ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.
అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.
అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.
పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.
ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.
పరలోకం అంటే ఏమిటి?
ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.
పరలోకానికి ఆధారాలు
పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:
ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)
ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.
ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.
ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.
పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.
పరలోకంలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు
పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.
వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.
అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.
అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.
అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.
పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…
పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం
పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.
ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.
కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ? 2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ? 3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ? 4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ? 5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ? 8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ? 9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ? 10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత
ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.
అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.
ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.
అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.
మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.
సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.
అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
إن الصدقة لتطفئ عن أهلها حر القبور (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్) నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.
అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس (కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్) ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.
అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.
అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ) నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.
మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.
దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:
ملكان يناديان (మలకాని యునాదియాని) ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.
అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?
اللهم أعط منفقا خلفا (అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్) ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.
దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:
ما نقصت صدقة من مال (మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్) దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:
قال الله: أنفق يا ابن آدم أنفق عليك (ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్) ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.
ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:
أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا (అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా) ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.
అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.
మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.
దానశీలురైన భక్తుల ఉదాహరణలు
ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.
ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.
ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.
మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.
అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:
مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.
ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.
కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.
ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.
దానధర్మాలు చేసే ఉత్తమ మార్గాలు
అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.
మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.
అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.
మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى (అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా) నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.
అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.
అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:
أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ (అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న) ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:
يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها (యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా) ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.
ఎప్పుడు దానధర్మాలు చేయాలి?
ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى (అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.
దానధర్మాలలో పాటించవలసిన జాగ్రత్తలు
ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:
إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول (ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్) ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.
కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.
రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్ఫామ్లో, స్టేటస్లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:
ومن تصدق يرائي فقد أشرك (వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక) ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.
అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.
మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!
ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సూర కాఫిరూన్ అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్) https://youtu.be/q7wEERbzMKU [7 నిముషాలు]
సూరత్ అల్-కాఫిరూన్ (అధ్యాయం 109) యొక్క ప్రాముఖ్యత, ఘనతలు మరియు ప్రధాన బోధనలపై ఈ ప్రసంగం దృష్టి పెడుతుంది. ఈ సూరాను నిద్రపోయే ముందు పఠించడం వలన షిర్క్ (బహుదైవారాధన) నుండి రక్షణ లభిస్తుందని మరియు తౌహీద్ (ఏకేశ్వరోపాసన) పై మరణం సంభవిస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు వివరించబడింది. ఇది ఖురాన్లో నాలుగో వంతుకు సమానమని, మరియు ప్రవక్త దీనిని ఫజ్ర్ మరియు మగ్రిబ్ సున్నత్ నమాజులలో పఠించేవారని హదీసుల ద్వారా తెలియజేయబడింది. మక్కా అవిశ్వాసులు ప్రవక్తతో మతపరమైన రాజీకి ప్రయత్నించినప్పుడు, ఈ సూరా అవతరించి, విశ్వాసంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేసింది. ఇస్లాం మానవ వ్యవహారాల్లో ఇతరులతో సత్ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, కానీ అల్లాహ్ ఆరాధనలో భాగస్వామ్యాన్ని (షిర్క్) తీవ్రంగా ఖండిస్తుందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.
109. సూరా అల్ ఖాఫిరూన్
بِسْمِ اللهِ الرَّحْمَنِ الرَّحِيمِ బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అనంత కరుణామయుడూ, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో
109:2 لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ లా అఅబుదు మా తఅబుదూన్ మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు.
109:3 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ వలా అన్తుం ఆబిదూన మాఅఅబుద్ నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు.
109:4 وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ వలా అన ఆబిదుమ్మా అబత్తుం మీరు ఆరాధించే వాటిని నేను అరాధించబోను.
109:5 وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ వలా అన్ తుం ఆబిదూన మా అఅబుద్ మరి నేను ఆరాధించేవానిని మీరెలాగూ ఆరాధించరు.
109:6 لَكُمْ دِينُكُمْ وَلِيَ دِينِ లకుం దీనుకుమ్ వ లి యదీన్ మీ ధర్మం మీది, నా ధర్మం నాది.”
సూరా యొక్క ఘనతలు
ఈ సూరాకు ఎన్నో ఘనతలు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పడుకునే ముందు ఎవరైతే ఈ సూరా చదువుకుంటారో, దీని అర్థ భావాలను గ్రహిస్తారో, వాస్తవానికి వారు షిర్క్ నుండి మొత్తానికి దూరమై తౌహీద్ పై మరణిస్తారన్నటువంటి శుభవార్త ఇచ్చారు. సునన్ అబీ దావూద్ 5055 యొక్క సహీ హదీస్.
అలాగే ఈ సూరా నాలుగో వంతు ఖురాన్కు సమానం అని సహీ హదీస్లో వచ్చి ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు. హదీస్ నంబర్ 586.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో మరియు మగ్రిబ్ తర్వాత రెండు రకాతుల సున్నతులోని మొదటి రకాతులో ఈ సూరా ఎక్కువగా చదువుతూ ఉండేవారు అని సునన్ నిసాయిలో హదీస్ వచ్చి ఉంది. 992 హదీస్ నంబర్.
హజ్రత్ జాబిర్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒక సహాబీ ఫజ్ర్ కంటే ముందు సున్నతులలోని మొదటి రకాతులో ‘ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్’ మరియు రెండో రకాతులో ‘ఖుల్ హువల్లాహు అహద్’ తిలావత్ చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని మెచ్చుకున్నారు, ప్రశంసించారు. చెప్పారు: “హాదా అబ్దున్ ఆమన బిరబ్బిహ్” – ఈ వ్యక్తి తన ప్రభువును విశ్వసించాడు. ఈ విషయం సహీ ఇబ్నె హిబ్బాన్లో ఉంది 2460, అలాగే షుఅబుల్ ఈమాన్ బైహఖీలో ఉంది 2524, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సిఫతుస్ సలాలో ప్రస్తావించారు.
సూరా యొక్క బోధనలు
ఇందులోని కొన్ని ముఖ్యమైన బోధనలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాము.
అల్లాహు త’ఆలా ఇస్లాం ధర్మం సర్వమానవాళికి ప్రసాదించాడు. సర్వ ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి ఈ ఇస్లాం యొక్క అసలైన బోధన ఏమిటి? మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎలాంటి భాగస్వామి, ఏ సాటి కల్పించకూడదు.
ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళికి ఇదే సందేశం ఇచ్చారు. అయితే ఆయన కాలంలో, ఆయన ఇచ్చేటువంటి ఈ సత్య సందేశాన్ని అడ్డుకోవడానికి విరోధులు, అవిశ్వాసులు, సత్య తిరస్కారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడ్డుకోలేరు మరియు ఈ సత్యధర్మం వ్యాప్తి చెందకుండా ఎలాంటి వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదు.
అప్పుడు ఒక పన్నాగం వారు ఏం పన్నారంటే, “ఓ ముహమ్మద్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక సంవత్సరం మీరు మా దేవుళ్లను ఆరాధించండి, ఒక సంవత్సరం మేము మీ అల్లాహ్ను ఆరాధిస్తాము”. అయితే, అల్లాహు త’ఆలా ఈ సూరా అవతరింపజేసి, ముమ్మాటికీ ఇలా జరగదు, మీరు అల్లాహ్ను ఎంత ఆరాధించినా బహుదైవారాధనను వదులుకోకుంటే మీ యొక్క ఆరాధన నిజమైన ఆరాధన కానే కాదు.
మరియు ఈ సూరాలోని మొదటి ఆయత్లో యా అయ్యుహల్ కాఫిరూన్, ఓ కాఫిరులారా అని అంటే ఇది ఏదైనా దూషణం, తిట్టు కాదు. కొందరు ఇలా అనుకుంటారు. వాస్తవానికి విషయం ఏమంటే, ఎవరైతే అల్లాహ్ను ఏకైక సత్యమైన ఆరాధ్యునిగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తగా నమ్మలేదో, విశ్వసించలేదో వారితో చెప్పడం జరుగుతుంది, ఓ సత్య తిరస్కారులారా అని. ఇక ఎవరైతే అల్లాహ్ ఆరాధనలో ఏకత్వాన్ని పాటించకుండా వేరే ఎవరినైనా భాగస్వామిగా కలుపుతారో, వాస్తవం ఏమిటంటే వారి ఆరాధన కూడా అల్లాహ్ కొరకు కాదు. వారికి దాని యొక్క సరైన ప్రతిఫలం లభించదు.
ఈ రోజుల్లో మత సామరస్యం అన్నటువంటి పేరు మీద కొందరు కొన్ని అవిస్వాసుల పండుగల్లో పాల్గొని, వారిలాంటి వేషధారణ వేసుకొని, వారి యొక్క విగ్రహాల ముందు కొబ్బరికాయ కొట్టడం గానీ, లేదా అక్కడ ఏదైనా వంగడం గానీ, ఇలాంటి కొన్ని పనులు చేసుకుంటూ ఇది మత సామరస్యం అని ఏదైతే చూపుతున్నారో, ఇది అసలైన సామరస్యం కాదు.
ఇస్లాం ధర్మం ముస్లింలకు అవిశ్వాసుల పట్ల మానవ రీత్యా ఉత్తమ నడవడిక అవలంబించి సత్ప్రవర్తనలతో వారితో మెలగాలని ఆదేశిస్తుంది. కానీ అల్లాహ్ ఆరాధనలో ఎలాంటి భాగస్వామ్యం అనేది ఇస్లాం ఒప్పుకోదు. ఈ అసలైన సందేశాన్ని ఈ సూరా ద్వారా గ్రహించాలి మరియు పడుకునే ముందు, ఇంకా మగ్రిబ్, ఫజ్ర్ నమాజులలో ఇలా దీనిని ఖురాన్లోని నాలుగో భాగానికి సమానం అన్నటువంటి ఘనతలు ఏవైతే ప్రసాదించబడ్డాయో, దీని కారణంగా అన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించి తౌహీద్ పై స్థిరంగా ఉండాలి. అల్లాహ్ అందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- ఇల్లు కొనే ముందు పొరుగు వారిని చూడండి అని ఎందుకు అనబడింది ? 2- పొరుగు వారు చెడ్డ వారు కాకుండా ఉండేలా చూడమని ప్రవక్త (స) అల్లాహ్ తో చేసిన దువా ఏమిటి ? 3- కూర వండేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసి వండండి అని ప్రవక్త (స) ఆజ్ఞాపించారు కారణం ఏమిటి ? 4- నమాజులు, ఉపవాసాలు ఆచరించి దాన ధర్మాలు చేసినా ఒక మహిళ నరకానికి వెళ్ళింది కారణం తెలుసా ? 5- తమ పొరుగు వారు ఆకలితో ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని వారికి ఏమవుతుంది ? 6- పొరుగింటి మహిళతో వ్యభిచారం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ? 7- పొరుగింటిలో దోంగతనం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ? 8- అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటూ ప్రవక్త (స) మూడు సార్లు ప్రమాణం చేసి ఎవరి గురించి చెప్పారు ? 9- పొరుగు వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడా ? 10- పొరుగు వారు ఆస్తిలో హక్కుదారులుగా నిర్ణయించబడుతారేమో అని ప్రవక్త (స) కు అనుమానం ఎందుకు కలిగింది ?
ఈ ప్రసంగంలో, ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి ఇస్లామీయ బోధనలు వివరించబడ్డాయి. మంచి పొరుగువారు దొరకడం అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు సౌభాగ్యానికి నిదర్శనమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. ఇస్లాం పొరుగువారితో, వారు ఏ మతానికి చెందినవారైనా సరే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, వారికి కానుకలు ఇచ్చుకోవాలని, వండిన దానిలో వారికి కూడా భాగం ఇవ్వాలని, మరియు వారి అవసరాలకు సహాయపడాలని ఆదేశిస్తుంది. దీనికి విరుద్ధంగా, మాటల ద్వారా గానీ చేతల ద్వారా గానీ పొరుగువారికి హాని కలిగించడం, వారి ప్రాణానికి, మానానికి, ధనానికి నష్టం వాటిల్లేలా చేయడం మహా పాపమని, అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని ప్రవక్త వారు తీవ్రంగా హెచ్చరించారు. పొరుగువారి ఆకలిని తెలిసి కూడా పట్టించుకోని వాడు విశ్వాసి కాజాలడని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇరుగుపొరుగు వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనమంతా నలుగురిలో ఒకరిలాగా జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మనము ఆలోచిస్తే, ప్రతి మనిషి నలుగురి మధ్య జీవించడానికి ఇష్టపడతాడు, ఏకాంతంలో ఒంటరిగా అందరికంటే పక్కగా దూరంగా నివసించడానికి ఇష్టపడడు. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరికీ ఇరుగుపొరుగు వారు ఉన్నారు, మనము కూడా వేరే వారికి ఇరుగుపొరుగు వారిగా ఉంటూ ఉన్నాము.
మంచి పొరుగువారి ప్రాముఖ్యత
అయితే మిత్రులారా, పొరుగువారు మంచివారు అయ్యి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే పెద్దపెద్ద గురువులు, పండితులు, ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు అని వారితో సలహాలు అడిగినప్పుడు,
اُطْلُبِ الْجَارَ قَبْلَ الدَّارِ (ఉత్లుబిల్ జార్ కబ్లద్దార్) ఇంటి కంటే ముందు ఇరుగు పొరుగు వారిని వెతకండి అని సలహా ఇచ్చేవారు. అర్థం ఏమిటంటే ఇల్లు కొనే ముందు పొరుగు వారు ఎలాంటి వారో చూసుకొని, తెలుసుకొని తర్వాత కొనండి అని చెప్పేవారు. అలా ఎందుకు చెప్పేవారంటే, పొరుగు వారు మంచివారు అయితే వారు మీకు అన్ని విధాలా సహాయపడతారు, మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది, ధార్మిక విషయాలలో కూడా వారు మీకు దోహదపడతారు, సహాయపడతారు.
అయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, పొరుగువారు మంచివారు దొరికిపోవటం ఇది సౌభాగ్యానికి నిదర్శనం అని తెలియపరిచి ఉన్నారు. మనం చూచినట్లయితే, అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు.
مِنْ سَعَادَةِ الْمَرْءِ الْجَارُ الصَّالِحُ (మిన్ సఆదతిల్ మర్ఇ అల్ జారుస్ సాలిహు) ఒక వ్యక్తి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమేమిటంటే, అతనికి మంచి పొరుగువారు దొరకడం.
అంటే మనిషి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమైన విషయం ఏమిటంటే, అతనికి మంచి పొరుగు వారు దొరికిపోతారు. అల్లాహు అక్బర్! మంచి పొరుగు వారు దొరకటం, అతని అదృష్టానికి నిదర్శనం, అతను అదృష్టవంతుడు అలాంటి మంచి వారు దొరికిపోతే అని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.
అయితే దీనికి విరుద్ధమైన విషయాన్ని మనం చూచినట్లయితే, ఒకవేళ పొరుగువారు మంచివారు కాదు అంటే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారు తలనొప్పిగా మారిపోతారు. పొరుగువారు మంచివారు కాకపోయినప్పుడు వారు మనకోసము తలనొప్పిగా మారిపోతారు. చాలా సందర్భాలలో చూసిన విషయం ఏమిటంటే, పొరుగు వారి పోరు తట్టుకోలేక ప్రజలు ఇల్లు వదిలేస్తారు లేదంటే అమ్మేస్తారు కూడా.
ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెడ్డ పొరుగు వారు ఉండకూడదు అని అల్లాహ్ శరణు కోరుకుంటూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించేవారు అని సహీ అత్తర్గీబ్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది.
اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ (అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ జారిస్సూయి ఫీ దారిల్ ముకామా) ఓ అల్లాహ్! నేను నివాసముండే ప్రదేశంలో చెడ్డ పొరుగు వాని కీడు నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను.
నేను నివాసం ఉండే ప్రదేశంలో చెడ్డ వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను, చెడ్డ పొరుగు వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉండేవారు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, చెడ్డవారు పొరుగువారుగా ఉండకూడదు. పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని ప్రవక్త వారు సైతము అల్లాహ్ తో శరణు కోరుకుంటున్నారంటే, చెడ్డ పొరుగు వారి వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో మనము గ్రహించవచ్చు.
పొరుగువారితో మన ప్రవర్తన
అయితే మిత్రులారా, మనం ఎలాగైతే మన పొరుగువారు మంచివారు ఉండాలని కోరుకుంటామో, మన పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని కోరుకుంటామో, స్వయంగా మనము కూడా పొరుగు వారి కోసము మంచి వాళ్ళులాగా మారిపోవాలి.
రండి ఇన్షా అల్లాహ్, పొరుగువారి పట్ల, వారి శ్రేయము మరియు వారి మంచి పట్ల ఇస్లాం ఎలాంటి బోధనలు చేసి ఉందో ఇన్షా అల్లాహ్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఇస్లాం మనకు ఆదేశిస్తూ ఉంది. పొరుగువారు, వారు ఎవరైనా సరే, మన సమీప బంధువులైనా సరే, దూరపు బంధువులైనా సరే, అపరిచితులైనా సరే, ఇతర మతస్తులైనా సరే, అందరితో మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పదేపదే తెలియజేస్తూ ఉండేవారు.
مَا زَالَ جِبْرِيلُ يُوصِينِي بِالْجَارِ حَتَّى ظَنَنْتُ أَنَّهُ سَيُوَرِّثُهُ (మాజాల జిబ్రీలు యూసీనీ బిల్ జార్ హత్తా జనన్తు అన్నహు సయువర్రిసుహు) జిబ్రీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చి పదేపదే పొరుగువారి గురించి ఎంతగా బోధించారంటే, బహుశా భవిష్యత్తులో పొరుగువారికి ఆస్తిలో వారసులుగా నిర్ణయించేస్తారేమో అన్న ఆలోచన నాకు కలిగింది.
జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత నా వద్దకు వచ్చి పదేపదే, ఎక్కువగా పొరుగు వారి గురించి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బోధిస్తూ ఉండేవారు. ఆయన ఎంతగా నన్ను బోధించారంటే, భవిష్యత్తులో బహుశా పొరుగు వారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న ఆలోచన నాకు కలిగింది అని ప్రవక్త వారు తెలియజేశారు. అంటే, పొరుగువారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న భావన వచ్చేటట్లుగా బోధించారు అంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అల్లాహ్ మరియు ప్రవక్త వారు మనకు బోధిస్తున్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి.
అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పడానికి మరొక ఉదాహరణ చూడండి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకరోజు ఇంట్లో ఒక పొట్టేలు కోయించారు. సేవకుడు పొట్టేలు కోస్తూ ఉన్నాడు, మాంసము భాగాలు చేస్తూ ఉన్నాడు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు సేవకునితో ఏమంటున్నారంటే, మా పొరుగులో ఉంటున్న యూదునికి కూడా ఈ మాంసంలో నుంచి ఒక భాగము చేరవేయించండి. ఒకసారి చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చారు, ఏమయ్యా నేను చెప్పిన మాట మరవకు, తప్పనిసరిగా పొరుగువారిలో ఉన్న మా ఆ యూద సోదరునికి ఈ మాంసంలోని భాగము చేరవేర్చు అని మళ్లీ చెప్పి వెళ్లారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత వచ్చారు, మళ్లీ చెప్తున్నారు. అలా పదేపదే వచ్చి చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏమన్నారంటే అయ్యా, ఆయన ముస్లిం కాదు కదా, యూదుడు, వేరే మతస్తుడు కదా, మరి ఆయన గురించి మీరు ఇంతగా తాకీదు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశారు. అల్లాహు అక్బర్.
ఆ మాట అడగగానే వెంటనే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, అయ్యా నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఈ ఉల్లేఖనము విని ఉన్నాను. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పదేపదే పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తూ వెళ్లారు. ఎంతగా ఆదేశించారంటే ప్రవక్త వారికి అనుమానం కలిగింది, భవిష్యత్తులో జిబ్రీల్ అలైహిస్సలాం ఏమైనా పొరుగు వారికి తమ ఆస్తిలో వాటాదారులుగా, భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనని నాకు అనుమానం కలిగిందని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ ప్రకారంగా పొరుగువారితో మనము ఎంతగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్న విషయం అక్కడ బోధపడింది, నేను స్వయంగా ప్రవక్త వారి నోట ఆ మాట విని ఉన్నాను కాబట్టి ఒక పొరుగు వానిగా నేను మన పొరుగులో ఉంటున్న యూద సోదరునితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది నాకు ఇస్లాం ఆదేశిస్తున్న విషయము కాబట్టి, తప్పనిసరిగా మీరు ఆ మాంసంలోని భాగము వారికి చేరవేయండి అని తెలియపరిచారు. అల్లాహు అక్బర్.
