2వ అధ్యాయం తౌహీద్ ఘనత, అది పాపాల విమోచనానికి ఉత్తమ సాధనం అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“ఎవరయితే విశ్వసించి, తమ విశ్వాసాన్ని “జుల్మ్” (షిర్క్) తో కలుషితం చేయలేదో, వారికే శాంతి ఉంది. వారు మాత్రమే రుజుమార్గంపై ఉన్నవారు.”(అన్ ఆమ్ 6 : 82).
ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:
“(1) అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని, ఆయన ఒక్కడేనని, 2) ఆయనకు మరెవ్వరూ సాటిలేరని మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దాసుడు, ప్రవక్త అని; (3) అలాగే ఈసా (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ దాసుడు, ఆయన ప్రవక్త అని, కాకపోతే ఆయన హజ్రత్ మర్యం (గర్భం)లో అవతరించిన అల్లాహ్ వాక్కు, అల్లాహ్ యొక్క ఆత్మ అని; (4,5) స్వర్గ నరకాలు ఉన్నాయి అన్నది యదార్ధమని, ఎవడైతే సాక్ష్యమిస్తాడో ఆ వ్యక్తి కర్మలు ఎలాంటివయినా సరే అల్లాహ్ అతడ్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు”. (బుఖారి, ముస్లిం).
ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలాసెలవిచ్చారు:
“అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు”. (బుఖారి, ముస్లిం).
అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారని:
ప్రవక్త మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో ఇలా విన్నవించుకున్నారు: ‘ఓ అల్లాహ్! నాకు కొన్ని వచనాలు నేర్పు. వాటితో నేను నిన్ను స్మరిస్తాను. నీతో అర్ధిస్తాను”. “ఓ మూసా! “లాఇలాహ ఇల్లల్లాహ్” పలుకు” అని అల్లాహ్ నేర్పాడు. మూసా (అలైహిస్సలాం) అన్నారు: “అల్లాహ్! నీ దాసులందరూ ఇదే వచనముతో స్మరిస్తారు?” “ఓ మూసా! ఏడు ఆకాశాలు, నేను తప్ప అందులో ఉన్న సృష్టి, ఇంకా ఏడు భూములను త్రాసు యొక్క ఒక పళ్లెంలో, “లాఇలాహ ఇల్లల్లాహ్” ను ఇంకొక పళ్లెంలో ఉంచితే “లాఇలాహ ఇల్లల్లాహ్” ఉన్న పళ్లెం క్రిందికి వంగిపోవును” అని అల్లాహ్ (దాని విలువను) తెలిపాడు.
(ఇబ్ను హిబ్బాన్ మరియు హాకిం సేకరించారు. హాకిం నిజపరిచారు).
అల్లాహ్ ఇలా సెలవిచ్చారని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను అని అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు:
“ఓ మానవుడా! నీవు భూమి నిండా పాపాలు చేసినప్పటికీ నాతో మరెవ్వరినీ సాటి కల్పించకుండా (చనిపోయి) నాతో కలిసినప్పుడు, ‘నేను అంతే (భూమి నిండా) క్షమాపణలతో నీతో కలుస్తాను (నిన్ను క్షమిస్తాను).(తిర్మిజి. ఈ హదీసు హసన్).
ముఖ్యాంశాలు:
1. అల్లాహ్ దయ, కరుణ చాలా విశాలమైనది.
2. తౌహీద్ యొక్క పుణ్యం అల్లాహ్ వద్ద చాలా ఎక్కువగా ఉంది.
3. దానితో పాటు అది పాపాలను తుడిచి వేయును.
4. సూరయే అన్ఆమ్ లోని ఆయతులో “జుల్మ్” అంటే షిర్క్ అని భావం.
5. ఉబాద బిన్ సామిత్ (రది అల్లాహు అన్హు) హదీసులో ఉన్న ఐదు విషయాల్ని గమనించండి.
6. ఉబాద హదీసు, ఇత్బాన్ హదీసు మరియు అబూ సఈద్ ఖుద్రీ (రది అల్లాహు అన్హుమ్) హదీసులను కలిపితే “లాఇలాహ ఇల్లల్లాహ్ ” యొక్క అసలు అర్ధం నీకు తెలుస్తుంది. మరియు దాని సరియైన భావాన్ని తెలుసు కొనక మోసబోయి తప్పులో పడియున్నవారి విషయం కూడా స్పష్టం అవుతుంది.
7. ఇత్బాన్ హదీసులో ఉన్న షరతు (అల్లాహ్ ఇష్టం కొరకు)పై చాలా శ్రద్ధ వహించాలి.
8. “లాఇలాహ ఇల్లల్లాహ్” ఘనత తెలుసుకునే అవసరం ప్రవక్తలకు సయితం ఉండేది.
9. “లాఇలాహ ఇల్లల్లాహ్” సర్వ సృష్టికన్నా ఎక్కువ బరువుగలదైనప్పటికీ, దాన్ని చదివేవారిలో చాలా మంది యొక్క త్రాసు తేలికగా (విలువలేనిదిగా) ఉండును.
10. ఆకాశాలు ఏడు ఉన్నట్లు భూములు కూడా ఏడు ఉన్నవని రుజువయింది.
11. అందులో కూడా నివసించువారున్నారు. (జీవించువారున్నారు).
12. అల్లాహ్ యొక్క అన్ని గుణగణాలను నమ్మాలని రుజువవుతుంది. కాని “అష్ ఆరీయ్యా” అను ఒక వర్గం వారు కొన్ని గుణగణాలను తిరస్కరిస్తారు.
13. అనస్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును నీవు అర్థం చేసుకుంటే, ఇత్బాన్ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు: “అల్లాహ్ సంతృప్తి కొరకు “లాఇలాహ ఇల్లల్లాహ్ ” చదివే వారిపై అల్లాహ్ నరకం నిషేధించాడు” లో అది కేవలం నోటితో చదవటం కాదు షిర్కు వదులుకోవాలి అని కూడా అర్ధం చేసుకుంటావు.
14. ఉబాద (రది అల్లాహు అన్హు) హదీసులో ఈసా (అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇద్దరిని “అల్లాహ్ దాసులు, ప్రవక్తలు” అని చెప్పబడింది.
15. ప్రతీది అల్లాహ్ ఆజ్ఞ తోనే పుడుతుంది గనుక అది అల్లాహ్ వాక్కు. కాని ఇక్కడ ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) ను అల్లాహ్ వాక్కు అని చెప్పబడింది .
16. (ఆత్మ అల్లాహ్ యొక్క సృష్టి అయినప్పటికీ) ప్రత్యేకంగా ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క ఆత్మ అని చెప్పబడింది.
17. స్వర్గ నరకాలను విశ్వసించు ఘనత కూడా తెలిసింది.
18. ఉబాద హదీసులో “కర్మలు ఏలాంటివైనా సరే” అన్నదానితో (అతడు ఏక దైవోపాసకుడు అయి ఉండుట తప్పనిసరి అనే) భావం తెలుస్తుంది.
19. (ప్రళయదినాన కర్మలు తూకము చేయబడే) త్రాసుకు రెండు పళ్ళాలుండును అని తెలిసింది.
20. ఇత్బాన్ హదీసులో అల్లాహ్ కు “వజ్హ్” ఉంది అని వచ్చింది. దాని అర్ధం “ముఖం” (Face).
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
తౌహీద్ మానవులందరిపై విధిగా ఉన్నదని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. ఇందులో దాని ఘనత, ఔన్నత్యం, దాని మంచి ప్రభావాన్ని మరియు దాని సత్ఫలితాన్ని తెలుపడం జరిగింది. తౌహీద్ లో ఉన్నటువంటి వివిధ ఘనతలు, మంచి ప్రభావాలు మరే దానిలో లేవు. ఇహపరాల మేళ్లు అన్నియూ తౌహీద్ ఫలితము, దాని ఘనత తోనే లభించును. పాపాల మన్నింపు, వాటి విమోచనం కూడా తౌహీద్ ఘనత వలనే. దానికి ఆధారం కూడా పైన తెలుపబడింది. (దాని అనేక ఘనతల్లో కొన్ని క్రింద చూడండి).
1. ఇహపరాల కష్టాలు, విపత్తులు దూరమగుటకు ఇది గొప్ప కారణం.
2.తౌహీద్ హృదయంలో ఆవగింజంత ఉన్నా, అది నరకాగ్నిలో శాశ్వతంగా ఉండకుండా కాపాడుతుంది.
3. అది సంపూర్ణంగా ఉంటే నరక ప్రవేశం నుండే కాపాడుతుంది.
4. తౌహీద్ గల వ్యక్తికి ఇహపర లోకాల్లో సంపూర్ణ సన్మార్గం, పూర్తి శాంతి ప్రాప్తి యగును.
5. అల్లాహ్ సంతృప్తి, దాని సత్ఫలితం పొందుటకు అది ఏకైక కారణం. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిఫారసుకు అర్హుడయ్యే అదృష్టవంతుడు “లాఇలాహ ఇల్లల్లాహ్” నిర్మలమైన మనుస్సుతో చదివేవాడు.
6. బాహ్య, ఆంతర్య, సర్వ మాటల, కర్మల అంగీకారం, వాటి సంపూర్ణత, వాటి సత్ఫలితం తౌహీద్ పై ఆధారపడియుంది. తౌహీద్ లో ఎంత బలం, స్వచ్ఛత ఉంటే, అంతగా ఆ విషయాలు సంపూర్ణం అవుతాయి.
7.సత్కార్యాలు చేయడం, దుష్కార్యాల నుండి దూరముండడం తౌహీద్ మూలంగా సులభమగును. బాధ కలిగినప్పుడు తృప్తి లభించును. తౌహీద్, విశ్వాసంలో అల్లాహ్ కొరకు స్వచ్ఛత చూపేవాడు సత్కార్యాలపై సత్ఫలితం, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తాడు. కనుక అవి అతనికి చాలా తేలికగా ఏర్పడుతాయి. దుష్కార్యాలపై ఉన్న శిక్షతో భయపడుతాడు కనుక అవి వదలుకోవడం కూడా అతనికిచాలా తేలికగా ఉంటుంది.
8.హృదయాంతరంలో తౌహీద్ సంపూర్ణమయితే అల్లాహ్ వారికి విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేస్తాడు, దాన్ని మనోరంజకమైనదిగా చేస్తాడు.అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతల పట్ల అసహ్యం కలిగేలా చేస్తాడు. అతన్ని సన్మార్గం పొందువారిలో చేర్చుతాడు.
9.ఏ దాసునిలో తౌహీద్, విశ్వాసం సంపూర్ణంగా ఉంటుందో అతడు అసహ్యమైన సంఘటనలను, కష్ట బాధలను ఎంతో విశాలమైన, సంతృప్తికరమైన మనుస్సుతో సహిస్తాడు. అల్లాహ్ వ్రాసి ఉంచిన అదృష్టంపై సంతోషంగా ఉంటాడు.
10) ఇంకా దాని ఘనత: అది మానవ దాస్యం నుంచి అతన్ని విముక్తి కలిగిస్తుంది. అతడు అల్లాహ్ తప్ప ఇతరుల పై ఆధారపడి, వారితో భయపడుతూ ఉండడు. వారి దయదాక్షిణ్యాల వైపు కన్నెత్తి చూడడు. అతడు చేసేది వారి కొరకూ కాదు. వాస్తవానికి ఇదే నిజమైన పరువు ప్రతిష్ట, మాన్యత. దీనితో పాటు అతడు అల్లాహ్ నే ఆరాధిస్తాడు. ఆయనకు తప్ప మరెవ్వరికి భయపడడు. మరెవ్వరితో కరుణను ఆశించడు. ఇలా అతడు సంపూర్ణ సాఫల్యం పొందుతాడు.
11. తౌహీద్ తప్ప ఇంకే దానికీ లభించని ఘనత: అతని మనసులో తౌహీద్, ఇఖ్లాసు తో కూడుకొని సంపూర్ణం అయితే, అతని చిన్న కర్మ కూడా అసంఖ్యాక ఫలితాన్ని పొందుతుంది. అతని మాటల, చేష్టల ఫలితం లెక్క లేకుండా పెరుగుతుంది. అబూ సయీద్ (రది అల్లాహు అన్హు) హదీసులో వచ్చిన ప్రకారం “ఇఖ్లాసుతో కూడుకున్న అతని ఆ సద్వచనం (లాఇలాహ ఇల్లల్లాహ్) భూమ్యాకాశాలు, (అల్లాహ్ తప్ప) అందులో ఉన్న సర్వం కన్నా బరువుగా ఉంటుంది”. ఇలాంటి విషయమే “హదీసుల్ బితాఖ” అన్న పేరుతో ప్రసిద్ది చెందిన హదీసులో కూడా ఉంది: “లాఇలాహ ఇల్లల్లాహ్” వ్రాసి ఉన్న చిన్న ముక్క తొంభై తొమ్మిది రిజిస్టర్ల (Records) కంటే ఎక్కువ బరువు గలదై పోతుంది. అందులో ప్రతీ ఒక్క రిజిస్టర్ దాని పొడవు, మనిషి దృష్టి ఎంత దూరము చేరుకుంటుందో అంత దూరముంటుంది. మరో వైపు కొందరుంటారు; తౌహీద్, ఇఖ్లాసు మనసులో సంపూర్ణం లేనివారు. వారికి ఈ స్థానం, ఘనత ప్రాప్తి కాదు.
12) ఇహపరాల్లో తౌహీద్ వారలకు అల్లాహ్ విజయం, సహాయం, గౌరవం నొసంగుతాడు. సన్మార్గం ప్రసాదిస్తాడు. మంచి పనులు చేయుటకు సౌకర్యం కలుగజేస్తాడు. మాటలను, చేష్టలను సంస్కరించుకునే భాగ్యం ప్రసాదిస్తాడు.
13) విశ్వాసులైన తౌహీద్ వారల నుండి ఇహపరాల బాధలను దూరము చేసి, శాంతి, సుఖ ప్రదమైన జీవితం అనుగ్రహిస్తాడు. దీని ఉదాహరణలు, సాక్ష్యాలు ఖుర్ ఆన్, హదీసులో చాలా ఉన్నవి.
సహాబా : ‘సహాబీ‘కి బహువచనం ‘సహాబా‘. విశ్వాస (ఈమాన్) స్థితిలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను కలుసుకుని, విశ్వాసస్థితిలో తనువు చాలించిన వారంతా సహాబా (సహచరులు- రది అల్లాహు అన్హుమ్) అనబడతారు.
వారు ముస్లిం సమాజంలో అందరికన్నా శ్రేష్టులని, ఇస్లాం వైపు ముందంజవేసిన వారని, ప్రవక్త సహచర్య భాగ్యం పొందినవారని, ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)తో కలిసి జిహాద్ చేసినవారని, షరీయత్ బరువు బాధ్యతలను మోయటమే గాకుండా దానిని తమ తరువాతి తరాల వారికి అందించిన ధన్యజీవులని, ఈ కారణంగా వారు ప్రపంచంలోనే అత్యుత్తమ సమూహం అని మనం విశ్వసించటం తప్పనిసరి (వాజిబ్). – [నుండి: సహాబా అంటే ఎవరు? వారి గురించి ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలి? – డా. సాలెహ్ అల్ ఫౌజాన్]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
ఈ ప్రసంగంలో, సహాబాల (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు) యొక్క నిర్వచనం, వారి ఉన్నత స్థానం మరియు ప్రాముఖ్యత వివరించబడింది. వారి జీవిత చరిత్రను తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమో హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనతో స్పష్టం చేయబడింది. సహాబాల యొక్క సద్గుణాలను మరియు వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను సూరతుల్ ఫతహ్ వంటి ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వివరించారు. సహాబాలను దూషించడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించిన హదీసులు, వారి పట్ల విశ్వాసులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు మరియు వారి మధ్య ఉన్న వివిధ స్థాయిల గురించి చర్చించబడింది. సలఫె సాలెహీన్ (పూర్వపు సత్పురుషులు) సహాబాలను ఎలా గౌరవించేవారో అబ్దుల్లా బిన్ ఉమర్ మరియు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ వంటి వారి ఉదాహరణలతో వివరించబడింది. సహాబాలను దూషించే వారి పట్ల ఇమామ్ అహ్మద్ వంటి ఇస్లామీయ పండితుల కఠినమైన వైఖరిని కూడా ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.
సహాబా – నిర్వచనం
సోదర సోదరీమణులారా, సహాబీ ఇది ఏకవచనం, సహాబా ఇది బహువచనం. సహాబియా ఇది ఏకవచనం, స్త్రీలను అంటారు. సహాబియాత్ ఇది బహువచనం, స్త్రీలను అంటారు. ఏ స్త్రీలు? ఏ పురుషులు? సహాబీ అంటే ఎవరైతే విశ్వాస స్థితిలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసి, కలిసి, విశ్వాస స్థితిలోనే చనిపోయారో వారిని సహాబీ అంటారు. ఇక ఒక్కరు పురుషులైతే సహాబీ, ఇద్దరు పురుషులైతే సహాబియాన్, అంతకంటే ఎక్కువ వారిని సహాబా లేదా అస్హాబు ముహమ్మద్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మిత్రులు అని అనబడుతుంది. ఒక స్త్రీ అయ్యేది ఉంటే, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిని చూసి, ప్రవక్త సల్లల్లహు అలైహి వసల్లం వారిపై విశ్వసించి, విశ్వాస స్థితిలో చనిపోయిన స్త్రీ సహాబియా, సహాబియతాన్, సహాబియాత్.
సహాబాల జీవిత చరిత్ర తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
అయితే సోదర సోదరీమణులారా, వారి జీవిత గాథ తెలుసుకోవడం, వారి జీవిత విషయాలు తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అన్నటువంటి ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. అయితే సమాధానం చాలా శ్రద్ధగా వినండి. ఈ సమాధానం నేను నా ఇష్టంతో, నేను నా ఆలోచనతో చెప్పేది కాదు. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిత్రులలో, సహాబాలలో ఒక గొప్ప సహాబీ. ఆయన తెలుపుతున్నారు. ఏమన్నారు ఆయన?
“అల్లాహు తాలా మానవుల హృదయాల పట్ల దృష్టి వేశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయాన్ని అందరి హృదయాల కంటే ఎంతో ఉత్తమంగా చూశాడు. ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆ తర్వాత, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రజల హృదయాలను వెతికాడు, చూశాడు. సహాబాల హృదయాలను ఎంతో పరిశుద్ధంగా పొందాడు. అల్లాహ్ ఆ సహాబాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్నేహితులుగా, అండదండగా, వారికి వారి ఈ ప్రచార కార్యక్రమంలో దోహదపడేవారుగా ఎన్నుకున్నాడు“
ఈ సహాబాలు ఎంత గొప్పవారు, ఎంత గొప్ప శ్రేణికి చెందినవారు. అల్లాహు తాలా స్వయంగా ప్రళయ దినం వరకు సురక్షితంగా ఉండేటటువంటి సత్య గ్రంథం, దివ్య గ్రంథం ఖుర్ఆన్ లో వంద కంటే పైగా ఆయతులలో వారిని ప్రశంసించాడు. వారి యొక్క ఉన్నత గుణాలను ప్రస్తావించాడు. వారి యొక్క ఎన్నో మంచి విషయాలను ప్రళయం వరకు వచ్చే ప్రజలందరి కొరకు ఒక మంచి ఆదర్శంగా ఉంటాయని కూడా తెలిపాడు.
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన ఈ సహాబాలు, వారిని విశ్వసించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. మనం అల్లాహ్ ను విశ్వసిస్తున్నాము, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, వారిలో ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాము. ఇంకా విశ్వాసానికి సంబంధించిన ఏ ఏ విషయాలు ఉన్నాయో, వాటిలో ఒక ముఖ్యమైన విషయం సహాబాలను కూడా విశ్వసించడం.
హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన ఒక విషయాన్ని గమనించండి,
أَبَرُّ هَذِهِ الْأُمَّةِ قُلُوبًا (అబర్రు హాదిహిల్ ఉమ్మతి ఖులూబా) సహాబాలు సర్వ విశ్వాసులలో, సర్వ విశ్వాసులలో అతి పరిశుద్ధమైన హృదయాలు గలవారు.
وَأَعْمَقُهَا عِلْمًا (వ అ’మఖుహా ‘ఇల్మా) చాలా లోతుగల జ్ఞానం, విద్య గలవారు.
وَأَقَلُّهَا تَكَلُّفًا (వ అఖల్లుహా తకల్లుఫా) చాలా తక్కువగా వారు ఏదైనా పని చేయడంలో వారి నుండి కావాలని ఏదీ పొరపాటు జరిగేది కాదు మరియు కావాలని ఎలాంటి బాధలలో చిక్కుకునే ప్రయత్నం చేసేవారు కారు.
وَأَحْسَنُهَا حَالًا (వ అహ్సనుహా హాలా) అందరికంటే ఉత్తమ స్థితిలో జీవితం గడిపేవారు.
اخْتَارَهُمُ اللَّهُ لِصُحْبَةِ نَبِيِّهِ وَلِإِقَامَةِ دِينِهِ (ఇఖ్తారహుముల్లాహు లిసుహబతి నబియ్యిహి వలి ఇఖామతి దీనిహి) అల్లాహు తాలా వారిని తన ప్రవక్తకు స్నేహితులుగా ఎన్నుకున్నాడు మరియు తన ఈ ధర్మాన్ని స్థాపించబడటానికి వారిని ఎన్నుకున్నాడు
గమనించారా? అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ఉండగానే విశ్వసించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ జీవితం గడిపారు. తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించిన సహాబాలను చూశారు. మదీనా వలస వచ్చిన తర్వాత సహాబాలను చూశారు. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి దశలో ఇస్లాం స్వీకరించిన వారిని కూడా చూశారు. అయితే గమనించండి, వారు సహాబాల గురించి ఎంత గొప్ప విషయం తెలిపారు.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు. (48:29)
గమనించండి, ఈ రోజుల్లో ఎవరైతే సహాబాలను అగౌరవపరుస్తున్నారో, సహాబాలలో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా వారి పట్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారో, ఒకసారి ఈ ఖుర్ఆన్ ఆయత్ ల పట్ల శ్రద్ధ వహించాలి. అల్లాహ్ వారిని ప్రశంసిస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలను ప్రస్తావిస్తున్నాడు. వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు కేవలం ఖుర్ఆన్ లోనే కాదు, ఖుర్ఆన్ కంటే ముందు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తౌరాత్ మరియు ఇంజీల్, వాటిలో కూడా వీరి ఉత్తమ గుణాలు ఉన్నాయి అని స్వయంగా అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడో, అలాంటి వారిని మనం దూషించడం, అలాంటి వారి గురించి మనం చెడుగా ఆలోచించడం, అలాంటి వారి పట్ల మనం ఏదైనా దుర్భాషలాడటం, ఇది మన విశ్వాసంలో కొరత, మన విశ్వాసానికి చాలా భయంకరమైన ముప్పు కలుగజేస్తుంది.
