ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో, టెక్స్ట్]

ప్రవక్త హూద్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
https://www.youtube.com/watch?v=ofVrllbBImA [41నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఆద్ జాతి మరియు ప్రవక్త హూద్ అలైహిస్సలాంల చరిత్రను వివరిస్తుంది. అల్లాహ్ ఆద్ జాతి వారికి అపారమైన శారీరక శక్తిని, సంపదను మరియు విజ్ఞానాన్ని ప్రసాదించాడు, కానీ వారు గర్వంతో విగ్రహారాధనలో మునిగిపోయారు. హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ వైపు ఆహ్వానించినప్పుడు వారు ఆయన్ని అపహాస్యం చేశారు. ఫలితంగా, అల్లాహ్ వారిపై భయంకరమైన పెనుగాలిని శిక్షగా పంపి వారిని నాశనం చేశాడు. ఈ కథ ద్వారా గర్వం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో మరియు అల్లాహ్ పై నమ్మకం ఎలా రక్షిస్తుందో తెలుస్తుంది. అలాగే షద్దాద్ రాజు నిర్మించిన ఇరం నగరం గురించిన కథనాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.

అస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్.

ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్. అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ فَهَلْ تَرَىٰ لَهُمْ مِنْ بَاقِيَةٍ

ఆదు వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. మరి వారిలో ఎవడైనా మిగిలి ఉన్నట్లు నీకు కనిపిస్తున్నాడా? (69:6-8)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక, ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్.

సోదర సోదరీమణులారా మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఒక జాతి గురించి తెలుసుకుందాం. వారికంటే గొప్ప శక్తిమంతులు అసలు పట్టణాలలోనే ఎవరూ సృష్టించబడలేదు అని స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చాడు. అలాంటి శక్తివంతమైన జాతి. వారు తలుచుకుంటే పెద్ద పెద్ద పర్వతాలను సైతం చిన్న రాయిలాగా తొలిచేసి నిర్మించుకుంటారు భవనాలు మాదిరిగా మార్చేస్తారు. అలాంటి జాతి. మరి అలాంటి జాతి ఎవరిని ఆరాధించింది? అలాంటి జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విధంగా రుజుమార్గం వైపు తీసుకురావడానికి ప్రవక్తను ఎవరిని పంపించాడు? ఆ ప్రవక్త ఆ జాతి వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపిస్తే మరి అంత పెద్ద శక్తివంతమైన ఆ జాతి వారు ఆ ప్రవక్త మాటలను విశ్వసించారా లేదా తిరస్కరించారా? అసలు ఆ జాతి ఎవరు? ఎక్కడ ఆ జాతి ఉనికి ఉండింది భూమండలం మీద? పర్వతాలనే చెక్కేసి భవనాలు లాగా మార్చేసిన ఆ జాతి ప్రజల భవనాల ఆనవాళ్లు ఏమైనా ఈరోజు భూమండలం మీద మిగిలి ఉన్నాయా లేదా? ఇలాంటి విషయాలు ఈనాటి ప్రసంగంలో మనం తెలుసుకుందాం.

అరబ్బు భూమండలంలోని అరబ్బు ప్రదేశంలో దక్షిణ భాగం వైపు సౌదీ అరేబియాకి దక్షిణాన ఒక దేశం ఉంది దాని పేరు యెమన్ దేశం. ఆ యెమన్ దేశంలోని సనా మరియు హజ్రమౌత్ ఈ రెండు నగరాల మధ్యలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశాన్ని ‘అహ్ కాఫ్’ అంటారు. ఆ అహ్ కాఫ్ అనే ప్రదేశంలో ఒక జాతి వారు నివసించే వారు, ఆ అరబ్బు జాతి వారిని ఆద్ జాతి అని పిలిచేవారు మరియు ఆదె ఊలా, ఆదె ఇరమ్ అని కూడా ఆ జాతి వారిని పిలిచేవారు.

ఆ జాతి ప్రజలు ఎలాంటి వ్యక్తులంటే ధార్మిక పండితులు వారి గురించి తెలియజేసిన విషయం, వారిలోని ప్రతి ఒక్క మనిషి 12 మూరల ఎత్తు కలిగినవాడు, శారీరకంగా చాలా దృఢమైన వారు శక్తిమంతులు. వారి గురించి ధార్మిక పండితులు తెలియజేయడం పక్కన పెడితే స్వయంగా సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఏమన్నాడంటే:

الَّتِي لَمْ يُخْلَقْ مِثْلُهَا فِي الْبِلَادِ
(అల్లతీ లమ్ యుఖ్ లఖ్ మిస్ లుహా ఫిల్ బిలాద్)
అటువంటి శక్తి గలవారు పట్టణాలలో సృష్టించబడలేదు.” (89:8)

స్వయంగా అల్లాహ్ అలాంటి ప్రజలు అసలు పట్టణాలలోనే సృష్టించబడలేదు అంటే వారు ఎంత గొప్ప శక్తివంతులై ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. వారి శక్తి సామర్థ్యాల మీద వారికే గర్వం ఉండేది వారు ఏమనేవారంటే:

مَنْ أَشَدُّ مِنَّا قُوَّةً
(మన్ అషద్దు మిన్నా ఖువ్వహ్)
బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడు ఎవడైనా ఉన్నాడా?” (41:15) అని వాళ్ళు ఛాలెంజ్ విసిరేవారు.

అలాంటి జాతి వారు, అయితే విషయం ఏమిటంటే అల్లాహ్ వారిని అంత శక్తిమంతులుగా అంత దృఢమైన శరీరం గలవారిలాగా పుట్టించినప్పటికీ సైతాన్ వలలో చిక్కుకొని నూహ్ అలైహిస్సలాం వారి తర్వాత ఈ భూమండలం మీద ఈ ఆద్ జాతి వారు విగ్రహారాధన ప్రారంభించారు. విగ్రహారాధన ప్రారంభించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన సంప్రదాయం ప్రకారం వారిని మళ్ళీ సంస్కరించడానికి, మార్గభ్రష్టత్వానికి గురైన ఆ జాతి ప్రజలను మళ్ళీ రుజుమార్గం వైపు తీసుకురావడానికి వారిలో నుంచే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయన పేరే హూద్ అలైహిస్సలాం.

హూద్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా ఎన్నుకొని దైవవాక్యాలు వారి వద్దకు పంపించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ దైవవాక్యాలు తీసుకొని ప్రజల ముందర వెళ్లారు. ప్రజల ముందర వెళ్లి ప్రజలను విగ్రహారాధన నుండి తప్పించి ఏకదైవ ఆరాధన వైపు పిలుపునిచ్చినప్పుడు, తౌహీద్ వైపు పిలుపునిచ్చినప్పుడు ఇతర జాతి ప్రజల మాదిరిగానే హూద్ అలైహిస్సలాం వారి జాతి ఆద్ జాతి ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించారు. ఏమని విమర్శించారు అసలు హూద్ అలైహిస్సలాం ఏమని పిలుపునిచ్చారు అవి కూడా మనకు ఖురాన్లో ప్రస్తావించబడి ఉన్నాయి అది కూడా మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని ఏడవ అధ్యాయం 65వ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ
(వ ఇలా ఆదిన్ అఖాహుమ్ హూదాన్ కాల యా ఖౌమిఅబుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహు)
మేము ‘ఆద్‌’ జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. ఆయన (వారితో) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరి మీరు భయపడరా?” (7:65)

అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి ప్రజల వద్దకు వెళ్లి దైవవాక్యాలు వినిపించారు. చూడండి ప్రతి ప్రవక్త జాతి ప్రజల వద్దకు వెళ్లి అందరికంటే ముందు ఏ విషయం వైపు పిలుపునిస్తున్నాడు అంటే అల్లాహ్ ఆరాధన వైపుకు రండి ఆయనే అన్ని రకాల ఆరాధనలకు ఏకైక అర్హుడు అన్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు అంటే ప్రతి ప్రవక్త ఎప్పుడైతే జాతి ప్రజలు బహుదైవారాధనకు గురయ్యారో వారిని ముందుగా ఏకదైవ ఆరాధన వైపుకి తౌహీద్ వైపుకి పిలుపునిచ్చాడు అన్న విషయం స్పష్టమవుతుంది.

హూద్ అలైహిస్సలాం తౌహీద్ వైపు ప్రజలకు పిలుపునిస్తే ఆ జాతి ప్రజలు ఏమని విమర్శించారంటే చూడండి వారేమన్నారంటే:

إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ
(ఇన్నా లనరాక ఫీ సఫాహతిన్ వ ఇన్నా లనజున్నుక మినల్ కాజిబీన్)
“నీవు మాకు తెలివితక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నీవు అబద్ధాలకోరువని మా అభిప్రాయం” (7:66) అన్నారు.

నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నీకు మతి భ్రమించింది అనే రీతిలో జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని విమర్శించినప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజల వద్దకు వెళ్లి ఏమండీ:

يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“ఓ నా జాతి ప్రజలారా! నాలో ఏమాత్రం తెలివితక్కువతనము లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫు నుంచి పంపబడిన ప్రవక్తను. నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తున్నాను. నేను మీకు నమ్మకస్తుడైన హితైషిని” (7:67-68) అని చెప్పారు.

నా మతి భ్రమించింది నేను తెలివితక్కువ వాడిని అని మీరు అంటున్నారు కదా అలాంటిది ఏమీ లేదు అసలు విషయం ఏమిటంటే అల్లాహ్ నన్ను సురక్షితంగానే ఉంచాడు నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి ప్రవక్తగా మీ ముందు వచ్చి ఈ విషయాలు తెలియజేస్తున్నాను తప్ప మతి భ్రమించి నేను ఈ విషయాలు మాట్లాడటం లేదు అని హూద్ అలైహిస్సలాం వారు స్పష్టం చేశారు. అంతేకాదండి హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలు చేస్తున్న చేష్టలను వివరిస్తూ అల్లాహ్ అనుగ్రహాలు వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన అనుగ్రహాల గురించి కూడా వారి ముందర వివరించారు. మనం చూసినట్లయితే ఆ జాతి ప్రజలు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద పర్వతాల వద్దకు వెళ్లి ఆ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేసేవారు. అది హూద్ అలైహిస్సలాం వారు చూసి వారితో ఏమన్నారంటే ఏమండీ:

أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ
(అతబ్ నూన బికుల్లి రీఇన్ ఆయతన్ తఅబసూన్. వ తత్తఖిజూన మసానిఅ లఅల్లకుమ్ తఖ్ లుదూన్)

“మీరు ఎత్తయిన ప్రతి స్థలంలో ఎలాంటి ప్రయోజనం లేని స్మారక కట్టడాలు ఎందుకు కడుతున్నారు? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు ఈ భవనాలు నిర్మిస్తున్నారా ఏంటి?” (26:128-129)

అసలు ఈ భవనాల్లో మీరు నివసిస్తారా? మీరు నివసించరు నివసించడానికి మైదానంలో భవనాలు నిర్మించుకున్నారు ఇళ్లు నిర్మించుకున్నారు ఈ పర్వతాలను చెక్కేసి తొలిచేసి భవనాలు లాగా మార్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం ప్రపంచానికి మీ శక్తి సామర్థ్యాలు చూపించాలని మిమ్మల్ని పొగడాలని అయ్యో ఎంత శక్తిమంతులయ్యా పర్వతాలనే భవనాలు లాగా మార్చేశారు అని మిమ్మల్ని పొగడాలని ప్రజల వద్ద మీ శక్తి సామర్థ్యాలు మీరు ప్రదర్శించాలని కేవలం మీ అహంకారాన్ని ప్రదర్శించాలని మాత్రమే మీరు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి మీ శ్రమ వృధా మీ సమయము వృధా ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలతో అనగా తర్వాత అల్లాహ్ అనుగ్రహాల గురించి కూడా వివరించారు ఏమన్నారు:

أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ وَجَنَّاتٍ وَعُيُونٍ
(అమద్దకుమ్ బి అన్ ఆమిన్ వ బనీన్. వ జన్నాతిన్ వ ఉయూన్)

“చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీ కోసము పశువులను మరియు సంతానాన్ని ప్రసాదించాడు. మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోటల ద్వారా సెలమల ద్వారా సహాయపడ్డాడు.” (26:133-134)

నీటి కాలువలు మీకోసం ప్రవహింపజేశాడు మీకు సంతానాన్ని ప్రసాదించాడు పశువులను ప్రసాదించాడు తోటలు మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించాడు ఈ అనుగ్రహాలు పొందిన మీరు అల్లాహ్ ను వేడుకోవాలి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అల్లాహ్ మార్గంలో నడుచుకోవాలి మీ మీద ఉన్న ఇది బాధ్యత ఈ బాధ్యతను మీరు గ్రహించండి అని హూద్ అలైహిస్సలాం వారు చాలా రకాలుగా జాతి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసినప్పటికిని ఆ ఆద్ జాతి వారు హూద్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ
(ఇన్ హాజా ఇల్లా ఖులుఖుల్ అవ్వలీన్)
“ఇది పూర్వికుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.” (26:137)

మేము ఏమో కొత్త విషయాలు చేయట్లేదండి మా పూర్వీకులు చేస్తూ వచ్చిన విషయాలే మేము కూడా పాటిస్తూ ఉన్నాము వారి పద్ధతినే మేము కూడా అనుసరిస్తున్నాము అంతే తప్ప మేము కొత్త విషయాలు ఏమీ చేయట్లేదు ఈ విగ్రహారాధన మా పూర్వీకుల నుంచి వస్తున్న విషయమే అని చెప్పారు. మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారిని ఏమన్నారంటే:

أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا
(అజిఅతనా లినఅబుదల్లాహ వహ్ దహు వ నజర మా కాన యఅబుదు ఆబాఉనా)

“మేము అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చినవాటిని వదిలివేయమని చెప్పడానికి నువ్వు మా వద్దకు వచ్చావా?” (7:70) అన్నారు.

తాత ముత్తాతలు చేస్తూ వచ్చిన పనులన్నీ మేము వదిలేయాలి నువ్వు చెప్పినట్టుగా అన్ని దేవుళ్లను వదిలేసి ఒకే దేవుణ్ణి పూజించుకోవాలి ఈ మాటలు చెప్పడానికేనా నువ్వు మా వద్దకు వచ్చింది అన్నట్టు మరి కొంతమంది హేళన చేశారు వెక్కిరించారు. అయితే మరికొంతమంది అయితే మొండిగా ప్రవర్తిస్తూ హూద్ అలైహిస్సలాం వారితో ఏమన్నారంటే:

وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ
(వ మా నహ్ ను బి తారికి ఆలిహతినా అన్ ఖౌలిక)
“నువ్వు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టము.” (11:53)

మేము ఎన్నో రోజుల నుంచి పూజించుకుంటూ వస్తున్నామయ్యా నువ్వు చెప్పగానే మా దేవుళ్లను పూజించటం మేము వదిలేయం మేము పూజిస్తాం అంతే అని మరికొంతమంది అయితే హూద్ అలైహిస్సలాం తో వాదించారు. అప్పుడు వారు వాదిస్తూ ఉంటే హూద్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నారు:

أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ
(అ తుజాదిలూననీ ఫీ అస్మాయిన్ సమ్మైతుమూహా అన్తుమ్ వ ఆబాఉకుమ్ మా నజ్జలల్లాహు బిహా మిన్ సుల్తాన్)

“మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్ల విషయంలో ఇవి కేవలం మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న పేర్లు మాత్రమే ఈ పేర్ల విషయంలో నాతో గొడవ పడుతున్నారా? వాటి గురించి అవి ఆరాధ్య దైవాలని నిర్ధారించే ఏ ప్రమాణాన్ని అల్లాహ్ అవతరింపజేయలేదు.” (7:71)

ఈ విగ్రహాలు దేవుళ్ళు వీటిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మీ సమస్యలు పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ఈ విగ్రహాలలో ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి ఆధారము ఎలాంటి వాక్యం అవతరింపజేయలేదే అలాంటప్పుడు ఏ విషయాన్ని చూసి మీరు వాటిని పూజిస్తున్నారు ఏ ఆధారాన్ని బట్టి మీరు వాటిని నమ్ముతున్నారు కేవలం పూర్వీకుల అంధానుసరణ తప్ప మరే ఆధారము మీ వద్ద లేదు ఈ విషయాన్ని మీరు గ్రహించండి. అయితే నేను మాత్రం ఒక విషయం స్పష్టం చేసేస్తున్నాను అదేమిటంటే:

إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
(ఇన్నీ ఉష్ హిదుల్లాహ వష్ హదూ అన్నీ బరీఉమ్ మిమ్మా తుష్రికూన్)

“అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసిగిపోయాను. వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ విషయానికి అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మీరు కూడా ఈ విషయానికి సాక్షులుగా ఉండండి.” (11:54)

ఎవరినైతే మీరు పూజిస్తున్నారో దేవుళ్లు అని నమ్ముతున్నారో ఆరాధిస్తున్నారో వారితో నేను విసిగిపోయాను నేను వారి పూజను వారి పూజతో నేను దూరంగా ఉంటున్నాను నాకు ఈ విగ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు ఈ విషయానికి నేను అల్లాహ్ కు సాక్ష్యం పెడుతున్నాను మీరు కూడా సాక్షులుగా ఉండండి అని హూద్ అలైహిస్సలాం వారు తెలియజేసేశారు. ప్రజలతో నువ్వు హూద్ అలైహిస్సలాం వారు మాట్లాడుతున్నారు ప్రజలు కూడా హూద్ అలైహిస్సలాం వారితో ఇదే విధంగా సమాధానం ఇస్తున్నారు ఈ విషయాలన్నీ మనం విన్నాము.

ఇక రండి ఆ జాతి ప్రజలు ఉంటారు ఆ జాతి పెద్దలు ఉంటారు కదండీ ప్రజలు ఒకవైపు పెద్దలు ఆ జాతి పెద్దలు వారు హూద్ అలైహిస్సలాం తో ఏమనేవారు చూడండి ఆ జాతి పెద్దలు హూద్ అలైహిస్సలాం వద్దకు వచ్చి ప్రజలందరినీ ఉద్దేశించి ఇలా అనేవారు:

مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
(మా హాజా ఇల్లా బషరుమ్ మిస్ లుకుమ్ యాకులు మిమ్మా తాకులున మిన్హు వయష్రబు మిమ్మా తష్రబూన్. వ లఇన్ అతఅతుమ్ బషరమ్ మిస్ లకుమ్ ఇన్నకుమ్ ఇజల్ లఖాసిరూన్)
“ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతను తింటున్నాడు మీరు తాగేదే ఇతను త్రాగుతున్నాడు మీరు గనుక మీలాంటి ఒక మానవ మాత్రుని అనుసరించారంటే మీరు తప్పకుండా నష్టపోతారు.” (23:33-34)

జాతి ప్రజలు వచ్చి జాతి పెద్దలు వచ్చి ప్రజలను రెచ్చగొడుతున్నారు ఇతను కూడా మీలాంటి ఒక సాధారణ మనిషే మీలాంటి ఒక సాధారణ మనిషి వచ్చి చెప్పగానే మీరు వారి మాటలు వినేస్తే మీరు నష్టపోతారు కాబట్టి ఇతని మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని జాతి పెద్దలు వచ్చి ప్రజలతో అనేవారు. మరికొంతమంది వచ్చి ఏమనేవారు అంటే:

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
(అ యఇదుకుమ్ అన్నకుమ్ ఇజా మిత్తుమ్ వ కున్తుమ్ తురాబన్ వ ఇజామన్ అన్నకుమ్ ముఖ్రజూన్. హైహాత హైహాత లీమా తూఅదూన్)
“ఏమిటి? మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం.” (23:35-36) అని మరికొంతమంది వచ్చి చెప్పేవారు.

ఇతని వాగ్దానాలని సంభవించే విషయాలు కావు. మనిషి మరణించి మట్టిలో కలిసిపోతాడు ఎముకల్లాగా మారిపోతాడు మళ్ళీ పుట్టడమంట తర్వాత అల్లాహ్ వద్ద లెక్కింపు జరగటమంట అక్కడ స్వర్గము నరకము అని ఫలితాలు శిక్షలు ఉన్నాయి అని విశ్వసించడమంట ఇవన్నీ అసంభవం జరిగే విషయాలు కావు అని మరికొంతమంది పెద్దలు వచ్చి జాతి ప్రజలకు మార్గభ్రష్టత్వానికి గురయ్యేటట్లుగా మాట్లాడేవారు. మరికొంతమంది అయితే ఏకంగా హూద్ అలైహిస్సలాం వారితోనే వచ్చి ఏమనేవారంటే జాతి పెద్దలు కొంతమంది:

إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ
(ఇన్ నఖూలు ఇల్లా ఇఅతరాక బఅజు ఆలిహతినా బి సూ)
“మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురి చేసి ఉంటారని మేము అనుకుంటున్నాము.” (11:54)

ఈ విధంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మా విగ్రహాలను దేవుళ్ళు కాదు అని నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు అంటే దీనికి గల ముఖ్యమైన కారణము మా దేవుళ్ళలోనే ఏదో ఒక దేవుడు ఆగ్రహించి నిన్ను శిక్షించాడు అతని శిక్ష నిన్ను పట్టుకునింది కాబట్టి ఈ విధంగా నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు అని మాటలు మాట్లాడారు చిత్రీకరించి మరి హూద్ అలైహిస్సలాం వారిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు ప్రజలు చాలా తొందరగా స్వీకరిస్తారు నమ్మే నమ్ముతారు.

అయితే చూడండి హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. వారు బెదిరించేటట్టు ప్రజలు కూడా భయపడే పోయేటట్టు వారు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారో చూడండి. హూద్ అలైహిస్సలాం వారు అంటున్నారు:

إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم
(ఇన్నీ తవక్కల్తు అలల్లాహి రబ్బీ వ రబ్బికుమ్)
“నేను కేవలం అల్లాహ్ నే నమ్ముకున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే.” (11:56)

వాళ్ళేమంటున్నారు మా దేవుళ్ళలో ఎవడో ఒకడు నిన్ను శిక్షించాడు కాబట్టి నీ మీద అతని శిక్ష పడింది నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని మా దేవుళ్ళు అని వారు వచ్చి హూద్ అలైహిస్సలాం తో హెచ్చరిస్తుంటే సమాధానంగా హూద్ అలైహిస్సలాం వారు ఏమంటున్నారు మీ దేవుడు ఏంటి నా దేవుడు ఏంటి అని చెప్పట్లేదు మీ దేవుడు ఏంటి నా దేవుడు గొప్పతనం చూడండి అనేటట్టుగా మాట్లాడట్లేదు ఆయన ఏమంటున్నారంటే నేను అల్లాహ్ నే నమ్ముతున్నాను ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే అంటే అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడట్లేదు అల్లాహ్ నాకు మీకు మనందరికీ దేవుడు అనే రీతిలోనే మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒక దాయికి ఒక ఉదాహరణగా ఒక ఆదర్శప్రాయంగా విషయం తెలుపబడింది అదేమిటంటే ఎదుటి వ్యక్తి నా దేవుడు అని మాట్లాడుతుంటే దాయి అతనితో మాట్లాడేటప్పుడు నా దేవుడు అల్లాహ్ నా దేవుడు అల్లాహ్ అన్నట్టు మాట్లాడరాదు మన దేవుడు మీకు మాకు మనందరికీ దేవుడు అల్లాహ్ ఆ అల్లాహ్ గురించి తెలుసుకోండి ఆ అల్లాహ్ వైపుకు రండి అనే మాట్లాడాలి గాని విగ్రహాలు మీ దేవుళ్ళు అల్లాహ్ నా దేవుడు అనే రీతిలో మాట్లాడరాదు ఇది సరైన విధానము కాదు సరైన విధానం ఏమిటంటే అల్లాహ్ మనందరి ప్రభువు ఆ ప్రభువు వైపుకు రండి అని మాత్రమే చెప్పాలి. ఇది ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే హూద్ అలైహిస్సలాం వారు మరొక విషయం వారికి తెలియజేశారు ఏమన్నారంటే:

فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ
(ఫఇన్ తవల్లౌ ఫఖద్ అబ్లగ్ తుకుమ్ మా ఉర్ సిల్ తు బిహీ ఇలైకుమ్)
“ఏమయ్యా నేనేమో మీ వద్దకు వచ్చి ఈ విషయాలు ప్రకటిస్తున్నాను ఒకవేళ మీరు మరలిపోదలిస్తే నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను నా బాధ్యత నెరవేర్చేశాను.” (11:57)

అల్లాహ్ వాక్యాలు మీ వద్దకు చేర్చటం వాటిని వివరంగా మీ ముందర తెలియజేయడం నా బాధ్యత నేను ఆ బాధ్యతను నెరవేర్చాను మీరు మరలిపోతే నా బాధ్యత తీరిపోతుంది మీరు మాత్రం అల్లాహ్ వద్ద ప్రశ్నించబడతారన్న విషయాన్ని హూద్ అలైహిస్సలాం జాతి ప్రజలకు తెలియజేశారు. తర్వాత హూద్ అలైహిస్సలాం చాలా రోజుల వరకు అనేక సంవత్సరాలుగా ఆద్ జాతి వారు కి దైవ వాక్యాలు వినిపిస్తూ వినిపిస్తూ ముందుకు సాగిపోయారు. అయితే జాతి ప్రజలు హూద్ అలైహిస్సలాం వారిని పట్టించుకోవట్లేదు. అప్పుడు హూద్ అలైహిస్సలాం ఆ జాతి ప్రజలకు హెచ్చరించటం ప్రారంభించారు ఏమన్నారంటే:

إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
(ఇన్నీ అఖాఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.” (26:135)

మీరు దైవ వాక్యాలను నమ్మటం లేదు మీరు దైవ వాక్యాలను అంగీకరించుట లేదు విశ్వసించుట లేదు ఒక మహా దినపు శిక్ష వచ్చి మీ మీద పడబోతుందన్న విషయము నాకు భయభ్రాంతుల్ని చేస్తుంది ఆ రోజు మీ మీద వచ్చి పడుతుందేమో ఆ శిక్ష వచ్చి మీ మీద పడుతుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్పారు. దానికి చూడండి గర్విష్టులు శక్తివంతులు బాగా ఎత్తుగా ఉన్నవారు బలంగా ఉన్నవారు శక్తిమంతులు మాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు ప్రపంచంలో అనుకుంటున్నవాళ్ళు శిక్ష వచ్చి పడుతుంది అని హూద్ అలైహిస్సలాం హెచ్చరిస్తుంటే వాళ్ళు ఎలాంటి గర్వంగా హూద్ అలైహిస్సలాం కు సమాధానం ఇస్తున్నారో చూడండి వాళ్ళు అంటున్నారు:

وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
(వ మా నహ్ ను బి ముఅజ్జబీన్. ఫ అత్తినా బిమా తఇదునా ఇన్ కున్త మినస్సాదిఖీన్)
“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము. ఏ శిక్ష గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం.” (26:138, 7:70)

శిక్ష వచ్చి పడుతుంది అని హెచ్చరిస్తున్నావు కదా మేము శిక్షించబడము మాకంటే శక్తిమంతులు ఎవరూ ప్రపంచంలో లేరు కాబట్టి మాకు ఎలాంటి శిక్ష గురించి భయము లేదు ఒకవేళ శిక్ష వస్తుంది అదే నిజమైటట్లయితే ఆ శిక్ష తీసుకొని రా చూద్దాము అని హూద్ అలైహిస్సలాం తో ఛాలెంజ్ చేస్తున్నారు సవాలు విసురుతున్నారు ఆద్ జాతి ప్రజలు. అప్పుడు హూద్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు:

قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(కాల రబ్బిన్ సుర్నీ బిమా కజ్జబూన్)
“ఓ ప్రభూ! వీళ్లు ధిక్కార వైఖరికి ప్రతిగా, వీళ్ళ ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు” (23:39) అని ప్రవక్త హూద్ అలైహిస్సలాం వారు ప్రార్థించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హూద్ అలైహిస్సలాం వారి ప్రార్థన స్వీకరించాడు స్వీకరించి త్వరలోని శిక్షించబడే రోజు రాబోతుంది నిరీక్షించండి అని తెలియజేశాడు. అదే విషయం హూద్ అలైహిస్సలాం జాతి ప్రజల వద్దకు వచ్చి:

فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ
(ఫన్ తజిరూ ఇన్నీ మఅకుమ్ మినల్ మున్ తజిరీన్)
“దైవ శిక్ష తీసుకొని రా చూద్దామని సవాలు విసిరారు కదా మీరు నిరీక్షించండి మీతో పాటు నేను కూడా నిరీక్షిస్తున్నాను.” (7:71) అని తెలియజేశారు అంటే ప్రార్థన అయిపోయింది దైవ శిక్ష రావటం నిర్ణయించబడింది ఇక అది ఎప్పుడు వస్తాది అనే దాని కోసం మీరు ఎదురు చూడండి నేను కూడా మీతో పాటు నిరీక్షిస్తున్నాను అని హూద్ అలైహిస్సలాం వారు ఆద్ జాతి వారికి తెలియజేశారు.

