ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా?
https://youtu.be/d0gnnL2PGE8 [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ‘అల్లాహ్ తన దాసునికి చాలడా?’ అనే ఖురాన్ వాక్యం యొక్క లోతైన భావాన్ని వివరించబడింది. దాసులలో రెండు రకాలు ఉంటారని, సాధారణ దాసులు (సృష్టి మొత్తం) మరియు ప్రత్యేక దాసులు (అల్లాహ్ కు సంపూర్ణంగా విధేయత చూపి, ఆయన దాస్యాన్ని వాస్తవ రూపంలో నెరవేర్చేవారు) అని బోధించారు. అల్లాహ్ తన ప్రత్యేక దాసులకు అన్ని కష్టాలు, శత్రువుల కుతంత్రాల నుండి తప్పకుండా సరిపోతాడని, వారిని కాపాడుతాడని నొక్కిచెప్పారు. దీనికి ఉదాహరణగా, రాజు హింస నుండి అల్లాహ్ ను వేడుకుని రక్షణ పొందిన నవయువకుని గాథను (సూరతుల్ బురూజ్) వివరించారు. మనం కూడా అల్లాహ్ యొక్క నిజమైన దాసులుగా మారినప్పుడు, ఎలాంటి కష్టంలోనైనా ఆయనపై సంపూర్ణ నమ్మకంతో ధైర్యంగా ఉండాలని, ఎందుకంటే ఆయనే మనకు చాలినవాడని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్. ఇక్కడ దీని యొక్క భావం తన దాసుడు. కానీ ఇందులో మరో గొప్ప భావం దాగి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా, ఖురాన్ వ్యాఖ్యానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏంటి?

ఒక రకంగానైతే ఈ సర్వ సృష్టి కూడా అల్లాహ్ దాస్యంలో ఉంది. మనం మానవులందరమూ కూడా అల్లాహ్ యొక్క దాసులమే.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ
ఖుల్ యా ఇబాది యల్లజీన అస్రఫూ అలా అన్ఫుసిహిమ్
(ఓ ప్రవక్తా!) చెప్పు: “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై హద్దుమీరారో…”

ఇదే సూరతు జ్జుమర్ లో అల్లాహుతాలా, “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారో” అని అన్నాడు. మనమందరం ఈ రకంగా చూస్తే అల్లాహ్ యొక్క దాసులమే. కానీ అల్లాహ్ యొక్క దాసులం అన్న ఈ సర్వసామాన్య భావంలో విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మేవారు, నమ్మనివారు, ఆస్తికులు, నాస్తికులు అందరూ వచ్చేస్తున్నారు. కానీ

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్ – తన దాసుడు అన్న భావంలో మరో మాట ఏదైతే మర్మంగా ఉందో, దాచి ఉందో, దాగి ఉందో అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క సామాన్య దాసునిగా కాకుండా అతని యొక్క ప్రత్యేక దాసుడైపోతాడో, అంటే వాస్తవ రూపంలో అల్లాహ్ యొక్క దాస్యాన్ని మరియు తనకు దాసుడుగా ఉన్న ఈ ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడో అతడికి, అలాంటి వానికి అల్లాహ్ తప్పకుండా సరిపోతాడు. అల్లాహు అక్బర్. తప్పకుండా అల్లాహ్ సరిపోతాడు.

అందుకొరకే ఒక హదీసులో మనకు ఏం తెలుస్తుంది? ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఆ హదీసును తన తఫ్సీర్ లో, ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. ఫుదాలా బిన్ ఉబైద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా ఆయన విన్నారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్:

أَفْلَحَ مَنْ هُدِيَ إِلَى الإِسْلامِ، وَكَانَ عَيْشُهُ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ
అఫ్లహ మన్ హుదియ ఇలల్ ఇస్లాం, వకాన ఐషుహు కఫాఫన్, వ ఖన్న అహుల్లాహు బిమా ఆతాహ్
ఇస్లాం వైపు మార్గనిర్దేశం పొందినవాడు, అతని జీవనం సరిపడినంతగా ఉంది, మరియు అల్లాహ్ అతనికి ఇచ్చిన దానితోనే అతన్ని సంతృప్తిపరిచినవాడు సాఫల్యుడయ్యాడు.

ఎవరైతే ఇస్లాం యొక్క సన్మార్గాన్ని పొందారో, అతని యొక్క ఇహలోకపు జీవితం, అతని యొక్క ఆర్థిక వ్యవస్థ అతనికి సరిపడే విధంగా ఉంది, అల్లాహ్ ఎంత ఇచ్చాడో అంతలోనే సరిపుచ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఇస్లాంపై స్థిరంగా ఉన్నాడు. అఫ్లహ! అతడు సాఫల్యుడైపోయాడు.

గమనించండి. ఖురాన్ లో సూరతుల్ బఖరాలో మొదటి పారా, అలిఫ్ లామ్ మీమ్ అది ఎండ్ అయ్యేకి ముందు, ఒక నాలుగైదు ఆయతుల ముందు

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ
ఫస యక్ఫీక హుముల్లాహ్
అయితే వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) అల్లాహ్ నీకు సరిపోతాడు.

ఫస యక్ఫీక హుముల్లాహ్. అల్లాహ్ వారి నుండి నీ కొరకు సరిపోతాడు. అంటే, నీకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అల్లాహ్ నీ కొరకు చాలు. నిన్ను కాపాడడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ అవసరాలు తీరడానికి, నీవు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి.

ఆ నవయువకుని సంఘటన మీకు తెలుసు కదా? సూరతుల్ బురూజ్ లో వచ్చి ఉంది. ఏమిటి సంఘటన? చాలా పొడుగ్గా ఉంది. సహీ హదీసులో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అతడు ఒక మాంత్రికుని దగ్గర మంత్రజాలం కూడా నేర్చుకుంటాడు, మరోవైపు ధర్మ విద్య కూడా నేర్చుకుంటాడు. తర్వాత అతనికి తెలుస్తుంది, ఈ మంత్ర విద్య, జాల విద్య అల్లాహ్ కు ఇష్టం లేనిది. ఇందులో షిర్క్, కుఫ్ర్, బహుదైవారాధన, అవిశ్వాసం, సత్య తిరస్కారం ఇంకా ఎన్నో చెడులు ఉన్నాయి. ఈ ధర్మ బోధకుడు అల్లాహ్ గురించి ఏ విషయాలైతే చెబుతున్నాడో ఇవి సత్యమైనవి, నిజమైనవి. అల్లాహ్ ను నమ్ముకుంటాడు.

ఆ తర్వాత ఒక దారిలో ఏదో పెద్ద జంతువు ప్రజల రాకపోకలను కూడా అది ఆపేస్తుంది. దాన్ని అల్లాహ్ యొక్క పేరుతో ఒక రాయి దాని మీద విసిరితే అది చనిపోతుంది. ప్రజలు తమ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఆ సందర్భంలో ప్రజలకు ఈ నవయువకుని గురించి, ఇతడు ఎంత మహిమ గలవాడు, అంత పెద్ద జంతువును ఎవరు కొట్టగలుగుతారు, ఎవరు చంపగలుగుతారు, దాన్ని దారిలో నుండి ఎవరు తీయగలుగుతారు? ఈ అబ్బాయి తీశాడు అని అతని వద్దకు వచ్చి అతన్ని చాలా గొప్పగా చెప్పుకుంటే, అతడు చాలా స్పష్టంగా చెప్పేస్తాడు, “నేను చేసింది ఏమీ లేదు, ఆ అల్లాహ్ సర్వశక్తిమంతుడే చేశాడు. మీరు అల్లాహ్ ను నమ్ముకోండి.” ఇక మన సమాజంలో చూస్తాము కదా, ఎక్కడైనా ఏదైనా కొత్త బాబా పుట్టగొడుగుల్లా మొలకెత్తుకొని వచ్చాడు అంటే, ప్రజలు పిచ్చోళ్ళ మాదిరిగా వారి వెంట పడి, నా ఈ కష్టం దూరం కావాలి, నాకు సంతానం కావాలి, నా ఫలానా పని కావాలి అని ఎలా వస్తారో, అలా రావడం మొదలుపెట్టారు ఆ అబ్బాయి దగ్గరికి. అప్పుడు అతను తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ఇస్లాం యొక్క దావత్ ఇచ్చాడు. అల్లాహ్ ను నమ్ముకోండి అని చెప్పాడు. చివరికి ఈ విధంగా ఆ కాలంలో ఉన్న రాజు వద్ద ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, అతడు అంధుడైపోయాడు, అతనికి ఈ విషయం తెలిసింది. అతడూ వచ్చాడు. అతనికి కూడా ఈ అబ్బాయి అదే మాట చెప్పాడు, “నేను ఎవరికీ కన్ను ప్రసాదించను, చూపులు ఇవ్వను, ఎవరి ఏ కష్టాన్ని దూరం చేసేవాణ్ణి నేను కాదు. అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ను నమ్ముకోండి, అతనితో దుఆ చేయండి.” ఆ మినిస్టర్ కూడా అల్లాహ్ ను నమ్ముకుంటాడు, అల్లాహ్ తో దుఆ చేస్తాడు, అల్లాహ్ అతనికి కళ్ళు ప్రసాదిస్తాడు, చూపు ఇచ్చేస్తాడు. అక్కడి నుండి ఇక కష్టాలు, పరీక్షలు, ఎన్నో రకాల హింసా దౌర్జన్యాలు ఆ మినిస్టర్ పై మొదలవుతాయి, తర్వాత ఆ బోధకునిపై వస్తాయి, చివరికి ఈ అబ్బాయిపై కూడా వస్తాయి.

ఆ సందర్భంలో సంక్షిప్త మాట ఏమిటంటే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, గుట్ట మీదికి తీసుకెళ్ళిన తర్వాత మీరు కలిసి ఇతన్ని కింద పారేసేయండి, మీరు తిరిగి రండి. ఆ అతని యొక్క సైనికులు కొందరు ఈ అబ్బాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ గుట్ట మీద నిలబడతారు. ఇక ఇతన్ని విసిరేద్దాము, పారేద్దాము అని అనుకునే సందర్భంలో ఆ అబ్బాయి ఏం దుఆ చేస్తాడు?

اللَّهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ
అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్
ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) నాకు సరిపో.

ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వీరి కుతంత్రాల నుండి, వీరి దుశ్చేష్టల నుండి నీవే నాకు సరిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. యా అల్లాహ్, తూ మేరే లియే కాఫీ హో జా. ఓ అల్లాహ్, నీవు నాకు సరిపడిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఆ గుట్టలో ఒక భూకంపం మాదిరిగా ఏర్పడింది. అతన్ని తీసుకొచ్చిన సైనికులందరూ కూడా అక్కడే నాశనమైపోయారు, ధ్వంసమైపోయారు. ఈ అబ్బాయి క్షేమంగా తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి.

ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంతమంది సైనికులను ఇచ్చి, ఇతన్ని తీసుకెళ్ళండి, షిప్ లో, ఒక బోట్ లో కూర్చోబెట్టుకొని, పడవలో నడి సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని పారేయండి, మీరు తిరిగి వచ్చేసేయండి. తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళాక ఇతన్ని పారేయాలని అనుకున్నప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ దుఆ చేస్తాడు: అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్. అల్లాహుతాలా వారందరినీ అందులో ముంచేస్తాడు, ఇతన్ని కాపాడుతాడు.

సోదర మహాశయులారా! చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. మనకు కావలసింది ఏంటి? అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం ఉండాలో, మనం అల్లాహ్ యొక్క నిజమైన దాసులమవ్వాలి. నిజంగా, వాస్తవ రూపంలో అతని దాస్యత్వాన్ని పాటించాలి. మనం గమనించాలి, సత్య నిజమైన దాసుడు ఎప్పుడూ కూడా తన యజమానికి అవిధేయత చూపడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం అల్లాహ్ యొక్క దాసులమన్నటువంటి సత్య భావనలో ఎల్లప్పుడూ ఉంటామో, అల్లాహ్ ను మనం ఆరాధించడంలో, అల్లాహ్ ను నమ్మడంలో, మనపై ఏమైనా కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ యే మనల్ని కాపాడువాడు, రక్షించేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో మనం ధైర్యంగా ఉండాలి.

ధర్మపరమైన నిషేధాలు-29: అల్లాహ్ తన కొరకు ఖుర్ఆనులో, ప్రవక్త సహీ హదీసుల్లో తెలిపిన గుణనామాలే తప్ప మరే గుణనామాలు అల్లాహ్ కు అంకితం చేయకు [వీడియో]

బిస్మిల్లాహ్

[1:12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ధర్మపరమైన నిషేధాలు – 29

29- అల్లాహ్ తన కొరకు ఖుర్ఆనులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ కొరకు సహీ హదీసుల్లో తెలిపిన గుణనామాలే తప్ప మరే గుణనామాలు అల్లాహ్ కు అంకితం చేయకు. మనకు నచ్చిన పేర్లతో అల్లాహ్ ను పిలుచుకుందాము అన్న ప్రసక్తే లేదు. ఎందుకనగా మన బుద్ధిజ్ఞానాలకు కాదు విలువ ఇవ్వవలసినది, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలకు విలువ ఇవ్వాలి.

[قُلِ ادْعُوا اللهَ أَوِ ادْعُوا الرَّحْمَنَ أَيًّا مَا تَدْعُوا فَلَهُ الأَسْمَاءُ الحُسْنَى] {الإسراء:110}

ఇలా చెప్పండిః అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రహ్మాన్ అని అయినా సరే. ఏ పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. (బనీ ఇస్రాఈల్ 17: 110).


