స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

స్వర్గంలోకి ప్రవేశించేవారు నాలుగు రకాలు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/O0rxrJs_Nms [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, స్వర్గంలో ప్రవేశించే వారి గురించి వివరించబడింది. ముఖ్యంగా నాలుగు రకాల స్వర్గవాసుల గురించి చర్చించబడింది. మొదటి రకం వారు విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లేవారు, వీరిలో 70,000 మంది ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. వీరి లక్షణాలు: ఇతరులను మంత్రించమని కోరరు, అపశకునాలు నమ్మరు, వాతలు పెట్టించుకోరు మరియు పూర్తిగా అల్లాహ్ పైనే నమ్మకం ఉంచుతారు. రెండవ రకం వారు విచారణ తర్వాత స్వర్గానికి వెళ్లేవారు. మూడవ రకం అస్ హాబుల్ ఆరాఫ్, వీరి పుణ్యాలు పాపాలు సమానంగా ఉంటాయి, వీరు కొంతకాలం ఆగి అల్లాహ్ దయతో స్వర్గానికి వెళ్తారు. నాల్గవ రకం వారు పాపాల కారణంగా నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత, వారి ఈమాన్ కారణంగా స్వర్గానికి వెళ్లేవారు. పెద్ద పాపాలు చేసిన వారు కూడా చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే (తౌబా), విచారణ లేకుండా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉందని ఖుర్ఆన్ ఆయత్ ల ద్వారా స్పష్టం చేయబడింది. సహాబాల జీవితాల నుండి ఉదాహరణలు, ముఖ్యంగా ఉక్కాషా బిన్ మెహ్సన్ మరియు మూర్ఛ రోగంతో బాధపడిన స్త్రీ ఉదంతాలు, స్వర్గం పట్ల వారికున్న ఆకాంక్షను మరియు అల్లాహ్ పై వారికున్న ప్రగాఢ విశ్వాసాన్ని వివరిస్తాయి.

أَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
[అవూదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్మాలినా]
మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా చెడు పనుల నుండి అల్లాహ్ తో శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు, వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు]
అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, అతడిని ఎవరూ దారి తప్పించలేరు. మరియు ఆయన ఎవరిని దారి తప్పిస్తాడో, అతనికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు]
మరియు అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]
మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

أَمَّا بَعْدُ، فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
[అమ్మా బఅదు ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్]
ఇక తర్వాత, నిశ్చయంగా, ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).

وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ
[వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
మరియు ఉత్తమమైన మార్గదర్శకత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం.

وَشَرُّ الْأُمُورِ مُحْدَثَاتُهَا، وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ، وَكُلُّ بِدْعَةٍ ضَلَالَةٌ، وَكُلُّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, వ కుల్ల ముహ్దసతిన్ బిద్అతున్, వ కుల్ల బిద్అతిన్ దలాలతున్, వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు చెడ్డ విషయాలు (ధర్మంలో) కొత్తగా కల్పించబడినవి, మరియు ప్రతి కొత్తగా కల్పించబడిన విషయం ఒక బిద్అత్ (, మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్నికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సర్వలోక ప్రభువైన, పాలకుడైన, సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, హమ్ద్ మరియు సనా తర్వాత స్వర్గములో ప్రవేశించే వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం.

స్వర్గములో ప్రవేశించే వారు నాలుగు రకాలు. అల్లాహ్ దయ, ఆయన కరుణ మూలంగా ఎవరైతే స్వర్గములో ప్రవేశిస్తారో, స్వర్గ ప్రవేశం ఎవరికి జరుగుతుందో వారు నాలుగు రకాలు.

మొదటి రకం: విచారణ లేకుండా, అతను చేసిన కర్మల లెక్క తీసుకోకుండా స్వర్గ ప్రవేశం జరుగుతుంది. అదృష్టవంతులు వారు, ఎటువంటి లెక్క లేదు, విచారణ లేదు. విచారణ లేకుండా స్వర్గ ప్రవేశం. ఇది మొదటి రకం.