పొరుగువారు ఎవరైనా సరే వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పటానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. అలాగే పొరుగువారితో మనము ముఖ్యంగా సత్ప్రవర్తనతో పాటు వారి పట్ల ప్రేమ పెంచుకోవడానికి వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి అని ఇస్లాం బోధించింది. చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వెళ్లి ప్రశ్నిస్తూ ఉన్నారు.
يَا رَسُولَ اللَّهِ، إِنَّ لِي جَارَيْنِ، فَإِلَى أَيِّهِمَا أُهْدِي؟ (యా రసూలల్లాహ్, ఇన్నలీ జారైని ఫ ఇలా అయ్యిహిమా అహదీ) ఓ దైవ ప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు, నేను వారిలో ఎవరికి కానుక ఇవ్వాలి?
ఓ దైవ ప్రవక్తా, పొరుగు వారితో కానుకలు ఇచ్చుకుంటూ ఉండాలి, వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, ప్రేమ అభిమానాలు పెరగటానికి, కానుకలు ఇచ్చుకోవాలి అని చెప్పారు కదా, అయితే నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి ముందుగా నేను ఈ కానుక అందజేయాలి అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ తెలియజేస్తూ ఉన్నారు.
قَالَ: “إِلَى أَقْرَبِهِمَا مِنْكِ بَابًا” (కాల: ఇలా అక్ రబి హిమా మిన్కి బాబన్) ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “నీ ఇంటి గుమ్మానికి వారిలో ఎవరి ఇల్లు దగ్గరగా ఉందో (వారికి ఇవ్వు)”.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. ప్రవక్త వారంటున్నారు, మీ గుమ్మానికి ఏ పొరుగువారి ఇల్లు దగ్గరగా ఉందో ముందు వారికి కానుక చేరవేయండి, ఆ తర్వాత ఇతరులకు కూడా చేరవేయండి అని దాని అర్థం. చూశారా? కాబట్టి పొరుగువారితో ప్రేమ అభిమానాలు పెంచుకోవటము కోసము, వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండండి అని ఇస్లాం మనకు బోధించింది మిత్రులారా.
అలాగే, మనం మన ఇంటిలో అప్పుడప్పుడు మంచి మంచి వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇస్లాం ఏమంటుందంటే, మీరు మీ ఇంటిలో మంచి వంటలు చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేయండి, ఆ వంటలో పొరుగువారి భాగాన్ని విస్మరించకండి అని చెబుతుంది. చూడండి అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తూ ఉన్నారు. ఏమని ఆదేశిస్తున్నారో చూడండి. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
يَا أَبَا ذَرٍّ، إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جِيرَانَكَ (యా అబాజర్, ఇజా తబఖ్త మరకతన్ ఫ అక్సిర్ మాఅహా వ తఆహద్ జీరానక్) ఓ అబూజర్! నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు, అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి మరియు నీ పొరుగువారిని పట్టించుకో (వారికి కూడా పంపు).
అల్లాహు అక్బర్. అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తున్నారు, ఓ అబూజర్, నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి. ఏ ఉద్దేశంతో ఎక్కువ వెయ్యమంటున్నారు? మీ పొరుగువారికి ఆ కూరలోని కొద్ది భాగము చేరవేర్చట కొరకు అందులో కొద్దిగా నీరు ఎక్కువ వెయ్యి అంటున్నారు. అల్లాహు అక్బర్.
చూశారా? దీన్నిబట్టి ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, మన ఇంట్లో ఏదైనా మంచి వంటకము మనము చేస్తున్నాము అంటే, అందులో మన పొరుగువారికి కూడా చేరవార్చవలసి ఉంది అన్న ఆలోచనతో మనము వంట చేయాలి, ఆ వంట వండిన తర్వాత అందులో కొద్ది భాగము పొరుగువారికి చేరవేయాలి అని చెప్పారు.
అంతేకాదండి. చాలా గట్టిగా తాకీదు చేయబడి ఉంది పొరుగు వారి గురించి. ఈ హదీస్ వింటే ఇన్షా అల్లాహ్ ఆ విషయం అర్థమవుతుంది. చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి ప్రవక్త వారు తెలియజేస్తున్నారు.
مَا آمَنَ بِي مَنْ بَاتَ شَبْعَانًا وَجَارُهُ جَائِعٌ إِلَى جَنْبِهِ وَهُوَ يَعْلَمُ بِهِ (మా ఆమన బీ మన్ బాత షబ్ఆన వ జారుహు జాయిఉన్ ఇలా జంబిహి వహువ యఅలము బిహి) తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడని తెలిసి కూడా, తాను మాత్రం కడుపు నిండా తిని నిద్రించే వ్యక్తి నన్ను విశ్వసించిన వాడు కాడు.
సహీ అల్ జామిఅ గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రామాణికమైన ఉల్లేఖనం అండి. ప్రవక్త వారు ఏమంటున్నారు, ఆ వ్యక్తి నా మీద విశ్వాసం తీసుకొని రాలేదు. ఎవరి గురించి అంటున్నారు చూడండి. ఎవరైతే తాను మాత్రం కడుపునిండా భుజించాడు కానీ అతని పొరుగువాడు ఆకలితో పడుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలిసి కూడా, అతని ఆకలి దూరం చేయకుండా, అతనికి అన్నం పెట్టకుండా, తాను మాత్రం కడుపునిండా తిని పడుకున్నాడు అంటే, ఆ వ్యక్తి విశ్వాసి కాడు, అతడు నా మీద విశ్వాసమే తీసుకొని రాలేదు అని ప్రవక్త వారు అన్నారు. అల్లాహు అక్బర్.
పొరుగువారు ఆకలితో ఉన్నారు, వారింట పొయ్యి వెలగనే లేదు అన్న విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మనము వారికి అన్నము చేర్చి, ఆహారము చేర్చి, వారి ఆకలి తీర్చకుండా మనం మాత్రమే కడుపునిండా భుజించి వారిని పట్టించుకోకుండా వదిలేసి అలాగే పడుకుంటే, మనం విశ్వాసులమే కాము, ప్రవక్త వారి మీద మనం విశ్వాసం తీసుకునే రాలేదు అని అంత గట్టిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేశారంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారి పట్ల మనము ఎంత శ్రద్ధ తీసుకోవాలి మనము ఇక్కడ తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, పొరుగువారు ముస్లింలు అయి ఉంటే, వారు ఆకలితో పడుకొని ఉంటే వారి పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెప్పట్లేదు. పొరుగువారు ఎవరైనా సరే, బంధువులైనా సరే, మతస్తులైనా సరే, ఇతరులైనా సరే వారు ఆకలితో ఉన్నారని తెలిస్తే, పరాయి మతస్తులైనా సరే ఆకలితో ఉన్నారు మన పొరుగువారని తెలిస్తే, వెంటనే మనము మన వద్ద ఉన్న ఆహారంలో నుంచి కొద్ది భాగము వారికి చేర్చాలి, వారి ఆకలి తీర్చాలి, పొరుగువారిగా మా మీద ఆ హక్కు ఉంది. అలా చేయకపోతే మనము ఆ హక్కును విస్మరించినట్లు అవుతాము, ప్రవక్త వారు చెప్పినట్లుగా మనం విశ్వాసులమే కాము. కాబట్టి మిత్రులారా పొరుగువారి పట్ల మనము శ్రద్ధ తీసుకోవలసి ఉంది అన్న విషయము ఇక్కడ మనకు బోధపడుతుంది.
అలాగే, పొరుగువారి కోసము వారి సహాయము కోసము మనము ఎల్లప్పుడూ మన ద్వారాలు తెరిచి ఉంచాలి. అంటే అర్థం ఏమిటి? పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీళ్లు కావాలని వస్తారు, ఎప్పుడైనా నూనె కావాలని వస్తారు, ఎప్పుడైనా ఉప్పు కావాలని వస్తారు, ఇంకొక్కటి ఏదైనా కావాలి ఇంకొకటి ఏదైనా కావాలి అని వస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వచ్చేస్తున్నారు ఏమిటి అని విసుక్కోకూడదు. అల్లాహు అక్బర్. విసుక్కోకూడదు, సంతోషంగా వారు వచ్చి అడిగితే మన ఇంటిలో ఉన్న ఆ పదార్థము వారికి సంతోషంగా అందజేయాలి. ఒక పొరుగువారిగా మనము ఆ విషయాన్ని సంతోషంగా భావించాలి గానీ విసుక్కోకూడదు అని ఇస్లాం మనకు బోధిస్తుంది.
చూడండి, పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి గురించి, ఆయన పొరుగు వారి కోసము దీనార్ దిర్హమ్ లు బాగా ఖర్చు పెట్టేసేవారు, వారికి ఇచ్చేస్తూ ఉండేవారు. చూసిన వారిలో కొందరు ఆయనతో ప్రశ్నించారు, ఏమయ్యా మీరు పొరుగువారి కోసము ఆ లెక్క లేకుండా హద్దు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఏమిటి? ఏంటిది అని అడిగేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మనం మన పొరుగువారితో సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. వారితో మాకు సంబంధం ముఖ్యమైనది, దీనార్ దిర్హం మాకు ముఖ్యమైనది కాదు అని చెప్పారు. అల్లాహు అక్బర్.
అయితే మిత్రులారా, నేడు ఈ రోజుల్లో మనం నివసిస్తున్నాము కదా, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనము గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా బాధాకరమైన విషయం చెబుతున్నాను, అల్లాహ్ మన్నించు గాక. మనం ఎలా జీవిస్తున్నాము, మన స్వభావం ఎలా ఉంది అంటే, మనకు దీనార్ దిర్హం ముఖ్యమైపోయాయి పొరుగు వారికంటే, మన సోదరులకంటే కూడా. మాకు దీనార్ దొరికితే చాలు, దిర్హం దొరికితే చాలు, పొరుగు వారు మనకు దూరమైపోయినా పర్వాలేదు, పొరుగు వారితో కావాలంటే మనము తెగతెంపులు చేసుకుంటాము గానీ దీనార్ దిర్హం ని మాత్రం వదులుకోము అన్నట్టుగా జీవించేస్తున్నాం. కానీ ప్రవక్త వారి శిష్యులు, పొరుగువారితో మనకు సంబంధాలు కావాలి, దీనార్ దిర్హం పోయినా పర్వాలేదు అని వారు ఆ విధంగా కోరుకునేవారు, అదే వారికి మాకీ తేడా.
అయితే మిత్రులారా, పరివర్తన రావలసిన అవసరం ఉంది. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
كَمْ مِنْ جَارٍ مُتَعَلِّقٍ بِجَارِهِ يَوْمَ الْقِيَامَةِ (కమ్ మిన్ జారిన్ ముతఅల్లికిన్ బిజారిహి యౌమల్ ఖియామ) ప్రళయ దినం రోజు చాలా మంది పొరుగువారు తమ పొరుగువారి గురించి అల్లాహ్ వద్ద ఫిర్యాదు చేస్తారు.
ప్రళయ దినం రోజు పొరుగువారిలో చాలామంది తమ పొరుగు వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద ప్రశ్నిస్తారు, అల్లాహ్ తో అడుగుతారు. ఏమని? షికాయత్ చేస్తారు.
يَا رَبِّ هَذَا أَغْلَقَ بَابَهُ دُونِي فَمَنَعَ مَعْرُوفَهُ (యా రబ్, హాజా అగ్లక బాబహు దూనీ ఫ మనఅ మారూఫహు) ఓ నా ప్రభూ! ఇతను (నా పొరుగువాడు) నా కోసం తన ఇంటి తలుపు మూసుకున్నాడు మరియు తన సహాయాన్ని నిరాకరించాడు.
ఇతను నా పొరుగువాడు, ప్రపంచంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల కోసం వెళ్తూ ఉంటే, అతను నాకు ఇవ్వకుండా తమ వాకిలి మూసుకునేవాడు ఓ అల్లాహ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందర పొరుగువారి గురించి షికాయత్ చేస్తారు పొరుగువారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. అల్ అదబుల్ ముఫ్రద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనం ఇది. కాబట్టి మిత్రులారా పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము వస్తూ ఉంటే మనం సంతోషంగా వారికి అందజేయాలి, పుణ్యకార్యంలాగా భావించాలి. మన హక్కు అని అర్థం చేసుకోవాలి గానీ వారు వస్తూ ఉంటే అడుగుతూ ఉంటే విసుక్కోకూడదు, ఇది ఇస్లాం మనకు బోధిస్తుంది మిత్రులారా.
పొరుగువారికి హాని కలిగించడం – ఒక మహా పాపం
అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారికి కానుకలు ఇవ్వాలి, వారి కోసము మన ఇంటిలో వండిన వంటలు కొన్ని చేరవేయాలి. అలాగే చిన్న చిన్న విషయాల కోసం వారు వస్తుంటే విసుక్కోకూడదు. అలాగే మన తరఫు నుంచి, మన మాటల నుండి, మన చేష్టల నుండి పొరుగువారికి హాని కలగకుండా కష్టము, నష్టము వాటిల్లకుండా మనము జాగ్రత్త పడాలి.
చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు.
مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلَا يُؤْذِ جَارَهُ (మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యు’జీ జారహు) ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ప్రళయ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు.
బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే పరలోకం పట్ల విశ్వసిస్తున్నారో, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు. పొరుగువారికి హాని కలిగించరాదు. అల్లాహ్ మీద మనకు విశ్వాసం ఉంది, పరలోకం పట్ల మనకు విశ్వాసము ఉంది అంటే, పొరుగు వారికి హాని కలిగించరాదు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు మూడుసార్లు ఈ విధంగా తెలియజేశారు.
وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ (వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్) అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు.
ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఎవరు? ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటున్నారు కదా ఆ వ్యక్తి ఎవరు ఓ దైవ ప్రవక్తా అంటే ప్రవక్త వారు అన్నారు.
مَنْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ (మల్లా య’మను జారుహు బవాయిఖహు) ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో (అతను విశ్వాసి కాడు).
ఎవరి కీడు నుండి అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, అలాంటి వ్యక్తి విశ్వాసి కాజాలడు అన్నారు. అంటే మన కీడు నుండి మన పొరుగువారు సురక్షితంగా లేరు, మనవల్ల మన పొరుగు వారికి నష్టం వాటిల్లుతుంది అంటే, బాధ కలుగుతూ ఉంది అంటే, మనము విశ్వాసులమే కాము అని ఆ ఉల్లేఖనం యొక్క అర్థం మిత్రులారా. అలాగే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.
لا يَدْخُلُ الْجَنَّةَ مَنْ لا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ (లా యద్ఖులుల్ జన్నత మల్లా య’మను జారుహు బవాయిఖహు) ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు.
ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగు వారు సురక్షితంగా లేరో. అంటే, పొరుగు వారికి ఇబ్బంది పెడుతున్న వ్యక్తి, పొరుగు వారికి నష్టం కలిగిస్తున్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని సూటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసేసి ఉన్నారు.
దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇద్దరు మహిళల గురించి ప్రశ్నించడం జరిగింది. మొదటి మహిళ ఎవరంటే, ఓ దైవ ప్రవక్తా ఒక మహిళ ఉన్నారు. ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లు, విధి ఇబాదత్ లు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎక్కువగా నఫిల్ ఇబాదత్ లు ఏమీ చేయట్లేదు. కాకపోతే, వారి మాటల నుండి, వారి చేష్టల నుండి పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్, గమనించాల్సిన విషయం. ఎక్కువగా నఫిల్ ఆరాధనలు ఏమీ చేయట్లేదు ఆవిడ. ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటూ ఉన్నారు, ఫర్జ్ ఇబాదత్ లతో పాటు పొరుగువారికి నష్టం వాటిల్లకుండా బాధ కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి మహిళ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
ఆవిడ స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పారు. ఇక మరొక మహిళ గురించి ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, మరొక మహిళ ఉన్నారు, ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లతో పాటు, విధి ఆరాధనలతో పాటు, నఫిల్ ఇబాదత్ లు, తహజ్జుద్ నమాజులు కూడా బాగా ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే ఆవిడ తమ మాటల నుండి పొరుగువారికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆవిడ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا خَيْرَ فِيهَا، هِيَ مِنْ أَهْلِ النَّارِ (లా ఖైర ఫీహా, హియ మిన్ అహ్లిన్నార్) ఆవిడలో ఎలాంటి మంచితనము లేదు, ఆవిడ నరకవాసులలో ఒకరు.
అల్లాహు అక్బర్. దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటండి? దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనం మన వరకు నమాజులు ఆచరించుకుంటూ ఉన్నాము, ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటున్నాము అంటే మనము స్వర్గానికి చేరిపోము. మనం పొరుగువారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడినప్పుడే మనము స్వర్గానికి చేరుకుంటాము. అంటే ఆరాధనలలో మనం ఎలాగైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, వ్యవహారాలలో కూడా పొరుగు వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వ్యవహారాలలో కూడా మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే స్వర్గానికి చేరుకుంటాము అని ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యింది మిత్రులారా.
అలాగే పొరుగువారి ప్రాణానికి, పొరుగువారి మానానికి, పొరుగువారి ధనానికి మన నుండి ఎలాంటి హాని వాటిల్లకూడదు. ఇది కూడా ఇస్లాం మనకు చాలా గట్టిగా తాకీదు చేస్తుంది. మనవల్ల మన పొరుగువారి ప్రాణం పోతుంది అన్న భయం వారికి కలుగుతుందంటే మనలో విశ్వాసం లేదు. మనవల్ల మన పొరుగు వారి మానానికి భంగం వాటిల్లే ప్రమాదము ఉంది అంటే మనం విశ్వాసులము కాదు. మనం మన పొరుగు వారి ధనం దోచుకునే వాళ్ళము అంటే మనం విశ్వాసులము కాము.
చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, పెద్ద నేరము ఏది, పెద్ద పాపము ఏది అల్లాహ్ వద్ద అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ (అన్ తజ్అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలకక్) నిన్ను పుట్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను నువ్వు ఆరాధించటం ఇది అల్లాహ్ వద్ద పెద్ద నేరము, పెద్ద పాపము అని అన్నారు.
ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్దది ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
أَنْ تَقْتُلَ وَلَدَكَ مَخَافَةَ أَنْ يَطْعَمَ مَعَكَ (అన్ తక్తుల వలదక మఖాఫత అన్ యత్అమ మఅక్) ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ యే అయినప్పటికినీ, నీవు బిడ్డలు పుడితే వారు నీతోపాటు కూర్చొని తింటారు అన్న భయంతో నీవు వారిని హతమార్చటం, అంటే భ్రూణహత్యలు చేయటము ఇది పెద్ద నేరము అల్లాహ్ వద్ద అని చెప్పారు.
ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్ద నేరము ఏది అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ (అన్ తుజానియ హలీలత జారిక) నీ పొరుగువారి భార్యతో నీవు వ్యభిచారము చేయటం అల్లాహ్ వద్ద పెద్ద నేరం అన్నారు.
బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి ఇది. కాబట్టి పొరుగువారి మానానికి భంగం వాటిల్లింది మా వల్ల అంటే మేము పెద్ద నేరానికి పాల్పడ్డాము అన్న విషయము. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు వ్యభిచారం గురించి ఏమంటారు, దొంగతనం గురించి ఏమంటారు?
مَا تَقُولُونَ فِي الزِّنَا؟ مَا تَقُولُونَ فِي السَّرِقَةِ؟ (మా తఖూలూన ఫిజ్జినా? మా తఖూలూన ఫిస్సర్కా?) వ్యభిచారం గురించి మీరేమంటారు? దొంగతనం గురించి మీరేమంటారు?
వ్యభిచారం గురించి మీరేమంటారు, దొంగతనం గురించి మీరేమంటారు అంటే, సహాబాలు, శిష్యులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్తా, వ్యభిచారం చేయడము ఇది హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త ఇద్దరూ దానిని నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు. దొంగతనం చేయటం హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేయడం హరాం, నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. అంటే వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం దీని గురించి మీరేమంటారు అంటే అది హరాము, నిషేధము, అల్లాహ్ మరియు ప్రవక్త నిషేధం చేశారు అని సహాబాలు సమాధానం ఇచ్చినప్పుడు, ప్రవక్త వారు ఏమంటున్నారో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لأَنْ يَزْنِيَ الرَّجُلُ بِعَشْرِ نِسْوَةٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَزْنِيَ بِامْرَأَةِ جَارِهِ (లఅన్ యజ్నియర్ రజులు బి అషరి నిస్వతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యజ్నియ బిమ్ రఅతి జారిహి) ఒక వ్యక్తి వేరే పది మంది మహిళలతో వ్యభిచారం చేయటం కంటే, తన పొరుగువారి భార్యతో వ్యభిచారం చేయటం పెద్ద పాపం.
