99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/BaJGDgkkjvc [38 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఖురాన్‌లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

اَلْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.)

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
(ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా)
భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)

ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
(వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా)
మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)

వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا
(వ ఖాలల్ ఇన్సాను మాలహా)
“అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)

మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
(యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా)
ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)

యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
(బి అన్న రబ్బక అవ్హాలహా)
ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)

అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)

యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)

వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)

మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.

దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.

సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.

సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:

ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.

సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.

సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.

గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?

ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?

ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا
(అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.)
మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.

గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
(వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.)
ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ
(తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.)
ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది. పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.

అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.

ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.

మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,

لِّيُنذِرَ مَن كَانَ حَيًّا
(లియున్దిర మన్ కాన హయ్యా)
బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.

బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ
(హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.)
అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.

సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.

ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.

హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,

فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ
(ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.)
ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,

تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ
(తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.)
మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి. ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.

وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ
(వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.)
గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.

ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.

ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.

మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,

أَتَيْنَا طَائِعِينَ
(అతైనా తాయిఈన్)
మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.

ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?

ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.

యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,

وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
(వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్)
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)

సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.

సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.

కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?

లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.

ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
(వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.)
అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.

సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,

مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ
(మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.)
మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”

సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.

అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31951

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

పరలోకం పట్ల విశ్వాసం – సలీం జామి’ఈ
https://youtu.be/NsqbSZr8XQI [14 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లామీయ విశ్వాసంలోని ఐదవ ముఖ్యమైన అంశమైన పరలోక జీవితంపై విశ్వాసం గురించి వివరించబడింది. పరలోకం అంటే ఏమిటి, దాని ఉనికికి ఖురాన్ మరియు హదీసుల నుండి ఆధారాలు, మరియు ప్రపంచంలో జరిగే అన్యాయాలకు అంతిమ న్యాయం జరగాల్సిన ఆవశ్యకత వంటి విషయాలు చర్చించబడ్డాయి. పరలోకంలో జరిగే ముఖ్య సంఘటనలైన హషర్ మైదానం (సమావేశ స్థలం), కర్మపత్రాల పంపిణీ, మీజాన్ (త్రాసు), జహన్నం (నరకం), మరియు జన్నత్ (స్వర్గం) గురించి కూడా ప్రస్తావించబడింది. చివరగా, పరలోకంపై విశ్వాసం ఒక వ్యక్తిని దైవభీతితో జీవించేలా, పుణ్యకార్యాల వైపు ప్రేరేపించేలా మరియు పాపాలకు దూరంగా ఉంచేలా ఎలా చేస్తుందో, తద్వారా సమాజంలో శాంతి ఎలా నెలకొంటుందో వివరించబడింది.

అల్ హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్.

అన్ని రకాల ప్రశంసలు, పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అర్కానుల్ ఈమాన్, విశ్వాస ముఖ్యాంశాలు మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రసంగంలో, విశ్వాస ముఖ్యాంశాలలోని ఐదవ ముఖ్యాంశం పరలోకం పట్ల విశ్వాసం గురించి తెలుసుకుందాం.

పరలోకం అంటే ఏమిటి? పరలోకాన్ని విశ్వసించడానికి మన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? పరలోకంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమిటి? పరలోకాన్ని విశ్వసిస్తే మనిషికి కలిగే ప్రయోజనము ఏమిటి? ఇవన్నీ ఇన్ షా అల్లాహ్ ఈ ప్రసంగంలో వస్తాయి.

ఆ హదీస్ మరొక్కసారి మనము విందాం. జిబ్రీల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్తా, ఈమాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ, అల్లాహ్ ను విశ్వసించటం, దూతలను విశ్వసించటం, గ్రంథాలను విశ్వసించటం, ప్రవక్తలను విశ్వసించటం, పరలోకాన్ని విశ్వసించటం, విధివ్రాతను విశ్వసించటం అని సమాధానం ఇచ్చినప్పుడు, జిబ్రీల్ అలైహిస్సలాం వారు నిజమే అని ధ్రువీకరించారు కదండీ. ఆ ప్రకారంగా ఈమాన్ (విశ్వాసం) అంటే ఆరు విషయాలను విశ్వసించవలసి ఉంది కదండీ. అందులోని ఐదవ విషయం, పరలోకం పట్ల విశ్వాసం. ఈ పరలోకం పట్ల విశ్వాసం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు మీ ముందర ఉంచుతున్నాను. ఇన్ షా అల్లాహ్, శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నము చేయండి.

ముందుగా, పరలోకం అంటే ఏమిటి తెలుసుకుందాం. పరలోకం అంటే, మానవులందరూ కూడా మరణించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మానవులందరినీ ఒక రోజు మళ్ళీ బ్రతికిస్తాడు. ఆ రోజు వారి కర్మల లెక్కింపు జరుగుతుంది. ఎవరైతే సత్కార్యాలు ఎక్కువగా చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, వారికి శిక్షలు విధించటం జరుగుతుంది. ఇలా జరిగే దినాన్ని పరలోక దినం, లెక్కింపు దినం అని కూడా అంటూ ఉంటారు.

పరలోకం ఉంది అని నమ్మటానికి ఆధారాలు మనము ఇప్పుడు చూచినట్లయితే, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా పదేపదే పరలోకం గురించి మరియు పరలోకంలో జరగబోయే విషయాల గురించి మనకు తెలియపరిచి ఉన్నాడు. హదీసులలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాలలో కూడా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట పరలోకము మరియు పరలోకంలో జరగబోయే విషయాల ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ మీ ముందర ఉంచుతున్నాను చూడండి. ఖురాన్ గ్రంథము 23వ అధ్యాయము 15, 16 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

ثُمَّ اِنَّكُمْ بَعْدَ ذٰلِكَ لَمَيِّتُوْنَ ثُمَّ اِنَّكُمْ يَوْمَ الْقِيٰمَةِ تُبْعَثُوْنَ
ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు. మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు. (23:15-16)

ఈ రెండు వాక్యాలలో ప్రళయ దినం ప్రస్తావన కూడా వచ్చి ఉంది. మనిషి మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతారు అనే ప్రస్తావన కూడా వచ్చి ఉంది. ఇలా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా హదీసులు, ఉల్లేఖనాలు ఉన్నాయి. తద్వారా, పరలోకము తప్పనిసరిగా ఉంది అని గ్రంథాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. ప్రతి విశ్వాసి కూడా పరలోకాన్నే విశ్వసించటం తప్పనిసరి.

ఇక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, పరలోకం సంభవిస్తుంది అని కూడా మనకు తెలుస్తుంది. అది ఎలాగంటే, మనం చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ప్రపంచంలో, బలవంతులు, దౌర్జన్యపరులు నిరుపేదలపై, బలహీనులపై దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. హత్యలు చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేస్తూ ఉంటారు, ప్రాణాలు తీసేసి ఇది ప్రమాదము అని చిత్రీకరిస్తూ ఉంటారు, అరాచకాలు సృష్టిస్తూనే ఉంటారు, కబ్జాల మీద కబ్జాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటే, మనం చూస్తూ ఉంటాం. బలహీనులు న్యాయం కావాలి అని ఎదురు చూస్తూనే ఉంటారు, కానీ వారికి ఎక్కడ కూడా న్యాయం దొరకదు, చివరికి వారు అలాగే బాధపడుతూనే మరణించి ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. బలవంతుల్లో కొందరు, రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో, ధనముతో తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. వారు చేసిన అరాచకాలకు శిక్షలు పడవు. ఏదో ఒక రకంగా పలుకుబడి ద్వారా వారు తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. చివరికి వారు కూడా ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.

ప్రశ్న ఏమిటంటే, మరి అన్యాయానికి గురి అయిన ఈ పీడితులకు, దేవుడు కూడా న్యాయం చేయడా? అన్యాయము చేసి, అరాచకాలు సృష్టించిన ఈ దుర్మార్గులకు, దేవుడు కూడా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కూడా శిక్షించడా? అంటే, దానికి ఇస్లాం ఇచ్చే సమాధానం ఏమిటంటే, తప్పనిసరిగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు, మరియు అతనికి న్యాయం చేస్తాడు. అలాగే ప్రతి నేరస్తునికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని నేరానికి సరిపడేటట్టుగానే శిక్షిస్తాడు. ఎంతటి నేరము ఉంటుందో అంతటి కఠినమైన శిక్ష కూడా విధిస్తాడు. దీనికి సరైన ప్రదేశము పరలోకము.

పరలోకంలో నిరుపేద, ధనికుడు, బలహీనుడు, బలవంతుడు, రాజకీయ అండదండలు, ధనము, పలుకుబడి ఇవన్నీ ఏమీ గానీ ఉండవు, పనికిరావు కూడా. అక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రతి హక్కుదారునికి అతని హక్కు ఇప్పిస్తాడు మరియు ప్రతి నేరస్తునికి అతని నేరానికి తగినంత శిక్ష కూడా విధిస్తాడు. ఆ రోజు న్యాయము స్థాపించబడుతుంది. ఆ ప్రకారంగా పరలోకము తప్పనిసరిగా సంభవిస్తుంది అని మనకు స్పష్టమవుతుంది మిత్రులారా.

పరలోకంలో ఏమేమి ఉంటాయి అనే విషయాలు మనం చూచినట్లయితే, చాలా విషయాలు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియపరిచి ఉన్నారు. కొన్ని విషయాలు మాత్రమే ఈ ప్రసంగంలో చెబుతున్నాను. ఇన్ షా అల్లాహ్, పరలోకంలో ఏమి జరుగుతుంది అనే ప్రసంగం వినండి, అందులో వివరాలు ఇన్ షా అల్లాహ్ మీకు దొరుకుతాయి. ఇక రండి, కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పరలోకంలో హషర్ మైదానము ఉంది. హషర్ మైదానము అంటే ఏమిటి? ప్రళయం సంభవించిన తర్వాత, యుగాంతము సంభవించిన తర్వాత, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ భూమి ఆకాశాలను సృష్టిస్తాడు. ఆ రోజు భూమి ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక చదరపు మైదానములా, పాన్పు లాగా ఉంటుంది. ఆ మైదానంలో ఒక చెట్టు గానీ, ఒక గుట్ట గానీ, ఒక భవనము గానీ ఉండదు. ఆ మైదానంలో, ఆది మానవుడైన ఆదమ్ అలైహిస్సలాం వద్ద నుండి యుగాంతం సంభవించినంత వరకు ఎంతమంది మానవులైతే జన్మించి, మరణించారో వారందరినీ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మళ్ళీ బ్రతికించి నిలబెడతాడు.

వారందరూ కూడా ఆ మైదానంలో నిలబడినప్పుడు, వారి వారి చేతికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. ఎవరైతే సత్కార్యాలు చేసి ఉంటారో, విశ్వసించి ఉంటారో, కుడిచేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు వారి కర్మలను, వారి సత్కార్యాలను చూసి, చదివి సంతోషిస్తూ ఉంటారు, వారి మొహము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కరించి ఉంటారో, అరాచకాలు సృష్టించి ఉంటారో, ఎడమ చేతిలో వారికి కర్మపత్రాలు ఇవ్వబడతాయి. వారు చేసుకున్న పాపాలన్నీ వారు ఆ రోజు చదువుకుంటూ, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వారి మొహం ఆ రోజు నల్లబడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, దానిని హషర్ మైదానము అని అంటారు.

అలాగే పరలోకంలో ఏముంది అని మనం చూచినట్లయితే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మీజాన్ ఉంచి ఉన్నాడు. మీజాన్ అంటే ఏమిటి? త్రాసు అని అర్థం. ఆ త్రాసులో ఏమి తూంచబడుతుంది అంటే, ప్రజల పుణ్యాలు, పాపాలు తూచబడతాయి. ఎవరి పుణ్యాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు విజేతలుగా నిలబడతారు. ఎవరి పాపాలు అయితే ఎక్కువగా ఉంటాయో, వారు దోషులుగా నిలబడతారు. ఆ రోజు తుది నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాదే. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎవరిని మన్నించాలనుకుంటాడో వారిని మన్నిస్తాడు. మరి ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వారిని శిక్షిస్తాడు. నిర్ణయం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చేతిలోనే ఉంటుంది. కాకపోతే, విశ్వాసం ప్రామాణికమైనది అవుతుంది కాబట్టి మిత్రులారా, ఆ రోజు రానున్నది. ప్రపంచంలోనే విశ్వసించండి, సత్కార్యాలు చేయండి అని మనకు తెలపబడింది. మొత్తానికి పరలోకంలో త్రాసు ఉంది, అందులో ప్రజల కర్మలు తూచబడతాయి.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జహన్నం సిద్ధం చేసి ఉంచాడు. జహన్నం అంటే నరకం అని అర్థం. నరకంలో ఏముంది అంటే, అది ఒక పెద్ద బావి, దాని నిండా అగ్ని ఉంది. ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో, తిరస్కారానికి పాల్పడి ఉంటారో, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అలాంటి వారిని శిక్షించడానికి నరకంలో పడవేస్తాడు. ఎవరు ఎన్ని ఘోరమైన నేరాలు, పాపాలు చేసి ఉంటారో, వారికి నరకంలో అంత కఠినమైన శిక్ష కూడా విధించబడుతుంది. అల్లాహ్ మన అందరికీ దాని నుండి, దాని శిక్షల నుండి రక్షించుగాక, ఆమీన్.

అలాగే, పరలోకంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా జన్నహ్, ఉర్దూలో జన్నత్, తెలుగులో స్వర్గం సిద్ధం చేసి ఉన్నాడు. స్వర్గంలో ఏమున్నాయి అంటే, అందులో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అనుగ్రహాలు అన్నీ ఉంచి ఉన్నాడు. ఆ అనుగ్రహాలు ఎవరికి దక్కుతాయి అంటే, ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు, పుణ్యాలు ఎక్కువగా చేసుకుని ఉంటారో, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ స్వర్గము ప్రసాదిస్తాడు. ఎవరు ఎన్ని ఎక్కువ పుణ్యాలు చేసుకొని ఉంటారో, వారు స్వర్గంలో అంత ఉన్నతమైన స్థానాలలో చేరుకుంటారు. స్వర్గంలో ఉన్నవారు, ప్రశాంతంగా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి భయము లేకుండా, సంతోషంగా జీవించుకుంటూ ఉంటారు. అలాంటి స్వర్గం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.

