ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

మనుషుల్లో అత్యంత చెడ్డ దొంగ, తన నమాజ్‌ ను దొంగిలించే వాడు [ఆడియో & టెక్స్ట్]

ఈ ప్రసంగంలో, నమాజు యొక్క ప్రాముఖ్యత మరియు దానిని సరిగ్గా, ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో ఎలా ఆచరించాలో వివరించబడింది. నమాజులో తొందరపాటు చూపడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతి చెడ్డ దొంగతనం”గా అభివర్ణించారని, ఇది ధనాన్ని దొంగిలించడం కంటే ఘోరమైనదని హదీసుల ద్వారా స్పష్టం చేయబడింది. అబ్దుల్లా బిన్ జుబైర్, ముస్లిం బిన్ యసార్, సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ వంటి సలఫె సాలిహీన్ (పూర్వపు సత్పురుషులు) తమ నమాజులలో ఎంతటి ఏకాగ్రత మరియు నిమగ్నతను కనబరిచేవారో ఉదాహరణలతో సహా వివరించారు. సరిగ్గా నమాజు చేయని వారిని చూసినప్పుడు వారికి హితబోధ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, మన నమాజు మన జీవితంపై మరియు పరలోకంపై చూపే ప్రభావాన్ని గురించి కూడా నొక్కి చెప్పబడింది.

మనుషుల్లో అత్యంత చెడ్డ దొంగ, తన నమాజ్‌ ను దొంగిలించే వాడు
https://youtu.be/1qJu0BoGg-w [30 నిముషాలు]
నమాజులో కదలిక, చలనం మరియు తొందరపాటు- 10 మంది సలఫె సాలిహీన్ నమాజుల ఉదాహరణ,
అసలు ఖుత్బా అరబీలో: షేఖ్ రాషిద్ అల్ బిదాహ్, అనువాదం: నసీరుద్దీన్ జామిఈ

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్]

మూత్ర తుంపరల నుండి అజాగ్రత్తగా ఉండుట (ఇస్లామీయ నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు)
https://youtu.be/3nniRG7Y6vU (12 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ముఖ్యంగా మూత్ర విసర్జన తర్వాత శుభ్రత గురించి వివరించబడింది. మూత్ర తుంపరల విషయంలో అజాగ్రత్తగా ఉండటం అనేది సమాధి శిక్షకు కారణమయ్యే ఒక పెద్ద పాపమని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీథ్ ద్వారా స్పష్టం చేయబడింది. చాడీలు చెప్పడం కూడా సమాధి శిక్షకు మరో కారణమని పేర్కొనబడింది. చిన్న పిల్లల మూత్రం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇస్లామిక్ ధర్మశాస్త్రపరమైన సులభమైన పరిష్కారాలు మరియు ఆధునిక కాలంలో మూత్రశాలల వాడకంలో ఉన్న ధార్మిక పరమైన ప్రమాదాల గురించి కూడా చర్చించబడింది.

ఇస్లాం యొక్క గొప్పతనం ఏమనగా అది మానవునికి మేలు చేయు ప్రతీ విషయం గురించి ఆదేశించింది. ఆ ఆదేశాల్లో మలినాల్ని, అపరిశుభ్రతను దూరం చేసి, మలమూత్ర విసర్జన తర్వాత నీళ్లతో లేక మట్టి పెడ్డలతో పరిశుద్ధ పరచుకోవాలన్న ఆదేశం కూడా ఉంది. పరిశుద్ధత పొందే విధానం సైతం స్పష్టంగా తెలుపబడినది.

అయితే కొందరు అపరిశుభ్రతను దూరం చేయడంలోనూ, సంపూర్ణ పరిశుభ్రతలోనూ అలక్ష్యం చేస్తారు, అంటే అశ్రద్ధ వహిస్తారు. ఆ కారణంగా వారి దుస్తులు, శరీరం అపరిశుభ్రంగా ఉండిపోతాయి. పైగా వారి నమాజు స్వీకరించబడదు. అంతేకాదు, అది సమాధి శిక్షకు కూడా కారణమవుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు.

مَرَّ النَّبِيُّ ﷺ بِحَائِطٍ مِنْ حِيطَانِ الْمَدِينَةِ فَسَمِعَ صَوْتَ إِنْسَانَيْنِ يُعَذَّبَانِ فِي قُبُورِهِمَا فَقَالَ النَّبِيُّ ﷺ يُعَذَّبَانِ وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ ثُمَّ قَالَ بَلَى {وفي رواية: وإنه لَكَبِير} كَانَ أَحَدُهُمَا لَا يَسْتَتِرُ مِنْ بَوْلِهِ وَكَانَ الْآخَرُ يَمْشِي بِالنَّمِيمَةِ…

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మదీన నగరంలోని ఒక తోట నుండి వెళ్తుండగా ఇద్దరు మనుషులకు వారి సమాధిలో శిక్ష పడుతున్నట్లు విన్నారు. అప్పుడు ఇలా చెప్పారు: “వారిద్దరు శిక్షించబడుతున్నారు, వారు శక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు”. మళ్లీ చెప్పారు: “ఎందుకు కాదు. పెద్ద పాపం చేసి నందుకే. వారిలో ఒకడు తన మూత్రతుంపరల నుండి జాగ్రత్త పడేవాడు కాదు. రెండోవాడు, చాడీలు చెప్పుకుంటు తిరిగేవాడు. (సహీ బుఖారీ 216, సహీ ముస్లిం 292)

