యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో | టెక్స్ట్]

యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/dTlJikQ_EoE [30 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త యాఖూబ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర వివరించబడింది. ఆయన వంశం, ఆయన తండ్రి ఇస్ హాఖ్ (అలైహిస్సలాం) మరియు తాత ఇబ్రాహీం (అలైహిస్సలాం కూడా ప్రవక్తలేనని ప్రస్తావించబడింది. యాఖూబ్ (అలైహిస్సలాం) తన మామయ్య కుమార్తెలు లయ్యా మరియు రాహీల్ లను వివాహం చేసుకున్న వృత్తాంతం, ఆయనకు 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె పుట్టిన వివరాలు ఇవ్వబడ్డాయి. ఆయన తన ప్రయాణంలో కన్న కల, దాని ఆధారంగా ఒక పుణ్యక్షేత్రం (బైతుల్ మఖ్దిస్) నిర్మిస్తానని మొక్కుకున్న సంఘటన, మరియు ఆ మొక్కును నెరవేర్చిన విధానం కూడా వివరించబడింది. చివరగా, ప్రవక్తలు వారి జాతి కోసమే పంపబడ్డారని, కేవలం ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాత్రమే యావత్ మానవాళి కోసం పంపబడ్డారని స్పష్టం చేయబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِيْنَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు.

وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَ الْمُرْسَلِيْنَ
[వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్]
మరియు ప్రవక్తలలో శ్రేష్ఠుడు మరియు ప్రవక్తల నాయకునిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.

نَبِيِّنَا مُحَمَّدٍ وَّ عَلَى آلِهِ وَ أَصْحَابِهِ أَجْمَعِيْنَ
[నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై మరియు వారి అనుచరులందరిపై శుభాలు కలుగుగాక.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَ رَحْمَةُ اللهِ وَ بَرَكَاتُهُ
[అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక మహా ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన స్వయంగా ఒక ప్రవక్త, ఆయన తండ్రి కూడా ఒక ప్రవక్త, ఆయన తాత కూడా ప్రవక్త. ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించాడు, అయితే సంతానము తరఫున ఆయనకు పరీక్షలు కూడా ఎదురయ్యాయి. సంతానం విషయంలో ఆయన ఎంతగా దుఃఖించారంటే, చివరికి ఆయన కళ్ళు తెల్లబడిపోయి కంటిచూపుకి ఆయన దూరమైపోయారు. ఎవరాయన అంటే, ఆయనే ప్రవక్త యాఖూబ్ అలైహిస్సలాం వారు.

యాఖూబ్ అలైహిస్సలాం వారు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి కుమారుడు. ఇస్ హాఖ్ అలైహిస్సలాం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుడు. ఆ ప్రకారంగా యాఖూబ్ అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇస్ హాఖ్ అలైహిస్సలాం కూడా ప్రవక్త, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారి తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు కూడా ప్రవక్త కాబట్టి, నేను ప్రారంభంలో ఆ విధంగా మాట్లాడాను.

ఇక రండి, యాఖూబ్ అలైహిస్సలాం వారి చరిత్ర మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం విన్నట్టుగా, యాఖూబ్ అలైహిస్సలాం వారి తండ్రి పేరు ఇస్ హాఖ్ అలైహిస్సలాం. ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి మనవడు అవుతాడు. యాఖూబ్ అలైహిస్సలాం వారి తల్లి పేరు రిఫ్కా, తెలుగులో రిబ్కా అని అనువాదము చేయబడి ఉంది.

రిబ్కాతో వివాహం జరిగిన తరువాత, ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సంతానం కోసమో ప్రార్థన చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఇద్దరు కుమారుల్ని ప్రసాదించాడు. ఒక కుమారుని పేరు ఈస్ (ఈసు అని కూడా చెబుతూ ఉంటారు), రెండవ కుమారుని పేరు యాఖూబ్. అయితే చరిత్రకారులు వీరిద్దరి గురించి తెలియజేస్తూ ఏమన్నారంటే, ఈస్ పెద్ద కుమారుడు, యాఖూబ్ చిన్న కుమారుడు. అయితే ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏమిటంటే, ఈస్ శరీరం మీద వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి, యాఖూబ్ శరీరం మీద వెంట్రుకలు ఉండేవి కావు. ఈస్ వారిని ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ఎక్కువగా అభిమానించేవారు, యాఖూబ్ వారిని రిబ్కా ఎక్కువగా అభిమానించేవారు అని చరిత్రకారులు తెలియజేశారు, అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.

ఇకపోతే, ఆ పుట్టిన ఇద్దరు కుమారులు, ఈస్ మరియు యాఖూబ్, ఇద్దరూ కూడా పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు ఇస్ హాఖ్ అలైహిస్సలాం వారు ముసలివారైపోయారు, వృద్ధాప్యానికి చేరుకున్నారు, ఆయన కంటిచూపు క్షీణించింది. ఇద్దరు కుమారులు పెరిగి పెద్దవారైన తరువాత, వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగింది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయము జరిగినప్పుడు, తల్లి రిబ్కా యాఖూబ్ వారిని పిలిచి, “చూడబ్బాయ్, నీవు నీ మామయ్య ఇంటి వద్దకు వెళ్ళిపో.” అంటే యాఖూబ్ అలైహిస్సలాం వారి మామయ్య హరాన్ అనే ఒక ప్రదేశంలో ఉండేవారు, అక్కడికి వెళ్ళిపోమని తల్లి రిబ్కా యాఖూబ్ అలైహిస్సలాం వారికి పురమాయించారు.

వ్యభిచారం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

వ్యభిచారం (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/OIK2VedWGQA (16 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో వ్యభిచారం (జినా) యొక్క నిషేధం గురించి, దాని తీవ్రత, అది దారితీసే మార్గాలను ఇస్లాం ఎలా నిరోధిస్తుంది, మరియు ఈ పాపానికి పాల్పడిన వారికి ప్రపంచంలో మరియు మరణానంతరం విధించబడే కఠిన శిక్షల గురించి చర్చించబడింది. హిజాబ్ (పరదా) యొక్క ఆవశ్యకత, చూపులను అదుపులో ఉంచుకోవడం, మరియు ఒంటరిగా పర స్త్రీ-పురుషులు కలవడాన్ని ఇస్లాం ఎందుకు నిషేధించిందో వివరించబడింది. వివాహితులు మరియు అవివాహితులు చేసే వ్యభిచారానికి గల శిక్షలలో తేడా, వృద్ధాప్యంలో ఈ పాపానికి పాల్పడటం యొక్క తీవ్రత, మరియు పేదరికాన్ని కారణంగా చూపి ఈ పాపంలో మునిగిపోవడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టం చేయబడింది. ఆధునిక సమాజంలో వ్యభిచారానికి దారితీసే కారణాలను వివరిస్తూ, ఈ చెడు నుండి దూరంగా ఉండేందుకు అల్లాహ్‌ను ప్రార్థించడం జరిగింది.

ఇక రండి ఈనాటి కాలంలో చాలా ప్రబలుతున్నటువంటి, ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, నెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఏ నిషేధాల్లో అనేకమంది ప్రజలు పడుతున్నారో దాని గురించి తెలుసుకుందాము. అది వ్యభిచారం.

ఇస్లాం ధర్మ ఉద్దేశాల్లో మానము మరియు గౌరవముల రక్షణ మరియు సంతానోత్పత్తి రక్షణ చాలా ముఖ్యమైనది. అందుకే ఇస్లాం వ్యభిచారాన్ని నిషేధించింది. అల్లాహ్ త’ఆలా సూరత్ బనీ ఇస్రాయీల్ ఆయత్ నంబర్ 32 లో తెలిపాడు,

وَلَا تَقْرَبُوا الزِّنَا ۖ إِنَّهُ كَانَ فَاحِشَةً وَسَاءَ سَبِيلًا
వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు సుమా! ఎందుకంటే అది నీతి బాహ్యమైన చేష్ట. మహా చెడ్డమార్గం” (17:32)

వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకండి. ఇక్కడ గమనించండి ఆయతులో ‘లా తఖ్రబు’ అని చెప్పబడింది. ‘లా తజ్నూ’ వ్యభిచారం చేయకండి అని డైరెక్ట్ గా చెప్పలేదు. ‘లా తఖ్రబు’ అంటే ఆ వ్యభిచారం వరకు చేర్పించే ఏ ఏ మార్గాలు ఉంటాయో అవన్నిటినీ వదులుకోండి, వాటి దగ్గరికి వెళ్ళకండి.

నిశ్చయంగా అది అతి దుష్టకార్యం మరియు చాలా బహు చెడ్డ మార్గం. షేక్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఈ రెండు పదాల యొక్క మంచి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు. ఎందుకు దీనిని చెడ్డ మార్గం అనడం జరిగింది? ఎందుకు దీనిని అశ్లీలం, అతి దుష్టకార్యం అని చెప్పడం జరిగింది? అయితే సోదర మహాశయులారా, ఇన్షాఅల్లాహ్ దానికి సంబంధించి ప్రత్యేకమైన దర్స్ ఇచ్చినప్పుడు ఇంకా వివరాలు విందాము.

సర్వసామాన్యంగా వ్యభిచారానికి పాల్పడే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? దానికంటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించనందువల్ల. అందుకే దాని వరకు చేర్పించే మార్గాలను ఇస్లాం నిషేధించింది. దాని వరకు చేర్పించే సాధనాలను కూడా మూసివేసింది.

ఈ మార్గాలను, వ్యభిచారం వరకు చేర్పించే సాధనాలను ఏదైతే మూసివేశాడో, వాటిలో ఒకటి ఏమిటి? అల్లాహ్ త’ఆలా హిజాబ్ యొక్క ఆదేశం ఇచ్చాడు, పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకంగా దీనిని కూడా హెడ్ లైన్ గా, రెడ్ లైన్ గా, రెడ్ కలర్ లో ఇచ్చి దానికి లింక్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ మన సమాజంలో ప్రబలి ఉన్నటువంటి గోదీ మీడియా అనండి లేదా స్వార్థపరులైన పత్రికా రిప్రజెంటేటివ్స్, టీవీ ఛానల్స్ వాళ్ళు ఇస్లాం జ్ఞానం మొత్తానికే లేదు వారికి, ఇస్లాంలో ఎక్కడా కూడా పరదా యొక్క ఆదేశం లేదు అని అంటారు, అస్తగ్ఫిరుల్లాహ్.

ఇక్కడ చూడండి, సూరతుల్ అహ్ జాబ్, సూరా నంబర్ 33, ఆయత్ నంబర్ 53. అలాగే సూరతుల్ అహ్ జాబ్ ఆయత్ నంబర్ 59 లో అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం ఇచ్చాడు. ఈ ఆదేశం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు స్త్రీలతో ఏదైనా అడగాలనుకుంటే,

فَسْـَٔلُوْهُنَّ مِنْ وَّرَاۤءِ حِجَابٍ
(ఫస్ అలూహున్న మివ్ వరా’ఇ హిజాబ్)
“పరదా వెనుక ఉండి అడగాలి.” (33:53)

హిజాబ్ వెనుక ఉండి అడగాలి. ముంగటగా అటు ఒక స్త్రీ ఉంది, ఇటు నేను ఉన్నాను, డైరెక్ట్ గా అడగకూడదు. ఏదైనా ఇద్దరి మధ్యలో అడ్డు ఉండాలి, పరదా ఉండాలి, హిజాబ్ ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ‘ఫస్ అలూహున్న’ అనేది అమ్ర్ (ఆర్డర్, ఆదేశం). అంతేకాకుండా ‘మివ్ వరా’ఇ హిజాబ్’ అని చెప్పాడు అల్లాహ్ త’ఆలా. ఇది డైరెక్ట్ ఆదేశమే ఉన్నది. ఇక ఖుర్ఆన్లో ఎక్కడా కూడా పరదా ఆదేశం లేదు అని అంటారు? ఇది వారి యొక్క అజ్ఞానం. వాస్తవానికి ఇది వారి యొక్క అజ్ఞానం.