పరలోకంలో ఇంకా ఏమి ఉంటాయి అంటే, పరలోకంలో హౌదె కౌసర్ ఉంది, పరలోకంలో పుల్ సిరాత్ ఉంది, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మీరు పరలోకంలో ఏమి జరుగుతుంది, పరలోక విశేషాలు అనే ప్రసంగాలు వినండి, ఇన్ షా అల్లాహ్ తెలుస్తుంది. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇక చివరులో మనము…

పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఇన్ షా అల్లాహ్ తెలుసుకొని మాటను ముగిద్దాం. పరలోకాన్ని విశ్వసిస్తే కలిగే ప్రయోజనం ఏమిటట? మనిషి పరలోకాన్ని విశ్వసించటం వలన దైవభీతితో జీవిస్తాడు. పుణ్యాలు బాగా చేసి, పరలోక అనుగ్రహాలు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. పాపాలు చేస్తే పరలోకంలో శిక్షలు తప్పవు అని భయపడుతూ ఉంటాడు. మరియు అలా భయపడటం వలన, అతను అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా చేయటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది.

ఒకసారి ఆలోచించి చూడండి. ప్రతి వ్యక్తి పరలోకాన్ని విశ్వసించి, పరలోకంలో ఉన్న అనుగ్రహాలను విశ్వసించి, పరలోకంలో ఉన్న శిక్షలను కూడా విశ్వసించి, వాటిని దృష్టిలో పెట్టుకుని జీవిస్తున్నప్పుడు, సత్కార్యాలు చేసుకుందాం, పుణ్యాలు సంపాదించుకుని స్వర్గానికి చేరుకుందాం అనుకుంటూ ఉంటే, అలాగే పాపాలు చేయవద్దు, చేస్తే నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి, వద్దు అయ్యా పాపాలు, నేరాలు అని దానికి దూరంగా ఉంటూ ఉంటే, ప్రతి వ్యక్తి ఆ విధంగా విశ్వసించి జీవించుకుంటే, అలాంటి సమాజము శాంతియుతంగా ఉంటుంది అని చెప్పటానికి ఇంకేమి కావాలి మిత్రులారా.

కాబట్టి, నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన అందరికీ సంపూర్ణ విశ్వాసులుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. నరక శిక్షల నుండి అల్లాహ్ మమ్మల్ని కాపాడి, స్వర్గవాసులుగా మమ్మల్ని అందరినీ స్వర్గానికి చేర్చుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=30634

పరలోకం (The Hereafter) – మెయిన్ పేజీ
https://teluguislam.net/hereafter/

దాన ధర్మాల విశిష్టత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]

1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.

అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.

ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا

వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.

అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.

మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.

సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.

అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.

అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.

అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.

అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.

మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.

దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:

ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.

అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?

اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.

దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:

ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.

తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:

قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.

ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.

అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:

أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.

అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.

మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.

ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.

ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.

ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.

మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.

అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.

ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.

కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.

ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.

అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.

మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.

అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.

మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.

అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.

అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:

أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:

يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.

ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)

నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.

ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:

إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.

కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.

రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:

ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.

అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.

మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!

ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

తబర్రుక్ (శుభం పొందగోరటం) వాస్తవికత [వీడియో & టెక్స్ట్]

తబర్రుక్ వాస్తవికత (Tabarruk & It’s Reality) [వీడియో]
https://youtu.be/MVZ1RxKfCWY [30 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్‌ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్‌లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్‌ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్‌లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.

الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ،
(అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.)
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.

وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا،
(వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా)
మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.

مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ،
(మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.)
అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ،
(వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ،
(వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.)
మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.

أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا.
(అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.)
ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్‌ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ
(అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్)
నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).

وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم
(వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం)
మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.

وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ
(వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్)
మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).

وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ
(వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్)
మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.

అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.

తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.

ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).

ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.

అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.

అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్‌తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:

وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:

كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ
ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్‌తో కూడిన గ్రంథం, తబర్రుక్‌తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.

ఇక ఖురాన్‌తో బరకత్ పొందటం, ఖురాన్‌తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్‌లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.

ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్‌ని అనుసరిస్తే. ఖురాన్‌ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్‌గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్‌ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్‌తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.

అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,

ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్‌ని పొందటం.

రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.

ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.

అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్‌గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.

అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.

బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:

فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ
(ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ)
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.

అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.

దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.

అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.

ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్‌తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.

కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.

خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ
(ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్)
మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.

అది యుద్ధ సమయంలో.

وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ
(వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్)
అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.

وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ
(వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం)
అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.

అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్‌ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.

అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:

قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ
(ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్)
అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.

ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.

అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్‌లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى
(లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)

ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్‌లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.

ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్‌లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్‌లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్‌లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్‌లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.

అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్‌కి, హదీస్‌కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్‌లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్‌గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్‌ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

తబర్రుక్ (‘సృష్టితాల‘ నుండి “శుభం” పొందగోరటం)

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

ఇరుగు పొరుగు వారి హక్కులు – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఇరుగు పొరుగు వారి హక్కులు
https://youtu.be/a1a481jkb_M [27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు:

1- ఇల్లు కొనే ముందు పొరుగు వారిని చూడండి అని ఎందుకు అనబడింది ?
2- పొరుగు వారు చెడ్డ వారు కాకుండా ఉండేలా చూడమని ప్రవక్త (స) అల్లాహ్ తో చేసిన దువా ఏమిటి ?
3- కూర వండేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పోసి వండండి అని ప్రవక్త (స) ఆజ్ఞాపించారు కారణం ఏమిటి ?
4- నమాజులు, ఉపవాసాలు ఆచరించి దాన ధర్మాలు చేసినా ఒక మహిళ నరకానికి వెళ్ళింది కారణం తెలుసా ?
5- తమ పొరుగు వారు ఆకలితో ఉన్నారని తెలిసి కూడా పట్టించుకోని వారికి ఏమవుతుంది ?
6- పొరుగింటి మహిళతో వ్యభిచారం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
7- పొరుగింటిలో దోంగతనం చేస్తే ఎంత పాపము మూటగట్టుకుంటారో తెలుసా ?
8- అల్లాహ్ సాక్షిగా ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటూ ప్రవక్త (స) మూడు సార్లు ప్రమాణం చేసి ఎవరి గురించి చెప్పారు ?
9- పొరుగు వారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళగలడా ?
10- పొరుగు వారు ఆస్తిలో హక్కుదారులుగా నిర్ణయించబడుతారేమో అని ప్రవక్త (స) కు అనుమానం ఎందుకు కలిగింది ?

ఈ ప్రసంగంలో, ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి ఇస్లామీయ బోధనలు వివరించబడ్డాయి. మంచి పొరుగువారు దొరకడం అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు సౌభాగ్యానికి నిదర్శనమని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల ద్వారా స్పష్టం చేయబడింది. ఇస్లాం పొరుగువారితో, వారు ఏ మతానికి చెందినవారైనా సరే, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, వారికి కానుకలు ఇచ్చుకోవాలని, వండిన దానిలో వారికి కూడా భాగం ఇవ్వాలని, మరియు వారి అవసరాలకు సహాయపడాలని ఆదేశిస్తుంది. దీనికి విరుద్ధంగా, మాటల ద్వారా గానీ చేతల ద్వారా గానీ పొరుగువారికి హాని కలిగించడం, వారి ప్రాణానికి, మానానికి, ధనానికి నష్టం వాటిల్లేలా చేయడం మహా పాపమని, అలాంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడని ప్రవక్త వారు తీవ్రంగా హెచ్చరించారు. పొరుగువారి ఆకలిని తెలిసి కూడా పట్టించుకోని వాడు విశ్వాసి కాజాలడని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా ఇవల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇరుగుపొరుగు వారి హక్కుల గురించి తెలుసుకోబోతున్నాం. చూడండి, మనమంతా నలుగురిలో ఒకరిలాగా జీవిస్తూ ఉన్నాం. ఆ ప్రకారంగా మనము ఆలోచిస్తే, ప్రతి మనిషి నలుగురి మధ్య జీవించడానికి ఇష్టపడతాడు, ఏకాంతంలో ఒంటరిగా అందరికంటే పక్కగా దూరంగా నివసించడానికి ఇష్టపడడు. కాబట్టి మనలోని ప్రతి ఒక్కరికీ ఇరుగుపొరుగు వారు ఉన్నారు, మనము కూడా వేరే వారికి ఇరుగుపొరుగు వారిగా ఉంటూ ఉన్నాము.

అయితే మిత్రులారా, పొరుగువారు మంచివారు అయ్యి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. అందుకే పెద్దపెద్ద గురువులు, పండితులు, ఎవరైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు అని వారితో సలహాలు అడిగినప్పుడు,

اُطْلُبِ الْجَارَ قَبْلَ الدَّارِ
(ఉత్లుబిల్ జార్ కబ్లద్దార్)
ఇంటి కంటే ముందు ఇరుగు పొరుగు వారిని వెతకండి అని సలహా ఇచ్చేవారు. అర్థం ఏమిటంటే ఇల్లు కొనే ముందు పొరుగు వారు ఎలాంటి వారో చూసుకొని, తెలుసుకొని తర్వాత కొనండి అని చెప్పేవారు. అలా ఎందుకు చెప్పేవారంటే, పొరుగు వారు మంచివారు అయితే వారు మీకు అన్ని విధాలా సహాయపడతారు, మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది, ధార్మిక విషయాలలో కూడా వారు మీకు దోహదపడతారు, సహాయపడతారు.

అయితే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా, పొరుగువారు మంచివారు దొరికిపోవటం ఇది సౌభాగ్యానికి నిదర్శనం అని తెలియపరిచి ఉన్నారు. మనం చూచినట్లయితే, అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు.

مِنْ سَعَادَةِ الْمَرْءِ الْجَارُ الصَّالِحُ
(మిన్ సఆదతిల్ మర్ఇ అల్ జారుస్ సాలిహు)
ఒక వ్యక్తి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమేమిటంటే, అతనికి మంచి పొరుగువారు దొరకడం.

అంటే మనిషి యొక్క సౌభాగ్యానికి నిదర్శనమైన విషయం ఏమిటంటే, అతనికి మంచి పొరుగు వారు దొరికిపోతారు. అల్లాహు అక్బర్! మంచి పొరుగు వారు దొరకటం, అతని అదృష్టానికి నిదర్శనం, అతను అదృష్టవంతుడు అలాంటి మంచి వారు దొరికిపోతే అని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది.

అయితే దీనికి విరుద్ధమైన విషయాన్ని మనం చూచినట్లయితే, ఒకవేళ పొరుగువారు మంచివారు కాదు అంటే, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, వారు తలనొప్పిగా మారిపోతారు. పొరుగువారు మంచివారు కాకపోయినప్పుడు వారు మనకోసము తలనొప్పిగా మారిపోతారు. చాలా సందర్భాలలో చూసిన విషయం ఏమిటంటే, పొరుగు వారి పోరు తట్టుకోలేక ప్రజలు ఇల్లు వదిలేస్తారు లేదంటే అమ్మేస్తారు కూడా.

ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెడ్డ పొరుగు వారు ఉండకూడదు అని అల్లాహ్ శరణు కోరుకుంటూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రార్థించేవారు అని సహీ అత్తర్గీబ్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనంలో ఈ విధంగా ఉంది.

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ جَارِ السُّوءِ فِي دَارِ الْمُقَامَةِ
(అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ జారిస్సూయి ఫీ దారిల్ ముకామా)
ఓ అల్లాహ్! నేను నివాసముండే ప్రదేశంలో చెడ్డ పొరుగు వాని కీడు నుండి నేను నీ శరణు కోరుకుంటున్నాను.

నేను నివాసం ఉండే ప్రదేశంలో చెడ్డ వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను, చెడ్డ పొరుగు వారి కీడు నుండి ఓ అల్లాహ్ నేను నీ శరణు కోరుకుంటున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేస్తూ ఉండేవారు. దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, చెడ్డవారు పొరుగువారుగా ఉండకూడదు. పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని ప్రవక్త వారు సైతము అల్లాహ్ తో శరణు కోరుకుంటున్నారంటే, చెడ్డ పొరుగు వారి వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో మనము గ్రహించవచ్చు.

అయితే మిత్రులారా, మనం ఎలాగైతే మన పొరుగువారు మంచివారు ఉండాలని కోరుకుంటామో, మన పొరుగువారు చెడ్డవారు ఉండకూడదు అని కోరుకుంటామో, స్వయంగా మనము కూడా పొరుగు వారి కోసము మంచి వాళ్ళులాగా మారిపోవాలి.

రండి ఇన్షా అల్లాహ్, పొరుగువారి పట్ల, వారి శ్రేయము మరియు వారి మంచి పట్ల ఇస్లాం ఎలాంటి బోధనలు చేసి ఉందో ఇన్షా అల్లాహ్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని ఇస్లాం మనకు ఆదేశిస్తూ ఉంది. పొరుగువారు, వారు ఎవరైనా సరే, మన సమీప బంధువులైనా సరే, దూరపు బంధువులైనా సరే, అపరిచితులైనా సరే, ఇతర మతస్తులైనా సరే, అందరితో మనము మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పదేపదే తెలియజేస్తూ ఉండేవారు.

مَا زَالَ جِبْرِيلُ يُوصِينِي بِالْجَارِ حَتَّى ظَنَنْتُ أَنَّهُ سَيُوَرِّثُهُ
(మాజాల జిబ్రీలు యూసీనీ బిల్ జార్ హత్తా జనన్తు అన్నహు సయువర్రిసుహు)
జిబ్రీల్ అలైహిస్సలాం నా వద్దకు వచ్చి పదేపదే పొరుగువారి గురించి ఎంతగా బోధించారంటే, బహుశా భవిష్యత్తులో పొరుగువారికి ఆస్తిలో వారసులుగా నిర్ణయించేస్తారేమో అన్న ఆలోచన నాకు కలిగింది.

జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత నా వద్దకు వచ్చి పదేపదే, ఎక్కువగా పొరుగు వారి గురించి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బోధిస్తూ ఉండేవారు. ఆయన ఎంతగా నన్ను బోధించారంటే, భవిష్యత్తులో బహుశా పొరుగు వారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న ఆలోచన నాకు కలిగింది అని ప్రవక్త వారు తెలియజేశారు. అంటే, పొరుగువారికి ఆస్తిలో భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనన్న భావన వచ్చేటట్లుగా బోధించారు అంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలని అల్లాహ్ మరియు ప్రవక్త వారు మనకు బోధిస్తున్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి.

అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పడానికి మరొక ఉదాహరణ చూడండి. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు తాలా అన్హు వారు ఒకరోజు ఇంట్లో ఒక పొట్టేలు కోయించారు. సేవకుడు పొట్టేలు కోస్తూ ఉన్నాడు, మాంసము భాగాలు చేస్తూ ఉన్నాడు. అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు సేవకునితో ఏమంటున్నారంటే, మా పొరుగులో ఉంటున్న యూదునికి కూడా ఈ మాంసంలో నుంచి ఒక భాగము చేరవేయించండి. ఒకసారి చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వచ్చారు, ఏమయ్యా నేను చెప్పిన మాట మరవకు, తప్పనిసరిగా పొరుగువారిలో ఉన్న మా ఆ యూద సోదరునికి ఈ మాంసంలోని భాగము చేరవేర్చు అని మళ్లీ చెప్పి వెళ్లారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత వచ్చారు, మళ్లీ చెప్తున్నారు. అలా పదేపదే వచ్చి చెబుతూ ఉంటే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏమన్నారంటే అయ్యా, ఆయన ముస్లిం కాదు కదా, యూదుడు, వేరే మతస్తుడు కదా, మరి ఆయన గురించి మీరు ఇంతగా తాకీదు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశారు. అల్లాహు అక్బర్.

ఆ మాట అడగగానే వెంటనే అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, అయ్యా నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఈ ఉల్లేఖనము విని ఉన్నాను. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పదేపదే పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తూ వెళ్లారు. ఎంతగా ఆదేశించారంటే ప్రవక్త వారికి అనుమానం కలిగింది, భవిష్యత్తులో జిబ్రీల్ అలైహిస్సలాం ఏమైనా పొరుగు వారికి తమ ఆస్తిలో వాటాదారులుగా, భాగస్తులుగా, వారసులుగా నిర్ణయించేస్తారేమోనని నాకు అనుమానం కలిగిందని ప్రవక్త వారు తెలియజేశారు. ఆ ప్రకారంగా పొరుగువారితో మనము ఎంతగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్న విషయం అక్కడ బోధపడింది, నేను స్వయంగా ప్రవక్త వారి నోట ఆ మాట విని ఉన్నాను కాబట్టి ఒక పొరుగు వానిగా నేను మన పొరుగులో ఉంటున్న యూద సోదరునితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, ఇది నాకు ఇస్లాం ఆదేశిస్తున్న విషయము కాబట్టి, తప్పనిసరిగా మీరు ఆ మాంసంలోని భాగము వారికి చేరవేయండి అని తెలియపరిచారు. అల్లాహు అక్బర్.

పొరుగువారు ఎవరైనా సరే వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పటానికి ఈ సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. అలాగే పొరుగువారితో మనము ముఖ్యంగా సత్ప్రవర్తనతో పాటు వారి పట్ల ప్రేమ పెంచుకోవడానికి వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి అని ఇస్లాం బోధించింది. చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రియ సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వెళ్లి ప్రశ్నిస్తూ ఉన్నారు.

يَا رَسُولَ اللَّهِ، إِنَّ لِي جَارَيْنِ، فَإِلَى أَيِّهِمَا أُهْدِي؟
(యా రసూలల్లాహ్, ఇన్నలీ జారైని ఫ ఇలా అయ్యిహిమా అహదీ)
ఓ దైవ ప్రవక్తా! నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు, నేను వారిలో ఎవరికి కానుక ఇవ్వాలి?

ఓ దైవ ప్రవక్తా, పొరుగు వారితో కానుకలు ఇచ్చుకుంటూ ఉండాలి, వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, ప్రేమ అభిమానాలు పెరగటానికి, కానుకలు ఇచ్చుకోవాలి అని చెప్పారు కదా, అయితే నాకు ఇద్దరు పొరుగువారు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరికి ముందుగా నేను ఈ కానుక అందజేయాలి అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ తెలియజేస్తూ ఉన్నారు.

قَالَ: “إِلَى أَقْرَبِهِمَا مِنْكِ بَابًا”
(కాల: ఇలా అక్ రబి హిమా మిన్కి బాబన్)
ఆయన (ప్రవక్త) ఇలా అన్నారు: “నీ ఇంటి గుమ్మానికి వారిలో ఎవరి ఇల్లు దగ్గరగా ఉందో (వారికి ఇవ్వు)”.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి. ప్రవక్త వారంటున్నారు, మీ గుమ్మానికి ఏ పొరుగువారి ఇల్లు దగ్గరగా ఉందో ముందు వారికి కానుక చేరవేయండి, ఆ తర్వాత ఇతరులకు కూడా చేరవేయండి అని దాని అర్థం. చూశారా? కాబట్టి పొరుగువారితో ప్రేమ అభిమానాలు పెంచుకోవటము కోసము, వారికి కానుకలు కూడా ఇచ్చుకుంటూ ఉండండి అని ఇస్లాం మనకు బోధించింది మిత్రులారా.

అలాగే, మనం మన ఇంటిలో అప్పుడప్పుడు మంచి మంచి వంటకాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇస్లాం ఏమంటుందంటే, మీరు మీ ఇంటిలో మంచి వంటలు చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువగా చేయండి, ఆ వంటలో పొరుగువారి భాగాన్ని విస్మరించకండి అని చెబుతుంది. చూడండి అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తూ ఉన్నారు. ఏమని ఆదేశిస్తున్నారో చూడండి. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

يَا أَبَا ذَرٍّ، إِذَا طَبَخْتَ مَرَقَةً فَأَكْثِرْ مَاءَهَا وَتَعَاهَدْ جِيرَانَكَ
(యా అబాజర్, ఇజా తబఖ్త మరకతన్ ఫ అక్సిర్ మాఅహా వ తఆహద్ జీరానక్)
ఓ అబూజర్! నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు, అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి మరియు నీ పొరుగువారిని పట్టించుకో (వారికి కూడా పంపు).

అల్లాహు అక్బర్. అబూజర్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తున్నారు, ఓ అబూజర్, నీవు నీ ఇంటిలో కూర వండేటప్పుడు అందులో నీరు కొంచెం ఎక్కువగా వేయి. ఏ ఉద్దేశంతో ఎక్కువ వెయ్యమంటున్నారు? మీ పొరుగువారికి ఆ కూరలోని కొద్ది భాగము చేరవేర్చట కొరకు అందులో కొద్దిగా నీరు ఎక్కువ వెయ్యి అంటున్నారు. అల్లాహు అక్బర్.

చూశారా? దీన్నిబట్టి ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, మన ఇంట్లో ఏదైనా మంచి వంటకము మనము చేస్తున్నాము అంటే, అందులో మన పొరుగువారికి కూడా చేరవార్చవలసి ఉంది అన్న ఆలోచనతో మనము వంట చేయాలి, ఆ వంట వండిన తర్వాత అందులో కొద్ది భాగము పొరుగువారికి చేరవేయాలి అని చెప్పారు.

అంతేకాదండి. చాలా గట్టిగా తాకీదు చేయబడి ఉంది పొరుగు వారి గురించి. ఈ హదీస్ వింటే ఇన్షా అల్లాహ్ ఆ విషయం అర్థమవుతుంది. చాలా ముఖ్యమైన విషయం జాగ్రత్తగా వినండి ప్రవక్త వారు తెలియజేస్తున్నారు.

مَا آمَنَ بِي مَنْ بَاتَ شَبْعَانًا وَجَارُهُ جَائِعٌ إِلَى جَنْبِهِ وَهُوَ يَعْلَمُ بِهِ
(మా ఆమన బీ మన్ బాత షబ్ఆన వ జారుహు జాయిఉన్ ఇలా జంబిహి వహువ యఅలము బిహి)
తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడని తెలిసి కూడా, తాను మాత్రం కడుపు నిండా తిని నిద్రించే వ్యక్తి నన్ను విశ్వసించిన వాడు కాడు.

సహీ అల్ జామిఅ గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రామాణికమైన ఉల్లేఖనం అండి. ప్రవక్త వారు ఏమంటున్నారు, ఆ వ్యక్తి నా మీద విశ్వాసం తీసుకొని రాలేదు. ఎవరి గురించి అంటున్నారు చూడండి. ఎవరైతే తాను మాత్రం కడుపునిండా భుజించాడు కానీ అతని పొరుగువాడు ఆకలితో పడుకుంటున్నాడు అన్న విషయాన్ని తెలిసి కూడా, అతని ఆకలి దూరం చేయకుండా, అతనికి అన్నం పెట్టకుండా, తాను మాత్రం కడుపునిండా తిని పడుకున్నాడు అంటే, ఆ వ్యక్తి విశ్వాసి కాడు, అతడు నా మీద విశ్వాసమే తీసుకొని రాలేదు అని ప్రవక్త వారు అన్నారు. అల్లాహు అక్బర్.

పొరుగువారు ఆకలితో ఉన్నారు, వారింట పొయ్యి వెలగనే లేదు అన్న విషయాన్ని మన దృష్టికి వచ్చిన తర్వాత కూడా మనము వారికి అన్నము చేర్చి, ఆహారము చేర్చి, వారి ఆకలి తీర్చకుండా మనం మాత్రమే కడుపునిండా భుజించి వారిని పట్టించుకోకుండా వదిలేసి అలాగే పడుకుంటే, మనం విశ్వాసులమే కాము, ప్రవక్త వారి మీద మనం విశ్వాసం తీసుకునే రాలేదు అని అంత గట్టిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేశారంటే, పొరుగువారితో మనం ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారి పట్ల మనము ఎంత శ్రద్ధ తీసుకోవాలి మనము ఇక్కడ తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, పొరుగువారు ముస్లింలు అయి ఉంటే, వారు ఆకలితో పడుకొని ఉంటే వారి పట్ల శ్రద్ధ తీసుకోండి అని చెప్పట్లేదు. పొరుగువారు ఎవరైనా సరే, బంధువులైనా సరే, మతస్తులైనా సరే, ఇతరులైనా సరే వారు ఆకలితో ఉన్నారని తెలిస్తే, పరాయి మతస్తులైనా సరే ఆకలితో ఉన్నారు మన పొరుగువారని తెలిస్తే, వెంటనే మనము మన వద్ద ఉన్న ఆహారంలో నుంచి కొద్ది భాగము వారికి చేర్చాలి, వారి ఆకలి తీర్చాలి, పొరుగువారిగా మా మీద ఆ హక్కు ఉంది. అలా చేయకపోతే మనము ఆ హక్కును విస్మరించినట్లు అవుతాము, ప్రవక్త వారు చెప్పినట్లుగా మనం విశ్వాసులమే కాము. కాబట్టి మిత్రులారా పొరుగువారి పట్ల మనము శ్రద్ధ తీసుకోవలసి ఉంది అన్న విషయము ఇక్కడ మనకు బోధపడుతుంది.

అలాగే, పొరుగువారి కోసము వారి సహాయము కోసము మనము ఎల్లప్పుడూ మన ద్వారాలు తెరిచి ఉంచాలి. అంటే అర్థం ఏమిటి? పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము మన ఇంటికి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీళ్లు కావాలని వస్తారు, ఎప్పుడైనా నూనె కావాలని వస్తారు, ఎప్పుడైనా ఉప్పు కావాలని వస్తారు, ఇంకొక్కటి ఏదైనా కావాలి ఇంకొకటి ఏదైనా కావాలి అని వస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వచ్చేస్తున్నారు ఏమిటి అని విసుక్కోకూడదు. అల్లాహు అక్బర్. విసుక్కోకూడదు, సంతోషంగా వారు వచ్చి అడిగితే మన ఇంటిలో ఉన్న ఆ పదార్థము వారికి సంతోషంగా అందజేయాలి. ఒక పొరుగువారిగా మనము ఆ విషయాన్ని సంతోషంగా భావించాలి గానీ విసుక్కోకూడదు అని ఇస్లాం మనకు బోధిస్తుంది.

చూడండి, పూర్వం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారి గురించి, ఆయన పొరుగు వారి కోసము దీనార్ దిర్హమ్ లు బాగా ఖర్చు పెట్టేసేవారు, వారికి ఇచ్చేస్తూ ఉండేవారు. చూసిన వారిలో కొందరు ఆయనతో ప్రశ్నించారు, ఏమయ్యా మీరు పొరుగువారి కోసము ఆ లెక్క లేకుండా హద్దు లేకుండా ఖర్చు పెట్టేస్తున్నారు ఏమిటి? ఏంటిది అని అడిగేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మనం మన పొరుగువారితో సంబంధాలు ఏర్పరచుకోవడం ముఖ్యం. వారితో మాకు సంబంధం ముఖ్యమైనది, దీనార్ దిర్హం మాకు ముఖ్యమైనది కాదు అని చెప్పారు. అల్లాహు అక్బర్.

అయితే మిత్రులారా, నేడు ఈ రోజుల్లో మనం నివసిస్తున్నాము కదా, మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనము గుండె మీద చెయ్యి పెట్టుకొని ఆత్మ విమర్శ చేసుకోవలసి ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా బాధాకరమైన విషయం చెబుతున్నాను, అల్లాహ్ మన్నించు గాక. మనం ఎలా జీవిస్తున్నాము, మన స్వభావం ఎలా ఉంది అంటే, మనకు దీనార్ దిర్హం ముఖ్యమైపోయాయి పొరుగు వారికంటే, మన సోదరులకంటే కూడా. మాకు దీనార్ దొరికితే చాలు, దిర్హం దొరికితే చాలు, పొరుగు వారు మనకు దూరమైపోయినా పర్వాలేదు, పొరుగు వారితో కావాలంటే మనము తెగతెంపులు చేసుకుంటాము గానీ దీనార్ దిర్హం ని మాత్రం వదులుకోము అన్నట్టుగా జీవించేస్తున్నాం. కానీ ప్రవక్త వారి శిష్యులు, పొరుగువారితో మనకు సంబంధాలు కావాలి, దీనార్ దిర్హం పోయినా పర్వాలేదు అని వారు ఆ విధంగా కోరుకునేవారు, అదే వారికి మాకీ తేడా.

అయితే మిత్రులారా, పరివర్తన రావలసిన అవసరం ఉంది. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

كَمْ مِنْ جَارٍ مُتَعَلِّقٍ بِجَارِهِ يَوْمَ الْقِيَامَةِ
(కమ్ మిన్ జారిన్ ముతఅల్లికిన్ బిజారిహి యౌమల్ ఖియామ)
ప్రళయ దినం రోజు చాలా మంది పొరుగువారు తమ పొరుగువారి గురించి అల్లాహ్ వద్ద ఫిర్యాదు చేస్తారు.

ప్రళయ దినం రోజు పొరుగువారిలో చాలామంది తమ పొరుగు వారి గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వద్ద ప్రశ్నిస్తారు, అల్లాహ్ తో అడుగుతారు. ఏమని? షికాయత్ చేస్తారు.

