ప్రవక్త ﷺ ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]

ప్రవక్త ఆదర్శవంతమైన జీవితంలోని 30 అంశాలు – ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం గారి జాదుల్ మఆద్ లో నుండి [వీడియోలు]
యూట్యూబ్ ప్లే లిస్ట్ – https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1vAdSpzam50Xb4BbeTxUTh
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

A ప్రవక్త విధానం: మలమూత్ర విసర్జనలో

1- ఆయన మరుగుదొడ్డిలో ప్రవేశించాలని అనుకున్నప్పుడు ఈ విధంగా పలికేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాఇస్. (ఓ అల్లాహ్! అపరిశుభ్ర స్త్రీ పురుష జిన్నాతుల నుండి నీ శరణు కోరుతున్నాను). (బుఖారీ). బయటకు వచ్చిన తర్వాత అనేవారు: గుఫ్రానక. (ఓ అల్లాహ్ నన్ను క్షమించు). (అబూ దావూద్ 30)

2- ఆయన ఎక్కువగా కూర్చొని ఉన్న స్థితిలోనే మలమూత్ర విసర్జన చేసేవారు.

3- ఆయన ఒక్కోసారి “ఇస్తింజా” (నీటితో శుభ్రం) చేసుకునేవారు, మరికొన్ని సార్లు “ఇస్తిజ్మార్” (రాళ్ళతో శుద్ధి) చేసుకునేవారు, ఇంకొన్ని సార్లు ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ రెండూ చేసేవారు.

4- ఆయన ఇస్తిన్జా మరియు ఇస్తిజ్మార్ లో ఎడమ చేతినే ఉపయోగించేవారు.

5- ఆయన ఇస్తింజా చేసిన తర్వాత తమ చేతిని మట్టితో శుభ్రపరుచుకునేవారు. (ఈ రోజుల్లో సబ్బుతో, హ్యాండ్ వాష్ లిక్విడ్ తో శుభ్రపరుచుకున్నా సరిపోతుంది).

6- ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు మలమూత్ర విసర్జన కొరకు సహాబాల (సహచరుల) దృష్టికి కనబడనంత దూరంగా వెళ్ళిపోయేవారు.

7- ఆయన కొన్నిసార్లు ఏదైనా మట్టి దిబ్బ (మిట్ట) వెనక, కొన్నిసార్లు ఖర్జూరపు చెట్ల చాటుకు, మరికొన్ని సార్లు లోయలో, పల్లపు భూమిలో చెట్ల వెనక మలమూత్ర విసర్జన చేసేవారు.

8- ఆయన మూత్ర విసర్జన కొరకు మెత్తటి నేలను అన్వేషించేవారు.

9-ఆయన మలమూత్ర విసర్జన కొరకు కూర్చునేటప్పడు నేలకు అత్యంత దగ్గరగా అవనంతవరకూ తమ దుస్తులను ఎత్తేవారు కాదు.

10- ఆయన మూత్రవిసర్జ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సలామ్ చేస్తే దానికి సమాధానం ఇచ్చేవారు కాదు.

B ప్రవక్త విధానం: వుజూ చేయడంలో

1-ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాల్లో ప్రతీ నమాజు కొరకు వుజూ చేసేవారు, కొన్ని సందర్భాల్లో ఒకే వుజూ తో ఎన్నో నమాజులు చేసేవారు.

2- ఆయన ఒక్కోసారి కేవలం ఒక ముద్ నీళ్ళతో, ఒకప్పుడు మూడిట్లో రెండు భాగాల ముద్ నీళ్ళతో, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ నీళ్ళతో వుజూ చేసేవారు. (నాలుగు ముద్ లు కలసి ఒక సాఅ అవుతుంది. ఇది ఒక కొలమానం. ఒక సాఅ లో సుమారు మూడు కిలోల బియ్యం వస్తాయి).

3- ఆయన వుజూలో తక్కువ నీటిని ఉపయోగించేవారు. తమ అనుచరసమాజాన్ని కూడా నీరు వృధా చేయడం నుంచి వారించేవారు.

4- ఆయన కొన్నిసార్లు ఒక్కోసారి, కొన్నిసార్లు రెండేసి సార్లు, కొన్ని సార్లు మూడేసి సార్లు తమ వుజూ అవయవాలను కడిగేవారు. మరికొన్ని సార్లు కొన్ని అవయవాలను రెండేసి సార్లు కడిగితే, మరికొన్ని అవయవాలను మూడేసి సార్లు కడిగేవారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా మూడు కంటే ఎక్కువ సార్లు కడగలేదు.

5- ఆయన కొన్నిసార్లు ఒకే దోసెడు నీటితో పుక్కిలించి, ముక్కులోకి నీళ్ళు ఎక్కించేవారు, మరికొన్ని సార్లు రెండు దోసెళ్ళతో, మరికొన్ని సార్లు మూడు దోసెళ్ళతో. అయితే ఒకే దోసెడు నీళ్ళలో నుండి సగంతో పుక్కిలించి, సగం ముక్కులో ఎక్కించేవారు.

6- ఆయన కుడిచేతితో ముక్కులోకి నీళ్ళు ఎక్కించి, ఎడమ చేతితో శుభ్రపరిచేవారు.

7- ఆయన పుక్కిలించకుండా, ముక్కులోకి నీటిని ఎక్కించకుండా వుజూ చేసేవారు కాదు.

8- ఆయన పూర్తి తలపై మస్ హ్ చేసేవారు, మరికొన్ని సార్లు రెండు చేతులతో తలపై మస్ హ్ చేస్తూ ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి తీసుకొచ్చేవారు.

9- ఎప్పుడైతే ఆయన తమ నుదుటిపై మసహ్ చేసేవారో అప్పుడు మిగిలిన మసహ్ ని తమ తలపాగా‌పై పూర్తిచేసే వారు.

10- ఆయన తలపై మస్ హ్ తో పాటే చెవుల పైభాగం మరియు లోపలి భాగం కూడా మస్ హ్ చేసేవారు.

11- ఆయన మేజోళ్ళు తొడగనప్పుడు రెండు కాళ్ళు కడిగేవారు.

12- ఆయన క్రమపద్దతిలో మరియు ఒక అవయవం తర్వాత వెంటనే మరో అవయవం కడుగుతూ వుజూ చేసేవారు, ఆయన ఈ (క్రమం, వెంటవెంట) విషయంలో ఎన్నడూ అంతరాయం (లోటు) కలిగించేవారు కాదు.

13- ఆయన బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరు)తో వుజూ ప్రారంభించేవారు, మరియు వుజూ పూర్తి చేశాక, చివరిలో ఈ దుఆ చదివేవారు: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీకలహూ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు, అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్ అల్నీ మినల్ ముతతహ్హిరీన్.  (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని ఆయన ఒక్కడేనని ఆయనకు భాగస్వామి ఎవరూ లేరని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను, ఓ అల్లాహ్! నన్ను పశ్చాత్తాప పడేవారిలోను, పరిశుభ్రత పాటించే వారిలోనూ చేర్చు (తిర్మిజీ).

            ఇంకా ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్ హానకల్లాహుమ్మ వబిహమ్ దిక అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, అస్తగ్ ఫిరుక వ అతూబు ఇలైక. (ఓ అల్లాహ్! నీవు పవిత్రుడవు మరియు సకల స్తోత్రాలు నీ కొరకే. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యమిస్తున్నాను. పశ్చాత్తాప పడి నీతో క్షమాపణ కోరుతున్నాను మరియు నీ వైపునకే మరలుచున్నాను. (ఇర్వావుల్ గలీల్ 1-135).

14- ఆయన‌‌ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా సహాబాలు ప్రారంభంలో: “నవైతు నఫ్అల్ హదస్” (నేను అశుధ్ధత దూరం అవ్వాలని “నియ్యత్” (సంకల్పం) చేసుకుంటున్నాను) అని లేదా నమాజు ధర్మసమ్మతం చేయడానికి “నియ్యత్” (సంకల్పిం) చేసుకుంటున్నాను అని అనేవారు కారు.

15- ఆయన వుజూలో తమ మోచేతులు మరియు చీలమండలాని కంటే పైగా కడిగేవారు కాదు.

16- ఆయనకు (వుజూ తర్వాత) తమ అవయవాలను ఆరబెట్టే అలవాటు లేకుండినది.

17- ఆయన తమ గెడ్డంలో ఖిలాల్  చేసేవారు, కానీ ఎల్లప్పుడూ చేసేవారు కారు.

18- ఆయన తమ వేళ్ళ మధ్యలో కూడా ఖిలాల్ చే‌సేవారు, కానీ ఎల్లప్పుడూ కాదు.

19- ఆయనకు ఎవరితోనైనా నీరు పోయించుకుంటూ వుజూ చేసే అలవాటు లేకుండినది, అనేకసార్లు స్వయంగా తామే నీళ్ళు తీసుకొని వుజూ చేసేవారు. మరికొన్ని సార్లు అవసరమైతే మరో వ్యక్తి సహాయం తీసుకునేవారు.

C ప్రవక్త విధానం: మేజోళ్ళపై మసహ్ చేయడంలో([2])

1- సహీహ్ హదీసు ద్వారా రూఢీ అయినది ఏమనగా ఆయన ప్రయాణంలోనూ, మరియు నగరంలో ఉన్నప్పుడూ మస్ హ్ చేసేవారు. ఆయన స్థానికుల కొరకు ఒక రాత్రి, ఒక పగలు మరియు ప్రయానికుని కొరకు మూడు రాత్రులు, మూడు పగళ్ళు మస్ హ్ చేసే గడువుని నిర్ధారించారు.

2- ఆయన మేజోళ్ళ పైభాగాన మస్ హ్ చేసేవారు. ఆయన అన్ని రకాల మేజోళ్ళపై మస్ హ్ చేశారు. ఒకప్పుడు కేవలం తలపాగా పై, మరొకప్పుడు నొసటి మరియు తలపాగాను కలిపి మస్ హ్ చేశారు.

3- ఆయన వుజూ చేస్తున్నప్పుడు కాళ్ళు కడిగే విషయంలో ఇబ్బంది పడేవారు కాదు. ఒకవేళ మేజోళ్ళు ఉంటే వాటిపైనే మస్ హ్ చేసేవారు, లేకపోతే కాళ్ళు కడిగేవారు.

D ప్రవక్త విధానం: తయమ్ముమ్ చేయడంలో([3])

1- ఆయన ఏ నేలపై నమాజు ఆచరించేవారో అదే నేలపై తయమ్ముమ్ చేసేవారు అది మన్ను అయినా, లేదా ఇసుక అయినా, లేదా చిత్తడి నేల అయినా సరే. ఆయన ఇలా అనేవారు: నా అనుచర సమాజంలోని ఏ వ్యక్తి అయినా ఎక్కడ ఉండగా నమాజు సమయం అవుతుందో అక్కడి శుభ్రమైన భూమి అతని కొరకు నమాజు చేసే స్థలం అవుతుంది మరియు (నీళ్ళు లేనిచో) తయమ్ముమ్ కొరకు అదే నేల మట్టి సరిపోతుంది.

2- ఆయన దూర ప్రయాణంలో వెళ్ళినప్పుడు తయమ్ముమ్ కొరకు తమ వెంట మట్టిని తీసుకువెళ్ళేవారు కారు. మరియు ఇలా చేయమని ఎన్నడూ ఆదేశించలేదు.

3- ఆయన నుండి ప్రతీ నమాజు కొరకూ విడిగా తయమ్ముమ్ చేయడం రుజువు లేదు,  ఆయన ఇలా ఆజ్ఞాపించనూ లేదు. ఆయన తయమ్ముమ్ ఆదేశం సామాన్యంగా ఇచ్చేశారు, మరియు అది వుజూకి ప్రత్యామ్నాయం అని తెలిపారు.

4- ఆయన ముఖం మరియు చేతుల పై ఒకే తట్టు తో తయమ్ముమ్ చేసేవారు.  

1- ఆయన నమాజు కొరకు నిలబడినప్పుడు “అల్లాహు అక్బర్” అనేవారు. దానికంటే ముందు ఆయన ఏమీ పలికేవారు కాదు. అదేవిధంగా ఎన్నడూ నోటితో సంకల్పం చేయలేదు.

2- ఆయన తక్బీరే తహ్రీమా (అల్లాహు అక్బర్)తో పాటే తమ రెండు చేతుల వేళ్ళను విడిగా, ఖిబ్లా దిశలో పెట్టి తమ రెండు చెవుల అంచుల లేదా భుజాల వరకు  ఎత్తేవారు. ఆ తరువాత కుడి చెయ్యిని ఎడమ చెయ్యి పైభాగంపై పెట్టేవారు

3- ఆయన కొన్నిసార్లు ఈ దుఆ (ఇస్తిఫ్తాహ్)తో (నమాజ్) ప్రారంభించేవారు: అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅత్త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్ యజు మినద్దనస్, అల్లాహుమ్మగ్ సిల్నీ మిన్ ఖతాయాయా బిల్ మాఇ వస్సల్ జి వల్ బరద్.

اللهُمَّ بَاعِدْ بَيْنِي وَبَيْنَ خَطَايَايَ كَمَا بَاعَدْتَ بَيْنَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ، اللهُمَّ نَقِّنِي مِنْ خَطَايَايَ كَمَا يُنَقَّى الثَّوْبُ الْأَبْيَضُ مِنَ الدَّنَسِ، اللهُمَّ اغْسِلْنِي مِنْ خَطَايَايَ بِالثَّلْجِ وَالْمَاءِ وَالْبَرَدِ

(ఓ అల్లాహ్ తూర్పు పడమరల మధ్య ఎంత దూరం ఉంచావో నన్నూ, నా పాపాలకు అంతే దూరంగా ఉంచు, ఓ అల్లాహ్! మాసిన బట్టని తెల్లగా శుభ్రం చేయబడినట్లు నన్ను నా పాపాల నుండి ప్రక్షాళణం చెయ్యి. ఓ అల్లాహ్! నా పాపాలను మంచు, నీరు, వడగండ్లతో కడిగివెయ్యి).

మరికొన్నిసార్లు ఆయన ఈ దుఆ తో  (నమాజు) ప్రారంభించేవారు: వజ్జహ్ తు వజ్ హియ లిల్లజీ ఫతరస్సమావాతి వల్ అర్ జ హనీఫా, వమా అన మినల్ ముష్రికీన్, ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లా షరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్.

وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا، وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ، إِنَّ صَلَاتِي، وَنُسُكِي، وَمَحْيَايَ، وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْمُسْلِمِينَ

(నేను నా ముఖాన్ని ఏకాగ్ర చిత్తంతో భూమ్యాకాశాలను సృష్టించిన వాని వైపునకు త్రిప్పుకున్నాను. నేను బహుదైవారాధకులలోని వాడిని కాను. నా నమాజ్, నా ఖుర్బానీ, నా జీవనం మరియు నా మరణం సర్వ లోక ప్రభువైన అల్లాహ్ కే అంకితం. ఆయన సహవర్తులెవరూ లేనివాడు. నాకు దీని గురించిన ఆజ్ఞే ఇవ్వబడింది. నేను ముస్లింలలోని వాడిని.

4- ఆయన దుఆయే ఇస్తిఫ్తాహ్ తర్వాత: అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం చదివేవారు. (నేను శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను). ఆ తర్వాత సూరతుల్ ఫాతిహా పఠించేవారు.

5- ఆయన రెండు చోట్ల మౌనంగా ఉండేవారు. మొదటిది: తక్బీరే తహ్రీమా మరియు ఖిరాత్ మధ్య. రెండవది: ఇందులో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం సూరయే ఫాతిహా తరువాత, మరికొందరి అభిప్రాయం ప్రకారం రుకూకి ముందు.

6- ఆయన సూరయే ఫాతిహా ముగించిన తరువాత మరొక‌ సూరా పారాయణం చేసేవారు. కొన్నిసార్లు పెద్ద సూరాలు పఠిస్తే మరికొన్ని సార్లు ప్రయాణం లేదా ఇతర కారణాల వల్ల చిన్న సూరాలు పఠించేవారు. కానీ ఆయన ఎక్కువ శాతం మధ్య రకమైన సూరాలు పఠించేవారు.

7- ఆయన ఫజర్ నమాజులో 60 నుండి 100 ఆయతుల వరకూ పారాయణం చేసేవారు. అదేవిధంగా ఆయన ఫజ్ర్ నమాజులో సూరయే ఖాఫ్, సూరయే రూమ్, సూరయే తక్వీర్ పారాయణం చేసేవారు.

            అదేవిధంగా “సూరయే జిల్ జాల్” ను రెండు రకాత్ లలో కూడా  పారాయణం చేసారు.

            ప్రయాణంలో ఉన్నప్పుడు ఫజ్ర్ నమాజులో ముఅవ్వజతైన్ (సూరయే ఫలఖ్ మరియు సూరయే నాస్) పారాయణం చేసారు.

            ఒకసారి ఆయన సూరయే ముఅ్ మినూన్ పారాయణం చేయడం ప్రారంభించారు మొదటి రకాతులో ఉండగా మూసా మరియు హారూన్ అలైహిమస్సలాం గారి సంఘటనకు చేరుకోగానే ఆయనకు విపరీతమైన దగ్గు రావడంతో ఆయన రుకూ చేసారు.

8- ఆయన జుమా రోజు ఫజ్ర్ నమాజులో అలిఫ్ లామ్ మీమ్ సూరయే సజ్దహ్ మరియు హల్ అతా అలల్ ఇన్సాన్ సూరయే దహర్ ను పారాయణం చేసేవారు.

9- ఆయన జొహ్ర్ నమాజులో కొన్నిసార్లు సుదీర్ఘ పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో సుదీర్ఘ పారాయణం చేస్తే అస్ర్ నమాజులో దానికి సగం వంతు పారాయణం చేసేవారు. ఒకవేళ జొహ్ర్ నమాజులో ఖిరాత్ సంక్షిప్తంగా చేసి ఉంటే అస్ర్ నమాజులో కూడా దానికి సమానంగా ఖిరాత్ (పారాయణం) చేసేవారు.

10- ఆయన మగ్రిబ్ నమాజులో ఒకసారి సూరయే తూర్, మరొకసారి సూరయే ముర్సలాత్ పారాయణం చేసారు.

11- ఆయన ఇషా నమాజులో సూరయే తీన్ పారాయణం చేసారు. మరియు హజ్రత్ ముఆజ్ రజియల్లాహు అన్హు గారి కొరకు {వష్షమ్ సి వదుహాహా} సూరయే షమ్స్ మరియు {సబ్బిహిస్మ రబ్బికల్ అఅలా} సూరయే అఅలా మరియు {వల్లైలి ఇజా యగ్ షా} సూరయే లైల్ పారాయణం చేయవలసినదిగా నిర్ణయించారు. సూరే బఖరా పారాయణం నుండి వారించారు.

12- ఆయన విధానం ఏ సూరా పారాయణం చేసినా దానిని పూర్తిగా పారాయణం చేయడం. ఒక్కోసారి ఒక సూరాను రెండు రకాత్ లలో పూర్తిచేసే వారు, ఒక్కోసారి ఆయన సూరాను ప్రారంభం నుంచి పారాయణం చేసేవారు. కానీ సూర మధ్యలో నుండి లేదా చివరి భాగం నుండి పారాయణం చేయడం గురించి ఆయన నుండి ఏ విషయమూ ప్రస్తావించబడలేదు.

            ఒకే రకాత్‌లో రెండు సూరాలను పఠించే విషయానికి వస్తే ఆయన ఇలా కేవలం సఫిల్ నమాజులలో చేసేవారు. ఇక ఒకే సూరాను రెండు రకాత్ లలో పూర్తి చేసే విషయానికి వస్తే ఆయన ఇలా తక్కువగా చేసేవారు. అదేవిధంగా ఆయన జుమా మరియు ఈదైన్ (పండుగల) నమాజులను వదిలి వేరితర నమాజులలో ఫలానా సూరాలనే  పఠించాలని ప్రత్యేకించలేదు.

13- ఆయన ఫజ్ర్ నమాజులో రుకూ తరువాత ఒక నెల వరకూ ఖునూతే నాజిలా పఠించారు, పిదప దానిని వదిలేశారు. ఇలా తాత్కాలిక అవసరం ఏర్పడినప్పుడు చేసారు, ఎప్పుడైతే ఆ అవసరం పూర్తి అయిపోయిందో అప్పుడు మానేశారు. ఆయన ఖునూత్ ను కష్ట, ఆపద సమయాల్లో పఠించేవారు, కానీ ఇది ఫజ్ర్ నమాజుతోనే ముడిపడిలేదు.

1- ప్రతీ నమాజులో ఆయన మొదటి రకాతు రెండవ రకాత్ కంటే సుదీర్ఘంగా ఉండేది.

2- ఆయన ఖిరాత్ పూర్తి చేయగానే శ్వాస తిరిగి తీసుకునేంత సమయం మౌనం పాటించేవారు. మరియు రెండు చేతులు ఎత్తుతూ (రఫ్ఉల్ యదైన్ చేస్తూ), అల్లాహు అక్బర్ పలుకుతూ రుకూలోకి వెళ్ళేవారు. తమ రెండు అరచేతులతో తమ మోకాళ్ళను గట్టిగా పట్టుకునేవారు, అలాగే తమ మోచేతులను ప్రక్కలకు దూరంగా ఉంచేవారు, ఆయన వీపు నిటారుగా ఉండేది. తలను పైకి ఉంచేవారు కాదు, అదేవిధంగా కిందికి కూడా వంచేవారు కాదు, వీపుకి సమానంగా ఉంచేవారు.

3- ఆయన రుకూలో సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేవారు. (ముస్లిం). ఒక్కోసారి: సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్లీ చదివేవారు. (ముత్తఫఖున్ అలైహి). ఆయన రుకూలో ఈ దుఆ కూడా చదివేవారు: సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్ (ముత్తఫఖున్ అలైహి).

4- సాధారణంగా ఆయన రుకూ పది సార్లు సుబ్ హాన రబ్బియల్ అజీమ్ చదివేంత సమానంగా ఉండేది. ఆయన సజ్దహ్ కూడా అలానే ఉండేది. ఒక్కోసారి రుకూ మరియు సజ్దహ్ ఖియామ్ కు సమానంగా ఉండేవి. కానీ ఇలా అప్పుడప్పుడూ ఒంటరిగా రాత్రి నమాజులలో చేసేవారు. ఆయన నమాజులు ఎక్కువ శాతం  మధ్యస్థంగా మరియు సరైన విధంగా ఉండేవి.

5- ఆయన సమిఅల్లాహులిమన్ హమిదహ్ అంటూ రుకూ నుండి పైకి లేస్తూ, రఫ్ఉల్ యదైన్ చేసేవారు, అలాగే వీపును నిటారుగా ఉంచేవారు. ఆయన సజ్దహ్ నుండి లేచిన తర్వాత (రెండు సజ్దాల మధ్య కూర్చున్నప్పుడు) కూడా నిటారుగా కూర్చునేవారు. ఇంకా ఇలా చెప్పేవారు: ఆ వ్యక్తి నమాజు చెల్లదు, ఎవడైతే రుకూ మరియు సజ్దహ్ లో తన వీపును నిటారుగా ఉంచడో. (తిర్మిజీ 265)

ఆయన నిటారుగా నిలబడిన తర్వాత రబ్బనా వలకల్ హమ్ద్ అనేవారు, మరొకప్పుడు రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు, మరికొన్ని సార్లు అల్లాహుమ్మ రబ్బనా లకల్ హమ్ద్ అనేవారు.

6- ఆయన రుకూ తర్వాత ఈ రుకున్ (అంటే ఖౌమా) కూడా రుకూ కు సమానమైన దీర్ఘంగా చేసేవారు. ఈ ఖౌమా స్థితిలో: అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హమ్దు మిల్అస్సమావాతి వ మిల్అల్ అర్జి వ మిల్అ మా బైనహుమా వమిల్అ మా షిఅ్ త మిన్ షైఇన్ బఅ్ దు అహ్లస్సనాఇ వల్ మజ్ది అహఖ్ఖు మా ఖాలల్ అబ్దు, వకుల్లునా లక అబ్దున్, లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్దు. (ముస్లిం)

7- ఆ తర్వాత ఆయన రఫఉల్ యదైన్ చేయకుండా సజ్దహ్ చేసేవారు. సజ్దహ్ చేసేటప్పుడు ఆయన ముందు తమ మోకాళ్ళను నేలపై పెట్టేవారు ఆ తర్వాత చేతులను పెట్టేవారు, ఆ తర్వాత నొసటి మరియు ముక్కుని ఆనించేవారు. ఆయన తలపాగా గుడ్డ పై కాకుండా నొసటి మరియు ముక్కుపై సజ్దహ్ చేసేవారు. ఆయన ఎక్కువగా నేలపైనే సజ్దహ్ చేసేవారు.. మరియు నీరు,తడిచిన మట్టిపై, మరియు ఖర్జూరపు చాపపై మరియు శుభ్రపరిచి, రంగించబడిన తోలు పై కూడా సజ్దహ్ చేసారని ఆధారాలు ఉన్నాయి.

8- సజ్దహ్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నుదుటు మరియు ముక్కును ఆనించి ఉంచేవారు, మరియు తమ రెండు చేతులను తమ రెండు చంకలకు ఎంతలా దూరంగా ఉంచేవారంటే ఆయన చంకల తెల్లదనం కనబడేది.

9- మరియు తమ రెండు చేతులను తమ భుజాలు మరియు చెవులకు సమానంగా ఉంచేవారు మరియు మధ్యస్థంగా సజ్దహ్ చేసేవారు. కాలి వేళ్ళ పై భాగం (గోటి భాగం) ఖిబ్లా వైపు ఉండేవి, అరచేతులు మరియు వేళ్ళను చాచేవారు..వేళ్ళను కలిపి ఉంచేవారు కాదు అదేవిధంగా ఎక్కువ దూరం దూరంగా కూడా ఉంచేవారు కాదు.

10) ఆయన సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు:-

సుబ్ హానకల్లాహుమ్మ రబ్బనా వబిహమ్దిక అల్లాహుమ్మగ్ ఫిర్ లీ ..(ముత్తఫఖున్ అలైహి) మరియు ఇలా కూడా పలికేవారు:- సుబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాఇకతి వర్రూహ్

11- ఆ తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రఫఉల్ యదైన్ చేయకుండా తమ తలను పైకెత్తేవారు,మరియు ఎడమ కాలిని పరిచి దానిపై కూర్చునేవారు ، కుడి కాలును లేపి ఉంచేవారు,మరియు తమ రెండు చేతులను తమ తొడలపై పెట్టేవారు ఆ స్థితిలో ఆయన మోచేతులు తొడలపై ఉండేవి.. మరియు చేతులను (పంజా) తమ‌ మోకాళ్లపై పెట్టేవారు, అలాగే రెండు వేళ్ళను  మధ్యలో గుండ్రని ఆకారం వచ్చేలా కలిపేవారు,ఆ తర్వాత ఆయన తమ చూపుడువేలుడు పైకి లేపి దుఆ చేసేవారు అదేవిధంగా.. దానిని కదుపుతూ ఉండేవారు మరియు ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మగ్ ఫిర్ లీ, వర్ హమ్నీ,వజ్ బుర్నీ,వహ్దినీ,వర్జుఖ్నీ…(అబూ దావూద్, తిర్మీజి, ఇబ్నే మాజహ్)-

[మిస్సింగ్ పాయింట్స్]

1) ఆయన నమాజులో ఉన్నప్పుడు అటూ ఇటూ దిక్కులు చూసేవారు కాదు.

2) ఆయన నమాజులో కళ్ళను మూసుకుని ఉంచేవారు కాదు.

3) ఆయన నమాజ్ కొరకు నిల్చున్నప్పుడు తలను కొంచెం వంచి ఉంచేవారు. ఆయన ఎప్పుడైనా నమాజును సుదీర్ఘంగా చేయాలని అనుకున్నప్పుడు ఒకవేళ వెనుక నుండి పిల్లవాని ఏడుపు వినిపిస్తే నమాజును త్వరగా ముగించేవారు, ఆ పిల్లవాని తల్లికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి.

4- ఆయన తమ మనవరాలు ఉమామాను తమ భుజాలపై ఎత్తుకొని ఫర్జ్ నమాజు చేసేవారు. ఖియామ్ (నిలబడిన) స్థితిలో ఎత్తుకునేవారు, రుకూ లేదా సజ్దహ్ స్థితిలో క్రిందికి దించేవారు.

5- ఆయన నమాజు చేస్తున్న స్థితిలో హసన్ మరియు హుసైన్ (రదియల్లాహు అన్హుమా) వచ్చి ఆయన వీపుపై ఎక్కేవారు, అప్పుడు ప్రవక్త వారిని దించకుండా తమ సజ్దహ్ ని సుదీర్ఘంగా చేసేవారు.

6- ఆయన నమాజులో ఉన్న స్థితిలో ఒకవేళ హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు వస్తే ఆయన నడుచుకుంటూ పోయి  ఆమె కొరకు తలుపు తీసేవారు పిదప తమ నమాజు చేసే చోటుకి తిరిగి వచ్చి, నమాజును కొనసాగించేవారు.

7- ఆయన నమాజు స్థితిలో ఉన్నప్పుడు సలాం కు సమాధానం సైగతో ఇచ్చేవారు.

8- ఆయన నమాజులో అవసరమున్నప్పుడు ఊదేవారు, ఏడ్చేవారు మరియు గొంతుని సవరించుకునే ఉండేవారు.

9- ఆయన కొన్నిసార్లు చెప్పులు, బూట్లు తీసేసి నమాజు చేసేవారు, కొన్నిసార్లు అవి తొడిగి నమాజు చేసేవారు. ఆయన యూదులను వ్యతిరేకిస్తూ చెప్పులతో నమాజు చేయండని ఆదేశించారు.

10- ఆయన ఒక్కోసారి ఒకే వస్త్రం లో నమాజు చేసేవారు. కానీ ఎక్కువగా రెండు వస్త్రాలలో నమాజు చేసేవారు.

1- ఆయన సలామ్ తిప్పిన తర్వాత మూడుసార్లు “అస్తగ్ఫిరుల్లాహ్” అని, ఈ జిక్ర్ చేసేవారు: అల్లాహుమ్మ అంతస్సలాము వమిన్కస్సలాము తబారక్ త యా ౙల్ జలాలి వల్ ఇక్రామ్. (ముస్లిం). اللَّهُمَّ أَنْتَ السَّلامُ وَمِنْكَ السَّلَامُ تَبَارَكْتَ يَا ذَا الجَلالِ والإِكْرَامِ

            ఆయన ఇస్తిగ్ఫార్ మరియు పైన తెలుపబడిన జిక్ర్ చేసే వరకు మాత్రమే ఖిబ్లా వైపు తిరిగి ఉండేవారు, ఆ పిదప వెంటనే ముఖ్తదీలు(నమాజీల) వైపుకు తిరిగేవారు. ఒక్కోసారి కుడి వైపు నుండి, మరోసారి ఎడమ వైపు నుండి.

2- ఆయన ఫజ్ర్ నమాజు చేసిన తర్వాత సూర్యుడు ఉదయించే వరకు అదే చోట కూర్చుని ఉండేవారు.

3- ఆయన ప్రతీ ఫర్జ్ నమాజు తర్వాత ఈ దుఆ చదివేవారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ .. అల్లాహుమ్మ లా మానిఅ లిమా అఅ్ తైత వలా ముఅ్ తియ లిమా మనఅ్ త వలా యన్ఫఉ ౙల్ జద్ది వమిన్కల్ జద్ది..(ముత్తఫఖున్ అలైహి)లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్,వలా నఅ్ బుదు ఇల్లా ఇయ్యాహు లహున్నిఅ్ మతు వలహుల్ ఫద్ లు ,వలహుస్స నాఉల్ హసను,లా ఇలాహ ఇల్లల్లాహ్,ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరిహల్ కాఫిరూన్. (ముస్లిం).

لَا إلهَ إلَّا اللهُ، وَحدَهُ لَا شَرِيْكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ، اللَّهُمَّ لَا مانعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ ولا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدِّ، ولَا حَوْلَ ولَا قُوَّةَ إلَّا باللهِ، لَا إِلَهَ إِلَّا اللهُ، وَلَا نَعْبُدُ إِلَّا إياهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الْحَسَنُ، لَا إلهَ إلَّا اللهُ، مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ

4- ఆయన తమ అనుచర సమాజానికి అభిలషణీయంగా నిర్ణంయించారు: సుబ్ హానల్లాహ్ 33 సార్లు, అల్ హందులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 33 సార్లు చెప్పి, చివరిలో లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ ఒకసారి పలికి 100 సంఖ్య పూర్తిచేయడం.

E- ప్రవక్త విధానం: నఫిల్ మరియు రాత్రి నమాజులో

1- ఆయన సాధారణ సున్నత్ అంటే కారణంతో కూడి లేని సున్నత్ మరియు నఫిల్ నమాజులు ఇంట్లోనే చేసేవారు. ప్రత్యేకంగా మగ్రిబ్ సున్నతులు.

2- ఆయన స్థానికంగా ఉన్నప్పుడు పదిరకాతులు నిబద్ధంగా చేసేవారు:

జొహ్ర్ కు ముందు రెండు రకాతులు, జొహ్ర్ తర్వాత రెండు రకాతులు,

మగ్రిబ్ తర్వాత రెండు రకాతులు,

ఇషా తర్వాత ఇంట్లో రెండు రకాతులు,

ఫజ్ర్ కి ముందు రెండు రకాతులు.

3) ఆయన నఫిల్ నమాజులలో అత్యంత నిబద్ధంగా ఫజ్ర్ సున్నతులను పాటించేవారు. ఆయన వాటిని మరియు విత్ర్ ను స్థానికంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా వదిలేవారు కాదు. ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు ఈ రెండు (ఫజ్ర్ సున్నతులు, విత్ర్) తప్ప వేరే ఏ సున్నతులు, నఫిల్లు చేయడం రుజువు లేదు .

4- ఆయన ఫజ్ర్ సున్నత్ చేసుకున్నాక కుడి ప్రక్కన నడుం వాల్చేవారు.

5- ఆయన ఒక్కోసారి జొహర్ నమాజు కు ముందు నాలుగు రకాతులు చేసేవారు. ఎప్పుడైనా జొహ్ర్ తర్వాత చేసే రెండు సున్నతులు తప్పిపోతే అస్ర్ నమాజు తర్వాత చేసేవారు.

6- ఆయన రాత్రి నమాజ్ అధికంగా నిలబడి చేసేవారు. ఒక్కోసారి కూర్చుని చేసేవారు. మరికొన్ని సార్లు ఆయన కూర్చుని ఖిరాత్ చేసి, మిగిలిన కొంత ఖిరాత్ భాగాన్ని నిలబడి పూర్తి చేసి, రుకూలోకి వెళ్ళేవారు.

7- ఆయన రాత్రి నమాజు 8 రకాతులు చేసేవారు, ప్రతి  రెండు రకాతుల తర్వాత సలాం తిప్పేవారు. ఆ తర్వాత నిరంతరంగా 5 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, చివరి రకాతులో తప్ప కూర్చునేవారు కాదు. ఒక్కోసారి 9 రకాతుల విత్ర్ నమాజు చేసేవారు, 8 రకాతులు నిరంతరంగా చేసి, ఆ తర్వాత కూర్చొని, సలాం తిప్పకుండా, లేచి, 9వ రకాతు చేసి కూర్చొని, తషహ్హుద్ చదివి సలాం తిప్పేవారు. సలాం తిప్పిన తరువాత మరో రెండు రకాత్ లు చేసేవారు, లేదా ఈ పద్ధతిలోనే ఒక్కోసారి 7 రకాతులు చేసి, ఆ తర్వాత రెండు రకాతులు కూర్చొని చేసేవారు.

8- ఆయన రాత్రి తొలి భాగం, మధ్య భాగం మరియు చివరి భాగంలో విత్ర్ నమాజు చేసేవారు. ఇలా చెప్పేవారు: మీరు విత్ర్ ను రాత్రి ఆఖరి నమాజుగా చేసుకోండి. (ముత్తఫఖున్ అలైహి)

9- ఆయన ఒక్కోసారి విత్ర్ తర్వాత రెండు రకాత్ లను కూర్చొని చేసేవారు, ఒక్కోసారి కూర్చొని ఖిరాత్ చేసి, రుకూ చేయడానికి సంకల్పించినప్పుడు లేచి నిలబడేవారు మరియు రుకూలోకి వెళ్ళేవారు.

10- ఎప్పుడైనా నిద్ర ఆవరించి లేదా ఏదైనా అవస్త ఉండి (రాత్రి తహజ్జుద్ చేయలేకపోతే) పగలు పన్నెండు రకాతులు చేసేవారు.

11- ఆయన ఒక్కోసారి తహజ్జుద్ నమాజులో ఒకే ఆయతుని తెల్లవారే వరకూ మాటిమాటికి తిలావత్ చేస్తూ గడిపేవారు.

12- ఆయన రాత్రి నమాజు ఒక్కోసారి నిశబ్దంగా, మరొకసారి బిగ్గరగా చేసేవారు. ఒక్కోసారి సుదీర్ఘంగా చేస్తే, మరొకసారి తేలికగా ఖియామ్ (నిలబడటం) చేసేవారు.

13- ఆయన విత్ర్ నమాజులో (సబ్బిహిస్మ రబ్బికల్ ఆలా) మరియు (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) మరియు (ఖుల్ హువల్లాహు అహద్) పారాయణం చేసేవారు. మరియు విత్ర్ నమాజు సలామ్ తిప్పిన తరువాత మూడు సార్లు (సుబ్ హానల్ మలికిల్ ఖుద్దూస్) చదివేవారు, మూడోసారి చదివేటప్పుడు స్వరాన్ని బిగ్గరగా చేస్తూ దీర్ఘం చేస్తూ చదివేవారు. (అబూ దావూద్,నసాయీ, ఇబ్నే మాజహ్)

1- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజును గొప్పగా భావించేవారు. మరియు  గౌరవం ఇచ్చేవారు అలాగే ఆ రోజు విశిష్టతలను ప్రత్యేకంగా తెలిపారు. వాటిలో కొన్ని:

* జుమా రోజు గుసుల్ చేయడం.

* ఆ రోజు మంచి దుస్తులు ధరించడం

* మరియు ఖుత్బా నిశ్శబ్దంగా వినడం వాజిబ్

* ప్రవక్త ముహమ్మద్ పై అత్యధికంగా దరూద్ పంపడం.

2- ప్రజలు మస్జిదులో జమా అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్         వచ్చి, సలామ్ చేసేవారు. మళ్ళీ మింబర్ పైకి ఎక్కి, ప్రజల వైపు ముఖం చేసి, వారికి సలాం చేసి, కూర్చునేవారు. అప్పుడు బిలాల్ రదియల్లాహు అన్హు అజాన్ ఇచ్చేవారు. ఆజాన్ అయిన వెంటనే ప్రవక్త నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. అజాన్ మరియు ఖుత్బాకు మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉండేది కాదు. మింబర్ తయారు కాక ముందు ప్రవక్త విల్లు లేదా లాఠీ కు ఆనుకొని ఖుత్బా ఇచ్చేవారు.

3- ఆయన నిలబడి (మొదటి) ఖుత్బా (జుమా ప్రసంగం) ఇచ్చేవారు, పిదప కూర్చునేవారు, మళ్లీ లేచి నిలబడి రెండవ ఖుత్బా ఇచ్చేవారు.

4- ఆయన ప్రజలను తమకు సమీపంగా కూర్చోమని మరియు నిశ్శబ్దంగా ఉండమని ఆజ్ఞాపించేవారు. మనిషి తన సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అన్నా అతను వ్యర్ధమైన పనికి పాల్పడినవాడవుతాడు, మరెవరైతే వ్యర్థమైన పనికి పాల్పడతాడో అతని కొరకు జుమా పుణ్యం లేదు.

5- ఆయన ఖుత్బా ఇస్తున్నప్పుడు కళ్ళు ఎర్రగా అయి, స్వరం గంభీరంగా (బిగ్గరగా) అయిపోయేది మరియు ఆయనలో ఆగ్రహం పెరిగిపోయేది ఎలా అంటే ఒక సైన్యాన్ని బెదిరిస్తున్నట్లుగా ఉండేది.

6- ఆయన “అమ్మా బఅద్” అని చెప్పిన తర్వాత ఖుత్బా మొదలు పెట్టేవారు. మరియు సంక్షిప్తమైన ఖుత్బా ఇచ్చి, నమాజును సుదీర్ఘంగా చేసేవారు.

7- ఆయన జుమా ఖుత్బా లో సహాబాలకు (తమ అనుచరులకు) ఇస్లాం యొక్క మూల విషయాలు,‌ ధర్మ పద్దతులను నేర్పేవారు. ఏదైనా ఆజ్ఞాపించే మరియు వారించే అవసరం ఉన్నప్పుడు ఆజ్ఞాపించేవారు, వారించేవారు.

8- ఆయన ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ప్రశ్నించే వారికి సమాధానం ఇవ్వడం కొరకు ఖుత్బా ను ఆపేసేవారు, మళ్లీ ఖుత్బాను కొనసాగించి పూర్తి చేసేవారు. ఒక్కోసారి ఏదైనా అవసరానికి మింబర్ పై నుండి దిగి, మళ్లీ మింబర్ పైకి వచ్చేవారు. ఆయన సమయసందర్భానుచితాన్ని గమనిస్తూ ఖుత్బా ఇచ్చేవారు. ఆకలితో ఉన్నవారిని లేదా అవసరం కలిగి ఉన్నవారిని చూస్తే వారికి దానం చేమమని ఆజ్ఞాపించేవారు మరియు ప్రోత్సహించేవారు.

9- ఆయన అల్లాహ్ స్మరణ వచ్చిన సందర్భంలో  తమ చూపుడు వేలుతో సైగ చేసేవారు. ఎప్పుడైనా కరువు కాటకాల స్థితి ఏర్పడినప్పుడు ఖుత్బా లోనే వర్షం కోసం దుఆ చేసేవారు.

10- ఆయన జుమా నమాజు చేసిన తర్వాత ఇంటికి వెళ్లి రెండు రకాత్ ల సున్నత్ నమాజు చేసేవారు. జూమాలో హాజరైనవారితో  జుమా నమాజు తర్వాత నాలుగు రకాతుల సున్నతులు చేయమని ఆజ్ఞాపించేవారు. (ఇమాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ చెప్పారు: జుమా చేసుకున్న తర్వాత మస్జిదులో చేసేవారు 4 సున్నతులు చేయాలి, ఇంటికి వచ్చి చేసేవారు 2 చేయాలి).

