మహా సంపన్నుడు ఖారూన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

(పూర్వకాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ సంపద’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో వాడేవారు.)

فَخَسَفْنَا بِهِ وَبِدَارِهِ الْأَرْضَ فَمَا كَانَ لَهُ مِن فِئَةٍ يَنصُرُونَهُ مِن دُونِ اللَّهِ وَمَا كَانَ مِنَ الْمُنتَصِرِينَ

“చివరికి మేము ఖారూన్ ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్ బారి నుంచి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు.” ( సూరా అల్ ఖసస్ 28: 81)

ఖారూన్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వంశానికి చెందినవాడు. చాలా సంపన్నుడు. ఒక మహా ప్రాసాదంలో భోగభాగ్యాలతో జీవించేవాడు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించేవాడు. అసంఖ్యాక బానిసలు ఎల్లప్పుడూ అతని సేవకు సిద్ధంగా ఉండేవారు. అన్ని రకాల సుఖవిలాసాలతో ఆడంబరంగా జీవితం గడిపేవాడు. అపారమైన ధన సంపత్తులు అతనిలో గర్వాన్ని పెంచాయి. అహంకారంతో విర్రవీగేవాడు.

ఖారూన్ బీదలను చూసి అసహ్యించుకునేవాడు. తెలివితేటలు లేకపోవడం వల్లనే వారు బీదరికంలో మగ్గుతున్నారని ఈసడించుకునేవాడు. తన తెలివితేటలు, వ్యాపార నైపుణ్యం వల్లనే తనకు అపార సంపద లభించిం దాని మిడిసిపడేవాడు.

జకాత్* చెల్లించవలసిందిగా ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి చెప్పారు. జకాత్ అన్నది బీదలకు ఒక హక్కుగా సంపన్నులు చెల్లించవలసిన నిర్ధారిత వాటా. విశ్వాసులందరూ తప్పనిసరిగా జకాత్ చెల్లించాలని అల్లాహ్ ఆదేశించాడు. కాని ఈ సలహా విన్న ఖారూన్ కోపంతో మండిపడ్డాడు. తనపై అల్లాహ్ అనుగ్రహం వర్షిస్తుందని, తన ధన సంపదలే అందుకు నిదర్శనమని ప్రవక్త మూసా (అలైహిస్సలాం)తో చెప్పాడు. తన జీవిత విధానాన్నిఆమోదించినందు వల్లనే అల్లాహ్ తన సంపదను అనునిత్యం పెంచుతున్నాడని వాదించాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అతడికి నచ్చ జెప్పారు. దుర్మార్గపు ఆలోచనల పరిణామాలు నష్టదాయకంగా ఉంటాయని హెచ్చరించారు.

చివరకు ఖారూన్ తన సంపదపై జకాత్ లెక్కించాడు. జకాత్ను లెక్కిస్తే తాను చెల్లించవలసిన మొత్తం అతడికి చాలా ఎక్కువగా కనబడింది. అంత మొత్తం చెల్లించాలంటే ప్రాణాలు పోయినట్లనిపించింది. జకాత్ చెల్లించేది లేదని తిరస్కరించడమే కాదు, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తన స్వార్థప్రయోజనాల కోసం జకాత్ చట్టం తీసుకొచ్చారని ప్రచారం మొదలుపెట్టాడు. ప్రవక్త మూసా (అస)కు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టడానికి కొంతమందికి లంచాలు కూడా ఇచ్చాడు. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) గురించి నానావిధాల పుకార్లు వ్యాపించేలా చేశాడు.

ఖారూన్ కుట్రల గురించి అల్లాహ్, ప్రవక్త మూసా (అలైహిస్సలాం)ను హెచ్చరించాడు. ఖారూన్ పిసినారితనానికి, అల్లాహ్ చట్టాల పట్ల అతని తిరస్కారానికిగాను అతడిని శిక్షించాలని ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ ను ప్రార్దించారు. అల్లాహ్ ఆగ్రహం ఖారూన్ పై విరుచుకుపడింది. భూమి ఒక్కసారిగా పగులుబారి ఖారూన్ సహా అతడి భవనాన్ని, యావత్తు సంపదను తనలో కలిపేసుకుంది. ఖారూన్ అనేవాడు ఒకప్పుడు ఉండేవాడన్న చిహ్నాలు కూడా లేకుండా అతడు తుడిచిపెట్టుకు పోయాడు. ఖారూన్ సంఘటన మూసా (అలైహిస్సలాం) జాతి ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలి పోయింది.