يَا رَبِّ هَذَا أَغْلَقَ بَابَهُ دُونِي فَمَنَعَ مَعْرُوفَهُ
(యా రబ్, హాజా అగ్లక బాబహు దూనీ ఫ మనఅ మారూఫహు)
ఓ నా ప్రభూ! ఇతను (నా పొరుగువాడు) నా కోసం తన ఇంటి తలుపు మూసుకున్నాడు మరియు తన సహాయాన్ని నిరాకరించాడు.

ఇతను నా పొరుగువాడు, ప్రపంచంలో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల కోసం వెళ్తూ ఉంటే, అతను నాకు ఇవ్వకుండా తమ వాకిలి మూసుకునేవాడు ఓ అల్లాహ్ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందర పొరుగువారి గురించి షికాయత్ చేస్తారు పొరుగువారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు. అల్ అదబుల్ ముఫ్రద్ గ్రంథంలోని ప్రామాణికమైన ఉల్లేఖనం ఇది. కాబట్టి మిత్రులారా పొరుగువారు చిన్న చిన్న విషయాల కోసము వస్తూ ఉంటే మనం సంతోషంగా వారికి అందజేయాలి, పుణ్యకార్యంలాగా భావించాలి. మన హక్కు అని అర్థం చేసుకోవాలి గానీ వారు వస్తూ ఉంటే అడుగుతూ ఉంటే విసుక్కోకూడదు, ఇది ఇస్లాం మనకు బోధిస్తుంది మిత్రులారా.

అలాగే, పొరుగువారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వారికి కానుకలు ఇవ్వాలి, వారి కోసము మన ఇంటిలో వండిన వంటలు కొన్ని చేరవేయాలి. అలాగే చిన్న చిన్న విషయాల కోసం వారు వస్తుంటే విసుక్కోకూడదు. అలాగే మన తరఫు నుంచి, మన మాటల నుండి, మన చేష్టల నుండి పొరుగువారికి హాని కలగకుండా కష్టము, నష్టము వాటిల్లకుండా మనము జాగ్రత్త పడాలి.

చూడండి, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు.

مَنْ كَانَ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ فَلَا يُؤْذِ جَارَهُ
(మన్ కాన యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫలా యు’జీ జారహు)
ఎవరైతే అల్లాహ్ పట్ల మరియు ప్రళయ దినం పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు.

బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైతే పరలోకం పట్ల విశ్వసిస్తున్నారో, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో, వారు తమ పొరుగువారికి ఎలాంటి హాని కలిగించరాదు. పొరుగువారికి హాని కలిగించరాదు. అల్లాహ్ మీద మనకు విశ్వాసం ఉంది, పరలోకం పట్ల మనకు విశ్వాసము ఉంది అంటే, పొరుగు వారికి హాని కలిగించరాదు. మరొక ఉల్లేఖనంలో ప్రవక్త వారు మూడుసార్లు ఈ విధంగా తెలియజేశారు.

وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ، وَاللَّهِ لَا يُؤْمِنُ
(వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్, వల్లాహి లా యు’మిన్)
అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు. అల్లాహ్ పై శపథం! అతను విశ్వాసి కాడు.

ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు, ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు. ఎవరు? ఆ వ్యక్తి విశ్వాసి కాజాలడు అంటున్నారు కదా ఆ వ్యక్తి ఎవరు ఓ దైవ ప్రవక్తా అంటే ప్రవక్త వారు అన్నారు.

مَنْ لَا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ
(మల్లా య’మను జారుహు బవాయిఖహు)
ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో (అతను విశ్వాసి కాడు).

ఎవరి కీడు నుండి అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, అలాంటి వ్యక్తి విశ్వాసి కాజాలడు అన్నారు. అంటే మన కీడు నుండి మన పొరుగువారు సురక్షితంగా లేరు, మనవల్ల మన పొరుగు వారికి నష్టం వాటిల్లుతుంది అంటే, బాధ కలుగుతూ ఉంది అంటే, మనము విశ్వాసులమే కాము అని ఆ ఉల్లేఖనం యొక్క అర్థం మిత్రులారా. అలాగే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూటిగా హెచ్చరించి ఉన్నారు.

لا يَدْخُلُ الْجَنَّةَ مَنْ لا يَأْمَنُ جَارُهُ بَوَائِقَهُ
(లా యద్ఖులుల్ జన్నత మల్లా య’మను జారుహు బవాయిఖహు)
ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగువాడు సురక్షితంగా లేడో, ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు.

ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. ఎవరి కీడు నుండి అయితే అతని పొరుగు వారు సురక్షితంగా లేరో. అంటే, పొరుగు వారికి ఇబ్బంది పెడుతున్న వ్యక్తి, పొరుగు వారికి నష్టం కలిగిస్తున్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు అని సూటిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసేసి ఉన్నారు.

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఇద్దరు మహిళల గురించి ప్రశ్నించడం జరిగింది. మొదటి మహిళ ఎవరంటే, ఓ దైవ ప్రవక్తా ఒక మహిళ ఉన్నారు. ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లు, విధి ఇబాదత్ లు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎక్కువగా నఫిల్ ఇబాదత్ లు ఏమీ చేయట్లేదు. కాకపోతే, వారి మాటల నుండి, వారి చేష్టల నుండి పొరుగు వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. అల్లాహు అక్బర్, గమనించాల్సిన విషయం. ఎక్కువగా నఫిల్ ఆరాధనలు ఏమీ చేయట్లేదు ఆవిడ. ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటూ ఉన్నారు, ఫర్జ్ ఇబాదత్ లతో పాటు పొరుగువారికి నష్టం వాటిల్లకుండా బాధ కలగకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి మహిళ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

هِيَ مِنْ أَهْلِ الْجَنَّةِ
(హియ మిన్ అహ్లిల్ జన్నా)
ఆవిడ స్వర్గవాసులలో ఒకరు.

ఆవిడ స్వర్గానికి చేరుకుంటారు అని చెప్పారు. ఇక మరొక మహిళ గురించి ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, మరొక మహిళ ఉన్నారు, ఆవిడ ఫర్జ్ ఇబాదత్ లతో పాటు, విధి ఆరాధనలతో పాటు, నఫిల్ ఇబాదత్ లు, తహజ్జుద్ నమాజులు కూడా బాగా ఆచరిస్తూ ఉన్నారు. కాకపోతే ఆవిడ తమ మాటల నుండి పొరుగువారికి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆవిడ గురించి మీరేమంటారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لا خَيْرَ فِيهَا، هِيَ مِنْ أَهْلِ النَّارِ
(లా ఖైర ఫీహా, హియ మిన్ అహ్లిన్నార్)
ఆవిడలో ఎలాంటి మంచితనము లేదు, ఆవిడ నరకవాసులలో ఒకరు.

అల్లాహు అక్బర్. దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటండి? దీన్నిబట్టి మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మనం మన వరకు నమాజులు ఆచరించుకుంటూ ఉన్నాము, ఫర్జ్ ఇబాదత్ లు చేసుకుంటున్నాము అంటే మనము స్వర్గానికి చేరిపోము. మనం పొరుగువారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడినప్పుడే మనము స్వర్గానికి చేరుకుంటాము. అంటే ఆరాధనలలో మనం ఎలాగైతే పర్ఫెక్ట్ గా ఉంటామో, వ్యవహారాలలో కూడా పొరుగు వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వ్యవహారాలలో కూడా మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే స్వర్గానికి చేరుకుంటాము అని ఈ ఉదాహరణ ద్వారా మనకు అర్థమయ్యింది మిత్రులారా.

అలాగే పొరుగువారి ప్రాణానికి, పొరుగువారి మానానికి, పొరుగువారి ధనానికి మన నుండి ఎలాంటి హాని వాటిల్లకూడదు. ఇది కూడా ఇస్లాం మనకు చాలా గట్టిగా తాకీదు చేస్తుంది. మనవల్ల మన పొరుగువారి ప్రాణం పోతుంది అన్న భయం వారికి కలుగుతుందంటే మనలో విశ్వాసం లేదు. మనవల్ల మన పొరుగు వారి మానానికి భంగం వాటిల్లే ప్రమాదము ఉంది అంటే మనం విశ్వాసులము కాదు. మనం మన పొరుగు వారి ధనం దోచుకునే వాళ్ళము అంటే మనం విశ్వాసులము కాము.

చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించడం జరిగింది. ఓ దైవ ప్రవక్తా, పెద్ద నేరము ఏది, పెద్ద పాపము ఏది అల్లాహ్ వద్ద అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهُوَ خَلَقَكَ
(అన్ తజ్అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలకక్)
నిన్ను పుట్టించిన అల్లాహ్ ను వదిలి ఇతరులను నువ్వు ఆరాధించటం ఇది అల్లాహ్ వద్ద పెద్ద నేరము, పెద్ద పాపము అని అన్నారు.

ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్దది ఏది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

أَنْ تَقْتُلَ وَلَدَكَ مَخَافَةَ أَنْ يَطْعَمَ مَعَكَ
(అన్ తక్తుల వలదక మఖాఫత అన్ యత్అమ మఅక్)
ఉపాధి ఇచ్చేవాడు అల్లాహ్ యే అయినప్పటికినీ, నీవు బిడ్డలు పుడితే వారు నీతోపాటు కూర్చొని తింటారు అన్న భయంతో నీవు వారిని హతమార్చటం, అంటే భ్రూణహత్యలు చేయటము ఇది పెద్ద నేరము అల్లాహ్ వద్ద అని చెప్పారు.

ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించాడు, ఓ దైవ ప్రవక్తా ఆ తర్వాత పెద్ద నేరము ఏది అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

أَنْ تُزَانِيَ حَلِيلَةَ جَارِكَ
(అన్ తుజానియ హలీలత జారిక)
నీ పొరుగువారి భార్యతో నీవు వ్యభిచారము చేయటం అల్లాహ్ వద్ద పెద్ద నేరం అన్నారు.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం అండి ఇది. కాబట్టి పొరుగువారి మానానికి భంగం వాటిల్లింది మా వల్ల అంటే మేము పెద్ద నేరానికి పాల్పడ్డాము అన్న విషయము. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు వ్యభిచారం గురించి ఏమంటారు, దొంగతనం గురించి ఏమంటారు?

مَا تَقُولُونَ فِي الزِّنَا؟ مَا تَقُولُونَ فِي السَّرِقَةِ؟
(మా తఖూలూన ఫిజ్జినా? మా తఖూలూన ఫిస్సర్కా?)
వ్యభిచారం గురించి మీరేమంటారు? దొంగతనం గురించి మీరేమంటారు?

వ్యభిచారం గురించి మీరేమంటారు, దొంగతనం గురించి మీరేమంటారు అంటే, సహాబాలు, శిష్యులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, ఓ దైవ ప్రవక్తా, వ్యభిచారం చేయడము ఇది హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త ఇద్దరూ దానిని నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు. దొంగతనం చేయటం హరాం, నిషేధం. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దొంగతనం చేయడం హరాం, నిషేధం అని మనకు తెలియపరిచి ఉన్నారు అని సమాధానం ఇచ్చారు. అంటే వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం దీని గురించి మీరేమంటారు అంటే అది హరాము, నిషేధము, అల్లాహ్ మరియు ప్రవక్త నిషేధం చేశారు అని సహాబాలు సమాధానం ఇచ్చినప్పుడు, ప్రవక్త వారు ఏమంటున్నారో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు,

لأَنْ يَزْنِيَ الرَّجُلُ بِعَشْرِ نِسْوَةٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَزْنِيَ بِامْرَأَةِ جَارِهِ
(లఅన్ యజ్నియర్ రజులు బి అషరి నిస్వతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యజ్నియ బిమ్ రఅతి జారిహి)
ఒక వ్యక్తి వేరే పది మంది మహిళలతో వ్యభిచారం చేయటం కంటే, తన పొరుగువారి భార్యతో వ్యభిచారం చేయటం పెద్ద పాపం.

మరియు

وَلأَنْ يَسْرِقَ الرَّجُلُ مِنْ عَشَرَةِ أَبْيَاتٍ أَيْسَرُ عَلَيْهِ مِنْ أَنْ يَسْرِقَ مِنْ بَيْتِ جَارِهِ
(వ లఅన్ యస్రికర్ రజులు మిన్ అషరతి అబ్యాతిన్ ఐసరు అలైహి మిన్ అన్ యస్రిక మిన్ బైతి జారిహి)
ఒక వ్యక్తి వేరే పది ఇళ్లలో దొంగతనం చేయటం కంటే, తన పొరుగువారి ఇంట్లో దొంగతనం చేయటం పెద్ద పాపం.

అని ప్రవక్త వారు తెలియజేశారు. అల్లాహు అక్బర్. వేరేచోట పది ఇళ్లల్లో దోచుకోవటం కంటే పొరుగు వారి ఇంటిలో దొంగతనం చేయటం పెద్ద నేరం అవుతుంది. వేరేచోట పది మంది మహిళల వద్ద వ్యభిచారం చేయటం కంటే కూడా, పొరుగువారి ఇంటిలో ఉన్న మహిళతో వ్యభిచారం చేయటం పెద్ద నేరం అయిపోతుంది అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మన నుండి మన పొరుగువారి ప్రాణానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి ధనానికి నష్టం వాటిల్లకూడదు, మన నుండి మన పొరుగువారి మానానికి కూడా భంగము వాటిల్లకూడదు. అలా జాగ్రత్త పడాలి అని ఇస్లాం మనకు బోధిస్తుంది. అలాగే జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పొరుగువారు ఇతర మతస్తులైనా సరే, వారి మానానికి గానీ, వారి ప్రాణానికి గానీ, వారి ధనానికి గానీ మన తరఫు నుంచి ఎలాంటి ధోకా ఉండకూడదు. అప్పుడే మనము నిజమైన విశ్వాసులమవుతాము అని మనము గుర్తించాలి, తెలియజేసుకోవాలి మిత్రులారా.

ఇప్పటివరకు పొరుగువారితో మనము ఏ విధంగా జీవించుకోవాలి, పొరుగువారి పట్ల ఏ విధంగా మనము శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అన్న విషయాలు బోధపడ్డాయి. నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


క్రింది లింకులు దర్శించి ఇరుగు పొరుగు వారి హక్కుల గురుంచి మరింత జ్ఞానం సంపాదించండి:

ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ధర్మ సమ్మతమైన వసీలా [వీడియో]
https://youtu.be/aOiweVwQqFA [14 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్‌కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్‌కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్‌తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ
(అల్ హందులిల్లాహి వహ్ దహు)
అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు)
ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:

وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ
(వబ్తగూ ఇలైహిల్ వసీల)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)

ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.

అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.

అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.

ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.

ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.

وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)

మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.

ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.

ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.

మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:

فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ
(ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక)
అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్‌! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)

ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.

నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:

أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ
(అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్)
నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)

అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.

అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:

قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي
(ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ)
“నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)

అభిమాన సోదరులారా, ఇది ఐదవది.

ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.

దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.

కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.

  • మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
  • రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
  • మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
  • నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
  • ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
  • ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.

ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

నాలుక ఉపద్రవాలు – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

నాలుక ఉపద్రవాలు – Dangers of the Tongue
https://youtu.be/4_uBq6Qy5lM [20 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నాలుక వల్ల కలిగే ఐదు ప్రధాన ఉపద్రవాలు మరియు పాపాల గురించి వివరించబడింది. ఇస్లాంలో నాలుకను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను హదీసుల వెలుగులో నొక్కి చెప్పబడింది. పరోక్ష నింద (గీబత్), చాడీలు చెప్పడం (నమీమత్), రెండు నాలుకల ధోరణి (జుల్ వజ్హైన్), అబద్ధం చెప్పడం (కజిబ్), మరియు అబద్ధపు ప్రమాణం చేయడం అనే ఐదు పాపాలు స్వర్గానికి దూరం చేసి నరకానికి దగ్గర చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించబడింది. ముస్లిం తన నాలుక మరియు చేతుల నుండి ఇతరులకు హాని కలగకుండా చూసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల సారాంశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్ అమ్మా బ’అద్.

అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈరోజు మనం నాలుక ఉపద్రవాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ సోదరులారా, మనిషి, ఒక ముస్లిం అవసరం మేరకే మాట్లాడాలి. అనవసరమైన మాటలు మాట్లాడేవారు, పిడి వాదాలకు దిగేవారు హదీసులో తీవ్ర పదజాలంతో హెచ్చరించబడ్డారు. అందుకే “నోరే నాకం (స్వర్గం), నోరే నరకం” అన్నారు పెద్దలు. నాలుకను సరిగ్గా ఉపయోగిస్తే అది స్వర్గానికి మార్గం సుగమం చేస్తుంది, దాన్ని దుర్వినియోగం చేస్తే నరకానికి గొనిపోతుంది అన్నమాట.

ఒక హదీస్ తెలుసుకుందాం. తిర్మిజీలో హదీస్ ఉంది. ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, ఆయన ప్రవక్త గారిని ఒక మాట అడిగారు. అది ఏమిటి?

“యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం,

مَنِ النَّجَاةُ؟
(మన్ నజాత్?)”
“ముక్తికి మార్గం ఏది?”

ఓ దైవ ప్రవక్తా, ముక్తికి మార్గం ఏది? అని అడిగారు. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ముక్తికి మార్గం ఏది? దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

أَمْسِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ
(అమ్సిక్ అలైక లిసానక, వల్ యస’అక బైతుక, వబ్కి అలా ఖతీఅతిక)
నీ నాలుకను అదుపులో ఉంచుకో.అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి. పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి

ఈ హదీస్ తిర్మిజీ గ్రంథంలో ఉంది. అంటే, ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు అడిగిన ప్రశ్న మాట ఏమిటి? ముక్తికి మార్గం ఏది? సమాధానం ఏమిటి ప్రవక్త గారు చెప్పారు? నీ నాలుకను అదుపులో ఉంచుకో, పెట్టుకో. నీ నాలుకను కాపాడుకో. అలాగే నీ ఇల్లు నిన్ను ఇమిడ్చుకోవాలి, అంటే నీ తీరిక సమయం ఇంట్లో గడవాలి. అలాగే నీ పాపాలను, నీ బలహీనతలను గుర్తించుకుని రోదించు, కన్నీళ్లు కార్చు అన్నమాట.

అంటే ఈ హదీస్‌లో ఉఖ్బా బిన్ ఆమిర్ రదియల్లాహు అన్హు ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగితే, ముక్తి పొందాలంటే ఎలా పొందగలము, ముక్తికి మార్గం ఏది అంటే, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాలు చెప్పారు.

  • దాంట్లో మొదటిది ఏమిటి? నాలుకను అదుపులో పెట్టుకో. నాలుకను కాపాడుకో, రక్షించుకో. ఎందుకు? ఎందుకంటే నోరే నాకం, నోరే నరకం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ముఖ్యమైన విషయం మాట ఇది పెద్దలు చెప్పిన మాట.
  • రెండవది, తీరిక సమయాన్ని, ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఇంట్లో గడపాలి.
  • మూడవది, పాపాలను గుర్తు చేసుకుని, మనము చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని రోదించాలి, కన్నీళ్లు కార్చాలి.

ఇక ఇంకో హదీస్ తెలుసుకుందాం. అబూ సయీద్ రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు. అదేమిటంటే, తెల్లవారజామున మనిషి శరీరంలోని అవయవాలన్నీ నాలుకను అత్యంత దీనంగా బతిమాలుతాయి. ఏమని బతిమాలుతాయి? “ఓ నాలుకా, నువ్వు మా విషయంలో అల్లాహ్‌కు భయపడి మసలుకో. ఎందుకంటే మా వ్యవహారం నీతో ముడిపడి ఉంది. నువ్వు సవ్యంగా ఉంటే మేము కూడా సవ్యంగా ఉండగలుగుతాం. నువ్వు వక్రతకు లోనైతే మేము కూడా వక్రతకు లోనైపోతాము.” ఈ విధంగా ప్రధాన పాత్ర వహిస్తుంది నాలుక. అది సవ్యంగా ఉంటే శరీర అవయవాలన్నీ సవ్యంగా ఉంటాయి. నాలుక వక్రతకు లోనైతే శరీర అవయవాలన్నీ వక్రతకు లోనైపోతాయి అన్నమాట.

ఇంకో హదీస్. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

مَنْ وَقَاهُ اللَّهُ شَرَّ مَا بَيْنَ لَحْيَيْهِ وَشَرَّ مَا بَيْنَ رِجْلَيْهِ دَخَلَ الْجَنَّةَ
(మన్ వఖాహుల్లాహు షర్ర మాబైన లహ్యైహి వ షర్ర మాబైన రిజ్లైహి దఖలల్ జన్నహ్)
“ఎవరినైతే అల్లాహ్ అతని రెండు దవడల మధ్య ఉన్న దాని (నాలుక) చెడు నుండి మరియు రెండు కాళ్ళ మధ్య ఉన్న దాని (మర్మాంగం) చెడు నుండి కాపాడతాడో, అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు.”

ఎవడైతే తన రెండు దవడల మధ్య ఉన్న నాలుకను రక్షించుకుంటాడో, కాపాడుకుంటాడో, అలాగే రెండు కాళ్ళ మధ్య ఉన్న మర్మాంగాన్ని కాపాడుకుంటాడో, దఖలల్ జన్నహ్, అటువంటి వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు. అంటే స్వర్గంలో ప్రవేశించడానికి రెండు ముఖ్యమైన విషయాలను మనం రక్షించుకోవాలి అన్నమాట. ఒకటి నాలుక, రెండవది మర్మాంగం.

ఇక ఇంకో హదీస్. అబూ మూసా రదియల్లాహు అన్హు దైవ ప్రవక్తకు ప్రశ్న అడిగారు, “ఖుల్తు యా రసూలల్లాహ్, నేను అడిగాను, ఓ దైవ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం,

أَىُّ الْمُسْلِمِينَ أَفْضَلُ؟
(అయ్యుల్ ముస్లిమీన అఫ్జల్?)”
“ముస్లింలలో ఉత్తముడు ఎవరు?”

ఓ దైవ ప్రవక్తా, ముస్లింలు చాలా మంది ఉన్నారు సమాజంలో, ప్రపంచంలో. శ్రేష్ఠమైన ముస్లిం ఎవరు? ముస్లింలలో ఉత్తమమైన ముస్లిము, శ్రేష్ఠమైన వాడు, గొప్పవాడు ఎవరు? దానికి సమాధానం ప్రవక్త గారు ఇలా ఇచ్చారు:

مَنْ سَلِمَ الْمُسْلِمُونَ مِنْ لِسَانِهِ وَيَدِهِ
(మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహీ వ యదిహీ)
“ఎవని నాలుక మరియు చేతి నుండి ఇతర ముస్లింలు సురక్షితంగా ఉంటారో (అతనే ఉత్తముడు).”

ఏ ముస్లిం నాలుక ద్వారా, చేతుల ద్వారా ఇతరులకి హాని జరగదో, కీడు జరగదో, అటువంటి ముస్లిం అందరికంటే శ్రేష్ఠుడు, ఉత్తముడు అని మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. సారాంశం ఏమిటంటే, నోరే నాకం, నోరే నరకం. కావున, అభిమాన సోదరులారా, నాలుక ఉపద్రవాలలో ఐదు తెలుసుకోబోతున్నాం. అంటే నాలుకకి సంబంధించిన పాపాలలో ఐదు పాపాలు మనం తెలుసుకుందాం.

మొదటిది, గీబత్, పరోక్ష నింద. గీబత్ అంటే ఏంటి? ఒక హదీస్ మనం తెలుసుకుంటే మనకు గీబత్ అర్థమవుతుంది. అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَتَدْرُونَ مَا الْغِيبَةُ؟
(అతద్రూన మల్ గీబహ్?)
“గీబత్ (పరోక్ష నింద) అంటే ఏమిటో మీకు తెలుసా?”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంభాషణ శైలి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి వాక్యం చెప్పేస్తారు, హదీస్. ఒక్కొక్కసారి ప్రశ్నోత్తరాల రూపంలో చెబుతారు. ఆ చెప్పబోయే మాట ఎంత ముఖ్యమైన ఉంటుందో ఆ విధంగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గీబత్ గురించి ఇలా ఆయనే అడుగుతున్నారు, “అతద్రూన మల్ గీబహ్? గీబత్ ఏంటో మీకు తెలుసా?”

సహాబాలు అన్నారు,

اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ
(అల్లాహు వ రసూలుహూ అ’అలమ్)
“అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే బాగా తెలుసు.”

సహాబాలు బదులిచ్చారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్‌కు తెలుసు, అల్లాహ్ ప్రవక్తకు తెలుసు, మాకు తెలియదు” అని. అప్పుడు అన్నారు ప్రవక్త గారు,

ذِكْرُكَ أَخَاكَ بِمَا يَكْرَهُ
(దిక్రుక అఖాక బిమా యక్రహ్)
“నీ సోదరుని గురించి అతను ఇష్టపడని విధంగా ప్రస్తావించటమే (గీబత్).”

అంటే మీ సోదరుని గురించి అతను వింటే అసహ్యించుకునే విధంగా మాట్లాడటం. సోదరుడు లేనప్పుడు వీపు వెనుక అతను వింటే అసహ్యించుకుంటాడు, ఆ విధంగా అతని గురించి మాట్లాడటం, దానికి గీబత్ అంటారు అని ప్రవక్త గారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం విని సహాబీ మళ్ళీ తన ఒక డౌట్‌ని ఇలా అడిగారు, వ్యక్తం చేశారు, అదేమిటి, ఖీల (అడగబడింది),

أَفَرَأَيْتَ إِنْ كَانَ فِي أَخِي مَا أَقُولُ؟
(అఫరఅయిత ఇన్ కాన ఫీ అఖీ మా అఖూల్?)
“ఒకవేళ నేను చెప్పేది నా సోదరునిలో నిజంగానే ఉంటే అప్పుడేమిటి?”

“ఓ దైవ ప్రవక్తా, నా సోదరుని గురించి నేను చెప్పేది నిజంగానే అతనిలో ఉంది. ఏ లోపం గురించి నేను మాట్లాడుతున్నానో, ఏ తప్పు గురించి నేను మాట్లాడుతున్నానో నా సోదరుని గురించి, అది నిజంగానే అతనిలో ఉంది. అతనిలో లేనిది నేను చెప్పటం లేదు. అతనిలో ఉన్న విషయాన్నే నేను చెప్తున్నాను. అలాగైతే?” అని ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. దానికి విని ప్రవక్త గారు అన్నారు,

إِنْ كَانَ فِيهِ مَا تَقُولُ فَقَدِ اغْتَبْتَهُ
(ఇన్ కాన ఫీహి మా తఖూలు ఫఖద్ ఇగ్తబ్తహు)
“అతనిలో నువ్వు చెప్పేది ఉంటేనే నువ్వు గీబత్ చేసినట్లు.”

అంటే అతనిలో ఉండే తప్పులనే నువ్వు చెప్తున్నావు, అప్పుడే అది గీబత్ అయ్యేది. అతనిలో ఉండే లోపాలు, అతనిలో ఉండే తప్పులు, అతను లేనప్పుడు నువ్వు అతను అసహ్యించుకునేలా చెప్తున్నావు కదా, అదే గీబత్.

وَإِنْ لَمْ يَكُنْ فِيهِ فَقَدْ بَهَتَّهُ
(వ ఇన్ లమ్ యకున్ ఫీహి ఫఖద్ బహత్తహు)
“ఒకవేళ అతనిలో అది లేకపోతే, నువ్వు అతనిపై అభాండం (బుహతాన్) మోపినట్లు.”

అతనిలో లేనిది చెప్తే అది గీబత్ కాదు, బుహతాన్ అవుతుంది, అభాండాలు వేయటం అవుతుంది. గీబత్ (పరోక్ష నింద) వేరు, అభాండం వేయటం వేరు. ఒక వ్యక్తిలోని ఉండే లోపాలు, తప్పులు అతను లేనప్పుడు చెప్పుకోవటం గీబత్. అతను వింటే బాధపడతాడు, ఆ విధంగా చెప్పుకోవటం గీబత్, పరోక్ష నింద. అతనిలో లేని విషయాలు చెప్తే అది బుహతాన్, అభాండం వేయడం అవుతుంది.