అలాగే సోదర మహాశయులారా, సోదరీమణులారా, మరొక విషయం చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఆయత్ నంబర్ 59 లో కనబడుతుంది. అక్కడ అల్లాహ్ త’ఆలా అంటున్నాడు,

قُلْ
(ఖుల్)
“ఓ ప్రవక్త, మీరు చెప్పండి.” (33:59)

వారికి ఆదేశం ఇవ్వండి. ఎంత స్పష్టంగా ఉంది! చెప్పండి, ఆదేశం ఇవ్వండి,

يُدْنِيْنَ عَلَيْهِنَّ مِنْ جَلَابِيْبِهِنَّ
(యుద్నీన అలైహిన్న మిన్ జలాబీబిహిన్)
“తమ దుపట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని.” (33:59)

ఆదేశం ఇవ్వండి అని ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత, ఇది ఇష్టంపై ఆధారపడి ఉంది అని ఎలా చెప్పగలుగుతాము? మరియు వాటన్నిటికంటే ముందు ఎక్కడైనా ఏదైనా అవసరంతో ఎవరైనా స్త్రీ బయటికి వెళ్లాలంటే స్త్రీల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? పురుషుల యొక్క చూపులు ఎక్కడ ఉండాలి? సూరతున్ నూర్, ఆయత్ నంబర్ 31లో స్పష్టంగా చెప్పడం జరిగింది.

మన యొక్క ఈనాటి అంశం పరదా గురించి కాదు, కానీ మాట వచ్చింది గనుక కొన్ని వివరాలను మీకు తెలియజేశాను. ఇవి సరిపోతాయి, మరిన్ని మీరు అక్కడ లింక్ ని క్లిక్ చేసి ఇన్షాఅల్లాహ్ తెలుసుకోవచ్చు. ప్రత్యేకంగా ‘సాధనాలను’ అని ఏదైతే మీరు పదం చూస్తున్నారో రెడ్ కలర్ లో, దాన్ని క్లిక్ చేస్తే పరదాకు సంబంధించిన పూర్తి ఒక వీడియో మీకు ఇన్షాఅల్లాహ్ ఓపెన్ అవుతుంది.

వ్యభిచారం వరకు చేరవేసే సాధనాలను, అక్కడి వరకు కూడా చేరుకోకూడదు అని అల్లాహ్ త’ఆలా పరదా యొక్క ఆదేశం చాలా స్పష్టంగా ఇచ్చాడు. చూపులను క్రిందికి ఉంచాలి అని ఆదేశం ఇచ్చాడు. పరస్త్రీలతో ఒంటరిగా, ఏకాంతంలో ఉండడాన్ని నిషేధించాడు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇన్ని కండిషన్లను దాటేసి, మితిమీరి వ్యభిచారానికి పాల్పడ్డాడంటే, ఇక వారికి శిక్ష విధించడం జరిగింది. ఈ శిక్ష వారు చేసుకున్న కర్మలకు ఫలితంగా మరియు ఆ శిక్ష అందరి ముందు ఇవ్వాలని చెప్పడం జరిగింది, ఇతరులందరికీ కూడా గుణపాఠం లభించాలని.

శ్రద్ధగా వినండి. వివాహితుడైన వ్యభిచారికి అతి కఠినమైన శిక్ష విధించింది ఇస్లాం. అతను చనిపోయేవరకు అతనిపై రాళ్లు రువ్వబడాలి. ఎందుకంటే తాను చేసిన చెడు కార్యపు ఫలితాన్ని అతడు చవి చూడాలి. అతని శరీరము యొక్క ప్రతీ భాగం, అంగం ఆ నిషిద్ధ కార్యం చేస్తూ ఎలా సుఖాన్ని అనుభవించినదో, అలాగే ఈ శిక్ష ద్వారా బాధను, నొప్పిని అనుభవించాలి. ఇది ఎవరి కొరకు? వివాహితుడైన, పెళ్లి అయిన తర్వాత భార్యతో అతడు సంసారం చేసేసాడు, ఆ తర్వాత మళ్లీ వ్యభిచారానికి పాల్పడ్డాడు, అలాంటి వానికి ఈ శిక్ష.

కానీ ఇక ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో, వివాహం కాని వ్యభిచారిపై వంద కొరడా దెబ్బల శిక్ష విధించాలి. ఇది ఇస్లామీయ శిక్షల్లో నియమించబడిన అతి ఎక్కువ శిక్ష. వేరే కొన్ని రకాల పాపాలకు కొన్ని రకాల కొరడా దెబ్బలు ఉన్నాయి, కానీ వాటి సంఖ్య తక్కువ. ఇక్కడ వివాహం కాని యువకుడు, యువతి వ్యభిచారానికి పాల్పడితే వంద కొరడా దెబ్బల శిక్ష, ఇది చాలా ఎక్కువ సంఖ్య, ఈనాటి ఈ పాపానికే విధించబడినది.

అంతేకాదు, విశ్వాసుల సమూహ సమక్షంలో అతనిపై ఈ శిక్ష విధించి, ఆ తర్వాత పూర్తి ఒక సంవత్సరం వరకు ఈ నేరానికి పాల్పడిన స్థలం నుండి దూరం చేసి మరింత అవమానం, అగౌరవం పాలు చేయాలి. ఇది ప్రాపంచిక శిక్ష.

చెప్పేకి ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వివాహితునికైనా, వివాహం కాని వానికైనా ఈ శిక్ష విధించాలని ఏదైతే చెప్పడం జరిగిందో, మనం సామాన్య మనుషులం, ఎవరికి ఇష్టం ఉంటే వారు ఆ విధంగా కాదు. ఒక ప్రభుత్వం, అధికారం చేతిలో ఉన్నవారు ఈ శిక్షను విధిస్తారు.

ఇక రండి, ఎవరైతే ఇహలోకంలో ఏదో రకంగా తప్పించుకున్నారు, శిక్ష పడలేదు, అలాంటి వారికి సమాధిలో ఎలాంటి ఘోరమైన శిక్ష ఉంటుందో గమనించండి.

పైన ఇరుకుగా, కింద వెడల్పుగా ఉండే కుండ లాంటి ఆవంలో వారు నగ్నంగా వేయబడతారు, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహుమ్మ అజిర్నా మిన్హు. ఓ అల్లాహ్ మమ్మల్ని రక్షించు ఇలాంటి పాపాల నుండి, ఇలాంటి శిక్షల నుండి. దాని కింద అగ్ని మండుతూ ఉంటుంది. అందులో జ్వాలలను ప్రజ్వలింప జేసినప్పుడల్లా వారు అరుస్తూ దాని నుండి బయట పడడానికి పైకి వస్తారు. కానీ అప్పుడే మంటలు చల్లారి వారు మళ్ళీ లోపలికి పడిపోతారు. ఇలా పైకి రావడం, జ్వాలలు ఎగిరినప్పుడు, అవి చల్లారినప్పుడు కిందికి పోవడం, అగ్నిలో కాలుతూ ఉండడం, అరుస్తూ ఉండడం, ఇది జరుగుతూనే ఉంటుంది ప్రళయం వరకు.

క్షణాల సుఖం కొరకు సంవత్సరాల తరబడి శిక్ష, ఇది ఏదైనా బుద్ధి జ్ఞానంలో వచ్చే మాటేనా? కానీ ప్రపంచ వ్యామోహంలో పడి, స్త్రీల యొక్క ఫితనాలలో పడి ఎందరో దీనికి పాల్పడుతున్నారు. ఎందరో స్త్రీలు సోషల్ మీడియాల ద్వారా ఇలాంటి పాపానికి పాల్పడుతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ప్రసాదించుగాక.

పరిస్థితి మరింత ఘోరంగా మారేది ఎప్పుడు? మనిషి వృద్ధాప్యానికి చేరుకొని సమాధికి సమీపించే సమయం వచ్చినప్పటికీ, అల్లాహ్ శిక్షించకుండా అతనికి ఇచ్చిన వ్యవధిని తౌబా కొరకు, అల్లాహ్ తో మాఫీ కొరకు ఉపయోగించుకోకుండా, దుర్వినియోగం చేసుకొని వ్యభిచారంలోనే మునిగి తేలుతున్నప్పుడు. ఏంటి ఆ విషయం? వినండి హదీస్ ద్వారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

ثَلَاثَةٌ لَا يُكَلِّمُهُمْ اللهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَا يَنْظُرُ إِلَيْهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ شَيْخٌ زَانٍ وَمَلِكٌ كَذَّابٌ وَعَائِلٌ مُسْتَكْبِرٌ

“ప్రళయదినాన ముగ్గురితో అల్లాహ్ మాట్లాడడు, వారిని శుద్ధపరచడు మరియు వారి వైపు చూడడు. వారికి కఠిన శిక్ష కలుగునుః వృద్ధ వ్యభిచారి. అబద్ధం పలికే రాజు. అహంకారం చూపే పేదవాడు”. (ముస్లిం 107).

గమనించారా? వృద్ధాప్యానికి చేరుకోబోతూ కూడా ఈ దుర్గుణాలకు దూరం కాకుంటే, అల్లాహ్ వైపు నుండి ఎంతటి కఠినమైన శిక్ష ఉందో గమనించండి.

సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఏ వ్యభిచారిణి తన వ్యభి చారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో అర్థ రాత్రి ఆకాశ ద్వారాలు తెరువ బడే సమయాన ఆమె దుఆ స్వకరించబడదు. (సహీహుల్ జామి 2971).

ఇక దీని గురించి మరొక విషయం, సంపదల్లో అతి చెడ్డది వ్యభిచార సంపద. ఈ రోజుల్లో ఎందరో దీనిని సంపాదన మార్గంగా చేసుకున్నారు. అల్లాహ్ హిదాయత్ ఇవ్వుగాక. అయితే అలాంటి సంపద చాలా చెడ్డది. ఏ వ్యభిచారిని తన వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదిస్తుందో, అర్ధరాత్రి ఆకాశ ద్వారాలు తెరువబడే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క దుఆలను అంగీకరించే సమయాన, అల్లాహ్ త’ఆలా అందరి యొక్క రోదనలను, వారి యొక్క ఆర్ధింపులను వింటున్న సమయాన ఆ వ్యభిచారి యొక్క దుఆ స్వీకరించబడదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన శిక్ష చూడండి ఇది కూడా. అందుకొరకు ఇలాంటి పాపాల నుండి స్వచ్ఛమైన తౌబా చేసికోవాలి.

ఇక పేదరికం, అవసరం కొందరంటారు కదా, పేదరికం ఉన్నది, ఎక్కడా మాకు ఏ మార్గం లేదు, మా బ్రతుకు తెరువు ఎలా గడవాలి, మేము చాలా గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాము, అందుకొరకే ఈ చెడుకు పాల్పడ్డాము. అయితే, పేదరికం, అవసరం అల్లాహ్ హద్దులను మీరడానికి ఎంతమాత్రం ధార్మిక సబబు కావు. అరబ్బుల్లో జాహిలియ్యత్ లో, ఇస్లాం రాకముందు అరబ్బులో ఒక సామెత ఉండేది, “స్వతంత్రు రాలైన స్త్రీ ఆకలిగొన్నప్పుడు తన రొమ్ముల వ్యాపారం చేసి (పాలు అమ్మి) తినదు అలాంటప్పుడు తన మానాన్ని అమ్మి ఎలా తింటుంది“.