మరియు
وَلأَنْ يَسْرِقَ الرَّجُلُ مِنْ عَشَرَةِ أَبْيَاتٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَسْرِقَ مِنْ بَيْتِ جَارِهِ (వ లఅన్ యస్రికర్ రజులు మిన్ అషరతి అబ్యాతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యస్రిక మిన్ బైతి జారిహి) ఒక వ్యక్తి వేరే పది ఇళ్లలో దొంగతనం చేయటం కంటే, తన పొరుగువారి ఇంట్లో దొంగతనం చేయటం పెద్ద పాపం.
అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. వేరేచోట పది ఇళ్లల్లో దోచుకోవటం కంటే పొరుగు వారి ఇంటిలో దొంగతనం చేయటం పెద్ద నేరం అవుతుంది. వేరేచోట పది మంది మహిళల వద్ద వ్యభిచారం చేయటం కంటే కూడా, పొరుగువారి ఇంటిలో ఉన్న మహిళతో వ్యభిచారం చేయటం పెద్ద నేరం అయిపోతుంది అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన నుండి మన పొరుగువారి ప్రాణానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి ధనానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి మానానికి కూడా భంగము వాటిల్లకూడదు. అలా జాగ్రత్త పడాలి అని ఇస్లాం మనకు బోధిస్తుంది. అలాగే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పొరుగువారు ఇతర మతస్తులైనా సరే, వారి మానానికి గానీ, వారి ప్రాణానికి గానీ, వారి ధనానికి గానీ మన తరఫు నుంచి ఎలాంటి ధోకా ఉండకూడదు. అప్పుడే మనము నిజమైన విశ్వాసులమవుతాము అని మనము గుర్తించాలి, తెలియజేసుకోవాలి మిత్రులారా.
ఇప్పటివరకు పొరుగువారితో మనము ఏ విధంగా జీవించుకోవాలి, పొరుగువారి పట్ల ఏ విధంగా మనము శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అన్న విషయాలు బోధపడ్డాయి. నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
క్రింది లింకులు దర్శించి ఇరుగు పొరుగు వారి హక్కుల గురుంచి మరింత జ్ఞానం సంపాదించండి:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.
إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ (ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్) నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.
తావీజులలో రకాలు
ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.
మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.
ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.
కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,
إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ (ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్) “నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)
అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.
అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.
అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.
మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.
ముగింపు మరియు సరైన పద్ధతి
అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.
కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.
ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:
مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ (మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి) “ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)
ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.
కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.
మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,
وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ (వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా) అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.
అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభనామములైన “అల్ హయ్ (సజీవుడు), అల్ ఖయ్యూమ్” యొక్క వివరణ https://youtu.be/Y9EhNR3PhYw [27 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క రెండు గొప్ప నామాలైన “అల్-హయ్యు” (సజీవుడు) మరియు “అల్-ఖయ్యూమ్” (సర్వానికి ఆధారభూతుడు) యొక్క లోతైన అర్థాలను వివరిస్తారు. “అల్-హయ్యు” అంటే అల్లాహ్ శాశ్వతంగా, సంపూర్ణంగా జీవించి ఉన్నవాడని, ఆయన జీవంలో ఎలాంటి లోపం లేదని, మరియు సమస్త జీవరాశులకు ఆయనే జీవప్రదాత అని అర్థం. “అల్-ఖయ్యూమ్” అంటే అల్లాహ్ స్వీయ-ఆధారితమైనవాడని, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదని, అదే సమయంలో సృష్టి మొత్తాన్ని ఆయనే పోషిస్తూ, నిర్వహిస్తున్నాడని భావం. ఈ రెండు నామాలు కలిసి అల్లాహ్ యొక్క అన్ని ذاتي (దాతి) మరియు فعلي (ఫి’లీ) గుణాలను కలిగి ఉన్నాయని వక్త నొక్కిచెప్పారు. ఈ నామాల ప్రాముఖ్యతను వివరించడానికి ఖురాన్ (సూరహ్ అల్-బఖరా, సూరహ్ ఆల్-ఇమ్రాన్, సూరహ్ తాహా) మరియు హదీసుల నుండి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. కష్ట సమయాల్లో ఈ నామాలతో అల్లాహ్ను ప్రార్థించడం చాలా పుణ్యప్రదమని, ఆయన సహాయం మరియు క్షమాపణ పొందటానికి ఇది ఒక మార్గమని చెప్పబడింది. విశ్వాసులు తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి, కేవలం అల్లాహ్పైనే ఆధారపడటానికి ఈ నామాలను అర్థం చేసుకుని, వాటిపై ధ్యానం చేయాలని వక్త ప్రోత్సహించారు.
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్.
సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహ్ యొక్క శుభ నామాలలో చాలా గొప్ప నామాలలో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము.
మీకు తెలిసిన విషయమే, అల్-హయ్యు అల్-ఖయ్యూమ్, ఇవి రెండూ కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహ్ తఆలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు.
అల్-హయ్యు (The Ever-Living) – సజీవుడు
అల్-హయ్యు అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి, ప్రతీ ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు.
అందులో అల్లాహ్ యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తఆలా యొక్క గొప్ప గుణం, అల్లాహ్ సజీవుడు. స్వతహాగా, ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తఆలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు.
మన జీవితం, సృష్టి రాశుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వేలాది, లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉన్నా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమీ లేకుండా ఉన్నారు. ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది. కానీ అల్లాహు తఆలా ఆది, అంతము లేనివాడు. అల్లాహ్ మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాహ్ కే తెలుసు. అప్పటినుండి ఉన్నాడంటే, చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహ్ కు మరణం అన్నది, మరియు అలసట అన్నది, నిద్ర, కునుకు అన్నది ఏదీ కూడా లేదు. అదే విషయం సూరత్ అల్-బఖరా లోని ఆయతల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్, ఆయతుల్ కుర్సీలో అల్లాహ్ ఇలా అంటాడు:
ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌ وَلَا نَوْمٌ అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్ అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు, అల్-హయ్యు (సజీవుడు), అల్-ఖయ్యూమ్ (సృష్టి యావత్తుకు ఆధారభూతుడు). ఆయనకు కునుకు గానీ, నిద్ర గానీ రాదు.
ఇక్కడ అల్-హయ్యు యొక్క వివరణలో, “లా త’అఖుదుహూ సినతువ్ వలా నౌమ్” అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా.
అల్లాహుమ్మ లక అస్లంతు, వబిక ఆమంతు, వఅలైక తవక్కల్తు, వఇలైక అనబ్తు, వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లనీ, అంతల్ హయ్యుల్లదీ లా యమూత్, వల్-జిన్ను వల్-ఇన్సు యమూతూన్.
ఓ అల్లాహ్, నీకు నేను విధేయుడనయ్యాను, నిన్నే నేను విశ్వసించాను, నీపైనే నేను భారం మోపాను, నీ వైపునకే నేను మరలాను, నీ ఆధారంగానే నేను వాదిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీ ఘనత యొక్క శరణు కోరుతున్నాను, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయకుండా కాపాడు. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రాని వానివి. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారే.
అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా గానీ, వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే. అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు.
اللَّهُ الَّذِي خَلَقَكُمْ అల్లాహుల్లదీ ఖలఖకుమ్ అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. (సూరతుర్-రూమ్)
సూరతుర్-రూమ్ లో ఇంతకుముందు మనం ఆయత్ విని ఉన్నాము. అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తఆలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు.
అయితే సోదర మహాశయులారా, అల్-హయ్యు, ఇందులో అల్లాహు తఆలా యొక్క దీనిని “ఇస్మే దాత్” అని కూడా అంటారు. అంటే, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప, స్వతహాగా ఉండే అటువంటి గుణాలన్నిటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఒక సందర్భంలో తెలియజేశారు:
الحَيُّ الْجَامِعُ لِصِفَاتِ الذَّاتِ అల్-హయ్యు అల్-జామిఉ లి-సిఫాతిద్-దాత్ అల్-హయ్యు (అనే పేరు) అల్లాహ్ యొక్క స్వతస్సిద్ధమైన గుణాలన్నిటినీ సమీకరించేది.
అల్లాహ్ యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్-ఇల్మ్ (జ్ఞానం), వస్-సమ్’అ (వినడం), వల్-బసర్ (చూడడం), వల్-యద్ (చెయ్యి), ఇలాంటి అల్లాహ్ యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్, సహీహ్ హదీసులలో, వాటన్నిటినీ, అవన్నీ కూడా ఈ అల్-హయ్యు అన్న పేరులో వచ్చేస్తాయి.
అల్-ఖయ్యూమ్ (The Self-Sustaining) – సర్వ సృష్టికి ఆధారభూతుడు
ఇక అల్-ఖయ్యూమ్. దీని భావం ఏమిటంటే, అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే, ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ, వాటికి బాధ్యత తీసుకుని ఉన్నాడు. అందుకొరకే, సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్-ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు “సర్వ సృష్టికి ఆధారభూతుడు” అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఈ పేరు గురించి చెప్పారు,
القَيُّومُ الْجَامِعُ لِصِفَاتِ الأَفْعَالِ అల్-ఖయ్యూమ్ అల్-జామిఉ లి-సిఫాతిల్-అఫ్ఆల్ అల్-ఖయ్యూమ్ (అనే పేరు) అల్లాహ్ యొక్క కార్యాలకు సంబంధించిన గుణాలన్నిటినీ సమీకరించేది.
ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్-ఖల్ఖ్ (సృష్టించడం), అర్-రిజ్ఖ్ (ఉపాధి కలిగించడం), వల్-ఇన్ఆమ్ (అనుగ్రహాలు నొసంగడం), అల్-ఇహ్యా (బ్రతికించడం), వల్-ఇమాత (చంపడం), ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు “రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్” (అల్-ఖయ్యూమ్ అనే పేరు వైపు మరలుతాయి). ఇవన్నీ కూడా అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చేస్తాయి.
అల్-హయ్యు వల్-ఖయ్యూమ్, ఇవి రెండూ ఖురాన్ లో కూడా వచ్చి ఉన్నాయి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్ లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీహ్ హదీస్ కూడా ఉంది. అబీ హాతిమ్ లో, తిర్మిదీ లో, ఇబ్నే మాజా లో ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ వారు “సహీహుల్ జామిఅ” లో ప్రస్తావించారు (హదీస్ నం. 979).
اِسْمُ اللَّهِ الأَعْظَمُ الَّذِي إِذَا دُعِيَ بِهِ أَجَابَ وَإِذَا سُئِلَ بِهِ أَعْطَى ఇస్ముల్లాహిల్ అ’జమ్ అల్లదీ ఇదా దుఇయ బిహి అజాబ్, వ ఇదా సుఇల బిహి అ’తా అల్లాహ్ యొక్క గొప్ప పేరు, దాని ద్వారా దుఆ చేస్తే ఆయన వెంటనే స్వీకరిస్తాడు మరియు దాని ద్వారా అర్ధించడం జరిగితే ఆయన ప్రసాదిస్తాడు.
ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ లోని సూరతుల్ బఖరాలో, సూరత్ ఆల్-ఇమ్రాన్ లో మరియు సూరతు తాహా లో ఉన్నాయి. ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరహ్ బఖరాలో గనుక మనం చూస్తే ఆయత్ నంబర్ 255, ఆయతుల్ కుర్సీలో:
ఇక సూరత్ త్వాహాలో గనుక మనం చూస్తే, ఆయత్ నంబర్ 111:
وَعَنَتِ ٱلْوُجُوهُ لِلْحَىِّ ٱلْقَيُّومِ వ అనతిల్ వుజూహు లిల్-హయ్యిల్ ఖయ్యూమ్.
సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి.
ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతులలో గమనించారు కదా, సూరత్ బఖరాలోని 255, ఆల్-ఇమ్రాన్ లోని స్టార్టింగ్ ఆయత్లో, అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాహ్ ను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో, వారు ఒక్కసారి ఆలోచించాలి.
ఖురాన్ లో అల్లాహ్ ఏమంటున్నాడు?
وَتَوَكَّلْ عَلَى ٱلْحَىِّ ٱلَّذِى لَا يَمُوتُ వ తవక్కల్ అలల్-హయ్యిల్లదీ లా యమూత్. నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్ పై మాత్రమే నమ్మకం కలిగి, ఆధారపడి, అతని మీదనే భరోసా ఉంచు.
భరోసా ఉర్దూ పదం, కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇ’తిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడో, ఎన్నటికీ మరణించనివాడో. మరి ఈ రోజుల్లో మనలో ఎంతో మంది తాయెత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా?
ఏ అల్లాహ్ సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని ఆధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి, ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తమూ నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్ మనకు సృష్టికర్తగా, ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత్ నంబర్ 41 చదవండి.
إِنَّ ٱللَّهَ يُمْسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ أَن تَزُولَا ఇన్నల్లాహ యుమ్సికుస్-సమావాతి వల్-అర్ద అన్ తజూలా. యదార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుండి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు.
ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నామా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా? సూరహ్ అంబియా లోని ఆయత్ చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి. కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మనం నివసించుటకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. అవి గనుక తమ స్థానాల నుండి తొలగిపోతే, అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు.
ఈ ఆయత్ కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్-రూమ్ ఆయత్ నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు, ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం, మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా, బలంగా చేస్తుంది.
అల్లాహ్ అంటున్నాడు:
وَمِنْ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلْأَرْضُ بِأَمْرِهِۦ వ మిన్ ఆయాతిహీ అన్ తఖూమస్-సమాఉ వల్-అర్దు బి-అమ్రిహ్ మరియు ఆయన సూచనలలో ఒకటి, ఆకాశం మరియు భూమి ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి.
ఈ “తఖూమ” అన్న పదం ఏదైతే ఉందో, దీని నుండే “ఖయ్యూమ్” అన్న అల్లాహ్ యొక్క పేరు వస్తుంది. (కాఫ్, యా, మీమ్) భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నిలకొని ఉన్నాయి. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాహ్ యే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతుర్-ర’అద్ ఆయత్ నంబర్ 33లో కూడా కనబడుతుంది.
أَفَمَنْ هُوَ قَآئِمٌ عَلَىٰ كُلِّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ అఫమన్ హువ ఖాఇమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్ ప్రతి ప్రాణి చేసే కర్మలను పర్యవేక్షించేవాడు (అల్లాహ్).
అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నిలకొలిపి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. గమనించండి. అలాంటి అల్లాహ్ కు మనం ఎంత విధేయులుగా ఉండాలి.
ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాహ్ తో దుఆ చేసి అల్లాహ్ పై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లాహ్ యొక్క దయతో మనకు ఏమీ కాదు, అల్లాహ్ మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు?
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్-హయ్యు లో అల్లాహ్ యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లాహ్ యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్-ఖయ్యూమ్ అన్న పేరులో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరూ కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీసును చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనం గనుక వాస్తవంగా ఈ హదీసును అర్థం చేసుకుంటే, ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లాహ్ యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దుఆ చేస్తే, ఎలా ఈ దుఆ స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదీ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524.
كَانَ النَّبِيُّ صلى الله عليه وسلم إِذَا كَرَبَهُ أَمْرٌ قَالَ కానన్-నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లమ ఇదా కరబహు అమ్రున్ ఖాల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా, చాలా బాధగా, కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దుఆ చేసేవారు.
(నోట్ చేసుకోండి మీరందరూ కూడా ఈ దుఆను. గుర్తుంచుకోండి. యాద్ చేసుకోండి. చిన్నదే. నాలుగే పదాలు ఉన్నాయి)
ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్“. నీ యొక్క కరుణ ఆధారంగా, తేరే రహ్మత్ కే వాస్తే సే, నీ కరుణ యొక్క వసీలాతో “అస్తగీస్”, నీ యొక్క సహాయాన్ని అర్ధిస్తున్నాను. ఎక్కడా ఏ సహాయం దొరకనప్పుడు, అల్లాహ్ నే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు, ఏదైనా పని జరిగే మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో ముందు అల్లాహ్ యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని? ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లాహ్, నఊజుబిల్లా అస్తగఫిరుల్లా, అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు, అల్లాహు తఆలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు, ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, అల్లాహ్ చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకుని దుఆ చేస్తూ ఉంటావో, అంతే అల్లాహు తఆలా నీ యొక్క పనులను చక్కబరుస్తూ ఉంటాడు.
ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా కి నేర్పిన దుఆ ఏమిటి? అల్లాహు అక్బర్, గమనించండి. మరియు ఈ దుఆను కూడా మీరు గుర్తుంచుకోండి, ఉదయం సాయంకాలం దుఆలలో చదవండి.
నా సర్వ వ్యవహారాలను అల్లాహ్, నీవు చక్కబరుచు. స్వయం నా వైపునకు గానీ, ఇంకా వేరే ఎవరి వైపునకు గానీ, రెప్ప కొట్టేంత సమయంలో కూడా, అంత కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు, నా వైపునకు అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నిటినీ కూడా చక్కబరుచు.
అంతేకాదు సోదర మహాశయులారా, ఈ అల్-హయ్యు, అల్-ఖయ్యూమ్ రెండు పేర్లతో మనం ఏదైనా దుఆ చేస్తే కూడా అల్లాహ్ స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాహ్ తో మనం క్షమాపణ కోరుకోవాలి అనుకుంటున్నాము. అలాంటప్పుడు తిర్మిదీ లో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే:
أَسْتَغْفِرُ اللَّهَ الَّذِي لاَ إِلَهَ إِلاَّ هُوَ الْحَىُّ الْقَيُّومُ وَأَتُوبُ إِلَيْهِ అస్తగఫిరుల్లాహల్లదీ లా ఇలాహ ఇల్లా హువల్-హయ్యుల్-ఖయ్యూమ్, వ అతూబు ఇలైహ్
అని చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా గానీ, ఇలాంటి దుఆ అర్థ భావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తఆలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు.
సోదర మహాశయులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు, మరియు ఖురాన్ లో ఆయతు, ఖురాన్ లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకుని మనం మన యొక్క అఖీదా బాగు చేసుకుందాము, ఇలాంటి గొప్ప అల్లాహ్ ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ, దుఃఖ, కష్టం మరియు ఆరాం, స్వస్థత, అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ ను మాత్రమే మనం సజీవంగా, సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు, అలాంటి అల్లాహ్ “యా హయ్యు యా ఖయ్యూమ్, బిరహ్మతిక అస్తగీస్” అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల వివరణ ముగిస్తున్నాను.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ﷺ వారి హక్కులు https://youtu.be/vCfZBWieaic [52 నిముషాలు] వక్త:ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
ఈ ప్రసంగం ముస్లిం సమాజంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కుల గురించి వివరిస్తుంది. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ను స్తుతించడంతో ప్రసంగం మొదలవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జాతికి లేదా ప్రాంతానికి మాత్రమే కాక, యావత్ ప్రపంచానికి ప్రవక్తగా పంపబడ్డారని ఖుర్ఆన్ ఆధారాలతో స్పష్టం చేయబడింది. ఇందులో ప్రధానంగా ఐదు హక్కుల గురించి చర్చించబడింది: 1) ప్రవక్తను విశ్వసించడం, ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక బాధ్యత; 2) ప్రవక్తను ప్రాణం కంటే ఎక్కువగా గౌరవించడం మరియు ఆయన సమక్షంలో స్వరాలు పెంచరాదని సహాబీల ఉదాహరణలతో వివరించబడింది; 3) ప్రవక్తను తల్లిదండ్రులు, సంతానం, మరియు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం, జైద్ రజియల్లాహు అన్హు వంటి సహాబీల ఉదాహరణలతో నొక్కి చెప్పబడింది; 4) జీవితంలోని ప్రతి రంగంలో ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవడం; 5) ప్రవక్త ఆదేశాలను పాటించడం మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయనకు విధేయత చూపడం. ఈ హక్కులను నెరవేర్చడం ద్వారానే ఇహపరలోకాలలో సాఫల్యం లభిస్తుందని ఈ ప్రసంగం బోధిస్తుంది.
أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ (వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్) نَبِيِّنَا مُحَمْمَدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ (నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్)
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక,ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు).
ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు
ఈనాటి ప్రసంగంలో మనం ముస్లిం సముదాయం మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులు ఏమిటి అనే విషయాన్ని ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్, హదీస్ గ్రంథాల వెలుగులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల ఉదాహరణల ద్వారా కూడా ఇన్ షా అల్లాహ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రదేశానికి, ఒక దేశానికి, ఒక జాతి వారికి ప్రవక్త కాదు, పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు.
