ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి?
https://youtu.be/koWlTdlX4BI [52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా పొందవచ్చో వివరించబడింది. సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన తలచినప్పుడే అన్నీ జరుగుతాయని గట్టి నమ్మకం కలిగి ఉండాలని ప్రసంగీకులు నొక్కిచెప్పారు. ఖుర్ఆన్ కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని అల్లాహ్ స్వయంగా చెప్పిన విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇది శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది. సూరహ్ యూనుస్, సూరహ్ అల్-ఇస్రా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని సంఘటనలను ఉదాహరిస్తూ, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందాలంటే దృఢ విశ్వాసం, పాపాలకు దూరంగా ఉండటం మరియు ఖుర్ఆన్ బోధనలను ఆచరించడం తప్పనిసరి అని బోధించారు. మూఢనమ్మకాలు, షిర్క్ వంటి పద్ధతులకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో ఖుర్ఆన్ ద్వారా చికిత్స పొందాలని వారు ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్. వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్.

ఫ అఊదు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్.

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
(వ నునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫావువ్ వ రహ్మతుల్ లిల్ మూమినీన్)
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.  (17:82)

సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సర్వ మానవాళి సన్మార్గం కొరకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్హందులిల్లాహ్, ఈ రోజు ధర్మ సందేశ విభాగం, రాష్ట్ర జమీయతే అహ్లె హదీస్ తెలంగాణ వారి తరఫున మూడు ప్రసంగాలు, మూడు పాఠాలు మీ ముందు ఇన్షా అల్లాహ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇన్షా అల్లాహ్ ప్రప్రథమంగా మీ ముందు ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా అనే అంశంపై ఫజీలతుష్ షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామయీ హఫిదహుల్లాహ్ మీ ముందు ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన ప్రసంగించనున్నారు. నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా గురువు గారిని నేను ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన మాకు ఎన్నో ఖుర్ఆన్ హదీసు వెలుగులో ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందాలి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ గ్రంథం ద్వారా ఎలా స్వస్థతను పొందుపరిచాడు అనే అంశాల గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తారని ఆశిస్తున్నాను. వలియత ఫద్దల్ మష్కూరున్ మాజూరా ఫలియత ఫద్దల్.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.” (10:58)

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ ధర్మ ప్రేమికులారా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం. మన కొరకు స్వస్థత ఎలా? అనే అంశంపై ప్రసంగించడానికి చెప్పడం జరిగింది. అయితే ఖుర్ఆన్ మన కొరకు ఏ రూపంలో స్వస్థత ఉంది, దాని ద్వారా మనం ఎలా స్వస్థత పొందగలుగుతామో తెలుసుకునేకి ముందు ఒక రెండు విషయాలు మనం గ్రహించడం చాలా అవసరం. ఏంటి ఆ రెండు విషయాలు? ముందు మనమందరమూ కూడా చాలా బలంగా విశ్వసించవలసినది, దృఢంగా నమ్మవలసినది ఏమిటంటే,

సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే జరుగుతుంది. చివరికి అమ్రే కౌనీ అని ఏదైతే అనడం జరుగుతుందో, మానవులు, జిన్నాతులు తప్ప మిగతా సృష్టి రాశులందరికీ కూడా వారి వారి ఏ పనిని బాధ్యతను అల్లాహ్ అప్పగించాడో, తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అది మన దృష్టిలో ఒకప్పుడు ఏదైనా చెడు అనిపించినా, అది కూడా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది, దీనినే అమ్రే కౌనీ అని అంటారు. ఎక్కడైనా ఏదైనా మంచి జరిగినా అది కూడా అల్లాహ్ వైపు నుండే జరుగుతూ ఉంది.

అగ్నిలో కాల్చే గుణం, కత్తిలో కాటు వేసే గుణం, ఇంకా సృష్టి రాశుల్లో వేరే ప్రతీ ఒక్క దానిలో అల్లాహ్ త’ఆలా అనుమతితోనే అది తన పని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అల్లాహ్ కోరుతాడో, అది తన ఆ పని చేయకూడదు అని, అది ఆ పని చేయదు. అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాంను కాల్చకూడదు అంటే అది కాల్చలేదు. కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాంను కోయకూడదు అని అంటే, కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపైన నడిచినప్పటికీ రవ్వంత గాయం కూడా కాలేదు. సముద్రంలో మునగడం, అందులో ఉన్న పెద్ద జీవరాశులు, తిమింగలాలు మనిషిని గానీ ఇంకా వేరే వాటిని తినడం ఒక సర్వసాధారణ అలవాటుగా మనం చూస్తాము, కానీ అదే యూనుస్ అలైహిస్సలాంను అతనికి ఏ కొంచెం నష్టం జరగకుండా అలాగే కాపాడాలి అని అల్లాహ్ ఆదేశం వస్తే కాపాడింది.

ఈ విధంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిలో తాను కోరిన విధంగా తన ఈ సృష్టిలో మార్పుచేర్పు చేస్తూ ఉంటాడు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే ఉర్దూలో, అరబీలో ఒక పదం ఉపయోగపడుతుంది. మనం మన లాభానికి ఎన్ని సాధనాలు ఏర్పరచుకున్నా, నష్టం నుండి దూరం ఉండడానికి మనం ఏ మార్గాలు అవలంబించినా, ఇవన్నీ కూడా అస్బాబ్ (సాధనాలు). కానీ, ముసబ్బిబుల్ అస్బాబ్, ఆ సాధనాలకు అవి తమ పని చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చేవాడు ఆ అల్లాహ్ మాత్రమే. ఈ బలమైన నమ్మకం మనకు ఉండాలి.

రెండో విషయం, అల్లాహ్ ఏది కోరితే అదే జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం ఏమీ జరగదు. మనం ఏదైనా మంచి కోరి, మంచి సాధనం దాని గురించి ఉపయోగిస్తే అల్లాహ్ తలచినప్పుడే ఆ మంచి మనకు జరుగుతుంది. అంటే, అల్లాహ్ త’ఆలా అందులో ఒక కారణం పెట్టాడు. కానీ అది ఎప్పుడు పని చేస్తుంది? అల్లాహ్ అనుమతి జరిగినప్పుడు, అల్లాహ్ తాను కోరి అనుమతి ఇచ్చినప్పుడు. ఈ నమ్మకం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాను, మనం సర్వసాధారణంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారిమి, హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ సిటీగా మనం చూస్తున్నాము, అందుకొరకు కొన్ని ఉదాహరణలుగా ఎప్పుడైనా దాని పేరు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎన్నో గల్లీలలో మీరు చూస్తూ ఉంటారు, “హమారే పాస్ హర్ తరహా కా రూహానీ ఇలాజ్ హై, ఖురానీ ఇలాజ్ హై”(మా దగ్గర అన్ని రకాల ఆధ్యాత్మిక చికిత్స ఉంది, ఖుర్ఆన్ చికిత్స ఉంది) ఇలాంటి బోర్డులు వేసి ఉంటాయి. వారి యొక్క మొబైల్ నెంబర్లు ఇచ్చి ఉంటాయి. జనాలు, ప్రజలు ధర్మ అవగాహన సరైన రీతిలో లేనందువల్ల, విశ్వాసాలు బలహీనంగా అయిపోయినందువల్ల, వారు ఎన్నో రకాల మోసాలకు గురి అవుతారు. తర్వాత కొందరు అల్లాహ్ యొక్క సత్య గ్రంథం ఖుర్ఆన్ విషయంలో శంకించడం మొదలు పెడతారు. ఇలా ఉండకూడదు.

అందుకొరకే నేను నా అసలైన టాపిక్ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా? ప్రారంభించేకి ముందు ముఖ్యమైన రెండు మాటలు చెప్పాను. వాటిపై చాలా శ్రద్ధ ఇవ్వండి.

ఇక ఖుర్ఆన్ మన కొరకు స్వస్థత ఇది మన శారీరక రోగాలకు కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మన యొక్క బాహ్య రోగాలకు కూడా మరియు ఇది అంతర్య కళ్ళకు కనబడనటువంటి రోగాలకు కూడా ఒక మంచి స్వస్థత కలుగజేసేది.

దీనికి సంబంధించిన ఆయతులు, హదీసులు చెప్పి, ఏ ఏ రీతిగా మనం ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందగలుగుతామో చెప్పేకి ముందు, ఖుర్ఆన్ గురించి స్వయంగా అల్లాహ్ త’ఆలా స్వస్థత అన్న పదం ఏదైతే పలికాడో, “షిఫా” అని ఖుర్ఆన్ లో వచ్చి ఉంది. సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో, అలాగే సూరత్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ అని అంటారు, సూరహ్ నెంబర్ 17, ఆయత్ నెంబర్ 82, అలాగే సూరత్ ఫుస్సిలత్, సూరహ్ నెంబర్ 41, ఆయత్ నెంబర్ 44, ఇంకా ఈ భావంలో వేరే కొన్ని చోట్ల కూడా ఆయతులు ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా మనలో ఎవరైనా ఏదైనా రోగానికి గురి అయితే, ఏ మందు తీసుకుంటున్నావు? ఎవరి వద్ద చికిత్స చేయిస్తున్నావు? చికిత్స, మందు తీసుకోవడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే అల్లాహ్ త’ఆలా ఈ ఖుర్ఆన్ మీ అన్ని రకాల రోగాలకు ఒక ఔషధం అని, దవా అని, ఇలాజ్ అని, చికిత్స అని చెప్పలేదు. మందుల ఉపయోగంతో ఏ ప్రయోజనం కలుగుతుందో, అంటే మనిషి యొక్క రోగం దూరమైపోయి స్వస్థత కలగడం. మర్ద్ (రోగం) పూర్తిగా అతనిలో నుండి వెళ్ళిపోవడం, దాని చోట అతనికి సిహ్హత్, షిఫా (ఆరోగ్యం, స్వస్థత) కలగడం. డైరెక్ట్ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఆ చివరి లాభం ఏదైతే ఉందో, స్వస్థత, ఆరోగ్యం అది అని తెలిపాడు. మందు అని తెలపలేదు, ఔషధం అని తెలపలేదు.

ఇందులో ఉన్నటువంటి గొప్ప మహిమ గ్రహించాల్సినది ఏమిటంటే, మనం చూస్తూనే ఉన్నాము, ఔషధాలు, మందులు సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో అవి పని చేస్తాయి, మనకు వాటి ద్వారా స్వస్థత కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వాటి ద్వారా మనకు స్వస్థత అనేది కలగదు. కానీ ఇక్కడ ఖుర్ఆన్ గురించి అల్లాహ్ త’ఆలా ఏం చెబుతున్నాడు అంటే, దీని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అంతమైపోతాయి, నామరూపాలు లేకుండా “లా తుగాదిరు సఖమా”, ఆ రోగం నామరూపాలు లేకుండా మీలో నుండి దూరమైపోతాయి.

సోదర మహాశయులారా, తొందర తొందరగా పది, ఇరవై ఆయతులు చదివేయడం, పది, ఇరవై హదీసులు వినడం అది గొప్ప కాదు. ఒక్క ఆయతు విన్నా, అందులో ఉన్న భావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మనలో ఒక మార్పు తీసుకురావడం, స్వయం మనం రోగం నుండి ఆరోగ్యం, మరియు అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు, బలహీన విశ్వాసం నుండి బలమైన విశ్వాసం వైపునకు, ఆచరణ పరంగా ఎంతో లోపం, దోషం ఉన్న మనం, సత్కార్యాలు పాటించడంలో చాలా వేగంగా ముందుకు రావడం, ఇలాంటి మంచి మార్పు మనలో రావాలి.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

అయితే, సూరత్ యూనుస్ యొక్క ఆయత్ నేను ముందు మీకు వినిపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమను గ్రహించండి. ఒకవేళ గత నెలలో ఖుర్ఆన్ ఎవరి గ్రంథం, ఎవరి కొరకు అన్న విషయంలో నేను హుదన్, హిదాయత్ ఏ ఏ రకంగా ఉంది అనే విషయం ఏదైతే తెలిపాను, సూర యూనుస్ యొక్క ఆయత్ ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు మీ ముందు పఠిస్తున్నానో, స్టార్టింగ్ లో కూడా సంక్షిప్త ఖుద్బయే మస్నూన తర్వాత పఠించాను, దాన్ని ఒక్కసారి గమనించండి మీరు.

“యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా, అల్లాహు అక్బర్. ఎందరో మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇంకా వేరే ఇస్లాం ధర్మం పై లేని వారు నా మాట వింటున్నారో కొంచెం శ్రద్ధ వహించండి. దివ్య గ్రంథం ఖుర్ఆన్, సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో అల్లాహ్ త’ఆలా “యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా అని సంబోధించాడు. అంటే, ముస్లింలారా అని అనలేదు, అరబ్బులారా అని అనలేదు, మక్కావాసులారా అని అనలేదు. సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ త’ఆలా ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు? ఇక సర్వ మానవులకు ఉంది గనక మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే, ఇది నా మాట కాదు, ఏదో తురుకోని మాట కాదు, ఏదో నీకు ఇష్టం లేని నీ పక్కన ఉన్నటువంటి నీ శత్రువుని మాట కాదు. నిన్ను సృష్టించిన నీ నిజ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ యొక్క మాట. నీతో సంబోధిస్తున్నాడు, నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. “యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, “ఖద్ జాఅత్కుం మౌఇజతుమ్ మిర్రబ్బికుం”. మీ ప్రభువు వైపు నుండి మీ కొరకు ఉపదేశం వచ్చేసింది. అల్లాహు అక్బర్.

ఈ ఉపదేశాన్ని గనక మీరు పాటించారంటే, అల్హందులిల్లాహ్, మీకు ఎంత లాభం కలుగుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అన్ని రకాల చెడులు, అది విశ్వాసానికి సంబంధించిన, లేదా ఆచరణ పరంగా నైనా, అశ్లీలత, అన్ని రకాల దుష్కార్యాలు వాటి నుండి మీరు దూరం ఉండగలుగుతారు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశాన్ని మీరు ఆచరించారంటే, విశ్వాసంలో కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మీరు మరల గలుగుతారు. ఆచరణ పరంగా కూడా మీరు అల్లాహ్ కు ఇష్టమైన సదాచరణ చేయగలుగుతారు. ఎప్పుడు? అల్లాహ్ మీ కొరకు పంపినటువంటి ఉపదేశాన్ని స్వీకరించారంటే.

ఆ తర్వాత చెప్పాడు, “వ షిఫావుల్ లిమా ఫిస్ సుదూర్”. సుదూర్, మీ యొక్క హృదయాలకు ఇది మంచి నివారణ, స్వస్థత. హృదయాలు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు,

مِنَ الشُّبَهِ وَالشُّكُوكِ، وَهُوَ إِزَالَةُ مَا فِيهَا مِنْ رِجْسٍ وَدَنَسٍ.
“మినష్ షుబహి వష్ షుకూకి, వహువ ఇజాలతు మా ఫీహా మిన్ రిజ్సిన్ వ దనస్”.
ఇది మీ రోగాల యొక్క, మీ హృదయాలకు నివారణ, స్వస్థత. హృదయాలలో ఏ అనుమానాలు, ఏ సందేహాలు, ఏ డౌట్స్ వస్తూ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ఈ ఖుర్ఆన్ మంచి నివారణ.”

అవును. నిజమైన సృష్టికర్త అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఆరాధ్యుడు ఉన్నాడు అటువంటి అనుమానంలో ఎవరైతే పడి ఉన్నారో, ఈ ఖుర్ఆన్ ను శ్రద్ధగా చదివారంటే, వారి యొక్క ఈ అనుమానాలు దూరమైపోతాయి. మేము ఆ అరబ్బుల్లో వచ్చిన ముహమ్మద్ ను ఎందుకు విశ్వసించాలి అన్నటువంటి సందేహంలో ఇంకా పడి ఉన్నారో, వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారంటే వారి యొక్క ఈ సందేహాలు దూరమవుతాయి. ఆయన కేవలం అరబ్బుల కొరకు కాదు. ఇక్కడ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఎలాగైతే చెబుతున్నాడో, మీ కొరకు ఉపదేశం, మీ కొరకు స్వస్థత, మీ రోగాలకు మంచి నివారణ కలిగిస్తూ మీకు స్వస్థత కలుగజేసేది అని, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఇదే ఖుర్ఆన్ లో తెలిపాడు, “యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ”, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. ఇంతకంటే మరీ స్పష్టంగా “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్”, సర్వ లోకాల వైపునకు మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపడం జరిగింది.

మనిషి ఇహలోకంలో శాంతి, పరలోకంలో కూడా నరకం నుండి ముక్తి పొంది శాంతి స్థలమైన ఆ స్వర్గంలో చోటు పొందాలంటే తప్పకుండా ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలి, ప్రవక్తపై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి అన్ని రకాల రోగాలకు స్వస్థత కలిగించేటువంటి ఈ ఖుర్ఆన్ ను చదివి మనలో మార్పు తీసుకురావాలి. దీని ద్వారా అన్ని రకాల చెడుగులు మన నుండి దూరమై, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనం మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గంలో ఉండగలుగుతాము.

సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు “వ హుదవ్ వ రహ్మ”. ఎప్పుడైతే మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ రోగాలకు స్వస్థత కలిగించే దానిని మీరు సరైన రీతిలో చదివి ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు మీకు మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. తద్వారా మీ జీవితాల్లో అల్లాహ్ యొక్క ప్రత్యేక కరుణలు మీపై దిగుతూ ఉంటాయి.

ఆ తర్వాత ఏం చెప్పాడు? “లిల్ ముఅమినీన్”. విశ్వాసుల కొరకు. కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఆయత్ యొక్క ఆరంభం యా అయ్యుహన్ నాస్ తోనే ఉంది. మరియు ఖుర్ఆన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇది ఉపదేశం, ఇది స్వస్థత, ఇది మార్గదర్శకత్వం, ఇది కారుణ్యం, నాలుగు గుణాలు చెప్పబడ్డాయి. ఆయత్ యొక్క చివరి పదం ఏముంది? లిల్ ముఅమినీన్, విశ్వాసుల కొరకు. అంటే ఏమిటి? ఇంతకు ముందు నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. వాస్తవానికి ఇది సర్వ మానవాళి కొరకు ఉపదేశము, స్వస్థత మరియు మార్గదర్శకత్వము, ఇంకా కారుణ్యము. కానీ ఎవరైతే వాస్తవ రూపంలో ఈ లాభాలు పొందుతారో, సర్వ మానవాళి పొందకుండా విశ్వాసులు ఈ లాభాలు పొందుతారు. ఎందుకు? విశ్వసించి దానిని అదే రీతిలో ఆచరిస్తారు గనుక.

ఇంతకు ముందు ఇచ్చిన ఒక సామెత మీకు గుర్తుందా? టార్చ్ లైట్ మీ చేతిలో ఉంది. బ్యాటరీ ఉంది. కానీ ఏం చేయాలి? రాత్రి మీరు ఏ దారి గుండా చీకటి దారిలో నడుస్తూ వెళ్తున్నారో, బ్యాటరీ ఆ టార్చ్ లైట్ వెంట తీసుకోవాలి, దాని బటన్లు నొక్కి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు మార్గం కనబడదు. ఎందుకు? మీరు దానిని మీరు నడిచే మార్గం వైపునకు కరెక్ట్ గా చూపించుకుంటూ వెళ్ళాలి. మీరు ఉదాహరణకు టార్చ్ లైట్ తీసుకున్నారు, బటన్ నొక్కారు, ఇక్కడ లైట్ ఉంది. కానీ దానిని ఆకాశం వైపునకు ఇలా ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. మీ ముంగట చీకటిలో ఏ దారి అయితే ఉందో అక్కడ వెలుతురు పడుతుందా? పడదు కదా?

అలాగే ముస్లింలారా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ కేవలం ఇళ్ళల్లో పెట్టుకొని, చేతిలో అందకుండా పైన ఎక్కడో అటుక మీద పెట్టి చదవకుండా, దానిని శ్రద్ధగా ఆలకించకుండా, దాని యొక్క అర్థ భావాలు తెలుసుకోకుండా, దాని ద్వారా ఎలా స్వస్థత పొందాలో ఆ ప్రయత్నం చేయకుండా మనం ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ఇంట్లో కాదు, జేబులో ఉన్నప్పటికీ, మీ యొక్క మొబైళ్ళలో ఉన్నప్పటికీ, మీ దుకాణాల్లో ఉన్నప్పటికీ, మీ బండిలో మీరు పెట్టుకున్నప్పటికీ మీ యొక్క జీవితాల్లో శుభాలు అనేటివి రావు. రోగాలు దూరం కావు, స్వస్థత అనేది కలగదు.

సూరతున్నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 69లో అల్లాహ్ త’ఆలా తేనె గురించి తెలిపాడు. తేనెటీగ మరియు తేనె యొక్క లాభం గురించి. “ఫీహి షిఫావుల్ లిన్నాస్”, తేనెలో సర్వ మానవాళికి స్వస్థత ఉంది అని. మొన్న కూడా మీరు వార్త చూశారు కావచ్చు. చివరికి కరోనా లాంటి రోగాలకైనా గానీ మన భారతదేశపు పాతకాలపు నాటి చికిత్సలను, ఔషధాలనే అమెరికా, యూరప్ లో కూడా వాడుతున్నారు. అక్కడి ల్యాబొరేటరీస్ లలో, అక్కడి శాస్త్రవేత్తలు తేనె లాంటి గొప్ప ఔషధం మరొకటి లేదు అని చెబుతున్నారు. అని తెలుగులో వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. తేనె, ఒరిజినల్ తేనె, 2000 రూపాయలకు కిలో పెట్టి మీరు కొన్నారు కావచ్చు. ఎంతో అందమైన బాటిల్ లో మీరు తీసుకొని వచ్చారు కావచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఎంతో మంచి చోట దాన్ని పెట్టేది ఉంటే, ఒక మంచి అందమైన చిన్న బాటిల్ లో ఒక 20, 30 గ్రాములు వేసుకొని జేబులో వేసుకుంటే లేదా కడుపునొప్పి ఉన్నప్పుడు కడుపుకు కట్టుకుంటే, ఏదైనా మెడనొప్పి ఉన్నప్పుడు మెడకు కట్టుకుంటే లేదా గొంతులో ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మెడ కింద కట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు కదా? డాక్టర్ మరియు ఆయుర్వేద అనుభవజ్ఞులైన వారు దానిని ఏ మోతాదులో, పొద్దున ఎన్నిసార్లు, నీళ్లలోనా, పాలల్లోనా, ఎందులో, నీళ్లు అయితే కూడా సామాన్య నీళ్లా, లేకుంటే కొంచెం కునుకున నీళ్లా, ఇవన్నీ మనం పద్ధతులు తెలుసుకొని ఆ విధంగా పాటించినప్పుడే దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో రోగాలకు మీరు డాక్టర్ల వద్ద నుండి మందు బిళ్ళలు గానీ, గొట్టం గోలీలు గానీ, లేకుంటే ఇంకా టానిక్ త్రాగే మందు గానీ తీసుకొని వస్తారు కదా? పొద్దుకు రెండు సార్లు తీసుకోవాలా, మూడు సార్లు తీసుకోవాలా, ఒక్కసారి తీసుకోవాలా, అన్నం కంటే ముందు తీసుకోవాలా, అన్నం తర్వాత తీసుకోవాలా, ఇవన్నీ విషయాలు మంచి విధంగా కనుక్కుంటారు కదా? అదే విధంగా దాన్ని పాటిస్తూ ఉంటారు కదా?

మరి ఖుర్ఆన్ విషయంలో కూడా స్వస్థత పొందే మార్గం ఏంటి? మనం ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందగలుగుతాము, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇంతవరకు చేయలేదు అంటే, మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో మనమే గమనించండి.

సోదర మహాశయులారా, ఖుర్ఆన్ ద్వారా మనం స్వస్థత అనేది నేను ఇంతకు ముందే తెలిపినట్లు, మన శారీరక రోగాలకు అంతకంటే ముఖ్యమైన మన హృదయ సంబంధమైన రోగాలకు కూడా ఇది మంచి స్వస్థత. హృదయ సంబంధ రోగాల గురించి కొన్ని విషయాలు ఇంతవరకే నేను చెప్పి ఉన్నాను. అయితే మనం ఖుర్ఆన్ చదువుతూ ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉండేది ఉంటే, దాని ప్రకారంగా మన ఆచరణ, దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో నడవడికలో మార్పు తెచ్చుకొని సదాచరణ పాటిస్తే, తప్పకుండా మన హృదయాల రోగాలకు స్వస్థత కలుగుతుంది.

హృదయ రోగాల యొక్క ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గుర్తుంచుకోండి.

“ఇన్న ఫిల్ జసది ముద్గా”, శరీరంలో ఒక అవయవం ఉంది. “ఇదా సలుహత్, సలుహల్ జసదు కుల్లు”, అది బాగుందంటే పూర్తి శరీరం బాగున్నట్లు. “వ ఇదా ఫసదత్, ఫసదల్ జసదు కుల్లు”, అది పాడైపోతే శరీరం అంతా కూడా పాడైపోతుంది. అదేమిటి? “అలా వహియల్ ఖల్బ్”, వినండి, అదే హృదయం.