నేటి కాలంలో ఈ అశ్లీల కార్యానికి ప్రతి ద్వారము తెరువబడింది. షైతాన్ తన మరియు తన అనుచరుల కుట్రలతో ఈ మార్గాలను సులభం చేశాడు. అవిధేయులు, దుష్టులు వానిని అనుసరించారు. ఇప్పుడు పరదా లేకుండా తిరగడం, చూపులు నలువైపుల్లో లేపి నిషిద్ధమైన వాటిని చూడటం, స్త్రీలు పురుషులు విచ్చలవిడిగా కలుసుకోవడం సర్వసాధారణమయ్యాయి. కామవాంఛల్ని రేకెత్తించే మ్యాగజిన్లు, నీలి చిత్రాలు సర్వసామాన్యమయ్యాయి. దుర్మార్గ ప్రదేశాలకు ప్రయాణాలు అధికమయ్యాయి. వేశ్యా గృహాలు లైసెన్సులు ఇచ్చి తెరువబడుతున్నాయి, అల్లాహు అక్బర్. ఎందుకంటే ఆర్థికంగా వారికి అందులో కమిషన్ దొరుకుతున్నాయని. మానభంగాలు పెచ్చరిల్లుతున్నాయి, అసంఖ్యాక అక్రమ సంతానాలు కలుగుతున్నాయి, అబార్షన్ల ద్వారా పిండాలను హతమార్చడం జరుగుతుంది.

ఓ అల్లాహ్, మేము నీ దయా కరుణ ద్వారా మా దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం కోరుతున్నాము. ఇంకా మా హృదయాలను శుద్ధపరచి, మా మానాలను కాపాడుము, మాకు నిషిద్ధ కార్యాలకు మధ్య పటిష్టమైన అడ్డు నిలుపుము. ఆమీన్. అందుకొరకే దుఆ చేసుకుంటూ ఉండాలి.

اَللّٰهُمَّ طَهِّرْ قُلُوْبَنَا
(అల్లాహుమ్మ తహ్హిర్ ఖులూబనా)
ఓ అల్లాహ్ మా హృదయాలను శుద్ధిపరచు

اَللّٰهُمَّ أَحْصِنْ فُرُوْجَنَا
(అల్లాహుమ్మ అహ్సిన్ ఫురూజనా)
మా మర్మాంగాలను కాపాడు.

ఓ అల్లాహ్ మా చూపులను మేము కిందికి వాలించి, కిందికి వేసి ఉండే విధంగా మాపై ఎల్లప్పుడూ భాగ్యం ప్రసాదించు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41181

వ్యభిచారం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి [వీడియో]

భర్త అక్రమ సంభంధం పెట్టుకొని చెడుపనులకు పాల్పడకుండా ఉండటానికి ఏదయినా దుఆ ఉందా? [వీడియో]

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

సమాధుల పూజ – ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [వీడియో | టెక్స్ట్]

సమాధుల పూజ (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/JEdmx9LRr78 (17 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, సమాధుల వద్ద జరిగే ఆరాధనల గురించి వివరించబడింది. ఇస్లాంలో సమాధుల పూజ తీవ్రంగా నిషిద్ధమని, అది పెద్ద షిర్క్ (బహుదైవారాధన) కిందకు వస్తుందని వక్త స్పష్టం చేశారు. చాలా మంది తాము కేవలం పుణ్యపురుషులను (ఔలియాలను) గౌరవిస్తున్నామని భావించినప్పటికీ, వారి చర్యలు ఆరాధన పరిధిలోకి వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. సమాధుల వద్ద సజ్దా (సాష్టాంగం) చేయడం, తవాఫ్ (ప్రదక్షిణ) చేయడం, మొక్కుబడులు చెల్లించడం, సహాయం కోసం ప్రార్థించడం వంటివి కేవలం అల్లాహ్‌కు మాత్రమే చేయాల్సిన ఆరాధనలని ఉద్ఘాటించారు. ఆపదలను తొలగించి, అవసరాలు తీర్చే శక్తి కేవలం అల్లాహ్‌కు మాత్రమే ఉందని, చనిపోయిన వారు వినలేరని, సమాధానం ఇవ్వలేరని ఖురాన్ ఆయతుల ద్వారా స్పష్టం చేశారు. అల్లాహ్‌ను కాదని ఇతరులను ప్రార్థిస్తూ మరణించిన వారు నరకానికి వెళ్తారని ప్రవక్త హదీసును ఉటంకించారు. ముస్లింలు ఇలాంటి షిర్క్ చర్యలకు దూరంగా ఉండి, ఏకైక దైవమైన అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

సమాధుల పూజ. అల్లాహు అక్బర్. బహుశా కొందరు మన మిత్రులు ఈ మాట విని కోపానికి వస్తారు కావచ్చు. కొందరంటారు – “ఏంటి మేము ఔలియాలను గౌరవిస్తాము, ప్రవక్తలను గౌరవిస్తాము, ఎవరైతే షహీద్ అయిపోయారో, పుణ్య పురుషులు ఉన్నారో వారిని గౌరవిస్తాము. మీరు సమాధుల పూజ అని అంటారా?” కానీ వాస్తవంగా ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. చదవండి, వినండి, శ్రద్ధ వహించండి.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2] [మరణానంతర జీవితం – పార్ట్ 56] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షలు [పార్ట్ 2]
[మరణానంతర జీవితం – పార్ట్ 56] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=EB7-tLfxGug
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హామిదన్ వముసల్లియన్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

నరకం, నరకవాసులు, వారికి ఇవ్వబడే శిక్షల గురించి మనం తెలుసుకుంటున్నాము. నరకంలో ఎందరో కాపలాదారులు ఉంటారు. వారందరి నాయకుడైన కాపలాదారి, వారందరికీ నాయకుడు అతని పేరు మాలిక్. ఖురాన్ లో ఆయన ప్రస్తావన వచ్చి ఉంది. నరకవాసులు ఆయన్ని పిలుస్తూ, అల్లాహ్ తో చెప్పండి మమ్మల్ని ఈ నరకం నుండి బయటికి తీయాలి అని కోరుతారు. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇలా ప్రస్తావించాడు.

وَنَادَوْا يَا مَالِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّاكِثُونَ
(వనాదవ్ యా మాలికు లియఖ్ది అలైనా రబ్బుక్, ఖాల ఇన్నకుం మాకిసూన్)
(వారు అరుస్తూ ఉంటారు) “ఓ మాలిక్, నీ ప్రభువు మా పని సరిచేయాలని (మాకు మరణం ప్రసాదించాలని) వేడుకో.” దానికి అతను, “మీరు ఇక్కడే కలకాలం ఉండవలసిందే” అని జవాబిస్తాడు.

వారు అరుస్తూ ఉంటారు, “ఓ మాలిక్, మేము ఈ నరకంలో పడే శిక్షలు భరించలేనివి. మేము ఇక్కడనే నశించిపోవాలని నీ ప్రభువును కోరుకో.” అప్పుడు అతను ఏమంటాడు? “ఇలా మీ కోరికలు పూర్తి కావు. మీరు ఇక్కడే పడి ఉంటారు.” నరక కాపలాదారుల ఈ నాయకుడు చూడటానికి ఎంతో భయంకరంగా మరియు అతడు పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా నవ్వలేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

ఆ హదీసు సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో ఉల్లేఖించబడినది. సముర బిన్ జుందుబ్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన ఆ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన స్వప్నం గురించి తెలియజేశారు. మరియు ప్రవక్తలకు చూపబడే కలలు, స్వప్నలు వాస్తవము, నిజము అన్న విషయం మనకు తెలిసినదే. ప్రవక్త చెప్పారు, నేను ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నరకంలో. అక్కడ ఒక వ్యక్తిని మహా అసహ్యకరమైన ఆకారంలో చూశాను. మీలో ఎవరైనా అసహ్యకరమైన ఆకారం అంటే ఎంత అసహ్యకరమైన ఆకారం మీ మనసులో వస్తుందో అంతకంటే మరీ అసహ్యకరమైన ఆకారంలో నేను ఒకరిని చూశాను. అతడు నరకం వద్ద ఆ నరకాగ్నిని తేజింపజేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. “ఓ జిబ్రీల్ ఇతను ఎవరు?” అని నేను అడిగాను. తర్వాత నాకు సమాధానం ఇవ్వబడినది:

فَإِنَّهُ مَالِكٌ خَازِنُ النَّارِ
(ఫఇన్నహు మాలికున్ ఖాజినిన్నార్)
“ఇతనే మాలిక్, నరకం యొక్క కాపలాదారి.”

మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మేరాజ్ చేయించబడినప్పుడు, గగన ప్రయాణానికి వెళ్ళినప్పుడు, ప్రతీ ఆకాశంలో వెళ్ళినప్పుడు ఆ ఆకాశంలో ఉన్నవారు, ప్రవక్తలు గానీ, దైవదూతలు గానీ, ఎవరైనా అందరూ నవ్వు ముఖముతో, ఆనందంతో స్వాగతం పలుకుతూ వారితో సలాం దువాలు జరిగాయి. కానీ కేవలం ఒకే వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి అతని నుండి నేను దాటినప్పుడు సలాం చేశాను. “فَسَلَّمْتُ عَلَيْهِ فَرَدَّ عَلَيَّ السَّلَامَ” (ఫసల్లమ్తు అలైహి ఫరద్ద అలయ్యస్సలామ్) “నేను అతనికి సలాం చేస్తే, అతను నా సలాంకు జవాబు పలికాడు.” కానీ నవ్వలేదు. చిరు ముఖంతో, ఆనందంతో నాకు సమాధానం పలకలేదు. నాకు స్వాగతం కూడా పలికాడు కానీ అది కూడా నవ్వు ముఖం అనేది ఏ మాత్రం లేదు. అప్పుడు జిబ్రీల్ నాతో చెప్పారు, “యా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),

ذَاكَ مَالِكٌ خَازِنُ جَهَنَّمَ
(దాక మాలికున్ ఖాజిను జహన్నమ్)
“ఇతను జహన్నం (నరకం) యొక్క కాపలాదారి అయిన మాలిక్.”

لَمْ يَضْحَكْ مُنْذُ خُلِقَ
(లమ్ యద్-హక్ మున్దు ఖులిఖ్)
“అతను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నవ్వలేదు.”

وَلَوْ ضَحِكَ إِلَىٰ أَحَدٍ لَضَحِكَ إِلَيْكَ
(వలవ్ దహిక ఇలా అహదిన్ లదహిక ఇలైక్)
“అతను కనీసం ఏ ఒక్కరి వైపునైనా చూసి నవ్వి ఉండేదుంటే, ఆ ఒక్క వ్యక్తి నీవే అయి ఉండేవాడివి.”

కానీ అతను నీ వైపు కూడా చూసి నవ్వలేదు. ఇక గమనించండి, ఇంతటి ఘోరమైన కాపలా దారి, ఆ నరకం యొక్క కాపలా దారి, ఆ నరకంలో పడే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో, అది ఇంకా ముందుకు ఆ విషయాలు రానున్నాయి. కానీ ప్రస్తుతం నరకం, నరకం యొక్క వైశాల్యం మరియు నరకం, దాని యొక్క కాపలాదారులు, ఆ కాపలాదారులకు నాయకుడైన వాడు ఎలాంటివాడు, వారి యొక్క గుణగణాల గురించి మనం ప్రస్తుతం తెలుసుకుంటున్నాము.