అల్లాహ్ తాలా వారిని ప్రశంసిస్తూ ఇస్లాం మరియు ఇస్లాం స్వీకరించిన వారి పట్ల ఎంత మృదువుగా, ఎంత ఆప్యాయతతో, కరుణా కటాక్షాలతో వారు జీవితం గడుపుతారంటే, అవిశ్వాసానికి సంబంధించిన విషయాలు మరియు సత్య ధర్మమైన ఇస్లాంకు వ్యతిరేకమున్న విషయాలు వారికి ఏమాత్రం ఇష్టం ఉండవు. నీవు వారిని రుకూ చేస్తూ, సజ్దా చేస్తూ చూస్తూ ఉంటావు. వారు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని, అల్లాహ్ యొక్క సంతృప్తిని కోరుతూ ఉంటారు. మరియు వారి యొక్క సజ్దా గుర్తులు, చిహ్నాలు వారి ముఖాలపై ఎంతో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నాడో గమనించండి అల్లాహు తాలా,
ఇదంతా వారి గురించి ప్రస్తావించి, ప్రశంసించి, “వారి ఈ ఉపమానం తౌరాతులో ఉంది.” ఈ ఉదాహరణలు, ఈ పోలికలు, ఈ ఉత్తమ గుణాలు వారి గురించి ఏవైతే ప్రస్తావించబడ్డాయో, ఇవన్నీ కూడా తౌరాతులలో కూడా ఉన్నాయి. అంటే వీరి గుణాలు ఇలా ఉంటాయి, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాలు ఎవరైతే ఉన్నారో, వారి యొక్క ఈ ఉత్తమ గుణాలు అని తౌరాత్ లో ప్రస్తావన వచ్చి ఉంది. అంతే కాదు, ఇంజీల్ లో ఎలా ఉంది?
“ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు“.” (48:29)
సహాబాలను దూషించడంపై ప్రవక్త హెచ్చరిక
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో స్పష్టంగా తెలిపారు:
لَا تَسُبُّوا أَصْحَابِي (లా తసుబ్బూ అస్ హాబీ) నా సహాబాలను మీరు దూషించకండి.
అంతేకాదు, వారి యొక్క స్థానం ఎంత గొప్పదో అది కూడా ఇదే హదీసులో తెలియబరిచారు. అదేమిటి?
“లవ్ అన్ఫఖ అహదు మిన్కుమ్ మిస్ల ఉహుదిన్ జహబా, మా బలగ ముద్ద అహదిహిమ్ వలా నసీఫహు.” మీలో ఎవరైనా ఉహద్ పర్వతం ఎంత పెద్దగా ఉందో అంత బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా, సహాబాలు సామాన్యంగా ఏదైనా విషయం, ఏదైనా వస్తువు, వారు ఒక ముప్పావు కిలో, 600 గ్రాములు, లేదా 300 గ్రాముల వరకు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి సమానం కూడా కాజాలదు. అల్లాహు అక్బర్.
గమనించండి సోదరులారా. ఉహద్ పర్వతం ఎంత పెద్దదో తెలుసా? ఇంచుమించు 7 నుండి 8 కిలోమీటర్ల పొడవు, 2 నుండి 3 కిలోమీటర్ల వెడల్పు మరియు 700 మీటర్ల ఎత్తు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఎవరైనా ఉహద్ పర్వతం అంత బంగారం ఖర్చు పెట్టినా, సహాబాలు ఒక 300 గ్రాముల వరకు లేదా ఒక 600, 650 గ్రాముల వరకు ఏదైనా వస్తువు ఖర్చు పెట్టి ఉంటే, మీ ఈ ఉహద్ పర్వతం లాంటి బంగారం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం సహాబాలు చేసిన ఈ పుణ్యానికి, దానానికి సమానంగా కాజాలదు. సహాబాల స్థానంలో, మీ స్థానంలో ఇంత పెద్ద గొప్ప వ్యత్యాసం ఉంది. మీరు ఏ నోట వారిని దూషిస్తారు? ఏ నోట వారిని మీరు చెడుగా ప్రస్తావిస్తారు?
సహాబాల పట్ల మన హక్కులు మరియు బాధ్యతలు
మొదటి హక్కు సహాబాల గురించి మనపై ఉన్నది ఏమిటి? అల్లాహు తాలా లేదా చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఏ ఘనతలు తెలిపారో వాటిని నమ్మడం. వారిలో ఎంతో గొప్ప స్థానంలో, వారి స్థానాల్లో హెచ్చుతగ్గులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మొట్టమొదటి స్థానంలో హజ్రత్ అబూబకర్, రెండవ స్థానంలో హజ్రత్ ఉమర్, మూడవ స్థానంలో హజ్రత్ ఉస్మాన్, నాలుగో స్థానంలో హజ్రత్ అలీ రదియల్లాహు అన్హుమ్ వరద్వు అన్. ఇక ఈ నలుగురి తర్వాత, ఇహలోకంలో ఏ పది మంది గురించైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో వారిలో ఈ నలుగురు వస్తారు, మిగిలిన ఆరుగురు, ఆ తర్వాత బద్ర్ లో పాల్గొన్నవారు. కానీ మొట్టమొదటి హక్కు ఏమిటి? ఎవరి గురించి ఏ ఏ ఘనతలు ఖుర్ఆన్ లో లేదా హదీసుల్లో వచ్చి ఉన్నాయో వాటిని మనం నమ్మాలి. వాటిలో ఏ ఒక్కటిని కూడా తిరస్కరించకూడదు.
ఎందుకో తెలుసా? ఉదాహరణకు, హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క ఘనతలో ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు అవతరింపజేయబడ్డాయి. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో హదీసుల్లో ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిలో ఏ ఒక్కటినీ కూడా మనం తిరస్కరిస్తే, ఇందులో అబూబకర్ స్థానంలో ఏ కొరత ఏర్పడదు. కానీ మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటలు తిరస్కరించిన వారిలో, అల్లాహ్ యొక్క ఆయతులను తిరస్కరించిన వారిలో అయిపోతాము. ఎప్పుడైతే మనం వారికి ఏ స్థానం ఇవ్వబడినదో దానిని మనం విశ్వసిస్తున్నామో, నమ్ముతున్నామో, అక్కడే వారిలోని ఏ ఒక్కరి పట్ల కూడా మన మనసులో ఏ కీడు కానీ, ఏ కపటం గానీ, ఎలాంటి దోషం కానీ ఉండకూడదు. మన హృదయంలో ఎలాంటి కపటము, ద్వేషము, జిగస్సు ఏదీ కూడా ఉండకూడదు. మన హృదయం వారి గురించి ఎంతో తేటతెల్లగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి కీడు లేకుండా ఉండాలి.
“ఎవరైతే విశ్వాస స్త్రీ పురుషులను వారి ఏ పాపం లేకుండా, ఏ కారణం లేకుండా వారిని బాధ పెడతారో, వారికి హాని కలుగజేస్తారో, వారు చాలా భయంకరమైన పాపాన్ని మరియు ఒక భయంకరమైన అపనిందను, స్పష్టమైన పాపాన్ని తమ మెడకు కట్టుకున్నవారైపోతారు.“
అందు గురించి అలాంటి వారు భయపడాలి. ఇక్కడ సామాన్యంగా విశ్వాసుల పదం ఏదైతే వచ్చిందో, ఎవరో విశ్వాసులని అనుకోకండి. విశ్వాసుల్లో మొట్టమొదటి స్థానంలో సహాబాలు వస్తారు అన్న విషయం మరవకండి.
కాలాల్లో ఉత్తమమైన కాలం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? సహీ బుఖారీ, సహీ ముస్లిం ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో ఈ హదీస్ ఉంది:
خَيْرُ النَّاسِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ (ఖైరున్నాసి ఖర్నీ, సుమ్మల్లజీన యలూనహుమ్, సుమ్మల్లజీన యలూనహుమ్) అన్ని కాలాల్లో అతి ఉత్తమమైన కాలం నాది, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం, మళ్లీ ఆ తర్వాత వచ్చే కాలం.
అల్లాహు అక్బర్. గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఆ కాలాన్ని అన్ని కాలాల్లో అతి శ్రేష్టమైనదని తెలుపుతున్నారు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు తిరస్కరించినప్పుడు ఈ సహాబాలు ఇస్లాంను స్వీకరించారు, విశ్వాస మార్గాన్ని అవలంబించారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వదిలేశారో, చివరికి స్వయంగా వారి కుటుంబంలోని కొందరు, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరువుగా అయ్యారు, దగ్గరగా అయ్యారు. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ ఇంటి నుండి వెళ్లగొట్టారో, అప్పుడు ఈ సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహాయమందజేసి, తమకు దగ్గరగా తీసుకున్నారు. ఈ విధంగా ఇస్లాం పట్ల సహాబాల త్యాగాలు ఇంతా అంతా కావు, ఎంతో గొప్పమైనవి.
సలఫె సాలెహీన్ మరియు సహాబాల గౌరవం
మన సలఫె సాలెహీన్ రహిమహుముల్లాహ్ సహాబాలను ఎలా గౌరవించేవారు? సహాబాల గురించి వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రేమ, వారి యొక్క గౌరవ మర్యాదలు ఎలా ఉండేవి? వాటిని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు, హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారి యొక్క కుమారుడు. ఒక సందర్భంలో అతను తెలిపాడు, “ప్రజలారా, సహాబాలను దూషించకండి. సహాబాలు కొంతసేపు, ఒక చిన్నపాటి గడియ, వారు ఏదైతే అల్లాహ్ ఆరాధనలో గడిపారో, మీరు మీ జీవితాంతం చేసే మీ ఆరాధన వారి ఆ గడియపాటు ఆరాధనకు చేరుకోదు.” వారి స్థానం అంత గొప్పది కనుక మీరు వారిని దూషించకండి.
అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమహుల్లాహ్, చాలా గొప్ప ముహద్దిస్, ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. వచ్చి, ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఎక్కువ ఘనత గలవారా, లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజా అని ప్రశ్నించాడు. అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఏం సమాధానం చెప్పారు? దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ సహాబీ కాదు, తాబియీన్లలో వస్తారు. ఆయన చాలా ఉత్తమమైన వారు, ఆయన ఒక ఖలీఫా, వారిని ఐదవ ఖలీఫా అని అంటారు. కానీ ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ఆయనకు ఎన్నో ఘనతలు ఉన్నాయి. అట్టి ముఖ్యమైన ఘనత ఏమిటి? సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తమ కళ్లారా చూశారు, విశ్వసించారు, విశ్వాస స్థితిలో మరణించారు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏ వహీ వచ్చేదో దానిని రాసేవారు ఏ సహాబాలైతే ఉన్నారో, కాతిబీనె వహీ, వారిలో ఒకరు. అంతేకాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బావమరిది. అంటే, హజ్రత్ అమీరె ముఆవియా రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క సోదరి ఉమ్మె హబీబా రదియల్లాహు తాలా అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర భార్య. విశ్వాసం మరియు సహాబీ కావడం తో పాటు ఇన్ని రకాల ఇంకా మరెన్నో ఘనతలు కూడా ఉన్నాయి. అయితే అతి ముఖ్యమైన విషయం అతను సహాబీ. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా ఉత్తమమైన వారు కానీ సహాబీ కాదు.
అయితే ఒక వ్యక్తి వచ్చి ఏమడుగుతున్నాడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ తో? అమీరె ముఆవియా ఎక్కువ ఘనత గలవారా లేకుంటే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఎక్కువ ఘనత గలవారా? అప్పుడు అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ రహిమతుల్లాహి అలైహి చెప్పారు, “ముఆవియా రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉండగా, ఆయన ముక్కులో పోయినటువంటి దుమ్ము, ధూళి, దాని స్థానానికి కూడా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చేరుకోడు, నీవేం మాట్లాడుతున్నావు?”
అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమతుల్లాహి అలైహి గారికి ఉన్న ఘనత, వారికి ఉన్న విద్య, ఆయన ఒక ఖలీఫా, ఆ విషయాల్లో మనం ఏ కొరత చూపి ఆయన్ని అవమానించడం కాదు. సహాబాల ఘనత ఎంత గొప్పదో అది తెలియజేస్తున్నాము. ఇది మనమే కాదు, మనకంటే ముందు పూర్వీకులు సలఫె సాలెహీన్ రహిమహుల్లాహ్, వారిలో అబ్దుల్లా ఇబ్నుల్ ముబారక్ ఎలాంటి ముహద్దిస్ అంటే, ఎందరో ముహద్దిసులు చెప్పారు, ఈయనపై ఎలాంటి దోషం లేని, జరహ్ లేని ముహద్దిస్ అని.
సహాబాల యొక్క స్థానం, వారి యొక్క ఘనత విషయంలో సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:
اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي ، اللَّهَ اللَّهَ فِي أَصْحَابِي (అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ, అల్లాహ అల్లాహ ఫీ అస్హాబీ) “నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి. నా సహాబాల ప్రస్తావన వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అల్లాహ్ ను గుర్తు చేస్తున్నాను, మీరు అల్లాహ్ తో భయపడండి.“
ఆ తర్వాత చెప్పారు, “మీరు వారిలో ఏ ఒక్కరిని కూడా తమ మనోవాంఛల కొరకు, తమ మనసులోని చెడు కోరికల కొరకు ఒక సాకుగా తీసుకోకండి”
فَمَنْ أَحَبَّهُمْ فَبِحُبِّي أَحَبَّهُمْ، وَمَنْ أَبْغَضَهُمْ فَبِبُغْضِي أَبْغَضَهُمْ (ఫమన్ అహబ్బహుమ్ ఫబిహుబ్బీ అహబ్బహుమ్, వమన్ అబ్గదహుమ్ ఫబిబుగ్దీ అబ్గదహుమ్) “ఎవరైతే వారి పట్ల ప్రేమగా ఉంటాడో అతడు నా పట్ల ప్రేమగా ఉన్నట్లు. మరియు ఎవరైతే వారి పట్ల ద్వేషంగా ఉంటాడో, అతడు నా పట్ల ద్వేషంగా ఉన్నట్లు“
وَمَنْ آذَاهُمْ فَقَدْ آذَانِي، وَمَنْ آذَانِي فَقَدْ آذَى اللَّهَ، وَمَنْ آذَى اللَّهَ يُوشِكُ أَنْ يَأْخُذَهُ (వమన్ ఆదాహుమ్ ఫఖద్ ఆదానీ, వమన్ ఆదానీ ఫఖద్ ఆదల్లాహ తబారక వ తాలా) “ఎవరైతే నా సహాబాలను హాని కలిగించాడో, వారికి కీడు కలుగజేశాడో, అతడు నాకు కీడు కలుగజేసినట్లు, నాకు బాధ కలుగజేసినట్లు. మరి ఎవరైతే నన్ను బాధ పెట్టాడో, అతడు అల్లాహ్ ను బాధ పెట్టినవాడవుతాడు.“
గమనించారా? సహాబాల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉందో? వారిని ప్రేమించడం, వారి పట్ల ద్వేషంగా ఉండకుండా ప్రేమగా ఉండడం ఎంత ముఖ్యమో మన జీవితంలో, అర్థమవుతుంది కదా ఈ హదీసుల ద్వారా?
మరొక హదీస్, హజ్రత్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లు, షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహాలో ప్రస్తావించారు దీనిని:
مَنْ سَبَّ أَصْحَابِي فَعَلَيْهِ لَعْنَةُ اللَّهِ وَالْمَلائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ (మన్ సబ్బ అస్హాబీ ఫఅలైహి ల’నతుల్లాహి వల్ మలాఇకతి వన్నాసి అజ్మయీన్) ఎవరైతే నా సహాబాలను దూషిస్తాడో, అతనిపై అల్లాహ్ యొక్క శాపం, దైవదూతల శాపం మరియు సర్వ ప్రజల యొక్క శాపం పడుగాక.
సహాబాలను దూషించడంపై ఇస్లామీయ పండితుల అభిప్రాయం
ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి, నాలుగు ఇమాములలో ఒక గొప్ప ఇమాం కదా. ఆయన ఏమన్నారో తెలుసా? సహాబాల విషయంలో, “నీవు ఎప్పుడైనా ఏదైనా వ్యక్తిని చూశావు, అతడు సహాబాలలో ఏ ఒక్కరినైనా దూషిస్తున్నాడు అంటే, అతడు నిజమైన ముస్లిమో కాదో అని శంకించవలసి వస్తుంది, అనుమాన పడే అటువంటి పరిస్థితి వస్తుంది.”
ఇలాంటి మాట ఎందుకు చెప్పారు ఇమామ్ అహ్మద్ రహిమతుల్లాహి అలైహి? ఎందుకంటే నిజమైన ముస్లిం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహీ హదీసుల జ్ఞానం ఉన్న ముస్లిం, ఏ సహాబీని కూడా దూషించడు.
ఇంకా మరో సందర్భంలో హజ్రత్ ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ రహిమహుల్లాహ్ తెలిపారు, “ఏ వ్యక్తికి కూడా సహాబాలను దూషించడం దూరం, సహాబాలను అగౌరవంగా ప్రస్తావించడం కూడా తగదు. ఎవరైనా అలా చేశాడంటే ఆ వ్యక్తి కాలంలో, ఆ వ్యక్తి ఉన్నచోట ఏ ముస్లిం నాయకుడు ఉన్నాడో అతడు అలాంటి వ్యక్తికి శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే సహాబాలను దూషించడం ఇది చిన్నపాటి పాపం కాదు, ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది“
22 వ అధ్యాయం
తౌహీదును రక్షించుటకు, షిర్క్ వరకు చేర్చించే ప్రతి దారిని మూసి వేయుటకు ప్రవక్త చేసిన కృషి. అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
“నిశ్చయంగా మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయనకు బాధ కలిగిస్తుంది.” (తౌబా 9:128).
అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా చెప్పారు:
“మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి. నా సమాధిని పండుగ కేంద్రం (ఉర్సు, జాతరగా) చేయకండి. నా కోసం దరూద్ చదవండి. మీరు ఎక్కడా ఉన్నా మీ దరూద్ నా వరకు చేరుతుంది”. (అబూ దావూద్).
అలీ బిన్ హుసైన్ కథనం: ఒక వ్యక్తి గోడలో ఉన్న ఒక రంద్రం నుండి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి వద్దకు వచ్చి అక్కడ దుఆ చేస్తుండగా, చూసి అతనిని నివారించారు. ఇంకా ఇలా చెప్పారు. నేను నీకు ఒక హదీసు వినిపిస్తాను, అది నేను నా తండ్రి (హుసైన్ రది అల్లాహు అన్హు)తో, అతను తన తండ్రి (అలీ రది అల్లాహు అన్హు)తో, అతను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)తో విన్నాడు. ప్రవక్త చెప్పారు:
“నా సమాధిని పండుగ కేంద్రంగా (ఉర్సు, జాతర) చేయకండి. మీరు మీ ఇళ్ళను సమాధులుగా మార్చకండి (నఫిల్ నమాజులు చదవకుండా). మీరు ఎక్కడ ఉండి నాపై సలాం పంపినా అది నా వరకు చేరుతుంది”. (రవాహు ఫిల్ ముఖ్ తార్ ).
ముఖ్యాంశాలు:
1. సూరయే తౌబా ఆయతు యొక్క భావం.
2. షిర్క్ దరిదాపులకు కూడా చేరకుండా దూరముండాలని ప్రవక్త యొక్క తాకీదు.
3. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మనపై చాలా కనికరం, కారుణ్యం గలవారు. మన రుజుమార్గాన్ని అధికంగా కోరుకునేవారు.
4. ఆయన సమాధి దర్శనకు వెళ్ళుట ప్రత్యేకంగా నివారించారు. ఆయన సమాధి దర్శనం (అక్కడ ఉన్నవారికి ధర్మం పరిదిలో ఉండి చేయుట) చాలా పుణ్య కార్యం.
5. (అక్కడ నివసించే వారైనప్పటికీ) మాటికి మాటికి దర్శించుటను నివారించారు.
6. నఫిల్ నమాజులు ఇంట్లో చదవాలని ప్రోత్సహించారు.
7. స్మశానంలో నమాజ్ చదవకూడదన్పది సహాబాల (సహచరుల) వద్ద స్పష్టమయిన విషయం.
8. దరూద్, సలాం దూరంగా ఉండి పంపినా, ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వరకు చేరుతుంది. అలాంటపుడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళే అవసరం లేదు.
9. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమాధి జీవితం (బర్ జఖ్)లో ఉన్నారు. ఆయన వరకు తన అనుచర సంఘం కర్మల నుండి కేవలం దరూద్, సలాం మాత్రమే చేర్చించ బడుతాయి.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయంలో ప్రస్తావించబడిన వాక్యాలపై శ్రద్ధ చూపినవారు ఇందులో తౌహీద్ను బలపరిచే విషయాలపై ఆచరించాలని పోత్సహించబడింది. అల్లాహ్ వైపునకే మరలాలని, భయమూ మరియు ఆశతో అల్లాహ్ పై మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయన దయను కాంక్షించి, దాన్ని పొందే ప్రయత్నం చేయాలని, సృష్టి బానిసత్వ శృంఖలాలను తెంచేసి, ముక్తి పొందాలని, సృష్టిలో ఎవరి గురించి కూడా గులువ్వు (అతిశయోక్తి) చేయకూడదని, సర్వ బాహ్యాంతర కార్యాలు సంపూర్ణంగా నిర్వహించి, ప్రత్యేకంగా ఇబాదత్ కు ప్రాణమయినటువంటి చిత్తశద్ధి (ఇఖ్లాసు) ప్రతికార్యంలో ఉంచే ప్రయత్నం చేయాలని ప్రోత్సహించబడింది.