అందుకొరకే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అన్నిటికంటే ముందు ఏం చూస్తారు? చెవిలో పెట్టుకొని రెండు దాని ద్వారా మీ యొక్క ఈ హృదయాన్ని, ముందు కూడా వెనక కూడా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? లేదా కొందరు ఆయుర్వేద అనుభవజ్ఞులు ఇక్కడ నాడి పట్టి చూస్తారు. దీని ద్వారా కూడా ఏం తెలుస్తుంది? హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? దీని ద్వారా శరీరంలోని ఎన్నో రోగాలను గుర్తుపడతారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హృదయం బాగుంది అంటే, అది అన్ని రకాల రోగాల నుండి స్వస్థత పొందింది అంటే మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎంతో మంచి మార్పు వస్తుంది. అందుకొరకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ నివారణ కొరకు, హృదయం మార్గదర్శకత్వంపై స్థిరంగా ఉండడానికి ఎన్నో దువాలు కూడా చేస్తూ ఉండేవారు. “అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా” ఇంకా వేరే ఎన్నో దువాలు ఉన్నాయి.

ఇక ఈ ఖుర్ఆన్ శారీరక రోగాలకు కూడా స్వస్థత. అవును. అల్హందులిల్లాహ్. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పేకి ముందు ఒక విషయం శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖుర్ఆన్ మీ శారీరక రోగాలకు కూడా స్వస్థత అని అంటే, ధర్మపరమైన వేరే ఔషధాలు వాడే అవసరం లేదు అని ఎంతమాత్రం భావం కాదు. చికిత్స చేయించుకోకూడదు అని ఎంతమాత్రం భావం కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. “దావూ మర్దాకుం యా ఇబాదల్లాహ్”, ఓ అల్లాహ్ దాసులారా, మీ యొక్క రోగాలకు మీరు చికిత్స చేయించండి. అయితే ఖుర్ఆన్ కు ప్రాధాన్యత అనేది ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఏముంది? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసి అన్ని మందులు వాడాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కానీ ఇక ఏదీ కూడా లాభం లేదు. ఇక అల్లాహ్ యే ఏదైనా చేయాలి అని ఇక ఖుర్ఆన్ ద్వారా స్వస్థత గురించి వచ్చాము. ఇలా ఉండకూడదు. ఖుర్ఆన్ శారీరక రోగాలకు మంచి ఔషధం, మంచి చికిత్స, దీని ద్వారా స్వస్థత కలుగుతుంది. అయితే రోగ ఆరంభంలో, అంతకంటే ముందు ఇంకా రోగం రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వెంటనే ఆరంభంలో, మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో దీని ద్వారా చికిత్స మనం పొందుతూ ఉండాలి. చిట్టచివరిసారిగా కాదు, ఈ యొక్క తప్పును మనం సరిదిద్దుకోవాలి.

రెండో విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఖుర్ఆన్ తప్పకుండా స్వస్థత. ఎందుకంటే అల్లాహ్ త’ఆలా తెలిపాడు ఈ విషయం ఖుర్ఆన్ లో. “వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా”, వాస్తవానికి మేము ఖుర్ఆన్ ద్వారా, ఖుర్ఆన్ ను స్వస్థత కొరకు అవతరింపజేశాము. “వ రహ్మతుల్ లిల్ ముఅమినీన్“, విశ్వాసుల కొరకు కారుణ్యంగా పంపాము.

అయితే ఇంతటి సత్యమైన మాటను మనం ఎలా తిరస్కరించగలుగుతాము? కానీ ఎంత ఎక్కువగా మన విశ్వాసం ఉంటుందో, ఎంత సత్యంగా మనం నమ్మి దీని ద్వారా చికిత్స చేయిస్తామో, అంతే ఎక్కువగా, అంతే తొందరగా అల్లాహ్ యొక్క దయతో మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఖుర్ఆన్ చదివినప్పటికీ స్వస్థత కలుగుతలేదు అని ఎవరైతే అంటారో వారు ఖుర్ఆన్ ను శంకించకూడదు, ఇంకా విశ్వాసం పాడైపోతుంది. తనలో, తాను అనాలసిస్ చేసుకోవాలి. తనలో తాను మార్పు తీసుకురావాలి. తనలో ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో దానిని కనుక్కునే ప్రయత్నం చేయాలి, దానిని వెతకాలి.

చిన్న ఉదాహరణ, షుగర్ రోగం తగ్గడానికి సర్వసాధారణంగా డాక్టర్లు, షుగర్ స్పెషలిస్టులు ఒక టాబ్లెట్ ఇస్తారు. స్టార్టింగ్ లో 2 mg. ఒక వారం, పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు ఇచ్చి చూసి డౌన్ కాకపోతే కొంచెం పెంచుతారు. కొందరు మూడు, మరికొందరు ఐదు. ఇంకా తగ్గకుంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు, ఒకటి కాడ రెండు, లేదా దానితో పాటు మరొకటి ఉంది, అది ఇస్తారు. కొందరి కొందరికి 300 కు పైగా, 400 కు ఆ విధంగా ఉండేది ఉంటే 400 కూడా దాటి ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ గురించి కూడా సలహా ఇస్తారు. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆయుర్వేద అనుభవజ్ఞులు, ఈ స్టార్టింగ్ డోస్ ద్వారానే మీకు 15 రోజుల్లో ఎందుకు తగ్గలేదు? మీరు ఏమైనా అన్నం తింటున్నారా? లేక మీరు పొటాటో లాంటి ఏమైనా కూరగాయలు తింటున్నారా? లేదా మీరు ఇంకా తీపి పదార్థాలు కూడా తింటూ ఉన్నారా? అని కూడా కనుక్కొని కొంచెం చురక పెడతారు. ఇది మీరు తగ్గించుకోకుంటే చాలా ప్రమాదంగా ఉంది అని. ఇక్కడ టాబ్లెట్ పని చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం, అటువైపు నుండి మీరు ఏ పత్యం చేయాలో అందులో సరిగ్గా పాస్ అవ్వలేదు. ఒక్క కారణం చెప్తున్నాను, మీరు 100% గా ఇదే విషయాన్ని ఖుర్ఆన్ పై ఫిట్ చేయకండి, విషయం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఖుర్ఆన్ చదివినప్పటికీ శారీరక కొన్ని రోగాలు మనకు దూరం కాలేదంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి కొరత లేదు నవూదుబిల్లాహ్, మనలో ఉంది. దాన్ని మనం అన్వేషించాలి, వెతకాలి, ఆ కొరత, ఆ లోపం, ఆ దోషాన్ని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి.

దీనికి సంబంధించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా తెలుపుతున్నారు. ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారంటే, ఏం చేసేవారు? ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బి రబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బి రబ్బిన్నాస్ చదువుకొని, తమ చేతులతో తమ శరీరంపై తుడుచుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వేదనకు గురి అయ్యారో, అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ దువాలు చదివి, ఈ సూరాలు చదివి, ప్రవక్త యొక్క చేతులను పట్టుకొని, ప్రవక్త యొక్క చేతులలో ఊది, ఎంతవరకు చేరగలుగుతుందో నేను ప్రవక్త చేతులతోనే ప్రవక్త శరీరంపై తుడుచేదాన్ని.ఇప్పుడు నేను చెప్పిన హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ఉక్బా రది అల్లాహు త’ఆలా అన్హు చెప్పారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సందర్భంలో ఓ ప్రయాణంలో ఉన్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ లోని రెండు రకాతులలో సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్ చదివారు. మళ్ళీ చెప్పారు, “లమ్ యతఅవ్వద్ ముతఅవ్విదున్ బిమిస్లిహిన్”, ఓ ఉక్బా, ఏ రకమైన రోగం గానీ, ఏ సమస్య ఎదురైనా గానీ, ఈ రెండు సూరాల కంటే ఉత్తమమైన వేరే ఏదీ కూడా అవసరం లేవు. గమనించారా? యూదుల్లో ఒకరు ప్రవక్తపై చేతబడి చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందులోనైతే చేతబడి చేయడం జరిగిందో ఆ వస్తువులను తెప్పించారు. వాటిలో 11 ముడులు వేసి ఉన్నాయి. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్, ఈ రెండు సూరాలలో కలిపి 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు సూరాల యొక్క తిలావత్ మొదలు పెట్టారు. ఒక్కొక్క ఆయత్ పూర్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి దానంతట అదే విడిపోయేది. ఏ విధంగా ముడులు విడిపోతూ ఉండేవో, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వస్థత అనేది ఎక్కువగా, మంచిగా ఏర్పడుతూ వచ్చింది.

సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారు ఓ ప్రయాణంలో ఉన్నారు, ఓ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది. ఆ ప్రాంతం యొక్క పెద్దలను కలిసి, మీ వద్ద మేము ఈ రాత్రి చుట్టాలుగా ఉంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు. ఆ ప్రాంతం యొక్క బయట శివార్లలో ఎలాగో రాత్రి గడుపుదాము అని ఉన్నారు. అదే రాత్రి ఆ గ్రామ పెద్ద మనిషికి ఏదో ఒక విషపురుగు కాటేసింది. ఎవరెవరో మంత్రగాళ్ళను, డాక్టర్లను పిలిపించి చికిత్స గురించి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు వారికి గుర్తొచ్చింది. అయ్యో, సాయంకాలం అయ్యేకి ముందుగా ఎవరో బయట నుండి కొందరు బాటసారులు వచ్చారు కదా, ఏమో వెళ్లి చూడండి కొంచెం ఏదైనా చుట్టుపక్కల ఉండవచ్చును, వారి దగ్గర ఏదైనా మంచి మందు ఉందో తెలుసుకుందాము. అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు తన వెంట ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లారు, సూరతుల్ ఫాతిహా చదివారు. అప్పటికప్పుడే అల్లాహ్ త’ఆలా ఆ గ్రామ పెద్ద మనిషికి ఆరోగ్యం ప్రసాదించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ ను శారీరక రోగాలకు కూడా స్వస్థతగా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్వస్థతకు అడ్డు కలిగించే విషయాలు ఏమున్నాయో, వాటి నుండి మనం దూరం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ వాటి నుండి మనం దూరం ఉండలేము అంటే చాలా నష్టపోతాము.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ గ్రంథాన్ని మన కొరకు స్వస్థత అని ఎన్నో హదీసుల్లో కూడా తెలిపారు. అంతేకాదు, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కొరకు కొన్ని దువాలు కూడా నేర్పి ఉన్నారు. అందుకొరకు ఒక సహీ హదీస్ లో వస్తుంది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త వద్దకు ఒక అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అతనికి అతనిపై షైతాన్ యొక్క ప్రభావం, షైతాన్ అతనిలో ప్రవేశించి ఉన్నాడు అని తెలిసింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులు తిలావత్ చేసి అతనిపై ఊదుతారు, అల్లాహ్ త’ఆలా అతనికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి,

కానీ చివరిలో నేను చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా మనం ఎలా స్వస్థత పొందాలి. మొట్టమొదటి విషయం, నేను చెప్పినటువంటి రెండు విషయాలను నమ్మాలి. అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ ముసబ్బిబుల్ అస్బాబ్, అన్ని సాధనాలకు మూల కారకుడు మరియు ఆ సాధనాలకు ఏ గుణం ఇచ్చాడో, ఆ గుణం ఇచ్చినవాడు అల్లాహ్ మాత్రమేనని. రెండో విషయం, అల్లాహ్ తలచినప్పుడే స్వస్థత కలుగుతుంది, అల్లాహ్ తలచినప్పుడే ప్రతీ సాధనం పని చేస్తుంది, అల్లాహ్ తలచినప్పుడే ఈ సృష్టిలో అల్లాహ్ కోరినది మాత్రమే జరుగుతూ వస్తుంది.

ఈనాటి నా ప్రసంగంలోని సారాంశంలో రెండో విషయం, ఖుర్ఆన్ ను మనం అల్లాహ్ యొక్క గ్రంథం అని, అల్లాహ్ యొక్క వాక్కు అని చాలా బలంగా విశ్వసించాలి. ఈ విశ్వాసంలో ఏ మాత్రం లోటు రాకూడదు, కొరత ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు.

ఈ ఖుర్ఆన్ మన యొక్క రోగాల, హృదయ రోగాలకు కూడా చికిత్స, మంచి ఔషధం, స్వస్థత కలుగుతుంది. అంటే, విశ్వాసం సరిగా లేనివారు విశ్వాసపరులు అవుతారు. నమాజులకు దూరం ఉన్నవారు నమాజు చదవగలుగుతారు. ఇంకా వేరే దుష్కార్యాలు చేసేవారు మంచి కార్యాలు చేయగలుగుతారు. కానీ ఎప్పుడు? ఖుర్ఆన్ ను చదివి శ్రద్ధగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు. ఖుర్ఆన్ గ్రంథం మన యొక్క ధర్మపరమైన అనుమానాలకు మంచి స్వస్థత కలుగజేస్తుంది. మరియు ఖుర్ఆన్ గ్రంథం మనలో ఏ చెడు పనుల గురించి కోరికలు పుడతాయో, మన యొక్క చెడు మనస్సు ఏ చెడులకైతే ప్రేరేపిస్తుందో, వాటన్నిటి నుండి కూడా అల్హందులిల్లాహ్ స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా? ఖుర్ఆన్ ను చదవడం ద్వారా, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకోవడం ద్వారా, ఖుర్ఆన్ ప్రకారంగా మన జీవితం గడుపుకోవడం ద్వారా.