1- ఆయన పండుగ నమాజులు ఈద్గాలో చేసేవారు. అందమైన దుస్తులను ధరించేవారు

2- ఈదుల్ ఫిత్ర్ రోజున పండుగ స్థలానికి (ఈద్గాహ్)కు బయలుదేరే ముందు కొన్ని ఖర్జూరాలు బేసి సంఖ్యలో తినేవారు. అయితే ఈదుల్ అజ్హా పండుగ నాడు  తిరిగి వచ్చేవరకూ ఏమీ తినేవారు కాదు. ఖుర్బానీ ఇచ్చి, ఖుర్బానీ మాంసాన్నే తినేవారు. ఈదుల్ ఫిత్ర్ నమాజు కొంత ఆలస్యంగా, ఈదుల్ అజ్హా నమాజు కొంత తొందరగా చేసేవారు.

3- ఆయన ఈద్గాహ్ కు కాలినడకన వెళ్లేవారు. వెంట బల్లాన్ని తీసుకువెళ్ళడం జరిగేది, ఆయన అక్కడకు చేరుకున్నాక ఆయన ముందు బల్లెమును (సుత్రా కొరకు) పాతిపెట్టబడం జరిగేది.

4- ఆయన ఈద్గాహ్ కు (పండుగ నమాజు స్థలానికి) చేరుకున్నాక, అజాన్ మరియు ఇఖామత్ లేకుండానే నమాజు ప్రారంభించేసేవారు. ఇంకా అస్సలాతు జామిఅహ్ లాంటి పదాలు కూడా అనేవారు కాదు. ఆయన మరియు సహాబా (సహచరులు) పండుగ నమాజుకు ముందు లేదా తర్వాత ఏ నమాజు చేసేవారు కాదు.

5- ముందు ఆయన నమాజు చేసేవారు, తర్వాత ఖుత్బా ఇచ్చేవారు. అయితే ఆ నమాజు రెండు రకాతులగా చేయించేవారు. మొదటి రకాతులో తక్బీరే తహ్రీమాతో పాటు ఏడు సార్లు క్రమంగా (నిరంతరంగా) తక్బీర్ చేసేవారు, ప్రతి రెండు తక్బీర్ల మధ్య క్షణంపాటు మౌనంగా ఉండేవారు, ఆ తక్బీర్ల మధ్య ఎటువంటి ప్రత్యేక జిక్ర్ (దుఆ) నిరూపించబడలేదు. ఏడు తక్బీర్లు అయిన తర్వాత ఖిరాత్ ప్రారంభించేవారు, ఖిరాత్ పూర్తయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళేవారు. ఆ తర్వాత రెండో రకాతులో నిరంతరంగా ఐదు సార్లు తక్బీర్ పలికేవారు. పిదప ఖిరాత్ మొదలు పెట్టేవారు. నమాజు పూర్తయిన తర్వాత లేచి జనుల ముందు నిలబడేవారు, ఆ స్థితిలో ప్రజలు కూర్చొనే ఉండేవారు, ఆయన వారందరికీ హితోపదేశం చేసేవారు మరియు మంచిని ఆదేశిస్తూ చెడు నుండి వారించేవారు..

మొదటి రకాతులో సూరయే ఫాతిహా తరువాత సూరయే ఖాఫ్ మరియు రెండవ రకాతులో “ఇఖ్తరబ” అనగా సూరయే ఖమర్ పూర్తిగా పారాయణం చేసేవారు. కొన్ని సార్లు రెండు రకాతులలో సూరయే అఅలా మరియు సూరయే గాషియా పారాయణం చేసేవారు.

1- ఆయన సూర్యగ్రహణం సందర్భంగా తమ దుప్పటిని ఈడ్చుకుంటూ హడావిడిగా, భయాందోళనతో మస్జిదుకు వచ్చారు. వెంటనే రెండు రకాతుల నమాజ్ చేయించారు. మొదటి రకాతులో సూరయె ఫాతిహా మరియు ఒక పెద్ద సూరా బిగ్గరగా పారాయణం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు, పిదప రుకూ నుండి నిలబడుతూ సమిఅల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్ అన్నారు. ఆ తర్వాత ఖిరాత్ ప్రారంభించారు, అయితే ఈ ఖియామ్, ఖిరాత్ మొదటి ఖియామ్, ఖిరాత్ కంటే తక్కువగా ఉండినది. ఆ తర్వాత సుదీర్ఘమైన రుకూ చేసారు ఇది ముందు రుకూ కంటే కొద్దిగ తక్కువ ఉండినది. తర్వాత తమ తలను రుకూ నుండి పైకెత్తారు పిదప సుదీర్ఘమైన రెండు సజ్దాలు (సాష్టాంగం) చేసారు. ఆ తర్వాత మళ్ళీ నిలబడి మొదటి రకాతులో చేసిన విధంగా ఈ రెండవ రకాతులో చేశారు. ఈ విధంగా ప్రతీ రకాతులో రెండు రుకూలు మరియు రెండు సజ్దాలు అయ్యాయి.‌ నమాజు  పూర్తయిన తర్వాత ఆయన‌ స్వచ్ఛమైన‌, అనర్గళమైన (మంచి సంభాషణ కలిగిన) ఖుత్బా ప్రసంగం ఇచ్చారు.

2- మరియు ఆయన గ్రహణ సందర్భంలో అల్లాహ్ స్మరణ, నమాజ్, దుఆ, ఇస్తిగ్ఫార్, సదఖా (దానదర్మాలు) చేయమని మరియు బానిసలకు విముక్తినివ్వమని ఆజ్ఞాపించారు.

1- ఆయన మింబర్ పై జుమా ఖుత్బా సందర్భం వర్షం కొరకు దుఆ చేసేవారు. ఇంకా వేరితర సందర్భాల్లో కూడా వర్షం కొరకు దుఆ చేసేవారు. అదే విధంగా ఆయన మస్జిద్ లో కూర్చుని ఉండగా తమ చేతులను పైకెత్తారు, మరియు అల్లాహ్ తో వర్షం కొరకు దా చేశారు.

2- ఆయన వర్షం కొరకు చేసిన దుఆలలో ఓ రెండు ఇవి: (అల్లాహుమ్మస్ ఖి ఇబాదక, వబహాఇమక, వన్ షుర్ రహ్మతక వఅహ్ యి బలదకల్ మయ్యిత్) ఓ అల్లాహ్! వర్షం కురిపించు! నీ దాసుల కొరకు, జంతువుల కొరకు, ఇంకా నీ కారుణ్యాన్ని కురిపించు మరియు మరణించిన ఈ సీమను బతికించు!

మరొక దుఆ: (అల్లాహుమ్మస్ ఖినా గైసమ్ ముగీసా, మరీఅమ్ మరీఆ, నాఫిఅన్ గైర జార్ర్, ఆజిలన్ గైర ఆజిల్). ఓ అల్లాహ్! ఆలస్యం లేకుండా తక్షణమే, నష్టం కాకుండా లాభాన్నిచ్చే, మాకు సహాయపడే, పచ్చటి పైర్లను పండించే మరియు ఆనంద వసంతాలుగా ఉండే వర్షాన్ని కురిపించు!

3- ఆయన ఎప్పుడైనా మేఘం లేదా తుఫాను గాలిని చూస్తే ముఖం కవలికల్లో ఆందోళన కనపడేది, అప్పుడు ఆయన (అటూ ఇటూ) వెనకా ముందూ చూస్తూ ఉండేవారు. ఎప్పుడైతే వర్షం కురిసేదో ఆయన దానిపట్ల సంతోషించేవారు. (ఆయన ఇది అల్లాహ్ శిక్షయితే కాదు కదా అని భయపడేవారు).

4- ఆయన వర్షాన్ని చూసినప్పుడు ఈ విధంగా అనేవారు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఆ. (ఓ అల్లాహ్ లాభదాయకమైన వర్షం కుర్పించు). మరియు తమ శరీరంలోని కొంత భాగం నుండి బట్టను తొలగించేవారు, అది వర్షంలో తడవాలని. ఆయనను దీని గురించి ప్రశ్నించినప్పుడు ఈ విధంగానే అనేవారు: నిశ్చయంగా ఇది అల్లాహ్ తరపునుండి అవతరించబడిన తాజా అనుగ్రహం.

5- వర్షం అధికమైనప్పుడు సహాబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో వర్షం ఆగడానికి దుఆ చేయండని కోరినప్పుడు ఆయన ఈ విధంగా దుఆ చేసేవారు: అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వద్ ద్జిరాబి వల్ ఆకామి వల్ జిబాలి, వ బుతూనిల్ అవ్ దియతి, వ మనాబతిష్ షజర్. అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. (బుఖారీ, ముస్లిం).

1- శత్రువులు ఆయనకు మరియు ఖిబ్లాకు మధ్యలో ఉన్నప్పుడు, వీరులందంరూ ఆయన వెనక రెండు సఫ్ (పంక్తు)లలో ఉండేవారు, ఆయన తక్బీరే తహ్రీమా పలికినప్పుడు వారందరూ తక్బీర్ పలికేవారు. ఆయన రుకూ చేస్తే వారందరూ రుకూ చేసేవారు, ఆయన రుకూ నుండి లేస్తే అందరూ లేచేవారు, ఆయన సజ్దాలోకి వెళ్ళినప్పు మొదటి  సఫ్ (పంక్తి) లో ఉన్నవారు సజ్దా చేసేవారు మరియు రెండో పంక్తివారు శత్రువులకు ఎదురుగా నిలబడేవారు, పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం రెండో రకాతు కొరకు నిలబడినప్పుడు రెండో పంక్తివారు తమ రెండు సజ్దాలు చేసుకొని, లేచి మొదటి పంక్తిలోనికి వెళ్ళిపోయేవారు, మొదటి పంక్తివారు వెనక్కి వచ్చి రెండో పంక్తివారి స్థానం తీసుకునేవారు, ఈ విధంగా మొదటి పంక్తి యొక్క విశిష్టత రెండు పంక్తులవారూ పొందేవారు. మరియు రెండవ పంక్తి వాళ్లు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు రెండు సజ్దాలు పొందగలిగేవారు. అదే విధంగా ఆయన రెండో రకాతులో రుకూ లోకి వెళ్ళాక రెండు పంక్తుల వారూ మొదటి రకాతులానే అమలు చేసేవారు. మరియు ఆయన తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు రెండో పంక్తి వాళ్లు తమ రెండు సజ్దాలను చేసుకునేవారు. పిదప ఆయన తో పాటు తషహ్హుద్ లో పాల్గొనేవారు. ఈ విధంగా అందరితో పాటే సలాం తిప్పేవారు.

2- ఒకవేళ శత్రువులు ఖిబ్లా వైపున కాకుండా వేరే దిశలో ఉంటే ఆయన తమ వెంట ఉన్నవారందరినీ ఒక్కోసారి రెండు గ్రూపులుగా చేసేవారు. ఒక గ్రూపు శత్రువులను ఎదురించడానికి నిలబడితే, మరొక గ్రూప్ ఆయనతో పాటు నమాజు చేసుకునేవారు. ఒక గ్రూపువారు ప్రవక్తతో ఒక రకాతు నమాజ్ చేసి వెళ్ళిపోయేవారు, మరియు రెండొవ గ్రూపువారు వచ్చి ఆయన రెండో రకాతులో కలిసేవారు, ఆయన సలాం తిప్పిన తర్వాత రెండు గ్రుపులూ మిగిలిన తమ ఒక్కొక్క రకాత్ పూర్తి చేసుకునేవారు.

3- ఒక్కోసారి ఆయన రెండు గ్రూపులలో నుండి ఒక గ్రూపుకి ఒక రకాత్ చేయించి నిలబడేవారు. వారప్పుడు రెండొవ రకాతు స్వయంగా పూర్తి చేసుకుని ఆయన రుకూ చేయకముందే వాపసు వెళ్ళిపోయేవారు. తర్వాత రెండో గ్రూపు వచ్చి ఆయనతో పాటు రెండో రకాతులో కలసేవారు, ఆయన తషహ్హుద్ కొరకు కూర్చున్నప్పుడు వీరు లేచి నిలబడి రెండవ రకాతు పూర్తిచేసుకునేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు తషహ్హుద్ చదివిన తరువాత వారి కోసం వేచి ఉండేవారు, వారు కూడా తషహ్హుద్ చదివిన తరువాత వారందరితో కలిపి సలామ్ త్రిప్పేవారు.

4- ఆయన ఒక్కోసారి ఒక గ్రూపువారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు. మళ్ళీ రెండో గ్రూపు వస్తే వారికి రెండు రకాతులు చేయించి, సలాం తింపేవారు

5- ఒక్కోసారి ఆయనతో పాటు ఒక రకాత్ చదివి ఒక గ్రూపు వెళ్ళిపోయేది మరియు ఒక రకాత్ ఖజా చేసేది కాదు. పిదప రెండో జమాత్ వచ్చాక వారికి కూడా ఆయన ఒక రకాతు చేయించేవారు మరియు ఆ జమాత్ కూడా రెండవ రకాతు ఖజా చేసేది కాదు. ఈ విధంగా ఆయనవి రెండు రకాతులు పూర్తయ్యేవి మరియు మిగతా వారివి కేవలం ఒక్కో రకాతు పూర్తయ్యేది.

1- జనాజాలో ఆయన పద్దతి ఎంతో పరిపూర్ణంగా మరియు అన్ని జాతులకు భిన్నంగా ఉండేది. ఇందులో మృతుడు, మరియు అతని కుటుంబం మరియు ఆత్మీయుల పట్ల సద్వర్తన, ఉత్తమంగా మసలుకునే వ్యవహారం ఉండేది. అందుకని ప్రవక్తవారు ప్రథమంగా వ్యాధి గ్రస్తునిని‌ సందర్శించేవారు, అతనికి పరలోకాన్ని జ్ఞప్తికి చేసేవారు, అతనికి తౌబా, ఇస్తిగ్ఫార్ గురించి ఉపదేశించేవారు, రోగి సమీపంలో ఉన్నవారితో, అతనికి లాఇలాహ ఇల్లల్లాహ్ చదవడం గురించి గుర్తు చేస్తూ ఉండమని ఆజ్ఞాపించేవార, ఇది అతని చివరి పలుకుగా మారాలని ఇలా ఆదేశించేవారు.

2- ఆయన సృష్టిలో అందరికన్నా ఎక్కువ అల్లాహ్ విధివ్రాత పట్ల సంతృప్తిగా ఉండేవారు. అందరికంటే ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండేవారు. ఆయన తమ‌ కుమారుడైన‌ ఇబ్రాహీం మరణించినప్పుడు ఏడ్చారు, ఆయన పట్ల ఉన్న దయ, కరుణ మరియు అప్యాయత వల్ల. కానీ ఆయన హృదయం అల్లాహ్ పట్ల ప్రసన్నత, కృతజ్ఞత తో‌ నిండి ఉండినది. మరియు నాలుక అల్లాహ్ స్మరణ మరియు స్తోత్రంలో నిమగ్నమై ఉండినది. మరియు ఆయన ఇలా అన్నారు: నిశ్చయంగా కళ్ళు కన్నీటి పర్యంతం అయ్యాయి, హృదయం బాధగా ఉంది, కానీ నేను అవే పలుకులు పలుకుతాను దేనిపట్లయితే నా ప్రభువు ప్రసన్నుడవుతాడో.

3- ఆయన ముఖాన్ని గిల్లడం, అరవడం, పెడబొబ్బలు పెట్టడం, విలపిస్తూ సంతాపం తో స్వరాన్ని బిగ్గరగా చేయడాన్నుంచి వారించారు.

4- ఆయన విధానం: మృతుని అంత్యక్రియలు తొందరగా పూర్తి చేయడం. అతన్ని శుభ్రపరచడం, స్నానం చేయించడం మరియు తెల్లని కఫన్ దుస్తులు తొడగించడం.

5- ఆయన విధానం: మృతుని ముఖం కప్పి ఉంచడం, అతని కళ్ళు మూయడం.

6- ఆయన కొన్ని సందర్భాల్లో మృతునిని స్వయంగా చుంబించేవారు.

7- ఆయన మృతదేహాన్ని మూడు లేదా ఐదు లేదా గుసుల్ (స్నానం) చేయించేవారి సూచన మేరకు అంతకంటే ఎక్కువ సార్లు అవసరం ఉంటే అన్నేసార్లు గుసుల్ చేయించమని ఆజ్ఞాపించేవారు. అయితే చివరిలో కాఫూర్ (కర్పూరం) ను వాడమని ఆజ్ఞాపించేవారు.

8- ఆయన యుద్ధభూమిలో వీరమరణం పొందిన (షహీద్) లకు గుసుల్ ఇచ్చేవారు కాదు. అతనిపై ఉన్న ఆయుధాలు, కవచాన్ని‌ తీసేసి, అతని శరీరంపై ఉన్న వస్త్రాల్లోనే ఖననం చేసేవారు. మరియు నమాజే జనాజా చేయించేవారు కాదు.

9- ఆయన ఇహ్రామ్ స్థితిలో మరణించిన వారికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించమని ఆజ్ఞాపించేవారు, వారిని వారి ఇహ్రామ్ బట్టల్లోనే ఖననం చేయమని ఆజ్ఞాపించేవారు. మరియు సుగంధ ద్రవ్యాలు పూయడం మరియు తలను కప్పడం నుండి వారించేవారు.

10- మృతుడి సంరక్షకునితో తెల్లని మంచి వస్త్రాలలో కఫన్ ఇవ్వమని ఆజ్ఞాపించేవారు, మరియు ఎక్కువ ఖరీదైన కఫన్ నుండి వారించేవారు.

11- ఒకవేళ కఫన్ చిన్నగా ఉండి, పూర్తి శరీరానికి సరిపోకపోతే, తలను దాచేవారు మరియు కాళ్లపై గడ్డిని పరిచేవారు.

1- ఆయన మృతుని జనాజా నమాజే మస్జిద్ బయట చేయించేవారు. కొన్ని సార్లు మస్జిద్ లో కూడా చేయించారు కానీ ఇలా ఎల్లప్పుడూ చేయలేదు.

2- నమాజ్ చేయించాలని ఎవరిదైనా జనాజా వస్తే, ఇతనిపై అప్పు (రుణం)ఉందా? అని అడిగేవారు. ఒకవేళ అతనిపై ఎలాంటి అప్పు లేకపోతే నమాజ్ చేయించేవారు. ఒకవేళ అతనిపై అప్పు ఉంటే ఆయన జనాజా నమాజ్ చేయకుండా మీరు చేసుకోండని సహాబాలకు ఆజ్ఞాపించేవారు. కానీ ఎప్పుడైతే యుద్ధఫలం రావడం మొదలయినదో ఆయన జనాజా నమాజు చేయించి, అతని అప్పు తీర్చేవారు మరియు అతని ఆస్తిని అతని వారసుల కొరకు వదిలేసేవారు.

3- ఆయన నమాజే జనాజా ప్రారంభిస్తూ అల్లాహు అక్బర్ అని అల్లాహ్ ను స్తుతించి, ఆయన్ని ప్రశంసించేవారు (అంటే సూర ఫాతిహా చదివేవారు), మృతుని కొరకు దుఆ చేసేవారు. నమాజే జనాజాలో నాలుగు తక్బీర్లు పలికేవారు. ఎప్పుడైనా ఐదు తక్బీర్లు కూడా పలికారు.

4- ఆయన మృతుని కొరకు ఇఖ్లాస్ (చిత్తశుద్ధి)తో దుఆ చేయండని ఆదేశించేవారు. ఆయన చేసే దుఆలలో ఇవి కూడా: అల్లాహుమ్మగ్ ఫిర్ లిహయ్యినా, వ మయ్యితినా, వ షాహిదినా, వ గాఇబినా, వ సగీరినా, వ కబీరినా, వ జకరినా, వ ఉన్సానా. అల్లాహుమ్మ మన్ అహ్ యైతహూ మిన్నా ఫఅహ్యిహీ అలల్ ఇస్లామ్, వమన్ తవ ఫ్ఫైతహూ మిన్నా ఫతవఫ్ఫహూ అలల్ ఈమాన్, అల్లాహుమ్మ లా తహ్రిమ్ నా అజ్రహూ వలా తఫ్తిన్నా బఅ్ దహ్. (ఓ అల్లాహ్! మాలో బ్రతికి ఉన్నవారిని, మరణించినవారిని, హాజరుగా ఉన్నవారిని, లేని వారిని, చిన్నవారిని, పెద్దవారిని, మా పురుషులను, మా స్త్రీలను మన్నింపుము. ఓ అల్లాహ్! మాలో ఎవరినయితే సజీవంగా ఉంచావో వారిని నీ ఇస్లాంపై సజీవంగా ఉంచు. మాలో ఎవరికయితే మరణాన్ని ప్రసాదిస్తావో వారికి ఈమాన్ (విశ్వాసం)పై మరణాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్! మమ్మల్ని అతని ప్రతిఫలం నుండి దూరం చేయకు, అతని తరువాత మమ్మల్ని కష్టాలకు గురిచేయకు.

ఆయన చేసే దుఆలలో ఈ దుఆ కూడా ఉంది:

అల్లాహుమ్మగ్ ఫిర్ లహూ వర్ హమ్ హూ, వ ఆఫిహీ, వఅ్ ఫు అన్హూ, వ అక్రిమ్ నుజులహూ వ వస్సిఅ్  ముద్ఖలహూ వగ్సిల్ హు బిల్ మాఇ వస్సల్జి వల్ బరది, వనఖ్ఖిహీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్యజు మినద్ దనసి, వ అబ్దిల్హు దారన్ ఖైరన్ మిన్ దారిహి, వ అహ్లన్ ఖైరన్ మిన్ అహ్లిహి, వ జౌజన్ ఖైరన్ మిన్ జౌజిహీ, వ అద్ఖిల్ హుల్ జన్నత, వ అఇజ్ హు మిన్ అజాబిల్ ఖబ్రి వ అదాబిన్నార్. (ఓ అల్లాహ్! అతన్ని క్షమించు, అతనిని కరుణించు, అతనికి సుఖాన్ని ప్రసాదించు, అతన్ని మన్నించు, అతన్ని అతిథిగా ఆదరించు, అతడు చేరుకునే స్థలాన్ని వెడల్పు చేయి, నీటితోని, మంచుతోను, మరియు వడగళ్ళతోనూ అతని పాపములను కడిగివేయి, మురికి లేని తెల్లని వస్త్రం నుండి మురికిని శుభ్రం చేసినట్లుగా అతని పాపములను కడిగివేయుము. అతని ఇంటికి బదులుగా మరింత మంచి ఇల్లు, ఈ కుటుంబం కంటే మంచి కుటుంబం, అతని జీవిత భాగస్వామి కంటే మంచి భాగస్వామిని అతనికి ప్రసాదించు. అతనికి స్వర్గంలో ప్రవేశం కల్పించు, సమాధి శిక్ష నుండి (నరకశిక్ష నుండి) కాపాడు. (ముస్లిం).

5- ఆయన జనాజా నమాజు కొరకు పురుషుని తలకు సమానంగా, మరియు స్త్రీ మధ్య భాగానికి సమానంగా నిలబడేవారు.

6- ఆయన పిల్లల నమాజే జనాజా కూడా చేయించేవారు. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, యుధ్ధప్రాప్తి సంపదనలో ద్రోహం (దొంగతనం) చేసేవారి నమాజే జనాజా చేయించేవారు కాదు.

7- ఆయన రజ్మ్ (వ్యభిచారం శిక్షలో రాళ్లు రువ్వండంతో మరణించిన) జుహైనా తెగకు చెందిన ఒక స్త్రీ యొక్క నమాజే జనాజా చేయించారు.

8- ఆయన నజాషీ చక్రవర్తి జనాజా నమాజ్ పరోక్షంగా చేయించినట్లు రుజువు ఉంది. అయితే ఆయన ప్రతి ఒక్కరి నమాజే జనాజా పరోక్షంగా చేసేవారు కాదు.

9- ఆయన ఎవరిదైనా జనాజా నమాజు చేయలేకపోతే, అతని సమాధి వద్దకు వెళ్లి చేసేవారు

1- ఆయన నమాజే జనాజా పూర్తి చేశాక జనాజా ముందు నడుచుకుంటూ ఖబ్రిస్తాన్ (శ్మశానవాటిక)కు వెళ్లేవారు. వాహనంపై ఉన్నవారిని వెనక ఉండమని, కాలి నడకన ఉన్నవారిని ముందు, వెనక, కుడి, ఎడమ ఎక్కడున్నా పర్లేదు, కాని జనాజాకు దగ్గర ఉండమని ఆజ్ఞాపించేవారు. ఆయన జనాజాని వేగంగా తీసుకూవెళ్ళాలని ఆదేశించేవారు.

2- జనాజాను క్రిందికి దించేవరకూ ఆయన కూర్చునే వారు కాదు.

3- ఆయన ముందు నుండి జనాజా వెళితే ఆయన నిలబడ్డారు, నిలబడమని ఆదేశించారు. అదేవిధంగా ఆయన కూర్చొని ఉండడం కూడా రుజువయినది.

4- ఆయన విధానం: శవాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం మరియు మిట్ట మధ్యాహ్నం పూట ఖననం చేయకూడదు.

5- సమాధి బగ్లీ (ఖిబ్లా దిశలో కొంచెం లోతుగా త్రవ్వి) ఉండాలి, మరియు మృతుని తల వద్ద, అలాగే కాళ్ల వద్ద విశాలంగా త్రవ్వాలని ఆదేశించేవారు.

6- ఆయన మృతుడ్ని ఖననం చేసిన తర్వాత అతని తల వైపు నుండి మూడు దోసెట్ల మట్టి వేశారు.

7- ఖననం చేసిన తరువాత అక్కడే నిలబడి మృతుని స్థిరత్వం కొరకు ప్రార్ధించేవారు. మరియు తమ అనుచరులను కూడా ఇలా చేయమని ఆజ్ఞాపించేవారు.

8- సమాధి వద్ద (ఫాతిహా ఇంకా ఏమైనా) చదవడం లేదా మృతునుకి (కలిమహ్ చదువు అని) ఉపదేశించడం అనేవి ఆయన నుండి నిరూపితం కాలేదు.

9- చావు వార్త వినిపంచడంలో ఆయన విధానం: ఎవరిదైనా చావు వార్త అతని గొప్పతనాలు చెప్పుకుంటూ చేసేవారు కాదు, ఇలా చేయడం నుండి వారించేవారు.

1- సమాధులను (అదనపు మట్టి పోసి) ఎత్తుగా లేపడం, ఇటుకలతో గట్టిగా తయారు చేయడం, వాటికి పూత పూయడం మరియు వాటిపై గోపురాలు కట్టడం లాంటివన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు కావు.

2- ఒకసారి ఆయన హజ్రత్ అలీ రజియల్లాహు అన్హు గారిని యమన్ వైపునకు పంపుతూ ఈ విధంగా ఆదేశించారు: ఏ చిత్రపటాన్ని మరియు విగ్రహాన్ని చూసినా నీవు దానిని తుడిచివేయి (ధ్వంసం చేసెయ్యి). ఎత్తైన సమాధిని చూస్తే సమానం చెయ్యి. ఈ విధంగా ఎత్తయిన సమాధులను సమానంగా చేయడం ఆయన విధానం.

3- ఆయన సమాధి పై సున్నం వేయడం, దానిపై నిర్మాణాలు నిర్మించడం, మరియు వాటిపై రాయడం నుండి వారించారు.

4- తమవారి సమాధి అని గుర్తుండడానికి ఒక రాయి పెట్టారు.

5- ఆయన సమాధులపై మస్జిదులు నిర్మించడం, వాటి వద్ద దీపాలు వెలిగించడం నుండి వారించారు మరియు ఇలా చేసేవారిని శపించారు.

6- ఆయన వాటి వైపు ముఖం చేసి నమాజు చేయడం నుండి వారించారు. ఆయన తమ‌ సమాధిని పండగ (మేళా, ఉర్సు, జాతర) లా చేయడం నుండి వారించారు.

7 – సమాధులను అవమానించడం, తొక్కడం, వాటిపై కూర్చోవడం, వాటిని ఆనుకోవడం, వాటిని విపరీతంగా గౌరవించడం, సందర్శించడం ఆయన పద్దతి కాదు.

8- ఆయన సహాబాల సమాధులను సందర్శించేవారు, అల్లాహ్ వారిని క్షమించాలని దుఆ చేయడానికి. ఖబ్రిస్తాన్ వెళ్ళేవారు ఈ దుఆ చదవాలని ఆదేశించారు: అస్సలాము అలైకుం అహ్లద్ దియారి, మినల్ మూమినీన వల్ ముస్లిమీన వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్, నస్ అలుల్లాహ లనా వలకుముల్ ఆఫియహ్. (ఓ ఈ గృహవాసులైన విశ్వాసులారా! ముస్లిములారా! మీపై శాంతులు కురియుగాక, మేము ఇన్ షా అల్లాహ్ మీతో కలువనున్నాము.  మేము మా కొరకు మరియు మీ కొరకై అల్లాహ్ తో సంక్షేమాన్ని కోరుతున్నాము. (ముస్లిం)

9- ఆయన విధానం ఏమిటంటే ఆయన మృతుల కుటుంబీకులను సందర్శించడానికి వెళ్లేవారు. కానీ సందర్శించడానికి ఏదైనా సమయాన్ని ప్రత్యేకించడం, లేదా సమాధుల మరియు వేరే చోటు జమ అయి ఖుర్ఆన్ చదవడం ఎప్పుడు చేయలేదు. (అంటే ఖుర్ఆన్ ఖ్వానీలు, ఫాతిహాలు చేసేవారు కాదు).

10- ఆయన విధానంలో నుండి మరొకటి ఏమిటంటే ప్రజల కొరకు మృతుల కుటుంబీకులు భోజనాలను నిర్వహించకూడదు, పైగా ప్రజలే మృతుల కుటుంబీకుల కొరకు భోజనాలను సిద్ధం చేసి వారికి తినిపించాలి. (దీని ద్వారా మూడొద్దులు, దస్వా, బీస్వా, తీస్వా, చాలీస్వా లాంటి వన్నీ యోగ్యం లేవని స్పష్టంగా తెలుస్తున్నది).

1- ఆయన విధానం జకాత్ కు సంబంధించి అత్యంత పరిపూర్ణమైనది. అంటే: దాని విధి అయ్యే సమయం, దాని పరిమాణం, దాని నిసాబ్ (జకాత్ విధింపు పరిమితి), అది ఎవరిపై విధి అవుతుంది, దాని హక్కుదారులు ఎవరు అన్న విషయాలన్నీ క్షుణ్ణంగా తెలియచేసారు. ధనవంతులు ఔచిత్యాలను మరియు పేదవాళ్ళ  అవసరాలను దృష్టిలో పెట్టడం జరిగినది. మరియు పేదల అవసరాలు తీరే రీతిలో ధనవంతుల సంపదలో ఏ దౌర్జన్యం లేకుండా జకాత్ విధిగా చేయబడింది.

2- ఎవరు జకాత్ తీసుకోడానికి అర్హులని గ్రహించేవారో, అతనికి జకాత్ ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా జకాత్ సొమ్ములో నుంచి అడిగితే, ఆ వ్యక్తి గురించి ఆయనకు తెలియకపోతే, అతనితో ఈ విధంగా చెప్పి, ఇచ్చేవారు: ఈ జకాతులో ధనవంతులకు, మరియు సంపాదించే స్థోమత కలిగిన వ్యక్తులకు ఎలాంటి భాగం లేదు.

3- ఆయన విధానం: ఏ ప్రాంతపు ధనికులతో జకాత్ తీసుకోబడినదో అదే ప్రాంతపు హక్కుదారుల్లో దానిని పంచేవారు, ఆ తర్వాత మిగిలినది తెప్పించి వేరే చోటున పంచేవారు.

4- ఆయన జకాత్ వసూళ్ళ కొరకై నియమితులైన వారిని జంతువులు, పండ్లు, మరియు పంటపొలాలు లాంటి బాహ్యమైన ఆస్తులు కలవారి వద్దకే పంపేవారు.

5- ఆయన ఖర్జూరం మరియు ద్రాక్ష తోటల యాజమానుల వద్దకు అంచనా వేసే (నిపుణుల)ను పంపేవారు, వారు పండ్లను మంచిగా చూసి ఎన్ని కిలోలు అవుతాయో అంచనా వేసేవారు, దీని ఆధారంగానే ప్రవక్త వారిపై ఎంత జకాత్ ఉంటుందో నిర్ణయించేవారు.

6- ఆయన విధానం: గుర్రాలు, బానిసలు, కంచర గాడిదలు మరియు గాడిదలపై జకాత్ తీసుకునేది కాదు. అదే విధంగా తూకం చేయలేని మరియు నిల్వ ఉంచలేని కూరగాయలు మరియు పండ్లపై కూడా జకాత్ తీసుకునేవారు కాదు. కానీ ద్రాక్ష మరియు ఖర్జూరాల నుండి జకాత్ తీసుకునేవారు. అయితే అన్ని రకాల ఖర్జూరాలలో నుండి జకాత్ తీసుకునేవారు, అందులో వాటి క్వాలిటీ మరియు రకాలను బట్టి వ్యత్యాసం పాటించేవారు కారు.

7- జకాతులో మంచి సంపదనే వెతికి తీసే విధానం కాదు ఆయనది. బదులుగా మధ్యస్థంగా ఉండే సంపదను తీసుకునేవారు.

8- సదఖా చేసినవారు, తాము సదఖ చేసిన వస్తువుని కొనుగోలు చేయడం నుండి వారించేవారు. ఎవరైనా పేదవాడు సదఖాగా పొందిన సొమ్ము ధనవంతునికి బహుమతిగా ఇస్తే దానిని తీసుకనే, తినే అనుమతి ఇచ్చేవారు.

9- ఆయన ఒక్కోసారి జకాత్ మరియు సదఖా యొక్క సంపద నుండి ముస్లిముల యొక్క లాభం లేదా సంక్షేమ పనుల కొరకు అప్పుగా తీసుకునేవారు. మరియు అవసరం ఉన్న సమయంలో సమయానికి ముందే జకాత్ తీసుకునేవారు. (ఉదాహరణకు అబ్బాస్ రదియల్లాహు అన్హు గారి నుండి రెండు సంవత్సరాల జకాత్ ముందుగానే తీసుకున్నారు.)

10- ఆయన వద్దకు ఎవరైనా జకాత్ తీసుకొని వస్తే “అల్లాహుమ్మ బారిక్ ఫీహి వఫీ ఇబిలిహ్” (ఓ అల్లాహ్! ఇందులో మరియు అతని ఒంటెలలో శుభాన్ని ప్రసాదించు) అని లేదా “అల్లాహుమ్మ సల్లి అలైహ్” అని దుఆ చేసేవారు. (ముత్తఫఖున్ అలైహి).

1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సదఖయే ఫిత్ర్ లో ఒక సాఅ్ ఖర్జూరం, లేదా బార్లీ, లేదా పన్నీర్, లేదా కిష్మ్మిష్ ను విధిగా చేసారు.

2- ఆయన విధానం: పిత్రాదానం పండుగ నమాజ్ కి ముందే తీయాలి. ఆయన ఇలా తెలిపారు: ఎవరైతే దానిని నమాజ్ కు ముందు తీస్తారో, అది స్వీకరింపబడుతుంది, మరెవరైతే నమాజు తర్వాత తీస్తారో అతను ఒక సాధారణ సదఖా (దానం) చేసినట్లు. (అబూ దావూద్).

3-  ఆయన విధానం: ఫిత్రదానం బీద వాళ్లకు మరియు చెయ్యి చాచి అడగని పేదవాళ్ల కొరకు ప్రత్యేకించేవారు. మరియు జకాత్ యొక్క ఎనిమిది రకాల హక్కుదారులలో ఏ ఒక్కరికీ ఇచ్చేవారు కాదు.

1- ఆయన అందరి కంటే ఎక్కువగా దానాలు చేసేవారు. తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా అంతా దానం చేసేసేవారు.

2- ఆయనతో ఎవరూ ఏమీ అడిగినా ఆయన ఇచ్చేసేవారు. ఒకవేళ అది తక్కువ ఉన్నా లేదా ఎక్కువ ఉన్నా .

3- తీసుకునే వాడికి తీసుకోవడంలో ఎంత సంతోషం, ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ  ఆనందం ఆయనకి ఇవ్వడంలో ఉండేది.

4- ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం కలవాడు ఆయన ముందు వస్తే అప్పుడు ఆయన తమ కంటే ఎక్కువ అతనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఒక్కోసారి తమ ఆహారం విషయంలో ఒక్కోసారి తమ బట్టల విషయంలో.

5- ఆయనతో కలిసిన వారు స్వీయ ఉదార భావాన్ని తమ నుండి నేర్చుకునేవారు

6- ఆయన ఇచ్చే బహుమతులు మరియు దానాలు వివిధ రకాలుగా ఉండేవి: ఒక్కోసారి ప్రత్యేక బహుమాన రూపంలో, ఒక్కోసారి సదఖాగా, ఒక్కోసారి సాదారణ గిఫ్ట్ రూపంలో, ఒక్కోసారి ఎవరితో ఏదైనా వస్తువు కొని, ఆ వస్తువు మరియు దాని పైకం (ధర) రెండూ అమ్మేవానికే ఇచ్చేసేవారు, ఒక్కోసారి అప్పు తీసుకొని దానికంటే ఎక్కువ, ఉత్తమ రీతిలో తిరిగి ఇచ్చేవారు, ఒక్కోసారి ఎవరి వద్దనైనా బహుమతి పుచ్చుకుంటే అతనికి ఏదో ఒక విధంగా దాని ప్రతిఫలం అంతకంటే ఎక్కువ లేదా మంచిది ఇచ్చేవారు.

1- ఆయన విధానం: (29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత) రమజాన్ నెల వంక ప్రత్యక్షంగా చూడనంత వరకు, లేదా చూసినట్లు కనీసం ఎవరైనా ఒక్కరు సాక్ష్యం ఇవ్వనంత వరకు ఉపవాసం ప్రారంభించేవారు కాదు. నెలవంక కనబడనిచచో, ఎవరు సాక్ష్యం ఇవ్వనిచో, షాబాన్ నెల ముప్పై రోజులు పూర్తి చేసుకొనేవారు.

2- ఒకవేళ 29వ షాబాన్ సూర్యాస్తమయం తర్వాత మేఘాలు క్రమ్ముకొని ఉంటే ఆయన షాబాన్ ముప్పై రోజులను పూర్తి చేసేవారు. మరియు మేఘావృతమైన రోజున ఉపవాసం ఉండేవారు కాదు, ఉండాలని ఆజ్ఞపించనూ లేదు.

3- ఆయన విధానం: రమజాన్ ముగింపుకై ఇద్దరు వ్యక్తుల సాక్షం స్వీకరించేవారు. (అంటే రమజాన్ ప్రారంభానికై ఒక్కరి సాక్ష్యం, పండుగకై ఇద్దరి సాక్ష్యం అవసరం).

4- ఒకవేళ పండుగ నమాజు చేసే సమయం ముగిసిన‌ తర్వాత ఇద్దరు వ్యక్తులు నెలవంక చూసామని సాక్ష్యం ఇస్తే, ఆయన ఉపవాసాన్ని విరమించేవారు, అందరికీ ఇదే ఆదేశమిచ్చేవారు. మరుసటి రోజు పండగ నమాజు దాని సమయంలో చేసేవారు.

5- ఆయన ఇఫ్తార్ చేయడంలో తొందర చేసేవారు, అంటే సూర్యాస్తమయం అయిన వెంటనే ఇఫ్తార్ చేసేవారు మరియు దాని తాకీదు చేసేవారు. అదేవిధంగా సహరీ చేసేవారు మరియు దాని గురించి ప్రోత్సహించేవారు, ఆయన సహరిలో ఆలస్యం చేసేవారు అంటే సహరీ చివరి సమయంలో సహరీ చేసేవారు మరియు అందరికీ ఇలాగే చేయాలని తాకీదు చేసేవారు.

6- ఆయన నమాజ్ కి ముందు ఇఫ్తార్ చేసేవారు. మరియు కొన్ని తాజా ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి లేకపోతే ఎండు ఖర్జూరాలతో ఇఫ్తార్ చేసేవారు. ఒకవేళ అవి కూడా లేకపోతే కొన్ని నీళ్ల గుటకలతో ఉపవాసాన్ని విరమించేవారు.

7- ఆయన ఇఫ్తార్ సమయంలో ఈ దుఆ పఠించేవారు: జహబజ్జమఉ వబ్ తల్లతిల్ ఉరూఖు వసబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్. (దాహం తీరింది, నరాలు తడి అయ్యాయి, అల్లాహ్ తలుచుకుంటే ప్రతిఫలం కూడా లభిస్తుంది.)

8- ఆయన విధానం: రమజా మాసంలో అనేక రకాల ఆరాధనలు ఎక్కువగా చేసేవారు. రమజాన్ లోని ప్రతి రాత్రి ప్రవక్త మరియు జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ ఒకరికొకరు వినిపించుకునేవారు.

9- ఆయన ఈ మాసంలో అధికంగా దానధర్మాలు, ఉపకారాలు (ప్రజల ఎడల మేలు), ఖుర్ఆన్ పారాయణం, నమాజ్, జిక్ర్ (అల్లాహ్ స్మరణ) చేస్తూ ఉండేవారు మరియు ఏతెకాఫ్ కూడా పాటించేవారు.

10- ఆయన వేరే రోజుల్లో చేయనటువంటి ఆరాధనలు ప్రత్యేకంగా రమజాన్ లో చేసేవారు. ఒక్కోసారి ఆయన సౌమె విసాల్ పాటించేవారు, కాని దాని నుండి సహాబాలను వారించేవారు. కాని తర్వాత సహాబాలకు కూడా సహరీ వరకు విసాల్ చేసే అనుమతి ఇచ్చారు. (సౌమె విసాల్ అంటే: ఇఫ్తార్ చేయకుంటే సహరీ వరకు ఏమీ తినకుండా ఉండుట. అయితే ఇప్పుడు ఇది మన కొరకు యోగ్యం లేదు).

1- ఆయన ఉపవాసిని సంభోగం నుండి, అరుపులు గోలల నుండి, తిట్లు, వివాదాల నుండి వారించేవారు. ఒకవేళ ఎవరైనా అతని పట్ల వివాదానికి దిగితూ (కయ్యానికి కాలు రువ్వితూ) తిట్లకు దిగితే “నేను ఉపవాసంతో ఉన్నాను” అని చెప్పమన్నారు.

2- ఆయన రమజాను మాసంలో ప్రయాణం చేస్తే ఒక్కోసారి ప్రయాణస్థితిలో ఉపవాసం ఉండేవారు, ఒక్కోసారి ఉపవాసం ఉండేవారు కారు. ఆయన సహాబాలకు రెండు విషయాలలో ఒకటిని ఎంపిక చేసుకునే అనుమతిని ఇచ్చారు.

3- ఒకవేళ ముస్లిముల సైన్యం శత్రువుల వద్దకు సమీపంగా ఉంటే ఉపవాసం ఉండవద్దని ఆజ్ఞాపించేవారు.