ఈ విషయమై దివ్య ఖుర్ఆన్లో ఇంకా ఏముందంటే, ఖారూన్ సంపదను చూసి ఈర్ష్యపడిన వారు, అప్పటి వరకు ఖారూనను కీర్తించడమే ఘనకార్యంగా భావించిన వారు ఈ సంఘటన తర్వాత, “అల్లాహ్ ఎవరికి తలచుకుంటే వారికి సంపద ఇస్తాడు. ఎవరికి తలచుకుంటే వారికి నిరాకరిస్తాడు. మనపై అల్లాహ్ అనుగ్రహం లేనట్లయితే మనల్ని కూడా భూమి మ్రింగేసి ఉండేది. అల్లాహ్ ను తిరస్కరించేవారు పురోభివృద్ధి సాధించలేరు. ఈ ప్రపంచంలో ఔన్నత్యాన్ని కోరుకోని వారికి, దుర్మార్గానికి పాల్పడని వారికి మాత్రమే పరలోక స్వర్గవనాలు లభిస్తాయి” అనడం ప్రారంభించారు.

ఖారూన్ వంటి వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది నడమంత్రపు సిరి పొంది తమ పాత రోజులను, అప్పటి కష్టాలను మరచి పోతారు. తాము కష్టపడి, శ్రమించి తమ తెలివితేటలతో సంపాదించిందే అంతా అనుకుంటారు. అందులో అల్లాహ్ కారుణ్యం లేదని భావిస్తారు. అల్లాహ్ పట్ల ఏలాంటి కృతజ్ఞత చూపించరు. అల్లాహ్ ఆదేశాలను విస్మరిస్తారు. బీదసాదలకు ఏలాంటి సహాయం అందించడం వారికి ఇష్టం ఉండదు. పైగా తమ సంపదను పెద్ద భవనాలు కట్టడం ద్వారా సంపన్నులకు గొప్ప విందులు ఇవ్వడం ద్వారా, అనవసరమైన ఆడంబరాల ద్వారా, ఖరీదైన దుస్తులు, వాహనాల ద్వారా ప్రదర్శిస్తూ విర్రవీగు తుంటారు. మరికొందరు ఇందుకు విరుద్ధంగా అత్యంత పిసినారులుగా మారిపోతారు. పిల్లికి బిచ్చమెత్తని ధోరణి ప్రదర్శిస్తారు. స్వంతం కోసం, తమ కుటుంబం కోసం ఖర్చుపెట్టడానికి కూడా వెనుకాడుతారు. సంపద పోగుచేయడంలోనే మునిగిపోతారు. కాని ఇలాంటి వారు తాము ఈ ప్రపంచంలో కేవలం కొంత సమయం గడిపి వెళ్ళడానికి వచ్చామన్న వాస్తవాన్ని మరచిపోతుంటారు.

అల్లాహ్ నిర్దేశించిన వాటాను బీదలకు చెల్లించడం ద్వారా మనిషి తన సంపదను పరిశుద్ధం చేసుకుంటాడు. లేనట్లయితే సంపద కలుషితమై పోతుంది. సంపద ఒక శాపంగా మారిపోతుంది. తన మార్గంలో ఖర్చు చేసిన సంపదను అనేక రెట్లు పెంచి ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. దాన ధర్మాలకు ఖర్చు చేసినది తనకు ఇచ్చిన ఉత్తమమైన రుణంగా అల్లాహ్ అభివర్ణిస్తున్నాడు. అల్లాహ్ కు రుణం ఇచ్చి ఆయన నుంచి తిరిగి పొందడం అన్నది మనిషికి ఎంత గౌరవప్రదం! ఎంత శుభప్రదం!!

అల్లాహ్ మనిషికి ధనసంపదలను ఒక పరీక్షగా అప్పగిస్తాడు (అమానత్-అంటే ఏదన్నా వస్తువును జాగ్రత్తగా ఉంచమని ఎవరికైనా అప్పగించడం), ధనసంపదలు కూడా అల్లాహ్ మనిషికి అప్పగించిన అమానత్ (అప్పగింత). తాను ఇచ్చిన ధనసంపదలతో ఎవరు ఏం చేస్తారన్నది చూడడానికి అల్లాహ్ వాటిని ప్రసాదిస్తాడు.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

మహావివేకి లుక్మాన్ – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

మంచికైనా చెడుకైనా మనిషి నాలుక, హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్

లుక్మాన్ (అలైహిస్సలాం) ఆఫ్రికా ఖండంలో జన్మించారు. ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు. అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు. కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో వన్య మృగాలతో పాటు ఉండేవారు. అడవిలో జీవితం, రోజూ అడవి మృగాలతో తల పడడం – ఈ విధంగా ఆయన కఠిన మైన జీవితాన్ని గడిపేవారు. భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరిం చుకున్నారు. తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు. ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయా లను ఆయన తెలుసుకున్నారు.

ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు. ఆయన్ను ఒక బానిసగా అమ్మివేశారు. తన స్వేచ్ఛా స్వాతంత్రయాలు  కోల్పోయా రాయన. స్వేచ్ఛగా తిరగడానికి లేదు, మాట్లాడడానికి లేదు. జీవితంలో ఎదు రైన ఈ కష్టాన్ని ఆయన భరించారు, సహనం వహించారు. అల్లాహ్ అనుగ్రహం కోసం ఎదురుచూడసాగారు. 

ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి. తెలివి, వివేకం కలిగినవాడు. అతను లుక్మాన్ను దయగా చూసేవాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు.

లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒక రోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలు తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) ఒక గొర్రెను కోసి దాని గుండె, నాలుకలను తీసుకుని యజమాని వద్దకు వెళ్ళారు. లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరు నవ్వు నవ్వాడు. శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె, నాలుకలను తీసుకు వచ్చిన ఎన్నిక ఆయనకు నచ్చింది. లుక్మాన్ (అలైహిస్సలాం) చాలా లోతయిన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్ధం చేసుకున్నాడు. అప్పటి నుంచి యజమాని లుక్మాన్ (అలైహిస్సలాం) పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు. ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు.

కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు. లుక్మాన్ యజమాని చెప్పినట్టు చేశారు. కాని విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె, నాలుకలే తీసుకువచ్చారు. యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు, మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు. లుక్మాన్ (అలైహిస్సలాం) యజమానికి సమాధానమిస్తూ, “మనిషి మంచివాడైతే అతని గుండె, నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు, మనిషి చెడ్డవాడైతే అతని గుండె, నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు” అన్నారు. ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాదరాలు చూపడం ప్రారంభించాడు. చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు. ఆయన వివేక విచక్షణలు, తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారు మోగిపోసాగాయి.

యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తన మరణానంతరం లుక్మాన్ (అలైహిస్సలాం)కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు. యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ (అలైహిస్సలాం)కు స్వాతంత్ర్యం లభించింది. ఆయన (అలైహిస్సలాం) అక్కడి నుంచి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయీల్ వద్ద స్థిరపడ్డారు. దావూద్ (అలైహిస్సలాం) పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. మహావివేకంతో, విచక్షణతో, నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి. అక్కడే ఆయన పెళ్ళి చేసుకుని సంసార జీవితాన్ని గడిపారు.

లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ దివ్యఖుర్ఆన్ ఇలా ప్రస్తావించబడింది:

31:13 وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”

31:14 وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.

31:15 وَإِن جَاهَدَاكَ عَلَىٰ أَن تُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۖ وَصَاحِبْهُمَا فِي الدُّنْيَا مَعْرُوفًا ۖ وَاتَّبِعْ سَبِيلَ مَنْ أَنَابَ إِلَيَّ ۚ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ

ఒకవేళ నీకు తెలియని వారినెవరినైనా నాకు భాగస్వాములుగా నిలబెట్టమని వారిద్దరూ నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు నువ్వు వారి మాట వినకు. ప్రపంచంలో మాత్రం వారి యెడల ఉత్తమరీతిలో మసలుకో. అయితే (మార్గానుసరణ విషయంలో మాత్రం) నా వైపు మరలి ఉన్న వానినే ఆదర్శంగా తీసుకో. ఆ తరువాత మీరంతా నా వైపుకే మరలి రావలసి ఉంటుంది. అప్పుడు నేను మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ తెలియపరుస్తాను.”

31:16 يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు.

31:17 يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ ۖ إِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ

“ఓ (ప్రియమైన) కుమారా! నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు. సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు. చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు. ఏ ఆపద వచ్చిపడినా సహనం పాటించు. నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు.

31:18 وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا ۖ إِنَّ اللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخْتَالٍ فَخُورٍ

“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు.

31:19 وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.”

(దివ్యఖుర్ఆన్ 31 : 13-19)

మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం, నాలుకల వల్ల తెలుస్తుంది. ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లో ఉంది.

మంచి యజమాని తన వద్ద ఉన్న వివేకవంతులైన నౌకర్లను గౌరవించాలి.

లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లాహ్ దివ్యఖుర్ఆన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు. ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది.

ఖురాన్ కథామాలిక – మూలం: షేఖ్ అబూబకర్ నజార్
Qur’an Katha Maalika – Selected Stories from Qur’an (Telugu)
తెలుగు అనువాదం: అబ్దుల్ వాహెద్ & హాఫిజ్ ఎస్. ఎమ్. రసూల్ షర్ఫీ
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్,హైదరాబాద్
https://teluguislam.net/2022/11/12/stories-from-the-quran/

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]

ఇస్లాం మెచ్చిన మహిళలు [పుస్తకం]
సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్,  హైదరాబాద్ -500059.