ఇక్కడ ఈ హదీథ్ లో మీరు, “వారు శిక్షించబడేది పెద్ద పాపం చేసినందుకు కాదు” అని ఒకసారి చదివి, మళ్ళీ వెంటనే “ఎందుకు కాదు? పెద్ద పాపం చేసినందుకే” దీని ద్వారా ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకండి. ఇక్కడ మాట ఏమిటంటే, ఆ మనుషులు ఎవరికైతే సమాధిలో ఇప్పుడు శిక్ష జరుగుతున్నదో, వారు ఈ పాపానికి ఒడిగట్టినప్పుడు, ఇది పెద్ద పాపం అన్నట్లుగా వారు భావించేవారు కాదు. ఆ మాటను ఇక్కడ చెప్పే ఉద్దేశంతో ఇలాంటి పదాలు వచ్చాయి హదీథ్ లో. అర్థమైందా? అంటే, అసలు చూస్తే దానికి ఎంత శిక్ష ఘోరమైనది ఉన్నదో దాని పరంగా అది పెద్ద పాపమే. కానీ చేసేవారు పెద్ద పాపమని భయపడేవారు కాదు. ఆ పాపం చేసేటప్పుడు వారు అయ్యో ఇలాంటి పాపం జరుగుతుంది కదా అని కాకుండా, “ఏ పర్లేదు. ఈ రోజుల్లో ఎంతోమంది లేరా మన మధ్యలో?” అనుకుంటారు.

ప్రత్యేకంగా కాలేజీల్లో, అటు పనులో ఉండేటువంటి పురుషులు, యువకులు, చివరికి ఎన్నోచోట్ల యువతులు, ఇళ్లల్లో తల్లులు. నమాజ్ సమయం అయిపోయి, దాన్ని దాటి పోయే సమయం వచ్చింది. అంటే నమాజ్ సమయం వెళ్ళిపోతుంది. నమాజ్ చదివారా అంటే, లేదండీ కొంచెం తహారత్ లేదు కదా. ఎందుకు లేదు తహారత్? ఏ లేదు మూత్రం పోయినప్పుడు కొంచెం తుంపరలు పడ్డాయి. లేదా మూత్రం పోసిన తర్వాత నేను కడుక్కోలేకపోయాను.

ఇక ఇళ్లల్లో తల్లులు పిల్లల మూత్రం విషయంలో, “ఆ ఇక పిల్లలు మా సంకలోనే ఉంటారు కదా, మాటిమాటికీ మూత్రం పోస్తూ ఉంటారు, ఇక ఎవరెవరు మాటిమాటికీ వెళ్లి చీర కట్టుకోవడం, మార్చుకోవడం, స్నానం చేయడం ఇదంతా కుదరదు కదా అండీ” అని ఎంతో సులభంగా మాట పలికేస్తారు. కానీ ఎంత ఘోరమైన పాపానికి వారు ఒడిగడుతున్నారు, వారు సమాధి శిక్షకు గురి అయ్యే పాపానికి ఒడిగడుతున్నారు అన్నటువంటి విషయం గ్రహిస్తున్నారా వారు?

ఆ బహుశా ఇప్పుడు ఇక్కడ మన ప్రోగ్రాంలో ఎవరైనా తల్లులు ఉండి వారి వద్ద చిన్న పిల్లలు ఉండేది ఉంటే వారికి ఏదో ప్రశ్న కొంచెం మొదలవుతుంది కావచ్చు మనసులో. అయ్యో ఇంత చిన్న పిల్లల, వారి మూత్రముల నుండి మేము ఎలా భద్రంగా ఉండాలి, దూరంగా ఉండాలి? పిల్లలే కదా, ఎప్పుడైనా పోసేస్తారు, తెలియదు కదా. మీ మాట కరెక్ట్, కానీ నా ఈ చిన్న జీవితంలో నేను చూసిన ఒక విచిత్ర విషయం ఏంటంటే, చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి అలవాటు చేయించాలి మనం. ఎందరో తత్వవేత్తలు, మాహిరే నఫ్సియాత్, సైకియాట్రిస్ట్, ప్రత్యేకంగా పిల్లల నిపుణులు చెప్పిన ఒక మాట ఏమిటంటే సర్వసామాన్యంగా మీరు గ్రహించండి, ఎప్పుడైనా ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పుట్టిన పిల్లలు అయినప్పటికీ వారు మూత్రం పోసుకున్నారంటే, స్వాభావికంగా వారు ఏడవడమో, అటూ ఇటూ పక్క మార్చడమో, ఇట్లాంటి ఏదో కదలిక చేస్తూ ఉంటారంట. ఎందుకు? తల్లి తొందరగా గుర్తుపట్టి ఆ పిల్లల్ని, చంటి పాపల్ని త్వరగా శుభ్రపరచాలని. అయితే తల్లులు ఈ విషయాన్ని గమనించాలి మరియు వారు పిల్లలకు చిన్నప్పటి నుండే మంచి అలవాటు చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, పిల్లలు చెప్పి మూత్రం పోయరు. ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పడం కూడా రాదు, కరెక్టే. కానీ ఇక పోస్తూనే ఉంటారు కదా అని, మీరు అదే అపరిశుభ్ర స్థితిలో, అశుద్ధ స్థితిలో ఉండటం ఇది కూడా సమంజసం కాదు. ఎప్పటికి అప్పుడు మీరు అపరిశుభ్రతను దూరం చేసుకోవాలి.

మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, ఇస్లాం అందుకొరకే చాలా ఉత్తమమైన ధర్మం. మీరు దీని యొక్క బోధనలను చదువుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి అని మాటిమాటికీ మేము మొత్తుకుంటూ ఉంటాము. ఎంత ఎక్కువగా ఇస్లాం జ్ఞానం తెలుసుకుంటారో, అల్లాహ్ మనపై ఎంత కరుణ కనుకరించాడో అన్నటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది. ఏంటి? ఎప్పటివరకైతే పిల్లలు కేవలం తల్లి పాల మీదనే ఆధారపడి ఉన్నారో, వేరే ఇంకా బయటి ఏ పోషకం వారికి లభించడం లేదో, అలాంటి పిల్లల విషయంలో మగపిల్లలు అయ్యేదుంటే వారి మూత్రం ఎక్కడ పడినదో మంచంలో గానీ, బొంతలో గానీ, చద్దర్ లో గానీ, మీ యొక్క బట్టల్లో ఎక్కడైనా ఆ చోట కేవలం కొన్ని నీళ్లు చల్లితే సరిపోతుంది. మరియు ఒకవేళ ఆడపిల్ల అయ్యేదుంటే, ఆమె ఎక్కడైతే మూత్రం పోసిందో అక్కడ ఆ మూత్రానికంటే ఎక్కువ మోతాదులో నీళ్లు మీరు దాని మీద పారబోస్తే అంతే సరిపోతుంది. మొత్తం మీరు స్నానం చేసే అవసరం లేదు, పూర్తి చీర మార్చుకునే, పూర్తి షర్ట్ సల్వార్ మార్చుకునే అవసరం లేదు. ఎక్కడైతే ఆ మూత్రం ఎంతవరకైతే మీ బట్టల్లో పడినదో, శరీరం మీద పడినదో అంతవరకు మీరు కడుక్కుంటే సరిపోతుంది.

ఇక పెద్దల విషయానికి వస్తే, వారు మూత్రం పోసే ముందు ఎక్కడ మూత్రం పోస్తున్నారో అక్కడి నుండి తుంపరులు, ఈ మూత్రం యొక్క కొన్ని చుక్కలు తిరిగి మనపై, మన కాళ్లపై, మన బట్టలపై పడే అటువంటి ప్రమాదం లేకుండా నున్నటి మన్ను మీద, లేదా టాయిలెట్లలో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం మూత్రం పోసే ప్రయత్నం చేయాలి. మనం పాటించే అటువంటి జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా ఏమైనా మూత్రం చుక్కలు, తుప్పరులు పడ్డాయి అన్నటువంటి అనుమానమైనా లేక నమ్మకమైనా కలిగితే, ఎంతవరకు పడ్డాయో అంతవరకే కడుక్కుంటే సరిపోతుంది. మొత్తం మనం స్నానం చేయవలసిన, అన్ని బట్టలు మార్చవలసిన అవసరము లేదు.

అయితే ఇలాంటి విషయాల నుండి జాగ్రత్త పడకుండా, ఎవరైతే అశ్రద్ధ వహిస్తున్నారో వారి గురించి మరొక హదీథ్ ఏముంది?

أَكْثَرُ عَذَابِ الْقَبْرِ فِي الْبَوْلِ
(అక్సరు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌల్)
“అధిక శాతం సమాధి శిక్ష మూత్ర విషయంలోనే కలిగేది”. (అహ్మద్:2/326).

మూత్ర విసర్జన పూర్తి కాకముందే నిలబడుట, మూత్ర తుంపరలు తనపై పడవచ్చునని తెలిసి కూడా అదేచోట మూత్ర విసర్జన చేయుట లేక నీళ్లతో లేదా మట్టి పెడ్డలతో పరిశుభ్ర పరచుకోకపోవుట ఇవన్నియు మూత్ర విషయంలో జాగ్రత్త పడకపోవటం కిందే లెక్కించబడతాయి.

ఈ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళ, అవిశ్వాసుల పోలిక ఎంతవరకు వచ్చేసిందంటే మూత్రశాలల్లో గోడలకు తగిలించి మూత్ర పాత్రలు పెట్టబడ్డాయి. దాని నలువైపులా ఏ అడ్డు ఉండదు. అందరూ వచ్చిపోయే వారి ముందు లజ్జా సిగ్గు లేకుండా మనిషి వచ్చి అందులో మూత్రం చేస్తాడు. మళ్లీ పరిశుభ్రం చేసుకోకుండానే తన బట్టను పైకి లాక్కుంటాడు. అంటే ప్యాంటుని ఈ విధంగా. ఈ విధంగా ఒకే సమయంలో రెండు దుష్ట నిషిద్ధాలకు గురి కావలసి వస్తుంది. ఒకటి, తన మర్మ స్థలాన్ని ప్రజల చూపుల నుండి కాపాడకపోవటం. రెండవది, మూత్ర తుంపరల నుండి జాగ్రత్త వహించకపోవటం.

ఇంతే కాకుండా, అంటే ఈ రెండే కాకుండా, అతను మూత్ర విసర్జన తర్వాత పరిశుభ్రం కాలేదు. అదే స్థితిలో బట్టను పైకి చేసుకున్నందుకు ఆ బట్టలు కూడా అపరిశుభ్రమైనాయి. శరీరము అపరిశుభ్రంగానే ఉంది. అదే స్థితిలో చేయబడే నమాజు అంగీకరింపబడదు. అంతేకాకుండా, సమాధి శిక్షకు కూడా గురి కావలసి వస్తుంది. అల్లాహ్ యే కాపాడాలి. కొంత అలసత్వం, అశ్రద్ధ, అలక్ష్యం వలన ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నాడు కదా. ఈ విధంగా సోదర మహాశయులారా, ఇంతటి నష్టాలు జరుగుతున్నప్పటికీ మనం ఇంకా అశ్రద్ధగానే ఉండేది ఉంటే గమనించండి, మనకు మనం ఎంత చెడులో పడవేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41051

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా? [వీడియో & టెక్స్ట్]

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ తప్పనిసరిగా చెయ్యాలా?
https://www.youtube.com/watch?v=XY5Wq4ZiYU8 [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

స్త్రీలు కూడా సూర్య చంద్ర గ్రహణం నమాజ్ చేయాలా?

అవునండి. స్త్రీలు కూడా ఈ నమాజ్ చేయాలి. దీనికి సంబంధించి దలీల్ ఉందా? అవును, బుఖారీ, ముస్లింలో ఉంది. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 184. అలాగే సహీ ముస్లిం హదీస్ నెంబర్ 905. అస్మా బిన్తె అబీ బకర్ రదియల్లాహు తాలా అన్హా ఉల్లేఖించారు.

