ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4 నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? [మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు] https://www.youtube.com/watch?v=vnw-1Kcariw వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.
నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.
కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.
ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.
అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.
సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”
మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులోఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3 [మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు] https://www.youtube.com/watch?v=QVnrPdQraUA వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.
అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:
فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ (ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్) “నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”
అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు] https://www.youtube.com/watch?v=bqcAR6CBK80 వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?
మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.
ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/mEfcvGUoA-Y [48 నిముషాలు]
ఈ ప్రసంగంలో, ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్ ప్రజల చరిత్రను వివరించబడింది. యూషా బిన్ నూన్, ఇల్యాస్ మరియు యసా (అలైహిముస్సలాం) వంటి ప్రవక్తల తరువాత, బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒక రాజును కోరగా, అల్లాహ్ తాలూత్ను నియమించాడు. జాలూత్ (గొలియత్)తో జరిగిన యుద్ధంలో, యువకుడైన దావూద్ (అలైహిస్సలాం) విజయం సాధించి, కాలక్రమేణా రాజుగా మరియు ప్రవక్తగా నియమితులయ్యారు. ఆయనకు “జబూర్” గ్రంథం ఇవ్వబడింది మరియు ఆయనకు పర్వతాలు, పక్షులతో పాటు అల్లాహ్ను కీర్తించే అద్భుతమైన స్వరం, ఇనుమును మెత్తగా చేసే శక్తి వంటి మహిమలు ప్రసాదించబడ్డాయి. దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్త మరియు రాజుగా న్యాయాన్ని ఎలా స్థాపించారో, ఒక సంఘటనలో తొందరపాటు తీర్పు ఇచ్చి ఎలా పశ్చాత్తాపపడ్డారో కూడా వివరించబడింది. ఆయన కుమారుడు సులేమాన్ (అలైహిస్సలాం) యొక్క జ్ఞానం, దావూద్ (అలైహిస్సలాం) యొక్క ఆరాధన, ఉపవాస పద్ధతి మరియు ఆయన మరణం గురించి కూడా చర్చించబడింది. ఈ ప్రసంగం నుండి న్యాయం, పశ్చాత్తాపం మరియు అల్లాహ్పై ఆధారపడటం వంటి గుణపాఠాలను నేర్చుకోవచ్చు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్నందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
ప్రవక్త దావూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
ఈనాటి ప్రసంగంలో మనము, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాము. ఇంతకు ముందు ప్రసంగాలలో, ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర వివరంగా తెలుసుకొని ఉన్నాము. మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసే సమయానికి బనీ ఇస్రాయీల్ ప్రజలు 40 సంవత్సరాల కొరకు తీహ్ మైదానంలో మార్గభ్రష్టులై తిరుగుతూ ఉన్నారు. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి కోసము ఆకాశం నుండి మన్ సల్వా ఆహారము దింపుతున్నాడు, రాతి నుండి నీటి ఊటను ఉభకింపజేశాడు, మేఘాల నుండి నీడ ఏర్పాటు చేశాడు, ఆ విధంగా వారు ఆ మైదానంలో ఉంటున్నారు అనే విషయం వరకు మనకు తెలియజేయడం జరిగింది.
ఆ తర్వాత జరిగిన విషయాలు తెలుసుకుంటూ ఇన్ షా అల్లాహ్ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోకి మనము ప్రవేశిద్దాం. తీహ్ మైదానంలో ఉన్నప్పుడే మూసా అలైహిస్సలాం వారు మరణించారు. ఆ తీహ్ మైదానంలో ఉన్నప్పుడే హారూన్ అలైహిస్సలాం వారు కూడా మరణించారు. మూసా అలైహిస్సలాం వారు, హారూన్ అలైహిస్సలాం వారిద్దరి మరణం తర్వాత బనీ ఇస్రాయీల్ వారికి యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు ప్రవక్తగా, బోధకునిగా దైవ వాక్యాలు బోధించుకుంటూ, వారి సమస్యలు పరిష్కరించుకుంటూ, వారిని సంస్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. 40 సంవత్సరాల గడువు పూర్తి అయ్యింది. తర్వాత ఆ మూర్ఖులు ఎవరైతే “యుద్ధంలో మేము ప్రవేశించలేము” అని వెనకడుగు వేశారో, “నీవు నీ ప్రభువు వెళ్లి యుద్ధం చేసుకోండి మేము ఇక్కడే కూర్చుని ఉంటాము” అని మూర్ఖత్వం ప్రదర్శించారో, వారందరూ కూడా మరణించారు. వారి బిడ్డలు ఇప్పుడు పెరిగి పెద్దవారై యువకులై ఉన్నారు. అంటే పూర్తిగా ఒక తరము గడిచిపోయింది. కొత్త తరము, ఉడుకు రక్తము ఎవరి శరీరాలలో ప్రవేశించి ఉందో, అలాంటి ఒక కొత్త తరము ఇప్పుడు ప్రపంచంలోకి ఉనికిలోకి వచ్చి ఉంది.
అలాంటి వారిని తీసుకుని యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు మళ్లీ అల్-ఖుద్స్, పాలస్తీనా వైపుకి ప్రయాణం ప్రారంభించారు. ఈసారి వారు దారి తప్పలేదు, ఎందుకంటే వారి మీద పెట్టబడిన ఆ 40 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయింది కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి మార్గం చూపించాడు. వారు ఏకంగా పాలస్తీనా దేశానికి అల్-ఖుద్స్ అనే నగరానికి వచ్చి చేరారు. ఇక, మాషా అల్లాహ్, యువకులు, ఉడుకు రక్తం, యుద్ధం కోసం సిద్ధమైపోండి అనగానే వారందరూ యుద్ధం కోసం సిద్ధంగా ఉన్నారు. అయితే అల్-ఖుద్స్ నగరంలో ఉన్న ప్రజలు లోపలే ఉండి చాలా రోజుల వరకు వారి సహనాన్ని పరీక్షించారు. అయినా గానీ వీరు వెనకాడగలేదు. చివరికి ఆ నగరము బనీ ఇస్రాయీల్ వారి చేతికి వచ్చేసింది. ఆ విధంగా బనీ ఇస్రాయీల్, ఇస్రాయీల్ సంతతి వారు అల్-ఖుద్స్ అనే నగరంలోకి ప్రవేశించారు. అప్పటి నుండి మళ్లీ ఆ నగరము వారి సొంతమయ్యింది, వారి వశమయ్యింది.
యూషా (అలైహిస్సలాం) తరువాత బనీ ఇస్రాయీల్
ఆ తర్వాత యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారు అక్కడ ఉన్నన్ని రోజులు వారికి దైవ వాక్యాలు, బోధనలు బోధించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆయన మరణించారు. యూషా బిన్ నూన్ అలైహిస్సలాం మరణించిన తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ లోపు మళ్లీ బనీ ఇస్రాయీల్ ప్రజలలో అవకతవకలు వచ్చేసాయి, వారు మళ్లీ మార్గభ్రష్టత్వానికి గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా లబ్నాన్ దేశంలో, ఇదే బనీ ఇస్రాయీల్ కు చెందిన కొంతమంది మళ్లీ మూర్ఖత్వం ప్రదర్శిస్తూ అక్కడ బాల్ అనే ఒక విగ్రహాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పూజించడం ప్రారంభించారు. ఆ విధంగా మళ్లీ బహుదైవారాధన, షిర్క్, విగ్రహారాధన ప్రారంభం చేసేశారు.
అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇల్యాస్ అలైహిస్సలాం వారిని వారి వద్దకు ప్రవక్తగా పంపించాడు. ఇల్యాస్ అలైహిస్సలాం లబ్నాన్ దేశంలో బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ వారిని సంస్కరించారు, అల్లాహ్ వైపు, అల్లాహ్ ఏకత్వం వైపు, తౌహీద్ వైపు వారిని పిలుపునిచ్చారు. ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం అనే మరో ప్రవక్త బనీ ఇస్రాయీల్ వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు. అయితే యూషా బిన్ నూన్ అలైహిస్సలాం వారి గురించి, ఇల్యాస్ అలైహిస్సలాం వారి గురించి, యసా అలైహిస్సలాం వారి గురించి ఎక్కువగా ప్రస్తావన లేదు కాబట్టి, నేను వారి గురించి ప్రత్యేకంగా ప్రసంగము చేయట్లేదు. ముఖ్యంగా వారి పేరు, వారు ఎవరి వైపుకి ప్రవక్తగా పంపించబడ్డారు, ఏ సందర్భంలో పంపించబడ్డారు అనే విషయం వరకు మాత్రమే చెప్పేసి మాటలు ముందుకు సాగిస్తున్నాను. ఈ విషయాన్ని మన మిత్రులు గమనించాలి.
అయితే ఇల్యాస్ అలైహిస్సలాం వారి తర్వాత యసా అలైహిస్సలాం వారికి బనీ ఇస్రాయీల్ ప్రజల పగ్గాలు ఇవ్వబడ్డాయి. యసా అలైహిస్సలాం వారు కూడా చాలా చక్కగా దైవ వాక్యాలు బనీ ఇస్రాయీల్ వారికి బోధించుకుంటూ ముందుకు సాగారు. యసా అలైహిస్సలాం వారు మరణించిన తర్వాత, అప్పుడు బనీ ఇస్రాయీల్ మీద అల్లాహ్ తరపు నుంచి పెద్ద పెద్ద పరీక్షలు వచ్చి పడ్డాయి. ఎందుకంటే యసా అలైహిస్సలాం వారి మరణం తర్వాత మళ్ళీ మరో ప్రవక్త వచ్చే లోపు ఈ మధ్య ఏ గ్యాప్ అయితే ఉందో, ఈ గ్యాప్ లో మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురయ్యారు. అంతే కాదండి, వారు పరస్పరం విభేదించుకుని గొడవలకు దిగారు. ఆ విధంగా పాపాల్లో మునిగిపోయారు, విభేదించుకుని గొడవలు పెట్టుకున్నారు. అలా చేసిన కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బుఖ్తె నసర్ అనే ఒక దౌర్జన్య పరిపాలకుడిని వారి మీదికి పంపించగా, ఆ బుఖ్తె నసర్ వచ్చి ఖుదుస్ మీద దండయాత్ర చేసి బనీ ఇస్రాయీల్ వారిని చాలా కఠినంగా అక్కడి నుంచి కొట్టి, చంపి తరిమేశాడు. అల్లాహు అక్బర్.
చరిత్ర చదువుతూ ఉంటే కన్నీళ్లు కారుతాయండి, అంత కఠినంగా, అంత విచక్షణ రహితంగా బుఖ్తె నసర్ మరియు అతని సైన్యమైన అమాలిఖా ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ మీద విరుచుకుపడ్డారు. నలుమూలల నుండి వారి మీద విరుచుకుపడి వారిని అల్-ఖుదుస్ నుండి తరిమి తరిమి, వారిని చంపారు. ఆ విధంగా వారిని అక్కడి నుంచి తరిమి తరిమి వెళ్ళగొట్టారు. ఆ విధంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు అల్-ఖుదుస్ ప్రదేశాన్ని మళ్ళీ కోల్పోయారు, ప్రపంచంలో వేరే వేరే ప్రదేశాలకు పారిపోయారు.
అయితే ఎప్పుడైతే ఈ బుఖ్తె నసర్ అనే రాజు వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల మీద దండయాత్ర చేసాడో, అల్-ఖుదుస్ నగరాన్ని సర్వనాశనం చేసాడో, బనీ ఇస్రాయీల్ ప్రజల్ని చెల్లాచెదురుగా తరిమేశాడో, ఆ సందర్భంలోనే బనీ ఇస్రాయీల్ ప్రజల వద్ద పవిత్రమైన జ్ఞాపకాలు, గుర్తులు కొన్ని ఉండేవి. ఒక పెట్టె ఉండేది వారి వద్ద, దానిని తాబూత్ అని అరబీలో అంటూ ఉంటారు. అందులో పవిత్రమైన కొన్ని గుర్తులు ఉండేవి. ఏముండేవి అంటే మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలకాలు ఉండేవి, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, కింద పడేస్తే సర్పం లాగా మారుతుంది, తర్వాత ముట్టుకుంటే మళ్ళీ కర్ర లాగా మారిపోతుంది అని విన్నాము కదా, ఆ కర్ర ఉండేది. హారూన్ అలైహిస్సలాం వారికి కూడా కొన్ని గుర్తులు అందులో ఉండేవి. అలాంటి ప్రవక్తల పవిత్రమైన కొన్ని గుర్తులు అందులో ఉండేవి. ఆ తాబూత్ పెట్టెను కూడా ఈ బుఖ్తె నసర్, అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయారు.
అయితే అలా జరిగిన తర్వాత మళ్లీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా షమ్వీల్ అలైహిస్సలాం అనే ఒక ప్రవక్తను పంపించాడు. షమ్వీల్ అలైహిస్సలాం అనే ప్రవక్త ప్రభవించబడిన తర్వాత ఆయన మళ్ళీ ప్రజలలో ఉన్న వారి మార్గభ్రష్టత్వాన్ని దూరం చేశారు, వారి లోపాలను వారు మళ్ళీ పరిష్కరించారు, సంస్కరించారు. ఆ తర్వాత బనీ ఇస్రాయీల్ ప్రజలు ఎవరెవరు ఎక్కడెక్కడ అయితే విడిపోయి దూరదూరంగా ఉంటున్నారో వారందరినీ మళ్ళీ ప్రోగవ్వాలని పిలుపునిచ్చారు. షమ్వీల్ అలైహిస్సలాం వారి పిలుపుని ఆమోదిస్తూ బనీ ఇస్రాయీల్ వారు మళ్ళీ వచ్చి ఒకచోట ప్రోగయ్యారు.
తాలూత్ ను రాజుగా నియమించడం
వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రోగైన తర్వాత, రాను రాను వారి సంఖ్య పెరుగుతూ పోయింది. లక్షల్లో మళ్ళీ వారి సంఖ్య అక్కడ ఏర్పడిపోయింది. అప్పుడు బనీ ఇస్రాయీల్ ప్రజలకు ఒక ఆలోచన తట్టింది. అదేమిటి? మనకు బోధించడానికి, దైవ వాక్యాలు వినిపించి నేర్పించడానికి ప్రవక్త అయితే ఉన్నారు. కానీ మనకు ఒక రాజు కూడా ఉంటే బాగుండేది. ఆ రాజు సారధ్యంలో మేము యుద్ధాలు చేయగలము, మా ప్రాపంచిక సమస్యలను అతను బాగా చక్కగా పరిష్కరించగలడు, అలాగే మేము కోల్పోయిన ఆ పవిత్రమైన గుర్తులు, తాబూత్ పెట్టె, మళ్ళీ మనము తిరిగి సొంతం చేసుకోగలము అనే ఉద్దేశంతో షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఓ దైవ ప్రవక్త వారు, మా కోసము ఒక రాజుని నియమించండి. మీరైతే దైవ వాక్యాలు బోధిస్తున్నారు కానీ, ఒక రాజుని నియమిస్తే ఆ రాజు సారధ్యంలో మేము ప్రాపంచిక సమస్యలు పరిష్కరించుకుంటాము, కోల్పోయిన గౌరవాన్ని మళ్ళీ పొందుతాము, కోల్పోయిన తాబూత్ పెట్టెను కూడా మళ్ళీ తిరిగి వశపరుచుకుంటాము అని కోరినప్పుడు, షమ్వీల్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ప్రజలతో ఏమన్నారంటే, చూడండి మీరు పెద్ద కోరిక కోరుతున్నారు. రాజును నియమించటం, ఆ తర్వాత జిహాద్ చేయటం మీ మీద విధి చేయటం జరిగితే మళ్ళీ మీరు మాట తప్పరాదు. ఒకవేళ మీరు మాట తప్పితే మళ్ళీ మీ మీద కఠినమైన శిక్షలు పడతాయి, జాగ్రత్త, మాట మార్చరు కదా అని అడిగారు. బనీ ఇస్రాయీల్ ప్రజలు లేదండి, మీరు రాజుని నియమించండి. యుద్ధం మా మీద విధి చేయండి చాలు, చూడండి మేము యుద్ధాలు ఎలా చేస్తామో అని పగడ్బాలు పలికారు. షమ్వీల్ అలైహిస్సలాం అల్లాహ్ తో దుఆ చేశారు.
అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధాన్ని విధి చేసేసాడు, ఫర్జ్ చేసేసాడు. ఆ తర్వాత వారి కోసము తాలూత్ ను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రాజుగా విధించాడు. అయితే ఈ తాలూత్ ఎవరు అంటే, యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారులలో బిన్యామీన్ అనే ఒక కుమారుడు ఉండేవాడు కదండీ, ఆ బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఈ తాలూత్.
షమ్వీల్ అలైహిస్సలాం ప్రజల ముందరకు వచ్చి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ మీద యుద్ధం విధి చేసేసాడు, ఇక మీరు యుద్ధము చేయవచ్చు, అలాగే తాలూత్ ని అల్లాహ్ మీ కొరకు రాజుగా నియమించాడు. మీరు తాలూత్ ని రాజుగా ఎన్నుకోండి అన్నారు. అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు షమ్వీల్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి, ఇదేమిటండి, మీరు తాలూత్ ని మనకు రాజుగా నియమించారు? బిన్యామీన్ వంశానికి చెందిన వ్యక్తి ఎప్పుడూ మనకు రాజుగా నియమింపబడలేదే? మన యహూదా సంతానికి చెందిన వ్యక్తులే ఎప్పుడూ ఇప్పటివరకు కూడా రాజులుగా నియమించబడుతూ వచ్చారు అని అడిగారు. అంటే యాకూబ్ అలైహిస్సలాం వారి మరొక కుమారుని పేరు యహూదా. ఆ యహూదా సంతానానికి చెందిన వ్యక్తులే ఇప్పటివరకు రాజులుగా నియమించబడుతూ వస్తూ ఉండేవారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ యహూదా సంతానానికి చెందిన వ్యక్తి కాకుండా, బిన్యామీన్ సంతానానికి చెందిన వ్యక్తి ఎప్పుడైతే రాజుగా నియమించబడ్డాడో, బనీ ఇస్రాయీల్ వారికి ఆశ్చర్యం కలిగింది. వెళ్లి షమ్వీల్ అలైహిస్సలాం వారి ముందర వారి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, లేదండీ ఇది నా నిర్ణయము, నా ఎన్నిక కాదండీ, ఇది అల్లాహ్ యొక్క ఎన్నిక. అల్లాహ్ ఆయనను రాజుగా ఎన్నుకోవాలని, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఆయనను ఎన్నుకోమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాడు అని చెప్పారు.
అయితే బనీ ఇస్రాయీల్ ప్రజలు నమ్మలేదు. మేము ఎలా నమ్మాలండి? ఇప్పటివరకు వస్తున్న పరంపరను కాకుండా వేరే కొత్త విషయాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు. మేము ఎలా నమ్మాలి? ఏదైనా నిదర్శనము మాకు చూపించండి అని అడిగారు. అప్పుడు షమ్వీల్ అలైహిస్సలాం వారు అన్నారు, ఇది దైవ నిర్ణయము అని మీకు తెలియజేయడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతల ద్వారా మీరు కోల్పోయిన ఆ తాబూత్ పెట్టెను మళ్ళీ మీ వద్దకు తిరిగి వచ్చేటట్టు చేస్తాడు, చూడండి అన్నారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశంతో దైవదూతలు ఆ అమాలిఖా ప్రజలు పట్టుకెళ్ళిపోయిన ఆ తాబూత్ పెట్టెను తిరిగి తీసుకుని వచ్చి బనీ ఇస్రాయీల్ ప్రజల చేతికి అప్పగించారు. ఇంతకుముందు చెప్పాను కదండీ, ఆ తాబూత్ పెట్టెలో తౌరాత్ ఫలకాలు, మూసా అలైహిస్సలాం వారి చేతి కర్ర, హారూన్ అలైహిస్సలాం వారి గుర్తులు ఇలా పవిత్రమైన విషయాలు అందులో భద్రపరచబడి ఉండేవి. ఆ తాబూత్ పెట్టె వారి వద్ద ఉంటే వారికి మనశ్శాంతి కూడా లభించేది. ఆ తాబూత్ పెట్టెను వెంటపెట్టుకుని వెళ్లి వారు యుద్ధాలు కూడా చేసేవారు.