4- ప్రయాణం కారణంగా ఉపవాసం ఉండకపోవడానికి ఆయన ఎటువంటి దూర పరిమితిని (హద్దును) నియమించలేదు.

5- సహాబాలు ప్రయాణం మొదలుపెట్టగానే ఉపవాసాన్ని విడిచిపెట్టేసేవారు. ఊరి పొలిమరలకు దూరం అయ్యాకే ఉపవాసం విరమించాలని భావించేవారు కాదు. పైగా ఇలా అనేవారు: ఇదే ప్రవక్తవారి సున్నత్ (విధానం).

6- కొన్ని సందర్భాల్లో ప్రవక్త మేల్కొనే సరికి, ఫజ్ర్ సమయం సమీపించి ఉంటే, సంభోగం వలన అశుద్ధావస్తలో ఉంటే, ఫజ్ర్ సమయం ప్రవేశించాక స్నానం చేసేవారు. ఉపవాసాన్ని పూర్తి చేసేవారు.

7- ఆయన రమజాన్ లో ఉపవాస స్థితిలో కొందరు భార్యలకు ముద్దు పెట్టుకునేవారు. (కాని ప్రవక్త తమను తాము అదుపులో ఉంచుకునే రీతిలో మనం లేము గనక మన ఉపవాసం భంగం కాకుండా ఉండడానికి దీనికి దూరముండడమే ఉత్తమం).

8- ఆయన నుండి ఉపవాస స్థితిలో మిస్వాక్ చేయడం, తలపై నీళ్లు పోసుకోవడం, (జాగ్రత్త పాటిస్తూ) ముక్కులో నీళ్ళు ఎక్కించడం, పుక్కిలించడం కూడా నిరూపితమై ఉంది.

9- ఆయన ఒకవేళ ఎవరైనా మరిచిపోయి తింటే అతనికి ఖజా చేయమని ఆజ్ఞాపించేవారు కాదు.

10- ఆయన వ్యాధిగ్రస్తునికి మరియు ప్రయాణికుడికి ఉపవాసం ఉండవద్దని, తర్వాత ఆ ఉపవాసాన్ని పూర్తి (ఖజా) చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఒకవేళ గర్భిణీ మరియు పాలు త్రాగించే స్త్రీలకు తమ గురించి అనారోగ్య భయం ఉంటే వారికి కూడా ఉపవాసం వదులుకునే అనుమతి ఇచ్చారు, కానీ వారు తర్వాత ఆ ఉపవాసాలను పూర్తి (ఖజా) చేసుకోవాలి.

1- ఉపవాసంలో ఆయన విధానం అందరికంటే పరిపూర్ణమైనది. కోరిన  లక్ష్యాన్ని పొందే మార్గం మరియు అది మనస్సుకు ఏ భారం కాకుండా సులభతరంగా ఉండేది.

ఆయన నఫిల్ ఉండడం మొదలు పెడితే, ఇక ఆయన ఉపవాసాలు వదలరేమో అనిపించేది. వదిలితే ఇక ఉండరేమో అనిపించేది.

ఆయన రమజాన్ తప్ప వేరే ఏ నెలలో పూర్తిగా ఉపవాసాలుండలేదు. మరియు షాబాన్ నెలలో ఉన్నంత ఎక్కువ ఏ వేరే నెలలో ఉపవాసాలుండలేదు. మరియు ఆయన ఉపవాసముండ కుండా ఏ నెలా గడిచేది కాదు. (అనగా ఆయన ప్రతీ నెలలో కొన్ని నఫిల్ ఉపవాసాలు పాటించేవారు).

2- ఆయన ప్రత్యేకించి శుక్రవారం రోజున ఉపవాసం ఉండటాన్ని ఇష్టపడలేదు. మరియు సోమవారం, గురువారం ప్రత్యేకించి ఆయన ఉపవాసాలు పాటించేవారు.

3- ప్రయాణంలో ఉన్నా లేదా స్థానికంగా ఉన్నా, అయ్యామే బీజ్ (చంద్ర మాసం ప్రకారం 13,14,15 తేదీలలో) ఉపవాసాలు ఎప్పుడూ వదిలేవారు కాదు.

4- ఆయన ప్రతినెల ప్రారంభ మూడు రోజులు ఉపవాసం ఉండేవారు.

5- ఆయన షవ్వాల్ నెల ఉపవాసాల గురించి ఇలా తెలిపారు: రమజాన్ వెంటనే ఈ ఉపవాసాలు ఉంటే పూర్తి కాలం ఉపవాసాలు ఉన్నట్లే. (ముస్లిం)

ఆయన ఆషూరా (మొహర్రం 10 వ తారీఖున) ఉపవాసాన్ని మిగతా ఉపవాసాల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు.

6- ఆయన అరఫా (జిల్ హిజ్జా 9 వ తేదీ) ఉపవాసం గురించి ఇలా అన్నారు: అరఫా రోజున ఉపవాసం ఉండటం వల్ల గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం; మొత్త రెండు సంవత్సరాల పాపాలు క్షమించబడతాయి. (ముస్లిం).

ఆయన విధానం: అరఫా మైదానంలో (హజ్ లో) ఉన్నప్పుడు అరఫా రోజున ఉపవాసం ఉండేవారు కాదు.

7- ఆయన ఎప్పుడూ నిరంతరంగా ఉపవాసాలు పాటించలేదు. బదులుగా ఆయన ఇలా అన్నారు: ఎవడైతే నిరంతరంగా ఉపవాసాలు పాటిస్తాడో అతను ఉపవాసమూ లేనట్టే, మరియు ఇఫ్తార్ కూడా చేయనట్లే. (నసాయీ)

8- ఒక్కోసారి ఆయన నఫిల్ ఉపవాసానికి సంకల్పించుకునేవారు మరియు ఉపవాసాన్ని విరమించేసేవారు. తరచుగా ఏమయ్యేదంటే; ఆయన ఇంట్లోకి ప్రవేశించి ‘ఈరోజు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా?’ అని అడిగేవారు, ఒకవేళ  లేదు అని సమాధానం దొరికితే, ఆయన అప్పుడు నేను ఉపవాసం ఉంటాను అనేవారు.

9- ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉపవాస స్థితిలో ఉన్నప్పుడు అతనిని ఎవరైనా భోజనానికి పిలిస్తే అతను వారితో ఈరోజు నేను ఉపవాసంతో ఉన్నాను అని అనాలి. (ముస్లిం)

1- ఆయన రమజాన్ చివరి పది రోజులలో ఏతికాఫ్ పాటించేవారు, మరియు ఈ పద్ధతి ఆయన మరణం వరకు పాటించారు. ఒకసారి రమజాన్ లో ఏతికాఫ్ పాటించనందుకు షవ్వాల్ నెలలో దాని ఖజా పాటించారు.

2- ఆయన లైలతుల్ ఖద్ర్ (ఘనమైన రేయి)ని అన్వేషించటానికి ప్రారంభ రమజాన్ లోని మొదటి దశలో, ఆ తర్వాత రెండో దశలో, ఆ తర్వాత మూడో దశలో ఎతికాఫ్ చేసారు. అది చివరి దశలో ఉందని ఆయనకు తెలిశాక, ఆయన అల్లాహ్ సన్నిధికి చేరుకునేంతవరకు ప్రతి రమజానులో చివరి దశలోనే ఏతికాఫ్ పాటించారు.

3- ఆయన ఉపవాసం ఉన్న స్థితిలోనే ఏతెకాఫ్ పాటించేవారు.

4- ఆయన గుడారం(డేరా) వేయమని ఆజ్ఞాపించేవారు. అప్పుడు ఆయన కొరకు మస్జిద్ లో గుడారం ఏర్పాటు చేయడం జరిగేది. ఆయన అందులోనే ఉండి అల్లాహ్ ఆరాధన చేసేవారు.

5- ఆయన ఏతికాఫ్ పాటించాలని సంకల్పించుకుంటే ఫజ్ర్ నమాజు తర్వాత ఆ గుడారంలోనికి ప్రవేశించేవారు.

6- ఏతికాఫ్ లో ఉన్నప్పుడు ఆయన పడక గుడారంలో పెట్టబడేది, ఆయన తమ డేరా లో ఒంటరిగా ఉండేవారు.

7- ఆయన ఏతికాఫ్ స్థితిలో ఉన్నప్పుడు తమ ఇంటికి కేవలం తమ ముఖ్యమైన (మలమూత్ర విసర్జన, స్నానం లాంటి) అవసరాలకు మాత్రమే వెళ్లేవారు.

8- ఆయన ఏతికాఫ్ స్థితిలో తమ‌ తలను ఆయెషా రజియల్లాహు అన్హా గారి వైపు తీసేవారు అప్పుడు ఆమె బహిష్టు స్థితిలో ఉండి కూడా ఆయన తలను కడిగి, దువ్వేది. (మస్జిదె నబవీ ప్రక్కనే ఆయిషా రజియల్లాహు అన్హా గది ఉండినది).

9- ఎవరైనా భార్య గుడారాంలో ప్రవక్తను కలవడానికి వస్తే, ఆయన వారితో మాట్లాడడం తప్ప ఇతరత్రా ఏదీ చేసేవారు కాదు. వారు వెళ్ళడానికి లేచి నిలబడితే, అది రాత్రి పూట గనక వారి వెనక తోడుగా మస్జిద్ బైట (ప్రాంగణంలో) వచ్చేవారు.

10- ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏతికాఫ్ స్థితిలో భార్యలతో లైంగిక సంబంధం (సంభోగం) లేదా ముద్దు పెట్టుకోవడం లాంటివేమీ చేసేవారు కాదు.

11- ఆయన ప్రతి సంవత్సరం పది రోజులు ఏతికాఫ్ పాటించేవారు. కానీ తమ మరణానికి ముందు సంవత్సరం ఆయన 20 రోజుల ఏతికాఫ్ పాటించారు.

1- ఆయన నాలుగు సార్లు ఉమ్రా చేశారు.

* మొదటి సారి: ఉమ్రయె హుదైబియా. ఆ సందర్భంలో మక్కా ముష్రికులు (అవిశ్వాసులు) ఆయన్ను (మరియు సహాబాలను) మస్జిదె హరామ్ లో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అప్పుడు ఆయన అడ్డుకోబడిన చోటనే జంతువు ఖుర్బానీ చేసి, తలవెంట్రుకలు తీయించుకొని, హలాల్ అయ్యారు (అంటే ఇహ్రాం స్త్థితిలో నుండి బైటికి వచ్చారు), ఆ తర్వాత తిరిగి మక్కా వెళ్ళిపోయారు.

* రెండొవ సారి: ఉమ్రయె ఖజా. దీనిని ఆయన హుదైబియా తర్వాతి సంవత్సరంలో చేశారు.

* మూడొవ సారి: హజ్జె ఖిరాన్ తో కలిపి చేసినది.

* నాలుగోవ సారి: జిఇర్రానా ప్రదేశము నుండి చేసిన ఉమ్రా.

2- ఆయన చేసిన నాలుగు ఉమ్రాలలో ఏ ఒక్కటి కూడా మక్కాలో ఉండి, మళ్ళీ బయటకు వెళ్ళి చేయలేదు, అన్నీ కూడా బయటి నుండి మక్కాలో ప్రవేశిస్తూ చేసినవే.

3- ఆయన సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉమ్రా చేసినట్లు రుజువైనది. ఆయన సంవత్సరంలో రెండు ఉమ్రాలు చేయలేదు.

4-ఆయన ఉమ్రాలన్నీ హజ్ నెలల్లోనే చేసారు.

5- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశం: రమదాన్ లో చేయబడిన ఉమ్రా హజ్ తో సమానం (ముత్తఫఖున్ అలైహి)

1- హజ్జ్ చేయడం విధి అని ఆదేశం అవతరించిన వెంటనే ప్రవక్త హజ్ కొరకు సిద్ధం అయిపోయారు. ఆయన (మదీనా జీవితంలో) కేవలం ఒకే హజ్ చేసారు, అది కూడా హజ్జె ఖిరాన్.

2- ఆయన జొహ్ర్ నమాజ్ తర్వాత ఇహ్రామ్ ధరించారు. మరియు ఈ పదాలతో తల్బియా చదివారు: లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లక లబ్బైక్. ఇన్నల్ హమ్ద, వన్నిఅమత లక వల్ ముల్క లా షరీక లక్.  (నేను హాజరైయ్యాను ఓ అల్లాహ్! నేను హాజరైయ్యాను, నీకు భాగస్వాములు ఎవరూ లేరు. నేను హాజరయ్యాను, నిస్సందేహంగా సకల ప్రశంసలు నీ కోసమే! సమస్త వరాలు నీ వైపు నుండే, సామ్రాజ్యాధికారం అంతా కూడా నీదే, వీటిలో కూడా నీకు ఎవరూ భాగస్వామి లేరు. (బుఖారీ, ముస్లిం).

ఆయన తమ స్వరాన్నిపెంచి బిగ్గరగా తల్బియా చదివారు, అది సహాబాలందరూ విన్నారు. అల్లాహ్ ఆదేశమేరకు ఆయన వారందరికీ బిగ్గరగా తల్బియా పఠించమని ఆజ్ఞాపించారు. పైన తెలిపిన తల్బియా ప్రవక్త పలుకుతూ ఉంటే సహాబాలు కూడా తగ్గిస్తూ , పెంచుతూ తల్బియా పలికేవారు. ఆయన ఎవరినీ నిరాకరించలేదు.

3- ఆయన సహాబాలకు హజ్ యొక్క మూడు రకాలు (ఖిరాన్, తమత్తుఅ్, ఇఫ్రాద్) లో ఏది తలిస్తే దాని ఇహ్రామ్ చేసే అనుమతి ఇచ్చారు. పిదప మక్కాకు సమీపంగా చేరుకున్నప్పుడు ఖుర్బానీ జంతువు తమ వెంట తీసుకురాని వారికి ఇలా ఆదేశించారు: మీరు ఉమ్రా చేసి, ఇహ్రామ్ స్థితి నుండి బైటికి వచ్చి, హజ్జె ఖిరాన్ సంకల్పాన్ని విరమించుకోండి.

4- ప్రవక్త ఈ హజ్జ్ ప్రయాణం తమ స్వారీ మీద చేసారు. దానిపై ఎటువంటి పల్లకి (కజావా), లేదా అంబారీ (హౌదజ్) ఉండేది కాదు మరియు ఆయన ప్రయాణ సామాగ్రి మరియు దారిలో తినత్రాగే వస్తువులు ఆయన స్వారీపైనే ఉండినవి.

పిదప ఆయన మక్కాకు చేరుకున్నాక ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు లేదో వారిని తప్పనిసరిగా ఉమ్రా కి మారమని ఆదేశించారు. ఉమ్రా పూర్తయ్యాక హలాల్ అయిపోవాలని ఆదేశించారు. ఎవరి వద్దనైతే ఖుర్బానీ జంతువు ఉందో వారిని మాత్రమే ఇహ్రామ్ స్థితిలో ఉండమని ఆదేశించారు. పిదప ఆయన జీతువా (ZeeTuwa) ప్రాంతానికి చేరుకున్నారు, అక్కడ జిల్ హిజ్జా 4 వ తేదీ రాత్రి గడిపారు. ఫజ్ర్ నమాజ్ చేసి గుస్ల్ (స్నానం) చేసి, మక్కా వైపునకు బయలుదేరారు. ఆయన మక్కాలో, దాని ఎగువ ప్రాంతం అయిన హుజూన్ కి సమీపంగా సనియతుల్ ఉల్యా వైపు నుండి పగటి పూట ప్రవేశించారు.

ఆయన మస్జిదే హరామ్ లో ప్రవేశించాక తహియ్యతుల్ మస్జిద్ చేయలేదు. (ఎందుకంటే ఇక్కడ తవాఫ్ (ప్రదక్షిణం) చేయడమే తహియ్యతుల్ మస్జిద్). ఆ పిదప కాబా వరకు, హజ్రె అస్వద్ వద్దకు వచ్చి, దానిని చుంబించారు, దాని వద్ద ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. పిదప ఆయన కుడి వైపుకు తిరిగి, కాబాను ఎడమ వైపున ఉంచారు. ఆయన కాబా ద్వారం వద్ద, జలదారి (దోనీ, పర్ నాలా) క్రింద, కాబా పైన లేదా దాని మూల మూలన దుఆ చేయలేదు. హజ్రె అస్వద్ మరియు రుక్నే యమానీ మధ్య ఈ దుఆ చదవడం రుజువై ఉంది: రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వఫిల్ ఆఖిరతి హసనతవ్ వఖినా అజాబన్నార్. (ఓ మా ప్రభూ! ప్రపంచం లోను మాకు మేలుని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మాకు మేలును ప్రసాదించు మరియు మమ్మల్ని అగ్ని శిక్ష నుండి కాపాడు).

ఆయన తవాఫ్ చేస్తున్నప్పుడు ఈ దుఆ తప్ప వేరేదీ ప్రత్యేకించి చదివాలని నిర్ణయించలేదు.

ఆయన తవాఫ్ లో మొదటి మూడు రౌండ్లు ‘రమ్ల్’ చేసేవారు, అంటే: అడుగులు దగ్గరదగ్గరగా వేస్తూ కొంచెం వేగంగా నడిచేవారు. అలాగే ‘ఇజ్తిబాఅ’ చేసేవారు, అంటే: కుడి భుజం ఖాళీగా ఉంచి ఎడమ భుజంపై వస్త్రాన్ని కప్పేవారు. ఈ విధంగా కుడి భుజం నగ్నంగా మరియు ఎడమ భుజం కప్పబడి ఉండేది.

ఆయన హజ్రె అస్వద్ ముందు వచ్చినప్పుడల్లా దాని వైపున సైగ చేశారు, లేదా వంకర కర్రతో తాకి, దానిని చుంబించారు మరియు అల్లాహు అక్బర్ అన్నారు.

ఇదే విధంగా ఆయన రుక్నే యమానీని తాకారు కానీ‌ దానిని చుంబించలేదు. అలాగే దానిని ముట్టుకున్న తర్వాత తమ చేతిని చుంబించలేదు.

కాబా యొక్క తవాఫ్ పూర్తి చేశాక, మఖామె ఇబ్రాహీం వెనక వచ్చి, చదివారు: వత్తఖిజూ మిమ్ మఖామి ఇబ్రాహీమ ముసల్లా  [وَاتَّخِذُواْ مِن مَّقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ] (మీరు ఇబ్రాహీము నిలబడిన ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోండి). (బఖర:2-125).

పిదప రెండు రకాతుల నమాజ్ చేశారు. అప్పుడు మఖామె ఇబ్రాహీం ఆయన మరియు కాబా మధ్యలో ఉంది. మొదటి రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్) సూరయె కాఫిరూన్ మరియు రెండవ రకాతులో సూరయె ఫాతిహా తర్వాత (ఖుల్ హువల్లాహు అహద్) సూరయె ఇఖ్లాస్ పారాయణం చేశారు. నమాజు పూర్తి చేశాక హజ్రె అస్వద్ వద్దకు వెళ్ళి దానిని చుంబించారు. పిదప సఫా వైపుకు బయలుదేరి దాని సమీపంలో చేరగానే  [إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَآئِرِ اللّهِ) ఇన్నస్సఫా వల్ మర్వత మిన్ షఆఇరిల్లాహ్ చదివారు. (నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాలలోనివి). (బఖర: 2-158).

“అల్లాహ్ సఫాను ముందు ప్రస్తావించాడు కనుక నేను కూడు సఈ సఫా నుండే ప్రారంభిస్తాను” అని చెప్పి సఫా కొండపై ఎక్కి, కాబా దిశలో ముఖం చేసి, లాఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని  పలికి ఈ జిక్ర్ చేశారు: లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు అన్జజ వఅదహు వ నసర అబ్దహు వ హజమల్ అహ్జాబ వహ్ దహు.

«لا إله إلا اللهُ وَحْدَهُ لا شَرِيكَ لَهُ، لَهُ المُلْكُ وَلَهُ الحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شيءٍ قدير، لاَ إلهَ إلاَّ اللهُ وَحْدَهُ أَنْجَزَ وَعْدَهُ وَنَصَرَ عَبْدَه وَهَزَمَ الأحْزَابَ وحْدَه»

అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరి సమానులు లేరు. రాజ్యాధికారం ఆయనదే, సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన దాసునికి సహాయం చేసాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు. (ముస్లిం, నిసాయి).

ఆయన ఈ జిక్ర్ మధ్యలో ప్రార్థించారు. ఆయన ఈ జిక్ర్ 3సార్లు పఠించారు.

పిదప ఆయన సఈ చేస్తూ మర్వహ్ వైపునకు వెళ్ళారు, లోయలో పరిగెత్తడం మొదలుపెట్టారు, అది దాటిన తర్వాత సామాన్య రీతిలో నడుచుకుంటూ వెళ్ళారు, ఆయన కాలినడకన సఈ చేయడం ప్రారంభించారు, పిదప జనసమూహం కారణంగా స్వారీ చేస్తూ సఈ పూర్తిచేసారు. మర్వహ్ చేరుకున్నప్పుడల్లా ఆయన దాని పైకి ఎక్కేవారు మరియు కాబాను తమ ఎదురుగా ఉండేలా చేసి అల్లాహ్ గొప్పతనం, ఏకత్వం ప్రకటించేవారు అనగా అల్లాహు అక్బర్ మరియు లాఇలాహ ఇల్లల్లాహ్ అనేవారు. మరియు సఫా పై ఏ దుఆలు చేశారో మర్వహ్ పై కూడా అవే దుఆలు చేసేవారు, (కానీ ఇన్నస్సఫా వల్ మర్ వత ఆయత్ చదివేవారు కాదు).

ఆయన మర్వహ్ వద్ద సఈ పూర్తి చేసి, తమ వెంట ఖుర్బానీ జంతువు తీసుకురాని వారితో ఇహ్రామ్ విప్పి పూర్తిగా హలాల్ అయిపోవాలని అదేశమిచ్చారు, ఒకవేళ హజ్జే ఇఫ్రాద్ అయినా లేదా ఖిరాన్ మరియు తమత్తుఅ్ అయినా పర్లేదన్నారు.

 ఆయన వద్ద ఖుర్బానీ జంతువు ఉంది గనక ఆయన ఇహ్రామ్ విప్పలేదు మరియు ఈ విధంగా అన్నారు: ఒకవేళ నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేను ఖుర్బానీ జంతువును వెంట తీసుకువచ్చేవాడిని కాదు, కేవలం ఉమ్రా కొరకే ఇహ్రామ్ ధరించేవాడిని. (ముత్తఫఖున్ అలైహి)

అదే ప్రదేశంలో ఆయన గుండు చేయించుకునేవారి కొరకు 3సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక్కసారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.

ఆయన తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజు వరకు మక్కాలోని ‘జాహిర్’ అనే ప్రాంతంలో ముస్లింలతో పాటు బస చేసినప్పుడు నమాజులు ఖస్ర్ చేస్తూ ఉండేవారు.

తర్వియహ్ (జిల్ హిజ్జా 8వ) రోజునన చాష్త్ (సూర్యోదయం అయ్యాక కొంత) సమయానికి తమతో పాటు ఉన్న వారితో మినా కి బయలుదేరారు. ఎవరైతే ఇహ్రామ్ ను విప్పేసారో వారు తమ ఇండ్ల నుండి (హజ్జ్ కొరకు) ఇహ్రామ్ ధరించి బయలుదేరారు.

ఆయన మినా చేరుకున్నాక అక్కడే జొహ్ర్ మరియు అస్ర్ (మరియు మిగితా) నమాజులు వాటి సమయాల్లో చేసుకొని, రాత్రి గడిపారు. మరుసటి రోజు సూర్యోదయం తర్వాత అరఫా వైపుకు రవానా అయ్యారు. సహాబాలలో కొందరు తల్బియా చదువుతుండగా మరి కొందరు తక్బీర్ పలుక సాగారు. ఆయన రెండింటినీ వింటూ ఉన్నారు కానీ ఎవరినీ వద్దనేవారు కాదు.

ఆయన ఆజ్ఞమేరకు ఆయన కొరకు నమిరహ్ లో  గుడారం (డేరా) వేయడం జరిగింది, (నమిరహ్ అరఫాలోని భాగం కాదు, ఇది అరఫా తూర్పు భాగంలో ఉన్న ఒక గ్రామం) ఆయన అందులో బస చేసారు. పొద్దు వాలిన తర్వాత (జొహ్ర్ సమయానికి) ఖస్వా ఒంటెపై స్వారీ చేస్తూ ఉరనహ్ లోయలోని దిగువ భాగానికి చేరుకున్నారు. అదే ప్రదేశంలో తమ స్వారీ పై కూర్చునే అద్భుతమైన ఖుత్బా (ప్రసంగాన్ని) ఇచ్చారు. అందులో ఆయన‌

– ఇస్లాం మూలంశాలు, నియమాలను వివరించారు.

– బహుదైవారాధన మరియు అజ్ఞానపు దురాచారాలను ఖండించారు.

– ఒకరి ధన, మాన, ప్రాణాలు నిషిధ్ధమని ప్రకటించారు. వీటిని ఇతర మతాలవారు కూడా అంగీకరిస్తారు.

– అజ్ఞానపు వ్యవహారాలు మరియు వడ్డీ ని అంతమొందించారు.

– స్త్రీలతో ఉత్తమ రీతిలో వ్యవహరించాలని తాకీదు చేశారు.

– ఈ ప్రసంగంలోనే తమ అనుచర సమాజాన్ని ఖుర్ఆన్ (హదీసుల)ను గట్టిగా పట్టుకోవాలని ఆదేశించారు.

– తాను అల్లాహ్ ఆజ్ఞలను ఉత్తమ రీతిలో అందరికీ చేరవేశానని మరియు దైవ దౌత్య పదవి బాధ్యతలను నెరవేర్చానని, అలాగే సమాజం కొరకు శ్రేయస్సు కోరానని తమ సహాబాల (సహచరుల)తో అంగీకారం మరియు సాక్ష్యం తీసుకున్నారు, ఇంకా ఈ మాట పైన అల్లాహ్ ను కూడా సాక్షిగా ఉంచారు.

ఆయన ఖుత్బా ముగించిన తరువాత బిలాల్ రదియల్లాహు అన్హు గారిని అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అజాన్ మరియు ఇఖామత్ అయిన తర్వాత ఆయన సిర్రీ (మొనంగా) ఖిరాత్ చేసి, జొహ్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు, మళ్ళీ ఇఖామత్ ఇవ్వడం జరిగినది వెంటనే అస్ర్ నమాజ్ రెండు రకాతులు చేయించారు. మరియు ఆ రోజు జుమా రోజు. ఆయనతో పాటు మక్కా వారు కూడా ఈ ప్రయాణం లో ఉన్నారు. వారు కూడా ఖస్ర్ మరియు జమా చేసారు.

ఆయన నమాజు పూర్తి చేసిన తర్వాత మౌఖిఫ్ (అరఫాత్)కి చేరుకున్నారు. ప్రజలకు ప్రవక్త అరఫా (అంటే 9వ జిల్ హిజ్జ) రోజు ఉపవాసమున్నారేమో అనే సందేహం వచ్చినప్పుడు ఆయన గారి భార్య హజ్రత్ మైమూనా రజియల్లాహు అన్హా గారు ఒక పాత్రలో పాలు పంపారు, ఆయన మౌఖిఫ్ లోనే నిలబడి ఉన్నప్పుడు ప్రజలందరి ముందు దానిని త్రాగారు. మరియు అరఫా మైదానం పర్వతం దిగువ ప్రాంతంలో రాళ్ల దగ్గర ఖిబ్లాకు ఎదురుగా తమ స్వారీ పైనే ‘నడిచి వెళ్ళేవారి దారి’ ఎదురుగా ఉండేలా నిలబడ్డారు. సూర్యాస్తమయం వరకూ దుఆ చేస్తూ, విలపిస్తూనే ఉన్నారు. మరియు ప్రజలను ఉరనా లోయను వదలి, అరఫా లోపలికి రావాలని ఆజ్ఞాపించారు. ఇంకా ఇలా ఆదేశించారు: నేను ఇక్కడ నిలిచాను మరియు పూర్తి అరఫా నిలుచు ప్రదేశం. (ముస్లిం)

ఆయన దుఆలో తమ చేతులను ఛాతీ వరకూ పైకెత్తారు ఎలాగైతే ఒక నిరుపేద ఆహారాన్ని అర్జిస్తాడో. ఆ సందర్భంలో ఇలా తెలిపారు:

«خَيْرُ الدُّعَاءِ دُعَاءِ يَوْمِ عَرَفَةَ، وَخَيْرُ مَا قُلْتُ أَنَا والنبيونَ قَبْلِي: لَا إلهَ إلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الملكُ وَلَهُ الحَمْدُ وهو عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ»

దుఆలలో కెల్లా ఉత్తమమైన దుఆ అరఫా రోజు చేయబడే దుఆ మరియు నేను, నాకు పూర్వం ప్రవక్తలందరూ చేసిన అత్యుత్తమమైన (దుఆ): లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీకలహూ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మీజి).

ఏ అనుమానం లేకుండా, సంపూర్ణంగా సూర్యాస్తమయం అయి, దాని పసుపుతనం కూడా కనుమరుగయ్యాక, ఆయన అరఫాత్ మైదానం నుండి బయలుదేరారు. ఉసామా బిన్ జైద్ ను తమ‌ వెనక కూర్చోబెట్టుకున్నారు. మరియు ప్రశాంతంగా,  నిశ్శబ్దంగా నడుస్తూ ఉన్నారు మరియు ఒంటె పగ్గాన్ని పల్లకి పక్క భాగాన్ని తగిలే విధంగా తన వైపుకి లాగుతూ ఉన్నారు‌. ఆ సమయంలో ఆయన ఇలా ఆదేశించారు: ఓ ప్రజలారా! ప్రశాంతంగా నడవండి. ఎందుకంటే త్వరగా, వేగంగా నడవడం పుణ్యం కాదు. (బుఖారీ)

ఆయన మఅ్ జిమైన్ దారి నుండి వాపసు అయ్యారు మరియు జబ్బ్ దారి నుండి అరఫా లో ప్రవేశించారు.

పిదప ఆయన సైరుల్ అనఖ్ నడక శైలిని అలవర్చుకున్నారు, అనగా అత్యంత నిదానంగానూ కాదు, అత్యంత వేగంగానూ కాదు, మధ్యస్థ నడక శైలి. ఒకవేళ ఆయనకు విశాలమైన దారి కనపడితే కొద్దిగా వేగం పెంచేవారు.

ఆయన దారిలో నిరంతరంగా తల్బియా పలికుతూనే ఉన్నారు. దారిలో ఒక చోట మూత్ర విసర్జన కొరకు వెళ్ళి, తేలికగా వుజూ చేసుకున్నారు. పిదప మళ్ళీ నడక ప్రారంభించి ముజ్దలిఫా చేరుకొని నమాజు కొరకు వుజూ చేసారు. అజాన్, ఇఖామత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు. పిదప ఆయన ఒంటెలను కూర్చోబెట్టే కి మరియు ప్రజలు తమ సామానులను దించక ముందే మగ్రిబ్ నమాజు చేయించారు. వారు తమ సామానులను దించిన తర్వాత మళ్ళీ ఇఖామత్ ఇవ్వమని, ఇషా నమాజు చేయించారు. ఇషా కొరకు అజాన్ ఇవ్వబడలేదు. మగ్రిబ్ మరియు ఇషా మధ్యలో ఏ నమాజూ చేయలేదు.

ఆ తర్వాత ఆయన ఫజ్ర్ వరకు పడుకున్నారు, ఆ రాత్రి ఆయన ఏ నమాజు చేయలేదు.

ఆ రాత్రి చంద్రుడు ఆస్తమించాక తమ బలహీన కుటుంబీకులను ఫజర్ కి ముందే మినా కు బయలుదేరాలని ఆదేశించారు. సూర్యోదయానికి ముందే జమరాత్ కు రాళ్లు కొట్టవద్దని తాకీదు చేశారు.

ఫజ్ర్ సమయం ప్రవేశించచిన తొలి వేళలోనే ఫజ్ర్ నమాజు చేయించారు, దాని కొరకు అజాన్ మరియు ఇఖామత్ ఇవ్వబడినది. పిదప స్వారీ చేస్తూ మష్అరే హరామ్ కు చేరుకున్నారు. ‘ముజ్దలిఫా ప్రాంతమంతయూ నిలుచు స్థలమే’ అని ప్రకటన చేశారు. పిదప ఖిబ్లా వైపు తిరిగి వెళుతురు అయ్యే వరకు దుఆ చేస్తూ, విలపిస్తూ, తక్బీర్ మరియు తహ్లీల్ మరియు అల్లాహ్ స్మరణ లో నిమగ్నమైపోయారు.

 ఆ తర్వాత ఆయన ముజ్దలిఫహ్ నుండి ఫజల్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుని తమ వెనక కూర్చోబెట్టుకొని బయలుదేరారు. ఈ దారిలోనే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమాని జమ్రాత్ పై విసరడానికి ఏడు కంకర రాళ్ళు ఏరుకొని తీసుకు రమ్మని చెప్పారు. ప్రవక్త వాటిని తమ చేతుల్లో ఎగరవేస్తూ, “ఇలాంటి కంకర్రాళ్ళే జమరాత్ పై విసరండి, ధర్మ విషయంలో మితిమీరకండి! ఎందుకంటే గత జాతులు ధర్మ విషయంలో మితిమీరడం వల్లనే నశించిపోయాయి”. (నిసీఈ, ఇబ్నె మాజా).

ఆయన ముందుకు సాగుతూ వాదియె ముహస్సర్ నుండి దాటుతూ తమ ఒంటె వేగాన్ని పెంచారు. ఆ తర్వాత జమర అఖబా లేదా కుబ్రాకు దారితీసే మధ్య మార్గాన్ని ఎంచుకొని, దాని ద్వారా మినా చేరుకున్నారు. ఆయన రాళ్ళు రువ్వడం ప్రారంభించే వరకూ తల్బియా పలికుతూ ఉన్నారు‌. సూర్యోదయం తర్వాత వాది (లోయ)లోని క్రింది భాగంలో కాబాను ఎడమ వైపున, మినాను కుడి వైపున ఉంచి, జమరకి ముందు సవారిపైనే ఉండి, ఒకదాని తర్వాత ఒకటి ఏడు రాళ్ళు విసిరారు‌, ప్రతీ రాయి విసిరేటప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు.

పిదప ఆయన మినా కి వాపసు అయ్యారు.

అక్కడ అనర్గళంగా, స్పష్టమైనరీతిలో అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. అందులో

– ఖుర్బానీ రోజు యొక్క విశిష్ఠత, ప్రాముఖ్యత, గొప్పతనం,

– పవిత్ర మక్కా నగరం యొక్క విశిష్ఠత వివరించారు.

– అల్లాహ్ గ్రంథానికి అనుగుణంగా పరిపాలించే వారికి విధేయత చూపమన్నారు.

– హజ్జ్ యొక్క విధివిధానాలను బోధించారు.

పిదప ఆయన మినా లో ఖుర్బానీ చేసే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ అరవై మూడు ఒంటెలను తమ స్వహస్తాలతో జిబహ్ చేసారు. ఒంటెను నిలబెట్టి, దాని ముందు ఎడమ కాలును మడిచి నహర్ చేసారు. ఆ తర్వాత ఆయన జిబహ్ చేయడం ఆపేసి, వంద లోని మిగిలిన ఒంటెలను అలీ రజియల్లాహు అన్హు జబహ్ చేయాలని, వాటి మాంసం నిరుపేదలలో పంచిపెట్టాలని మరియు కసాయికి అతని కష్టార్జితంగా జంతువులో నుండి ఏమీ ఇవ్వద్దని ఆదేశించారు. (అంటే వేరే డబ్బులు ఇవ్వచ్చు, కాని ఖుర్బానీ మాంసం, దాని తోలు లాంటివేమీ ఇవ్వకూడదు).

 మినా మొత్తం ఖుర్బానీ చేసే ప్రదేశం అని అలాగే మక్కా వీధులు నడటానికి దారులు మరియు ఖుర్బానీ చేసే ప్రదేశం అని తెలియజేశారు.

ఆయన ఖుర్బానీ పూర్తి కాగానే క్షైరం చేసేవారిని పిలిచి, శిరోముండనం (గుండు) చేయించుకున్నారు. అతను కుడివైపు నుండి మొదలుపెట్టాడు‌. పిదప ఆయన అతనికి ఎడమ వైపున చెయ్యమని ఆజ్ఞాపించారు‌. ఆ తర్వాత తమ వెంట్రుకలను అబూ తల్హా రజియల్లాహు అన్హు గారికి ఇచ్చి, ప్రజలలో పంచి వేయమని ఆదేశించారు‌. (ముత్తఫఖున్ అలైహి).

అక్కడే గుండు చేయించుకునేవారి కొరకు మూడు సార్లు మరియు కటింగ్ చేయించుకునేవారి కొరకు ఒక సారి క్షమాభిక్ష కొరకు దుఆ చేశారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం హలాల్ అవ్వక ముందు ఆయిషా రజియల్లాహు అన్హా ఆయనకు సుగంధ ద్రవ్యాలను పూసారు. (ఇది మొదటి తహల్లుల్).

            ఆ తర్వాత ఆయన జొహ్ర్ కి ముందు స్వారీ చేస్తూ మక్కా చేరుకున్నారు. తవాఫె ఇఫాజా చేశారు. (దీనినే తవాఫె హజ్ అని కూడా అంటారు, ఇది రుకున్, ఇది చేయకుంటే హజ్ చేయనట్లే లెక్క). ఆయన దానికి మినహా వేరే తవాఫ్ చేయలేదు. (అంటే అక్కడ ఉండి, నఫిల్ తవాఫులు చేయలేదు). ఈ సందర్భంలో సఈ కూడా చేయలేదు. మరియు ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు, అలాగే వీడ్కోలు తవాఫ్ (తవాఫె విదాఅ)లో కూడా రమ్ల్ చేయలేదు. ఆయన రమ్ల్ కేవలం ప్రారంభ తవాఫ్ (తవాఫె ఖుదూమ్)లోనే చేసారు.

            తవాఫ్ పూర్తయిన పిదప ఆయన జమ్ జమ్ వైపుకు వెళ్ళారు. అక్కడ ప్రజలు త్రాగుతున్నారు. వారు జమ్ జమ్ నీళ్ళ పాత్ర ఆయనకు ఇచ్చారు, ఆయన నిలబడి త్రాగారు. (అక్కడ అలాంటి అవసరం ఉండే). పిదప ఆయన మినా తిరిగి వచ్చి, అక్కడే రాత్రి గడిపారు.

            ఆయన ఆ రోజు జొహ్ర్ నమాజు ఎక్కడ చేశారన్న విషయంలో బేధాభిప్రాయం ఉంది. ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా కథనం: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో జొహ్ర్ నమాజు చేశారు మరియు జాబిర్, ఆయిషా రజియల్లాహు అన్హుమా కథనం: మక్కాలో చేసారు.

            మరుసటి రోజు (11వ జిల్ హిజ్జ) పొద్దువాలే వరకు (జొహ్ర్ సమయ ప్రవేశానికి) వేచించి సమయం కాగానే తమ నివాసం నుండి జమరాత్ వైపుకు కాలినడకన వెళ్ళారు, స్వారి మీద కాదు. మస్జిదె ఖైఫ్ కి సమీపంగా ఉన్న జమరయె ఊలా నుండి మొదలు పెట్టారు. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అంటూ ఏడు రాళ్ళు కొట్టారు.

            ఆ తర్వాత జమర నుండి కొద్దిగ ముందుకు సాగి, కొంచెం కుడి వైపునకు వచ్చి, రెండు చేతులను పైకెత్తి, ఖిబ్లా వైపు ముఖం చేసి సుదీర్ఘమైన దుఆ చేసారు, అంటే సూర బఖర పఠించే అంత సేపు.

            పిదప జమరయె వుస్తా వైపుకి వచ్చారు. అల్లాహు అక్బర్ అని పలుకుతూ ఏడు రాళ్ళు కొట్టారు, పిదప లోయకు కలిసి ఉండే ఎడమ భాగం వైపుకి జరిగి ఖిబ్లా వైపు తిరిగి మొదటి సారి కంటే కొంత తక్కువ సుదీర్ఘమైన దుఆ చేసారు.

            పిదప ఆయన జమరయె అఖబా వద్దకు వచ్చి, లోయ లోనికి ప్రవేశించారు. జమరాను ముందు ఉంచి బైతుల్లాహ్ ను ఎడమ వైపున మరియు మినా ను కుడి వైపున ఉండేలా చేసుకొని అల్లాహు అక్బర్ అని పలికి ఏడు రాళ్ళు కొట్టారు. రాళ్ళు కొట్టిన తర్వాత అక్కడ ఎటువంటి దుఆ చేయలేదు తిరిగి వాపసు వచ్చేసారు.

            ప్రాధాన్యత పొందిన అభిప్రాయం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జొహ్ర్ నమాజ్ కి ముందే జమరాత్ పై రాళ్ళు విసిరారు. ఆ తర్వాత నమాజు చేసుకున్నారు. అబ్బాస్ రజియల్లాహు అన్హు గారికి హాజీలకు నీళ్ళు త్రాపించే బాధ్యత ఉన్న కారణంగా మినా రాత్రులు  (మినాలో కాకుండా) మక్కాలో గడపడానికి అనుమతిని ఇచ్చారు.

            ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రోజులే రాళ్ళు విసిరి వెళ్ళాలని తొందరపడలేదు, తష్రీఖ్ యొక్క మూడు రోజులు (జిల్ హిజ్జా 11,12,13) పూర్తిగా ఉండి, రాళ్ళు విసిరారు.

            జొహ్ర్ తర్వాత ముహస్సబ్ వైపు బయలుదేరారు, పిదప అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్, ఇషా నమాజులు చేసారు మరియు నిద్రపోయారు. అదే రాత్రి మక్కా బయలుదేరి, సహరీ సమయంలో తవాఫె విదాఅ (వీడ్కోలు) చేసారు. ఈ తవాఫ్ లో రమ్ల్ చేయలేదు (భుజాలను కదుపుతూ, చిన్న అడుగులు వేస్తూ వేగంగా నడవడం).

            సఫియా రదియల్లాహు అన్హా గారికి బహిష్టు (నెలసరి) రావడంతో ఆమెకు వీడ్కోలు తవాఫ్ వదిలేయమని అనుమతి ఇచ్చారు.

            ఆయిషా రజియల్లాహు అన్హా గారికి ఆమె మనస్సు తృప్తి కోసం తమ‌ సోదరునితో పాటు తన్ఈమ్[4] నుండి ఉమ్రా చేసే అనుమతి ఇచ్చారు. ఆమె రాత్రి ఉమ్రా ముగించిన తర్వాత ప్రవక్త సహాబాలకు బయలుదేరమని ఆదేశించారు. మరియు ప్రజలు మదీనా వైపునకు బయలుదేరారు.

