దాన ధర్మాల విశిష్టత – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

దాన ధర్మాల విశిష్టత
సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/UA3H7Z8PhLY [34 నిముషాలు]

1- దానం చేసిన వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ప్రతి ఫలం ఇస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు ?
2- దానం చేసిన వారికి, ప్రపంచంలో ఏమి ప్రయోజనం కలుగుతుంది? సమాధిలో ఏమి ప్రయోజనం కలుగుతుంది ? పరలోకంలో ఏమి ఫలితం దక్కుతుంది ?
3- దానం చేసే వారి కోసం దైవ దూతలు ఏమని దుఆ చేస్తారు ?
4- దానం చేస్తే ధనం తరుగుతుందా ? పెరుగుతుందా ?
5- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎంత గొప్పగా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
6- ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుటుంబీకులు ఎలా దానం చేసే వారో ఒక ఉదాహరణ చెప్పండి ?
7- సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎలా దానం చేసే వారో కొన్ని ఉదాహరణలు చెప్పండి ?
8- దాన ధర్మాలు చేయుటకు కొన్ని మంచి మార్గాలు ఏమిటి ?
9- మరణించిన వారి తరుపున వారసులు దానం చేయవచ్చా ?
10- దాన ధర్మాలు చేయు వారు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి ?

ఈ ప్రసంగంలో, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరించబడింది. దానధర్మాలు చేయడం ద్వారా లభించే అనేక ప్రయోజనాలు, అవి సంపదను తగ్గించకపోగా పెంచుతాయని, అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి చెడ్డ చావు నుండి కాపాడుతాయని, సమాధిలో మరియు తీర్పు దినాన రక్షణ కల్పిస్తాయని పేర్కొనబడింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరుల జీవితాల నుండి దానశీలతకు సంబంధించిన ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. చివరగా, ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలు, దానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు జాగ్రత్తలను కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీదనూ, ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక, ఆమీన్.

సోదర సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను, అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనం ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల విశిష్టత అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో దాన ధర్మాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసులకు దానధర్మాలు చేయాలని ఆదేశిస్తూ ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 254వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ ఈ విధంగా ఆదేశించాడు:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِمَّا رَزَقْنَاكُم
ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చు చేయండి.

అల్లాహ్ ఇచ్చిన సొమ్ములో నుంచి అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయాలన్న ఆదేశము ఈ వాక్యంలో ఉంది. అయితే దానధర్మాలు చేస్తే కలిగే ప్రయోజనాలు, ఘనత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ పొగిడి ఉన్నాడు.

ఖురాన్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, మూడు మరియు నాలుగు వాక్యాలలో అల్లాహ్ తెలియజేశాడు:

الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا

వారు నమాజును నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు. నిజమైన విశ్వాసులంటే వీరే

అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టేవారు నిజమైన విశ్వాసులు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఆయతులో, ఈ వాక్యంలో పొగిడి ఉన్నాడు.

అలాగే ఎవరైతే అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తారో వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 700 రెట్లు ఎక్కువ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని ఉదాహరించి మరీ తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, రెండవ అధ్యాయము, 261వ వాక్యాన్ని చూడండి:

مَّثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمْ فِي سَبِيلِ اللَّهِ كَمَثَلِ حَبَّةٍ أَنبَتَتْ سَبْعَ سَنَابِلَ فِي كُلِّ سُنبُلَةٍ مِّائَةُ حَبَّةٍ ۗ وَاللَّهُ يُضَاعِفُ لِمَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ

అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని ఖర్చు చేసే వారి ఉపమానం ఇలా ఉంటుంది: ఒక విత్తనాన్ని నాటగా, అది మొలకెత్తి అందులో నుంచి ఏడు వెన్నులు పుట్టుకు వస్తాయి. ప్రతి వెన్నులోనూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారికి సమృద్ధి వొసగుతాడు. అల్లాహ్ పుష్కలంగా ప్రసాదించేవాడు, ప్రతీదీ తెలిసినవాడు.

మనిషి ఒక్క గింజ భూమిలో నాటితే అందులో నుంచి ఒక చెట్టు పుడుతుంది. ఆ చెట్టుకు ఏడు కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు ఒక్కొక్క వెన్నుగా, ఏడు కొమ్మలకు ఏడు వెన్నులు ఉంటాయి. ప్రతి వెన్నులో వందేసి గింజలు ఉంటాయి అంటే ఏడు వెన్నులకు 700 గింజలు ఆ మనిషికి దక్కుతాయి. నాటింది ఒక్క గింజ కానీ పొందింది 700 గింజలు. ఆ ప్రకారంగా ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క దీనారు గానీ, ఒక్క దిర్హము గానీ, ఒక్క రియాలు గానీ, ఒక్క రూపాయి గానీ చిత్తశుద్ధితో దానము చేస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని దానాన్ని మెచ్చుకొని అతనికి 700 రెట్లు ప్రతిఫలము ప్రసాదిస్తాడు అన్నమాట ఈ వాక్యంలో తెలియజేయడం జరిగింది.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, ఎవరైతే దానధర్మాలు చేస్తారో వారి సమస్యలు పరిష్కరించబడటానికి అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడని తెలియజేసి ఉన్నాడు. ఖురాన్ గ్రంథం, 92వ అధ్యాయము ఐదు నుండి ఏడు వరకు ఉన్న వాక్యాలను ఒకసారి మనము చూచినట్లయితే:

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ وَصَدَّقَ بِالْحُسْنَىٰ فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ
ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో, తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో ఇంకా సత్ఫలితాన్ని సత్యమని ధ్రువపరిచాడో, అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యము వొసగుతాము.

సమస్యల పరిష్కారము కోసము ప్రజలు టెన్షన్ పడుతూ ఎక్కడెక్కడికో తిరుగుతూ చాలా అగచాట్లు పడుతూ ఉంటారు. అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేస్తే సమస్యల పరిష్కారము కోసము అల్లాహ్ సులభమైన మార్గాలు తెరుస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి, సమస్యలు పరిష్కరించబడాలంటే దానధర్మాలు చేసుకోవాలన్న విషయం ఇక్కడ మనకు బోధపడింది.

అలాగే దానధర్మాలు చేసే వారికి లభించే మరొక విశిష్టత ఏమిటంటే మరణించిన తర్వాత సమాధిలో అగ్ని వేడి నుండి వారిని కాపాడటం జరుగుతుంది. మనం సమాధి సంగతులు అన్న ప్రసంగంలో వివరంగా విని ఉన్నాం. ఈ సమాధి ఎలాంటిది అంటే కొంతమంది కోసము అది స్వర్గపు లోయలాగా ఉంటుంది. వారు అక్కడ ప్రశాంతంగా పడుకుంటారు. అదే సమాధి మరికొంతమందికి నరక బావి లాగా మారిపోతుంది. వారు అక్కడ కఠినమైన శిక్షలు పొందుతూ ఉంటారు. ఇదంతా వివరంగా మనము సమాధి సంగతులు అనే ప్రసంగంలో విని ఉన్నాం. కాకపోతే ఇక్కడ మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేసిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన దయా కృపతో సమాధి అగ్ని వేడి నుండి రక్షిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం అస్సహీహా గ్రంథంలోనిది, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

إن الصدقة لتطفئ عن أهلها حر القبور
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ అన్ అహ్లిహా హర్రల్ ఖుబూర్)
నిశ్చయంగా దానధర్మాలు, దానధర్మాలు చేసే వారి కొరకు సమాధి అగ్నిని చల్లార్చి వేస్తుంది.

అంటే దానధర్మాలు చేసిన వారు సమాధిలోని అగ్ని వేడి నుండి రక్షించబడతాడు అన్నమాట.

దానధర్మాలు చేసే వారికి కలిగే మరొక ప్రయోజనం ఏమిటంటే, లెక్కింపు రోజున హషర్ మైదానంలో వారికి నీడ కల్పించడం జరుగుతుంది. పరలోకం అన్న ప్రసంగంలో మనం విని ఉన్నాం వివరంగా. లెక్కింపు రోజున హషర్ మైదానంలో ప్రజలందరినీ ప్రోగు చేయడం జరుగుతుంది. సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. వేడి తీవ్రతతో ప్రజలు అల్లాడుతూ ఉంటారు. చెమటలో కొంతమంది మునుగుతూ ఉంటారు. అక్కడ చెట్టు నీడ గానీ, భవనం నీడ గానీ, పర్వతం నీడ గానీ ఉండదు. కేవలం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సింహాసనం నీడ మాత్రమే ఉంటుంది. అయితే అక్కడ నీడ కొంతమందికి ప్రసాదించబడుతుంది. వారిలో ఒకరు ఎవరంటే ఎవరైతే ప్రపంచంలో దానధర్మాలు చేస్తారో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం సహీ అల్ జామే గ్రంథంలోనిది. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

كل امرئ في ظل صدقته حتى يقضى بين الناس
(కుల్లుమ్ రిఇన్ ఫీ జిల్లి సదఖతిహీ హత్తా యుఖ్జా బైనన్నాస్)
ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు మనిషి తాను చేసిన దానధర్మం యొక్క నీడలో ఉంచబడతాడు.

అంటే ప్రజల మధ్య తీర్పు జరిగేంత వరకు అతను ప్రశాంతంగా, అతను ప్రపంచంలో చేసుకున్న దానధర్మాలకు బదులుగా నీడ కల్పించబడి అతను అక్కడ ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట.

అలాగే మిత్రులారా, దానధర్మాలు చేయటం వల్ల అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మరియు దానధర్మాలు చేసే వారు చెడ్డ చావు నుండి రక్షించబడతారు అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఇబ్నె హిబ్బాన్ మరియు తబరానీ గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు:

إن الصدقة لتطفئ غضب الرب وتدفع ميتة السوء
(ఇన్న స్సదఖత లతుత్ఫిఉ గజబర్రబ్బి వతద్ఫఉ మీతతస్సూ)
నిశ్చయంగా దానధర్మాలు అల్లాహ్ ఆగ్రహాన్ని చల్లార్చి వేస్తాయి మరియు చెడ్డ చావు నుండి రక్షిస్తాయి.

మనం చూస్తూ ఉన్నాం, వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం, ప్రజలు భయంకరమైన చావు చస్తూ ఉన్నారు. దానధర్మాలు చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భయంకరమైన చావు నుండి కాపాడుతాడు. దానధర్మాలు చేస్తే అల్లాహ్ ఆగ్రహము చల్లబడుతుంది మిత్రులారా.

దానధర్మాలకు ఉన్న మరొక గొప్ప విశిష్టత ఏమిటంటే, దానధర్మాలు చేసే వారి కోసం దైవదూతలు, ఇద్దరు దైవదూతలు దుఆ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఉల్లేఖనం సహీ అత్తర్గీబ్ గ్రంథంలోనిది, ఈ విధంగా ప్రవక్త వారు తెలియజేశారు:

ملكان يناديان
(మలకాని యునాదియాని)
ఇద్దరు దైవదూతలు పుకారిస్తూ ఉంటారు.

అంటే ఇద్దరు దైవదూతలు వేడుకుంటూ ఉంటారు, అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉంటారు. ఏమని?

اللهم أعط منفقا خلفا
(అల్లాహుమ్మ ఆతి మున్ఫిఖన్ ఖలఫన్)
ఖర్చు పెట్టే వానికి, ఓ అల్లాహ్! నువ్వు వెంటనే ప్రతిఫలం ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటారు.

దైవదూతలు ఆ భక్తుని కోసము దుఆ చేయటం అంటే ఇది గొప్ప విశిష్టత కలిగిన విషయం మిత్రులారా.

ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అదేమిటంటే విశ్వాస బలహీనత కలిగిన కొంతమంది దానధర్మాలు చేసుకుంటూ పోతే సొమ్ము, ధనము తరిగిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. వాస్తవం అది కాదు. నిజం ఏమిటంటే దానధర్మాలు చేయటం వలన మనిషి యొక్క ధనము పెరుగుతుంది, తరగదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రవక్త వారు సూటిగా తెలియజేశారు:

ما نقصت صدقة من مال
(మా నఖసత్ సదఖతుమ్ మిమ్మాల్)
దానధర్మం వల్ల ఏ భక్తుని సొమ్ము, ధనము తరగదు.

తరగదు అంటే పెరుగుతుంది తప్పనిసరిగా అని అర్థం. ఇదే విషయం బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారి నోట తెలియజేశాడు:

قال الله: أنفق يا ابن آدم أنفق عليك
(ఖాలల్లాహ్: అన్ఫిఖ్ యా ఇబ్న ఆదమ్ ఉన్ఫిఖ్ అలైక్)
ఓ ఆదమ్ కుమారుడా (మానవుడా) నువ్వు ఖర్చు చేయి, నేను నీకు ప్రసాదిస్తాను అన్నాడు.

ఇంతకుముందు కూడా మనం విని ఉన్నాం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మార్గంలో మనం ఒకటి ఇస్తే 700 రెట్లు అల్లాహ్ పెంచి మాకు ఇస్తాడని. ఇక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మీరు నా మార్గంలో దానధర్మాలు చేయండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు కాబట్టి మనం కొంచెం ఇస్తే అల్లాహ్ మాకు ఎక్కువగా ఇస్తాడు కాబట్టి, కొంచెం ఇచ్చి ఎక్కువ పొందుతున్నాము కదా? ఆ ప్రకారంగా మన సొమ్ము తరుగుతూ ఉందా, పెరుగుతూ ఉందా? పెరుగుతూ ఉంది. కాబట్టి అదే ప్రవక్త వారు తెలియజేశారు, దానధర్మాల వల్ల సొమ్ము తరగదు గానీ పెరుగుతుంది. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాను అని వాగ్దానం చేశాడు కాబట్టి అల్లాహ్ ఎక్కువ ఇస్తాడు అన్నమాట.

అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శిష్యులకు, మీరు అల్లాహ్ మార్గంలో నిర్భయంగా దానధర్మాలు చేయండి, ఖర్చు పెట్టండి అని ఆదేశించేవారు. ముఖ్యంగా బిలాల్ రజియల్లాహు అన్హు వారి గురించి చూచినట్లయితే, బిలాల్ రజియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, మిష్కాత్ గ్రంథంలోని ఉల్లేఖనంలో, ప్రవక్త వారు అంటున్నారు:

أَنْفِقْ يَا بِلَالُ، وَلَا تَخْشَ مِنْ ذِي الْعَرْشِ إِقْلَالًا
(అన్ఫిఖ్ యా బిలాల్, వలా తఖ్ష మిన్ జిల్ అర్షి ఇఖ్లాలా)
ఓ బిలాల్, అల్లాహ్ మార్గంలో నువ్వు ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపో, ఆ సింహాసనం మీద ఉన్న అల్లాహ్ పట్ల నువ్వు లేమికి భయపడకు.

అంటే నేను ఇచ్చుకుంటూ పోతే నాకు అల్లాహ్ ఇస్తాడో లేదో అని నువ్వు భయపడవద్దు, నిర్భయంగా నువ్వు అల్లాహ్ మీద నమ్మకంతో దానధర్మాలు చేసుకుంటూ ముందుకు సాగిపో అని ప్రవక్త వారు శిష్యులకు బోధించారు.

మిత్రులారా, ఇప్పటివరకు మనము తెలుసుకున్న విషయం ఏమిటంటే ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ప్రకారంగా అల్లాహ్ మార్గంలో దానధర్మాలు చేయడం వలన ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అనేక అనుగ్రహాలు భక్తులు పొందుతారు.

ఇక రండి, దానధర్మాలు చేసిన కొంతమంది భక్తుల ఉదాహరణలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలోనే గొప్ప భక్తులు ఎవరంటే మన అందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చేసిన దానధర్మాలలో ఒక రెండు ఉదాహరణలు మీ ముందర ఉంచుతూ ఉన్నాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితకాలంలో హునైన్ సంగ్రామం జరిగినప్పుడు ప్రవక్త వారి చేతికి 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 1,000 గొర్రెలు, 125 kg ల వెండి వచ్చింది. ఆ పూర్తి సొమ్ము ప్రవక్త వారు వినియోగించుకోవడానికి అవకాశము ఉంది. కానీ ప్రవక్త వారు ఏం చేశారంటే, ప్రజల మధ్య 6,000 బానిసలు, 24,000 ఒంటెలు, 100 గొర్రెలు, 125 kg ల వెండి మొత్తం పంచేశారు. ఒక్క బానిసను గాని వెంట తీసుకెళ్లలేదు, ఒక్క ఒంటెను గాని, ఒక్క గొర్రెను గాని వెంట తీసుకెళ్లలేదు. అంతెందుకు, ఒక్క వెండి నాణెము కూడా ప్రవక్త వారు చేతిలో పెట్టుకొని తీసుకెళ్లలేదు. మొత్తం పంచేసి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. చూశారా? ప్రవక్త వారు ఎంతగా దానధర్మాలు చేసేవారు, ప్రజలకు పంచిపెట్టేవారో.

మరొక ఉదాహరణ చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, “అల్లాహ్ మార్గం చూపిస్తాడు, కూర్చోండి” అని కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి వచ్చి సహాయం చేయండి అన్నారు. అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు, అతన్ని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు వచ్చారు, ముగ్గురిని కూడా ప్రవక్త వారు కూర్చోబెట్టుకున్నారు. కొద్దిసేపు గడిచింది, ఒక శిష్యుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి నాలుగు వెండి నాణేలు బహుమానంగా, హదియాగా ఇచ్చి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే అక్కడ కూర్చొని ఉన్న ముగ్గురికి ఒక్కొక్క నాణెము, ఒక్కొక్క నాణెము ఇచ్చేయగా వారు సంతోషంగా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారి వద్ద ఒక్క నాణెం మిగిలిపోయింది. ఎవరైనా వస్తారేమో, అవసరార్థులు వచ్చి అడుగుతారేమో ఇద్దాము అని ఎదురుచూశారు గాని ఎవరూ రాలేదు. ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ప్రవక్త వారికి నిద్ర పట్టట్లేదు. లేస్తున్నారు, నమాజ్ ఆచరిస్తున్నారు, మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, మళ్లీ లేస్తున్నారు నమాజ్ ఆచరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు చూసి ప్రవక్త వారితో ప్రశ్నించారు: “ఓ దైవ ప్రవక్తా, ఏమైందండి? మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు. కొత్త నిబంధనలు ఏమైనా వచ్చాయా? కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా? వాటిని తలుచుకొని మీరు ఏమైనా కంగారు పడుతూ ఉన్నారా?” అని అడిగితే, ప్రవక్త వారు ఆ ఒక్క వెండి నాణెము తీసి, “ఇదిగో, ఈ వెండి నాణెం వల్ల నేను కంగారు పడుతూ ఉన్నాను. దీన్ని నేను దానం చేయకముందే ఒకవేళ మరణిస్తే, అల్లాహ్ నాకు ఈ ఒక్క నాణెం గురించి అడిగితే నేను ఏమి సమాధానం చెప్పాలి? అది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను కంగారు పడుతున్నాను” అన్నారు. అల్లాహు అక్బర్! ఒక్క వెండి నాణెము అల్లాహ్ మార్గంలో దానం చేయకపోతే నాకేం గతి పడుతుందో అని ప్రవక్త వారు అంతగా భయపడుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దాన్ని దానం చేసేయాలని ఎదురుచూస్తున్నారంటే, ప్రవక్త వారు ఎంతగా దానం చేసేవారో చూడండి మిత్రులారా. అందుకోసమే చూసిన వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ప్రవక్త వారు చాలా అమితంగా, పరిమితి లేకుండా దానధర్మాలు చేసేవారు. ముఖ్యంగా రమజాన్ మాసంలో అయితే గట్టిగా వీస్తున్న గాలి కంటే వేగంగా దానధర్మాలు చేసేవారు అని చూసిన వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు.

