సహాబాల విధానం & దాని అవసరం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహాబాల విధానం & దాని అవసరం
https://youtu.be/nsxJhTZ1QP8 [45 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త సహాబాల విధానం (మన్హజ్) మరియు దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. సహాబీ అనే పదానికి అర్థం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఈమాన్ స్థితిలో కలుసుకుని, అదే స్థితిలో మరణించిన వారని నిర్వచించారు. సహాబాలు ముస్లిం సమాజంలో అత్యంత శ్రేష్ఠులని, వారి విశ్వాసం (ఈమాన్) మరియు అఖీదా ఖురాన్ ద్వారా ధృవీకరించబడిందని నొక్కి చెప్పారు. మన విశ్వాసం మరియు ఆచరణా విధానం సహాబాల వలె ఉండాలని, ఖురాన్ మరియు హదీసులను వారు అర్థం చేసుకున్న విధంగానే మనం అర్థం చేసుకోవాలని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. సహాబాల మార్గాన్ని విడిచిపెట్టడం నరకానికి దారితీస్తుందని హెచ్చరించారు. సహాబాల విధానాన్ని అనుసరించడమే నిజమైన సన్మార్గమని, వారి ఇత్తిబా (అనుసరణ) యొక్క ప్రాముఖ్యతను ఉదాహరణలతో వివరించారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ
(వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్)
శుభపరిణామం దైవభీతిపరులకే ప్రాప్తిస్తుంది.

وَلَا عُدْوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيْنَ
(వలా ఉద్వాన ఇల్లా అలజ్జాలిమీన్)
అన్యాయం చేస్తోన్నవారిపైన మాత్రమే ప్రతిఘటన/పోరాటం అనుమతించబడింది

وَالصَّلٰوةُ وَالسَّلَامُ عَلٰى سَيِّدِ الْاَنْۢبِيَآءِ وَالْمُرْسَلِيْنَ
(వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్)
ప్రవక్తల నాయకునిపై మరియు దైవప్రవక్తలపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

وَمَنْ تَبِعَهُمْ بِاِحْسَانٍ اِلٰى يَوْمِ الدِّيْنِ اَمَّا بَعْدُ
(వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బఅద్)
మరియు ప్రళయదినం వరకు వారిని ఉత్తమ రీతిలో అనుసరించేవారిపై కూడా (శాంతి మరియు శుభాలు వర్షించుగాక). ఆ తర్వాత…

رَبِّ اشْرَحْ لِيْ صَدْرِيْ وَيَسِّرْ لِيْٓ اَمْرِيْ وَاحْلُلْ عُقْدَةً مِّنْ لِّسَانِيْ يَفْقَهُوْا قَوْلِيْ
(రబ్బిష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్ రీ వహ్ లుల్ ఉఖ్దతమ్ మిల్ లిసానీ యఫ్ఖహూ ఖవ్ లీ)
“ఓ నా ప్రభూ! నా హృదయాన్ని విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను అర్థం చేసుకోగలగాలి.” (20:25-28)

మన్హజుస్ సహాబా. సహాబా ఈ పదం సహాబీ పదానికి బహువచనం. ఉర్దూలో సహాబీ ఏకవచనం, సహాబా అనేది బహువచనం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచరులు. ఈమాన్ స్థితిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకొని, ఈమాన్ స్థితిలోనే మరణించిన వారంతా సహాబా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు అనబడతారు. ఇది సహాబా లేదా సహాబీ అనే పదానికి అర్థం.

వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్ఠులు. ఇస్లాం వైపు ముందంజ వేసినవారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచర్య భాగ్యం పొందినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి జిహాద్ చేసినవారు. షరీఅత్ బాధ్యతలను మోయటమే గాక దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులు. ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం వాజిబ్. తప్పనిసరి. అంటే సహాబాల గురించి ఇలా అఖీదా, విశ్వాసం మనం కలిగి ఉండాలి.

సహాబాల విధానం కంటే ముందు, ముందుమాటగా నేను రెండు మూడు విషయాలు, ఈ సహాబాల యొక్క ఔన్నత్యం గురించి చెప్పదలిచాను. సహాబాల గురించి ఖురాన్‌లో అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలలో చాలా నొక్కి చెప్పడం జరిగింది. వారు ఎవరు, వారి విశ్వాసం ఏమిటి, వారి గొప్పతనం ఏమిటి అనేది. ఉదాహరణకు సూరా తౌబాలో ఆయత్ నెంబర్ 100.

وَالسّٰبِقُوْنَ الْاَوَّلُوْنَ مِنَ الْمُهٰجِرِيْنَ وَالْاَنْصَارِ وَالَّذِيْنَ اتَّبَعُوْهُمْ بِاِحْسَانٍ ۙ رَّضِيَ اللّٰهُ عَنْهُمْ وَرَضُوْا عَنْهُ وَاَعَدَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِيْ تَحْتَهَا الْاَنْهٰرُ خٰلِدِيْنَ فِيْهَآ اَبَدًا ۭذٰلِكَ الْفَوْزُ الْعَظِيْمُ

ముహాజిర్లలో, అన్సార్లలో ప్రప్రథమంగా ముందంజ వేసిన వారితోనూ, తర్వాత చిత్తశుద్ధితో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసన్నుడయ్యాడు. వారు అల్లాహ్ పట్ల ప్రసన్నులయ్యారు. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం అంటే ఇదే.” (9:100)

ఈ ఆయతులో మూడు వర్గాల గురించి చెప్పడం జరిగింది. ముహాజిర్లు ఒక వర్గం, అన్సార్లు ఒక వర్గం. అంటే సహాబాలలో ఇది రెండు వర్గాలు. ముహాజిర్లు, అన్సార్లు. మూడవది, వారి తర్వాత వారిని చిత్తశుద్ధితో అనుసరించేవారు. వారెవరు? కొంతమంది పండితులు తాబయీన్లు అయి ఉండవచ్చు అని చెప్పారు. కాకపోతే ప్రళయం వరకు వచ్చే విశ్వాసులందరూ దీనిలో వస్తారు. చిత్తశుద్ధితో వారిని అనుసరించేవారు. ఎవరిని? సహాబాలను. ముహాజిర్లను, సహాబాలను చిత్తశుద్ధితో అనుసరించేవారు కూడా ఈ కోవకి వస్తారు. ఇది సహాబాల యొక్క గొప్పతనం.

విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి?
https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్.

ఆత్మీయ సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం.

విశ్వాసులతో స్నేహం అంటే, మువహ్హిదీన్‌లను అనగా ఏక దైవారాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తౌబా, ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు.

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)

ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا
(అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా)
ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)

అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.

مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وَتَرَاحُمِهِمْ وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى

(మసలుల్ ముఅమినీన ఫీ తవాద్దిహిమ్ వ తరాహుమిహిమ్ వ త’ఆతుఫిహిమ్ మసలుల్ జసద్, ఇజష్ తకా మిన్హు ఉద్వున్ తదాఆ లహూ సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా)

పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)

ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43226


అధర్మమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అధర్మమైన సమ్మతమైన వసీలా
https://youtu.be/mh_RqyUcea4 [13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّيْنِ، أَمَّا بَعْدُ.

(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)

సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.

ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.

అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:

مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟
(మన్ త’అబుద్? కైఫ త’అబుద్?)
ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?

ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.

అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.

అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.

ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.

కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.

దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.

అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.

అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:

“ఇదా సఅల్తుముల్లాహ ఫస్ అలూహు బిజాహీ, ఫ ఇన్న జాహీ ఇందల్లాహి అజీమ్”.

ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.

అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.

అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా)
పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)

ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.

సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.

అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.

ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43148

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/


లంచగొండితనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

లంచగొండితనం
https://youtu.be/Oyxybndq8kM [23 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో లంచగొండితనం అనే ఘోరమైన పాపం గురించి వివరించబడింది. లంచం అంటే అన్యాయంగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి లేదా అక్రమమైన కోరికను నెరవేర్చుకోవడానికి అధికారికి ఏదైనా ఇవ్వడం అని ప్రవక్త నిర్వచించారు. ఇస్లాంకు ముందు కూడా ఈ అవినీతి యూదులలో ఉండేదని, వారు ప్రాపంచిక ప్రయోజనాల కోసం తమ గ్రంథాలను మార్చారని ఆయన వివరించారు. లంచాన్ని ఇస్లాం తీవ్రంగా నిషేధించిందని, సూరా అల్-బఖరా మరియు సూరా అల్-మాఇదాలోని వచనాలను ఉటంకిస్తూ, లంచం ఇచ్చేవారిని మరియు తీసుకునేవారిని ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించారని ఒక హదీసును ఉదహరించారు. ఒక వ్యక్తి యొక్క నిజమైన సంపద అతను తిన్నది, ధరించినది లేదా పరలోకం కోసం దానధర్మాలు చేసినది మాత్రమేనని, మిగిలినది వారసుల కోసం విడిచిపెట్టబడుతుందని ప్రవక్త స్పష్టం చేశారు. లంచం వంటి అక్రమ సంపాదన తినడం వల్ల ప్రార్థనలు (దుఆ) అంగీకరించబడవని మరియు అది దైవిక శిక్షకు దారి తీస్తుందని హెచ్చరించారు.

نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ
(నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు)
మేము ఆయననే స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్నే అర్థిస్తున్నాము మరియు ఆయన క్షమాపణనే వేడుకుంటున్నాము.

وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا
(వ న’ఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అ’అమాయలినా)
మా ఆత్మల కీడు నుండి మరియు మా చెడు కార్యాల నుండి మేము అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
(మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు)
అల్లాహ్ మార్గనిర్దేశం చేసిన వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరు, మరియు ఆయన తప్పుదారి పట్టించిన వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
(వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు)
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
(వ అష్హదు అన్న ముహమ్మదన్ ‘అబ్దుహు వ రసూలుహు)
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
(యా అయ్యుహల్లదీన ఆమను త్తఖుల్లాహ హఖ్ఖ తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్)
“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడవలసిన విధంగా భయపడండి. మరియు ముస్లింలుగా తప్ప మరణించకండి.” (3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا

“మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడు. దాని నుండే దాని జతను కూడా సృష్టించాడు. మరి వారిద్దరి నుండి ఎంతోమంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేశాడు. మీరు ఎవరి పేరుతో ఒకరినొకరు కోరుకుంటారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటానికి భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్‌ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.” (4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا

“ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మరియు సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. ఆయన మీ కార్యాలను చక్కబరుస్తాడు. మరియు మీ పాపాలను క్షమిస్తాడు. ఇక అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపినవాడు గొప్ప విజయాన్ని సాధించినట్లే.” (33:70-71)

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم وَشَرَّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلالَةٌ وَكُلَّ ضَلالَةٍ فِي النَّارِ

ఇక ఆ తర్వాత, నిశ్చయంగా, మాటలలోకెల్లా ఉత్తమమైనది అల్లాహ్ గ్రంథం (ఖుర్‌ఆన్), మరియు మార్గాలలోకెల్లా ఉత్తమమైనది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం. కార్యాలలోకెల్లా చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. ప్రతి కొత్తగా కల్పించబడినది బిద్అత్ (ధర్మంలో నూతన ఆచారం). ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా! లంచగొండితనం అనే అంశంపై ఈరోజు మనం ఇస్లాం ధర్మం ఏమి చెబుతుంది అని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

లంచం లేదా లంచగొండితనం అంటే అధర్మమైన ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా పనిని న్యాయ విరుద్ధమైన తన కోరికను నెరవేర్చుకోవడానికి ఎవరైనా అధికారికి లేక తత్సంబంధితమైన వ్యక్తికి ఎంతో కొంత ఇచ్చి ఆ పనిని చేయించుకోవటం లంచం. దీనిని కొందరు లాంఛనం అని, మరికొందరు దక్షిణం అని, ఇంకొందరు బహుమతి అని, గిఫ్ట్ అని అంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా ఉద్దేశం మాత్రం దురుద్దేశమే కాబట్టి, పద్ధతి మాత్రం అక్రమ పద్ధతి కాబట్టి ఇది నూటికి నూరు శాతం లంచమే అవుతుంది.

ఖురాన్ అవతరణ పూర్వం, అలాగే మదీనాలోని యూదులలో కూడా ఈ గుణం ఉండేది. లంచగొండితనం అనేది ఉండేది. తౌరాతు గ్రంథంలో జరిగిన ప్రక్షిప్తాల (మార్పుల) వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఒకటి ఈ లంచమే. అరేబియాలో యూదుల వ్యాజ్యాలపై వారి మతాధిపతులు, తెగల సర్దారులు తీర్పులు చేసేవారు. వారి స్వార్థ బుద్ధి కారణంగా న్యాయ సమత్వం లేకుండా పోయింది. అయిన వారికి ఆకులో, కాని వారికి కంచంలో అన్నట్లు యూద విద్వాంసులు ఆశ్రిత పక్షపాతం వహించేవారు. ఈ వ్యవహారంలో వారు తౌరాతు గ్రంథంలో ఉన్న ధర్మాదేశాలను కూడా కట్టిపుచ్చేవారు.

ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ సూరా బఖరా ఆయత్ 174లో ఇలా సెలవిచ్చాడు:

إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

“అల్లాహ్‌ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాలను దాచేవారు, వాటిని కొద్దిపాటి ధరకు అమ్ముకునేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లాహ్‌ వారితో అస్సలు మాట్లాడడు. వారిని పరిశుద్ధపరచడు. పైపెచ్చు వారికి బాధాకరమైన శిక్ష కలదు.” (2:174)

అంటే, అల్లాహ్ తన గ్రంథంలో అవతరింపజేసిన విషయాన్ని ఆ యూదులు, ఆ యూదుల ధర్మ పండితులు దాచిపెట్టేవారు. దానిని కొద్దిపాటి మూల్యానికి అమ్ముకునేవారు. తమ పొట్టలను అగ్నితో నింపుకునేవారు. ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారితో మాట్లాడటం గానీ, వారిని పరిశుద్ధ పరచటం గానీ చేయడు. వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. అంటే యూదులు లంచం తీసుకుని వారి గ్రంథాలలో ఉన్న విషయాలను దాచి పెట్టేవారని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. ఇంకా అల్లాహ్ సూరా మాఇదాలో ఇలా అన్నాడు:

وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ

వారిలో చాలామందిని నీవు చూస్తావు, వారు పాపకార్యాల వైపుకు, దౌర్జన్యం వైపుకు, అధర్మమయిన సొమ్మును స్వాహా చేయటం వైపుకు ఎగబడుతూ ఉంటారు. వారు చేసే ఈ చేష్టలన్నీ పరమ చెడ్డవి. (5:62)

అంటే లంచం తీసుకుని వారు న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం పట్టించుకునేవారు కాదు.

లంచగొండితనం ఇస్లాంలో చాలా స్పష్టంగా నిషేధించబడినది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా బఖరా ఆయత్ 188లో ఇలా సెలవిచ్చాడు:

وَلَا تَأْكُلُوا أَمْوَالَكُم بَيْنَكُم بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِّنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنتُمْ تَعْلَمُونَ

ఒకరి సొమ్మును ఇంకొకరు అన్యాయంగా స్వాహా చేయకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైన రీతిలో ఇతరుల ఆస్తిలో కొంతభాగం కాజేయటం కోసం అధికారులకు ముడుపులు చెల్లించకండి. అది (న్యాయం కాదన్న సంగతి) మీకూ తెలిసినదే. (2:188)

అంటే ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, మీరు ఒకరి సొమ్మును ఇంకొకరు అధర్మంగా తినకండి. ఇతరుల సొమ్ములోని కొంత భాగం అక్రమంగా స్వాహా చేసేందుకు ఆ వ్యవహారాన్ని అధికారుల వద్దకు తీసుకుపోకండి. అది అన్యాయం అన్న సంగతి స్వయంగా మీకు తెలుసు. అంటే లంచం ఇచ్చి, అధికారులకు లంచం ఇచ్చి అన్యాయంగా సొమ్ము కాజేయకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయత్లో హెచ్చరించాడు.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لَعَنَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم الرَّاشِيَ وَالْمُرْتَشِيَ
(ల’అన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్రాషి వల్ ముర్తషి)
“లంచం పుచ్చుకునేవానిని మరియు లంచం ఇచ్చేవానిని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.”

లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు వారిద్దరినీ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ల’అనత్ చేశారు, వారి పైన శపించారు. అంటే, ఏ విషయం పైన అల్లాహ్ శాపం ఉంటుందో, దేని పైన ప్రవక్త గారి శాపం ఉంటుందో, అది ఘోరమైన పాపం అని అర్థం. దానికి తప్పనిసరిగా శిక్ష ఉంటుందని అర్థం. అంటే ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం లంచం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లంచం పుచ్చుకునే వానిని, లంచం ఇచ్చే వానిని శపించారు. ఎందుకంటే వారు అన్యాయంగా, అనైతికంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతరుల సంపదను నిషిద్ధమైన పద్ధతిలో సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక లంచం ద్వారా వచ్చే ఆ డబ్బు, లంచం ద్వారా వచ్చే ఆ ధనం, లంచం ద్వారా వచ్చే ఆ పదవి, ఆ వస్తువు ఏదైనా సరే అది అధర్మం, హరాం అని స్పష్టమవుతుంది.

అభిమాన సోదరులారా! ప్రతి చిన్న బాధ్యుడు, చిన్న పోస్ట్, పియాన్ నుంచి, ఫర్రాష్ నుంచి పెద్ద స్థాయి వరకు లంచం అనేది సర్వసామాన్యం అయిపోయింది సమాజంలో. అసలు లంచం ఇచ్చేవారు దానికి తప్పుగా అని కూడా భావించడం లేదు. ఇంత సర్వసామాన్యం అయిపోయింది. ఇది ఒక అమానత్. అల్లాహ్ మనకి ఇచ్చింది ప్రతీది అమానత్. అది మన శరీర అవయవాలు కావచ్చు, అతను తన ఇంట్లో యజమాని అయితే, తన అధీనంలో ఉన్న భార్యాపిల్లలు కావచ్చు. అల్లాహ్ ఏదైతే మనకి ఇచ్చాడో అది అమానత్, అప్పగింత. దానిని మనం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారంగానే మనము జీవించాలి ప్రతి విషయంలో. వ్యవహారం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, క్రయవిక్రయాలు కావచ్చు, లావాదేవీలు కావచ్చు, ఏదైనా సరే. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సూరా నిసా ఆయత్ 58 లో:

إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا الْأَمَانَاتِ إِلَىٰ أَهْلِهَا
(ఇన్నల్లాహ య’మురుకుమ్ అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా)
ఎవరి అమానతులను వారికి అప్పగించండి… ” అని అల్లాహ్‌ మిమ్మల్ని గట్టిగా ఆదేశిస్తున్నాడు (4:58)

ఈ ఆయత్లో అమానత్, విశ్వసనీయత ఇవి రెండు రకాలు.

ఒకటి, ఒకరు ఇంకొకరి వద్ద భద్రపరచమని పెట్టిన సొమ్ము. అది ఏదైనా కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, కరెన్సీ రూపంలో కావచ్చు, వెండి, బంగారం రూపంలో కావచ్చు, భూమి కాగితాలు కావచ్చు, తినే వస్తువు ఏదైనా సరే భద్రపరచమని పెట్టిన సొమ్ము. ఆ సొమ్ము ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఎవరి సొమ్ముని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఇది ఒక అమానత్.