అలాగే ఖుర్ఆన్ మన యొక్క శారీరక రోగాలకు కూడా మంచి స్వస్థత. అది కూడా ఎప్పుడు? పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, పూర్తి సత్యంతో మనం ఈ ఖుర్ఆన్ ను స్వయం మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు గానీ, లేక వేరే ఇంకా ఏదైనా రోగికి చదవాలి.

కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, ఈ ఖుర్ఆన్ ద్వారా అల్హందులిల్లాహ్ అల్లాహ్ త’ఆలా ఏ స్వస్థత మనకు కలుగజేస్తాడని శుభవార్త ఇచ్చాడో, ఖుర్ఆన్ లోని ఎన్నో ఆయతులలో, ఈ ఖుర్ఆన్ ను ప్రజల రోగాల కొరకు స్వస్థత అని ప్రజల విశ్వాసాలను పాడు చేయకూడదు. అబద్ధపు, అసత్యపు బోర్డులు వేసి, సోషల్ మీడియా ద్వారా తమ గురించి ప్రచారం చేసుకుంటూ, తమ నెంబర్ ప్రజలకు ఇస్తూ, రూహానీ ఇలాజ్, ఖురానీ ఇలాజ్ మా దగ్గర జరుగుతుంది అంటూ వారిని షిర్క్ లో పడవేయడం గానీ, ఖురానీ ఇలాజ్ అన్న పేరుతో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి, ఫలానా రాత్రి, ఫలానా చోట జిబా చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, సోదర మహాశయులారా ఫలానా సమాధి వద్ద, ఫలానా బాబాగారు ఖుర్ఆన్ తో ఇలాజ్ మరియు స్వస్థత కలుగజేస్తాడట అని అలాంటి సమాధుల వైపునకు వెళ్లడం, ఈ విషయాలన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను చివరిలో, ఈ తప్పు విషయాల నుండి మనం చాలా దూరం ఉండాలి. వీటి ద్వారా విశ్వాసం పాడైపోతుంది, వీటి ద్వారా మనం ఇస్లాం నుండి దూరమైపోతాము అని మనం భయపడాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్ ద్వారా సరైన రీతిలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త యొక్క పద్ధతి, విధానంలో స్వస్థత కోరే, పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వ ఆఖిరు దఅవానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

  • అల్లాహ్‌పై దృఢ విశ్వాసం: సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదని గట్టిగా నమ్మాలి. అన్నీ ఆయన తలచినప్పుడే జరుగుతాయి.
  • ఖుర్ఆన్ – కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత: అల్లాహ్ ఖుర్ఆన్‌ను కేవలం ఔషధం (దవా) లేదా చికిత్స (ఇలాజ్) అని చెప్పలేదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఖుర్ఆన్ ద్వారా రోగం పూర్తిగా నయమవుతుంది.
  • శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు నివారణ: ఖుర్ఆన్ కేవలం జ్వరం, నొప్పి వంటి శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు, చెడు ఆలోచనలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది.
  • విశ్వాసులకు ప్రత్యేకం: ఖుర్ఆన్ సర్వమానవాళికి మార్గదర్శకమైనప్పటికీ, దాని ద్వారా సంపూర్ణ స్వస్థత మరియు కారుణ్యం పొందేది విశ్వాసులు మాత్రమే. ఎందుకంటే వారు దానిని నమ్మి ఆచరిస్తారు.
  • సరైన పద్ధతిలో ఆచరించడం ముఖ్యం: తేనె సీసా ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం రానట్లే, ఖుర్ఆన్‌ను చదవకుండా, అర్థం చేసుకోకుండా, దాని బోధనలను ఆచరించకుండా ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత కలగదు.
  • మూఢనమ్మకాలకు దూరం: ఖుర్ఆన్ పేరుతో నిమ్మకాయలు, కోడి బలులు, సమాధుల వద్ద మొక్కుబడులు వంటి షిర్క్ మరియు మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఇది విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.
  • లౌకిక చికిత్సను తిరస్కరించరాదు: ఖుర్ఆన్ స్వస్థత ఇస్తుందని వైద్య చికిత్సను మానేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చికిత్స చేయించుకోవాలని బోధించారు. ఖుర్ఆన్ పారాయణంతో పాటు వైద్యం కూడా కొనసాగించాలి.
  1. విశ్వాసాన్ని బలపరచుకోండి: ప్రతిదీ అల్లాహ్ అధీనంలోనే ఉందని, ఆయన తలచినప్పుడే స్వస్థత లభిస్తుందని మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి.
  2. ఖుర్ఆన్‌ను రోజూ పారాయణం చేయండి: ఖుర్ఆన్‌ను అర్థంతో సహా క్రమం తప్పకుండా చదవండి. దాని బోధనలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి.
  3. రుఖియా (ఖుర్ఆన్ ద్వారా చికిత్స) చేసుకోండి: అనారోగ్యానికి గురైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిలో సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫలక్, సూరతున్నాస్ వంటి సూరాలను చదివి మీపై లేదా రోగిపై ఊదుకోండి.
  4. దువా చేయండి: స్వస్థత కోసం అల్లాహ్‌ను ప్రార్థించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దువాలను నేర్చుకొని వాటి ద్వారా అల్లాహ్‌ను వేడుకోండి.
  5. పాపాలకు దూరంగా ఉండండి: స్వస్థతకు అడ్డుపడే పాప కార్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
  6. మూఢనమ్మకాలను వదిలివేయండి: ఖుర్ఆన్ పేరుతో జరిగే మోసాలకు, షిర్క్‌కు దారితీసే పద్ధతులకు దూరంగా ఉండండి. స్వస్థతను ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమేనని నమ్మండి.
  7. వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు: రుఖియాతో పాటు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోండి మరియు వారు సూచించిన మందులను వాడండి. ఇస్లాం వైద్య చికిత్సను ప్రోత్సహిస్తుంది.
  8. సమస్య ఆరంభంలోనే ఖుర్ఆన్‌ను ఆశ్రయించండి: కేవలం అన్ని దారులు మూసుకుపోయాకే కాకుండా, అనారోగ్యం ప్రారంభ దశలోనే ఖుర్ఆన్ ద్వారా స్వస్థత కోసం ప్రయత్నించండి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=13889

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

జుమా ఖుత్బా సందర్భంలో మౌనంగా ఉండుట తప్పనిసరి [ఆడియో, టెక్స్ట్]

[8 నిముషాలు]
https://youtu.be/cRqGXyIpURs
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం శుక్రవారం ఖుత్బా (ప్రసంగం) సమయంలో నిశ్శబ్దం పాటించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఖుత్బా జరుగుతున్నప్పుడు ఇతరులను నిశ్శబ్దంగా ఉండమని చెప్పడం కూడా నిషేధించబడినదని, అలా చేయడం శుక్రవారం నమాజ్ యొక్క పుణ్యాన్ని కోల్పోయేలా చేస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. శుక్రవారం నాడు త్వరగా వచ్చి, స్నానం చేసి, నఫిల్ నమాజ్ చేసి, మౌనంగా ఖుత్బా విన్నవారికి పది రోజుల పాపాలు క్షమించబడతాయని చెప్పబడింది. ఖుత్బా వినడం అనేది అజాన్‌కు సమాధానం ఇవ్వడం కంటే ముఖ్యమైనదని, ఆలస్యంగా వచ్చినవారు కూడా సంక్షిప్తంగా రెండు రకాతుల నమాజ్ చేసి ఖుత్బా వినడంలో నిమగ్నం కావాలని ఈ ప్రసంగం బోధిస్తుంది.

السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد.
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్.)
(అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీపై వర్షించుగాక. సర్వస్తోత్రాలు అల్లాహ్‌కే శోభాయమానం. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక.)

باب الإنصات للخطبة يوم الجمعة
(బాబుల్ ఇన్సాతి లిల్ ఖుత్బతి యౌమల్ జుమా)
(శుక్రవారం రోజు ఖుత్బాకు మౌనంగా వినడం అనే అధ్యాయం.)

జుమా రోజు ఖుత్బా జరుగుతున్న సమయంలో మౌనం వహించడం, గమ్మున ఉండడం.

عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: إذا قلت لصاحبك يوم الجمعة أنصت والإمام يخطب، فقد لغوت
(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: ఇదా ఖుల్త లిసాహిబిక యౌమల్ జుముఅతి అన్‌సిత్ వల్ ఇమాము యఖ్తుబు, ఫఖద్ లగౌత)

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “జుమా రోజు ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో ‘మౌనం వహించు’ అని అంటే, నీవు ఒక లగ్వ్ (వ్యర్థమైన) పని చేసినవానివి అవుతావు.”

ఈ హదీస్ ద్వారా మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి, ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో, జుమా రోజు, మనం సైలెంట్‌గా ఉండాలి, మౌనం వహించాలి. ఏ కార్యకలాపాలు చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు.

రెండో బోధ మనకిందులో, మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నాము, కొందరు మాట్లాడుకుంటున్నారు, ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారు, వారికి కూడా మనం చెప్పకూడదు. “అరే ఇలా చేయకు,” “ఓ బాయ్, ఖామోష్ రహో,” “మౌనం వహించు,” “ప్లీజ్ సైలెంట్‌గా ఉండు” అని మనం చెప్పకూడదు. ఇది ఇమామ్ యొక్క బాధ్యత, ఇమామ్ చెప్పాలి.

ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే, ఒకవేళ మనం ఇమామ్ ఖుత్బా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా, “మీరు గమ్మున ఉండండి,” “మాట్లాడకండి,” “ప్లీజ్ సైలెంట్” అని మనం చెప్పామంటే, మనం లగ్వ్ చేసిన వాళ్ళం అయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు.

లగ్వ్ అంటే ఇక్కడ ఏంటి? లగ్వ్ అంటే ఇక్కడ పనికిమాలిన, వృధా మాట. అయితే, చూడటానికి ఇక్కడ గమనించండి, గమనించండి, చూడటానికి మనం ఒక మంచి పని చేశామని అనిపిస్తుంది కదా? ఒక ఇద్దరు మాట్లాడుకుంటే, “ష్, సైలెంట్ ప్లీజ్” ఈ విధంగా మెల్లగా చెప్పేశాము. మనం ఒక మంచి పని చేశాము అనే భావన మనకు ఏర్పడింది. కానీ ప్రవక్త ఏమంటున్నారు? فقد لغوت (ఫఖద్ లగౌత) – “నీవు ఒక లగ్వ్ పని చేశావు” అని. మరియు ఇక్కడ లగ్వ్ అన్నదానికి భావం, ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ అస్కలానీ రహ్మతుల్లా అలై తెలిపినట్లు,

خبت من الأجر
(ఖిబ్త మినల్ అజ్ర్)
నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు.

بطلت فضيلة جمعتك
(బతలత్ ఫజీలతు జుముఅతిక్)
జుమాకు సంబంధించిన ఏ ఘనత, ఏ గొప్పతనం అయితే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం. అల్లాహు అక్బర్.

حرم فضيلة الجمعة
(హురిమ ఫజీలతల్ జుమా)
జుమా యొక్క ఫజీలత్ ఏదైతే ఉందో దాని నుండి అతడు మహ్రూమ్ అయిపోయాడు

అందుకొరకు సోదర మహాశయులారా, కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము, ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో, అనేకమంది మన సోదరులు, మిత్రులు ఖుత్బా అరబీలో జరుగుతుంది, మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు, ముగ్గురు, నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇది ఇంకా మహా ఘోరమైన విషయం.

గమనించండి ఇక్కడ. ఇద్దరు మాట్లాడుకునే వారిని, “మీరు సైలెంట్‌గా ఉండండి” అని చెప్పడంలోనే పాపం ఉన్నది, జుమా యొక్క సవాబ్ (పుణ్యం) కోల్పోతున్నారంటే, ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి. ఈ హదీస్ ఏదైతే మీకు వినిపించానో, సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 934, అలాగే సహీ ముస్లిం, హదీస్ నంబర్ 851.

ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము.

