హజ్జ్ ఘనత – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

హజ్జ్ ఘనత
షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YE1Djv32h40 [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.

اَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.

చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.

కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్

హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్

అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.

దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:

بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ
(బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్: షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, వఇకామిస్సలాతి, వఈతాయిజ్జకాతి, వహజ్జు బైతిల్లాహి, వసౌమి రమదాన్)

ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.

ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.

ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.

ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.

అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.

ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.

హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ
(అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్)
స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.

అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.

రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.

ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.

ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا، وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ

“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.

మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.

అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

أَدِيمُوا الْحَجَّ وَالْعُمْرَةَ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوبَ كَمَا تَنْفِي الْكِيرُ خَبَثَ الْحَدِيدِ

మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.

అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:

أَيُّ الْعَمَلِ أَفْضَلُ
(అయ్యుల్ అమలి అఫ్దల్)
ఏ సత్కార్యము గొప్పది?

అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:

إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ
(ఈమాను బిల్లాహి వ రసూలిహి)
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.

గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:

جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ
(జిహాదున్ ఫీ సబీలిల్లాహ్)
అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.

మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

حَجٌّ مَبْرُورٌ
(హజ్జున్ మబ్రూర్)
స్వీకరించబడిన హజ్.

అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.

అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ
(లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్)
మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]

మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ
(జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా)
వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.

అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.

అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:

الْغَازِي فِي سَبِيلِ اللَّهِ، وَالْحَاجُّ، وَالْمُعْتَمِرُ وَفْدُ اللَّهِ، دَعَاهُمْ فَأَجَابُوهُ وَسَأَلُوهُ فَأَعْطَاهُمْ

అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.

అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.

మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.

దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.

అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:

مَنْ خَرَجَ حَاجًّا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْحَاجِّ إِلَى يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ خَرَجَ مُعْتَمِرًا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْمُعْتَمِرِ إِلَى يَوْمِ الْقِيَامَةِ

ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)

అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:

اغْسِلُوهُ بِمَاءٍ وَسِدْرٍ، وَكَفِّنُوهُ فِي ثَوْبَيْهِ، وَلاَ تُخَمِّرُوا رَأْسَهُ، وَلاَ تُحَنِّطُوهُ، فَإِنَّهُ يُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ مُلَبِّيًا

“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”

అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ
(లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్)
“ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”

అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.

ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.

ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,

“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.

మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.

ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.

కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.

అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.

హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:

స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

مَنْ أَرَادَ الْحَجَّ فَلْيَتَعَجَّلْ، فَإِنَّهُ قَدْ يَمْرَضُ الْمَرِيضُ، وَتَضِلُّ الضَّالَّةُ، وَتَعْرِضُ الْحَاجَةُ
(మన్ అరాదల్ హజ్జ ఫల్ యతఅజ్జల్, ఫఇన్నహు ఖద్ యమ్రదుల్ మరీదు, వ తదిల్లుజ్జాలతు, వ త’అరిదుల్ హాజతు)

ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.

కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.

చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.

అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.

ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”

అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.

ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا
(యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,

ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:

وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ

అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?

అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.

అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ
(ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల ఫిల్ హజ్జ్)
హజ్‌ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.” (2:197)

ప్రవక్త వారు తెలియజేశారు:

مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ
(మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు)
“ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”

ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:

يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا
(యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”

ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:

لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ
(లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్)
“నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”

నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.

అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:

لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ
(లబ్బైక్ అన్ షుబ్రుమా)
“ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ
(హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా)
“ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”

కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.

అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

نَعَمْ وَلَكِ أَجْرٌ
(నఅమ్ వలకి అజ్ర్)
“అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”

“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.

మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.

అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.

అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.

ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్

వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43235

హజ్జ్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/


నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు – 4 [మరణానంతర జీవితం – పార్ట్ 58] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 4]
[మరణానంతర జీవితం – పార్ట్ 58] [26 నిముషాలు]
https://www.youtube.com/watch?v=rtI9WoN-uuo
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నరకం (జహన్నం) యొక్క తీవ్రతను, దాని అగ్ని మరియు శిక్షల గురించి వివరిస్తారు. నరకంలో మరణం అనేది ఉండదని, శిక్ష నిరంతరంగా మరియు తీవ్రంగా ఉంటుందని, అది ఎముకలను మరియు హృదయాలను తాకుతుందని స్పష్టం చేస్తారు. నరకాగ్ని, దాని నిప్పురవ్వలు, నివాసుల హింస, వారు తాగే బాధాకరమైన పానీయాలు మరియు నీడలేని నీడ గురించి ఖురాన్ ఆయతులను ఉటంకిస్తారు. కృతజ్ఞత లేకపోవడం మరియు ఇతరులను శపించడం వంటివి నరకంలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, ఈ దుర్గుణాలు ఎవరినైనా నరకానికి దారితీస్తాయని నొక్కి చెబుతారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని పరలోకం యొక్క శాశ్వత వాస్తవికతతో పోలుస్తూ, శ్రోతలను అల్లాహ్‌కు భయపడాలని, పాపాలను విడిచిపెట్టాలని, మరియు ఖురాన్ మరియు ప్రవక్త మార్గదర్శకత్వం అనుసరించి పరలోకం కోసం సిద్ధం కావాలని ప్రబోధిస్తారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది? నరకం దాని వేడితో అందులో పడే నరకవాసులను ఎలా శిక్షిస్తుంది? దానిని వివరిస్తూ అల్లాహ్ త’ఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో, దానివల్ల మనలో భయం ఏర్పడి, మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.

నరక శిక్షల గురించి అల్లాహ్ త’ఆలా ఏ ఏ ఆయతులైతే అవతరింపజేశాడో, వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు, ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో, ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము.

నరకాగ్ని ఎంత శిక్షాపరమైనదంటే, కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు, హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు, అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా, దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో, దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది, దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది.

ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది, ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లాహ్ మనకు తెలిపాడు అంటే, అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని.

సూరె ఘాషియాలో,

وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ
(వుజూహున్ యౌమఇజిన్ ఖాషిఅహ్)
ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.(88:2)

عَامِلَةٌ نَّاصِبَةٌ
(ఆమిలతున్ నాసిబహ్)
శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. (88:3)

تَصْلَىٰ نَارًا حَامِيَةً
(తస్లా నారన్ హామియహ్)
వారు మండే అగ్నికి ఆహుతి అవుతారు.(88:4)

ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా, నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది.

మరోచోట సూరతుల్ లైల్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్,

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
(ఫ అన్-జర్తుకుమ్ నారన్ తలజ్జా)
మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.(92:14)

అని తెలియపరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది? నారన్ తలజ్జా. నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది.

తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవు గాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు, ధనం అతనికి ఏమీ ప్రయోజనం కలిగించలేదు.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
(సయస్లా నారన్ జాత లహబ్)
త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. (111:3)

గమనించండి ఇక్కడ. నారన్ హామియా, నారన్ తలజ్జా, నారన్ జాత లహబ్. నార్, ఆ అగ్ని, నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ జాత లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది, దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి.

ఈ విధంగా మహాశయులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద?

الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ
(అల్లతీ తత్తలివు అలల్ అఫ్-ఇద)
అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. (104:7)

అని ఒకచోట తెలపడం జరిగింది. ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది. మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరేచోట పడతాయో, వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో, దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాత్‌లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
(ఇన్నహా తర్మీ బిషరరిన్ కల్-ఖస్ర్)
నిశ్చయంగా నరకం మేడలు, మిద్దెలంతటి నిప్పు రవ్వలను విసురుతుంది. (77:32)

ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగుల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా, అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్! ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

నారుకుమ్ హాజిహిల్లాతీ యూఖిదు ఇబ్ను ఆదమ్, జుజ్‌ఉమ్ మిన్ సబ్ఈన జుజ్‌ఇన్ మిన్ హర్రి జహన్నమ్”.
ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో, అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం.

సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, “ప్రవక్తా, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే “ఫుద్విలత్ బి తిస్ఇన్ వసిత్తీన జుజ్ఆ”, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము?

మహాశయులారా, మనిషి వేడిలో, ఎండకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా?

కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ, శక్తి క్షీణించిపోయినట్లుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్లి, గాలి వీస్తున్నచోట కూర్చుండి, ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే, అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు.

కానీ నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది.

انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
(ఇన్-తలిఖూ ఇలా జిల్లిన్ జీ సలాసి షుఅబ్)
“మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” (77:30)

لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
(లా జలీలిన్ వలా యుగ్నీ మినల్ లహబ్)
నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. (77:31)

అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్! ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు, నరకం నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.

ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరె వాఖిఆలో అల్లాహ్ త’ఆలా దాని గురించి ప్రస్తావించాడు. నరకం, నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు, గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు, ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు, కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ. అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్ గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది.

ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదాము అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ మరియు ఆ దానిని మనిషి ఏ మాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడి కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా, నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు.

ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిన్ వలా కరీమ్. అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరె కహఫ్ లో చదవండి.

وَإِن يَسْتَغِيثُوا يُغَاثُوا بِمَاءٍ كَالْمُهْلِ يَشْوِي الْوُجُوهَ ۚ بِئْسَ الشَّرَابُ وَسَاءَتْ مُرْتَفَقًا

ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!. (18:29)

దాహం కలుగుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో, దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగకముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్! దాన్ని చూసి ఏమంటాడు? బిఅసష్షరాబ్! ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్! కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో, ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్! ఇలాంటి జీవితం మనిషిది గమనించండి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి, దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము.

మహాశయులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే, వారు కూడా నరకంలో ఉంటారు.

ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఇన్నీ రఐతు అక్సర అహ్లిన్నారి అన్నిసా”. నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, ఎందుకు, కారణం చెప్పగలుగుతారా?” ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు గాని, సహాబాల యొక్క భార్యలు, సహాబియాత్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని.

ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, “అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా”, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెట్టింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు, “తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి?” అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరిని క్షమించు గాక, ఈ రోజుల్లో మనలో అనేకమంది అలవాటు ఏమైంది? చెడు గుణం గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు, అడ్డ ప్రశ్నలు వేసి, ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా? ఇలాంటి పాపాలు మన్నించబడవా? ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా .. ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ, వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో, ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు.

మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు, ఇది కూడా చేయడం తప్పనిసరియా? చేయకుంటే నడవదా? అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాహ్‌తో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతి వారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం, ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం.

అందుగురించి మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో, నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, కారణాలు ఏంటి?” అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “యక్సుర్నల్ లఅన్, వ యక్ఫుర్నల్ అషీర్”. వారి నోట మాటిమాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి. వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.

భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, “ఖియారుకుమ్ ఖియారుకుమ్ లి అహ్లిహి, వ అన ఖైరుకుం లి అహ్లీ”. మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని. మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో, “జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను” అని భార్య అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా, ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు.

మహాశయులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి.

ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే, నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు.

మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహ్ త’ఆలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరినొకరినైనా అల్లాహ్ త’ఆలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు.

وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا
(వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబ్-అస రసూలా)
ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. (17:15)

ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు. ఇక ఏ జాతి పైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే, ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.

మహాశయులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లాహ్ మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో, ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి, ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా ఖురాన్‌లో స్పష్టంగా తెలిపాడు,

كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
(కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిల)
ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.(75:20)

وَتَذَرُونَ الْآخِرَةَ
(వ తజరూనల్ ఆఖిర)
పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.(75:21)

మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరియు మీ వెనక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరిచిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి, తాత్కాలికపు లాభాలు, ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి, దూరమున ఉన్న ఆ పరలోకం మహా దూరం ఉంది కదా అని భావించి, దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో, దానిని పాటించనందుకు, అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది.

ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి, దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి, మరియు ఎల్లవేళల్లో అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.

సూరె జుఖ్రుఫ్, ఆయత్ నంబర్ 23, 24 లో అల్లాహ్ త’ఆలా ఎంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు, గమనించండి.

మా అర్సల్నా మిన్ ఖబ్లిక ఫీ ఖర్యతిన్ మిన్ నజీరిన్ ఇల్లా ఖాల ముత్రఫూహా.
మేము మీకంటే ముందు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు, మీకంటే ముందు ఏ బస్తీలో, ఏ హెచ్చరిక చేసేవానిని మేము పంపినా, ఆ బస్తీలో, ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు, ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు?

إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَىٰ أُمَّةٍ وَإِنَّا عَلَىٰ آثَارِهِم مُّهْتَدُونَ

అది కాదు, “మా తాతముత్తాతలు ఒకానొక పద్ధతిపై ఉండటం మేము చూశాము. మేము వాళ్ల అడుగుజాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము” అని వారు బుకాయిస్తారు.. (43:22)

అప్పుడు ఆ ప్రవక్తలు వారితో చెప్పారు,

قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ

“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, (43:24)

మీ తాతముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా? అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు?

قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ

దానికి వారు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు. (43:24)

మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో, ఏ సత్యమైతే తీసుకొచ్చారో, వాటిని మేము తిరస్కరిస్తున్నాము. అల్లాహు అక్బర్! ఈ విధంగా ప్రజలు పెడమార్గంలో పడిపోతారు. అల్లాహ్ త’ఆలా నరకంలోకి తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచు గాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించు గాక. వా ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=44015

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2) : షిర్క్ , ధర్మభ్రష్టత (రిద్దత్) – మరణానంతర జీవితం : పార్ట్ 43 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2)
[మరణానంతర జీవితం – పార్ట్ 43]
https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్‌తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్‌కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.

త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్‌కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.

అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.

మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా]
అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)

ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్‌తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్‌ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్‌ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్‌ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.

ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా]
అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)

మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్‌ను స్వీకరించాలి.

సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.

వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.

సూరె జుమర్ ఆయత్ నెంబర్ 65.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
[వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్]

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.

ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.

రండి సోదరులారా! షిర్క్‌ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.

ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.

అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.

ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)

మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్‌కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.

వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.

అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.

షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.

సూరె ముహమ్మద్ ఆయత్ నెంబర్ తొమ్మిది.

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుమ్ కరిహూ మా అన్జలల్లాహు ఫ అహ్బత అఅమాలహుమ్]

“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)

ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.

అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.

ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్‌కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్‌కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుముత్తబఊ మా అస్ఖతల్లాహ వకరిహూ రిద్వానహూ ఫఅహ్బత అఅమాలహుమ్]

“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)

ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్‌కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.

అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్‌కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43992

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ప్రవక్త మరియు యువకులు – ఖతీబ్ షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | నసీరుద్దీన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త మరియు యువకులు
ఖతీబ్ షేఖ్ రాషిద్ అల్ బిదాహ్ | అనువాదం: నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/VE5UXDERbwg [21 నిముషాలు]

ఈ శుక్రవార ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువతతో ఎలా వ్యవరించేవారో వివరిస్తుంది. సమాజానికి యువత నిజమైన సంపద మరియు కవచం అని నొక్కిచెబుతూ, ప్రవక్త వారిని ప్రేమ, గౌరవం, మరియు సాన్నిహిత్యంతో ఎలా దగ్గర చేసుకున్నారో ఉదాహరణలతో వివరించబడింది. ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు), ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు), అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వంటి యువ సహాబాలతో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలు, వారిని ప్రోత్సహించిన తీరు, మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని ఎలా మార్గనిర్దేశం చేశారో తెలియజేయబడింది. పాపం చేయాలనుకున్న యువకుడితో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సౌమ్యంగా, వివేకంతో వ్యవహరించి మార్పు తెచ్చిన సంఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, యువత సామర్థ్యాలను గుర్తించి, వారిపై నమ్మకముంచి, మక్కాకు గవర్నర్‌గా, సైన్యానికి అధిపతిగా నియమించడం వంటి పెద్ద బాధ్యతలను ఎలా అప్పగించారో కూడా ఈ ఖుత్బా స్పష్టం చేస్తుంది. యువత పట్ల మన వ్యవహారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదర్శవంతమైన మార్గాన్ని అనుసరించాలని ఈ ప్రసంగం ఉద్బోధిస్తుంది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వనుసల్లీ అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్.

జుమా ఖుత్బా 12వ సెప్టెంబర్ 2025. ఈ ఖుత్బా అరబీ భాషలో రాసిన వారు మరియు ఖుత్బా ఇచ్చిన వారు అష్షేఖ్ రాషిద్ అల్ బిదా. సౌదీ అరబ్ లోని జుల్ఫీ ప్రాంతంలో ఉన్నటువంటి జామే అష్షేఖ్ ఇబ్ను ఉసైమీన్ రహిమహుల్లాహ్ మస్జిద్ లో. మరియు తెలుగు అనువాదం చేసి వాయిస్ ద్వారా వినిపిస్తున్న వారు ముహమ్మద్ నసీరుద్దీన్ జామియి.

ఈరోజు ఖుత్బా యొక్క అంశం ప్రవక్త మరియు యువకులు. అంటే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల పట్ల ఎలా వ్యవహరించే వారు, కొన్ని సంఘటనలు ఈరోజు మనం తెలుసుకుందాము.

వారు ఈ ఉమ్మత్ సమాజానికి కవచం, దాని నిజమైన సంపద. ఎవరు వారు? వారే యువకులు. ఓ యువకుల్లారా! ఈ విషయాన్ని గ్రహించండి.

గత రెండు జుమాల ప్రసంగాలలో మంచి ఆదర్శ ప్రాయులు అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నారులతో మరియు వృద్ధులతో ఎలా వ్యవహరించే వారో తెలుసుకున్నాము. ఈరోజు మనం కొనసాగించే, ఇంకా ముందుకు కొనసాగించి నేర్చుకుంటాము, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యవ్వనంలో ఉన్న వారితో ఎలా వ్యవహరించేవారో. వారిని మనం తరుణులు, టీనేజర్స్ అని పిలుస్తాము కదా.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యువకులను గౌరవించేవారు, వారిని తమకు దగ్గరగా చేర్చుకునేవారు, వయసు అనే అడ్డుకట్టలను ఆయన ప్రేమ, సాన్నిహిత్యం మరియు నమ్మకంతో ధ్వంసం చేసేవారు. అర్థమైంది కదా ఈ విషయం? మనం పెద్దలము, తండ్రి వయసులో ఉన్న వారిమి, యువకులతో ఏంటి ఇంత క్లోజ్ గా దగ్గరగా ఉండేది? ఈ రోజుల్లో పెద్దలు అనుకుంటారు, యువకులు కూడా అనుకుంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అడ్డుకట్టలను ధ్వంసం చేశారు. ఎలా? ప్రేమతో, సాన్నిహిత్యంతో, వారికి దగ్గరగా అయి, మరియు వారిలో నమ్మకాన్ని పెంచి. అందువల్ల మనం చూస్తాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా దగ్గర చేసుకున్న వారు, శిక్షణ ఇచ్చిన వారు యువకులే. అవునండీ సహాబాల చరిత్ర మీరు చదవండి, ఎంతమంది యువకులు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరగా ఉండేవారు.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ సవారీపై వెనుక కూర్చోబెట్టుకోవడం అంటే వారిని దగ్గరగా ఉంచే ప్రేమకు సూచన. అండి, ఒక సంఘటన చూడండి. హజ్జతుల్ విదా అంటే తెలుసు కదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికి కంటే సుమారు మూడు నెలల క్రితం చేసినటువంటి హజ్. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో లక్షకు పైగా మంది హాజరయ్యారు కదా. ఆ హజ్జతుల్ విదాలో అరఫాత్ ప్రాంగణంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఒంటెపై ఉండగా, ఆయన చుట్టూ విపరీతమైన జన సమూహం ఉండగా, అకస్మాత్తుగా ఆయన ఇలా పిలిచారు,

ادْعُوا لِي أُسَامَةَ بْنَ زَيْدٍ
(ఉద్ఊలీ ఉసామా బిన్ జైద్)
“నా వద్దకు ఉసామా బిన్ జైద్ ను పిలవండి.”