ఖుర్ఆన్ గ్రంథం ఏడవ అధ్యాయము 158 వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
قُلْ يَا أَيُّهَا النَّاسُ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ جَمِيعًا الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ (ఖుల్ యా అయ్యుహన్నాస్ ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుమ్ జమీఅనిల్లజీ లహు ముల్కుస్సమావాతి వల్ అర్ద్) (ఓ ముహమ్మద్!) వారికి చెప్పు: “ఓ మానవులారా! నిశ్చయంగా నేను మీ అందరి వైపునకు అల్లాహ్ పంపిన ప్రవక్తను. భూమ్యాకాశాల సామ్రాజ్యం ఆయనదే. (7:158)
దాని అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరఫున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను. మీ అందరి వైపున పంపబడిన ప్రవక్త అంటే అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవదౌత్యము వర్తిస్తుంది. అంటే నా మాటకు అర్థం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి ప్రపంచానికి, మానవులందరి వైపుకు ప్రవక్తగా పంపబడి ఉన్నారు, ఈ విషయాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇక రండి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత, విశ్వాసి మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరఫున ఏమేమి బాధ్యతలు వస్తాయి, ఏమి హక్కులు అతని మీద ఉంటాయి, ఆ హక్కులు ఏమిటి, వాటిని అతను ఏ విధంగా చెల్లించుకోవాలి అనేది మనం చూద్దాం.
ప్రథమ హక్కు: విశ్వసించడం
ముందుగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ఖుర్ఆన్ గ్రంథం సూరా తగాబున్ ఎనిమిదవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَآمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ (ఫ ఆమినూ బిల్లాహి వ రసూలిహి) కనుక మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. (64:8)
అనగా, మీరు అల్లాహ్ను విశ్వసించండి మరియు దైవ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించండి అని ఆదేశిస్తున్నాడు కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి కొంతమంది విశ్వసించారు. చూడకుండా చాలామంది విశ్వసించారు. అయితే ఒక ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి విశ్వసించిన వారికి ఒక్కసారి శుభవార్త వినిపిస్తే చూడకుండా ఆయనను విశ్వసించిన వారికి ఏడుసార్లు శుభవార్త వినిపించి ఉన్నారు.
طوبى لمن رآني وآمن بي، وطوبى سبع مرات لمن لم يرني وآمن بي (తూబా లిమన్ రఆనీ వ ఆమన బీ, వ తూబా సబ అ మర్రాతిన్ లిమన్ లమ్ యరనీ వ ఆమన బీ.) ఇది ప్రామాణికమైన హదీసు. దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను చూసి నన్ను విశ్వసించాడో అతనికి ఒక్కసారి శుభవార్త, మరియు ఎవరైతే నన్ను చూడకుండా నన్ను విశ్వసించారో వారికి ఏడుసార్లు శుభవార్త అని ఆ ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారంగా మనము చాలా సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద పుట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడకుండా విశ్వసించాము కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ఏడుసార్లు శుభవార్త ఇన్ షా అల్లాహ్ అది మనకు దక్కుతుంది.
అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి విని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన అతని ముందర జరిగింది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అన్న విషయాన్ని అతను తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే ప్రవక్త వారిని విశ్వసించకుండా తిరస్కారిగా అలాగే ఉండిపోతాడో, అతను నరకానికి చేరుకుంటాడు, నరకవాసి అయిపోతాడు అని కూడా హెచ్చరించబడి ఉంది. ముస్లిం గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బోధించి ఉన్నారు,
والذي نفس محمد بيده، لا يسمع بي أحد من هذه الأمة يهودي ولا نصراني، ثم يموت ولم يؤمن بالذي أرسلت به، إلا كان من أصحاب النار (వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బి యదిహి, లా యస్మవు బీ అహదున్ మిన్ హాజిహిల్ ఉమ్మతి యహూదియ్యున్ వలా నస్రానియ్యున్, సుమ్మ యమూతు వలమ్ యుఅమిన్ బిల్లజీ ఉర్సిల్తు బిహి ఇల్లా కాన మిన్ అస్హాబిన్నార్). దీని భావం ఏమిటంటే, ఎవరి చేతిలో అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రాణము ఉందో ఆ మహా శక్తిశాలి అయిన ప్రభువు సాక్షిగా నా ఈ అనుచర సమాజంలో అతను యూదుడు గాని, క్రైస్తవుడు గాని ఎవరైనా గాని, అతని ముందర నా ప్రస్తావన జరిగింది, అతను నా గురించి విన్నాడు. నా గురించి విని కూడా అతను నన్ను మరియు నా ద్వారా పంపబడిన శాసనాన్ని, ధర్మాన్ని విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులలో చేరిపోతాడు. చూశారా? ప్రవక్త వారి గురించి విని, తెలుసుకొని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని గురించి విని తెలుసుకొని కూడా ఏ వ్యక్తి అయితే విశ్వసించకుండా అలాగే మరణిస్తాడో అతను నరకవాసులకు చేరిపోతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఏమిటంటే అతని ముందర ఎప్పుడైతే ప్రవక్త వారి గురించి మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మం గురించి ప్రస్తావించబడుతుందో అతను వెంటనే అర్థం చేసుకొని మనసారా ప్రవక్త వారిని విశ్వసించాలి, ప్రవక్త వారి ద్వారా పంపబడిన ధర్మాన్ని అతను స్వీకరించాలి.
ఏ విషయం మమ్మల్ని అడ్డుపడుతూ ఉంది ప్రవక్త వారిని మరియు ప్రవక్త తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించడానికి అంటే చాలామంది కేవలము భయం కారణంగా వెనకడుగు వేస్తూ ఉంటారు. చూడండి నేడు ప్రజలతో గాని, అధికారులతో గాని మనము భయపడి వెనకడుగు వేస్తే రేపు మరణానంతరము మమ్మల్ని వారు వచ్చి రక్షిస్తారా? మాకు అలాంటి గడ్డు పరిస్థితులు కూడా లేవు ప్రపంచంలో. మనము అల్హమ్దులిల్లాహ్ స్వతంత్రులము. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూడండి, ప్రజలు పేదరికంలో ఉన్నారు, ప్రజలు బానిసలుగా కూడా ఉన్నారు. బానిసలుగా ఉండి, పేదలుగా ఉండి కూడా వారు గడ్డు పరిస్థితులలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకొని ప్రవక్త వారి సమక్షంలో హాజరయ్యి ప్రవక్త వారిని విశ్వసించారు, విశ్వాసులుగా మారారు. తత్కారణంగా ప్రజలు, అధికారులు, పెద్దలు వారిని హింసించారు, వారిని విమర్శించారు, వారిని హేళన చేశారు, రకరకాలుగా చిత్రహింసలు చేసినప్పటికినీ వారు మాత్రము విశ్వాసాన్ని వదులుకోకుండా ధైర్యంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసులుగా చరిత్రలో నిలిచిపోయారు మరియు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద కూడా గౌరవమైన స్థానం పొందారు. ఉదాహరణకు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని చూడండి. ఈయన ఒక యజమాని వద్ద బానిసగా ఉండేవారు. యజమాని పేరు ఉమయ్య బహుశా నాకు గుర్తు రావట్లేదు. ఉమయ్య బిన్ ఖల్ఫ్. అతను ఏం చేసేవాడంటే, బిలాల్ రజియల్లాహు అన్హు వారు ముస్లింలు అయిపోయారు, విశ్వాసి అయిపోయారు అన్న విషయాన్ని విని తెలుసుకొని, బిలాల్ రజియల్లాహు అన్హు వారిని ఈ అరబ్బు దేశంలో ఎడారిలో ఎండాకాలంలో మిట్టమధ్యాహ్నం పూట ఎండ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ వేడికి ఇసుక ఎంతగా కాలిపోతూ ఉంటుంది, అలాంటి మండుతున్న ఇసుక మీద అర్ధనగ్నంగా ఆయనను పడుకోబెట్టేవాడు, ఆ తర్వాత ఛాతి మీద పెద్ద పెద్ద రాళ్లు పెట్టేసేవాడు. పైన రాయి కాలుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, కింద ఇసుక కూడా కాలుతూ ఉంటుంది, అలాంటి స్థితిలో ఆయన అల్లాడిపోతూ ఉంటే నీవు విశ్వాసాన్ని వదిలేయి, నేను కూడా నిన్ను హింసించడం వదిలేస్తాను అని చెప్పేవాడు. అవన్నీ భరించి కూడా ఆయన బానిస అయి ఉండి కూడా చిత్రహింసలు భరిస్తూ కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ పంపించిన సత్య ప్రవక్త అని చాటి చెప్పారు. ఆ తర్వాత అతను అన్నము పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఆకలిదప్పికలతో అలాగే ఉంచేశాడు, చెరసాలలో బంధించాడు, మెడలో తాడు కట్టేసి పోకిరి పిల్లవారికి, కుర్రాళ్ళ చేతికి ఇచ్చేశాడు. వారు బిలాల్ రజియల్లాహు అన్హు వారిని పశువులాగా ఈడ్చుకుంటూ తిరిగేవారు. తత్కారణంగా ఆయన శరీరానికి, కాళ్లకు గాయాలు అయిపోయేవి. అన్ని రకాలుగా ఆయనను హింసించినా అలాంటి గడ్డు పరిస్థితుల్లో బానిసగా అయ్యి ఉండి కూడా ఆయన విశ్వాసం పొందారు, ప్రవక్త వారిని మరియు ప్రవక్త వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించి వచ్చిన సమస్యలని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తత్కారణంగా ఆయన గొప్ప విశ్వాసిగా చరిత్రలో మిగిలిపోయారు, అల్లాహ్ వద్ద కూడా వారికి గొప్ప ఉన్నతమైన స్థానాలు ఉన్నాయి. కాబట్టి మనకు
الحمد لله ثم الحمد لله (అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్), బానిసత్వం లేదు. అల్లాహ్ దయవల్ల మమ్మల్ని అందరినీ అల్లాహ్ స్వతంత్రులుగా ఉంచాడు కాబట్టి మనము కంగారు పడవలసిన అవసరము లేదు, బెదరవలసిన అవసరము లేదు, భయపడవలసిన వెనకడుగు వేయవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించండి. తద్వారానే ఇహపరాలా సాఫల్యము మనకు దక్కుతుంది.
రెండవ హక్కు: గౌరవించడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం ఇది మొదటి హక్కు. ఇక రెండవ హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన తర్వాత ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించాలని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు శిష్యులకు, సహాబాలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో బిగ్గరగా మాట్లాడకండి, శబ్దము పెంచకండి అని తాకీదు చేసి ఉన్నాడు. మనం చూసినట్లయితే, ఖుర్ఆన్ గ్రంథము 24వ అధ్యాయము 63వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
దాని అర్థం ఏమిటంటే, మీరు దైవప్రవక్త పిలుపును మీలో ఒకరినొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మనం పరస్పరం ఒకరినొకరిని ఏ విధంగా అయితే పిలుచుకుంటామో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయం అలాంటిది కాదు. ప్రవక్త వారితో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు మీరు జాగ్రత్తగా, సగౌరవంగా, అణకువతో మాట్లాడండి అని ఆ వాక్యంలో బోధించబడి ఉంది.
అలాగే ఖుర్ఆన్ గ్రంథం 49వ అధ్యాయం, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ (యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్హరూ లహు బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్) ఓ విశ్వాసులారా! మీ స్వరాలను ప్రవక్త స్వరం కన్నా బిగ్గరగా చేయకండి, మీలో మీరు ఒకరితో మరొకరు బిగ్గరగా మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడకండి. (49:2)
దీని అర్థం ఏమిటంటే, ఓ విశ్వాసులారా మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయనతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు, జాగ్రత్త సుమా. చూశారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంతగా గౌరవించాలంటే ప్రవక్త వారి సమక్షంలో బిగ్గరగా శబ్దాన్ని పెంచి, హెచ్చించి మాట్లాడరాదు, పలకరాదు. ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయనను గౌరవించకుండా బిగ్గరగా మాట్లాడినట్లయితే, శబ్దాన్ని పెంచినట్లయితే, అది ఒక రకంగా ప్రవక్త వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది, తత్కారణంగా మనిషి యొక్క కర్మలు, సత్కార్యాలు, పుణ్యాలన్నీ వృధా అయిపోయే ప్రమాదం ఉంది అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. దీనికి ఉదాహరణగా మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల గురించి ఒక ఉదాహరణ తీసుకుందాం.
ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు బనూ తమీమ్ అనే తెగకు చెందిన ఒక బిడారము, కొంతమంది సమూహము వచ్చారు. బనూ తమీమ్కు చెందిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోకి వచ్చినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక సలహా ఇచ్చారు. ఓ దైవప్రవక్త, కాకా బిన్ మాబద్ అనే వ్యక్తిని ఈ సమూహానికి మీరు నాయకునిగా నియమించండి అన్నారు. అయితే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూడా అక్కడ ఉన్నారు, ఆయన జోక్యం చేసుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవప్రవక్త, అక్రా బిన్ హాబిస్ ని ఈ సమూహానికి, ఈ తెగ వారికి నాయకునిగా నియమించండి అని ఆయన సలహా ఇచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ఉంటే, ఉమర్ రజియల్లాహు అన్హు వారు మరో వ్యక్తి గురించి ప్రస్తావించారు. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది కదండీ, వారిద్దరూ కూడా నేను చెప్పిన వ్యక్తే మంచిది, నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరంటూ ఉంటే, లేదండి నేను చెప్పిన వ్యక్తిని నియమిస్తేనే మంచిది అని ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఆ తర్వాత మాట మాట పెరిగి వారు పెద్దగా శబ్దాలు చేయడం, హెచ్చుగా మాట్లాడటం ప్రారంభించేశారు. అలా జరిగినప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ వాక్యాలను అవతరింపజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త వారి కంఠస్వరం వద్ద హెచ్చించకండి అని ఆ వాక్యాన్ని ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడో, మీరు జాగ్రత్త పడకపోతే మీ సత్కార్యాలు, మీ పుణ్యాలు వృధా అయిపోతాయని ఆ వాక్యం చివరలో తెలియజేసి ఉన్నాడు కదా, అది విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఎంతగా మారిపోయారంటే, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ఎంత మెల్లగా మాట్లాడేవారంటే, ఎంత చిన్నగా మాట్లాడేవారంటే, దగ్గరలో కూర్చున్న వ్యక్తి కూడా ఆయన ఏమి చెప్పారో వినలేక రెండవసారి మళ్ళీ అడిగేవారు. అయ్యో మీరు ఏం చెప్పారో సరిగా వినిపించలేదండి, చెప్పండి ఏంటో అని రెండవసారి మళ్ళీ అడగవలసి వచ్చేది. అంత నెమ్మదిగా, అంత చిన్నగా ఆయన మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ వాక్యము అవతరింపజేయబడిన తర్వాత.
కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఇది రెండవ హక్కు. దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు, ఆయన స్వరం కొంచెం పెద్దది. మామూలుగా కొంతమందికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొంతు కొంచెం పెద్దది ఇస్తాడు, వారు మామూలుగా మాట్లాడినా గాని శబ్దం కొంచెం హెచ్చుగా వస్తుంది. ఆ ప్రకారంగా సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి స్వరము కూడా, కంఠము కూడా కొంచెం పెద్దది. ఆయన మామూలుగా మాట్లాడినా శబ్దం కొంచెం పెద్దగా, హెచ్చుగా వచ్చేది. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫవూ అస్వా తకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి, ఆ వాక్యం అవతరింపజేయబడిన తర్వాత, ఆయన సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి సమావేశంలో రావడం, హాజరవ్వడమే మానేశారు. అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన రావడమే మానేశారు. కొద్ది రోజులు గడిచాయి. కొద్ది రోజులు గడిచిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏంటండీ సాబిత్ బిన్ ఖైస్ కనిపించడం లేదు అని సహాబాలతో అడిగారు. అప్పుడు సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు ఏం చెప్పారంటే, ఓ దైవప్రవక్త, నేను ఆయన పొరుగులోనే ఉంటాను. కాబట్టి మీరు అనుమతి ఇస్తే నేను వెళ్లి చూస్తాను, ఆయన ఎందుకు మీ మధ్య రావట్లేదు ఇక్కడ, ఎందుకు పాల్గొనట్లేదు మీ సమావేశంలో, నేను వెళ్లి తెలుసుకొని వస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే, ప్రవక్త వారు సరే అని పంపించారు. ఆ తర్వాత సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్లి చూస్తే, ఆయన తల పట్టుకొని కూర్చొని ఉన్నారు, దిగులుగా ఉన్నారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి ఏమండీ ప్రవక్త వారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఈ మధ్య మీరు ప్రవక్త వారి సమావేశంలో హాజరు కాలేదు, ఎందుకండీ అలా, మిమ్మల్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్తు చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర బిగ్గరగా, పెద్ద శబ్దంతో మాట్లాడకండి, అలా మాట్లాడితే మీ కర్మలు వృధా అయిపోతాయి అని చెప్పాడు కాబట్టి, నా శబ్దం పెద్దది, నా కంఠం హెచ్చుగా ఉంటుంది కాబట్టి, నేను చేసుకున్న కర్మలన్నీ, సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, నేను నరకవాసి అయిపోయానేమోనని నాకు భయంగా ఉంది, అందుకోసమే నేను దిగులుగా ఉన్నాను, అక్కడ రాలేకపోతున్నాను అని చెప్పారు. సాద్ బిన్ మాద్ రజియల్లాహు అన్హు వారు అదంతా విని, తిరిగి వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు. అదంతా తెలియజేసిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాట విని, వెంటనే ఆ సహాబీకి శుభవార్త తెలియజేశారు, సాద్ రజియల్లాహు అన్హు వారి ద్వారా. మీరు వెళ్ళండి, ఆయనకు తెలియజేయండి, ఆయన నరకవాసులలోని వ్యక్తి కాదు, ఆయన స్వర్గవాసులలోని వ్యక్తి అని శుభవార్త తెలియజేశారు.
ఈ ఉల్లేఖనం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించే విధానము సహాబాల వద్ద ఎంతగా ఉందో, వారు ఎంతగా ప్రవక్త వారిని గౌరవించేవారో, మరియు ప్రవక్త వారిని అగౌరవపరచడాన్ని ఎంతగా వారు భయపడేవారో చూడండి, దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే, ఎవరెవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవిస్తారో, అలాంటి వారి కోసము శుభవార్త ఉంది. ఖుర్ఆన్ గ్రంథము ఏడవ అధ్యాయము 157 వ వాక్యాన్ని మనం చూచినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
فَالَّذِينَ آمَنُوا بِهِ وَعَزَّرُوهُ وَنَصَرُوهُ وَاتَّبَعُوا النُّورَ الَّذِي أُنْزِلَ مَعَهُ ۙ أُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (ఫల్లజీన ఆమను బిహి వ అజ్జరూహు వ నసరూహు వత్తబవూన్నూరల్లజీ ఉన్జిల మఅహు ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్) కనుక ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను గౌరవించి, ఆయనకు సహాయం చేసి, ఆయనతోపాటు అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. (7:157)
దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి, అతనికి ఆదరువుగా నిలుస్తారో, తోడ్పాటు నందిస్తారో, ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో, వారే సాఫల్యం పొందేవారు. ప్రవక్త వారిని విశ్వసించి, ప్రవక్త వారిని అనుసరించి, ప్రవక్త వారిని గౌరవించేవారు సాఫల్యం పొందేవారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేసి ఉన్నాడు చూశారా.
అలాగే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించేవారో, ఒక అవిశ్వాసి అలనాటి అవిశ్వాసి, ఆయన పేరు ఉర్వా బిన్ మసూద్ సఖఫీ. తర్వాత, అప్పటి వరకు ఆయన ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారని ధర్మ పండితులు తెలియజేసి ఉన్నారు. ఉర్వా బిన్ మసూద్ సఖఫీ, ఈ సంఘటన జరిగే సమయానికి ఆయన ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. సులహ్ హుదైబియా, హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన ప్రవక్త వారితో మాట్లాడటానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడటానికి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో సహాబాలు ఏ విధంగా అణకువతో ఉన్నారో, ప్రవక్త వారిని ఏ విధంగా గౌరవిస్తున్నారో కళ్లారా చూశాడు. కళ్లారా చూసి, తర్వాత మళ్ళీ మక్కాలో ఉన్న అవిశ్వాసుల వద్దకు వెళ్లి, అక్కడ చూసిన దృశ్యాన్ని ఈ విధంగా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారో చూడండి: “ఓ నా జాతి ప్రజలారా, నేను పెద్ద పెద్ద రాజుల దర్బారులలోకి కూడా వెళ్ళాను. నేను రోమ్ చక్రవర్తి మరియు అలాగే ఈరాన్ చక్రవర్తి వారి దర్బారులలోకి కూడా నేను వెళ్ళాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, పెద్ద పెద్ద రాజులను కూడా అతని దర్బారులో ఉన్న మంత్రులు అంతగా గౌరవించరు, ఎంతగా అయితే ప్రవక్త వారి శిష్యులు ప్రవక్త వారిని గౌరవిస్తున్నారో. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ప్రవక్త వారి నోటి నుండి ఉమ్మి కూడా ఒకవేళ బయటికి వచ్చేస్తే, శిష్యులు ఆ ఉమ్మిని తీసుకొని శరీరానికి పూసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త వారు ఉజూ చేస్తే, ఆయన ఉజూ చేసిన నీటిని శిష్యులు తీసుకోవాలని పోటీ పడుతూ ఉన్నారు. ఆయన కేవలం సైగ చేస్తే చాలు, వెంటనే ఆ పని చేసి పెట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అలా నేను గౌరవించబడటము, పెద్ద పెద్ద రాజులని సైతము నేను చూడలేదు. అంతగా ప్రవక్త వారి శిష్యులు ప్రవక్తను గౌరవిస్తున్నారు” అని తెలియజేశాడు.
చూశారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఏ విధంగా గౌరవించారు? అలాగే మనము కూడా ప్రవక్త వారిని గౌరవించాలి. ప్రవక్త వారు మన మధ్య లేరు కదా, మరి ఏ విధంగా మనము గౌరవించాలి అంటే, ప్రవక్త వారి ఆదేశాలు మన మధ్య ఉన్నాయి. ప్రవక్త వారి ఆదేశాలు, హదీసుల రూపంలో, ఉల్లేఖనాల రూపంలో మన మధ్య ఉన్నాయి. ఆ హదీసులు చదవబడేటప్పుడు, వినిపించేటప్పుడు మనము గౌరవంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. అలాగే, ప్రవక్త వారి ఆదేశాలను అదే గౌరవంతో మనము ఆచరించాలి.
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించడం, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కు. అయితే, గౌరవించాలి, ప్రతి ముస్లిం యొక్క హక్కు అని తెలుసుకున్న తర్వాత రెండు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్తను గౌరవించడం అనే పదాన్ని తీసుకొని, ప్రవక్త వారి విషయంలో హద్దు మీరిపోవడం సరికాదు. గౌరవంలో చాలామంది హద్దు మీరిపోతూ ఉంటారు. అంటే, ప్రవక్తను ప్రవక్త స్థానంలో కాకుండా, తీసుకెళ్లి దైవ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, దీనిని గులు అని అంటారు. అల్లాహ్ సుబ్ హాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు, ప్రవక్త వారు వారించి ఉన్నారు. మనం చూచినట్లయితే, బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
لا تطروني كما أطرت النصارى ابن مريم، فإنما أنا عبد فقولوا عبد الله ورسوله (లా తత్రూనీ కమా అతరతిన్నసారా ఇబ్న మర్యమ. ఇన్నమా అన అబ్దున్, ఫఖూలూ అబ్దుల్లాహి వ రసూలుహు.) చూశారా, మర్యం కుమారుడు ఈసా, ఏసుక్రీస్తు అంటారు కదండీ, ಮರ್ಯಮ್ ಕುಮಾರడైన ఈసా అలైహిస్సలాం వారి విషయంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే హద్దు మీరిపోయారో, మీరు, అనగా ముస్లింలకు ఆదేశిస్తున్నారు, మీరు నా విషయంలో ఆ విధంగా హద్దు మీరకండి. నేను అల్లాహ్ దాసుడిని మరియు అల్లాహ్ ప్రవక్తని. నాకు ఉన్న స్థానంలో మాత్రమే నన్ను మీరు ఉంచి గౌరవించండి, నాకు లేని స్థానము నాకు కల్పించే ప్రయత్నం చేయకండి అని ప్రవక్త వారు వారించారు.
చూశారా, కాబట్టి ప్రవక్త వారిని గౌరవిస్తున్నాము అని చెబుతూ చాలామంది ప్రవక్త వారికి ఉన్న స్థానం కంటే ఎక్కువ స్థానము ఇచ్చేటట్టుగా అల్లాహ్ స్థానంలోకి తీసుకుని వెళ్లి నిలబెట్టేటట్టుగా చేస్తూ ఉంటారు, అలా చేయడం సరికాదు.
అలాగే, దీనికి విరుద్ధమైన విషయం. చాలామంది మూర్ఖులు అనలో, పాపిష్టులు అనలో, ఇంకేమనాలో తెలియదు, ప్రవక్త వారిని కించపరుస్తూ ఉంటారు. అల్లాహ్ మమ్మల్ని ఏమంటున్నాడు, ప్రవక్త వారిని గౌరవించాలి అంటున్నాడు. కానీ నేడు మనం చూస్తున్నాం, ముస్లింలు మనము అని చెప్పుకునే చాలామంది మూర్ఖులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. వారి మాటల ద్వారా, వారి చేష్టల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక వ్యక్తి మీడియా ముందర వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కించపరుస్తున్నాడు. స్వయంగా నేను ముస్లిం అని కూడా మళ్లీ ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఎంతటి మూర్ఖత్వం అండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా చెప్పుకున్న తర్వాతే ఒక వ్యక్తి ముస్లిం అవుతున్నాడు. అలాంటి వ్యక్తి, ప్రవక్త వారిని విశ్వసించిన తర్వాతే ముస్లిం అవుతున్న వ్యక్తి, ప్రవక్త వారిని కించపరచటం, అగౌరవపరచటం ఏమిటండి ఇది?
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైతే కించపరుస్తారో, అగౌరవపరుస్తారో, ప్రపంచంలో కూడా శిక్షించబడతాడు, పరలోకంలో కూడా వారు శిక్షించబడతారు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథము సూరా తౌబా 61వ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు కాబట్టి, జాగ్రత్త. కర్మలు వృధా అయిపోతాయి, నష్టపోతారు ప్రపంచంలో కూడా శిక్షించబడతారు, పరలోకంలోనూ మరియు ప్రపంచంలోనూ. కాబట్టి ప్రవక్త వారిని అగౌరవపరచటం పెద్ద నేరం, అలాంటి నేరానికి పాల్పడరాదు, జాగ్రత్త అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.
మూడవ హక్కు: ప్రేమించడం
ముస్లిం సముదాయం మీద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హక్కులలో నుంచి రెండు హక్కుల గురించి తెలుసుకున్నాం అండి. విశ్వసించడం ప్రథమ హక్కు, ప్రవక్త వారిని గౌరవించడం రెండవ హక్కు. ఇక మూడవ హక్కు ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించాలి, ప్రేమించాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
ثلاث من كن فيه وجد حلاوة الإيمان (సలాసున్ మన్ కున్న ఫీహి వజద హలావతల్ ఈమాన్.) మూడు విషయాలు ఎవరిలో ఉంటాయో, అతను ఈమాన్ విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాడు అన్నారు. ఆ మూడు విషయాలు ఏమిటి అంటే, మొదటి విషయం:
أن يكون الله ورسوله أحب إليه مما سواهما (అన్ యకూనల్లాహు వ రసూలుహు అహబ్బ ఇలైహి మిమ్మా సివాహుమా.) అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్త అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి అందరికంటే ఎక్కువగా అభిమానించాలి, ప్రేమించాలి. అందరికంటే ఎక్కువ అంటే, తనకంటే, తన కుటుంబ సభ్యుల కంటే, తన తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రపంచంలో ఉన్న వారందరి కంటే, చివరికి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించాలని దాని అర్థం.
దీనికి ఉదాహరణగా మనము చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే ఉల్లేఖనంలో ఈ విధంగా తెలియజేశారు:
لا يؤمن أحدكم حتى أكون أحب إليه من ولده ووالده والناس أجمعين (లా యూమిను అహదుకుమ్ హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మయీన్.) మీలో ఏ వ్యక్తి కూడా అప్పటి వరకు విశ్వాసి కాజాలడు, ఎప్పటి వరకు అయితే అతను నన్ను తన సంతానము కంటే, తన తల్లిదండ్రుల కంటే, మానవులందరి కంటే ఎక్కువగా నన్ను అభిమానించడో అన్నారు. అంటే, తల్లిదండ్రుల కంటే, భార్యాబిడ్డల కంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే ఎక్కువగా ప్రవక్త వారిని అభిమానించినప్పుడే వ్యక్తి విశ్వాసి అవుతాడు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారి గురించి ఉదాహరణ చాలా ప్రచారం చెంది ఉంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో హాజరయ్యి,
يا رسول الله، لأنت أحب إلي من كل شيء إلا من نفسي (యా రసూలల్లాహ్, లఅంత అహబ్బు ఇలయ్య మిన్ కుల్లి శైఇన్ ఇల్లా మిన్ నఫ్సీ) అన్నారు. ఓ దైవప్రవక్త, మీరు నాకు అందరికంటే ఎక్కువగా ఇష్టులు, నేను మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణము నాకు మీకంటే ఎక్కువ ప్రియమైనది అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
لا، والذي نفسي بيده، حتى أكون أحب إليك من نفسك (లా వల్లజీ నఫ్సీ బియదిహి, హత్తా అకూన అహబ్బ ఇలైక మిన్ నఫ్సిక్.) లేదు లేదు ఓ ఉమర్, ఎవరి చేతిలో అయితే నా ప్రాణము ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీవు నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను అభిమానించనంత వరకు పూర్తి సంపూర్ణ విశ్వాసి కాజాలవు అన్నారు.
ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించారు. ఆ తర్వాత ప్రవక్త వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఇప్పుడు మిమ్మల్ని నా ప్రాణము కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను అని తెలియజేసినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,
الآن يا عمر (అల్ ఆన యా ఉమర్.) ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసము సంపూర్ణమైంది అని తెలియజేశారు.
చూశారా, కాబట్టి ప్రతి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించాలి. ప్రాణము కంటే ఎక్కువగా అభిమానించినప్పుడే అతను సంపూర్ణ విశ్వాసి కాగలడు, లేని యెడల అతని విశ్వాసము సంపూర్ణము కాజాలదు అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనము ఒక ఉదాహరణ తీసుకుందాం.
జైద్ రజియల్లాహు అన్హు వారి గురించి మనము చూచినట్లయితే, జైద్ రజియల్లాహు అన్హు వారిని ఆయన పసితనంలోనే దుండగులు దొంగలించారు. మన మొరటు భాషలో చెప్పాలంటే ఆయనను కిడ్నాప్ చేసేశారు. ఆయనను దొంగలు పట్టుకెళ్లి వేరే ప్రదేశాలలో అమ్మేశారు. ఆ తర్వాత నుండి ఆయన బానిస అయిపోయారు. ఆ తర్వాత చేతులు మారుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఆయనను కొన్నారు, తర్వాత వేరే వ్యక్తికి అమ్మేశారు, ఆ తర్వాత మరో వ్యక్తి మరో వ్యక్తిని అమ్మేశారు. ఆ ప్రకారంగా అమ్ముతూ అమ్ముతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన చేతులు మారుతూ మారుతూ మారుతూ మక్కాలో ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారి వద్దకు వచ్చారు. ఖదీజా రజియల్లాహు త’ఆలా అన్హా వారు జైద్ వారిని కొని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కానుకగా ఇచ్చి, ఓ దైవప్రవక్త, ఈయనతో మీరు సేవలు చేయించుకోండి అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైద్ రజియల్లాహు త’ఆలా అన్హు వారితో సేవలు చేయించుకుంటూ ఉన్నారు. సేవలు చేయించుకుంటూ ఉంటున్నప్పుడు, ఒకరోజు అనుకోకుండా ఆయన కాబతుల్లాలో తిరుగుతూ ఉంటే, వారి తల్లిదండ్రులు కూడా హజ్ చేయడానికి వచ్చి కాబతుల్లా వద్ద ప్రదక్షిణలు, తవాఫ్ చేస్తూ ఉన్నారు. వెంటనే తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను చూసి గుర్తుపట్టి, జైద్ రజియల్లాహు అన్హు వారు వెళ్లి, “నేను పసితనంలో తప్పిపోయిన మీ అబ్బాయిని” అని తెలియజేశారు. మీ అబ్బాయిని అని ఎప్పుడైతే తెలియజేశారో, కుటుంబ సభ్యులు వెంటనే జైద్ రజియల్లాహు అన్హు వారిని పట్టుకొని, చిన్ననాటి రోజుల్లో తప్పిపోయిన బిడ్డ దొరికాడు అని వారు చాలా సంతోషించారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవప్రవక్త, మా అబ్బాయి పసితనంలో తప్పిపోయాడు, ఇప్పుడు అనుకొని ఊహించని రీతిలో ఇక్కడ బానిసగా ఉన్నాడు, మీరు అనుమతి ఇస్తే మా అబ్బాయిని మేము మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము అని అడిగినప్పుడు, ప్రవక్త వారు అన్నారు, మీరు సంతోషంగా తీసుకువెళ్ళవచ్చు, అయితే నిబంధన ఏమిటంటే, మీరు ఒకసారి జైద్ తో మాట్లాడండి, సంప్రదించి చూడండి. జైద్ వారు మీతో పాటు రావడానికి ఆయన సిద్ధమైతేనే మీరు తీసుకువెళ్ళండి, లేదంటే లేదు అని చెప్పారు.
ఆ తర్వాత, జైద్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వెళ్లి, చూడండి దైవప్రవక్త వారు మీ ఇష్టం మీద వదిలేశారు, ఇక మాకు అనుమతి దొరికినట్లే, కాబట్టి పదండి మేము మా ఇంటికి వెళ్లిపోదాము అని అంటే, జైద్ రజియల్లాహు అన్హు వారు లేదు నేను రాను, నేను ప్రవక్త వద్దనే ఉండిపోతాను అని తేల్చి చెప్పేశారు.
ఏంటండీ, ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు ఆలోచించాలి. ఒక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతి ఇచ్చేశారు, జైద్ రజియల్లాహు అన్హు వారికి ఇక బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుంది, స్వతంత్రుడిగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి హాయిగా జీవించుకోవచ్చు. కానీ స్వతంత్రుడిగా వెళ్లి కుటుంబ సభ్యులతో హాయిగా జీవించుకోవడానికి ఆయన ఇష్టపడట్లేదు, ప్రవక్త వారి వద్ద బానిసగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు అంటే, ప్రవక్త వారిని ఆయన ఎంతగా అభిమానించేవారో, ఎంతగా ప్రేమించేవారో చూడండి. అలాగే, ప్రవక్త ఆయనతో ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ప్రవక్త వారిని అంతగా అభిమానిస్తున్నారు చూడండి.
కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలు ఎంతగా ప్రేమించేవారో, ఎంతగా అభిమానించేవారో ఈ ఉదాహరణల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అలాగే మిత్రులారా, మరొక ఉదాహరణ మనము చూచినట్లయితే, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త వారు ఆయనను చూసి ఏమండీ, ఏంటో మీరు కంగారుగా ఉన్నారు అని అడిగినప్పుడు, ఆయన అంటున్నారు, ఓ దైవప్రవక్త, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు గుర్తుకు వస్తే, వెంటనే మిమ్మల్ని చూడాలనుకుంటాను, కాబట్టి నేను ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ మస్జిద్ లోకి వస్తాను. మీరు మస్జిద్ లో ఏదో ఒక చోట సహాబాలతో సమావేశమై ఉంటారు లేదంటే నమాజ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక విధంగా మీరు నన్ను కనిపిస్తారు. మిమ్మల్ని చూడగానే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. అయితే ఈరోజు నాకు ఒక ఆలోచన తట్టింది, ఆ ఆలోచన కారణంగా నేను అయోమయంలో పడిపోయాను, నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది. అదేమిటంటే, మరణించిన తర్వాత పరలోకంలో మీరేమో ప్రవక్త కాబట్టి స్వర్గంలోని ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటారు, నేను ఒక సాధారణమైన వ్యక్తి కాబట్టి, అల్లాహ్ దయవల్ల నేను కూడా స్వర్గానికి వచ్చేసినా, నేను స్వర్గంలోనే మామూలు స్థానాలలో ఉంటాను. అక్కడ కూడా నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని అక్కడ ఎలా చూడగలను, అక్కడ చూడలేనేమోనని నాకు బాధగా ఉంది, కంగారుగా ఉంది, ఓ దైవప్రవక్త అన్నారు.
చూశారా, ఎంతటి తపన ఉందో ఆయనలో ప్రవక్త వారిని చూడాలనే తపన, ప్రవక్త వారిని చూసి మనశ్శాంతి పొందాలన్న అభిమానం చూశారా. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు అవతరింపజేశాడు.
وَمَنْ يُطِعِ اللَّهَ وَالرَّسُولَ فَأُولَٰئِكَ مَعَ الَّذِينَ أَنْعَمَ اللَّهُ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَالصِّدِّيقِينَ وَالشُّهَدَاءِ وَالصَّالِحِينَ ۚ وَحَسُنَ أُولَٰئِكَ رَفِيقًا (వమయ్ యుతిఇల్లాహ వర్రసూల ఫఉలాయిక మఅల్లజీన అన్అమల్లాహు అలైహిమ్ మినన్నబియ్యీన వస్సిద్దీఖీన వష్షుహదాఇ వస్సాలిహీన వహసున ఉలాయిక రఫీఖా) ఎవరైతే అల్లాహ్కు, ప్రవక్తకు విధేయత చూపుతారో వారు, అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలు, సత్యసంధులు, అమరగతులు, సద్వర్తనులతో పాటు ఉంటారు. వారు ఎంత మంచి స్నేహితులు! (4:69) ఖుర్ఆన్ గ్రంథం నాలుగవ అధ్యాయము 69 వ వాక్యము.
దాని అర్థం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్కు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనబరుస్తారో, వారే అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోను, సత్యసంధులతోను, షహీదులతోను, సద్వర్తనులతోను ఉంటారు. వీరు ఎంతో మంచి స్నేహితులు.
ఎవరైతే అల్లాహ్ను మరియు ప్రవక్త వారిని విశ్వసించి, అభిమానించి, ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ప్రవక్తలతో పాటు ఉంటారట, సిద్దీఖీన్లతో పాటు సత్యసంధులతో పాటు ఉంటారట, షహీద్ వీరమరణం పొందిన వారితో పాటు ఉంటారట. ఎంతటి గౌరవం చూశారా?
سبحان الله ثم سبحان الله (సుబ్ హానల్లాహ్ సుమ్మా సుబ్ హానల్లాహ్).
అయితే మిత్రులారా, ఒకే మాట చెప్పి ఇన్ షా అల్లాహ్ ఒక విషయం వైపు మీ దృష్టిని నేను తీసుకువెళ్లాలనుకుంటున్నాను.. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి
متى الساعة؟ (మతస్సాఅ) ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వైపు చూసి
ماذا أعددت لها؟ (మాజా ఆదత్త లహా) అని తిరిగి ప్రశ్నించారు. ప్రళయం గురించి నీవు అడుగుతున్నావు సరే, కానీ ఆ ప్రళయం కోసము నీవు ఏమి సిద్ధం చేసుకున్నావు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఓ దైవప్రవక్త, నేను పెద్దగా నమాజులు ఏమి చదువుకోలేదు, నేను పెద్దగా ఉపవాసాలు ఏమి ఉండలేదు, చెప్పుకోదగ్గ పెద్ద పుణ్యకార్యం నేను ఏమి చేసుకోలేదు. నా మీద ఉన్న బాధ్యత మాత్రం నేను నెరవేర్చుకుంటూ ఉన్నాను, పెద్దగా చెప్పుకోదగ్గ పుణ్యకార్యము నేను ఏదీ చేయలేదు. కాకపోతే నేను నా గుండెల నిండా మీ అభిమానం ఉంచుకొని ఉన్నాను అన్నారు.
ఆయన ఏమంటున్నాడండి, నా గుండెల నిండా నేను మీ అభిమానాన్ని ఉంచుకొని ఉన్నాను అంటే వెంటనే ప్రవక్త వారు తెలియజేశారు,
أنت مع من أحببت (అంత మఅ మన్ అహబబ్త.) నీవు ఎవరినైతే అభిమానిస్తున్నావో, రేపు వారితో పాటే పరలోకంలో ఉంటావు అని చెప్పారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ వ్యక్తి పూర్తి అభిమానిస్తున్నాడు కాబట్టి, ప్రవక్త వారు తెలియజేసిన శుభవార్త ప్రకారము ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరిలో స్వర్గంలో ఉంటాడు. అయితే, ఇక్కడ ఇప్పుడు నేను మిమ్మల్ని ఆలోచింపజేస్తున్న విషయం ఏమిటంటే, ముస్లింలము మేము, ముస్లింలము మేము అని ప్రకటించుకునే ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీ గుండెల్లో ఎవరి అభిమానం ఎక్కువగా ఉంది? అల్లాహ్ అభిమానం ఎక్కువగా ఉందా? ప్రవక్త అభిమానం ఎక్కువగా ఉందా? లేక చింపిరి చింపిరి బట్టలు వేసుకున్న మహిళలతో నృత్యాలు చేసే, ఎగిరే, చిందేసే నాటక నటీనటుల అభిమానము ఉందా ఆలోచించండి. ఒకవేళ మీరు అందరి కంటే ఎక్కువగా అల్లాహ్ను అభిమానిస్తున్నారు, ప్రవక్త వారిని అభిమానిస్తున్నారు అంటే, అల్హమ్దులిల్లాహ్, చాలా సంతోషకరమైన విషయం. అలా కాకుండా మీరు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ఎక్కువగా నటీనటులను, వేరే వేరే వ్యక్తులను అభిమానిస్తున్నారు అంటే రేపు మీరు ఎవరితో పాటు ఉంటారు పరలోకంలో ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారం ఆలోచించండి.
