అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ ముస్లింలారా! నేను మీకు మరియు స్వయాన నాకు అల్లాహ్ యొక్క దైవభీతి కలిగి ఉండాలని ఉపదేశిస్తున్నాను. అల్లాహ్ తఆలా మన ముందు తరాల వారి కొరకు మరియు మన తర్వాత తరాల వారి కొరకు కూడా ఇదే ఉపదేశం చేయడం జరిగింది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.
వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. (అల్ నిసా :131)
కనుక అల్లాహ్ తో భయపడండి, ఆయనకు విధేయత చూపండి మరియు అవిధేయత నుండి దూరంగా ఉండండి.
తెలుసుకోండి! ఇస్లాం ధర్మంలో దైవ గ్రంథాలపై విశ్వాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. ఇది విశ్వాస మూల స్థంభాలలో మూడవది. అల్లాహ్ తన దాసులపై కనుకరిస్తూ వారి సన్మార్గమునకై ప్రవక్త ద్వారా ఒక గ్రంథాన్ని కూడా పంపించాడు, కారణం ఇహపరాల సాఫల్యం.
(ముస్లిములారా!) మీరు ఇలా ప్రకటించండి: ”మేము అల్లాహ్ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దానినీ, ఇబ్రాహీం, ఇస్మాయీల్, ఇస్హాఖ్, యాఖూబ్ మరియు వారి సంతతిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరిమధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధేయులము.” (అల్ బఖర 2:136)
ఓ విశ్వాసులారా! దైవగ్రంథాలపై ఏడు విషయాలలో తప్పక విశ్వాసం ఉంచాలి (షరహ్ సలాసతు ఉసూల్ )
ఒకటి : అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలు నిజమైనవి అని విశ్వాసం ఉంచాలి. ఉదాహరణకు అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు.
తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు (అల్ బఖర: 285)
గ్రంథ అవతరణ వహీ ద్వారా జరిగింది. వాస్తవంగా అల్లాహ్ తఆలా ఆకాశం నుండి భూమి పైకి వహీ తీసుకురావడానికి దైవదూతలను నియమించాడు. ఆ దూత పేరు జిబ్రయిల్ (అలైహిస్సలాం). ఈయన ప్రవక్తకు తన ప్రత్యేక గ్రంథాన్ని వెల్లడించాడు.
రెండో విషయం: ఏ గ్రంథాల గురించే అయితే మనకు తెలుసో వాటిని విశ్వసించడం. అవి ఆరు ఉన్నాయి. ఇబ్రహీం మరియు మూసా సహీఫాలు. తౌరాత్ మూసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం, ఇంజీల్ ఈసా (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం. జబూర్ దావూద్ (అలైహిస్సలాం) వారిపై అవతరింప చేయబడిన గ్రంథం మరియు ఖుర్ఆన్ మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిపై అవతరింప చేయడం జరిగింది. కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటంటే మూసా సహీఫాలు మరియు తౌరాత్ ఒక్కటే అయితే ఈ విధంగా ఐదు పేర్లు అవుతాయి. మరియు అదే విధంగా ఏ గ్రంధాల గురించైతే మనకు తెలియదో వాటిపై కూడా మనం పరిపూర్ణంగా విశ్వాసం తీసుకురావాలి.
మూడో విషయం: దైవ ప్రవక్తలపై ఏ గ్రంథాలు అయితే అవతరించాయో వాటిపై మాత్రమే విశ్వాసముంచాలి. ఏ గ్రంధాలలోనైతే మార్పు చేర్పులు జరిగాయో వాటి పై విశ్వాసం ఉంచరాదు. ఉదాహరణకు మూసా ప్రవక్తపై అవతరింప చేయబడిన తౌరాత్ ను విశ్వసించాలి మరియు ఈసా ప్రవక్త పై అవతరించబడిన ఇంజీల్ గ్రంథం పై విశ్వాసం ఉంచాలి. ఇవి అసలు గ్రంథాలు. కానీ ఇప్పుడు ఏ గ్రంధాలైతే యూదులు చేతుల్లో మరియు క్రైస్తవుల చేతుల్లో ఉన్నాయో అవి మార్పులకు లోనయ్యాయి. గ్రంథాలకు అవే పేర్లు పెట్టినప్పటికీ వారు తమ పూర్వీకులు చెప్పినటువంటి విషయాలను అందులో చేర్చారు మరియు ఇవే అసలు గ్రంథాలని ప్రకటించారు. మరియు సంవత్సరాల తరబడి ప్రజలు ఆ కల్పిత కథనాలను పాటించుకుంటూ వారు మార్గభష్టత్వానికి లోనయ్యారు మరియు ప్రజలను కూడా మార్గభష్టత్వానికి లోను చేశారు. కనుక గతించిన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంథాలు మార్పు చేర్పులకు లోనవడం వలన అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపచేయబడినటువంటి దివ్య ఖుర్ఆన్ యొక్క రక్షణ బాధ్యతను స్వయంగా అల్లాహ్ నే తీసుకున్నాడు. అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)
ఈ వాక్యంలో జిక్ర్ అనగా ఖురాన్ అనే భావం
నాల్గొవ విషయం: ఏ విషయాలు అయితే ఆ గ్రంథాల ద్వారా వెల్లడించబడ్డాయో వాటిని సత్యమని నమ్మడం. ఉదాహరణకు ఖుర్ఆన్ మరియు ఖుర్ఆన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు, వాటిలో మార్పు చేర్పులకు గురికాకుండా ఉన్నటువంటి సంఘటనలు. అదేవిధంగా ఖుర్ఆన్ తెలియచేయనటువంటి విషయాలను మేము ధ్రువీకరించము మరియు తిరస్కరించం, ఎందుకంటే మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసులో ఇలా వచ్చింది – ఏదైతే గ్రంథ ప్రజలు మీకు తెలియ పరుస్తారో దానిని మీరు సత్యం లేక అసత్యం అని అనకండి, ఈ విధంగా అనండి – “మేము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పై విశ్వాసం తెచ్చాము“. ఎందుకంటే ఒకవేళ వారి మాట సత్యం అయితే ధ్రువీకరించినట్లు అవుతుంది మరియు అసత్యం అయితే దానిని తిరస్కరించినట్లు అవుతుంది (అబూ దావూద్-3644)
ఐదొవ విషయం: ఆ గ్రంథాలలో ఉన్నటువంటి ఆదేశాలు ఏవైతే రద్దు కాలేదో వాటిపై ఆచరించడం. ఉదాహరణకు: అల్లాహ్ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు.
(మేము తౌరాతు గ్రంథంలో యూదుల కోసం ఒక శాసనాన్ని లిఖించాము: (దీని ప్రకారం) ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను. అలాగే కొన్ని ప్రత్యేక గాయాల కోసం కూడా (సరిసమానంగా) ప్రతీకారం ఉంది. కాని ఎవరయినా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పరిహారం (కప్ఫారా) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన దానికనుగుణంగా తీర్పు ఇవ్వనివారే దుర్మార్గులు.) (అల్ మాయిదా : 45)
మరియు ఈ ఆజ్ఞ మన షరీఅత్ (చట్టం)లో కూడా భాగమై ఉంది. దీనిపై ఆచరించడం కూడా జరుగుతుంది అని విశ్వసించాలి. మన ధర్మం దీనికి విరుద్ధం కాదు మరియు ఈ ఆజ్ఞ రద్దు చేయబడలేదు.
ఆరవ విషయం: ఈ గ్రంథాలు మానవులందరినీ ఒకే ధర్మం వైపునకు ఆహ్వానిస్తాయి అని విశ్వసించడం. దీనినే తౌహీద్ అంటారు. తౌహీద్ మూడు రకాలు. 1. తౌహీదె ఉలూహియత్ 2. తౌహీదె రుబూబియత్ 3. తౌహీదె అస్మా వసిఫాత్.
ఏడవ విషయం: ఖురాన్ గ్రంథం పూర్వ గ్రంథాలను ధ్రువీకరిస్తుంది. మరియు వాటిపై ఆధిపత్యం కలిగినటువంటిది. మరియు పూర్వ గ్రంథాలను పరిరక్షిస్తుంది. పూర్వ గ్రంథాలన్నీ కూడా ఈ దివ్య ఖురాన్ ద్వారానే రద్దు చేయబడ్డాయి. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. (అల్ మాయిదా :48)
ఇబ్న్ తైమియా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు : “ఖురాన్ లో ఇలానే ఉంది, అల్లాహ్ మరియు అంతిమ దినం గురించి పూర్వ గ్రంథాలలో వచ్చిన వార్తలు ధృవీకరించబడ్డాయి మరియు మరింత వివరంగా పేర్కొనబడ్డాయి. ఈ విషయాలపై. స్పష్టమైన రుజువులు మరియు వాదనలు సమర్పించబడ్డాయి. అదేవిధంగా, ప్రవక్తలందరి ప్రవక్త పదవులు మరియు సందేశహరుల సందేశం అంగీకరించబడింది. మరియు అదే విధంగా ప్రవక్తల ద్వారా పంపబడిన అన్ని చట్టాలను అంగీకరించడం జరిగింది, మరియు వివిధ ఆధారాల ద్వారా మరియు స్పష్టమైన రుజువుల ద్వారా ప్రవక్తలను మరియు గ్రంథాలను తిరస్కరించిన వారితో చర్చలు వాదన చేయటం. అదేవిధంగా అల్లాహ్ వారికి విధించిన శిక్షలను గురించి మరియు గ్రంథాలను అనుసరించే వారికి అల్లాహ్ చేసే సహాయాన్ని గురించి మరియు గ్రంథవహులు మునుపటి గ్రంధాలలో జరిపిన మార్పుల గురించి మరియు వక్రీకరణల గురించి అల్లాహ్ ప్రస్తావించాడు. గ్రంథాలలో వారు చేసిన పనులను, అలాగే వారు దాచిన అల్లాహ్ ఆజ్ఞలను కూడా పేర్కొన్నాడు. మరియు ప్రతి ప్రవక్త తీసుకువచ్చిన షరీఅత్ చట్టం గురించి తెలియజేయడం జరిగింది. మరియు అలానే పవిత్ర ఖుర్ఆన్ గురించి తెలియపరచడం జరిగింది. అందువల్ల, పవిత్ర ఖురాన్ అనేక విధాలుగా మునుపటి గ్రంథాల కంటే ఆధిక్యతను ప్రాధాన్యత పొందింది. ఈ ఖుర్ఆన్ గ్రంథాల ప్రామాణికతకు సాక్షి మరియు ఈ గ్రంథాలలోని వక్రీకరణల అబద్ధానికి సాక్షి.” (మజ్ మూఅల్ ఫతావా17/44)
ఆయన ఇంకా ఇలా తెలియజేశారు “ఖుర్ఆన్ విషయానికొస్తే, ఇది స్వతంత్ర గ్రంథం. దానిని విశ్వసించిన వారికి మరే ఇతర గ్రంథం అవసరం లేదు. ఈ ఖుర్ఆన్ మునుపటి అన్ని గ్రంధాల లక్షణాల కలయిక మరియు ఇతర గ్రంథాలలో ఉన్న అనేక లక్షణాలను కలిగి ఉంది. అందుకే ఈ గ్రంధం మునుపటి గ్రంధాలన్నింటిని ధృవీకరిస్తుంది మరియు అన్నింటికంటే శ్రేష్ఠమైనది. ఇది మునుపటి పుస్తకాలలోని సత్యాన్ని రుజువు చేస్తుంది మరియు వాటిలోని తిరోగమనాలను తిరస్కరిస్తుంది. మరియు అల్లాహ్ ఏ ఆజ్ఞలను రద్దు చేశాడో, ఇది వాటిని రద్దు చేస్తుంది, కాబట్టి ఈ ధర్మం సత్యాన్ని రుజువు చేస్తుంది, ఇది మునుపటి గ్రంథాలలో బలమైన భాగం, మరియు ఈ గ్రంధాలు మారిన మతాన్ని చెల్లుబాటు చేయవు, ఈ గ్రంథాలలో రద్దు చేయబడిన విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి“. (మజ్ మూఅల్ ఫతావా 19/184-185)
ఓ ముస్లింలారా! దైవ గ్రంథాలు ఆరు విషయాలను ఏకీభవిస్తాయి
[1]దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మొదటిది:- కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ఆరాధనలో ఎవరిని సాటి కల్పించకూడదు, వారు ఎవరైనా సరే, విగ్రహం అయినా, మనుషులైనా ప్రవక్తలైనా, రాళ్ళు అయినా, ఇక వేరే ఇతర ఏ వస్తువులైనా సరే సాటి కల్పించరాదు. దీన్నిబట్టి అర్థం అవుతున్నటువంటి విషయం దైవ ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, వాళ్ళు కేవలం అల్లాహ్ ని మాత్రమే ఆరాధించేవారు.
[2]దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో రెండవది:- విశ్వాస ప్రాథమిక విషయాలపై విశ్వాసం ఉంచడం. అవేమిటంటే అల్లాహ్ పై, దైవదూతలపై, దైవ గ్రంథాలపై, దైవ ప్రవక్తలపై, ప్రళయ దినంపై, విధిరాత మంచి చెడు అవడంపై విశ్వాసం ఉంచాలి.
[3] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో మూడవది:- ప్రత్యేక ఆరాధనలను కేవలం అల్లాహ్ కొరకు విధిగా చేయడం. ఉదాహరణకు నమాజ్, జకాత్, రోజా మొదలైనవి. కానీ ప్రవక్తల రాకడ ప్రకారంగా ఆరాధనలు నిర్వహించబడే విధానములు విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు తౌరాత్ గ్రంథం కూడా నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది మరియు ఇంజీల్ గ్రంథం కూడా నమాజ్ నమాజ్ చదవమని ఆజ్ఞాపిస్తుంది. అదే విధంగా ఖురాన్ గ్రంథం కూడా నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తుంది. కానీ నమాజ్ విధానము, నమాజ్ ఆచరించే సమయము ఈ మూడు మతాలలో వేరువేరుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాసం యొక్క ఆజ్ఞ కూడా అంతే.
షరియత్ యొక్క వివరణాత్మక తీర్పులకు సంబంధించినంతవరకు, సాధారణ పరంగా అన్ని గ్రంధాలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి, అయితే కొన్నిసార్లు అవి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అతని ఆధిపత్యానికి అనుగుణంగా ఉంటాయి ఎందుకంటే అల్లాహ్ కు తన దాసులకు ఏది మేలో తెలుసు కాబట్టి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు :
(మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము.)(అల్ మాయిదా:48)
ఉదాహరణకు అల్లాహ్ తఆలా వేటినైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ కొరకు హలాల్ అనగా ధర్మ సమ్మతం చేశాడో వాటిలో కొన్నింటిని తన జ్ఞానము మరియు వివేకంతో బనీ ఇస్రాయీల సమాజంపై వాటిని నిషిద్ధం చేశాడు. అవి వారి కంటే ముందు ధర్మసమ్మతం గావించబడినవి.
యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారికోసం నిషేధించాము. వారు ఎంతో మందిని దైవమార్గం నుంచి అడ్డుకోవటం వల్లనూ (అల్ నిసా:160)
[4]దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో నాల్గవది:- న్యాయం యొక్క ఆజ్ఞ. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చి పంపాము. వారితో పాటు గ్రంథాన్ని, ధర్మకాటాను కూడా అవతరింపజేశాము ప్రజలు న్యాయంపై నిలిచి ఉండటానికి! (అల్ హదీద్ :25)
[5] దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఐదొవది:- ఐదు విషయాలను తప్పక కాపాడుకోవాలి అనే ఆజ్ఞాపించబడింది. అవి ఏమిటంటే ధర్మం, విశ్వాసం, ధనము, గౌరవము మరియు ప్రాణం.
[6]దైవ గ్రంథాలు ఏకీభవించే విషయాలలో ఆరవది:- మంచి నైతికత గురించి ఆజ్ఞాపించడం జరిగింది మరియు చెడు నడవడిక నుండి వారించడం జరిగింది. ఉదాహరణకు: గ్రంథాలన్నీటిలో తల్లిదండ్రులకు విధేయత చూపాలని మరియు బంధువులతో బాంధవ్యాలు కలుపుకోవాలని, అతిధులకు గౌరవ మర్యాదలు చేయాలని, నిరుపేదలను ఆదుకోవాలని అనేటువంటి ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది. అదే విధంగా చెడును వారించడం ఉదాహరణకు: దౌర్జన్యం, తిరుగుబాటు, తల్లిదండ్రుల అవిధేయత, ఒకరి గౌరవ మర్యాదలతో ఆడుకోవడం, అబద్ధం, దొంగతనం, చాడీలు చెప్పడం, గీబత్ మొదలైనవి.
దైవ గ్రంథాలపై విశ్వాసం గురించి కొన్ని లాభదాయకమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మనజీవితాలలో వర్షింప చేయుగాక. ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరిని క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన (తౌబా) పశ్చాతాపం చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
తెలుసుకోండి! అల్లాహ్ మీపై కరుణించు గాక. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు – ఆకాశం నుంచి అవతరింప చేయబడిన గ్రంథాలలో గొప్ప గ్రంధాలు రెండు ఉన్నాయి. అవి తౌరాత్ మరియు ఖుర్ఆన్. దివ్య ఖురాన్ లో అనేకచోట్ల ఈ రెండు గ్రంథాల ప్రస్తావన ఒకేసారి వచ్చింది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఉన్నతమైనవి మరియు ఈ రెండు గ్రంథాల లో ఉన్నటువంటి చట్టము పరిపూర్ణం గావించబడినది.
ఓ అల్లాహ్ దాసులారా! నిశ్చయంగా ఖుర్ఆన్ అన్ని గ్రంథాల కంటే ఎంతో ఉన్నతమైనది. అందుకే అల్లాహ్ ఈ ఖురాన్ కు పూర్వ గ్రంథాలన్నీటిపై ఆధిక్యతను ప్రసాదించాడు. ఈ గ్రంథంలో ఇతర గ్రంథాలలో లేని అద్భుతాలు మరియు జ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో మేలైన విషయాలు ఉన్నాయి.
ఖురాన్ అనగా ఇది అల్లాహ్ యొక్క వాక్యము. దీని ద్వారా అల్లాహ్ మాట్లాడాడు. అల్లాహ్ మాట్లాడినటువంటి వాక్యాలను జిబ్రాయిల్ దూత ద్వారా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి వరకు చేరవేయబడ్డాయి తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఆ వాక్యాలను తన అనుచరులు వరకు చేర్చారు. వారు ఖుర్ఆన్ ను తమ హృదయాలలో భద్రపరుచుకున్నారు. వాటిని ఆకులపై లేక కాగితాలపై లిఖించి భద్రపరిచారు. ఆ తర్వాత మూడవ ఖలీఫా ఉస్మాన్ (రదియల్లాహు అన్హు ) గారి పరిపాలనలో ఒక పుస్తక రూపంలో సంకలనం చేశారు. ఆ తర్వాత దాని నుంచి అనేక కాపీలను చేసి ప్రచురించడం జరిగింది. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు:
మేమే ఈ ఖుర్ఆన్ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము (అల్ హిజ్ర్ :9)
ఓ ముస్లింలారా గ్రంథాలలోకెల్లా చిట్టచివరి గ్రంథము దివ్య ఖురాన్. అల్లాహ్ తఆలాఈ గ్రంథాన్ని తన జ్ఞానంతో మరియు వివేకంతో అవతరింపజేశాడు.
[1]ఈ ఖుర్ఆన్ అవతరణకు గల ఒక వివేకం ఏమిటంటే: ఆ ఖుర్ఆన్ యొక్క వాక్యాల పై యోచన చేసి బుద్ధిమంతులు ఉపదేశం పొందాలి అని మరియు వారిలో దైవభీతి జనించాలని. అల్లాహ్ ఇలా అంటున్నాడు :
ఇదొక శుభప్రదమైన గ్రంథం. ప్రజలు దీని వాక్యాలపై చింతన చేసేటందుకు, బుద్ధిజీవులు దీని ద్వారా గుణపాఠం నేర్చుకునేందుకు మేము దీనిని నీ వైపుకు పంపాము. (సాద్ : 29)
ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్ఆన్గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. (తహా :113)
[2] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే: దైవభీతిపరులకు ప్రతిఫలం ప్రసాదించుటకు మరియు తిరస్కారుల కొరకు శిక్ష ఉందని హెచ్చరించుటకు.
(అలాగే) ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక (గ్రంథము)ను అవతరింపజేశాము (అల్ నహ్ల్ :44)
ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “విశ్వసించిన వారికి నిలకడను వొసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికీ, వారికి శుభవార్తను వినిపించటానికీ నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ (జిబ్రయీల్) దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు.” (అల్ నహ్ల్ :64)
[5] మరొక వివేకవంతమైన విషయం ఏమిటంటే : ప్రజల మధ్య ఖుర్ఆన్ ద్వారా తీర్పు జరగాలని.
(ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీకు చూపిన విధంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికిగాను మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్యంతోపాటు పంపాము.) (అల్ నిసా : 105)
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి. అల్లాహ్ మీపై కరుణించుగాక . అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యానికై అజ్ఞాపించి ఉన్నాడాని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి.
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింప చేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్ది తో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు.
ఓ అల్లాహ్! ఇస్లాం, ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమాన బరుచు. నీవు నీ ధర్మం అయిన ఇస్లాం కు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు. ఓ అల్లాహ్! మా దేశాలలో భద్రత ను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గము పై నడిచే వారిగా చేయి. ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని, పరలోకం లో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్ములను కాపాడు. ఆమీన్
ఖతీబ్: మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ, జుబైల్, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామిఈ ‘ఇస్లామీయ జుమా ప్రసంగాలు’ అనే పుస్తకం నుండి – రచన: మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు : ఒక వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ప్రళయ దినం గురించి దర్యాప్తుచేశాడు. “ఆ (ప్రళయ) ఘడియ ఎప్పుడొస్తుంది?” అని అతను ప్రశ్నించాడు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు : ”నువ్వు దానిని ఏర్పాటు చేసుకున్నావా?” దానికి ఆ వ్యక్తి, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండటం తప్ప మరే తయారీ చేసుకోలేదు” అని అన్నాడు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”నువ్వు ప్రేమించేవారితో పాటు ఉంటావు” అని ప్రబోధించారు. (బుఖారి)
అనస్ (రదియల్లాహు అన్హు) ఏమంటున్నారో చూడండి: “నేనయితే మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు)ల పట్ల ప్రేమ కలిగి ఉండేవాడిని. ఒకవేళ నేను ఆ మహనీయులు చేసినన్ని మహత్కార్యాలు చేయలేకపోయినప్పటికీ ఈ ప్రేమ మూలంగా తీర్పుదినాన వారి సహచర్యంలోనే ఉండగలనన్న ఆశ నాకుంది.”
బుఖారిలోని మరో ఉల్లేఖనం ఇలా ఉంది : ఒకతను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, ”ఓ దైవప్రవక్తా! ఆ ఘడియ ఎప్పుడు వస్తుంది?” అని అడిగాడు. “నువ్వు దాని కొరకు చేసిన తయారీ ఏమిటీ?” అని మహాప్రవక్త ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు ఆ వ్యక్తి ”దానిగ్గాను నా వద్ద ఎక్కువ నమాజులు లేవు. ఎక్కువ ఉపవాసాలూ లేవు. ఎక్కువ దానధర్మాలు కూడా లేవు. అయితే నేను అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ప్రేమిస్తున్నాను” అని విన్నవించుకున్నాడు. ఇది విని, “నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు.
దైవప్రవక్తను ఈ విధంగా ప్రశ్నించిన వ్యక్తి ఒక పల్లెటూరి వాడని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది. పల్లెటూరి మనుషులు విషయాన్ని దర్యాప్తు చేసే తీరే వేరు. వారిలో మొహమాటంగాని, ఊగిసలాటగాని సాధారణంగా ఉండదు. కాగా, మహాప్రవక్త ప్రియ సహచరుల ధోరణి దీనికి కొంత భిన్నంగా ఉండేది. ఏ విషయాన్ని ప్రవక్తకు అడగాలన్నా కించిత్ భయం, జంకు వారికి ఉండేది. పల్లెటూరి నుండి ఏ పామరుడయినా వచ్చి ప్రవక్తను ధర్మసందేహాలు అడిగితే బావుండేదని వారు తలపోస్తూ ఉండేవారు. ఆ విధంగా తమకు మరిన్ని ధార్మిక విషయాలు తెలుస్తాయన్నది వారి ఉద్దేశం.
1. ‘ఆ ఘడియ ఎప్పుడొస్తుంది?’ అనేది హదీసులోని ఒక వాక్యం. అరబీలో ”అ సాఅత్” అని ఉంది. దీనికి తెలుగులో “నిర్ధారిత సమయం” అని అర్థం వస్తుంది. నిర్ధారిత సమయం అంటే మనిషి మరణించగానే అతని కర్మల లెక్కను తీసుకునే సమయమైనా కావాలి లేదా సమస్త జనులను నిలబెట్టి లెక్కతీసుకునే ప్రళయదినమైనా కావాలి.
2. “నువ్వు దాన్ని ఏర్పాటు చేసుకున్నావా?” అనేది హదీసులోని మరో వాక్యం. ప్రళయదిన ప్రతిఫలం గురించి అంత తొందరపడుతున్నావు. సరే, మరి అక్కడ నీకు గౌరవ స్థానం లభించేందుకు కావలసిన సత్కార్యాలు చేసుకున్నావా? అన్న భావం ఆ ప్రశ్నలో ఇమిడి ఉంది. ఇది ఎంతో వివేకవంతమయిన, ఆలోచనాత్మకమయిన ప్రశ్న. ప్రళయదినం సంభవించటమైతే తథ్యం. అది తన నిర్ణీత సమయంలో రానే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా కన్నా దానికోసం తను సన్నద్ధమై ఉన్నానా? లేదా? అన్న చింత మనిషికి ఎక్కువగా ఉండాలి.
3. ”నేనే తయారీ చేసుకోలేదు” అని ఆ పల్లెటూరి వ్యక్తి అనటంలోని ఉద్దేశ్యం తాను బొత్తిగా నమాజ్ చేయటం లేదని, దానధర్మాలు చేయటం లేదని కాదు. ఆ విధ్యుక్తధర్మాలను తను నెరవేరుస్తున్నాడు. అయితే అవి అతని దృష్టిలో బహుస్వల్పం అన్నమాట. మరో ఉల్లేఖనంలో ఆ విషయమే ఉంది (నా దగ్గర నమాజులు, ఉపవాసాలు, దానధర్మాలు ఎక్కువగా లేదని ఆ వ్యక్తి చెప్పాడు).
విధ్యుక్త ధర్మాలను (ఫరాయజ్) నెరవేర్చనిదే ఏ వ్యక్తి తాను అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త అభిమానినని చెప్పుకోలేడు. సహాబాల హయాంలో ఇలా ఆలోచించే వారే కాదు. విశ్వసించి, ముస్లింనని ప్రకటించుకుని ఇస్లాంలోని ప్రధాన విధులపట్ల అలసత్వం వహించటం ఆనాడు ఎక్కడా లేదు.
4. “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల ప్రేమ తప్ప”
అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల ఎవరి హృదయంలోనయినా ప్రేమ ఉంటే అది అది అతనిలోని విశ్వాసానికి (ఈమాన్ కు) ప్రబల తార్కాణం అన్నమాట. విశ్వాసం లేనిదే ప్రేమ ప్రసక్తే రాదు. అంటే తన మనసులో విశ్వాసం ఉంది గనకనే అల్లాహ్ ను, దైవప్రవక్తను తాను ప్రేమిస్తున్నానని, అందుకనే తనకు పరలోకం గురించిన చింత అధికంగా ఉందని ఆ పల్లెటూరి వ్యక్తి ఉద్దేశ్యం. అతని ఆలోచన ఎంతో అర్థవంతమైంది కూడా.
5. ”నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి వెంట ఉంటావు.”
అంటే నీ విశ్వాసం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యెడల నీకు గల ప్రేమ నీకు ఉపయోగపడతాయి. తీర్పుదినాన నీ చేత ప్రేమించబడిన వారి సహచర్యం నీకు ప్రాప్తమవుతుంది. ఇంకా నువ్వు వారి శ్రేణిలోని వ్యక్తిగానే పరిగణించబడతావు. అల్లాహ్ ను ప్రేమించినవాడు ప్రళయదినాన అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉంటాడు. మహాప్రవక్తను ప్రేమించినవాడు, ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) చెంత స్వర్గంలో ఉంటాడు. విశ్వాసుల పలు అంతస్థులు ఉంటాయి. ఒకరు ఎగువ స్థాయిలో ఉంటే మరొకరు దిగువస్థాయిలో ఉంటారు. ఎగువ స్థాయిలో నున్న వారు దిగువ స్థాయిలో ఉన్నవారిని చూచి అల్పులని భావించరు. అలాగే దిగువ స్థాయిలో నున్నవారు ఎగువస్థాయిలో నున్నవారిని చూసి అసూయ చెందరు. ప్రతి ఒక్కరూ అల్లాహ్ అనుగ్రహాలను ఆస్వాదిస్తూ ఆనందంలో మునిగి ఉంటాడు.
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పల్లెటూరి వ్యక్తికి చేసిన ఉపదేశం విని సహచరులు ఎంతో సంతోషించారు. అది వారిలోని విశ్వాస భాగ్యానికి ప్రతీక. వారు అన్నిటికన్నా ఎక్కువగా పరలోకం గురించి ఆలోచిస్తుండేవారు. తాము ప్రేమించిన వారి వెంటే ఉంటామన్న సంగతి తెలియగానే వారి సాఫల్యం వారి కళ్ళముందు కదలాడింది. ఎందుకంటే మహాప్రవక్త యెడల వారికి గల ప్రేమ నిజమైనది, అపారమైనది, నిష్కల్మషమైనది.
కేవలం నోటితో ప్రకటించినంత మాత్రాన నిజమైన ప్రేమ వెల్లడి కాదు. ఆచరణకు, త్యాగానికి అది మారు పేరు. తాము ప్రేమించేవారి అభీష్టానుసారం మసలుకున్నప్పుడే, వారు సమ్మతించిన మార్గాన్ని అనుసరించినప్పుడే అది సార్థకమవుతుంది.
హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) గారు మహాప్రవక్త మరియు అబూబకర్ (రదియల్లాహు అన్హు) లను ఎంతగానో ప్రేమించేవారు. ఆ కారణంగా తనకు వారి సహచర్యం లభిస్తుందని ఆయన ఆశిస్తుండేవారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు అత్యంత ప్రియమైన సహచరులు. ఇహలోకంలో వారు ఎప్పుడూ ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఒకేచోట వారి అంత్యక్రియలు జరిగాయి. స్వర్గంలో కూడా వారు ఒకేచోట ఉంటారు. దైవప్రవక్తల తరువాత – సామాన్య మానవులలో శ్రేష్టులైన వారు అబూబకర్ గారే. ఆ తరువాత స్థానం హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిది.
6. ఆ మహనీయులు చేసినన్ని సత్కార్యాలు నేను చేయలేకపోయినా వారిని ప్రేమిస్తున్నందున పరలోకంలో వారి సహచర్యం నాకు లభిస్తుందని ఆశిస్తున్నానని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) అన్నారు.
అంటే, నా సత్కార్యాలు వారి సత్కార్యాలు, త్యాగాల ముందు బహు స్వల్పమైనవి. అయితే నేను వారిని ప్రేమ అనే తీగతో అల్లుకుపోయాను. అందుచేత ఎలాగోలా స్వర్గంలోకి ప్రవేశిస్తాను.
అబూ మూసా అష్అరి ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది : “ఒక మనిషి కొందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. కాని వారి స్థాయిలో మహత్కార్యాలు చేయలేడు. మరి అప్పుడతని పరిస్థితి ఏమిటి? అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అడగగా, ”మనిషి ఎవరిని ప్రేమిస్తాడో వారి వెంట ఉంటాడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) బదులిచ్చారు.
ఈ అధ్యాయంలోని హదీసు ద్వారా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటం వల్ల ప్రాప్తమయ్యే మహాభాగ్యం ఎటువంటిదో విదితమవుతోంది. అదేవిధంగా దైవదాసుల్లోని సద్వర్తనుల సావాసంలో ఉండటం శుభసూచకమని కూడా బోధపడుతోంది. ఇకపోతే, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను ప్రేమించటమంటే ఏ విధంగా ప్రేమించటం అన్న ప్రశ్న జనిస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోరిన విధంగా జీవితం గడపటం, వారు వద్దన్న విషయాల జోలికి పోకుండా ఉండటం, వారి ప్రసన్నతను చూరగొనగలిగే పనులను చేయటమే ఆ ప్రేమకు ప్రతిరూపం.
ఇక, సద్వర్తనులయిన మానవులను ప్రేమించటం అంటే వారి దాస్యం చేయమని భావం ఎంతమాత్రం కాదు. వారి మాదిరిగా మంచి పనులు చేస్తూ, వారి స్థాయికి ఎదగటానికి ప్రయత్నించాలి.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మనిషికి తన భార్యాబిడ్డల కంటే, తన సొంత సొమ్ముకంటే, తన వారికంటే ఎక్కువగా నేను ప్రియమైనవాడ్ని కానంతవరకూ అతను విశ్వాసి (మోమిన్) కాలేడు.” (ముస్లిం)
ఈ హదీసులో ”విశ్వాసం” యొక్క ఉన్నతమయిన స్థితి వివరించబడింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నతస్థితికి విశ్వాసం చేరుకోవాలి. అంటే మనం మన స్వయంపై దైవప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మన ప్రాణం కన్నా దైవప్రవక్త ప్రాణమే ప్రీతికరం కాగలగాలి. ఒకసారి హజ్రత్ ఉమర్ మహాప్రవక్తను ఉద్దేశించి, “ఓ దైవప్రవక్తా! నా ప్రాణం తప్ప మిగతా అన్ని విషయాలకన్నా మీరే నాకు ప్రియమైన వారు” అని అన్నారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”లేదు, ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో అతని సాక్షిగా చెబుతున్నాను – నేను మీకు మీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతమం కానంత వరకూ మీరు విశ్వాసి కాలేరు” అని పలికారు. ఉమర్ (రజిఅన్ అన్నారు. “ఇప్పుడు నాకు మీరు నిశ్చయంగా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రీతికరమైన వారు.” దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “అయితే ఉమర్! ఇప్పుడు మీరు విశ్వాసులు” అన్నారు. (బుఖారి)
సహచరులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల అమితమయిన ప్రేమాభిమానం కలిగి ఉండేవారు. చారిత్రక గ్రంథాలు, హదీసు గ్రంథాలే దీనికి నిదర్శనం. హిజ్రత్ సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్తకు చేసిన సేవలను గురించి ప్రఖ్యాత చరిత్రకారులు, హదీసువేత్త అయిన ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ ఇద్దరూ రాత్రిపూట సూర్ గుహలో చేరారు. అయితే అబూబకర్ గుహలోకి మొదట ప్రవేశించారు. దైవప్రవక్తకు కీడు కలిగించే మృగం గాని, పాముగాని గుహలో ఉండవచ్చునేమోనన్న భయంతో అబూబకర్ తొలుత తానే గుహలో ప్రవేశించారు.”