సంకలనం: మౌలానా ముహమ్మద్ తఖీయుద్దీన్(రహిమహుల్లాహ్)
అనువాదం: ఇఖ్బాల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్, హైదరాబాద్ -500059.

[ఇక్కడ పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [80 పేజీలు]

ఈదుల్ అద్ హా (బక్రీద్) పండుగ – తెలుసుకోవలసిన విషయాలు  – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా టెక్స్ట్]

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

ఖుత్బా అంశము: ఈదుల్ అద్హా (బక్రీద్)పండుగ –తెలుసుకోవలసిన విషయాలు                  

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.    

ఓ ముస్లిం లారా! ఒక గొప్ప దినము మనపై రాబోతున్నది. నిశ్చయంగా అది శుభకరమైనటువంటి ఖుర్బాని దినము. ఇది ఇస్లాం యొక్క గొప్ప విధి నెరవేర్చిన అనంతరం వస్తుంది. అనగా హజ్ తర్వాత వచ్చే పండుగ. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఈ విధంగా తెలియజేశారు: “అల్లాహ్ తఆలా దగ్గర అత్యంత ఘనత కలిగినటువంటి దినము – ఖుర్బానీ  (నహ్ర్) దినము“. అనగా; జిల్ హిజ్జా మాసం యొక్క పదవరోజు. ఆ తరువాత يَوْمُ الْقَرَّ “ఖర్ర్ దినము” (స్థిరపడి ఉండే రోజు) అనగా; జిల్ హిజ్జ మాసం యొక్క పదకొండవ  రోజు. ఈ రోజున హజ్ చేసే వారందరూ మినా ప్రదేశంలో ఆగుతారు.

1. ఈ ఖుర్బానీ పండుగ రోజుకు ఇతర దినాలపై ప్రాధాన్యతను ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే; హజ్ కు సంబంధించినటువంటి ఎక్కువ ఆచరణలు ఇదే రోజున పాటించబడతాయి, ఉదాహరణకు; హజ్ చేసేవారు ఆ రోజు జమ్రా ఉఖ్బా (పెద్దదాని)పై రాళ్లు కొట్టాలి, ఖుర్బానీ ఇవ్వాలి, శిరోముండన చేయాలి, తవాఫె ఇఫాదా చేయాలి, సయీ చేయాలి. మరియు హజ్ చేయనటువంటి వారు ఆ రోజున ఖుర్బానీ జంతువు బలి ఇస్తారు. ఈ ఆచరణలన్నీ అదే రోజు చేయబడతాయి. ఈ విధముగా ఆచరణలు అన్నీ ఏకం అయ్యే మరొక రోజు లేదు అందుకే ఆ రోజుకి ఇంత ప్రాధాన్యత లభించింది.

2. ఇస్లామీయ పండుగలకు వేరే ఇతర పండుగలపై ఇంత ప్రాధాన్యత లభించడానికి గల కారణం ఏమిటంటే; ఈ పండుగలు ఎంతో వివేకాన్ని మరియు గొప్ప లక్ష్యాలను తీసుకుని వస్తాయి. అందులో నుండి ముఖ్యంగా అల్లాహ్ యొక్క ఆచారాలను గౌరవించడం, మరియు విశ్వాసులకు సంతోషాన్ని కలుగ చేయడం. ఇస్లాం యొక్క అనుయాయులు ఈ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విధి విధానాలు, సౌలభ్యాలు గురించి ప్రజలకు తెలియపరచాలి.

అరఫా దినము (తొమ్మిదవ జిల్ హిజ్జా), ఖుర్బానీ దినం (పదవ జిల్ హిజ్జా), ఆ తరువాత “తష్ రీఖ్” దినాలు ఇస్లామియా పండుగ దినములు తిని త్రాగేటువంటి దినాలు (అబూ దావూద్)

3. ఓ విశ్వాసులారా! ఆ రోజు ఒక విశ్వాసి అల్లాహ్‌ యొక్క సామీప్యం పొందాలంటే దాని కొరకు అల్లాహ్ మార్గంలో ఖుర్బానీ ఇవ్వాలి. ఇది అల్లాహ్ యొక్క “ఖలీల్” స్నేహితులైనటువంటి ఇబ్రహీం మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సున్నత్ విధానము.