సృష్టరాసుల విషయంలో గులువ్వు (అతిశయోక్తి) అయ్యే ముష్రికులను పోలిన మాటలు, చేష్టలు చేయుట నివారించబడింది. ఇది వారిలో కలిసిపోవుటకు కూడా కారణం కావచ్చు. తౌహీద్ భద్రతకై షిర్క్ లోయలో పడవేసే మాటలు, చేష్టల నుండి కూడా నివారించబడింది. విశ్వాసులు ఏ ఉద్దేశంతో పుట్టించబడ్డారో దానిపై వారు స్థిరంగా ఉండుటకు ఇది వారిపై ఓ కరుణ, దయ. వారి సాఫల్యం కూడా అందులొనే ఉంది.
ఇది ఏకత్వపు బాటకు సత్యమైన మాట – ఇమామ్ అస్-సాదీ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. తెలుగు అనువాదం: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్). ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్
(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)
వ బిహీ నస్తయీను వస్సలాతు వస్సలాము అలా నబియ్యినా ముహమ్మదిన్ వ్వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్ మయిీన్.
ప్రశ్న : ప్రతి మనిషీ విధిగా తెలుసుకోవలసిన నాలుగు అంశాలు ఏవి?
జవాబు :
మొదటిది – ఇల్మ్ (జ్ఞానం), అంటే దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను, ఇస్లాం ధర్మాన్ని గురించి క్షుణ్ణంగా, ప్రామాణికమైన ఆధారాల ద్వారా తెలుసుకోవటం.
రెండవది. : ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం.
మూడవది : దీనిని ఇతరులకు తెలియపరచటం.
నాల్గవది : ఈ మార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను ఓపికతో సహించి నిలకడను కనబరచటం.
(కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి లోనై ఉన్నాడు.అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారు, పరస్పరం సత్యాన్ని ప్రబోధిస్తూ ఉండేవారు, సహనస్థయిర్యాలను గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉండేవారు మాత్రం నష్టంలో లేరు.) (అల్ అస్ర్ సూరా)
ప్రశ్న: ఈ సూరా గురించి ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) ఏమన్నారో తెలుసా?
జవాబు : అవును. అల్లాహ్ తన సృష్టితాల కోసం ఈ చిన్న సూరా నొక్కదానిని అవతరింపజేసినా వారి మార్గదర్శకత్వం కొరకు ఇది సరిపోయేదని ఇమామ్ షాఫయి (రహిమహుల్లాహ్) అభిప్రాయపడ్డారు.
ప్రశ్న: ముందు జ్ఞానమా లేక ఆచరణా?
జవాబు : జ్ఞానం తరువాతనే మాటలయినా,చేతలయినా. దీనికి ఆధారం ఏమిటంటే-
“కనుక ఓ ప్రవక్తా! బాగా తెలుసుకో! అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవడూ లేడని. నీవల్ల జరిగిన పొరపాట్లకు క్షమాభిక్ష వేడుకో. విశ్వాసులైన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా.” (ముహమ్మద్ 47:19)
ప్రశ్న : ప్రతి ఒక్కరూ తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించవలసిన ఆ మూడు ముఖ్యాంశాలు ఏవి?
జవాబు:: మొదటిదేమంటే; మనల్ని అల్లాహ్యే పుట్టించాడు. ఆయనే మన జీవికకోసం ఉపాధిని ప్రసాదించాడు. ఆయన మనల్ని ఇట్టే వదలిపెట్టలేదు. మనకు సన్మార్గం చూపడానికని ప్రవక్తల్ని పంపించాడు. ఎవరయితే వారు చెప్పినట్టు వింటాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరెవరయితే ధిక్కరిస్తాడో అతను నరకానికి ఆహుతి అవుతాడు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?
జవాబు : దీనికి ఆధారం ఇది : అల్లాహ్ తన గ్రంథంలో ఏమని సెలవిచ్చాడంటే-
“మేము ఫిర్ఔను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీపై సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము. (చూడండి) ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవటం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టుకున్నాము.” (అల్ ముజ్జమ్మిల్ 73: 15,16)
రెండవదేమిటంటే; ఆరాధన మరియు దాస్యం విషయంలో తనతోపాటు మరెవరికయినా భాగస్వామ్యం కల్పిస్తే, దీనిని అల్లాహ్ సుతరామూ సహించడు. ఇది షిర్క్ అవుతుంది. షిర్క్ చేసేవారు తనకెంత సన్నిహితులయినా, ఆఖరికి దైవదూతలు, దైవప్రవక్తలు ఈ పని చేసినా సరే దేవుడు క్షమించడు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?
జవాబు : దీనికి ఆధారంగా దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనాన్ని చూడండి –
“మస్జిద్లు అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్తో పాటు మరొకరిని పిలవకండి.” (జిన్ 72:18)
మూడవదేమిటంటే; దేవుని ఏకత్వాన్ని అంగీకరించి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కి విధేయుడై ఉంటానని ఒప్పుకున్న మీదట దైవం మరియు దైవప్రవక్తల విరోధులతో స్నేహం చేయరాదు. మరి ఆ దైవవిరోధులు తమకు ఆప్తులు, మిత్రులయినాసరే వారితో తెగతెంపులు చేసుకోవలసిందే.
ప్రశ్న : ఆ మేరకు ఏదైనా నిదర్శనం ఉందా?
జవాబు : ఉంది. దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు –
“అల్లాహ్ను, పరలోకాన్ని విశ్వసించేవారు, అల్లాహ్ను ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించే వారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రు లైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులయినా సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరపు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు.” (ముజాదల 58:22)
ప్రశ్న : ‘హనీఫియత్’ – లేదా ‘మిల్లతె ఇబ్రాహీం’ అంటే ఏమిటి?
జవాబు: మిల్లతె ఇబ్రాహీం అంటే చిత్తశుద్ధితో, ఏకాగ్ర చిత్తంతో ఒక్కడైన అల్లాహ్ను ఆరాధించటం. అల్లాహ్ అందరికీ దీని గురించే ఆజ్ఞాపించాడు. ఇందు నిమిత్తమే అందరినీ పుట్టించాడు.
ప్రశ్న : అలా అని ఎక్కడుందీ?
జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్ఆన్లో ఉంది :
“నేను జిన్నుల్ని, మానవుల్ని నా దాస్యం చేయడానికి మాత్రమే పుట్టించాను”.
ప్రశ్న : ‘యాబుదూని’ (నా దాస్యమే చేయాలి) అనే మాటలోని ఆంతర్యం ఏమిటీ?
జవాబు : దీని ఆంతర్యం ఏమిటంటే ప్రాణులన్నీ ఆయన ఏకత్వాన్ని అంగీకరించి ఆయన ముందరే తలవంచాలి. ఆయన చేయమన్న దానిని చేయాలి. వద్దన్న దానికి దూరంగా ఉండాలి.
ప్రశ్న : అల్లాహ్ ఆజ్ఞాపించిన వాటిలోకెల్లా పెద్ద ఆజ్ఞ ఏది?
జవాబు : తౌహీద్ ! అదే ఏకదైవారాధన.
ప్రశ్న : ‘తౌహీద్’ అంటే ఏమిటీ?
జవాబు : తౌహీద్ అంటే కేవలం ఒక్క అల్లాహ్నే పూజించాలి. ఆయన దైవత్వంలో, ఆయన గుణగణాలలో, ఆయన అధికారాలలో వేరొకరికి సహవర్తుల్ని కల్పించ కూడదు. ఆయన అద్వితీయుడనీ, దోషరహితుడనీ, రాగద్వేషాలకు అతీతుడనీ, సృష్టితాలలో ఆయనకు ఏమాత్రం పోలికలేదనీ అంగీకరించాలి. ఇదే స్వచ్భమైన తౌహీద్.
ప్రశ్న : అల్లాహ్ మనల్ని వారించిన వాటిలోకెల్లా పెద్ద వస్తువు ఏది?
జవాబు : షిర్క్.
ప్రశ్న : షిర్క్ అంటే?
జవాబు : షిర్క్ అంటే అల్లాహ్తో పాటు వేరొక దైవేతరుణ్ణి మొర పెట్టుకోవటం, దైవారాధనలో ఇంకొకరికి సాటి కల్పించటం.
ప్రశ్న: దీనికి ఉపమానం గానీ, ఆధారం గానీ ఉందా?
జవాబు : ఉంది. ఉదాహరణకు దివ్య ఖుర్ఆన్లోని ఈ క్రింది ఆయత్ని గమనించండి:
ప్రశ్న : ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?
జవాబు :
1. తమ పోషకుని (రబ్) తెలుసుకోవటం,
2. తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
3. తన ప్రవక్తయగు హజ్రత్ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.
ప్రశ్న : నీ ప్రభువు (పోషకుడు) ఎవరు?
జవాబు : నా ప్రభువు అల్లాహ్. ఆయనే నన్నూ మరియు సమస్తలోక వాసులను తన అనుగ్రహంతో పోషిస్తున్నాడు. ఆయనే నా ఆరాధ్య దైవం. ఆయన తప్ప నాకు మరో ఆరాధ్యుడు లేడు.
ప్రశ్న : దీనికి నిదర్శనం ఏమిటి?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని తొలి వాక్యమే దీనికి నిదర్శనం –
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
“ప్రశంసలు, పొగడ్త లన్నీసర్వలోకాలపాలకుడు, పోషకుడు అయిన అల్లాహ్కే శోభిస్తాయి.”(సూరా ఫాతిహా 1:1)
అల్లాహ్ తప్ప మిగిలినదంతా లోకంగా పరిగణించడుతుంది. నేను కూడా ఈ లోకంలో ఒక వ్యక్తిని.
ప్రశ్న : నీవు నీ ప్రభువును ఎలా తెలుసుకోగలిగావు?
జవాబు : నేను నా ప్రభువును ఆయన నిదర్శనాల ద్వారా తెలుసుకోగలిగాను. ఆయన సృష్టితాల ద్వారా, రేయింబవళ్ల ద్వారా, సూర్యచంద్రుల ద్వారా, భూమ్యా కాశాల ద్వారా, అందలి ప్రాణుల ద్వారా భూమ్యాకాశాలలో సంచరించే జీవుల ద్వారా తెలుసుకోగలిగాను.
“ఈ రేయింబవళ్లూ, ఈ సూర్య చంద్రులు అల్లాహ్ సూచనలలోనివే. సూర్యచంద్రులకు సాష్టాంగ పడకండి. వాటిని సృజించిన అల్లాహ్ కు సాష్టాంగ పడండి – నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.” (హామీమ్ అస్ సజ్దా 31:37)
“వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరు దినాలలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పి వేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్జి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి! సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్ అనంతమయిన శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు. (అల్ అరాఫ్ 7:54)
ప్రశ్న : ‘రబ్’ అని ఎవరిని అంటారు?
జవాబు : యజమాని, స్వామి మరియు శూన్యంలో నుంచి అస్థిత్వాన్ని తీసుకువచ్చే వానిని ‘రబ్’ అని అంటారు.అటువంటి శక్తిమంతుడే యదార్దానికి పూజనీయుడు.
ప్రశ్న : ఈ మేరకు ఏదన్నా నిదర్శనం ఉందా?
జవాబు : ఉంది. దివ్య ఖుర్ఆన్లోని ఈ వాక్యాన్ని పరిశీలించండి –
“మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీనిద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పు గాను, ఆకాశాన్ని కప్పు గానూ సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసినవాడూ ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టకండి.” (అల్ బఖర 2:21-22)
అందుచేతఈవస్తువులను ఎవరు సృష్టించాడో అతడే ఆరాధనలు,దాస్యానికి అర్హుడు.
ప్రశ్న : ‘“ఇబాదత్’ అని దేనినంటారు?
జవాబు : ఆరాధ్యుని సమక్షంలో అశక్తతతో, అణకువతో, వినమ్రతతో, ప్రేమాతి శయంతో మెలగటాన్ని “ఇబాదత్’ అని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే దాసుడు దేవుని ప్రసన్నతను చూరగొనడానికి, ఆయన్ని సంతృప్తిపరచడానికి చేసే ఇబాదత్ లేక ఆరాధన.
ప్రశ్న : అల్లాహ్ ఎన్ని రకాల ఆరాధనలు చేయమని ఆజ్ఞాపించాడు?
జవాబు : ఎన్నో రకాల ఆరాధనలు చేయమన్నాడు. వాటిలో ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, దుఆ, భయము, దైవాన్ని కలుసుకోవాలన్న కుతూహలం, కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ, దైవంపై భారం మోపటం, ఖుర్బానీ, ఉపవాసం, మొక్కుబడి లాంటివే గాకుండా ఇంకా అనేక ఆరాధనలున్నాయి. వాటిని చేయ మని అల్లాహ్ ఆదేశించాడు. మరి ఇవన్నీ అల్లాహ్కే ప్రత్యేకం అన్న సంగతిని మరువరాదు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనం గమనించండి.
“మస్జిద్లు అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకం. కనుక వాటిలో అల్లాహ్తో పాటు మరొకరిని వేడుకొనరాదు.” (సూరె జిన్-18)
ఇంకా ఇలా అనబడింది :
“నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు – మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరా ధించకండి.” (బనీ ఇస్రాయీల్ – 23)
ప్రశ్న : ఎవరయినా వీటిలో దేనిననయినా దైవేతరుల కోసం ప్రత్యేకించినట్టయితే ఏమవుతుంది?
జవాబు : ఎవరయినా వీటిలో దేనినయినా దైవేతరుల కొరకు ప్రత్యేకిస్తే వారు ముష్రిక్లు (బహు దైవోపాసకులు) అయిపోతారు.
ప్రశ్న : ఏమిటీ దీనికీ ఆధారం?
జవాబు : దీనికి ఆధారంగా అల్లాహ్ ఈవిధంగా సెలవిచ్చాడు –
“ఎవడయినా అల్లాహ్తోపాటు మరొక ఆరాధ్యుణ్జి కూడా వేడుకుంటే, దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు.అతని లెక్క అతని ప్రభువు వద్దఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొంద లేరు.” (అల్ మూమినూన్ – 117)
జవాబు : అల్లాహ్ దివ్య ఖుర్ఆన్లో ఈవిధంగా సెలవిచ్చి ఉన్నాడు –
“మీ ప్రభువు స్పష్టంగా చెప్పేశాడు : మీరు నన్ను పిలవండి. నేను మీ మొరను వింటాను మరియు ఆమోదిస్తాను. ఎవరయితే నా ఆరాధన యెడల తలబిరుసుతనం ప్రదర్శిస్తారో వారు త్వరలోనే పరాభవంపాలై నరకంలో ప్రవేశిస్తారు.” (….) ఇదిలా వుండగా “అద్దుఆవు ముఖ్ఖల్ ఇబాద” (ఈ హదీస్ జయీఫ్ ఉన్నది.) (దుఆ ఆరాధన యొక్క సారం) అని మహనీయ ముహమ్మదు (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రబోధించారు. వేరొక సహీ హదీసులో “అద్దుఆవు హువల్ ఇబాద‘ (దుఆయే అసలు ఆరాధన) అని ఉంది
ప్రశ్న : ఖౌఫ్ (భయము, భీతి) కూడా ఆరాధనే నన్నదానికి నిదర్శనం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనమే దీనికి నిదర్శనం –
“కనుక మీరు నిజమయిన విశ్వాసులే అయితే ఇక ముందు మానవులకు భయ పడకండి. నాకు భయపడండి.” (ఆలి ఇమ్రాన్ – 175)
ప్రశ్న : ‘రజా’ (దైవాన్ని కలుసుకునే కుతూహలం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని క్రింది వచనమే దీనికి నిదర్శనం –
“కనుక తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. ఆరాధనలో తన ప్రభువుతోపాటు మరెవ్వరినీ చేర్చకూడదు.” (అల్ కహఫ్ – 110)
ప్రశ్న : ‘తవక్కుల్ (దైవంపై గల నమ్మకం, దైవంపై భారం వేయటం) కూడా ఆరాధనేనన్న దానికి రుజువు ఏమిటీ?
జవాబు : దీనికి రుజువు ఇది-
1. “మీరు నిజంగానే విశ్వాసులయితే అల్లాహ్పై భారం వెయ్యండి.” (అల్ మాయిద – 23) 2. “ఎవరయితే అల్లాహ్ పై భారం వేస్తాడో అతని కొరకు ఆయన చాలు.” (తలాక్- 5)
ప్రశ్న : కఠోర పరిశ్రమ, అభ్యాసం, ఆశ, అణకువ వంటివి కూడా ఆరాధనే నన్న దానికి ఆధారం ఏమిటీ?
జవాబు : దీనికి ఆధారం ఇదే –
“వారు సత్కార్యాల కోసం ఎంతగానో ప్రయాస పడతారు. ఆశతోనూ, శ్రద్ధాభక్తుల తోనూ మమ్మల్ని ప్రార్థిస్తారు. మా సమ క్షంలో అణగిమణగి ఉంటారు.”(అంబియా – 90)
ప్రశ్న : “ఖషియత్’ (భయము, భక్తి) కూడా ఆరాధనే అనే దానికి ఆధారంఏమిటీ?
జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ క్రింది వచనం. ఇందులో అల్లాహ్ తన దాసులను ఉద్దేశ్యించి ఏమంటున్నాడో చూడండి –
“కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి.” (అల్ మాయిద – 3)
ప్రశ్న : ‘ఇనాబత్’ (మరలటం,రుజువు కావటం) కూడా ఆరాధనే అన్న దానికి నిదర్శనం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ క్రింది వచనం దీనికి నిదర్శనం –
“మీ మీదకు శిక్ష రాకముందే, మీకు ఎవరినుండీ సహాయం లభించని పరిస్థితి ఏర్పడక ముందే మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి.” (అజ్ జుమర్ – 54)
ప్రశ్న : ‘ఇస్తెఆనత్’ (సహాయం అర్థించటం) కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ ప్రార్థనే దీనికి నిదర్శనం :
“(దేవా!) మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము.” (అల్ ఫాతిహా – 4)
ఇంకా – హదీసులో ఇలా ఉంది : “నువ్వు ఏదైనా అర్థించటమే జరిగితే అల్లాహ్ను అర్ధించు.”
ప్రశ్న : ‘“ఇస్తెఆజ’ (శరణు కోరటం) కూడా ఆరాధనే ననడానికి ఆధారం ఏమిటీ?
జవాబు : ‘ఇస్తెఆజ’ కూడా ఆరాధనే అనడానికి ఆధారం ఇది :
ఇలా అను,”నేను మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్) శరణు కోరుతున్నాను.”
ప్రశ్న : ‘ఇస్తెగాస’ (ఫిర్యాదు లేక విన్నపం చేసుకోవటం) కూడా ఆరాధనే అనడానికి ఏమిటీ నిదర్శనం?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ క్రింది వచనమే దీనికి నిదర్శనం –
“ఇంకా మీరు మీ ప్రభువును నహాయం కొరకు విన్నవించుకున్న సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : “నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.” (అన్ ఫాల్ – 9)
ప్రశ్న : ఒకరి పేరుమీద జిబహ్ చేయటం (బలి ఇవ్వటం) కూడా ఆరాధనే అన్న దానికి ఏమిటి ఆధారం?
జవాబు : దేవుని ఈ ఉపదేశమే దీనికి ఆధారం :
“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు : నా నమాజ్, నా సకల ఉపాసనా రీతులు, నా జీవనం, నా మరణం-సమస్తమూ సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయన కు ఏ భాగ స్వామీ లేడు. ఈ ఆజ్ఞయే నాకు ఇవ్వ బడింది. అందరికంటే ముందు విధేయ తతో తలవంచే వాణ్జి నేనే.” (అల్ అన్ ఆమ్ – 162)
ప్రశ్న : మొక్కుకోవటం కూడా ఆరాధనేనన్నదానికి ఆధారమేమిటి?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ ఉపదేశమే దీనికి ఆధారం-
“వారు ఎలాంటి వారంటే (ప్రపంచంలో) మొక్కుబడి చెల్లించేవారు,నలువైవుల నుంచీ ఆపదలు కమ్ముకుని వచ్చే దినానికి భయపడేవారు.” (అల్ ఇన్సాన్ – 7)
ప్రశ్న : రెండవ ప్రధానాంశం ఏమిటీ?
జవాబు : ఇస్లాం ధర్మాన్ని ఆధారాలతో సహా తెలుసుకోవటం.
ప్రశ్న : ఇస్లాం అంటే ఏమిటీ?
జవాబు : ఇస్లాం అంటే స్వచ్భమైన ఏక దైవారాధనతోపాటు, బేషరతుగా అల్లాహ్కు లొంగిపోవటం, పూర్తిగా సమర్చించుకోవటం,దైవాజ్ఞాపాలన చేయటం, ఆయనకు విధేయత చూపటం, బహు దైవారాధనతో, బహు దైవారాధకులతో తెగతెంపులు చేసుకోవటం.
ప్రశ్న : ఇస్లాం ధర్మంలో గల అంతస్థులు ఎన్ని? అవి ఏవి?
జవాబు : ఈ అంతస్థులు మూడు. 1. ఇస్లాం 2. ఈమాన్ 3. ఇహ్సాన్. ప్రతి అంతస్థు లేక స్థాయిలో కొన్ని ప్రధానాంశాలు ఉన్నాయి.
1. అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేడనీ, ముహమ్మద్ – (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్తయనీ సాక్ష్యమివ్వడం.
2. నమాజ్ను నెలకొల్పటం.
3. జకాత్ అనే విధిగా చెల్లించవలసిన దానాన్ని చెల్లించటం.