ఇలా ఎప్పుడైతే ఆ తాబూత్ పెట్టె తిరిగి మళ్ళీ వారి వద్దకు వచ్చిందో, అప్పుడు వారు అర్థం చేసుకున్నారు ఇది దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది అని. తర్వాత సంతోషంగా వారు తాలూత్ ని తమ నాయకునిగా, తమ రాజుగా ఎన్నుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా కోసం యుద్ధం విధి చేయండి, మేము యుద్ధము చేస్తాము, యుద్ధాలలో పాల్గొంటాము అని కోరిన వారు, ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యుద్ధము విధి చేసేసాడో, లక్షల్లో ఉన్న వారి సంఖ్యలో నుంచి కేవలం 80,000 వ్యక్తులు మాత్రమే యుద్ధానికి సిద్ధమయ్యారు. మిగతా వారందరూ కూడా మాట మార్చేశారు.
ఎలాంటి ప్రజలు ఈ బనీ ఇస్రాయీల్ ప్రజలు ఒకసారి ఆలోచించండి. కొద్దిసేపు క్రితమే పగడ్బాలు పలికారు, గొప్పలు పలికారు, మేము యుద్ధాలు చేస్తాము అని. యుద్ధం విధి చేసేసిన తర్వాత, మేము యుద్ధము చేయము అని చేతులు దులుపుకున్నారు. వెళ్ళిపోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. కానీ, మాట మీద నిలబడిన వారు 80,000 మాత్రమే. అయితే ఆ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉంటున్నారు, చిత్తశుద్ధితో నిలబడుతున్నారు అనేది లెక్క తేలలేదు. అయినా గానీ, తాలూత్ రాజు ఆ 80,000 మందిని వెంటపెట్టుకుని యుద్ధము కోసము బయలుదేరారు.
అయితే మనిషి లోపల ఎక్కడో ఒకచోట ఒక ఆలోచన, కంగారు అనేది ఉంది. లక్షల్లో బనీ ఇస్రాయీల్ ప్రజలు యుద్ధము చేయము అని వెనకడుగు వేసేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 80,000 లో నుంచి కూడా ఎంతమంది చిత్తశుద్ధితో ఉన్నారు అనేది లెక్క తేలలేదు. అయితే ఆ 80,000 లో నుంచి ఎంతమంది చిత్తశుద్ధి కలిగిన వారు ఉన్నారు అనేది తేల్చడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. వారు యుద్ధము కోసము తాలూత్ రాజుతో పాటు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వెళుతూ వెళుతూ ఉంటే దారిలో ఒక నది వచ్చింది. ఆ నది పేరు నెహ్రె ఉర్దున్, జోర్డాన్ నది. ఆ నది దాటుతున్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరీక్ష పెట్టాడు. ఆ నది నీరు ఎవరూ కడుపునిండా తాగరాదు. ఒక గుడికెడు నీళ్లు తాగాలనుకుంటే తాగవచ్చు గానీ, అసలు తాగకుండా ఉంటేనే మంచిది. కడుపు నిండా అయితే అస్సలు తాగనే రాదు అని అల్లాహ్ పరీక్ష పెట్టేశాడు.
చూడండి, ప్రయాణంలో ఉన్నారు, బాగా దప్పిక, ఆకలితో ఉన్నారు. అలాంటప్పుడు మంచి నీరు కనిపించాయి. ఆ మంచి నీరు తాగవద్దు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిబంధన పెట్టాడు, పరీక్షించడానికి. అయితే నది దిగి నది అవతల వైపు దాటేసరికి 80,000 లో నుంచి కేవలం 313 వ్యక్తులు మాత్రమే నీళ్లు తాగలేదు, మిగతా వారందరూ కూడా కడుపు నిండా నీళ్లు తాగేశారు. దీని ద్వారా అర్థమైన విషయం ఏమిటంటే, ఆ 80,000 లో నుంచి కూడా చిత్తశుద్ధి కలిగిన వారు కేవలం 313 మంది మాత్రమే. మిగతా వారందరూ కూడా మాట మీద, చిత్తశుద్ధితో ఉన్నవారు కాదు అని తేలిపోయింది.
నది దాటిన తర్వాత, ఎప్పుడైతే వారు నది అవతల వైపుకి చేరుకున్నారో, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు కాళ్లు చేతులు నిరసించిపోయాయి. వారు కూర్చుండిపోయారు. రాజుతో, మహారాజా, ఇప్పుడు మేము యుద్ధంలో పాల్గొనలేము, మా శరీరంలో శక్తి లేకుండా పోయింది అని చేతులెత్తేశారు.
జాలూత్ తో యుద్ధం
ఒక్కసారి ఆలోచించి చూడండి. 80,000 లో నుంచి కేవలం 313 మంది మాత్రమే నీళ్ళు తాగకుండా ఉన్నారు. ఆ 313 మందిని తీసుకుని వెళ్లి ఇప్పుడు పెద్ద సైన్యంతో యుద్ధం చేయాలంటే మామూలు విషయమా? ఆ 313 మంది ఎంత కంగారు పడిపోతారు అలాంటి సందర్భంలో? కానీ చిత్తశుద్ధి కలిగిన ఆ 313 మంది ఒకరినొకరు ఏమని మాట్లాడుకున్నారంటే, చూడండి మనము అల్లాహ్ మీద నమ్మకం కలిగి ఉన్నాము. మనకు పూర్వము కూడా తక్కువ సంఖ్యలో ఉన్న వారు అల్లాహ్ మీద నమ్మకంతో యుద్ధాలలో పాల్గొన్నప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని ఆదుకుని విజయాల వరకు చేర్చాడు కాబట్టి, మనము కూడా అల్లాహ్ మీద భారం వేసి, అల్లాహ్ మీద నమ్మకంతో ముందుకు సాగుదాము, పదండి. వీళ్ళు రాకపోయినా పర్వాలేదు, మాకు అల్లాహ్ సహాయకుడిగా ఉన్నాడు, మేము ఇన్ షా అల్లాహ్ తప్పనిసరిగా విజయము సాధిస్తాము అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని అక్కడి నుంచి ముందుకు సాగారు.
అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో బద్ర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాల సంఖ్య 313 మంది. అదే విధంగా ఇక్కడ తాలూత్ రాజుతో పాటు చిత్తశుద్ధి కలిగి యుద్ధంలో పాల్గొనడానికి ముందుకు వెళుతున్న వారి సంఖ్య కూడా 313. ఆ 313 మందిని తీసుకుని తాలూత్ రాజు యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లారు. ముందుకు వెళ్ళిన తర్వాత శత్రు సైన్యం ఎదురుపడింది. ఎప్పుడైతే శత్రు సైన్యము ఎదురుపడిందో, అక్కడ చూస్తే శత్రు సైన్యంలో సైన్యము సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారి సైన్యాధిపతి, అతని అరబీ భాషలో జాలూత్ అంటారు, తెలుగులో గొలియత్ మరియు అలాగే ఆంగ్లంలో కూడా గొలియత్ అని అనువాదం చేసి ఉన్నారు. అరబీలో అయితే, ఉర్దూలో అయితే జాలూత్ అని అతని పేరు తెలపబడింది. అతను యుద్ధ వస్త్రాలు ధరించి, కత్తి పట్టుకుని, పెద్ద శరీర దేహము కలిగిన వాడు, ముందుకు వచ్చాడు. అతని దేహాన్ని, అతని ఎత్తును చూసి ఏ ఒక్కరూ కూడా అతని ముందుకు వెళ్ళటానికి సాహసించలేకపోతున్నారు. అతను ముందుకు వచ్చి సవాలు విసిరాడు. మీ 313 మందిలో నుంచి నన్ను ఎదుర్కొనే మొనగాడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే రండి ముందుకు చూద్దాము అని బిగ్గరగా సవాలు విసురుతూ ఉన్నాడు. ఎంతో గర్వాన్ని, ఎంతో అహంకారాన్ని ప్రదర్శిస్తూ, మీలో ఎవరైనా ఉన్నాడా, ఎవరికైనా దమ్ము ఉందా నన్ను ఎదుర్కోవడానికి అని సవాలు విసురుతూ ఉంటే, ఈ 313 మందిలో నుంచి 16 సంవత్సరాల ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. అతను ఎలాంటి యుద్ధ యుద్ధ వస్త్రాలు ధరించి లేడు. అతని చేతిలో చివరికి ఖడ్గము, కత్తి కూడా లేదు. చేతిలో ఒక తాడు ఉంది, మరొక చేతిలో కొన్ని రాళ్లు మాత్రమే ఉన్నాయి.
ఆ రాళ్లు, ఆ తాడు పట్టుకుని ముందుకు వస్తే, ఆ కుర్రాడిని చూసి ఆ జాలూత్ సేనాధిపతి పకపక నవ్వేసాడు. ఒరేయ్ బచ్చా, నీవు నన్ను ఎదుర్కొంటావా? నీ సైన్యంలో నీకంటే గొప్ప పెద్ద మొనగాడు ఎవడూ లేడా నన్ను ఎదుర్కోవడానికి? అని హేళన చేశాడు. అతను హేళన చేస్తూ ఉంటే, అతని వెనుక ఉన్న అతని సైన్యము నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ 16 ఏళ్ల కుర్రాడు తాడులో ఆ రాళ్లు పెట్టి గిరగిరా తిప్పి వేగంగా విసిరాడు. అవి ఎంత వేగంగా వచ్చి తగిలాయి అంటే చరిత్రకారులు తెలియజేశారు, మెరుపు వేగంతో ఆ రాళ్లు వచ్చి ఆ జాలూత్ నుదుటను బలంగా తాకాయి. ఒకదాని వెనుక ఒకటి వచ్చి తాకగానే ఆ గర్విస్తున్న ఆ జాలూత్ ఒక్కసారిగా వెనక్కి కూలి పడిపోయాడు. అలాగే ప్రాణాలు వదిలేశాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ జాలూత్ సైన్యం మొత్తము భయపడిపోయింది, బిత్తరపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా రెండు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైపోయింది. చూస్తూ ఉండంగానే కంగారు పడిపోయిన, బిత్తరపోయిన, భయపడిపోయిన జాలూత్ సైన్యము పరాజయం పాలయ్యి పారిపోయారు. ఈ 313 మంది గెలుపు పొందారు, విజయము ఈ భక్తులకు, చిత్తశుద్ధి కలిగిన వారికి దక్కింది. అయితే ఆ 16 సంవత్సరాల కుర్రాడు ఎవరైతే జాలూత్ ని రాళ్లతో కొట్టి చంపేశాడో, అతను ఎవరంటే, ఆయనే దావూద్ అలైహిస్సలాం. అల్లాహు అక్బర్.
చూశారా? ఆయన పేరే దావూద్ అలైహిస్సలాం. దావూద్ అలైహిస్సలాం వారి చేతిలో ఆ జాలూత్ అనే సేనాధికారి మరణించాడు. విజయము ముస్లింలకు, చిత్తశుద్ధి కలిగిన ఈ భక్తులకు వరించింది అల్ హందులిల్లాహ్. అది చూసిన ఈ తాలూత్ రాజు, 313 మందిని వెనక పట్టుకుని వచ్చిన ఈ తాలూత్ రాజు, దావూద్ అలైహిస్సలాం వారిని మెచ్చుకుని ఆ తర్వాత తన కుమార్తెను దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చి వివాహం జరిపించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం రాజకుమార్తెతో వివాహం చేసుకున్నారు, రాజుకి అల్లుడైపోయారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత రాజు తన రాజ్యాన్ని కూడా దావూద్ అలైహిస్సలాం వారి చేతికి అప్పగించేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ వారికి దావూద్ అలైహిస్సలాం వారు రాజయ్యారు.
దావూద్ (అలైహిస్సలాం) ప్రవక్తగా మరియు రాజుగా
రాజైపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ప్రవక్త పదవి కూడా ఇచ్చేశాడు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ఆయనే ప్రవక్త, ఆయనే రాజు. అంటే ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు కూడా ఆయనే పరిష్కరిస్తారు. అలాగే ప్రజల ధార్మిక విషయాలు కూడా ఆయనే బోధిస్తారు, పరిష్కరిస్తారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం ప్రవక్త కూడా, దావూద్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజలకి రాజు కూడా. అయితే దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని మహిమలు ఇచ్చాడు. ఏంటి ఆ మహిమలు? ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం పేరు జబూర్. ఖురాన్ లోని సూరా నిసా 165 వ వాక్యంలో ఆ జబూర్ గ్రంథం ప్రస్తావన వచ్చి ఉంది. ప్రపంచంలో నాలుగు గ్రంథాలు బాగా ప్రసిద్ధి చెంది ఉన్నాయి: తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్. ఈ ప్రసిద్ధి చెందిన నాలుగు గ్రంథాలలో జబూర్ గ్రంథము కూడా ఉంది. ఆ జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది అల్లాహ్ తరపున.
దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము ఇచ్చాడు, మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవారు. ఆయన ఆ జబూర్ గ్రంథాన్ని మంచి స్వరంతో, కంఠంతో చదువుతూ ఉంటే, పర్వతాలు కూడా ఆయన చదువుతున్న ఆ జబూర్ గ్రంథ వాక్యాలు చాలా చిత్తశుద్ధితో వినేవి, అవి కూడా వెంట వెంటనే ఆ పలుకులు పలికే ప్రయత్నము చేసేవి. అంతే కాదండీ, పక్షులు సైతము దావూద్ అలైహిస్సలాం వారు జబూర్ వాక్యాలు పఠిస్తూ ఉంటే మంచి స్వరంతో, వచ్చి చుట్టూ కూర్చుని మెడలు కిందికి వంచుకుని చాలా చక్కగా, శ్రద్ధగా వినేవి. అంత మంచి స్వరంతో ఆయన ఆ జబూర్ వాక్యాలు పఠించేవారు.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం వారికి ఇచ్చిన మరొక మహిమ ఏమిటంటే, లోహాన్ని ఆయన కోసము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెత్తదిగా మార్చేశాడు. లోహము చాలా గట్టిది. దాన్ని మెత్తదిగా మార్చాలంటే అగ్నిలో చాలా సేపు బాగా ఎర్రగా కాల్చాల్సి వస్తుంది. ఆ తర్వాత అది మెత్తబడుతుంది. ఆ తర్వాత దాన్ని కావలసిన ఆకారంలో ప్రజలు మలుచుకుంటూ ఉంటారు. కానీ దావూద్ అలైహిస్సలాం లోహాన్ని ముట్టుకుంటే చాలు, అది మెత్తగా మారిపోతుంది. ఆ తర్వాత దావూద్ అలైహిస్సలాం ఆయనకు తోచినట్టుగా ఆ లోహాన్ని కావలసిన ఆకారంలో మలుచుకునేవారు. ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లోహాన్ని మెత్తదిగా చేసేసాడు. దావూద్ అలైహిస్సలాం ఆ లోహంతో యుద్ధ వస్త్రాలు తయారు చేసేవారు, కత్తులు తయారు చేసేవారు, అలాగే కవచాలు, వేరే విషయాలు కూడా ఆయన తయారు చేసేవారు.
దావూద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రాజు అయ్యి ఉండి కూడా బైతుల్ మాల్ నుండి, రాజు ఖజానా నుండి సొమ్ము తీసుకునే వారు కాదు. లోహాన్ని కరిగించి, ఆ లోహం నుండి తయారు చేసిన కవచాలు, కత్తులు ఇంకా వేరే విషయాలను అమ్మి, వాటితో వచ్చే సొమ్ముతో ఆయన అవసరాలు తీర్చుకునేవారు. ఎంత చిత్తశుద్ధి కలిగినవారో చూడండి.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి యొక్క అలవాటు ఏమిటంటే, ఆయన ఉదయం పూట ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. గొడవ పడిన వాళ్లకు తీర్పులు ఇచ్చేవారు. రాత్రి పూట మాత్రము అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమైపోయేవారు. రాత్రి పూట ఆయన వద్దకు రావడానికి ఎవరికీ అనుమతి ఉండేది కాదు.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసి, మళ్ళీ ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు మానేసేవారు. అంటే రోజు తర్వాత రోజు ఆయన ఉపవాసము ఉండటాన్ని ఇష్టపడేవారు, రోజు మార్చి రోజు ఆయన ఉపవాసం ఉండేవారు కాబట్టి, ఆ ఉపవాసానికే సౌమె దావూద్ అని పేరు పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, ఎవరైనా ఉపవాసాలు ఉండాలనుకుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే, వారు సౌమె దావూద్ పాటించవచ్చు. దావూద్ అలైహిస్సలాం ఒకరోజు ఉపవాసం ఉండి, ఒకరోజు ఉపవాసముని మానేసేవారు. రోజు తర్వాత రోజు ఉపవాసం ఉండేవారు, అంతవరకు మాత్రమే ఉపవాసం ఉండటానికి అనుమతి ఉంది అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో అబూ మూసా అనే ఒక శిష్యుడు ఉండేవారు. ఆయనకు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మంచి కంఠము, మంచి స్వరము ఇచ్చి ఉంటే, ఆయన ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఖురాన్ వాక్యాలు పఠిస్తూ ఉంటే, ఆ శబ్దాన్ని విని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్లి మెచ్చుకుంటూ, ఓ అబూ మూసా, నీకు అల్లాహ్ ఎంత మంచి కంఠము, స్వరము ఇచ్చాడంటే, దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడిన స్వరాలలో ఒక స్వరము నీకు ఇవ్వబడింది అనిపిస్తుంది నాకు అని చెప్పారు. ఆ విధంగా ఖురాన్ గ్రంథాన్ని, అలాగే ఆకాశ గ్రంథాన్ని మంచి స్వరంతో పఠించటము కూడా అల్లాహ్ తరపున దక్కిన గొప్ప అనుగ్రహం అని ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఇద్దరు గొర్రెల కాపరుల తీర్పు
అయితే దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక సంఘటన ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారు రాత్రిపూట ఆరాధనలో నిమగ్నమైపోయేవారు, రాత్రిపూట ఆయన వద్దకు ఎవరికీ వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు అని మనం ఇంతకు ముందే విన్నాం. సమస్య ఏమీ అయినా, గొడవ ఏమీ అయినా, ఉదయం పూట మాత్రమే ఆయన వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి. అయితే ఆయన రాత్రి పూట ఏకాంతంలో అల్లాహ్ ను ఆరాధించుకుంటూ ఉంటున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి పరిష్కారం కోసం వచ్చారు. అయితే ఆయన ఆరాధనలో నిమగ్నమై ఉన్నారు, ఇప్పుడు కలవడానికి కుదరదు, ఉదయము కలవవచ్చు అని తెలుసుకుని వారు ఉదయం వరకు మేము ఓపిక పట్టేదానికి లేదు అని గోడ దూకి లోపలికి ప్రవేశించారు.