ఎవరు ఈ ఉసామా బిన్ జైద్? అప్పుడు ఆయన్ను ఎరుగని వారు ఎవరు ఈ ప్రత్యేక పిలుపు మరియు గౌరవానికి అర్హుడో అని ఎదురుచూశారు. అక్కడ ప్రజలు ఉన్నారు కదా, అందరికీ తెలియదు ఉసామా ఎవరు అన్నది. అయితే ఎప్పుడైతే ప్రవక్త ఇలా పిలిచారో, అందరి ఆలోచనలు ఏమవుతాయి? కానీ వారు ఒక పెద్ద వృద్ధుడిని, తెల్ల గడ్డం ఉన్న వాడిని ఊహించి ఉంటారు కదా అక్కడి ఆ ప్రజలు ప్రవక్త ద్వారా ఈ మాట విన్న తర్వాత, “ఉద్ఊలీ ఉసామా”.

వారు అలా ఊహిస్తున్నంతలో 18 ఏళ్ల నవ యువకుడు, నల్ల రంగు గల యువకుడు ఉసామా వచ్చి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెపైకి ఎక్కి, ఆయన వెనుక కూర్చొని ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ విపరీతమైన జన సమూహం ఆశ్చర్యపోయి సంతోషించారు.

మనం గమనిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులను అపారమైన భావోద్వేగాలు మరియు అనురాగంతో కప్పి ఉంచేవారు. గనుక మనం చూస్తాము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుడైన ముఆద్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకొని, దానిని తమ చేతిలో ఉంచి, ఇలా అంటారు,

يا معاذُ واللَّهِ إنِّي لأحبُّكَ
(యా ముఆద్ వల్లాహి ఇన్నీ ల ఉహిబ్బుక్)
“ఓ ముఆద్, అల్లాహ్ ప్రమాణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.” (అబూ దావూద్ 1522).

ఈ దృశ్యంలో ముఆద్ (రదియల్లాహు అన్హు) గారి హృదయంలో కలిగిన భావాలను, ఆయన హృదయ స్పందనలను, ఆయనకు కలిగిన ఆనందాన్ని మీరు ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ఆయన చెయ్యి ప్రవక్త చేతిలో ఉంది. ఆ సమయంలో ప్రవక్త అంటున్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కేవలం ఈ మాటనే చెప్పలేదు, అల్లాహ్ సాక్షిగా అని చెప్పారు. ముఆద్ (రదియల్లాహు అన్హు) వారి యొక్క ఆలోచన దృష్టి అటు ఇటు ఉండకుండా “యా ముఆద్” (ఓ ముఆద్) అని సంబోధించడం ద్వారా మనిషి అటెన్షన్ అయి వింటాడు కదా. సుబ్ హా నల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యవహారం ఎలా ఉండిందో గమనించండి, ఇలాంటి ఉత్తమ ఆదర్శం పాటించే ప్రయత్నం చేయండి.

అలాగే 20 ఏళ్ళు రాని యువకుడైన అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ని ఊహించుకోండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చెయ్యిని ఆయన భుజంపై పెట్టారు, ఇలా చెయ్యి పెట్టారు అంటే ఏంటి? అది ఒక దగ్గరపాటు క్షణం, ప్రేమ నిండిన క్షణం. ఒక పెద్ద మనిషి ఒక యువకుడి భుజం మీద చెయ్యి పెట్టారు అంటే ఏంటి, ఎంతో దగ్గరికి తీసుకున్నారు అని కదా? ఆ తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు,

يا عبدَ اللهِ ! كن في الدنيا كأنك غريبٌ أو عابرُ سبيلٍ
(యా అబ్దుల్లాహ్! కున్ ఫిద్దున్యా క అన్నక గరీబున్ అవ్ ఆబిరు సబీలిన్)
“ఓ అబ్దుల్లాహ్, ఈ లోకంలో నీవు ఒక విదేశీయుని వలె లేదా ఒక బాటసారి వలె ఉండు.” (సహీహ్ బుఖారీ 6416).

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటనలో మనం ఏదైతే ఇప్పుడు విన్నామో భుజము మీద చెయ్యి పెట్టి చెప్పడం, అది ఒక అద్భుతమైన భావోద్వేగ పాత్రలో అందించబడిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతమైన వసియత్. వసియత్ అంటే సర్వసామాన్యంగా మరణ శాసనం, చనిపోయే ముందు చెప్పేటువంటి ముఖ్య మాట అని కూడా తీసుకుంటారు, కానీ వసియత్ ఒక ముఖ్యమైన ఉపదేశం, ఏదైనా ఒక ముఖ్యమైన సలహా ఇవ్వడం అన్న భావంలో కూడా వస్తుంది.

ముగ్గురి ఉదాహరణలు మీ ముందుకి వచ్చాయి కదా? ఉసామా బిన్ జైద్ మరియు ముఆద్ ఇబ్ను జబల్ మరియు అబ్దుల్లాహ్ బిన్ ఉమర్. ఇక రండి ముందుకు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకునేవారు. హజ్జతుల్ విదాలో ఆయన తమ ఒంటెపై వెనుక కూర్చోబెట్టారు ఫద్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ని. హజ్రత్ అబ్బాస్ వారి కొడుకు ఫద్ల్. ఫద్ల్ ఇబ్నే అబ్బాస్ ఒక అందమైన యువకుడు. అప్పుడే ఒక అందమైన యువతి ప్రవక్తను ప్రశ్నించడానికి వచ్చింది. ఫద్ల్ (రదియల్లాహు అన్హు) ఆమెను చూస్తూ ఉండగా వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ముఖాన్ని తిప్పేశారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని కొట్టలేదు, గద్దించలేదు, ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ యువతిని నేరుగా మందలించలేదు. కానీ పరోక్షంగా ఫద్ల్ కు మృదువుగా బోధించడం ద్వారా ఆమెకు కూడా బోధించేశారు. అల్లాహు అక్బర్. గమనించారా?

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఫద్ల్ ఇబ్నే అబ్బాస్ (రదియల్లాహు అన్హు)తో ప్రవర్తించిన ఈ ప్రవర్తన, ఆయన పట్ల వ్యవహరించిన ఈ సందర్భం సహీహ్ బుఖారీ 1513 మరియు సహీహ్ ముస్లిం 1334లో ఉంది.

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకున్న ఉదాహరణల్లో ఒకటి మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ (రదియల్లాహు అన్హు) చెప్పారు. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాము, మేము అంటే ఇక్కడ ఆయన ఒక్కరు కాదు, మరి కొంతమంది. ఎవరు వారు? మేమంతా ఒకే వయసులో ఉన్న యువకులం, 20 రోజులు ఆయన వద్దే ఉన్నాము, ధర్మం నేర్చుకున్నాము. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కరుణతో కూడిన మృదువైన వారిగా ఉండేవారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాకు మా కుటుంబాల కోసం కలిగిన తపనను గమనించి ఇలా అన్నారు,

ارْجِعُوا إِلَى أَهْلِيكُمْ
(ఇర్జిఊ ఇలా అహ్లికుం)
“మీ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళండి.”

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యువకులు తమ భార్యల కోసం కలిగిన తపనను గమనించారు, ఇది ఆయన వారిపై చూపిన కరుణలో ఓ భాగం. ఈ హదీస్ సహీహ్ బుఖారీ 631, సహీహ్ ముస్లిం 674లో ఉంది. మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ యువకుడు, ఆయనతో వచ్చిన వారు కూడా యువకులు.

ఈ విధంగా మనం అల్లాహ్ యొక్క దయతో ఉసామా బిన్ జైద్, ముఆద్ ఇబ్నే జబల్, అబ్దుల్లాహ్ బిన్ ఉమర్, ఫద్ల్ ఇబ్ను అబ్బాస్ మరియు మాలిక్ ఇబ్నుల్ హువైరిస్ మరియు ఆయనతో పాటు వచ్చినటువంటి యువకుల కొన్ని సంఘటనలు విన్నాము కదా, ప్రవక్త ఎలా వ్యవహరించారో వారితో.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీరి పట్ల పాటించినటువంటి విషయాలు అన్నీ కూడా పాజిటివ్ రీతిలో మనకు కనబడ్డాయి. కానీ ఎవరైనా యువకుడు కొంచెం తల తిరిగినవాడు, ఏదో చెడ్డ ఆలోచనల్లో ఉన్నవాడు, అలాంటి యువకుల పట్ల కూడా ప్రవక్త ఎలా వివరించేవారో ఇక శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల కోరికలను అర్థం చేసుకునేవారు, కనుక యువకులు తమ కోరికలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలియజేసేవారు. ఎలా? చూడండి ఈ సంఘటన.

ఒక యువకుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అంటాడు, “ఓ ప్రవక్తా! నాకు ఒక అనుమతి ఇవ్వండి, నేను వ్యభిచారం చేయాలనుకుంటున్నాను.” అల్లాహు అక్బర్. ప్రవక్త ముందు యువకుడు వచ్చి వ్యభిచారం గురించి అనుమతి కోరుతున్నాడా? ప్రవక్త కొట్టాడా? అస్తగ్ఫిరుల్లాహ్. ప్రవక్త ఆ యువకుడిని కొట్టారా? గద్దించారా? అక్కడి నుండి వెళ్ళగొట్టారా? లేదు లేదు లేదు, వినండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని దగ్గరికి తీసుకొని, అతన్ని గద్దించలేదు, నిరోధించలేదు, దూషించలేదు. “ఉద్నుహు మిన్నీ”, అతన్ని నా దగ్గరకు చేర్చండి అని హదీసులో కూడా ఉంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో మెతక వైఖరితో ఆ యువకుడితో కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏమని?

“నీ తల్లికి ఇది ఇష్టపడతావా? నీ సోదరికి ఇది ఇష్టపడతావా? నీ పిన్నికి ఇది ఇష్టపడతావా? నీ మేనత్తకి ఇది ఇష్టపడతావా?” ప్రతి ప్రశ్నకు ఆ యువకుడు లేదు, లేదు, లేదు అనే సమాధానం ఇచ్చాడు, అంతే కాదు కేవలం లేదు అనలేదు, మిమ్మల్ని సత్యంతో పంపిన అల్లాహ్ సాక్షిగా అనుకుంటూ లేదు అని చెప్పాడు. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలాగే ఇతరులు కూడా తమ కూతుర్లకు, తమ తల్లులకు, తమ చెల్లెళ్ళకు దీనిని ఎప్పటికీ ఇష్టపడరు” అని తెలియజేశారు. ఆ తర్వాత మాట పూర్తి కాలేదు ఇంకా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతిని ఆ యువకుడి చాతిపై ఉంచారు, యువకుడు ఆ చెయ్యి చల్లదనాన్ని తన చాతిపై అనుభవించాడు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా దుఆ ఇచ్చారు,

اللَّهُمَّ اغْفِرْ ذَنْبَهُ، وَطَهِّرْ قَلْبَهُ، وَحَصِّنْ فَرْجَهُ
(అల్లాహుమ్మగ్ఫిర్ దంబహు, వ తహ్హిర్ ఖల్బహు, వ హస్సిన్ ఫర్జహు)
“ఓ అల్లాహ్, అతని పాపాన్ని క్షమించు, అతని హృదయాన్ని పవిత్రం చెయ్యి, అతని గుప్తాంగాన్ని (అనైతికత నుండి) రక్షించు.”

