“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

“వలీ యుల్లాహ్”, “ఔలియా అల్లాహ్ “అంటే ఎవరు?
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/9G8MWDYNSwo [7 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్)
వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)

ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.

ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.

నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.

అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్‌కు) భయపడేవారై ఉంటారు.(10:63)

ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.

అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.

కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.

అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.

అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.

అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44244

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ మరియు గ్యారవీ గురించిన వాస్తవాలు [వీడియో]

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు? [ఆడియో & టెక్స్ట్]

బాబాలతో మొరపెట్టుకొనుట పాపమా?? [వీడియో & టెక్స్ట్]


ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]

ధర్మ అవగాహనం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]
యూట్యూబ్ ప్లే లిస్ట్

https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3CRoRRZhxlcQFsZpOPs2Sg

  1. ఇబాదత్ (ఆరాధన) అంటే ఏమిటి ? ఎవరికి చెయ్యాలి ? ఎలా చెయ్యాలి ? [యూట్యూబ్ లింక్]
  2. ఆరాధనలో ఇహ్సాన్ (ihsan) అంటే ఏమిటి ? [యూట్యూబ్ లింక్]
  3. అల్లాహ్ (సుబ్ హనహూవ తఆలా) దైవ ప్రవక్తలను ఎందుకు పంపించాడు ? [యూట్యూబ్ లింక్]
  4. తౌహీద్ (ఏక దైవారాధన) [యూట్యూబ్ లింక్]
  5. అల్లాహ్ (సుబ్ హనహూవ తఆలా) ఎక్కడ ఉన్నాడు ? [యూట్యూబ్ లింక్]
  6. అన్నింటి కంటే పెద్ద పాపం ఏది ? – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
  7. షిర్క్ అంటే ఏమిటి ? [యూట్యూబ్ లింక్]
  8. షిర్క్ చేస్తూ సత్కార్యాలు చేస్తూ ఉంటే ప్రయోజనం ఉందా? [యూట్యూబ్ లింక్]
  9. దుఆ (వేడుకోవడం, ప్రార్ధన ) [యూట్యూబ్ లింక్]
  10. సహాయం కోరుకోవడం (ఇస్తియాన) – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
  11. మొక్కుబడి (నద్ర్) [యూట్యూబ్ లింక్]
  12. సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]
  13. చేతబడి [యూట్యూబ్ లింక్]
  14. జ్యోతిష్యం (Astrology) [వీడియో & టెక్స్ట్]
  15. ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  16. అల్లాహ్ యేతరులపై ప్రమాణం (ఒట్టు) చేయడం ధర్మ సమ్మతమేనా? [వీడియో & టెక్స్ట్]
  17. రుఖ్ యా (మంత్రించి ఊదటం) [వీడియో & టెక్స్ట్]
  18. తావీజులు, తాయత్తులు… !? – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]
  19. మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  20. ధర్మ సమ్మతమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]
  21. అధర్మమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]
  22. షిఫాఅత్ ” సిఫారసు ” [యూట్యూబ్ లింక్]
  23. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స) పట్ల ప్రేమ [యూట్యూబ్ లింక్]
  24. దైవ ప్రవక్త ﷺ ప్రేమ లో “గులూ” (అతిగా ప్రవర్తించడం, మితి మీరి పోవడం) [వీడియో & టెక్స్ట్]
  25. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్(స) ప్రత్యేకతలు [యూట్యూబ్ లింక్]
  26. జిహాద్ అంటే ఏమిటి? [వీడియో & టెక్స్ట్]
  27. విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  28. ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  29. అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  30. వివాదం తలెత్తినప్పుడు ఏం చెయ్యాలి? – హబీబురహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  31. బిద్అత్ అంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
  32. బిద్అత్ రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

87. తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) [వీడియో & టెక్స్ట్]

తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/5shT_PdxwNE [60 నిముషాలు]

ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఆ`లా యొక్క వివరణ ఇవ్వబడింది. అల్లాహ్ యొక్క పవిత్రతను కీర్తించడం (తస్బీహ్) నాలుగు విధాలుగా ఉంటుందని వివరించబడింది: హృదయంలో, మాటలో, అల్లాహ్ నామాలు మరియు గుణాల విషయంలో, మరియు ఆచరణలో. అల్లాహ్ యే సృష్టికర్త, సృష్టిని తీర్చిదిద్ది, ప్రతిదాని విధిని నిర్ధారించి, మార్గదర్శకత్వం ఇచ్చేవాడని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని, పచ్చిక బయళ్ళు ఎండిపోయినట్లు మానవ జీవితం కూడా ముగుస్తుందని, కానీ అల్లాహ్ పునరుత్థానం చేస్తాడని గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ ను ప్రవక్త (స)కు అల్లాహ్ యే గుర్తుంచుకునేలా చేస్తాడని, దానిని అనుసరించడం సులభతరం చేయబడిందని చెప్పబడింది. అల్లాహ్ కు భయపడేవారే ఉపదేశాన్ని స్వీకరిస్తారని, దౌర్భాగ్యులు దానిని తిరస్కరించి ఘోరమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారని హెచ్చరించబడింది. ఆత్మశుద్ధి చేసుకుని, అల్లాహ్ ను స్మరించి, నమాజ్ చేసేవారే సాఫల్యం పొందుతారని. ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితమే శ్రేష్ఠమైనదని, శాశ్వతమైనదని, ఈ సందేశం ఇబ్రాహీం (అ.స) మరియు మూసా (అ.స) గ్రంథాలలో కూడా ఉందని సూరహ్ ముగుస్తుంది. ప్రసంగం తర్వాత, ఇషా నమాజ్ సమయం, ఉదూ లేకుండా ఖుర్ఆన్ పట్టుకోవడం, మరియు షిర్క్ కు సంబంధించిన ఆచారాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.

ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ ఆలా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. అయితే ఈ సూరకు సంబంధించి కొన్ని ప్రారంభ విషయాలు నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పి ఉన్నాను.

మొదటి ఆయతు

سَبِّحِ اسْمَ رَبِّكَ الْأَعْلَى
(సబ్బిహిస్మ రబ్బికల్ ఆ`లా)
నీ మహోన్నత ప్రభువు నామాన్ని కీర్తించు. (87:1)

సబ్బిహ్’ – పవిత్రతను కొనియాడు, ‘సుబ్ హా నల్లాహ్’ అని పలుకుతూ ఉండు. దీని యొక్క భావం ఇంతకు ముందే నేను చెప్పాను, నాలుగు రకాలుగా ఉండాలి. మనం అల్లాహ్ యొక్క తస్బీహ్ నాలుగు రకాలుగా చేయాలి.

  • (1) ఒకటి, మన మనస్సులో అల్లాహ్ అన్ని రకాల షిర్క్, అన్ని రకాల లోపాలు, అన్ని రకాల దోషాలకు అతీతుడు అని బలంగా నమ్మాలి.
  • (2) మరియు ‘సుబ్ హా నల్లాహ్’ అని నోటితో పలుకుతూ ఉండాలి.
  • (3) మూడవది, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, అల్లాహ్ యొక్క మంచి గుణాలు అవి అల్లాహ్ కు మాత్రమే తగును, అందులో అల్లాహు త’ఆలా ఎలాంటి లోపాలు లేనివాడు అని కూడా స్పష్టంగా నమ్మాలి.
  • (4) ఇంకా, మన ఆచరణ ద్వారా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి. అంటే, మనం ఏ పని చేయడం ద్వారా మనం అల్లాహ్ కు ఒక దోషాన్ని అంటగట్టిన వారం అవుతామో, అలాంటి పనులు చేయకూడదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, లోపాలకు అతీతుడు అని స్పష్టమయ్యే అటువంటి పనులు మనం చేయాలి. అంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి మన యొక్క ఆచరణ ద్వారా కూడా.