రెండవ రకం: విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. నిలబడాలి, పుస్తకం ఇవ్వబడుతుంది, ఖుర్ఆన్ మరియు హదీస్ లో చెప్పబడిన విధంగా ప్రతి విషయం గురించి లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు పెట్టావు? జీవితం ఎలా గడిచింది? వయసు, యవ్వనం, ప్రతి విషయం గురించి, ప్రతి చిన్న ప్రతి పెద్ద. అల్లాహ్ హక్కులు పూర్తి చేశావా లేదా? దాసుల హక్కులు పూర్తి చేశావా లేదా? ఫర్జ్ విషయాలు, ఆదేశాలు పాటించావా లేదా? ప్రతి విషయం గురించి అడగడం జరుగుతుంది. పరీక్ష తర్వాత, విచారణ తర్వాత స్వర్గ ప్రవేశం. రెండవ రకం.

మూడవ రకం: వారు నరకానికి పోరు, కానీ స్వర్గ ప్రవేశానికి నిర్ణీత సమయం వరకు ఆపబడతారు. వారు నరకానికి ఏ మాత్రం పోరు స్వర్గానికే పోతారు, కాకపోతే నిర్ణీత సమయం వరకు స్వర్గానికి పోకుండా ఆపబడతారు. వారినే అస్ హాబుల్ ఆరాఫ్ అంటారు, వారి ప్రస్తావన సూర నెంబర్ 7, సూర ఆరాఫ్ లో ఉంది. ఆరాఫ్ వారు నిర్నీత సమయం వరకు స్వర్గం పోకుండా ఆపబడతారు, తర్వాత స్వర్గానికి పోతారు. ఇది మూడవ రకం.

నాల్గవ రకం: వారి పాపాల మూలంగా నరకానికి పోతారు. శిక్ష ముగిసిన తర్వాత వారి ఈమాన్ మూలంగా చివరికి అల్లాహ్ తన దయతో స్వర్గానికి పంపిస్తాడు.

ఈ నాలుగు రకాలు స్వర్గానికి పోయేవారు.

వారిలో మొదటి వారు ఎవరు? విచారణ లేకుండా, ఎటువంటి లెక్క తీసుకోకుండా స్వర్గానికి పోయేవారు. వారి గురించి బుఖారీలో ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం.

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా కథనం. ఈయన ఎవరు? మన ప్రవక్త గారి పినతండ్రి అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ కుమారులు. పెద్ద సహాబీ. ఖుర్ఆన్ జ్ఞానం కలిగిన వారు. ముఫస్సిర్ సహాబీ. ఆయన కోసం ప్రవక్త గారు దుఆ చేశారు. అందుకే ఖుర్ఆన్ యొక్క ఆయతుల పరమార్థం, అర్థం బాగా తెలిసిన వారు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు. ఆయన అంటున్నారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఏమని? “నాకు గత సమాజాలను చూపించడం జరిగింది”. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి గత సమాజాలు చూపించడం జరిగింది. తద్వారా నేను చూసింది ఏమిటంటే, (లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో) ఒక ప్రవక్తతో కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు, అంటే స్వర్గానికి పోయేవారు, పాస్ అయిన వారు, ఆయన్ని అల్లాహ్ ని విశ్వసించిన వారు విశ్వాసులు, మూమినీన్లు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అంటే పది కంటే తక్కువ మంది. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయనతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఇంకో ప్రవక్తను చూశాను, ఆయన ఒక్కరే ఉన్నారు, ఆయనతో పాటు ఎవరూ లేరు. అంటే ఆ ప్రవక్తకి విశ్వసించిన వారు ఒక్కరు కూడా లేరు.

ఆ తర్వాత, అకస్మాత్తుగా నాకు పెద్ద సమూహం గోచరించింది. బహుశా ఇది నా అనుచర సమాజం అని అనుకున్నాను. కానీ ఇది మూసా అలైహిస్సలాం, ఆయన అనుచర సమాజం. ఆ తర్వాత, ఇటువైపు చూడండి అని నన్ను చెప్పటం జరిగింది, నేను చూశాను, పెద్ద సమూహం. ఎక్కడ వరకు చూస్తున్నానో అక్కడ వరకు ఉంది జనాలు, పెద్ద సమూహం. మరోవైపు చూడండి అని చెప్పడం జరిగింది, మరోవైపు చూశాను, పెద్ద సమూహం కనపడింది.