4. రమజాన్ నెలలో విధిగా ఉపవాసాలుండటం.
5. (స్థోమత ఉంటే) హజ్ చేయటం.
ప్రశ్న : అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడన్న సాక్ష్యానికి నిదర్శనం ఏమిటీ?
జవాబు : దివ్య గ్రంథమైన ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :
“తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహ్యే సాక్ష్యమిచ్చాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తిమంతుడూ, ఆ మహాజ్ఞానీ తప్ప వాస్తవానికి మరొక దైవం లేడు అని నిజాయితీగానూ, న్యాయంగానూ సాక్ష్యమిస్తారు.” (ఆలి ఇమాన్ – 18)
ప్రశ్న : “లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే భావం ఏమిటీ?
జవాబు : అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు, పూజ్యుడు లేడనీ, ఆయనే నిజ దైవమనీ భావం.
ప్రశ్న : “లా ఇలాహ్” అంటే….?
జవాబు : అల్లాహ్ తప్ప ఇతర దైవాలను వదలి వేయటం, త్రోసి పుచ్చటం అని భావం.
ప్రశ్న : “ఇల్లల్లాహ్” అంటే భావం ఏమిటీ?
జవాబు : ఆరాధన, దాస్యం, పూజలకు అల్లాహ్యే తగినవాడనీ, దాస్యంలో ఆయనకు సహవర్తులు ఎవరూ లేరని ఆచరణ ద్వారా రుజువు చేయటం.
ప్రశ్న : ఈ విషయాన్ని విడమరచి చెప్పేదేమైనా ఉందా?
జవాబు : అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు-
“ఇబ్రాహీమ్ తన తండ్రికీ, తన జాతివారికీ ఇలా చెప్పిన ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, “మీరు పూజిస్తున్నవాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు.” ఇబ్రాహీమ్ ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచివెళ్లాడు, వారు దాని వైపునకు మరలేందుకు.” (అజ్ జుఖ్రుఫ్ : 26-28)
మరోచోట ఇలా సెలవిచ్చాడు
“ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథం కల ప్రజలారా! మాకూ మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి. (అది ఏమి టంటే) మనం అల్లాహ్కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు. మనలోని వారెవరూ అల్లాహ్ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది.”ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను:”మేము ముస్లింలము (కేవలం అల్లాహ్కే దాన్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్ – 64)
ప్రశ్న: ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) దైవప్రవక్త అన్నసాక్ష్యానికి ఆధారం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని ఈ దైవోపదేశమే ఇందుకు ఆధారం-
“చూడండి! మీ వద్దకు ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన స్వయంగా మీలోనివాడే. మీరు తీవ్రంగా నష్టానికి గురికావటం అనేది ఆయనకు కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్నిఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు.” (అత్ తౌబా – 128)
అల్లాహ్ ఇంకా ఈ విధంగా స్పష్టం చేశాడు –
“ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయనవెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులు గానూ ఉంటారు,పరస్పరం కరుణామయులు గానూ ఉంటారు.”(అల్ ఫతహ్ – 29)
జవాబు : దీని మతలబు ఏమిటంటే; ఆయన ఆదేశాలను పాలించాలి, ఆయన ఏ విషయం చెప్పినా దాన్ని సత్యమని ధృవీకరించాలి. ఆయన వారించిన వాటికి దూరంగా ఉండాలి. ఆయన చూపిన షరీయత్ కనుగుణంగా దైవారాధన చేయాలి.
ప్రశ్న: నమాజ్, రోజా గురించి ఏం ఆధారముంది? తౌహీద్కు గల తాత్పర్యం ఏమిటీ?
జవాబు : అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు :
“వారు అల్లాహ్కు దాస్యం చెయ్యాలని, పూర్తి ఏకాగ్రతతో తమ ధర్మాన్నిఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ను స్థాపించాలనీ, జకాత్ ఇస్తూ ఉండాలని మాత్రమే వారికి (గ్రంథ వహులకు) ఆదేశించటం జరిగింది. ఇదే సరియైన, సవ్యమైన ధర్మం (అని వారికి స్పష్టం చేయబడింది). (అల్ బయ్యిన – 5)
ప్రశ్న : “రోజా” (ఉపవాసం)కు ఆధారమేమన్నా ఉందా?
జవాబు : ఉంది. దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనం చదవండి :
“విశ్వసించిన ఓ ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది -ఏ విధం గా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (అల్ బఖర : 183)
ప్రశ్న : హజ్ చేయాలి అన్న దానికి ఆధారం ఏమిటీ?
జవాబు : దివ్య ఖుర్ఆన్లో హజ్ గురించి ఇలా సెలవీయబడింది : “ప్రజలపై అల్లాహ్కు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించడానికి తిరస్కరించేవాడు, అల్లాహ్కు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసు కోవాలి.” (ఆలి ఇమ్రాన్ – 97)
ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క రెండవ అంతస్థు ఏది?
జవాబు : ఈమాన్ (విశ్వాసం).
ప్రశ్న: ఈమాన్ శాఖలు (విభాగాలు) ఎన్ని?
జవాబు : ఈమాన్ శాఖలు డెబ్బయికి పైగా ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా ఉన్నతమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్. అన్నిటికన్నా తక్కువ స్థాయిగల శాఖ “దారిలో పడి ఉన్న బాధాకరమైన వస్తువులను తొలగించటం.” లజ్జ మరియు వ్రీడ కూడా ఈమాన్లో అంతర్భాగమే.
ప్రశ్న : ఈమాన్లోని ప్రధానాంశాలు ఎన్ని? అవి ఏవి?
జవాబు : ఈమాన్లోని ప్రధానాంశాలు ఆరు. అవి
1. అల్లాహ్పై విశ్వాసం
2. దైవదూతలపై విశ్వాసం
3. దైవం తరఫున అవతరింపజేయబడిన గ్రంథాలపై విశ్వాసం
4. దైవప్రవక్తలపై విశ్వాసం
5. అంతిమ దినంపై విశ్వాసం
6. మంచి జరిగినా, చెడు జరిగినా-అంతా దైవం తరఫుననే జరుగుతుంది అనే దాని (విధి వ్రాత)పై విశ్వాసం.
ప్రశ్న : ఏమిటీ దీనికి ఆధారం?
జవాబు : ఆధారం కావాలంటే దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనాన్ని చదవండి. “సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో, పడమరకో త్రిప్పటం కాదు, సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ను, అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీఆయన ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించటం.” (అల్ బఖర : 127)
ప్రశ్న : ‘విధి’ (తక్దీర్) అనే దానికి ఆధారం ఏమిటీ?
జవాబు : దీనికి ఆధారం దివ్య గ్రంథంలోని ఈ వచనం –
“మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయం తోపాటు సృష్టించాము.” (అల్ ఖమర్ – 49)
ప్రశ్న : ఇస్లాం ధర్మం యొక్క మూడవ అంతస్థు ఏది?
జవాబు : ఇస్లాం మూడవ అంతస్థు ‘ఇహ్సాన్.”
ప్రశ్న : “ఇహ్సాన్’ అంటే అసలేమిటీ?
జవాబు : మీరు అల్లాహ్ను చూస్తున్నామన్న భావనతో ఆరాధన చేయండి. లేకుంటే, ఆయన మిమ్మల్నిచూస్తున్నాడన్న తలంపుతోనయినా ఆరాధన చేయండి. అంటే ఏ ఆరాధననైనా ఉత్తమ రీతిలో నిర్వర్తించటమే అసలు ఇహ్సాన్ అన్నమాట.
ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని క్రింది ఆయతే దీనికి ఆధారం.
“భయభక్తులతో పనిచేస్తూ, ఉదాత్త వైఖరి కలిగి ఉండే వారితో అల్లాహ్ ఉంటాడు.” (అన్ నహ్ల్ -128)
మరో చోట అల్లాహ్ ఈ విధంగా ప్రబోధించాడు –
“మహా శక్తిమంతుడైన ఆ అనంతకరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను, (నీవు) లేచినవుడు చూస్తాడు, సజ్దా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసిన వాడు.”(అష్ షుఅరా: 217-220)
వేరొక చోట ఇలా సెలవీయబడింది-
“ప్రవక్తా! నీవు ఏ స్థితిలో ఉన్నాఖురాను నుండి దేనిని వినిపించినా, మానవులారా! మీరుఏది చేసినా ఆ అన్ని సందర్భాలలోనూ మేము మిమ్మల్నిచూస్తూనే ఉంటాము” (యూనుస్-61)
ప్రశ్న: ఇస్లాం ధర్మానికి చెందిన ఈ మూడు మెట్లకు (ఇస్లాం, ఈమాన్ ఇహ్సాన్)కి సంబంధించి హదీసు లేక సున్నతులో కూడా ఏమైనా ఆధారముందా?
జవాబు : ఉంది. హదీసె జిబ్రయీల్గా ఖ్యాతి చెందిన ఆ హదీసును హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి అల్లాహు అన్హు) ఈ విధంగా తెలిపారు-
“మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమక్షంలో కూర్చుని ఉన్నాము. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని దుస్తులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. జుట్టు నల్లగా ఉంది. మరి అతనిలో ప్రయాణ బడలిక కూడా కనిపించలేదు. మాలో ఎవరూ అతన్ని ఎరుగరు. ఆ వ్యక్తి దైవవ్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ఎదుటకూర్చున్నాడు.తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి మరీ కూర్చున్నాడు. తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి, ‘ఓ ముహమ్మద్! నాకు ఇస్లాం గురించి తెలియజేయండి’ అని అన్నాడు. “నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్య దైవం లేడని సాక్ష్యమివ్వాలి.ముహమ్మద్ అల్లాహ్ సందేశహరుడని కూడా నీవు సాక్ష్యమివ్వాలి.నమాజ్ను స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి.రమజాన్ నెలలో ఉపవాసాలుండాలి. స్థోమత ఉంటే దైవ గృహాన్ని సందర్శించి హజ్ చేయాలి’ అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) వివరించారు.’తమరు చెప్పింది నిజం’ అన్నాడా వ్యక్తి.మాకు ఆశ్చర్యం కలిగించింది అతని ప్రవర్తన. ప్రశ్నించేవాడూ అతనే, సమాధానాన్ని సత్యమని ధృవీకరించేవాడూ అతనే. “నాకు ఈమాన్ గురించి వివరించండి’ అని తిరిగి ప్రశ్నించాడా పృచ్చకుడు. దానికాయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “నీవు అల్లాహ్ను,ఆయన దూతలను, ఆయన (గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని, మంచి జరిగినా చెడు జరిగినా అంతా దైవం తరఫుననే జరుగుతుందన్న విధివ్రాతను విశ్వసించు.ఇదే ఈమాన్’ అని వివరించారు. “నాకు ఇహ్సాన్ గురించి చెప్పండి’ అని మళ్లీ ప్రశ్నించాడా అపరిచితుడు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా విడమరచి చెప్పారు: “నీవు అల్లాహ్ను చూస్తున్నానన్న (అల్లాహ్ ఎదుట ఉన్నాడన్న) భావంతో ఆయన్ని ఆరాధించు.ఒకవేళ నీవు ఆయన్ని చూడ లేకపోయినా, ఆయన నిన్ను చూస్తున్నాడన్న తలంపు నీలో ఉండాలి.” “నాకు ప్రళయదినం గురించి చెప్పండి” అని అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. ‘దాని గురించి ప్రశ్నించబడే వానికి ప్రశ్నించేవానికన్నా ఎక్కువేమీ తెలీదు” అన్నారాయన (సల్లలాహు అలైహి వ సల్లం) . “పోనీ నాకు దాని సూచనలయినా తెలుపగలరా?!’ అని ఇంకో ప్రశ్న వేశాడు అతను. దానికాయన ఇలా చెప్పారు: “దాసీ (బానిసరాలు, పని మనిషి తన యజమానురాలికి జన్మనిస్తుంది. కాళ్లకు చెప్పులు, శరీరంపై చొక్కా లేకుండానే గొర్రెల్ని కాచే గొర్రెల కాపరులు బ్రహ్మాండమైన కట్టడాలు కట్టడం నీవు చూస్తావు. మరి ఆ వ్యక్తి అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. మేము కాస్సేపు మౌనం వహించాము. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఓ ఉమర్! ప్రశ్నలు వేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా?!’అని అడిగారు. ‘దైవానికి, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే తెలిసి ఉండాలి అని మేము విన్నవించుకున్నాము. “ఆయన జిబ్రయీల్. మీకుమీ ధర్మాన్ని బోధించే నిమిత్తం ఆయన మీ వద్దకు విచ్చేశారు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు. (సహీహ్ ముస్లిం)
ప్రశ్న : మూడవ ముఖ్యాంశం ఏమిటి?
జవాబు : మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి గురించి. ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైషులు అరబ్బులు. మరి ఈ అరబ్బులు దైవప్రవక్తలయిన హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం)ల సంతతికి చెందిన వారు.
ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వయస్సు గురించి చెబుతారా?
జవాబు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) 63 సంవత్సరాలు జీవించి ఉన్నారు.40 ఏళ్ల వయస్సులో దైవప్రవక్తగా నియుక్తులయ్యారు. దైవప్రవక్తగా 23 సంవత్సరాలు మానవ జాతికి మార్గదర్శకత్వం వహించారు. సూరె ‘ఇఖ్రా’తో దైవదౌత్య శుభవార్త అందింది. సూరె ‘ముద్దస్సిర్’ అందిన క్షణం నుంచి సందేశకార్యానికి నడుం బిగించారు.ఆయన మక్కాలో జన్మించారు. మక్కా నుండి మదీనాకు ప్రస్థానం (హిజ్రత్) చేశారు. మదీనాలోనే ప్రభువు వద్దకు మహా ప్రస్థానం చేశారు.
ప్రశ్న : అల్లాహ్ ఆయన్ని దేని కొరకు పంపాడు?
జవాబు : మానవ జాతిని షిర్క్ (బహు దైవారాధన) నుండి రక్షించడానికి, ఏకేశ్వరోపాసనని బోధించడానికి అల్లాహ్ ఆయన్ని పంపాడు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : దివ్య ఖుర్ఆన్లోని క్రింది వచనాలు దీనికి స్పష్టమైన ఆధారాలు. “వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ! లే; లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, అశుద్ధతకు దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు.నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.” (అల్ ముద్దస్సిర్ : 1- 7)
ప్రశ్న : “లే,లేచిహెచ్చరించు” అన్న మాటల్లోని అంతరార్థం ఏమిటి?
జవాబు : దీని అంతరార్థం ప్రజలకు షిర్క్ గురించి హెచ్చరించమనీ,తౌహీద్ను ఉపదేశించమనీను.
జవాబు : తౌహీద్ (ఏకేశ్వరోపాసన) ని స్వీకరించటం ద్వారా ప్రభువు గొప్పతనాన్ని అంగీకరించమనీ, ఆచరణలను షిర్క్ అనే మలినం నుండి కాపాడుకోమనీ భావం.
ప్రశ్న :“అశుద్ధతకు దూరంగా ఉండు” అనడంలోని ఔచిత్యం ఏమిటి?
జవాబు : విగ్రహాలను, విగ్రవారాధకులను విడిచిపెట్టేయమనీ, వాటితో తెగత్రెంపులు చేసుకోమనీ భావం.
ప్రశ్న : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ విధంగా మలినమైన వాతావరణానికి దూరంగా ఎంత కాలం ఉన్నారు?
జవాబు : పదినంవత్సరాలు. ఆతరువాత మేరాజ్ యాత్ర ప్రాప్తించింది. ఆ సందర్భంగా ఐదు నమాజులు వొసగబడ్డాయి. నమాజు ద్వారా దైవ సహాయాన్ని అర్థించాలన్నది దీని అభిమతం.ఆ తరువాత ఆయన మదీనాకు వలసపోయారు (హిజ్రత్ చేశారు).
ప్రశ్న : హిజ్రత్ అంటే ఏమిటి?
జవాబు : హిజ్రత్ అంటే ప్రస్థానం చేయటం, ఒక చోటి నుండి మరో చోటికి వలసపోవటం! షిర్క్ వాతావరణం నుండి ఏకేశ్వరోపాసనా వాతావరణం వైపునకు, చెడులకు నిలయమైన చోటు నుండి స్వచ్చమయిన భావాల పరివ్యాప్తికి అనువైన చోటుకు, చెడు వ్యవస్థ నుండి సత్య ప్రధానమైన వ్యవస్థ వైపునకు తరలి వెళ్లటమే హిజ్రత్!
ప్రశ్న : హిజ్రత్ ఆజ్ఞ ఎప్పటికీ ఉంటుందా?
జవాబు : ఉంటుంది. షిర్క్, బిద్అత్ల కాలుష్యం నుండి తౌహీద్ మరియు సున్నత్ల పరిశుద్ధత వైపునకు, చెడు భావాల నుండి సవ్యమైన భావాల వైపునకు, చెడు సహచర్యం నుండి సద్వర్తనుల సహచర్యం వైపునకు తరలిపోవాలన్న ఆజ్ఞ అంతిమ దినం వరకూ ఉంటుంది సుమా!
ప్రశ్న : ఈ వాదనకు ఏదైనా ఆధారం ఉందా?
జవాబు : ఉంది దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయండి-
“తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని,’ఇదేమిటీ మీ స్థితి ఇలా ఉంది?’అని అడిగారు.అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు; “మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము.”అల్లాహ్ భూమి విశాలముగా లేదా మీరు వలస పోవటానికి?’అని దైవదూతలు అడిగారు. వారి నివాసం నరకం. అది మహాచెడ్డ నివాసం.అయితే నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి ఏ మార్గమూ, ఏసాధన సంపత్తీ లేని పురుషులనూ, స్రీలనూ పిల్లలనూ అల్లాహ్ క్షమించవచ్చు.(ఎందుకంటే) అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా మన్నించేవాడూను.” (అన్ నిసా- 97, 98)
ఇంకా ఇలా అనబడింది:
“విశ్వసించిన నా దాసులారా! నా భూమి విశాలమైనది, కనుక మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.” (అన్కబూత్ – 56)
ప్రశ్న : పై రెండు వచనాల అవతరణ యొక్క పూర్వ రంగం ఏమిటి?
జవాబు : మొదటి ఆయతు అవతరణా సందర్భం : మక్కాకు చెందిన కొంత మంది ఇస్లాం స్వీకరించారు. కాని వారు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తో పాటు హిజ్రత్ చేయలేక మక్కాలోనే ఉండి పోయారు. అటువంటి వారిలో కొంత మంది తమ విశ్వాసంపై నిలకడ కలిగి ఉండలేక, కాలం వేసే కళ్ళెంలో ఇరుక్కుని, పరిస్థితుల ఇంద్రజాలానికి మోసపోయారు. ఆఖరికి వారు బద్ర్ సంగ్రామంలో ముష్రిక్కుల పక్షాన నిలిచారు.అందుచేత అల్లాహ్ వారి వినతిని తోసిపుచ్చాడు. వారు ఒడిగట్టిన స్వామి ద్రోహానికి ప్రతిఫలంగా వారి కొరకు నరకాన్ని వొసగాడు. రెండవ వచనానికి పూర్వ రంగం ఏమంటే; మక్కాలో కొంతమంది ముస్లిములు హిజ్రత్ చేయలేక ఉండిపోయారు.అప్పుడు అల్లాహ్ వారి విశ్వాసాన్ని (ఈమాన్) వారికిజ్ఞాపకం చేసి హిజ్రత్ (ప్రస్థానం) వైపునకు పురికొల్పాడు.
ప్రశ్న : ‘హిజ్రత్’ ఒక శాశ్విత ప్రాతిపదిక గల ఆజ్ఞ అనడానికి హదీసులో ఆధారం ఏదన్నా ఉందా?
జవాబు : ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉపదేశించారు:
“పశ్చాత్తాపం (ద్వారం)మూసుకునే దాకా హిజ్రత్ (ద్వారం) మూసుకొనదు.సూర్యుడు తను అస్తమించే చోటున ఉదయించే దాకా పశ్చాత్తాపం (ద్వారం కూడా) మూసుకొనదు సుమా!”
ప్రశ్నః మదీనా మునవ్వరాలో స్థిరపడిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారు ఇచ్చిన ఆదేశాలు ఏవి?
జవాబు : మదీనాలో స్థిరపడగానే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇస్లాం యొక్క మిగిలిన ఆదేశాలను-అంటే; జకాత్, రోజా, హజ్, అజాన్ మరియు జిహాద్ తదితర ఆదేశాల ను జారీ చేశారు.
ప్రశ్న: ఈ విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎంతకాలం మదీనాలో ప్రజల జీవితాలను తీర్చిదిద్దారు?
జవాబు : 10 సంవత్సరాలు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పరమపదించారు. కాని ఆయన నెలకొల్పిన ధర్మం మాత్రం యథాతథంగా ఉంది. ఆయన మనకు అందజేయని శుభం లేదు. అన్ని రకాల హానికరమయిన వాటి నుండి ఆయన తన అనుచర సమాజాన్ని జాగరూకపరచి వాటికి దూరంగా ఉండాలని హెచ్చ రించారు.
ప్రశ్న : ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మనకు తెలియజేసిన శుభం ఏది?ఆయన ఏ కీడు గురించి హెచ్చరించారు?
జవాబు : ఆయన మనకు తౌహీద్ (దేవుని ఏకత్వం) గురించి నొక్కి చెప్పారు. దైవానికి సమ్మతమయిన, ఇష్టకరమయిన వన్తువులేవో స్పష్టం చేశారు. ఇదంతా మన పాలిట మేలుగా, శుభంగా పేర్కొనబడుతుంది.
ఇకపోతే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) , షిర్క్ (బహు దైవారాధన) గురించి గట్టిగా హెచ్చరించారు. దైవానికి సమ్మతం కాని, హానికరమయిన వస్తువులు ఏవేవో సూచించి వాటి యెడల మనందరినీ అప్రమత్తం చేశారు.
ప్రశ్న: అల్లాహ్ ఆయన్ని ఏదైనా ప్రత్యేక వర్గానికో, తెగకో ప్రవక్తగా చేసి పంపాడా?
