో చూసినట్లయితే, అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు, “అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దౌర్జన్యానికి పాల్పడిన వారిని ఇష్టపడడు.”

మిత్రులారా, ఎవరైతే దౌర్జన్యానికి గురి అవుతారో, అణిచివేతకు గురి అవుతారో, అలాంటి వారు బద్దుఅ (శాపం) పెడతారు. వారు శాపం పెడితే, అది అల్లాహ్ వద్దకు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.

وَاتَّقِ دَعْوَةَ الْمَظْلُومِ فَإِنَّهُ لَيْسَ بَيْنَهَا وَبَيْنَ اللَّهِ حِجَابٌ
(వత్తఖి ద’వతల్ మజ్లూమ్, ఫ ఇన్నహూ లైస బైనహా వ బైనల్లాహి హిజాబ్)

“అణచివేతకు గురైన వ్యక్తి శాపం నుండి జాగ్రత్త పడండి. ఎందుకంటే దానికి, అల్లాహ్ కు మధ్య ఎలాంటి అడ్డు తెర ఉండదు.”

దీనికి కొన్ని ఉదాహరణలు ఇన్షా అల్లాహ్ నేను మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

మొదటి ఉదాహరణ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిది. ఈయన పేరు ఎక్కడైనా విన్నారా మీరు? సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు అషర ముబష్షరాలో చివరి పేరు ఆయనది. ఒకే ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది మందిని స్వర్గపు శుభవార్త వినిపించి ఉన్నారు కదా, మొదటి పేరు అబూబక్ర్ రజియల్లాహు అన్హు వారిది వస్తుంది. చివరి పేరు సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిది.

సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారు వృద్ధాప్యానికి చేరినప్పుడు – ప్రవక్త వారు మరణించారు, అబూబక్ర్ రజియల్లాహు అన్హు వారు, ఉమర్ రజియల్లాహు అన్హు వారు, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు, అలీ రజియల్లాహు అన్హు వారు నలుగురు ధర్మ ఖలీఫాలు మరణించిన తరువాత, మదీనాలో మర్వాన్ అనే ఒక వ్యక్తి పరిపాలన చేస్తున్న రోజుల్లో, సయీద్ రజియల్లాహు అన్హు వారు వృద్ధాప్యానికి గురైపోయారు, అంటే ముసలివారైపోయారు. ఆ సమయంలో అర్వా బిన్త్ ఉవైస్ అనే ఒక మహిళ ఆయన మీద నింద మోపారు. ఏమని నింద మోపారు? “ఈయన అక్రమంగా నా భూమి లాక్కున్నారు, దౌర్జన్యంగా నా భూమి పీక్కున్నారు” అని నింద మోపారు.

విషయం మర్వాన్ వద్దకు చేరింది. మర్వాన్ ఈ సయీద్ బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారిని పిలిపించి, “ఏంటి విషయం? ఈ మహిళ మీ గురించి ఈ విధంగా చెబుతా ఉంది” అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఏమండీ, ఈ నేరానికి నేను పాల్పడలేదు. చూడండి, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఒక హదీసు విని ఉన్నాను. ప్రవక్త వారు తెలియజేశారు, ఎవరైనా ప్రపంచంలో ఇతరుల భూమి ఒక జానెడు భూమి దోచేసినా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రేపు పరలోకంలో అతని మెడలో ఏడు భూముల భారం వేలాడదీస్తాడు అని తెలియజేశారు.” ఆ హదీసు నేను ప్రవక్త వారి నోట విని ఉన్నాను. ఆ హదీసు విని కూడా నేను ఇలాంటి నేరం చేస్తానా? ఇతరుల భూమి అక్రమంగా నేను కాజేస్తానా? నేను చేయలేదు అని చెప్పేశారు.

అప్పుడు ఆయన ఏమన్నారంటే, “మీరు ఇంకా సాక్ష్యాధారాలు చూపించవలసిన అవసరం లేదు, మీరు వెళ్ళవచ్చు” అని పంపించేశాడు. కాకపోతే, ముసలితనంలో ఆయన మీద, ఆయన గౌరవనీయుడు కదండీ, ఎంత గౌరవనీయుడు, ఒక సహాబీ. ప్రవక్త వారి నోట స్వర్గపు శుభవార్త పొందిన సహాబీ. అలాంటి గౌరవనీయుడైన వ్యక్తి మీద నింద మోపటము, కాబట్టి ఆయనకు గాయమైంది, మనసుకు గాయమైంది. ఆయన బాధపడ్డారు, లోలోపల బాధపడి, చివరికి ఆయన ఏం చేశారంటే, శాపం పెట్టేశారు. ఏమని శాపం పెట్టారు?

اللَّهُمَّ إِنْ كَانَتْ كَاذِبَةً فَأَعْمِ بَصَرَهَا وَاقْتُلْهَا فِي أَرْضِهَا
(అల్లాహుమ్మ ఇన్ కానత్ కాజిబతన్ ఫ అ’మి బసరహా వఖ్తుల్ హా ఫీ అర్జిహా)
“ఓ అల్లాహ్! ఈమె అబద్దమాడుతున్నట్లయితే, ఈమె కంటిచూపును తీసివేయి మరియు ఈమెను తన భూమిలోనే మరణింపజెయ్యి.” (ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం)

ఏమని శాపం పెట్టారంటే, “ఓ అల్లాహ్, ఈ మహిళ ఆపద్ధం పలుకుతూ ఉన్నట్లయితే, ఈవిడ కంటి చూపు పోవాలి, ఈవిడ భూమిలోనే ఈవిడ చనిపోవాలి” అని శాపం పెట్టారు, అల్లాహు అక్బర్.

సహాబీ అండి. సహాబీ శాపం పెట్టారు, చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఆ మహిళ అంధురాలు అయిపోయారు, కంటిచూపు పోయింది. ఆ తర్వాత, ఆవిడ భూమిలోనే ఏదో పని నిమిత్తము గుంత తవ్వి పెట్టి ఉంటే, ఒకరోజు ఆవిడ వెళ్తూ ఉంది, కళ్ళు చూపు, కంటి చూపు లేదు. కనిపించని కారణంగా వెళ్ళింది, ఆ గుంతలో పడి చచ్చింది, అల్లాహు అక్బర్.

చూశారా? శాపం పెడితే, అది డైరెక్ట్ అల్లాహ్ వద్దకు చేరుకుంటుంది అని చెప్పటానికి ఒక ఉదాహరణ, అది ముస్లిం గ్రంథంలోని ఉదాహరణ, ఒక సహాబీ ఉదాహరణ మీ ముందర ఉంచాను. ఇప్పుడు మరొక ఉదాహరణ మీ ముందర ఉంచుతూ ఉన్నాను, గమనించండి.

రెండో ఉదాహరణ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిది. నలుగురు ఇమాములు ఉన్నారు కదండీ, ఆ నలుగురు ఇమాములలో ఒక ఇమాము వారు, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్. ఈయన జీవిత కాలంలో మామూనుర్ రషీద్ అనే ఒక పరిపాలకుడు ఉండేవాడు. ఆయన కొంతమంది మాటల్లో పడిపోయి, ఖురాన్ మఖ్లూఖ్ అని ఒక ఉపద్రవాన్ని లేవనెత్తేశారు.

ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ వారు, “మీ వాదన సరికాదు, ఇది ఖురాన్ వాక్యాలకు, ప్రవక్త వారి ఉల్లేఖనాలకు విరుద్ధమైనది” అని వారించారు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా, మామూనుర్ రషీద్ రాజు కాబట్టి, ఎవరైతే ఆయన మాటను వ్యతిరేకించారో వారిని కొట్టించాడు, జైళ్లలో వేయించాడు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిని కూడా జైల్లో వేయించి కొరడాలతో కొట్టించాడు.

చూడండి, కొరడాలతో కొట్టించిన తర్వాత, కొద్ది రోజులకి ఏం చేశాడంటే, ఆయన నగరం నుంచి వేరే నగరానికి తరలించండి, వేరే జైల్లో వేసి మరింత కఠినమైన శిక్షలు వేయించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక భటులు ఆయన ఇంటికి వెళ్లారు. “రాజు ఆజ్ఞ వచ్చింది, మీకు ఈ ఊరి నుంచి వేరే ఊరికి తరలిస్తున్నారు, అక్కడ మరింత కఠినమైన శిక్షలు మీకు వేయిస్తున్నాడు రాజు” అని చెప్పారు. అప్పుడు ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారు మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు.