అప్పుడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీ అనుచర సమాజం. వీరిలో డెబ్బై వేల మంది కర్మల విచారణ లేకుండానే స్వర్గములో ప్రవేశిస్తారు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి తమ గృహంలోకి వెళ్ళిపోయారు. ఇది విన్న సహాబాలు వారి మనసులో రకరకాల ఆలోచనలు, వారు ఎవరై ఉంటారు? విచారణ లేకుండా, లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గ ప్రవేశం. సుబ్ హా నల్లాహ్! ఎంత అదృష్టవంతులు! వారెవరు? బహుశా ఇస్లాం స్థితిలోనే జన్మించి షిర్క్ దరిదాపులకి కూడా పోని వారు ఉండవచ్చు అని రకరకాల ఆలోచనలు, మాటలు మాట్లాడుకుంటున్నారు. అటువంటి వారు అయ్యి ఉండవచ్చు, ఇటువంటి వారు అయ్యి ఉండవచ్చు అని మాట్లాడుతూ ఉండగా, అంతలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ సహాబాల మాటలు విని, మీరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఓ దైవ ప్రవక్త! ఆ డెబ్బై వేల మంది ఎవరు? విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా డైరెక్ట్ స్వర్గం, వారు ఎవరు దైవ ప్రవక్త అంటే దానికి సమాధానంగా మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏమిటంటే:

هُمُ الَّذِينَ لاَ يَرْقُونَ وَلاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యర్కూన వలా యస్తర్కూన వలా యతతయ్యరూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

ఈ నాలుగు లక్షణాలు, గుణాలు కలిగిన వారు. వారెవరు? వారు స్వయంగా మంత్రించి ఊదుకోరు, ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునం పాటించరు, కేవలం తమ ప్రభువు అనగా అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పారు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

ఒక సహాబీ, ఆయన పేరు ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు, ఆయన ఇది విని వెంటనే, ఓ దైవ ప్రవక్త, విచారణ లేకుండా, కర్మల లెక్క లేకుండా, డైరెక్ట్ స్వర్గంలో ప్రవేశించే వారిలో నేను కూడా ఉండాలని దుఆ చేయండి అల్లాహ్ తో అని విన్నవించుకున్నారు. ఎవరు? ఉక్కాషా బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దుఆ చేసే అవసరం లేదు, నువ్వు వారిలో ఉన్నావు అని శుభవార్త చెప్పేశారు. “పో ఉక్కాషా, నువ్వు వారిలో ఉన్నావు. ఎవరికైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విచారణ లేకుండా, లెక్కల అది లెక్కలు లేకుండా డైరెక్ట్ గా స్వర్గం పంపుతారో, నువ్వు వారిలో ఉన్నావు” అని చెప్పారు. సుబ్ హా నల్లాహ్! ఈ భాగ్యం ఉక్కాషా బిన్ మెహ్సన్ కి ఖచ్చితంగా తెలిసిపోయింది. అల్ హమ్దులిల్లాహ్. ఇది విని ఇంకో సహాబీ లేచారు. ఓ దైవ ప్రవక్త, నా కోసం కూడా దుఆ చేయండి, నేను కూడా ఆ సమూహంలో ఉండాలి అని. దానికి మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “సబకక బిహా ఉక్కాషా” అన్నారు. అంటే, ఉక్కాషా నీకన్నా ముందుకి వెళ్ళిపోయాడు, ఆ భాగ్యాన్ని ఆయన నోచుకున్నాడు అని చెప్పేశారు మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ హదీస్ బుఖారీలోనే మూడు చోట్ల ఉంది.

ఇదే హదీస్ ముస్లిం గ్రంథంలో కొంచెం తేడాతో ఇలా ఉంటుంది.

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ وَلاَ يَتَطَيَّرُونَ وَلاَ يَكْتَوُونَ وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
[హుముల్లదీన లా యస్తర్కూన వలా యతతయ్యరూన వలా యక్తవూన వఅలా రబ్బిహిమ్ యతవక్కలూన]
“వారు ఇతరులతో మంత్రించి ఊదించుకోరు, అపశకునాలు పాటించరు, (వ్యాధి నివారణకు) వాతలు పెట్టించుకోరు మరియు తమ ప్రభువు పైనే నమ్మకం కలిగి ఉంటారు.”

వారు ఎవరంటే, వారు మంత్రించి ఊదించుకోరు. రెండవది, అపశకునం పాటించరు. ఈ అపశకునం గురించి రెండు వారాల ముందు మనం తెలుసుకున్నాం జుమా ప్రసంగంలోనే అపశకునం అంటే ఏమిటి అనేది. మూడవది, శరీరాన్ని అగ్నితో వాతలు పెట్టుకోరు. నాలుగవది, కేవలం అల్లాహ్ పైనే నమ్మకం కలిగి ఉంటారు. ఇది పూర్తి హదీస్, విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారి గురించి.