జవాబు : అల్లాహ్ ఆయన్ని సమస్త మానవాళి కోసం ప్రవక్తగా చేసి పంపాడు. జిన్నులు మానవులంతా ఆయనకు విధేయత చూపటం తప్పనిసరి గావించాడు.
ప్రశ్న: దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : దివ్యఖుర్ఆన్లోని ఈ ఆయత్ దీనికి ఆధారం-
(ఓ ముహమ్మద్!) ఇలా ప్రకటించు: నేను మీఅందరి వైపునకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి.” (అల్ బఖర : 158)
ఇంకా ఇలా అనబడింది –
“ఆ సంఘటన కూడా ప్రస్తావించదగినదే. అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖుర్ఆన్ వినేందుకు నీ వద్దకు తీసుకు వచ్చాము.” (అల్ అహ్ఖాఫ్ – 29)
ప్రశ్న : అల్లాహ్ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా ధర్మాన్ని పరిపూర్ణం గావించాడా? లేక ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మాన్ని పూర్తి చేశాడా?
జవాబు : అల్లాహ్ ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ద్వారా-ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) బ్రతికి ఉండగానే-ధర్మాన్ని పరిపూర్ణం గావించాడు. ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) తదనంతరం ధర్మంలో ఎలాంటి వస్తువునూ చేర్చవలసిన అవసరం లేదు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏదన్నా ఉందా?
జవాబు : ఉంది. దివ్య ఖుర్ఆన్లోని ఈ ఆయత్ను చూడండి:
“ఈ రోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం గావించాను.ఇక దీనితో నా వరాలను కూడా పూర్తి చేశాను.ఇంకా ఇస్లాంను మీ జీవనధర్మంగా సమ్మతించాను.” (అల్ మాయిద – 3)
ప్రశ్న: ఆయన మరణించారనడానికి ఆధారం ఏమిటి?
జవాబు : ఆయన మరణం సత్యమనడానికి దివ్యఖుర్ఆన్లోని ఈవచనమే నిదర్శనం.
“(ఓ ప్రవక్తా!) నీవూ మరణిస్తావు. వారూ మరణిస్తారు.చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ మీ వ్యాజ్యాలను వినిపిస్తారు.”(అజ్ జుమర్ – 30)
ప్రశ్న : మరణించిన పిదప ప్రజలు మళ్లీ బ్రతికించబడతారా?
జవాబు : అవును. బ్రతికించబడతారు. దివ్యఖుర్ఆన్లోని ఈ ఆయత్ని చూడండి. “ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టిం చాము, దాని లోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము. దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము.” (తాహా-55)
ఇంకా ఈ విధంగా సెలవీయబడింది.
“అల్లాహ్ మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు. తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు. మళ్లీ దానినుండే ఎకాఎకీ మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు.” (నూహ్ – 17)
ప్రశ్న : తిరిగి బ్రతికించబడిన తరువాత ప్రజల లెక్క తీసుకోబడుతుందా? వారికి శిక్షాబహుమానాలు లభిస్తాయా?
జవాబు : అవును.ప్రజల లెక్క తేల్చబడుతుంది.వారి కర్మలను బట్టి శిక్ష విధించటమో, బహుమానం ఒసగటమో జరుగుతుంది.దీనికి ఆధారం ఇది: “చెడు చేసే వారికి, అల్లాహ్ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు (అల్లాహ్ ఉన్నాడు)”. (అన్ నజ్మ్ -31)
ప్రశ్న : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వ్యక్తి గురించి ఏమనబడింది?
జవాబు : మరణానంతర జీవితాన్ని త్రోసిపుచ్చిన వాడు అవిశ్వాసి (కాఫిర్) అని అనబడింది. దీనికి ఆధారం దివ్య ఖుర్ఆన్లోని ఈ వచనం –
“త్రాము మరణించిన తరువాత మళ్లీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరుగదు అని అవిశ్వాసులు పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను: ‘కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత, మీరు (ప్రపంచంలో) ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియ జేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్కు చాలా సులభం.” (అత్ తగాబున్ -7)
ప్రశ్న: అల్లాహ్ తన ప్రవక్తలకు ఏమని ఉపదేశించి పంపాడు?
జవాబు : దేవునిఏకత్వాన్ని (తౌహీద్ను) అవలంబించేవారికి స్వర్గలోకపు శుభవార్తనివ్వమనీ, బహు దైవోపాసన (షిర్క్)కు ఒడిగట్టే వారిని నరక యాతన గురించి హెచ్చరించమనీ అల్లాహ్ తన ప్రవక్తలకు ఉపదేశించి పంపాడు.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు –
“ఈ ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపే వారుగా, హెచ్చరిక చేసేవారుగా పంప బడ్డారు-వారి ఆవిర్భావం తరువాత అల్లాహ్కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ సాకూ మిగల కూడదని.” (అన్ నిసా – 163)
ప్రశ్న : ప్రప్రథమ ప్రవక్త ఎవరు?
జవాబు : హజ్రత్ నూహ్ అలైహిస్సలాం.
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : ఖుర్ఆన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు :
“(ప్రవక్తా!) నూహ్ వైవునకు, ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లుగా మేము నీ వైపునకు వహీ (దైవవాణి) ని పంపాము.” (అన్ నిసా -163)
ప్రశ్న : దైవప్రవక్త పంపబడని జాతి ఏదైనా ఉందా?
జవాబు : లేదు. అన్ని జాతుల వద్దకు దేవుని తరఫున ప్రవక్తలు పంపబడ్డారు. దీనికి ఆధారంగా దివ్య ఖుర్ఆన్లోని ఈ ఆయత్ను గమనించండి:
“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: “అల్లాహ్ను ఆరాధించండి. మిథ్యా దైవాల (తాగూత్) ఆరాధ నకు దూరంగా ఉండండి.” (అన్ నహ్ల్ – 36)
ప్రశ్న : ‘తాగూత్’ అంటే అసలేమిటి?
జవాబు : ఆరాధన విషయంలో దాసుడు హద్దు మీరి పోవటమే ‘తాగూత్. తాగూత్ అనేది ఆరాధించే వానికీ, ఆరాధించబడే వానికీ వర్తిస్తుంది.తాగూత్ ఒక మిథ్య. ఒక పైశాచిక మార్గం.
ప్రశ్న : తాగూత్ లు ఎన్ని రకాలు?
జవాబు : అనేక రకాలు.అయికతే వాటిలో ఐదు రకాలు ముఖ్యమైనవి.
1) దైవ ధూత్కారి అయిన ఇబ్లీస్
2) అల్లాహ్ మినహా-ప్రజల చేత కొలవబడే వ్యక్తి
3) తనను పూజించమని ప్రజలను కోరే వ్యక్తి.
4) తనకు అగోచర జ్ఞానం ఉందని ప్రగల్భాలు పలికే వాడు.
5) దైవం తరపున అవతరింపజేయబడిన షరీఅత్కు విరుద్ధంగా తీర్పులు చేసేవాడు (ఇటువంటి మిథ్యా దేముళ్ళను తిరస్కరించాలనీ, వారికి దూరంగా ఉండాలనీ, దైవ విధేయులుగా జీవించాలనీ అల్లాహ్ మనకు ఆజ్ఞాపించాడు).
ప్రశ్న : దీనికి ఆధారం ఏమిటి?
జవాబు : దివ్యఖుర్ఆన్లోని ఈ వచనమే దీనికి ఆధారం-
“ధర్మం విషయంలో నిర్బంధం గానీ, బలాత్కారం గానీ లేదు. సత్యవాక్కు అసత్య వాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడింది.ఇక నుండి’తాగూత్’ను తిరస్కరించి, అల్లాహ్ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. (అతడు ఆశ్రయించిన) అల్లాహ్ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు.” (అల్ బఖరా – 256)
వేరొక చోట ఇలా సెలవిచ్చాడు :
“మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరికచేశాము : “అల్లాహ్ను ఆరాధించండి. తాగూత్ (మిథ్యాదైవాల) ఆరాధన కు దూరంగా ఉండండి.” (అన్ నహ్ల్ -36)
ఇంకొక చోట ఇలా చెప్పబడింది.
ఓ ప్రవక్తా! ఇలా చెప్పు : “గ్రంథ ప్రజలారా! మాకూ-మీకూ మధ్య సమానమైన ఒక విషయం వైపునకు రండి (అదేమిటంటే) మనం అల్లాహ్కు తప్ప మరెవరికీ దాస్యం చెయ్యరాదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టరాదు.మనలోని వారెవరూ అల్లాహ్ను తప్ప మరెవరినీ తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది”.ఈ సందేశాన్ని స్వీకరించటానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలా అను: “మేము ముస్లిములలో (కేవలం అల్లాహ్కే దాస్యం చేసేవారు, విధేయత చూపేవారు) అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి.” (ఆలి ఇమ్రాన్ – 64)
ఇదీ అసలు”లా ఇలాహ ఇల్లల్లాహ్” విసృత భావం హదీసులో ఇలా వుంది : “అసలు విషయం ఇస్లాం. దాని స్తంభం నమాజ్.దాని ఉన్నత సోపానం దైవ మార్గంలో పోరాటం.”
9 వ అధ్యాయం చెట్లు , రాళ్ళతో శుభం (తబర్రుక్ ) కోరుట అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ ఆదేశం: “ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్ల వాస్తవికతను గురించి కాస్తయినా ఆలోచించారా?”(సూరా నజ్మ్ 53:19,20).
అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) కథనం: మేము ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) తో కలసి హునైన్ యుద్దానికి వెళ్ళాము. అప్పుడే మేము కొత్తగా ఇస్లాం స్వీకరించి యుంటిమి. (దారి మధ్యలో ఒక చోట) ముష్రిక్కుల ఒక ‘రేగు చెట్టు’ ఉండింది. అక్కడ వారు శుభం (తబర్రుక్) కలగాలని కూర్చుండేవారు, తమ ఆయుధాలను దానికి తగిలించేవారు. దానిని “జాతు అన్వాత్”” అనేవారు. ఆ రేగుచెట్టు దగ్గరి నుండి మేము వెళ్తూ “మాకు కూడా అలాంటి ఒక “జాతు అన్వాత్ ” నిర్ణయించండి ప్రవక్తా’ అని అన్నాము.
అప్పుడు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) అన్నారు: “అల్లాహు అక్బర్! ఇవే (గత జాతులు పాటించిన) పద్దతులు, మార్గాలు. నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్ష్యం! బనీ ఇస్రాయీల్ “తమ ప్రవక్త మూసా (అలైహిస్సలాం) తో అన్న తీరే మీరన్నారు. “వాళ్ళ దేవుళ్ళ వంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసి పెట్టు” (అని వారన్నప్పుడు), మూసా (అలైహిస్సలాం) ఇలా అన్నారు: “మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు”. (ఆరాఫ్ 7:138). తప్పకుండా మీకంటే ముందు గడిచిపోయినవారి మార్గాలను మీరు కూడా అనుసరిస్తారు”అని ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) హెచ్చరించారు.
(తిర్మిజీ ). సహీ అని నిరూపించబడిన హదీసు.
ముఖ్యాంశాలు
1. సూరె నజ్మ్ లోని ఆయత్ యొక్క వ్యాఖ్యానం తెలిసింది. (అదే మనగా: ఆ దేవతలు వారికి లాభనష్టాలు చేకూర్చేవి అని ముష్రికులు భావించేవారు. అందుకే వారితో మొరపెట్టుకునేవారు. అక్కడ జంతువులను బలిచ్చేవారు. వారి సాన్నిధ్యం కోరేవారు).
3. సహాబాలు (సహచరులు) కేవలం తమ కోరికను వెల్లడించారు తప్ప, దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురాలేదు.
4. కోరిక ఉద్దేశం కూడా అల్లాహ్ సాన్నిధ్యం పొందడానికే ఉండేది. ఎందుకనగా: అల్లాహ్ దానిని ప్రేమిస్తాడని వారనుకున్నారు.
5. ఇది షిర్క్కు సంబంధించినదని సహాబాలకు తెలియనప్పుడు ఇతరులకు తెలియకపోవడం సంభవం. (కాని తెలిసిన వెంటనే విడనాడడం కూడా తప్పనిసరి).
6. ప్రవక్త సహాబాలు (సహచరులు), తమ సత్కార్యాలకు బదులుగా పొందిన వాగ్దానం, క్షమాపణ శుభవార్త లాంటివి అంత సులభంగా ఇతరులు పొందలేరు.
7. వారికి తెలియదు కదా అని ప్రవక్త ఊరుకోలేదు. “అల్లాహు అక్బర్! ఇవే మార్గాలు. మీకంటే ముందు గతించిన వారి మార్గాలను మీరు అనుసరిస్తారు” అని మూడు సార్లు హెచ్చరించి, అలాంటి కోరికలు చెడు అని స్పష్టం చేసారు.
8. మరో ముఖ్య విషయం ప్రవక్త తమ సహచరులతో ఇలా అనడం: మీ ప్రశ్న, కోరిక బనీ ఇస్రాయీల్, మూసాతో ప్రశ్నించి, కోరినటువంటిదే. వారు: “వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు” అని కోరారు.
9. ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) వారిని నివారించడం “లాఇలాహ ఇల్లల్లాహ్” యొక్క భావంలోనే వస్తుంది. ఇది చాలా సూక్ష్మమైనది. అందుకే సహచరులు కూడా అది “లాఇలాహ ఇల్లల్లాహ్” భావానికి విరుద్ధమైనదని ముందు గమనించలేక పోయారు.
10. ఇచ్చట కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం), అల్లాహ్ ప్రమాణం చేసి చెప్పారు. (మాటి మాటికి ప్రమాణం చేయటం ఆయన అలవాటు కాదు. కాని విషయం చాలా గంభీరమైనది గనుక ప్రమాణం చేసి చెప్పారు).
11. తమ కోరికను వెల్లడించినందుకు వారు మతభ్రష్టులు కాలేదు. దీనీతో తెలిసిందేమిటంటే షిర్క్ చిన్నదీ (కనబడనిది) ఉంటుంది, పెద్దదీ (కనబడునది) ఉంటుంది.
12 “మేము కొత్తగా ఇస్లాం స్వీకరించియుంటిమి” అన్న వారి మాటతో ఇతర సహచరులు దినిని షిర్క్గా భావించేవారు అని తెలుస్తుంది.
13. ఆశ్చర్యం కలిగినప్పుడు “అల్లాహు అక్బర్” అనవచ్చు అని తెలిసింది. ఇలా అనకూడదు అని అనేవారి మాట ప్రవక్త మాటకు విరుద్ధం అని స్పష్టమయింది.
14. (షిర్క్ మరియు బిద్ అత్ )కు చేర్పించే సాధనాలన్నిటినీ రద్దు చేయాలని తెలిసింది.
15. జాహిలియ్యత్ (అజ్ఞానకాలం) నాటి పోలికను అవలంబించుట నుండి నివారించబడింది.
16. విద్య నేర్పుతున్నప్పుడు అవసర సందర్భంగా ఆగ్రహించవచ్చును.
17. “ఇవే సాంప్రదాయాలు” అని ప్రవక్త (సల్లలాహు అలైహి వసల్లం) ఒక నియమం తెలిపారు.
18. ప్రవక్త మహత్యాల్లో ఒకటి ఆయన భవిష్యసూచన ఇచ్చినట్టు సంభవించింది.
19. ఖుర్ఆన్లో యూదుల, క్రైస్తవుల ఏ విషయాల్ని చెడుగా ప్రస్తావించి వారిన హెచ్చరించబడిందో, అలాంటి పనుల నుండి మనము దూరముండాంలని మనకు కూడా హెచ్చరిక ఉంది.
20. పండితుల వద్ద ఉన్న ఒక నియమం వాస్తవమైనది. అది: ఆరాధనల (ఇబాదత్ల) పునాది ఆజ్ఞ (హుకుం) పై ఉంది. (మన ఇష్టానుసారం ఇబాదత్ చేయరాదు).
21. గ్రంథమవ్వబడిన వారి సాంప్రదాయాలు, అలవాట్లు ఎలా చెడ్డవో ముష్రికులవి కూడా అలాగే చెడ్డవి.
22. ఎవరైతే అధర్మం నుండి ధర్మంలో అడుగుపెడుతాలో వారిలో కొన్ని పాత అలవాట్లు ఉంటాయి అని తెలిసింది. అబూ వాఖిద్ లైసీ (రది అల్లాహు అన్హు) అదే చెప్పింది. “మేము కొత్తగా ఇస్తాం స్వీకరించియుంటిమి”.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
‘చెట్లతో, రాళ్ళతో శుభం కోరుట ముష్రిక్కుల పని. ‘చెట్లతో, రాళ్ళతో, సమాధులతో ఇంకేదానితోనైనా శుభం కోరుట ధర్మసమ్మతం కాదని పండితులు ఏకీభవించారు. ఇది “గులువ్వు” (అతిశయోక్తి). ఎవరితో, ఏ దానితో తబర్రుక్ కోరబడుతుంటో, వారి ఆరాధన, వారితో దుఆ (ప్రార్ధన) చేయడం లాంటి పనులకు ఇది గురి చేస్తుంది. అల్లాహ్ యేతరుల ఆరాధన, వారితో దుఆ షిర్క్ అక్బర్ (పెద్ద షిర్క్) అన్న విషయం తెలిసిందే. చివరికి ముఖామె ఇబ్రాహీం, ప్రవక్త యొక్క గృహం, బైతుల్ మఖ్డిస్, అక్కడ ఉన్న “సఖ్ర్” మొదలగు వాటితో తబర్రుక్ కోరుట కూడా తప్పు.
కాబతుల్లా లోని హజర్ అస్వద్ (నల్ల రాయి)ను ముట్టుకొనుట, చుంబించుట మరియు రుక్నె యమానిని ముట్టుకొనుట మొదలైనవి అల్లాహ్ కు విధేయత చూపుట. ఆయన ఔన్నత్యాల ముందు వినయ వినమ్రతతో మెలుగుటయే ఇబాదత్ యొక్క సారాంశము. దీనికున్న ఆదేశం ఇతర వాటికి లేదు.
ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం, దాని అనివార్యత మరియు దాని రాకకు ముందు అల్లాహ్ తన కారుణ్యంతో పంపిన సూచనల గురించి వివరించబడింది. ఈ సూచనలు మూడు రకాలుగా విభజించబడ్డాయి: ఇప్పటికే జరిగిపోయినవి (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక), ప్రస్తుతం జరుగుతూ పెరుగుతున్నవి (అజ్ఞానం మరియు అనైతికత పెరగడం), మరియు ప్రళయానికి అతి సమీపంలో సంభవించే పది పెద్ద సూచనలు. ముఖ్యంగా దజ్జాల్ యొక్క ఫితనా (సంక్షోభం) మరియు దాని నుండి రక్షణ పొందే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. ఈ సూచనల గురించిన జ్ఞానం, విశ్వాసులు తమ విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, సత్కార్యాల వైపు పయనించడానికి మరియు చెడుకు దూరంగా ఉండటానికి ఒక హెచ్చరిక అని వక్త ఉద్బోధించారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్.
మా సోదరులారా! ప్రళయదినం మరియు దాని యొక్క సూచనల గురించి కొన్ని విషయాలు ఈ రోజు మనం ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.
ప్రళయదిన భయంకరత
ప్రళయదిన విషయం అనేది చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైనదంటే దాన్ని మనం ఊహించలేము ఇప్పుడు. దాని గురించి అల్లాహ్ త’ఆలా సూరె హజ్ లో ఆరంభంలోనే ఒక ఆయత్ లో మూడు విషయాలు తెలిపాడు. ఏ రోజైతే ప్రళయం సంభవిస్తుందో, ఆ రోజు:
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)
يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّآ اَرْضَعَتْ (యౌమ తరౌనహా తద్’హలు కుల్లు ముర్దిఅతిన్ అమ్మా అర్దఅత్) ఆ రోజు పాలు త్రాపించే తల్లి, పాలు త్రాగే తన పిల్లను మరిచిపోతుంది.
రెండో విషయం చెప్పాడు:
وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا (వ తదఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా) ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది
మూడో విషయం చెప్పాడు.
وَتَرَى النَّاسَ سُكَارٰى (వ తరన్ నాస సుకారా) జనులు ఆ రోజు, ప్రజలు ఆ రోజు మత్తులో ఉంటారు.
وَمَا هُمْ بِسُكَارٰى (వమా హుమ్ బిసుకారా) కాని నిజానికి వారు మత్తులో ఉండరు. (22:2)
ఆ మత్తులో ఉండడం అనేది ఏదో మత్తుపదార్థం సేవించినందుకు కాదు.
وَلٰكِنَّ عَذَابَ اللّٰهِ شَدِيْدٌ (వలాకిన్న అదాబల్లాహి షదీద్) ఆనాటి అల్లాహ్ యొక్క శిక్ష అనేది చాలా కఠినమైనది. అందుగురించి ప్రళయం సంభవించే రోజు ఇలాంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటారు.
మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే
ఆ రోజు రాకముందే విశ్వాసులు సిద్ధమవడం, సత్కార్యాలు ముందుకు పంపుకోవడం, విశ్వాస మార్గాన్ని అవలంబించి ప్రజలందరూ కూడా సృష్టికర్త అయిన అల్లాహ్ వైపునకు మరలడం తప్పనిసరి. అయితే ప్రళయం అనేది ఈ ప్రపంచమంతా, విశ్వమంతా నాశనమైన రోజు సంభవిస్తుంది. ఆ రోజు వరకు మనం బ్రతికి ఉంటామో లేదో తెలియదు. కానీ ఏ రోజైతే మనకు మన చావు వస్తుందో, ఆ రోజు మన ప్రళయం మనపై సంభవించినట్లే. మనం ఎప్పుడుచనిపోతామో, రేపో మాపో తెలుసా మనకు? తెలియదు. అయితే మనం, మన చావు వచ్చింది అంటే మన ప్రళయం వచ్చేసింది అన్నట్లే. ఆ ప్రళయం గురించి మనం వేచించి ఉండవలసిన అవసరం లేదు. అందుగురించే ఆ ప్రళయ విషయం వచ్చినప్పుడు మనలో ఒక భయం ఏర్పడినప్పుడు మనం సత్కార్యాల వైపునకు ముందుకు వెళ్ళాలి, విశ్వాస మార్గాన్ని బలంగా పట్టుకోవాలి. అప్పుడే మనకు ఇహలోకంతో పాటు పరలోకంలో కూడా మోక్షం అనేది ప్రాప్తమవుతుంది.