గమనించండి మిత్రులారా, మోకాళ్ళ మీద వంగిపోయి శాపం పెట్టారు. ఏమని శాపం పెట్టారు?

اللَّهُمَّ فَإِنْ يَكُنِ الْقُرْآنُ كَلامَكَ غَيْرَ مَخْلُوقٍ فَاكْفِنَا مَؤُنَتَهُ
(అల్లాహుమ్మ ఫ ఇన్ యకునిల్ ఖుర్ఆను కలాముక ఘైరు మఖ్లూఖ్, ఫక్ఫినా మవూనతహూ)
“ఓ అల్లాహ్! ఖురాన్ నీ వాక్యమై, అది సృష్టించబడనిదైతే, ఇతని (పరిపాలకుడి) పీడ నుండి మమ్మల్ని కాపాడు.”

ఓ అల్లాహ్, నీ గ్రంథం ఖురాన్ ఘైర్ మఖ్లూఖ్ అయితే, ఈ రాజు దౌర్జన్యం నుండి నన్ను కాపాడు ఓ అల్లాహ్ అని దుఆ చేశారు. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ వారిని ఆయన ఊరిలో నుంచి వేరే నగరానికి తీసుకువెళ్తూ ఉన్నారు, నగరంలో ఇంకా ప్రవేశించలేదు, అంతలోనే కబురు వచ్చింది, ఏమని? రాజు చనిపోయాడు అని. అల్లాహు అక్బర్.

చూశారా? కాబట్టి రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచానండి. ఈ రెండు ఉదాహరణల ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఎవరైతే దౌర్జన్యానికి గురవుతారో, అణిచివేతకు గురవుతారో, వారు శాపం పెడతారు. అలాంటి వారు శాపం పెడితే, ఆ శాపం తగులుతుంది. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, వారి మీద ఆ శాపం పడుతుంది, ఆ శాపం వారిని పట్టుకుంటుంది, జాగ్రత్త అని ఈ రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచడం జరిగింది.

అలాగే మనం చూసినట్లయితే, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, అలాంటి వారి మీద అల్లాహ్ శాపం పడుతుంది అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు.

أَلَا لَعْنَةُ اللَّهِ عَلَى الظَّالِمِينَ
(అలా ల’నతుల్లాహి అలజ్ జాలిమీన్)
“విని తెలుసుకోండి! దౌర్జన్యపరులపై అల్లాహ్‌ శాపం ఉంది.” (హూద్ 11:18)

ఖురాను గ్రంథం 11వ అధ్యాయము 18వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు. “జాగ్రత్త, ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, వారి మీద అల్లాహ్ శాపం పడుతుంది.”

అల్లాహ్ శాపం పడుతుంది అనటానికి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి గురువుగారు అంటే, ఖురాన్ లో మూసా అలైహిస్సలాం వారి గురించి మనము చూచినట్లయితే, బనీ ఇస్రాయీల్ ప్రజలను, అలనాటి రాజు ఫిరౌన్, ఫిరౌన్ బనీ ఇస్రాయీల్ ప్రజలను టార్గెట్ చేసుకుని, వారి హక్కుల్ని కాలరాసి, తర్వాత వారిని బానిసలుగా మార్చి, రేయింబవళ్లు వెట్టి చాకిరి చేయించి, కొట్టించి, ఆకలి దప్పుకలతో ఉంచి, చివరికి వారి మగబిడ్డలను వారి కళ్ల ముందరే చంపించేశాడు.

ఎంత దౌర్జన్యం అండి. హక్కులు కాజేశాడు. కొట్టాడు, ఆకలి దప్పుకలతో ఉంచాడు, బానిసలుగా మార్చారు, వెట్టి చాకిరి చేయించాడు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వారి ఇళ్లల్లో మగబిడ్డ పుడితే, వారి కళ్ల ముందే, తల్లిదండ్రుల కళ్ల ముందే చంపించేశాడు.

ఇంకా వాళ్ళు ఉంటారా? ఎంత అణిచివేతకు గురైన వారు గమ్మున ఉంటారా? శాపం పెడతారా పెట్టరా? శాపం పెట్టేశారు. చివరికి ఏమైంది? మనందరికీ తెలిసిన విషయమే, పదేపదే మనం వినే ఉన్నాం. చివరికి ఏమైందండి? సముద్రంలో, నడి సముద్రంలో మునిగి చచ్చాడు. నడి సముద్రంలో మునిగి చచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రకటించేశాడు, “నీ శవాన్ని నేను ప్రపంచంలో భద్రంగా ఉంచుతాను. ప్రళయం వరకు వచ్చే వారు నీ శవాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలి” అని అన్నాడు. నేడు కూడా ప్రజలు వెళుతూ ఉన్నారు, కెమెరాలలో అతని ఫోటోలు, వీడియోలు బంధించి ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు, “ఇదిగో, ఒకప్పుడు విర్రవీగిపోయిన దౌర్జన్యపరుడు, అహంకారి ఫిరౌన్, అతని శవాన్ని చూడండి” అని చూపిస్తూ ఉన్నారు.

అంటే, అహంకారానికి పాల్పడితే, దౌర్జన్యానికి పాల్పడితే, అలాంటి గతి పడుతుంది మిత్రులారా.

అలాగే మరొక ముఖ్యమైన హెచ్చరిక, అదేమిటంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా 11వ అధ్యాయము 113వ వాక్యంలో తెలియజేశాడు.

وَلَا تَرْكَنُوا إِلَى الَّذِينَ ظَلَمُوا فَتَمَسَّكُمُ النَّارُ
(వలా తర్కనూ ఇలల్లజీన జలమూ ఫ తమస్సకుమున్నార్)
ఎట్టి పరిస్థితిలోనూ దుర్మార్గుల పక్షాన మొగ్గకండి. మొగ్గారో మీక్కూడా నిప్పు (నరకాగ్ని) అంటుకుంటుంది. (11:113)

ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడతారో, అలాంటి వారి వైపు మొగ్గు చూపించకూడదు. ఒకవేళ మొగ్గు చూపారో, మీకు కూడా నరకాగ్ని పట్టుకుంటుంది అన్నారు. అంటే అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ వ్యక్తికి ఏ విధంగానూ సహకరించకూడదు.

మనం ఏం చేస్తున్నామండి? ప్రజలు మనం చూసినట్లయితే, నేడు కొంతమంది ముస్లింలను టార్గెట్ చేసుకుని, వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు, వారిని అణిచివేతకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క నిబంధన, ఒక్కొక్క హక్కు, ఒక్కొక్క హక్కు వారిది దూరం చేసేస్తూ ఉన్నారు, తొలగించుకుంటూ పోతూ ఉన్నారు. ముస్లింలను నలువైపుల నుంచి అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు. అయితే దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేస్తూ ఉంటే, కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, మీడియా ముందర వచ్చి, సోషల్ మీడియా ముందర వచ్చి, అతన్ని పొగుడుతూ ఉన్నారు. అతన్ని పొగుడుతూ, అతనికి సహాయం చేస్తూ ఉన్నారు, అతనికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలా అతన్ని ప్రోత్సహిస్తే, అతనికి సహాయపడితే, అతను ఏం చేస్తాడండి? మరింత రెచ్చిపోయి దౌర్జన్యానికి పాల్పడతాడు, అవునా కాదా? మరింత ఎక్కువగా దౌర్జన్యం చేస్తాడు, అవునా కాదా? అలా చేస్తే, దౌర్జన్యం చేసిన వానికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది, దౌర్జన్యం చేసే వారిని పొగిడిన వారికి కూడా నరకాగ్ని పట్టుకుంటుంది, జాగ్రత్త అని అల్లాహ్ హెచ్చరించాడు. కాబట్టి అలా చేయకూడదు సుమా.