పుస్తకం & వీడియో పాఠాలు క్రింద వినవచ్చు
ధర్మపరమైన నిషేధాలు

ధర్మపరమైన నిషేధాలు (భాగాలు) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2ipsEd3T9LtuCJ3_1vELEu

ధర్మపరమైన నిషేధాలు (పాయింట్స్ క్లిప్స్) – యూట్యూబ్ ప్లేలిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0PzbYW7saGrZ3TYVB51Rtb

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం [వీడియో & టెక్స్ట్]

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం
https://www.youtube.com/watch?v=UsTrHy6arh8 [12 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్‌లోని మొదటి అధ్యాయం, సూరతుల్ ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాన్ని వివరిస్తారు. ఏ పనినైనా అల్లాహ్ పేరుతో (బిస్మిల్లాహ్) ప్రారంభించాలని, ఇది ఖురాన్ అపార కరుణామయుడైన అల్లాహ్ నుండి వచ్చిన గ్రంథమని గుర్తుచేస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఖురాన్ యొక్క నిర్మాణం, 114 సూరాలు మరియు 30 పారాలుగా విభజించబడిందని వివరించారు. సూరతుల్ ఫాతిహా, ఖురాన్ సారాంశంగా పరిగణించబడుతుందని, మూడు ప్రధాన భాగాలుగా విభజించబడిందని తెలిపారు. మొదటి భాగం అల్లాహ్ యొక్క లక్షణాలైన రబ్ (ప్రభువు), అర్-రహ్మాన్ (కరుణామయుడు), అర్-రహీమ్ (కృపాశీలుడు), మరియు మాలిక్ (అధిపతి)ని స్మరిస్తూ ఆయనను స్తుతించడం. రెండవ భాగం, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం మరియు ఆయన సహాయాన్నే అభ్యర్థించడం గురించి చెబుతుంది. మూడవ భాగం, రుజుమార్గం (సన్మార్గం) కోసం చేసే ప్రార్థన, అంటే ప్రవక్తలు, సత్యవంతులు మరియు పుణ్యాత్ముల మార్గం, అల్లాహ్ ఆగ్రహానికి గురైనవారి (యూదులు) మరియు మార్గభ్రష్టులైనవారి (క్రైస్తవులు) మార్గం కాదని స్పష్టం చేస్తుంది. వక్త, జ్ఞానం ఉండి ఆచరించకపోవడం మరియు జ్ఞానం లేకుండా ఆరాధించడం రెండూ ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో మనం ఆరంభం చేస్తున్నాము. ముందు ఇక్కడ మనం సూరతుల్ ఫాతిహా. ఖురాన్ ఆరంభం అనేది బిస్మిల్లాహ్ నుండి ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బిస్మిల్లాహ్ అన్న పదం ఖురాన్ యొక్క ఆరంభంలో ఏదైతే వచ్చిందో దీని గురించి ధర్మ పండితులు చెప్పిన విషయాలు అందులో సంక్షిప్తంగా రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి, మనం ఏ కార్యం మొదలు పెట్టినా గాని అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలు పెట్టాలి.

రెండవది, “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అని ఖురాన్ ఆరంభం ఏదైతే జరుగుతుందో, ఇందులో ఒక గొప్ప సూచన ఏముందంటే ఈ దివ్య గ్రంథం అల్లాహ్ వైపు నుండి ఉంది. ఎలాంటి అల్లాహ్? సర్వసామాన్యంగా పూర్తి సృష్టికి, ప్రత్యేకంగా మానవుల పట్ల ఎంతో కరుణతో మెలిగేవాడు. వారిపై దయ దాక్షిణ్యాలు చూపేవాడు. వారి యొక్క మంచి కొరకే ఈ ధర్మ గ్రంథం అవతరింపజేశారు.

సోదర మహాశయులారా, దివ్యగ్రంథం ఖురాన్ లో 114 సూరాలు ఉన్నాయి. మొదటి సూరా ఇది సూరె ఫాతిహా మరియు చివరి సూరా సూరతున్నాస్.

ఇందులో ప్రజలు కంఠస్థం చేసుకోవడానికి, ప్రజలు గుర్తుంచుకోవడానికి 30 కాండాలలో, సామాన్యంగా పారా లేదా జుజ్ అని అనబడడం జరుగుతుంది. పారా అని ఉర్దూలో మరియు జుజ్ అని అరబీలో చెప్పడం జరుగుతుంది. 30 పారాల్లో దీనిని విభజించడం జరిగింది. ఇది పారాయణం, తిలావత్ కొరకు సులభతరంగా ఉండడానికి. మళ్ళీ పారాలో కూడా కొన్ని భాగాలు చేయబడ్డాయి. అయితే ఈనాటి నుండి మనం ప్రతి రోజు ఒక పారా సారాంశాన్ని వినబోతున్నాము.

సూరతుల్ ఫాతిహా యొక్క ఘనత

మొట్టమొదటి సూరా సూరె ఫాతిహా. దీని గురించి స్వయంగా ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ యొక్క మొట్టమొదటి సూరా ఆరంభ పరంగా, ఖురాన్ ఇప్పుడు ఉన్నటువంటి క్రమం పరంగా సూరె ఫాతిహా. మరియు అంతేకాదు, ఖురాన్ లోని 114 సూరాలలో أعظم سورة అతి గొప్ప సూరా, అతి ఘనత గల సూరా సూరతుల్ ఫాతిహా. అంతేకాదు ఈ సూరె ఫాతిహా, దీనిని ఖురాన్ యొక్క సారాంశం అని కూడా అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉర్దూలో మా ఛానల్ లో ఒక వీడియో కూడా ఉంది. దాన్ని కూడా ఉర్దూ తెలిసిన వారు చూడవచ్చు. అందులో చాల వివరాలు ఉన్నాయి.

అయితే సూరతుల్ ఫాతిహాలో మనం గమనిస్తే, చదువుతే శ్రద్ధగా, ఇందులో మనకు మూడు భాగాలు కనబడతాయి.

ఒకటి, (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీం, మాలికి యౌమిద్దీన్) ఇక్కడి వరకు.
రెండవ భాగం, (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మూడో భాగం, “ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం” నుండి చివరి వరకు.

సూరతుల్ ఫాతిహా – మొదటి భాగం: అల్లాహ్ స్తుతి

ఈ మొదటి భాగంలో మనకు తెలుపబడిన గొప్ప విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నీపై ఎవరైనా ఉపకారం చేశారు గనుక నీవు అతన్ని స్తుతించదలుచుకుంటే, రబ్బిల్ ఆలమీన్ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ ఆయన యొక్క కృపలు, కరుణలు, దయ, అనుగ్రహాల కంటే ఎక్కువగా ఇంకా వేరే ఎవరి అనుగ్రహాలు లేవు. అందుకొరకు నీవు అల్లాహ్ ను స్తుతించు.

ఓ మానవుడా, నీవు ఎవరి పట్లనైనా ఒక ఆశతో చూస్తున్నావు, అతని వైపు నుండి నీకు ఏదైనా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నావు, అర్రహ్మా నిర్రహీం అతి గొప్ప కరుణామయుడు, కృపాశీలుడు అల్లాహ్ మాత్రమే గనుక నీవు అతన్ని స్తుతించు.

ఒకవేళ నీవు ఎవరితోనైనా భయపడి స్తుతించదలుస్తే, మాలికి యౌమిద్దీన్ ప్రళయ దినానికి ఏకైక యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. అతని యొక్క భయం ఎంతగా మనలో ఉండాలంటే, అంతకంటే ఎక్కువ భయం ఇంకా ఎవరిది కూడా ఉండజాలదు. అలాంటి అల్లాహ్ కు నీవు నీ స్తుతులు, పొగడ్తలన్నీ కూడా చెల్లిస్తూ ఉండు.

మరో రకంగా మనం ఆలోచిస్తే మనమందరం దాసులం, అల్లాహ్ మన యజమాని. మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎల్లవేళల్లో మరియు ఆరాధన అన్న పదం విన్నప్పుడు కేవలం నమాజ్ ఒక్క విషయాన్ని మనసులో తీసుకురాకండి. ఆరాధన అని అన్నప్పుడు ప్రత్యేకంగా అల్లాహ్ ను ఆరాధించే విషయంలో అది మనసు సంబంధమైన ఆరాధన అయినా, నాలుక సంబంధమైన ఆరాధన అయినా, అవయవాలకు సంబంధమైన ఆరాధన అయినా ఇవి వస్తాయి. అలాగే హుఖూఖుల్లాహ్ (అల్లాహ్ హక్కులు ) కు సంబంధించినవి వస్తాయి, హుఖూఖుల్ ఇబాద్ కు సంబంధించినవి కూడా వస్తాయి.

ఈ ఆరాధనలన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు, చేసేటప్పుడు మనలో నాలుగు విషయాలు ఉండాలి. మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. అల్లాహ్ ను మనం సంపూర్ణ ప్రేమతో, సంపూర్ణ ఆశతో, సంపూర్ణ భయంతో ఆరాధించాలి మరియు వినయ వినమ్రతతో. అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ భయం మరియు ఆశ, సంపూర్ణ ప్రేమ మరియు ఆశ భయం.

ఈ మూడిటికి ధర్మపండితులు, ధర్మపండితులు ఒక పక్షి మాదిరిగా కూడా ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఎలాగైతే ఒక పక్షి ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా, తల లేకుండా ఎగరదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా గాని అది బ్రతకదు, ఎగరదు. అలాగే ఈ మూడింటిలో ఏ ఒక్క విషయం తగ్గిపోయినా గాని మన యొక్క ఆరాధన, మనం అల్లాహ్ ను ఆరాధించే విషయంలో చాల లోపం కలుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – రెండవ భాగం: అల్లాహ్ తో నిబంధన

ఆ తర్వాత చెప్పడం జరిగింది.

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. (1:5)

ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ యొక్క సహాయమే కోరుతున్నాము. మనకు మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, అంతేకాదు అల్లాహ్ యొక్క ఆరాధన మనం అల్లాహ్ యొక్క సహాయం లేనిది చేయలేము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – మూడవ భాగం: సన్మార్గం కోసం ప్రార్థన

మూడవ విషయం. ఇహలోకంలో మన కొరకు అత్యంత గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అల్లాహ్ కు ఇష్టమైన మార్గం మన కొరకు ప్రాప్తించబడడం. అదే విషయం ఇందులో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒక్క రోజులో 17 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాము. అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు అని.

అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ మనకు సన్మార్గం ఏదైతే చూపుతాడో దాని యొక్క ఇక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటి? అల్లాహ్ ను ఆరాధించి అల్లాహ్ యొక్క మార్గంపై నడిచి ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందారో, ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ములు అలాంటి వారి మార్గం మాకు ప్రసాదించు అల్లాహ్.

మరి ఎవరైతే, మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయి సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడ్డారో అలాంటి వారి మార్గం వద్దు. అంటే ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హదీసుల ఆధారంగా

الْمَغْضُوبِ
(అల్ మగ్జూబ్)
ఆగ్రహానికి గురైన వారు

ఎవరిపై అయితే ఆగ్రహం కురిసిందో వారెవరు? వారు వాస్తవానికి యూదులు. మరియు

الضَّالِّينَ
(వజ్జాలీన్)
మార్గభ్రష్టులు

క్రైస్తవులు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కారణం గమనించండి, సంతోషపడే విషయం కాదు. ఒకరిని దూషించే విషయం కాదు అంతకు.

ఎవరికైతే ధర్మ జ్ఞానం లభించినదో మరియు వారు ఆ ధర్మ జ్ఞానాన్ని ఆచరించడం లేదో వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురుస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటారు కానీ ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరో, అందువల్ల వారు చేసే వారి కృషి అంతా కూడా సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడిపోతుంది, నష్టంలో వారు పడిపోతారు. అందుకొరకు వారిని జ్జాలీన్ అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మనం ఒకవేళ ధర్మ అవగాహన కలిగి సరియైన రీతిలో ఆచరించకుంటే యూదులతో సమానమైపోతాము అన్నటువంటి హెచ్చరిక ఉంది.

అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి కాంక్ష ఉంది, తపన ఉంది. కానీ విద్య నేర్చుకోవడం లేదు. ధర్మం నేర్చుకోకుండా దూరమైపోతున్నాము. ధర్మవేత్తలకు దూరం ఉంటున్నాము. నాకు తెలిసిపోయింది అని, నేను ఖురాన్ చదువుకుంటాను, వేరే వారితో నేర్చుకునేది ఏమున్నది? నేను అరబీ గ్రామర్ నేర్చుకున్నాను, ఖురాన్ నాకు డైరెక్ట్ గా అర్థమవుతుంది అన్నటువంటి భ్రమలో పడి ధర్మవేత్తలకు, సన్మార్గంపై ఉన్నటువంటి పుణ్య పురుషులకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండి మనకు మనం ధర్మానికి దూరం ఏదైతే చేసుకుంటున్నామో, వాస్తవానికి ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో పడవేస్తుంది.

చివరి ఒక మాట దీని గురించి చెప్పేది ఏమిటంటే, సూరతుల్ ఫాతిహా ఇందులో మనం అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందు అల్లాహ్ ను స్తుతించాలి, ఆ తర్వాత మన అవసరాన్ని పెట్టాలి. అయితే ఈ మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కూడా దరూద్ చదువుతూ ఉండాలి.

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్ నుండి
https://teluguislam.net/?p=8142

ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి?
https://youtu.be/koWlTdlX4BI [52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా పొందవచ్చో వివరించబడింది. సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన తలచినప్పుడే అన్నీ జరుగుతాయని గట్టి నమ్మకం కలిగి ఉండాలని ప్రసంగీకులు నొక్కిచెప్పారు. ఖుర్ఆన్ కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని అల్లాహ్ స్వయంగా చెప్పిన విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇది శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది. సూరహ్ యూనుస్, సూరహ్ అల్-ఇస్రా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని సంఘటనలను ఉదాహరిస్తూ, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందాలంటే దృఢ విశ్వాసం, పాపాలకు దూరంగా ఉండటం మరియు ఖుర్ఆన్ బోధనలను ఆచరించడం తప్పనిసరి అని బోధించారు. మూఢనమ్మకాలు, షిర్క్ వంటి పద్ధతులకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో ఖుర్ఆన్ ద్వారా చికిత్స పొందాలని వారు ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్. వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్.

ఫ అఊదు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్.