أَتَيْتُ عَائِشَةَ زَوْجَ النَّبِيِّ صلى الله عليه وسلم
(అతైతు ఆయిషత జౌజిన్ నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లం)
[నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయిన ఆయిషా వద్దకు వచ్చాను]

حِينَ خَسَفَتِ الشَّمْسُ
(హీన ఖసఫతిష్ షమ్స్)
[సూర్య గ్రహణం పట్టినప్పుడు].

సూర్య గ్రహణం సందర్భంలో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వద్దకు వచ్చాను.

فَإِذَا النَّاسُ قِيَامٌ يُصَلُّونَ
(ఫ ఇదన్ నాస్ కియామున్ యుసల్లూన్)
[అక్కడ ప్రజలు నిలబడి నమాజ్ చేస్తూ ఉన్నారు].

ప్రజలను చూశాను మస్జిద్ లో, వారు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు.

وَإِذَا هِيَ قَائِمَةٌ تُصَلِّي
(వ ఇదా హియ ఖాయిమతున్ తుసల్లీ)
[ఆమె కూడా నిలబడి నమాజ్ చేస్తూ ఉంది].

అప్పుడు నేను ఆయిషాను చూశాను, ఆమె కూడా ఆ జమాత్ లో పాల్గొని, మగోళ్ళ వెనకా, మగవారి వెనక నమాజులో నిలబడి ఉంది.

فَقُلْتُ مَا لِلنَّاسِ
(ఫకుల్తు మాలిన్ నాస్)
[అప్పుడు నేను అడిగాను, ప్రజలకు ఏమైంది?].

ఏంటి ఇది? ఇది ఏ నమాజ్ సమయం? ఇప్పుడు ఎందుకు నమాజ్ చేస్తున్నారు ప్రజలు? ఏంటి విషయం? అయితే నమాజులో ఉన్నారు గనక ఆయిషా రదియల్లాహు తాలా అన్హా,

فَأَشَارَتْ بِيَدِهَا نَحْوَ السَّمَاءِ
(ఫ అషారత్ బియదిహా నహ్వస్ సమా)
[ఆమె తన చేతితో ఆకాశం వైపునకు సైగ చేసింది].

ఆకాశం వైపునకు వేలు చూపించింది. అప్పుడు, سُبْحَانَ اللَّهِ (సుబ్హానల్లాహ్) [అల్లాహ్ పవిత్రుడు]. అప్పుడు ఆమెకు అర్థమైంది. సూర్య గ్రహణం యొక్క నమాజ్ చేయడం జరుగుతుంది అని.

ఇది, ఈ హదీస్ ద్వారా దలీల్ ఏంటి? అర్థమైంది కదా? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా కూడా జమాత్ తో ఈ నమాజ్ చేస్తూ ఉన్నది. అందుకొరకు, స్త్రీలు జమాత్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటే, మస్జిద్ లో వారికొరకు ప్రత్యేకమైన సురక్షితమైన, శాంతివంతమైన, అన్ని ఫితనాల నుండి రక్షణ అటువంటి స్థలం కేటాయించబడి ఉండేది ఉంటే, అక్కడికి వచ్చి జమాత్ తో చేసుకోవాలి. లేదా అంటే, వారు ఒంటరిగా చేసుకోవచ్చు. తమ తమ ఇండ్లల్లో.

ఈ విషయంలో కూడా హనఫియా, మాలికీయా, షాఫియా, హంబలియా ప్రతీ ఒక్కరి ఏకాభిప్రాయం ఉన్నది. ఈ విధంగా సోదర మహాశయులారా, సలాతుల్ కుసూఫ్, సలాతుల్ ఖుసూఫ్, సూర్య గ్రహణం గాని, చంద్ర గ్రహణం గాని, వీటి యొక్క నమాజ్ విషయం మనకు తెలిసింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ – గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0wjHmWPFU4R2_gIgP3F5vP

సూర్య చంద్ర గ్రహణ నమాజు విధిగా ఉందా ? [వీడియో & టెక్స్ట్]

సూర్య చంద్ర గ్రహణ నమాజు విధిగా ఉందా ?
https://www.youtube.com/watch?v=PaFKBSzfoHo [6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సలాతుల్ కుసూఫ్ ఏదైతే ఉందో, సూర్య చంద్ర గ్రహణం యొక్క నమాజ్, ఇది సర్వసామాన్యంగా మన మధ్యలో ఫిఖ్ హనఫీ, ఫిఖ్ షాఫి, ఫిఖ్ మాలికీ, ఫిఖ్ హంబలీ అని చాలా ఫేమస్ గా ఉన్నాయి కదా. అందరి వద్ద ఇది సున్నతే ముఅక్కద. దీని యొక్క స్థానం, లెవెల్ ఏంటి? సున్నతే ముఅక్కద.

ఇది సున్నతే ముఅక్కద అని ఇమామ్ నవవి (రహమతుల్లా అలై) ఇజ్మా అని కూడా చెప్పారు.

قَالَ النَّوَوِيُّ وَصَلَاةُ كُسُوفِ الشَّمْسِ وَالْقَمَرِ سُنَّةٌ مُؤَكَّدَةٌ بِالْإِجْمَاعِ
[ఖాల నవవీ వ సలాతు కుసూఫిష్షమ్సి వల్ ఖమరి సున్నతున్ ముఅక్కదతున్ బిల్ ఇజ్మా]
“ఇమామ్ నవవీ రహమతుల్లా చెప్పారు: సూర్య చంద్ర గ్రహణం యొక్క నమాజ్ సున్నతే ముఅక్కద అని ఇజ్మా ఉంది.”

ఇజ్మా అంటే ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉన్నారు, అందరూ ధర్మవేత్తలు ఏకీభవించిన విషయం. ఇది బిల్ ఇత్తిఫాఖ్ అని ఇమామ్ ఇబ్ను దఖీఖుల్ ఈద్ కూడా చెప్పి ఉన్నారు. అలాగే ఈ విషయాన్ని ఇమామ్ ఇబ్ను హజర్ అస్కలానీ రహమతుల్లా అలై ఫత్హుల్ బారీలో కూడా ప్రస్తావించారు.