عن أبي هريرة رضي الله عنه أن النبي صلى الله عليه وسلم قال: من اغتسل ثم أتى الجمعة، فصلى ما قدر له، ثم أنصت حتى يفرغ من خطبته، ثم يصلي معه، غفر له ما بينه وبين الجمعة الأخرى، وفضل ثلاثة أيام

(అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు అన్న నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల్: మనిగ్తసల సుమ్మ అతల్ జుముఅత, ఫసల్లా మా ఖుద్దిర లహు, సుమ్మ అన్‌సత హత్తా యఫ్రుగ మిన్ ఖుత్బతిహి, సుమ్మ యుసల్లీ మఅహు, గుఫిర లహు మా బైనహు వ బైనల్ జుముఅతిల్ ఉఖ్రా, వ ఫద్లు సలాసతి అయ్యామ్)

ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో, జుమా నమాజు కొరకు హాజరయ్యారో మరియు ఖుత్బా కంటే ముందు వచ్చి అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతులు చేశాడో (ఇది జుమా ఖుత్బా కంటే ముందు, సామాన్యంగా వీటిని మనం నఫిల్ అంటాము. జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు. కనీసం రెండు రకాతులు, కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు. ఇమామ్ ఖుత్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు), ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమామ్ ఖుత్బా మొదలు పెడతాడో అప్పటి నుండి ఖుత్బా పూర్తి అయ్యే వరకు అన్‌సత (أنصت) – సైలెంట్‌గా ఉన్నాడు, మౌనం వహించాడు, గమ్మున ఉండిపోయాడు. ఆ తర్వాత ఇమామ్‌తో నమాజ్ చేశాడు. ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు, అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా, అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహ్‌తాలా మన్నిస్తాడు. అల్లాహు అక్బర్.

గమనించండి, పది రోజుల పాపాలు జుమా రోజు నమాజుకు హాజరై, త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అంటే అన్ని చేసుకొని, ఇమామ్‌తో ఖుత్బా వినడంలో శ్రద్ధ వహించడం, మౌనం వహించడం, అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటి? ఒకవేళ ఎవరైనా మాట్లాడారో, మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారో అంటే వారు జుమా యొక్క సవాబును కోల్పోయారు.

ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు. వచ్చేసరికి ఏదైనా ఆలస్యం అయిపోయింది, మేము మస్జిద్‌లోకి వచ్చాము, ఇమామ్ అజాన్ ఇస్తున్నాడు. ఆ సందర్భంలో ఏం చేయాలి? రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా? లేకుంటే అజాన్ అయ్యేవరకు మేము వేచి ఉండాలా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడానికి? అయితే సోదర మహాశయులారా, అజాన్ యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం, కానీ ఇమామ్ యొక్క ఖుత్బా వినడం అనేది అజాన్ యొక్క జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక, సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి, ఇమామ్ యొక్క ఖుత్బా శ్రద్ధగా వినాలి.

అల్లాహ్ మనందరికీ మన జీవితంలోని ప్రతీ సమస్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపినటువంటి పరిష్కారాన్ని స్వీకరించి ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక.


494. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్


ఇతరములు:

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు. ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి

జుమా (శుక్ర వారం)
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు [ఆడియో, టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మరణం మరియు సమాధి శిక్షల వివరాలు, సందేహ సమాధానాలు
https://www.youtube.com/watch?v=_HrW7uu-pc4 [14 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం మరణం మరియు సమాధి జీవితం (బర్ జఖ్) గురించిన వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తుంది. మరణ దూత (మలకుల్ మౌత్) అందరికీ ఒకరేనని, వేర్వేరు మతాల వారికి వేర్వేరు దూతలు ఉండరని స్పష్టం చేస్తుంది. విశ్వాసులు మరియు అవిశ్వాసుల మరణ అనుభవాలలో తేడా ఉంటుందని సహీ హదీసుల ఆధారంగా వివరిస్తుంది. విశ్వాసి ఆత్మ శాంతియుతంగా తీయబడి, స్వర్గపు సువాసనలతో స్వీకరించబడి, ఆకాశాలలో గౌరవించబడుతుంది. దీనికి విరుద్ధంగా, అవిశ్వాసి ఆత్మ కఠినంగా తీయబడి, నరకపు దుర్వాసనలతో అవమానించబడుతుంది. సమాధిలో పెట్టడం అనేది సాధారణ పద్ధతి అయినప్పటికీ, దహనం చేయబడిన లేదా ఏ విధంగానైనా శరీరం నాశనమైనప్పటికీ, ఆత్మకు శిక్ష లేదా బహుమానం తప్పదని ఖురాన్ మరియు హదీసుల ద్వారా వివరిస్తుంది. ఈ మధ్య కాలాన్ని “బర్ జఖ్” అని అంటారు. చివరగా, సమాధిలో జరిగే ముగ్గురు దేవదూతల ప్రశ్నలు (నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు?) మరియు వాటికి విశ్వాసులు, అవిశ్వాసులు ఇచ్చే సమాధానాలను చర్చిస్తుంది.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బ’అద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కురియుగాక. ఇక ఆ తర్వాత.

చావు మరియు సమాధి శిక్షణ గురించి ఒక ప్రశ్న వచ్చింది. వాస్తవానికి ఆ ప్రశ్నలో ఎన్నో ఇంకా లింక్ ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానంగా ఈ ఆడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. శ్రద్ధగా వింటారని, విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.

మొదటి విషయం ఏమిటంటే, సామాన్యంగా చావు దూత అని, మలకుల్ మౌత్ అని, మౌత్ కా ఫరిష్తా అని, లేదా యమదూత అని ఏదైతే అంటారో, హిందువులకు వేరు, ముస్లింలకు వేరు, క్రైస్తవులకు వేరు, వేరే ఇంకా మతాలు అవలంబించే వారికి వేరు, అలాగా ఏమీ లేరు. ఇలాంటి భ్రమలో నుండి మనం బయటికి రావాలి. వాస్తవానికి, ప్రాణం తీసే దూత మరియు ఆయనకు తోడుగా వచ్చే అటువంటి దూతలు, ఆ తోడుగా వచ్చే దూతల యొక్క సంఖ్య అల్లాహ్ కు మాత్రమే తెలుసు. అయితే, ఇక్కడ మనకు ఖురాన్ హదీస్ ద్వారా తెలుస్తున్న విషయం ఏంటంటే, విశ్వాసులు, పుణ్యాత్ములు వీరికి వీరి యొక్క ప్రాణం ఒక రకంగా తీయడం జరుగుతుంది మరియు ఎవరైతే అవిశ్వాసులు లేదా విశ్వాసులుగా ఉండి కలిమా చదివి కూడా మహా పాపాత్ములు ఉంటారో వారి యొక్క ప్రాణం మరో రకంగా తీయడం జరుగుతుంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఖురాన్ యొక్క ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఏదైనా వేరే సందర్భంలో ఆ ఆయతులు, ఆ వాటి యొక్క అర్థం భావం అనేది ఇన్ షా అల్లాహ్ రికార్డ్ చేసి పంపుదాము. కానీ సంక్షిప్తంగా ప్రస్తుతం ఏంటంటే, సహీ హదీస్లో వచ్చిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు.

విశ్వాసుడు, పుణ్యాత్ముడు అతని ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు, ప్రాణం తీసే దూత, ఆయన కూడా దైవదూతనే, ప్రాణం తీసే దూత వస్తాడు మరియు స్వర్గం నుండి కరుణ దూతలు కూడా హాజరవుతారు. స్వర్గం నుండి వారు సువాసనతో కూడి ఉన్నటువంటి వస్త్రాలు తీసుకొని వస్తారు. ఆ తర్వాత అతని దగ్గర కూర్చుండి, ప్రభువు యొక్క కారుణ్యం వైపునకు, అల్లాహ్ యొక్క సంతృష్టి వైపునకు వచ్చేసెయ్ ఓ పవిత్ర ఆత్మా, ఈ రోజు నీపై నీ ప్రభువు ఏమీ కోపగించుకోకుండా నీ పట్ల సంతృప్తి కలిగి ఉన్నాడు అన్నటువంటి శుభవార్తలు వినిపిస్తూ ఉంటారు. దీని సంక్షిప్త విషయం ఖురాన్ సూరే హామీమ్ అస్సజ్దాలో కూడా వచ్చి ఉంది.

وَأَبْشِرُوا بِالْجَنَّةِ الَّتِي كُنتُمْ تُوعَدُونَ
(వ అబ్షిరూ బిల్ జన్నతిల్లతీ కున్తుం తూ’అదూన్)
“మీకు వాగ్దానం చేయబడిన స్వర్గం ఇదేనని సంతోషించండి.” (41:30)

ఇక ప్రాణం తీసే దూత ఎంతో సునాయాసంగా, నిదానంగా మంచి విధంగా అతని యొక్క ప్రాణం తీస్తాడు. ఆ మనిషి యొక్క ఆత్మ కూడా మంచి విధంగా ఆ ప్రాణం తీసే దూత యొక్క చేతుల్లోకి వచ్చేస్తుంది. దానికి కూడా హదీసుల్లో కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ దైవదూతలు వెంటనే ఆ సువాసనలతో కూడి ఉన్నటువంటి స్వర్గపు వస్త్రాలలో ఆ ఆత్మను చుట్టుకొని ఆకాశం పైకి వెళ్తారు. మొదటి ఆకాశం ద్వారాలు మూయబడి ఉంటాయి. అయితే అక్కడ తీసుకుపోయే దూతలు పర్మిషన్ కోరుతారు. ఆకాశపు యొక్క ఆ దూతలు అడుగుతారు, ఈ మంచి ఆత్మ ఎవరిది మీరు తీసుకొని వస్తున్నారు? అయితే అతని యొక్క మంచి పేరు, మంచి గుణాలు ఈ దైవదూతలు తెలియజేస్తారు. ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆ మొదటి ఆకాశపు దైవదూతలు ఘనంగా ఇతన్ని స్వాగతిస్తూ ఆ దూతలతో కలిసి ఇంకా పైకి వెళ్తారు. ఈ విధంగా రెండో ఆకాశం పైకి చేరుతారు. అలాగే అక్కడ కూడా స్వాగతం జరుగుతుంది, ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. చివరికి ప్రతి ఆకాశంలో కూడా అలాగే జరుగుతుంది. ఏడో ఆకాశం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆదేశం వస్తుంది. నా యొక్క ఈ దాసుని యొక్క ఆ నామము عِلِّيِّينَ (ఇల్లియీన్) ఉన్నతమైన స్థానం లో రాయండి. మరో ఉల్లేఖన ప్రకారం, ఇతని యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో, దీని ఇతడు స్వర్గపు యొక్క రుచులు, స్వర్గపు యొక్క మంచి అనుభవాలు పొందుతూ ఉంటాడు. కానీ, మళ్ళీ అతన్ని ప్రశ్నించడానికి తిరిగి ఆ మనిషిని ఏదైతే సమాధిలో ఖననం చేయడం జరుగుతుందో, ఆ అతని శరీరంలో పంపడం జరుగుతుంది. ఇది విశ్వాసుడు, పుణ్యాత్ముని యొక్క ఆత్మ ఏదైతే తీయడం జరుగుతుందో దాని యొక్క సంక్షిప్త విషయం.

ఇక మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కాఫిర్ (అవిశ్వాసుడు), ఫాసిఖ్ వ ఫాజిర్ (పాపాత్ములు) వారి యొక్క ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు ప్రాణం తీసే దూత వస్తాడు మరియు నరకం నుండి శిక్ష దూతలు దుర్వాసనతో కూడి ఉన్న చెడ్డ వస్త్రాలను తీసుకొని వస్తారు. ప్రాణం తీసే దూత ఓ చెడు ఆత్మా, వచ్చేసెయ్ అల్లాహ్ యొక్క కోపం, ఆగ్రహం వైపునకు అని అంటారు. అతని యొక్క ఆత్మ శరీరంలో తిరుగుతుంది. ఆ ప్రాణం తీసే దైవదూత చేతిలోకి రావడానికి రెడీగా ఉండదు. కానీ బలవంతంగా తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ దూతలు ఆ వస్త్రాల్లో చుట్టుకొని పైకి వెళ్తారు. కానీ ఆకాశపు ద్వారాలు తెరవబడవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ లోని ఈ ఆయత్ కూడా చదివారు:

لَا تُفَتَّحُ لَهُمْ أَبْوَابُ السَّمَاءِ
(లా తుఫత్తహు లహుమ్ అబ్వాబుస్ సమా’)
వారి కొరకు ఆకాశ ద్వారాలు తెరవబడవు. (7:40)

మళ్ళీ అక్కడి నుండే అతని యొక్క ఆత్మను క్రిందికి విసిరివేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరే హజ్ లోని ఆయత్ చదివారు:

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ فَتَخْطَفُهُ الطَّيْرُ أَوْ تَهْوِي بِهِ الرِّيحُ فِي مَكَانٍ سَحِيقٍ
(వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫక అన్నమా ఖర్ర మినస్ సమా’ఇ ఫతఖ్తఫుహుత్ తైరు అవ్ తహ్వీ బిహిర్ రీహు ఫీ మకానిన్ సహీఖ్)
అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయిన వాని వంటివాడు. పక్షులు అతన్ని తన్నుకుపోతాయి, లేదా గాలి అతన్ని దూరప్రాంతానికి విసిరివేస్తుంది. (22:31)

అంటే అల్లాహ్ తో పాటు షిర్క్ చేసేవారు, ఇలా పాపాలలో తమ జీవితం పూర్తిగా గడిపేవారు, పాపాలలో విలీనమైన వారు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వారి యొక్క ఉపమానం ఎలా తెలుపుతున్నాడంటే,

فَكَأَنَّمَا خَرَّ مِنَ السَّمَاءِ
(ఫక అన్నమా ఖర్ర మినస్ సమా)
ఆకాశం నుండి పడిపోయిన వాని వలె.
ఆకాశం నుండి పడిపోయిన వారు, ఇక అతనిని పక్షులు తమ యొక్క చుంచులతో వేటాడుతాయి, లాక్కుంటాయి, లేదా గాలి అనేది అటు ఇటు ఎక్కడైనా విసిరి పారేస్తుంది. అక్కడి నుండి పారేయడం జరుగుతుంది. అయితే ఏడు భూముల కింద سِجِّين (సిజ్జీన్) ఖైదీల చిట్టా అనే ఏదైతే దఫ్తర్ (రిజిస్టర్), ప్రాంతం ఏదైతే ఉందో అందులో అతని నామం రాయడం జరుగుతుంది. ఇక అతన్ని, ఆ శరీరం, భౌతికాయాన్ని అతని బంధువులు ఖననం చేశారంటే, అక్కడ ప్రశ్నోత్తరాల గురించి అందులో పంపడం జరుగుతుంది.

