త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2) : షిర్క్ , ధర్మభ్రష్టత (రిద్దత్) – మరణానంతర జీవితం : పార్ట్ 43 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (2)
[మరణానంతర జీవితం – పార్ట్ 43]
https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్‌తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్‌కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.

త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్‌కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.

అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.

మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా]
అల్లాహ్‌కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)

ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్‌తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్‌ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్‌ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్‌ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.

ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
[ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్‌ఫిరు మాదూన దాలిక లిమన్‌ యషా]
తనకు భాగస్వామ్యం (షిర్క్‌) కల్పించటాన్ని అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్‌ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.

وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا
[వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా]
అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)

మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్‌తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్‌ను స్వీకరించాలి.

సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.

వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.

సూరె జుమర్ ఆయత్ నెంబర్ 65.

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
[వలఖద్ ఊహియ ఇలైక వ ఇలల్లజీన మిన్ ఖబ్లిక లఇన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్]

“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.

ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.

రండి సోదరులారా! షిర్క్‌ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.

ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.

అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.

ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.

وَلَئِن سَأَلْتَهُمْ لَيَقُولُنَّ إِنَّمَا كُنَّا نَخُوضُ وَنَلْعَبُ ۚ قُلْ أَبِاللَّهِ وَآيَاتِهِ وَرَسُولِهِ كُنتُمْ تَسْتَهْزِئُونَ لَا تَعْتَذِرُوا قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ

(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్‌తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు. మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)

మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్‌కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.

వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.

అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.

షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.

సూరె ముహమ్మద్ ఆయత్ నెంబర్ తొమ్మిది.

ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుమ్ కరిహూ మా అన్జలల్లాహు ఫ అహ్బత అఅమాలహుమ్]

“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)

ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.

అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.

ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్‌కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్‌కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.

ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
[దాలిక బిఅన్నహుముత్తబఊ మా అస్ఖతల్లాహ వకరిహూ రిద్వానహూ ఫఅహ్బత అఅమాలహుమ్]

“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)

ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్‌కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్‌కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.

అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్‌కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.

అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43992

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6) – మరణానంతర జీవితం : పార్ట్ 47 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (6)
[మరణానంతర జీవితం – పార్ట్ 47]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=rCFxyKebOx8 [22 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి వివరించబడింది. ప్రధానంగా, అల్లాహ్ మార్గంలో పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీలను కాపాడకుండా వారికి ద్రోహం చేయడం, ఆత్మహత్య చేసుకోవడం, అకారణంగా భర్తకు అవిధేయత చూపడం, ప్రజలు ఇష్టపడని ఇమామ్, మరియు యజమాని నుండి పారిపోయిన బానిస వంటి వారి నమాజులు స్వీకరించబడకపోవడం, దానధర్మాలు చేసి వాటిని చెప్పుకుని బాధపెట్టడం, గర్వంతో చీలమండలాల కిందికి దుస్తులు ధరించడం, మరియు అమ్మకాలలో అబద్ధపు ప్రమాణాలు చేయడం వంటి పాపాల తీవ్రత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో చర్చించబడింది. ఈ పాపాలు కర్మల త్రాసును తేలికగా చేయడమే కాక, అల్లాహ్ యొక్క ఆగ్రహానికి మరియు కఠినమైన శిక్షకు కారణమవుతాయని హెచ్చరించబడింది.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు. అల్ హమ్దులిల్లాహి కఫా వ సలామున్ అలా ఇబాదిల్లజీనస్ తఫా అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

వాటిలో 14వ విషయం, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా, వారి విషయంలో అపహరణలకు, అక్రమానికి పాల్పడడం.

మహాశయులారా, అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే, అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరిగితే, అందులో పాల్గొనడం అని భావం వస్తుంది. అయితే, అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే, ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడానికి మరియు అల్లాహ్ యొక్క సత్య ధర్మాన్ని తెలుసుకోవడానికి, విద్య అభ్యసించడానికి ప్రయాణం చేసేవారు, ఈ విధంగా ఇంకా ఎన్నో పుణ్య కార్యాల గురించి కూడా ఈ పదం ఉపయోగపడుతుంది. అయితే మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు.

حُرْمَةُ نِسَاءِ الْمُجَاهِدِينَ عَلَى الْقَاعِدِينَ كَحُرْمَةِ أُمَّهَاتِهِمْ عَلَيْهِمْ
(హుర్మతు నిసాయిల్ ముజాహిదీన అలల్ ఖాఇదీన క హుర్మతి ఉమ్మహాతిహిమ్ అలైహిమ్)

ఎలాగైతే అల్లాహ్ మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో, గ్రామాల్లో, తమ ఇంట్లో కూర్చుండి ఉంటారో, వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో, అలాగే పోరాడటానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం.

అంటే, స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో, వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడూ ఊహించకుండా మనం ఉంటామో, అలాగే అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా ఆ విధంగా భావించాలి, వారికి రక్షణ ఇవ్వాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో ఒకటి. కానీ అలా చేయకుండా, ఎవరైతే అపహరణకు గురి చేస్తారో, వారి మాన పరువుల్లో జోక్యం చేసుకుంటారో, వారికి ఏ రకమైన ఇబ్బంది కలుగజేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ఆ అల్లాహ్ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు. ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో, అతన్ని పిలుస్తాడు. పిలిచి, ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం తెలియజేస్తూ,

فما ظنكم
(ఫమా జన్నుకుమ్)

చెప్పండి, ఇతని పుణ్యాల నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి. ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు.

ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికైనా, ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా, లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్లి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం గానీ, ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా? వారికి రక్షణ కలుగజేస్తున్నారా? ఇంకా ఎవరైతే బయటికి వెళ్లి అల్లాహ్ మార్గంలో ఉంటున్నారో, అల్లాహ్ యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి ఇళ్లల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం, వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్నవారందరి యొక్క బాధ్యత.

ఇంకా మహాశయులారా! ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో 15వ విషయం, ఆత్మహత్య చేసుకోవడం. అల్లాహు అక్బర్! ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అల్లాహ్ పై విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో, తమ చదువులో, ఇహలోకపు బూటకపు ప్రేమల్లో, ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యూర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కానీ, ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అతడు నరకవాసి అని. కొందరు సహచరులకు, ఏంటి, అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది. కానీ వారిలోనే ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు. చివరికి ఏం జరిగింది? ఎంతో మందిని అతను హత్య చేసి, ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి, ఏదో ఒక బాణం వచ్చి అతనికి గుచ్చుకుంది. దాన్ని అతను భరించలేక, స్వయంగా తన బాణంతోనే తనను తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసిన వెంటనే అతను పరుగెత్తుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, మీరు చెప్పిన మాట నిజమైంది. అల్లాహ్ సాక్షిగా మీరు సత్య ప్రవక్త, ఇందులో ఎలాంటి అనుమానం లేదు.” ప్రవక్త అడిగారు, “ఏమైంది విషయం? ఏం చూశావు? ఏం జరిగింది?” అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రవక్తా, ఎవరి గురించైతే, ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ, పొగుడుతూ ఉండగా, మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో, అతన్ని నేను నా కళ్ళారా చూశాను, తనకు తాను చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా అల్లాహ్ త’ఆలా మీ యొక్క మాటను సత్యపరిచాడు,” అని తెలియపరిచాడు.

ఈ విధంగా మహాశయులారా, అందుగురించే అనేకమంది సహాబాయే కిరామ్ రదియల్లాహు అన్హుమ్ వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి. అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది.

అయితే ఈ విధంగా మహాశయులారా, ఆత్మహత్యకు పాల్పడకూడదు. ఆత్మహత్య అన్నది ఏమిటి? వాస్తవానికి, ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఎప్పుడూ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడం. ఎందుకంటే సహీ హదీసులో వచ్చి ఉంది,

ఎవరైతే ఏ మార్గంతో, ఏ విధంగా, ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో, అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు, తీర్పు దినాన తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది. చివరికి అతడు, అయ్యో, నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమీకి పనికి రాదు.

మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? ప్రవక్త కాలంలో, ప్రవక్త తోడుగా ఉండి, ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని, ఎంతో ధైర్యంగా పోరాడి, ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని, ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి నరకంలోకి వెళ్ళాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం. అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్మార్గం చూపుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై పోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము పట్ల అసహ్యించుకొనుట, ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట. ఈ మూడు పాపాలు ఎలాంటివి అంటే, దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో చాలా గొప్ప సత్కార్యం. ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో, త్రాసు బరువు అనేది కాజాలదు, తేలికగా అవుతుంది. ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది. వినండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసు.

ثَلَاثَةٌ لَا تُجَاوِزُ صَلَاتُهُمْ آذَانَهُمْ
(సలాసతున్ లా తుజావిజు సలాతుహుమ్ ఆజానహుమ్)
మూడు రకాల వారు, వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు.

అంటే, అల్లాహ్ వద్దకు వెళ్లి అక్కడ అల్లాహ్ స్వీకరించడం, అది ఇంకా దూరం. వారి మీదికే వెళ్ళదు. అంటే భావం, స్వీకరించబడదు. ఎవరు ఆ ముగ్గురు? ఆ మూడు రకాల వారు ఎవరు?