(తహ్హిర్ ఖల్బక్ అని కూడా మరికొన్ని ఉల్లేఖనాల్లో ఉంది). (ముస్నద్ అహ్మద్ 22211). ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రితనమైన వ్యవహారం, సౌమ్యతలో, సహచర్యంలో, జాగ్రత్తగా గమనించడంలో స్పష్టమవుతుంది.

ఇక రెండో ఖుత్బా. అల్హందులిల్లాహి ఖైర్ రాహిమీన్, వస్సలాతు వస్సలాము అలల్ మబ్ఊతి రహమతల్లిల్ ఆలమీన్, అమ్మాబాద్.

అందుకని ఓ విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకులపై నమ్మకం ఉంచేవారు, వారి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసేవారు కారు, వారి ప్రతిభలను నిర్లక్ష్యం చేసేవారు కారు, వారిని అర్హులుగా చూసినప్పుడు గొప్ప పనులు, గొప్ప బాధ్యతలను వారికి అప్పగించేవారు. చూశారా మరో కోణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉన్నటువంటి ప్రతిభను, వారిలో ఉన్నటువంటి ఎవరికి ఏ విషయంలో ఎలాంటి ఎబిలిటీ, సలాహియత్ ఉన్నదో గమనించి ఆ బాధ్యతలు అప్పగించేవారు.

గమనించండి ఇక్కడ, మక్కా విజయం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి బయలుదేరేకి ముందు అక్కడ పాలకుడిగా, మీరు చెప్పవచ్చు మక్కాకి గవర్నర్ గా అత్తాబ్ బిన్ ఉసైద్ (రదియల్లాహు అన్హు) వారిని నియమించారు. అప్పుడు అతని వయసు సుమారు 20 సంవత్సరాలు మాత్రమే. ఇమామ్ ఇబ్ను సాద్ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని అత్తబకాతుల్ కుబ్రాలో ప్రస్తావించారు.

గమనించండి, ఆ సమయంలో మక్కాలో ఖురైష్ పెద్దలు, వయసు పైబడిన నాయకులు ఉన్నా, వారి మీద అధికారి ఒక 20 సంవత్సరాల యువకుడు అయ్యాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యువకుల్లో ఉన్నటువంటి ప్రతిభను గమనించి ఎలా వారికి చాన్స్ ఇచ్చేవారో చూడండి.

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరియాకు ఒక సైన్యాన్ని పంపి వారిపై సైన్యాధికారిగా ఉసామా బిన్ జైద్ ను నియమించారు, అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు మాత్రమే. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ఆ సైన్యంలో అబూబకర్ (రదియల్లాహు అన్హు), ఉమర్ (రదియల్లాహు అన్హు) లాంటి పెద్ద సహాబాలు కూడా ఉన్నారు.

తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉసామా బిన్ జైద్ అంత పెద్ద సైన్యానికి సైన్యాధికారిగా చేశారు కదా, అతనికి మరో ధైర్యం ఇస్తూ, ఇంకా ఇతరులకు అతని ప్రతిభని చాటుతూ చెప్పారు,

وأيمُ اللهِ لَقَدْ كان خَلِيقًا لِلْإمارَةِ
(వ ఐముల్లాహి లకద్ కాన ఖలీకన్ లిల్ ఇమారతి)
“అల్లాహ్ సాక్షిగా, నిశ్చయంగా అతడు ఈ అధికార హోదాకి (నాయకత్వానికి) తగినవాడు.” (సహీహ్ బుఖారీ 2450, సహీహ్ ముస్లిం 2426).

అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త తరం యువతను చిన్న వయసులోనే బాధ్యతలు భరించడానికి, సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేసేవారు. అందుకే ఆయన తర్వాత ఆ యువకులు ఉమ్మత్ పెద్దలయ్యారు, సత్యం వైపునకు పిలిచేవారయ్యారు. అల్లాహ్ వారందరితో సంతోషంగా ఉండుగాక. ఆ సహాబాలను ఆ రీతిలో పెంచి, పవిత్రం చేసి, ఉన్నత గుణాలు వారికి నేర్పిన ప్రవక్తపై అల్లాహ్ యొక్క లెక్కిలేనన్ని దరూద్ సలాం, సలాతో సలాం, బరకాత్, దయా, శాంతి, శుభాలు కలుగుగాక.

لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ

“అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు”(3:164)

అందువల్ల మనం యువత పట్ల మన వ్యవహారంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గాన్ని అనుసరించాలి, ఆయన సున్నతులను ఫాలో అయ్యే అనుచరులుగా ఉండడానికి.

సుబ్ హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43563


కీడు (చెడు) యొక్క సృష్టి – హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ | నసీరుద్దీన్ జామిఈ

రచయిత: హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ (హఫిజహుల్లాహ్)
అనువాదం: నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.

మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.

{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ}
(అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]

అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
“మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).

ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.

ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:

అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.

కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.

దీనినే ఇలా కూడా అంటారు:
“కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”

అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ»
(మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]

ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?

{فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ}
(కాబట్టి కోరినవాడు విశ్వసించవచ్చు మరియు కోరినవాడు తిరస్కరించవచ్చు). [అల్-కహఫ్: 29]

అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:

{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا}
(నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]

మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:

{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ}
(మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]

ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.

పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.

పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.

{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ}
(మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]

అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:

  1. ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا}
    (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
  2. రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ}
    (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]

    మరియు ఇది కూడా:

    {إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ}
    (నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, సర్వజ్ఞుడు). [అల్-అన్ ఆమ్: 83]

ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.

వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.

అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah/

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

ముస్లింలు దేన్ని తమ గీటురాయిగా తీసుకోవాలి?
వక్త: హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/7wdS1-T5Pkg [15 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ముస్లింలు తమ జీవితంలోని ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ అంతిమ గీటురాయిగా దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన ప్రవక్త ప్రవచనాలను (హదీసులను) మాత్రమే స్వీకరించాలని వక్త నొక్కి చెప్పారు. పూర్వీకుల ఆచారాలు, వ్యక్తిగత కోరికలు లేదా ఇతరుల అభిప్రాయాలు ఈ రెండు మూలాలకు విరుద్ధంగా ఉంటే వాటిని అనుసరించవద్దని హెచ్చరించారు. అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పు చేయకపోవడం యొక్క తీవ్రమైన పరిణామాలను వివరించడానికి సూరహ్ మాయిదాలోని వాక్యాలను ఉదహరించారు. అలాంటి చర్యలను అవిశ్వాసం (కుఫ్ర్), దుర్మార్గం (జుల్మ్), మరియు అవిధేయత (ఫిస్ఖ్)గా వర్గీకరించారు. అల్లాహ్ చట్టం కంటే తమ చట్టం గొప్పదని భావించి తీర్పు ఇవ్వడం (పెద్ద కుఫ్ర్) మరియు అల్లాహ్ చట్టం యొక్క ఆధిక్యతను విశ్వసిస్తూనే ప్రాపంచిక కోరికల కారణంగా దానిని ఉల్లంఘించడం (చిన్న కుఫ్ర్) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సమాజంలోని వివాదాలు మరియు తగాదాలకు దైవిక చట్టాన్ని ప్రమాణంగా విడిచిపెట్టడమే కారణమని ఒక హదీసుతో ప్రసంగాన్ని ముగించారు.

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్ అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ రోజు మనం ముస్లిములు దేనిని తమ గీటురాయిగా తీసుకోవాలి అనే విషయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రియ వీక్షకులారా, సాధారణంగా మనం మన సమాజంలో చూసేది ఏమిటి? ఏదైనా తీర్పు ఇవ్వాలన్నా, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించాలన్నా, నిర్ణయించాలన్నా, ఈ ఆచారం మా తాత ముత్తాతల నుంచి వస్తా ఉంది, మా అమ్మానాన్న ఇలాగే నేర్పించారు, మా గురువులు ఇలాగే చేసేవారు, అది న్యాయమైనా, అన్యాయమైనా, సత్యమైనా, అసత్యమైనా, ఇది పక్కన పెట్టి, న్యాయం-అన్యాయం, సత్యం-అసత్యం, మంచి విధానం, చెడు విధానం, కరెక్టా కాదా ఇవి పక్కన పెట్టి, ముందు నుంచి వస్తా ఉంది కాబట్టి కొనసాగిస్తున్నారు. కాకపోతే ఇస్లాంలో అలా చెల్లదు.

ముస్లిములు దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు అంటే ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకోవడం తప్పనిసరి, విధి అని మనం తెలుసుకోవాలి. అమ్మానాన్నతో నేర్చుకోవాలి, కాకపోతే అమ్మానాన్న, తల్లిదండ్రులు దేనిని గీటురాయిగా తీసుకుని నేర్పించారు? గురువులతో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. కానీ ఆ గురువులు దేనిని గీటురాయిగా తీసుకుని మనకి నేర్పించారు? విజ్ఞులతో, జ్ఞానులతో, పండితులతో తెలుసుకోవాలి. కాకపోతే వారు దేనిని గీటురాయిగా తీసుకుని మనల్ని నేర్పించారు అనేది ముఖ్యమైన విషయం, తెలుసుకోవలసిన విషయం.