ఆరాధనలో ఉన్న దావూద్ అలైహిస్సలాం వారు కంగారుపడిపోయారు. ఇదేమిటి? ఎవరైనా దాడి చేయడానికి వచ్చాడేమో అని కంగారుపడిపోయారు. కానీ ఆ తర్వాత వారిద్దరూ వెళ్లి దావూద్ అలైహిస్సలాం వారితో మేము గొడవ పడటానికి, దాడి చేయడానికి రాలేదండీ. మా ఇద్దరి మధ్య ఒక వ్యవహారంలో భేదాభిప్రాయము కలిగింది. కాబట్టి తీర్పు కోసము మీ వద్దకు వచ్చాము అని చెప్పారు. సమస్య ఏంటి అని దావూద్ అలైహిస్సలాం వారు అడిగితే, అప్పుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నా వద్ద ఒకే ఒక గొర్రె ఉంది. ఈ నా సోదరుని వద్ద 99 గొర్రెలు ఉన్నాయి. ఇతను 99 గొర్రెలు మేపుకోవడానికి వెళుతూ వెళుతూ, నా మీద సానుభూతి చూపి, అయ్యా నీ వద్ద ఒకే ఒక గొర్రె ఉంది, ఆ ఒక గొర్రెను మేపడానికి నీవు వెళ్లి కష్టపడటం ఎందుకు? ఆ ఒక గొర్రెను కూడా నా గొర్రెలతో పాటు పంపించేయి, నేనే ఆ 99 గొర్రెలతో పాటు నీ ఒక గొర్రెను కూడా మేపుకొని వస్తాను అని చెబితే, నా సోదరుడు నా మీద సానుభూతి చూపిస్తున్నాడులే అనుకుని నేను నా గొర్రెను అతని గొర్రెలతో పాటు మేపడానికి పంపించేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత నా గొర్రె అతని గొర్రెలతో పాటు వెళ్ళటము, మేసి తిరిగి రావటము, దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఇతను నా సోదరుడు, ఆ గొర్రె నాదే అని ప్రకటిస్తున్నాడు. ఇలా చేయటము న్యాయమేనా మీరు చెప్పండి అని అడిగారు.
అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారు వెంటనే, అయ్యో 99 గొర్రెలు పెట్టుకుని ఇంకా నీ మనిషికి కోరిక తీరలేదా? ఆ ఒక్క గొర్రె కూడా నీవు తీసుకోవాలని చూస్తావా? ఎంత దురాశ నీకు? ఇలా అతను చేయటము దౌర్జన్యము, అలా చేయరాదు అని వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు మాట్లాడేశారు. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడేశారో, అప్పుడు ఆ 99 గొర్రెల వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారితో, అయ్యా మీరు కేవలం అతని మాట మాత్రమే విన్నారు, నా మాట విన్నారా? సమస్య ఏంటో నా నోట మీరు తెలుసుకున్నారా? నా నోట మీరు సమస్య అడిగి తెలుసుకోకుండానే ఒక వ్యక్తి మాట విని వేసి వెంటనే తీర్పు చెప్పేటం ఏమిటయ్యా ఇది? నా మాట కూడా మీరు వినాలి కదా. నా మాట, ఆయన మాట, ఇద్దరి మాటలు విని, సత్యం ఎవరి వైపు ఉంది అనేది మీరు అప్పుడు చూడాలి కదా. నా మాట వినకుండానే మీరు తీర్పు ఇచ్చిస్తున్నారు ఏమిటయ్యా ఇది? అని ఆయన అడిగేశాడు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారికి తప్పు తెలిసింది. వెంటనే దావూద్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో మన్నింపు కోరుకున్నారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మన్నించాడు. ఈ ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో సూరా సాద్ 21 నుండి 24 వాక్యాల వరకు ఉంది.
అలాగే దావూద్ అలైహిస్సలాం వారు అటు ఉదయం పూట ప్రజల ప్రాపంచిక వ్యవహారాలు చక్కదిద్దుకుంటూ, రాత్రి పూట అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, ప్రజలకు జబూర్ గ్రంథంలోని దైవ వాక్యాలు బోధించుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉంటే, దావూద్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆయన పేరు సులేమాన్. ఇన్ షా అల్లాహ్, సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఈ ప్రసంగంలో సులేమాన్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర ఉండదు కానీ, దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో చోటు చేసుకున్న ఒక సంఘటన మాత్రము తెలుపుతాను.
దావూద్ అలైహిస్సలాం వారి కుమారుడు సులేమాన్ అలైహిస్సలాం పెరిగి పెద్దవారయ్యారు. ఈలోపు దావూద్ అలైహిస్సలాం వారి జీవితంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. మరొకసారి ఇద్దరు వ్యక్తులు దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు తీర్పు కోసం వచ్చారు. సమస్య ఏంటంటే, ఒక వ్యక్తి వద్ద చేను ఉంది, అందులో అతను పంట పండిస్తూ ఉంటే, పంట కొద్ది రోజుల్లో ఇన్ షా అల్లాహ్ ఇప్పుడు కోతకు వస్తుంది అన్నప్పుడు, మరొక వ్యక్తి వద్ద ఉన్న పశువులు వచ్చి ఆ చేనులోకి దూరి పూర్తి పంటను నాశనం చేసేసాయి, మేసేసి. ఇప్పుడు ఆ చేను కలిగిన వ్యక్తి దావూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, కొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న నా పంట మొత్తము ఈ వ్యక్తి పశువులు వచ్చి నాశనం చేసేసాయి. ఈ వ్యక్తి ఇతని పశువుల్ని జాగ్రత్తగా కట్టుకుని బంధించుకొని ఉంచాల్సింది. నా చేనులోకి అతను ఎలాంటి భద్రత లేకుండా నిర్లక్ష్యంగా పశువుల్ని వదిలేసిన కారణంగా నా పంట మొత్తం నాశనమైపోయింది కాబట్టి నాకు నష్టపరిహారము ఇప్పించండి అని ఆ చేను కలిగిన వ్యక్తి అడగగా, దావూద్ అలైహిస్సలాం వారు తీర్పు ఇస్తూ, అతని వద్ద ఉన్న పశువులన్నీ నీవు తీసుకో అని చెప్పేశారు.
ఆ తీర్పు చెప్పగా ఆ పశువుల యజమాని అసహనం వ్యక్తపరుస్తూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఎదురుపడ్డారు. ఏంటయ్యా విషయం అని అడిగితే, చూడండి నా పశువులు వెళ్లి అతని చేనులో మేసాయి, అతని పంటకు నష్టం కలిగించాయి. అది నిజమే. అయితే నష్టపరిహారంగా నా పూర్తి పశువుల్ని అతనికి ఇచ్చేయమని మీ నాన్నగారు చెప్పేశారు. ఇదేంటయ్యా ఇది, ఏం న్యాయమయ్యా ఇది అని ఆయన అడుగుతూ ఉంటే, అసహనం వ్యక్తపరుస్తూ ఉంటే, సులేమాన్ అలైహిస్సలాం వారు ఆ ఇద్దరు వ్యక్తుల్ని మళ్లీ వెంటపెట్టుకుని, పదండి నేను నాన్నతో మాట్లాడతాను అని మళ్లీ పిలుచుకుని వచ్చారు. నాన్నగారి వద్దకు వచ్చి, నాన్నగారు, మీరు తీర్పు ఇచ్చారు సరే, కానీ ఈ సమస్యకు మరొక తీర్పు కూడా ఉంటుంది. మీరు అనుమతి ఇస్తే నేను చెప్తాను, ఇన్ షా అల్లాహ్ ఆ తీర్పు మీకు నచ్చుతుంది అని చెప్పారు. దావూద్ అలైహిస్సలాం, సరే చెప్పు నాయనా చూద్దాము అని సులేమాన్ అలైహిస్సలాం వారికి అనుమతి ఇవ్వగా, సులేమాన్ అలైహిస్సలాం వారు అన్నారు, చూడండి చేతికి వచ్చిన పంట నాశనమైపోయింది. అతనికి తప్పనిసరిగా నష్టం వాటిల్లింది. అయితే ఈ పశువులు ఉన్న వ్యక్తికి ఇప్పుడు బాధ్యత ఏమిటంటే, అతను కొద్ది నెలల కోసము కష్టపడి ఆ చేనులో మళ్ళీ అదే పంట వేసి, పంట చేతికి వచ్చినంత వరకు దాన్ని బాగా జాగ్రత్తగా చూసుకుని, పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంట ఆ చేను యజమానికి మళ్ళీ అప్పగించాలి. అప్పటివరకు ఆ చేను యజమాని నీ పశువుల్ని తన వద్ద ఉంచుకుని వాటి పాలతో, ఇతర వేరే విషయాలతో లబ్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే నీవు ఆ చేనులో పంట పండించి అతనికి ఆ పంట అప్పగిస్తావో, ఆ రోజు అతను నీ పశువులన్నీ కూడా నీకు అప్పగించేస్తాడు. అప్పటివరకు నీ పశువులు అతని వద్ద ఉంటాయి అని తీర్పు ఇవ్వగా, దావూద్ అలైహిస్సలాం వారు విని చాలా మెచ్చుకున్నారు. మాషా అల్లాహ్, ఈ తీర్పు చాలా బాగుంది. దీని ద్వారా ఇద్దరిలో ఏ ఒక్కరికి నష్టము ఉండదు, ఇద్దరూ లాభపడతారు, ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. చాలా మంచి తీర్పు అని దావూద్ అలైహిస్సలాం వారు మెచ్చుకున్నారు.
దావూద్ (అలైహిస్సలాం) మరణం
అయితే మిత్రులారా, ఆ విధంగా దావూద్ అలైహిస్సలాం వారు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారి వయస్సు 100 సంవత్సరాలకు చేరింది. ఇంతకుముందు మనము ప్రవక్త ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో దావూద్ అలైహిస్సలాం వారి ప్రస్తావన విని ఉన్నాం. ఎవరికైనా గుర్తుందా? ఏంటి ఆ విషయము?
ఆదమ్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించినప్పుడు, ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని కూడా ఆదమ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. అప్పుడు ఆదమ్ అలైహిస్సలాం వారి సంతానాన్ని చూస్తూ చూస్తూ ఒక ఆత్మ వద్ద కాంతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే, ఎవరిది ఈ ఆత్మ, ఎవరు ఈయన అని అడిగినప్పుడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇతను మీ కుమారుడు దావూద్, మీ తర్వాత చాలా సంవత్సరాలకు ప్రపంచంలో పుడతాడు అని అల్లాహ్ తెలియజేస్తే, అతని ఆయుష్షు ఎంత అని ఆదమ్ అలైహిస్సలాం వారు అడిగినప్పుడు, 60 సంవత్సరాలు అని అల్లాహ్ తెలియజేయగా, నా ఈ బిడ్డకు 60 సంవత్సరాలేనా ఆయుష్షు? నా ఆయుష్షులో నుంచి ఒక 40 సంవత్సరాలు అతని ఆయుష్షులోకి వేసేసి 100 సంవత్సరాలు చేయండి అని ఆదమ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ తో కోరగా, అల్లాహ్ ఆదేశంతో అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 100 సంవత్సరాలుగా మార్చబడింది అని ఆ రోజు మనము ఆదమ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విని ఉన్నాము గుర్తుందా కదా అండి?
అలాగే దావూద్ అలైహిస్సలాం వారి ఆయుష్షు 60 ప్లస్ 40 మొత్తం కలిపి 100 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 100 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు, దావూద్ అలైహిస్సలాం వారు ఒకరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇంటిని తలుపులు వేసేసి, బయట నుండి తాళం వేసేసి వెళ్లిపోయారు. ఆయన వెళ్ళిన కొద్దిసేపు తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నారు. అనుకోకుండా ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అది చూసి దావూద్ అలైహిస్సలాం కుటుంబ సభ్యులు కంగారుపడిపోయారు. అయ్యో పరాయి వ్యక్తి తలుపులు, గదులు వేసి ఉన్నా గానీ, గదులు మూసేసి ఉన్నా, తలుపులు మూసేసి ఉన్నా, ఎలా వచ్చేసాడు గదిలోకి, లోపలికి? అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దావూద్ అలైహిస్సలాం వారు వచ్చి చూస్తే, మనమంతా అప్పుడు ఆయన దృష్టిలో కలంకితులమైపోతామేమో కదా, ఎలా వచ్చాడు ఈ వ్యక్తి? అని వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అందులోనే దావూద్ అలైహిస్సలాం వారు తిరిగి తలుపులు తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించి చూస్తే, కుటుంబ సభ్యులు ఉన్నారు, పక్కన మరొక వ్యక్తి కూడా ఉన్నాడు.
దావూద్ అలైహిస్సలాం వారికి కోపం వచ్చింది. పరాయి వ్యక్తి నేను లేనప్పుడు నా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అది నేను బయట నుండి తాళం వేసి వెళ్ళినప్పుడు? అని కోపంగా ఎవరయ్యా నువ్వు? అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఏ తాళాలు, ఏ తలుపులు నన్ను ఆపలేవు, అంతెందుకు ఏ రక్షక భటులు కూడా నన్ను ఆపలేరు. నేను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వెళ్ళగలను అని చెబుతూ ఉంటే, వెంటనే దావూద్ అలైహిస్సలాం వారు అర్థం చేసుకున్నారు. తలుపులు మూసివేసి ఉన్నా, నువ్వు లోపలికి రాగలిగినావు అంటే, నీవు మానవుడివి కావు, నీవు దైవదూతవు, అవునా? అన్నారు. అప్పుడు ఆయన, అవునండి, నేను దైవదూతనే, ఇప్పుడు మీ మరణ సమయము సమీపించింది, మీ ఆయుష్షు పూర్తి అయ్యింది, మీ ప్రాణము తీసుకుని వెళ్ళవలసి ఉంది అని చెప్పగా, దావూద్ అలైహిస్సలాం వారు మరణానికి సిద్ధమయ్యారు. అప్పుడు దావూద్ అలైహిస్సలాం వారి ప్రాణాలు ఆ దైవదూత తీసుకుని వెళ్ళిపోయారు. 100 సంవత్సరాల వయస్సులో దావూద్ అలైహిస్సలాం వారి మరణము సంభవించింది. దావూద్ అలైహిస్సలాం వారి మరణానంతరం ప్రవక్త పదవి మరియు రాజ్యాధికారము ఆయన కుమారుడైన సులేమాన్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది.
సులేమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ఇన్ షా అల్లాహ్ మనము వచ్చే ఆదివారము ఇన్ షా అల్లాహ్ వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఇక్కడితో దావూద్ అలైహిస్సలాం వారి చరిత్ర తెలియజేసి నా మాటను నేను ముగిస్తూ ఉన్నాను.
అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రవక్తల జీవిత చరిత్ర తెలుసుకుని, వాటి ద్వారా బోధపడే విషయాలు అర్థం చేసుకుని, మన విశ్వాసాన్ని పెంచుకుని, మన పాపాలను అలాగే మార్గభ్రష్టత్వాన్ని సంస్కరించుకుని అల్లాహ్ తో క్షమాపణ వేడుకుంటూ ధర్మం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రశ్న మరియు జవాబు
ప్రియ ప్రేక్షకులారా, విద్యార్థులారా, షేక్ గారు ప్రసంగించిన ఈ అంశానికి సంబంధించి మీ వద్ద ఏమైనా ప్రశ్న ఉంటే త్వరగా మీ ఎలక్ట్రానిక్ చేయిని ఎత్తండి, మీకు ప్రశ్నించే అవకాశం ఇవ్వబడుతుంది.
దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో ఏమి గుణపాఠం నేర్చుకోవాలి అతని ద్వారాగా?
ఆ దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తీర్పు ఇచ్చే వారు ఒక వ్యక్తి మాటలే విని వేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు. ఇద్దరినీ, ప్రత్యర్థులు ఇద్దరినీ కూడా కూర్చోబెట్టి వీరి వాదనలు కూడా వినాలి, వారి వాదనలు కూడా వినాలి. ఇరువైపుల నుండి వాదనలు విని, ఆ తర్వాత ఎవరి పక్షంలో న్యాయం ఉంది అనేది గ్రహించి ఆ తర్వాత తీర్పు ఇవ్వాలి. కేవలం ఒక వర్గం మాటలే విని వేసి, ఆ వర్గం మాటల్నే సత్యమని నమ్మేసి వెంటనే తీర్పు ఇవ్వరాదు అనేది ఒక విషయం.
అలాగే ప్రవక్త దైవ వాక్యాలు బోధించటంతో పాటు, ప్రాపంచిక ప్రజల ప్రాపంచిక సమస్యలు పరిష్కరించడానికి అతను ప్రజల రాజు కూడా అవ్వగలడు. ఒక ప్రవక్త ప్రవక్త పదవితో పాటు రాజుగా ఆ బాధ్యతలు కూడా నెరవేర్చగలడు. రాజులు ప్రవక్తలుగా, ప్రవక్తలు రాజులుగా ఉండటము నేరము కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రవక్తలు కేవలము ధార్మిక విషయాలు బోధించేంత వరకు మాత్రమే పరిమితమై ఉండాలి, వారికి రాజ్యంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. రాజులు పరిపాలన చేసుకుంటూ ఉండాలి, వారికి ధార్మిక విషయాలలో జోక్యము తగదు అని డివైడ్ చేస్తూ ఉంటారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దావూద్ అలైహిస్సలాం మరియు సులేమాన్ అలైహిస్సలాం వారి ప్రస్తావన చేసి, ఒకే వ్యక్తి ప్రవక్తగా కూడా ధార్మిక విషయాలు బోధించగలడు, ఒకే వ్యక్తి రాజుగా కూడా ప్రజలకు నాయకత్వం వహించగలడు అనే విషయాలు కూడా తెలియజేసి ఉన్నారు.
అలాగే ఆకాశ గ్రంథాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చాలా మంది ప్రవక్తలకు ఇచ్చి ఉన్నాడు. అందులో నాలుగు ఆకాశ గ్రంథాలు ప్రసిద్ధి చెందినవి. అందులో ఒక గ్రంథము జబూర్ గ్రంథము దావూద్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. అయితే ఇప్పుడు అది అసలు రూపంలో ప్రపంచంలో లేదు. ఖురాన్ గ్రంథము అవతరించబడిన తర్వాత మిగతా గ్రంథాలు అన్నీ కూడా మన్సూఖ్ (రద్దు) అయిపోయాయి. ఇప్పుడు ప్రపంచంలో చలామణిలో మరియు చెల్లుబాటులో ఉన్న ఆకాశ గ్రంథము ఖురాన్ గ్రంథము అని కూడా మనము గ్రహించాలి.
అలాగే ప్రవక్త ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప దైవభక్తుడు అయినా మరణము తప్పదు, తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది. మనిషి ఎక్కడ ఉన్నా, దైవదూతలు అక్కడికి వెళ్లి అతని ప్రాణాలు తీయగలరు. అతను తలుపులు వేసుకుని గది లోపల ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మరణం సమీపించినప్పుడు దైవదూతలు వెళ్లి అతన్ని అక్కడి నుంచి ప్రాణాలు తీయగలరు. ఇలాంటి కొన్ని విషయాలు మనకు దావూద్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా బోధపడతాయి.
గురువుగారు, ఇక్కడ ఆదమ్ అలైహిస్సలాం గారు తమ ఆయుష్షు నుంచి 40 సంవత్సరాలు దావూద్ అలైహిస్సలాం గారికి ప్రసాదిస్తారు కదా, ప్రసాదించిన 40 సంవత్సరాలను కలుపుకుని పూర్తి ఎన్ని సంవత్సరాలు వారు, వారికి ఆయుష్షు కలిగింది దావూద్ అలైహిస్సలాం కి? రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ 40 సంవత్సరాలు వారు, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం గారికి గిఫ్ట్ గా ఇచ్చిన 40 సంవత్సరాలు ఈ రివాయత్ అంటే ఆధారం ఇది, ఇది ఇజ్రాయెలీ రివాయతా లేకపోతే హదీస్ పరంగానండి ఇది? దీని ఆధారం?
