దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వారి మహిమలు (Prophet’s Miracles)
https://youtu.be/2su-OWOpcGo [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహిమలు అనే అంశంపై ఈ ప్రసంగం సాగింది. ప్రవక్తలందరూ తమ ప్రవక్తృత్వానికి నిదర్శనంగా అల్లాహ్ యొక్క అనుమతితో కొన్ని మహిమలను చూపారని, వాటిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మహిమలు ఎన్నెన్నో ఉన్నాయని వక్త వివరించారు. అన్నింటికన్నా గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథమని, అది ప్రళయం వరకు సజీవంగా ఉండే మహిమ అని తెలిపారు. చంద్రుడిని రెండుగా చీల్చడం, హుదైబియా వద్ద తన వేళ్ళ నుండి నీటిని ప్రవహింపజేసి 1500 మంది సహచరుల దాహాన్ని తీర్చడం, కందకం యుద్ధం సమయంలో కొద్దిపాటి ఆహారాన్ని వెయ్యి మందికి పైగా సరిపోయేలా చేయడం, ఒక చెట్టు మరియు తోడేలు ఆయన ప్రవక్తృత్వాన్ని సాక్ష్యమివ్వడం వంటి సంఘటనలను వివరించారు. ప్రవక్తలు చూపిన మహిమలు వారు దైవ ప్రవక్తలని రుజువు చేయడానికే గానీ, వారు దేవుళ్ళమని ప్రకటించుకోవడానికి కాదని, నేటి కాలంలోని దొంగ బాబాలు చేసే కనుగట్టు విద్యలకు, ప్రవక్తల మహిమలకు తేడాను గ్రహించాలని ఉద్భోదించారు.

స్తోత్రాలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహిమలు.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ప్రవక్తలను, అల్లాహ్ వాక్యాలు ప్రజలకు వినిపించడానికి, ధర్మ ప్రచారము చేయించడానికి వివిధ సందర్భాలలో, వివిధ యుగాలలో, వివిధ ప్రదేశాలలో అనేక మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు ప్రజల ముందర దైవ వాక్యాలు వినిపించినప్పుడు, ప్రజలు ఆ ప్రవక్తలతో కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఆ ప్రవక్తలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలకు ఆశ్చర్యం కలిగేటట్టుగా కొన్ని మహిమలను, అద్భుతాలను చూపించాడు.

ఆ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేసి చూపించిన కొన్ని మహిమల గురించి, కొన్ని సూచనల గురించి మనము ఈ ప్రసంగంలో తెలుసుకుందాం.

మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రసాదించిన మహిమలు అనేకమైనవి ఉన్నాయి. ఆ మహిమలన్నింటిలో గొప్ప మహిమ, అన్నిటికంటే పెద్ద మహిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. ఇదేంటండీ? మహిమలంటే ఏదో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చెబుతారంటే, ఇదేదో పుస్తకం గురించి మీరు చెబుతున్నారేంటి అని మీరు ఆశ్చర్యపోతారేమో.

అయితే అభిమాన సోదరులారా, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి, అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథం అని ఎందుకు చెబుతున్నానంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన మహిమలు అవి అప్పటికప్పుడే కనిపించాయి, ఆ తర్వాత అదృశ్యమైపోయాయి. కానీ ఈ ఖుర్ఆన్ గ్రంథం ఎలాంటి మహిమ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలం నుండి ఇప్పటి వరకు కూడా అది అలాగే సజీవంగా ఉంది, ప్రళయం వరకు కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి మహిమలన్నింటిలో గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ గ్రంథము కంటే పూర్వము అనేక గ్రంథాలు ప్రపంచంలో వచ్చాయి. కానీ అవి ఏదీ కూడాను తన అసలు రూపంలో నిలబడలేదు. కానీ ఖుర్ఆన్ గ్రంథం అల్ హందులిల్లాహ్ అవతరించబడిన నాటి నుండి నేటి వరకు కూడా అది తన అసలు రూపంలోనే ఉంది, ప్రళయం వరకు కూడా అది అసలు రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రంథాలన్నింటిలో సురక్షితమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖుర్ఆన్ గ్రంథము మాత్రమే. ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తీసుకుని ఉన్నాడు కాబట్టి అది సురక్షితమైన గ్రంథము. కాబట్టి అది గొప్ప మహిమ అని చెప్పబడుచున్నది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ ఎంత గొప్ప మహిమ అంటే, ఆ ఖుర్ఆన్ గ్రంథాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఈ ఖుర్ఆన్ లాంటి మరొక గ్రంథము మీరు ఏదైనా రచించి తేగలరేమో తెచ్చి చూపించండి అని ఛాలెంజ్ చేశాడు. ఖుర్ఆన్ పూర్తి గ్రంథము. అలాంటి పూర్తి గ్రంథము మీరు రచించలేకపోతున్నారా? పోనీ ఖుర్ఆన్ లో ఉన్న అధ్యాయాలలో నుంచి ఒక పది అధ్యాయాలు రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్లీ ఛాలెంజ్ చేసి ఉన్నాడు. ఒక పది సూరాలు మీరు రాసి చూపించండి అన్నాడు. పది సూరాలు వీలుపడదా? ఒక్క సూరా అయినా సరే మీరు రాసి చూపించగలరా ఖుర్ఆన్ లాంటిది అని అడిగాడు. ఒక్క సూరా కూడా మీరు రాయలేరా? పోనీ ఒక్క ఆయతు, ఒక్క వాక్యము, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాల లాంటి ఒక్క వాక్యము మీరు, జిన్నాతులు అందరూ కలిసి పరస్పరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరి ఇలాంటి ఒక్క వాక్యము రాయగలరేమో రాసి చూపించండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఛాలెంజ్ చేశాడు.

అభిమాన సోదరులారా, ఈ ఛాలెంజ్ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది ప్రజలు ఖుర్ఆన్ లాంటి ఒక్క వాక్యము రాయలేకపోయారు. వారు ఎంత కష్టపడ్డా, రాత్రింబవళ్ళు ప్రయత్నించినా వారికి సాధ్యపడలేకపోయింది అభిమాన సోదరులారా. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లభించిన సూచనలలో, మహిమలలో గొప్ప సూచన, గొప్ప మహిమ ఖుర్ఆన్ గ్రంథము అని ఇందుకే చెప్పబడుచున్నది అభిమాన సోదరులారా.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ చూపించిన మరొక గొప్ప మహిమ, చంద్రుడు రెండు ముక్కలైపోవటం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో నివసిస్తున్న రోజుల్లో, మక్కాలోని పెద్దలు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో, “నీవు దైవప్రవక్తవే అయితే ఒక సూచన చూపించు, ఒక మహిమ చూపించు” అని ప్రశ్నించారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తో ప్రార్థన చేశారు, దుఆ చేశారు, “ఓ అల్లాహ్, మక్కా వాసులు నాతో సూచన అడుగుతున్నారు, మహిమ అడుగుతున్నారు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో దుఆ చేయగా, వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ ద్వారా చూపించాడు, “ఓ దైవప్రవక్తా, చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోవుచున్నాడు.”

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ప్రజలకు ఆ పెద్ద మహిమ చూపించారు, “చూడండి, చంద్రుడు రెండు ముక్కలైపోతున్నాడు” అని. మక్కా ప్రజలు కళ్ళారా చూశారు, చంద్రుడు రెండు ముక్కలైపోయి హిరా పర్వతం కుడి వైపున ఒక భాగము, హిరా పర్వతము ఎడమ వైపున మరొక భాగము, రెండు భాగాలుగా విడిపోయాడు. అభిమాన సోదరులారా, ఇంత పెద్ద అద్భుతము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించాడు. దీని ప్రస్తావన ఖుర్ఆన్ గ్రంథంలో సూరా ఖమర్ ఒకటవ వాక్యం నుండి ఐదవ వాక్యం వరకు మీకు లభిస్తుంది. అలాగే ముస్లిం గ్రంథంలో కూడా దీని ప్రస్తావన మీకు దొరుకుతుంది.

చంద్రుడు రెండు ముక్కలైపోవటం, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలను తీసుకుని ఉమ్రా చేయటానికి మదీనా నుండి మక్కాకు వస్తూ ఉన్నారు. హుదైబియా అనే ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట వచ్చిన సహాబాల వద్ద ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. త్రాగటానికి కూడా నీళ్ళు లేవు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద ఒక చిన్న పాత్ర ఉంటే, ఆ పాత్రలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ఆ పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్ళ నుండి వుజూ చేయటం ప్రారంభించారు. వెంటనే సహాబాలందరూ అక్కడ ప్రోగైపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “ఏంటండీ, మీరందరూ ఇక్కడికి వచ్చేశారు? ఏంటి విషయము?” అంటే అప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు, “ఓ దైవ ప్రవక్తా, మనము ఇంచుమించు 1500 మంది మనం ఉన్నాం ఇక్కడ. ఎవరి వద్ద కూడా నీళ్ళు లేవండి, త్రాగడానికి కూడా నీళ్ళు లేవండి. కేవలం మీ దగ్గర ఉన్న ఆ పాత్రలో నీళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళు కూడా మీరు వుజూ చేసేస్తున్నారు కదా, మనకు వుజూ చేసుకోవడానికి గానీ, త్రాగడానికి గానీ, వంట చేసుకోవడానికి గానీ మా దగ్గర అస్సలు నీళ్ళే లేవండి” అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వినిపించగా, అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ ను ప్రార్థించి, తమ చేతులను ఆ పాత్రలో పెట్టగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వేళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహం ఉబికింది. ఎన్ని నీళ్ళు వచ్చాయంటే అక్కడ ఉన్న 1500 మంది సహాబాలు అందరూ ఆ నీళ్ళతో వుజూ చేసుకున్నారు, వారి వద్ద ఉన్న పాత్రలన్నింటినీ నీళ్ళతో నింపుకున్నారు. అల్లాహు అక్బర్. ఇంత పెద్ద మహిమ అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా చూపించాడు.

అలాగే మరొక మహిమ గురించి మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో పాటు ఒక ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గమధ్యలో ఒక బద్దూ వ్యక్తి కనిపించాడు. ఒక పల్లెటూరు వాసి అని మనం మన భాషలో చెప్పుకుంటాం కదండీ. అలాంటి ఒక పల్లెటూరు వాసి కనిపించగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని దగ్గరకు వెళ్లి, “అయ్యా, అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్తను అని నీవు సాక్ష్యం పలకవయ్యా” అని చెప్పారు. అంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నువ్వు సాక్ష్యం పలకవయ్యా అని ఆ పల్లెటూరు వాసితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రశ్నిస్తే, అతను ఏమన్నాడంటే, “నేను లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే సాక్ష్య వచనం, కల్మా పఠించాలంటే, నేను కాకుండా ఎవరైనా ఈ కలిమాను సాక్ష్యం పలికే వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరి నుండైనా మీరు నా ముందర సాక్ష్యం పలికించి చూపిస్తారా?” అని అతను మళ్లీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు.

అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరలోనే ఒక చెట్టు ఉంటే, ఆ చెట్టు వైపు సైగ చూపి, ఏమన్నారంటే, “చూడయ్యా, ఈ చెట్టు కూడా అల్లాహ్ ఒక్కడే నిజమైన ప్రభువు, నేను అల్లాహ్ పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలుకుతుంది, చూపించనా?” అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ చెట్టుకి పురమాయించగా, ఆ చెట్టు అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
“అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని మూడు సార్లు సాక్ష్యం పలికి, అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ తన స్థానంలో వెళ్లి నిలబడిపోయింది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే అతను కూడా,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)

అని అతను కూడా సాక్ష్యం పలికాడు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక సూచన, మరొక మహిమ.

అభిమాన సోదరులారా, అలాగే మనం చూసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ చూపించిన మరొక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వెళ్ళిన తర్వాత ఒకసారి బాగా కరువు ఏర్పడింది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆకలి దప్పులతో గడుపుతున్న రోజుల్లో మక్కా వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మదీనాకు వెళ్లి హతమార్చాలని, ఆయనను అక్కడి నుంచి కూడా తరిమివేయాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మక్కా వాసుల్ని మదీనా లోపలికి రానియ్యకుండా అడ్డుకోవటానికి కందకం తవ్వాలని నిర్ణయించారు.

ఆ కందకం త్రవ్వేటప్పుడు, కరువు వల్ల సమయానికి అన్నము, నీళ్ళు దొరకని కారణంగా ఆకలి దప్పికలతో ప్రవక్త వారు మరియు సహాబాలు అందరూ కష్టపడుతున్నారు, ఆ గుంత, ఆ కందకము తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా బలహీనపడిపోయారు, సహాబాలు కూడా బలహీనపడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితిని చూసి ఒక సహాబీ ఇంటికి వెళ్లి వాళ్ళ ఆవిడతో అన్నాడు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా రోజుల నుండి అన్నం తినని కారణంగా బలహీనులైపోయారు. కాబట్టి, మన ఇంట్లో ఏమైనా ఉంటే మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆహారం ఏర్పాటు చేద్దాము, ఏమైనా ఉందా చూడు” అంటే, ఆవిడ వెళ్లి వెతకగా ఒక ‘సా’ గింజలు కనిపించాయి. ఒక ‘సా’ అంటే ఇంచుమించు, రెండున్నర కేజీలు గింజలు కనిపించాయి.

అవి తీసుకొని వచ్చి ఆవిడ ఏమందంటే, “చూడండి, ఈ ధాన్యము రెండున్నర కేజీలు మాత్రమే ఉంది. దీనిని నేను పిండిగా మార్చేస్తాను. ఆ తర్వాత మన ఇంట్లో ఒక మేక పిల్ల ఉంది, దాన్ని జబా చేయండి, ఇన్షా అల్లాహ్ దానితో నేను కూర వండుతాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త వారితో ఒక కొద్ది మంది, ఐదు లేదా పది మంది వస్తే గనక ఇన్షా అల్లాహ్ వారందరికీ మనము ఈ పిండి ద్వారా, ఈ మాంసము ద్వారా ఆహారం ఏర్పాటు చేయగలము, భోజనం ఏర్పాటు చేయగలము. మీరు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఒక పది మందిని కూడా రమ్మని చెప్పండి, ఆహ్వానించండి” అని ఆ సహాబీ వాళ్ళ ఆవిడ చెప్పింది.

ఆ సహాబీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లి, పక్కకు పిలిచి, “ఓ దైవ ప్రవక్త, ఈరోజు మా ఇంట్లో మీకు ఆహారం ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఒక పది మందిని తీసుకుని మా ఇంటికి ఆహారానికి, భోజనానికి రండి” అని ఆహ్వానించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అక్కడ కందకం తవ్వుతున్న సహాబాలు అందరినీ, “ఏవండీ, ఫలానా సహాబీ వారి ఇంటిలో మనకు ఈరోజు భోజన ఏర్పాటు ఉంది, కాబట్టి అందరూ నా వెంట రండి వెళ్దాం” అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చేశారు. అల్లాహు అక్బర్. వారి సంఖ్య ఎంత ఉందో తెలుసా? అక్కడ కందకం తవ్వుతున్న వారి సంఖ్య వెయ్యి కంటే ఎక్కువగా ఉంది. అంత మందిని కూడా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేశారు.

అది చూసి ఆ సహాబీ కంగారు పడిపోయారు. అదేంటండీ, నేను ఏదో పది మందిని తీసుకుని రమ్మంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకంగా వెయ్యి కంటే ఎక్కువ మందిని తీసుకుని వచ్చేస్తున్నారు. అంత మందికి నేను భోజన ఏర్పాటు ఎలా చేయగలను? నా దగ్గర ఉన్నది కొంచెమే కదా అని ఆయన కంగారు పడుతుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తితో అన్నారు, ఆ సహాబితో అన్నారు, “ఏమయ్యా, మీ ఇంటిలో పొయ్యి మీద ఉన్న ఆ పాత్రను అలాగే ఉంచమని చెప్పండి మీ ఆవిడతో. అలాగే, మీ ఆవిడ ఆ గింజల్ని పిండి లాగా రుబ్బుతోంది కదా, ఇప్పుడనే రొట్టెలు తయారు చేయవద్దు, అలాగే ఉంచమని చెప్పండి నేను వచ్చేవరకు కూడా” అని చెప్పి పంపించారు.

ఆ సహాబీ వెళ్లి వాళ్ళ ఆవిడతో, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మందిని తీసుకుని వస్తున్నారు, కాకపోతే ఆ పొయ్యి మీద ఉన్న పాత్రను దింపవద్దని చెప్పారు, రొట్టెలు ఇప్పుడనే వంట చేయవద్దని చెప్పారు, ఆయన వచ్చేవరకు ఆగాలంట” అని చెప్పారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చేవరకు వాళ్ళ ఆవిడ ఆగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఇంట్లోకి ప్రవేశించి అల్లాహ్ పేరు తలచుకుని ‘బిస్మిల్లాహ్’ అని ఆ కూర వండుతున్న పాత్రలో వేలు పెట్టి ఇలా తిప్పారు. ఆ తర్వాత ఎక్కడైతే ఆ పిండి ఉందో అక్కడ కూడా వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు తలచుకుని ఆ పిండిలో చెయ్యి పెట్టారు. ఆ తర్వాత ఆ సహాబీ వాళ్ళ భార్యతో ఏమన్నారంటే, “రొట్టెలు తయారు చేయడానికి నీకు ఒక్కరితోనే సరిపోదు కాబట్టి మరొక మహిళను కూడా పిలిపించుకో” అన్నారు. ఆవిడ పక్కింటి ఒక ఆవిడని కూడా పిలిపించుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న పిండిని ఆ ఇద్దరు మహిళలు తీసుకుని రొట్టెలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సహాబీ ఆ పాత్రలో ఉన్న ఆ కూర కొంచెం కొంచెము తీసి ఆ అక్కడ ఉన్న సహాబాలు అందరికీ వడ్డిస్తున్నారు. ఆ సహాబీ చెబుతున్నారు, అక్కడ ఉన్న వెయ్యి మంది కూడా ఆ రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని ఆ మాంసము కూర ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుని పూర్తి వెయ్యి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా తిన్నారు, కడుపునిండా భుజించారు. అయినాగానీ పిండి అలాగే మిగిలిపోయింది, కూర కూడా ఆ పాత్ర నిండా అలాగే మిగిలి ఉంది. అల్లాహు అక్బర్.