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.

తాలూత్ & జాలూత్ – ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/mEfcvGUoA-Y [48 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్ ప్రజల చరిత్రను వివరించబడింది. యూషా బిన్ నూన్, ఇల్యాస్ మరియు యసా (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తల తరువాత, బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒక రాజును కోరగా, అల్లాహ్ తాలూత్‌ను నియమించాడు. జాలూత్ (గొలియత్)తో జరిగిన యుద్ధంలో, యువకుడైన దావూద్ (అలైహిస్సలాం) విజయం సాధించి, కాలక్రమేణా రాజుగా మరియు ప్రవక్తగా నియమితులయ్యారు. ఆయనకు “జబూర్” గ్రంథం ఇవ్వబడింది మరియు ఆయనకు పర్వతాలు, పక్షులతో పాటు అల్లాహ్‌ను కీర్తించే అద్భుతమైన స్వరం, ఇనుమును మెత్తగా చేసే శక్తి వంటి మహిమలు ప్రసాదించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్త మరియు రాజుగా న్యాయాన్ని ఎలా స్థాపించారో, ఒక సంఘటనలో తొందరపాటు తీర్పు ఇచ్చి ఎలా పశ్చాత్తాపపడ్డారో కూడా వివరించబడింది. ఆయన కుమారుడు సులేమాన్ (అలైహిస్సలాం) యొక్క జ్ఞానం, దావూద్ (అలైహిస్సలాం) యొక్క ఆరాధన, ఉపవాస పద్ధతి మరియు ఆయన మరణం గురించి కూడా చర్చించబడింది. ఈ ప్రసంగం నుండి న్యాయం, పశ్చాత్తాపం మరియు అల్లాహ్‌పై ఆధారపడటం వంటి గుణపాఠాలను నేర్చుకోవచ్చు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు

ఈనాటి ప్రసంగంలో మనము, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాము. ఇంతకు ముందు ప్రసంగాలలో, ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర వివరంగా తెలుసుకొని ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసే సమయానికి బనీ ఇస్రాయీల్ ప్రజలు 40 సంవత్సరాల కొరకు తీహ్ మైదానంలో మార్గభ్రష్టులై తిరుగుతూ ఉన్నారు. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి కోసము ఆకాశం నుండి మన్ సల్వా ఆహారము దింపుతున్నాడు, రాతి నుండి నీటి ఊటను ఉభకింపజేశాడు, మేఘాల నుండి నీడ ఏర్పాటు చేశాడు, ఆ విధంగా వారు ఆ మైదానంలో ఉంటున్నారు అనే విషయం వరకు మనకు తెలియజేయడం జరిగింది.

ఆ తర్వాత జరిగిన విషయాలు తెలుసుకుంటూ ఇన్ షా అల్లాహ్ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోకి మనము ప్రవేశిద్దాం. తీహ్ మైదానంలో ఉన్నప్పుడే మూసా అలైహిస్సలాం వారు మరణించారు. ఆ తీహ్ మైదానంలో ఉన్నప్పుడే హారూన్ అలైహిస్సలాం వారు కూడా మరణించారు. మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారిద్దరి మరణం తర్వాత బనీ ఇస్రాయీల్ వారికి యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు ప్రవక్తగా, బోధకునిగా దైవ వాక్యాలు బోధించుకుంటూ, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ, వారిని సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. 40 సంవత్సరాల గడువు పూర్తి అయ్యింది. తర్వాత ఆ మూర్ఖులు ఎవరైతే “యుద్ధంలో మేము ప్రవేశించలేము” అని వెనకడుగు వేశారో, “నీవు నీ ప్రభువు వెళ్లి యుద్ధం చేసుకోండి మేము ఇక్కడే కూర్చుని ఉంటాము” అని మూర్ఖత్వం ప్రదర్శించారో, వారందరూ కూడా మరణించారు. వారి బిడ్డలు ఇప్పుడు పెరిగి పెద్దవారై యువకులై ఉన్నారు. అంటే పూర్తిగా ఒక తరము గడిచిపోయింది. కొత్త తరము, ఉడుకు రక్తము ఎవరి శరీరాలలో ప్రవేశించి ఉందో, అలాంటి ఒక కొత్త తరము ఇప్పుడు ప్రపంచంలోకి ఉనికిలోకి వచ్చి ఉంది.

అలాంటి వారిని తీసుకుని యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు మళ్లీ అల్-ఖుద్స్, పాలస్తీనా వైపుకి ప్రయాణం ప్రారంభించారు. ఈసారి వారు దారి తప్పలేదు, ఎందుకంటే వారి మీద పెట్టబడిన ఆ 40 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయింది కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి మార్గం చూపించాడు. వారు ఏకంగా పాలస్తీనా దేశానికి అల్-ఖుద్స్ అనే నగరానికి వచ్చి చేరారు. ఇక, మాషా అల్లాహ్, యువకులు, ఉడుకు రక్తం, యుద్ధం కోసం సిద్ధమైపోండి అనగానే వారందరూ యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే అల్-ఖుద్స్ నగరంలో ఉన్న ప్రజలు లోపలే ఉండి చాలా రోజుల వరకు వారి సహనాన్ని పరీక్షించారు. అయినా గానీ వీరు వెనకాడగలేదు. చివరికి ఆ నగరము బనీ ఇస్రాయీల్ వారి చేతికి వచ్చేసింది. ఆ విధంగా బనీ ఇస్రాయీల్, ఇస్రాయీల్ సంతతి వారు అల్-ఖుద్స్ అనే నగరంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి మళ్లీ ఆ నగరము వారి సొంతమయ్యింది, వారి వశమయ్యింది.

ఆ తర్వాత యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు అక్కడ ఉన్నన్ని రోజులు వారికి దైవ వాక్యాలు, బోధనలు బోధించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆయన మరణించారు. యూషా బిన్ నూన్ అలైహిస్సలాం మరణించిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ లోపు మళ్లీ బనీ ఇస్రాయీల్ ప్రజలలో అవకతవకలు వచ్చేసాయి, వారు మళ్లీ మార్గభ్రష్టత్వానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లబ్నాన్ దేశంలో, ఇదే బనీ ఇస్రాయీల్ కు చెందిన కొంతమంది మళ్లీ మూర్ఖత్వం ప్రదర్శిస్తూ అక్కడ బాల్ అనే ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. ఆ విధంగా మళ్లీ బహుదైవారాధన, షిర్క్, విగ్రహారాధన ప్రారంభం చేసేశారు.

అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇల్యాస్ అలైహిస్సలాం వారిని వారి వద్దకు ప్రవక్తగా పంపించాడు. ఇల్యాస్ అలైహిస్సలాం లబ్నాన్ దేశంలో బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ వారిని సంస్కరించారు, అల్లాహ్ వైపు, అల్లాహ్ ఏకత్వం వైపు, తౌహీద్ వైపు వారిని పిలుపునిచ్చారు. ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం అనే మరో ప్రవక్త బనీ ఇస్రాయీల్ వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. అయితే యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారి గురించి, ఇల్యాస్ అలైహిస్సలాం వారి గురించి, యసా అలైహిస్సలాం వారి గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు కాబట్టి, నేను వారి గురించి ప్రత్యేకంగా ప్రసంగము చేయట్లేదు. ముఖ్యంగా వారి పేరు, వారు ఎవరి వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు, ఏ సందర్భంలో పంపించబడ్డారు అనే విషయం వరకు మాత్రమే చెప్పేసి మాటలు ముందుకు సాగిస్తున్నాను. ఈ విషయాన్ని మన మిత్రులు గమనించాలి.

అయితే ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం వారికి బనీ ఇస్రాయీల్ ప్రజల పగ్గాలు ఇవ్వబడ్డాయి. యసా అలైహిస్సలాం వారు కూడా చాలా చక్కగా దైవ వాక్యాలు బనీ ఇస్రాయీల్ వారికి బోధించుకుంటూ ముందుకు సాగారు. యసా అలైహిస్సలాం వారు మరణించిన తర్వాత, అప్పుడు బనీ ఇస్రాయీల్ మీద అల్లాహ్ తరపు నుంచి పెద్ద పెద్ద పరీక్షలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే యసా అలైహిస్సలాం వారి మరణం తర్వాత మళ్ళీ మరో ప్రవక్త వచ్చే లోపు ఈ మధ్య ఏ గ్యాప్ అయితే ఉందో, ఈ గ్యాప్ లో మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అంతే కాదండి, వారు పరస్పరం విభేదించుకుని గొడవలకు దిగారు. ఆ విధంగా పాపాల్లో మునిగిపోయారు, విభేదించుకుని గొడవలు పెట్టుకున్నారు. అలా చేసిన కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బుఖ్తె నసర్ అనే ఒక దౌర్జన్య పరిపాలకుడిని వారి మీదికి పంపించగా, ఆ బుఖ్తె నసర్ వచ్చి ఖుదుస్ మీద దండయాత్ర చేసి బనీ ఇస్రాయీల్ వారిని చాలా కఠినంగా అక్కడి నుంచి కొట్టి, చంపి తరిమేశాడు. అల్లాహు అక్బర్.

చరిత్ర చదువుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయండి, అంత కఠినంగా, అంత విచక్షణ రహితంగా బుఖ్తె నసర్ మరియు అతని సైన్యమైన అమాలిఖా ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ మీద విరుచుకుపడ్డారు. నలుమూలల నుండి వారి మీద విరుచుకుపడి వారిని అల్-ఖుదుస్ నుండి తరిమి తరిమి, వారిని చంపారు. ఆ విధంగా వారిని అక్కడి నుంచి తరిమి తరిమి వెళ్ళగొట్టారు. ఆ విధంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు అల్-ఖుదుస్ ప్రదేశాన్ని మళ్ళీ కోల్పోయారు, ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాలకు పారిపోయారు.

అయితే ఎప్పుడైతే ఈ బుఖ్తె నసర్ అనే రాజు వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల మీద దండయాత్ర చేసాడో, అల్-ఖుదుస్ నగరాన్ని సర్వనాశనం చేసాడో, బనీ ఇస్రాయీల్ ప్రజల్ని చెల్లాచెదురుగా తరిమేశాడో, ఆ సందర్భంలోనే బనీ ఇస్రాయీల్ ప్రజల వద్ద పవిత్రమైన జ్ఞాపకాలు, గుర్తులు కొన్ని ఉండేవి. ఒక పెట్టె ఉండేది వారి వద్ద, దానిని తాబూత్ అని అరబీలో అంటూ ఉంటారు. అందులో పవిత్రమైన కొన్ని గుర్తులు ఉండేవి. ఏముండేవి అంటే మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలకాలు ఉండేవి, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, కింద పడేస్తే సర్పం లాగా మారుతుంది, తర్వాత ముట్టుకుంటే మళ్ళీ కర్ర లాగా మారిపోతుంది అని విన్నాము కదా, ఆ కర్ర ఉండేది. హారూన్ అలైహిస్సలాం వారికి కూడా కొన్ని గుర్తులు అందులో ఉండేవి. అలాంటి ప్రవక్తల పవిత్రమైన కొన్ని గుర్తులు అందులో ఉండేవి. ఆ తాబూత్ పెట్టెను కూడా ఈ బుఖ్తె నసర్, అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయారు.

