ముస్లిం చేసే దానధర్మాలు | కలామే హిక్మత్

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారని అబూ మూసా అష్ అరి (రదియల్లాహు అన్హు) చెప్పారు: “దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.”
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అతని వద్ద లేకుంటే?!’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు :’అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాదించాలి. (దాంతో) తన స్వయానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు దానం ఇవ్వాలి.’
సహచరులు సందేహంగా అడిగారు – ‘ఒకవేళ అలా చేయలేకపోతే? లేదా చేయకపోతే?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు: ‘దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి.’
సహచరులు అడిగారు – ‘ఒకవేళ అలా చేయకపోతేనో?’
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు ‘మంచిని ఆజ్ఞాపించాలి’.
సహచరులు మళ్ళీ అడిగారు ‘ఒకవేళ అది కూడా చేయలేకపోతే?!’
ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు : ‘(పరులను) నొప్పించకుండా జాగ్రత్త పడాలి. ఇది కూడా అతని పాలిట దానమే.” (బుఖారి)

“దానం ఇవ్వటం ప్రతి ముస్లింకు తప్పనిసరి.” ముస్నద్ తియాసి ఉల్లేఖనంలో “ప్రతిరోజు” అనే పదం అదనంగా ఉంది. ఈ దానం శక్తిమేరకు ప్రతి ఒక్కరిపైతప్పనిసరి అవుతుంది. అంటే ప్రతి ముస్లిం నైజంలో, అతని ప్రవర్తనలో సదకా (దానం) ఒక భాగం కావాలన్నది దీని పరమార్థం. అతను ఏ స్థితిలో ఉన్నా – కలిమిలో ఉన్నా లేమి తాండవిస్తున్నా – అతనిలో దాతృ స్వభావం మాత్రం ఉండాల్సిందే అన్నది పై వాక్యం ఉద్దేశ్యం.

‘ఒకవేళ అతని వద్ద లేకపోతే’ అని ప్రవక్త గారి ప్రియ సహచరులు ప్రశ్నించారు.’దానం’ అనే ప్రస్తావన రాగానే ధన ధాన్యాదుల ద్వారా చేసే సహాయం మాత్రమేనని అసలు సహచరులు తలపోశారు. అయితే ఈ “పదం”కు ఉన్న భావం ఎంతో విస్తృతమయిందని, ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని మృదువుగా పలకరించి అతన్ని ఓదార్చటం, అతని ఆపదను కడతేర్చే సంకల్పంతో తరుణోపాయం సూచించటం కూడా “సదకా” కోవలోకే వస్తుందని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో ఇబ్నె అబీ హంజా ఇలా అభిప్రాయపడ్డారు :

“దాన ధర్మాలు చేయడం కేవలం శ్రీమంతులకే పరిమితం కాదని, డబ్బుఖర్చుపెట్టకుండా కూడా దానధర్మాలు చేయవచ్చని ఈ హదీసు ద్వారా ఆధారంలభిస్తున్నది.”

“అతను తన స్వహస్తాలతో శ్రమించి సంపాయించాలి.” అన్న ప్రవక్త గారి పలుకు గమనించదగినది. కష్టపడి ఉపాధిని సంపాయించటం చాలా ముఖ్యం అని దీని ద్వారా విదితమవుతుంది. కష్టపడి సంపాయించ గలిగినప్పుడే ఏ మనిషయినా తన స్వయానికై ఖర్చుచేసుకుని ఇతరుల కేదైనా సహాయం చెయ్యగలుగుతాడు. శ్రమించి సంపాదించుకుంటేనే, ఎదుటివారి ముందు చేతులు చాచి యాచించే దురవస్థ రాకుండా జాగ్రత్త పడగలుగుతాడు. పైపెచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తూ, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ, వీలయినంత ఎక్కువగా నిరాధారులనుఆదుకోగలుగుతాడు.

“దయనీయ స్థితిలో ఉన్న అగత్యపరునికి సహాయపడాలి” అనేది హదీసు లోని మరో వాక్యం. అటువంటి సహాయం నోటి ద్వారా కావచ్చు. చేతల ద్వారా కూడా కావచ్చు. మరోవిధంగా కూడా కావచ్చు. సహాయపడే తీరు ఎన్నో రకాలు.

“మంచిని గురించి ఆజ్ఞాపించాలి” అనేది మరో వాక్యం. వేరొక ఉల్లేఖనంలో “చెడులనుండి ఆపాలి” అని కూడా ఉంది. మంచిని ఆజ్ఞాపించటంలోనే “చెడుల నుండి ఆపటం” అనే భావం ఇమిడి ఉంది. ఖుర్ఆన్ హదీసుల వెలుగులో సమ్మతమయిన ప్రతిదీ ‘మంచి’గానే పరిగణించబడుతుంది. అలాగే ఖుర్ఆన్, హదీసులలో ఏవేవైతే ‘కూడదు’ అని అనబడ్డాయో అవి చెడుగానే పరిగణింపబడతాయి. వాటి జోలికి ప్రజలను పోనివ్వకుండా చూడటం కూడా గొప్ప సత్కార్యమే.

“(పరుల మనసు) నొప్పించకుండా జాగ్రత్త పడాలి.” నోటి ద్వారా నయినా, చేతలద్వారా నయినా లేక ఆ రెండింటి ద్వారానయినా ఎదుటివారు నొచ్చుకునేలా ప్రవర్తించరాదు. ఎట్టి పరిస్థితిలోనూ దైవ ప్రసన్నత చూరగొనటమే దీని వెనుక అసలు ప్రేరణ అయివుంటే తప్పకుండా ఇది సయితం పుణ్యకార్యంగానే పరిగణించబడుతుంది. దైవదాసులకు బాధ కలగకుండా మసలు కోవటం ఒక నిజమైన ముస్లిం యొక్క చిహ్నం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ద్వారా ఇదే భావం వ్యక్తమవుతోంది. ఆయన ఉల్లేఖించిన ప్రవచనం ఇలా ఉంది : “నిజమైన ముస్లిం అతనే – ఎవరి నోటి మరియు చేతుల బారి నుండి ముస్లింలుసురక్షితంగా ఉండగలరో.”

“ఒకవేళ అలా చెయ్యలేకపోతే,” ప్రవక్త సహచరులు పలు కోణాల నుంచి ఒకవిషయం యొక్క లోతుపాతులను తెలుసుకునేవారు. వారలా అడగటం వల్లనే “విషయం” ప్రాముఖ్యతను సంతరించుకుంది. సదకా (దానం) యొక్క విస్తృత భావం కూడా తెలిసివచ్చింది. దానధర్మాలు చేయటం, అవసరం ఉన్న వారిని ఆదుకోవటం, మంచిని గురించి ఆజ్ఞాపించటం, చెడుల నుండి ఆపటం ఇవన్నీ చెయ్యవలసిన ముఖ్య పనులేనని, వీటికిగాను దైవసన్నిధిలో ప్రతిఫలం కూడా అపారమని తెలియవచ్చింది.

ఈ హదీసు ద్వారా స్పష్టమయిన మరో విషయం ఏమిటంటే, సత్కార్యాలు వాటి ప్రాముఖ్యత, ప్రతిఫలాల దృష్ట్యా ఎన్నో స్థాయిలను కలిగి ఉంటాయి. అయితే వీటిలో అన్నిటిక న్నా ఉత్తమమయినది, మనిషి తన ధనాన్ని ఇతరులకు దానం చేయటం. ఒక ముస్లిం ఫకీరు భిక్షకుడు – దైవమార్గంలో ఖర్చు పెట్టలేకపోతే అతను, అది మినహా మిగతా సత్కార్యాలపై చొరవ చూపాలి. అల్లాహ్ ఏ ప్రాణి పైనా అతని శక్తికి మించిన భారం మోపడు. మనిషి, తాను ఏ సత్కార్యమూ చేయలేకపోతే, అతను కనీసం చెడుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలి.

ఈ హదీసు ద్వారా విదితమయ్యే మరో విషయం ఏమిటంటే, షరీఅత్ ఆదేశాలు -స్థితిగతుల దృష్ట్యా – స్వల్పమయిన వ్యత్యాసంతో వర్తిస్తాయి. ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం), ప్రతి ముస్లిం దానం ఇవ్వటం తప్పనిసరి అని ఖరారు చేశారు. అయితే ప్రతి ముస్లిం దానధర్మాలు చెయ్యలేడు. పైగా కొంతమందైతే దానాలు పుచ్చుకోవటం తప్ప మరో గత్యంతరం లేని స్థితిలో ఉంటారు. అటువంటప్పుడు పుచ్చుకోవడం వారి కొరకు సమంజసమే అవుతుంది. విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మాటిమాటికీ విద్వాంసుని అడగవచ్చు అని కూడా ఈ హదీసు ద్వారా తెలియవస్తోంది. అదేవిధంగా కష్టపడి చెమటోడ్చి సంపాయించడం శ్రేష్ఠతతో కూడుకున్న విషయమని అలా సంపాయించే వాడే తనను ఆదుకోవటంతో పాటు ఇతరులను కూడా ఆదుకోగలుగుతాడని అవగతమవుతోంది.

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

రెండు ఉత్తమ వచనాలు | కలామే హిక్మత్

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: 

“రెండు వచనాలున్నాయి. అవి కరుణామయుని (అల్లాహ్)కి అత్యంత ప్రీతికరమైనవి. అవి నోటికి చాలా తేలికైనవే, (కాని) త్రాసులో చాలా బరువుగా ఉంటాయి. అవే ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ ‘, ‘సుబ్ హానల్లాహిల్ అజీమ్.” (బుఖారి) 

1. ‘సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ’ అంటే అల్లాహ్ పవిత్రతను ఆయన స్తోత్రంతో సహా కొనియాడుతున్నాను అని అర్థం. ‘సుబహానల్లాహిల్ అజీమ్’ అంటే మహోన్నతుడైన అల్లాహ్ పవిత్రతను వర్ణిస్తున్నాను అని భావం. 

అల్లాహ్ పవిత్రత అనేది ఆయన సుగుణాలకు ప్రతీక, సకల లోపాలకు, బలహీనతలకు ఆయన అతీతుడు అనే భావం ఇందులో స్ఫురిస్తుంది. బహు దైవోపాసకులు ఏ బలహీనతలను, మరే భాగస్వామ్యాలను ఆయనకు ఆపాదిస్తారో వాటన్నింటికీ ఆయన అతీతుడు. 

విశ్వాసి ఘటించే శ్రద్ధాంజలి అల్లాహ్ ఔన్నత్యానికి, ఆయన స్థాయికి తగిన విధంగా ఉంటుంది. యదార్థానికి ఆయన అన్ని రకాల దోషాలకు దూరంగా ఉన్నవాడు. హదీసులో పేర్కొనబడిన రెండు సద్వచనాలు ఎంతో సంక్షిప్తమైనవి. సులభమైనవి. సృష్టిపై దృష్టిని సారించిన తరువాత, ఈ సువిశాల విశ్వ వ్యవస్థలోని నిర్వహణా యంత్రాంగం, అందలి పరమార్థాలపై యోచించిన తరువాత విశ్వాసి నోట అప్రయత్నంగా వెలువడే ఈ రెండు వచనాలు అనంత విశ్వ వ్యవస్థలోని అన్నింటికన్నా గొప్ప సత్యంగా, నిజమైన దైవస్తోత్రంగా రూపొందుతాయి. 

ప్రభువు ఏ విధంగా తన వ్యక్తిత్వంలో, గుణగణాలలో పవిత్రుడో అదేవిధంగా సృష్టి ఏర్పాట్లలోనూ సాటిలేనివాడు. ఆయన మానవులను ఆలోచించమని కోరాడు : 

“ఒక దానిపై ఒకటి సప్తాకాశాలను నిర్మించిన వాడు ఆయనే. మీరు కరుణామయుని సృష్టిలో ఎటువంటి సంబంధ రాహిత్యాన్ని కనలేరు. మరి మీ దృష్టిని సారించండి – మీ కేదయినా ఆటంకం కానవస్తోందా? మాటిమాటికీ దృష్టిని సారించండి, మీ దృష్టి అలసిసొలసి, ఓడిపోయి తిరిగివస్తుంది.”  (అల్ ముల్క్ : 3,4) 

దీని గురించి హాఫిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు : కరుణామయుడు అన్న పదాన్ని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగిందంటే ఈ హదీసులో అల్లాహ్ యొక్క సువిశాలమైన కారుణ్యాన్ని సుబోధకం చేయడమే దీని పరమ ఉద్దేశ్యం అయి ఉంటుంది. ఆయన కరుణ ఎంత విస్తృతమైనదంటే, తన దాసులు మామూలు ఆచరణకు కూడా ఆయన పుష్కలమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. 

అల్లాహ్ కు ఈ వచనాలు అత్యంత ప్రీతికరం ఎందుకంటే, వీటి ద్వారా దాసుడు తన ప్రభువు గొప్పతనాన్ని, ఆయన ఏకత్వాన్ని, ఆయన అద్భుతాలను చాటుతాడు. బహుదైవోపాసకులు, దైవధిక్కారుల వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. వారు ఒకవేళ దైవాన్ని విశ్వసిస్తున్నప్పటికీ ఆయనకు సహవర్తులుగా ఇతరుల్ని నిలబెట్టడం ద్వారా ఆయన గుణగణాలని నిర్లక్ష్యంచేసిన వారవుతారు. ఒక్కోసారి వారు దేవుని శక్తి యుక్తుల్ని సయితం అనుమానించే నిందించే విధంగా ప్రవర్తిస్తారు. అయితే నిజమైన విశ్వాసి, నికార్సయిన ఏకేశ్వరోపాసి చేసే స్తోత్రం, జిక్ (స్మరణ) ఎంతైనా ఆదరణీయమైనవి. 

దివ్య ఖుర్ఆన్లో ఎన్నో సూరాల ఆరంభం అల్లాహ్ పవిత్రతను కొనియాడటంతోనే జరిగింది. ‘హదీద్” “హష్ర”, “సఫ్” సూరాలు ఇలా ప్రారంభమయ్యాయి – 

“సబ్బహ లిల్లాహి మాఫిస్సమావాతి వ మాఫిల్ అర్జి వహువల్ అజీజుల్ హకీమ్.” 

అనువాదం : “భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ను స్తుతించాయి. ఆయన అధిపతి, వివేకవంతుడు.” 

ఇదేవిధంగా, “జుమా”, “తగాబున్” సూరాలు కూడా అల్లాహ్ పవిత్ర స్మరణతోనే మొదలయినాయి. 

3. “నోటికి చాలా తేలికైనవి” అంటే ఈ వచనాలను వల్లించడం అత్యంత సులువు. అరబీ భాషలోని కొన్ని పదాలను పలకటం సులభం కాదు. పైగా ఆ పదాలను చాలా జాగ్రత్తగా పలకవలసి ఉంటుంది. ఖిరాత్ కళా నిపుణులు అరబీ భాషలోని పదాలను రెండు రకాలుగా విభజించారు : 

(అ) షదీద్: అంటే గట్టిగా నొక్కి) పలకబడేవి. 
(ఆ) రఖ్వ : అంటే తేలిగ్గా ఉచ్చరించబడేవి. 

అయితే హదీసులోని రెండు వచనాల – సుబ్ హానల్లాహి వబి హమ్ దిహీ, సుబహానల్లాహిల్ అజీమ్ – లో ‘బ’ అనే అక్షరం తప్ప మిగిలిన అక్షరాలన్నీ “రఖ్వ” లోకే వస్తాయి. ఈ విధంగా, ఈ రెండు వచనాలు నోటికి చాలా తేలికైనవి. మహాప్రవక్త చెప్పింది సత్యమని నిరూపణయింది. 

4. “త్రాసులో చాలా బరువైనవి” అంటే తీర్పుదినం నాడు మనిషి కర్మలు తూయబడి నపుడు సత్కర్మల తక్కెడలో అవి బరువును పెంచుతాయి, నోటి ఉచ్చరణకు ఆ పచనాలు తేలికైనప్పటికీ ఫలితం రీత్యా అత్యంత బరువైనవి. ఆ బరువే పరలోకంలో పనికొచ్చేది. 

నోటిద్వారా జారిన మాటలు కూడా త్రాసులో తూయబడతాయన్న విషయం గత కాలాల్లో ప్రజలకు అర్థం కాకపోయిందేమో గాని ఉష్ణోగ్రతను, శీతోష్ణ స్థితిని సయితం కొలిచే నేటి ఆధునిక మానవుడికి ఇది వింతేమీ కాదు. ఇన్షా అల్లాహ్ తీర్పుదినం నాడు మనిషి కర్మలు, విశ్వాస పరిమాణం తప్పకుండా తూయబడతాయి. హదీసులోని శుభప్రదమైన ఆ రెండు వచనాలు పఠిస్తూ ఉండాలని పలుచోట్ల చెప్పబడింది. విధ్యుక్త ధర్మాల (ఫరాయిజ్) ను నిర్వర్తించటం మనసుకు కాస్త శ్రమగా తోచవచ్చునేమో గాని ఈ వచనాలను వల్లించడం కష్టతరమేమీ కాదు. అందుకే వీటిని పలుకుతూ ఉండటంలో పిసినారితనం కనబరచరాదు. 

ఈ రెండు వచనాలు ఇంతటి మహత్ పూర్వకంగా ఎలా రూపొందాయని ఆలోచిస్తే, పఠిత ఈ రెండు వచనాలను పఠిస్తూ పఠిస్తూ వాటి అర్థంపై యోచించటం మొదలెడతాడని, తద్వారా అతని హృదయాంతరాళంలో నిజస్వామి పట్ల గౌరవం, ప్రేమ ఏర్పడతాయని తెలుస్తోంది. తద్వారా అతని హృదయం నుంచి ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. నిర్మలమైన మనసుతో ఇప్పుడతను ప్రభువుకు సన్నిహితుడవుతాడు. ప్రభువుకు సన్నిహితుడైన దాసుని స్థానం గురించి ఇక చెప్పవలసిందేముంది! 

“ఈ వచనాలు త్రాసులో బరువు కలిగి ఉంటాయి” అంటే భావం విశ్వాసి ఈ రెండు వచనాలను పలుకుతూనే అపరాధాలు చేస్తూ ఉండటం పరిపాటి. అయితే- హదీసులోని రెండు వచనాలు ఎంతటి మహత్తు గలవంటే ఎన్నో దుష్కర్మల కంటే అవి ఎక్కువ బరువు కల్గి ఉంటాయి. అందుచేత ఈ వచనాలను పలికే వారల్లా ఘోర అపరాధాలు చేస్తూ ఉండమని భావం ఎంతమాత్రం కాదు. సాధారణంగా ‘జిక్ర్’ (దైవనామ స్మరణ) లో గడిపే మనిషి దుష్కర్మలకు దూరంగానే ఉంటాడు. మానవ సహజమైన దౌర్బల్యం మూలంగా ఎప్పుడో ఒకప్పుడు అతని చేత తప్పు జరగవచ్చుగాని సతతం జరగదు. అదీగాక ఈ పవిత్ర వచనాలు అతని మనసులో భయభక్తులను సృజిస్తాయి. అటువంటి వ్యక్తికి అల్లాహ్ తరపున కూడా రక్షణ లభిస్తుంది. సహాయం లభిస్తుంది. కనుక అతను ధర్మ సమ్మతమయిన కోర్కెలను ధర్మ సమ్మతమయిన విధానాల ద్వారానే తీర్చుకుంటాడు. నెరవేరని మరెన్నో కోర్కెలను మనసులోనే అణచుకుంటాడు. త్యాగ భావం అలవరచుకుంటాడు. 

ఘోర అపరాధాలకు ఒడిగట్టడం విశ్వాస బలహీనతకు తార్కాణం. విశ్వాసంలో బలహీనుడుగా ఉన్నవాడే పెద్ద పాపాలకు పాల్పడతాడని అహ్లెసున్నత్ వర్గం భావిస్తుంది. ఎన్ని అపరాధాలు చేస్తే అంతే అతని ఈమాన్ (విశ్వాసం) క్షీణిస్తూ పోతుంది. అతన్నే “ఫాసిఖ్” “ఫాజిర్” (అపరాధి, అపచారి) అనటం జరుగుతుంది. అయితే అతను గనక తనను విశ్వాసిగా చెప్పుకునేంతవరకు, ధర్మ భ్రష్టతకు పాల్పడ కుండా, షిర్క్ (బహుదైవారాధన)కు ఒడిగట్టకుండా ఉన్నంతవరకూ అతన్ని ముస్లింలలో ఒకడుగానే పరిగణించటం జరుగుతుంది. అతని వ్యవహారం పరలోకంలో అల్లాహ్ కే వదలివేయబడుతుంది. అయితే ఏకేశ్వరోపాసకుడయిన ప్రతి వ్యక్తినీ నరకం నుండి విముక్తి కలిగిస్తానని ఆయన అంటున్నాడు. అందుకే అల్లాహ్ తనగ్రంథంలో శుభవార్తను, హెచ్చరికను ఒకేచోట ప్రస్తావించాడు: 

نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ

“నేనే ఎక్కువగా మన్నించేవాడిని మరియు కరుణించేవాడినని, అయితే నా శిక్ష కూడా అత్యంత వ్యధాభరితమైన శిక్షేనని (ఓ ప్రవక్తా!) నా దాసులకు చెప్పివేయండి.” (అల్ హిజ్ర్ 15 : 49, 50) 

దాసులు తన వైపునకు మరలి రావాలని తనను అధికంగా జ్ఞాపకం చేయాలని, తన గొప్పతనాన్ని గురించి అదే పనిగా చెప్పుకోవాలని, తనను క్షమాశీలునిగా, స్వర్గ యజమానిగా చెప్పుకోవటంలో నిమగ్నులవ్వాలని, తనంటే భయపడుతూ ఉండాలని, పాపాలకు దూరంగా ఉండాలని, క్షమాభిక్ష పెట్టడంలో తాను ఎంత ఉదార స్వభావుడో నేరస్థులను పట్టుకోవటంలో కూడా అంతే కఠినుడని, కనుక తన పట్టు పట్ల తరచూ భయపడుతూ ఉండాలని అల్లాహ్ పై రెండు ఆయత్లలో దాసులకు చెబుతున్నాడు. దైవ కారుణ్యంపై ఆశలు పెంచుకోవటం, ఆయన ఆగ్రహం పట్ల భయపడుతూ ఉండటం విశ్వాసుల ముఖ్య లక్షణం. దైవప్రవక్తలు హజ్రత్ జకరియ్యా, హజ్రత్ యహ్యా (అలైహిముస్సలాం)ల గురించి ఖుర్ఆన్లో సెలవీయబడింది : 

إِنَّهُمْ كَانُوا يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا لَنَا خَاشِعِينَ

“వారు సత్కార్యాల వైపునకు పరుగెత్తేవారు. మమ్మల్ని భయంతో ప్రార్థించేవారు, ఇంకా వారు మా ముందు వంగి ఉండేవారు.” (అంబియా 21: 90) 

పై ఆయత్ ద్వారా తెలిసేదేమంటే విశ్వాసి అత్యంత వినయ వినమ్రతలతో దైవనామాన్ని స్మరిస్తూ మంచి పనులు చేస్తూ కూడా ఆయన పట్టు పట్ల భయంతో కంపిస్తూ ఉంటాడు. దైవ నామస్మరణ, దైవారాధనలు అతన్ని ఎంతటి నిష్టాపరునిగా మలుస్తాయంటే చెడు పనులంటేనే అతనిలో అసహ్యం జనిస్తుంది. 