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
(వ నునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫావువ్ వ రహ్మతుల్ లిల్ మూమినీన్)
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.  (17:82)

సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సర్వ మానవాళి సన్మార్గం కొరకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్హందులిల్లాహ్, ఈ రోజు ధర్మ సందేశ విభాగం, రాష్ట్ర జమీయతే అహ్లె హదీస్ తెలంగాణ వారి తరఫున మూడు ప్రసంగాలు, మూడు పాఠాలు మీ ముందు ఇన్షా అల్లాహ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇన్షా అల్లాహ్ ప్రప్రథమంగా మీ ముందు ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా అనే అంశంపై ఫజీలతుష్ షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామయీ హఫిదహుల్లాహ్ మీ ముందు ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన ప్రసంగించనున్నారు. నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా గురువు గారిని నేను ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన మాకు ఎన్నో ఖుర్ఆన్ హదీసు వెలుగులో ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందాలి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ గ్రంథం ద్వారా ఎలా స్వస్థతను పొందుపరిచాడు అనే అంశాల గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తారని ఆశిస్తున్నాను. వలియత ఫద్దల్ మష్కూరున్ మాజూరా ఫలియత ఫద్దల్.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.” (10:58)

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ ధర్మ ప్రేమికులారా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం. మన కొరకు స్వస్థత ఎలా? అనే అంశంపై ప్రసంగించడానికి చెప్పడం జరిగింది. అయితే ఖుర్ఆన్ మన కొరకు ఏ రూపంలో స్వస్థత ఉంది, దాని ద్వారా మనం ఎలా స్వస్థత పొందగలుగుతామో తెలుసుకునేకి ముందు ఒక రెండు విషయాలు మనం గ్రహించడం చాలా అవసరం. ఏంటి ఆ రెండు విషయాలు? ముందు మనమందరమూ కూడా చాలా బలంగా విశ్వసించవలసినది, దృఢంగా నమ్మవలసినది ఏమిటంటే,

సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే జరుగుతుంది. చివరికి అమ్రే కౌనీ అని ఏదైతే అనడం జరుగుతుందో, మానవులు, జిన్నాతులు తప్ప మిగతా సృష్టి రాశులందరికీ కూడా వారి వారి ఏ పనిని బాధ్యతను అల్లాహ్ అప్పగించాడో, తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అది మన దృష్టిలో ఒకప్పుడు ఏదైనా చెడు అనిపించినా, అది కూడా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది, దీనినే అమ్రే కౌనీ అని అంటారు. ఎక్కడైనా ఏదైనా మంచి జరిగినా అది కూడా అల్లాహ్ వైపు నుండే జరుగుతూ ఉంది.

అగ్నిలో కాల్చే గుణం, కత్తిలో కాటు వేసే గుణం, ఇంకా సృష్టి రాశుల్లో వేరే ప్రతీ ఒక్క దానిలో అల్లాహ్ త’ఆలా అనుమతితోనే అది తన పని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అల్లాహ్ కోరుతాడో, అది తన ఆ పని చేయకూడదు అని, అది ఆ పని చేయదు. అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాంను కాల్చకూడదు అంటే అది కాల్చలేదు. కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాంను కోయకూడదు అని అంటే, కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపైన నడిచినప్పటికీ రవ్వంత గాయం కూడా కాలేదు. సముద్రంలో మునగడం, అందులో ఉన్న పెద్ద జీవరాశులు, తిమింగలాలు మనిషిని గానీ ఇంకా వేరే వాటిని తినడం ఒక సర్వసాధారణ అలవాటుగా మనం చూస్తాము, కానీ అదే యూనుస్ అలైహిస్సలాంను అతనికి ఏ కొంచెం నష్టం జరగకుండా అలాగే కాపాడాలి అని అల్లాహ్ ఆదేశం వస్తే కాపాడింది.

ఈ విధంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిలో తాను కోరిన విధంగా తన ఈ సృష్టిలో మార్పుచేర్పు చేస్తూ ఉంటాడు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే ఉర్దూలో, అరబీలో ఒక పదం ఉపయోగపడుతుంది. మనం మన లాభానికి ఎన్ని సాధనాలు ఏర్పరచుకున్నా, నష్టం నుండి దూరం ఉండడానికి మనం ఏ మార్గాలు అవలంబించినా, ఇవన్నీ కూడా అస్బాబ్ (సాధనాలు). కానీ, ముసబ్బిబుల్ అస్బాబ్, ఆ సాధనాలకు అవి తమ పని చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చేవాడు ఆ అల్లాహ్ మాత్రమే. ఈ బలమైన నమ్మకం మనకు ఉండాలి.

రెండో విషయం, అల్లాహ్ ఏది కోరితే అదే జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం ఏమీ జరగదు. మనం ఏదైనా మంచి కోరి, మంచి సాధనం దాని గురించి ఉపయోగిస్తే అల్లాహ్ తలచినప్పుడే ఆ మంచి మనకు జరుగుతుంది. అంటే, అల్లాహ్ త’ఆలా అందులో ఒక కారణం పెట్టాడు. కానీ అది ఎప్పుడు పని చేస్తుంది? అల్లాహ్ అనుమతి జరిగినప్పుడు, అల్లాహ్ తాను కోరి అనుమతి ఇచ్చినప్పుడు. ఈ నమ్మకం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాను, మనం సర్వసాధారణంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారిమి, హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ సిటీగా మనం చూస్తున్నాము, అందుకొరకు కొన్ని ఉదాహరణలుగా ఎప్పుడైనా దాని పేరు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎన్నో గల్లీలలో మీరు చూస్తూ ఉంటారు, “హమారే పాస్ హర్ తరహా కా రూహానీ ఇలాజ్ హై, ఖురానీ ఇలాజ్ హై”(మా దగ్గర అన్ని రకాల ఆధ్యాత్మిక చికిత్స ఉంది, ఖుర్ఆన్ చికిత్స ఉంది) ఇలాంటి బోర్డులు వేసి ఉంటాయి. వారి యొక్క మొబైల్ నెంబర్లు ఇచ్చి ఉంటాయి. జనాలు, ప్రజలు ధర్మ అవగాహన సరైన రీతిలో లేనందువల్ల, విశ్వాసాలు బలహీనంగా అయిపోయినందువల్ల, వారు ఎన్నో రకాల మోసాలకు గురి అవుతారు. తర్వాత కొందరు అల్లాహ్ యొక్క సత్య గ్రంథం ఖుర్ఆన్ విషయంలో శంకించడం మొదలు పెడతారు. ఇలా ఉండకూడదు.

అందుకొరకే నేను నా అసలైన టాపిక్ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా? ప్రారంభించేకి ముందు ముఖ్యమైన రెండు మాటలు చెప్పాను. వాటిపై చాలా శ్రద్ధ ఇవ్వండి.

ఇక ఖుర్ఆన్ మన కొరకు స్వస్థత ఇది మన శారీరక రోగాలకు కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మన యొక్క బాహ్య రోగాలకు కూడా మరియు ఇది అంతర్య కళ్ళకు కనబడనటువంటి రోగాలకు కూడా ఒక మంచి స్వస్థత కలుగజేసేది.

దీనికి సంబంధించిన ఆయతులు, హదీసులు చెప్పి, ఏ ఏ రీతిగా మనం ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందగలుగుతామో చెప్పేకి ముందు, ఖుర్ఆన్ గురించి స్వయంగా అల్లాహ్ త’ఆలా స్వస్థత అన్న పదం ఏదైతే పలికాడో, “షిఫా” అని ఖుర్ఆన్ లో వచ్చి ఉంది. సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో, అలాగే సూరత్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ అని అంటారు, సూరహ్ నెంబర్ 17, ఆయత్ నెంబర్ 82, అలాగే సూరత్ ఫుస్సిలత్, సూరహ్ నెంబర్ 41, ఆయత్ నెంబర్ 44, ఇంకా ఈ భావంలో వేరే కొన్ని చోట్ల కూడా ఆయతులు ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా మనలో ఎవరైనా ఏదైనా రోగానికి గురి అయితే, ఏ మందు తీసుకుంటున్నావు? ఎవరి వద్ద చికిత్స చేయిస్తున్నావు? చికిత్స, మందు తీసుకోవడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే అల్లాహ్ త’ఆలా ఈ ఖుర్ఆన్ మీ అన్ని రకాల రోగాలకు ఒక ఔషధం అని, దవా అని, ఇలాజ్ అని, చికిత్స అని చెప్పలేదు. మందుల ఉపయోగంతో ఏ ప్రయోజనం కలుగుతుందో, అంటే మనిషి యొక్క రోగం దూరమైపోయి స్వస్థత కలగడం. మర్ద్ (రోగం) పూర్తిగా అతనిలో నుండి వెళ్ళిపోవడం, దాని చోట అతనికి సిహ్హత్, షిఫా (ఆరోగ్యం, స్వస్థత) కలగడం. డైరెక్ట్ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఆ చివరి లాభం ఏదైతే ఉందో, స్వస్థత, ఆరోగ్యం అది అని తెలిపాడు. మందు అని తెలపలేదు, ఔషధం అని తెలపలేదు.

ఇందులో ఉన్నటువంటి గొప్ప మహిమ గ్రహించాల్సినది ఏమిటంటే, మనం చూస్తూనే ఉన్నాము, ఔషధాలు, మందులు సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో అవి పని చేస్తాయి, మనకు వాటి ద్వారా స్వస్థత కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వాటి ద్వారా మనకు స్వస్థత అనేది కలగదు. కానీ ఇక్కడ ఖుర్ఆన్ గురించి అల్లాహ్ త’ఆలా ఏం చెబుతున్నాడు అంటే, దీని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అంతమైపోతాయి, నామరూపాలు లేకుండా “లా తుగాదిరు సఖమా”, ఆ రోగం నామరూపాలు లేకుండా మీలో నుండి దూరమైపోతాయి.

సోదర మహాశయులారా, తొందర తొందరగా పది, ఇరవై ఆయతులు చదివేయడం, పది, ఇరవై హదీసులు వినడం అది గొప్ప కాదు. ఒక్క ఆయతు విన్నా, అందులో ఉన్న భావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మనలో ఒక మార్పు తీసుకురావడం, స్వయం మనం రోగం నుండి ఆరోగ్యం, మరియు అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు, బలహీన విశ్వాసం నుండి బలమైన విశ్వాసం వైపునకు, ఆచరణ పరంగా ఎంతో లోపం, దోషం ఉన్న మనం, సత్కార్యాలు పాటించడంలో చాలా వేగంగా ముందుకు రావడం, ఇలాంటి మంచి మార్పు మనలో రావాలి.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

అయితే, సూరత్ యూనుస్ యొక్క ఆయత్ నేను ముందు మీకు వినిపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమను గ్రహించండి. ఒకవేళ గత నెలలో ఖుర్ఆన్ ఎవరి గ్రంథం, ఎవరి కొరకు అన్న విషయంలో నేను హుదన్, హిదాయత్ ఏ ఏ రకంగా ఉంది అనే విషయం ఏదైతే తెలిపాను, సూర యూనుస్ యొక్క ఆయత్ ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు మీ ముందు పఠిస్తున్నానో, స్టార్టింగ్ లో కూడా సంక్షిప్త ఖుద్బయే మస్నూన తర్వాత పఠించాను, దాన్ని ఒక్కసారి గమనించండి మీరు.

“యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా, అల్లాహు అక్బర్. ఎందరో మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇంకా వేరే ఇస్లాం ధర్మం పై లేని వారు నా మాట వింటున్నారో కొంచెం శ్రద్ధ వహించండి. దివ్య గ్రంథం ఖుర్ఆన్, సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో అల్లాహ్ త’ఆలా “యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా అని సంబోధించాడు. అంటే, ముస్లింలారా అని అనలేదు, అరబ్బులారా అని అనలేదు, మక్కావాసులారా అని అనలేదు. సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ త’ఆలా ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు? ఇక సర్వ మానవులకు ఉంది గనక మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే, ఇది నా మాట కాదు, ఏదో తురుకోని మాట కాదు, ఏదో నీకు ఇష్టం లేని నీ పక్కన ఉన్నటువంటి నీ శత్రువుని మాట కాదు. నిన్ను సృష్టించిన నీ నిజ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ యొక్క మాట. నీతో సంబోధిస్తున్నాడు, నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. “యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, “ఖద్ జాఅత్కుం మౌఇజతుమ్ మిర్రబ్బికుం”. మీ ప్రభువు వైపు నుండి మీ కొరకు ఉపదేశం వచ్చేసింది. అల్లాహు అక్బర్.

ఈ ఉపదేశాన్ని గనక మీరు పాటించారంటే, అల్హందులిల్లాహ్, మీకు ఎంత లాభం కలుగుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అన్ని రకాల చెడులు, అది విశ్వాసానికి సంబంధించిన, లేదా ఆచరణ పరంగా నైనా, అశ్లీలత, అన్ని రకాల దుష్కార్యాలు వాటి నుండి మీరు దూరం ఉండగలుగుతారు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశాన్ని మీరు ఆచరించారంటే, విశ్వాసంలో కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మీరు మరల గలుగుతారు. ఆచరణ పరంగా కూడా మీరు అల్లాహ్ కు ఇష్టమైన సదాచరణ చేయగలుగుతారు. ఎప్పుడు? అల్లాహ్ మీ కొరకు పంపినటువంటి ఉపదేశాన్ని స్వీకరించారంటే.

ఆ తర్వాత చెప్పాడు, “వ షిఫావుల్ లిమా ఫిస్ సుదూర్”. సుదూర్, మీ యొక్క హృదయాలకు ఇది మంచి నివారణ, స్వస్థత. హృదయాలు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు,

مِنَ الشُّبَهِ وَالشُّكُوكِ، وَهُوَ إِزَالَةُ مَا فِيهَا مِنْ رِجْسٍ وَدَنَسٍ.
“మినష్ షుబహి వష్ షుకూకి, వహువ ఇజాలతు మా ఫీహా మిన్ రిజ్సిన్ వ దనస్”.
ఇది మీ రోగాల యొక్క, మీ హృదయాలకు నివారణ, స్వస్థత. హృదయాలలో ఏ అనుమానాలు, ఏ సందేహాలు, ఏ డౌట్స్ వస్తూ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ఈ ఖుర్ఆన్ మంచి నివారణ.”

అవును. నిజమైన సృష్టికర్త అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఆరాధ్యుడు ఉన్నాడు అటువంటి అనుమానంలో ఎవరైతే పడి ఉన్నారో, ఈ ఖుర్ఆన్ ను శ్రద్ధగా చదివారంటే, వారి యొక్క ఈ అనుమానాలు దూరమైపోతాయి. మేము ఆ అరబ్బుల్లో వచ్చిన ముహమ్మద్ ను ఎందుకు విశ్వసించాలి అన్నటువంటి సందేహంలో ఇంకా పడి ఉన్నారో, వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారంటే వారి యొక్క ఈ సందేహాలు దూరమవుతాయి. ఆయన కేవలం అరబ్బుల కొరకు కాదు. ఇక్కడ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఎలాగైతే చెబుతున్నాడో, మీ కొరకు ఉపదేశం, మీ కొరకు స్వస్థత, మీ రోగాలకు మంచి నివారణ కలిగిస్తూ మీకు స్వస్థత కలుగజేసేది అని, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఇదే ఖుర్ఆన్ లో తెలిపాడు, “యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ”, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. ఇంతకంటే మరీ స్పష్టంగా “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్”, సర్వ లోకాల వైపునకు మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపడం జరిగింది.