అయితే అలా జరిగిన తర్వాత మళ్లీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షమ్వీల్ అలైహిస్సలాం అనే ఒక ప్రవక్తను పంపించాడు. షమ్వీల్ అలైహిస్సలాం అనే ప్రవక్త ప్రభవించబడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజలలో ఉన్న వారి మార్గభ్రష్టత్వాన్ని దూరం చేశారు, వారి లోపాలను వారు మళ్ళీ పరిష్కరించారు, సంస్కరించారు. ఆ తర్వాత బనీ ఇస్రాయీల్ ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ అయితే విడిపోయి దూరదూరంగా ఉంటున్నారో వారందరినీ మళ్ళీ ప్రోగవ్వాలని పిలుపునిచ్చారు. షమ్వీల్ అలైహిస్సలాం వారి పిలుపుని ఆమోదిస్తూ బనీ ఇస్రాయీల్ వారు మళ్ళీ వచ్చి ఒకచోట ప్రోగయ్యారు.

వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రోగైన తర్వాత, రాను రాను వారి సంఖ్య పెరుగుతూ పోయింది. లక్షల్లో మళ్ళీ వారి సంఖ్య అక్కడ ఏర్పడిపోయింది. అప్పుడు బనీ ఇస్రాయీల్ ప్రజలకు ఒక ఆలోచన తట్టింది. అదేమిటి? మనకు బోధించడానికి, దైవ వాక్యాలు వినిపించి నేర్పించడానికి ప్రవక్త అయితే ఉన్నారు. కానీ మనకు ఒక రాజు కూడా ఉంటే బాగుండేది. ఆ రాజు సారధ్యంలో మేము యుద్ధాలు చేయగలము, మా ప్రాపంచిక సమస్యలను అతను బాగా చక్కగా పరిష్కరించగలడు, అలాగే మేము కోల్పోయిన ఆ పవిత్రమైన గుర్తులు, తాబూత్ పెట్టె, మళ్ళీ మనము తిరిగి సొంతం చేసుకోగలము అనే ఉద్దేశంతో షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఓ దైవ ప్రవక్త వారు, మా కోసము ఒక రాజుని నియమించండి. మీరైతే దైవ వాక్యాలు బోధిస్తున్నారు కానీ, ఒక రాజుని నియమిస్తే ఆ రాజు సారధ్యంలో మేము ప్రాపంచిక సమస్యలు పరిష్కరించుకుంటాము, కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందుతాము, కోల్పోయిన తాబూత్ పెట్టెను కూడా మళ్ళీ తిరిగి వశపరుచుకుంటాము అని కోరినప్పుడు, షమ్వీల్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ప్రజలతో ఏమన్నారంటే, చూడండి మీరు పెద్ద కోరిక కోరుతున్నారు. రాజును నియమించటం, ఆ తర్వాత జిహాద్ చేయటం మీ మీద విధి చేయటం జరిగితే మళ్ళీ మీరు మాట తప్పరాదు. ఒకవేళ మీరు మాట తప్పితే మళ్ళీ మీ మీద కఠినమైన శిక్షలు పడతాయి, జాగ్రత్త, మాట మార్చరు కదా అని అడిగారు. బనీ ఇస్రాయీల్ ప్రజలు లేదండి, మీరు రాజుని నియమించండి. యుద్ధం మా మీద విధి చేయండి చాలు, చూడండి మేము యుద్ధాలు ఎలా చేస్తామో అని పగడ్బాలు పలికారు. షమ్వీల్ అలైహిస్సలాం అల్లాహ్ తో దుఆ చేశారు.

అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధాన్ని విధి చేసేసాడు, ఫర్జ్ చేసేసాడు. ఆ తర్వాత వారి కోసము తాలూత్ ను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాజుగా విధించాడు. అయితే ఈ తాలూత్ ఎవరు అంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులలో బిన్యామీన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు కదండీ, ఆ బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఈ తాలూత్.

షమ్వీల్ అలైహిస్సలాం ప్రజల ముందరకు వచ్చి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ మీద యుద్ధం విధి చేసేసాడు, ఇక మీరు యుద్ధము చేయవచ్చు, అలాగే తాలూత్ ని అల్లాహ్ మీ కొరకు రాజుగా నియమించాడు. మీరు తాలూత్ ని రాజుగా ఎన్నుకోండి అన్నారు. అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఇదేమిటండి, మీరు తాలూత్ ని మనకు రాజుగా నియమించారు? బిన్యామీన్ వంశానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ మనకు రాజుగా నియమింపబడలేదే? మన యహూదా సంతానికి చెందిన వ్యక్తులే ఎప్పుడూ ఇప్పటివరకు కూడా రాజులుగా నియమించబడుతూ వచ్చారు అని అడిగారు. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి మరొక కుమారుని పేరు యహూదా. ఆ యహూదా సంతానానికి చెందిన వ్యక్తులే ఇప్పటివరకు రాజులుగా నియమించబడుతూ వస్తూ ఉండేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యహూదా సంతానానికి చెందిన వ్యక్తి కాకుండా, బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో, బనీ ఇస్రాయీల్ వారికి ఆశ్చర్యం కలిగింది. వెళ్లి షమ్వీల్ అలైహిస్సలాం వారి ముందర వారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, లేదండీ ఇది నా నిర్ణయము, నా ఎన్నిక కాదండీ, ఇది అల్లాహ్ యొక్క ఎన్నిక. అల్లాహ్ ఆయనను రాజుగా ఎన్నుకోవాలని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఆయనను ఎన్నుకోమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు అని చెప్పారు.

అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు నమ్మలేదు. మేము ఎలా నమ్మాలండి? ఇప్పటివరకు వస్తున్న పరంపరను కాకుండా వేరే కొత్త విషయాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు. మేము ఎలా నమ్మాలి? ఏదైనా నిదర్శనము మాకు చూపించండి అని అడిగారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, ఇది దైవ నిర్ణయము అని మీకు తెలియజేయడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా మీరు కోల్పోయిన ఆ తాబూత్ పెట్టెను మళ్ళీ మీ వద్దకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు, చూడండి అన్నారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశంతో దైవదూతలు ఆ అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయిన ఆ తాబూత్ పెట్టెను తిరిగి తీసుకుని వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల చేతికి అప్పగించారు. ఇంతకుముందు చెప్పాను కదండీ, ఆ తాబూత్ పెట్టెలో తౌరాత్ ఫలకాలు, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, హారూన్ అలైహిస్సలాం వారి గుర్తులు ఇలా పవిత్రమైన విషయాలు అందులో భద్రపరచబడి ఉండేవి. ఆ తాబూత్ పెట్టె వారి వద్ద ఉంటే వారికి మనశ్శాంతి కూడా లభించేది. ఆ తాబూత్ పెట్టెను వెంటపెట్టుకుని వెళ్లి వారు యుద్ధాలు కూడా చేసేవారు.

ఇలా ఎప్పుడైతే ఆ తాబూత్ పెట్టె తిరిగి మళ్ళీ వారి వద్దకు వచ్చిందో, అప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఇది దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అని. తర్వాత సంతోషంగా వారు తాలూత్ ని తమ నాయకునిగా, తమ రాజుగా ఎన్నుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా కోసం యుద్ధం విధి చేయండి, మేము యుద్ధము చేస్తాము, యుద్ధాలలో పాల్గొంటాము అని కోరిన వారు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధము విధి చేసేసాడో, లక్షల్లో ఉన్న వారి సంఖ్యలో నుంచి కేవలం 80,000 వ్యక్తులు మాత్రమే యుద్ధానికి సిద్ధమయ్యారు. మిగతా వారందరూ కూడా మాట మార్చేశారు.

ఎలాంటి ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు క్రితమే పగడ్బాలు పలికారు, గొప్పలు పలికారు, మేము యుద్ధాలు చేస్తాము అని. యుద్ధం విధి చేసేసిన తర్వాత, మేము యుద్ధము చేయము అని చేతులు దులుపుకున్నారు. వెళ్ళిపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. కానీ, మాట మీద నిలబడిన వారు 80,000 మాత్రమే. అయితే ఆ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉంటున్నారు, చిత్తశుద్ధితో నిలబడుతున్నారు అనేది లెక్క తేలలేదు. అయినా గానీ, తాలూత్ రాజు ఆ 80,000 మందిని వెంటపెట్టుకుని యుద్ధము కోసము బయలుదేరారు.

అయితే మనిషి లోపల ఎక్కడో ఒకచోట ఒక ఆలోచన, కంగారు అనేది ఉంది. లక్షల్లో బనీ ఇస్రాయీల్ ప్రజలు యుద్ధము చేయము అని వెనకడుగు వేసేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు అనేది లెక్క తేలలేదు. అయితే ఆ 80,000 లో నుంచి ఎంతమంది చిత్తశుద్ధి కలిగిన వారు ఉన్నారు అనేది తేల్చడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. వారు యుద్ధము కోసము తాలూత్ రాజుతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ ఉంటే దారిలో ఒక నది వచ్చింది. ఆ నది పేరు నెహ్రె ఉర్దున్, జోర్డాన్ నది. ఆ నది దాటుతున్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెట్టాడు. ఆ నది నీరు ఎవరూ కడుపునిండా తాగరాదు. ఒక గుడికెడు నీళ్లు తాగాలనుకుంటే తాగవచ్చు గానీ, అసలు తాగకుండా ఉంటేనే మంచిది. కడుపు నిండా అయితే అస్సలు తాగనే రాదు అని అల్లాహ్ పరీక్ష పెట్టేశాడు.

చూడండి, ప్రయాణంలో ఉన్నారు, బాగా దప్పిక, ఆకలితో ఉన్నారు. అలాంటప్పుడు మంచి నీరు కనిపించాయి. ఆ మంచి నీరు తాగవద్దు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిబంధన పెట్టాడు, పరీక్షించడానికి. అయితే నది దిగి నది అవతల వైపు దాటేసరికి 80,000 లో నుంచి కేవలం 313 వ్యక్తులు మాత్రమే నీళ్లు తాగలేదు, మిగతా వారందరూ కూడా కడుపు నిండా నీళ్లు తాగేశారు. దీని ద్వారా అర్థమైన విషయం ఏమిటంటే, ఆ 80,000 లో నుంచి కూడా చిత్తశుద్ధి కలిగిన వారు కేవలం 313 మంది మాత్రమే. మిగతా వారందరూ కూడా మాట మీద, చిత్తశుద్ధితో ఉన్నవారు కాదు అని తేలిపోయింది.

నది దాటిన తర్వాత, ఎప్పుడైతే వారు నది అవతల వైపుకి చేరుకున్నారో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కాళ్లు చేతులు నిరసించిపోయాయి. వారు కూర్చుండిపోయారు. రాజుతో, మహారాజా, ఇప్పుడు మేము యుద్ధంలో పాల్గొనలేము, మా శరీరంలో శక్తి లేకుండా పోయింది అని చేతులెత్తేశారు.