ఇక ప్రవక్త వారి కుటుంబీకులను గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త వారి మరణానంతరం, ప్రవక్త వారి సతీమణి, విశ్వాసుల మాత ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి వద్దకు లక్ష దిర్హములు వచ్చాయి కానుకగా. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ఆ రోజు ఉపవాసంతో ఉన్నారు. ఆ లక్ష దిర్హములు కూడా ఆ విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రజల మధ్య పంచేశారు. మొత్తం పంచేసి ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్లారో, సేవకురాలు ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారితో అడుగుతూ ఉన్నారు: “ఏమమ్మా, ఆ దిర్హములలో నుంచి, అనగా ఆ లక్ష దిర్హములలో నుంచి ఏమైనా మిగుల్చుకున్నారా? ఎందుకంటే ఈ రోజు ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి, ఇఫ్తారీ చేయటానికి కూడా ఏమీ లేదు” అన్నారు. ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, “నేను ఒక్క దిర్హము కూడా మిగుల్చుకోలేదు, మొత్తం పంచేశాను” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఇంట్లో ఉపవాస విరమణ చేయటానికి కూడా ఏమీ లేని పరిస్థితిలో కూడా వారు నిర్భయంగా, ఎంత విశాలమైన హృదయంతో ప్రజలకు దానధర్మాలు చేసేవారో చూడండి ప్రవక్త వారి కుటుంబీకులు.

ఇక ప్రవక్త వారి శిష్యుల గురించి మనం చూచినట్లయితే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు తబూక్ యుద్ధ సమయంలో ఇంట్లోని సగం సామాగ్రి తీసుకొని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఉంచేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమయ్యా, ఇంట్లో ఏమి మిగిల్చావు?” అంటే, “సగం సామాగ్రి మిగిల్చి, మిగతా సగం తీసుకొని వచ్చి మీ ముందర ఉంచేశాను, ఓ దైవ ప్రవక్తా” అన్నారు. తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు వారు తీసుకొని వచ్చి సామాగ్రి ప్రవక్త వారి ముందర ఉంచారు. ఆయనతో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, “ఏమండీ, ఇంట్లో ఏమి మిగిల్చి వచ్చారు?” అంటే అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మరియు ప్రవక్త వారి మీద ఉన్న విశ్వాసము, అభిమానము మాత్రమే ఇంట్లో ఉంచి, మిగతా సొమ్ము మొత్తం పట్టుకొని వచ్చి మీ ముందర ఉంచేశానండి” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో ఇద్దరి గురించి చెప్పడం జరిగింది.

మరొక శిష్యుని గురించి మనం చూచినట్లయితే ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు. ప్రవక్త వారి మరణానంతరం అబూబకర్ రజియల్లాహు అన్హు వారు ఖలీఫాగా పరిపాలన చేస్తున్న రోజుల్లో మదీనాలో ఒకసారి కరువు ఏర్పడింది. ప్రజలు వచ్చి అబూబకర్ రజియల్లాహు అన్హు వారితో, “ధాన్యము లేక ప్రజలు ఆకలితో ఉన్నారు, వారి సమస్యను పరిష్కరించండి” అని కోరినప్పుడు, అబూబకర్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “ఒక్క రోజు మీరు ఓపిక పట్టండి, రేపు మీ సమస్య తీరిపోతుంది” అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెలు సిరియా దేశము నుండి ధాన్యం మోసుకొని మదీనాకు చేరాయి. ఆ రోజుల్లో ట్రక్కులు, లారీలు, గూడ్స్ రైళ్లు ఇవన్నీ లేవు కదండీ. ఒంటెల మీద, గుర్రాల మీద సామానులు, ధాన్యము వచ్చేది. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి ఒంటెల మీద సిరియా దేశం నుంచి ధాన్యము మదీనాకు చేరింది. వ్యాపారవేత్తలు ఏం చేశారంటే పరుగెత్తుకుంటూ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి వద్దకు వచ్చి, “ఏమండీ, ఈ ధాన్యము మాకు అమ్మండి, మేము మీకు లాభం ఇస్తాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు వారిని అడిగారు, “ఎంత ఇస్తారు మీరు?” అని. ఆ వ్యాపారవేత్తలు ఏమన్నారంటే, “మీరు పదికి కొన్న దాన్ని పదమూడు ఇచ్చి తీసుకుంటాము” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారు” అన్నారు. వ్యాపారవేత్తలు కొద్దిసేపు ఆలోచించుకొని, “సరేనండి, మీరు పదికి కొన్న దాన్ని పదిహేను ఇచ్చి మేము కొంటాము, మాకు ఇచ్చేయండి” అన్నారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు మళ్ళీ అదే మాట అన్నారు, “నాకు ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవారు ఉన్నారండి” అన్నారు. వ్యాపారవేత్తలు ఆశ్చర్యపోయారు. “మదీనాలో మేమే పెద్ద వ్యాపారవేత్తలము, మాకంటే ఎక్కువ లాభము మీకు ఇచ్చి ఈ ధాన్యం కొనుగోలు చేసేవాడు ఎవడు ఉన్నాడు, చెప్పండి?” అని అడిగారు. అప్పుడు ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రకటించారు: “చూడండి, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన మార్గంలో ఒకటి ఇస్తే 700 రెట్లు ఎక్కువగా ఇస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు కాబట్టి, మీరందరూ సాక్షిగా ఉండండి, ఈ ఒంటెల మీద ఉన్న పూర్తి ధాన్యాన్ని నేను మదీనా వాసుల కోసము దానం చేసేస్తూ ఉన్నాను, అల్లాహ్ కోసము” అని దానం చేసేశారు. అల్లాహు అక్బర్! చూశారా? ఇది ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి యొక్క ఉదాహరణ.

అలాగే అబూ దహ్దా రజియల్లాహు అన్హు అని ఒక సహాబీ ఉండేవారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని రెండవ అధ్యాయము 245వ వాక్యాన్ని అవతరింపజేశాడో:

مَّن ذَا الَّذِي يُقْرِضُ اللَّهَ قَرْضًا حَسَنًا فَيُضَاعِفَهُ لَهُ أَضْعَافًا كَثِيرَةً
అల్లాహ్‌కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దాన్ని ఆయన ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు.

ఎవరు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసి అల్లాహ్ కు అప్పు ఇస్తాడో, దాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన వద్ద పెంచి పోషించి పెద్దదిగా చేసేస్తాడు, భక్తుడు మరణించి అల్లాహ్ వద్దకు చేరినప్పుడు పెద్ద ప్రతిఫల రూపంలో అతనికి అది ఇవ్వబడుతుంది” అని ఆ వాక్యంలో తెలియజేయబడింది.

కాబట్టి ఆ వాక్యాన్ని విన్న తర్వాత ఆ సహాబీ అబూ దహ్దా రజియల్లాహు తాలా అన్హు వారు ప్రవక్త వారి వద్దకు వచ్చి, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి, మీరు సాక్షిగా ఉండండి, మదీనాలో నాకు 600 ఖర్జూరపు చెట్లు కలిగిన ఒక తోట ఉంది. ఆ తోటను నేను అల్లాహ్ మార్గంలో దానం చేసేస్తున్నాను, అల్లాహ్ కు అప్పు ఇచ్చేస్తూ ఉన్నాను” అని ప్రకటించేశారు. తర్వాత ఆ తోట వద్దకు వెళ్లి తోట లోపల అడుగు కూడా పెట్టకుండా బయట నుంచే నిలబడిపోయి, కుటుంబ సభ్యులు తోట లోపల ఉంటే, “ఏమండీ, మీరందరూ బయటికి వచ్చేయండి, నేను అల్లాహ్ మార్గంలో ఈ తోటను దానం చేసేశాను” అని చెప్పగా కుటుంబ సభ్యులు అందరూ బయటికి వచ్చేసారు. అల్లాహు అక్బర్! ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు, సహాబాలు చేసిన దానధర్మాలకు కొన్ని నిదర్శనాలు.

ఇక అలనాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంనాటి కొంతమంది మహిళల గురించి మనం చూచినట్లయితే, ఇంతకుముందు మనం ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారి గురించి విన్నాం. మిగతా వేరే సహాబియాత్ ల గురించి, మహిళల గురించి మనం చూచినట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మహిళల మధ్య వెళ్లి ప్రసంగించారు. ప్రసంగించిన తర్వాత దానధర్మాలు చేసుకొని మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి కాపాడుకోండి అని చెప్పినప్పుడు, మహిళలు దానధర్మాలు చేశారు. చూసిన వారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, అక్కడ ఉన్న మహిళల్లో కొంతమంది వారు తొడుగుతూ ఉన్న, ధరిస్తూ ఉన్న నగలు సైతము దానం చేసేశారు అని చెప్పారు. ఇవన్నీ కొంతమంది భక్తులు చేసిన దానధర్మాల ఉదాహరణలు మిత్రులారా.

అయితే ఖురాన్ మరియు హదీసులలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి దానధర్మాలు చేసుకోవటం మంచిది అని విశిష్టతలు తెలియజేసి ఉన్నారు? రండి ఇప్పుడు మనము కొన్ని ఉత్తమమైన దానధర్మాలు చేసే మార్గాలను తెలుసుకుందాం.

మొదటి మార్గం: సదకా జారియా అని అరబీలో అంటారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం అని తెలుగులో దాన్ని అనువాదం చేస్తారు. నిరంతరం పుణ్యం లభిస్తూ ఉండే మార్గం ఏమిటి అంటే ఒక రెండు మూడు విషయాలు మీ ముందర ఉంచుతున్నాను చూడండి.

ఒక వ్యక్తి ఒక మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ నిర్మించిన తర్వాత అతను మరణించినా, ప్రపంచంలో ఆ మస్జిద్ మిగిలి ఉన్నన్ని రోజులు, ప్రజలు అందులో నమాజ్ ఆచరిస్తున్నన్ని రోజులు, మస్జిద్ నిర్మించిన ఆ వ్యక్తి సమాధిలో ఉన్నా గాని అతనికి నిరంతరము పుణ్యము చేరుతూనే ఉంటుంది.

అలాగే ఒక వ్యక్తి ప్రజల దాహం తీర్చడానికి నీటి బావి తవ్వించాడు. తర్వాత అందులో నీళ్లు ప్రజలు తీసుకోవటం కోసము సౌకర్యాలు కల్పించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. అతను మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, ఈ బావి ఉన్నన్ని రోజులు, ఆ బావి నీళ్లు ప్రజలు వాడినన్ని రోజులు ఆ వ్యక్తికి నిరంతరం పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది, చేరుతూనే ఉంటుంది. ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయండి.

అలాగే ధార్మిక విద్య ఉంది. ఒక గురువుగారు శిష్యులకు ధార్మిక విద్య నేర్పించారు. గురువుగారు మరణించి సమాధిలోకి వెళ్లిపోయినా, శిష్యులు ప్రపంచంలో గురువు వద్ద నేర్చుకున్న విద్యను వారు ఎన్ని రోజులు అయితే అమలుపరుస్తూ ఉంటారో, ఇతరులకు బోధిస్తూ ఉంటారో ఆయనకు నిరంతరము, ఎలాంటి విరామం లేకుండా పుణ్యము సరఫరా అవుతూనే ఉంటుంది మిత్రులారా. ఇవి సదకా జారియాకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి సదకా జారియా చేసుకోవాలి. ఇది మొదటి మార్గం.

మరొక మార్గం ఏమిటంటే అనాథలను పోషించాలి. తల్లిదండ్రులు మరణించిన తర్వాత అనాథలు ఎవరైతే ఉంటారో వారిని పోషించటము కూడా గొప్ప పుణ్యకార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أنا وكافل اليتيم كهاتين في الجنة وأشار بالسبابة والوسطى
(అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న వ అషార బిస్సబ్బాబతి వల్ వుస్తా)
నేను మరియు అనాథ బిడ్డకు పోషించే వ్యక్తి ఇద్దరము స్వర్గంలో పక్కపక్కనే ఉంటాము అని చూపుడు వేలు మరియు మధ్య వేలు ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. (అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎంత గొప్ప విషయం అండి! ప్రవక్త వారి పొరుగులో మనము ఉండవచ్చు. అల్లాహు అక్బర్! కాబట్టి మనం చేసే దానధర్మాలలో ఒక మంచి మార్గం ఏది అంటే అనాథలను పోషించటం.

అలాగే దానధర్మాలు చేసుకోవటానికి మరొక గొప్ప మార్గం, ప్రజల ఆకలి తీర్చటం, ప్రజల దాహము తీర్చటం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు, అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం సారాంశం ఏమిటంటే: “ఎవరైతే విశ్వాసులలో ఆకలితో ఉన్న వారిని అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తాడో, విశ్వాసులలో నీళ్ల కోసము తపిస్తూ ఉన్న విశ్వాసుల దాహాన్ని తీరుస్తాడో, అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గంలోని పండ్లు, ఫలాలు తినిపిస్తాడు, స్వర్గంలోని నదుల నుండి త్రాపిస్తాడు” అని చెప్పారు. అల్లాహు అక్బర్! ఆకలితో ఉన్నవారి ఆకలి తీరిస్తే, దాహంతో ఉన్న వారి దాహము తీరిస్తే ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వర్గపు పళ్ళ ఫలాలు, స్వర్గపు నదుల నీరు త్రాపిస్తాడు, ప్రసాదిస్తాడు మిత్రులారా.

అలాగే ఎవరైతే నిరుపేదలు, సరైన బట్టలు లేవు, నగ్నంగా ఉంటూ ఉన్నారు, అలాంటి వారికి బట్టలు తొడిగించడం కూడా గొప్ప సత్కార్యము, దానధర్మాలు చూసుకోవడానికి ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. ప్రవక్త వారు తెలియజేశారు:

أَيُّمَا مُسْلِمٍ كَسَا مُسْلِمًا ثَوْبًا عَلَى عُرْيٍ كَسَاهُ اللَّهُ مِنْ خُضْرِ الْجَنَّةِ
(అయ్యుమా ముస్లిమ్ కసా ముస్లిమన్ సౌబన్ అలా ఉరన్ కసాహుల్లాహు మిన్ ఖుజ్రిల్ జన్న)
ఏ భక్తుడైతే నగ్నంగా ఉన్న వారికి బట్టలు తొడిగిస్తాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలంగా స్వర్గంలోని పచ్చని దుస్తులు ధరింపజేస్తాడు అన్నారు. ( అబూ దావూద్ గ్రంథంలోని ఉల్లేఖనం)

అల్లాహు అక్బర్! స్వర్గంలోని మంచి బట్టలు, ఉత్తమమైన బట్టలు, పచ్చని బట్టలు అల్లాహ్ ఆ భక్తునికి ఇస్తాడని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే దానధర్మాలు చేసుకోవటం కోసము మరొక సౌకర్యవంతమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రుల తరఫున, వారు మరణించిన తర్వాత వారి బిడ్డలు దానధర్మాలు చేసుకోవచ్చు. చూడండి దీనికి ఉదాహరణగా తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనం ప్రామాణికమైనది. సాద్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఒక సహాబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు:

يا رسول الله إن أمي توفيت أفينفعها إن تصدقت عنها
(యా రసూలల్లాహ్ ఇన్న ఉమ్మీ తువఫియత్ అఫయన్ఫఉహా ఇన్ తసద్దఖ్తు అన్హా)
ఓ దైవ ప్రవక్తా! నా తల్లి మరణించింది. నేను ఆవిడ తరపున సదఖా చేస్తే, దానధర్మాలు చేస్తే ఆవిడకు ప్రయోజనము చేకూరుతుందా? అని అడిగారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “నఅమ్. అవును, తప్పనిసరిగా ఆవిడ పేరున నువ్వు దానధర్మాలు చేసుకోవచ్చు, ఆవిడకు ప్రయోజనము చేకూరుతుంది” అని అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయన వద్ద ఒక తోట ఉండింది, ఆ తోటను ఆయన వారి తల్లి పేరు మీద దానం చేసేశారు. అల్లాహు అక్బర్! ఈ ఉల్లేఖనం ప్రకారంగా మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే మన తల్లిదండ్రుల్లో ఎవరు మరణించి ఉన్నా వారి బిడ్డలుగా మనము ప్రపంచంలో వారి పేరు మీద దానధర్మాలు చేయవచ్చు, వారికి పుణ్యము దక్కేలాగా ప్రయత్నించవచ్చు.

ఇక దానధర్మాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

أن تصدق وأنت صحيح شحيح تخشى الفقر وتأمل الغنى
(అన్ తసద్దఖ వఅన్త సహీహున్ షహీహున్ తఖ్ షల్ ఫఖర వతఅమలుల్ గినా)

నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నాకు ఏమైనా ఇంకా తక్కువ పడుతుందేమో అన్న భయము కలుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇంకా డబ్బు కావాలి ధనము కావాలి అని ఆశిస్తున్నప్పుడు, నువ్వు దానధర్మము చేస్తే అది నీ కొరకు ఉత్తమమైన సందర్భము అన్నారు. (బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం)

ఎప్పుడైతే మనిషి యవ్వనంగా ఉన్నప్పుడు ఎక్కువ సొమ్ము కావాలి అని అతనికి ఎక్కువ కోరికలు ఉంటాయి కాబట్టి ఎక్కువ సొమ్ము కావాలని కోరుకుంటాడు. చాలా అవసరాలు ఉంటాయి, ఆస్తులు కావాలి, ఇల్లు నిర్మించుకోవాలి, భార్య బిడ్డలకు నగలు తొడిగించుకోవాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. అప్పుడు సొమ్ము కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో మనిషి తన అవసరాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ కూడా అల్లాహ్ మార్గంలో దానం చేసినట్లయితే అది ఉత్తమమైన సందర్భం అని ప్రవక్త వారు తెలియజేశారు. అదే ముసలివారు అయిపోయిన తర్వాత, చావు దగ్గరికి వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడండి? ఎలాంటి కోరికలు ఉండవు. ఇంక ఎలాగూ ప్రపంచం వదిలేసి వెళ్ళిపోతున్నాము కదా, వెంట తీసుకొని వెళ్ళము కదా అని అప్పుడు దానం చేయటం కంటే కూడా అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు, కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సందర్భంలో దానధర్మాలు చేస్తే అది ఎక్కువ ప్రయోజనం కల్పించే విషయం అని ప్రవక్త వారు అన్నారు.

ఇక చివర్లో, దానధర్మాలు చేసే వారికి కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, మొదటి విషయం, దానధర్మాలు చేసే వారు ధర్మసమ్మతమైన, హలాల్ సంపాదనతో మాత్రమే దానధర్మాలు చేయాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనం:

إن الله عز وجل لا يقبل صلاة بغير طهور ولا صدقة من غلول
(ఇన్నల్లాహ అజ్జవజల్ లా యఖ్బలు సలాతన్ బిగైరి తహూరిన్ వలా సదఖతన్ మిన్ గలూలిన్)
ఉజూ లేకుండా నమాజు చేస్తే అలాంటి నమాజు అల్లాహ్ ఆమోదించడు, హరామ్ సంపాదనతో దానధర్మాలు చేస్తే అలాంటి దానధర్మాలను కూడా అల్లాహ్ ఆమోదించడు అన్నారు.

కాబట్టి హరామ్ సంపాదనతో కాదు, హలాల్ సంపాదన, ధర్మసమ్మతమైన సంపాదనతో దానధర్మాలు చేసుకోవాలి.