రెండవ రకపు అమానతు పదవులకు సంబంధించినది. ఒకటి, అర్హత కలిగిన వారికే బాధ్యత అప్పగించాలి. రెండవది, బాధ్యత తీసుకున్న వారు తమ బాధ్యతను, తన డ్యూటీని న్యాయంగా, ధర్మంగా, షరియత్ పరంగా, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాల పరంగా అతను బాధ్యత వహించాలి. ఇది అమానత్. లంచం తీసుకుంటున్నాడు అంటే తన బాధ్యతలో లోపం జరుగుతుంది. అంటే డబ్బు తీసుకుని, సొమ్ము తీసుకుని అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా అతను తన బాధ్యత వహిస్తున్నాడు. సొమ్ము కాజేస్తున్నాడు. దీనినే లంచం అంటారు. అది ఒక పైసా కావచ్చు, కోట్లు కావచ్చు. ఒక్క పైసా హరాంతో కూడిన మన కడుపులోకి పోతే, దానివల్ల మన శరీరం ఎదుగుతుంది కదా, మాంసము, ఎముకలు, రక్తము ఇవన్నీ హరాంతో అవుతుంది. అటువంటి శరీరం స్వర్గంలో ప్రవేశించదని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు ఉన్నాయి.

అభిమాన సోదరులారా! అసలు మనిషి అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదిస్తాడు. కానీ ఆ డబ్బు వలన ఈ లోకములో అతనికి మనశ్శాంతి ఉండదు. పరలోకంలో శిక్ష ఉంటుంది. ఈ విషయం మరిచిపోతున్నాడు.

ఈ ధనం గురించి మన ప్రవక్తగారు ఏం చెప్పారో ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిదిలో ఈ హదీస్ ఉంది.

عَنْ كَعْبِ بْنِ عِيَاضٍ، قَالَ سَمِعْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَقُولُ
(అన్ కా’బ్ ఇబ్ని ‘ఇయాదిన్, ఖాల సమీ’తు అన్నబియ్య సల్లల్లాహు అలైహి వసల్లమ యఖూలు)
కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం: నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పగా విన్నాను:

إِنَّ لِكُلِّ أُمَّةٍ فِتْنَةً وَفِتْنَةُ أُمَّتِي الْمَالُ
(ఇన్న లికుల్లి ఉమ్మతిన్ ఫితనతున్, వ ఫితనతు ఉమ్మతీ అల్-మాల్)
“నిశ్చయంగా, ప్రతీ ఉమ్మత్ (సముదాయం) కొరకు ఒక ఫితనా (పరీక్ష) ఉంది. మరియు నా ఉమ్మత్ యొక్క ఫితనా ధనం.” (జామి అత్-తిర్మిది)

కాబ్ బిన్ ఇయాజ్ రదియల్లాహు అన్హు కథనం, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతుండగా నేను విన్నానని అంటున్నారు. ప్రవక్తగారు ఏం చెప్పారు? ప్రతి ఉమ్మత్ కి ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంటుంది. అలాగే నా అనుచర సమాజానికి పరీక్ష సంపద, డబ్బు, మాల్ అన్నారు. ఎందుకంటే రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ధనం గురించి ప్రశ్నిస్తాడు, లెక్క ఉంది. న్యాయంగా సంపాదించావా, అన్యాయంగా సంపాదించావా? లంచంతో సంపాదిస్తే అది అన్యాయం, అధర్మం, నిషిద్ధం, పాపం, నేరం అది. ఒక హదీస్లో ఇలా ఉంది:

అబూ బర్జా అల్-అస్లమీ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ عُمْرِهِ فِيمَا أَفْنَاهُ وَعَنْ عِلْمِهِ فِيمَا فَعَلَ وَعَنْ مَالِهِ مِنْ أَيْنَ اكْتَسَبَهُ وَفِيمَا أَنْفَقَهُ وَعَنْ جِسْمِهِ فِيمَا أَبْلاَهُ

“ప్రళయ దినాన ఒక దాసుడు నాలుగు విషయాల గురించి ప్రశ్నించబడే వరకు తన పాదాలను కదల్చలేడు: తన జీవితాన్ని దేనిలో గడిపాడని, తన జ్ఞానంతో ఏమి ఆచరించాడని, తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించి ఎక్కడ ఖర్చు పెట్టాడని, మరియు తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడని.” (జామి అత్-తిర్మిది)

దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لَا تَزُولُ قَدَمَا عَبْدٍ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُسْأَلَ عَنْ أَرْبَعٍ
(లా తజూలు ఖదమా అబ్దిన్ యౌమల్ ఖియామతి హత్తా యుస్అల అన్ అర్బ’ఇన్)
రేపు ప్రళయ దినాన నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అల్లాహ్ దాసుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు.

ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. ఎప్పుడు? నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినంత వరకు. ఆ నాలుగు ప్రశ్నలు ఏమిటి?

  1. మొదటి విషయం, తన జీవితం, తన వయసు ఎలా గడిచింది. ధర్మంలోనా, అధర్మంలోనా? ధర్మపరంగా, అధర్మపరంగా? అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయతలోనా, అవిధేయతలోనా?
  2. రెండవ ప్రశ్న, వ’అన్ ‘ఇల్మిహి ఫీమా ఫ’అల్ (తన జ్ఞానం విషయంలో ఏమి ఆచరించాడు). జ్ఞానం గురించి. అతనికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ప్రవక్త గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి ఎంత వరకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంలో అతను ఎంతవరకు ఆచరించాడు.
  3. మూడవది, వ’అన్ మాలిహి మిన్ ఐన ఇక్తసబహు వ ఫీమా అన్ఫఖహు (తన ధనాన్ని ఎక్కడి నుండి సంపాదించాడు మరియు దేనిలో ఖర్చు పెట్టాడు). ధనం గురించి, సొమ్ము గురించి, ఆస్తి గురించి, డబ్బు గురించి ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు పెట్టావు. ఎలా వచ్చింది, అది కూడా, ఎలా పోయింది అది కూడా, రెండు కూడా. కొందరు కష్టంగా సంపాదిస్తారు, ధర్మ సమ్మతంగా సంపాదిస్తారు, న్యాయంగా సంపాదిస్తారు. కష్టార్జితమే, కానీ ఖర్చు పెట్టేది అధర్మం అవుతుంది. కావున ఈ ఎలా సంపాదించావు, న్యాయంగా, అన్యాయంగా, ధర్మంగా, అధర్మంగా, అలాగే ఎలా ఖర్చు పెట్టావు.
  4. నాలుగవది, వ’అన్ జిస్మిహి ఫీమా అబ్లాహ్ (తన శరీరాన్ని దేనిలో ఉపయోగించాడు). శరీరం గురించి. చేతులు, కాళ్లు, కళ్లు, హృదయం, కడుపు, పాదాలు, ఇవన్నీ, చెవులు వారికి ఎలా పోషించావు. నీ శరీరం ఎలా పెరిగింది? హరాం సొమ్ముతోనా, హలాల్ సొమ్ముతోనా? ఏ విధంగా ఖర్చు పెట్టావు? చెవులతో ఖురాన్ విన్నావా, న్యాయం విన్నావా, ఇంకేమైనా బూతులు, చెడు విషయాలు? ఇవన్నీ అల్లాహ్ అడుగుతాడు.

అందుకే ఒక విషయం, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, అరఫా మైదానం. చాలాసార్లు విన్నాం మనం ఈ హదీస్. అరఫా మైదానం, ఇప్పుడు కూడా ఇన్ని సౌకర్యాలు ఉండి కూడా హజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండి, ఏసీ బస్సులు, విమానంలో ఏసీ, ఎయిర్ పోర్టులో ఏసీ, గుడారాలు, ఇంటి నుంచి తవాఫ్ వరకు, మినాకి, ముజ్దలిఫాకి అన్నిచోట్ల ప్రయాణ సౌకర్యాలు, సవారీలు అయినప్పటికీ చాలా ఇబ్బందులు పడతారు మనుషులు. కానీ ప్రవక్త గారి కాలంలో ఉన్నవారు ఒంటెల పైన, లేనివారు కాలి నడక పోయి హజ్ చేసేవారు. అటువంటి ఒక వ్యక్తి అరఫా మైదానంలో దుస్తులు సరిగా లేవు, తల వెంట్రుకలు గాలితో, దుమ్ముతో నిండిపోయినాయి. ఒకరకంగా ఉంది. ఆ వ్యక్తి అరఫా మైదానంలో చేతులు ఎత్తి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కార్చి దుఆ చేస్తున్నాడు. ఆ వ్యక్తి గురించి ప్రవక్త గారు ఏమన్నారంటే, అతని దుఆ స్వీకరించబడదు అన్నారు. ఒక వ్యక్తి ఎన్నో వందల, వేల మైళ్ల దూరంతో ప్రయాణం చేసి హజ్ కోసం ప్రయాణం చేస్తే అరఫా మైదానంలో హదీస్ లో ఏముంది, అరఫా మైదానంలో చేయబడిన దుఆ రద్దు చేయబడదు అని ఉంది కదా. అల్-హజ్జు అరఫా అన్నారు ప్రవక్తగారు కదా. అయినా అరఫా మైదానంలో దుఆ చేస్తే ఆ దుఆ క్యాన్సిల్. ప్రవక్తగారు అన్నారు, ఎందుకు? దానికి వివరం ప్రవక్తగారు చెప్పారు. ఆ వ్యక్తి తినే సొమ్ము హరాం, తొడిగే దుస్తులు హరాం, తాగేది హరాం. అతని దుఆ ఎలా అల్లాహ్ స్వీకరిస్తాడు? అంటే ఇది చెప్పటం నా ఉద్దేశం ఏమిటంటే, లంచం హరాం. లంచం తీసుకునే వ్యక్తి యొక్క దుఆ ఎలా స్వీకరించబడుతుంది? దుఆ స్వీకరించబడదు. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు, పరలోకంలో కఠినమైన శిక్ష ఉంటుంది అని మనం తెలుసుకోవాలి.

అసలు ప్రవక్త గారు ఒక విషయం చెప్పారు. మనిషి సంపాదించే సంపాదనలో ఆ వ్యక్తి యొక్క వాటా ఎంత? వేరే వాళ్ళ వాటా కాదు. ఒక వ్యక్తి సంపాదిస్తాడు, తన వారసుల వాటా కాదు. ఒక వ్యక్తి చనిపోతే భార్యకు వాటా ఎంత, పిల్లలకి వాటా ఎంత, అమ్మానాన్నకి వాటా ఎంత దీని గురించి కాదు. ఒక వ్యక్తి కష్టార్జితం, కష్టంతో సంపాదిస్తున్నాడు. ఆ సంపదలో అతని వాటా ఎంత? ఇది ప్రాపంచిక యొక్క యదార్థం ఇది. తెలుసుకుందాం.

అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, దాసుడు నా ధనము, నా ధనము అంటూ ఉంటాడు. ఎల్లప్పుడూ నా దాసుడు నా ధనము, నా సంపాదన, నా ధనము, నా విల్లా, నా బంగ్లా, నా సేవింగ్ అకౌంట్, నాది, నాది అంటాడు కదా. వాస్తవానికి సంపాదనలో, సంపాదించే వ్యక్తిలో మూడు భాగాలే ఉంటాయి. నాలుగో భాగం ఉండదు. మొదటి భాగం, మా అకల ఫ అఫ్నా (తిన్నాడు మరియు దానిని జీర్ణం చేసుకున్నాడు). తిన్నాడు, ఆ తర్వాత అది అరిగిపోయింది. అతను వాడాడు. తిన్నాడు, ఆ తిండి వలన తన శరీరంలో రక్తం వచ్చింది, మాంసం వచ్చింది, ఇది వచ్చింది. తిన్నాడు. ఆ తిన్నదే అతని వాటా. రెండవది, అవ్ లబిస ఫ అబ్లా (ధరించాడు మరియు దానిని పాతదిగా చేశాడు). తొడిగాడు, చించేసాడు. కొన్నాడు, బట్టలు కొన్నాడు, దుస్తులు కొన్నాడు, తొడుక్కున్నాడు, యూస్ చేశాడు. ఇది అతని వాటా. మూడవది, అవ్ అ’తా ఫఖ్తనా (ఇచ్చాడు మరియు దానిని పరలోకం కోసం దాచుకున్నాడు). అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాడు. ఈ మూడే అతనికి వాటా. ఈ మూడింటిలో రెండు వాటాలు అతను అనుభవిస్తాడు, ప్రపంచంలోనే అయిపోతాయి. మూడో వాటా శాశ్వతంగా అతనికి మిగిలిపోతుంది. ఇవి కాక అతని ధనంలో, అతని సొమ్ములో, అతని ఆస్తిలో, అతని సంపదలో ఏదైనా మిగిలినా అది అతనిది కాదు. ఎందుకంటే అదంతా అతను విడిచిపెట్టి చనిపోతాడు. వేరేవాళ్లు అక్రమంగా తీసుకోవచ్చు, అధర్మంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోకపోయినా, తన సంతానము, బంధువులు అది తీసేసుకుంటారు. చివరికి ఒక ఉంగరమో, ఏదైనా రాకపోయినా కట్ చేసి తీసేసుకుంటారు కానీ వదలరు. మనిషి యొక్క సంపాదనలో ఇవి మూడే వాటాలు. ఇది మనం గ్రహించాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ హలాల్ సంపదను సంపాదించే కృషిని, సద్బుద్ధిని ప్రసాదించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43047

తయమ్ముమ్ పద్దతి – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో, టెక్స్ట్]

తయమ్ముమ్ పద్దతి
https://youtu.be/Cc_1VB72Sak [9 నిముషాలు]
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ ఆచారమైన ‘తయమ్ముమ్’ (పొడి శుద్ధీకరణ) గురించి వివరించబడింది. ఇందులో తయమ్ముమ్ యొక్క అక్షరార్థం మరియు షరియత్ ప్రకారం దాని అర్థం, సూరహ్ అన్-నిసా మరియు సూరహ్ అల్-మాయిదా నుండి ఖురాన్ ఆధారాలు, నీరు అందుబాటులో లేనప్పుడు లేదా అనారోగ్యం వంటి నిర్దిష్ట పరిస్థితులలో తయమ్ముమ్ ఎప్పుడు అనుమతించబడుతుంది, ఏ పదార్థాలను (స్వచ్ఛమైన మట్టి మరియు దాని రకాలు) ఉపయోగించవచ్చు, దానిని ఆచరించే సరైన పద్ధతి మరియు దానిని చెల్లకుండా చేసే చర్యలు వివరించబడ్డాయి.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బిఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం తయమ్ముమ్ గురించి తెలుసుకోబోతున్నాం.

తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. శాబ్దిక అర్థం.

షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే, ప్రయాణంలో ఉన్నప్పుడు గానీ, ప్రయాణికుడు స్థానికంగా గానీ, వుజూ ఘుసుల్ లో మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని, చేతులను స్పర్శించుకోవడాన్ని కోవటం అని అర్థం.

ఈ తయమ్ముమ్ గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో సూర నిసా అలాగే సూర మాయిదాలో కూడా సెలవిచ్చాడు. తయమ్ముమ్ గురించి. సూర నిసాలో ఆయత్ ఇలా ఉంటుంది.

وَإِن كُنتُم مَّرْضَىٰ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَاءَ أَحَدٌ مِّنكُم مِّنَ الْغَائِطِ أَوْ لَامَسْتُمُ النِّسَاءَ فَلَمْ تَجِدُوا مَاءً فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا فَامْسَحُوا بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ

(వ ఇన్ కున్ తుమ్ మర్దా అవ్ అలా సఫరిన్ అవ్ జాఅ అహదుమ్ మిన్ కుమ్ మినల్ గాఇతి అవ్ లామస్ తుమున్ నిసాఅ ఫలమ్ తజిదూ మాఅన్ ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబన్ ఫమ్ సహూ బివుజూహికుమ్ వ అయ్దీకుమ్)

ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు. (సూర నిసా 4:43)

మీరు ఎప్పుడైనా అస్వస్థులై అయి ఉంటే, అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే అంటే సంభోగం చేసి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో, కాలకృత్యాలు తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత వుజూ తప్పనిసరి. సంభోగం తర్వాత ఘుసుల్ తప్పనిసరి. నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీరు మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయత్లో తెలియజేశాడు. అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ ఆయతులో ఘుసుల్ మరియు వుజూకి బదులు నీరు లేనప్పుడు తయమ్ముమ్ అనే అవకాశాన్ని, భాగ్యాన్ని, అనుమతిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనలకి ప్రసాదించాడు.

ఇక తయమ్ముమ్ ఏ సందర్భాలలో అనుమతి ఉంది? వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్. కాకపోతే దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలలోనే అనుమతి ఉంది.

ఒకటి, నీరు లేనప్పుడు. నమాజ్ కోసం తప్పనిసరిగా వుజూ చేయాలి, నీరు లేదు. తప్పనిసరిగా ఘుసుల్ చేయాలి, నీరు లేదు.

రెండవది, నీరు ఉన్నా త్రాగటానికి సరిపోతుంది. ఎంత నీరు ఉందంటే, తాగితే వుజూకి లేదు, వుజూ చేస్తే తాగటానికి లేదు. అలాంటప్పుడు. నీరు ఉన్నా తాగడానికి సరిపోయినప్పుడు.

మూడవది, నీటి ఉపయోగం మనిషికి హానికరం. అనారోగ్యం మూలంగా, ఏదో ఒక గాయం మూలంగా ఏదైనా సరే. నీటి ఉపయోగం మనిషికి హానికరం. అటువంటి సందర్భంలో.

నాలుగవది, ఒకవేళ నీరు మంచుగా, మంచులాగా చల్లగా ఉంది. వేడి చేసే అవకాశం కూడా లేదు. అటువంటి సందర్భంలో.

అలాగే ఐదవది, నీరు ఉన్నప్పటికీ నీటికి మనిషికి మధ్య ప్రాణ శత్రువు, అడవి మృగం, మరేదైనా ప్రాణాపాయం కలిగించే వస్తువు మధ్యలో ఉంది. అటువంటి సమయంలో తయమ్ముమ్ చేయవచ్చు.

ఈ ఐదు కారణాలు సందర్భాలలో వుజూ మరియు ఘుసుల్ కి బదులు తయమ్ముమ్ ఉంది.

ఏ వస్తువులతో తయమ్ముమ్ చేయాలి? పరిశుభ్రమైన మట్టితో గానీ లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో తయమ్ముమ్ చేయాలి. ఉదాహరణకు ఇసుక, ఎండిపోయిన బూడిద, రాయి, కంకరరాళ్ళు మొదలగునవి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయత్ లో చెప్పిన పదం ఏమిటి?

فَتَيَمَّمُوا صَعِيدًا طَيِّبًا
(ఫతయమ్మమూ సయీదన్ తయ్యిబా)

పరిశుభ్రమైన మట్టితో అన్నాడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా. అంటే సయీద్ అంటే ఏమిటి? సయీద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి కావచ్చు, మట్టి లాంటి ఇతర వస్తువులు కూడా అవ్వచ్చు.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పఠించాలి. ఆ తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. ఆ తర్వాత చేతుల్ని ఒక్కసారి ఊదాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత చేతుల్ని మణికట్టు వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చెయ్యి పైన, కుడి చేతితో ఎడమ చెయ్యి పైన.

చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన. ఆ తర్వాత చివర్లో వుజూ చేసిన తర్వాత పఠించే దుఆ తయమ్ముమ్ తర్వాత కూడా పఠించాలి.

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ. اللَّهُمَّ اجْعَلْنِي مِنَ التَّوَّابِينَ، وَاجْعَلْنِي مِنَ الْمُتَطَهِّرِينَ

(అష్ హదు అల్ లాఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ జ’అల్నీ మినత్ తవ్వాబీన వ జ’అల్నీ మినల్ ముతతహ్ హిరీన్.)

ఇది తయమ్ముమ్ చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, సులభంగా ఉంటుంది.

పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో, సంకల్పంతో బిస్మిల్లా అని పలకాలి. రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి చేయి పైన, కుడి చేత్తో ఎడమ చేయి పైన స్పర్శించుకోవాలి. ఆ తర్వాత వుజూ తర్వాత ఏ దుఆ పఠిస్తామో ఆ దుఆ పఠించాలి.

తయమ్ముమ్ దేని వల్ల భంగమైపోతుంది? ఏ కారణాల వల్ల తయమ్ముమ్ భంగమవుతుంది? తయమ్ముమ్ ని భంగపరిచే విషయాలు.