ఒక్కసారి ఆలోచించి చూడండి. 80,000 లో నుంచి కేవలం 313 మంది మాత్రమే నీళ్ళు తాగకుండా ఉన్నారు. ఆ 313 మందిని తీసుకుని వెళ్లి ఇప్పుడు పెద్ద సైన్యంతో యుద్ధం చేయాలంటే మామూలు విషయమా? ఆ 313 మంది ఎంత కంగారు పడిపోతారు అలాంటి సందర్భంలో? కానీ చిత్తశుద్ధి కలిగిన ఆ 313 మంది ఒకరినొకరు ఏమని మాట్లాడుకున్నారంటే, చూడండి మనము అల్లాహ్ మీద నమ్మకం కలిగి ఉన్నాము. మనకు పూర్వము కూడా తక్కువ సంఖ్యలో ఉన్న వారు అల్లాహ్ మీద నమ్మకంతో యుద్ధాలలో పాల్గొన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని ఆదుకుని విజయాల వరకు చేర్చాడు కాబట్టి, మనము కూడా అల్లాహ్ మీద భారం వేసి, అల్లాహ్ మీద నమ్మకంతో ముందుకు సాగుదాము, పదండి. వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మాకు అల్లాహ్ సహాయకుడిగా ఉన్నాడు, మేము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా విజయము సాధిస్తాము అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అక్కడి నుంచి ముందుకు సాగారు.

అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాల సంఖ్య 313 మంది. అదే విధంగా ఇక్కడ తాలూత్ రాజుతో పాటు చిత్తశుద్ధి కలిగి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వెళుతున్న వారి సంఖ్య కూడా 313. ఆ 313 మందిని తీసుకుని తాలూత్ రాజు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్ళిన తర్వాత శత్రు సైన్యం ఎదురుపడింది. ఎప్పుడైతే శత్రు సైన్యము ఎదురుపడిందో, అక్కడ చూస్తే శత్రు సైన్యంలో సైన్యము సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారి సైన్యాధిపతి, అతని అరబీ భాషలో జాలూత్ అంటారు, తెలుగులో గొలియత్ మరియు అలాగే ఆంగ్లంలో కూడా గొలియత్ అని అనువాదం చేసి ఉన్నారు. అరబీలో అయితే, ఉర్దూలో అయితే జాలూత్ అని అతని పేరు తెలపబడింది. అతను యుద్ధ వస్త్రాలు ధరించి, కత్తి పట్టుకుని, పెద్ద శరీర దేహము కలిగిన వాడు, ముందుకు వచ్చాడు. అతని దేహాన్ని, అతని ఎత్తును చూసి ఏ ఒక్కరూ కూడా అతని ముందుకు వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. అతను ముందుకు వచ్చి సవాలు విసిరాడు. మీ 313 మందిలో నుంచి నన్ను ఎదుర్కొనే మొనగాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే రండి ముందుకు చూద్దాము అని బిగ్గరగా సవాలు విసురుతూ ఉన్నాడు. ఎంతో గర్వాన్ని, ఎంతో అహంకారాన్ని ప్రదర్శిస్తూ, మీలో ఎవరైనా ఉన్నాడా, ఎవరికైనా దమ్ము ఉందా నన్ను ఎదుర్కోవడానికి అని సవాలు విసురుతూ ఉంటే, ఈ 313 మందిలో నుంచి 16 సంవత్సరాల ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. అతను ఎలాంటి యుద్ధ యుద్ధ వస్త్రాలు ధరించి లేడు. అతని చేతిలో చివరికి ఖడ్గము, కత్తి కూడా లేదు. చేతిలో ఒక తాడు ఉంది, మరొక చేతిలో కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి.

ఆ రాళ్లు, ఆ తాడు పట్టుకుని ముందుకు వస్తే, ఆ కుర్రాడిని చూసి ఆ జాలూత్ సేనాధిపతి పకపక నవ్వేసాడు. ఒరేయ్ బచ్చా, నీవు నన్ను ఎదుర్కొంటావా? నీ సైన్యంలో నీకంటే గొప్ప పెద్ద మొనగాడు ఎవడూ లేడా నన్ను ఎదుర్కోవడానికి? అని హేళన చేశాడు. అతను హేళన చేస్తూ ఉంటే, అతని వెనుక ఉన్న అతని సైన్యము నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ 16 ఏళ్ల కుర్రాడు తాడులో ఆ రాళ్లు పెట్టి గిరగిరా తిప్పి వేగంగా విసిరాడు. అవి ఎంత వేగంగా వచ్చి తగిలాయి అంటే చరిత్రకారులు తెలియజేశారు, మెరుపు వేగంతో ఆ రాళ్లు వచ్చి ఆ జాలూత్ నుదుటను బలంగా తాకాయి. ఒకదాని వెనుక ఒకటి వచ్చి తాకగానే ఆ గర్విస్తున్న ఆ జాలూత్ ఒక్కసారిగా వెనక్కి కూలి పడిపోయాడు. అలాగే ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ జాలూత్ సైన్యం మొత్తము భయపడిపోయింది, బిత్తరపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. చూస్తూ ఉండంగానే కంగారు పడిపోయిన, బిత్తరపోయిన, భయపడిపోయిన జాలూత్ సైన్యము పరాజయం పాలయ్యి పారిపోయారు. ఈ 313 మంది గెలుపు పొందారు, విజయము ఈ భక్తులకు, చిత్తశుద్ధి కలిగిన వారికి దక్కింది. అయితే ఆ 16 సంవత్సరాల కుర్రాడు ఎవరైతే జాలూత్ ని రాళ్లతో కొట్టి చంపేశాడో, అతను ఎవరంటే, ఆయనే దావూద్ అలైహిస్సలాం. అల్లాహు అక్బర్.

చూశారా? ఆయన పేరే దావూద్ అలైహిస్సలాం. దావూద్ అలైహిస్సలాం వారి చేతిలో ఆ జాలూత్ అనే సేనాధికారి మరణించాడు. విజయము ముస్లింలకు, చిత్తశుద్ధి కలిగిన ఈ భక్తులకు వరించింది అల్ హందులిల్లాహ్. అది చూసిన ఈ తాలూత్ రాజు, 313 మందిని వెనక పట్టుకుని వచ్చిన ఈ తాలూత్ రాజు, దావూద్ అలైహిస్సలాం వారిని మెచ్చుకుని ఆ తర్వాత తన కుమార్తెను దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చి వివాహం జరిపించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం రాజకుమార్తెతో వివాహం చేసుకున్నారు, రాజుకి అల్లుడైపోయారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన రాజ్యాన్ని కూడా దావూద్ అలైహిస్సలాం వారి చేతికి అప్పగించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ వారికి దావూద్ అలైహిస్సలాం వారు రాజయ్యారు.

రాజైపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ప్రవక్త పదవి కూడా ఇచ్చేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ఆయనే ప్రవక్త, ఆయనే రాజు. అంటే ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు కూడా ఆయనే పరిష్కరిస్తారు. అలాగే ప్రజల ధార్మిక విషయాలు కూడా ఆయనే బోధిస్తారు, పరిష్కరిస్తారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ప్రవక్త కూడా, దావూద్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజలకి రాజు కూడా. అయితే దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఏంటి ఆ మహిమలు? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం పేరు జబూర్. ఖురాన్ లోని సూరా నిసా 165 వ వాక్యంలో ఆ జబూర్ గ్రంథం ప్రస్తావన వచ్చి ఉంది. ప్రపంచంలో నాలుగు గ్రంథాలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి: తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్. ఈ ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రంథాలలో జబూర్ గ్రంథము కూడా ఉంది. ఆ జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది అల్లాహ్ తరపున.

దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము ఇచ్చాడు, మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని మంచి స్వరంతో, కంఠంతో చదువుతూ ఉంటే, పర్వతాలు కూడా ఆయన చదువుతున్న ఆ జబూర్ గ్రంథ వాక్యాలు చాలా చిత్తశుద్ధితో వినేవి, అవి కూడా వెంట వెంటనే ఆ పలుకులు పలికే ప్రయత్నము చేసేవి. అంతే కాదండీ, పక్షులు సైతము దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ వాక్యాలు పఠిస్తూ ఉంటే మంచి స్వరంతో, వచ్చి చుట్టూ కూర్చుని మెడలు కిందికి వంచుకుని చాలా చక్కగా, శ్రద్ధగా వినేవి. అంత మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ వాక్యాలు పఠించేవారు.

అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చిన మరొక మహిమ ఏమిటంటే, లోహాన్ని ఆయన కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెత్తదిగా మార్చేశాడు. లోహము చాలా గట్టిది. దాన్ని మెత్తదిగా మార్చాలంటే అగ్నిలో చాలా సేపు బాగా ఎర్రగా కాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత అది మెత్తబడుతుంది. ఆ తర్వాత దాన్ని కావలసిన ఆకారంలో ప్రజలు మలుచుకుంటూ ఉంటారు. కానీ దావూద్ అలైహిస్సలాం లోహాన్ని ముట్టుకుంటే చాలు, అది మెత్తగా మారిపోతుంది. ఆ తర్వాత దావూద్ అలైహిస్సలాం ఆయనకు తోచినట్టుగా ఆ లోహాన్ని కావలసిన ఆకారంలో మలుచుకునేవారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లోహాన్ని మెత్తదిగా చేసేసాడు. దావూద్ అలైహిస్సలాం ఆ లోహంతో యుద్ధ వస్త్రాలు తయారు చేసేవారు, కత్తులు తయారు చేసేవారు, అలాగే కవచాలు, వేరే విషయాలు కూడా ఆయన తయారు చేసేవారు.

దావూద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రాజు అయ్యి ఉండి కూడా బైతుల్ మాల్ నుండి, రాజు ఖజానా నుండి సొమ్ము తీసుకునే వారు కాదు. లోహాన్ని కరిగించి, ఆ లోహం నుండి తయారు చేసిన కవచాలు, కత్తులు ఇంకా వేరే విషయాలను అమ్మి, వాటితో వచ్చే సొమ్ముతో ఆయన అవసరాలు తీర్చుకునేవారు. ఎంత చిత్తశుద్ధి కలిగినవారో చూడండి.

అలాగే దావూద్ అలైహిస్సలాం వారి యొక్క అలవాటు ఏమిటంటే, ఆయన ఉదయం పూట ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. గొడవ పడిన వాళ్లకు తీర్పులు ఇచ్చేవారు. రాత్రి పూట మాత్రము అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. రాత్రి పూట ఆయన వద్దకు రావడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు.

అలాగే దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసి, మళ్ళీ ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసేవారు. అంటే రోజు తర్వాత రోజు ఆయన ఉపవాసము ఉండటాన్ని ఇష్టపడేవారు, రోజు మార్చి రోజు ఆయన ఉపవాసం ఉండేవారు కాబట్టి, ఆ ఉపవాసానికే సౌమె దావూద్ అని పేరు పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఎవరైనా ఉపవాసాలు ఉండాలనుకుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే, వారు సౌమె దావూద్ పాటించవచ్చు. దావూద్ అలైహిస్సలాం ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు ఉపవాసముని మానేసేవారు. రోజు తర్వాత రోజు ఉపవాసం ఉండేవారు, అంతవరకు మాత్రమే ఉపవాసం ఉండటానికి అనుమతి ఉంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు.

అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబూ మూసా అనే ఒక శిష్యుడు ఉండేవారు. ఆయనకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము, మంచి స్వరము ఇచ్చి ఉంటే, ఆయన ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఖురాన్ వాక్యాలు పఠిస్తూ ఉంటే, ఆ శబ్దాన్ని విని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్లి మెచ్చుకుంటూ, ఓ అబూ మూసా, నీకు అల్లాహ్ ఎంత మంచి కంఠము, స్వరము ఇచ్చాడంటే, దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన స్వరాలలో ఒక స్వరము నీకు ఇవ్వబడింది అనిపిస్తుంది నాకు అని చెప్పారు. ఆ విధంగా ఖురాన్ గ్రంథాన్ని, అలాగే ఆకాశ గ్రంథాన్ని మంచి స్వరంతో పఠించటము కూడా అల్లాహ్ తరపున దక్కిన గొప్ప అనుగ్రహం అని ప్రజలు అర్థం చేసుకోవాలి.

