లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య – హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

లుఖ్మాన్ (అలైహిస్సలాం) ఉపదేశాలు: జీవన విద్య
హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/H-0-b8o_u2M [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో సురయే లుఖ్మాన్ ఆధారంగా ‘జీవన విద్య’ గురించి వివరించారు. లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఎనిమిది ముఖ్యమైన ఉపదేశాలను ఈ క్రింది విధంగా చర్చించారు: అల్లాహ్ పట్ల ఏకత్వాన్ని కలిగి ఉండటం (తౌహీద్), తల్లిదండ్రుల పట్ల గౌరవం మరియు విధేయత చూపడం, అల్లాహ్ యొక్క సర్వవ్యాప్త జ్ఞానాన్ని గుర్తించి తఖ్వాతో జీవించడం, నమాజును నిలబెట్టడం, సమాజంలో మంచిని ప్రబోధించి చెడును నిరోధించడం, కష్ట సమయాల్లో సహనం (సబర్) పాటించడం, అహంకారాన్ని వీడి వినయాన్ని అలవరచుకోవడం మరియు మాట తీరులో, నడకలో మర్యాదను పాటించడం. చివరగా ఈ ఐదు సూత్రాలు—తౌహీద్, నమాజ్, అఖ్లాక్, సబర్, వినయం—మానవ జీవితానికి మరియు సమాజ శ్రేయస్సుకు పునాదులని ఆయన సారాంశం ఇచ్చారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

إِنَّ الْحَمْدَ لِلَّهِ ، نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ ، وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا ، وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا ، مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ ، وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.

(ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తయీనుహు వ నస్తగ్ఫిరుహు, వ నవూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా, వ మిన్ సయ్యిఆతి ఆ’మాలినా, మన్ యహదిహిల్లాహు ఫలా ముజిల్ల లహు, వ మన్ యుజ్లిల్ ఫలా హాదియ లహు, వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.)

అల్లాహుమ్మ సల్లి వసల్లిమ్ వ బారిక్ అలా అబ్దిక వ రసూలిక ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు, సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తన అనుగ్రహాలను కురిపించు గాక.

అభిమాన సోదరులారా! ఈ రోజు మనం పరిశీలించబోయే విషయం: లుఖ్మాన్ అలైహిస్సలాం ఉపదేశాలు – జీవన విద్య. మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే అమూల్యమైన మార్గదర్శకత్వం లుఖ్మాన్ అలైహిస్సలాం వారి ఉపదేశాలలో ఉంది. ఖురాన్ లో ఒక సూరా పేరే ‘లుఖ్మాన్’. ఇందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలను పేర్కొన్నాడు. కానీ ఆ ఉపదేశాలు కేవలం ఒక తండ్రి సలహాలు కాదు, ఇవి సమగ్ర జీవన విద్య.

అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఇస్లాం యొక్క మొదటి మరియు అత్యంత ముఖ్యమైన బోధన తౌహీద్. ఇదే విషయం ముస్లిములు మరియు ముష్రికుల మధ్య స్పష్టమైన తేడాను ఏర్పరుస్తుంది. దీనిని నిరాకరించే వ్యక్తి ముష్రిక్ అవుతాడు. అలాంటి వ్యక్తికి లోకంలోనూ, పరలోకంలోనూ అవమానం మరియు అపకీర్తి తప్పదు. ఎందుకంటే షిర్క్ చేయడం అంటే ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన అస్తిత్వాన్ని నిరాకరించడం అవుతుంది. మరోవైపు షిర్క్ చేసే వ్యక్తి తనలాంటి లేదా తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న సృష్టుల ముందు తల వంచి, తనను తాను అవమానించుకుంటాడు మరియు హీన స్థితికి దిగజారుతాడు.