[డౌన్లోడ్ PDF]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

సూర అల్ హాఖ్ఖ తఫ్సీర్ (ఖురాన్ వ్యాఖ్యానం) [వీడియో]

సూర అల్ హాఖ్ఖ తఫ్సీర్ యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2AXotEM112kIXsGz4Z7atA

జరిగి తీరేది.

ఏమిటా జరిగి తీరేది?

ఆ జరిగి తీరే దాని గురించి నీకేం తెలుసు?

తట్టేటటువంటి విపత్తును సమూదు, ఆదు జనులు ధిక్కరించారు.

(పర్యవసానంగా) సమూదు వారు అత్యంత భయంకరమైన కేక ద్వారా అంత మొందించబడ్డారు.

ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు.

వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.

మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా?

ఫిరౌను, అతనికి పూర్వం గతించినవారు, తలక్రిందులుగా చేయబడిన పట్టణాలవారు కూడా పాపాలకు ఒడిగట్టారు.

వారు తమ ప్రభువు పంపిన ప్రవక్త(ల)ను ఎదిరించారు. అందువల్ల అల్లాహ్ వాళ్ళను (కూడా) చాలా గట్టిగా పట్టుకున్నాడు.

నీళ్ళ ఉధృతి పెరిగిపోయినప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము.

దీనిని మీకొక హితబోధగా, జ్ఞాపికగా చేయటానికి, విని జ్ఞాపకముంచుకునే చెవులు దీనిని (ఎల్లకాలం) జ్ఞాపకముంచుకునేందుకు (ఈ విధంగా చేశాము).

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక

ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.

ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.

అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.

ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.

చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.

అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.

ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.

అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.

షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.

అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.

ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.

ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.

అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.

ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్‌గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.

ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.

అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.

అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.

అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.

తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.

వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.

ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.

ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.

షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.

ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్) దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.

దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.

చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.

మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.

మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.

ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,

وَاذْكُرْ فِي الْكِتَابِ إِدْرِيسَ ۚ إِنَّهُ كَانَ صِدِّيقًا نَّبِيًّا وَرَفَعْنَاهُ مَكَانًا عَلِيًّا
(వజ్కుర్ ఫిల్ కితాబి ఇద్రీస ఇన్నహూ కాన సిద్దీఖన్ నబియ్యన్, వ రఫఅనాహు మకానన్ అలియ్యా)

ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే. మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)

అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.

మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.

ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.

అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.

ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.

ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.

ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.

మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.

అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?

మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.

రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.

కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.

అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.

దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.

దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.

అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.

ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31097

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

పరాచికానికైనా సరే మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు | కలామే హిక్మత్

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు .

“మీలో ఎవ్వరూ మీ సోదరుని వైపు ఆయుధం ఎక్కుపెట్టరాదు.బహుశా షైతాని అతని చేయిని ఝుళిపించవచ్చు. ఇంకా, అది నరక కూపంలోపడిపోవచ్చు.” (ముస్లిం)

ఈ హదీనులో ముస్లిం హక్కుల గురించి నొక్కి పలకడం జరిగింది. ఏ ముస్లిమునైనా భయపెట్టడం, కలవరానికి గురిచెయ్యడం, లేదా అతను నొచ్చుకునేలా వ్యవహరించడం పట్ల వారించ బడింది.

మీ సోదరుని వైపు ఆయుధాన్ని ఎక్కు పెట్టరాదు.” ఇక్కడ సోదరుడంటే ముస్లిం అన్నమాట. ముస్లిములు పరస్పరం అన్నదమ్ములు. అల్లాహ్ సెలవిచ్చాడు :”ఇన్నమల్ మోమినీన ఇఖ్వ” (విశ్వాసులు పరస్పరం సోదరులు). ఆటపాటల్లో, పరాచి కానికయినా భయపెట్టే సంకల్పంతో కరవాలాన్ని, ఖడ్గాన్ని, లేక మరే ప్రమాదకరమైన ఆయుధాన్నయినా లేపటం హరాం (నిషిద్ధం).

“షైతాన్ అతని చేయిని ఝుళిపించవచ్చు” అంటే చేయి జారినా చేయి విసిరినా చేతిలోని ఆయుధానికి ఎదుటి వ్యక్తి గురికావచ్చు. ఇది ఘోర అన్యాయం అవుతుంది.ఒక ముస్లింను అకారణంగా చంపిన కారణంగా ఇతను నరకాగ్నికి ఆహుతి అవుతాడు.ఎందుకంటే అన్యాయంగా, అధర్మంగా ఏ ముస్లిమునైనా వధించటం మహాపాతకం.

అల్లాహ్ సెలవిచ్చాడు :

“ఉద్దేశ్యపూర్వకంగా ఎవడైతే ఒక విశ్వసించిన వాణ్ణి చంపుతాడో అతనికి బహుమానం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమయిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.(అన్ నిసా: 93)

ఏ ముస్లిం హత్యకయినా, గాయాని కయినా కారణభూతమయ్యే ప్రతి విధానాన్ని, ధోరణిని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధంగా (హరామ్)గా ఖరారు చేసినట్లు అసంఖ్యాకమయిన హదీసుల ద్వారా విదితమవుతోంది.

హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది :

ఎప్పుడయినా ఏ ముస్లిం అయినా మరో ముస్లిం వైపునకు ఇనుప ముక్కతో సంజ్ఞ చేస్తే దైవదూతలు అతన్ని శపిస్తారు – ఒకవేళ అతను సంజ్ఞ చేసిన వ్యక్తి అతని తోబుట్టువు అయినాసరే.”

ఇబ్నుల్ అరబీ ఏమంటున్నారో చూడండి – ‘కేవలం ఇనుప ముక్కతో సంజ్ఞ చేసినమాత్రానికే అతను శాపగ్రస్తుడయితే, ఇక ఆ ఇనుపముక్కతో ఎదుటి ముస్లింపైదాడి జరిపితే, అప్పుడతని పర్యవసానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో?’

వేళాకోళంగానే అయినా ఆయుధంతో సైగ చేసిన వ్యక్తి ధూత్కారిగా పరిగణించబడటానికి కారణమేమంటే, అతని, ఈ చేష్ట మూలంగా ఎదుటి వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. అదే ఒకవేళ అతను నిజంగానే ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టే ఉద్దేశ్యంతో చేస్తే అది మహాపరాధమే అవుతుంది. అందుకే ఒరలేని (నగ్న) ఖడ్గాలు ఇచ్చిపుచ్చుకోరాదని అనబడింది. అలా ఇచ్చిపుచ్చు కొంటున్నప్పుడు ఏమరుపాటు వల్ల ఖడ్గం చేజారి పోయి హాని కలిగే ప్రమాదముంది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బృందం వైపుగా వెళుతుండగా, వారు ఒరలేని ఖడ్గాలను మార్పిడి చేసుకుంటూ కనిపించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఇలా మందలించారు- “ఇలాంటి చేష్ట చేయరాదని నేను మీకు చెప్పలేదా? మీలో ఎవరయినా ఖడ్గాలుమార్చుకుంటున్నప్పుడు ఒరలో పెట్టి మరీ ఇవ్వాలి.” (అహ్మద్, బజార్)

నేటి ఆధునిక కాలంలో ఎవరయినా వేళాకోళానికయినా సరే – రివాల్వర్ను ఎదుటివారికి గురిపెట్టడం, గుళ్లు నింపిన రివాల్వర్తో అనుభవం లేకుండా ప్రాక్టీసు చేయటం కూడా హదీసులో ప్రస్తావించబడిన ఖడ్గాల మార్పిడిలాంటిదే.ముక్తసరిగా హదీసు సారాంశం ఏమంటే ప్రతి ముస్లిం ప్రాణం అత్యంత విలువైనది, గౌరవప్రదమైనది. కాబట్టి అకారణంగా, అన్యాయంగా ఒక ప్రాణానికి హాని తలపెట్టడం దైవ సమక్షంలో పెద్ద నేరం అవుతుంది. అటువంటి వారి నుండి ప్రళయ దినాన కఠినంగా లెక్క తీసుకోవటం జరుగుతుంది.

[PDF డౌన్ లోడ్ చేసుకోండి]

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ

నూతన సంవత్సర (న్యూ ఇయర్) ఉత్సవాల వాస్తవికత [వీడియో, టెక్స్ట్]

నూతన సంవత్సర (న్యూ ఇయర్) ఉత్సవాల వాస్తవికత
https://youtu.be/oPjBc0636SE [61 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలను ఇస్లామీయ దృక్కోణంలో విశ్లేషించారు. ముస్లింలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం హరామ్ (నిషిద్ధం) అని, దీనికి అనేక కారణాలున్నాయని వివరించారు. ఇస్లాంకు తనదైన ప్రత్యేక గుర్తింపు ఉందని, అన్యజాతీయుల పండుగలను, ఆచారాలను అనుకరించడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్’హా) మాత్రమే ఉన్నాయని, వాటిని మినహా వేరే వేడుకలకు అనుమతి లేదని తెలిపారు. ఈ వేడుకలు క్రైస్తవుల క్రిస్మస్ పండుగకు కొనసాగింపుగా జరుగుతాయని, దైవానికి సంతానం ఉందని విశ్వసించే వారి పండుగలో పాలుపంచుకోవడం దైవద్రోహంతో సమానమని హెచ్చరించారు. ఈ వేడుకల సందర్భంగా జరిగే అశ్లీలత, మద్యం సేవనం, సంగీతం, స్త్రీ పురుషుల కలయిక వంటి అనేక నిషిద్ధ కార్యాల గురించి కూడా వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ, వారిని ఇలాంటి చెడుల నుండి కాపాడాలని, వారికి ఇస్లామీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహ్. అల్’హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మదివ్ వ’అలా ఆలిహి వ’సహ్బిహి అజ్మ’ఈన్, అమ్మా బా’ద్.

ప్రియ విద్యార్థులారా! ఈరోజు అల్’హమ్దులిల్లాహ్, నిషిద్ధతలు జాగ్రత్తలు అనేటువంటి మన ఈ శీర్షికలో తొమ్మిదవ క్లాస్. అయితే ఈరోజు ఈ తొమ్మిదవ క్లాస్ ఏదైతే జరగబోతుందో, ప్రారంభం కాబోతుందో, ఈనాడు తేదీ డిసెంబర్ 31, 2023.

ఇప్పటి నుండి సమయ ప్రకారంగా చూసుకుంటే సుమారు ఒక 12న్నర గంటల తర్వాత 2024వ సంవత్సరంలో ఫస్ట్ జనవరిలో ప్రవేశించబోతున్నాము. ఈ నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం, న్యూ ఇయర్ కి సంబంధించి కూడా ఎన్నో రకాల నిషిద్ధతలకు పాల్పడతారు. అందుకని మన క్రమంలో, మనం చదువుతున్నటువంటి పుస్తకంలో, ఏ మూడు అంశాలు ఈరోజు ఉన్నాయో, సమయం మనకు సరియైన రీతిలో అందుబాటులో ఉండేది ఉంటే, అనుకూలంగా ఉంటే, అవి మూడు లేదా వాటిలో కొన్ని ఇన్’షా’అల్లాహ్ తెలుసుకుంటాము. కానీ వాటన్నిటికంటే ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్, కొత్త సంవత్సర ఉత్సవాలు జరుపుకోవడం యొక్క వాస్తవికత ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.

ఎందుకంటే సోదర మహాశయులారా, వీటి వివరాలు మనం తెలుసుకోకుండా ఆ నిషిద్ధతలకు పాల్పడుతూ ఉంటే ఇహలోక పరంగా, సమాధిలో, పరలోకంలో చాలా చాలా నష్టాలకు మనం గురి కాబోతాం. అందుకొరకే వాటి నుండి జాగ్రత్తగా ఉండండి, ఆ నిషిద్ధతలకు పాల్పడకుండా ఉండండి అని చెప్పడం మా యొక్క బాధ్యత. వినడం, అర్థం చేసుకోవడం, మంచిని ఆచరించడం, చెడును ఖండించడం, చెడును వదులుకోవడం మనందరిపై ఉన్నటువంటి తప్పనిసరి బాధ్యత.

అయితే సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త సంవత్సరం సంబరాలు మనం జరుపుకోవచ్చా? ఉత్సవాలు జరుపుకోవచ్చా? న్యూ ఇయర్ హ్యాపీ ఎవరికైనా చెప్పవచ్చా? అంటే ఇది హరామ్, దీనికి ఎలాంటి అనుమతి లేదు. మరి ఇందులో ఉన్న చెడులు చాలా ఉన్నాయి. కానీ ఆ చెడుల గురించి చెప్పేకి ముందు ఒక విన్నపం, ప్రత్యేకంగా ఏ స్త్రీలు, పురుషులు ఇలాంటి సంబరాలు జరుపుకుంటారో, కొత్త సంవత్సరం యొక్క వేడుకలు జరుపుకుంటారో, వారు ప్రత్యేకంగా పూర్తిగా ఈ ప్రసంగాన్ని వినండి. ఉర్దూ అర్థమైతే ‘నయే సాల్ కా జష్న్’ అని మా ఉర్దూ ప్రసంగం కూడా ఉంది. వినండి, అర్థం చేసుకోండి, కారణాలు తెలుసుకోండి. ఇక వీళ్ళు ఈ మౌల్సాబులు హరామ్ అని చెప్పారు. ఇక మీదట వీళ్ళ మాట వినే అవసరమే లేదు, ఈ విధంగా పెడచెవి పెట్టి, విముఖత చూపి తమకు తాము నష్టంలో పడేసుకోకండి.

మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించామో, విశ్వసిస్తున్నామో, అది ఎలాంటి ఉత్తమమైన, సంపూర్ణమైన – నా ఈ పదాలను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి – మనం ఏ ఇస్లాం ధర్మాన్ని అవలంబించి, దీని ప్రకారంగా జీవితం గడపాలన్నట్లుగా పూనుకొని, నిశ్చయించి మనం జీవితం కొనసాగిస్తున్నామో, ఈ ఇస్లాం ధర్మం అత్యుత్తమమైనది, సంపూర్ణమైనది, ప్రళయం వరకు ఉండేది, అన్ని జాతుల వారికి, ప్రతీ కాలం వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఉత్తమ ధర్మం. ఈ ఇస్లాం ధర్మం, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారో, ఇస్లాం ధర్మాన్ని నమ్ముతారో ఇస్లాం కోరుకుంటున్నది ఏమిటంటే తనదంటూ ఒక వ్యక్తిత్వం, తనదంటూ ఒక ఐడెంటిఫికేషన్, నేను ఒక ముస్లింని అన్నటువంటి తృప్తి, మన యొక్క ప్రత్యేకత మనం తెలియజేయాలి, దానిపై స్థిరంగా ఉండాలి. ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి, ముస్లిం అంటే ఇలా ఉంటాడు. ముస్లిం అంటే ఖిచిడీ కాదు, ముస్లిం అంటే బిర్యానీ కాదు, ముస్లిం అంటే ఏదో కొన్ని వస్తువుల, తినే ఆహార పదార్థాల పేర్లు కావు. ముస్లిం తన విశ్వాసంతో, తన ఆరాధనలతో, తన వ్యక్తిత్వంతో, తన యొక్క క్యారెక్టర్ తో అత్యుత్తమ మనిషిగా నిరూపిస్తాడు.

అందుకొరకే ప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనేక సందర్భాలలో ఇచ్చినటువంటి బోధనల్లో ఒక మాట, ఎన్నో సందర్భాల్లో ఉంది. ప్రతి జుమాలో మీరు వింటూ ఉంటారు కూడా. హజ్ లో ఒక సందర్భంలో ప్రవక్త చెప్పారు, ‘హదయునా ముఖాలిఫుల్ లిహదియిహిమ్’. మన యొక్క విధానం, మన యొక్క మార్గదర్శకత్వం అందరిలో నేను కూడా ఒకడినే, అందరి మాదిరిగా నేను అన్నట్లుగా కాదు. మన యొక్క విధానం, మన ఇస్లామీయ వ్యక్తిత్వం, మనం ముస్లింలం అన్నటువంటి ఒక ప్రత్యేక చిహ్నం అనేది ఉండాలి. ఎందుకంటే అందరూ అవలంబిస్తున్నటువంటి పద్ధతులు వారి వారి కోరికలకు తగినవి కావచ్చు కానీ, వారి ఇష్ట ప్రకారంగా వారు చేస్తున్నారు కావచ్చు కానీ, మనం ముస్లింలం, అల్లాహ్ ఆదేశానికి, ప్రవక్త విధానానికి కట్టుబడి ఉంటాము. ప్రతి జుమ్మాలో వింటున్నటువంటి విషయం ఏంటి?

فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
(ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్)
నిశ్చయంగా అన్నింటికన్నా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖుర్ఆన్).

وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم
(వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం)
అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గం.

ఇది కేవలం జుమ్మా రోజుల్లో చెప్పుకుంటే, కేవలం విని ఒక చెవి నుండి మరో చెవి నుండి వదిలేస్తే ఇది కాదు అసలైన ఇస్లాం. మొదటి కారణం ఏంటి? మన విశ్వాసం నుండి మొదలుకొని, ఆరాధనలు మొదలుకొని, మన జీవితంలోని ప్రతి రంగంలో మనం మనకంటూ ఒక ఇస్లామీయ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి, ఆచరించాలి, కనబరచాలి.

శ్రద్ధగా వినండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎందుకు మనం జరుపుకోకూడదు? సెకండ్ రీజన్, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జాతులు, సమాజాలే కాదు ప్రభుత్వ పరంగా కూడా దేశాలు దీనిని ఏదైతే జరుపుకుంటున్నాయో అది ఒక పండుగ మాదిరిగా అయిపోయింది, కదా? మరియు ఇస్లాంలో మనకు అల్లాహ్ యే ఇచ్చినటువంటి పండుగలు కేవలం రెండే రెండు పండుగలు సంవత్సరంలో.

అబూ దావూద్ లో వచ్చిన హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు?

إِنَّ اللَّهَ قَدْ أَبْدَلَكُمْ بِهِمَا خَيْرًا مِنْهُمَا
(ఇన్నల్లాహ ఖద్ అబ్దలకుం బిహిమా ఖైరమ్ మిన్హుమా)
నిశ్చయంగా అల్లాహ్ ఈ రెండు రోజులకు బదులుగా మీకు వీటికన్నా ఉత్తమమైన రెండు రోజులను ప్రసాదించాడు.

అజ్ఞాన కాలంలో రెండు రోజులు వారు జరుపుకునేవారు, ఆటలాడేవాడు, పాటలాడేవారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? అల్లాహ్ యే మీకు ఆ రెండు రోజులకు బదులుగా మరో రెండు రోజులు ప్రసాదించాడు. కనుక మీరు ఆ అజ్ఞాన కాలంలో పాటిస్తూ వస్తున్నటువంటి రెండు రోజులను మరిచిపొండి, వాటిని వదిలేయండి, వాటిలో ఏ మాత్రం పాలుపంచుకోకండి, అలాంటి వాటిని జరుపుకోకండి. అల్లాహ్ మీకు వాటికి బదులుగా ఏదైతే ప్రసాదించాడో రెండు రోజులు వాటిలో మీరు మీ పండుగ జరుపుకోండి. ఏంటి అవి? యౌముల్ ఫితర్, వ యౌముల్ అద్’హా. సర్వసామాన్యంగా మనం రమదాన్ పండుగ అని, బక్రీద్ పండుగ అని అనుకుంటూ ఉంటాం.