(హజ్ లేదా ఉమ్రా చేసేవారు ఇచ్చే ‘జంతుబలి’ని, అలాగే తమ స్థానంలో ఉండి, మక్కాలో జిబహ్ చేయుబడుటకు పంపే జంతువుని ‘హద్ య్’ అంటారు).

1- ఆయన తమ వైపు నుండి ఒంటె మరియు ఆవుని ‘హద్ య్’ లో ఇచ్చారు. తమ సతీమణుల తరపున ఆవుని ఇచ్చారు. అలాగే ఆయన స్థానికంగా ఉన్న స్థితిలో, మరియు తమ ఉమ్రా, హజ్జ్ లలో ‘హద్ య్’ సమర్పించారు۔

2- ఆయన మేకను ‘హద్ య్’గా సమర్పించడానికి పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా వేసేవారు. కాటు వేసి చిహ్నం పెట్టేవారు కాదు. ఆయన స్థానికంగా ఉండి, ‘హద్ య్’ పంపుతున్న స్థితిలో ముహ్రిమ్ పై కొన్ని హలాల్ వస్తువులు నిషిద్ధమున్న్లు ఆయన పై నిషిద్ధమ్మయ్యేవి కావు.

3- ఆయన ఒంటె ‘హద్ య్’గా పంపుతున్నప్పుడు దాని మెడలో పట్టా మరియు చిహ్నం కూడా వేసేవారు, చిహ్నం అంటే ఆయన దాని మూపురం యొక్క కుడి వైపున రక్తం వచ్చేలా ఒక చిన్న కాటు వేసేవారు.

4- ఆయన ‘హద్ య్’ పంపిస్తూ తీసుకువెళ్ళే వ్యక్తికి చెప్పేవారు: జంతువు చనిపోయే స్థితికి చేరుకుంటే దానిని జిబహ్ చేయమని మరియు ఒక చెప్పుని దాని రక్తంతో రంగించి దాని ప్రక్కలో పెట్టండి, దాని మాంసం ఆ వ్యక్తి మరియు అతని ప్రయాణ మిత్రులు తినకండి, కాని వేరే ప్రజల్లో పంచి పెట్టండి.

5- ఆయన ఒక ఒంటెలో ఏడుగురు మరియు ఒక ఆవులో ఏడుగురు పాల్గొనడానికి (భాగం పంచుకోవడానికి) సహాబాలకు అనుమతి ఇచ్చారు.

6- ‘హద్ య్’ తీసుకువెళ్ళే వ్యక్తి వద్ద ప్రయాణం కొరకు వేరే స్వారీ లేకుంటే ఈ ‘హద్ య్’ ఒంటెపై కూర్చొని ప్రయాణంచవచ్చు. ఇలా అతనికి ప్రయాణానికి ఓ వాహనం దొరికే వరకు.

7- ఆయన విధానం: ఒంటెను నిలబెట్టి ఎడమ కాలును కట్టివేసి నహర్ చేయడం. నహర్ చేసేటప్పుడు “బిస్మిల్లాహి అల్లాహు అక్బర్” అని‌ పలికేవారు.

8-ఆయన ఖుర్బానీ జంతువులను తమ స్వహస్తాలతో జిబహ్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని ఇతరులకు అప్పగించేసేవారు.

9- ఆయన మేకను ౙబహ్ చేస్తున్నప్పుడు తమ కాలుని దాని ప్రక్కపై పెట్టేవారు మరియు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పలికుతూ ౙబహ్ చేసేవారు.

10- ఆయన తమ అనుచర సమాజం కొరకు ‘హద్ య్’ మరియు ఖుర్బానీ జంతువు యొక్క మాంసం తినడానికి మరియు బహుమతిగా ఇచ్చిపుచ్చుకోడానికి మరియు (పేదల్లో పంచిన తర్వాత కొంత భాగం మక్కా నుండి తమ ప్రాంతాలకు తీసుకుపోయే) అనుమతి ఇచ్చారు.

11- కొన్నిసార్లు ఆయన ‘హద్ య్’ మాంసాన్ని పంచిపెట్టేవారు, మరికొన్నిసార్లు ‘ఇష్టమున్నవారు జిబహ్ చేయబడిన జంతువు నుండి కోసుకొని వెళ్ళిండి’ అని చెప్పేవారు.

12- ఆయన విధానం: ‘హద్ య్’ జంతువును ఉమ్రా చేసినప్పుడు మర్వహ్ వద్ద, మరియు హజ్జే ఖిరాన్ చేసినప్పుడు మినాలో జిబహ్ చేసేవారు. ఆయన‌ హలాల్ అయిన తర్వాతనే నహర్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ సూర్యోదయం తర్వాత, జమరాత్ పై రాళ్ళు విసిరిన తర్వాతే నహర్ చేసేవారు. సూర్యోదయానికి ముందే నహర్ లేదా జిబహ్ చేసే అనుమతి ఎవరికీ ఇవ్వలేదు.

1- ఆయన‌ ఎప్పుడూ ఖుర్బానీ వదలలేదు. ఆయన పండుగ నమాజు తరువాత రెండు గొర్రెపోతులను ఖుర్బానీ ఇచ్చేవారు మరియు ఇలా అనేవారు: తష్రీఖ్ రోజులన్నీ (అంటే 11,12,13వ జిల్ హిజ్జ) జిబహ్ చేసే రోజులే. (ముస్నద్ అహ్మద్)

2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే‌ పండుగ నమాజుకు ముందు ఖుర్బానీ ఇస్తారో అతని‌ ఖుర్బానీ స్వీకరించబడదు. అది తన‌ ఇంటి వారి కొరకు ఇచ్చిన మాంసం కింద లెక్క. (ముత్తఫఖున్ అలైహి)

3- ఆయన గొర్రేపోతులో జజ్అ జిబహ్ చసే అనుమతి ఇచ్చారు. జజ్అ అనగా ఆరు నెలలు నిండ గొర్రేపోతు పిల్ల. మిగతా జంతువులలో రెండు పళ్ళు ఉన్న జంతువులను. ఒంటెలలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న దానిని. ఆవులో రెండు పూర్తి చేసి మూడులో ప్రవేశించినది.

4- ఆయన విధానం: ఖుర్బానీ కొరకు ఎటువంటి లోపాలు లేని ఉత్తమమైన, ఆరోగ్యవంతమైన జంతువులనే ఎంచుకునేవారు. చెవులు కోసి వున్న, కొమ్ములు విరిగి ఉన్న, గుడ్డివి, కుంటివి, అంగ వైకల్యం మరియు (మాంసం లేకుండా) బలహీనమైన వాటిని ఖుర్బానీ ఇవ్వడం నుండి వారించారు.

            ఇంకా ఇలా ఆదేశించారు: కళ్ళను, చెవులను శ్రద్ధగా పరిశీలించండి, అనగా అవి‌ పూర్తిగా మంచి స్థితిలో ఉన్నాయన్న నమ్మకానికి రావాలి.

5- ఎవరైతే ఖుర్బానీ ఇవ్వడానికి సంకల్పించుకుంటాడో అతను జుల్ హిజ్జా ప్రారంభం అవ్వగానే తమ గోళ్ళను, తల వెంట్రుకలను కత్తిరించకూడదని ఆజ్ఞాపించారు.

6- ఈద్గాహ్ లో నే‌ ఖుర్బానీ చేయటం ప్రవక్త విధానం.

7- ఆయన విధానం: ఒక మేక ఒక కుటుంబం తరపున ఖుర్బానీకి సరిపోతుంది, ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నా సరే.

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఆదేశించారు: ప్రతి శిశువు తన అఖీఖా కి బదులు తాకట్టు ఉంటుంది. కాబట్టి ఏడో రోజున అఖీఖా చేయాలి, మరియు ఆ బిడ్డ తల వెంట్రుకలను తీయించాలి (గుండు చేయాలి). మరియు పేరు పెట్టాలి. (అబూ దావూద్, తిర్మీజి, నిసాయీ)

2- మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం: మగ బిడ్డ తరపున రెండు మేకలు మరియు ఆడ బిడ్డ తరపున ఒక మేక జిబహ్ చేయాలి. (అబూ దావూద్, నసాయీ)

1- ఆయన కొనడం, అమ్మడం చేసేవారు కానీ దైవదౌత్యం తర్వాత కొనుగోలు చేయడం అమ్మడం కంటే అధికంగా ఉండినది. ఆయన‌ వేతనం కొరకు పని చేసారు మరియు వేతనాలు ఇచ్చి పని తీసుకున్నారు. ఆయన (క్రయవిక్రయాల్లో ఇతర వ్యవహారాల్లో) స్వయం ఇతరులకు బాధ్యత వహించారు (వకీల్ గా ఉన్నారు) మరియు ఇతరులను బాధ్యులుగా (వకీల్ గా) నియమించారు. కాని ఇతరులను బాధ్యులుగా చేయడమే స్వయం బాధ్యత వహించేకంటే అధికంగా ఉండినది.

2-ఆయన నగదు మరియు అప్పు రెండు రకాలుగా కొనుగోళ్లు చేశారు. ఆయన ఇతరుల కొరకు సిఫారసు చేసారు మరియు ఆయన ముందు ఇతరుల సిఫారసు కూడా చేయబడినది. ఆయన తాకట్టు ద్వారా‌ అప్పు తీసుకున్నారు, అలానే తాకట్టు లేకుండా కూడా అప్పు తీసుకున్నారు. మరియు ఆయన వస్తువులను కూడా అరువుగా తీసుకున్నారు.

3- ఆయన‌ సాధారణ బహుమతి ఇచ్చారు మరియు తీసుకున్నారు. ఆయన‌ ప్రత్యేక బహుమతులు ఇచ్చారు మరియు ఇతరుల నుండి బహుమతులు స్వీకరించచారు, మళ్ళీ అంతకంటే మేలైనది తిరిగి కూడా ఇచ్చారు, ఒకవేళ (బహుమతి స్వీకరించాలన్న) ఇష్టం లేకపోతే ఆ బహుమతి ఇచ్చే వారికి మంచి సాకు చెప్పేవారు. రాజులు బహుమతులు పంపేవారు, ఆయన వాటిని స్వీకరించేవారు, మరియు సహాబాలలో వాటిని పంచిపెట్టేసేవారు.

4- ప్రజల్లో అత్యుత్తమ వ్యవహారం ఆయనదే ఉండేది. ఆయన ఎవరి వద్దనైనా ఎప్పుడన్నా అప్పు తీసుకుంటే, తిరిగి చెల్లించడంలో ఉత్తమ విధానాన్ని మరియు ఎక్కువ ఇచ్చేవారు, ఇంకా అప్పు ఇచ్చినవారి సంపద, కుటుంబంలో శుభం కొరకు దుఆ చేసేవారు. ఒకసారి ఆయన ఒక ఒంటెను అప్పుగా తీసుకున్నారు, అప్పుడు దాని యజమాని ప్రవక్త వద్దకు వచ్చి అప్పును వాపసు చేయమని అడుగుతూ, కఠినంగా వ్యవహరించసాగాడు, అక్కడున్న సహాబాలు కూడా అతని పట్ల కఠినంగా ప్రవర్తించాలనుకున్నారు, కాని ప్రవక్త ఇలా తెలిపారు: అతనిని వదిలివేయండి! హక్కుదారునికి (ఎంతైనా) మాట్లాడే హక్కు ఉంది. (ముత్తఫఖున్ అలైహి)

5- ఆయనతో అజ్ఞానంగా వ్యవహరించే వారి పట్ల ఆయనలో ఓపిక సహనలే అధికమయ్యేవి. ఎవరిలో కొపాగ్రహం మిచ్చిపోతుందో అతడు తన కోపాన్ని వుజూ తో లేదా నిలబడి ఉంటే కూర్చొని లేదా షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతూ చల్లబరుచుకోవాలని (శాంతపరచాలని) ఆదేశించారు.

6- ఆయన ఎవరి పట్ల కూడా గర్వహాంకారాలతో వ్యవహరించేవారు కాదు. బదులుగా ఆయన తమ సహచరుల పట్ల వినయంగా, మృదు స్వభావం తో మెలిగేవారు. ప్రతీ చిన్న, పెద్ద అందరికీ‌ సలామ్ చేసేవారు.

7- ఆయన వేళాకోళం (జోక్) చేసినా సత్యం ద్వారానే చేసేవారు. ఆయన ఏదైనా కప్పిపుచ్చే రీతిలో మాట్లాడినా (అంటే తౌరియా చేసినా) సత్యాన్నే అవలంబించేవారు.

8- ఆయన పరుగు పందెంలో పోటీ చేశారు. ఆయన తమ చెప్పుల్ని స్వయంగా కుట్టుకునేవారు. తమ దుస్తులకు స్వయంగా తామే అతుకులు వేసుకునేవారు. తొట్టె (బకెట్) విరిగితే స్వయంగా సరిచేసుకునేవారు. మేక పాలు స్వయంగా పితికేవారు. పడకలో, బట్టల్లో పేను, మరేదైనా ఇలాంటివి పడితే శుభ్రపరుచుకునేవారు. తమ ఇంటి వారికి సేవ చేసేవారు, తమ వ్యక్తిగత అవసరాలు తామే పూర్తి చేసుకునేవారు. ఆయన మస్జిదే నబవీ నిర్మాణం సమయంలో సహాబాలతో కలిసి ఇటుకలు కూడా మోసేవారు.

9- ఆయన సృష్టిలోనే అత్యంత విశాలమైన హృదయం, పవిత్రమైన మనస్సు గలవారు.

10- రెండు విషయాలలో ఏదైనా ఒకటి ఎంచుకునే అనుమతి లభిస్తే ఆయన సులువైనదే ఎంచుకునేవారు, ఒకవేళ అది పాపంతో కూడినది కాకపోతే.

11- ఆయన ఏ దౌర్జన్యపరుడి యొక్క దౌర్జన్యం పట్ల పగ తీర్చుకునేవారు కాదు. కానీ అతను అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘించనప్పుడు తప్ప, ఎవడైనా అల్లాహ్ నిషిద్ధతలను ఉల్లంఘిస్తే ఆయన కంటే ఎక్కువ ఆగ్రహించుకునేవాడు మరెవరూ ఉండరు.

12- ఆయన సలహా ఇచ్చేవారు మరియు తీసుకునేవారు కూడా. వ్యాధిగ్రస్తులను పరామర్శించేవారు. జనాజాలో పాల్గొనేవారు. దావత్ (ఆహ్వానాన్ని) స్వీకరించేవారు. బలహీనుల, నిరుపేదల మరియు విధవల అవసరాలను పూర్తి చేయడం కొరకు వారితో పాటు వెళ్లేవారు.

13- తనకు ప్రియమైన వస్తువు ఎవరైనా ఆయనకు ఇస్తే, ఆయన అతని కొరకు దుఆ చేసేవారు మరియు ఇలా అనేవారు: ఎవరి కొరకైనా ఎవరన్నా మేలు చేస్తే, అతను జజాకల్లాహు ఖైరా (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక) అని అంటే అతను అతనిని మంచి రీతిలో ప్రశంసించినట్టు. (తిర్మీజి).

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: “మీ ఈ ప్రపంచంలోని వాటిలో మహిళలు, సువాసన పట్ల నాలో ప్రేమ ప్రోదిచెయ్యబడింది. కాగా, నమాజ్ నా కంటికి చలువ.

            ఇంకా ఇలా తెలిపారు: “యువకుల్లారా! మీలో స్థోమత ఉన్నవారు పెళ్ళి చేసుకోండి”. మరో సందర్భంలో ఇలా చెప్పారు: “అధికంగా ప్రేమించే మరియు పిల్లలను కనే స్త్రీని వివాహమాడండి”.

2- ఆయన తమ భార్యలతో ఉత్తమరీతిలో, సత్ప్రవర్తనతో మెలిగేవారు, సద్భావంతో ఉండేవారు మరియు ఇలా అనేవారు: “తన ఇంటివారి (ఆలుబిడ్డల) యెడల ఉత్తముడైన వాడే మీ అందరిలో ఉత్తముడు. నేను నా ఆలుబిడ్డల విషయంలో మీ అందరికన్నా ఉత్తముడిని.

3- ఆయన భార్యలలో ఎవరైనా ఏదైనా విషయంపై ఇష్టం (మక్కువ) చూపితే ఆయన వారి కోరికలను నెరవేర్చేవారు ఎప్పటివరకైతే అందులో ఎలాంటి నిషేధం ఉండదో. ఆయన అన్సార్ బాలికలను ఆయెషా రజియల్లాహు అన్హా వద్దకు ఆమెతో ఆడుకోడానికి పంపేవారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఏ పాత్రలో ఎక్కడ తమ పెదవులు పెట్టి త్రాగారో అదే చోట ప్రవక్త తమ పెదవులు పెట్టి త్రాగేవారు. ఆయన ఆయిషా రజియల్లాహు అన్హా ఒడిలో తలను ఆనించేవారు. ఆమె ఒడిలో తమ శిరస్సు ఉంచి ఖుర్ఆన్ పారాయణం చేసేవారు, అలాంటి కొన్ని సందర్భాల్లో ఆమె బహిష్టురాలై ఉండేది. ఆమె బహిష్టులో ఉన్నప్పుడు ఆయన‌ ఆమెతో లంగోటా లాంటి లో ఉడుపును కట్టుకోమని ఆదేశించేవారు ఆ తర్వాత ఆమె దేహానికి తమ దేహం ఆనించేవారు.

4- ఆయన అస్ర్ నమాజ్ తర్వాత తమ భార్యల వద్దకు వెళ్లి, వారి దగ్గర కూర్చొని వారి స్థితిగతులు, సంక్షేమాలు తెలుసుకునేవారు. రాత్రి వంతు ఏ భార్య గద్దర ఉండేదో ఆమె వద్దే రాత్రి గడిపేవారు.

5- ఆయన రాత్రి, నివాసం మరియు రోజువారి ఖర్చులు భార్యల మధ్యలో న్యాయంగా పంచేశారు. కొన్నిసార్లు మిగిలిన సతీమణుల సమక్షంలో ఎవరైనా ఒక్కరి వైపు తమ చెయ్యి చాపేవారు.

6- ఆయన తమ భార్యలతో రాత్రి మొదటి భాగంలో మరియు చివరి భాగంలో సంభోగం చేసేవారు. మొదటి భాగంలో సంభోగం చేస్తే గుసుల్ స్నానం చేసి నిద్రపోయేవారు. కొన్ని సందర్భాల్లో వుజూ చేసి పడుకునే వారు‌.

            ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: “ఎవరయితే తన ఇల్లాలితో మల విసర్జన మార్గం గుండా సమాగమం జరుపుతాడో వాడు శాపగ్రస్తుడు.” (అహ్మద్, సహీహ్)

            ఇంకా ఇలా తెలియజేశారు: “మీలో ఎవరయినా తన భార్యతో సమాగమం జరపాలనుకుంటే ఈ దుఆ చదవాలి: ‘బిస్మిల్లాహ్ అల్లాహుమ్మ జన్నిబ్ నష్షైతాన వ జన్నిబిష్షైతాన మా రజఖ్తనా’ (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్! మమ్ము షైతాన్ నుంచి దూరంగా ఉంచు. నీవు మాకు ప్రసాదించే దాని నుంచి కూడా షైతాన్ ను దూరంగా ఉంచు).

بِسْمِ اللَّهِ اللَّهُمَّ جَنِّبْنَا الشَّيْطَانَ وَجَنِّبِ الشَّيْطَانَ مَا رَزَقْتَنَا

 ఈ సమాగమం ద్వారా వారికి అల్లాహ్ సంతానం రాసిపెట్టి ఉంటే ఆ సంతానానికి షైతాన్ ఎన్నటికీ కీడు కలిగించలేడు. (బుఖారీ, ముస్లిం).

7- ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఎవరయినా స్త్రీని వివాహమాడినా లేదా బానిసను లేదా వాహనం కొనుగోలు చేసినా అల్లాహ్ తో దానిలో శుభం కొరకు ఈ విధంగా వేడుకోవాలి: “అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైరహా వ ఖైర మా జుబిలత్ అలైహి వ అఊజుబిక మిన్ షర్రిహా వ షర్రి మా జుబిలత్ అలైహ్.” (ఓ అల్లాహ్! నేను నీ నుండి దీనిలోని మేలును అర్థిస్తున్నాను. ఏ నైజంపై దీనిని పుట్టించటం జరిగిందో దాని మేలును అర్థిస్తున్నాను. మరియు ఇందులోని కీడు నుంచి నీ శరణు వేడుతున్నాను. ఏ స్వభావంపై దీనిని సృజించటం జరిగిందో దాని కీడు నుంచి నీ శరణు కోరుతున్నాను.)” (అబూదావూద్-2160 హసన్)

أَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَهَا وَخَيْرَ مَا جُبِلَتْ عَلَيْهِ أَعُوْذُبِكَ مِنْ شَرِّهَا وَشَرِّ مَا جُبِلَتْ عَلَيْهِ

8- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నికాహ్ చేసుకున్న వారిని ఈ విధంగా ఆశీర్వదించేవారు: “బారకల్లాహు లక వ బారక అలైక వ జమఅ బైనకుమా ఫీ ఖైర్” “అల్లాహ్ నీకు మరియు మీపై శుభాన్ని కురిపించుగాక! మీ ఇద్దరి మధ్య శుభాన్ని, ఏకీభావాన్ని సృజించుగాక!)” (అబూదావూద్-2130 సహీహ్)’

بَارَكَ اللَّهُ لَكَ وَبَارَكَ عَلَيْكَ، وَجَمَعَ بَيْنَكُمَا فِي خَيْرٍ

9- ఆయన ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడు తమ భార్యల మధ్య చీటీ (డ్రా) వేసేవారు, అందులో ఎవరి పేరు వస్తే ఆమెతో ప్రయాణం చేసేవారు. మిగతా భార్యలకు దీని బదులు ఇచ్చేవారు కాదు.

10- ఆయన ఇళ్లను ఎంతో ఎత్తుగా, మహా విశాలంగా మరియు అధిక అలంకరణలతో నిర్మించడం పట్ల ఏ శ్రద్ధ చూపేవారు కాదు. (జీవితపు అవసరాలు తీరే విధంగా ఉంటే సరిపుచ్చుకునేవారు).

11- ఆయన తలాఖ్ (విడాకులు) ఇచ్చారు,  రుజూ కూడా చేసుకున్నారు (మొదటి మరియు రెండవ విడాకుల తర్వాత గడువు లోపల తిరిగి భార్యగా ఉంచుకునే అనుమతి ఖుర్ఆన్ లో ఉంది, అదే ప్రకారంగా రుజూ చేసుకున్నారు).

            మరియు ఒక నెల కొరకు తాత్కాలికంగా తమ భార్యల నుండి ఈలా (వేరవ్వడం) చేసారు.

            కానీ ఆయన జిహార్ ఎన్నడూ చేయలేదు. (అంటే భార్యతో నీ వీపు నా తల్లి లాంటిది లేదా నీవు నా తల్లి లాంటి దానివి అనడం. అజ్ఞాన కాలంలో మాటిమాటికి ఇలా అని భార్యలను వేధించేవారు, ఇస్లాం దీనిని నిషిద్ధ పరిచింది, అలా చెప్పేవారిపై పరిహారం విధిగావించింది. చూడండి సూర ముజాదల ప్రారంభ ఆయతులు) .

1- ఆయన పగలూ, రాత్రీ, రహస్యంగా మరియు బహిరంగంగా ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు. ఆయన మక్కాలో మూడు సంవత్సరాల వరకూ రహస్యంగా ధర్మప్రచారం చేసారు. కానీ ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ఈ ఆజ్ఞ అవతరించిందో: فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَاَعْرِضْ عَنِ الْمُشْرِكِيْنَ కాబట్టి (ఓ ప్రవక్తా!) నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమరచి చెప్పు. బహుదైవారాధకులను (ముష్రిక్కులను) పట్టించుకోకు. (హిజ్ర్ 15:94).

            అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ పై అమలు చేస్తూ బహిరంగంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరియు నిందించేవాడి నిందతో భయపడకుండా ప్రతీ చిన్న, పెద్ద, స్వతంత్రుడు, బానిస, మగ, ఆడ, జిన్నులు మరియు మానవులందరినీ అల్లాహ్ వైపునకు ఆహ్వానించేవారు.

2- మక్కా లో ఆయన సహచరుల పై దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు ఆయన వారిని హబ్షా (అబీసీనియా) వైపు హిజ్రత్ (వలస) చేయవలసిందిగా ఆదేశించారు.

3- ఆయన తాయిఫ్ నగరానికి బయలుదేరారు, వారికి ఇస్లాం సందేశం ఇవ్వడానికి మరియు వారు సత్యధర్మానికి మద్దతు, సహాయం అందించి, ఆయనకు తోడ్పాటుగా ఉండాలని, కానీ వారిలో ఎవరూ కూడా స్వీకరించ లేదు మరియు సహాయకులుగా నిలబడలేదు, పైగా తీవ్రమైన బాధ కలిగించారు. మక్కావాసుల కంటే ఘోరమైన రీతిలో ప్రవర్తించారు. తిరిగి మక్కా వెళ్ళిపోయేలా బలవంతం చేసారు‌. అందువల్ల ఆయన ముతఇమ్ బిన్ అదీ రక్షణలో మక్కాలో ప్రవేశించారు.

4- పదేళ్ళ వరకూ ఆయన  బహిరంగంగా ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రతీ సంవత్సరం హజ్జ్ లో బైటి నుండి వచ్చే ప్రజలతో కలిసేవారు, హాజీల డేరాల వద్దకు వెళ్ళేవారు. హజ్జ్ కాలంలోనే ఉకాజ్, మిజిన్న, జుల్ మజాజ్ లాంటి పెద్ద బజార్లలో వచ్చే ప్రతీ తెగవారితో, వారి నివాస స్థలానికి వెళ్ళి, వారిని కలసి ఇస్లాం సందేశం అందజేసేవారు.

5- ఆ సందర్భంలోనే ఒకసారి ఆయన అఖబాకు దగ్గర్లో మదీనావాసులైన ఖజ్రజ్ తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులతో కలిసారు, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. వారు వెంటనే ఇస్లాం స్వీకరించి, మదీనాకు తిరిగి వెళ్లి, ఇతరులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడం మొదలు పెట్టారు. ఈ విధంగా మదీనాలో ఇస్లాం వ్యాప్తి చెందింది. మరియు ఇస్లాం ప్రవేశించని ఇల్లు అంటూ లేకుండినది.

6- మరుసటి సంవత్సరం వారిలో నుండే 12 మంది వచ్చారు. అప్పుడు ఆయన వారితో అఖబా వద్ద ఈ ప్రకారంగా ప్రమాణం తీసుకున్నారు: మేము ప్రవక్త మాటను విని, విధేయత పాటిస్తాము, అవసరం ఏర్పడినప్పుడు డబ్బు ఖర్చు చేస్తాము, మంచిని ఆదేశిస్తాము మరియు చెడును ఖండిస్తాము, అల్లాహ్ మార్గంలో నిందించేవాడి ఏ నిందనూ లెక్క చేయకుండా మీకు సహాయం చేస్తూ ఉంటాము మరియు మేము స్వయం మమ్మల్ని మరియు మా భార్యపిల్లల్ని కాపాడే రీతిలో మిమ్మల్ని (అంటే ప్రవక్తను) కాపాడతాము. వీటన్నిటికి బదులుగా మీకు స్వర్గం ఉంటుందని ప్రవక్త వారికి శుభవార్తనిచ్చారు.

            ఆ తర్వాత వారు మదీనా తిరిగి వెళ్లిపోయారు. ప్రవక్త వారితో పాటు ముస్అబ్ బిన్ ఉమైర్ రజియల్లాహు అన్హు మరియు అబ్దుల్లాహ్ బిన్ మక్తూమ్ రజియల్లాహు అన్హు గారిని పంపారు. వీరు మదీనా వాసులకు ఖుర్ఆన్ బోధిస్తూ మరియు ప్రజలను అల్లాహ్ వైపునకు పిలుస్తూ ఉండేవారు. అలా వారి ఆధారంగా ఎంతోమంది ఇస్లాం స్వీకరించారు. వారిలోనే ఉసైద్ బిన్ హుజైర్ మరియు సఅద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హుమా వారు కూడా ఉన్నారు.

7- పిదప ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం, ముస్లిములు మదీనా వైపు హిజ్రత్ చేయాలని ఆదేశించారు. అప్పుడు ప్రజలందరూ అందులో ముందుకు సాగిపోయారు. పిదప ఆయన మరియు ఆయన ప్రియ గుహ వాసి అయిన అబూ బకర్ రదియల్లాహు అన్హు గారులిద్దరూ కలసి హిజ్రత్ చేసి, మదీనాకు వలస వచ్చినవారితో కలిసిపోయారు.

8- ప్రవక్త మదీనా చేరుకున్న తర్వాత అన్నిటికంటే ముందు ముహాజిరీన్ మరియు అన్సార్ మధ్య సోదరభావం ఏర్పరిచారు. అప్పుడు వారి సంఖ్య 90 ఉండెను.

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ముస్లింలందరి ఆశ్రయం ఒక్కటే, వారిలోని అత్యంత అల్పుడైన సరే ఎవరికైనా ఆశ్రయం ఇవ్వగలడు (దానిని మిగితా ముస్లిములందరూ ఒప్పుకోక తప్పదు) (బుఖారీ). ప్రవక్త ఇంకా ఇలా తెలిపారు: విశ్వాసుల మరియు అవిశ్వాసుల మధ్య ఏదైనా ఒప్పందం ఉన్నప్పుడు, దానిని భంగం చేయరాదు, అది అలా ఉండగా, దాని గడువు పూర్తి కాక ముందు మరో ఒప్పందం కుదుర్చకూడదు, లేదా (వారి వైపు నుండి ఏదైనా ద్రోహం జరగవచ్చన్న భయం ఉంటే) ఒప్పందాన్ని భంగం చేస్తున్నామని వారికి స్పష్టంగా తెలియజేయాలి. (అబూ దావూద్ 2759).

2- ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు: ఎవరైనా ఒక వ్యక్తి ఆశ్రయం ఇచ్చి, పిదప‌ అతనిని హత్య చేస్తే  అలాంటి హంతకునితో నాకు ఏలాంటి సంబంధం లేదు. (ఇబ్నే మాజహ్).

3- ముసైలమ కజ్జాబ్ రాయబారులు ఆయన వద్దకు వచ్చినప్పుడు అన్నారు: మేము ముసైలమను అల్లాహ్ యొక్క ప్రవక్తగా నమ్ముతున్నాము, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: ఒకవేళ రాయబారులను హతమార్చడం అనేది ఉంటే నేను మిమ్మల్ని హతమార్చే వాడిని. ప్రవక్తవారి ఈ పలుకులే రాయబారులను హత్య చేయకూడదు అన్న చట్టంగా నిలిచాయి.

4- ఎవరైనా రాయబారి ఇస్లాం స్వీకరిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని తమ వద్ద ఆపుకునేవారు కాదు, అతన్ని తిరిగి పంపేసేవారు.

5- శత్రువులు సహాబాలలో ఏ ఒకరితోనైనా ప్రవక్తకు తెలియకుండా, ఇష్టం లేకుండా ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే ఆయన దానిని కొనసాగించేవారు, ఒకవేళ ఆ ఒప్పందం వల్ల ముస్లిములకు ఏ నష్టం లేకుంటే.

6- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా ఖురైష్ లతో చేసిన ఒప్పందంలోని కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:

• పదేళ్ళ వరకు వారి మధ్య మరియు ముస్లింల మధ్య యుద్ధం జరగదు,

• అవిశ్వాసుల్లో నుండి ఎవరైనా ఇస్లాం స్వీకరించి ముస్లింల వద్దకు వెళ్తే వారు అతనిని తిరిగి వాపసు పంపించేయాలి.

• ముస్లింలలో నుండి ఎవరైనా అవిశ్వాసుల వద్దకు పోతే, వారు అతన్ని తిరిగి వాపసు పంపరు.

            కానీ అల్లాహు తఆలా దీనిని స్త్రీల విషయంలో రద్దు చేశాడు. వారిని పరీక్షించాలని, వారితో విచారణ జరపాలని ఆదేశించాడు. దీని ప్రకారం ఏ స్త్రీ విశ్వాసీ అని తెలుస్తుందో ప్రవక్త ఆమెను తిరిగి అవిశ్వాసుల వద్దకు పంపేవారు కాదు.

7- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలుకు ఆదేశించారు: ఏ స్త్రీలు అవిశ్వాసాన్ని విడనాడి ఇస్లాం వైపునకు హిజ్రత్ చేసి వస్తారో వారి మహర్ లను అవిశ్వాసులకు వాపసు చేసేయండి. అందువల్ల ముస్లిములు వారి మహర్లను అవిశ్వాసులకు తిరిగి ఇచ్చేసేవారు.

8- అవిశ్వాస పురుషుల్లో నుండి ఎవరైనా ముస్లిం గా ప్రవక్త వద్దకు వస్తే, ఆ అవిశ్వాసులు అతడ్ని తీసుకువెళ్లడానికి వస్తే ఆయన అతనిని తీసుకెళ్ళడం నుండి నిరాకరించేవారు కాదు. అదేవిధంగా అతనిని తిరిగి వెళ్ళిపోమని బలవంతం చేసేవారు కూడా కాదు మరియు పో అని ఆజ్ఞాపించేవారు కూడా కాదు. ఎప్పుడైనా ఆ వ్యక్తి ఆ అవిశ్వాసుల్లో ఎవరినైనా హతమార్చితే లేదా ఎవరి సొమ్మునైనా దోచుకుంటే, అతడు వీరి చేతుల నుండి చేజారి పోయాడు గనక మరియు వారి వద్ద కూడా చేరుకోలేదు గనక అతని ఈ పనిని నిరాకరించేవారు కాదు మరియు అతను చేసిన హత్యకు ఎటువంటి జమానత్ (పరిహార బాధ్యత) తీసుకునేవారు కాదు.

9- ఖైబర్ ప్రాంతాన్ని జయించిన తర్వాత ఆయన వారితో ఈ షరతుపై ఒప్పందం చేసుకున్నారు: వారిని అక్కడి నుంచి బహిష్కరించడబడును, మరియు వారి స్వారీలు మోయోగలిగే సామానులే వారు తీసుకువెళ్లాలి మరియు వారి బంగారం, వెండి,  ఆయుధాలకు ప్రవక్తయే అధికారులవుతారు.

10- ఇంకా వారితో జరిగిన ఒప్పందంలో: వారి భూమిలో పండే పంటలో సగం ముస్లింలకు మరియు సగం వారికి. ముస్లింలు కోరుకున్నన్ని రోజులే వారు వారు అక్కడ ఉంటారు. ప్రవక్త ప్రతీ ఏటా వారి వద్దకు సరైన అంచనా వేసే నిపుణుడిని పంపేవారు అతను పండ్లు పండాక ఎన్ని పండ్లను త్రెంచాలో అంచనా వేసేవాడు. మరియు ముస్లిముల వాటాకు వారినే హామీదారులుగా ఉంచేవారు మరియు మిగిలిన వారి వాటాలో వారు తమ ఇష్ట ప్రకారం చేసుకునేవారు

1- ఆయన హుదైబియా నుండి తిరిగి వాపసు రాగానే రాజుల వైపునకు ఉత్తరాలు, లేఖలు రాయడం, రాయబారులను (దూతలను) పంపడం మొదలు పెట్టారు.

– ఆయన రోమా రాజుకు ఓ లేఖ వ్రాసి, దూత ద్వారా పంపారు. మరియు అతను ఇస్లాం స్వీకరించాలనుకున్నాడు, స్వీకరించేవాడే కాని (తన కొందరి దగ్గరి వారి కారణంగా) స్వీకరించలేదు.

2- అబీ సీనియా దేశం నజాషీ చక్రవర్తి వైపునకు కూడా సందేశం పంపారు, అతను ఇస్లాం స్వీకరించాడు.

3- ముఆజ్ బిన్ జబల్ మరియు అబూ మూసా అష్ అరీ రదియల్లాహు అన్హుమా వారిని యమన్ వాసుల వద్దకు పంపారు, వారందరూ ఏ గొడవ లేకుండా ఇస్లాం స్వీకరించారు.

1- ఆయన కపట విశ్వాసుల బాహ్య ఆచరణలను స్వీకరించేవారు మరియు అంతర్గత విషయాలను అల్లాహ్ పై వదిలేసేవారు. రుజువు మరియు ఆధారాలతో వారితో చర్చ జరిపేవారు. ఆయన కొన్నిసార్లు వారి పట్ల దృష్టిని మరల్చుకుంటే  మరి కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించేవారు. ప్రభావవంతమైన మాటలతో వారికి నచ్చజెప్పేవారు.

2- ఆయన వారి హృదయాలు గెలుచుకోడానికి వారితో పోరాడలేదు. ఆయన ఇలా అనేవారు: “ముహమ్మద్ తన సహచరులనే హతమార్చేస్తున్నాడు” అని ప్రజలు అనుకుంటూ తిరగడం నాకిష్టం లేదు. (ముత్తఫఖున్ అలైహి).

1- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరిలోకెల్లా ఎక్కువగా అల్లాహ్ స్మరణ చేసేవారు. ఆయన మాటలన్నీ అల్లాహ్‌ స్మరణ మరియు దానికి సంబంధించిన విషయంలోనే ఉండేవి. ఆయన ఆజ్ఞ, వారింపు మరియు అనుచర సమాజానికిచ్చే ధార్మికాదేశాలు నాలుక ద్వారా అల్లాహ్ స్మరణ అయితే, ఆయన మౌనం హృదయ స్మరణ. ఆయన నిలబడుతూ, కూర్చుంటూ, పడుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ, స్థానికంగా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో, సందర్భాల్లో, స్థితుల్లో అల్లాహ్ స్మరణ చేస్తూ ఉండేవారు. ఒక్కటేమిటి ఆయన ప్రతి శ్వాసలో అల్లాహ్ స్మరణ ఉండేది.

ఆయన విధానం: ఉదయసాయంకాలపు జిక్ర్ లో

Text Box: అజ్కార్ & దుఅల గురించి
ఇక్కడ క్లిక్ చేయండి
1- ఆయన ఉదయం ఈ జిక్ర్ చేసేవారు:

                                                                                      أَصْبَحْنَا عَلَى فِطْرَةِ الْإِسْلَامِ وَعَلَى كَلِمَةِ الْإِخْلَاصِ وَعَلَى دِينِ نَبِيِّنَا مُحَمَّدٍ ﷺ وَعَلَى مِلَّةِ أَبِينَا إِبْرَاهِيمَ حَنِيفًا مُسْلِمًا وَمَا كَانَ مِنْ الْمُشْرِكِين

అస్ బహ్ నా అలా ఫిత్రతిల్ ఇస్లామి వ అలా కలిమతిల్ ఇఖ్లాసి వఅలా దీని నబియ్యినా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ వ అలా మిల్లతి అబీనా ఇబ్రాహీమ హనీఫమ్ ముస్లిమవ్ వమాకాన మినల్ ముష్రికీన్. (ముస్నద్ అహ్మద్ 3/406, సహీహుల్ జామి ).

(మేము ఉదయానికి చేరాము స్వభావిక ధర్మం అయిన ఇస్లాంపై, చిత్తశుద్ధితో కూడి ఉన్న వచనంపై, మా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మంపై, మా పితామూర్తులైన ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క మతముపై, ఆయన ఏకాగ్రచిత్తులు, విధేయులు, ముష్రికులలోని వారు కారు).

            మరియు ఈ విధంగా అనేవారు:

اللَّهُمَّ بِكَ أّصْبَحْنَا وَبِكَ أَمْسَينَا وَبِكَ نَحْيَا وَبِكَ نَمُوتُ وَإِلَيكَ النُّشُور

అల్లాహుమ్మ బిక అస్ బహ్ నా వ బిక అమ్ సైనా వబిక నహ్ యా వ బిక నమూతు వ ఇలైకన్నుషూర్. (అదబుల్ ముఫ్రద్ 1199).

(ఓ అల్లాహ్! నీ రక్షణలోనే మేము ఉదయానికి చేరాము, నీ రక్షణలోనే మేము సాయంకాలానికి చేరాము, నీ పేరుతోనే మేము జీవించి ఉన్నాము, నీ పేరుతోనే మేము మరణిస్తాము, మళ్ళీ నీ వైపే లేపబడనున్నాము).

            ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైనా ఉదయానికి చేరుకున్నారంటే ఈ జిక్ర్ చదవాలి:

أَصْبَحْنَا وَأَصْبَحَ الْمُلْكُ للهِ رَبِّ الْعَالَمِينَ، اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ هَذَا الْيَوْمِ: فَتْحَهُ، وَنَصْرَهُ وَنُورَهُ، وَبَرَكَتَهُ، وَهُدَاهُ، وَأَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا فِيهِ وَشَرِّ مَا بَعْدَهُ.

అస్ బహ్ నా వ అస్ బహల్ ముల్కు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక ఖైర హాజల్ యౌమి, ఫత్ హహు, వ నస్రహు, వ నూరహు, వ బరకతహు, వహుదాహు వఅఊజు బిక మిన్ షర్రి మా ఫీహి వ షర్రి మా బఅ్ దహ్

మేము మరియు రాజ్యమంతా సకలలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకు ఉదయానికి చేరాము. ఓ అల్లాహ్ నేను ఈ రోజులో ఉన్న మేలును, జయాన్ని, సహాయాన్ని, కాంతిని, శుభాలను, సన్మార్గము ప్రసాదించమని వేడుకుంటున్నాను. మరియు దీనిలో ఉన్న కీడు నుండి, తర్వాత వచ్చే కీడు నుండి నీ శరణే కోరుచున్నాను. (అబూదావూద్, జాదుల్ మఆద్ 2-373).

(ఇదే జిక్ర్ సాయంకాలం కూడా చదవాలి, కాని ముందు వాక్యము “అమ్సైనా వ అమ్సల్” అని మార్చి చదవాలి)

మరియు ఇలా అన్నారు: ఎవరైతే సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ పూర్తి విశ్వాసంతో ఉదయం చదివుతాడో ఒకవేళ అతను సాయంకాలానికి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు, ఒకవేళ సాయంకాలం పూర్తి నమ్మకంతో చదివి ఉదయించేకి ముందే మరణిస్తే స్వర్గంలో చేరుతాడు. ((బుఖారి 6306)

اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلهَ إلاَّ أَنْتَ خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَااسْتَطَعْتُ أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ أَبُوْءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِيْ فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلاَّ أَنْتَ

అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలఖ్ తనీ వ అన అబ్దుక వఅన అలా అహ్దిక వ వఅ్ దిక మస్తతఅ్ తు అఊజు బిక మిన్ షర్రి మా సనఅ్ తు అబూఉ లక బినిఅ్ మతిక అలయ్య వఅబూఉ లక బిజంబీ ఫగ్ఫిర్లీ ఫఇన్నహూ లా యగ్ ఫిరుజ్జునూబ ఇల్లా అంత.