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన మొదటి హితబోధ, మొదటి నసీహత్ ఇదే తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి:

وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ ۖ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
(వ ఇజ్ కాల లుఖ్మాను లిబ్నిహీ వహువ యఇజుహు యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహి ఇన్నష్షిర్క లజుల్మున్ అజీమ్)

లుఖ్మాన్‌ తన కుమారునికి హితబోధ చేస్తూ ఇలా అన్నాడు: “ఓ నా ముద్దుల పుత్రుడా! అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించకు. నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం.”(31:13)

లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన మొట్టమొదట ఉపదేశం షిర్క్ నుండి వారించడం. దీనిని బట్టి విదితమయ్యేదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడు హితోపదేశం చేసినా ప్రధాన స్థానంలో షిర్క్ ఖండన, తౌహీద్ అంగీకారం గురించే అయి ఉండాలి. షిర్క్ నుండి వారించే మాటలు తప్పకుండా చెప్పాలి. తమ పిల్లలలో అల్లాహ్ ఏకత్వాన్ని నూరిపోయాలి.

జీవన విద్యలో మొదటి పాఠం తౌహీద్. ఇది మనం బాగా తెలుసుకోవాలి. విశ్వాసం సరిగ్గా ఉంటే జీవితం సరిగ్గా ఉంటుంది. మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “ఎవరైతే షిర్క్ చేయకుండా చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు.” అందుకే మనము చదివే, పఠించే కలిమా – ‘కలిమతుత్ తౌహీద్’ – లా ఇలాహ ఇల్లల్లాహ్ లో మొదటి భాగం ఏమిటి? షిర్క్ ఖండన. రెండవ భాగం తౌహీద్ అంగీకారం ఉంటుంది. నఫీ – ఇస్ బాత్. లా ఇలాహ (దేవుడు లేడు), ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప). అంటే మొదటి భాగం ఏమి ఉంది? షిర్క్ ఖండన ఉంది. రెండవ భాగంలో తౌహీద్ అంగీకారం గురించి ఉంటుంది.

కావున లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి బోధించిన మొదటి విషయం, నసీహత్ చేసిన మొదటి నసీహత్ అది తౌహీద్ గురించి, షిర్క్ ఖండన గురించి ఉంది. ఎందుకంటే ఇది జీవితంలో అన్నిటికంటే ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది. దీనికి మించినది ఏదీ లేదు.

ఇక రెండో విషయానికి వస్తే, తౌహీద్ తర్వాత అమ్మ నాన్న గురించి ఉంటుంది, తల్లిదండ్రుల గురించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో తల్లిదండ్రుల గౌరవానికి అత్యున్నత స్థానం ఉంది. అల్లాహ్ ఆరాధన తర్వాత వెంటనే తల్లిదండ్రుల పట్ల దయ, విధేయతను ఖురాన్ ఆదేశిస్తుంది. లుఖ్మాన్ సూరాలో, ఆయత్ 14 లో ఇలా ఉంటుంది:

وَوَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَىٰ وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنِ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ

(వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి హమలత్ హు ఉమ్ముహు వహ్నన్ అలా వహ్నిన్ వ ఫిసాలుహు ఫీ ఆమైని అనిష్కుర్ లీ వ లివాలిదైక ఇలయ్యల్ మసీర్)

మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము- అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (కనుక ఓ మానవుడా!) నువ్వు నాకూ, నీ తల్లిదండ్రులకూ కృతజ్ఞుడవై ఉండు. (ఎట్టకేలకు మీరంతా) మరలి రావలసింది నా వద్దకే.(31:14)

ఈ ఆయతులు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, సహనం, దయ చూపాలని స్పష్టంగా బోధిస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు: “అల్లాహ్ సంతృప్తి తల్లిదండ్రుల సంతృప్తిలో ఉంది. అల్లాహ్ అసంతృప్తి తల్లిదండ్రుల అసంతృప్తిలో ఉంది.”

ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ని అడిగాడు: “నా మంచి సహవాసానికి ఎవరు ఎక్కువ అర్హులు?” మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “నీ తల్లి“. అతను మూడు సార్లు అడిగితే, మూడు సార్లు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నీ తల్లి” అని చెప్పారు. నాలుగవ సారి “నీ తండ్రి” అని సమాధానం ఇచ్చారు.

అంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, వారితో మృదువుగా మాట్లాడాలి, వారి అవసరాలు తీర్చాలి, వారి కోసం దుఆ చేయాలి. ఈ విధంగా రెండవ విషయం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసింది అది తల్లిదండ్రుల గురించి.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం తల్లిదండ్రుల గౌరవం ఒక మహత్తర ఇబాదత్. వారిని సంతోషపరచడం ద్వారా అల్లాహ్ సంతోషాన్ని పొందవచ్చు. అందుకే ప్రతి ముస్లిం తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, విధేయతతో ఉండాలి. ఇది రెండవ విషయం. లుఖ్మాన్ అలైహిస్సలాం యొక్క ఉపదేశాల విషయంలో ‘వ వస్సైనల్ ఇన్ సాన బివాలిదైహి’ అని ఉంటుంది.

మొదటిది ఏంటి? తౌహీద్, నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన. రెండవది ఏమిటి? తల్లిదండ్రుల గురించి. అంటే తల్లి కష్టాలు, తండ్రి పోషణ – ఇది మనకు ఏమి నేర్పుతుంది? కుటుంబ విలువలు సమాజానికి పునాది.

ఇక మూడవ విషయానికి వస్తే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సర్వజ్ఞుడు. బాధ్యతా భావం కలుగుతుంది దీనివల్ల. అంటే లుఖ్మాన్ అలైహిస్సలాం చేసిన మూడవ హితోపదేశం:

يَا بُنَيَّ إِنَّهَا إِن تَكُ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ فَتَكُن فِي صَخْرَةٍ أَوْ فِي السَّمَاوَاتِ أَوْ فِي الْأَرْضِ يَأْتِ بِهَا اللَّهُ ۚ إِنَّ اللَّهَ لَطِيفٌ خَبِيرٌ

(యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిస్ ఖాల హబ్బతిమ్ మిన్ ఖర్దలిన్ ఫతకున్ ఫీ సఖ్రతిన్ అవ్ ఫిస్ సమావాతి అవ్ ఫిల్ అర్జి యాతి బిహల్లాహు ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్)

(లుఖ్మాన్‌ తన కుమారునికి ఇలా బోధపరిచాడు) “నాయనా! ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా, అది ఏదైనా రాతి బండలో ఉన్నా, లేక అది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లాహ్‌ తప్పకుండా తీసుకువస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు. (31:16)

అంటే ఒక ఆవగింజంత పని అయినా అల్లాహ్ గమనిస్తాడు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అన్న మాట. సమాజంలో ఉన్నా, సమూహంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏకాంతంలో ఉన్నా ఎలాగైనా సరే, రాత్రి పగలు ఎక్కడైనా సరే అల్లాహ్ గమనిస్తున్నాడు. ఏదీ కూడా అల్లాహ్ తో గోప్యంగా లేదు. ప్రతి విషయం అల్లాహ్ కు తెలుసు. రహస్య జీవితంలో కూడా తఖ్వా కలిగి ఉండాలి అని బోధపడుతుంది మనకు.

ఈ కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేది మొబైల్. కావున అల్లాహ్ చూస్తున్నాడని గుర్తుంచుకోవాలి. హరామ్ కంటెంట్ చూడకూడదు, చెడు చాటింగ్ చేయకూడదు, చెడు సంబంధాలు నివారించాలి. రహస్యంగా చేసిన పాపం కూడా అల్లాహ్ కు చాలా బాగా తెలుసు. ఇది మనలో తఖ్వా పెంచుతుంది ఈ భావన. ఈ హితోపదేశం ఆవగింజంత కూడా అల్లాహ్ కు తెలుసు అంటే నేను ఏది చేసినా, నేను ఏది ఊహించినా అల్లాహ్ ఎరుగుతాడు. అన్ని విషయాలు అల్లాహ్ కు తెలుసు. కావున ఈ భావన కలిగి ఉంటే ఏమవుతుంది? తఖ్వా పెరుగుతుంది, దైవభీతి పెరుగుతుంది.

ఇక నాలుగవ ఉపదేశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశం నాలుగవది: నమాజ్ స్థాపన.