మనిషి ఇహలోకంలో శాంతి, పరలోకంలో కూడా నరకం నుండి ముక్తి పొంది శాంతి స్థలమైన ఆ స్వర్గంలో చోటు పొందాలంటే తప్పకుండా ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలి, ప్రవక్తపై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి అన్ని రకాల రోగాలకు స్వస్థత కలిగించేటువంటి ఈ ఖుర్ఆన్ ను చదివి మనలో మార్పు తీసుకురావాలి. దీని ద్వారా అన్ని రకాల చెడుగులు మన నుండి దూరమై, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనం మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గంలో ఉండగలుగుతాము.

సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు “వ హుదవ్ వ రహ్మ”. ఎప్పుడైతే మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ రోగాలకు స్వస్థత కలిగించే దానిని మీరు సరైన రీతిలో చదివి ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు మీకు మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. తద్వారా మీ జీవితాల్లో అల్లాహ్ యొక్క ప్రత్యేక కరుణలు మీపై దిగుతూ ఉంటాయి.

ఆ తర్వాత ఏం చెప్పాడు? “లిల్ ముఅమినీన్”. విశ్వాసుల కొరకు. కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఆయత్ యొక్క ఆరంభం యా అయ్యుహన్ నాస్ తోనే ఉంది. మరియు ఖుర్ఆన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇది ఉపదేశం, ఇది స్వస్థత, ఇది మార్గదర్శకత్వం, ఇది కారుణ్యం, నాలుగు గుణాలు చెప్పబడ్డాయి. ఆయత్ యొక్క చివరి పదం ఏముంది? లిల్ ముఅమినీన్, విశ్వాసుల కొరకు. అంటే ఏమిటి? ఇంతకు ముందు నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. వాస్తవానికి ఇది సర్వ మానవాళి కొరకు ఉపదేశము, స్వస్థత మరియు మార్గదర్శకత్వము, ఇంకా కారుణ్యము. కానీ ఎవరైతే వాస్తవ రూపంలో ఈ లాభాలు పొందుతారో, సర్వ మానవాళి పొందకుండా విశ్వాసులు ఈ లాభాలు పొందుతారు. ఎందుకు? విశ్వసించి దానిని అదే రీతిలో ఆచరిస్తారు గనుక.

ఇంతకు ముందు ఇచ్చిన ఒక సామెత మీకు గుర్తుందా? టార్చ్ లైట్ మీ చేతిలో ఉంది. బ్యాటరీ ఉంది. కానీ ఏం చేయాలి? రాత్రి మీరు ఏ దారి గుండా చీకటి దారిలో నడుస్తూ వెళ్తున్నారో, బ్యాటరీ ఆ టార్చ్ లైట్ వెంట తీసుకోవాలి, దాని బటన్లు నొక్కి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు మార్గం కనబడదు. ఎందుకు? మీరు దానిని మీరు నడిచే మార్గం వైపునకు కరెక్ట్ గా చూపించుకుంటూ వెళ్ళాలి. మీరు ఉదాహరణకు టార్చ్ లైట్ తీసుకున్నారు, బటన్ నొక్కారు, ఇక్కడ లైట్ ఉంది. కానీ దానిని ఆకాశం వైపునకు ఇలా ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. మీ ముంగట చీకటిలో ఏ దారి అయితే ఉందో అక్కడ వెలుతురు పడుతుందా? పడదు కదా?

అలాగే ముస్లింలారా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ కేవలం ఇళ్ళల్లో పెట్టుకొని, చేతిలో అందకుండా పైన ఎక్కడో అటుక మీద పెట్టి చదవకుండా, దానిని శ్రద్ధగా ఆలకించకుండా, దాని యొక్క అర్థ భావాలు తెలుసుకోకుండా, దాని ద్వారా ఎలా స్వస్థత పొందాలో ఆ ప్రయత్నం చేయకుండా మనం ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ఇంట్లో కాదు, జేబులో ఉన్నప్పటికీ, మీ యొక్క మొబైళ్ళలో ఉన్నప్పటికీ, మీ దుకాణాల్లో ఉన్నప్పటికీ, మీ బండిలో మీరు పెట్టుకున్నప్పటికీ మీ యొక్క జీవితాల్లో శుభాలు అనేటివి రావు. రోగాలు దూరం కావు, స్వస్థత అనేది కలగదు.

సూరతున్నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 69లో అల్లాహ్ త’ఆలా తేనె గురించి తెలిపాడు. తేనెటీగ మరియు తేనె యొక్క లాభం గురించి. “ఫీహి షిఫావుల్ లిన్నాస్”, తేనెలో సర్వ మానవాళికి స్వస్థత ఉంది అని. మొన్న కూడా మీరు వార్త చూశారు కావచ్చు. చివరికి కరోనా లాంటి రోగాలకైనా గానీ మన భారతదేశపు పాతకాలపు నాటి చికిత్సలను, ఔషధాలనే అమెరికా, యూరప్ లో కూడా వాడుతున్నారు. అక్కడి ల్యాబొరేటరీస్ లలో, అక్కడి శాస్త్రవేత్తలు తేనె లాంటి గొప్ప ఔషధం మరొకటి లేదు అని చెబుతున్నారు. అని తెలుగులో వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. తేనె, ఒరిజినల్ తేనె, 2000 రూపాయలకు కిలో పెట్టి మీరు కొన్నారు కావచ్చు. ఎంతో అందమైన బాటిల్ లో మీరు తీసుకొని వచ్చారు కావచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఎంతో మంచి చోట దాన్ని పెట్టేది ఉంటే, ఒక మంచి అందమైన చిన్న బాటిల్ లో ఒక 20, 30 గ్రాములు వేసుకొని జేబులో వేసుకుంటే లేదా కడుపునొప్పి ఉన్నప్పుడు కడుపుకు కట్టుకుంటే, ఏదైనా మెడనొప్పి ఉన్నప్పుడు మెడకు కట్టుకుంటే లేదా గొంతులో ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మెడ కింద కట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు కదా? డాక్టర్ మరియు ఆయుర్వేద అనుభవజ్ఞులైన వారు దానిని ఏ మోతాదులో, పొద్దున ఎన్నిసార్లు, నీళ్లలోనా, పాలల్లోనా, ఎందులో, నీళ్లు అయితే కూడా సామాన్య నీళ్లా, లేకుంటే కొంచెం కునుకున నీళ్లా, ఇవన్నీ మనం పద్ధతులు తెలుసుకొని ఆ విధంగా పాటించినప్పుడే దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో రోగాలకు మీరు డాక్టర్ల వద్ద నుండి మందు బిళ్ళలు గానీ, గొట్టం గోలీలు గానీ, లేకుంటే ఇంకా టానిక్ త్రాగే మందు గానీ తీసుకొని వస్తారు కదా? పొద్దుకు రెండు సార్లు తీసుకోవాలా, మూడు సార్లు తీసుకోవాలా, ఒక్కసారి తీసుకోవాలా, అన్నం కంటే ముందు తీసుకోవాలా, అన్నం తర్వాత తీసుకోవాలా, ఇవన్నీ విషయాలు మంచి విధంగా కనుక్కుంటారు కదా? అదే విధంగా దాన్ని పాటిస్తూ ఉంటారు కదా?

మరి ఖుర్ఆన్ విషయంలో కూడా స్వస్థత పొందే మార్గం ఏంటి? మనం ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందగలుగుతాము, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇంతవరకు చేయలేదు అంటే, మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో మనమే గమనించండి.

సోదర మహాశయులారా, ఖుర్ఆన్ ద్వారా మనం స్వస్థత అనేది నేను ఇంతకు ముందే తెలిపినట్లు, మన శారీరక రోగాలకు అంతకంటే ముఖ్యమైన మన హృదయ సంబంధమైన రోగాలకు కూడా ఇది మంచి స్వస్థత. హృదయ సంబంధ రోగాల గురించి కొన్ని విషయాలు ఇంతవరకే నేను చెప్పి ఉన్నాను. అయితే మనం ఖుర్ఆన్ చదువుతూ ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉండేది ఉంటే, దాని ప్రకారంగా మన ఆచరణ, దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో నడవడికలో మార్పు తెచ్చుకొని సదాచరణ పాటిస్తే, తప్పకుండా మన హృదయాల రోగాలకు స్వస్థత కలుగుతుంది.

హృదయ రోగాల యొక్క ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గుర్తుంచుకోండి.

“ఇన్న ఫిల్ జసది ముద్గా”, శరీరంలో ఒక అవయవం ఉంది. “ఇదా సలుహత్, సలుహల్ జసదు కుల్లు”, అది బాగుందంటే పూర్తి శరీరం బాగున్నట్లు. “వ ఇదా ఫసదత్, ఫసదల్ జసదు కుల్లు”, అది పాడైపోతే శరీరం అంతా కూడా పాడైపోతుంది. అదేమిటి? “అలా వహియల్ ఖల్బ్”, వినండి, అదే హృదయం.

అందుకొరకే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అన్నిటికంటే ముందు ఏం చూస్తారు? చెవిలో పెట్టుకొని రెండు దాని ద్వారా మీ యొక్క ఈ హృదయాన్ని, ముందు కూడా వెనక కూడా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? లేదా కొందరు ఆయుర్వేద అనుభవజ్ఞులు ఇక్కడ నాడి పట్టి చూస్తారు. దీని ద్వారా కూడా ఏం తెలుస్తుంది? హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? దీని ద్వారా శరీరంలోని ఎన్నో రోగాలను గుర్తుపడతారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హృదయం బాగుంది అంటే, అది అన్ని రకాల రోగాల నుండి స్వస్థత పొందింది అంటే మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎంతో మంచి మార్పు వస్తుంది. అందుకొరకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ నివారణ కొరకు, హృదయం మార్గదర్శకత్వంపై స్థిరంగా ఉండడానికి ఎన్నో దువాలు కూడా చేస్తూ ఉండేవారు. “అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా” ఇంకా వేరే ఎన్నో దువాలు ఉన్నాయి.

ఇక ఈ ఖుర్ఆన్ శారీరక రోగాలకు కూడా స్వస్థత. అవును. అల్హందులిల్లాహ్. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పేకి ముందు ఒక విషయం శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖుర్ఆన్ మీ శారీరక రోగాలకు కూడా స్వస్థత అని అంటే, ధర్మపరమైన వేరే ఔషధాలు వాడే అవసరం లేదు అని ఎంతమాత్రం భావం కాదు. చికిత్స చేయించుకోకూడదు అని ఎంతమాత్రం భావం కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. “దావూ మర్దాకుం యా ఇబాదల్లాహ్”, ఓ అల్లాహ్ దాసులారా, మీ యొక్క రోగాలకు మీరు చికిత్స చేయించండి. అయితే ఖుర్ఆన్ కు ప్రాధాన్యత అనేది ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఏముంది? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసి అన్ని మందులు వాడాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కానీ ఇక ఏదీ కూడా లాభం లేదు. ఇక అల్లాహ్ యే ఏదైనా చేయాలి అని ఇక ఖుర్ఆన్ ద్వారా స్వస్థత గురించి వచ్చాము. ఇలా ఉండకూడదు. ఖుర్ఆన్ శారీరక రోగాలకు మంచి ఔషధం, మంచి చికిత్స, దీని ద్వారా స్వస్థత కలుగుతుంది. అయితే రోగ ఆరంభంలో, అంతకంటే ముందు ఇంకా రోగం రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వెంటనే ఆరంభంలో, మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో దీని ద్వారా చికిత్స మనం పొందుతూ ఉండాలి. చిట్టచివరిసారిగా కాదు, ఈ యొక్క తప్పును మనం సరిదిద్దుకోవాలి.

రెండో విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఖుర్ఆన్ తప్పకుండా స్వస్థత. ఎందుకంటే అల్లాహ్ త’ఆలా తెలిపాడు ఈ విషయం ఖుర్ఆన్ లో. “వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా”, వాస్తవానికి మేము ఖుర్ఆన్ ద్వారా, ఖుర్ఆన్ ను స్వస్థత కొరకు అవతరింపజేశాము. “వ రహ్మతుల్ లిల్ ముఅమినీన్“, విశ్వాసుల కొరకు కారుణ్యంగా పంపాము.

అయితే ఇంతటి సత్యమైన మాటను మనం ఎలా తిరస్కరించగలుగుతాము? కానీ ఎంత ఎక్కువగా మన విశ్వాసం ఉంటుందో, ఎంత సత్యంగా మనం నమ్మి దీని ద్వారా చికిత్స చేయిస్తామో, అంతే ఎక్కువగా, అంతే తొందరగా అల్లాహ్ యొక్క దయతో మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఖుర్ఆన్ చదివినప్పటికీ స్వస్థత కలుగుతలేదు అని ఎవరైతే అంటారో వారు ఖుర్ఆన్ ను శంకించకూడదు, ఇంకా విశ్వాసం పాడైపోతుంది. తనలో, తాను అనాలసిస్ చేసుకోవాలి. తనలో తాను మార్పు తీసుకురావాలి. తనలో ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో దానిని కనుక్కునే ప్రయత్నం చేయాలి, దానిని వెతకాలి.

చిన్న ఉదాహరణ, షుగర్ రోగం తగ్గడానికి సర్వసాధారణంగా డాక్టర్లు, షుగర్ స్పెషలిస్టులు ఒక టాబ్లెట్ ఇస్తారు. స్టార్టింగ్ లో 2 mg. ఒక వారం, పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు ఇచ్చి చూసి డౌన్ కాకపోతే కొంచెం పెంచుతారు. కొందరు మూడు, మరికొందరు ఐదు. ఇంకా తగ్గకుంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు, ఒకటి కాడ రెండు, లేదా దానితో పాటు మరొకటి ఉంది, అది ఇస్తారు. కొందరి కొందరికి 300 కు పైగా, 400 కు ఆ విధంగా ఉండేది ఉంటే 400 కూడా దాటి ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ గురించి కూడా సలహా ఇస్తారు. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆయుర్వేద అనుభవజ్ఞులు, ఈ స్టార్టింగ్ డోస్ ద్వారానే మీకు 15 రోజుల్లో ఎందుకు తగ్గలేదు? మీరు ఏమైనా అన్నం తింటున్నారా? లేక మీరు పొటాటో లాంటి ఏమైనా కూరగాయలు తింటున్నారా? లేదా మీరు ఇంకా తీపి పదార్థాలు కూడా తింటూ ఉన్నారా? అని కూడా కనుక్కొని కొంచెం చురక పెడతారు. ఇది మీరు తగ్గించుకోకుంటే చాలా ప్రమాదంగా ఉంది అని. ఇక్కడ టాబ్లెట్ పని చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం, అటువైపు నుండి మీరు ఏ పత్యం చేయాలో అందులో సరిగ్గా పాస్ అవ్వలేదు. ఒక్క కారణం చెప్తున్నాను, మీరు 100% గా ఇదే విషయాన్ని ఖుర్ఆన్ పై ఫిట్ చేయకండి, విషయం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఖుర్ఆన్ చదివినప్పటికీ శారీరక కొన్ని రోగాలు మనకు దూరం కాలేదంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి కొరత లేదు నవూదుబిల్లాహ్, మనలో ఉంది. దాన్ని మనం అన్వేషించాలి, వెతకాలి, ఆ కొరత, ఆ లోపం, ఆ దోషాన్ని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి.