ప్రళయ దినం సూచనలు
అయితే అల్లాహ్ యొక్క దయ మనపై చాలా ఉంది గనక, ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడే గనక, ఆ ప్రళయానికి ముందు ఎన్నో సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు సంభవించినప్పుడల్లా మనిషి ప్రళయాన్ని గుర్తు చేసుకోవాలి. మరియు ఆ ప్రళయ రోజు, ప్రళయ దినాన తాను సాఫల్యం పొందిన వారిలో చేరకోవాలి అని తనకు తాను సిద్ధపడుటకు అల్లాహ్ త’ఆలా అలాంటి సూచనలు పంపిస్తూ ఉంటాడు.
ఖుర్ఆన్ లో అల్లాహ్ చెప్పాడు:
فَهَلْ يَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَأْتِيَهُمْ بَغْتَةً ۚ فَقَدْ جَاۤءَ اَشْرَاطُهَا (ఫహల్ యన్దురూన ఇల్లస్ సాఅత అన్ త’తియహుమ్ బగ్ తతన్, ఫఖద్ జా’అ అష్రాతుహా) ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. (47:18)
ఏమిటి? ప్రళయం గురించి వారు వేచి చూస్తూ ఉన్నారా? అది ఎప్పుడైనా ముందు నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఏకాయెకిగా రావచ్చు. కానీ ఆ ప్రళయానికంటే ముందు దానికి సంబంధించిన సూచనలు వచ్చేసాయి.
اِقْتَرَبَتِ السَّاعَةُ وَانْشَقَّ الْقَمَرُ (ఇఖ్ తరబతిస్ సాఅతు వన్ షఖ్ ఖల్ ఖమర్) ప్రళయం సమీపించినది, చంద్రుడు రెండు ముక్కలయ్యాడు.(54:1)
ఇవన్నీ కూడా ప్రళయ సూచనల్లో.
అయితే సోదరులారా, ప్రళయం గురించి మనం సిద్ధపడడం, అది రాకముందే దాని గురించి మనం తయారీ చేయడం చాలా అవసరం. అయితే ప్రళయానికి ముందు ఏ సూచనలైతే రానున్నాయో, ఆ సూచనలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో వివరంగా మనకు తెలిపారు. దానికి సంబంధించిన హదీసులన్నీ ఏవైతే వచ్చాయో, ఆ హదీసులు, పండితులు ఆ సూచనలన్నిటినీ మూడు రకాలుగా విభజించారు.
ప్రళయ సూచనలు మరియు వాటి రకాలు
ఒకటి, కొన్ని సూచనలు వచ్చేసాయి, సమాప్తమైపోయాయి. మరియు కొన్ని రెండో రకమైన సూచనలు, ఆ సూచనలు రావడం మొదలైంది, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మూడో రకమైన సూచనలు ఏమిటంటే, ఆ మూడో రకమైన సూచనలు ప్రళయానికి మరీ దగ్గరగా వస్తాయి, అవి చాలా పెద్ద సూచనలు. అవి రావడం మొదలైంది అంటే ఒకటి వెనుక మరొకటి వస్తూనే పోతాయి. అందులో ఎలాంటి మధ్యలో గ్యాప్ అనేది ఉండదు.
మొదటి రకం, సూచనలు మొదలై సమాప్తం కూడా అయినవి:
ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్తగా నియమింపబడి పంపబడడం. ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా పంపడం అనేది ప్రళయ సూచనల్లో ఒకటి అని కూడా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చావు, ఆయన ఈ లోకాన్ని వీడిపోవడం కూడా ప్రళయ సూచనల్లో ఒకటి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
بُعِثْتُ أَنَا وَالسَّاعَةُ كَهَاتَيْنِ (బుఇస్తు అన వస్సాఅతు కహాతైన్) నేను మరియు ప్రళయ ఘడియ ఈ రెండు వేళ్ళ వలే (దగ్గరగా) పంపబడ్డాము.
అంటే మా మధ్యలో ఎక్కువ సమయం లేదు అని భావం. కానీ ఆ సమయం అనేది మన అంచనా ప్రకారంగా కాదు, అల్లాహ్ యొక్క జ్ఞాన ప్రకారంగా.
ప్రళయ సూచనల్లో రెండో రకమైన సూచనలు, మొదలైపోయినాయి మరియు ఇంకా పెరుగుతూనే పోతున్నాయి.
ఉదాహరణకు, వాటి గురించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ హదీస్ సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది. దాని కొంత భాగం బుఖారీలో కూడా ఉంది.
ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం అంటే ఏమిటి? ఈమాన్ అంటే ఏమిటి? మరియు ఇహ్సాన్ అంటే ఏమిటి? అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానం చెప్పారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. ప్రళయం ఎప్పుడు వస్తుందో అనేది నాకు తెలియదు అని ప్రవక్త గారు చెప్పారు. అయితే దాని యొక్క సూచనలు ఏవైనా చెప్పండి అని జిబ్రీల్ అడిగినప్పుడు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు:
أَنْ تَلِدَ الْأَمَةُ رَبَّتَهَا (అన్ తలిదల్ అమతు రబ్బతహా) బానిస స్త్రీ తన యజమానురాలికి జన్మనివ్వడం.
మరియు రెండో సూచన ప్రవక్త వారు చెప్పారు, ఒంటిపై గుడ్డ లేనటువంటి వాళ్ళు, కాళ్ళల్లో చెప్పులు లేనటువంటి వాళ్ళు మరియు తిందామంటే టైం కు తిండి దొరకనటువంటి పేదవాళ్ళు, ఎంత ధనం వాళ్ళ చేతుల్లో వచ్చేస్తుందంటే, పెద్ద పెద్ద బిల్డింగులు వాళ్ళు కడతారు.
ఇంకా బుఖారీ ముస్లిం లో మరొక హదీస్ వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి. విద్య, ధర్మజ్ఞానం అనేది లేపబడుతుంది. అజ్ఞానం పెరిగిపోతుంది. ప్రజలు మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోతుంది. మరియు వ్యభిచారం కూడా చాలా పెరిగిపోతుంది.
మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికి ముందు కొన్ని సూచనలు ఉన్నాయి: అశ్లీలత అనేది ఎక్కువైపోతుంది. ప్రజలు తమ బంధుత్వాన్ని తెంచుకుంటూ ఉంటారు, కలుపుకోవడానికి బదులుగా. మరి ఎవరైతే అమానత్, ఏ విషయమైనా గానీ, నమ్మి ఒకరిని ఏదైనా అతని దగ్గర పెడితే, అలాంటి అమానతులు కాజేసుకునే వాళ్ళు అయిపోతారు. మరి ఎవరైతే మోసం చేసే వాళ్ళు ఉన్నారో, అమానత్ లో ఖియానత్ చేసే వారు ఉన్నారో, అలాంటి వారిని చాలా విశ్వసనీయులు, అమానతులు పాటించే వాళ్ళు అని భావించడం జరుగుతుంది.
ఈ విధంగా ఇంకా ఎన్నో సూచనలు హదీసులో వచ్చి ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక గ్రామీణుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, “ప్రవక్తా, ప్రళయం ఎప్పుడు ఉన్నది? దానికి సూచనలు ఏమిటి?” అని అడిగాడు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయం, దానికి సూచన ఏమిటంటే, ఎప్పుడైతే అమానత్, అమానత్ గా ఉండకుండా దాన్ని కాజేసుకోవడం జరుగుతుందో, ఒకరిని విశ్వసనీయుడు, చాలా నమ్మకస్తుడు అని అతని వద్ద ఏదైనా మాట, ఏదైనా వస్తువు పెడితే దానిలో మోసం చేస్తాడో, అప్పుడు నీవు ప్రళయం వస్తుంది అని వేచించు. అయితే అమానత్ లో ఖియానత్ అనేది ఎలా జరుగుతుంది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు, ఏ హోదా, ఏ పని, ఏ తగిన మనిషికి ఇవ్వాలో అలా కాకుండా, దానికి అర్హులు లేని వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నీవు ప్రళయం గురించి వేచించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
ఈ విధంగా సోదరులారా, ఇక్కడ ఒక విషయం చాలా మనం శ్రద్ధగా మనం గమనించాలి. అదేమిటంటే, ఈ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే, ఇక ప్రవక్త చెప్పారు గనక, ప్రవక్త మాటల్లో ఎప్పుడూ కూడా అబద్ధం ఉండదు, చెప్పింది జరిగి తీరుతుంది అని ఈ రకంగా కేవలం మనం ఆలోచించి ఉండకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయానికి ముందే సంభవించే సూచనల గురించి మనకు తెలుపుతున్నారు అంటే ఇది కూడా స్వయంగా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త, అల్లాహ్ యొక్క సత్యమైన నిజమైన సందేశ దూత అని భావం. ఎందుకు? ఆయన ఏ మాట కూడా తన ఇష్ట ప్రకారంగా తన నోటితో చెప్పేవారు కాదు.
وَمَا يَنْطِقُ عَنِ الْهَوٰى ۗ اِنْ هُوَ اِلَّا وَحْيٌ يُّوْحٰى (వమా యన్తిఖు అనిల్ హవా. ఇన్ హువ ఇల్లా వహ్యుయ్యూహా) అతను తన మనోవాంఛల ప్రకారం మాట్లాడడు. అది పంపబడే దైవవాణి (వహీ) తప్ప మరేమీ కాదు. (53:3-4)
ఏదో ముందుకు జరగబోయే విషయాల గురించి ఏదైతే ప్రవక్త గారు చెప్తున్నారో, ఈ రోజుల్లో కొందరు అగోచర జ్ఞానం ఉన్నది, ఆ పండితుడు చాలా ఆరితేరినవాడు, అతను చాలా గొప్పవాడు అని ఏదో పంచాంగం చెప్పినట్లుగా కొన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ఇలాంటి మోసపూరితమైన మాటలు, నవూదుబిల్లా అస్తగ్ఫిరుల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పేవారు కాదు. అలాంటి విషయాలు ప్రవక్త చెప్పేవారు కాదు. సూర నజ్మ్ లో అల్లాహ్ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన కోరికతో ఏదీ మాట్లాడడు. అల్లాహ్ ప్రవక్త గారి గురించి చెప్తున్నాడు, ప్రవక్త వారు తమ కోరికతో, తమ ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడడు. అల్లాహ్ అతని వైపునకు ఏ వహీ పంపుతాడో, ఏ దివ్యవాణి పంపుతాడో, దాని ప్రకారమే ప్రవక్త అల్లాహ్ పంపినటువంటి విషయాల్ని ఇతరులకు తెలియజేస్తాడు.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఈ సూచనలు ఎందుకు తెలిపారు? ఇందులో మంచి విషయాలు ఏవైతే కరువవుతాయో, ఏ మంచి విషయాలలో మనం కొరత చూస్తామో, ఆ మంచి చేయడానికి మనం ముందుగా ఉండాలి. ఉదాహరణకు, ప్రళయానికి ముందు ధర్మ విద్య లేపబడుతుంది. అంటే ఏంటి? అది ఎక్కడో ఇట్లా పెట్టి ఉంటది ఎవడో వచ్చి తీసుకుంటాడు అట్లా భావం కాదు. దీనికి రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, ధర్మ పండితులు ఎవరైతే ఉన్నారో, వారి చావు అనేది ఎక్కువైపోతుంది. రెండో భావం, ప్రత్యేకంగా ముస్లింలు మరియు ఇతరుల హృదయాల్లో నుండి ధర్మ జ్ఞానం అవలంబించాలి అన్నటువంటి ప్రేమ అనేది తగ్గిపోతుంది.
ఇది ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రయత్నం చేయాలి. ఇదిగో ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలా. ఇప్పుడు ఈ బండ ఎండల్లో 45-47 వరకు కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత చేరుకుంటుంది. అయినా గాని పని వదులుకుంటామా మనం? చెమటలు కారుతూ ఉంటాయి. శరీరం మండుతూ ఉంటుంది. కానీ ఎందుకు పని చేస్తాం? ఎందుకు ఆ కష్టాన్ని భరిస్తూ ఉంటాం? ఈ పట్టి కష్టపడితేనే ఈ చెమట మనది వస్తేనే, మనం కొంచెం ఓపిక వహిస్తేనే మనకు జీతం దొరుకుద్ది. అప్పుడే మనం మన కడుపు నింపగలుగుతాము, మన పిల్లల కడుపు నింపగలుగుతాము అని ఆలోచిస్తాం. ఇంతకంటే ఎక్కువ ఆలోచన మనకు కేవలం ఈ శరీరం గురించేనా? ఈ ఆత్మ గురించి వద్దా? ఈ ఆత్మ వీడి పోయింది అంటే ఈ శరీరం ఏదైనా లాభంలో ఉందా? తీసుకెళ్లి బొంద పెడతాం. తీసుకెళ్లి దఫన్ చేసేస్తాం. మట్టిలో అది కుళ్ళిపోతుంది. కానీ ఆత్మ మిగిలి ఉంటుంది. అల్లాహ్ త’ఆలా మరొక శరీరం ప్రసాదిస్తాడు. ఈ శరీరంలో కూడా ఒక వెన్నుముక బీజం ఉంటుంది, ప్రళయ దినాన అల్లాహ్ త’ఆలా రెండోసారి లేపినప్పుడు దాని ద్వారా మళ్ళీ లేపుతాడు.
అయితే, చెప్పే విషయం ఏంటి? ఈ కేవలం శరీరానికి ఎంత సుఖం మనం ఇవ్వదలుచుకుంటున్నామో, దాని గురించి ఎంత కష్టపడుతున్నామో, మనకు ఇష్టం లేని ఒక సత్కార్యం, మనకు ఇష్టం లేని విశ్వాసం, మనకు ఇష్టం లేని ఒక మంచి కార్యం, దాని వైపునకు కూడా మనం మనసును ఒప్పించి అయినా కానీ ముందడుగు వెయ్యాలి.
ఇంకా కొన్ని సూచనలు మనం విన్నాం. ఏంటవి? వ్యభిచారం అధికమైపోవడం. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు సేవించడం అధికమైపోవడం. అశ్లీలత పెరిగిపోవడం. ఇలాంటి విషయాలు మనం విన్నప్పుడు ఏం చేయాలి? అరే ప్రవక్త చెప్పిండు కదా ఎట్లైనా అయిపోతది అని మనం కూడా దాంట్లో పాల్గొనాలా? కాదు. ప్రవక్త ఈ వార్త మనకు ఇస్తున్నారు అంటే, తమ పరలోకాన్ని సాఫల్యం చేసుకోగోరే వారు, ప్రళయ దినాన తమకు నరకం నుండి మోక్షం కలగాలి, ప్రళయ దినాన వచ్చే కష్టాలన్నీ కూడా దూరం కావాలి అని కోరుకునేవారు ఇహలోకంలో సంభవించే ఈ చెడులకు దూరం ఉండండి. ఏ మంచి విషయాలు తగ్గుతాయి అని తెలుస్తుందో, దాన్ని మనం చేయడానికి ముందడుగు వెయ్యాలి. ఏ చెడు పెరుగుతుంది అని మనకు తెలుస్తుందో, దానికి మనం దూరం ఉండాలి. ఇది అసలు కారణం చెప్పడానికి.
పెద్ద సూచనలు
మరి సోదరులారా, ప్రళయం సంభవించేకి ముందు మూడవ రకమైన సూచనలు ఏవైతే సంభవిస్తాయో, అవి చాలా పెద్ద సూచనలు, చాలా ఘోరమైనవి. ఒక సందర్భంలో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, అప్పటికి సహాబాలు, ప్రవక్త గారిని విశ్వసించిన సహచరులు ప్రళయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. “మీరేం చర్తించుకుంటున్నారు? ఏ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు? పరస్పరం ఏ విషయం మీద చర్చలు జరుగుతుంది?” అని ప్రవక్త గారు అడిగారు. వారు చెప్పారు, “మేము ప్రళయం గురించి పరస్పరం చర్చించుకుంటున్నాము.”
అప్పుడు ప్రవక్త గారు చెప్పారు,
إِنَّهَا لَنْ تَقُومَ حَتَّى تَرَوْنَ قَبْلَهَا عَشْرَ آيَاتٍ (ఇన్నహా లన్ తఖూమ హత్తా తరౌన ఖబ్లహా అష్ర ఆయాతిన్) నిశ్చయంగా, ప్రళయం, దానికంటే ముందు పది పెద్ద సూచనలు సంభవించే వరకు ప్రళయం రాదు.
ఏంటి ఆ పెద్ద సూచనలు?
అద్-దుఖాన్ (పొగ): ఒక చాలా విచిత్రమైన మరియు చాలా భయంకరమైన ఒక పొగ ఏర్పడుతుంది. దాని వివరణ మనం వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాము.
అద్-దజ్జాల్: దజ్జాల్ యొక్క రాక.
దాబ్బతుల్ అర్ద్: ఒక జంతువు వస్తుంది. మాట్లాడుతుంది. ఇతను విశ్వాసి, ఇతను అవిశ్వాసి అనేది చెప్తుంది.
సూర్యుడు పడమర నుండి ఉదయించడం: సూర్యుడు ప్రతిరోజు ఎటునుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి. కానీ ప్రళయానికి సమీపంలో ఇటు పడమర వైపు నుండి ఉదయిస్తాడు.
ఈసా ఇబ్ను మర్యం రాక: యేసు క్రీస్తు, ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు.
య’జూజ్ మరియు మ’జూజ్: ఒక జాతి, వారు బయటికి వెళ్తారు.
మూడు పెద్ద భూకంపాలు: ఒకటి తూర్పులో, మరొకటి పడమరలో, మరొకటి ఈ జజీరతుల్ అరబ్ (అరబ్ ద్వీపంలో). చాలా గాంభీర్యంగా భూమి క్రుంగిపోతుంది.
యమన్ నుండి ఒక అగ్ని: ఇందులో చివరి పెద్ద సూచన, యమన్ నుండి ఒక అగ్ని వెలుదేరుతుంది, అగ్ని వెళ్తుంది. ఆ అగ్ని వెళ్ళింది అంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ప్రజల్ని నెట్టేసుకుంటూ వస్తుంది. ప్రజలు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ? షామ్ (సిరియా) వైపున. అది చివరి యొక్క పెద్ద సూచన అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.
అయితే ఈ పెద్ద సూచనలు ఒకటి తర్వాత మరొకటి, ఒకటి తర్వాత మరొకటి ఈ విధంగా మొదలై కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. వాటి మధ్యలో ఏ గ్యాప్ అనేది ఉండదు.
వీటన్నిటిలో అతి భయంకరమైనది దజ్జాల్ యొక్క సంక్షోభం, దజ్జాల్ యొక్క ఫితనా. దజ్జాల్ ఎవడు? అతడు ఒక మానవుడు, ఒక మనిషే. కానీ ప్రళయానికి ముందు అతడు వస్తాడు. అల్లాహ్ త’ఆలా అతనికి ఒక శక్తిని ఇస్తాడు. దాని మూలంగా అతడు ఎన్నో మహిమల పేరు మీద ప్రజలను మోసం చేసి, నేను మీ దేవుణ్ణి, నేను మీ అనారోగ్యులకు, రోగంతో ఉన్నవారికి స్వస్థత ప్రసాదించేవాణ్ణి, మీలో కష్టంలో ఉన్నవారికి సుఖం ఇచ్చేవాణ్ణి, నేను మీ యొక్క ప్రభువుని అని తనకు తాను చాటింపు చేసుకుంటాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైతే దజ్జాల్ బయలుదేరాడు అని వింటారో, అతనితోని ఎదుర్కోవడానికి, అతని ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు, దూరమే ఉండాలి. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక విశ్వాసి నా విశ్వాసం చాలా బలంగా ఉంది, నేను ఎలాంటి మోసంలో పడను అని అనుకుంటాడు. కానీ వాడు ఎలాంటి మాయాజాలం చూపిస్తాడో, దానికి మోసపోయి తన విశ్వాసాన్ని కోల్పోతాడు. అతన్ని ప్రభువుగా నమ్మేస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు:
“చూడండి ఇంతకముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా దజ్జాల్ గురించి హెచ్చరించారు. ఎందుకంటే ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎన్ని ఫితనాలు, ఎన్ని సంక్షోభాలు, ఎన్ని ఇలాంటి ఉపద్రవాలు జరిస్తాయో, పుడతాయో, వాటన్నిటిలో అతిపెద్ద భయంకరమైన ఫితనా, ఉపద్రవం దజ్జాల్ యొక్క ఫితనా. అందుగురించే ప్రతి ప్రవక్త తమ జాతి వారికి అతని గురించి హెచ్చరించారు. నేను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
వినండి, అతను తనకు తాను ప్రభువుగా చాటింపు చేసుకుంటాడు. అయితే మీ ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే. దజ్జాల్ ను మీరు గుర్తు పట్టాలంటే అతనికి రెండు కళ్ళు ఉండవు. ఒకే ఒక కన్ను ఉంటది, ఒంటి కన్ను అంటాం కదా. ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒక కన్ను కూడా సామాన్య మనుషుల కన్నుల మాదిరిగా ఉండదు, బయటికి వచ్చి ఒక ద్రాక్ష పండు పెద్దది ఎలా ఉంటుందో ఆ విధంగా భయంకరంగా ఉంటుంది. మరియు అతని తల మీద, నుదుటి మీద ك ف ر (కాఫ్-ఫా-రా) కాఫిర్ అన్న పదం రాసి ఉంటుంది. చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతారు.