లేదండి, మేము ప్రవక్త వారిని ఎక్కువగా అభిమానిస్తున్నాం అండి అని చాలామంది నోటితో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. నోటితో మాట్లాడితే సరిపోదు. మీ మాట్లాడే తీరు, మీ డ్రెస్ కోడ్, మీరు ధరించే దుస్తులు, మీ హెయిర్ స్టైల్, మీ వెంట్రుకలు, అలాగే మీ బట్టలు, మీ మాట్లాడే తీరు, మీ హెయిర్ స్టైల్, అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యవహార శైలి ఇవన్నీ మీరు ఎవరిని అభిమానిస్తున్నారో, ఎవరిని మీరు ఫాలో అవుతున్నారో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ముస్లింలు అంటున్న వారు, వారి బట్టలను చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విధంగా వారు దుస్తులు ధరిస్తున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారంగా వారు వెంట్రుకలు ఉంచుతున్నారా? ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము వ్యవహార శైలిగా నడుచుకుంటున్నారా? అక్కడ మనకు తెలిసిపోతుంది ఎవరు ఎవరిని మనం ఫాలో చేస్తున్నాం, ఎవరిని మనం అభిమానిస్తున్నాం, ఎవరి ఫోటోలు కాపీలలో, నోట్ బుక్కులలో, ఇంట్లోని గోడల మీద అతిక్కించుకుంటున్నాం, అక్కడ మనకు తెలిసిపోతుంది మన అభిమానులు ఎవరో, మనం ఎవరిని అభిమానిస్తున్నాము అనేది.
కాబట్టి జాగ్రత్త, ఎవరిని అభిమానిస్తున్నారో వారితోనే రేపు ఉంటారు.
నాలుగవ హక్కు: ఆదర్శంగా తీసుకోవడం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మటం, విశ్వసించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించటం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అభిమానించటం, మూడు హక్కుల గురించి తెలుసుకున్నాం కదండీ. ఇక మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శమూర్తిగా, రోల్ మోడల్ గా, ఆదర్శనీయుడిగా తీసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రతి పనిలో, ప్రతి విషయంలో, ఆరాధనల్లో, వ్యవహారాల్లో, అలాగే విశ్వాసంలో, ప్రతి విషయంలో ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఖుర్ఆన్ గ్రంథం 33వ అధ్యాయం 21వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,
لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِمَنْ كَانَ يَرْجُو اللَّهَ وَالْيَوْمَ الْآخِرَ وَذَكَرَ اللَّهَ كَثِيرًا (లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్ లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర వ జకరల్లాహ కసీరా) వాస్తవానికి అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు – అంటే అల్లాహ్ను, అంతిమ దినాన్ని ఆశించేవారికీ, అల్లాహ్ను అధికంగా స్మరించే వారికీ – ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. (33:21)
అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శము ఉంది అన్నారు. ఏ వ్యక్తి అయినా సరే ఆయన తండ్రిగా ఉంటాడు లేదా కుమారునిగా ఉంటాడు లేదా వృత్తిపరంగా ఒక బోధకునిగా, ఒక టీచర్గా ఉంటాడు లేదా ఒక డాక్టర్గా ఉంటాడు, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా సరే, ఏ వయసులో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక తండ్రిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదర్శనీయులు, ఒక కుమారునిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక భర్తగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక గురువుగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక వ్యాపారిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక డాక్టర్గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక బోధకునిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక లీడర్గా ప్రవక్త వారు ఆదర్శనీయులు, ఒక పొరుగువానిగా ప్రవక్త వారు ఆదర్శనీయులు, అలాగే ఒక సైన్యాధిపతిగా కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. మనిషి జీవితంలోని ప్రతి రంగంలో కూడా ప్రవక్త వారు ఆదర్శనీయులు. కాబట్టి, ఏ వ్యక్తి అయినా సరే, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే, ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం? ఎవరిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించుకుంటున్నాం? మన జీవన వ్యవహారాలు, మన జీవన శైలి ఎలా ఉంది, మన లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. ప్రవక్త వారిని ఆదర్శంగా తీసుకొని మనము జీవించాలి, ఇది ముస్లింల సముదాయం మీద ఉన్న మరొక హక్కు.
ఐదవ హక్కు: విధేయత చూపడం
ఇక సమయం ఎక్కువైపోతుంది కాబట్టి, క్లుప్తంగా ఇన్ షా అల్లాహ్ చెబుతూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త వారి తరఫున ముస్లిం సముదాయం మీద ఉన్న ముఖ్యమైన, ముఖ్యమైన, ముఖ్యమైన హక్కు, బాధ్యత ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. అనుసరించటం, విధేయత చూపటం అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులకైతే మమ్మల్ని చేయమని ఆదేశించారో, ఆ పనులను చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ పనులైతే చేయవద్దు అని వారించారో, ఆ పనులు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రవక్త వారు ప్రతి భక్తి కార్యానికి, ప్రతి మంచి కార్యానికి చేయమని ఆదేశించి ఉన్నారు. అలాగే, ప్రతి పాపానికి మరియు ప్రతి తప్పు కార్యానికి దూరంగా ఉండండి అని వారించి ఉన్నారు. ప్రవక్త వారు వారించిన విషయాలకు దూరంగా ఉండాలి, ప్రవక్త వారు బోధించిన, చేయమని చెప్పిన విషయాలను మనము చేయాలి. దీనినే ఇతాఅత్, ఇత్తెబా అని అరబీలో అంటారు, విధేయత అని తెలుగులో అంటారు, అనుసరించటం అని అంటారు.
ఖుర్ఆన్ గ్రంథం సూరా మాయిదా 92 వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు,
وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ (వ అతీవుల్లాహ వ అతీవుర్రసూల్) అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్తకు కూడా విధేయత చూపండి. (5:92)
అల్లాహ్కు విధేయత చూపండి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా విధేయత చూపండి, అనుసరించండి. ఎలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మనము విధేయత చూపాలి, అనుసరించాలంటే ఒక రెండు ఉదాహరణలు చెప్పిఇన్ షా అల్లాహ్ మాటను ముగించి ముందుకు కొనసాగిస్తాను.
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందుకు వచ్చాడు. ఆయన బంగారపు ఉంగరము ధరించి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, ఆ ఉంగరము తీసేసి పక్కన పడేశారు. పురుషులు బంగారము ధరించడము ఇస్లాం నియమాల నిబంధనల ప్రకారము అది వ్యతిరేకం. పురుషులు బంగారము ధరించరాదు, ఇది ఇస్లాం మనకు బోధించే విషయం. ఆ వ్యక్తి బంగారము ధరించి ఉన్నారు కాబట్టి ప్రవక్త వారు ఆ బంగారపు ఉంగరము తీసి పక్కన పడేసి, మీరు నరకము యొక్క అగ్నిని ముట్టుకోవటము, చేతిలో పట్టుకోవటము ఇష్టపడతారా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత ప్రవక్త వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇతర శిష్యులు ఆ వ్యక్తిని పిలిచి, చూడండి, ఆ బంగారము ధరించవద్దు అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, ఆ బంగారము మీరు ధరించవద్దు, కానీ అది అక్కడ పడిపోయి ఉంది కాబట్టి, అది మీరు తీసుకువెళ్ళండి, వేరే పనుల కోసం ఉపయోగించుకోండి అన్నారు. అయితే, ఆయన ఏమన్నారో తెలుసా,
لا والله، لا آخذه أبداً، وقد طرحه رسول الله صلى الله عليه وسلم (లా వల్లాహి, లా ఆఖుజుహు అబదా, వఖద్ తరహహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం.) అల్లాహ్ సాక్షిగా, అలా నేను చేయనంటే చేయను. ఏ పరికరాన్ని అయితే ప్రవక్త వారు తొలగించి పక్కన పడేశారో, దాన్ని నేను ముట్టుకోనంటే ముట్టుకోను అని చెప్పారు.
అలాగే మనం చూచినట్లయితే, అలీ రజియల్లాహు అన్హు వారు ఒకసారి పట్టు వస్త్రాలు ధరించి వెళ్తూ ఉన్నారు, ప్రవక్త వారి కంటపడ్డారు. ప్రవక్త వారు అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించి ఉన్న విషయాన్ని చూసి, ప్రవక్త వారికి ఆ విషయం నచ్చలేదు. ప్రవక్త వారికి నచ్చలేదన్న విషయం ఆయన ముఖ కవళికల ద్వారా కనపడింది. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు గుర్తుపట్టి, ఇంటికి వచ్చేసి ఆ వస్త్రాలు తీసి, చించేసి మహిళలకు ఇచ్చేశారు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇస్లామీయ నిబంధనల ప్రకారము పట్టు వస్త్రాలు పురుషులకు యోగ్యమైనవి కావు. పట్టు వస్త్రాలు మహిళలకే ప్రత్యేకం. పురుషులు పట్టు వస్త్రాలు ధరించరాదు, ఇది ఇస్లామీయ నిబంధన. అయితే అలీ రజియల్లాహు అన్హు వారు పట్టు వస్త్రాలు ధరించారు కాబట్టి, ప్రవక్త వారు ఆ విషయాన్ని ఇష్టపడలేదు. వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ విషయాన్ని గ్రహించి, ఆ పట్టు వస్త్రాలు ఇంటికి వెళ్లి చించేసి, మహిళల చేతికి ఇచ్చేశారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బట్టలతో ఏమైనా చేసుకోండి అని.
చూశారా, ప్రవక్త వారు ఇష్టపడలేదు, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారు ఆ దుస్తులను తొలగించేశారు. చూశారా, ఆ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము అనుసరించాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనము విధేయత చూపాలి. ఏ విషయాలనైతే ప్రవక్త వారు మమ్మల్ని వారించారో వాటికి దూరంగా ఉండాలి.
అలాగే, ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులలో మరొక హక్కు ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన ధర్మాన్ని వ్యాపింపజేయాలి, ప్రచారం చేయాలి, ప్రజల వద్దకు తీసుకువెళ్లి చేరవేయాలి. ఆ పని ప్రవక్తలు చేశారు. ప్రవక్త, మీకు నేను చివరి ప్రవక్తని, నా తర్వాత ప్రవక్తలు రారు. ఇక దీని ప్రచారం యొక్క బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి వెళ్ళిన తర్వాత సహాబాలు ఆ బాధ్యత నెరవేర్చారు. ఆ తర్వాత వారు కూడా బాధ్యత నెరవేర్చారు. మనము కూడా ఆ బాధ్యత నెరవేర్చాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులను అభిమానించాలి. ఎవరిని కూడా కించపరచరాదు, దూషించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూద్ పఠించాలి, ఇది కూడా మన మీద ఉన్న బాధ్యత మరియు హక్కు. దరూద్ శుభాలు అనే ప్రసంగము
إِنْ شَاءَ ٱللَّٰهُ (ఇన్ షా అల్లాహ్) వినండి, అక్కడ దరూద్ గురించి, అది ఎంత విశిష్టమైన కార్యమో తెలపజడం జరిగింది. అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్నేహితులతో మనము కూడా అభిమానం చూపించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శత్రువులతో మనము కూడా శత్రుత్వాన్ని వ్యక్తపరచాలి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ముస్లిం సముదాయం మీద ఉన్న హక్కులు. క్లుప్తంగా మీ ముందర ఉంచడం జరిగింది. నేను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని అందరినీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక,ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అబూ హురైరా (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర వక్త: సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/c8YBKq1fepo [30 నిముషాలు]
ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప సహాబీ అయిన అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్రను క్లుప్తంగా వివరించబడింది. ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు, స్వీకరించిన తర్వాత ప్రవక్త వారు పెట్టిన పేరు, మరియు ఆయనకు “అబూ హురైరా” (పిల్లికి తండ్రి) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. ఆయన యెమన్ దేశంలోని దౌస్ తెగలో జన్మించి, తండ్రిని కోల్పోయి తల్లి వద్ద పెరిగిన తీరు, మరియు తుఫైల్ బిన్ అమర్ దౌసీ (రదియల్లాహు అన్హు) ద్వారా ఇస్లాం స్వీకరించిన వృత్తాంతం చెప్పబడింది. మదీనాలో ఆయన అనుభవించిన తీవ్ర పేదరికం, అహ్ల్ అస్-సుఫ్ఫాలో ఒకరిగా జీవించిన విధానం, మరియు ప్రవక్త వారి దుఆ ఫలితంగా ఆయన తల్లి ఇస్లాం స్వీకరించిన అద్భుత సంఘటనను కళ్ళకు కట్టినట్టు వివరించారు. ప్రవక్త వారి తర్వాత, వివిధ ఖలీఫాల కాలంలో ఆయన పాత్ర, బహ్రెయిన్ గవర్నర్గా ఆయన సేవలు, మరియు ఆయన మరణ సమయంలో పరలోకం గురించి ఆయనకున్న భయభక్తులను ఈ ప్రసంగం తెలియజేస్తుంది. అత్యధికంగా 5,374 హదీసులను ఉల్లేఖించిన సహాబీగా ఆయన స్థానం, మరియు ఆయన అద్భుతమైన జ్ఞాపకశక్తిని కూడా ఈ ప్రసంగంలో ప్రస్తావించారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ [అల్-హమ్దు లిల్లాహ్, వస్సలాతు వస్సలాము ‘అలా రసూలిల్లాహ్] సకల స్తోత్రములు, పొగడ్తలు అల్లాహ్ కే శోభస్తాయి. మరియు అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు ఆయన ప్రవక్తపై వర్షించుగాక.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ఈనాటి ప్రసంగంలో మనం ఒక గొప్ప సహాబీ గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన గొప్పతనం ఏమిటంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ప్రత్యేకంగా దుఆ చేసి ఉన్నారు. హదీసు గ్రంథము చిన్నది అయినా సరే, పెద్దది అయినా సరే, ఆయన పేరు తప్పనిసరిగా అందులో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడి ఉంటుంది. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి 5,374 హదీసులు, ఉల్లేఖనాలు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. ఇలాంటి విశిష్టతలు కలిగిన ఆ సహాబీ ఎవరనుకుంటున్నారా? ఆయనే అబూ హురైరా రజియల్లాహు త’ఆలా అన్హు వారు. రండి, ఇన్ షా అల్లాహ్, ఈ ప్రసంగంలో మనం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర క్లుప్తంగా, ఇన్ షా అల్లాహ్, తెలుసుకుందాం.
పేరు & కున్నియత్
ఆయన ఇస్లాం స్వీకరించక ముందు ఆయనకు అబ్దుష్ షమ్స్ అని పేరు ఉండేది. ఇస్లాం స్వీకరించిన తర్వాత, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ పేరు సరికాదు అని మార్చి అబ్దుర్రహ్మాన్ అని పేరు పెట్టారు. అయితే, అబూ హురైరా అని ఆయనకు కున్నియత్, నామాంతరము ఉండేది. అబూ హురైరా అంటే దాని అర్థం ఏమిటి? చిన్న పిల్లికి తండ్రి అని అర్థం. ఆ పేరు ఆయనకు ఎందుకు పెట్టబడింది అంటే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన ఒక పిల్లిని పోషిస్తూ ఉండేవారు. ఆ పిల్లి ఆయన మీద అభిమానంతో ఎల్లప్పుడూ ఆయన వెంట వెంట తిరుగుతూ ఉండేది, ఆయన ఒడిలో కూర్చుంటూ ఉండేది. అది చూసిన ప్రజలు ఆయనకు అబూ హురైరా, చిన్న పిల్లికి తండ్రి అని నామాంతరము, కున్నియత్ పెట్టేశారు అని అంటూ ఉన్నారు.
జననం మరియు బాల్యం
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎక్కడ జన్మించారు అని మనం చూచినట్లయితే, యెమన్ దేశంలోని దౌస్ తెగలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జన్మించారు. ఆయన జన్మించిన కొద్ది రోజులకే వారి తండ్రి మరణించారు. ఆయన అనాథగా తల్లి వద్ద పెరిగారు. తల్లి పేరు ఉమైమ. ఆమె అబూ హురైరా వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో పోషించారు.
ఇక అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఎలా ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో భాగంగా తుఫైల్ బిన్ అమర్ దౌసీ రజియల్లాహు అన్హు వారి ఇస్లాం స్వీకరణ మనము విని ఉన్నాం. తుఫైల్ బిన్ అమర్, ఈయన కూడా యెమన్ దేశస్థులు, దౌస్ తెగకు చెందినవారు, గొప్ప కవి కూడా. మక్కాకు ఒకసారి వచ్చారు. మక్కా వాసులు ఆయనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడకండి, ఆయన మాటలు వినకండి అని హెచ్చరించారు. ఆయన ప్రారంభంలో ప్రవక్త వారి మాటలు వినకూడదు అనుకున్నారు. తర్వాత లోలోపల ఆలోచించి, “నేను కవిని, మంచి చెడులో వ్యత్యాసాన్ని గ్రహించగలిగే వాడిని, మరి అలాంటప్పుడు ముహమ్మద్ మాటలు వినటానికి నేను ఎందుకు భయపడాలి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వతహాగా ఆయన తరపు నుంచి ఏమీ మాట్లాడేవారు కాదు కదా! దైవ వాక్యాలు ప్రజలకు బోధించేవారు కదా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుఫైల్ బిన్ అమర్ వారికి దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ఆయన దైవ వాక్యాలను అర్థం చేసుకొని వెంటనే ఇస్లాం స్వీకరించేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు, “మీ తెగ వారికి కూడా వెళ్లి మీరు ఇస్లాం గురించి బోధించండి” అని ఆదేశించినప్పుడు, ఆయన దౌస్ తెగకు తిరిగి వెళ్లి ఇస్లాం వైపుకి ఆహ్వానించారు. ప్రారంభంలో తెగ వారు ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు మళ్లీ వెళ్లి ప్రయత్నము చేయమని ఆదేశించినప్పుడు, మళ్లీ వెళ్లి ఆయన ప్రయత్నము చేయగా 80 కుటుంబాలు అల్-హమ్దులిల్లాహ్ ఇస్లాం స్వీకరించాయి. అలా ఇస్లాం స్వీకరించిన వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు.
మదీనా వలస మరియు ఖైబర్ యుద్ధం
మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో విన్నాం అండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణము చేసి వెళ్లిపోయారు. మదీనాకు వలస ప్రయాణం చేసి వెళ్లిపోయిన ఆరవ లేదా ఏడవ సంవత్సరంలో తుఫైల్ బిన్ అమర్ వారు 80 కుటుంబాలను తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి హాజరయ్యారు. మదీనాకు వచ్చి చూస్తే, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేరు. ఆ సమయానికి ఆయన సైన్యముతో పాటు ఖైబర్ ప్రదేశానికి వెళ్లి ఉన్నారు, అక్కడ యూదులతో యుద్ధం సంభవిస్తూ ఉంది. దౌస్ తెగకు చెందిన తుఫైల్ బిన్ అమర్ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, మిగతా ప్రజలు కొంతమంది మదీనా నుండి చక్కగా ఖైబర్కు వెళ్లిపోయారు. ఆ ప్రకారంగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఎక్కడ కలిశారు అంటే ఖైబర్ ప్రదేశంలో కలిశారు. ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసి, అల్-హమ్దులిల్లాహ్ ఆ తర్వాత ఆయన కూడా, దౌస్ తెగ ప్రజలు కూడా యుద్ధంలో పాల్గొని విజేతలుగా మదీనాకు తిరిగి వచ్చేశారు.
మదీనాలో జీవనం మరియు పేదరికం
మదీనాకు వచ్చేసిన తర్వాత ఏమి జరిగిందంటే, దౌస్ తెగకు చెందిన చాలా మంది ప్రజలు వేరే వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. కానీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మూడు విషయాల కారణంగా మదీనాలోనే స్థిరపడిపోయారు. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పదే పదే చూడాలనే కోరిక. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సేవ చేయాలనే కోరిక. మూడవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇస్లాం శిక్షణ మరియు ధార్మిక శిక్షణ పొందాలనే కోరిక. ఈ మూడు విషయాల కారణంగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలోనే స్థిరపడిపోయారు. అయితే, గమనించాల్సిన విషయం ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు యెమన్ నుండి మదీనాకు వస్తున్నప్పుడు తల్లిని కూడా వెంట తీసుకొని వచ్చారు. తల్లి ఇస్లాం స్వీకరించలేదు, అయినా గానీ ఆవిడను వెంటబెట్టుకొని మదీనాకు వచ్చేసి ఉన్నారు.