దీనికి సంబంధించిన సహాబియాత్ లలో, సహాబాలలో అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి, వారి జీవిత చరిత్ర మనము చదివితే. ప్రపంచ సమస్యలను, ప్రపంచ బాధలను పట్టించుకోకుండా, వారు ప్రాధాన్యత ఇచ్చింది పరలోకానికి. వారిలో ప్రతి ఒక్కరూ నేను విచారణ లేకుండా స్వర్గానికి పోయే వారిలో ఉండాలని ప్రయత్నం చేసేవారు. దానికి ఉదాహరణ ఒక హదీస్ ఉంది అది తెలుసుకుందాం. ఈ హదీస్ కూడా బుఖారీలో ఉంది, ముస్లింలో కూడా ఉంది. ఇది ఏమిటి?

అతా బిన్ అబూ రిబాహ్ అంటున్నారు, నాకు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా పిలిచి, నేను నీకు ఒక స్వర్గ స్త్రీని, స్వర్గ మహిళని చూపించనా అని అడిగారు. “ఖుల్తు బలా”, తప్పనిసరిగా చూపించండి, స్వర్గ మహిళ! అంటే ప్రతి ఒక్కరికి గ్యారెంటీ లేదు కదా. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ఎవరు స్వర్గానికి పోతారో ఖచ్చితంగా చెప్పగలమా? కానీ ఎవరెవరికైతే మన ప్రవక్త గారు ముందే చెప్పి పోయారో వారు ఖచ్చితం గ్యారెంటీ. ఆ విషయం ఇది. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ అంటున్నారు “ఓ అతా బిన్ అబూ రిబాహ్, స్వర్గ మహిళకి చూపించినా?” చూపించండి అన్నారు. అప్పుడు ఆయన అంటున్నారు ఇదిగో ఆ నల్ల రంగు గల స్త్రీ.

ఆవిడ ఒకసారి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాకు మూర్ఛ రోగం ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నేను నగ్నంగా అయిపోతాను, నా శరీరంలో బట్టలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. స్వస్థత కోసం దుఆ చేయండి దైవ ప్రవక్త అన్నారు.

ఇది విని మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడకి రెండు ఆప్షన్లు ఇచ్చారు. అది ఏమిటి?

إِنْ شِئْتِ صَبَرْتِ وَلَكِ الْجَنَّةُ، وَإِنْ شِئْتِ دَعَوْتُ اللَّهَ أَنْ يُعَافِيَكِ
[ఇన్ షి’తి సబర్తి వలకిల్ జన్నతు, వ ఇన్ షి’తి దఅవుతుల్లాహ అన్ యుఆఫియకి]
“నువ్వు తలచుకుంటే సహనం వహించు, నీకు స్వర్గం ఉంది. లేదా నువ్వు కోరుకుంటే నేను అల్లాహ్ తో దుఆ చేస్తాను, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.”

ఆ స్వర్గ మహిళ మొదటి ఆప్షన్ ఎన్నుకున్నది. నేను సహనం వహిస్తాను ఓ దైవ ప్రవక్త, ఎందుకంటే నాకు స్వర్గం లభిస్తుంది, చెప్పారు కదా, స్వర్గం గ్యారెంటీ ఇస్తున్నారు కదా. నాకు ఈ రోగం ఉన్నా పర్వాలేదు, నేను సహనం వహిస్తాను, కాకపోతే ఒక్క విన్నపం. ఆ రోగం వచ్చినప్పుడు, ఆ స్థితిలో నా శరీరం నుంచి నా బట్టలు ఎగరకుండా ఉండాలి, నేను నగ్నం అవ్వకూడదు, దాని కోసం ప్రార్థించండి అన్నారు. దాని కోసం మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన చేశారు.

అభిమాన సోదరులారా, ఇది సహాబాల ప్రయత్నం, వారి కృషి, ఏ విధంగా నేను స్వర్గానికి పోవాలి, అది కూడా విచారణ లేకుండా స్వర్గానికి పోవాలి అనేది.