అంటే పది మంది తినే ఆహారాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎంతలో ఎంతటి శుభం కల్పించాడంటే, ఎంతటి బర్కత్ ఇచ్చాడంటే వెయ్యి కంటే ఎక్కువ మంది అల్లాహ్ దయవల్ల అక్కడ భోజనం చేశారు. ఇది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన ఒక గొప్ప మహిమ.

అలాగే ఒకసారి మదీనా ఇరుపక్కల కొంతమంది యూదులు ఉండేవారు ఆ రోజుల్లో. ఒక యూదుడు గొర్రెలు మేపటానికి గొర్రెలను తోలుకొని వెళితే ఒక తోడేలు వచ్చి ఒక గొర్రెను పట్టుకుని లాక్కుని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే గొర్రెను కాపాడుకోవడానికి ఆ తోడేలును వెంబడించాడు, వెంబడించి వెంబడించి వెంబడించి చివరికి ఆ గొర్రెను ఆ తోడేలు నుండి కాపాడుకుని తీసుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ తోడేలు కూర్చుని ఆ యూదునితో మాట్లాడుతా ఉంది. “ఏంటయ్యా, అల్లాహ్ నాకు ఇచ్చిన ఆహారాన్ని నా నోటి వద్ద నుండి నువ్వు లాక్కుని వెళ్ళిపోతున్నావే” అంది. అతను ఆశ్చర్యపడిపోయాడు. ఇదేంటండీ? జంతువు ఏకంగా మనిషితోనే మాట్లాడటం ప్రారంభించేసింది అని ఆ జంతువుతో అతను అడుగుతుంటే అప్పుడు ఆ తోడేలు ఆ వ్యక్తితో అంటూ ఉంది, “దీనికంటే ఒక మరొక్క గొప్ప విషయం నేను నీకు చెప్పనా? మదీనాలో ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. అతను జరిగిన విషయాలు కూడా చెబుతుంటాడు, అలాగే జరగబోయే విషయాలు కూడా చెబుతున్నాడు. నువ్వు వెళ్లి అతనితో కలుసు” అంది.

ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ యూదుడు గొర్రెలు ఇంటికి తోలుకొని వచ్చేసి, ఇండ్లల్లో ఆ గొర్రెలు వదిలేసి తిన్నగా మదీనాకు వెళ్లి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ జరిగిన విషయం, సంఘటన మొత్తం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద వినిపిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తోడేలు చెప్పింది నిజమే, నేనే ఆ ప్రవక్తను అని చెప్పగా, వెంటనే ఆ యూదుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే,

أَشْهَدُ أَنْ لَا إِلَٰهَ إِلَّا ٱللَّٰهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ ٱللَّٰهِ
(అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్)
అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధ్యులు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను”

అని సాక్ష్యం పలికి ముస్లిం అయిపోయాడు అభిమాన సోదరులారా. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో జరిగిన మరొక మహిమ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అని ఒక జంతువు కూడా సాక్ష్యమిచ్చింది.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరికొన్ని మహిమల్లో ఒక మహిమ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలి నుండి చాలా మందికి స్వస్థత లభించింది. మనమంతా వినే ఉన్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస ప్రయాణం చేసే సందర్భంలో సౌర్ గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ప్రవేశించారు. ఆ గుహను శుభ్రపరిచిన తర్వాత అక్కడ ఉన్న రంధ్రాలన్నింటినీ బట్టతో కప్పేయగా ఒక రంధ్రం మిగిలిపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు తమ కాలుని ఆ రంధ్రం పైన పెట్టేసి ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని లోపలికి ప్రవేశించమని చెబితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోపలికి ప్రవేశించారు, ఆ తర్వాత అబూబకర్, అబూబకర్ రజియల్లాహు అన్హు వారి తొడ మీద తల పెట్టుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఒక విషపురుగు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలుకి కాటేసింది. విషం శరీరంలో ఎక్కుతూ ఉంటే బాధ భరించలేక అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కన్నీరు కారిస్తే, ఒక చుక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం మీద పడినప్పుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కళ్ళు తెరిచి, “ఎందుకు ఏడుస్తున్నావు అబూబకర్?” అంటే అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారు కాలు చూపించి, “ఏదో విషపురుగు నాకు కాటేసింది” అని చెప్పగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఉమ్మిని తీసి అక్కడ పూయగానే విషం మొత్తం తగ్గిపోయింది. చూశారా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మి నుండి విషము నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత కల్పించాడు అబూబకర్ రజియల్లాహు అన్హు వారి గారికి.

అలాగే ఖైబర్ ప్రదేశంలో కూడా అలీ రజియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిలవగా, అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి చేరితే, అప్పటికే అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళలో సమస్య ఏర్పడి కళ్ళు బాగా ఎర్రబడిపోయాయి. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ ఉమ్మిని తీసి అలీ రజియల్లాహు అన్హు వారి కళ్ళల్లో పూయగా, వెంటనే అలీ రజియల్లాహు అన్హు వారికి ఉన్న సమస్య తొలగిపోయింది. ఆయనకు కూడా స్వస్థత లభించింది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మిలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వస్థత పెట్టాడు. ఇది కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మరొక మహిమ.

ఇలాగే అభిమాన సోదరులారా, చాలా విషయాలు ఉన్నాయి. చివరిగా ఒక విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి వారికి లభించక పూర్వమే మక్కాలో తిరుగుతూ ఉంటే, రాళ్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, చెట్లు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి, గుట్టలు వంగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలాము చెప్పేవి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రపంచానికి చూపించిన మహిమ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో అనేవారు, “నేను బాగా గుర్తు పెట్టుకుని ఉన్నాను, నాకు ప్రవక్త పదవి లభించక పూర్వమే మక్కాలో ఫలానా రాయి నాకు సలాం చెబుతా ఉండింది, నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు ఉంది” అని దైవ ప్రవక్త చెప్పేవారు.

అలాగే పన్నెండు సంవత్సరాల వయసులో పినతండ్రి అబూ తాలిబ్ గారితో సిరియా దేశానికి వర్తకం కోసము ప్రయాణం చేస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక క్రైస్తవ పండితుడు వచ్చి సాక్ష్యమిచ్చాడు ఏమంటే, “ఈ బాలుడు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు వేలు చూపించి, ఏమన్నాడంటే, ఈ బాలుడు నడుచుకుని వస్తూ ఉంటే దారిలో కనిపించిన రాయి, దారిలో కనిపించిన చెట్టు వంగి ఇతనికి సలాము చెబుతా ఉంది. కాబట్టి ఇతను పెద్దవాడైన తర్వాత కారుణ్య మూర్తి, రహ్మతుల్లిల్ ఆలమీన్ అవుతాడు” అని ఆరోజే ఆయన సాక్ష్యం పలికాడు.

కాబట్టి అభిమాన సోదరులారా, ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి, ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది. చివరిగా ఒక విషయం ఏమిటంటే, మనం దృష్టి పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ప్రవక్తలు వారు దైవ సందేశహరులు అని ప్రపంచానికి రుజువు చూపించటానికి కొన్ని మహిమలు చూపించారు. ఆ మహిమలు చూపించి మేము కేవలం దైవ సందేశహరులము అని చెప్పుకున్నారు గానీ, మహిమలు చూపించి మేమే దేవుళ్ళము లేదా దేవునిలోని భాగము లేదా దేవుని అవతారము అని వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రకటించుకోలేదు. అయితే ఈ రోజుల్లో ఎవడైతే కొన్ని కిటుకులు, కొన్ని కనుగట్టులు చూపించి ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, ఇదిగోండి నేను మహిమ చూపిస్తున్నాను, నా వద్ద మహిమలు ఉన్నాయి, నేనే దేవుణ్ణి లేదంటే నేనే దేవుని స్వరూపాన్ని, లేదంటే నేనే దేవుని అవతారాన్ని అని ప్రకటిస్తుంటున్నాడంటే అతను అబద్ధం పలుకుతున్నాడు అని మనము గ్రహించాలి.

ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. మహిమలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తలకు మాత్రమే ఇచ్చాడు గానీ, ఇలాంటి దొంగ బాబాలకు ఆయన ఇవ్వలేదు. ఇలా ఈ రోజుల్లో ఎవరైనా ప్రకటిస్తున్నాడంటే వాడు దొంగ బాబా అని మనం గుర్తించాలి అభిమాన సోదరులారా.

అల్లాహ్ తో నేను దుఆ చేస్తున్నాను, మనము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గొప్పతనాన్ని అర్థం చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాలను ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

ఆఖూలు ఖవ్ లీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన్ ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16753

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) & కుటుంబం
https://teluguislam.net/muhammad/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) [ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) – Tawakkul (Relying on Allah)
https://youtu.be/TIGObCDidls [29 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ పై నమ్మకం, భరోసా (తవక్కుల్) యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. అల్లాహ్ పై నమ్మకం అంటే ఏమిటో నిర్వచించి, ఖురాన్ మరియు హదీసుల వెలుగులో దాని ప్రయోజనాలను ప్రస్తావించారు. అల్లాహ్ ను నమ్ముకున్న వారికి ఆయన ప్రేమ, సహాయం, షైతాను నుండి రక్షణ మరియు స్వర్గంలో గొప్ప బహుమానాలు లభిస్తాయని వివరించారు. ఈ నమ్మకానికి ఉదాహరణలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా (అలైహిస్సలాం), ఇబ్రాహీం (అలైహిస్సలాం) మరియు హాజిరా (అలైహస్సలాం)ల జీవితాల నుండి సంఘటనలను ఉదహరించారు. చివరగా, నిజమైన నమ్మకం అంటే కేవలం కూర్చోవడం కాదని, అందుబాటులో ఉన్న సాధనాలను (కారణాలను) ఉపయోగించుకుంటూ, ఫలితాన్ని అల్లాహ్ కు వదిలి వేయడమేనని స్పష్టం చేశారు.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో ‘అల్లాహ్ పై నమ్మకం‘ అనే అంశం గురించి ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ పై నమ్మకం ఉంచడం భక్తుల బాధ్యత. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఆరాధన కూడా. అల్లాహ్ పై నమ్మకం ఉంచడం ఇది విశ్వాసులు అనుసరించిన మార్గం.

ముందుగా, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం అంటే ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రపంచం మరియు పరలోకం అన్నిచోట్ల, అన్ని సమస్యలను పరిష్కరించేవాడు మరియు అన్ని అవసరాలు తీర్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే అని హృదయంతో గట్టిగా నమ్మాలి. దీనినే అల్లాహ్ పై నమ్మకం అంటారు.

మనం ఖురాన్ లో చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, అల్లాహ్ పై నమ్మకం ఉంచమని ఆదేశించి ఉన్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 25వ అధ్యాయం, 58వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَتَوَكَّلْ عَلَى الْحَيِّ الَّذِي لَا يَمُوتُ وَسَبِّحْ بِحَمْدِهِ ۚ وَكَفَىٰ بِهِ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا
ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాహ్ ను నమ్ముకో. స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. తన దాసుల పాపాల గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు.

అంటే ఈ ఆయత్ లో, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సజీవంగా ఉండే, ఎన్నటికీ మరణించని నీ ప్రభువైన అల్లాహ్ ను నమ్ముకో అని ఆదేశిస్తున్నాడు. అలాగే మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 14వ అధ్యాయం, 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేశాడు:

وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
విశ్వాసులైన వారు కేవలం అల్లాహ్ నే నమ్ముకోవాలి.

అభిమాన సోదరులారా! ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అల్లాహ్, అల్లాహ్ ను నమ్ముకోమని ఆదేశిస్తున్నాడు. అల్లాహ్ ను నమ్ముకుంటే భక్తులకు, విశ్వాసులకు లభించే ప్రయోజనం ఏమిటి? అది కూడా చెప్పండి అని మీరు అడగొచ్చు. ఇన్షా అల్లాహ్ అది కూడా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ ను నమ్ముకుంటారో అలాంటి భక్తుడ్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రేమిస్తాడు. ఆ భక్తున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. ఖురాన్ లో మనం చూచినట్లయితే, ఖురాన్ లోని 3వ అధ్యాయం, 159వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
నిశ్చయంగా అల్లాహ్ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.

అలాగే, అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సహాయం ఆ భక్తునికి లభిస్తుంది. అభిమాన సోదరులారా, ఖురాన్ లోని 65వ అధ్యాయం, 3వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَهُوَ حَسْبُهُ
అల్లాహ్ పై భారం మోపిన వానికి సహాయం చేయుటకు అల్లాహ్ చాలు.

అభిమాన సోదరులారా! అల్లాహ్ ను నమ్ముకున్న వానికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, అతను షైతాను బారి నుండి కాపాడబడతాడు. మనం ఖురాన్ లో చూచినట్లయితే, 16వ అధ్యాయం, 99వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
విశ్వసించి తమ ప్రభువు పైనే భారం మోపిన వారిపై వాడికి (అనగా షైతానుకు) ఎలాంటి అధికారము ఉండదు.

అల్లాహు అక్బర్. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముకుంటే అలాంటి వ్యక్తి మీద షైతాను ప్రభావం ఉండదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశారు. అంతేగాక సోదరులారా, మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లోని 29వ అధ్యాయం, 59వ వాక్యంలో స్వర్గం గురించి ప్రస్తావిస్తూ స్వర్గంలో భవనాలు ఉంటాయి, ఆ భవనాల కింద ఏర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గం గురించి తెలియజేస్తూ చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడు అంటే, ఈ భవనాలు, ఈ స్వర్గ వనాలు, ఈ నదులు, ఈ బహుమానాలు ఎవరికి లభిస్తాయి అంటే:

الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఎవరైతే సహనం పాటిస్తారో మరియు అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని ఆ భవనాలు, ఆ ఏర్లు, ఆ వనాలు ప్రసాదిస్తాడు.

ఇది అల్లాహ్ ను నమ్ముకుంటే కలిగే మరొక ప్రయోజనం. మనం హదీసు గ్రంథంలో చూచినట్లయితే ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. ఎవరైతే అల్లాహ్ ను ఎలాగైతే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్ముతారో అలాంటి వారికి ఒక గొప్ప శుభవార్త తెలియజేయబడి ఉంది. హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూసిన ఒక కల గురించి వివరించారు. మన అందరికీ తెలిసిన విషయమే, ప్రవక్తలకి వచ్చే కలలు కూడా దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, నిజమైన కలలే వాళ్లకు వస్తాయి, దైవ ఆదేశాల ప్రకారంగానే వస్తాయి, అబద్ధపు, బూటకపు కలలు ప్రవక్తలకు రావు.

ఆ కలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. పరలోక దినాన స్వర్గ ప్రవేశము జరుగుచున్నది. పూర్వం గతించిన ప్రవక్తలు స్వర్గంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక ప్రవక్తతో పాటు కేవలం ఒక అనుచరుడు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నాడు. ఒక ప్రవక్తతో పాటు కొంతమంది అనుచరులు మాత్రమే స్వర్గంలో ప్రవేశిస్తున్నారు. ఇంతలోనే, ఒక ప్రవక్త, ఆ ప్రవక్తతో పాటు ఒక పెద్ద సమూహము, అనుచర సమూహము స్వర్గంలో ప్రవేశిస్తుంది. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరు ఈ ప్రవక్త? ఈయన అనుచరులు చాలా పెద్ద సంఖ్యలో స్వర్గంలో ప్రవేశిస్తున్నారే! ఎవరు వీరు అని అడిగి తెలుసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడింది ఏమిటంటే, ఈయన మూసా అలైహిస్సలాం మరియు ఆయన వెనకంబడి వెళ్తున్న వాళ్ళు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరులు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరొక దృశ్యం చూపించబడింది. ఆ దృశ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, చాలా పెద్ద సంఖ్యలో ఒక సమూహం వస్తూ ఉంది స్వర్గ ప్రవేశం చేయడానికి. అది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశ్చర్యపోయి, ఎవరు ఈ అనుచరులు? ఏ ప్రవక్తకు సంబంధించిన అనుచరులు వీరు? అని ప్రశ్నించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయబడిన విషయం ఏమిటంటే, ఓ ప్రియ ప్రవక్త, ఈ పెద్ద సమూహము మీ అనుచర సమాజమే. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఇంత పెద్ద సమూహంలో 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కల మొత్తం అనుచరుల ముందర వినిపించేశారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఇక విన్న శిష్యులలో భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి. ఒకరికి ఒకరు ప్రశ్నించుకుంటున్నారు, ఏమండీ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు కదా 70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారంట, ఎవరై ఉంటారు వారు? కొంతమంది ఏమంటారంటే, బహుశా వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులేమో. కొంతమంది ఏమంటారంటే, బహుశా ఇస్లాం స్వీకరించిన తర్వాత ముస్లింలుగా ఉన్న వారి ఇళ్లల్లో జన్మించిన వారేమో. మరి కొంతమంది వారు ఏమంటారంటే, బహుశా వలస ప్రయాణం చేసిన వారేమో. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వార్త చేరింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ అనుచరుల ముందర వచ్చి నిలబడి ఆ 70,000 మంది లెక్కింపు లేకుండా స్వర్గంలో ప్రవేశించే వారు ఎవరు అనే విషయాన్ని తెలియజేశారు. ఏమన్నారంటే:

هُمُ الَّذِينَ لاَ يَسْتَرْقُونَ، وَلاَ يَكْتَوُونَ، وَلاَ يَتَطَيَّرُونَ، وَعَلَى رَبِّهِمْ يَتَوَكَّلُونَ
ఆ 70,000 మంది ఎవరంటే, మంత్ర తంత్రాలను నమ్మరు, వాతలు పెట్టుకునే విషయాలను కూడా వారు నమ్మరు, చిలుక జోస్యాలను కూడా వారు నమ్మరు, వాళ్ళు కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్ముతారు అని చెప్పారు.

అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా సంపూర్ణంగా నమ్మినట్లయితే లెక్కింపు లేకుండా స్వర్గ ప్రవేశము సంభవించును అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా శుభవార్త తెలియజేశాడు అభిమాన సోదరులారా.