అభిమాన సోదరులారా, ప్రతి విషయంలో, అమ్మానాన్న విషయంలో, భార్యాపిల్లల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో, అనాథల విషయంలో, వితంతువుల విషయంలో, ఇరుగుపొరుగు వారి విషయంలో, అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఉద్యోగమైనా, రాజకీయపరమైనా, ఏ రంగంలోనైనా సరే ఒక తీర్పు ఇస్తే, ఒక పరిష్కారం చేస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలు మరియు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ప్రకారంగానే ఉండాలి. ఖుర్ఆన్ మరియు హదీసులు మాత్రమే గీటురాయిగా మనం తీసుకోవాలి, చేసుకోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరహ్ మాయిదా, ఆయత్ 49లో ఇలా సెలవిచ్చాడు:

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహు వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)

(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.”  (5:49)

అంటే, నీవు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. ఏదైనా తీర్పు ఇస్తే, ఏదైనా సమస్యకి పరిష్కారం చూపిస్తే అది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క చట్ట ప్రకారం ఉండాలి, అల్లాహ్ యొక్క ఆజ్ఞ పరంగా ఉండాలి.

وَلَا تَتَّبِعْ اَهْوَاۤءَهُمْ
(వలా తత్తబిఅ అహ్వాఅహుమ్)
వారి కోరికలను ఎంత మాత్రం అనుసరించకు.

వారు బంధువులని, స్నేహితులని, మిత్రులని, తెలిసిన వారని, లేకపోతే వారు సమాజంలో వారు హోదాలో మంచి హోదాలో, మంచి పొజిషన్‌లో ఉన్నారని, ఆ ఉద్దేశంతో తీర్పు చేయకూడదు. వారు ఎవ్వరైనా సరే, అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఇరుగుపొరుగు వారు, స్నేహితులు, గురువులు, తెలిసిన వారు, తెలియని వారు ఎవ్వరైనా సరే. ధనవంతులు, పేదవారు, ఉన్నవారు, లేనివారు ఎవ్వరైనా సరే అందరికీ ఒకటే ధర్మం, అందరికీ ఒకటే న్యాయం, అందరికీ ఒకటే విధానం.

وَاَنِ احْكُمْ بَيْنَهُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ
(వ అనిహ్కుమ్ బైనహుమ్ బిమా అన్జలల్లాహ్)
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చట్టం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశం ఏమిటి? ఆయన యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆయన ఏ విధంగా మనకు సెలవిచ్చాడు? మరియు దానికి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయంలో ఆయన ప్రవచనం ఏమిటి? ఆయన విధానం ఏమిటి? ఇది మనకు తప్పనిసరి.

ఇదే ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చివరి భాగంలో ఇలా సెలవిచ్చాడు:

وَاِنَّ كَثِيْرًا مِّنَ النَّاسِ لَفٰسِقُوْنَ
(వ ఇన్న కసీరమ్ మినన్నాసి లఫాసిఖూన్)
 “ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు.“(5:49)

ఫాసిఖ్ అంటే అవిధేయుడు, కరప్ట్, దురాచారి. అంటే ప్రజలలో చాలా మంది అల్లాహ్ ఆజ్ఞలకు, ఆదేశాలకు విరుద్ధంగా తీర్పుని ఇస్తున్నారన్నమాట. పట్టించుకోవటం లేదు. నేను ఎవరిని నమ్ముతున్నాను? ఎవరి పట్ల నేను విశ్వాసం కలిగి ఉన్నాను? ఎవరి కలిమా నేను చదువుతున్నాను? ఎవరి విధేయత నేను చూపాలి? ఎవరిని నేను ఆదర్శంగా తీసుకున్నాను? ఇవి కాకుండా, మనోమస్తిష్కాలకు గురై, ప్రపంచ వ్యామోహానికి గురై, ఏదో ఒక కారణంగా అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను పక్కన పెట్టి, మన కోరికల పరంగా, లేకపోతే వారు బంధువులని, తెలిసిన వారని, ఉన్న వారని, ఏదో ఒక సాకుతో వారికి అనుగుణంగా, వారి కోరికలకు సమానంగా తీర్పు ఇవ్వకూడదు అన్నమాట.

అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ ఏం తెలియజేశాడు? ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను కాకుండా, అల్లాహ్ చట్టపరంగా కాకుండా, దానికి విరుద్ధంగా తీర్పునిస్తే వారు ఫాసిఖ్, అవిధేయులు, కరప్టెడ్, దురాచారులు అని అల్లాహ్ తెలియజేశాడు. అలాగే, అదే సూరహ్, సూరహ్ మాయిదా వాక్యం 45లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముజ్జాలిమూన్)
అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.” (5:45)

ఎవరైతే అల్లాహ్ ఆదేశం ప్రకారం, అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, వారు దుర్మార్గులు. అంటే అల్లాహ్ చట్టం ప్రకారం తీర్పు ఇవ్వని వారే దుర్మార్గులు, దౌర్జన్యులు అని అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశం ప్రకారం, అనగా ఖుర్ఆన్ మరియు హదీసుల పరంగా తీర్పు ఇవ్వకపోతే, వారు జాలిమీన్, దుర్మార్గులు, దౌర్జన్యపరులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాగే అదే సూరహ్, ఆయత్ 44 లో ఇలా సెలవిచ్చాడు:

وَمَنْ لَّمْ يَحْكُمْ بِمَاۤ اَنْزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الْكٰفِرُوْنَ
(వమల్లమ్ యహ్కుమ్ బిమా అన్జలల్లాహు ఫ ఉలాఇక హుముల్ కాఫిరూన్)
ఎవరు అల్లాహ్‌ అవతరింపజేసిన వహీ ప్రకారం తీర్పు చెయ్యరో వారే (కరడుగట్టిన) అవిశ్వాసులు.” (5:44)

అభిమాన సోదరులారా, ఈ విషయం మనం బాగా గమనించాలి. ఒకే సూరహ్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యం 44, అదే సూరహ్ వాక్యం 45, అదే సూరహ్ వాక్యం 49లో, అల్లాహ్ చట్టం ప్రకారం, అల్లాహ్ ఆదేశాల ప్రకారం తీర్పు ఇవ్వకపోతే, ఒక ఆయతులో ఫాసిఖీన్ అన్నాడు, వారు ఫాసిఖులు, దౌర్జన్యపరులు, దురాచారులు అన్నారు. ఇంకో ఆయతులో జాలిమూన్ అన్నాడు, దౌర్జన్యపరులు, దుర్మార్గులు అన్నాడు. ఇంకో ఆయతులో కాఫిరూన్ అన్నాడు, అంటే వారు అవిశ్వాసులు.

అంటే ఇంత గమనించే విషయం ఇది. మనము జీవితానికి సంబంధించిన అది విశ్వాసం అయినా, ఆరాధన అయినా, వ్యాపారం అయినా, వ్యవసాయం అయినా, రాజకీయం అయినా, నడవడిక అయినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనము తీర్పు ఇవ్వాలంటే గీటురాయిగా తీసుకోవాలంటే అది అల్లాహ్ ఆదేశం, అంతిమ దైవప్రవక్త యొక్క ప్రవచనం.

అభిమాన సోదరులారా, అలా చేయకపోతే ఇస్లాంకు వ్యతిరేకమైన చట్టాలను అమలు చేయడాన్ని ధర్మ సమ్మతంగా భావించడం, ఇస్లాంకు వ్యతిరేకంగా, ఖుర్ఆన్‌కి వ్యతిరేకంగా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలకు వ్యతిరేకంగా అమలు చేయడాన్ని ఇది కరెక్టే, సమ్మతమే అని భావించడం కుఫ్ర్ అక్బర్ అవుతుంది. పెద్ద అవిశ్వాసం. అంటే ఆ వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఇబ్నె బాజ్ రహమతుల్లాహి అలైహి ఇలా సెలవిచ్చారు, ఎవరైనా తీర్పు ఇస్తే, అది రెండు రకాలుగా ఉంటుంది అన్నారు.

మొదటి రకం ఏమిటి? (ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్) అల్లాహ్ చట్టం ప్రకారం కాకుండా, అల్లాహ్ యొక్క ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు ఇస్తే, ఎందుకు ఇస్తున్నాడు ఆ తీర్పు ఆ వ్యక్తి? (యఅతఖిదు హల్ల దాలిక్), అతని ఉద్దేశం ఏమిటి? నేను ఇచ్చే తీర్పు, దీంట్లో పరిష్కారం ఉంది ఆ సమస్యకి. అల్లాహ్ ఆదేశంలో ఆ పరిష్కారం లేదు, నా తీర్పులో ఆ పరిష్కారం ఉంది అని భావించి ఆ తీర్పు ఇస్తే, లేదా (అవ అన్న దాలిక అఫ్దల్), నా తీర్పు, నా నిర్ణయం, నా న్యాయం అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది, మేలైనది అని భావిస్తే, (అవ్ అన్నహు యుసావి లిష్షరిఅ), లేకపోతే నా తీర్పు కూడా అల్లాహ్ తీర్పుకి సమానంగానే ఉంది, షరిఅత్‌కి సమానంగానే ఉంది అనే ఉద్దేశంతో తీర్పు ఇస్తే, (కాన కాఫిరన్ ముర్తద్దన్), ఆ వ్యక్తి కాఫిర్ అయిపోతాడు, ముర్తద్ అయిపోతాడు. అంటే ఇస్లాం నుంచి తొలగిపోతాడు.

ఏ ఉద్దేశంతో? నేను ఇచ్చే న్యాయం తీర్పు, నేను చేసే న్యాయం, నేను అవలంబించే విధానం ఇది అల్లాహ్ ఆదేశం కంటే గొప్పది లేదా దానికి సరైనది, సమానంగా ఉంది అని ఆ ఉద్దేశంతో భావించి తీర్పు ఇస్తే, అటువంటి న్యాయం, అటువంటి తీర్పు, అటువంటి వ్యక్తి ఇస్లాం నుంచి తొలగిపోతారు, కాఫిర్ అవిశ్వాసి అయిపోతారు, ముర్తద్ అయిపోతారు.