సలాతుల్ కుసూఫ్ కొరకు ఆధారం

నికి దలీల్ ఖురాన్ నుండి కూడా తీసుకోవడం జరిగింది. ఖురాన్లో ఉందా? సలాతుల్ కుసూఫ్ గురించి? సలాతుల్ కుసూఫ్ గురించి డైరెక్ట్ గా కాదు, ఇన్డైరెక్ట్ గా ఉంది. మీరు ఈనాటి మన ఈ సమావేశం ప్రోగ్రాం ఆరంభంలో ఏదైతే తిలావత్ విన్నారో సూరత్ ఫుస్సిలత్ లోని ఆయత్ నెంబర్ 37 లో అల్లాహ్ ఏమన్నాడు?

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

“రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా అల్లాహ్ సూచనల్లో ఒక సూచన. మీరు సూర్య చంద్రులకు సజ్దాలు చేయకండి, సాష్టాంగ పడకండి. ఏ అల్లాహ్ వీటిని సృష్టించాడో, వారికి మీరు సజ్దా చేయండి, సాష్టాంగపడండి. వాస్తవానికి మీరు అల్లాహ్ ఆరాధన చేసేవారే అయుంటే, సాష్టాంగం అనేది, సజ్దా అనేది, నమాజ్ అనేది, ఇబాదత్ అనేది అల్లాహ్ కొరకే చేయాలి, అల్లాహ్ యొక్క సృష్టి రాశులకు కాదు.”

ఇక హదీథ్ లో ఎన్నో హదీథులు దీనికి సంబంధించినవి ఉన్నాయి. ఎన్నో హదీథులు దీనికి సంబంధించినవి ఉన్నాయి. హజ్రత్ అబూ మస్ఊద్ ఉఖ్బా బిన్ అమ్ర్ రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

إِنَّ الشَّمْسَ وَالْقَمَرَ لَا يَنْكَسِفَانِ لِمَوْتِ أَحَدٍ مِنَ النَّاسِ
[ఇన్నష్షమ్స వల్ఖమర లా యన్కసిఫాని లి మౌతి అహదిన్ మినన్నాస్]
నిశ్చయంగా సూర్యుడు మరియు చంద్రుడు ప్రజలలో ఎవరైనా చనిపోయినందుకు గ్రహణం పట్టవు.

మరో ఉల్లేఖనంలో ఉంది, వలా లిహయాతి [ఎవరైనా పుట్టినందుకు] గ్రహణం పట్టవు.

وَلَكِنَّهُمَا آيَتَانِ مِنْ آيَاتِ اللَّهِ فَإِذَا رَأَيْتُمُوهَا فَقُومُوا فَصَلُّوا
[వలాకిన్నహుమా ఆయతాని మిన్ ఆయాతిల్లాహ్, ఫఇజా రఅయ్తుమూహా ఫఖూమూ ఫసల్లూ]
“వాస్తవానికి అవి రెండూ అల్లాహ్ సూచనల్లో ఒక గొప్ప సూచన. మీరు సూర్య గ్రహణం చూసినా, చంద్ర గ్రహణం చూసినా, లేవండి, నమాజులు చేయండి.” [ఈ హదీథ్ సహీహ్ బుఖారీలో ఉంది, 1041. అలాగే సహీహ్ ముస్లింలో ఉంది, 911]

సోదర మహాశయులారా, ఈ భావంలో ఇంకా ఎన్నో హదీథులు ఉన్నాయి. చూడడానికి దీనిని సున్నతే ముఅక్కద చెప్పడం జరిగింది కదా. వాజిబ్ అయితే లేదు కదా. కొందరు ఇలాంటి అడ్డ ప్రశ్నలు మళ్లీ తీసుకొస్తారు. అంటే వాజిబ్ లేదు అంటే చదవకుంటే ఏం పాపం లేదు కదా? ఇట్లాంటి ప్రశ్న మరొకటి తీసుకొస్తారు. సోదర మహాశయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు. అంతేకాదు, ఎంత భయకంపితులై, సూర్యునికి గ్రహణం పట్టింది అని తెలిసిన వెంటనే ఎంత వేగంగా, భయకంపితులై లేసి వచ్చారంటే యజుర్రు రిదాఅహూ [తన పై వస్త్రాన్ని ఈడ్చుకుంటూ], ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ యొక్క దుప్పటి అది వ్రేలాడుతుంది, అదే స్థితిలో పరుగెట్టుకుంటూ వచ్చేశారు. అక్కడ ఉన్న వారికి చెప్పారు అస్సలాతు జామిఆ [నమాజ్ కొరకు సమీకరించబడింది] అని చెప్పండి. నమాజ్ కొరకు మీరందరూ పోగైపోవాలి, అందరూ జమా కావాలి అని ఒక ప్రకటన చేయించారు. అందుకొరకు, దీనికి సంబంధించిన హదీథుల ఆధారంగా ధర్మ పండితులు దీనికి ఒక స్థానం సున్నతే ముఅక్కద అని చెప్పారంటే, దీన్ని వదిలేయవచ్చు అన్నటువంటి భావం ఎంతమాత్రం కాదు. ఇలాంటి తప్పుడు భావాల్లో పడకూడదు. ఎవరైనా ఏదైనా ధర్మ కారణంగా చదవకుంటే అల్లాహుతాలా వారి యొక్క మనసును, వారి యొక్క నియ్యత్ సంకల్పాన్ని చూస్తున్నాడు. కానీ కావాలని వదులుకోకూడదు.

యూట్యూబ్ ప్లే లిస్ట్గ్రహణ సమయాలలో నమాజ్ (సలాతుల్ కుసూఫ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0wjHmWPFU4R2_gIgP3F5vP

నమాజ్ కొరకు త్వరపడటం యొక్క ప్రాముఖ్యత – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్ [ఖుత్బా]

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి.  అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.

ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు  తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)

అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.

బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)

ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.

ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)

అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)

ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)

అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక  మన్నిస్తాడు.  

స్తోత్రం మరియు దరూద్ తరువాత

మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.

ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)

దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది.  నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.

إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ
నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)

షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.

ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై  అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)

ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.

سُبۡحَٰنَ رَبِّكَ رَبِّ ٱلۡعِزَّةِ عَمَّا يَصِفُونَ وَسَلَٰمٌ عَلَى ٱلۡمُرۡسَلِينَ وَٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِين

రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ
జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ
అనువాదం: అబ్దుల్లాహ్ జామయి

పుస్తకం నుండి – ఇస్లామీయ జుమా ప్రసంగాలు – షేఖ్ మాజిద్ బిన్ సులైమాన్

సలాతుల్ రగాయిబ్ (రగాయిబ్ నమాజ్ ) – రజబ్ మాసంలో ఒక బిద్అత్

రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.

‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.

ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :

1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)

ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)

అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:

ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)

2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)

3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)

4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)

5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.

6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)

వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)

నుండి : జాదుల్ ఖతీబ్ (ఖుత్బాల సంగ్రహం) – మొదటి సంపుటం – ముహమ్మద్ ఇస్ హాఖ్ జాహిద్

సామూహిక నమాజ్ విధి – వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం [ఖుత్బా]

ఖుత్బా అంశము : సామూహిక నమాజ్ విధి-వ్యాపారం మరియు ఇతర కార్య కలాపాల వలన నిర్లక్ష్యం వహించడం నిషేదం         

إنَّ الْحَمْدَ لِلهِ نَحْمَدُهُ وَنَسْتَعِينُهُ وَنَسْتَغْفِرُهُ، وَنَعُوذُ بِاللهِ مِنْ شُرُورِ أَنْفُسِنَا وَمِنْ سَيِّئَاتِ أَعْمَالِنَا، مَنْ يَهْدِهِ اللهُ فَلاَ مُضِلَّ لَهُ، وَمَنْ يُضْلِلْ فَلاَ هَادِىَ لَهُ، وَأَشْهَدُ أَنْ لاَ إِلَهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُه

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسۡلِمُونَ١٠٢

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُم مِّن نَّفۡسٖ وَٰحِدَةٖ وَخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالٗا كَثِيرٗا وَنِسَآءٗۚ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِي تَسَآءَلُونَ بِهِۦ وَٱلۡأَرۡحَامَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيبٗا١

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَقُولُواْ قَوۡلٗا سَدِيدٗا٧٠ يُصۡلِحۡ لَكُمۡ أَعۡمَٰلَكُمۡ وَيَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ فَازَ فَوۡزًا عَظِيمًا٧١

మొదటి ఖుత్బా :-

స్తోత్రాలు మరియు దరూద్ తరువాత :

అన్నిటికంటే ఉత్తమమైనమాట అల్లాహ్ మాట, మరియు అందరికంటే ఉత్తతమైన పద్దతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారి పద్దతి. అన్నిటికంటే నీచమైనది ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడినవి. బిద్అత్ కార్యకలాపాలు మరియు ఇస్లాంలో క్రొత్తగా సృష్టించబడిన ప్రతికార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతి బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతి మార్గభ్రష్టత్వము నరకములోకి  తీసుకువెళ్ళేదే.

ఓ ముస్లిం లారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి. ఆయనకు విధేయత చూపండి. అవిధేయత నుంచి దూరంగా ఉండండి మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ తఆల ముస్లింలకు జమాత్ తో అనగా (సామూహికంగా) మస్జిద్లో నమాజ్ ఆచరించమని ఆజ్ఞాపించాడు. మరియు అకారణంగా నమాజ్ నుండి దూరంగా ఉండడాన్ని వారించాడు.  మరియు మస్జిదులో జమాతుతో నమాజ్  చదవడం గురించి అనేక హదీసులలో ఆజ్ఞాపించబడింది.

1. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లమ్) ఈ విధంగా ప్రవచించారు:

మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా సామూహికంగా చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించటానికి కారణమేమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతేకాదు, అతని వల్ల జరిగిన పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచిపెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంతవరకూ దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, “అల్లాహ్! ఇతనిపై శాంతి కురిపించు. అల్లాహ్! ఇతణ్ణి కనికరించు” అని అంటూ ఉంటారు. మస్జిద్లో ప్రవేశిం చిన తర్వాత సామూహిక నమాజ్ కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో అంత సేపూ అతను నమాజ్లో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. (అంటే అతనికి అంత పుణ్యం లభిస్తుందన్నమాట).(బుఖారీ-ముస్లిం)