    ఒక చిన్న ఉదాహరణ చూడండి , మీకు విషయం అర్ధం అవుతుంది . మనం భారతీయులము గనక 15వ ఆగస్టు, 26 జనవరి ఇలాంటి సందర్భంలో మనం మన దేశ దేశానికి ఏదైతే స్వాతంత్రం లభించినదో, దానిని పురస్కరించుకొని ఒక సంబరం, ఒక సంతోషం వ్యక్తపరుస్తాము. కానీ మన తోటి భారతీయులు కొందరు ఏం చేస్తారు? ఆ సమయంలో అక్కడ నెహ్రూ గారి లేదా గాంధీ గారి యొక్క బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతారు. అయితే ఈ సందర్భంలో మనం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి మన ఆచరణ ద్వారా. అయితే మనం, వారు అక్కడ టెంకాయ కొడుతున్నప్పుడు కేవలం ‘సుబ్ హా నల్లాహ్’ అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ‘ఓ రండి, మీరు మా జమాత్ యొక్క పెద్ద, మీరు మా యొక్క స్కూల్ కు పెద్ద ఆర్గనైజర్, మీరు పెద్ద హెడ్ మాస్టర్’ ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లింని ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి అతని చేతిలో ఓ టెంకాయ ఇచ్చి ‘కొట్టండి’ అని అంటే అక్కడ అతని యొక్క పరీక్ష. అతడు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి ఈ టెంకాయ కొట్టి టెంకాయ సమర్పించినవాడు అవుతున్నాడు. అంటే అతను ‘సుబ్ హా నల్లాహ్’ నోటితో పలుకుతున్నా, ఆచరణతో వ్యతిరేకిస్తున్నాడు అని భావం. ఇప్పుడు అర్థమైందా అందరికీ క్లియర్ గా? మనం అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా మనం ఎలా కొనియాడాలి అన్న విషయం తెలిసింది కదా?

ఇక ‘రబ్బిక’ నీ ప్రభువు అన్నటువంటి పదం ఇక్కడ అల్లాహు త’ఆలా ఉపయోగించాడు. ‘సబ్బిహిల్లా’ అల్లాహ్ యొక్క పవిత్రత కొనియాడు అని అంటే కూడా మాట వస్తుంది. కానీ ‘రబ్బిక’ అనడంలో ఇక్కడ హిక్మత్, ఔచిత్యం అని కొందరు ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు ఏం తెలిపారంటే, ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో ఏ ముష్రికులు అయితే ఉండేవారో చుట్టుపక్కన మొత్తం, వారు మనందరి సృష్టికర్త అయిన నిజమైన ప్రభువు అల్లాహ్ ను రబ్ అని, అల్లాహ్ ను ఖాలిఖ్ పుట్టించేవాడని, అల్లాహ్ ను రాజిఖ్ ఉపాధి ప్రదాత అని నమ్మేవారు. అయినా షిర్క్ చేసేవారు. అయితే ఇలాంటి వారికి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ అల్లాహ్ నైతే ప్రభువు అని నమ్ముతున్నారో, ఆ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడండి. షిర్క్ కు దూరంగా ఉండిపోండి.

‘అల్-ఆలా’ అల్లాహ్ యొక్క పేరు కూడా మరియు ఇందులో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ ఉన్నతుడు అందుకొరకే ఇక్కడ అనువాదంలో ఉంది ‘సర్వోన్నతుడు’ అయిన. అల్లాహు త’ఆలా తన యొక్క అస్తిత్వం జాత్ కే ఏతిబార్ సే, తన యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణాల విషయంలో కూడా సర్వోన్నతుడు. తన యొక్క పనులలో కూడా సర్వోన్నతుడు.

సూరహ్ అల్-ఆ`లా – 2 నుండి 5 ఆయతులు

ఈ మొదటి ఆయతులో రబ్ అంటే ఏంటి, ఆ`లా అంటే ఏంటి, తస్బీహ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ యొక్క, నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడు. ఎందుకు పవిత్రతను కొనియాడాలి? మన యొక్క ‘సుబ్ హా నల్లాహ్’ అనడానికి తస్బీహ్ కి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఎందుకు? ఇక్కడ అల్లాహు త’ఆలా ఆయతు నెంబర్ రెండు నుండి ఆయతు నెంబర్ ఐదు వరకు కొన్ని కారణాలు తెలుపుతున్నాడు. శ్రద్ధ వహించండి ఇప్పుడు.

الَّذِي خَلَقَ فَسَوَّىٰ
(అల్లదీ ఖలక ఫసవ్వా)
ఆయనే సృష్టించాడు, మరి ఆపైన తీర్చిదిద్దాడు. (87:2)

وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ
(వల్లదీ ఖద్దర ఫహదా)
ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. (87:3)

ఆయనే సృష్టించాడు. ‘ఫసవ్వా’ మరి ఆపైన తీర్చిదిద్దాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంతేకాదు, ఆ అల్లాహు త’ఆలా, ‘వల్లదీ ఖద్దర’ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు. ‘తఖ్దీర్’ విధిరాత అని ఏదైతే అంటామో, దాని యొక్క ప్రస్తావన కూడా ఈ ‘ఖద్దర’ అన్న పదంలోనే వచ్చేస్తుంది. ‘ఫహదా’ పిదప మార్గం చూపించాడు.

నాలుగు పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఖలక, సవ్వా, ఖద్దర, హదా. ప్రియ విద్యార్థులారా, ఈ నాలుగు పదాల యొక్క అర్థమైతే ఇక్కడ ఉన్నది. ఖలక సృష్టించాడు, సవ్వా తీర్చిదిద్దాడు, ఖద్దర నిర్ధారించాడు, తఖ్దీర్ విధిరాత రాశాడు, హదా మార్గం చూపించాడు. కానీ వ్యాఖ్యానకర్తలు దీని గురించి చెప్పిన విషయాలను గమనిస్తే, అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క గొప్పతనం మన ముందు ఎంత స్పష్టంగా వస్తుందో, మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని.

ఖుర్ఆన్ లో ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా తెలుపబడ్డాయి. వీటి యొక్క ఈ నాలుగు పదాలు ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు ఖుర్ఆన్ లోని వేరే సూరత్ లో. ఇంతకు ముందు మీరు ఉదాహరణకు చదివారు కదా సూరతుల్ ఇన్ఫితార్ లో? ఆయతు నెంబర్ ఏడులో.

يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
(యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీమ్)
ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?(82:6)

الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
(అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్)
(యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. (82:7)

فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ
(ఫీ అయి సూరతిమ్ మాషాఅ రక్కబక్)
తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.(82:8)

గుర్తొచ్చిందా? అక్కడ చూడండి, సూరతుల్ ఇన్ఫితార్ లో మనం చదివి ఉన్నాము. అలాగే మీరు గమనించారంటే, సూరత్ అత్-తీన్ అని అంటాము కదా మనం? అక్కడ, అలాగే సూరత్ అస్-సజ్దాలో కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాలను వివరించాడు.

సంక్షిప్తంగా, సారాంశంగా మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు ఒక మనిషి విషయమే చూడండి. అల్లాహు త’ఆలా ఇక్కడ పూర్తి సృష్టి విషయం గురించి చెబుతున్నాడు. ఖలక అంటే అల్లాహు త’ఆలా పూర్తి సృష్టిని సృష్టించాడు. సవ్వా, ప్రతీ సృష్టిలో వారికి ఎలాంటి చక్కబాటు, తీర్చిదిద్దడం అవసరమో ఆ రీతిలో తీర్చిదిద్దాడు. ఖద్దర, ప్రతి ఒక్కరి విధిరాత రాసి ఉంచాడు. హదా, ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైనది వారికి మార్గం చూపాడు.

కానీ ఈ విషయం కొంచెం వివరంగా ఒక్క మానవుని విషయంలోనే మనం గమనించామంటే, అల్లాహు త’ఆలా మానవుని సృష్టించాడు కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ కళ్ళు మనకు వెనక వైపున ఉంటే? మన ఈ మూతి, ఫేస్ అనడం లేదు నేను, మౌత్ అని ఏదైతే అంటామో మూతి, ఇందులో నుండి అయితే పళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, ఇది మన ఏదైనా ఒక వైపున ఉండేది ఉంటే? అలా కాకుండా కేవలం మనిషి ఒక తిండి విషయం ఆలోచించండి. మనిషి తినాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, మంచి శక్తి లభిస్తే మంచిగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతాడు.