(ఓ అల్లాహ్! నీవు నా ప్రభువు, నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు, నీవే నన్ను సృష్టించావు, నేను నీ దాసుడ్ని, నేను నీతో చేసిన ఒడంబడిక, వాగ్దానంపై స్థిరంగా ఉన్నాను, నేను పాల్పడిన పాపాల కీడు నుండి నీ శరణులో వచ్చుచున్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలను కూడా ఒప్పుకుంటున్నాను, నీవు నన్ను క్షమించు, పాపాలను క్షమించేవాడు నీ తప్ప ఎవడూ లేడు).

3- మరియు ఇలా అన్నారు: ఎవరు ప్రతి రోజు ఉదయం వంద సార్లు ఈ జిక్ర్ చేస్తాడో:

  • అతనికి 10 బానిసలకు విముక్తి కలిగించినంత పుణ్యం ఉంటుంది,
  • 100 పుణ్యాలు అతని కొరకు వ్రాయబడతాయి,
  • అతని 100 పాపాలు మన్నింపబడతాయి,
  • అతను సాయంకాలం వరకు షైతాన్ నుండి కాపాడబడతాడు,
  • అతనికంటే ఎక్కువ చదివినవాడు తప్ప మరెవ్వడూ అతనికంటే ఉత్తముడు కాడు.

لاَ إِلهَ إِلاَّ اللهُ وَحْدَهُ لاَ شَرِيْكَ لَهُ لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِير

లాఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (బుఖారీ 6403, ముస్లిం 2691).

4- మరియు ఆయన ఉదయం, సాయంత్రం ఈ దుఆ చదివేవారు:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ اَللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ الْعَفْوَ وَالْعَافِيَةَ فِي دِيْنِي وَ دُنْيَايَ وَأَهْلِيْ وَمَالِيْ اللَّهُمَّ اسْتُرْ عَوْرَاتِيْ وَآمِنْ رَوْعَاتِي اللَّهُمَّ احْفَظْنِيْ مِنْ بَيْنِ يَدَيَّ وَمِنْ خَلْفِيْ وَعَنْ يَمِيْنِي وَعَنْ شِمَالِي وَمِنْ فَوْقِي وَأَعُوذُ بِعَظْمَتِكَ أَنْ أُغْتَالَ مِنْ تَحْتِي

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరహ్, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మస్ తుర్ ఔరాతీ వ ఆమిన్ రౌఆతీ అల్లాహుమ్మహ్ ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకీ వ అఊజు బిఅజ్మతిక అన్ ఉగ్ తాల మిన్ తహ్ తీ.

(ఓ అల్లాహ్! నేను నీతో ఇహపరాల క్షేమాన్ని కోరుతున్నాను, ఓ అల్లాహ్! నేను నీతో నా ధర్మం, ప్రపంచం, ఇల్లాలు, ఆస్తుల్లో మన్నింపు మరియు క్షేమాన్ని కోరుతున్నాను. ఓ అల్లాహ్! నా లోటుపోట్లను కప్పిఉంచు, నా భయాన్ని దూరం చేయి, ఓ అల్లాహ్! నన్ను నా ముందు నుండి, నా వెనక నుండి, నా కుడి, ఎడమ నుండి మరియు పై నుండి కాపాడు. నేను క్రింది నుండి కూడా ఏ కీడుకు గురి కాకుండా నీ ఔన్నత్యాల ఆధారంగా నీ శరణులోకి వచ్చాను).

5- ఇంకా ఇలా తెలిపారు: ఎవరైతే ఈ దుఆ ప్రతి ఉదయం మరియు సాయంత్రం చదువుతాడో అతనికి ఏదీ నష్టపరచదు. (అబూదావూద్ 5088).

بِسْمِ اللهِ الَّذِي لاَ يَضُرُّ مَعَ اسْمِهِ شَيْءٌ فِي الأَرْضِ وَلاَ فِي السَّمَاءِ وَهُوَ السَّمِيعُ العَلِيم

బిస్మిల్లాహిల్లజీ లా యజుర్రు మఅస్మిహీ షైఉన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాఇ వహువస్సమీఉల్ అలీం.

(అల్లాహ్ పేరుతో, ఆయన పేరుతో ఏ వస్తువు నష్టపరచదు, ఆకాశంలోగాని, భూమిలోగాని, ఆయన వినువాడు, సర్వజ్ఞాని).

6- అబూ బకర్ రజియల్లాహు అన్హు ప్రవక్తతో ఇలా అన్నారు: నాకు ఏదైనా దుఆ నేర్పండి, నేను దానిని ఉదయం, సాయంత్రం చదువుతాను, అప్పుడు ప్రవక్త చెప్పారు: నీవు ఉదయం, సాయంకాలం మరియు పడుకునే ముందు ఈ దుఆ చదువు:  

اللَّهُمَّ فَاطِرَ السَّمَاوَاتِ وَالأرْضِ عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ رَبَّ كُلِّ شَيْءٍ وَ مَلِيْكَهُ أَشْهَدُ أَن لاَّ إِلَهَ إِلاَّ أَنْتَ أَعُوذُ بِكَ مِنْ شَرِّ نَفْسِي وَشَرِّ الشَّيْطَانِ وَشِرْكِهِ وَأَنْ أَقْتَرِفَ عَلَى نَفْسِي سُوْءً أَوْ أَجُرَّهُ إِلَى مُسْلِمٍ

అల్లాహుమ్మ ఫాతిరస్సమావాతి వల్ అర్జి ఆలిమల్ గైబి వష్షహాదతి రబ్బ కుల్లి షైఇఁ వ మలీకహ్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అఊజు బిక మిన్ షర్రి నఫ్సీ వ షర్రిష్ షైతాని వ షిర్కిహీ, వఅన్ అక్తరిఫ అలా నఫ్సీ సూఅన్ ఔ అజుర్రహూ ఇలా ముస్లిమ్.

(ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! ప్రతీ వస్తువు యొక్క ప్రభువా! మరియు యజమానీ! నీ తప్ప సత్య ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను, నేను నీ శరణులో వచ్చాను; నా ఆత్మ కీడు నుండి, షైతాన్ కీడు నుండి, అతని షిర్క్ ప్రేరేపణల నుండి, అలాగే నేను నా పట్ల గాని లేదా ఎవరైనా ముస్లింను చెడుకు గురి చేయుట నుండి).

ఆయన విధానం: ఇంటి నుండి బయలుదేరే లేదా ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దుఆలలో

1- ఆయన ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ విధంగా పలికేవారు:

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ، اللَّهُمَّ إِنِّي أعُوذُ بِكَ أنْ أضِلَّ أَوْ أُضَلَّ، أَوْ أَزِلَّ أَوْ أُزَلَّ، أَوْ أظْلِمَ أَوْ أُظْلَمَ، أَوْ أجْهَلَ أَوْ يُجْهَلَ عَلَيَّ

బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్, అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక అన్ అజ్దిల్ల ఔ ఉజ్దల్ల ఔ అజిల్ల ఔ ఉజల్ల ఔ అజ్లిమ ఔ ఉజ్లమ ఔ అజ్ హల ఔ యుజ్ హల అలయ్య.

అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, నేను స్వయంగా మార్గం తప్పడం నుండి, లేదా తప్పించబడటం నుండి, జారటం నుండి లేదా జారింపబడుట నుండి, నేను ఎవరినైనా బాధించడం నుండి లేదా ఎవరిచేతనైనా బాధింపబడటం నుండి, నేను ఎవరితోనైనా అసభ్యంగా, మూర్ఖంగా ప్రవర్తించుట నుండి లేదా ఎవరైనా నాతో అలా ప్రవర్తించుట నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్!).

2- ఇంకా ఇలా తెలిపారు: ఎవరు ఇంటి నుండి బైటికి వెళ్తూ ఈ దుఆ చదువుతారో అతనితో ఇలా అనబడుతుంది: నీకు సన్మార్గం ప్రాప్తించినది, అల్లాహ్ నీ కొరకు సరిపోయాడు, కీడు, బాధల నుండి  నీకు రక్షణ లభించినది మరియు షైతాన్ అతని నుండి దూరమయ్యాడు. (అబూదావూద్ 5095).

بِسْمِ اللهِ تَوَكَّلْتُ عَلَى اللَّهِ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِالله

బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహి లాహౌల వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్.

(అల్లాహ్ పేరుతో వెళ్తున్నాను, అల్లాహ్ పై మాత్రమే నా నమ్మకం. పుణ్యం చేసే మరియు పాపం నుండి దూరంగా ఉండే భాగ్యం అల్లాహ్ యే ప్రసాదించువాడు.)

3- ఆయన ఫజ్ర్ నమాజ్ కొరకు బయలుదేరేటప్పుడు ఇలా చదివేవారు:

اللَّهُمَّ اجْعَلْ فِي قَلْبِي نُورًا وَفِي لِسَانِي نُورًا وَاجْعَلْ فِي سَمْعِي نُورًا وَاجْعَلْ فِي بَصَرِي نُورًا وَاجْعَلْ مِنْ خَلْفِي نُورًا وَمِنْ أَمَامِي نُورًا وَاجْعَلْ مِنْ فَوْقِي نُورًا وَمِنْ تَحْتِي نُورًا اللَّهُمَّ أَعْطِنِي نُورًا

అల్లాహుమ్మజ్అల్ ఫీ ఖల్ బీ నూరా, వ ఫీ లిసానీ నూరా, వజ్అల్ ఫీ సమ్ఈ నూరా, వజ్అల్ ఫీ బసరీ నూరా, వజ్అల్ మిన్ ఖల్ ఫీ నూరా, వ మిన్ అమామీ నూరా, వజ్అల్ మిన్ ఫౌఖీ నూరా, మవిన్ తహ్ తీ నూరా, అల్లాహుమ్మ అఅతినీ నూరా. (ముస్లిం 763, బుఖారి 6316).

(ఓ అల్లాహ్ నా హృదయంలో వెలుగు ప్రసాదించు, నా నాలుకలో వెలుగు ప్రసాదించు, నా చెవిలో వెలుగు ప్రసాదించు, నా కళ్ళలో వెలుగు ప్రసాదించు, నా వెనక వెలుగు ప్రసాదించు, నా ముందు వెలుగు ప్రసాదించు, నా పైన వెలుగు ప్రసాదించు, నా క్రింద వెలుగు ప్రసాదించు. ఓ అల్లాహ్ నాకు (ప్రళయ దినాన) వెలుగు ప్రసాదించు).

4- ఇంకా ఇలా అన్నారు: మనిషి తన ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదవాలి:

اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ خَيْرَ الْمَوْلَجِ وَخَيْرَ الْمَخْرَجِ بِسْمِ الله وَلَجْنَا وَبِسْمِ الله خَرَجْنَا وَعَلَى الله رَبِّنَا تَوَكَّلْنَا

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరల్ మౌలజి వ ఖైరల్ మఖ్రజి బిస్మిల్లాహి వలజ్నా వ బిస్మిల్లాహి ఖరజ్నా వఅలల్లాహి రబ్బినా తవక్కల్నా.

(ఓ అల్లాహ్! నేను ఇంట్లో ప్రవేశిస్తూ, బయటికి వెళ్తూ శుభం కలగాలని నిన్నే వేడుకుంటున్నాను. అల్లాహ్ పేరుతో ప్రవేశించాము, అల్లాహ్ పేరుతోనే బైటికి వెళ్ళాము, మా ప్రభువైన అల్లాహ్ పై నమ్మకం ఉంచాము). (అబూదావూద్ 5096).

1- ఆయన మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు ఈ దుఆ చదివేవారు: అఊజు బిల్లాహిల్ అజీం వ బివజ్ హిహిల్ కరీం వ సుల్తానిహిల్ ఖదీం మినష్షైతానిర్రజీం.

أَعُوذُ بِاللهِ الْعَظِيمِ وَبِوَجْهِهِ الْكَرِيمِ وَسُلْطَانِهِ الْقَدِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ

(ధూత్కరింపబడిన షైతాన్ బారి నుండి రక్షణకై నేను గొప్పవాడైన అల్లాహ్, ఆయన గౌరవనీయమైన ముఖం మరియు ఆది నుండి గల ఆయన అధికార శరణులోకి వస్తున్నాను).

అయన దీని ఘనత ఇలా తెలిపారు: ఎప్పుడైతే దాసుడు ఈ దుఆ చదువుతాడో అప్పుడు షైతాన్ అంటాడు: ఈ రోజంతా ఇతను నా నుండి రక్షింపబడ్డాడు.(అబూ దావూద్)

2- ఇంకా ఇలా అన్నారు: మీలో ఎవరైనా మస్జిదులోకి ప్రవేశించాలనుకున్నప్పుడు  ప్రవక్త పై దరూద్ పంపిన తరువాత ఈ దుఆ చదవాలి:

అల్లాహుమ్మఫ్ తహ్ లీ అబ్వాబ రహ్మతిక.                    اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ

(ఓ అల్లాహ్ నా కొరకు నీ కరుణ ద్వారాలను తెరుచు). (ముస్లిం 713).

మస్జిద్ నుండి బైటికి వచ్చేటప్పుడు ఈ దుఆ చదవాలి:

అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్లిక.        اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ

(ఓ అల్లాహ్ నీతో నీ దయ కోరుతున్నాను). (ముస్లిం 713).

ఆయన విధానం: నెలవంకను చూసినప్పుడు చేసే దుఆలో

ఆయన నెలవంకను చూసినప్పుడు ఈ దుఆ చేసేవారు:

اللَّهُمَّ أَهِلَّهُ عَلَيْنَا بِالْأَمْنِ وَالإِيمَانِ، وَالسَّلَامَةِ وَالإِسْلَامِ، وَالتَّوْفِيقِ لِمَا تُحِبُّ رَبَّنَا وَتَرْضَى رَبُّنَا وَرَبُّكَ اللهُ

అల్లాహుమ్మ అహిల్లాహూ అలైనా బిల్ అమ్ని, వల్ ఈమాని వస్సలామతి, వల్ ఇస్లామి వత్తౌఫీఖి లిమా తుహిబ్బు రబ్బునా వతర్జా, రబ్బునా వ రబ్బు కల్లాహ్

ఓ అల్లాహ్! ఈ చంద్రునికి మాపై శాంతి, విశ్వాసము, రక్షణ, ఇస్లాంతో సహా,  ఉదయింపజేయి. నీవు ప్రేమించే, ఇష్టపడే వాటి భాగ్యం ప్రసాదించు ఓ మా ప్రభువా! (ఓ చంద్రుడా!) నాకు మరియు నీకు అల్లాయే ప్రభువు (దార్మీ, తిర్మిజి 3-157).

1-: ఆయన ఇలా సెలవిచ్చారు: నిశ్చయంగా అల్లాహు తఆలా తుమ్ముని ఇష్టపడతాడు మరియు ఆవలింతని ఇష్టపడడు. కనుక మీలో ఎవరికన్నా తుమ్ము వస్తే అల్  హందులిల్లాహ్ అని పలకాలి. వినే ప్రతి ముస్లిం పై ‘యర్హముకల్లాహ్ (నీపై అల్లాహ్ కారుణ్యం చూపు గాక)’ అనడం విధిగా ఉంది. ఆవలింత అనేది షైతాన్ తరపు నుండి. కనుక మీలో ఎవరికన్నా ఆవలింత వస్తే శక్తానుసారం దానిని ఆపడానికి ప్రయత్నం చేయాలి, మీలో ఎవరైనా ఆవలిస్తే షైతాన్ నవ్వుతాడు. (బుఖారీ)

2- ఆయన తుమ్మేటప్పుడు తమ చేయి లేదా వస్త్రాన్ని (రుమాలుని) అడ్డు పెట్టుకునేవారు. స్వరాన్ని తగ్గించేవారు.(అబూ దావూద్, తిర్మీజి)

3- ఇబ్ను ఉమర్ రజియల్లాహు అన్హుమా తుమ్మి (అల్ హందు లిల్లాహ్ అంటే, దగ్గరున్నావారిలో ఎవరైనా) యర్హముకల్లాహ్ అని అంటే, ఆయన దానికి జవాబుగా: యర్ హమునల్లాహు వ ఇయ్యాకుమ్, వయగ్ఫిర్ లనా వలకుమ్. (అల్లాహ్ మాపై మరియు మీపై కరుణించుగాక మరియు మిమ్మల్ని మరియు మమ్మల్ని క్షమించుగాక).

4- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో‌ ఎవరైనా తుమ్మినప్పుడు అల్ హందులిల్లాహ్ అనండి, ఇతనికి‌ జవాబుగా ఇతని సోదరుడు లేదా సహచరుడు యర్ హముకల్లాహ్ అనాలి. మళ్ళీ ఇతను యర్ హముకల్లాహ్ కి‌ జవాబుగా యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం అనాలి (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక). (బుఖారీ).

5- మీలో ఎవరైనా తుమ్మి అల్ హందులిల్లాహ్ అన్నప్పుడే అతనికి యర్ హముకల్లాహ్ అని జవాబు ఇవ్వండి. ఒకవేళ అతను హందులిల్లాహ్ అనకపోతే అతనికి‌ జవాబు ఇవ్వకండి‌. (ముస్లిం).

            ఆయన మూడు సార్లు కంటే ఎక్కువ తుమ్మేవాడికి బదులు ఇచ్చేవారు కాదు. ఇతనికి జలుబు అయింది అనేవారు. (ముస్లిం).

6- సహీ హదీసులో వచ్చింది: యూదులు ఆయన వద్దకు వచ్చి కావాలని తుమ్మేవారు, తద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యర్ హముకల్లాహ్ అంటే, వారికి ఆ కరుణ దుఆ లభిస్తుందని ఆశించేవారు, కానీ ప్రవక్త యహ్ దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుం (అల్లాహ్ మీకు సన్మార్గం చూపుగాక మరియు మిమ్మల్ని సరిదిద్దుగాక) అని అనేవారు. (తిర్మిజీ)

1- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో‌ ఎవరైనా వ్యాధిగ్రస్తునిని పరామర్శించి, ఈ దుఆ చేస్తే, ఆ రోగం, ఆపద ఇతనికి తగలదు:

الْحَمْدُ للهِ الَّذِي عَافَانِي مِمَّا ابْتَلَاكَ بِهِ وَفَضَّلَنِي عَلى كَثِيرٍ مِمَّنْ خَلَقَ تَفْضِيلاً

అల్ హందులిల్లాహిల్లజీ ఆఫానీ మిమ్మబ్ తలాక బిహి వఫజ్జలనీ అలా కసీరిమ్ మిమ్మన్ ఖలఖ తఫ్జీలా.

సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి, అల్లాహ్ నిన్ను పరీక్షిస్తున్న దాని నుండి నన్ను క్షేమంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు. (అబూ దావూద్)

1- ఆయన తమ అనుచర సమాజానికి గాడిద గాండ్రింపు వింటే పై’తాన్ నుండి శరణు కోరమని మరియు కోడి పుంజు కూత వింటే అల్లాహ్ తో ఆయన అనుగ్రహాన్ని అర్థించండి అని తెలిపారు. (బుఖారీ, ముస్లిం).

1- ఆయన ప్రజలకు కోపం వచ్చినప్పుడు వుజూ చేయమని, నిలబడి ఉంటే కూర్చోమని, కూర్చొని ఉంటే పడుకోవాలని మరియు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుంచి శరణు వేడుకోమని ఆదేశించారు.

1- తర్జీఅ (ترجيع = అజాన్ లో షహాదత్ పదాలు 4 సార్లు పలకడం) మరియు తర్జీఅ లేకుండా అంటే రెండు విధాలుగా అజాన్ ఇవ్వడం రుజువైనది. మరియు ఇఖామత్ ఒకసారి లేదా రెండు సార్లు ఇవ్వడం కూడా అనుమతి ఇవ్వబడింది. అయితే అన్ని స్థితుల్లో “ఖద్ ఖామతిస్సలాహ్” రెండు సార్లు అనడమే ఆయన నుండి రుజువైనది. ఒకేసారి అనడం ఖచ్చితంగా నిరూపించబడలేదు.

2- ఆయన తమ‌ అనుచర సమాజానికి ముఅజ్జిన్ ఎలా పులకుతే అలాగే జవాబు ఇవ్వాలని, కానీ హయ్య అలస్సలాహ్ మరియు హయ్య అలల్ ఫలాహ్ అన్నప్పుడు లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని జవాబు ఇవ్వమని ఆదేశించారు.

3- ప్రవక్త ప్రవచనం: ఎవరైతే అజాన్ విని ఈ దుఆ చదువుతాడో, అతని పాపాలు మన్నించబడతాయి: అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీక లహూ వఅష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ, రజీతు బిల్లాహి రబ్బా వబి ముహమ్మదిర్ రసూలా వబిల్ ఇస్లామి దీనా.

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، رَضِيتُ بِاللهِ رَبًّا وَبِمُحَمَّدٍ رَسُولًا، وَبِالْإِسْلَامِ دِينًا

(అల్లాహ్ తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. అల్లాహ్ నా ప్రభువు అని, ముహమ్మద్ (అల్లాహ్ యొక్క) ప్రవక్త అని మరియు ఇస్లాం నా ధర్మం అని ఇష్టపడ్డాను). (ముస్లిం 386).

4- అజాన్ వినేవారు ముఅజ్జిన్ కి బదులు ఇచ్చాక ఆయనపై దరూద్ చదివి, ఆ తర్వాత ఈ దుఆ చదవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు, ఇంకా అందువల్ల అతనికి ప్రళయదినాన ప్రవక్త సిఫారసు లభిస్తుందని శుభవార్తి ఇచ్చారు: అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దఅ్ వతిత్ తామ్మతి వస్సలాతిల్ ఖాఇమతి ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలత వబ్అస్ హు మఖామమ్ మహ్మూద నిల్లజీ వఅత్తహూ.

اللَّهُمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ وَالصَّلَاةِ الْقَائِمَةِ آتِ مُحَمَّدًا الْوَسِيلَةَ وَالْفَضِيلَةَ وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ

(ఈ పరిపూర్ణ ఆహ్వానం మరియు స్థాపించబడే నమాజు యొక్క ప్రభువైన అల్లాహ్! ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వసీల మరియు ఘనతలు ప్రసాదించు. మరియు నీవు వాగ్దానం చేసిన ‘మఖామె మహ్మూద్’ (ప్రశంసనీయమైన స్థానం) ప్రతిష్ఠంపజేయి). (బుఖారీ)

5- ఆయన ఇలా తెలిపారు: అజాన్ మరియు ఇఖామత్ ల మధ్య చేయబడే దుఆ రద్దుచేయబడదు.

1- ఆయన జిల్ హిజ్జా తొలిదశలో అత్యధికంగా అల్లాహ్ స్మరణ చేసేవారు. మరియు ప్రజలకు కూడా అత్యధికంగా తహ్మీద్ (అల్ హందులిల్లాహ), తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) చేస్తూ ఉండాలని ఆదేశించారు.

1- ఆయన ప్రతి రోజు ఒక హిజ్బ్ పారాయణం చేసేవారు, దానిని వదిలేవారు కాదు. (హిజ్బ్ అంటే తిలావత్ కొరకు ఫిక్స్ చేసుకున్న ఖుర్ఆన్ లోని ఒక భాగం).

2- ఆయన ఖుర్ఆన్ ను ఆగి ఆగి నింపాదిగా ఒక్కో అక్షరాన్ని స్పష్టంగా పారాయణం చేసేవారు, వేగంగా చదివేవారు కాదు, అలానే త్వరగా కూడా చదివేవారు కాదు. బదులుగా మధ్యస్థ వైఖరిని అవలంభిస్తూ ఖిరాఅ తఫ్సీరియ్యహ్ (వినేవారికి భావం తెలిసేరీతిలో తిలావత్) చేసేవారు.

3- ఆయన ఖుర్ఆన్ యొక్క ప్రతి ఆయతును వేర్వేరుగా చదివేవారు. ఒక్కో ఆయత్ పై ఆగేవారు. సూరాలను ఆగి ఆగి నింపాదిగా తిలావత్ చేసేవారు, వినేవారికి చాలా సుదీర్ఘమైన సూరాగా ఏర్పడేది.

4- ఆయన మద్ (దీర్ఘం) ఉన్న పదాలను ఉదా : అర్రహ్మాన్, అర్హహీంని గుంజీ, లాగీ చదివేవారు. (వీడియోలో తప్పక చూడండి ఈ విధానం).

5- ఆయన పారాయణం ప్రారంభించే ముందు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ తో శరణు వేడుకునేవారు. అనగా అఊజుబిల్లాహి మినష్ షైతానిర్రజీం పఠించేవారు. మరికొన్ని సార్లు ఈ విధంగా చదివేవారు: అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినష్షైతానిర్రజీమి మిన్‌ హమ్జిహి వ నఫ్ఖిహి వ నఫ్సిహ్. (ఓ అల్లాహ్ నేను శాపగ్రస్తుడైన షైతాన్ ప్రేరణల నుండి,అతని ఊదడం నుండి, మంత్రం నుండి నీ శరణు వేడుతున్నాను). (ఇబ్నే మాజహ్).

6- ఆయన నిలబడి, కూర్చొని, పడుకొని, వుజూ స్థితిలో, వుజూ లేని స్థితిలో ప్రతీ స్థితిలో ఖుర్ ఆన్ పారాయణం చేసేవారు కానీ అశుద్ధావస్థలో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు కాదు.

7- ఆయన ఉత్తమమైన స్వరంతో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. మరియు ఇలా అనేవారు: ఎవరైతే ఖుర్ ఆన్ సుందరమైన స్వరంతో చదవడో వాడు మన విధానం లోనివాడు కాదు. (బుఖారీ).

            ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ఖుర్ఆన్ ను మీ కంఠస్వరాల ద్వారా అలంకరించండి.

8- ఆయన ఇతరుల స్వరంతో కూడా పారాయణం వినడం ఇష్టపడేవారు.

9- ఆయన సజ్దహ్ ఆయతు చదివినప్పుడు అల్లాహు అక్బర్ అని సజ్దహ్ లోకి వెళ్ళేవారు. ఆయన ఒక్కోసారి సజ్దహ్ లో ఈ దుఆ చదివేవారు: సజద వజ్ హియ లిల్లజీ ఖలకహూ వ షక్క సమ్అహూ వ బసరహూ బిహౌలిహీ వ కువ్వతిహీ [ఫతబారకల్లాహు అహ్ సనుల్ ఖాలిఖీన్]. (తిర్మిజి 580 [హాకిం 802]).

سَجَدَ وَجْهِي لِلَّذِي خَلَقَهُ وَشَقَّ سَمْعَهُ وَبَصَرَهُ بِحَوْلِهِ وَقُوَّتِهِ {فَتبَارَك اللهُ أَحسَنَ الخَالِقِين}

(నా ముఖం, తన శక్తి సామర్థ్యాలతో దానిని సృష్టించిన, చెవి, కళ్ళు ఇచ్చిన అల్లాహ్ కు సజ్దా చేసింది. అతి ఉత్తమ సృష్టి కర్త అయిన అల్లాహ్ చాలా శుభాలు కలవాడు).

            మరికొన్ని సందర్భాల్లో ఈ దుఆ చదివేవారు: అల్లాహుమ్మక్ తుబ్ లీ బిహా ఇందక అజ్రా, వ జఅ అన్నీ బిహా విజ్రా, వజ్అల్ హా లీ ఇందక జుఖ్రా, వ తఖబ్బల్ హా మిన్నీ కమా తఖబ్బల్ తహా మిన్ అబ్దిక దావూద్. (తిర్మిజి 579, 3424).

اللَّهُمَّ اكْتُبْ لِي بِهَا عِنْدَكَ أَجْرًا وَضَعْ عَنِّي بِهَا وِزْرًا وَاجْعَلْهَا لِي عِنْدَكَ ذُخْرًا وَتَقَبَّلْهَا مِنِّي كَمَا تَقَبَّلْتَهَا مِنْ عَبْدِكَ دَاوُدَ

(ఈ సజ్దాకు బదులుగా నీ వద్ద నా కొరకు పుణ్యం వ్రాసి పెట్టు, నాపై ఉన్న పాపాల భారం దించిపెట్టు, పుణ్యఫలం భద్రంగా స్టోర్ చేసిపెట్టు మరియు నీ (ప్రియ)దాసుడైన దావూద్ అలైహిస్సలాం నుండి అంగీకరించినట్లు నాతో అంగీకరించు).

ఆయన సజ్దయే తిలావత్ నుండి లెసినప్పుడు అల్లాహు అక్బర్ అనేవారు కాదు. అలాగే తషహ్హుద్ లేదా సలామ్ కూడా త్రిప్పేవారు కాదు. (కాని నమాజు చేయించే ఇమాం నమాజులో ఉండగా సజ్దయే తిలావత్ గల ఆయత్ చదివితే, అల్లాహు అక్బర్ అంటూ సజ్దాలోకి వెళ్ళాలి, అల్లాహు అక్బర్ అంటూ సజ్దా నుండి లేవాలి).

1- ఆయన ఖుత్బా ఇచ్చేటప్పుడు కళ్ళు ఎర్రగా, కంఠస్వరం పెద్దగా (బిగ్గరగా) అయ్యేవి. ఆగ్రహం పెరిగిపోయేదే; ఎలాగైతే ఒక సైన్యం నుండి బెదిరించేవాడు అంటాడో: ప్రజలారా శత్రువు మీపై పొద్దున్న లేదా రాత్రి దాడి చేయబోతున్నాడు.

            ఆయన ఇలా అన్నారు: “నన్ను పంపబడిన కాలం మరియు ప్రళయదినం మధ్య ఈ విధంగా న్ని ఈ విధంగా ప్రక్కప్రక్కన కలిపి పంపడం జరిగింది” అని ప్రవక్త ముహమ్మద్ ﷺ తమ చూపుడు వ్రేలును మధ్య వ్రేలుతో కలిపి చూపిస్తూ అన్నారు (బుఖారీ, ముస్లిం)

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అనేవారు: అమ్మా బఅద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్, వ ఖైరల్ హద్ యి హద్ యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, వషర్రల్ ఉమూరి ముహ్ దాసాతుహా, వ కుల్ల బిద్అతిన్ ద్జలాలహ్. (అన్నిటికంటే ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథంలోనిది, అన్నిటికంటే ఉత్తమమైన విధానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం, అన్ని విషయాల్లో కెల్ల అతి చెడ్డ విషయం బిద్అతులు (ధర్మం పేరు మీద కల్పితాచాచరాలు),  ప్రతి కొత్త కల్పిత దురాచారం మార్గభ్రష్టత్వానికి దారితీస్తుంది. (ముస్లిం).

ఆయన అల్లాహ్ స్తోత్రం తో ప్రారంభించకుండా ఎటువంటి ప్రసంగాన్ని ప్రసంగించేవారు కాదు.

ఆయన తమ సహాబాలకు ఉపన్యాసం కొరకు ఈ విధంగా బోధించేవారు:-

ఇన్నల్ హమ్ద లిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅ్ మాలినా మయ్ యహ్ దిహిల్లాహు ఫలాముజిల్ల లహు వమయ్ యుజ్లిల్ ఫలా హాదియలహు వ నష్రదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు…

సకల స్తోత్రములన్నీ అల్లాహ్ కే చెందుతాయి మేము ఆయన్నే స్తుతిస్తాము. సహాయం కోసం ఆయన్నే అర్ధిస్తున్నాము. మోక్షం(క్షమాభిక్ష )కొరకు ఆయన్నే వేడుకుంటున్నాము. కామ చేష్టల నుండి దురాచరణల నుండి మేము ఆయన శరణు కోరుకుంటున్నాము ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శనం వహిస్తాడు వారిని ఎవరూ దారి తప్పించలేరు. మరి ఎవరినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వానికి గురి చేయదలుచుకుంటాడో వారికి ఎవ్వరూ దారి చూపించలేరు‌ అల్లాహ్ తప్ప ఎవరూ నిజ ఆరాధ్యుడు లేడని మేము సాక్ష్యం ఇస్తున్నాము.మరియు మహాప్రవక్త ముహమ్మద్ ﷺ గారు ఆయన సందేశహరులని దాసులని కూడా మేము సాక్ష్యం ఇస్తున్నాము.

పిదప ఆయన ఈ మూడు వాక్యాలను పారాయణం చేసేవారు:-

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ حَقَّ تُقٰتِهٖ وَلَا تَمُوْتُنَّ اِلَّا وَاَنْتُمْ مُّسْلِمُوْنَ

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.

Aal-e-Imran 3:102

يٰۤاَيُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِيْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيْرًا وَّنِسَآءً ۚ وَاتَّقُوا اللّٰهَ الَّذِيْ تَسَآءَلُوْنَ بِهٖ وَالْاَرْحَامَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَيْكُمْ رَقِيْبًا

మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.

An-Nisa’ 4:1

يٰۤاَيُّهَا الَّذِيْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَقُوْلُوْا قَوْلًا سَدِيْدًا ۙ

ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి).

Al-Ahzab 33:70

మరియు ఆయన వారికి (సహాబాలకు) ప్రతీ పనిలో ఇస్తెఖారహ్ చేయమని నేర్పేవారు ఎలాగైతే ఖుర్ఆన్ లోని సూరా నేర్పేవారో.

ఆయన ఇలా అన్నారు:-

మీరు ఏ పనినైనా చేయాలనుకుంటే ‘ఫర్జ్’ నమాజులో తప్ప ఇతర నఫిల్ నమాజు రెండు రకాతులు చదివి ఇలా పఠించాలి.

అల్లాహుమ్మ ఇన్నీ అస్తఖీరుక బిఇల్మిక వఅస్తఖ్దిరుక బిఖుద్రతిక వస్అలుక మిన్ ఫజ్లికల్ అజీమ్ ఫఇన్నక తఖ్దిరు వలా అఖ్దిరు వ తఅ్ లము వలా అఅ్ లము వ అన్త‌ అల్లాముల్ గుయూబ్. అల్లాహుమ్మ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర —(తమ అవసరం గురించి విన్నవించాలి)— ఖైరుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)–ఫఖ్దుర్ హు లీ వయస్సిర్ హు లీ , సుమ్మ బారిక్ లీ ఫీహి , వ ఇన్ కున్త తఅ్ లము అన్న హాజల్ అమ్ర షర్రుల్లీ ఫీ దీనీ వ మఆషీ వ ఆఖిబతి అమ్రీ.. లేదా ఇలా అన్నారు (ఆ(ع)జిలిహీ వ ఆ(آ)జిలిహీ)..ఫస్రిఫ్ హు అన్నీ వస్రిఫ్ నీ అన్హు వఖ్దుర్ లియల్ ఖైర హైసు కాన సుమ్మ రజ్జినీ బిహీ.(బుఖారీ)

(ఓ అల్లాహ్ ! నేను నీ జ్ఞానం ద్వారా, నీ నుండి మేలు కోరుతున్నాను. నీ శక్తి ద్వారా నాకు శక్తిని ప్రసాదించు. నీ మహా అనుగ్రహాన్ని కోరుతున్నాను. నిశ్చయంగా నీకే శక్తి ఉంది. నాకు ఎలాంటి శక్తి లేదు. నీకు అంతా తెలుసు నాకు ఏమీ తెలియదు. ఆగోచర జ్ఞానం కలవాడవు నీవే. ఓ అల్లాహ్! ఈ పని (దేనిని గురించి ఇస్తేఖారా చేస్తున్నారో దానిని ప్రస్తావించాలి) ధార్మికంగా సామాజికంగా, సంపాదనంగా, మోక్షపరంగా,(దాని త్వరగా మరియు ఆలస్యం లో) నా కొరకు మేలైనదైతే నాకై నిశ్చయించు. దానిని నా కొరకు ప్రసాదించు. ఓ అల్లాహ్! ఈ పని ధార్మికంగా, సంపాదనపరంగా, మోక్షపరంగా(దాని త్వరగా మరియు ఆలస్యం లో) కీడైనదైతే దాన్నుండి నాకు నా నుండి దాన్ని దూరంగా ఉంచు. ఎక్కడున్నా సరే నాకు మేలును ప్రసాదించు. దాని ద్వారా నాకు సంతృప్తిని ప్రసాదించు). (బుఖారీ)

1- ఆయన ఒక్కోసారి పరుపు మీద‌ మరియు ఒక్కోసారి చర్మంతో చేయబడిన పరుపు మీద, ఒక్కోసారి చాప పై , ఒక్కోసారి నేలపై , మరియు ఒక్కోసారి మంచంపై పడుకునేవారు‌.ఆయన పరుపు మరియు దిండి శుభ్రంగా రంగించబడిన చర్మం తో చేసినదై ఉండేది దాని లోపల ఖర్జూరం బెరడు నిండి ఉండేది.

2- ఆయన అవసరానికంటే ఎక్కువగా నిద్రపోయేవారు కాదు.మరియు అవసరానికంటే తక్కువగా నిద్రపోయే వారు కూడా కాదు.

3- ఆయన రాత్రి మొదటి భాగంలో నిద్రపోయేవారు మరియు చివరి భాగంలో మేలుకునేవారు. కొన్నిసార్లు ముస్లిములందరి సంక్షేమం కోసం మొదటి రాత్రిలో మేల్కొని ఉండేవారు.

4- (ప్రయాణ స్థితిలో) ఆయన రాత్రి చివరి భాగంలో పడుకున్నప్పుడు కుడి వైపున  పడుకునేవారు.మరియు ఫజర్ ముందు పడుకున్నప్పుడు కుడి చేయి నిల్చోబెట్టి దాని అరచేతిలో తల పెట్టి పడుకునే వారు.

5- ఆయన పడుకున్నప్పుడు ఎవరూ ఆయనని నిద్ర నుండి మేల్కొనిపేవారు కాదు ఎప్పటి వరకు అయితే ఆయన స్వయంగా మేలుకోరో. ఆయన కళ్ళు నిదురపోయేవి కానీ హృదయం మేల్కొని ఉండేది.

6-ఆయన పరుపుపై పడుకొనేందుకు వెళ్లినప్పుడు ఈ దుఆ చదివేవారు:-  బిస్మికల్లాహుమ్మ అమూతు వ అహ్యా (అల్లాహ్ పేరుతో మరణిస్తున్నాను (నిదురపోతున్నాను) మరియు జీవిస్తున్నాను (మేల్కొంటున్నాను) (బుఖారీ)

ఆయన ఖుల్ హువల్లాహు అహద్ (సూరయే ఇఖ్లాస్),ఖుల్ అఊజు బిరబ్బిల్ ఫలఖ్(సూరయే ఫలఖ్), ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ (సూరయే నాస్) పఠించేవారు మరియు తమ రెండు అరచేతులను దగ్గర చేసి వాటి మీద ఊదేవారు.పిదప రెండు అరచేతులతో తల,ముఖం, మరియు కుదరభాగంపై స్పర్శించేవారు (తుడిచేవారు). మరియు ఎంతవరకు కుదిరితే అంత భాగంపై తుడిచేవారు. ఈ విధంగా ఆయన మూడుసార్లు చేసేవారు.(బుఖారీ)

7- ఆయన కుడి వైపున పడుకునేవారు.మరియు ఆయన తన చేతిని కుడి చెంప క్రింద ఉంచి ఈ దుఆ చదివేవారు:- అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తబ్అసు ఇబాదక ( ఓ అల్లాహ్ నీవు నన్ను సమాధి శిక్ష నుండి కాపాడు ఏ నాడు అయితే నీవు నీ దాసులను తిరిగి లేపుతావో)అబూ దావూద్, తిర్మీజి

ఆయన కొందరు సహాబాలతో ఇలా అన్నారు:- నీవు నీ పరుపు మీదకు పోయినప్పుడు నమాజు కొరకు చేసే మాదిరిగా వుజూ చేసుకో పిదప కుడి వైపు తిరిగి పడుకొని ఈ దుఆ చదువు:-

«اللَّهُمَّ أَسْلَمْتُ نَفْسِي إِلَيْكَ، وَفَوَّضْتُ أَمْرِي إِلَيْكَ، وَوَجَّهْتُ وَجْهِي إِلَيْكَ، وَأَلْجَأْتُ ظَهْرِي إِلَيْكَ، رَغْبَةً وَرَهْبَةً إِلَيْكَ ، لَا مَلْجَأَ وَلَا مَنْجَا مِنْكَ إِلَّا إِلَيْكَ ، آمَنْتُ بِكِتَابِكَ الَّذِي أَنْزَلْتَ وَبِنَبِيِّكَ الَّذِي أَرْسَلْتَ».

“అల్లాహుమ్మ అస్లమ్తు నఫ్సీ ఇలైక, వఫవ్వజ్తు అమ్రీ ఇలైక, వ వజ్జహ్తు వజ్హీ ఇలైక, వ అల్ జఅ్ తు జహ్రీ ఇలైక, రగ్బతవ్ వ రహ్బతన్ ఇలైక, లా మల్జఅ వలా మన్జఅ మిన్క ఇల్లా ఇలైక, ఆమన్తు బికితాబికల్లదీ అన్జల్త వ బినబియ్యికల్లదీ అర్సల్త””

ఓ అల్లాహ్! నా ఆత్మను నీ ఆధీనం చేసాను, నా వ్యవహారాలన్నీ నీకు నా ముఖాన్ని నీ వైపుకు మరల్చాను, నా వీపును నీ వైపుకు వంచాను, (ఇవన్నీ నేను) భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో చేసాను. నీ పట్టు నుండి తప్పించుకోలేను. నీవు తప్ప నాకు రక్షకుడు లేడు. నీవు అవతరింప జేసిన గ్రంథాన్నీ మరియు నీవు పంపిన ప్రవక్తనూ విశ్వసించాను. (ఈ దుఆ నిద్ర పోయిన తరువాత చనిపోతే ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మరణం జరిగినట్లు) (బుఖారీ, ముస్లిం).

«اللَّهُمَّ رَبَّ جِبْرِيلَ، وَمِيكَائِيلَ، وَإِسْرَافِيلَ فَاطِرَ السَّمَوَاتِ وَالْأَرْضِ، عَالِمَ الْغَيْبِ وَالشَّهَادَةِ، أَنْتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ اهْدِنِي لِمَا اخْتُلِفَ فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِكَ إِنَّكَ تَهْدِي مَنْ تَشَاءُ إِلَى صِرَاطٍ مُسْتَقِيمٍ».

 అల్లాహుమ్మ రబ్బ జిబ్రీల, వ మీకాయీల, వ ఇస్రాఫీల ఫాతిరస్ సమావాతి వల్ అర్ది. ఆలిమల్ గైబి వష్ షహాదతి, అన్త తహ్కుము బైన ఇబాదిక, ఫీమా కానూ ఫీహి యఖ్తలిఫూన్. ఇహ్దినీ లిమఖ్ తులిఫ ఫీహి మినల్ హఖ్ఖి బిఇద్నిక ఇన్నక తహ్దీ మన్ తషాఉ ఇలా సిరాతిమ్ ముస్తఖీమ్.