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క శిక్ష ప్రారంభమైంది. ప్రారంభంలో అక్కడ వర్షాలు ఆగిపోయాయి. వర్షం ఆగిపోయిన కారణంగా అక్కడ కరువు ఏర్పడింది. ప్రజలకు ఆహారము నీళ్ళ సమస్య ఎదురైంది చాలా రోజుల వరకు వర్షాలు కురవకపోయేసరికి కరువు ఏర్పడిన కారణంగా వారు ఆకలి దప్పికలతో అల్లాడే పరిస్థితి ఏర్పడింది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత నల్లటి మేఘాలు వచ్చాయి ఇక్కడ గమనించండి కొంచెం బాగా మిత్రులారా నల్లటి మేఘాలు ఎప్పుడైతే వస్తూ కనిపించాయో అప్పుడు జాతి ప్రజలు ఏమన్నారంటే:

قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا
(ఖాలూ హాజా ఆరిజుమ్ ముమ్ తిరునా)
“ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బులు. ఇవి మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక” (46:24) అని వారు చెప్పుకోసాగారు. అయితే అల్లాహ్ ఏమన్నాడంటే:

بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
(బల్ హువ మస్ తఅ జల్ తుమ్ బిహీ రీహున్ ఫీహా అజాబున్ అలీమ్)
“నిజానికి అది మీరు తొందరపెట్టిన విపత్కర మేఘం, అదొక పెనుగాలి అందులో వేదాభరితమైన శిక్ష ఉంది.” (46:24)

వారేమనుకుంటున్నారు దూరం నుంచి చూసి అవి నల్లటి మబ్బులు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షం కురుస్తుంది మా కరువు మొత్తం దూరమైపోతుంది అని వారు అనుకుంటున్నారు కానీ అల్లాహ్ ఏమంటున్నాడు అంటే ఆ మేఘాల వెనుక పెనుగాలి ఉంది మరియు విపత్కరమైన శిక్ష మీకోసం వస్తూ ఉంది భయంకరమైన శిక్ష అందులో దాగి ఉంది అని అంటున్నాడు. తర్వాత ఏమైందండి ఆ మేఘాలు ఎప్పుడైతే ఆ జాతి ప్రజల వద్దకు వచ్చాయో వర్షానికి బదులు తీవ్రమైన భయంకరమైన గాలి మొదలయింది. ఎన్ని రోజులు ఆ గాలి నడిచింది ఏ విధంగా అల్లాహ్ వారిని శిక్షించాడో అది కూడా ఖురాన్ లో ప్రస్తావించబడింది 69వ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ
(వ అమ్మ ఆదున్ ఫ ఉహ్ లికూ బిరీహిన్ సర్ సరిన్ ఆతియతిన్. సఖ్ ఖరహా అలైహిమ్ సబ్ అ లయాలిన్ వ సమానియత అయ్యామిన్ హుసూమన్ ఫతరల్ ఖౌమ ఫీహా సర్ ఆ క అన్నహుమ్ అఅజాజు నఖ్ లిన్ ఖావియతిన్)

“ఆద్‌ జాతి వారు ప్రచండమైన పెనుగాలి ద్వారా నాశనం చేయబడ్డారు. దాన్ని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు విధించాడు. నీవు గనుక అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దుల వలె నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి.” (69:6-7) అల్లాహు అక్బర్. ఏడు రాత్రులు ఎనిమిది పగళ్లు పూర్తి ఒక వారం వరకు ఆ పెనుగాలి వారిపైకి పంపించబడింది.

అంతే కాదు ఆ గాలితో పాటు మరొక శిక్ష ఏమిటంటే:

فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً
(ఫ అఖజత్ హుముస్ సైహతు బిల్ హఖ్ ఖి ఫజఅల్ నాహుమ్ గుసాఅన్)

“ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది అంతే మేము వారిని చెత్తాచెదారం లాగా చేసేసాము.” (23:41)

ఒకవైపు ఏడు రాత్రులు ఎనిమిది పగళ్ల వరకు తీవ్రమైన ఒక గాలి వీస్తూ ఉంది దానికి తోడుగా ఒక భయంకరమైన అరుపు కూడా వారిని పట్టుకునింది ఆ గాలి వచ్చినప్పుడు ఆ గాలి వచ్చి వారి ఇళ్లలోకి దూరి ఎవరైతే మాకంటే శక్తిమంతులు ప్రపంచంలో ఎవరూ లేరు అని విర్రవీగిపోయారో సవాలు విసిరారో ప్రపంచానికి అలాంటి వారి పరిస్థితి ఏమైపోయిందంటే ఆ గాలి వారిని పైకి తీసుకెళ్లి తలకిందులుగా కిందికి పడేసేది నేలకేసి కొడితే వచ్చి నేలకు తల తగలగానే తల బద్దలైపోయేది వారు తుఫాను వచ్చిన తర్వాత మనం టీవీ ఛానల్లో చూస్తూ ఉంటాం టెంకాయ చెట్లు, తాటి చెట్లు, ఖర్జూరపు చెట్లు అవన్నీ నేలకొరిగి ఉంటాయి పంట నష్టం జరిగింది అని చూపిస్తూ ఉంటాడు కదండీ ఆ విధంగా ఎంతో ఎత్తు ఉన్న బలశాలులైన ఆ ఆద్ జాతి ప్రజలందరూ కూడా బొద్దుల వలె కింద పడిపోయి ఉన్నారు తాటి ఖర్జూరపు టెంకాయ బొద్దుల వలె అక్కడ పడి మరణించారు నాశనమయ్యారు.

అయితే పూర్తి జాతిలో ఎంతమంది అయితే హూద్ అలైహిస్సలాం వారి మాటను నమ్మి విశ్వసించారో హూద్ అలైహిస్సలాం ప్రవక్తను మరియు ఆయన మాట విశ్వసించిన ఆ జాతి ప్రజలను మాత్రం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రక్షించాడు సురక్షితమైన ప్రదేశానికి వారిని తరలించాడు ఖురాన్లో 11వ అధ్యాయం 58వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا
(వ లమ్మా జాఅ అమ్రునా నజ్జైనా హూదన్ వల్లజీన ఆమనూ మఅహూ బిరహ్ మతిమ్ మిన్నా)
“మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్‌ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము.” (11:58)

అంటే ఆద్ జాతి వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గాలి మరియు అరుపు ద్వారా శిక్షించాడు వారందరూ నాశనమైపోయారు చెత్తాచెదారం లాగా అయిపోయారు విశ్వసించిన వారిని ప్రవక్తను మాత్రం అల్లాహ్ రక్షించాడు. ఇది హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి యొక్క సంక్షిప్తమైన చరిత్ర.

అయితే ఈ చరిత్రతో మరొక కథ ముడిపడి ఉంది ఆ కథ అక్కడక్కడ కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు అదేమిటంటే హూద్ అలైహిస్సలాం వారి జాతిని ఆద్ జాతి అంటారు కదండీ ఆ జాతి వద్ద షద్దాద్ బిన్ ఆద్ మరియు షదీద్ బిన్ ఆద్ అనే ఇద్దరు రాజులు ఆ జాతిని పరిపాలించేవారు వారిద్దరూ అన్నదమ్ములు వారి తండ్రి పేరు వచ్చి ఆద్, ఆ ఆద్ అనే రాజు ఆ ప్రదేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి ఆ పూర్తి జాతిని ఆద్ జాతి వారు అని పేరు పెట్టడం జరిగింది. అయితే తండ్రి మరణించిన తర్వాత షద్దాద్ మరియు షదీద్ వీరిద్దరూ ఆ ప్రదేశాన్ని పరిపాలించారు. అయితే కొద్ది రోజులకు వారిద్దరిలో నుంచి షదీద్ అనే ఒక తమ్ముడు మరణించాడు షదీద్ మరణించిన తర్వాత పూర్తి బాధ్యతలు షద్దాద్ చేతికి అప్పగించబడ్డాయి ఆ తర్వాత షద్దాద్ ఒక్కడే ఆ ప్రదేశం మొత్తానికి రాజయ్యాడు పూర్తి అధికారాలు అతని చేతుల్లోకి వచ్చాయి అతను ఆ ప్రదేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు.

జాతి ప్రజలు చాలా శక్తివంతులు ఎత్తు కలిగిన వారు కాబట్టి వారిని తీసుకొని తన సామ్రాజ్యాన్ని అతను చాలా దూరం వరకు విస్తరించుకుంటూ పోయాడు. అయితే ఎప్పుడైతే హూద్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల వద్దకు వెళ్లి అల్లాహ్ గురించి మరణానంతర జీవితం గురించి స్వర్గం గురించి నరకం గురించి వివరించారో ఆ రాజు వద్దకు స్వర్గం గురించి ఎవరో వినిపించారు అప్పుడు ఆ రాజు ఆ స్వర్గం గురించి స్వర్గ అనుగ్రహాల గురించి విని ఏమన్నాడంటే ఆకాశాలలో స్వర్గం ఉండటం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను అని ప్రకటించాడు. హూద్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు గర్వంతో అహంకారంతో అతను ఏమన్నాడంటే ఆకాశాల పైన ఉన్న స్వర్గం ఏమిటి భూమండలం మీదే నేను స్వర్గాన్ని నిర్మించి చూపిస్తాను చూడండి అని ఆ తర్వాత ‘అదన్‘ అనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ బంగారము వెండి వజ్రాలు ఈ విధంగా అతని వద్ద ఉన్న ఖజానా మొత్తం ఖర్చు పెట్టి ఒక స్వర్గాన్ని నిర్మించే పని మొదలెట్టాడు.

ఆ రోజుల్లో ప్రజల ఆయుష్షు చాలా పెద్దది చాలా ఎక్కువ రోజులు వారు బ్రతికేవారు ఆ విధంగా 300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు. అందులో భవనాలు ఏర్పాటు చేశారు రహదారులు నిర్మించారు నీటి కాలువలు నిర్మించారు పండ్ల తోటలు నిర్మించారు సేవకుల్ని ఉంచారు అన్ని సౌకర్యాలు ఉంచారు దానితోపాటు బంగారం అందులో ఉంచారు వెండి ఉంచారు వజ్రాలు ఉంచారు ఈ విధంగా నగలు ఆభరణాలు కూడా అందులో ఉంచారు దానికి ‘ఇరం‘ అని నామకరణం చేశాడు స్వర్గానికి జన్నతుల్ ఫిర్దౌస్ జన్నాతు అద్న్ అని పేర్లు ఉంటాయి కదండీ ఆ విధంగా ఇతను నిర్మించిన స్వర్గానికి అతను ‘ఇరం’ అని నామకరణం చేశాడు.

300 సంవత్సరాల వరకు కష్టపడి ప్రజలు ఒక స్వర్గాన్ని నిర్మించారు నిర్మించబడిన స్వర్గం గురించి రాజుకు తెలియజేశారు రాజు ఏం చేశాడంటే 300 సంవత్సరాల తర్వాత తను కోరుకున్న స్వర్గము నిర్మించబడింది ఆ స్వర్గ ప్రారంభోత్సవానికి వెళ్లడానికి బంధుమిత్రులతో పాటు పయనమయ్యాడు. మార్గ మధ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక్క రోజు ప్రయాణము చేస్తే ఒక్క రోజు తర్వాత ఆ స్వర్గానికి చేరుకుంటాడు అనగా దైవ శిక్ష వచ్చి ఆద్ జాతి వారి మీద పడింది ఆ శిక్షలో ఆద్ జాతితో పాటు ఆ రాజు అతని కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరూ కూడా అక్కడికక్కడే నాశనమైపోయి మరణించారు చనిపోయారు. తను ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న కలల స్వర్గాన్ని అతను చేరుకోలేకపోయాడు ఇంకా ఒక్క రోజు ప్రయాణం ఉందనగానే అంతలోనే అక్కడే అతను చనిపోయాడు మరణించాడు అని చరిత్రకారులు తెలియజేశారు.

ఇక్కడితో పూర్తి కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత ఈ స్వర్గానికి సంబంధించిన మరొక విషయం చెప్పబడుతుంది అదేమిటంటే ఈ సంఘటన జరిగిన చాలా వేల సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం నలుగురు ఖలీఫాల మరణానంతరం ఎప్పుడైతే అమీరె మావియా ఖలీఫాగా చక్రవర్తిగా ముస్లింలను పరిపాలిస్తున్నారో ఆ రోజుల్లో అబ్దుల్లా బిన్ ఖిలాబా అనే ఒక వ్యక్తి ఒంటెను వెతుక్కుంటూ వెళ్లారు. వెళ్తున్నారు ఒంటెను వెతుకుతున్నారు వెంట ఒంటె ఎక్కడికో పారిపోయింది ఆ పారిపోయిన ఒంటెను వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే ఒక చోట కాలు జారారు కింద పడ్డారు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్లి చూస్తే లోపల భవనాలు ఉన్నాయి అక్కడ వెండి వజ్రాలు బంగారం అన్నీ ఒక పెద్ద నగరాన్ని అక్కడ ఆయన చూశారు. ఆయన ఏం చేశారంటే అందులో నుంచి కొంచెం బంగారము వెండి వజ్రాలు ఇలాంటి ఆభరణాలు తీసుకొని ఏదో ఒక రకంగా కష్టపడి మళ్ళీ బయటికి వచ్చారు.

తరువాత ఆ విషయం తిన్నగా వారి ద్వారా వారి స్నేహితులకి స్నేహితుల ద్వారా బంధుమిత్రులకి బంధుమిత్రుల ద్వారా రాజు వద్దకు చేరిపోయింది. రాజు వద్దకు విషయం చేరినప్పుడు ఆ రాజు గారు అబ్దుల్లా బిన్ ఖిలాబా గారిని పిలిపించి ఏమయ్యా ఏదో సంఘటన జరిగిందంట భూమి లోపల నువ్వు ఎక్కడో కింద పడ్డావంట అక్కడ ఒక పెద్ద నగరం నీకు కనిపించింది అంట అక్కడ నువ్వు బంగారము ఇవన్నీ తీసుకువచ్చావు అంట కదా ఇది ఎక్కడ ఉందో నువ్వు మమ్మల్ని చూపించగలవా అని అడిగితే సరేనండి చూపిస్తాను పదండి అని ఆయన భటులతో పాటు బయలుదేరారు కానీ ఆ ప్రదేశాన్ని ఆయన కనుక్కోలేకపోయారు ఆ ప్రదేశానికి చేరుకోలేకపోయారు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ రెండు సంఘటనలు ఎలాంటి సంఘటనలు అంటే ఇవి ప్రామాణికమైనవి కావు అని ధార్మిక పండితులు తేల్చి చెప్పారు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ ప్రస్తావన అక్కడక్కడ కొంతమంది ఈ రాజు గురించి చర్చిస్తూ ఉంటారు తెలియజేస్తూ ఉంటారు అయితే ఇది ప్రామాణికమైన విషయం కాదన్న విషయం మీ దృష్టిలో నేను ఉంచదలిచాను కాబట్టి ఈ పూర్తి కథ వినిపించి దాని వాస్తవాన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది.

అయితే మిత్రులారా ఒక్క విషయం మాత్రం స్పష్టం అదేమిటంటే ఆద్ జాతి వారు చాలా శక్తిమంతులు. ఆ శక్తి సామర్థ్యాలను అల్లాహ్ కోసం అల్లాహ్ ధర్మం కోసం వారు ఉపయోగించలేదు గానీ ప్రపంచంలో వారి ఉనికిని చాటుకోవడానికి వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చూపించడానికి గర్వపడడానికి మాత్రమే ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే అహంకారం ప్రదర్శించారు తత్కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తను పంపి వారిని సంస్కరించేటందుకు ప్రయత్నం చేసినా గానీ వారు ప్రవక్తను విశ్వసించలేదు అల్లాహ్ ను విశ్వసించలేదు కాబట్టి దైవ శిక్షకు గురయ్యారు. ఈ హూద్ అలైహిస్సలాం మరియు ఆద్ జాతి వారి చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అహంకారం ప్రదర్శిస్తే వారు ఎంతటి శక్తి సామర్థ్యం కలిగిన వారైనా సరే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మెచ్చుకోడు వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కఠినంగా శిక్షిస్తాడు.

అలాగే రెండవ విషయం ఏమిటంటే హూద్ అలైహిస్సలాం వారిని జాతి ప్రజలు బెదిరించారు మా ప్రభువులు నీకు ఏదో రోగానికి గురి చేశారు కాబట్టి నువ్వు ఈ విధంగా వ్యాధిగ్రస్తుడిలా మారిపోయి మాట్లాడుతున్నావు అని లేనిపోని విషయాలు చెప్పి ఆయనను బెదిరించే ప్రయత్నం చేశారు అలాంటప్పుడు ఆయన అవునేమో అనుకోలేదు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి నాకు లాభ నష్టాలు ఏమి జరిగినా అల్లాహ్ తరఫునే జరుగుతాయి గానీ అల్లాహ్ తప్ప మరెవరికీ లాభాలు నష్టాలు సమకూర్చే అధికారము శక్తి లేదు అన్న విషయాన్ని ప్రపంచానికి ముఖ్యంగా ఆ జాతి ప్రజలకు తెలియజేశారు కాబట్టి మనం కూడా అదే విషయాన్ని నమ్మాలి. మనకు లాభం కలిగినా నష్టం కలిగినా అల్లాహ్ తరఫునే కలుగుతుంది కానీ అల్లాహ్ తప్ప మరెవరి వల్ల అది సాధ్యము కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు “ప్రపంచం మొత్తం కలిపి మీకు సహాయం చేయాలనుకున్నా మీకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంత సహాయం చేయాలంటే అంతే చేయగలుగుతారు ప్రపంచం మొత్తం కలిసి మీకు నష్టం చేయాలనుకున్నా అల్లాహ్ మీకు ఎంత నష్టం చేయాలనుకుంటాడో అంతే వారు నష్టం చేయగలుగుతారు అంతే తప్ప అల్లాహ్ ఆజ్ఞకు మించి వారు ఏమీ చేయలేరు” అన్న విషయాన్ని తెలియజేశారు కాబట్టి అల్లాహ్ మీద పూర్తి నమ్మకం భక్తులకు ఉండాలి అనేది మనకు ఇక్కడ తెలుపడం జరిగింది.

చివరి విషయం ఏమిటంటే మనిషికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యము అల్లాహ్ పై మరియు ప్రవక్తల పై అల్లాహ్ వాక్యాలపై విశ్వాసము మరియు అనుసరణ ద్వారానే లభిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి.

నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ రుజుమార్గం మీద స్థిరంగా నడుచుకునే భాగ్యం ప్రసాదించుగాక మార్గభ్రష్టత్వానికి గురి కాకుండా సైతాన్ వలలో చిక్కుకోకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి భక్తి శ్రద్ధలతో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్.

అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

69:6 وَأَمَّا عَادٌ فَأُهْلِكُوا بِرِيحٍ صَرْصَرٍ عَاتِيَةٍ

69:7 سَخَّرَهَا عَلَيْهِمْ سَبْعَ لَيَالٍ وَثَمَانِيَةَ أَيَّامٍ حُسُومًا فَتَرَى الْقَوْمَ فِيهَا صَرْعَىٰ كَأَنَّهُمْ أَعْجَازُ نَخْلٍ خَاوِيَةٍ

ఆద్ వారు ప్రచండమైన పెనుగాలుల ద్వారా నాశనం చేయబడ్డారు. వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి. (ఖుర్ఆన్ 69 : 6-7)

యమన్, ఒమన్ ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచరియల వద్ద ఆద్ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. వారు శారీరకంగా దృఢకాయులు. భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు. ఎత్తయిన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది. వారి బలసామర్ధ్యాల వల్ల, వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది. కాని భౌతికంగా వారు సాధించిన ప్రగతీ వికా సాలు, వారి శారీరక బలాధిక్యత వారిని అహంకారానికి, గర్వాతిశయానికి గురి చేశాయి. దౌర్జన్యాలు, అన్యాయానికి మారు పేరయిన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది. వారికి వ్యతిరేకంగా గొంతువిప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు.

అల్లాహ్ గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది. అలాగే వారు అల్లాహ్ ఆరాధనను పూర్తిగా నిరాకరించనూ లేదు. కాని వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే, అంటే ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు. అల్లాహ్ పాటు వారు అనేక దేవీదేవతలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం, అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది.

అల్లాహ్ ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని, వారికి హితబోధ చేయాలని నిర్ణయించి, వారిలో ఒకరిని దైవప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయనే హూద్ (అలైహిస్సలాం). ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో, దృఢసంకల్పంతో, సహనంతో నిర్వర్తించారు. ఆయన విగ్రహారాధనను ఖండించారు. ప్రజలకు బోధిస్తూ, “ప్రజలారా! ఈ రాళ్ళ వల్ల లాభం ఏముంది? మీ స్వంత చేతులతో . మీరు చెక్కే వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది? నిజానికి ఇలా చేయడం మీ వివేకవివేచనలను పరాభవించుకోవడమే అవుతుంది. దేవుడు కేవలం ఒకే ఒక్కడు. ఆయనే ఆరాధనకు అర్హుడు. ఆయనే అల్లాహ్. ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. ఆయనే మీకు పోషణనిస్తున్నాడు. ఆయనే మీకు జీవన్మరణాలు ఇస్తున్నాడు” అని చెప్పారు. ‘అల్లాహ్ మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించాడు. అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించాడు. కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి. ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. లేకపోతే నూహ్ జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకూ పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు.

హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త (అలైహిస్సలాం) ప్రజల్లో దైవవిశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు. కాని వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. పైగా హూద్ (అలైహిస్సలాం)తో వాదనకు దిగారు. “హూద్ ! నీవు చెబుతున్న దేమిటి? ఈ దేవీదేవతలు అల్లాహ్ తో మా తరఫున సిఫారసు చేస్తాయి” అని. దబాయించారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “ప్రజలారా! అందరి దేవుడు అల్లాహ్ ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఆయన మీ బృహద్ధ మనికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు. ఈ విగ్రహాలు మీ కోసం సిఫారసు చేయలేవు. వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాహు మరింత దూరం అవుతారు. మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో! కాని మీ విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటిచెబుతున్నాయి” అన్నారు.

కాని వారు హూద్ (అలైహిస్సలాం) మాటలను తిరస్కరించారు. ఆయన్ను ఎగతాళి చేశారు. “హూద్! నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే. అలాంటప్పుడు అల్లాహ్ నీకు మాత్రమే ప్రవక్త పదవీ బాధ్యతలను అనుగ్రహించాడా? అలా ఎన్నటికీ జరగదు. నువ్వు అబద్ధాలాడుతున్నావు” అన్నారు. హూద్ (అలైహిస్సలాం) వారికి జవాబిస్తూ, “నేను నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను. నా వివేకవివేచనలను మీలో ఎవ్వరూ ప్రశ్నించలేదు. అల్లాహ్ నన్ను హెచ్చరించేవానిగా, మార్గం చూపేవానిగా ఎన్నుకున్నాడు. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఏకత్వం అన్నది విశ్వం లోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది. ప్రతి వస్తువులోనూ ఒక సూచన ఉంది. కాబట్టి ఆయన్ను విశ్వసించండి. ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి. ఆయన కారుణ్యానికి దూరం కావద్దు. పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి. మీకు వైభవోపేతమైన ఎత్తయిన భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు మీ శక్తిని, మీ సంపదను చాటిచెబుతున్నాయి. కాని వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి. మీరు మీ సంపదను, మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు. మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీరు కేవలం సుఖవిలాసాల కోసం ప్రాకులాడుతున్నారు” అని హెచ్చరించారు. కాని ఆ ప్రజలు ఆయన బోధనలను పెడచెవిన పెట్టారు. హూద్ (అలైహిస్సలాం) తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు. ఆయన వారితో, “అల్లాహ్ ముందు సాక్షులుగా ఉండండి. నేను దైవసందేశాన్ని మీకు అందజేశాను. నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తునే ఉంటాను. మీ బెదిరింపులకు భయపడను. నేను కేవలం అల్లాహు మాత్రమే భయపడతాను” అన్నారు.

ఒక రోజు వారు ఆకాశాన్ని ఒక నల్లమబ్బు కప్పివేయడాన్ని చూశారు. వర్షం వస్తుందని వారు భావించారు. ఈ తొలకరి వర్షానికి పొలాలను సిద్ధం చేసుకోవాలనుకున్నారు. హూద్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించారు. ఇది దేవుని కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు. ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన. ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది. దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు.

భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు, ఏడు రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. కేవలం హూద్ (అస), ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. వారు అక్కడి నుంచి ‘హద్రమౌత్’కు వలస పోయారు. వారు అక్కడ ఒకేదేవుడు అల్లాహ్ ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 7:65-72, 11:50-60, 26:123-140)

ఇటీవల స్పేస్ షటిల్ నుంచి తీసుకున్న ఆధునిక రాడార్ ఇమేజ్ల వల్ల లభించిన వైజ్ఞానిక ఆధారాలతో దక్షిణ ఓమ్మాన్ ని ఉబార్ వద్ద ఎనిమిది ఎత్తయిన టవర్లను కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతాన్ని “ఖాళీ ప్రదేశం” (ఎంప్టీ క్వార్టర్)గా పిలువడం జరుగుతుంది. ఈ సంఘటన దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం జరిగిందని భావిస్తున్నారు. ఒక్క దివ్యఖుర్ఆన్ తప్ప మరో మతగ్రంథం లేదా ధార్మిక పుస్తకం ఏదీ ఈ పట్టణం పతనాన్ని ప్రస్తావించలేదు.

[క్రింది భాగం అహ్సనుల్ బయాన్ నుండి తీసుకోబడింది]

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించాడు:

7:65 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۗ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۚ أَفَلَا تَتَّقُونَ

మేము ఆద్‌జాతి వద్దకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. “నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. మరలాంటప్పుడు మీరు భయపడరా?” అని అతను చెప్పాడు.

7:66 قَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ إِنَّا لَنَرَاكَ فِي سَفَاهَةٍ وَإِنَّا لَنَظُنُّكَ مِنَ الْكَاذِبِينَ

దానికి అతని జాతిలోని అవిశ్వాస సర్దారులు, “నువ్వు మాకు తెలివి తక్కువ వానిలా కనిపిస్తున్నావు. పైగా నువ్వు అబద్ధాల కోరువని మా అభిప్రాయం” అన్నారు.

7:67 قَالَ يَا قَوْمِ لَيْسَ بِي سَفَاهَةٌ وَلَٰكِنِّي رَسُولٌ مِّن رَّبِّ الْعَالَمِينَ

“ఓ నా జాతివారలారా! నాలో ఏ మాత్రం తెలివితక్కువ తనం లేదు. నేను సకల లోకాల ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను.

7:68 أُبَلِّغُكُمْ رِسَالَاتِ رَبِّي وَأَنَا لَكُمْ نَاصِحٌ أَمِينٌ

“నా ప్రభువు సందేశాలను మీకు చేరవేసేవాణ్ణి. మీరు నమ్మదగ్గ మీ శ్రేయోభిలాషిని.

7:69 أَوَعَجِبْتُمْ أَن جَاءَكُمْ ذِكْرٌ مِّن رَّبِّكُمْ عَلَىٰ رَجُلٍ مِّنكُمْ لِيُنذِرَكُمْ ۚ وَاذْكُرُوا إِذْ جَعَلَكُمْ خُلَفَاءَ مِن بَعْدِ قَوْمِ نُوحٍ وَزَادَكُمْ فِي الْخَلْقِ بَسْطَةً ۖ فَاذْكُرُوا آلَاءَ اللَّهِ لَعَلَّكُمْ تُفْلِحُونَ

“ఏమిటీ, మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీనుండే ఒక వ్యక్తి ద్వారా, మీ ప్రభువు తరఫునుండి మీ వద్దకు హితోపదేశం రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా? అల్లాహ్‌ మిమ్మల్ని నూహ్‌ జాతి అనంతరం వారసులుగా చేసి, మీకు ఎక్కువ శరీర సౌష్ఠవాన్ని ప్రసాదించిన సంగతిని గుర్తుంచుకోండి. అల్లాహ్‌ అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందుతారు” అని హూద్‌ బోధపరచాడు.

7:70 قَالُوا أَجِئْتَنَا لِنَعْبُدَ اللَّهَ وَحْدَهُ وَنَذَرَ مَا كَانَ يَعْبُدُ آبَاؤُنَا ۖ فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ

“మేము అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించాలనీ, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదలివేయమని (చెప్పటానికేనా) నువ్వు మా వద్దకు వచ్చింది? ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షను గురించి నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం” అని వారు అన్నారు.

7:71 قَالَ قَدْ وَقَعَ عَلَيْكُم مِّن رَّبِّكُمْ رِجْسٌ وَغَضَبٌ ۖ أَتُجَادِلُونَنِي فِي أَسْمَاءٍ سَمَّيْتُمُوهَا أَنتُمْ وَآبَاؤُكُم مَّا نَزَّلَ اللَّهُ بِهَا مِن سُلْطَانٍ ۚ فَانتَظِرُوا إِنِّي مَعَكُم مِّنَ الْمُنتَظِرِينَ

అప్పుడు హూద్‌ ఇలా అన్నాడు : “ఇక మీ ప్రభువు శిక్ష, ఆయన ఆగ్రహం మీపై విరుచుకుపడినట్లే. ఏమిటీ, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న పేర్ల విషయంలో నాతో గొడవపడుతున్నారా? వాటి గురించి (అవి ఆరాధ్య దైవాలని నిర్థారించే) ఏ ప్రమాణాన్నీ అల్లాహ్‌ అవతరింపజెయ్యలేదు. కాబట్టి మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేను కూడా నిరీక్షిస్తాను.”

7:72 فَأَنجَيْنَاهُ وَالَّذِينَ مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَقَطَعْنَا دَابِرَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ وَمَا كَانُوا مُؤْمِنِينَ

ఎట్టకేలకు మేము అతన్నీ, అతని సహచరులను మా కృపతో కాపాడాము. అయితే మా ఆయతులు అబద్ధాలంటూ కొట్టి పారేసినవారి వేరును త్రెంచివేశాము. వారు ఎట్టి పరిస్థితిలోనూ విశ్వసించేవారు కారు.

11:50 وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

మరి మేము ఆద్‌ జాతి వైపుకు వారి సోదరుడైన హూద్‌ను పంపాము. అతను (తన వారినుద్దేశించి) ఇలా అన్నాడు: “ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు కల్పించేవన్నీ అబద్ధాలు తప్ప మరేమీ కావు.”

11:51 يَا قَوْمِ لَا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى الَّذِي فَطَرَنِي ۚ أَفَلَا تَعْقِلُونَ

“ఓ నాజాతి ప్రజలారా! ఈ పనికై నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత నన్నుసృష్టించిన వానిదే. అయినప్పటికీ మీరు వివేకవంతులుగా వ్యవహరించరే?!”

11:52 وَيَا قَوْمِ اسْتَغْفِرُوا رَبَّكُمْ ثُمَّ تُوبُوا إِلَيْهِ يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا مُجْرِمِينَ

“ఓ నా జాతి వారలారా! మీ పోషకుని (అంటే అల్లాహ్‌) సమక్షంలో మీ తప్పుల మన్నింపుకై ప్రార్థించండి. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. ఆయన మీపై (ఆకాశం నుండి) ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీకున్న బలిమికి మరింత శక్తినీ, బలాన్నీ చేకూరుస్తాడు. మీరు మాత్రం అపరాధులుగా తిరిగిపోకండి.”

11:53 قَالُوا يَا هُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِي آلِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

దానికి వారు, “ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు.

11:54 إِن نَّقُولُ إِلَّا اعْتَرَاكَ بَعْضُ آلِهَتِنَا بِسُوءٍ ۗ قَالَ إِنِّي أُشْهِدُ اللَّهَ وَاشْهَدُوا أَنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ

పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్‌ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్‌ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.”

11:55 مِن دُونِهِ ۖ فَكِيدُونِي جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

“సరే. మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకు ఏమాత్రం కూడా గడువు ఇవ్వకండి.

11:56 إِنِّي تَوَكَّلْتُ عَلَى اللَّهِ رَبِّي وَرَبِّكُم ۚ مَّا مِن دَابَّةٍ إِلَّا هُوَ آخِذٌ بِنَاصِيَتِهَا ۚ إِنَّ رَبِّي عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ

“నేను కేవలం అల్లాహ్‌నే నమ్ముకున్నాను. ఆయన నాకూ ప్రభువే. మీ అందరికీ ప్రభువే. ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది. నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు.

11:57 فَإِن تَوَلَّوْا فَقَدْ أَبْلَغْتُكُم مَّا أُرْسِلْتُ بِهِ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّي قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُ شَيْئًا ۚ إِنَّ رَبِّي عَلَىٰ كُلِّ شَيْءٍ حَفِيظٌ

ఒకవేళ మీరు మరలి పోదలిస్తే (పొండి), నేను మాత్రం నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను. నా ప్రభువు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు. మీరు ఆయనకు ఏవిధమైన కీడూ కలిగించలేరు. నిస్సందేహంగా నా ప్రభువు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు.”

11:58 وَلَمَّا جَاءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَالَّذِينَ آمَنُوا مَعَهُ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَاهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

మరి మా ఆజ్ఞ (అమల్లోకి) వచ్చినప్పుడు మేము హూద్‌నూ, అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులనూ మా ప్రత్యేక కృపతో కాపాడాము. ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము.

11:59 وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا بِآيَاتِ رَبِّهِمْ وَعَصَوْا رُسُلَهُ وَاتَّبَعُوا أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

ఇదీ ఆద్‌ జాతి (వృత్తాంతం). వీరు తమ ప్రభువు ఆయతులను త్రోసి పుచ్చారు. ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు. ఇంకా అహంకారి, అవిధేయీ అయిన ప్రతివ్యక్తినీ వారు అనుసరించారు.

11:60 وَأُتْبِعُوا فِي هَٰذِهِ الدُّنْيَا لَعْنَةً وَيَوْمَ الْقِيَامَةِ ۗ أَلَا إِنَّ عَادًا كَفَرُوا رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు.

26:123 كَذَّبَتْ عَادٌ الْمُرْسَلِينَ

ఆద్‌ జాతి వారు (కూడా) దైవ ప్రవక్తలను ధిక్కరించారు.

26:124 إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ هُودٌ أَلَا تَتَّقُونَ

అప్పుడు వారి సోదరుడైన హూద్‌, (వారినుద్దేశించి) ఇలా అన్నాడు : “మీరు బొత్తిగా భయపడరా?

26:125 إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

“నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుణ్ణి అయిన ప్రవక్తను.

26:126 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:127 وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ

“ఈ పనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది.

26:128 أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ

“ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా?

26:129 وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ

“మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన) భవనాలను నిర్మిస్తున్నారే!

26:130 وَإِذَا بَطَشْتُم بَطَشْتُمْ جَبَّارِينَ

“మీరు ఎప్పుడు, ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్య పూరితంగా పంజా విసురుతున్నారే!?

26:131 فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ

“కనుక, మీరు అల్లాహ్‌కు భయపడండి. నా విధానాన్ని అనుసరించండి.

26:132 وَاتَّقُوا الَّذِي أَمَدَّكُم بِمَا تَعْلَمُونَ

“మీకు తెలిసివున్న సమస్త (మంచి) వస్తువులను మీకు వొసగి, మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి.

26:133 أَمَدَّكُم بِأَنْعَامٍ وَبَنِينَ

“ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు.

26:134 وَجَنَّاتٍ وَعُيُونٍ

“తోటల ద్వారా, చెలమల ద్వారా (సహాయపడ్డాడు).

26:135 إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

“నేను మీ విషయంలో ఒక మహా దినపు శిక్ష గురించి భయపడుతున్నాను.”

26:136 قَالُوا سَوَاءٌ عَلَيْنَا أَوَعَظْتَ أَمْ لَمْ تَكُن مِّنَ الْوَاعِظِينَ

వారిలా అన్నారు : “నువ్వు మాకు బోధించినా, బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే.

26:137 إِنْ هَٰذَا إِلَّا خُلُقُ الْأَوَّلِينَ

“ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు.

26:138 وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

“ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము.”

26:139 فَكَذَّبُوهُ فَأَهْلَكْنَاهُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً ۖ وَمَا كَانَ أَكْثَرُهُم مُّؤْمِنِينَ

ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు.

26:140 وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తిసంపన్నుడు, పరమ కృపాశీలుడు.

ప్రవక్తలు (మెయిన్ పేజీ):
https://teluguislam.net/prophets

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]

యూసుఫ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/3aASE6ZWQGQ [40 నిముషాలు]

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త యూసుఫ్(అలైహిస్సలాం)
(క్రీ.పూ. 1700 నుంచి క్రీ.పూ.1680 వరకు)

యూసుఫ్ (అలైహిస్సలాం) పద్ధెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆయన దృఢమైన, అందమైన యువకునిగా ఎదిగారు. చాలా నమ్రత కలిగిన వారిగా పేరుపడ్డారు. ఆయన గౌరవంగా వ్యవహరించే వారు. దయ సానుభూతులతోప్రవర్తించేవారు. ఆయన సోదరుడు బినామిన్ కూడా అలాంటి గుణగణాలు కలిగినవాడే. వీరిద్దరూ ఒకే తల్లి రాకెల్ కుమారులు. సుగుణ సంపన్నులైన ఈ ఇరువురు కుమారుల పట్ల తండ్రి యాఖూబ్ (అలైహిస్సలాం) ఎక్కువ ఇష్టం ప్రదర్శించేవారు. వీరిద్దరిని తన దృష్టి నుంచి పక్కకు వెళ్ళనిచ్చే వారు కాదు. వారిని పరిరక్షించడానికిగాను ఇంటి తోటలోనే వారిని పనిచేసేలా నిర్దేశించారు.

సోదరుల కుట్ర (అలైహిస్సలాం) అసూయ అగ్ని వంటిది. అది సోదరుల గుండెల్లో పొగలు గ్రక్కడం ప్రారంభించింది. విద్వేషంగా మారింది. ఒక సోదరుడు మిగిలిన వారితో, “నాన్నగారు మనందరికన్నా యూసుఫ్, బిన్ యామిన్ల పట్ల ఎక్కువ ప్రేమ చూపుతున్నారు.నిజానికి వారిద్దరి కన్నా మనం బలంగా ఉన్నాం. మన అమ్మలకన్నా వారిద్దరి అమ్మనే ఆయన ఎక్కువ ప్రేమిస్తారు. ఇది న్యాయం కాదు” అన్నాడు. వారందరూ తమకు అన్యాయం జరిగి పోతోందని భావించారు.

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]

నేలపై నిండు చంద్రుడు (ముహమ్మద్ ప్రవక్త ﷺ జీవన దృశ్యాలు కొన్ని) [పుస్తకం]
మూలం : మర్దిజా ఆల్డ్ రిచ్ టారింటినో
అనువాదం: బా మేరాజ్
శాంతి మార్గం పబ్లికేషన్ ట్రస్ట్

[డౌన్లోడ్ పుస్తకం]
[116 పేజీలు] [PDF] [మొబైల్ ఫ్రెండ్లీ]

దైవప్రవక్త సహచరులు జాబిర్ బిన్ సమురహ్ (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పారు:

ఒక వెన్నెల రాత్రి – నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను చూశాను. ఆయన ఎరుపు రంగు దుస్తుల్లో వున్నారు.నేను ఆకాశంలోని చంద్రుణ్ణి ఒకసారి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఖారవిందాన్ని మరోసారి ఇలా మార్చి మార్చి చూస్తూ ఉన్నాను.అప్పుడు నాకు ఆకాశంలోని చంద్రుడి కన్నా దైవ ప్రవక్త ముఖారవిందమే నిండు చంద్రునిలా ఎంతో అందంగా కనిపించింది.

1. శుభోదయం
2. నల్ల మచ్చ
3. జమ్ జమ్ బావి
4. వంద ఒంటెల విందు
5. వర్తక బృందం
6. క్రైస్తవ పండితుడు -బహీరా
7. యవ్వనం
8. అల్లాహ్ పిలుపు
9. ఖురైష్ తెగ
10. ప్రతి పక్షం
11. జిన్నాత్
12. రాత్రి ప్రయాణం
13. కొండ గుహ
14. మదీనా
15. మదీనా-2
16. బద్ర్ యుద్ధం
17. ఉహుద్ యద్ధం
18. కందక యుద్ధం
19. తిరిగి రాక

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర [వీడియో & టెక్స్ట్]

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర
వక్త: ముహమ్మద్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్
https://www.youtube.com/watch?v=QSCd4zG7zUQ [47 నిముషాలు]

ఈ ప్రసంగంలో, మానవ చరిత్రలో విగ్రహారాధన ఎలా ప్రారంభమైందో వివరించబడింది. ఆదం (అలైహిస్సలాం) తరువాత వెయ్యి సంవత్సరాల పాటు మానవజాతి ఏక దైవారాధనపై ఉంది. వద్, సువా, యగూస్, యఊక్, నసర్ అనే ఐదుగురు పుణ్యాత్ముల మరణానంతరం, షైతాన్ వారి విగ్రహాలను తయారుచేయించి, రాబోయే తరాలను వాటి ఆరాధన వైపు మళ్లించాడు. ఈ బహుదైవారాధనను నిర్మూలించడానికి, అల్లాహ్ తన మొదటి రసూల్ (సందేశహరుడు)గా నూహ్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఆయన 950 సంవత్సరాలు ఏకదైవారాధన వైపు ప్రజలను పిలిచినా, కొద్దిమంది తప్ప ఎవరూ విశ్వసించలేదు. ప్రజల తిరస్కరణ, ఎగతాళి, మరియు హెచ్చరికల అనంతరం, అల్లాహ్ ఆదేశంతో నూహ్ (అలైహిస్సలాం) ఒక ఓడను నిర్మించారు. మహా జలప్రళయం సంభవించి, అవిశ్వాసులందరూ (నూహ్ కుమారునితో సహా) మునిగిపోయారు మరియు నూహ్, ఆయనతో ఉన్న విశ్వాసులు మాత్రమే రక్షించబడ్డారు. తూఫాను తరువాత, నూహ్ యొక్క ముగ్గురు కుమారుల సంతానం ద్వారా మానవజాతి మళ్ళీ వ్యాపించింది, అందుకే ఆయనను “మానవుల రెండవ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్.

قَالَ اللّٰهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

“నిశ్చయంగా మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము – నీ జాతి వారిపై వ్యధాభరితమైన శిక్ష వచ్చి పడకముందే వారిని హెచ్చరించు” అని (ఆదేశించి). (71:1)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా, మీ అందరికీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం, ఈ భూమి మీద మానవులు నివాసం ఏర్పరుచుకున్న తరువాత అందరికంటే ముందు విగ్రహారాధన ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారు? విగ్రహారాధన మానవులు చేయడానికి అసలైన కారణం ఏమిటి? ప్రజలను మళ్ళీ సృష్టితాల ఆరాధన నుండి తప్పించి, సృష్టికర్త ఆరాధన వైపు పిలవటానికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రథమంగా పంపించిన రసూల్ ఎవరు? ఆయన పేరు ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఆయన ఎలా ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు? తరువాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా విశ్వాసులకు ఎలాంటి రక్షణ కల్పించాడు? అవిశ్వాసులకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏ విధంగా శిక్షించాడు? ఈ విషయాలన్నీ ఇన్షా అల్లాహ్ ఈ ప్రసంగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇంతకు ముందు ప్రసంగాలలో మిత్రులారా మనం, భూమి మీద మొదటి జంట ఆదం మరియు హవ్వా అలైహిస్సలాం వారిని అల్లాహ్ ఈ భూమి మీదికి పంపిన తర్వాత, వారు బ్రతికి ఉన్నంత కాలము వారి సంతానానికి అల్లాహ్ గురించి, అల్లాహ్ ఆరాధన గురించి నేర్పించి వెళ్లారు. వారి తర్వాత షైతాను కొన్ని కుయుక్తులు పన్ని, ప్రజలలో కొన్ని దురలవాట్లు ఏర్పడేటట్టు చేశాడు. కానీ ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము మానవుల మనుగడ ఈ భూమి మీద ప్రారంభమైన వెయ్యి సంవత్సరాల వరకు, అంటే మానవుని చరిత్ర ఈ భూమి మీద మొదలైన తర్వాత నుండి వెయ్యి సంవత్సరాల వరకు ప్రజలు కేవలం ఒకే ఒక ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే ఆరాధించుకుంటూ వచ్చారు. మధ్యలో షైతాను వలలో చిక్కి కొంతమందిలో కొన్ని దురలవాట్లు వచ్చాయి కానీ వారు మాత్రం ఒక అల్లాహ్ నే నమ్మారు, ఒక అల్లాహ్ నే ఆరాధించుకుంటూ వచ్చారు.

తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత, ఆదం అలైహిస్సలాం, హవ్వా అలైహిస్సలాం, ఆది దంపతుల మరణం తర్వాత, షీస్ అలైహిస్సలాం, ఇద్రీస్ అలైహిస్సలాం వారి మరణం తర్వాత, వెయ్యి సంవత్సరాల మానవ చరిత్ర ఈ భూమి మీద నడిచిన తర్వాత, అప్పుడు ప్రజలు రెండు రకాలుగా మారిపోయారు. ఒక రకం ఎవరంటే అల్లాహ్ ను తలచుకుంటూ, అల్లాహ్ ను ఆరాధించుకుంటూ, అల్లాహ్ మీద భయభక్తితో జీవితం గడుపుకునే దైవభక్తులు. మరో రకమైన ప్రజలు ఎవరంటే అల్లాహ్ ఆరాధనకు దూరమైపోయిన వారు, దైవ భీతికి, దైవ భక్తికి దూరంగా ఉంటున్న వారు మరి కొంతమంది. ఇలా దైవభక్తితో జీవించుకున్న వాళ్ళు కొందరు, దైవభక్తికి దూరమైపోయిన వారు కొందరు. అలా రెండు రకాలుగా ప్రజలు మారిపోయారు.

అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే, ఎవరైతే దైవ భీతితో భక్తులుగా జీవించుకుంటున్నారో వారిలో ఒక ఐదుగురు ప్రసిద్ధి చెంది ఉన్నారు. వారి ప్రస్తావన ఖురాన్లో కూడా వచ్చి ఉంది, 71వ అధ్యాయం, 23వ వాక్యంలో. వారి పేర్లు వద్, సువా, యగూస్, యఊక్, నసర్. ఈ ఐదు పేర్లు కూడా దైవ భీతితో జీవించుకుంటున్న దైవభక్తుల పేర్లు అని అబ్దుల్లా ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేసి ఉన్నారు.

అయితే ఈ ఐదు మందిని ఎవరైతే దైవ భీతికి దూరంగా ఉంటున్నారో వారు సైతం ఈ ఐదు మందిని అభిమానించేవారు. ప్రజలు వారు దైవభక్తులని గౌరవిస్తూ అభిమానించేవారు.

ఇక షైతాన్ మానవుని బద్ధ శత్రువు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతని గురించి ముందే తెలియజేసి ఉన్నాడు, మానవుల బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు అని. అతను మానవులను మార్గభ్రష్టత్వానికి గురి చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెంటనే ఎప్పుడైతే ప్రజలు కొంతమంది దైవ భీతితో జీవించుకుంటున్నారో, మరికొంతమంది దైవ భీతికి దూరమైపోయారో అన్న విషయాన్ని గమనించాడో, అతను దైవ భీతికి దూరంగా ఉంటున్న వారి వద్దకు వచ్చాడు. వచ్చి ఈ దైవ భీతి పరులు ఎవరైతే బాగా ప్రసిద్ధి చెందారో, వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీరి మరణానంతరం ప్రజల వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు ఈ ఫలా ఫలా వ్యక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు కదండీ. వారు మరణించిన తర్వాత వారి మీద ఉన్న మీ అభిమానాన్ని మీరు ఎలా చాటుకుంటారండి? అని వాడు ఏం చేశాడంటే కొన్ని ప్రతిమలు తయారుచేసి, ఏమండీ ఇవి మీరు అభిమానించే దైవ భీతిపరుల ప్రతిమలు. ఈ ప్రతిమలు మీరు మీ వద్ద ఉంచుకొని వారి అభిమానాన్ని చాటుకోండి, వారిని తలుచుకోండి అని తెలియజేశాడు.

చూడటానికి మాట చాలా మధురంగా కనిపిస్తుంది కదండీ. ఒక అభిమాని యొక్క ప్రతిమను తీసుకొని వచ్చి మీరు ఇతన్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఇతని ప్రతిమను మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తే ఎవరు వద్దంటాడండి? అలాగే ఆ ప్రజలు ఏం చేశారంటే, షైతాను మానవుని రూపంలో వచ్చి ఆ విధంగా చెబుతూ ఉంటే, ఇదేదో మంచిగానే ఉంది కదా అనుకొని తీసుకుపోయి వెళ్లి విగ్రహాలను ఇళ్లల్లో ఉంచుకున్నారు. చూడండి, ప్రతిమలు ఇళ్లల్లోకి కేవలం అభిమానం అనే ఒక కారణంతోనే వచ్చాయి. అవి ఆరాధ్యులు, మన కోరికలు తీర్చే దేవుళ్ల రూపాలు అన్న ఆలోచనతో అవి ఇళ్లల్లోకి రాలేదు.

మనం అభిమానించే మన దైవ భీతిపరుల ప్రతిమలు అని అవి ఇళ్లల్లోకి వచ్చాయి. వారు బ్రతికి ఉన్నంత కాలం, ఎవరైతే ఆ విగ్రహాలను, ఆ ప్రతిమలను ఇళ్లల్లోకి తీసుకొని వెళ్లారో వారు జీవించినంత కాలము వాటిని చూసుకుంటూ మన పూర్వీకులు, మన పూర్వీకులు ఒకప్పుడు ఉండేవారు, ఒకప్పుడు భక్తి శ్రద్ధలతో జీవించుకునేవారు అని చెప్పుకుంటూ జీవించారు. ముఖ్యంగా ఆ దైవ భీతిపరులు ఎక్కడైతే దైవ ఆరాధనలో సమయం గడిపేవారో, అదే చోట ఆ విగ్రహాలను ప్రతిష్టించుకున్నారు అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికినీ మానవుల మధ్యకి ప్రతిమలు, విగ్రహాలు వచ్చాయి. ప్రారంభంలో అవి కేవలము అభిమానించబడ్డాయి అంతేగాని ఆరాధించబడలేదు.

రోజులు గడిచాయి. మానవుల ఆయుష్షు ముగిస్తూ పోయింది. ఒక తరం గడిచింది, తర్వాత తరం గడిచింది. ఆ విధంగా తరాలు గడిచిన తర్వాత విగ్రహాలు మాత్రము అవి అలాగే నిలబడి ఉన్నాయి. ఒక రెండు, మూడు తరాలు గడిచిన తర్వాత అవి ఒక పురాతన వస్తువులాగా మారిపోయింది. దాని చరిత్ర ఎవరికీ తెలియదు, తర్వాత వచ్చిన తరాల వారికి.