ఇక ఆ తర్వాత, సమాధిలో ఏదైతే పెట్టడం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుంది సంక్షిప్తంగా వినండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరంగా ఆ విషయాలు తెలిపారు. కానీ ఆ విషయాల యొక్క వివరణలో వెళ్ళేకి ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. అదేమిటంటే, సామాన్యంగా సమాధి యొక్క శిక్ష లేదా సమాధి యొక్క వరాలు అని ఏదైతే అనడం జరుగుతుందో, ఇక్కడ ఇలా ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వాస్తవానికి మానవ చరిత్రలో మానవునికి ఇవ్వబడిన ఆదేశ ప్రకారం అతన్ని సమాధిలో పెట్టడమే. ఇక ఎవరైతే సమాధిలో పెట్టకుండా వేరే పద్ధతులు అవలంబిస్తున్నారో, వారు స్వభావానికి, ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నారు. ఇదొక మాట అయితే, రెండో మాట ఏమిటంటే, అధిక శాతం చనిపోయే వారిని సమాధిలో పెట్టడం జరుగుతుంది. అందుకొరకే ఈ పదాలు ఉపయోగించబడ్డాయి.

కానీ ఇక ఎవరైనా, ఎవరిదైనా కాల్చివేయడం జరిగితే, లేదా ఎవరైనా అగ్నికి ఆహుతి అయి పూర్తిగా బూడిదైపోతే, లేదా ఏదైనా మృగ జంతువు యొక్క ఆహారంగా మారిపోతే, ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, మనిషిని బొందలో పెట్టకుండా, సమాధిలో పెట్టకుండా ఏ విధంగా ఏది జరిగినా గానీ, ఈ శరీరం ఏదైతే ఉందో, భౌతికాయం అని ఏదైతే అంటామో అది నాశనమైపోతుంది. కానీ ఆత్మ అయితే ఉంటుంది. అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే ఆత్మకైనా శిక్ష ఇవ్వవచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలై దీనికి సంబంధించిన ఎన్నో వివరాలు తెలిపి ఉన్నారు. అల్లాహ్ తలుచుకుంటే ఆ కుళ్ళిపోయిన, కాలిపోయిన, ఆహారంగా మారిపోయిన ఆ శరీరాన్ని మరోసారి ఉనికిలోకి తీసుకురావచ్చు. లేదా అల్లాహ్ త’ఆలా తలుచుకుంటే కొత్త శరీరం ప్రసాదించవచ్చు. అల్లాహ్ తలుచుకుంటే, సమాధి యొక్క శిక్షలు మరియు వరాలు ఏవైతే ఉన్నాయో, శిక్షలు అంటే అవిశ్వాసులకు పాపాత్ములకు, వరాలు అంటే, అనుగ్రహాలు అంటే విశ్వాసులకు మరియు పుణ్యాత్ములకు, ఈ సమాధి శిక్షలు లేదా అనుగ్రహాలు, వరాలు ఇవి ప్రతి ఒక్కరికీ జరిగి ఉంటాయి.

وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(వ మిన్ వరా’ఇహిమ్ బర్ జ ఖున్ ఇలా యౌమి యుబ్ ‘అసూన్)
వారి వెనుక పునరుత్థాన దినం వరకు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. (23:100)

దీన్నే కొందరు మధ్య కాలం, ఇటు ఇహలోకం అటు పరలోకం, దాని మధ్య లోకం ఇది. మధ్య లోకంలో ఇవి తప్పకుండా జరిగి ఉంటాయి. తప్పకుండా జరిగి ఉంటాయి. ఈ విశ్వాసం మనం తప్పకుండా మనసులో నిశ్చయించాలి. ఈ విషయాలను నమ్మాలి.

ఇక సమాధిలో… సమాధి అంటే ఇక్కడ గుర్తు ఉంది కదా, ఒకవేళ ఎవరినైనా సమాధిలో పెట్టడం జరగకపోయినా గానీ వారిని ప్రశ్నించడం జరుగుతుంది. వచ్చి దైవదూత అడుగుతాడు, నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? అప్పుడు విశ్వాసుడు అయితే, నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు నా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సమాధానం ఇస్తాడు. తర్వాత నాలుగో ప్రశ్న అడగడం జరుగుతుంది, ఈ విషయాలు నీవు ఎలా తెలుసుకున్నావు అని? అతడు చెబుతాడు, నేను ఖురాన్ ను చదివాను, ధర్మం నేర్చుకున్నాను అని.

ఇక ఎవరైతే అవిశ్వాసి లేదా పాపాత్ముడై ఉంటాడో, మహా ఘోరమైన పాపాత్ముడు, అలాంటి వారు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వరు. అయ్యో, మాకు తెలియదు, ప్రజలు అన్నట్లుగా మేమన్నాము అని అంటారు. నువ్వు ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు చదువుకోలేదు, ఎందుకు చదువుకున్న వారిని అనుసరించి ఖురాన్ పారాయణం చేయలేదు అని చెప్పుకుంటూ వారిని కొట్టడం, శిక్షించడం జరుగుతుంది.

ఇక సమాధిలో, ఈ మధ్య లోకంలో జరిగే అటువంటి మరికొన్ని వివరాలు కూడా ఉన్నాయి. కానీ సమయం ఇప్పటికే ఎక్కువైనందుకు నేను ఇంతటితో ముగిస్తున్నాను. కానీ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లభించింది అని ఆశిస్తున్నాను. సంక్షిప్తంగా మీ ప్రశ్న ఏముండే? ఎవరి చావు ఎట్లా వస్తుంది? హిందువులకు వేరే రకంగా యమదూత వస్తాడా, ప్రాణం తీసే దూత వస్తాడా? ఇంకా ముస్లింలకు వేరే దూతనా? మనలాంటి, మనకు జరిగే విధంగానే వారికి జరుగుతాయా? మరి వారినైతే సమాధిలో పెట్టడం జరగదు కదా, కాల్చేస్తారు కదా, మరి వారికి ఎలా జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఏవైతే వచ్చాయో వాటన్నిటినీ కలుపుకొని ఈ సంక్షిప్త విషయం తెలపడం జరిగింది.

చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని, మళ్ళీ అల్లాహ్ యొక్క మైదానే మహ్షర్ లో నిలబడే వరకు ఏ ఏ సంఘటనలు జరుగుతాయని ఖురాన్ మరియు సహీ హదీసులలో తెలపబడ్డాయో, వాటన్నిటినీ మనం విశ్వసించి ఆ ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఉంచేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రములు.

أَسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులతో దుఆ చేయు నష్టాలు (خطورة الدعاء مع غير الله)
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

https://www.youtube.com/watch?v=k3vxVbMjq6g [27 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వివరిస్తున్నారు. దుఆ కేవలం అల్లాహ్ కే చెందాలని, ఆయనను కాకుండా ఇతరులను ప్రార్థించడం షిర్క్ (బహుదైవారాధన) మరియు కుఫ్ర్ (అవిశ్వాసం) అవుతుందని స్పష్టం చేస్తున్నారు. దుఆయే అసలైన ఇబాదత్ (ఆరాధన) అని, ఇతరులతో దుఆ చేయడం మహా అన్యాయం మరియు దౌర్జన్యం అని నొక్కిచెప్పారు. అల్లాహ్ ను వదిలి ప్రార్థించబడే వారికి ఎలాంటి శక్తి లేదని, వారు మన మొరలు వినలేరని, సహాయం చేయలేరని మరియు ప్రళయ దినాన మనకు శత్రువులుగా మారిపోతారని ఖురాన్ ఆయతుల ద్వారా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ కష్టసుఖాలలో కేవలం ఏకైక అల్లాహ్ ను మాత్రమే వేడుకోవాలని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

సోదర సోదరీమణులారా! దుఆ అల్లాహ్ యేతరులతో చేయడం ఎంత నష్టమో ఎప్పుడైనా మనం గమనించామా? ఈరోజు ఈ అతి ముఖ్యమైన శీర్షికకు సంబంధించిన కొన్ని ఆయతులు దివ్య ఖురాన్ ద్వారా మరియు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక రెండు హదీసులు కూడా మనం విందాము.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఎందరు ప్రవక్తలు గతించారో, వారందరి జాతి వారు ఏ రకమైన షిర్క్ కు పాల్పడ్డారో అందులో అతి భయంకరమైనది, వారిని నరకంలో పడవేసినది అది దుఆ మిన్ దూనిల్లాహ్. అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం. ఉదాహరణకు ఎవరైనా అనారోగ్యానికి గురవుతారు, ఎవరిపైనా ఏదైనా కష్టాలు ఆపదలు వస్తాయి, ఎవరికైనా సంతానం కలగదు. ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాము, వారు అల్లాహ్ ను కాకుండా ఇతరులను అర్ధిస్తారు, ఇతరులను ప్రార్థిస్తారు, ఇతరులతో దుఆ చేస్తారు. వారికి సంతానం కలగాలని, వారికి ఆరోగ్యం ప్రాప్తించాలని, వారి కష్టాలు దూరమైపోవాలని. ఇది ఎంత ఘోరమైన పాపమో ఎప్పుడైనా మనం ఆలోచించామా? అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఖురాన్ ఆయతుల ఆధారంగా కొన్ని ముఖ్య విషయాలు చెబుతున్నాను, ఈ ముఖ్యమైన శీర్షికకు సంబంధించినది. మీరు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

ఇందులో మొదటి విషయం, అసలు దుఆ ఎవరి హక్కు? అంటే మనం దాసులము, ఎవరితో దుఆ చేయాలి? దీని గురించి ఖురాన్ చాలా స్పష్టంగా మనకు తెలియజేసింది.

సూరతుర్ రాద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 14 లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు:

لَهُ دَعْوَةُ الْحَقِّ
(లహు ద’వతుల్ హఖ్)
దుఆ యొక్క హక్కు కేవలం అల్లాహ్ ది మాత్రమే.” (13:14)

ఆయన తప్ప ఇంకా ఎవరితో దుఆ చేయడం ఇది న్యాయం, ధర్మం ఎంత మాత్రం కాదు.

ఇంకా, సూరె లుఖ్మాన్, ఆయత్ నెంబర్ 30 లో అల్లాహ్ తెలిపాడు:

وَأَنَّ مَا يَدْعُونَ مِن دُونِهِ الْبَاطِلُ
(వ అన్న మా యద్ఊన మిన్ దూనిహిల్ బాతిల్)
అల్లాహ్ తప్ప వారు ఎవరెవరితో దుఆ చేస్తున్నారో ఇదంతా కూడా వ్యర్థం, వృధా, అసత్యం.” (31:30)

అల్లాహు అక్బర్, గమనించారా? స్వయంగా మన సృష్టికర్త అయిన అల్లాహ్, మనం ఎవరితో దుఆ చేయాలని మనకు ఆదేశించాడు? ఈ విషయానికి వస్తే, ఖురాన్ లో ఒక సందర్భంలో కాదు, ఎన్నో చోట్ల. ఉదాహరణకు, సూరతు గాఫిర్, దాని యొక్క మరొక పేరు సూరతుల్ మూమిన్, ఆయత్ నెంబర్ 60 లో తెలిపాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ
(వ ఖాల రబ్బుకుముద్ ఊనీ అస్తజిబ్ లకుమ్)
మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను (40:60)

వ ఖాల రబ్బుకుమ్, మీ ప్రభువు మీకు ఈ ఆదేశం ఇస్తున్నాడు, ఉద్’ఊనీ, మీరు నాతో మాత్రమే దుఆ చేయండి, అస్తజిబ్ లకుమ్, నేను మీ దుఆలను అంగీకరిస్తాను. అల్లాహు అక్బర్, గమనించారా? నేను మీ దుఆలను అంగీకరిస్తాను అంటున్నాడు అల్లాహ్ త’ఆలా.