రెండో రకమైన తీర్పు ఏమిటి? (అమ్మా ఇదా హకమ బిగైరి మా అన్జలల్లాహ్), అల్లాహ్ చట్టానికి విరుద్ధంగా, అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తున్నాడు, ఉద్దేశం ఏమిటి? (లిహవా), తన కోరికలకి అనుగుణంగా, కోరికలకి బానిసైపోయి ఇస్తున్నాడు, కోరికలను పూర్తి చేసుకోవటానికి. (అవ్ లిమకాసిద్ సయ్యిఅ) చెడు ఉద్దేశం కోసం, చెడు కారణాల కోసం. (అవ్ లితమఇన్), లేకపోతే ఏదో ఒక ఆశించి. (అవ్ లిర్రిశ్వా) లంచం కోసం. నేను అల్లాహ్ యొక్క ఆదేశానికి విరుద్ధంగా తీర్పు ఇస్తే నాకు ఇంత డబ్బు వస్తుంది, లంచం వస్తుంది, ధనం వస్తుంది, ఈ ఉద్దేశంతో తీర్పు ఇస్తే, అంటే అతని మనసులో అతని విశ్వాసం, అతని నమ్మకం ఏమిటి? నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉంది, ఇది తప్పే. కాకపోతే నేను ఈ విధంగా తీర్పు ఇస్తే నాకు ప్రపంచపరంగా, ఆర్థికపరంగా నాకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నా కోరికలు పూర్తి అవుతాయి అని ఈ దురుద్దేశంతో తీర్పు ఇస్తున్నాడు. మనసులో మాత్రం అల్లాహ్ తీర్పే గొప్పది అని నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి ఘోరమైన పాపాత్ముడు అవుతాడు. దీనిని చిన్న షిర్క్ అంటారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రతి చిన్న, పెద్ద కుఫ్ర్ నుండి, షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక.

అంటే, నా నిర్ణయం, నా తీర్పు అల్లాహ్ ఆదేశానికి విరుద్ధంగా ఉన్నా నాదే గొప్పది అని భావించి ఇస్తే, అతను పెద్ద కుఫ్ర్, ముర్తద్ అయిపోతాడు. మనోవాంఛలకు, డబ్బుకి ఆశించి, కోరికలకి లోనై తీర్పు ఇస్తే పాపాత్ముడు అవుతాడు, చిన్న కుఫ్ర్ అవుతుంది, చిన్న అవిశ్వాసం అవుతుంది.

అభిమాన సోదరులారా, చివర్లో ఒక్క హదీస్ చెప్పి నేను నా ఈ మాటని ముగిస్తాను. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “వారి నాయకులు దైవగ్రంథం ప్రకారం తీర్పు చేయకుంటే, అల్లాహ్ అవతరింపజేసిన చట్టాన్ని ఎన్నుకోకుంటే, అల్లాహ్ వారి మధ్యన వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు.” ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది.

ఇప్పుడు పూర్తి సమాజంలో, ప్రపంచంలో మన పరిస్థితి ఏమిటి? మనకి అర్థమవుతుంది. మనం ఎందుకు ఈ విధంగా వివాదాలకు గురై ఉన్నాము, తగాదాలకు గురై ఉన్నాము అంటే, మన తీర్పులు, మన వ్యవహారాలు, మనం చేసే విధానము, మనం తీసుకున్న గీటురాయి అది ఖుర్ఆన్ మరియు హదీస్ కాదు. మనం తీసుకున్న గీటురాయి అది అల్లాహ్ ఆదేశాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలు కాదు.

ఎప్పుడైతే మనం అల్లాహ్ ఆదేశాల పరంగా తీర్పు ఇవ్వమో, అల్లాహ్ ఆదేశాలను, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనాలను గీటురాయిగా తీసుకోమో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన మధ్య వివాదాలను, తగాదాలను సృష్టిస్తాడు. అది ఇప్పుడు మనము కళ్ళారా చూస్తున్నాము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖుర్ఆన్ మరియు ప్రామాణికమైన హదీసులను గీటురాయిగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ఆదేశాలను గీటురాయిగా తీసుకొని తీర్పునిచ్చే సద్బుద్ధిని అల్లాహ్ మనందరినీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43352

మన ఆరాధనలు స్వీకరించబడాలంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మన ఆరాధనలు స్వీకరించబడాలంటే?
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YUGJ4R5B-Ps [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఆరాధనలు (ఇబాదత్) అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి అవసరమైన మూడు ప్రాథమిక షరతులను వక్త వివరిస్తున్నారు. అవి: 1) అల్లాహ్ పై ప్రగాఢమైన మరియు స్థిరమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటం, 2) చేసే ప్రతి పుణ్యకార్యంలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) పాటించడం, అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయడం, ప్రజల మెప్పు లేదా ప్రదర్శన కోసం కాదు, మరియు 3) ప్రతి ఆరాధనను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన పద్ధతి (సున్నత్) ప్రకారమే ఆచరించడం. ఈ మూడు షరతులు లేకుండా చేసే కర్మలు స్వీకరించబడకుండా వృధా అయిపోయే ప్రమాదం ఉందని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తున్నారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ أَمَّا بَعْدُ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్]

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం ఆరాధనలు స్వీకరింపబడాలంటే ఏమి చేయాలి, కండిషన్లు ఏమిటి తెలుసుకుందాం. మనం అల్లాహ్‌ను ఆరాధిస్తాము, అల్లాహ్ నే ఆరాధిస్తాము. నమాజులు నెలకొల్పుతాము, ముఖ్యంగా ఈ రమదాన్ మాసంలో ఇతర మాసాల కంటే కొంచెం ఎక్కువగానే మనము ఆరాధనలో ఉంటాము. నమాజుల ద్వారా, నఫిల్ నమాజులు, తరావీహ్ నమాజు, దానధర్మాలు, దుఆ, ఖురాన్ పారాయణం, ఇతరులకు సహాయం చేయటం ఈ విధంగా అనేక రకాల ఆరాధనలు చేస్తున్నాము. ఖురాన్ చదువుతున్నాం, నమాజులు పాటిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఖియాముల్ లైల్ చేస్తున్నాము. కాకపోతే మనము చేసే ఈ కర్మలు, మనము చేసే ఈ ఆరాధన స్వీకరించబడుతుందా? అల్లాహ్ స్వీకరిస్తున్నాడా? అల్లాహ్ ఇష్టపడుతున్నాడా మన ఆరాధనకి? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి.

నేను చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా నమాజ్ ఏ విధంగా అయ్యి ఉండాలి? నేను ఉండే ఉపవాసం అల్లాహ్ స్వీకరించాలా అంటే నా ఉపవాసం ఏ విధంగా ఉండాలి? నేను చేసే ఖురాన్ పారాయణం అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా ఖురాన్ యొక్క పారాయణం ఏ విధంగా ఉండాలి? నేను చేసే దానం, నేను చేసే ప్రతీ మంచి పని, ప్రతీ పుణ్యం, ప్రతీ సదాచరణ – నేను చేసేది, నేను దుఆ చేస్తున్నాను, నేను ఖురాన్ పారాయణం చేస్తున్నాను, తిలావత్ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏడ్చి ఏడ్చి దుఆ చేస్తున్నాను, ఖియాముల్ లైల్ చేస్తున్నాను, ఒకరికి సహాయం చేస్తున్నాను, పేదవారికి అన్నం పెడుతున్నాను, పేదవారికి దుస్తులు దానం చేస్తున్నాను, లేని వారికి ఆదుకుంటున్నాను, అంటే పలు విధాలుగా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను.

కాకపోతే నా ఈ ఆరాధన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్వీకరించాలా అంటే, దానికి మూడు కండిషన్లు ఉన్నాయి. అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలా, లేకపోతే మన కర్మలు వృధా అయిపోతాయి. మన ఆరాధనలు స్వీకరింపబడాలంటే ముఖ్యమైన మూడు కండిషన్లు మనం తెలుసుకోవాలి, మూడు విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మూడు ఏమిటి? ఒకటి, అల్లాహ్ పై నమ్మకం. రెండవది, ఇఖ్లాస్ (చిత్తశుద్ధి). మూడవది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం. ఈ మూడు విషయాలు ఉంటేనే మన ఆరాధన స్వీకరించబడుతుంది.

  • అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన నమ్మకం లేకుండా ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • చిత్తశుద్ధి ఇఖ్లాస్. చిత్తశుద్ధి లేకుండా ఆరాధిస్తే, ప్రజల మెప్పు కోసం ఆరాధిస్తే, ప్రజలు పొగడాలని పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యం, ఆ సదాచరణ, ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • అలాగే మనం చేసే సదాచరణ, మనం చేసే ఆరాధన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం పరంగా లేకపోతే అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు.

ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే మన కర్మలు ఉండాలి.

మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన ప్రగాఢ విశ్వాసం. అల్లాహ్ మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు,

“ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి కానత్ లహుం జన్నతుల్ ఫిర్దౌసి నుజులా”. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి, విశ్వసించి.. మొదటి కండిషన్ ఏమిటి? విశ్వాసం. విశ్వసించి, విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం తర్వాత సత్కార్యాలు చేసిన వారికి ఫిర్దౌస్ ఉద్యానవనాలు ఉంటాయి అని అన్నాడు.

అలాగే అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరతుల్ అసర్ లో తెలియజేశాడు, వల్ అసర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఇల్లల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాత్. కాలం సాక్షిగా మానవులందరూ నష్టంలో ఉన్నారు, నాలుగు రకాల కోవకి చెందిన నాలుగు గుణాలు ఉండే వ్యక్తులు తప్ప అన్నాడు. అంటే విశ్వసించిన వారు, ఆ తర్వాత సత్కార్యాలు చేసేవారు, పరస్పరం సత్యం గురించి హితబోధ చేసుకునే వారు, సహనం వహించేవారు. అంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. 

ఇదే విషయం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

قُلْ آمَنْتُ بِاللَّهِ ثُمَّ اسْتَقِمْ
[కుల్ ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్]
“నేను అల్లాహ్‌ను విశ్వసించాను” అని పలికి, దానిపై నిలకడగా ఉండు.

మేమందరము అల్లాహ్‌ని విశ్వసించాము అని అంటున్నాము, విశ్వసించాము కూడా. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే, అల్లాహ్‌ను నమ్ముతున్నాము, అల్లాహ్ ఆదేశాల పరంగా జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏదైతే చేయమన్నాడో అవి చేయాలి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దేనిని నిషిద్ధం చేశాడో దానికి దూరంగా ఉండాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలు మనకి బోధించారో, చేయమన్నారో, ఆజ్ఞాపించారో అది మనము చేయాలి, ఆయన్ని అనుసరించాలి, విధేయత చూపాలి. ఏ విషయాల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారో, నిషిద్ధం అన్నారో, అధర్మం అన్నారో వాటిని విడనాడాలి, దూరంగా ఉండాలి. సుమ్మస్తకిమ్ (స్థిరంగా ఉండు). అల్లాహ్‌ని విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన నమ్మకం కలిగిన తర్వాత దానిపై నిలకడగా ఉండాలి. అల్లాహ్‌ని విశ్వసిస్తున్నాం, నమాజ్ చేయటం లేదు. రమదాన్‌లో నమాజ్ చేస్తాము, రమదాన్ తర్వాత నమాజ్ చేయము. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రమదాన్ మాసానికి ప్రభువు అయితే, రమదాన్ తర్వాత మాసాలకి అల్లాహ్ ప్రభువు కాదా?