రెండవ సూచన ఏమిటంటే, దానధర్మాలు చేసే వారు ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు. కేవలం అల్లాహ్ చిత్తం కోసం మాత్రమే దానధర్మాలు చేయాలి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేడు ప్రజలు ఏం చేస్తారంటే, డబ్బు లేదా ఇతర వస్తువులు ఇతరులకు దానం చేస్తూ ఉన్నారంటే ఎన్ని సెల్ఫీలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు తీసుకుంటారంటే ఇక దాన్ని సోషల్ మీడియాలో, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో, స్టేటస్‌లలో వేరే వేరే చోట ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో నాకంటే గొప్ప దానకర్త ఎవరైనా ఉన్నారో లేదో చూడండి అని చూపిస్తూ ఉంటారు. ఇది కాదండి కావాల్సింది. ప్రపంచానికి చూపించటం, స్టేటస్‌లలో పెట్టుకోవడం కాదు, అల్లాహ్ కు నచ్చాలి. దాని కోసం మనం దానధర్మం చేయాలి. ప్రజలకు చూపించటానికి, ప్రజల దృష్టిలో నేను దాతను అనిపించుకోవడానికి కాదండి. అల్లాహ్ మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేయాలి. ప్రదర్శనా బుద్ధితో దానం చేస్తే దాని పుణ్యం వృధా అయిపోతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనం:

ومن تصدق يرائي فقد أشرك
(వమన్ తసద్దఖ యురాయీ ఫఖద్ అష్రక)
ఎవరైతే ప్రదర్శనా బుద్ధితో, చూపించటానికి దానధర్మాలు చేస్తాడో, అతను బహుదైవారాధనకు పాల్పడినట్లు అవుతుంది అన్నారు.

అల్లాహు అక్బర్! కాబట్టి ప్రదర్శనా బుద్ధితో దానధర్మాలు చేయకూడదు.

మూడవ విషయం, దానధర్మాలు చేసిన తర్వాత ఉపకారము చాటకూడదు. దెప్పి పొడవటం అంటారు కదండీ. ఉపకారము చాటకూడదు. ఇచ్చిన తర్వాత నేను నీకు ఇచ్చాను కదా, అది ఇచ్చాను కదా, ఇది ఇచ్చాను కదా అని కొంతమంది వారి మీద ఉపకారం చాటుతూ ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే చేసిన ఆ దానధర్మాల పుణ్యం మొత్తం వృధా అయిపోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు.

ఇక చివర్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానం ఇచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా కఠినంగా హెచ్చరించారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, “ఎవరైతే దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుంటారో వారు కక్కిన దాన్ని మళ్ళీ నోట్లో వేసుకున్న దానికి సమానం అన్నారు”. అల్లాహు అక్బర్!

ఇవి దానధర్మాలు చేసుకోవటానికి, దానధర్మాలు చేసే వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. నేను చివర్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన అందరికీ అన్న, విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=28200

జకాతు & సదఖా (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/zakah/

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ శుభ నామమైన “రబ్బ్” యొక్క వివరణ [వీడియో]
https://youtu.be/NTehdBRdCxg [28 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో అల్లాహ్ యొక్క శుభనామమైన “అర్-రబ్” (ప్రభువు) యొక్క లోతైన అర్థాలు మరియు భావనలు వివరించబడ్డాయి. “రబ్” అనే పదం సృష్టించడం, పోషించడం, నిర్వహించడం, నాయకత్వం వహించడం వంటి అనేక విస్తృతమైన అర్థాలను కలిగి ఉంటుందని వక్త తెలియజేశారు. ఈ పదం ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకం అని, ఇతరులకు వాడాలంటే మరొక పదాన్ని జతచేయాలని అరబిక్ వ్యాకరణ నియమాన్ని ఉదహరించారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ (ప్రభుత్వం) రెండు రకాలుగా ఉంటుందని వివరించారు: ఒకటి సాధారణ రుబూబియత్, ఇది సృష్టిలోని అందరి కోసం (విశ్వాసులు, అవిశ్వాసులతో సహా); రెండవది ప్రత్యేక రుబూబియత్, ఇది కేవలం విశ్వాసులకు, ప్రవక్తలకు మాత్రమే ప్రత్యేకం, దీని ద్వారా అల్లాహ్ వారికి విశ్వాస భాగ్యం, మార్గదర్శకత్వం మరియు ప్రత్యేక సహాయాన్ని అందిస్తాడు. ప్రవక్తలందరూ తమ ప్రార్థనలలో (దుఆ) “రబ్బనా” (ఓ మా ప్రభూ) అని అల్లాహ్ ను ఎలా వేడుకున్నారో ఖుర్ఆన్ ఆయతుల ద్వారా ఉదహరించారు. చివరగా, అల్లాహ్ ను ఏకైక రబ్ గా అంగీకరించడం తౌహీద్ యొక్క మూలమని, ఆయనతో పాటు ఇతరులను సంతానం, స్వస్థత లేదా ఇతర అవసరాల కోసం ఆరాధించడం షిర్క్ అనే ఘోరమైన పాపమని హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఆలా ఆలిహి వసహ్బిహి అజ్మయీన్. అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అఊజు బిల్లాహిస్ సమీయిల్ అలీమి మినష్ షైతానిర్ రజీమ్)
వినువాడు, సర్వజ్ఞాని అయిన అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను, శపించబడిన షైతాను నుండి.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వస్తోత్రాలు, పొగడ్తలన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే.

అల్లాహ్ యొక్క శుభనామం రబ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అయితే, ప్రియ విద్యార్థులారా, వీక్షకులారా! రబ్ అన్న అల్లాహ్ యొక్క ఈ శుభనామం, ఉత్తమ పేరు, దీని యొక్క భావాన్ని, అర్థాన్ని గనక మనం చూస్తే, ఇందులో ఎన్నో అర్థాలు, ఎన్నో భావాలు వస్తాయి. అయితే, ఆ భావాలు తెలిపేకి ముందు అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక మాట మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, రబ్ మరియు సర్వసామాన్యంగా అరబీలో అర్-రబ్ అన్న ఈ పదం కేవలం విడిగా రబ్ లేదా అర్-రబ్, అల్లాహ్ కు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అల్లాహ్ ను కాకుండా వేరే ఎవరి గురించైనా ఈ పదం ఉపయోగించాలంటే, తప్పకుండా దానితో పాటు మరొక పదాన్ని కలపడం తప్పనిసరి. ఈ యొక్క నియమం ఏదైతే మీరు తెలుసుకున్నారో, ఇప్పుడు ఇది మంచిగా మీకు అర్థం కావాలంటే రండి, రబ్ యొక్క అర్థాన్ని తెలుసుకుంటే మనకు ఈ విషయం తెలుస్తుంది.

రబ్ యొక్క అర్థంలో పుట్టించడం, పోషించడం, జీవన్మరణాలు ప్రసాదించడం మరియు నిర్వహించడం, నడిపించడం ఇవన్నీ భావాలతో పాటు, ఏదైనా విషయాన్ని చక్కబరచడం, దానిని రక్షించుకుంటూ ఉండడం, చూడడం, ఇంకా నాయకుడు, ఉన్నత హోదా అంతస్తులు కలిగి ఉన్నవాడు, ఎవరి ఆదేశం మాత్రమే చెల్లుతుందో ప్రజలు అనుసరిస్తారో, ఎవరి పెత్తనం నడుస్తుందో ఇలాంటి భావాలన్నీ కూడా ఇందులో ఉపయోగపడతాయి, ఈ భావాలన్నీ కూడా ఈ పదానికి వస్తాయి.

ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ‘అల్-బదాయిఉల్ ఫవాయిద్’ లో తెలిపారు,

إِنَّ هَذَا الِاسْمَ إِذَا أُفْرِدَ تَنَاوَلَ فِي دَلَالَاتِهِ سَائِرَ أَسْمَاءِ اللَّهِ الْحُسْنَى وَصِفَاتِهِ الْعُلْيَا
(ఇన్న హాజల్ ఇస్మ ఇజా ఉఫ్రిద తనావల ఫీ దిలాలాతిహి సాయిర అస్మాఇల్లాహిల్ హుస్నా వ సిఫాతిహిల్ ఉల్యా)
“నిశ్చయంగా ఈ పేరు (అర్-రబ్) ఒంటరిగా ప్రయోగించబడినప్పుడు, దాని సూచనలలో అల్లాహ్ యొక్క ఇతర ఉత్కృష్టమైన నామాలు మరియు ఉన్నత గుణాలన్నీ చేరిపోతాయి.”

ఈ మాటను షేఖ్ అబ్దుర్రజాక్ అల్-బదర్ హఫిజహుల్లాహ్ ప్రస్తావించి, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ యొక్క మాట ఇలా చెప్పారు:

إِنَّ الرَّبَّ هُوَ الْقَادِرُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ الْحَيُّ الْقَيُّومُ الْعَلِيمُ السَّمِيعُ الْبَصِيرُ الْمُحْسِنُ الْمُنْعِمُ الْجَوَادُ، الْمُعْطِي الْمَانِعُ الضَّارُّ النَّافِعُ الْمُقَدِّمُ الْمُؤَخِّرُ
(ఇన్నర్-రబ్బ హువల్ ఖాదిరుల్ ఖాలిఖుల్ బారివుల్ ముసవ్విరుల్ హయ్యుల్ ఖయ్యుముల్ అలీముస్ సమీయుల్ బసీరుల్ ముహ్సినుల్ మున్ఇముల్ జవాద్, అల్ ముఅతీ అల్ మానిఉ అద్దార్రు అన్నాఫిఉ అల్ ముఖద్దిము అల్ ముఅఖ్ఖిర్)

రబ్ అన్న యొక్క ఈ పదం అల్లాహ్ గురించి ఉపయోగించినప్పుడు, అల్లాహ్ యొక్క ఇంకా వేరే ఎన్నో పేర్లలో ఉన్నటువంటి భావం ఇందులో వచ్చేస్తుంది. అయితే, ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ కంటే కూడా చాలా ముందు ఇమామ్ తబరీ రహిమహుల్లాహ్, తఫ్సీర్ యొక్క పుస్తకాలలో ప్రామాణికమైన పరంపరలతో పేర్కొనబడిన మొట్టమొదటి తఫ్సీర్ అని దీనికి పేరు వచ్చింది, తఫ్సీరె తబరీ, అందులో ఇమామ్ ఇబ్ను జరీర్ రహిమహుల్లాహ్ చెప్పారు:

الرَّبُّ فِي كَلَامِ الْعَرَبِ مُتَصَرِّفٌ عَلَى مَعَانٍ، فَالسَّيِّدُ الْمُطَاعُ فِيهِمْ يُدْعَى رَبًّا
(అర్-రబ్బు ఫీ కలామిల్ అరబ్ ముతసర్రిఫున్ అలా మఆన్, ఫస్-సయ్యిదుల్ ముతాఉ ఫీహిమ్ యుద్ఆ రబ్బన్)
“అరబ్బుల భాషలో ‘రబ్’ అనే పదం అనేక అర్థాలలో వస్తుంది. వారిలో విధేయత చూపబడే నాయకుడిని ‘రబ్’ అని పిలుస్తారు.”

అరబీ భాషలో, అరబ్బుల మాటల్లో అర్-రబ్ అన్న పదం ఏ నాయకుడినైతే అనుసరించడం జరుగుతుందో, అలాంటి వాటిని మరియు ఏ మనిషి అయితే అన్ని విషయాలను, వ్యవహారాలను చక్కబరిచి వాటిని సరిదిద్ది, వాటి బాగోగులు చూసుకుంటాడో, అలాంటి వాడిని మరియు ఏదైనా విషయానికి అధికారి అయిన అలాంటి వారికి కూడా అర్-రబ్ అన్న పదం ఉపయోగపడుతుంది.

ఈ విధంగా, ఇంటి యొక్క యజమాని అని మనం అంటాము తెలుగులో. దీని గురించి అరబీలో రబ్బుద్-దార్. కేవలం రబ్ కాదు. దార్ అంటే ఇల్లు. ఇంటి యొక్క యజమాని – రబ్బుద్-దార్. ఈ పని యొక్క బాధ్యుడురబ్బుల్-అమల్. ఇప్పటికీ కువైట్ మరియు మరికొన్ని దేశాలలో స్పాన్సర్ ఎవరైతే ఉంటారో, సౌదీలో ‘కఫీల్‘ అని ఏదైతే అనడం జరుగుతుందో, అలా కువైట్‌లో ‘రబ్బుల్ అమల్’ అని అక్కడ పిలవడం, చెప్పడం జరుగుతుంది.

ఈ భావాన్ని మీరు తెలుసుకున్నారంటే, ఇక మనం అల్లాహ్ యొక్క పేరు చెప్పుకుంటున్నాము గనక, అల్లాహ్ యొక్క పేరు ఒకటి రబ్ ఉంది అని, తౌహీద్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన భాగాలు – తౌహీదె రుబూబియత్, తౌహీదె అస్మా వ సిఫాత్, తౌహీదె ఉలూహియత్ – వీటిలో ఒకటి రుబూబియత్. అంటే ఈ మొత్తం విశ్వంలో సృష్టించడం, పోషించడం, నిర్వహించడంలో ఏకైకుడు, ఎలాంటి భాగస్వామి లేనివాడు అల్లాహ్ అని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి.

అయితే, ఈ మొత్తం సృష్టిని సృష్టించడంలో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఖుర్ఆన్ లో మనం శ్రద్ధగా చదివామంటే, ఈ విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, అల్లాహ్ త’ఆలా ఖుర్ఆన్ లో కొన్ని సందర్భాలలో అల్లాహ్ మాత్రమే మన యొక్క రబ్ అని తెలియజేస్తూ, ఆయనే ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు అని స్పష్టంగా తెలిపాడు. సూరతుల్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102 చూడండి:

ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ
(జాలికుముల్లాహు రబ్బుకుమ్, లా ఇలాహ ఇల్లా హువ, ఖాలిఖు కుల్లి షైఇన్ ఫఅబుదూహ్)
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. (6:102)

ఈ ఆయతును మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఒక్క మాటకే కాదు ఇది దలీల్, ఈ ఆయత్ యొక్క భాగం ఏదైతే నేను చదివానో ఇప్పుడు, తెలుగు అనువాదం చెప్పానో, ఇందులో మరి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకా ముందుకు కూడా నేను దీనిని ప్రస్తావిస్తాను. సూరె అన్ఆమ్ సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102.

అల్లాహ్ త’ఆలాయే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క మేలు, సంక్షేమాలు, వారందరి యొక్క బాగోగులు చూసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతి వారికి అవసరం తీర్చువాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి భావం ఈ అర్-రబ్ అనే పదంలో ఉంది.

రబ్ లో రబ్బా యురబ్బీ తర్బియతన్. తర్బియత్పోషించడం అన్న పదం, అన్న భావం ఏదైతే ఉందో, ఇందులో రెండు రకాలు అన్న విషయం స్పష్టంగా తెలుసుకోండి.

అల్లాహ్ త’ఆలా రబ్, ప్రతి ఒక్కరి రుబూబియత్, ప్రతి ఒక్కరి తర్బియత్ వారి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో దాని పరంగా వారిని పోషించే బాధ్యత అల్లాహ్ ఏదైతే తీసుకున్నాడో, అల్లాహ్ మాత్రమే చేయగలుగుతున్నాడో, దీని యొక్క ఈ రబ్ యొక్క భావంలో రెండు రకాలు ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

ఒకటి, పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా, విశ్వాసుడైనా, అవిశ్వాసుడైనా, సన్మార్గంపై ఉన్నవాడైనా, మార్గభ్రష్టంలో ఉన్నవాడైనా, ప్రతి ఒక్కరి సృష్టి, ఉపాధి, వారి యొక్క నిర్వహణ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని అధోగతికి పాలు చేయాలి, ఇదంతా కూడా అల్లాహ్ త’ఆలా చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో అల్లాహ్ కు ఎవరూ కూడా భాగస్వామి లేరు. ఇది ఒక సామాన్యమైన భావం.

కానీ అల్లాహ్ త’ఆలా తన యొక్క ప్రవక్తలకు, తన ప్రత్యేకమైన పుణ్యాత్ములైన దాసులకు, సద్వర్తనులకు, విశ్వాస భాగ్యం, ప్రవక్త పదవి లాంటి గొప్ప మహా భాగ్యం, అల్లాహ్ యొక్క ఆరాధన సరైన రీతిలో చేసే అటువంటి భాగ్యం, మరియు వారు పాపాలను వదిలి పుణ్యాల వైపునకు రావడం, పాపం పొరపాటు జరిగిన వెంటనే తౌబా చేసే భాగ్యం కలుగజేయడం, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క ప్రత్యేక రుబూబియత్. ఇది ప్రసాదించేవాడు కూడా అల్లాహ్ త’ఆలాయే. కానీ ఇలాంటివి ప్రత్యేక రుబూబియత్ లోని విషయాలు ఎవరికైనా లభించాలంటే, వారు అల్లాహ్ వైపునకు మరలడం కూడా తప్పనిసరి.

గమనించండి ఇక్కడ ఒక విషయం, అల్లాహ్ త’ఆలాయే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంలో నేను రాకముందు తల్లి గర్భంలో నన్ను ఎలా పోషిస్తూ వచ్చాడు, పుట్టిన వెంటనే, మనం గమనించాలి ఇక్కడ. మనం మనుషులం గాని, పక్షులు గాని, జంతువులు, పశువులు గాని అల్లాహ్ యొక్క రుబూబియత్ విషయాన్ని గమనించేది ఇక్కడ చాలా గొప్ప ఒక నిదర్శనం మనకు ఉన్నది. గుడ్డులో ఉన్నా గాని పక్షులు, లేక పశువులు, జంతువులు, మనుషులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాని, అక్కడ వారి యొక్క మొత్తం జన్మ యొక్క ప్రక్రియ ఎలా కొనసాగిస్తున్నాడు, అల్లాహ్ తప్ప వేరే ఎవరికైనా ఇలాంటి శక్తి ఉందా?

పుట్టిన వెంటనే, గుడ్డులో పూర్తి పక్షి తయారవుతుంది. బయటికి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ అది వస్తుంది. మరియు వచ్చిన వెంటనే దానికి కావలసిన ఆహారం కళ్ళు తెరవకముందు ఎలా తల్లి దానికి ఇవ్వాలి అన్నటువంటి భాగ్యం, జ్ఞానం, అల్లాహ్ త’ఆలా ఆ పక్షికి ఎలా కలుగజేస్తాడో గమనించండి. ఇక మనిషి, జంతువుల విషయానికి వస్తే, పుట్టిన వెంటనే తన యొక్క ఆహారం ఎక్కడ ఉన్నదో అటు జంతువు గాని, అటు మనిషి గాని తన తల్లి స్థనాల్లో అన్న విషయాన్ని ఎలా గమనిస్తాడో చూడండి. ఈ భాగ్యం ఎవరు కలుగజేస్తున్నారు? ‘రబ్’ అన్నటువంటి పదం మనం చదివినప్పుడు, ఈ విషయాలు చూస్తున్నప్పుడు, అల్లాహ్ పై మన యొక్క విశ్వాసం అనేది చాలా బలంగా ఉండాలి. అయితే మనం పుట్టిన తర్వాత క్రమంగా మనలో ఎలాంటి శక్తి పెరుగుతుందో, మనలో బుద్ధిజ్ఞానాలు ఎలా పెరుగుతాయో, ఈ విషయంలో కూడా అల్లాహ్ రబ్ అయి మనల్ని ఎలా పెంచుతున్నాడో, ఇందులో మన కొరకు గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.