అలాగే, అల్లాహ్ ను ఏ విధంగా అయితే నమ్మాలో ఆ విధంగా నమ్మినట్లయితే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తి కొరకు ఉపాధి మార్గాలను తెరుస్తాడట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ చెప్పారు. పక్షులను చూశారా? తమ గూళ్ల నుండి పక్షులు ఖాళీ కడుపులతో ఉదయాన్నే బయలుదేరుతాయి. వాటి వద్ద ఎలాంటి ఉద్యోగము ఉండదు. ఏవండీ? నెలసరి జీతం దొరికేది లేదంటే డైలీ కూలీ దొరికేది ఏదైనా ఉద్యోగం ఉంటదండి పక్షులకి? అల్లాహ్ మీద నమ్మకంతో అవి ఇళ్ల నుండి బయలుదేరుతాయి. సాయంత్రం అయ్యే సమయానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులు అన్నింటికీ ఉపాధి ప్రసాదిస్తాడు, కడుపు నింపుకొని ఇళ్లకు వస్తాయి. ఈ ఉదాహరణ చెప్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం ఉంచిన వారికి ఎలాగైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పక్షులకు ఉపాధి ప్రసాదిస్తున్నాడో, మానవులకు కూడా ఉపాధి మార్గాలు తెరుస్తాడు. కాకపోతే కావలసిన విషయం ఏమిటి? అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మాలి.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది ధార్మిక పండితులు ఏమన్నారంటే, అల్లాహ్ ను నమ్ముకోవడం ‘అత్తవక్కులు అలల్లాహి జిమావుల్ ఈమాన్’. అల్లాహ్ ను సంపూర్ణంగా నమ్మడం ఇదే విశ్వాసం యొక్క అసలైన విషయం అన్నారు.

మరొక ధార్మిక పండితుడు ఏమన్నారంటే ‘అత్తవక్కులు నిస్ఫుద్దీన్’. మీరు అల్లాహ్ ను గనుక సంపూర్ణంగా నమ్మితే సగం ధర్మాన్ని ఆచరించినట్లే అన్నారు.

అభిమాన సోదరులారా! ఇక రండి. కొంతమంది దైవభక్తులు అల్లాహ్ ను ఏ విధంగా నమ్మారో అది కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. బహుశా వారి ఉదాహరణల ద్వారా మనలో కూడా భక్తి జనిస్తుందేమో చూద్దాం ఇన్షా అల్లాహ్.

ముందుగా మనం చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉదాహరణ మనం తీసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా వాసులు ఇంటిని చుట్టుముట్టి హత్య చేయాలన్న ఉపాయం పన్నారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేసేసాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిని తోడు తీసుకుని సౌర్ గుహలో వెళ్లి తల దాచుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే.

సౌర్ గుహలో తల దాచుకున్న తర్వాత మక్కా వాసులు ఏమన్నారంటే, ఎవరైనా సరే ముహమ్మద్ మరియు అబూబకర్ ఇద్దరినీ బ్రతికి ఉండంగా లేదా చంపి అయినా పట్టుకొని వస్తే ఒక్కొక్కరి బదులుగా 100 ఒంటెలు బహుమానంగా ఇవ్వబడతాయి అని చెప్పేసి ప్రకటించేశారు. ఇక బహుమానం దొరుకుతుందన్న ఆశతో మక్కా నలువైపులా ప్రజలు ముహమ్మద్ మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు వారిని వెతకడానికి బయలుదేరారు. కొంతమంది అయితే సౌర్ గుహ దగ్గరికి కూడా చేరుకున్నారు. లోపల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారిద్దరూ ఉన్నారు. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారు వణికిపోయారు. బయట శత్రువు నిలబడి మాట్లాడుకుంటున్నాడు, వాళ్ల కాళ్లు కనిపిస్తున్నాయి, శబ్దం వినిపిస్తా ఉంది. అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు భయంతో వణికిపోతూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బయట శత్రువు వచ్చేసి నిలబడి ఉన్నాడు, వాళ్లలో ఏ ఒక్కడైనా సరే మోకాళ్ళ వరకు వంగి చూసినా సరే మనము చిక్కిపోతాము, దొరికిపోతాము, పట్టుబడిపోతాము.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎలాంటి భయము, బెదుకు లేదు. ఆయన ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉంటూ ఆయన అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు వారితో అంటున్నారు, యా అబా బకర్! మా జన్నుక బి ఇస్నైని అల్లాహు సాలిసుహుమా. ఓ అబూబకర్! నువ్వేమనుకుంటున్నావు మనమిద్దరమే ఇక్కడ ఉన్నామని అనుకుంటున్నావా? మా ఇద్దరితో పాటు మాలో మూడోవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా ఉన్నాడు. లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా. నువ్వు భయపడవద్దు, కంగారు పడవద్దు, అల్లాహ్ మాతోపాటు ఉన్నాడు, అల్లాహ్ మీద నమ్మకంతో ఉండు అన్నారు. శత్రువు వచ్చాడు, గుహ బయటనే నిలబడ్డాడు, మాట్లాడాడు, ఏ ఒక్కనికి కూడా గుహలో తొంగి చూసే అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేసేసాడు. అక్కడి నుంచి అట్టే బయటికి వెళ్లిపోయారు. అల్లాహ్ కాపాడాడా లేదండి? ఇది అల్లాహ్ యొక్క సహాయం. అల్లాహ్ ను నమ్ముకున్నందువల్ల.

అలాగే, మరొక ఉదాహరణ మనం ఖురాన్ గ్రంథంలో నుంచి తీసుకున్నట్లయితే, మూసా అలైహిస్సలాం వారి గురించి మనం చూచినట్లయితే, ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయీల్ ని ఫిరౌన్ రాజు మరియు అతని వంశీయుల బానిసత్వం నుండి విడిపించుకుని, స్వతంత్రులుగా మార్చుకుని బయలుదేరి పోతూ ఉంటే, ముందర సముద్రం వచ్చేసింది. అటు ఫిరౌన్ కి ఎవరో రెచ్చగొట్టిన కారణంగా అతను మళ్లీ బనీ ఇస్రాయీల్ వారిని పట్టి బంధించి శిక్షించడానికి సైన్యంతో పాటు బయలుదేరి వచ్చేసాడు. బనీ ఇస్రాయీల్ ప్రజలు ముందర వెళ్లలేరు, సముద్రం ఉంది. వెనుకకు వెళితే ఫిరౌన్ చేతిలో చిక్కుతారు. ఇక ఏం చేయాలి? ముందర కూడా మార్గం కనిపించట్లేదు, వెనుక కూడా మార్గం కనిపించట్లేదు. ఏం చేయాలి? అక్కడ ఉన్న బనీ ఇస్రాయీల్ లో కొంతమంది భయపడిపోయి మూసా అలైహిస్సలాం వారి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి, వణికిపోతూ ఏమంటున్నారంటే:

قَالَ أَصْحَابُ مُوسَىٰ إِنَّا لَمُدْرَكُونَ
ఓ మూసా! నీ మీద నమ్మకంతో మేము వచ్చేసినాము బయలుదేరి. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే అతను సైన్యం తీసుకుని వచ్చేస్తున్నాడు, ఇంక పట్టుబడిపోతామేమో

అని మూసా అలైహిస్సలాం వారితో చెప్పగా, మూసా అలైహిస్సలాం వారు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? మూసా అలైహిస్సలాం వారు అన్నారు:

قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
మీరు భయపడవద్దు. నిశ్చయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాతో పాటు ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా నాకు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అన్నారు.

అంతలోనే అల్లాహ్ ఆదేశం ప్రకారంగా మూసా అలైహిస్సలాం వారు తన చేతిలో ఉన్న కర్రతో సముద్రం మీద అల్లాహ్ పేరు స్మరించి కొట్టగా, సముద్రంలో మార్గం చూపించేశాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఆ మార్గం నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ అందరూ సముద్రాన్ని దాటేశారు. అదే మార్గం నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు వారిని వెంబడిస్తూ మధ్య సముద్రంలో వచ్చినప్పుడు మళ్లీ నీళ్లు కలిసిపోయాయి, ఫిరౌన్ మరియు అతని పూర్తి సైన్యం నీటిలో మునిగి మరణించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ వారిని కాపాడాడు. అల్లాహ్ మీద నమ్మకం ఉన్నందువలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి సహాయం చేశాడా లేదా? ఆదుకున్నాడా లేదా చెప్పండి అభిమాన సోదరులారా.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోకి సంబంధించిన మరొక సందర్భంలో, ఒక యుద్ధ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చెట్టు నీడలో కాసేపు సేద తీరుదామని కత్తిని కొమ్మకు వేలాడదీసి పడుకున్నారు. కళ్లు మూసుకున్నారు, నిద్ర వచ్చింది. ఆయన నిద్రలో ఉంటుండగా, శత్రువు దూరము నుంచి గమనించి నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. ఏ కత్తినైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొమ్మకు వేలాడదీసి ఉన్నారో ఆ కత్తిని తీసుకుని బయటికి తీశాడు. అంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్లు తెరుచుకున్నాయి. తెరుస్తానే చూస్తే శత్రువు కత్తి తీసుకుని సిద్ధంగా నిలబడి ఉన్నాడు. ఎంతో గర్వంతో అతను ఏమంటున్నాడు అంటే, మయ్ యమ్నవుక మిన్నీ. ఓ ముహమ్మద్! నా చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఎలాంటి ఆయుధము లేదు. ఇప్పుడు నా బారి నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అంటున్నాడు.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎలాంటి వణుకు లేదు, ఎలాంటి బెరుకు లేదు. ఆయన నిర్భయంగా నిలబడి ఆయనకు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? అల్లాహ్! నాకు అల్లాహ్ రక్షిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి భయము, బెదుకు లేకుండా సమాధానం ఇవ్వగా, ఎవరైతే ఆయుధం పట్టుకుని ఉన్నాడో అతని శరీరంలో వణుకు పుట్టింది, కత్తి అతని చేయిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇక ఆ కత్తిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకుని, చెప్పు నాయనా ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తాడు అన్నారు. అతను అల్లాహ్ ను విశ్వసించు వాడు కాదు. వణికిపోయాడు. కానీ కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని క్షమించేసి, వెళ్ళిపో నేను నిన్ను క్షమించేస్తున్నాను అన్నారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ వ్యక్తి తమ సమూహం వద్దకు వెళ్లి ప్రజల ముందర ఏమని ప్రకటించారంటే, నా జీవితంలో ఈ రోజు నేను ఒక వ్యక్తితో కలిసినాను, అతని కంటే గొప్ప, ఉత్తమమైన వ్యక్తిని నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ చూడలేదు అన్నారు. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ మీద నమ్మకం ఉంచడంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను ఆదుకుని రక్షించాడా లేదా? రక్షించాడు.

అలాగే అభిమాన సోదరులారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షా అల్లాహ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ నా మాటను ముగించే ప్రయత్నం చేస్తాను. ఖురాన్ లో మనం చదువుతూ ఉంటాం, ప్రవక్తల పితామహుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని వారి దేశ ప్రజలు ఎప్పుడైతే అగ్నిలో వేసి కాల్చేయాలని నిర్ణయించారో, పెద్ద అగ్నిని మంటించి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని విసిరేశారు. విసిరేస్తున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారు నన్ను కాపాడండి, నన్ను చంపకండి అని ఎవరినైనా వేడుకున్నారా? ఎవరినీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వేడుకోలేదు. అగ్నిలో పడవేయబడుతున్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఒకటే:

حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
(హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్)
మాకు అల్లాహ్ చాలు. ఆయన చాలా మంచి కార్య సాధకుడు.

అల్లాహు అక్బర్. క్షణాలలో మార్చేయగలడు పరిస్థితుల్ని. అది అల్లాహ్ యొక్క శక్తి అభిమాన సోదరులారా. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి నోటి నుంచి అదే మాట వచ్చింది, హస్బునల్లాహు వ ని‘అమల్ వకీల్. ఆయన గొప్ప కార్య సాధకుడు, ఆయన సహాయం నాకు చాలు అని అల్లాహ్ మీద నమ్మకంతో ఉంచారు. అగ్నిలో పడవేయబడ్డారు. అగ్నికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశించాడు:

يَا نَارُ كُونِي بَرْدًا وَسَلَامًا عَلَىٰ إِبْرَاهِيمَ
(యా నారు కూనీ బర్దన్ వ సలామన్ ‘అలా ఇబ్రాహీమ్)
ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీం కొరకు చల్లనిదిగా, సురక్షితమైనదిగా మారిపో అన్నాడు.

ప్రజలు చూస్తుండగానే అగ్నిలో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు పడ్డారు. అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి వచ్చారు. వచ్చారా లేదా? అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అంత పెద్ద అగ్నిలో నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడా లేదా? ఇది అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకుంటే కలిగే ప్రయోజనం అభిమాన సోదరులారా.

అలాగే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి గురించి కూడా చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహ్ ఆదేశాను ప్రకారం హాజిరా అలైహస్సలాం వారిని, ఆమె ఒడిలో ఉన్న ఇస్మాయీల్ అలైహిస్సలాం వారిని అరణ్య ప్రదేశంలో, నిర్మానుష్యమైన ప్రదేశంలో, గుట్టల మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒంటరి మహిళ, ఒడిలో బిడ్డ. అరణ్యంలో వదిలేసి వెళ్లిపోతూ ఉంటే, ఇక్కడ ఒంటరిగా మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి అని చెప్పి వెనక వెనక వెళ్లి ప్రశ్నించారు. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు, ముందుకు సాగిపోతున్నారు. కానీ ఆమె ఒక గొప్ప భక్తురాలు. భక్తితో ఆలోచించింది, ఎందుకు నా భర్త నాకు ఈ విధంగా చేస్తున్నాడు అని. భక్తితో ఆలోచించి ఆమె ఒక ప్రశ్న అడిగింది, అదేమిటంటే అల్లాహ్ ఆదేశాను ప్రకారంగా మీరు ఏమైనా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నారా? అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం అవును అని తల ఊపించారు.

ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాం తల ఊపారో, అవును అని సమాధానం ఇస్తూ సైగ చేశారో, అప్పుడు ఆ భక్తురాలు చెప్పిన మాట ఏమిటో తెలుసా? “ఇజన్ లా యుజయ్యిఉనా”. అల్లాహ్ ఆదేశంతో మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటే మమ్మల్ని రక్షించడానికి అల్లాహ్ చాలు. అల్లాహ్ మాకు ఎలాంటి నష్టం లేకుండా చూసుకుంటాడు అన్నది. ఎలాంటి భక్తి అండి! ఎలాంటి నమ్మకం అండి ఆ మహిళకి. తర్వాత జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. ఆమె ఒంటరిగా అక్కడ ఉండింది. తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దూతను పంపించి అక్కడ జమ్ జమ్ లాంటి, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన నీటి బావిని పుట్టించాడు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నగరమే స్థాపించబడింది. ఆ తర్వాత అక్కడ ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మించబడింది. హాజిరా అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా? ఇస్మాయీల్ అలైహస్సలాం వారిని అల్లాహ్ ఆదుకున్నాడా లేదా అల్లాహ్ ను నమ్ముకున్న కారణంగా? ఆదుకున్నాడు అభిమాన సోదరులారా.

ఇవన్నీ ఉదాహరణలు. ఈ ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, అల్లాహ్ మీద పూర్తి భక్తితో, పూర్తి నమ్మకంతో ఉంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గాలను చూపిస్తాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, రక్షిస్తాడు అభిమాన సోదరులారా.

అయితే ముఖ్యమైన ఒక గమనిక ఉంది, అదేమిటంటే అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. అల్లాహ్ ను నమ్ముకోవడం అంటే అల్లాహ్ కు నమ్ముకునే సరైన విధానం ఏమిటంటే సాధనాలను ఉపయోగించుకుంటూ ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైపోతే అల్లాహ్ రక్షిస్తాడని చేతులు కట్టుకుని కూర్చోకూడదు. సాధనాలను ఉపయోగించాలి. ట్రీట్మెంట్ చేసుకోవాలి. మందులను తీసుకోవాలి. మందులను ఉపయోగించాలి. మందులో ఎలాంటి శక్తి లేదు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని అప్పుడు అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఒక ఒంటె ఉంది, ఆ ఒంటెను నేను తాడుతో కట్టేసి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా లేదంటే అలాగే వదిలేసి అల్లాహ్ మీద నమ్మకం ఉంచాలా అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తాడుతో కట్టేయి ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అన్నారు. అంటే సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు.

ఉదాహరణలు మనకు ఖురాన్ లో కూడా ఉన్నాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఇంచుమించు 15, 18 సంవత్సరాల వరకు వ్యాధిగ్రస్తులయ్యారు. శరీరం మొత్తం పురుగులు పడిపోయాయి. నగర బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. నెగ్గిన తర్వాత అల్లాహ్ ఆయనకు ఏమని ఆదేశించాడు? వెళ్లి ఫలానా చోట కాలుతో అల్లాహ్ పేరు స్మరించి కొట్టు. అక్కడ నీళ్లు వస్తాయి, ఆ నీటిలో స్నానం చెయ్ అన్నాడు. అల్లాహ్ తలుచుకుంటే ఆయన కాళ్లు కొట్టకపోయినా అక్కడ నీళ్లు పుట్టించగలడు. ఆ శక్తి అల్లాహ్ కు ఉంది కదా? కానీ అయ్యూబ్ అలైహిస్సలాం వారికి అల్లాహ్ ఆదేశించాడు, వెళ్లి అక్కడ కాళ్లతో కొట్టు నీళ్లు వస్తాయి. అంటే కొట్టు అని ఆదేశిస్తున్నాడు ఎందుకు? సాధనాలను ఉపయోగించు, ఆ తర్వాత అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆశించు.అలాగే జరిగింది, ఆయన వెళ్లి కొట్టారు, నీటి ఊట వచ్చింది, స్నానం చేశారు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు.