అప్పుడు షైతాన్ మళ్ళీ మానవుని రూపంలో వారి మధ్యకు వచ్చి, తర్వాతి తరాల వారి వద్దకు వచ్చి, ఏమండీ మీ పూర్వీకులు వీటినే ఆరాధించుకునేవారు, మీరెందుకండి విస్మరిస్తున్నారు వీటిని? మీ పూర్వీకులు వీటిని ఆరాధిస్తుండగా నేను చూశాను అని అతను నమ్మజబితే, తర్వాత తరాల వారు అతని మాటలను నమ్మి వెంటనే ఆ ప్రతిమలను, ఆ విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించేశారు.

చూశారా, షైతాను ఎలా క్రమంగా, నెమ్మదిగా ప్రజలను అల్లాహ్ ఆరాధన నుండి తప్పించి విగ్రహారాధన వైపుకి తీసుకెళ్ళిపోయాడో? అభిమానం అన్న ఒక విషయాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. తరువాత ఆ విగ్రహాలను ఇళ్లల్లో తీసుకొని వెళ్లి, ముందు ప్రతిష్టింపజేసి, తర్వాత తరాల వారికి మాత్రము వారే మీ దేవుళ్ళు అన్నట్టుగా చిత్రీకరించి చెప్పగానే తర్వాత తరాల వారు తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమాయకత్వానికి గురయ్యి వారు ఆ విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. విగ్రహారాధన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమండలం మీద ప్రారంభమైంది. షైతాను వలలో చిక్కుకొని ప్రజలు ఆ విధంగా విగ్రహారాధన చేశారు.

ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) వారి పిలుపు

అప్పుడు పైనుంచి గమనిస్తున్న అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, ఇదేమిటండీ మానవులు రాళ్ళను, విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారో అని వెంటనే వారిలో నుంచే ఒక ఉత్తమమైన వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకొని వారి మధ్యకు ప్రవక్తగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రభవింపజేశాడు. ఆయన పేరే నూహ్ అలైహిస్సలాం.

నూహ్ అలైహిస్సలాం ప్రవక్త పదవి దక్కిన తర్వాత ప్రజల మధ్యకు ప్రవక్తగా వెళ్లి ముందుగా నూహ్ అలైహిస్సలాం వారి జాతి ప్రజలకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, ఖురాన్ లో ఏడవ అధ్యాయం 59వ వాక్యంలో మనం చూస్తే కనిపిస్తుంది అక్కడ, నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు:

يَٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ

(యా కౌమి అ`బుదుల్లాహ మాలకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహూ)
“ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దేవుడు లేడు.” (7:59)

ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప వేరెవరూ మీ ఆరాధనకు అర్హులు కారు. అంటే నూహ్ అలైహిస్సలాం ప్రజల వద్దకు వెళ్లి మొదటి దైవ వాక్యం వినిపించింది ఏమిటంటే, మీ ఆరాధనలకు అర్హుడు కేవలం ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి నా జాతి ప్రజలారా మీరు అల్లాహ్ ను ఆరాధించండి, అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలుపునిచ్చారు.

ఇక్కడ ఒక విషయం మనం గుర్తులో పెట్టుకోవాలి అదేమిటంటే, ఈ భూమండలం మీద మానవుని చరిత్ర మొదలైన తర్వాత ప్రజలకు విగ్రహారాధన నుండి తప్పించి అల్లాహ్ ఆరాధన వైపుకి రండి అని పిలిచిన మొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ గౌరవం ఆయనకే దక్కింది.

నూహ్ అలైహిస్సలాం కేవలం ప్రజలకు అల్లాహ్ ను ఆరాధించండి అని చెప్పడమే కాదండి, అల్లాహ్ ను ఆరాధించిన వలన మీకు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఎలాంటి అనుగ్రహాలు ప్రసాదిస్తాడు అన్న విషయాలు కూడా తెలియజేశారు. ఖురాన్లో మనం చూసినట్లయితే 71వ అధ్యాయం 10వ వాక్యము నుండి 12వ వాక్యం వరకు ఆయన చెప్పిన మాటలు తెలపబడ్డాయి. ఆయన ఏమన్నారంటే:

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا ‎﴿١٠﴾‏ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا ‎﴿١١﴾‏ وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَٰرًا ‎﴿١٢﴾‏

(ఫకుల్తుస్తగ్ఫిరూ రబ్బకుమ్ ఇన్నహూ కాన గఫ్ఫారా. యుర్సిలిస్ సమాఅ అలైకుమ్ మిద్రారా. వయుమ్దిద్కుమ్ బి అమ్వాలివ్ వబనీన వయజ్అల్ లకుమ్ జన్నతివ్ వయజ్అల్ లకుమ్ అన్హారా)
“మీరు మీ ప్రభువును క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన క్షమాశీలుడు. (అలా చేస్తే) ఆయన మీపై ఆకాశం నుండి ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. సిరిసంపదలతో, సంతానంతో మీకు సహాయం చేస్తాడు. మీ కోసం తోటలను ఉత్పాదనం చేస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు.” (71:10-12)

మీరు బహుదైవారాధన చేసి పాపానికి ఒడిగట్టారు కదా. మీరు అల్లాహ్ తో క్షమాపణ వేడుకోండి. క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. ఆయన నిశ్చయంగా క్షమించేవాడు. క్షమించిన తర్వాత ఆయన మీ కోసం ఏం చేస్తాడంటే, ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.

మీ పాపాలు మన్నిస్తాడు, వర్షాలు కురిపిస్తాడు, నదులు ప్రవహింపజేస్తాడు, మీకు సంతానం ప్రసాదిస్తాడు, పంటలు పండిస్తాడు. ఈ విధంగా అల్లాహ్ అనుగ్రహాలు మీకు దొరుకుతూ ఉంటాయి అని నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధన వైపు పిలుస్తూ అల్లాహ్ ప్రజలకు ప్రసాదించే అనుగ్రహాల గురించి కూడా తెలియజేశారు.

జాతి ప్రజల తిరస్కరణ మరియు ఎగతాళి

అయితే ప్రజల స్పందన ఎలా ఉండేది? అది మనం చూసినట్లయితే, ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాం ఈ విషయాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లారో ప్రజలు ఏమనేవారంటే:

إِنَّا لَنَرَىٰكَ فِى ضَلَٰلٍ مُّبِينٍ

(ఇన్నాల నరాక ఫీ దలాలిమ్ ముబీన్)
“మేమైతే నిన్ను స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లు చూస్తున్నాము.” (7:60)
ఓ నూహ్, నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తుంది అన్నారు. మరికొంతమంది ఏమన్నారంటే:

مَا سَمِعْنَا بِهَٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

(మా సమిఅనా బిహాజా ఫీ ఆబాయినల్ అవ్వలీన్)
“ఇలాంటి మాటను మేము మా తాతముత్తాతల కాలంలో ఎన్నడూ వినలేదు.” (23:24)
అనగా ఇతను చెప్పే దానిని మేము ఇదివరకు ఎన్నడూ మా తాత ముత్తాతల కాలంలో విననేలేదు. మా తాత ముత్తాతల కాలంలో ఇలా ఒక దేవుణ్ణి ఆరాధించాలి, అల్లాహ్ ని దేవుణ్ణి, అల్లాహ్ ని ఆరాధించాలన్న మాటలు మనం విననేలేదే అని కొంతమంది మాట్లాడారు. మరి కొంతమంది ఏమన్నారంటే:

وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَٰٓئِكَةً

(వలౌ షా అల్లాహు లఅన్జల మలాయికతన్)
“అల్లాహ్‌యే గనక తలచుకుంటే దైవదూతలను దించి ఉండేవాడు.” (23:24)
ప్రజలను అల్లాహ్ వైపు పిలవాలనే ఒక ఉద్దేశం అల్లాహ్ కు ఉండినట్లయితే మానవుడిని ఎందుకు పంపిస్తాడు? ఒక దైవదూతను పంపించేవాడు కదా అని అన్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం, చూడండి ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారికి నువ్వు మార్గభ్రష్టత్వానికి గురైపోయావు అంటున్నారు, మనిషిగా నువ్వు మా వద్దకు ప్రవక్తగా రావడం ఏంటి, దైవదూత రావచ్చు కదా అంటున్నారు, మా తాత ముత్తాతల కాలంలో ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ వినలేదే అంటున్నారు. అయితే నూహ్ అలైహిస్సలాం ఎంతో మృదు స్వభావంతో ప్రజలకు ఎంత మధురమైన మాటలు చెప్తున్నారో చూడండి. ఆయన అన్నారు, “నా జాతి ప్రజలారా, నేను దారి తప్పలేదు. నేను సర్వలోకాల ప్రభువు తరపున పంపబడిన ప్రవక్తను. నేను మీ మేలు కోరేవాడిని.”

ప్రతి జాతిలో కొంతమంది పెద్దలు ఉంటారండి. నూహ్ అలైహిస్సలాం వారి జాతిలో కూడా పెద్దలు ఉండేవారు కదా, వారు నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని ఏమనేవారంటే:

يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ

(యురీదు అన్ యతఫద్దల అలైకుమ్)
“ఇతను మీపై ఆధిపత్యం చెలాయించాలని కోరుతున్నాడు.” (23:24)
ఇతను మీపై పెత్తరికాన్ని కోరుకుంటున్నాడు. మరికొంతమంది పెద్దలు ఏమనేవారంటే:

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ

(ఇన్ హువ ఇల్లా రజులుమ్ బిహీ జిన్నతున్)
“ఇతను పిచ్చిపట్టిన మనిషి తప్ప మరెవరూ కారు.” (23:25)
అనగా ఇతనికి పిచ్చి పట్టినట్టుంది. మరికొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక షరతు పెట్టేశారు. ఏంటి ఆ షరతు? నూహ్ అలైహిస్సలాం ప్రజలకు దైవ వాక్యాలు వినిపిస్తూ ఉంటే కొంతమంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలు విని విశ్వసించి ముస్లింలుగా, విశ్వాసులుగా జీవించుకుంటున్నారు. అయితే వారందరూ కూడా హోదాపరంగా, ధనంపరంగా బలహీనులు. వారి గురించి వచ్చి ఈ జాతి పెద్దలు నూహ్ అలైహిస్సలాం వారి వద్ద షరతు పెడుతున్నారు. ఏమంటున్నారంటే:

أَنُؤْمِنُ لَكَ وَٱتَّبَعَكَ ٱلْأَرْذَلُونَ

(అను’మినులక వత్తబఅకల్ అర్జలూన్)
“(ఓ నూహ్‌!) నిన్ను అనుసరిస్తున్న వారంతా అధములే కదా! మరి మేము నిన్ను ఎలా విశ్వసిస్తాము?” (26:111)
అదేమిటంటే, ఓ నూహ్, మేము నీ మాటను విశ్వసిస్తాం, నీ మాటను అంగీకరిస్తామయ్యా, అయితే నీ వద్ద ఉన్న ఈ బలహీనులు, అధములు వీరిని నువ్వు నీ వద్ద నుండి గెంటివేయి.

మేము నిన్ను విశ్వసించాలా? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు. కాబట్టి మేము నీ మాట వినాలంటే ఈ అధములని నీ వద్ద నుండి నువ్వు గెంటేయాలి అన్నారు. చూడండి, చులకనగా చూస్తున్నారు విశ్వాసులను. అహంకారం అండి, హోదాలలో ఉన్నారు కదా, జాతి పెద్దలు కదా, గర్వం. ఆ అహంకారంతో, గర్వంతో ఏమంటున్నారంటే వారిని నువ్వు గెంటేస్తే నేను నీ మాట వింటాము అంటున్నారు.

అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “ఏమండీ, నేను ఏదో హోదా కోరుకుంటున్నాను, లేదా ధనం కోరుకుంటున్నాను, మీ నాయకుడిని అయిపోవాలి ఇలాంటి కోరికలతో నేను మీకు ఈ వాక్యాలు వినిపిస్తున్నానని మీరు అనుకుంటున్నారా? వాస్తవం ఏమిటంటే:

وَمَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ

(వమా అస్అలుకుమ్ అలైహి మిన్ అజ్ర్)
“నేను దీనికై మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు.” (26:109)
నేను ఈ బోధనలకు ప్రతిఫలంగా ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. అలాగే:

وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلْمُؤْمِنِينَ

(వమా అన బితారిదిల్ ము’మినీన్)
“నేను విశ్వాసులను తరిమివేసేవాడను కాను.” (26:114)
నేను మాత్రం విశ్వాసులను ఎట్టి పరిస్థితుల్లో గెంటివేసేవాడిని కాను. విశ్వాసులు వాళ్ళు ధనపరంగా బలహీనులా, బలవంతులా, ఇది కాదు. విశ్వాసం వారిది ఎంత దృఢమైనదనే దానిని బట్టి వారిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా గౌరవ స్థానాలు కేటాయిస్తాడు కాబట్టి నేను మాత్రం వీరిని నా వద్ద నుండి గెంటివేయను అని నూహ్ అలైహిస్సలాం వారు వారికి తెలియజేశారు.

నూహ్ అలైహిస్సలాం వారు జాతి ప్రజల మధ్య ఇంచుమించు 950 సంవత్సరాల వరకు రేయింబవళ్ళు కష్టపడి దైవ వాక్యాలు ప్రజలకు తెలియజేశారు. ఖురాన్లోని 29వ అధ్యాయం 14వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا

(ఫలబిస ఫీహిమ్ అల్ఫ సనతిన్ ఇల్లా ఖమ్సీన ఆమన్)
“అతను వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు.” (29:14)
అనగా 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు, 50 తక్కువ వెయ్యి సంవత్సరాలు అంటే 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారి మధ్య ఉన్నాడు. రాత్రిపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు, పగలుపూట వారికి దైవ వాక్యాలు వినిపించారు. అందరూ కలిసి ఉన్నచోట వెళ్లి దైవ వాక్యాలు వినిపించారు. ఏకాంతంలో వెళ్లి కలిసి వారికి అల్లాహ్ వైపు పిలిచారు, దైవ వాక్యాలు వినిపించారు. బహిరంగంగా కూడా దైవ వాక్యాలు ప్రకటించారు, ఏకాంతంలో కూడా వెళ్లి వారికి అల్లాహ్ వాక్యాలు తెలియజేశారు. ఇలా నూహ్ అలైహిస్సలాం ఎన్ని రకాలుగా వారికి అల్లాహ్ వాక్యాలు వినిపించినా వారు మాత్రం ఏం చేసేవారంటే, చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు, తలల మీద బట్టలు కప్పుకునేవారు.

అంతే కాదండి, వారిలో ఎవరికైనా మరణం సమీపిస్తే మరణించే ముందు కుటుంబ సభ్యుల్ని దగ్గరికి పిలిచి హితవు చేసేవారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో మీరు నూహ్ మాట వినకండి. నూహ్ ఎటువైపు మిమ్మల్ని పిలుస్తున్నాడో అటువైపు మీరు వెళ్ళకండి. నూహ్ మాటల్ని మీరు పట్టించుకోకండి. అలాగే మనం పూజిస్తున్న వద్, సువా, యగూస్, యఊక్, నసర్, వీళ్ళ ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలకండి అని చెప్పేవారు. దీని ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది:

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

(వకాలూ లా తజరున్న ఆలిహతకుమ్ వలా తజరున్న వద్దవ్ వలా సువాఅవ్ వలా యగూస వయఊక వనస్రా)
“మరియు వారు ఇలా అన్నారు: ‘మీరు మీ దైవాలను ఎంతమాత్రం వదలకండి. వద్దును, సువాను, యగూసును, యఊకును, నస్రును అసలే వదలకండి’.” (71:23)

చివరికి అన్ని సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు కష్టపడినా ఎంతమంది విశ్వసించారంటే, ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. 950 సంవత్సరాల కష్టానికి ఫలితంగా కేవలం ఇంచుమించు 80 మంది మాత్రమే విశ్వసించారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం జాతి ప్రజలను హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే:

إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ

(ఇన్నీ అఖఫు అలైకుమ్ అజాబ యౌమిన్ అజీమ్)
“నిశ్చయంగా నేను మీ విషయంలో ఒక మహత్తర దినపు శిక్షకు భయపడుతున్నాను.” (7:59)
అనగా మీ విషయంలో ఒక మహా దినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. ఒక శిక్ష మీకు వచ్చి పట్టుకుంటుందన్న భయం నాకు కలుగుతూ ఉంది, కాబట్టి మీరు దైవ శిక్షకు భయపడండి, అల్లాహ్ వైపుకు రండి అని అల్లాహ్ శిక్ష గురించి వారిని హెచ్చరించారు.

అయితే జాతి ప్రజలు, జాతి పెద్దలు ఆ మాట విని నూహ్ అలైహిస్సలాం వారితో ఏమనేవారంటే:

قَالُوا۟ يَٰنُوحُ قَدْ جَٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ

(ఖాలూ యా నూహు కద్ జాదల్తనా ఫ అక్సర్త జిదాలనా ఫ’తినా బిమా తఇదునా ఇన్ కుంత మినస్ సాదిఖీన్)
“ఓ నూహ్‌! నీవు మాతో వాదించావు. చాలా ఎక్కువగా వాదించావు. నీవు గనక సత్యవంతుడివే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతున్న ఆ శిక్షను తీసుకురా చూద్దాం.” (11:32)
అనగా, ఓ నూహ్, నువ్వు మాతో వాదించావు, మరీ మరీ వాదించావు, మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని అనగా ఆ దైవ శిక్షని తీసుకురా అని చెప్పేవారు. ఎంత పెద్ద మాట అండి! అల్లాహ్ శిక్ష మిమ్మల్ని పట్టుకుంటుంది అని ప్రవక్త హెచ్చరిస్తూ ఉంటే, జాతి ప్రజలు, జాతి పెద్దలు ఏమంటున్నారంటే, ఈ హెచ్చరికలు నోటితో చెప్పటం కాదు, ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే అయితే తీసుకురా చూద్దాం ఆ దైవ శిక్ష ఎలా ఉంటాదో అంటున్నారంటే ఎంతటి అహంకారము. షైతాను వారిని ఎలా అంధులుగా చేసేసాడో చూడండి.

మరి కొంతమంది అయితే ఏకంగా నూహ్ అలైహిస్సలాం వారి మీదకే తిరగబడిపోయారు. వారేమన్నారంటే:

لَئِن لَّمْ تَنتَهِ يَٰنُوحُ لَتَكُونَنَّ مِنَ ٱلْمَرْجُومِينَ

(లఇల్ లమ్ తంతహి యా నూహు లతకూనన్న మినల్ మర్జుమీన్)
“ఓ నూహ్‌! నీవు గనక (ఈ పని నుండి) విరమించుకోకపోతే, నిశ్చయంగా నీవు రాళ్లతో కొట్టి చంపబడతావు.” (26:116)
వారేమంటున్నారంటే, నువ్వు గనుక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపడం ఖాయం. దైవ శిక్ష వచ్చి పడుతుంది అని మమ్మల్ని బెదిరించడం కాదు, ఇలాంటి మాటలు నువ్వు మానుకోకపోతే నిన్నే మేమందరం కలిసి రాళ్లతో కొట్టి చంపేస్తాము, ఇది ఖాయం అని చెప్పారు.

దైవ ఆదేశం మరియు ఓడ నిర్మాణం

అలాంటప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక మాట తెలియజేశాడు. ఏంటి ఆ మాట?

أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ

(అన్నహూ లయ్ యు’మిన మిన్ కౌమిక ఇల్లా మన్ కద్ ఆమన్)
“ఇంతకు ముందే విశ్వసించిన వారు తప్ప, నీ జాతి వారిలో మరింకెవరూ విశ్వసించరు.” (11:36)
ఓ నూహ్, నీ జాతి వారిలో ఇంతవరకు విశ్వసించిన వారు తప్ప ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. ఇప్పటివరకు ఎంతమంది అయితే విశ్వసించారో వారే విశ్వాసులు. ఇక నీ జాతిలో ఏ ఒక్కడూ కూడా విశ్వసించేవాడు లేడు అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ తో ప్రార్థన చేశారు. ఏమన్నారు?

رَبِّ إِنَّ قَوْمِى كَذَّبُونِ ‎﴿١١٧﴾‏ فَٱفْتَحْ بَيْنِى وَبَيْنَهُمْ فَتْحًا وَنَجِّنِى وَمَن مَّعِىَ مِنَ ٱلْمُؤْمِنِينَ ‎﴿١١٨﴾‏

(రబ్బి ఇన్న కౌమీ కజ్జబూన్. ఫఫ్తహ్ బైని వబైనహుమ్ ఫత్హవ్ వనజ్జినీ వమన్ మఇయ మినల్ ము’మినీన్)
“నా ప్రభూ! నా జాతి వారు నన్ను ధిక్కరించారు. కనుక నాకూ, వారికీ మధ్య ఒక స్పష్టమైన తీర్పు కావాలి. నాకూ, నాతో పాటు ఉన్న విశ్వాసులకూ మోక్షం ప్రసాదించు.” (26:117-118)
అనగా, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకూ, వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. ఇక నిర్ణయం నీ వైపే వదిలేస్తున్నాను ఓ అల్లాహ్, నీవే ఫలితం తేల్చేయి, నన్ను, నాతో పాటు ఉన్న విశ్వాసులను మాత్రము నువ్వు రక్షించు కాపాడు అని నూహ్ అలైహిస్సలాం వారు దుఆ చేయగా, ప్రార్థన చేయగా అప్పుడు అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏంటది?

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

(వస్నఇల్ ఫుల్క బిఅ’యునినా వవహ్యినా వలా తుఖతిబ్నీ ఫిల్ లజీన జలమూ ఇన్నహుమ్ ముగ్ రఖూన్)
“నీవు మా కళ్లెదుట, మా ఆదేశానుసారం ఓడను నిర్మించు. దుర్మార్గుల విషయంలో నాతో మాట్లాడకు. వారు ముంచివేయబడటం ఖాయం.” (11:37)
అనగా, మా కళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు, వారంతా ముంచివేయబడేవారే. అంటే మా ఆదేశాల ప్రకారము ఒక ఓడను నువ్వు తయారు చేసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నూహ్ అలైహిస్సలాం వారికి ఆదేశాలు ఇచ్చేశాడు.

నూహ్ అలైహిస్సలాం విషయాన్ని అర్థం చేసుకొని అల్లాహ్ తో మరొక్కసారి ప్రార్థిస్తున్నారు, ఏమన్నారంటే:

رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَٰفِرِينَ دَيَّارًا ‎﴿٢٦﴾‏ إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا ‎﴿٢٧﴾‏

(రబ్బి లా తజర్ అలల్ అర్జి మినల్ కాఫిరీన దయ్యారా. ఇన్నక ఇన్ తజర్హుమ్ యుజిల్లా ఇబాదక వలా యలిదూ ఇల్లా ఫాజిరన్ కఫ్ఫారా)
“నా ప్రభూ! నీవు భూమిపై ఒక్క అవిశ్వాసిని కూడా సజీవంగా వదలొద్దు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను మార్గభ్రష్టుల్ని చేస్తారు. వారు జన్మనిచ్చేది కూడా అవిధేయులకూ, కృతఘ్నులకూ మాత్రమే.” (71:26-27)
నా ప్రభు, నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసిని సజీవంగా వదిలిపెట్టకు. ఒకవేళ నువ్వు గనుక వీళ్ళను వదిలిపెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు, వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరుడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు. కాబట్టి అవిశ్వాసుల్ని ఎవరినీ నువ్వు వదలొద్దు, వారు మార్గభ్రష్టత్వానికి గురయ్యిందే కాకుండా వారి సంతానాన్ని కూడా వారు మార్గభ్రష్టులుగా మార్చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరినీ నువ్వు వదలొద్దు ఓ అల్లాహ్ అని మరొక్కసారి ప్రార్థన చేసేశారు.

అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం ఓడను నిర్మిస్తున్నారు. నూహ్ అలైహిస్సలాం ఏ ప్రదేశంలో అయితే ఓడ నిర్మిస్తున్నారో, అది సముద్రానికి చాలా దూరంగా ఉండే ప్రదేశం. ధార్మిక పండితులు, ముఖ్యంగా చరిత్రకారులు నూహ్ అలైహిస్సలాం వారి పుట్టుక, నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశం గురించి ఏమన్నారంటే ఇరాక్ లోని కనాన్ ప్రదేశంలో ఆయన జీవించారు, నివసించారు ఆ రోజుల్లో అని తెలియజేశారు. అసలు విషయం అల్లాహ్ కే తెలియాలి. అయితే ఒక విషయం మాత్రము నిజం, అదేమిటంటే నూహ్ అలైహిస్సలాం వారు నివసించిన ప్రదేశము సముద్రానికి దూరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఓడను నిర్మిస్తున్నారు. ఓడ నిర్మిస్తూ ఉంటే ఆ జాతి ప్రజలు, ఆ జాతి పెద్దలు అటువైపు నుంచి వస్తూ వెళుతూ ఆ ఓడ నిర్మాణాన్ని చూసి పరస్పరము నవ్వుకునేవారు, విశ్వాసులను చూసి హేళన చేసేవారు. ఇదేంటి ఈ ఎడారిలో మీరు పడవ నడిపిస్తారా? ఇక్కడ మీరు పడవ నిర్మిస్తున్నారు, ఇది మూర్ఖత్వం కాదా? పడవ ఎక్కడైనా ఎడారిలో నడుస్తుందా? అంటూ హేళన చేసేవారు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారితో ఒకే మాట అనేవారు. అదేమిటంటే:

إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

(ఇన్ తస్ఖరూ మిన్నా ఫఇన్నా నస్ఖరు మిన్కుమ్ కమా తస్ఖరూన్)
“ఒకవేళ మీరు మమ్మల్ని చూసి నవ్వితే, మీరు నవ్వుతున్న విధంగానే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతాము.” (11:38)
అనగా మీరు మా స్థితిపై నవ్వుతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుకుంటాము. అంటే ఎలాగైతే మీరు మమ్మల్ని చూసి ఈరోజు నవ్వుకుంటున్నారు కదా, ఒకరోజు త్వరలోనే రాబోతోంది, ఆ రోజు మేము నవ్వుతాం, అప్పుడు మీరు ఏడుస్తారు అన్న విషయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశారు.

అలాగే నూహ్ అలైహిస్సలాం అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో మరొక్కసారి ప్రార్థించారు. ఏమన్నారంటే:

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَٰتِ

(రబ్బిగ్ఫిర్లీ వలివాలిదయ్య వలిమన్ దఖల బైతియ ము’మినవ్ వలిల్ ము’మినీన వల్ ము’మినాత్)
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారినీ, విశ్వాసులైన పురుషులందరినీ, స్త్రీలందరినీ క్షమించు.” (71:28)
నన్నూ, నా తల్లిదండ్రులను విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు.

మహా జలప్రళయం మరియు రక్షణ

ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక నిర్ణీత సమయాన్ని నూహ్ అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే పొయ్యి, పొయ్యిలో నుంచి నీళ్ళు ఉప్పొంగుతాయో అప్పుడు మా ఆదేశము వచ్చి పొయ్యి పొంగినప్పుడు ఈ ఓడలోకి ప్రతి జీవరాశి నుండి రెండేసి, అనగా ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో, ఎవరి విషయంలోనైతే ముందుగానే మాట ఖరారైందో వారిని వదిలేయి, ఇంకా విశ్వాసులందరినీ కూడా ఎక్కించుకో. అయితే అతని వెంట విశ్వసించిన వారు బహు కొద్దిమంది మాత్రమే. (11:40).