4. ఖుర్బానీ చేయడానికి కొన్ని మర్యాదలు మరికొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణకు; జంతువుని ఖిబ్లా వైపు తిప్పి జుబహ్ చేయాలి, మరియు దానిపై అల్లాహ్ నామాన్ని పఠించాలి. ఈ విధంగా అనాలి:

اللهم هذا منك ولك، اللهم هذا عني وعن أهل بيتي، اللهم تقبل مني
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్నీ వ అన్ అహ్ల్ బైతీ, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్నీ
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు. ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము. ఓ అల్లాహ్! నా వైపు నుండి మరియు నా కుటుంబం వైపు నుండి దీనిని స్వీకరించు)

5. ఖుర్బానీ ఇచ్చే వారు స్తోమత ఉంటే స్వయంగా జంతువుని జుబహ్ చేయాలి. దాని విధానం – నిర్ణీత స్థలం అంటే గొంతును కోయాలి;  రక్తం వేగంగా ప్రవహించే రెండు రక్త నరాలు కోయాలి, ఇంకా శ్వాస నాళం మరియు ఆహారనాళం కోయాలి.

6. ఎవరైనా తన ఖుర్బానీ జంతువును వధించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగిస్తే, దానిని వధించే వ్యక్తి అతని తరపున ఈ దువాను పఠించాలి: 

اللهم هذا منك ولك، اللهم هذا عن فلان ، اللهم تقبل منه
అల్లాహుమ్మ హాజా మిన్ క వలక్, అల్లాహుమ్మ హాజా అన్ ఫులాన్, అల్లాహుమ్మ తఖబ్బల్ మిన్ హు
(ఓ అల్లాహ్! ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, ఇది నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాము, ఓ అల్లాహ్!  ఇది ఫలానా (పేరు పలకాలి) వ్యక్తి తరుపు నుండి దీనిని స్వీకరించు).

7. కత్తిని లేక చాకుని ఖుర్బానీ జంతువు నుండి దాచి ఉంచాలి. దాని ముందు పదును పెట్టరాదు, మరియు ఇతర జంతువుల ముందు దానిని జబహ్ చేయరాదు. ఇందులో మనం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సూక్తిని అనుసరించాలి: అల్లాహ్ తఆలా ప్రతి దానిపట్ల ఉన్నతంగా వ్యవహరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు దేనినైనా వధించ వలసి వచ్చినప్పుడు దానిని ఉన్నతంగా వధించండి మరియు తమ ఆయుధానికి బాగా పొద్దున పెట్టండి .ఎందుకంటే వధించబడే జంతువును బాధించరాదు. (ముస్లిం)

8. ఖుర్బానీ ఇచ్చేటువంటి సమయం నాలుగు రోజుల వరకు ఉంటుంది. పండుగ రోజు ఆ తర్వాత మూడు “తష్ రీఖ్” దినాలు. ఇందులో మొదటి రోజు ఖుర్బానీ ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే ఇది జిల్ హిజ్జా మాసం యొక్క మొదటి పది రోజులలో ఉంది.

9. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు కొమ్ములు తిరిగిన తెల్లని రెండు పొట్టేళ్లను ఖుర్బానీగా ఇచ్చారు. మరియు ఎలాంటి జంతువుని ఖుర్బాని చేయకూడదో అది కూడా తెలియజేశారు. ఒంటి కన్ను కలిగిన దానిని ,రోగం ఉన్నట్లు స్పష్టంగా ఉన్న దానిని, కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది.(అహ్మద్)

10. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పండగ రోజున ఖుర్బానీ మాంసం తోనే భోజనాన్ని ప్రారంభించే వారు.

11. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కాలంలో ప్రజలు ఖుర్బానీ ఇవ్వడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు, మరియు ఉన్నవాటిలో అన్నింటికంటే మంచి జీవాలను కొనుగోలు చేసేవారు, ఎందుకంటే ఎంత దృఢంగా ఆరోగ్యంగా ఉంటే అది అల్లాహ్ వద్ద అంతే ప్రియమైనదిగా పరిగణించబడుతుంది, మరియు దాని ద్వారా ఖుర్బానీ చేసే వ్యక్తికి కూడా అంతే ప్రతిఫలం లభిస్తుంది. ఇమామ్ ఇబ్నే తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేశారు: “సాదారణంగా ఖుర్బానీ యొక్క పుణ్యఫలం దాని ఖరీదును బట్టి ఉంటుంది”. (అల్ ఫతావా)

12. అల్లాహ్ దాసులారా! ఖుర్బాని జీవం పై ఖర్చు పెట్టడంలో ఎలాంటి పరిమితి లేదు. దాని మాంసం తినవచ్చు, ప్రయాణంలో తీసుకు వెళ్లొచ్చు ,మరియు పేదలలో పంచి పెట్టవచ్చు. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:

 فَكُلُوا مِنْهَا وَأَطْعِمُوا الْقَانِعَ وَالْمُعْتَرَّ
వాటిని (మీరూ) తినండి, అడగని అభాగ్యులకు, అడిగే అగత్యపరులకు కూడా తినిపించండి” (సూరా అల్ హజ్ 22:36)

హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియచేశారు:
(తినండి తినిపించండి మరియు దాచుకోండి) (ముస్లిం)

13. జంతువును జూబహ్ చేసిన తర్వాత, దానిలోని ఏ భాగాన్ని కానీ, మాంసాన్ని గానీ, చర్మాన్ని గానీ, మరేదైనా అమ్మడానికి అనుమతి లేదు.