ఇంతటి గొప్ప రబ్ అయిన అల్లాహ్, మనల్ని ఏ ఆదేశం ఇవ్వకుండా, మనల్ని పుట్టించి, మనకు ఏ ఉద్దేశం లేకుండా చేస్తాడా? చేయడు. అందుకొరకే అల్లాహ్ ఏమంటున్నాడు:

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
(అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖ్నాకుమ్ అబసవ్ వఅన్నకుమ్ ఇలైనా లా తుర్ జఊన్)
“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?”(23:115)

అలా కాదు. ఒక ఉద్దేశపరంగా మిమ్మల్ని పుట్టించాము. అదేంటి? ఆ అల్లాహ్ యొక్క ఆరాధన మనం చేయడం. అందుకొరకే, ఖుర్ఆన్ లో అనేక సందర్భాలలో అల్లాహ్ తన రుబూబియత్ కు సంబంధించిన నిదర్శనాలు చూపించి, వెంటనే ఉలూహియత్ వైపునకు అల్లాహ్ త’ఆలా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను చదివినటువంటి ఆయతే చూడండి. సూరత్ అన్ఆమ్, సూరహ్ నంబర్ ఆరు, ఆయత్ నంబర్ 102, ‘జాలికుముల్లాహు రబ్బుకుమ్’ – ఆయనే మీ ప్రభువు. అల్లాహ్ మీ ప్రభువు. ‘లా ఇలాహ ఇల్లా హువ’ – ఆయన తప్ప ఎవరు కూడా మీకు ఆరాధ్యనీయుడు కాడు. ఆయనే మిమ్మల్ని పుట్టించాడు గనక, ప్రతి వస్తువుని పుట్టించాడు గనక, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి.

ఇదే విధేయత, ఆరాధనా భావంతో మనం అల్లాహ్ ను వేడుకోవాలని మనకు నేర్పడం జరిగింది. మరియు మనం గనక ప్రత్యేకంగా సూరతుల్ అంబియాలో మరియు వేరే ఇతర సూరాలలో చూస్తే ప్రవక్తలు అందరూ అల్లాహ్ తో ప్రత్యేక వేడుకోలు, దుఆ, అర్ధింపు లాంటి విషయాలు ఎలా అల్లాహ్ తో అడిగేవారు? ‘రబ్బనా’.

రబ్బీ అంటే ఇది ఏకవచనం – ఓ నా ప్రభువా. రబ్బనా – ఓ మా ప్రభువా.

అయితే, ఆదం అలైహిస్సలాం కూడా ఎలా దుఆ చేశారు?

رَبَّنَا ظَلَمْنَا أَنْفُسَنَا
(రబ్బనా జలమ్నా అన్ఫుసనా)
“ఓ మా ప్రభూ! మేము మా ఆత్మలకు అన్యాయం చేసుకున్నాము”

అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, హూద్ అలైహిస్సలాం, అయ్యూబ్ అలైహిస్సలాం, యాఖూబ్ అలైహిస్సలాం, ఇంకా ఎందరో ప్రవక్తల దుఆలు ఖుర్ఆన్ లో ఉన్నాయి కదా. ఇతరులతో దుఆ చేయడం ఎంత ఘోరం అన్నటువంటి ఒక వీడియో మాది ఉంది, మీరు చూడండి. ప్రవక్తలందరి దుఆలు ‘రబ్బనా’ తో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? అల్లాహ్ యే మనల్ని అన్ని రకాలుగా పోషించి, పెంచి, మన యొక్క అవసరాలు తీర్చి మనల్ని చూసుకుంటూ, మన యొక్క బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. అందుకొరకు ‘రబ్బనా’. అల్లాహ్ యొక్క నామం ఎంత గొప్పదో అది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. కానీ దుఆలో వచ్చేసరికి, ‘రబ్బీ అవ్జిఅనీ అన్ అష్కుర నిఅమతకల్ లతీ’..సులైమాన్ అలైహిస్సలాం వారి యొక్క దుఆ కూడా. ఈ విధంగా అనేక సందర్భాలలో ‘రబ్బీ’ మరియు ‘రబ్బనా’ అన్నటువంటి పదాలతో దుఆ చేయడం మనకు నేర్పడం జరిగింది.

సోదర మహాశయులారా! అల్లాహ్ త’ఆలా రబ్ అయి ఉన్నాడు గనక, మనము అల్లాహ్ యొక్క రబ్ అన్న ఈ పదాన్ని ఎక్కడెక్కడ చదివినా గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ లోకంలో ఎంతోమంది తమకు తాము రబ్ అన్నటువంటి ఆరోపణ, దావా చేశారు.

ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలంలో నమ్రూద్, మూసా అలైహిస్సలాం కాలంలో ఫిరౌన్. ఇక్కడ వారి యొక్క నమ్మకం ఏంటి? మేము రాజులము గనక, అందరూ ప్రజలు గనక, మా ఇష్టప్రకారమే మీరు జీవితం గడపాలి, మా ఆదేశాలను అనుసరించాలి. అల్లాహ్ ను నమ్మేవారు, వారు కూడా. “అల్లాహ్ కాకుండా మేము పుట్టించాము ఈ భూమ్యాకాశాలను, మేము మిమ్మల్ని పుట్టించాము” ఇలాంటి దావా లేకుండింది వారిది. సయ్యద్-ముతా అన్నటువంటి భావనతో, అంటే మాది పెత్తనం, మా మాటే చెల్లాలి, నడవాలి.

అయితే ఈరోజుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అధికారం దొరికినదంటే, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు ఉన్నాడు, అసలైన రబ్ అతను, అసలైన విధేయత అతనిది, మనం ఆరాధించవలసినది అల్లాహ్ ను అన్న విషయాన్ని మరచిపోయి, అల్లాహ్ యొక్క మాటకు వ్యతిరేకమైన, నేను నాయకుడిని నా మాట మీరు వినాలి అన్నటువంటి గర్వానికి ఏదైతే గురి అవుతారో, వారు కూడా భయపడాలి ఫిరౌన్ లాంటి గతి వారిది అవుతుంది అని. అందుకొరకే ఎల్లవేళల్లో అల్లాహు త’ఆలా తో భయపడి, అల్లాహ్ ను రబ్ అని ఏదైతే మనం నమ్ముతున్నామో,

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ
(యా అయ్యుహన్నాసు ఉబుదూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువైన, మీ యొక్క రబ్ అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. (2:21)

إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۚ هَٰذَا صِرَاطٌ مُسْتَقِيمٌ
(ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుమ్ ఫఅబుదూహ్, హాదా సిరాతుమ్ ముస్తఖీమ్)
నా ప్రభువు, నా యొక్క రబ్, మీ యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే గనక ఆయన్నే ఆరాధించండి. ఇదియే సన్మార్గం.  (3:51)

ఇక ఈ సన్మార్గం నుండి ఎవరైనా దూరమైపోతే వారు చాలా చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎల్లప్పుడూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉండండి.

رَبِّ اغْفِرْ لِي وَلِأَخِي
(రబ్బిగ్ఫిర్లీ వలి అఖీ)
ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని, సోదరులను క్షమించు.(7:151)

رَبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ
(రబ్బిగ్ఫిర్లీ వలి వాలిదయ్య)
“ఓ నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను క్షమించు.” (71:28)

ఈ విధంగా, ఈ రెండు పదాలు ఇప్పుడు నేను చదివానో ఖుర్ఆన్ లో వచ్చినవే. మూసా అలైహిస్సలాం వారి యొక్క దుఆ, నూహ్ అలైహిస్సలాం యొక్క దుఆ ఈ విధంగా.

అలాగే అల్లాహ్ ను రబ్ అని మనం నమ్మే ఈ పదంలో, ఇందులో మనం చాలా బలమైన ఒక గట్టి విశ్వాసం ఏం ఉండాలంటే, ఈ లోకంలో మనం రబ్ అయిన అల్లాహ్ యొక్క విశ్వాసంపై బలంగా ఉన్నప్పుడు, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎంతటి దౌర్జన్యపరుల నుండి మనపై ఎలాంటి హింసా దౌర్జన్యాలు చేయబడినా, ఈ పరీక్షా కాలమైనటువంటి ఒక చిన్న జీవితంలో కొన్ని పరీక్షలు మాత్రమే. వాటిని దూరం చేసేవాడు అల్లాహ్ మాత్రమే. ఈ విషయం మనకు మూసా అలైహిస్సలాం, ఫిరౌన్, ఆ తర్వాత మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీల్ యొక్క సంఘటనలో, అలాగే సూరతుల్ ముఅమిన్ లో, సూరతుల్ ముఅమిన్ లో అల్లాహ్ త’ఆలా ఫిరౌన్ వంశానికి సంబంధించిన ఒక విశ్వాసుని సంఘటన ఏదైతే తెలిపాడో, అందులో కూడా ఈ గొప్ప గుణపాఠం ఉంది.

ఎప్పుడైతే ఫిరౌన్ చెప్పాడో, “నన్ను వదలండి నేను మూసాను హత్య చేస్తాను,” అప్పుడు ఆ విశ్వాసుడు వెంటనే నిలబడి ఏమన్నాడు?

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ
(వ ఖాల రజులున్ ముఅమినున్ మిన్ ఆలి ఫిరౌన యక్తుము ఈమానహు అతఖ్ తులూన రజులన్ అన్ యఖూల రబ్బియల్లాహ్)
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్‌ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: “ఏమిటీ, ‘అల్లాహ్‌ నా ప్రభువు’ అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? (40:28)

నా ప్రభువు, నా యొక్క రబ్ అల్లాహ్ మాత్రమే అని చెప్పే ఇలాంటి వ్యక్తిని మీరు చంపుతారా? ఇంకా అతని పూర్తి సంఘటన మీరు చదవండి, సూరత్ అల్-ముఅమిన్, దీని యొక్క రెండవ పేరు గాఫిర్, సూరహ్ నంబర్ 40, ఆయత్ నంబర్ 28 నుండి ఈ సంఘటన మొదలవుతుంది.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క గొప్ప నామముల, మంచి పేర్ల ఏ వివరాలు తెలుసుకుంటున్నామో, దాని పరంగా మన విశ్వాసం ఉండి, అన్ని రకాల షిర్కులకు, మూఢనమ్మకాలకు అల్లాహ్ మనల్ని దూరం ఉంచుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

అల్లాహ్ (త’ఆలా): https://teluguislam.net/allah/

అల్లాహ్ శుభ నామాల వివరణ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tSV7A9HKJzSeM0aIAiYcb

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్
తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)

తఫ్సీర్ సూరతుల్ జుముఆహ్ 62: ఆయతులు 9-11 (Tafsir Suratul Jumuah Ayah 9-11)
https://youtu.be/5hhWL5q0q6M [49 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, సూరతుల్ జుముఆ (అధ్యాయం 62), ఆయతులు 9 నుండి 11 వరకు వివరించబడ్డాయి. శుక్రవారం నమాజు కొరకు పిలుపు వచ్చినప్పుడు వ్యాపారాలు మరియు ఇతర ప్రాపంచిక పనులను విడిచిపెట్టి అల్లాహ్ ధ్యానం వైపునకు పరుగెత్తాలని విశ్వాసులకు ఇచ్చిన ఆదేశంపై దృష్టి సారించబడింది. ఖురాన్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఆచరించడానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీసులు ఎంత అవసరమో నొక్కి చెప్పబడింది; హదీసును తిరస్కరించడం అంటే పరోక్షంగా ఖురాన్‌ను తిరస్కరించడమే అని స్పష్టం చేయబడింది. శుక్రవారం రోజు యొక్క ఘనత, ఆ రోజున స్నానం చేయడం, త్వరగా మస్జిద్‌కు రావడం, మరియు నిశ్శబ్దంగా ఖుత్బా వినడం వల్ల కలిగే గొప్ప పుణ్యాల గురించి హదీసుల ఆధారంగా వివరించబడింది. ప్రవక్త ఖుత్బా ఇస్తుండగా ఒక వ్యాపార బృందం రాకతో కొందరు సహాబాలు పరధ్యానంలో పడిన చారిత్రక సంఘటనను ప్రస్తావిస్తూ, వినోదం మరియు వ్యాపారం కంటే అల్లాహ్ వద్ద ఉన్న ప్రతిఫలం ఎంతో మేలైనదని ఈ ఆయతులు గుర్తుచేస్తున్నాయని బోధించబడింది. ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, అల్లాహ్‌ను నిరంతరం స్మరించుకోవడమే నిజమైన సాఫల్యానికి మార్గమని ప్రసంగం ముగిసింది.


అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు. అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మాబాద్.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, అల్హందులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం ఈరోజు తఫ్సీర్ క్లాస్ ప్రారంభం చేయబోతున్నాము. ఈనాటి మన తఫ్సీర్ క్లాస్‌లో మనం ఇన్షాఅల్లాహ్, సూరతుల్ జుముఆ, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి చివరి వరకు మూడు ఆయతుల వ్యాఖ్యానం తెలుసుకోబోతున్నాము.

అయితే సోదర మహాశయులారా, సోదరీమణులారా, నేను అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ జుముఆ ఆయత్ నంబర్ తొమ్మిది నుండి తిలావత్ ప్రారంభించబోతున్నాను. ఇంతలో మీరు మీ యొక్క బంధుమిత్రులందరినీ కూడా గుర్తు చేసుకోండి, ఈనాటి ఈ శుభప్రదమైన ప్రోగ్రాంలో హాజరవ్వడానికి వారికి ప్రోత్సహించండి.

వాస్తవానికి, మనం ముస్లిముగా, అల్లాహ్‌ను విశ్వసించే వారిగా పుట్టడం లేదా తర్వాత ఇస్లాం ధర్మంలో చేరడం, ఆ తర్వాత ఇస్లాం ధర్మం నేర్చుకోవడానికి ఇలాంటి అవకాశాలు మనకు కలుగుతూ ఉండటం ఇది అల్లాహ్ యొక్క ఎంతో గొప్ప దయ. ఎందుకంటే ధర్మ విద్యనే మనిషికి అల్లాహ్‌కు చాలా దగ్గరగా చేస్తుంది. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం నేర్చుకుంటూ ఉంటే మనం నశించిపోయే ఈ లోకం యొక్క వ్యామోహంలో పడకుండా పరలోక చింతలో మనం గడపగలుగుతాము మన యొక్క ఈ ఇహలోక రోజులు. ధర్మ విద్య అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో మనం అభ్యసిస్తూ ఉంటే, అల్లాహ్ ఆదేశించినవి ఏమిటో వాటిని ఆచరిస్తూ, అల్లాహ్‌కు ఇష్టం లేని, ఆయన మన కొరకు నిషేధించినవి ఏమిటో తెలుసుకొని వాటికి దూరంగా ఉండగలుగుతాము.

ఈ రోజుల్లో మనలో అనేక మంది పురుషులు గానీ, స్త్రీలు గానీ ఎన్నో రకాల పాపాల్లో పడి, కరోనా మహమ్మారి యొక్క ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందులకు గురియై వారు ఒక రకంగా నష్టపోతున్నారు. కానీ వాస్తవానికి ఇది అంత పెద్ద నష్టం కాదు. మహా భయంకరమైన పెద్ద నష్టం ఆ శాశ్వతమైన పరలోక జీవితాన్ని గుర్తించకపోవడం, అక్కడి ఆ జీవితం మనకు సాఫల్యం, స్వర్గం ప్రాప్తించడానికి ఈ లోకంలో చేసుకునేటువంటి కొన్ని సత్కార్యాలు చేసుకోకపోవడం.

అయితే రండి సోదర మహాశయులారా, సోదరీమణులారా, ఇప్పుడు అల్లాహ్ యొక్క దయతో ఆ ఆయతుల యొక్క తిలావత్ మనం ప్రారంభం చేస్తున్నాము. ముందు మీరు చాలా శ్రద్ధగా ఖురాన్ ఈ ఆయతులను ఆలకించండి. ఖురాన్ యొక్క తిలావత్ చేయడం ఎలా పుణ్య కార్యమో, పూర్తి శ్రద్ధాభక్తులతో ఖురాన్‌ను వినడం కూడా అంతే పుణ్యం. ఒక్కో అక్షరానికి పదేసి పుణ్యాలు, ఇంకా ఎన్నో రకాల లాభాలు.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ.
(అవూదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్)
(శపించబడిన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ وَذَرُوا الْبَيْعَ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ.
(యా అయ్యుహల్లజీన ఆమనూ ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅతి ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహి వ జరుల్ బైఅ, జాలికుమ్ ఖైరుల్లకుమ్ ఇన్ కున్తుమ్ తలమూన్)

فَإِذَا قُضِيَتِ الصَّلَاةُ فَانتَشِرُوا فِي الْأَرْضِ وَابْتَغُوا مِن فَضْلِ اللَّهِ وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا لَّعَلَّكُمْ تُفْلِحُونَ.
(ఫఇదా ఖుదియతిస్సలాతు ఫన్తషిరూ ఫిల్ అర్ది వబ్తగూ మిన్ ఫద్లిల్లాహి వజ్కురుల్లాహ కసీరన్ లఅల్లకుమ్ తుఫ్లిహూన్)

وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا ۚ قُلْ مَا عِندَ اللَّهِ خَيْرٌ مِّنَ اللَّهْوِ وَمِنَ التِّجَارَةِ ۚ وَاللَّهُ خَيْرُ الرَّازِقِينَ.
(వ ఇదా రఅవ్ తిజారతన్ అవ్ లహ్వనిన్ఫద్దూ ఇలైహా వ తరకూక ఖాయిమా, ఖుల్ మా ఇందల్లాహి ఖైరుమ్ మినల్లహ్వి వ మినత్తిజారతి, వల్లహు ఖైరుర్రాజిఖీన్)


ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదిలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. మరి నమాజు ముగిసిన తర్వాత భూమిలో విస్తరించి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి. ఎక్కువగా అల్లాహ్‌ను స్మరిస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.

జనుల పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కనవచ్చినా, వారు దాని వైపుకు పరుగెడుతున్నారు, నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు, అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.

అల్హందులిల్లాహ్, మీరు సూరతుల్ జుముఆ, సూరా నంబర్ 62, ఆయత్ నంబర్ తొమ్మిది నుండి 11 వరకు మూడు ఆయతుల తిలావత్ మరియు ఈ మూడు ఆయతుల అనువాదం కూడా విన్నారు. ఇక రండి, ఈ ఆయతులలో మనకు బోధపడుతున్న విషయాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం.

సోదర మహాశయులారా, తఫ్సీర్ ఇబ్ను కసీర్, ఖురాన్ యొక్క తఫ్సీర్‌లలో చాలా ప్రఖ్యాతి గాంచిన తఫ్సీర్. ఈ తఫ్సీర్ ధర్మవేత్తలందరూ కూడా ఏకీభవించిన మరియు ఎలాంటి విభేదం లేకుండా దీని యొక్క విషయాలను ఇందులో ఖురాన్ యొక్క వ్యాఖ్యానం ఖురాన్‌తో మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి హదీసులతో ఏదైతే చేయబడినదో దానిని ఏకీభవిస్తారు.

ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మనం చూశామంటే, అందులో ఇప్పుడు మనకు ఉపయోగపడే ప్రయోజనకరమైన విషయాలలో, ఈ ఆయతులో అల్లాహు తాలా విశ్వాసులను సంబోధించాడు. يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا (యా అయ్యుహల్లజీన ఆమనూ – ఓ విశ్వాసులారా). ఇంతకు ముందు అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది, హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి గురించి కూడా చెప్పడం జరిగింది.

అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) చెబుతున్నారు, ఖురాన్‌లో ఎప్పుడు మీరు “యా అయ్యుహల్లజీన ఆమనూ, ఓ విశ్వాసులారా” అని చదివితే, చెవి మాత్రమే కాదు, మీ హృదయంలో ఉన్నటువంటి వినే శక్తిని కూడా ఉపయోగించి పూర్తి శ్రద్ధాభక్తులతో మీరు వినండి. అల్లాహ్ విశ్వాసులకు ఏదైనా ఆదేశం ఇస్తున్నాడు లేదా అల్లాహు తాలా ఏదైనా పాప కార్యం నుండి వారిని ఆపుతున్నాడు. ఈ విధంగా సోదర మహాశయులారా, మనం “యా అయ్యుహల్లజీన ఆమనూ” అని ఎక్కడ చదివినా గానీ అబ్దుల్లా ఇబ్ను మస్ఊద్ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క ఈ మాటను గుర్తించుకోవాలి మరియు వెంటనే అల్లాహ్ నాకు ఇస్తున్న ఆదేశం ఏమిటి అన్న యొక్క మాటపై శ్రద్ధ వహించాలి.

ఇందులో అల్లాహ్ ఇచ్చిన ఆదేశం ఏంటి? إِذَا نُودِيَ لِلصَّلَاةِ مِن يَوْمِ الْجُمُعَةِ (ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅహ్ – శుక్రవారం నాడు నమాజు కొరకు పిలువబడినప్పుడు). జుమా నమాజుకు మిమ్మల్ని పిలువబడినప్పుడు, దీని ద్వారా ఈ ఆయత్ యొక్క ఆరంభంలోనే విశ్వాసానికి సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన గొప్ప విషయం మనకు తెలుస్తుంది. అదేమిటండీ?

ఇక ఈ ఆయతులలో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఆ ఆదేశాల వివరాల్లోకి, జుమాకు సంబంధించిన మసలే మసాయిల్, ఆదేశాలు, అవన్నీ వివరాల్లోకి నేను ఈ రోజు వెళ్ళడం లేదు. ఈ ఆయతుల యొక్క వ్యాఖ్యానం మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఈ సూరా పేరు సూరతుల్ జుముఆ. ఇందులో కేవలం రెండే రెండు రుకూలు ఉన్నాయి. మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. నేను తొమ్మిదవ ఆయత్ ఏదైతే మొదలు పెట్టానో, ఇది రెండవ రుకూ. మొదటి రుకూలో యూదుల ప్రస్తావన ఉంది. అయితే, మొదటి రుకూలో యూదుల ప్రస్తావన తర్వాత, మిగతా చివరి మూడు ఆయతుల్లో అల్లాహు తాలా జుమాకు సంబంధించిన ఆదేశాలు ఇచ్చాడంటే, ఇక్కడ ఏదో గొప్ప మర్మం ఉంది. ఇక్కడ ఏదో గొప్ప విషయం ఉంటుంది, దానిని మనం చాలా గ్రహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా? నాతో పాటు మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా? నేను ఏమంటున్నాను? శ్రద్ధ వహించండి. సూరా పేరు సూరతుల్ జుముఆ. అయితే ఈ సూరా మొత్తం జుమా ఆదేశాలు ఇందులో లేవు. చివరి మూడు ఆయతుల్లోనే ఉన్నాయి. ముందు ఎనిమిది ఆయతుల్లో యూదుల ప్రస్తావన ఉంది. అయితే యూదుల ప్రస్తావన తర్వాత జుమా యొక్క ఆదేశాల ప్రస్తావన, జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇందులో మర్మం ఏమిటి అని మీరు ఏదైనా గ్రహించే ప్రయత్నం చేశారా అని నేను అడుగుతున్నాను.

అయితే దీనిని గ్రహించడానికి రండి సహీ బుఖారీలోని హదీస్, సహీ ముస్లిం షరీఫ్‌లోని హదీస్ మనం వింటే ఇన్షాఅల్లాహ్ ఈ యొక్క మర్మాన్ని, ఈ యొక్క ఔచిత్యాన్ని గ్రహించగలుగుతాం. ఏంటి హదీస్? బుఖారీలోని సహీ హదీస్, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అబూ హురైరా (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు:

نَحْنُ الآخِرُونَ السَّابِقُونَ يَوْمَ الْقِيَامَةِ
(నహ్నుల్ ఆఖిరూన అస్సాబిఖూన యౌమల్ ఖియామ)
(మనం (కాలంలో) చివరి వాళ్ళం, కానీ ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం)

అనుచర సంఘాల ప్రకారంగా, ఈ ప్రపంచంలో వచ్చిన ప్రవక్తల అనుయాయుల ప్రకారంగా చూసుకుంటే మనం చిట్టచివరి వాళ్ళం. అంటే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చిట్టచివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, మనం ప్రవక్త వారి అంతిమ సమాజం. కానీ, అస్సాబిఖూన యౌమల్ ఖియామ (ప్రళయ దినాన అందరికంటే ముందుంటాం). ప్రళయ దినాన అందరికంటే ముందు మనం లేపబడటం, హాజరు చేయబడటం, లెక్క తీర్పు తీసుకోబడటం, స్వర్గంలో ప్రవేశింపబడటం ఇంకా ఎన్నో కార్యాలలో అందరికంటే ముందుగా ఉంటాం. సుబ్ హానల్లాహ్, ఇంత గొప్ప ఘనత అల్లాహ్ ఇచ్చాడు గమనించండి.

అయితే, بَيْدَ أَنَّهُمْ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِنَا (బైద అన్నహుమ్ ఊతుల్ కితాబ మిన్ కబ్లినా – మనకంటే ముందు వారికి గ్రంథం ఇవ్వబడింది). మనకంటే ముందు గ్రంథం పొందిన వారు ఎందరో ఉన్నారు, యూదులు, క్రైస్తవులు, ఇంకా. అయినా వారి కంటే ముందు మనల్ని లేపడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెలిపారు, “సుమ్మ హాదా” ఇక ఈ దినం అంటే ఈ జుమ్మా రోజు – يَوْمُهُمُ الَّذِي فَرَضَ اللَّهُ عَلَيْهِمْ (యౌముహుముల్లజీ ఫరదల్లాహు అలైహిమ్ – అల్లాహ్ వారిపై విధిగావించిన రోజు). ఈ జుమా విషయం, జుమా యొక్క ఘనత మనకంటే ముందు జాతి వారికి కూడా ఇవ్వడం జరిగింది. فَاخْتَلَفُوا فِيهِ (ఫఖ్తలఫూ ఫీహి). వారు అందులో విభేదించుకున్నారు. فَهَدَانَا اللَّهُ لَهُ (ఫహదానల్లాహు లహూ). అల్లాహ్ మనకు దాని సన్మార్గం కల్పించాడు, అల్లాహ్ మనకు ఆ రోజు యొక్క భాగ్యం కల్పించాడు.

ఏమైంది? فَالنَّاسُ لَنَا فِيهِ تَبَعٌ (ఫన్నాసు లనా ఫీహి తబఉన్ – కాబట్టి ప్రజలు ఈ విషయంలో మన అనుచరులు). ఇక ప్రజలు మన వెనక ఉన్నారు. الْيَهُودُ غَدًا وَالنَّصَارَى بَعْدَ غَدٍ (అల్-యహూదు గదన్ వన్నసారా బఅద గద్ – యూదులు రేపు, క్రైస్తవులు ఎల్లుండి). యూదుల వారంలోని ఒక పండుగ రోజు మాదిరిగా శనివారం, మరియు క్రైస్తవులు ఆదివారం. వారందరి కంటే ముందు శుక్రవారంలో మనం ఉన్నాము. ఈ ఘనత అల్లాహు తాలా మనకు ప్రసాదించాడు. ముస్లిం షరీఫ్‌లోని ఉల్లేఖనంలో చూస్తే, అల్లాహ్ మనకంటే ముందు జాతి వారిని వారి దుశ్చేష్టలకు కారణంగా అల్లాహ్ ఈ రోజు నుండి వారిని పెడమార్గంలో పడవేశాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి, అల్లాహ్ తన ఇష్టంతో వారిని పెడమార్గంలో పడవేశారు అని కాదు. వారి దుశ్చేష్టలకు కారణంగా, వారి అవిధేయతకు కారణంగా. అల్లాహ్ జుమా రోజు వారికి ప్రసాదించాడు, కానీ వారు దానిని విలువ ఇవ్వలేదు, అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు. యూదులకు శనివారం, క్రైస్తవులకు ఆదివారం నిర్ణయించాడు. మరియు మనం వారి కంటే వెనక వచ్చినప్పటికీ, వారి కంటే ముందు రోజు, శుక్రవారం రోజు అల్లాహు తాలా మనకు దాని యొక్క భాగ్యం కలుగజేశాడు.

అయితే, ఈ విధంగా రోజుల్లో వారు ఇహలోకంలో మనకు వెనక ఏదైతే ఉన్నారో, అలాగే పరలోకంలో కూడా మనం వారి కంటే ముందుగా ఉంటాము. అందరికంటే ముందు, సర్వ సృష్టిలో అందరికంటే ముందు మన యొక్క తీర్పు జరుగుతుంది అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీసులో మనకు తెలియజేశారు. ఇక్కడ ఇప్పుడు మీకు ఈ రెండు హదీసులు విన్న తర్వాత అర్థమైందా? యూదుల ప్రస్తావన ముందు ఉంది ఈ సూరతుల్ జుముఆలో, తర్వాత జుమా యొక్క ప్రస్తావన వచ్చిందంటే ఇక్కడ మనకు ఒక హెచ్చరిక కూడా ఉంది. అదేమిటి? వారు ఎలాగైతే విభేదాల్లో పడ్డారో, అల్లాహ్ ఆదేశాలను త్యజించారో, తిరస్కరించారో, అలాంటి పరిస్థితి మీది రాకూడదు, మీరు చాలా శ్రద్ధగా మరియు అల్లాహ్‌తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించే వారిగా మీరు ఉండండి.

ఆ తర్వాత ఆయతులను మనం గమనిస్తే, ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) ఇక్కడ కొన్ని జుమాకు సంబంధించిన ఆయత్ యొక్క వివరణ, వ్యాఖ్యానంలో కొన్ని విషయాలు తెలిపారు. మొదటి విషయం నేను ఇంతకు ముందు తెలిపినట్లు, అల్లాహ్ ఏమంటున్నాడు? فَاسْعَوْا إِلَىٰ ذِكْرِ اللَّهِ (ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్). అల్లాహ్ యొక్క ధ్యానం, స్మరణ వైపునకు మీరు పరుగెత్తండి. అయితే వాస్తవానికి ఇక్కడ ‘పరుగెత్తండి’ అనువాదం సరియైనది కాదు. ఇక్కడ ఇమాం ఇబ్ను కసీర్ (రహిమహుల్లాహ్) చెప్పినట్లు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ నమాజుకైనా గానీ పరుగెత్తి రావడం నుండి వారించారు. సహీ బుఖారీలోని హదీస్: إِذَا سَمِعْتُمُ الإِقَامَةَ فَامْشُوا إِلَى الصَّلاَةِ وَعَلَيْكُمُ السَّكِينَةُ وَالْوَقَارُ وَلاَ تُسْرِعُوا (ఇదా సమిఅతుముల్ ఇఖామత ఫమ్షూ ఇలస్సలాతి వ అలైకుముస్సకీనతు వల్ వఖారు వలా తుస్రిఊ – మీరు ఇఖామత్ విన్నప్పుడు, నమాజుకు నడిచి రండి, మీపై నిదానం మరియు గంభీరత ఉండాలి, తొందరపడకండి). మీరు ఇఖామత్ విన్నప్పుడు నమాజుకు నడిచి రండి. మీరు ఎలా నడిచి రావాలంటే, మీపై నిదానం, నింపాది మరియు ఒక వఖార్, ఒక మర్యాద అనేది స్పష్టంగా కనబడాలి. “వలా తుస్రిఊ” (తొందరపడకండి) – మీరు పరుగెత్తుకుంటూ రాకండి. మరొక ఉల్లేఖనంలో, మీరు పరుగెత్తుకుంటూ రాకండి, నిదానంగా రండి. ఎన్ని రకాతులు ఇమాంతో పొందుతారో చదవండి, తప్పిపోయిన రకాతులు తర్వాత చేసుకోండి.

కానీ ఇక్కడ ఈ ఆయతులో అల్లాహు తాలా “ఫస్అవ్” అని ఏదైతే చెప్పాడో, దాని భావం ఏంటి? ఇమాం హసన్ బస్రీ (రహిమహుల్లాహ్) చెప్పారు, “అమా వల్లాహి మా హువ బిస్సఅయి అలల్ అఖ్దామ్” (అల్లాహ్ సాక్షిగా, ఇది కాళ్ళపై పరుగెత్తడం కాదు). ఇక్కడ ‘సయీ’ అంటే కాళ్ళ మీద పరుగెడుకుంటూ రావడం కాదు. వారు ఇలా రావడం నుండి వారించడం జరిగింది. వలాకిన్ బిల్ ఖులూబి వన్నియ్యతి వల్ ఖుషూఅ (కానీ హృదయాలతో, సంకల్పంతో మరియు వినమ్రతతో). ఏంటి? వారి యొక్క నియత్‌, సంకల్పం, వారి హృదయం, సంపూర్ణ ఖుషూ, వినయ వినమ్రతతో రావాలి. కానీ ఇక్కడ భావం ఏంటి? దీనికి సంబంధించి మరొక ఇమాం ఖతాదా (రహిమహుల్లాహ్) వారు తెలిపినట్లు, దాని భావం ఏంటంటే, “అన్ తస్ఆ బిఖల్బిక వ అమలిక” (నీ హృదయంతో మరియు నీ ఆచరణతో ప్రయాసపడు). నీవు జుమా రోజున, జుమా నమాజు కొరకు ముందు నుండే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ, సంసిద్ధత అనేది పాటిస్తూ, నీవు ముందుకు వచ్చేసేయ్.

ఈ విధంగా సోదర మహాశయులారా, ఇక్కడ మరో విషయం కూడా మీకు అర్థమైంది కదా? ఖురాన్‌ను మనం హదీసు లేకుండా సరియైన రీతిలో అర్థం చేసుకోలేము.

అయితే సోదర మహాశయులారా, ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా యొక్క ఘనతలో ఎన్నో విషయాలు తెలిపారు. సహీ బుఖారీలో వచ్చిన హదీస్, నిశ్చయంగా జుమా రోజు చాలా గొప్ప ఘనత గల రోజు. అదే రోజు అల్లాహు తాలా ఆదం (అలైహిస్సలాం)ని పుట్టించాడు, ఆదం (అలైహిస్సలాం)ని స్వర్గంలో పంపాడు, ఆదం (అలైహిస్సలాం) అదే రోజు స్వర్గం నుండి తీయబడ్డారు, అదే రోజు ఆయన మరణించారు, అదే రోజు ప్రళయం సంభవిస్తుంది మరియు అదే రోజున ఒక ఘడియ ఉంది, ఎవరైతే ఆ ఘడియను పొంది దుఆ చేసుకుంటారో, అల్లాహ్ ఆ ఘడియలో చేసిన దుఆని తప్పకుండా స్వీకరిస్తాడు.

మరియు ప్రవక్త మహానీయులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), శుక్రవారం రోజున మంచి రీతిలో తలంటు స్నానం చేయాలి అని, మంచి దుస్తులు ధరించాలి అని, సాధ్యమైతే సువాసన పూసుకోవాలి అని, మరియు ఎంత తొందరగా ఇంటి నుండి బయలుదేరి మస్జిద్‌కు రాగలుగుతారో, హాజరై మౌనంగా ఉండాలి. ప్రత్యేకంగా ఖుత్బా జరుగుతున్న సందర్భంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు, మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా ఖుత్బా వింటూ ఉండాలి. ఒకవేళ ఖుత్బా మన భాషలో కాకపోయినప్పటికీ శ్రద్ధగా ఖుత్బా వినాలి. ఈ విధంగా అల్లాహు తాలా వారం రోజే కాదు, ఇంకా మూడు రోజులు అదనంగా మన పాపాలను మన్నిస్తాడు. అంతే కాదు, ఎంతో గొప్ప పుణ్యం ప్రసాదిస్తాడని సహీ హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ దావూద్ మరియు తిర్మిజీ, ఇబ్ను మాజాలో వచ్చినటువంటి హదీస్, ఔస్ బిన్ ఔస్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖించారు:

مَنِ اغْتَسَلَ يَوْمَ الْجُمُعَةِ وَغَسَّلَ، وَبَكَّرَ وَابْتَكَرَ، وَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ، كَانَ لَهُ بِكُلِّ خُطْوَةٍ يَخْطُوهَا أَجْرُ سَنَةٍ صِيَامُهَا وَقِيَامُهَا
(ఎవరైతే శుక్రవారం రోజున (జనాబత్ నుండి) స్నానం చేసి, త్వరగా బయలుదేరి, (మస్జిద్ కు) దగ్గరగా కూర్చుని, (ఖుత్బాను) శ్రద్ధగా విని, నిశ్శబ్దంగా ఉంటారో, అతను వేసే ప్రతి అడుగుకు ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు (రాత్రి) నమాజులు చేసిన పుణ్యం లభిస్తుంది)

ఎవరైతే ఉత్తమ రీతిలో జుమా రోజు స్నానం చేస్తారో, అతి త్వరగా బయలుదేరుతారో, సాధ్యమై నడిచి వెళ్తారో, వాహనం ఎక్కి వెళ్ళరో, మరియు ఇమామ్‌కు దగ్గరగా కూర్చుంటారో, శ్రద్ధగా ఖుత్బా వింటారో, ఎలాంటి వృధా కార్యకలాపాలకు పాల్పడరో, ఏమిటి లాభం? సుబ్ హానల్లాహ్. శ్రద్ధ వహించండి, వారి ఒక్కొక్క అడుగుకు బదులుగా ఒక సంవత్సరం ఉపవాసాలు మరియు ఒక సంవత్సరం తహజ్జుద్‌లు చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. సుబ్ హానల్లాహ్, ఎంత గొప్ప పుణ్యం చూడండి. సహీ హదీసులో వచ్చిన ఈ శుభవార్త, అందుకొరకు ఎవరూ కూడా జుమా రోజు ఆలస్యం చేయకుండా, జుమా రోజు ఎలాంటి అశ్రద్ధలో ఉండకుండా, ఆటపాటల్లో సమయాలు వృధా చేయకుండా త్వరగా మస్జిద్‌కు వచ్చే ప్రయత్నం చేయాలి. మరియు ఎంతోమంది మస్జిద్‌లో హాజరవుతారు. ఒకవేళ ఖుత్బా వారి భాషలో కాకుంటే వెనక మాట్లాడుకుంటూ ఉంటారు, మొబైల్‌లలో ఆడుకుంటూ ఉంటారు, ఇంకా వేరే వృధా కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారు. అలా చేసే వారికి ఈ గొప్ప పుణ్యం అనేది లభించదు.