2. హజ్రత్ ఇబ్నె మస్ ఊద్ (రదియల్లాహు అన్హు) కథనం: రేపు (ప్రళయ దినాన) తానొక ముస్లింగా అల్లాహ్ ను కలవాలనుకునే వ్యక్తి ఈ నమాజుల కొరకు అజాన్ (ప్రకటన) ఇవ్వబడినప్పుడల్లా వాటిని పరిరక్షించుకోవాలి, (అంటే వాటిని తప్పకుండా – నెరవేర్చాలి.) ఎందుకంటే అల్లాహ్ మీ ప్రవక్త కొరకు మార్గదర్శక పద్ధతుల్ని నిర్ణయించాడు. నమాజులు కూడా ఆ మార్గదర్శక పద్ధతుల్లోనివే. ఒకవేళ మీరు కూడా ఈ వెనక ఉండేవాని మాదిరిగా ఇంట్లో నమాజ్ చేసుకుంటే మీరు మీ ప్రవక్త విధానాన్ని వదలి పెట్టినవారవుతారు. మీరు గనక మీ ప్రవక్త విధానాన్ని విడిచి పెట్టినట్లయితే తప్పకుండా భ్రష్ఠత్వానికి లోనవుతారు. ఎవరైతే ఉన్నతమైన రీతిలో వుజూ చేసి  మస్జిద్ వైపు బయలుదేరుతారో వారి ఒక అడుగు బదులుగా ఒక సత్కార్యం వారి పేరున రాయబడుతుంది మరియు వారి ఒక్క స్థానం ఉన్నతం చేయబడుతుంది మరియు ఒక పాపం మన్నించడం జరుగుతుంది. మా కాలంలో నేను గమనించేవాణ్ణి పేరెన్నికగన్న కపటులు మాత్రమే (సామూహిక నమాజ్లో పాల్గొనకుండా) వెనక ఉండిపోయేవారు. (వ్యాధి మొదలగు కారణాల చేత) నడవలేక పోతున్నవారిని ఇద్దరు మనుషుల సాయంతో తీసుకొని వచ్చి పంక్తిలో నిలబెట్టడం జరిగేది. (ముస్లిం)

1.8 ప్రార్ధనా స్థలాల ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

298 – حديث أَبِي ذَرٍّ رضي الله عنه، قَالَ: قُلْتُ يَا رَسُولَ اللهِ أيُّ مَسْجِدٍ وُضِعَ فِي الأَرْضِ أَوَّلُ قَالَ: الْمَسْجِدُ الْحَرَامُ قَالَ: قُلْتُ ثُمَّ أيُّ قَالَ: الْمَسْجِدُ الأَقْصى قُلْتُ: كَمْ كَانَ بَيْنَهُمًا قَالَ: أَرْبَعُونَ سَنَةً، ثُمَّ أَيْنَمَا أَدْرَكَتْكَ الصَّلاَةُ بَعْدُ، فَصَلِّ، فَإِنَّ الْفَضْلَ فِيهِ
__________
أخرجه البخاري في: 60 كتاب الأنبياء: 10 باب حدثنا موسى بن إسماعيل

298. హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) కథనం:- నేనొకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! ప్రపంచంలో అన్నిటి కంటే ముందు నిర్మించబడిన మస్జిద్ ఏది?” అని అడిగాను. దానికాయన “మస్జిదుల్ హరాం (కాబా గృహం)” అని సమాధానమిచ్చారు. “ఆ తరువాత ఏదీ?” అని నేను మళ్ళీ అడిగాను. “బైతుల్ మఖ్ దిస్” అన్నారు ఆయన. “అయితే ఈ రెండిటి నిర్మాణాల మధ్య ఎంత వ్యవధి ఉంది?” అని తిరిగి ప్రశ్నించాను. “నలభై ఏళ్ళ”ని ఆయన సమాధానమిచ్చారు. ఆ తరువాత “కాల చక్రం నిన్ను ఏ చోటుకు తెస్తే ఆ చోటనే (వేళకు) నమాజు చెయ్యి. అదే శ్రేష్ఠమైన పని” అని హితవు చేశారు ఆయన.” [సహీహ్ బుఖారీ : 60వ ప్రకరణం – అంబియా….. అధ్యాయం ]

299 – حديث جَابِرِ بْنِ عَبْدِ اللهِ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ مِنَ الأَنْبِيَاءِ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِيَ الأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلاَةُ فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِيَ الْغَنَائِمُ، وَكَانَ النَبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاس كَافَّةً، وَأُعْطِيتُ الشَّفَاعَةَ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 56 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ جعلت لي الأرض مسجدًا وطهورًا

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు:- నాకు పూర్వం ఏ దైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి. (1) నా గాంభీర్యానికి శత్రువులు ఒక నెల ప్రయాణపు దూరం నుండే భయపడిపోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు. (2) నా కోసం యావత్తు భూమండలం * ప్రార్థనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తి ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళయినప్పుడు నమాజు చేసుకోవచ్చు. (3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్)ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది. (4) ఇతర దైవప్రవక్తలందరూ తమ తమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం దైవప్రవక్తగా పంపబడ్డాను. (5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు ** చేసే అధికారం ఇవ్వబడింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 56వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. జుఇలత్ లియల్ అర్జుకుల్లహ మస్జిదన్ వ తహూర]

* అంటే, నిషిద్ధ ప్రదేశాల్లో తప్ప మరెక్కడయినా వేళకాగానే అలస్యం చేయకుండా నమాజు చేయడం ఉత్తమం అని అర్థం. నిషిద్ధ ప్రదేశాలు అంటే శ్మశానం, భవన నిర్మాణ సామగ్రి ఉండే ప్రదేశాలు, పేడ కసువు ఉండే పశువుల కొట్టాలు, మార్గాలు, మలిన ప్రదేశాలు, స్నానాల దొడ్లు మొదలగునవి.

** ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్థం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫార్సు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫార్సు అంటే రద్దు కానటువంటి సిఫార్సు గాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫార్సు గానీ అయి ఉంటుంది.

300 – حديث أَبِي هُرَيْرَةَ رضي الله عنه، أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: بُعِثْتُ بِجَوَامِعِ الْكَلِمِ، وَنُصِرْتُ بِالرُّعْبِ، فَبَيْنَا أَنَا نَائِمٌ أُتِيتُ بِمَفَاتِيحِ خَزَائِنِ الأَرْضِ فَوُضِعَتْ فِي يَدِي
قَالَ أَبُو هُرَيْرَةَ: وَقَدْ ذَهَبَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَأَنْتُمْ تَنْتَثِلُونَهَا
__________
أخرجه البخاري في: 56 كتاب الجهاد: 122 باب قول النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ نصرت بالرعب مسيرة شهر

300. హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “నాకు సంక్షిప్త పదాలతో విస్తృత భావం కలిగి వున్న ( ఖుర్ఆన్) వాణి ప్రసాదించబడింది. (నా గురించి విని శత్రువుల గుండెల్లో గుబులు పుట్టేలా) నాకు గాంభీర్యత నిచ్చి సహాయం చేయబడింది. ఓ రోజు నేను నిద్రపోతూంటే (కలలో) నా చేతికి ప్రపంచంలోని సిరిసంపదలు, నిక్షేపాలకు సంబంధించిన తాళపు చెవులు అందించబడ్డాయి”.