మొదటిది, ఏ కారణాల వల్ల వుజూ భంగం అవుతుందో అదే కారణాల వల్ల తయమ్ముమ్ కూడా భంగం అవుతుంది.

రెండవది, నీరు లభించినా లేదా నీరు ఉపయోగించే స్థితి ఏర్పడినా తయమ్ముమ్ భంగమైపోతుంది.

అభిమాన సోదరులారా! ఇది తయమ్ముమ్ గురించి కొన్ని విషయాలు. తయమ్ముమ్ అంటే శాబ్దిక అర్థం ఏమిటి, షరియత్ పరంగా తయమ్ముమ్ అంటే అర్థం ఏమిటి, ఏ సందర్భాలలో తయమ్ముమ్ చేయాలి, అలాగే ఏ వస్తువుతో తయమ్ముమ్ చేయాలి, తయమ్ముమ్ చేసే పద్ధతి ఏమిటి, తయమ్ముమ్ ని భంగం పరిచే విషయాలు ఇది మనం తెలుసుకున్నాం.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ కి సంబంధించిన జ్ఞానాన్ని ప్రసాదించు గాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ప్రతి విషయంలో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని అనుసరిస్తూ ఆయన సున్నత్ ని ధనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహ్.

ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

తౌహీద్ (ఏక దైవారాధన) రక్షణ కవచం – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

జుమా ఖుత్బా: తౌహీద్ రక్షణ కవచం
https://youtu.be/ywb7-3fUjCo [17 నిముషాలు]
ఖతీబ్ (అరబీ): షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ . జుల్ఫీ, సఊది అరేబియ

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క ప్రాముఖ్యతను మరియు షిర్క్ (బహుదైవారాధన) యొక్క ప్రమాదాలను వివరిస్తుంది. తౌహీద్ అత్యున్నత ఆరాధన అని, షిర్క్ అత్యంత ఘోరమైన పాపమని వక్త నొక్కిచెప్పారు. తాయెత్తులు కట్టుకోవడం వంటి షిర్క్‌కు దారితీసే కార్యాలను నివారించాలని, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ సద్భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తౌహీద్‌ను ఎలా కాపాడారో, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారో హుదైబియా చెట్టు ఉదంతం ద్వారా వివరించారు. మనల్ని మరియు మన కుటుంబాలను తౌహీద్‌పై స్థిరంగా ఉంచమని అల్లాహ్‌ను ప్రార్థించాలని, ఇస్లాం మరియు సున్నత్ అనే అనుగ్రహాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

أَلْحَمْدُ لِلَّهِ الْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا
(అల్ హమ్దు’లిల్లాహిల్ ముతవహ్హిది బిల్ జలాలి బికమాలిల్ జమాలి త’అజీమన్ వ తక్బీరా)

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا
(అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ తఖ్దీరన్ వ తద్బీరా)

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
(వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ లియకూన లిల్ ఆలమీన నజీరా)

صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ
(సల్లల్లాహు వ సల్లమ అలైహి తస్లీమన్ కసీరా, అమ్మా బ’అద్)

الْحَمْدُ لِلهِ اَلْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا هُوَ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ؛ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا، صَلَّى اَللهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ:

నేను మీకూ, అలాగే నాకు కూడా అల్లాహ్‌ (సుబహనహు వ త’ఆలా) భయభీతిని కలిగి ఉండాలని బోధిస్తున్నాను. అల్లాహ్‌కు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీద్‌ను (అల్లాహ్‌ ఏకత్వాన్ని) స్థాపించడం, షిర్క్‌ను (ఆయనకు భాగస్వాములను కల్పించడాన్ని) నివారించడం. తౌహీద్‌ అన్ని ఆరాధనలలోకెల్లా గొప్పది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు. షిర్క్‌ అన్ని పాపాలలోకెల్లా అత్యంత అసహ్యకరమైనది,  చెడ్డది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ నుండి అత్యంత దూరంలో ఉంటారు.

అవును, తౌహీద్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇది దాసులపై అల్లాహ్‌కు ఉన్న హక్కు. వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి. కలహాలు, సంక్షోభాలు, రోగాలు వారిని ఆవరించాయి. వారిలో కొందరు తాయెత్తులు, కడియాల మాయలో పడి ఉన్నారు, వాటిని తమకు, తమ పిల్లలకు, తమ వాహనాలకు, తమ ఇళ్లకు కట్టుకుంటారు. అవి కీడును దూరం చేస్తాయని, కంటిదిష్టిని తొలగిస్తాయని, మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు. కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా?

(مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ)
“ఎవరైతే తాయెత్తు కట్టుకుంటారో, వారు షిర్క్‌ చేసినట్లే.” (ముస్నద్ అహ్మద్ 17422. దీని సనద్ బలమైనది).

అల్లాహ్‌ ను కాకుండా వేరొకరిని ఆశ్రయించినా, వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం! విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు, కానీ అతను (షిర్క్ చేసే వాడు) కలుషితమైన దానిని త్రాగాడు. విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు, కానీ అతను పదిమంది ప్రభువులను ఆరాధించాడు:

(ءأَرْبَابٌ مُّتَّفَرّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ)
అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి!)” (యూసుఫ్ 12:39).

ఇక మృతులను పూజించేవాడు ఎక్కడ, ఎన్నటికీ మరణించని జీవించియున్న అల్లాహ్ ని పూజించేవాడు ఎక్కడ?

(هَلْ يَسْتَوِيَانِ مَثَلاً الْحَمْدُ للَّهِ بَلْ أَكْثَرُهُمْ لاَ يَعْلَمُونَ)
మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.” (నహ్ల్ 16:75).

అయినప్పటికీ, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి. అంటే తౌహీద్ ను ప్రేమించడం, ప్రోత్సహించడం, దానిని స్థాపించడం. షిర్క్ ను అసహ్యించుకోవడం, షిర్క్ ను వారించడం. ఇది ప్రాథమిక విషయం. వీటిని మనం మన భార్యా, పిల్లలు, మన బంధువులు, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో నాటాలి. వారిలో అల్లాహ్ పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి. ఆయన గొప్ప ఆజ్ఞ తౌహీద్. ఆయన గొప్ప నిషేధం షిర్క్. అల్లాహ్ జల్ల వ’ఉలా తన ప్రవక్తకు తౌహీద్‌ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు:

{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اَللَّهُ}
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ” (ముహమ్మద్ 47:19).

ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అల్లాహ్ ఇచ్చినప్పుడు, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ.. కాబట్టి, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ. అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం: “మేము తౌహీద్‌ను అర్థం చేసుకున్నాము, అయితే దానిని మన పాఠశాలల్లో, మసీదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి?” అంటారు కదా కొందరు ఇలా. ఇలా అనడం తప్పు విషయం. అల్లాహ్ నేర్చుకోమని ఏ విషయం అయితే చెబుతున్నాడో, దానిని ఇలా విస్మరించడమా?

ఓ విశ్వాసులారా: తౌహీద్‌ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన.

{الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ}
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించేవారు, వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి.” (ఫత్ హ్ 48:6).

ఎంత మంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని, సత్యం బలహీనపడడాన్ని చూసినప్పుడు, అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని, సత్యం క్షీణిస్తుందని భావిస్తారు? ఇది అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఊహ. ఇది ఆయన స్వభావానికి, గుణాలకు తగనిది.

ఎంత మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు, అల్లాహ్‌ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు? ఇది నిస్సందేహంగా తౌహీద్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మీ పరిస్థితిని మీరే చూసుకోండి, మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు, దాన్ని ఎంత ఖండిస్తారు? మీరు ప్రతి లోపానికి అర్హులు, అలాంటిది మీ ప్రభువు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి, దురాలోచన కలిగి ఉంటారు, ఆయన పరిపూర్ణ గుణాలన్నింటికీ అర్హుడు?

ఇమామ్ అల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్‌ రహిమహుల్లాహ్ రచించిన ‘కితాబుత్-తౌహీద్‌’లో ఒక అధ్యాయం ఉంది, దాని శీర్షిక:

حِمَايَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِمَى التَّوْحِيدِ وَسَدِّهِ طُرُقَ الشِّرْكِ
(హిమాయతున్-నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ హిమత్-తౌహీద్ వ సద్దిహీ తురుఖష్-షిర్క్)
తౌహీద్‌ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా రక్షించారు, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారు.”

ఇందులో, ఆ ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) షిర్క్ కు దారి తీసే మార్గాలను మూసివేశారు, స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ, తౌహీద్ ను రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా.

తౌహీద్‌ను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము: హజ్రత్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హుదైబియాలోని చెట్టు కింద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బైఅత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్పారు: “బైఅత్ జరిగిన తర్వాత సంవత్సరం మేము ఆ చెట్టు దగ్గరి నుండి దాటిపోయాము, కాని మేము దానిని మరచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము.” (బుఖారీ 4162, 4163, ముస్లిం 1859).

ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ చెప్పారు, “దాని అదృశ్యం, అంటే అది కనబడకుండా ఉండడం, అల్లాహు త’ఆలా దయలో ఓ భాగం. అది కనిపించి ఉన్నట్లయితే, అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది”. (షర్హ్ ముస్లిం).

తరువాత హజ్రత్ ఉమర్‌ రజియల్లాహు అన్హు కాలంలో, ప్రజలు దాని పట్ల మరొకసారి ఫిత్నాలో పడ్డారు. అప్పుడు ఆయన దానిని నరికివేయమని ఆజ్ఞాపించారు, షిర్క్‌కు దారితీసే మార్గాన్ని మూసివేయడానికి; ఎందుకంటే వారు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు. అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన భయపడ్డారు. (ఫత్హుల్ బారీ 7/448 ثُمَّ وَجَدْتُ عِنْد بن سَعْدٍ بِإِسْنَادٍ صَحِيحٍ عَنْ نَافِعٍ أَنَّ عُمَرَ بَلَغَهُ أَنَّ قَوْمًا يَأْتُونَ الشَّجَرَةَ فَيُصَلُّونَ عِنْدَهَا فَتَوَعَّدَهُمْ ثُمَّ أَمْرَ بِقَطْعِهَا فَقُطِعَتْ).