ఉదాహరణకు ఒకటి తీసుకోండి. తినడానికి తన చేతిలో ఒక అన్నం ముద్దనే ఎత్తాడు అనుకోండి. చేతుల ద్వారా ముందు విషయం తెలుస్తుంది. ఆ అన్నం మెత్తగా ఉన్నదా, పాసిపోయినదా, మంచిగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా? బియ్యం ఏవైతే మనం వండామో, అవి మంచిగా ఉడికాయా లేవా అన్న విషయాలు మనకు మన వేళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. దానితోపాటు ఏదైనా కూర కలుపుకొని ముద్ద చేసుకొని మనం పైకి ఎత్తుతాము. అందులో ఏదైనా మనకు ఇష్టం లేని మిరపకాయ వచ్చినా కళ్ళతో కనబడుతుంది, పక్కకు తీసేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా మనకు ఇష్టం లేని వాసన లాంటిది ఉండేది ఉంటే, ముక్కు కాడికి వచ్చేసరికి పక్కకు జరిపేస్తాము. ముక్కుతో మనం అది పీల్చి చూస్తాము గనక. అంతా కూడా బాగానే ఉంది అని పెదవుల వరకు తెచ్చి ఇలా నోట్లో పెడతాము. అంతలోనే నాలుక నోట్లో ఇలా పెట్టిన వెంటనే నాలుక దాని యొక్క రుచి చెబుతుంది. ఓ ఛీ ఛీ, ఇంత ఎక్కువ ఉప్పు అయిపోయిందా! కదా, నేను ఎలా నా కడుపులో దించాలి? లేదా ఇంకా వేరే ఏదైనా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఈ విధంగా మీరు గమనించండి, అల్లాహు త’ఆలా మనకు ఎన్ని రకాల ఈ తీర్చిదిద్దడం అనే విషయంలోనే ఒక కేవలం మన శరీరంలోనే చూసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత ఆ అన్నం ముద్ద మన గొంతు కిందికి దిగడానికి గొంతులో ఎలాంటి ప్రక్రియ ఉన్నది? అక్కడి నుండి మళ్ళీ కిందికి ఎప్పుడైతే వస్తుందో, జీర్ణాశయంలో వెళ్ళే వరకు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినవి, మన యొక్క లివర్ కార్యానికి సంబంధించినవి, ఈ విధంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మనం ఒక అన్నం ముద్ద లోపటికి వేస్తే, మన శరీరంలోని ఏ లోపలి, బయటి ఏ ఏ అవయవాలు ఏ రీతిలో పనిచేస్తాయి, ఒక పొందికగా, ఒక మంచి రీతిలో? అల్లాహు అక్బర్. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అందుకొరకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఒక చోట ఏమంటున్నాడు? ‘వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్’ ఏమిటి మీరు మీ యొక్క స్వయం మీ శరీరంలోనే గమనించరా? అల్లాహ్ యొక్క సృష్టి ప్రక్రియను మీరు గ్రహించండి.

ఖద్దర తఖ్దీర్ విషయం కూడా ఉన్నది, మరియు మనిషికి ఏ ఏ అవసరాలు ఏ రీతిలో నిర్ధారించాడో అల్లాహు త’ఆలా నిర్ధారించాడు. మనం మనుషులము గనుక నేను మనిషి యొక్క ఉదాహరణ ముందుగా చెబుతున్నాను, వేరే ఇంకా సృష్టిరాశుల గురించి చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రెండు ఆయతుల్లోనే ఇంకా గంటల తరబడి సమయం వెళ్ళిపోతుంది.

హదా, ప్రతి ఒక్కరికీ వారి యొక్క హిదాయత్, ఇహలోకంలో వారు ఏ రీతిలో మంచిగా జీవించాలి, పరలోకంలో స్వర్గం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాల యొక్క మార్గదర్శకత్వం కూడా అల్లాహు త’ఆలా చేశాడు. అల్లాహ్ ఈ నాలుగు పనులు చేసిన వాడు కనుక మీరు ఈ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయాలి, ఇంకా వేరే ఎవరి తస్బీహ్ చేయకూడదు. అంతేకాదు,

وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ
(వల్లదీ అఖ్రజల్ మర్ఆ`)
మరియు ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.

فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ
ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.

ఎందుకు? మీతో పాటు మీ జంతువులు కూడా, మీరు ఎలాగైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను అనుభవిస్తూ తింటూ త్రాగుతూ హాయిగా ఉన్నారో, మీ సేవకు ఉన్న వేరే జంతువుల కొరకు కూడా అల్లాహు త’ఆలా ఆహారాన్ని పుట్టించాడు. కానీ ఈ పచ్చిక బయళ్ళు మనం ఏవైతే చూస్తామో, స్వయం మన కొరకు ఆహారంగా ఉన్నటువంటి ఈ పంటల విషయం మీరు ఒకసారి చూడండి. బియ్యమైనా, వేరే కూరగాయలైనా, వేరే పప్పు దినుసులైనా, ఇవన్నీ ఏ పచ్చని పైర్ల ద్వారా మనకు లభిస్తాయో, వాటి నుండి మనం ఆ ధాన్యాలు తీసుకున్న వెంటనే, ఆ తర్వాత అది గడ్డిగా అయిపోతుంది కదా? ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా నల్లగా అయిపోయి, అక్కడ ఏమైనా ఇంతకుముందు పండిందో లేదో అన్నటువంటి పరిస్థితి ఆ భూమిది అయిపోతుంది.

అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు? ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు అంటే, ఓ మానవులారా, ఏ రీతిలోనైతే మీరు ఈ పంటలు చూస్తారో, అలాగే మీ యొక్క పరిస్థితి. మీ ఏ నామ నిషాన్, మీ యొక్క ఏ గుర్తు లేకుండా ఉండినది, కానీ మీ తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. మీరు పెరిగారు, మళ్ళీ చనిపోతారు. చనిపోయిన తర్వాత, ఎలాగైతే ఈ భూమి మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడడం ద్వారా ఇక్కడ పచ్చిక బయళ్ళు మనకు కనబడుతున్నాయో, అదే రీతిలో మిమ్మల్ని కూడా అల్లాహు త’ఆలా మరోసారి తప్పకుండా పుట్టిస్తాడు. మరోసారి మిమ్మల్ని అల్లాహ్ పుట్టించడంలో ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం లేదు. గమనిస్తున్నారా? అందుకొరకే ఈ లాంటి ఈ శక్తి గల అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన యొక్క పవిత్రత మాత్రమే మీరు కొనియాడాలి. మరియు మీరు ఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మరియు ఆ అల్లాహ్ తొలిసారి మిమ్మల్ని పుట్టించినట్లుగా, మలిసారి పుట్టించే శక్తి గలవాడు అని కూడా నమ్మాలి.

ఇక ఆ తర్వాత రండి. ఇహలోకంలో పుట్టించి అన్ని రకాల మార్గాలు మీకు సులభం చేసిన ఈ అల్లాహు త’ఆలా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిస్తాడు కదా? అయితే మీ హృదయాలలో విశ్వాసం యొక్క మొలక నాటడానికి, సత్కార్యాల పట్ల పుణ్యం, పుణ్యం యొక్క ప్రేమ కలిగించడానికి, అల్లాహ్ మీ హిదాయత్ కొరకు ఖుర్ఆన్ అవతరింపజేశాడు. అయితే దాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాడు అల్లాహు త’ఆలా.

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ
(సనుఖ్రిఉక ఫలా తన్సా)
(ఓ ప్రవక్తా!) మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. (87:6)

إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
(ఇల్లా మాషా అల్లాహ్, ఇన్నహూ యఅ`లముల్ జహ్ర వమా యఖ్ఫా)
అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. (87:7)

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
(వనుయస్సిరుక లిల్ యుస్రా)
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.(87:8)

ఈ మూడు ఆయతులు గుర్తున్నాయి కదా? శ్రద్ధగా వినండి. ఈ మూడు ఆయతుల యొక్క భావాన్ని, ఈ మూడు ఆయతుల యొక్క అనువాదం, ఈ మూడు ఆయతుల యొక్క సంక్షిప్త వ్యాఖ్యానాన్ని.

ఇందులో స్పష్టమైన మనకు అనువాదంలో కనబడుతున్న రీతిలో మనం చూస్తే, ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరిస్తున్నప్పుడు, శ్రద్ధ వినండి, అర్థం చేసుకోండి. ఈ మూడు ఆయతుల భావాలు ఏవైతే ఉన్నాయో, అందులో రెండు మాటలు నేను తెలియజేస్తున్నాను కనుక మీరు శ్రద్ధగా వింటే మాట మంచిగా అర్థమవుతుంది. ఆయతు నెంబర్ ఆరు, ఏడు, ఎనిమిది. ఇక్కడ అరబీ ఆయతులకు తెలుగు అనువాదం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా బాహ్యమైన అర్థం ఒకటి ఏమిటి?

మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్న దానిని ఎరిగిన వాడు. మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

దీని యొక్క బాహ్యమైన అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో, నాకు అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ఏదైతే ప్రసాదిస్తున్నాడో, నేను మరువకూడదు, నేను ఎల్లవేళల్లో నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు ఈ ఆయతులు కంఠస్థం ఉండడానికి నేను మంచిగా గుర్తు చేసుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వెంటనే చదువుతూ ఉండేవారు. దీని ప్రస్తావన మనకు ఇక్కడ ఏదైతే సూరతుల్ ఆ`లాలో చూస్తున్నారో, అదే కాకుండా మనకు సూరతుల్ ఖియామాలో కూడా కనబడుతుంది ఈ విషయం. మరియు అలాగే ఖుర్ఆన్ లో మరొకచోట కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశాడు, బహుశా సూరతుల్ ఇస్రా అనుకుంటా. అయితే ఓ ప్రవక్తా, ఫలా తాజల్, మీరు తొందర పడకండి. ఈ ఖుర్ఆన్ ను నీవు మరిచిపోకుండా భద్రంగా మీ మనసులో ఉండే విధంగా మేము నీకు సహాయపడతాము. ఆ విషయంలో నిన్ను మీకు మేము మీకు సులభతరం ప్రసాదిస్తాము. కనుక మీరు ఎలాంటి చింత లేకుండా మీకు ఎప్పుడైతే ఈ ఖుర్ఆన్ వహీ చేయడం జరుగుతుందో అప్పుడు కేవలం శ్రద్ధగా వినండి అంతే. తర్వాత దాన్ని కంఠస్థం మీ మనసులో, మీ హృదయంలో చేసే విషయంలో మేమే నీకు తోడు పడతాము. మరి నీవు మెల్లగా చదివినా, బహిరంగంగా చదివినా అంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.

అయితే ఇక్కడ ఏడవ ఆయతు ప్రారంభంలో ఏముంది? అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. అంటే ఏమిటి ఇది? అల్లాహ్ తలచినప్పుడు కొన్ని ఆయతులు లేదా వాటి భావాన్ని ఏదైతే రద్దు పరుస్తాడో, దాని ప్రస్తావన సూరతుల్ బఖరాలో కూడా వచ్చి ఉంది. ఆ భావం. అది అల్లాహ్ యొక్క ఇష్టం. మనం ఎందుకు అల్లాహ్ ఇలా చేస్తాడు అని అల్లాహ్ ను అడిగే హక్కు మనకు లేదు. ఉదాహరణకు, సూరతున్నూర్ లో మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది, పెళ్లి అయిన వారు వ్యభిచారానికి పాల్పడితే వారిని రాళ్లు రువ్వి చంపాలి అన్నటువంటి ఆదేశం కూడా ఉండింది. అయితే దానికి సంబంధించిన ఆ ఆయతులు కూడా ఉండినవి. అల్లాహు త’ఆలా ఆదేశాన్ని మిగిలి ఉంచాడు హదీసుల ద్వారా. కానీ ఆ ఆయతులు అల్లాహు త’ఆలా ఖుర్ఆన్ లో నుండి తీసేసాడు. అది అల్లాహ్ ఇష్టం.

ఇక సూర బఖరాలో ఉంది అల్లాహ్ తలచుకున్నప్పుడు ఆయతులలో రద్దు చేస్తాడు అన్నది విషయం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగిపోయింది, ఆ రద్దు అన్నది ఇప్పుడు జరగదు. చూస్తున్నారా సూర బఖరా ఆయతు నెంబర్ 106.

مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? (2:106)

أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ

భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దేననీ, అల్లాహ్‌ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా? (2:107)

ఈ విధంగా అల్లాహు త’ఆలా తలచుకున్నప్పుడు రద్దు చేయగలుగుతాడు. అతన్ని ఎవరూ కూడా కాదు అనలేరు. కానీ ఈ ఆయతు యొక్క ఈ భావం, ఈ యొక్క బాహ్య భావమే కాకుండా మరొక భావం ఇందులో ఏముంది?

ఇందులో మరొక భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకమైన అనుగ్రహం, ఆయన మరిచిపోకుండా ఆయన హృదయంలో ఖుర్ఆన్ ఆయతులు నాటుకుపోయి ఉండే విధంగా అల్లాహు త’ఆలా వారికి సహాయపడతాడు. కానీ మనం ఈ ఆయతులు మరిచిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు త్యాగం, ప్రయాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రయత్నం మనం చేశాము అంటే, ఆయతు నెంబర్ ఎనిమిది గమనించండి, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.

ఇక్కడ సౌలభ్యం అన్నది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నపాటి కష్టం ఏదైనా మనం చేసిన తర్వాతనే సౌలభ్యం అన్నది మనకు ఏర్పడుతుంది కదా. అందుకొరకు ఖుర్ఆన్ యాద్ చేయడంలో కూడా మనం కష్టపడాలి. మన సమయాన్ని, మన నిద్రను, మన యొక్క ప్రయత్నాన్ని అందులో వెచ్చించాలి. అప్పుడు అది మనకు అల్లాహ్ యొక్క దయతో ఎంతో సులభతరం ఏర్పడుతుంది.

మరో రకంగా ఇందులో, నేను ప్రారంభంలోనే చెప్పినట్లు, శరీరపరంగా చూసుకుంటే ఇంకా వేరే రకంగా అల్లాహు త’ఆలా మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఎంతో మంచి రీతిలో పుట్టించిన వాడు, ‘ఫహదా’ అని చదివారు కదా, మూడవ ఆయతు చివరిలో ‘ఫహదా’. ఆ హిదాయత్ అల్లాహ్ ఎలా ఇచ్చాడు? ఖుర్ఆన్ ద్వారా, హదీస్ ద్వారా ఇచ్చాడు. కనుక మనం ఈ ఖుర్ఆన్, హదీస్ ను చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉన్న తర్వాత సరిపోతుందా? లేదు, ఇతరులకు బోధ చేస్తూ ఉండాలి.

فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.” (87:9)

అదే విషయం గమనించండి ఆయతు నెంబర్ తొమ్మిదిలో, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. ఈ లాభదాయకం అయితే అని ఏదైతే ఇక్కడ ఉన్నదో, లాభదాయకం లేకుంటే వదిలేయ్ అన్నటువంటి భావం కాదు. ఇక్కడ రెండు భావాలు కనీసం గుర్తుంచుకోండి.

ఒకటి, మీరు ఉపదేశం చేస్తూ ఉండండి, ఒకరికి బోధ చేస్తూ ఉండండి, ఈ బోధ అన్నది ఏదో ఒక రీతిలో లాభదాయకంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకొని ఆచరించకపోయినా, చెప్పేవారికి లాభమే కదా అందులో? చెప్పిన పుణ్యం లభిస్తుంది కదా? అవునా కాదా? మరియు రెండో భావం, ఈ ఎవరికైతే మనం చెప్పామో, విన్న వ్యక్తి, అది ఆ సమయంలో అతనికి లాభదాయకంగా ఏర్పడకపోయినా, ఒకానొక రోజు ‘అరే అవును, ఫలానా సమయంలో వాళ్ళు నాకు చెప్పారు కదా’ అన్నటువంటి ఒక సుబూత్, ఒక రుజువు అతని వద్ద ఉంటుంది. ఏదో ఒక రకంగా. కానీ గమనించండి. ఎవరైనా మనకు ఏదైనా ఉపదేశం చేస్తున్నారు, ఆ ఉపదేశం మనకు లాభదాయకం కావాలి అంటే ఏం ఉండాలి మనలో? ఆయతు నెంబర్ 10 గమనించండి.

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(సయజ్జక్కరు మయ్ యఖ్షా)
(అల్లాహ్ పట్ల) భయమున్నవాడు ఉపదేశాన్ని గ్రహిస్తాడు. (87:10)

చూస్తున్నారా? అందుకొరకే ఒక వ్యక్తి మనకు చెప్పాడు, ‘ఏంటయ్యా, నీవు కొంచెం నమాజ్ లో వెనక ఉన్నావు. ఏంటయ్యా, ఈ తాగుడు మానుకో. ఏంటయ్యా, ఈ పాపాన్ని వదులుకో.’ ‘అరే పోరా పో, నీది నువ్వు చూసుకో. నాకెందుకు చెబుతున్నావ్?’ ఇలా అనకూడదు. ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కదా ఎంతో మందికి ఇలా చెప్పడం. ఎందుకు? ఒక వ్యక్తి మనకు ఏదైనా ఉపదేశం చేశాడంటే, మనకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశాడు అతను. అంతేకాదు, అల్లాహ్ మనపై దయ తలిచాడు. మనకు సన్మార్గం చూపించడంలో ఒకరి యొక్క సహాయం అల్లాహ్ మనకు అందించాడు. ఇక నేను ఇలా అడ్డం తిరిగి, ఇలాంటి తప్పుడు సమాధానం ఇచ్చానంటే, నేను అల్లాహ్ యొక్క భయం నా మనసులో లేనట్లే కదా. అర్థమవుతుందా అవతలేదా? అందుకొరకే సూర బఖరాలో ఒక చోట ఏమున్నది? ఎవరైతే అల్లాహ్ తో భయపడండి.