يَا بُنَيَّ أَقِمِ الصَّلَاةَ…
(యా బునయ్య అఖిమిస్ సలాత…)

“ఓ నా కుమారా! నమాజును స్థాపించు…” (31:17)

ఇస్లాం ధర్మంలో సలాహ్ (నమాజు) అత్యంత ముఖ్యమైన ఇబాదత్. ఇది ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒక స్తంభం. అర్కానుల్ ఇస్లాం లోని ఒక రుకున్. అల్లాహ్ పై విశ్వాసం తర్వాత అత్యంత ప్రధానమైన కర్తవ్యం అస్సలాహ్.

నమాజ్ గురించి ఖురాన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది. “నమాజ్ ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి” – సూరయే బఖరాలో, సూరయే అన్కబూత్ లో, సూరయే తాహాలో అనేక సూరాలలో ఉంది. నమాజ్ అసభ్య కార్యాల నుండి, చెడు పనుల నుండి నివారిస్తుంది. అంటే ఈ ఆయత్ కి చాలా వివరంగా చెప్పవచ్చు – ‘ఇన్నస్ సలాత తన్ హా అనిల్ ఫహ్ షాయి వల్ మున్ కర్’. నమాజ్, నమాజ్ చేసే వ్యక్తిని చెడు పని నుండి, పాపం నుండి, ఫహ్ షా నుండి, మున్ కర్ నుండి కాపాడుతుంది అని ఇది ఖురాన్ వాక్యం, ఖురాన్ ఆయత్. మరి ఇప్పుడు మనం సమాజంలో గమనిస్తున్నాము – నమాజులు చేస్తున్నాము, పాపాలు చేస్తున్నాము. నమాజులు చేస్తున్నాము, సినిమాలు చూస్తున్నాము. నమాజ్ చేస్తున్నాము, బూతులు మాట్లాడుతున్నాము. నమాజ్ చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. నమాజులు చేస్తున్నారు, అనేక పాపాలకి పాల్పడుతున్నారు. అంటే మరి అల్లాహ్ వాగ్దానం కదా అది ఖురాన్ లో, ఆయత్ లో ఉంది కదా! ప్రతి ప్రవక్త నమాజ్ గురించి హెచ్చరించారు. మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణం పోయే ఆ సమయంలో కూడా ‘అస్సలాత్ అస్సలాత్’ అని చెప్పారు. మరి ఇటువంటి నమాజ్ మరి నమాజ్ చేసే వ్యక్తిని పాపాల నుండి, దుర్మార్గాల నుండి, మోసాల నుండి, చెడు నుండి ఎందుకు కాపాడటం లేదు అంటే – నమాజ్ చేసే రీతిలో, ఏ విధానంలో నమాజ్ చేయాలో, ఏ హక్కులతో నమాజ్ చేయాలో, ఏ రీతిలో నమాజ్ చేయాలో, ఏ భక్తితో, ఏ భావనతో నమాజ్ చేయాలో, ఎటువంటి విశ్వాసంతో నమాజ్ చేయాలో, ఏ విధానంతో నమాజ్ చేయాలో ఆ విధానం లేదు కాబట్టి. “నన్ను స్మరించుటకై నమాజ్ స్థాపించు”. ఈ ఆయతులు నమాజ్ మనిషిని పాపాల నుండి దూరంగా ఉంచి అల్లాహ్ స్మరణలో ఉంచుతుందని తెలియజేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా నమాజ్ గురించి అనేక సందర్భాలలో అనేక విధాలుగా తెలియజేసి ఉన్నారు. “మన మధ్య మరియు కుఫ్ర్ మధ్య తేడా అనేది నమాజ్.” రేపు ప్రళయ దినాన మనిషి నుండి మొదట అడగబడేది నమాజ్ గురించే.

ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. నమాజ్ వల్ల కలిగే ప్రయోజనాలలో అల్లాహ్ కు దగ్గరవ్వడం, హృదయానికి శాంతి, పాపాల క్షమాపణ, క్రమశిక్షణ మరియు సమయపాలన, సమాజంలో ఐక్యత (జమాత్ నమాజ్ ద్వారా). ఈ విధంగా నమాజ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం నమాజ్ ముస్లిముల జీవితానికి ఆధారం. ఇది కేవలం ఆచారం కాదు, ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. నమాజ్ అనేది కేవలం ఆచారం కాదు. ఇది అల్లాహ్ తో నేరుగా సంబంధాన్ని బలపరిచే పవిత్రమైన మార్గం. క్రమంగా ఖుషూ (భక్తి), వినయంతో నమాజ్ ఆచరించడం ద్వారా ఈ లోకంలో శాంతి, పరలోకంలో విజయం లభిస్తాయి.