తన యజమాని నుండి పారిపోయిన దాసుడు, అతను తిరిగి వచ్చేంత వరకు అతని నమాజు స్వీకరించబడదు. మరియు ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో, అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలై, భర్త ఆగ్రహానికి, రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో, ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహ్యించుకుంటున్నారో, ఒకవేళ వారి అసహనం, వారు అసహ్యించుకొనడం హక్కుగా ఉంటే, అలాంటి ఇమామ్ యొక్క నమాజు కూడా స్వీకరించబడదు. అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు.

ఈ విధంగా మహాశయులారా, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. హదీస్ నెంబర్ 360. మరియు షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో పేర్కొన్నారు. హదీస్ నెంబర్ 3057.

కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే, ఇలాంటి భార్యలు, ఇలాంటి ఇమాములు, ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో, మేము ఎందుకు నమాజు చేయాలి అని నమాజును విడనాడకూడదు. నమాజు స్వీకరించకపోవడానికి కారణం ఏ పాపమైతే ఉందో, అలాంటి పాపాన్ని వదులుకొని నమాజు స్వీకరించబడే విధంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి.

17వ కార్యం, దీనివల్లనైతే త్రాసు తేలికగా అయిపోతుందో అది, దానధర్మాలు చేసి ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మనందరికీ సంకల్ప శుద్ధి ప్రసాదించుగాక. ఈ రోజుల్లో ఈ చెడు గుణం చాలా మందిలో చూడడం జరుగుతుంది. ఒకరి పట్ల ఏదైనా మేలు చేస్తారు, ఒకరికి ఏదైనా దానధర్మాలు చేస్తారు, ఒకరికి అతను ఏదైనా విషయంలో సహాయపడతారు, ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు, తర్వాత ఎద్దేవా చేయడం, తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం, తర్వాత నేను చేయడం వల్ల, నేను నీకు సహకరించడం వల్ల, నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంత పైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు. ఇలా బాధ కలిగించే వారి ఆ దానధర్మాలు, ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి. వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు.

ఖురాన్లో అల్లాహ్ త’ఆలా ఈ విధంగా తెలియపరిచాడు.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُمْ بِالْمَنِّ وَالْأَذَىٰ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుబ్తిలూ సదఖాతికుమ్ బిల్ మన్ని వల్ అజా)

“ఓ విశ్వాసులారా! మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.”(2:264)

దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది. మీరు చేసిన ఆ దానం, దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో కూడా తెలిపారు. ఆ హదీసు ఇన్ షా అల్లాహ్ దీని తర్వాత ప్రస్తావిస్తాను.

18వ కార్యం, దీనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో, చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, “సలాసతున్” మూడు రకాల మనుషులు ఉన్నారు, అల్లాహ్ త’ఆలా వారితో మాట్లాడడు, ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపున చూడడు, వారిని పరిశుద్ధ పరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు ప్రస్తావించారు. అబూజర్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు,

خَابُوا وَخَسِرُوا، مَنْ هُمْ يَا رَسُولَ اللَّهِ؟
(ఖాబూ వ ఖసిరూ, మన్ హుమ్ యా రసూలల్లాహ్?)
“ప్రవక్తా, వారైతే నాశనమైపోయారు, వారైతే చాలా నష్టపోయారు. ఎవరు అలాంటి వారు?”

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

“చీలమండలానికి కిందిగా దుస్తులు ధరించేవాడు, ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు, మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు” అని. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది, హదీస్ నెంబర్ 106.

ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది? దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా? మనలో ఎంతోమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు. దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది. ఒకటి, అల్లాహ్ మన వైపున చూడడు. రెండవది, అల్లాహ్ మనతో మాట్లాడడు. మూడవది, అల్లాహ్ మనల్ని పరిశుద్ధ పరచడు. నాలుగవది, అల్లాహ్ త’ఆలా కఠిన శిక్ష ఇస్తాడు. ఈ విధంగా మహాశయులారా, ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి? ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో, ఒకరికి ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో, మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య ప్రమాణాలు చేస్తున్నారో.

ఈ విధంగా మహాశయులారా, అల్లాహ్ యొక్క దయవల్ల మనం మరణానంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం, త్రాసు నెలకొల్పడం, త్రాసును నెలకొల్పడం, న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల, ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది, ఏ దుష్కార్యాల వల్ల త్రాసు తేలికగా అవుతుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము. ఇక మిగిలినది ఏమిటి? మనము సత్కార్యాలు చేయడంలో ముందుకు వెళ్ళాలి. మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి. దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. తేలికగా ఉండకుండా, త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి. అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము. ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు, మీకు చెప్పడం, తెలపడం జరిగింది. ఇక మీ బాధ్యత, మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి. ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో, అంతే ఎక్కువగా మన యొక్క త్రాసు కూడా బరువుగా అవుతూ ఉంటుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ప్రతిరోజు మనం పడుకునే ముందు, బిస్మిల్లాహి, ఓ అల్లాహ్ నీ యొక్క పేరుతో నేను నిద్రపోతున్నాను. ప్రళయ దినాన నా యొక్క త్రాసును నీవు బరువుగా చేయి అని దుఆ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి ఒక దుఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా కూడా రుజువై ఉన్నది.

అల్లాహ్ మనందరి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేయుగాక. అల్లాహ్ త’ఆలా మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక. మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో, అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43905

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2] – కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్ [మరణానంతర జీవితం – పార్ట్ 24] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [2]
కోపాన్ని దిగమింగటం, జనాజా నమాజు, తహజ్జుద్ నమాజ్
[మరణానంతర జీవితం – పార్ట్ 24] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=qB4bqlE_8NE
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయదినాన సత్కార్యాల త్రాసును బరువుగా చేసే పనుల గురించి వివరించబడింది. మూడవ సత్కార్యం అల్లాహ్ ప్రసన్నత కోసం కోపాన్ని దిగమింగడం. ఇది ఒక వ్యక్తికి ప్రపంచం మరియు దానిలో ఉన్న సమస్తం కంటే మేలైన పుణ్యాన్ని అందిస్తుందని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. నాల్గవది, జనాజా నమాజ్‌లో పాల్గొని, ఖననం పూర్తయ్యే వరకు అంతిమయాత్రను అనుసరించడం. దీనికి ప్రతిఫలంగా రెండు మహా పర్వతాలంత పుణ్యం లభిస్తుంది. ఐదవది, రాత్రిపూట (తహజ్జుద్) నమాజ్‌లో కనీసం పది ఖురాన్ ఆయతులను పఠించడం. ఇది ఒక వ్యక్తిని అశ్రద్ధ చేసేవారి జాబితా నుండి తొలగించి, అపారమైన పుణ్యాన్ని అందిస్తుంది. ఈ కర్మలు చూడటానికి చిన్నవిగా అనిపించినా, వాటి ప్రతిఫలం చాలా గొప్పదని మరియు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయని బోధించబడింది.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటున్నాము. అందులో మూడవ సత్కార్యం కోపాన్ని దిగమింగటం. అల్లాహు అక్బర్.

ఈ రోజుల్లో మనలో ఎంతో మంది అనవసరంగా కోపానికి గురి అవుతూ ఉంటారు. ధర్మ విషయంలో, అల్లాహ్ కొరకు కోపానికి రావడం, ఇది కూడా ఒక మంచి విషయం, సత్కార్యంలో లెక్కించబడుతుంది. కానీ దాని హద్దులో ఉండడం చాలా అవసరం. అయితే సామాన్య జీవితంలో కోపం అనేది సామాన్యంగా మంచి విషయం కాదు. మనిషికి ఎప్పుడైతే కోపం వస్తుందో అతను ఎన్నో రకాల చెడుకు, ఎన్నో రకాల పాపానికి, ఎన్నో రకాల అత్యాచారాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అందుగురించి కోపాన్ని దిగమింగే వారి గురించి చాలా గొప్ప ఘనత తెలపడమే కాకుండా, ఇది మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో కూడా ఒకటి అని తెలపడం జరిగింది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. ఇబ్ను మాజా, ముస్నద్ అహ్మద్, అదబుల్ ముఫ్రద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాలతో పాటు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2752.

مَا مِنْ جُرْعَةٍ أَعْظَمُ أَجْرًا عِنْدَ اللَّهِ مِنْ جُرْعَةِ غَيْظٍ كَظَمَهَا عَبْدٌ ابْتِغَاءَ وَجْهِ اللَّهِ
(మా మిన్ జుర్‌అతిన్ అఅజము అజ్రన్ ఇందల్లాహ్ మిన్ జుర్‌అతి గైజిన్ కజమహా అబ్దున్ ఇబ్తిగాఅ వజ్‌హిల్లాహ్)
అల్లాహ్ వద్ద పుణ్యపరంగా అతి గొప్ప గుటక, అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకై దాసుడు తన కోపాన్ని మింగే గుటక.

గమనించండి ఇక్కడ విషయం. ఎలాంటి గుటక అల్లాహ్ వద్ద మనకు అతి గొప్ప పుణ్యాన్ని పొందే విధంగా చేస్తుంది? కోపాగ్ని గుటక. ఏదైతే మనిషి కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికై మింగేస్తాడో. అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు కోపాన్ని దిగమింగడం, కోపం ఉన్నా, ఆ కోపాన్ని నెరవేర్చే అటువంటి శక్తి మన వద్ద ఉన్నా, దాని ద్వారా ఇతరులకు ఏ చెడుకు కలగజేయకుండా కోపాన్ని దిగమింగడం ఎంత గొప్ప పుణ్యాన్ని ప్రాప్తిస్తుంది.