మరియు ఎవరైతే ఎంత ముందుగా నమాజుకు హాజరవుతారో జుమా రోజు, సహీ బుఖారీలోని హదీసులో వారికి మరొక గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగింది. దాని యొక్క సారాంశం నేను తెలియజేస్తున్నాను, ఎవరైతే మొదటి ఘడియలో వస్తారో వారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం, ఎవరైతే రెండవ ఘడియలో వస్తారో వారికి ఒక ఆవు ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం, ఎవరైతే మూడవ ఘడియలో వస్తారో వారికి ఒక మేక ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే నాలుగో ఘడియలో వస్తారో ఒక కోడి అల్లాహ్ మార్గంలో దానం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది, మరియు ఎవరైతే ఐదవ ఘడియలో వస్తారో వారికి ఒక కోడి గుడ్డు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఆ తర్వాత, ఎప్పుడైతే ఇమాం వచ్చేస్తారో ఖుత్బా ఇవ్వడానికి, ప్రత్యేకంగా ఎవరైతే దైవదూతలు హాజరవుతారో ఈ ఐదు ఘడియల్లో వచ్చిన వారి పేరు నమోదు చేసుకోవడానికి, ఈ ప్రత్యేక రిజిస్టర్లలో, తర్వాత వచ్చిన వారి యొక్క పేర్లు నమోదు కావు. అందుకొరకు ఎలాంటి ఆలస్యం చేయకూడదు. జుమా రోజున మిస్వాక్ చేయడం, సువాసన పూసుకోవడం, ఎంతో పరిశుభ్రంగా రావడం, ఇది చాలా ఉత్తమ విషయం అని ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. హజ్రత్ అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు తాలా అన్హు) వారి యొక్క హదీసులో కూడా మనకు ఈ విషయాలు బోధపడుతున్నాయి.

ఇంకా సోదర మహాశయులారా, మీరు గనక ఆయతును గమనిస్తే అక్కడ అల్లాహు తాలా చెబుతున్నాడు, “ఫస్అవ్ ఇలా జిక్రిల్లాహ్“. అల్లాహ్ యొక్క జిక్ర్, ధ్యానం వైపునకు హాజరవ్వండి. ఇక్కడ అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఇక్కడ ఖుత్బా. ఇమాం ఏదైతే ఖుత్బా ఇస్తారో ఆ ఖుత్బాలో కూడా రావాలి. అంటే ఏమిటి? ఇమాం మెంబర్ పై వచ్చేకి ముందు వచ్చేస్తే, కనీసం ఒక చాలా గొప్ప పుణ్యం మనం పొందుతాము, ప్రత్యేకంగా దైవదూతలు ఎవరైతే హాజరవుతారో వారి యొక్క రిజిస్టర్లలో కూడా మన పేరు వచ్చేస్తుంది.

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరైతే చాలా చాలా అనారోగ్యంగా ఉన్నారో, మస్జిద్ కు హాజరయ్యే అంతటువంటి శక్తి లేదో, మరియు ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఇంకా చిన్న పిల్లలు మరియు స్త్రీలు, ఇలాంటి వారిపై జుమాలో హాజరు కావడం విధిగా లేదు. కాకపోతే వారిలో ఎవరైనా జుమాలో వచ్చారంటే, జుమాలో వచ్చినటువంటి గొప్ప పుణ్యాలు తప్పకుండా పొందుతారు. మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆ తర్వాత సహాబాలు, తాబియీన్, తబే తాబియీన్, ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా అల్హందులిల్లాహ్ సహీ హదీసుల్లో వచ్చిన దాని ప్రకారం, స్త్రీలకు కూడా మస్జిద్‌లలో వచ్చేటువంటి అవకాశం కలుగజేయాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కారణంగా అలాంటి సౌకర్యం లేకుంటే అది వేరు విషయం. కానీ వారి కొరకు ఇలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఇది ప్రవక్త వారి సాంప్రదాయం, హదీసుల్లో దీనికి నుంచి ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చి ఉన్నాయి.

ఆ తర్వాత అల్లాహు తాలా తెలిపాడు, “వ జరుల్ బైఅ” (క్రయవిక్రయాలను వదిలిపెట్టండి). ప్రత్యేకంగా ఈ జుమాకు సంబంధించి ఒక గొప్ప అనుగ్రహం అల్లాహ్ మనపై చేసినది గుర్తు చేసుకోవాలి. అదేమిటి? అల్లాహు తాలా ఇంతకు ముందు జాతులపై కాకుండా ప్రత్యేకంగా మనపై అనుగ్రహించిన ఒక గొప్ప అనుగ్రహం జుమా రోజున ఏమిటంటే, జుమా నమాజు యొక్క మొదటి ఖుత్బా ఆరంభం అయ్యేకి కొంచెం ముందు వరకు మనం వ్యాపారంలో ఉండవచ్చు. జుమా నమాజు పూర్తి అయిపోయిన తర్వాత కూడా వ్యాపారాలు చేసుకోవచ్చు. కేవలం ఇంత సమయం మాత్రమే అల్లాహు తాలా “వ జరుల్ బైఅ” అని ఆదేశించాడు, కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు అన్నీ కూడా వదులుకోండి అని. కానీ ఇంతకు ముందు జాతులపై ఎలా ఉండినది? పూర్తి వారి ఆ వారంలో ఒక్క రోజు అన్ని కార్యకలాపాలు, వర్తకాలు, వ్యాపారాలు వదిలేసి అల్లాహ్ యొక్క ఆరాధనలో నిమగ్నులై ఉండటం. ఇది కూడా గమనించండి, అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై. అయితే ఎవరైతే ఇమాం వచ్చి మెంబర్ పై ఏదైతే ఎక్కుతాడో మరియు ముఅజ్జిన్ అజాన్ ఇస్తాడో, దాని తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తే, అతడు ఒక హరాం పని చేసిన వాడు అవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చాలా మంది ఎన్నో ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది, అటు ఖుత్బా జరుగుతూ ఉంటుంది, ఇటు బయట మస్జిద్ ముంగట ఇత్తర్లు, సుర్మాలు, టోపీలు, మిస్వాకులు, ఇంకా వేరే కొన్ని, ఎవరైతే మస్జిద్ కు దగ్గర దగ్గరగా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారో, వారు వ్యాపారాలు నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు విషయం, పొరపాటు.

అల్లాహు తాలా వెంటనే ఏం గుర్తు చేస్తున్నాడు గమనించండి, “జాలికుమ్ ఖైరుల్లకుమ్ ఇన్ కున్తుమ్ తలమూన్” (మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది). అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం, ఖురాన్‌ను మనం చదువుతూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఏమంటున్నాడు? మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. ఏంటి? వర్తకాన్ని వదిలేసి నమాజు కొరకు హాజరవ్వడం. అయ్యో, నేను డ్యూటీ చేసుకోకుంటే నాకు కూడు ఎక్కడ వస్తది? నేను నా భార్యా పిల్లలకు ఏం తినబెట్టాలి? ఈ విధంగా మనం ఆలోచిస్తాము. కానీ అల్లాహు తాలా పూర్తి జుమ్మా రోజు మొత్తం 12 గంటలు పగలంతా కూడా మీరు వదిలేసుకోండి వ్యాపారాన్ని అనట్లేదు. కనీసం ఈ జుమా యొక్క సమయం ఏదైతే ఉంటుందో, ఎందులోనైతే మనం అల్లాహ్‌ను ఆరాధిస్తామో ఆ కొన్ని నిమిషాలు మాత్రమే. ఇది కూడా అల్లాహ్ కొరకు పాటించని వాడు, అల్లాహ్ కొరకు ఈ నమాజ్ చేయడానికి తన వ్యాపారాన్ని, తన వర్తకాన్ని, తన పనులను, డ్యూటీని, జాబ్‌ని వదులుకొని వాడు, తాను అనుకుంటున్నాడు కావచ్చు, నమాజుకు పోయి ఏం సంపాదిస్తారు, నేను ఇంత మంచి జీతం తీసుకుంటున్నా, ఎంత మంచి పని చేసుకుంటున్నా. కానీ అల్లాహ్ అంటున్నాడు, కాదు, ఎవరైతే తమ యొక్క డ్యూటీని, తమ యొక్క ఉద్యోగాన్ని, తమ యొక్క వ్యాపారాన్ని, తమ యొక్క వర్తకాన్ని వదిలి నమాజు జుమ్మాకు హాజరయ్యారో, “జాలికుమ్ ఖైరుల్లకుమ్”, ఇది మీ కొరకు మంచిది. తెలియకుంటే ధర్మ ఆధారంగా తెలుసుకోండి, “తఅలమూన్”.

ఆ వెంటనే ఏమంటున్నాడో చూడండి అల్లాహు తాలా, “ఫఇదా ఖుదియతిస్సలాహ్“. ఎప్పుడైతే నమాజు పూర్తి అయిపోతుందో, “ఫన్తషిరూ ఫిల్ అర్ద్“. వెళ్ళండి, భూమిలో సంచరించండి. “వబ్తగూ మిన్ ఫద్లిల్లాహ్“. అల్లాహ్ యొక్క ఈ ఫద్ల్, అల్లాహ్ యొక్క అనుగ్రహం, అల్లాహ్ యొక్క దయ, దాన్ని అన్వేషించండి.

ఇరాఖ్ ఇబ్ను మాలిక్ (రదియల్లాహు తాలా అన్హు) ఉల్లేఖనం వచ్చింది. ఆయన జుమా నమాజు చేసుకున్న తర్వాత వెళ్ళేవారు బయటికి. “అల్లాహుమ్మ ఇన్నీ అజబ్తు దఅవతక” (ఓ అల్లాహ్, నేను నీ పిలుపుకు స్పందించాను). ఓ అల్లాహ్ నీవు పిలిచావు, జుమాలో హాజరవ్వని, నేను వచ్చాను. “వ సల్లైతు ఫరీదతక” (మరియు నీవు విధిగావించిన నమాజును నెరవేర్చాను). నేను ఈ ఫర్జ్‌ను నెరవేర్చాను, చదివాను. “వన్తషర్తు కమా అమర్తనీ” (మరియు నీవు ఆదేశించినట్లే విస్తరించాను). నీవు చెప్పావు కదా అల్లాహ్, “ఫన్తషిరూ”, సంచరించండి, బయటికి వెళ్ళండి, బయటికి వచ్చేసాను. “ఫర్జుఖ్నీ మిన్ ఫద్లిక” (కాబట్టి నీ అనుగ్రహంతో నాకు ఉపాధిని ప్రసాదించు). ఓ అల్లాహ్, నీ యొక్క అనుగ్రహం నాకు ప్రసాదించు. “వ అన్త ఖైరుర్రాజిఖీన్” (నీవే ఉత్తమ ప్రదాతవు). నీవే అతి ఉత్తమ ప్రదాతవు. ఇబ్ను అబీ హాతింలో ఈ ఉల్లేఖనం ఉంది.

మరికొందరు ధర్మవేత్తలు, సలఫే సాలెహీన్ చెప్పారు, ఎవరైతే జుమా నమాజు తర్వాత వ్యాపారంలో నిమగ్నులవుతారో, అల్లాహు తాలా వారికి ఎంతో అనుగ్రహం, ఎంతో శుభం కలుగజేస్తాడు. అయితే ఇక్కడ భావం ఏంటి? నమాజు సమయం ఎంతనైతే ఉందో, అందులో పూర్తి శ్రద్ధాభక్తులతో నమాజ్ చదవాలి.

కానీ మళ్ళీ ఇక్కడ గమనించండి మీరు, వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు? وَاذْكُرُوا اللَّهَ كَثِيرًا (వజ్కురుల్లాహ కసీరన్). అల్లాహ్‌ను మీరు అధికంగా స్మరించండి, అల్లాహ్ యొక్క జికర్ ఎక్కువగా చేయండి. لَّعَلَّكُمْ تُفْلِحُونَ (లఅల్లకుమ్ తుఫ్లిహూన్). అప్పుడే మీరు సాఫల్యం పొందుతారు. గమనిస్తున్నారా? మీరు నమాజ్ చేశారు, తర్వాత వెళ్ళిపోయారు, వ్యాపారంలో నిమగ్నులయ్యారు. కానీ ఆ వ్యాపార సమయంలో కూడా మీరు అల్లాహ్‌ను ధ్యానించండి. మీరు అమ్ముతున్నప్పుడు, కొంటున్నప్పుడు, మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు, ఎవరి నుండి ఏదైనా తీసుకుంటున్నప్పుడు, అల్లాహ్‌ను అధికంగా స్మరించండి. పరలోక దినాన మీకు లాభం చేకూర్చేది ఏదైతే ఉందో, దాని నుండి మీ ప్రపంచ వ్యామోహం మిమ్మల్ని దూరం చేయకూడదు..

అల్లాహు అక్బర్. ఇక్కడ స్మరించండి, అల్లాహ్‌ను గుర్తుంచుకోండి, “ఉజ్కురూ” – అల్లాహ్‌ను ధ్యానించండి అంటే రెండు భావాలు. ఒకటేమిటి? ఆ వ్యాపారంలో ఉన్నా, మీరు వ్యవసాయంలో ఉన్నా, వేరే ఏదైనా మీ ఉద్యోగంలో వెళ్ళినా, మీరు ఇంకా ఎవరితోనైనా ఏదైనా కార్యకలాపాలు చేస్తూ, పరస్పరం ఏదైనా సంప్రదింపులు చేసుకుంటూ ఉన్నా, అక్కడ అల్లాహ్ ఆదేశం ఏంటి? దానిని మీరు గుర్తుంచుకొని ఆ ప్రకారంగా జీవించండి. ఇదొక భావం. రెండవ భావం, మీరు వ్యాపారంలో ఉన్నప్పటికీ, అల్హందులిల్లాహ్, సుబ్ హానల్లాహ్. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఇచ్చు పుచ్చుకుంటున్నప్పుడు, ఇన్షాఅల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ యొక్క స్మరణ అనేది మీ యొక్క నోటిపై రావాలి. అల్లాహ్ యొక్క స్తోత్రం అనేది రావాలి. అల్లాహ్‌ను మీరు గుర్తిస్తూ ఉండాలి. అందుకొరకే ఒక సహీ హదీసులో వచ్చి ఉంది కదా? ఎవరైతే బజార్లో వచ్చినప్పుడు, గుర్తుంచుకోండి ఇది దుఆ, తర్వాత యూట్యూబ్ లోకి, ఫేస్బుక్ లోకి వెళ్లి మళ్ళీ ఈ దుఆను మీరు ఒకవేళ మర్చిపోతే గుర్తు చేసుకోండి, మరోసారి వినండి.

ఎవరైతే బజార్లో వెళ్లి ఈ దుఆ చదువుతారో, అల్లాహు తాలా వారికి పది లక్షల పుణ్యాలు ప్రసాదిస్తాడు, పది లక్షల పాపాలు వారి నుండి మన్నింపజేస్తాడు, మరో ఉల్లేఖనంలో ఉంది, పది లక్షల స్థానాలు వారివి పెంచుతాడు. ఏంటి దుఆ?

لاَ إِلَهَ إِلاَّ اللَّهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ
(లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ, లహుల్ ముల్కు వ లహుల్ హమ్దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్)
(అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వామి లేడు. సార్వభౌమత్వం ఆయనదే, స్తోత్రం ఆయనకే చెల్లును, మరియు ఆయన ప్రతి దానిపై శక్తిమంతుడు)

సాధారణంగా ఫర్జ్ నమాజుల తర్వాత అట్లా మనం చదువుతూ ఉంటాము కదా? గుర్తుంచుకోండి.

ఇమాం ముజాహిద్ (రహిమహుల్లాహ్) చెప్పారు, لا يكون العبد من الذاكرين الله كثيرا حتى يذكر الله قائما وقاعدا ومضطجعا (లా యకూనుల్ అబ్దు మినజ్-జాకిరీనల్లాహ కసీరన్ హత్తా యజ్కురల్లాహ ఖాయిమన్ వ ఖాయిదన్ వ ముద్-తజిఆ) “మనిషి నిలబడుతూ, కూర్చుంటూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”

సూరతుల్ అహ్‌జాబ్‌లో అల్లాహు తాలా ఒక శుభవార్త ఇచ్చాడు ఇక్కడ, “అజ్-జాకిరీనల్లాహ కసీరన్ వజ్-జాకిరాత్” (అల్లాహ్‌ను అధికంగా స్మరించే పురుషులు మరియు స్త్రీలు). అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసే వారు అంటే ఎవరు? ఇమాం ముజాహిద్ చెబుతున్నారు, “నడుచుకుంటూ, నిలబడుతూ మరియు పడుకుంటూ అన్ని స్థితుల్లో అల్లాహ్‌ను స్మరించేవాడే వాస్తవంగా అల్లాహ్‌ను అధికంగా గుర్తు చేసిన వాడు.”

ఆ తర్వాత సోదరులారా, చివరి ఆయత్ ఏదైతే ఉందో ఈరోజు మన పాఠంలో, సంక్షిప్తంగా దీని యొక్క భావం తెలియజేసి నేను ఈనాటి తఫ్సీర్ క్లాస్‌ను ముగించేస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చేరుకున్న ఐదు రోజుల తర్వాతనే జుమా నమాజ్ ప్రారంభం చేసేశారు. మక్కా నుండి వలస వచ్చారు కదా మదీనాకు, సోమవారం వచ్చారు మదీనాలో. ఆ తర్వాత మంగళ, బుధ, గురు, శుక్ర. శుక్రవారం వచ్చింది, ఖుబా నుండి బయలుదేరారు, మధ్యలో బనీ సాలిం బిన్ ఔఫ్ యొక్క ఇళ్ళు వచ్చాయి, అక్కడ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా చేశారు. మస్జిదుల్ జుముఆ అని ఈరోజు కూడా ఉంది, ఖుబా మరియు మస్జిదున్నబవి మధ్యలో.

అయితే, కొన్ని రోజుల తర్వాత సంఘటన ఇది. మీకు తెలిసిన విషయమే, మదీనాలో వచ్చిన తర్వాత సామూహిక పరంగా నమాజుకు సంబంధించి ఇంకా ఎన్నో రకాల ఆదేశాలు అల్లాహు తాలా కొన్ని కొన్ని సందర్భాల్లో అవతరింపజేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. మరియు మక్కా నుండి వచ్చిన వారు మదీనాలో ఆరంభంలో కొన్ని సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులకు కూడా గురయ్యారు, అనారోగ్యం పాలయ్యారు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల. అయితే ఒక జుమా రోజు ఏం జరిగింది? ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారు. ఆ సందర్భంలో బయట దేశం నుండి ఒక వ్యాపార బృందం వచ్చింది. వ్యాపార బృందం ఒక ఊరిలో వచ్చిన తర్వాత వారు డప్పు లాంటిది కొట్టేవారు ప్రజలకు తెలియాలని. అయితే, ఎప్పుడైతే ఇటు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖుత్బా ఇస్తున్నారో అదే సందర్భంలో వ్యాపార బృందం వచ్చింది. వారికి తెలియదు ఖుత్బా యొక్క ఆదేశాలు, జుమ్మా నమాజుకు సంబంధించిన పద్ధతులు. అయితే ఇక్కడ ప్రవక్త ముందు ఉన్నటువంటి వారిలో కొంతమంది ఆ సరుకులు తీసుకోవడానికి వెంటనే ప్రవక్తను ఖుత్బా ఇస్తుండగా వదిలి వెళ్ళిపోయారు. కొన్ని హదీసుల ద్వారా తెలుస్తుంది, 12 మంది మిగిలి ఉన్నారు ప్రవక్త ముందు. ప్రవక్త ఖుత్బా ఇస్తున్నప్పుడు, చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు అల్లాహు తాలా ఈ ఆయత్ అవతరింపజేశాడు. చివరి ఆయత్ ఏంటి? “وَإِذَا رَأَوْا تِجَارَةً أَوْ لَهْوًا انفَضُّوا إِلَيْهَا وَتَرَكُوكَ قَائِمًا”. వారు ఏదైనా వ్యాపారాన్ని లేదా ఆటపాటలను చూసినప్పుడు, నిన్ను ఖుత్బా ఇస్తుండగా నిలబడి వదిలి వెళ్తారు, వాటిలో పాలు పంచుకుంటారు. “ఖుల్” (వారికి తెలపండి), “మా ఇందల్లాహి ఖైర్” (అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది).