మరియం అలైహస్సలాం వారి గురించి కూడా ఉంది ఖురాన్ లో. మరియం అలైహస్సలాం ఎప్పుడైతే గర్భవతిగా ఉండిందో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆదేశం ప్రకారంగా ఆమె నగరానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నది. అప్పుడు దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమెకు ఒక విషయాన్ని తెలియజేశాడు, అదేమిటంటే నీవు కంగారు పడకు, బాధపడకు, ఎవరైనా ఇక్కడికి వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను, మాట్లాడను అని చెప్పి సైగ చేసేయి. ఆకలి వేస్తే ఖర్జూరపు చెట్టు ఉంది కదా దానికి చేతితో తాకు. ఖర్జూరపు కాయలు రాలుతాయి. ఆ ఖర్జూరపు పండ్లు తిను. నీరు తాగు, అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపు అని తెలియజేశాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, అల్లాహ్ తలుచుకుంటే ఆమె ఖర్జూరపు చెట్టుని తాకకుండా ఉన్నా గానీ ఖర్జూరపు, ఖర్జూరపు పండ్లు కిందకి రాల్చగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ మరియం అలైహస్సలాం వారికి అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, నువ్వు చేయితో ఖర్జూరపు చెట్టుని ముట్టుకో, తాకు. ఆ తర్వాత ఖర్జూరపు కాయలు, ఖర్జూరపు పండ్లు రాలుతాయి తీసుకుని తిను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధనాలను ఉపయోగించు ఆ తర్వాత అల్లాహ్ మీద నమ్మకం ఉంచు అని ఇవన్నీ విషయాలు, ఇవన్నీ ఉదాహరణలు మనకు తెలియజేస్తున్నాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకంతో, సాధనాలను ఉపయోగించుకుంటూ ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయాన్ని ఆశిద్దాం.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ అల్లాహ్ మీద సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచే భాగ్యాన్ని ప్రసాదించు గాక. సాధనాలను ఉపయోగించుకుంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే నమ్మి అల్లాహ్ తోనే సహాయం అర్ధించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

అఖూలు ఖౌలీ హాజా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16739

ఇతర లింకులు:

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?[ఆడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఖురాన్ లో ఔలియాల ప్రస్తావన వచ్చి ఉంది కదా? మరి ఎందుకు వారితో దుఆ చేయకూడదు, శరణు వేడకూడదు?
https://youtu.be/OFeb-uCup0Q [9 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చివరి ప్రవక్త అని, ఆయన తర్వాత ప్రవక్తలు రారని స్పష్టం చేయబడింది. అయితే, అల్లాహ్ యొక్క ‘ఔలియాలు’ (స్నేహితులు) వస్తూనే ఉంటారని ఖురాన్ లో ఉందని, కానీ వారిని ఆరాధించడం, వేడుకోవడం లేదా వారి సమాధుల వద్ద మొక్కుబళ్ళు చెల్లించడం ఘోరమైన షిర్క్ అని వివరించబడింది. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఔలియాలుగా చేసుకోవద్దని, కేవలం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ ను మాత్రమే అనుసరించాలని సూరతుల్ ఆరాఫ్, సూరతుర్ రఅద్ వంటి ఆయత్ ల ఆధారంగా నొక్కి చెప్పబడింది.

సమాధానం: వ అలైకుం అస్సలాం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ ప్రవక్తలకు అంతిమ, చిట్టచివరి ప్రవక్త అని చాలా స్పష్టంగా ఉంది. మరియు ఇక మీరు అడిగిన ప్రశ్న, అల్లాహ్ యొక్క ఔలియాల గురించి ఖురాన్ లో లేదా?

అల్లాహ్ యొక్క ఔలియాల ప్రస్తావన ఖురాన్ లో అనేక సందర్భాలలో ఉంది. కానీ, అల్లాహ్ ను వదిలి ఆ ఔలియాలను మనం వేడుకోవడం లేదా అల్లాహ్ తో పాటు ఆ ఔలియాలతో దువాలు చేయడం, దీని ప్రస్తావన లేదు. ఏముంది ఖురాన్ లో? ఉదాహరణకు మీరు సూరతు యూనుస్ చూశారంటే,

أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
(అలా ఇన్న అవ్లియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్)
వినండి! నిశ్చయంగా అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయమూ ఉండదు, వారు దుఃఖించరు కూడా.

الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ
(అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్)
వారు ఎవరంటే, విశ్వసించి, దైవభీతితో ఉండేవారు.

ఇప్పుడు నేను తిలావత్ చేసిన రెండు ఆయతులు సూరత్ యూనుస్ 62, 63.

వినండి. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఔలియా, (అలా వినండి, ఇన్న నిశ్చయంగా, ఔలియా అల్లాహ్, అల్లాహ్ యొక్క ఔలియా, వలీలు), లా ఖవ్ఫున్ అలైహిమ్, వారికి ఎలాంటి భయము లేదు. వలా హుమ్ యహ్జనూన్, వారు ఎలాంటి చింతించనవసరము లేదు.

అల్లజీన ఆమనూ, ఎవరు ఆ ఔలియాలు? విశ్వసించిన వారు.
వ కానూ యత్తఖూన్, వారు పాపాలకు దూరంగా ఉండేవారు, భయభీతితో, అల్లాహ్ యొక్క భయభీతితో తమ జీవితం గడిపేవారు.

ఇక వారికి ఎలాంటి రందీ లేదు, ఎలాంటి చింత లేదు, బాధ లేదు, వారు భయపడవలసిన అవసరం లేదు అని అల్లాహ్ చెప్పాడు కదా, మరి ఏముంది వారికి? అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నెంబర్ 64 లో,

لَهُمُ الْبُشْرَىٰ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ
(లహుముల్ బుష్రా ఫిల్ హయాతిద్ దున్యా వ ఫిల్ ఆఖిరహ్)
ఇహలోక జీవితంలో మరియు పరలోక జీవితంలో వారి కొరకు శుభవార్తలు ఉన్నాయి.

అయితే గమనించారా? ఔలియా అల్లాహ్ ల యొక్క ప్రస్తావన ఖురాన్ లో ఉంది. వారి యొక్క ఘనత అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలిపాడు.

కానీ ఈ రోజుల్లో మన ముస్లిం సోదర సోదరీమణులలో ఎంతో మంది అల్లాహ్ తో పాటు ఇతర ఔలియాలను ఏదైతే వేడుకుంటున్నారో, దువా చేస్తున్నారో, వారి యొక్క సమాధుల వద్దకు వెళ్లి అల్లాహ్ కు చేయవలసిన కొన్ని ఆరాధనలు, ఉదాహరణకు మొక్కుబడులు చెల్లించడం గానీ, మరికొన్ని దర్బారుల, దర్గాల వద్ద జంతువులను బలి ఇవ్వడం గానీ, అల్లాహ్ హిదాయత్ ప్రసాదించు గాక కొన్ని దర్బారులు ఉదాహరణకు పాకిస్తాన్ లో ఖలందర్ షా దర్గా అని ఉంది, అక్కడ తవాఫ్ కూడా చేస్తారు. నవూజుబిల్లాహ్ సుమ్మ నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, మనం ఎలాగైతే తవాఫ్ హజ్రే అస్వద్ నుండి మొదలుపెట్టి అక్కడే పూర్తి చేస్తామో, అలా అక్కడ కూడా వారు ఒక స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడి నుండి ప్రారంభం చేస్తారు. ఇలాంటి ఘోరమైన షిర్క్ పనులు ఏవైతే జరుగుతున్నాయో, అల్లాహ్ దివ్య గ్రంథం ఖురాన్ లో వీటిని ఖండించాడు.

ఉదాహరణకు మీరు సూరతుల్ ఆరాఫ్, ఆయత్ నెంబర్ మూడు చూశారంటే,

اتَّبِعُوا مَا أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُمْ وَلَا تَتَّبِعُوا مِن دُونِهِ أَوْلِيَاءَ ۗ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
(ఇత్తబిఊ మా ఉన్జిల ఇలైకుమ్ మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఊ మిన్ దూనిహీ అవ్లియా, ఖలీలమ్ మా తజక్కరూన్)
మీ ప్రభువు వైపు నుండి మీ వైపునకు అవతరింప చేయబడిన దానిని మీరు అనుసరించండి. దానిని వదిలి మీరు ఔలియాల వెంట పడకండి. మీరు చాలా తక్కువ గుణపాఠం నేర్చుకుంటున్నారు.

హితోపదేశం ఈ ఖురాన్, హదీసుల ద్వారా ఏదైతే తీసుకోవాలో, దాని నుండి మీరు చాలా తక్కువ హితోపదేశం పొందుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అల్లాహు అక్బర్. గమనించారా?

అయితే స్వయంగా ఆ ఔలియాలు, ఎవరైతే అల్లాహ్ యొక్క నిజమైన ఔలియాలు ఉన్నారో, వారి యొక్క ఘనత చాలా గొప్పగా ఉంది. అందులో అనుమానం లేదు. కానీ ఆ ఔలియాలలో ఏ ఒక్క వలీ, ఇక్కడ గుర్తుంచుకోండి నిజమైన వలీ అయితే, ఏ ఒక్క వలీ కూడా మీరు నా సమాధి వద్దకు రండి, నా యొక్క దర్గాల వద్దకు రండి, నన్ను ఆరాధించండి, నాతో దువా చేయండి, నా వద్ద మొక్కుబడులు మీరు చెల్లించండి, ఇలాంటి ఏ ఒక్క మాట చెప్పలేదు.

ఒక్కసారి గనక మీరు సూరతుర్ రఅద్, సూర నెంబర్ 13, ఆయత్ నెంబర్ 16 లో గమనిస్తే,

قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ ۚ قُلْ أَفَاتَّخَذْتُم مِّن دُونِهِ أَوْلِيَاءَ لَا يَمْلِكُونَ لِأَنفُسِهِمْ نَفْعًا وَلَا ضَرًّا
(ఖుల్ మర్ రబ్బుస్ సమావాతి వల్ అర్ద్, ఖులిల్లాహ్. ఖుల్ అఫత్తఖజ్తుమ్ మిన్ దూనిహీ అవ్లియాల లా యమ్లికూన లి అన్ఫుసిహిమ్ నఫ్ అన్ వలా దర్ర)
వారితో ప్రశ్నించండి, భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు? వారితో చెప్పండి, అల్లాహ్ మాత్రమే. ఇప్పుడు వారికి ఈ ఆదేశం ఇవ్వండి, ఈ హెచ్చరిక చేయండి, వారికి తెలపండి, చెప్పండి వారితో, అల్లాహ్ ను కాదని మీరు వేరే వారిని ఔలియాలుగా చేసుకుంటున్నారా మీకు ఇష్టం వచ్చినట్లు? వారు స్వయం తమకు ఏ లాభం చేకూర్చలేరు, వారిపై వచ్చి పడిన ఏ నష్టాన్ని వారు దూరం చేసుకోలేరు.

ఔలియా అల్లాహ్, వారిని మనం విశ్వసించాలి. ఎవరైతే అల్లాహ్ యొక్క సత్యమైన వలీలు ఉన్నారో, వారు అల్లాహ్ యొక్క సత్య వలీలు అని నమ్మాలి. కానీ, ఈ రోజుల్లో వలీల పేరు మీద ఏ దందాలు జరుగుతున్నాయో వాటిని స్వయంగా ఖురాన్ ఖండించినది అన్న విషయం కూడా తెలుసుకోవాలి.

అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించు గాక. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్: https://teluguislam.net/?p=16057

అనారోగ్యంగా ఉన్నవారి స్వస్థత కోసం ఉపవాసం ఉండి, ఖురాన్ చదివి దుఆ చేయవచ్చా? [ఆడియో]

బిస్మిల్లాహ్

[4 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం [వీడియో & టెక్స్ట్]

సూరయే ఫాతిహా సంక్షిప్త సారాంశం
https://www.youtube.com/watch?v=UsTrHy6arh8 [12 నిముషాలు ]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్‌లోని మొదటి అధ్యాయం, సూరతుల్ ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు అర్థాన్ని వివరిస్తారు. ఏ పనినైనా అల్లాహ్ పేరుతో (బిస్మిల్లాహ్) ప్రారంభించాలని, ఇది ఖురాన్ అపార కరుణామయుడైన అల్లాహ్ నుండి వచ్చిన గ్రంథమని గుర్తుచేస్తుందని ఆయన నొక్కిచెప్పారు. ఖురాన్ యొక్క నిర్మాణం, 114 సూరాలు మరియు 30 పారాలుగా విభజించబడిందని వివరించారు. సూరతుల్ ఫాతిహా, ఖురాన్ సారాంశంగా పరిగణించబడుతుందని, మూడు ప్రధాన భాగాలుగా విభజించబడిందని తెలిపారు. మొదటి భాగం అల్లాహ్ యొక్క లక్షణాలైన రబ్ (ప్రభువు), అర్-రహ్మాన్ (కరుణామయుడు), అర్-రహీమ్ (కృపాశీలుడు), మరియు మాలిక్ (అధిపతి)ని స్మరిస్తూ ఆయనను స్తుతించడం. రెండవ భాగం, అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం మరియు ఆయన సహాయాన్నే అభ్యర్థించడం గురించి చెబుతుంది. మూడవ భాగం, రుజుమార్గం (సన్మార్గం) కోసం చేసే ప్రార్థన, అంటే ప్రవక్తలు, సత్యవంతులు మరియు పుణ్యాత్ముల మార్గం, అల్లాహ్ ఆగ్రహానికి గురైనవారి (యూదులు) మరియు మార్గభ్రష్టులైనవారి (క్రైస్తవులు) మార్గం కాదని స్పష్టం చేస్తుంది. వక్త, జ్ఞానం ఉండి ఆచరించకపోవడం మరియు జ్ఞానం లేకుండా ఆరాధించడం రెండూ ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో మనం ఆరంభం చేస్తున్నాము. ముందు ఇక్కడ మనం సూరతుల్ ఫాతిహా. ఖురాన్ ఆరంభం అనేది బిస్మిల్లాహ్ నుండి ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే బిస్మిల్లాహ్ అన్న పదం ఖురాన్ యొక్క ఆరంభంలో ఏదైతే వచ్చిందో దీని గురించి ధర్మ పండితులు చెప్పిన విషయాలు అందులో సంక్షిప్తంగా రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి, మనం ఏ కార్యం మొదలు పెట్టినా గాని అల్లాహ్ యొక్క శుభ నామంతో మొదలు పెట్టాలి.

రెండవది, “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అని ఖురాన్ ఆరంభం ఏదైతే జరుగుతుందో, ఇందులో ఒక గొప్ప సూచన ఏముందంటే ఈ దివ్య గ్రంథం అల్లాహ్ వైపు నుండి ఉంది. ఎలాంటి అల్లాహ్? సర్వసామాన్యంగా పూర్తి సృష్టికి, ప్రత్యేకంగా మానవుల పట్ల ఎంతో కరుణతో మెలిగేవాడు. వారిపై దయ దాక్షిణ్యాలు చూపేవాడు. వారి యొక్క మంచి కొరకే ఈ ధర్మ గ్రంథం అవతరింపజేశారు.

సోదర మహాశయులారా, దివ్యగ్రంథం ఖురాన్ లో 114 సూరాలు ఉన్నాయి. మొదటి సూరా ఇది సూరె ఫాతిహా మరియు చివరి సూరా సూరతున్నాస్.

ఇందులో ప్రజలు కంఠస్థం చేసుకోవడానికి, ప్రజలు గుర్తుంచుకోవడానికి 30 కాండాలలో, సామాన్యంగా పారా లేదా జుజ్ అని అనబడడం జరుగుతుంది. పారా అని ఉర్దూలో మరియు జుజ్ అని అరబీలో చెప్పడం జరుగుతుంది. 30 పారాల్లో దీనిని విభజించడం జరిగింది. ఇది పారాయణం, తిలావత్ కొరకు సులభతరంగా ఉండడానికి. మళ్ళీ పారాలో కూడా కొన్ని భాగాలు చేయబడ్డాయి. అయితే ఈనాటి నుండి మనం ప్రతి రోజు ఒక పారా సారాంశాన్ని వినబోతున్నాము.

సూరతుల్ ఫాతిహా యొక్క ఘనత

మొట్టమొదటి సూరా సూరె ఫాతిహా. దీని గురించి స్వయంగా ఖురాన్లో మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఖురాన్ యొక్క మొట్టమొదటి సూరా ఆరంభ పరంగా, ఖురాన్ ఇప్పుడు ఉన్నటువంటి క్రమం పరంగా సూరె ఫాతిహా. మరియు అంతేకాదు, ఖురాన్ లోని 114 సూరాలలో أعظم سورة అతి గొప్ప సూరా, అతి ఘనత గల సూరా సూరతుల్ ఫాతిహా. అంతేకాదు ఈ సూరె ఫాతిహా, దీనిని ఖురాన్ యొక్క సారాంశం అని కూడా అనడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉర్దూలో మా ఛానల్ లో ఒక వీడియో కూడా ఉంది. దాన్ని కూడా ఉర్దూ తెలిసిన వారు చూడవచ్చు. అందులో చాల వివరాలు ఉన్నాయి.

అయితే సూరతుల్ ఫాతిహాలో మనం గమనిస్తే, చదువుతే శ్రద్ధగా, ఇందులో మనకు మూడు భాగాలు కనబడతాయి.

ఒకటి, (అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మా నిర్రహీం, మాలికి యౌమిద్దీన్) ఇక్కడి వరకు.
రెండవ భాగం, (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మూడో భాగం, “ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీం” నుండి చివరి వరకు.

సూరతుల్ ఫాతిహా – మొదటి భాగం: అల్లాహ్ స్తుతి

ఈ మొదటి భాగంలో మనకు తెలుపబడిన గొప్ప విషయం ఏంటంటే, ఓ మానవుడా, నీవు నీపై ఎవరైనా ఉపకారం చేశారు గనుక నీవు అతన్ని స్తుతించదలుచుకుంటే, రబ్బిల్ ఆలమీన్ సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ ఆయన యొక్క కృపలు, కరుణలు, దయ, అనుగ్రహాల కంటే ఎక్కువగా ఇంకా వేరే ఎవరి అనుగ్రహాలు లేవు. అందుకొరకు నీవు అల్లాహ్ ను స్తుతించు.

ఓ మానవుడా, నీవు ఎవరి పట్లనైనా ఒక ఆశతో చూస్తున్నావు, అతని వైపు నుండి నీకు ఏదైనా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నావు, అర్రహ్మా నిర్రహీం అతి గొప్ప కరుణామయుడు, కృపాశీలుడు అల్లాహ్ మాత్రమే గనుక నీవు అతన్ని స్తుతించు.

ఒకవేళ నీవు ఎవరితోనైనా భయపడి స్తుతించదలుస్తే, మాలికి యౌమిద్దీన్ ప్రళయ దినానికి ఏకైక యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. అతని యొక్క భయం ఎంతగా మనలో ఉండాలంటే, అంతకంటే ఎక్కువ భయం ఇంకా ఎవరిది కూడా ఉండజాలదు. అలాంటి అల్లాహ్ కు నీవు నీ స్తుతులు, పొగడ్తలన్నీ కూడా చెల్లిస్తూ ఉండు.