ఓ అల్లాహ్‌, మమ్మల్ని తౌహీద్‌పై జీవింపజేయి, తౌహీద్‌పై మరణింపజేయి, ప్రళయదినాన మమ్మల్ని తౌహీద్ పై లేపు. అస్తగ్ఫిరుల్లాహ లీ వ’లకుమ్ ఫ’స్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్’రహీం.

الْحَمْدُ لِلهِ الَّذِيْ هَدَانَا لِنِعْمَةِ الْإِسْلَامِ وَالتَّوْحِيدِ وَالسُّنَّةِ الْبَيْضَاءِ، وَالصَلَاَةُ وَالسَلَاَمُ عَلَى إمَامِ الْحُنَفَاءِ، أَمَّا بَعْدُ:
అల్ హమ్దు’లిల్లాహిల్లజీ హదానా లిని’అమతిల్ ఇస్లామి వత్-తౌహీది వస్-సున్నతిల్ బైదా, వస్-సలాతు వస్-సలాము అలా ఇమామిల్ హునఫా, అమ్మా బ’అద్.

ఇస్లాం, తౌహీద్‌, స్పష్టమైన సున్నత్ అనే గొప్ప అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్‌కు స్తోత్రములు. తౌహీద్ పై స్థిరంగా ఉండి, అటూ ఇటూ తొంగని, వంగనివారి నాయకులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి, శుభాలు వర్షించుగాక. ఆమీన్. అమ్మాబాద్!

ఓ షిర్క్‌ను, దానిని పాటించేవారిని వదలి, తౌహీద్‌ను పాటించేవాడా, ఓ బిద్అత్‌ను, దానిని పాటించేవారిని వదలి సున్నత్‌ను పాటించేవాడా: నీవు తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌ మరియు సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా, దాని విలువను గ్రహిస్తున్నావా?

మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా (సౌదీయాలో జరిగిన ఖుత్బా, అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది), ఏంటి అది? అల్లాహ్ దయ వల్ల మనం మస్జిదులు, శ్మశాన వాటికలలోకి, ఖబ్రిస్తాన్ లలోకి ప్రవేశించినప్పుడు, షిర్క్ లేదా బిద్అత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము. విగ్రహాలను పూజించకుండా, సాలిహీన్‌లను, సమాధి చేయబడిన వారిని, ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లాహ్‌ గొప్ప దయను నీవు గుర్తుకు తెచ్చుకున్నావా?

నీ మూడవ తండ్రి ఇబ్రహీం (అలైహిస్సలాం) చేసిన దుఆ నీవు చేస్తూ ఉన్నావా?
(మూడవ తండ్రి ఎందుకు అన్నారండీ? మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కాదా? ధర్మమంతా ప్రేమగా నేర్పారు కదా).

{وَاجْنُبْنِي وَبَنِيَّ أَنْ نَعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِنَ النَّاسِ}
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు, నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి” (ఇబ్రాహీం 14:35-36).

ఇబ్నుల్-ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను – ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు – నేను ఆయనను దాని గురించి అడిగాను, ఆయన అన్నారు: అల్లాహ్ నాకు సున్నత్ ప్రసాదించాడు, దాని జ్ఞానం ప్రసాదించాడు. మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో, ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో, వాటి నుండి విముక్తిని కలిగించాడు. ఇలా కలిగించిన ఆ అల్లాహ్ ను నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను. అది నన్ను సంతోష పెట్టింది, చివరికి నన్ను ఏడ్పించింది”. (మదారిజుస్సాలికీన్ 3/127).

فاللهم لَكَ الحَمْدُ عَلَى نِعْمَةِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ، بِبِلَادِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ.
(అల్లాహుమ్మ లకల్ హమ్దు అలా ని’అమతిత్ తౌహీది వస్-సున్నతి ఫీ బిలాదిత్ తౌహీది వస్-సున్న)
ఓ అల్లాహ్‌, తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌, సున్నత్ అనే గొప్ప అనుగ్రహానికి నీకే ప్రశంసలు, స్తోత్రములు.

اللَّهُمَّ ثَبِّتْنَا عَلَى ذَلِكَ إِلَى يَوْمِ نَلْقَاكَ
(అల్లాహుమ్మ సబ్బిత్నా అలా జాలిక ఇలా యౌమి నల్ఖాక)
ఓ అల్లాహ్! మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు.

وَعُمَّ بِالتَّوْحِيدِ وَالسُّنَّةِ أَوْطَانَ الْمُسْلِمِينَ
(వ’ఉమ్మ బిత్-తౌహీది వస్-సున్నతి అవ్తానల్ ముస్లిమీన్)
ముస్లింల దేశాలను తౌహీద్, సున్నత్ తో నింపు.

اللهم كَمَا هَدَيْتَنا لِلإِسْلاَمِ فلاَ تَنْزِعْهُ مِنّا حَتَّى تَتَوَفَّانا وَنحن مُسْلِمونَ.
(అల్లాహుమ్మ కమా హదైతనా లిల్ ఇస్లామి ఫలా తన్జి’అహు మిన్నా హత్తా తతవఫ్ఫానా వ నహ్ను ముస్లిమూన్)
ఓ అల్లాహ్‌, నీవు మమ్మల్ని ఇస్లాంపై నడిపించినట్లే, మేము ముస్లింలుగా మరణించే వరకు దానిని మమ్మల్నుండి దూరం చేయకు.

اللهم اجْعَلْنَا مِمَّنْ يَلْقَاكَ لَا يُشْرِكُ بِكَ شَيْئَاً.
(అల్లాహుమ్మ జ’అల్నా మిమ్మన్ యల్ఖాక లా యుష్రికు బిక షైఆ)
ఓ అల్లాహ్‌, నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ اجْعَلْنَا أغَنْى خَلْقِكَ بكَ، وأفْقَرَ خَلْقِكَ إليْكَ.
(అల్లాహుమ్మ జ’అల్నా అగ్నా ఖల్ఖిక బిక వ అఫ్ఖర ఖల్ఖిక ఇలైక)
ఓ అల్లాహ్‌, నీ తప్ప నీ సృష్టిలో ఎవరి అవసరం లేకుండా చేయి, మరియు నీ సృష్టిలోకెల్లా నీ సన్నిధిలో అత్యంత పేదవారిగా ఉంచు.

اللَّهُمَّ إِنّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ.
(అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకన్-నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్)
ఓ అల్లాహ్‌, ఎన్నటికీ మారకుండా, తొలగిపోకుండా ఉండే శాశ్వతమైన అనుగ్రహాలు మేము నిన్ను అడుగుతున్నాము.

اللهم وفِّقْ إِمَامَنَا خَادِمَ الحَرَمَينِ الشَّرِيْفَيْنِ، وَوَلِيَّ عَهْدِهِ لِمَا فِيْهِ عِزُّ الإِسْلامِ وَصَلاحُ المُسْلِمِيْنَ. وَارْحَمْ وَالِدَهُمُ الإِمَامَ المُؤَسِّسَ، وَالإِمَامَ المُجَدِّدَ.
(అల్లాహుమ్మ వఫ్ఫిఖ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్-షరీఫైని వ వలియ్య అహదిహీ లిమా ఫీహి ఇజ్జుల్ ఇస్లామి వ సలాహుల్ ముస్లిమీన్, వర్’హమ్ వాలిదహుమల్ ఇమామల్ ముఅస్సిస వల్ ఇమామల్ ముజద్దిద్)
ఓ అల్లాహ్! మా నాయకుడు (అంటే రాజు), రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి, ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి. వారి తండ్రి, వ్యవస్థాపక ఇమామ్ (మలిక్ అబ్దుల్ అజీజ్) మరియు పునరుద్ధరణ చేసిన ఇమామ్ (ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్) రహిమహుముల్లాహ్ పై నీవు దయ చూపు.

اللهم احْفَظْ أَمْنَنَا وَإيْمَانَنَا وَجُنُودَنَا وَحُدُوْدَنَا، وَمُقَدَّسَاتِنَا وَقُدْسَنَا.
(అల్లాహుమ్మ హ్ఫజ్ అమ్ననా వ ఈమాననా వ జునూదనా వ హుదూదనా వ ముఖద్దసాతినా వ ఖుద్సనా)
ఓ అల్లాహ్‌, మా భద్రతను, మా విశ్వాసాన్ని, మా సైనికులను, మా సరిహద్దులను, మా పవిత్ర స్థలాలను, మా బైతుల్ మఖ్దిస్ ను రక్షించు, కాపాడు.

اللهم يَا ذَا النِّعَمِ الَّتِيْ لا تُحْصَى عَدَدًا: نَسْأَلُكَ أَنْ تُصَلِّيَ وَتُسَلِّمَ عَلَى مُحَمَّدٍ أَبَدَاً.
(అల్లాహుమ్మ యా జన్ని’అమిల్లతీ లా తుహ్సా అదదా, నస్అలుక అన్ తుసల్లియ వ తుసల్లిమ అలా ముహమ్మదిన్ అబదా)
ఓ అల్లాహ్‌, లెక్క లేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా: ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎల్లప్పుడూ శాంతిని, శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42249

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో | టెక్స్ట్]

ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం ఏది లేదు
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/ta7KklHK6V0 [19 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాం అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత మరియు శ్రేష్ఠత గురించి 10 ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఇస్లాం అల్లాహ్ చేత ఎన్నుకోబడిన మరియు ఇష్టపడిన సహజ సిద్ధమైన ధర్మం. ఇది స్వచ్ఛమైన తౌహీద్ (ఏకదైవారాధన) ను బోధిస్తుంది మరియు జ్ఞానం, న్యాయం, సమానత్వం, సులభత్వం, మరియు ఓర్పు వంటి గుణాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ధర్మంలో ఎలాంటి బలవంతం లేదని స్పష్టం చేస్తుంది మరియు ఇది నైతిక విలువలతో కూడిన ఉత్తమమైన సమాజాన్ని (ఉమ్మతే వసత్) నిర్మిస్తుంది. ఈ అనుగ్రహాలన్నీ ఇస్లాంను ఇతర అనుగ్రహాల కంటే ఉన్నతమైనదిగా నిరూపిస్తాయని వక్త పేర్కొన్నారు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్షైతా నిర్రజీమ్)
శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బ’అద్. అభిమాన సోదరులారా! మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ రోజు మనం, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అన్న అంశంపై ముఖ్యమైన 10 విషయాలు తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనపై ఎన్నో అసంఖ్యాకమైన వరాలను ప్రసాదించాడు. ఆ వరాలలో, ఆ అనుగ్రహాలలో అన్నిటికంటే శ్రేష్ఠమైనది, దానికి మించినది లేనిది అది ఇస్లాం ధర్మం. దీని గురించి అనేక విషయాలు ఉన్నాయి, కాకపోతే ఈ రోజు మనం 10 విషయాలు తెలుసుకుందాం.

మొదటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కొరకు అనుగ్రహించిన ధర్మం, ఇష్టపడిన ధర్మం అన్నమాట. ఈ విషయం అల్లాహ్ సూర ఆలి ఇమ్రాన్ లో ఇలా తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
(ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం)
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. (3:19)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వమయ్ యబతగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలయ్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్)
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా ఆయత్ మూడులో ఇలా సెలవిచ్చాడు:

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రజీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను(5:3)

ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత స్పష్టంగా ఇస్లాం మీ కొరకు ధర్మంగా ఎన్నుకున్నాను, మీ కొరకు దీనిని పరిపూర్ణం చేశాను, దీనిని ,అంటే ఇస్లాంని అల్లాహ్ ఏమన్నాడు? నా అనుగ్రహం అంటున్నాడు. ‘ని’మతీ’, నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. ఇది మొదటి విషయం. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దాసుల కోసం అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం ఇస్లాం ధర్మం.

ఇక రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన ధర్మం. సహజ సిద్ధమైన, స్వాభావిక ధర్మం. ఇది ప్రత్యేకత ఇది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర రూమ్, ఆయత్ 30లో ఇలా సెలవిచ్చాడు:

فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنِيفًا ۚ فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا ۚ لَا تَبْدِيلَ لِخَلْقِ اللَّهِ ۚ ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
కనుక నీవు ఏకాగ్రతతో నీ ముఖాన్ని (అల్లాహ్‌) ధర్మంపై నిలుపు. అల్లాహ్‌ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైన్నే (ఉండండి). అల్లాహ్‌ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం. కాని చాలామంది తెలుసుకోరు. (30:30)

ఈ ఆయత్ లో ‘ఫితర‘ అని ఉంది. ఫితరతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా’. ‘ఫితరత్‘ అంటే సహజత్వం లేక నైజం అన్నమాట. వేరే మాటలలో చెప్పాలంటే, అల్లాహ్ మానవుణ్ణి సహజ ధర్మంపై, అంటే దేవుని ఏకత్వంపై, తౌహీద్ స్వభావంపై పుట్టించాడు. కాబట్టి మానవ నైజములోనే ఏకత్వం, తౌహీద్, ఏక దైవ ఆరాధన అంతర్లీనమై ఉంది అన్నమాట. అందుకే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. బుఖారీలో హదీస్ ఉంది:

كُلُّ مَوْلُودٍ يُولَدُ عَلَى الْفِطْرَةِ، فَأَبَوَاهُ يُهَوِّدَانِهِ أَوْ يُنَصِّرَانِهِ أَوْ يُمَجِّسَانِهِ
(కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫితర, ఫ అబవాహు యుహవ్విదానిహి అవ్ యునస్సిరానిహి అవ్ యుమజ్జిసానిహి)
ప్రతి బిడ్డ సహజత్వం (ఇస్లాం) తోనే పుడతాడు. అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీ (అగ్ని ఆరాధకుడు) గానో చేసేస్తారు.

అంటే ప్రతి బిడ్డ సహజత్వంతోనే పుడతాడు, నైజంతోనే పుడతాడు, సహజత్వంతోనే పుడతాడు, అంటే మువహ్హిద్ గానే పుడతాడు, తౌహీద్ లోనే పుడతాడు. కాకపోతే పెరిగిన కొద్దీ ఆ బిడ్డ యొక్క అమ్మానాన్న అతనికి యూదునిగానో, క్రైస్తవునిగానో, మజూసీగానో చేసేస్తారు అన్నమాట. అంటే రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం అన్నమాట.

ఇక మూడవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం. ఖురాన్ లోని సూర ఇఖ్లాస్:

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ ‎﴿١﴾‏ اللَّهُ الصَّمَدُ ‎﴿٢﴾‏ لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ ‎﴿٣﴾‏ وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ ‎﴿٤﴾
(ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్సమద్, లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహూ కుఫువన్ అహద్)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం!) వారికి ఇలా చెప్పు: అల్లాహ్ (నిజమైన ఆరాధ్యుడు)ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. (ఏ అక్కరా లేనివాడు). ఆయన (ఎవరినీ) కనలేదు. ఆయన (కూడా) ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు (పోల్చదగిన వాడు) ఎవడూ లేడు.

అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో మూల సూత్రాలు, సృష్టికర్త అంటే ఎవరు, మూల సూత్రాలు తెలియజేశాడు. అల్లాహ్ ఒకే ఒక్కడు, ఎటువంటి అక్కరా, ఎటువంటి అవసరం లేనివాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. తినటం, త్రాగటం, నిద్రించటం, కునుకు, నిద్ర, అవసరం, సహాయం తీసుకోవటం, ఇలాంటి ప్రపంచములో ప్రతి జీవి, ప్రతి వ్యక్తికి ఇది అవసరం ఉంటుంది. ఎటువంటి అవసరం అక్కర లేకుండా ఏ జీవి ఉండలేదు, జీవించలేదు. కావున సకల లోకాలకు సృష్టికర్త అటువంటి వాడు కాదు. అవసరం లేని వాడు అల్లాహ్, అక్కర లేనివాడు అల్లాహ్. అలాగే ఆయనకి అమ్మానాన్న లేరు, సంతానమూ లేదు. ఆయనకి సమానము ఎవరూ లేరు. ఇంకా మనము ఖురాన్ పరిశీలిస్తే, అల్లాహ్ పుట్టినవాడు కాదు, అల్లాహ్ కి చావు, మరణం రాదు అన్నమాట. ఇది మూడవ విషయం.

ఇక నాలుగవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ ‎﴿١﴾‏ خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ ‎﴿٢﴾‏ اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ‎﴿٣﴾‏ الَّذِي عَلَّمَ بِالْقَلَمِ ‎﴿٤﴾‏ عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ‎﴿٥﴾
(ఓ ప్రవక్తా!) సృష్టించిన నీ ప్రభువు పేరుతో చదువు. ఆయన మనిషిని నెత్తుటి ముద్దతో సృష్టించాడు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. ఆయన కలం ద్వారా జ్ఞాన బోధ చేశాడు. ఆయన మనిషిని అతడు ఎరుగని, తెలియని దానిని నేర్పించాడు.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మొట్టమొదటి సారి వచ్చిన దివ్యవాణి ఇది. అంటే మొదటి దైవవాణి జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, విద్య గురించి వచ్చిందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర ముజాదలలో ఇలా సెలవిచ్చాడు:

يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ
(యర్ఫ ఇల్లాహుల్లజీన ఆమనూ మిన్కుమ్ వల్ లజీన ఊతుల్ ఇల్మ దరజాత్)
మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. (58:11)

మీలో విశ్వసించిన వారిది మొదటి విషయం, రెండవది జ్ఞానం ప్రసాదించబడిన వారి అంతస్తులను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెంచుతాడు. అంటే మూడవ విషయం ఏమిటంటే, జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞత గల ధర్మం ఇస్లాం ధర్మం. ఇది నాలుగో విషయం.

ఐదవ విషయం ఏమిటంటే, మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం. ఇస్లాం ధర్మం మానవుల మధ్య, జనుల మధ్య, దైవదాసుల మధ్య, సృష్టి మధ్య సమానత్వం కలిగిన ధర్మం, ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَإِذَا حَكَمْتُم بَيْنَ النَّاسِ أَن تَحْكُمُوا بِالْعَدْلِ
(వ ఇజా హకమ్తుమ్ బైనన్నాసి అన్ తహ్కుమూ బిల్ అద్ల్)
ప్రజల మధ్య తీర్పులు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండి. (4:58)

إِنَّ اللَّهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ
(ఇన్నల్లాహ య’మురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాయి జిల్ ఖుర్బా)
అల్లాహ్‌ న్యాయం చేయమనీ, ఉపకారం (ఇహ్‌సాన్‌) చేయమనీ, బంధువుల హక్కులను నెరవేర్చమనీ ఆజ్ఞాపిస్తున్నాడు.  (16:90)

అంటే ఐదవ విషయం ఏమిటి? మానవుల మధ్య, సృష్టి మధ్య, దైవదాసుల మధ్య పూర్తిగా న్యాయం చేసే ధర్మం ఇస్లాం ధర్మం.

అలాగే ఆరవ విషయం ఏమిటంటే, సులభమైన ధర్మం ఇస్లాం ధర్మం. అల్లాహ్ అంటున్నాడు సూర హజ్ లో:

وَمَا جَعَلَ عَلَيْكُمْ فِي الدِّينِ مِنْ حَرَجٍ
(వమా జ’అల అలైకుమ్ ఫిద్దీని మిన్ హరజ్)
ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు (22:78)

మానవ మాత్రులు భరించలేనంతటి కష్టతరమైన, క్లిష్టతరమైన బాధ్యతను అల్లాహ్ మనపై మోపలేదు అన్నమాట. అలాగే అల్లాహ్ సూర బఖరా యొక్క చివరలో ఇలా సెలవిచ్చాడు:

لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا
(లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్’అహా)
అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. (2:286)

అంటే ఇది ఆరవ విషయం, సులభమైన ధర్మం. మనిషి మోయలేని భారం అల్లాహ్ వేయలేదు అన్నమాట.