ఇలా కోపాన్ని దిగమింగి, ఎదుటి వారితో ప్రతీకారం తీర్చుకోకుండా మన్నించే వారిని స్వయంగా అల్లాహ్ ప్రశంసించాడు. ఖురాన్‌లో అలాంటి వారిని ప్రశంసించాడు. చదవండి సూరె ఆలి ఇమ్రాన్. ఆయత్ నెంబర్ 134 మరియు 136.

الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
(అల్లజీన యున్ఫికూన ఫిస్సర్రాఇ వద్దర్రాఇ వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాస్, వల్లహు యుహిబ్బుల్ ముహ్సినీన్)
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.” (3:134)

కలిమిలో నున్నా, బలిమిలో నున్నా, సిరివంతులైనా, పేదవారైనా అన్ని స్థితుల్లో ఖర్చు చేస్తూ ఉండేవారు. మరియు తమ కోపాన్ని దిగమింగేవారు. ప్రజల్ని మన్నించేవారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు, అల్లాహ్ ప్రేమిస్తాడు.

ఆ తర్వాత ఆయతులో మరికొన్ని ఉత్తమ గుణాలను ప్రస్తావించి, వారికి లభించే పుణ్యం ఎలాంటిదో 136వ ఆయతులో ప్రస్తావించాడు.

أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
(ఉలాఇక జజాఉహుమ్ మగ్ఫిరతుమ్ మిర్రబ్బిహిమ్ వ జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హారు ఖాలిదీన ఫీహా, వనిఅమ అజ్రుల్ ఆమిలీన్)
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!.” (3:136)

అలాంటి వారికి తమ ప్రభువు వైపు నుండి ప్రతిఫలం ఏమిటంటే తమ ప్రభువు వైపు నుండి వారికి క్షమాపణ లభిస్తుంది, మన్నింపు లభిస్తుంది. మరియు స్వర్గాలు. ఎలాంటి స్వర్గవనాలు? వారి పాదాల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు అందులో సదా కాలం ఉంటారు. ఇలాంటి సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం కూడా ఎంత మేలు ఉంది.

ఈ విధంగా అల్లాహ్ త’ఆలా స్వయంగా కోపాన్ని దిగమింగే వారి గురించి, ప్రజల్ని మన్నించే వారి గురించి ఎంతో గొప్పగా ప్రశంసిస్తున్నాడు.

ఇంతటితో సరి కాకుండా, ఎవరైతే అల్లాహ్ అభీష్టాన్ని పొందడానికి మాత్రమే తమ కోపాన్ని దిగమింగుతారో, అల్లాహ్ త’ఆలా వారికి ఇంతకంటే ఇంకా ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తాడని వాగ్దానం చేశాడు. ఆ హదీసును ఇమామ్ అబూ దావూద్, ఇమామ్ తిర్మిజీ, ఇమామ్ ఇబ్ను మాజా, ఇమామ్ అహ్మద్ తమ హదీథ్ గ్రంథాల్లో ప్రస్తావించారు. మరియు షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుత్తర్గీబ్‌లో దానిని పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 2753.

مَنْ كَظَمَ غَيْظًا وَهُوَ قَادِرٌ عَلَى أَنْ يُنْفِذَهُ دَعَاهُ اللَّهُ عَزَّ وَجَلَّ عَلَى رُءُوسِ الْخَلَائِقِ يَوْمَ الْقِيَامَةِ حَتَّى يُخَيِّرَهُ اللَّهُ مِنَ الْحُورِ الْعِينِ مَا شَاءَ
(మన్ కజమ గైజన్ వహువ ఖాదిరున్ అలా అన్ యున్ఫిజహు దఆహుల్లాహు అజ్జవజల్ల అలా రుఊసిల్ ఖలాయిఖి యౌమల్ ఖియామతి హత్తా యుఖయ్యిరహుల్లాహు మినల్ హూరిల్ ఈని మా షాఅ)

“ఎవరైతే తమ కోపాన్ని దిగమింగుతారో, అతను తలచుకుంటే తన కోపాన్ని ప్రతీకారంగా తీర్చుకునే శక్తి కూడా కలిగి ఉన్నాడు, కానీ కేవలం అల్లాహ్ సంతృష్టిని పొందడానికి మాత్రమే అతను కోపాన్ని దిగమింగుతాడు. అలాంటి వ్యక్తిని ప్రళయ దినాన ప్రజలందరి మధ్యలో నుండి అల్లాహ్ త’ఆలా అతన్ని పిలిచి, హూరె ఈన్ (స్వర్గపు కన్య స్త్రీలలో, పవిత్ర స్త్రీలలో) తనకు ఇష్టమైన వారిని ఎన్నుకోవడానికి అల్లాహ్ త’ఆలా అతనికి ఛాయిస్ (అధికారం) ఇస్తాడు.”

ఈ విధంగా మహాశయులారా, ఎవరైతే ఇహలోకంలో కోపాన్ని దిగమింగుతారో అల్లాహ్ త’ఆలా ఇంత గొప్ప ప్రతిఫలం అతనికి ఇస్తారు అంటే, ఈ విధంగా అతని యొక్క సత్కార్యాల త్రాసు ఎంతో బరువుగా అవుతుంది.

దీని ద్వారా మనకు మరో గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే, మనిషి కోపానికి వచ్చినప్పుడు ఎదుటి వానిని చిత్తు చేసి, పడవేసి, నాలుగు తిట్టి, దూషించి, అతన్ని కొట్టడమే ఇది శూరుడు, పెహల్వాన్ అన్న భావం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కూడా తెలియబరిచారు.

لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ
(లైసష్షదీదు బిస్సురఅ, ఇన్నమష్షదీదుల్లజీ యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్)

“ఎదుటి వాడిని చిత్తు చేసే వాడే శూరుడు కాదు. అసలైన శూరుడు ఎవరంటే, తాను ఆగ్రహదోగ్రుడైనప్పుడు, కోపానికి గురి అయినప్పుడు తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు.”

ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది. హదీథ్ నెంబర్ 6114. మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది. హదీథ్ నెంబర్ 2950.

ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో, సత్కార్యాలతో బరువుగా ఉండాలంటే, అందులో మూడవ విషయం కోపాన్ని దిగమింగడం. మనం మన జీవితంలో కోపాన్ని దిగమింగుతూ మన త్రాసును బరువుగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసును బరువు చేసే విషయాలు ఏమిటి అనే ఈ పాఠంలో, ఈ శీర్షికలో, నాల్గవ విషయం… జనాజా నమాజ్ చేయడం మరియు జనజాల వెంట వెళ్ళడం.

సోదర సోదరీమణులారా, జనాజా వెంట వెళ్ళడం, జనాజా నమాజ్ చేయడం ఇది మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువగా బరువు ఉంటుంది. మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఇలా ఉంది.

مَنْ تَبِعَ جَنَازَةً حَتَّى يُصَلَّى عَلَيْهَا وَيُفْرَغَ مِنْهَا فَلَهُ قِيرَاطَانِ، وَمَنْ تَبِعَهَا حَتَّى يُصَلَّى عَلَيْهَا فَلَهُ قِيرَاطٌ، وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَثْقَلُ فِي مِيزَانِهِ مِنْ أُحُدٍ
(మన్ తబిఅ జనాజతన్ హత్తా యుసల్లా అలైహా వ యుఫ్రగ మిన్హా ఫలహు కీరాతాన్, వమన్ తబిఅహా హత్తా యుసల్లా అలైహా ఫలహు కీరాతున్, వల్లజీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లహువ అస్ఖలు ఫీ మీజానిహి మిన్ ఉహుద్)

“ఎవరైతే జనాజా వెంట వెళ్లి జనాజా నమాజ్ చేసి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు దాని వెంట ఉంటాడో, అతనికి రెండు కీరాతుల పుణ్యం. మరి ఎవరైతే కేవలం నమాజ్ చేసే వరకే జనాజా వెంట ఉంటారో వారికి ఒక్క కీరాత్. ముహమ్మద్ ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా, ఆ రెండు కీరాతులు ప్రళయ దినాన త్రాసులో ఉహుద్ పర్వతం కంటే ఎక్కువగా బరువుగా ఉంటుంది.”

గమనించారా? స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం త్రాసులో ఈ పుణ్యాలు ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉంటాయని మనకు ఎంత స్పష్టంగా తెలియజేశారో. ఇకనైనా మనం జనాజా నమాజ్‌లో పాల్గొందామా?

అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను అతని జనాజాలో ఎందుకు వెళ్ళాలి? నా బంధువు కాదు కదా, నా తోటి పనిచేసేవాడు కాదు కదా, నా ఫ్రెండ్ కాదు కదా ఈ విధంగా చూసుకుంటున్నారు. అదే అతని దగ్గరి బంధువుల్లో ఎవరైనా ఏది ఉంటే, వారి జనాజాలోకి వెళ్తున్నారు. మరికొందరైతే అతను నా బంధువే కానీ అతనితో నా సంబంధాలు మంచిగా లేవు గనుక, అతను బ్రతికి ఉన్న కాలంలో నేను అతని జనాజాలో వెళ్ళను. అతనితోనే ఈ విధంగా పగ తీర్చుకొని ఏమి సంపాదిస్తున్నాము మనము? మనం ప్రళయ దినాన మన త్రాసులో ఉహుద్ పర్వతానికంటే ఎక్కువ బరువుగా ఉన్నటువంటి ఈ సత్కార్యాన్ని కోల్పోయి ఇంతటి గొప్ప పుణ్యాన్ని మనం మన చేజేతురాలా పోగొట్టుకుంటున్నాము.