ఆమన్తు బిల్లాహి (నేను అల్లాహ్‌ను విశ్వసించాను) అని చెప్పి, సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన గట్టి నమ్మకం కలిగి ఉండాలి. మన విశ్వాసాలు, మన ఆచరణలు, మన ఆరాధనలు, మన కర్మలు, మన పుణ్యాలు అల్లాహ్ స్వీకరించాలంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే పాలకుడు, ఆయన మాత్రమే పోషకుడు, ఆయన మాత్రమే సర్వ లోకాలను చూసుకునేవాడు, ఆయన మాత్రమే మన జీవన్మరణాలకు కారకుడు. ఆయన మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇది మొదటి విషయం.

రెండో విషయం ఇఖ్లాస్, చిత్తశుద్ధి. ఏ మంచి పని చేసినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం చేయాలి, ప్రజల మెప్పు కోసం చేయకూడదు. నన్ను సమాజంలో పొగుడుతారు, నాకు పేరు వస్తుంది, అందరూ నాకు పొగుడుతారు ఈ ఉద్దేశంతో మంచి పని చేయకూడదు. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు, దీనికి రియా అంటారు. రియా గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

الرِّيَاءُ الشِّرْكُ الأَصْغَرُ
[అర్-రియా అష్-షిర్కుల్ అస్గర్]
రియా (ప్రదర్శనా బుద్ధి) అనేది చిన్న షిర్క్.

రియా (ప్రదర్శనా బుద్ధితో), నలుగురి మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం ఏదైనా మంచి పని చేస్తే అది షిర్క్ అవుతుంది. చిన్న షిర్క్ అవుతుంది అన్నారు. అంటే ప్రదర్శనా బుద్ధితో సదాచరణ చేస్తే అది సదాచరణ కాదు, అది షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ప్రజల మెప్పు కోసం అల్లాహ్‌ను ఆరాధించకూడదు. చిత్తశుద్ధితో, ఇఖ్లాస్‌తో మనము మంచి పని చేయాలి, ఆరాధించాలి.

మొదటి విషయం, అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, ఆయన ఏకత్వం పైన నమ్మకం, విశ్వాసం. రెండవది, చిత్తశుద్ధి, ఇఖ్లాస్. మూడో విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన పద్ధతి పరంగానే మన కర్మలు ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟
[వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ]
“అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇస్తారో అది తీసుకోండి, ఆయన దేని నుంచి ఖండిస్తారో దానికి దూరంగా ఉండండి.” (59:7)

అంటే మనము నమాజ్ చేసినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం ఉండినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం పాటించినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అయ్యి ఉండాలి, ఖియాముల్ లైల్ చేసినా ప్రవక్త గారి విధానం, దుఆ చేసినా ప్రవక్త గారి విధానం, దానధర్మాలు చేసినా ప్రవక్త గారి విధానం, ఖురాన్ పారాయణం చేసినా ప్రవక్త గారి విధానం. ప్రవక్త గారి విధానం లేకపోతే ఆ ఆరాధన రద్దు చేయబడుతుంది. ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
[మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ (ధార్మిక) విషయంలో లేని దాన్ని క్రొత్తగా కల్పిస్తారో, అది త్రోసిపుచ్చబడుతుంది (తిరస్కరించబడుతుంది).

మా ఆదేశాలకు అనుగుణంగా లేని పనులు త్రోసిపుచ్చబడతాయి, రద్దు చేయబడతాయి, క్యాన్సిల్ చేయబడతాయి. అభిమాన సోదరులారా, మనం చేసే ప్రతీ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. లేకపోతే అవి స్వీకరించబడవు. దుఆ చేస్తాము, ప్రవక్త గారి విధానం. నమాజ్ పాటిస్తాము, ప్రవక్త గారి విధానం. సహరీ ఆదాబులు, ప్రవక్త గారి విధానం. ఇఫ్తార్ గురించి, ప్రవక్త గారి విధానం. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రవక్త గారి విధానం. ఎటువంటి సంకల్పం ఉండాలి, ప్రవక్త గారి విధానం. నమాజ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రవక్త గారి విధానం. హజ్, ఉమ్రా చేయాలి, ప్రవక్త గారి విధానం. అమ్మానాన్నలను పోషించాలి, వారి మాట వినాలి, ప్రవక్త గారి ఆదేశాల పరంగానే. మనము ఏ పుణ్యం చేసినా, ఏ మంచి పని చేసినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం పరంగానే ఉండాలి, లేకపోతే మనం చేసే కర్మలు వృధా అయిపోతాయి, స్వీకరించబడవు.

అభిమాన సోదరులారా, చివర్లో ఆ మూడు విషయాలు తెలుసుకుందాము, రిపీట్ చేస్తున్నాను. అల్లాహ్ పై నమ్మకం, చిత్తశుద్ధి (ఇఖ్లాస్), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ఈ మూడు కండిషన్లు ఉంటే మన ఆరాధనలు, నమాజ్, ఉపవాసం, ఖియాముల్ లైల్, దుఆ, జిక్ర్, తిలావత్ ఇవన్నీ స్వీకరించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఈ కండిషన్లతో పాటు ఆరాధనలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన ప్రతీ ఆరాధనలో అల్లాహ్ పై గట్టి నమ్మకాన్ని, ఇఖ్లాస్‌ని, ప్రవక్త గారి సున్నత్ విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మనందరి చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43606

(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు! – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు!
https://youtu.be/2WVvL9Ip-l4 [11 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నఫిల్ సదకా (ఐచ్ఛిక దాతృత్వం) యొక్క వివిధ రూపాలను ఇస్లాంలో వివరించబడ్డాయి. సదకా కేవలం ధనంతో ఇచ్చేది మాత్రమే కాదని, ప్రతి మంచి పని ఒక సదకా అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ద్వారా స్పష్టం చేయబడింది. చిరునవ్వుతో పలకరించడం, దారి చూపడం, అల్లాహ్ ను స్మరించడం (తస్బీహ్, తహమీద్, తక్బీర్), మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం వంటివి కూడా సదకాగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి తన కుటుంబంపై ఖర్చు చేయడం కూడా సదకా అని చెప్పబడింది. చివరగా, వ్యక్తి మరణించిన తర్వాత కూడా పుణ్యం లభించే మూడు రకాల సదకాల గురించి వివరించబడింది: సదకా-ఎ-జారియా (నిరంతర దానధర్మం), ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం, మరియు తల్లిదండ్రుల కోసం ప్రార్థించే సజ్జనులైన సంతానం.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)
నిశ్చయంగా, సర్వస్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభాయమానం. ఆయన తర్వాత ఏ ప్రవక్తా రారో, అట్టి ప్రవక్తపై అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి కురియుగాక. ఆ తర్వాత.

ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ సోదరులారా, మనం గత ఎపిసోడ్లలో జకాత్ గురించి తెలుసుకుందాం.

ఈరోజు, నఫిల్ సదకా రకాలు తెలుసుకుందాం. సదకా అంటే కేవలం ధనంతో, డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు అని మనకు తెలుస్తుంది, బోధపడుతుంది, మనము ఖురాన్ మరియు హదీస్ గమనిస్తే. నఫిల్ సదకా చాలా రకాలు ఉన్నాయి. ధనంలో కూడా ఉన్నాయి, ధనం కాకపోయినా. ఉదాహరణకు, బుఖారీ, ముస్లింలో ఓ హదీస్ ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
(కుల్లు మ’అరూఫిన్ సదఖహ్)
ప్రతి మంచి పని ఒక సదకా (దానం).

మంచి పని ఏమిటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చిరునవ్వుతో మాట్లాడినా అది మంచి పని ఇస్లాం దృష్టిలో, అది కూడా సదకా. ఒక వ్యక్తికి దారి చూపినా సదకా, మంచి పని.

ఒక హదీస్ లో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తక్బీర్, తస్బీహ్, తహమీద్, తహ్లీల్ ఇవి కూడా సదకా అని చెప్పారు. అంటే, అల్లాహు అక్బర్ అని పలకటం, సుబ్ హానల్లాహ్ అని పఠించటం, అల్ హమ్దులిల్లాహ్ అని అనటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం, అస్తగ్ ఫిరుల్లాహ్ అని చెప్పటం కూడా సదకా. అల్లాహు అక్బర్ ఒక సదకా. ఒక్కసారి సుబ్ హానల్లాహ్ అంటే ఒక సదకా. ఒక్కసారి అల్ హమ్దులిల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి అస్తగ్ ఫిరుల్లాహ్ అంటే ఒక్క సదకా.

ఇది సామాన్యంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ పలికినా, చెప్పినా మాట ఇది. కాకపోతే రమజాన్ మాసం ప్రత్యేకమైన మాసం. రమదాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి పుణ్యానికి ఎన్నో రెట్లు పెంచి, అధికం చేసి అల్లాహ్ ప్రసాదిస్తాడు. కావున దీన్ని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ రమదాన్ మాసంలో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు. డబ్బు రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ధన రూపంలో, భూమి రూపంలో, వ్యాపార రూపంలో జకాత్ చెల్లించడానికి ప్రతి వ్యక్తి అర్హుడు కాకపోవచ్చు. కాకపోతే ఈ రూపాలలో, జిక్ర్ ద్వారా సదకా, దీనిని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ మాసంలో అత్యధికంగా మనము ఈ రకానికి సంబంధించిన సదకా చేసుకోవాలి.

అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

اَلأَمْرُ بِالْمَعْرُوفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(అల్ అమ్ రు బిల్ మ’అరూఫ్ వ నహ్యు అనిల్ మున్కర్ సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడు నుండి నివారించడం కూడా సదకా.