కాకపోతే, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, కోర్టులో, ఖాజీ దగ్గర, నిర్ణయాలు జరుగుతున్నాయి, పంచాయితీ జరుగుతూ ఉంది, సాక్ష్యం కోసం పిలిపించారు. అటువంటి సమయంలో అందరూ హాజరవుతారు. అటువంటప్పుడు ఉండేది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్తే అది తప్పు లేదు. దీనికి చాలా వివరాలు ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, గీబత్, పరోక్ష నింద అంటే వ్యక్తి లేనప్పుడు వీపు వెనుక అతను అసహ్యించుకునేలా అతని గురించి చెప్పుకోవటం. ఇది ఇస్లాంలో నిషిద్ధమైనది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ హుజరాత్‌లో ఇలా తెలియజేశాడు:

…وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ تَوَّابٌ رَّحِيمٌ
“… ఒకరి దోషాలను ఒకరు వెతకకండి. మీలో ఒకరు మరొకరి గురించి చాడీలు చెప్పకండి. మీలో ఎవరయినా తన చనిపోయిన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? దానిని మీరు అసహ్యించుకుంటారు కదా! మీరు అల్లాహ్‌కు భయపడండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపార కరుణాప్రదాత.” (49:12)

అల్లాహు అక్బర్! మీరు గీబత్ చేసుకోకండి. మీలో కొందరు కొందరి గురించి గీబత్ చేసుకోకండి. పరోక్ష నింద, వీపు వెనుక చాడీలు చెప్పుకోకండి. వీపు వెనుక, వెనుక చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవరైనా చనిపోయిన మీ సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? అల్లాహు అక్బర్! చనిపోయిన సోదరుడు, అంటే శవం మాంసం తినడానికి ఇష్టపడతారా? ఫకరిహ్ తుమూహ్, మీరు ఏవగించుకుంటున్నారు కదా, అసహ్యించుకుంటున్నారు కదా. వత్తఖుల్లాహ్. అలాగైతే, గీబత్ విషయంలో అల్లాహ్‌కు భయపడండి. ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ్, నిశ్చయంగా అల్లాహ్ తౌబా స్వీకరించేవాడు, కనికరించేవాడు.

ఇది మొదటిది. నాలుక ఉపద్రవాలలో, నాలుకకు సంబంధించిన రోగాలలో ఒకటి, పాపాలలో ఒకటి గీబత్, పరోక్ష నింద.

రెండవది, చాడీలు చెప్పటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

لاَ يَدْخُلُ الْجَنَّةَ نَمَّامٌ
(లా యద్ఖులుల్ జన్నత నమ్మామున్)
“చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు.”

చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడు, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది. అలాగే ఒక హదీస్, మనందరికీ తెలిసిన విషయమే, నేను దాని ఆ హదీస్ యొక్క సారాంశం చెప్తున్నాను. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఎక్కడో పోతుంటే మధ్యలో సమాధులు కనబడినాయి. ఆ సమాధులలో ఏం చెప్పారు? ఈ సమాధిలో ఉన్న వారికి శిక్ష పడుతుంది అని చెప్పాడు ప్రవక్త గారు. దేని మూలంగా? ఒక వ్యక్తికి చాడీల మూలంగా, చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు ఒక వ్యక్తి, దాని మూలంగా సమాధిలో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వ్యక్తి, మూత్రం పోసినప్పుడు ఒంటి మీద దాని తాలూకు తుంపరలు పడకుండా జాగ్రత్త పడేవాడు కాదు. కావున చాడీలు సమాజంలో కుటుంబాలను, జీవితాలను ఛిన్నాభిన్నం చేయటానికి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది చాడీ. కావున చాడీల నుంచి మనం దూరంగా ఉండాలి. నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో రెండవది చాడీలు చెప్పటం.

మూడవది, జుల్ వజ్హైన్ (రెండు ముఖాల వాడు). రెండు నాలుకల ధోరణికి పాల్పడేవాడు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఒక సుదీర్ఘమైన హదీస్ ఉంది, ఆ హదీస్‌లోని చివరి భాగం ఇది:

وَتَجِدُونَ شَرَّ النَّاسِ ذَا الْوَجْهَيْنِ الَّذِي يَأْتِي هَؤُلاَءِ بِوَجْهٍ وَهَؤُلاَءِ بِوَجْهٍ
“ప్రజలలోకెల్లా చెడ్డవాడు రెండు ముఖాల వాడు అని మీరు గమనిస్తారు. అతను ఈ గుంపు వద్దకు ఒక ముఖంతో, ఆ గుంపు వద్దకు మరో ముఖంతో వెళ్తాడు.”

ముత్తఫఖున్ అలైహ్, బుఖారీ, ముస్లింలోని హదీస్. అంటే ప్రజలలో రెండు ముఖాల గలవారిని అత్యంత నీచులు అయినట్లు మీరు గమనిస్తారు. వాడు చేసే పని ఏమిటి? వారు కొందరి దగ్గరికి ఒక ముఖంతో, మరికొందరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తారు. అంటే అర్థం ఏమిటి? ఒక వర్గం దగ్గరికి ఒక ముఖంతో పోవటం, ఇంకో వర్గం దగ్గరికి ఇంకో ముఖంతో పోవటం, అర్థం ఏమిటి? ఒక వ్యక్తి దగ్గరికి పోయి, ఒక వర్గం దగ్గరికి పోయి, “నేను మీ శ్రేయోభిలాషిని, మీకు మిత్రుణ్ణి. మీకు ఎవరు శత్రువో వాడు నాకు కూడా శత్రువు.” అతని గురించి గొప్పలు చెప్పుకుని అతని శత్రువు గురించి చెడుగా చెప్పి వచ్చి, మళ్లీ అదే వ్యక్తి శత్రువు దగ్గరికి పోయి ఇదే మాట రిపీట్ చేయటం, “నేను నీకు మిత్రుణ్ణి, నేను నీకు శ్రేయోభిలాషిని, నీ శత్రువుకి నేను శత్రువుని.” ఈ విధంగా అతను రెండు ముఖాలు చూపించాడు. ఒక వర్గం ఇంకో వర్గానికి పడదు, ఈ వర్గానికి ఒక రకంగా మాట్లాడి అదే పద్ధతి ఆ వర్గం దగ్గరికి పోయి కూడా చెప్పటం. దీనిని అంటారు జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి. ఇది చాలా చెడ్డది.

నాలుగవది, అబద్ధం చెప్పటం. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ… وَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ
“నిశ్చయంగా, సత్యం పుణ్యం వైపు దారి తీస్తుంది మరియు పుణ్యం స్వర్గం వైపు దారి తీస్తుంది… మరియు నిశ్చయంగా, అసత్యం పాపం వైపు దారి తీస్తుంది మరియు పాపం నరకం వైపు దారి తీస్తుంది…”

సత్యం అనేది, నిజం అనేది సదాచరణ వైపు తీసుకునిపోతుంది. వ ఇన్నల్ బిర్ర యహదీ ఇలల్ జన్నహ్. సదాచరణ, నిజాయితీ స్వర్గంలో తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయజ్దుకు. ఒక వ్యక్తి నిజం చెప్తూ ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి సిద్దీఖన్, చివరికి అల్లాహ్ వద్ద అతను నిజాయితీపరుడు అని అతని గురించి రాయడం జరుగుతుంది, లిఖించడం జరుగుతుంది. వ ఇన్నల్ కజిబ యహదీ ఇలల్ ఫుజూర్, అబద్ధం అనేది అవిధేయత వైపుకు తీసుకునిపోతుంది, పాపం వైపుకు తీసుకుని వెళ్తుంది. వ ఇన్నల్ ఫుజూర యహదీ ఇలన్నార్, ఈ అవిధేయత నరకానికి తీసుకునిపోతుంది. వ ఇన్నర్ రజుల లయక్దిబు, ఒక వ్యక్తి అబద్ధం చెబుతూనే ఉంటాడు, హత్తా యుక్తబ ఇందల్లాహి కజ్జాబన్, చివరికి అల్లాహ్ దగ్గర అతను అబద్ధీకుడుగా లిఖించబడతాడు.

ప్రియ సోదరులారా, సారాంశం ఏమిటంటే ఈ హదీస్‌లో, సత్యమే మాట్లాడితే నిజాయితీపరుడైపోతాడు, తత్కారణంగా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. అబద్ధం మాట్లాడుతూ ఉంటే అబద్ధీకుడు అని లిఖించబడతాడు, తత్కారణంగా నరకానికి పోతాడు. నాలుక ఉపద్రవాలలో ఇది అబద్ధం కూడా ఒకటి.

ఐదవది, అబద్ధపు ప్రమాణం చేయటం. సామాన్యంగా అబద్ధం చెప్పటం అది ఒక రకమైన ఉపద్రవం, తప్పు, చెడు. అబద్ధపు సాక్ష్యం ఇవ్వటం, ప్రమాణం చేయటం లేక ఒట్టు పెట్టుకోవటం అంటే వాస్తవానికి సాక్ష్యం ఇవ్వటం అన్నమాట. లేక ఒకరికి సాక్ష్యంగా పెట్టుకోవటం అన్నమాట. అల్లాహ్ పైన ప్రమాణం చేసి చెబుతున్నాడంటే అదెంత ముఖ్యమైనది, అసాధారణమైన విషయమో బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము చేసే ప్రమాణంపై అల్లాహ్‌ను కూడా మనము తీసుకునివస్తున్నాము, అల్లాహ్ పైన ప్రమాణం చేస్తున్నామంటే అల్లాహ్‌కు కూడా దీంట్లో మనము ఇది చేస్తున్నాం. కావున, అవసరం లేకపోయినప్పటికీ ప్రమాణం చేయటమే తప్పు. అవసరం పడితే, ముఖ్యావసరం అయితేనే ప్రమాణం చేయాలి. అవసరం లేకపోతే ప్రమాణం చేయటం తప్పు. దానికి తోడు అబద్ధపు ప్రమాణం చేయటం. సుబ్ హా నల్లాహ్! సత్యమైన, నిజంగానే ప్రమాణం చేయటం అనవసరమైన విషయాలలో చేయకూడదు, అవసరమైతేనే చేయాలి. ఇక ఒకటి అవసరం కాదు, రెండవది ప్రమాణం చేస్తున్నాము, అది కూడా అబద్ధం ప్రమాణం చేస్తున్నాము, అంటే ఇది తీవ్రమైన తప్పు.

అభిమాన సోదరులారా, దీని గురించి ఇస్లాం ధర్మంలో దీని వివరాలు ఎక్కువగా ఉన్నాయి. సారాంశం ఏమిటంటే, నాలుక ఉపద్రవాలలో చాలా ఉన్నాయి, వాటిలో నేను ఐదు విషయాలు నేను వ్యక్తం చేశాను, తెలియజేశాను. ఒకటి గీబత్, పరోక్ష నింద, రెండోది చాడీలు చెప్పటం, మూడవది జుల్ వజ్హైన్, రెండు నాలుకల ధోరణి, నాలుగవది అబద్ధం చెప్పటం, ఐదవది అబద్ధపు ప్రమాణం చేయటం. ఇవి నాలుకకి సంబంధించిన ఉపద్రవాలలో ముఖ్యమైనవి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నాలుకకి సంబంధించిన ప్రతి ప్రమాదం నుండి, ప్రతి చెడు నుండి కాపాడు గాక. అల్లాహ్ మనందరికీ ప్రతి పాపం నుండి కాపాడు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24855

పాపాలు (Sins):
https://teluguislam.net/sins/

ఈ క్రింది లింక్‌ దర్శించి, మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: గ్రూప్ 1: https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

అల్లాహ్ యేతరులపై ప్రమాణం (ఒట్టు) చేయడం ధర్మ సమ్మతమేనా? [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేయడం ధర్మ సమ్మతమేనా?
https://youtu.be/FpPJtYzHKHQ [12 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ఉపన్యాసంలో, ఇస్లాంలో ప్రమాణం (ఒట్టు) చేయడానికి సంబంధించిన నియమాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. అల్లాహ్ యేతరులపై, అంటే ప్రవక్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కాబా లేదా ఇతర సృష్టితాలపై ప్రమాణం చేయడం ఇస్లాంలో ఘోరమైన పాపం మరియు షిర్క్ (బహుదైవారాధన) అని స్పష్టం చేయబడింది. అవసరమైతే, కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే నిజాయితీతో ప్రమాణం చేయాలని, లేకపోతే మౌనంగా ఉండాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినట్లు హదీసుల ద్వారా తెలియజేయబడింది. అబద్ధపు ప్రమాణాలు చేయడం, ముఖ్యంగా అల్లాహ్ పేరు మీద చేయడం కూడా మహా పాపమని హెచ్చరించబడింది. అంతిమంగా, ఈ షిర్క్ అనే పాపం నుండి దూరంగా ఉండాలని మరియు అల్లాహ్ బోధనలను మాత్రమే అనుసరించాలని ఉద్బోధించబడింది.

అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్

అభిమాన సోదరులారా! “ధర్మ అవగాహనం” అనే ఈ ఎపిసోడ్ లో మీకందరికీ నా ఇస్లామీయ అభివాదం,

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం దైవేతరులపై ప్రమాణం చేయడం ధర్మసమ్మతమా, కాదా? అనే విషయం గురించి తెలుసుకుందాం.

కొన్ని సందర్భాలలో మనకు ప్రమాణం చేసే అవసరం వస్తుంది. మనము చెప్పే మాట సత్యమని, నిజమని చెప్పటానికి, మనం చెప్పే మాటను బలపరచటానికి, లేదా అవతలి వ్యక్తి మా మాటను నమ్మటం లేదని వారిని నమ్మించటానికి, లేదా ఏదో ఒక సందర్భంలో గొడవపడితే, “నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పాను, అలా చేయలేదు, ఇలా చేశాను” అని రుజువు చేయటానికి, లేదా ఏదో ఒక వాగ్దానం నెరవేర్చటానికి, బలపరచటానికి, “అల్లాహ్ సాక్షిగా నేను ఈ పని చేస్తాను” అని ఇలా కొన్ని కారణాల వల్ల మనిషి ప్రమాణం చేస్తాడు.

మనం సమాజంలో చూస్తాము, కొంతమంది సృష్టిరాశుల మీద ప్రమాణం చేస్తారు. అది ప్రవక్తలు కావచ్చు, ప్రవక్త మీద ప్రమాణం, కాబతుల్లా మీద ప్రమాణం, మస్జిద్ సాక్షిగా మస్జిద్ మీద ప్రమాణం, దైవదూతల మీద ప్రమాణం, తాత ముత్తాతల మీద ప్రమాణం, ఆత్మల మీద ప్రమాణం, తల మీద ప్రమాణం, “నా తలపైన పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను,” “నా బిడ్డ తలపైన చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” “అమ్మ తలపైన పెట్టి ప్రమాణం చేస్తున్నాను,” ఫలానా సమాధి మీద ప్రమాణం చేస్తున్నాను, వారి నిజాయితీ మీద ప్రమాణం చేస్తున్నాను, ఇలా అనేక విధాలుగా సృష్టి రాశులపై, దైవేతరులపై, అల్లాహ్ పైన కాకుండా, అల్లాహ్ మీద కాకుండా అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, గురువులు, సమాధులు, కాబా, మస్జిద్ ఏదైనా సరే దైవేతరుల మీద ప్రమాణం చేయటం ఇది ఇస్లాం పరంగా అధర్మం. ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ అని మనకు తెలుస్తుంది ఖురాన్ మరియు హదీసులు పరిశీలిస్తే.

ప్రమాణం చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎప్పుడైతే అప్పుడు, ఎవరి మీద అంటే వారి మీద చేయకూడదు, తప్పు, చాలా తప్పు.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

إِنَّ اللَّهَ تَعَالَى يَنْهَاكُمْ أَنْ تَحْلِفُوا بِآبَائِكُمْ فَمَنْ كَانَ حَالِفًا فَلْيَحْلِفْ بِاللَّهِ أَوْ لِيَصْمُتْ
(ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం అన్ తహ్లిఫూ బి ఆబాయికుం ఫమన్ కాన హాలిఫన్ ఫల్ యహ్లిఫ్ బిల్లాహి అవ్ లియస్ముత్)
నిశ్చయంగా అల్లాహ్, మీరు మీ తండ్రి తాతల మీద ప్రమాణం చేయడాన్ని నిషేధించాడు. కనుక ఎవరైనా ప్రమాణం చేయదలిస్తే అల్లాహ్ మీదనే చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. (ముత్తఫకున్ అలై – బుఖారీ మరియు ముస్లిం)

ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథములో ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని అల్లాహ్ వారించాడు.” ఇన్నల్లాహ త’ఆలా యన్ హాకుం – అల్లాహ్ ఖండించాడు, అల్లాహ్ నిషేధించాడు, అల్లాహ్ వారించాడు మీరు మీ తాత ముత్తాతల మీద ప్రమాణం చేయటాన్ని, అంటే చేయవద్దండి అని అర్థం.

ఫమన్ కాన హాలిఫన్ – ఒకవేళ ప్రమాణం చేయదలచుకుంటే ఆ అవసరం వచ్చింది. ఏదో ఒక తగాదాలో, గొడవలో, ఏదో ఒక సందర్భంలో, విషయంలో తప్పనిసరిగా ప్రమాణం చేసే అవసరం వచ్చింది, ప్రమాణం చేయదలచుకుంటున్నారు, అటువంటి సమయంలో ఫల్ యహ్లిఫ్ బిల్లాహ్ – అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయండి, అవ్ లియస్ముత్ – లేకపోతే ఊరుకోండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అంటే, ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి, ఊరుకుండాలి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం, యొక్క ప్రవచనం ఇది.

అలాగే ముస్లిం గ్రంథంలో ఇలా ఉంది, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు:

لَا تَحْلِفُوا بِالطَّوَاغِي، وَلَا بِآبَائِكُمْ
(లా తహ్లిఫూ బిత్తవాగీ వలా బి ఆబాయికుం)
మీరు తాగూత్ (దైవేతర శక్తులు) మీద ప్రమాణం చేయకండి, మీ తండ్రి తాతల మీద కూడా ప్రమాణం చేయకండి.

మీరు మీ తాత ముత్తాతల మీద, మీరు మీ, మీరు విగ్రహాల మీద, దైవేతరుల మీద ప్రమాణం చేయకండి. “తవాగీ” ఇది బహువచనం తాగూత్ కి. తాగూత్ అంటే అల్లాహను తప్ప ఎవరిని ఆరాధిస్తున్నామో అది తాగూత్ అవుతుంది. అల్లాహ్ కాక ఎవరిని ఆరాధన దైవాలుగా భావించుకున్నారు, అది తాగూత్ కిందికి వస్తుంది. సమాధి పూజ చేస్తే సమాధి తాగూత్, ఒక చెట్టుకి పూజిస్తే ఆ చెట్టు తాగూత్. చనిపోయిన ప్రవక్తలను, ఔలియాలను, పుణ్య పురుషులను పూజిస్తే అది తాగూత్. అల్లాహ్ ను కాక ఎవరిని పూజిస్తే అది తాగూత్ అవుతుంది. అంటే, లా తహ్లిఫూ బిత్తవాగీకి అర్థం ఏమిటి? అల్లాహ్ తప్ప ఏ వస్తువు పైనా, ఏ వ్యక్తి పైనా, ఏ ఇతరుల మీద కూడా ప్రమాణం చేయకండి. వలా బి ఆబాయికుం – మీ తాత ముత్తాతల మీద కూడా ప్రమాణం చేయకండి అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, అంతేకాదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ حَلَفَ بِالْأَمَانَةِ فَلَيْسَ مِنَّا
(మన్ హలఫ బిల్ అమానతి ఫలయ్స మిన్నా)
ఎవరైతే అమానత్ (విశ్వసనీయత/నిజాయితీ) మీద ప్రమాణం చేస్తాడో, అతను మా పద్ధతిని అనుసరించిన వాడు కాదు.

ఎవరైతే నిజాయితీ మీద ప్రమాణం చేస్తాడో, వాడు ముస్లిం పద్ధతిని అనుసరించట్లేదు అని అర్థం. ఫలయ్స మిన్నా – మావాడు కాదు, మాలోని వాడు కాదు.

అభిమాన సోదరులారా, అంతే, ఇది ఎంత చిన్న విషయం కాదు. మనం చూస్తూ ఉంటాము మాటిమాటికీ, చీటికిమాటికి ప్రమాణం చేస్తూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకి ప్రమాణం చేసేస్తాం. అది కూడా దైవేతరుల పైన మీద – అమ్మ మీద ఒట్టు, నా బిడ్డ మీద ఒట్టు, నా తల మీద ఒట్టు, తలపైన చెయ్యి పెట్టుకొని, పిల్లలపైన చెయ్యి పెట్టుకొని. ఇది మహా పాపం. అధర్మం, అన్యాయం. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు.

చివరికి నిజాయితీ మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే అల్లాహ్ పేరు మరియు ఆయన గుణగణాల తప్ప, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క గుణగణాల తప్ప ఇతర ఏ విషయం మీద కూడా ప్రమాణం చేయకూడదు. నిజాయితీ కూడా అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం అది. “నా నిజాయితీ మీద, నీ నిజాయితీ మీద, వారి నిజాయితీ మీద ఒట్టు, ప్రమాణం చేసి చెప్తున్నాను” అంటే నిజాయితీ ఏమిటి? అల్లాహ్ యొక్క ఆదేశాలలో ఒక ఆదేశం. మరి ఆ ఆదేశం మీద ఒట్టు, ప్రమాణం చేస్తే, అది అల్లాహ్ యొక్క గుణగణాలకి పోల్చినట్లు అవుతుంది.

అభిమాన సోదరులారా, ప్రమాణం అనేది, ఒట్టు అనేది దీనికి అరబీలో, ఉర్దూలో “ఖసమ్” అంటారు. ఇది కేవలం అల్లాహ్ మీదనే. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తగాబున్, ఆయత్ 7లో ఇలా సెలవిచ్చాడు:

قُلْ بَلَىٰ وَرَبِّي لَتُبْعَثُنَّ
(ఖుల్ బలా వ రబ్బీ లతుబ్’అసున్న)
(ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు: “నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు” (64:7)

అంటే చనిపోయిన జీవితం, మరణానంతర జీవితం, మీరు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు లేపుతాను, మీరు లేపబడతారు. ఆ విషయం చెప్పటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి ఇలా అన్నారు, ఖుల్ – ఓ ప్రవక్తా, ఇలా అను. బలా వ రబ్బీనా ప్రభువు సాక్షిగా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఏం నేర్పించాడు? ప్రమాణం చేయగలిగితే, ఆ అవసరం పడితే, చేయాలనుకుంటే అల్లాహ్ మీదనే ప్రమాణం చేయాలి. ఖుల్ బలా వ రబ్బీ – ఓ ప్రవక్తా, వారితో ఇలా అను, “నా ప్రభువు సాక్షిగా లతుబ్’అసున్న – మీరు తప్పకుండా మళ్ళీ లేపబడతారు.” అంటే కొందరికి విశ్వాసం ఉండదు, మరణానంతర జీవితంపై. అది వేరే ముఖ్యమైన సబ్జెక్ట్ అది. మీరు చనిపోయిన తర్వాత లేపబడతారు. సుమ్మ లతునబ్బ’ఉన్న బిమా అమిల్తుం – మీరు ఏం చేశారో మీ కర్మలు, మంచి చెడు మొత్తం మీ ముందర ఉంచడం జరుగుతుంది. అల్లాహ్ చూపిస్తాడు, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా పాపం చేశాడా, పుణ్యం చేశాడా, తక్కువ, ఎక్కువ, న్యాయం, అన్యాయం మొత్తం మన జీవిత చరిత్ర అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు చూపిస్తాడు మరియు మన ఆ కర్మల పరంగానే మనకు తీర్పు జరుగుతుంది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యంలో తెలియజేశాడు. అంటే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి. దైవేతరుల మీద, అల్లాహ్ యేతరుల మీద ప్రమాణం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? షిర్క్ అవుతుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ
(మన్ హలఫ బి గైరిల్లాహి ఫఖద్ అష్రక)
ఎవరైతే అల్లాహ్ యేతరులపై ప్రమాణం చేశాడో, అతను షిర్క్ చేశాడు.

అల్లాహు అక్బర్! ప్రమాణం అనేది అంత పెద్దది. ఒక ముఖ్యమైన విషయంలో ప్రమాణం చేయాలనుకుంటే అల్లాహ్ మీద ప్రమాణం చేయాలి. అది కూడా ప్రమాణం నిజం ఉండాలి, సత్యం ఉండాలి. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన కూడా చేయకూడదు. ఇతరులకి మోసం చేయటానికి కొందరు ఒక వస్తువు అమ్మటానికి అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ పైన చేస్తారు. ఇది కూడా మహా పాపం. అబద్ధమైన ప్రమాణం అల్లాహ్ మీద కూడా చేయకూడదు. నీతి, నిజాయితీ, న్యాయం, సత్యం, ధర్మం అనే విషయంలో ప్రమాణం చేసే అవసరం వస్తే అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద షిర్క్, కుఫ్ర్, బిద్అత్ నుండి కాపాడుగాక, రక్షించుగాక! అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పుడు వరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రములు.

وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్)
మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక!

తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

తావీజులు, తాయత్తులు… !?
https://youtu.be/W9VBuoPiFfk [15 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, తావీజు (తాయత్తులు) మరియు ఇస్లాంలో వాటి స్థానం గురించి వివరించబడింది. తావీజులు రెండు రకాలుగా విభజించబడ్డాయి: ఖుర్ఆన్ వచనాలు కలిగినవి మరియు ఇతర వస్తువులు (గవ్వలు, దారాలు మొదలైనవి) కలిగినవి. ఖుర్ఆన్ వచనాలు ఉన్న తాయత్తుల విషయంలో కూడా పండితుల మధ్య అభిప్రాయ భేదం ఉందని, అయితే మెజారిటీ పండితులు షిర్క్‌కు దారితీస్తుందనే భయంతో వాటిని కూడా నిషేధించారని ప్రసంగీకులు పేర్కొన్నారు. షిర్క్‌తో కూడిన రెండవ రకం తాయత్తులు పూర్తిగా హరామ్ అని స్పష్టం చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన విధంగా, తాయత్తులకు బదులుగా ఖుర్ఆన్ మరియు దుఆలను పఠించడం ద్వారా రక్షణ మరియు నివారణను వెతకాలని ముగింపులో ఉపదేశించబడింది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద, అమ్మా బా’ద్)
నిశ్చయంగా సర్వ స్తోత్రాలు ఏకైక అల్లాహ్ కే శోభిస్తాయి. మరియు ఎవరి తర్వాత ప్రవక్త లేడో, ఆయనపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమములోకి మీ అందరికీ ఇస్లామీయ అభివాదం.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈ రోజు మనం తావీజు, తాయత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం మన సమాజంలో చూస్తూ ఉంటాము, కొందరి మెడలో, చేతులో, నడుంకి తావీజులు, తాయత్తులు కట్టుకుంటారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా ఉండటానికి, పెద్దవారైనా సరే, ఎవరైనా సరే రోగానికి గురైనప్పుడు ఆ రోగం పోవాలని, నష్టానికి గురైనప్పుడు నష్టం రాకూడదని, కొందరు భయం కోసము, కొందరు ముందు జాగ్రత్త ఎప్పుడూ నష్టానికి, బాధకి లోను కాకూడదని ఏదేదో కారణాలతో, ఏదేదో ఉద్దేశాలతో తావీజులు కట్టుకుంటారు. ఇది కూడా సమాజంలో ఒక వర్గం దీనిని వ్యాపారంగా కూడా చేసుకున్నది. కాకపోతే, ఇస్లాం ధర్మంలో, షరీఅత్‌లో తావీజు యొక్క వాస్తవికత ఏమిటి? దీనికి అరబీలో ‘తమీమా‘ అంటారు, ‘త’అవీద్’. మామూలుగా తెలుగులో తావీజు, తాయత్తు అని చెప్తారు.

ఈ తాయత్తులు, ఈ తావీజులు రెండు రకాలు. షేఖ్ సాలెహ్ బిన్ ఫౌజాన్ అల్ ఫౌజాన్ (రహ్మతుల్లాహి అలై) ఒక పుస్తకం ఉంది ‘అఖీదతుత్ తౌహీద్‘, ఆ పుస్తకం ఆధారంగా ఈ తావీజు గురించి ఈ రెండు రకాలు నేను మాట్లాడుతున్నాను. తావీజు రెండు రకాలు ఈ తాయత్తులు.

మొదటి రకం ఏమిటి? ఖుర్ఆన్ ఆధారంగా కట్టే తావీజులు. ఆ తావీజులో ఎటువంటి షిర్క్ లేదు, బిద్అత్ లేదు, కొత్త విషయాలు లేవు. ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన వాక్యాలు మాత్రమే ఆ తావీజులో ఉన్నాయి. అంటే ఖుర్ఆన్ సూక్తులను లేదా అల్లాహ్ నామాలను, గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో తావీజు వేయటం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. అల్లాహ్ సూక్తులను, అల్లాహ్ నామాలను, అల్లాహ్ గుణాలను లిఖించి ఆ వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వేలాడదీయడం, వేయటం.

ఇటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది పండితుల అభిప్రాయం. అందరి అభిప్రాయం కాదు, కొంతమంది పండితుల అభిప్రాయం మాత్రమే. ఆధారం ఏమిటి? అటువంటి తావీజులో షిర్క్ లేదు, బిదాత్ లేదు, కొత్త విషయం ఏదీ లేదు. కేవలం అల్లాహ్ వాక్యం ఉంది, అల్లాహ్ నామం మాత్రమే ఉంది, అల్లాహ్ గుణగణాలు మాత్రమే ఉన్నాయి. ఉద్దేశం కూడా ఏమిటి? వ్యాధి నివారణ పొందే ఉద్దేశం. షిర్క్ లేదు కాబట్టి ఇది ధర్మ సమ్మతమే అని కొంతమంది పండితుల అభిప్రాయం.

కాకపోతే, అత్యధిక శాతం, ఎక్కువ మంది ధర్మ పండితులు ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటారు. ఆ లిఖించటంలో, ఆ తావీజులో, ఆ కాగితంలో ఖుర్ఆన్ ఆయత్ మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని అంటారు అత్యధిక మంది ధర్మ పండితులు. ఉదాహరణకు, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు త’ఆలా అన్హు) పెద్ద సహాబీ, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి కుమారుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రదియల్లాహు త’ఆలా అన్హు), హుజైఫా (రదియల్లాహు త’ఆలా అన్హు), ఉఖ్బా బిన్ ఆమిర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఇలా, అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) యొక్క శిష్యులు, ఒక ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహ్మతుల్లాహి అలై), అలాగే వారి శిష్యులు, తర్వాతి తరాల వారు కూడా దీనినే కట్టుబడ్డారు, అంటే ఇది కూడా ఇటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇదే. ఆధారం ఏమిటి?

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

إِنَّ الرُّقَى وَالتَّمَائِمَ وَالتِّوَلَةَ شِرْكٌ
(ఇన్నర్రుఖా వత్తమాఇమ్ వత్తివలా షిర్కున్)
“నిశ్చయంగా మంత్రాలు (షిర్క్ తో కూడినవి), తాయత్తులు మరియు తివలా (ఒక రకమైన క్షుద్ర విద్య) షిర్క్.” (ఇబ్ను మాజా)

అంటే ఈ విధంగా మంత్రించటం, తాయత్తులు వేయటం, తివలా, ఇది ఒక రకమైన చేతబడి, క్షుద్ర విద్య, షిర్కుతో కూడుకున్నది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా! కేవలం అల్లాహ్ నామాలు మాత్రమే, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉన్నప్పటికీ అది ధర్మ సమ్మతం కాదు అని ఎందుకు అంటున్నారంటే మూడు కారణాల వల్ల అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అంటున్నారు. అది మూడు కారణాలు. ఒకటి ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం పట్ల వారింపు ఉంది. సర్వసాధారణంగా తాయత్తులు కట్టరాదు, తావీజు వేయరాదు అని వాక్యాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. కావున ఈ సర్వసాధారణకి ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు. ఒక విషయం సర్వసాధారణంగా ఉంది, దానికి ప్రత్యేకంగా ఏమైనా రుజువు కావాలి, ఆధారం కావాలి. ఆధారం లేకపోతే అది ధర్మ సమ్మతం అవ్వదు. అంటే మొదటి రకం, మొదటి విషయం ఏమిటి? సర్వసాధారణంగా తాయత్తులు కట్టడం వల్ల వారింపు ఉంది. ఈ సర్వసాధారణమును ప్రత్యేకంగా చేసే ఆధారం ఏదీ లేదు కనుక.

అలాగే రెండవ కారణం ఏమిటి? దీనిని ధర్మ సమ్మతం చేస్తే షిర్క్ ద్వారాలు తెరుస్తాయి. షిర్క్ ద్వారాలను మూసివేయటంలో ఈ వారింపు ఉపయుక్తంగా ఉన్నది కాగా తావీజులు వ్రేలాడదీయవచ్చన్న ఫతవా అనే ఇస్తే, షిర్కుతో కూడుకున్న తావీజును ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. అది ఏ విధంగానూ సమ్మతం కాదు. ఇది రెండో కారణం.

మూడోది ఏమిటి? ఖుర్ఆన్ ఆయతులను తావీజుగా చేసి మెడలో, చేతులు వేసుకుంటే తప్పకుండా వాటి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు. తప్పనిసరిగా అవుతుంది అది. ఎందుకంటే తావీజు వేసుకొని బాత్రూంకి పోవాలి, కాలకృత్యాలు పూర్తి చేసుకోవాలి, మనిషి ఒకసారి జునుబీ స్థితిలో ఉంటాడు, అశుద్ధ స్థితిలో ఉంటాడు, వివాహం అయిన వారు సంభోగించుకుంటారు భార్యాభర్తలు. మరి మెడలో ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామము, చేతిలో అల్లాహ్ వాక్యాలు, ఖుర్ఆన్ వాక్యాలు, అల్లాహ్ నామాలు, అల్లాహ్ పేరు, అల్లాహ్ గుణ విశేషాలు ఇవి మన శరీరంలో పెట్టుకొని మనము బాత్రూం కి పోవటం ఏమిటి? కాలకృత్యాలు తీసుకోవటం ఏమిటి? జునుబీ స్థితిలో ఉండటం ఏమిటి? ఈ విధంగా చాలా కారణాలు ఉన్నాయి, అమర్యాద అవుతుంది ఆ ఈ ఖుర్ఆన్ వాక్యాల విషయంలో. కావున ఈ మూడు కారణాల వల్ల ఆ తావీజులో ఖుర్ఆన్ వాక్యాలు మాత్రమే ఉన్నప్పటికిని అది ధర్మ సమ్మతం కాదు అని పండితుల అత్యధిక మంది పండితుల అభిప్రాయం ఇది.

అభిమాన సోదరులారా! ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటల్లో సారాంశం రెండు రెండు విషయాలు. ఒకటి, ధర్మ సమ్మతమైన తావీజు, దాంట్లో ఎటువంటి షిర్క్ పదాలు ఉండకూడదు. కేవలం అల్లాహ్ వాక్యాలు, అల్లాహ్ నామం, అల్లాహ్ గుణాలు మాత్రమే ఉండాలి. అటువంటి తావీజు ధర్మ సమ్మతమని కొంతమంది మాత్రమే ధర్మ సమ్మతం అంటున్నారు. కాకపోతే, రెండో విషయం ఏమిటి? అత్యధిక మంది ధర్మ పండితులు అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే ఈ మూడు కారణాలు. మొదటి కారణం ఏమిటి? సాధారణంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతీ తావీజు షిర్క్ అన్నారు. దానికి ప్రత్యేకం చేయటానికి ఆధారం లేదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏమిటి? ఇది షిర్క్‌కి దారి తీస్తుంది. రెండో కారణం. మూడో కారణం ఏమిటి? అల్లాహ్ వాక్యాల పట్ల, అల్లాహ్ నామం పట్ల, అల్లాహ్ గుణ విశేషాల పట్ల అమర్యాద కలుగుతుంది, అగౌరవం కలుగుతుంది. ఈ కారణాల వల్ల రుజువు లేదు కాబట్టి అటువంటి తావీజు కూడా ధర్మ సమ్మతం కాదు అని అత్యధిక మంది పండితుల అభిప్రాయం.

కావున, మనము తావీజు కట్టుకోకుండా, తావీజు వ్రేలాడదీసుకోకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానాన్ని అనుసరించి మనము మంత్రించి ఊదుకోవాలి, అది ఆధారం ఉంది కదా! ఆరోగ్యం బాగాలేదు, ప్రవక్త గారు కొన్ని దుఆలు, కొన్ని వాక్యాలు నేర్పించారు. ఖుర్ఆన్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ నామాలు ఉన్నాయి, అల్లాహ్ గుణాలు ఉన్నాయి. అవి మంత్రించి, పఠించి ఊదుకోవచ్చు. రోగిపై పఠించి ఊదవచ్చు. నీళ్ళపై మంత్రించి ఆ నీళ్ళు తాగవచ్చు, త్రాపించవచ్చు. ఈ విధానం ఉంది కదా. లేని విధానాన్ని, దాంట్లో షిర్క్ అనే అనుమానం ఉంది, అటువంటి విధానాన్ని ఎన్నుకోవడం కరెక్ట్ కాదు.

ఇక తావీజు విషయంలో రెండో రకం, రెండో కోవకు చెందిన తావీజు, ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మతం కాదు, అధర్మం, షిర్క్ మరియు హరామ్. అంటే, ఖుర్ఆన్ సూక్తులు ఆధారం కాని, ఆధారం లేని తావీజులు. అంటే గవ్వలు, పూసలు, దారాలు, వెంట్రుకలు, చిప్పలు, భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం, హరామ్, ధర్మ సమ్మతం కాదు, షిర్క్. అవి ఖచ్చితంగా షిర్క్ కిందికి వస్తాయి. ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లాహ్ నామాల, వాక్యాల బదులు వాటిని ఇతరత్రా వాటితో ముడిపెట్టడం జరుగుతుంది, దైవేతరులను ఆశ్రయించడం జరుగుతుంది. కాగా హదీసులో ఇలా ఉంది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

مَنْ تَعَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ
(మన్ త’అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక్)
ఎవరైతే తాయత్తు వేలాడదీసుకున్నాడో, అతను షిర్క్ చేశాడు.” (ముస్నద్ అహ్మద్)

ఇంకో హదీసులో ఉంది:

مَنْ تَعَلَّقَ شَيْئًا وُكِّلَ إِلَيْهِ
(మన్ త’అల్లఖ షై’అన్ వుకిల ఇలైహి)
ఎవరైతే ఏదైనా వస్తువుతో (రక్షణ కోసం) సంబంధం పెట్టుకుంటాడో, అతను దానికే అప్పగించబడతాడు.” (తిర్మిజి)

ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరుచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు, అతని నమ్మకం దాని పైనే ఉంటుంది, అల్లాహ్ పైన నమ్మకం ఉండదు. అల్లాహ్ అతనికి పట్టించుకోడు. కావున ఇది షిర్క్ అవుతుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది అది ఒక వ్యాపారంగా చేసుకున్నారు. మీరు దాని గురించి అనుభవం చేసి చూడండి. కొన్ని తావీజులు ఓపెన్ చేసి చూస్తే, కొన్ని అక్షరాలు ఉంటాయి, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. అరబీ భాష కావచ్చు, అరబీ భాష కాకపోవచ్చు, అర్థం కాని భాష ఉంటుంది, అర్థం కాని అక్షరాలు ఉంటాయి. కొన్ని తావీజులలో అడ్డంగా, దిడ్డంగా గీతలు ఉంటాయి. కొన్ని తావీజులలో లెక్కలు ఉంటాయి. ఇదన్నీ ఎవరు నేర్పించారు? ఇవన్నీ హరామ్, ఇవన్నీ షిర్క్ కిందికి వస్తుంది, అధర్మం.

కావున, మనం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన విధానాన్నే అనుసరించాలి. రోగానికి గురైనప్పుడు ప్రవక్త గారు మనకి ఏం నేర్పించారు? పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ప్రవక్త గారు నేర్పించారు. జ్వరం వస్తే ఏం చేయాలి? బాధకి గురైతే ఏం చేయాలి? నష్టానికి గురైతే ఏం చేయాలి? భయంలో ఏం చేయాలి? ప్రయాణంలో ఏం చేయాలి? అల్హమ్దులిల్లాహ్! అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రతీ విధానం నేర్పించారు. ప్రతీ విషయంలో, ప్రతీ సమయంలో, ప్రతీ సబ్జెక్టులో మనకు నేర్పించారు. వివాహంలో, సంభోగం సమయంలో, దుస్తులు వేసుకునేటప్పుడు, ఇంట్లో ప్రవేశించేటప్పుడు, ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు, ఉదయం సాయంత్రం దుఆలు, అజాన్‌కి ముందు అజాన్ తర్వాత, మస్జిద్‌కి పోయేటప్పుడు బయటికి వచ్చేటప్పుడు, బాధ కలిగినప్పుడు, భయం ఉన్నప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు, అప్పులో ఉన్నప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు ప్రతీ సమస్యకి, ప్రతీ రోగానికి, ప్రతీ కష్టానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక పద్ధతి నేర్పించారు, ఒక విధానం నేర్పించారు.

మరి మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ఏం నేర్పించినా,

وَمَا يَنطِقُ عَنِ الْهَوَىٰ إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
(వమా యంతిఖు అనిల్ హవా, ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా)
అతను తన మనోభిరామం ప్రకారం మాట్లాడటమూ లేదు. అది (అతను మాట్లాడేదంతా) అతని వద్దకు పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు అల్లాహ్ తరఫు నుంచే నేర్పుతారు. కావున, మనము ప్రతీ చిన్న పెద్ద షిర్క్ నుండి దూరంగా ఉండాలి. షిర్క్ చాలా ఘోరమైన నేరం, డేంజర్ విషయం అది. షిర్క్ చాలా ఘోరం. కావున, ఈ తావీజు కూడా షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ఈ షిర్క్ నుండి దూరంగా ఉండాలి, ఈ తావీజులు, తాయత్తులతో దూరంగా ఉండాలి. సమాజంలో ఈ బాబాలు, పీర్లు, వీళ్ళు దీనిని ఒక వ్యాపారంగా చేసుకున్నారు. ఇస్లాంలో ఎటువంటి దీనికి స్థానం లేదు. ఇది ధర్మ సమ్మతం కాదు. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మనకి రోగం వచ్చినా, మన పిల్లలకి రోగాలు వచ్చినా, వారికి దిష్టి తగలకుండా ఉండాలన్నా ప్రవక్త గారు నేర్పించారు. కావున మీరు దుఆల పుస్తకం ఆధారంగా ఉన్న ప్రామాణికమైన హదీసుల పరంగా దుఆలు మనకు ఉన్నాయి, ఆ దుఆలు పఠించండి, ప్రవక్త గారి విధానాన్ని అనుసరించండి. ఇన్షా అల్లాహ్ ఇహపర లోకాలలో సాఫల్యం దక్కుతుంది ఇన్షా అల్లాహ్.

అభిమాన సోదరులారా! కావున ఇంతటితో నేను నా మాటలను ముగిస్తూ, ఇన్షా అల్లాహ్ మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా చివరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=24530

మంత్రించి ఊదటం, తావీజులు కట్టటం – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [PDF] [4పేజీలు]

ఆపద దూరమగుటకు, లేదా అది రాకుండా తాయత్తులు, పూసలు మరియు గవ్వలు వేసుకోకు – ధర్మపరమైన నిషేధాలు [వీడియో] [6 నిముషాలు]

దిష్టి తగలకుండా బుగ్గకి నల్ల చుక్క లేదా కాళ్ళకి నల్ల దారం కట్టవచ్చా? [వీడియో]

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/