ఇక ఐదవ హితోపదేశం: మంచి ఆజ్ఞాపన, చెడు నిరోధం – అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్. మంచిని పెంపొందించడం, చెడును నిర్మూలించడం.

…وَأْمُرْ بِالْمَعْرُوفِ وَانْهَ عَنِ الْمُنكَرِ…
(…వ ముర్ బిల్ మ’రూఫి వన్ హ అనిల్ మున్కరి…)

“…మంచిని ఆదేశించు, చెడును వారించు…” (31:17)

అంటే సమాజ బాధ్యత అని అర్థం దీనికి. సమాజ బాధ్యత ప్రతి ముస్లింకి ఉంది. అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ వలన ఏం జరుగుతుంది? సమాజంలో న్యాయం జరుగుతుంది, సమాజంలో శాంతి ఉంటుంది, సమాజంలో సమానత్వం ఉంటుంది.

ఇస్లాం ధర్మంలో వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యత, సమాజం పట్ల కర్తవ్యం కూడా అత్యంత ముఖ్యమైనది. ముస్లిం కేవలం తన కోసం మాత్రమే కాకుండా సమాజ మేలు కోసం జీవించాలని ఖురాన్ మరియు హదీసులు బోధిస్తాయి.

ఖురాన్ లో సూరయే మాయిదాలో ఉంది: “నీతి, భయభక్తుల విషయాల్లో పరస్పరం సహకరించండి. పాపం, దుర్మార్గంలో సహకరించవద్దండి.” ‘తఆవనూ అలల్ బిర్రి వత్ తఖ్వా, వ లా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్’. మంచి విషయాలలో, పుణ్యానికి సంబంధించిన విషయాలలో, సత్కార్యాలలో ఒకరికొకరు సహాయంగా, తోడుగా ఉండాలి. పాపంతో కూడిన విషయాలలో సహాయం చేయకూడదు. ఈ విధంగా నిజమైన నీతి అనేది తన సంపదను బంధువులకు, అనాధలకు, నిరుపేదలకు ఇవ్వడం. అలాగే సూరయే ఆలి ఇమ్రాన్ లో ఉంటుంది: “మీరు ఉత్తమ సమాజం, మీరు మంచి పనులను ఆజ్ఞాపించి చెడు పనులను నిరోధిస్తారు.” ఈ ఆయతులు సమాజంలో న్యాయం, దయ, సహాయం, ధర్మం స్థాపించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “మీలో ఎవరికైనా తన సోదరుడికి ఇష్టమైనదే తనకూ ఇష్టమైతే అతడు నిజమైన విశ్వాసి.” తన కోసం ఏది ఇష్టపడతాడో, సోదరుని కోసం కూడా అదే ఇష్టపడాలి. అటువంటి వ్యక్తే నిజమైన విశ్వాసి.

ప్రజలకు అత్యంత మేలు చేసేవారే ఉత్తములు. ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరు చెడు చూడగలిగితే దానిని చేతితో ఆపాలి. సాధ్యం కాకపోతే మాటతో ఆపాలి. ఇది కూడా సాధ్యం కాకపోతే హృదయంలో అసహ్యించుకోవాలి. ఇది ఈమాన్ లో అత్యంత బలహీనమైన స్థాయి.”

ముస్లిముల సామాజిక కర్తవ్యాలలో జకాత్, సదఖా ఇవ్వడం, పేదలు, అనాధలు, వితంతువులకు సహాయం చేయడం, నిజాయితీతో వ్యాపారం చేయడం, పొరుగువారిని గౌరవించడం, అన్యాయాన్ని వ్యతిరేకించడం, సమాజంలో శాంతి ఐక్యత పెంపొందించడం. ఇవన్నీ అమర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్ కర్ ద్వారా జరుగుతాయి. ఖురాన్ మరియు హదీసు ప్రకారం ప్రతి ముస్లిం వ్యక్తి సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. సమాజ సేవ కూడా ఒక ఇబాదత్. దయ, న్యాయం, సహకారం, సత్యం – ఇవే ఇస్లాం బోధించే సామాజిక బాధ్యతల మూల సూత్రాలు.