అలాగే మిత్రులారా, మానవుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. జంతువుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. పక్షుల మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు. ఏ ప్రాణి మీద కూడా దౌర్జన్యానికి పాల్పడకూడదు అని హెచ్చరించిన ధర్మం, మన ఇస్లాము ధర్మం. అయితే మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే,

انْصُرْ أَخَاكَ ظَالِمًا أَوْ مَظْلُومًا
(ఉన్సుర్ అఖాక జాలిమన్ అవ్ మజ్లూమన్)
“మీ సోదరునికి సహాయం చేయండి, అతను దౌర్జన్యపరుడైనా సరే లేదా అణచివేతకు గురైన వాడైనా సరే.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన తర్వాత, సహాబాలు ప్రవక్త వారితో అడిగారు, “ఓ దైవ ప్రవక్తా, మా సోదరుడు అణిచివేతకు గురైతే మనము అతనికి సహాయం చేస్తాం, ఇది అర్థమవుతా ఉంది. కానీ, మన సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తా ఉంటే, అప్పుడు మనము అతనికి ఎలా సహాయం చేయగలము?” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

قَالَ: تَأْخُذُ فَوْقَ يَدَيْهِ
(ఖాల: తాఖుజు ఫౌఖ యదైహి)
“(దౌర్జన్యం చేస్తున్న అతని) చేతులను పట్టుకోవడం (అంటే ఆపడం).” (బుఖారీ)

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం. మీ సోదరుడు ఇతరుల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, అతని చెయ్యి పట్టుకొని ఆ దౌర్జన్యం నుండి ఆపండి. దౌర్జన్యం చేయకుండా మీ సోదరుని మీరు ఆపితే, మీ సోదరునికి మీరు సహాయం చేసిన వారు అవుతారు అన్నారు, అల్లాహు అక్బర్. ఇది ఇస్లాం మిత్రులారా.

కాబట్టి ఇస్లాం ధర్మంలో ఎవరి మీద కూడా దౌర్జన్యం చేయటానికి అనుమతి ఇవ్వబడలేదు. ఎవరైతే దౌర్జన్యం చేస్తారో, అలాంటి వారిని అల్లాహ్ ఇష్టపడడు. వారి మీద దైవ శాపం పడుతుంది. ఎవరైతే అణిచివేతకు గురవుతారో, వాళ్ళు శాపం పెడితే, ఆ శాపం వారిని ముట్టుకుంటుంది అని బోధించడం జరిగింది.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ అన్ని రకాల దౌర్జన్యాల నుండి దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. న్యాయంగా వ్యవహరించుకుంటూ, అందరి హక్కులు చెల్లించుకుంటూ జీవితం గడిపే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَذَا أَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ
(అఖూలు ఖౌలీ హాజా అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్)

فَاسْتَغْفِرُوهُ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43386


బిద్అత్ రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

బిద్అత్ రకాలు 
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/GDexn4QMzt4 [7 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నిషిద్ధమైన ‘బిదాత్’ (మతంలో నూతన ఆవిష్కరణ) యొక్క వివిధ రకాలను వివరిస్తారు. బిదాత్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు: విశ్వాసానికి సంబంధించినది (బిదాత్ అల్-ఇ’తిఖాదియ్యా) మరియు ఆరాధనలకు సంబంధించినది (బిదాత్ అల్-అమలియ్యా). విశ్వాసపరమైన బిదాత్, జహ్మియా, ముతజిలా వంటి మార్గం తప్పిన సమూహాల సిద్ధాంతాలను ఉదాహరణగా చూపిస్తుంది. ఆరాధనలలో బిదాత్‌ను నాలుగు విభాగాలుగా వివరిస్తారు: 1) షరియత్‌లో ఆధారం లేని కొత్త ఆరాధనను సృష్టించడం (ఉదా: మీలాద్-ఉన్-నబీ ఉత్సవం), 2) నిర్ధారిత ఆరాధనలకు అదనంగా చేర్చడం (ఉదా: ఫర్జ్ నమాజ్‌లో రకాతుల సంఖ్యను పెంచడం), 3) ఆరాధన పద్ధతిని మార్చడం (ఉదా: వ్యక్తిగత ధిక్ర్‌ను సామూహికంగా చేయడం), 4) సాధారణ ఆరాధనలకు షరియత్ నిర్దేశించని ప్రత్యేక సమయం లేదా తేదీని కేటాయించడం (ఉదా: షాబాన్ 15న ప్రత్యేక ఉపవాసం మరియు జాగరణ). ప్రతి రకమైన బిదాత్ నుండి దూరంగా ఉండాలని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గాన్ని మాత్రమే అనుసరించాలని వక్త నొక్కిచెప్పారు.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మాబాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

గత ఎపిసోడ్ లో బిదాత్ అంటే ఏమిటి? దాని అర్థం తెలుసుకున్నాం. ఈరోజు బిదాత్ రకాలు తెలుసుకుందాం, కొన్ని రకాలు.

ముఖ్యంగా బిదాత్ రెండు రకాలు.

మొదటి రకం విశ్వాసపరమైన బిదాత్. విశ్వాసానికి, ఈమాన్ కి సంబంధించిన బిదాత్. అంటే ఈ బిదాత్ సంబంధం వ్యక్తుల విశ్వాసాలతో ఉంటుంది. ఉదాహరణకు, జహ్మియా అనే ఒక వర్గం ఉంది, ముతజిలా అనే ఒక వర్గం ఉంది, రవాఫిజ్ అనే వర్గం ఉంది, తదితర మార్గ విహీన వర్గాల వారి సిద్ధాంతాలు. వారు అల్లాహ్ విషయంలో, అల్లాహ్ యొక్క అస్మాయె హుస్నా (ఉత్తమమైన పేర్లు) విషయంలో, అలాగే తఖ్దీర్ (విధి వ్రాత) విషయంలో, మన కర్మల విషయంలో వాళ్ళు కొత్త కొత్త విషయాలు కల్పించుకున్నారు. ఇప్పుడు దాని వివరం అవసరం లేదు. ఇది విశ్వాసానికి సంబంధించిన బిదాత్. ముతజిలా, జహ్మియా, రవాఫిజ్ తదితర మార్గ విహీన వర్గాల సిద్ధాంతాలు.

ఇక రెండవ రకం, ఆరాధనకి సంబంధించిన బిదాత్. ఆరాధన. నమాజ్ చేయటం, జికిర్ చేయటం, దుఆ చేయటం, హజ్ ఉమ్రా చేయటం, ఉపవాసం ఉండటం, పండుగ జరుపుకోవటం. హృదయానికి సంబంధించిన ఆరాధనలు, శారీరానికి సంబంధించిన ఆరాధనలు, నాలుకకి సంబంధించిన ఆరాధనలు. అంటే ఆరాధనకి సంబంధించిన బిదాత్, ఇది రెండవ రకం. అంటే ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతున్న బిదాత్. అది ఆరాధన కాదు, అది ఇబాదత్ కాదు, అది ప్రవక్త గారి విధానం కాదు. కానీ ఇబాదత్ గా, ఆరాధనగా చెల్లుబాటు అవుతా ఉంది.

ఉదాహరణకు, షరియత్ తో ఏ ప్రాతిపదిక కూడా లేని ఆరాధనను ఎవరైనా సృష్టించుకొని దానిని సమాజంలో ప్రవేశపెట్టడం. అంటే లేని నమాజు, లేని ఉపవాసం, లేని పండుగలను కల్పించుకోవటం అన్నమాట. ఉదాహరణకు, మీలాదున్నబీ, ఈద్ మీలాదున్నబీ ఉత్సవం. అది ఇబాదత్ గా, దీన్ లోని, ధర్మంలోని ఒక పండుగగా జరుపుకుంటారు. కానీ అది ఇబాదత్ కాదు. ఇది ఇబాదత్ లో బిదాత్ అవుతుంది.

అలాగే, ఇంకో రకం, చేయవలసి ఉన్న ఆరాధనకు అదనంగా ఏదన్నా చేర్చటం. ఉదాహరణకు, ఫర్జ్ నమాజులో ఒక రకాతును అదనంగా చేర్చటం. జుహర్ నమాజ్ నాలుగు రకాతులు ఫర్జ్. ఐదు చేయవచ్చా? చేయకూడదు. ఉద్దేశ్యపూర్వకంగా పుణ్యమే కదా, ఆరాధనే కదా, మంచి పనే కదా అని ఉద్దేశ్యంతో చేస్తే అది బిదాత్ అయిపోతుంది. అలాగే అసర్ లో నాలుగు, ఐదు చేయలేము. మగ్రిబ్ లో మూడు, నాలుగు చేయలేము. ఇషాలో నాలుగు, ఐదు చేయలేము. ఫజర్ లో రెండే, మూడు చేయలేము. మరి నమాజ్ మంచిదే కదా, నమాజ్ పుణ్యమే కదా అని చెప్పి ప్రవక్త గారు చూపించిన విధానం కాకుండా వేరే విధానం, కొత్తగా ఆవిష్కరిస్తే, ప్రవేశ పెడితే అది ఆరాధనలో బిదాత్ అవుతుంది.