మరో ఉల్లేఖనం ఏమని ఉందంటే; ఆ గుహకు ఎన్నో కన్నాలు ఉన్నాయి. అబూబకర్ ఆ కన్నాలను మూసివేశారు. ఒక కన్నాన్ని మూసివేయటానికి వీలుపడకపోతే తన కాలిని దానికి అడ్డుగా పెట్టారు. కన్నం లోపలినుంచి విషపు పురుగులు కాటేయసాగాయి. బాధతో ఆయన కళ్ళనుంచి అశ్రువులు రాలాయి. అయినా ఆయన కాలు తీయలేదు.
ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరించాలి. ఎవరయినా, తనకు ప్రవక్త యెడల అమితమయిన ప్రేమ ఉందని చాటుకుంటూ ప్రవక్త సంప్రదాయాన్ని (సున్నత్ను) అవలంబించకపోతే, అతను అసత్యవాది, బూటకపు అనుయాయి అనిపించుకుంటాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:
“మేము అల్లాహ్ ను మరియు ప్రవక్తను విశ్వసించామని, విధేయతను స్వీకరించామని వారంటారు. ఆ తరువాత వారిలో ఒక వర్గం విధేయత పట్ల విముఖత చూపుతుంది. ఇటువంటి వారు విశ్వాసులు కారు.” (అన్నూర్ : 47)
విధేయతా మార్గం నుండి వైముఖ్యం ప్రదర్శించిన వారిని విశ్వాస పరిధుల నుండి వేరుచేస్తూ పై ఆయత్ అవతరించింది. మనసులో ఎంత అధికంగా విశ్వాసం ఉంటే అంతే అధికంగా విధేయతా భావం ఉంటుంది.
చెప్పుకోవటానికయితే చాలామంది తమకు ప్రవక్తయెడల అపార గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే వారి మాటలు ‘విధేయత’ అనే గీటురాయిపై పరికించబడతాయి. ఒకవేళ వారి ఆచరణ ప్రవక్త ఆచరణకు భిన్నంగా ఉంటే వారు చెప్పేదంతా బూటకం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే, నిష్కల్మషమైన విధేయతా భావం ఉంటే అది ఆచరణ ద్వారా తప్పకుండా వ్యక్తమవుతుంది.
”(ఓ ప్రవక్తా!) వారితో అనండి, ‘ఒకవేళ మీరు అల్లాహ్ యెడల ప్రేమ కలిగి ఉంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, ఎంతగానో కరుణించేవాడు కూడాను.” (ఆలి ఇమ్రాన్ : 31)
హాపిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు :
ప్రవక్తలందరిపట్ల ప్రేమ కలిగి ఉండటం విశ్వాసానికి ప్రతీక. అయితే మనం అందరికన్నా ఎక్కువ ప్రేమ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల కలిగి ఉండాలి :
ఇమామ్ ఖతాబి ఇలా అంటున్నారు:
ఇక్కడ ప్రేమ అంటే భావం లాంఛన ప్రాయమయిన ప్రేమ కాదు హృదయ పూర్వకమయిన ప్రేమ. మహాప్రవక్త ఏమని ఉపదేశించారంటే, మీరు నా అనుసరణలో మీ మనోకాంక్షల్ని జయించనంతవరకు, నా సంతోషానికి మీ సుఖసంతోషాలపై ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ – ఒకవేళ మీకు నష్టం కలిగినాసరే, చివరకు మీరు అమరగతి నొందవలసి వచ్చినా సరే – మీరు నా సంతోషం కొరకు పాటుపడనంతవరకూ మీకు నాపై గల ప్రేమ ధృవీకరించబడదు.
ఖాజీ అయాజ్ మరియు ఇబ్నె బతాల్ తదితరులు ఇలా అభిప్రాయపడ్డారు : ప్రేమ మూడు రకాలు :
(1) గౌరవనీయమయిన ప్రేమ. ఇది తండ్రిపట్ల ఉంటుంది. (2) అవ్యాజానురాగాలతో కూడిన ప్రేమ. ఇది సంతానంపై ఉంటుంది. (3) స్వాభావికమయిన ప్రేమ. ఇది ఒక మనిషికి మరో మనిషిపై సాధారణంగా ఉంటుంది.
ఈ హదీసులో మహాప్రవక్త అన్ని రకాల ప్రేమలను ప్రస్తుతించారు.
ఈ హదీసు ఆలోచన, యోచనల వైపు దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా ప్రాప్తమయ్యే మహత్పూర్వకమయిన ప్రయోజనాలకు మూలం ఆలోచన మరియు యోచనలే. ప్రవక్త సహచరులు ఏ విషయంపైనయినా ఎంతో సావధానంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని తరచి చూసేవారు. అందుచేత వారి విశ్వాసం ఎంతో దృఢమయ్యింది. ఈ హదీసు ద్వారా ముస్లిమైన ప్రతి ఒక్కరికీ లభించే సందేశం ఏమంటే సకల ప్రేమలకన్నా ప్రవక్త యెడల ప్రేమకు అతను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో తాను ఏ స్థాయిలో నున్నది అతను సతతం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.
—
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం) రచన:సఫీ అహ్మద్ మదనీ అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ] https://youtu.be/cXBur4cYoZE [37:50 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1- ప్రవక్త విధానం: శుద్ధి మరియు మలమూత్ర విసర్జనలో([1])
A– ప్రవక్త విధానం: మలమూత్ర విసర్జనలో
1- ఆయన మరుగుదొడ్డిలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు ఈ విధంగా పలికేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (ఓ అల్లాహ్! అపరిశుభ్ర స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుతున్నాను). (బుఖారీ). బయటకు వచ్చిన తర్వాత అనేవారు: గుఫ్రానక. (ఓ అల్లాహ్ నన్ను క్షమించు). (అబూ దావూద్ 30)
2- ఆయన ఎక్కువగా కూర్చొని ఉన్న స్థితిలోనే మలమూత్ర విసర్జన చేసేవారు.
3- ఆయన ఒక్కోసారి “ఇస్తింజా” (నీటితో శుభ్రం) చేసుకునేవారు, మరికొన్ని సార్లు “ఇస్తిజ్మార్” (రాళ్ళతో శుద్ధి) చేసుకునేవారు, ఇంకొన్ని సార్లు ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ రెండూ చేసేవారు.
4- ఆయన ఇస్తిన్జా మరియు ఇస్తిజ్మార్ లో ఎడమ చేతినే ఉపయోగించేవారు.
5- ఆయన ఇస్తింజా చేసిన తర్వాత తమ చేతిని మట్టితో శుభ్రపరుచుకునేవారు. (ఈ రోజుల్లో సబ్బుతో, హ్యాండ్ వాష్ లిక్విడ్ తో శుభ్రపరుచుకున్నా సరిపోతుంది).
6- ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన కొరకు సహాబాల (సహచరుల) దృష్టికి కనబడనంత దూరంగా వెళ్ళిపోయేవారు.
7- ఆయన కొన్నిసార్లు ఏదైనా మట్టి దిబ్బ (మిట్ట) వెనక, కొన్నిసార్లు ఖర్జూరపు చెట్ల చాటుకు, మరికొన్ని సార్లు లోయలో, పల్లపు భూమిలో చెట్ల వెనక మలమూత్ర విసర్జన చేసేవారు.
8- ఆయన మూత్ర విసర్జన కొరకు మెత్తటి నేలను అన్వేషించేవారు.
9-ఆయన మలమూత్ర విసర్జన కొరకు కూర్చునేటప్పడు నేలకు అత్యంత దగ్గరగా అవనంతవరకూ తమ దుస్తులను ఎత్తేవారు కాదు.
10- ఆయన మూత్రవిసర్జ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సలామ్ చేస్తే దానికి సమాధానం ఇచ్చేవారు కాదు.
B– ప్రవక్త విధానం: వుజూ చేయడంలో
1-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ప్రతీ నమాజు కొరకు వుజూ చేసేవారు, కొన్ని సందర్భాల్లో ఒకే వుజూ తో ఎన్నో నమాజులు చేసేవారు.
2- ఆయన ఒక్కోసారి కేవలం ఒక ముద్ నీళ్ళతో, ఒకప్పుడు మూడిట్లో రెండు భాగాల ముద్ నీళ్ళతో, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ నీళ్ళతో వుజూ చేసేవారు. (నాలుగు ముద్ లు కలసి ఒక సాఅ అవుతుంది. ఇది ఒక కొలమానం. ఒక సాఅ లో సుమారు మూడు కిలోల బియ్యం వస్తాయి).
3- ఆయన వుజూలో తక్కువ నీటిని ఉపయోగించేవారు. తమ అనుచరసమాజాన్ని కూడా నీరు వృధా చేయడం నుంచి వారించేవారు.
4- ఆయన కొన్నిసార్లు ఒక్కోసారి, కొన్నిసార్లు రెండేసి సార్లు, కొన్ని సార్లు మూడేసి సార్లు తమ వుజూ అవయవాలను కడిగేవారు. మరికొన్ని సార్లు కొన్ని అవయవాలను రెండేసి సార్లు కడిగితే, మరికొన్ని అవయవాలను మూడేసి సార్లు కడిగేవారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా మూడు కంటే ఎక్కువ సార్లు కడగలేదు.
5- ఆయన కొన్నిసార్లు ఒకే దోసెడు నీటితో పుక్కిలించి, ముక్కులోకి నీళ్ళు ఎక్కించేవారు, మరికొన్ని సార్లు రెండు దోసెళ్ళతో, మరికొన్ని సార్లు మూడు దోసెళ్ళతో. అయితే ఒకే దోసెడు నీళ్ళలో నుండి సగంతో పుక్కిలించి, సగం ముక్కులో ఎక్కించేవారు.
6- ఆయన కుడిచేతితో ముక్కులోకి నీళ్ళు ఎక్కించి, ఎడమ చేతితో శుభ్రపరిచేవారు.
7- ఆయన పుక్కిలించకుండా, ముక్కులోకి నీటిని ఎక్కించకుండా వుజూ చేసేవారు కాదు.
8- ఆయన పూర్తి తలపై మస్ హ్ చేసేవారు, మరికొన్ని సార్లు రెండు చేతులతో తలపై మస్ హ్ చేస్తూ ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి తీసుకొచ్చేవారు.
9- ఎప్పుడైతే ఆయన తమ నుదుటిపై మసహ్ చేసేవారో అప్పుడు మిగిలిన మసహ్ ని తమ తలపాగాపై పూర్తిచేసే వారు.
10- ఆయన తలపై మస్ హ్ తో పాటే చెవుల పైభాగం మరియు లోపలి భాగం కూడా మస్ హ్ చేసేవారు.
11- ఆయన మేజోళ్ళు తొడగనప్పుడు రెండు కాళ్ళు కడిగేవారు.
12- ఆయన క్రమపద్దతిలో మరియు ఒక అవయవం తర్వాత వెంటనే మరో అవయవం కడుగుతూ వుజూ చేసేవారు, ఆయన ఈ (క్రమం, వెంటవెంట) విషయంలో ఎన్నడూ అంతరాయం (లోటు) కలిగించేవారు కాదు.
13- ఆయన బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరు)తో వుజూ ప్రారంభించేవారు, మరియు వుజూ పూర్తి చేశాక, చివరిలో ఈ దుఆ చదివేవారు: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని ఆయన ఒక్కడేనని ఆయనకు భాగస్వామి ఎవరూ లేరని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను, ఓ అల్లాహ్! నన్ను పశ్చాత్తాప పడేవారిలోను, పరిశుభ్రత పాటించే వారిలోనూ చేర్చు (తిర్మిజీ).
ఇంకా ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్ దిక అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక. (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు సకల స్తోత్రాలు నీ కొరకే. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యమిస్తున్నాను. పశ్చాత్తాప పడి నీతో క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపునకే మరలుచున్నాను. (ఇర్వావుల్ గలీల్ 1-135).
14- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లేదా సహాబాలు ప్రారంభంలో: “నవైతు నఫ్అల్ హదస్” (నేను అశుధ్ధత దూరం అవ్వాలని “నియ్యత్” (సంకల్పం) చేసుకుంటున్నాను) అని లేదా నమాజు ధర్మసమ్మతం చేయడానికి “నియ్యత్” (సంకల్పిం) చేసుకుంటున్నాను అని అనేవారు కారు.
15- ఆయన వుజూలో తమ మోచేతులు మరియు చీలమండలాని కంటే పైగా కడిగేవారు కాదు.
16- ఆయనకు (వుజూ తర్వాత) తమ అవయవాలను ఆరబెట్టే అలవాటు లేకుండినది.
17- ఆయన తమ గెడ్డంలో ఖిలాల్ చేసేవారు, కానీ ఎల్లప్పుడూ చేసేవారు కారు.
18- ఆయన తమ వేళ్ళ మధ్యలో కూడా ఖిలాల్ చేసేవారు, కానీ ఎల్లప్పుడూ కాదు.
19- ఆయనకు ఎవరితోనైనా నీరు పోయించుకుంటూ వుజూ చేసే అలవాటు లేకుండినది, అనేకసార్లు స్వయంగా తామే నీళ్ళు తీసుకొని వుజూ చేసేవారు. మరికొన్ని సార్లు అవసరమైతే మరో వ్యక్తి సహాయం తీసుకునేవారు.
1- సహీహ్ హదీసు ద్వారా రూఢీ అయినది ఏమనగా ఆయన ప్రయాణంలోనూ, మరియు నగరంలో ఉన్నప్పుడూ మస్ హ్ చేసేవారు. ఆయన స్థానికుల కొరకు ఒక రాత్రి, ఒక పగలు మరియు ప్రయానికుని కొరకు మూడు రాత్రులు, మూడు పగళ్ళు మస్ హ్ చేసే గడువుని నిర్ధారించారు.
2- ఆయన మేజోళ్ళ పైభాగాన మస్ హ్ చేసేవారు. ఆయన అన్ని రకాల మేజోళ్ళపై మస్ హ్ చేశారు. ఒకప్పుడు కేవలం తలపాగా పై, మరొకప్పుడు నొసటి మరియు తలపాగాను కలిపి మస్ హ్ చేశారు.
3- ఆయన వుజూ చేస్తున్నప్పుడు కాళ్ళు కడిగే విషయంలో ఇబ్బంది పడేవారు కాదు. ఒకవేళ మేజోళ్ళు ఉంటే వాటిపైనే మస్ హ్ చేసేవారు, లేకపోతే కాళ్ళు కడిగేవారు.
1- ఆయన ఏ నేలపై నమాజు ఆచరించేవారో అదే నేలపై తయమ్ముమ్ చేసేవారు అది మన్ను అయినా, లేదా ఇసుక అయినా, లేదా చిత్తడి నేల అయినా సరే. ఆయన ఇలా అనేవారు: నా అనుచర సమాజంలోని ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఉండగా నమాజు సమయం అవుతుందో అక్కడి శుభ్రమైన భూమి అతని కొరకు నమాజు చేసే స్థలం అవుతుంది మరియు (నీళ్ళు లేనిచో) తయమ్ముమ్ కొరకు అదే నేల మట్టి సరిపోతుంది.
2- ఆయన దూర ప్రయాణంలో వెళ్ళినప్పుడు తయమ్ముమ్ కొరకు తమ వెంట మట్టిని తీసుకువెళ్ళేవారు కారు. మరియు ఇలా చేయమని ఎన్నడూ ఆదేశించలేదు.
3- ఆయన నుండి ప్రతీ నమాజు కొరకూ విడిగా తయమ్ముమ్ చేయడం రుజువు లేదు, ఆయన ఇలా ఆజ్ఞాపించనూ లేదు. ఆయన తయమ్ముమ్ ఆదేశం సామాన్యంగా ఇచ్చేశారు, మరియు అది వుజూకి ప్రత్యామ్నాయం అని తెలిపారు.
4- ఆయన ముఖం మరియు చేతుల పై ఒకే తట్టు తో తయమ్ముమ్ చేసేవారు.
2– ప్రవక్త విధానం: నమాజులో
A- ప్రవక్త విధానం: ఇస్తిఫ్తాహ్ (సనా) మరియు ఖిరాత్ లో
1- ఆయన నమాజు కొరకు నిలబడినప్పుడు “అల్లాహు అక్బర్” అనేవారు. దానికంటే ముందు ఆయన ఏమీ పలికేవారు కాదు. అదేవిధంగా ఎన్నడూ నోటితో సంకల్పం చేయలేదు.
2- ఆయన తక్బీరే తహ్రీమా (అల్లాహు అక్బర్)తో పాటే తమ రెండు చేతుల వేళ్ళను విడిగా, ఖిబ్లా దిశలో పెట్టి తమ రెండు చెవుల అంచుల లేదా భుజాల వరకు ఎత్తేవారు. ఆ తరువాత కుడి చెయ్యిని ఎడమ చెయ్యి పైభాగంపై పెట్టేవారు
3- ఆయన కొన్నిసార్లు ఈ దుఆ (ఇస్తిఫ్తాహ్)తో (నమాజ్) ప్రారంభించేవారు: అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనస్, అల్లాహుమ్మగ్ సిల్నీ మిన్ ఖతాయాయా బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.
(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్నూ, నా పాపాలకు అంతే దూరంగా ఉంచు, ఓ అల్లాహ్! మాసిన బట్టని తెల్లగా శుభ్రం చేయబడినట్లు నన్ను నా పాపాల నుండి ప్రక్షాళణం చెయ్యి. ఓ అల్లాహ్! నా పాపాలను మంచు, నీరు, వడగండ్లతో కడిగివెయ్యి).
మరికొన్నిసార్లు ఆయన ఈ దుఆ తో (నమాజు) ప్రారంభించేవారు: వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫా, వమా అన మినల్ ముష్రికీన్, ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్.
(నేను నా ముఖాన్ని ఏకాగ్ర చిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని.
4- ఆయన దుఆయే ఇస్తిఫ్తాహ్ తర్వాత: అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం చదివేవారు. (నేను శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను). ఆ తర్వాత సూరతుల్ ఫాతిహా పఠించేవారు.
5- ఆయన రెండు చోట్ల మౌనంగా ఉండేవారు. మొదటిది: తక్బీరే తహ్రీమా మరియు ఖిరాత్ మధ్య. రెండవది: ఇందులో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం సూరయే ఫాతిహా తరువాత, మరికొందరి అభిప్రాయం ప్రకారం రుకూకి ముందు.
6- ఆయన సూరయే ఫాతిహా ముగించిన తరువాత మరొక సూరా పారాయణం చేసేవారు. కొన్నిసార్లు పెద్ద సూరాలు పఠిస్తే మరికొన్ని సార్లు ప్రయాణం లేదా ఇతర కారణాల వల్ల చిన్న సూరాలు పఠించేవారు. కానీ ఆయన ఎక్కువ శాతం మధ్య రకమైన సూరాలు పఠించేవారు.
7- ఆయన ఫజర్ నమాజులో 60 నుండి 100 ఆయతుల వరకూ పారాయణం చేసేవారు. అదేవిధంగా ఆయన ఫజ్ర్ నమాజులో సూరయే ఖాఫ్, సూరయే రూమ్, సూరయే తక్వీర్ పారాయణం చేసేవారు.
అదేవిధంగా “సూరయే జిల్ జాల్” ను రెండు రకాత్ లలో కూడా పారాయణం చేసారు.
ప్రయాణంలో ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజులో ముఅవ్వజతైన్ (సూరయే ఫలఖ్ మరియు సూరయే నాస్) పారాయణం చేసారు.
ఒకసారి ఆయన సూరయే ముఅ్ మినూన్ పారాయణం చేయడం ప్రారంభించారు మొదటి రకాతులో ఉండగా మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం గారి సంఘటనకు చేరుకోగానే ఆయనకు విపరీతమైన దగ్గు రావడంతో ఆయన రుకూ చేసారు.
8- ఆయన జుమా రోజు ఫజ్ర్ నమాజులో అలిఫ్ లామ్ మీమ్ సూరయే సజ్దహ్ మరియు హల్ అతా అలల్ ఇన్సాన్ సూరయే దహర్ ను పారాయణం చేసేవారు.
9- ఆయన జొహ్ర్ నమాజులో కొన్నిసార్లు సుదీర్ఘ పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో సుదీర్ఘ పారాయణం చేస్తే అస్ర్ నమాజులో దానికి సగం వంతు పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో ఖిరాత్ సంక్షిప్తంగా చేసి ఉంటే అస్ర్ నమాజులో కూడా దానికి సమానంగా ఖిరాత్ (పారాయణం) చేసేవారు.
10- ఆయన మగ్రిబ్ నమాజులో ఒకసారి సూరయే తూర్, మరొకసారి సూరయే ముర్సలాత్ పారాయణం చేసారు.
11- ఆయన ఇషా నమాజులో సూరయే తీన్ పారాయణం చేసారు. మరియు హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారి కొరకు {వష్షమ్ సి వదుహాహా} సూరయే షమ్స్ మరియు {సబ్బిహిస్మ రబ్బికల్ అఅలా} సూరయే అఅలా మరియు {వల్లైలి ఇజా యగ్ షా} సూరయే లైల్ పారాయణం చేయవలసినదిగా నిర్ణయించారు. సూరే బఖరా పారాయణం నుండి వారించారు.
12- ఆయన విధానం ఏ సూరా పారాయణం చేసినా దానిని పూర్తిగా పారాయణం చేయడం. ఒక్కోసారి ఒక సూరాను రెండు రకాత్ లలో పూర్తిచేసే వారు, ఒక్కోసారి ఆయన సూరాను ప్రారంభం నుంచి పారాయణం చేసేవారు. కానీ సూర మధ్యలో నుండి లేదా చివరి భాగం నుండి పారాయణం చేయడం గురించి ఆయన నుండి ఏ విషయమూ ప్రస్తావించబడలేదు.
ఒకే రకాత్లో రెండు సూరాలను పఠించే విషయానికి వస్తే ఆయన ఇలా కేవలం సఫిల్ నమాజులలో చేసేవారు. ఇక ఒకే సూరాను రెండు రకాత్ లలో పూర్తి చేసే విషయానికి వస్తే ఆయన ఇలా తక్కువగా చేసేవారు. అదేవిధంగా ఆయన జుమా మరియు ఈదైన్ (పండుగల) నమాజులను వదిలి వేరితర నమాజులలో ఫలానా సూరాలనే పఠించాలని ప్రత్యేకించలేదు.
13- ఆయన ఫజ్ర్ నమాజులో రుకూ తరువాత ఒక నెల వరకూ ఖునూతే నాజిలా పఠించారు, పిదప దానిని వదిలేశారు. ఇలా తాత్కాలిక అవసరం ఏర్పడినప్పుడు చేసారు, ఎప్పుడైతే ఆ అవసరం పూర్తి అయిపోయిందో అప్పుడు మానేశారు. ఆయన ఖునూత్ ను కష్ట, ఆపద సమయాల్లో పఠించేవారు, కానీ ఇది ఫజ్ర్ నమాజుతోనే ముడిపడిలేదు.
3- B– ప్రవక్త విధానం: నమాజు ప్రాక్టికల్ గా చేయడంలో
1- ప్రతీ నమాజులో ఆయన మొదటి రకాతు రెండవ రకాత్ కంటే సుదీర్ఘంగా ఉండేది.
2- ఆయన ఖిరాత్ పూర్తి చేయగానే శ్వాస తిరిగి తీసుకునేంత సమయం మౌనం పాటించేవారు. మరియు రెండు చేతులు ఎత్తుతూ (రఫ్ఉల్ యదైన్ చేస్తూ), అల్లాహు అక్బర్ పలుకుతూ రుకూలోకి వెళ్ళేవారు. తమ రెండు అరచేతులతో తమ మోకాళ్ళను గట్టిగా పట్టుకునేవారు, అలాగే తమ మోచేతులను ప్రక్కలకు దూరంగా ఉంచేవారు, ఆయన వీపు నిటారుగా ఉండేది. తలను పైకి ఉంచేవారు కాదు, అదేవిధంగా కిందికి కూడా వంచేవారు కాదు, వీపుకి సమానంగా ఉంచేవారు.
3- ఆయన రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేవారు. (ముస్లిం). ఒక్కోసారి: సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ చదివేవారు. (ముత్తఫఖున్ అలైహి). ఆయన రుకూలో ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్ (ముత్తఫఖున్ అలైహి).
4- సాధారణంగా ఆయన రుకూ పది సార్లు సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేంత సమానంగా ఉండేది. ఆయన సజ్దహ్ కూడా అలానే ఉండేది. ఒక్కోసారి రుకూ మరియు సజ్దహ్ ఖియామ్ కు సమానంగా ఉండేవి. కానీ ఇలా అప్పుడప్పుడూ ఒంటరిగా రాత్రి నమాజులలో చేసేవారు. ఆయన నమాజులు ఎక్కువ శాతం మధ్యస్థంగా మరియు సరైన విధంగా ఉండేవి.
5- ఆయన సమిఅల్లాహులిమన్ హమిదహ్ అంటూ రుకూ నుండి పైకి లేస్తూ, రఫ్ఉల్ యదైన్ చేసేవారు, అలాగే వీపును నిటారుగా ఉంచేవారు. ఆయన సజ్దహ్ నుండి లేచిన తర్వాత (రెండు సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు) కూడా నిటారుగా కూర్చునేవారు. ఇంకా ఇలా చెప్పేవారు: ఆ వ్యక్తి నమాజు చెల్లదు, ఎవడైతే రుకూ మరియు సజ్దహ్ లో తన వీపును నిటారుగా ఉంచడో. (తిర్మిజీ 265)
ఆయన నిటారుగా నిలబడిన తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్ అనేవారు, మరొకప్పుడు రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు, మరికొన్ని సార్లు అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు.
6- ఆయన రుకూ తర్వాత ఈ రుకున్ (అంటే ఖౌమా) కూడా రుకూ కు సమానమైన దీర్ఘంగా చేసేవారు. ఈ ఖౌమా స్థితిలో: అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్దు మిల్అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వమిల్అ మా షిఅ్ త మిన్ షైఇన్ బఅ్ దు అహ్లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు, వకుల్లునా లక అబ్దున్, లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్దు. (ముస్లిం)
7- ఆ తర్వాత ఆయన రఫఉల్ యదైన్ చేయకుండా సజ్దహ్ చేసేవారు. సజ్దహ్ చేసేటప్పుడు ఆయన ముందు తమ మోకాళ్ళను నేలపై పెట్టేవారు ఆ తర్వాత చేతులను పెట్టేవారు, ఆ తర్వాత నొసటి మరియు ముక్కుని ఆనించేవారు. ఆయన తలపాగా గుడ్డ పై కాకుండా నొసటి మరియు ముక్కుపై సజ్దహ్ చేసేవారు. ఆయన ఎక్కువగా నేలపైనే సజ్దహ్ చేసేవారు.. మరియు నీరు,తడిచిన మట్టిపై, మరియు ఖర్జూరపు చాపపై మరియు శుభ్రపరిచి, రంగించబడిన తోలు పై కూడా సజ్దహ్ చేసారని ఆధారాలు ఉన్నాయి.
8- సజ్దహ్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నుదుటు మరియు ముక్కును ఆనించి ఉంచేవారు, మరియు తమ రెండు చేతులను తమ రెండు చంకలకు ఎంతలా దూరంగా ఉంచేవారంటే ఆయన చంకల తెల్లదనం కనబడేది.
9- మరియు తమ రెండు చేతులను తమ భుజాలు మరియు చెవులకు సమానంగా ఉంచేవారు మరియు మధ్యస్థంగా సజ్దహ్ చేసేవారు. కాలి వేళ్ళ పై భాగం (గోటి భాగం) ఖిబ్లా వైపు ఉండేవి, అరచేతులు మరియు వేళ్ళను చాచేవారు..వేళ్ళను కలిపి ఉంచేవారు కాదు అదేవిధంగా ఎక్కువ దూరం దూరంగా కూడా ఉంచేవారు కాదు.
10) ఆయన సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు:-
సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్ లీ ..(ముత్తఫఖున్ అలైహి) మరియు ఇలా కూడా పలికేవారు:- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్
11- ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రఫఉల్ యదైన్ చేయకుండా తమ తలను పైకెత్తేవారు,మరియు ఎడమ కాలిని పరిచి దానిపై కూర్చునేవారు ، కుడి కాలును లేపి ఉంచేవారు,మరియు తమ రెండు చేతులను తమ తొడలపై పెట్టేవారు ఆ స్థితిలో ఆయన మోచేతులు తొడలపై ఉండేవి.. మరియు చేతులను (పంజా) తమ మోకాళ్లపై పెట్టేవారు, అలాగే రెండు వేళ్ళను మధ్యలో గుండ్రని ఆకారం వచ్చేలా కలిపేవారు,ఆ తర్వాత ఆయన తమ చూపుడువేలుడు పైకి లేపి దుఆ చేసేవారు అదేవిధంగా.. దానిని కదుపుతూ ఉండేవారు మరియు ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మగ్ ఫిర్ లీ, వర్ హమ్నీ,వజ్ బుర్నీ,వహ్దినీ,వర్జుఖ్నీ…(అబూ దావూద్, తిర్మీజి, ఇబ్నే మాజహ్)-
[మిస్సింగ్ పాయింట్స్]
4- D- ప్రవక్త విధానం: నమాజు సందర్భంలో చేసే కదలికలలో
1) ఆయన నమాజులో ఉన్నప్పుడు అటూ ఇటూ దిక్కులు చూసేవారు కాదు.
2) ఆయన నమాజులో కళ్ళను మూసుకుని ఉంచేవారు కాదు.
3) ఆయన నమాజ్ కొరకు నిల్చున్నప్పుడు తలను కొంచెం వంచి ఉంచేవారు. ఆయన ఎప్పుడైనా నమాజును సుదీర్ఘంగా చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ వెనుక నుండి పిల్లవాని ఏడుపు వినిపిస్తే నమాజును త్వరగా ముగించేవారు, ఆ పిల్లవాని తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి.
4- ఆయన తమ మనవరాలు ఉమామాను తమ భుజాలపై ఎత్తుకొని ఫర్జ్ నమాజు చేసేవారు. ఖియామ్ (నిలబడిన) స్థితిలో ఎత్తుకునేవారు, రుకూ లేదా సజ్దహ్ స్థితిలో క్రిందికి దించేవారు.
5- ఆయన నమాజు చేస్తున్న స్థితిలో హసన్ మరియు హుసైన్ (రదియల్లాహు అన్హుమా) వచ్చి ఆయన వీపుపై ఎక్కేవారు, అప్పుడు ప్రవక్త వారిని దించకుండా తమ సజ్దహ్ ని సుదీర్ఘంగా చేసేవారు.
6- ఆయన నమాజులో ఉన్న స్థితిలో ఒకవేళ హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు వస్తే ఆయన నడుచుకుంటూ పోయి ఆమె కొరకు తలుపు తీసేవారు పిదప తమ నమాజు చేసే చోటుకి తిరిగి వచ్చి, నమాజును కొనసాగించేవారు.
7- ఆయన నమాజు స్థితిలో ఉన్నప్పుడు సలాం కు సమాధానం సైగతో ఇచ్చేవారు.
8- ఆయన నమాజులో అవసరమున్నప్పుడు ఊదేవారు, ఏడ్చేవారు మరియు గొంతుని సవరించుకునే ఉండేవారు.
9- ఆయన కొన్నిసార్లు చెప్పులు, బూట్లు తీసేసి నమాజు చేసేవారు, కొన్నిసార్లు అవి తొడిగి నమాజు చేసేవారు. ఆయన యూదులను వ్యతిరేకిస్తూ చెప్పులతో నమాజు చేయండని ఆదేశించారు.
10- ఆయన ఒక్కోసారి ఒకే వస్త్రం లో నమాజు చేసేవారు. కానీ ఎక్కువగా రెండు వస్త్రాలలో నమాజు చేసేవారు.
E- ప్రవక్త విధానం: నమాజు తర్వాత చేసే పనులలో
1- ఆయన సలామ్ తిప్పిన తర్వాత మూడుసార్లు “అస్తగ్ఫిరుల్లాహ్” అని, ఈ జిక్ర్ చేసేవారు: అల్లాహుమ్మ అంతస్సలాము వమిన్కస్సలాము తబారక్ త యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్. (ముస్లిం). اللَّهُمَّ أَنْتَ السَّلامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ والإِكْرَامِ
ఆయన ఇస్తిగ్ఫార్ మరియు పైన తెలుపబడిన జిక్ర్ చేసే వరకు మాత్రమే ఖిబ్లా వైపు తిరిగి ఉండేవారు, ఆ పిదప వెంటనే ముఖ్తదీలు(నమాజీల) వైపుకు తిరిగేవారు. ఒక్కోసారి కుడి వైపు నుండి, మరోసారి ఎడమ వైపు నుండి.
2- ఆయన ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత సూర్యుడు ఉదయించే వరకు అదే చోట కూర్చుని ఉండేవారు.
3- ఆయన ప్రతీ ఫర్జ్ నమాజు తర్వాత ఈ దుఆ చదివేవారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ .. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్ది..(ముత్తఫఖున్ అలైహి)లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్,వలా నఅ్ బుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ్ మతు వలహుల్ ఫద్ లు ,వలహుస్స నాఉల్ హసను,లా ఇలాహ ఇల్లల్లాహ్,ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం).
4- ఆయన తమ అనుచర సమాజానికి అభిలషణీయంగా నిర్ణంయించారు: సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు చెప్పి, చివరిలో లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒకసారి పలికి 100 సంఖ్య పూర్తిచేయడం.
E- ప్రవక్త విధానం: నఫిల్ మరియు రాత్రి నమాజులో
1- ఆయన సాధారణ సున్నత్ అంటే కారణంతో కూడి లేని సున్నత్ మరియు నఫిల్ నమాజులు ఇంట్లోనే చేసేవారు. ప్రత్యేకంగా మగ్రిబ్ సున్నతులు.
2- ఆయన స్థానికంగా ఉన్నప్పుడు పదిరకాతులు నిబద్ధంగా చేసేవారు:
జొహ్ర్ కు ముందు రెండు రకాతులు, జొహ్ర్ తర్వాత రెండు రకాతులు,
మగ్రిబ్ తర్వాత రెండు రకాతులు,
ఇషా తర్వాత ఇంట్లో రెండు రకాతులు,
ఫజ్ర్ కి ముందు రెండు రకాతులు.
3) ఆయన నఫిల్ నమాజులలో అత్యంత నిబద్ధంగా ఫజ్ర్ సున్నతులను పాటించేవారు. ఆయన వాటిని మరియు విత్ర్ ను స్థానికంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వదిలేవారు కాదు. ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ రెండు (ఫజ్ర్ సున్నతులు, విత్ర్) తప్ప వేరే ఏ సున్నతులు, నఫిల్లు చేయడం రుజువు లేదు .
4- ఆయన ఫజ్ర్ సున్నత్ చేసుకున్నాక కుడి ప్రక్కన నడుం వాల్చేవారు.
5- ఆయన ఒక్కోసారి జొహర్ నమాజు కు ముందు నాలుగు రకాతులు చేసేవారు. ఎప్పుడైనా జొహ్ర్ తర్వాత చేసే రెండు సున్నతులు తప్పిపోతే అస్ర్ నమాజు తర్వాత చేసేవారు.
6- ఆయన రాత్రి నమాజ్ అధికంగా నిలబడి చేసేవారు. ఒక్కోసారి కూర్చుని చేసేవారు. మరికొన్ని సార్లు ఆయన కూర్చుని ఖిరాత్ చేసి, మిగిలిన కొంత ఖిరాత్ భాగాన్ని నిలబడి పూర్తి చేసి, రుకూలోకి వెళ్ళేవారు.