దీనికి సంబంధించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా తెలుపుతున్నారు. ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారంటే, ఏం చేసేవారు? ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బి రబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బి రబ్బిన్నాస్ చదువుకొని, తమ చేతులతో తమ శరీరంపై తుడుచుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వేదనకు గురి అయ్యారో, అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ దువాలు చదివి, ఈ సూరాలు చదివి, ప్రవక్త యొక్క చేతులను పట్టుకొని, ప్రవక్త యొక్క చేతులలో ఊది, ఎంతవరకు చేరగలుగుతుందో నేను ప్రవక్త చేతులతోనే ప్రవక్త శరీరంపై తుడుచేదాన్ని.ఇప్పుడు నేను చెప్పిన హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ఉక్బా రది అల్లాహు త’ఆలా అన్హు చెప్పారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సందర్భంలో ఓ ప్రయాణంలో ఉన్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ లోని రెండు రకాతులలో సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్ చదివారు. మళ్ళీ చెప్పారు, “లమ్ యతఅవ్వద్ ముతఅవ్విదున్ బిమిస్లిహిన్”, ఓ ఉక్బా, ఏ రకమైన రోగం గానీ, ఏ సమస్య ఎదురైనా గానీ, ఈ రెండు సూరాల కంటే ఉత్తమమైన వేరే ఏదీ కూడా అవసరం లేవు. గమనించారా? యూదుల్లో ఒకరు ప్రవక్తపై చేతబడి చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందులోనైతే చేతబడి చేయడం జరిగిందో ఆ వస్తువులను తెప్పించారు. వాటిలో 11 ముడులు వేసి ఉన్నాయి. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్, ఈ రెండు సూరాలలో కలిపి 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు సూరాల యొక్క తిలావత్ మొదలు పెట్టారు. ఒక్కొక్క ఆయత్ పూర్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి దానంతట అదే విడిపోయేది. ఏ విధంగా ముడులు విడిపోతూ ఉండేవో, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వస్థత అనేది ఎక్కువగా, మంచిగా ఏర్పడుతూ వచ్చింది.

సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారు ఓ ప్రయాణంలో ఉన్నారు, ఓ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది. ఆ ప్రాంతం యొక్క పెద్దలను కలిసి, మీ వద్ద మేము ఈ రాత్రి చుట్టాలుగా ఉంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు. ఆ ప్రాంతం యొక్క బయట శివార్లలో ఎలాగో రాత్రి గడుపుదాము అని ఉన్నారు. అదే రాత్రి ఆ గ్రామ పెద్ద మనిషికి ఏదో ఒక విషపురుగు కాటేసింది. ఎవరెవరో మంత్రగాళ్ళను, డాక్టర్లను పిలిపించి చికిత్స గురించి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు వారికి గుర్తొచ్చింది. అయ్యో, సాయంకాలం అయ్యేకి ముందుగా ఎవరో బయట నుండి కొందరు బాటసారులు వచ్చారు కదా, ఏమో వెళ్లి చూడండి కొంచెం ఏదైనా చుట్టుపక్కల ఉండవచ్చును, వారి దగ్గర ఏదైనా మంచి మందు ఉందో తెలుసుకుందాము. అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు తన వెంట ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లారు, సూరతుల్ ఫాతిహా చదివారు. అప్పటికప్పుడే అల్లాహ్ త’ఆలా ఆ గ్రామ పెద్ద మనిషికి ఆరోగ్యం ప్రసాదించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ ను శారీరక రోగాలకు కూడా స్వస్థతగా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్వస్థతకు అడ్డు కలిగించే విషయాలు ఏమున్నాయో, వాటి నుండి మనం దూరం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ వాటి నుండి మనం దూరం ఉండలేము అంటే చాలా నష్టపోతాము.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ గ్రంథాన్ని మన కొరకు స్వస్థత అని ఎన్నో హదీసుల్లో కూడా తెలిపారు. అంతేకాదు, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కొరకు కొన్ని దువాలు కూడా నేర్పి ఉన్నారు. అందుకొరకు ఒక సహీ హదీస్ లో వస్తుంది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త వద్దకు ఒక అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అతనికి అతనిపై షైతాన్ యొక్క ప్రభావం, షైతాన్ అతనిలో ప్రవేశించి ఉన్నాడు అని తెలిసింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులు తిలావత్ చేసి అతనిపై ఊదుతారు, అల్లాహ్ త’ఆలా అతనికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి,

కానీ చివరిలో నేను చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా మనం ఎలా స్వస్థత పొందాలి. మొట్టమొదటి విషయం, నేను చెప్పినటువంటి రెండు విషయాలను నమ్మాలి. అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ ముసబ్బిబుల్ అస్బాబ్, అన్ని సాధనాలకు మూల కారకుడు మరియు ఆ సాధనాలకు ఏ గుణం ఇచ్చాడో, ఆ గుణం ఇచ్చినవాడు అల్లాహ్ మాత్రమేనని. రెండో విషయం, అల్లాహ్ తలచినప్పుడే స్వస్థత కలుగుతుంది, అల్లాహ్ తలచినప్పుడే ప్రతీ సాధనం పని చేస్తుంది, అల్లాహ్ తలచినప్పుడే ఈ సృష్టిలో అల్లాహ్ కోరినది మాత్రమే జరుగుతూ వస్తుంది.

ఈనాటి నా ప్రసంగంలోని సారాంశంలో రెండో విషయం, ఖుర్ఆన్ ను మనం అల్లాహ్ యొక్క గ్రంథం అని, అల్లాహ్ యొక్క వాక్కు అని చాలా బలంగా విశ్వసించాలి. ఈ విశ్వాసంలో ఏ మాత్రం లోటు రాకూడదు, కొరత ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు.

ఈ ఖుర్ఆన్ మన యొక్క రోగాల, హృదయ రోగాలకు కూడా చికిత్స, మంచి ఔషధం, స్వస్థత కలుగుతుంది. అంటే, విశ్వాసం సరిగా లేనివారు విశ్వాసపరులు అవుతారు. నమాజులకు దూరం ఉన్నవారు నమాజు చదవగలుగుతారు. ఇంకా వేరే దుష్కార్యాలు చేసేవారు మంచి కార్యాలు చేయగలుగుతారు. కానీ ఎప్పుడు? ఖుర్ఆన్ ను చదివి శ్రద్ధగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు. ఖుర్ఆన్ గ్రంథం మన యొక్క ధర్మపరమైన అనుమానాలకు మంచి స్వస్థత కలుగజేస్తుంది. మరియు ఖుర్ఆన్ గ్రంథం మనలో ఏ చెడు పనుల గురించి కోరికలు పుడతాయో, మన యొక్క చెడు మనస్సు ఏ చెడులకైతే ప్రేరేపిస్తుందో, వాటన్నిటి నుండి కూడా అల్హందులిల్లాహ్ స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా? ఖుర్ఆన్ ను చదవడం ద్వారా, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకోవడం ద్వారా, ఖుర్ఆన్ ప్రకారంగా మన జీవితం గడుపుకోవడం ద్వారా.

అలాగే ఖుర్ఆన్ మన యొక్క శారీరక రోగాలకు కూడా మంచి స్వస్థత. అది కూడా ఎప్పుడు? పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, పూర్తి సత్యంతో మనం ఈ ఖుర్ఆన్ ను స్వయం మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు గానీ, లేక వేరే ఇంకా ఏదైనా రోగికి చదవాలి.

కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, ఈ ఖుర్ఆన్ ద్వారా అల్హందులిల్లాహ్ అల్లాహ్ త’ఆలా ఏ స్వస్థత మనకు కలుగజేస్తాడని శుభవార్త ఇచ్చాడో, ఖుర్ఆన్ లోని ఎన్నో ఆయతులలో, ఈ ఖుర్ఆన్ ను ప్రజల రోగాల కొరకు స్వస్థత అని ప్రజల విశ్వాసాలను పాడు చేయకూడదు. అబద్ధపు, అసత్యపు బోర్డులు వేసి, సోషల్ మీడియా ద్వారా తమ గురించి ప్రచారం చేసుకుంటూ, తమ నెంబర్ ప్రజలకు ఇస్తూ, రూహానీ ఇలాజ్, ఖురానీ ఇలాజ్ మా దగ్గర జరుగుతుంది అంటూ వారిని షిర్క్ లో పడవేయడం గానీ, ఖురానీ ఇలాజ్ అన్న పేరుతో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి, ఫలానా రాత్రి, ఫలానా చోట జిబా చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, సోదర మహాశయులారా ఫలానా సమాధి వద్ద, ఫలానా బాబాగారు ఖుర్ఆన్ తో ఇలాజ్ మరియు స్వస్థత కలుగజేస్తాడట అని అలాంటి సమాధుల వైపునకు వెళ్లడం, ఈ విషయాలన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను చివరిలో, ఈ తప్పు విషయాల నుండి మనం చాలా దూరం ఉండాలి. వీటి ద్వారా విశ్వాసం పాడైపోతుంది, వీటి ద్వారా మనం ఇస్లాం నుండి దూరమైపోతాము అని మనం భయపడాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్ ద్వారా సరైన రీతిలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త యొక్క పద్ధతి, విధానంలో స్వస్థత కోరే, పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వ ఆఖిరు దఅవానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

  • అల్లాహ్‌పై దృఢ విశ్వాసం: సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదని గట్టిగా నమ్మాలి. అన్నీ ఆయన తలచినప్పుడే జరుగుతాయి.
  • ఖుర్ఆన్ – కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత: అల్లాహ్ ఖుర్ఆన్‌ను కేవలం ఔషధం (దవా) లేదా చికిత్స (ఇలాజ్) అని చెప్పలేదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఖుర్ఆన్ ద్వారా రోగం పూర్తిగా నయమవుతుంది.
  • శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు నివారణ: ఖుర్ఆన్ కేవలం జ్వరం, నొప్పి వంటి శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు, చెడు ఆలోచనలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది.
  • విశ్వాసులకు ప్రత్యేకం: ఖుర్ఆన్ సర్వమానవాళికి మార్గదర్శకమైనప్పటికీ, దాని ద్వారా సంపూర్ణ స్వస్థత మరియు కారుణ్యం పొందేది విశ్వాసులు మాత్రమే. ఎందుకంటే వారు దానిని నమ్మి ఆచరిస్తారు.
  • సరైన పద్ధతిలో ఆచరించడం ముఖ్యం: తేనె సీసా ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం రానట్లే, ఖుర్ఆన్‌ను చదవకుండా, అర్థం చేసుకోకుండా, దాని బోధనలను ఆచరించకుండా ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత కలగదు.
  • మూఢనమ్మకాలకు దూరం: ఖుర్ఆన్ పేరుతో నిమ్మకాయలు, కోడి బలులు, సమాధుల వద్ద మొక్కుబడులు వంటి షిర్క్ మరియు మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఇది విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.
  • లౌకిక చికిత్సను తిరస్కరించరాదు: ఖుర్ఆన్ స్వస్థత ఇస్తుందని వైద్య చికిత్సను మానేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చికిత్స చేయించుకోవాలని బోధించారు. ఖుర్ఆన్ పారాయణంతో పాటు వైద్యం కూడా కొనసాగించాలి.
  1. విశ్వాసాన్ని బలపరచుకోండి: ప్రతిదీ అల్లాహ్ అధీనంలోనే ఉందని, ఆయన తలచినప్పుడే స్వస్థత లభిస్తుందని మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి.
  2. ఖుర్ఆన్‌ను రోజూ పారాయణం చేయండి: ఖుర్ఆన్‌ను అర్థంతో సహా క్రమం తప్పకుండా చదవండి. దాని బోధనలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి.
  3. రుఖియా (ఖుర్ఆన్ ద్వారా చికిత్స) చేసుకోండి: అనారోగ్యానికి గురైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిలో సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫలక్, సూరతున్నాస్ వంటి సూరాలను చదివి మీపై లేదా రోగిపై ఊదుకోండి.
  4. దువా చేయండి: స్వస్థత కోసం అల్లాహ్‌ను ప్రార్థించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దువాలను నేర్చుకొని వాటి ద్వారా అల్లాహ్‌ను వేడుకోండి.
  5. పాపాలకు దూరంగా ఉండండి: స్వస్థతకు అడ్డుపడే పాప కార్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
  6. మూఢనమ్మకాలను వదిలివేయండి: ఖుర్ఆన్ పేరుతో జరిగే మోసాలకు, షిర్క్‌కు దారితీసే పద్ధతులకు దూరంగా ఉండండి. స్వస్థతను ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమేనని నమ్మండి.
  7. వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు: రుఖియాతో పాటు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోండి మరియు వారు సూచించిన మందులను వాడండి. ఇస్లాం వైద్య చికిత్సను ప్రోత్సహిస్తుంది.
  8. సమస్య ఆరంభంలోనే ఖుర్ఆన్‌ను ఆశ్రయించండి: కేవలం అన్ని దారులు మూసుకుపోయాకే కాకుండా, అనారోగ్యం ప్రారంభ దశలోనే ఖుర్ఆన్ ద్వారా స్వస్థత కోసం ప్రయత్నించండి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=13889

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా? [ఆడియో & టెక్స్ట్]

దైవప్రవక్త (ﷺ) వారు అల్లాహ్ ను చూసారా?
https://www.youtube.com/watch?v=085GXx38_nE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూశారా? అనే ప్రశ్నకు ఈ ప్రసంగం సమాధానమిస్తుంది. ప్రవక్త అల్లాహ్‌ను చూడలేదని స్పష్టంగా చెప్పబడింది. ఈ వాదనను బలపరచడానికి, సహీహ్ ముస్లిం మరియు సహీహ్ బుఖారీ నుండి రెండు హదీసులు ఉదహరించబడ్డాయి. మొదటి హదీసులో, అబూ దర్ (రదియల్లాహు అన్హు) ప్రవక్తను నేరుగా అడిగినప్పుడు, “అతను కాంతి (నూర్), నేను ఎలా చూడగలను?” అని ప్రవక్త సమాధానమిచ్చారు. రెండవ హదీసులో, మస్రూక్ ఇదే ప్రశ్నను ఆయిషా (రదియల్లాహు అన్హా)ను అడిగినప్పుడు, ప్రవక్త అల్లాహ్‌ను చూశారని చెప్పేవారు అబద్ధం చెప్పినట్లేనని ఆమె తీవ్రంగా స్పందించి, ఖురాన్ ఆయత్‌ను ఉదహరించారు. అయితే, ప్రళయ దినాన స్వర్గంలో విశ్వాసులందరూ అల్లాహ్‌ను చూస్తారని కూడా వివరించబడింది.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూశారా? సరైన సమాధానం చూడలేదు. అవును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను చూడలేదు.కొందరు అనుకుంటారు మేరాజ్ పోయినప్పుడు చూశారు కదా అని. కానీ, ఇది సరైన మాట కాదు.