అలాగే ఇంకో రకం ఏమిటంటే, ఆరాధన చేయవలసిన రీతిలో చేయకుండా, సంప్రదాయేతర పద్ధతిలో చేయటం. ఉదాహరణకు, వ్యక్తిగతంగా చేసుకోవలసిన దుఆలను, దైవ ధ్యానమును, జికిర్ ను సామూహికంగా చేయటం. ఏ ఆరాధన అయితే ప్రవక్త గారు వ్యక్తిగతంగా చేసుకోండి అని చేసి చూపించారో, వాటిని మనం సామూహికంగా చేయటం. దాని కోసం ప్రత్యేక సదనాలను ఏర్పాటు చేసుకోవటం, ఆరాధనలు చేసేందుకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవలంబించిన సులభమైన విధానాన్ని కాదని, కష్టతరమైన పద్ధతులను పాటించటం అన్నమాట.

అలాగే ఇంకో రకం ఏమిటంటే, ధర్మ సమ్మతమైన ఏ దేని ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు కేటాయించుకోవటం. ఆ ఆరాధన మాత్రం ధర్మ సమ్మతమే. కానీ ఆ ధర్మ సమ్మతమైన ఆ ఆరాధనలను ఫలానా తేదీ లేక ఫలానా సమయం కొరకు ప్రత్యేకించుకోవటం. అది కూడా బిదాతే. ఎందుకంటే ఈ ఆరాధనలను షరియత్ ఆ మేరకు నిర్ధారించి ఉండదు. ఉదాహరణకు, షాబాన్ నెల 15వ తేదీ పగలు ఉపవాసం ఉండాలని, ఆ రాత్రి పూట జాగారం చేయాలని నిశ్చయించుకోవటం. ఇది బిదాత్. ఉపవాసం ఉండటం, రాత్రి జాగారం చేయటం ఇది సమ్మతమే. ఎప్పుడైనా ఉపవాసం ఉండవచ్చు, ఏ రాత్రి అయినా జాగారం చేసి ప్రార్థన చేయవచ్చు. ఉపవాసం ఉండటం, రాత్రి పూట జాగారం చేయటం సమ్మతమే. కానీ వాటిని ఒకానొక రాత్రి కోసమో, పగలు కోసమో ప్రత్యేకించుకోవటం సమ్మతం కాదు. దానికి ఆధారం లేదు అన్నమాట.

ఇది బిదాత్ కి సంబంధించిన కొన్ని రకాలు మనము తెలుసుకున్నాము. మన సమాజంలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అల్లాహ్ మనందరినీ ప్రతి బిదాత్ నుండి కాపాడుగాక. ఇక బిదాతుల ఆదేశం ఏమిటి? అది ఇన్షాఅల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43343

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/



సహాబాల విధానం & దాని అవసరం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహాబాల విధానం & దాని అవసరం
https://youtu.be/nsxJhTZ1QP8 [45 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
(వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్)
శుభపరిణామం దైవభీతిపరులకే ప్రాప్తిస్తుంది.

وَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ
(వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్)
అన్యాయం చేస్తోన్నవారిపైన మాత్రమే ప్రతిఘటన/పోరాటం అనుమతించబడింది

وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
(వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్)
మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…

رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)

మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.

సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.

وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِيَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِيْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَآ اَبَدًا ۭذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ

ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)

ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


శాంతి భద్రతల ప్రాముఖ్యత, ముస్లిం పాలకుల పట్ల విధేయత & సామాజిక ఐక్యత [వీడియో & టెక్స్ట్]

శాంతిభద్రతల విలువ & ఐక్యత ప్రాముఖ్యత – జుమా ఖుత్బా
ఖతీబ్ ఫజీలతుష్ షేక్ రాషిద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్-బిదా హఫిజహుల్లాహ్
https://youtu.be/SnCZ5FgZV0U [22 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఖుత్బాలో ఇస్లాం ధర్మంలో శాంతి భద్రతల ప్రాముఖ్యతను, ముస్లిం పాలకుల పట్ల విధేయతను మరియు సామాజిక ఐక్యతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి వివేకవంతమైన నిర్ణయాన్ని ఉదహరిస్తూ, అంతర్యుద్ధం (ఫిత్నా) మరియు రక్తపాతాన్ని నివారించడానికి పాలకుల పట్ల విధేయత ఎంత ముఖ్యమో వివరించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న శాంతిని అల్లాహ్ గొప్ప వరంగా పేర్కొంటూ, కృతజ్ఞతా భావం, దైవభీతి మరియు ఐక్యమత్యం ద్వారానే ఈ భద్రత రక్షించబడుతుందని, అనవసరమైన విభేదాలు మరియు ముఠా తగాదాలకు దూరంగా ఉండాలని ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా హెచ్చరించారు.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ كَمَا بَسَطْتَ رِزْقَنَا، وَأَظْهَرْتَ أَمْنَنَا، وَجَمَعْتَ فُرْقَتَنَا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ.
[ఇన్నల్ హమ్దలిల్లాహి కమా బసత్త రిజ్ కనా, వ అజ్ హర్త అమ్ననా, వజమఅ త ఫుర్ ఖతనా. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు సల్లల్లాహు అలైహి వసల్లమ తస్లీమన్ కసీరా, అమ్మ బాద్.]

అల్హమ్దులిల్లాహ్! ఓ అల్లాహ్ నీవు మా ఉపాధి విస్తృతం చేశావు, మాకు భద్రత ప్రసాదించావు, మా మధ్య ఐక్యత కలిగించావు. నీవు తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు, ప్రవక్త అని కూడా సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక అనేక లెక్కలేనన్ని సలాతు సలామ్ మరియు శుభాలు, బర్కత్ లు పంపించు గాక.

ఈరోజు జుమా ఖుత్బా యొక్క అంశం మన ఐక్యత మరియు మన పాలకులు. మరొక రకంగా చెప్పాలంటే ఇస్లాంలో శాంతి భద్రతల విలువ మరియు ముస్లిం పాలకుల యొక్క విధేయత, ప్రాముఖ్యత మరియు ఐక్యతతో ఉండటంలోని లాభాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము.

విశ్వాసులారా! అల్లాహ్ మీపై కరుణించు గాక. మీ చావుకు ముందే అధికంగా సత్కార్యాల్లో ముందుగా ఉండండి. మీకు ఒక అర్థవంతమైన, బోధన కలిగించే సంఘటన వినిపిస్తాను. అది సహీహ్ బుఖారీలో ఉంది. వివేకవంతులైన సహాబీ, దృఢ విజ్ఞానులైన సహాబీ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి గురించి.

ఏమిటి ఆ సంఘటన? అలీ (రదియల్లాహు అన్హు) మరియు ముఆవియా (రదియల్లాహు అన్హు) మధ్య యుద్ధం జరిగిన సమయంలో ప్రజలు విభేదాల్లో పడ్డారు. అయితే వారి విభేదాలను ముగించడానికి హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) వైపు నుండి హజ్రత్ అబూ మూసా అషరీ (రదియల్లాహు అన్హు) మరియు హజ్రత్ అమీర్ ముఆవియా వైపు నుండి హజ్రత్ అమర్ ఇబ్నె ఆస్ (రదియల్లాహు అన్హు) హకమ్ – న్యాయ నిర్ణేతలుగా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో ముఆవియా (రదియల్లాహు అన్హు) ఒక ప్రసంగంలో ఇలా అన్నారు: “ఈ వ్యవహారం అంటే ఖిలాఫత్ గురించి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తన తల లేపి మాట్లాడాలి. ఎందుకంటే మేమే ఈ వ్యవహారానికి అతని కన్నా, అతని తండ్రి కన్నా ఎక్కువ అర్హులం.”

అప్పుడు ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) అన్నారు: “నేను నా దుస్తులను సరిచేసుకొని నిలబడి మాట్లాడి చెబుదాము అనుకున్నాను: “నీకంటే ఎక్కువ అర్హుడు ఇస్లాం కోసం నీతో, నీ తండ్రితో యుద్ధం చేసిన వారే’ (అంటే మీరైతే ఫతహ్ మక్కా వరకు ఇస్లాంలో ప్రవేశించలేదు, కానీ హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు అప్పటికే ముస్లిం గా ఉన్నారు మరియు ఫతహ్ మక్కా కంటే ముందు మీరు మరియు మీ తండ్రి అవిశ్వాసులుగా ఉన్నప్పుడు హజ్రత్ అలీ రదియల్లాహు అన్హు ఇస్లాం కొరకు మీతో పోరాడారు కదా)” అన్నటువంటి మాట చెబుదాము అని అనుకున్నాను. కానీ వెంటనే ఆలోచించాను. (హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అంటున్నారు), వెంటనే ఆలోచించాను: ‘నేను ఇప్పుడే మాట్లాడితే, ఈ విషయాలు చెప్పబోతే ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది. రక్తపాతం జరుగుతుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పే పదాలకు నాది మంచి ఉద్దేశం ఎంతగా ఉన్నప్పటికీ ప్రజలు దానిని నా ఉద్దేశ్య ప్రకారంగా కాకుండా వేరుగా అర్థం చేసుకోవచ్చు.’ అయితే వెంటనే జన్నతులో, స్వర్గంలో ఓపిక సహనాలకు బదులుగా ఉన్న అల్లాహ్ వాగ్దానం గుర్తు వచ్చింది. నేను ఆ మాట చెప్పలేదు.”