జనాజాకు సంబంధించిన మరొక హదీథ్ వినండి. అందులో ఉహుద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది. ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, హదీథ్ నెంబర్ 1325, మరియు ముస్లిం షరీఫ్‌లో కూడా ఉంది, హదీథ్ నెంబర్ 945.

مَنْ شَهِدَ الْجَنَازَةَ حَتَّى يُصَلِّيَ فَلَهُ قِيرَاطٌ، وَمَنْ شَهِدَ حَتَّى تُدْفَنَ كَانَ لَهُ قِيرَاطَانِ. قِيلَ: وَمَا الْقِيرَاطَانِ؟ قَالَ: مِثْلُ الْجَبَلَيْنِ الْعَظِيمَيْنِ
(మన్ షహిదల్ జనాజత హత్తా యుసల్లియ ఫలహు కీరాతున్, వమన్ షహిద హత్తా తుద్ఫన కాన లహు కీరాతాన్. కీల వమల్ కీరాతాన్? కాల మిస్లుల్ జబలైనల్ అజీమైన)

“ఎవరైతే కేవలం జనాజా నమాజ్ చేసే అంతవరకు జనాజా వెంట ఉంటారో అతనికి ఒక్క కీరాత్, మరియు ఎవరైతే జనాజా నమాజ్ తర్వాత ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటారో వారికి రెండు కీరాతులు. రెండు కీరాతులు అంటే ఎంత అని ప్రశ్న వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: రెండు మహా పెద్ద పర్వతాలకు సమానం అని.”

పెద్ద పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలా? అంతకంటే మరీ పెద్దవియా? కావచ్చు. అది మనం ఎంత సంకల్ప శుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు.

ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు, ఏ శవం వెంటనైనా ఖబ్రిస్తాన్‌లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకు ఎప్పుడైనా బాధ కలుగుతుందా? హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు త’ఆలా అన్హు గారి గురించి ముస్లిం షరీఫ్‌లో ఉల్లేఖన ఉంది. జనాజా నమాజ్ చేస్తే ఒక కీరాత్ పుణ్యం అన్న విషయం వారికి తెలిసి ఉండే. కానీ ఖబ్రిస్తాన్ వరకు వెళ్లి, ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉంటే రెండు కీరాతులు అన్న విషయం అబ్దుల్లాహ్ బిన్ ఉమర్‌కు చాలా రోజుల వరకు తెలియలేదు. ఎప్పుడైతే అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖన ఆయన విన్నారో, రెండు కీరాతుల పుణ్యం అని, చాలా బాధపడ్డారు. మాటిమాటికి అనేవారు, అయ్యో ఎన్ని కీరాతుల పుణ్యాలు మనం కోల్పోయాము కదా అని.

ఏదైనా ప్రభుత్వ లోన్ తప్పిపోతే, ప్రభుత్వం వైపు నుండి సబ్సిడీ ద్వారా గృహాలు నిర్మించుకోవడానికి ఏదైనా లోన్ మిస్ అయిపోతే, అరే ఆ తారీఖు లోపల నేను ఎందుకు అలాంటి అవకాశాన్ని పొందలేదు అని ఎంతో బాధపడుతూ ఉంటాము కదా మనం. ఇలాంటి పుణ్యాలు ఉహుద్ పర్వతానికి సమానమైన, అంతకంటే ఇంకా గొప్పగా రెండు మహా పెద్ద పర్వతాలకు సమానమైన పుణ్యం మనం కోల్పోతున్నాము అన్నటువంటి బాధ ఎప్పుడైనా కలుగుతుందా? కలుగుతుంది అంటే ఇన్ షా అల్లాహ్ ఇది విశ్వాసం యొక్క సూచన. అల్లాహ్ మనందరికీ ప్రతి జనాజాలో పాల్గొని ఇలాంటి గొప్ప పుణ్యాలు సంపాదించి, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసుకునేటువంటి భాగ్యం మనకు ప్రసాదించుగాక.

మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో ఐదవ సత్కార్యం…కనీసం పది ఆయతులు చదువుతూ రాత్రి కనీసం రెండు రకాతుల తహజ్జుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం. ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది. దీనికి సంబంధించిన హదీథ్ ఈ విధంగా ఉంది.

مَنْ قَرَأَ عَشْرَ آيَاتٍ فِي لَيْلَةٍ كُتِبَ لَهُ قِنْطَارٌ، وَالْقِنْطَارُ خَيْرٌ مِنَ الدُّنْيَا وَمَا فِيهَا
(మన్ కరఅ అషర ఆయాతిన్ ఫీ లైలతిన్ కుతిబ లహు అల్ కిన్తార్, వల్ కిన్తార్ ఖైరుమ్ మినద్దున్యా వమా ఫీహా)

“ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ అన్నది ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది.

అల్లాహు అక్బర్. కేవలం ఒక బిల్డింగ్ లభించినది, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లభించినది, మనం ఎంత ధనవంతులమని సంతోషిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ గమనించండి, రాత్రి పది ఆయతులు ఎవరైతే పఠిస్తాడో, అతని కర్మపత్రంలో కిన్తార్ వ్రాయబడుతుంది. మరియు కిన్తార్ ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే ఎంతో మేలైనది. ఈ హదీథ్ తబ్రానీ కబీర్‌లోనిది. షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో దీనిని పేర్కొన్నారు.

ఇక సునన్ అబీ దావూద్, ఇబ్ను హిబ్బాన్, ఇబ్ను ఖుజైమాలోని ఈ హదీసును శ్రద్ధగా వినండి. దీనిని షేఖ్ అల్బానీ రహమహుల్లాహ్ గారు సహీహుత్తర్గీబ్‌లో పేర్కొన్నారు. హదీథ్ నెంబర్ 639.

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الْغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ الْقَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ الْمُقَنْطَرِينَ
(మన్ కామ బి అష్రి ఆయాతిన్ లమ్ యుక్తబ్ మినల్ గాఫిలీన్, వమన్ కామ బిమిఅతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్, వమన్ కామ బి అల్ఫి ఆయ కుతిబ మినల్ ముకన్తరీన్)

“ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో, వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు. మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో, నమాజ్ చేస్తూ, వారు అల్లాహ్ యొక్క ఆరాధన ఎంతో శ్రద్ధగా చేసే వారిలో లిఖించబడతారు. మరి ఎవరైతే వెయ్యి ఆయతులు చేస్తూ నమాజ్ చేస్తారో, వారిని ముకన్తరీన్‌లో లిఖించబడుతుంది.”

ముకన్తరీన్ అంటే ఎవరు? ఎవరికైతే కిన్తార్ పుణ్యాలు లభిస్తాయో, ఇంతకుముందు విన్న హదీసు ప్రకారం ఈ ప్రపంచం, ప్రపంచంలో ఉన్న సమస్తానికంటే మేలైనది.

ఈ విధంగా మహాశయులారా, గమనించండి, చూడడానికి ఎంత చిన్నటి సత్కార్యాలు కానీ వాటి పుణ్యం ఎంత గొప్పగా ఉందో. ఎంత గొప్పగా పుణ్యం ఉందో అంతే మన త్రాసును ఇన్ షా అల్లాహ్ బరువు గలవిగా చేస్తాయి. ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉండే సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) | మరణానంతర జీవితం : పార్ట్ 44 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (3) – ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా)
[మరణానంతర జీవితం – పార్ట్ 44]
https://www.youtube.com/watch?v=gOF9pfhteUE [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రళయ దినాన కర్మల త్రాసును తేలికపరిచే పాప కార్యాల గురించి వివరించబడింది. ముఖ్యంగా, ‘చూపుగోలుతనం’ లేదా ప్రదర్శనా బుద్ధి (రియా) అనే పాపంపై దృష్టి సారించారు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల ప్రశంసలు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసే సత్కార్యాలను అల్లాహ్ తిరస్కరిస్తాడని ఒక హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. దీని తీవ్రతను వివరిస్తూ, అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన ఒక సుదీర్ఘ హదీథ్ ను ప్రస్తావించారు. దాని ప్రకారం, ప్రళయ దినాన అల్లాహ్ ముందు తీర్పు కోసం నిలబెట్టబడే తొలి ముగ్గురు: ఖురాన్ పారాయణం చేసినవాడు, ధనాన్ని దానం చేసినవాడు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడినవాడు. అయితే, వీరు తమ కార్యాలను ప్రజల మెప్పు కోసం చేసినందున, వారి సత్కార్యాలు నిరర్థకమై, నరకాగ్నికి గురవుతారు. ఈ హదీథ్ విని ముఆవియా (రదియల్లాహు అన్హు) తీవ్రంగా ప్రభావితమై, సూరహ్ హూద్ లోని ఆయతులను పఠించిన వృత్తాంతాన్ని కూడా వివరించారు. దానధర్మాలు, హజ్-ఉమ్రా, ఖుర్బానీ వంటి అనేక ఆచరణలలో ప్రదర్శనా ధోరణుల పట్ల జాగ్రత్త వహించాలని ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా, అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

ప్రళయ దినాన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలు ఏమిటో ఈ శీర్షికలోని ఒక ముఖ్య విషయం, ఏ పాప కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అయి మీదికి లేసిపోతుందో, బరువుగా ఉండదో, అలాంటి పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము.