14.  అవిశ్వాసుల హృదయాలు ఇస్లాం వైపు మొగ్గడానికి వారికి ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వచ్చు.

15. ఖుర్బానీ మాంసాన్ని కసాయి వానికి కూలీగా ఇవ్వరాదు. ఎందుకంటే ధర్మం దీనికి అంగీకరించలేదు. కనుక అతనికి కూలీగా డబ్బులు మాత్రమె ఇవ్వాలి.

16. ఓ అల్లాహ్ దాసులారా! ఈ గొప్ప పండుగ తర్వాత ఘనత కలిగినటువంటి దినాలు కూడా వస్తాయి. వాటిని “తష్రీఖ్” దినాలు అంటారు ఆ దినములలో అతి ఎక్కువగా” జిక్ర్ “స్మరణ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు:

وَاذْكُرُوا اللَّهَ فِي أَيَّامٍ مَّعْدُودَاتٍ
(గణించదగిన ఆ దినాలలో (తష్రీఖ్‌ దినాలలో) అల్లాహ్‌ను స్మరించండి.) (సూరా అల్ బఖర 2:203)

ఈద్ రోజులలో చేయవలసిన ముఖ్యమైన ఆచరణ ఇక్కడ తెలపడం జరుగుతుంది: “తష్రీఖ్” యొక్క మూడు రోజులలో అన్ని సమయాలలో సంపూర్ణ తక్బీర్ పటించాలి. మరియు మూడవరోజు మగ్రిబ్ నమాజ్ వరకు తక్బీర్ చదువుతూ ఉండాలి. అలాగే  “తష్రీఖ్” యొక్క మూడవ రోజున అసర్ వరకు రోజువారీ ప్రార్థనలలో ఐదు పూటల ఈ విధంగా తక్బీర్ పటించాలి:

(అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లాల్లాహ్,  వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్)
ఇందులో అల్లాహు అక్బర్ రెండుసార్లు లేదా మూడుసార్లు పటించవచ్చు

17. తష్రీఖ్” దినాలు వాస్తవానికి తిని త్రాగే మరియు అల్లాహ్ స్మరించుకునే రోజులు. ఈ రోజులలో ఉపవాసం ఉండడం అనుమతించబడలేదు, ఎందుకంటే అవి పండుగ రోజులు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “తష్రీఖ్” దినాలు తిని త్రాగేటువంటి రోజులు”.
మరో హదీసులో ఉంది: “అల్లాహ్ ను స్మరించే రోజులు”.

18. ఈద్ గొప్ప ప్రయోజనాల్లో ఒకటి: ముస్లింల మధ్య సంబంధాన్ని నెలకొల్పడం, ఒకరినొకరు కలిసే సద్భావం కలిగి ఉండటం. హృదయాలలో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవడం, భయం మరియు పేదరికాన్ని తొలగించడం, మరియు ద్వేషం మరియు అసూయలను నివారించడం, మరియు హృదయాలలో రగులుతున్న అసూయ అనే అగ్నిని ఆర్పడం. ఈద్ ప్రార్థనను నిర్వహించడానికి ముస్లింలను ఒకే చోట సమీకరించగల ఇస్లాం యొక్క సామర్ధ్యం మనకు కనిపిస్తుంది. అంతేకాదు భక్తి ప్రాతిపదికన వారిని సత్యం పై స్థిరంగా వారి హృదయాలను మార్గనిర్దేశం చేస్తుందనడానికి సంకేతం.

నౌమాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా తెలియజేశారు: “విశ్వాసుల ఉదాహరణ కరుణపరంగా, ఐక్యత పరంగా, ప్రేమ పరంగా ఒక శరీరం లాంటిది. కనుక శరీరంలో ఏదైనా భాగంలో నొప్పి కలిగితే దాని ద్వారా జ్వరం వస్తుంది. అప్పుడు శరీరంలో ఉన్న అవయవాలన్ని ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి”. (ముస్లిం)