మరో రకంగా మనం ఆలోచిస్తే మనమందరం దాసులం, అల్లాహ్ మన యజమాని. మనం అల్లాహ్ యొక్క ఆరాధన ఎల్లవేళల్లో మరియు ఆరాధన అన్న పదం విన్నప్పుడు కేవలం నమాజ్ ఒక్క విషయాన్ని మనసులో తీసుకురాకండి. ఆరాధన అని అన్నప్పుడు ప్రత్యేకంగా అల్లాహ్ ను ఆరాధించే విషయంలో అది మనసు సంబంధమైన ఆరాధన అయినా, నాలుక సంబంధమైన ఆరాధన అయినా, అవయవాలకు సంబంధమైన ఆరాధన అయినా ఇవి వస్తాయి. అలాగే హుఖూఖుల్లాహ్ (అల్లాహ్ హక్కులు ) కు సంబంధించినవి వస్తాయి, హుఖూఖుల్ ఇబాద్ కు సంబంధించినవి కూడా వస్తాయి.

ఈ ఆరాధనలన్నీ కూడా మనం ఆరాధించేటప్పుడు, చేసేటప్పుడు మనలో నాలుగు విషయాలు ఉండాలి. మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. అల్లాహ్ ను మనం సంపూర్ణ ప్రేమతో, సంపూర్ణ ఆశతో, సంపూర్ణ భయంతో ఆరాధించాలి మరియు వినయ వినమ్రతతో. అల్లాహ్ యొక్క ఆరాధన సంపూర్ణ భయం మరియు ఆశ, సంపూర్ణ ప్రేమ మరియు ఆశ భయం.

ఈ మూడిటికి ధర్మపండితులు, ధర్మపండితులు ఒక పక్షి మాదిరిగా కూడా ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. ఎలాగైతే ఒక పక్షి ఎలాగైతే ఒక పక్షి రెండు రెక్కలు లేకుండా, తల లేకుండా ఎగరదు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా గాని అది బ్రతకదు, ఎగరదు. అలాగే ఈ మూడింటిలో ఏ ఒక్క విషయం తగ్గిపోయినా గాని మన యొక్క ఆరాధన, మనం అల్లాహ్ ను ఆరాధించే విషయంలో చాల లోపం కలుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – రెండవ భాగం: అల్లాహ్ తో నిబంధన

ఆ తర్వాత చెప్పడం జరిగింది.

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ
(ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్)
మేము నిన్నే ఆరాధిస్తున్నాము, నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. (1:5)

ఓ అల్లాహ్ మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ యొక్క సహాయమే కోరుతున్నాము. మనకు మరియు అల్లాహ్ కు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని, అంతేకాదు అల్లాహ్ యొక్క ఆరాధన మనం అల్లాహ్ యొక్క సహాయం లేనిది చేయలేము అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరుగుతుంది.

సూరతుల్ ఫాతిహా – మూడవ భాగం: సన్మార్గం కోసం ప్రార్థన

మూడవ విషయం. ఇహలోకంలో మన కొరకు అత్యంత గొప్ప అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అల్లాహ్ కు ఇష్టమైన మార్గం మన కొరకు ప్రాప్తించబడడం. అదే విషయం ఇందులో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒక్క రోజులో 17 సార్ల కంటే ఎక్కువగా అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాము. అల్లాహ్ మాకు సన్మార్గం చూపించు అని.

అయితే సోదర మహాశయులారా, అల్లాహ్ మనకు సన్మార్గం ఏదైతే చూపుతాడో దాని యొక్క ఇక్కడ చిన్న వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేమిటి? అల్లాహ్ ను ఆరాధించి అల్లాహ్ యొక్క మార్గంపై నడిచి ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను పొందారో, ప్రవక్తలు, సత్యవంతులు, అమరవీరులు మరియు పుణ్యాత్ములు అలాంటి వారి మార్గం మాకు ప్రసాదించు అల్లాహ్.

మరి ఎవరైతే, మరి ఎవరైతే నీ ఆగ్రహానికి గురి అయి సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడ్డారో అలాంటి వారి మార్గం వద్దు. అంటే ఎవరు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, హదీసుల ఆధారంగా

الْمَغْضُوبِ
(అల్ మగ్జూబ్)
ఆగ్రహానికి గురైన వారు

ఎవరిపై అయితే ఆగ్రహం కురిసిందో వారెవరు? వారు వాస్తవానికి యూదులు. మరియు

الضَّالِّينَ
(వజ్జాలీన్)
మార్గభ్రష్టులు

క్రైస్తవులు అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ కారణం గమనించండి, సంతోషపడే విషయం కాదు. ఒకరిని దూషించే విషయం కాదు అంతకు.

ఎవరికైతే ధర్మ జ్ఞానం లభించినదో మరియు వారు ఆ ధర్మ జ్ఞానాన్ని ఆచరించడం లేదో వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురుస్తుంది. మరియు ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి తపన కలిగి ఉంటారు కానీ ధర్మ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరో, అందువల్ల వారు చేసే వారి కృషి అంతా కూడా సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో పడిపోతుంది, నష్టంలో వారు పడిపోతారు. అందుకొరకు వారిని జ్జాలీన్ అని చెప్పడం జరిగింది. ఈ రోజుల్లో కూడా మనం ఒకవేళ ధర్మ అవగాహన కలిగి సరియైన రీతిలో ఆచరించకుంటే యూదులతో సమానమైపోతాము అన్నటువంటి హెచ్చరిక ఉంది.

అల్లాహ్ ను ఆరాధించాలి అన్నటువంటి కాంక్ష ఉంది, తపన ఉంది. కానీ విద్య నేర్చుకోవడం లేదు. ధర్మం నేర్చుకోకుండా దూరమైపోతున్నాము. ధర్మవేత్తలకు దూరం ఉంటున్నాము. నాకు తెలిసిపోయింది అని, నేను ఖురాన్ చదువుకుంటాను, వేరే వారితో నేర్చుకునేది ఏమున్నది? నేను అరబీ గ్రామర్ నేర్చుకున్నాను, ఖురాన్ నాకు డైరెక్ట్ గా అర్థమవుతుంది అన్నటువంటి భ్రమలో పడి ధర్మవేత్తలకు, సన్మార్గంపై ఉన్నటువంటి పుణ్య పురుషులకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైన అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి దూరంగా ఉండి మనకు మనం ధర్మానికి దూరం ఏదైతే చేసుకుంటున్నామో, వాస్తవానికి ఇది కూడా మనల్ని మార్గభ్రష్టత్వంలో పడవేస్తుంది.

చివరి ఒక మాట దీని గురించి చెప్పేది ఏమిటంటే, సూరతుల్ ఫాతిహా ఇందులో మనం అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ముందు అల్లాహ్ ను స్తుతించాలి, ఆ తర్వాత మన అవసరాన్ని పెట్టాలి. అయితే ఈ మధ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కూడా దరూద్ చదువుతూ ఉండాలి.

సూరతుల్ ఫాతిహా వ్యాఖ్యానం – అహ్సనుల్ బయాన్ నుండి
https://teluguislam.net/?p=8142

ఖుర్’ఆన్ – మెయిన్ పేజీ
https://teluguislam.net/quran/

నమాజు – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు | ధర్మపరమైన నిషేధాలు – 35 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు
https://youtu.be/RCMU6hao5aE [4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రసంగం యొక్క ప్రధాన అంశం అల్లాహ్ పట్ల సద్భావన (హుస్న్ అజ్-జన్) కలిగి ఉండటం మరియు దురభిప్రాయం (సూ అజ్-జన్) కలిగి ఉండకుండా ఉండటం. అల్లాహ్ తన దాసుడు తన గురించి ఎలా భావిస్తాడో అలానే అతనితో వ్యవహరిస్తాడని వక్త నొక్కిచెప్పారు. అల్లాహ్ పట్ల చెడుగా భావించడం విశ్వాసుల లక్షణం కాదని, అది ఘోరమైన పాపమని పేర్కొన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు చేసిన ఉపదేశాన్ని ఉల్లేఖించారు, ప్రతి ఒక్కరూ అల్లాహ్ పట్ల మంచి అభిప్రాయంతోనే మరణించాలని చెప్పారు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ మరియు ఇమామ్ మావుర్దీ వంటి పండితుల అభిప్రాయాలను కూడా ఉటంకిస్తూ, అల్లాహ్ పట్ల దురభిప్రాయం కలిగి ఉండటం ఎంత పెద్ద పాపమో మరియు అది మార్గభ్రష్టత్వానికి ఎలా దారితీస్తుందో వివరించారు.

అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండకు

35వ విషయం. అల్లాహ్ పట్ల سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), చెడు తలంపు కలిగి ఉండకు. మనిషి ఎలాంటి తలంపు అల్లాహ్ పట్ల ఉంచుతాడో, అల్లాహ్ అతని ఆ తలంపు ప్రకారమే అతనికి తోడుగా ఉంటాడు. విషయం అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా అల్లాహ్ విషయంలో చెడు తలంపు అనేది ఉండకూడదు, అల్లాహ్ నన్ను కరుణించడు కావచ్చు, ఏ నా పని ఇది కాదు నేను ఎప్పటినుండి దుఆ చేస్తూనే ఉన్నాను, ఇంకా ఈ విధంగా ప్రజలు అల్లాహ్ విషయంలో చెడు తలంపులు కలిగి ఉంటారు.

ఈ చెడు తలంపు కలిగి ఉండడం, سُوءُ الظَّنِّ (సూ అజ్-జన్), అల్లాహ్ గురించి ఇలా చెడుగా ఆలోచించడం విశ్వాసుల గుణం ఎంత మాత్రం కాదు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చివరి ఉపదేశం

జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి కంటే ముందు మూడు రోజులు ఈ ఉపదేశం చేస్తున్నప్పుడు స్వయంగా నేను విన్నాను అని అంటున్నారు. గమనించండి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మరణానికి మూడు రోజుల ముందు ఏం ఉపదేశించారు?

لَا يَمُوتَنَّ أَحَدُكُمْ إِلَّا وَهُوَ يُحْسِنُ الظَّنَّ بِاللَّهِ عَزَّ وَجَلَّ
(లా యమూతన్న అహదుకుమ్ ఇల్లా వహువ యుహ్సినుజ్-జన్న బిల్లాహి అజ్జ వజల్)
మీలో ఎవరూ అల్లాహ్ అజ్జ వజల్ పట్ల సద్భావన కలిగి ఉన్న స్థితిలో తప్ప మరణించవద్దు (ముస్లిం 2877).

మీలో ఎవరు కూడా, మీలో ప్రతి వ్యక్తి అల్లాహ్ పట్ల మంచి తలంపు ఉంచుతూ మరణించాలి. మరణ సమయంలో అల్లాహ్ విషయంలో చాలా మంచి తలంపు ఉండాలి. దీనికి భిన్నంగా అల్లాహ్ క్షమించడేమో అన్నటువంటి చెడు తలంపును ఎంత మాత్రం ఉండకూడదు.

చెడు తలంపు ఘోరమైన పాపం

ఇక్కడ గమనించండి సోదర మహాశయులారా, అల్లాహ్ పట్ల చెడు తలంపు విశ్వాసుల గుణం కాదు. అల్లాహ్ పట్ల చెడు తలంపు ఘోర పాపాల్లో ఒక పాపం.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్) చెప్పారు:

أَعْظَمُ الذُّنُوبِ عِنْدَ اللَّهِ إِسَاءَةُ الظَّنِّ بِهِ
(అఅజముజ్-జునూబి ఇందల్లాహి ఇసాఅతుజ్-జన్ని బిహి)
ఘోరమైన పాపాల్లో ఒక పాపం అల్లాహ్ వద్ద ఏమిటంటే అల్లాహ్ పట్ల చెడు తలంపు కలిగి ఉండడం.

ఇమామ్ మావుర్దీ (రహిమహుల్లాహ్) చెప్పారు:

سُوءُ الظَّنِّ هُوَ عَدَمُ الثِّقَةِ بِمَنْ هُوَ لَهَا أَهْلٌ، فَإِنْ كَانَ بِالْخَالِقِ كَانَ شَكًّا يَؤُولُ إِلَى ضَلَالٍ
సూ అజ్-జన్ (చెడు తలంపు) అంటే నమ్మకానికి అర్హుడైన వానిపై నమ్మకం లేకపోవడం. ఒకవేళ అది సృష్టికర్త (అల్లాహ్) పట్ల అయితే, అది మార్గభ్రష్టత్వానికి దారితీసే సందేహంగా మారుతుంది

సూ అజ్-జన్, చెడు తలంపు అంటే ఏంటి? ఒక వ్యక్తి దేనికి అర్హుడు కాడో, అతడు అలాంటి వాడు అని తప్పుగా భావించడం. ఇక ఈ తలంపు చెడు, ఈ చెడు తలంపు అల్లాహ్ విషయంలో ఉంది అంటే అతడు ఒక రకమైన సందేహానికి, అనుమానానికి గురి అయి, అతడు మార్గభ్రష్టత్వంలో పడిపోతున్నాడు.

అందుకొరకు అల్లాహు తఆలా ఖురాన్లో అనేక సందర్భాలలో, సూరత్ ఫుస్సిలత్, దీని మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నంబర్ 22, 23లో, అలాగే సూరతుల్ ఫత్హ్ ఆయత్ నంబర్ 6, ఆయత్ నంబర్ 12 వీటి గురించి చాలా నష్టాలు తెలపడం జరిగింది. నేను చెప్పిన ఆ ఆయతులు మీరు చదవండి మరియు వాటి ద్వారా సరియైన జ్ఞానం అర్ధించే ప్రయత్నం చేయండి.

41:22 وَمَا كُنتُمْ تَسْتَتِرُونَ أَن يَشْهَدَ عَلَيْكُمْ سَمْعُكُمْ وَلَا أَبْصَارُكُمْ وَلَا جُلُودُكُمْ وَلَٰكِن ظَنَنتُمْ أَنَّ اللَّهَ لَا يَعْلَمُ كَثِيرًا مِّمَّا تَعْمَلُونَ

“మీరు రహస్యంగా (చెడుపనులకు) పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్లు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్‌కు కూడా తెలియవని అనుకునేవారు.”

41:23 وَذَٰلِكُمْ ظَنُّكُمُ الَّذِي ظَنَنتُم بِرَبِّكُمْ أَرْدَاكُمْ فَأَصْبَحْتُم مِّنَ الْخَاسِرِينَ

“మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరకు మీరు ఘోర నష్టానికి గురయ్యారు.”

48:6 وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا

అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.

48:12 بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا

అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.

పుస్తకం & అన్నీ వీడియో పాఠాలు క్రింద వినవచ్చు:

ధర్మపరమైన నిషేధాలు
https://teluguislam.net/?p=1705

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఎందుకు ఎక్కువ మంది భార్యలున్నారు?
https://youtu.be/XPzalQiVVY4 [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బహుళ వివాహాల గురించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. మొత్తం 11 మంది భార్యలు ఉన్నారని, వారిలో ఇద్దరు ఆయన జీవితకాలంలోనే మరణించారని, ఆయన మరణించే సమయానికి తొమ్మిది మంది ఉన్నారని వక్త స్పష్టం చేశారు. ఈ వివాహాలు అల్లాహ్ యొక్క ప్రత్యేక అనుమతితో జరిగాయని, దీనికి సూరతుల్ అహ్‌జాబ్‌లో ప్రమాణం ఉందని వివరించారు. ఈ వివాహాల వెనుక ఉన్న అనేక కారణాలను ఆయన వివరించారు: స్త్రీలకు ఆదర్శవంతమైన జీవితాన్ని తెలియజేయడం, వైవాహిక జీవితంలోనూ ఆయన ఒక ఉత్తమ ఆదర్శంగా నిలవడం, వివిధ వంశాలు మరియు వర్గాల మధ్య సంబంధాలను బలపరచడం, మరియు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని, శత్రువుల పట్ల కూడా గౌరవప్రదంగా వ్యవహరించే తీరును తెలియజేయడం వంటివి ముఖ్యమైనవి. ఇది ఇస్లాం యొక్క విశ్వజనీన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొత్తం భార్యలు 11. అయితే తమ జీవితంలో ఇద్దరు భార్యలు చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించే సందర్భంలో తొమ్మిది భార్యలు వారి వద్ద ఉన్నారు.

అయితే, ప్రవక్తకు నలుగురి కంటే ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకునే అటువంటి అనుమతి, అర్హత స్వయంగా నిజ సృష్టికర్త అయిన మనందరి ఆరాధ్యుడైన అల్లాహ్ ప్రసాదించాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెళ్లిళ్లు చేసుకున్నారు. దీని యొక్క వివరణ సూరతుల్ అహ్‌జాబ్‌లో చూడవచ్చును. సూరా నెంబర్ 33, మరి ఇందులో ప్రత్యేకంగా ఎక్కడైతే అల్లాహ్ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకరి కంటే ఎక్కువగా భార్యలు చేసుకునే అటువంటి అనుమతి ఇచ్చాడో, ఆయతు నెంబర్ 28 నుండి సుమారు సుమారు 35 వరకు మరియు ఆ తర్వాత ఒక రెండు ఆయతులు కూడా మీరు చూశారంటే దీనికి సంబంధించిన ఎన్నో లాభాలు మనకు ఏర్పడతాయి.

సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం పురుషులకే ప్రవక్త కారు, స్త్రీలకు కూడాను. అయితే, ప్రవక్త వారి ఆదర్శ జీవితం పురుషులకు ఎంత అవసరమో, అలాగే స్త్రీలకు కూడా అవసరం. ఒకరి కంటే, నలుగురి కంటే ఎక్కువ భార్యల ద్వారా ఇలా ప్రవక్త వారి ఆదర్శవంతమైన జీవితాన్ని తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేయడానికి మంచి సహకారం ఏర్పడుతుంది.

రెండవ విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన అందరి కొరకు ఒక ఉత్తమ ఆదర్శం అని ఇదే సూరతుల్ అహ్‌జాబ్‌లో కూడా అల్లాహ్ మనకు తెలియజేశాడు. అయితే, ఈ ఆదర్శం కేవలం మస్జిద్ వరకు, బయట బజారు వరకు, యుద్ధాల్లోనే కాదు, వైవాహిక జీవితంలో, ఫ్యామిలీ లైఫ్‌లో కూడా. అంతేకాదు, ఇంకా మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, మానవుల్లో, సమాజంలో విద్యా రీత్యా గానీ, బుద్ధి జ్ఞానాల పరంగా గానీ, విషయాలు నేర్చుకుని ఆచరించే పరంగా గానీ, సమాజంలో ప్రజలు ఏ తారతమ్యాలు ఏర్పాటు చేసుకుంటారో దాని పరంగా గానీ వేరువేరుగా ఉంటారు గనుక, వేరువేరు వంశాలకు సంబంధించిన భార్యలు ప్రవక్త దగ్గర ఉండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ ఆదర్శాన్ని అందరికీ తెలియజేయడానికి.