7- ఆయన రాత్రి నమాజు 8 రకాతులు చేసేవారు, ప్రతి రెండు రకాతుల తర్వాత సలాం తిప్పేవారు. ఆ తర్వాత నిరంతరంగా 5 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, చివరి రకాతులో తప్ప కూర్చునేవారు కాదు. ఒక్కోసారి 9 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, 8 రకాతులు నిరంతరంగా చేసి, ఆ తర్వాత కూర్చొని, సలాం తిప్పకుండా, లేచి, 9వ రకాతు చేసి కూర్చొని, తషహ్హుద్ చదివి సలాం తిప్పేవారు. సలాం తిప్పిన తరువాత మరో రెండు రకాత్ లు చేసేవారు, లేదా ఈ పద్ధతిలోనే ఒక్కోసారి 7 రకాతులు చేసి, ఆ తర్వాత రెండు రకాతులు కూర్చొని చేసేవారు.
8- ఆయన రాత్రి తొలి భాగం, మధ్య భాగం మరియు చివరి భాగంలో విత్ర్ నమాజు చేసేవారు. ఇలా చెప్పేవారు: మీరు విత్ర్ ను రాత్రి ఆఖరి నమాజుగా చేసుకోండి. (ముత్తఫఖున్ అలైహి)
9- ఆయన ఒక్కోసారి విత్ర్ తర్వాత రెండు రకాత్ లను కూర్చొని చేసేవారు, ఒక్కోసారి కూర్చొని ఖిరాత్ చేసి, రుకూ చేయడానికి సంకల్పించినప్పుడు లేచి నిలబడేవారు మరియు రుకూలోకి వెళ్ళేవారు.
10- ఎప్పుడైనా నిద్ర ఆవరించి లేదా ఏదైనా అవస్త ఉండి (రాత్రి తహజ్జుద్ చేయలేకపోతే) పగలు పన్నెండు రకాతులు చేసేవారు.
11- ఆయన ఒక్కోసారి తహజ్జుద్ నమాజులో ఒకే ఆయతుని తెల్లవారే వరకూ మాటిమాటికి తిలావత్ చేస్తూ గడిపేవారు.
12- ఆయన రాత్రి నమాజు ఒక్కోసారి నిశబ్దంగా, మరొకసారి బిగ్గరగా చేసేవారు. ఒక్కోసారి సుదీర్ఘంగా చేస్తే, మరొకసారి తేలికగా ఖియామ్ (నిలబడటం) చేసేవారు.
13- ఆయన విత్ర్ నమాజులో (సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా) మరియు (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) మరియు (ఖుల్ హువల్లాహు అహద్) పారాయణం చేసేవారు. మరియు విత్ర్ నమాజు సలామ్ తిప్పిన తరువాత మూడు సార్లు (సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్) చదివేవారు, మూడోసారి చదివేటప్పుడు స్వరాన్ని బిగ్గరగా చేస్తూ దీర్ఘం చేస్తూ చదివేవారు. (అబూ దావూద్,నసాయీ, ఇబ్నే మాజహ్)
5- A- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానం: జుమా రోజున
1- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజును గొప్పగా భావించేవారు. మరియు గౌరవం ఇచ్చేవారు అలాగే ఆ రోజు విశిష్టతలను ప్రత్యేకంగా తెలిపారు. వాటిలో కొన్ని:
* జుమా రోజు గుసుల్ చేయడం.
* ఆ రోజు మంచి దుస్తులు ధరించడం
* మరియు ఖుత్బా నిశ్శబ్దంగా వినడం వాజిబ్
* ప్రవక్త ముహమ్మద్ పై అత్యధికంగా దరూద్ పంపడం.
2- ప్రజలు మస్జిదులో జమా అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ వచ్చి, సలామ్ చేసేవారు. మళ్ళీ మింబర్ పైకి ఎక్కి, ప్రజల వైపు ముఖం చేసి, వారికి సలాం చేసి, కూర్చునేవారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు అజాన్ ఇచ్చేవారు. ఆజాన్ అయిన వెంటనే ప్రవక్త నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. అజాన్ మరియు ఖుత్బాకు మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండేది కాదు. మింబర్ తయారు కాక ముందు ప్రవక్త విల్లు లేదా లాఠీ కు ఆనుకొని ఖుత్బా ఇచ్చేవారు.
3- ఆయన నిలబడి (మొదటి) ఖుత్బా (జుమా ప్రసంగం) ఇచ్చేవారు, పిదప కూర్చునేవారు, మళ్లీ లేచి నిలబడి రెండవ ఖుత్బా ఇచ్చేవారు.
4- ఆయన ప్రజలను తమకు సమీపంగా కూర్చోమని మరియు నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞాపించేవారు. మనిషి తన సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అన్నా అతను వ్యర్ధమైన పనికి పాల్పడినవాడవుతాడు, మరెవరైతే వ్యర్థమైన పనికి పాల్పడతాడో అతని కొరకు జుమా పుణ్యం లేదు.
5- ఆయన ఖుత్బా ఇస్తున్నప్పుడు కళ్ళు ఎర్రగా అయి, స్వరం గంభీరంగా (బిగ్గరగా) అయిపోయేది మరియు ఆయనలో ఆగ్రహం పెరిగిపోయేది ఎలా అంటే ఒక సైన్యాన్ని బెదిరిస్తున్నట్లుగా ఉండేది.
6- ఆయన “అమ్మా బఅద్” అని చెప్పిన తర్వాత ఖుత్బా మొదలు పెట్టేవారు. మరియు సంక్షిప్తమైన ఖుత్బా ఇచ్చి, నమాజును సుదీర్ఘంగా చేసేవారు.
7- ఆయన జుమా ఖుత్బా లో సహాబాలకు (తమ అనుచరులకు) ఇస్లాం యొక్క మూల విషయాలు, ధర్మ పద్దతులను నేర్పేవారు. ఏదైనా ఆజ్ఞాపించే మరియు వారించే అవసరం ఉన్నప్పుడు ఆజ్ఞాపించేవారు, వారించేవారు.
8- ఆయన ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ప్రశ్నించే వారికి సమాధానం ఇవ్వడం కొరకు ఖుత్బా ను ఆపేసేవారు, మళ్లీ ఖుత్బాను కొనసాగించి పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఏదైనా అవసరానికి మింబర్ పై నుండి దిగి, మళ్లీ మింబర్ పైకి వచ్చేవారు. ఆయన సమయసందర్భానుచితాన్ని గమనిస్తూ ఖుత్బా ఇచ్చేవారు. ఆకలితో ఉన్నవారిని లేదా అవసరం కలిగి ఉన్నవారిని చూస్తే వారికి దానం చేమమని ఆజ్ఞాపించేవారు మరియు ప్రోత్సహించేవారు.
9- ఆయన అల్లాహ్ స్మరణ వచ్చిన సందర్భంలో తమ చూపుడు వేలుతో సైగ చేసేవారు. ఎప్పుడైనా కరువు కాటకాల స్థితి ఏర్పడినప్పుడు ఖుత్బా లోనే వర్షం కోసం దుఆ చేసేవారు.
10- ఆయన జుమా నమాజు చేసిన తర్వాత ఇంటికి వెళ్లి రెండు రకాత్ ల సున్నత్ నమాజు చేసేవారు. జూమాలో హాజరైనవారితో జుమా నమాజు తర్వాత నాలుగు రకాతుల సున్నతులు చేయమని ఆజ్ఞాపించేవారు. (ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ చెప్పారు: జుమా చేసుకున్న తర్వాత మస్జిదులో చేసేవారు 4 సున్నతులు చేయాలి, ఇంటికి వచ్చి చేసేవారు 2 చేయాలి).
B– ప్రవక్త విధానం: ఈదైన్ (పండుగ)లలో
1- ఆయన పండుగ నమాజులు ఈద్గాలో చేసేవారు. అందమైన దుస్తులను ధరించేవారు
2- ఈదుల్ ఫిత్ర్ రోజున పండుగ స్థలానికి (ఈద్గాహ్)కు బయలుదేరే ముందు కొన్ని ఖర్జూరాలు బేసి సంఖ్యలో తినేవారు. అయితే ఈదుల్ అజ్హా పండుగ నాడు తిరిగి వచ్చేవరకూ ఏమీ తినేవారు కాదు. ఖుర్బానీ ఇచ్చి, ఖుర్బానీ మాంసాన్నే తినేవారు. ఈదుల్ ఫిత్ర్ నమాజు కొంత ఆలస్యంగా, ఈదుల్ అజ్హా నమాజు కొంత తొందరగా చేసేవారు.
3- ఆయన ఈద్గాహ్ కు కాలినడకన వెళ్లేవారు. వెంట బల్లాన్ని తీసుకువెళ్ళడం జరిగేది, ఆయన అక్కడకు చేరుకున్నాక ఆయన ముందు బల్లెమును (సుత్రా కొరకు) పాతిపెట్టబడం జరిగేది.
4- ఆయన ఈద్గాహ్ కు (పండుగ నమాజు స్థలానికి) చేరుకున్నాక, అజాన్ మరియు ఇఖామత్ లేకుండానే నమాజు ప్రారంభించేసేవారు. ఇంకా అస్సలాతు జామిఅహ్ లాంటి పదాలు కూడా అనేవారు కాదు. ఆయన మరియు సహాబా (సహచరులు) పండుగ నమాజుకు ముందు లేదా తర్వాత ఏ నమాజు చేసేవారు కాదు.
5- ముందు ఆయన నమాజు చేసేవారు, తర్వాత ఖుత్బా ఇచ్చేవారు. అయితే ఆ నమాజు రెండు రకాతులగా చేయించేవారు. మొదటి రకాతులో తక్బీరే తహ్రీమాతో పాటు ఏడు సార్లు క్రమంగా (నిరంతరంగా) తక్బీర్ చేసేవారు, ప్రతి రెండు తక్బీర్ల మధ్య క్షణంపాటు మౌనంగా ఉండేవారు, ఆ తక్బీర్ల మధ్య ఎటువంటి ప్రత్యేక జిక్ర్ (దుఆ) నిరూపించబడలేదు. ఏడు తక్బీర్లు అయిన తర్వాత ఖిరాత్ ప్రారంభించేవారు, ఖిరాత్ పూర్తయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత రెండో రకాతులో నిరంతరంగా ఐదు సార్లు తక్బీర్ పలికేవారు. పిదప ఖిరాత్ మొదలు పెట్టేవారు. నమాజు పూర్తయిన తర్వాత లేచి జనుల ముందు నిలబడేవారు, ఆ స్థితిలో ప్రజలు కూర్చొనే ఉండేవారు, ఆయన వారందరికీ హితోపదేశం చేసేవారు మరియు మంచిని ఆదేశిస్తూ చెడు నుండి వారించేవారు..
మొదటి రకాతులో సూరయే ఫాతిహా తరువాత సూరయే ఖాఫ్ మరియు రెండవ రకాతులో “ఇఖ్తరబ” అనగా సూరయే ఖమర్ పూర్తిగా పారాయణం చేసేవారు. కొన్ని సార్లు రెండు రకాతులలో సూరయే అఅలా మరియు సూరయే గాషియా పారాయణం చేసేవారు.
6- A– ప్రవక్త విధానం: సూర్య గ్రహణం సందర్భంలో
1- ఆయన సూర్యగ్రహణం సందర్భంగా తమ దుప్పటిని ఈడ్చుకుంటూ హడావిడిగా, భయాందోళనతో మస్జిదుకు వచ్చారు. వెంటనే రెండు రకాతుల నమాజ్ చేయించారు. మొదటి రకాతులో సూరయె ఫాతిహా మరియు ఒక పెద్ద సూరా బిగ్గరగా పారాయణం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు, పిదప రుకూ నుండి నిలబడుతూ సమిఅల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్ అన్నారు. ఆ తర్వాత ఖిరాత్ ప్రారంభించారు, అయితే ఈ ఖియామ్, ఖిరాత్ మొదటి ఖియామ్, ఖిరాత్ కంటే తక్కువగా ఉండినది. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు ఇది ముందు రుకూ కంటే కొద్దిగ తక్కువ ఉండినది. తర్వాత తమ తలను రుకూ నుండి పైకెత్తారు పిదప సుదీర్ఘమైన రెండు సజ్దాలు (సాష్టాంగం) చేసారు. ఆ తర్వాత మళ్ళీ నిలబడి మొదటి రకాతులో చేసిన విధంగా ఈ రెండవ రకాతులో చేశారు. ఈ విధంగా ప్రతీ రకాతులో రెండు రుకూలు మరియు రెండు సజ్దాలు అయ్యాయి. నమాజు పూర్తయిన తర్వాత ఆయన స్వచ్ఛమైన, అనర్గళమైన (మంచి సంభాషణ కలిగిన) ఖుత్బా ప్రసంగం ఇచ్చారు.
2- మరియు ఆయన గ్రహణ సందర్భంలో అల్లాహ్ స్మరణ, నమాజ్, దుఆ, ఇస్తిగ్ఫార్, సదఖా (దానదర్మాలు) చేయమని మరియు బానిసలకు విముక్తినివ్వమని ఆజ్ఞాపించారు.
B– ప్రవక్త విధానం: ఇస్తిస్ఖా (వర్షం కోరడం) లో
1- ఆయన మింబర్ పై జుమా ఖుత్బా సందర్భం వర్షం కొరకు దుఆ చేసేవారు. ఇంకా వేరితర సందర్భాల్లో కూడా వర్షం కొరకు దుఆ చేసేవారు. అదే విధంగా ఆయన మస్జిద్ లో కూర్చుని ఉండగా తమ చేతులను పైకెత్తారు, మరియు అల్లాహ్ తో వర్షం కొరకు దా చేశారు.
2- ఆయన వర్షం కొరకు చేసిన దుఆలలో ఓ రెండు ఇవి: (అల్లాహుమ్మస్ ఖి ఇబాదక, వబహాఇమక, వన్ షుర్ రహ్మతక వఅహ్ యి బలదకల్ మయ్యిత్) ఓ అల్లాహ్! వర్షం కురిపించు! నీ దాసుల కొరకు, జంతువుల కొరకు, ఇంకా నీ కారుణ్యాన్ని కురిపించు మరియు మరణించిన ఈ సీమను బతికించు!
మరొక దుఆ: (అల్లాహుమ్మస్ ఖినా గైసమ్ ముగీసా, మరీఅమ్ మరీఆ, నాఫిఅన్ గైర జార్ర్, ఆజిలన్ గైర ఆజిల్). ఓ అల్లాహ్! ఆలస్యం లేకుండా తక్షణమే, నష్టం కాకుండా లాభాన్నిచ్చే, మాకు సహాయపడే, పచ్చటి పైర్లను పండించే మరియు ఆనంద వసంతాలుగా ఉండే వర్షాన్ని కురిపించు!
3- ఆయన ఎప్పుడైనా మేఘం లేదా తుఫాను గాలిని చూస్తే ముఖం కవలికల్లో ఆందోళన కనపడేది, అప్పుడు ఆయన (అటూ ఇటూ) వెనకా ముందూ చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే వర్షం కురిసేదో ఆయన దానిపట్ల సంతోషించేవారు. (ఆయన ఇది అల్లాహ్ శిక్షయితే కాదు కదా అని భయపడేవారు).
4- ఆయన వర్షాన్ని చూసినప్పుడు ఈ విధంగా అనేవారు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఆ. (ఓ అల్లాహ్ లాభదాయకమైన వర్షం కుర్పించు). మరియు తమ శరీరంలోని కొంత భాగం నుండి బట్టను తొలగించేవారు, అది వర్షంలో తడవాలని. ఆయనను దీని గురించి ప్రశ్నించినప్పుడు ఈ విధంగానే అనేవారు: నిశ్చయంగా ఇది అల్లాహ్ తరపునుండి అవతరించబడిన తాజా అనుగ్రహం.
5- వర్షం అధికమైనప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో వర్షం ఆగడానికి దుఆ చేయండని కోరినప్పుడు ఆయన ఈ విధంగా దుఆ చేసేవారు: అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వద్ ద్జిరాబి వల్ ఆకామి వల్ జిబాలి, వ బుతూనిల్ అవ్ దియతి, వ మనాబతిష్ షజర్. అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. (బుఖారీ, ముస్లిం).
ప్రవక్త విధానం: సలాతుల్ ఖౌఫ్ (యుద్ధంలో చేసే నమాజ్)లో
1- శత్రువులు ఆయనకు మరియు ఖిబ్లాకు మధ్యలో ఉన్నప్పుడు, వీరులందంరూ ఆయన వెనక రెండు సఫ్ (పంక్తు)లలో ఉండేవారు, ఆయన తక్బీరే తహ్రీమా పలికినప్పుడు వారందరూ తక్బీర్ పలికేవారు. ఆయన రుకూ చేస్తే వారందరూ రుకూ చేసేవారు, ఆయన రుకూ నుండి లేస్తే అందరూ లేచేవారు, ఆయన సజ్దాలోకి వెళ్ళినప్పు మొదటి సఫ్ (పంక్తి) లో ఉన్నవారు సజ్దా చేసేవారు మరియు రెండో పంక్తివారు శత్రువులకు ఎదురుగా నిలబడేవారు, పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం రెండో రకాతు కొరకు నిలబడినప్పుడు రెండో పంక్తివారు తమ రెండు సజ్దాలు చేసుకొని, లేచి మొదటి పంక్తిలోనికి వెళ్ళిపోయేవారు, మొదటి పంక్తివారు వెనక్కి వచ్చి రెండో పంక్తివారి స్థానం తీసుకునేవారు, ఈ విధంగా మొదటి పంక్తి యొక్క విశిష్టత రెండు పంక్తులవారూ పొందేవారు. మరియు రెండవ పంక్తి వాళ్లు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు రెండు సజ్దాలు పొందగలిగేవారు. అదే విధంగా ఆయన రెండో రకాతులో రుకూ లోకి వెళ్ళాక రెండు పంక్తుల వారూ మొదటి రకాతులానే అమలు చేసేవారు. మరియు ఆయన తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు రెండో పంక్తి వాళ్లు తమ రెండు సజ్దాలను చేసుకునేవారు. పిదప ఆయన తో పాటు తషహ్హుద్ లో పాల్గొనేవారు. ఈ విధంగా అందరితో పాటే సలాం తిప్పేవారు.
2- ఒకవేళ శత్రువులు ఖిబ్లా వైపున కాకుండా వేరే దిశలో ఉంటే ఆయన తమ వెంట ఉన్నవారందరినీ ఒక్కోసారి రెండు గ్రూపులుగా చేసేవారు. ఒక గ్రూపు శత్రువులను ఎదురించడానికి నిలబడితే, మరొక గ్రూప్ ఆయనతో పాటు నమాజు చేసుకునేవారు. ఒక గ్రూపువారు ప్రవక్తతో ఒక రకాతు నమాజ్ చేసి వెళ్ళిపోయేవారు, మరియు రెండొవ గ్రూపువారు వచ్చి ఆయన రెండో రకాతులో కలిసేవారు, ఆయన సలాం తిప్పిన తర్వాత రెండు గ్రుపులూ మిగిలిన తమ ఒక్కొక్క రకాత్ పూర్తి చేసుకునేవారు.
3- ఒక్కోసారి ఆయన రెండు గ్రూపులలో నుండి ఒక గ్రూపుకి ఒక రకాత్ చేయించి నిలబడేవారు. వారప్పుడు రెండొవ రకాతు స్వయంగా పూర్తి చేసుకుని ఆయన రుకూ చేయకముందే వాపసు వెళ్ళిపోయేవారు. తర్వాత రెండో గ్రూపు వచ్చి ఆయనతో పాటు రెండో రకాతులో కలసేవారు, ఆయన తషహ్హుద్ కొరకు కూర్చున్నప్పుడు వీరు లేచి నిలబడి రెండవ రకాతు పూర్తిచేసుకునేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు తషహ్హుద్ చదివిన తరువాత వారి కోసం వేచి ఉండేవారు, వారు కూడా తషహ్హుద్ చదివిన తరువాత వారందరితో కలిపి సలామ్ త్రిప్పేవారు.
4- ఆయన ఒక్కోసారి ఒక గ్రూపువారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు. మళ్ళీ రెండో గ్రూపు వస్తే వారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు
5- ఒక్కోసారి ఆయనతో పాటు ఒక రకాత్ చదివి ఒక గ్రూపు వెళ్ళిపోయేది మరియు ఒక రకాత్ ఖజా చేసేది కాదు. పిదప రెండో జమాత్ వచ్చాక వారికి కూడా ఆయన ఒక రకాతు చేయించేవారు మరియు ఆ జమాత్ కూడా రెండవ రకాతు ఖజా చేసేది కాదు. ఈ విధంగా ఆయనవి రెండు రకాతులు పూర్తయ్యేవి మరియు మిగతా వారివి కేవలం ఒక్కో రకాతు పూర్తయ్యేది.
7- ప్రవక్త విధానం: మృతుని అంత్యక్రియలలో
1- జనాజాలో ఆయన పద్దతి ఎంతో పరిపూర్ణంగా మరియు అన్ని జాతులకు భిన్నంగా ఉండేది. ఇందులో మృతుడు, మరియు అతని కుటుంబం మరియు ఆత్మీయుల పట్ల సద్వర్తన, ఉత్తమంగా మసలుకునే వ్యవహారం ఉండేది. అందుకని ప్రవక్తవారు ప్రథమంగా వ్యాధి గ్రస్తునిని సందర్శించేవారు, అతనికి పరలోకాన్ని జ్ఞప్తికి చేసేవారు, అతనికి తౌబా, ఇస్తిగ్ఫార్ గురించి ఉపదేశించేవారు, రోగి సమీపంలో ఉన్నవారితో, అతనికి లాఇలాహ ఇల్లల్లాహ్ చదవడం గురించి గుర్తు చేస్తూ ఉండమని ఆజ్ఞాపించేవార, ఇది అతని చివరి పలుకుగా మారాలని ఇలా ఆదేశించేవారు.
2- ఆయన సృష్టిలో అందరికన్నా ఎక్కువ అల్లాహ్ విధివ్రాత పట్ల సంతృప్తిగా ఉండేవారు. అందరికంటే ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండేవారు. ఆయన తమ కుమారుడైన ఇబ్రాహీం మరణించినప్పుడు ఏడ్చారు, ఆయన పట్ల ఉన్న దయ, కరుణ మరియు అప్యాయత వల్ల. కానీ ఆయన హృదయం అల్లాహ్ పట్ల ప్రసన్నత, కృతజ్ఞత తో నిండి ఉండినది. మరియు నాలుక అల్లాహ్ స్మరణ మరియు స్తోత్రంలో నిమగ్నమై ఉండినది. మరియు ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా కళ్ళు కన్నీటి పర్యంతం అయ్యాయి, హృదయం బాధగా ఉంది, కానీ నేను అవే పలుకులు పలుకుతాను దేనిపట్లయితే నా ప్రభువు ప్రసన్నుడవుతాడో.
3- ఆయన ముఖాన్ని గిల్లడం, అరవడం, పెడబొబ్బలు పెట్టడం, విలపిస్తూ సంతాపం తో స్వరాన్ని బిగ్గరగా చేయడాన్నుంచి వారించారు.
4- ఆయన విధానం: మృతుని అంత్యక్రియలు తొందరగా పూర్తి చేయడం. అతన్ని శుభ్రపరచడం, స్నానం చేయించడం మరియు తెల్లని కఫన్ దుస్తులు తొడగించడం.
5- ఆయన విధానం: మృతుని ముఖం కప్పి ఉంచడం, అతని కళ్ళు మూయడం.
6- ఆయన కొన్ని సందర్భాల్లో మృతునిని స్వయంగా చుంబించేవారు.
7- ఆయన మృతదేహాన్ని మూడు లేదా ఐదు లేదా గుసుల్ (స్నానం) చేయించేవారి సూచన మేరకు అంతకంటే ఎక్కువ సార్లు అవసరం ఉంటే అన్నేసార్లు గుసుల్ చేయించమని ఆజ్ఞాపించేవారు. అయితే చివరిలో కాఫూర్ (కర్పూరం) ను వాడమని ఆజ్ఞాపించేవారు.
8- ఆయన యుద్ధభూమిలో వీరమరణం పొందిన (షహీద్) లకు గుసుల్ ఇచ్చేవారు కాదు. అతనిపై ఉన్న ఆయుధాలు, కవచాన్ని తీసేసి, అతని శరీరంపై ఉన్న వస్త్రాల్లోనే ఖననం చేసేవారు. మరియు నమాజే జనాజా చేయించేవారు కాదు.
9- ఆయన ఇహ్రామ్ స్థితిలో మరణించిన వారికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించమని ఆజ్ఞాపించేవారు, వారిని వారి ఇహ్రామ్ బట్టల్లోనే ఖననం చేయమని ఆజ్ఞాపించేవారు. మరియు సుగంధ ద్రవ్యాలు పూయడం మరియు తలను కప్పడం నుండి వారించేవారు.
10- మృతుడి సంరక్షకునితో తెల్లని మంచి వస్త్రాలలో కఫన్ ఇవ్వమని ఆజ్ఞాపించేవారు, మరియు ఎక్కువ ఖరీదైన కఫన్ నుండి వారించేవారు.
11- ఒకవేళ కఫన్ చిన్నగా ఉండి, పూర్తి శరీరానికి సరిపోకపోతే, తలను దాచేవారు మరియు కాళ్లపై గడ్డిని పరిచేవారు.
ప్రవక్త విధానం: జనాజా నమాజులో
1- ఆయన మృతుని జనాజా నమాజే మస్జిద్ బయట చేయించేవారు. కొన్ని సార్లు మస్జిద్ లో కూడా చేయించారు కానీ ఇలా ఎల్లప్పుడూ చేయలేదు.
2- నమాజ్ చేయించాలని ఎవరిదైనా జనాజా వస్తే, ఇతనిపై అప్పు (రుణం)ఉందా? అని అడిగేవారు. ఒకవేళ అతనిపై ఎలాంటి అప్పు లేకపోతే నమాజ్ చేయించేవారు. ఒకవేళ అతనిపై అప్పు ఉంటే ఆయన జనాజా నమాజ్ చేయకుండా మీరు చేసుకోండని సహాబాలకు ఆజ్ఞాపించేవారు. కానీ ఎప్పుడైతే యుద్ధఫలం రావడం మొదలయినదో ఆయన జనాజా నమాజు చేయించి, అతని అప్పు తీర్చేవారు మరియు అతని ఆస్తిని అతని వారసుల కొరకు వదిలేసేవారు.
3- ఆయన నమాజే జనాజా ప్రారంభిస్తూ అల్లాహు అక్బర్ అని అల్లాహ్ ను స్తుతించి, ఆయన్ని ప్రశంసించేవారు (అంటే సూర ఫాతిహా చదివేవారు), మృతుని కొరకు దుఆ చేసేవారు. నమాజే జనాజాలో నాలుగు తక్బీర్లు పలికేవారు. ఎప్పుడైనా ఐదు తక్బీర్లు కూడా పలికారు.
4- ఆయన మృతుని కొరకు ఇఖ్లాస్ (చిత్తశుద్ధి)తో దుఆ చేయండని ఆదేశించేవారు. ఆయన చేసే దుఆలలో ఇవి కూడా: అల్లాహుమ్మగ్ ఫిర్ లిహయ్యినా, వ మయ్యితినా, వ షాహిదినా, వ గాఇబినా, వ సగీరినా, వ కబీరినా, వ జకరినా, వ ఉన్సానా. అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్యిహీ అలల్ ఇస్లామ్, వమన్ తవ ఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రిమ్ నా అజ్రహూ వలా తఫ్తిన్నా బఅ్ దహ్. (ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్నవారిని, మరణించినవారిని, హాజరుగా ఉన్నవారిని, లేని వారిని, చిన్నవారిని, పెద్దవారిని, మా పురుషులను, మా స్త్రీలను మన్నింపుము. ఓ అల్లాహ్! మాలో ఎవరినయితే సజీవంగా ఉంచావో వారిని నీ ఇస్లాంపై సజీవంగా ఉంచు. మాలో ఎవరికయితే మరణాన్ని ప్రసాదిస్తావో వారికి ఈమాన్ (విశ్వాసం)పై మరణాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మమ్మల్ని అతని ప్రతిఫలం నుండి దూరం చేయకు, అతని తరువాత మమ్మల్ని కష్టాలకు గురిచేయకు.
ఆయన చేసే దుఆలలో ఈ దుఆ కూడా ఉంది:
అల్లాహుమ్మగ్ ఫిర్ లహూ వర్ హమ్ హూ, వ ఆఫిహీ, వఅ్ ఫు అన్హూ, వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅ్ ముద్ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బరది, వనఖ్ఖిహీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్యజు మినద్ దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహీ, వ అద్ఖిల్ హుల్ జన్నత, వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అదాబిన్నార్. (ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతనిని కరుణించు, అతనికి సుఖాన్ని ప్రసాదించు, అతన్ని మన్నించు, అతన్ని అతిథిగా ఆదరించు, అతడు చేరుకునే స్థలాన్ని వెడల్పు చేయి, నీటితోని, మంచుతోను, మరియు వడగళ్ళతోనూ అతని పాపములను కడిగివేయి, మురికి లేని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా అతని పాపములను కడిగివేయుము. అతని ఇంటికి బదులుగా మరింత మంచి ఇల్లు, ఈ కుటుంబం కంటే మంచి కుటుంబం, అతని జీవిత భాగస్వామి కంటే మంచి భాగస్వామిని అతనికి ప్రసాదించు. అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పించు, సమాధి శిక్ష నుండి (నరకశిక్ష నుండి) కాపాడు. (ముస్లిం).
5- ఆయన జనాజా నమాజు కొరకు పురుషుని తలకు సమానంగా, మరియు స్త్రీ మధ్య భాగానికి సమానంగా నిలబడేవారు.
6- ఆయన పిల్లల నమాజే జనాజా కూడా చేయించేవారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, యుధ్ధప్రాప్తి సంపదనలో ద్రోహం (దొంగతనం) చేసేవారి నమాజే జనాజా చేయించేవారు కాదు.
7- ఆయన రజ్మ్ (వ్యభిచారం శిక్షలో రాళ్లు రువ్వండంతో మరణించిన) జుహైనా తెగకు చెందిన ఒక స్త్రీ యొక్క నమాజే జనాజా చేయించారు.
8- ఆయన నజాషీ చక్రవర్తి జనాజా నమాజ్ పరోక్షంగా చేయించినట్లు రుజువు ఉంది. అయితే ఆయన ప్రతి ఒక్కరి నమాజే జనాజా పరోక్షంగా చేసేవారు కాదు.
9- ఆయన ఎవరిదైనా జనాజా నమాజు చేయలేకపోతే, అతని సమాధి వద్దకు వెళ్లి చేసేవారు
8– ప్రవక్త విధానం: ఖనన సంస్కారాలలో
1- ఆయన నమాజే జనాజా పూర్తి చేశాక జనాజా ముందు నడుచుకుంటూ ఖబ్రిస్తాన్ (శ్మశానవాటిక)కు వెళ్లేవారు. వాహనంపై ఉన్నవారిని వెనక ఉండమని, కాలి నడకన ఉన్నవారిని ముందు, వెనక, కుడి, ఎడమ ఎక్కడున్నా పర్లేదు, కాని జనాజాకు దగ్గర ఉండమని ఆజ్ఞాపించేవారు. ఆయన జనాజాని వేగంగా తీసుకూవెళ్ళాలని ఆదేశించేవారు.
2- జనాజాను క్రిందికి దించేవరకూ ఆయన కూర్చునే వారు కాదు.
3- ఆయన ముందు నుండి జనాజా వెళితే ఆయన నిలబడ్డారు, నిలబడమని ఆదేశించారు. అదేవిధంగా ఆయన కూర్చొని ఉండడం కూడా రుజువయినది.
4- ఆయన విధానం: శవాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు మిట్ట మధ్యాహ్నం పూట ఖననం చేయకూడదు.
5- సమాధి బగ్లీ (ఖిబ్లా దిశలో కొంచెం లోతుగా త్రవ్వి) ఉండాలి, మరియు మృతుని తల వద్ద, అలాగే కాళ్ల వద్ద విశాలంగా త్రవ్వాలని ఆదేశించేవారు.
6- ఆయన మృతుడ్ని ఖననం చేసిన తర్వాత అతని తల వైపు నుండి మూడు దోసెట్ల మట్టి వేశారు.
7- ఖననం చేసిన తరువాత అక్కడే నిలబడి మృతుని స్థిరత్వం కొరకు ప్రార్ధించేవారు. మరియు తమ అనుచరులను కూడా ఇలా చేయమని ఆజ్ఞాపించేవారు.
8- సమాధి వద్ద (ఫాతిహా ఇంకా ఏమైనా) చదవడం లేదా మృతునుకి (కలిమహ్ చదువు అని) ఉపదేశించడం అనేవి ఆయన నుండి నిరూపితం కాలేదు.
9- చావు వార్త వినిపంచడంలో ఆయన విధానం: ఎవరిదైనా చావు వార్త అతని గొప్పతనాలు చెప్పుకుంటూ చేసేవారు కాదు, ఇలా చేయడం నుండి వారించేవారు.
ప్రవక్త విధానం: స్మశానవాటిక మరియు సంతాపంలో
1- సమాధులను (అదనపు మట్టి పోసి) ఎత్తుగా లేపడం, ఇటుకలతో గట్టిగా తయారు చేయడం, వాటికి పూత పూయడం మరియు వాటిపై గోపురాలు కట్టడం లాంటివన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు కావు.
2- ఒకసారి ఆయన హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు గారిని యమన్ వైపునకు పంపుతూ ఈ విధంగా ఆదేశించారు: ఏ చిత్రపటాన్ని మరియు విగ్రహాన్ని చూసినా నీవు దానిని తుడిచివేయి (ధ్వంసం చేసెయ్యి). ఎత్తైన సమాధిని చూస్తే సమానం చెయ్యి. ఈ విధంగా ఎత్తయిన సమాధులను సమానంగా చేయడం ఆయన విధానం.
3- ఆయన సమాధి పై సున్నం వేయడం, దానిపై నిర్మాణాలు నిర్మించడం, మరియు వాటిపై రాయడం నుండి వారించారు.
4- తమవారి సమాధి అని గుర్తుండడానికి ఒక రాయి పెట్టారు.
5- ఆయన సమాధులపై మస్జిదులు నిర్మించడం, వాటి వద్ద దీపాలు వెలిగించడం నుండి వారించారు మరియు ఇలా చేసేవారిని శపించారు.
6- ఆయన వాటి వైపు ముఖం చేసి నమాజు చేయడం నుండి వారించారు. ఆయన తమ సమాధిని పండగ (మేళా, ఉర్సు, జాతర) లా చేయడం నుండి వారించారు.
7 – సమాధులను అవమానించడం, తొక్కడం, వాటిపై కూర్చోవడం, వాటిని ఆనుకోవడం, వాటిని విపరీతంగా గౌరవించడం, సందర్శించడం ఆయన పద్దతి కాదు.
8- ఆయన సహాబాల సమాధులను సందర్శించేవారు, అల్లాహ్ వారిని క్షమించాలని దుఆ చేయడానికి. ఖబ్రిస్తాన్ వెళ్ళేవారు ఈ దుఆ చదవాలని ఆదేశించారు: అస్సలాము అలైకుం అహ్లద్ దియారి, మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్, నస్ అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్. (ఓ ఈ గృహవాసులైన విశ్వాసులారా! ముస్లిములారా! మీపై శాంతులు కురియుగాక, మేము ఇన్ షా అల్లాహ్ మీతో కలువనున్నాము. మేము మా కొరకు మరియు మీ కొరకై అల్లాహ్ తో సంక్షేమాన్ని కోరుతున్నాము. (ముస్లిం)
9- ఆయన విధానం ఏమిటంటే ఆయన మృతుల కుటుంబీకులను సందర్శించడానికి వెళ్లేవారు. కానీ సందర్శించడానికి ఏదైనా సమయాన్ని ప్రత్యేకించడం, లేదా సమాధుల మరియు వేరే చోటు జమ అయి ఖుర్ఆన్ చదవడం ఎప్పుడు చేయలేదు. (అంటే ఖుర్ఆన్ ఖ్వానీలు, ఫాతిహాలు చేసేవారు కాదు).
10- ఆయన విధానంలో నుండి మరొకటి ఏమిటంటే ప్రజల కొరకు మృతుల కుటుంబీకులు భోజనాలను నిర్వహించకూడదు, పైగా ప్రజలే మృతుల కుటుంబీకుల కొరకు భోజనాలను సిద్ధం చేసి వారికి తినిపించాలి. (దీని ద్వారా మూడొద్దులు, దస్వా, బీస్వా, తీస్వా, చాలీస్వా లాంటి వన్నీ యోగ్యం లేవని స్పష్టంగా తెలుస్తున్నది).
9- ప్రవక్త విధానం: జకాత్ మరియు సదఖా(దానధర్మా)లలో
A– ప్రవక్త విధానం: జకాత్ లో
1- ఆయన విధానం జకాత్ కు సంబంధించి అత్యంత పరిపూర్ణమైనది. అంటే: దాని విధి అయ్యే సమయం, దాని పరిమాణం, దాని నిసాబ్ (జకాత్ విధింపు పరిమితి), అది ఎవరిపై విధి అవుతుంది, దాని హక్కుదారులు ఎవరు అన్న విషయాలన్నీ క్షుణ్ణంగా తెలియచేసారు. ధనవంతులు ఔచిత్యాలను మరియు పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టడం జరిగినది. మరియు పేదల అవసరాలు తీరే రీతిలో ధనవంతుల సంపదలో ఏ దౌర్జన్యం లేకుండా జకాత్ విధిగా చేయబడింది.
2- ఎవరు జకాత్ తీసుకోడానికి అర్హులని గ్రహించేవారో, అతనికి జకాత్ ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా జకాత్ సొమ్ములో నుంచి అడిగితే, ఆ వ్యక్తి గురించి ఆయనకు తెలియకపోతే, అతనితో ఈ విధంగా చెప్పి, ఇచ్చేవారు: ఈ జకాతులో ధనవంతులకు, మరియు సంపాదించే స్థోమత కలిగిన వ్యక్తులకు ఎలాంటి భాగం లేదు.
3- ఆయన విధానం: ఏ ప్రాంతపు ధనికులతో జకాత్ తీసుకోబడినదో అదే ప్రాంతపు హక్కుదారుల్లో దానిని పంచేవారు, ఆ తర్వాత మిగిలినది తెప్పించి వేరే చోటున పంచేవారు.
4- ఆయన జకాత్ వసూళ్ళ కొరకై నియమితులైన వారిని జంతువులు, పండ్లు, మరియు పంటపొలాలు లాంటి బాహ్యమైన ఆస్తులు కలవారి వద్దకే పంపేవారు.
5- ఆయన ఖర్జూరం మరియు ద్రాక్ష తోటల యాజమానుల వద్దకు అంచనా వేసే (నిపుణుల)ను పంపేవారు, వారు పండ్లను మంచిగా చూసి ఎన్ని కిలోలు అవుతాయో అంచనా వేసేవారు, దీని ఆధారంగానే ప్రవక్త వారిపై ఎంత జకాత్ ఉంటుందో నిర్ణయించేవారు.
6- ఆయన విధానం: గుర్రాలు, బానిసలు, కంచర గాడిదలు మరియు గాడిదలపై జకాత్ తీసుకునేది కాదు. అదే విధంగా తూకం చేయలేని మరియు నిల్వ ఉంచలేని కూరగాయలు మరియు పండ్లపై కూడా జకాత్ తీసుకునేవారు కాదు. కానీ ద్రాక్ష మరియు ఖర్జూరాల నుండి జకాత్ తీసుకునేవారు. అయితే అన్ని రకాల ఖర్జూరాలలో నుండి జకాత్ తీసుకునేవారు, అందులో వాటి క్వాలిటీ మరియు రకాలను బట్టి వ్యత్యాసం పాటించేవారు కారు.
7- జకాతులో మంచి సంపదనే వెతికి తీసే విధానం కాదు ఆయనది. బదులుగా మధ్యస్థంగా ఉండే సంపదను తీసుకునేవారు.
8- సదఖా చేసినవారు, తాము సదఖ చేసిన వస్తువుని కొనుగోలు చేయడం నుండి వారించేవారు. ఎవరైనా పేదవాడు సదఖాగా పొందిన సొమ్ము ధనవంతునికి బహుమతిగా ఇస్తే దానిని తీసుకనే, తినే అనుమతి ఇచ్చేవారు.
9- ఆయన ఒక్కోసారి జకాత్ మరియు సదఖా యొక్క సంపద నుండి ముస్లిముల యొక్క లాభం లేదా సంక్షేమ పనుల కొరకు అప్పుగా తీసుకునేవారు. మరియు అవసరం ఉన్న సమయంలో సమయానికి ముందే జకాత్ తీసుకునేవారు. (ఉదాహరణకు అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి నుండి రెండు సంవత్సరాల జకాత్ ముందుగానే తీసుకున్నారు.)
10- ఆయన వద్దకు ఎవరైనా జకాత్ తీసుకొని వస్తే “అల్లాహుమ్మ బారిక్ ఫీహి వఫీ ఇబిలిహ్” (ఓ అల్లాహ్! ఇందులో మరియు అతని ఒంటెలలో శుభాన్ని ప్రసాదించు) అని లేదా “అల్లాహుమ్మ సల్లి అలైహ్” అని దుఆ చేసేవారు. (ముత్తఫఖున్ అలైహి).
B– ప్రవక్త విధానం: జకాతే ఫిత్ర్ (ఫిత్రా దానం)లో
1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదఖయే ఫిత్ర్ లో ఒక సాఅ్ ఖర్జూరం, లేదా బార్లీ, లేదా పన్నీర్, లేదా కిష్మ్మిష్ ను విధిగా చేసారు.
2- ఆయన విధానం: పిత్రాదానం పండుగ నమాజ్ కి ముందే తీయాలి. ఆయన ఇలా తెలిపారు: ఎవరైతే దానిని నమాజ్ కు ముందు తీస్తారో, అది స్వీకరింపబడుతుంది, మరెవరైతే నమాజు తర్వాత తీస్తారో అతను ఒక సాధారణ సదఖా (దానం) చేసినట్లు. (అబూ దావూద్).
3- ఆయన విధానం: ఫిత్రదానం బీద వాళ్లకు మరియు చెయ్యి చాచి అడగని పేదవాళ్ల కొరకు ప్రత్యేకించేవారు. మరియు జకాత్ యొక్క ఎనిమిది రకాల హక్కుదారులలో ఏ ఒక్కరికీ ఇచ్చేవారు కాదు.
C– ప్రవక్త విధానం: నఫిల్ సదఖాలలో
1- ఆయన అందరి కంటే ఎక్కువగా దానాలు చేసేవారు. తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా అంతా దానం చేసేసేవారు.
2- ఆయనతో ఎవరూ ఏమీ అడిగినా ఆయన ఇచ్చేసేవారు. ఒకవేళ అది తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా .
3- తీసుకునే వాడికి తీసుకోవడంలో ఎంత సంతోషం, ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఆయనకి ఇవ్వడంలో ఉండేది.
4- ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం కలవాడు ఆయన ముందు వస్తే అప్పుడు ఆయన తమ కంటే ఎక్కువ అతనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక్కోసారి తమ ఆహారం విషయంలో ఒక్కోసారి తమ బట్టల విషయంలో.
5- ఆయనతో కలిసిన వారు స్వీయ ఉదార భావాన్ని తమ నుండి నేర్చుకునేవారు
6- ఆయన ఇచ్చే బహుమతులు మరియు దానాలు వివిధ రకాలుగా ఉండేవి: ఒక్కోసారి ప్రత్యేక బహుమాన రూపంలో, ఒక్కోసారి సదఖాగా, ఒక్కోసారి సాదారణ గిఫ్ట్ రూపంలో, ఒక్కోసారి ఎవరితో ఏదైనా వస్తువు కొని, ఆ వస్తువు మరియు దాని పైకం (ధర) రెండూ అమ్మేవానికే ఇచ్చేసేవారు, ఒక్కోసారి అప్పు తీసుకొని దానికంటే ఎక్కువ, ఉత్తమ రీతిలో తిరిగి ఇచ్చేవారు, ఒక్కోసారి ఎవరి వద్దనైనా బహుమతి పుచ్చుకుంటే అతనికి ఏదో ఒక విధంగా దాని ప్రతిఫలం అంతకంటే ఎక్కువ లేదా మంచిది ఇచ్చేవారు.
10– ప్రవక్త విధానం: రోజా (ఉపవాసం) లో
A– ఆయన విధానం: రమదాన్ ఉపవాసాలలో
1- ఆయన విధానం: (29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత) రమజాన్ నెల వంక ప్రత్యక్షంగా చూడనంత వరకు, లేదా చూసినట్లు కనీసం ఎవరైనా ఒక్కరు సాక్ష్యం ఇవ్వనంత వరకు ఉపవాసం ప్రారంభించేవారు కాదు. నెలవంక కనబడనిచచో, ఎవరు సాక్ష్యం ఇవ్వనిచో, షాబాన్ నెల ముప్పై రోజులు పూర్తి చేసుకొనేవారు.
2- ఒకవేళ 29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత మేఘాలు క్రమ్ముకొని ఉంటే ఆయన షాబాన్ ముప్పై రోజులను పూర్తి చేసేవారు. మరియు మేఘావృతమైన రోజున ఉపవాసం ఉండేవారు కాదు, ఉండాలని ఆజ్ఞపించనూ లేదు.
3- ఆయన విధానం: రమజాన్ ముగింపుకై ఇద్దరు వ్యక్తుల సాక్షం స్వీకరించేవారు. (అంటే రమజాన్ ప్రారంభానికై ఒక్కరి సాక్ష్యం, పండుగకై ఇద్దరి సాక్ష్యం అవసరం).
4- ఒకవేళ పండుగ నమాజు చేసే సమయం ముగిసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు నెలవంక చూసామని సాక్ష్యం ఇస్తే, ఆయన ఉపవాసాన్ని విరమించేవారు, అందరికీ ఇదే ఆదేశమిచ్చేవారు. మరుసటి రోజు పండగ నమాజు దాని సమయంలో చేసేవారు.
5- ఆయన ఇఫ్తార్ చేయడంలో తొందర చేసేవారు, అంటే సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చేసేవారు మరియు దాని తాకీదు చేసేవారు. అదేవిధంగా సహరీ చేసేవారు మరియు దాని గురించి ప్రోత్సహించేవారు, ఆయన సహరిలో ఆలస్యం చేసేవారు అంటే సహరీ చివరి సమయంలో సహరీ చేసేవారు మరియు అందరికీ ఇలాగే చేయాలని తాకీదు చేసేవారు.
6- ఆయన నమాజ్ కి ముందు ఇఫ్తార్ చేసేవారు. మరియు కొన్ని తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి లేకపోతే ఎండు ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి కూడా లేకపోతే కొన్ని నీళ్ల గుటకలతో ఉపవాసాన్ని విరమించేవారు.
7- ఆయన ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ పఠించేవారు: జహబజ్జమఉ వబ్ తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్. (దాహం తీరింది, నరాలు తడి అయ్యాయి, అల్లాహ్ తలుచుకుంటే ప్రతిఫలం కూడా లభిస్తుంది.)
8- ఆయన విధానం: రమజా మాసంలో అనేక రకాల ఆరాధనలు ఎక్కువగా చేసేవారు. రమజాన్ లోని ప్రతి రాత్రి ప్రవక్త మరియు జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ ఒకరికొకరు వినిపించుకునేవారు.
9- ఆయన ఈ మాసంలో అధికంగా దానధర్మాలు, ఉపకారాలు (ప్రజల ఎడల మేలు), ఖుర్ఆన్ పారాయణం, నమాజ్, జిక్ర్ (అల్లాహ్ స్మరణ) చేస్తూ ఉండేవారు మరియు ఏతెకాఫ్ కూడా పాటించేవారు.
10- ఆయన వేరే రోజుల్లో చేయనటువంటి ఆరాధనలు ప్రత్యేకంగా రమజాన్ లో చేసేవారు. ఒక్కోసారి ఆయన సౌమె విసాల్ పాటించేవారు, కాని దాని నుండి సహాబాలను వారించేవారు. కాని తర్వాత సహాబాలకు కూడా సహరీ వరకు విసాల్ చేసే అనుమతి ఇచ్చారు. (సౌమె విసాల్ అంటే: ఇఫ్తార్ చేయకుంటే సహరీ వరకు ఏమీ తినకుండా ఉండుట. అయితే ఇప్పుడు ఇది మన కొరకు యోగ్యం లేదు).
B– ప్రవక్త విధానం: ఉపవాసంలో ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన విషయాలలో
1- ఆయన ఉపవాసిని సంభోగం నుండి, అరుపులు గోలల నుండి, తిట్లు, వివాదాల నుండి వారించేవారు. ఒకవేళ ఎవరైనా అతని పట్ల వివాదానికి దిగితూ (కయ్యానికి కాలు రువ్వితూ) తిట్లకు దిగితే “నేను ఉపవాసంతో ఉన్నాను” అని చెప్పమన్నారు.
2- ఆయన రమజాను మాసంలో ప్రయాణం చేస్తే ఒక్కోసారి ప్రయాణస్థితిలో ఉపవాసం ఉండేవారు, ఒక్కోసారి ఉపవాసం ఉండేవారు కారు. ఆయన సహాబాలకు రెండు విషయాలలో ఒకటిని ఎంపిక చేసుకునే అనుమతిని ఇచ్చారు.
3- ఒకవేళ ముస్లిముల సైన్యం శత్రువుల వద్దకు సమీపంగా ఉంటే ఉపవాసం ఉండవద్దని ఆజ్ఞాపించేవారు.
4- ప్రయాణం కారణంగా ఉపవాసం ఉండకపోవడానికి ఆయన ఎటువంటి దూర పరిమితిని (హద్దును) నియమించలేదు.
5- సహాబాలు ప్రయాణం మొదలుపెట్టగానే ఉపవాసాన్ని విడిచిపెట్టేసేవారు. ఊరి పొలిమరలకు దూరం అయ్యాకే ఉపవాసం విరమించాలని భావించేవారు కాదు. పైగా ఇలా అనేవారు: ఇదే ప్రవక్తవారి సున్నత్ (విధానం).
6- కొన్ని సందర్భాల్లో ప్రవక్త మేల్కొనే సరికి, ఫజ్ర్ సమయం సమీపించి ఉంటే, సంభోగం వలన అశుద్ధావస్తలో ఉంటే, ఫజ్ర్ సమయం ప్రవేశించాక స్నానం చేసేవారు. ఉపవాసాన్ని పూర్తి చేసేవారు.
7- ఆయన రమజాన్ లో ఉపవాస స్థితిలో కొందరు భార్యలకు ముద్దు పెట్టుకునేవారు. (కాని ప్రవక్త తమను తాము అదుపులో ఉంచుకునే రీతిలో మనం లేము గనక మన ఉపవాసం భంగం కాకుండా ఉండడానికి దీనికి దూరముండడమే ఉత్తమం).
8- ఆయన నుండి ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడం, తలపై నీళ్లు పోసుకోవడం, (జాగ్రత్త పాటిస్తూ) ముక్కులో నీళ్ళు ఎక్కించడం, పుక్కిలించడం కూడా నిరూపితమై ఉంది.
9- ఆయన ఒకవేళ ఎవరైనా మరిచిపోయి తింటే అతనికి ఖజా చేయమని ఆజ్ఞాపించేవారు కాదు.
10- ఆయన వ్యాధిగ్రస్తునికి మరియు ప్రయాణికుడికి ఉపవాసం ఉండవద్దని, తర్వాత ఆ ఉపవాసాన్ని పూర్తి (ఖజా) చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఒకవేళ గర్భిణీ మరియు పాలు త్రాగించే స్త్రీలకు తమ గురించి అనారోగ్య భయం ఉంటే వారికి కూడా ఉపవాసం వదులుకునే అనుమతి ఇచ్చారు, కానీ వారు తర్వాత ఆ ఉపవాసాలను పూర్తి (ఖజా) చేసుకోవాలి.
11–A– ప్రవక్త విధానం: నఫిల్ ఉపవాసాలలో
1- ఉపవాసంలో ఆయన విధానం అందరికంటే పరిపూర్ణమైనది. కోరిన లక్ష్యాన్ని పొందే మార్గం మరియు అది మనస్సుకు ఏ భారం కాకుండా సులభతరంగా ఉండేది.
ఆయన నఫిల్ ఉండడం మొదలు పెడితే, ఇక ఆయన ఉపవాసాలు వదలరేమో అనిపించేది. వదిలితే ఇక ఉండరేమో అనిపించేది.
ఆయన రమజాన్ తప్ప వేరే ఏ నెలలో పూర్తిగా ఉపవాసాలుండలేదు. మరియు షాబాన్ నెలలో ఉన్నంత ఎక్కువ ఏ వేరే నెలలో ఉపవాసాలుండలేదు. మరియు ఆయన ఉపవాసముండ కుండా ఏ నెలా గడిచేది కాదు. (అనగా ఆయన ప్రతీ నెలలో కొన్ని నఫిల్ ఉపవాసాలు పాటించేవారు).
2- ఆయన ప్రత్యేకించి శుక్రవారం రోజున ఉపవాసం ఉండటాన్ని ఇష్టపడలేదు. మరియు సోమవారం, గురువారం ప్రత్యేకించి ఆయన ఉపవాసాలు పాటించేవారు.
3- ప్రయాణంలో ఉన్నా లేదా స్థానికంగా ఉన్నా, అయ్యామే బీజ్ (చంద్ర మాసం ప్రకారం 13,14,15 తేదీలలో) ఉపవాసాలు ఎప్పుడూ వదిలేవారు కాదు.
4- ఆయన ప్రతినెల ప్రారంభ మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.
5- ఆయన షవ్వాల్ నెల ఉపవాసాల గురించి ఇలా తెలిపారు: రమజాన్ వెంటనే ఈ ఉపవాసాలు ఉంటే పూర్తి కాలం ఉపవాసాలు ఉన్నట్లే. (ముస్లిం)
ఆయన ఆషూరా (మొహర్రం 10 వ తారీఖున) ఉపవాసాన్ని మిగతా ఉపవాసాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు.
6- ఆయన అరఫా (జిల్ హిజ్జా 9 వ తేదీ) ఉపవాసం గురించి ఇలా అన్నారు: అరఫా రోజున ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం; మొత్త రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి. (ముస్లిం).
ఆయన విధానం: అరఫా మైదానంలో (హజ్ లో) ఉన్నప్పుడు అరఫా రోజున ఉపవాసం ఉండేవారు కాదు.
7- ఆయన ఎప్పుడూ నిరంతరంగా ఉపవాసాలు పాటించలేదు. బదులుగా ఆయన ఇలా అన్నారు: ఎవడైతే నిరంతరంగా ఉపవాసాలు పాటిస్తాడో అతను ఉపవాసమూ లేనట్టే, మరియు ఇఫ్తార్ కూడా చేయనట్లే. (నసాయీ)
8- ఒక్కోసారి ఆయన నఫిల్ ఉపవాసానికి సంకల్పించుకునేవారు మరియు ఉపవాసాన్ని విరమించేసేవారు. తరచుగా ఏమయ్యేదంటే; ఆయన ఇంట్లోకి ప్రవేశించి ‘ఈరోజు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా?’ అని అడిగేవారు, ఒకవేళ లేదు అని సమాధానం దొరికితే, ఆయన అప్పుడు నేను ఉపవాసం ఉంటాను అనేవారు.
9- ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనిని ఎవరైనా భోజనానికి పిలిస్తే అతను వారితో ఈరోజు నేను ఉపవాసంతో ఉన్నాను అని అనాలి. (ముస్లిం)
B– ప్రవక్త విధానం: ఏతికాఫ్ లో
1- ఆయన రమజాన్ చివరి పది రోజులలో ఏతికాఫ్ పాటించేవారు, మరియు ఈ పద్ధతి ఆయన మరణం వరకు పాటించారు. ఒకసారి రమజాన్ లో ఏతికాఫ్ పాటించనందుకు షవ్వాల్ నెలలో దాని ఖజా పాటించారు.
2- ఆయన లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి)ని అన్వేషించటానికి ప్రారంభ రమజాన్ లోని మొదటి దశలో, ఆ తర్వాత రెండో దశలో, ఆ తర్వాత మూడో దశలో ఎతికాఫ్ చేసారు. అది చివరి దశలో ఉందని ఆయనకు తెలిశాక, ఆయన అల్లాహ్ సన్నిధికి చేరుకునేంతవరకు ప్రతి రమజానులో చివరి దశలోనే ఏతికాఫ్ పాటించారు.
3- ఆయన ఉపవాసం ఉన్న స్థితిలోనే ఏతెకాఫ్ పాటించేవారు.
4- ఆయన గుడారం(డేరా) వేయమని ఆజ్ఞాపించేవారు. అప్పుడు ఆయన కొరకు మస్జిద్ లో గుడారం ఏర్పాటు చేయడం జరిగేది. ఆయన అందులోనే ఉండి అల్లాహ్ ఆరాధన చేసేవారు.
5- ఆయన ఏతికాఫ్ పాటించాలని సంకల్పించుకుంటే ఫజ్ర్ నమాజు తర్వాత ఆ గుడారంలోనికి ప్రవేశించేవారు.
6- ఏతికాఫ్ లో ఉన్నప్పుడు ఆయన పడక గుడారంలో పెట్టబడేది, ఆయన తమ డేరా లో ఒంటరిగా ఉండేవారు.
7- ఆయన ఏతికాఫ్ స్థితిలో ఉన్నప్పుడు తమ ఇంటికి కేవలం తమ ముఖ్యమైన (మలమూత్ర విసర్జన, స్నానం లాంటి) అవసరాలకు మాత్రమే వెళ్లేవారు.
8- ఆయన ఏతికాఫ్ స్థితిలో తమ తలను ఆయెషా రజియల్లాహు అన్హా గారి వైపు తీసేవారు అప్పుడు ఆమె బహిష్టు స్థితిలో ఉండి కూడా ఆయన తలను కడిగి, దువ్వేది. (మస్జిదె నబవీ ప్రక్కనే ఆయిషా రజియల్లాహు అన్హా గది ఉండినది).
9- ఎవరైనా భార్య గుడారాంలో ప్రవక్తను కలవడానికి వస్తే, ఆయన వారితో మాట్లాడడం తప్ప ఇతరత్రా ఏదీ చేసేవారు కాదు. వారు వెళ్ళడానికి లేచి నిలబడితే, అది రాత్రి పూట గనక వారి వెనక తోడుగా మస్జిద్ బైట (ప్రాంగణంలో) వచ్చేవారు.
10- ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏతికాఫ్ స్థితిలో భార్యలతో లైంగిక సంబంధం (సంభోగం) లేదా ముద్దు పెట్టుకోవడం లాంటివేమీ చేసేవారు కాదు.
11- ఆయన ప్రతి సంవత్సరం పది రోజులు ఏతికాఫ్ పాటించేవారు. కానీ తమ మరణానికి ముందు సంవత్సరం ఆయన 20 రోజుల ఏతికాఫ్ పాటించారు.
11– ప్రవక్త విధానం: హజ్జ్ మరియు ఉమ్రాలలో
A– ప్రవక్త విధానం: ఉమ్రాలో
1- ఆయన నాలుగు సార్లు ఉమ్రా చేశారు.
* మొదటి సారి: ఉమ్రయె హుదైబియా. ఆ సందర్భంలో మక్కా ముష్రికులు (అవిశ్వాసులు) ఆయన్ను (మరియు సహాబాలను) మస్జిదె హరామ్ లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన అడ్డుకోబడిన చోటనే జంతువు ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలు తీయించుకొని, హలాల్ అయ్యారు (అంటే ఇహ్రాం స్త్థితిలో నుండి బైటికి వచ్చారు), ఆ తర్వాత తిరిగి మక్కా వెళ్ళిపోయారు.
* రెండొవ సారి: ఉమ్రయె ఖజా. దీనిని ఆయన హుదైబియా తర్వాతి సంవత్సరంలో చేశారు.
* మూడొవ సారి: హజ్జె ఖిరాన్ తో కలిపి చేసినది.
* నాలుగోవ సారి: జిఇర్రానా ప్రదేశము నుండి చేసిన ఉమ్రా.
2- ఆయన చేసిన నాలుగు ఉమ్రాలలో ఏ ఒక్కటి కూడా మక్కాలో ఉండి, మళ్ళీ బయటకు వెళ్ళి చేయలేదు, అన్నీ కూడా బయటి నుండి మక్కాలో ప్రవేశిస్తూ చేసినవే.
3- ఆయన సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉమ్రా చేసినట్లు రుజువైనది. ఆయన సంవత్సరంలో రెండు ఉమ్రాలు చేయలేదు.
4-ఆయన ఉమ్రాలన్నీ హజ్ నెలల్లోనే చేసారు.
5- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం: రమదాన్ లో చేయబడిన ఉమ్రా హజ్ తో సమానం (ముత్తఫఖున్ అలైహి)
B (1)– ప్రవక్త విధానం: హజ్ చేయడంలో
1- హజ్జ్ చేయడం విధి అని ఆదేశం అవతరించిన వెంటనే ప్రవక్త హజ్ కొరకు సిద్ధం అయిపోయారు. ఆయన (మదీనా జీవితంలో) కేవలం ఒకే హజ్ చేసారు, అది కూడా హజ్జె ఖిరాన్.
2- ఆయన జొహ్ర్ నమాజ్ తర్వాత ఇహ్రామ్ ధరించారు. మరియు ఈ పదాలతో తల్బియా చదివారు: లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్. ఇన్నల్ హమ్ద, వన్నిఅమత లక వల్ ముల్క లా షరీక లక్. (నేను హాజరైయ్యాను ఓ అల్లాహ్! నేను హాజరైయ్యాను, నీకు భాగస్వాములు ఎవరూ లేరు. నేను హాజరయ్యాను, నిస్సందేహంగా సకల ప్రశంసలు నీ కోసమే! సమస్త వరాలు నీ వైపు నుండే, సామ్రాజ్యాధికారం అంతా కూడా నీదే, వీటిలో కూడా నీకు ఎవరూ భాగస్వామి లేరు. (బుఖారీ, ముస్లిం).
ఆయన తమ స్వరాన్నిపెంచి బిగ్గరగా తల్బియా చదివారు, అది సహాబాలందరూ విన్నారు. అల్లాహ్ ఆదేశమేరకు ఆయన వారందరికీ బిగ్గరగా తల్బియా పఠించమని ఆజ్ఞాపించారు. పైన తెలిపిన తల్బియా ప్రవక్త పలుకుతూ ఉంటే సహాబాలు కూడా తగ్గిస్తూ , పెంచుతూ తల్బియా పలికేవారు. ఆయన ఎవరినీ నిరాకరించలేదు.
3- ఆయన సహాబాలకు హజ్ యొక్క మూడు రకాలు (ఖిరాన్, తమత్తుఅ్, ఇఫ్రాద్) లో ఏది తలిస్తే దాని ఇహ్రామ్ చేసే అనుమతి ఇచ్చారు. పిదప మక్కాకు సమీపంగా చేరుకున్నప్పుడు ఖుర్బానీ జంతువు తమ వెంట తీసుకురాని వారికి ఇలా ఆదేశించారు: మీరు ఉమ్రా చేసి, ఇహ్రామ్ స్థితి నుండి బైటికి వచ్చి, హజ్జె ఖిరాన్ సంకల్పాన్ని విరమించుకోండి.
4- ప్రవక్త ఈ హజ్జ్ ప్రయాణం తమ స్వారీ మీద చేసారు. దానిపై ఎటువంటి పల్లకి (కజావా), లేదా అంబారీ (హౌదజ్) ఉండేది కాదు మరియు ఆయన ప్రయాణ సామాగ్రి మరియు దారిలో తినత్రాగే వస్తువులు ఆయన స్వారీపైనే ఉండినవి.
పిదప ఆయన మక్కాకు చేరుకున్నాక ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు లేదో వారిని తప్పనిసరిగా ఉమ్రా కి మారమని ఆదేశించారు. ఉమ్రా పూర్తయ్యాక హలాల్ అయిపోవాలని ఆదేశించారు. ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు ఉందో వారిని మాత్రమే ఇహ్రామ్ స్థితిలో ఉండమని ఆదేశించారు. పిదప ఆయన జీతువా (ZeeTuwa) ప్రాంతానికి చేరుకున్నారు, అక్కడ జిల్ హిజ్జా 4 వ తేదీ రాత్రి గడిపారు. ఫజ్ర్ నమాజ్ చేసి గుస్ల్ (స్నానం) చేసి, మక్కా వైపునకు బయలుదేరారు. ఆయన మక్కాలో, దాని ఎగువ ప్రాంతం అయిన హుజూన్ కి సమీపంగా సనియతుల్ ఉల్యా వైపు నుండి పగటి పూట ప్రవేశించారు.
ఆయన మస్జిదే హరామ్ లో ప్రవేశించాక తహియ్యతుల్ మస్జిద్ చేయలేదు. (ఎందుకంటే ఇక్కడ తవాఫ్ (ప్రదక్షిణం) చేయడమే తహియ్యతుల్ మస్జిద్). ఆ పిదప కాబా వరకు, హజ్రె అస్వద్ వద్దకు వచ్చి, దానిని చుంబించారు, దాని వద్ద ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. పిదప ఆయన కుడి వైపుకు తిరిగి, కాబాను ఎడమ వైపున ఉంచారు. ఆయన కాబా ద్వారం వద్ద, జలదారి (దోనీ, పర్ నాలా) క్రింద, కాబా పైన లేదా దాని మూల మూలన దుఆ చేయలేదు. హజ్రె అస్వద్ మరియు రుక్నే యమానీ మధ్య ఈ దుఆ చదవడం రుజువై ఉంది: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అజాబన్నార్. (ఓ మా ప్రభూ! ప్రపంచం లోను మాకు మేలుని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మాకు మేలును ప్రసాదించు మరియు మమ్మల్ని అగ్ని శిక్ష నుండి కాపాడు).
ఆయన తవాఫ్ చేస్తున్నప్పుడు ఈ దుఆ తప్ప వేరేదీ ప్రత్యేకించి చదివాలని నిర్ణయించలేదు.
ఆయన తవాఫ్ లో మొదటి మూడు రౌండ్లు ‘రమ్ల్’ చేసేవారు, అంటే: అడుగులు దగ్గరదగ్గరగా వేస్తూ కొంచెం వేగంగా నడిచేవారు. అలాగే ‘ఇజ్తిబాఅ’ చేసేవారు, అంటే: కుడి భుజం ఖాళీగా ఉంచి ఎడమ భుజంపై వస్త్రాన్ని కప్పేవారు. ఈ విధంగా కుడి భుజం నగ్నంగా మరియు ఎడమ భుజం కప్పబడి ఉండేది.
ఆయన హజ్రె అస్వద్ ముందు వచ్చినప్పుడల్లా దాని వైపున సైగ చేశారు, లేదా వంకర కర్రతో తాకి, దానిని చుంబించారు మరియు అల్లాహు అక్బర్ అన్నారు.
ఇదే విధంగా ఆయన రుక్నే యమానీని తాకారు కానీ దానిని చుంబించలేదు. అలాగే దానిని ముట్టుకున్న తర్వాత తమ చేతిని చుంబించలేదు.
కాబా యొక్క తవాఫ్ పూర్తి చేశాక, మఖామె ఇబ్రాహీం వెనక వచ్చి, చదివారు: వత్తఖిజూ మిమ్ మఖామి ఇబ్రాహీమ ముసల్లా [وَاتَّخِذُواْ مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ] (మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి). (బఖర:2-125).
పిదప రెండు రకాతుల నమాజ్ చేశారు. అప్పుడు మఖామె ఇబ్రాహీం ఆయన మరియు కాబా మధ్యలో ఉంది. మొదటి రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) సూరయె కాఫిరూన్ మరియు రెండవ రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ హువల్లాహు అహద్) సూరయె ఇఖ్లాస్ పారాయణం చేశారు. నమాజు పూర్తి చేశాక హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి దానిని చుంబించారు. పిదప సఫా వైపుకు బయలుదేరి దాని సమీపంలో చేరగానే [إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَآئِرِ اللّهِ) ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ చదివారు. (నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి). (బఖర: 2-158).
“అల్లాహ్ సఫాను ముందు ప్రస్తావించాడు కనుక నేను కూడు సఈ సఫా నుండే ప్రారంభిస్తాను” అని చెప్పి సఫా కొండపై ఎక్కి, కాబా దిశలో ముఖం చేసి, లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని పలికి ఈ జిక్ర్ చేశారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అన్జజ వఅదహు వ నసర అబ్దహు వ హజమల్ అహ్జాబ వహ్ దహు.
«لا إله إلا اللهُ وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شيءٍ قدير، لاَ إلهَ إلاَّ اللهُ وَحْدَهُ أَنْجَزَ وَعْدَهُ وَنَصَرَ عَبْدَه وَهَزَمَ الأحْزَابَ وحْدَه»
అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరి సమానులు లేరు. రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసునికి సహాయం చేసాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు. (ముస్లిం, నిసాయి).
ఆయన ఈ జిక్ర్ మధ్యలో ప్రార్థించారు. ఆయన ఈ జిక్ర్ 3సార్లు పఠించారు.
పిదప ఆయన సఈ చేస్తూ మర్వహ్ వైపునకు వెళ్ళారు, లోయలో పరిగెత్తడం మొదలుపెట్టారు, అది దాటిన తర్వాత సామాన్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళారు, ఆయన కాలినడకన సఈ చేయడం ప్రారంభించారు, పిదప జనసమూహం కారణంగా స్వారీ చేస్తూ సఈ పూర్తిచేసారు. మర్వహ్ చేరుకున్నప్పుడల్లా ఆయన దాని పైకి ఎక్కేవారు మరియు కాబాను తమ ఎదురుగా ఉండేలా చేసి అల్లాహ్ గొప్పతనం, ఏకత్వం ప్రకటించేవారు అనగా అల్లాహు అక్బర్ మరియు లాఇలాహ ఇల్లల్లాహ్ అనేవారు. మరియు సఫా పై ఏ దుఆలు చేశారో మర్వహ్ పై కూడా అవే దుఆలు చేసేవారు, (కానీ ఇన్నస్సఫా వల్ మర్ వత ఆయత్ చదివేవారు కాదు).
ఆయన మర్వహ్ వద్ద సఈ పూర్తి చేసి, తమ వెంట ఖుర్బానీ జంతువు తీసుకురాని వారితో ఇహ్రామ్ విప్పి పూర్తిగా హలాల్ అయిపోవాలని అదేశమిచ్చారు, ఒకవేళ హజ్జే ఇఫ్రాద్ అయినా లేదా ఖిరాన్ మరియు తమత్తుఅ్ అయినా పర్లేదన్నారు.
ఆయన వద్ద ఖుర్బానీ జంతువు ఉంది గనక ఆయన ఇహ్రామ్ విప్పలేదు మరియు ఈ విధంగా అన్నారు: ఒకవేళ నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేను ఖుర్బానీ జంతువును వెంట తీసుకువచ్చేవాడిని కాదు, కేవలం ఉమ్రా కొరకే ఇహ్రామ్ ధరించేవాడిని. (ముత్తఫఖున్ అలైహి)
అదే ప్రదేశంలో ఆయన గుండు చేయించుకునేవారి కొరకు 3సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక్కసారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.
13– B (2)– ప్రవక్త విధానం: హజ్జ్ లో
ఆయన తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజు వరకు మక్కాలోని ‘జాహిర్’ అనే ప్రాంతంలో ముస్లింలతో పాటు బస చేసినప్పుడు నమాజులు ఖస్ర్ చేస్తూ ఉండేవారు.
తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజునన చాష్త్ (సూర్యోదయం అయ్యాక కొంత) సమయానికి తమతో పాటు ఉన్న వారితో మినా కి బయలుదేరారు. ఎవరైతే ఇహ్రామ్ ను విప్పేసారో వారు తమ ఇండ్ల నుండి (హజ్జ్ కొరకు) ఇహ్రామ్ ధరించి బయలుదేరారు.
ఆయన మినా చేరుకున్నాక అక్కడే జొహ్ర్ మరియు అస్ర్ (మరియు మిగితా) నమాజులు వాటి సమయాల్లో చేసుకొని, రాత్రి గడిపారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత అరఫా వైపుకు రవానా అయ్యారు. సహాబాలలో కొందరు తల్బియా చదువుతుండగా మరి కొందరు తక్బీర్ పలుక సాగారు. ఆయన రెండింటినీ వింటూ ఉన్నారు కానీ ఎవరినీ వద్దనేవారు కాదు.
ఆయన ఆజ్ఞమేరకు ఆయన కొరకు నమిరహ్ లో గుడారం (డేరా) వేయడం జరిగింది, (నమిరహ్ అరఫాలోని భాగం కాదు, ఇది అరఫా తూర్పు భాగంలో ఉన్న ఒక గ్రామం) ఆయన అందులో బస చేసారు. పొద్దు వాలిన తర్వాత (జొహ్ర్ సమయానికి) ఖస్వా ఒంటెపై స్వారీ చేస్తూ ఉరనహ్ లోయలోని దిగువ భాగానికి చేరుకున్నారు. అదే ప్రదేశంలో తమ స్వారీ పై కూర్చునే అద్భుతమైన ఖుత్బా (ప్రసంగాన్ని) ఇచ్చారు. అందులో ఆయన
– ఇస్లాం మూలంశాలు, నియమాలను వివరించారు.
– బహుదైవారాధన మరియు అజ్ఞానపు దురాచారాలను ఖండించారు.
– ఒకరి ధన, మాన, ప్రాణాలు నిషిధ్ధమని ప్రకటించారు. వీటిని ఇతర మతాలవారు కూడా అంగీకరిస్తారు.
– అజ్ఞానపు వ్యవహారాలు మరియు వడ్డీ ని అంతమొందించారు.
– స్త్రీలతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని తాకీదు చేశారు.
– ఈ ప్రసంగంలోనే తమ అనుచర సమాజాన్ని ఖుర్ఆన్ (హదీసుల)ను గట్టిగా పట్టుకోవాలని ఆదేశించారు.
– తాను అల్లాహ్ ఆజ్ఞలను ఉత్తమ రీతిలో అందరికీ చేరవేశానని మరియు దైవ దౌత్య పదవి బాధ్యతలను నెరవేర్చానని, అలాగే సమాజం కొరకు శ్రేయస్సు కోరానని తమ సహాబాల (సహచరుల)తో అంగీకారం మరియు సాక్ష్యం తీసుకున్నారు, ఇంకా ఈ మాట పైన అల్లాహ్ ను కూడా సాక్షిగా ఉంచారు.
ఆయన ఖుత్బా ముగించిన తరువాత బిలాల్ రదియల్లాహు అన్హు గారిని అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అజాన్ మరియు ఇఖామత్ అయిన తర్వాత ఆయన సిర్రీ (మొనంగా) ఖిరాత్ చేసి, జొహ్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు, మళ్ళీ ఇఖామత్ ఇవ్వడం జరిగినది వెంటనే అస్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు. మరియు ఆ రోజు జుమా రోజు. ఆయనతో పాటు మక్కా వారు కూడా ఈ ప్రయాణం లో ఉన్నారు. వారు కూడా ఖస్ర్ మరియు జమా చేసారు.
ఆయన నమాజు పూర్తి చేసిన తర్వాత మౌఖిఫ్ (అరఫాత్)కి చేరుకున్నారు. ప్రజలకు ప్రవక్త అరఫా (అంటే 9వ జిల్ హిజ్జ) రోజు ఉపవాసమున్నారేమో అనే సందేహం వచ్చినప్పుడు ఆయన గారి భార్య హజ్రత్ మైమూనా రజియల్లాహు అన్హా గారు ఒక పాత్రలో పాలు పంపారు, ఆయన మౌఖిఫ్ లోనే నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరి ముందు దానిని త్రాగారు. మరియు అరఫా మైదానం పర్వతం దిగువ ప్రాంతంలో రాళ్ల దగ్గర ఖిబ్లాకు ఎదురుగా తమ స్వారీ పైనే ‘నడిచి వెళ్ళేవారి దారి’ ఎదురుగా ఉండేలా నిలబడ్డారు. సూర్యాస్తమయం వరకూ దుఆ చేస్తూ, విలపిస్తూనే ఉన్నారు. మరియు ప్రజలను ఉరనా లోయను వదలి, అరఫా లోపలికి రావాలని ఆజ్ఞాపించారు. ఇంకా ఇలా ఆదేశించారు: నేను ఇక్కడ నిలిచాను మరియు పూర్తి అరఫా నిలుచు ప్రదేశం. (ముస్లిం)
ఆయన దుఆలో తమ చేతులను ఛాతీ వరకూ పైకెత్తారు ఎలాగైతే ఒక నిరుపేద ఆహారాన్ని అర్జిస్తాడో. ఆ సందర్భంలో ఇలా తెలిపారు:
దుఆలలో కెల్లా ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేయబడే దుఆ మరియు నేను, నాకు పూర్వం ప్రవక్తలందరూ చేసిన అత్యుత్తమమైన (దుఆ): లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మీజి).
ఏ అనుమానం లేకుండా, సంపూర్ణంగా సూర్యాస్తమయం అయి, దాని పసుపుతనం కూడా కనుమరుగయ్యాక, ఆయన అరఫాత్ మైదానం నుండి బయలుదేరారు. ఉసామా బిన్ జైద్ ను తమ వెనక కూర్చోబెట్టుకున్నారు. మరియు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నారు మరియు ఒంటె పగ్గాన్ని పల్లకి పక్క భాగాన్ని తగిలే విధంగా తన వైపుకి లాగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇలా ఆదేశించారు: ఓ ప్రజలారా! ప్రశాంతంగా నడవండి. ఎందుకంటే త్వరగా, వేగంగా నడవడం పుణ్యం కాదు. (బుఖారీ)
ఆయన మఅ్ జిమైన్ దారి నుండి వాపసు అయ్యారు మరియు జబ్బ్ దారి నుండి అరఫా లో ప్రవేశించారు.
పిదప ఆయన సైరుల్ అనఖ్ నడక శైలిని అలవర్చుకున్నారు, అనగా అత్యంత నిదానంగానూ కాదు, అత్యంత వేగంగానూ కాదు, మధ్యస్థ నడక శైలి. ఒకవేళ ఆయనకు విశాలమైన దారి కనపడితే కొద్దిగా వేగం పెంచేవారు.
ఆయన దారిలో నిరంతరంగా తల్బియా పలికుతూనే ఉన్నారు. దారిలో ఒక చోట మూత్ర విసర్జన కొరకు వెళ్ళి, తేలికగా వుజూ చేసుకున్నారు. పిదప మళ్ళీ నడక ప్రారంభించి ముజ్దలిఫా చేరుకొని నమాజు కొరకు వుజూ చేసారు. అజాన్, ఇఖామత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. పిదప ఆయన ఒంటెలను కూర్చోబెట్టే కి మరియు ప్రజలు తమ సామానులను దించక ముందే మగ్రిబ్ నమాజు చేయించారు. వారు తమ సామానులను దించిన తర్వాత మళ్ళీ ఇఖామత్ ఇవ్వమని, ఇషా నమాజు చేయించారు. ఇషా కొరకు అజాన్ ఇవ్వబడలేదు. మగ్రిబ్ మరియు ఇషా మధ్యలో ఏ నమాజూ చేయలేదు.
ఆ తర్వాత ఆయన ఫజ్ర్ వరకు పడుకున్నారు, ఆ రాత్రి ఆయన ఏ నమాజు చేయలేదు.
ఆ రాత్రి చంద్రుడు ఆస్తమించాక తమ బలహీన కుటుంబీకులను ఫజర్ కి ముందే మినా కు బయలుదేరాలని ఆదేశించారు. సూర్యోదయానికి ముందే జమరాత్ కు రాళ్లు కొట్టవద్దని తాకీదు చేశారు.
ఫజ్ర్ సమయం ప్రవేశించచిన తొలి వేళలోనే ఫజ్ర్ నమాజు చేయించారు, దాని కొరకు అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడినది. పిదప స్వారీ చేస్తూ మష్అరే హరామ్ కు చేరుకున్నారు. ‘ముజ్దలిఫా ప్రాంతమంతయూ నిలుచు స్థలమే’ అని ప్రకటన చేశారు. పిదప ఖిబ్లా వైపు తిరిగి వెళుతురు అయ్యే వరకు దుఆ చేస్తూ, విలపిస్తూ, తక్బీర్ మరియు తహ్లీల్ మరియు అల్లాహ్ స్మరణ లో నిమగ్నమైపోయారు.
ఆ తర్వాత ఆయన ముజ్దలిఫహ్ నుండి ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుని తమ వెనక కూర్చోబెట్టుకొని బయలుదేరారు. ఈ దారిలోనే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమాని జమ్రాత్ పై విసరడానికి ఏడు కంకర రాళ్ళు ఏరుకొని తీసుకు రమ్మని చెప్పారు. ప్రవక్త వాటిని తమ చేతుల్లో ఎగరవేస్తూ, “ఇలాంటి కంకర్రాళ్ళే జమరాత్ పై విసరండి, ధర్మ విషయంలో మితిమీరకండి! ఎందుకంటే గత జాతులు ధర్మ విషయంలో మితిమీరడం వల్లనే నశించిపోయాయి”. (నిసీఈ, ఇబ్నె మాజా).
ఆయన ముందుకు సాగుతూ వాదియె ముహస్సర్ నుండి దాటుతూ తమ ఒంటె వేగాన్ని పెంచారు. ఆ తర్వాత జమర అఖబా లేదా కుబ్రాకు దారితీసే మధ్య మార్గాన్ని ఎంచుకొని, దాని ద్వారా మినా చేరుకున్నారు. ఆయన రాళ్ళు రువ్వడం ప్రారంభించే వరకూ తల్బియా పలికుతూ ఉన్నారు. సూర్యోదయం తర్వాత వాది (లోయ)లోని క్రింది భాగంలో కాబాను ఎడమ వైపున, మినాను కుడి వైపున ఉంచి, జమరకి ముందు సవారిపైనే ఉండి, ఒకదాని తర్వాత ఒకటి ఏడు రాళ్ళు విసిరారు, ప్రతీ రాయి విసిరేటప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు.
పిదప ఆయన మినా కి వాపసు అయ్యారు.
అక్కడ అనర్గళంగా, స్పష్టమైనరీతిలో అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అందులో
– ఖుర్బానీ రోజు యొక్క విశిష్ఠత, ప్రాముఖ్యత, గొప్పతనం,
– పవిత్ర మక్కా నగరం యొక్క విశిష్ఠత వివరించారు.
– అల్లాహ్ గ్రంథానికి అనుగుణంగా పరిపాలించే వారికి విధేయత చూపమన్నారు.
– హజ్జ్ యొక్క విధివిధానాలను బోధించారు.
పిదప ఆయన మినా లో ఖుర్బానీ చేసే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అరవై మూడు ఒంటెలను తమ స్వహస్తాలతో జిబహ్ చేసారు. ఒంటెను నిలబెట్టి, దాని ముందు ఎడమ కాలును మడిచి నహర్ చేసారు. ఆ తర్వాత ఆయన జిబహ్ చేయడం ఆపేసి, వంద లోని మిగిలిన ఒంటెలను అలీ రజియల్లాహు అన్హు జబహ్ చేయాలని, వాటి మాంసం నిరుపేదలలో పంచిపెట్టాలని మరియు కసాయికి అతని కష్టార్జితంగా జంతువులో నుండి ఏమీ ఇవ్వద్దని ఆదేశించారు. (అంటే వేరే డబ్బులు ఇవ్వచ్చు, కాని ఖుర్బానీ మాంసం, దాని తోలు లాంటివేమీ ఇవ్వకూడదు).
మినా మొత్తం ఖుర్బానీ చేసే ప్రదేశం అని అలాగే మక్కా వీధులు నడటానికి దారులు మరియు ఖుర్బానీ చేసే ప్రదేశం అని తెలియజేశారు.
ఆయన ఖుర్బానీ పూర్తి కాగానే క్షైరం చేసేవారిని పిలిచి, శిరోముండనం (గుండు) చేయించుకున్నారు. అతను కుడివైపు నుండి మొదలుపెట్టాడు. పిదప ఆయన అతనికి ఎడమ వైపున చెయ్యమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత తమ వెంట్రుకలను అబూ తల్హా రజియల్లాహు అన్హు గారికి ఇచ్చి, ప్రజలలో పంచి వేయమని ఆదేశించారు. (ముత్తఫఖున్ అలైహి).
అక్కడే గుండు చేయించుకునేవారి కొరకు మూడు సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక సారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం హలాల్ అవ్వక ముందు ఆయిషా రజియల్లాహు అన్హా ఆయనకు సుగంధ ద్రవ్యాలను పూసారు. (ఇది మొదటి తహల్లుల్).
ఆ తర్వాత ఆయన జొహ్ర్ కి ముందు స్వారీ చేస్తూ మక్కా చేరుకున్నారు. తవాఫె ఇఫాజా చేశారు. (దీనినే తవాఫె హజ్ అని కూడా అంటారు, ఇది రుకున్, ఇది చేయకుంటే హజ్ చేయనట్లే లెక్క). ఆయన దానికి మినహా వేరే తవాఫ్ చేయలేదు. (అంటే అక్కడ ఉండి, నఫిల్ తవాఫులు చేయలేదు). ఈ సందర్భంలో సఈ కూడా చేయలేదు. మరియు ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు, అలాగే వీడ్కోలు తవాఫ్ (తవాఫె విదాఅ)లో కూడా రమ్ల్ చేయలేదు. ఆయన రమ్ల్ కేవలం ప్రారంభ తవాఫ్ (తవాఫె ఖుదూమ్)లోనే చేసారు.
తవాఫ్ పూర్తయిన పిదప ఆయన జమ్ జమ్ వైపుకు వెళ్ళారు. అక్కడ ప్రజలు త్రాగుతున్నారు. వారు జమ్ జమ్ నీళ్ళ పాత్ర ఆయనకు ఇచ్చారు, ఆయన నిలబడి త్రాగారు. (అక్కడ అలాంటి అవసరం ఉండే). పిదప ఆయన మినా తిరిగి వచ్చి, అక్కడే రాత్రి గడిపారు.
ఆయన ఆ రోజు జొహ్ర్ నమాజు ఎక్కడ చేశారన్న విషయంలో బేధాభిప్రాయం ఉంది. ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో జొహ్ర్ నమాజు చేశారు మరియు జాబిర్, ఆయిషా రజియల్లాహు అన్హుమా కథనం: మక్కాలో చేసారు.
మరుసటి రోజు (11వ జిల్ హిజ్జ) పొద్దువాలే వరకు (జొహ్ర్ సమయ ప్రవేశానికి) వేచించి సమయం కాగానే తమ నివాసం నుండి జమరాత్ వైపుకు కాలినడకన వెళ్ళారు, స్వారి మీద కాదు. మస్జిదె ఖైఫ్ కి సమీపంగా ఉన్న జమరయె ఊలా నుండి మొదలు పెట్టారు. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అంటూ ఏడు రాళ్ళు కొట్టారు.
ఆ తర్వాత జమర నుండి కొద్దిగ ముందుకు సాగి, కొంచెం కుడి వైపునకు వచ్చి, రెండు చేతులను పైకెత్తి, ఖిబ్లా వైపు ముఖం చేసి సుదీర్ఘమైన దుఆ చేసారు, అంటే సూర బఖర పఠించే అంత సేపు.
పిదప జమరయె వుస్తా వైపుకి వచ్చారు. అల్లాహు అక్బర్ అని పలుకుతూ ఏడు రాళ్ళు కొట్టారు, పిదప లోయకు కలిసి ఉండే ఎడమ భాగం వైపుకి జరిగి ఖిబ్లా వైపు తిరిగి మొదటి సారి కంటే కొంత తక్కువ సుదీర్ఘమైన దుఆ చేసారు.
పిదప ఆయన జమరయె అఖబా వద్దకు వచ్చి, లోయ లోనికి ప్రవేశించారు. జమరాను ముందు ఉంచి బైతుల్లాహ్ ను ఎడమ వైపున మరియు మినా ను కుడి వైపున ఉండేలా చేసుకొని అల్లాహు అక్బర్ అని పలికి ఏడు రాళ్ళు కొట్టారు. రాళ్ళు కొట్టిన తర్వాత అక్కడ ఎటువంటి దుఆ చేయలేదు తిరిగి వాపసు వచ్చేసారు.
ప్రాధాన్యత పొందిన అభిప్రాయం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జొహ్ర్ నమాజ్ కి ముందే జమరాత్ పై రాళ్ళు విసిరారు. ఆ తర్వాత నమాజు చేసుకున్నారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు గారికి హాజీలకు నీళ్ళు త్రాపించే బాధ్యత ఉన్న కారణంగా మినా రాత్రులు (మినాలో కాకుండా) మక్కాలో గడపడానికి అనుమతిని ఇచ్చారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రోజులే రాళ్ళు విసిరి వెళ్ళాలని తొందరపడలేదు, తష్రీఖ్ యొక్క మూడు రోజులు (జిల్ హిజ్జా 11,12,13) పూర్తిగా ఉండి, రాళ్ళు విసిరారు.
జొహ్ర్ తర్వాత ముహస్సబ్ వైపు బయలుదేరారు, పిదప అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు చేసారు మరియు నిద్రపోయారు. అదే రాత్రి మక్కా బయలుదేరి, సహరీ సమయంలో తవాఫె విదాఅ (వీడ్కోలు) చేసారు. ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు (భుజాలను కదుపుతూ, చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడవడం).
సఫియా రదియల్లాహు అన్హా గారికి బహిష్టు (నెలసరి) రావడంతో ఆమెకు వీడ్కోలు తవాఫ్ వదిలేయమని అనుమతి ఇచ్చారు.
ఆయిషా రజియల్లాహు అన్హా గారికి ఆమె మనస్సు తృప్తి కోసం తమ సోదరునితో పాటు తన్ఈమ్[4] నుండి ఉమ్రా చేసే అనుమతి ఇచ్చారు. ఆమె రాత్రి ఉమ్రా ముగించిన తర్వాత ప్రవక్త సహాబాలకు బయలుదేరమని ఆదేశించారు. మరియు ప్రజలు మదీనా వైపునకు బయలుదేరారు.
14- ప్రవక్త ప్రవక్త విధానం: హద్ య్, ఖుర్బానీ మరియు అఖీఖాలో
A- ప్రవక్త విధానం: హద్ య్ లో
(హజ్ లేదా ఉమ్రా చేసేవారు ఇచ్చే ‘జంతుబలి’ని, అలాగే తమ స్థానంలో ఉండి, మక్కాలో జిబహ్ చేయుబడుటకు పంపే జంతువుని ‘హద్ య్’ అంటారు).
1- ఆయన తమ వైపు నుండి ఒంటె మరియు ఆవుని ‘హద్ య్’ లో ఇచ్చారు. తమ సతీమణుల తరపున ఆవుని ఇచ్చారు. అలాగే ఆయన స్థానికంగా ఉన్న స్థితిలో, మరియు తమ ఉమ్రా, హజ్జ్ లలో ‘హద్ య్’ సమర్పించారు۔
2- ఆయన మేకను ‘హద్ య్’గా సమర్పించడానికి పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా వేసేవారు. కాటు వేసి చిహ్నం పెట్టేవారు కాదు. ఆయన స్థానికంగా ఉండి, ‘హద్ య్’ పంపుతున్న స్థితిలో ముహ్రిమ్ పై కొన్ని హలాల్ వస్తువులు నిషిద్ధమున్న్లు ఆయన పై నిషిద్ధమ్మయ్యేవి కావు.
3- ఆయన ఒంటె ‘హద్ య్’గా పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా మరియు చిహ్నం కూడా వేసేవారు, చిహ్నం అంటే ఆయన దాని మూపురం యొక్క కుడి వైపున రక్తం వచ్చేలా ఒక చిన్న కాటు వేసేవారు.
4- ఆయన ‘హద్ య్’ పంపిస్తూ తీసుకువెళ్ళే వ్యక్తికి చెప్పేవారు: జంతువు చనిపోయే స్థితికి చేరుకుంటే దానిని జిబహ్ చేయమని మరియు ఒక చెప్పుని దాని రక్తంతో రంగించి దాని ప్రక్కలో పెట్టండి, దాని మాంసం ఆ వ్యక్తి మరియు అతని ప్రయాణ మిత్రులు తినకండి, కాని వేరే ప్రజల్లో పంచి పెట్టండి.
5- ఆయన ఒక ఒంటెలో ఏడుగురు మరియు ఒక ఆవులో ఏడుగురు పాల్గొనడానికి (భాగం పంచుకోవడానికి) సహాబాలకు అనుమతి ఇచ్చారు.
6- ‘హద్ య్’ తీసుకువెళ్ళే వ్యక్తి వద్ద ప్రయాణం కొరకు వేరే స్వారీ లేకుంటే ఈ ‘హద్ య్’ ఒంటెపై కూర్చొని ప్రయాణంచవచ్చు. ఇలా అతనికి ప్రయాణానికి ఓ వాహనం దొరికే వరకు.
7- ఆయన విధానం: ఒంటెను నిలబెట్టి ఎడమ కాలును కట్టివేసి నహర్ చేయడం. నహర్ చేసేటప్పుడు “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని పలికేవారు.
8-ఆయన ఖుర్బానీ జంతువులను తమ స్వహస్తాలతో జిబహ్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని ఇతరులకు అప్పగించేసేవారు.
9- ఆయన మేకను ౙబహ్ చేస్తున్నప్పుడు తమ కాలుని దాని ప్రక్కపై పెట్టేవారు మరియు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పలికుతూ ౙబహ్ చేసేవారు.
10- ఆయన తమ అనుచర సమాజం కొరకు ‘హద్ య్’ మరియు ఖుర్బానీ జంతువు యొక్క మాంసం తినడానికి మరియు బహుమతిగా ఇచ్చిపుచ్చుకోడానికి మరియు (పేదల్లో పంచిన తర్వాత కొంత భాగం మక్కా నుండి తమ ప్రాంతాలకు తీసుకుపోయే) అనుమతి ఇచ్చారు.
11- కొన్నిసార్లు ఆయన ‘హద్ య్’ మాంసాన్ని పంచిపెట్టేవారు, మరికొన్నిసార్లు ‘ఇష్టమున్నవారు జిబహ్ చేయబడిన జంతువు నుండి కోసుకొని వెళ్ళిండి’ అని చెప్పేవారు.
12- ఆయన విధానం: ‘హద్ య్’ జంతువును ఉమ్రా చేసినప్పుడు మర్వహ్ వద్ద, మరియు హజ్జే ఖిరాన్ చేసినప్పుడు మినాలో జిబహ్ చేసేవారు. ఆయన హలాల్ అయిన తర్వాతనే నహర్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ సూర్యోదయం తర్వాత, జమరాత్ పై రాళ్ళు విసిరిన తర్వాతే నహర్ చేసేవారు. సూర్యోదయానికి ముందే నహర్ లేదా జిబహ్ చేసే అనుమతి ఎవరికీ ఇవ్వలేదు.
B- ఆయన విధానం: ఖుర్బానీలో
1- ఆయన ఎప్పుడూ ఖుర్బానీ వదలలేదు. ఆయన పండుగ నమాజు తరువాత రెండు గొర్రెపోతులను ఖుర్బానీ ఇచ్చేవారు మరియు ఇలా అనేవారు: తష్రీఖ్ రోజులన్నీ (అంటే 11,12,13వ జిల్ హిజ్జ) జిబహ్ చేసే రోజులే. (ముస్నద్ అహ్మద్)
2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ ఇస్తారో అతని ఖుర్బానీ స్వీకరించబడదు. అది తన ఇంటి వారి కొరకు ఇచ్చిన మాంసం కింద లెక్క. (ముత్తఫఖున్ అలైహి)
3- ఆయన గొర్రేపోతులో జజ్అ జిబహ్ చసే అనుమతి ఇచ్చారు. జజ్అ అనగా ఆరు నెలలు నిండ గొర్రేపోతు పిల్ల. మిగతా జంతువులలో రెండు పళ్ళు ఉన్న జంతువులను. ఒంటెలలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దానిని. ఆవులో రెండు పూర్తి చేసి మూడులో ప్రవేశించినది.
4- ఆయన విధానం: ఖుర్బానీ కొరకు ఎటువంటి లోపాలు లేని ఉత్తమమైన, ఆరోగ్యవంతమైన జంతువులనే ఎంచుకునేవారు. చెవులు కోసి వున్న, కొమ్ములు విరిగి ఉన్న, గుడ్డివి, కుంటివి, అంగ వైకల్యం మరియు (మాంసం లేకుండా) బలహీనమైన వాటిని ఖుర్బానీ ఇవ్వడం నుండి వారించారు.
ఇంకా ఇలా ఆదేశించారు: కళ్ళను, చెవులను శ్రద్ధగా పరిశీలించండి, అనగా అవి పూర్తిగా మంచి స్థితిలో ఉన్నాయన్న నమ్మకానికి రావాలి.
5- ఎవరైతే ఖుర్బానీ ఇవ్వడానికి సంకల్పించుకుంటాడో అతను జుల్ హిజ్జా ప్రారంభం అవ్వగానే తమ గోళ్ళను, తల వెంట్రుకలను కత్తిరించకూడదని ఆజ్ఞాపించారు.
6- ఈద్గాహ్ లో నే ఖుర్బానీ చేయటం ప్రవక్త విధానం.
7- ఆయన విధానం: ఒక మేక ఒక కుటుంబం తరపున ఖుర్బానీకి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే.
C- ఆయన విధానం: అఖీఖాలో
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఆదేశించారు: ప్రతి శిశువు తన అఖీఖా కి బదులు తాకట్టు ఉంటుంది. కాబట్టి ఏడో రోజున అఖీఖా చేయాలి, మరియు ఆ బిడ్డ తల వెంట్రుకలను తీయించాలి (గుండు చేయాలి). మరియు పేరు పెట్టాలి. (అబూ దావూద్, తిర్మీజి, నిసాయీ)
2- మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం: మగ బిడ్డ తరపున రెండు మేకలు మరియు ఆడ బిడ్డ తరపున ఒక మేక జిబహ్ చేయాలి. (అబూ దావూద్, నసాయీ)
15- A- ఆయన విధానం: అమ్మకం, కొనుగోలు (క్రయవిక్రయాల్లో / లావాదేవీలు) మరియు వ్యవహారాలలో
1- ఆయన కొనడం, అమ్మడం చేసేవారు కానీ దైవదౌత్యం తర్వాత కొనుగోలు చేయడం అమ్మడం కంటే అధికంగా ఉండినది. ఆయన వేతనం కొరకు పని చేసారు మరియు వేతనాలు ఇచ్చి పని తీసుకున్నారు. ఆయన (క్రయవిక్రయాల్లో ఇతర వ్యవహారాల్లో) స్వయం ఇతరులకు బాధ్యత వహించారు (వకీల్ గా ఉన్నారు) మరియు ఇతరులను బాధ్యులుగా (వకీల్ గా) నియమించారు. కాని ఇతరులను బాధ్యులుగా చేయడమే స్వయం బాధ్యత వహించేకంటే అధికంగా ఉండినది.
2-ఆయన నగదు మరియు అప్పు రెండు రకాలుగా కొనుగోళ్లు చేశారు. ఆయన ఇతరుల కొరకు సిఫారసు చేసారు మరియు ఆయన ముందు ఇతరుల సిఫారసు కూడా చేయబడినది. ఆయన తాకట్టు ద్వారా అప్పు తీసుకున్నారు, అలానే తాకట్టు లేకుండా కూడా అప్పు తీసుకున్నారు. మరియు ఆయన వస్తువులను కూడా అరువుగా తీసుకున్నారు.
3- ఆయన సాధారణ బహుమతి ఇచ్చారు మరియు తీసుకున్నారు. ఆయన ప్రత్యేక బహుమతులు ఇచ్చారు మరియు ఇతరుల నుండి బహుమతులు స్వీకరించచారు, మళ్ళీ అంతకంటే మేలైనది తిరిగి కూడా ఇచ్చారు, ఒకవేళ (బహుమతి స్వీకరించాలన్న) ఇష్టం లేకపోతే ఆ బహుమతి ఇచ్చే వారికి మంచి సాకు చెప్పేవారు. రాజులు బహుమతులు పంపేవారు, ఆయన వాటిని స్వీకరించేవారు, మరియు సహాబాలలో వాటిని పంచిపెట్టేసేవారు.
4- ప్రజల్లో అత్యుత్తమ వ్యవహారం ఆయనదే ఉండేది. ఆయన ఎవరి వద్దనైనా ఎప్పుడన్నా అప్పు తీసుకుంటే, తిరిగి చెల్లించడంలో ఉత్తమ విధానాన్ని మరియు ఎక్కువ ఇచ్చేవారు, ఇంకా అప్పు ఇచ్చినవారి సంపద, కుటుంబంలో శుభం కొరకు దుఆ చేసేవారు. ఒకసారి ఆయన ఒక ఒంటెను అప్పుగా తీసుకున్నారు, అప్పుడు దాని యజమాని ప్రవక్త వద్దకు వచ్చి అప్పును వాపసు చేయమని అడుగుతూ, కఠినంగా వ్యవహరించసాగాడు, అక్కడున్న సహాబాలు కూడా అతని పట్ల కఠినంగా ప్రవర్తించాలనుకున్నారు, కాని ప్రవక్త ఇలా తెలిపారు: అతనిని వదిలివేయండి! హక్కుదారునికి (ఎంతైనా) మాట్లాడే హక్కు ఉంది. (ముత్తఫఖున్ అలైహి)
5- ఆయనతో అజ్ఞానంగా వ్యవహరించే వారి పట్ల ఆయనలో ఓపిక సహనలే అధికమయ్యేవి. ఎవరిలో కొపాగ్రహం మిచ్చిపోతుందో అతడు తన కోపాన్ని వుజూ తో లేదా నిలబడి ఉంటే కూర్చొని లేదా షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతూ చల్లబరుచుకోవాలని (శాంతపరచాలని) ఆదేశించారు.
6- ఆయన ఎవరి పట్ల కూడా గర్వహాంకారాలతో వ్యవహరించేవారు కాదు. బదులుగా ఆయన తమ సహచరుల పట్ల వినయంగా, మృదు స్వభావం తో మెలిగేవారు. ప్రతీ చిన్న, పెద్ద అందరికీ సలామ్ చేసేవారు.
7- ఆయన వేళాకోళం (జోక్) చేసినా సత్యం ద్వారానే చేసేవారు. ఆయన ఏదైనా కప్పిపుచ్చే రీతిలో మాట్లాడినా (అంటే తౌరియా చేసినా) సత్యాన్నే అవలంబించేవారు.
8- ఆయన పరుగు పందెంలో పోటీ చేశారు. ఆయన తమ చెప్పుల్ని స్వయంగా కుట్టుకునేవారు. తమ దుస్తులకు స్వయంగా తామే అతుకులు వేసుకునేవారు. తొట్టె (బకెట్) విరిగితే స్వయంగా సరిచేసుకునేవారు. మేక పాలు స్వయంగా పితికేవారు. పడకలో, బట్టల్లో పేను, మరేదైనా ఇలాంటివి పడితే శుభ్రపరుచుకునేవారు. తమ ఇంటి వారికి సేవ చేసేవారు, తమ వ్యక్తిగత అవసరాలు తామే పూర్తి చేసుకునేవారు. ఆయన మస్జిదే నబవీ నిర్మాణం సమయంలో సహాబాలతో కలిసి ఇటుకలు కూడా మోసేవారు.
9- ఆయన సృష్టిలోనే అత్యంత విశాలమైన హృదయం, పవిత్రమైన మనస్సు గలవారు.
10- రెండు విషయాలలో ఏదైనా ఒకటి ఎంచుకునే అనుమతి లభిస్తే ఆయన సులువైనదే ఎంచుకునేవారు, ఒకవేళ అది పాపంతో కూడినది కాకపోతే.
11- ఆయన ఏ దౌర్జన్యపరుడి యొక్క దౌర్జన్యం పట్ల పగ తీర్చుకునేవారు కాదు. కానీ అతను అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘించనప్పుడు తప్ప, ఎవడైనా అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘిస్తే ఆయన కంటే ఎక్కువ ఆగ్రహించుకునేవాడు మరెవరూ ఉండరు.
12- ఆయన సలహా ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కూడా. వ్యాధిగ్రస్తులను పరామర్శించేవారు. జనాజాలో పాల్గొనేవారు. దావత్ (ఆహ్వానాన్ని) స్వీకరించేవారు. బలహీనుల, నిరుపేదల మరియు విధవల అవసరాలను పూర్తి చేయడం కొరకు వారితో పాటు వెళ్లేవారు.
13- తనకు ప్రియమైన వస్తువు ఎవరైనా ఆయనకు ఇస్తే, ఆయన అతని కొరకు దుఆ చేసేవారు మరియు ఇలా అనేవారు: ఎవరి కొరకైనా ఎవరన్నా మేలు చేస్తే, అతను జజాకల్లాహు ఖైరా (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక) అని అంటే అతను అతనిని మంచి రీతిలో ప్రశంసించినట్టు. (తిర్మీజి).
B- ప్రవక్త విధానం: వివాహం మరియు సంసారజీవనంలో
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “మీ ఈ ప్రపంచంలోని వాటిలో మహిళలు, సువాసన పట్ల నాలో ప్రేమ ప్రోదిచెయ్యబడింది. కాగా, నమాజ్ నా కంటికి చలువ.
ఇంకా ఇలా తెలిపారు: “యువకుల్లారా! మీలో స్థోమత ఉన్నవారు పెళ్ళి చేసుకోండి”. మరో సందర్భంలో ఇలా చెప్పారు: “అధికంగా ప్రేమించే మరియు పిల్లలను కనే స్త్రీని వివాహమాడండి”.
2- ఆయన తమ భార్యలతో ఉత్తమరీతిలో, సత్ప్రవర్తనతో మెలిగేవారు, సద్భావంతో ఉండేవారు మరియు ఇలా అనేవారు: “తన ఇంటివారి (ఆలుబిడ్డల) యెడల ఉత్తముడైన వాడే మీ అందరిలో ఉత్తముడు. నేను నా ఆలుబిడ్డల విషయంలో మీ అందరికన్నా ఉత్తముడిని.
3- ఆయన భార్యలలో ఎవరైనా ఏదైనా విషయంపై ఇష్టం (మక్కువ) చూపితే ఆయన వారి కోరికలను నెరవేర్చేవారు ఎప్పటివరకైతే అందులో ఎలాంటి నిషేధం ఉండదో. ఆయన అన్సార్ బాలికలను ఆయెషా రజియల్లాహు అన్హా వద్దకు ఆమెతో ఆడుకోడానికి పంపేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఏ పాత్రలో ఎక్కడ తమ పెదవులు పెట్టి త్రాగారో అదే చోట ప్రవక్త తమ పెదవులు పెట్టి త్రాగేవారు. ఆయన ఆయిషా రజియల్లాహు అన్హా ఒడిలో తలను ఆనించేవారు. ఆమె ఒడిలో తమ శిరస్సు ఉంచి ఖుర్ఆన్ పారాయణం చేసేవారు, అలాంటి కొన్ని సందర్భాల్లో ఆమె బహిష్టురాలై ఉండేది. ఆమె బహిష్టులో ఉన్నప్పుడు ఆయన ఆమెతో లంగోటా లాంటి లో ఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు ఆ తర్వాత ఆమె దేహానికి తమ దేహం ఆనించేవారు.
4- ఆయన అస్ర్ నమాజ్ తర్వాత తమ భార్యల వద్దకు వెళ్లి, వారి దగ్గర కూర్చొని వారి స్థితిగతులు, సంక్షేమాలు తెలుసుకునేవారు. రాత్రి వంతు ఏ భార్య గద్దర ఉండేదో ఆమె వద్దే రాత్రి గడిపేవారు.
5- ఆయన రాత్రి, నివాసం మరియు రోజువారి ఖర్చులు భార్యల మధ్యలో న్యాయంగా పంచేశారు. కొన్నిసార్లు మిగిలిన సతీమణుల సమక్షంలో ఎవరైనా ఒక్కరి వైపు తమ చెయ్యి చాపేవారు.
6- ఆయన తమ భార్యలతో రాత్రి మొదటి భాగంలో మరియు చివరి భాగంలో సంభోగం చేసేవారు. మొదటి భాగంలో సంభోగం చేస్తే గుసుల్ స్నానం చేసి నిద్రపోయేవారు. కొన్ని సందర్భాల్లో వుజూ చేసి పడుకునే వారు.
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరయితే తన ఇల్లాలితో మల విసర్జన మార్గం గుండా సమాగమం జరుపుతాడో వాడు శాపగ్రస్తుడు.” (అహ్మద్, సహీహ్)
ఇంకా ఇలా తెలియజేశారు: “మీలో ఎవరయినా తన భార్యతో సమాగమం జరపాలనుకుంటే ఈ దుఆ చదవాలి: ‘బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ జన్నిబ్ నష్షైతాన వ జన్నిబిష్షైతాన మా రజఖ్తనా’ (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్! మమ్ము షైతాన్ నుంచి దూరంగా ఉంచు. నీవు మాకు ప్రసాదించే దాని నుంచి కూడా షైతాన్ ను దూరంగా ఉంచు).
ఈ సమాగమం ద్వారా వారికి అల్లాహ్ సంతానం రాసిపెట్టి ఉంటే ఆ సంతానానికి షైతాన్ ఎన్నటికీ కీడు కలిగించలేడు. (బుఖారీ, ముస్లిం).
7- ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఎవరయినా స్త్రీని వివాహమాడినా లేదా బానిసను లేదా వాహనం కొనుగోలు చేసినా అల్లాహ్ తో దానిలో శుభం కొరకు ఈ విధంగా వేడుకోవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైరహా వ ఖైర మా జుబిలత్ అలైహి వ అఊజుబిక మిన్ షర్రిహా వ షర్రి మా జుబిలత్ అలైహ్.” (ఓ అల్లాహ్! నేను నీ నుండి దీనిలోని మేలును అర్థిస్తున్నాను. ఏ నైజంపై దీనిని పుట్టించటం జరిగిందో దాని మేలును అర్థిస్తున్నాను. మరియు ఇందులోని కీడు నుంచి నీ శరణు వేడుతున్నాను. ఏ స్వభావంపై దీనిని సృజించటం జరిగిందో దాని కీడు నుంచి నీ శరణు కోరుతున్నాను.)” (అబూదావూద్-2160 హసన్)
8- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నికాహ్ చేసుకున్న వారిని ఈ విధంగా ఆశీర్వదించేవారు: “బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్” “అల్లాహ్ నీకు మరియు మీపై శుభాన్ని కురిపించుగాక! మీ ఇద్దరి మధ్య శుభాన్ని, ఏకీభావాన్ని సృజించుగాక!)” (అబూదావూద్-2130 సహీహ్)’
9- ఆయన ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడు తమ భార్యల మధ్య చీటీ (డ్రా) వేసేవారు, అందులో ఎవరి పేరు వస్తే ఆమెతో ప్రయాణం చేసేవారు. మిగతా భార్యలకు దీని బదులు ఇచ్చేవారు కాదు.
10- ఆయన ఇళ్లను ఎంతో ఎత్తుగా, మహా విశాలంగా మరియు అధిక అలంకరణలతో నిర్మించడం పట్ల ఏ శ్రద్ధ చూపేవారు కాదు. (జీవితపు అవసరాలు తీరే విధంగా ఉంటే సరిపుచ్చుకునేవారు).
11- ఆయన తలాఖ్ (విడాకులు) ఇచ్చారు, రుజూ కూడా చేసుకున్నారు (మొదటి మరియు రెండవ విడాకుల తర్వాత గడువు లోపల తిరిగి భార్యగా ఉంచుకునే అనుమతి ఖుర్ఆన్ లో ఉంది, అదే ప్రకారంగా రుజూ చేసుకున్నారు).
మరియు ఒక నెల కొరకు తాత్కాలికంగా తమ భార్యల నుండి ఈలా (వేరవ్వడం) చేసారు.
కానీ ఆయన జిహార్ ఎన్నడూ చేయలేదు. (అంటే భార్యతో నీ వీపు నా తల్లి లాంటిది లేదా నీవు నా తల్లి లాంటి దానివి అనడం. అజ్ఞాన కాలంలో మాటిమాటికి ఇలా అని భార్యలను వేధించేవారు, ఇస్లాం దీనిని నిషిద్ధ పరిచింది, అలా చెప్పేవారిపై పరిహారం విధిగావించింది. చూడండి సూర ముజాదల ప్రారంభ ఆయతులు) .
16- A- ఆయన విధానం: దావహ్ (ధర్మప్రచారం)లో
1- ఆయన పగలూ, రాత్రీ, రహస్యంగా మరియు బహిరంగంగా ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు. ఆయన మక్కాలో మూడు సంవత్సరాల వరకూ రహస్యంగా ధర్మప్రచారం చేసారు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞ అవతరించిందో: فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు. (హిజ్ర్ 15:94).
అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ పై అమలు చేస్తూ బహిరంగంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరియు నిందించేవాడి నిందతో భయపడకుండా ప్రతీ చిన్న, పెద్ద, స్వతంత్రుడు, బానిస, మగ, ఆడ, జిన్నులు మరియు మానవులందరినీ అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు.
2- మక్కా లో ఆయన సహచరుల పై దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు ఆయన వారిని హబ్షా (అబీసీనియా) వైపు హిజ్రత్ (వలస) చేయవలసిందిగా ఆదేశించారు.
3- ఆయన తాయిఫ్ నగరానికి బయలుదేరారు, వారికి ఇస్లాం సందేశం ఇవ్వడానికి మరియు వారు సత్యధర్మానికి మద్దతు, సహాయం అందించి, ఆయనకు తోడ్పాటుగా ఉండాలని, కానీ వారిలో ఎవరూ కూడా స్వీకరించ లేదు మరియు సహాయకులుగా నిలబడలేదు, పైగా తీవ్రమైన బాధ కలిగించారు. మక్కావాసుల కంటే ఘోరమైన రీతిలో ప్రవర్తించారు. తిరిగి మక్కా వెళ్ళిపోయేలా బలవంతం చేసారు. అందువల్ల ఆయన ముతఇమ్ బిన్ అదీ రక్షణలో మక్కాలో ప్రవేశించారు.
4- పదేళ్ళ వరకూ ఆయన బహిరంగంగా ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతీ సంవత్సరం హజ్జ్ లో బైటి నుండి వచ్చే ప్రజలతో కలిసేవారు, హాజీల డేరాల వద్దకు వెళ్ళేవారు. హజ్జ్ కాలంలోనే ఉకాజ్, మిజిన్న, జుల్ మజాజ్ లాంటి పెద్ద బజార్లలో వచ్చే ప్రతీ తెగవారితో, వారి నివాస స్థలానికి వెళ్ళి, వారిని కలసి ఇస్లాం సందేశం అందజేసేవారు.
5- ఆ సందర్భంలోనే ఒకసారి ఆయన అఖబాకు దగ్గర్లో మదీనావాసులైన ఖజ్రజ్ తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులతో కలిసారు, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. వారు వెంటనే ఇస్లాం స్వీకరించి, మదీనాకు తిరిగి వెళ్లి, ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడం మొదలు పెట్టారు. ఈ విధంగా మదీనాలో ఇస్లాం వ్యాప్తి చెందింది. మరియు ఇస్లాం ప్రవేశించని ఇల్లు అంటూ లేకుండినది.
6- మరుసటి సంవత్సరం వారిలో నుండే 12 మంది వచ్చారు. అప్పుడు ఆయన వారితో అఖబా వద్ద ఈ ప్రకారంగా ప్రమాణం తీసుకున్నారు: మేము ప్రవక్త మాటను విని, విధేయత పాటిస్తాము, అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఖర్చు చేస్తాము, మంచిని ఆదేశిస్తాము మరియు చెడును ఖండిస్తాము, అల్లాహ్ మార్గంలో నిందించేవాడి ఏ నిందనూ లెక్క చేయకుండా మీకు సహాయం చేస్తూ ఉంటాము మరియు మేము స్వయం మమ్మల్ని మరియు మా భార్యపిల్లల్ని కాపాడే రీతిలో మిమ్మల్ని (అంటే ప్రవక్తను) కాపాడతాము. వీటన్నిటికి బదులుగా మీకు స్వర్గం ఉంటుందని ప్రవక్త వారికి శుభవార్తనిచ్చారు.
ఆ తర్వాత వారు మదీనా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారితో పాటు ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు మరియు అబ్దుల్లాహ్ బిన్ మక్తూమ్ రజియల్లాహు అన్హు గారిని పంపారు. వీరు మదీనా వాసులకు ఖుర్ఆన్ బోధిస్తూ మరియు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ ఉండేవారు. అలా వారి ఆధారంగా ఎంతోమంది ఇస్లాం స్వీకరించారు. వారిలోనే ఉసైద్ బిన్ హుజైర్ మరియు సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హుమా వారు కూడా ఉన్నారు.
7- పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం, ముస్లిములు మదీనా వైపు హిజ్రత్ చేయాలని ఆదేశించారు. అప్పుడు ప్రజలందరూ అందులో ముందుకు సాగిపోయారు. పిదప ఆయన మరియు ఆయన ప్రియ గుహ వాసి అయిన అబూ బకర్ రదియల్లాహు అన్హు గారులిద్దరూ కలసి హిజ్రత్ చేసి, మదీనాకు వలస వచ్చినవారితో కలిసిపోయారు.
8- ప్రవక్త మదీనా చేరుకున్న తర్వాత అన్నిటికంటే ముందు ముహాజిరీన్ మరియు అన్సార్ మధ్య సోదరభావం ఏర్పరిచారు. అప్పుడు వారి సంఖ్య 90 ఉండెను.
B- ప్రవక్త విధానం: సయోధ్య, శాంతి కుదుర్చడంలో మరియు రాయబారులతో వ్యవహారంలో
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ముస్లింలందరి ఆశ్రయం ఒక్కటే, వారిలోని అత్యంత అల్పుడైన సరే ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలడు (దానిని మిగితా ముస్లిములందరూ ఒప్పుకోక తప్పదు) (బుఖారీ). ప్రవక్త ఇంకా ఇలా తెలిపారు: విశ్వాసుల మరియు అవిశ్వాసుల మధ్య ఏదైనా ఒప్పందం ఉన్నప్పుడు, దానిని భంగం చేయరాదు, అది అలా ఉండగా, దాని గడువు పూర్తి కాక ముందు మరో ఒప్పందం కుదుర్చకూడదు, లేదా (వారి వైపు నుండి ఏదైనా ద్రోహం జరగవచ్చన్న భయం ఉంటే) ఒప్పందాన్ని భంగం చేస్తున్నామని వారికి స్పష్టంగా తెలియజేయాలి. (అబూ దావూద్ 2759).
2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు: ఎవరైనా ఒక వ్యక్తి ఆశ్రయం ఇచ్చి, పిదప అతనిని హత్య చేస్తే అలాంటి హంతకునితో నాకు ఏలాంటి సంబంధం లేదు. (ఇబ్నే మాజహ్).
3- ముసైలమ కజ్జాబ్ రాయబారులు ఆయన వద్దకు వచ్చినప్పుడు అన్నారు: మేము ముసైలమను అల్లాహ్ యొక్క ప్రవక్తగా నమ్ముతున్నాము, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఒకవేళ రాయబారులను హతమార్చడం అనేది ఉంటే నేను మిమ్మల్ని హతమార్చే వాడిని. ప్రవక్తవారి ఈ పలుకులే రాయబారులను హత్య చేయకూడదు అన్న చట్టంగా నిలిచాయి.
4- ఎవరైనా రాయబారి ఇస్లాం స్వీకరిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని తమ వద్ద ఆపుకునేవారు కాదు, అతన్ని తిరిగి పంపేసేవారు.
5- శత్రువులు సహాబాలలో ఏ ఒకరితోనైనా ప్రవక్తకు తెలియకుండా, ఇష్టం లేకుండా ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన దానిని కొనసాగించేవారు, ఒకవేళ ఆ ఒప్పందం వల్ల ముస్లిములకు ఏ నష్టం లేకుంటే.
6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఖురైష్ లతో చేసిన ఒప్పందంలోని కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:
• పదేళ్ళ వరకు వారి మధ్య మరియు ముస్లింల మధ్య యుద్ధం జరగదు,
• అవిశ్వాసుల్లో నుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి ముస్లింల వద్దకు వెళ్తే వారు అతనిని తిరిగి వాపసు పంపించేయాలి.
• ముస్లింలలో నుండి ఎవరైనా అవిశ్వాసుల వద్దకు పోతే, వారు అతన్ని తిరిగి వాపసు పంపరు.
కానీ అల్లాహు తఆలా దీనిని స్త్రీల విషయంలో రద్దు చేశాడు. వారిని పరీక్షించాలని, వారితో విచారణ జరపాలని ఆదేశించాడు. దీని ప్రకారం ఏ స్త్రీ విశ్వాసీ అని తెలుస్తుందో ప్రవక్త ఆమెను తిరిగి అవిశ్వాసుల వద్దకు పంపేవారు కాదు.
7- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలుకు ఆదేశించారు: ఏ స్త్రీలు అవిశ్వాసాన్ని విడనాడి ఇస్లాం వైపునకు హిజ్రత్ చేసి వస్తారో వారి మహర్ లను అవిశ్వాసులకు వాపసు చేసేయండి. అందువల్ల ముస్లిములు వారి మహర్లను అవిశ్వాసులకు తిరిగి ఇచ్చేసేవారు.
8- అవిశ్వాస పురుషుల్లో నుండి ఎవరైనా ముస్లిం గా ప్రవక్త వద్దకు వస్తే, ఆ అవిశ్వాసులు అతడ్ని తీసుకువెళ్లడానికి వస్తే ఆయన అతనిని తీసుకెళ్ళడం నుండి నిరాకరించేవారు కాదు. అదేవిధంగా అతనిని తిరిగి వెళ్ళిపోమని బలవంతం చేసేవారు కూడా కాదు మరియు పో అని ఆజ్ఞాపించేవారు కూడా కాదు. ఎప్పుడైనా ఆ వ్యక్తి ఆ అవిశ్వాసుల్లో ఎవరినైనా హతమార్చితే లేదా ఎవరి సొమ్మునైనా దోచుకుంటే, అతడు వీరి చేతుల నుండి చేజారి పోయాడు గనక మరియు వారి వద్ద కూడా చేరుకోలేదు గనక అతని ఈ పనిని నిరాకరించేవారు కాదు మరియు అతను చేసిన హత్యకు ఎటువంటి జమానత్ (పరిహార బాధ్యత) తీసుకునేవారు కాదు.
9- ఖైబర్ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆయన వారితో ఈ షరతుపై ఒప్పందం చేసుకున్నారు: వారిని అక్కడి నుంచి బహిష్కరించడబడును, మరియు వారి స్వారీలు మోయోగలిగే సామానులే వారు తీసుకువెళ్లాలి మరియు వారి బంగారం, వెండి, ఆయుధాలకు ప్రవక్తయే అధికారులవుతారు.
10- ఇంకా వారితో జరిగిన ఒప్పందంలో: వారి భూమిలో పండే పంటలో సగం ముస్లింలకు మరియు సగం వారికి. ముస్లింలు కోరుకున్నన్ని రోజులే వారు వారు అక్కడ ఉంటారు. ప్రవక్త ప్రతీ ఏటా వారి వద్దకు సరైన అంచనా వేసే నిపుణుడిని పంపేవారు అతను పండ్లు పండాక ఎన్ని పండ్లను త్రెంచాలో అంచనా వేసేవాడు. మరియు ముస్లిముల వాటాకు వారినే హామీదారులుగా ఉంచేవారు మరియు మిగిలిన వారి వాటాలో వారు తమ ఇష్ట ప్రకారం చేసుకునేవారు
C- ప్రవక్త విధానం: రాజులను ఇస్లాం వైపు ఆహ్వానించడం మరియు రాయబారులను లేఖలు ఇచ్చి పంపడంలో
1- ఆయన హుదైబియా నుండి తిరిగి వాపసు రాగానే రాజుల వైపునకు ఉత్తరాలు, లేఖలు రాయడం, రాయబారులను (దూతలను) పంపడం మొదలు పెట్టారు.
– ఆయన రోమా రాజుకు ఓ లేఖ వ్రాసి, దూత ద్వారా పంపారు. మరియు అతను ఇస్లాం స్వీకరించాలనుకున్నాడు, స్వీకరించేవాడే కాని (తన కొందరి దగ్గరి వారి కారణంగా) స్వీకరించలేదు.
2- అబీ సీనియా దేశం నజాషీ చక్రవర్తి వైపునకు కూడా సందేశం పంపారు, అతను ఇస్లాం స్వీకరించాడు.
3- ముఆజ్ బిన్ జబల్ మరియు అబూ మూసా అష్ అరీ రదియల్లాహు అన్హుమా వారిని యమన్ వాసుల వద్దకు పంపారు, వారందరూ ఏ గొడవ లేకుండా ఇస్లాం స్వీకరించారు.
D– ఆయన విధానం: కపట విశ్వాసులతో వ్యవహారాలలో
1- ఆయన కపట విశ్వాసుల బాహ్య ఆచరణలను స్వీకరించేవారు మరియు అంతర్గత విషయాలను అల్లాహ్ పై వదిలేసేవారు. రుజువు మరియు ఆధారాలతో వారితో చర్చ జరిపేవారు. ఆయన కొన్నిసార్లు వారి పట్ల దృష్టిని మరల్చుకుంటే మరి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించేవారు. ప్రభావవంతమైన మాటలతో వారికి నచ్చజెప్పేవారు.
2- ఆయన వారి హృదయాలు గెలుచుకోడానికి వారితో పోరాడలేదు. ఆయన ఇలా అనేవారు: “ముహమ్మద్ తన సహచరులనే హతమార్చేస్తున్నాడు” అని ప్రజలు అనుకుంటూ తిరగడం నాకిష్టం లేదు. (ముత్తఫఖున్ అలైహి).
17- ఆయన విధానం: జిక్ర్ (అల్లాహ్ స్మరణ)లో
1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారు. ఆయన మాటలన్నీ అల్లాహ్ స్మరణ మరియు దానికి సంబంధించిన విషయంలోనే ఉండేవి. ఆయన ఆజ్ఞ, వారింపు మరియు అనుచర సమాజానికిచ్చే ధార్మికాదేశాలు నాలుక ద్వారా అల్లాహ్ స్మరణ అయితే, ఆయన మౌనం హృదయ స్మరణ. ఆయన నిలబడుతూ, కూర్చుంటూ, పడుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ, స్థానికంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, సందర్భాల్లో, స్థితుల్లో అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారు. ఒక్కటేమిటి ఆయన ప్రతి శ్వాసలో అల్లాహ్ స్మరణ ఉండేది.
అస్ బహ్ నా అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ వ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫమ్ ముస్లిమవ్ వమాకాన మినల్ ముష్రికీన్. (ముస్నద్ అహ్మద్ 3/406, సహీహుల్ జామి ).
(మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రచిత్తులు, విధేయులు, ముష్రికులలోని వారు కారు).
అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా వ బిక అమ్ సైనా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199).
(ఓ అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే లేపబడనున్నాము).
ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉదయానికి చేరుకున్నారంటే ఈ జిక్ర్ చదవాలి:
అస్ బహ్ నా వ అస్ బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైర హాజల్ యౌమి, ఫత్ హహు, వ నస్రహు, వ నూరహు, వ బరకతహు, వహుదాహు వఅఊజు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బఅ్ దహ్
మేము మరియు రాజ్యమంతా సకలలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకు ఉదయానికి చేరాము. ఓ అల్లాహ్ నేను ఈ రోజులో ఉన్న మేలును, జయాన్ని, సహాయాన్ని, కాంతిని, శుభాలను, సన్మార్గము ప్రసాదించమని వేడుకుంటున్నాను. మరియు దీనిలో ఉన్న కీడు నుండి, తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణే కోరుచున్నాను. (అబూదావూద్, జాదుల్ మఆద్ 2-373).
(ఇదే జిక్ర్ సాయంకాలం కూడా చదవాలి, కాని ముందు వాక్యము “అమ్సైనా వ అమ్సల్” అని మార్చి చదవాలి)
మరియు ఇలా అన్నారు: ఎవరైతే సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివుతాడో ఒకవేళ అతను సాయంకాలానికి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదివి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. ((బుఖారి 6306)
అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వ అన అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅ్ దిక మస్తతఅ్ తు అఊజు బిక మిన్ షర్రి మా సనఅ్ తు అబూఉ లక బినిఅ్ మతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అంత.
(ఓ అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).
3- మరియు ఇలా అన్నారు: ఎవరు ప్రతి రోజు ఉదయం వంద సార్లు ఈ జిక్ర్ చేస్తాడో:
అతనికి 10 బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది,
100 పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి,
అతని 100 పాపాలు మన్నింపబడతాయి,
అతను సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు,
అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు.
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకీ వ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.
(ఓ అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, ఓ అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా ఏ కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యాల ఆధారంగా నీ శరణులోకి వచ్చాను).
5- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే ఈ దుఆ ప్రతి ఉదయం మరియు సాయంత్రం చదువుతాడో అతనికి ఏదీ నష్టపరచదు. (అబూదావూద్ 5088).
(అల్లాహ్ పేరుతో, ఆయన పేరుతో ఏ వస్తువు నష్టపరచదు, ఆకాశంలోగాని, భూమిలోగాని, ఆయన వినువాడు, సర్వజ్ఞాని).
6- అబూ బకర్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు: నాకు ఏదైనా దుఆ నేర్పండి, నేను దానిని ఉదయం, సాయంత్రం చదువుతాను, అప్పుడు ప్రవక్త చెప్పారు: నీవు ఉదయం, సాయంకాలం మరియు పడుకునే ముందు ఈ దుఆ చదువు:
అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇఁ వ మలీకహ్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రహూ ఇలా ముస్లిమ్.
(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు యొక్క ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్ ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి).
ఆయన విధానం: ఇంటి నుండి బయలుదేరే లేదా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దుఆలలో
1- ఆయన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ విధంగా పలికేవారు:
అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్!).
2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరు ఇంటి నుండి బైటికి వెళ్తూ ఈ దుఆ చదువుతారో అతనితో ఇలా అనబడుతుంది: నీకు సన్మార్గం ప్రాప్తించినది, అల్లాహ్ నీ కొరకు సరిపోయాడు, కీడు, బాధల నుండి నీకు రక్షణ లభించినది మరియు షైతాన్ అతని నుండి దూరమయ్యాడు. (అబూదావూద్ 5095).
(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).
4- ఇంకా ఇలా అన్నారు: మనిషి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదవాలి:
اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా.
(ఓ అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము). (అబూదావూద్ 5096).
ప్రవక్త విధానం: మస్జిదులో ప్రవేశిస్తూ, బైటికి వెళ్తూ
1- ఆయన మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదివేవారు: అఊజు బిల్లాహిల్ అజీం వ బివజ్ హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.
అల్లాహుమ్మ అహిల్లాహూ అలైనా బిల్ అమ్ని, వల్ ఈమాని వస్సలామతి, వల్ ఇస్లామి వత్తౌఫీఖి లిమా తుహిబ్బు రబ్బునా వతర్జా, రబ్బునా వ రబ్బు కల్లాహ్
ఓ అల్లాహ్! ఈ చంద్రునికి మాపై శాంతి, విశ్వాసము, రక్షణ, ఇస్లాంతో సహా, ఉదయింపజేయి. నీవు ప్రేమించే, ఇష్టపడే వాటి భాగ్యం ప్రసాదించు ఓ మా ప్రభువా! (ఓ చంద్రుడా!) నాకు మరియు నీకు అల్లాయే ప్రభువు (దార్మీ, తిర్మిజి 3-157).
18– ప్రవక్త విధానం: తుమ్ము మరియు ఆవలింత సమయంలో చేసే స్మరణలో
1-: ఆయన ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా అల్లాహు తఆలా తుమ్ముని ఇష్టపడతాడు మరియు ఆవలింతని ఇష్టపడడు. కనుక మీలో ఎవరికన్నా తుమ్ము వస్తే అల్ హందులిల్లాహ్ అని పలకాలి. వినే ప్రతి ముస్లిం పై ‘యర్హముకల్లాహ్ (నీపై అల్లాహ్ కారుణ్యం చూపు గాక)’ అనడం విధిగా ఉంది. ఆవలింత అనేది షైతాన్ తరపు నుండి. కనుక మీలో ఎవరికన్నా ఆవలింత వస్తే శక్తానుసారం దానిని ఆపడానికి ప్రయత్నం చేయాలి, మీలో ఎవరైనా ఆవలిస్తే షైతాన్ నవ్వుతాడు. (బుఖారీ)
2- ఆయన తుమ్మేటప్పుడు తమ చేయి లేదా వస్త్రాన్ని (రుమాలుని) అడ్డు పెట్టుకునేవారు. స్వరాన్ని తగ్గించేవారు.(అబూ దావూద్, తిర్మీజి)
3- ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా తుమ్మి (అల్ హందు లిల్లాహ్ అంటే, దగ్గరున్నావారిలో ఎవరైనా) యర్హముకల్లాహ్ అని అంటే, ఆయన దానికి జవాబుగా: యర్ హమునల్లాహు వ ఇయ్యాకుమ్, వయగ్ఫిర్ లనా వలకుమ్. (అల్లాహ్ మాపై మరియు మీపై కరుణించుగాక మరియు మిమ్మల్ని మరియు మమ్మల్ని క్షమించుగాక).
4- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో ఎవరైనా తుమ్మినప్పుడు అల్ హందులిల్లాహ్ అనండి, ఇతనికి జవాబుగా ఇతని సోదరుడు లేదా సహచరుడు యర్ హముకల్లాహ్ అనాలి. మళ్ళీ ఇతను యర్ హముకల్లాహ్ కి జవాబుగా యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం అనాలి (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక). (బుఖారీ).
5- మీలో ఎవరైనా తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే అతనికి యర్ హముకల్లాహ్ అని జవాబు ఇవ్వండి. ఒకవేళ అతను హందులిల్లాహ్ అనకపోతే అతనికి జవాబు ఇవ్వకండి. (ముస్లిం).
ఆయన మూడు సార్లు కంటే ఎక్కువ తుమ్మేవాడికి బదులు ఇచ్చేవారు కాదు. ఇతనికి జలుబు అయింది అనేవారు. (ముస్లిం).
6- సహీ హదీసులో వచ్చింది: యూదులు ఆయన వద్దకు వచ్చి కావాలని తుమ్మేవారు, తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యర్ హముకల్లాహ్ అంటే, వారికి ఆ కరుణ దుఆ లభిస్తుందని ఆశించేవారు, కానీ ప్రవక్త యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక) అని అనేవారు. (తిర్మిజీ)
ఆయన విధానం:- వ్యాధిగ్రస్తునిని పరామర్శించేటప్పుడు చదివే దుఆ లో
1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తునిని పరామర్శించి, ఈ దుఆ చేస్తే, ఆ రోగం, ఆపద ఇతనికి తగలదు:
అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ మిమ్మబ్ తలాక బిహి వఫజ్జలనీ అలా కసీరిమ్ మిమ్మన్ ఖలఖ తఫ్జీలా.
సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి, అల్లాహ్ నిన్ను పరీక్షిస్తున్న దాని నుండి నన్ను క్షేమంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు. (అబూ దావూద్)
ఆయన విధానం: కోడి కూత మరియు గాడిద గాండ్రింపు విన్నప్పుడు చదివే దుఆలలో
1- ఆయన తమ అనుచర సమాజానికి గాడిద గాండ్రింపు వింటే పై’తాన్ నుండి శరణు కోరమని మరియు కోడి పుంజు కూత వింటే అల్లాహ్ తో ఆయన అనుగ్రహాన్ని అర్థించండి అని తెలిపారు. (బుఖారీ, ముస్లిం).
ఆయన విధానం: కోపం వచ్చిన సందర్భంలో చదివే దుఆలో
1- ఆయన ప్రజలకు కోపం వచ్చినప్పుడు వుజూ చేయమని, నిలబడి ఉంటే కూర్చోమని, కూర్చొని ఉంటే పడుకోవాలని మరియు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి శరణు వేడుకోమని ఆదేశించారు.
ఆయన విధానం: అజాన్ మరియు దాని దుఆలలో
1- తర్జీఅ (ترجيع = అజాన్ లో షహాదత్ పదాలు 4 సార్లు పలకడం) మరియు తర్జీఅ లేకుండా అంటే రెండు విధాలుగా అజాన్ ఇవ్వడం రుజువైనది. మరియు ఇఖామత్ ఒకసారి లేదా రెండు సార్లు ఇవ్వడం కూడా అనుమతి ఇవ్వబడింది. అయితే అన్ని స్థితుల్లో “ఖద్ ఖామతిస్సలాహ్” రెండు సార్లు అనడమే ఆయన నుండి రుజువైనది. ఒకేసారి అనడం ఖచ్చితంగా నిరూపించబడలేదు.
2- ఆయన తమ అనుచర సమాజానికి ముఅజ్జిన్ ఎలా పులకుతే అలాగే జవాబు ఇవ్వాలని, కానీ హయ్య అలస్సలాహ్ మరియు హయ్య అలల్ ఫలాహ్ అన్నప్పుడు లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని జవాబు ఇవ్వమని ఆదేశించారు.
3- ప్రవక్త ప్రవచనం: ఎవరైతే అజాన్ విని ఈ దుఆ చదువుతాడో, అతని పాపాలు మన్నించబడతాయి: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.
(అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).
4- అజాన్ వినేవారు ముఅజ్జిన్ కి బదులు ఇచ్చాక ఆయనపై దరూద్ చదివి, ఆ తర్వాత ఈ దుఆ చదవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఇంకా అందువల్ల అతనికి ప్రళయదినాన ప్రవక్త సిఫారసు లభిస్తుందని శుభవార్తి ఇచ్చారు: అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅ్ వతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ.
(ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి). (బుఖారీ)
5- ఆయన ఇలా తెలిపారు: అజాన్ మరియు ఇఖామత్ ల మధ్య చేయబడే దుఆ రద్దుచేయబడదు.
ఆయన విధానం: జిల్ హిజ్జా జిక్ర్ లో
1- ఆయన జిల్ హిజ్జా తొలిదశలో అత్యధికంగా అల్లాహ్ స్మరణ చేసేవారు. మరియు ప్రజలకు కూడా అత్యధికంగా తహ్మీద్ (అల్ హందులిల్లాహ), తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) చేస్తూ ఉండాలని ఆదేశించారు.
ప్రవక్త విధానం: ఖుర్ ఆన్ పారాయణంలో
1- ఆయన ప్రతి రోజు ఒక హిజ్బ్ పారాయణం చేసేవారు, దానిని వదిలేవారు కాదు. (హిజ్బ్ అంటే తిలావత్ కొరకు ఫిక్స్ చేసుకున్న ఖుర్ఆన్ లోని ఒక భాగం).
2- ఆయన ఖుర్ఆన్ ను ఆగి ఆగి నింపాదిగా ఒక్కో అక్షరాన్ని స్పష్టంగా పారాయణం చేసేవారు, వేగంగా చదివేవారు కాదు, అలానే త్వరగా కూడా చదివేవారు కాదు. బదులుగా మధ్యస్థ వైఖరిని అవలంభిస్తూ ఖిరాఅ తఫ్సీరియ్యహ్ (వినేవారికి భావం తెలిసేరీతిలో తిలావత్) చేసేవారు.
3- ఆయన ఖుర్ఆన్ యొక్క ప్రతి ఆయతును వేర్వేరుగా చదివేవారు. ఒక్కో ఆయత్ పై ఆగేవారు. సూరాలను ఆగి ఆగి నింపాదిగా తిలావత్ చేసేవారు, వినేవారికి చాలా సుదీర్ఘమైన సూరాగా ఏర్పడేది.
4- ఆయన మద్ (దీర్ఘం) ఉన్న పదాలను ఉదా : అర్రహ్మాన్, అర్హహీంని గుంజీ, లాగీ చదివేవారు. (వీడియోలో తప్పక చూడండి ఈ విధానం).
5- ఆయన పారాయణం ప్రారంభించే ముందు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ తో శరణు వేడుకునేవారు. అనగా అఊజుబిల్లాహి మినష్ షైతానిర్రజీం పఠించేవారు. మరికొన్ని సార్లు ఈ విధంగా చదివేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినష్షైతానిర్రజీమి మిన్ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహ్. (ఓ అల్లాహ్ నేను శాపగ్రస్తుడైన షైతాన్ ప్రేరణల నుండి,అతని ఊదడం నుండి, మంత్రం నుండి నీ శరణు వేడుతున్నాను). (ఇబ్నే మాజహ్).
6- ఆయన నిలబడి, కూర్చొని, పడుకొని, వుజూ స్థితిలో, వుజూ లేని స్థితిలో ప్రతీ స్థితిలో ఖుర్ ఆన్ పారాయణం చేసేవారు కానీ అశుద్ధావస్థలో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు కాదు.
7- ఆయన ఉత్తమమైన స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. మరియు ఇలా అనేవారు: ఎవరైతే ఖుర్ ఆన్ సుందరమైన స్వరంతో చదవడో వాడు మన విధానం లోనివాడు కాదు. (బుఖారీ).
ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఖుర్ఆన్ ను మీ కంఠస్వరాల ద్వారా అలంకరించండి.
8- ఆయన ఇతరుల స్వరంతో కూడా పారాయణం వినడం ఇష్టపడేవారు.
9- ఆయన సజ్దహ్ ఆయతు చదివినప్పుడు అల్లాహు అక్బర్ అని సజ్దహ్ లోకి వెళ్ళేవారు. ఆయన ఒక్కోసారి సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు: సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).
(నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).
మరికొన్ని సందర్భాల్లో ఈ దుఆ చదివేవారు: అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, వ జఅ అన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, వ తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్. (తిర్మిజి 579, 3424).
(ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).
ఆయన సజ్దయే తిలావత్ నుండి లెసినప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు కాదు. అలాగే తషహ్హుద్ లేదా సలామ్ కూడా త్రిప్పేవారు కాదు. (కాని నమాజు చేయించే ఇమాం నమాజులో ఉండగా సజ్దయే తిలావత్ గల ఆయత్ చదివితే, అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళాలి, అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి లేవాలి).
19– ఆయన విధానం: ఖుత్బా (ప్రసంగం)లో
1- ఆయన ఖుత్బా ఇచ్చేటప్పుడు కళ్ళు ఎర్రగా, కంఠస్వరం పెద్దగా (బిగ్గరగా) అయ్యేవి. ఆగ్రహం పెరిగిపోయేదే; ఎలాగైతే ఒక సైన్యం నుండి బెదిరించేవాడు అంటాడో: ప్రజలారా శత్రువు మీపై పొద్దున్న లేదా రాత్రి దాడి చేయబోతున్నాడు.
ఆయన ఇలా అన్నారు: “నన్ను పంపబడిన కాలం మరియు ప్రళయదినం మధ్య ఈ విధంగా న్ని ఈ విధంగా ప్రక్కప్రక్కన కలిపి పంపడం జరిగింది” అని ప్రవక్త ముహమ్మద్ ﷺ తమ చూపుడు వ్రేలును మధ్య వ్రేలుతో కలిపి చూపిస్తూ అన్నారు (బుఖారీ, ముస్లిం)
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనేవారు: అమ్మా బఅద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, వషర్రల్ ఉమూరి ముహ్ దాసాతుహా, వ కుల్ల బిద్అతిన్ ద్జలాలహ్. (అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథంలోనిది, అన్నిటికంటే ఉత్తమమైన విధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం, అన్ని విషయాల్లో కెల్ల అతి చెడ్డ విషయం బిద్అతులు (ధర్మం పేరు మీద కల్పితాచాచరాలు), ప్రతి కొత్త కల్పిత దురాచారం మార్గభ్రష్టత్వానికి దారితీస్తుంది. (ముస్లిం).
ఆయన అల్లాహ్ స్తోత్రం తో ప్రారంభించకుండా ఎటువంటి ప్రసంగాన్ని ప్రసంగించేవారు కాదు.
ఆయన తమ సహాబాలకు ఉపన్యాసం కొరకు ఈ విధంగా బోధించేవారు:-
ఇన్నల్ హమ్ద లిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్ మాలినా మయ్ యహ్ దిహిల్లాహు ఫలాముజిల్ల లహు వమయ్ యుజ్లిల్ ఫలా హాదియలహు వ నష్రదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు…
సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి మేము ఆయన్నే స్తుతిస్తాము. సహాయం కోసం ఆయన్నే అర్ధిస్తున్నాము. మోక్షం(క్షమాభిక్ష )కొరకు ఆయన్నే వేడుకుంటున్నాము. కామ చేష్టల నుండి దురాచరణల నుండి మేము ఆయన శరణు కోరుకుంటున్నాము ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం వహిస్తాడు వారిని ఎవరూ దారి తప్పించలేరు. మరి ఎవరినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వానికి గురి చేయదలుచుకుంటాడో వారికి ఎవ్వరూ దారి చూపించలేరు అల్లాహ్ తప్ప ఎవరూ నిజ ఆరాధ్యుడు లేడని మేము సాక్ష్యం ఇస్తున్నాము.మరియు మహాప్రవక్త ముహమ్మద్ ﷺ గారు ఆయన సందేశహరులని దాసులని కూడా మేము సాక్ష్యం ఇస్తున్నాము.
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిఘావేసి ఉన్నాడు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).
Al-Ahzab 33:70
మరియు ఆయన వారికి (సహాబాలకు) ప్రతీ పనిలో ఇస్తెఖారహ్ చేయమని నేర్పేవారు ఎలాగైతే ఖుర్ఆన్ లోని సూరా నేర్పేవారో.
ఆయన ఇలా అన్నారు:-
మీరు ఏ పనినైనా చేయాలనుకుంటే ‘ఫర్జ్’ నమాజులో తప్ప ఇతర నఫిల్ నమాజు రెండు రకాతులు చదివి ఇలా పఠించాలి.
అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వఅస్తఖ్దిరుక బిఖుద్రతిక వస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅ్ లము వలా అఅ్ లము వ అన్త అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర —(తమ అవసరం గురించి విన్నవించాలి)— ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)–ఫఖ్దుర్ హు లీ వయస్సిర్ హు లీ , సుమ్మ బారిక్ లీ ఫీహి , వ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ.. లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)..ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ రజ్జినీ బిహీ.(బుఖారీ)
(ఓ అల్లాహ్ ! నేను నీ జ్ఞానం ద్వారా, నీ నుండి మేలు కోరుతున్నాను. నీ శక్తి ద్వారా నాకు శక్తిని ప్రసాదించు. నీ మహా అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిశ్చయంగా నీకే శక్తి ఉంది. నాకు ఎలాంటి శక్తి లేదు. నీకు అంతా తెలుసు నాకు ఏమీ తెలియదు. ఆగోచర జ్ఞానం కలవాడవు నీవే. ఓ అల్లాహ్! ఈ పని (దేనిని గురించి ఇస్తేఖారా చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి) ధార్మికంగా సామాజికంగా, సంపాదనంగా, మోక్షపరంగా,(దాని త్వరగా మరియు ఆలస్యం లో) నా కొరకు మేలైనదైతే నాకై నిశ్చయించు. దానిని నా కొరకు ప్రసాదించు. ఓ అల్లాహ్! ఈ పని ధార్మికంగా, సంపాదనపరంగా, మోక్షపరంగా(దాని త్వరగా మరియు ఆలస్యం లో) కీడైనదైతే దాన్నుండి నాకు నా నుండి దాన్ని దూరంగా ఉంచు. ఎక్కడున్నా సరే నాకు మేలును ప్రసాదించు. దాని ద్వారా నాకు సంతృప్తిని ప్రసాదించు). (బుఖారీ)
ఆయన విధానం: నిద్రపోవడం, మేల్కోవడం మరియు కలలో
1- ఆయన ఒక్కోసారి పరుపు మీద మరియు ఒక్కోసారి చర్మంతో చేయబడిన పరుపు మీద, ఒక్కోసారి చాప పై , ఒక్కోసారి నేలపై , మరియు ఒక్కోసారి మంచంపై పడుకునేవారు.ఆయన పరుపు మరియు దిండి శుభ్రంగా రంగించబడిన చర్మం తో చేసినదై ఉండేది దాని లోపల ఖర్జూరం బెరడు నిండి ఉండేది.
2- ఆయన అవసరానికంటే ఎక్కువగా నిద్రపోయేవారు కాదు.మరియు అవసరానికంటే తక్కువగా నిద్రపోయే వారు కూడా కాదు.
3- ఆయన రాత్రి మొదటి భాగంలో నిద్రపోయేవారు మరియు చివరి భాగంలో మేలుకునేవారు. కొన్నిసార్లు ముస్లిములందరి సంక్షేమం కోసం మొదటి రాత్రిలో మేల్కొని ఉండేవారు.
4- (ప్రయాణ స్థితిలో) ఆయన రాత్రి చివరి భాగంలో పడుకున్నప్పుడు కుడి వైపున పడుకునేవారు.మరియు ఫజర్ ముందు పడుకున్నప్పుడు కుడి చేయి నిల్చోబెట్టి దాని అరచేతిలో తల పెట్టి పడుకునే వారు.
5- ఆయన పడుకున్నప్పుడు ఎవరూ ఆయనని నిద్ర నుండి మేల్కొనిపేవారు కాదు ఎప్పటి వరకు అయితే ఆయన స్వయంగా మేలుకోరో. ఆయన కళ్ళు నిదురపోయేవి కానీ హృదయం మేల్కొని ఉండేది.
6-ఆయన పరుపుపై పడుకొనేందుకు వెళ్లినప్పుడు ఈ దుఆ చదివేవారు:- బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా (అల్లాహ్ పేరుతో మరణిస్తున్నాను (నిదురపోతున్నాను) మరియు జీవిస్తున్నాను (మేల్కొంటున్నాను) (బుఖారీ)
ఆయన ఖుల్ హువల్లాహు అహద్ (సూరయే ఇఖ్లాస్),ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(సూరయే ఫలఖ్), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ (సూరయే నాస్) పఠించేవారు మరియు తమ రెండు అరచేతులను దగ్గర చేసి వాటి మీద ఊదేవారు.పిదప రెండు అరచేతులతో తల,ముఖం, మరియు కుదరభాగంపై స్పర్శించేవారు (తుడిచేవారు). మరియు ఎంతవరకు కుదిరితే అంత భాగంపై తుడిచేవారు. ఈ విధంగా ఆయన మూడుసార్లు చేసేవారు.(బుఖారీ)
7- ఆయన కుడి వైపున పడుకునేవారు.మరియు ఆయన తన చేతిని కుడి చెంప క్రింద ఉంచి ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక ( ఓ అల్లాహ్ నీవు నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు ఏ నాడు అయితే నీవు నీ దాసులను తిరిగి లేపుతావో)అబూ దావూద్, తిర్మీజి
ఆయన కొందరు సహాబాలతో ఇలా అన్నారు:- నీవు నీ పరుపు మీదకు పోయినప్పుడు నమాజు కొరకు చేసే మాదిరిగా వుజూ చేసుకో పిదప కుడి వైపు తిరిగి పడుకొని ఈ దుఆ చదువు:-
“అల్లాహుమ్మ అస్లమ్తు నఫ్సీ ఇలైక, వఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, వ అల్ జఅ్ తు జహ్రీ ఇలైక, రగ్బతవ్ వ రహ్బతన్ ఇలైక, లా మల్జఅ వలా మన్జఅ మిన్క ఇల్లా ఇలైక, ఆమన్తు బికితాబికల్లదీ అన్జల్త వ బినబియ్యికల్లదీ అర్సల్త””
ఓ అల్లాహ్! నా ఆత్మను నీ ఆధీనం చేసాను, నా వ్యవహారాలన్నీ నీకు నా ముఖాన్ని నీ వైపుకు మరల్చాను, నా వీపును నీ వైపుకు వంచాను, (ఇవన్నీ నేను) భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో చేసాను. నీ పట్టు నుండి తప్పించుకోలేను. నీవు తప్ప నాకు రక్షకుడు లేడు. నీవు అవతరింప జేసిన గ్రంథాన్నీ మరియు నీవు పంపిన ప్రవక్తనూ విశ్వసించాను. (ఈ దుఆ నిద్ర పోయిన తరువాత చనిపోతే ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మరణం జరిగినట్లు) (బుఖారీ, ముస్లిం).
ఓ అల్లాహ్! జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీలుల ప్రభువువి నీవే! ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలలో తీర్పునిచ్చే వాడివి నీవే. విభేదము ఏర్పడిన విషయాలలో నీ అనుజ్ఞతో నాకు సత్యము వైపునకు మార్గదర్శకము గావించు. నిశ్చయంగా నీవు కోరిన వారికి రుజు మార్గదర్శకము గావిస్తావు. (ముస్లిం).
9- ఆయన నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ విధంగా పఠించేవారు:-
చనిపోయిన తర్వాత మమ్మల్ని తరిగి బ్రతికించిన అల్లాహ్క సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది. (బుఖారీ, ముస్లిం) మరియు మిస్వాక్ చేసేవారు మరియు కొన్నిసార్లు సూరయే ఆలిమ్రాన్ చివరి పది వాక్యాలు పారాయణం చేసేవారు (ముత్తఫఖున్ అలైహి)
10- ఆయన కోడికూతను విన్నప్పుడు నిద్ర లేచేవారు మరియు అల్లాహ్ యొక్క స్తోత్రం, తక్బీర్ (గొప్పతనం), తహ్లీల్ (లాఇలాహ ఇల్లల్లాహ్) మరియు దుఆ చేసేవారు.
11- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు:- మంచి కలలు అల్లాహ్ తరుపునుండి వస్తాయి. మరియు చెడు కలలు షైతాన్ తరపు నుండి వస్తాయి. అందువలన ఏ వ్యక్తి అయినా అయిష్టకరమైన కలను చూస్తే ఎడమవైపున సాధారణంగా(తూ తూ అని కొన్ని తుంపర్లు పడేలా) ఉమ్మాలి.మరియు అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం అని పఠిస్తే అతనికి ఎటువంటి హాని కలుగదు. మరియు దానిని ఎవరికీ తెలుపకూడదు. మరియు ఒకవేళ మంచి కలను చూస్తే దానిని శుభవార్త అనుకొని కేవలం తాను ఇష్టపడిన వారికి మాత్రమే తెలుపాలి.(ముత్తఫఖున్ అలైహి)
అలాగే చెడు కలలు చూసేవారితో ప్రక్క మార్చి మరియు నమాజు చేయమని ఆజ్ఞాపించారు.
20- ఆయన విధానం: అలంకరణ, రూపు రేఖలు, వస్త్రధారణ మరియు సహజ (ప్రకృతి)వ్యవహారాలలో.
1-ఆయన సుగంధాన్ని అత్యధికంగా వాడేవారు, మరియు దానిని ఇష్టపడేవారు.ఎప్పడూ సువాసనను పీల్చుకోకుండా వదిలేవారు కాదు.ఆయన దృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైన సువాసన మిష్క్ ది(అనగా కస్తూరిది ).
2- ఆయన మిస్వాక్ ను అధికంగా ఇష్టపడేవారు.ఇఫ్తార్ మరియు ఉపవాస స్థితిలో కూడా మిస్వాక్ చేసేవారు.నిద్ర నుండి మేల్కొనేటప్పుడు, మరియు ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మరియు నమాజు కొరకు మిస్వాక్ చేసేవారు.
3- ఆయన సుర్మా ను ఉపయోగించేవారు మరియు ఇలా అన్నారు:-మీ సుర్మా లలో అత్యంత ఉత్తమమైన సుర్మా అస్మద్ .ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది మరియు కను రెప్పల వెంట్రుకలను పెంచుతుంది.
4- ఆయన ఒక్కోసారి స్వయంగా తల దువ్వుకునేవారు ఒక్కోసారి ఆయన భార్య ఆయిషా రదియల్లాహు అన్హా దువ్వేది. ఆయన తల వెంట్రుకలన్నీ గొరిగించుకునేవారు లేకపోతే అలానే వదిలేసేవారు
5- ఆయన హజ్ మరియు ఉమ్రాలలోనే గుండు చేయించుకోవడం రుజువైంది.ఆయన తల వెంట్రుకలు జుమ్మ కంటే ఎక్కువ మరియు వఫ్రా కంటే తక్కువ ఉండేవి.మరియు జుమ్మ వెంట్రుకలు ఆయన చెవుల అంచు వరకు చేరి ఉండేవి.
జుమ్మ :- భుజాల వరకు పెరిగిపోయిన తల వెంట్రుకలు
వఫ్రహ్:- చివరి వరకు ఉండే పొడువాటి వెంట్రుకలను (జుట్టు) అంటారు
లమ్మహ్:- చెవుల అంచుల కంటే కొద్దిగ పొడవుగా ఉండే జుట్టు
6- ఖజఅ్(కొంత తలభాగాన్ని గొరికించుకొని కొంత భాగాన్ని వదిలివేయడం,అరగుండు) నుండి ఆయన వారించేవారు
7-ఆయన ఇలా తెలిపారు:- అవిశ్వాసులకు వ్యతిరేకత చూపండి! గెడ్డాన్ని పెంచండి మరియు మీసాలను తగ్గించండి.(ముత్తఫఖున్ అలైహి)
8- ఆయన దుస్తులలో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకునేవారు.ఒక్కోసారి ఉన్ని ,ఒక్కోసారి దూది లేదా పత్తి,లేదా కొన్నిసార్లు కాటన్ (అవిసె మొక్క నుండి తయారు చేయబడిన వస్త్రం).ఆయనకు అన్నిటికంటే ఇష్టమైన వస్త్రం చొక్కా.
9-ఆయన యమన్ కి చెందిన చారల దుప్పటి, మరియు ఆకుపచ్చ దుప్పటిని కూడా వేసుకునేవారు.మరియు జుబ్బా,మరియు చేతుల దగ్గర టైట్ గా ఉండేది,పైజామా,లుంగీ,దుప్పటి,సాక్సులు, చెప్పులు మరియు తలపాగా కూడా ధరించేవారు.
10- తలపాగాను అడుగున కట్టేవారు మరియు దాని అంచుని ఒక్కోసారి వెనుక వదిలేసేవారు. ఒక్కోసారి వదిలేవారు కాదు. (హన్క్ అనగా అంగిలి,దిగువ దవడ గడ్డం క్రింద భాగాన్ని అంటారు )
11- మరియు ఆయన నలుపు రంగు దుస్తులు ధరించేవారు, మరియు ఎరుపు లుంగీ లేదా దుప్పటిని కూడా వాడారు
12- ఆయన వెండి ఉంగరాన్ని ధరించేవారు, మరియు దానిలో ఉన్న రాయి ని అరచేతి లోపలి వైపుకు తిప్పుకునేవారు.
13- ఆయన కొత్త దుస్తులు ధరించేటప్పుడు వాటి పేరు తీసుకునేవారు మరియు ఈ విధంగా ప్రార్థించేవారు:-
అల్లాహుమ్మ అంత కసౌతనీహి హాజల్ ఖమీసి అవిర్రిదాఇ అవిల్ అమామహ్,అస్అలుక ఖైరిహీ వ ఖైర మా సునిఅ లహూ వ అఊజుబిక మిన్ షర్రిహీ వషర్రి మాసునిఅ లహ్. (అబూదావూద్ 4020).
(ఓ అల్లాహ్!నీవే నాకు ఈ చొక్కా, లేదా దుప్పటి లేదా తలపాగా తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో ఆ మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో ఆ కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).
14- ఆయన చొక్కాను కుడివైపు నుండి ధరించేవారు.
15- ఆయన దువ్వుకునేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు, వుజూ లేదా తహారత్ (శుభ్రత) పొందేటప్పుడు, మరియు ఏదైనా వస్తువుని ఇవ్వడం మరియు తీసుకోవడంలో కుడి వైపు నుండి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు.
16- తుమ్ము వచ్చినప్పుడు ఆయన చేయి లేదా వస్త్రాన్ని ముఖంపై అడ్డుగా పెట్టుకునే వారు మరియు తమ స్వరాన్ని తగ్గించేసేవారు.
17- ఆయన ముసుగు వేసుకున్న యువ కన్యల కంటే ఎక్కువ సిగ్గుపడేవారు.
18- ఆయన పరిహసించే మాటలపై నవ్వే వారు కూడా!..అయితే ఆయన నవ్వడం అధికంగా చిరునవ్వు తో ఉండేది. ఆయన అధికంగా నవ్వినప్పుడు ఆయన చిగుళ్ళు కనపడేవి. ఆయన ఏడవడం కూడా నవ్వడం మాదిరిగానే ఉండేది ఎలాగైతే ఆయన పగలబడి నవ్వే వారు కాదు అలానే వారు వెక్కి వెక్కి ఏడ్చేవారు కాదు. అయితే ఆయన కళ్ళ నుండి కన్నీరు కారేది. మరియు ఆయన హృదయం నుండి (ఏడ్చే) శబ్దం వినబడేది.న
ప్రవక్త విధానం: అనుమతి తీసుకోవడం, సలాం చేయడంలో
1- ఆయన ఏదైనా తెగ వద్దకు పోతే వారికి సలాం చేసేవారు.మరియు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళేవారు.మరియు ప్రజలకు సలాం ను వ్యాప్తి చేయమని ఆజ్ఞాపించేవారు.
2- ఆయన ఇలా అన్నారు:- చిన్నవాడు పెద్దవానికి సలాం చేయాలి, మరియు బాటసారి కూర్చొని ఉన్న వ్యక్తి కి, మరియు స్వారీ పై ప్రయాణం లో ఉన్నవాడు కాలినడక నడిచే వానికి, మరియు తక్కువ మంది ఎక్కువ మందికి సలాం చేయాలి.
3- ఆయన ఎవరినన్నా కలిసినప్పుడు ముందుగా సలాం చేసేవారు మరియు ఆయనకి ఎవరైనా సలాం చేస్తే అదేవిధంగా.. లేకపోతే అంతకంటే ఉత్తమంగా వెంటనే బదులు ఇచ్చేవారు. కానీ ఏదన్నా కారణం ఉదా :- నమాజ్,మల మూత్ర విసర్జన సమయంలో వెంటనే ఇచ్చేవారు కాదు.
4- ఆయన ప్రారంభంలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనేవారు మరియు ఆయన మొదలుపెట్టే అతను అలైకస్సలాం అని మొదలుపెట్టడాన్ని అయిష్జపడేవారు.ఆయన సలాం కి జవాబుగా వఅలైకస్సలాం అని వావ్(మరియు ) తో ఇచ్చేవారు.
5- ఆయన విధానం ఏమనగా ప్రజలు అధికంగా ఉన్నప్పుడు ఒక్కసారి సలాం చేయడం వలన అందరికీ చేరదు అనుకున్నప్పుడు ఆయన మూడు సార్లు సలాం చేసేవారు.
6- ఆయన విధానం ఏమనగా మస్జిద్ లోనికి ప్రవేశించే వారు ముందుగా తహియ్యతుల్ మస్జిద్ నమాజు చేయాలి ఆ తర్వాత ప్రజల వద్దకు వచ్చి సలాం చేయాలి.
7- ఆయన చేయి, తల, వేళ్ళ సైగలతో ఎవరికీ సలాం జవాబు ఇచ్చేవారు కాదు.కానీ నమాజులో ఉన్నప్పుడు తప్ప.. అప్పుడు ఆయన సైగలతో జవాబు ఇచ్చేవారు.
8- పిల్లల ఉన్న దారి గుండా వెళితే వారికి సలాం చేసేవారు. అదేవిధంగా స్త్రీలు ఉన్న దారిలో ప్రవేశించినా సలాం చేసేవారు.మరియు సహాబాలు కూడా జుమా నమాజు తరువాత వాపసు వస్తుండగా దారిలో ఉన్న ముసలామెకు సలాం చేసేవారు.
9- ఆయన ఇతరులకు సలాం పంపేవారు. మరియు ఇతరులు పంపిన సలాం ను కూడా స్వీకరించేవారు. ఆయన ముందు ఎవరన్నా వేరొకరి సలాంను ప్రస్తావిస్తే ఆయన ముందు సలాం తెచ్చిన అతని పై మరియు పంపిన వాని పై సలాం చేసేవారు.
10- ఆయనను ఇలా ప్రశ్నించడం జరిగింది:- ఒక వ్యక్తి అతని సహోదరుడుని కలుసుకున్నప్పుడు అతని కొరకు వంగవచ్చునా? దానికి ఆయన లేదని సమాధానమిచ్చారు. మరి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది అతనిని వాటేసుకుని చుంబించవచ్చునా? దానికి కూడా ఆయన లేదని సమాధానం ఇచ్చారు. పిదప ఇలా అడగడం జరిగింది అతనితో కరచాలం చేయవచ్చునా? దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు (తిర్మీజి)
11- ఆయన తన ఇంటి వారి వద్దకు వారు ఉచ్చులో పడే విధంగా(ఇబ్బంది కరంగా)అకస్మాత్తుగా వచ్చేవారు కాదు. ఆయన ప్రవేశించగానే సలాం చేసేవారు మరియు వారి స్థితిగతులను తెలుసుకునేవారు
12-ఆయన రాత్రి వేళలో తమ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఏ విధంగా సలాం చేసేవారు అంటే మేలుకొని ఉన్నవాడు వినేలా మరియు నిద్రపోయి ఉన్నవాడు తొందరపడి మేలుకోకుండా ఉండేలా చేసేవారు.
13- ఆయన విధానం ఏమనగా ఎప్పుడైతే అనుమతి అందించే వానితో నీవు ఎవరు ? అని అడగబడుతుందో అప్పుడు ఆయన ఫలానా గారి అబ్బాయి ఫలానా ని,లేదా తమ బిరుదు ని తెలిపేవారు అంతేకానీ “నేను నేను” అనేవారు కాదు.
14- ఆయన ఇతరుల వద్దకు వెళ్ళినప్పుడు మూడుసార్లు అనుమతిని అర్జించేవారు ఒకవేళ మూడుసార్లు తర్వాత కూడా అనుమతి లభించకపోతే తిరిగి వచ్చేసేవారు.
15-ఆయన సహాబాలకు అనుమతిని అర్జించేముందు సలాం చేయమని బోధించేవారు.
16-ఆయన ఎవరి ద్వారం వద్దనైనా వెళితే దానికి తిన్నగా నిలబడే వారు కాదు బదులుగా కుడి లేదా ఎడమ వైపు నిలబడేవారు. మరియు ఇలా అనేవారు:- అనుమతిని అర్థించడం కనుచూపు పడడం నుండి కాపాడుకోవడం కొరకే (ముత్తఫఖున్ అలైహి)
21- ఆయన విధానం: సంభాషణ, నిశ్శబ్దం, నాలుకను సంరక్షించుకోవడం మరియు పదాలు, పేర్లు ఎంచుకోవడంలో
1-ఆయన చాలా అనర్గళంగా మరియు మధురమైన మాట గలవారు.ఉఛ్ఛారణ లో అందరికంటే వేగంగా మరియు సంభాషణలో మధురమైనవారు.
2- ఆయన సుదీర్ఘంగా మౌనం వహించే వారు. కేవలం అవసరం కలిగినప్పుడే మాట్లాడేవారు.మరియు వ్యర్థమైన,అనవసర మాటల నుండి దూరం పాటించేవారు.ఆయన కేవలం పుణ్యం ఆశించే విషయాలలోనే మాట్లాడేవారు.
3- ఆయన సమగ్రంగా మాట్లాడేవారు. ఆయన మాటలు లెక్కించగలవాడు లెక్కించగలిగేంతగా చాలా స్పష్టంగా ఉండేవి.ఆయన మాటలు గుర్తుపెట్టుకోకపోయేంత వేగంగా ఉండేవి కావు.అలాగే ఎక్కువగా ఆగి ఆగి మాట్లాడేవారు కూడా కాదు.
4- ఆయన తమ ప్రసంగం లో , మరియు అనుచర సమాజిని అత్యున్నత జ్ఞానం బోధించడంలో ఉత్తమమైన మరియు సరైన పదాలు పదాలను ఎంచుకునేవారు..ఏవైతే కాఠిన్యానికి , అసభ్యకరమైన మాటల నుండి దూరంగా ఉంటాయో.
5- ఆయన ఏదైనా మంచి పదాన్ని దాని అర్హతలేని వాడి కొరుకు, మరియు చెడు పదాన్ని మంచి వ్యక్తి కోసం ఎంచుకునేవారు కాదు.కావున, కపటులను సయ్యద్(సర్దారు )అని మరియు అబూ జహల్ ను అబుల్ హకమ్ (తెలివైనవాడు)అని అనడం నుండి వారించారు.మరియు సుల్తాన్ కొరకు మాలికుల్ ముల్క్ మరియు ఖలీఫతుల్లాహ్ అనడం నుండి వారించారు.
6- ఆయన ఇలా అన్నారు:- ఎవరిపై అన్నా షైతాన్ ప్రభావం ఉంటే అతను బిస్మిల్లాహి అని చదవాలి.మరియు షైతానును శపించకూడదు.మరియు షైతాన్ నాశనం అవ్వాలి అని ఇలాంటి పదాలతో శపించకూడదు.
7- ఆయన ఉత్తమమైన పేర్లను ఇష్టపడేవారు. మరియు ఇలా అన్నారు :-మీ వద్దకు ఎప్పుడైనా రాయబారి ని పంపించడం జరిగితే అతని రూపం మరియు పేరు చక్కగా ఉండాలి. ఆయన పేర్ల నుండి అర్థాలను గ్రహించి పేర్లు మరియు ఆ వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వారు .
8- ఆయన ప్రవచనం:- అల్లాహ్ దృష్టిలో అన్నిటికంటే ఇష్టమైన పేరు అబ్దుల్లాహ్ మరియు అబ్దుర్రహ్మాన్ . మరియు అందరికంటే సత్యసంధులు హారిస్ మరియు హమ్మామ్. మరియు అన్నిటికంటే చెడ్డ పేర్లు హరబ్ మరియు ముర్రహ్
9- ఆయన ఆసియా అనే పేరును మార్చి జమీలహ్ అని పెట్టారు.మరియు అస్రమ్ ను జరిఅ గా మార్చారు. మరియు ఆయన మదీనా లో ప్రవేశించిన తర్వాత దాని పాత పేరు యస్రిబ్ ను తీసివేసి తయ్యిబహ్ పెట్టారు.
11- ఆయన సహాబాలకు మరియు చిన్న పిల్లలకు కున్నియత్ ను ఎంచేవారు (ఇచ్చేవారు).ఆయన తమ భార్యల్లో కొందరికి కూడా కున్నియత్ (స్వంత పేరు)ఇచ్చారు.
12- ఆయన విధానం ఏమనగా ఆయన పిల్లలు కలవారికి మరియు పిల్లలు లేని వారికి ఇద్దరికీ కూడా కున్నియత్ ఇచ్చేవారు. మరియు ఇలా తెలిపేవారు నా పేరు ద్వారా మీరు కూడా పేరు పెట్టుకోండి కానీ నా కున్నియత్ ను ఎంచుకోకండి.
ఆయన అషా అనే పేరుని వదిలి ఉత్మా అని పిలవడాన్నుండి వారించారు.మరియు ద్రాక్ష ను కర్మ్ అనడం నుండి కూడా వారించారు.మరియు ఇలా తెలిపారు:- కర్మ్ అనేది విశ్వాసి హృదయం
13-ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు..దాసుడు ఈ నక్షత్రం మూలంగానే వర్షం కురిసింది అని అనడం నుండి వారించారు మరియు అల్లాహ్ ఏదైతే తలిచాడో అదే విధంగా మీరు ఏదైతే తలిచారో అని అనడం నుండి, మరియు అల్లాహ్ యేతరల పై వాగ్దానం చేయడం నుండి, మరియు అత్యధికంగా ప్రమాణాలు చేయడం నుండి కూడా వారించారు. మరియు “ఇతను ఇలా చేశాడు కాబట్టి ఇతను యూదుడు” అని అనడం నుండి మరియు సర్దార్ తన రాజ్యంలోని వారందరినీ “మీరు నా దాసులు మరియు దాసీలు” అనడం నుండి మరియు “నా అంతరాత్మ (మనసు) మలీనమైపోయింది” అని మరియు “షైతాన్ పాడుగాను” అని అదే విధంగా “ఓ అల్లాహ్ నీవు తలుచుకుంటే నన్ను క్షమించు” అని ఇలాంటి పదాలు వాడడం నుండి వారించారు.
14- ఆయన కాలం, గాలి, జ్వరం మరియు కోడిని తిట్టడం నుండి అలాగే అజ్ఞానపు కూతలు కూయడం నుండి వారించారు. అనగా తెగలను పిలవడం మరియు వారి పట్ల పక్షపాతం చూపడం వంటివి మొదలగు.మ
([1]) జాదుల్ మఆద్ 1/163
([2]) జాదుల్ మఆద్ 1/192
([3]) జాదుల్ మఆద్ 1/163
[4] తన్ఈమ్ అంటే మక్కా నుండి మదీనా దారిలో హరం యొచ్చ చివరి హద్దు
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం)
పలస్తీనాలో ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) సందేశాన్ని కొందరు విశ్వసించారు. సత్య సందేశాన్ని స్వీకరించారు.
సారాకు సంతానం కలుగలేదు. ఆమెకు వయసు పైబడింది. పిల్లలు కలిగే వయసు దాటిపోయింది. తన భర్తకు ఒక పిల్లవాడిని ఇవ్వలేకపోయానని ఆమె బాధపడేవారు. అందువల్ల తమ సేవకురాలు హాజిరాను పెళ్ళి చేసుకోవలసిందిగా ఆమె భర్తను కోరారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈ సలహా మన్నించారు. హాజిరాను వివాహం చేసుకున్నారు. హాజిరాకు ఒక కుమారుడు, ఇస్మాయీల్ (అలైహిస్సలాం) జన్మిం చారు. ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) చాలా సంతోషించారు. ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ను అమి తంగా ప్రేమించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“ఆ తరువాత ఇబ్రాహీమ్ ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా పగులగొట్టాడు. అయితే పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచి దానివైపు పెట్టాడు. వారంతా మరలటానికే (అలా చేశాడు). ” (ఖుర్ఆన్ 21: 58)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో] https://youtu.be/cbP4rt3rO4Q [43 నిముషాలు] ముహమ్మద్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ)
[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]
ప్రవక్త సాలిహ్ (అలైహిస్సలాం) (సమూద్ జాతి ప్రజలు వారి విశిష్ట ఒంటె)
సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు…… “మీరు దేవుని ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ల వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు. కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి(చంపేశారు). (ఖుర్ఆన్ 91 : 11-14).
సమూదు (జాతి) వారు తమ పొగరు మూలంగా (వారి ప్రవక్తను) ధిక్కరించారు.అప్పుడు వారిలోని ఒక పెద్ద దౌర్భాగ్యుడు (వారి తలబిరుసుపోకడలకు సారధిగా) నిలబడ్డాడు.“మీరు అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె విషయంలో, దాని నీళ్ళ వంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి” అని దైవప్రవక్త వారిని హెచ్చరించాడు..కాని వారు మాత్రం తమ ప్రవక్త (మాటల)ను త్రోసిపుచ్చి, దాని గిట్టెలను నరికి (చంపేశారు). అంతే! వారి ప్రభువు వారి దురాగతాల కారణంగా వారిపై వినాశాన్ని పంపాడు. వారందరినీ సమానం (నేలమట్టం) చేశాడు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర https://youtu.be/aog37XDhX8c [33 నిముషాలు] వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ప్రవక్త ఇద్రీస్ (అలైహిస్సలాం) జీవిత చరిత్రను వివరిస్తారు. ఆదం (అలైహిస్సలాం) మరియు వారి కుమారులైన ఖాబిల్ మరియు హాబిల్ కథను పునశ్చరణ చేస్తూ, హాబిల్ హత్య తర్వాత ఖాబిల్ తన తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడని గుర్తుచేస్తారు. ఆదం (అలైహిస్సలాం) తర్వాత, ఆయన కుమారుడు షీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా నియమించబడ్డారు. షైతాన్ ఖాబిల్ యొక్క మార్గభ్రష్టులైన సంతానం వద్దకు మానవ రూపంలో వచ్చి, వారిని సంగీతం (ఫ్లూట్) ద్వారా మభ్యపెట్టి, అశ్లీలత మరియు వ్యభిచారంలోకి నెట్టాడు. ఈ పాపం పెరిగిపోయినప్పుడు, అల్లాహ్ ఇద్రీస్ (అలైహిస్సలాం)ను ప్రవక్తగా పంపారు. ఆయన పాపులను హెచ్చరించి, మానవ చరిత్రలో మొదటిసారిగా దైవ మార్గంలో యుద్ధం (జిహాద్) చేశారు. ఇద్రీస్ (అలైహిస్సలాం) మొట్టమొదటిగా కలం ఉపయోగించిన మరియు బట్టలు కుట్టిన వ్యక్తి అని చెప్పబడింది. ఖురాన్ మరియు హదీసులలో ఆయన ఉన్నత స్థానం గురించి ప్రస్తావించబడింది, ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మే’రాజ్ యాత్రలో ఆయనను నాలుగవ ఆకాశంలో కలిశారు. ఈ కథ నుండి, షైతాన్ యొక్క కుతంత్రాలు, సంగీతం యొక్క చెడు ప్రభావం, మరియు పరాయి స్త్రీ పురుషులు ఏకాంతంగా ఉండటం యొక్క నిషేధం వంటి పాఠాలు నేర్చుకోవాలని వక్త ఉద్బోధిస్తారు.
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్. నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ అస్హాబిహి అజ్మయీన్
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వ లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి.
ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.
సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.
أَسْلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ (అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు) మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక
ఈనాటి ప్రసంగంలో మనం ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రను తెలుసుకుందాం. అయితే, మాట ప్రారంభించడానికి ముందు ఒక విషయం వైపుకు మీ దృష్టి మరలించాలనుకుంటున్నాను. అదేమిటంటే, ఇంతకుముందు జరిగిన ప్రసంగంలో మనం ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం వారి పుట్టుక గురించి, ఆయన భూమండలం మీద దిగడం గురించి, భూమి మీద ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహస్సలాం వారు ఇద్దరూ జంటగా నివసించటము, వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సంతానము ప్రసాదించటము, ఈ విషయాలన్నీ వివరంగా ఆదం అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో విన్నాం.
ఆ ప్రసంగంలో నేను ప్రసంగిస్తూ ప్రసంగిస్తూ ఒకచోట ఏమన్నానంటే, ఆదం అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 మంది సంతానాన్ని కల్పిస్తే వారిలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఖాబిల్, మరొకరు హాబిల్. వారిద్దరి మధ్య పెళ్ళి విషయంలో గొడవ జరిగింది. ఆ తర్వాత ఖాబిల్ అన్యాయంగా హాబిల్ ని హతమార్చేశాడు. హతమార్చిన తర్వాత, హత్య చేసేసిన తర్వాత అతను తల్లిదండ్రుల వద్ద నుండి దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు అన్న విషయము నేను ప్రస్తావించాను.
అది మనము ఇప్పుడు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రసంగంలో ఇన్ షా అల్లాహ్, ఆ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిపోయిన ఖాబిల్ గురించి చర్చ వస్తుంది కాబట్టి.
ఖాబిల్ సంతానం & షైతాన్ కుతంత్రం
ఖాబిల్ హంతకుడు. నేరం చేశాడు. తన సోదరుడిని హతమార్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్ద నేరస్తుడుగా, అవమానంగా ఉండటానికి ఇష్టపడక అక్కడి నుండి అతను దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు.
చరిత్రకారులు, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారం, ఆదం అలైహిస్సలాం మరియు ఆదం అలైహిస్సలాం వారి సంతానము పర్వతాలకు సమీపంలో నివసించేవారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ సృష్టి ప్రారంభంలో, మానవ చరిత్ర ప్రారంభంలో మానవులను ఆ విధంగా జీవించడానికి సౌకర్యం కల్పించగా, వారు పర్వతాలకు సమీపంలో జీవించసాగారు, నివసించసాగారు.
అయితే, ఈ ఖాబిల్ నేరం చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత ఆ ప్రదేశాన్ని విడిచేసి దూరంగా మైదానంలో వెళ్ళి స్థిరపడిపోయాడు. అంటే కొండ పర్వతాలకు సమీపంలో ఉండకుండా మైదానంలో వెళ్ళి అతను అక్కడ స్థిరపడిపోయాడు. అతని జీవితం అక్కడ సాగుతూనే ఉంది. అక్కడ అతనికి సంతానము కలిగింది. ఆ సంతానోత్పత్తిలో అక్కడ ఆ రకంగా పూర్తి ఒక జాతి సృష్టించబడింది.
ఇటు ఆదం అలైహిస్సలాం వారు జీవించినంత కాలం వారి సంతానానికి తండ్రిగాను, ఒక ప్రవక్తగా, బోధకునిగాను సత్ప్రవర్తన నేర్పించి, మంచి గుణాలు నేర్పించి, దైవ భక్తి మరియు దైవ నియమాలు నేర్పించి, ఆ తర్వాత ఆయన మరణించారు. ఆదం అలైహిస్సలాం వారు మరణించిన ఒక సంవత్సరానికి హవ్వా అలైహిస్సలాం వారు కూడా మరణించారు. ఈ విధంగా ఒక సంవత్సర వ్యవధిలోనే ఆది దంపతులు ఇద్దరూ మరణించారు.
అయితే, ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం, ఆదం అలైహిస్సలాం వారి బిడ్డలకు దైవ నియమాలు నేర్పించే బాధ్యత షీస్ అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఆదం అలైహిస్సలాం వారి కుమారులలోనే ఒక కుమారుడు షీస్ అలైహిస్సలాం.
షీస్ అలైహిస్సలాం వారికి హవ్వా అలైహిస్సలాం ఆ పేరు ఎందుకు నిర్ణయించారంటే, ఎప్పుడైతే హాబిల్ హతమార్చబడ్డాడో, ఒక బిడ్డను కోల్పోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వెంటనే హవ్వా అలైహిస్సలాం వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. అప్పుడు ఆమె, “నా ఒక బిడ్డ మరణించిన తర్వాత అల్లాహ్ నన్ను ఒక కానుకగా మరొక కుమారుడిని ఇచ్చాడు కాబట్టి ఇతను నాకు అల్లాహ్ తరపు నుంచి ఇవ్వబడిన కానుక” అంటూ, అల్లాహ్ కానుక అనే అర్థం వచ్చేటట్టుగా షీస్ అని ఆయనకు పేరు పెట్టారు, నామకరణం చేశారు.
అంటే ప్రతి బిడ్డ అల్లాహ్ కానుకే, కానీ ఆ సందర్భంలో ఎప్పుడైతే ఒక కుమారుడిని కోల్పోయారో, మరొక కుమారుడిని అల్లాహ్ వెంటనే ప్రసాదించాడు కాబట్టి, ఆ విధంగా ఆమె తలచి అతనికి షీస్ అని నామకరణం చేశారు. ఆ విధంగా ఆయన పేరు షీస్ అని పడింది.
ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ప్రవక్త పదవిని ఇచ్చాడు. ఆదం అలైహిస్సలాం కూడా మరణించే ముందే షీస్ వారిని దైవ నియమాలు ఎలా బోధించాలన్న విషయాలు వివరించారు. ఆదం అలైహిస్సలాం వారి మరణానంతరం షీస్ అలైహిస్సలాం ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తానికి దైవ వాక్యాలు వినిపించేవారు, దైవ విషయాలు, దైవ నియమాలు బోధించేవారు.
ఇదిలా ఉండగా, ఇప్పుడు షైతాను తన పని ప్రారంభించాడు. అతనేం చేశాడంటే, అతను దూరం నుంచి గమనించాడు. ఆదం అలైహిస్సలాం వారి సంతానం మొత్తం అటు అటవీ ప్రాంతంలో నివసిస్తూ ఉంది. వారిలో ప్రవక్త ఉన్నారు, బోధకులు ఉన్నారు, దైవ నియమాలు నేర్పిస్తున్నారు. వారందరూ భక్తి శ్రద్ధలతో జీవించుకుంటున్నారు. కానీ ఈ ఖాబిల్ మాత్రము దూరంగా వెళ్ళి స్థిరపడిపోయాడు. అతని సంతానము అతని సంతానము కూడా అక్కడనే పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తి ఒక జాతి అటువైపు స్థిరపడిపోయింది. అటు ఆ జాతి కూడా పెరుగుతూ ఉంది. ఇటు ఆదం అలైహిస్సలాం వారి సంతానము కూడా పెరుగుతూ ఉంది.
అప్పుడు షైతాను, ఇక్కడ ప్రవక్తలు లేరు, ఖాబిల్ నివసిస్తున్న చోట, ఖాబిల్ జాతి నివసిస్తున్న చోట బోధకులు లేరు అని గమనించాడు. అప్పుడు అతను ఒక మానవ అవతారం ఎత్తి మనుషుల మధ్యకి ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళిపోయాడు. ఖాబిల్ జాతి వద్దకు వెళ్ళి చూస్తే, వారిలో అసభ్యత, అశ్లీలత, దురాచారాలు చాలా ఎక్కువగా చూశాడు. అప్పుడు అతను అనుకున్నాడు, “నాకు సరైన ప్రదేశం ఇది, నాకు కావలసిన స్థలము ఇదే” అని అతనికి తోచింది.
ఆ తర్వాత అతను అక్కడే స్థిరపడిపోయి, ఆ తర్వాత అతను ఏం చేశాడంటే, ఒక ఫ్లూట్ తయారు చేశాడు. ఇక్కడి నుంచి గమనించండి, ఎలా షైతాన్ మానవులను నెమ్మదిగా తప్పు దోవకి నెట్టుతాడో. ఒకేసారి సడన్గా ఒక పెద్ద నేరంలోకి నెట్టేయడు. నెమ్మదిగా, క్రమంగా, క్రమంగా వారిని నెట్టుకుంటూ నెట్టుకుంటూ తీసుకొని వెళ్ళి ఒక పెద్ద పాపంలోకి, ఊబిలోకి నెట్టేస్తాడు. అలా ఎలా చేస్తాడో గమనించండి ఒకసారి.
ఒక ఫ్లూట్ తయారు చేశాడండి. ఒక ఫ్లూట్ తయారు చేసిన తర్వాత, ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజుల్లో కరెంటు, అలాగే టీవీలు, ఇతర విషయాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక వ్యక్తి సాయంకాలము కూర్చొని ఏదైనా కథ చెప్తున్నాడంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. లేదు ఏదైనా ఒక విన్యాసము చేసి చూపిస్తున్నాడు అంటే ప్రజలందరూ అతని వద్ద గుమిగూడతారు. అలా జరిగేది. మన చిన్ననాటి రోజుల్లో కూడా మనం ఇలాంటి కొన్ని విషయాలు చూశాం.
అదే విధంగా ఆ రోజుల్లో అతను ఏం చేసేవాడంటే, ఫ్లూట్ తయారు చేసి సాయంత్రం పూట ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యి అతని వద్ద వచ్చి గుమిగూడేవారు. ఒక రోజు కొంతమంది వచ్చారు. తర్వాత రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూ పోయింది, పెరుగుతూ పోయింది.
అది గమనించిన షైతాను వారికి ఒక పండగ రోజు కూడా నిర్ణయం చేశాడు తన తరపు నుంచే. చూడండి. ఆ పండగ రోజు అయితే మరీ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడేవారు. అప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా వారి కలయిక జరిగేది. అప్పుడు అతను బాగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ శబ్దానికి వారు ఉర్రూతలూగిపోయేవారు.
అయితే, ఇది ఇలా జరుగుతూ ఉండగా, అటు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ఒక రోజు అనుకోకుండా ఇటువైపు వచ్చేసాడు.వచ్చి చూస్తే ఇక్కడ నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు అనేటివి ఏమీ లేవు. విచ్చలవిడితనం ఎక్కువ ఉంది. అశ్లీలత ఎక్కువ ఉంది. ఆడ మగ కలయికలు ఎక్కువ ఉన్నాయి. ఎవరికీ ఎలాంటి కట్టుబాట్లు లేవు, నిబంధనలు లేవు, సిగ్గు, లజ్జ, మానం అనే బంధనాలే లేవు. అదంతా అతను చూశాడు. అక్కడ ఉన్న మహిళల్ని, అమ్మాయిల్ని కళ్ళారా చూశాడు. వారి అందానికి ఇతను కూడా ఒక మైకంలోకి దిగిపోయాడు.
తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, ఒక రోజు వచ్చాడు, ఇక్కడ జరుగుతున్న విషయాలు, ఆ ఫ్లూట్ వాయించడము, ప్రజలందరూ అక్కడ గుమిగూడటము, వారందరూ కేరింతలు పెట్టడము, ఇదంతా గమనించి అతను వారి అందానికి ప్రభావితుడయ్యి వెళ్ళిపోయి తన స్నేహితులకు ఆయన్ని తెలియజేశాడు. చూడండి. ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విషయాలను గమనించాడు, వెళ్ళి తన స్నేహితులకు చెప్పగా వారిలో కూడా కోరిక పుట్టింది. ప్రతి వ్యక్తితో షైతాన్ ఉన్నాడు కదా లోపల, చెడు ఆలోచనలు కలిగించడానికి.
వారిలో కూడా కోరిక పుట్టగా, వారు కూడా రహస్యంగా ఎవరికీ తెలియకుండా వారు కూడా ఒక రోజు వచ్చారు. వారు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలను చూసి, ఆ మహిళల అందానికి వారు కూడా ప్రభావితులయ్యారు. ఆ విధంగా ముందు ఒక వ్యక్తి, ఆ తర్వాత అతని స్నేహితులు, వారి స్నేహితుల స్నేహితులు, ఈ విధంగా అటు అటవీ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో నివసిస్తున్న వారు కూడా కొద్దిమంది కొద్దిమంది రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు కూడా ఇటువైపు వచ్చి వీరితో పాటు కలిసిపోవడం ప్రారంభించారు.
ఈ విధంగా వారి రాకపోకలు ఏర్పడ్డాయి. అటు కొత్త కొత్త మహిళలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాల తర్వాత అక్రమ సంబంధాలకు దారి తీశాయి. ఆ తర్వాత, ఆ అక్రమ సంబంధాల వద్దనే షైతాను వారిని వదిలిపెట్టలేదు. వ్యభిచారం అనే ఊబిలోకి పూర్తిగా నెట్టేశాడు. వ్యభిచారం విచ్చలవిడితనం ప్రారంభమైపోయింది. కొద్ది మంది అయితే ప్రతి రోజూ రావటము, వెళ్ళటం ఎందుకండి, ఇక్కడే స్థిరపడిపోతే పోదు కదా అని ఎవరిలో అయితే భక్తి లోపం ఉందో, బలహీనత ఉందో వారైతే ఆ ప్రదేశాన్నే త్యజించేసి ఏకంగా వచ్చి ఇక్కడే మైదానంలో స్థిరపడిపోయారు.
ఆ విధంగా షైతాన్ ఒక్క ఫ్లూట్ సాధనంతో ప్రజల్లో వ్యభిచారాన్ని ప్రారంభం చేశాడు. అందుకోసమే ఒక్క విషయం గమనించండి. ధార్మిక పండితులు ఒక మాట తెలియజేశారు అదేమిటంటే “అల్-గినావు మిఫ్తాహుజ్జినా” అనగా సంగీతము వ్యభిచారానికి తాళం చెవి లాంటిది. ఇక్కడ ప్రజల మధ్య, ఇతర పురుషుల, మహిళల మధ్య అక్రమ సంబంధం ఎలా ఏర్పడింది? ఏ విషయం వారికి ఆకర్షితులు చేసింది? మ్యూజిక్, ఫ్లూట్ శబ్దం. దానినే మనము మ్యూజిక్ అనొచ్చు, సంగీతము అనొచ్చు. కదండీ. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇన్నష్షైతాన యజ్రీ ఫిల్ ఇన్సాని మజ్రద్దమ్.” షైతాన్ మనిషి నరనరాలలో నడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి ఆ సంగీతాన్ని వింటాడో, మ్యూజిక్ వింటాడో, అతనిలో ఉన్న షైతాను నాట్యం చేస్తాడు. అప్పుడు మనిషి కూడా ఉర్రూతలూగిపోతాడు, అతని ఆలోచనలు కూడా చెల్లాచెదురైపోతూ ఉంటాయి. కాబట్టి సంగీతం అల్లాహ్ కు ఇష్టం లేదు. షైతానుకు ప్రియమైనది, ఇష్టమైనది. కాబట్టి అదే పరికరాన్ని అతను తయారు చేశాడు, దాన్నే సాధనంగా మార్చుకొని ప్రజల్లో అతను లేని ఒక చెడ్డ అలవాటుని సృష్టించేశాడు.
ఇద్రీస్ (అలైహిస్సలాం) ప్రవక్తగా రాక
షీస్ అలైహిస్సలాం ఆ రోజుల్లో ప్రవక్తగా ఉంటున్నప్పుడు వారు జాతి వారికి చాలా రకాలుగా వారిని హెచ్చరించారు, దైవ విషయాలు తెలియజేసినప్పటికిని వారు షీస్ అలైహిస్సలాం వారి మాటను గ్రహించలేకపోయారు. షీస్ అలైహిస్సలాం వారి మాటను పడచెవిన పెట్టేశారు. చివరకు ఏమైందంటే, షీస్ అలైహిస్సలాం వారి మరణం సంభవించింది. షీస్ అలైహిస్సలాం వారి మరణానంతరం దైవ భీతితో జీవిస్తున్న వారి సంఖ్య రాను రాను క్షీణిస్తూ పోయింది. వ్యభిచారానికి, అశ్లీలానికి ప్రభావితులైన వారి సంఖ్య రాను రాను పెరుగుతూ పోయింది. అప్పుడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరొక ప్రవక్తను, మరొక బోధకుడిని పుట్టించాడు. ఆయన పేరే ఇద్రీస్ అలైహిస్సలాం.
ఇద్రీస్ అలైహిస్సలాం ఈజిప్ట్ (మసర్)దేశంలో జన్మించారని కొంతమంది చరిత్రకారులు తెలియజేశారు. మరి కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే, లేదండీ, ఆయన బాబుల్, బాబిలోనియా నగరంలో జన్మించారు, ఆ తర్వాత వలస ప్రయాణం చేసి ఆయన మసర్, ఈజిప్ట్ కి చేరుకున్నారు అని తెలియజేశారు. ఏది ఏమైనాకి, ఏది ఏమైనప్పటికీ ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశంలో, మసర్ దేశంలో నివసించారన్న విషయాన్ని చరిత్రకారులు తెలియజేశారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త పదవి ఇవ్వగా, ఇద్రీస్ అలైహిస్సలాం ఎవరైతే వ్యభిచారంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని దైవ శిక్షల నుండి హెచ్చరించారు. దైవ నియమాలను తెలియజేశారు. పద్ధతి, సిగ్గు, లజ్జ, సంస్కారం అనే విషయాలు వారికి వివరించి తెలియజేశారు.
దైవ నియమాలకు ఎలా కట్టుబడి, ఎలా సౌశీల్యవంతులుగా జీవించుకోవాలన్న విషయాన్ని వారు వివరించి మరీ తెలియజేయగా చాలా తక్కువ మంది మాత్రమే తప్పును గ్రహించి, పశ్చాత్తాపపడి, తప్పును, నేరాన్ని ఒప్పుకొని అల్లాహ్ సమక్షంలో క్షమాభిక్ష వేడుకొని మళ్ళీ భక్తి వైపు వచ్చేశారు. కానీ అధిక శాతం ప్రజలు మాత్రము తమ తప్పుని అంగీకరించలేదు, తమ తప్పుని వారు అంగీకరించటం అంగీకరించకపోవడమే కాకుండా దానిని విడనాడలేదు, దానిని ఒక సాధారణమైన విషయంగా భావిస్తూ అలాగే జీవితం కొనసాగించడం ప్రారంభం చేశారు.
చాలా సంవత్సరాల వరకు ఇద్రీస్ అలైహిస్సలాం వారికి దైవ వాక్యాలు వినిపిస్తూ పోయారు, బోధిస్తూ పోయారు, తెలియజేస్తూ పోయారు కానీ ఫలితం లేకపోయేసరికి అల్లాహ్ ఆజ్ఞతో ఇద్రీస్ అలైహిస్సలాం తమ వద్ద ఉన్న విశ్వాసులను, దైవ భీతిపరులను, భక్తులను తీసుకొని, దైవ నియమాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి మీద యుద్ధం ప్రకటించారు.
మానవ చరిత్రలో, ఈ భూమండలం మీద అందరికంటే ముందు యుద్ధం ప్రారంభించిన ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ యుద్ధంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులకు, దైవ భీతిపరులకు సహాయం చేశాడు. అధర్మంగా, అన్యాయంగా, అసభ్యంగా జీవిస్తున్న వారు ఓడిపోయారు. వారు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
మిత్రులారా, యుద్ధం చేసిన తర్వాత, పాపిష్ఠులు దైవ భక్తుల చేత శిక్షించబడిన తర్వాత ఇద్రీస్ అలైహిస్సలాం మళ్ళీ ప్రజలకు దైవ భీతి, నియమాలు నేర్పించుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ విధంగా ప్రపంచంలో కొద్దిమంది దైవ భీతిపరులు మళ్ళీ దైవ భక్తిగా జీవిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా వారికి మరిన్ని విషయాలు నేర్పించాడు.
మనం చూసినట్లయితే, ఇద్రీస్ అలైహిస్సలాం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి కలం పరిచయం చేయించాడు. ఈ భూమండలం మీద, మానవ చరిత్రలో అందరికంటే ముందు కలం సృష్టించింది, ఉపయోగించింది ఇద్రీస్ అలైహిస్సలాం వారు అని చరిత్రకారులు తెలియజేశారు. అలాగే, బట్టలు కుట్టటము కూడా ఈ భూమండలం మీద అందరికంటే ముందు ఇద్రీస్ అలైహిస్సలాం వారే ప్రారంభించారు అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఆ విధంగా ఇద్రీస్ అలైహిస్సలాం వారు ఉన్నంతవరకు జనులకు, మానవులకు అనేక విషయాలు నేర్పించారు, తెలియజేశారు, దైవ వాక్యాలు కూడా వినిపించుకుంటూ జీవితం ముందుకు కొనసాగించారు.
ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ లో రెండు చోట్ల వచ్చి ఉంది. ఒకటి సూరా అంబియా, 21వ అధ్యాయం, 85వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తల పేర్లను ప్రస్తావిస్తూ ఇద్రీస్ అలైహిస్సలాం వారి పేరు కూడా ప్రస్తావించాడు. పేరు ప్రస్తావన మాత్రమే అక్కడ జరిగింది. అయితే, రెండవ చోట ఖురాన్ లోని సూరా మర్యం, 19వ అధ్యాయం, 56, 57 వాక్యాలలో ఇద్రీస్ అలైహిస్సలాం వారి గురించి ప్రస్తావిస్తూ,
“ఇంకా ఈ గ్రంథంలో ఇద్రీసు గురించిన ప్రస్తావన కూడా చెయ్యి. అతను కూడా నిజాయితిపరుడైన ప్రవక్తే.మేమతన్ని ఉన్నత స్థానానికి లేపాము.” (19:56-57)
అని తెలియజేశాడు. .ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రెండవ వాక్యంలో “వ రఫఅనాహు మకానన్ అలియ్యా” (మేము అతన్ని ఉన్నత స్థానానికి లేపాము) అని తెలియజేశాడు కదా, దాన్ని వివరిస్తూ కొంతమంది ఉల్లేఖకులు ఏమని తెలియజేశారంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి కీర్తిని పెంచాడు అని తెలియజేశారు.
మరి కొన్ని ఉల్లేఖనాలలో ఏమని తెలపబడింది అంటే, ఇద్రీస్ అలైహిస్సలాం వారు మరణం సమీపించినప్పుడు, ఆయన మరణ సమయం సమీపించిందన్న విషయాన్ని తెలుసుకొని, ఒక దైవదూత వీపు ఎక్కి ఆకాశాల పైకి వెళ్ళిపోయారు. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం దాటుకుంటూ నాలుగవ ఆకాశంలోకి చేరుకుంటే అటువైపు నుంచి ప్రాణం తీసే దూత కూడా వస్తూ ఎదురయ్యాడు. అతను ఆ దూతతో అడిగాడు, “ఏమండీ, నేను ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు తీయటానికి వస్తున్నాను. నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇద్రీస్ అలైహిస్సలాం వారి ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీయండి అని పురమాయించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది, ఆయన భూమండలం మీద కదా నివసిస్తున్నాడు, అల్లాహ్ ఏంటి నాకు నాలుగవ ఆకాశం మీద ఆయన ప్రాణము తీయమని చెప్తున్నాడు అని నేను ఆశ్చర్యపోతూ వస్తున్నాను. ఇది ఎలా ఇది ఎలా సంభవిస్తుందండి? ఇది అసంభవం కదా, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు, నాలుగో ఆకాశం మీద నేను ఆయన ప్రాణాలు ఎలా తీయగలను?” అని ఆ దూతతో అడిగితే అప్పుడు ఆ దూత అన్నాడు, “లేదండీ, అనుకోకుండా ఇద్రీస్ అలైహిస్సలాం వారు నేను ఆకాశాల పైకి వెళ్ళిపోతాను అంటూ నా వీపు మీద ఎక్కి వచ్చేసారు, చూడండి” అని చెప్పగా అప్పుడు ఆ దూత ఆయన ప్రాణాలు నాలుగవ ఆకాశం మీద తీశాడు అని కొన్ని ఉల్లేఖనాల్లో తెలపబడింది. అయితే చూస్తే ఈ ఉల్లేఖనాలన్నీ బలహీనమైనవి.కాబట్టి ఈ బలహీనమైన ఉల్లేఖనాలను మనము ఆధారంగా తీసుకోలేము. కాకపోతే ఈ బలహీనమైన విషయాలు ఎవరైనా ఎక్కడైనా బోధించవచ్చు, అది బలహీనమైన మాట అన్న విషయము మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆ విషయాన్ని వివరించాను.
ఏది ఏమైనప్పటికిని, ఇద్రీస్ అలైహిస్సలాం వారి ఆయుష్షు పూర్తి అయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు సహజ మరణమే ప్రసాదించాడు. ఆయన సహజంగానే మరణించారు.
అయితే, ఒక ప్రామాణికమైన ఉల్లేఖనం మనకు దొరుకుతుంది. అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర చేసిన ఉల్లేఖనము. ఆ ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశాల వైపు వెళ్ళినప్పుడు, మొదటి ఆకాశం మీద ఆదం అలైహిస్సలాం వారితో కలిశారు. రెండవ ఆకాశం మీద ఈసా అలైహిస్సలాం వారితో కలిశారు. మూడవ ఆకాశం మీద యూసుఫ్ అలైహిస్సలాం వారితో కలిశారు. నాలుగవ ఆకాశం మీద ఇద్రీస్ అలైహిస్సలాం తో ఆయన కలిశారు. ఇది మాత్రం ప్రామాణికమైన హదీసులలో తెలపబడి ఉంది.
ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొంతమంది ప్రవక్తలను ఆకాశాల మీద ఉంచి ఉన్నాడో, వారిలో ఇద్రీస్ అలైహిస్సలాం నాలుగవ ఆకాశం మీద ఉన్నారన్న విషయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మే’రాజ్ యాత్ర నుండి వచ్చిన తర్వాత తెలియజేశారు. కాబట్టి ఇద్రీస్ అలైహిస్సలాం ఎంతో కీర్తి పొందిన, ఉన్నతమైన, గొప్ప ప్రవక్త అన్న విషయము మనము ఈ వాక్యము ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా తెలుసుకున్నాము.
ఇక్కడ మరొక విషయం నేను చర్చించి నా మాటను ముగిస్తాను, అదేమిటంటే ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవితంలో, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి కలం ప్రవేశపెట్టినా, ఇద్రీస్ అలైహిస్సలాం మొదటిసారి బట్టలు కుట్టి ప్రజలకు తొడిగించినా, ఇద్రీస్ అలైహిస్సలాం దైవ మార్గంలో మొదటిసారి యుద్ధము చేసినా ఆ యుద్ధంలో ఆయన పొందిన మాలె గనీమత్ (యుద్ధంలో లభించిన సొత్తు) ఆ రోజుల్లో మాత్రం అది ధర్మసమ్మతము కాదు.
ఏ ప్రవక్త జీవితంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాలె గనీమత్ ని ధర్మసమ్మతము చేయలేదు. కేవలం అంతిమ ప్రవక్త, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో మాత్రమే మాలె గనీమత్ ని ధర్మసమ్మతం చేశాడు. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “ఇతర ప్రవక్తల మీద నాకు కొన్ని విషయాల ద్వారా ఆధిక్యత ప్రసాదించబడింది, అందులో ఒక విషయం ఏమిటంటే, వ ఉహిల్లత్ లి అల్ గనాయిమ్ (నా కొరకు మాలె గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది)” అని తెలిపారు.
మరి ఆ రోజుల్లో వారికి యుద్ధము తర్వాత దొరికిన సొమ్ముని వారు ఏం చేసేవారో అని ప్రశ్న కూడా రావచ్చు. దాన్ని కొన్ని ఉల్లేఖనాల ద్వారా చరిత్రకారులు ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో యుద్ధం ముగిసిన తర్వాత దొరికిన సొమ్ము అది ఒకచోట తీసుకొని వెళ్లి ఉంచితే ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ సొమ్ము మొత్తాన్ని కాల్చేసేది. ఆ సొమ్ము ఎవరికీ ధర్మసమ్మతము కాదు అని ఆ రోజుల్లో నియమ నిబంధనలు ఉండేవి అని తెలపబడింది.
నేర్చుకోవలసిన పాఠాలు
అయితే మిత్రులారా, ఇద్రీస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గ్రహించాల్సిన కొన్ని పాఠాలు ఏమిటి?
మొదటి పాఠం ఏమిటంటే, షైతాన్ మానవుని బహిరంగ శత్రువు. మానవులకు షైతాను ఎప్పటికీ స్నేహితుడు కాజాలడు. అయితే కొంతమంది మాత్రము అతన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. వారు ఎవరంటే, ఎవరైతే దైవ భీతికి దూరమైపోతున్నారో వారు మాత్రమే షైతాన్ని స్నేహితులుగా చేసుకుంటున్నారు. మరి షైతాన్ కోరుకుంటుంది ఏమిటి? షైతాను మానవులను ఎలాగైనా సరే తప్పులు చేయించి వారికి శిక్షార్హులుగా మార్చేసి నరకానికి తీసుకెళ్ళి నెట్టేయాలన్నది షైతాన్ యొక్క ప్రయత్నం.
రెండవ విషయం ఏమిటంటే, సంగీతం, మ్యూజిక్ ఇది అల్లాహ్ కు నచ్చిన విషయము కాదు. అల్లాహ్ ఇష్టపడడు. షైతానుకు నచ్చిన విషయము. కాబట్టి ఇస్లాం ధర్మం ప్రకారంగా మ్యూజిక్ నిషేధం, అధర్మమైనది. అల్లాహ్ కు నచ్చనిది. ఎవరైతే మ్యూజిక్ కి ఇష్టపడతారో వారిలో అధిక శాతం ప్రజలు, పురుషులైనా సరే, మహిళలైనా సరే, అక్రమ సంబంధానికి పాల్పడి ఉంటారు. గమనించి చూసుకోండి. అనేక సర్వేలు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.
కాబట్టి షైతాన్ మానవులలో సిగ్గు, లజ్జ, మానం అనేది దూరమైపోయి, అసభ్యత, అశ్లీలత పెరిగిపోవాలని కోరుకుంటాడు కాబట్టి మ్యూజిక్ ని ఆసరాగా చేసుకొని అతను ప్రజల్ని వ్యభిచారంలోకి నెట్టేస్తాడు. వ్యభిచారం నిషేధం, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఈ మ్యూజిక్ వ్యభిచారం దరిదాపులకు తీసుకువెళ్తున్న ఒక సాధనం కాబట్టి వ్యభిచారానికి దూరంగా ఉండమని మనకు తెలపబడింది, మరియు వ్యభిచారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళే విషయాలకు కూడా దూరంగా ఉండండి అని మనకు తెలపబడింది. “వలా తక్రబుజ్జినా” (వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి) అని కూడా చెప్పబడింది.
అలాగే, మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే, ఒక పరాయి పురుషుడు, ఒక పరాయి స్త్రీ ఏకంగా ఒకచోట ఉండరాదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో ఇద్దరు, పరాయి పురుషుడు, పరాయి మహిళ ఒకచోట ఉంటే అక్కడ మూడవ వాడు షైతాన్ ప్రవేశిస్తాడు. అతని మదిలో కూడా చెడు భావన, ఈమె మదిలో కూడా చెడు ఆలోచనలు రేకెత్తిస్తాడు. కాబట్టి అలా ఒకచోట ఉండటం ధర్మసమ్మతము కాదు.
దీనికి ఉదాహరణగా మనం చూసినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రోజు మస్జిద్ బయట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణితో మాట్లాడుతూ ఉన్నారు. అంతలోనే ఓ ఇద్దరు సహాబీలు, సహచరులు అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిద్దరిని పిలిచారు. పిలిచి, “ఏమండీ, నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఈవిడ నా సతీమణి” అని తెలియజేశారు. అది విని వారికి ఆశ్చర్యం కలిగింది, “ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరేంటి మాకు సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు? మేము మీ మీద అనుమానం చేస్తామని మీకు అనిపిస్తూ ఉందా? మేము మీ మీద ఎందుకు అనుమానం చేస్తామండి?” అన్నారు.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “షైతాను ప్రతి మనిషి శరీరంలో నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటాడు కాబట్టి, ఒకవేళ అతను మీలో ఏమైనా ఇలాంటి అనుమానం రేకెత్తిస్తాడేమోనన్న కారణంగా నేను ఆ అనుమానం మీలో రాకుడదని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని తెలియజేశారు.
అంటే, మనిషి నరనరాల్లో షైతాను ప్రవహిస్తూ ఉంటాడు, కోరికలను రెచ్చగొడతాడు, అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకాంతంలో అక్కడ ఒక మహిళతో మాట్లాడుతున్నారు కదా అన్న భావన వాటిలో కలిగిస్తాడు. కాబట్టి వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “ఈమె పరాయి మహిళ కాదు, ఈమె నా సతీమణి” అని వివరించారు.
ఇక చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రవక్తల జీవితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ, ఆ ప్రవక్తల జీవితాల ద్వారా మనకు బోధపడే విషయాలను కూడా మనము నేర్చుకుంటూ, మన విశ్వాసాన్ని పెంచుకుంటూ, అల్లాహ్ మీద పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. ఆమీన్.
వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.