మరియు అతడు ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజలకు ఎన్నో మోసపెడుతూ వారిని నేను ప్రభువుగా నమ్మండి అని అంటూ ఉంటాడు. అయితే ప్రజల్ని నమ్మించడానికి ఒక సందర్భంలో అతనికి ఎలాంటి శక్తి లభిస్తుంది అంటే చాలా పెద్ద సంఖ్యలో అతని వెంట జనం ఉంటుంది. ఒక సందర్భంలో ప్రవక్త గారు చెప్పారు, అతన్ని అనుసరించే వారిలో స్త్రీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది అని. ఒక సందర్భంలో అతని వెంట చాలా పెద్ద జనం ఉంటుంది. అతడు ఆకాశాన్ని ఆదేశిస్తే వర్షం కురుస్తుంది. భూమిని ఆదేశిస్తే పంట వెళ్తుంది. చూడు, నేను ప్రభువును కాదా అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు.
ప్రజలు కొందరు నమ్మరు. ఆ సందర్భంలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకువచ్చి నీ తల్లిదండ్రిని బ్రతికించి చూపించాలా అని అంటాడు. అయితే అతని వెంట షైతానులు ఉంటాయి. ఇద్దరు షైతానులు అతని యొక్క తల్లిదండ్రి యొక్క రూపంలో అతని ముందుకు వస్తారు. ఇలాంటి మోసం జరుగుద్ది మరియు అల్లాహ్ యొక్క ఎంత గొప్ప దయ మనపై గమనించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా మొత్తం మన విశ్వాసంలో పడకుండా, విశ్వాసంపై స్థిరంగా ఉండడానికి అల్లాహ్ మనకు ప్రవక్త ద్వారా ఈ విషయాలు తెలియపరిచాడు. కానీ మన దురదృష్టం ఏంటంటే చదువుకు, విద్యకు ఎంతో దూరం ఉండిపోతున్నాం. విషయాలన్నీ తెలుసుకోవాలి. రోజు కొంచెం ఒక పేజీ అయినా గానీ ఖుర్ఆన్ దాని అనువాదంతో చదవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులను చదువుతూ ఉండాలి. ప్రవక్త వారి యొక్క జీవితం చదువుతూ ఉండాలి. ఈ కాంక్ష ఇంకా ఎప్పుడు మనలో పుడుతుంది?
వాస్తవానికి ఈ రోజుల్లో గమనిస్తే, ఏ ఉపద్రవాలు, సంక్షోభాలు, ఫితనా ఎక్కువ అవుతూ ఉన్నాయో, అందులో నేనైతే అనుకుంటా, మన చేతులో ఇలాంటి పెద్ద పెద్ద షైతానులు రావడం అని కూడా ఒకటి భావిస్తాను. ఎందుకో తెలుసా? వాస్తవానికి దీని వెనక నిజంగా వీటి ద్వారా, అంటే ఈ మొబైల్ సెట్స్, స్మార్ట్ ఫోన్స్, మరి ఇలాంటి దీనికి సంబంధించిన ఎన్నో పరికరాలు ఏవైతే ఉన్నాయో, వీటి వలన కొంత ప్రయోజనం, ఎంతో లాభం ఉండవచ్చు. కానీ ఈ రోజుల్లో జనం ఆ లాభానికంటే ఎక్కువగా నష్టంలో దాన్ని ఉపయోగిస్తున్నారు, వాటిని ఉపయోగిస్తున్నారు. గంటల తరబడి పేజీ పైకి చేస్తూ, చేస్తూ, Facebook నుండి, Facebook లో చూసి చూసి మన ఫేస్ ఏ పాడైపోతుంది. కానీ దానిని మనం గమనించడం లేదు. దానికి బదులుగా ఏదైనా మంచి విషయం చదవాలి అంటే కోరిక పుట్టడం లేదు. ఉదాహరణకు Facebook ఇచ్చాను. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి. అంతకు ముందు, ఇవి రాకముందు డిష్ లు, టీవీలు, మంచి మంచి ప్రోగ్రాంలో అని అనుకునేవాళ్ళం. స్త్రీలు ఫిలింలు, సీరియల్ లలో, పురుషులు ఎంతో మంది ఎన్నో రకాల ఆటల్లో, క్రికెట్ అని కొందరు, మరికొందరికి మరికొన్ని కాంక్షలు.
సోదరులారా, అల్లాహ్ మనపై కరుణించి, ఆయన మనకు ఎంతో మనపై దయచేసి, ప్రళయానికి ముందు సంభవించే సూచనల గురించి ఏ చిన్న చిన్న వివరాలు అయితే తెలిపాడో, మన ప్రవక్త ద్వారా వాటిని తెలుసుకొని మంచి విషయాలకు ముందుకు వెళ్లి, చెడు నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, మన పరలోకం కూడా మనకు బాగుపడుతుంది. అక్కడ నరకం నుండి మోక్షం పొంది స్వర్గంలో మనం చేరగలుగుతాం.
దజ్జాల్ ఇక్కడ ఉండేది ఎన్ని రోజులు? కేవలం 40 రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో. కానీ మొదటి రోజు ఒక సంవత్సరం మాదిరి, రెండో రోజు ఒక నెల మాదిరిగా, మూడో రోజు ఒక వారం మాదిరిగా, మిగితా రోజులు 37 సామాన్య రోజులుగా ఉంటాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. చివరికి ఈసా అలైహిస్సలాం దిగి వస్తారు. విశ్వాసుల ఒక సంఖ్య, విశ్వాసుల ఒక గ్రూప్ వారి వెంట ఉంటుంది. ఈసా అలైహిస్సలాం దజ్జాల్ ను వెతికి, దజ్జాల్ ను చంపేస్తారు. హత్య చేస్తారు.
కానీ ఒక విషయం, ఇతడు చాలా పెద్ద దజ్జాల్, భయంకరమైనవాడు. అయినా గానీ రెండు విషయాలు దీంట్లో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి? ఇతని ఉపద్రవాలు, ఇతని యొక్క ఫితనా, ఇతను ప్రజల్ని దుర్మార్గంలో పడవేయడానికి ఎంత ఏ ప్రయత్నం చేసినా గానీ, అల్లాహ్ పై గట్టి నమ్మకంతో అతన్ని ఎదురించకుండా, మనం ఉన్నకాడ మనం ఉండి, విశ్వాసంపై స్థిరంగా ఉండి, సత్కార్యాలు చేస్తూ ఉండి, ప్రత్యేకంగా దజ్జాల్ నుండి రక్షణకై, దజ్జాల్ నుండి అల్లాహ్ మనల్ని రక్షించాలని ప్రవక్త ఏ దుఆలు అయితే మనకు నేర్పారో, ఏ ప్రత్యేక కార్యాలు అయితే మనకు నేర్పారో అవి చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు అతని ఎన్ని భయంకరమైన, ఎన్ని మోసాలు, ఎన్ని మాయాజాలం మహిమలు అని చూపించినా గానీ అందులో ఇన్ షా అల్లాహ్ మనం పడం. కానీ విశ్వాసం మరియు ప్రవక్త చూపిన విధానంలో మనం ఉండాలి, కరెక్ట్ గా ఆచరణలో ఉండాలి. ఉదాహరణకు ప్రతి నమాజులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు,
అని చదివేవారు. ఇది చదువుతూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు ప్రతి జుమా రోజు ఏం చదవాలి? సూరె కహఫ్ చదువుతూ ఉండండి అని చెప్పారు. అది చదువుతూ ఉండాలి.
ఈ రోజుల్లో మన పరిస్థితి ఏమైంది? మా తల్లిదండ్రి మమ్మల్ని స్కూల్ కు పంపలేదు, మా తల్లిదండ్రి మమ్మల్ని మదరసాలో చేర్పించలేదు, మాకు ఖుర్ఆన్ చిన్నప్పుడు నేర్పలేదు అని ఇప్పటివరకు మనం నేర్చుకోలేకపోతున్నాము. కానీ మన చిన్నప్పుడు ఇట్లాంటి మొబైల్స్ ఉండెనా? వీటిని ఎలా ఆపరేటింగ్ చేయాలో అవన్నీ తెలుసా? అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా ఇవి ఉపయోగించుకుంటున్నారు, దీన్ని వాడుతున్నారు. ఏమీ రాని వ్యక్తి కూడా తనకు ఇష్టమైన పాట దాంట్లో ఎన్నుకొని వింటున్నాడు, ఇష్టమైన ఫిలిం దాంట్లో తీసి చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆ చెడులో ఏ జ్ఞానం అయితే మనది ఉపయోగపడుతుందో, మంచి తెలుసుకోవడానికి నాకైతే చదువు రాదు, చలో ఈ రోజు నేను ఏం చేస్తా, ఈ ఖుర్ఆన్ అప్లికేషన్ దీంట్లో స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసి ఆ ఈరోజు జుమ్మా కదా, జుమ్మా రోజు నేను సూర కహఫ్, నాకు చదవ రాదు, కనీసం చూసుకుంటూ శ్రద్ధగా వింటూ ఉంటా. అట్లా ఎవరైనా ఆలోచిస్తున్నారా? బహుశా వెయ్యిలో ఎవరైనా ఒకరు ఉంటే ఉండవచ్చునేమో. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి మనం.
రెండో విషయం, ఆ పెద్ద దజ్జాల్ నుండి మనం రక్షణ పొందాలంటే, అతని యొక్క మాయాజాలంలో మనం చిక్కిపోకూడదు అంటే ఈ పనులు చేయడంతో పాటు, ఆ పెద్ద దజ్జాల్ రాకముందు ఎందరో చిన్న చిన్న దజ్జాల్లు వస్తూ ఉంటారు. వాటి మాయాజాలకు కూడా మనం దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. గారడీ ఆటల్లాంటివి ఆడిపిస్తారు, మంత్రాలు చేస్తున్నాము, చేతబడి చేస్తున్నాము, మా దగ్గర మాయాజాలం ఉన్నది, మా దగ్గర ఫలానా శక్తి ఉన్నది, దేవుడు నాలో వదిగి వచ్చాడు, దేవుడు నాలో ఈ విధంగా చూపించుకుంటూ ప్రజల్ని మోసం చేసి, ప్రజల యొక్క నజరానాలు, ప్రజల యొక్క డబ్బులు, ప్రజల యొక్క ఆస్తులు అన్నీ కాజేసుకుంటూ దేవుని పేరు మీద తింటూ ఉన్నారు. అల్లాహ్ పేరు మీద తింటూ ఉన్నారు. ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఆ పేర్లు చెప్పేది ఉంటే కొందరికి కోపాలే వస్తాయి.
మన బర్రార్ లలో కూడా ఎన్నో మజార్లు, దర్గాలు, దర్బారులు, బాబాల యొక్క ఏమైతే అనుకుంటామో అక్కడ కూడా ఇలాంటి విషయాలు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుగురించి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలాంటి మోసాల్లో పడకుండా, దుర్మార్గంలో పడకుండా, విశ్వాసంపై మన యొక్క చావు కావాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలి? విశ్వాస మార్గం మీద ఉండాలి. ఖుర్ఆన్ హదీస్ చదువుతూ ఉండాలి. ధర్మ జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉండాలి. అల్లాహ్ త’ఆలా ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ప్రళయం రాకముందు ఏ సూచనలైతే సంభవిస్తా ఉన్నాయో, అల్లాహ్ ఆ సూచనల్లోని చెడు విషయాల నుండి మనల్ని దూరం ఉంచి, ఏ మంచి విషయాలు కరువవుతాయో వాటికి చేరువై, దగ్గరై, అలాంటి విషయాలు నేర్చుకొని మన వాళ్ళల్లో వాటిని ఇంకింత పెంపొందించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ త’ఆలా దజ్జాల్, దజ్జాల్ కు ముందు వచ్చే ఇంకా చిన్న చిన్న దజ్జాల్ ల వారందరి ఫితనాల నుండి కూడా మనల్ని అల్లాహ్ కాపాడుగాక.
జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వబరకాతుహు.
మానవులను, జిన్నులను పుట్టించటంలోని తన ఉద్దేశ్యమేమిటో అల్లాహ్ ఈ వాక్యంలో తెలియపరచాడు. వారంతా తనను మాత్రమే ఆరాధించాలి, తనకు మాత్రమే విధేయత చూపాలన్నది ఆయన అభిమతం. అయితే దానికోసం ఆయన మనుషులనుగానీ, జిన్నాతులనుగానీ కట్టుబానిసలుగా చేసుకోలేదు. వారి స్వేచ్చా స్వాతంత్రాలను హరించ లేదు. ఒకవేళ అదేగనక అయివుంటే మనుషులు, జిన్నాతులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా అల్లాహ్ ఆరాధనకు కట్టుబడి ఉండేవారు. కాని అల్లాహ్ వారికి స్వేచ్చను ఇస్తూనే తనను ఆరాధించమని కోరాడు. వారి పుట్టుకలోని పరమార్ధాన్ని వారికిక్కడ జ్ఞాపకం చేశాడు. ఈ పరమార్థాన్ని విస్మరించిన వారికి పరలోకంలో ఎదురయ్యే పరాభవాన్ని గురించి కూడా హెచ్చరించాడు.
“నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు”. (సూరా అజ్ జారియాత్ 51:57)
ఈ ఆరాధన మరియు విధేయత ద్వారా నా పోషణ జరుగుతుందని అనుకుంటున్నారేమో! అదేమీ కాదు. ప్రపంచంలో మీరు కల్పించే చిల్లర దేవుళ్ల లాంటి వాణ్ని కాదు నేను. ఆ మాటకొస్తే భూమ్యాకాశాల్లోని సమస్త ఖజానాలు నా అధీనంలోనే ఉన్నాయి. నా ఆరాధన వల్ల నా భక్తులకే లాభం చేకూరుతుంది. వారికి ఇహపరాల సాఫల్యం కలుగుతుంది. అంతేగాని నాకు చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదు.
3వ అధ్యాయం తౌహీదు యొక్క నిర్ధారణ చేసినవారు విచారణ లేకుండా స్వర్గంలో చేరుతారు అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.
అల్లాహ్ (త’ఆలా) ఆదేశం: “నిజానికి ఇబ్రాహీమ్ తనకు తానే ఒక సంఘం (ఉమ్మహ్). అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపినవాడు. అతను ఎన్నడూ ముష్రిక్ గా ఉండలేదు?” (సూరహ్ నహ్ల్ 16:120).
وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
“… మరియు ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వామ్యులుగా చేయరో (వారే మేళ్ళ వైపునకు పరుగులు తీసేవారు)“ (సూరహ్ మూ’మినూన్ 23:59).
హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ కథనం: నేను సఈద్ బిన్ జుబైర్ వద్ద ఉండగా “నిన్న రాత్రి రాలి పడిన నక్షత్ర చుక్కను ఎవరు చూశారు?” అని అడిగారాయన. “నేను చూశాను. అప్పుడు నేను నమాజులో లేను, కాని విషపురుగు కాటేసినందున బాధతో ఉన్నాను”. అని చెప్పాను. “అయితే నీవు ఏమి చేశావు ?” అని ఆయన ప్రశ్నించారు. “రుఖ్యా (మంత్రం) చదివాను” అని జవాబిచ్చాను. “ఎందుకు అలా చేశావు?” అని ఆయనడిగారు. “షాతబి మాకు ఒక హదీసు వినివించారు (దాని ఆధారంగా నేను చదివాను)” అనిచెప్పాను. “ఆయన ఏ హదీసు మీకు వినిపించారు” అని ఆయన అడిగారు. నేను చెప్పాను: “బురైద బిన్ హుసయ్యిబ్ ఉల్లేఖించిన ఒక హదీసు మాకు వినిపించారు. ఆయన చెప్పారు: “దిష్టి తగిలితే మరియు విషపురుగు కాటేస్తే తప్ప మంత్రించకూడదు” అని. “ఎవరు విన్న హదీసుపై ఆచరించారో వారు మంచి పని చేశారు” అని సఈద్ చెప్పి. మాకు ఇబ్నె అబ్బాసు (రది అల్లాహు అన్హు) ఈ హదీసు వినిపించారు ” అన్నారు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా సెలవిచ్చారు: “నాకు వివిధ అనుచర సమాజాలను చూపించడం జరిగింది. (వారికి సారథ్యం వహిస్తూ) ప్రవక్తలు నా ముందు నుంచి వెళ్ళసాగారు. అప్పుడు కొందరు ప్రవక్తల వెనక ఓ చిన్న సమూహం ఉంది. కొందరు ప్రవక్తల వెనక ఒక్కొక్క వ్యక్తి మాత్రమే ఉంటే, మరికొందరి ప్రవక్తల వెనక ఇద్దరేసి వ్యక్తులు ఉండేవారు. అసలు ఒక్క మనిషి కూడా తమ వెనుక లేని ప్రవక్తలు కూడా వారిలో ఉన్నారు. ఆ తరువాత నాకు ఒక పెద్ద జన సమూహము కన్పించింది. అది నా అనుచర సమాజం కావచ్చని భావించాను. కాని ఆ సమూహం హజ్రత్ మూసా (అలైహిస్సలాం), ఆయన అనుచర సమాజమని నాకు తెలియజేయబడింది. ఆ తరువాత జన సమూహం మరొకటి చూశాను. అప్పుడు ఈ జన సమూహం మీ అనుచర సమాజమే. వీరిలో డెబ్బయ్ వేల మంది ఎలాంటి విచారణ, శిక్ష లేకుండానే స్వర్గంలో ప్రవేశిస్తారు” అని తెలుపబడింది.
ఆ తరువాత ప్రవక్త లేచి వెళ్ళిపోయారు. (డెబ్బై వేల మంది ఎవరయి ఉంటారో) అని కొందరు అనుచరులు పరస్పరం మాట్లాడుకుంటూ “బహుశ వారు ప్రవక్త మైత్రిత్వం (స్నేహం) పొందిన వారు కావచ్చు” అన్నారు. మరి కొందరు “వారు ఇస్లాంలోనే పుట్టి ఏ మాత్రం షిర్క్ చేయని వారు కావచ్చు” అని అన్నారు. ఇలా చర్చించూకుంటూ ఉండగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వచ్చేశారు. వారందరూ చర్చించుకున్న విషయాలను ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “వారు మంత్రాలు చేయించుకునేవారు కారు, దుశ్శకునాలను పాటించరు, వాతలతో చికిత్స చేయించుకోరు. వారు తమ ప్రభువును మాత్రమే నమ్ముకొని (ఏ కష్టమొచ్చినా) ఆయన మీదే ఆధారపడతారు” అని విశదీకరించారు.
ప్రవక్త అనుచరుల్లో ఉక్కాషా బిన్ మిహ్సన్ లేచి నిలబడి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అని కోరాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పారు: “నీవు వారిలో ఒకడివి”. ఇది చూసి మరో వ్యక్తి లేచి “ప్రవక్తా! నేను వారిలో ఒకరిని కావాలని మీరు దుఆ చేయండి” అన అడిగాడు. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పారు: “ఉక్కాషా నీ కంటే ముందు ఈ సదవకాశాన్ని ఉపంయోగించుకున్నాడు”. (బుఖారి, ముస్లిం).
ముఖ్యాంశాలు:
1. తౌహీద్ విషయంలో ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు.
2. తౌహీద్ యొక్క భావం స్పష్టమయింది.
3. ప్రవక్త ఇబ్రాహీం ముష్రికులలోని వారు కారు అని అల్లాహ్ వారిని ప్రశంసించాడు.
4. షిర్క్ నుండి దూరమున్న ఔలియా అల్లాహ్ లను (అల్లాహ్ భక్తులను) ప్రశంసించబడింది.
5. మంత్రం చేయించుట, వాతలు వేయించుటను మానుకొనుట “తౌహీద్ యొక్క తహ్ఖీఖ్” చేసినట్టగును.
6. పై హదీసులో వచ్చిన గుణాలు అలవరచుకొనుట అల్లాహ్ పై “భరోసా” (నమ్మకం, ఆధారం) చాలా ఉన్నట్టు
7. ఈ హదీసు ద్వారా ప్రవక్త సహచరుల అపారవిద్య తెలుస్తుంది. (ఆ డెబ్బై వేల మంది అల్లాహ్ దయ తరువాత) వారి సత్కార్యాలతోనే (విచారణ, శిక్ష లేకుండా) స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు.
8. సహాబీలు మంచి విషయాల్లో మున్ముందుగా ఉండడానికి ఎంతగా కాంక్షించేవారో తెలుస్తుంది.
9. ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) “ఉమ్మతీలు” (అనుచర సమాజం) ఉన్నత స్థానంలో, సంఖ్యలో ఇతర ప్రవక్తల “ఉమ్మతీల” (అనుచరుల) కంటే ఎక్కువగా, శ్రేష్ఠులుగా ఉన్నట్టు తెలుస్తుంది.
10. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) “ఉమ్మతీల” ఘనత కూడ తెలుస్తుంది.
11. ప్రవక్త ఎదుట గత “ఉమ్మతీలందరు” ప్రత్యక్షమయ్యారు.
12. ప్రతీ “ఉమ్మత్” తమ ప్రవక్త వెంట వచ్చును.
13. ప్రవక్తలను అనుసరించిన ప్రజలు అల్ప సంఖ్యాకులు అని తెలుస్తుంది.
14. ఏ ప్రవక్తను విశ్వసించిన వారు ఎవరూ ఉండరో, ఆ ప్రవక్త ఒంటరిగా వచ్చును.
15. దీని వల్ల తెలిసిందేమిటంటే: మెజారిటి ఉన్నప్పుడు విర్రవీగ వద్దు. మైనారిటిగా ఉన్నప్పుడు చింతించవద్దు.
17. సఈద్ బిన్ జుబైర్ “ఎవరు విన్న హదీసుపై ఆచరించాలో వారు మంచి పని చేశారు” అని అన్న పదంతో పూర్వీకులు విద్యలో ఎంత ఆరితేరిన వారో తెలుస్తుంది. ఇంకా; వీరు చెప్పిన హదీసు మరియు హుసైన్ బిన్ అబ్దుర్ రహ్మాన్ చెప్పిన హదీసులో తేడా ఏ మాత్రం లేదు.
18. పూర్వ పండితులు అనవసర ప్రశంసల నుండి దూరంగా ఉుండేవారు.
19. ఉక్కాషాకు “నీవు వారిలో ఒకడివి అని ప్రవక్త చెప్పడం ప్రవక్త పదవి గుర్తుల్లో ఒకటి.