పండగ రోజున చేసేటువంటి మరొక అభిలషనీయమైన పని ఏమిటంటే; ఆ రోజున బంధుత్వాలను కలుపుకోవాలి. ఎందుకంటే అల్లాహ్ తన దాసుడిపై దీనిని విధిగా చేశాడు. ముఖ్యంగా శుభ సందర్భాలలో కాబట్టి ఎవరైతే బంధుత్వాలను కలుపుకుంటారో అల్లాహ్ తఆల అతనికి దగ్గరవుతాడు, మరి ఎవరైతే బంధుత్వాన్ని తెంచుకుంటారో అలాంటి వారిని అల్లాహ్ తన కారుణ్యం నుండి దూరం చేస్తాడు,

అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎలా తెలియజేశారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు: “నేను కరుణామయుడును నేనే బంధుత్వాన్ని పుట్టించాను. మరియు దాని పేరును నా పేరుతో జోడించాను. కాబట్టి ఎవరైతే నీతో సంబంధం పెట్టుకుంటాడో అతనితో నేను సంబంధం పెట్టుకుంటాను, మరియు ఎవరైతే త్రేగదెంపులు చేసుకుంటాడో అతనితో నేను త్రేగదెంపులు చేసుకుంటాను“. (ముస్లిం)

ఓ అల్లాహ్ దాసులారా! కనుక ఎవరైతే తమ బంధువులతో స్నేహితులతో పోట్లాట కారణంగా విడిపోయారో వారు మన్నింపుల వైఖరిని అవలంబించండి. ఎందుకంటే అల్లాహ్ ఇలా అంటున్నాడు:

فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ
కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ( సూరా ఆష్ షూరా 42:40)

మరొకచోట ఇలా అంటున్నాడు:

إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ
విశ్వాసులు (ముస్లింలు) అన్నదమ్ములు (అన్న సంగతిని మరువకండి). కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. (సూరా అల్ హుజురాత్ 49:10)

19. ఓ అల్లాహ్ దాసులారా పండుగ శుభాకాంక్షలు తెలుపడం ఒక మంచి పని. ఇబ్నె తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియ చేస్తున్నారు:  పండుగ నమాజ్ తరువాత ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు (تقبل الله منا ومنكم، وأحاله الله عليك) తెలుపుకునే విధానం కొందరి సహాబాల ద్వారా మనకు తెలుస్తుంది. మరియు కొంత మంది ధర్మ పండితులు కూడా దీనిని సమ్మతించారు. (అల్ ఫతావా)

20. అల్లాహ్ దాసులారా! అల్లాహ్ యొక్క అనుగ్రహాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధమైన నిషేధించబడిన విషయాలకు పాల్పడితే దానికి బదులుగా అల్లాహ్ యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని భయపడండి.

చివరిగా నేను, నా కోసం మరియు మీ కోసం పాప క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా అతను క్షమించేవాడు మరియు దయగలవాడు.

స్తోత్రం మరియు దరూద్ తరువాత

ఓ విశ్వాసి స్త్రీలారా! అల్లాహ్ విశ్వాస మాతృమూర్తులకు ఆజ్ఞాపిస్తూ ఖురాన్ ఈ విధంగా అంటున్నాడు:

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ

మీరు మీ ఇండ్లల్లోనే ఆగి ఉండండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. నమాజు చేస్తూ ఉండండి. జకాతు ఇస్తూ ఉండండి. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

అల్లాహ్‌ను తమ ప్రభువుగా, ఇస్లాంను తమ మతంగా మరియు ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రవక్తగా అంగీకరించే ఓ ఇస్లాం మహిళ లా, తీర్పు దినం వరకు వారి అడుగుజాడల్లో నడిచే విశ్వాసుల తల్లులకు మరియు విశ్వాసులైన మహిళలకు ఈ దైవిక ఉపదేశం సాధారణంగా అందరికీ వర్తిస్తుంది, కాబట్టి అల్లాహ్ కు మరియు ప్రవక్త విధేయతకు కట్టుబడి ఉండాలి.

మానవులు మరియు జిన్నాతులు యొక్క చెడు విధానాల పట్ల తస్మాత్ జాగ్రత్త వహించాలి. నగ్నత్వం మరియు అశ్లీల ఉపద్రవం యొక్క ప్రలోభాలలో పడకండి. అల్లాహ్ ఇలా అంటున్నాడు;

وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ 
పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా మీ సింగారాన్ని చూపిస్తూ తిరగకండి. (సూరా అల్ ఆహ్ జాబ్ 33:33)

భద్రతను, క్షేమాన్ని కోరుకునే స్త్రీ తనను తాను అవిస్వాసుల కార్యకలాపాలలో అనుసరించకూడదు, ఎందుకంటే వారిని అనుసరించడం వలన ఇది హృదయం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు మనలో కూడా ఆ అవలక్షణాలు చోటు చేసుకుంటాయి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

وَاللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ الَّذِينَ يَتَّبِعُونَ الشَّهَوَاتِ أَن تَمِيلُوا مَيْلًا عَظِيمًا