అల్లాహ్ వద్ద ఉన్నది అది ఎంతో మేలైనది. అల్లాహు అక్బర్. ఇక్కడ ఈ ఆయతులో గమనించండి ఇప్పుడు, ముందు అల్లాహ్ ఏమన్నాడు? “వ ఇదా రఅవ్ తిజారతన్ అవ్ లహ్వన్” (వారు వ్యాపారాన్ని లేదా వినోదాన్ని చూసినప్పుడు). వ్యాపారం ముందు ప్రస్తావించాడు, లహ్వ్ (ఆట, పాటలు, వినోదాలు) తర్వాత. మళ్ళీ ఏమంటున్నాడు అల్లాహు తాలా, అల్లాహ్ వద్ద ఉన్నది ఎంతో మేలైనది “మినల్లహ్వి వ మినత్తిజార” (వినోదం కన్నా మరియు వర్తకం కన్నా). దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి టీవీలు చూసుకుంటూ కూర్చుంటారో, ఈ రోజుల్లో ఎవరైతే నమాజులు వదిలి పబ్జీ ఇంకా వేరే ఆటలు, గేమ్స్ ఆడుకుంటూ ఉంటారో, ఎవరైతే నమాజు వదిలి క్రికెట్ మ్యాచెస్, ఫుట్బాల్ మ్యాచెస్, వారికి ఇష్టమైన మ్యాచ్‌లు చూసుకుంటూ ఉంటారో, ఇదంతా కూడా ఆట, వినోదం. ఇందులో మేలు లేదు. అల్లాహ్ ఎప్పుడైతే పిలిచాడో, నమాజు కొరకు రమ్మని చెప్పాడో, అందులో హాజరవ్వడం, అందులో మేలు ఉన్నది. “వల్లాహు ఖైరుర్రాజిఖీన్”. అల్లాహ్ అతి ఉత్తమ ఉపాధి ప్రదాత. అతని కంటే మేలైన ఉపాధిని ప్రసాదించేవాడు ఇంకా ఎవరూ కూడా లేరు.

సోదర మహాశయులారా, చెప్పుకుంటే విషయాలు ఇంకా చాలా ఉంటాయి, కానీ అల్లాహు తాలా ఇందులో మనకు ఇచ్చినటువంటి ఆదేశాలను మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. జుమా నమాజు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. మొన్న కూడా ఒక మిత్రుడు అడుగుతున్నాడు, ఏమని? ఎంతోమంది ముస్లిములను మనం చూస్తాము, జుమాకు హాజరవుతారు కానీ ఐదు పూటల నమాజులు చేయరు. ఎందుకు ఇలా చేస్తారు? ఇది వారి యొక్క బద్ధకం, అశ్రద్ధత. వాస్తవానికి ఇది ఇలా చేస్తున్నది వారు చాలా తప్పు చేస్తున్నారు. అల్లాహ్‌తో భయపడాలి. అల్లాహ్ ఎలాగైతే జుమా నమాజు మనపై విధిగావించాడో, ఐదు పూటల నమాజు ప్రతి రోజు విధి గావించాడు. ఐదు పూటల నమాజు చేసుకుంటూ ఉండాలి, అల్లాహ్ యొక్క ఆదేశం పాటిస్తూ ఉండాలి.

ఈ రోజుల్లో మనం ఏమంటాము? కూడు లేకుంటే ఏ నమాజులు, ఏం పనికొస్తాయి? ఈ విధంగా అంటారు కొందరు, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. ఇక్కడ కూడా అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి, మీకు తిండి ప్రసాదించేవాడు అల్లాహ్, సంపాదన అనేది, కష్టం అనేది మీరు పడాలి కానీ ఇచ్చేది అల్లాహు తాలా. అందుకొరకు అల్లాహ్ యొక్క ఆదేశాలను ధిక్కరించి మీరు కేవలం ప్రపంచ వ్యామోహంలో పడకండి.

అల్లాహు తాలా మనందరికీ ఇహపరలోకాల మేలు ప్రసాదించుగాక. ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం చేయుగాక. ఈ రోజుల్లో మనలో అనేకమంది ఏదైతే నమాజ్ విషయంలో అశ్రద్ధగా ఉన్నారో, అల్లాహు తాలా ఈ అశ్రద్ధతను దూరం చేయుగాక.

జజాకుముల్లాహు ఖైరన్ వ అహసనల్ జజా. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా? [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ఏమిటి? తన దాసునికి అల్లాహ్ సరిపోడా?
https://youtu.be/d0gnnL2PGE8 [11 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ‘అల్లాహ్ తన దాసునికి చాలడా?’ అనే ఖురాన్ వాక్యం యొక్క లోతైన భావాన్ని వివరించబడింది. దాసులలో రెండు రకాలు ఉంటారని, సాధారణ దాసులు (సృష్టి మొత్తం) మరియు ప్రత్యేక దాసులు (అల్లాహ్ కు సంపూర్ణంగా విధేయత చూపి, ఆయన దాస్యాన్ని వాస్తవ రూపంలో నెరవేర్చేవారు) అని బోధించారు. అల్లాహ్ తన ప్రత్యేక దాసులకు అన్ని కష్టాలు, శత్రువుల కుతంత్రాల నుండి తప్పకుండా సరిపోతాడని, వారిని కాపాడుతాడని నొక్కిచెప్పారు. దీనికి ఉదాహరణగా, రాజు హింస నుండి అల్లాహ్ ను వేడుకుని రక్షణ పొందిన నవయువకుని గాథను (సూరతుల్ బురూజ్) వివరించారు. మనం కూడా అల్లాహ్ యొక్క నిజమైన దాసులుగా మారినప్పుడు, ఎలాంటి కష్టంలోనైనా ఆయనపై సంపూర్ణ నమ్మకంతో ధైర్యంగా ఉండాలని, ఎందుకంటే ఆయనే మనకు చాలినవాడని ఈ ప్రసంగం యొక్క సారాంశం.

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్. ఇక్కడ దీని యొక్క భావం తన దాసుడు. కానీ ఇందులో మరో గొప్ప భావం దాగి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా, ఖురాన్ వ్యాఖ్యానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఏంటి?

ఒక రకంగానైతే ఈ సర్వ సృష్టి కూడా అల్లాహ్ దాస్యంలో ఉంది. మనం మానవులందరమూ కూడా అల్లాహ్ యొక్క దాసులమే.

قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَىٰ أَنفُسِهِمْ
ఖుల్ యా ఇబాది యల్లజీన అస్రఫూ అలా అన్ఫుసిహిమ్
(ఓ ప్రవక్తా!) చెప్పు: “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై హద్దుమీరారో…”

ఇదే సూరతు జ్జుమర్ లో అల్లాహుతాలా, “ఓ నా దాసులారా! ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారో” అని అన్నాడు. మనమందరం ఈ రకంగా చూస్తే అల్లాహ్ యొక్క దాసులమే. కానీ అల్లాహ్ యొక్క దాసులం అన్న ఈ సర్వసామాన్య భావంలో విశ్వాసులు, అవిశ్వాసులు, నమ్మేవారు, నమ్మనివారు, ఆస్తికులు, నాస్తికులు అందరూ వచ్చేస్తున్నారు. కానీ

أَلَيْسَ اللَّهُ بِكَافٍ عَبْدَهُ
అలైసల్లాహు బికాఫిన్ అబ్దహ్
అల్లాహ్ తన దాసునికి చాలడా?

అబ్దహ్ – తన దాసుడు అన్న భావంలో మరో మాట ఏదైతే మర్మంగా ఉందో, దాచి ఉందో, దాగి ఉందో అదేమిటంటే, ఎవరైతే అల్లాహ్ యొక్క సామాన్య దాసునిగా కాకుండా అతని యొక్క ప్రత్యేక దాసుడైపోతాడో, అంటే వాస్తవ రూపంలో అల్లాహ్ యొక్క దాస్యాన్ని మరియు తనకు దాసుడుగా ఉన్న ఈ ఉద్దేశాన్ని పూర్తి చేస్తాడో అతడికి, అలాంటి వానికి అల్లాహ్ తప్పకుండా సరిపోతాడు. అల్లాహు అక్బర్. తప్పకుండా అల్లాహ్ సరిపోతాడు.

అందుకొరకే ఒక హదీసులో మనకు ఏం తెలుస్తుంది? ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఆ హదీసును తన తఫ్సీర్ లో, ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. ఫుదాలా బిన్ ఉబైద్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా ఆయన విన్నారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్:

أَفْلَحَ مَنْ هُدِيَ إِلَى الإِسْلامِ، وَكَانَ عَيْشُهُ كَفَافًا، وَقَنَّعَهُ اللَّهُ بِمَا آتَاهُ
అఫ్లహ మన్ హుదియ ఇలల్ ఇస్లాం, వకాన ఐషుహు కఫాఫన్, వ ఖన్న అహుల్లాహు బిమా ఆతాహ్
ఇస్లాం వైపు మార్గనిర్దేశం పొందినవాడు, అతని జీవనం సరిపడినంతగా ఉంది, మరియు అల్లాహ్ అతనికి ఇచ్చిన దానితోనే అతన్ని సంతృప్తిపరిచినవాడు సాఫల్యుడయ్యాడు.

ఎవరైతే ఇస్లాం యొక్క సన్మార్గాన్ని పొందారో, అతని యొక్క ఇహలోకపు జీవితం, అతని యొక్క ఆర్థిక వ్యవస్థ అతనికి సరిపడే విధంగా ఉంది, అల్లాహ్ ఎంత ఇచ్చాడో అంతలోనే సరిపుచ్చుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఇస్లాంపై స్థిరంగా ఉన్నాడు. అఫ్లహ! అతడు సాఫల్యుడైపోయాడు.

గమనించండి. ఖురాన్ లో సూరతుల్ బఖరాలో మొదటి పారా, అలిఫ్ లామ్ మీమ్ అది ఎండ్ అయ్యేకి ముందు, ఒక నాలుగైదు ఆయతుల ముందు

فَسَيَكْفِيكَهُمُ اللَّهُ
ఫస యక్ఫీక హుముల్లాహ్
అయితే వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) అల్లాహ్ నీకు సరిపోతాడు.

ఫస యక్ఫీక హుముల్లాహ్. అల్లాహ్ వారి నుండి నీ కొరకు సరిపోతాడు. అంటే, నీకు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అల్లాహ్ నీ కొరకు చాలు. నిన్ను కాపాడడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ అవసరాలు తీరడానికి, నీవు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవడానికి.

ఆ నవయువకుని సంఘటన మీకు తెలుసు కదా? సూరతుల్ బురూజ్ లో వచ్చి ఉంది. ఏమిటి సంఘటన? చాలా పొడుగ్గా ఉంది. సహీ హదీసులో దాని ప్రస్తావన వచ్చి ఉంది. అతడు ఒక మాంత్రికుని దగ్గర మంత్రజాలం కూడా నేర్చుకుంటాడు, మరోవైపు ధర్మ విద్య కూడా నేర్చుకుంటాడు. తర్వాత అతనికి తెలుస్తుంది, ఈ మంత్ర విద్య, జాల విద్య అల్లాహ్ కు ఇష్టం లేనిది. ఇందులో షిర్క్, కుఫ్ర్, బహుదైవారాధన, అవిశ్వాసం, సత్య తిరస్కారం ఇంకా ఎన్నో చెడులు ఉన్నాయి. ఈ ధర్మ బోధకుడు అల్లాహ్ గురించి ఏ విషయాలైతే చెబుతున్నాడో ఇవి సత్యమైనవి, నిజమైనవి. అల్లాహ్ ను నమ్ముకుంటాడు.

ఆ తర్వాత ఒక దారిలో ఏదో పెద్ద జంతువు ప్రజల రాకపోకలను కూడా అది ఆపేస్తుంది. దాన్ని అల్లాహ్ యొక్క పేరుతో ఒక రాయి దాని మీద విసిరితే అది చనిపోతుంది. ప్రజలు తమ రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఆ సందర్భంలో ప్రజలకు ఈ నవయువకుని గురించి, ఇతడు ఎంత మహిమ గలవాడు, అంత పెద్ద జంతువును ఎవరు కొట్టగలుగుతారు, ఎవరు చంపగలుగుతారు, దాన్ని దారిలో నుండి ఎవరు తీయగలుగుతారు? ఈ అబ్బాయి తీశాడు అని అతని వద్దకు వచ్చి అతన్ని చాలా గొప్పగా చెప్పుకుంటే, అతడు చాలా స్పష్టంగా చెప్పేస్తాడు, “నేను చేసింది ఏమీ లేదు, ఆ అల్లాహ్ సర్వశక్తిమంతుడే చేశాడు. మీరు అల్లాహ్ ను నమ్ముకోండి.” ఇక మన సమాజంలో చూస్తాము కదా, ఎక్కడైనా ఏదైనా కొత్త బాబా పుట్టగొడుగుల్లా మొలకెత్తుకొని వచ్చాడు అంటే, ప్రజలు పిచ్చోళ్ళ మాదిరిగా వారి వెంట పడి, నా ఈ కష్టం దూరం కావాలి, నాకు సంతానం కావాలి, నా ఫలానా పని కావాలి అని ఎలా వస్తారో, అలా రావడం మొదలుపెట్టారు ఆ అబ్బాయి దగ్గరికి. అప్పుడు అతను తన గొప్పతనాన్ని చాటుకోలేదు. ఇస్లాం యొక్క దావత్ ఇచ్చాడు. అల్లాహ్ ను నమ్ముకోండి అని చెప్పాడు. చివరికి ఈ విధంగా ఆ కాలంలో ఉన్న రాజు వద్ద ఒక మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో, అతడు అంధుడైపోయాడు, అతనికి ఈ విషయం తెలిసింది. అతడూ వచ్చాడు. అతనికి కూడా ఈ అబ్బాయి అదే మాట చెప్పాడు, “నేను ఎవరికీ కన్ను ప్రసాదించను, చూపులు ఇవ్వను, ఎవరి ఏ కష్టాన్ని దూరం చేసేవాణ్ణి నేను కాదు. అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ ను నమ్ముకోండి, అతనితో దుఆ చేయండి.” ఆ మినిస్టర్ కూడా అల్లాహ్ ను నమ్ముకుంటాడు, అల్లాహ్ తో దుఆ చేస్తాడు, అల్లాహ్ అతనికి కళ్ళు ప్రసాదిస్తాడు, చూపు ఇచ్చేస్తాడు. అక్కడి నుండి ఇక కష్టాలు, పరీక్షలు, ఎన్నో రకాల హింసా దౌర్జన్యాలు ఆ మినిస్టర్ పై మొదలవుతాయి, తర్వాత ఆ బోధకునిపై వస్తాయి, చివరికి ఈ అబ్బాయిపై కూడా వస్తాయి.

ఆ సందర్భంలో సంక్షిప్త మాట ఏమిటంటే, ఈ అబ్బాయిని తీసుకెళ్ళండి, గుట్ట మీదికి తీసుకెళ్ళిన తర్వాత మీరు కలిసి ఇతన్ని కింద పారేసేయండి, మీరు తిరిగి రండి. ఆ అతని యొక్క సైనికులు కొందరు ఈ అబ్బాయిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ గుట్ట మీద నిలబడతారు. ఇక ఇతన్ని విసిరేద్దాము, పారేద్దాము అని అనుకునే సందర్భంలో ఆ అబ్బాయి ఏం దుఆ చేస్తాడు?

اللَّهُمَّ اكْفِنِيهِمْ بِمَا شِئْتَ
అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్
ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వారి నుండి (వారి కీడుకు వ్యతిరేకంగా) నాకు సరిపో.

ఓ అల్లాహ్, నీకు ఇష్టమైన రీతిలో వీరి కుతంత్రాల నుండి, వీరి దుశ్చేష్టల నుండి నీవే నాకు సరిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అల్లాహు అక్బర్. యా అల్లాహ్, తూ మేరే లియే కాఫీ హో జా. ఓ అల్లాహ్, నీవు నాకు సరిపడిపోవాలి, నీవే నన్ను కాపాడుకోవాలి. అప్పుడు ఏం జరిగింది? ఆ గుట్టలో ఒక భూకంపం మాదిరిగా ఏర్పడింది. అతన్ని తీసుకొచ్చిన సైనికులందరూ కూడా అక్కడే నాశనమైపోయారు, ధ్వంసమైపోయారు. ఈ అబ్బాయి క్షేమంగా తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి? రాజు దగ్గరికి.

ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంతమంది సైనికులను ఇచ్చి, ఇతన్ని తీసుకెళ్ళండి, షిప్ లో, ఒక బోట్ లో కూర్చోబెట్టుకొని, పడవలో నడి సముద్రంలో తీసుకెళ్ళి అక్కడ ఇతన్ని పారేయండి, మీరు తిరిగి వచ్చేసేయండి. తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళాక ఇతన్ని పారేయాలని అనుకున్నప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ దుఆ చేస్తాడు: అల్లాహుమ్మక్ఫినీహిమ్ బిమా షి’త్. అల్లాహుతాలా వారందరినీ అందులో ముంచేస్తాడు, ఇతన్ని కాపాడుతాడు.

సోదర మహాశయులారా! చెప్పే విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు మనకు ఎన్నో ఉన్నాయి. మనకు కావలసింది ఏంటి? అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం ఉండాలో, మనం అల్లాహ్ యొక్క నిజమైన దాసులమవ్వాలి. నిజంగా, వాస్తవ రూపంలో అతని దాస్యత్వాన్ని పాటించాలి. మనం గమనించాలి, సత్య నిజమైన దాసుడు ఎప్పుడూ కూడా తన యజమానికి అవిధేయత చూపడు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనం అల్లాహ్ యొక్క దాసులమన్నటువంటి సత్య భావనలో ఎల్లప్పుడూ ఉంటామో, అల్లాహ్ ను మనం ఆరాధించడంలో, అల్లాహ్ ను నమ్మడంలో, మనపై ఏమైనా కష్టాలు వచ్చాయి అంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు అల్లాహ్ యే మనల్ని కాపాడువాడు, రక్షించేవాడు అన్నటువంటి సంపూర్ణ నమ్మకంతో మనం ధైర్యంగా ఉండాలి.

అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్ ను మనం ఎలా గుర్తించాలి? [ఆడియో & టెక్స్ట్]

నిజ సృష్టికర్తను ఎలా గుర్తించాలి? ఆయన గుణగణాలేమిటి?
https://youtu.be/YXvC41kqzPw (8:34 నిముషాలు )
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఈ ప్రసంగంలో “అల్లాహ్ అంటే ఎవరు?” మరియు “అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి?” అనే రెండు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. పొగను చూసి నిప్పును, వస్తువును చూసి దాని తయారీదారుని గుర్తించినట్లే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని చూసి దాని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని తార్కికంగా అర్థం చేసుకోవచ్చని వక్త వివరిస్తారు. ఆ సృష్టికర్త ఒక్కడేనని, ఆయనకు ఎవరూ సాటిలేరని స్పష్టం చేస్తారు. ఆయన ఏకత్వాన్ని, గొప్పతనాన్ని మరియు లక్షణాలను వివరించడానికి, వక్త దివ్య ఖురాన్‌లోని ‘సూరహ్ అల్-ఇఖ్లాస్’ మరియు ‘ఆయతుల్ కుర్సీ’లను వాటి తెలుగు అనువాదంతో సహా ఉదహరించారు. ఈ వచనాల ద్వారా అల్లాహ్ నిరపేక్షాపరుడని, సజీవుడని, సర్వజ్ఞుడని, మరియు ఆయనకు తల్లిదండ్రులు, సంతానం లేరని, ఆయనకు ఎవరూ సమానులు కారని నొక్కిచెప్పారు. సత్యాన్ని గ్రహించి, ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్‌ను ఆరాధించాలని ఈ ప్రసంగం పిలుపునిస్తుంది.