ఓ అల్లాహ్! జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీలుల ప్రభువువి నీవే! ఓ భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! నీ దాసులు విభేదించుకుంటున్న విషయాలలో తీర్పునిచ్చే వాడివి నీవే. విభేదము ఏర్పడిన విషయాలలో నీ అనుజ్ఞతో నాకు సత్యము వైపునకు మార్గదర్శకము గావించు. నిశ్చయంగా నీవు కోరిన వారికి రుజు మార్గదర్శకము గావిస్తావు. (ముస్లిం).

9- ఆయన నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఈ విధంగా పఠించేవారు:-

«الْحَمْدُ للهِ الَّذِي أَحْيَانَا بَعْدَ مَا أَمَاتَنَا وَإِلَيْهِ النُّشُورُ»

“అల్హామ్దు లిల్లాహిల్లదీ అహ్యానా బఅ్ దమా అమాతనా వఇలైహిన్ నుషూర్”

చనిపోయిన తర్వాత మమ్మల్ని తరిగి బ్రతికించిన అల్లాహ్క సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది. (బుఖారీ, ముస్లిం) మరియు మిస్వాక్ చేసేవారు మరియు కొన్నిసార్లు సూరయే ఆలిమ్రాన్ చివరి పది వాక్యాలు పారాయణం చేసేవారు (ముత్తఫఖున్ అలైహి)

10- ఆయన కోడికూతను విన్నప్పుడు నిద్ర లేచేవారు మరియు అల్లాహ్ యొక్క స్తోత్రం, తక్బీర్ (గొప్పతనం), తహ్లీల్ (లాఇలాహ ఇల్లల్లాహ్) మరియు దుఆ చేసేవారు.

11- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు:- మంచి కలలు అల్లాహ్ తరుపునుండి వస్తాయి. మరియు చెడు కలలు షైతాన్ తరపు నుండి వస్తాయి‌. అందువలన ఏ వ్యక్తి అయినా అయిష్టకరమైన కలను చూస్తే ఎడమవైపున సాధారణంగా(తూ తూ అని కొన్ని తుంపర్లు పడేలా) ఉమ్మాలి.మరియు అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం అని పఠిస్తే అతనికి ఎటువంటి హాని కలుగదు. మరియు దానిని ఎవరికీ తెలుపకూడదు. మరియు ఒకవేళ మంచి కలను చూస్తే దానిని శుభవార్త అనుకొని కేవలం తాను ఇష్టపడిన వారికి మాత్రమే తెలుపాలి.(ముత్తఫఖున్ అలైహి)

అలాగే చెడు కలలు చూసేవారితో ప్రక్క మార్చి మరియు నమాజు చేయమని ఆజ్ఞాపించారు.

1-ఆయన సుగంధాన్ని అత్యధికంగా వాడేవారు, మరియు దానిని‌ ఇష్టపడేవారు.ఎప్పడూ సువాసనను పీల్చుకోకుండా వదిలేవారు కాదు.ఆయన దృష్టిలో అన్నిటికంటే ఉత్తమమైన సువాసన మిష్క్ ది(అనగా కస్తూరిది ).

2- ఆయన‌ మిస్వాక్ ను అధికంగా ఇష్టపడేవారు.ఇఫ్తార్ మరియు ఉపవాస స్థితిలో కూడా మిస్వాక్ చేసేవారు.నిద్ర నుండి మేల్కొనేటప్పుడు, మరియు ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు మరియు నమాజు కొరకు మిస్వాక్ చేసేవారు.

3- ఆయన సుర్మా ను ఉపయోగించేవారు మరియు ఇలా అన్నారు:-మీ సుర్మా లలో అత్యంత ఉత్తమమైన సుర్మా అస్మద్ .ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది మరియు కను రెప్పల వెంట్రుకలను పెంచుతుంది.

4- ఆయన ఒక్కోసారి స్వయంగా తల దువ్వుకునేవారు ఒక్కోసారి ఆయన భార్య ఆయిషా రదియల్లాహు అన్హా  దువ్వేది. ఆయన తల వెంట్రుకలన్నీ గొరిగించుకునేవారు లేకపోతే అలానే వదిలేసేవారు

5- ఆయన‌ హజ్ మరియు ఉమ్రాలలోనే గుండు చేయించుకోవడం రుజువైంది.ఆయన తల వెంట్రుకలు జుమ్మ కంటే ఎక్కువ మరియు వఫ్రా కంటే తక్కువ ఉండేవి.మరియు జుమ్మ వెంట్రుకలు ఆయన చెవుల‌ అంచు వరకు చేరి ఉండేవి.

జుమ్మ :- భుజాల వరకు పెరిగిపోయిన తల వెంట్రుకలు

వఫ్రహ్:- చివరి వరకు ఉండే పొడువాటి వెంట్రుకలను (జుట్టు) అంటారు

లమ్మహ్:- చెవుల అంచుల కంటే కొద్దిగ‌ పొడవుగా ఉండే జుట్టు

6- ఖజఅ్(కొంత తలభాగాన్ని గొరికించుకొని కొంత భాగాన్ని వదిలివేయడం,అరగుండు) నుండి ఆయన వారించేవారు

7-ఆయన ఇలా తెలిపారు:- అవిశ్వాసులకు వ్యతిరేకత చూపండి! గెడ్డాన్ని పెంచండి మరియు మీసాలను తగ్గించండి.(ముత్తఫఖున్ అలైహి)

8- ఆయన దుస్తులలో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకునేవారు.ఒక్కోసారి ఉన్ని ,ఒక్కోసారి దూది లేదా పత్తి,లేదా కొన్నిసార్లు కాటన్ (అవిసె మొక్క నుండి తయారు చేయబడిన వస్త్రం).ఆయనకు  అన్నిటికంటే ఇష్టమైన వస్త్రం చొక్కా.

9-ఆయన యమన్ కి చెందిన చారల దుప్పటి, మరియు ఆకుపచ్చ దుప్పటిని కూడా వేసుకునేవారు.మరియు జుబ్బా,మరియు చేతుల దగ్గర టైట్ గా ఉండేది,పైజామా,లుంగీ,దుప్పటి,సాక్సులు, చెప్పులు మరియు తలపాగా కూడా ధరించేవారు.

10- తలపాగాను అడుగున కట్టేవారు మరియు దాని అంచుని ఒక్కోసారి వెనుక వదిలేసేవారు. ఒక్కోసారి వదిలేవారు కాదు.  (హన్క్ అనగా అంగిలి,దిగువ దవడ గడ్డం క్రింద భాగాన్ని అంటారు )

11- మరియు ఆయన నలుపు రంగు దుస్తులు ధరించేవారు, మరియు ఎరుపు లుంగీ లేదా దుప్పటిని కూడా వాడారు

12- ఆయన వెండి ఉంగరాన్ని ధరించేవారు, మరియు దానిలో ఉన్న రాయి ని అరచేతి లోపలి వైపుకు తిప్పుకునేవారు.

13- ఆయన కొత్త దుస్తులు ధరించేటప్పుడు వాటి పేరు తీసుకునేవారు మరియు ఈ విధంగా ప్రార్థించేవారు:-

اللَّهُمَّ  أَنْتَ كَسَوْتَنِيهِ ھذا القمیص اوالرداء او العمامۃ أَسْأَلُكَ خَيْرِهِ وَخَيْرِ مَا صُنِعَ لَهُ وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهِ وَشَرِّ مَا صُنِعَ لَهُ

అల్లాహుమ్మ అంత కసౌతనీహి హాజల్ ఖమీసి అవిర్రిదాఇ అవిల్ అమామహ్,అస్అలుక  ఖైరిహీ వ ఖైర మా సునిఅ లహూ వ అఊజుబిక మిన్ షర్రిహీ వషర్రి మాసునిఅ లహ్. (అబూదావూద్ 4020).

 (ఓ అల్లాహ్!నీవే నాకు ఈ చొక్కా, లేదా దుప్పటి లేదా తలపాగా తొడిగించావు, ఇందులో ఉన్న మేలు మరియు దేని కొరకు ఇది తయారు చేయబడిందో ఆ మేలును నీతో కోరుతున్నాను, ఇందులోని కీడు మరియు దేని కొరకు తయారు చేయబడిందో ఆ కీడు నుండి నీ శరణులో వస్తున్నాను).

14- ఆయన చొక్కాను కుడివైపు నుండి ధరించేవారు.

15- ఆయన దువ్వుకునేటప్పుడు, చెప్పులు వేసుకునేటప్పుడు, వుజూ లేదా తహారత్ (శుభ్రత) పొందేటప్పుడు, మరియు ఏదైనా వస్తువుని ఇవ్వడం మరియు తీసుకోవడంలో కుడి వైపు నుండి ప్రారంభించడాన్ని ఇష్టపడేవారు.

16- తుమ్ము వచ్చినప్పుడు ఆయన చేయి లేదా వస్త్రాన్ని ముఖంపై అడ్డుగా పెట్టుకునే వారు మరియు తమ స్వరాన్ని తగ్గించేసేవారు.

17- ఆయన ముసుగు వేసుకున్న యువ కన్యల కంటే ఎక్కువ సిగ్గుపడేవారు.

18- ఆయన పరిహసించే మాటలపై నవ్వే వారు కూడా!..అయితే ఆయన నవ్వడం అధికంగా చిరునవ్వు తో ఉండేది. ఆయన అధికంగా నవ్వినప్పుడు ఆయన చిగుళ్ళు  కనపడేవి. ఆయన ఏడవడం కూడా నవ్వడం మాదిరిగానే ఉండేది ఎలాగైతే ఆయన పగలబడి నవ్వే వారు కాదు అలానే వారు వెక్కి వెక్కి ఏడ్చేవారు కాదు. అయితే ఆయన కళ్ళ నుండి కన్నీరు కారేది. మరియు ఆయన హృదయం నుండి (ఏడ్చే) శబ్దం వినబడేది.న

1- ఆయన ఏదైనా తెగ‌ వద్దకు పోతే వారికి సలాం చేసేవారు.మరియు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళేవారు.మరియు ప్రజలకు సలాం ను వ్యాప్తి చేయమని ఆజ్ఞాపించేవారు.

2- ఆయన ఇలా అన్నారు:- చిన్నవాడు పెద్దవానికి సలాం చేయాలి, మరియు బాటసారి కూర్చొని ఉన్న వ్యక్తి కి, మరియు స్వారీ పై ప్రయాణం లో ఉన్నవాడు కాలినడక నడిచే వానికి, మరియు తక్కువ మంది ఎక్కువ మందికి సలాం చేయాలి.

3- ఆయన ఎవరినన్నా కలిసినప్పుడు ముందుగా సలాం చేసేవారు మరియు ఆయనకి ఎవరైనా సలాం చేస్తే అదేవిధంగా.. లేకపోతే అంతకంటే ఉత్తమంగా వెంటనే బదులు ఇచ్చేవారు. కానీ ఏదన్నా కారణం ఉదా :- నమాజ్,మల మూత్ర విసర్జన సమయంలో వెంటనే ఇచ్చేవారు కాదు.

4- ఆయన ప్రారంభంలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనేవారు మరియు ఆయన మొదలుపెట్టే అతను అలైకస్సలాం అని మొదలుపెట్టడాన్ని అయిష్జపడేవారు.ఆయన సలాం కి జవాబుగా వఅలైకస్సలాం అని వావ్(మరియు ) తో  ఇచ్చేవారు.

5- ఆయన విధానం ఏమనగా ప్రజలు అధికంగా ఉన్నప్పుడు ఒక్కసారి సలాం చేయడం వలన అందరికీ చేరదు అనుకున్నప్పుడు ఆయన మూడు సార్లు సలాం చేసేవారు.

6- ఆయన విధానం ఏమనగా మస్జిద్ లోనికి ప్రవేశించే వారు  ముందుగా తహియ్యతుల్ మస్జిద్ నమాజు చేయాలి ఆ తర్వాత ప్రజల వద్దకు వచ్చి సలాం చేయాలి.

7- ఆయన చేయి, తల, వేళ్ళ సైగలతో ఎవరికీ సలాం జవాబు ఇచ్చేవారు కాదు.కానీ నమాజులో ఉన్నప్పుడు తప్ప.. అప్పుడు ఆయన సైగలతో జవాబు ఇచ్చేవారు.

8- పిల్లల ఉన్న దారి గుండా వెళితే వారికి సలాం చేసేవారు. అదేవిధంగా స్త్రీలు ఉన్న దారిలో ప్రవేశించినా సలాం చేసేవారు.మరియు సహాబాలు కూడా జుమా నమాజు తరువాత వాపసు వస్తుండగా దారిలో ఉన్న ముసలామెకు సలాం చేసేవారు.

9- ఆయన ఇతరులకు సలాం పంపేవారు. మరియు ఇతరులు పంపిన సలాం ను కూడా స్వీకరించేవారు. ఆయన ముందు ఎవరన్నా వేరొకరి సలాంను ప్రస్తావిస్తే ఆయన ముందు సలాం తెచ్చిన అతని పై మరియు పంపిన వాని పై సలాం చేసేవారు.

10- ఆయనను ఇలా ప్రశ్నించడం జరిగింది:- ఒక వ్యక్తి అతని సహోదరుడుని కలుసుకున్నప్పుడు అతని కొరకు వంగవచ్చునా? దానికి ఆయన లేదని సమాధానమిచ్చారు. మరి ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది అతనిని వాటేసుకుని చుంబించవచ్చునా? దానికి కూడా ఆయన లేదని సమాధానం ఇచ్చారు. పిదప ఇలా అడగడం జరిగింది అతనితో కరచాలం చేయవచ్చునా? దానికి ఆయన అవును అని సమాధానం ఇచ్చారు (తిర్మీజి)

11- ఆయన తన ఇంటి వారి వద్దకు వారు ఉచ్చులో పడే విధంగా(ఇబ్బంది కరంగా)అకస్మాత్తుగా వచ్చేవారు కాదు. ఆయన ప్రవేశించగానే సలాం చేసేవారు మరియు వారి స్థితిగతులను తెలుసుకునేవారు

12-ఆయన రాత్రి వేళలో తమ ఇంటిలో ప్రవేశించేటప్పుడు ఏ విధంగా సలాం చేసేవారు అంటే మేలుకొని ఉన్నవాడు వినేలా మరియు నిద్రపోయి ఉన్నవాడు తొందరపడి మేలుకోకుండా ఉండేలా చేసేవారు.

13- ఆయన విధానం ఏమనగా ఎప్పుడైతే అనుమతి అందించే వానితో నీవు ఎవరు ? అని అడగబడుతుందో అప్పుడు ఆయన ఫలానా గారి అబ్బాయి ఫలానా ని,లేదా తమ బిరుదు ని తెలిపేవారు అంతేకానీ “నేను నేను” అనేవారు కాదు.

14- ఆయన ఇతరుల వద్దకు వెళ్ళినప్పుడు మూడుసార్లు అనుమతిని అర్జించేవారు ఒకవేళ మూడుసార్లు తర్వాత కూడా అనుమతి లభించకపోతే తిరిగి వచ్చేసేవారు.

15-ఆయన సహాబాలకు అనుమతిని అర్జించేముందు సలాం చేయమని బోధించేవారు.

16-ఆయన ఎవరి ద్వారం వద్దనైనా వెళితే దానికి తిన్నగా నిలబడే వారు కాదు బదులుగా కుడి లేదా ఎడమ వైపు నిలబడేవారు‌. మరియు ఇలా అనేవారు:- అనుమతిని అర్థించడం కనుచూపు పడడం నుండి కాపాడుకోవడం కొరకే (ముత్తఫఖున్ అలైహి)

1-ఆయన చాలా అనర్గళంగా మరియు మధురమైన మాట గలవారు.ఉఛ్ఛారణ లో అందరికంటే వేగంగా మరియు సంభాషణలో మధురమైనవారు.

2- ఆయన సుదీర్ఘంగా మౌనం వహించే వారు. కేవలం అవసరం కలిగినప్పుడే మాట్లాడేవారు.మరియు వ్యర్థమైన,అనవసర మాటల నుండి దూరం పాటించేవారు.ఆయన కేవలం పుణ్యం ఆశించే విషయాలలోనే మాట్లాడేవారు.

3- ఆయన సమగ్రంగా మాట్లాడేవారు. ఆయన మాటలు లెక్కించగలవాడు లెక్కించగలిగేంతగా చాలా స్పష్టంగా ఉండేవి.ఆయన మాటలు గుర్తుపెట్టుకోకపోయేంత వేగంగా ఉండేవి కావు.అలాగే ఎక్కువగా ఆగి ఆగి మాట్లాడేవారు కూడా కాదు.

4- ఆయన తమ ప్రసంగం లో , మరియు అనుచర సమాజిని‌ అత్యున్నత జ్ఞానం బోధించడంలో ఉత్తమమైన మరియు సరైన పదాలు పదాలను ఎంచుకునేవారు..ఏవైతే కాఠిన్యానికి , అసభ్యకరమైన మాటల నుండి దూరంగా ఉంటాయో.

5- ఆయన‌ ఏదైనా మంచి పదాన్ని దాని అర్హతలేని వాడి కొరుకు, మరియు చెడు పదాన్ని మంచి వ్యక్తి కోసం ఎంచుకునేవారు కాదు.కావున,  కపటులను సయ్యద్(సర్దారు )అని మరియు అబూ జహల్ ను అబుల్ హకమ్ (తెలివైనవాడు)అని అనడం నుండి వారించారు.మరియు సుల్తాన్ కొరకు మాలికుల్ ముల్క్ మరియు ఖలీఫతుల్లాహ్ అనడం నుండి వారించారు.

6- ఆయన ఇలా అన్నారు:- ఎవరిపై అన్నా షైతాన్ ప్రభావం ఉంటే అతను బిస్మిల్లాహి అని చదవాలి.మరియు షైతానును శపించకూడదు.మరియు షైతాన్ నాశనం అవ్వాలి అని ఇలాంటి పదాలతో శపించకూడదు.

7- ఆయన ఉత్తమమైన పేర్లను ఇష్టపడేవారు. మరియు ఇలా అన్నారు :-మీ వద్దకు ఎప్పుడైనా రాయబారి ని పంపించడం జరిగితే అతని రూపం మరియు పేరు చక్కగా ఉండాలి. ఆయన పేర్ల నుండి అర్థాలను గ్రహించి పేర్లు మరియు ఆ వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వారు .

8- ఆయన ప్రవచనం:- అల్లాహ్ దృష్టిలో అన్నిటికంటే ఇష్టమైన పేరు అబ్దుల్లాహ్ మరియు అబ్దుర్రహ్మాన్ . మరియు అందరికంటే సత్యసంధులు హారిస్ మరియు హమ్మామ్. మరియు అన్నిటికంటే చెడ్డ పేర్లు హరబ్ మరియు ముర్రహ్

9- ఆయన ఆసియా అనే పేరును మార్చి జమీలహ్ అని పెట్టారు.మరియు అస్రమ్ ను జరిఅ గా మార్చారు. మరియు ఆయన మదీనా లో ప్రవేశించిన తర్వాత దాని పాత పేరు యస్రిబ్ ను తీసివేసి తయ్యిబహ్ పెట్టారు.

11- ఆయన సహాబాలకు మరియు చిన్న పిల్లలకు కున్నియత్ ను ఎంచేవారు (ఇచ్చేవారు).ఆయన తమ భార్యల్లో కొందరికి కూడా కున్నియత్ (స్వంత పేరు)ఇచ్చారు.

12- ఆయన విధానం ఏమనగా ఆయన పిల్లలు కలవారికి మరియు పిల్లలు లేని వారికి ఇద్దరికీ కూడా కున్నియత్ ఇచ్చేవారు. మరియు ఇలా తెలిపేవారు నా పేరు ద్వారా మీరు కూడా పేరు పెట్టుకోండి కానీ నా కున్నియత్ ను ఎంచుకోకండి.

ఆయన అషా అనే పేరుని వదిలి ఉత్మా అని పిలవడాన్నుండి వారించారు.మరియు ద్రాక్ష ను కర్మ్ అనడం నుండి కూడా వారించారు.మరియు ఇలా తెలిపారు:- కర్మ్ అనేది విశ్వాసి హృదయం

13-ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు..దాసుడు ఈ నక్షత్రం మూలంగానే వర్షం కురిసింది అని అనడం నుండి వారించారు ‌ మరియు అల్లాహ్ ఏదైతే తలిచాడో అదే విధంగా మీరు‌ ఏదైతే తలిచారో అని అనడం నుండి, మరియు అల్లాహ్ యేతరల పై వాగ్దానం చేయడం నుండి, మరియు అత్యధికంగా ప్రమాణాలు చేయడం నుండి కూడా వారించారు. మరియు “ఇతను ఇలా చేశాడు కాబట్టి ఇతను యూదుడు” అని అనడం నుండి మరియు సర్దార్ తన రాజ్యంలోని వారందరినీ “మీరు నా దాసులు మరియు దాసీలు” అనడం నుండి మరియు “నా అంతరాత్మ (మనసు) మలీనమైపోయింది” అని మరియు “షైతాన్ పాడుగాను” అని అదే విధంగా “ఓ అల్లాహ్ నీవు తలుచుకుంటే నన్ను క్షమించు” అని ఇలాంటి పదాలు వాడడం నుండి వారించారు.

14- ఆయన కాలం, గాలి, జ్వరం మరియు కోడిని తిట్టడం నుండి అలాగే అజ్ఞానపు కూతలు కూయడం నుండి వారించారు. అనగా తెగలను పిలవడం మరియు వారి పట్ల పక్షపాతం చూపడం వంటివి మొదలగు.మ


([1]) జాదుల్ మఆద్ 1/163

([2]) జాదుల్ మఆద్ 1/192

([3]) జాదుల్ మఆద్ 1/163

[4] తన్ఈమ్ అంటే మక్కా నుండి మదీనా దారిలో హరం యొచ్చ చివరి హద్దు

107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

107. సూరా అల్ మాఊన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/eeOM0ICPkPo [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 7 ఆయతులు ఉన్నాయి. అవిశ్వాసులు, కపట విశ్వాసుల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరా మొదటి ఆయతులో వచ్చిన ‘మాఊన్’ (సాధారణ వస్తువులు) అన్న పదాన్నే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. రెండు రకాల ప్రజలను ఈ సూరాలో తీవ్రంగా విమర్శించడం జరిగింది.

(1) తీర్పుదినాన్ని నిరాకరిస్తున్న అవిశ్వాసులు. వారు అనాధలను కఠినంగా కసరి కొడతారు. నిరుపేదలకు సహాయం చేయడాన్ని వారు ప్రోత్సహించరు.

(2) కపట విశ్వాసులైన ముస్లిములు – నమాజులకు ఆలస్యం చేస్తారు. వేళకు నమాజు చేయరు. అందరూ చూడాలని మంచి పనులు చేస్తారు. చిన్న చిన్న విషయాలలో కూడా తమ తోటి వారికి సహాయం చేయడానికి ముందుకు రారు.

తజ్వీద్ సులభ శైలిలో [పుస్తకం]

రచన / కూర్పు : ముర్షిదా రజూఖ్
అధిపతి : అరబ్బేతరులకు అరబీ శిక్షణా విభాగం ఇంగ్లీషు అకాడమి

పర్యవేక్షణ: లతీఫా ఎన్. అల్ సయీద్
అధిపతి : స్కూల్ విభాగం , ఇస్లామ్ ప్రెజెంటేషన్ కమిటి మహిళా విభాగం

అనువాదం:
సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ, హబీబుర్రహ్మాన్ జామయీ

Tajweed in Easyway – Book Part 1& 2
[పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [పార్ట్ 1 & 2] [138 పేజీలు] [54 MB]

తజ్వీద్ అనేది అత్యున్నతమైన విద్య. అదొక అమోఘమైన పఠనా ప్రక్రియ. ఎందుకంటే ఇది దివ్య ఖుర్ఆన్తో సంబంధం కలిగివుంది. ఖుర్ఆన్ గ్రంథం అల్లాహ్ శాశ్వత మహిమ. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లమ్)పై పవిత్ర ఖుర్ఆన్లు ఎలా అవతరించిందో అలానే పఠించడాన్ని తజ్వీద్ అంటారు. ప్రతి ముస్లిం దీనిని తప్పక నేర్చుకోవాలి. ఇంకా తమ పిల్లలకు కూడా నేర్పాలి. ఎందుకంటే తజ్వీద్ ఖుర్ఆన్ పారాయణం ఫర్జె అయిన్ (తప్పనిసరి విధి). అంటే ఇది ప్రతి ముస్లింపై ఉన్న విధ్యుక్త ధర్మం.

తజ్వీద్: ప్రతి అక్షరాన్ని సరయిన ఉచ్చారణతో ప్రత్యేక లక్షణాలతో పారాయణం చేయటాన్నే తజ్వీద్ అంటారు.

సమస్త స్తోత్రాలు అల్లాహ్ కొరకే. ఇంకా సమస్త మానవాళికి కారుణ్యమూర్తిగా పంపబడిన దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై శాంతి కురియుగాక! ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు, ఖుర్ఆన్ పఠనం ఓ ఆరాధన. దీని ద్వారా ఒక ముస్లిం చాలా తేలికగా అనంతమైన పుణ్య ఫలాల్ని సముపార్జించుకోగలడు.

ఖుర్ఆన్ను తజ్వీద్ నిబంధనలతో పారాయణం చేయటం ప్రతి పఠితునిపై తప్పనిసరి. కాబట్టి ముస్లింలు సరిఅయిన రీతిలో ఖుర్ఆన్ పారాయణం చేసేందుకు తజ్వీద్ నియమాలను పాటించటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అక్షరాన్ని దాని నియమాలను, లక్షణాలను పాటిస్తూ సరిఅయిన ఉచ్చారణతో ఖుర్ఆన్ పారాయణం చేయడంలో పారాయణకర్తలు ప్రావీణ్యత సంపాదించాలన్నదే తజ్వీద్ శాస్త్ర ముఖ్యోద్దేశం.

తజ్వీద్ సమర్పిస్తున్నందుకు ఐ.పి.సి స్కూల్ విభాగం సంతోషిస్తోంది. అరబీ మాతృభాష కాని ముస్లింలు, నవ ముస్లింలు వారి ఖుర్ఆన్ పారాయణాన్ని వృద్ధి చేసుకోవాలన్నదే ఈ పుస్తక సమర్పణ ముఖ్యోద్దేశం. “తజ్వీద్’ – సులభ శైలిలో” అనే పుస్తకం ఒక మంచి ఆరంభం. తజీవీద్ నేర్చుకునే వారికి ఈ పుస్తకం చక్కగా ఖుర్ఆన్ పారాయణం చేయడానికి దోహదకారి కాగలదని ఆశిస్తున్నాము.

ఇది ముస్లింలందరికీ మార్గదర్శకం కావాలని, ఇది మాకు శుభాశీస్సుగా మారాలని పరమ పవిత్రుడైన అల్లాహ్ ను వేడుకుంటున్నాము.

స్కూల్ విభాగం
ఇస్లాం ప్రజెంటేషన్ కమిటి

93. సూరా అద్ దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

93. సూరా అద్ – దుహా – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/-brxXfYs6GU [ 50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలు ఇందులో ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. మొదటి ఆయతులో వచ్చిన ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఊరటనిస్తూ, అల్లాహ్ ఆయన్ను వదలిపెట్టలేదని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనాధబాలునిగా ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేసింది అల్లాహ్ యేనని, మార్గం తెలియని స్థితిలో ఉన్నప్పుడు మార్గం చూపింది అల్లాహ్ యేనని, బీదరికంలో ఉన్నప్పుడు సంపద ప్రసాదించింది అల్లాహ్ యేనని గుర్తుచేయడం జరిగింది. రాబోయే కాలం గతకాలం కన్నా నిశ్చయంగా మేలైనదిగా ఉంటుందని చెప్పడం జరిగింది. అనాధల పట్ల దయతో వ్యవహరించాలని, యాచకులను కసురుకోరాదని, అల్లాహ్ ప్రసాదించిన వరాలను గురించి అందరికీ తెలియజేయాలని చెప్పడం జరిగింది.

95. సూరా అత్ తీన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]

95. సూరా అత్ తీన్ – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో]
https://youtu.be/8mq5MIxqjEM [45 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం నుండి]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. సృష్టిరాసులన్నింటిలోను మానవునికి అత్యున్నత స్థానాన్ని ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. మొదటి ఆయతులో వచ్చిన ‘తీన్’ (అంజూరం) అన్న పదాన్ని ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మనిషిని చక్కని రూపులో సృష్టించడం జరిగిందని, ఉత్తమమైన శారీరక, మానసిక శక్తులు ప్రసాదించడం జరిగిందని, ఇవన్నీ అల్లాహ్ అనుగ్రహాలని తెలియజేసింది. అందువల్ల మనిషి అల్లాహ్ కు కృతజ్ఞుడై ఉండాలని బోధించింది. అల్లాహ్ కు దూరమైతే మనిషి తన హోదాను కోల్పోతాడనీ, అవమానాల పాలయి పతనమవుతాడనీ, పరలోకం అనివార్యమని హెచ్చరించింది.

95:1 وَالتِّينِ وَالزَّيْتُونِ
అత్తి పండు సాక్షిగా! ఆలివు సాక్షిగా!

95:2 وَطُورِ سِينِينَ
సినాయ్ పర్వతం సాక్షిగా! [1]

95:3 وَهَٰذَا الْبَلَدِ الْأَمِينِ
శాంతియుతమైన ఈ నగరం (మక్కా) సాక్షిగా! [2]

95:4 لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي أَحْسَنِ تَقْوِيمٍ
నిశ్చయంగా మేము మానవుణ్ణి అత్యుత్తమమైన ఆకృతిలో సృజించాము. [3]

95:5 ثُمَّ رَدَدْنَاهُ أَسْفَلَ سَافِلِينَ
అటుపిమ్మట అతణ్ణి అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము. [4]

95:6 إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే విశ్వసించి, ఆ పైన మంచి పనులు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. [5]

95:7 فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِالدِّينِ
మరైతే (ఓ మానవుడా!) ప్రతిఫల దినాన్ని ధిక్కరించమని ఏ వస్తువు నిన్ను పురమాయిస్తున్నది. [6]

95:8 أَلَيْسَ اللَّهُ بِأَحْكَمِ الْحَاكِمِينَ
ఏమిటి, అధికారులందరికంటే అల్లాహ్ గొప్ప అధికారి కాడా? [7]

[1] అల్లాహ్ తన ప్రవక్త అయిన మూసా (అలైహిస్సలాం)తో సంభాషణ జరిపినది ఈ పర్వతం మీదే.

[2] శాంతియుతమైన నగరం అంటే మక్కా నగరం. ఈ నగరంలో హత్యాకాండకు అనుమతి లేదు. ఈ నగరంలో ప్రవేశించిన వారికి రక్షణ లభిస్తుంది.

మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం ఈ సూరాలో మూడు ప్రదేశాలపై ప్రమాణం చేయబడింది. ఈ మూడు ప్రదేశాలు కూడా చరిత్రాత్మకమైనవి. ఎందుకంటే ఆ స్థలాలలో గొప్ప గొప్ప ప్రవక్తలు, షరీయతు ప్రదాతలు వచ్చారు. “అత్తిపండు, ఆలివ్ సాక్షిగా!” అంటే అత్తిపండ్లు,ఆలివ్ పండ్లు విరివిగా ఉత్పత్తి అయ్యే ప్రదేశం అని అర్థం. అది బైతుల్ మజ్లిస్ (జెరూసలేము) ప్రదేశం. దైవప్రవక్త ఈసా (ఏసుక్రీస్తు) ఆ ప్రదేశంలో ప్రభవించారు. సినాయ్ పర్వతంపై మూసా (అలైహిస్సలాం)కు ప్రవక్త పదవి ఇవ్వబడింది. కాగా; మక్కానగరంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించారు (ఇబ్నె కసీర్).

[3] పై మూడు ఆయతులలో చేయబడిన ప్రమాణానికి జవాబు ఈ ఆయతులో ఇవ్వబడింది. అదేమంటే ఈ లోకంలో మానవుణ్ణి అల్లాహ్ అత్యుత్తమ రీతిలో సృజించాడు. ఇతర ప్రాణులతో, జంతువులతో పోల్చుకున్నప్పుడు ఈ తేడా కొట్టొచ్చినట్లే కనిపిస్తుంది.ఇతర జీవుల ముఖాలు క్రిందికి వంగి ఉంటాయి. కాని అల్లాహ్ మనిషిని మాత్రం నిటారుగా నిలబడి నడిచేవానిగా, అందగాడుగా మలిచాడు. ఇతర ప్రాణులకు భిన్నంగా మానవుడు తన చేతులతో సంపాదించి తింటాడు. త్రాగుతాడు. అతని శరీరావయవాలు ఎంతో పొందికగా ఉన్నాయి. వేర్వేరు అవయవాల మధ్య చాలినంత ఎడమ ఉంది. ఇతర ప్రాణుల మాదిరిగా వాటి మధ్య అస్తవ్యస్తతగానీ, అసౌకర్య పరిస్థితిగానీ లేదు. ముఖ్యమైన అవయవాలు రెండేసి చేయబడ్డాయి. మరి అతనిలో కనే, వినే, ఆలోచించే, అర్థంచేసుకునే శక్తియుక్తులు పొందు పరచబడ్డాయి. “అల్లాహ్ ఆదంను తన ఆకారంపై పుట్టించాడ”న్న హదీసును (ముస్లిం – కితాబుల్ బిర్….) విద్వాంసులు ఈ నేపథ్యంలో ఉదాహరించటం కూడా గమనార్హ విషయమే. మానవ సృజనలో ఈ విషయాలన్నింటి మేళవింపే “అహ్సని తఖ్వీమ్” (అందమైన ఆకృతి). అందునా అల్లాహ్ మూడుసార్లు ప్రమాణం చేసిన తరువాత ఈ మాట చెప్పాడు (ఫత్హుల్ ఖదీర్).

[4] ఈ ఆయతును పలువురు వ్యాఖ్యాతలు పలు విధాలుగా గ్రహించారు. కొంతమంది ప్రకారం ఈ ఆయతు మనిషి యొక్క హీనాతి హీనమైన వార్ధక్యాన్ని (ముసలితనాన్ని) సూచిస్తోంది. ఈ వయసులో మనిషి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అతను విచక్షణా జ్ఞానాన్ని సయితం కోల్పోయి పసిపిల్లవాడిలా ప్రవర్తిస్తాడు. మరికొంత మంది ప్రకారం మానవుడు తన దురాగతాల కారణంగా నైతికంగా దిగజారి పాతాళానికి త్రోసివేయ బడతాడు. పాముల, క్రిమికీటకాల కన్నా హీనుడిగా తయారవుతాడు. ఇంకా కొంత మంది ప్రకారం నరకంలో అవిశ్వాసులకు పట్టే దురవస్థ ఇది! అంటే మానవుడు దైవాన్ని, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎదిరించి, తనను అత్యుత్తమ స్థానం నుంచి ఎగదోసుకుని నరకంలోని అధమాతి అధమ స్థానంలో పడవేసుకుంటాడు.

[5] అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని మాత్రం అల్లాహ్ ఈ దుష్పరిణామం నుండి మినహాయించాడు.

[6] ఇది మనిషికి చేయబడే హెచ్చరిక! ఓ మనిషీ! నిన్ను అత్యుత్తమ ఆకృతిలో పుట్టించి, గౌరవోన్నతుల్ని వొసగిన ప్రభువు అత్యంత అధమస్థితికి చేర్చే శక్తి కూడా కలిగి ఉన్నాడని మరచిపోకు. అలాగే నిన్ను తిరిగి బ్రతికించటం కూడా ఆయనకు ఏమాత్రం కష్టతరం కాదు. ఇది తెలిసి కూడా నువ్వు ప్రళయదినాన్ని, శిక్షాబహుమానాన్ని త్రోసిపుచ్చుతున్నావా? మరికొందరు దీని అర్థం ఇలా చెబుతారు: (ఓ ముహమ్మద్!)దీని తరువాత తీర్పుదినానికి సంబంధించి నిన్ను ఎవరు ధిక్కరించగలరు?

[7] ఆయన ఏ ఒక్కరికీ అన్యాయం చేయడు సరికదా, తీర్పు దినాన్ని నెలకొల్పి అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం చేస్తాడు. ఈ సూరా చివరిలో “బలా వ అన అలా జాలిక మినష్షాహిదీన్” (ఎందుకు కాడు?! ఈ విషయానికి నేను సయితం సాక్షినే) అని పలకాలని తిర్మిజీ గ్రంథంలోని ఒక బలహీన హదీసు ద్వారా తెలుస్తోంది.

30వ పారా ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్) – జుజ్ అమ్మ – యూట్యూబ్ ప్లే లిస్ట్ :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3P1gmLLtmLJ_qczbvpmWWr

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

ఇషా తర్వాత 4 రకాతులు = లైలతుల్ ఖద్ర్ లోని 4 రకాతుల పుణ్యం

ఇషా తర్వాత 4 రకాతులు = లైలతుల్ ఖద్ర్  లోని 4 రకాతుల పుణ్యం

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

99. సూరా అజ్ జిల్ జాల్ (భూకంపం) – ఖురాన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/BaJGDgkkjvc [38 min]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఖురాన్‌లోని 99వ అధ్యాయం, సూరతుల్ జిల్జాల్ యొక్క వివరణాత్మక వ్యాఖ్యానం (తఫ్సీర్). భూమి తీవ్రంగా ప్రకంపించబడటం, తనలోని శవాలను, నిధులను బయటకు వెళ్లగ్రక్కడం, మానవుడు నిశ్చేష్టుడై “దీనికేమైంది?” అని ప్రశ్నించడం వంటి ప్రళయదినపు భయానక సంఘటనలను వక్త వివరిస్తారు. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని తన నమాజులో పఠించడం, అది సహచరులపై చూపిన గాఢమైన ప్రభావం గురించిన హదీసులను ఉదహరిస్తారు. భూమి స్వయంగా మానవుడు చేసిన ప్రతి చిన్న, పెద్ద కర్మకు సాక్ష్యమిస్తుందని, జవాబుదారీతనం అనే ప్రధాన సందేశాన్ని ఈ సూరా తెలియజేస్తుందని వివరిస్తారు. అణువంత మంచి చేసినా, చెడు చేసినా అది దాని కర్తకు చూపించబడుతుందని, కనుక ఈ జీవితంలో మన కర్మల పట్ల జాగ్రత్త వహించాలని శ్రోతలను హెచ్చరిస్తూ ప్రసంగం ముగుస్తుంది.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

اَلْحَمْدُ لِلَّهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُولِ اللَّهِ، أَمَّا بَعْدُ
(అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.)

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అవూజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో (ప్రారంభిస్తున్నాను).

إِذَا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا
(ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా)
భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపింపజేయబడినప్పుడు (సూరా అజ్-జిల్జాల్ 99:1)

ఇదా జుల్జిలత్. కంపించ చేయబడినప్పుడు. అల్ అర్ద్, భూమి. మళ్ళీ దాని యొక్క మస్దర్ జిల్జాలహా అని ఏదైతే వచ్చిందో, హా అంటే ఆ భూమి అని దాని వైపునకు సైగ చేయడం జరుగుతుంది. జిల్జాల్ అని వచ్చిన మరోసారి చెప్పబడిన పదానికి తీవ్రమైన రీతిలో. అంటే ఏమిటి? భూమి చాలా తీవ్రమైన తన ప్రకంపనలతో కంపించ చేయబడినప్పుడు.

وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا
(వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా)
మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు, (సూరా అజ్-జిల్జాల్ 99:2)

వ అఖ్రజత్ బయట పడవేసినప్పుడు. అల్ అర్ద్ ఆ భూమి. దేనిని బయట పడేసినప్పుడు? తనలో ఉన్నటువంటి బరువులన్నింటినీ. మరి భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడవేసినప్పుడు,

وَقَالَ الْإِنسَانُ مَا لَهَا
(వ ఖాలల్ ఇన్సాను మాలహా)
“అరె! దీనికేమైపోయిందీ?” అని మనిషి (కలవరపడుతూ)అంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:3)

మనిషి అంటాడు, మాలహా? అరె! దీనికి ఏమైపోయింది?

يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
(యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా)
ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. (సూరా అజ్-జిల్జాల్ 99:4)

యౌమఇదిన్ ఆ రోజు తుహద్దిసు వివరిస్తుంది. అఖ్బారహా. తుహద్దిసు అంటే ఇక్కడ అర్ద్. అరబీలో అర్ద్ స్త్రీలింగం, ఫీమేల్ వర్డ్ గా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే తుహద్దిసు వచ్చింది. పురుషలింగం అయితే యుహద్దిసు వచ్చేది. తుహద్దిసు, భూమి వివరిస్తుంది, తెలియజేస్తుంది. అఖ్బారహా తన సంగతులన్నీ, తన సమాచారాలన్నీ.

بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
(బి అన్న రబ్బక అవ్హాలహా)
ఎందుకంటే నీ ప్రభువు దానికి, ఆ మేరకు ఆజ్ఞాపించి ఉంటాడు.(సూరా అజ్-జిల్జాల్ 99:5)

అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు వివరిస్తుంది? ఎందుకంటే బి అన్న, ఎందుకంటే రబ్బక నీ ప్రభువు అవ్హాలహా దానికి ఆజ్ఞాపించి ఉంటాడు అలా చేయాలని.

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు. (సూరా అజ్-జిల్జాల్ 99:6)

యౌమఇదిన్ ఆ రోజు. యస్దురున్నాస్, యస్దురు తరలి వస్తారు, తిరిగి వస్తారు. అన్నాస్ జనులు, ప్రజలు. అష్ తాతా వేరు వేరు బృందాలుగా. లియురవ్ వారికి చూపబడేందుకు అఅమాలహుమ్ వారి యొక్క కర్మలు. ఆ రోజు జనులు వారి కర్మలు వారికి చూపబడేందుకు గాను వేరు వేరు బృందాలుగా తరలి వస్తారు.

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:7)

వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా. ఫమన్ ఎవడైనా గానీ, ఎవడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. యఅమల్ చేస్తాడో, చేసినా. మిస్ఖాల దర్రహ్ అణువంత. దర్రహ్ చీమల కంటే చిన్నగా, చీమల యొక్క గుడ్లు, చీమల యొక్క పిల్లలు, అంతకంటే మరీ చిన్నది. ఖైరన్ ఏదైనా సత్కార్యం. యరహు దాన్ని అతడు చూసుకుంటాడు. కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. (సూరా అజ్-జిల్జాల్ 99:8)

మరెవరు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.