రెండు విషయాలు అడిగారండి మీరు. అవునండి. ఒకటి, ఆదమ్ అలైహిస్సలాం వారు దావూద్ అలైహిస్సలాం వారికి 40 సంవత్సరాల ఆయుష్షు ఇచ్చిన తర్వాత, దావూద్ అలైహిస్సలాం వారి పూర్తి ఆయుష్షు ఎంత? అని అడిగారు. ఇది మొదటి ప్రశ్న కదండీ. దాని సమాధానం ఏమిటంటే, దావూద్ అలైహిస్సలాం వారి అసలు ఆయుష్షు 60 సంవత్సరాలు, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి పొందిన 40 సంవత్సరాలు. 60 మరియు 40, రెండు కలిపి మొత్తం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయన ఆయుష్షు అని మనకు ఇస్లామీయ గ్రంథాల ద్వారా, ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల ద్వారా తెలపబడింది. వేరే గ్రంథాల వారు ఆయన ఆయుష్షు 77 సంవత్సరాలు అని కూడా చెబుతూ ఉంటారు. కాకపోతే అవన్నీ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఆ విషయాల మీద మనము నిజము అని చెప్పడానికి లేదు, అబద్ధము అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అవి మన్సూఖ్ (రద్దు) అయిపోయిన గ్రంథాలు. మనకు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలలో ఉన్న విషయాలే ప్రామాణికమైనవి కాబట్టి నేను ఇవి మాత్రమే ప్రస్తావించాను, వాటి జోలికి నేను వెళ్ళలేదు. ఇది మొదటి విషయము. ఆయన ఆయుష్షు పూర్తి 100 సంవత్సరాలు అనేది మీ మొదటి ప్రశ్నకు సమాధానం. ఇక రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఆదమ్ అలైహిస్సలాం వారి ఆయుష్షులో నుంచి 40 సంవత్సరాలు ఆయనకు ఇవ్వబడటము, ఇది ఇస్రాయీలీ ఉల్లేఖనమా లేదా ప్రవక్త వారి ఖురాన్ లేదా హదీస్ ఉల్లేఖనాలా అని విధంగా మీరు అడిగారు. దాని సమాధానం ఏమిటంటే, ఇవి ఇస్రాయీలీ ఉల్లేఖనాలు కావండి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వచనాలలో నుంచి వచ్చిన ఒక విషయం అండి. ముస్నద్ అహ్మద్ అనే ఒక హదీస్ గ్రంథం ఉంది. అందులో దీని ప్రస్తావన వచ్చి ఉంది.
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
తాలూత్ – మహారాజుగా మారిన పశువులకాపరి (1030-1010 క్రీ.పూ)
“అల్లాహ్ తాలూత్ను మీ రాజుగా నియమించాడని” వారి ప్రవక్త వారికి తెలియజేసినప్పుడు, “అతని అధికారం మాపై ఎలా నడుస్తుంది? రాజ్యాధికారానికి అతనికన్నా ఎక్కువ హక్కు దారులము మేమాయె! కనీసం అతనికి సిరిసంపదల్లో కూడా విస్తృతి వొసగబడలేదు” అని (సాకులు) చెప్పసాగారు. ప్రవక్త వారికి ఇలా నచ్చజెప్పాడు: “(చూడండి!) అల్లాహ్ అతన్నే మీపై (నాయకునిగా) ఎన్నుకున్నాడు. జ్ఞానపరంగా, శారీరకంగా కూడా అతనికి ఆధిక్యతను ప్రసాదించాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తాడు. అల్లాహ్ విశాల సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కూడా!” (2:247)
ఇ స్రాయీల్ ప్రజలు తమ వద్ద ఉన్న పవిత్ర పెట్టె (మూసా కాలానికి చెందిన కొన్ని పవిత్రమైన వస్తువులు కలిగి ఉన్న బంగారు తాపడం ఉన్న పెట్టె టాబర్నికల్) చాలా పవిత్రమైనదని, తమ చరిత్రకు సంబంధించి చాలా ముఖ్యమైన చిహ్నమని భావించేవారు. చివరకు యుద్ధాలలోను దానిని తీసుకుని వెళ్ళేవారు. దాని వల్లనే అల్లాహ్ తమను కాపాడుతున్నాడని నమ్మేవారు. ఈ నమ్మకం వల్ల వారికి మానసిక శాంతి, అపార ధైర్యసాహసాలు లభించేవి. దీని వల్ల వారి శత్రువులు కూడా భయ భీతులయ్యేవారు. దానికి అల్లాహ్ ప్రత్యేకమైన శక్తులు ప్రసాదించాడని వారి శత్రువులు భావించేవారు.
క్రమేణా ఇస్రాయీల్ ప్రజలు అల్లాహ్ ఆదేశాలను, చట్టాలను విస్మరించడం ప్రారంభించారు. చెడులు, దుర్నడతలు వారి జీవితాల్లో భాగాలుగా మారిపోయాయి. అల్లాహ్ వారిపై వారి శత్రువులను (పలస్తీనులను) పంపించాడు. ఇస్రాయీల్ ప్రజలను పలస్తీనులు ఓడించారు. వారి పవిత్ర పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వారిని వారి ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టారు. వారి సంతానాన్ని నిర్బంధించి బానిసలుగా మార్చారు. ఇస్రాయీలీల అధికారం ,ప్రాబల్యం అంతా అంతరించింది. వారు ఒకరికి ఒకరు కాకుండాపోయారు. నిరాశా నిస్పృహలకు గురయ్యారు.
అప్పుడు ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం) వారి వద్దకు వచ్చారు. ఆయన రాకతో వారికి కాస్త ఉపశమనం లభించింది. తమకు ఒక బలమైన నాయకుడి అవసరం ఉందని, అందుకు ప్రవక్త సహకరించాలని వారు ఆయన్ను కోరారు. ఒక బలమైన నాయకుని పర్యవేక్షణలో తాము శత్రువులతో పోరాడాల్సి ఉందని చెప్పారు. కాని ప్రవక్త శామ్యూల్ (అలైహిస్సలాం)కు వారి బలహీనతలు బాగా తెలుసు. అందువల్ల ఆయన వారితో, “పోరాడవలసిన సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తగ్గుతారు” అన్నారు. కాని వారు ఆయనతో, తాము చాలా పరాభవాలు సహించామని, ఇప్పుడు అల్లాహ్ మార్గంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అన్నారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది | సంకల్ప శుద్ధి (ఇఖ్లాస్) https://youtu.be/lQSrDz01_OQ [19 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
—
ఈ ప్రసంగంలో, రియాదుస్ సాలిహీన్ నుండి ఐదవ హదీసు వివరించబడింది. ఈ హదీసులో మ’అన్ ఇబ్ను యజీద్, అతని తండ్రి యజీద్ మరియు తాత అఖ్నస్, ముగ్గురూ సహాబాలు కావడం ఒక విశేషంగా పేర్కొనబడింది. యజీద్ మస్జిద్ లో దానం చేయాలనే ఉద్దేశ్యంతో ధనాన్ని ఉంచగా, అతని కొడుకు మ’అన్ అవసరార్థం దానిని తీసుకున్నాడు. తండ్రి దీనిపై అభ్యంతరం చెప్పగా, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ప్రవక్త (స) “ఓ యజీద్, నీ సంకల్పానికి ప్రతిఫలం నీకు లభిస్తుంది, మరియు ఓ మ’అన్, నీవు తీసుకున్నది నీకే చెందుతుంది” అని తీర్పు ఇచ్చారు. ఈ సంఘటన నుండి, కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉంటాయని, ఉద్దేశ్యం మంచిదైతే ఫలితం ఊహించని విధంగా ఉన్నా పుణ్యం లభిస్తుందని వివరించబడింది. అలాగే, తండ్రీకొడుకుల మధ్య విభేదాలు వస్తే పండితుల వద్దకు వెళ్లి పరిష్కారం వెతకాలని సూచించబడింది. చివరగా, ఒక వ్యక్తి తన కొడుకుకు లేదా తండ్రికి సాధారణ దానం (సదకా) ఇవ్వవచ్చని, కానీ జకాత్ ఇవ్వరాదని, ఎందుకంటే వారి పోషణ బాధ్యత తనపైనే ఉంటుందని వివరించబడింది. అయితే, వారు అప్పుల్లో ఉంటే, ఆ అప్పు తీర్చడానికి జకాత్ ఇవ్వవచ్చని స్పష్టం చేయబడింది.
“మా నాన్న యజీద్ ఒకసారి దానధర్మాల నిమిత్తం కొన్ని దీనార్లు బయటికి తీసి వాటిని మస్జిద్ లో ఒక వ్యక్తి దగ్గర (అవసరమున్న వానికి ఇవ్వమని) ఉంచి వెళ్ళిపోయారు. అదే సమయంలో నేను అక్కడికి వచ్చాను. (అవసరం నిమిత్తం) నేను ఆ వ్యక్తి నుండి దీనార్లు పుచ్చుకొని ఇంటికి తీసుకువచ్చాను. వాటిని చూసి మా నాన్నగారు “అల్లాహ్ సాక్షి! నేను ఇవి నీకివ్వాలనుకోలేదు. అంటూ నాతో వాదనకు దిగారు. నేను ఆయన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు మా నాన్న వాదన గురించి వివరించాను. దానికి అయన: “ఓ యజీద్! నీకు నీ సంకల్పానికి అను గుణంగా పుణ్యం లభిస్తుంది. ఓ మాన్! అలాగే నువ్వు తీసుకున్న దీనార్లు కూడా నీకొరకు ధర్మ సమ్మతమే అవుతాయి” అని తీర్పు చెప్పారు” (బుఖారీ)
السلام عليكم ورحمة الله وبركاته (అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక.
الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين، نبينا محمد وعلى آله وصحبه أجمعين، أما بعد (అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్) సకల లోకాల ప్రభువైన అల్లాహ్ యే సర్వ స్తోత్రాలకు అర్హుడు. ప్రవక్తల నాయకుడైన మనప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులు, సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కరుణ వర్షించుగాక.
సోదర మహాశయులారా! రియాదుస్ సాలిహీన్, హదీసు మకరందం అనే ఈ ప్రఖ్యాతి గాంచిన హదీసు పుస్తకం మనం చదవడం, అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము. ఈ క్రమంలో అల్లాహ్ యొక్క దయవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము.
ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్, మ’అన్ బిన్ యజీద్ బిన్ అఖ్నస్. మ’అన్, ఆయన తండ్రి పేరు యజీద్. ఆయన తండ్రి పేరు అఖ్నస్. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. రెండేసి మూడేసి సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది. ఏమిటది? కొడుకు, తండ్రి, తాత. మ’అన్ ఇబ్ను యజీద్ ఇబ్ను అఖ్నస్. వీరు ముగ్గురూ కూడా సహాబీలు.
సామాన్యంగా ఏముంటుంది? ఒక వ్యక్తి సహాబీ, మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు. లేదా ఒక వ్యక్తి, అతని కొడుకు కావచ్చు. కానీ ఇక్కడ ముగ్గురూ, కొడుకు, అతని తండ్రి, ఈ కొడుకు యొక్క తాత. ముగ్గురూ కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దులిల్లాహ్ చనిపోయారు కూడా. అయితే వీరు ముగ్గురూ కూడా అల్హమ్దులిల్లాహ్ సహాబీ. ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు:
وهو وأبوه وجده صحابيون (వ హువ వ అబూహు వ జద్దుహు సహాబియ్యూన్) అతను, అతని తండ్రి మరియు అతని తాత సహాబాలు.
అయితే ఇక రండి, అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము. ఇందులో ఈ కొడుకు హదీసును ఉల్లేఖిస్తున్నారు. విషయం ఏం జరిగిందంటే, మ’అన్ యొక్క తండ్రి యజీద్, అల్లాహ్ మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకుని వెళ్ళాడు. మస్జిద్ లో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతనికి ఇచ్చి, ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కొంత సమయానికి మ’అన్ వచ్చాడు, ఈ కొడుకు. ఆ వ్యక్తితో కలిశాడు, ఏదో మాట అయి ఉంటుంది, ఆ సందర్భంలో మ’అన్ కి అది అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మ’అన్ కి ఇచ్చేశాడు. మ’అన్ కు అవసరం కూడా ఉండినది అప్పుడు.
ఆ తర్వాత ఈ విషయం మ’అన్ యొక్క తండ్రి యజీద్ కు తెలిసింది. ఎవరు? దానం చేసిన వ్యక్తి. అప్పుడు యజీద్ అన్నాడు, “అల్లాహ్ సాక్షి, నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు.” అప్పుడు ఈ కొడుకు మ’అన్ ఏం చేశాడు? ఇక ఈ విషయంలో తండ్రితో గొడవ పడడం మంచిది కాదు. అయితే నాన్నా, మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియజేసి, అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము. ఇద్దరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఈ విషయం వివరించారు. యజీద్ చెప్పాడు, నేను డబ్బు తీసుకెళ్లి కొంత సామాను తీసుకెళ్లి ఇచ్చాను మస్జిద్ లో ఒక వ్యక్తికి, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని. ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు. కొడుకు చెప్పాడు, అవును, నాకు అవసరం ఉండింది. అల్లాహ్ ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను. మస్జిద్ లో ఈ వ్యక్తి కలిశాడు, అతని వద్ద అది ఉంది. అయితే నేను తీసుకొచ్చుకున్నాను. ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విన్న తర్వాత:
لك ما نويت يا يزيد، ولك ما أخذت يا معن (లక మా నవయిత యా యజీద్, వ లక మా అఖద్-త యా మ’అన్) ఓ యజీద్! నీ సంకల్పానికి తగిన ప్రతిఫలం నీకు లభిస్తుంది. మరియు ఓ మ’అన్! నీవు తీసుకున్నది నీకే చెందుతుంది.
అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికీ తీర్పు ఇచ్చారు. ఏంటి? ఓ యజీద్, నీకు నీ సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది. నువ్వు దానం చేయాలనుకున్నావు, ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది. ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు, ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు. ఆ నీ నియ్యత్ ప్రకారంగా, నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది. మరియు ఓ మ’అన్, నువ్వు తీసుకున్నది ఈ దానంలో కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి, హరామ్ కావు. ఎందుకు? తండ్రి నుండి నువ్వు దానంగా ఏదీ తీసుకోలేదు. ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు.
ఈ హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.
హదీసు నుండి పాఠాలు
మరియు మన ఈ మొదటి శీర్షిక, టాపిక్, ఉన్వాన్ ఇఖ్లాస్ కు సంబంధించినది. చిత్తశుద్ధి. మాట్లాడే మాట గానీ, మనం చేసే ఏదైనా పని గానీ, మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకే ఉండాలి. అల్లాహ్ తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు, ప్రాపంచిక లాభాలు పొందడానికి, ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవీ కూడా ఉండకూడదు.
ఈ శీర్షికలో, ఈ టాపిక్ లో ఇమామ్ నవవీ రహమహుల్లాహ్ ఈ హదీసును పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి? మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు. కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో, ఎలా కనబడుతుంది? మన నియ్యత్ కు, మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది. అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకు? ఏ మనిషి, ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో, అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది.
ఈ హదీసులో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో, అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయం అయి ఉండి ఉంటే, అందులో నేను ఉన్న మార్గమే, నా యొక్క ఆలోచనే, నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్వివాదానికి దిగి, పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు. తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి. అలాగే, ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని, ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అల్హమ్దులిల్లాహ్. కానీ లేదు, పరిష్కారం తేలడం లేదు, ఒక మంచి రిజల్ట్ వెళ్లడం లేదు, అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్లి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని, సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి. యజీద్ ఏమన్నాడు? లేదు, నువ్వు ఎందుకు తీసుకున్నావు మస్జిద్ లో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవ పడ్డాడు. కానీ కొడుకు మ’అన్ ఏం చేశాడు? తండ్రితో గొడవ పడడం మంచిది కాదు, ప్రవక్త ఉన్నారు, ఆయన వద్దకు వెళ్లి మనం నిజం ఏంటో తెలుసుకుందాము అని.
దీని ద్వారా మనకు మరొక విషయం ఏం తెలుస్తుంది? ఏ ధర్మ విషయంలో గానీ, ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే, ఆ విభేదాలను తూతూ మంత్రం, లేదు నేను చెప్పినట్టే, ఏ లేదు నేను చెప్పిందే కరెక్ట్, ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మజ్ఞానుల వద్దకు వెళ్లి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం.
ఇక్కడ మరొక విషయం మనకు ఏం అర్థమైందంటే, మన దగ్గరి కాలంలో ఇమామ్ ఇబ్ను ఉథైమీన్ రహమహుల్లాహ్ చాలా గొప్ప పండితులు గడిసి చనిపోయారు. ఆయన రియాదుస్ సాలిహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పదం ఏదైతే చెప్పారో, “లక మా నవైత్” (నీవు ఏ నియ్యత్ చేశావో), ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు.
ఉదాహరణకు, ఒక వ్యక్తి వద్ద రెండు ఇళ్లు ఉన్నాయి అనుకోండి. ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. అతడు అల్లాహ్ మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు. అనుకొని, ఎవరైనా బాధ్యులతోను మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ, ఏదో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిలిలో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే, మాట మాటల్లో అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ, “నేను నా ఈ ఇంటిని అల్లాహ్ మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను” అని పెద్ద ఇంటి వైపుకు వేలు చూపించాడు. అసలు అతని నియ్యత్ లో, సంకల్పంలో ఉన్నది ఏంటి? చిన్న ఇల్లు. కానీ ఆ మాట ధోరణిలో ఉండి, అక్కడ గమనించక వేలు అనేది ఎటు చూపించాడు? పెద్ద ఇల్లు వైపునకు. అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి అతను? చిన్నదా, పెద్దదా? కాదు. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే. నియ్యత్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి.
అలాగే, ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కు బయలుదేరాడు. మీకాత్ లో ఉండి ముందు నుండే అతని యొక్క నియ్యత్ ఉన్నది, నేను హజ్జె తమత్తు చేస్తాను అని. హజ్జె తమత్తు అంటే ఏమవుతుంది? ముందు ఉమ్రా చేసి, హలాల్ అయిపోయి, మళ్ళీ ఎనిమిదవ తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఇహ్రామ్ కొత్తగా చేస్తారు. అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు “లబ్బైక్ హజ్జన్” అని అనేశాడు. వాస్తవానికి అతని యొక్క నియ్యత్ ఏముంది? హజ్ లేదా హజ్జె కిరాన్, హజ్జె ఇఫ్రాద్ చేయాలని లేదు, హజ్జె తమత్తు చేయాలని ఉంది. అయితే అతను “లబ్బైక్ హజ్జన్” అని నోటితో పలికినప్పటికీ, అతడు తన నియ్యత్ ప్రకారంగా ఉమ్రా చేయాలి ముందు. ఎందుకంటే హజ్జె తమత్తు చేసేది ఉంది. ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమ్రా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు.
దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, కొన్ని సందర్భాల్లో మనిషి దానధర్మాలు ఏదైతే చేస్తాడో, చేసిన తర్వాత అతనికి తెలిసింది, హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని. అలాంటప్పుడు అతడు బాధపడవలసిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక పెద్ద హదీస్ కూడా ఉంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎవరూ చూడకుండా, కేవలం అల్లాహ్ సంతృప్తి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు. బయలుదేరేసరికి ఏమైంది? ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు. మరో రాత్రి వ్యభిచారిణి చేతిలో పెట్టేశాడు. మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు. ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని. చాలా బాధపడ్డాడు. కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది, నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, వ్యభిచారిణికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు, ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు. నీ యొక్క నియ్యత్, నీ యొక్క సంకల్పం కరెక్ట్ గా ఉండింది గనక, దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది.