థర్డ్ రీజన్ ఏంటి? మనం న్యూ సెలబ్రేషన్ ఎందుకు జరుపుకోకూడదు? ఎందుకంటే ఇతరుల యొక్క ఆచారం అది అయిపోయినది. వారు పండుగ మాదిరిగా దానిని జరుపుకుంటున్నారు. అలా మనం జరుపుకోవడం వల్ల వారి యొక్క విధానాన్ని, పద్ధతులను అవలంబించడం ద్వారా వారిలో కలిసిపోయే, ప్రళయ దినాన వారితో కలిసి లేపబడే, వారితో నరకంలో పోయే అటువంటి ప్రమాదానికి గురవుతాం. అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్:

مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ
(మన్ తషబ్బహ బి’ఖౌమిన్ ఫహువ మిన్హుమ్)
ఎవరైతే ఏ జాతిని పోలి నడుచుకుంటారో వారు వారిలోని వారే అయిపోతారు.

గమనించండి ఎంత చెడ్డ విషయం ఇది.

ఫోర్త్ రీజన్, కారణం, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, 25వ డిసెంబర్ రోజు ఏ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారో, దానిని అనుసరిస్తూ దాని యొక్క కంటిన్యూషన్ లోనే ఇలాంటి పండుగలు జరుగుతూ ఉంటాయి. ఇంకా వేరే వారు ఏవైతే అందులో చేస్తారో వాటి విషయం వేరు. అయితే, ఎవరైతే మీ తల్లిని తిడతారో, నీవు అతనికి ‘హ్యాపీ, ఎంత మంచి పని చేశావురా’ అని అంటావా? అనవు కదా! అలా మీ తల్లికి తిట్టిన వాడినికి నీవు శుభకాంక్షలు తెలియజేయవు. మరి ఎవరైతే అల్లాహ్ కు సంతానం ఉంది అని, అల్లాహ్ యొక్క సంతానం 25వ డిసెంబర్ నాడు పుట్టాడు అని విశ్వసిస్తున్నారో, దానిని పురస్కరించుకొని పండుగలు జరుపుకుంటున్నారో, అలాంటి వారి ఆ ఉత్సవాలలో మనం ఎలా పాలుపంచుకోగలము? ఎలా వారికి హ్యాపీ చెప్పగలము? విషెస్ ఇవ్వగలము? శుభకాంక్షలు తెలియజేయగలము? ఇదంతా కూడా మనకు తగని పని. ఎందుకంటే అల్లాహ్ ను తిట్టే వారితో మనం సంతోషంగా ఉండి సంబరాలు జరపడం అంటే మనం ఆ తిట్టడంలో పాలు పంచుకున్నట్లు, అల్లాహ్ ను మనం తిడుతున్నట్లు, ఇక మనం ఇస్లాం, మన ఇస్లామీయం ఏమైనా మిగిలి ఉంటుందా?

ఖురాన్ లోనే అల్లాహ్ త’ఆలా ఎంత కఠోరంగా, అల్లాహ్ కు సంతానం అని అన్న వారి పట్ల ఎలాంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క కోపం, ఆగ్రహం కురిసింది. అంతేకాదు, ఈ మాట అంటే అల్లాహ్ కు సంతానం ఉంది అనడం ఎంత చెడ్డదంటే ఆకాశాలు దీనిని గ్రహిస్తే బద్దలైపోతాయి. బద్దలైపోతాయి, పగిలిపోతాయి. మరియు భూమి చీలిపోతుంది. అంతటి చెండాలమైన మాట అల్లాహ్ కొరకు ఇది. ఇక అలాంటి వారితో మీరు పాలుపంచుకోవడం, ఇది ఏమైనా సమంజసమేనా?

ఫిఫ్త్ రీజన్, న్యూ సెలబ్రేషన్ జరుపుకోకపోవడానికి, అందులో జరుగుతున్నటువంటి నిషిద్ధ కార్యాలు. ఏమిటి ఆ నిషిద్ధ కార్యాలు? వాటి యొక్క స్థానం ఏమిటి? అందులో ఏమేమి చేస్తారో వాటి యొక్క వాస్తవికత ఏమిటి? రండి, సంక్షిప్తంగా అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొదటి విషయం ఇందులో, ఐదవ రీజన్ కొంచెం పొడుగ్గా సాగుతుంది. ఇందులో మరికొన్ని వేరే పాయింట్స్ చెబుతున్నాను, శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఇందుకిగాను ఇది నిషిద్ధం అని మనకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది.

మొదటి విషయం ఏంటి? 31వ డిసెంబర్ దాటిపోయి ఫస్ట్ జనవరి రావడం, ఇది 30 తర్వాత 31, లేదా ఫస్ట్ జనవరి తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్, థర్డ్ తర్వాత ఫోర్, ఎలా దినాలు గడుస్తున్నాయో అదే రీతిలో. దీనికంటూ ఏ ధర్మంలో కూడా ఎలాంటి ప్రత్యేకత లేదు, ఇస్లాం లోనైతే దీని యొక్క ప్రస్తావన ఏ మాత్రం లేదు. ఇక అలాంటి సందర్భంలో మనం రాత్రంతా కాచుకుంటూ వేచి ఉంటూ 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్లు పూర్తి అయ్యాయి, 00:00 అని వచ్చిన వెంటనే చప్పట్లు కొట్టడం, కేకలు, నినాదాలు ఇవన్నీ చేసుకుంటూ వెల్కమ్ అన్నటువంటి పదాలు పలకడం, గమనించండి కొంచెం ఆలోచించండి. ప్రతి రాత్రి ఏదైతే 12 అవుతుందో, దినం మారుతుందో, కొత్త సంవత్సరం అని ఏ రీతి మీరు అనుకుంటున్నారో అది 60 సెకండ్ల ఒక నిమిషం, 60 నిమిషాల ఒక గంట, 24 గంటల ఒక రోజు, ఏడు రోజుల ఒక వారం, ఏ ఒక వారం సుమారు నాలుగు వారాలు కొద్ది రోజుల ఒక నెల, 12 నెలల ఒక సంవత్సరం. ఇదే తిరుగుడు ఉంది కదా? ఇందులో కొత్తదనం ఏమిటి? ఇందులో కొత్తదనం ఏమిటి? నీవు ఏదైతే వెల్కమ్ అంటున్నావో, 12 అయిన వెంటనే సంబరాలు జరుపుకుంటున్నావో, దేనికి జరుపుకుంటున్నావు?

మనకు ముస్లింగా గమనించాలంటే అసలు ఆ 12, ఆ సమయంతో మనకు సంబంధమే లేదు. ఇస్లాం పరంగా 24 గంటల దినం ఏదైతే మనం అనుకుంటామో, అది మారుతుంది ఎప్పటినుండి? సూర్యాస్తమయం నుండి. సన్ సెట్ అవుతుంది కదా? అప్పటి నుండి కొత్త తేదీ ప్రారంభమవుతుంది. కొత్త తేదీ అంటున్నాను, కొత్త సంవత్సరం అనడం లేదు. కొత్త రోజు. ముందు రాత్రి వస్తుంది, తర్వాత పగలు వస్తుంది, ఇస్లాం ప్రకారంగా. మరొక విషయం మీరు గమనించండి. బుద్ధిపూర్వకంగా, అల్లాహ్ ఇచ్చిన జ్ఞానంతో ఆలోచించండి.

ఈ జంత్రీ, క్యాలెండర్ మారినంత మాత్రాన ఏ ఏ సంబరాలు జరుపుకోవాలని, ఏ సంతోషాలు వ్యక్తపరచాలని ప్లాన్ చేసుకొని ఈ రాత్రి గురించి వేచిస్తూ ఉంటారో, దీని ప్రస్తావన లేదు అని మనం తెలుసుకున్నాము, అదే చోట మనం గమనిస్తే ఖురాన్ లో, హదీస్ లో, అల్లాహ్ త’ఆలా మనకు ఇస్తున్నటువంటి ఆదేశం ఏమి? ఎప్పుడైనా ఆలోచించామా? ఇలాంటి ఈ వేచి ఉండడం ప్రతి రోజు మన కర్తవ్యం కావాలి. రాత్రి 12 వేచి ఉండడం అంటలేను నేను. ఒక దినం మారుతున్నప్పుడు, ఒక కొత్త రోజు మనకు లభిస్తున్నప్పుడు మన యొక్క కర్తవ్యం ఏమిటి? మన యొక్క బాధ్యత ఏమిటి? ఒక్కసారి సూరతుల్ ఫుర్ఖాన్ లోని ఈ ఆయతును గమనించండి.

وَهُوَ الَّذِي جَعَلَ اللَّيْلَ وَالنَّهَارَ خِلْفَةً لِمَنْ أَرَادَ أَنْ يَذَّكَّرَ أَوْ أَرَادَ شُكُورًا
(వహువల్లజీ జ’అలల్లైల వన్నహార ఖిల్ఫతల్ లిమన్ అరాద అం యజ్జక్కర అవ్ అరాద శుకూరా)
జ్ఞాపకం చేసుకోవాలనుకునే వాని కొరకు, లేక కృతజ్ఞత చూపదలచిన వాని కొరకు రాత్రింబవళ్లను ఒక దాని తరువాత మరొకటి వచ్చేలా చేసినవాడు ఆయనే. (25:62)

రేయింబవళ్లు మీకు ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్ యే. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి, ఎందుకని? మీలో ఎవరు ఎక్కువగా గుణపాఠం నేర్చుకుంటారు, అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తలచుకుంటారు, వాటిని ప్రస్తావించుకొని అల్లాహ్ యొక్క షుక్రియా, అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎక్కువగా తెలుపుతూ ఉంటారు. అల్లాహ్ యొక్క ఈ థాంక్స్, షుక్రియా, కృతజ్ఞత,

اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا
(ఇ’మలూ ఆల దావూద షుక్రా)
ఓ దావూదు సంతతి వారలారా! కృతజ్ఞతాపూర్వకంగా పనులు చేయండి. (34:13)

హృదయంతో, మనసుతో, నాలుకతో, ఆచరణతో, ధన రూపంలో అన్ని రకాలుగా. మరి నేను ఏదైతే చెప్పానో, ప్రతి రోజు ఈ మన బాధ్యత అని, ఎప్పుడైనా మనం గమనించామా? ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మీలోని ప్రతి వ్యక్తి ఎప్పుడైతే ఉదయాన లేస్తాడో, అతని ప్రతి కీలుకు బదులుగా ఒక దానం తప్పకుండా అతను చేయాలి. అల్లాహ్ త’ఆలా రాత్రి పడుకోవడానికి ప్రసాదించాడు, పగటిని శ్రమించడానికి మనకు అనుగ్రహించాడు. నేను ఒక కొత్త దినాన్ని పొందాను, మేల్కొన్నాను, నిద్రలోనే నేను చనిపోలేదు కదా,

الْحَمْدُ لِلَّهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا
(అల్’హమ్దులిల్లాహిల్లజీ అహ్యానా బ’దమా అమాతనా)
మమ్మల్ని మరణింపజేసిన తర్వాత తిరిగి ప్రాణం పోసిన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

అని అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించుకుంటూ మేల్కోవడం. ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు? 360 కీళ్లు మనిషి శరీరంలో ఉన్నాయి. ఈ 360 కీళ్లలో ప్రతి ఒక్క కీలుకు బదులుగా ఒక్క దానం చేయడం, సదకా చేయడం తప్పనిసరి. పేదవాళ్లకు చాలా పెద్ద భారం ఇది ఏర్పడుతుంది కదా? ఎలా మనం రోజుకు 360 దానాలు చేయగలుగుతాము? కానీ అల్లాహ్ త’ఆలా మనకు ప్రవక్త కారుణ్యమూర్తి సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభవార్త తెలియజేసి ఎంత సులభతరం ప్రసాదించాడు! ఒక్కసారి సుబ్ హా నల్లాహ్ అంటే ఒక్క సదకా చేసినంత పుణ్యం. ఈ విధంగా ఇంకా విషయాలు ఉన్నాయి. మా జీడీకేనసీర్ YouTube ఛానల్ లో షేక్ జాకిర్ జామి గారు చాలా మంచి ప్రసంగం సదకాల గురించి ఉంది, విని చూడండి. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, కనీసం రెండు రకాతులు సలాతుద్ దుహా చదివితే 360 దానాలు చేసినటువంటి సదకాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుభవార్త తెలియజేశారు. అయితే, ఒక వైపున ఇలాంటి బోధనలు మనకు ఉన్నాయి. ప్రతి రోజు ఒక కొత్త ధనం మనం ఏదైతే పొందుతున్నామో, కొత్త రోజు ఏదైతే పొందుతున్నామో, అందులో ఎలాంటి మనం శుక్రియా అదా చేయాలి, అందులో ఎలాంటి బాధ్యత మనపై ఉన్నది, మరియు రాత్రి ఏ వేళను కాచుకుంటూ వేచి ఉంటూ వెయిట్ చేస్తూ ఉంటారో, ఆ రాత్రి, ప్రత్యేకంగా రాత్రిలోని మూడవ భాగం ఆరంభంలో అల్లాహ్ త’ఆలా ప్రపంచపు ఆకాశం వైపునకు తనకు తగిన రీతిలో వస్తాడు అని, ఎవరు క్షమాపణలు కోరుకుంటారు? ఎవరు దుఆ చేస్తారు? ఎవరికి ఏ అవసరం ఉంది? అల్లాహ్ ను అర్ధిస్తారు, అడుగుతారు అని అల్లాహ్ త’ఆలా కేకలు వేస్తాడు, చాటింపు చేస్తాడు. దాని వైపునకు శ్రద్ధ వహించకుండా, సంవత్సరంలో ఒక్క రాత్రి దాని గురించి సంతోషం వ్యక్తపరచడానికి, దాని పేరున సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా మనం నిద్రను పోగొట్టుకొని వేచి ఉంటూ ఉండడం ఇది అల్లాహ్ యొక్క హకీకత్ లో, వాస్తవంగా శుక్రియా అవుతుందా గమనించండి.

ఇంకా రండి, ఈ విధంగా రాత్రి 12 గంటల కొరకు వేచి ఉంటూ, అప్పుడు ఏ అరుపులు, ఏ కేకలు వేస్తారో, అల్లాహు అక్బర్. దగ్గర ఉన్నవారు కొందరి యొక్క చెవులు గిళ్ళుమనడం కాదు, ఆ శబ్దాలకు ఎవరైనా కొంచెం హార్ట్ లాంటి హార్ట్ పేషెంట్ లాంటి మనుషులు ఉండేది ఉంటే అక్కడ వారి పని పూర్తి అయిపోతుంది. అల్లాహు అక్బర్.

ఈ సంబరాలకు అనుమతి లేదు. ఇంకా ఆ రాత్రి దీపాలు వెలిగించడం, వాటిని ఆర్పడం, క్యాండిల్స్ దానికొక ప్రత్యేకత ఇవ్వడం, ఈ క్యాండిల్స్ కు, మవ్వొత్తులకు ఈ ప్రత్యేకత అగ్ని పూజారులలో ఉంటుంది, మజూసులలో ఉంటుంది. వారి యొక్క పోలిక అవలంబించి మనం ఎటువైపునకు వెళ్తున్నామో ఒకసారి ఇది కూడా ఆలోచించి చూడండి. అంతేకాదు, ఈ రాత్రి వేచి ఉంటూ ఏదైతే ఉంటారో, ఆ తర్వాత కేకులు కట్ చేసుకుంటూ, తినుకుంటూ, వాటి యొక్క క్రీములు తినడమే కాదు, ఆహారం యొక్క ఎంత వేస్టేజ్, మళ్ళీ సంబరాల, సంతోషాల పేరు మీద వాటిని ఎంత అగౌరవ, ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తారంటే క్రీములు తీసుకొని ఒకరు మరొకరికి పూసుకుంటూ ఉంటారు.

ఈ సందర్భంలో గమనించాలి, ఎక్కడెక్కడైతే హోటళ్లలో గాని, పార్కులలో గాని, వేరే కొన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకొని ఇలాంటి సంబరాలకు ఏదైతే అందరూ హాజరవుతారో, స్త్రీలు, పురుషులు, యువకులు, యువతులు వారి మధ్యలో జరిగేటువంటి ఆ సందర్భంలో అశ్లీల కార్యాలు, అశ్లీల మాటలు, అశ్లీల పనులు ఇవన్నీ కూడా నిజంగా ఏ సోదరుడు తన సోదరి గురించి, ఏ తండ్రి తన బిడ్డ గురించి, ఏ భర్త తన భార్య గురించి సహించలేడు. సహించలేడు. ఏ కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న కొడుకు తన తల్లి గురించి భరించలేడు. ఇలాంటి విషయాలు వినడం కూడా ఇష్టపడడు. కానీ అలాంటి సందర్భంలో ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? దానికి ఇంకా మించి ఒకరి మీద ఒకరు రంగులు పోసుకోవడం, కలర్స్ రుద్దుకోవడం. ఇంకా ఆ సమయంలో ప్రత్యేకంగా పెద్ద పెద్ద స్పీకర్స్ లాంటివి, బాక్సులు సెట్ చేసుకొని వాటిలో సాంగ్స్, మ్యూజిక్స్ రకరకాలవి పెట్టుకొని ఆనందం వ్యక్తపరచడం. ఈ మ్యూజిక్ విషయంలో ఎప్పుడైనా విన్నారా? ఇది మన కొరకు నిషిద్ధం అన్న విషయం? మరియు ఇలా చేసే వారి గురించి ఎన్ని రకాల హెచ్చరికలు వచ్చాయో వాటి గురించి ఎప్పుడైనా విన్నారా? సూరత్ లుఖ్మాన్ లోని సుమారు ప్రారంభ ఆయత్ లోనే

وَمِنَ النَّاسِ مَنْ يَشْتَرِي لَهْوَ الْحَدِيثِ لِيُضِلَّ عَنْ سَبِيلِ اللَّهِ بِغَيْرِ عِلْمٍ
(వ మినన్నాసి మం యష్తరీ లహ్వల్ హదీసి లియుదిల్ల అన్ సబీలిల్లాహి బిగైరి ఇల్మ్)
ప్రజలలో కొందరు సరైన జ్ఞానం లేకుండా (ఇతరులను) అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికి, దానిని (అల్లాహ్ మార్గాన్ని) ఎగతాళి చేయటానికి పనికిరాని విషయాలను కొంటారు. (31:6)

ఇక్కడ లహ్వల్ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో, తఫ్సీర్ లో, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పిన మాటలు అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి మూడేసి సార్లు చెబుతున్నారు. మరి ఇటు మనం ముస్లింలమని భావించుకుంటూ ఇలాంటి సంతోషాల పేరు మీద ఇవన్నీ జరుపుకుంటూ ఉండడం, మన ఇస్లాంపై ఇది, మనం ముస్లింలము అని చెప్పుకోవటంపై ఎంత మచ్చ, ఒక చాలా చెడు, ఒక తప్ప పడిపోతుందో గమనించండి.

మిత్రులారా, సోదర సోదరీమణులారా, ప్రత్యేకంగా ఎవరైతే తమ యొక్క యువకులైన బిడ్డల్ని, కొడుకుల్ని 31వ డిసెంబర్ సాయంకాలం వరకు బయటికి వెళ్ళడానికి అనుమతిస్తున్నారో, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారేసరికి ఇంటికి వచ్చేవరకు ఎన్ని పాపాలలో వారు కూరుకుపోయి ఉంటారు, ఎన్ని రకాల అశ్లీల కార్యాలకు పాల్పడి తల్లిదండ్రుల యొక్క ఇహలోకపు బద్నామీ, ఇహలోకంలోనే చెడు పేరు కాకుండా వారి యొక్క పరలోక పరంగా కూడా నష్టం చేకూర్చే అటువంటి ఎన్ని కార్యాలకు వారు పాల్పడతారు. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలి? సోదరులు ఏం చేయాలి? తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారి బాధ్యతలో ఉన్నటువంటి పిల్లల్ని ఇలాంటి చెడు కార్యాల్లో వెళ్లకుండా తాళం వేసి ఉంచడం, మొబైల్ తీసుకొని పెట్టడం, ఏదైనా కేవలం బెదిరించి ఎంతవరకైనా చేయగలుగుతారు? అలా చేయకుండా వారు అలాంటి అశ్లీల కార్యాల్లో, ఇలాంటి సెలబ్రేషన్స్ లో పాల్గొనకుండా ఉండడానికి మీరు ఇంట్లోనే మంచి ప్లాన్ చేయండి. మీరు ఒకవేళ ఫలానా ఫలానా పిల్లలు వెళ్లేవారు ఉన్నారు అన్నట్లుగా మీకు ఏదైనా ఐడియా కలిగి ఉండేది ఉంటే, వారిని తీసుకొని ఏదైనా మంచి పుణ్య కార్యానికి, పుణ్యకార్యం కాకపోయినా చెడు నుండి రక్షింపబడడానికి అల్లాహ్ తో మేలును కోరుతూ, దుఆ చేసుకుంటూ ఎక్కడైనా విహారానికి వెళ్ళండి. మంచి విషయాల గురించి, పెద్ద పాపాల నుండి దూరం ఉండడానికి, కానీ ఇలాంటి వాటిలో మాత్రం పాల్గొనకండి.