సహీహ్ ముస్లిం షరీఫ్ లో హదీస్ నెంబర్ 178, అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، هَلْ رَأَيْتَ رَبَّكَ؟ قَالَ: نُورٌ أَنَّى أَرَاهُ
(స’అల్తు రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, హల్ ర’అయిత రబ్బక్? ఖాల్: నూరున్ అన్నా అరాహు)

“నేను స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించాను. ‘ప్రవక్తా, మీరు మీ ప్రభువును చూశారా?’ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ‘అతను సర్వమూ నూర్ (కాంతి). నేను ఎలా చూడగలుగుతాను?'”

అతను సర్వమూ నూర్, కాంతి, ప్రకాశం. నేను ఎలా చూడగలుగుతాను? అబూ దర్ రదియల్లాహు అన్హు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగితే ప్రవక్త ఇలా సమాధానం ఇచ్చారు.

అయితే మరొక హదీస్ చూడండి సహీహ్ బుఖారీలో వచ్చింది. హదీస్ నెంబర్ 4855. ఇంతకుముందు దీనిలోని ఒక భాగం మనం విని ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ టాపిక్‌కు సంబంధించిన విషయం వినండి.

మస్రూక్ రహిమహుల్లాహ్, ఆయిషా రదియల్లాహు అన్హాతో ప్రశ్నించారు, “ఓ మాతృమూర్తి!,

هَلْ رَأَى مُحَمَّدٌ صلى الله عليه وسلم رَبَّهُ
(హల్ ర’ఆ ముహమ్మదున్ సల్లల్లాహు అలైహి వసల్లం రబ్బహు)
‘ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారా?'”

فَقَالَتْ لَقَدْ قَفَّ شَعْرِي مِمَّا قُلْتَ
(ఫఖాలత్ లఖద్ ఖఫ్ఫ ష’రీ మిమ్మా ఖుల్త్)
వినండి, ఆయిషా రదియల్లాహు అన్హా ఏమంటున్నారు, మస్రూక్ అంటున్నారు, ఫఖాలత్ (ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు),

“నీవు చెప్పిన ఈ మాటతో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఈ మూడు మాటల నుండి, విషయాల నుండి నువ్వు ఎక్కడున్నావు? తెలియకుండా ఇంకా ఎందుకున్నావు? ఎవరైతే నీతో చెబుతాడో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువుని చూశారని, فَقَدْ كَذَبَ (ఫఖద్ కదబ్) “అతడు అబద్ధం పలికాడు.” అసత్యం మాట్లాడాడు.

మళ్ళీ ఆయిషా రదియల్లాహు తా’ఆలా అన్హా ఈ ఆయత్ ను పఠించారు:

لَا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
(లా తుద్రికుహుల్ అబ్సారు వహువ యుద్రికుల్ అబ్సార వహువల్లతీఫుల్ ఖబీర్)

“ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వమూ తెలిసినవాడు.”

ఈ విధంగా ఈ రెండు హదీసులు మరియు ఖురాన్ ఆయత్ ద్వారా మనకు తెలిసిన బోధ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్‌కు వెళ్ళినప్పుడు గానీ, ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలం గానీ, ఎప్పుడూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్‌ను చూడలేదు.

అయితే ప్రళయ దినాన స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అల్లాహ్‌ను చూస్తారు మరియు ఇన్ షా అల్లాహ్ విశ్వాసులందరూ కూడా తప్పకుండా చూస్తారు.

وُجُوهٌ يَوْمَئِذٍ نَاضِرَةٌ * إِلَى رَبِّهَا نَاظِرَةٌ
(వుజూహున్ యవ్‌మఇదిన్ నాదిరహ్, ఇలా రబ్బిహా నాదిరహ్)
“ఆ రోజు కొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి. తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటాయి.”

ఇంకా వేరే ఎన్నో ఆయతులు, హదీసులు కూడా దీనికి దలీలుగా ఉన్నాయి.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ : https://teluguislam.net/?p=11473

అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ ను మనం ఎలా గుర్తించాలి? [ఆడియో & టెక్స్ట్]

నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి?
https://youtu.be/YXvC41kqzPw (8:34 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్‌లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.

అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్‌గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్‌ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్‌ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.

అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.

ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.

అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఖుల్ హువల్లాహు అహద్
اللَّهُ الصَّمَدُ
అల్లాహుస్ సమద్
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
లమ్ యలిద్ వలమ్ యూలద్
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్

వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.

ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్‌లోని 112వ అధ్యాయం.

ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.

ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌۭ وَلَا نَوْمٌۭ ۚ لَّهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ مَن ذَا ٱلَّذِى يَشْفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذْنِهِۦ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَىْءٍۢ مِّنْ عِلْمِهِۦٓ إِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ ۖ وَلَا يَـُٔودُهُۥ حِفْظُهُمَا ۚ وَهُوَ ٱلْعَلِىُّ ٱلْعَظِيمُ ٢٥٥

ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారు పది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:

అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.

అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.

అల్లాహ్ (త’ఆలా) – Main Page
https://teluguislam.net/allah/

అల్లాహ్ యొక్క ప్రేమను ఎలా పొందగలుగుతాము? [ఆడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి? [ఆడియో & టెక్స్ట్]

అల్లాహ్ అంటే ఎవరు? ఇస్లాం అంటే ఏమిటి?
https://youtu.be/e6YALKM5wwU [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, అల్లాహ్ యొక్క ఏకత్వం, ఆయన గుణగణాలు మరియు సృష్టిలో ఆయన పాత్ర గురించి వివరించబడింది. అల్లాహ్ యే ఈ సృష్టి అంతటికీ మూలాధారుడని, ఆయనే జీవన్మరణాలకు అధిపతి అని మరియు సర్వ మానవాళికి ఉపాధిని ప్రసాదించేవాడని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేయబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ ప్రవక్తలను పంపాడని, వారిలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పబడింది. ఇస్లాం అంటే అల్లాహ్ కు లొంగిపోవడమని, ఇది కేవలం ఒక మతవర్గానికి చెందినది కాదని, సర్వ మానవాళికి చెందిన సత్య ధర్మమని నొక్కి చెప్పబడింది. భారతదేశంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోనే ప్రవేశించిందని, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం కూడా భారత ఖండంలోనే అవతరించారని చారిత్రక ఆధారాలతో వివరించబడింది. చివరగా, ఇస్లాంను కాదని మరో మార్గాన్ని అనుసరించేవారు పరలోకంలో నష్టపోతారని ఖురాన్ హెచ్చరికతో ప్రసంగం ముగించబడింది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

అల్లాహ్ త’ఆలా ఈ సృష్టి అంతటికీ మూలాధారుడు. ఆది నుండి ఉన్నవాడు, అంతము వరకు ఉండేవాడు. సర్వ ప్రాణి, సర్వ సృష్టికి సమాప్తము, వినాశనము అనేది ఉంటుంది. కానీ అల్లాహ్, అతనికి ఎలాంటి మరణము గానీ, ఎలాంటి సమాప్తము గానీ లేదు.

అల్లాహ్, ఏ అస్తిత్వాన్ని, ఎవరినైతే మనం అల్లాహ్ అని అంటామో ఆయన గురించి ఖురాన్ దివ్య గ్రంథంలో ఎన్నో ఆయతులలో ఆయన యొక్క పరిచయం చాలా వివరంగా ఉంది.

اللَّهُ الَّذِي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ
(అల్లాహుల్లదీ ఖలకకుమ్, సుమ్మ రజఖకుమ్, సుమ్మ యుమీతుకుమ్, సుమ్మ యుహ్యీకుమ్)
ఆయనే మిమ్మల్ని సృష్టించినవాడు. అల్లాహ్ ఆయనే మీ అందరికీ ఆహారం ప్రసాదించేవాడు. ఆ అల్లాహ్ యే మీ అందరికీ మరణం ప్రసాదిస్తాడు మరియు ఆ తర్వాత మరోసారి మిమ్మల్ని బ్రతికిస్తాడు, తిరిగి లేపుతాడు. (30:40)

ఈ విధంగా చూసుకుంటూ పోతే అల్లాహ్ గురించి ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకంగా సూర రూమ్, ఇంకా వేరే కొన్ని సూరాలలో చాలా స్పష్టంగా ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఆరాఫ్, ఆయత్ నంబర్ 54.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ يُغْشِي اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا وَالشَّمْسَ وَالْقَمَرَ وَالنُّجُومَ مُسَخَّرَاتٍ بِأَمْرِهِ ۗ أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు. ఆ తరువాత సింహాసనంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. అది దాన్ని వేగంగా వెంబడిస్తూ వస్తుంది. ఇంకా ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌ అపారమైన శుభాలు కలవాడు.(7:54)

ఆయనే రాత్రిని పగటిపై కప్పుతున్నాడు. మరియు ఈ పగలు అనేది రాత్రి వెంట పడుతుంది. మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. వినండి, ఈ లోకంలో ఆదేశం చెల్లేది, ఆజ్ఞ పాలన జరిగేది అల్లాహ్ ది మాత్రమే. సృష్టి ఆయనదే గనక ఆజ్ఞా పాలన కూడా ఆయనదే జరుగును. ఆ అల్లాహ్ సర్వ విశ్వ విశ్వాసాలకు, ఈ సర్వ లోకాలకు ప్రభువు, చాలా శుభము కలవాడు.

ఇంకా ఖురాన్ గ్రంథంలో మనం చూసినట్లయితే,

اللَّهُ الَّذِي رَفَعَ السَّمَاوَاتِ بِغَيْرِ عَمَدٍ تَرَوْنَهَا
(అల్లాహుల్లదీ రఫ అస్సమావాత్ బిగైరి అమదిన్ తరౌనహా)
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. (13:2)

ఆ ఆకాశాలను ఎలాంటి పిల్లర్ లేకుండా ఏ ఒక్క పిల్లర్ లేకుండా పైకి లేపి నిలిపాడు, తరౌనహా, దీనికి ఏ ఒక్క పిల్లర్ లేని విషయం మీరు చూస్తున్నారు. మరోచోట సూర ఇబ్రాహీంలో,

اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
(అల్లాహుల్లదీ లహూ మా ఫిస్సమావాతి వ మా ఫిల్ అర్ద్)
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. (14:2)

وَوَيْلٌ لِلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
(వ వైలున్ లిల్ కాఫిరీన మిన్ అదాబిన్ షదీద్)
తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది. (14:2)

మరి ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తున్నారో, అల్లాహ్ ను తిరస్కరిస్తున్నారో అలాంటి వారికి వినాశనం ఉంది మరియు చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఇంకా ఈ రకంగా చూసుకుంటే ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఉదాహరణకు సూర ఇబ్రాహీం.

اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు. (14:32)

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, ఆ సృష్టికర్త, పోషణకర్త, జీవన్మరణాల ప్రధాత, ఈ సర్వ సృష్టికి మూలం ఆయనే. అయితే సర్వ సృష్టిని మన సేవ కొరకు, మనం వాటి ద్వారా లాభం పొందడానికి సృష్టించాడు. సూర బఖరాలోని మూడవ రుకూలో,

هُوَ الَّذِي خَلَقَ لَكُمْ مَا فِي الْأَرْضِ جَمِيعًا
(అల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ)
భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకే సృష్టించినవాడు ఆయనే. (2:29)

ఆ అల్లాహు త’ఆలా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని, ఖలక లకుమ్ మా ఫిల్ అర్ది జమీఆ, సమస్తాన్ని మీ కొరకు పుట్టించాడు. కానీ మనల్ని కేవలం ఆయన్ని ఆరాధించుటకే పుట్టించాడు. ఆయన్ను ఎలా ఆరాధించాలి? అందుకొరకు ఆయన స్వయంగా ఏదైనా అవతారం ఎత్తి ఈ లోకంలో రాలేదు. ఎలాగైతే వేరే కొందరు తప్పుడు మార్గాల్లో ఉన్నారో, కొందరు ఏమనుకుంటారు, స్వయంగా అల్లాహ్ లేదా వారి వారి భాషల్లో వారు అల్లాహ్ ను దేవుడు అని, ఈశ్వరుడు అని ఏదైతే అనుకుంటారో వారి యొక్క తప్పుడు విశ్వాస ప్రకారం, ఆ సృష్టికర్త మానవులకు మార్గం చూపడానికి అవతారం ఎత్తి వస్తాడు అని, లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దేవుడై వారిలో ఒకరిని మానవులకు మార్గం చూపడానికి పంపాడు అని, ఇవన్నీ కూడా తప్పుడు విశ్వాసాలు.

ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ ఏం చేశాడు? ఆయన మానవుల్లోనే అతి ఉత్తమ నడవడిక గల మరియు మానవుల్లోనే అందరికీ తెలిసి ఉన్న ఒక మంచి వ్యక్తిని తనకు మరియు తన దాసులకు మధ్య ప్రవక్తగా, ఒక సందేశ దూతగా ఎన్నుకున్నాడు.