జకాత్ మరియు దానంపై ధర్మశాస్త్ర తీర్పులు
ఇప్పుడు ఈ హదీసులో మనం తెలుసుకున్నాము, మ’అన్ బిన్ యజీద్, అంటే యజీద్, తండ్రి, దానం మస్జిద్ లో పెట్టి వచ్చాడు. తర్వాత అతని కొడుకు వెళ్ళాడు. కొడుక్కు తెలియదు, మా నాన్నే పెట్టాడు అని కూడా. అయితే, తండ్రి తన దానం కొడుక్కు ఇవ్వచ్చా? ఇదొక ధర్మ విషయం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పటివరకైతే దానం సామాన్య దానంగా ఉందో, అంటే జకాత్ కాదు, ధర్మదానాలు, ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో, జకాత్ కాదు. ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు, బంధువులకు ఇవ్వచ్చు, ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు. కానీ, జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు. ఎందుకు? జకాత్ ఇది ఒక విధి, కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది. అందుకొరకే తండ్రి కొడుక్కు జకాత్ ఇవ్వలేడు.
కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు, కొడుక్కు ఇవ్వడానికి. అదేమిటి? కొడుకు పెద్దగయ్యాడు, సంపాదిస్తున్నాడు, కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో, ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు. అప్పులో కొడుకు చిక్కుకున్నాడు. అయితే, తండ్రి అతని నుండి వేరై, వేరే సంపాదన, సామాన్యంగా మన వద్ద ఏమంటారు? వాని పొయ్యి వేరు, వాని వంట వేరు, ఈ విధంగా అనుకుంటాం కదా. కానీ అతని వద్ద అప్పు ఉంది, ఆ అప్పు తీరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుక్కు ఇవ్వచ్చు. అప్పు తీర్చడానికి.
అలాగే, ఆపోజిట్, కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా? లేదు. అట్టనే ఇవ్వరాదు. ఎందుకు? ఎప్పుడైతే తండ్రి వృద్ధాప్య… ముసలివాడై, లేదా అనారోగ్యం పాలై, అతడు ఇక ఏమీ సంపాదించలేని స్థితిలో ఉన్నాడో, ఆ తండ్రికి తినిపించడం, త్రాగించడం, అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం, అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం, అతను ఉండడానికి ఒక ఇల్లు, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? కొడుకు సంతానం చూసుకోవాలి. అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది. మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు. ఇటు కొడుకు సంపాదించి పంపుతా ఉంటాడు, అటు అయ్యా… త్రాగడంలో… జ్యూస్ మరియు పాలు కాదు, బాదం పాలు కాదు. అర్థమవుతుంది కదా? ఆ, సారాయి తాగడంలో, కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే, ఆ కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటిలో కూడా చాలా అధ్వాన్నంగా పరిస్థితులు మారిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే, కొడుకు వద్ద జకాత్ సొమ్ము ఏదైతే ఉందో, అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు.
ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి? మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో, అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు. ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే, పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్లాహ్ యొక్క దయవల్ల, దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకుందాం.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.
102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.
102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.
102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).
102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ మీరు నరకాన్ని చూసి తీరుతారు.
102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!
102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
أَلْهَاكُمُ التَّكَاثُرُ అల్ హాకుముత్తకాసుర్ అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.
حَتَّىٰ హత్తా ఆఖరికి, చివరికి మీరు
زُرْتُمُ జుర్తుమ్ సందర్శిస్తారు, చేరుకుంటారు
الْمَقَابِرَ అల్ మకాబిర్ సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.
كَلَّا కల్లా ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.
سَوْفَ تَعْلَمُونَ సౌఫ తఅలమూన్ మీరు తొందరగానే తెలుసుకుంటారు.
ثُمَّ كَلَّا సుమ్మ కల్లా మరెన్నటికీ కాదు,
سَوْفَ تَعْلَمُونَ సౌఫ తఅలమూన్ మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
كَلَّا కల్లా అది కాదు,
لَوْ تَعْلَمُونَ లౌ తఅలమూన మీరు గనక తెలుసుకున్నట్లయితే
عِلْمَ الْيَقِينِ ఇల్మల్ యకీన్ నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.
لَتَرَوُنَّ الْجَحِيمَ ల తరవున్నల్ జహీమ్ మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)
الْجَحِيمَ అల్ జహీమ్ నరకాన్ని.
ثُمَّ సుమ్మ అవును మళ్ళీ
لَتَرَوُنَّهَا ల తరవున్నహా మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?
عَيْنَ الْيَقِينِ ఐనల్ యకీన్ ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్ మరి ఆ రోజు
ثُمَّ సుమ్మ మళ్ళీ
لَتُسْأَلُنَّ ల తుస్ అలున్న మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది
يَوْمَئِذٍ యౌమ ఇజిన్ ఆ రోజున
عَنِ النَّعِيمِ అనిన్నయీమ్ అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత
సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.
రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.
ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.
చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.
అల్లాహ్ భీతి మరియు ప్రాపంచిక సంపద
అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్లో చెప్పినట్లు:
وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا వలా తన్స నసీబక మినద్దున్యా పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.
కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.
ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:
نراك اليوم طيب النفس నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్ ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.
ప్రవక్త చెప్పారు:
أجل والحمد لله అజల్, వల్ హందులిల్లాహ్ అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.
మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:
لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى లా బఅస బిల్ గినా లిమనిత్తకా అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.
మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.
మళ్ళీ చెప్పారు:
وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.
గమనిస్తున్నారా?
وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ వతీబున్నఫ్సి మినన్నయీమ్ మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.
ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.
అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.
ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:
حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ హత్తా జుర్తుముల్ మకాబిర్ ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.
హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.
రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:
ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ సుమ్మ అమాతహు ఫ అక్బరహ్ అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.
సూరత్ తాహాలో చదివితే:
مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్ ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.
అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.
ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.
సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.
జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.
పరలోక హెచ్చరిక మరియు అల్లాహ్ అనుగ్రహాలు
ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.
سَوْفَ تَعْلَمُونَ సౌఫ తఅలమూన్ మీరు తొందరగానే తెలుసుకుంటారు.
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్ మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.
ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:
ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.
ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.
ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్ మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.
వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.
ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.
సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?
సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:
نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్ (రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”
తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?
أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ అమా ఇన్న జాలిక సయకూన్ అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.
సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ? 2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ? 3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ? 4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ? 5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ? 7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ? 8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ? 9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ? 10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.
సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత
ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.
చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.
అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.
ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:
వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.
అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:
అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.
మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.
సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.
అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
إن الصدقة لتطفئ عن أهلها حر القبور (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్) నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.
అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.
దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس (కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్) ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.
అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.
అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:
إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء (ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ) నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.
మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.
దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:
ملكان يناديان (మలకాని యునాదియాని) ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.
అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?
اللهم أعط منفقا خلفا (అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్) ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.
దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:
ما نقصت صدقة من مال (మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్) దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.
తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:
قال الله: أنفق يا ابن آدم أنفق عليك (ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్) ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.
ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.
అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:
أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا (అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా) ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.
అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.
మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.
దానశీలురైన భక్తుల ఉదాహరణలు
ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.
మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.
ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.
ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.
మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.
అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:
مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً అల్లాహ్కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.
ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.
కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.
ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.
దానధర్మాలు చేసే ఉత్తమ మార్గాలు
అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.
మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.
ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.
అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.
అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.
మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى (అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా) నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.
అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.
అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:
أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ (అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న) ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)
అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:
يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها (యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా) ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.
ఎప్పుడు దానధర్మాలు చేయాలి?
ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى (అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)
ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.
దానధర్మాలలో పాటించవలసిన జాగ్రత్తలు
ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:
إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول (ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్) ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.
కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.
రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్ఫామ్లో, స్టేటస్లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:
ومن تصدق يرائي فقد أشرك (వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక) ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.
అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.
మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.
ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!
ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, “తబర్రుక్ వాస్తవికత” (శుభాన్ని ఆశించడం యొక్క వాస్తవికత) అనే అంశంపై చర్చించబడింది. వక్త తబర్రుక్ను రెండు రకాలుగా విభజించారు: ధర్మసమ్మతమైనది (మష్రూ) మరియు నిషిద్ధమైనది (మమ్నూ). ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ద్వారా ధృవీకరించబడిన తబర్రుక్ మాత్రమే ధర్మసమ్మతమైనదని, ఉదాహరణకు మూడు మస్జిద్లకు (మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవి, మస్జిద్-ఎ-అఖ్సా) ప్రయాణించడం, జమ్ జమ్ నీరు త్రాగడం, మరియు ఖురాన్ను పఠించి, అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా శుభం పొందడం వంటివి వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం, ఆయన వస్తువులు, మరియు ఆయన శరీరం నుండి వేరైన భాగాల (వెంట్రుకలు) ద్వారా శుభం పొందడం కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకం అని, సహాబాలు ఇతరులతో ఇలా చేయలేదని స్పష్టం చేశారు. ఖురాన్ మరియు సున్నత్లలో ఆధారం లేని ఏ వస్తువు, ప్రదేశం, లేదా వ్యక్తి ద్వారా శుభాన్ని ఆశించడం నిషిద్ధమైన తబర్రుక్ అని, ఇది షిర్క్కు దారితీస్తుందని హెచ్చరించారు. దర్గాలు లేదా ఇతర సమాధుల వద్దకు శుభం కోసం ప్రయాణించడం హరామ్ అని హదీసుల ఆధారంగా వివరించారు.
الْحَمْدُ لِلَّهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنُؤْمِنُ بِهِ وَنَتَوَكَّلُ عَلَيْهِ، (అల్ హందులిల్లాహి నహ్మదుహూ వ నస్త ఈనుహూ వ నస్తగ్ ఫిరుహూ వ ను’మిను బిహీ వ నతవక్కలు అలైహ్.) సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. మేము ఆయనను స్తుతిస్తున్నాము, ఆయన సహాయాన్ని కోరుతున్నాము, ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము, ఆయనను విశ్వసిస్తున్నాము మరియు ఆయనపైనే నమ్మకం ఉంచుతున్నాము.
وَنَعُوذُ بِاللَّهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، (వ న ఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ ఫుసినా వ మిన్ సయ్యిఆతి అ’అమాలినా) మేము మా ఆత్మల చెడు నుండి మరియు మా కర్మల చెడు నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాము.
مَنْ يَهْدِهِ اللَّهُ فَلَا مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ، (మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ, వ మన్ యుద్ లిల్హు ఫలా హాదియ లహ్.) అల్లాహ్ ఎవరికి మార్గనిర్దేశం చేస్తాడో, వారిని ఎవరూ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు ఆయన ఎవరిని మార్గభ్రష్టులుగా వదిలేస్తాడో, వారికి ఎవరూ మార్గనిర్దేశం చేయలేరు.
وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، (వ అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్.) అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కారని నేను సాక్ష్యమిస్తున్నాను, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.
وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، (వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహ్.) మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.
أَرْسَلَهُ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا، وَدَاعِيًا إِلَى اللَّهِ بِإِذْنِهِ وَسِرَاجًا مُنِيرًا. (అర్సలహూ బిల్ హఖ్ఖి బషీరవ్ వ నజీరా. వ దాఇయన్ ఇలల్లాహి బి ఇజ్నిహీ వ సిరాజమ్ మునీరా.) ఆయన (అల్లాహ్) అతన్ని (ముహమ్మద్ను) సత్యంతో శుభవార్తలు అందించేవాడిగా, హెచ్చరించేవాడిగా, తన అనుమతితో అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా మరియు ప్రకాశవంతమైన దీపంగా పంపాడు.
أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ (అమ్మా బ’అద్ ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్) నిశ్చయంగా, అన్ని మాటలలోకెల్లా ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం (ఖురాన్).
وَخَيْرُ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صلى الله عليه وسلم (వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు అన్ని మార్గాలలోకెల్లా ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం.
وَشَرُّ الأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلُّ مُحْدَثَةٍ بِدْعَةٌ (వ షర్రల్ ఉమూరి ముహ్ దసాతుహా, వ కుల్లు ముహ్ దసతిన్ బిద్ అహ్) మరియు అన్ని కార్యాలలోకెల్లా చెడ్డ కార్యం (ధర్మంలో) కొత్తగా కల్పించబడినది, మరియు ప్రతి కొత్త కల్పన ఒక బిద్అత్ (ఆవిష్కరణ).
وَكُلُّ بِدْعَةٍ ضَلاَلَةٌ وَكُلُّ ضَلاَلَةٍ فِي النَّارِ (వ కుల్లు బిద్ అతిన్ దలాలహ్, వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్) మరియు ప్రతి బిద్అత్ ఒక మార్గభ్రష్టత్వం, మరియు ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి దారి తీస్తుంది.
సర్వ స్తోత్రాలు, అన్ని విధముల పొగడ్తలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. కారుణ్య శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక.
అభిమాన సోదరులారా, నాటి ఈ జుమా ప్రసంగాంశం, తబర్రుక్ వాస్తవికత. తబర్రుక్ అనే విషయంలో మన సమాజంలో అనేక విధాల అపార్థాలు, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ఆధారంగా కాకుండా బిద్అతులు చోటు చేసుకున్నాయి. ఇన్షా అల్లాహ్ ఈరోజు తబర్రుక్ వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం.
తబర్రుక్ అర్థం మరియు రకాలు
తబర్రుక్ అంటే బరకత్ నుంచి. బరకత్ పొందటం, శుభాలను పొందడం, శుభాలను ఆశించడం, శుభాలు కలగడం అనే అర్థాలు వస్తాయి తబర్రుక్ అంటే. అత్తబర్రుక్ బిష్షై అంటే ప్రత్యేకమైన ఓ వస్తువు ద్వారా శుభాన్ని కోరటం.
ఈ తబర్రుక్ రెండు రకాలు. మష్రూ తబర్రుక్ (ధర్మ సమ్మతమైన తబర్రుక్). రెండవది మమ్నూ తబర్రుక్ (నిషిద్ధమైన తబర్రుక్).
ధర్మసమ్మతమైన తబర్రుక్ (మష్రూ తబర్రుక్ )
ధర్మ సమ్మతమైన తబర్రుక్ అంటే, ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అయిన తబర్రుక్. ఉదాహరణకు, శుభం కొరకు, మేలు కొరకు, శుభం పొందటానికి మస్జిద్-ఎ-హరామ్ వైపుకు పయనించటం, ప్రయాణించటం. అది హదీసులో ఉంది. అలాగే మస్జిద్-ఎ-నబవి ప్రయాణించటం, అలాగే మస్జిద్-ఎ-అఖ్సా వైపు పోవటం. అంటే ఈ మూడు మస్జిదుల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, శుభం కొరకు, మేలు కొరకు, పుణ్యం కొరకు ఈ మూడు మస్జిదుల వైపుకు ప్రయాణం చేయవచ్చు. ఇది ధర్మ సమ్మతమైన తబర్రుక్ పొందటం.
అలాగే జమ్ జమ్ నీరు, దాని గురించి స్పష్టమైన హదీసులు ఉన్నాయి, దాని యొక్క శుభం గురించి.
అలాగే ఖురాన్. స్వయంగా ఖురాన్ గ్రంథం తబర్రుక్తో నిండి ఉన్నది. స్వయంగా ఖురాన్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఇలా తెలియజేశాడు:
وَهَـٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ మరియు ఈ ఖురాన్ మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గురించి సూర సాద్, ఆయత్ 29లో ఇలా తెలియజేశాడు:
كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِّيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ ఇదొక శుభప్రదమైన గ్రంథం. బరకత్తో కూడిన గ్రంథం, తబర్రుక్తో నిండియున్న గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు దీనిని నీ వైపుకు పంపాము అని అల్లాహ్ సెలవిచ్చాడు.
ఇక ఖురాన్తో బరకత్ పొందటం, ఖురాన్తో తబర్రుక్ ఆశించటం, ఇలాంటి చాలా ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. నేను రెండు ఆయతులు పఠించాను, అన్ఆమ్ మరియు సూర సాద్ లోనిది.
ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందాలంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దీంట్లో కండిషన్ పెట్టాడు. ఖురాన్ శుభప్రదం, ఎప్పుడు? ఖురాన్ని అనుసరిస్తే. ఖురాన్ని ఎప్పుడు అనుసరించాలి? పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు అనుసరించవచ్చు. అలాగే ఖురాన్ శుభప్రదం ఎప్పుడు? చింతన చేస్తే, గుణపాఠం నేర్చుకుంటే, మన జీవితాలు ఖురాన్ పరంగా ఉంటే ఈ ఖురాన్ మనకోసం బరకత్గా మారిపోతుంది, మన జీవితాలలో శుభం జరుగుతుంది, శుభం మనం పొందవచ్చు, శుభాన్ని ఆశించవచ్చు ఖురాన్ ద్వారా, అంటే ఖురాన్ను పఠించి, ఖురాన్ పారాయణం చేసి, ఖురాన్ చింతన చేసి, గుణపాఠం నేర్చుకొని ఆచరించినట్లయితే, ఈ ఖురాన్ ద్వారా మనకి బరకత్ వస్తుంది, శుభం అవుతుంది. అలా కాకుండా, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో పఠించడం లేదు, ఖురాన్ తెరిచి చూడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కేవలం బరకత్ ఉద్దేశంతో అందమైన దుస్తులు, అందమైన ఒక చిట్టీలో, ఖరీదైన దుస్తులలో దాన్ని బంద్ చేసి, ప్రయాణం చేసేటప్పుడు వాహనంలో, కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో, దుకాణంలో, కేవలం తబర్రుక్ ఉద్దేశంతో, చదవటం లేదు, అర్థం చేసుకోవటం లేదు, పారాయణం లేదు, ఏమీ లేదు, అది సమంజసం కాదు. ఖురాన్ ద్వారా తబర్రుక్ పొందటం స్వయంగా అల్లాహ్ తెలియజేశాడు. ఖురాన్ ద్వారా, ఖురాన్ ఆ గ్రంథమే బరకత్తో కూడిన గ్రంథం. ఆ ఖురాన్ ద్వారా మనం బరకత్ పొందాలంటే పఠించాలి, పారాయణం చేయాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా నడుచుకోవాలి. దీని ద్వారా ఖురాన్ మనకి బరకత్ అవుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తబర్రుక్
అసలు విషయం ఏమిటంటే, ఖురాన్ తర్వాత అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో శుభాన్ని పొందటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా శుభాన్ని పొందటం, తబర్రుక్ ఆశించటం,
ఇవి రెండు విధాలు. ఒకటి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందటం, వ్యక్తిత్వంతో ఆయన ఉన్నప్పుడు. సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చుంబించేవారు, శుభప్రదమైన చేతులను పట్టుకునేవారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చేతులను పట్టుకొని తమ ముఖాన్ని పైన స్పర్శించుకునేవారు, తిప్పుకునేవారు, శుభం ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో. అది అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వంతో తబర్రుక్ని పొందటం.
రెండవది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శుభప్రదమైన శరీరంతో, శుభవంతమైన శరీరంతో వేరైన వస్తువులు, వేరైన భాగాలు. ఆయన శుభవంతమైన శిరోజాలు, తల వెంట్రుకలు. ఆయన శరీరంకి ముట్టిన దుస్తులు, ఆయన వాడిన పాత్రలు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి సంబంధించిన, ఆయన వాడిన, ఆయన తొడిగిన పాత్రలు, వస్తువులతో తబర్రుక్ పొందటం.