మొదటి విషయం కుఫ్ర్, షిర్క్ మరియు ధర్మభ్రష్టత. వాటిలోని కొన్ని భాగాలను మనం తెలుసుకున్నాము. రెండవది చూపుగోలుతనం.

మీకు గుర్తుండాలి, త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో ఇఖ్లాస్, సంకల్ప శుద్ధి అని మనం తెలుసుకున్నాము. దానికి అపోజిట్, విరుద్ధమైన విషయం చూపుగోలుతనం. పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఏదైనా సత్కార్యం చేయడం. ఇది మన ఆ సత్కార్య సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది. ఈ విధంగా ఆ చేసిన సత్కార్యం పుణ్యాల త్రాసులో ఉండి బరువుగా ఉండేదానికి బదులుగా పాపంలో లెక్కించబడుతుంది, త్రాసు తేలికగా అయిపోతుంది.

ఒకసారి ఈ హదీథ్ పై మీరు కూడా శ్రద్ధ వహించండి. అల్లాహ్ త’ఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు.

أَنَا أَغْنَى الشُّرَكَاءِ عَنِ الشِّرْكِ
[అన అగ్నష్ షురకాఇ అనిష్ షిర్క్]
భాగస్వాములలో భాగస్వామ్యానికి అందరికంటే ఎక్కువ అతీతున్ని, నిరపేక్షాపరుడిని నేనే”

مَنْ عَمِلَ عَمَلاً أَشْرَكَ فِيهِ مَعِي غَيْرِي تَرَكْتُهُ وَشِرْكَهُ
[మన్ అమిల అమలన్ అష్రక ఫీహి మ’ఈ గైరీ, తరక్తుహు వ షిర్కహు]
ఎవరైతే ఏదైనా కార్యం సత్కార్యం చేస్తాడో, అందులో నాతో పాటు ఇతరులను భాగస్వామిగా చేస్తాడో, నేను అతడిని అతడి భాగస్వామిని అన్నిటిని వదిలేస్తాను, అలాంటి సత్కార్య అవసరం నాకు లేదు, దాని యొక్క సత్ఫలితం కూడా నేను అతనికి ప్రసాదించను.

ఎంత నష్టం గమనించండి. అల్లాహ్ సంతృష్టి కొరకు మనం ఆ కార్యం చేయకుండా, దాని యొక్క లాభం ఇహలోకంలో ఎవరితోనైనా పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో చేస్తే ఎంత నష్టానికి మనం గురి అవుతున్నాము.

ఇంకా మహాశయులారా, ఈ హదీథ్ సహీ ముస్లిం షరీఫ్ లోనిది. కానీ ఇంతకంటే మరీ ఘోరమైన, ఇంతకంటే మరీ ఘోరమైన గతి, ఈ ప్రదర్శనా బుద్ధితో, చూపుగోలుతనంతో పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా సత్కార్యం చేశామంటే ఎలాంటి శిక్షను ఎదుర్కోవలసి వస్తుందో, ఎలాంటి నరకంలో పడవలసి వస్తుందో మీరు ఈ హదీథ్ ద్వారా వినే ప్రయత్నం చేసి అర్థం చేసుకోండి.

జామె తిర్మిజీలో వివరంగా ఈ హదీథ్ ఉంది. పోతే దీని యొక్క కొన్ని భాగాలు సంక్షిప్తంగా సహీ ముస్లిం షరీఫ్ లో కూడా ఉంది. జామె తిర్మిజీ హదీథ్ నెంబర్ 2382.

షుఫయ్యా అల్ అస్బహీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం, నేను మదీనా తయ్యిబా నగరానికి వచ్చాను. మస్జిద్-ఎ-నబవీలో ఒక వ్యక్తి చుట్టూనా చాలామంది పోగై ఉన్నారు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీథులు వినిపిస్తున్నారు. నేను కూడా చోటు చేసుకొని అతనికి దగ్గరగా కూర్చున్నాను. హదీథులు వినిపించడం సమాప్తం అయ్యాక, ఒక్కొక్కరు ప్రజలందరూ కూడా లేచి పోయ్యాక, ఆయన ఒంటరిగా అయిన తర్వాత నేను ఆయనతో అడిగాను, నేను అల్లాహ్ యొక్క ప్రమాణం చేసి నిన్ను అడుగుతున్నాను, నీవు స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో విని, అర్థం చేసుకొని, గ్రహించి ఉన్న ఏదైనా హదీథ్ ఉంటే నాకు వినిపించండి అని.

అప్పుడు హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు, “సరే మంచిది, నేను స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో నా చెవులతో విన్న ఒక హదీథ్ ను, అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. ఒక కేక వేశారు, స్పృహ తప్పి పడిపోయారు. కొంతసేపటి తర్వాత ఆయన, మరోసారి, “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో విన్న హదీథ్ ను, దానిని అర్థం చేసుకున్న హదీథ్ ను నీకు వినిపిస్తాను” అని అన్నారు. కేక వేశారు, మళ్లీ స్పృహ తప్పారు. మరి కొంత సేపటికి తర్వాత ఆయన మూడోసారి అలాగే అని, మూడోసారి కూడా స్పృహ తప్పారు.

ఇక ఆ తర్వాత అతను స్పృహ స్థితి నుండి బయటికి వచ్చి, ఏం చెప్పారు? “నేను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇంట్లో ఉండగా, అప్పుడు నేను తప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంకా ఎవరూ లేరు, నేను ఈ హదీథ్ ను విన్నాను” అని మళ్లీ ఒక కేక వేశారు, స్పృహ తప్పిపోయారు. ఇక నేను ఒకవేళ ఆయన్ని ఆనుకొని పట్టుకోకుంటే పడిపోయేవారు. కొంతసేపటి వరకు నేను అలాగే అతన్ని పట్టుకొని ఉన్నాను. ఆ తర్వాత ఆయన మేల్కొన్నారు. ఆ తర్వాత చెప్పారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు అని.

ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా ప్రజల మధ్యలోకి వస్తాడు, వారి యొక్క తీర్పు చేయడానికి. అప్పుడు ఇహలోకంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు, ఎవరెవరు ఎలా వచ్చారో అక్కడ ఎన్నో సంఘాలు, వారు తమ యొక్క మోకాళ్ళ మీద ఆ మహా మైదానంలో వచ్చి అల్లాహ్ యొక్క తీర్పు గురించి వేచిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సందర్భంలో అల్లాహ్ త’ఆలా తొలిసారిగా ప్రజలందరి మధ్యలో నుండి ఒక వ్యక్తిని పిలుస్తాడు. అతడు ఎవడు? ఖురాన్ కంఠస్థం చేసిన వ్యక్తి, ఖురాన్ పారాయణం చేసే వ్యక్తి మరియు ఖురాన్ పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వ్యక్తి.

అల్లాహ్ త’ఆలా ఆయన్ని పిలిచి, “నేను నీకు ఖురాన్ యొక్క విద్య ప్రసాదించాను కదా? నీవు దీనిని నమ్ముతావా? నా యొక్క ఈ అనుగ్రహాన్ని తిరస్కరిస్తావా?” అప్పుడు అతను అంటాడు, “లేదు ఓ అల్లాహ్, నేను తిరస్కరించను. నీవు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించావు, నేను ఒప్పుకుంటాను.” అప్పుడు అల్లాహ్ అడుగుతాడు, “నా ఈ అనుగ్రహానికి బదులుగా నీవు ఎలాంటి కృతజ్ఞత తెలిపావు?” అప్పుడు అతను అంటాడు, “ఓ అల్లాహ్, నేను నీ కొరకే ఈ ఖురాన్ పారాయణం చేశాను. ప్రజలను ఈ ఖురాన్ వైపునకు ఆహ్వానించేవాణ్ణి, ప్రజలకు ఖురాన్ చదవడం నేర్పేవాణ్ణి.”

అప్పుడు అల్లాహ్ ఏమంటాడు? “నీవు అబద్ధం పలుకుతున్నావు, అసత్యం మాట్లాడుతున్నావు.” అప్పుడు దైవదూతలు కూడా అంటారు అతనితో, “నీవు అసత్యం పలుకుతున్నావు” అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, “ఖురాన్ పారాయణం చేయడం, ప్రజలకు ఇది నేర్పడం, దీని యొక్క ఉద్దేశం నీది ఏమంటే ప్రజలు నిన్ను ఓ ఖారీ సాబ్, ఓ ఖారీ సాబ్ అని నీ పేరు ప్రఖ్యాతుల గురించి, ఇహలోకంలో గొప్ప పేరు సంపాదించాలన్న ఉద్దేశంతో నీవు చదివేవానివి. అల్లాహ్ ప్రసన్నత కొరకు కాదు.” ఓ అల్లాహ్, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఇలాంటి వారిలో కలపకుండా కేవలం నీ సంతృష్టి కొరకు చదివే సద్భాగ్యుల్లో మమ్మల్ని కూడా చేర్చు ఓ అల్లాహ్.