అల్హందులిల్లాహ్. అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ రెండు ప్రశ్నలకు సంక్షిప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను.

అల్లాహ్‌ను మనం ఎలా గుర్తించాలి? ఈ ప్రశ్నకు మనం లాజికల్‌గా కూడా సమాధానం పొందవచ్చు. అంటే, పొగను చూసి దూరంగా, పొగను చూసి అక్కడ అగ్ని మండుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాము. ఒక టేబుల్‌ను, కట్టెతో చేయబడిన అల్మారీని చూసి, దీనిని తయారు చేసేవాడు ఒక కార్పెంటర్ అని, ఎక్కడైనా ఏదైనా మంచి డిజైన్‌ను చూసి ఒక మంచి ఆర్టిస్ట్ దీన్ని డిజైన్ చేశాడు అని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు మన ముందుకు వస్తాయి కదా.

అయితే, ఈ బ్రహ్మాండమైన సృష్టిని మన కళ్లారా మనం చూస్తూనే ఉన్నాము కదా. అయితే, వీటన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు అని అట్లే మనకు తప్పకుండా తెలుస్తుంది. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు.

ఈ లోకంలో ఆ నిజమైన సృష్టికర్తను వదలి ఎంతోమంది ప్రజలు వేరే ఎవరెవరినైతే పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో మీరు ఆలోచించండి. ఆ ఆరాధ్యులలో, ఎవరినైతే ఆ నిజ సృష్టికర్తను వదిలి ఎవరినైతే ప్రజలు పూజిస్తున్నారో, ఆ పూజ్యులలో ఏ ఒక్కరైనా గానీ “మేము ఆకాశం సృష్టించామని, భూమిని మేము సృష్టించామని, వర్షాన్ని మేము కురిపిస్తున్నామని,” ఈ విధంగా ఏమైనా దావా చేసిన వారు ఉన్నారా? లేరు. ఉండరు కూడా.

అయితే, ఇంకా ఇలాంటి ఉదాహరణలతోనే మీకు సమాధానాలు ఇస్తూ ముందుకు పోవడం మంచిది కాదు. స్వయంగా ఆ సృష్టికర్త, మనందరి నిజ ఆరాధ్య దైవం, ఆయన యొక్క అంతిమ గ్రంథంలో సర్వ మానవాళిని ఉద్దేశించి, స్వయంగా ఆయన తన గురించి ఏ పరిచయం అయితే మనకి ఇచ్చాడో, ఒక్కసారి శ్రద్ధగా ఆలకిద్దాము.

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
ఖుల్ హువల్లాహు అహద్
اللَّهُ الصَّمَدُ
అల్లాహుస్ సమద్
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
లమ్ యలిద్ వలమ్ యూలద్
وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ
వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్

వారికీ ఇలా చెప్పు, అల్లాహ్ ఆయన ఒక్కడు, ఏకైకుడు. అల్లాహ్ నిరపేక్షాపరుడు, ఎవరి ఏ అవసరం లేని వాడు, సృష్టిలో ప్రతీ ఒక్కరి అవసరాన్ని తీర్చువాడు. ఆయన ఎవరిని కనలేదు అంటే, ఆయనకు భార్య, పిల్లలు ఎవరూ లేరు. ఇంకా, ఆయన కూడా ఎవరికీ పుట్టిన వాడు కాడు, అంటే ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. ఆయనకు సరి సమానుడు, పోల్చదగిన వాడు ఎవడూ లేడు.

ఇది దివ్య గ్రంథం, సర్వ మానవాళి కొరకు మార్గదర్శిగా పంపబడినటువంటి దివ్య గ్రంథం ఖురాన్‌లోని 112వ అధ్యాయం.

ఇక ఆ సృష్టికర్త అయిన అల్లాహ్, సూరతుల్ బఖరా, సూరహ్ నెంబర్ రెండు, ఆయత్ నెంబర్ 255లో తన గురించి ఎలా పరిచయం చేశాడో, చాలా శ్రద్ధగా ఆలకించండి.

ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُۥ سِنَةٌۭ وَلَا نَوْمٌۭ ۚ لَّهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ مَن ذَا ٱلَّذِى يَشْفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذْنِهِۦ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَىْءٍۢ مِّنْ عِلْمِهِۦٓ إِلَّا بِمَا شَآءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ ۖ وَلَا يَـُٔودُهُۥ حِفْظُهُمَا ۚ وَهُوَ ٱلْعَلِىُّ ٱلْعَظِيمُ ٢٥٥

ఆ నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సుమారు పది గుణాలు ఈ ఆయతులో తెలుపబడ్డాయి. శ్రద్ధగా వినండి మరియు ఆయన తప్ప ఈ సృష్టిలో ఏ ఒక్కరిలోనైనా ఈ గుణాలు ఉన్నాయా గమనించండి. తద్వారా ఆయన ఏకైకుడు, ఆయనే ఒకే ఒక్కడు మన ఆరాధనలకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని, సత్యాన్ని కూడా గ్రహించండి. ఇప్పుడు నేను మీ ముందు పఠించినటువంటి ఆయతి యొక్క తెలుగు అనువాదం:

అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవ్వడూ లేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గానీ నిద్ర గానీ పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆధీనంలో ఉన్నది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని, వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగును. ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్సీ వైశాల్యం భూమ్యాకాశాలను చుట్టుముట్టి ఉంది. వాటిని రక్షించటానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు, చాలా గొప్పవాడు.

అల్లాహు అక్బర్. అధ్యాయం 112లో మీరు సుమారు నాలుగు Unique , సాటి లేని అటువంటి గుణాల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు చదివిన ఈ రెండవ అధ్యాయంలోని 255వ ఆయతులో సుమారు పది గుణాలు తెలుసుకున్నారు. నిశ్చింతగా, ఏకాంతంలో పరిశీలించండి. మరియు మన ఈ శరీరంలో నుండి ప్రాణం వీడకముందే సత్యాన్ని గ్రహించండి. ఆ నిజమైన సృష్టికర్త, ఏకైక ఆరాధ్యుడు అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక.

అల్లాహ్ (త’ఆలా) – Main Page
https://teluguislam.net/allah/

ఫాతిహా అంటే ఏమిటి?ఎలా చేయాలి? [ఆడియో, టెక్స్ట్]

ఫాతిహా అంటే ఏమిటి?ఎలా చేయాలి?
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=yMaP0GqHX7U [9 నిముషాలు]

ఈ ప్రసంగంలో సూరత్ అల్-ఫాతిహా యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఉపయోగించాల్సిన సరైన పద్ధతుల గురించి వివరించబడింది. సూరత్ అల్-ఫాతిహా ఖురాన్‌లోని మొట్టమొదటి సూరా అని, దీనిని నమాజులోని ప్రతి రకాత్‌లో తప్పనిసరిగా పఠించాలని వివరించారు. అంతేకాకుండా, ఆరోగ్యం కోసం (రుఖ్యా) దీనిని పఠించడం సున్నత్ అని, దీనికి సహీహ్ బుఖారీలో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే, సమాజంలో వ్యాపించి ఉన్న బిద్అత్ ఆచారాలు, అంటే వంటకాలపై ఫాతిహా చదవడం, మీలాద్‌లు, ఉర్సులు, మరియు ఇతర పండుగల పేరుతో చేసే ఆచారాలను ఖండించారు. పుణ్యపురుషుల పేరుతో చేసే ఇటువంటి పనులు షిర్క్ మరియు బిద్అత్ అని, అల్లాహ్ యే సర్వశక్తుడని, ఆయననే వేడుకోవాలని ప్రబోధించారు. చివరిగా, బిద్అత్ లేదా షిర్క్ ఆచారాలలో భాగంగా చేసిన ఆహారాన్ని తినకూడదని హెచ్చరిస్తూ, సన్మార్గంలో నడవాలని అల్లాహ్ ను వేడుకున్నారు.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్ హమ్దులిల్లాహ్! ఫాతిహా గురించి ఇంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇక్కడ వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వింటారు అని మరియు ఖురాన్ హదీసు ప్రకారంగా సహీహ్ విషయాలపై ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఖురాన్ మరియు హదీసును అనుసరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

సాధారణంగా ప్రశ్న ఎలా వస్తుంది? ఫాతిహా ఎలా చేయాలి? ఫాతిహా చేసే పద్ధతి ఏంటి? కొంచెం తెలపగలరు. లేదా ఫాతిహా చేసిన అన్నం తినవచ్చా? ఫాతిహా చేసి ఉన్న ఏదైనా పదార్థం త్రాగవచ్చా? అన్నటువంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ముందు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సూరతుల్ ఫాతిహా దివ్య ఖురాన్ అల్లాహ్ పంపినటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖురానే మజీద్‌లోని మొట్టమొదటి సూరత్.

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి మొదలవుతుంది. గైరిల్ మగ్ దూబి అలైహిమ్ వలజ్జాల్లీన్ పై సమాప్తమవుతుంది.

ఈ సూరా మనం ఎన్నో సందర్భాలలో చదివేది ఉంది. దీనిని సూరే ఫాతిహా అని అంటారు. ఖురాన్‌లో అల్ ఫాతిహా అన్న పేరుతోనే ఇది వ్రాయబడుతుంది. పోతే ఇంకా వేరే ఎన్నో ఘనతలు ఈ సూరాకు ఉన్నాయి, ఇంకా ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి.

అయితే మనం రేయింబవళ్లలో, 24 గంటల్లో చేసేటువంటి ఐదు ఫర్జ్ నమాజులలో 17 ఫర్జ్ రకాత్లు ఏవైతే ఉన్నాయో, వాటిలోని ప్రతి ఒక్క రకాత్‌లో సూరే ఫాతిహా తప్పకుండా చదవాలి. మనం జమాత్ లో ఉండి నమాజ్ చేస్తున్నా గానీ, ఒంటరిగా చేస్తున్నా గానీ, ఇమామ్ గా ఉన్నా గానీ, ముక్తదీగా ఉన్నా గానీ. ఇది ఫాతిహా సూరా చదివేది నమాజులో.

ఇక నమాజులో కాకుండా ఆరోగ్యం పొందే ఉద్దేశంతో దీనిని చదవవచ్చు. సహీహ్ బుఖారీలో దీనికి ఆధారం అనేది ఉంది. ఎవరికైనా ఏదైనా పురుగు కాటేసింది లేదా ఏదైనా పాము, తేలు అట్లాంటిది లేదా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా నొప్పి ఉంది, శరీరంలో ఏదైనా బాధ ఉంది, అలాంటి వారు ఈ సూరా చదివి తమపై ఊదుకోవచ్చు. ఇక్కడ విషయం మరోసారి శ్రద్ధగా వినండి. స్వయం ఆరోగ్యం పొందాలన్న ఉద్దేశంతో స్వయం మనకు మనం ఈ సూరా చదివి మన శరీరంపై లేదా నొప్పి ఉన్న భాగంపై లేదా కాటేసిన చోటు మనం ఊదుకోవచ్చు. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారు? ఫలానా వారి దగ్గరికి వెళ్లాలి, వారు మనకు ఏదైనా మంత్రం చేయాలి, దువా చదవాలి, వారు చదివి ఊదాలి – ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో పర్వాలేదు కానీ, సాధారణంగా మనం ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి.

ఇక రండి కొన్ని సందర్భాలలో కొన్ని వంటకాలు చేసి ఏదైతే ఫాతిహా చేయడం అన్నటువంటి పదం మనలో చాలా ప్రబలి ఉందో శ్రద్ధగా వినండి సోదర సోదరీమణులారా. మీలాద్‌లు, ఉర్సులు, జాతరాలు, చాలిస్వాలు, బిస్వాలు, తీస్వాలు ఇలాంటివి, రజబ్ కే కుండే, ఇంకా ముర్దోం కీ ఈద్, బడోం కీ ఈద్, 15 షాబాన్, షబే బరాత్ ఇట్లాంటి ఇంకా ఎన్నో పేర్లతో ఏ ఏ బిద్అత్లన్నీ జరుగుతున్నాయో, సాధారణంగా అలాంటి బిదాత్లలోనే కొన్ని తిను పదార్థాలపై లేదా మంచి బిర్యానీలు, పలావులు, ఇంకా ఏదైనా తీపి పదార్థాలు వండుకొని ఏం చేస్తారు? అక్కడ ఫాతిహా అని చేస్తారు.

ఇక ఇందులో ఇలా చేసే వారు కొందరు మౌల్వీ సాబులు వారి వ్యక్తిగత లాభం కొరకు చేస్తారా, దేని కొరకు చేస్తారో అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇచ్చుగాక. కానీ శ్రద్ధగా వినండి ఇలా ఇట్లాంటి బిద్అత్లు అవి చేయడమే నిషిద్ధం ఇస్లాంలో. ఎందుకంటే మొహర్రంలో పీరీల పండుగలు గానీ, ఆ తర్వాత నెలలో ఏదైనా చివరి బుధవారం అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ అవ్వల్ నెలలో మీలాద్ అని, ఆ తర్వాత వచ్చే రబీ ఉల్ ఆఖర్ నెలలో పీరానే పీర్ కా మహీనా గ్యార్వీ షరీఫ్ లో అని, ఇంకా లేదా రజబ్ లో రజబ్ కే కుండే 22 రజబ్ ఇమామ్ జాఫర్ సాదిక్ రహిమహుల్లా పేరుతో, కుండే మేరాజ్ యొక్క రాత్రి, ఇట్లాంటివి షాబాన్ లో ఇంకా 15 షాబాన్ షబే బరాత్ ఇట్లాంటివన్నీ కూడా బిద్అత్లు. ఈ బిద్అత్లు చేయడానికి ఇస్లాంలో అనుమతి ఏమాత్రం లేదు.

ఇక ఆ బిద్అత్లు చేసి అందులో కొన్ని వంటకాలు చేసుకొని అందులో ఫాతిహాల పేరుతో ఏమైనా చేయడం కూడా నిషిద్ధం హరామ్ కిందికి వస్తుంది, అవన్నీ జాయెజ్ లేవు. కొందరు ఏమంటారో తెలుసా? మేము ఈసాలే సవాబ్ గురించి చేస్తున్నాము. మన పుణ్యాత్ములకు, పూర్వీకులకు, పుణ్యపురుషులకు, మన బంధువులలో చనిపోయిన వారికి పుణ్యం దొరకాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము – ఇవన్నీ కేవలం బూటకపు మాటలు, కేవలం ఒక బిద్అత్ ను నడపడానికి పేర్లు మార్చి చేసేటువంటి కొన్ని పనులు. అందుకొరకు జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి వాటికి ఏ ఆధారాలు లేవు.

ఇక కొందరు మౌల్వీ సాబులు ఫాతిహా అన్న పేరుతో ఈ సూరే ఫాతిహా చదువుతారు, కుల్ హువల్లాహు అహద్ చదువుతారు, దరూద్ షరీఫ్ చదువుతారు, ఇంకా కొందరు ఇంకొన్ని పెంచుతారు, మరికొందరు కొన్ని తగ్గిస్తారు. ఆ తర్వాత ఇక ఫాతిహా అయిపోయింది, ఇక దీంట్లో చాలా బర్కత్ ఉంటుంది తినాలి అని అంటారు. మరికొందరు ఈ సూరాలు చదవడమే కాకుండా కొందరు అల్లాహ్ యొక్క వలీలు, అల్లాహ్ యొక్క భక్తులు ఎవరైతే గడిచిపోయారో, వారి పేర్ల మీద కొన్ని ప్రత్యేక పనులు చేస్తారు. ఇట్లాంటివి షిర్క్ వరకు చేరిపిస్తాయి. మొదటి విషయం ఏదైతే ఉందో కేవలం ఆ సూరాలు చదవడం ఖురాన్ లోని – ఇది బిద్అత్ కిందికి వస్తుంది, అది కూడా హరామ్. కానీ మరికొందరు ఏం చేస్తారు? పుణ్యపురుషుల పేర్లతో వాళ్ళ పేర్లు తీసుకొని మనం ఈ విధంగా చదివేది ఉంటే ఇంత ఇంత బర్కత్, ఇంత ఇంత శుభము, ఇంత ఇంత పుణ్యము లభిస్తుంది అన్నటువంటి మూఢనమ్మకాలలో ఉంటారు. వారికి అవన్నీ ఏమీ లభించవు, వాస్తవానికి అన్నీ ప్రసాదించేవాడు అల్లాహ్ యే. ఏదైనా పరీక్ష వచ్చినా గానీ అల్లాహ్ వైపు నుండే వస్తుంది. కానీ ప్రజలలో ఉన్న మూఢనమ్మకం ద్వారా వారు ఇలా చేస్తారు, ఇది షిర్క్ వరకు చేరిపిస్తుంది. అందుకొరకు మనం ఎలాంటి ఫాతిహాలు చేయకూడదు.

ఇక మన ఇంటికి ఎవరైనా ఫాతిహా చేసిన వస్తువు తీసుకొచ్చి వస్తే ఇస్తే అవి తినాలా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే ఒకవేళ కేవలం బిద్అత్ కు సంబంధించినది అయ్యేది ఉంటే అది తీసుకోకూడదు. ఎందుకు? తీసుకోవడంలో ఒక బిద్అత్ కు, ఒక నిషిద్ధ కార్యానికి మనం సపోర్ట్ చేసే వాళ్లం అవుతున్నాము అని. కానీ ఏమీ తెలియకుండా వచ్చేసింది మనం తినేసాము, అల్లాహ్ క్షమించుగాక అని మనం ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి.

ఇక ఒకవేళ నేను రెండో రకం ఏదైతే చెప్పానో చూడండి, ఆ ఫాతిహాలలో షిర్క్ లాంటి విషయాలు కూడా ఉంటాయి అని. అవి గైరుల్లాహ్ యొక్క పేరు కూడా అందులో తీసుకోవడం జరుగుతుంది. మరి ఖురాన్ లో నాలుగు చోట్ల అల్లాహ్ త’ఆలా గైరుల్లాహ్ యొక్క పేరు మీద, అల్లాహ్ యేతరుల పేరు మీద ఇట్లాంటి మొక్కుబడులు చేసిన వాటిని తినకూడదు అని నిషేధించాడు. అది షిర్క్ కిందకి వస్తుంది, దాని నుండి అయితే ఎట్టి పరిస్థితిలో కూడా మనం జాగ్రత్త వహించాలి.

అయితే ఈ ఫాతిహాకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు వచ్చేసాయి అని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ త’ఆలా అన్ని రకాల చెడుల నుండి, అన్ని రకాల దురాచారాల నుండి ఇస్లాం యొక్క పేర్లు లేబుల్ లు తగిలించి చేసేటువంటి పనుల నుండి, ఇట్లాంటి మోసపూరితమైన మాటలు చేష్టల నుండి అల్లాహ్ మనందరినీ కూడా కాపాడుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరైన పద్ధతిని అనుసరిస్తూ అల్లాహ్ యొక్క ఆరాధన పూర్తి ఇఖ్లాస్ చిత్తశుద్ధి మంచి సంకల్పంతో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక.

బారకల్లాహు ఫీకుమ్ వ జజాకుముల్లాహు ఖైరా. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వసల్లల్లాహు వ సల్లమ అలా నబియ్యినా ముహమ్మద్ వఅలా ఆలిహీ వసహబిహీ అజ్మయీన్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=6885