అప్పుడే ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కి దగ్గర ఉన్న వారిలో ఒకరు అన్నారు: “అల్లాహ్ నిన్ను రక్షించాడు. నీవు బహుదూరంగా ఈ ఫిత్నా నుండి తప్పించుకున్నావు. ఇది అల్లాహ్ దయ తర్వాత సరైన జ్ఞానం మరియు బలమైన విశ్వాసం నీ వద్ద ఉన్నందువల్ల.” ఎవరు చెప్పారు ? హజ్రత్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు) కు దగ్గరగా ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మాట చెప్పారు.

అయితే ఇక్కడ గమనించండి. మనిషి దగ్గర బలమైన విశ్వాసంతో పాటు సరైన జ్ఞానం ఉండి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో, అది కూడా అల్లాహ్ దయతో ప్రసాదించబడింది అంటే ఇది ఎంత గొప్ప వరం? సూరతుల్ ముజాదిల ఆయత్ నంబర్ 11 ద్వారా గమనించండి:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
[యర్ ఫఇల్లా హుల్లజీన ఆమనూ మిన్ కుమ్ వల్లజీన ఊతుల్ ఇల్మ దరజాత్]
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు” (58:11)

ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క గౌరవం కూడా ఈ సందర్భంలో తెలిసి వచ్చింది. ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ సంఘటన సహీహ్ బుఖారీలో ఉంది. గమనించారా! జ్ఞానం, వివేకం ఎలా శాంతి ఐక్యతకు దారి చూపుతుందో, మరియు అజ్ఞానం, మూర్ఖత్వం అశాంతి అలజడులకు దారి తీస్తుంది.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు.

ఓ విశ్వాసులారా! అల్లాహ్ మన దేశం, దేశవాసులపై చాలా గొప్ప వరం అనుగ్రహించాడు. మనం ఖుర్ఆన్ సున్నత్ మార్గదర్శకత్వంలో మన నాయకులకు విధేయులుగా మరియు ఐక్యతతో ఉన్నాము. అల్లాహ్ మనల్ని పెద్ద ఫిత్నాల సంక్షోభాల నుండి కాపాడాడు. చుట్టుపక్కల్లో చూడండి పరిస్థితి ఎలా ఉంది?

مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
[మినల్లజీన ఫర్రఖూ దీనహుమ్ వ కానూ షియఅన్, కుల్లు హిజ్బిన్ బిమా లదైహిమ్ ఫరిహూన్]
వారు తమ ధర్మాన్ని ముక్కచెక్కలు చేసేశారు. వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబరపడిపోతోంది.” (30:32)

విశ్వాసులారా! మన దేశం (అంటే సౌదీ అరేబియా) అలజడులు, విభేదాలు లేకుండా సురక్షితంగా ఉన్న ప్రాంతం. ఇది ఖుర్ఆన్ అవతరించిన భూమి కాదా? ఈమాన్ (విశ్వాస) గూడు కాదా? వీరుల జయాల ప్రదేశం మరియు విశ్వవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే దేశం కాదా? అవును తప్పకుండా. అల్లాహ్ అనుగ్రహాల్లో గొప్ప అనుగ్రహం మనం స్నేహభావం, శాంతి సంపదల మరియు ఉదార గుణాలతో జీవిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్!

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు.(28:57)

వేలాది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తుంచుకుందాం. అప్పుడు ఇబ్రాహీం (అలైహిస్సలాం) కాబా స్థలానికి వచ్చి, అది ఇంకా నిర్మించబడక ముందే ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـٰذَا بَلَدًا آمِنًا
[రబ్బిజ్ అల్ హాజా బలదన్ ఆమినా]
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి. (2:126)

ఇక్కడ గమనించండి దుఆలో ఉన్న పదాన్ని “రబ్బిజ్ అల్ హాజా ‘బలదన్’ ఆమినా” (నకిరా అంటారు). సూరతుల్ బకరాలోని ఆయత్ నంబర్ 126. ఆ తర్వాత ఆయన కాబాను నిర్మించారు. చుట్టూ ప్రజల హృదయాలు ఆకర్షితమయ్యే నగరం ఏర్పడినప్పుడు మళ్లీ ఇలా దుఆ చేశారు:

رَبِّ اجْعَلْ هَـذَا الْبَلَدَ آمِنًا
[రబ్బిజ్ అల్ హాజల్ బలద ఆమినా]
“నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి!” (14:35)

ఇక్కడ “అల్-బలద” అని వచ్చి ఉంది. పైన ఏముంది? “బలదన్”. అంటే అప్పటికి అది ప్రజలు నివసించలేదు, అప్పుడు కూడా దుఆ చేశారు. ప్రజలు అక్కడ నివసించిన తర్వాత కూడా దుఆ చేశారు. ఏమని? “నా ప్రభు ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి” (సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ 35). అంటే ఏం తెలిసింది? భద్రత, శాంతి, అమ్నో-అమాన్, పీస్ ఫుల్ లైఫ్ – ఇది నిర్మాణానికి ముందు అవసరం, నిర్మాణం తర్వాత కూడా అవసరమే.

అల్లాహు అక్బర్! ఇస్లాం ఎలా శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇస్తుందో గమనించారా!

ఇంకా గుర్తుంచుకుందాం. అరబ్ ద్వీపకల్పం దోపిడీలు, హత్యలు, లూటీలకు రంగస్థలంగా ఉన్న రోజుల్లో అల్లాహ్ మనపై చేసిన ఉపకారం గుర్తుంచుకుందాం.

وَاذْكُرُوا إِذْ أَنتُمْ قَلِيلٌ مُّسْتَضْعَفُونَ فِي الْأَرْضِ تَخَافُونَ أَن يَتَخَطَّفَكُمُ النَّاسُ فَآوَاكُمْ وَأَيَّدَكُم بِنَصْرِهِ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ لَعَلَّكُمْ تَشْكُرُونَ

ఒకప్పటి మీ పరిస్థితిని కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పట్లో మీరు అవనిలో అల్ప సంఖ్యలో ఉండేవారు. మరీ బలహీనులుగా పరిగణించబడేవారు. ప్రజలు మిమ్మల్ని మట్టుబెడతారేమోనని మీరు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితిలో అల్లాహ్‌ మీకు ఆశ్రయమిచ్చి, తన సహాయంతో మీకు బలిమిని ఇచ్చాడు. మీకు పరిశుభ్రమైన, పరిశుద్ధమైన ఆహార వస్తువులను ప్రసాదించాడు – మీరు కృతజ్ఞులై ఉండేందుకు. (8:26)

ఇప్పటి రోజుల్లో కూడా ప్రతి అంతర్జాతీయ, ప్రాంతీయ సంఘటన మన నాయకుల చుట్టూ మరియు జ్ఞానవంతుల చుట్టూ మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. భద్రత అనేది చర్చకు గురయ్యే అంశం కాదు అని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటే భద్రత పోయిన వెంటనే జీవితం తన అందాన్ని కోల్పోతుంది.

అందుకే సౌదీ అరేబియా రాజ్యం శక్తివంతంగా, గౌరవంగా నిలవాలి మరియు ప్రతి దురుద్దేశం మరియు కుతంత్రం నుంచి సురక్షితంగా ఉండాలి. ఇది మానవ సమాజం కోసం ప్రేమతో గమనించే కన్నుగా, సహాయం చేసే చేతిగా ఉండాలి.

మనం మన ప్రాంతంలో ఈ ప్రయత్నం చేయాలి. తౌహీద్, సున్నత్ కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అల్లాహుతాలా మనకు ఈ శాంతి భద్రతలు ప్రసాదిస్తాడు. సూరతుల్ నూర్ లో కూడా ఈ విషయాన్ని చూడవచ్చు. ఇక్కడికి మొదటి ఖుత్బా పూర్తయింది.

الْحَمْدُ لِلَّهِ الَّذِي هَدَانَا لِلْإِسْلَامِ وَالسُّنَّةِ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ كَانَتْ بِعْثَتُهُ خَيْرَ مِنَّةٍ، أَمَّا بَعْدُ.
[అల్హమ్దులిల్లాహిల్ లజీ హదానా లిల్ ఇస్లామి వస్సున్న, వస్సలాతు వస్సలాము అల మన్ కానత్ బిఅ సతుహు ఖైర మిన్న, అమ్మ బాద్.]

మన దేశ భద్రత మరియు అభివృద్ధిని కాపాడే విధంగా మన తరం పిల్లల్ని పెంపకం చేయడం అత్యంత ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. అలాగే అహ్లుస్ సున్నత్ యొక్క మన్హజ్ మరియు అఖీదాలోని ఒక కీలక విషయాన్ని కూడా వారికి (పిల్లలకు) నేర్పాలి. ఏమిటి అది? తమ నాయకుల మాట వినడం, వారికి విధేయత చూపడం విధిగా ఉంది అని, వారి నాయకత్వపు శపథాన్ని (బైఅతుల్ ఇమామ్) భంగపరచకుండా ఉండడం కూడా విధిగా ఉంది అని. అలాగే వారి (అంటే ముస్లిం నాయకుల) మేలు కోరుతూ అల్లాహ్ వారికి సద్భాగ్యం ప్రసాదించాలని దుఆ కూడా చేస్తూ ఉండాలి.

ఈ భావాన్ని బలపరిచే అర్థవంతమైన ఓ సంఘటన మీకు వినిపిస్తాను. ఇది కూడా ‘సహీహ్ బుఖారీ’లో ఉంది (7111 హదీథ్ నెంబర్). శ్రద్ధగా వినండి.

శాంతి భద్రతల గురించి, ముస్లిం నాయకుని పట్ల మనమందరము ఐక్యతగా ఉండడం ఎంత ముఖ్యమో ‘సహీహ్ బుఖారీ’లోని ఈ హదీథ్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారి యొక్క సంఘటన వినండి.

మదీనాలో ప్రజలు యజీద్ బిన్ ముఆవియా బైఅతును విరమించుకున్నారు. అప్పుడు తెలివైన ఉపాధ్యాయుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) వారు ఏదైతే బైఅతును విరమించుకున్నారో దాని భయంకర ప్రమాదాన్ని మరియు చాలా ప్రమాదకరమైన అఖీదా లోపాన్ని గ్రహించారు. ఆయన మొదట తన సొంత కుటుంబాన్ని హెచ్చరించడం మొదలుపెట్టారు. తన సేవకుల్ని మరియు పిల్లల్ని కూర్చోబెట్టి ఇలా అన్నారు: “మేము ఈ వ్యక్తి (అంటే యజీద్) కి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞానుసారంగా బైఅతు ఇచ్చాము. మీలో ఎవరైనా ఈ నాయకుడిని బైఅతు నుండి తొలగిపోతే లేదా ఇంకెవరికైనా బైఅతు ఇస్తే అతనితో నా సంబంధం అంతే (ఇక తెగిపోతుంది). ఇక నా పక్షాన అతనికి ఏమీ ఉండదు.” అంటే ఆయన అలాంటి వారిని బహిష్కరిస్తారు, మాట్లాడరు కూడా. ఈ విధంగా హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హెచ్చరించారు.

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) – సహీహ్ బుఖారీ వ్యాఖ్యానం రాసిన వారు – ఈ హదీస్ (7111) వ్యాఖ్యానంలో చెప్పారు: “ఈ సంఘటన సారాంశం ఏమిటంటే బైఅతు జరిగిన నాయకుడికి విధేయత చూపడం విధి. అతనిపై తిరుగుబాటు నిషిద్ధం (హరామ్). ఎంతవరకు హరామ్? ఆ నాయకుడు అన్యాయంగా వ్యవహరించినా సరే అతనికి తిరుగుబాటుగా ఉండడం ఇది న్యాయం కాదు. కేవలం అతని పాపాల కారణంగా అతని బైఅతును విరమించుకోవడం సరైన మాట కాదు” అని హాఫిజ్ ఇబ్ను హజర్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) తెలియజేశారు.

సోదర మహాశయులారా! ఓ సౌదీ అరేబియా ముస్లిములారా! (ఖతీబ్ గారు అలా అంటున్నారు కనుక తెలుగులో అలా అనువదించడం జరిగింది. మనం ప్రతి దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కి ఈ మాట చెబుతున్నాం). మన దేశంలో పాలకులు మరియు ప్రజల మధ్య ఉన్న ఐక్యత మరియు పరస్పర ప్రేమ శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం అల్లాహ్ యొక్క దయానుగ్రహం. ఆయన తాడును (అంటే ధర్మాన్ని) పట్టుకొని ఉండడమే గాక, నిలకడగా ఉన్న ఉలమా (అల్-ఉలమా ఉర్-రాసిఖూన్ – దృఢంగా నిలబడిన నాయకులు) మరియు ప్రజల శ్రేయోభిలాష మరియు వారి నిజమైన దుఆలు – వీటితో కూడి సాధ్యమైంది. ఇదే అల్లాహ్ ఆదేశం కూడా:

وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا

అల్లాహ్‌ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి – అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. .” (3:103)

 اللهم يا من حَفِظتَ بلادَنا طيلةَ هذهِ القرونِ، وكفيتَها شرَ العادياتِ الكثيراتِ المدبَّراتِ الماكراتِ،
ఓ అల్లాహ్‌! నువ్వు ఈ శతాబ్దాలంతా మా దేశాన్ని కాపాడినవాడివి, అనేక plotting చేసిన శత్రువుల చెడునుండి దాన్ని రక్షించినవాడివి,

اللهم فأدِمْ بفضلِكَ ورحمتِكَ حِفْظَها من كل سوءٍ ومكروهٍ، وأدِمْ عليها نعمةَ الإخاءِ والرخاءِ.
ఓ అల్లాహ్! నీ దయ మరియు కరుణతో మమ్మల్ని ప్రతి చెడు మరియు నష్టం నుండి ఎప్పటికీ కాపాడుతూ ఉండు, మరియు మాకు సోదరభావం, శాంతి ఆశీర్వాదాలు ప్రసాదించు.

• اللهم احفظْ دينَنا وأمنَنا، واحفَظْ أرجاءَنا وأجواءَنا، وحدودَنا وجنودَنا، واقتصادَنا وعتادَنا، واحفظْ مملكتَنا وخليجَنا، وسائرَ بلادِ المسلمينَ.
ఓ అల్లాహ్! మా దీన్‌ను, మా భద్రతను, మా దేశపు అన్ని భాగాలనూ, వాతావరణాన్ని, సరిహద్దులనూ, సైనికులనూ, ఆర్థిక వ్యవస్థనూ, సమస్త సామాగ్రిని కాపాడు, మా రాజ్యమైన సౌదీ అరేబియాను మరియు గల్ఫ్ ప్రాంతాన్నీ, మరియు ముస్లింల దేశాలన్నిటినీ కాపాడు.

 اللهم صُدَّ عنا غاراتِ أعدائِنا المخذولينَ وعصاباتِهِم المتخوِّنينَ.
ఓ అల్లాహ్! మమ్మల్ని మా ఓడిపోయిన శత్రువుల దాడుల నుండి మరియు వాళ్ల కుట్రా గుంపుల నుండి కాపాడు.

 اللهم اكفِنا شرَ طوارقِ الليلِ والنهارِ، إلا طارقًا يَطرقُ بخيرٍ يا رحمنُ.
ఓ అల్లాహ్! రాత్రి, పగలు దుష్ట శత్రువుల చెడు నుండీ మమ్మల్ని కాపాడు – కేవలం మంచి వార్తలతో వచ్చే అతిథిని రానివ్వు – ఓ రహ్మాన్!

 اللهم وانصرْ إخوانَنا بأكنافِ بيتِ المقدسِ، واهزِمْ إخوانَ القردةِ والخنازيرِ.
ఓ అల్లాహ్! బైతుల్ మక్దిస్ పరిసరాల్లో ఉన్న మా సోదరులను నీవు గెలిపించు, వారికి సహాయం అందించు. మరియు కోతులు, పందులు వంటి వారిని ఓడించు.