మా ఆదేశం వచ్చినప్పుడు పొయ్యి ఉప్పొంగినప్పుడు నీళ్లు ఉప్పొంగినప్పుడు ప్రతి జాతిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని ఓడలోకి ఎక్కించుకో, విశ్వాసులను కూడా నీతో పాటు తీసుకో అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేయగా, నూహ్ అలైహిస్సలాం ఆ రోజు కోసం ఎదురు చూడగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నిర్ణయించిన ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆకాశం నుండి జోరున వాన కురిసింది, నీళ్లలో నుంచి కూడా నీళ్లు ఉప్పొంగి పైకి వచ్చేసాయి. అప్పుడు నూహ్ అలైహిస్సలాం విశ్వాసులందరినీ తీసుకొని పడవ ఎక్కేశారు. అలాగే ప్రతి జాతిలో నుండి, ప్రతి జీవిలో నుండి ఒక్కొక్క జంటని ఒక్కొక్క జంటని పడవలోకి ఎక్కించుకున్నారు.

ఆ తర్వాత చూస్తూ ఉండంగానే నీటి మట్టం పెరుగుతూ పోయింది, పడవ నీటిపై తేలడం ప్రారంభించింది. అప్పుడు నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు కూర్చున్న ఉన్నవారితో అన్నారు,

بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ

(బిస్మిల్లాహి మజ్రేహా వముర్సాహా)
“దీని ప్రయాణం, దీని మజిలీ అల్లాహ్ పేరుతోనే ఉన్నాయి.” (11:41)
అనగా అల్లాహ్ పేరుతోనే ఇది నడుస్తుంది మరియు ఆగుతుంది. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులందరూ అల్లాహ్ తో దుఆ చేశారు.

ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّٰلِمِينَ

(అల్ హందులిల్లాహిల్ లజీ నజ్జానా మినల్ కౌమిజ్ జాలిమీన్)
“దుర్మార్గులైన జనుల బారి నుండి మమ్మల్ని కాపాడిన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.” (23:28)
దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్ కు కృతజ్ఞతలు.

ఇలా ఆ పడవ నీటిపై తేలుతున్నప్పుడు నూహ్ అలైహిస్సలాం మరియు విశ్వాసులు దుఆ పఠిస్తూ ఉంటే నూహ్ అలైహిస్సలాం పడవలో నుంచి బయటికి చూడగా బయట నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కనిపించాడు. అతని పేరు యామ్ లేదా కనాన్. నూహ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా నలుగురు బిడ్డల్ని ప్రసాదించాడు. ఆ నలుగురిలో ఒకడు యామ్ లేదా కనాన్. అతను నూహ్ అలైహిస్సలాం వారి మాటను విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యుల్లో నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి కూడా నూహ్ అలైహిస్సలాం వారిని విశ్వసించలేదు. నూహ్ అలైహిస్సలాం వారి నలుగురు కుమారులలో ఒక్క కుమారుడు కనాన్ లేదా యామ్ అతను కూడా విశ్వసించలేదు. అవిశ్వాసులతో స్నేహము చేసి వారి మాటల్లో పడి తండ్రినే, ప్రవక్తనే, బోధకుడినే తిరస్కరించేశాడు. బయట నిలబడి ఉన్నాడు. అవిశ్వాసి కదా, విశ్వాసులతో పాటు పడవలోకి రాలేదు.

బయట నిలబడి ఉంటే నూహ్ అలైహిస్సలాం కుమారుణ్ణి చూసి ఏమన్నారంటే:

يَٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَٰفِرِينَ

(యా బునయ్యర్కమ్ మఅనా వలా తకుమ్ మఅల్ కాఫిరీన్)
“ఓ నా కుమారా! మాతో పాటు (ఈ ఓడలో) ఎక్కు. అవిశ్వాసులతో చేరిపోకు.” (11:42)
బాబు, మాతో పాటే వచ్చి కూర్చో, అవిశ్వాసులతో వెళ్ళకు నాయనా. తండ్రి తండ్రే కదండీ, రక్త సంబంధీకుడు కదండీ. బిడ్డను చూసి ఏమన్నారంటే బాబు, మాతో పాటు వచ్చి పడవలో కూర్చో నాయనా, విశ్వాసులతో పాటు వచ్చి కలిసిపో నాయనా, అవిశ్వాసులతో పాటు ఉండకు నాయనా అని నూహ్ అలైహిస్సలాం బిడ్డను పిలిస్తే అతను ఏమంటున్నాడో చూడండి. అవిశ్వాసి కదండీ, అవిశ్వాసులతో స్నేహం చేశాడు కదండీ. కాబట్టి మాట కూడా అవిశ్వాసి లాగే అతని నోటి నుంచి వస్తుంది. అతను ఏమన్నాడంటే:

سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ

(సఆవీ ఇలా జబలియ్ య’సిమునీ మినల్ మా’)
“నన్ను నీటి నుండి కాపాడే ఏదైనా పర్వతాన్ని ఆశ్రయిస్తాను.” (11:43)
ఏమండీ, ఎంత జోరున వాన కురుస్తా ఉంది అంటే నీటి మట్టం ఎంత తొందరగా పెరుగుతూ ఉంది అంటే ఇలాంటి తూఫానులో ఈ పడవ అసలు నిలుస్తుందా అండి? నేను నా ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదైనా ఎత్తైన పర్వతాన్ని ఆశ్రయిస్తాను, అది నన్ను ఈ నీళ్ల నుండి కాపాడుతుంది అని చెప్తున్నాడు. దానికి నూహ్ అలైహిస్సలాం వారు అన్నారు, “లేదు నాయనా, ఈరోజు అల్లాహ్ ఎవరిని రక్షిస్తాడో వారు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళు తప్ప మరెవ్వరూ ఈరోజు రక్షించబడే వాళ్ళు ఉండరు. కాబట్టి నా మాట విను నాయనా, వచ్చి మాతో పాటు పడవలో ఎక్కి కూర్చో నాయనా” అంటే అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. అంతలోనే చూస్తూ ఉండగా ఒక పెద్ద అల వచ్చింది, ఆ అల తాకిడికి అతను వెళ్లి నీళ్లల్లో పడిపోయినాడు, నీటిలో మునిగి మరణిస్తున్నాడు.

తండ్రి ప్రేమ ఉప్పొంగింది. కళ్ళ ముందరే బిడ్డ నీళ్లల్లో మునిగి మరణిస్తూ ఉంటే చూడలేకపోయారు, చలించిపోయారు. వెంటనే అల్లాహ్ తో దుఆ చేసేసారు, “ఓ అల్లాహ్, నా బిడ్డ, నా సంబంధీకుడు, నా రక్తం, నా కళ్ళ ముందరే మరణిస్తున్నాడు” అంటే అల్లాహ్ తో దుఆ చేయగా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా వెంటనే నూహ్ అలైహిస్సలాం వారిని హెచ్చరించాడు. ఏమన్నారంటే:

يَٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ

(యా నూహు ఇన్నహూ లైస మిన్ అహ్లిక)
“ఓ నూహ్‌! అతను నీ కుటుంబీకుడు కాడు.” (11:46)
ఓ నూహ్, ముమ్మాటికి వాడు నీ కుటుంబీకుడు కాడు, వాడి పనులు ఏ మాత్రము మంచివి కావు.

إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَٰهِلِينَ

(ఇన్నీ అఇజుక అన్ తకూన మినల్ జాహిలీన్)
“నీవు అజ్ఞానులలో చేరకుండా ఉండాలని నేను నీకు ఉపదేశిస్తున్నాను.” (11:46)
అవిశ్వాసుల గురించి నువ్వు నాతో ప్రార్థించకు, నేను నీకు… అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అంటున్నాడు, నువ్వు అజ్ఞానులలో ఒకనివి కారాదని నేను నీకు ఉపదేశిస్తున్నాను అన్నాడు.

నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడిని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా, అతను నీ కుమారుడు కాదు, అతని పనులు మంచివి కావు అంటున్నాడంటే కొంతమంది ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం ఆ… నూహ్ అలైహిస్సలాం వారి ఆ కుమారుడు నూహ్ అలైహిస్సలాం కు పుట్టినవాడు కాదు, అక్రమ సంపాదము అన్నట్టుగా కొంతమంది అపార్థం చేసుకున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్ సుమ్మ అస్తగ్ఫిరుల్లాహ్. ఎంత మాత్రమూ ఇది సరైన విషయము కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్తలకు అలాంటి అసభ్యమైన గుణము కలిగిన మహిళలను సతీమణులుగా ఇవ్వడు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి విశ్వసించకపోయినంత మాత్రాన ఆమె నూహ్ అలైహిస్సలాం వారిని ద్రోహం చేసింది అనేది కాదండి ఇక్కడ విషయము. అతను విశ్వాసి కాదు, అవిశ్వాసులతో పాటు ఉండి అవిశ్వాసానికి గురయ్యాడు, సొంత తండ్రినే, దైవ బోధకుడినే తిరస్కరించాడు. కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అతన్ని అవిశ్వాసుల జాబితాలో ఉంచుతున్నాడు అన్న విషయం అక్కడ మనం అర్థం చేసుకోవాలి.

నూహ్ అలైహిస్సలాం వారి కళ్ల ముందరే నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు మరణించాడు. నూహ్ అలైహిస్సలాం మరియు నూహ్ అలైహిస్సలాం వారితో పాటు జంతువులు, విశ్వాసులు అందరూ కూడా ఆ ఓడలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఓడ నీటిపై నడుస్తూ ఉందో అప్పుడు వారందరూ అల్లాహ్ తో దుఆ చేశారు. ఏమని దుఆ చేశారంటే:

رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

(రబ్బి అన్జిల్నీ మున్జలమ్ ముబారకవ్ వఅంత ఖైరుల్ మున్జిలీన్)
“ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు అత్యుత్తమంగా దించేవాడవు.” (23:29)
ఓ అల్లాహ్, ఓ మా ప్రభు, నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా దించేవాడవు అని అల్లాహ్ తో దుఆ చేసుకున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని మమ్మల్ని తీసుకొని వెళ్లి దించు అల్లాహ్ అని అల్లాహ్ తో దుఆ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ రోజు ఎలాంటి తూఫాను వచ్చింది, నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంతెంత పెద్ద అలలు ఆ రోజుల్లో వచ్చాయి అంటే అది కూడా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ లో 11వ అధ్యాయం 42వ వాక్యంలో తెలియజేశాడు:

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ

(వహియ తజ్రీ బిహిమ్ ఫీ మౌజిన్ కల్ జిబాల్)
“ఆ ఓడ పర్వతాల వంటి అలల మధ్య వారిని తీసుకుపోసాగింది.” (11:42)
అనగా ఆ ఓడ వారిని పర్వతాల్లాంటి అలల్లో నుంచి తీసుకుపోసాగింది. ఒక్కొక్క అల పర్వతం అంత పెద్దదిగా ఉండింది అంటే ఎన్ని నీళ్లు వచ్చి ఉంటాయి, ఎంత పెద్దగా నీటి మట్టం పెరిగిపోయి ఉంటుంది. అంత పెద్ద నీటి మట్టంలో నూహ్ అలైహిస్సలాం తో పాటు ఉన్నవారు మాత్రమే, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ, అవిశ్వాసులందరూ కూడా నీటిలో మునిగి మరణించారు.

తర్వాత ఆ ఓడ ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దయతో, అల్లాహ్ అనుగ్రహంతో వర్షము ఆగింది, నీళ్లు కూడా ఇంకిపోయాయి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అటు ఆకాశాన్ని మరియు ఇటు భూమిని కూడా ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశంతో వర్షం ఆగిపోయింది, నీళ్లు భూమిలోకి ఇంకిపోయాయి. ఆ పడవ నీటి మీద నుంచి తేలుకుంటూ తేలుకుంటూ జూదీ అనే ఒక పర్వతం పైకి వచ్చి ఆగింది.

وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ

(వస్తవత్ అలల్ జూదియ్యి)
“ఆ ఓడ జూదీ పర్వతంపై నిలిచింది.” (11:44)
ఖురాన్ లో ఆ పర్వతం పేరు ప్రస్తావన వచ్చి ఉంది. వస్తవత్ అలల్ జూదియ్యి అనగా ఓడ జూదీ పర్వతంపై నిలిచింది. మరి ఈ జూదీ పర్వతం ఎక్కడ ఉంది అంటే చరిత్రకారులు తెలియజేసిన విషయం టర్కీ దేశంలో ఆ పర్వతం ఉంది అని తెలియజేశారు.

అలాగే ఎప్పుడైతే ఆ పర్వతం మీద పడవ ఆగిందో, నీళ్లు పూర్తిగా భూమిలోకి ఇంకిపోయాయో, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం వారితో పాటు నూహ్ అలైహిస్సలాం వారి కుటుంబ సభ్యులలో ముగ్గురు కుమారులు, వారి పేరు సామ్, హామ్, యాఫిస్, మూడు పేర్లు. నాలుగో కుమారుడు మాత్రం నీటిలో తూఫాన్ లో మునిగిపోయి మరణించాడు. ముగ్గురు కుమారులు విశ్వాసులు. వాళ్ళ సతీమణులు కూడా విశ్వాసులు. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారులు మరియు ముగ్గురు కోడళ్ళు, అలాగే మిగతా 80 మంది విశ్వాసులు, జంతువులు వారందరూ కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత, నీళ్లు ఇంకిపోయిన తర్వాత భూమి మీదికి వాళ్ళు ఓడపై నుంచి దిగి వచ్చేశారు.

నూహ్ (అలైహిస్సలాం) వారి వారసత్వం

ఇక్కడ చివరిగా మనము కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి, అదేమిటంటే వారు భూమి మీదికి వచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రణాళిక ప్రకారము వారికి ఎంత ఆయుష్షు ఉండిందో అన్ని రోజులు వారు అల్లాహ్ ను ఆరాధించుకుంటూ జీవించారు. అయితే నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానము మాత్రమే ముందుకు సాగింది. మిగతా వారి ఎవరి సంతానము కూడా ప్రపంచంలో ముందుకు సాగలేదు. వారి ఆయుష్షు పూర్తి అయ్యాక వారు మరణించారు అంతే, కానీ వారి సంతానం మాత్రం ముందుకు సాగలేదు. కేవలం నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానం మాత్రమే ముందుకు సాగింది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ముఖ్యంగా మనం చూచినట్లయితే నూహ్ అలైహిస్సలాం వారి ఒక కుమారుడు సామ్. సామ్ సంతానము తెల్ల రంగు కలవారు. వారు అరబ్బులు, ఇశ్రాయేలు వంశీయులు వీళ్ళందరూ సామ్ సంతానము ప్రపంచంలో వ్యాపించారు. అలాగే రెండవ కుమారుడు హామ్. ఇతని సంతానము నల్ల రంగు గలవారు. ఇథియోపియా, సూడాన్ మరియు ఇతర ఆఫ్రికా దేశాలలో వారి సంతానము వ్యాపించింది. మూడవ కుమారుడు యాఫిస్. ఇతని సంతానము ఎర్ర ఛాయ కలిగినవారు. టర్క్ వాసీయులు మరియు తూర్పు ఆసియా వాసులు వీరందరూ కూడా యాఫిస్ కుమారులు, యాఫిస్ సంతానము అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఆ ప్రకారంగా చూస్తే తూఫాను తర్వాత ఈ భూమండలం మీద నూహ్ అలైహిస్సలాం వారి ముగ్గురు కుమారుల సంతానమే వ్యాపించింది కాబట్టి నూహ్ అలైహిస్సలాం వారిని ఆదమే సానీ, అబుల్ బషర్ సానీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. అనగా మానవుల రెండవ పితామహుడు. అబుల్ బషర్ సానీ మానవుల రెండవ పితామహుడు అని నూహ్ అలైహిస్సలాం వారికి బిరుదు ఇవ్వడం జరిగింది.

అలాగే నూహ్ అలైహిస్సలాం చాలా కష్టపడి జాతి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకు ఇచ్చిన ప్రవక్త పదవి బాధ్యతలను చాలా చక్కగా నెరవేర్చారు, కష్టపడ్డారు కాబట్టి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయన కీర్తి ప్రపంచంలో ఉంచాడు. ఖురాన్లో 37వ అధ్యాయం 78వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, “వతరక్నా అలైహి ఫిల్ ఆఖరీన్” అనగా రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మేము మిగిల్చి ఉంచాము అన్నాడు. చూడండి, నేడు కూడా నూహ్ అలైహిస్సలాం వారిని, ఆయన జీవిత చరిత్రని మనము ఎంతో చర్చించుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం.

ఖురాన్లో ఒక ఐదు మంది ప్రవక్తల్ని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని ఒక ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ ఎవరు అంటే ధార్మిక పండితులు తెలియజేశారు, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా ఈ ఐదు మంది ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని కీర్తి పొందారు. అంటే ఆ ఐదు మందిలో నూహ్ అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి ప్రపంచంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఉంచి ఉన్నాడు.

అలాగే ఖురాన్ లో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన తొమ్మిది సూరాలలో వచ్చి ఉంది. తొమ్మిది సూరాలలో ఒకటి సూర ఆరాఫ్, సూర యూనుస్, సూర హూద్, సూర అంబియా, సూర ము’మినూన్, సూర షుఅరా, సూర అంకబూత్, సూర సాఫ్ఫాత్, సూర కమర్. తొమ్మిది సూరాలలో నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. మరొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక పూర్తి అధ్యాయం, ఒక పూర్తి సూర, సూర నూహ్ అని 71వ అధ్యాయం, పూర్తి ఒక సూర అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో ఆయన పేరుతో అవతరింపజేసి ఉన్నాడు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం జీవించినంత కాలం భక్తులతో, విశ్వాసులతో విశ్వాసంగా, భక్తిగా జీవించారు, ఆ తర్వాత ఆయన మరణము సంభవించింది. ఇలా నూహ్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ముగిసింది. ఆ తర్వాత జరిగిన విషయాలు ఇన్షా అల్లాహ్ రాబోయే ప్రసంగాలలో విందాం. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఏక దైవారాధన చేసుకుంటూ, షిర్క్ బహు దైవారాధన నుండి దూరంగా ఉంటూ అల్లాహ్ ని నమ్ముకొని, అల్లాహ్ నే ఆరాధించుకుంటూ, అల్లాహ్ నే వేడుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

తుదకు మా ఆదేశం వచ్చి, పొయ్యిపొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి మంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువ) చొప్పున ఎక్కించుకో.నీ ఇంటివారలను కూడాతీసుకో. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము నూహ్ కు చెప్పాము.(ఖుర్ఆన్ 11 : 40).

ప్రవక్త లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర [వీడియో]

లూత్ (అలైహిస్సలాం) – ప్రవక్తల జీవిత చరిత్ర
https://youtu.be/lQwtCpQfvi4 [29 నిముషాలు]
వక్త: సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

ప్రవక్త ఇబ్రాహీమ్ (అలైహిస్సలాం) ఈజిప్టును వదలి తన సోదరుని కుమారునితో సహా పలస్తీనా వచ్చి అక్కడ స్థిరపడ్డారు. ఆ సోదర కుమారుడే లూత్ (అలైహిస్సలాం). ఆ పిదప లూత్(అలైహిస్సలాం) సదూమ్ పట్టణానికి వెళ్ళి పోయారు. ఈ పట్టణం మృత సముద్రానికి పశ్చిమ తీరాన ఉంది. ఈ పట్టణంలో అనేక చెడులు వ్యాపించి ఉండేవి. అక్కడి ప్రజలు ప్రయాణీకులను దోచుకునేవారు. బాటసారులను దోచుకుని హతమార్చే వారు. మరో పెద్ద చెడు స్వలింగ సంపర్కం. పురుషులు తమ భార్యలతో కాక పురుషులతోనే కామ వాంఛలు తీర్చుకునే వారు. ఈ అసహజ లైంగిక క్రియకు తర్వాత ‘సోడోమి‘ అనే పేరుపడింది. (సదూమ్ పట్టణం పేరు వల్ల). అక్కడ స్వలింగ సంపర్కం నిర్లజ్జగా బాహాటంగా జరిగేది.

ఈ చెడులు పెట్రేగిపోయినప్పుడు అల్లాహ్ వారి వద్దకు లూత్ (అలైహిస్సలాం)ను పంపాడు. ఈ చెడులను వదలుకోవలసినదిగా ఆయన వారికి బోధించారు. కాని వారు తమ చెడులలో పూర్తిగా కూరుకు పోయారు. లూత్ (అలైహిస్సలాం) బోధనల పట్ల వారు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. అల్లాహ్ శిక్ష గురించి లూత్ (అలైహిస్సలాం) వారిని హెచ్చరించినప్పటికీ వారు తమ చెడుల్లో మునిగిపోయి ఆయన మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. ఇలాంటి బోధనలు కొనసాగిస్తే పట్టణం నుంచి తరిమేస్తామని ఆయన్ను బెదిరించారు. వారి చెడులు ఇతర పట్టణాలకు కూడా వ్యాపిస్తాయని లూత్ (అలైహిస్సలాం) భయపడ్డారు. వారిపై చర్య తీసుకోవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

ఇస్లాం అమరవీరులు 

ఇస్లాం అమర వీరులు [6p] [PDF]

وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.”
(అల్ బఖర 2: 154) 

పై ఆయతులో అల్లాహ్ ధన్యజీవుల గురించి ప్రస్తావించాడు. వారే ఇస్లాం మార్గంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులు. అల్లాహ్ సన్నిధిలో వారికి మహోన్నత స్థానం ఉంది. మన ఊహకందని మహత్తర జీవితం, ఆనందం వారికి అక్కడ లభిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్ గ్రంథంలో అమరవీరుల గురించి, వారి విశిష్ఠత గురించి పలు ఆయతుల్లో చెప్పబడింది. 

దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో అధర్మంగా, మోసగించబడి ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రముఖ అమరవీరుల గాథలను ఈ రోజు తెలుసుకుందాం. కాని కరుడుగట్టిన విరోధులు వారిని మోసగించి హతమార్చారు. పిరికిపందలైన తిరస్కారుల అలవాటే అది. సత్యవంతులను ఎదుర్కొనే ధైర్యం వారికి లేకపోయింది. అందుకే మోసపూరిత సన్నాగాలు, కుట్రలు పన్ని వారిని అధర్మంగా హతమార్చారు. నేటి ఇస్లాం విరోధుల స్థితి కూడా అలానే ఉంది. 

మీ ముందు చెప్పబోయే ఈ సంఘటన ఉహద్ యుద్దం తరువాత హిజ్ర శకం 4వ యేట జరిగింది. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం:

ఉహద్ యుద్ధానంతరం తిరస్కారులు, ఇస్లాం విరోధులు ముస్లింల గౌరవ మర్యాదలను మట్టిపాలు చేయటానికి, వారికి నష్టం కల్గించే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నసాగారు. ఇంత నష్టం జరిగినా ముస్లింలు యుద్ధ వ్యూహరచనలతో, శక్తిసామర్థ్యాలతో, సైన్యాన్ని సమీకరిస్తూ పుంజుకోవటాన్ని వారు సహించలేకపోయారు. ఇస్లాంను దెబ్బతీయటానికి, నష్టం, కీడు తలపెట్టడానికి మరో దుష్టాలోచన చేశారు. ఖురైషులంతా కలసి అజల్ ఖిరా జాతిలోని 7 గురు వ్యక్తులను ఎన్నుకుని వారిని మదీనాలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి పంపారు. వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, “దైవ ప్రవక్తా! (సల్లల్లాహు అలైహి వసల్లం) ! మా వర్గమంతా ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉంది. వారి శిక్షణ కోసం ఇస్లామీయా బోధకులను మీరు మా వెంట పంపించండి” అని అంటారు. 

మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర & షహాదత్ [ఆడియో]

మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర మరియు షహాదత్
https://youtu.be/ejJd6Qy1NWw [15 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, మూడవ ఖలీఫా అయిన హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవితం మరియు ఘనత గురించి వివరించబడింది. ఆయన అల్లాహ్ పట్ల గల భయభక్తులు, ఆరాధన, మరియు దాతృత్వం గురించి ప్రస్తావించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇద్దరు కుమార్తెలను వివాహం చేసుకున్న కారణంగా ఆయనకు “జున్నూరైన్” (రెండు ప్రకాశాల యజమాని) అనే బిరుదు ఎలా వచ్చిందో వివరించబడింది. హుదైబియా సంధి సమయంలో జరిగిన “బైఅతుర్ రిద్వాన్” (అల్లాహ్ ప్రసన్నత పొందిన వాగ్దానం)లో ఆయన ప్రాముఖ్యత, రూమా బావిని కొని ప్రజల కొరకు దానం చేయడం, మరియు తబూక్ యుద్ధం కోసం సైన్యాన్ని సిద్ధపరచడంలో ఆయన చేసిన అపారమైన సహాయం వంటి చారిత్రక సంఘటనలు ఉదహరించబడ్డాయి. ఆయన ఖిలాఫత్ కాలంలో ఖుర్ఆన్‌ను ఒక గ్రంథ రూపంలో సంకలనం చేయడం మరియు మస్జిద్-ఎ-హరామ్, మస్జిద్-ఎ-నబవీల విస్తరణ వంటి ఆయన చేసిన గొప్ప పనులను కూడా పేర్కొనడం జరిగింది. చివరగా, ఆయన అమరత్వం పొందిన విషాదకర సంఘటనను వివరిస్తూ, అంతర్గత కలహాలు (ఫిత్నా) యొక్క తీవ్రత గురించి హెచ్చరించి, ముస్లింలు ఐక్యంగా ఉండవలసిన ఆవశ్యకతను నొక్కిచెప్పబడింది.

اَلْحَمْدُ لِلّٰهِ. اَلْحَمْدُ لِلّٰهِ عَلَى نِعَمٍ تَتْرَى، وَعَلَى أَرْزَاقٍ لَا نُطِيقُ لَهُ حَصْرًا. وَأَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، شَهَادَةً تَكُونُ لَنَا ذُخْرًا. وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُ اللهِ وَرَسُولُهُ الْمَخْصُوصُ بِالْفَضَائِلِ الْكُبْرَى. صَلَّى اللهُ عَلَيْهِ إِلَى يَوْمِ الْأُخْرَى. أَمَّا بَعْدُ. فَالتَّقْوَى وِقَاءٌ، وَلِبَاسُهَا خَيْرُ لِبَاسٍ.