20. ఉక్కాషా ఘనత (అతడు స్వర్గవాసి అని తెలుపబడుట).
21. ఉక్కాషా తరువాత వ్యక్తికి ప్రవక్త చెప్పిన మాటల ద్వారా సందర్భాన్ని బట్టి స్పష్టంగా కాకుండా సైగల ద్వారా సంక్షిప్తంగా మాట్లాడడం యోగ్యం అని తెలుస్తుంది.
22. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నీతి, సత్ప్రవర్తన కూడా ఈ హదీసులో ఉట్టిపడుతుంది.
తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ)
ఈ అధ్యాయం దీనికంటే ముందు అధ్యాయాన్ని సంపూర్ణ పరుస్తుంది. ఇది దానికి సంబంధించినదే.
తౌహీద్ యొక్క “నిర్ధారణ” అంటే: పెద్ద షిర్క్, చిన్న షిర్క్ నుండి, వాక్కులోనూ, విశ్వాసంలోనూ, కర్మలలోనూ అన్ని బిద్అత్ (కల్పిత ఆచారా)ల నుండి, పాపాల నుండి తౌహీద్ను కాపాడుట, శుద్ది పరుచుట. ఇవన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు మాత్రమే చేయుట. ఎందుకనగా అత్యధికమైన షిర్క్ తౌహీద్కు విరుద్ధమైనది. అత్యల్పమైన షిర్క్ సంపూర్ణ తౌహీద్కు విరుద్దమైనది. బిద్అత్ , పాపాలు తౌహీద్ను కలుషితం చేసి, దాని సంపూర్ణత్వానికి అడ్డుపడతాయి. దాని లాభాల నుండి దూరం చేస్తాయి.
తౌహీద్ యొక్క నిర్ధారణ చేసిన వాని హృదయం విశ్వాసం, తౌహీద్, ఇఖ్లాస్ (సంకల్పశుద్ది)తో నిండిపోతుంది. తన ఆచరణ దాన్ని సత్యపరుస్తుంది. అది ఏ విధంగా అనగా: అల్లాహ్ యొక్క సమస్త ఆదేశాలకు అతడు శిరసావహిస్తాడు. అవిధేయతకు పాల్పడి విశ్వాసాన్ని నష్టపరుచుకోడు. అలాంటివాడే స్వర్గంలో విచారణ లేకుండా వెళ్లేవాడు. అందులో ప్రవేశించే మొదటి వ్యక్తి అయ్యేవాడు.
అల్లాహ్ కు పూర్ణ విధేయుడై, అల్లాహ్ పై ధృడమైన నమ్మకం ఉంచి, ఏ ఒక్క విషయంంలో కూడా అల్లాహ్ ను వదలి మానవుల వైపు మరలకుండా, వారిని అడగకుండా ఉండి, అతని బాహ్యం, ఆంతర్యం, మాటలు, చేష్టలు, ప్రేమ, ద్వేషం అన్నియు కేవలం అల్లాహ్ ప్రీతి కొరకే చేయుట , ప్రవక్త అడుగుజాడల్లో నడుచుట తౌహిద్ యొక్క నిర్దారణకు ప్రత్యేక నిదర్శనం.
ఇక్కడ ప్రజల స్థానాల్లో వ్యత్యాసం గలదు. “ప్రతి వ్యక్తి స్థానం అతడు చేసే పనులకు అనుగుణంగా ఉంటుంది.” (6: 132).
ఆశలతో, వాస్తవం లేని మాటలతో తౌహీద్ యొక్క నిర్ధారణ కాదు. మనస్సులో స్థిరమైన విశ్వాసం, ఇహ్సాన్ (ఆరాధనా సౌందర్యం) వాస్తవికతలతో, దానికి తోడుపడే సత్ప్రవర్తన, సత్కార్యాలతో అవుతుంది.
ఈ విధంగా తౌహీద్ యొక్క నిర్ధారణ చేసినవారు ఈ అధ్యాయంలో చెప్పబడిన ఘనతలకు అర్హులవుతారు.
కుఫ్ర్ (అవిశ్వాసం, తిరస్కార వైఖరి) , నిర్వచనం, దాని రకాలు
(అ) కుఫ్ర్ నిర్వచనం :
నిఘంటువు ప్రకారం కుఫ్ర్ అంటే కప్పి ఉంచటం, దాచి పెట్టడం అని అర్థం. అయితే షరీయత్లో “ఈమాన్‘ (విశ్వాసం)కు విరుద్ధమైన దానిని కుఫ్ర్ (అవిశ్వాసం లేక తిరస్కారం) అంటారు.
ఎందుకంటే – అల్లాహ్ యెడల, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల విశ్వాసం లేకపోవటమనే దానికి మరో పేరే కుఫ్ర్ (అవిశ్వాసం). అందులో ధిక్కరణా వైఖరి ఉన్నా, లేకున్నా అది అవిశ్వాసమే. విశ్వాసం (ఈమాన్)లో సందేహం సంశయమున్నా లేదా విముఖత ఉన్నా లేదా అసూయ ఉన్నా లేదా అహంకార భావమున్నా లేదా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) విధానాన్ని అనుసరించకుండా మనోవాంఛలు అడ్డుపడినా – ఇవన్నీ కుఫ్ర్ (అవిశ్వాసం)లో అంతర్భాగాలే. కాకపోతే అల్లాహ్ యే లేడని, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) రాక అసత్యమని పూర్తిగా కొట్టివేసే వ్యక్తి అవిశ్వాసం చాలా తీవ్రమైనది, కరడుగట్టినది. అలాగే దైవప్రవక్తలు సత్యం అన్న విషయంపై విశ్వాసమున్నప్పటికీ కేవలం అసూయ వల్ల వారిని త్రోసిపుచ్చిన వ్యక్తి కూడా అవిశ్వాసియే (కాఫిరే). (మజ్మూఅ అల్ ఫతావా-షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ-12/335)
(ఆ) కుఫ్ర్ రకాలు :
కుఫ్ర్ (అవిశ్వాసం) రెండు రకాలు : (1) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా అవిశ్వాసం) (2) కుఫ్రె అస్గర్ (చిన్న తరహా అవిశ్వాసం).
మొదటి రకం – కుఫ్రె అక్బర్
ఇది మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి బహిష్కృతం చేసేస్తుంది. ఇందులో కూడా ఐదు రకాలున్నాయి. అవేమంటే:
“అల్లాహ్కు అబద్దాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినపుడు దానినీ అసత్యమంటూ ధిక్కరించే వానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటి, అటువంటి తిరస్కారుల నివాస స్ధలం నరకంలో ఉండదా?”(అల్ అన్కబూత్ 29:68)
(2) కుఫ్రె తకబ్బుర్ వ ఇన్కార్ (అహంకారం, నిరాకరణతో కూడుకున్న కుఫ్ర్):
ఒక విషయాన్ని సత్యమని ధ్రువీకరిస్తూనే అహంకారం కారణంగా త్రోసిపుచ్చటం.
“మీరందరూ ఆదం ముందు సాష్టాంగపడండి అని మేము దూతలను ఆజ్ఞాపించినపుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు నిరాకరించాడు. అహంకారి అయి, అవిశ్వాసులలో చేరిపోయాడు.” (అల్ బఖర 2:34)
(3) కుఫ్రె షక్ (అనుమానంతో కూడుకున్న కుఫ్ర్)
దీనినే సంశయంతో, సందిగ్ధంతో కూడుకున్న కుఫ్ర్ అని కూడా అంటారు.
ఆ విధంగా అతను తన ఆత్మకు అన్యాయం చేసుకున్న స్థితిలో తన తోటలోకి వెళ్ళాడు. ఇలా అన్నాడు: “ఏనాటికైనా ఈ తోట నాశనమవుతుందని నేననుకోను. ప్రళయ ఘడియ ఆసన్నమవుతుందని కూడా నేను భావించటం లేదు. ఒకవేళ (అలాంటిదేదైనా జరిగి) నేను నా ప్రభువు వద్దకు మరలింపబడినా, నిస్సందేహంగా నేను (ఆ మళ్ళింపు స్థానంలో) ఇంతకన్నా మంచి స్థితిలోనే ఉంటాను.” అప్పుడు అతని స్నేహితుడు అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఏమిటి, నిన్ను మట్టితో చేసి, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించి, ఆ పైన నిన్ను నిండు మనిషిగా తీర్చిదిద్దిన ఆయననే (ఆరాధ్య దైవాన్నే) తిరస్కరిస్తున్నావా? నా మటుకు నేను ఆ అల్లాహ్ యే నా ప్రభువు అని నమ్ముతున్నాను. నేను నా ప్రభువుకు సహవర్తునిగా ఎవరినీ కల్పించను.” (అల్ కహఫ్ 18:35-38)
(4) కుఫ్రె ఏరాజ్ (విముఖతతో కూడుకున్న కుఫ్ర్)
దీనికి ఆధారం దివ్య ఖుర్ఆన్లోని ఈ సూక్తి:
وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ
“అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.” (అల్ అహ్ఖాఫ్ 46:3)
“ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయ బడింది. ఇక వారు ఏమీ అర్థం చేసుకోరు.”(అల్ మునాఫిఖూన్ 63:3)
రెండవ రకం – కుఫ్రె అస్గర్ (చిన్నతరహా కుఫ్ర్)
దీనివల్ల మనిషి తన సముదాయం నుండి వేర్పడడు. దీనినే ‘క్రియాత్మక కుఫ్ర్‘గా కూడా వ్యవహరిస్తారు. దైవగ్రంథంలో, దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) సున్నత్లో ఇది కుఫ్ర్గా పేర్కొనబడి నప్పటికీ ఇది ‘కుఫ్ర్ అక్బర్’ (పెద్ద తరహా కుఫ్ర్ ) పరిధిలోనికి రాదు. ఉదాహరణకు దైవానుగ్రహాల పట్ల కృతఘ్నతా భావం (కుఫ్రానె నీమత్). ఉదాహరణకు:
“అల్లాహ్ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుండీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. తరువాత ఆ పట్టణ వాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతఘ్నత చూపారు (అల్లాహ్ చేసిన మేళ్లను మరచిపొయ్యారు).” (అన్ నహ్ల్ 16:112)
ఒక ముస్లిం సాటి ముస్లింతో యుద్ధం చేయటం కూదా ‘కుఫ్రె అస్గర్’ ఉపమానం లోకే వస్తుంది. దీనిని గురించి మహనీయ ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
ప్రవక్త మహనీయుల (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ఈ ప్రవచనం కూడా ఈ సందర్భంగా గమనార్హమే:
“మీరు నా తదనంతరం ఒకరినొకరి మెడలు నరుక్కొని కాఫిర్లుగా మారకండి.”(బుఖారీ, ముస్లిం)
అల్లాహ్ యేతరుల పేర ప్రమాణం చేయటం కూడా ఈ కోవకు చెందినదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు :
“అల్లాహ్ యేతరుని పేర ప్రమాణం చేసినవాడు కుఫ్ర్ (అవిశ్వాసాని)కి ఒడిగట్టాడు లేదా షిర్క్ (బహుదైవోపాసన)కి పాల్పడ్డాడు.” (ఈ హదీసును తిర్మిజీ-1535 పొందుపరచి, హసన్గా ఖరారు చేశారు. హాకిమ్ మాత్రం దీనిని సహీహ్ – ప్రామాణికం – గా పేర్కొన్నారు).
వేరొక చోట అల్లాహ్ పెద్ద పాపానికి ఒడిగట్టిన వానిని విశ్వాసి (మోమిన్)గా పేర్కొన్నాడు. ఇలా సెలవిచ్చాడు :
“ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది.”(అల్ బఖర 2:178)
పై సూక్తిలో అల్లాహ్ హంతకుణ్జి ‘విశ్వాసుల పరిధి నుండి వేరుచేయలేదు. పైగా అతన్ని హతుని తరఫు హక్కుదారునికి సోదరునిగా ఖరారు చేస్తూ అతనిపై ఖిసాస్ చెల్లింపు విధించాడు. తరువాత ఈ విధంగా ఆదేశించాడు :
“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్జీ కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్త ధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి”.(అల్ బఖర 2:178)
ఇక్కడ ‘సోదరత్వం’ అంటే భావం నిశ్చయంగా ధార్మిక సోదరబంధమే. వేరొకచోట అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :
“(గుర్తుంచుకోండి) విశ్వాసులంతా అన్నదమ్ములు. కనుక మీ సోదరులిరువురి మధ్య రాజీ కుదుర్చండి.”(అల్ హుజురాత్ 49:10)
(పైన పొందుపరచబడిన విషయం “షరహ్ అత్ తహావియ్యహ్” నుండి సంక్షిప్తంగా సంగ్రహించబడినది).
కుఫ్రె అక్బర్ – కుఫ్రె అస్గర్ మధ్య గల తేడాలు:
(1) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా కుఫ్ర్) మనిషిని ఇస్లామీయ సముదాయం నుండి వేరుపరుస్తుంది. అతని ఆచరణలన్నీ దీని మూలంగా వృధా అయిపోతాయి. కుఫ్రె అస్గర్ (చిన్న తరహా కుఫ్ర్) వల్ల మనిషి ఇస్లామీయ సమాజం నుండి బహిష్కృతుడవడం గానీ, అతని ఆచరణలు వృధా అవటంగానీ జరగదు. అయితే అతనిలో ‘కుఫ్ర్’ మోతాదునుబట్టి అతని విశ్వాసం బలహీనమవుతుంది. దీనికి పాల్పడిన వ్యక్తిని అది శిక్షార్హునిగా నిలబెడుతుంది.
(2) కుఫ్రె అక్బర్ (పెద్ద తరహా కుఫ్ర్)కు పాల్పడిన వ్యక్తిని అది శాశ్వతంగా నరకానికి ఆహుతి చేస్తుంది. కుఫ్రె అస్గర్ (చిన్న తరహా కుఫ్ర్)కు పాల్పడిన వ్యక్తి ఒకవేళ నరకానికి ఆహుతి అయినప్పటికీ అందులో శాశ్వతంగా పడి ఉండడు. అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించి, అతన్ని క్షమించి, నరకంలో వేయకపోవటం కూడా సంభవమే.
(3) కుఫ్రె అక్బర్ – దానికి పాల్చడిన వ్యక్తి ధన ప్రాణాలను అది సమ్మతంగా చేసి వేస్తుంది. కాగా కుఫ్రె అస్గర్ – దానికి పాల్పడిన వ్యక్తి ధన ప్రాణాలను సమ్మతం చేయదు.
(4) కుఫ్రె అక్బర్కు ఒడిగట్టిన వ్యక్తికి – విశ్వాసులకు మధ్య విరోధ భావం తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి కుఫ్రె అక్బర్కి ఒడిగట్టే వారితో ముస్లింలు స్నేహం చేయటం ధర్మసమ్మతం కాదు – అతనెంత దగ్గరివాడయినాసరే! అయితే కుఫ్రె అస్గర్ ఎట్టి పరిస్థితిలోనూ స్నేహ బంధంలో అవరోధంగా ఉండదు. పైగా అలాంటి వ్యక్తితో – అతనిలో ఉన్న విశ్వాస (ఈమాన్) మోతాదును బట్టి స్నేహపూర్వక సంబంధాలు పెంపొందించుకోవచ్చు. అతనిలో ఉన్న అవిధేయతా భావం, పాపం మోతాదునుబట్టి అతని పట్ల దూరంగా ఉండటం జరుగుతుంది.
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.
షిర్క్ (బహుదైవారాధన), దాని రకాలు:
షిర్క్ అంటే: ఆరాధనలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పుట. ఉదాహరణకు విగ్రహాన్ని, మృతులను, సూర్యచంద్రులను, ప్రవక్తలను, వలీలను, సమాధి తదితరాలను పూజించుట. లేదా అల్లాహ్ యేతరులతో మొరపెట్టుకొనుట, వారికి మ్రొక్కుబడులు చెల్లించుట లేదా వారి కొరకు నమాజు, ఉపవాసాలు పాటించుట, వారి కొరకు బలిదానమిచ్చుట. ఇవన్నీ అల్లాహ్ తో పాటు షిర్క్ లో వస్తాయి.
అలాగే విగ్రహానికి, సూర్యచంద్రులకు, సమాధివారికి ఇంకా ఇలాంటి వాటికి సజ్దా చేయుట (సాష్టాంగపడుట). ఇది కూడా షిర్క్, ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది. అల్లాహ్ కాపాడుగాక!
అలాగే సృష్టించటంలో అల్లాహ్ తో పాటు ఎవరైనా భాగస్వామి గలడని, లేదా అల్లాహ్ మాత్రమే శక్తిగలవాటి శక్తి అతనిలో ఉందని నమ్మడం కూడా షిర్క్ అవుతుంది.
షిర్క్ రెండు రకాలు: చిన్న షిర్క్, పెద్ద షిర్క్.
మొదటిది: పెద్ద షిర్క్: ఆరాధన యొక్క ఏ ఒక్క రకమైనా అల్లాహ్ యేతరుల కొరకు చేయుట. ఇలాంటి షిర్క్ చేసిన వ్యక్తి తౌబా చేయకుండా (పశ్చత్తాప పడి, క్షమాభిక్ష కోరకుండా) చనిపోతే శాశ్వతంగా నరకంలో ఉంటాడు. ఇంకా ఇది సర్వ సత్కార్యాలను భస్మం చేసేస్తుంది.
పద్దెనిమిది ప్రవక్తల ప్రస్తావన తర్వాత సూర అన్ఆమ్ ఆయతు 88లో అల్లాహ్ ఇలా హెచ్చరించాడు:
{అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్ మాత్రమే. అది తప్ప ఏ పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో తీవ్రమైన పాపపు మాట అన్నాడన్నమాట}. (సూరె నిసా 4: 48).
పెద్ద షిర్క్ లోని కొన్ని రకాలు: అల్లాహ్ యేతరులతో దుఆ, అల్లాహ్ యేతరుల కొరకు మొక్కుబడి, జిబహ్ వగైరాలు చేయుట. అల్లాహ్ తో ఇతరుల్ని సాటి కలిపి అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ వారి పట్ల ఉంచుట.
{కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్లాహ్ పట్ల కలిగి ఉండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు}. (సూరె బఖర 2: 165).
రెండవది: చిన్న షిర్క్:ఖుర్ఆను, హదీసుల్లో ఏ పనుల కొరకు షిర్క్ అనే పదం వచ్చిందో కాని అవి పెద్ద షిర్క్ వరకు చేరవో వాటిని చిన్న షిర్క్ అంటారు. ఈ రకం ధర్మభ్రష్టతకు కారణం కాదు. కాని దీని వల్ల తౌహీదు లో మాత్రం కళంకం, కొరత ఏర్పడుతుంది. ఉదా: ప్రదర్శనాబుద్ధితో ఏదైనా సత్కార్యం చేయుట. లేదా షిర్క్ అక్బర్ కు చేర్పించే ఏదైనా కార్యం. ఉదా: ఏదైనా సమాధి వద్ద అల్లాహ్ కొరకు నమాజు చేయుట. అల్లాహ్ యేతరులు లాభనష్టానికి అధికారులు కారు అన్న విశ్వాసంతో వారి మీద ప్రమాణం చేయుట. ఇంకా అల్లాహ్ మరియు ఫలాన వ్యక్తి తలచినట్లు అని అనడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారుః
“మీ పట్ల నాకు అధికంగా భయం కలిగించేదేమిటంటే మీరు చిన్న షిర్క్ కు పాల్పడతారని”. చిన్న షిర్క్ అంటేమిటి? ప్రవక్తా అని అడిగారు అక్కడున్నవారు. అప్పుడు ప్రవక్త చెప్పారు: “ప్రదర్శనాబుధ్ధి” అని.(ముస్నద్ అహ్మ్దద్ 23630. దీని సనద్ జయ్యిద్).
«مَنْ حَلَفَ بِغَيْرِ اللَّهِ فَقَدْ أَشْرَكَ»
“ఎవరు అల్లాహ్ తప్ప ఇతరుల ప్రమాణం చేశాడో అతడు షిర్క్ చేసినట్లే“. (అబూ దావూద్ 3251. సహీ హదీస్).
తాయత్తులు వేసుకొనుట: రోగాలు, ఆపదలు రాకుండా లేదా వచ్చినా తొలిగిపోవుటకు కడాలు, రింగులు సాధనం అని వేసుకొనుట లాంటి పనులు చిన్న షిర్క్ కు సంబంధించినవే. ఇక అవి సాధనమే కాదు, లాభనష్టాలు వాటిలో ఉన్నాయి, అంటే: అవి వేసుకున్నప్పుడు లాభం ఉంటుంది వేసుకోకుంటే నష్టం ఉంటుంది అని విశ్వసిస్తే అది పెద్ద షిర్కులో వస్తుంది. (అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి).
అలాగే జ్యోతిషుల వద్దకు వచ్చి ఏమైనా అడగడం కూడా షిర్క్ లో వస్తుంది, ఎలా అనగా అతడు మానవుల్లో కొందరు అగోచర జ్ఞానం గలవారని నమ్మినందుకు. ఇది అబద్ధం, భూటకం. అల్లాహ్ ఈ ఆదేశానుసారం:
“అల్లాహ్కు తప్ప ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారెవరికీ అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతారో కూడా వారికి తెలియదు” అని ఓ ప్రవక్తా వారికి చెప్పు. (నమ్ల్ 27:65).
అందుకే ప్రతి ముస్లం తప్పనిసరిగా తెలుసకోవాల్సిన విషయం ఏమిటంటే: స్వచ్ఛమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) కొరకే అల్లాహ్ మనల్ని పుట్టించాడు, స్వర్గనరకాలను సృష్టించాడు, ప్రవక్తల్ని పంపాడు, గ్రంథాలను అవతరింపజేశాడు. కర్మలన్నీ అల్లాహ్ కొరకే ప్రత్యేకించి చిత్తశుద్ధితో చేసినప్పుడే స్వీకరించబడతాయి, లేదా అంటే అవి రద్దు చేయబడతాయి.
You must be logged in to post a comment.