సోదర మహాశయులారా! ఖురాన్ సూరతులలోని క్రమంలో ఈ 99వ సూరత్, సూరతుల్ జిల్జాల్, చాలా ప్రాముఖ్యత గల సూరా. ఈ సూరా యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని సందర్భాల్లో, ఎలాగైతే ముస్నద్ అహ్మద్ లో హదీస్ వచ్చి ఉందో, అబూ ఉమామా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు:

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి కాలంలో కొంచెం బరువు పెరిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విత్ర్ చేసిన తర్వాత కూర్చుండి రెండు రకాతులు ఎప్పుడైనా చేసేవారు. ఆ రెండు రకాతులలోని మొదటి రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఇదా జుల్జిలతిల్ అర్ద్ చదివేవారు. మరియు రెండవ రకాతులో సూరే ఫాతిహా తర్వాత ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ (قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ) చదివేవారు.

దీని ప్రాముఖ్యతను గమనించడానికి, అబూ దావూద్ లో వచ్చినటువంటి ఒక హదీస్, 816 హదీస్ నెంబర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోజు ఫజర్ నమాజులోని రెండు రకాతుల్లో కూడా ఇదే సూరత్ జిల్జాల్. చదివారు.

సోదర మహాశయులారా! ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో, సహాబాల యొక్క జీవితాల్లో, ఈ సూరా పట్ల ఎలాంటి ప్రాముఖ్యత ఉండినది, చాలా భయంకరమైన గొప్ప విషయాలు చెప్పుకోవడానికి, సూక్ష్మమైన విషయాల గురించి ప్రస్తావన చేసుకునేటందుకు, ఏ చిన్న, అతి చిన్న, మరీ చిన్న పుణ్య కార్యమైనా చేసుకోవడానికి ముందుకు రావాలని, ఏ చిన్న, ఏ అతి చిన్న, మరీ చిన్న పాపమైనా తప్పకుండా దానితో దూరం ఉండాలని ఈ సూరా ద్వారా గుణపాఠం తెచ్చుకొని ఇతరులకు బోధించేవారు, నేర్పేవారు ఈ సూరా ఆధారంగా.

సోదర మహాశయులారా! ఈ సూరా యొక్క ప్రాముఖ్యత మరొక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఆ హదీసును కొందరు ధర్మవేత్తలు జయీఫ్ (ضَعِيفٌ) అన్నారు కానీ, ముస్నద్ అహ్మద్ ఏదైతే చాలా ఎక్కువ వాల్యూమ్ లో పూర్తి రీసెర్చ్ తో ప్రింట్ అయిందో, 35-40 కంటే ఎక్కువ వాల్యూమ్స్ లో, దాని యొక్క రీసెర్చ్ చేసిన ముహఖ్ఖిఖీన్ (مُحَقِّقِينَ) దానిని బలమైనదిగానే చెప్పారు. ఆ హదీస్ కొంచెం పొడుగ్గా ఉంది, సారాంశం చెబుతున్నాను:

ఆ మనిషి చాలా సంతోషంగా ప్రవక్త వద్ద నుండి తిరిగి వెళ్తూ, అల్లాహ్ యే సత్యంతో మిమ్మల్ని పంపాడో ఆ అల్లాహ్ యొక్క సాక్ష్యంతో చెబుతున్నాను, తప్పకుండా ఈ సూరాను నేను నేర్చుకుంటాను, నేను ఇంతకంటే ఎక్కువగా బహుశా నేర్చుకోలేకపోతాను కావచ్చు కానీ దీనిని అయితే తప్పకుండా నేర్చుకుంటాను అని వెనుతిరిగి పోయాడు అక్కడి నుండి. అతడు వెళ్తున్నది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “ఇతడు సాఫల్యం పొందాడు, ఇతడు విజయం పొందాడు“.

సోదర మహాశయులారా! గమనిస్తున్నారా? ఇక మీలో ఎవరెవరికైతే ఈ సూరా రాదో, లేక ఈ సూరా యొక్క భావాన్ని ఇంతవరకు అర్థం చేసుకొని ప్రయత్నం చేయలేదో, ఇక శ్రద్ధగా వినండి, ఆయత్ యొక్క వ్యాఖ్యానాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ ఈ హదీస్ మరియు ఇంతకుముందు తెలుసుకున్న హదీసుల ద్వారా దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించండి. మరియు ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి ఈ సూరా ఖురాన్ లోని సగం సూరా, ఈ సూరా ఖురాన్ లోని నాలుగో వంతుకు సమానం, కానీ అలాంటి హదీసులు సహీ లేవు అని ఎందరో ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.

సోదర మహాశయులారా! ఈ సూరాలో పరలోకం పట్ల మన యొక్క విశ్వాసం పెరిగే రీతిలో, పరలోకానికి సంబంధించిన రెండు సందర్భాలను ప్రస్తావించడం జరిగింది. ఒకటి, మొదటి శంఖు ఊదబడినప్పుడు ఈ విశ్వం అంతా చెల్లాచెదురై నాశనమవుతున్న సందర్భాన్ని, మరొకటి రెండవ శంఖు ఊదబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, గమ్యస్థానాలు ఏమవుతాయి, పరిస్థితి ఏముంటుంది దాని గురించి చెప్పడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మీరు చూస్తున్నట్లు, ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. జుల్జిలత్ అని క్రియ రూపంలో ఉన్న ఒక పదాన్ని చెప్పిన వెంటనే మళ్ళీ జిల్జాలహా అని ఫార్మాట్ చేంజ్ చేసి మస్దర్ రూపంలో తీసుకువచ్చి, అల్లాహ్ త’ఆలా చెప్పదలచినది ఏమిటంటే, ఈ ప్రళయ సమయాన ఏ భూకంపం ఏర్పడుతుందో, ఈ మొత్తం భూమిలో ఏ ప్రకంపనలు స్టార్ట్ అవుతాయో, అవి ఏమో చిన్నవి కావు, చాలా భయంకరమైనవి.

గమనించండి ఒక్కసారి మీరు, ఎక్కడో ఇండోనేషియాకు ఎంతో దూరంలో, అది కూడా సముద్రం లోపలని భూమిలో ప్రకంపనలు మొదలౌతే, వాటి యొక్క ప్రభావమే కాదు, నష్టం వేలాది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మన భారతదేశానికి కూడా చేరుకొని, సునామీ అన్న పేరుతో ఈ రోజు కూడా మర్చిపోని స్థితిలో ఉన్నాము కదా. అయితే అది సునామీ అన్నటువంటి పేరు ఏదైతే ఉందో, కేవలం సముద్రాల, సముద్రం యొక్క అలలు, కెరటాలు పెరిగి ఏదో నష్టం జరిగింది కాదు కదా. ఎక్కడ ఇండోనేషియా, ఎక్కడ సముద్రం లోపలి భాగంలో సంభవించిన ప్రకంపన, భూకంపం, అక్కడ భూమి దద్దరిల్లింది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో దాని నష్టం ఇంతా అంతా కాదు, కోట్ల కోట్లలో జరిగింది, ప్రాణాలు పోయాయి, ప్రాణ నష్టంతో పాటు ధన నష్టం కూడా జరిగింది. సోదర మహాశయులారా! ఒక్కసారి ఒక్కచోట వచ్చిన ఈ భూకంపం ఎంత దూరం నష్టం చేకూర్చింది, ఇక ప్రళయదినాన్ని గుర్తుంచుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఈ మొత్తం భూమిలో ఎక్కడా కూడా ఖాళీ లేకుండా అంతటా ఈ భూకంపం వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించగలమా మనం?

ఎక్కడైనా ఒకచోట భూకంపం వస్తుంది అంటే రాని చోటకు ప్రజలు పరిగెత్తుతారు. కదా? మరి ఆ రోజు పరిగెత్తడానికి ఎక్కడ స్థలం ఉన్నది? ఎక్కడ స్థలం ఉన్నది? అందుకొరకు సోదర మహాశయులారా! ఖురాన్ ఆయతులను గ్రహించి, గమనించి మన జీవితంలో మార్పు తెచ్చుకునే మనం ప్రయత్నం చేయాలి. లేదా అంటే మన శక్తి ఏం శక్తి? మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి విపత్తులు మనం అడ్డుకోగలుగుతాము?

ఆ రోజు, వ అఖ్రజతిల్ అర్దు అస్ఖాలహా. భూమి తన యొక్క బరువులన్నింటినీ. ఇక్కడ బరువులు అంటే ఒకటి కాదు రెండు కాదు, అనేక విషయాల ప్రస్తావన ఉంది. ఒకటి, ఇక్కడ ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చివరి మానవుని వరకు ఎవరు ఎక్కడ ఎలా చనిపోయారో, వారిని కాల్చడం జరిగినా, వారిని పూడ్చడం జరిగినా, వారు ఏదైనా జంతువుకి ఆహుతి అయిపోయినా, ఏదైనా అగ్నికి ఆహుతి అయిపోయినా, ఏదైనా జంతు మృగ జీవికి ఒక నివాలా అయిపోయినా, ఏ పరిస్థితిలో చనిపోయినా వారిని సమాధి చేయబడినా, చేయబడకపోయినా అంతా కూడా తిరిగి వచ్చేది మట్టి వైపునకే. 77వ సూరా సూరతుల్ ముర్సలాత్ లో వచ్చిన ఒక ఆయత్ ను గమనించండి,

أَلَمْ نَجْعَلِ الْأَرْضَ كِفَاتًا أَحْيَاءً وَأَمْوَاتًا
(అలం నజ్అలిల్ అర్ద కిఫాతా అహ్యాఅవ్ వ అమ్ వాతా.)
మేము ఈ భూమిని వారి యొక్క జీవుల కొరకు మరియు చనిపోయిన వారి కొరకు అందరి కొరకు సరిపోయేదిగా చేసి ఉంచాము.

గమనించండి, ఈ ఆయత్ లో ఇంకా వేరే ఎన్నో బోధనలు ఉన్నాయి వేరే సందర్భంలో. కానీ చెప్పే ఉద్దేశ్యం ఏమిటి, తిరస్కరించిన వారైనా, నమ్మిన వారైనా, విశ్వాసులైనా, అవిశ్వాసులైనా, ఆస్తికులైనా, నాస్తికులైనా, అందరూ కూడా ఈ భూమిలోకి ఏదైతే పోయారో ఏ రీతిలోనైనా వెలికి వస్తారు. తప్పకుండా బయటికి వస్తారు. సూరతుల్ ఇన్షికాఖ్ (سُورَةُ الْإِنْشِقَاقِ) లో చదవండి, ముతఫ్ఫిఫీన్ (مُطَفِّفِينَ) తర్వాత సూరత్,

وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
(వ అల్ఖత్ మా ఫీహా వ తఖల్లత్.)
ఇక బరువులన్నింటినీ తీసివేస్తుంది బయటికి అని రెండవ భావం, ఈ భూమిలో ఎక్కడెక్కడ ఏ ఖజానాలు ఉన్నాయో, ఏ కోశాగారాలు ఉన్నాయో, ఏ ఏ రకమైన ధాతువులు ఉన్నాయో, వెండి బంగారం రూపులోనైనా, ఇంకా వేరే ఏ రీతిలోనైనా అంతా కూడా బయటికి వచ్చి పడుతుంది. మనిషి ఎటు నడిచినా గానీ బంగారం, వెండి అంతకంటే ఇంకా విలువైనది వేరే ఎంతో సామాగ్రి అతను కళ్ళతో చూస్తాడు. సహీ ముస్లిం లోని ఒక హదీస్ శ్రద్ధగా వినండి, అల్లాహు అక్బర్.

تَقِيءُ الْأَرْضُ أَفْلَاذَ كَبِدِهَا أَمْثَالَ الْأُسْطُوَانِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ
(తఫిల్ అర్దు అఫ్లాద కబిదిహా అమ్సాలల్ ఉస్తువాన్ మిన దహబి వల్ ఫిద్దా.)
ప్రళయదినాన ఈ భూమి తనలో ఉన్నటువంటి ఖజానాలన్నిటినీ బయటికి పడేస్తుంది. పెద్ద పెద్ద గుట్టలు, పర్వతాల మాదిరిగా మనిషి కళ్ళ ముందు వెండి బంగారాలు పడి ఉంటాయి.

అప్పుడు ఒక హంతకుడు వస్తాడు, అయ్యో, ఈ బంగారం వెండి కొరకే కదా నేను ఫలానా వ్యక్తిని చంపి ఈ ధన ఆశలో ఒకరి ప్రాణం తీసుకున్నాను, ఇప్పుడు ఇంతగా నా కళ్ళ ముందు ఉంది కానీ నాకు ఏ ప్రయోజనం చేకూర్చదు ఇది, దీనిని తీసుకొని ఏ లాభం పొందలేను. మరొక వ్యక్తి వస్తాడు, అయ్యో, నేను ఈ డబ్బు ధన ఆశలో బంధుత్వాలను తెంచాను, నా యొక్క సంబంధాలను పాడు చేసుకున్నాను, నేను ఈ యొక్క డబ్బు ధన ఆశలో ఎందరి నా దగ్గర వారిని దూరం చేసుకున్నాను, అయ్యో అని వాపోతాడు. కానీ అది అతనికి ఏ ప్రయోజనం చేకూర్చదు. దొంగ వస్తాడు, అతడు ఇదంతా చూసి, అయ్యో, దీని గురించేనా నా యొక్క చేతులు నరికి వేయబడినవి, ఈ రోజు తీసుకుందాం అంటే కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత వారి కళ్ళ ముందు ఉంటుంది కానీ ఎవరు దానిని ముట్టరు, ఏమీ తీసుకోలేరు.

ఇదంతా కూడా ఇంత స్పష్టంగా వివరంగా మనకు చెప్పబడినప్పుడు, ఈ రోజుల్లో మనం నా తాత భూమి నా అయ్యకు దొరకలేదు, ఇక ఇప్పుడు నేను ఇంత అధికారంలో వచ్చిన కదా, నా చిన్నాయనలకు, నా పెదనాయనలకు అందరికీ ఇక నేను జైల్లో వేస్తాను, వారి సంతానాలనే వేస్తాను, వారి యొక్క వంశమే గుర్తుంచుకోవాలి అన్నటువంటి పన్నాగలు పన్ని, ఏ ఏ ప్రయత్నాలు చేస్తారో, దౌర్జన్యాలు చేసి ఒకరి భూమిని ఏదైతే ఆక్రమించుకుంటారో, ఏ ఏ రీతిలో చివరికి ఒక మాట ఇక్కడ చెప్పవచ్చు కదా, కట్నకానుకల రూపంలో అమ్మాయిల తల్లిదండ్రులపై దౌర్జన్యాలు చేసి ఏ ఏ సొమ్ము లూటీ చేస్తున్నారో, ఈ సూరత్ యొక్క వ్యాఖ్యానంలో వచ్చిన హదీస్ ద్వారా గుణపాఠం నేర్చుకోవాలి.

భూమి తన బరువులన్నింటినీ తీసి బయట పడేసినప్పుడు, మనిషి, అయ్యో, అరె దీనికి ఏమైపోయింది, ఇది ఇలా ఎందుకు చేస్తుంది? అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. మనిషి ఇలా మొత్తుకుంటాడు కానీ ఏమీ లాభం.

మరొక వ్యాఖ్యానం, బరువులన్నీ తీసి బయట పడేసినప్పుడు అన్న దానికి ధర్మవేత్తలు, ఖురాన్ వ్యాఖ్యానకర్తలు తెలిపారు, అదేమిటంటే, ఆ రోజు మనిషి ఏ ఏ విషయాలను నమ్మకపోయేదో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, ఆ సత్యాలు వాస్తవాలన్నీ కూడా అతని కళ్ల ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు అతను ఆ విషయాలన్నింటినీ, వేటినైతే ప్రవక్తలు, ప్రవక్తల యొక్క నాయబులు, వారి యొక్క మార్గంపై ఉన్నటువంటి దాయిలు, ప్రచారకులు ఏ సత్యాలు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలిపినప్పటికీ తిరస్కరించేవారో, నమ్మకుండా ఉండేవారో వారికి ఆ వాస్తవాలన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సోదర మహాశయులారా! ఈ సందర్భంలో మనిషి చాలా బాధగా అంటాడు, అయ్యో ఇదేమైపోయింది, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, మరియు ఈ సందర్భం అనేది ఖురాన్ లో ఇంకా వేరే సూరాలలో కూడా చెప్పడం జరిగినది. ఉదాహరణకు సూరత్ యాసీన్ చదువుతారు కదా, ఎంత మన దౌర్భాగ్యం గమనించండి, సూర యాసీన్,

لِّيُنذِرَ مَن كَانَ حَيًّا
(లియున్దిర మన్ కాన హయ్యా)
బ్రతికి ఉన్న వారి కొరకు ఇదిగో హెచ్చరిక అని అల్లాహ్ అదే సూరాలో చెబుతున్నాడు.

బ్రతికి ఉన్న వారు చదివి గుణపాఠం నేర్చుకోవడం లేదు, చనిపోయిన వారి మీద చదువుతున్నారు, వారు వినడానికి కూడా ఏ శక్తి వారిలో లేదు. అదే సూరత్ యాసీన్ లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,

هَٰذَا مَا وَعَدَ الرَّحْمَٰنُ وَصَدَقَ الْمُرْسَلُونَ
(హాదా మా వఅదర్ రహ్మాను వ సదఖల్ ముర్సలూన్.)
అప్పుడు వారి కళ్లు తెరిచినట్లు అవుతాయి, వారి కళ్ల మీద ఉన్నటువంటి ముసుగు తొలగిపోయినట్లు ఏర్పడుతుంది, అప్పుడు అంటారు అయ్యో, మమ్మల్ని మా సమాధుల నుండి ఎక్కడైతే హాయిగా పడుకొని ఉంటిమో, ఎవరు లేపేశారు మమ్మల్ని? రహ్మాన్ చేసిన వాగ్దానం ఇదే కదా అది. ప్రవక్తలు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు నిజంగానే జరుగుతున్నాయి, అవే కదా ఇవి. కానీ అప్పుడు మనిషి వాటన్నిటినీ సత్యంగా నమ్మితే ఏ లాభం ఉండదు.

సోదర మహాశయులారా! ఇదా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా, ఇదా దీనిని అరబీ గ్రామర్ ప్రకారంగా ఒక షర్తియా పదం అంటారు, దాని యొక్క సమాధానం నాలుగో ఆయత్ లో అల్లాహ్ ఇస్తున్నాడు, యౌమఇదిన్ తుహద్దిసు అఖ్బారహా. అల్లాహు అక్బర్. ఆయత్ నెంబర్ రెండులో చూశారు మీరు, తన బరువులన్నింటినీ వెలికి తీస్తుంది అని.

ఇక ఆయత్ నెంబర్ నాలుగులో ఉన్న విచిత్రం గమనించండి, ఆ రోజు భూమి తన సంగతులన్నీ వివరిస్తుంది. ఏమిటి ఆ సంగతులు? ఏమిటి ఆ సంగతులు? అల్లాహు అక్బర్. అల్లాహ్ త’ఆలా మనిషిని పుట్టించినప్పటి నుండి కాదు అంతకు ముందు నుండి ఈ భూమి ఉంది. ప్రళయం వరకు ఎక్కడెక్కడ ఏమి జరిగినదో అదంతా కూడా ఈ భూమి అంతా వివరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్.

హజరత్ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం వస్తుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఈ సూరతుల్ జిల్జాల్ తిలావత్ చేశారు. సూరత్ జిల్జాల్ తిలావత్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ ఆయత్ నెంబర్ నాలుగు వరకు చేరుకున్నారో, మీకు తెలుసా దాని యొక్క సమాచారాలన్నీ కూడా ఏమిటి? మీకు తెలుసా దాని యొక్క సంగతులన్నీ ఏమిటి? అది ఏం వివరిస్తుంది? ఆ సమయంలో సహాబాలు సామాన్యంగా జవాబు ఇచ్చినట్లుగానే ఇచ్చారు, అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు. అప్పుడు ప్రవక్త తెలిపారు,

فَإِنَّ أَخْبَارَهَا أَنْ تَشْهَدَ عَلَى كُلِّ عَبْدٍ وَأَمَةٍ
(ఫఇన్న అఖ్బారహా అన్ తష్హద అలా కుల్లి అబ్దివ్ వ అమతిన్.)
ప్రతి మానవుడు పురుషుడు అయినా, స్త్రీ అయినా భూమిలోని ఏ చోట ఉండి ఏ పని చేశాడో దాని గురించి ఆ భూమి వివరిస్తుంది. ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు, ఇక్కడ ఉండి ఇలాంటి పని చేశాడు. అందుకొరకే రబీఆ ఉల్లేఖించిన ఒక ఉల్లేఖనంలో తబరానీ కబీర్ లో వచ్చింది,

تَحَفَّظُوا مِنَ الْأَرْضِ، فَإِنَّهَا أُمُّكُمْ
(తహఫ్ఫదూ మినల్ అర్ద్, ఫఇన్నహా ఉమ్ముకుమ్.)
మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క ఈ భూమి నుండి. ఎందుకంటే ఇది మీ యొక్క తల్లి లాంటిది. మీరు ఈ భూమిపై నివసిస్తున్నారు, దీని లోకే వెళ్ళేవారు ఉన్నారు.

وَإِنَّهُ لَيْسَ مِنْ أَحَدٍ عَامِلٌ عَلَيْهَا خَيْرًا أَوْ شَرًّا إِلَّا وَهِيَ مُخْبِرَةٌ بِهِ
(వఇన్నహూ లైస మిన్ అహదిన్ ఫాయిలున్ అలైహా ఖైరన్ అవ్ షర్రన్ ఇల్లా వహియ ముఖ్బిరా.)
గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఈ భూమి దీనిపై మీరు ఎక్కడ ఉండి ఏ పని చేసినా, మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా ఆ భూమి రేపటి రోజు తప్పకుండా చెప్పనున్నది.

ఈ రెండు హదీసులు ప్రామాణికతలో కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ, ఒకటి మరొకటికి మంచి సపోర్ట్ ఇస్తుంది అని ధర్మవేత్తలు అంటారు. అందుకొరకే వీటిని ప్రస్తావించడం జరిగింది.

సోదర మహాశయులారా! ఇక్కడ మనం భయపడవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిలోని ఏ చోట ఉండి మనం ఏ పని చేస్తున్నామో, అది మన గురించి సాక్ష్యం పలుకుతుంది. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, హజరత్ ఆయిషా రదియల్లాహు త’ఆలా అన్హా, ఇంకా వేరే సహాబాల ద్వారా రుజువైనటువంటి కొన్ని హదీసుల ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఏ చిన్న సత్కార్యాన్ని విలువ లేకుండా భావించకూడదు. ఇది ఏమవుసరం అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఏ పెద్ద సత్కార్యాన్ని కూడా చేయడంలో వెనక ఉండకూడదు. అలాగే ఏ పాప కార్యం పట్ల కూడా ఇది ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నటువంటి ధోరణిలో ఉండకూడదు.

ఈ ఆయతుల ద్వారా మనకు బోధపడుతుంది, మనం ఏ సత్కార్యాలు చేసినా, ఏ పాప కార్యాలు చేసినా వాటి గురించి సాక్ష్యాధారాలు తయారవుతూ పోతూ ఉన్నాయి. ఆ రోజు మనం మన నోటితో ఏ విషయాన్ని తిరస్కరించినా, స్వయం మన యొక్క శరీరం నుండే మనకు దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు వచ్చేస్తాయి. అందుకొరకు అల్లాహ్ తో భయపడుతూ ఉండాలి.

మరియు ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఆరులో గమనించండి, ఆయత్ నెంబర్ ఐదులో, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో, అల్లాహ్ యొక్క ఆజ్ఞతోనే భూమి చేస్తుంది. గమనించండి, భూమి యొక్క సృష్టికర్త అల్లాహ్ మరియు అల్లాహ్ త’ఆలా ఆజ్ఞ ప్రకారమే అది మసులుకుంటుంది. అల్లాహ్ త’ఆలా ఖురాన్ లో ఒక చోట చెబుతున్నాడు, భూమి మరియు ఆకాశం ఈ రెండిటికీ అల్లాహ్ త’ఆలా మీకు ఇష్టమైనా లేకపోయినా మీరు విధేయులుగానే రావాలి అని అంటే వారు,

أَتَيْنَا طَائِعِينَ
(అతైనా తాయిఈన్)
మేము ఓ అల్లాహ్ నీకు విధేయులుగా హాజరయ్యాము అని చెప్పారు.

ఖురాన్ లోని ఆయత్ భావం. ఇంతటి విధేయత ఈ భూమి ఆకాశాలు పాటిస్తూ, ఎక్కడ ఏం మనం చేశామో అవన్నీ వివరిస్తున్నప్పుడు, మనం ఇంకా ఎంత అశ్రద్ధగా ఉంటాము? ఇంకా ఎన్ని రోజులు ఈ అశ్రద్ధ, ఏమరుపాటులో ఉంటాము?

ఆ తర్వాత అల్లాహ్ త’ఆలా ఆయత్ నెంబర్ ఆరులో తెలియజేస్తున్నాడు,

يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ
(యౌమఇదిన్ యస్దురున్నాసు అష్ తాతల్ లియురవ్ అఅమాలహుమ్)
ఆ రోజు జనులు – వారి కర్మలు వారికి చూపబడేందుకుగాను – వేర్వేరు బృందాలుగా తరలి వస్తారు.

యస్దుర్ (يَصْدُرُ) అని ఏదైతే ఇక్కడ చెప్పడం జరిగిందో, తరలి రావడం, తిరిగి రావడం. సమాధుల నుండి మైదానే మెహషర్ లో లెక్క తీర్పు గురించి మరియు అక్కడ ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘట్టాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ రెండవ తిరుగు ఏ గమ్యస్థానం ఉంటుందో ఎవరికి, స్వర్గం నరకం రూపంలో అటువైపున అని. మరియు ఇక్కడ ఏదైతే అష్ తాతా (أَشْتَاتًا), వేరు వేరు బృందాలుగా అని చెప్పడం జరిగిందో దానికి ఖురాన్ లోని ఇంకా ఎన్నో ఆయతులు కూడా సాక్ష్యాధారంగా ఉన్నాయి. దీని యొక్క భావంలో ఎన్నో విషయాలు వస్తాయి. ఒకటి ఏమిటి, అవిశ్వాసులు ఒక బృందం, విశ్వాసులు ఒక బృందం. ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. మరొక భావం ఇక్కడ, ప్రతి ప్రవక్త వారి యొక్క అనుచరుల ప్రకారంగా వేరు వేరు బృందాలు. మరొక భావం ఇందులో, ప్రతి ప్రవక్తతో వారిలో కొందరు విశ్వసించేవారు, మరికొందరు విశ్వసించని వారు. ఈ విధంగా ఖురాన్ లో ఎన్నో సందర్భాల్లో మనకు ఈ విషయాలు తెలుస్తాయి,

وَيَوْمَ نَحْشُرُ مِن كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّن يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ
(వయౌమ నహ్షురు మిన్ కుల్లి ఉమ్మతిన్ ఫౌజన్ మిమ్మన్ యుకద్దిబు బి ఆయాతినా ఫహుమ్ యూజఊన్)
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు.” (27:83)

సూరతున్ నహల్ లో, అలాగే ఇంకా వేరే సూరాలలో కూడా ఈ భావం ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ మరోసారి మీరు గమనించండి, లియురవ్ అఅమాలహుమ్. ఈ పదం, ఈ పదం ఏదైతే లియురవ్ అఅమాలహుమ్ అని ఉందో మనల్ని కంపించి వేయాలి, మనలో భయాన్ని పుట్టించాలి. ఎందుకు? ఏం చెప్పడం జరుగుతుంది, వారి యొక్క కర్మలు వారికి చూపించడానికి. అల్లాహు అక్బర్.

సోదర మహాశయులారా! ఎలాగైతే కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా సీక్రెట్ సీసీటీవీలు, కెమెరాలు ఉంటాయి. ఇక్కడ మనల్ని ఎవరు చూడటం లేదు అని ఏదో నేరానికి పాల్పడతాము. కానీ పట్టుబడిన తర్వాత ఎప్పుడైతే ఆ సీసీ ఫొటేజ్ లను మన ముందు స్పష్టంగా ఒక స్క్రీన్ లో చూపించడం జరుగుతుందో, మనం ఆ ప్రాంతంలో ఎటు నుండి వస్తున్నాము, ఎలా వస్తున్నాము, ఏ ఏ ఆయుధాలతో, ఏ ఏ సాధనాలతో వస్తున్నాము, ఎలా లూటీ, దోపిడీ ఇంకా వేరే నేరాలకు పాల్పడుతున్నాము అదంతా మన కళ్ళారా మనం చూసుకుంటూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో ఒక్కసారి గమనించండి. ఇది ఏదో ఒక్కసారి చేసినటువంటి పొరపాటు, అది ఏదో రికార్డ్ అయిపోయింది, కానీ దాని గురించి విని మనం కొన్ని సందర్భాల్లో సిగ్గుకు గురి అవుతాము, ఎంతో సందర్భాల్లో ఛీ ఇలాంటి పనులు ఎందుకు చేయాలి అని అనుకుంటాము.

కానీ ఇక్కడ గమనించండి, అటువైపున భూమి సాక్ష్యం పలుకుతుంది, భూమి అంతా కూడా తెలియజేస్తుంది, మళ్ళీ అల్లాహ్ వద్దకు హాజరవుతున్నాము, అక్కడ ఈ ఫొటో, సీసీటీవీలలో మొత్తం రికార్డ్ అయినటువంటి మన పూర్తి జీవితం యొక్క ఫ్లాష్ బ్యాక్ రికార్డ్ వీడియో మొత్తం బయటికి వస్తుంది, అప్పుడు మనం ఎక్కడ తల దాచుకుంటాము? అప్పుడు మనం ఎక్కడ అల్లాహ్ యొక్క శిక్షల నుండి పారిపోతాము? ఏదైనా అవకాశం ఉందా?

లియురవ్ అఅమాలహుమ్, వారికి వారి కర్మలన్నీ చూపడం జరుగుతుంది అంటే దైవదూతలు రాసుకున్నటువంటి ఆ దఫ్తర్లు, రిజిస్టర్లు ఓపెన్ చేసి చూపిస్తారు అనే ఒక్కటే భావంలో మీరు ఉండకండి. ఆ చూపించడం అనేది మనకు, మనం ఇక్కడ లోకంలో ఏ రీతిలో మనం మసులుకుంటూ ఉంటామో ఆ ప్రకారంగా అక్కడ మనతో పరిస్థితి జరుగుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసిన తప్పులను ఒప్పుకొని అల్లాహ్ తో ఆ సమయంలో కూడా ఒకవేళ ఇహలోకంలో విశ్వాసంగా ఉండి కొన్ని పొరపాట్లు జరిగితే, తౌహీద్ పై ఉండి వేరే కొన్ని పాపాలు జరిగితే బహుశా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనల్ని మన్నించేస్తాడు అన్నటువంటి ఆశ ఉంచవచ్చు కూడా. అవును, ఒక హదీస్ ద్వారా కూడా ఈ భావం మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు కూడా, మీలో ప్రతి ఒక్కడు ఎన్ని పాపాలు చేసినా గానీ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవాలి, తౌబా ఇస్తిగ్ఫార్ లాంటివి చేసుకుంటూ ఉండాలి, కానీ దానితో పాటు ఏంటి, ఏ పాపం జరిగినప్పటికీ అల్లాహ్ పట్ల సదుద్దేశంతో ఉండాలి. అల్లాహ్ నా విశ్వాసాన్ని స్వీకరించి, నా పుణ్యాలను స్వీకరించి, నా పాపాలను మన్నిస్తాడు అని. కానీ ఆ ఉద్దేశం ప్రకారంగా తన యొక్క విశ్వాసం, ఆచరణ కూడా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా ప్రయత్నం చేయకుండా కేవలం బూటకపు అబద్ధపు ఆశలను పెట్టుకొని మనం చెడును చెడుగా భావించి ఛీ అన్నట్లుగా మన మనసులో లేకుంటే ఈ పశ్చాత్తాపం, ఈ ఆశ అనేది మనకు ఏ ప్రయోజనం చేకూర్చదు.

ఆ తర్వాత ఆయత్ నెంబర్ ఏడు మరియు ఎనిమిది, ఇది కూడా చాలా భయంకరమైన విషయం ఇందులో ఉంది. ఏమిటంటే, ఎక్కడ ఏ లోకంలో ఏ చాటున, ఏ గుహలో, ఏ రీతిలో ఎక్కడ ఉండి కూడా రవ్వంత, అణువంత, ఏ చిన్న పుణ్య కార్యం చేసినా అది మనం చూసుకుంటాము. మరియు ఇహలోకంలో ఏ చెడు చేసినా దాన్ని కూడా పరలోకంలో చూసుకుంటాము. ఈ భావంలో కూడా ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి,

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا ۗ وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
(వవజదూ మా అమిలూ హాదిరా వలా యద్లిము రబ్బుక అహదా.)
అల్లాహ్ త’ఆలా మీరు చేసిన పూర్తి మీ యొక్క జీవితమంతా ఏ ఏ కార్యాల్లో గడిసిందో దాన్నంతా కూడా హాజరు పరుస్తాడు, అల్లాహ్ ఎవరిపైనా కూడా ఏ కొంచెం అన్యాయం చేయడు.

సహీ బుఖారీలో వచ్చినటువంటి ఒక ఉల్లేఖనం ద్వారా మనం చాలా భయకంపితులైపోవాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో విషయాలు తెలియజేస్తూ, గుర్రం గురించి నేను నిన్నటి క్లాస్ లో ఏదైతే ఒక హదీస్ సంక్షిప్త భావం చెప్పానో అది ఒకరి కొరకు అజ్ర్ (أَجْرٌ) ఉంటే మరొకరి కొరకు సిత్ర్ (سِتْرٌ) మరియు ఇంకో వారికి అది పాపంగా ఉంటుంది, మూడు రకాల విషయాలు, రకాల గుర్రాలు ఉన్నాయి అని. ఆ హదీస్ వివరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఒక సహాబీ అడిగారు, ప్రవక్తా, ఈ గుర్రం గురించి అయితే బాగానే చెప్పారు, మరి ఈ గాడిదల గురించి ఏంటి ప్రస్తావన అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటో గమనించండి,

مَا أُنْزِلَ فِيهَا شَيْءٌ إِلَّا هَذِهِ الْآيَةُ الْفَاذَّةُ الْجَامِعَةُ
(మా ఉన్జిల ఫీహా షైఅన్ ఇల్లా హాదిహిల్ ఆయతిల్ ఫాద్దతిల్ జామిఆ.)
మీరు అడిగిన ప్రశ్నకు నా వైపు నుండి నాకు ఏ సమాధానం లేదు, అల్లాహ్ ఏదైతే అవతరింపజేస్తూ ఉంటాడో, వహీ చేస్తూ ఉంటాడో దాని ప్రకారంగా నేను మీకు చెబుతూ ఉంటాను, ఇప్పుడు మీరు దీని గురించి ఏదైతే అడిగారో ఇక్కడ గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా దీని గురించి నాకైతే ఏమీ ఆదేశం రాలేదు, ఏ వహీ రాలేదు, కానీ ఒక జామిఅ ఆయత్, ఒక విచిత్రమైన, ఒక యునీక్ లాంటి ఆయత్ అది మీరు గుర్తుంచుకోండి,

فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ
(ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్)
కనుక ఎవడు అణుమాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణుమాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”

సోదర మహాశయులారా! ఫరజ్దఖ్ అని ఒక చాలా ప్రఖ్యాతి గాంచిన కవి. అయితే ఆ కవి యొక్క బాబాయి ప్రవక్త సల్లల్లాهُ అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని ముందు ఈ సూరా చదువుతూ, ఫమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ ఖైరయ్యరహ్, వమయ్యామల్ మిస్ఖాల దర్రతిన్ షర్రయ్యరహ్ అని తిలావత్ చేశారు. ఆ మనిషి, అతడు కూడా అరబ్, అరబీ భాష పట్ల మంచి అవగాహన. విన్న వెంటనే ఏమన్నాడు, చాలు చాలు చాలు, ఇక మీరు ఆపండి. ఈ విషయమే నాకు సరిపోయింది, మనం గుణపాఠం తెచ్చుకోవడానికి, జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవడానికి, ఇక బహుశా దీని తర్వాత ఏది వినే అవసరం ఉండదు అని చెప్పుకొచ్చాడు.

అంటే ఏంటి, మనం ఏదైతే ఇహలోకంలో పుణ్యం చేస్తామో, పరలోకంలో దాని గురించి మనకు తప్పకుండా ప్రతిఫలం లభించడమే కాదు, ఆ పుణ్య కార్యాన్ని కూడా మనం చూస్తాము వీడియో రూపంలో. మరియు ఎక్కడైతే ఏ పాపాలు చేస్తామో వాటిని కూడా వీడియో రూపంలో చూస్తాము. అలాంటి సందర్భంలో మన పరిస్థితి ఏముంటుందో, భయపడాలి అల్లాహ్ తో.

అందుకొరకే సోదర మహాశయులారా! సమయం కూడా కావస్తుంది గనుక, ఈ విధంగా హదీస్ గ్రంథాల్లో ఒక సూరాకు సంబంధించి, ఆ సూరాలోని కొన్ని ఆయతులకు సంబంధించి ఏ ఏ హదీసులు వస్తాయో, వాటిలో ఏ ఏ గుణపాఠాలు ఉంటాయో వాటి ద్వారా మనం మంచి బోధ నేర్చుకొని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. పరలోకం పట్ల విశ్వాసం మనది చాలా బలంగా ఉండాలి మరియు ఇహలోకంలోనే మనం మార్పు తెచ్చుకొని పుణ్యాల వైపునకు రావాలి లేదా అంటే చాలా నష్టంలో ఉంటాము.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఖురాన్ ను శ్రద్ధగా చదివి అర్థం చేసుకుంటూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక.

آمِينَ وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(ఆమీన్ వ ఆఖిరు దఅవాన అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=31951

మా యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి ఇన్ షా అల్లాహ్:
http://www.youtube.com/user/teluguislam?sub_confirmation=1

101.సూరతుల్ ఖారిఅహ్ (మహోపద్రవం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)

101.సూరతుల్ ఖారిఅహ్ (మహోపద్రవం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/Qrb396ZG5wI [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో 11 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా తీర్పుదినం గురించి వివరించింది. ఈ సూరాకు పేరుగా పెట్టబడిన పదం మొదటి ఆయతులో ప్రస్తావనకు వచ్చింది. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను ఇందులో వివరించడం జరిగింది. ఆ రోజున తీవ్రమైన ప్రకంపనాలు సంభవిస్తాయి. పర్వతాలు దూదిపింజల్లా ఎగురుతాయి. మానవులు దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా చెల్లాచెదరయిన దీపపు పురుగుల్లా కనబడతారు. చేసిన కర్మలకు తగిన విధంగా శిక్షా లేదా బహుమానాలు ఆ రోజున లభిస్తాయి.

101:1 الْقَارِعَةُ
ఎడా పెడా బాదేది.

101:2 مَا الْقَارِعَةُ
ఏమిటీ, ఆ ఎడా పెడా బాదేది?

101:3 وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ
ఆ ఎడా పెడా బాదే దాని గురించి నీకేం తెలుసు?

101:4 يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ
ఆ రోజు మనుషులు చెల్లాచెదురైన దీపపు పురుగుల్లా అయిపోతారు.

101:5 وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ
పర్వతాలు ఏకిన రంగు రంగుల దూది పింజాల్లా (లేక ఉన్నిలా) అయిపోతాయి.

101:6 فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ
ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో.

101:7 فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
అతను మనసు మెచ్చిన భోగ భాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు.

101:8 وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ
మరెవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో,

101:9 فَأُمُّهُ هَاوِيَةٌ
అతని నివాస స్థానం ‘హావియా’ అవుతుంది.

101:10 وَمَا أَدْرَاكَ مَا هِيَهْ
అదేమిటో (‘హావియా’ అంటే ఏమిటో) నీకేం తెలుసు?

101:11 نَارٌ حَامِيَةٌ
అది దహించివేసే అగ్ని.


“మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది”. మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ బంధుమిత్రులను చేర్పించండి, ఇన్ షా అల్లాహ్.
https://chat.whatsapp.com/JYb4QhZ4Hlu5Ek076Xx4fJ

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం) [వీడియో & టెక్స్ట్]

సూరతుల్ తకాసుర్ (అధికంగా ప్రోగుచేయటం) – తఫ్సీర్ (వ్యాఖ్యానం)
https://youtu.be/UEPobrbzkmg [37 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ సూరా మక్కాకాలానికి చెందినది. ఇందులో మొత్తం 8 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ముఖ్యంగా సంపద పట్ల వ్యామోహం గురించి వివరించింది. మానవులు విపరీతంగా ప్రాపంచిక సుఖభోగాల వ్యామోహం కలిగి ఉంటారు. ఎల్లప్పుడు తమ సంపదను ఇంకా పెంచుకోవాలని చూస్తుంటారు. తమ హోదాను, అధికారాన్ని పెంచుకో వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రాపంచిక ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా నిమగ్నమైపోయి పరలోకాన్ని విస్మరిస్తారు. నిజానికి పరలోకం మనిషి భవిష్యత్తు. మృత్యువు ఆసన్నమైనప్పుడు, సమాధిలో వాస్తవాన్ని గుర్తిస్తారు. తీర్పుదినాన వారు తమ కళ్ళారా నరకాన్ని చూసుకుంటారు. అల్లాహ్ కు దూరమైనందుకు, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు.

102:1 أَلْهَاكُمُ التَّكَاثُرُ
అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది.

102:2 حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

102:3 كَلَّا سَوْفَ تَعْلَمُونَ
ఎన్నటికీ కాదు, మీరు తొందరగానే తెలుసుకుంటారు.

102:4 ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
మరెన్నటికీ కాదు…. మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

102:5 كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
అది కాదు. మీరు గనక నిశ్చిత జ్ఞానంతో తెలుసుకున్నట్లయితే (అసలు పరధ్యానంలోనే పడి ఉండరు).

102:6 لَتَرَوُنَّ الْجَحِيمَ
మీరు నరకాన్ని చూసి తీరుతారు.

102:7 ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ
అవును! మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా!

102:8 ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
మరి ఆ రోజు (అల్లాహ్) అనుగ్రహాల గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.


اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ اَمَّا بَعْدُ
అల్హందులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
అఊజుబిల్లాహిస్సమీయిల్ అలీమి మినష్షైతానిర్రజీమ్.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.