అంతే కాదు, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా వచ్చారు. సర్వ మానవాళిలో ప్రత్యేకంగా ఆ కాలంలో బహుదైవారాధకుల రూపంలో, యూదుల రూపంలో, క్రైస్తవుల రూపంలో ఎందరో అక్కడ నాయకులు ఉన్నారు. అయితే, ఆ నాయకుల యొక్క బిడ్డలు సైతం ఎప్పుడైతే యుద్ధంలో బానిసరాళ్లుగా వచ్చారో, వారికి వారి హోదా, అంతస్తు ప్రకారంగా వారి యొక్క తండ్రులకు ఇస్లాం యొక్క గొప్పతనం తెలిసిరావాలి, ‘నా బిడ్డలు బానిసరాళ్లు అయ్యారు’ అన్నటువంటి అవమానంతో ఇస్లాం పట్ల మరింత వారి యొక్క హృదయాలలో ఏ చెడు చేసుకోకూడదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి బిడ్డలను వివాహం చేసుకున్నారంటే, ఇస్లాం యొక్క గొప్ప నాయకుల వద్ద నా బిడ్డలు ఒక మహారాణిగా ఉన్నారు అన్నటువంటి సంతోషంతో వారు కూడా ఇస్లాంకు మరింత దగ్గరగా అయ్యారు.

ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉర్దూ తెలిసిన వారు మౌలానా సయ్యద్ సులేమాన్ మన్సూర్‌పురి రహ్మతుల్లాహి అలైహి వారి ‘రహ్మతున్ లిల్ ఆలమీన్’ పుస్తకంలో దీని యొక్క వివరాలను కూడా ఇన్షా అల్లాహ్ చూడగలుగుతారు. ఈ సమాధానం సరిపోతుందని ఆశిస్తున్నాను.

ఇతరములు: 

మద్రాస్ ప్రసంగాలు – ప్రవక్త ﷺ జీవితచరిత్రకు సంబంధించిన వివిధ కోణాలపై 8 ఖుత్బాలు
అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వీ
https://teluguislam.net/2021/12/01/madras-prasangalu/

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):
https://teluguislam.net/muhammad

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
https://teluguislam.net/2011/03/25/muhammad-the-final-prophet/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
https://teluguislam.net/2020/01/02/prophet-muhammad-seerah/
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
https://teluguislam.net/2019/08/05/the-meaning-of-muhammad-rasolullaah/
అనువాదం : ముహమ్మద్ నసీరుద్దీన్

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి? [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ద్వారా స్వస్థత (షిఫా) ఎలా పొందాలి?
https://youtu.be/koWlTdlX4BI [52 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా పొందవచ్చో వివరించబడింది. సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన తలచినప్పుడే అన్నీ జరుగుతాయని గట్టి నమ్మకం కలిగి ఉండాలని ప్రసంగీకులు నొక్కిచెప్పారు. ఖుర్ఆన్ కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని అల్లాహ్ స్వయంగా చెప్పిన విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇది శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది. సూరహ్ యూనుస్, సూరహ్ అల్-ఇస్రా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలోని సంఘటనలను ఉదాహరిస్తూ, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందాలంటే దృఢ విశ్వాసం, పాపాలకు దూరంగా ఉండటం మరియు ఖుర్ఆన్ బోధనలను ఆచరించడం తప్పనిసరి అని బోధించారు. మూఢనమ్మకాలు, షిర్క్ వంటి పద్ధతులకు దూరంగా ఉంటూ, సరైన పద్ధతిలో ఖుర్ఆన్ ద్వారా చికిత్స పొందాలని వారు ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాఇ వల్ ముర్సలీన్. వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. అమ్మా బాద్.

ఫ అఊదు బిల్లాహిస్ సమీఇల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్.

وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
(వ నునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫావువ్ వ రహ్మతుల్ లిల్ మూమినీన్)
మేము అవతరింపజేసే ఈ ఖుర్‌ఆన్‌ విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత, కారుణ్య ప్రదాయిని.  (17:82)

సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వ లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సర్వ మానవాళి సన్మార్గం కొరకు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్హందులిల్లాహ్, ఈ రోజు ధర్మ సందేశ విభాగం, రాష్ట్ర జమీయతే అహ్లె హదీస్ తెలంగాణ వారి తరఫున మూడు ప్రసంగాలు, మూడు పాఠాలు మీ ముందు ఇన్షా అల్లాహ్ తీసుకురావడం జరుగుతుంది. అందులో ఇన్షా అల్లాహ్ ప్రప్రథమంగా మీ ముందు ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా అనే అంశంపై ఫజీలతుష్ షేఖ్ ముహమ్మద్ నసీరుద్దీన్ జామయీ హఫిదహుల్లాహ్ మీ ముందు ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన ప్రసంగించనున్నారు. నేను ఎలాంటి ఆలస్యం చేయకుండా గురువు గారిని నేను ఇన్షా అల్లాహ్ ఈ అంశం పైన మాకు ఎన్నో ఖుర్ఆన్ హదీసు వెలుగులో ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందాలి, అల్లాహ్ అజ్జవజల్లా ఈ గ్రంథం ద్వారా ఎలా స్వస్థతను పొందుపరిచాడు అనే అంశాల గురించి ఇన్షా అల్లాహ్ వివరిస్తారని ఆశిస్తున్నాను. వలియత ఫద్దల్ మష్కూరున్ మాజూరా ఫలియత ఫద్దల్.

అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا هُوَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “అల్లాహ్‌ ప్రదానం చేసిన ఈ బహుమానానికి, కారుణ్యానికి జనులు సంతోషించాలి. వారు కూడబెట్టే దానికంటే ఇది ఎంతో మేలైనది.” (10:58)

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ ధర్మ ప్రేమికులారా, ఖుర్ఆన్ అల్లాహ్ యొక్క సత్య గ్రంథం. మన కొరకు స్వస్థత ఎలా? అనే అంశంపై ప్రసంగించడానికి చెప్పడం జరిగింది. అయితే ఖుర్ఆన్ మన కొరకు ఏ రూపంలో స్వస్థత ఉంది, దాని ద్వారా మనం ఎలా స్వస్థత పొందగలుగుతామో తెలుసుకునేకి ముందు ఒక రెండు విషయాలు మనం గ్రహించడం చాలా అవసరం. ఏంటి ఆ రెండు విషయాలు? ముందు మనమందరమూ కూడా చాలా బలంగా విశ్వసించవలసినది, దృఢంగా నమ్మవలసినది ఏమిటంటే,

సర్వశక్తిమంతుడు కేవలం అల్లాహ్ మాత్రమే. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క ఆదేశ ప్రకారమే జరుగుతుంది. చివరికి అమ్రే కౌనీ అని ఏదైతే అనడం జరుగుతుందో, మానవులు, జిన్నాతులు తప్ప మిగతా సృష్టి రాశులందరికీ కూడా వారి వారి ఏ పనిని బాధ్యతను అల్లాహ్ అప్పగించాడో, తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా అల్లాహ్ యొక్క అనుమతితోనే జరుగుతుంది. అది మన దృష్టిలో ఒకప్పుడు ఏదైనా చెడు అనిపించినా, అది కూడా అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది, దీనినే అమ్రే కౌనీ అని అంటారు. ఎక్కడైనా ఏదైనా మంచి జరిగినా అది కూడా అల్లాహ్ వైపు నుండే జరుగుతూ ఉంది.

అగ్నిలో కాల్చే గుణం, కత్తిలో కాటు వేసే గుణం, ఇంకా సృష్టి రాశుల్లో వేరే ప్రతీ ఒక్క దానిలో అల్లాహ్ త’ఆలా అనుమతితోనే అది తన పని చేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అల్లాహ్ కోరుతాడో, అది తన ఆ పని చేయకూడదు అని, అది ఆ పని చేయదు. అగ్ని ఇబ్రాహీం అలైహిస్సలాంను కాల్చకూడదు అంటే అది కాల్చలేదు. కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాంను కోయకూడదు అని అంటే, కత్తి ఇస్మాయిల్ అలైహిస్సలాం మెడపైన నడిచినప్పటికీ రవ్వంత గాయం కూడా కాలేదు. సముద్రంలో మునగడం, అందులో ఉన్న పెద్ద జీవరాశులు, తిమింగలాలు మనిషిని గానీ ఇంకా వేరే వాటిని తినడం ఒక సర్వసాధారణ అలవాటుగా మనం చూస్తాము, కానీ అదే యూనుస్ అలైహిస్సలాంను అతనికి ఏ కొంచెం నష్టం జరగకుండా అలాగే కాపాడాలి అని అల్లాహ్ ఆదేశం వస్తే కాపాడింది.

ఈ విధంగా అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఈ సృష్టిలో తాను కోరిన విధంగా తన ఈ సృష్టిలో మార్పుచేర్పు చేస్తూ ఉంటాడు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే ఉర్దూలో, అరబీలో ఒక పదం ఉపయోగపడుతుంది. మనం మన లాభానికి ఎన్ని సాధనాలు ఏర్పరచుకున్నా, నష్టం నుండి దూరం ఉండడానికి మనం ఏ మార్గాలు అవలంబించినా, ఇవన్నీ కూడా అస్బాబ్ (సాధనాలు). కానీ, ముసబ్బిబుల్ అస్బాబ్, ఆ సాధనాలకు అవి తమ పని చేయాలి అన్నట్లుగా ఆదేశం ఇచ్చేవాడు ఆ అల్లాహ్ మాత్రమే. ఈ బలమైన నమ్మకం మనకు ఉండాలి.

రెండో విషయం, అల్లాహ్ ఏది కోరితే అదే జరుగుతుంది, మన ఇష్ట ప్రకారం ఏమీ జరగదు. మనం ఏదైనా మంచి కోరి, మంచి సాధనం దాని గురించి ఉపయోగిస్తే అల్లాహ్ తలచినప్పుడే ఆ మంచి మనకు జరుగుతుంది. అంటే, అల్లాహ్ త’ఆలా అందులో ఒక కారణం పెట్టాడు. కానీ అది ఎప్పుడు పని చేస్తుంది? అల్లాహ్ అనుమతి జరిగినప్పుడు, అల్లాహ్ తాను కోరి అనుమతి ఇచ్చినప్పుడు. ఈ నమ్మకం కూడా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాను, మనం సర్వసాధారణంగా తెలుగు ప్రాంతాలకు చెందిన వారిమి, హైదరాబాద్ ను ఒక క్యాపిటల్ సిటీగా మనం చూస్తున్నాము, అందుకొరకు కొన్ని ఉదాహరణలుగా ఎప్పుడైనా దాని పేరు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఎన్నో గల్లీలలో మీరు చూస్తూ ఉంటారు, “హమారే పాస్ హర్ తరహా కా రూహానీ ఇలాజ్ హై, ఖురానీ ఇలాజ్ హై”(మా దగ్గర అన్ని రకాల ఆధ్యాత్మిక చికిత్స ఉంది, ఖుర్ఆన్ చికిత్స ఉంది) ఇలాంటి బోర్డులు వేసి ఉంటాయి. వారి యొక్క మొబైల్ నెంబర్లు ఇచ్చి ఉంటాయి. జనాలు, ప్రజలు ధర్మ అవగాహన సరైన రీతిలో లేనందువల్ల, విశ్వాసాలు బలహీనంగా అయిపోయినందువల్ల, వారు ఎన్నో రకాల మోసాలకు గురి అవుతారు. తర్వాత కొందరు అల్లాహ్ యొక్క సత్య గ్రంథం ఖుర్ఆన్ విషయంలో శంకించడం మొదలు పెడతారు. ఇలా ఉండకూడదు.

అందుకొరకే నేను నా అసలైన టాపిక్ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత ఎలా? ప్రారంభించేకి ముందు ముఖ్యమైన రెండు మాటలు చెప్పాను. వాటిపై చాలా శ్రద్ధ ఇవ్వండి.

ఇక ఖుర్ఆన్ మన కొరకు స్వస్థత ఇది మన శారీరక రోగాలకు కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా. మన యొక్క బాహ్య రోగాలకు కూడా మరియు ఇది అంతర్య కళ్ళకు కనబడనటువంటి రోగాలకు కూడా ఒక మంచి స్వస్థత కలుగజేసేది.

దీనికి సంబంధించిన ఆయతులు, హదీసులు చెప్పి, ఏ ఏ రీతిగా మనం ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందగలుగుతామో చెప్పేకి ముందు, ఖుర్ఆన్ గురించి స్వయంగా అల్లాహ్ త’ఆలా స్వస్థత అన్న పదం ఏదైతే పలికాడో, “షిఫా” అని ఖుర్ఆన్ లో వచ్చి ఉంది. సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో, అలాగే సూరత్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ అని అంటారు, సూరహ్ నెంబర్ 17, ఆయత్ నెంబర్ 82, అలాగే సూరత్ ఫుస్సిలత్, సూరహ్ నెంబర్ 41, ఆయత్ నెంబర్ 44, ఇంకా ఈ భావంలో వేరే కొన్ని చోట్ల కూడా ఆయతులు ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా మనలో ఎవరైనా ఏదైనా రోగానికి గురి అయితే, ఏ మందు తీసుకుంటున్నావు? ఎవరి వద్ద చికిత్స చేయిస్తున్నావు? చికిత్స, మందు తీసుకోవడం ఇలాంటి పదాలు ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏంటంటే అల్లాహ్ త’ఆలా ఈ ఖుర్ఆన్ మీ అన్ని రకాల రోగాలకు ఒక ఔషధం అని, దవా అని, ఇలాజ్ అని, చికిత్స అని చెప్పలేదు. మందుల ఉపయోగంతో ఏ ప్రయోజనం కలుగుతుందో, అంటే మనిషి యొక్క రోగం దూరమైపోయి స్వస్థత కలగడం. మర్ద్ (రోగం) పూర్తిగా అతనిలో నుండి వెళ్ళిపోవడం, దాని చోట అతనికి సిహ్హత్, షిఫా (ఆరోగ్యం, స్వస్థత) కలగడం. డైరెక్ట్ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఆ చివరి లాభం ఏదైతే ఉందో, స్వస్థత, ఆరోగ్యం అది అని తెలిపాడు. మందు అని తెలపలేదు, ఔషధం అని తెలపలేదు.

ఇందులో ఉన్నటువంటి గొప్ప మహిమ గ్రహించాల్సినది ఏమిటంటే, మనం చూస్తూనే ఉన్నాము, ఔషధాలు, మందులు సర్వసాధారణంగా మనం ఉపయోగిస్తాము, కొన్ని సందర్భాల్లో అవి పని చేస్తాయి, మనకు వాటి ద్వారా స్వస్థత కలుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో వాటి ద్వారా మనకు స్వస్థత అనేది కలగదు. కానీ ఇక్కడ ఖుర్ఆన్ గురించి అల్లాహ్ త’ఆలా ఏం చెబుతున్నాడు అంటే, దీని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగాలన్నీ కూడా నశించిపోతాయి, అంతమైపోతాయి, నామరూపాలు లేకుండా “లా తుగాదిరు సఖమా”, ఆ రోగం నామరూపాలు లేకుండా మీలో నుండి దూరమైపోతాయి.

సోదర మహాశయులారా, తొందర తొందరగా పది, ఇరవై ఆయతులు చదివేయడం, పది, ఇరవై హదీసులు వినడం అది గొప్ప కాదు. ఒక్క ఆయతు విన్నా, అందులో ఉన్న భావాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని అల్లాహ్ ఇష్ట ప్రకారంగా మనలో ఒక మార్పు తీసుకురావడం, స్వయం మనం రోగం నుండి ఆరోగ్యం, మరియు అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు, బలహీన విశ్వాసం నుండి బలమైన విశ్వాసం వైపునకు, ఆచరణ పరంగా ఎంతో లోపం, దోషం ఉన్న మనం, సత్కార్యాలు పాటించడంలో చాలా వేగంగా ముందుకు రావడం, ఇలాంటి మంచి మార్పు మనలో రావాలి.

يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ وَشِفَاءٌ لِّمَا فِي الصُّدُورِ وَهُدًى وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ
ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుంచి మీ దగ్గరకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్నవ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, నమ్మేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. (10:57)

అయితే, సూరత్ యూనుస్ యొక్క ఆయత్ నేను ముందు మీకు వినిపిస్తాను. ఇందులో ఉన్నటువంటి ఒక గొప్ప మహిమను గ్రహించండి. ఒకవేళ గత నెలలో ఖుర్ఆన్ ఎవరి గ్రంథం, ఎవరి కొరకు అన్న విషయంలో నేను హుదన్, హిదాయత్ ఏ ఏ రకంగా ఉంది అనే విషయం ఏదైతే తెలిపాను, సూర యూనుస్ యొక్క ఆయత్ ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు మీ ముందు పఠిస్తున్నానో, స్టార్టింగ్ లో కూడా సంక్షిప్త ఖుద్బయే మస్నూన తర్వాత పఠించాను, దాన్ని ఒక్కసారి గమనించండి మీరు.

“యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా, అల్లాహు అక్బర్. ఎందరో మన హైందవ సోదరులు, క్రైస్తవ సోదరులు ఇంకా వేరే ఇస్లాం ధర్మం పై లేని వారు నా మాట వింటున్నారో కొంచెం శ్రద్ధ వహించండి. దివ్య గ్రంథం ఖుర్ఆన్, సూరత్ యూనుస్, సూరహ్ నెంబర్ 10, ఆయత్ నెంబర్ 57 లో అల్లాహ్ త’ఆలా “యా అయ్యుహన్ నాస్”, ఓ ప్రజలారా అని సంబోధించాడు. అంటే, ముస్లింలారా అని అనలేదు, అరబ్బులారా అని అనలేదు, మక్కావాసులారా అని అనలేదు. సర్వ మానవాళిని ఉద్దేశించి అల్లాహ్ త’ఆలా ఇక్కడ చెబుతున్నాడు. ఏం చెప్పాడు? ఇక సర్వ మానవులకు ఉంది గనక మీరందరూ కూడా వినాలి. ఎందుకంటే, ఇది నా మాట కాదు, ఏదో తురుకోని మాట కాదు, ఏదో నీకు ఇష్టం లేని నీ పక్కన ఉన్నటువంటి నీ శత్రువుని మాట కాదు. నిన్ను సృష్టించిన నీ నిజ సృష్టికర్త అయిన ఆ అల్లాహ్ యొక్క మాట. నీతో సంబోధిస్తున్నాడు, నిన్ను ఉద్దేశించి చెబుతున్నాడు. “యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, “ఖద్ జాఅత్కుం మౌఇజతుమ్ మిర్రబ్బికుం”. మీ ప్రభువు వైపు నుండి మీ కొరకు ఉపదేశం వచ్చేసింది. అల్లాహు అక్బర్.