ఇంకా ఈ సందర్భంలో ఎవరికైనా మనం హ్యాపీ అని చెప్పడం, హ్యాపీ న్యూ ఇయర్ అని దీనికి కూడా అనుమతి లేదు. షేక్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ తో ప్రశ్నించడం జరిగింది, ఎవరైనా మనకు చెప్పేది ఉంటే ఏం చేయాలి? మీకు కూడా మేలు జరుగుగాక అన్నట్లుగా వదిలేయాలి. కానీ అలాంటి వాటి వైపు ఏ శ్రద్ధ వహించకూడదు. ఇక ఇలాంటి శుభకాంక్షలు తెలియజేయకూడదు అన్నప్పుడు, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి స్టేటస్ లు పెట్టుకోవడం, రీల్ ముందునుండే తయారు చేసుకొని మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో అప్లోడ్ చేయడం, వాటిని షేర్ చేయడం, వాటిని లైక్ చేయడం లేదా మన యొక్క మిత్రులకు అలాంటివి సందేశాలు, మెసేజ్లు పంపడం, ఇవన్నీ కూడా తన సమయాన్ని వృధా కార్యంలో గడుపుతూ ఇంకా పెద్ద కార్యాలకు, పెద్ద నష్టాలకు పాల్పడే అటువంటి ప్రమాదం ఉంటుంది.

సోదర మహాశయులారా, ఈ సందర్భంలో ఇంకా ఏ ఏ విషయాలు జరుగుతాయో, ఇప్పుడు మనం ఏదైతే పాఠం మొదలు పెట్టబోతున్నామో, మొదటి పాఠంలోనే కొన్ని విషయాలు రాబోతున్నాయి గనుక, ఇక్కడి వరకు నేను నా ఈ న్యూ ఇయర్ కు సంబంధించిన ఏ సందేశం మీకు ఇవ్వాలనుకున్నానో, దానిని సమాప్తం చేస్తాను. కానీ సమాప్తం చేసే ముందు, గత ఎనిమిదవ పాఠంలో, అంతకుముందు పాఠాలలో మనం కొన్ని విషయాలు విన్నాము, ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో వాటిని గుర్తుంచుకోవడం చాలా చాలా అవసరం.

పర పురుషులు, పర స్త్రీలు ఈ సందర్భంలో ఏదైతే కలుసుకుంటారో, యువకులు, యువతులు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఒకరితో ఒకరు ఏదైతే టచ్ అవుతారో, ఈ సందర్భంలో చూపులకు సంబంధించిన నిషిద్ధతలు ఏమిటి, చదివాము. వాటిని ఒకసారి గుర్తు చేసుకోండి. అవన్నీ ఈ రాత్రి జరుగుతాయి. పర స్త్రీని తాకడం ఎంత ఘోరమైన పాపమో, దాని గురించి హదీస్ లు చదివాము, అవి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇంకా ఇలాంటి ఈ సందర్భంలో ఒకరు మరొకరికి శుభకాంక్షల పేరు మీద, సంబరాల పేరు మీద ఏ పదాలు పలుకుతూ ఉంటారో, ఆ పదాల్లో కూడా ఎన్నో అశ్లీల పదాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకోవడం కూడా సమంజసం ఉండదు. కానీ కేవలం తెలియజేస్తున్నాను, అలాంటి వాటన్నిటికీ దూరం ఉండాలంటే అలాంటి ప్రోగ్రాంలలో హాజరు కానే కాకూడదు. మరొక చివరి మాట ఈ సందర్భంలో, కొందరు ఏమంటారు? మేము అలాంటి సెలబ్రేషన్స్ జరుపుకోము. మేము అలాంటి సెలబ్రేషన్ లో పాల్గొనము. అలాంటి సెలబ్రేషన్ చేసే వారికి ఎలాంటి హ్యాపీ అనేది మేము చెప్పము. కానీ ఏం చేస్తారు? టీవీలలో లేదా మొబైల్ ద్వారా, స్మార్ట్ ఫోన్ల ద్వారా కొన్ని ప్రత్యేక వెబ్సైట్లు, కొన్ని ప్రత్యేక యూట్యూబ్ లలో లైవ్ కార్యక్రమాలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే కొన్ని యాప్స్ లలో లైవ్ ప్రోగ్రాములు దీనికి సంబంధించి జరుగుతాయి, కేవలం అవి చూసుకుంటున్నాము అని అంటారు. అర్థమైందా? స్వయంగా మేము ఏమీ పాల్గొనము, మేము మా ఇంట్లోనే ఉంటాము. కానీ ఏం చేస్తాము? లైవ్ ప్రోగ్రాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఏవైతే వస్తున్నాయో, వాటిని చూసుకుంటూ ఉంటాము. ఇలాంటివి చూసుకొని ఉండడం కూడా యోగ్యం లేదు.

కనీసం రెండు కారణాలు మీరు అర్థం చేసుకోండి. కనీసం రెండు కారణాలు అర్థం చేసుకోండి. ఒకటి, ఒక కారణం, వారు ఏ తప్పు పనులైతే ఆరోజు చేస్తూ ఉంటారో మీరు చూసి వారిని ప్రోత్సహించిన వారు అవుతారు. మీరు ప్రోత్సహించకున్నా మీ పదాలతో, మీరు వారి యొక్క ఆ వెబ్సైట్ ను, వారి యొక్క ఆ అప్లికేషన్ ను, వారి యొక్క ఆ ఛానల్ ను ఓపెన్ చేసి చూడడమే వారికి ఒక ప్రోత్సాహం. ఎందుకంటే వ్యూవర్స్ పెంచిన వారు అవుతారు. అంతే కాకుండా, అందులో ఏ ఏ చెడులు జరుగుతూ ఉంటాయో, అవి చూస్తూ చూస్తూ మనం ఆ పాపంలో మన కళ్ళతో పాల్గొన్న వారిమి అవుతాం. మనసులో ఏ భావోద్వేగాలు జనిస్తాయో, మనసును ఆ జినాలో, ఆ చెడులో, ఆ పాడులో, రంకులో, గుంపులో మనం మన మనసును కూడా వేసిన వారు అవుతాం. ఇంకా ఏమైనా చెడ్డ పేర్లు ఉండేది ఉంటే చెప్పడం ఇష్టం ఉండదు కానీ మీరు గమనించండి, అంత చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే కేవలం వాటిని చూడడం కూడా యోగ్యం లేదు.

రెండవ కారణం ఇక్కడ ఏమిటంటే, మనిషి ఒక చెడును చెడు అని భావించాడు. కానీ దానిని చూస్తూ ఉన్నాడంటే, షైతాన్ యొక్క ఇవి ‘ఖుతువాతుష్ షైతాన్’ అని ఏదైతే చదివారో ఇంతకు ముందు ఒక పాఠంలో, అలాంటివి ఇవి ఖుతువాత్. అలాంటి ఈ అడుగులు. ఈ అడుగుజాడల్లో మీరు నడుస్తూ ఉన్నందుకు, అయ్యో వారు అంత పాడు చేస్తారు కదా, నేనైతే అంత చేయను కదా అన్నటువంటి ఏ తృప్తి అయితే వస్తూ ఉంటుందో, చెడులో ఉండి ఒక రకమైన చెడు చేస్తలేము అన్నటువంటి తృప్తిపడి తమకు తాము పుణ్యాత్ములని భావిస్తారు. ఇది చాలా తమకు తాము మోసంలో వేసుకున్న వారు అవుతారు.

సోదర మహాశయులారా, అల్లాహ్ మనందరికీ కూడా హిదాయత్ ఇవ్వు గాక, మనలో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో అల్లాహ్ త’ఆలా వారికి తమ యొక్క సంతానాన్ని ఇలాంటి సందర్భాల్లో ఎలా శిక్షణ ఇవ్వాలో, ఎలా వారి యొక్క మంచి పద్ధతులు నేర్పాలో, ఆ భాగ్యం వారికి ప్రసాదించి ఇలాంటి చెడు కార్యాల నుండి దూరం ఉంచు గాక.

ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట

ఇక రండి, మన యొక్క ఈరోజు తొమ్మిదవ పాఠం, నిషిద్ధతలు, జాగ్రత్తలు అనే ఈ పుస్తకం నుండి 28వ అంశం, ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. చూశారా? నేను చెప్పాను కదా, అది అల్లాహ్ వైపు నుండి మన యొక్క ఈ క్రమంలో ఈరోజే ఈ పాఠం వచ్చింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు సంబంధించి కూడా ఈ అంశాన్ని మనం మంచి రీతిలో అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. చాలా చాలా అవసరం.

ఒక రెండు సెకండ్లు ఉండండి, ఇప్పుడు అజాన్ అవుతుంది.

ఇక్కడ ఎవరైతే యూట్యూబ్ లో చూస్తున్నారో, జూమ్ లో రావాలని కోరుకుంటారో, జూమ్ లో వస్తే ఒకసారి అది ఫుల్ అయిపోయింది అని మీకు తెలుస్తుందో, అక్కడే మీరు ఊరుకోకండి. మరోసారి, మరికొన్ని క్షణాల తర్వాత ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఎందుకంటే జూమ్ లో వచ్చేవారు ఏదో ఒక పని మీద ఒకరిద్దరు ముగ్గురు ఈ విధంగా వస్తూ పోతూ ఉంటారు. ఈ విధంగా 100 కంటే తక్కువ ఎప్పుడైతే ఉంటుందో, మీరు అందులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఇంట్లో సిగ్గుమాలిన పనులను సహించుట. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ముగ్గురిపై అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్షనో ఒకసారి గమనించండి. స్వర్గం మనం కోల్పోయామంటే ఇక ఏం మేలు పొందాము మనం? ఏం మంచితనం మనకు దొరికింది? ఇహలోకంలో గాని, పరలోకంలో గాని స్వర్గం కోల్పోయిన తర్వాత ఇక ఏదైనా మేలు ఉంటుందా మిగిలి? ఈ విషయం ముందు గమనించండి మీరు.

ఏంటి ఆ మూడు పాపాలు, దీని కారణంగా స్వర్గం నిషేధమవుతుంది? ఒకటి, మత్తు పానీయాలకు బానిస అయినవాడు. మత్తు పానీయాలకు సంబంధించి మా యొక్క ప్రసంగం కూడా ఉంది, మా జీడీకే నసీహ్ యూట్యూబ్ ఛానల్ లో, మత్తు పానీయాల ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఇహపరలోకాలలో ఏ ఏ చెడులు వారి గురించి చెప్పడం అందులో చెప్పడం జరిగింది.

రెండవది, తల్లిదండ్రులకు అవిధేయుడు, అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా ఈనాటి కాలంలో, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో ఏ యువకులు, యువతులు, ఏ స్టూడెంట్స్ తమ తల్లిదండ్రులను ఏడిపించి, తల్లిదండ్రులకు బాధ కలిగించి, తల్లిదండ్రులు వద్దు అన్నా గాని వెళ్తూ ఉన్నారో, మీ ఈ నూతన సంవత్సర శుభకాంక్షలు, నూతన సంవత్సరం యొక్క సంబరాలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఆనందకరమైనదా? లేక స్వర్గం చాలా ఆనందకరమైనదా? అల్లాహ్ ఇచ్చిన బుద్ధి జ్ఞానంతో ఒక్కసారి ఆలోచించుకోండి. తల్లిదండ్రులను కాదు అని, వారికి అవిధేయత చూపి మీరు ఇలాంటి వాటిలో పాల్గొన్నారు అంటే, స్వర్గాన్ని కోల్పోయారు అంటే, మీ ఈ సంతోషాలు మీకు ఏం లాభం కలుగజేస్తాయో ఒక్కసారి ఆలోచించండి.

ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో మత్తుకు బానిస అయిపోతారు ఎంతోమంది. కొందరు యువకులు, నవ యువకులు, నవ యువతులు వారికి మొదటిసారిగా ‘అరే ఒక్కసారి త్రాగురా, ఒకటే గుటకరా, ఒకే చిన్న పెగ్గురా, అరే ఈ ఒక్కరోజే కదరా మనం ఆనందం జరుపుకునేది’ అని ఒకరు మరొకరికి ఈ విధంగా చెప్పుకుంటూ ఏదైతే తాగిస్తారో, తర్వాత దానికి అలవాటు పడే అటువంటి పునాది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంలో జరుగుతుంది. కనుక గమనించండి, మహప్రవక్త మహానీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఎలాంటి విషయం తెలిపారు?

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الآخِرِ
(మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్)
ఎవరైతే అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తారో

ఎవరికైతే అల్లాహ్ పై మరియు పరలోక దినంపై విశ్వాసం ఉన్నదో, అలాంటి వారు ఏ దస్తర్ ఖాన్ పై, ఏ ఆహార, అన్నపానీయాలు పెట్టిన ఆచోట, ఎక్కడైతే దావత్ జరుగుతుందో, ఎక్కడైతే నలుగురు కూర్చుని తింటున్నారో, అలాంటి దస్తర్ ఖాన్ పై ఒకవేళ ఏదైనా మత్తు ఉన్నది, ఏదైనా సారాయి ఉన్నది, విస్కీ బ్రాండీ లాంటివి ఉన్నాయి అంటే, అలాంటి ఆ దస్తర్ ఖాన్ లో, ఆ భోజనంలో, ఆ సంబరంలో వారితో కలవకూడదు, వారితో పొత్తు ఉండకూడదు, అందులో హాజరు కాకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారైతే, చెప్పేకి ముందు ఏమన్నారు? ‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్’యౌమిల్ ఆఖిర్’. అల్లాహ్ ను ఎవరైతే విశ్వసిస్తున్నారో, పరలోక దినాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో. అంటే ఇక గమనించండి, ఈ సెలబ్రేషన్ సందర్భంగా మీరు వెళ్లారు, అక్కడ ఈ గ్లాసులు కూడా పెట్టబడ్డాయి. మీరు త్రాగకున్నా గాని అలాంటి చోట హాజరు కావడం మీ అల్లాహ్ పై విశ్వాసాన్ని తగ్గిస్తుంది, మీ పరలోక విశ్వాసం దీని ద్వారా తగ్గిపోతుంది. కనుక గమనించండి, ఈ హదీస్ ను శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి.

ముగ్గురు ఉన్నారు, వారికి స్వర్గం లభించదు. ఒకరు, మత్తుకు బానిస అయిన వారు, రెండవ వారు తల్లిదండ్రులకు అవిధేయుడు, మూడవ వాడు తన ఇంట్లో అశ్లీలత, సిగ్గుమాలిన వాటిని సహించేవాడు, వాడినే ‘దయ్యూస్’ అని చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రశ్నిస్తారు, దయ్యూస్ అంటే ఎవరు? హదీస్ లో వచ్చింది దయ్యూస్ అంటే ఎవరు? ఇదే హదీస్ లో దాని పక్కనే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమే వివరించారు. తన ఇంటి వారిలో, ‘అహల్’ అంటే ఇంటి వారిలో. ఇక్కడ ‘ఇంట్లో’ అన్న పదం ఏదైతే మీరు చూస్తున్నారో తెలుగులో, దీని ద్వారా మేము ఇంటి బయటికి వెళ్లి ఇలాంటిది ఏమైనా చేసేది ఉంటే పాపం కాదు కదా అని అనుకోకండి. అర్థం కావడానికి ఒక పదం ‘ఇంట్లో’ అని రాయడం జరిగింది. అంటే ఇంటి వారు. ఉదాహరణకు నేను ఇంటి బాధ్యుడిని. నా యొక్క బాధ్యతలో ఎవరెవరు వస్తారో, వారందరి గురించి నాకు సరియైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. వారు ఏదైనా అశ్లీల కార్యంలో పడడం లేదు కదా, సిగ్గుమాలిన మాటలు గాని, పనులు గాని ఏమైనా చేస్తున్నారా? అన్నది నేను తెలుసుకుంటూ ఉండాలి.

ఒకవేళ అలాంటి ఏ కొంచెం అనుమానం వచ్చినా, వారికి మంచి రీతిలో నచ్చచెప్పడం, ఆ చేష్టలకు శిక్ష ఏదైతే ఉందో తెలియజేసి ఆ అశ్లీలతకు దూరంగా ఉంచడం తప్పనిసరి విషయం. ఇంట్లో యజమానికి, అంటే అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, ఇంటి యొక్క పెద్ద కొడుకు కావచ్చు, సోదరీమణుల కొరకు పెద్ద సోదరుడు కావచ్చు. అందుకొరకే ఒక మాట సర్వసామాన్యంగా మీరు వింటూ ఉంటారు చూడండి. ఒక్క పురుషుడిని నలుగురు స్త్రీలు నరకంలోకి తీసుకెళ్తారు అన్నట్లుగా. ఆ పదంతో ఏదైనా హదీస్ ఉందా, నాకు ఇంతవరకు తెలియదు, దొరకలేదు. కానీ ఇక్కడ మాట కొన్ని సందర్భాల్లో కరెక్ట్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఎలా? ఎవరైనా తండ్రి రూపంలో ఉండి సంతానాన్ని, భర్త రూపంలో ఉండి భార్యలను, ఇంకా సోదరిని రూపంలో ఉండి సోదరీమణులను, కొడుకు రూపంలో ఉండి తల్లిని, చెడు చూస్తూ, వ్యభిచారంలో పడుతూ, సిగ్గుమాలిన చేష్టలు చేస్తూ, తమ యొక్క స్మార్ట్ ఫోన్లలో ఇస్లాంకు వ్యతిరేకమైన, అశ్లీలతను స్పష్టపరిచే అటువంటి ఇమేజెస్ గాని, వీడియోస్ గాని, చాటింగ్స్ గాని ఉన్న విషయాలన్నీ కూడా తెలిసి కూడా వారిని ఆ చెడు నుండి ఆపుటలేదంటే అతడే దయ్యూస్.

అయితే, మరెప్పుడైనా ఏదైనా పెద్ద ఉలమాలతో మీరు ఇంకా దీని గురించి డీప్ గా విన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా, షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపినటువంటి ఒక విషయం తెలుపుతున్నాను. ఈ హదీస్ యొక్క వ్యాఖ్యానంలో షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఏదైతే చెప్పారో, దయ్యూస్ అంటే, తన ఇంటిలో, తన ఇంటి వారిలో చెడును, అశ్లీలతను, సిగ్గుమాలిన విషయాలను సహించేవాడు. వాస్తవానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సభ్యత, సంస్కారం పదాలలో కూడా అశ్లీలత ఏమీ రాకుండా ‘అల్’ఖబస్’ అన్నటువంటి మాట చెప్పారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం, వేరే ఇంకా ఈ టాపిక్ కు సంబంధించిన హదీస్ లు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా, సహాబాల యొక్క వ్యాఖ్యానాల ద్వారా తెలుస్తున్నది ఏమిటంటే, వ్యభిచారం లాంటి చెడుకు పాల్పడే విషయం, పాల్పడబోతున్న విషయం తెలిసి కూడా మౌనం వహించే అటువంటి బాధ్యుడు, అతడు దయ్యూస్. ఈ మాట చెప్పిన తర్వాత షేక్ బిన్ బాజ్ రహమహుల్లాహ్ చెబుతున్నారు, వాస్తవానికి దయ్యూస్ అనేది ఇది, కానీ ఇక్కడి వరకు చేరిపించడానికి ముందు కొన్ని సాధనాలు ఉంటాయి. అయితే వాటిని చేయకుండా ఉన్నప్పుడే మనిషి వీటికి దూరంగా ఉంటాడు. వాటికి పాల్పడ్డాడంటే ఈ చెడుకు పాల్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం కూడా ఇంతకుముందు హదీస్ లో చదివాము కదా, కళ్ళు వ్యభిచారం చేస్తాయి. ఆ యొక్క హదీస్ లోని వివరంలో వేరే హదీస్ ల ఆధారంగా నేను చెప్పాను, హదీస్ లో స్పష్టంగా వచ్చి ఉంది, చేతులు వ్యభిచారం చేస్తాయి, కాళ్ళు వ్యభిచారం చేస్తాయి, పెదవులు వ్యభిచారం చేస్తాయి, నాలుక వ్యభిచారం చేస్తుంది, చెవులు వ్యభిచారం చేస్తాయి. ఇవన్నీ కూడా ‘ముకద్దిమాత్’ అంటారు. అసలైన వ్యభిచారం దేన్నైతే అంటారో, దాని వరకు చేరిపించేటువంటి సాధనాలు ఇవి. అయితే, ‘దయ్యూస్’ అన్నది ఆ చివరి విషయాన్ని సహించేవాడు. కానీ ఇవి కూడా అందులో వచ్చేస్తాయి, ఎందుకంటే ఇవే అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక. అక్కడి వరకు చేరిపిస్తాయి గనుక.

రండి, మన పాఠంలోని మరికొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ చదివి ఈ విషయాన్ని ఇంకెంత మంచి రీతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ కాలం నాటి దయ్యూల్స్ రూపాల్లో ఇంట్లో కూతురు లేక భార్య పర పురుషునితో మొబైల్స్ లో సంభాషిస్తూ ఉండగా, అతను అలాంటి వాటిని సహించుట. తన ఇంట్లో ఉన్న స్త్రీలలో ఏ ఒకరైనా పర పురుషునితో ఏకాంతంలో గడుపుతూ ఉండడం చూసి మౌనం వహించుట. లేక ఆమె ఒంటరిగా మహరం కాని డ్రైవర్ తో వాహనంలో వెళ్ళుటను చూచి నిరాకరించకపోవుట. వారు ధార్మిక పరదా లేకుండా అంటే ఇంట్లోని స్త్రీలు ధార్మిక పరదా లేకుండా బయటికి వెళ్లి ప్రతి వచ్చి పోయే వాని విష చూపులకు గురి అవుతూ ఉండడం గమనించి సహించుట. ఇంకా అశ్లీలత, సిగ్గుమాలిన తనాన్ని ప్రచారం చేసేటువంటి ఫిలిం క్యాసెట్లు, డిష్ కేబుల్లు, ఇంకా ఏ పరికరం అయినా, ఏ సాధనం అయినా, ఏ మ్యాగజైన్స్ అయినా ఇంట్లోకి తీసుకురావటాన్ని చూసి వారిని నిరాకరించకపోవుట. అలాగే కొడుకులు పర స్త్రీలతో సంబంధం పెట్టుకోవడాన్ని చూసి మౌనం వహించుట. పిల్లలు తమ రూముల్లో, ఎందుకంటే ఎవరి వద్దనైతే సౌకర్యాలు పెరిగి ఉన్నాయో, ఒక్కొక్క కొడుకుకు ఒక్కొక్క రూమ్ ఇచ్చేస్తారు, లేదా ఒక రూమ్ కొడుకుల కొరకు, మరొక రూమ్ బిడ్డల కొరకు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరిది ఒక బెడ్. అందులో అతను దుప్పటి వేసుకొని మొబైల్ తీసుకొని ఏమేం చూస్తున్నారో, తమ సంతానం తమ మొబైల్ ని ఏ చెడులో వాడుతున్నారో ఆ విషయాన్ని గమనించకుండా లేదా తెలిసి కూడా మౌనం వహించుట, ఇవన్నీ కూడా దయ్యూస్ అనే విషయంలోనే వచ్చేస్తాయి. కనుక వీటన్నిటికీ దూరం ఉండడం చాలా అవసరం.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇంకా రెండు అంశాలు ఈనాటి గురించి ఏదైతే మనం అనుకున్నామో, ఉంటాయి, కానీ టైం సరిపడదు గనుక ఇక్కడి వరకే మనం స్టాప్ చేస్తున్నాము. ప్రత్యేకంగా న్యూ ఇయర్ కి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉండేది ఉంటే అవి తీసుకుందాము. ఇన్’షా’అల్లాహ్ మిగతా రెండు పాఠాలు, ఇంకా మరికొన్ని పాఠాలు ఉన్నాయి, తర్వాత రోజుల్లో చదివే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, విన్న మంచి మాటలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. న్యూ ఇయర్ కు సంబంధించి ప్రత్యేకంగా ఏ చెడు విషయాల ప్రస్తావన వచ్చిందో, వాటి నుండి మనం స్వయంగా దూరం ఉండి, మన బాధ్యతలో ఉన్న వారిని దూరం ఉంచేటువంటి సౌభాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.

బిద్అత్ (కల్పితాచారం) – Bidah (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/bidah/

వడ్డీ (Riba) [పుస్తకం]

[డౌన్లోడ్ పుస్తకం]
[32 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

వడ్డీ (అన్ని పోస్టులు):
https://teluguislam.net/category/riba-interest-vaddi/

అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

దివ్యఖుర్ఆన్లో సృష్టికర్త వడ్డీ సొమ్ము తినేవారిని ఉద్దేశ్యించి ఇలా సెలవిచ్చాడు:

“వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. వారు ఈ స్థితికి గురి కావటానికి కారణమేమిటంటే ‘వ్యాపారం కూడా వడ్డీ లాంటిదేగా’ అని వారంటారు. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్దం (హరామ్) గావించాడు. కనుక ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ను ఇచ్చేవారికి వారి ప్రభువు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ, శోకం కానీ కలిగే అవకాశం లేదు. విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు. మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడేవరకు గడువు ఇవ్వండి. లేక ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకో గలిగితే ఇదే మీ కొరకు మేలైనది. (అల్ బఖర 2 : 275-280)

దివ్యఖుర్ఆన్లోని ఈ వాక్యాలు అరేబియాలో ఇస్లామీయ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవతరించాయి. దీని తర్వాత ఇస్లామీయ ప్రభుత్వం పరిధిలో వడ్డీ వ్యాపారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడింది.

వడ్డీ‘ని దివ్యఖుర్ఆన్లో ‘రిబా‘గా పేర్కొనటం జరిగింది. రిబా అంటే ‘అధికం‘ లేక ‘అదనం‘ అనే అర్థాలు వస్తాయి. అరబ్బులు ఈ పదాన్ని అధిక సొమ్ము అన్న భావంలో వాడేవారు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత గడువు వరకు రుణంగా ఇచ్చిదాన్ని పుచ్చుకునే సమయంలో అసలుతో పాటు ఒప్పందం ప్రకారం మరి కొంత అదనపు మొత్తం వసూలు చేసేవాడు. దీన్నే మన నాట ‘వడ్డీ’గా వ్యవహరిస్తాము.

ఈ వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదనీ, తరతరాలుగా ఇది మానవ సముదాయాల్లో వ్రేళ్లూనుకొని ఉందని తెలుస్తోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు, జాతుల మాదిరిగా అరబ్బులలోనూ వడ్డీ లావాదేవీలు కొనసాగేవి. మన దేశంలోని వడ్డీ వ్యాపారులు, వడ్డీ మార్వాడీల వలెనే అరేబియాలో కూడా పెట్టుబడిదారులు వడ్డీ వ్యాపారాన్ని తమ ప్రధాన వృత్తిగా ఎన్నుకునేవారు. రుణగ్రస్తుడు నిర్ణీత గడువులో రుణం చెల్లించలేకపోతే, గడువును పొడిగించి చక్రవడ్డీ తరహాలో మరింత అదనపు సొమ్మును రాబట్టేవారు. తత్కారణంగా ఒకవైపు బాకీదారుల బాకీ నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు వడ్డీ ఆసాములు పేద ప్రజల రక్తం పీలుస్తూ కోట్లకు పడగలెత్తేవారు.

కాగా; ఈ పోకడ ఇస్లాం స్వభావ స్వరూపాలకు ఎంతకీ సరిపడదు. అది ప్రబోధించే సిద్ధాంతానికి వడ్డీ విరుద్ధమైనది. ఇస్లాం అభాగ్య జీవుల్ని ఆదుకోమనీ, పేదవారికి సహాయపడమనీ, అగత్యపరుల అక్కరలు తీర్చమనీ అంటుంది. పైగా ఈ పనులన్నీ ప్రాపంచిక పరమార్థాలతో గాకుండా అల్లాహ్ ప్రసన్నతను, పరలోక ప్రయోజనాలను ఆశించి చేయాలని ప్రబోధిస్తోంది.

సకల రుగ్మతలకు మూలమైన మద్యపానం నుండి జన సామాన్యాన్ని రక్షించడానికి దైవ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచనాలు అంచెలవారీ విధానాన్ని అనుసరించినట్లే వడ్డీ అనే క్రూరాతిక్రూరమైన ఆచారాన్ని రూపుమాపడానికి యుక్తితో, సావధానంతో కూడిన వైఖరిని అనుసరించటం జరిగింది. మొదట్లో ఒక్కసారిగా వడ్డీని నిషేధిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రజలకు అది మింగుడు పడేది కాదేమో! అందుకే సకారాత్మకమైన పద్ధతిలో “మీరు సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి, పేద ప్రజలకు సహాయం చేయండి, బలహీనులను ఆదుకోండి, అగత్యపరుల అవసరాలను తీర్చండి; దయ, జాలి, త్యాగం, దాతృత్వం వంటి ఉన్నత నైతిక సుగుణాలను అలవర్చుకోండి” అని వారిని మానసికంగా సన్నద్ధుల్ని చేయటం జరిగింది.

“మీరు ఎల్లకాలం ఇక్కడ ఉండరు. మీరు నశించినట్లే మీ సిరిసంపదలు కూడా నశిస్తాయి. కాబట్టి అశాశ్వితమైన ఈ ఆస్తిపాస్తుల్ని వెచ్చించి శాశ్వతమైన పరలోక సాఫల్యాన్ని, స్వర్గలోక సుఖాలను సంపాదించండి. ఖారూన్ వంటి ధన పిపాసకులకు పట్టిన గతిని చూసైనా గుణపాఠం నేర్చుకోండి” అంటూ ఒక్కొక్క వాస్తవాన్నీ వారి దృష్టికి తీసుకురావటం జరిగింది.

ఈ ఉపదేశాలు క్రమక్రమంగా ప్రజల మనోభావాలపై ప్రభావం చూపసాగాయి. స్వార్థమే పరమార్థంగా జీవించే ప్రజలు సొసైటీలోని సాటి సోదరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోసాగారు. శాశ్వితమైన స్వర్గ సుఖాల ముందు ప్రాపంచిక తళుకు బెళుకులన్నీ అల్పంగా కనిపించసాగాయి. సమాజంలో నిర్మాణాత్మకమైన ఈ కృషి జరిగిన మీదట నిర్దాక్షిణ్యమైన ఈ ‘వ్యాపారాన్ని’ నిషేధించే చట్టం ప్రవేశ పెట్టబడింది. సూరె బఖరాలోని ఈ ఆయతుల (ఆయత్ నెం. 275-280) ద్వారా ఇస్లాంలో వడ్డీ శాశ్వతంగా నిషేధించబడింది.

గతంలో జరిగిందేదో జరిగిపోయిందనీ, ఇక మీదట ఎవరయినా ఈ ఆజ్ఞను లెక్కచేయకపోతే వారు అల్లాహ్ మరియు ప్రవక్తకు బద్ద విరోధులవుతారనీ, అటువంటి వారిపై అల్లాహ్ మరియు దైవప్రవక్త తరఫున యుద్ధ ప్రకటన జరిగినట్లేనని పై వచనాలలో స్పష్టం చేయబడింది. (అల్లాహ్ రక్షించుగాక!)

వడ్డీ సొమ్ము తినేవారి గురించి ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రావటం ఆలోచించదగినది. పెద్దపెద్ద పాపాలకు పాల్పడిన వారి కోసం కూడా ఇంతటి తీవ్రమైన హెచ్చరిక రాలేదు. మద్యం సేవించే వారున్నారు, వ్యభిచారం చేసే వారున్నారు; హత్యలు చేసేవారున్నారు. ఇవన్నీ నిషిద్ధాలే. పెద్ద పెద్ద అపరాధాలే. అల్లాహ్ సమక్షంలో ఈ పాపాలకు పాల్పడిన వారికి శిక్ష లభించడమూ తథ్యమే. కాని అల్లాహ్ తరఫున, దైవప్రవక్త తరఫున యుద్ధం ప్రకటించబడే వార్నింగ్ ఒక్క వడ్డీ సొమ్ము తినేవారి విషయంలోనే ఇవ్వబడింది. దీన్ని బట్టి ఇదెంత తీవ్రమైన, అసహ్యకరమైన పాపమో ఊహించవచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనల ద్వారా కూడా ఇది అత్యంత ఘోరమైన పాపాల జాబితాలో చేర్చబడినట్లు అవగతమవుతోంది. వడ్డీకి ఇచ్చేవారు, వడ్డీ పుచ్చుకునేవారు వడ్డీ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులు వ్రాసేవారు ముగ్గురూ ధూత్కారులుగానే ఖరారు చేయబడ్డారు. మరి కొన్ని ఉల్లేఖనాల ప్రకారం వడ్డీ పాపం వ్యభిచారపు పాపం కన్నా డెబ్బయిరెట్లు అధికమని తెలియవస్తోంది.

‘వడ్డీ కూడా వ్యాపారం లాంటిదేగా’ అని సందేహపడేవారికి, ‘రెండింటి ఉద్దేశ్యం లాభార్జనే కదా!’ అని ప్రశ్నించే వారికి సమాధానం కేవలం హేతుపరంగా ఇస్తే సరిపోదు. ఈ విషయాన్ని భౌతికంగానే కాక ఆధ్యాత్మిక దృష్టితో కూడా పరికించటం అవసరం.

అల్లాహ్ ఆదేశానుసారం ఈ రెండింటి (వడ్డీ-వ్యాపారం)లో భూమ్యాకాశాలంత వ్యత్యాసం ఉంది. పరమ ప్రభువు ఒక దానిని హరామ్ (అధర్మం) గావించగా రెండవ దానిని హలాల్ (ధర్మసమ్మతం)గా ఖరారు చేశాడు. అటువంటప్పుడు రెండూ సమానమెలా అవుతాయి? ఒక వస్తువును సృజించిన వాడే దాని లాభనష్టాలను సరిగ్గా బేరీజు వేయగలుగుతాడు. మరి ఆ సృష్టి కర్త ఒక దానిని హరామ్, మరొక దానిని హలాల్ గా చేశాడంటే హరామ్ గా ఖరారు చేసిన వస్తువులో తప్పకుండా ఏదో ‘కీడు’ ఉండి ఉండాలి. జనసామాన్యానికి ఈ సంగతి బోధపడినా, పడకపోయినా అదంతే. ఎందుకంటే సమస్త విశ్వమండలంలో ఉన్న వస్తువుల వాస్తవిక జ్ఞానం భూమ్యాకాశాలను పరివేష్ఠించి ఉన్న ఆ ప్రభువుకే బాగా తెలుసు. ఆయన జ్ఞాన పరిధికి తాకని వస్తువు అంటూ లేదు. లోకంలోని వ్యక్తులు, సమాజాలకు తమ సొంత లాభనష్టాలు, మంచీ చెబ్బరలు మాత్రమే తెలుసు. సమస్త లోకం యొక్క మంచీ చెబ్బరలను వారు గ్రహించలేరు. కొన్ని వస్తువులు ఒక వ్యక్తికో, ఒక సంఘానికో లాభదాయకంగా కనిపించవచ్చు. అయితే యావత్తు జాతి లేక యావద్దేశానికి అది హానికరం కావచ్చు.

మరొక వాక్యంలో, అల్లాహ్ వడ్డీని మట్టుపెడతాడనీ, దానధర్మాలను వికసింపజేస్తాడని చెప్పబడింది. వడ్డీతో పాటు దానధర్మాలు ప్రస్తావన రావటం ఆశ్చర్యం కల్గిస్తుంది. అయితే ఈ ప్రస్తావన ఒక ప్రత్యేక దృక్పథంతో తీసుకురాబడింది. వాస్తవానికి వడ్డీ మరియు దానధర్మాలు (సదఖాత్) పరస్పర విరుద్ధమైనవి. రెండింటి పరిణామాలు కూడా పరస్పర వ్యాఘాతమైనవి. సాధారణంగా ఈ రెండు పనులు చేసేవారి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా ఒక దానితో ఒకటి సమన్వయం చెందవు.

దానధర్మాలు ఎదుటివారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయబడతాయి. వడ్డీ దీనికి భిన్నమైనది. ఎలాంటి మొహమాటం లేకుండా ఎదుటివారి నుండి వడ్డీ సొమ్ము రాబట్టడం జరుగుతుంది. రెండు పనులు చేసేవారి సంకల్పంలో వైరుధ్యం ఎందుకు ఉందంటే దానమిచ్చేవాడు పుణ్యార్జన లక్ష్యంతో, అల్లాహ్ మెప్పును పొందే ఉద్దేశ్యంతో ఇస్తాడు. ఈ పవిత్ర ఆశయం కోసం అతడు తన ఐశ్వర్యం కర్పూరంలా కరిగిపోయినా చింతించడు. కాని వడ్డీ పుచ్చుకునేవాడు!? అతడు పొద్దస్తమానం దొడ్డిదోవలో సంపదను పోగు చేసేందుకు తహతహలాడుతుంటాడు. అందుకే. అటువంటి సంపదను అల్లాహ్ అసహ్యించుకుంటాడు. ఈ కారణంగా ఈ సంపదలోని శుభం లేక వికాసగుణం (బరకత్) మటుమాయమైపోతుంది. కాగా; సదఖాలు (దానధర్మాలు) చేసేవారి ఆస్తిలో అల్లాహ్ శ్రేయో వికాసాలను పుష్కలంగా పొందుపరుస్తాడు.

వడ్డీని రూపుమాపి దానధర్మాలను వికసింపజేయడంలోని ఆంతర్యం ఏమిటీ? అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. రూపుమాపడం లేదా వికసింపజేయటం అన్నది పరలోక ప్రతిఫలం దృష్ట్యా చెప్పబడిందని కొంత మంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. అంటే వడ్డీ తినేవాడి సొమ్ము పరలోకంలో ఎంత మాత్రం అతనికి ఉపయోగపడదనీ, పైగా అది అతని పాలిట విపత్తుగా పరిణమిస్తుందని, అదే దానధర్మాలు చేసేవారికి అవి పరలోకంలో శాశ్వత అనుగ్రహాలకు, స్వర్గలోక సుఖాలకు పాత్రుల్ని చేస్తాయని పండితులు వివరించారు. సర్వసాధారణంగా విద్వాంసులు దీనిపై చేసే వ్యాఖ్య ఇలా ఉంది: వడ్డీని రూపు మాపటం, దానాలను వికసింపజేయటం పరలోకం దష్ట్యా ఎలాగూ ఉంది. అయితే దాని గుణం ఎంతో కొంత ఈ లోకంలోనే కనిపిస్తుంది.

ప్రజల కడుపులు కొట్టి సంపాదించే ఈ అధర్మమైన సొమ్ము అట్టే కాలం నిలవదు కూడా. పెద్ద పెద్ద కోటీశ్వరులు, వడ్డీ వ్యాపారులు చూస్తుండగానే దివాలా తీసి రోడ్డున పడటం చూస్తుంటాము. అంటే; వడ్డీలేని వ్యాపారాలకు నష్టం రాదని కాదు. వ్యాపారంలో లాభనష్టాలు సహజం. కాని శిఖరాగ్రాన ఉన్నవారు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోవటం, నిన్న కోటీశ్వరుడిగా ఉండి నేడు ఒక్కొక్క రూపాయి కోసం దేవురించటం వంటి ఉదాహరణలు మనకు వడ్డీ లావాదేవీల్లో, జూదం పట్టాల అడ్డాలలోనే కనిపిస్తాయి. ఈ సొమ్ము ఎంత శీఘ్రంగా పెరిగినా దీర్ఘకాలం నిలవదు. ఈ పాడు సంపద వారసులకు అచ్చిరాదు. సాధారణంగా ఏదో ఒక విపత్తు వచ్చి కూడబెట్టిన దాన్ని కాస్తా హరించివేస్తుంది.

ఒకవేళ ఆ సంపద వృధా అవుతున్నట్టు పైకి కనిపించకపోయినా దాని లాభాలకు, శుభాలకు మనిషి దూరం అవటం తథ్యం. ఎందుకంటే అధర్మమార్గాల ద్వారా సొమ్మును కూడబెట్టే వ్యక్తి పన్నుల మినహాయింపు నుండి బయట పడేందుకు డొంకదారులు వెతుకుతాడు. స్టేటస్ కోసం వెండీ బంగారాలను, వజ్ర వైఢూర్యాలను సమీకరిస్తాడు. వాటి మూలంగా నిజానికి అతడికి చేకూరే లాభం ఏమీ ఉండదు. వజ్రవైఢూర్యాలు ఆకలి దప్పులు తీర్చవు. ఎండ వేడిమి నుంచీ, చలి తీవ్రత నుంచి అవి అతన్ని కాపాడలేవు. పైగా వాటిని భద్రపరచడానికి నానా కష్టాలు పడాలి. మానసిక ఉద్రిక్తతను అనుభవించాలి.

నిజం చెప్పాలంటే మనిషికి శాంతిని, తృప్తినీ, హాయినీ, గౌరవాన్ని ప్రసాదించే ఐశ్వర్యమే సిసలైన ఐశ్వర్యం. అతని ఐశ్వర్యం అతని జీవితానికి సార్ధకతను చేకూర్చగలగాలి. తన ఆస్తి వల్ల తనకు కలిగిన లాభమే తన సంతతికి కూడా కలగాలని మనిషి అభిలషిస్తాడు. అతని ఈ అభిలాష ఎంతో సహజం కూడా. వాస్తవానికి ఈ సుఖశాంతులు ఎవరికయినా వారి ఆస్తి వల్ల ప్రాప్తిస్తే అది కొద్ది ఆస్తి అయినప్పటికీ ఎంతో విలువైనది, శుభవంతమైనది. నిజానికి శుభము, సమృద్ధి అంటే ఇదే. మరే వ్యక్తి ఈ శుభానికి నోచుకోకుండా పోతాడో అతడి సంపద పరిమాణం రీత్యా చాలా ఎక్కువే అయినప్పటికీ యదార్థానికి అది తరిగిపోయింది.

పైకి అది పెరుగుతున్నట్లు కానవస్తుంది. కాని అది పెరుగుదల కాదు. అది బలుపు కాదు వాపు. వ్యాధి మూలంగా ఒక్కొక్కప్పుడు మనిషి శరీరం విపరీతంగా బరువు పెరుగుతుంది. వివేకవంతుడైన మనిషి ఎవరూ ఆ ‘బరువు’ ను ఆరోగ్యానికి ఆనవాలుగా భావించడు. ఎందుకంటే ఈ ‘పెరుగుదల’ వినాశానికి సంకేతం అని అతనికి తెలుసు. వడ్డీ సొమ్ము పరిస్థితి కూడా ఇంతే. వడ్డీని ఆర్జించే వాని సంపద ఎంతగా పెరుగుతున్నట్టు కానవచ్చినా దాని శ్రేయోవికాసాలకు అతడు నోచుకోకుండా పోతాడు.

ఇక్కడ కొంతమందికి సందేహం కలుగవచ్చు. నేటి వడ్డీ వ్యాపారులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారే! వారు పెద్ద పెద్ద మేడల్లో, ఎయిర్ కండీషన్డ్ భవనాలలో సేద తీరుతున్నారే! సుఖ సౌఖ్యాలనిచ్చే సకల వస్తు సామగ్రి వారి వద్దనే ఉంది కదా! అవసరానికి మించిన నౌకర్లు వారి దగ్గరే ఉన్నారు. కోరుకున్న రాజభోగాలు అన్నీ వారి స్వంతమై ఉన్నాయి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఈ సొమ్ము నుండి లబ్ది పొందడం లేదని ఎలా అంటారు? అని ప్రశ్నించవచ్చు.

అయితే ఇక్కడ విస్మరించరాని విషయం ఒకటుంది. సౌఖ్య సామగ్రి వేరు ‘సౌఖ్యం’ వేరు. సౌఖ్యాన్నిచ్చే సామగ్రి కర్మాగారాల్లో తయారయి, మార్కెట్లలో అమ్ముడు అవుతుంది. కాని ‘సౌఖ్యం’ అనేది ఉంది చూశారు, అది ఏ ఫ్యాక్టరీలోనో తయారు కాదు. అది ఏ మార్కెట్టులోనో విక్రయించబడదు. అది పరమ ప్రభువు తరఫున ప్రసాదించబడే ‘దయానుగ్రహం’. అది ఎంత ఖరీదైనదంటే మనిషి తన దగ్గరున్న సర్వస్వాన్ని అర్పించి కూడా కొనలేకపోతాడు. ఒక్క నిద్ర ప్రసాదించే సుఖాన్నే తీసుకోండి. దాన్ని పొందడం కోసం మనిషి ఖరీదైన బంగళా కట్టగలడు. ఖరీదైన ఫర్నీచర్ను సమకూర్చుకోగలడు. సుతిమెత్తని పరుపులను, కళ్ళు చెదిరే కార్పెట్లును కొనగలడు. గాలి, వెలుతురు నిరంతరాయంగా ఉండే ఉద్దేశ్యంతో జనరేటర్ను కూడా తెచ్చుకోవచ్చు. కాని ఇంత చేసినా ఆ ఇంటి యజమానికి తియ్యని నిద్ర పట్టగలదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎంత మాత్రం లేదు. మీకు నమ్మకం కుదరకపోతే సౌఖ్య సామగ్రిని పుష్కలంగా సమకూర్చుకున్న వారి గురించి సర్వే చేయండి. వేలాది మంది మీకు నెగటివ్ సమాధానమిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రజల్లో 75 శాతం మంది నిద్ర మాత్రలు మింగి పడుకుంటారని నివేదికలు తెలుపుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నిద్రమాత్రలు కూడా పని చేయమని మారాం చేస్తాయి. ఇతరత్రా సుఖాల సంగతి కూడా ఇంతే. మీరు డబ్బులు తగలెట్టి విలాస సామగ్రిని కొనుక్కురావచ్చు. కాని విలాసవంతమైన ఆ జీవితం మీకు ప్రాప్తించే ష్యూరిటీ లేదు.

ఈ పూర్వరంగంలో విషయాన్ని పరికిస్తే మీకే బోధపడుతుంది – వడ్డీ కాముకుల అంగట్లో అన్నీ ఉంటాయి గాని వారికి కావలసిన సుఖం, శాంతి, తృప్తి మాత్రం కరువైపోతాయని! వారు కోటిని కోటిన్నరగా, కోటిన్నరని రెండు కోట్లుగా మార్చాలని పరితపిస్తుంటారే తప్ప తమ ఆయురారోగ్యాల చింత కూడా వారికి ఉండదు. ఆలుబిడ్డలు వారితో కొన్ని క్షణాలైనా గడపాలని పరితపించిపోతుంటారు. కాని ఆ మధుర క్షణాల కోసం కూడా వారికి టైం దొరకదు. ఫ్లైట్ల కోసం పరుగులు తీస్తుండటం, గాల్లో విహరించటంలోనే వారి జీవిత కాలం గడచిపోతుంది. ఆ విధంగా వారు సుఖపడే సామగ్రినయితే ప్రోగు చేస్తారు. కాని సుఖాన్ని ఆస్వాదించలేకపోతారు.

పోనీ వాళ్ళు స్వయంగా సుఖపడకపోతే పోనివ్వండి. తమ ఉనికి ద్వారా వారు ఇతరులకు ప్రయోజనం ఏమైనా చేకూర్చుతారా అంటే అదీ ఉండదు. వడ్డీ సొమ్మును కూడబెట్టే అత్యాశ వాళ్ళను కఠిన మనస్కులుగా మార్చివేస్తుంది. వారి గుండెల్లోంచి దయ, జాలి, కనికారం మటుమాయమైపోతాయి. ఎంతసేపటికీ అభాగ్య జీవుల బలహీనతను సొమ్ము చేసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చి తమ శరీరాన్ని పోషించుకోవడమే వారి పరమావధి అయి ఉంటుంది. అందుచేత సొసైటీలోని ప్రజల హృదయాల్లో వారి పట్ల గౌరవభావం లేశమైనా ఉండదు. మన దేశంలోని వడ్డీ వ్యాపారస్తులను గానీ, అమెరికా బ్రిటన్ల లోని వడ్డీ కుబేరులైన యూదుల చరిత్రను గానీ తరచి చూస్తే. మీకు అవగతమవుతుంది -వారి లాకర్లలో క్వింటాళ్ళ కొద్దీ బంగారు వెండి వజ్రాలుండవచ్చుగాక! కాని ప్రపంచంలో ఎక్కడా, మానవ సముదాయాల్లో ఏ మూలన కూడా ఈ ‘అయ్యవార్ల’కు పరువు ప్రతిష్ఠ ఉన్నట్లు కనిపించదు. పైగా ఈ కుబేరుల పట్ల పేద ప్రజల్లో అసూయాద్వేషాలు ఏర్పడి వర్గ సంఘర్షణకు దారితీస్తాయి. 20వ శతాబ్దిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వర్గ సంఘర్షణలకు కారణం ఈ అసూయాద్వేషాలేనన్నది జగమెరిగిన సత్యం. కార్మిక వర్గానికీ పెట్టుబడిదారీ వర్గానికీ మధ్య సాగిన ఈ సంఘర్షణే ప్రపంచాన్ని రెండు బ్లాకులుగా నిలువునా చీల్చివేసింది. ఒక నకారాత్మక (Negative) ధోరణి నుండి పుట్టుకు వచ్చిన సిద్ధాంతం మరో నకారాత్మక పుంతను తొక్కి భీకర రూపం దాల్చింది. తత్ఫలితంగా యావత్ప్రపంచమే రణరంగానికి, నరమేధానికి నిలయమైపోయింది. దీనికంతటికీ మూలకారణం ఏమిటీ? అత్యాశకు పోయిన ధనికులకు కనీసావసరాలకు నోచుకోని అభాగ్య జీవులకు మధ్య ఏర్పడిన అంతులేని అగాధం కాదా? ఈ అగాధానికి మూలం అక్రమ సముపార్జన కాదా?

రక్తం పీల్చే ఈ జలగల మరో ఉపమానం ఇలా ఉంటుంది – పేద ప్రజల రక్తాన్ని పీల్చి తమ వల్లు పెంచుకునే ఈ ఆసాముల సమూహం ఒకటి ఒకచోట ఒక కాలనీని నిర్మించుకుంటే, వీక్షించదలచే వారికి అది అందంగా కానవస్తుంది. అక్కడ నివసించే వారంతా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వారి వాకిళ్ళు పచ్చగా నిగనిగ లాడుతుంటాయి. మరి ఈ ఒక్క వాడను చూచి ఇది దేశప్రగతికి ప్రతిబింబం అనాలా? మంచినీ, మానవత్వాన్ని కాంక్షించేవారు ఈ ఒక్క కాలనీని చూసి మురిసిపోరు. అల్లంత దూరాన ఈ అయ్యవార్ల దోపిడీకి గురై పూరి గుడిసెల్లో నివసిస్తున్న పేద ప్రజల పాట్లను కూడా వారు చూడదలుస్తారు. ఈ స్థితిని వారు ప్రగతికి ప్రతీకగా కాక మానవత్వాన్ని మంటగలిపే పోకడగా అభివర్ణిస్తారు.

తద్భిన్నంగా సదఖాలు ఇచ్చే వారినీ, దానధర్మాలు చేసే వారిని చూడండి – వారు ధనార్జన కోసం నిద్రాహారాలు మానేసి పరుగులు తీయరు. వారెంతో స్థిమితంతో ఉంటారు. తమకు లభించిన దానితోనే సంతృప్తి చెంది అందులోంచి కూడా హక్కుదారుల హక్కును తీసి ఉంచుతారు. తత్ఫలితంగా వారు ప్రశాంతంగా జీవితం గడపటంతో పాటు బడుగు ప్రజల శుభాశీస్సుల్ని అందుకుంటూ ఉంటారు. అల్లాహ్ “వడ్డీని నశింపజేసి దాన ధర్మాలను వికసింపజేయటం” అంటే ఇదే.

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి లేదా ఆ రుణాన్ని మాఫీ చేయండి. మీరు తెలుసుకోగలిగితే ఇదే మీ కొరకు మేలైనది. “ అని అనబడింది.

‘వడ్డీ’ని ‘నిషిద్ధం’గా ఖరారు చేసిన తరువాత అల్లాహ్ ముస్లింలకు చేసిన సూచన ఇది. ఈ నిషేధాజ్ఞ రాకపూర్వం అరబ్బులు తమ బాకీదారుడు ఆర్థిక సమస్యల వల్ల గడువు లోపల బాకీ చెల్లించకపోతే రావలసిన వడ్డీని అసలు కింద జమ చేసుకొని వడ్డీపై వడ్డీ (చక్రవడ్డీ)ని వసూలు చేస్తుండేవారు.

రాజాధిరాజు అయిన అల్లాహ్ ఈ విషయమై శాశ్వతంగా చట్టం ప్రవేశపెట్టి, రుణగ్రస్తుడు దారిద్ర్య స్థితికి లోనై రుణం చెల్లించలేకుండా ఉన్న పక్షంలో అతన్ని వేధించటం ధర్మ సమ్మతం కాదనీ, స్థితిమంతుడయ్యే వరకు అతనికి గడువు ఇవ్వవలసిందేనని నిర్ణయించాడు. పైపెచ్చు ఆ బాకీదారుణ్ణి పెద్ద మనస్సుతో మన్నించి వదలివేస్తే అది మీ పాలిట శ్రేయస్కరమని ప్రోత్సహించటం జరిగింది.

ఇక్కడ ఈ రకమైన ‘మాఫీ’నిసదఖా’తో పోల్చడం జరిగింది. అంటే వడ్డీని వదలి వేయటమేగాక రావలసిన అసలు విషయంలో కూడా చేతులు దులుపు కోవటం అన్నమాట! పైకి ఇది రుణదాతలకు నష్టకరంగానే అగుపిస్తుంది. కాని ఖుర్ఆన్ మాత్రం దీనిని ‘శుభకరం’గా అభివర్ణించింది. ఈ శుభం (మేలు) రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి: మూన్నాళ్ళ ఈ జీవితం ముగిసిన తరువాత అతను వదలుకున్న కొద్దిపాటి సొమ్ముకు బదులుగా శాశ్వితమైన స్వర్గానుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. రెండు: అతని మన్నింపుల వైఖరి యొక్క శుభపరిణామం ఈ లోకంలోనే కొంత అడ్వాన్సుగా అతనికి కనిపిస్తుంది. ఉదాహరణకు:- అతని దగ్గర ఉన్న సొమ్ము పరిమితమే కావచ్చు. కాని వృధా ఖర్చుల నుండి, అనూహ్యమైన విపత్తుల నుండి అల్లాహ్ అతన్ని రక్షిస్తాడు. రోగాలు, మందులు మాకుల పేరిట, డాక్టర్ల ఫీజుల పేరిట అక్రమార్కుల సొమ్ము లక్షల్లో కరిగిపోగా, సామాన్యజనులు చాలా స్వల్ప మొత్తంలోనే స్వస్థతను పొందుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు కొందరికి శుష్క ప్రియాలుగా కన్పించవచ్చునేమోగాని దైనందిన జీవితంలో లెక్కకు మించిన ఇలాంటి ఉపమానాల్ని మనం చూస్తుంటాము.

దారిద్ర్య స్థితిని ఎదుర్కొంటున్న రుణగ్రస్తుని యెడల మృదు వైఖరిని అవలంబించే వారికి హదీసులలో కూడా శుభవార్త వినిపించబడింది. తబ్రానీలోని ఒక హదీసులో ఉంది :

“ఏ వ్యక్తి అయితే ఎవరికీ ఏ నీడా లభించని రోజున అల్లాహ్ కారుణ్య ఛాయ తనకు లభించాలని కోరుకుంటాడో అతడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రస్తుని పట్ల మృదువుగా మెలగాలి లేక అతన్ని మన్నించి వదలి పెట్టాలి”.

మరొక హదీసులో ఇలా ఉంది:-

“ఎవరయితే తన ప్రార్థనలు స్వీకరించబడాలనీ, తన కష్టాలు దూరం కావాలని కోరుకుంటున్నాడో అతడు కష్టాల్లో ఉన్న తన బాకీదారుడికి మరింత గడువును ఇవ్వాలి”.

సహీహ్ ముస్లింలోని ఒక హదీసు ఇది:

“ఎవరయితే ఒక పేద రుణగ్రస్తుడికి గడువు ఇస్తాడో అతనికి ప్రతి రోజూ అతనిచ్చిన రుణానికి సమానంగా దానధర్మాల పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఒక గడువు ముగిసే వరకూ పుణ్యం ఈ లెక్కన లభిస్తూ ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసే నాటికి రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చలేని స్థితిలో ఉండి, రుణదాత మరికొంత గడువును ఇస్తే అట్టిపరిస్థితిలో రెట్టింపు మొత్తం దానమిచ్చిన పుణ్యం ప్రాప్తిస్తుంది.” (సహీహ్ ముస్లిం, ముస్నద్ అహ్మద్)

వడ్డీ యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి దివ్య గ్రంథంలోని ఇతర వచనాలను కూడా ఇక్కడ ప్రస్తావించటం అవసరం.

“విశ్వసించిన ప్రజలారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినటం మానండి. అల్లాహ్ కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (ఆలి ఇమ్రాన్ 3:130)

పై వచనంలో “ఇబ్బడి ముబ్బడిగా పెరిగే” అనే ప్రత్యేక పదం వాడబడింది. పూర్వం అరేబియాలో ఒక నిర్ణీత గడువు కొరకు వడ్డీపై అప్పు ఇచ్చి గడువు ప్రకారం అప్పు తీర్చకపోతే రుణగ్రస్తునికి మరికొంత గడువు ఇచ్చేవారు. అయితే అదనపు గడువునకుగాను అదనపు వడ్డీని విధించేవారు. మలిసారి గడువు ముగిసేనాటికి రుణం వసూలు కాకుంటే వడ్డీ శాతం మరింతగా పెంచబడేది. ఆ విధంగా ఒకవైపు రుణదాతకు ఇబ్బడిముబ్బడిగా వడ్డీ సొమ్ము వచ్చి పడుతుంటే మరోవైపు వడ్డీ భారంతో రుణగ్రస్తుని నడ్డి విరిగిపోతుండేది.

నిసా సూరాలో ఈ విధంగా సెలవీయబడింది

“యూదుల ఈ దుర్మార్గ వైఖరి వల్లనూ, వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలు సృష్టిస్తున్నందువల్లనూ, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లనూ, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లనూ మేము వారి కొరకు పూర్వం ధర్మ సమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.” (అన్ నిసా – 160,161)

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీయత్లో కూడా ‘వడ్డీ’ అధర్మంగా ఖరారయినట్టు పై రెండు వచనాల ద్వారా రూఢీ అవుతోంది. ఈ ఆదేశాన్ని ధిక్కరించి, ప్రాపంచిక వ్యామోహంలో యూదులు వడ్డీ సొమ్మును తినసాగితే అల్లాహ్ ఆగ్రహం చెంది కొన్ని హలాల్ వస్తువులు సయితం వారి కొరకు ‘హరామ్’ చేసేశాడు.

ఈ చర్చను మూడు భాగాలుగా విభజించవచ్చు.

(a) ఖుర్ఆన్ హదీసులలో వడ్డీ వాస్తవికత ఏమిటీ?
(b) వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం ఏమిటీ?
(c) వడ్డీ ఎంత నికృష్టమైనదైనా అది నేటి ఆర్థిక వ్యవస్థలో, వాణిజ్య రంగంలో అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది కదా! ఖుర్ఆన్ ఆదేశాల ప్రకారం దాన్ని విడనాడితే బ్యాంకింగ్ వ్యవస్థ నడిచేదెలా?

(అ) అరబీ భాషలో వడ్డీ కొరకు వాడబడిన పదం ‘రిబా‘. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవించక పూర్వం కూడా అరేబియా ప్రాంతంలో ఈ పదం వ్యవహారంలో ఉంది. కేవలం వ్యవహారంలో ఉండటమే కాదు, ప్రజలు ‘రిబా’ ప్రాతిపదికన లావాదేవీలు ముమ్మరంగా జరిపేవారు. అంతెందుకు, తౌరాత్ గ్రంథం అవతరించిన కాలంలో (దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం హయాంలో) కూడా యూదులు వడ్డీ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా అది ‘హరాం’ గావించబడిందని సూరె నిసాలోని ఆయతుల ద్వారా బోధపడుతోంది. తేలిందేమంటే అరబ్బులకు ‘రిబా’ అనే పదం కొత్తకాదు. అందుచేతనే ‘రిబా’ సొమ్మును తినటం హరాం (అధర్మం) అని హిజ్రీ 8వ ఏట ఖుర్ఆన్లో ఆజ్ఞ అవతరించినపుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దాని తఫ్సీర్ లను (వడ్డీ గురించిన వివరాలను) విడమరచి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఏ విధంగా నయితే మద్యపానాన్ని నిషేధించగానే ప్రవక్త సహచరులు దాన్ని తు.చ. తప్పకుండా పాటించారో అదే విధంగా వడ్డీ (రిబా) నిషేధాజ్ఞలు రాగానే వారు వడ్డీ లావాదేవీలన్నిటినీ త్యజించారు. ఆనాటికి ముస్లిమేతర సోదరుల నుండి తమకు రావలసి ఉన్న భారీ మొత్తాన్ని సయితం ముస్లింలు వదులుకున్నారు.

చెప్పవచ్చిందేమంటే వడ్డీ నిషేధాజ్ఞలు వచ్చిన కాలంలో దానికి సంబంధించిన మతలబులు ఏమీ గుట్టుగానో లేక అనిర్వచనీయంగానో ఉంచబడలేదు. ప్రజా జీవితాల్లో పాతుకుపోయి వున్న వడ్డీ (రిబా)నే ఖుర్ఆన్ నిషిద్ధంగా ప్రకటించింది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దీనిని కేవలం ఒక నైతిక కట్టడిగా గాకుండా ‘ఒకదేశ చట్టం’గానే ప్రవేశపెట్టారు. కాకపోతే రెండవ ఖలీఫా హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) కాలంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ చట్టం అన్వయింపుకు సంబంధించిన కొన్ని చిక్కులు ఎదురై షరియత్ కోవిదులలో ద్వంద్వాభిప్రాయాలు వినిపించాయి, అది వేరే విషయం! అయితే రిబా (వడ్డీ) హరాం అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి సందేహంగానీ, భేదాభిప్రాయంగానీ లేదు. వివరాల్లోకి పోతే సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను తరచి చూడవలసి ఉంటుంది. విషయం లోతుల్లోకి పోవటం మా ఉద్దేశ్యం కాదు. వడ్డీ మూలంగా సమాజంలో జనించే ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక కీడులను స్థూలంగా పాఠకుల ముందుంచి, అల్లాహ్ ఆజ్ఞల్ని అనుసరించటంలో దాసుల ఇహపర సాఫల్యాలు ఇమిడి ఉన్నాయని తెలుపడమే ఈ చిరు పుస్తకం ఉద్దేశ్యం.

సారాంశం ఏమిటంటే (1) అప్పుగా ఇచ్చి దానిపై లాభం లేక అదనపు మొత్తం పొందజూడటం వడ్డీ అవుతుంది. (2) ఈ వడ్డీ అధర్మమని ఖుర్ఆన్ హదీసులు స్పష్టం చేయగానే మహాప్రవక్త సహచరులు నిస్సంకోచంగా దీనిని విడనాడారు. ఈ విషయంలో వారు ఎలాంటి ఊగిసలాటకు లోను కాలేదు. (3) క్రింద పేర్కొనబడిన వస్తువులు లావాదేవీలు జరిపినపుడు సరిసమానంగా ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకవేళ వాటిలో హెచ్చుతగ్గులు చేస్తే అది కూడా వడ్డీ క్రిందికి వస్తుంది. అవేమంటే; (1) బంగారం, (2) వెండి, (3) గోధుమలు, (4)జవలు, (5) ఖర్జూరం, (6) ద్రాక్ష.

నేడు ఏ వడ్డీనయితే మానవ ఆర్థికాంశానికి కీలకంగా భావించబడుతున్నదో అది ఖుర్ఆన్ హదీసుల ప్రకారం నిషిద్ధం. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. దీని నిషిద్ధం గురించి 7 ఖుర్ఆన్ వచనాలు, 40కి పై చిలుకు ప్రవక్త ప్రవచనాలు సాక్షిగా ఉన్నాయి.

(b) ఇక ఈ వడ్డీ నిషేధించబడటంలోని ఔచిత్యం లేక పరమార్థం ఏమిటి? ఏ కారణంగా దీనిపై వేటు వేయబడింది? ఏ కారణంగా ఇది శాపగ్రస్తమైన వ్యవస్థగా భావించబడింది? ఇందులో గల ఆధ్యాత్మిక లేక ఆర్థిక కీడు ఏమిటి? అన్న విషయానికి వద్దాం.

ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రశాంత మనస్సుతో అర్థం చేసుకోవాలి. అదేమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టబడిన ఏ ఒక్క వస్తువులో కూడా ఏదో ఒక్క మేలు ఉండకపోదు. ఆఖరికి పాము, తేలు లాంటి విషపూరిత జంతువుల్లో, తోడేళ్లు, సింహాల వంటి క్రూర జంతువుల్లో కూడా లోక కళ్యాణానికి ఉద్దేశించిన బాగోగులు ఎన్నో కొన్ని ఉంటాయి. మానవుడు తొక్కే అడ్డదారుల్లో, వినాశకర పోకడల్లో కూడా ఏదో ఒక లాభం తప్పకుండా దాగి ఉంటుంది. అయితే ఏ మతమైనా, మరే మానవ సమాజమైనా, ఇంకే ఇతర సైద్ధాంతిక వర్గమైనా అతి తక్కువ నష్టాలతో సరిపెట్టి అత్యధిక లాభాలనిచ్చే వస్తువునే లాభకరమైన వస్తువు లేదా మేలైన వస్తువుగా పరిగణిస్తుంది. ఉదాహరణకు:- ఖుర్ఆన్ మద్యపానాన్ని నిషేధిస్తూ, ఇది ఘోరమైన పాపాలకు మూలమనీ, అయితే ఇందులో ప్రజల కోసం ఎంతో కొంత లాభం కూడా ఉందని చెప్పింది. కాని ఇందలి కీడు ఇందలి మేలు కన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. కాబట్టి నష్టాల ఆధిపత్యం వేటిలోనయితే ఉంటుందో వాటినల్లా నష్టకరమైనవిగానే పరిగణించి వాటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

వడ్డీ పరిస్థితి కూడా అంతే. వడ్డీ సొమ్ము తినేవాడికి అది తాత్కాలికంగా లాభకరంగా కనిపించవచ్చు. అయితే దాని ఐహిక, పారలౌకిక అనర్థాలు అతనికి వచ్చిన లాభం కన్నా ఎన్నోరెట్లు అధికమై ఉంటాయి. ఏదేని ఒక వస్తువు తృటిలో ప్రయోజనం చేకూర్చి దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిసినపుడు వివేకవంతుడైన వ్యక్తి ఎవడూ ఆ వస్తువును లాభకరమైన వస్తువుల జాబితాలో చేర్చడు. పైగా దానిని నష్టాల జాబితాలోనే వ్రాసుకుంటాడు. అదే విధంగా ఒక వస్తువు ఒక వ్యక్తికి మేలు చేకూర్చి సమాజం మొత్తానికి హాని కలిగిస్తుందని తెలిసినపుడు విజ్ఞుడైన మనిషి ఎవడూ దానిని మేలైన వస్తువుగా ఖరారు చేయలేడు. దొంగతనం లేక దొమ్మీ వల్ల ఒక వ్యక్తి లేక ఒక ముఠా లాభం పొందవచ్చు. కాని ఈ కీడు యొక్క ప్రభావం మొత్తం సమాజంపైనే పడుతుంది. సమాజమంతటా భయోత్పాతం నెలకొంటుంది. అందుచేత ఎవరూ దొంగతనాన్ని, దొమ్మీలను మంచివిగా తలపోయరు.

ఈ ఉపోద్ఘాతం తర్వాత మీరు వడ్డీ సమస్యపై దృష్టిని సారించండి. కాస్త నిదానంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. వడ్డీని ఆర్జించే వాడికి తాత్కాలిక లాభాలకన్నా అతనికి వాటిల్లే ఆధ్యాత్మిక, నైతిక దివాలా చాలా తీవ్రంగా ఉంటుందని, మంచిని, మానవత్వాన్ని కాంక్షించే మనుషుల జాబితాలో ఆ వ్యక్తికి చోటు లేకుండా పోతుంది. అతనికొక్కడికి వచ్చే లాభం సమాజాన్నంతటినీ భారీ నష్టంలో పడదోస్తుంది. కాని విచారకరమైన విషయం ఏమిటంటే లోకంలో ఏదైనా ఒక వస్తువు చెలామణిలోకి వచ్చేస్తే దాని మేళ్లు మాత్రమే ప్రజల కంటికి కనిపిస్తుంటాయి. కీడులు మాత్రం కంటికి ఆనవు.

నేటి ఆధునికయుగంలో వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి, యావత్తు ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. అది మానవ అభిరుచి పై ఎంత తీవ్రమైన ప్రభావం చూపిందంటే దాని వాతన పడిన వారు చేదైన దానిని తియ్యనిదిగా నమ్ముతున్నారు. సమస్త మానవాళి ఆర్థిక వినాశానికి హేతువు అయిన వస్తువు (వడ్డీ) ఆర్థిక సమస్యల పరిష్కారమార్గంగా పరిగణించబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఏ ఆలోచనాపరుడైనా లేక ఏ ఆర్థికవేత్త అయినా ఈ వడ్డీకి వ్యతిరేకంగా నినదిస్తే అతన్ని పిచ్చివాడిగా జమకట్టేస్తారు.

కాని ఒక విషయాన్ని విస్మరించరాదు – ఒక దేశంలో ఒక అంటువ్యాధి ప్రబలిపోయి దాని చికిత్స అంతగా ప్రభావం చూపకపోవటాన్ని చూసి ఏ డాక్టరైనా ఆ వ్యాధిని వ్యాధిగా పరిగణించకుండా దాన్నే ఒక ఔషధంగా,పరిష్కార మార్గంగా సూచించాడనుకోండి. ఆ డాక్టరును డాక్టరని అంటారా! అతడు డాక్టర్ కాడు. నరరూప రాక్షసుడు, ప్రవీణుడైన డాక్టర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా వ్యాధిని వ్యాధిగానే తలపోస్తాడు. వ్యాధి నివారణను సూచిస్తాడు.

దైవ ప్రవక్తలు (అలైహిముస్సలాం) మానవ సంస్కరణకు బాధ్యులుగా ఉండేవారు. ఎవరు తమ మాటను ఖాతరు చేసినా చేయకపోయినా వారు తమ పనిని తాము చేసుకుపోయేవారు. వారు గనక ప్రజల మనోకాంక్షల కనుగుణంగా నడుచుకుంటూ పోతే నేడు లోకమంతా అవిశ్వాస భావాలతో, మిథ్యావాదులతో అంధకార బంధురంగా ఉండేది.

వడ్డీ నేటి ఆర్థిక జగతికి వెన్నెముకగా భావించబడుతూ ఉన్నప్పటికీ – యూరపుకు చెందిన కొంతమంది విజ్ఞులు ఇప్పటికే దీన్ని ప్రమాదకరమైన బిందువుగా తలపోస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాదని, వెన్నె ముకను తొలచివేసే ఒక పురుగు అని వారు ఇప్పటికే అంగీకరించారు.

కాని శోచనీయమైన విషయం ఏమిటంటే మేధావులు, అర్థశాస్త్ర నిపుణులు కూడా ఒక్కోసారి ఆచార సంప్రదాయాల వలయంలో చిక్కుకుపోయి స్వేచ్ఛగా ఆలోచించలేకపోతారు. కాలపు క్రేజుకు తలఒగ్గి అంతరాత్మ ప్రబోధాన్ని అణచివేస్తారు.

కొద్దిమంది బలుపు కోసం కోట్లాది మంది ప్రాణులు భారీ మూల్యం చెల్లించవలసి రావటం, అనేక మానవ సముదాయాలు ఆకలి దప్పులకు, ఆర్థిక మాంద్యానికి లోను కావటం, దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న ప్రజల బ్రతుకులు మరింత నికృష్ట స్థితికి చేరటం, అదే సమయంలో గుప్పెడు మంది పెట్టుబడిదారులు సామాన్య జనుల రక్తం పీల్చి తమ కండలు పెంచుకోవటం సర్వసాధారణమైపోయింది. కడుపు మండి ఎప్పుడైనా ఈ సత్యాన్ని వాళ్ల ముందు వెల్లడిస్తే దాన్ని త్రోసి పుచ్చుతూ వారు అమెరికా, ఇంగ్లాండ్ల మార్కెట్లలో నిలబెట్టి వడ్డీ సమృద్ధిని మనకు చూపించదలుస్తారు. అక్కడ సమృద్ధి కనబడటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మేకలను భక్షించే మృగాలు బలిష్టంగానే ఉంటాయి కదా! కాని ఈ మృగాల వేటకు గురైన ప్రజల్లోకి చొచ్చుకుపోయి వారి స్థితిగతుల్ని కాస్త వీక్షించమనండి – అక్కడ ఈ మృగాల వేటకు గురైన వేలాదిమంది సామాన్య జనులు జీవచ్ఛవాల్లా పడి ఉండటం కాన వస్తుంది. ఇలాంటి ఆర్థిక ప్రక్రియను ఇస్లాం ఆరోగ్యవంతమైన ప్రక్రియగా భావించదు. గుప్పెడు మంది బడా వాణిజ్యవేత్తల బలుపుకోసం యావత్తు మానవ సమాజం చిక్కి శల్యమై పోవటం ప్రగతి అనిపించుకోదు.

(c) నేడు వడ్డీ కొత్త పుంతలు తొక్కుతోంది. దీని వ్రేళ్ళు నలువైపుల నుండీ ఆర్థిక వ్యస్థను ఆక్టోపస్ లా అల్లుకుపోతున్నాయి. మద్యం, జూదం, వ్యభిచారం వంటి చెడుగులు నాగరికత పేరిట, ఫ్యాషన్ పేరిట కొత్త మెరుగులు దిద్దుకొని ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లే వడ్డీ కూడా కొత్త అవతారమెత్తి ప్రజా జీవితాలతో ఆడుకుంటోంది. నిన్నటి వరకూ దుకాణాలకే పరిమితమైన ఈ రుగ్మత నేడు సేవింగ్ స్కీములు, బ్యాంకులు, సొసైటీల రూపంలో ఆవిర్భవించింది. ఈ కొంగొత్త వ్యవస్థ వల్ల సమాజమంతటికీ లాభం చేకూరుతుందని మభ్య పెట్టడం జరుగుతోంది. డబ్బుండీ వ్యాపారం చేయలేనివారు కొందరుంటే, వ్యాపారం చేయగోరినా చాలినంత పెట్టుబడిలేని వారు కొందరుంటారు. అలాంటి వారి దగ్గరున్న డబ్బును పొదుపు పథకాల క్రింద రాబట్టం జరుగుతుంది. వారికి వడ్డీ రూపేణ ఎంతో కొంత ‘లాభం’ లభిస్తుందనుకోండి. అయితే అలా పోగైన సంపద తిరిగి బడా వ్యాపారుల చేతుల్లోకి రుణం క్రింద వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ వడ్డీ లాభాలు అటు సామాన్యులకూ ఇటు పెద్ద వర్తకులకు కూడా లాభసాటిగా ఉన్నట్లు అగుపిస్తుంది.

కాని న్యాయ దృష్టిలో ఆలోచిస్తే ఇదొక మేడిపండు తప్ప మరేమీ కాదన్న వాస్తవం బోధపడుతుంది. ముదనష్టపు వస్తువులను మృదుమధురమైనవిగా సమర్పించే కిటుకులు మన వాళ్లకు బాగా తెలుసు. సారాయి భట్టీలలో అత్యంత దుర్భరమైన స్థితిలో తయారయిన సారాయిని అందమైన హోటళ్లలో సంస్కారవంతమైన శైలిలో సమర్పించటం ఎలాంటిదో, సాని కొంపల్లో మ్రగ్గే వారిని ‘కాల్ గర్ల్’ పేరుతో స్టార్ హోటళ్లకు రప్పించటం ఎటువంటిదో ఇదీ అటువంటిదే. నైతికంగా మానవ సమాజాలను తొలచివేసే వస్తువులకు ఆధునికత పేరిట అందమైన తొడుగులు తొడిగించినంత మాత్రాన అవి విషపూరితం కాకుండా పోవు.

పొదుపు మొత్తాలపై బ్యాంకుల ద్వారా లభించే కొద్దిపాటి వడ్డీ వల్ల వారి జరుగుబాటు ఎలాగూ కాదు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు కూలీనాలీయో ఉద్యోగమో ఎలాగూ చేయక తప్పదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారం మొదలెట్టి మార్కెట్టులోని వైపరీత్యాలకు తట్టుకొని నిలబడలేరు. పెద్ద తరహాలో వ్యాపారం చేద్దామంటే వారికి భారీ మొత్తంలో రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. వ్యాపార రంగంలో పరపతి ఉండి, ఓ మిలియనీరుగా చెలామణీ అవుతున్న వాడికి కోటి రూపాయిలైనా బ్యాంకుల నుండి రుణంగా లభిస్తాయి గాని ఒక సామాన్యుడికి పదివేల అప్పు కూడా పుట్టదు. ఆ విధంగా కలవాడు తన స్థాయి కన్నా పదిరెట్ల వ్యాపారం చేయగలుగుతాడు. లాభాలు కూడా అదే విధంగా జుర్రుకుంటాడు. కాని ఒక సన్నకారు వ్యాపారస్తుడు అప్పుడప్పు చేసి ఒక వేళ వ్యాపారం చేసినా అతడికి వచ్చే లాభం అతని జరుగుబాటుకు కూడా సరిపోదు. ఇదిలా ఉండగా వ్యాపార సంబంధమైన వైపరీత్యాలు గాని సంభవిస్తే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. ఆ వైపరీత్యాల్ని సృష్టించేది కూడా ఎవరో కాదు, బడా వాణిజ్యవేత్తలేనన్నది బహిరంగ రహస్యం. తేలిందేమంటే మార్కెట్టులో కొద్దిమంది పెద్ద తరహా వ్యాపారస్తులే మిగులుతారు. మూలధనమంతా క్రమక్రమంగా వారి ఇనుప్పెట్టెలకు తరలిపోతుంది.

1. సమాజమంతా వర్తకానికి దూరమై కొద్దిమంది పెట్టుబడిదారులు ఆర్థిక రంగాన్ని ఏలడం అన్యాయం కాదా?

2. మార్కెట్టులో కొద్దిమంది ఏకస్వామ్యం ఆధిపత్యం పెరిగిపోతుంది. వారు కోరినప్పుడల్లా నిత్యావసర వస్తువులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచేస్తూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే క్రయవిక్రయాల వ్యవస్థ అంతా వారి గుప్పెట్లో ఉంటుంది. పరోక్షంగా వాళ్లు దేశాన్నే శాసించే స్థాయికి చేరుకుంటారు. సామాన్య ప్రజల సొమ్ముతో తెగబలిసిన ఈ ఆసాములకు ప్రజా సంక్షేమం పట్ల గాని, సామాజిక న్యాయం అంటేగాని ఎలాంటి ఆసక్తి ఉండదు.

అదే వర్తకం వికేంద్రీకరణ జరిగి, మార్కెట్టులో పరిపూర్ణమైన పోటీ విధానం అమల్లోకి వచ్చినట్లయితే పరిస్థితి తద్ఛిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న వర్తకులకు కూడా లాభాలు వచ్చి వారి ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. వేలాది మందికి జీవనోపాధి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ సమస్య కొంతలో కొంత పరిష్కృతమవుతుంది. ప్రగతి ఫలాలు అందరికీ లభించి ఆర్థిక అసమానతల అగాధం కొంతవరకైనా పూడుకుంటుంది. కాని ఈ విషయం జనసామాన్యానికి అర్థమయ్యేలా చెప్పేదెవరు? వినాశకరమైన రోగం తగిలించబడింది. ప్రచారం చేసే వారేమో దీన్ని ఒక రోగంగా గాక దివ్య ఔషధంగా ప్రచారం చేస్తున్నారు.

3. బ్యాంకుల వడ్డీ వల్ల సమాజానికి వాటిల్లే మరో ఆర్థిక అనర్థం ఏమిటో చూడండి – ఒక వ్యక్తి వద్ద లక్ష రూపాయిల మూలధనముంటే అతను బ్యాంకు నుండి రుణం తీసుకొని 10 లక్షల వ్యాపారం చేస్తాడు. ఒకవేళ అతడి వ్యాపారం అనూహ్యమైన ఒడిదుడుకులకు లోనై అతడు దివాలా తీస్తే అతడికి కలిగే నష్టం ఒక లక్ష (10 శాతం) మాత్రమే. కాని మిగిలిన 90 శాతం నష్టం ఎవరిపై పడుతుంది? సమాజంపైనే కదా! పైకి బ్యాంకుకు నష్టం వాటిల్లినట్లుగా అగుపిస్తుంది. కాని వాస్తవానికి ఆ బ్యాంకు సొమ్ము ఎవరిది? ప్రజలది కాదా? దీని ద్వారా బోధపడిందేమంటే పెట్టుబడిదారుడు లాభాలు వచ్చినంత కాలం తానొక్కడే లాభాలను ఆర్జించాడు. సమాజానికి లభించింది నామమాత్రం. కాని నష్టం వాటిల్లేసరికి 90 శాతం నష్టం సమాజంపైకి నెట్టేయబడింది.

4. వడ్డీ వ్యవస్థ వలన కలిగే మరో పరాభవం ఏమిటంటే, వడ్డీ సొమ్ముతో వ్యాపారం మొదలెట్టిన వ్యక్తి ఒకసారి నష్టాల ఊబిలో పడ్డాడంటే ఇక అతడు పైకి రాలేడు. ఎందుకంటే నష్టాన్ని భరించేటంత మూలధనం అతని వద్దనయితే లేదు. నష్టాలు వాటిల్లినపుడు అతని ఇక్కట్లు రెట్టింపు అవుతాయి. ఒకవైపు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది. రెండోవైపు అతడు బ్యాంకు రుణభారం క్రింద నలిగిపోయాడు. దాన్ని చెల్లించే దారి లేదు. కాని అదే వడ్డీ రహిత వ్యాపారంలో నష్టం వాటిల్లి ఉంటే అతడు బికారి మాత్రమే అయ్యేవాడు. కాని రుణగ్రస్తుడు అయ్యేవాడు కాదు.

ఒక్కడ ఒక సందేహం ఉత్పన్నమవటం సహజం. బ్యాంకుల ద్వారా జాతీయ సంపద ఒక చోట ప్రోగవటం వల్ల జనసామాన్యానికి ఎంతో కొంతయినా లాభం చేకూరింది కదా! పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో లాభం చేకూరవచ్చుగాక, కాని సామాన్య ప్రజానీకానికి కూడా ఎంతోకొంత ముట్టింది కదా! ప్రజాధనాన్ని పొదుపు చేసే ఈ బ్యాంకు స్కీములే గనక లేకుంటే ఈ సంపద అంతా పూర్వకాలపు వ్యాపారస్తులు, జమీందార్లు ఖజానాను భూస్థాపితం చేసినట్లుగా ఈ కాలపు ప్రజలు కూడా సంపదను ఫ్రీజ్ చేసేసి నిరుపయోగం చేసేవారు కదా! అని కొందరు ప్రశ్నించవచ్చు.

దీనికి సమాధానం ఏమిటంటే ఇస్లాం వడ్డీని అధర్మంగా ఖరారు చేసి దాని ద్వారాలను మూసివేసినట్లే, సంపదను ఒకచోట ప్రోగు చేసిపెట్టే వారిపై జకాత్ అనే విద్యుక్త ధర్మాన్ని మోపి వాళ్ళు సంపదను నిరుపయోగం చేయకుండా బ్రేకువేసింది. పైగా ఆ సంపదను వెలికితీసి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టక తప్పని పరిస్థితిని సృష్టించింది. ఎలాగంటారేమో! ఇస్లాం ప్రకారం ఏ ముస్లిమైనా బంగారాన్ని గాని, నగదును గానీ నిల్వ చేస్తే అతడు ఆ సొమ్ముపై సాలీనా రెండున్నర శాతం చొప్పున జకాత్ ని తీసి సమాజంలోని అగత్యపరులకు, నిరాధారులకు ఇవ్వవలసి ఉంటుంది. ఆ విధంగా అతడు తన నిల్వలను పెట్టుబడిగా మార్చకుండా అట్టే పెట్టుకొని ఉంటే కొన్ని సంవత్సరాలకే ఆ ఖజానా కాస్తా ఖాళీ అయిపోతుంది. కాబట్టి అతడు తన దగ్గరున్న మిగులును ఫ్రీజ్ చేసి ఉంచే బదులు దాన్ని వాణిజ్యంలోనో వ్యవసాయంలోనో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపైన జకాత్ ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు. అంటే తన దగ్గరున్న సంపద ద్వారా తాను లబ్దిపొందడంతో పాటు ఇతరులకు కూడా జకాత్ రూపంలో లాభాలను పంచిపెడతాడు.

జకాత్ చెల్లింపు ద్వారా సమాజంలోని నిరుపేదలకు, అగత్యపరులకు సాయం లభించినట్లే ముస్లింల ఆర్థిక స్థితిగతులు చక్కబడే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్తకాన్ని ప్రోత్సహించేందుకు జకాత్ దోహదపడుతుంది. ఎందుకంటే, నగదు సొమ్మును ఏడాది కాలం పాటు ఇనుప్పెట్టెల్లో మూసి ఉంచడం వల్ల తనకు ప్రయోజనం ఏమీ కలగకపోగా, జకాత్ రూపేణా కొంతధనం బయటకు వెళ్ళిపోతుందే అని మనిషి ఆలోచనలో పడి ఆ నగదుతో వ్యాపారం మొదలెడతాడు. వేలాది మందికి చెందిన కష్టార్జితాన్ని బ్యాంకుల ద్వారా రాబట్టి ఒక పారిశ్రామికవేత్త వ్యాపారం చేసే బదులు స్థితిమంతుడయిన ప్రతి ఒక్కడూ వ్యాపార రంగంలో అడుగుపెడతాడు. వాణిజ్యరంగంలో ఆరోగ్యవంతమైన పోటీ పెరుగుతుంది. మార్కెట్లో ఏకస్వామ్య వ్యవస్థ బదులు పరిపూర్ణపోటీ విధానం అమల్లోకి వస్తుంది. మార్కెట్ సమతౌల్యం ఏర్పడుతుంది. తత్ఫలితంగా సమాజంలోని బడుగు జీవులకు, నిరాధారులకు వెసులుబాటు లభిస్తుంది.

వడ్డీ వ్యాపారం మూలంగా వాటిల్లే ఆర్థిక అస్తవ్యస్త స్థితిని అవలోకనం చేశాము. ఇక దీని మూలంగా మానవుని ఆధ్యాత్మిక, నైతిక రంగాలపై పడే దుష్ప్రభావాన్ని చూద్దాము –

1. మానవుని గుణగణాలలో అత్యంత ముఖ్యమైనది, ఉజ్వలమైనది త్యాగగుణం మరియు దాతృ స్వభావం. స్వయంగా బాధల్ని భరించి ఇతరులకు సుఖాన్ని పంచిపెట్టడమనే భావన ఉన్నత మానవీయతకు తార్కాణం. అయితే వడ్డీ పిశాచం తిష్ఠ వేసిన సమాజాల్లో ఈ పరోపకార గుణం దాదాపు నశిస్తుంది. పరులకు ఉపకారం కాదు కదా పరులు కష్టపడి పైకొచ్చి తన సరసన నిలబడటాన్ని కూడా ఒక వడ్డీ వ్యాపారి సహించలేడు.

2. అతడు ఆపదల్లో ఉన్న వారిపై జాలి చూపకపోగా వారి ఆపదల్ని తన స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోజూస్తాడు.

3. వడ్డీ ఆర్జన వల్ల అతనిలో పేరాశ పెరిగిపోతుంది. క్రమంగా అతని హృదయంలోని దయాదాక్షిణ్యాలు మటుమాయమవుతాయి. మంచీ-చెడుల మధ్య గల వ్యత్యాసాన్ని మరచిపోతాడు. ఆ విధంగా అతను నైతికంగా దిగజారి కడకు మానవత్వానికే దూరమైపోతాడు.

వడ్డీ మూలంగా సమాజానికి వాటిల్లే నైతిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అనర్థాలను వివరించారు సరే, మరయితే ఈ వడ్డీ లేకుండా వ్యవస్థ నడిచేదెలా? ఆర్థిక వ్యవస్థ అణువణువునూ ‘వడ్డీ’ పెనవేసుకొని ఉండగా దీన్ని ఒక్కసారిగా విడనాడితే వ్యాపారస్తులకు బ్రతికి బట్టకట్టే మార్గం ఏది? అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తడం సహజం.

మనం ఇక్కడ ఆవేశానికి లోనవకుండా ఒక విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. ఒక వ్యాధి ప్రబలిపోయి అది అంటువ్యాధిగా మారిపోయినపుడు చికిత్స దుర్లభంగా కనిపిస్తుంది. కానీ ఆ చికిత్స వృధాపోదు. ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం కావడానికి సమయం పడుతుంది. దీని కొరకు వ్యక్తులు, సమాజాలు సహన స్థయిర్యాలతో వ్యవహరించవలసి ఉంటుంది. దివ్యఖుర్ఆన్లో అల్లాహ్ స్వయంగా ఇలా సెలవిచ్చాడు.

“అల్లాహ్ ధర్మం విషయంలో మీపై ఎలాంటి లేమి (ఇబ్బంది) నీ ఉంచలేదు.”

దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే వడ్డీకి అతీతంగా మానవ సమాజాలకు ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు, కష్టనష్టాలు లేకుండా నడిపించే మార్గం తప్పక ఉంది.

సమాజంలోని నిరుపేదల అభాగ్యజీవుల పాట్లను నిరోధించే ఉపాయాలు ఇస్లాంలో ఉన్నాయి. ఇస్లాం ధర్మం పట్ల, దాని ఉపదేశాల పట్ల అనాసక్తత మూలంగా ముస్లింల స్థితిగతులు ఇలా తగలడ్డాయి గాని వారు గనక ఇస్లాం ప్రబోధనలను ఖచ్చితంగా తమ దైనందిన జీవితాల్లో ప్రవేశపెట్టుకున్నట్లయితే వారి జీవన గతే మారిపోతుంది. జకాత్, సదకాల రూపంలో వారు సక్రమంగా తమ సంపదను పంపిణీ చేసినట్లయితే నేడున్న సమస్యలు ఉండవు. ఇదంతా వారి నిర్లక్ష్య ధోరణి యొక్క పరిణామమే. నిజం చెప్పాలంటే నేడు జకాత్ విధానం దాదాపు లేదు. ముస్లింలలో చాలామంది నమాజ్ మాదిరిగానే జకాత్ జోలికిపోరు. జకాత్ ఇచ్చేవారు కూడా పాక్షికంగానే ఇస్తున్నారు. జకాత్ ను పూర్తిగా ఇచ్చేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పోనీ వారైనా ఆ జకాత్ సొమ్మేదో సక్రమంగా పంపిణీ చేస్తున్నారా అంటే అదీ లేదు. తమ సొమ్ముల్లో ఏడాదికోసారి జకాత్ తీస్తే సరిపోదు, దాన్ని సజావుగా చెల్లించాలి, నిర్ణీత పద్దులకు మాత్రమే కేటాయించాలన్నది అల్లాహ్ ఆదేశం. జకాత్ సొమ్మును దాని హక్కుదారులకు మాత్రమే చెల్లించే నిమిత్తం సిసలైన హక్కుదారులను అన్వేషించే దాతలు ఎంత మంది ఉన్నారో మీరే చెప్పండి.

ముస్లింల మిగులు ధనం ఎంత స్వల్పంగా ఉన్నా సరే, వారిలోని ప్రతి ఒక్క స్థితిమంతుడు గనక చిత్తశుద్ధితో జకాత్ అనే విధానాన్ని వేరుపరచి సక్రమమైన పద్ధతిలో దాని హక్కుదారులకు చేరవేసినట్లయితే అసలెవరికీ ముష్టెత్తుకునే దుస్థితి దాపురించదు. చీటికి మాటికీ అప్పుల కోసం ‘అయ్యవార్ల’ వద్దకు పరుగులు తీయాల్సిన అగత్యం కూడా ఉండదు.

మరి ఈ జకాత్ నే షరీఅత్ ఆదేశాలకు లోబడి సామూహిక పద్ధతిలో వసూలు చేసి ‘బైతుల్ మాల్’ అనే సంస్థను స్థాపించినట్లయితే మరిన్ని మేళ్లు చేకూరుతాయి. అలా పెద్ద మొత్తంలో వసూలైన జకాత్ ను బైతుల్ మాల్ ద్వారా వడ్డీలేని రుణాలుగా కూడా ఇవ్వవచ్చు. జీవనోపాధి లేక రోడ్డున పడ్డ అనేక మందికి రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమల్ని స్థాపించవచ్చు. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఒక ఐరోపా ఆర్థిక నిపుణుడు నిజం చెప్పాడు. అతనిలా అన్నాడు – “ముస్లింల జకాత్ వ్యవస్థ ఎంత ప్రభావవంతమైనదంటే, ముస్లింలే గనక దాన్ని సక్రమంగా పాటిస్తే ఆ జాతిలో ఒక్క దరిద్రుడు, అగత్యపరుడూ మిగలడు”.

ఈ చర్చ ద్వారా చివరకు మేము చెప్పదలచిందేమంటే; వడ్డీ ఒక అంటువ్యాధిలా ప్రబలి పోయిన ఈ రోజుల్లో ఇక దాన్ని విడనాడే దారేలేదని తలపోయటం సరైనది కాదు. కాకపోతే ఇది ఒక్క వ్యక్తి లేక కొందరు వ్యక్తుల పని కాదు. ప్రభుత్వాలు, సామూహిక సంస్థలు చొరవ తీసుకొని వ్యవస్థను మార్చడానికి యత్నించినపుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. కనీసం ముస్లిం సమాజాలు, ముస్లిం రాజ్యాలు ఈ సమస్యపై దృష్టిని కేంద్రీకరించి వడ్డీ రహిత వ్యవస్థ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే వడ్డీ పిశాచం నుండీ ప్రజానీకాన్ని కాపాడటం దుర్లభమేమీ కాదు. వారు ఈ లక్ష్యాల్ని సాధించిననాడు ఆర్థికంగా యావత్ప్రపంచానికే ఆదర్శప్రాయం కాగలుగుతారు.

మరో విషయాన్ని మేము ముస్లింలకు ప్రత్యేకంగా విన్నవించుకోదలిచాము – వారు కనీసం రోగాన్ని రోగంగానే చూడాలి. అధర్మాన్ని (హరాం) అధర్మంగానే చూడాలి. షరీఅత్లో అధర్మమైన ఒక వస్తువును ధర్మసమ్మతం (హలాల్)గా తలపోయడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. అత్యంత విచారకరమైన విషయమేమంటే ముస్లిం సమాజాల్లో కొంత మంది మేధావులు ఈ ‘హరామ్’ ను ‘హలాల్’గా నిరూపించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన పాపం అన్న సంగతిని వారు మరచిపోతున్నారు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటమాడటం ధిక్కారవైఖరికి ప్రతీక అని వారు గ్రహించకపోతే అది వారి గ్రహచారం. కనీసం హరామ్ ను హరామ్ గా భావించటం వల్ల వారికి వాటిల్లే నష్టం ఏమీలేదు కదా!

చివర్లో మేము వడ్డీ నిషిద్ధం మరియు దానికి సంబంధించి అల్లాహ్ తరఫున చేయబడిన హెచ్చరికలను తెలిపేందుకు గాను మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రవచనాలను పొందుపరచదలిచాము. కనీసం పాపాన్ని పాపంగా తలపోసే భావన అయినా ప్రజల్లో మేల్కొనాలన్నదీ, దానికి దూరంగా ఉండటానికి ప్రజలు ఉపాయాలు ఆలోచించాలన్నది మా ఉద్దేశ్యం. ఈ హరామ్ ను హలాల్ గా పరిగణించి వారు రెట్టింపు పాపాన్ని మూటగట్టుకోకుండా ఉన్నా చాలు కొంత వరకు ఉద్దేశ్యం నెరవేరినట్లే. ముస్లింలలో చాలా మంది రాత్రిపూట తహజ్జుద్ నమాజులో, అల్లాహ్ నామస్మరణలో గడుపుతారు. కాని తెల్లవారాక వారు తమ వ్యాపార వ్యవహారాలలో తలమునకలవగానే తాము వడ్డీ అనే అధర్మమైన వ్యవహారానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేయూతనిస్తున్నామన్న సంగతి మరచిపోతారు. ఇది కడు శోచనీయమని వేరుగా చెప్పనవసరం లేదు. వడ్డీ గురించి తన అనుచర సమాజానికి మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) చేసిన హెచ్చరికల్ని చదవండి.

1) “ఏడు ప్రాణాంతక వస్తువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోండి” అని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు. ‘అవేమిటి ఓ దైవ ప్రవక్తా!’ అని సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ప్రశ్నించగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా వివరించారు:- 1) ఒక్కడైన అల్లాహ్ (ఆరాధనలలో)కు సహవర్తునిగా వేరొక దైవాన్ని నిలబెట్టడం. 2) చేతబడి (బాణామతి) చేయడం, 3) ఏ వ్యక్తినయినా అన్యాయంగా హతమార్చడం 4) వడ్డీ తినడం 5) అనాధ సొమ్మును భక్షించటం. 6) ధర్మయుద్ధ సమయంలో యుద్ధ రంగం నుండి వెన్ను చూపి పారిపోవటం 7) సౌశీల్యవతి అయిన మహిళపై అపనింద మోపడం”. (ఈ హదీసు సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.)

2) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు. “ఇవాళ రాత్రి నేను నా దగ్గరకొచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని చూశాను. వాళ్లు నన్ను బైతుల్ మఖ్దిస్ వరకు గొనిపోయారు. మేము మరింత ముందుకు సాగిపోగా అక్కడ ఒక నెత్తుటి కాలువ కనిపించింది. అందులో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మరొకతను కాలువ ఒడ్డున నిలుచుని ఉన్నాడు. కాలువలో నిలుచున్న వ్యక్తి బయటకు రావటానికి యత్నించినపుడు ఒడ్డున ఉన్న వ్యక్తి అతని ముఖంపై రాయి రువ్వుతున్నాడు. ఆ దెబ్బతో అతడు మునుపున్న చోటికే పరుగెత్తుకెళుతున్నాడు. మళ్లీ అతడు కాలువ నుంచి బయట పడేందుకు ప్రయత్నించగా ఒడ్డున ఉన్నవాడు మళ్లీ రాయి రువ్వసాగుతున్నాడు. ఏమిటీ తతంగం? అని నేను నా వెంట వున్న ఇద్దరిని ప్రశ్నించగా ‘కాలువలో చిక్కుకుపోయిన వ్యక్తి వడ్డీ సొమ్ము తినేవాడు (ఇప్పుడు తన కర్మకు శిక్ష అనుభవిస్తున్నాడు) అని వాళ్లు బదులిచ్చారు.” (ఈ హదీసు సహీహ్ బుఖారీలోని కితాబుల్ బుయూలో ఉంది).

3) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వడ్డీ తీసుకునే వారినీ, వడ్డీ ఇచ్చే వారిని కూడా ధూత్కరించారు. మరికొన్ని ఉల్లేఖనాలలో వడ్డీ వ్యవహారం పై సాక్ష్యమిచ్చేవారు, తత్సంబంధితమైన దస్తావేజులు వ్రాసేవారు కూడా ధూత్కరించబడ్డారు.

సహీహ్ ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో ఇలా అనబడింది “వీళ్ళంతా ఈ పాపంలో సమాన భాగస్థులే”. మరి కొన్ని ఉల్లేఖనాలలో, సాక్షులు, దస్తావేజులు వ్రాసేవారు తమకు అది వడ్డీ వ్యవహారం అని తెలిసి ఉన్న పక్షంలోనే ధూత్కారానికి గురవుతారు.

4) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. “నాలుగు రకాల మనుషులున్నారు. వారికి స్వర్గంలో ప్రవేశం లభించదు గాక లభించదని అల్లాహ్ నిర్ధిష్టంగా నిర్ణయించాడు. ఆ నలుగురు ఎవరంటే (a) మద్యపానానికి ఆలవాటు పడినవాడు. (b) వడ్డీని తిన్నవాడు (c) అనాధ సొమ్మును అన్యాయంగా స్వాహా చేసేవాడు (d) తల్లిదండ్రుల మాట విననివాడు. (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రిక్ హాకిమ్’లో ఉంది)

5) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్ తిన్నవాడు ముప్ఫయి ఆరుసార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క”.

మరొక ఉల్లేఖనంలో “అక్రమ ధనంతో పెరిగిన కండ కోసం అగ్నియే సబబైనది”.

దాంతో పాటు మరో ఉల్లేఖనం ఈ విధంగా ఉంది :- “ఒక ముస్లిం మాన మర్యాదల్ని మంట గలపడం వడ్డీ తినటం కన్నా ఎక్కువ పాపిష్టికరం” (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్, బ్రానీలలో ఉంది)

6) వేరొక హదీసులో ఉంది:- మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “(వృక్షం యొక్క) ఫలం నిరుపయోగం కాక ముందే దాన్ని అమ్మి వేయాలి”. ఇంకా ఇలా అన్నారు – “ఏదేని ఒక పేటలో వ్యభిచారం, వడ్డీ వ్యాపారం పెరిగిపోతే అది అల్లాహ్ ఆగ్రహాన్ని తన పైకి ఆహ్వానించినట్లే.” (ఈ ఉల్లేఖనం ‘ముస్తద్రక్ హాకిమ్ లో ఉంది.)

7) మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు “ఏ జాతిలోనయినా లావాదేవీలు వడ్డీ ప్రాతిపదికగా సాగితే అల్లాహ్ వారిపై నిత్యావసర వస్తువుల ధరను విపరీతం చేస్తాడు. మరే జాతిలోనయినా లంచగొండితనం ప్రబలిపోతే శత్రువును చూసి వణికిపోయే భయోత్పాత స్థితి వారిపై నెలకొంటుంది”. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్లో ఉంది)

8) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు:- షబే మేరాజ్ సందర్భంగా మేము ఏడవ ఆకాశంలో చేరినపుడు నేను నా పైన ఒక మెరుపును చూశాను. ఆ తరువాత మాకు ఒక జన సమూహం తారసిల్లింది. వారి పొట్టలు నివాస గృహాల మాదిరిగా వ్యాకోచించి ఉన్నాయి. వాటిల్లో సర్పాలు నిండి ఉన్నాయి. అవి బయటకు కనిపిస్తూ ఉన్నాయి. ‘ఎవరు వీరు?’ అని నేను దైవదూత జిబ్రయీల్ (అలైహిస్సలాం)ని అడిగాను. ‘వీళ్లు వడ్డీ సొమ్ము తిన్నవారు’ అని ఆయన సమాధానమిచ్చారు. (ఈ ఉల్లేఖనం ముస్నద్ అహ్మద్ లో నిది)

9) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఔఫ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు)ని ఉద్దేశ్యించి చెప్పారు – “క్షమార్హం కాని పాపాలకు దూరంగా ఉండండి. వాటిల్లో ఒకటి:- యుద్ధప్రాప్తిని తస్కరించటం, రెండు:- వడ్డీ సొమ్ము తినటం”. (తబ్రానీ)

10) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా ఉపదేశించారు: “మీరు ఎవరికయితే అప్పు ఇచ్చారో అతన్నుంచి కానుక కూడా స్వీకరించకండి”. (బహుశా అతను ఈ కానుక అప్పుకు బదులుగా ఇచ్చాడేమో. అది బహుశా వడ్డీయేమో. అందుచేత అతని కానుకను స్వీకరించే విషయంలో కూడా జాగ్రత్తపడటం మంచిది.)

దివ్యఖుర్ఆన్లోని ఏడు వచనాలు మరియు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పది హదీసుల ఆధారంగా వడ్డీ నిషిద్దం గురించి స్థూలంగా మీ ముందుంచటం జరిగింది. విషయాన్ని వివరంగా చర్చిస్తే ఓ పెద్ద గ్రంథమే తయారవుతుంది
.
ధర్మంలో హరామ్ (నిషిద్ధం) – హలాల్ (ధర్మ సమ్మతం)లు కీలకమైనవి. మోమిన్ (విశ్వాసి) అయిన వాడు హలాల్ వస్తువులను స్వీకరించి హరామ్ వస్తువులను పరిత్యజిస్తాడు. హరామ్ వస్తువుల పట్ల ఏహ్యభావం కలిగి ఉంటాడు. ఇస్లామీయ షరీఅత్ హరామ్ గా ఖరారు చేసిన వాటిలో ఏదైనా హరామే. హరామ్ వస్తువుల జాబితాలో వచ్చే కొన్నింటిని అసహ్యించుకొని మరికొన్నింటిని స్వీకరించటం అంటే ధర్మాన్ని పాక్షికంగా అవలంబించటమే.

కాగా, అల్లాహ్ విశ్వాసుల్ని ఉద్దేశ్యించి ఏమంటున్నాడో తెలుసా?!

‘యా అయ్యుహల్లజీన ఆమనుద్ ఖులూ ఫిస్సిల్మి కాప్ఫహ్’
ఓ విశ్వాసులారా ! ఇస్లాంలో ప్రవేశిస్తే (పాక్షికంగా కాదు) పూర్తి స్థాయిలో ప్రవేశించండి.

సమాప్తం

వడ్డీ – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1NM8ynZdYubB7u7F0gGvnP

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]
మూలం : మర్దిజా ఆల్డ్ రిచ్ టారింటినో
అనువాదం: బా మేరాజ్
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్

[డౌన్లోడ్ పుస్తకం]
[116 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

దైవప్రవక్త సహచరులు జాబిర్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

ఒక వెన్నెల రాత్రి – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను చూశాను. ఆయన ఎరుపు రంగు దుస్తుల్లో వున్నారు.నేను ఆకాశంలోని చంద్రుణ్ణి ఒకసారి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందాన్ని మరోసారి ఇలా మార్చి మార్చి చూస్తూ ఉన్నాను.అప్పుడు నాకు ఆకాశంలోని చంద్రుడి కన్నా దైవ ప్రవక్త ముఖారవిందమే నిండు చంద్రునిలా ఎంతో అందంగా కనిపించింది.

1. శుభోదయం
2. నల్ల మచ్చ
3. జమ్ జమ్ బావి
4. వంద ఒంటెల విందు
5. వర్తక బృందం
6. క్రైస్తవ పండితుడు -బహీరా
7. యవ్వనం
8. అల్లాహ్ పిలుపు
9. ఖురైష్ తెగ
10. ప్రతి పక్షం
11. జిన్నాత్
12. రాత్రి ప్రయాణం
13. కొండ గుహ
14. మదీనా
15. మదీనా-2
16. బద్ర్ యుద్ధం
17. ఉహుద్ యద్ధం
18. కందక యుద్ధం
19. తిరిగి రాక

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

కలామే హిక్మత్ (వివేక వచనం) -1 [పుస్తకం]

డౌన్లోడ్ – కలామే హిక్మత్ (వివేక వచనం) -1
రచయిత : సఫీ అహ్మద్ మదనీ
[88 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

ముందుమాట – [డౌన్లోడ్ PDF]