ఇంకా సోదర మహాశయులారా, దుఆ ఇది అసలైన ఇబాదత్, అసలైన ఆరాధన, అసలైన ప్రార్థన, దుఆ. ఇదే సూరత్, సూరత్ గాఫిర్, సూరతుల్ మూమిన్ ఆయత్ నెంబర్ 60 లో, అల్లాహ్ ఇలా తెలియజేశాడు:

وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۖ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ

మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, “మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం.”( 40:60)

దుఆ యొక్క ఆదేశం ఇచ్చిన వెంటనే, నా ఆరాధన పట్ల ఎవరైతే అహంకారానికి గురి అవుతాడో అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా, దుఆను ఆరాధన, దుఆ అసలైన ఇబాదత్ అని తెలిపాడు. ఎవరైతే దుఆ చేయరో అల్లాహ్ త’ఆలా తో, ఏం జరుగుతుంది? సయద్ ఖులూన జహన్నమ దాఖిరీన్. అవమానకరంగా వారు నరకంలో ప్రవేశిస్తారు. అల్లాహు అక్బర్. ఇంకా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆఉ హువల్ ఇబాదహ్)
దుఆ అసలైన ఇబాదత్.

మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే సూర గాఫిర్ యొక్క ఆయత్ పారాయణం చేశారు.

అంతేకాదు సోదరులారా, ఒకవైపున అల్లాహ్ త’ఆలా నాతోనే దుఆ చేయండి అని ఏదైతే ఆదేశించాడో, ఇతరుల ఎవరితోనీ దుఆ చేయకండి అని కూడా చెప్పాడు. ఇతరులతో దుఆ చేయడం నిషేధించాడు, వారించాడు. ఉదాహరణకు, సూరత్ యూనుస్ ఆయత్ నెంబర్ 106 లో తెలిపాడు:

وَلَا تَدْعُ مِن دُونِ اللَّهِ
(వలా తద్’ఉ మిన్ దూనిల్లాహ్)
అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినీ అర్ధించకండి, ఎవరితో దుఆ చేయకండి.” (10:106)

సూరతుల్ ఖసస్ ఆయత్ నెంబర్ 88 లో చెప్పాడు:

وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ
(వలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర్)
అల్లాహ్‌తో పాటు మరే దేవుణ్ణీ మొరపెట్టుకోకు. (28:88)

అల్లాహ్ తో పాటు ఇంకా ఎవరితోనీ కూడా, అల్లాహ్ తో పాటు వేరే ఏ దైవమైనా ఉన్నాడు అని భావించి వారితో మీరు దుఆ చేయకండి. సోదర మహాశయులారా, సూరత్ యూనుస్ మరియు సూరతుల్ ఖసస్ లోని ఈ రెండు ఆయతుల ద్వారా మనకు విషయం ఏం తెలిసింది? అల్లాహ్ తో దుఆ చేయడంతో పాటు ఇతరులతో చేయడం ఇది కూడా నిషేధం. అల్లాహ్ ను వదిలి వేరే ఎవరితోనైనా చేయడం ఇది కూడా నిషిద్ధం. మరి చేయవలసింది ఏంటిది? సూర గాఫిర్ లో మనం తెలుసుకున్నాము, కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేయాలి.

అయితే, అల్లాహ్ తప్ప ఇతరులతో దుఆ చేయడం వల్ల మనకు నష్టం ఏమిటి? మహా భయంకరమైన నష్టం. అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం గాని, అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేయడం గాని, ఇది షిర్క్ మరియు కుఫ్ర్ లోకి వస్తుంది. బహుదైవారాధనలో లెక్కించడం జరుగుతుంది. సత్య తిరస్కారంలో లెక్కించడం జరుగుతుంది.

సూరతున్ నహల్ ఆయత్ నెంబర్ 86 గమనించండి.

وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ
(వ ఇదా ర అల్లజీన అష్రకూ షురకాఅహుమ్)
ఈ ముష్రిక్కులు తాము (అల్లాహ్‌కు) భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే..”

షిర్క్ చేసినటువంటి వారు, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వాములుగా కల్పించిన వారు తమ భాగస్వాములను చూస్తారు. ఎప్పుడు ఇది? ప్రళయ దినాన. చూసి ఏమంటారు?

قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ
(ఖాలూ రబ్బనా హాఉలాఇ షురకాఉనల్లజీన కున్నా నద్’ఊ మిన్ దూనిక్)
“ఓ మా ప్రభూ! మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే” అని అంటారు” (16:86)

గమనిస్తున్నారా సోదరులారా? చదవండి మీరు సూరతున్ నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 86. ప్రళయ దినాన అందరూ హాజరవుతారు కదా, దుఆ చేసిన వారు ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో. ఎప్పుడైతే వారిని చూస్తారో, “ఓ మా ప్రభువా, నిన్ను వదిలి మేము వారితో దుఆ చేసాము, వారిని మేము నీకు భాగస్వామిగా చేసాము. ఈరోజు వారు మాకు ఏమీ లాభం చేయడం లేదు” అని మొరపెట్టుకుంటారు. అయితే ఈ ఆయత్ లో మనకు చాలా స్పష్టంగా తెలిసింది, వారు స్వయంగా ఒప్పుకుంటున్నారు మేము ఈ షిర్క్ పని చేసాము అని.

అయితే, సూరతుల్ ఆరాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 37 కూడా మీరు గమనించండి. మీరు కూడా స్వయంగా తెలుగు ఖురాన్ అనువాదాలు తీసి చదవండి, చూడండి, పరిశీలించండి. ఒక విషయం.. క్షమించండి, నేను నా టాపిక్ కు కొంచెం దూరమై ఒక విషయం మీకు అర్థం కావడానికి తెలియజేస్తున్నాను. మనం జానెడు కడుపులో పోయే కూడు తినడానికి మార్కెట్ లోకి వెళ్లి బియ్యం ఏ రకమైనది, ఈ టమాటాలు పాడు అయినాయా, మంచియా, ఉల్లిగడ్డ మంచిగుందా లేదా, ఈ కూరగాయలు మంచియా లేవా, ఒక్కొక్కటి ఏరుకొని మంచి మంచివి తీసుకొని వస్తాము కదా. మన స్వర్గం విషయానికి, ఏ ధర్మ జ్ఞానం మనం నేర్చుకోవాల్సి ఉందో దానిని కూడా మనం వెతకాలి, పరిశీలించాలి, సత్యం ఏదో తెలుసుకోవాలి. సూరతుల్ ఆరాఫ్ ఆయత్ నెంబర్ 37:

حَتَّىٰ إِذَا جَاءَتْهُمْ رُسُلُنَا يَتَوَفَّوْنَهُمْ قَالُوا أَيْنَ مَا كُنتُمْ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ

ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.. (7:37)

అప్పుడు వారు తమకు తాము సాక్ష్యం పలుకుతారు, “అయ్యో, మేము ఎంత కుఫ్ర్ పని చేసాము, ఎంత అవిశ్వాసానికి పాల్పడే పని చేసాము, సత్య తిరస్కారంలో మేము పడి ఉన్నాము“. అయితే ఏం తెలిసింది? అల్లాహ్ తో కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇతరులతో దుఆ చేయడం షిర్క్, కుఫ్ర్ లో వస్తుంది మరియు వారు ఏమీ వారికి లాభం చేకూర్చలేదు. వారు ఏమీ లాభం చేకూర్చరు అన్న విషయం ఇంకా ఎన్నో ఆయతుల ద్వారా ఇన్ షా అల్లాహ్ నేను తెలియజేస్తున్నాను.

అంతేకాదు సోదర మహాశయులారా, అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే వారితో కూడా దుఆ చేయడం ఇది మహా అన్యాయం, మహా దౌర్జన్యం. ఏ కొందరు యువకులు తమ జాతి వారిని ఎదిరించి, జాతి వారందరూ కూడా షిర్క్ పనులు చేస్తున్నారు, తౌహీద్ కు దూరమై ఉన్నారు, వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి అన్న తపనతో తమ గ్రామం నుండి కూడా దూరమయ్యారు. ఆ సందర్భంలో వారు ఏమంటారు, సూరతుల్ కహఫ్ ఆయత్ నెంబర్ 14:

لَّن نَّدْعُوَ مِن دُونِهِ إِلَٰهًا ۖ لَّقَدْ قُلْنَا إِذًا شَطَطًا
(లన్ నద్’ఉవ మిన్ దూనిహి ఇలాహన్, లఖద్ ఖుల్నా ఇదన్ షతతా)
మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవటమన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారమవుతాము.” (18:14)

లన్ నద్’ఉవ మిన్ దూనిహీ ఇలాహా. మేము అల్లాహ్ ను వదిలి వేరే ఏ భూటకపు దైవాలను మేము ఆరాధించము. అల్లాహ్ ను వదిలి వేరే ఏ దైవంతో మేము దుఆ చేయము. ప్రజలు ఎవరెవరినైతే దైవాలుగా భావిస్తున్నారో, వారి దృష్టిలో, వారి యొక్క అభిప్రాయం ప్రకారం వారు దేవుళ్ళు కావచ్చు, కానీ సత్యమైన దేవుడు కేవలం అల్లాహ్. సత్యమైన ఆరాధ్యుడు కేవలం అల్లాహ్. ఆయన్ని తప్ప మేము ఇంకా ఎవరితో దుఆ చేయము. లఖద్ ఖుల్నా ఇజన్ షతతా. ఒకవేళ మేము ఇలా చేసి ఉంటే ఇది మహా దౌర్జన్యం అయిపోతుంది. గమనించారా? 

అంతేకాదు, అల్లాహ్ ను తప్ప వేరే ఎవరితోనైనా దుఆ చేయడం, అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైనా దుఆ చేయడం… మహాశయులారా, ఇది అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. అవును, అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసే విషయం. చదవండి ఖురాన్ లో. సూరతుష్ షుఅరా ఆయత్ నెంబర్ 213 లో అల్లాహ్ తెలిపాడు:

فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
(ఫలా తద్’ఉ మ’అల్లాహి ఇలాహన్ ఆఖర ఫతకూన మినల్ ము’అద్దబీన్)
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అల్లాహ్‌తోపాటు మరే ఇతర దైవాన్నీ మొరపెట్టుకోకు. నువ్వుగాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు సుమా!” (26:213)

ఫలా తద్వు మఅల్లాహి ఇలాహన్ ఆఖర్. అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఏ దైవంతో మీరు దుఆ చేయకండి. ఫతకూన మినల్ ముఅజ్జబీన్. అలా చేశావంటే, అలా చేశారంటే శిక్ష ఇవ్వబడిన వారిలో ఎవరికైతే శిక్ష పడుతుందో వారిలో మీరు కలిసిపోతారు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరిని ఇహలోకం, పరలోకం అన్ని రకాల శిక్షల నుండి దూరం చేయుగాక, దూరం ఉంచుగాక. మరియు శిక్షలకు గురి చేసే ప్రతి పాపం నుండి కూడా అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక.

అంతేకాదు, చివరిలో ఒక రెండు ముఖ్యమైన విషయాలు అవేమిటంటే, అల్లాహ్ ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తారో, అల్లాహ్ ను కాకుండా లేదా అల్లాహ్ తో పాటు ఇంకా వేరే ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారిలో ఏ శక్తి లేదు. మన మొరలు వినడానికి, మనం వేడుకునే వాటిని ఇవ్వడానికి, మన కష్ట దుఃఖాలు దూరం చేయడానికి, సుఖాలు ప్రసాదించడానికి, ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వడానికి వారిలో ఏ శక్తి లేదు అని అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు. ఒకవేళ వాస్తవంగా అల్లాహ్ ను నమ్మేవారయ్యేది ఉంటే ఈ ఆయతులను చాలా శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. సూరత్ ఫాతిర్, ఆయత్ నెంబర్ 13, 14.

وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
(వల్లదీన తద్’ఊన మిన్ దూనిహి మా యమ్లికూన మిన్ ఖిత్మీర్)
ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.” (35:13)

إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా! (35:14)

(వల్లజీన తద్వూన మిన్ దూనిహీ). మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే దుఆ చేస్తారో, ఎవరితోనైతే దుఆ చేస్తారో, (మా యమ్లికూన మిన్ కిత్మీర్). ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర. అంతమాత్రం కూడా వారికి ఏ శక్తి లేదు. (ఇన్ తద్వూహుం లా యస్మవూ దుఆఅకుం). మీరు వారితో దుఆ చేస్తే మీ దుఆలను వారు వినలేరు. గమనించండి. సూరత్ ఫాతిర్ ఆయత్ 13, 14. మీరు అల్లాహ్ ను వదిలి ఎవరితోనైతే దుఆ చేస్తారో, వారు ఖర్జూరపు బీజము మీద ఉండేటువంటి సన్నని ఆ పొర ఏదైతే ఉంటుందో అంత మందం కూడా శక్తి కలిగి లేరు. మీరు వారిని అడిగితే, వారితో దుఆ చేస్తే వారు వినరు. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఉన్నారు కదా, వింటారు అన్నటువంటి మూఢనమ్మకంలో. అయితే అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. (వలవ్ సమీవూ మస్తజాబూ లకుం). మీ మూఢనమ్మకాల ప్రకారంగా వారు వింటారు అని ఏదైతే అనుకుంటున్నారో, అలా జరిగినా ఎప్పుడైనా, ఏదైనా సందర్భంలో ఒక పరీక్షగా మేము వారికి వినిపించినా, వారు మీ దుఆలకు సమాధానం చెప్పలేరు.

(వ యౌమల్ ఖియామతి యక్ఫురూన బిషిర్కికుం). మీరు ఈ షిర్క్ ఏదైతే చేస్తున్నారో, దుఆ ఇతరులతో చేసి ఏ భాగస్వామ్యం కల్పింపజేస్తున్నారో, దీనిని వారు ప్రళయ దినాన తిరస్కరిస్తారు. (వలా యునబ్బిఉక మిస్లు ఖబీర్). సూక్ష్మ జ్ఞాని అయిన అల్లాహ్ ఆయన తెలిపినటువంటి విషయాలు మీకు తెలిపేవాడు ఇంకా వేరే ఎవడు లేడు.

అలాగే సోదర మహాశయులారా, సూరత్ సబా ఆయత్ నెంబర్ 22 ఒకసారి గమనించండి మీరు.

قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ

(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు ఎవరెవరినయితే ఊహించుకుంటున్నారో వారందరినీ పిలిచి చూడండి. భూమ్యాకాశాలలో వారికి రవంత అధికారంగానీ, వాటిలో వారికి ఎలాంటి వాటాగానీ లేదు. వారిలో ఏ ఒక్కడూ అల్లాహ్‌కు సహాయకుడు కూడా కాడు. (34:22)

(ఖులిద్ వుల్లజీన జఅంతుం మిన్ దూనిల్లాహ్). మీ మూఢనమ్మకం ప్రకారం అల్లాహ్ ను వదిలి ఎవరెవరిని మీరు ఆరాధిస్తారో, ఎవరెవరిని పూజిస్తారో, ఎవరెవరితో దుఆ చేస్తారో, (ఉద్వూ), మీరు దుఆ చేసి చూడండి. వారిలో ఏముంది? (లా యమ్లికూన మిస్కాల జర్రతిన్ ఫిస్సమావాతి వలా ఫిల్ అర్జ్). ఆకాశాల్లో, భూమిలో రవ్వంత దానికి వారు అధికారం కలిగి లేరు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏం చెప్పాడు? సూరె ఫాతిర్ లో, ఖర్జూరపు బీజం మీద ఉండేటువంటి ఒక పొర అంతటి అధికారం కూడా వారికి లేదు. ఇక్కడ జర్రహ్, అణువు. కళ్ళతో కనబడదు మనకు. అంతటి అధికారం కూడా వారిలో లేదు. ఇంకా, (వమాలహుం ఫీహిమా మిన్ షిర్క్). భూమి ఆకాశాల్లో వారికి ఏ భాగస్వామ్యం లేదు.

అల్లాహ్ క్షమించుగాక, అల్లాహ్ కు కాదు ఒక ఉదాహరణ, పోలిక, మనకు అర్థం కావడానికి ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను. కొన్ని సందర్భంలో ఏమవుతుంది? నా వద్ద ఒక్క పైసా కూడా లేకపోవచ్చు. కానీ నేను ఒకరితో బిజినెస్ లో పార్ట్నర్ కావచ్చు కదా. ఏదైనా పనిలో నేను పొత్తు కలవవచ్చు కదా. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు? అరే, అతడు ఫలానా కంపెనీలో ఒక పార్ట్నర్ గా ఉన్నాడు, ఎంతటి మహానుభావుడో అని అనుకుంటాం కదా. అయితే అల్లాహ్ ఇలాంటి భావాన్ని కూడా ఎట్లా దూరం చేస్తున్నాడో గమనించండి. వారికి అణువంత అధికారం కూడా లేదు ఆకాశాల్లో గాని, భూమిలో గాని. అంతేకాదు వారు ఈ భూమి ఆకాశాల్లో అల్లాహ్ కు ఏ పార్ట్నర్ కారు, ఏ భాగస్వామి కారు. అంతెందుకు, కొందరు ఇహలోకం ప్రకారంగా చూసుకుంటే ఏ అధికారం ఉండదు, పార్ట్నర్ ఉండడు. కానీ ఒకరి కంపెనీ నడపడానికి, ఒకరి పని పూర్తి అవ్వడానికి ఏదో తన ఛాయాశక్తి కొంచెం సపోర్ట్ అయినా ఇస్తాడు కదా. అల్లాహ్ ఇలాంటి దానిని కూడా ఖండించాడు. ఏం చెప్పాడు? (వమాలహుం మిన్హుం మిన్ జహీర్). మీరు ఎవరెవరితోనైతే దుఆలు చేస్తున్నారో వారిలో ఏ ఒక్కడు కూడా అల్లాహ్ కు ఎలాంటి మద్దతునిచ్చేవాడు కాదు, ఎలాంటి సహాయం అందించేవాడు కాదు.

ఇక మీరు అలాంటి వారితో ఎందుకు దుఆ చేస్తున్నారు అని అల్లా రబ్బుల్ ఆలమీన్ హెచ్చరిస్తున్నాడు. అల్లాహు అక్బర్. గమనించండి సోదరులారా.

ప్రత్యేకంగా ఎవరైతే అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరెవరినైతే ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, దుఆలు చేస్తున్నారో, అర్ధిస్తున్నారో, వారి యొక్క స్థితి ఏమిటి? ఇంకా, వారు ఏమైనా ప్రళయ దినాన మనకు లాభం కలగజేస్తారా? ఉపయోగపడతారా? అది కూడా జరగదు. సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ నెంబర్ ఐదు, ఆరు వినండి.

وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? (46:5)

وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. (46:6)

(వ మన్ అదల్లు మిమ్మన్ యద్వూ మిన్ దూనిల్లాహ్). ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నారో వారి కంటే మార్గభ్రష్టులు ఇంకా వేరే ఎవరు లేరు. నేననడం లేదు, ఖురాన్ తీసి చూడండి మీరు. వ మన్ అదల్లు, అతని కంటే మార్గభ్రష్టత్వంలో ఇంకా ఎవరు లేరు. ఎవరు? ఎవరైతే అల్లాహ్ ను వదిలి ఇతరులతో దుఆ చేస్తున్నాడో. ఎలాంటి వారితో దుఆ చేస్తున్నాడు? (మల్లా యస్తజీబు లహు ఇలా యౌమిల్ ఖియామ). ప్రళయ దినం వరకు అతని దుఆలను అంగీకరించడం గాని, దుఆకు సమాధానం గాని చెప్పలేని వారు. అంతేకాదు, (వహుం అన్ దుఆఇహిం గాఫిలూన్). వారు వీరు చేసే దుఆలకు ఏ సంబంధం లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. వారికి తెలియనే తెలియదు, ఎవరో వచ్చి మా సమాధుల వద్ద, ఎవరో మా పేరును తీసుకొని దుఆలు చేస్తున్నారు అని.

(వ ఇజా హుషిరన్నాస్). ప్రళయ దినాన ఎప్పుడైతే సమూహ పరచడం జరుగుతుందో, (కానూ లహుం అదాఅ). ఈ దుఆ చేసేవారు, ఎవరితోనైతే దుఆ చేయడం జరిగిందో వారందరూ పరస్పరం శత్రువులైపోతారు. (వ కానూ బి ఇబాదతిహిం కాఫిరీన్). మరియు వారి యొక్క ఆరాధనలో, వారి యొక్క దుఆలు వాటి గురించి ఇంకార్ చేస్తారు, రద్దు చేస్తారు. వీరు మమ్మల్ని ఆరాధించలేదు, మాతోని దుఆ చేయలేదు అని స్పష్టంగా తెలియజేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లాహ్ క్షమించుగాక, ఇహలోక ప్రకారంగా నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను, గమనించండి.

ఉదాహరణకు నీవు ఏదైనా ఆపదలో ఇరుక్కున్నావు. కోర్టులో వెళ్ళవలసి వచ్చింది. ఏం జరిగింది? ఫలానా వకీల్ చాలా పేరు గలవాడు. ఫలానా లాయర్ ఎంతో పేరు గాంచిన వాడు. అతనిని నేను పిలిపించుకుంటే నన్ను ఎట్లనైనా ఈ కేసులో నుండి బయటికి తీసేస్తాడు అని అనుకున్నావు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత, నీవు అనుకుంటున్నావు ఈ కేసు ఈ కోర్టులో ఆ వకీల్, ఆ లాయర్ నీకు సపోర్ట్ చేసి నీ తరఫు నుండి మాట్లాడి నిన్ను జైలు పాలు కాకుండా, శిక్షకు గురి కాకుండా కాపాడుకుంటాడు అని. తీరా సమయం వచ్చే వరకు ఏం జరిగింది? నీకు వ్యతిరేకమైపోయాడు. అతడు నీకు వ్యతిరేకమైపోయాడు. నీవు ఇంకా పాపంలో ఉన్నావు, నీ పై ఈ అపరాధం అన్నట్టుగా ఎన్నో సాక్షాలు తెచ్చి ఇరికించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి గమనించండి. ఇంతకంటే మరీ భయంకరమైన, ఘోరమైన పరిస్థితి అక్కడ రానుంది. అల్లాహ్ మనందరిని కూడా కాపాడుగాక.

ఖురాన్ లో మనం గమనిస్తే, ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం, యూనుస్ అలైహిస్సలాం, లూత్ అలైహిస్సలాం, సులేమాన్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యూసుఫ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సుమారు 16 ప్రవక్తలు, వారు అల్లాహ్ తో ఏ దుఆ చేశారో, ఎలా ఎలా మొరపెట్టుకున్నారో ఆ దుఆల ప్రస్తావనలన్నీ కూడా ఖురాన్ లో ఉన్నాయి. ఎక్కడా కూడా వారు అల్లాహ్ తప్ప ఇతరులతో మొరపెట్టుకోలేదు. నేను ఎందుకు ప్రస్తావిస్తున్నాను? ఈ ప్రవక్తల సరైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే కదా మనకు మోక్షం లభించేది.

అంతేకాదు, అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఎందరో పుణ్యాత్ముల గురించి కూడా తెలిపాడు. ఉదాహరణకు, ఇమ్రాన్ యొక్క భార్య, ఫిరౌన్ యొక్క భార్య మరియు బిల్ఖీస్ రాణి మరియు ఆ గుహలో, సూర కహఫ్ లో వచ్చిన ప్రస్తావన ఉన్నవారు. ఇంకా విశ్వాసులు, ఎవరైతే ఒక తోటకు అధికారి అయ్యారో వారి యొక్క సంఘటన ఉంది. ఈ విధంగా ఇంకా ఎందరో సంఘటనలు ఖురాన్ లో ఉన్నాయి. వారందరూ కూడా వారి కష్ట సమయాల్లో కేవలం ఏకభాగస్వామ్యం లేకుండా అల్లాహ్ తోనే దుఆ చేశారు, అల్లాహ్ నే మొరపెట్టుకున్నారు.

అందు గురించి సోదరులారా, ఇదే పని మనం కూడా చేయాలి. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరినైనా మనం మొరపెట్టుకున్నామో, వేరే ఎవరితోనైనా దుఆ చేసాము అంటే షిర్క్ లో పడిపోతాము, కుఫ్ర్ లో పడిపోతాము, మహా దౌర్జన్యం చేసిన వారమవుతాము, అల్లాహ్ యొక్క శిక్షకు గురి కావలసి వస్తుంది. అంతేకాకుండా అల్లాహ్ ను కాదని మనం ఎవరెవరినీ మొరపెట్టుకుంటామో ఎవరూ కూడా మనకు ఇహలోకంలో పనికిరారు. పరలోకంలోనైతే ఏమాత్రం మనకు లాభం చేకూర్చరు.

అల్లాహ్ మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక. ఎల్లవేళల్లో కేవలం అల్లాహ్ తో మాత్రమే దుఆ చేస్తూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తప్ప వేరే ఎవరెవరితో మనం ఇంతవరకు తెలిసి తెలియక, అజ్ఞానంలో ఉండి ఏమైతే చేసామో, అల్లాహ్ ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించి, మన్నించి మనల్ని తన యొక్క పవిత్రమైన పుణ్య దాసుల్లో చేర్చుగాక.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5159