ఇది ధర్మ సమ్మతమైనది అని మనకు పలు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి ఒక రెండు, మూడు హదీసులు మనం పరిశీలిద్దాం. ముస్లిం గ్రంథంలో హదీస్ ఉంది, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఈ హదీస్ కి కథనం ఉల్లేఖులు. ఆమె ఇలా అంటున్నారు, అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హా ఎవరంటే, అబూబకర్ గారి కూతురు, ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క అక్క అస్మా రదియల్లాహు అన్హా. అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు యొక్క తల్లి అస్మా రదియల్లాహు అన్హా. ఆవిడ రదియల్లాహు అన్హా ఇలా తెలియజేశారు, ఒక ప్రవక్త గారి ఒక జుబ్బాని తీశారు, జుబ్బా, చొక్కా. అస్మా రదియల్లాహు అన్హా ఒక జుబ్బాని తీసి, ఈ జుబ్బా ఆయిషా రదియల్లాహు అన్హా బ్రతికున్నంత కాలం ఆవిడ దగ్గర ఉండింది ఈ జుబ్బా. ఆయిషా రదియల్లాహు అన్హా పరమపదించిన తర్వాత ఆ జుబ్బాని నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జుబ్బా ఎవరిది? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన జుబ్బా, తొడిగిన జుబ్బా అది. ఇప్పుడు ఆ జుబ్బా నా దగ్గర ఉంది. ఇప్పుడు మనం మనలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే, కీడు జరిగితే, స్వస్థత కోసం, చికిత్స కోసం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన ఆ జుబ్బాని మనం నీళ్ళలో వేసి, ఆ జుబ్బాని పిండితే, ఆ నీళ్ళతో మనం ఆరోగ్యం కోసం వాడేవారము, చికిత్స నిమిత్తం ఆ నీళ్లు వాడేవారము, అని అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు. అంటే ఈ హదీస్ ప్రామాణికమైన హదీస్, ముస్లిం గ్రంథంలో ఈ హదీస్ ఉంది.
అలాగే ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది. సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు ఇలా తెలియజేశారు, ఆయన దగ్గర ఒక పాత్ర ఉండింది, మంచి నీళ్లు తాగే పాత్ర, గ్లాస్ లాంటిది, పాత్ర ఉండింది. ఆ పాత్ర, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్రలో నీళ్లు ఒకప్పుడు తాగారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉండగా ఆ పాత్రలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మంచి నీళ్లు తాగారు. ఆ పాత్ర సహల్ బిన్ స’అద్ రదియల్లాహు త’ఆలా అన్హు దగ్గర ఉండింది. ఆ పాత్ర తీసి సహల్ రదియల్లాహు అన్హు తబర్రుక్ కోసం, శుభం పొందటం కోసం తాగారని అబూ హాజిమ్ తెలియజేశారు. ఆ తర్వాత అదే పాత్రను నాకు కావాలని ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలైహి కోరారు. ఎవరిని? సహల్ బిన్ స’అద్ రదియల్లాహు అన్హుని. ఆ పాత్ర నాకు ఇస్తారా అని కోరితే, సహల్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారికి కానుకగా ఆ పాత్రను ఇచ్చేశారు. అర్థం ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్ర ఆయన అనుచరులు ఆ తర్వాత తాబయీన్లు తబర్రుక్గా, శుభం కోరటం కోసం వాడేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడిన పాత్రలు, ధరించిన దుస్తులు తబర్రుక్ కోసం వాడవచ్చు అని ఈ బుఖారీ హదీస్ ద్వారా రూఢి అవుతుంది.
అలాగే అబూ జుహైఫా రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణ నిమిత్తం మధ్యాహ్న సమయంలో బయలుదేరారు. ఒక ప్రయాణంలో మధ్యాహ్నం బయలుదేరారు. దారిలో బతహా ప్రదేశంలో నమాజ్ నిమిత్తం ఆగటానికి. దారిలో నమాజ్ చేయడానికి, జొహర్ మరియు అసర్ నమాజ్ చేయడానికి. ఆ స్థలం పేరు బతహా. అక్కడ ఆగి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసి జొహర్, అసర్ నమాజ్ చేశారు. సహాబాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యితో, చెయ్యి పట్టుకొని సహాబాలు తమ ముఖం పైన తిప్పుకున్నారు. ఈ హదీస్ రావి జుహైఫా అంటున్నారు, నేను కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యిని పట్టుకొని నా ముఖం పైన తిప్పాను, ఉంచాను. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన చెయ్యి చల్లగా, కస్తూరి కంటే ఎక్కువ సువాసనగా ఉండింది, అని తెలియజేశారు. అంటే ఈ విధంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వాడిన వస్తువుల ద్వారా, స్వయంగా ఆయన బ్రతికి ఉన్నంతకాలం, స్వయంగా ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ తీసుకోవటం, తబర్రుక్ ని పొందటం ఇది ధర్మ సమ్మతము.
బుఖారీలోనే ఇంకో హదీసులో ఇలా ఉంది:
فَجَعَلَ النَّاسُ يَأْخُذُونَ مِنْ فَضْلِ وَضُوئِهِ فَيَتَمَسَّحُونَ بِهِ (ఫ జ’అలన్నాసు య’ఖుజూన మిన్ ఫద్లి వుజూఇహీ ఫ యతమస్సహూన బిహీ) అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేస్తే, వుజూలో మిగిలిన నీళ్లను సహాబాలు తీసుకునేవారు. ఆ నీళ్లను తమ శరీరం పైన పూసుకునేవారు, ముఖం పైన పూసుకునేవారు, తమ పైన జల్లుకునేవారు, తబర్రుక్ ఉద్దేశంతో.
అభిమాన సోదరులారా, అలాగే ముస్లిం గ్రంథంలో ఒక హదీస్ ఉంది, హజ్ సమయంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినా రోజు అది ఖుర్బానీ ఇచ్చిన తర్వాత, క్షవరం చేసుకున్నప్పుడు, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభవంతమైన శిరోజాలను కుడి వైపు, ఎడమ వైపు సహాబాలకు పంచారు. తబర్రుక్ ఉద్దేశంతో సహాబాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభవంతమైన శిరోజాలను తమ వద్ద ఉంచుకున్నారు.
దీంతో ఏమర్థమవుతుంది? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికున్నంత కాలం ఆయన వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందవచ్చు, ఆయన వాడిన, వేసుకున్న, ధరించిన దుస్తుల ద్వారా, ఆయన శరీరం నుంచి వేరైన, అది వెంట్రుకలు, ద్వారా, అలాగే ఆయన వాడిన పాత్రల ద్వారా సహాబాలు తబర్రుక్ పొందారని రూఢి అయ్యింది, ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే, ఇది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం. ప్రత్యేకంగా ఆయన కొరకే ఇది.
అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పోల్చుకుంటూ ఇతర ఔలియాలు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనుల విషయంలో ఇలా చేయటం షిర్క్ అవుతుంది. ధర్మ పండితులు ఇతరులకి, దర్గాలకి పోయి శుభాన్ని కోరటం, ఇది ఫలానా పీర్ జుబ్బా అని, ఇది ఫలానా ఔలియా చొక్కా అని, ఇది ఫలానా ఔలియా పాత్ర అని, ఇది ఫలానా ఔలియాకి ఇది, ఇది అని, అది అని, ఇది ఔలియాలు, బుజుర్గులు, పీర్లు, ధర్మ పండితులు, పుణ్య పురుషులు, సజ్జనులు ఎవరైనా సరే. అంతెందుకు? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అందరి కంటే ఉత్తములు ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఉమ్మతె ముహమ్మదియాలో, ప్రవక్తల పరంపర తర్వాత, ప్రవక్తల తర్వాత, ఉమ్మతె ముహమ్మదియాలో అందరికంటే పెద్ద వలీ ఎవరు? అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు. ఎవరైతే ప్రపంచంలో వలీ, వలీ, వలీ అని పేరు పొందారో, వారికంటే పెద్ద వలీ అబూబకర్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు త’ఆలా అన్హు. ఆ తర్వాత అషర ముబష్షరా. పది మంది సహాబాలకి ప్రవక్త గారు స్వయంగా ఒకే హదీసులో స్వర్గం శుభవార్త ఇచ్చారు. ముహాజిర్లు, అన్సార్లు, అంత పెద్ద పెద్ద సహాబాల ద్వారా ఎవరైనా ఇతర సహాబాలు, తాబయీన్లు శుభాన్ని ఆశించారా? తబర్రుక్ పొందారా? తబర్రుక్ నిమిత్తం ఇలా చేశారా? స్వయంగా ఈ నలుగురు ఖలీఫాలు, అషర ముబష్షరా, ముహాజిరీన్లు, అన్సార్లు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో కాకుండా, ఆయన జుబ్బా, ఆయన వాడిన పాత్ర, ఆయన శరీరం నుంచి వేరైన ఆ శుభవంతమైన శిరోజాలు, ఇవి కాకుండా, ప్రవక్త గారు ఎక్కడ నమాజ్ చేశారో, ప్రవక్త సమాధి నుంచి శుభం తీసుకున్నారా? మనకంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వారు. ప్రవక్త గారి జీవితాన్ని చూసిన వారు. ఖురాన్ యొక్క అర్థం ప్రవక్తతో తెలుసుకున్న వారు. అటువంటి సహాబాలు కూడా, ఇది తబర్రుక్ అనేది చేయలేదు. అది ఒక ప్రత్యేకంగా ఉంది, దేని ద్వారా తబర్రుక్ తీసుకోవాలి అనేది ఖురాన్లో అల్లాహ్ తెలియజేశాడు, హదీసులలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఖురాన్ మరియు హదీస్ పరంగా ఉంటే అది ధర్మ సమ్మతం, అది చేయాలి. మంచి విషయం.
ఉదాహరణకు ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. జమ్ జమ్ నీరు ఉంది. వర్షపు నీళ్లు ఉంది. వర్షపు నీరు శుభవంతమని, ఎందుకు? దాంతో ప్రయోజనం ఉంది. తాగుతాము, బ్రతుకు ఉంది, పంటలు పండుతాయి, దాంతో మేలు జరుగుతుంది. శుభవంతమైనది. హజరె అస్వద్ ఉంది. ప్రవక్త గారు ముద్దాడారు. స్వర్గం నుంచి వచ్చిందని చెప్పారు. శుభవంతమైన ఉద్దేశంతో మనం కూడా ముద్దాడతాం. ఆ విధంగా దేని గురించి ఖురాన్లో ఉందో తబర్రుక్ పొందవచ్చు అని, దేని గురించి ప్రవక్త గారు స్వయంగా చెప్పారో తబర్రుక్ ఉంది అని, మరి ఏ విషయాల గురించి ప్రాక్టికల్గా సహాబాలు అమలు చేశారో వాటితో తబర్రుక్ పొందటం, ఆశించటం ధర్మ సమ్మతమే. అవి కాకుండా ప్రస్తుతం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు, పరమపదించారు. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంతో తబర్రుక్ పొందేది లేదు, అది అయిపోయింది. రెండవది, ఆయన శరీరం నుంచి వేరైన వస్తువులు, ఆయన దుస్తులు, పాత్రలు, వెంట్రుక, అవి ఇప్పుడు ప్రపంచంలో ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి అవ్వలేదు, ఎక్కడ ఉన్నాయి అనేది. నిజంగానే ప్రామాణికమైన హదీసుల ద్వారా ఇప్పుడు కూడా రూఢి అయితే అది ధర్మ సమ్మతమే, తబర్రుక్ ఉద్దేశంతో వాడవచ్చు. కాకపోతే రూఢి అవ్వలేదు, ప్రవక్త యొక్క సంబంధించిన వస్తువులు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం శరీరంతో వేరైన వస్తువులు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అనేది ప్రామాణికమైన హదీసుల ద్వారా రూఢి లేదు కాబట్టి. ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ తబర్రుక్తో కూడిన అన్ని విషయాలన్నీ పాత ఇండియాలోనే ఉన్నాయి. ఇది ఫలానా ఔలియా, ఇది ఫలానా పీరు, ఇది ఫలానా సహాబీ, ఇది ఫలానా వ్యక్తిది పగడా, ఇది ఫలానా వ్యక్తిది పగడి, ఇది ఫలానా వ్యక్తిది జుబ్బా, ఇది ఫలానా వ్యక్తిది పాత్ర, ఇది ఫలానా ఔలియా గ్లాసు, ఇది ఫలానా ఔలియా వెంట్రుక, ఇది ఫలానా ఔలియా పాదము, ఇది ఫలానా ఔలియా చెప్పులు, ఇవంతా పాత ఇండియాలోనే ఉన్నాయి, అరబ్ దేశాల్లో లేవే? అంటే మనము సృష్టించుకున్నాము. ఒకవేళ ఉన్నా, ఆ తబర్రుక్ అనేది కేవలం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే పరిమితం, ప్రత్యేకం. ఆయన తప్ప సహాబాలకి అది లేదు. అబూబకర్ రదియల్లాహు కంటే పెద్ద వలీ ఉన్నారా? ఉమర్ కంటే పెద్ద వలీ ఉన్నారా? ఖులఫా-ఎ-అర్బా కంటే పెద్ద వలీలు ఉన్నారా? వారి ద్వారానే వారి అనుచరులు, వారి స్నేహితులు ఆ తర్వాత తాబయీన్లు వారి ద్వారా తబర్రుక్ పొందలేదు కదా, అంటే అది ధర్మ సమ్మతం కాదు అని అర్థం అయిపోయింది.
నిషిద్ధమైన తబర్రుక్ (మమ్నూ తబర్రుక్)
కాకపోతే ఒక హదీస్ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ కి పోయారు. అబూ వాఖిద్ అల్లైసీ తెలియజేస్తున్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى حُنَيْنٍ (ఖరజ్నా మ’అన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హునైన్) మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు హునైన్ కి పోయాము.
అది యుద్ధ సమయంలో.
وَنَحْنُ حُدَثَاءُ عَهْدٍ بِكُفْرٍ (వ నహ్ను హుదసాఉ అహ్దిన్ బికఫ్రిన్) అప్పుడు మేము కొత్త కొత్తగా ఇస్లాం స్వీకరించాము. అంటే అప్పుడే మేము ఇస్లాం స్వీకరించిది, కొత్తగా ముస్లిములము. కొత్తగా ఇస్లాం స్వీకరించాము.
وَلِلْمُشْرِكِينَ سِدْرَةٌ يَعْكُفُونَ عِنْدَهَا وَيَنُوطُونَ بِهَا أَسْلِحَتَهُمْ (వ లిల్ ముష్రికీన సిద్రతున్ య’అకిఫూన ఇందహా వ యనూతూన బిహా అస్లిహతహుం) అక్కడ ఆ హునైన్ ఆ స్థలంలో ఒక రేయి చెట్టు ఉండింది. ముష్రికీన్లు, బహుదైవారాధకులు ఆ రేయి చెట్టు పైన తమ ఆయుధాలను వ్రేలాడదీసేవారు, తబర్రుక్ ఉద్దేశంతో. చేసేది ఎవరు? ముష్రికీన్లు, తబర్రుక్ ఉద్దేశంతో అలా చేసేవారు.
అది చూసి ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు, “ఓ దైవ ప్రవక్త,” దానికి జాతు అన్వాత్ అని పేరు ఉంది హదీస్ పుస్తకంలో, ఆ రేయి చెట్టు పైన అది వారు ఆయుధాలు వ్రేలాడదీస్తారు కదా, దాని పేరు జాతు అన్వాత్. ఈ కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు దైవ ప్రవక్తతో, “ఓ దైవ ప్రవక్త, ఏ విధంగా అయితే ఆ బహుదైవారాధకులు, ఆ ముష్రికీన్లు తబర్రుక్ నిమిత్తం, శుభం పొందటానికి ఈ చెట్టు పైన ఆయుధాలు వ్రేలాడదీస్తున్నారు కదా, మా కోసం కూడా మీరు ఒక అన్వాత్ని తయారు చేయండి” అన్నారు, తబర్రుక్ కోసం.
అప్పుడు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసహనంతో ఏమన్నారంటే:
قُلْتُمْ وَالَّذِي نَفْسِي بِيَدِهِ كَمَا قَالَ قَوْمُ مُوسَى: اجْعَل لَّنَا إِلَٰهًا كَمَا لَهُمْ آلِهَةٌ (ఖుల్తుమ్ వల్లజీ నఫ్సీ బియదిహీ కమా ఖాల ఖవ్ము మూసా: ఇజ్అల్ లనా ఇలాహన్ కమా లహుమ్ ఆలిహహ్) అల్లాహ్ సాక్షిగా, ఆ దేవుని సాక్షిగా ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో, అంటే అల్లాహ్ సాక్షిగా, మీరు చెప్పిన మాట చాలా పెద్ద మాట. ఏ విధంగా అయితే మూసా జాతి ప్రజలు మూసా అలైహిస్సలాంని కోరారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్. ఆ బనీ ఇస్రాయిల్లో బహుదైవారాధకులు షిర్క్ చేసేవారు ఆ ఆవు దూడని పూజించేవారు కదా. మూసా అలైహిస్సలాంకి విశ్వసించిన వారు కూడా అడిగారు: “ఓ మూసా అలైహిస్సలాం, వారికి ఏ విధంగా ఇలాహ్ ఉన్నాడో, అలాగే మాకు కూడా ఒక ఇలాహ్ తయారు చేయండి” అన్నారు.
ఇన్నకుమ్ కౌమున్ తజ్హలూన్ (నిశ్చయంగా మీరు ఇంకా అజ్ఞానులే) అని సమాధానం ఇచ్చారు. అంటే అది ఉపమానంగా ఇస్తూ అంతిమ దైవ ప్రవక్త, “ఇప్పుడు కూడా మీకు ఇంకా పాత జ్ఞాపకాలే ఉన్నాయా? పాత ఆచారాలే ఉన్నాయా? ఇంకా మీ ఈమానంలో, మీ విశ్వాసంలో ఇంకా తేడా రాలేదా?” అని అసహనంగా ప్రవక్త గారు బాధపడ్డారు. అంటే, ఇది అధర్మమైన తబర్రుక్, మమ్నూ తబర్రుక్. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఉన్నా కూడా, ఈ చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పండ్ల ద్వారా తబర్రుక్ లేదు అని ఈ హదీస్ ద్వారా రూఢి అయిపోయింది. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ లో ఉంది, ఇది సహీ హదీస్ ఇది.
అలాగే చివర్లో, బుఖారీ కితాబు ఫద్లిస్సలాత్లో ఒక హదీస్ ఉంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:
لاَ تُشَدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَلاَثَةِ مَسَاجِدَ الْمَسْجِدِ الْحَرَامِ وَمَسْجِدِ الرَّسُولِ -صلى الله عليه وسلم- وَمَسْجِدِ الأَقْصَى (లా తుషద్దుర్రిహాలు ఇల్లా ఇలా సలాసతి మసాజిద్: అల్ మస్జిదిల్ హరామ్, వ మస్జిదిర్రసూల్, వ మస్జిదిల్ అఖ్సా.)
ఈ భూమండలంలో అన్నిటికంటే పవిత్రమైన స్థలాలు ఏమిటి? మస్జిద్లు. ఎక్కడైనా సరే, పవిత్రంగా, అన్నిటికంటే పవిత్రం. కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ తెలియజేశారు, శుభాలు పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం నిషిద్ధం, హరామ్. అది మస్జిద్ అయినా సరే.
ఫలానా దేశంలో ఫలానా మస్జిద్ ఉంది, అక్కడ పోయి నమాజ్ చేస్తే పుణ్యం వస్తుంది, శుభం కలుగుతుంది, తబర్రుక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్. మూడు మస్జిద్లు తప్ప. మస్జిద్-ఎ-హరామ్ (మక్కా), మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (ఫలస్తీన్). ఈ మూడు మస్జిద్లు తప్ప, అంటే ఈ మూడు మస్జిద్లు శుభం పొందే ఉద్దేశంతో, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. హదీస్ ద్వారా రూఢి అయ్యింది, ధర్మ సమ్మతం. ఈ మూడు మస్జిద్లు తప్ప ప్రపంచంలో ఎక్కడైనా సరే, మస్జిద్ అయినా సరే, తబర్రుక్ ఉద్దేశంతో ప్రయాణం చేయటం హరామ్.