ఇక ఏడవ విషయం ఏమిటంటే, ఓర్పుని, సహనాన్ని బోధించే ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష నిమిత్తం ప్రపంచంలో సమస్యలు ఇస్తాడు, మనిషికి సమస్యలు వస్తాయి. రోగాలు వస్తాయి. ఆరోగ్యంతో పాటు అనారోగ్యము ఉంటుంది, లాభంతో పాటు నష్టమూ ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లాహ్ కొందరికి ఇస్తాడు, కొందరికి ఇవ్వడు. కొందరు ధనవంతులు, కొందరు పేదవారు. ఉన్నవారు, లేనివారు. కానీ ఇదంతా ఎందుకు? పరీక్ష కోసం. కావున సహనాన్ని, ఏ సమయంలో, కష్టంలో, దుఃఖంలో, నష్టంలో, బాధలో సమీప బంధువులు, దగ్గర ఉన్నవారు చనిపోయినప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? వ్యాపారంలో నష్టం జరిగింది, ఉద్యోగం అకస్మాత్తుగా పోయింది, ఇబ్బందుల్లో వచ్చేసాము. కానీ ఇస్లాం ధర్మం సహనం బోధిస్తుంది. ఏ విధంగా? దానికి వివరాలు ఉన్నాయి, నేను వివరం చెప్పటం లేదు. ఖురాన్లో వివరాలు ఉన్నాయి. అల్లాహ్ అంటున్నాడు:

إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(ఇన్నల్లాహ మ’అస్సాబిరీన్)
స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు (8:46)

అల్లాహ్ యొక్క సహాయం కోరండి బాధల్లో, సమస్యల్లో, అనారోగ్యంలో, కష్టంలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకాటాల్లో అల్లాహ్ సహాయం కోరండి. ఏ విధంగా కోరండి? సహనం ద్వారా, నమాజ్ ద్వారా. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అసర్ లో నాలుగు విషయాలు తెలియజేశాడు. ఈ నాలుగు గుణాలు, నాలుగు లక్షణాలు కలిగిన వారు ఇహపర లోకాలలో నష్టపోరు అని. వారిలో ఒకటి ఏమిటి? విశ్వాసం. రెండవది సత్కార్యం. మూడవది హఖ్, సత్యం. నాలుగవది సహనం. కావున ఇస్లాం ధర్మం సహనాన్ని బోధించే ధర్మం.

ఇక ఎనిమిదవ విషయం ఏమిటంటే, ధర్మం విషయంలో బలవంతం చేయదు ఇస్లాం ధర్మం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَد تَّبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ
ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు. సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటమయ్యింది (2:256)

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు:

وَقُلِ الْحَقُّ مِن رَّبِّكُمْ ۖ فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ ۚ إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا
ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.(18:29)

అంటే సత్యం మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది, కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్ని సిద్ధం చేసి ఉంచాము. అంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సత్యం ఏది, అసత్యం ఏది స్పష్టంగా తెలియజేశాడు. బలవంతం చేయడు. ఎటువంటి బలవంతమూ లేదు. మీకు నచ్చితే, మీకు ఇష్టం ఉంటే మీరు స్వీకరించండి, లేకపోతే వదలండి. బలవంతం అనేది లేదు. కాకపోతే మంచి చేసే వారికి ప్రతిఫలం అలాగే ఉంటుంది, చెడు చేసే వారికి ప్రతిఫలం ఆ విధంగా ఉంటుంది. అభిమాన సోదరులారా! అంటే ఎనిమిదవ విషయం ఏమిటి? ఇస్లాం ధర్మం ధర్మం విషయంలో బలవంతం చేయదు.

తొమ్మిదవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం అంటే ఉమ్మతే ముహమ్మదియా, ఉమ్మతే వసత్. అంటే మెరుగైన, ఉత్తమమైన సమాజం అన్నమాట. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా సెలవిచ్చాడు:

وَكَذَٰلِكَ جَعَلْنَاكُمْ أُمَّةً وَسَطًا لِّتَكُونُوا شُهَدَاءَ عَلَى النَّاسِ وَيَكُونَ الرَّسُولُ عَلَيْكُمْ شَهِيدًا
అదే విధంగా మేము మిమ్మల్ని ఒక “న్యాయశీల సమాజం” (ఉమ్మతె వసత్‌)గా చేశాము – మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.)(2:143)

అభిమాన సోదరులారా! ఈ ఆయత్ లో ‘వసత్’ అనే పదం వచ్చింది. ‘వసత్’ అనే పదానికి అర్థం మధ్యస్థం, కానీ మెరుగైన, ఉత్తమమైన అని అర్థం కూడా వస్తుంది. ఈ భావములోనే ఇక్కడ ప్రయోగించబడింది. ఉత్తమమైనది, మెరుగైనది అన్నమాట ఇస్లాం ధర్మం.

అభిమాన సోదరులారా! ఇక పదవ విషయం ఏమిటంటే, నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం. ఈ విషయం గురించి చెప్పుకుంటూ పోతే ఖురాన్ లో, ప్రవక్త గారి ప్రవచనాలలో అసంఖ్యాకమైన వచనాలు, వాక్యాలు ఉన్నాయి. నైతికత అంటే ఏమిటి? దాని విలువ ఏమిటి? నడక, నడవడిక, నీతి, నిజాయితీ, సత్యము, న్యాయము, ధర్మము. ఏ విధంగా అమ్మానాన్నతో ఎలా ఉండాలి? భార్యతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? ఇరుగుపొరుగు వారితో ఎలా ఉండాలి? జంతువులతో ఎలా ఉండాలి? దారి హక్కు ఏమిటి? శారీరక హక్కు ఏమిటి? జననం నుండి మరణం వరకు నియమాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనకు బోధించారు.

ఉదాహరణకు ఒక రెండు మూడు చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ‘అక్సరు మా యుద్ఖిలుల్ జన్నత, తఖ్వల్లాహి వ హుస్నుల్ ఖులుఖ్’. అంటే స్వర్గానికి పోవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఎక్కువ మంది, అత్యధికంగా స్వర్గానికి ఏ కారణం వల్ల పోతున్నారు? దైవభీతి మరియు సద్గుణాలు స్వర్గ ప్రవేశానికి ఎక్కువగా దోహదకారి అవుతుందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక దుఆ నేర్పించారు. ఆ దుఆ ఏమిటి? ‘

اللَّهُمَّ أَنْتَ حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي
అల్లాహుమ్మ అంత హస్సంత ఖల్ఖీ ఫహస్సిన్ ఖులుఖీ’.
ఓ అల్లాహ్! నీవు నా రూపురేఖలను అందంగా మలచినట్లే నా నడవడికను కూడా ఉత్తమంగా మలచు.

ఇంకా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

بُعِثْتُ لِأُتَمِّمَ مَكَارِمَ الْأَخْلَاقِ
‘బు’ఇస్తు లి ఉతమ్మిమ మకారిమల్ అఖ్లాఖ్’.
నేను నడవడికను, మంచి గుణాలను పూర్తి చేయటానికే నేను పంపబడ్డాను.

అంటే ఇది దీని గురించి చాలా వివరంగా ఖురాన్ లో మరియు హదీస్ లో చెప్పడం జరిగింది. ఏ విధంగా మాట్లాడాలి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు,

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ
‘మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్ యకుల్ ఖైరన్ అవ్ లియస్ముత్’.
ఎవరికైతే అల్లాహ్ పట్ల, అంతిమ దినం పట్ల విశ్వాసం ఉందో వారు మాట్లాడితే సత్యమే మాట్లాడాలి లేకపోతే మౌనం వహించాలి.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అభిమాన సోదరులారా! సారాంశం ఏమిటంటే, పదవ విషయం, ఇస్లాం ధర్మం నైతిక విలువలు గల ధర్మం. నేను ముఖ్యంగా 10 విషయాలు చెప్పాను. ఇస్లాం కి, ఇస్లాం అనుగ్రహానికి మించిన అనుగ్రహం లేదు అని అంశం పైన నేను పది అనుగ్రహాలు చెప్పాను.

  1. ఇస్లాం తన దాసుల కోసం అల్లాహ్ అనుగ్రహించిన, ఇష్టపడిన ధర్మం.
  2. ఇది సహజ సిద్ధమైన, స్వాభావిక గల ధర్మం.
  3. స్వచ్ఛమైన తౌహీద్ ధర్మం.
  4. జ్ఞానం, విజ్ఞానం, విద్య, విజ్ఞతల గల ధర్మం.
  5. మానవుల మధ్య న్యాయం, సమానత్వం కలిగిన ధర్మం.
  6. సులభమైన ధర్మం.
  7. సహనాన్ని బోధించే ధర్మం.
  8. ధర్మం విషయంలో ఎటువంటి బలవంతం చేయని ధర్మం.
  9. ఉమ్మతే వసత్ అంటే మెరుగైనది, ఉత్తమమైన సమాజం.
  10. నైతిక విలువలు గల ధర్మం ఇస్లాం ధర్మం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42189

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

మానవుల కర్మల నమోదు | మరణానంతర జీవితం : పార్ట్ 48 | [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మానవుల కర్మల నమోదు  – [మరణానంతర జీవితం – పార్ట్ 48]
https://www.youtube.com/watch?v=MoutOVAU1zA [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.

ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.

إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
(ఇది యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వనిష్షిమాలి క’యీద్)
ఒకడు కుడివైపున, మరొకడు ఎడమవైపున కూర్చొని వ్రాసేవారు వ్రాస్తున్నప్పటి స్థితిని (జ్ఞాపకం చేసుకో). (50:17)

కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.

అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ
(వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్)
నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)

మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.

మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.

మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:

لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا
‘అల్లాహ్‌ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)

ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.

మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.

أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
(అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్)
ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)

ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.

ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.

మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:

وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ
(వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్)
వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)

వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.

అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.

إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ
(ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్)
వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)

అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.

ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.

మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:

ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.

అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.

ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:

(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.

(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.

(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.

ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.

అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.

అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.

ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.

అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41712

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]