أَلْهَاكُمُ التَّكَاثُرُ
అల్ హాకుముత్తకాసుర్
అల్ హాకుమ్ అంటే మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది, ఏమరపాటుకు గురి చేసింది, అశ్రద్ధలో పడవేసింది. అంటే ఏమిటి? మనిషి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వదిలేసి, దానికంటే తక్కువ ప్రాముఖ్యత గల విషయంలో పడ్డాడంటే అతడు దాని నుండి ఏమరుపాటులో పడి వేరే పనిలో బిజీ అయ్యాడు. التَّكَاثُرُ అత్తకాసుర్ – అధికంగా పొందాలన్న ఆశ. అధికంగా పొందాలన్న ఆశ మిమ్మల్ని పరధ్యానంలో పడవేసింది. తఫ్సీర్‌లో, వ్యాఖ్యానంలో మరికొన్ని వివరాలు ఇన్షాఅల్లాహ్ మనం తెలుసుకుందాము.

حَتَّىٰ
హత్తా
ఆఖరికి, చివరికి మీరు

زُرْتُمُ
జుర్తుమ్
సందర్శిస్తారు, చేరుకుంటారు

الْمَقَابِرَ
అల్ మకాబిర్
సమాధులను. మీరు సమాధులకు చేరుకుంటారు, ఈ అధికంగా పొందాలన్నటువంటి ఆశలోనే ఉండిపోయి.

كَلَّا
కల్లా
ఎన్నటికీ కాదు. మీ కోరికలన్నీ నెరవేరి పూర్తి అవుతాయనుకుంటారు కానీ అలా కాదు.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا
సుమ్మ కల్లా
మరెన్నటికీ కాదు,

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

كَلَّا
కల్లా
అది కాదు,

لَوْ تَعْلَمُونَ
లౌ తఅలమూన
మీరు గనక తెలుసుకున్నట్లయితే

عِلْمَ الْيَقِينِ
ఇల్మల్ యకీన్
నిశ్చిత జ్ఞానంతో, పూర్తి నమ్మకమైన జ్ఞానంతో. అంటే ఏమిటి ఇక్కడ? మీకు గనక ఇల్మె యకీన్ ఉండేది ఉంటే, మీకు పూర్తి నమ్మకమైన జ్ఞానం ఉండేది ఉంటే ఈ ఏమరుపాటులో ఏదైతే ఉన్నారో ఒకరి కంటే ఒకరు ఎక్కువగా పొందాలన్న ఆశలో పడిపోయి, ఆ ఆశల్లో ఉండరు, ఏమరుపాటుకు గురి కారు.

لَتَرَوُنَّ الْجَحِيمَ
ల తరవున్నల్ జహీమ్
మీరు తప్పకుండా చూసి తీరుతారు (ల ఇక్కడ బలంగా, గట్టిగా తాకీదుగా చెప్పడానికి ఒక ప్రమాణంతో కూడినటువంటి పదం అని వ్యాఖ్యానకర్తలు చెబుతారు)

الْجَحِيمَ
అల్ జహీమ్
నరకాన్ని.

ثُمَّ
సుమ్మ
అవును మళ్ళీ

لَتَرَوُنَّهَا
ల తరవున్నహా
మీరు దానిని తప్పకుండా చూసి తీరుతారు. హా అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో హా అలిఫ్, దాని ఉద్దేశ్యం ఆ నరకం గురించి చెప్పడం. ఎలా?

عَيْنَ الْيَقِينِ
ఐనల్ యకీన్
ఖచ్చితమైన మీ కళ్ళారా మీరు ఆ నరకాగ్నిని చూసి తీరుతారు, చూసి ఉంటారు.

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మరి ఆ రోజు

ثُمَّ
సుమ్మ
మళ్ళీ

لَتُسْأَلُنَّ
ల తుస్ అలున్న
మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది

يَوْمَئِذٍ
యౌమ ఇజిన్
ఆ రోజున

عَنِ النَّعِيمِ
అనిన్నయీమ్
అనుగ్రహాల గురించి. మరి ఆ రోజు అల్లాహ్ యొక్క అనుగ్రహాలు మీకు ఏవైతే ఇవ్వబడ్డాయో వాటి గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.

సూరహ్ అత్-తకాసుర్ ఘనతలు మరియు ప్రాముఖ్యత

సోదర మహాశయులారా, సోదరీమణులారా, మీరు ఈ సూరా గురించి సర్వసామాన్యంగా ఘనతలు ఎక్కువగా విని ఉండరు. ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారు అంటే గుర్తుంచుకోండి అది ఏ సహీ హదీసుతో రుజువైన మాట కాదు. ఎలాగైతే సర్వసామాన్యంగా మనం సూరతుల్ ఫాతిహా, సూరతుల్ ఇఖ్లాస్ (قُلْ هُوَ اللَّهُ أَحَدٌ – ఖుల్ హువల్లాహు అహద్) ఇప్పుడు ఏదైతే హమ్నా బిన్తె షేఖ్ అబూ హయ్యాన్ తిలావత్ చేశారో సూరతుల్ ఇఖ్లాస్, అలాగే సూరత్ అల్-ఫలఖ్, వన్నాస్ ఇంకా కొన్ని వేరే సూరాల విషయంలో ఎన్నో సహీ హదీసులు వచ్చి ఉన్నాయి. సూరతుత్-తకాసుర్ యొక్క ఘనత విషయం అంటున్నాను నేను, ఘనత. ఘనతలో ఏ ఒక్క సహీ హదీస్ లేదు. కానీ ఏదైనా సూరాకు, ఏదైనా ఆయత్‌కు ప్రత్యేకంగా ఏదైనా ఒక ఘనత లేనందువల్ల దాని స్థానం పడిపోలేదు. ఎందుకంటే ఖురాన్ అల్లాహ్ యొక్క వాక్కు, మాట గనక అందులో తక్కువ స్థానం ఏమీ ఉండదు. ఒకదాని ఘనత ఏదైనా ఉంటే అది వేరే విషయం కానీ లేనందుకు అది ఏదైనా తక్కువ స్థానం అన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు, ఒక మాట. రెండో మాట, ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడనప్పటికీ ఇందులో చాలా ముఖ్యమైన మరియు చాలా ప్రాముఖ్యత గల మనందరికీ, విశ్వాసులకు, అవిశ్వాసులకు, పుణ్యాత్ములకు, పాపాత్ములకు అందరికీ బోధపడే గుణపాఠాలు ఉన్నాయి.

రండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ఆధారంగా ఇన్షాఅల్లాహ్ ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకుందాము. ఇందులో మీరు ఇప్పుడు చూసినట్లుగా మొట్టమొదటి ఆయత్‌ను శ్రద్ధ వహించండి: أَلْهَاكُمُ التَّكَاثُرُ – అల్ హాకుముత్తకాసుర్. అల్ హాకుమ్ అంటే సంక్షిప్తంగా చెప్పేశాను. అత్తకాసుర్ అంటే, సోదర మహాశయులారా శ్రద్ధగా వినండి, ప్రత్యేకంగా ఎవరైతే ధర్మ క్లాసులలో హాజరవుతున్నారో, ఎవరైతే దావా పనులు చేస్తున్నారో వారు కూడా వినాలి. ఇంకా ఎవరైతే పరలోకం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, సత్కార్యాలలో చాలా వెనక ఉన్నారో వారైతే తప్పనిసరిగా వినాలి. చాలా విషయాలు ఈ అత్తకాసుర్ పదంలో వస్తున్నాయి. తకాసుర్ అంటారు కసరత్ ఎక్కువ కావాలి, అధికంగా కావాలి. మరియు తకాసుర్ ఇది అరబీ గ్రామర్ ప్రకారంగా ఎలాంటి సేగా (format) లో ఉంది అంటే ఒకరు మరొకరితో పోటీపడి అతని కంటే ఎక్కువ నాకు కావాలి అన్నటువంటి ఆశతో అదే ధ్యేయంతో దానినే లక్ష్యంగా పెట్టుకొని అలాగే జీవించడం, పూర్తి ప్రయత్నం చేయడం.

ఇక ఇది ప్రపంచ రీత్యా చూసుకుంటే, ఎవరైతే పరలోకాన్ని త్యజించి, పరలోకం గురించి ఏ ప్రయత్నం చేయకుండా కేవలం ఇహలోక విషయాల్లోనే పూర్తిగా నిమగ్నులై ఒకరి కంటే ఒకరు ఎక్కువగా ఉండాలి, ముందుగా ఉండాలి అన్నటువంటి ఆశలో జీవితం గడుపుతూ దానికే పూర్తి సమయం వెచ్చిస్తున్నారో, సంతానం వాని కంటే నాకు ఎక్కువ కావాలని గాని, వాని కంటే ఎక్కువ పెద్ద బిజినెస్ నాది కావాలి అని, వాని కంటే ఎక్కువ పొలాలు, పంటలు నాకు కావాలి అని, ఈ లోకంలో వారి కంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు, హోదా అంతస్తులు నాకు కావాలి అని, ఈ విధంగా ఏ ఏ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారో గుర్తుంచుకోవాలి, ఇవన్నీ కూడా పరలోకాన్ని మరిపింపజేస్తే, పరలోకం పట్ల అశ్రద్ధలో పడవేస్తే ఇది చాలా చాలా నష్టం.

చివరికి మనం చేసే అటువంటి నమాజులు, ఉండే అటువంటి ఉపవాసాలు, హాజరయ్యే అటువంటి ఈ ధర్మ విద్య, ధర్మ జ్ఞాన క్లాసులు, మనం ఏ దావా కార్యక్రమాలు పాటిస్తూ ఉంటామో వీటన్నిటి ద్వారా నేను ఫలానా వారి కంటే ఎక్కువ పేరు పొందాలి. ఇలాంటి దురుద్దేశాలు వచ్చేసాయి అంటే ఈ పుణ్య కార్యాలు చేస్తూ కూడా అల్లాహ్ యొక్క ప్రసన్నత, పరలోక సాఫల్యం పట్ల ఆశ కాకుండా ఇహలోకపు కొన్ని ప్రలోభాలలో, ఇహలోకపు ఆశలలో పడి నేను నా ఈ యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా, నా యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాని కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేసే వరకు వదలను. నేను నా యొక్క ఈ ప్రయత్నంలో అతని కంటే ముందుగా ఉండాలి, నా పేరు రావాలి, ఇట్లాంటి దురుద్దేశాలు వచ్చేస్తే పుణ్య కార్యాలు కూడా నాశనం అవుతాయి, పరలోకంలో చాలా నష్టపోతాము.

అయితే ఈ సందర్భంలో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక హదీసును తెలుసుకుంటే చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏంటి ఆ హదీస్? వాస్తవానికి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము గనక అల్లాహు తఆలా సూరతుల్ కసస్‌లో చెప్పినట్లు:

وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ الدُّنْيَا
వలా తన్స నసీబక మినద్దున్యా
పరలోకానికై పూర్తి ప్రయత్నంలో ఉండండి, అక్కడి సాఫల్యం కొరకు. కానీ ఈ లోకంలో, ప్రపంచంలో ఏదైతే కొంత మనం సమయం గడిపేది ఉన్నది, కొద్ది రోజులు ఉండవలసి ఉంది, దాని అవసరాన్ని బట్టి మాత్రమే మీరు కొంచెం ప్రపంచం గురించి కూడా మర్చిపోకండి.

కానీ ఇక్కడ జీవించడానికి ఏ ఇల్లు, ఏ కూడు, ఏ గూడు, ఏ గుడ్డ, ఏ ధనము, ఏ డబ్బు అవసరం ఉన్నదో అది మనకు కేవలం ఒక సాధనంగా, చిన్నపాటి అవసరంగానే ఉండాలి కానీ దాని కొరకే మనం అంతా కూడా వెచ్చించాము, సర్వము దాని కొరకే త్యజించాము అంటే ఇది మన కొరకు చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, మనం ఇహపరాలన్నీ కూడా కోల్పోతాము.

ఏంటి ఆ హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది? ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్యలో వచ్చారు, స్నానం చేసి. సహాబాలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలో రావడం ఎంత ఆనందంగా కనిపించిందంటే సహాబాలు అన్నారు ప్రవక్తతో:

نراك اليوم طيب النفس
నరాకల్ యౌమ తయ్యిబన్నఫ్స్
ఓ ప్రవక్తా, ఎంత మంచి మూడ్‌లో మీరు ఉన్నట్లు కనబడుతున్నారు, చాలా ఆనందంగా, మంచి మనస్సుతో ఉన్నట్లుగా మేము చూస్తున్నాము.

ప్రవక్త చెప్పారు:

أجل والحمد لله
అజల్, వల్ హందులిల్లాహ్
అవును, అల్లాహ్ యొక్క హమ్ద్, అల్లాహ్ యొక్క శుక్ర్, అల్లాహ్ కే స్తోత్రములు.

మళ్ళీ ప్రజలు కొంత సిరివంతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, గమనించండి హదీసును:

لَا بَأْسَ بِالْغِنَى لِمَنِ اتَّقَى
లా బఅస బిల్ గినా లిమనిత్తకా
అల్లాహ్ యొక్క భయభీతి కలిగిన వానికి అల్లాహ్ సిరివంతం ప్రసాదించడం, సిరివంతం గురించి అతడు కొంచెం ప్రయత్నం చేయడం పాపం కాదు, చెడుది కాదు.

మంచిది అని అనలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, గమనించండి. ఏమన్నారు? లా బఅస్. ఒకవేళ అల్లాహ్ తో భయభీతి, అల్లాహ్ యొక్క భయభీతితో డబ్బు సంపాదిస్తూ, డబ్బు కొంచెం జమా చేస్తూ, అవసరం ఉన్న ప్రకారంగా ఖర్చు చేస్తూ అతడు ధనవంతుడు అవుతున్నాడంటే ఇది చెడ్డ మాట ఏమీ కాదు.

మళ్ళీ చెప్పారు:

وَالصِّحَّةُ لِمَنِ اتَّقَى خَيْرٌ مِنَ الْغِنَى
వస్సిహతు లిమనిత్తకా ఖైరుమ్ మినల్ గినా
కానీ ఆరోగ్యం భయభీతి కలిగే వారికి, అల్లాహ్ యొక్క భయంతో జీవించే వారికి ఆరోగ్యం అన్నది వారి యొక్క ధనం కంటే ఎంతో మేలైనది.

గమనిస్తున్నారా?

وَطِيبُ النَّفْسِ مِنَ النَّعِيمِ
వతీబున్నఫ్సి మినన్నయీమ్
మరియు మనిషి మంచి మనస్సుతో ఉండడం ఇది కూడా అల్లాహ్ అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం.

ఇప్పుడు ఈ సూరా మనం చదువుతున్నామో దాని యొక్క చివరి ఆయత్‌కు కూడా ఈ హదీస్ వ్యాఖ్యానంగా గొప్ప దలీల్ ఉంటుంది మరియు మొదటి ఆయత్ ఏదైతే ఉందో దానికి కూడా గొప్ప ఆధారంగా ఉంటుంది, దాని యొక్క వ్యాఖ్యానంలో. ఎందుకంటే హదీస్ యొక్క మూడు భాగాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాలు చెప్పారు కదా, భయభీతి కలిగే వారికి ధనం ఎలాంటి నష్టం లేదు లేదా చెడు కాదు. కానీ ఆరోగ్యం అన్నది భయభీతి గలవారికి వారి ధనాని కంటే చాలా ఉత్తమమైనది. ఈ రెండు విషయాలు మొదటి ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది, అల్ హాకుముత్తకాసుర్.

అయితే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? మనిషి ఫలానా కంటే నాకు ఎక్కువ ఉండాలని కోరుతున్నాడు, ఏదైనా ప్రపంచ విషయం. కానీ అక్కడ ఉద్దేశ్యం ఏమున్నది? అతని జీవితం ఎలా ఉన్నది? అల్లాహ్ యొక్క భయభీతితో గడుస్తున్నది. అతని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఆ డబ్బు గాని, ధనం గాని, సంతానం గాని, ఇహలోకంలో ఇంకా ఏదైనా స్థానం సంపాదించి దాని ద్వారా అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయడంలో, ప్రజలకు మేలు చేకూర్చడంలో మనం ముందుకు ఉండాలి, అల్లాహ్ యొక్క ప్రసన్నత తను కోరుతున్నాడు. అలాంటప్పుడు సోదర మహాశయులారా, ఇలాంటి ఈ ధనం, ఇలాంటి ఈ ఆరోగ్యం, ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాలు కోరడం తప్పు కాదు. ఒక రకంగా చూసుకుంటే అతని కొరకు పరలోకంలో ఇవి ఎంతో పెద్ద గొప్ప స్థానాన్ని తెచ్చిపెడతాయి మరియు అతడు ఈ విధంగా ఎంతో ముందుగా ఉంటాడు.

ఇంకా ఇక్కడ విషయాలు మీరు గమనిస్తే:

حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ
హత్తా జుర్తుముల్ మకాబిర్
ఆఖరికి మీరు (ఈ ఆశల ఆరాటంలోనే) సమాధులకు చేరుకుంటారు.

హత్తా జుర్తుముల్ మకాబిర్ అని చెప్పడం జరిగింది. ఈ జుర్తుముల్ మకాబిర్ అన్నటువంటి ఆయత్ ద్వారా బోధపడే విషయం ఏమిటి? గమనించండి, నేను వ్యాఖ్యానం చేస్తూ దానితో పాటే కొన్ని లాభాలు కూడా తెలియజేస్తున్నాను, మనకు వేరుగా లాభాలు చెప్పుకోవడానికి బహుశా అవకాశం ఉండకపోవచ్చు. జుర్తుముల్ మకాబిర్‌లో అఖీదాకు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయం ఏమిటి? ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడి నుండి చనిపోయేది ఉంది.

రెండవది, మనుషులను చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే సర్వ మానవులకు నాచురల్ గా, స్వాభావికంగా ఇవ్వబడినటువంటి పద్ధతి. దీనికి భిన్నంగా ఎవరైనా కాల్చేస్తున్నారంటే, ఎవరైనా మమ్మీస్‌గా తయారు చేసి పెడుతున్నారంటే, ఇంకా ఎవరైనా ఏదైనా బాడీ ఫలానా వారికి డొనేట్ చేశారు, సైంటిఫిక్ రీసెర్చ్‌ల కొరకు, ఈ విధంగా ఏదైతే సమాధి పెట్టకుండా వేరే పద్ధతులు అనుసరిస్తున్నారో ఇది ప్రకృతి పద్ధతి కాదు, అల్లాహ్ మానవుల మేలు కొరకు తెలిపినటువంటి పద్ధతి కాదు. అల్లాహు తఆలా సర్వ మానవాళి కొరకు వారు చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టడమే మొట్టమొదటి మానవుడు చనిపోయిన, అంటే మొట్టమొదటి మానవుడు ఎవరైతే చనిపోయారో ఆదం అలైహిస్సలాం యొక్క కుమారుడు, ఒక కాకి ద్వారా నేర్పడం జరిగింది, సూరహ్ మాయిదాలో దాని ప్రస్తావన ఉంది. సూరత్ అబసాలో చదవండి మీరు:

ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
సుమ్మ అమాతహు ఫ అక్బరహ్
అల్లాహ్ యే మరణింపజేశాడు మరియు మిమ్మల్ని సమాధిలో పెట్టాడు.

సూరత్ తాహాలో చదివితే:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ
మిన్హా ఖలక్నాకుమ్ వఫీహా నుయీదుకుమ్ వమిన్హా నుఖ్రిజుకుమ్
ఇదే మట్టి నుండి మిమ్మల్ని పుట్టించాము, తిరిగి అందులోనే మిమ్మల్ని పంపిస్తాము, తిరిగి అక్కడి నుండే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాము, లేపుతాము.

అయితే ఇదొక మాట, అఖీదాకు సంబంధించింది. మూడో మాట ఇందులో మనకు ఏం తెలుస్తుందంటే సమాధి అన్నది శాశ్వత స్థలం కాదు. అందుకొరకే ఉర్దూలో గాని, అరబీలో గాని లేదా తెలుగులో గాని అతడు తన చివరి గమ్యానికి చేరుకున్నాడు, ఎవరైనా చనిపోతే అంటారు కదా, ఈ మాట సరియైనది కాదు. మనిషి యొక్క చివరి మెట్టు, చివరి యొక్క అతని యొక్క స్థానం అది స్వర్గం లేదా నరకం. అల్లాహ్ మనందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసి నరకం నుండి రక్షించుగాక.

ఈ ఆయతులో, హత్తా జుర్తుముల్ మకాబిర్, మరొక చాలా ముఖ్యమైన అఖీదాకు సంబంధించిన విషయం ఏమిటంటే ఈ ఆయతు ద్వారా సలఫె సాలెహీన్ యొక్క ఏకాభిప్రాయం, సమాధిలో విశ్వాసులకు, పుణ్యాత్ములకు అనుగ్రహాలు లభిస్తాయి మరియు అవిశ్వాసులకు, మునాఫికులకు, పాపాత్ములకు శిక్షలు లభిస్తాయి. ఇది ఏకీభవించబడిన విషయం. దీనిని చాలా కాలం వరకు తిరస్కరించే వారు ఎవరూ లేకుండిరి, కానీ తర్వాత కాలాల్లో కొందరు పుట్టారు. మరికొందరు ఏమంటారు, ముస్లింలని తమకు తాము అనుకునే అటువంటి తప్పుడు వర్గంలో, తప్పుడు మార్గంలో ఉన్నవారు కొందరు ఏమంటారు, హా, సమాధిలో శిక్ష జరుగుతుంది కానీ కేవలం ఆత్మకే జరుగుతుంది, శరీరానికి జరగదు. ఇలాంటి మాటలు చెప్పడం కూడా సహీ హదీసుతో రుజువు కావు. ఎందుకంటే అది అల్లాహ్ ఇష్టంపై ఉన్నది. మనిషి చనిపోయిన తర్వాత అనుగ్రహాలు లభించడం మరియు శిక్షలు లభించడం అన్నది ఆత్మ, శరీరం రెండింటికీ కావచ్చు, శరీరానికే కావచ్చు, ఆత్మకే కావచ్చు. ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ తమ రచనల్లో దీని గురించి చాలా వివరాలు తీసుకొచ్చి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపారు. ఈ విధంగా సోదర మహాశయులారా, హత్తా జుర్తుముల్ మకాబిర్, దీని గురించి కూడా కొన్ని హదీస్ ఉల్లేఖనాల ద్వారా సమాధి శిక్ష గురించి చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అందుకొరకు ఇది లేదు అని, కేవలం ఆత్మకు అని, ఈ విధంగా చెప్పుకుంటూ ఉండడం ఇది సరియైన విషయం కాదు.

సోదర మహాశయులారా, ఇక్కడ మరొక విషయం మనకు తెలుస్తుంది. మకాబిర్ అని అల్లాహు తఆలా చెప్పాడు. సర్వసామాన్యంగా మనం ఖబ్రిస్తాన్ అని ఏదైతే అంటామో దానిని చెప్పడం జరుగుతుంది. అయితే ముస్లింల యొక్క సర్వసామాన్యంగా వ్యవహారం, వారందరి కొరకు ఏదైనా స్మశాన వాటిక అని అంటారు, ఖబ్రిస్తాన్ ఉంటుంది, అక్కడే అందరినీ సమాధి చేయాలి, దఫన్ చేయాలి. కానీ అలా కాకుండా ప్రత్యేకంగా నా భూమిలో, నా యొక్క ఈ జగాలో, నేను పుట్టిన స్థలంలో ఇక్కడే అన్నటువంటి కొన్ని వసియతులు ఎవరైతే చేస్తారో, తర్వాత అక్కడ పెద్ద పెద్ద మజార్లు, దర్గాలు కట్టడానికి తప్పుడు మార్గాలు వెళ్తాయో ఇవన్నీ కూడా సరియైన విషయాలు కావు.

జుర్తుముల్ మకాబిర్ ద్వారా ధర్మపరమైన మరొక లాభం మనకు ఏం తెలుస్తుందంటే మనము ఇహలోకంలో బ్రతికి ఉన్నంత కాలం కబ్రిస్తాన్‌కు వెళ్లి, మన ఊరిలో, మన సిటీలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి కబ్రిస్తాన్‌కు వెళ్లి దర్శనం చేస్తూ ఉండాలి, జియారత్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ప్రపంచ వ్యామోహం తగ్గుతుంది, పరలోకం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇది తప్పనిసరి విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తల్లి ఆమినా గారి యొక్క సమాధిని దర్శించారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు కూడా, فَزُورُوا الْقُبُورَ – ఫజూరుల్ కుబూర్, మీరు సమాధులను దర్శించండి, అల్లాహ్ దీని గురించి అనుమతి ఇచ్చి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత ఆయతులను కొంచెం శ్రద్ధ వహించండి. అల్లాహు తఆలా ఇందులో చాలా ముఖ్య విషయాలు చెబుతున్నాడు. మూడు, రెండు సార్లు ఒకే రకమైన పదాలు వచ్చాయి, మూడోసారి ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుందో గమనించండి. కల్లా, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం తెలుసుకున్నాము. కల్లా అన్న పదం అవిశ్వాసులు లేదా తిరస్కారుల అభిప్రాయాలను కొట్టిపారేసి, మీరు అనుకున్నట్లు ఎంతమాత్రం జరగదు అని చెప్పడంతో పాటు, అసలు వాస్తవ విషయం ఇది అని చెప్పడానికి కూడా ఈ కల్లా అన్నటువంటి పదం ఉపయోగించడం జరుగుతుంది.

سَوْفَ تَعْلَمُونَ
సౌఫ తఅలమూన్
మీరు తొందరగానే తెలుసుకుంటారు.

ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్
మరెన్నటికీ కాదు, మీరు చాలా తొందరగానే తెలుసుకుంటారు.

ఈ రెండు ఆయతులు ఒకే రకంగా ఎందుకున్నాయి, ఒకే భావం వచ్చింది కదా అని ఆలోచించకండి. ఇబ్ను అబ్బాస్ రదిఅల్లాహు తఆలా అన్హు తెలుపుతున్నారు, మొదటి ఆయతు ద్వారా అంటే మొదటి సౌఫ తఅలమూన్ ద్వారా చెప్పే ఉద్దేశ్యం, మనిషి చావు సమయంలో అతనికి తెలుస్తుంది, నేను ఈ లోకంలో, ఈ ప్రపంచం గురించి, ఇక్కడి హోదా అంతస్తుల గురించి, డబ్బు ధనాల గురించి, భార్యా పిల్లల గురించి, నా యొక్క వర్గం వారి గురించి, నా యొక్క కులం, గోత్రం వారి గురించి, నా యొక్క పార్టీ వారి గురించి ఎంత శ్రమించానో, ఇదంతా వృధా అయిపోతుంది కదా అని తొలిసారిగా అతనికి అతని మరణ సమయంలో తెలిసిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే సమాధుల నుండి లేస్తారో, మైదానే మహషర్‌లో జమా అవుతారో అక్కడ కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండో ఆయతులో రెండోసారి తెలిసే విషయం చెప్పడం జరిగింది. మరియు మూడో ఆయత్ అంటే మన క్రమంలో ఆయత్ నెంబర్ ఐదు:

كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ
కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్

ఇక్కడ ఏదైతే తాలమూన అని వచ్చింది, కానీ ఎలా వచ్చింది? మీకు ఖచ్చిత జ్ఞానం కలుగుతుంది. దీని యొక్క వ్యాఖ్యానంతో మనకు తెలుస్తుంది, ప్రళయ దినాన అల్లాహు తఆలా నరకాన్ని తీసుకొస్తాడు. దాని తర్వాత ఆయతులో ఉంది కదా, మీరు నరకాన్ని చూసి తీరుతారు, అవును మీరు దానిని ఖచ్చితంగా కళ్ళారా చూస్తారు సుమా. అయితే మనిషికి చనిపోయే సందర్భంలో, సమాధి నుండి లేసే సందర్భంలో ఖచ్చితంగా తెలిసిపోతుంది అతనికి. కానీ ఎప్పుడైతే ఇక అతడు కళ్ళారా నరకాన్ని చూస్తాడో, నరకం యొక్క తీర్పు అయిన తర్వాత ఎవరెవరైతే నరకంలో పోవాలో వారు పోతారు. దానిని హక్కుల్ యకీన్ అంటారు.

ఎందుకంటే ఇక్కడ గమనించండి, యకీన్ అన్న పదం ఖురాన్‌లో మూడు రకాలుగా వచ్చింది. ఒకటి ఇల్మల్ యకీన్, ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఆయత్ నెంబర్ చివరిలో. మరియు ఐనుల్ యకీన్, ఆయత్ నెంబర్ ఏడులో చూస్తున్నట్లు. మరియు హక్కుల్ యకీన్ అని వేరే ఒకచోట వచ్చి ఉంది. ఇల్ముల్ యకీన్ అంటే మీకు ఖచ్చిత జ్ఞానం తెలవడం. ఎలా తెలుస్తుంది ఇది? చెప్పే వ్యక్తి ఎవరో, ఎంతటి సత్యవంతుడో దాని ప్రకారంగా మీరు అతని మాటను సత్యంగా నమ్ముతారు, కదా? రెండవది, దాని యొక్క సాక్ష్యాధారాలతో, దాని యొక్క సాక్ష్యాధారాలతో. ఇక ఎప్పుడైతే దానిని కళ్ళారా చూసుకుంటారో దానినే ఐనుల్ యకీన్ అంటారు, ఇక మీరు దానిని కళ్ళారా చూసుకున్నారు గనక తిరస్కరించలేరు. కానీ ఎప్పుడైతే అది మీ చేతికి అందుతుందో లేదా మీరు దానికి చేరుకుంటారో, దానిని అనుభవిస్తారో, అందులో ప్రవేశిస్తారో, దానిని ఉపయోగిస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా హక్కుల్ యకీన్, ఇక సంపూర్ణ నమ్మకం, ఏ మాత్రం అనుమానం లేకుండా సంపూర్ణ నమ్మకం కలుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశ్యం ఏంటంటే, ఓ మానవులారా, మీరు పరలోకాన్ని మరిచి ఏదైతే ఇహలోక ధ్యానంలోనే పడిపోయారో, ఇది మిమ్మల్ని పరలోకం నుండి ఏమరుపాటుకు గురి చేసిందో తెలుసుకోండి, మీకు ఖచ్చితంగా, ఖచ్చిత జ్ఞానంతో తెలుస్తుంది ఆ పరలోకం సత్యం అన్నది, ఖురాన్, హదీస్ సత్యం అన్నది మరియు మీరు నరకాన్ని చూసి తీరుతారు.

ఈ నరకం గురించి హదీసులో ఏమి వచ్చి ఉంది అంటే, ప్రళయ దినాన తీర్పు జరిగే సమయంలో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం వచ్చే వరకు ఎంతమంది మానవులైతే ఒక పెద్ద మైదానంలో జమా అయి ఉంటారో, అల్లాహు తఆలా ఒక్కసారి నరకాగ్నిని వారికి దగ్గరగా చూపించడానికి డెబ్బై వేల సంకెళ్ళతో దానిని బంధించి వారి ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, గమనించండి. డెబ్బై వేల మంది దైవదూతలు, డెబ్బై వేల సంకెళ్ళు, ఒక్కొక్క సంకెళ్ళు ఎంత పెద్దగా అంటే డెబ్బై వేల మంది దైవదూతలు దాన్ని పట్టుకొని ఉంటారు. డెబ్బై వేలను డెబ్బై వేలతో ఇంటూ చేయాలి. గమనించండి, ఎంతమంది దైవదూతలు దానిని పట్టుకొని లాగుకొని తీసుకొస్తూ ఉంటారు. ప్రజలందరూ చూసి భయకంపితలు అయిపోతారు. సోదర మహాశయులారా, అలాంటి ఆ పరిస్థితి రాకముందే మనం దాని నుండి రక్షణకై ఇహలోకంలో అల్లాహ్ యొక్క ఆదేశాలను, ప్రవక్త యొక్క విధేయతను పాటించి జీవితం గడపాలి. ఆ తర్వాత:

ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ
సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్
మీరు ఆ రోజు తప్పకుండా మీకు ఇవ్వబడుతున్నటువంటి అనుగ్రహాల గురించి ప్రశ్నించడం జరుగుతుంది.

వాస్తవానికి సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనందరినీ చాలా భయకంపితులు చేసే అటువంటి ఆయత్ ఇది కూడాను. ఎందుకంటే నిజంగా మనం చాలా ఏమరుపాటుకు గురి అయ్యే ఉన్నాము, ఇంకా ఈ ఏమరుపాటు, అశ్రద్ధకు గురి అయి అల్లాహ్ యొక్క కృతజ్ఞత ఎంత ఎక్కువ మంచి రీతిలో చెల్లించాలో చెల్లించడం లేదు. మనం ఎన్ని అనుగ్రహాలు అల్లాహ్ మనకు ప్రసాదించాడు, దాన్ని మనకు మనం ఒకసారి ఏదైనా లెక్కించుకునే ప్రయత్నం చేయడం, దాని గురించి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించే ప్రయత్నం చేయడమే మర్చిపోతున్నాము.

ఒకవేళ మనం హదీసులో చూస్తే, సహీ ముస్లిం, హదీస్ నెంబర్ 2969 లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయ దినాన అల్లాహు తఆలా మనిషిని అడుగుతాడు, నేను నీకు గౌరవం ప్రసాదించలేదా, నీకు నీ ఇంట్లో గాని, నీకు హోదా అంతస్తులు ఇవ్వలేదా, నీకు భార్యా పిల్లలు మరియు ఇంకా డబ్బు ధనం లాంటివి ఇవ్వలేదా, ప్రత్యేకంగా ఎవరికైతే ఈ లోకంలో ఇలాంటివి లభించాయో వారిని తప్పకుండా ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాదు, నీకు ఒంటెలు ఇచ్చాను, ఇంకా గుర్రాలు ఇచ్చాను, నీవు నీకు ఎంత ప్రజలలో ప్రతిష్ట ఇచ్చాను అంటే నీవు ఆదేశిస్తే ప్రజలు నీ మాటను వినేవారు. అయితే అల్లాహ్ అడుగుతాడు, ఇవన్నీ నీకు ఇచ్చానా లేదా? అప్పుడు మనిషి అబద్ధం చెప్పలేకపోతాడు. అవును ఓ అల్లాహ్ ఇవన్నీ ప్రసాదించావు. అప్పుడు అల్లాహు తఆలా అంటాడు, నీవు నన్ను కలుసుకునేవాడివవు, పరలోకం అనేది ఉన్నది, నీవు నా వద్దకు రానున్నావు అన్నటువంటి విషయం నమ్మేవాడివా? కాఫిర్ అయ్యేది ఉంటే ఏమంటాడు? లేదు అని. అప్పుడు అల్లాహ్ అంటాడు, అన్సాక కమా నసీతనీ, నీవు నన్ను ఎలా మరిచావో అలాగే నేను కూడా నిన్ను మర్చిపోతాను.

సోదర మహాశయులారా, సూరతున్నీసా మీరు కొంచెం శ్రద్ధగా చదవండి ఎప్పుడైనా అనువాదంతో. ఒకటి కంటే ఎక్కువ స్థానంలో మునాఫికుల గురించి చెప్పడం జరిగింది, వారు పరలోకాన్ని విశ్వసించే రీతిలో విశ్వసించరు అని. మన పరిస్థితి కూడా అలాగే అవుతుందా, ఒక్కసారి మనం అంచనా వేసుకోవాలి. ఒక హదీస్ పై శ్రద్ధ వహిస్తే మీకు ఈ అంశం అర్థమైపోతుంది, సమయం కూడా కాబోతుంది గనక నేను సంక్షిప్తంగా చెప్పేస్తాను.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, గమనించండి, ముగ్గురు ఎలాంటి వారు? ప్రవక్త విషయం చెప్పే అవసరమే లేదు, ప్రవక్తల తర్వాత ఈ లోకంలోనే అత్యంత శ్రేష్టమైన మనుషులు ఇద్దరు. అయితే సుమారు రెండు లేదా మూడు రోజుల నుండి తిండికి, తినడానికి ఏ తిండి లేక తిప్పల పడుతూ, కడుపులో కూడా ఎంతో పరిస్థితి మెలికలు పడుతూ అబూబకర్ ముందు వెళ్లారు, ఆ తర్వాత ఉమర్ వెళ్లారు, ప్రవక్తను కలుద్దామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వెళ్లారు, ముగ్గురూ బయటనే కలుసుకున్నారు. ఎటు వెళ్లారు, ఎటు వెళ్లారు అంటే కొందరు సిగ్గుతో చెప్పుకోలేకపోయారు కానీ ఏ విషయం మిమ్మల్ని బయటికి తీసిందో, నన్ను కూడా అదే విషయం బయటికి తీసింది అని ప్రవక్త చెప్పి అక్కడి నుండి ఒక అన్సారీ సహాబీ యొక్క తోటలోకి వెళ్తారు. అల్లాహు అక్బర్. పూర్తి హదీస్ అనువాదం చెప్పలేను కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, అన్సారీ సహాబీ మంచి అప్పుడే నీళ్లు బయటి నుండి తీసుకొని వస్తారు, చల్లనివి, ప్రవక్త ముందు, అబూబకర్, ఉమర్ ముందు పెడతారు మరియు తోటలో నుండి తాజా కొన్ని ఖర్జూర్ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఈ రెండే విషయాలను చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీరు కారుతాయి, సహాబాలు కూడా ఏడుస్తారు ఇద్దరూ. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెబుతారో తెలుసా? ఈ అనుగ్రహాల గురించి ప్రళయ దినాన మీతో ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, మూడు రోజులు తిండి లేక తిప్పల పడిన తర్వాత దొరికిన ఈ ఖర్జూర్ మరియు నీళ్లు. వీటి గురించి ఇలా చెప్పారు అంటే ఈ రోజుల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఏసీలు, మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్‌లు, మన ఇళ్లల్లో కొన్ని రోజుల వరకు తినేటువంటి సామాగ్రి, ఇంకా మనకు ఎన్నో జతల బట్టలు, ఇంకా ఏ ఏ అనుగ్రహాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతగా అల్లాహ్ కు కృతజ్ఞత చెల్లించుకోవలసి ఉంది, కానీ మనం ఎంత ఏమరుపాటుకు, అశ్రద్ధకు గురి అయి ఉన్నాము?

సోదర మహాశయులారా, నిజంగా చెప్పాలంటే మనం చాలా అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మరిచిపోయి ఉన్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేస్తారు:

نِعْمَتَانِ مَغْبُونٌ فِيهِمَا كَثِيرٌ مِنَ النَّاسِ
నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరుమ్ మినన్నాస్
(రెండు అనుగ్రహాలు ఉన్నాయి, ప్రజలు వాటి గురించి చాలా అశ్రద్ధగా ఉన్నారు).”

తిర్మిజీలోని మరో ఉల్లేఖనం ద్వారా తెలుస్తుంది, అల్లాహు తఆలా మనిషితో ప్రశ్నిస్తూ అంటాడు: “నేను నీకు చల్లని నీరు త్రాపించలేదా? నీవు వంటలో వేసుకోవడానికి నీకు ఉప్పు ఇవ్వలేదా?” ఇవి, ఇంకా ఇలాంటి ఎన్నో హదీసుల ద్వారా ఏం తెలుస్తుందంటే ప్రళయ దినాన అల్లాహు తఆలా ఎన్నో రకాల అనుగ్రహాల గురించి, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల గురించి అడుగుతాడు. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ముందుకు వచ్చారు, ఈ ఆయత్ గురించి ప్రశ్నించడానికి. ఎప్పుడైతే ఈ ఆయత్ అవతరించిందో, సుమ్మ ల తుస్ అలున్న యౌమ ఇజిన్ అనిన్నయీమ్, ముస్నద్ అహ్మద్ లోని ఉల్లేఖనం, తిర్మిజీలో కూడా ఉంది. సహాబాలు వచ్చి అడిగారు, ప్రవక్తా, మా దగ్గర ఏమున్నది? ఈ ఖర్జూర్ ఉన్నది, ఈ నీళ్లు ఉన్నాయి, ఇంతే కదా. అంటే వీటి గురించి కూడా ప్రశ్నించడం జరుగుతుందా, మన పరిస్థితి ఎలా ఉంది, ఎల్లవేళల్లో మనం మన యొక్క ఆయుధాలు వెంట తీసుకొని వెళ్తున్నాము, ఎప్పుడు శత్రువులు మనపై దాడి చేస్తారు అన్నటువంటి భయంలో జీవిస్తున్నాము, మనపై ఏమంత ఎక్కువ అనుగ్రహాలు అన్నటువంటి ప్రశ్న ప్రశ్నిస్తే ప్రవక్త ఏం చెప్పారు?

أَمَا إِنَّ ذَلِكَ سَيَكُونُ
అమా ఇన్న జాలిక సయకూన్
అల్లాహ్ చెప్పాడు ప్రశ్నిస్తానని, అల్లాహు తఆలా తప్పకుండా ప్రశ్నించి తీరుతాడు.

సోదర మహాశయులారా, ఈ ఇంకా మరికొన్ని హదీసులు ఇలాంటివి మనం చదవాలి, తెలుసుకోవాలి, ఇలాంటి ఈ సూరాల వ్యాఖ్యానంలో మనం అల్లాహ్ తో భయపడాలి, మనకు అల్లాహ్ యొక్క అనుగ్రహాల గురించి చిన్న బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని, గుర్తొచ్చినన్నివి, గుర్తురానివి చాలా ఉన్నాయి, కానీ గుర్తు వచ్చినవి కొంచెం మనం అల్లాహ్ యొక్క ప్రత్యేక కృతజ్ఞత చెల్లించుకునే ప్రయత్నం చేయాలి. మరియు కృతజ్ఞత ఎలా చెల్లించాలి? అల్లాహ్ ఆదేశాలను పాటించి, ఆ అనుగ్రహాలను అల్లాహ్ యొక్క విధేయతలో ఉపయోగించి. విన్న విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.

ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ ఖియామహ్ (ప్రళయం) [వీడియోలు]

పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 40 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా ప్రళయం గురించి, ఆ రోజున మరణించిన వారు మళ్ళీ లేపబడడం గురించి, తీర్పుదినం గురించి, శిక్షా బహుమానాల గురించి బోధించింది. మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది ఒక భ్రమ ఎంతమాత్రం కాదని, అనివార్యంగా చోటుచేసుకునే సంఘటన అనీ ఈ సూరా హెచ్చరించింది. ప్రళయం రోజు భయాందోళనలతో అందరూ కళ్ళు తేలవేస్తారు. చంద్రుడు కాంతివిహీనుడై పోతాడు. సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు. తీర్పుదినాన ప్రతి ఒక్కరికి వారి కర్మల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నాలుక, కాళ్ళుచేతులు అవి చేసిన పనులకు సాక్ష్యం చెబుతాయి. మనిషిని ఒక వీర్యపు బిందువుతో పుట్టించిన అల్లాహ్ చనిపోయిన తర్వాత మళ్ళీ లేపి నిలబెట్టే శక్తిసామర్ధ్యాలు ఉన్నవాడు.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (ఖురాన్ తఫ్సీర్ – సూరా అల్ ఖియామహ్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1OVnR38cf3AOW5Uf-_gRGv