ఒక ప్రశ్న, అది ఏమిటంటే, కొందరు చిన్న చిన్న ఏదో పాపాలు చేస్తారు, పెద్ద పాపాలు కూడా చేస్తారు, కాకపోతే బుఖారీ హదీస్ లో చెప్పబడిన ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి కదా అవి ఉండవు. అపశకునం పాటించరు. షిర్క్ చేయరు. మంత్రించి ఊదించుకోరు. అల్లాహ్ పై నమ్మకం ఉంది. ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి, వేరే పాపాలు చేస్తున్నారు. అటువంటి వారు కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోతారా? ఈ ప్రశ్న షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్-మునజ్జిద్ తో అడగడం జరిగింది. ఆయన సమాధానం ఇచ్చారు, చిన్న పెద్ద పాపాలకి పాల్పడిన వాడు కూడా కర్మల విచారణ లేకుండా స్వర్గానికి పోయే అవకాశం ఉంది అని చెప్పి ఆయన సూర ఫుర్ఖాన్ లోని ఈ ఆయత్ ను పఠించారు. ఆయత్ ఏమిటి?

وَالَّذِينَ لَا يَدْعُونَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ وَلَا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ وَلَا يَزْنُونَ
వారు అల్లాహ్‌తోపాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. న్యాయబద్ధంగా తప్ప – అల్లాహ్‌ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు. వారు వ్యభిచారానికి పాల్పడరు. (25:68)

అంటే, వారు అల్లాహ్ తో పాటు మరే దైవాన్ని మొరపెట్టుకోరు అంటే షిర్క్ చేయరు. న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ ఏ ప్రాణిని హత్య చేయటాన్ని నిషేధించాడో దానిని హతమార్చరు, అంటే హత్య చేయరు. వారు వ్యభిచారానికి పాల్పడరు, వ్యభిచారం చేయరు. మూడు విషయాలు, షిర్క్ చేయరు, హత్య చేయరు, వ్యభిచారం చేయరు. ఈ చేష్టలకు ఒడగట్టిన వారు, చేస్తే? హత్య చేశారు, లేదా వ్యభిచారం చేశారు, లేదా షిర్క్ చేశారు. ఇలా చేస్తే, పాప ఫలాన్ని పొంది తీరుతాడు. అంతేకాకుండా:

يُضَاعَفْ لَهُ الْعَذَابُ يَوْمَ الْقِيَامَةِ وَيَخْلُدْ فِيهِ مُهَانًا
ప్రళయదినాన అతనికి రెట్టింపు శిక్ష వడ్డించబడుతుంది. వాడు పరాభవంపాలై, అత్యంత నికృష్టస్థితిలో కలకాలం అందులో పడి ఉంటాడు. (25:69)

ఇక మూడోవ ఆయత్.

إِلَّا مَنْ تَابَ وَآمَنَ وَعَمِلَ عَمَلًا صَالِحًا فَأُولَٰئِكَ يُبَدِّلُ اللَّهُ سَيِّئَاتِهِمْ حَسَنَاتٍ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
అయితే (ఈ పాప కార్యాల తరువాత) ఎవరు పశ్చాత్తాపం చెంది, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో అలాంటి వారి పాపాలను అల్లాహ్‌ పుణ్యాలుగా మార్చి వేస్తాడు. అల్లాహ్‌ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణాకరుడు.(25:70)

అయితే, ఈ పాప కార్యాల తర్వాత, పాపం చేసిన తర్వాత కుమిలిపోయి, పశ్చాత్తాపం చెంది, కన్నీళ్లు కార్చి, అంటే ఇక్కడ పశ్చాత్తాపం అంటే జోక్ కాదు, సీరియస్. ఏ పశ్చాత్తాపం గురించి అల్లాహ్ చెప్పాడో, “యా అయ్యుహల్లదీన ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతన్ నసూహా”. తౌబయే నసూహా. ఏ విధంగా ఖుర్ఆన్ లో హదీస్ లో తౌబా అంటే ఏమిటి, ఆ విధంగా తౌబా పశ్చాత్తాపం చెంది, కుమిలిపోయి పశ్చాత్తాపం చెందారో, విశ్వసిస్తారో, సదాచరణ చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చేస్తాడు. సుబ్ హా నల్లాహ్! వారు చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చివేయబడతాయి. అల్లాహ్ క్షమాపశీలి, కరుణామయుడు. అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? తౌబా చేసుకుంటే, ఆ నాలుగు లక్షణాలు ఉంటే, షిర్క్ చేయని వారు, మంత్రించి ఊదుకోని వారు, అపశకునం పాటించని వారు, అల్లాహ్ పై నమ్మకం వేసిన వారు, వేరే పాపాలు చేసిన తర్వాత పూర్తి నమ్మకంతో, సంపూర్ణ విశ్వాసంతో, దృఢ సంకల్పంతో కుమిలిపోతూ నిజమైన తౌబా చేసుకుంటే వారికి కూడా విచారణ లేకుండా స్వర్గ ప్రవేశానికి అవకాశం ఉంది.