అల్లాహ్‌ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలని కోరుతున్నాడు. కాని, తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మాత్రం మీరు (దైవమార్గం నుంచి) పెడదారి తీసి చాలా దూరం వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. (సూరా అన్ నిసా 4:27)

మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు! అల్లాహ్ మీ అందరినీ ఎల్ల వేళలా సుఖ సౌఖ్యాలతో ఉంచుగాక. అందరి పై తన శుభాల వర్షాన్ని కురిపించు గాక. అందరి ఆరాధనలు స్వీకరించుగాక. పాపాలను మన్నించుగాక. అల్లాహ్ అందరి ధర్మ సమ్మతమైన కోరికలు తీర్చుగాక. సదా చరణ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు గాక!

చివరగా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూద్ పంపుతూ ఉండండి, ఎవరైతే ఒకసారి దరూద్ పంపుతారో అల్లాహ్ అతనిపై పది కారుణ్యాలు కురిపిస్తాడు.

اللهم صلِّ وسلِّم وبارك على عبدك ورسولك نبينا محمد، وعلى آله وصحبه أجمعين

ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ
ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

దాన ధర్మాల విశిష్టత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]

1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.

అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.

ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا

వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.

అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.

మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.

సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.

అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.

అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.

అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.

అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.

మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.

దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:

ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.

అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?

اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.

దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:

ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.

తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:

قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.

ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.

అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:

أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.

అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.

మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.

ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.

ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.

ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.

మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.

అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.

ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.

కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.

ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.

అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.

మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.

అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.

మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.

అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.

అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:

أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:

يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.

ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)

నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.

ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:

إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.

కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.

రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:

ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.

అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.

మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!

ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

అల్లాహ్ యేతరులపై ప్రమాణం (ఒట్టు) చేయడం ధర్మ సమ్మతమేనా? [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా?
https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్

అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.

మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.

ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ
(ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్)
నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)

ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.

ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.

అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ
(లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం)
మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.

మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
(మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా)
ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.

ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.

అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.

అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ
(ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న)
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)

అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీనా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ
(మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక)
ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.

అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు [వీడియో | టెక్స్ట్]

ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు
https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు]
వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.

ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
(ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.

ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ
(ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి)
కనుక మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)

అనగా, మీరు అల్లాహ్‌ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.

طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي
(తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.)
ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,

والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار
(వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్).
దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.

ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు

الحمد لله ثم الحمد لله
(అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్),
బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَا تَجْعَلُوا دُعَاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعَاءِ بَعْضِكُمْ بَعْضًا
(లా తజ్అలూ దుఆ అర్రసూలి బైనకుమ్ క దుఆఇ బఅదికుమ్ బఅదా)
ఓ విశ్వాసులారా! మీలో మీరు ఒకరినొకరు పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవకండి. (24:63)

దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.

అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్)
ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)

దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్‌కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.

కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.

ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
(ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్)
కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)

దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.

అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.

చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.

ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله
(లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.)
చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.

చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.

అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.

ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

ثلاث من كن فيه وجد حلاوة الإيمان
(సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.)
మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు.
ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:

أن يكون الله ورسوله أحب إليه مما سواهما
(అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.)
అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి.
అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.

దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:

لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين
(లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.)
మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,

يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي
(యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ)
అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك
(లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.)
లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.

ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

الآن يا عمر
(అల్ ఆన యా ఉమర్.)
ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.

చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.

జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.

ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.

ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.

కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.

చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.

وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا
(వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా)
ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69)
ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.

దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్‌కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.

ఎవరైతే అల్లాహ్‌ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?

سبحان الله ثم سبحان الله
(సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).

అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి

متى الساعة؟
(మతస్సాఅ)
ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి

ماذا أعددت لها؟
(మాజా ఆదత్త లహా)
అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు.
అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.


ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,

أنت مع من أحببت
(అంత మఅ మన్ అహబబ్త.)
నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్‌ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.

లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.

కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا
(లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా)
వాస్తవానికి అల్లాహ్‌ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్‌ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్‌ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)

అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్‌గా ఉంటాడు లేదా ఒక డాక్టర్‌గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్‌గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.

ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.

ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను.
ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.

ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ
(వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్)
అల్లాహ్‌కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)

అల్లాహ్‌కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.

ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,

لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم
(లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.)
అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.

అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.

చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.

అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము

إِنْ شَاءَ ٱللَّٰهُ
(ఇన్ షా అల్లాహ్)
వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్‌తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్).

وَعَلَيْكُمُ السَّلَامُ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ అలైకుమ్ అస్సలామ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7