“నీ ఉద్దేశం ఏముండే? నీవు ఇహలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఖురాన్ చదివావు, ఖురాన్ పఠించావు, దానిని ఇతరులకు నేర్పావు. ప్రజలు నిన్ను చాలా మెచ్చుకున్నారు, అక్కడే నీ ఫలితం అయిపోయింది.”

ఆ తర్వాత, రెండో వ్యక్తిని అల్లాహ్ త’ఆలా పిలుస్తాడు ప్రజలందరి మధ్యలో నుండి. అతడు ఎవడు? అల్లాహ్ అతనికి చాలా డబ్బు, ధనం ప్రసాదించి ఉంటాడు. అల్లాహ్ అతని యొక్క అనుగ్రహాలను గుర్తు చేసి, “నీవు ఈ నా ఈ అనుగ్రహాలకు బదులుగా ఏమి ఆచరించావు? ఎలా కృతజ్ఞత తెలిపావు?” అని ప్రశ్నిస్తే, “ఓ అల్లాహ్, నీవు నాకు ఇచ్చిన ఈ అనుగ్రహాలన్నీ కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే వీటిని నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను” అని అంటాడు. అప్పుడు అల్లాహ్ వైపు నుండి ఏం సమాధానం వస్తుంది? మళ్ళీ ఏం జరుగుతుంది? ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము ఆ విషయాలు విందాము.

డబ్బు ధనాలు కలిగి ఉన్న వ్యక్తి ఒప్పుకుంటాడు. “నీవు నేను ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా ఎలా ఆచరించావు? ఏం చేశావు? ఏ కృతజ్ఞత తెలిపావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో ఖర్చు పెట్టాను, బంధుత్వాలను పెంచుకునే ప్రయత్నం చేశాను, నీకు ఇష్టమైన మార్గాల్లో నా ఈ ధనాన్ని వెచ్చించాను.” అప్పుడు అల్లాహ్ త’ఆలా సమాధానం ఇస్తూ, “నీవు పేరు ప్రఖ్యాతుల గురించి, అరే ఇతను చాలా ఉదార మనసు మరియు ఎంతో మంచి బుద్ధి గలవాడు, ధనాన్ని ఖర్చు పెట్టేవాడు అని పేరు ప్రఖ్యాతుల గురించి నీవు ఖర్చు పెట్టావు. ఇహలోకంలో ప్రజలు కూడా నిన్ను మెచ్చుకున్నారు.” ఈ విధంగా అతనికి ఏ పుణ్యము, ఏ సత్ఫలితము ప్రసాదించడు.

మూడో వ్యక్తిని కూడా అల్లాహ్ త’ఆలా అందరి మధ్యలో నుండి తీసుకువస్తాడు. అల్లాహ్ అతనికి శక్తి, గొప్ప మేధ, బుద్ధి ప్రసాదించి ఉంటాడు. అతను అల్లాహ్ మార్గంలో పోరాడుతూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. “నేను నీకు ఇచ్చిన ఈ శక్తి సామర్థ్యాలను నీవు ఒప్పుకుంటున్నావా?” అంటే, “అవును ఓ అల్లాహ్, నేను ఒప్పుకుంటున్నాను.” “నీవు ఏం కృతజ్ఞత చెల్లించావు?” అని అంటే, “ఓ అల్లాహ్, నేను నీ మార్గంలో పోరాడాను” అని అతను సమాధానం ఇస్తాడు. అప్పుడు అల్లాహ్ అంటాడు, “నీవు అబద్ధం పలుకుతున్నావు.” దైవదూతలు కూడా అతనితో అంటారు, “నీవు అబద్ధం పలుకుతున్నావు. ఇహలోకంలో నీవు ఒక గొప్ప ధైర్యవంతునివి, చాలా గొప్పగా పోరాడే వానివి అని పేరు ప్రఖ్యాతుల గురించి ఇలా పోరాడావు.” అప్పుడు అల్లాహ్ త’ఆలా అతని యొక్క ఏ సత్కార్యాన్ని స్వీకరించడు. “నీవు అబద్ధం పలుకుతున్నావు” అని అంటాడు.

అబూ హురైరా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా యొక్క మోకాళ్ళను ఇలా తట్టి, కొట్టి, “అబూ హురైరా, నీకు తెలుసా? అల్లాహ్ యొక్క సృష్టిలో తొలిసారిగా ఈ ముగ్గురిని ప్రశ్నించి, వారు అల్లాహ్ సంతృష్టి కొరకు ఆ సత్కార్యాలు చేయలేదు, పేరు ప్రఖ్యాతుల గురించే సత్కార్యాలు చేశారు గనుక వారి ఆ సత్కార్యాలని వృధా చేసి, ఎలాంటి సత్ఫలితం లేకుండా చేసి, నరకాగ్నిని ఈ ముగ్గురి ద్వారా మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది.”

అల్లాహ్ మనందరినీ కూడా నరక శిక్ష నుండి కాపాడు గాక. ఎప్పుడూ ఏ సత్కార్యం చేసినా గాని అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయకూడదు. అల్లాహ్ సంతృష్టి కాకుండా ఫలానా వారు, ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలి, ఇహలోక పేరు ప్రఖ్యాతుల గురించి ఏదైనా చేయడం, ఇది మహా ఘోర పాపం. దీనివల్ల మన త్రాసు అనేది బరువుగా కాకుండా తేలికగా అయిపోతుంది అన్న విషయం ఈ హదీథ్ ల ద్వారా మనకు తెలిసింది.

ఈ షుఫయ్యా రహిమహుల్లాహ్ ఎవరైతే అబూ హురైరా రదియల్లాహు అన్హు ద్వారా ఈ హదీథ్ ను విన్నారో, ఆయన హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు గారి యొక్క బాడీగార్డ్ లలో ఒకరు. ఒక సందర్భంలో ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు వద్దకు ఎవరో వచ్చారు. అప్పుడు షుఫయ్యా రదియల్లాహు అన్హు ఈ హదీథ్ ను కంప్లీట్ గా, సంపూర్ణంగా ఆ సందర్భంలో వినిపించారు. ఆ హదీథ్ ను విని హజ్రత్ ముఆవియా రదియల్లాహు త’ఆలా అన్హు ఏం చెప్పారు?

“ఖురాన్ ను చదివేవారు, చదివించేవారు, ధనభండారాలు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడేవారు, వీరి యొక్క పరిస్థితి ఇలా ఉన్నది. వీరి ద్వారా నరకాగ్నిని దహించి వేయడం జరుగుతుంది అంటే, మరి మన పరిస్థితి ఏమవుతుందో కదా?” అని బాధపడుతూ ఉన్నారు. బాధ పడుతూ పడుతూ హజ్రత్ ముఆవియా రదియల్లాహు అన్హు కూడా స్పృహ తప్పిపోయారు. చాలా సేపటి తర్వాత ఎప్పుడైతే ఆయన మేల్కొన్నారో, ఖురాన్ యొక్క ఈ ఆయతులు పఠించారు.

ఖురాన్ సూరహ్ హూద్ యొక్క ఆయత్ నెంబర్ 15, 16 పఠించారు.

مَنۡ كَانَ يُرِيۡدُ الۡحَيٰوةَ الدُّنۡيَا وَزِيۡنَتَهَا نُوَفِّ اِلَيۡهِمۡ اَعۡمَالَهُمۡ فِيۡهَا وَهُمۡ فِيۡهَا لَا يُبۡخَسُوۡنَ
ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు. (11:15)

اُولٰٓئِكَ الَّذِيۡنَ لَيۡسَ لَهُمۡ فِى الۡاٰخِرَةِ اِلَّا النَّارُ ‌ۖ وَحَبِطَ مَا صَنَعُوۡا فِيۡهَا وَبَاطِلٌ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ
అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి. (11:16)

అల్లాహు అక్బర్, గమనించారా? ఎంత గొప్ప ఘోర విషయం. ప్రళయ దినాన వారికి అగ్ని తప్ప, నరకాగ్ని తప్ప ఇంకా వేరే ఏదీ లభించదు. ఇహలోకంలో వారు చేసినదంతా కూడా వృధా అయిపోతుంది. ఇక ముందుకు వారు ఏదైతే చేస్తూ ఉంటారో అదంతా కూడా వృధా అవుతుంది. పరలోకాన వారికి ఎలాంటి లాభం దాని ద్వారా చేకూర్చదు.

అందుగురించే మహాశయులారా, అల్లాహ్ తో భయపడాలి. మనం ఏ సత్కార్యం చేసినా గాని కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయాలి మరియు ప్రదర్శనా బుద్ధి, పేరు ప్రఖ్యాతుల గురించి కాకుండా మనం అల్లాహ్ యొక్క అభీష్టాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మహాశయులారా, ప్రళయ దినాన మన త్రాసు బరువు కాకుండా దాని యొక్క బరువు తగ్గిపోయి తేలికగా అయి మనకు స్వర్గంలో కాకుండా నరకంలో పోయేటువంటి పరిస్థితి రావడానికి ఒక ముఖ్య కారణం ఈ లోకంలో మనం చేసే సత్కార్యాలు కేవలం అల్లాహ్ సంతృష్టి కొరకు చేయడం కాకుండా ఇతరుల ప్రశంసలు అందుకోవడానికి, ఫలానా ఫలానా వారు మనల్ని మెచ్చుకోవాలని, ఇలా మనం చేస్తే మన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అని చేయడం మహా భయంకరం.