ఇక వారు ఎవరు? మూడవ వర్గం, నరకానికి పోరు, నిర్నీత సమయం వరకు ఆరాఫ్ పైన, ఆరాఫ్ అది స్థలం అక్కడ పరలోకములో. ఆరాఫ్ అంటే ఒక స్థలం పేరు, గోడ పేరు. ఆరాఫ్ పైన చాలామంది ఉంటారు, వారు ప్రతి ఒక్కరినీ వారి చిహ్నాలను బట్టి గుర్తుపడతారు. అంటే ఆరాఫ్ పైన ఉన్న మనుషులు స్వర్గానికి పోయేవారు ఎవరు, నరకానికి పోయేవారు ఎవరు, వారి ఆనవాలను బట్టి గుర్తుపట్టేస్తారు వాళ్ళు, ఆరాఫ్ వాళ్ళు, ఆ గోడ పైన ఉన్నవారు. వారు స్వర్గవాసులను పిలిచి “అస్సలాము అలైకుమ్”, మీపై శాంతి కలుగుగాక అని అంటారు. ఈ ఆరాఫ్ వారు అప్పటికీ ఇంకా స్వర్గంలో ప్రవేశించి ఉండరు. అయితే స్వర్గం లభిస్తుందన్న ఆశతో వారు ఉంటారు. అసలు వీళ్ళు ఎవరు? వీరి గురించి అత్యధిక ధర్మ పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆరాఫ్ వాళ్ళు, వారి సత్కర్మలు, దుష్కర్మలు, పుణ్యాలు, పాపాలు సరిసమానంగా ఉంటాయి. వారి సత్కర్మలు వారిని నరకంలో పోకుండా ఆపుతాయి, వారి దుష్కర్మలు స్వర్గానికి పోకుండా ఆపుతాయి. అందుకు నిర్నీత సమయం వరకు వారు వేచి ఉంటారు, స్వర్గానికి పోకుండా ఆపబడి ఉంటారు, ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయతో వారిని స్వర్గానికి పంపిస్తాడు. వీరు మూడవ రకం వారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ విచారణ లేకుండా స్వర్గంలో ప్రవేశించే ఆ సమూహంలో చేరిపించు గాక. ఆమీన్. మనందరికీ ఇహపరలోకాల సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం [మరణానంతర జీవితం – పార్ట్ 49] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం
[మరణానంతర జీవితం – పార్ట్ 49]
https://www.youtube.com/watch?v=LJvDCtqg1H0 [23 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహిల్లజీ హదానా లిహాదా వమా కున్నా లినహ్తదియ లవ్లా అన్ హదానల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ వఅలా ఆలిహి వమన్ వాలాహ్. అమ్మాబాద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన మన కర్మ పత్రాలు మన చేతిలో ఇవ్వబడటం ఈ విషయాల వివరణలు మనం తెలుసు కుంటున్నాము.

అయితే మహాశయులారా, గత కార్యక్రమంలో మనం ఇహలోకంలో మన కర్మలన్నీ కూడా వ్రాయబడుతున్నాయి అనే విషయానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము. ఎప్పుడైతే పరలోకంలో మనం హాజరవుతామో అక్కడ మన కర్మ పత్రాలు మన ముందు తెరవబడటం జరుగుతుంది. ప్రతీ మనిషి ఇహలోకంలో అతను చదువుకున్నా, చదువుకోకున్నా అతడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ప్రళయ దినాన అతని మెడలో అతని యొక్క కర్మ పత్రం ఉంటుంది. స్వయంగా దానిని అతను చదువుకోవచ్చు కూడా. స్వయంగా అతను దానిని చదువుకునే అటువంటి శక్తి కూడా ఆ రోజు అల్లాహు తఆలా అతనికి ప్రసాదిస్తాడు.

ఒకసారి సూరత్ బనీ ఇస్రాయీల్, దాని మరొక పేరు సూరతుల్ ఇస్రా. సూరతుల్ ఇస్రాలోని ఈ ఆయతు చదవండి.

وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ
وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا
إقْرَأْ كِتَابَكَ
كَفَىٰ بِنَفْسِكَ الْيَوْمَ عَلَيْكَ حَسِيبًا

మేము ప్రతీ మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలో వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మ పత్రాలను వెలికి తీస్తాము. అతను దానిని ఒక తెరువబడిన పుస్తకం మాదిరిగా స్పష్టంగా చూస్తాడు పొందుతాడు. అప్పుడు అతనితో చెప్పడం జరుగుతుంది. నీవు నీ ఈ కర్మ పత్రాన్ని చదువుకో. ఈ రోజు నీ లెక్క తీసుకోవటానికి నీవే చాలు.

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది? [మరణానంతర జీవితం – పార్ట్ 19] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?
[మరణానంతర జీవితం – పార్ట్ 19] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kKaOZfTuxe0
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాద అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ఈనాటి శీర్షిక: త్రాసు అంటే ఏమిటి? ప్రళయ దినాన దాని యొక్క గాంభీర్యత, కష్టతరం అనేది ఎలా ఉంటుంది?

మహాశయులారా, సృష్టికర్త అయిన అల్లాహ్ సర్వము తెలిసినవాడు. మరియు ఆయన ఎవరి పట్ల కూడా ఎలాంటి అన్యాయం చేయనివాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు మరియు దాసులకు వారి పుణ్యాలకంటే ఎంతో ఎక్కువ రేట్లో ఉపకారాలు చేసి వారిని మన్నిస్తూ ఉండేవాడు. కానీ రవ్వంత కూడా ఎవరిపై ఏ అన్యాయము చేయడు.

ఆయన ప్రళయ దినాన తలచుకుంటే, దాసుల పట్ల ఆయనకున్న పరిజ్ఞానంతో వారి యొక్క విశ్వాసం, అవిశ్వాసం, సత్కార్యాలు, దుష్కార్యాలు అనే ఆధారం మీద వారిని స్వర్గంలో పంపడం, నరకంలో పంపడం వంటి తీర్పులు చేయగలడు. అలా చేసే అధికారం అతనికి ఉంది. కానీ, అలా చేయకుండా వారి యొక్క లెక్క, వారి యొక్క తీర్పు, సాక్ష్యాధారాలను, ఇంకా ఆ రోజు త్రాసును నెలకొల్పుతాడు.

త్రాసును నెలకొల్పి, అందులో ప్రజలు చేసినటువంటి సత్కార్యాలను ఒకవైపున, దుష్కార్యాలను మరోవైపున తూకం చేస్తాడు. స్వయంగా సత్కార్యాలు, దుష్కార్యాలు చేసిన ప్రజలను కూడా అందులో పెట్టడం జరుగుతుంది. అంతేకాదు, ఏ కర్మపత్రాలు దైవదూతలు రాస్తూ ఉన్నారో, ఆ పత్రాలను కూడా, ఆ ఫైల్లను కూడా అందులో తూకం చేయడం జరుగుతుంది. ఇదంతా దేని కొరకు? ప్రజలు కూడా స్వయంగా వారు తృప్తికరమైన న్యాయం వారికి లభించినది అని వారికి మనస్తృప్తి కలగాలి.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

స్వర్గ సందర్శనం [పుస్తకం]

బిస్మిల్లాహ్

స్వర్గ సందర్శనం (Swarga Sandarsanam)
కూర్పు : మౌలానా ముహమ్మద్‌ ఇఖ్‌బాల్‌ కైలానీ (Muhammad Iqbal Kailani)
అనువాదం : ముహమ్మద్‌ జీలాని (Muhammad Jeelani)
ప్రకాశకులు : హదీస్‌ పబ్లికేషన్స్‌. హైద్రాబాద్‌, ఏ.పి. ఇండియా

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
https://bit.ly/swarga-sandarsanam-mobile
PDF (పిడిఎఫ్) – 176 పేజీలు మొబైల్ ఫ్రెండ్లీ బుక్

విషయ సూచిక 

ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం

390. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నమాజు చేయడానికి మస్జిదుకు వెళ్ళే వ్యక్తి కోసం అల్లాహ్ స్వర్గంలో విందు ఏర్పాటు చేస్తాడు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 37 వ అధ్యాయం – ఫజ్లిమన్ ఘదా ఇలల్ మస్జిది వరాహ]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 51 వ అధ్యాయం – నమాజు కోసం ముస్జిదుకు వెళ్తే పాపాలు క్షమించబడతాయి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్