(అల్ హందులిల్లాహ్. అల్ హందులిల్లాహి అలా నిఅమిన్ తత్రా, వ అలా అర్జాకిన్ లా నుతీకు లహూ హస్రా. వ అష్ హదు అల్లా ఇల్లాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహ్, షహాదతన్ తకూను లనా జుఖ్రా. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహుల్ మఖ్ సూసు బిల్ ఫదాయిలిల్ కుబ్రా. సల్లల్లాహు అలైహి ఇలా యౌమిల్ ఉఖ్రా. అమ్మా బ’అద్. ఫత్తఖ్వా వికావున్, వ లిబాసుహా ఖైరు లిబాస్.)

సమస్త ప్రశంసలు అల్లాహ్ కే శోభాయమానం. నిరంతరం కురుస్తున్న ఆయన అనుగ్రహాలకు, మనం లెక్కించలేనన్ని ఆయన జీవనోపాధులకు అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని, ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. ఈ సాక్ష్యం మా కొరకు (పరలోకంలో) ఒక నిధిగా ఉండుగాక. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త, ఆయన గొప్ప సద్గుణాలతో ప్రత్యేకించబడినవారు. ప్రళయదినం వరకు ఆయనపై (ప్రవక్తపై) అల్లాహ్ యొక్క కారుణ్యం వర్షించుగాక. ఇక ఆ తర్వాత. దైవభీతి ఒక రక్షణ కవచం, మరియు దాని వస్త్రం ఉత్తమమైన వస్త్రం.

ఈరోజు అల్లాహ్ యొక్క దయతో ఎలాంటి పుణ్యాత్ముని గురించి మనం తెలుసుకుంటామంటే, ఆయన అల్లాహ్ యొక్క ఆరాధన ఎక్కువగా చేసేవారు. అల్లాహ్ యొక్క విధేయతలో చాలా ముందుగా ఉన్నవారు. రేయింబవళ్లు సజ్దాలో, ఖియాంలో ఉంటూ, పరలోకం పట్ల చాలా భయం కలిగి తన ప్రభువు యొక్క కారుణ్యాన్ని ఆశించేవాడు.

أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ
(అమ్మన్ హువ ఖానితున్ ఆనా అల్లైలి సాజిదవ్ వ ఖాయిమా, యహ్ జరుల్ ఆఖిరత వ యర్ జూ రహ్ మత రబ్బిహ్)
ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?)(39:9)

హాఁ! ఆయనే, చాలా సిగ్గు బిడియం గల, దైవదూతలు సైతం ఆయనతో సిగ్గుపడే అటువంటి పుణ్యాత్ముడు, ప్రవక్త యొక్క సహచరుడు హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు). ఆయన షహీద్ (అమరవీరులు). ఆయన స్వర్గవాసులలో ఒకరు. ఆయన ఈ లోకంలో భూమిపై నడుస్తుండగానే ఆయన స్వర్గవాసి అన్నటువంటి శుభవార్త ఇవ్వడం జరిగింది.

అవును, సహీహ్ బుఖారీలో వచ్చినటువంటి హదీస్, హదీస్ నెంబర్ 2778. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

مَنْ حَفَرَ رُومَةَ فَلَهُ الجَنَّةُ
(మన్ హఫర రూమత ఫ లహుల్ జన్నహ్)
“ఎవరైతే రూమా (బావిని) త్రవ్వుతారో, అతని కొరకు స్వర్గం ఉంది.”

وَمَنْ جَهَّزَ جَيْشَ العُسْرَةِ فَلَهُ الجَنَّةُ
(వ మన్ జహ్ హజ జైషల్ ఉస్రతి ఫ లహుల్ జన్నహ్)
“మరియు ఎవరైతే కష్టకాలంలో ఉన్న సైన్యాన్ని (తబూక్ యుద్ధ సైన్యాన్ని) సిద్ధపరుస్తారో, అతని కొరకు స్వర్గం ఉంది.”

తబూక్ యుద్ధ సందర్భంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఇందులో ఎవరైతే సైన్యాన్ని సిద్ధపరుస్తారో, సైన్యం కొరకు సహాయాలు అందిస్తారో, అలాంటి వారి కొరకు కూడా స్వర్గం అన్నటువంటి శుభవార్త ప్రవక్త ఇచ్చినప్పుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ బీరె రూమాను దాని యజమాని నుండి కొని అందరి కొరకు దానం చేశారు, వక్ఫ్ చేశారు. మరియు ఆ తబూక్ యుద్ధంలో 300 ఒంటెలు ఇంకా 10,000 దీనార్లు దానం చేశారు.

హజ్రత్ ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ సుకుమార్తె అయినటువంటి రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) కు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే కొంతకాలం జీవితం గడిపిన తర్వాత, బద్ర్ యుద్ధం సందర్భంలో ఆమె చాలా అనారోగ్యానికి పాలైంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని ఆమె యొక్క బాగోగులు చూసుకుంటూ, ఆమె అనారోగ్య సమయంలో ఆమె సేవలో ఉండడానికి వదిలారు. అంతేకాదు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్నటువంటి యుద్ధ వీరులకు ఏ యుద్ధ ఫలం అయితే లభించిందో, యుద్ధ ఫలంలోని ఏ భాగం లభించిందో, అలాంటి ఒక భాగం ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారికి కూడా ప్రవక్త ఇచ్చారు. అయితే హజ్రత్ రుకయ్యా (రదియల్లాహు త’ఆలా అన్హా) అదే అనారోగ్యంలో ఆ బద్ర్ యుద్ధం సందర్భంలోనే చనిపోయింది.

ఆ తర్వాత వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సుకుమార్తె అయినటువంటి ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు త’ఆలా అన్హా)ను హజ్రత్ ఉస్మాన్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ లోకంలో ప్రవక్త యొక్క కూతుర్లను ఒకరినొకరి ఇద్దరి కూతుర్లను పెళ్లి చేసుకున్నటువంటి మహానుభావుడు వేరే మరెవ్వరూ లేరు. అందుకొరకే హజ్రత్ ఉస్మాన్ గారికి ‘జున్నూరైన్’ (రెండు ప్రకాశాల యజమాని) అన్నటువంటి బిరుదు లభించింది.

ఇక హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత ఆరవ సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు ఉమ్రా కొరకు బయలుదేరారు. అయితే మక్కా ఖురైషులు, అవిశ్వాసులు సహాబాలు, ప్రవక్త వారు ఉమ్రా చేయకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంలో వారితో సంధి కుదుర్చడానికి, మాట్లాడడానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారిని రాయబారిగా పంపడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వెంటనే ప్రవక్త ఆదేశం మేరకు బయలుదేరారు. ఎలాంటి తడబడాయించలేదు, ఏ రీతిలో కూడా వెనుక ఉండలేదు.

ఆ సందర్భంలో ఆయనకు తెలుసు, ఇక్కడ రాయబారిగా సంధి కుదుర్చడానికి వెళ్తున్నామంటే, అక్కడ మృత్యువును కూడా స్వీకరించడం లేదా వారు ఖైదీగా చేస్తే కూడా ఏమీ చేయలేక ఉండాలి. అలాంటి పరిస్థితులను గమనించి కూడా వెళ్లారు. అయితే ఎప్పుడైతే మక్కాలో ప్రవేశించారో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు), కాబా వైపున చూశారో, ఆ సందర్భంలో ఖురైష్ యొక్క పెద్దలు, నాయకులు, “ఓ ఉస్మాన్, నీవు మాతో, నీకు మంచి సంబంధం ఉంది. కనుక మేము నీకు తవాఫ్ చేయడానికి అనుమతిస్తున్నాము. కాబా యొక్క తవాఫ్ చేయాలంటే నీవు చెయ్యి. ఎలా మేము మిమ్మల్ని అడ్డుకోము.” కానీ, అల్లాహు అక్బర్! హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఆ సమయంలో ఏం సమాధానం ఇచ్చారో తెలుసా? వారి వైపున చూస్తూ, వారితో చెప్పారు: “అల్లాహ్ సాక్షిగా, ఎప్పటివరకైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తవాఫ్ చేయరో, నేను తవాఫ్ చేయను.”

ఆ తర్వాత ఖురైష్ అతన్ని బంధించారు, అంటే పట్టుకున్నారు, ఆపుకున్నారు. ఆ సందర్భంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ చేయబడ్డారు, హతమయ్యారు, హత్య చేయబడ్డారు అన్నటువంటి ఒక పుకారు లేసినది. అయితే ఇటు సహాబాలందరికీ ఈ విషయం తెలిస్తే, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ కూడా జమా చేసి, మౌత్ (మరణం) కొరకు సిద్ధం అన్నటువంటి ‘బైఅత్’ (శపధం) తీసుకున్నారు. చరిత్రలో ఇలాంటి గొప్ప బైఅత్ మరొకటి కనబడలేదు. దానినే అల్లాహు త’ఆలా స్వయంగా ‘బైఅతుర్ రిద్వాన్’ అన్నటువంటి పేరు ఇచ్చాడు. చదవండి సూరతుల్ ఫత్హ్, ఆయత్ నంబర్ 18:

لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ
(లఖద్ రదియల్లాహు అనిల్ ముఅమినీన ఇజ్ యుబాయిఊనక తహ్ తష్ షజరతి ఫ అలిమ మా ఫీ కులూబిహిమ్)
(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. (48:18)

అయితే ఆ సందర్భంలో మరో చాలా గొప్ప సంఘటన, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గొప్ప ఘనత ఎంత స్పష్టమవుతుందో చూడండి. ఈ విషయం సహీహ్ బుఖారీలో వచ్చి ఉన్నది, హదీస్ నెంబర్ 3698, అలాగే ముస్నద్ బజ్జార్లో కూడా ఉంది. ఏంటి విషయం అది?

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరితో శపధం తీసుకుంటున్నారు. హజ్రత్ ఉస్మాన్‌కు బదులుగా ఆయన రక్తం యొక్క పరిహారం తీసుకోవడానికి మనమందరమూ యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా. ఆ సమయంలో అక్కడ ఉస్మాన్ అయితే లేరు కదా! అయితే ప్రవక్త ఏం చేశారు? తమ కుడి చెయ్యిని పైకి లేపి, కుడి చేతిని తమ స్వయంగా ఎడమ చేతిపై కొడుతూ ఏం చెప్పారు? “ఈ కుడి చెయ్యి ఉస్మాన్ యొక్క చెయ్యి. ఉస్మాన్ కూడా నాతోని బైఅత్ చేస్తున్నారు” అన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరిచి, ఉస్మాన్ యొక్క ఘనతను ఇంత గొప్పగా చాటి చెప్పారు. ఈ సందర్భంలో ధర్మవేత్తలు ఏమంటున్నారు? అల్లాహు అక్బర్! అల్లాహు అక్బర్! ప్రవక్త తమ కుడి చెయ్యిని ‘ఇది ఉస్మాన్ చెయ్యి’ అని ఏదైతే చెప్పారో, వాస్తవానికి ఆ చెయ్యి ఉస్మాన్ యొక్క చేతుల కంటే ఎంతో గొప్పదైనది.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక అబూబక్ర్, అబూబక్ర్ మరణించాక హజ్రత్ ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖలీఫా అయ్యారు. వీరిద్దరి ఖలీఫాల తర్వాత, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) 72 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఖలీఫా అయ్యారు. 12 సంవత్సరాలు ఖిలాఫత్ నడిపించారు. వారి యొక్క ఖిలాఫత్ కాలంలో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలలో, పుణ్య కార్యాలలో, ఖుర్ఆన్ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి, దాని యొక్క ఎన్నో కాపీలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు పంపడం, అంతేకాదు మస్జిద్-ఎ-హరామ్, మక్కతల్ ముకర్రమా, అలాగే మస్జిద్-ఎ-నబవీ, మదీనా ఈ రెండిటినీ కూడా చాలా విస్తీర్ణం చేశారు. అక్కడ వస్తున్న నమాజీల కొరకు, హజ్ ఉమ్రాలు చేసే వారి కొరకు, దాని యొక్క దర్శన కొరకు వచ్చే వారి కొరకు చాలా ఇరుకుగా అవుతుంది అని దానిని ఇంకా పెద్దగా పెంచారు.

అల్లాహు అక్బర్! వాస్తవానికి హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క సీరత్, వారి యొక్క జీవిత చరిత్రలో చాలా గొప్ప గొప్ప ఘనమైన కార్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, అల్లాహు త’ఆలా, ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క చివరి సమయం కూడా ఎంత గొప్పగా జరిగింది! అల్లాహు అక్బర్! జుమా రోజున ఆయన షహీద్ అయ్యారు. అసర్ నమాజ్ తర్వాత సమయం. జిల్ హిజ్జా యొక్క హుర్మత్ (గౌరవప్రదమైన) మాసం. ప్రజలందరూ అటు హజ్ చేసి, అయ్యాముత్ తష్రీఖ్ యొక్క రెండవ రోజు, అంటే 12వ జిల్ హిజ్జా రోజున, 84 సంవత్సరాల వయసు నిండినది, అప్పుడు షహీద్ అయ్యారు.

చాలా కఠినంగా హంతకులు ప్రవర్తించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) షహీద్ అయ్యేకి కొన్ని క్షణాల ముందు చెప్పారు: “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గడిచిన రాత్రిలో స్వప్నంలో చూశాను. ప్రవక్త వారు అంటున్నారు:

اصْبِرْ، فَإِنَّكَ تُفْطِرُ عِنْدَنَا الْقَابِلَةَ
(ఇస్బిర్, ఫ ఇన్నక తుఫ్ తిరు ఇందనల్ ఖాబిలహ్)
‘ఓ ఉస్మాన్, సహనం వహించు, రేపటి రోజు నీవు మాతో పాటు ఇఫ్తార్ చేస్తావు.'”

ఆ తర్వాత హజ్రత్ ఉస్మాన్ ఖుర్ఆన్ గ్రంథాన్ని తెప్పించారు, చదువుతూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. అది ఆయన ముందు ఉన్నది, ఆయన చేతుల్లో ఖుర్ఆన్ గ్రంథం ఉండగానే దుండగులు, హంతకులు ఆయనని హతమార్చారు.

ఈ ప్రస్తావన, మరియు నేను ప్రవక్తను స్వప్నంలో చూశాను, ప్రవక్త శుభవార్త ఇచ్చారు అన్నటువంటి మాట ముస్నద్ అహ్మద్ లో వచ్చి ఉంది. షేఖ్ అహ్మద్ షాకిర్ దాని యొక్క ముహక్కిఖ్, సహీహ్ అని చెప్పారు, హదీస్ నెంబర్ 526.

అంతేకాదు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) ఖుర్ఆన్ చదువుతున్న సందర్భంలో ఆ దురదృష్టవంతులు, దుండగులు, హంతకులు, పాపాత్ములు ఇంట్లో ప్రవేశించారు. వారిలోని అత్యంత దురదృష్టుడు, హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారి యొక్క గడ్డాన్ని పట్టుకొని తొమ్మిది సార్లు పొడిచాడు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క శరీరం నుండి చిమ్మిన రక్తం ఏదైతే చిందిందో, దాని యొక్క ఆ రక్తం ఆయన చదువుతున్నటువంటి ఖుర్ఆన్ పై కూడా పడింది. ఖుర్ఆన్లో ఏ ప్రాంతంలో పడిందో తెలుసా? సూరతుల్ బఖరాలోని ఆయత్ నెంబర్ 137:

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
(ఫస యక్ ఫీక హుముల్లాహ్, వ హువస్ సమీఉల్ అలీమ్)
వారికి వ్యతిరేకంగా నీకు అల్లాహ్‌ చాలు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ ఎరుగును. (2:137)

اللَّهُمَّ ارْضَ عَنْ أَبِي بَكْرٍ وَعُمَرَ وَعُثْمَانَ وَعَلِيٍّ وَسَائِرِ الصَّحَابَةِ. وَاحْشُرْنَا فِي زُمْرَتِهِمْ. اللَّهُمَّ إِنَّا أَحْبَبْنَاهُمْ وَمَا رَأَيْنَاهُمْ. اللَّهُمَّ ارْزُقْنَا صُحْبَتَهُمْ فِي الْآخِرَةِ مَعَ نَبِيِّنَا صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.

అల్లాహుమ్మర్ద అన్ అబీ బకర్ వ ఉమర వ ఉస్మాన వ అలీ వ సాయిరిస్ సహాబా. వహ్ షుర్నా ఫీ జుమ్రతిహిమ్. అల్లాహుమ్మ ఇన్నా అహ్ బబ్ నాహుమ్ వ మా రఅయ్ నాహుమ్. అల్లాహుమ్మ ర్ జుఖ్ నా సుహ్ బతహుమ్ ఫిల్ ఆఖిరతి మ’అ నబియ్యినా సల్లల్లాహు అలైహి వసల్లం.

ఓ అల్లాహ్, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్, అలీ పట్ల నీవు సంతృష్టిగా ఉండు. వారిపై నీ యొక్క సంతృష్టి మరియు నీ యొక్క కరుణను కురిపించు. అలాగే తమ అందరి సహాబాలపై కూడా. ఓ అల్లాహ్, మమ్మల్ని కూడా వారితో పాటు లేపు. ఓ అల్లాహ్, మేము వారిని చూడలేదు, కానీ వారిని ప్రేమిస్తున్నాము. కనుక ఓ అల్లాహ్, ప్రళయ దినాన ప్రవక్తతో పాటు వారి యొక్క సోహబత్, వారి యొక్క సాన్నిహిత్యం మాకు ప్రసాదించు.

మహాశయులారా, ఈ సంఘటన ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, మనం అన్ని రకాల బాహ్యమైన మరియు ఆంతర్యంలో ఉన్న, కనబడినవి కనబడకపోయేవి, అన్ని రకాల ఫితనాల నుండి, సంక్షోభాల నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. మరొక గొప్ప విషయం, ఈ విభేదాలను వదులుకోవాలి. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు త’ఆలా అన్హు) వారు షహీద్ అవ్వడానికి ముఖ్య కారణం, ఏ ఫితనాలు, ఏ సంక్షోభాలు అయితే లేశాయో అవే. మరియు ఆ సందర్భంలో ఇమామ్‌కు, మరియు నాయకునికి వ్యతిరేకంగా ఎవరైతే లేశారో, అలాంటి వారే వారిని షహీద్ చేశారు. అయితే అల్లాహు త’ఆలా ఏదైతే మనం ఏకంగా ఉండాలని, ఐక్యంగా ఉండాలని, విభేదాలు లేకుండా ఉండాలని, పరస్పరం ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని మాటిమాటికీ ఆదేశిస్తూ ఉంటాడో ఖుర్ఆన్ హదీసులలో, ఆ ఆదేశాలను మనం శ్రద్ధ వహించి ఆచరిస్తూ ఉండాలి. చిన్న చిన్న ప్రాపంచిక కారణాలను తీసుకొని మనం పరస్పరం ఎలాంటి చీలికల్లో పడకూడదు. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ప్రసాదించు గాక, ఆమీన్.

వ ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్.


సహాబాలు మరియు మన సలఫ్ (మెయిన్ పేజీ)
https://teluguislam.net/sahaba-and-salaf/

అలీ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర

అలీ (రదియల్లాహు అన్హు) జీవిత చరిత్ర
https://youtu.be/36Y2zB2eBPo [42 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[సహాబాలు మరియు మన సలఫ్]
https://teluguislam.net/sahaba-and-salaf/

ఈ వీడియోలో గమనించవలసిన విషయాలు:

1- అలీ (రదియల్లాహు అన్హు) ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

2- అలీ (రదియల్లాహు అన్హు) ఎప్పుడు ఇస్లాం స్వీకరించారు?

3- అలీ (రదియల్లాహు అన్హు) వివాహం ఎప్పుడు జరిగింది, ఎవరితో జరిగింది?

4- « అబూతురాబ్ » అనే (కున్నియ్యత్) నామాంతరం అలీ (రదియల్లాహు అన్హు) కి ఎలా దక్కింది?

5- « అసదుల్లాహ్ » అంటే ఏమిటి,ఈ బిరుదు అలీ (రదియల్లాహు అన్హు) కి ఎందుకు దక్కింది?

6- « ఖవారిజ్ » అంటే ఎవరు, అలీ (రదియల్లాహు అన్హు) వారిని ఏమి చేసారు?

7- రాజధాని ని అలీ (రదియల్లాహు అన్హు) ఎక్కడికి మార్చారు, కారణం ఏమిటి?

8- « జమల్ యుద్ధం » అంటే ఏమిటి,ఈ యుద్ధానికి కారణం ఏమిటి?

9- « సిప్ఫీన్ యుద్ధం » ఎవరెవరి మధ్య జరిగింది, కారణం ఏమిటి?

10- అలీ (రదియల్లాహు అన్హు) మరణం ఎలా సంభవించింది?

నలుగురు మార్గదర్శక ఖలీఫాలు

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

ప్రవక్త ﷺ మనవళ్లు – హసన్, హుసైన్ (రదియల్లాహు అన్హుమా) విశిష్టతలు [వీడియో]

ప్రవక్త ﷺ మనవళ్లు – హసన్, హుసైన్ (రదియల్లాహు అన్హుమా) విశిష్టతలు | ముహమ్మద్ సలీం జామి’ఈ
https://youtu.be/9hw5NIyuQzc [33 నిముషాలు]

ముహర్రం నెలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఈ నెలతో హుస్సైన్ (రజియల్లాహు అన్హు) కు సంబంధం ఏమిటి? – ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [వీడియో] [60నిముషాలు]
https://teluguislam.net/2020/08/25/muharram-ashura-sunnah-and-bidah/

హజ్రత్ హుసైన్ (రజియల్లాహు అన్హు) హంతకులెవరు? [వీడియో][50:41 నిముషాలు]
ఫజీలతుష్షేఖ్ సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2020/08/26/who-killed-al-husayn/

ముహర్రం మాసం & సహాబాల ఔన్నత్యం [వీడియో] [55 నిముషాలు]
https://teluguislam.net/2020/08/31/muharram-and-greatness-of-sahaba/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ముహర్రం పండుగ ఎలా జరుపుకోవాలి? [వీడియో]
https://teluguislam.net/2020/08/20/can-we-celebrate-muharram-festival/
మనం ముహర్రం పండుగ జరుపుకోవచ్చా? జరుపుకో కూడదు అంటే ఏంటి సాక్ష్యం (దలీల్)? జరుపుకొనేది ఉండి వుంటే ఎలా జరుపుకోవాలి? – వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు [వీడియో ]

[20] మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – తబూక్ పోరాటం: రోమ్ అగ్రరాజ్యాన్ని నిలువరించిన ముస్లింలు
https://youtu.be/xC-ulwWQX-o [52 నిముషాలు]

తప్పకుండా వినే ప్రయత్నం చేయండి, చాల మంచి వీడియో, ప్రవక్త గారి (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత చరిత్ర అర్ధం చేసుకోవడం మనందరి విధి.

తబూక్ పోరాటం PDF డౌన్లోడ్ చేస్కోండి: (20 పేజీలు)
https://teluguislam.net/wp-content/uploads/2022/06/ghazwa-tabook.pdf

మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3A9nJQ26qTrl-iuvWeXrbO

గజ్వయె తబూక్ (తబూక్ పోరాటం) 

మక్కా విజయం, సత్యాసత్యాల నడుమ జరిగిన ఓ నిర్ణయాత్మకమైన యుద్ధమే అనాలి. ఆ విజయానంతరం అరబ్బుల్లో, మహనీయ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క దైవ దౌత్యం గురించి ఎలాంటి సందేహానికి ఆస్కారం లేకుండా పోయింది. ఈ కారణంగానే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దైవధర్మం అయిన ఇస్లామ్ లో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరడం ఆరంభమైంది. ప్రతినిధి వర్గాల రాకకు సంబంధించిన అధ్యాయంలో మేము ఇస్తున్న వివరాల ఆధారంగా ఈ విషయాన్ని వారు అంచనా వేసుకోవచ్చు. అలాగే, హజాతుల్ విదా సందర్భంలో హాజరైన ప్రజా సమూహాన్ని బట్టి కూడా దీన్ని మనం గుర్తించవచ్చు – మొత్తానికి, అరేబియాలో అంతర్గతంగా ప్రబలుతున్న తిరుగుబాట్లు, అడ్డంకులన్నీ ఇప్పుడు దాదాపుగా సమసిపోయి నట్లయింది. ముస్లిములు, దైవధర్మ సంవిధానాన్ని, ఇస్లామ్ షరీఅతను ఎల్లెడలా వ్యాపింపజేయడానికి, ఇస్లామ్ ధర్మప్రచారం కోసం ఏకాగ్రతను సంతరించుకొని ముందుకు పురోగమించడానికి అవకాశం లభించినట్లయింది. 

తబూక్ పోరాటం సంభవించడానికి గల కారణం 

అయితే ఇప్పుడు, ఎలాంటి కారణం లేకుండానే ముస్లిములతో తలపడడానికి ఓ శక్తి మదీనా వైపునకు దృష్టిని పెట్టింది. దీనికి సంబంధించిన వారు అప్పుడప్పుడు ముస్లిములను కవ్విస్తూ ఉన్నారు. ఈ శక్తి రోమను సామ్రాజ్యానికి సంబంధించినది. అది ఆ కాలంలో ప్రపంచంలోకెల్లా ఓ పెద్ద సూపర్ పవర్ గా అలరారే సామ్రాజ్యం . వెనుకటి పుటల్లో ఈ కవ్వింపు, షుజ్ల్ బిన్ అమ్రూ గస్సానీ చేతిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి దూత హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ అజీ (రదియల్లాహు అన్హు) హత్యగావించబడడంతో ఆరంభమైంది. హజ్రత్ హారిస్ బిన్ ఉమైర్ బస్రా గవర్నరు వద్దకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సందేశాన్ని తీసుకు వెళ్ళిన వ్యక్తి. అదే కాకుండా, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ తరువాత హజ్రత్ జైద్ బిన్ హారిసా నేతృత్వంలో ఓ సైనిక పటాలాన్ని పంపించడం, అది రోమను సామ్రాజ్యంలో ‘మూతా’లో భీకరంగా యుద్ధం చేయడం, అయితే ఈ సైనిక పటాలం ఆ తలబిరుసుతనం గల రోమనులను అణచలేకపోవడం కూడా మనం వెనుకటి పుటల్లో చదువుకున్నదే. అయితే, ముస్లిముల ఈ సైన్యం అప్పటి సూపర్ పవర్ అయిన రోమనులతో ఢీకొనడం, అరేబియా పౌరులపై మంచి ప్రభావాన్నే వేసింది. | 

రోమ్ చక్రవర్తి కైజరు, ఈ ప్రభావం విషయంలో, దాని ఫలితంగా అరబ్బు తెగల్లో రోమనుల నుండి స్వాతంత్ర్యం పొందే భావన జాగృతం అయ్యే విషయంలో, ముస్లిముల ఎడల అరబ్బుల్లో ఏర్పడే సానుభూతి విష 

యంలో ఎలా ఉపేక్షించగలడు? అవి అతణ్ణి కలచివేస్తున్న ప్రమాద సూచికలే మరి. ఆ ప్రమాదం ఒక్కో అడుగు అతని సరిహద్దుల వైపునకు కదిలివస్తోంది. అరేబియాతో కలిసిన సిరియా సరిహద్దుకు ఓ సవాలుగా నిలిచింది. కాబట్టి కైజరు, ముస్లిముల ఈ మహోన్నతమైన శక్తి, అజేయమైన ఈ ప్రమాదం ముంచుకు రాకపూర్వమే, రోము సామ్రాజ్యానికి ఆనుకొని ఉన్న అరబ్బు ప్రాంతాల్లో సంక్షోభం, తిరుగుబాట్లు చెలరేగక మునుపే దాన్ని అణచివేయా లనే దృఢసంకల్పానికి వచ్చాడు.

ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే, మూతా యుద్ధం జరిగి ఇంకా ఒక్క సంవత్సరం కూడా తిరిగిరాలేదు, 

రోము చక్రవర్తి రోమను ప్రజల్ని, తన ఆధీనంలో ఉన్న అరబ్బుల్ని, అంటే ఆలెగస్సాన్ తెగ వగైరాలతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని సమీకరించి, ఓ భయంకరమైన, నిర్ణయాత్మకమైన యుద్ధం కోసం సన్నాహాలు మొదలెట్టాడు. 

రోమనులు మరియు గస్సాన్ల యుద్ధ సన్నాహాల వార్తలు 

రోమను సామ్రాజ్యం ముస్లిములపై దండెత్తడానికి సన్నాహాలు ప్రారంభించిందన్న వార్తలు ఎడతెగకుండా మదీనాకు చేరుతూనే ఉన్నాయి. ఈ కారణంగా ముస్లిములు అప్రమత్తులైపోయారు. ఏ చిన్న అనుమానం వచ్చినా రోమనులు తమపైకి వచ్చిపడ్డారనే భావనకు లోనైపోతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఓ సంఘటనను కూడా ఇక్కడ ఉటంకించక తప్పదు. అదే సంవత్సరం, అంటే హిజీ శకం 9లో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణులతో అలిగి ఒక నెల్లాళ్ళు ‘ఈలా“చేసి వారికి దూరంగా ఉన్నారు. సహచరులకు ఈ విషయం తెలిసిరాలేదు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి తలాక్ ఇచ్చారనే అనుకొని బాధపడిపోయారు. 

[ఈలా అంటే స్త్రీ వద్దకు వెళ్ళనని ఒట్టేసుకోవడం. ఈ ఒట్టు నాల్గు నెలలు లేదా అంతకంటే తక్కువ గడువు కోసం వేసుకుంటే ధర్మశాస్త్రం ప్రకారం ఫరవాలేదు. ఇదే గనక నాల్గు నెలలు దాటితే షరీఅత్ న్యాయస్థానం ఆ విషయంలో జోక్యం కలుగజేసుకుని భర్త, భార్యను భార్యగానైనా ఉంచుకోవాలి లేదా ఆమెకు తలాక్ అయినా ఇవ్వాలి అని ఆదేశిస్తుంది. కొందరు సహాబాల అభిప్రాయం ప్రకారం, నాల్గు నెలల గడువు తీరిపోగానే ఆ స్త్రీకి తలాక్ వర్తిస్తుంది.]

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన గురించి ఇలా వివరిస్తున్నారు: 

“నాకు అన్సారీ మిత్రుడొకడుండేవాడు. నేను (దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధిలో) లేనప్పుడు అతను అక్కడ జరిగిన విషయాలు వచ్చి చెప్పేవాడు. నేను కూడా అతని గైర్హాజరులో వెళ్ళి జరిగిన విషయాలు అతనికి చెబుతూ ఉండేవాణ్ణి. ఈ ఇద్దరు మిత్రులు మదీనాలోనే ఉంటూ ఉండేవారు. ఇరుగుపొరుగున ఉంటూ వంతుల వారీగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి వస్తూ ఉండేవారు – ఆ కాలంలోనే మాకు గస్సాన్ రాజు వల్ల ప్రమాదం ఏర్పడుతుందనే శంక ఉంటూ ఉండేది. అతను మా పై దాడి చేయనున్నాడని వస్తున్న వార్తల వల్ల మేము అప్రమత్తులమై ఉండేవారం. ఓ రోజు హఠాత్తుగా నా ఆ అన్సారీ మిత్రుడు నా తలుపును తెగబాదుతూ తలుపు తెరవమని అరవనారంభించాడు. అది విన్న నేను, “ఏమిటీ? గస్సానీలు వచ్చిపడ్డారా?” 

అని అడిగాను. 

“కాదు, అంతకంటే పెద్ద ఘోరమే జరిగిపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యామణుల నుండి వేరైపోయారు” అన్నాడు నా మిత్రుడు. [సహీహ్ బుఖారీ-2/730 ]

మరో ఉల్లేఖనంలో హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఇలా అన్నట్లు ఉంది: 

“మా పై దండెత్తడానికి ఆలెగస్సాన్ తమ గుర్రాలకు నాడాలు వేస్తున్నా రనే పుకార్లు బాగా వ్యాపించిన రోజులవి. ఓ రోజు నా మిత్రుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సన్నిధికి వెళ్ళి ఇషా నమాజు సమయానికి తిరిగివచ్చాడు. నా ఇంటి తలుపును పెద్దగా తడుతూ, “ఆయన నిద్రపోయారా?” అని అరుస్తున్నాడు. 

నేను బెదిరిపోతూ బయటకు వచ్చేశాను.

“ఓ పెద్ద ప్రమాదం జరిగిపోయింది” అన్నాడతను. 

“ఏమిటి? గస్సానులు వచ్చేశారా?” అని అడిగాన్నేను. 

“లేదు. అంతకంటే పెద్ద ప్రమాదమే ముంచుకువచ్చింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ భార్యలకు తలాక్ ఇచ్చేశారు.” [సహీహ్ బుఖారీ-1/334]

ఈ పరిస్థితినిబట్టి రోమనుల వల్ల ముస్లిములలో ఏర్పడిన వ్యాకులత ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాకుండా, మునాఫిక్లులు (కపట ముస్లిములు) వ్యాపింపజేస్తున్న పుకార్లు వారిని మరింత చీకాకుపర్చనారం భించాయి. ఈ మునాఫిలకు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి రంగంలోనూ నెగ్గుకు వస్తున్నారని, ఈ భూమ్మీదనున్న ఏ శక్తికీ వెరవడం లేదని, ఏ అడ్డంకులైతే ఆయన దారికి అడ్డువస్తున్నాయో అవన్నీ ఇట్టే తొలగిపోతున్నాయన్న విషయం తెలిసినప్పటికీ వారు తమ మనస్సుల్లో దాచుకున్నది, ఎదురు చూస్తున్నది తప్పకుండా నెరవేరే తరుణం ఎంతో దూరంగా లేదని తలచి ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు పన్ననారంభించారు. వారు తాము భావిస్తున్నట్లుగానే ఓ మస్జిదను (ఆ మస్జిద్, మస్జిదె జిరా గా ఆ తరువాత ఖ్యాతిగాంచింది) కట్టుకొని ఆ మస్జిద్ లో కుట్రలు, కుతంత్రాలకు పథకాలు వేయనారంభిం చారు. దైవం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ల ఎడల తిరస్కార భావ పునాదులపై నిర్మించ బడిన మస్జి లోనికి వచ్చి నమాజు చేయించమని కూడా ఈ మునాఫిస్టు దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)ను కోరి ఉన్నారు. అలా కోరడానికి కారణం, ముస్లిములను మభ్య పెట్టి వారికి తాము పన్నుతున్న కుతంత్రాలు తెలియకుండా ఉండాలని, ఆ మస్జిద్ లోకి వచ్చి పోయే వారిపై ముస్లిములు నిఘా ఉంచకుండా ఉండడానికే. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందు వలన ఆ మస్జిద్ లో నమాజు చేయించే కార్యక్రమాన్ని యుద్ధం నుండి తిరిగి వచ్చే వరకు వాయిదా వేశారు. ఇలా మునాఫిక్లులు తమ లక్ష్యసాధనలో కృతకృత్యులు కాలేకపోయారు. అల్లాహ్ వారి ఈ ఎత్తుగడను యుద్ధం నుండి తిరిగివచ్చే లోపలే బట్టబయలు చేశాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం నుండి తిరిగివచ్చిన తరువాత ఆ మస్జిద్ లో నమాజు చేసే బదులు దాన్ని నేలమట్టం చేయించారు. 

రోమనులు, గస్సానుల యుద్ధ సన్నాహాలకు చెందిన ప్రత్యేక వార్తలు 

ముస్లిములు యుద్ధ వార్తలను వింటూ చీకాకులో ఉన్న కాలంలోనే మదీనాకు సిరియా దేశం నుండి నూనె సరఫరా చేసే ‘బన్తీల’ (*)  ద్వారా హఠాత్తుగా హెరిక్స్ నలభై వేల మంది సైనికులతో కూడిన ఓ పెద్ద సైన్యాన్ని తయారు చేసి పేరుమోసిన ఓ కమాండరు నేతృత్వంలో యుద్ధానికి పంపిస్తు న్నాడని, ఆ సైన్యం జెండా క్రిందికి క్రైస్తవ తెగలైన లబ్న్ మరియు జిజాములు కూడా వచ్చి చేరాయని, ఆ సైన్యం ముందస్తు దళం ఒకటి ‘బల్కా’ వరకు వచ్చేసిందనే పిడుగులాంటి వార్త వినిపించారు. ఇలా అది ఓ పెద్ద ప్రమాద రూపంలో ముస్లిముల ముందుకు వచ్చిన ప్రత్యేక యుద్ధ సంబంధమైన 

(*) సాబిత్ బిన్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతికి చెందినవారు. ఒకప్పుడు ఉత్తర హిజాలో మంచి పలుకుబడిగల ధనవంతులు. పతనావస్థకు చేరి క్రమక్రమంగా మామూలు రైతులుగా, వ్యాపారులుగా మారిపోయినవారు వీరు

మరింత జటిలంగా మారిన పరిస్థితులు 

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతుంటే, వాటికితోడు మరిన్ని విపత్తులు వచ్చిపడ్డాయి. విపరీతమైన ఎండ వేడిమికి తోడు ప్రజలు కరవు వల్ల బాధపడు తున్నారు. వెళ్ళడానికి వాహనాలు కూడా తక్కువే. మదీనాలో పండే పండు పంటకొచ్చాయి. కాబట్టి ప్రజలు మదీనాను వదలక నీడపట్టున ఉండి పంటను దక్కించుకుందామనే ధోరణిలో ఉన్నారు. వెంటనే బయలుదేరడానికి సిద్ధపడడం లేదు. అదేకాకుండా దూరప్రాంతానికి వెళ్ళడం, మార్గంలో ఏర్పడే అవరోధాలు ఓ ప్రక్క పీడించనారంభించాయి వారిని. 

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుని ఖచ్చితమైన నిర్ణయం

అయితే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరిస్థితులను, జరుగబోయే మార్పుల్ని క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయాత్మకమైన ఘడియలో గనక ముస్లిములు రోమనులతో యుద్ధం చేయడానికి బద్దకించి ముస్లిముల ప్రాంతాల్లోనికి చొరబడే వీలు కలిగిస్తే, వారు మదీనా పై దండెత్తి వస్తే గనకా, ఇస్లామీయ సందేశం పై చెడు ప్రభావాలు పడతాయి. ముస్లిమ్ సైన్యానికి ఇప్పటి వరకు వచ్చిన కీర్తికాస్తా మంటగలిసిపోతుంది. ‘హునైన్’ యుద్ధంలో చావుదెబ్బ తిని తుది శ్వాస వదులుతున్న అజ్ఞానం తిరిగి బ్రతికి బట్టకడుతుంది. సమయం కోసం కాచుకొని అబూ ఆమిర్ ఫాసిక్ ద్వారా రోమను చక్రవర్తితో సంబంధాలు ఏర్పర్చుకున్న మునాఫిన్లు, రోమనులతో తలపడబోతున్న ముస్లిములకు వెన్నుపోటు పొడవడానికి కాచుకొని కూర్చున్నారు. ఇలా ఇప్పటి వరకు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన అనుచరగణం ఇస్లామ్ వ్యాప్తికి చేసిన కృషి అంతా బూడిదలో బోసిన పన్నీరులా వృధా అయిపోగలదు. ఎడతెగని రక్తపాత సహిత యుద్ధాలు, సైనిక చర్యల ద్వారా సంపాదించిన విజయాలు కాస్తా అపజయాలుగా మారిపోయే ఆస్కారం ఉంది. 

ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ ఫలితాలను పూర్తిగా బేరీజు వేసుకుం టూనే ఉన్నారు. అందుకని, ఓ వైపు విషమ పరిస్థితులు, మరో వైపు దారిద్ర్యం పీడిస్తున్నప్పటికీ, రోమనులను దారుల్ ఇస్లామ్ (మదీనా) వైపునకు పురోగ మించే వెసులుబాటును కల్పించే బదులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తామే స్వయాన వారి ప్రాంతాల్లోనికి చొరబడి వారికి వ్యతిరేకంగా ఓ నిర్ణయాత్మకమైన యుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. 

రోమనులతో యుద్ధానికి సన్నాహాలు 

ఈ వ్యవహారాన్ని గురించి బాగా సమీక్షించిన తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయులు సహాబా (రదియల్లాహు అన్హుమ్)లకు, యుద్ధం గురించిన సన్నాహాలు ప్రారంభిం చమని ప్రకటించారు. అరబ్బు తెగలు, మక్కా ప్రజల్ని కూడా యుద్ధం కోసం బయలుదేరండనే సందేశం పంపించారు. ఏ గజ్వాకైనా వెళ్ళేటప్పుడు దైవప్రవక్త 

(సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల దృష్టిని మరో వైపునకు మళ్ళించడం రివాజు. కాని పరిస్థితి జటిలత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “మనం రోమనులతో యుద్ధానికి వెడుతున్నాం” అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ‘జిహాద్’ గురించి ప్రజల్ని ప్రేరేపించారు. దివ్యఖుర్ఆన్లోని ‘తౌబా’ సూరాలోని ఓ భాగం ఈ సందర్భంలోనే అవతరించింది. దీనికితోడు, ఆయన దానధర్మాల ప్రాశస్త్యం గురించి చెబుతూ, అల్లాహ్ మార్గంలో ప్రియమైనది, మేలైనది అయిన దాన్ని వెచ్చించమని ప్రోత్సహించారు. 

యుద్ధ సన్నాహాలకు ముస్లిముల ఉరుకులు పరుగులు 

సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ప్రకటన వినగానే, రోమనులతో యుద్ధం చేయడానికి సన్నాహాలను ముమ్మరం చేశారు. తెగలు, మిత్రపక్షాలు నలువైపుల నుండి మదీనాకు వచ్చిచేరనారంభించాయి. ఎవరి మనస్సుల్లోనైతే కపటం నాటుకుపోయిందో వారు తప్ప ప్రతి ముస్లిమ్ ఆ గజ్వాకు వెళ్ళడానికి వెనుకాడలేదు. అయితే ముస్లిములలోనే ముగ్గురు వ్యక్తులు మాత్రం ఎలాంటి కారణాలు లేకుండానే ఆ గజ్వాలో చేరకుండా ఆగిపోయారు. వారు కపట ముస్లిములు కారు, నిజమైన ముస్లిములే. ఆర్థికంగా వెనుకబడిన పేద ముస్లిములు సైతం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహనీయుల వద్దకు వచ్చి యుద్ధంలో పాల్గొనడానికి తమకు ఏదైనా వాహనాన్ని సమకూర్చమని ప్రాధేయపడనారం భించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన వద్ద ఏదీ లేదని, ఈ విషయంలో నేను నిస్సహాయుడనని చెప్పి పంపించడం జరుగుతూ ఉండేది. దివ్యఖుర్ఆన్ ఈ సందర్భాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది. 

“నేను మీ కొరకు వాహనాలను ఏర్పాటు చేయలేను అని అన్నప్పుడే, గత్యంతరం లేక వారు మరలిపోయారు. వారి కళ్ళ నుండి అశ్రువులు ప్రవహించాయి. వారు తమ ఖర్చులతో పోరాటంలో పాల్గొనే శక్తి తమకు లేనందుకు చాలా బాధపడ్డారు.” (9 : 92) 

ఇలాగే ముస్లిములు దైవమార్గంలో ధనాన్ని వెచ్చించే విషయంలో ఒకరినొకరు మించిపోవాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. హజ్రత్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు), సిరియా దేశం వెళ్ళడానికిగాను వ్యాపార సామగ్రి మూటలు గల రెండు వందల ఒంటెలను, వాటితో సహా రెండు వందల ఓకియాల వెండి (దాదాపు ఇరవై తొమ్మిదిన్నర కిలోల వెండి) తయారు చేసి ఉన్నారు. ఆయన దీన్నంతటిని యుద్ధం కోసం దానంగా ఇచ్చేశారు. ఆ తరువాత అదనంగా ఓ వంద ఒంటెల్ని ప్రయాణ సామగ్రితో సహా సదఖా చేశారు. అది ఇచ్చిన తరువాత ఒక వెయ్యి దీనారాలు (దాదాపు అయిదున్నర కిలోల బంగారం) తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒడిలో పొసేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ దీనారాలను చేతితో ఇటు అటు కదిలిస్తూ ఈ రోజు ఉస్మాన్ ఏది చేసినా ఆయనకు నష్టాన్ని చేకూర్చదు ‘* అననారంభించారు. ( *జామిఆ తిర్మిజీ: మనాఖిబ్ ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్-2/2111 )

అదే కాకుండా హజ్రత్ ఉస్మాన్ మళ్ళీ మళ్ళీ సదఖా చేస్తూనే ఉన్నారు. అలా ఆయన సదఖా చేసిన ధనం గాక, ఒంటెల సంఖ్య తొమ్మిది వందలు, గుర్రాల సంఖ్య నూరు వరకు చేరిపోయింది. 

ఇటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు) తన రెండొందల ఓకియాలు (అంటే ఇరవైతొమ్మిదిన్నర కిలోల వెండి) తీసుకొచ్చి సమర్పించారు. హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) తన దగ్గర ఉన్నదంతా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చి పడవేశారు. ఆయన భార్యాపిల్లల కోసం మిగిల్చి ఉంచింది కేవలం అల్లాహ్, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను మాత్రమే. ఆయన చేసిన సదఖా ధనం మొత్తం నాల్గు వేల దీర్ఘములు. ఆయనే ఈ సదఖా తెచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించినవారిలో ప్రథముడు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వద్ద ఉన్న సొత్తులోని సగభాగం తీసుకొని వచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) కూడా పెద్ద మొత్తంలోనే ధనాన్ని తెచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. వారే కాకుండా హజ్రత్ తలా (రదియల్లాహు అన్హు), సఅద్ బిన్ ఉబాదా (రదియల్లాహు అన్హు), ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)లు కూడా తగినంత డబ్బును సదఖాగా ఇచ్చారు. హజ్రత్ ఆసిమ్ బిన్ అద్దీ (రదియల్లాహు అన్హు) తొంభై వస్క్ ల (అంటే పదమూడున్నర వేల కిలోలు లేదా పదమూడున్నర టన్నుల) ఖర్జూరాలు తీసుకువచ్చారు. తక్కిన సహాబాలు కూడా ఒకరి తరువాత ఒకరు తమకు తోచిన సదఖా తెచ్చి ఇచ్చారు. చివరికి శక్తి లేనివారు కూడా ఒకటో రెండో ముద్దు (ఖర్జూరాలు) సదఖాగా ఇచ్చారు. మహిళలు కూడా తమ కంఠహారాలు, వడ్డాణాలు, కాళ్ళ పట్టీలు, చెవుల రింగులు, ఉంగరాలు వగైరాలు వారి శక్తి మేరకు తెచ్చి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమర్పించుకున్నారు. ప్రతివారూ పిసినారితనాన్ని ప్రదర్శించకుండా సదఖ ఇచ్చినవారే. కేవలం మునాఫిన్లు ఒక్కరే ఒకరిని మించి ఒకరు సదఖా చేయడం చూసి (వీరు ప్రదర్శనాబుద్ధితో చేస్తున్న సదఖా అని) తూలనాడనారంభించారు. తమ వద్ద ఇవ్వడానికి ఏమి లేని పేద ముస్లిములెవరైనా ఒకటి, రెండు ఖర్జూరాలను తీసుకొని వస్తే వారిని చూసి ఈ మునాఫిక్లు, ఓహో ఈ ఖర్జూరాలతో కైజరు సామ్రాజ్యాన్ని జయిస్తారు కాబోలు అని హేళన చేసేవారు. (9 : 97) 

తబూక్ కు బయలుదేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ముహమ్మద్ బిన్ ముస్లిమా (రదియల్లాహు అన్హు)ను, మరో ఉల్లేఖనంలో చెప్పబడి నట్లుగా సబా బిన్ అరఫ్తా (రదియల్లాహు అన్హు)ను మదీనాకు గవర్నరుగా నియమించారు. . హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు)ని తమ కుటుంబ సభ్యులకు సంరక్షకులుగా చేసి మదీనా లోనే ఉండమని చెప్పి ఆదేశించారు. కాని మునాఫిన్లు ఆయన్ను తూల నాడడం వలన ఆయన బయలుదేరి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు చేరారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తిరిగి ఆయన్ను మదీనాకు పంపిస్తూ, “ఏమిటీ! నీకూ నాకూ ఉన్న అనుబంధం, హజ్రత్ మూసా (అలైహిస్సలాం)కు హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం)తో ఉన్న అనుబంధం లాంటిది అనే విషయాన్ని గ్రహించలేదా? అయితే నా తరువాత మరో ప్రవక్త రాడు అనే విషయం తెలుసుకో” అని అన్నారు. 

ఎట్టకేలకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉత్తర దిశ వైపునకు బయలుదేరారు. (నిసాయీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రకారం అది గురువారం) గమ్యం తబూక్. సైన్యం పెద్దది. ముప్ఫై వేల మంది యోధులతో కూడిన సైన్యం అది. అంతకు పూర్వం ముస్లిములు అంత పెద్ద సైన్యాన్ని ఎప్పుడూ సమీకరించలేదు. అందుకని, ముస్లిములు దానికోసం తమ శాయశక్తులా ధనాన్ని సమకూర్చి నప్పటికీ సైన్యానికి కావలసిన హంగుల్ని సమకూర్చలేకపోయారు. అప్పటికీ వాహనాలు, తినుబండారాలు బాగా తక్కువగానే ఉన్నాయి. కాబట్టి పద్దెనిమిదేసి మంది సిపాయీలకు ఒక్కొక్క ఒంటె కేటాయించబడింది. వారు దాని పై వంతుల వారీగా స్వారీ చేస్తూ వెడుతున్నారు. అలాగే తినుబండారాల కొరత వల్ల అప్పుడప్పుడు చెట్ల ఆకుల్ని సైతం తినవలసి వచ్చింది. ఆ ఆకుల్ని తినడం వలన వారి పెదాలు వాచిపోయాయి. విధిలేక ఒంటెల కొరత ఉన్నప్పటికీ వాటిని జిబహ్ చేసి దాని ప్రేవుల్లో ఉన్న నీటిని త్రాగవలసి వచ్చింది. అందుకొరకే ఆ సైన్యం పేరు ‘జైషే ఉగ్రత్’ (అంటే కష్టాలు అనుభవించిన సైన్యం) అని పడిపోయింది. తబూక్ కు వెళ్ళేటప్పుడు ఈ సైన్యం ‘ హిజ్ర్ (అంటే సమూద్ జాతి నివసించిన ప్రదేశం) గుండా వెళ్ళవలసి వచ్చింది. సమూద్ జాతి ‘వాదియిల్ ఖురా’లో బండరాళ్ళను తొలిచి ఇండ్లను నిర్మించుకున్న జాతి. సహాబా (రదియల్లాహు అన్హుమ్)లు అక్కడి ఓ బావి నుండి నీటిని నింపుకున్నారు. కాని బయలుదేరే టప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో, “మీరు ఈ ప్రదేశంలోని నీరు త్రాగకండి, ఆ నీటితో నమాజు చేసుకోవడానికి వుజూ కూడా చెయ్యొద్దు. ఆ నీటితో ఏ పిండి అయితే కలిపి ముద్దగా చేశారో, దాన్ని పశువులకు పెట్టేయండి. ఆ పిండి తినకండి. మీరు సాలెహ్ (అలైహిస్సలాం)గారి ఒంటె నీళ్ళు త్రాగిన బావిలోని నీటినే ఉపయోగించండి” అని ఆదేశించారు. 

‘సహీ హీన్’ గ్రంథంలో ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హు)గారి ఉల్లేఖనం ఒకటుంది. అందులో ఆయన ఇలా సెలవిస్తున్నారు: 

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ హిజ్ర్ (లేదా సమూద్ జాతి నివాసం) గుండా వెడుతూ, ‘ఈ దుష్టులు నివసించిన ప్రదేశంలో ప్రవేశించకండి. వారి పై పడిన ఆపద మీ పైనా పడవచ్చు. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం బాధతో మూలిగే హృదయాలు రోదిస్తూ నడిచినట్లు నడవండి’ అన్నారు. ఆ పిదప ఆయన తన తల పై వస్త్రం కప్పుకుని వేగంగా ప్రయాణిస్తూ ఆ లోయను దాటారు.” [సహీహ్ బుఖారీ- హిజ్ర్ లోయలో ప్రవేశించిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనే అధ్యాయం-2/637]

మార్గమధ్యంలో సైన్యానికి నీరు కరవై విలవిలలాడిపోతోంది. ఈ విషయం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు కొందరు. ప్రవక్త మహ నీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ను మొర పెట్టుకోగా అల్లాహ్ మేఘాలను పంపించాడు. అవి బాగా వర్షించగా జనం తనవితీరా దాహాన్ని తీర్చుకోవడమే కాకుండా అవసరానికి కావలసినంత నీటిని నింపుకోవడం జరిగింది. 

ఇక తబూక్ దాపుకు చేరుతారనగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యాన్ని ఉద్దేశించి, “ఇన్షా అల్లాహ్, మీరు రేపటికల్లా తబూక్ యొక్క నీటి చెలమను చేరుకో గలరు. అయితే చార్జ్ సమయానికి ముందు అక్కడకు వెళ్ళలేరు. కాబట్టి 

అక్కడికి వెళ్ళినవాడు ఏ ఒక్కడు కూడా నేను చేరనంత వరకు ఆ నీటిని ముట్టుకోవద్దు సుమా!” అని హెచ్చరించారు. హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం, “మేము అక్కడికి చేరేలోపలే ఇద్దరు వ్యక్తులు ఆ చెలమ దగ్గరికి వెళ్ళడం గమనించాం. ఊట బావి(చెలమ) నుండి కొద్దికొద్దిగా నీరు ఊరుతోంది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిద్దరిని ఉద్దేశించి, ‘మీరు ఈ నీటిని ముట్టుకున్నారా?’ అని అడగగా, ‘అవును’ అని బదులిచ్చారు వారు. ఆ ఇద్దరికి దైవాదేశం మేరకు ఏం చేప్పాలో చెప్పి, ఆ చెలమ నుండి తన ఒక అర చేతిని దొప్పగా చేసి వచ్చిన నీటిని బయటకు తీయనారంభించారు. అలా తీయగా వచ్చిన కొద్దిపాటి నీటితో తన ముఖాన్ని, చేతుల్ని కడిగి తిరిగి ఆ నీటిని ఆ చెలమలో పోసేశారు. ఆ తరువాత ఆ చెలమలో పుష్కలంగా నీరు ఊరనారంభించింది. సహాబా (రదియల్లాహు అన్హుమ్) తనవితీరా ఆ నీటిని త్రాగారు. ఆ తరువాత నన్నుద్దేశించి, ‘ఓ ముఆజ్! నీవే గనక బ్రతికి ఉంటే ఈ ప్రదేశాన్ని తోటలతో సస్యశ్యామలంగా అలరారుతున్నట్లు చూస్తావు’ అని చెప్పారు.” [ ముస్లిమ్- ముఆజ్ బిన్ జబల్ ఉల్లేఖనం-2/246]

మార్గం మధ్యలోనో లేదా తబూక్ కు చేరిన తరువాతనో- ఉల్లేఖనాల్లో కొంత భేదం ఉంది – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

“ఈ రాత్రి మి మీదికి పెద్ద ఇసుక తుఫాను ఒకటి వచ్చిపడబోతోంది. అందుకని ఏ ఒక్కడూ లేచి నిలబడకూడదు. ఒంటెగలవాడు దాన్ని త్రాటితో గట్టిగా కట్టేయాలి” అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చినట్లుగానే ఆ రాత్రి తీవ్రమైన గాలి దుమారం చెలరేగింది. వారిలో ఒక వ్యక్తి లేచి నిలబడగా ఆ గాలి దుమారం అతణ్ణి ఎగిరేసుకుపోయి రెండు కొండల నడుమ విసరేసింది. ” [ముస్లిమ్-ముఆజ్ బిన్ జబల్  ఉల్లేఖనం -2/246]

తబూక్ ప్రయాణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జొహ్రీ మరియు అశ్ నమాజులు, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు కలిపి చేసేవారు. ఒక్కొక్కసారి ఈ రెండు నమాజుల్ని జమా తస్లిమ్ గాను, జమా తాఖీ గానూ చేసేవారు. (‘జమా తస్లీమ్’ అంటే జొహ్రీ మరియు అస్త్ నమాజులు జొహ్ర నమాజు వేళ అయినప్పుడు, మగ్రిబ్, ఇషా నమాజులు మగ్రిబ్ వేళ అయినప్పుడు చేయడం. ఇక ‘ జమా తాకీర్’ అంటే, జొన్గా, అత్ నమాజులు అన్ నమాజు వేళలో, మగ్రిబ్, ఇషా నమాజులు ఇషా నమాజు వేళలో చేయడం) 

తబూక్ కు చేరిన ఇస్లామీయ సైన్యం 

ఇస్లామీయ సైన్యం తబూకకు చేరి గుడారాలను వేసుకొని, రోమనులతో తలబడడానికి సిద్ధమైపోయింది. ఈ సందర్భంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానుద్దేశించి, విశాలమైన భావాలు స్ఫురించేటట్లుగా ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఇహపరలోకాల సాఫల్యం గురించి ప్రోత్సహించారు. అల్లాహ్ శిక్ష ఎలాంటిదో చూపుతూ భయ పెట్టారు. యుద్ధానంతరం లభించబోయే వరాలు, బహుమానాలకు సంబంధించిన శుభవార్తనిచ్చారు. ఇలా సైన్యం యొక్క ధైర్యసాహసాలు పెరిగినట్లయింది. వారిలో ఇప్పటి వరకు, తినుబండా రాలు, ఇతర వస్తువుల లేమి గురించి బాధపడుతున్న లోపాలన్నీ తొలగి పోయాయి. మరో ప్రక్క రోమను సామ్రాజ్యానికి మద్దతుగా వచ్చిన తెగలు, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రాక గురించి విని భయభీతులైపోయాయి. ముందుకొచ్చి ముస్లిమ్ సేనను ఢీకొనడానికి ధైర్యం చాలక, దేశంలోని వివిధ పట్టణాల వైపునకు పారిపోనారంభించాయి. వారి ఈ వైఖరి ప్రభావం, అరేబియా ద్వీపం లోనే కాకుండా, బయటి వారి పైనా పడింది. ముస్లిముల ఘనకీర్తికి మరింత బలం చేకూరినట్లయింది. ముస్లిములకు, యుద్ధం ద్వారా సాధించ లేని రాజకీయ ప్రయోజనాలు ఒనగూడాయి. ఆ ప్రయోజనాలేమిటో మనం ఇక్కడ సమీక్షిద్దాం. 

‘అయిలా’ పాలకుడు ‘యక్నా బిన్ రౌబా’ వెంటనే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరై జిజియా కట్టడానికి ఒప్పుకున్నాడు. సంధి ఒప్పందం చేసు కున్నాడు. ‘జర్ బా’ మరియు ‘అజ్ రూహ్’ పౌరులు కూడా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు వచ్చి జిజియా కట్టడానికి సిద్ధపడ్డారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి ఓ పత్రాన్ని రాయించి ఇచ్చారు. వారు దాన్ని సురక్షితంగా తమ వద్ద ఉంచు కోవడం జరిగింది. అలాగే ‘అయిలా’ లకునికి కూడా ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) పత్రాన్ని రాసి ఇచ్చారు. అది ఈ క్రింది విధంగా ఉంది.

“బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. ఇది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరఫున, యహినా బిన్ రౌబా మరియు అయిలా ప్రజలకు రాసి ఇచ్చిన శాంతి ఒప్పంద పత్రం. భూతలంపైనా, సముద్రం మీదనూ వారి పడవలు మరియు బిడారాల బాధ్యత అల్లాహ్ మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)దే. అలాగే ఈ బాధ్యత ‘యహినా’కు మిత్రులైన సిరియా వారి కోసం కూడాను. అయితే, వారి ఏ వ్యక్తి అయినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అతని ధనం అతని ప్రాణాన్ని రక్షించలేదు. అతని సొత్తును తీసుకున్నవాడికి అది ధర్మసమ్మతమే అవుతుంది. వారు ఏ ఒయాసిస్సుకు వెళ్ళడాన్నిగాని, భూమి మరియు సముద్ర మార్గం పై నడవడాన్నిగాని అడ్డుకోవడం జరుగదు.”

ఇదే కాకుండా మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కు నాల్గు వందల ఇరవై ఉ’రోహకుల పటాలాన్నిచ్చి దూమతుల్ జందల్ పాలకుడు ‘ఉకైదిర్’ వద్దకు పంపించారు. వెళ్ళేటప్పుడు ఆయనతో, “నీవు వెళ్ళేటప్పటికి అతడు జింక వేటలో ఉండగా జూస్తావు” అని కూడా చెప్పారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కోట అగుపడేటంత దూరం వెళ్ళి ఆగిపోయారు. అనుకోకుండా ఓ జింక ఎక్కడి నుండో వచ్చి కోట ద్వారాన్ని కొమ్ములతో చెలుగుతోంది. ఉకైదర్ దాన్ని వేటాడడానికి బయటకు వచ్చాడు. వెన్నెల రాత్రి కావడం వలన, హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు), ఆయనగారి అనుచరులు అతణ్ణి పట్టుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తెచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతణ్ణి క్షమించి, రెండు వేల ఒంటెలు, ఎనిమిది వందల బానిసలు, నాల్గు వందల కవచాలు, నాల్గు వందల బరిశెలు ఇచ్చే షరతు పై ఒప్పందం కుదుర్చుకుని వదలివేశారు. అతను ఇక నుండి జిజియా కూడా కడతా నని ఒప్పుకున్నాడు. ఇలా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యహినాకు తోడు దూమా, తబూక్, అయిలా మరియు తైమాలతో షరతులతో కూడిన ఒప్పందాలు చేసుకున్నట్లయింది. 

ఈ పరిస్థితులను గమనించి, ఇప్పటి వరకు రోమనుల చెప్పుచేతల్లో ఉన్న తెగలు, ఇక తమ పాత సంరక్షకులను నమ్ముకొని ఉండే కాలం చెల్లిపోయిందని తలచి ముస్లిములకు సహకరించనారంభించారు. ఈ విధంగా ముస్లిము సామ్రాజ్య సరిహద్దులు విస్తరించి నేరుగా రోమను సామ్రాజ్యంతో కలిసిపోయాయి. రోమనుల తొత్తులు చాలా మట్టుకు అంతమైపోయారు. 

మదీనాకు తిరుగు ప్రయాణం 

ఇస్లామీయ సేన ఎలాంటి యుద్ధం చేయకుండానే విజయకేతనం ఎగురవేస్తూ మదీనాకు తిరిగి వచ్చింది. అల్లాహ్, యుద్ధం విషయంలో మోమిన్ (విశ్వాసుల)కు అండగా నిలిచాడు. అయితే మార్గమధ్యంలో ఓ లోయ వద్ద పన్నెండుగురు మునాఫిక్ కు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి ప్రయత్నించారు. ఆయన అప్పుడు ఆ లోయగుండా వెళుతున్నారు. హజ్రత్ అమ్మార్(రదియల్లాహు అన్హు) ఒంటె ముకుత్రాడు పట్టుకొని ముందు నడుస్తున్నారు. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ (రదియల్లాహు అన్హు) ఒంటె వెనకాల నడుస్తూ దాన్ని తోలుతున్నారు. మిగిలిన సహాబాలందరూ దూరంగా, ఆ లోయ పల్లపు ప్రదేశం గుండా వస్తున్నారు. అందుకని మునాఫిలకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చే దుష్టావకాశం లభించిందనిపించింది. వారు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపునకు రానారంభించారు. ఇటు ప్రవక్తగారి సహచరులిద్దరు మామూలుగా నడుస్తూనే ఉన్నారు. వెనుక నుండి ఎవరో వస్తున్నట్లు కాళ్ళ సవ్వడి వినబడింది. వీరంతా ముఖాలపై ముసుగులు కట్టుకొని దాడికి సిద్ధపడడం చూసి ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వసల్లం) హుజైఫా (రదియల్లాహు అన్హు)ను వారిని అడ్డగించడానికి పంపారు. ఆయన వారి వాహనాల ముఖాలపై తన బౌలుతో కొట్టనారంభించారు. అల్లాహ్, ఆయన వేసిన దెబ్బలకు భయపడి పోయేటట్లుగా చేయడం వలన వారు పారిపోయి తమ వారి వద్దకు చేరారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి పేర్లు చెబుతూ వారెందుకు వచ్చారో తెలియజేశారు. అందుకనే హజ్రత్ హుజైఫా (రదియల్లాహు అన్హు)కు, ప్రవక్త ‘నమ్మిన బంటు’గా పేరుబడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించే దివ్య ఖుర్ఆన్లో, “వారు చేయదలిచిన పనిని చేయలేకపోయారు” అనే వాక్యం అవతరించింది. 

ప్రయాణం పూర్తిచేసి మదీనా దాపుకు రాగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మదీనా గురుతులు కానరాగా ఆయన, “అదిగో ‘తాబా’, అది ఉహద్ కొండ, మనల్ని ప్రేమించేది మనం దాన్ని ప్రేమిస్తున్న కొండ అదిగో” అని సంబరపడుతూ అన్నారు. ఇటు మదీనాలో ఆయన రాక గురించిన వార్త అందగానే స్త్రీలు, పిల్లలు, అమ్మాయిలంతా బయటకు వచ్చి ఎంతో ఘనంగా ఆ సైన్యానికి స్వాగతం పలకుతూ ఈ పద్యపాదాలను చదవనారంభించారు° (దాని భావం ఇలా ఉంది): 

“సనీయతుల్ విదా దిగ్మండలం నుండి పొడిచిన పున్నమి చంద్రు డడిగో, మమ్మల్ని పిలిచేవాడు పిలుస్తున్నంత వరకు దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం మన విధి.” 

[ఇది ఇబ్నె ఖయ్యిమ్ గారి సూక్తి. దీనిపై చర్చ ఇది వరకే వచ్చింది]

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ కు రజబ్ నెలలో బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పటికి రమజాన్ నెల నడుస్తోంది. ఈ ప్రయాణం మొత్తం యాభై రోజుల ప్రయాణం. ఇరవై రోజులు తబూక్ లో గడిపినవి, ముప్ఫై రోజులు అక్కడికి వెళ్ళిరావడానికి జరిగిన ప్రయాణ రోజులు. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ జీవితకాలంలో స్వయంగా పాల్గొన్న గజ్వాల్లో ఈ గజ్వా చిట్టచివరి గజ్వా (పోరాటం). 

ముకల్లిఫీన్ (యుద్ధంలో పాల్గొనకుండా వెనుక ఉండిపోయినవారు) 

ఈ పోరాటం, దాని ప్రత్యేక పరిస్థితులననుసరించి, అల్లాహ్ తరఫున ఓ గట్టి పరీక్ష కూడాను. ఈ పోరాటం ద్వారా, విశ్వాసులెవరో, విశ్వాసులు కానివారెవరో తేలిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి వారిని ఏరి చూయించడం అల్లాహ్  సంప్రదాయం. దివ్యఖుర్ఆన్ ఈ విషయాన్ని ఇలా సెలవిస్తోంది: 

“మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అల్లాహ్ విశ్వాసులను ఏ మాత్రం ఉండనివ్వడు. ఆయన పవిత్రులను, అపవిత్రుల నుంచి తప్పకుండా వేరుచేస్తాడు.” (3:179) 

కాబట్టి ఈ పోరాటంలో విశ్వాసులు, సత్యవంతులందరూ పాల్గొన్నవారే. ఆ యుద్ధంలో పాల్గొనకపోవడమంటే, అది నిఫా కు (కాపట్యానికి) గుర్తు. ఎవరైనా యుద్ధంలో పాల్గొనకుండా ఎందుకు ఉండిపోవలసి వచ్చిందో ఆ విషయాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకునేవారు సహాబా (రదియల్లాహు అన్హుమ్). ఆయన దానికి జవాబుగా, “వదిలేయండి! అతని మనస్సులో శ్రేయం పొందాలనే కోరికే ఉంటే, అల్లాహ్ త్వరలోనే అతణ్ణి నా వద్దకు పంపించేస్తాడు. అలా కాకపోతే అతని నుండి అల్లాహ్ మిమ్మల్ని రక్షించినట్లే” అని అంటూ ఉండే వారు. ఎలాగైతేనేమి,యుద్ధసామగ్రి, వాహనాలులేక యుద్ధంలో పాల్గొనలేక పోయిన వారు కొందరైతే, మునాఫిక్ కు మరికొందరు. ఈ మునాఫిస్టు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను విశ్వసించామని దొంగ నటన చేసినవారు. ప్రస్తుతం వారే దొంగసాకులు చెప్పి ఈ గజ్వాలో పాల్గొనకుండా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుమతిని పొంది వెనుక ఉండిపోయినవారు. మరికొందరైతే ఎలాంటి అనుమతి లేకుండానే ఇండ్లలో కూర్చుండిపోయారు. అయితే పోరాటంలో పాల్గొనకుండా మిగిలిపోయిన ముగ్గురు మాత్రం నిజమైన ముస్లిములు, గట్టి విశ్వాసం గలవారే. వారు ఎలాంటి కారణం లేకుండానే యుద్ధంలో పాల్గొనలేదు. వారిని అల్లాహ్ పరీక్షకు గురిచేసిన తరువాత వారి పశ్చాత్తాపాన్ని మన్నించడం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

తిరుగు ప్రయాణం చేసి మదీనాకు చేరిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పటిలాగే మస్జిదె నబవీ కి వెళ్ళారు. అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు. ప్రజలు చుట్టుముట్టగా అక్కడనే కూర్చుండిపోయారు. ఇటు మునాఫిక్లులు – వారు ఎనభై మందికంటే ఎక్కువే.”(*) ఒకరి తరువాత ఒకరు వచ్చి ఏదో సాకులు చెప్పనారంభించారు. అల్లాహ్  పై ప్రమాణాలు చేస్తూ తాము రాలేకపోయిన విషయాన్ని వివరిస్తున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు పైకి చెప్పే దాన్ని స్వీకరించి వారితో బైక్ కూడా చేస్తూ వారి మన్నింపు కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నారు. వారి మనస్సులోని విషయాన్ని దైవానికే వదలివేశారు

(*) వాకిదీ కథనం ప్రకారం, ఈ సంఖ్య అన్సారులలోని మునాఫిక్ లది. వారే కాకుండా బనీ గిఫ్ఫార్ వగైరా బద్దూ తెగల వారి సంఖ్య ఎనభై ఇద్దరు. అబ్దుల్లాహ్ బిన్ ఉబై, అతని సహచరులు వారికి అదనం. వారు కూడా చాలా మందే ఉన్నారు. (చూడండి, ఫహుల్ బారి-8/119) 

ఇక మిగిలిన వారు ముగ్గురు మోమిన్లు, సత్యసంధులు – అంటే హజ్రత్ కఅబ్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు), మురారా బిన్ రబీ (రదియల్లాహు అన్హు), హిలాల్ బిన్ ఉమయ్యా (రదియల్లాహు అన్హు)లు- వారు నిజాన్నే అనుసరిస్తూ, “మేము ఎలాంటి కారణం లేకుండానే పోరాటంలో పాల్గొనలేదు” అని ఉన్న విషయం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు విన్నవించుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఈ ముగ్గురు వ్యక్తులతో ఎలాంటి సంభాషణ చేయవద్దని సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను ఆదేశించారు. కాబట్టి ఈ ముగ్గురికి వ్యతిరేకంగా తీవ్రమైన బాయికాట్ (సామాజిక వెలి) ప్రారంభం అయింది. ప్రజలంతా ఒక్కసారే మారిపోయారు. జీవితం భయంకరంగా మారిపోయింది. ఇంత పెద్ద వైశాల్యం గల భూమి ఒక్కసారే ఇరుకైనట్లనిపించింది వారికి, అదేకాదు ప్రాణాలు కూడా పోయేటంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అలా నలభై రోజులు గడిచిన తరువాత భార్యల వద్దకుపోవడం కూడా మానుకొమ్మనే ఆదేశం వెలువడింది. బాయికాట్ కు సంబంధించిన యాభై రోజులు పూర్తి అయిన తరువాత అల్లాహ్ వారి తౌబా స్వీకరించబడినట్లు శుభవార్త అందించాడు. దివ్యఖుర్ఆన్ లోని ఈ శుభవార్త వాక్యాలు ఇలా ఉన్నాయి. 

“ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా ఆయన క్షమించాడు. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా, భూమి వారికి ఇరుకై పోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు, వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు. నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించే వాడూను.” (9 : 118) 

ఈ తీర్పు వెలువడగానే ముస్లిములందరూ సాధారణంగానూ, ఆ ముగ్గురు సహాబాలు (6) ప్రత్యేకంగాను సంబరపడిపోయారు. ప్రజలు పరుగున వచ్చి వారికి ఈ శుభవార్తను అందించనారంభించారు. వారి ముఖాలు ఆనందాతిశయంతో విప్పారిపోయాయి. ప్రజలు వారికి కానుకలు అర్పించనారంభించారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వారికి ఎంతో విలువైన రోజు. 

అలాగే మరెవరైతే చేతకాక వివశులై ఆ సంగ్రామంలో పాల్గొనలేక పోయారో వారిని గురించి అల్లాహ్ ఈ క్రింది ఆయత్ లను అవతరింపజేశాడు. 

“వృద్ధులు, వ్యాధిగ్రస్తులూ, పోరాటంలో పాల్గొనడానికి దారి భత్యాలు లేని వారూ ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దోషమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహూ, ఆయన ప్రవక్తకూ విశ్వాసపాత్రులుగా ఉన్నంతవరకు. అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడూ, కరుణించేవాడూను.” (9 : 91,92) 

మదీనాకు దాపుగా వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి విషయంలోనే, “మదీనాలో కొందరున్నారు. వారు మీరు ఏయే ప్రదేశాల నుండి ప్రయాణం చేశారో, ఏ లోయల్ని దాటారో అప్పుడు మీ వెంటే ఉన్నారు, వారిని కొన్ని అనివార్య కారణాలు మీ వెంట రాకుండా చేశాయి” అని అనగా, “ఓ దైవప్రవక్తా! వారు మదీనాలో ఉంటూనే మన వెంట ఉన్నారా?” అని అడిగారు అనుచరులు. “అవును, మదీనాలో ఉండి కూడా వారు మీ వెంటే ఉన్నారు” అని సమాధానమిచ్చారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). 

ఈ పోరాట ప్రభావం 

ఈ సంగ్రామం అరేబియా ద్వీపంపై, ముస్లిముల ప్రభావం విస్తరింప జేయడానికి, బలం చేకూర్చడానికి ఎంతో దోహదపడింది. ఇక అరేబియా ద్వీపంలో ఇస్లామ్ శక్తి తప్ప మరే శక్తి జీవించి ఉండజాలదు అనే విషయం ప్రజల మనస్సుల్లో నాటుకుపోయింది. ముస్లిములకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అదను కోసం ఎదురుచూస్తున్న మునాఫిక్ ఆశలు కూడా అడియాసలైపోయాయి. వీరు రోమను సామ్రాజ్యంపై పెట్టుకున్న 

ఆశలు ఈ సంగ్రామంతో అడుగంటిపోయాయి. అందుకని వారి ధైర్యం కాస్తా సన్నగిల్లి, యదార్థం ముందు మోకరిల్లడం తప్ప మరే మార్గం వారికి లభించలేదు. 

ఇలాంటి పరిస్థితి ఏర్పడిన తరువాత ఇక ముస్లిములు, మునాఫిక్స్ ఎడల మృదువైఖరిని అవలంబించే అవసరమే లేకుండాపోయింది. అల్లాహ్ వారి ఎడల కఠిన వైఖరిని అవలంబించమని ఆదేశం ఇస్తూ, చివరకు వారు ఇచ్చే దానధర్మాలను కూడా స్వీకరించడంగాని, వారి జనాజా నమాజు చేయడం గాని, వారి మన్నింపు కోసం ప్రార్థించడంగాని చేయవద్దని ఆదేశించడం జరిగింది. అలాగే వారి సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని, మస్జిద్ పేరు మిద వారేదైతే కుట్రల గూడు కట్టుకున్నారో దాన్ని పడవేయమని ఆదేశిం చాడు. వాటి గురించి అవతరింపజేసిన ఆయలు వారిని పూర్తిగా బట్టబయలు చేసివేశాయి. ఇక వారిని గుర్తించడంలో ఎలాంటి పొరపాటు లేకుండా పోయింది. అంటే, ఈ ఖుర్ఆన్ ఆదేశాలు, మదీనా ప్రజలు తెలుసుకునేటట్లు వారి బండారం బయట పెట్టాయన్నమాట.” *

* ఈ గజ్వా (సంగ్రామం) గురించిన వివరాలు ఈ క్రింది ఆధారాల నుండి గ్రహించ బడ్డాయి. ఇబ్నె హషామ్-2/515 – 517, జాదుల్ ముఆద్-3/2 – 13; సహీ బుఖారి -2/633 – 637, 1/252, 414 వగైరా; సహీహ్ ముస్లిమ్ షరా నూవీ-2/246; ఫత్ హుల్ బారి-8/110 – 126, ముక్తసరుస్సీరత్- షేక్ అబ్దుల్లాహ్, పుట. 291 – 407) 

ఈ సంగ్రామానికి సంబంధించి అవతరించిన ఖుర్ఆన్ ఆదేశాలు 

ఈ గజ్వాకు సంబంధించి తౌబా సూరా (కౌ అధ్యాయం)లో అనేక ఆయలు అవతరించాయి. కొన్ని గజ్వాకు బయలుదేరక పూర్వం అవతరిస్తే, మరికొన్ని బయలుదేరి వెళ్ళిన తరువాత ప్రయాణ సందర్భంగాను, మరికొన్ని మదీనాకు తిరిగి వచ్చిన తరువాతనూ అవతరించాయి. ఈ ఆయత్ లలో చిత్తశుద్ధిగల విశ్వాసుల ఔన్నత్యం ఎలాంటిదో చెప్పడం జరిగింది. అదే కాకుండా, ఈ ఆయత్ లలో, గజ్వాలో పాల్గొన్నవారు, గజ్వాలో పాల్గొనలేక పోయిన విశ్వాసులు, సత్యసంధుల తౌబా (పశ్చాత్తాపం) స్వీకరించబడిన విషయమూ వగైరాలు ఉన్నాయి.

ఆ సంవత్సరపు కొన్ని ప్రముఖ సంఘటనలు 

ఆ సంవత్సరం (అంటే హిజీ శకం 9)లో చారిత్రాత్మకమైన సంఘట నలు అనేకం చోటు చేసుకున్నాయి. 

1. తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత, ఉవైమిర్ అజ్ఞానీ మరియు ఆయన భార్య నడుమ ‘లిఆన్’ (రంకు విషయమై ఏర్పడిన జగడం) జరిగింది. 

2. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తాను వ్యభిచరించినట్లు చెప్పిన స్త్రీకి ‘రజ్మ్’ (రాళ్ళతో కొట్టి చంపే శిక్ష) వేయబడింది. ఆ స్త్రీ పురుడు పోసుకొని, పిల్లవాడు పాలు త్రాగడం మానినప్పుడు గాని ఆమెను రజ్జ్ చేయడం జరగలేదు. 

3. అబిసీనియా చక్రవర్తి ‘అస్మహా నజాషీ’ మరణించగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన ‘గాయిబానా’ (పరోక్ష) నమాజె జనాజా చేశారు. 

4. ఆ సంవత్సరమే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పుత్రిక ఉమ్మె కుల్సూమ్ (రదియల్లాహు అన్హా) చనిపోయారు. ఆమె మరణం మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను శోకసముద్రంలో ముంచివేసింది. తన అల్లుడు హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)తో ఆయన(సల్లల్లాహు అలైహి వసల్లం), “ఒకవేళ నాకు మూడవ కుమార్తె ఉండి ఉంటే ఆమె వివాహం కూడా నీతో చేసేవాన్నే” అన్నారు. 

5. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తబూక్ నుండి తిరిగివచ్చిన తరువాత మునాఫిక్స్ సర్దారు అబ్దుల్లా బిన్ ఉబై చనిపోయాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని మన్నింపు కోసం దుఆ చేశారు. హజ్రత్ ఉమర్(రదియల్లాహు అన్హు) ఆయన్ను వారిస్తున్నప్పటికీ అతని నమాజె జనాజా చేశారు. ఆ తరువాత దివ్యఖుర్ఆన్లో, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను బలపరుస్తూ, మునాఫిక్స్ నమాజె జనాజా చేయకూడదనే ఆదేశం అవతరించింది.