ఈ రోజుల్లో అనేకమంది దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏదైనా ఇలాంటి దానధర్మాలు చేస్తే రాయి మీద వారి పేరు రాయబడి చాలా కాలం వరకు అక్కడ పెట్టడం జరుగుతుంది, ఈ విధంగా వారిని గుర్తించడం జరుగుతుంది అని. మరికొందరు ఏదైనా మరో సత్కార్యం చేస్తారు మరియు దాని యొక్క ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో, వాట్సాప్ లలో, సోషల్ మీడియాలలో వేసి నేను ఇలా చేశాను అని చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఎంతోమంది హజ్ కు వెళ్తూ ఉంటారు, ఉమ్రాకు వెళ్తూ ఉంటారు. హజ్, ఉమ్రాల యొక్క ఎన్నో సందర్భాలలో ఫోటోలు తీసి ఫేస్ బుక్ లలో వేయడం, వాట్సాప్ గ్రూప్ లలో పంపడం. అలాగే మరికొందరు ఖుర్బానీ సందర్భాలలో మంచి మంచి జంతువులు కొని ప్రజల్లో వారి యొక్క పేరు రావాలి అని, దాని యొక్క ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయడం, రమదాన్ మాసాల్లో ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వారి యొక్క పేరు ప్రఖ్యాతుల గురించి వాటి యొక్క ఫోటోలు తీసి గ్రూపులలో పంపడం.

అందరూ ఇలా చేసేవారు నవూజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, ఇలాంటి దుష్కార్యానికి పాల్పడుతున్నారు అని నేను చెప్పడం లేదు. కానీ అనేక మంది యొక్క ఉద్దేశాలు ఇంచుమించు ఇలాగా ఉంటున్నాయి. ఎవరైనా ఏదైనా కారణంగా ఒక నిరూపణ ఉండడానికి ఏదైనా చేస్తూ ఉంటే వారి యొక్క మన: సంకల్పాన్ని, వారి హృదయాంతరంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అల్లాహ్ యే బాగవుగా గుర్తెరుగుతాడు. కానీ ఈ రోజుల్లో సామాన్యంగా మీరు ఎవరిని అడిగినా గాని, “అరే, ఏంటి దీన్ని మీరు ఎందుకు ఫోటోలు తీసి వేశారు?” అంటే, “మన ఫ్రెండ్స్ చూస్తారు కదా, మంచి కామెంట్స్ ఇస్తారు కదా.” అయితే ఈ విధంగా మన యొక్క మన సంకల్పంలో అల్లాహ్ యొక్క అభీష్టం, అల్లాహ్ యొక్క సంతృష్టి తగ్గిపోవడం వల్ల మన యొక్క ఈ సత్కార్యాల సత్ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి. చివరికి మన యొక్క త్రాసులు బరువుగా కాకుండా తేలికగా అయిపోతున్నాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ ఇలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉంచుగాక. మన యొక్క త్రాసును తేలికగా చేసే మరికొన్ని పాపాల గురించి ఇన్షా అల్లాహ్ ఈ విధంగానే మనం తెలుసుకుంటూ ఉంటాము. మీరు ఈ కార్యక్రమాలను చూస్తూ ఉండండి. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42019

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు [మరణానంతర జీవితం – పార్ట్ 55] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.అల్హందులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! నరకం, నరకం యొక్క వివరణలు, నరకవాసుల గురించి వివరాలు మనం ఇన్షా అల్లాహ్ తెలుసుకోబోతున్నాము. నరకం, ఇది అల్లాహ్ యొక్క శిక్ష. అల్లాహ్ ను విశ్వసించని వారు, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించకుండా ఆయనకు అవిధేయత చూపుతూ, ఆయన పంపిన సత్యధర్మానికి వ్యతిరేకంగా జీవించే వారి గురించి నివాసస్థలం.

మరణానంతర జీవిత ఘట్టాల్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. అయితే, చివరిగా మిగిలిన రెండు విషయాలు: ఒకటి నరకం, మరొకటి స్వర్గం. నరకం, దాని భయంకర విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం స్వర్గం గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

నరకానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటి యొక్క భావనను బట్టి, పాపాలు చేసేవారు ఎలాంటి పాపాలకు గురి అవుతారో, వారికి ఎలాంటి శిక్ష విధించాలో దానిని బట్టి కూడా ఆ పేర్లు దానికి నిర్ణయించడం జరిగింది. అల్లాహు తఆలా ఎన్నో పేర్లను ఖురాన్ లో కూడా ప్రస్తావించాడు:

  • అన్నార్ (النَّار) – అగ్ని
  • జహన్నమ్ (جَهَنَّم) – నరకం (అత్యంత ప్రసిద్ధమైన పేరు)
  • జహీమ్ (جَحِيم) – ప్రజ్వలించే అగ్ని
  • సఈర్ (سَعِير) – మండుతున్న జ్వాల
  • లజా (لَظَىٰ) – భగభగమండే అగ్ని
  • సఖర్ (سَقَر) – కాల్చివేసేది
  • హుతమా (حُطَمَة) – ముక్కలు ముక్కలుగా నలిపివేసేది
  • హావియా (هَاوِيَة) – అగాధం, పాతాళం

ఈ విధంగా ఇంకా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల యొక్క భావన మరియు పాపాలను బట్టి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఉదాహరణకు, ఒక ఉదాహరణ ఇచ్చి నేను మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాము. సూరతుల్ హుమజాలో అల్లాహ్ ఇలా అంటున్నాడు:

నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? – [మరణానంతర జీవితం – పార్ట్ 54] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 4
నరకంపై వంతెన దాటడానికి ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి?
[మరణానంతర జీవితం – పార్ట్ 54] [23 నిముషాలు]
https://www.youtube.com/watch?v=vnw-1Kcariw
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహ్. వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక కూడా నరకంపై వేయబడే వంతెన.

నరకంపై వేయబడే వంతెన క్షేమంగా, సురక్షితంగా దాటడానికి అల్లాహ్ యొక్క దయ, ఆయన కరుణ తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సిఫారసు తర్వాత మన సత్కార్యాలు కూడా చాలా దోహదపడతాయి. అయితే ఎలాంటి సత్కార్యాలు దోహదపడతాయి? ఆ విషయాలు తెలుసుకోబోతున్నాము.

కానీ అంతకంటే ముందు మరొక చిన్న విషయం. అదేమిటంటే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత అటువైపున స్వర్గం ఉంటుంది. ఎవరైతే స్వర్గంలో ప్రవేశించే వారు కారో వారు నరకంలో పడిపోతారు. కానీ ఎవరైతే స్వర్గంలో ప్రవేశించేవారో వారే నరకంపై వేయబడిన వంతెనను దాటిపోతారు. దాటిపోయిన వెంటనే స్వర్గంలో ప్రవేశించలేరు. అక్కడ మరో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మరో చిన్న వంతెన ఉంటుంది. దానిని కూడా తప్పకుండా దాటవలసి ఉంటుంది.

ఆ వంతెన దేని గురించి? స్వర్గంలో ఎవరు కూడా ప్రవేశించాలంటే బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడంతో పాటు ఆంతర్యం కూడా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి. అంటే, ఎవరి మనసులో కూడా ఏ రవ్వంత కపటం, ఏ రవ్వంత జిగస్సు, ఏ రవ్వంత చెడు అనేది మరొకరి గురించి ఉండకూడదు.

అయితే, నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత, పరస్పరం ఎవరి మధ్యలోనైనా ఏదైనా మనస్సులో చెడు మిగిలి ఉంటే, దానిని శుభ్రపరచి, వారి యొక్క హృదయాలను అన్ని రకాల మలినాల నుండి, అన్ని రకాల చెడుల నుండి శుభ్రపరిచి ఆ తర్వాత స్వర్గంలో చేర్పించడం జరుగుతుంది.

సహీ బుఖారీలో హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించిన హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “విశ్వాసులు నరకంపై వేయబడిన వంతెన దాటి వెళ్ళిన తర్వాత, ఇటు నరకం అటు స్వర్గం మధ్యలో ఆపుకోబడతారు. ప్రపంచంలో ఏ కొంచెం వారి హృదయాల్లో ఏ చెడు ఉన్నా వాటిని శుభ్రపరచడం జరుగుతుంది. ఎవరి పట్ల ఏ కొంచెం అన్యాయం ఉన్నా, అన్యాయం చేసిన వానికి స్వర్గపు స్థానాలు తగ్గించబడతాయి, మరీ ఎవరిపైనైతే అన్యాయం జరిగిందో ఆ బాధితుల స్వర్గ స్థానాలు పెంచడం జరుగుతుంది.”

మరొక ఉల్లేఖనంలో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నరకంపై వేయబడిన వంతెన దాటిన తర్వాత ఎవరు కూడా స్వర్గంలో ప్రవేశించలేరు, ఎవరి హృదయాలలోనైతే ఏ కొంచెమైనా కపటం, ఏదైనా జిగస్సు, చెడు ఒకరి గురించి ఉందో. వారిని శుభ్రపరిచి ఆ తర్వాత వారిని స్వర్గంలో చేర్చడం జరుగుతుంది. ఎందుకంటే స్వర్గంలో ప్రవేశించేవారు, వారి హృదయాలు శుభ్రంగా, అందులో ఎలాంటి కీడు లేకుండా ఉంటుంది.” ఎందుకంటే వారి హృదయాలు వాటిలో ఎలాంటి కీడు, ఎలాంటి చెడు లేకుండా ఉండాలి, అప్పుడే వారు స్వర్గంలో ప్రవేశించగలుగుతారు. అందుకని మహాశయులారా, ఇహలోకంలోనే మనం ఒకరిపై ఏదైనా అన్యాయం చేసి ఉంటే, ఒకరిది ఏదైనా హక్కు తిని ఉంటే, ఒకరికి ఏదైనా బాధ మనం కలిగించి ఉంటే, క్షమాపణ కోరుకొని లేదా వారి యొక్క హక్కు చెల్లించి హృదయాలలో ఎలాంటి మలినము మనం ఉంచుకోకూడదు.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 3 – [మరణానంతర జీవితం – పార్ట్ 53] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 3
[మరణానంతర జీవితం – పార్ట్ 53] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=QVnrPdQraUA
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము.