ఇక్కడ మదీనాలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వేరే ఏ వృత్తిని కూడా ఆయన ఎంచుకోకుండా, కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద నుండి ఎక్కువగా మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ పని కోసం ఆయన పూర్తిగా అంకితమైపోయారు. మస్జిద్-ఎ-నబవీలో ఉండిపోతూ ఉండేవారు. ఆయన లాగే మరికొంత మంది సహాబాలు కూడా ఉండేవారు. వారందరినీ కూడా అస్హాబుస్ సుఫ్ఫా అనేవారు. అజియాఫుల్ ఇస్లాం అని, అజియాఫుల్లాహ్ అని, ఖుర్రా అని వారిని పిలిచేవారు. వారందరూ కూడా నిరుపేదలే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారందరి కోసము ఒక ప్రదేశాన్ని కేటాయించి నీడ సౌకర్యము కూడా కల్పించారు. వారందరూ కూడా ఆ ప్రదేశంలో సేద తీరేవారు.
ఇక, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మదీనాలో ఉంటున్నప్పుడు చాలా పేదరికము మరియు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన స్వయంగా తెలియజేసిన విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో రెండు రెండు రోజులు, మూడు మూడు రోజులు ఆయనకు తినటానికి ఏమీ దొరకని కారణంగా పూర్తిగా నీరసించిపోయి, ఒక్కొక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతే, ప్రజలు ఆయన పడుకుంటూ ఉన్నాడేమోలే అనుకునేవారు. మరికొంత మంది అయితే, ఏమైంది ఈయనకు ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నారు, పిచ్చి పట్టిందా అని కూడా కొంతమంది భావిస్తూ ఉండేవారు. కానీ వాస్తవానికి, ఆయన నీరసించిపోయి స్పృహ కోల్పోయి పడిపోయేవారు.
ఒకసారి ఆయన కడుపు మీద రాయి కట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరైనా కనిపిస్తే వారితో మాట్లాడుదాము, వారు ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఆశిస్తూ ఉన్నారు. అంతలోనే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అటువైపు వచ్చారు. ఆయనతో మాట్లాడారు, ఆయన కేవలం మాట్లాడి పలకరించి వెళ్లిపోయారు. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు వారు వచ్చారు, ఆయనను పలకరించారు, ఆయన కూడా కేవలం పలకరించి మాట్లాడి ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాట్లాడితే, వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముఖ కవళికను గమనించి అర్థం చేసుకొని, “నాతో పాటు రండి” అని ఇంటికి తీసుకుని వెళ్లారు. ప్రవక్త వారి ఇంట్లో ఒక పాత్రలో కొన్ని పాలు ఉన్నాయి. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి ఆదేశిస్తూ, “మీ మిగతా మిత్రులు మస్జిద్ లో ఉన్నారు కదా, అస్హాబుస్ సుఫ్ఫా, వారందరినీ కూడా పిలుచుకొని రండి” అన్నారు. ఆయన మనసులో ఆశ్చర్యపోతూ ఉన్నారు, “ఏమిటండి, ఒక చిన్న పాత్రలో ఉన్న పాలు అంత మంది నా మిత్రులకు సరిపోతాయా?” అని లోలోపల ఆశ్చర్యపోతూ ఉన్నారు, కానీ ప్రవక్త వారి ఆజ్ఞ కదా, పాటించాలి కదా, కాబట్టి వెళ్లి వారందరినీ పిలుచుకొని వచ్చారు. వారందరూ ప్రవక్త వారి ఇంటికి వచ్చినప్పుడు ప్రవక్త వారు తమ స్వహస్తాలతో ఆ పాత్ర ఒక శిష్యునికి అందజేసి, అల్లాహ్ నామాన్ని తలుచుకొని తాగటం ప్రారంభించండి అన్నారు. ఒక శిష్యుడు తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆయన తాగాడు, వేరే వారికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న వారందరూ కూడా తాగేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒకసారి తాగి ఇచ్చేస్తూ ఉంటే, “లేదు మరొకసారి తాగండి, మరొకసారి తాగండి” అని ఇంచుమించు ప్రవక్త వారు మూడు నాలుగు సార్లు ఆయనకు తాగమని చెప్పగా, ఆయన తాగేసి, “ఓ దైవ ప్రవక్త, నా కడుపు నిండిపోయిందండి, ఇక నేను తాగలేను” అని ఇచ్చేయగా, చివరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పాలు త్రాగారు. అల్లాహు అక్బర్! ఒక గిన్నెలో ఉన్న పాలు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అందులోనే ఎంత వృద్ధి, బరకత్ ఇచ్చాడంటే, అక్కడ ఉన్న వారందరూ కూడా అల్-హమ్దులిల్లాహ్ తనివి తీరా త్రాగగలిగారు.
అలాగే మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ప్రవక్త వారికి సేవలు కూడా చేస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు నీటి ఏర్పాటు చేసేవారు, వేరే వేరే పనులు కూడా ప్రవక్త వారి పనులు ఆయన చేసి పెడుతూ ఉండేవారు.
తల్లి ఇస్లాం స్వీకరణ
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కూడా మదీనాకు వచ్చి ఉన్నారు, ఆవిడ ఇస్లాం స్వీకరించలేదు అని మనం ఇంతవరకే విని ఉన్నాము కదండీ. తల్లిని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా గౌరవించేవారు, అభిమానించేవారు. ఎందుకంటే, పసితనంలోనే తండ్రి మరణించినా ఆవిడ బిడ్డను పోషించుకుంటూ ఉండిపోయారు గానీ మరొక వివాహము చేసుకోలేదు. కాబట్టి, బిడ్డ కోసం అంకితమైన తల్లి కోసము బిడ్డ, అనగా అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా చాలా అభిమానించేవారు, సేవలు చేసేవారు, గౌరవించేవారు. ఆవిడ కూడా ఇస్లాం స్వీకరించాలని పదేపదే వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండేవారు.
ఒకసారి ఏమైందంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి వద్దకు వెళ్లి ఇస్లాం గురించి బోధిస్తూ ఉంటే ఆమె కోపగించుకున్నారు. కోపగించుకుని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి మీద మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక అనరాని మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద కూడా మాట్లాడేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి బాధ కలిగింది. ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, ఇలా జరిగింది మా ఇంట్లో. మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా తల్లికి ఇస్లాం భాగ్యము లభించాలని, అల్లాహ్ ఆమెకు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలని అల్లాహ్ తో ప్రార్థన చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి కోసము ప్రత్యేకంగా అల్లాహ్ తో దుఆ చేయగా, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లారు. వెళ్లి చూస్తే, తలుపులు మూయబడి ఉన్నాయి, లోపల తల్లి స్నానం చేస్తున్న శబ్దం వస్తూ ఉంది. బిడ్డ వచ్చాడన్న విషయాన్ని గమనించిన తల్లి, “ఓ అబూ హురైరా, ఆగిపో నాయనా కొద్దిసేపు” అని ఆజ్ఞాపించగా, బయటే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కొద్దిసేపు నిలబడిపోయారు. తర్వాత తల్లి స్నానం ముగించుకొని, బట్టలు ధరించుకొని, తలుపులు తెరిచి, ముందుగా ఆమె పలికిన మాట ఏమిటంటే:
أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُوْلُ اللهِ [అష్-హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్-హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్] అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
తల్లి సాక్ష్య వచనం పఠించి, కలిమా పఠించి, ఇస్లాం స్వీకరించారన్న విషయాన్ని చూసి, విని, మళ్లీ పట్టరాని సంతోషంలో ఆనంద భాష్పాలు కార్చుకుంటూ, ఏడ్చుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్త, నా తల్లి ఇస్లాం స్వీకరించేశారు” అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మళ్లీ దైవ ప్రవక్తతో వేడుకున్నారు, “ఓ దైవ ప్రవక్త, విశ్వాసులందరూ కూడా నన్ను, నా తల్లిని అభిమానించాలని మీరు అల్లాహ్ తో దుఆ చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి ఆయన కోసము, ఆయన తల్లి కోసము అల్లాహ్ తో దుఆ చేశారు. అల్-హమ్దులిల్లాహ్! నేటికీ కూడా విశ్వాసులందరూ వారు మదరసాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలు చదువుతూ ఉన్నా, లేదా వారు విద్యార్థులు కాకుండా సామాన్యమైన ప్రజలు ధార్మిక పండితుల నోట ప్రసంగాలలో గానీ, మస్జిదులలో గానీ ఎక్కడైనా గానీ ప్రవక్త వారి మాటలు, ఉల్లేఖనాలు, హదీసులు వింటూ ఉన్నారు అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క పేరు ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించబడుతూనే ఉంటుంది. ఆ ప్రకారంగా, ప్రతి విశ్వాసి అబూ హురైరా రజియల్లాహు అన్హు వారికి అభిమానిగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఇన్ షా అల్లాహ్, అలాగే ఉంటూ ఉంటారు ముందు కూడా. అంటే, ప్రవక్త వారి యొక్క దుఆ ఫలితంగా విశ్వాసులందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని అభిమానిస్తూ ఉన్నారు మిత్రులారా, ఇది చెప్పాల్సిన విషయం.
అలాగే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తల్లి గురించి ఎంతగా శ్రద్ధ తీసుకుంటారో చూడండి. మరొక ఉదాహరణ చెబుతూ ఉన్నాను. ఒకసారి ఆకలి కారణంగా ఆయన మస్జిద్-ఎ-నబవీ లోకి ప్రవేశించారు. అక్కడ ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని ఆశతో వస్తే, ఎవరూ లేరు. కొంతమంది అక్కడ కూర్చొని ఉంటే వారి దగ్గరకు వెళ్లి, “ఈ సమయానికి మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి?” అని అడిగారు. వారందరూ ఏమన్నారంటే, “మీరు ఏ విధంగా అయితే ఈ సమయానికి ఆకలితో ఇక్కడికి ఏమైనా దొరుకుతుందని వచ్చారో, అలాగే మేము కూడా వచ్చాము” అన్నారు. తర్వాత వారందరూ కూడా కలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్దాము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లారు. వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, మాకు తినటానికి ఏమీ దొరకలేదు” అని ఆకలితో ఉన్నాము అని తెలియజేయగా, ప్రవక్త వారు ఖర్జూరపు పళ్ళు తెప్పించి ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్! సహాబాలు మరియు ప్రవక్త వారు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారో చూడండి. ఒక్కొక్కరికి రెండు రెండు ఖర్జూరపు పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రవక్త వారు అంటున్నారు, “ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీరు తినండి. అల్లాహ్ దయతో ఈ పూర్తి రోజుకు ఈ రెండు ఖర్జూరపు పండ్లు మీకు సరిపోతాయి.” అందరూ కూడా రెండు రెండు ఖర్జూరపు పండ్లు తీసుకొని తింటూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మాత్రము ఒక ఖర్జూరపు పండు మాత్రమే తిని ఒకటి లోపల పెట్టుకుంటూ ఉంటే, ప్రవక్త వారు చూసి, “ఎందుకండి ఒకటి ఖర్జూరము పెట్టుకుంటూ ఉన్నారు?” అంటే, “నా తల్లి కోసము పెట్టుకుంటున్నాను, ఓ దైవ ప్రవక్త” అన్నారు. అల్లాహు అక్బర్! తల్లి గురించి ఎంత శ్రద్ధ తీసుకునేవారో చూడండి. “నా తల్లి కోసము ఆ ఖర్జూరము నేను పెట్టుకుంటూ ఉన్నాను, ఓ దైవ ప్రవక్త” అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “లేదండి, ఆ ఖర్జూరము మీరు తినేయండి. మీ తల్లి కోసము నేను ప్రత్యేకంగా అదనంగా రెండు ఖర్జూరపు పండ్లు ఇస్తాను” అని దైవ ప్రవక్త వారు రెండు అదనంగా ఖర్జూరపు పండ్లు ఇచ్చి మీ తల్లికి ఇవ్వండి అన్నారు. అల్లాహు అక్బర్! మొత్తానికి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి తల్లి ప్రారంభంలో ఇస్లాం స్వీకరించలేదు, తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆ ఫలితంగా ఆవిడ ఇస్లాం స్వీకరించారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా తల్లి గురించి శ్రద్ధ తీసుకునేవారు, సేవలు చేసేవారు, బాగా అభిమానించేవారు కూడానూ.
ఆ తర్వాత మనం చూచినట్లయితే, హిజ్రీ శకం ఏడవ సంవత్సరం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా ఆచరించటానికి వెళ్ళినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త వారి వెంట వెళ్లి ఆ సంవత్సరము ఉమ్రా ఆచరించి వచ్చారు. ఆ తర్వాత, హిజ్రీ శకం ఎనిమిదవ సంవత్సరం వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బహ్రెయిన్ దేశానికి అలా బిన్ అల్-హదరమీ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి పంపిస్తూ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని కూడా ఆయనకు తోడుగా, జతగా పంపించారు. “మీరు అబూ హురైరా వారిని వెంట తీసుకుని వెళ్ళండి, ఆయనను గౌరవించండి” అని అలా బిన్ అల్-హదరమీ వారికి ప్రవక్త వారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరూ కలిసి బహ్రెయిన్కు వెళ్లారు. అలా బిన్ అల్-హదరమీ వారు బహ్రెయిన్కు వెళ్ళిన తర్వాత ప్రవక్త వారి ఆదేశం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు వారితో, “ఏమండీ, మీకు నేను గౌరవిస్తున్నాను, మీరు ఏ బాధ్యత తీసుకుంటారో చెప్పండి” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆలోచించి, “నాకు అజాన్ పలికే బాధ్యత ఇవ్వండి” అన్నారు. అల్లాహు అక్బర్! అజాన్ పలికే బాధ్యత అది సాధారణమైనది కాదు. అది చాలా విశిష్టత కలిగిన బాధ్యత, ఎంతో గౌరవంతో కూడుకున్న బాధ్యత కాబట్టి, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత ఇవ్వండి అన్నారు. నేడు చాలామంది అజాన్ పలికే బాధ్యతను చిన్నచూపుతో చూస్తూ ఉంటారు, అది సాధారణమైన విషయంగా భావిస్తూ ఉంటారు. లేదండి, చాలా విశిష్టతలతో కూడిన విషయము అది. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ బాధ్యత తీసుకున్నారు.
కొద్ది నెలలకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరే అబాన్ బిన్ సయీద్ అనే ఒక సహాబీని అక్కడికి అనగా బహ్రెయిన్కు నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఇద్దరూ తిరిగి మళ్లీ మదీనాకు వచ్చేశారు. ఒక సంవత్సరం గడిచింది. హిజ్రీ శకం తొమ్మిదవ సంవత్సరము వచ్చింది. ఆ సంవత్సరము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని నాయకునిగా నియమించి, ఆయన సారథ్యంలో ఇంచుమించు 300 మంది సహాబాలను హజ్ ఆచరించడానికి పంపించారు. వారిలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. అంటే, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి సారథ్యంలో హజ్ ఆచరించబడినప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చేశారు. ఆ సంవత్సరం ప్రవక్త వారు మాత్రము హజ్కి వెళ్ళలేదండి. ఆ తర్వాత వచ్చే సంవత్సరం, అనగా హిజ్రీ శకం పదవ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మంది సహాబాలను వెంటబెట్టుకొని వెళ్లి హజ్ ఆచరించారు. ఆ హజ్ని హజ్జతుల్ వదా అని అంటూ ఉంటారు. ఆ హజ్లో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వెళ్లి హజ్ ఆచరించుకొని వచ్చారు.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనంతర జీవితం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, ఆయన పరిపాలన యుగంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు, ముఖ్యంగా ముర్తద్దీన్లతో జరిగిన యుద్ధాలలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రత్యేకంగా పాల్గొన్నారు. అబూబకర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉమర్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఏం చేశారంటే, బహ్రెయిన్ ప్రదేశానికి ప్రవక్త వారి లాగే అలా బిన్ అల్-హదరమీ, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు, వీరిద్దరినీ నాయకులుగా నియమించి పంపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ సందర్భంలో బహ్రెయిన్లో ఇంచుమించు ఒక సంవత్సరం నాయకునిగా పరిపాలన కొనసాగించారు. ఆ ఒక సంవత్సరంలో ప్రభుత్వ తనఖా కూడా పొందారు, అటుగా ఆయన స్వయంగా కూడా వ్యాపారము చేశారు. ఆ ప్రకారంగా, ఆ ఒక సంవత్సరంలో ఆయన పెద్ద మొత్తంలో అల్-హమ్దులిల్లాహ్ డబ్బు సంపాదించుకోగలిగారు.
ఒక సంవత్సరం తర్వాత, ఉమర్ రజియల్లాహు అన్హు వారు వేరే సహాబీని అక్కడికి నాయకునిగా నియమించి పంపించేయగా, అలా బిన్ అల్-హదరమీ మరియు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వీరిద్దరూ మళ్లీ మదీనాకు తిరిగి వచ్చేశారు. అయితే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఈసారి మదీనాలో వచ్చినప్పుడు ఆయన వద్ద చాలా డబ్బు సొమ్ము ఉంది. ఇప్పుడు ఆయన మునుపటి లాగా నిరుపేద, ఆకలి దప్పుకలతో గడిపేవారు కాదు. చాలా డబ్బు అల్-హమ్దులిల్లాహ్ ఆయన సంపాదించుకోగలిగి ఉన్నారు. అయితే ఆయన ఏం చేశారో తెలుసా? మదీనాకు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తము బైతుల్ మాల్ కోసం అంకితం చేసేశారు. బైతుల్ మాల్ అంటే ప్రభుత్వం తరపున వితంతువులకు, అనాథలకు, మరియు నిరుపేదలకు ఆ సహాయము అందించేవారు. ఆ సహాయ నిధి కోసము ఈయన ఆయన వద్ద ఉన్న సంపద, డబ్బు మొత్తము అంకితం చేసేశారు, విరాళంగా ఇచ్చేశారు. అల్లాహు అక్బర్!
ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో, అంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారి మరణానంతరం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి పరిపాలన యుగంలో, సల్మాన్ బిన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారితో పాటు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు చాలా యుద్ధాలలో పాల్గొన్నారు. ముఖ్యంగా, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి జీవిత కాలంలో ఆయన తూర్ పర్వతం ఉంది కదండీ, వాది-ఎ-సైనా, సైనా అనే ఒక లోయ ఉంది. ఆ మైదానములో ఒక పర్వతం ఉంది, కోహె తూర్. అక్కడ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా మాట్లాడారు కదండీ. ఆ పర్వతం వరకు ఆయన ప్రయాణము కొనసాగించారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే, ఆ ప్రయాణంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే, కాబ్ అహ్బార్ రజియల్లాహు అన్హు వారు, వాస్తవానికి ఆయన ఒక యూదుడు, తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయనకు వేరే గ్రంథాల జ్ఞానము ఉంది. ఆయనతో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం వినిపించారు. ఏమని వినిపించారంటే, “జుమా రోజు చాలా విశిష్టత కలిగినది. జుమా రోజున అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదం అలైహిస్సలాం వారిని పుట్టించాడు. జుమా రోజున ఆయనకు స్వర్గంలో ప్రవేశింపజేశాడు. జుమా రోజునే ఆయన స్వర్గం నుంచి బయటికి వచ్చేశారు.” ఆ విధంగా చెబుతూ చెబుతూ చివర్లో, “జుమా రోజులో ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో భక్తుడు చేసే దుఆ తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమోదిస్తాడు” అని తెలియజేయగా, కాబ్ అహ్బార్, ఆయన ఏమంటున్నారంటే, “ఆ ఘడియ సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా” అన్నారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అన్నారు, “లేదండి, దైవ ప్రవక్త వారు తెలియజేసిన దాని ప్రకారము ప్రతి శుక్రవారము ఆ ఘడియ ఉంటుంది” అన్నారు. ఆయన ఆశ్చర్యపోయి వారి గ్రంథము, అంటే వేరే మత గ్రంథాలు ఉన్నాయి కదండీ, ఆయన ఇస్లాం స్వీకరించక ముందు యూదుడు కదండీ, ఆ మతానికి చెందిన గ్రంథము చదివి ఆయన, “ప్రవక్త వారు చెప్పిన మాట నిజము” అని అప్పుడు ఆయన ధ్రువీకరించారు కూడా.