హజ్రత్ అబూహురైరా (రదియల్లాహు అన్హు) ఈ హదీసు ఉల్లేఖించిన తర్వాత “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇహలోకం వీడిపోయిన తరువాత ఇప్పుడు మీరా సిరిసంపదలు, నిక్షేపాలు హస్తగతం చేసుకుంటున్నారు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 56వ ప్రకరణం – జిహాద్, 122వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి…. నుసిర్తు బిర్రూబి….]

1.9 ప్రయాణీకుల నమాజ్ ప్రకరణం| మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  

398 – حديث عَائِشَةَ أُمِّ الْمُؤْمِنِينَ قَالَتْ: فَرَضَ اللهُ الصَّلاَةَ حِينَ فَرَضَهَا رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ فِي الْحَضَرِ وَالسَّفَرِ، فَأُقِرَّتْ صَلاَةُ السَّفَرِ، وَزِيدَ فِي صَلاَةِ الْحَضَرِ
__________
أخرجه البخاري في: 8 كتاب الصلاة: 1 كيف فرضت الصلوات في الإسراء

398. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) కథనం:-

అల్లాహ్ (ప్రారంభంలో) నమాజు విధిగా చేయాలని నిర్ణయించినప్పుడు ప్రయాణావస్థలో ఉన్నా, లేకపోయినా రెండేసి రకాతులు విధిగా చేయాలని ఆదేశించాడు. అయితే ఆ తరువాత కొన్నాళ్ళకు ప్రయాణావస్థలో రకాతుల సంఖ్యను ఇదివరకటిలాగే యథాతథంగా ఉంచి, ప్రయాణావస్థలో లేనప్పుడు నిర్వర్తించవలసిన రకాతుల సంఖ్యను పెంచడం జరిగింది.

[సహీహ్ బుఖారీ : 8వ ప్రకరణం – సలాత్, 1వ అధ్యాయం – కైఫఫర్జియ తిస్సలాతు ఫిల్ ఇస్రా)

399 – حديث ابْنِ عُمَرَ عَنْ حَفْصِ بْنِ عَاصِمٍ قَالَ: حَدَّثَنَا ابْنُ عُمَرَ، فَقَالَ: صَحِبْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَلَمْ أَرَهُ يُسَبِّحُ فِي السَّفَرِ وَقَالَ اللهُ جَلَّ ذِكْرُهُ (لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللهِ أُسْوَةٌ حَسَنَةٌ)
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 11 باب من لم يتطوع في السفر دبر الصلاة وقبلها

399. హజ్రత్ హఫ్స్ బిన్ ఆసిమ్ (రహిమహుల్లాహ్) కథనం ప్రకారం హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేశారు:-

నేను (ఓసారి ప్రయాణంలో) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నాను. ఆయన (ఈ) ప్రయాణంలో సున్నత్ నమాజులు చేస్తూ ఉండగా నేను చూడలేదు. కాగా; అల్లాహ్ ( ఖుర్ఆన్లో) “దైవప్రవక్త (జీవనసరళి)లో మీకొక చక్కని ఆదర్శం ఉంది” అని అన్నాడు. (33:21)

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఫ్సీరుస్సలాత్, 11వ అధ్యాయం – మల్లమ్ యతతవ్వు ఫిస్సఫరి దుబుర సలవాత్)

400 – حديث أَنَسٍ رضي الله عنه، قَالَ: صَلَّيْتُ الظُّهْرَ مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمَدِينَةِ أَرْبَعًا، وَبِذِي الْحُلَيْفَةِ رَكْعَتَيْنِ
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 5 باب يقصر إذا خرج من موضعه

400. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) కథనం:-

నేను మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక నాలుగు రకాతులు జుహర్ నమాజు చేశాను; ‘జుల్ హులైఫా’లో రెండు రకాతులు అసర్ నమాజు చేశాను.

[సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 5వ అధ్యాయం – యఖ్ సురు ఇజా ఖరజ మిమ్మవుజూ…..]

401 – حديث أَنَسٍ، قَالَ خَرَجْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَة
سَأَلَهُ يَحْيَى بْنُ أَبِي إِسْحقَ قَالَ: أَقَمْتُمْ بِمَكَّةَ شَيْئًا قَالَ أَقَمْنَا بِهَا عَشْرًا
__________
أخرجه البخاري في: 18 كتاب تقصير الصلاة: 1 باب ما جاء في التقصير وكم يقيم حتى يقصر

401. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు)కథనం:-

మేమొకసారి దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట మదీనా నుండి మక్కాకు బయలుదేరాము. ఈ ప్రయాణంలో మేము (మక్కా నుండి) తిరిగి మదీనా చేరుకునే వరకు రెండేసి రకాతులు (మాత్రమే ఫర్జ్) నమాజ్ చేశాము. హజ్రత్ యహ్యా బిన్ అబూ ఇసఖ్ (రహిమహుల్లాహ్) ఈ హదీసు విని “మరి మీరు మక్కాలో ఎన్ని రోజులు విడిది చేశారు?” అని అడిగారు. దానికి హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) “మక్కాలో మేము పది రోజులు ఉన్నాము” అని సమాధానమిచ్చారు.

(సహీహ్ బుఖారీ : 18వ ప్రకరణం – తఖ్సీరుస్సలాత్, 1వ అధ్యాయం – మాజా అఫిత్తఖ్సీరి వకమ్ యుఖీము హత్తాయుఖస్సిర్)