ఇక ఆరవ ఉపదేశం: సబర్, సహనం.

…وَاصْبِرْ عَلَىٰ مَا أَصَابَكَ…
(…వస్ బిర్ అలా మా అసాబక…)

“…మరియు నీపై వచ్చి పడే (కష్టాలను) సహనంతో భరించు…” (31:17)

జీవితం అంటే సమస్యలు, కష్టాలు, బాధలు, రోగాలు, ఇష్టం లేని విషయాలు చాలా వస్తా ఉంటాయి. వాటిలో సహనం వహించాలి. పరీక్షలు ఉంటాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పాపాల మూలంగానో లేకపోతే పరీక్ష నిమిత్తమో పరీక్షిస్తాడు. పరీక్షలు అంటే జీవితంలో భాగమే అవి. సబర్ విజయానికి మార్గం. సహనం ఇస్లాం ధర్మంలో అత్యున్నత గుణాలలో ఒకటి. కష్టకాలంలో స్థిరంగా ఉండటం, పాపాల నుండి దూరంగా ఉండటం, అల్లాహ్ పై నమ్మకంతో ఉండటం ఇవన్నీ సబర్ లోని భాగాలు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు: “ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజ్ ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్నవారితో ఉంటాడు.” ఇంకా సూరయే ఆలి ఇమ్రాన్ లో ఇలా ఉంటుంది: “ఓ విశ్వాసులారా! సహనం పాటించండి, స్థిరంగా ఉండండి.” సూరయే జుమర్ లో ఉంటుంది: “సహనం పాటించే వారి ప్రతిఫలం లెక్క లేనిది.”

ఈ ఆయతులు సబర్ ఉన్న వాడికి అల్లాహ్ ప్రత్యేకత ప్రతిఫలం ఇస్తాడని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా సబర్ గురించి చాలా విషయాలు ఖురాన్ మరియు హదీసులో ఉన్నాయి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు: “నిజమైన సహనం కష్టం మొదటి దెబ్బలోనే కనిపిస్తుంది.” అంటే సహనం యొక్క రకాలు అనేక రకాలుగా ఉంటాయి: ఆజ్ఞాపాలనలో సబర్ (ఇబాదత్ లో సబర్ – నమాజ్, ఉపవాసం వంటి ఇబాదత్ లో స్థిరంగా ఉండటం), పాపాల నుండి దూరంగా ఉండటంలో సబర్, అలాగే కష్టకాలంలో సహనం (అనారోగ్యం, నష్టం, పరీక్షలు వచ్చినప్పుడు అల్లాహ్ పై నమ్మకం కలిగి ఉండటం). ఖురాన్ మరియు హదీసు ప్రకారం సహనం ఒక విశ్వాసి యొక్క బలమైన ఆయుధం. సబర్ ద్వారా మనం అల్లాహ్ కు దగ్గరవుతాము, ఈ లోకంలో శాంతిని పరలోకంలో విజయాన్ని పొందుతాము.

ఇక ఏడవ ఉపదేశం: అహంకారం, దాన్ని విడిచిపెట్టడం.

وَلَا تُصَعِّرْ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمْشِ فِي الْأَرْضِ مَرَحًا…
(వ లా తుసఇ’ర్ ఖద్దక లిన్నాసి వ లా తమ్ షి ఫిల్ అర్జి మరహన్…)

జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు…” (31:18)

ఓ నా కుమారా! అహంకారం – కిబ్ర్ – ఇస్లాం ధర్మంలో తీవ్రంగా నిషేధించబడిన దోషం. మనిషి తనను తాను గొప్పవాడిగా భావించి ఇతరులను తక్కువగా చూడటం ఇది అల్లాహ్ కు ఇష్టం లేని గుణం. వినయం మాత్రమే విశ్వాసి యొక్క లక్షణం. ప్రజల పట్ల నీ చెంపను తిప్పవద్దు, గర్వంగా చూడవద్దు, భూమిపై అహంకారంగా నడవవద్దు. అల్లాహ్ గర్విష్టులను ఇష్టపడడు అని లుఖ్మాన్ అలైహిస్సలాం బోధించిన విషయం ఇది.

ఇంకా వేరే చోట్ల ఉంది ఖురాన్ లో: “నిస్సందేహంగా అల్లాహ్ అహంకారులను ఇష్టపడడు.” ఇంకో చోట ఇలా ఉంది: “భూమిపై అన్యాయంగా అహంకారం ప్రదర్శించే వారిని నా ఆయతుల నుండి తిప్పివేస్తాము.” ఈ ఆయతులు అహంకారం మనిషిని సత్యం నుండి దూరం చేస్తుందని స్పష్టం చేస్తాయి.

మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా దీని గురించి అనేక సందర్భాలలో అనేక విషయాలు చెప్పారు. “ఎవరి హృదయంలో ఆవగింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గంలో ప్రవేశించడు.” సహాబాలు అడిగారు: “ఓ ప్రవక్తా! ఒక మనిషి తన దుస్తులు చెప్పులు అందంగా ఉండాలని కోరుకోవడం కూడా అహంకారమేనా?” దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానం ఇచ్చారు: “అల్లాహ్ సుందరుడు, సౌందర్యాన్ని ఇష్టపడతాడు. అహంకారం అనేది సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడడం.” కావున అహంకారం వల్ల కలిగే నష్టాలలో ఒకటి సత్యాన్ని అంగీకరించకపోవడం, అలాగే ఇతరులను తక్కువగా చూడడం, సమాజంలో విభేదాలు ఏర్పరచడం. ఇవన్నీ అల్లాహ్ కోపానికి గురవడం అవుతుంది. దానికి విరుద్ధంగా కిబ్ర్ కి విరుద్ధంగా వినయం – వినయం ఉన్న వారిని అల్లాహ్ ఉన్నత స్థాయికి చేరుస్తాడు. వినయం విశ్వాసిని ప్రజల హృదయాల్లో ప్రియంగా చేస్తుంది. ఇది ప్రవక్తల లక్షణం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం అహంకారం ఒక ప్రమాదకరమైన పాపం. మనిషి తన సంపద, జ్ఞానం, స్థానం వల్ల గర్వపడకూడదు. అన్నీ అల్లాహ్ అనుగ్రహమే అని గుర్తించి వినయంతో జీవించడం నిజమైన విశ్వాసి లక్షణం.

అలాగే ఎనిమిదవది: మిత భాషణ. మాట్లాడే తీరు, మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజ్.

وَاقْصِدْ فِي مَشْيِكَ وَاغْضُضْ مِن صَوْتِكَ ۚ إِنَّ أَنكَرَ الْأَصْوَاتِ لَصَوْتُ الْحَمِيرِ
(వక్ సిద్ ఫీ మష్ యిక వగ్ జుజ్ మిన్ సౌతిక ఇన్న అన్ కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్)

“నీ నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకీ అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం.” (31:19)

నడకలో మధ్యేమార్గం అవలంబించు. నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు. నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిద స్వరం. మిత భాషణ అంటే మన మాటల్లో నియంత్రణ, దయ, నిజాయితీ మరియు మర్యాదతో మాట్లాడటం. ఖురాన్ మరియు హదీసు ప్రకారం మాటల శక్తి సమాజంలో శాంతి మరియు ఐక్యతకు మూలం. నిజమైన ముస్లిం – మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పిన మాట – నిజమైన ముస్లిం వ్యక్తి తన చేతులతో మరియు తన భాషతో ఇతరులకు హాని చేయడు. ‘అల్ ముస్లిము మన్ సలీమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి’. ఒక ముస్లిం అనేవాడు తన చేతి ద్వారా, తన బిహేవియర్ ద్వారా, మాటల ద్వారా ఇతరులకు హాని కల్పించడు. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తే నిజమైన ముస్లిం అని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలియజేశారు. అలాగే సదా మంచి మాట చెప్పడం కూడా సదఖా. మంచి మాట – అది కూడా సదఖా కిందకు వస్తుందని మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.

ఖురాన్ మరియు హదీసు ప్రకారం మిత భాషణ ఒక మహత్తర మానవ గుణం. మాటల ద్వారా హాని కలిగించకుండా సమాజంలో శాంతి మరియు ఐక్యతను కొనసాగించడం ప్రతి ముస్లిం యొక్క కర్తవ్యం. మంచి మాటలు వాడటం కూడా ఒక ఇబాదత్ మరియు అది మన వ్యక్తిత్వానికి మెరుగుపరుస్తుంది. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా బాగుండాలి.

అభిమాన సోదరులారా! ఈ విధంగా లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి చేసిన ఉపదేశాలు దానికి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవసరం పడుతుంది. క్లుప్తంగా దీని యొక్క సారాంశం లుఖ్మాన్ అలైహిస్సలాం తన కుమారునికి ఇచ్చిన ఉపదేశాలలోని సారాంశం ఐదు పదాలలో చెప్పాలంటే:

  1. తౌహీద్ (అల్లాహ్ పట్ల నమ్మకం, విధేయత, ఆజ్ఞాపాలన)
  2. నమాజ్ (క్రమశిక్షణ)
  3. అఖ్లాక్ (వ్యక్తిత్వం)
  4. సహనం (స్థిరత్వం)
  5. వినయం (గొప్పతనం)

ఇదే జీవన విద్య. అంటే మూడు ముక్కల్లో చెప్పాలంటే:

  • అల్లాహ్ తో సంబంధం
  • కుటుంబంతో సంబంధం
  • సమాజంతో సంబంధం

ఇదే కదా ప్రపంచం, ప్రాపంచిక జీవితం. అంటే పూర్తి జీవితం దీంట్లో ఇమిడిపోయింది. ఈ విధంగా జీవితం గడిపితే ప్రపంచంలో, సమాజంలో, కుటుంబంలో, స్నేహితుల్లో, బంధువుల్లో అన్ని చోట్ల, అన్ని ప్రాంతాల్లో, అన్ని సమయాల్లో శాంతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమానత్వం ఉంటుంది, హాయిగా జీవితం గడుపుతుంది.

అల్లాహ్ తో సంబంధం ఎలా ఉండాలి, కుటుంబంతో సంబంధం ఎలా ఉండాలి, సమాజంతో సంబంధం ఎలా ఉండాలి. ఇదే ఈ ఉపదేశాలకి సారాంశం, ఇదే జీవన విద్య.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఈ విలువలను మన కుటుంబాల్లో ఈ విధంగా అమలు చేసి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. లుఖ్మాన్ అలైహిస్సలాం కు ఇచ్చిన హిక్మత్ తో హిక్మత్ లో మాకు భాగం ఇవ్వు, ప్రసాదించు గాక. మన పిల్లలను సాలిహీన్లుగా చేయు గాక. మన జీవితాలను ఖురాన్ తో అలంకరించు గాక. ఆమీన్ యా రబ్బిల్ ఆలమీన్.

اللَّهُمَّ اغْفِرْ لِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ الأَحْيَاءِ مِنْهُمْ وَالأَمْوَاتِ ، اللَّهُمَّ أَصْلِحْ شَبَابَ الْمُسْلِمِينَ وَارْزُقْنَا التَّوْحِيدَ الْخَالِصَ ، وَأَعِنَّا عَلَى إِقَامَةِ الصَّلاةِ وَاجْعَلْنَا مِنَ الصَّابِرِينَ الْمُتَوَاضِعِينَ ، آمِين يَا رَبَّ الْعَالَمِينَ.

వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=46052

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు
https://www.youtube.com/watch?v=pcIMF4mR90E [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.

అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్‌కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్‌లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్‌ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్‌ని రాసిపెట్టాడు.

మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:

  1. నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
  2. రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్‌కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
  3. మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).

إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ
(ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ)
పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.

గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.

మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:

وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ
(వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్)
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.

ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్‌గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:

فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ
(ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్)
ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.

ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.

కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్‌పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41278

తఖ్దీర్ (విధి వ్రాత):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2011/03/23/prohibitions-in-sharia-telugu-islam/

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).