اللَّهُ يَصْطَفِي مِنَ الْمَلَائِكَةِ رُسُلًا وَمِنَ النَّاسِ
(అల్లాహు యస్తఫీ మినల్ మలాఇకతి రుసులన్ వ మినన్నాస్)
అల్లాహ్ తన సందేశహరులుగా దైవదూతలలో నుండి, మానవులలో నుండి ఎన్నుకుంటాడు. (22:75)

అల్లాహు త’ఆలా దైవదూతల్లో కూడా సందేశ దూతలను ఎన్నుకుంటాడు, అలాగే మానవుల్లో కూడా అల్లాహు త’ఆలా తనకిష్టమైన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. ఎన్నుకొని అతని వద్దకు తన దూత ద్వారా గాని లేదా డైరెక్ట్ అతని హృదయ ఫలకం మీద తన యొక్క సందేశాన్ని అవతరింపజేస్తాడు. ఆ ప్రవక్త అల్లాహ్ యొక్క ఆ సందేశాన్ని తీసుకొని, స్వీకరించి, నేర్చుకొని, తర్వాత ప్రజలకు వినిపిస్తారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం తెలిపి ఉన్నాడు. అల్లాహు త’ఆలా తనకిష్టమైన ప్రజల్లోని ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత ఆ ప్రవక్తగా చేసిన తర్వాత అతని వద్దకు దైవదూతను పంపి గానీ, అతని వద్దకు దివ్యవాణి పంపి గానీ, వహీ. మరి లేదా ఏదైనా పర్దా, హిజాబ్ అడ్డులో ఉండి మాట్లాడి గానీ అల్లాహు త’ఆలా తన యొక్క సందేశాన్ని అతని వద్దకు చేర్పిస్తాడు. ఈ విధంగా మానవులు ఎలా అల్లాహ్ ను ఆరాధించాలి, ఆ ఆరాధన మార్గాన్ని తన ప్రవక్తల ద్వారా వారికి నేర్పుతాడు.

ఇక ఎవరైతే వక్రమార్గంలో పడి, స్వాభావిక వారి యొక్క ఫిత్రత్, స్వాభావికం, ప్రకృతి విధానాన్ని వదిలేసి తప్పుడు ఆచారాల్లో, దురాచారాల్లో పడి ఉంటారో, వారు ఏమంటారు, ఈ మాలాంటి ఒక మనిషి మమ్మల్ని ఎందుకు మంచి గురించి చెప్పాలి? ఎందరో ప్రవక్త కాలాల్లో ప్రవక్తను తిరస్కరించినవారు,

أَبَشَرٌ يَهْدُونَنَا
(అ బషరున్ యహ్దూననా)
‘ఏమిటి, సాటి మానవులు మాకు మార్గదర్శకత్వం చేస్తారా?!’ (64:6)

మాలాంటి మనిషే కదా ఇతను, ఇతని మీదనే అల్లాహు త’ఆలా ఎందుకు వహీ పంపాడు? ఇతన్నే ప్రవక్తగా ఎందుకు ఎన్నుకున్నాడు? మాలో ఇంకా వేరే ఎవరు లేకుండేనా? అంటే దీని భావం ఏంటి? ఈ విధంగా వ్యతిరేకించడం మనిషిలో ఈ వ్యతిరేక గుణం మొదలైంది అంటే, ప్రతి దాన్ని, స్వయంగా తన తండ్రిని అనవచ్చు. నువ్వే నాకు ఎందుకు తండ్రిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే నాకు ఎందుకు తల్లిగా అయినావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? నువ్వే మాకు ఎందుకు రాజుగా ఉన్నావు? వేరే ఒకడు ఎందుకు కాలేదు? ఇతడే ఎందుకు మాకు ప్రవక్తగా వచ్చాడు అన్న విషయం, దాని గురించి అల్లాహు త’ఆలా ఒక సమాధానం ఏమి చెప్పాడు? అల్లాహ్ అతనిదే సృష్టి, అతనిదే ఆజ్ఞా పాలన జరుగును. అతడు తాను కోరిన వారిని ప్రవక్తగా ఎన్నుకుంటాడు. అల్లాహ్ యొక్క సృష్టిలో అల్లాహ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడిగే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే అల్లాహ్ చేసేది మానవుల మేలు కొరకు, అది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేస్తారో వారు ప్రకృతి సిద్ధాంతాలకు దూరమై వక్రమార్గంలో నడుస్తూ ఉంటారు.

మరికొందరు ఏమన్నారు? సరే, మాకు సన్మార్గం చూపడానికి అల్లాహ్ యొక్క ఇష్టం ఉండేది ఉంటే, ఏదైనా దైవదూతలను పంపే, పంపకపోయేదా? దైవదూతలను ఎందుకు పంపలేదు? అయితే సూర అన్ఆమ్ లో దాని యొక్క సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. వలౌ జఅల్నాహు మలకన్, ఒకవేళ దైవదూతలను మేము వారి మధ్యలో ప్రవక్తగా చేసి పంపినా, వారిని ఆ దైవదూత రూపంలో ఉంచలేము. వారిని ఒక మనిషిగా చేసి వారికి ఎందుకంటే గమనించండి, మానవుల అవసరాలు దైవదూతల అవసరాలకు భిన్నంగా ఉంటాయి. అయితే మానవులకు సన్మార్గం చూపడానికి మానవుల్లోనే ఒక జ్ఞానం ఉన్న, మంచి నడవడిక గల, ఇతరులకు ఆదర్శంగా ఉండగలిగే అటువంటి వారినే అల్లాహు త’ఆలా ఎన్నుకుంటాడు.

అయితే సోదరులారా, చెప్పే విషయం ఏంటంటే, అల్లాహ్, ఆయన ఎలాంటి అవతారం ఎత్తడు. ఆయన ఒకరి ఏదైనా వేషంలో ఇహలోకంలోకి రాడు, మానవులకు మార్గం చూపడానికి. ఆయన సిద్ధాంతం ఏంటి? ఇంతకుముందు గ్రంథాల్లో కూడా ఆ విషయాల్ని తెలియబరిచాడు. చిట్టచివరి గ్రంథం ఖురాన్ లో కూడా స్పష్టపరిచాడు. అయితే మానవులకు మార్గం చూపడానికి అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపర ఏదైతే మొదలుపెట్టాడో ఆదం అలైహిస్సలాం నుండి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఈ పరంపర సాగుతూ వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ ప్రవక్తల పరంపరను అల్లాహు త’ఆలా అంతం చేశాడు. ఆయనను చివరి ప్రవక్తగా పంపాడు. మరియు ప్రళయం సంభవించే వరకు ఆ ప్రవక్తనే మనం ఆదర్శంగా, మనం అంటే సర్వ మానవులం, ఆదర్శంగా చేసుకొని అల్లాహ్ ఆయనపై పంపినటువంటి దివ్య ఖురాన్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, ఆ దివ్య ఖురాన్ ను ప్రవక్త ముహమ్మద్ వారు ఎలా ఆచరించారో అలా ఆచరించే ప్రయత్నం చేయాలి అని అల్లాహ్ మనకు ఆదేశించాడు. అందు గురించి సూర ఇబ్రాహీం గానీ ఇంకా వేరే సూరాలు మనం చూసేది ఉంటే,

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ
(కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినజ్జులుమాతి ఇలన్నూర్)
(ఇది) ఒక గ్రంథం. దీనిని మేము నీపై అవతరింపజేశాము – నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. (14:1)

సర్వ ప్రజల్ని మీరు చీకట్లలో నుండి తీసి వెలుతురులోకి, ప్రకాశంలోకి తీసుకురావాలి అని. అయితే ఈ రోజుల్లో ఎంతోమంది ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోలేదో, వారు ఏమనుకుంటారు, ఇస్లాం ధర్మం అన్నది ప్రవక్త ముహమ్మద్ ది. ఇది కేవలం ముస్లింల ప్రవక్త, కేవలం ముస్లింల ధర్మం మరియు ఖురాన్ ఇది కేవలం ముస్లింల ధర్మం. కానీ ఇది నిజమైన మాట కాదు.

స్వయంగా ఒకవేళ మనం ఖురాన్ లో చూసి ఉంటే, ఇక్కడ ఎన్నో సందర్భాల్లో అల్లాహు త’ఆలా ఖురాన్ గురించి, ప్రవక్త ముహమ్మద్ గురించి, ఇస్లాం ధర్మం గురించి, అల్లాహ్ గురించి, అల్లాహ్ అంటే అల్లాహ్ స్వయంగా తన గురించి, అల్లాహ్ అనే అతను ముస్లింల దేవుడే కాదు. సర్వ మానవుల దేవుడు. అందు గురించి ఖురాన్ స్టార్టింగ్ లోనే మొట్టమొదటి ఆదేశం అని అనబడుతుంది. రెండో రుకూ పూర్తయిన తర్వాత మూడో రుకూ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
(యా అయ్యుహన్నాస్ ఉ’బుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మిమ్మల్ని, మీకు పూర్వం గడిచిన వారిని సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. తద్వారా మీరు దైవభీతిపరులు కాగలరు. (2:21)

ఓ ప్రజలారా, ముస్లింలారా, అరబ్బులారా, ఈ విధంగా అనబడలేదు. యా అయ్యుహన్నాస్, ఓ ప్రజలారా, ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువుని మీరు ఆరాధించండి. ఎవరు ఆ ప్రభువు? అల్లదీ ఖలకకుమ్, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, వల్లదీన మిన్ కబ్లికుమ్, మీ కంటే ముందు ఉన్న వారిని, ముందు గతించిన వారిని పుట్టించాడో. లఅల్లకుమ్ తత్తకూన్, ఈ విధంగా మీరు నరకం నుండి తమకు తాము రక్షించుకోవచ్చు.

అయితే ఇక్కడ సర్వ ప్రజల్ని అల్లాహ్ ఉద్దేశించి కేవలం ఆ ఏకైక సృష్టికర్తను, అల్లాహ్ ను మాత్రమే పూజించాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా,

يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا
(యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ)
“ఓ మానవులారా! నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను.” (7:158)

ఓ జనులారా, ఓ మానవులారా, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా చేసి పంపబడ్డాను. సందేశ దూతగా పంపబడ్డాను. ఎవరి వైపు నుండి? ఆ అల్లాహ్ వైపు నుండి,

الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ
(లహూ ముల్కుస్సమావాతి వల్ అర్ద్)
భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)

ఈ సర్వ ఆకాశాల మరియు భూమిలో ఉన్న సర్వానికి అధికారి ఆయన మాత్రమే.

ఇక ఖురాన్ గ్రంథం, ఇంతకుముందు నేను సూర ఇబ్రాహీం ఒక ఆయత్ మీకు ముందు చదివాను, కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస్. ఈ గ్రంథం ఏదైతే మీపై అవతరింపజేశామో, దీని ద్వారా మీరు ప్రజలను, అరబ్బులను అని అనలేదు, ప్రజలను మిమ్మల్ని చీకట్ల నుండి వెలుతురు వైపునకు తీయడానికి పంపాము. అంతేకాకుండా ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన ఆయత్, సర్వసామాన్యంగా ఎందరో హిందువులకు కూడా ఇది తెలిసి ఉంటుంది కావచ్చు.

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنْزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِلنَّاسِ
(షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్, హుదల్లిన్నాస్)
రమజాను నెల – ఆ నెలలోనే ఖుర్ఆన్ అవతరించింది. అది మానవులందరికీ మార్గదర్శకత్వం వహించేది. (2:185)

రమదాన్ మాసంలో ఖురాన్ అవతరించింది, హుదల్లిన్నాస్, ఈ ఖురాన్ సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

అయితే సోదరులారా, ఈ రోజుల్లో సర్వ మానవులు కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని విశ్వసించాలి, ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించాలి, తమ జీవితం అల్లాహ్ పంపిన ఈ గ్రంథం, అల్లాహ్ పంపిన చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ ప్రకారంగానే గడపాలి.

కానీ, మన, సామాన్యంగా మనం, మన తెలుగు దేశంలో అనండి, తెలుగుదేశం అంటున్నాను, అంటే పార్టీ అనట్లే నేను, ఆంధ్ర, తెలంగాణ అని ఇక రెండు పేర్లు చెప్పేదానికి బదులుగా, లేక మొత్తం భారతదేశంలో అనండి, సామాన్యంగా ఏమంటారు, ఈ ఇస్లాం దేశం ఒక 700 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మన ఇండియాలోకి వచ్చింది. అంతకుముందు ఇస్లాం అనేది లేదు. అందు గురించి మధ్యంతరంలో పుట్టుకొచ్చిన విషయం ఇది, దీన్ని ఎందుకు మనం స్వీకరించాలి? మన తాత ముత్తాతలు పాతకాలం నుండి ఏ ఆచారం మీద ఉన్నారో, ఏ ధర్మం మీద ఉన్నారో అలాగే ఉండాలి అని ఒక మాట అంటారు. విన్నారు కదా ఎన్నోసార్లు.

అయితే దీంతో మనకు గొడవ అవసరం లేదు. ప్రేమపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా, గ్రంథాల ఆధారంతో మీరు సత్యాన్ని తెలుసుకోండి అని వారికి నచ్చచెబుదాము. దానికి మనం ఏ పద్ధతిలో వారికి నచ్చ చెప్పాలి? మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాం అంటే ఏంటి? దాని అర్థం, దాని భావం ఏంటో నచ్చచెప్పాలి. ఇస్లాం అంటే ఏదో కొత్త ధర్మం కాదు. ఇస్లాం అంటే ఒకరికి ఏదైనా శత్రుత్వం వహించే లేదా ఒకరి గురించి ఏదైనా చెడు చూపించేటువంటి విషయం కాదు. ఇస్లాం అన్నదానికి భావం, మనం మన సృష్టికర్తకు లొంగబడి ఆయన ముందు తలవంచి ఆయన ఇష్ట ప్రకారం జీవితం గడపడం. ఇంకా నేను వివరంలో లోతుగా వెళ్ళలేను, సలము నుండి ఒక భావం దీని గురించి లొంగిపోవట అని వస్తుంది. శాంతిని పొందుట అని కూడా వస్తుంది. ఈ రెండిటినీ కలిపితే, మీరు మీ సృష్టికర్తకు లొంగిపోయి ఇహపరలోకాల్లో శాంతిని పొందండి.

ఈ రకంగా చూసుకుంటే, సీన్, లామ్, మీమ్ అన్న ఈ మూడు అక్షరాలు మూల పదం ఏదైతే ఉందో ఇస్లాంకి, దానికి అనుగుణంగా ఈ పదం ఎన్నో రకాలుగా ఏదైతే వాడబడుతుందో, అస్లమ, యుస్లిము, యుస్లిమూన, ముస్లిమూన, ఈ విధంగా ఖురాన్ లో మీరు చూసి ఉంటే, ఒక సందర్భంలో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడో గమనించండి.

أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ
(అఫగైర దీనిల్లాహి యబ్గూన్)
ఏమిటి, వీరు అల్లాహ్ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? (3:83)

ఏమైంది ఈ ప్రజలకు? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మాన్ని మాకు వద్దు, మేము ఈ సత్య ధర్మాన్ని స్వీకరించమని అంటున్నారా, తిరస్కరిస్తున్నారా, ఇష్టం లేదు అని అంటున్నారా?

وَلَهُ أَسْلَمَ مَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا
(వలహూ అస్లమ మన్ ఫిస్సమావాతి వల్ అర్ది తౌఅన్ వ కర్హా)
వాస్తవానికి భూమ్యాకాశాలలోని సమస్త వస్తువులు – ఇష్టపూర్వకంగా గానీ, అయిష్టంగా గానీ – ఆయనకే విధేయత చూపుతున్నాయి. (3:83)

మీరు మానవులు, ఐదు ఫిట్ల మనిషి, నాలుగున్నర ఫిట్ల మనిషి, మీ సంగతేంటి? మీకంటే పెద్ద పెద్ద సృష్టి రాశులు, ఆకాశం, ఆకాశాల్లో ఉన్న సర్వము, భూమి, భూమిలో ఉన్న సర్వము, అవన్నీ కూడా అస్లమ, లొంగిపోయి ఉన్నాయి. విధేయత పాటిస్తున్నాయి. అల్లాహ్ ఆజ్ఞా పాలన చేస్తున్నాయి, వారికి ఇష్టమైనా, ఇష్టం కాకపోయినా. అస్లమ, వారందరూ ఇస్లాంలోకి వచ్చారు, అంటే ఏంటిది? ఈ సర్వ సృష్టి మనం చూస్తున్నాము, సూర్యుడిని అల్లాహ్ పుట్టించినప్పటి నుండి ఒక్కసారైనా దైవం, అంటే అల్లాహ్ యొక్క నిర్ణయం, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ సూర్యుని గురించి నిర్ణయించిన దారిని, మార్గాన్ని ధిక్కరించి, వ్యతిరేకించి నడుస్తుందా? నడుస్తున్నాడా? అలా అయితే ఇప్పటివరకు ఎప్పుడో నాశనం అయిపోయేది.

సోదరులారా, ఈ ఒక్క విషయం చెప్పాను సూర్యుడని. ఇస్లాం ధర్మం అంటే ఏంటిది? ఇది ఏదో కొత్త 400 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం వచ్చిన ధర్మం కాదు. ఆది మానవుడి నుండే కాదు, అంతకు ముందు నుండి ఉంది. ప్రతి సృష్టి అల్లాహ్ కు లొంగి ఉన్నది. అయితే మానవులను కూడా అల్లాహ్ పుట్టించింది ఆయన ఆదేశం పాటించి, ఆయనను మాత్రమే ఆరాధించుటకు.

అయితే చివరిగా ఈ సందేశం సంపూర్ణం చేయబడింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద. అందుగురించే ఇప్పుడు ఇదియే ఇస్లాం, అంటే ఖురాన్, అల్లాహ్, ముహమ్మద్ ప్రవక్త. వీటిని ఈ ముగ్గురిని, మూడింటిని మనం స్వీకరించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం ప్రకారంగా జీవితం గడపడం తప్పనిసరి.

ఇక ఏదైతే పుకారు ఉందో, వెయ్యి సంవత్సరాల క్రితమని, ఇది కూడా తప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో ఉన్నప్పుడే భారత ఖండంలో ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం అంటే ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిచయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన సత్య ధర్మం అప్పుడే ఇండియాలో చేరింది. ఇప్పటికీ దాని యొక్క గుర్తులు, దాని యొక్క చిహ్నాలు కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించిన సహాబాలు, వారిలో ఇద్దరి సమాధులు ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. కానీ చరిత్ర నుండి కూడా దూరమై, కళ్ళు మూసుకొని లేదా తెలిసినప్పటికీ వాటి మీద ముసుగు వేసి సత్యాన్ని స్వీకరించకపోతే అది వేరే విషయం.

మరొక చారిత్రక విషయం, దాని గురించి ఖురాన్ లో, హదీస్ లో ఎలాంటి ప్రూఫ్ అనేది లేదు, కానీ చారిత్రకంగా ఒక విషయం చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది. అదేమిటంటే ఆది మానవుడు అని ఎవరినైతే అనడం జరుగుతుందో, అంటే ఆదం అలైహిస్సలాం మరియు ఆయన యొక్క భార్య హవ్వా అలైహిస్సలాం, వీరిద్దరినీ అల్లాహు త’ఆలా స్వర్గం నుండి ఏదైతే దించాడో అప్పుడు ఆదం అలైహిస్సలాం ఆ కాలంలో ఇండియా, ఇప్పుడు ఉన్న ఇండియా, శ్రీలంక ఇదంతా కలిసి ఉండే, అయితే సరాందీప్ అనే ప్రాంతంలో వచ్చారు, దిగారు, తర్వాత అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి మక్కాలో చేరుకున్నారు అని కూడా చారిత్రకంగా ఒక మాట ఉంది. దీన్ని నిరాకరించడానికి ఇంతకంటే బలమైన ఏదైనా విషయం ఉండేది ఉంటే అది వేరే విషయం. కానీ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను? అయితే మన భారత ఖండంలోనే ఆది మానవుడు అవతరించాడు. ఆ ఆది మానవుడు అల్లాహ్ యొక్క దాసుడు. అతను ముస్లిం. అతని నుండి వచ్చిన సర్వ సంతానము ఇస్లాం ధర్మ ప్రకారంగానే ఉంటుంది. అల్లాహ్ ఖురాన్ లో ఏమి చెప్పాడు?

فِطْرَتَ اللَّهِ الَّتِي فَطَرَ النَّاسَ عَلَيْهَا
(ఫిత్ రతల్లాహిల్లతీ ఫతరన్నాస అలైహా)
అల్లాహ్ మానవులను ఏ ప్రకృతిపై పుట్టించాడో దానినే అవలంబించు. (30:30)

మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, “కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్రా.” పుట్టే ప్రతి పిల్లవాడు ఫిత్రత్, ప్రకృతి ధర్మం, స్వాభావిక ధర్మంపై పుడతాడు. కానీ అతనికి మాటలు రావు, ఇంకా ఏమీ అనుభవం ఉండదు గనక, ఫ అబవాహు యుహవ్విదానిహి. అతని యొక్క తల్లిదండ్రి యూదులైతే, అబ్బాయిని కూడా యూదునిగా చేసేస్తారు. తల్లిదండ్రులు ఒకవేళ అగ్ని పూజారులైతే, ఆ పిల్లవాడు కూడా అలాగే మారిపోతాడు. కానీ ఎప్పుడైతే అతడు పెరుగుతాడో, బుద్ధి జ్ఞానం గలవాడైతాడో, సత్యాన్ని తెలుసుకుంటాడో, ధర్మాన్ని వెతుకుతాడో, అతనికి సత్యం అనేది తెలిసి రావచ్చు. ఒకవేళ ఇహలోక ఏదైనా ఆశలు, ఇహలోక ఏవైనా భయాలు, లేదా హోదా, అంతస్తుల దురాశలు, ఇలాంటివి ఏవీ అడ్డు రాకుంటే, తప్పకుండా మనిషి సత్యం విన్న తర్వాత, అతనికి మాట అర్థమవుతుంది, స్వీకరించగలడు. ఎందుకంటే ఇహలోకంలో నేనే రాజుని అని కాదు, నేనే మీ ప్రభువుని, నా ముందే మీరు తలవంచాలి అన్నటువంటి గర్వానికి గురియై ఎంతో గర్వంతో విర్రవీగుతూ కొంతకాలం ప్రజల్ని తన ముందు, తమ ముందు వంచించుకున్న అలాంటి పెద్ద పెద్ద నాయకులు స్వయంగా వారి ప్రాణం పోయే సందర్భంలో ఏమన్నారు? ఫిరౌన్, అతని కంటే దుర్మార్గుడు, దౌర్జన్యుడు బహుశా ఇంకా వేరే ఒకడు రాలేదు. అతడు కూడా ఏమన్నాడు? మూసా మరియు హారూన్ ల యొక్క ప్రభువు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను అన్నాడు.

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ ప్రవక్త. ఆయన కాలంలో ఎవరైతే ప్రవక్తకు వ్యతిరేకంగా నాయకత్వం వహించారో, వారిలో ఒకరి పేరు అబూ జహల్. ప్రవక్త అతని గురించి ఏమన్నాడు ఒకసారి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ జహల్ గురించి ఒకసారి ఏమన్నారు? ఈ అబూ జహల్ ఈ కాలానికి ఫిరౌన్ లాంటివాడు. కానీ అంతటి ఆ దుర్మార్గుడు దొంగచాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ పఠించేటప్పుడు వినేవాడు. విన్నాడు. విని, సత్యం అతనికి తెలిసింది. అతని యొక్క దగ్గరి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు లాంటి వాడు, అతన్ని అడిగాడు కూడా, రాత్రి నేను కూడా ఖురాన్ విన్నాను, నువ్వు కూడా దొంగచాటుగా విన్నావు అంటే నేను వినలేదు అని ముందు అన్నాడు. తర్వాత చెప్పాడు, చెప్పే మాట అతనిది బాగానే అనిపిస్తుంది, కానీ ఇతడి వంశం, అబూ జహల్ యొక్క వంశం ముత్తాతల్లో ఒకరి వైపు నుండి వస్తుంది, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబ్దే మునాఫ్ నుండి వస్తారు. వీరి యొక్క వంశంలో వారు ఎలాంటి అన్ని మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చారో, మనం కూడా చేసుకుంటూ వచ్చాము. కానీ ఈరోజు ఇతడు కొత్త ఏదో మాట మొదలు పెట్టాడు కదా, అలాంటి హోదా అంతస్తు మనకు దొరకదు కదా. అంటే కేవలం ప్రపంచ దురాశలకు లోనై సత్యాన్ని తిరస్కరించలేదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత, మదీనా వలస వచ్చిన తర్వాత అక్కడ ప్రవక్తకు శత్రువుల్లో చాలా కఠినంగా వ్యతిరేకించిన వారిలో ఒకతని పేరు హుయై బిన్ అఖ్తబ్, యూదుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యల్లో ఒక భార్య ఎవరు? సఫియ్యా రదియల్లాహు అన్హా. ఆ నాయకుని యొక్క కుమార్తె. ఆమె ఇస్లాం స్వీకరించింది. ప్రవక్తకు భార్యగా అయింది. ఆమె ఒక సందర్భంలో చెప్తుంది, నేను ఇంకా చాలా నా చిన్న వయసు నాది. ప్రవక్త ఆ రోజుల్లో మదీనాలో వచ్చే సందర్భంలో మా నాన్న మరియు మా చిన్న తండ్రి, చాచా, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతడు వచ్చేసాడు మదీనాలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి. మరి ఏంటి ఉద్దేశం? అతని గురించి మన గ్రంథాల్లో కూడా వచ్చింది ఉంది కదా, చిట్టచివరి ప్రవక్త అని. ఇద్దరు ఆ సత్య విషయాలన్నీ తెలుసు వారికి. ఎందుకంటే యూద గ్రంథాల్లో కూడా ప్రవక్త ముహమ్మద్ గురించి వచ్చింది ఉంది ప్రస్తావన. కానీ వారు ఏమన్నారు? లేదు, లేదు, లేదు, మనం ప్రాణం ఉన్నంతవరకు అతన్ని వ్యతిరేకించి, అతనికి తిరుగుబాటుగా, ఎదురుగానే మనం ఉండాలి, అంటే ఈ రోజుల్లో ఏమనవచ్చు మనం, అపోజిషన్ పార్టీలోనే ఉండాలి, ఎప్పుడు కూడా వారితో కలవవద్దు.

అయితే ప్రపంచ దురాశాలకు గురై కూడా ఎందరో ఇలాంటి సత్యాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. అందు గురించి సోదరులారా, ఇవన్నీ మనకు ఇహలోకంలో కొద్ది రోజులు మాత్రమే పనికి వస్తే రావచ్చు, అందరికీ కూడా రావు. కానీ చివరికి చనిపోయే సందర్భంలో కూడా సత్యాన్ని తిరస్కరించడం, ధర్మాన్ని వ్యతిరేకించడం, ఏ మాట మనకు తెలిసిందో అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి దాన్ని అమలు చేయనందుకు, అమలు పరచనందుకు, తప్పకుండా దీని గురించి ప్రశ్నించబడుతుంది మరియు పరలోకంలోనైతే చాలా నష్టపోతాము. అందు గురించి ఖురాన్ లో అల్లాహ్ త’ఆలా ఏం చెప్పాడు?

وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
(వ మన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు)
ఎవడైనా ఇస్లాంను కాదని మరో ధర్మాన్ని అవలంబించదలిస్తే, అది అతని నుండి ఎంతమాత్రం స్వీకరించబడదు. మరి అతను పరలోకంలో నష్టపోయే వారిలో చేరతాడు. (3:85)

ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని తనకు ధర్మంగా ఒప్పుకుంటాడో, దాన్ని స్వీకరించి బ్రతుకుతాడో, ఫలన్ యుఖ్బల మిన్హ్, అది అతని నుండి ఎన్నటికీ స్వీకరించబడదు. వహువ ఫిల్ ఆఖిరతి, ఇక్కడ ఒక విషయం గమనించండి. అల్లాహ్ ఏమంటున్నాడు? వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. అతడు పరలోకంలో చాలా నష్టపోయే వారిలో కలుస్తాడు. ఇహలోకం గురించి చెప్పలేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొందరు తప్పుడు మార్గంలో ఉన్నప్పటికీ అల్లాహ్ తొందరగా పట్టి శిక్షించడు. కొంత వెసులుబాటుని ఇస్తూ ఉంటాడు. అందు గురించి ఇలాంటి వెసులుబాటుని పొంది తప్పుడు భావంలో పడకూడదు. అల్లాహు త’ఆలా మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇస్లాం ధర్మం స్వయంగా అర్థం చేసుకొని ఇతరులకు దానిని అర్థం మంచిగా నచ్చచెప్పే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.