అయితే, దర్గా విషయం ఏమిటి? దర్గాకి పోతున్నారు, స్త్రీలు, పురుషులు, హిజాబ్ లేదు, చాలా ఖురాన్కి, హదీస్కి విరుద్ధంగా, మరి తబర్రుక్. ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమాధితో తబర్రుక్ లేదు. ఆయన మదీనాలో నడిచిన వీధులతో తబర్రుక్ లేదు. ఆయన యుద్ధాలు చేసిన యుద్ధ మైదానం ద్వారా తబర్రుక్ లేదు. దేని ద్వారా తబర్రుక్ ఉందో, అది రూఢి అయ్యింది ఖురాన్, హదీస్లో ఉంది. అవి తప్ప అది మస్జిద్ అయినా, సమాధి అయినా, దర్గా అయినా, ఔలియా అయినా, సజ్జనులైనా, పుణ్య పురుషులైనా తబర్రుక్ అనేది లేదు. ఒకవేళ తబర్రుక్గా భావిస్తే, వాటి ద్వారా శుభాన్ని కోరితే, అది షిర్క్ క్రిందికి వస్తుందని ధర్మ పండితులు తెలియజేశారు.
అభిమాన సోదరులారా, ఇవి సారాంశం, ధర్మ సమ్మతమైన తబర్రుక్, నిషిద్ధమైన తబర్రుక్.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ను అర్థం చేసుకొని, దాని అనుగుణంగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు హదీస్ యొక్క సరైన అవగాహన కలిగే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్, సుమ్మా ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో ‘వసీలా’ (అల్లాహ్కు సామీప్యం పొందడానికి ఒక సాధనం) అనే ఇస్లామీయ భావన గురించి వివరించబడింది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం వసీలా యొక్క సరైన అవగాహనను, మరియు సాధారణ అపోహలను వక్త స్పష్టం చేశారు. వసీలా అంటే అల్లాహ్ యొక్క సామీప్యాన్ని ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా వెతకడం అని ఆయన వివరించారు. ఈ ప్రసంగం ఆరు రకాల “ధర్మ సమ్మతమైన వసీలా”పై దృష్టి పెట్టింది: 1. అల్లాహ్ యొక్క అందమైన పేర్లు మరియు గుణగణాల ద్వారా. 2. ఒకరి విశ్వాసం (ఈమాన్) మరియు సత్కార్యాల ద్వారా. 3. తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ద్వారా. 4. అల్లాహ్కు తమ అవసరాన్ని మరియు నిస్సహాయతను వ్యక్తపరచడం ద్వారా. 5. అల్లాహ్ ముందు తమ పాపాలను ఒప్పుకోవడం ద్వారా. 6. జీవించి ఉన్న ఒక పుణ్యాత్ముడిని తమ కోసం అల్లాహ్తో ప్రార్థించమని (దుఆ) కోరడం ద్వారా. మరణించిన ప్రవక్తలు, పుణ్యాత్ములు లేదా వారి సమాధుల ద్వారా వసీలాను వెతకడం ధర్మసమ్మతం కాదని వక్త నొక్కి చెప్పారు.
اَلْحَمْدُ لِلّٰهِ وَحْدَهُ (అల్ హందులిల్లాహి వహ్ దహు) అన్ని పొగడ్తలు ఏకైకుడైన అల్లాహ్ కే.
وَ الصَّلَاةُ وَ السَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ (వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు) ఆయన తర్వాత ప్రవక్త ఎవరూ రారో, ఆయనపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక.
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం.
أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అంటే మధ్యవర్తి అవసరమా? అల్లాహ్ ను దుఆ చేయటానికి, అర్థించటానికి, వేడుకోవటానికి లేదా మా దుఆలు స్వీకరింపబడటానికి మధ్యవర్తి అవసరమా? ఒకరి సహాయం అవసరమా? వసీలా అవసరమా? అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో వసీలా గురించి తెలియజేశాడు, కాకపోతే మన సమాజంలో ఒక వర్గం దానికి తప్పుడు అర్థం తీసుకుంటుంది. సహాబాలు, తాబయీన్లు, సజ్జనులు, పూర్వీకులు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, అయిమ్మాలు (ఇమాములు) తీసుకోలేని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. దాని వాస్తవం ఏమిటి? ఇన్ షా అల్లాహ్ ఆధారంగా, ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారంగా తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర మాయిదా, ఆయత్ 35 లో ఇలా తెలియజేశాడు:
وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (వబ్తగూ ఇలైహిల్ వసీల) ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి. (5:35)
ఆయన సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అని అల్లాహ్ తెలియజేశాడు. ఈ ఆయత్ లో వసీలా అనే పదం ఉంది.
వసీలా అంటే ఏమిటి?
అసలు వసీలా అంటే అర్థం ఏమిటి? వసీలా అంటే ఏదేని ఆశయాన్ని సాధించటానికి, సామీప్యం పొందటానికి అవలంబించబడే మార్గం లేక సాధనం. ఇది వసీలా యొక్క అర్థం. సింపుల్ గా చెప్పాలంటే, అల్లాహ్ సామీప్యం కొరకు సృష్టితాలను సాధనంగా చేసుకోవటం.
అభిమాన సోదరులారా! అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే సాధనం వెతకండి అంటే ఆయనకు దగ్గర చేర్చే సత్కార్యాలను చేయమని అర్థం. కానీ కొంతమంది అసలు ఈ వసీలాను వదిలేసి, ఖురాన్ లో ఏ వసీలా గురించి చెప్పడం జరిగిందో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ వసీలా గురించి చెప్పారో, దాని నిజమైన అర్థం ఏమిటి, వాస్తవమైన భావం ఏమిటి అది పక్కన పెట్టి, దర్గా, సమాధులను, పుణ్య పురుషులను, ప్రవక్తలను, దైవదూతలను, ఔలియాలను, చనిపోయిన వారిని సాధనంగా చేసుకుంటున్నారు. ఇది ముమ్మాటికీ ఖురాన్ కి, హదీసులకు లకు విరుద్ధం.
వసీలా రకాలు
అభిమాన సోదరులారా! ఇక, వసీలా రెండు రకాలు. ధర్మ సమ్మతమైన వసీలా, అధర్మమైన వసీలా.
ఈరోజు మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకుందాం. ఏ వసీలా సమ్మతంగా ఉందో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడో, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకి తెలియజేశారో, ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం, ఇన్ షా అల్లాహ్.
ధర్మ సమ్మతమైన వసీలా
ధర్మ సమ్మతమైన వసీలాలో ఒకటి, గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం.
وَلِلَّهِ الْأَسْمَاءُ الْحُسْنَىٰ فَادْعُوهُ بِهَا (వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా) అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. (7:180)
మొదటి ధర్మ సమ్మతమైన వసీలా ఏమిటి? అల్లాహ్ నామాలను, గుణగణాలను సాధనంగా చేసుకోవటం. అల్లాహ్ నామాన్ని, అల్లాహ్ గుణాలను వసీలాగా తీసుకోవటం. ఇది సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా – అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఇది గత ఎపిసోడ్ లో మనం తెలుసుకున్నాం, అంటే దుఆ చేసేటప్పుడు, వేడుకునేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అల్లాహ్ నామాల ద్వారా, అల్లాహ్ గుణ విశేషణాల ద్వారా వేడుకోవటం, అల్లాహ్ యొక్క నామాలను, అల్లాహ్ యొక్క గుణాలను సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం. ఇది మొదటి విషయం.
ఆ తర్వాత రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేయటం. విశ్వాసాన్ని, సత్కర్మలను. దీనికి ఉదాహరణ, బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక పేరు పొందిన ఒక హదీస్ ఉంది, ఫేమస్ హదీస్, గుహ వారి హదీస్. దీనికి ఒక ప్రబల తార్కాణం. ఆ వివరంగా ఉంది హదీస్, నేను కేవలం దాంట్లో యొక్క సారాంశం మాత్రమే చెప్తున్నాను.
ఆ ముగ్గురు వ్యక్తులు, బనీ ఇస్రాయీల్ లో, గుహలో తల దాచుకున్నారు. గాలుల మూలంగా, వర్షాల మూలంగా కొండరాయి విరిగి ఆ గుహ ముఖాన్ని మూసేసింది. ఆ ముగ్గురు వ్యక్తులు గుహ లోపల ఉండిపోయారు. బయటికి రావాలంటే కొండరాయి వచ్చి పడిపోయింది, ఆ ముఖ ద్వారం బంద్ అయిపోయింది. ఆ ముగ్గురు వ్యక్తులు బయటికి రాలేరు, శబ్దం బయటికి రాదు, అది ఊరు కాదు, ఎవరో సహాయం చేసే వారు ఎవరూ లేరు, మాట వినే వారు ఎవరూ లేరు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏదో ఒక దారి చూపిస్తే తప్ప వారికి వేరే మార్గమే లేదు. అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారు? ఆ ముగ్గురు తమ తమ జీవితంలో చేసుకొన్న సత్కర్మలను ఆధారంగా చేసుకుని దుఆ చేశారు. ఒక వ్యక్తి అయితే తమ అమ్మ నాన్నల పట్ల ఏ విధంగా వ్యవహరించాడో అది సాధనంగా చేసుకున్నాడు, అమ్మ నాన్నల పట్ల సత్ప్రవర్తన గురించి. ఇంకో వ్యక్తి దానధర్మాల గురించి, ఇంకో వ్యక్తి వేరే విషయం గురించి, ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ సత్కర్మలను, చేసుకొన్న పుణ్యాలను సాధనంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని అల్లాహ్ ను వారు దుఆ చేశారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి దుఆలను ఆలకించి, వారి ప్రార్థన స్వీకరించి, వారికి ఆ బండరాయిని తప్పించి, కొండరాయిని తప్పించారు. వారు ముగ్గురు అల్హందులిల్లాహ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. అంటే దీంతో ఏం అర్థం అవుతుంది? విశ్వాసం మరియు సత్కర్మలను సాధనంగా, వసీలాగా చేసి వేడుకోవచ్చు. ఇది రెండో విషయం.
మూడో విషయము, అల్లాహ్ సన్నిధిలో ఆయన “తౌహీద్ ను ఆశ్రయించటం. అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించి దుఆ చేయటం, తౌహీద్ ను వసీలాగా చేసుకోవటం. ఇది యూనుస్ అలైహిస్సలాం ఇలా దుఆ చేశారు. సూర అంబియా ఆయత్ 21:87:
فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَن لَّا إِلَٰهَ إِلَّا أَنتَ سُبْحَانَكَ (ఫనాదా ఫిజ్జులుమాతి అల్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక) అతను చీకట్లలో నుంచి, “అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడవు.” అని మొరపెట్టు కున్నాడు(21:87)
ఇది యూనుస్ అలైహిస్సలాం చేప కడుపులో చేసిన దుఆ ఇది. చీకట్లో, కటిక చీకట్లో, సముద్రం చీకటి, మళ్లా చేప కడుపు, ఆ చీకటి. కటిక చీకట్లో యూనుస్ అలైహిస్సలాం చేసిన దుఆ ఇది. చీకట్లో ఇలా మొరపెట్టుకున్నారు: “ఓ అల్లాహ్! నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.” లా ఇలాహ ఇల్లా అంత – తౌహీద్ ని ఆశ్రయించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్ హానక – “నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు.” అంటే మూడో విషయం, అల్లాహ్ సన్నిధిలో ఆయన తౌహీద్ ని, ఏకత్వాన్ని ఆశ్రయించి దుఆ చేయటం.
నాలుగో విషయం, అల్లాహ్ వైపు మరలి తన అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం. అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వసీలాగా చేసుకొని అల్లాహ్ ను అడగటం, వేడుకోవటం. ఇది అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ. ఆయన అనారోగ్యానికి గురైనప్పుడు, దాదాపు 18 సంవత్సరాలు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఎంత ఆయన సహనం, ఓర్పు, ఆయనకు వచ్చిన పరీక్ష. అభిమాన సోదరులారా! అయ్యూబ్ అలైహిస్సలాం అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ ఆయన యొక్క నిస్సహాయ స్థితిని ఆయన వసీలాగా చేసుకొని అల్లాహ్ కు ప్రార్థించారు, వేడుకున్నారు. అయ్యూబ్ అలైహిస్సలాం చేసిన దుఆ ఏమిటి? సూర అంబియా ఆయత్ 83:
أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَأَنتَ أَرْحَمُ الرَّاحِمِينَ (అన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్) “నాకు ఈ వ్యాధి సోకింది. నువ్వు కరుణించే వారందరిలోకీ అపారంగా కరుణించేవాడవు” (21:83)
అని దుఆ చేసుకున్నారు, వేడుకున్నారు. అంటే తన నిస్సహాయ స్థితిని సాధనంగా చేసుకున్నారు.
అభిమాన సోదరులారా, అలాగే ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం, పాపాలను అంగీకరిస్తూ, ఒప్పుకుంటూ దానికి సాధనంగా చేసుకుని వేడుకోవటం. ఇది మూసా అలైహిస్సలాం దుఆ చేశారు. సూర ఖసస్, ఆయత్ 16లో:
قَالَ رَبِّ إِنِّي ظَلَمْتُ نَفْسِي فَاغْفِرْ لِي (ఖాల రబ్బీ ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ ఫిర్లీ) “నా ప్రభూ! నాకు నేనే అన్యాయం చేసుకున్నాను. కనుక నన్ను క్షమించు.” (28:16)
అభిమాన సోదరులారా, ఇది ఐదవది.
ఆరవది ఏమిటంటే, ఇది చాలా గమనించి వినాలి, అపార్థం చేసుకోకూడదు. ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం. పరమపదించిన ఔలియాలు, పరమపదించిన ప్రవక్తలు, పరమపదించిన సత్పురుషులు కాదు. బ్రతికి ఉన్న సత్పురుషుల దుఆలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
దీనికి ఉదాహరణ ఏమిటి? సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో వెళ్లి ఇలా రిక్వెస్ట్ చేసుకునేవారు, విన్నవించుకునేవారు: “ఓ దైవప్రవక్త, వర్షం లేదు, కరువు వచ్చేసింది, మీరు దుఆ చేయండి.” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు, అల్లాహ్ దుఆ స్వీకరించేవాడు, వర్షం వచ్చేది.
అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత – ఈ హదీస్ బుఖారీ గ్రంథంలో ఉంది – అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, మరి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వసీలాగా చేసుకోవచ్చు కదా? లేకపోతే ఆయన సమాధి వారి దగ్గరే ఉంది కదా? మస్జిద్ లోనే, పక్కనే ఉంది కదా? మదీనాలోనే ఉంది కదా? ఆ సమాధి దగ్గరికి పోయి వసీలాగా అడగవచ్చు కదా? లేదు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి పోయి దుఆ చేయమని కోరేవారు. ఇది చాలా గమనించే విషయం. సహాబాలు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, ప్రవక్త గారి పేరుతో వసీలాగా దుఆ చేయలేదు. ప్రవక్త గారి యొక్క సమాధి దగ్గరికి పోయి వసీలాగా చేసుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, ప్రవక్త గారితో దుఆ చేయించేవారు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత, సహాబాలు ఆయన పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు బ్రతికి ఉన్నారు కాబట్టి, ఆయన దగ్గరికి పోయి దుఆ చేయమని వేడుకునేవారు, అడిగేవారు, రిక్వెస్ట్ చేసుకునేవారు.
కావున, ఇవి నేను చెప్పిన ఆరు రకాలు, ఇవి మాత్రమే ధర్మ సమ్మతమైన వసీలా.
మొదటిది ఏమిటి? అల్లాహ్ యొక్క నామాలను, గుణాలను వసీలాగా చేసుకోవటం.
రెండవది, విశ్వాసం మరియు సత్కర్మలను అల్లాహ్ సన్నిధిలో సాధనంగా చేసుకోవటం, వసీలాగా చేసుకోవటం.
మూడవది, అల్లాహ్ సన్నిధిలో అల్లాహ్ యొక్క తౌహీద్ ను ఆశ్రయించటం.
నాలుగవది, అల్లాహ్ వైపు మరలి అవసరాన్ని, నిస్సహాయ స్థితిని వ్యక్తపరచి దానిని సాధనంగా చేసుకోవటం.
ఐదవది, తమ పాపాలను అంగీకరిస్తూ దైవ సన్నిధిలో వాటిని సాధనంగా చేసుకోవటం.
ఆరవది, బ్రతికి ఉన్న సత్పురుషులు, పుణ్యాత్ముల దగ్గరికి పోయి దుఆ చేయమని కోరటం. వారు కూడా దుఆ చేస్తారు.
ఈ విధంగా, ఇవి తప్ప ఇంకా ఇతర రకమైన వసీలా ధర్మ సమ్మతం కాదు. అది ధర్మ సమ్మతం కాని వసీలా, అధర్మమైన వసీలా. అది ఏమిటో, ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.
وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (వ ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) మా ఆఖరి ప్రార్థన ఏమిటంటే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు.
وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ (వస్సలాము అలైకుమ్ వ రహ్ మతుల్లాహి వ బరకాతుహు) మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో] https://youtu.be/NTehdBRdCxg [28 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభనామమైన “అర్-రబ్” (ప్రభువు) యొక్క లోతైన అర్థాలు మరియు భావనలు వివరించబడ్డాయి. “రబ్” అనే పదం సృష్టించడం, పోషించడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం వంటి అనేక విస్తృతమైన అర్థాలను కలిగి ఉంటుందని వక్త తెలియజేశారు. ఈ పదం ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు వాడాలంటే మరొక పదాన్ని జతచేయాలని అరబిక్ వ్యాకరణ నియమాన్ని ఉదహరించారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ (ప్రభుత్వం) రెండు రకాలుగా ఉంటుందని వివరించారు: ఒకటి సాధారణ రుబూబియత్, ఇది సృష్టిలోని అందరి కోసం (విశ్వాసులు, అవిశ్వాసులతో సహా); రెండవది ప్రత్యేక రుబూబియత్, ఇది కేవలం విశ్వాసులకు, ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, దీని ద్వారా అల్లాహ్ వారికి విశ్వాస భాగ్యం, మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాడు. ప్రవక్తలందరూ తమ ప్రార్థనలలో (దుఆ) “రబ్బనా” (ఓ మా ప్రభూ) అని అల్లాహ్ ను ఎలా వేడుకున్నారో ఖుర్ఆన్ ఆయతుల ద్వారా ఉదహరించారు. చివరగా, అల్లాహ్ ను ఏకైక రబ్ గా అంగీకరించడం తౌహీద్ యొక్క మూలమని, ఆయనతో పాటు ఇతరులను సంతానం, స్వస్థత లేదా ఇతర అవసరాల కోసం ఆరాధించడం షిర్క్ అనే ఘోరమైన పాపమని హెచ్చరించారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.
అల్లాహ్ యొక్క శుభనామం రబ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా! రబ్ అన్న అల్లాహ్ యొక్క ఈ శుభనామం, ఉత్తమ పేరు, దీని యొక్క భావాన్ని, అర్థాన్ని గనక మనం చూస్తే, ఇందులో ఎన్నో అర్థాలు, ఎన్నో భావాలు వస్తాయి. అయితే, ఆ భావాలు తెలిపేకి ముందు అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, రబ్ మరియు సర్వసామాన్యంగా అరబీలో అర్-రబ్ అన్న ఈ పదం కేవలం విడిగా రబ్ లేదా అర్-రబ్, అల్లాహ్ కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరి గురించైనా ఈ పదం ఉపయోగించాలంటే, తప్పకుండా దానితో పాటు మరొక పదాన్ని కలపడం తప్పనిసరి. ఈ యొక్క నియమం ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఇప్పుడు ఇది మంచిగా మీకు అర్థం కావాలంటే రండి, రబ్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఈ విషయం తెలుస్తుంది.