ఈ ఉపదేశాన్ని గనక మీరు పాటించారంటే, అల్హందులిల్లాహ్, మీకు ఎంత లాభం కలుగుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అన్ని రకాల చెడులు, అది విశ్వాసానికి సంబంధించిన, లేదా ఆచరణ పరంగా నైనా, అశ్లీలత, అన్ని రకాల దుష్కార్యాలు వాటి నుండి మీరు దూరం ఉండగలుగుతారు. అల్లాహ్ యొక్క ఈ ఉపదేశాన్ని మీరు ఆచరించారంటే, విశ్వాసంలో కూడా అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో మీరు మరల గలుగుతారు. ఆచరణ పరంగా కూడా మీరు అల్లాహ్ కు ఇష్టమైన సదాచరణ చేయగలుగుతారు. ఎప్పుడు? అల్లాహ్ మీ కొరకు పంపినటువంటి ఉపదేశాన్ని స్వీకరించారంటే.

ఆ తర్వాత చెప్పాడు, “వ షిఫావుల్ లిమా ఫిస్ సుదూర్”. సుదూర్, మీ యొక్క హృదయాలకు ఇది మంచి నివారణ, స్వస్థత. హృదయాలు అని ఇక్కడ ఏదైతే చెప్పడం జరిగిందో, ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పారు,

مِنَ الشُّبَهِ وَالشُّكُوكِ، وَهُوَ إِزَالَةُ مَا فِيهَا مِنْ رِجْسٍ وَدَنَسٍ.
“మినష్ షుబహి వష్ షుకూకి, వహువ ఇజాలతు మా ఫీహా మిన్ రిజ్సిన్ వ దనస్”.
ఇది మీ రోగాల యొక్క, మీ హృదయాలకు నివారణ, స్వస్థత. హృదయాలలో ఏ అనుమానాలు, ఏ సందేహాలు, ఏ డౌట్స్ వస్తూ ఉంటాయో, వాటన్నిటికీ కూడా ఈ ఖుర్ఆన్ మంచి నివారణ.”

అవును. నిజమైన సృష్టికర్త అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఆరాధ్యుడు ఉన్నాడు అటువంటి అనుమానంలో ఎవరైతే పడి ఉన్నారో, ఈ ఖుర్ఆన్ ను శ్రద్ధగా చదివారంటే, వారి యొక్క ఈ అనుమానాలు దూరమైపోతాయి. మేము ఆ అరబ్బుల్లో వచ్చిన ముహమ్మద్ ను ఎందుకు విశ్వసించాలి అన్నటువంటి సందేహంలో ఇంకా పడి ఉన్నారో, వాస్తవానికి ఖుర్ఆన్ గ్రంథాన్ని శ్రద్ధగా చదివారంటే వారి యొక్క ఈ సందేహాలు దూరమవుతాయి. ఆయన కేవలం అరబ్బుల కొరకు కాదు. ఇక్కడ అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ గురించి ఎలాగైతే చెబుతున్నాడో, మీ కొరకు ఉపదేశం, మీ కొరకు స్వస్థత, మీ రోగాలకు మంచి నివారణ కలిగిస్తూ మీకు స్వస్థత కలుగజేసేది అని, అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా అల్లాహ్ ఇదే ఖుర్ఆన్ లో తెలిపాడు, “యా అయ్యుహన్ నాస్, ఓ ప్రజలారా, ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం జమీఆ”, నేను మీ అందరి వైపునకు ప్రవక్తగా పంపబడ్డాను. ఇంతకంటే మరీ స్పష్టంగా “వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్”, సర్వ లోకాల వైపునకు మిమ్మల్ని కారుణ్య మూర్తిగా పంపడం జరిగింది.

మనిషి ఇహలోకంలో శాంతి, పరలోకంలో కూడా నరకం నుండి ముక్తి పొంది శాంతి స్థలమైన ఆ స్వర్గంలో చోటు పొందాలంటే తప్పకుండా ఏకైక అల్లాహ్ ను ఆరాధించాలి, చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించాలి, ప్రవక్తపై అవతరించిన ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని విశ్వసించి అన్ని రకాల రోగాలకు స్వస్థత కలిగించేటువంటి ఈ ఖుర్ఆన్ ను చదివి మనలో మార్పు తీసుకురావాలి. దీని ద్వారా అన్ని రకాల చెడుగులు మన నుండి దూరమై, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, మనం మన సృష్టికర్తకు ఇష్టమైన మార్గంలో ఉండగలుగుతాము.

సోదర మహాశయులారా, ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు “వ హుదవ్ వ రహ్మ”. ఎప్పుడైతే మీరు ఉపదేశాన్ని స్వీకరించి మీ రోగాలకు స్వస్థత కలిగించే దానిని మీరు సరైన రీతిలో చదివి ఆచరిస్తూ ఉంటారో, అప్పుడు మీకు మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. తద్వారా మీ జీవితాల్లో అల్లాహ్ యొక్క ప్రత్యేక కరుణలు మీపై దిగుతూ ఉంటాయి.

ఆ తర్వాత ఏం చెప్పాడు? “లిల్ ముఅమినీన్”. విశ్వాసుల కొరకు. కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఆయత్ యొక్క ఆరంభం యా అయ్యుహన్ నాస్ తోనే ఉంది. మరియు ఖుర్ఆన్ గురించి చెప్పడం జరుగుతుంది, ఇది ఉపదేశం, ఇది స్వస్థత, ఇది మార్గదర్శకత్వం, ఇది కారుణ్యం, నాలుగు గుణాలు చెప్పబడ్డాయి. ఆయత్ యొక్క చివరి పదం ఏముంది? లిల్ ముఅమినీన్, విశ్వాసుల కొరకు. అంటే ఏమిటి? ఇంతకు ముందు నేను ఉదాహరణ ఇచ్చాను మీకు. వాస్తవానికి ఇది సర్వ మానవాళి కొరకు ఉపదేశము, స్వస్థత మరియు మార్గదర్శకత్వము, ఇంకా కారుణ్యము. కానీ ఎవరైతే వాస్తవ రూపంలో ఈ లాభాలు పొందుతారో, సర్వ మానవాళి పొందకుండా విశ్వాసులు ఈ లాభాలు పొందుతారు. ఎందుకు? విశ్వసించి దానిని అదే రీతిలో ఆచరిస్తారు గనుక.

ఇంతకు ముందు ఇచ్చిన ఒక సామెత మీకు గుర్తుందా? టార్చ్ లైట్ మీ చేతిలో ఉంది. బ్యాటరీ ఉంది. కానీ ఏం చేయాలి? రాత్రి మీరు ఏ దారి గుండా చీకటి దారిలో నడుస్తూ వెళ్తున్నారో, బ్యాటరీ ఆ టార్చ్ లైట్ వెంట తీసుకోవాలి, దాని బటన్లు నొక్కి ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత కూడా మీకు మార్గం కనబడదు. ఎందుకు? మీరు దానిని మీరు నడిచే మార్గం వైపునకు కరెక్ట్ గా చూపించుకుంటూ వెళ్ళాలి. మీరు ఉదాహరణకు టార్చ్ లైట్ తీసుకున్నారు, బటన్ నొక్కారు, ఇక్కడ లైట్ ఉంది. కానీ దానిని ఆకాశం వైపునకు ఇలా ఎత్తుకొని పట్టుకొని ఉన్నారు. మీ ముంగట చీకటిలో ఏ దారి అయితే ఉందో అక్కడ వెలుతురు పడుతుందా? పడదు కదా?

అలాగే ముస్లింలారా మీరు కూడా శ్రద్ధగా వినండి. ఖుర్ఆన్ కేవలం ఇళ్ళల్లో పెట్టుకొని, చేతిలో అందకుండా పైన ఎక్కడో అటుక మీద పెట్టి చదవకుండా, దానిని శ్రద్ధగా ఆలకించకుండా, దాని యొక్క అర్థ భావాలు తెలుసుకోకుండా, దాని ద్వారా ఎలా స్వస్థత పొందాలో ఆ ప్రయత్నం చేయకుండా మనం ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ఇంట్లో కాదు, జేబులో ఉన్నప్పటికీ, మీ యొక్క మొబైళ్ళలో ఉన్నప్పటికీ, మీ దుకాణాల్లో ఉన్నప్పటికీ, మీ బండిలో మీరు పెట్టుకున్నప్పటికీ మీ యొక్క జీవితాల్లో శుభాలు అనేటివి రావు. రోగాలు దూరం కావు, స్వస్థత అనేది కలగదు.

సూరతున్నహల్, సూర నెంబర్ 16, ఆయత్ నెంబర్ 69లో అల్లాహ్ త’ఆలా తేనె గురించి తెలిపాడు. తేనెటీగ మరియు తేనె యొక్క లాభం గురించి. “ఫీహి షిఫావుల్ లిన్నాస్”, తేనెలో సర్వ మానవాళికి స్వస్థత ఉంది అని. మొన్న కూడా మీరు వార్త చూశారు కావచ్చు. చివరికి కరోనా లాంటి రోగాలకైనా గానీ మన భారతదేశపు పాతకాలపు నాటి చికిత్సలను, ఔషధాలనే అమెరికా, యూరప్ లో కూడా వాడుతున్నారు. అక్కడి ల్యాబొరేటరీస్ లలో, అక్కడి శాస్త్రవేత్తలు తేనె లాంటి గొప్ప ఔషధం మరొకటి లేదు అని చెబుతున్నారు. అని తెలుగులో వార్తలు ప్రచురిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. తేనె, ఒరిజినల్ తేనె, 2000 రూపాయలకు కిలో పెట్టి మీరు కొన్నారు కావచ్చు. ఎంతో అందమైన బాటిల్ లో మీరు తీసుకొని వచ్చారు కావచ్చు. దాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో ఎంతో మంచి చోట దాన్ని పెట్టేది ఉంటే, ఒక మంచి అందమైన చిన్న బాటిల్ లో ఒక 20, 30 గ్రాములు వేసుకొని జేబులో వేసుకుంటే లేదా కడుపునొప్పి ఉన్నప్పుడు కడుపుకు కట్టుకుంటే, ఏదైనా మెడనొప్పి ఉన్నప్పుడు మెడకు కట్టుకుంటే లేదా గొంతులో ఏదైనా మీకు ఇబ్బంది ఉండి మెడ కింద కట్టుకుంటే లాభం ఉంటుందా? ఉండదు కదా? డాక్టర్ మరియు ఆయుర్వేద అనుభవజ్ఞులైన వారు దానిని ఏ మోతాదులో, పొద్దున ఎన్నిసార్లు, నీళ్లలోనా, పాలల్లోనా, ఎందులో, నీళ్లు అయితే కూడా సామాన్య నీళ్లా, లేకుంటే కొంచెం కునుకున నీళ్లా, ఇవన్నీ మనం పద్ధతులు తెలుసుకొని ఆ విధంగా పాటించినప్పుడే దాని ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఎన్నో రోగాలకు మీరు డాక్టర్ల వద్ద నుండి మందు బిళ్ళలు గానీ, గొట్టం గోలీలు గానీ, లేకుంటే ఇంకా టానిక్ త్రాగే మందు గానీ తీసుకొని వస్తారు కదా? పొద్దుకు రెండు సార్లు తీసుకోవాలా, మూడు సార్లు తీసుకోవాలా, ఒక్కసారి తీసుకోవాలా, అన్నం కంటే ముందు తీసుకోవాలా, అన్నం తర్వాత తీసుకోవాలా, ఇవన్నీ విషయాలు మంచి విధంగా కనుక్కుంటారు కదా? అదే విధంగా దాన్ని పాటిస్తూ ఉంటారు కదా?

మరి ఖుర్ఆన్ విషయంలో కూడా స్వస్థత పొందే మార్గం ఏంటి? మనం ఖుర్ఆన్ ద్వారా ఎలా స్వస్థత పొందగలుగుతాము, ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఇంతవరకు చేయలేదు అంటే, మనం ఎంత అశ్రద్ధలో ఉన్నామో మనమే గమనించండి.

సోదర మహాశయులారా, ఖుర్ఆన్ ద్వారా మనం స్వస్థత అనేది నేను ఇంతకు ముందే తెలిపినట్లు, మన శారీరక రోగాలకు అంతకంటే ముఖ్యమైన మన హృదయ సంబంధమైన రోగాలకు కూడా ఇది మంచి స్వస్థత. హృదయ సంబంధ రోగాల గురించి కొన్ని విషయాలు ఇంతవరకే నేను చెప్పి ఉన్నాను. అయితే మనం ఖుర్ఆన్ చదువుతూ ఉండేది ఉంటే, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకుంటూ ఉండేది ఉంటే, దాని ప్రకారంగా మన ఆచరణ, దాని ప్రకారంగా మన యొక్క జీవితంలో నడవడికలో మార్పు తెచ్చుకొని సదాచరణ పాటిస్తే, తప్పకుండా మన హృదయాల రోగాలకు స్వస్థత కలుగుతుంది.

హృదయ రోగాల యొక్క ప్రస్తావన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు వచ్చిందంటే సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గుర్తుంచుకోండి.

“ఇన్న ఫిల్ జసది ముద్గా”, శరీరంలో ఒక అవయవం ఉంది. “ఇదా సలుహత్, సలుహల్ జసదు కుల్లు”, అది బాగుందంటే పూర్తి శరీరం బాగున్నట్లు. “వ ఇదా ఫసదత్, ఫసదల్ జసదు కుల్లు”, అది పాడైపోతే శరీరం అంతా కూడా పాడైపోతుంది. అదేమిటి? “అలా వహియల్ ఖల్బ్”, వినండి, అదే హృదయం.

అందుకొరకే మీరు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ, అన్నిటికంటే ముందు ఏం చూస్తారు? చెవిలో పెట్టుకొని రెండు దాని ద్వారా మీ యొక్క ఈ హృదయాన్ని, ముందు కూడా వెనక కూడా, హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? లేదా కొందరు ఆయుర్వేద అనుభవజ్ఞులు ఇక్కడ నాడి పట్టి చూస్తారు. దీని ద్వారా కూడా ఏం తెలుస్తుంది? హృదయం నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? హార్ట్ బీటింగ్ ఎలా ఉంది? దీని ద్వారా శరీరంలోని ఎన్నో రోగాలను గుర్తుపడతారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హృదయం బాగుంది అంటే, అది అన్ని రకాల రోగాల నుండి స్వస్థత పొందింది అంటే మన విశ్వాసంలో, మన ఆచరణలో ఎంతో మంచి మార్పు వస్తుంది. అందుకొరకు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ నివారణ కొరకు, హృదయం మార్గదర్శకత్వంపై స్థిరంగా ఉండడానికి ఎన్నో దువాలు కూడా చేస్తూ ఉండేవారు. “అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా, వ జక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా, అంత వలియ్యుహా వ మౌలాహా” ఇంకా వేరే ఎన్నో దువాలు ఉన్నాయి.

ఇక ఈ ఖుర్ఆన్ శారీరక రోగాలకు కూడా స్వస్థత. అవును. అల్హందులిల్లాహ్. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పేకి ముందు ఒక విషయం శ్రద్ధగా వినండి. అదేమిటి? ఖుర్ఆన్ మీ శారీరక రోగాలకు కూడా స్వస్థత అని అంటే, ధర్మపరమైన వేరే ఔషధాలు వాడే అవసరం లేదు అని ఎంతమాత్రం భావం కాదు. చికిత్స చేయించుకోకూడదు అని ఎంతమాత్రం భావం కాదు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. “దావూ మర్దాకుం యా ఇబాదల్లాహ్”, ఓ అల్లాహ్ దాసులారా, మీ యొక్క రోగాలకు మీరు చికిత్స చేయించండి. అయితే ఖుర్ఆన్ కు ప్రాధాన్యత అనేది ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితి ఏముంది? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఫెయిల్ అయి వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద స్పెషలిస్టులను కలిసి అన్ని మందులు వాడాము, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాము, కానీ ఇక ఏదీ కూడా లాభం లేదు. ఇక అల్లాహ్ యే ఏదైనా చేయాలి అని ఇక ఖుర్ఆన్ ద్వారా స్వస్థత గురించి వచ్చాము. ఇలా ఉండకూడదు. ఖుర్ఆన్ శారీరక రోగాలకు మంచి ఔషధం, మంచి చికిత్స, దీని ద్వారా స్వస్థత కలుగుతుంది. అయితే రోగ ఆరంభంలో, అంతకంటే ముందు ఇంకా రోగం రాకుండా ఉండడానికి మరియు వచ్చిన వెంటనే ఆరంభంలో, మధ్యలో, చివరిలో, అన్ని వేళల్లో దీని ద్వారా చికిత్స మనం పొందుతూ ఉండాలి. చిట్టచివరిసారిగా కాదు, ఈ యొక్క తప్పును మనం సరిదిద్దుకోవాలి.

రెండో విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, ఖుర్ఆన్ తప్పకుండా స్వస్థత. ఎందుకంటే అల్లాహ్ త’ఆలా తెలిపాడు ఈ విషయం ఖుర్ఆన్ లో. “వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా”, వాస్తవానికి మేము ఖుర్ఆన్ ద్వారా, ఖుర్ఆన్ ను స్వస్థత కొరకు అవతరింపజేశాము. “వ రహ్మతుల్ లిల్ ముఅమినీన్“, విశ్వాసుల కొరకు కారుణ్యంగా పంపాము.

అయితే ఇంతటి సత్యమైన మాటను మనం ఎలా తిరస్కరించగలుగుతాము? కానీ ఎంత ఎక్కువగా మన విశ్వాసం ఉంటుందో, ఎంత సత్యంగా మనం నమ్మి దీని ద్వారా చికిత్స చేయిస్తామో, అంతే ఎక్కువగా, అంతే తొందరగా అల్లాహ్ యొక్క దయతో మనకు స్వస్థత కలుగుతుంది. ఈ రోజుల్లో కొంతమందికి ఖుర్ఆన్ చదివినప్పటికీ స్వస్థత కలుగుతలేదు అని ఎవరైతే అంటారో వారు ఖుర్ఆన్ ను శంకించకూడదు, ఇంకా విశ్వాసం పాడైపోతుంది. తనలో, తాను అనాలసిస్ చేసుకోవాలి. తనలో తాను మార్పు తీసుకురావాలి. తనలో ఏ లోపం ఉందో, ఏ దోషం ఉందో దానిని కనుక్కునే ప్రయత్నం చేయాలి, దానిని వెతకాలి.