وَإِذَا قِيلَ لَهُ اتَّقِ اللَّهَ أَخَذَتْهُ الْعِزَّةُ بِالْإِثْمِ ۚ فَحَسْبُهُ جَهَنَّمُ ۚ وَلَبِئْسَ الْمِهَادُ

“అల్లాహ్‌కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. (2:206)

అల్లాహ్ తో భయపడండి అని అంటే, అతడు విర్రవీగుతాడు. అహంకారానికి గురి అవుతాడు. నాకు చెప్పే వానివి ఎవనివి నువ్వు? అని ఎదురు తిరుగుతాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి ఎవడు? గమనించండి ఆ తర్వాత ఆయతు నెంబర్ 11.

وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
(వయతజన్నబుహల్ అష్ ఖా)
దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.” (87:11)

ఆ ఉపదేశాన్ని దౌర్భాగ్యుడు మాత్రమే దాటవేస్తాడు. అల్లాహు అక్బర్. ఏంటమ్మా, నువ్వు ఏదో పనికి బయటికి వెళ్తున్నావు కదమ్మా, కొంచెం పరదా చేసుకుంటూ వెళ్ళమ్మా. అల్లాహ్ ది ఈ ఆదేశం ఇచ్చాడు. ‘ఓ మౌల్సాబ్ మీరు మీ పని చూసుకోండి. మాకు ఇదంతా బోధ చేసే అవసరం లేదు.’ ఇలా ఉండకూడదు. ఎవరైనా ఇలా అడ్డం తిరిగారు, ఉపదేశాన్ని గ్రహించలేదు, ఉపదేశాన్ని స్వీకరించలేదు అంటే, నేను కాదండి చెప్పేది, అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి. అతడు అష్ ఖా, మహా దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఇంతకుముందే నేను చెప్పాను కదా మీకు, షఖీ అంటే దౌర్భాగ్యుడు. అష్ ఖా అంటే మహా దౌర్భాగ్యుడు లేదా పెద్ద దౌర్భాగ్యుడు లేదా అత్యంత దౌర్భాగ్యుడు. ఈ విధంగా వస్తుంది భావం.

మనం ఇలాంటి ఏమైనా బోధనలు వింటేనే కదండీ మనకు అల్లాహ్ యొక్క భయం ఇంకింత ఎక్కువగా కలిగేది. మరి ఈ విషయాన్ని మనం తిరస్కరించేసాము అంటే, ఎవరైనా మనకు బోధ చేస్తున్నప్పుడు మనం అతని బోధను ఏమాత్రం గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఉండేది ఉంటే, వాస్తవానికి మనకు మనం దౌర్భాగ్యాన్ని కొనుక్కున్న వాళ్ళం అయిపోతాము. ఇక ఇలా ఉపదేశాన్ని తిరస్కరించి, ఖుర్ఆన్, హదీసుల మాటలను మనం అర్థం చేసుకోకుండా, చెప్పిన వానికే అడ్డంగా తిరిగి ప్రవర్తించామంటే, దౌర్భాగ్యులైపోయాము. ఈ దౌర్భాగ్యుని పరిస్థితి ఏమవుతుంది? గమనించండి ఆయతు నెంబర్ 12 లో.

الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ
(అల్లదీ యస్లన్-నారల్ కుబ్రా)
వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. (87:12)

వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి ఈ దౌర్భాగ్యం నుండి కాపాడు గాక. అల్లాహు త’ఆలా నరక ప్రవేశం నుండి కూడా మనల్ని కాపాడు గాక. అయితే ప్రతిరోజు కనీసం మూడుసార్లు దువా చేసుకుంటూ ఉండాలి. ‘ఓ అల్లాహ్ నన్ను స్వర్గంలో ప్రవేశించు, ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు’ అని కనీసం మూడుసార్లు మనం ఇలా దువా చేసుకుంటూ ఉండాలి. ఆ నరకం ఎలాంటిది? అక్కడ శిక్షలు భరించలేక చనిపోదామని మనిషి కోరుకుంటాడు. కానీ,

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
(సుమ్మ లా యమూతు ఫీహా వలా యహ్యా)
వాడందులో చావనైనా చావడు, బ్రతకనైనా బ్రతకడు. (రెంటికీ మధ్య దుర్భరస్థితిలో ఉంటాడు). (87:13)

వాడు అందులో చావనైనా చావడు. చస్తే ఏమవుతుంది? ఈ కష్టాలన్నిటినీ కూడా చూడకుండా ఉంటాము. కానీ చావు రాదు. వలా యహ్యా, బ్రతకనైనా బ్రతకడు. అంటే ఈ శిక్షలను తప్పించుకొని ఏదైనా మంచి బ్రతుకు కూడా దొరకదు. ఏ స్థితిలో ఉంటాడు? కేవలం అనువాదం చదివి ఎవరికైనా కన్ఫ్యూజ్ కాకూడదు అని బ్రాకెట్లో అక్కడ రాశారు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా ఈ నరక శిక్షల నుండి మనందరినీ కూడా కాపాడు గాక.

ఇక్కడ చూస్తున్నారా, మనిషి నరకంలో శిక్షలను భరించలేక ఏమంటాడు? చూడండి ఇక్కడ. సూర నెంబర్ 25, ఆయతు నెంబర్ 13, 14.

وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)

నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్లు, చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు, ద’అవ్ హునాలిక సుబూరా, వారు అక్కడ చావు కోసం అరుస్తారు. మాకు చావు రావాలని కోరుకుంటారు.

لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا
(లా తద్ ఉల్ యవ్మ సుబూరవ్ వాహిదవ్ వద్ ఉ సుబూరన్ కసీరా)
“ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది). (25:14)

ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. అంటే ఏంటి? అనేక చావుల కోసం అరిస్తే చావు వస్తుందనా? కాదు. ఇక్కడ మీరు ఇక ఒర్రుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు మీ మాట వినడం జరగదు. ఇహలోకంలో ఎంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు చెబుతూ ఉంటే మీరు ఇలాగే మా మాటలు తిరస్కరించారు కదా.

అలాగే మనం ఇంతకుముందు కూడా చదివి వచ్చాము సూరతుల్ ఇన్షిఖాఖ్ లో ఈ ఆయతు.

وَيَدْعُو ثُبُورًا
(వ యద్ ఉ సుబూరా)
అతను చావు కోసం కేకలు వేస్తాడు. (84:11)

మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.

وَيَصْلَىٰ سَعِيرًا
(వ యస్లా సఈరా)
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు. (84:12)

إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
(ఇన్నహూ కాన ఫీ అహ్లిహీ మస్రూరా)
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. (84:13)

ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. ఈ రోజుల్లో ముస్లింలకు బాధ కలిగిస్తూ తిరిగి వెళ్లి తమ యొక్క గ్యాంగ్ లో, గ్రూప్ లో, తమ యొక్క ఇంటివారు, తమ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా. కానీ ప్రళయ దినాన పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది.

ఇక రండి అల్లాహు త’ఆలా ఈ కొన్ని విషయాలు తెలిపిన తర్వాత మళ్ళీ ఏ రీతిలో మనకు బోధ చేస్తున్నాడో గమనించండి.

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ
(ఖద్ అఫ్లహ మన్ తజక్కా)
పవిత్రుడైనవాడు ఖచ్చితంగా సాఫల్యం పొందాడు.(87:14)

కచ్చితంగా సాఫల్యం పొందాడు. ఎవరండి? పవిత్రుడైన వాడు. మన్ తజక్కా. ‘తజక్కాపవిత్రత అంటే ఇక్కడ, మనిషి అన్ని రకాల షిర్క్, బిద్’అత్ ల నుండి. తజక్కా, అన్ని రకాల షిర్క్, బిద్’అత్ లకు దూరంగా ఉండాలి. తజక్కా, తన మనసును పరిశుభ్ర పరచుకోవాలి. ఏ కపటము, జిగత్సు, ఎలాంటి అసూయ లాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి.

وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ
(వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా)
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(87:15)

అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. ఈ విషయంలో కూడా సర్వసామాన్యంగా మన వద్ద చాలా చాలా బద్ధకం ఉన్నది. ధర్మం తెలిసిన వాళ్లలో కూడా. కూర్చుంటూ, లేస్తూ, ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం, సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా కలిసినప్పుడు ఆ ఏదైనా మాట సందర్భంలో ఏదైనా విషయం, ఇలాంటి సందర్భాల్లో అల్హందులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్, బారకల్లాహు ఫీక్, అహసనల్లాహు ఇలైక్, ఇలాంటి దువాలు ఇచ్చుకుంటూ మనం ఉండడం, అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎల్లవేళల్లో చాలా ముఖ్య విషయం.