మంచిని ఆజ్ఞాపించటం, చెడుని ఆపటం కూడా సదకా. మంచి చేయమని చెప్పటం కూడా సదకా అవుతుంది. చెడుని ఆపటం కూడా సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఓ హదీస్ లో ఇలా ఉంది:

إِمَاطَتُكَ الْحَجَرَ وَالشَّوْكَ وَالْعَظْمَ عَنِ الطَّرِيقِ لَكَ صَدَقَةٌ
(ఇమాతతుకల్ హజర్ వష్షౌక్ వల్ అజ్మ్ అనిత్తరీఖి సదఖతున్ లక్)
దారి నుండి రాయిని, ముల్లును మరియు ఎముకను తొలగించడం నీ కోసం సదకా అవుతుంది.

దారి నుండి రాళ్లను, ఆ దారి నుండి ముళ్ళను, అలాగే ఎముకల్ని, దారి నుండి తొలగించడం నీ కోసం సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అంధులకి దారి చూపటం, అలాగే చెవిటి, మూగ వారికి విషయం బోధపరచడం కూడా సదకా అవుతుంది.

అలాగే ఏదైనా ప్రాణికి నీరు త్రాపించడం కూడా సదకా. కష్టాల్లో, అవసరాల్లో ఉన్న వారికి సహాయపడటం సదకా. చివరికి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

نَفَقَةُ الرَّجُلِ عَلَى أَهْلِهِ صَدَقَةٌ
(నఫఖతుర్రజులి అలా అహ్లిహీ సదఖహ్)
ఒక వ్యక్తి తన కుటుంబంపై చేసే ఖర్చు కూడా సదకా.

వ్యక్తి తన ఇంటి వారిని, భార్యా పిల్లలను పోషించటం కూడా సదకా అన్నారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఆదేశానుసారం, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, ఆయన సున్నత్ ని అనుసరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో దైవ ప్రసన్నత కోసం భార్యను పోషిస్తే, పిల్లల్ని పోషిస్తే, అది కూడా సదకా క్రిందకి లెక్కించబడుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఇంకో హదీస్ లో:
مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا … إِلاَّ كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً
(మా మిన్ ముస్లిమిన్ యగ్రిసు గర్సన్ … ఇల్లా కాన మా ఉకిల మిన్హు లహూ సదఖహ్)
ఏ ముస్లిమైనా ఒక మొక్కను నాటితే… దాని నుండి తినబడిన ప్రతి దానికీ అతనికి సదకా పుణ్యం లభిస్తుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఒక చెట్టును నాటుతాడు. నాటిన తర్వాత, ఆ చెట్టు నుంచి ప్రయోజనం పొందే, లాభం పొందే ఆ ప్రతి వ్యక్తికి బదులుగా ఆ చెట్టు నాటిన వ్యక్తికి సదకా వస్తుంది. సదకా అంత పుణ్యం వస్తుంది. అంటే, ఏ వ్యక్తి అయితే చెట్టు నాటుతాడో, చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ద్వారా కొందరు నీడ తీసుకుంటారు, నీడలో కూర్చుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. అది కూడా సదకా. ఆ చెట్టు ఫలం ఎవరైతే తింటారో అది కూడా సదకా క్రిందికి వస్తుంది.

అభిమాన సోదరులారా, అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, దారి నుండి హాని కలిపించే, ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించటం కూడా సదకా క్రిందికి వస్తుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో, మూడు రకాల సదకా ఉంది. అది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మూడు రకాల సదకాలు ఉన్నాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِذَا مَاتَ ابْنُ آدَمَ انْقَطَعَ عَمَلُهُ إِلاَّ مِنْ ثَلاثٍ
(ఇదా మాత ఇబ్ను ఆదమ ఇన్ఖత’అ అమలుహు ఇల్లా మిన్ సలాస్)
ఆదం సంతతి వాడు (మానవుడు) మరణించినప్పుడు, అతని కర్మలు మూడు విషయాలు తప్ప ఆగిపోతాయి.

ఆదం సంతతికి చెందినవాడు అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, చనిపోయిన తర్వాత కర్మలు అంతమైపోతాయి. ఇప్పుడు అతనికి పాపం, పుణ్యం అనేది ఉండదు, మనిషి చనిపోయాడు. చనిపోక ముందు వరకే కదా, పాపం చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, సదాచరణ చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఇలా కర్మలు చేయటం అనేది చావు వరకు. చనిపోయిన తర్వాత ప్రతిఫలం మాత్రమే గాని, కర్మ అనేది ఉండదు.

ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, అతని అమల్ (కర్మ) ఇన్ఖతా అయిపోతుంది, కట్ అయిపోతుంది. మూడు విషయాలు తప్ప అన్నారు ప్రవక్త గారు, ఇది గమనించాల్సిన విషయం. మూడు విషయాలు తప్ప.

ఒకటి,

صَدَقَةٌ جَارِيَةٌ
(సదఖతున్ జారియహ్)
నిరంతరం కొనసాగే దానం (సదకా-ఎ-జారియా).

ఎటువంటి సదకా అంటే అది జారియాగా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ ఉన్నంతకాలం, ఆ మస్జిద్ లో నమాజ్ జరిగేంతకాలం ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మస్జిద్ నిర్మించడం, మద్రసా నిర్మించడం, వృక్షాలు నాటటం, బావి త్రవ్వించడం, ఈ విధంగా. దీనికి సదకా జారియా అంటారు. పుణ్యం లభిస్తూనే ఉంటుంది, అది ఉన్నంత వరకు.

రెండవది,

عِلْمٌ يُنْتَفَعُ بِهِ
(ఇల్మున్ యున్తఫ’ఉ బిహీ)
ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం.

ప్రజలకు విద్యాబోధన చేయటం, విద్య నేర్పించటం, ప్రజలకు సన్మార్గం చూపే గ్రంథాలు రాయటం, విద్యార్థులను తయారు చేయటం. అంటే, జ్ఞానం అన్నమాట. ఏ వ్యక్తి అయితే జ్ఞానం వదిలిపోతాడో, విద్య వదిలిపోతాడో. అది చాలా రకాలుగా ఉండవచ్చు. ఒకటి, తన విద్యార్థులను వదిలి వెళ్ళాడు, నేర్పించి పోయాడు. ఖురాన్ ని, హదీస్ ని, అల్లాహ్ వాక్యాలను, ప్రవక్త గారి ప్రవచనాలను, దీన్ నేర్పించి పోయాడు. అతని శిష్యులు వేరే వారికి నేర్పుతారు, వారు వేరే వారికి నేర్పుతారు. ఈ చైన్ సాగుతూనే ఉంటుంది ప్రళయం వరకు. అప్పటి వరకు ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి రాసిపోయాడు, కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివి చాలా మంది సన్మార్గం పొందుతున్నారు, మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, పాపం నుంచి ఆగిపోతున్నారు. మరి ఆ పుస్తకం ఉన్నంతవరకు, ఆ పుస్తకాల ద్వారా నేర్చుకునే వారందరి వల్ల ఆ వ్యక్తికి పుణ్యం పోతూనే ఉంటుంది.

మూడవది,

وَلَدٌ صَالِحٌ يَدْعُو لَهُ
(వలదున్ సాలిహున్ యద్’ఊ లహూ)
అతని కోసం ప్రార్థించే సజ్జనుడైన సంతానం.

తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం. అంటే అమ్మ నాన్న కోసం దుఆ చేసే సంతానం. మరి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ ఎప్పుడు చేస్తారండీ? వారికి మనము ఆ విధంగా తయారు చేయాలి, నేర్పించాలి. వారికి దీన్ నేర్పించాలి, హలాల్ నేర్పించాలి, హరాం అంటే ఏమిటో తెలియజేయాలి, ఖురాన్ నేర్పించాలి, ఇస్లాం అంటే ఏమిటో వారికి నేర్పించాలి. వారికి మనము నేర్పిస్తే, అటువంటి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ చేస్తూ ఉంటుంది. ఆ సంతానం దుఆ చేస్తూ ఉంటే, దాని పుణ్యం అమ్మ నాన్న చనిపోయినా కూడా పుణ్యం పోతూనే ఉంటుంది. ఈ మూడు రకాల సదకాలు మనిషి మరణం తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. సదకా జారియా, రెండవది ఇల్మ్, మూడవది సంతానం.

అభిమాన సోదరులారా, రమదాన్ కి సంబంధించిన మరెన్నో విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَصَلَّى اللهُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
(వ సల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ సహ్ బిహీ అజ్ మ’ఈన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43591

సహనం ప్రయోజనాలు – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహనం ప్రయోజనాలు
https://youtu.be/gxR-9kJ-B6g [45 నిముషాలు]
వక్త: షేఖ్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.

దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే,

سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
(సలామున్ అలైకుం బిమా సబర్ తుం ఫ ని’అమ ఉఖ్బద్ దార్)

“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)

సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.

అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,

إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
(ఇన్నీ జజైతుహుముల్ యౌమ బిమా సబరూ అన్నహుం హుముల్ ఫాయిజూన్)

నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్‌ సెలవిస్తాడు).” (23:111)

అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.

అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.

కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,

وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
(వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్)
సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)

అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.

సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.

అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్ సాబిరీన్)
సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.” (8:46)

సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.

అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్)
సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.” (39:10)

అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.

ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.

అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.

సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ
(వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్)
“సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)

అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.

అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?

وَبَشِّرِ الصَّابِرِينَ. الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
(వబష్షిరిస్ సాబిరీన్. అల్లజీన ఇజా అసాబత్ హుం ముసీబతున్ ఖాలూ ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఉలాయిక అలైహిం సలవాతుమ్ మిర్ రబ్బిహిం వ రహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్)

ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)

ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.

అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.

అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్. మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.

అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.

కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.

అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.

మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
(వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహీ వనహన్ నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మ’అవా)

మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)

ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.

అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.

మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا
(ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా)
ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)

మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.

ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.

అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.

కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.

సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(వలమ్మా బరజూ లిజాలూత వ జునూదిహీ ఖాలూ రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్)

వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)

ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.

నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,

وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(వస్బిర్ వమా సబ్ రుక ఇల్లా బిల్లాహ్ వలా తహ్జన్ అలైహిం వలా తకు ఫీ జైకిమ్ మిమ్మా యమ్కురూన్)

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.

అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.

కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.

ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
(వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా)
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)

వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.

అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.

ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,

మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా.
విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.

అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.

దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?

ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.

చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.

మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.

ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.

అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43525