చివరి రోజులు మరియు మరణం
సరే, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క వీర మరణం సంభవించినప్పుడు అలీ రజియల్లాహు అన్హు వారు ముస్లింల నాయకులయ్యారు. ఆయన పరిపాలన యుగంలో ముస్లింల రెండు పెద్ద సమూహాల మధ్య పెద్ద యుద్ధము జరిగింది. ఆ యుద్ధ సమయంలో అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వారిద్దరి మధ్య సంధి కుదిర్చటానికి చాలా ప్రయత్నము చేశారు. చివరికి ఆయన ఫలితం దొరకని కారణంగా యుద్ధంలో పాల్గొనకుండా ఆయన ఒంటరితనాన్ని ఎన్నుకున్నారు. ప్రత్యేకంగా దైవ ఆరాధన కోసం ఆయన అంకితమైపోయారు అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
సరే, ఏది ఏమైనప్పటికినీ, అలీ రజియల్లాహు అన్హు వారి తర్వాత, హిజ్రీ శకం 59వ సంవత్సరం, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాధి రాను రాను ముదురుతూనే పోయింది. మరణ సమయం సమీపించింది. అప్పుడు ఆయన పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నారు. ప్రజలు ఆయనతో అడిగారు, “ఏమండీ, ఎందుకు ఏడుస్తున్నారు?” అంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు, “నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోతున్నానని బాధలో నేను ఏడవట్లేదు. పరలోకాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను. ప్రయాణము ముందు ముందు చాలా పెద్దది, నా దగ్గర ఏమో సామాను చాలా తక్కువగా ఉంది. నేను స్వర్గానికి చేరుకుంటానా, నరకానికి చేరుకుంటానా నాకు అర్థం కావట్లేదు. స్వర్గం నా గమ్యస్థానం అవుతుందా, నరకం నా గమ్యస్థానం అవుతుందా తెలియదు కాబట్టి, అది తలుచుకొని నేను ఏడుస్తూ ఉన్నాను” అన్నారు.
అల్లాహు అక్బర్! జీవితాంతం ప్రవక్తకు మరియు సహాబాలకు మరియు ఇస్లాంకు అంకితమైపోయిన అలాంటి సహాబీ పరలోకాన్ని తలుచుకొని, “నా వద్ద సొమ్ము తక్కువ ఉంది,” అంటే పుణ్యాలు తక్కువ ఉన్నాయి, ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది, “స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో తెలియదు” అని ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయనలో ఎంత దైవభీతి ఉండేదో ఆలోచించండి. అలాగే, మనము ఎలాంటి ఎక్కువ పుణ్యాలు చేయకపోయినా పరలోకాన్ని తలుచుకొని ఏడవట్లేదు అంటే, ఎలాంటి భ్రమలో మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి మిత్రులారా.
సరే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణ సమయము సమీపించింది. ఆయన మదీనాలో ఉంటూ ఉన్నారు. మదీనా యొక్క నాయకుడు ఆ రోజుల్లో మర్వాన్ ఇబ్నుల్ హకం అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన పరామర్శించడానికి వచ్చారు. వచ్చి, “అల్లాహ్ మీకు స్వస్థత ప్రసాదించుగాక” అని ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అల్లాహ్ తో ప్రార్థించారు, “ఓ అల్లాహ్, నేను నీతో కలవటానికి ఇష్టపడుతూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను నీ వద్దకు రావటానికి ఇష్టపడు” అని ప్రార్థించారు. అల్లాహు అక్బర్! ఆ తర్వాత, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క మరణము సంభవించింది.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు మరణించిన తర్వాత వలీద్ బిన్ ఉత్బా బిన్ అబీ సుఫియాన్ రహిమహుల్లాహ్ వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి యొక్క జనాజా నమాజు ఆచరించారు. తర్వాత అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి దేహాన్ని అల్-బఖీ, జన్నతుల్ బఖీ అంటుంటారు కదండీ, అల్-బఖీ అల్-గర్కద్, అందులో ఆయనకు ఖనన సంస్కారాలు చేయడం జరిగింది. 59వ హిజ్రీలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు ఇంచుమించు 80 సంవత్సరాలకు కొద్దిగా తక్కువ లేదంటే కొద్దిగా ఎక్కువ అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన తర్వాత రోజుల్లో వివాహం చేసుకున్న కారణంగా ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె యొక్క వివాహము గొప్ప తాబయీ, సయీద్ బిన్ ముసయ్యిబ్ రహిమహుల్లాహ్ వారితో జరిగింది అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
జ్ఞాపకశక్తి మరియు హదీసుల ఉల్లేఖన
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి 5,374 హదీసులు ఉమ్మత్ అనుచర సమాజం వరకు చేరవేర్చి ఉన్నారు. సహాబీలందరిలో ఎక్కువగా హదీసులు ఉల్లేఖించిన వారు అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు అని కూడా చరిత్రకారులు తెలియజేసి ఉన్నారు.
అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ప్రవక్త వారి హదీసుల్ని జీవితాంతం చాలా చక్కగా కంఠస్థం చేసుకొని భద్రంగా గుర్తుంచుకొని ఉన్నారు అని చెప్పటానికి ఒక ఉదాహరణ వినిపిస్తూ ఉన్నాను, చూడండి. ఆయన జీవించి ఉన్నప్పుడు మదీనా నాయకుడు మర్వాన్ ఇబ్నుల్ హకం అని ఇంతవరకు మనం విన్నాము కదా. ఆ మర్వాన్ అనే అతను ఏం చేశాడంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని పిలిపించి ఆ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి, ఈ విషయానికి సంబంధించిన ఒక హదీసు వినిపించండి అని కొన్ని హదీసులు అడిగారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు ఆ హదీసులన్నీ కూడా వినిపించారు. ఈయన ఏం చేశారంటే, ముందే ఒక వ్యక్తిని ఆదేశించి, ఆయన వినిపిస్తున్న హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకోండి అని ఆదేశించగా, తెర వెనుక ఒక వ్యక్తి ఆ హదీసులన్నీ కూడా ఒక పత్రంలో వ్రాసి ఉంచుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, మళ్ళీ అబూ హురైరా రజియల్లాహు అన్హు వారిని ఆ మర్వాన్ అనే వ్యక్తి పిలిపించి మళ్ళీ ఆ హదీసులు ఫలానా ఫలానా హదీసులు వినిపించండి అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు గత సంవత్సరం ఏ విధంగా వినిపించారో అదే విధంగా చక్కగా ఎలాంటి తప్పు దొర్లకుండా వినిపించేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు వెళ్లిపోయిన తర్వాత తెర వెనుక కూర్చుని ఉన్న ఆ పత్రాన్ని గమనిస్తున్న వ్యక్తితో అడిగారు, “అబూ హురైరా కరెక్ట్ గానే వినిపించారా? ఏమైనా హెచ్చుతగ్గులు జరిగాయా?” అంటే, ఆ వ్యక్తి కూడా, “ఉన్నది ఉన్నట్టే ఆయన మొత్తం చెప్పారు, ఎలాంటి హెచ్చుతగ్గులు జరగలేదు” అని ఆ వ్యక్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు జీవితాంతం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్ని చక్కగా గుర్తుంచుకొని వేరే వారి వరకు చేరవేశారు అని మనకు ఈ సంఘటన తెలుపుతుంది.
ఆ ప్రకారంగా, నేను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉల్లేఖనాలు చదివి, నేర్చుకొని, ఇతరుల వద్దకు చేర్చే భాగ్యం ప్రసాదించుగాక. ఇది అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి జీవిత చరిత్ర. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న, విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.
وَجَزَاكُمُ اللهُ خَيْرًا [వ జజాకుముల్లాహు ఖైరన్] మరియు అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ఇచ్చుగాక.
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ [అస్సలాము ‘అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు] మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి | బులూగుల్ మరాం | హదీసు 1280 https://youtu.be/K3wcOKsHcp8 [ 9 నిముషాలు ] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
1280. హజ్రత్ జాబిర్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రభోదించారు:
“అన్యాయానికి దూరంగా ఉండండి ఎందుకంటే అన్యాయం ప్రళయదినాన తమస్సుకు, చిమ్మచీకట్లకు కారణభూత మవుతుంది. ఇంకా పిసినారితనం నుండి నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించినవారు దీని (పిసినిగొట్టు తనం) మూలంగానే నాశనమయ్యారు.”
సారాంశం:
ఈ హదీసులో అన్యాయంతో పాటు, పీనాసితనం పట్ల అప్రమత్తంగా ఉండాలని తాకీదు చేయబడింది. ‘అన్యాయం’ తీర్పుదినాన అన్యాయం చేసిన మనిషి పాలిట అంధకారబంధురంగా పరిణమిస్తుంది. అతనికి వెలుతురు , కాంతి కావలసిన తరుణంలో దట్టమైన చీకట్లు అతన్ని అలుముకుంటాయి పిసినారితనం కూడా ఒక దుర్గుణమే. పేరాశకు లోనైనవాడు, పిసినిగొట్టుగా తయారైన వాడు సమాజానికి మేలు చేకూర్చకపోగా, సమాజంలో అత్యంత హీనుడుగా భావించబడతాడు. పిసినారితనం నిత్యం మనస్పర్థలకు, కాఠిన్యానికి కారణభూతమవుతుంది, దుష్పరిణామాలకు దారితీస్తుంది.
—
ఈ ప్రసంగంలో, హదీథ్ నంబర్ 1280 ఆధారంగా ‘జుల్మ్’ (అణచివేత) మరియు ‘షుహ్’ (తీవ్రమైన పిసినారితనం లేదా దురాశ) అనే రెండు వినాశకరమైన పాపాల గురించి వివరించబడింది. ప్రళయదినాన అణచివేత చీకట్లుగా మారుతుందని, మరియు ‘షుహ్’ పూర్వపు జాతులను నాశనం చేసిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. సాధారణ పిసినారితనం ‘బుఖుల్’ కు మరియు తీవ్రమైన దురాశ ‘షుహ్’ కు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. ‘షుహ్’ అనేది కేవలం తన వద్ద ఉన్నదాన్ని ఖర్చు చేయకపోవడమే కాక, ఇతరుల సంపదను అక్రమంగా పొందాలనే కోరికను కూడా కలిగి ఉంటుందని, ఇది హత్యలు, పాపాలు మరియు బంధుత్వాలను తెంచడం వంటి ఘోరాలకు దారితీస్తుందని వివరించబడింది. చివరగా, సూరత్ అల్-హష్ర్ లోని ఒక ఆయత్ ను ఉటంకిస్తూ, ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడతారో వారే నిజమైన సాఫల్యం పొందుతారని నొక్కి చెప్పబడింది.
హదీథ్ వివరణ: అణచివేత (జుల్మ్) మరియు పిసినారితనం (షుహ్)
హజ్రత్ జాబిర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, జుల్మ్ కీ దూరంగా ఉండండి. ఎందుకంటే జుల్మ్ ప్రళయ దినాన తమస్సుకు, చిమ్మ చీకట్లకు కారణభూతమవుతుంది. ఇంకా షుహ్, పిసినారితనం నుండి మిమ్మల్ని కాపాడుకోండి. మీకు పూర్వం గతించిన వారు దీనిని, అంటే పిసినిగొట్టుతనం మూలంగానే నాశనమయ్యారు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఏ విషయంలో వినాశనం ఉన్నదో దాని నుండి మనం దూరం కాకపోతే మనమే చాలా ఘోరమైన నష్టంలో పడిపోతాము.
ఈ హదీథ్ లో జుల్మ్ గురించి వచ్చింది. ఇంతకుముందే మనం హదీథ్ నంబర్ 1279 లో దాని వివరాలు తెలుసుకున్నాం. అయితే ఇందులో మరొక విషయం ఏముంది? వత్తఖుష్షుహ్. షుహ్.
షుహ్ (الشُّحّ) మరియు బుఖుల్ (بخل) మధ్య వ్యత్యాసం
షుహ్, ఒక ఒత్తి ఉన్నది ఈ పదం, మరొకటి ఉన్నది బుఖుల్. బుఖుల్ అంటే కంజూసీతనం, పిసినారితనం. చేతిలో డబ్బులు ఉన్నాయి, అల్లాహ్ మార్గంలో, అవసరం ఉన్నవారికి, పేదవారికి దానం చేయకుండా, ఇవ్వకుండా స్వయం తన భార్యాపిల్లలపై, తల్లిదండ్రులపై ఏ మధ్య రకంలో ఖర్చు పెట్టాలో పెట్టకుండా పిసినారితనం వహించడం. ఇదేమిటి? బుఖుల్.
ఇక్కడ హదీథ్ లో వచ్చిన పదం ఏంటి? షుహ్. ధర్మవేత్తలు ఏమంటున్నారంటే, ఈ బుఖుల్ అనేది ఎప్పుడైతే మనిషిలో మితిమీరిపోతుందో, చివరికి అతడు ఖర్చు పెట్టే విషయంలోనే కాదు, డబ్బు, ధనం యొక్క పిశాచి ఎంతగా అయ్యాడంటే ఉన్నదానిని ఖర్చు పెట్టకుండా ఆపుకొని ఉంచుకుంటున్నాడు, అంతే కాదు, ఇంకా కావాలి, కావాలి, కావాలి అన్నటువంటి ఈ పెరాశ అనేది అక్రమంగా సంపాదించడంలో కూడా అతన్ని పడవేస్తుంది. ఇంతటి ఘోర స్థితికి ఎదిగిన వారిని అతడు షుహ్ లో పడ్డాడు అని అంటారు.
అర్థమైంది కదా? అయితే బుఖుల్ అనేది ఏదైతే ఉందో పిసినారితనం, అందులో మరింత ఓ నాలుగు అడుగులు ముందుగా ఉండడం దీనిని షుహ్ అంటారు.
మరొక భావం దీని గురించి కొందరు ధర్మవేత్తలు ఏం చెప్పారంటే, షుహ్ అన్నది మనసుతో. అటు లేనిదాన్ని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో అడ్డమార్గాలు తొక్కవలసి వచ్చినా, పాపం చేయవలసి వచ్చినా ఏ భయం లేకుండా చేసి సంపాదించడం మరియు ఖర్చు చేసే విషయంలో అంటే ప్రాక్టికల్ గా ఖర్చు చేసే విషయంలో బఖీల్, ఆపుకొని ఉంచడం, దీన్ని బుఖుల్, ముందు దాన్ని షుహ్ అని అంటారు.
పిసినారితనం (షుహ్) యొక్క వినాశకరమైన పరిణామాలు
కానీ ఇక్కడ గమనించండి, ప్రవక్త వారు ఏమంటున్నారు? ఇలాంటి ఈ పిసినారితనాన్ని మీరు వదులుకోండి. ఇలాంటి ఈ పిసినారితనం మీలో రాకుండా జాగ్రత్తపడండి. ఎందుకు? ఇంతకుముందు జాతి వారి వినాశనానికి ఇది కారణమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.
ఎలా అండి ఇది? ఎలా అంటే, గమనించండి. ఈ రోజుల్లో కూడా మనం కుబేరులను చూస్తున్నాము. మిలియనీర్, బిలియనీర్, కోట్లాధిపతులను కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనిషిలో ఈ పిసినారితనం చోటు చేసుకుంటుందో, ఏం చేస్తాడు? బంధుత్వాలను లెక్క కట్టడు. ఈ విధంగా మాట్లాడతాడు.
ఇస్లాం ధర్మం పేరుతో ఎందరికీ ఎలర్జీగా ఉంది. ఏ మానవత్వం ముందండి అని అంటారు. కానీ ఇలాంటి పిసినారులు మన సమాజంలో ఎంతోమంది కనబడతారు. మానవత్వత్వం ముందు అన్న వాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి బంధుత్వాలను, స్వయం మానవులను మరిచిపోయి దానికే ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే, చివరికి హత్యలు, ఘోరమైన పాపాలు, నేరాలు చేయవలసి వచ్చినా నాలుగు పైసల కొరకు అవన్నీ చేయడానికి కూడా సిద్ధమవుతారు. ఈ విధంగా ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది.
ఈ ఇంతకుముందు జాతి వారిని వినాశనానికి గురిచేసింది అంటే ఇహలోకంలో ఇప్పుడు చెప్పిన రీతిలో. ఇది పరలోకంలో కూడా వినాశనం. ఎందుకంటే మనిషి ఎప్పుడైతే డబ్బును, ధనాన్ని, ప్రజలకు అవసరమున్న విషయాలను, వస్తువులను ఆపుకొని స్వయం లాభం పొందుతూ, కొన్ని సందర్భాలలోనైతే పిసినారితనం ఎంతగా ఉంటుందంటే స్వయం కూడా లాభం పొందడు. స్వయం కూడా లాభం పొందకుండా డబ్బు సంపాదించడంలో ఎంత ముందుకు వెళుగుతారంటే వారి వద్ద దొంగతనం, అక్రమ సంపాదన, హత్య చేయడం మరియు మోసంతో డబ్బు కాజేసుకోవడం ఇవన్నీ ఎలాంటి పాపంగా భావించరు. ఇంకా దానిపై బంధుత్వాలను తెంచడం, ఇవన్నీ పాపాలకు గురి అవుతారు. చివరికి ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా పరలోకంలో అతన్ని నష్టంలో పడవేస్తాయి.
అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రజియల్లాహు అన్హు) గారి వివరణ
ఒకసారి అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు తన శిష్యులతో, తన దగ్గర కూర్చున్న వారితో అడిగారు, “అయ్యుహుమా అషద్ద్, అల్-బుఖుల్ అవిష్-షుహ్?” (ఈ రెండిటిలో ఏది తీవ్రమైనది, బుఖుల్ ఆ లేక షుహ్ ఆ?). నేను ఇంతకుముందే చెప్పాను కదా రెండు పదాలు ఉన్నాయని. అల్-బుఖుల్, దీని యొక్క అసలైన భావం పిసినారితనం. దానిపై మరొకటి షుహ్. ఈ రెండిటిలో చాలా చెడ్డది ఏమిటి? అని అడిగారు.
అయితే అక్కడ ఉన్నవారు విభేదాల్లో పడ్డారు. కొందరు ఇలా అంటుంటే, కొందరు అది అంటున్నారు. అప్పుడు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ అన్నారు, “అష్-షుహ్హు అషద్దు మినల్-బుఖుల్” (షుహ్ అనేది బుఖుల్ కంటే తీవ్రమైనది). షుహ్ అన్నది బుఖుల్ కంటే చాలా చెడ్డది. “లిఅన్నష్-షహీహ యషుహ్హు అలా మా ఫీ యదైహి ఫయహ్బిసుహూ, వ యషుహ్హు అలా మా ఫీ ఐదిన్-నాసి హత్తా య’ఖుజహూ. వ అమ్మల్-బఖీలు ఫహువ యబ్ఖలు అలా మా ఫీ యదైహి” (ఎందుకంటే ‘షహీహ్’ (షుహ్ గుణం ఉన్నవాడు) తన చేతిలో ఉన్న దానిపై పిసినారితనం చూపి దాన్ని బంధిస్తాడు, మరియు ప్రజల చేతుల్లో ఉన్న దానిపై కూడా దురాశ పడతాడు, దాన్ని తీసుకునేంత వరకు. అయితే ‘బఖీల్’ (బుఖుల్ గుణం ఉన్నవాడు) కేవలం తన చేతిలో ఉన్న దానిపై మాత్రమే పిసినారితనం చూపిస్తాడు).
షుహ్ ఉన్న వ్యక్తి తన చేతిలో ఉన్నదానిని ఆపేస్తాడు, ఇతరులకు ఇవ్వకుండా. అంతేకాదు, ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని కూడా మంచి మనసుతో చూడడు, ఎప్పుడు నా చేతిలోకి వచ్చి పడుతుందో, ఎప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుందో అని. కానీ బఖీల్ కేవలం తన వద్ద ఉన్నదానిని ఇతరులకు ఖర్చు చేయకుండా ఆపుకునేవాడు. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు ఈ విధంగా దీనిని, ఈ రెండు పదాలను వివరించారు.
ఖురాన్ సూచన
అయితే ఖురాన్ సూరతుల్-హష్ర్, 28వ ఖండంలో ఉంది, ఆయత్ నంబర్ తొమ్మిదిని గనక మనం చూస్తే, షుహ్ అన్నది ఎన్నో ఇతర పాపాలకు కారణమవుతుంది అని కూడా తెలుస్తుంది. అందుకొరకే దాని నుండి దూరం ఉన్నవాడే సాఫల్యం పొందుతాడని అల్లాహ్ అక్కడ మనకు తెలియజేస్తున్నాడు.
وَمَن يُوقَ شُحَّ نَفْسِهِ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ ఎవరైతే తమ ఆత్మల పిసినారితనం నుండి కాపాడబడ్డారో, అట్టివారే సాఫల్యం పొందేవారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.