అయితే దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక సంఘటన ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారు రాత్రిపూట ఆరాధనలో నిమగ్నమైపోయేవారు, రాత్రిపూట ఆయన వద్దకు ఎవరికీ వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు అని మనం ఇంతకు ముందే విన్నాం. సమస్య ఏమీ అయినా, గొడవ ఏమీ అయినా, ఉదయం పూట మాత్రమే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి. అయితే ఆయన రాత్రి పూట ఏకాంతంలో అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి పరిష్కారం కోసం వచ్చారు. అయితే ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు, ఇప్పుడు కలవడానికి కుదరదు, ఉదయము కలవవచ్చు అని తెలుసుకుని వారు ఉదయం వరకు మేము ఓపిక పట్టేదానికి లేదు అని గోడ దూకి లోపలికి ప్రవేశించారు.

ఆరాధనలో ఉన్న దావూద్ అలైహిస్సలాం వారు కంగారుపడిపోయారు. ఇదేమిటి? ఎవరైనా దాడి చేయడానికి వచ్చాడేమో అని కంగారుపడిపోయారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ వెళ్లి దావూద్ అలైహిస్సలాం వారితో మేము గొడవ పడటానికి, దాడి చేయడానికి రాలేదండీ. మా ఇద్దరి మధ్య ఒక వ్యవహారంలో భేదాభిప్రాయము కలిగింది. కాబట్టి తీర్పు కోసము మీ వద్దకు వచ్చాము అని చెప్పారు. సమస్య ఏంటి అని దావూద్ అలైహిస్సలాం వారు అడిగితే, అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నా వద్ద ఒకే ఒక గొర్రె ఉంది. ఈ నా సోదరుని వద్ద 99 గొర్రెలు ఉన్నాయి. ఇతను 99 గొర్రెలు మేపుకోవడానికి వెళుతూ వెళుతూ, నా మీద సానుభూతి చూపి, అయ్యా నీ వద్ద ఒకే ఒక గొర్రె ఉంది, ఆ ఒక గొర్రెను మేపడానికి నీవు వెళ్లి కష్టపడటం ఎందుకు? ఆ ఒక గొర్రెను కూడా నా గొర్రెలతో పాటు పంపించేయి, నేనే ఆ 99 గొర్రెలతో పాటు నీ ఒక గొర్రెను కూడా మేపుకొని వస్తాను అని చెబితే, నా సోదరుడు నా మీద సానుభూతి చూపిస్తున్నాడులే అనుకుని నేను నా గొర్రెను అతని గొర్రెలతో పాటు మేపడానికి పంపించేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత నా గొర్రె అతని గొర్రెలతో పాటు వెళ్ళటము, మేసి తిరిగి రావటము, దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇతను నా సోదరుడు, ఆ గొర్రె నాదే అని ప్రకటిస్తున్నాడు. ఇలా చేయటము న్యాయమేనా మీరు చెప్పండి అని అడిగారు.

అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారు వెంటనే, అయ్యో 99 గొర్రెలు పెట్టుకుని ఇంకా నీ మనిషికి కోరిక తీరలేదా? ఆ ఒక్క గొర్రె కూడా నీవు తీసుకోవాలని చూస్తావా? ఎంత దురాశ నీకు? ఇలా అతను చేయటము దౌర్జన్యము, అలా చేయరాదు అని వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు మాట్లాడేశారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడేశారో, అప్పుడు ఆ 99 గొర్రెల వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారితో, అయ్యా మీరు కేవలం అతని మాట మాత్రమే విన్నారు, నా మాట విన్నారా? సమస్య ఏంటో నా నోట మీరు తెలుసుకున్నారా? నా నోట మీరు సమస్య అడిగి తెలుసుకోకుండానే ఒక వ్యక్తి మాట విని వేసి వెంటనే తీర్పు చెప్పేటం ఏమిటయ్యా ఇది? నా మాట కూడా మీరు వినాలి కదా. నా మాట, ఆయన మాట, ఇద్దరి మాటలు విని, సత్యం ఎవరి వైపు ఉంది అనేది మీరు అప్పుడు చూడాలి కదా. నా మాట వినకుండానే మీరు తీర్పు ఇచ్చిస్తున్నారు ఏమిటయ్యా ఇది? అని ఆయన అడిగేశాడు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారికి తప్పు తెలిసింది. వెంటనే దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మన్నింపు కోరుకున్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా సాద్ 21 నుండి 24 వాక్యాల వరకు ఉంది.

అలాగే దావూద్ అలైహిస్సలాం వారు అటు ఉదయం పూట ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ, రాత్రి పూట అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, ప్రజలకు జబూర్ గ్రంథంలోని దైవ వాక్యాలు బోధించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటే, దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు సులేమాన్. ఇన్ షా అల్లాహ్, సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ ప్రసంగంలో సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ఉండదు కానీ, దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రము తెలుపుతాను.

దావూద్ అలైహిస్సలాం వారి కుమారుడు సులేమాన్ అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. మరొకసారి ఇద్దరు వ్యక్తులు దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు తీర్పు కోసం వచ్చారు. సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి వద్ద చేను ఉంది, అందులో అతను పంట పండిస్తూ ఉంటే, పంట కొద్ది రోజుల్లో ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు కోతకు వస్తుంది అన్నప్పుడు, మరొక వ్యక్తి వద్ద ఉన్న పశువులు వచ్చి ఆ చేనులోకి దూరి పూర్తి పంటను నాశనం చేసేసాయి, మేసేసి. ఇప్పుడు ఆ చేను కలిగిన వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, కొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న నా పంట మొత్తము ఈ వ్యక్తి పశువులు వచ్చి నాశనం చేసేసాయి. ఈ వ్యక్తి ఇతని పశువుల్ని జాగ్రత్తగా కట్టుకుని బంధించుకొని ఉంచాల్సింది. నా చేనులోకి అతను ఎలాంటి భద్రత లేకుండా నిర్లక్ష్యంగా పశువుల్ని వదిలేసిన కారణంగా నా పంట మొత్తం నాశనమైపోయింది కాబట్టి నాకు నష్టపరిహారము ఇప్పించండి అని ఆ చేను కలిగిన వ్యక్తి అడగగా, దావూద్ అలైహిస్సలాం వారు తీర్పు ఇస్తూ, అతని వద్ద ఉన్న పశువులన్నీ నీవు తీసుకో అని చెప్పేశారు.

ఆ తీర్పు చెప్పగా ఆ పశువుల యజమాని అసహనం వ్యక్తపరుస్తూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఎదురుపడ్డారు. ఏంటయ్యా విషయం అని అడిగితే, చూడండి నా పశువులు వెళ్లి అతని చేనులో మేసాయి, అతని పంటకు నష్టం కలిగించాయి. అది నిజమే. అయితే నష్టపరిహారంగా నా పూర్తి పశువుల్ని అతనికి ఇచ్చేయమని మీ నాన్నగారు చెప్పేశారు. ఇదేంటయ్యా ఇది, ఏం న్యాయమయ్యా ఇది అని ఆయన అడుగుతూ ఉంటే, అసహనం వ్యక్తపరుస్తూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మళ్లీ వెంటపెట్టుకుని, పదండి నేను నాన్నతో మాట్లాడతాను అని మళ్లీ పిలుచుకుని వచ్చారు. నాన్నగారి వద్దకు వచ్చి, నాన్నగారు, మీరు తీర్పు ఇచ్చారు సరే, కానీ ఈ సమస్యకు మరొక తీర్పు కూడా ఉంటుంది. మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను, ఇన్ షా అల్లాహ్ ఆ తీర్పు మీకు నచ్చుతుంది అని చెప్పారు. దావూద్ అలైహిస్సలాం, సరే చెప్పు నాయనా చూద్దాము అని సులేమాన్ అలైహిస్సలాం వారికి అనుమతి ఇవ్వగా, సులేమాన్ అలైహిస్సలాం వారు అన్నారు, చూడండి చేతికి వచ్చిన పంట నాశనమైపోయింది. అతనికి తప్పనిసరిగా నష్టం వాటిల్లింది. అయితే ఈ పశువులు ఉన్న వ్యక్తికి ఇప్పుడు బాధ్యత ఏమిటంటే, అతను కొద్ది నెలల కోసము కష్టపడి ఆ చేనులో మళ్ళీ అదే పంట వేసి, పంట చేతికి వచ్చినంత వరకు దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుని, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట ఆ చేను యజమానికి మళ్ళీ అప్పగించాలి. అప్పటివరకు ఆ చేను యజమాని నీ పశువుల్ని తన వద్ద ఉంచుకుని వాటి పాలతో, ఇతర వేరే విషయాలతో లబ్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆ చేనులో పంట పండించి అతనికి ఆ పంట అప్పగిస్తావో, ఆ రోజు అతను నీ పశువులన్నీ కూడా నీకు అప్పగించేస్తాడు. అప్పటివరకు నీ పశువులు అతని వద్ద ఉంటాయి అని తీర్పు ఇవ్వగా, దావూద్ అలైహిస్సలాం వారు విని చాలా మెచ్చుకున్నారు. మాషా అల్లాహ్, ఈ తీర్పు చాలా బాగుంది. దీని ద్వారా ఇద్దరిలో ఏ ఒక్కరికి నష్టము ఉండదు, ఇద్దరూ లాభపడతారు, ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. చాలా మంచి తీర్పు అని దావూద్ అలైహిస్సలాం వారు మెచ్చుకున్నారు.

అయితే మిత్రులారా, ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారి వయస్సు 100 సంవత్సరాలకు చేరింది. ఇంతకుముందు మనము ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో దావూద్ అలైహిస్సలాం వారి ప్రస్తావన విని ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఏంటి ఆ విషయము?

ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినప్పుడు, ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని కూడా ఆదమ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. అప్పుడు ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని చూస్తూ చూస్తూ ఒక ఆత్మ వద్ద కాంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, ఎవరిది ఈ ఆత్మ, ఎవరు ఈయన అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇతను మీ కుమారుడు దావూద్, మీ తర్వాత చాలా సంవత్సరాలకు ప్రపంచంలో పుడతాడు అని అల్లాహ్ తెలియజేస్తే, అతని ఆయుష్షు ఎంత అని ఆదమ్ అలైహిస్సలాం వారు అడిగినప్పుడు, 60 సంవత్సరాలు అని అల్లాహ్ తెలియజేయగా, నా ఈ బిడ్డకు 60 సంవత్సరాలేనా ఆయుష్షు? నా ఆయుష్షులో నుంచి ఒక 40 సంవత్సరాలు అతని ఆయుష్షులోకి వేసేసి 100 సంవత్సరాలు చేయండి అని ఆదమ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ తో కోరగా, అల్లాహ్ ఆదేశంతో అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 100 సంవత్సరాలుగా మార్చబడింది అని ఆ రోజు మనము ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విని ఉన్నాము గుర్తుందా కదా అండి?

అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 60 ప్లస్ 40 మొత్తం కలిపి 100 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 100 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు, దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటిని తలుపులు వేసేసి, బయట నుండి తాళం వేసేసి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపు తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. అనుకోకుండా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అది చూసి దావూద్ అలైహిస్సలాం కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. అయ్యో పరాయి వ్యక్తి తలుపులు, గదులు వేసి ఉన్నా గానీ, గదులు మూసేసి ఉన్నా, తలుపులు మూసేసి ఉన్నా, ఎలా వచ్చేసాడు గదిలోకి, లోపలికి? అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారు వచ్చి చూస్తే, మనమంతా అప్పుడు ఆయన దృష్టిలో కలంకితులమైపోతామేమో కదా, ఎలా వచ్చాడు ఈ వ్యక్తి? అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందులోనే దావూద్ అలైహిస్సలాం వారు తిరిగి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించి చూస్తే, కుటుంబ సభ్యులు ఉన్నారు, పక్కన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు.

దావూద్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చింది. పరాయి వ్యక్తి నేను లేనప్పుడు నా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అది నేను బయట నుండి తాళం వేసి వెళ్ళినప్పుడు? అని కోపంగా ఎవరయ్యా నువ్వు? అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏ తాళాలు, ఏ తలుపులు నన్ను ఆపలేవు, అంతెందుకు ఏ రక్షక భటులు కూడా నన్ను ఆపలేరు. నేను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వెళ్ళగలను అని చెబుతూ ఉంటే, వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు అర్థం చేసుకున్నారు. తలుపులు మూసివేసి ఉన్నా, నువ్వు లోపలికి రాగలిగినావు అంటే, నీవు మానవుడివి కావు, నీవు దైవదూతవు, అవునా? అన్నారు. అప్పుడు ఆయన, అవునండి, నేను దైవదూతనే, ఇప్పుడు మీ మరణ సమయము సమీపించింది, మీ ఆయుష్షు పూర్తి అయ్యింది, మీ ప్రాణము తీసుకుని వెళ్ళవలసి ఉంది అని చెప్పగా, దావూద్ అలైహిస్సలాం వారు మరణానికి సిద్ధమయ్యారు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి ప్రాణాలు ఆ దైవదూత తీసుకుని వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల వయస్సులో దావూద్ అలైహిస్సలాం వారి మరణము సంభవించింది. దావూద్ అలైహిస్సలాం వారి మరణానంతరం ప్రవక్త పదవి మరియు రాజ్యాధికారము ఆయన కుమారుడైన సులేమాన్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది.

సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ఇన్ షా అల్లాహ్ మనము వచ్చే ఆదివారము ఇన్ షా అల్లాహ్ వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడితో దావూద్ అలైహిస్సలాం వారి చరిత్ర తెలియజేసి నా మాటను నేను ముగిస్తూ ఉన్నాను.

అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర తెలుసుకుని, వాటి ద్వారా బోధపడే విషయాలు అర్థం చేసుకుని, మన విశ్వాసాన్ని పెంచుకుని, మన పాపాలను అలాగే మార్గభ్రష్టత్వాన్ని సంస్కరించుకుని అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్.

‎اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ ప్రేక్షకులారా, విద్యార్థులారా, షేక్ గారు ప్రసంగించిన ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్న ఉంటే త్వరగా మీ ఎలక్ట్రానిక్ చేయిని ఎత్తండి, మీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వబడుతుంది.

ఆ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీర్పు ఇచ్చే వారు ఒక వ్యక్తి మాటలే విని వేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు. ఇద్దరినీ, ప్రత్యర్థులు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి వీరి వాదనలు కూడా వినాలి, వారి వాదనలు కూడా వినాలి. ఇరువైపుల నుండి వాదనలు విని, ఆ తర్వాత ఎవరి పక్షంలో న్యాయం ఉంది అనేది గ్రహించి ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. కేవలం ఒక వర్గం మాటలే విని వేసి, ఆ వర్గం మాటల్నే సత్యమని నమ్మేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు అనేది ఒక విషయం.

అలాగే ప్రవక్త దైవ వాక్యాలు బోధించటంతో పాటు, ప్రాపంచిక ప్రజల ప్రాపంచిక సమస్యలు పరిష్కరించడానికి అతను ప్రజల రాజు కూడా అవ్వగలడు. ఒక ప్రవక్త ప్రవక్త పదవితో పాటు రాజుగా ఆ బాధ్యతలు కూడా నెరవేర్చగలడు. రాజులు ప్రవక్తలుగా, ప్రవక్తలు రాజులుగా ఉండటము నేరము కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రవక్తలు కేవలము ధార్మిక విషయాలు బోధించేంత వరకు మాత్రమే పరిమితమై ఉండాలి, వారికి రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. రాజులు పరిపాలన చేసుకుంటూ ఉండాలి, వారికి ధార్మిక విషయాలలో జోక్యము తగదు అని డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం మరియు సులేమాన్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి, ఒకే వ్యక్తి ప్రవక్తగా కూడా ధార్మిక విషయాలు బోధించగలడు, ఒకే వ్యక్తి రాజుగా కూడా ప్రజలకు నాయకత్వం వహించగలడు అనే విషయాలు కూడా తెలియజేసి ఉన్నారు.

అలాగే ఆకాశ గ్రంథాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మంది ప్రవక్తలకు ఇచ్చి ఉన్నాడు. అందులో నాలుగు ఆకాశ గ్రంథాలు ప్రసిద్ధి చెందినవి. అందులో ఒక గ్రంథము జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. అయితే ఇప్పుడు అది అసలు రూపంలో ప్రపంచంలో లేదు. ఖురాన్ గ్రంథము అవతరించబడిన తర్వాత మిగతా గ్రంథాలు అన్నీ కూడా మన్సూఖ్ (రద్దు) అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో చలామణిలో మరియు చెల్లుబాటులో ఉన్న ఆకాశ గ్రంథము ఖురాన్ గ్రంథము అని కూడా మనము గ్రహించాలి.

అలాగే ప్రవక్త ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప దైవభక్తుడు అయినా మరణము తప్పదు, తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది. మనిషి ఎక్కడ ఉన్నా, దైవదూతలు అక్కడికి వెళ్లి అతని ప్రాణాలు తీయగలరు. అతను తలుపులు వేసుకుని గది లోపల ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మరణం సమీపించినప్పుడు దైవదూతలు వెళ్లి అతన్ని అక్కడి నుంచి ప్రాణాలు తీయగలరు. ఇలాంటి కొన్ని విషయాలు మనకు దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడతాయి.

రెండు విషయాలు అడిగారండి మీరు. అవునండి. ఒకటి, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం వారికి 40 సంవత్సరాల ఆయుష్షు ఇచ్చిన తర్వాత, దావూద్ అలైహిస్సలాం వారి పూర్తి ఆయుష్షు ఎంత? అని అడిగారు. ఇది మొదటి ప్రశ్న కదండీ. దాని సమాధానం ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారి అసలు ఆయుష్షు 60 సంవత్సరాలు, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి పొందిన 40 సంవత్సరాలు. 60 మరియు 40, రెండు కలిపి మొత్తం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయన ఆయుష్షు అని మనకు ఇస్లామీయ గ్రంథాల ద్వారా, ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలపబడింది. వేరే గ్రంథాల వారు ఆయన ఆయుష్షు 77 సంవత్సరాలు అని కూడా చెబుతూ ఉంటారు. కాకపోతే అవన్నీ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ విషయాల మీద మనము నిజము అని చెప్పడానికి లేదు, అబద్ధము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అవి మన్సూఖ్ (రద్దు) అయిపోయిన గ్రంథాలు. మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ఉన్న విషయాలే ప్రామాణికమైనవి కాబట్టి నేను ఇవి మాత్రమే ప్రస్తావించాను, వాటి జోలికి నేను వెళ్ళలేదు. ఇది మొదటి విషయము. ఆయన ఆయుష్షు పూర్తి 100 సంవత్సరాలు అనేది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి 40 సంవత్సరాలు ఆయనకు ఇవ్వబడటము, ఇది ఇస్రాయీలీ ఉల్లేఖనమా లేదా ప్రవక్త వారి ఖురాన్ లేదా హదీస్ ఉల్లేఖనాలా అని విధంగా మీరు అడిగారు. దాని సమాధానం ఏమిటంటే, ఇవి ఇస్రాయీలీ ఉల్లేఖనాలు కావండి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచనాలలో నుంచి వచ్చిన ఒక విషయం అండి. ముస్నద్ అహ్మద్ అనే ఒక హదీస్ గ్రంథం ఉంది. అందులో దీని ప్రస్తావన వచ్చి ఉంది.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

وَقَالَ لَهُمْ نَبِيُّهُمْ إِنَّ اللَّهَ قَدْ بَعَثَ لَكُمْ طَالُوتَ مَلِكًا ۚ قَالُوا أَنَّىٰ يَكُونُ لَهُ الْمُلْكُ عَلَيْنَا وَنَحْنُ أَحَقُّ بِالْمُلْكِ مِنْهُ وَلَمْ يُؤْتَ سَعَةً مِّنَ الْمَالِ ۚ قَالَ إِنَّ اللَّهَ اصْطَفَاهُ عَلَيْكُمْ وَزَادَهُ بَسْطَةً فِي الْعِلْمِ وَالْجِسْمِ ۖ وَاللَّهُ يُؤْتِي مُلْكَهُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

“అల్లాహ్‌ తాలూత్‌ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్‌ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్‌ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్‌ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!” (2:247)

ఇ స్రాయీల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె (మూసా కాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె టాబర్నికల్) చాలా పవిత్రమైనదని, తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు. చివరకు యుద్ధాలలోను దానిని తీసుకుని వెళ్ళేవారు. దాని వల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్యసాహసాలు లభించేవి. దీని వల్ల వారి శత్రువులు కూడా భయ భీతులయ్యేవారు. దానికి అల్లాహ్ ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు.

క్రమేణా ఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. అల్లాహ్ వారిపై వారి శత్రువులను (పలస్తీనులను) పంపించాడు. ఇస్రాయీల్ ప్రజలను పలస్తీనులు ఓడించారు. వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు. వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు. ఇస్రాయీలీల అధికారం ,ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండాపోయారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు.

అప్పుడు ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం) వారి వద్దకు వచ్చారు. ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది. తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని, అందుకు ప్రవక్త సహకరించాలని వారు ఆయన్ను కోరారు. ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు. కాని ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం)కు వారి బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల ఆయన వారితో, “పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు” అన్నారు. కాని వారు ఆయనతో, తాము చాలా పరాభవాలు సహించామని, ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నారు.

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) | హదీసు కిరణాలు [ఆడియో, టెక్స్ట్]

నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.

5. హజ్రత్‌ మాన్‌ బిన్‌ యజీద్‌ బిన్‌ అఖ్‌నస్‌ (రదియల్లాహు అన్హుమ్) (ఈయన, ఈయన తండ్రీ తాతలు ముగ్గురూ దైవప్రవక్త అనుచరులే) కథనం:

“మా నాన్న యజీద్‌ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్‌ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్‌! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్‌! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)

السلام عليكم ورحمة الله وبركاته
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.

الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్)
సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.

సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.

ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.

సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:

وهو وأبوه وجده صحابيون
(వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్)
అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.

అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.

ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:

لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن
(లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్)
ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.

అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.

ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.

ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.

ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.

దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.

ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.

ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.

అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.

దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.

ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.

కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.

అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.

ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) – సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్)
https://teluguislam.net/2019/10/19/ikhlas/

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.