అయితే, ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు? దీని గురించి ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు:

فَأَكُونُ أَنَا وَأُمَّتِي أَوَّلُ مَنْ يُجِيزُ
(ఫ అకూను అనా వ ఉమ్మతీ అవ్వలు మన్ యుజీజ్)
“నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము.”

అల్లాహు అక్బర్. మహాశయులారా, లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చి పోయారు. చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను, ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి. అయితే ఇక్కడ గమనించండి, ఆ ప్రవక్త, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం, ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటడంలో ముందుగా ఉంటాము. ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్): పార్ట్ 2 – [మరణానంతర జీవితం – పార్ట్ 52] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన) – పార్ట్ 2
[మరణానంతర జీవితం – పార్ట్ 52] [20 నిముషాలు]
https://www.youtube.com/watch?v=ADuGX4TjS2o
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد
(అల్-హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్) [సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రములు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన సహచరులందరిపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…]

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక నరకంపై వంతెన.

మహాశయులారా, ఎవరికి ఎంత కాంతి లభిస్తుందో అంతే వేగంగా వారు ఆ వంతెనను దాటగలుగుతారు. ముస్తదరక్ హాకిం లోని హదీథ్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీ అని అన్నారు. ఆ హదీథ్ లో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎంత కాంతి లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరుస్తూ, ఎవరు ఎంత వేగంగా ఆ వంతెనను దాటుతారో స్పష్టపరిచారు.

హజ్రత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ప్రళయ దినాన అల్లాహు తఆలా పూర్వీకులను, వెనుకటి వారిని, ప్రజలందరినీ సమీకరిస్తాడు. ఆ పొడవైన హదీథ్ లో కాంతి ఇవ్వబడే విషయాన్ని తెలియపరుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రతి ఒక్కరికి వారి కర్మల ప్రకారం కాంతి ఇవ్వడం జరుగుతుంది. నూర్ ఇవ్వడం జరుగుతుంది.

فَمِنْهُمْ مَنْ يُؤْتَى نُورُهُ مِثْلَ الْجَبَلِ
(ఫమిన్‌హుమ్ మన్ యూ’తా నూరుహు మిథ్లల్ జబల్)
[వారిలో కొందరికి పర్వతమంత కాంతి ఇవ్వబడుతుంది.]

కొందరికి కొండంత పరిమాణంలో, కొండ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, కొండంత పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. వారి సత్కార్యాలు మహా గొప్పగా ఉండవచ్చు. మరికొందరికి అంతకంటే మరీ ఎక్కువ పరిమాణంలో కూడా కాంతి లభిస్తుంది. మరికొందరికి వారు ఒక ఖర్జూరపు కర్ర తమ కుడిచేతిలో తీసుకున్నంత పరిమాణంలో లభిస్తుంది. మరికొందరికి అంతకంటే తక్కువ పరిమాణంలో. చివరి వ్యక్తి లేక చివరి రకం వారు, చివరి వర్గం వారు ఎవరికైతే కాంతి అతి తక్కువ పరిమాణంలో ఇవ్వడం జరుగుతుందో అది వారి కాలులోని, వారి పాదములోని బొటనవేలి పరిమాణంలో వారికి కాంతి లభిస్తుంది. అది కూడా ఒకసారి వెలుగుతూ ఉంటే ఒకసారి దాని యొక్క కాంతి అనేది నశించిపోతుంది.

నరకంపై వంతెన (ఫుల్ సిరాత్) – [మరణానంతర జీవితం – పార్ట్ 51] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ఫుల్ సిరాత్ (నరకంపై వంతెన)
[మరణానంతర జీవితం – పార్ట్ 51] [22 నిముషాలు]
https://www.youtube.com/watch?v=kjbs6O5YVHI
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వసలామున్ అలా ఇబాదిల్లజీనస్తఫా అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు “మరణానంతర జీవితం” అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక “నరకంపై వంతెన”. అల్లాహు అక్బర్.

మహాశయులారా, ప్రళయ దినాన సంభవించే అన్ని ఘట్టాలలో అతి భయంకరమైనది, అతి క్లిష్టతరమైనది ఇది కూడా ఒకటి. ఆ రోజు అల్లాహు తఆలా నరకంపై ఒక వంతెనను ఏర్పాటు చేస్తాడు. ప్రతీ మనిషీ ఆ వంతెనపై తప్పకుండా వచ్చి ఉంటాడు.

వ ఇమ్ మిన్కుమ్ ఇల్లా వారిదుహా, కాన అలా రబ్బిక హత్మమ్ మఖ్దియ్యా.
(وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا)
అనువాదం: మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం.

మీలో ప్రతీ ఒక్కడూ దానిపై వచ్చి ఉంటాడు. ఇది నీ ప్రభువు చేసినటువంటి తిరుగులేని నిర్ణయం, ఖచ్చితమైన నిర్ణయం. అయితే, ఆ వంతెన ఎలాంటిది? దేనిపై వేయబడుతుంది? ఆ వంతెన వెడల్పు ఎంత ఉంటుంది? దానిపై ఎవరు ఎలా వెళ్తారు, దాటుతారు? ఇవన్నీ విషయాలు కూడా చాలా తెలుసుకోవలసి ఉంది.

మహాశయులారా, ముందు విషయం మనం ఇక్కడ గమనించాల్సింది, ఆ వంతెన నరకంపై ఉంటుంది. అల్లాహు అక్బర్. అంటే భావం ఏమిటి? ఏ కొంచెం కాలు జారినా, డైరెక్ట్ నరకంలోనే పడిపోతాము. అల్లా మనందరినీ రక్షించు గాక. అయితే అది వెడల్పుగా ఉండదు. ఇది కూడా చాలా ఘోరమైన విషయం. సహీహ్ ముస్లిం షరీఫ్‌లో వచ్చి ఉంది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తాలా అన్హు తెలిపారు:

బలగనీ అన్నల్ జిస్ర అలా జహన్నమ్ అహద్దు మినస్ సైఫ్ వ అదఖ్ఖు మినష్ షఅర్.
(بَلَغَنِي أَنَّ الْجِسْر عَلَى جَهَنَّم أَحَدُّ مِنَ السَّيْفِ وَأَدَقُّ مِنَ الشَّعْرِ)
అనువాదం: ఆ నరకంపై ఉన్న వంతెన, కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది అని నాకు చేరింది.

ఆ నరకంపై ఉన్న వంతెన కత్తి పదును కంటే ఎక్కువ పదునుగా, కుచ్చగా ఉంటుంది మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటుంది. అల్లాహు అక్బర్. తాడు అని అనవచ్చా? లేదు. గమనించండి. అయితే, ఇది కత్తి పదును కంటే మరీ కుచ్చగా, పదునుగా మరియు వెంట్రుక కంటే మరీ సన్నగా ఉంటది అని ఏదైతే తెలపడం జరిగిందో, అది ఎలా కావచ్చు? మనం అనుమానానికి గురి కాకూడదు. ఎలాంటి సందేహం వహించవద్దు. ఎందుకంటే పరలోకాన సంభవించే విషయాలన్నీ కూడా మనం ఇహలోక జ్ఞానంతో అర్థం చేసుకోలేము.

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన [మరణానంతర జీవితం – పార్ట్ 23] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు [1] – సంకల్ప శుద్ధి, సత్ప్రవర్తన
[మరణానంతర జీవితం – పార్ట్ 23] [21 నిముషాలు]
https://www.youtube.com/watch?v=bqcAR6CBK80
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

السلام عليكم ورحمة الله وبركاته
الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد

మహాశయులారా, మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం. మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయ దినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం, అందులో కర్మలను, కర్మ పత్రాలను, ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము. అయితే, ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి?

మహాశయులారా, ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం, వినడం, తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము. ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే, అల్లాహ్ కాపాడుగాక మనందరినీ రక్షించుగాక, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లాహ్ యొక్క దయవల్ల ఏ సత్కార్యాలు ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తాయి, ఆ సత్కార్యాల గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము.

ఇందులో మొదటి విషయం ఇఖ్లాస్. అంటే సంకల్ప శుద్ధి. ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్ప శుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది. ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పళ్ళెంలో, సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది. ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా, అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా, సంకల్ప శుద్ధి కలిగి లేకుంటే, అది కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏ మాత్రం దొరకడమే కాదు, ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలె అది వృధా అయిపోతుంది. ఏమీ ఫలితము మనిషికి లభించదు. చూడడానికి ఇహలోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు. చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు, కానీ సంకల్ప శుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది. సత్ఫలితం లేకుండా చేస్తుంది.