చిన్న ఉదాహరణ, షుగర్ రోగం తగ్గడానికి సర్వసాధారణంగా డాక్టర్లు, షుగర్ స్పెషలిస్టులు ఒక టాబ్లెట్ ఇస్తారు. స్టార్టింగ్ లో 2 mg. ఒక వారం, పది రోజులు, పదిహేను రోజులు, ఇరవై రోజులు ఇచ్చి చూసి డౌన్ కాకపోతే కొంచెం పెంచుతారు. కొందరు మూడు, మరికొందరు ఐదు. ఇంకా తగ్గకుంటే ఇంకొంచెం డోస్ పెంచుతారు, ఒకటి కాడ రెండు, లేదా దానితో పాటు మరొకటి ఉంది, అది ఇస్తారు. కొందరి కొందరికి 300 కు పైగా, 400 కు ఆ విధంగా ఉండేది ఉంటే 400 కూడా దాటి ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ గురించి కూడా సలహా ఇస్తారు. కానీ అనుభవజ్ఞులైన డాక్టర్లు, ఆయుర్వేద అనుభవజ్ఞులు, ఈ స్టార్టింగ్ డోస్ ద్వారానే మీకు 15 రోజుల్లో ఎందుకు తగ్గలేదు? మీరు ఏమైనా అన్నం తింటున్నారా? లేక మీరు పొటాటో లాంటి ఏమైనా కూరగాయలు తింటున్నారా? లేదా మీరు ఇంకా తీపి పదార్థాలు కూడా తింటూ ఉన్నారా? అని కూడా కనుక్కొని కొంచెం చురక పెడతారు. ఇది మీరు తగ్గించుకోకుంటే చాలా ప్రమాదంగా ఉంది అని. ఇక్కడ టాబ్లెట్ పని చేయకపోవడానికి ఒక ముఖ్య కారణం, అటువైపు నుండి మీరు ఏ పత్యం చేయాలో అందులో సరిగ్గా పాస్ అవ్వలేదు. ఒక్క కారణం చెప్తున్నాను, మీరు 100% గా ఇదే విషయాన్ని ఖుర్ఆన్ పై ఫిట్ చేయకండి, విషయం అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఖుర్ఆన్ చదివినప్పటికీ శారీరక కొన్ని రోగాలు మనకు దూరం కాలేదంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి కొరత లేదు నవూదుబిల్లాహ్, మనలో ఉంది. దాన్ని మనం అన్వేషించాలి, వెతకాలి, ఆ కొరత, ఆ లోపం, ఆ దోషాన్ని మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి.

దీనికి సంబంధించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. హజ్రత్ ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా తెలుపుతున్నారు. ఎప్పుడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారంటే, ఏం చేసేవారు? ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బి రబ్బిల్ ఫలక్, ఖుల్ అఊదు బి రబ్బిన్నాస్ చదువుకొని, తమ చేతులతో తమ శరీరంపై తుడుచుకునేవారు. ఎప్పుడైతే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణ వేదనకు గురి అయ్యారో, అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ దువాలు చదివి, ఈ సూరాలు చదివి, ప్రవక్త యొక్క చేతులను పట్టుకొని, ప్రవక్త యొక్క చేతులలో ఊది, ఎంతవరకు చేరగలుగుతుందో నేను ప్రవక్త చేతులతోనే ప్రవక్త శరీరంపై తుడుచేదాన్ని.ఇప్పుడు నేను చెప్పిన హదీస్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది.

ముస్నద్ అహ్మద్ లో ఒక హదీస్ ఉంది, ఉక్బా రది అల్లాహు త’ఆలా అన్హు చెప్పారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సందర్భంలో ఓ ప్రయాణంలో ఉన్నాను. సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజ్ లోని రెండు రకాతులలో సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్ చదివారు. మళ్ళీ చెప్పారు, “లమ్ యతఅవ్వద్ ముతఅవ్విదున్ బిమిస్లిహిన్”, ఓ ఉక్బా, ఏ రకమైన రోగం గానీ, ఏ సమస్య ఎదురైనా గానీ, ఈ రెండు సూరాల కంటే ఉత్తమమైన వేరే ఏదీ కూడా అవసరం లేవు. గమనించారా? యూదుల్లో ఒకరు ప్రవక్తపై చేతబడి చేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎందులోనైతే చేతబడి చేయడం జరిగిందో ఆ వస్తువులను తెప్పించారు. వాటిలో 11 ముడులు వేసి ఉన్నాయి. సూరతుల్ ఫలక్ మరియు సూరతున్నాస్, ఈ రెండు సూరాలలో కలిపి 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు సూరాల యొక్క తిలావత్ మొదలు పెట్టారు. ఒక్కొక్క ఆయత్ పూర్తి చేస్తున్నప్పుడు ఒక్కొక్క ముడి దానంతట అదే విడిపోయేది. ఏ విధంగా ముడులు విడిపోతూ ఉండేవో, ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వస్థత అనేది ఎక్కువగా, మంచిగా ఏర్పడుతూ వచ్చింది.

సహీహ్ బుఖారీ మరియు ముస్లింలో వచ్చినటువంటి అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు వారి యొక్క ఉల్లేఖనం, వారు ఓ ప్రయాణంలో ఉన్నారు, ఓ ప్రాంతం నుండి వెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది. ఆ ప్రాంతం యొక్క పెద్దలను కలిసి, మీ వద్ద మేము ఈ రాత్రి చుట్టాలుగా ఉంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే వారు ఇవ్వలేదు. ఆ ప్రాంతం యొక్క బయట శివార్లలో ఎలాగో రాత్రి గడుపుదాము అని ఉన్నారు. అదే రాత్రి ఆ గ్రామ పెద్ద మనిషికి ఏదో ఒక విషపురుగు కాటేసింది. ఎవరెవరో మంత్రగాళ్ళను, డాక్టర్లను పిలిపించి చికిత్స గురించి ప్రయత్నం చేయడం జరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు వారికి గుర్తొచ్చింది. అయ్యో, సాయంకాలం అయ్యేకి ముందుగా ఎవరో బయట నుండి కొందరు బాటసారులు వచ్చారు కదా, ఏమో వెళ్లి చూడండి కొంచెం ఏదైనా చుట్టుపక్కల ఉండవచ్చును, వారి దగ్గర ఏదైనా మంచి మందు ఉందో తెలుసుకుందాము. అబూ సయీద్ ఖుద్రీ రది అల్లాహు త’ఆలా అన్హు తన వెంట ఒక ఇద్దరిని తీసుకొని వెళ్లారు, సూరతుల్ ఫాతిహా చదివారు. అప్పటికప్పుడే అల్లాహ్ త’ఆలా ఆ గ్రామ పెద్ద మనిషికి ఆరోగ్యం ప్రసాదించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ ను శారీరక రోగాలకు కూడా స్వస్థతగా చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఈ స్వస్థతకు అడ్డు కలిగించే విషయాలు ఏమున్నాయో, వాటి నుండి మనం దూరం ఉండడం కూడా చాలా చాలా అవసరం. ఒకవేళ వాటి నుండి మనం దూరం ఉండలేము అంటే చాలా నష్టపోతాము.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ గ్రంథాన్ని మన కొరకు స్వస్థత అని ఎన్నో హదీసుల్లో కూడా తెలిపారు. అంతేకాదు, స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన కొరకు కొన్ని దువాలు కూడా నేర్పి ఉన్నారు. అందుకొరకు ఒక సహీ హదీస్ లో వస్తుంది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రది అల్లాహు త’ఆలా అన్హా వారి యొక్క ఉల్లేఖనం, ప్రవక్త వద్దకు ఒక అబ్బాయిని తీసుకురావడం జరిగింది. అతనికి అతనిపై షైతాన్ యొక్క ప్రభావం, షైతాన్ అతనిలో ప్రవేశించి ఉన్నాడు అని తెలిసింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ఆయతులు తిలావత్ చేసి అతనిపై ఊదుతారు, అల్లాహ్ త’ఆలా అతనికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు ఉన్నాయి,

కానీ చివరిలో నేను చెప్పే ముఖ్యమైన కొన్ని విషయాలు ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా మనం ఎలా స్వస్థత పొందాలి. మొట్టమొదటి విషయం, నేను చెప్పినటువంటి రెండు విషయాలను నమ్మాలి. అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ ముసబ్బిబుల్ అస్బాబ్, అన్ని సాధనాలకు మూల కారకుడు మరియు ఆ సాధనాలకు ఏ గుణం ఇచ్చాడో, ఆ గుణం ఇచ్చినవాడు అల్లాహ్ మాత్రమేనని. రెండో విషయం, అల్లాహ్ తలచినప్పుడే స్వస్థత కలుగుతుంది, అల్లాహ్ తలచినప్పుడే ప్రతీ సాధనం పని చేస్తుంది, అల్లాహ్ తలచినప్పుడే ఈ సృష్టిలో అల్లాహ్ కోరినది మాత్రమే జరుగుతూ వస్తుంది.

ఈనాటి నా ప్రసంగంలోని సారాంశంలో రెండో విషయం, ఖుర్ఆన్ ను మనం అల్లాహ్ యొక్క గ్రంథం అని, అల్లాహ్ యొక్క వాక్కు అని చాలా బలంగా విశ్వసించాలి. ఈ విశ్వాసంలో ఏ మాత్రం లోటు రాకూడదు, కొరత ఉండకూడదు, బలహీనంగా ఉండకూడదు.

ఈ ఖుర్ఆన్ మన యొక్క రోగాల, హృదయ రోగాలకు కూడా చికిత్స, మంచి ఔషధం, స్వస్థత కలుగుతుంది. అంటే, విశ్వాసం సరిగా లేనివారు విశ్వాసపరులు అవుతారు. నమాజులకు దూరం ఉన్నవారు నమాజు చదవగలుగుతారు. ఇంకా వేరే దుష్కార్యాలు చేసేవారు మంచి కార్యాలు చేయగలుగుతారు. కానీ ఎప్పుడు? ఖుర్ఆన్ ను చదివి శ్రద్ధగా అర్థం చేసుకొని దాని ప్రకారంగా ఆచరించినప్పుడు. ఖుర్ఆన్ గ్రంథం మన యొక్క ధర్మపరమైన అనుమానాలకు మంచి స్వస్థత కలుగజేస్తుంది. మరియు ఖుర్ఆన్ గ్రంథం మనలో ఏ చెడు పనుల గురించి కోరికలు పుడతాయో, మన యొక్క చెడు మనస్సు ఏ చెడులకైతే ప్రేరేపిస్తుందో, వాటన్నిటి నుండి కూడా అల్హందులిల్లాహ్ స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా? ఖుర్ఆన్ ను చదవడం ద్వారా, ఖుర్ఆన్ ను శ్రద్ధగా అర్థం చేసుకోవడం ద్వారా, ఖుర్ఆన్ ప్రకారంగా మన జీవితం గడుపుకోవడం ద్వారా.

అలాగే ఖుర్ఆన్ మన యొక్క శారీరక రోగాలకు కూడా మంచి స్వస్థత. అది కూడా ఎప్పుడు? పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, పూర్తి సత్యంతో మనం ఈ ఖుర్ఆన్ ను స్వయం మనం అనారోగ్యానికి గురి అయినప్పుడు గానీ, లేక వేరే ఇంకా ఏదైనా రోగికి చదవాలి.

కానీ గుర్తుంచుకోండి సోదర మహాశయులారా, ఈ ఖుర్ఆన్ ద్వారా అల్హందులిల్లాహ్ అల్లాహ్ త’ఆలా ఏ స్వస్థత మనకు కలుగజేస్తాడని శుభవార్త ఇచ్చాడో, ఖుర్ఆన్ లోని ఎన్నో ఆయతులలో, ఈ ఖుర్ఆన్ ను ప్రజల రోగాల కొరకు స్వస్థత అని ప్రజల విశ్వాసాలను పాడు చేయకూడదు. అబద్ధపు, అసత్యపు బోర్డులు వేసి, సోషల్ మీడియా ద్వారా తమ గురించి ప్రచారం చేసుకుంటూ, తమ నెంబర్ ప్రజలకు ఇస్తూ, రూహానీ ఇలాజ్, ఖురానీ ఇలాజ్ మా దగ్గర జరుగుతుంది అంటూ వారిని షిర్క్ లో పడవేయడం గానీ, ఖురానీ ఇలాజ్ అన్న పేరుతో నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల కోడి, ఫలానా రాత్రి, ఫలానా చోట జిబా చేయాలి అన్నటువంటి ఆదేశాలు ఇవ్వడం, సోదర మహాశయులారా ఫలానా సమాధి వద్ద, ఫలానా బాబాగారు ఖుర్ఆన్ తో ఇలాజ్ మరియు స్వస్థత కలుగజేస్తాడట అని అలాంటి సమాధుల వైపునకు వెళ్లడం, ఈ విషయాలన్నీ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను చివరిలో, ఈ తప్పు విషయాల నుండి మనం చాలా దూరం ఉండాలి. వీటి ద్వారా విశ్వాసం పాడైపోతుంది, వీటి ద్వారా మనం ఇస్లాం నుండి దూరమైపోతాము అని మనం భయపడాలి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఖుర్ఆన్ ద్వారా సరైన రీతిలో, అల్లాహ్ కు ఇష్టమైన రీతిలో, ప్రవక్త యొక్క పద్ధతి, విధానంలో స్వస్థత కోరే, పొందే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వ ఆఖిరు దఅవానా అనిల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

  • అల్లాహ్‌పై దృఢ విశ్వాసం: సర్వశక్తిమంతుడు అల్లాహ్ యే అని, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదని గట్టిగా నమ్మాలి. అన్నీ ఆయన తలచినప్పుడే జరుగుతాయి.
  • ఖుర్ఆన్ – కేవలం చికిత్స కాదు, సంపూర్ణ స్వస్థత: అల్లాహ్ ఖుర్ఆన్‌ను కేవలం ఔషధం (దవా) లేదా చికిత్స (ఇలాజ్) అని చెప్పలేదు, సంపూర్ణ స్వస్థత (షిఫా) అని స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం ఖుర్ఆన్ ద్వారా రోగం పూర్తిగా నయమవుతుంది.
  • శారీరక మరియు ఆధ్యాత్మిక రోగాలకు నివారణ: ఖుర్ఆన్ కేవలం జ్వరం, నొప్పి వంటి శారీరక రోగాలకే కాకుండా, అనుమానాలు, సందేహాలు, చెడు ఆలోచనలు వంటి హృదయ సంబంధమైన (ఆధ్యాత్మిక) రోగాలకు కూడా స్వస్థతను కలిగిస్తుంది.
  • విశ్వాసులకు ప్రత్యేకం: ఖుర్ఆన్ సర్వమానవాళికి మార్గదర్శకమైనప్పటికీ, దాని ద్వారా సంపూర్ణ స్వస్థత మరియు కారుణ్యం పొందేది విశ్వాసులు మాత్రమే. ఎందుకంటే వారు దానిని నమ్మి ఆచరిస్తారు.
  • సరైన పద్ధతిలో ఆచరించడం ముఖ్యం: తేనె సీసా ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం రానట్లే, ఖుర్ఆన్‌ను చదవకుండా, అర్థం చేసుకోకుండా, దాని బోధనలను ఆచరించకుండా ఇంట్లో పెట్టుకుంటే స్వస్థత కలగదు.
  • మూఢనమ్మకాలకు దూరం: ఖుర్ఆన్ పేరుతో నిమ్మకాయలు, కోడి బలులు, సమాధుల వద్ద మొక్కుబడులు వంటి షిర్క్ మరియు మూఢనమ్మకాలకు పాల్పడకూడదు. ఇది విశ్వాసాన్ని నాశనం చేస్తుంది.
  • లౌకిక చికిత్సను తిరస్కరించరాదు: ఖుర్ఆన్ స్వస్థత ఇస్తుందని వైద్య చికిత్సను మానేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చికిత్స చేయించుకోవాలని బోధించారు. ఖుర్ఆన్ పారాయణంతో పాటు వైద్యం కూడా కొనసాగించాలి.
  1. విశ్వాసాన్ని బలపరచుకోండి: ప్రతిదీ అల్లాహ్ అధీనంలోనే ఉందని, ఆయన తలచినప్పుడే స్వస్థత లభిస్తుందని మీ విశ్వాసాన్ని దృఢపరచుకోండి.
  2. ఖుర్ఆన్‌ను రోజూ పారాయణం చేయండి: ఖుర్ఆన్‌ను అర్థంతో సహా క్రమం తప్పకుండా చదవండి. దాని బోధనలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి.
  3. రుఖియా (ఖుర్ఆన్ ద్వారా చికిత్స) చేసుకోండి: అనారోగ్యానికి గురైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన పద్ధతిలో సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఫలక్, సూరతున్నాస్ వంటి సూరాలను చదివి మీపై లేదా రోగిపై ఊదుకోండి.
  4. దువా చేయండి: స్వస్థత కోసం అల్లాహ్‌ను ప్రార్థించండి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నేర్పిన దువాలను నేర్చుకొని వాటి ద్వారా అల్లాహ్‌ను వేడుకోండి.
  5. పాపాలకు దూరంగా ఉండండి: స్వస్థతకు అడ్డుపడే పాప కార్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మీలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
  6. మూఢనమ్మకాలను వదిలివేయండి: ఖుర్ఆన్ పేరుతో జరిగే మోసాలకు, షిర్క్‌కు దారితీసే పద్ధతులకు దూరంగా ఉండండి. స్వస్థతను ఇచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమేనని నమ్మండి.
  7. వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేయవద్దు: రుఖియాతో పాటు నిపుణులైన వైద్యుల సలహా తీసుకోండి మరియు వారు సూచించిన మందులను వాడండి. ఇస్లాం వైద్య చికిత్సను ప్రోత్సహిస్తుంది.
  8. సమస్య ఆరంభంలోనే ఖుర్ఆన్‌ను ఆశ్రయించండి: కేవలం అన్ని దారులు మూసుకుపోయాకే కాకుండా, అనారోగ్యం ప్రారంభ దశలోనే ఖుర్ఆన్ ద్వారా స్వస్థత కోసం ప్రయత్నించండి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=13889

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran