మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి? – షేక్ హబీబుర్రహ్మన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మనం అల్లాహ్ ను ఏవిధంగా వేడుకోవాలి?
https://youtu.be/51-0s5yKLYg [12 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మన్ జామయి

ఈ ప్రసంగంలో, దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత మరియు దానిని ఆచరించవలసిన సరైన పద్ధతి గురించి వివరించబడింది. దుఆ ఆరాధనలలో ఒక ముఖ్యమైన భాగమని, దానిని ఎలా చేయాలో అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించారని చెప్పబడింది. ప్రవక్త గారి జీవితం నుండి రెండు సంఘటనలను ఉదాహరణగా చూపిస్తూ, అల్లాహ్ ను స్తుతించకుండా మరియు ప్రవక్తపై దరూద్ పంపకుండా నేరుగా అభ్యర్థించడం తొందరపాటు అవుతుందని, అయితే అల్లాహ్ యొక్క ఉత్తమమైన నామాలు మరియు గుణగణాల ద్వారా వేడుకోవడం సరైన పద్ధతి అని స్పష్టం చేయబడింది. అల్లాహ్ యొక్క 99 పేర్ల ప్రాముఖ్యత మరియు వాటిని గణించడం అంటే కేవలం లెక్కించడం కాదని, వాటిని విశ్వసించి, అర్థం చేసుకుని, జీవితంలో ప్రతిబింబించేలా చేయాలని వివరించబడింది. ప్రార్థన చేయడానికి మధ్యవర్తి (వసీలా) అవసరమా అనే అంశం తదుపరి ప్రసంగంలో చర్చించబడుతుందని చెప్పబడింది.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియా ఇ వల్ ముర్సలీన్, వమన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమం లోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపడానికి ప్రవక్తలను పంపాడు. దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్ కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు. ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే, ప్రార్థించే విషయంలో కూడా, దుఆ చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు.

అభిమాన సోదరులారా! వేడుకోవటం, దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు,

اَلدُّعَاءُ هُوَ الْعِبَادَةُ
(అద్దుఆ హువల్ ఇబాదహ్)
దుఆ యే అసలైన ఆరాధన.

ఈ హదీస్ అహ్మద్ గ్రంథంలో ఉంది, తిర్మిజీ లో ఉంది, అబూ దావూద్ లో ఉంది, ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది.

దుఆ తప్పక చేయవలసిన ఆరాధన. కావున, దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి, తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుఆ చేసే విధానం, పద్ధతి నేర్పించారు.

అబూ దావూద్ లో ఒక హదీస్ ఉంది, ఫుజాలా బిన్ ఉబైద్ రదియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లో ఉన్నారు, ఒక వ్యక్తి వచ్చాడు. నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దుఆ చేశాడు, ‘నాకు మోక్షం ఇవ్వు, ఓ అల్లాహ్ నన్ను కరుణించు’ అని డైరెక్ట్ గా దుఆ చేశాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, “మీరు తొందరపడ్డారు, ముందు అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడు, ఆ తర్వాత నాపై దరూద్ పంపించు, ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో, నువ్వు చేసుకోదలచుకున్న దుఆ చేసుకో” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

కాసేపటి తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దుఆ చేసే విధానం ఇలా ఉండింది. ఆ వ్యక్తి తన అవసరాలను అడగక ముందు, తన అవసరాలను అల్లాహ్ ముందు పెట్టక ముందు, తన దుఆ ఈ విధంగా అతను ప్రార్థన చేశాడు:

اَللّٰهُمَّ إِنِّيْ أَسْأَلُكَ بِأَنِّيْ أَشْهَدُ أَنَّكَ أَنْتَ اللّٰهُ لَا إِلٰهَ إِلَّا أَنْتَ الْأَحَدُ الصَّمَدُ الَّذِيْ لَمْ يَلِدْ وَلَمْ يُوْلَدْ وَلَمْ يَكُنْ لَّهُ كُفُوًا أَحَدٌ
(అల్లాహుమ్మ ఇన్నీ అస్ అలుక బిఅన్నీ అష్ హదు అన్నక అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ అహదుస్ సమద్, అల్లదీ లమ్ యలిద్ వలమ్ యూలద్, వలమ్ యకుల్లహు కుఫువన్ అహద్)

“ఓ అల్లాహ్! నేను నిన్నే అర్థిస్తున్నాను. అల్లాహ్ నువ్వు మాత్రమే. సకల లోకాలకు ప్రభువు, పాలకుడు, పోషకుడు. ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే. లా ఇలాహ ఇల్లా అంత్, నువ్వు తప్ప ఏ దేవుడూ లేడు. అల్ అహద్, నువ్వు ఒకే ఒక్కడివి. అస్సమద్, నిరపేక్షాపరుడివి, అవసరాలు, అక్కర్లు లేనివాడివి. నీకు తల్లిదండ్రులు గానీ, సంతానం గానీ లేరు. నీకు సరిసమానం ఎవ్వరూ లేరు.”

ఇలా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దుఆ చేసుకున్నాడు. ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చారు:

لَقَدْ سَأَلْتَ اللّٰهَ بِالِاسْمِ الَّذِيْ إِذَا سُئِلَ بِهِ أَعْطٰى وَإِذَا دُعِيَ بِهِ أَجَابَ
(లఖద్ సఅల్తల్లాహ బిల్ ఇస్మిల్లదీ ఇదా సుఇల బిహీ అఅతా వ ఇదా దుఇయ బిహీ అజాబ్)
“ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే ఆ దుఆ స్వీకరించబడుతుందో, ఆ పేరుతోనే నువ్వు అడిగావు.”

అంటే ఇక్కడ రెండు విషయాలు మన ముందుగా ఉన్నాయి ఈ హదీస్ లో. మొదటి వ్యక్తి డైరెక్ట్ గా అల్లాహ్ ఘనత లేకుండా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించకుండా, పంపించకుండా డైరెక్ట్ దుఆ ప్రారంభం చేశాడు, ‘ఓ అల్లాహ్ నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, కరుణించు, క్షమించు’ అని చెప్పి స్టార్ట్ చేసేశాడు. అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఇచ్చారు? “ఓ నాయనా! నువ్వు తొందరపడ్డావు” అని చెప్పారు. మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా మెచ్చుకున్నారు. “ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లాహ్ ప్రసాదిస్తాడో, ఏ పేరు ద్వారా దుఆ చేస్తే దుఆ స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అడిగావు” అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని మెచ్చుకొని ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రియ వీక్షకులారా! మనకు అర్థమైంది ఏమిటంటే, దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి, ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరా ఆరాఫ్, ఆయత్ 180 లో తెలియజేశాడు, ఏ విధంగా అల్లాహ్ ను వేడుకోవాలి అనటానికి.

وَلِلّٰهِ الْاَسْمَاۤءُ الْحُسْنٰى فَادْعُوْهُ بِهَاۖ
(వలిల్లాహిల్ అస్మావుల్ హుస్నా ఫద్ ఊహు బిహా)
అల్లాహ్ కు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతోనే ఆయనను ప్రార్థించండి. (7:180)

అభిమాన సోదరులారా! బుఖారీ, కితాబుద్ దావాత్, అలాగే ముస్లిం గ్రంథం కితాబుద్ దికిర్ లో ఒక హదీస్ ఉంది. అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ బేసి సంఖ్యలో ఉన్నాడు, బేసి సంఖ్యను ఆయన ఎంతో ఇష్టపడతాడు. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది ఈ హదీస్.

ఈ హదీస్ లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో? అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది. అంటే దీనికి అర్థము 99 మాత్రమే ఉన్నాయి అని కాదు, ఈ విషయం గమనించుకోండి. హదీస్ లో 99 పేర్లు తెలియజేయడం జరిగింది, దానికి అర్థం అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే, లెక్కిస్తే, అడిగితే దుఆ స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ, అల్లాహ్ కు 99 పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు. అల్లాహ్ కు పేర్లు అసంఖ్యాకమైనవి, కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇల్మె గైబ్ లోనే ఉన్నాయి, మనకు తెలియవు. అందుకు 99 మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి.

రెండవ విషయం ఈ హదీస్ లో, ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే, గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు. గణించడంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి, చిత్తశుద్ధితో, భక్తితో ఈ నామాలను స్మరించాలి, ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి, వాటిని కంఠస్థం చేసుకోవాలి, ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి. ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించడం అంటే, గణించడం అంటే.

అభిమాన సోదరులారా! అలాగే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దుఆ చేసేవారు, అల్లాహ్ నామాలను గణించేవారు, లెక్కించేవారు, అల్లాహ్ యొక్క నామాల ద్వారా, గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ఉదాహరణకు ఒక హదీస్ ఉంది, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే దుఆలలో ఒక దుఆ యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది:

أَسْأَلُكَ بِكُلِّ اسْمٍ هُوَ لَكَ سَمَّيْتَ بِهِ نَفْسَكَ
(అస్ అలుక బికొల్లి ఇస్మిన్ హువ లక సమ్మైత బిహీ నఫ్సక్)
ఓ అల్లాహ్! నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను.

అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకునేవారు. ప్రియ వీక్షకులారా! ఈ… ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దుఆ చేయటం, అల్లాహ్ ను వేడుకోవటం, ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి, దీని విధానం ఏమిటి? అల్లాహ్ యొక్క నామాల ద్వారా, ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహ్ ను పిలవాలి, వేడుకోవాలి, దుఆ చేయాలి. ఆ, ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహ్ ను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి.

ప్రియ సోదరులారా! ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే, అల్లాహ్ ను వేడుకోవటానికి ఎవరి సహాయమైనా అవసరమా? అల్లాహ్ ను వేడుకోవటానికి, దుఆ చేయటానికి, ఆ దుఆ స్వీకరించబడటానికి ఎవరి సహాయమైనా అవసరమా? మధ్యవర్తి అవసరమా? సింపుల్ గా చెప్పాలంటే వసీలా అవసరమా? అసలు వసీలా అంటే ఏమిటి? వసీలా వాస్తవికత ఏమిటి? వసీలా ధర్మసమ్మతమా కాదా? వసీలా గురించి వివరాలు, వసీలా గురించి వాస్తవికత ఏమిటో ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి? [వీడియో & టెక్స్ట్]

సూరహ్ ఇఖ్లాస్ ప్రాముఖ్యత & ఏయే సందర్భాలలో చదవాలి?
https://www.youtube.com/watch?v=Ja2OyufkHDQ [3 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త సూరా అల్-ఇఖ్లాస్ యొక్క గొప్పతనాన్ని మరియు వివిధ సందర్భాలలో దానిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్, మగ్రిబ్, విత్ర్ మరియు తవాఫ్ నమాజులలో ఈ సూరాను పఠించేవారని తెలిపారు. నిద్రపోయే ముందు ఈ సూరాను మువ్వజతైన్ (సూరా ఫలక్, సూరా నాస్)లతో కలిపి మూడు సార్లు చదివి శరీరంపై తుడుచుకోవడం వల్ల కీడుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఉదయం మరియు సాయంత్రం అజ్కార్‌లలో, అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత దీనిని పఠించడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, రోజుకు సుమారు 14 సార్లు ఈ సూరాను పఠించడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందవచ్చని సూచించారు.

ఈ సూరాకు ఇంత గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని కారణంగానే ఒక్క రోజులోనే అనేక సందర్భాల్లో చదవడానికి చెప్పడం జరిగింది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజులోని రెండవ రకాతు సున్నత్ లో ఈ సూరా చదివేవారు. తవాఫ్ చేసిన తర్వాత రెండు రకాతులు చేస్తారు కదా, అందులో రెండవ రకాతు సున్నత్ తర్వాత చదివేవారు. కొన్ని సందర్భాల్లో మగ్రిబ్ నమాజు లోని రెండవ రకాతులో కూడా చదివేవారు. విత్ర్ నమాజు లోని మూడవ రకాతులో కూడా ఈ సూరా చదువుతూ ఉండేవారు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి.

అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క సూరా ప్రతి ముస్లిం పడుకునే ముందు మూడు సార్లు చదవాలి. దీనితో పాటు సూరతుల్ ఫలక్ మరియు సూరతుల్ నాస్ కూడా చదవాలి అని చెప్పారు. ఇది మనం చదివి ఊదుకున్నామంటే, ఎక్కడి వరకు మన చెయ్యి చేరుతుందో తల పై నుండి, ముఖము మరియు శరీర భాగము, అక్కడ వరకు స్పర్శ చేసుకుంటూ, తుడుచుకుంటూ వెళ్ళాలి, మసాహ్ చేసుకుంటూ. ఈ విధంగా అన్ని రకాల చెడుల నుండి, కీడుల నుండి మనం కాపాడబడతాము అన్నటువంటి శుభవార్త కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అలాగే ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి ఈ సూరా మరియు రెండు సూరాలు (ఫలక్, నాస్) కూడా చదవాలని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు, సాయంకాలం అజ్కార్ ఏవైతే ఉన్నాయో వాటిలో మూడేసి సార్లు చదవాలి. అబూ దావూద్ యొక్క సహీహ్ హదీథ్, “తక్ఫీక మిన్ కుల్లి షై” (నీవు ఉదయం, సాయంత్రం మూడేసి సార్లు ఈ మూడు సూరాలు చదివావంటే, అది నీకు అన్ని రకాల కీడుల నుండి కాపాడడానికి సరిపోతుంది).

ఈ విధంగా మీరు ఆలోచించండి, ఈ సూరా యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది గనక అల్హమ్దులిల్లాహ్, సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇన్ని సార్లు… టోటల్ ఎన్ని సార్లు అయిందో ఒకసారి ఆలోచించారా మీరు. ప్రతి ఫర్జ్ నమాజు తర్వాత ఒక్కసారి (ఐదు), ఉదయం మూడు సార్లు, సాయంకాలం మూడు సార్లు, రాత్రి పడుకునే ముందు మూడు సార్లు. తొమ్మిది ప్లస్ ఐదు, పద్నాలుగు సార్లు ఈ సూరా మనం చదువుతున్నామా? మనలో ఎవరైనా చదువుతలేరంటే వారు ఎన్ని మేళ్లను కోల్పోతున్నారు? ఎన్ని రకాల శుభాలను కోల్పోతున్నారు? స్వయంగా వారే ఆలోచించుకోవాలి.

అల్లాహ్ యే మనందరికీ ఈ సూరా యొక్క ఘనతను, గొప్పతనాన్ని అర్థం చేసుకొని, దాని యొక్క అర్థ భావాలను మంచి రీతిలో అవగాహన చేసుకొని, దాని ప్రకారంగా మన విశ్వాసాన్ని దృఢపరచుకొని, ఆచరణకు సంబంధించిన విషయాలను సంపూర్ణంగా అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ఆచరించే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మరియు

قُلْ هُوَ اللَّهُ أَحَدٌ
[ఖుల్ హువల్లాహు అహద్]
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “ఆయనే అల్లాహ్, అద్వితీయుడు (ఏకైకుడు).” (112:1)

చెప్పండి అని అల్లాహ్ ఏదైతే ఆదేశించాడో, అందరికీ చెప్పే, తెలియజేసే, ప్రచారం చేసే అటువంటి భాగ్యం కూడా అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

సూరహ్ ఇఖ్లాస్ (Suratul Ikhlas) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3dePHBnlkeXpCe1NBDiPaA

హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ
https://youtu.be/pOXV3-6CJEg [20 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రది అల్లాహు తాలా అన్హు) యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వివరిస్తారు. ప్రవక్త సహచరుల జీవితాలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యతను నొక్కిచెప్పడంతో ప్రసంగం ప్రారంభమవుతుంది. అబూబక్ర్ (రది అల్లాహు తాలా అన్హు) ఇస్లాం కోసం చేసిన సేవలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన స్థిరత్వం, విశ్వాసం మరియు ఆయన గొప్పతనాన్ని వివరించే వివిధ సంఘటనలు ఇందులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా, వలస ప్రయాణంలో గుహలో ప్రవక్తతో పాటు ఉండటం, తన సంపదనంతా ఇస్లాం కోసం ఖర్చు చేయడం, మరియు ప్రవక్త మరణం తర్వాత సమాజాన్ని ఏకతాటిపై నిలపడంలో ఆయన పోషించిన పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ఖలీఫాగా ఆయన సాధించిన విజయాలు, మతభ్రష్టులతో పోరాడటం మరియు ఖురాన్‌ను సంకలనం చేయించడం వంటి చారిత్రాత్మక విజయాలను కూడా వక్త వివరించారు.

అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

نَحْمَدُهُ وَنُصَلّي عَلى رَسُولِهِ الكريم، أما بعد!
నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీం, అమ్మా బాద్.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి సంక్షిప్త జీవిత చరిత్ర. ఇది జుమా ఖుత్బా. షేఖ్ అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ హఫిజహుల్లాహ్ జామిఅ అల్-గనాంలో ఇచ్చారు, అక్టోబర్ 31, 2025న.

ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వలన విశ్వాసం పెరుగుతుంది మరియు నమ్మకం బలపడుతుంది. వారు ఉత్తమ తరానికి చెందిన వారు. ఇమామ్ అహ్మద్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు, “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులందరి గొప్ప పనులను, వారి జీవిత చరిత్రను ప్రస్తావించడం సున్నత్.”

ఈ రోజు జుమా ఖుత్బాలో మేము ప్రస్తావిస్తాము ఒక వ్యక్తి జీవిత చరిత్రను. ఆయన సాధారణ వ్యక్తి కారు. గొప్ప మహానుభావుడు. ఇస్లాంలో ఆయనది గొప్ప ప్రభావం ఉంది. తమ ధర్మానికి మరియు ప్రవక్తకు సహాయం చేయడంలో ఒక్క క్షణం కూడా వెనకాడలేదు.

మొదటి ధర్మబద్ధమైన ఖలీఫా, గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులు, కష్ట సుఖాల్లో ఆయన మిత్రుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బాధ్యతలు మోసినవారు. స్థిరత్వం, నిలకడతో మరియు నమ్మకంతో ధర్మాన్ని రక్షించినవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఈ ఉమ్మత్‌లో, సమాజంలో అత్యుత్తములు. జాతి మొత్తం ఆయన గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్థాయిని అంగీకరించింది. ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖలీఫా అయిన హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ , అబ్దుల్లా బిన్ ఉస్మాన్ బిన్ ఆమిర్ అల్-ఖురషీ. హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్, ఆయన పేరు అబ్దుల్లాహ్. తండ్రి పేరు ఉస్మాన్, తాత పేరు ఆమిర్ అల్-ఖురషీ రదియల్లాహు తాలా అన్హు.

అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు మక్కాలో ఏనుగుల సంఘటన తర్వాత రెండు సంవత్సరాలు ఆరు నెలలకు జన్మించారు. ప్రజలు ప్రవక్తను విడిచిపెట్టినప్పుడు, నిస్సహాయకునిగా వదిలినప్పుడు ఆయన ప్రవక్తకు సహాయం అందజేశారు. ప్రజలు ప్రవక్తను విశ్వసించనప్పుడు, ఆయన విశ్వసించారు. ప్రజలు ప్రవక్తను తిరస్కరించినప్పుడు, ఆయన సత్య ప్రవక్త అని ధ్రువీకరించారు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ‘అస్-సిద్దీఖ్’ (సత్యవాది) అని వర్ణించారు (బిరుదునిచ్చారు).

సహీహ్ బుఖారీలో (3675) ఒక సంఘటన గమనించండి, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క ఘనతను గ్రహించండి.

أنَّ رسولَ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ صعِدَ أُحدًا وأبو بَكْرٍ وعمرُ وعثمانُ فرجفَ بِهِم فقالَ رسولُ اللَّهِ صلَّى اللَّهُ علَيهِ وسلَّمَ: اثبت أُحُدُ فإنَّما عليكَ نبيٌّ وصدِّيقٌ وشَهيدانِ

ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ (రదియల్లాహు అన్హుమ్) లతో కలిసి ఉహుద్ పర్వతంపైకి ఎక్కారు. పర్వతం ప్రకంపించింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు: “ఓ ఉహుద్! స్థిరంగా ఉండు. నీపై ఒక ప్రవక్త, ఒక సిద్దీఖ్ మరియు ఇద్దరు షహీద్‌లు (అమరవీరులు) ఉన్నారు.” (బుఖారీ 3675).

ఇస్లాం స్వీకరించిన మొదటి వ్యక్తి అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు. సహాబాలలో అల్లాహ్ వైపు పిలిచిన మొదటి వ్యక్తి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు (అంటే ప్రవక్త తర్వాత అని భావం). ఆయన ద్వారా హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ జుబైర్, హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్, తల్హా బిన్ ఉబైదుల్లా, సాద్ బిన్ అబీ వక్కాస్ (రదియల్లాహు తాలా అన్హుమ్) వంటి చాలా మంది గొప్ప సహచరులు ఇస్లాం స్వీకరించారు. గమనించండి, వీరందరూ కూడా అషర-ఎ-ముబష్షరాలో పరిగణించబడతారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు తన సంపాదనంతా ఇస్లాం సేవలో ఖర్చు చేశారు. హజ్రత్ బిలాల్, హజ్రత్ ఆమిర్ బిన్ ఫుహైరా మరియు ఇతర పీడితులను బానిసత్వం నుంచి విముక్తి కలిగించారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హును ప్రేమించేవారు మరియు ఆయన గొప్పతనం గురించి ప్రజలకు చెప్పేవారు. హజ్రత్ అమర్ ఇబ్నుల్ ఆస్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తను అడిగారు, “ప్రజలలో మీకు అత్యంత ప్రియమైన వారు ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆయిషా రదియల్లాహు తాలా అన్హా.” హజ్రత్ అమర్ అంటున్నారు, “నేను మళ్ళీ అడిగాను, పురుషులలో ఎవరు?” ప్రవక్త చెప్పారు, “ఆమె యొక్క తండ్రి” (అంటే హజ్రత్ ఆయిషా యొక్క తండ్రి హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు). (సహీహ్ బుఖారీ, 4358).

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సంపదను తమ సొంత సంపద వలే ఉపయోగించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా చెప్పారు:

«إِنَّ أَمَنَّ النَّاسِ عَلَيَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ أَبُو بَكْرٍ، وَلَوْ كُنْتُ مُتَّخِذًا خَلِيلًا مِنْ أُمَّتِي لاَتَّخَذْتُ أَبَا بَكْرٍ، وَلَكِنْ أُخُوَّةُ الإِسْلاَمِ وَمَوَدَّتُهُ، لاَ يَبْقَيَنَّ فِي المَسْجِدِ بَابٌ إِلَّا سُدَّ، إِلَّا بَابُ أَبِي بَكْرٍ»

“నా సహచర్యంలో మరియు సంపదలో నాపై అత్యంత మేలు చేసిన వ్యక్తి అబూబక్ర్. నా ఉమ్మత్‌లో ఒక స్నేహితుడిని (ఖలీల్) చేసుకోవాలని వస్తే, నేను అబూబక్ర్‌ను చేసుకునేవాడిని. కానీ ఇస్లాం సౌభ్రాతృత్వం మరియు స్నేహం మనకు మధ్య ఉంది. హజ్రత్ అబూబక్ర్ తలుపు తప్ప మస్జిదులోని అన్ని తలుపులు మూసివేయబడాలి.” (సహీహ్ బుఖారీ 466, సహీహ్ ముస్లిం 2382).

ఈ హదీసు యొక్క సంక్షిప్త భావం ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు విన్న హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు?

إِنَّ أَمَنَّ النَّاسِ عَلَىَّ فِي صُحْبَتِهِ وَمَالِهِ
(ఇన్న అమన్నన్ నాసి అలయ్య ఫీ సుహబతిహీ వ మాలిహీ)

తన సహచర్యం ప్రకారంగా మరియు తన ధనంతో నాకు మేలు చేకూర్చిన వారిలో అత్యంత ఎక్కువ, ‘అమన్’ – హజ్రత్ అబూబక్ర్. ఇక ప్రాణ స్నేహితుడిగా ఎవరినైనా చేసుకుని ఉంటే, (ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరే హదీసులో చెప్పారు, ‘అల్లాహ్ నన్ను ఖలీల్‌గా చేసుకున్నాడు’) ఒకవేళ నేను ఎవరినైనా ఖలీల్‌గా చేసుకుంటే, అబూబక్ర్‌ని చేసుకునేవానిని. అంటే గమనించండి, సర్వ సహాబాలలో అబూబక్ర్ యొక్క ఘనత తెలుస్తుంది కదా దీనివల్ల. మరియు అబూబక్ర్ తప్ప ఇతరుల తలుపులు అన్నీ కూడా మూయబడాలి అంటే ఏమిటి? మస్జిద్-ఎ-నబవీ ప్రథమంగా కట్టబడిన ఆ కాలంలో, మస్జిద్-ఎ-నబవీకి పక్కనే ఎందరో వేరే సహాబాల ఇళ్లు కూడా ఉండినవి. అయితే, ఆ మస్జిద్ యొక్క మెయిన్, ముఖ ద్వారం, ముఖ్యమైనది ఏదైతే ఉంటుందో అది కాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో నుండి డైరెక్ట్ మస్జిద్‌లో వచ్చే విధంగా తలుపులు తెరుచుకొని ఉన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబక్ర్ తప్ప ఇతరుల ద్వారాలు మూయబడాలి అని ఆదేశించారు.

ఇంకా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు ఘనతలో, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పిన మాట వినండి. (సహీహ్ బుఖారీ 3685, సహీహ్ ముస్లిం 2389). అయితే ఇక్కడ శ్రద్ధగా గమనించండి, సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చినటువంటి ఈ హదీస్, హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారిని ఎంత గొప్పగా కీర్తిస్తున్నారు. ఈ రోజుల్లో కొందరు మేము హజ్రత్ అలీని ప్రేమిస్తాము అన్నటువంటి సాకుతో, అబూబక్ర్, ఉమర్ రదియల్లాహు తాలా అన్హుమాను ఏదైతే దూషిస్తారో, వారు ఈ లోకంలో అతి చెడ్డవారు మరియు హజ్రత్ అలీని కూడా దూషించినట్లే. ఎందుకంటే స్వయంగా అలీ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తున్నారు, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

హజ్రత్ అలీ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు:

إِنِّي كُنْتُ كَثِيرًا أَسْمَعُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «ذَهَبْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَدَخَلْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ، وَخَرَجْتُ أَنَا وَأَبُو بَكْرٍ، وَعُمَرُ»

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచుగా ఇలా చెప్పడం నేను విన్నాను: ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ వెళ్ళాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ ప్రవేశించాము,’ ‘నేను, అబూబకర్ మరియు ఉమర్ బయలుదేరాము.'” (బుఖారీ 3685, ముస్లిం 2389).

(ఇక్కడ ‘కున్తు అస్మ’ఉ’ అనేది నిరంతరంగా వినేవాడిని అని సూచిస్తుంది). ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో పనుల్లో “నేను, అబూబక్ర్, ఉమర్” అని మాటిమాటికి ప్రస్తావించేవారు. అల్లాహు అక్బర్. ఏం తెలిసింది దీని ద్వారా? సహాబాలు కూడా అబూబక్ర్‌లను, ఉమర్ హజరత్‌లను చాలా ప్రేమించే, గౌరవించేవారు.

అల్లాహ్ దాసులారా, హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సత్కార్యాలలో మరియు మంచి పనులలో ముందుండేవారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పోటీ చేయలేకపోయారు.

ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో ఇలా అన్నారు, “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పుడు నా దగ్గర కొంత సంపద ఉంది. నేను అనుకున్నాను, ‘ఈ రోజు నేను అబూబక్ర్‌ను అధిగమిస్తాను.’ ఒకవేళ నేను ఎప్పుడైనా ఆయనను అధిగమించగలిగితే… నేను నా సంపదలో సగం తెచ్చాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చారు?’ నేను చెప్పాను, ‘అంతే మిగిల్చాను’ (అంటే సగం). అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హు తన దగ్గర ఉన్నదంతా తెచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని అడిగారు, ‘మీ కుటుంబానికి ఏమి మిగిల్చావు?’ ఆయన చెప్పారు, ‘వారికి అల్లాహ్‌ను మరియు అల్లాహ్ సందేశహరులైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మిగిల్చి వచ్చాను.’ హజ్రత్ ఉమర్ అంటున్నారు, అప్పుడు నేను చెప్పాను, ‘«لَا أُسَابِقُكَ إِلَى شَيْءٍ أَبَدً» నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఎన్నటికీ అధిగమించలేను.’” (అబూ దావూద్, 1678, షేఖ్ అల్బానీ దీనిని హసన్ అని అన్నారు).

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు సహచర్యంలో అత్యున్నత శిఖరాన్ని మరియు అత్యున్నత స్థాయిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో చాలా కఠినమైన సమయాల్లో సహవాసం గడిపారు. ఆ విషయంలో ఆయనను ఎవరూ అధిగమించలేకపోయారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వలస వెళ్ళారు మరియు గుహలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు దాక్కున్నారు. అదే విషయాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

إِلَّا تَنْصُرُوهُ فَقَدْ نَصَرَهُ اللَّهُ إِذْ أَخْرَجَهُ الَّذِينَ كَفَرُوا ثَانِيَ اثْنَيْنِ إِذْ هُمَا فِي الْغَارِ إِذْ يَقُولُ لِصَاحِبِهِ لَا تَحْزَنْ إِنَّ اللَّهَ مَعَنَا

మీరు గనక అతనికి (ప్రవక్తకు) తోడ్పడకపోతే (పోనివ్వండి), అవిశ్వాసులు దేశం నుంచి అతనిని వెళ్ళగొట్టినప్పుడు- అతను ఇద్దరిలో రెండవవాడు. వారిద్దరూ గుహలో ఉన్నప్పుడు, అతను తన సహచరునితో, “బాధపడకు. నిశ్చయంగా అల్లాహ్‌ మనకు తోడుగా ఉన్నాడు” అని ఓదార్చినప్పుడు అల్లాహ్‌యే వారికి తోడ్పడ్డాడు.” (తౌబా 9:40).

ఈ ఆయతులో గమనించండి “సానియస్ నైన్” అన్న పదాన్ని, అంటే ఇద్దరిలో రెండో వ్యక్తి! ఎవరు ఆయన? ఆయనే అబూబకర్ అస్-సిద్దీఖ్ రజియల్లాహు అన్హు. ఇది ఆయనకు ఎంత గొప్ప బిరుదు, ఘనత! ఆలోచించండి. ఇద్దరిలో రెండో వ్యక్తి! ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ప్రేమించారు, భయం, కష్టం మరియు ఇబ్బందులను ఆయనతో పంచుకున్నారు. హునైన్ యుద్ధంలో ఆయనతో పాటు ఉన్నారు, తబూక్‌కు ఆయనతో పాటు ప్రయాణించారు, ఆయనతో పాటు హజ్ చేశారు, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఆదేశమేరకు ఆయనకు బదులుగా నమాజ్ ఇమామత్‌ చేయించారు. మరియు ఆయన తర్వాత ఖిలాఫత్ భారాన్ని మోశారు.