అలాగే నమాజ్ ఆచరించాడు. ఆరాధనల్లో కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది గనక అందుకొరకే ఇక్కడ దాని ప్రస్తావన వచ్చింది. ఈ రెండు ఆయతులు, ఆయతు నెంబర్ 14 మరియు 15 ఏదైతే మీరు చూస్తున్నారో, ఇందులో మరొక భావం కూడా ఉంది అని ధర్మవేత్తలు అంటారు. అదేమిటి?

ఈ ఆయతులలో ఈదుల్ ఫితర్, రమజాన్ ముగింపు, సదఖతుల్ ఫితర్, ఈద్ యొక్క నమాజ్, వీటి ప్రస్తావన ఉన్నది అని. ఏ రీతిలో? ఇదే క్రమంలో. మన్ తజక్కా వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా. రమజాన్ ముగించినది, నెలవంక కనబడినది, ఇప్పుడు మనం పండుగ జరుపుకోవాలి అని తెలిసిన వెంటనే తజక్కా, జకాతుల్ ఫితర్ ఇవ్వాలి, సదఖతుల్ ఫితర్ ఇవ్వాలి, ఫిత్రానా చెల్లించాలి. అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పండుగ స్థలానికి చేరుకునే వరకు. ఆ తర్వాత ఖుత్బా కంటే ముందు నమాజ్ అదా చేయాలి. సూరతుల్ ఆ`లాలోని ఆయతు నెంబర్ 14 మరియు 15లో రమజాన్ ముగింపు, నెలవంక వెంటనే జకాతుల్ ఫితర్ చెల్లించడం మరియు అప్పటి నుండే తక్బీర్ చెప్పుకుంటూ ఉండడం, మరుసటి రోజు తెల్లారిన తర్వాత సూర్యోదయం అయ్యాక 15, 20 నిమిషాల తర్వాత నుండి పండుగ నమాజ్ చేయడం ప్రారంభించడం, వీటి ప్రస్తావన ఉన్నది. మరియు సూరతుల్ కౌసర్ లో

فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ
(ఫసల్లి లిరబ్బిక వన్ హర్)
కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. (108:2)

ముందు నమాజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి అన్నటువంటి ప్రస్తావన అందులో ఈదుల్ అద్హాకు సంబంధించిన ఆదేశం ఉన్నది.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనకు అల్లాహ్ మనపై చేసిన అనుగ్రహాలను గుర్తు చేస్తున్నాడు. శారీరక అనుగ్రహాలే కాకుండా మన ఆధ్యాత్మిక, మన యొక్క ఆత్మీయంగా మనకు కావలసిన హిదాయత్ ఖుర్ఆన్, హదీస్ ద్వారా దొరుకుతుంది, దాని గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఖుర్ఆన్, హదీస్ బోధనలు తిరస్కరిస్తారో వారికి ఈ చెడ్డ స్థానం ఉన్నదో అది తెలిపిన తర్వాత చెడ్డవారు అని చెప్పాడు కదా అల్లాహు త’ఆలా ఇక్కడ అష్ ఖా, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని. అందుకొరకే వెంటనే అల్లాహు త’ఆలా ఇక్కడ అఫ్లహ. దౌర్భాగ్యుడు నరకంలో వెళ్తాడు. మరి ఆ దౌర్భాగ్యునికి భిన్నంగా, ఆపోజిట్ లో ఉండేవాడు ఎవడు? సౌభాగ్యవంతుడు, సాఫల్యం పొందేవాడు. వారి యొక్క గుణాలు ఏంటి? ఇలా ఉంటాయి.

కానీ ఈ రోజుల్లో అనేకమంది తమకు తాము ముస్లింలు అనుకుంటూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? 16వ ఆయతులో అల్లాహ్ తెలిపాడు.

بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا
(బల్ తు`సిరూనల్ హయాతద్-దున్యా)
కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. (87:16)

కానీ మీరు మాత్రం ప్రాముఖ్యతనిస్తున్నారు ప్రాపంచిక జీవితానికి. ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది కదా మనలో అనేకమంది. కానీ వాస్తవం ఏమిటి?

وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ
(వల్-ఆఖిరతు ఖైరువ్-వ అబ్ ఖా)
వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.(87:17)

ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ. ఇహలోకం ఎప్పటికీ మిగిలి ఉండేది కాదు. ఎప్పటికీ మిగిలి ఉండేది పరలోకం. ఇహలోకం మంచిది ఎప్పుడు? దానిని నీవు పరలోకం మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు. ఇహలోకంలో ఉండి పరలోకం గురించి నీవు ఆలోచించకుంటే, నీ ఇహలోకం కూడా పాడే, పరలోకం కూడా పాడైపోతుంది.

إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ
(ఇన్న హాజా లఫిస్-సుహుఫిల్ ఊలా)
ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. (87:18)

ఈ బోధనలు, ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో ఉన్నాయి. ఎవరి గ్రంథాలు?

صُحُفِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ
(సుహుఫి ఇబ్రాహీమ వమూసా)
(అంటే) ఇబ్రాహీము, మూసాల గ్రంథాలలో! (87:19)

ఈ విధంగా ఇక్కడి వరకు సూరా సమాప్తమైనది. సోదర మహాశయులారా, ఈ సూరాలో మనకు ఉన్నటువంటి బోధనలు ఎంత చక్కగా అల్లాహు త’ఆలా తెలిపాడో అర్థం చేసుకొని, దాని ప్రకారంగానే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి.

మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి నేను మూడు మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్నవారు, తర్వాత ఆన్లైన్ లో వినేవారు, YouTube లో వినేవారు. మొదటి విషయం, ప్రతీ నమాజ్ కొరకు ఒక ప్రారంభ సమయం, ఒక ముగింపు సమయం అనేది ఉంటుంది. ఇక మీరు ఇషా విషయంలో అడిగారు గనక, ఇషా యొక్క సమయం రాజిహ్ ఖౌల్, ప్రియారిటీ ప్రాధాన్యత లభించినటువంటి మాట ఆధారంగా, దేనికైతే ఎక్కువ హదీసులు ఆధారంగా ఉన్నాయో దాని పరంగా ఇషా ముగింపు సమయం అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి అంటే సర్వసామాన్యంగా రాత్రి 12 గంటలు మిడ్ నైట్ అని అంటారు అలా కాదు. సూర్యాస్తమయం నుండి ఫజర్ ప్రారంభ సమయం వరకు ఎన్ని గంటలు ఉంటాయో అందులో మీరు సగం చేయాలి. ఇది ఒక మొదటి మాట.

రెండో మాట ఏమిటంటే, కొన్ని హదీసుల ఆధారంగా ఫజర్ వరకు కూడా ఇషా సమయం ఉన్నది అని కొందరి అభిప్రాయం ఉన్నది. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్టు మొదటి మాటలో రాజిహ్, ప్రాధాన్యత కలిగిన ప్రియారిటీ ఇవ్వబడిన ఆధారాల ప్రకారంగా, ప్రియారిటీ ఇవ్వబడినటువంటి మాట ఏమిటి? అర్ధరాత్రి మాట ఎక్కువ నిజం.

ఇక మూడో మాట, ప్రత్యేకంగా ఇషాకు సంబంధించి కానివ్వండి లేదా ఏ నమాజ్ అయినా, ఏదైనా ధర్మపరమైన కారణం వల్ల మనం ఏదైనా నమాజ్ దాని ముగింపు సమయానికంటే ముందే చేయలేకపోతే, అయ్యో ఇక సమయం అయిపోయింది కదా అని ఊరుకుండేది కాదు. ఆ నమాజ్ ను తప్పకుండా మనం చేయాలి. ఒకవేళ సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ నమాజ్ తప్పకుండా చేయాలి. కానీ, సమయం దాటిన తర్వాత చేసిన నమాజ్ యొక్క పుణ్యం, దాని సమయం దాటక ముందే చేసిన నమాజ్ పుణ్యం మరియు నమాజ్ యొక్క దాని తొలి సమయంలో చేసే నమాజ్ పుణ్యం, ఈ మూడిటిలో తేడాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీతో అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నాను, మూడు సమయాలు చెప్పాను నేను. ఒక మనిషి, ఉదాహరణకు ఒక మనిషి ఇషా నమాజ్ దాని తొలి సమయంలో చదివాడు. మరొక మనిషి దాని ఇషా నమాజ్ దాని చివరి సమయంలో చదివాడు. అంటే సమయం దాటక ముందే, ముగింపు కంటే కొంచెం ముందు. మూడో వ్యక్తి సమయం దాటిపోయిన తర్వాత చదివాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయండి?

బారకల్లాహు ఫీ ఇల్మికుం. కరెక్ట్ సమాధానం. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్. మన ఈ ఆన్లైన్ లో వింటున్న వారు ఏదో బండిపై లేదా బస్సులో లేదా వెహికల్ పై ప్రయాణం చేసుకుంటూ కూడా వింటున్నారు అన్నట్లుగా కనబడుతుంది. జజాకుముల్లాహు ఖైర్ వంట చేసుకుంటూ కూడా, ఇల్లు ఊడ్చుకుంటూ కూడా, బట్టలు ఉతుక్కుంటూ కూడా, మీ పనులు చేసుకుంటూ కూడా మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ మీరు ఈ పాఠాలు వింటున్నారు అంటే అల్హందులిల్లాహ్ మంచి విషయం. మీ యొక్క సమయాన్ని ఒక పుణ్య కార్యంలో గడుపుతున్నారు. అయితే ఇషా సమయంకి నమాజ్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా?

మీరు అడిగిన దానికి, మీరు ఇంత మాట చెప్పిన దానికి మరొక సలహాగా నేను ఒక మాట చెబుతున్నాను, బహుశా ఇంట్లో ఉండే ప్రతీ స్త్రీకి కానివ్వండి లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవారు లేదా కొందరు మధ్యాహ్న డ్యూటీ చేస్తారు, వారి డ్యూటీ అయిపోయేసరికి రాత్రి 11, 12 ఇలా అవుతుంది. అయితే ఆ విషయం ఏంటంటే, ఎవరైనా ఇషా నమాజ్ విషయంలో ప్రత్యేకంగా చాలా అలసిపోవడం వల్ల, చాలా పని ఉండడం వల్ల, చాలా ఇరుకులో చిక్కుకొని ఉన్నారు, ఆ నమాజ్ కొరకు సమయం కలగడం లేదు, అలాంటి వారు ఇషా ప్రాధాన్యత ఇవ్వబడిన సమయం అర్ధరాత్రి అని ఏదైతే తెలుసుకున్నామో, ఆ సమయం దాటక ముందు కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క సున్నత్, విత్ర్, ఇవన్నీ మీరు ఆ తహజ్జుద్ కొరకు లేచినప్పుడు, ఫజర్ కు ముందు లేచినప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు, పాపం ఏమీ లేదు ఇన్షాఅల్లాహ్.

అయితే ఇక్కడ కొందరు ఉలమాలు ఏదైతే పట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కానీ తెరవకూడదు అని ఏదైతే అన్నారో, తెరవకూడదు అని అంటే అక్కడ భావం, ఆయతులు అరబీలో ఏవైతే రాసి ఉన్నాయో, ఆ ఆయతులు రాసి ఉన్న చోట తమ ఆ చెయ్యి, వేలు పెట్టకుండా ఉంటే మరీ మంచిది అని అంటారు. అది అసలు విషయం. పవిత్రత, పరిశుభ్రంగా లేని సమయంలో ఖురాన్ పట్టుకోకూడదు అని అంటే, ప్రత్యేకంగా ఆయతులు రాసి ఉన్న చోట మన ఆ శరీర భాగం తగలకుండా ఉండడం మంచిది అని అంటారు. కానీ వేరే దాని బైండింగ్ లేదా అది కవర్ లో ఉన్నది, ఆ రీతిలో పట్టుకొని మనం ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము ఇబ్బంది లేదు అని అంటారు.

నేను మరోసారి చెబుతున్నాను. నేను అక్కడ చెప్పిన ఉదాహరణ ఇచ్చాను నేను, ఏమి ఇచ్చాను? మనం అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా కూడా వ్యక్తపరచాలి. ఆచరణ ద్వారా ఎలా వ్యక్తపరచాలి? ఎన్నో సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో అలాంటివి రావచ్చు. కానీ సర్వసామాన్యంగా అందరికీ తెలుస్తది అని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటి ఉదాహరణ అది? మీరు ఆ జెండా వందనం అని ఏదైతే అంటారో, అది కరెక్ట్ పదం ఏంటో నాకు తెలియదు. సర్వసామాన్యంగా ప్రజలు అంటూ ఉంటారు కానీ, 15th ఆగస్టు లేదా ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే జెండా వద్ద మన ఇందిరా గాంధీ లేకుంటే మన గాంధీజీ, నెహ్రూ గారి యొక్క ఫోటోలు ఏదైతే పెడతారో, అక్కడ ఎంతోమంది కొబ్బరికాయ కొడతారు. అయితే మన ముస్లింలలో కొందరు ఏమనుకుంటారు, నేను సుబ్ హా నల్లాహ్ అనుకుంటాను తర్వాత క్షమాపణ కోరుకుంటాను, కానీ ఒక నా టెంకాయ కొట్టేద్దాము. ఇలా టెంకాయ కొట్టడం మన ఆచరణ పరంగా మనం సుబ్ హా నల్లాహ్ కు వ్యతిరేకం చేస్తున్నట్లు. కనుక అలాంటి చోట టెంకాయ కూడా కొట్టకూడదు.

జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం, కతబల్లాహు అజ్రకుం. అల్లాహు త’ఆలా ఖురాన్ ను మంచిగా అర్థం చేసుకొని, ప్రవక్త హదీసులను చదువుతూ అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్, వ ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44090


నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 4 [మరణానంతర జీవితం – పార్ట్ 58] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 4]
[మరణానంతర జీవితం – పార్ట్ 58] [26 నిముషాలు]
https://www.youtube.com/watch?v=rtI9WoN-uuo
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నరకం (జహన్నం) యొక్క తీవ్రతను, దాని అగ్ని మరియు శిక్షల గురించి వివరిస్తారు. నరకంలో మరణం అనేది ఉండదని, శిక్ష నిరంతరంగా మరియు తీవ్రంగా ఉంటుందని, అది ఎముకలను మరియు హృదయాలను తాకుతుందని స్పష్టం చేస్తారు. నరకాగ్ని, దాని నిప్పురవ్వలు, నివాసుల హింస, వారు తాగే బాధాకరమైన పానీయాలు మరియు నీడలేని నీడ గురించి ఖురాన్ ఆయతులను ఉటంకిస్తారు. కృతజ్ఞత లేకపోవడం మరియు ఇతరులను శపించడం వంటివి నరకంలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, ఈ దుర్గుణాలు ఎవరినైనా నరకానికి దారితీస్తాయని నొక్కి చెబుతారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని పరలోకం యొక్క శాశ్వత వాస్తవికతతో పోలుస్తూ, శ్రోతలను అల్లాహ్‌కు భయపడాలని, పాపాలను విడిచిపెట్టాలని, మరియు ఖురాన్ మరియు ప్రవక్త మార్గదర్శకత్వం అనుసరించి పరలోకం కోసం సిద్ధం కావాలని ప్రబోధిస్తారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది? నరకం దాని వేడితో అందులో పడే నరకవాసులను ఎలా శిక్షిస్తుంది? దానిని వివరిస్తూ అల్లాహ్ త’ఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో, దానివల్ల మనలో భయం ఏర్పడి, మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.

నరక శిక్షల గురించి అల్లాహ్ త’ఆలా ఏ ఏ ఆయతులైతే అవతరింపజేశాడో, వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు, ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో, ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము.

నరకాగ్ని ఎంత శిక్షాపరమైనదంటే, కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు, హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు, అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా, దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో, దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది, దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది.

ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది, ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లాహ్ మనకు తెలిపాడు అంటే, అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని.

సూరె ఘాషియాలో,

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
(వుజూహున్ యౌమఇజిన్ ఖాషిఅహ్)
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.(88:2)

عَامِلَةٌ نَّاصِبَةٌ
(ఆమిలతున్ నాసిబహ్)
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. (88:3)

تَصْلَىٰ نَارًا حَامِيَةً
(తస్లా నారన్ హామియహ్)
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.(88:4)

ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా, నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది.

మరోచోట సూరతుల్ లైల్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్,

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
(ఫ అన్-జర్తుకుమ్ నారన్ తలజ్జా)
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.(92:14)

అని తెలియపరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది? నారన్ తలజ్జా. నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది.

తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవు గాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు, ధనం అతనికి ఏమీ ప్రయోజనం కలిగించలేదు.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
(సయస్లా నారన్ జాత లహబ్)
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. (111:3)

గమనించండి ఇక్కడ. నారన్ హామియా, నారన్ తలజ్జా, నారన్ జాత లహబ్. నార్, ఆ అగ్ని, నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ జాత లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది, దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి.

ఈ విధంగా మహాశయులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద?

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
(అల్లతీ తత్తలివు అలల్ అఫ్-ఇద)
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. (104:7)

అని ఒకచోట తెలపడం జరిగింది. ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది. మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరేచోట పడతాయో, వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో, దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాత్‌లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
(ఇన్నహా తర్మీ బిషరరిన్ కల్-ఖస్ర్)
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. (77:32)

ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగుల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా, అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్! ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

నారుకుమ్ హాజిహిల్లాతీ యూఖిదు ఇబ్ను ఆదమ్, జుజ్‌ఉమ్ మిన్ సబ్ఈన జుజ్‌ఇన్ మిన్ హర్రి జహన్నమ్”.
ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో, అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం.

సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, “ప్రవక్తా, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే “ఫుద్విలత్ బి తిస్ఇన్ వసిత్తీన జుజ్ఆ”, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము?

మహాశయులారా, మనిషి వేడిలో, ఎండకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా?

కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ, శక్తి క్షీణించిపోయినట్లుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్లి, గాలి వీస్తున్నచోట కూర్చుండి, ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే, అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు.

కానీ నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది.

انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
(ఇన్-తలిఖూ ఇలా జిల్లిన్ జీ సలాసి షుఅబ్)
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” (77:30)

لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
(లా జలీలిన్ వలా యుగ్నీ మినల్ లహబ్)
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. (77:31)

అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్! ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు, నరకం నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.

ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరె వాఖిఆలో అల్లాహ్ త’ఆలా దాని గురించి ప్రస్తావించాడు. నరకం, నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు, గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు, ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు, కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ. అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్ గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది.

ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదాము అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ మరియు ఆ దానిని మనిషి ఏ మాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడి కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా, నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు.

ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిన్ వలా కరీమ్. అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరె కహఫ్ లో చదవండి.

وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا

ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!. (18:29)

దాహం కలుగుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో, దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగకముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్! దాన్ని చూసి ఏమంటాడు? బిఅసష్షరాబ్! ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్! కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో, ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్! ఇలాంటి జీవితం మనిషిది గమనించండి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి, దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము.

మహాశయులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే, వారు కూడా నరకంలో ఉంటారు.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఇన్నీ రఐతు అక్సర అహ్లిన్నారి అన్నిసా”. నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, ఎందుకు, కారణం చెప్పగలుగుతారా?” ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు గాని, సహాబాల యొక్క భార్యలు, సహాబియాత్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని.

ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, “అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా”, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెట్టింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు, “తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి?” అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరిని క్షమించు గాక, ఈ రోజుల్లో మనలో అనేకమంది అలవాటు ఏమైంది? చెడు గుణం గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు, అడ్డ ప్రశ్నలు వేసి, ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా? ఇలాంటి పాపాలు మన్నించబడవా? ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా .. ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ, వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో, ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు.

మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు, ఇది కూడా చేయడం తప్పనిసరియా? చేయకుంటే నడవదా? అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాహ్‌తో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతి వారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం, ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం.

అందుగురించి మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో, నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, కారణాలు ఏంటి?” అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “యక్సుర్నల్ లఅన్, వ యక్ఫుర్నల్ అషీర్”. వారి నోట మాటిమాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి. వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.

భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, “ఖియారుకుమ్ ఖియారుకుమ్ లి అహ్లిహి, వ అన ఖైరుకుం లి అహ్లీ”. మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని. మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో, “జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను” అని భార్య అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా, ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు.

మహాశయులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే, నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు.

మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహ్ త’ఆలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరినొకరినైనా అల్లాహ్ త’ఆలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు.

وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
(వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబ్-అస రసూలా)
ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. (17:15)

ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు. ఇక ఏ జాతి పైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే, ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.

మహాశయులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లాహ్ మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో, ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి, ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా తెలిపాడు,

كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
(కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిల)
ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.(75:20)

وَتَذَرُونَ الْآخِرَةَ
(వ తజరూనల్ ఆఖిర)
పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.(75:21)

మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరియు మీ వెనక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరిచిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి, తాత్కాలికపు లాభాలు, ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి, దూరమున ఉన్న ఆ పరలోకం మహా దూరం ఉంది కదా అని భావించి, దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో, దానిని పాటించనందుకు, అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది.

ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి, దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి, మరియు ఎల్లవేళల్లో అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.

సూరె జుఖ్రుఫ్, ఆయత్ నంబర్ 23, 24 లో అల్లాహ్ త’ఆలా ఎంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు, గమనించండి.

మా అర్సల్నా మిన్ ఖబ్లిక ఫీ ఖర్యతిన్ మిన్ నజీరిన్ ఇల్లా ఖాల ముత్రఫూహా.
మేము మీకంటే ముందు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు, మీకంటే ముందు ఏ బస్తీలో, ఏ హెచ్చరిక చేసేవానిని మేము పంపినా, ఆ బస్తీలో, ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు, ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు?

إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ

అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు.. (43:22)

అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు,

قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ

“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, (43:24)

మీ తాతముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా? అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు?

قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ

దానికి వారు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు. (43:24)

మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో, ఏ సత్యమైతే తీసుకొచ్చారో, వాటిని మేము తిరస్కరిస్తున్నాము. అల్లాహు అక్బర్! ఈ విధంగా ప్రజలు పెడమార్గంలో పడిపోతారు. అల్లాహ్ త’ఆలా నరకంలోకి తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచు గాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించు గాక. వా ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44015

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2) : షిర్క్ , ధర్మభ్రష్టత (రిద్దత్) – మరణానంతర జీవితం : పార్ట్ 43 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2)
[మరణానంతర జీవితం – పార్ట్ 43]
https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్‌తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్‌కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.

త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్‌కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.

అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.

మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా]
అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)

ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్‌తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్‌ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్‌ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్‌ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.

ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా]
అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)

మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్‌ను స్వీకరించాలి.

సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.

వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.

సూరె జుమర్ ఆయత్ నెంబర్ 65.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
[వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్]

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.

ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.

రండి సోదరులారా! షిర్క్‌ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.

ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.

అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.

ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)

మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్‌కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.

వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.

అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.

షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.

సూరె ముహమ్మద్ ఆయత్ నెంబర్ తొమ్మిది.

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుమ్ కరిహూ మా అన్జలల్లాహు ఫ అహ్బత అఅమాలహుమ్]

“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)

ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.

అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.

ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్‌కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్‌కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుముత్తబఊ మా అస్ఖతల్లాహ వకరిహూ రిద్వానహూ ఫఅహ్బత అఅమాలహుమ్]

“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)

ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్‌కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.

అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్‌కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43992

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) – మరణానంతర జీవితం : పార్ట్ 47 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.

మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)

ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.

అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,

فما ظنكم
(ఫమా జన్నుకుమ్)

చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.

ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.

ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.

ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,

ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.

మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.

అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?

తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.

కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.

17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.

ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)

“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)

దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.

18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.

ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.

ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.

అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

కీడు (చెడు) యొక్క సృష్టి – హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ | నసీరుద్దీన్ జామిఈ

రచయిత: హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ (హఫిజహుల్లాహ్)
అనువాదం: నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.

మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.

{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ}
(అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]

అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
“మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).

ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.

ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:

అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.

కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.

దీనినే ఇలా కూడా అంటారు:
“కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”

అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ»
(మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]

ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?

{فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ}
(కాబట్టి కోరినవాడు విశ్వసించవచ్చు మరియు కోరినవాడు తిరస్కరించవచ్చు). [అల్-కహఫ్: 29]

అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:

{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا}
(నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]

మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:

{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ}
(మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]

ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.

పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.

పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.

{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ}
(మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]

అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:

  1. ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا}
    (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
  2. రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ}
    (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]

    మరియు ఇది కూడా:

    {إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ}
    (నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, సర్వజ్ఞుడు). [అల్-అన్ ఆమ్: 83]

ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.

వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.

అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah/

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].