اللهم وفِّقْ وليَ أمرِنا ووليَ عهدِه لهُداكَ. واجعلْ عمَلَهُما في رضاكَ.
ఓ అల్లాహ్! మా నాయకుడిని మరియు ఆయన వారసుడిని నీ హిదాయత్‌ వైపు నడిపించు, వారి కార్యాలు నీ సంతోషానికి కారణమయ్యేలా చేయు.

 اللهم سدِّدهُمْ في قراراتِهِمْ ومؤتمراتِهِمْ.
ఓ అల్లాహ్! వారి నిర్ణయాలలోను, సమావేశాలలోను వారికి సరైన దారిని చూపు.

 اَللَّهُمَّ صَلِّ وَسَلِّمَ عَلَى عَبْدِكَ وَرَسُولِكَ مُحَمَّدٍ.
ఓ అల్లాహ్! నీ బానిస మరియు ప్రవక్త అయిన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) పైన శాంతి మరియు దీవెనలు వర్శించు గాక!

سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42824

శీతాకాలం ఆదేశాలు, మర్యాదలు – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

శీతాకాలం ఆదేశాలు, మర్యాదలు – జుమా ఖుత్బా
https://youtu.be/94K03YKJMVg [14 నిముషాలు]
ఖతీబ్ ( అరబీ భాష): షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ ﷾.
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.

ఈ ఖుత్బాలో, షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి శీతాకాలం యొక్క ప్రాముఖ్యత మరియు ఒక ముస్లిం జీవితంలో దాని స్థానం గురించి వివరించారు. రుతువుల మార్పు అల్లాహ్ యొక్క జ్ఞానానికి నిదర్శనమని, శీతాకాలం నరకంలోని చలిని మరియు స్వర్గంలోని అనుగ్రహాలను గుర్తు చేస్తుందని తెలిపారు. చలికాలంలో పేదలకు సహాయం చేయడం, ఉపవాసాలు ఉండటం మరియు రాత్రి నమాజులు చేయడం వంటి పుణ్యకార్యాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఇది విశ్వాసికి ఒక వసంత కాలం లాంటిదని, ఈ సమయంలో చేసే ఆరాధనలు అల్లాహ్ కు చాలా ఇష్టమైనవని వివరించారు. అలాగే చలిలో వుదూ చేయడం, అనారోగ్యం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండటం మరియు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తుచేసుకోవడం వంటి విషయాలను కూడా ప్రస్తావించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

పదిహేనవ డిసెంబర్ 2023, జుమా రోజున ఫదీలతుష్ షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవి హఫిదహుల్లాహ్ ఇచ్చినటువంటి జుమా ఖుత్బా అనువాదం, “అష్షితా అహ్ కామ్ వ ఆదాబ్” – శీతాకాలం ఆదేశాలు మరియు మర్యాదలు. దీనినే మనం మరింత వివరంగా అర్థం కావడానికి “కాలాల మార్పులో గుణపాఠాలు” మరియు “శీతాకాలం విశ్వాసికి వసంతం” అన్నటువంటి పేర్లతో మీ ముందు తీసుకురావడం జరిగింది.

ఓ ముస్లింలారా! అల్లాహ్‌ జ్ఞానంలోని సూచనల్లో ఒకటి ఋతువులను వైవిధ్యపరచడం: చలి మరియు వేడి, కరువు మరియు వర్షం, పొడవైన రోజులు మరియు చిన్న రాత్రులు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ఆదేశించాడు సూరతున్ నూర్, సూర నెంబర్ 24, ఆయత్ నెంబర్ 44 లో:

يُقَلِّبُ اللَّهُ اللَّيْلَ وَالنَّهَارَ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
(యుఖల్లిబుల్లాహుల్ లైల వన్నహార్, ఇన్న ఫీ జాలిక ల ఇబ్రతల్ లి ఉలిల్ అబ్సార్)
అల్లాహ్‌ రేయింబవళ్ళను మారుస్తూ ఉంటాడు. కళ్లున్న వారికి ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. (నూర్ 24:44).

అలాగే సూరతుల్ ఫుర్ఖాన్, సూర నెంబర్ 25, ఆయత్ నెంబర్ 61, 62 లో తెలిపాడు:

تَبَارَكَ الَّذِي جَعَلَ فِي السَّمَاءِ بُرُوجًا وَجَعَلَ فِيهَا سِرَاجًا وَقَمَرًا مُّنِيرًا * وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِّمَنْ أَرَادَ أَن يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا

ఆకాశంలో బురుజులను నిర్మించి, అందులో ప్రజ్వలమైన దీపాన్ని, కాంతిమంతమైన చంద్రుణ్ణి ఆవిష్కరించినవాడు శుభకరుడు. ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది. (ఫుర్ఖాన్ 25:61,62)

ఇప్పుడు ఈ శీతాకాలం తన చలితో మన ముందుకు వచ్చింది. ఇది అల్లాహ్‌ యొక్క స్పష్టమైన సూచనల్లో ఒకటి, ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఇంకా ఏమి గుర్తు చేస్తుంది!?

బుఖారీ 3260 మరియు ముస్లిం 617లో ఉంది: హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ప్రవక్త ﷺ ఇలా అన్నారు:

»اشْتَكَتِ النَّارُ إِلَى رَبِّهَا فَقَالَتْ: رَبِّ أَكَلَ بَعْضِي بَعْضًا، فَأَذِنَ لَهَا بِنَفَسَيْنِ: نَفَسٍ فِي الشِّتَاءِ وَنَفَسٍ فِي الصَّيْفِ، فَأَشَدُّ مَا تَجِدُونَ مِنَ الحَرِّ، وَأَشَدُّ مَا تَجِدُونَ مِنَ الزَّمْهَرِيرِ«

“నరకం తన ప్రభువుతో ఫిర్యాదు చేసింది: ‘ఓ ప్రభూ! నా కొంత భాగం మరొక భాగాన్ని తినేస్తోంది.’ అప్పుడు అల్లాహ్‌ దానికి రెండు శ్వాసల గురించి అనుమతించాడు: ఒకటి శీతాకాలంలో, మరొకటి వేసవిలో. అందువల్ల మీరు అనుభవించే అత్యంత వేడి దాని తీవ్రమైన వేడిలోనిది, మరియు మీరు అనుభవించే అత్యంత చలి దాని ‘జమ్ హరీర్’ లోనిది.”

జమ్ హరీర్ – నరకంలోని అత్యంత చలి ఉండే ప్రదేశం. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు వస్తున్నాయి, శ్రద్ధగా వింటూ ఉండండి.

అల్లాహ్‌ ఇలా తెలిపాడు:

مُتَّكِئِينَ فِيهَا عَلَى الْأَرَائِكِ لَا يَرَوْنَ فِيهَا شَمْسًا وَلَا زَمْهَرِيرًا
(ముత్తకి’ఈన ఫీహా అలల్ అరాయికి లా యరౌన ఫీహా షమ్సన్ వలా జమ్ హరీరా)
వారక్కడ దిండ్లకు ఆనుకొని పీఠాలపై కూర్చుని ఉంటారు. అక్కడ వారు సూర్య తాపాన్ని గానీ, చలి తీవ్రతను గానీ చూడరు“. (ఇన్సాన్ 76:13).

చూశారా? సూరతుల్ ఇన్సాన్ సూర నెంబర్ 76 లోని ఈ 13 వ ఆయత్ లో “వలా జమ్ హరీరా” అని ఏదైతే ఉందో, చలి తీవ్రతను కూడా చూడరు అన్నటువంటి అనువాదం ఇక్కడ చేయడం జరిగింది. 

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఇలా వ్యాఖ్యానించారు: “అంటే వారికి బాధాకరమైన వేడి కూడా లేదు, బాధాకరమైన చలి కూడా లేదు. ఇది శాశ్వతమైన సుఖమే.”

అల్లాహ్‌ ఇలా చెప్పాడు:

هَذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
(హాజా ఫల్ యజూఖూహు హమీమున్ వ గస్సాఖ్)
ఇదీ (వారి గతి)! దాన్ని వారు రుచి చూడాలి. మరిగే నీళ్లు, చీము నెత్తురు. (సాద్ 38:57).

لَايَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا • إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
(లా యజూఖూన ఫీహా బరదన్ వలా షరాబా, ఇల్లా హమీమన్ వ గస్సాఖా)
వారందులో ఎలాంటి చల్లదనాన్నిగానీ, త్రాగటానికి ఏ పానీయాన్నిగానీ, రుచిచూడరు. మరిగే నీరు, (కారే) చీము తప్ప. (నబా 78:25)

ఇవి నరకంలో ఉన్న వారు ఎదుర్కొనే రెండు కఠిన శిక్షలు. తీవ్ర వేడి అంటే ఇక్కడ వేడి వేడి నీరు హమీమన్, మరియు గస్సాఖ్ అని ఏదైతే చెప్పడం జరిగిందో, తీవ్ర చలి అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది.

ఇళ్ల ఆశ్రయం, దుస్తులు, హీటర్లు, వెచ్చదనం ఇవన్నీ అల్లాహ్‌ దయ, అనుగ్రహాలు. అల్లాహ్‌ ఇలా తెలిపాడు:

وَاللَّهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا
(వల్లాహు జ’అల లకుమ్ మిన్ బుయూతికుమ్ సకనా)
అల్లాహ్‌ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. (16:80)

وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ
(వ జ’అల లకుమ్ సరాబీల తఖీకుముల్ హర్ర వ సరాబీల తఖీకుమ్ బ’సకుమ్)
ఇంకా ఆయనే మీకోసం, మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షణ కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. (నహ్ల్ 16:81)

మరియు పశువుల గురించి ఇలా తెలిపాడు:

وَلَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ
(వలకుమ్ ఫీహా దిఫ్’ఉన్ వ మనాఫి’ఉ)
వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. (నహ్ల్ 16:05).

అంటే వాటి ఉన్ని, వెంట్రుకలు, బొచ్చుతో మనం దుస్తులు, దుప్పట్లు తయారు చేస్తాము.

మన ఇళ్లల్లో హీటర్లు, దుప్పట్లు, వేడి దుస్తులు అదనంగా, అవసరానికి మించి ఉంటే మన చుట్టూ కొన్ని కుటుంబాలు తీవ్ర చలిలో వణుకుతున్నాయి. ఇది విశ్వాసుల బాధ్యత: పేదలను గమనించడం, సహాయం చేయడం.

ప్రవక్త ﷺ చెప్పారు:

»مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ، وَتَرَاحُمِهِمْ، وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى «
విశ్వాసులు పరస్పరం అభిమానించుకోవటంలో మరియు ప్రేమావాత్సల్యాలతో మెలగటంలో ఒక అవయవానికి బాధకలిగినప్పుడు మొత్తం దేహమంతా బాధతో, జబ్బుతో మూలుగుతుంది. (ముస్లిం 2586).

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హువారి నసీహత్ గుర్తు చేస్తుంది

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజలకు ఇలా వ్రాసేవారు: “చలి శత్రువు లాంటిది. చలికి సిద్ధంగా ఉండండి. ఉన్నితో, సాక్స్‌లతో, దుప్పట్లతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే వేడిగా ఉంచుకోండి. ఎందుకంటే చలి శరీరంలో త్వరగా ప్రవేశిస్తుంది, నెమ్మదిగా వెళ్తుంది.”

ప్రవక్త ﷺ అన్నారు:

«الغَنِيمَةُ البَارِدَةُ الصَّوْمُ فِي الشِّتَاءِ»
(అల్ గనీమతుల్ బారిదతు అస్సౌము ఫిష్షితా)
శీతకాలంలో ఉపవాసాలు కష్టం లేని యుద్ధ ఫలం లాంటిది. (తిర్మిజి 797. షేఖ్ అల్బానీ సహీ అన్నారు).

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు చెప్పారు:

الشتاء غنيمةُ العابدينَ
“అష్షితా ఉ గనీమతుల్ ఆబిదీన్” 
శీతాకాలం ఆరాధకులకు గొప్ప అదృష్ట సమయం.

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు చెప్పారు:

مرحبًا بالشتاء تنزل فيه البركة، ويطول فيه الليل للقيام، ويقصر فيه النهار للصيام”
“మర్ హబమ్ బిష్షితా ఇ తన్జిలు ఫీహిల్ బరక, వ యతూలు ఫీహిల్ లైలు లిల్ ఖియామ్, వ యఖ్ సురు ఫీహిన్ నహారు లిస్సియామ్” 
“శీతాకాలానికి స్వాగతం, అందులో బర్కత్ (శుభం) దిగుతుంది, తహజ్జుద్ కొరకు రాత్రి పొడుగ్గా ఉంటుంది, ఉపవాసం కొరకు పగలు చిన్నగా ఉంటుంది.”

ముఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు మరణ సమయంలో ఏడుస్తూ చెప్పారు:

إنما أبكي على ظمأ الهواجر، وقيام ليل الشتاء، ومزاحمة العلماء بالركب عند حِلَق الذكر.
“ఇన్నమా అబ్కీ అలా దమఇల్ హవాజిర్ వ ఖియామి లైలిష్ షితా వ ముజాహమతిల్ ఉలమా ఇ బిర్రుకబి ఇంద హిలఖిద్ దిక్ర్” 
“నేను మూడు వాటికోసమే ఏడుస్తున్నాను: వేసవి ఉపవాసంలోని దాహం, శీతాకాల రాత్రి ప్రార్థనలు, పండితులతో (నేర్చుకొనుటకు) కూర్చోవడం.”

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో అడిగారు: 

»ألا أدلُّكم على ما يمحو الله به الخطايا ويرفعُ به الدرجاتِ؟» قالوا: بلى يا رسول الله.قال: «إسباغُ الوضوءِ على المكارهِ«

అల్లాహు తఆలా ఏ కారణంగా మీ పాపాలను తుడిచివేసి మీ స్థానాలను పెంచుతాడో తెలుపనా?” తప్పక తెలుపండి ప్రవక్తా! అని సహాబాలు అన్నారు. అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు: “అనుకూల సమయసందర్భం కాకపోయినా సంపూర్ణంగా వుజూ చేయడం

తీవ్రమైన చలిలో వుజూ పూర్తి చేయడం పుణ్యం పెంచుతుంది, అయితే అవసరమైతే నీటిని వేడి చేయడం అనుమతే. చలి తీవ్రమై వుజూ చేయలేకపోతే తయ్యమ్ముమ్ కూడా అనుమతి ఉంది.

ఉమ్ము సాయిబ్ రజియల్లాహు అన్హాకు తీవ్రమైన జ్వరం వచ్చి బాధపడుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను పరామర్శించి, ఇంతగా వణుకుతున్నావు ఏమిటి అని అడిగారు.

అందుకు ఆమె:

لَا بَارَكَ اللهُ فِيهَا
“లా బారకల్లాహు ఫీహా” 
‘అల్లాహ్ ఈ జ్వరంలో వృద్ధి కలుగుజేయకూడదు’ అని పలికింది.

అప్పుడు ప్రవక్త ﷺ చెప్పారు:

»لَا تَسُبِّي الْحُمَّى، فَإِنَّهَا تُذْهِبُ خَطَايَا بَنِي آدَمَ كَمَا يُذْهِبُ الْكِيرُ خَبَثَ الْحَدِيدِ«
(లా తసుబ్బిల్ హుమ్మా, ఫఇన్నహా తుజ్హిబు ఖతాయా బనీ ఆదమ, కమా యుజ్హిబుల్ కీరు ఖబసల్ హదీద్)
నీవు జ్వరాన్ని తిట్టకు (దూషించకు), ఎందుకంటే బట్టి ఇనుము తుప్పు (జంగు)ను దూరం చేసినట్లు ఈ జ్వరం ఆతం సంతతి పాపాలను దూరం చేస్తుంది. (ముస్లిం 2575).

ఓ అల్లాహ్‌ దాసులారా! అల్లాహ్‌కు భయపడండి — బహిర్గతంగా గానీ, అంతరంగంలో గానీ. అల్లాహ్‌ సూర బఖర 2:216లో ఇలా తెలిపాడు:

وَعَسَى أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ … وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
వ ‘అసా అన్ తక్రహూ షై’అన్ వహువ ఖైరుల్ లకుమ్ వల్లాహు య’అలము వ అన్తుమ్ లా త’అలమూన్. )
మీరు దేన్ని ఇష్టపడటం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. … నిజ జ్ఞానం అల్లాహ్‌కు మాత్రమే ఉంది. మీకు ఆ విషయం తెలియదు.

అల్లాహ్‌ ఈ శీతాకాలాన్ని మనపై మరియు సమస్త ముస్లింలపై కరుణ, శాంతి, రక్షణతో నింపుగాక. మన సోదర సోదరీమణుల అవసరాలను తీర్చేలా మనందరిని ప్రేరేపించుగాక. ఆమీన్.

వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42485