రబ్ పదం యొక్క అర్థం
రబ్ యొక్క అర్థంలో పుట్టించడం, పోషించడం, జీవన్మరణాలు ప్రసాదించడం మరియు నిర్వహించడం, నడిపించడం ఇవన్నీ భావాలతో పాటు, ఏదైనా విషయాన్ని చక్కబరచడం, దానిని రక్షించుకుంటూ ఉండడం, చూడడం, ఇంకా నాయకుడు, ఉన్నత హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడు, ఎవరి ఆదేశం మాత్రమే చెల్లుతుందో ప్రజలు అనుసరిస్తారో, ఎవరి పెత్తనం నడుస్తుందో ఇలాంటి భావాలన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి, ఈ భావాలన్నీ కూడా ఈ పదానికి వస్తాయి.
ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ‘అల్-బదాయిఉల్ ఫవాయిద్’ లో తెలిపారు,
إِنَّ هَذَا الِاسْمَ إِذَا أُفْرِدَ تَنَاوَلَ فِي دَلَالَاتِهِ سَائِرَ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلْيَا (ఇన్న హాజల్ ఇస్మ ఇజా ఉఫ్రిద తనావల ఫీ దిలాలాతిహి సాయిర అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉల్యా) “నిశ్చయంగా ఈ పేరు (అర్-రబ్) ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు, దాని సూచనలలో అల్లాహ్ యొక్క ఇతర ఉత్కృష్టమైన నామాలు మరియు ఉన్నత గుణాలన్నీ చేరిపోతాయి.”
ఈ మాటను షేఖ్ అబ్దుర్రజాక్ అల్-బదర్ హఫిజహుల్లాహ్ ప్రస్తావించి, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట ఇలా చెప్పారు:
రబ్ అన్న యొక్క ఈ పదం అల్లాహ్ గురించి ఉపయోగించినప్పుడు, అల్లాహ్ యొక్క ఇంకా వేరే ఎన్నో పేర్లలో ఉన్నటువంటి భావం ఇందులో వచ్చేస్తుంది. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ కంటే కూడా చాలా ముందు ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్, తఫ్సీర్ యొక్క పుస్తకాలలో ప్రామాణికమైన పరంపరలతో పేర్కొనబడిన మొట్టమొదటి తఫ్సీర్ అని దీనికి పేరు వచ్చింది, తఫ్సీరె తబరీ, అందులో ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:
الرَّبُّ فِي كَلَامِ الْعَرَبِ مُتَصَرِّفٌ عَلَى مَعَانٍ، فَالسَّيِّدُ الْمُطَاعُ فِيهِمْ يُدْعَى رَبًّا (అర్-రబ్బు ఫీ కలామిల్ అరబ్ ముతసర్రిఫున్ అలా మఆన్, ఫస్-సయ్యిదుల్ ముతాఉ ఫీహిమ్ యుద్ఆ రబ్బన్) “అరబ్బుల భాషలో ‘రబ్’ అనే పదం అనేక అర్థాలలో వస్తుంది. వారిలో విధేయత చూపబడే నాయకుడిని ‘రబ్’ అని పిలుస్తారు.”
అరబీ భాషలో, అరబ్బుల మాటల్లో అర్-రబ్ అన్న పదం ఏ నాయకుడినైతే అనుసరించడం జరుగుతుందో, అలాంటి వాటిని మరియు ఏ మనిషి అయితే అన్ని విషయాలను, వ్యవహారాలను చక్కబరిచి వాటిని సరిదిద్ది, వాటి బాగోగులు చూసుకుంటాడో, అలాంటి వాడిని మరియు ఏదైనా విషయానికి అధికారి అయిన అలాంటి వారికి కూడా అర్-రబ్ అన్న పదం ఉపయోగపడుతుంది.
ఈ విధంగా, ఇంటి యొక్క యజమాని అని మనం అంటాము తెలుగులో. దీని గురించి అరబీలో రబ్బుద్-దార్. కేవలం రబ్ కాదు. దార్ అంటే ఇల్లు. ఇంటి యొక్క యజమాని – రబ్బుద్-దార్. ఈ పని యొక్క బాధ్యుడు – రబ్బుల్-అమల్. ఇప్పటికీ కువైట్ మరియు మరికొన్ని దేశాలలో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, సౌదీలో ‘కఫీల్‘ అని ఏదైతే అనడం జరుగుతుందో, అలా కువైట్లో ‘రబ్బుల్ అమల్’ అని అక్కడ పిలవడం, చెప్పడం జరుగుతుంది.
తౌహీద్ మరియు రుబూబియత్
ఈ భావాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక మనం అల్లాహ్ యొక్క పేరు చెప్పుకుంటున్నాము గనక, అల్లాహ్ యొక్క పేరు ఒకటి రబ్ ఉంది అని, తౌహీద్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన భాగాలు – తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్, తౌహీదె ఉలూహియత్ – వీటిలో ఒకటి రుబూబియత్. అంటే ఈ మొత్తం విశ్వంలో సృష్టించడం, పోషించడం, నిర్వహించడంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అల్లాహ్ అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి.
అయితే, ఈ మొత్తం సృష్టిని సృష్టించడంలో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఖుర్ఆన్ లో మనం శ్రద్ధగా చదివామంటే, ఈ విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ లో కొన్ని సందర్భాలలో అల్లాహ్ మాత్రమే మన యొక్క రబ్ అని తెలియజేస్తూ, ఆయనే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు అని స్పష్టంగా తెలిపాడు. సూరతుల్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102 చూడండి:
ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ (జాలికుముల్లాహు రబ్బుకుమ్, లా ఇలాహ ఇల్లా హువ, ఖాలిఖు కుల్లి షైఇన్ ఫఅబుదూహ్) ఆయనే అల్లాహ్. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. (6:102)
ఈ ఆయతును మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఒక్క మాటకే కాదు ఇది దలీల్, ఈ ఆయత్ యొక్క భాగం ఏదైతే నేను చదివానో ఇప్పుడు, తెలుగు అనువాదం చెప్పానో, ఇందులో మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా ముందుకు కూడా నేను దీనిని ప్రస్తావిస్తాను. సూరె అన్ఆమ్ సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102.
అల్లాహ్ త’ఆలాయే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క మేలు, సంక్షేమాలు, వారందరి యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతి వారికి అవసరం తీర్చువాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి భావం ఈ అర్-రబ్ అనే పదంలో ఉంది.
రెండు రకాల రుబూబియత్
రబ్ లో రబ్బా యురబ్బీ తర్బియతన్. తర్బియత్ – పోషించడం అన్న పదం, అన్న భావం ఏదైతే ఉందో, ఇందులో రెండు రకాలు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి.
అల్లాహ్ త’ఆలా రబ్, ప్రతి ఒక్కరి రుబూబియత్, ప్రతి ఒక్కరి తర్బియత్ వారి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని పరంగా వారిని పోషించే బాధ్యత అల్లాహ్ ఏదైతే తీసుకున్నాడో, అల్లాహ్ మాత్రమే చేయగలుగుతున్నాడో, దీని యొక్క ఈ రబ్ యొక్క భావంలో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.
ఒకటి, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసుడైనా, అవిశ్వాసుడైనా, సన్మార్గంపై ఉన్నవాడైనా, మార్గభ్రష్టంలో ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి సృష్టి, ఉపాధి, వారి యొక్క నిర్వహణ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని అధోగతికి పాలు చేయాలి, ఇదంతా కూడా అల్లాహ్ త’ఆలా చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఇది ఒక సామాన్యమైన భావం.
కానీ అల్లాహ్ త’ఆలా తన యొక్క ప్రవక్తలకు, తన ప్రత్యేకమైన పుణ్యాత్ములైన దాసులకు, సద్వర్తనులకు, విశ్వాస భాగ్యం, ప్రవక్త పదవి లాంటి గొప్ప మహా భాగ్యం, అల్లాహ్ యొక్క ఆరాధన సరైన రీతిలో చేసే అటువంటి భాగ్యం, మరియు వారు పాపాలను వదిలి పుణ్యాల వైపునకు రావడం, పాపం పొరపాటు జరిగిన వెంటనే తౌబా చేసే భాగ్యం కలుగజేయడం, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక రుబూబియత్. ఇది ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ త’ఆలాయే. కానీ ఇలాంటివి ప్రత్యేక రుబూబియత్ లోని విషయాలు ఎవరికైనా లభించాలంటే, వారు అల్లాహ్ వైపునకు మరలడం కూడా తప్పనిసరి.
గమనించండి ఇక్కడ ఒక విషయం, అల్లాహ్ త’ఆలాయే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో నేను రాకముందు తల్లి గర్భంలో నన్ను ఎలా పోషిస్తూ వచ్చాడు, పుట్టిన వెంటనే, మనం గమనించాలి ఇక్కడ. మనం మనుషులం గాని, పక్షులు గాని, జంతువులు, పశువులు గాని అల్లాహ్ యొక్క రుబూబియత్ విషయాన్ని గమనించేది ఇక్కడ చాలా గొప్ప ఒక నిదర్శనం మనకు ఉన్నది. గుడ్డులో ఉన్నా గాని పక్షులు, లేక పశువులు, జంతువులు, మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని, అక్కడ వారి యొక్క మొత్తం జన్మ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ఇలాంటి శక్తి ఉందా?
పుట్టిన వెంటనే, గుడ్డులో పూర్తి పక్షి తయారవుతుంది. బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అది వస్తుంది. మరియు వచ్చిన వెంటనే దానికి కావలసిన ఆహారం కళ్ళు తెరవకముందు ఎలా తల్లి దానికి ఇవ్వాలి అన్నటువంటి భాగ్యం, జ్ఞానం, అల్లాహ్ త’ఆలా ఆ పక్షికి ఎలా కలుగజేస్తాడో గమనించండి. ఇక మనిషి, జంతువుల విషయానికి వస్తే, పుట్టిన వెంటనే తన యొక్క ఆహారం ఎక్కడ ఉన్నదో అటు జంతువు గాని, అటు మనిషి గాని తన తల్లి స్థనాల్లో అన్న విషయాన్ని ఎలా గమనిస్తాడో చూడండి. ఈ భాగ్యం ఎవరు కలుగజేస్తున్నారు? ‘రబ్’ అన్నటువంటి పదం మనం చదివినప్పుడు, ఈ విషయాలు చూస్తున్నప్పుడు, అల్లాహ్ పై మన యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. అయితే మనం పుట్టిన తర్వాత క్రమంగా మనలో ఎలాంటి శక్తి పెరుగుతుందో, మనలో బుద్ధిజ్ఞానాలు ఎలా పెరుగుతాయో, ఈ విషయంలో కూడా అల్లాహ్ రబ్ అయి మనల్ని ఎలా పెంచుతున్నాడో, ఇందులో మన కొరకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.
ఇంతటి గొప్ప రబ్ అయిన అల్లాహ్, మనల్ని ఏ ఆదేశం ఇవ్వకుండా, మనల్ని పుట్టించి, మనకు ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడా? చేయడు. అందుకొరకే అల్లాహ్ ఏమంటున్నాడు:
أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ (అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖ్నాకుమ్ అబసవ్ వఅన్నకుమ్ ఇలైనా లా తుర్ జఊన్) “మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”(23:115)
అలా కాదు. ఒక ఉద్దేశపరంగా మిమ్మల్ని పుట్టించాము. అదేంటి? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన మనం చేయడం. అందుకొరకే, ఖుర్ఆన్ లో అనేక సందర్భాలలో అల్లాహ్ తన రుబూబియత్ కు సంబంధించిన నిదర్శనాలు చూపించి, వెంటనే ఉలూహియత్ వైపునకు అల్లాహ్ త’ఆలా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతే చూడండి. సూరత్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102, ‘జాలికుముల్లాహు రబ్బుకుమ్’ – ఆయనే మీ ప్రభువు. అల్లాహ్ మీ ప్రభువు. ‘లా ఇలాహ ఇల్లా హువ’ – ఆయన తప్ప ఎవరు కూడా మీకు ఆరాధ్యనీయుడు కాడు. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు గనక, ప్రతి వస్తువుని పుట్టించాడు గనక, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి.
ప్రవక్తలందరి దుఆలు ”రబ్బీ’ మరియు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి
ఇదే విధేయత, ఆరాధనా భావంతో మనం అల్లాహ్ ను వేడుకోవాలని మనకు నేర్పడం జరిగింది. మరియు మనం గనక ప్రత్యేకంగా సూరతుల్ అంబియాలో మరియు వేరే ఇతర సూరాలలో చూస్తే ప్రవక్తలు అందరూ అల్లాహ్ తో ప్రత్యేక వేడుకోలు, దుఆ, అర్ధింపు లాంటి విషయాలు ఎలా అల్లాహ్ తో అడిగేవారు? ‘రబ్బనా’.
రబ్బీ అంటే ఇది ఏకవచనం – ఓ నా ప్రభువా. రబ్బనా –ఓ మా ప్రభువా.
అయితే, ఆదం అలైహిస్సలాం కూడా ఎలా దుఆ చేశారు?
رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا (రబ్బనా జలమ్నా అన్ఫుసనా) “ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము”
అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, ఇంకా ఎందరో ప్రవక్తల దుఆలు ఖుర్ఆన్ లో ఉన్నాయి కదా. ఇతరులతో దుఆ చేయడం ఎంత ఘోరం అన్నటువంటి ఒక వీడియో మాది ఉంది, మీరు చూడండి. ప్రవక్తలందరి దుఆలు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? అల్లాహ్ యే మనల్ని అన్ని రకాలుగా పోషించి, పెంచి, మన యొక్క అవసరాలు తీర్చి మనల్ని చూసుకుంటూ, మన యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. అందుకొరకు ‘రబ్బనా’. అల్లాహ్ యొక్క నామం ఎంత గొప్పదో అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. కానీ దుఆలో వచ్చేసరికి, ‘రబ్బీ అవ్జిఅనీ అన్ అష్కుర నిఅమతకల్ లతీ’..సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ కూడా. ఈ విధంగా అనేక సందర్భాలలో ‘రబ్బీ’ మరియు ‘రబ్బనా’ అన్నటువంటి పదాలతో దుఆ చేయడం మనకు నేర్పడం జరిగింది.
షిర్క్ నుండి హెచ్చరిక
సోదర మహాశయులారా! అల్లాహ్ త’ఆలా రబ్ అయి ఉన్నాడు గనక, మనము అల్లాహ్ యొక్క రబ్ అన్న ఈ పదాన్ని ఎక్కడెక్కడ చదివినా గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఎంతోమంది తమకు తాము రబ్ అన్నటువంటి ఆరోపణ, దావా చేశారు.
ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో నమ్రూద్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటి? మేము రాజులము గనక, అందరూ ప్రజలు గనక, మా ఇష్టప్రకారమే మీరు జీవితం గడపాలి, మా ఆదేశాలను అనుసరించాలి. అల్లాహ్ ను నమ్మేవారు, వారు కూడా. “అల్లాహ్ కాకుండా మేము పుట్టించాము ఈ భూమ్యాకాశాలను, మేము మిమ్మల్ని పుట్టించాము” ఇలాంటి దావా లేకుండింది వారిది. సయ్యద్-ముతా అన్నటువంటి భావనతో, అంటే మాది పెత్తనం, మా మాటే చెల్లాలి, నడవాలి.
అయితే ఈరోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అధికారం దొరికినదంటే, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు, అసలైన రబ్ అతను, అసలైన విధేయత అతనిది, మనం ఆరాధించవలసినది అల్లాహ్ ను అన్న విషయాన్ని మరచిపోయి, అల్లాహ్ యొక్క మాటకు వ్యతిరేకమైన, నేను నాయకుడిని నా మాట మీరు వినాలి అన్నటువంటి గర్వానికి ఏదైతే గురి అవుతారో, వారు కూడా భయపడాలి ఫిరౌన్ లాంటి గతి వారిది అవుతుంది అని. అందుకొరకే ఎల్లవేళల్లో అల్లాహు త’ఆలా తో భయపడి, అల్లాహ్ ను రబ్ అని ఏదైతే మనం నమ్ముతున్నామో,
يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ (యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్) ఓ ప్రజలారా! మీ ప్రభువైన, మీ యొక్క రబ్ అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. (2:21)
إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ (ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుమ్ ఫఅబుదూహ్, హాదా సిరాతుమ్ ముస్తఖీమ్) నా ప్రభువు, నా యొక్క రబ్, మీ యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి. ఇదియే సన్మార్గం. (3:51)
ఇక ఈ సన్మార్గం నుండి ఎవరైనా దూరమైపోతే వారు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎల్లప్పుడూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండండి.
رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي (రబ్బిగ్ఫిర్లీ వలి అఖీ) ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని, సోదరులను క్షమించు.(7:151)
رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ (రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య) “ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను క్షమించు.” (71:28)
ఈ విధంగా, ఈ రెండు పదాలు ఇప్పుడు నేను చదివానో ఖుర్ఆన్ లో వచ్చినవే. మూసా అలైహిస్సలాం వారి యొక్క దుఆ, నూహ్ అలైహిస్సలాం యొక్క దుఆ ఈ విధంగా.
అలాగే అల్లాహ్ ను రబ్ అని మనం నమ్మే ఈ పదంలో, ఇందులో మనం చాలా బలమైన ఒక గట్టి విశ్వాసం ఏం ఉండాలంటే, ఈ లోకంలో మనం రబ్ అయిన అల్లాహ్ యొక్క విశ్వాసంపై బలంగా ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దౌర్జన్యపరుల నుండి మనపై ఎలాంటి హింసా దౌర్జన్యాలు చేయబడినా, ఈ పరీక్షా కాలమైనటువంటి ఒక చిన్న జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ విషయం మనకు మూసా అలైహిస్సలాం, ఫిరౌన్, ఆ తర్వాత మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ యొక్క సంఘటనలో, అలాగే సూరతుల్ ముఅమిన్ లో, సూరతుల్ ముఅమిన్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ వంశానికి సంబంధించిన ఒక విశ్వాసుని సంఘటన ఏదైతే తెలిపాడో, అందులో కూడా ఈ గొప్ప గుణపాఠం ఉంది.
ఎప్పుడైతే ఫిరౌన్ చెప్పాడో, “నన్ను వదలండి నేను మూసాను హత్య చేస్తాను,” అప్పుడు ఆ విశ్వాసుడు వెంటనే నిలబడి ఏమన్నాడు?
وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ (వ ఖాల రజులున్ ముఅమినున్ మిన్ ఆలి ఫిరౌన యక్తుము ఈమానహు అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బియల్లాహ్) (అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? (40:28)
నా ప్రభువు, నా యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే అని చెప్పే ఇలాంటి వ్యక్తిని మీరు చంపుతారా? ఇంకా అతని పూర్తి సంఘటన మీరు చదవండి, సూరత్ అల్-ముఅమిన్, దీని యొక్క రెండవ పేరు గాఫిర్, సూరహ్ నంబర్ 40, ఆయత్ నంబర్ 28 నుండి ఈ సంఘటన మొదలవుతుంది.
అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క గొప్ప నామముల, మంచి పేర్ల ఏ వివరాలు తెలుసుకుంటున్నామో, దాని పరంగా మన విశ్వాసం ఉండి, అన్ని రకాల షిర్కులకు, మూఢనమ్మకాలకు అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.