అల్లాహ్ దాసులారా, అస్-సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు అన్ని సద్గుణాల సంపన్నులు. ఆయన ఎక్కువ ఉపవాసాలు ఉండేవారు (సవ్వామ్), రాత్రుల్లో ఎక్కువ ఆరాధన, నమాజ్ చేసేవారు (ఖవ్వామ్), ప్రజలకు చాలా మేలు చేసేవారు (ముహ్సిన్), అల్లాహ్ వైపు తిరిగి పశ్చాత్తాపపడేవారు, మృదు మనస్కుడు (అవ్వాహ్) [1]. ఆయన చాలా ఎక్కువగా ఏడ్చేవారు (బక్కా).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు ఉపవాసం ఉన్నారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు జనాజాలో (అంత్యక్రియలకు) హాజరయ్యారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు పేదవాడికి తినిపించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” ప్రవక్త అడిగారు: “ఈ రోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు?” అబూబకర్ అన్నారు: “నేను.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు:

مَا اجْتَمَعْنَ فِي امْرِئٍ إِلاَّ دَخَلَ الْجَنَّةَ
(మజ్తమ’న ఫిమ్రిఇన్ ఇల్లా దఖలల్ జన్నహ్)
ఈ పనులన్నీ ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే, అతను స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. (సహీహ్ ముస్లిం 1028).

అల్లాహ్, అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు పట్ల సంతోషించు గాక. మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇవ్వు గాక. నిశ్చయంగా ఆయన అన్ని విషయాలపై శక్తిమంతుడు.

أعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ: وَسَيُجَنَّبُهَا الْأَتْقَى (17) الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّى (18) وَمَا لِأَحَدٍ عِنْدَهُ مِنْ نِعْمَةٍ تُجْزَى (19) إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَى (20) وَلَسَوْفَ يَرْضَى (21)

దైవభీతిపరుడు మాత్రం దాన్నుండి సురక్షితంగా ఉంచబడతాడు, (ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు). మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన (కూడా) తప్పకుండా సంతోషిస్తాడు. (లైల్ 92:17-21).

ఈ ఆయతులు అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు గౌరవం, మర్యాద, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఘనతను చాటుతూ అల్లాహ్ అవతరింపజేశాడు.

الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا محمدٍ وعلى آله وصحبه أجمعين أما بعد

అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహీ వ సహ్బిహీ అజ్మయీన్, అమ్మా బాద్.

ఓ ముస్లిములారా, చరిత్రలో నమోదు చేయబడిన గొప్ప సంఘటనలలో ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు యొక్క స్థిరత్వం, నిలకడ. ప్రవక్త మరణ వార్త సహాబాలకు చాలా తీవ్రమైనదిగా, బాధాకరమైనదిగా ఉండినది. ఆ సందర్భంలో హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు వచ్చి ప్రజలను ఓదార్చారు, ఆ తర్వాత నిలబడి అల్లాహ్‌ను స్తుతించారు మరియు ప్రశంసించారు. ఆ తర్వాత చెప్పారు, “ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తున్నారో, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారు. ఎవరైతే అల్లాహ్‌ను పూజిస్తున్నారో, నిశ్చయంగా అల్లాహ్ జీవించి ఉన్నాడు, ఎన్నటికీ మరణించడు.” ఆపై హజ్రత్ అబూబక్ర్ ఈ ఆయత్ పఠించారు:

وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ أَفَإِنْ مَاتَ أَوْ قُتِلَ انْقَلَبْتُمْ عَلَى أَعْقَابِكُمْ وَمَنْ يَنْقَلِبْ عَلَى عَقِبَيْهِ فَلَنْ يَضُرَّ اللَّهَ شَيْئًا وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ

“ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు (ఇస్లాం నుంచి) వెనుతిరిగిపోతారా? వెనుతిరిగి- పోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3:144).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించినప్పుడు సహచరులందరూ అబూబక్ర్ రదియల్లాహు తాలా అన్హును వారిని ఖలీఫాగా నియమించడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఎందుకంటే వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆయన సాన్నిహిత్యం, ఆయన గొప్పతనం మరియు ఇస్లాంలో ఆయన ముందున్న స్థానం గురించి తెలుసు. ఆయన ఖిలాఫత్ ఇస్లాంకు మరియు ముస్లింలకు చాలా మంచిది.

ఆయన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఉసామా రదియల్లాహు తాలా అన్హు సైన్యాన్ని పంపారు. సైన్యాలను సమీకరించారు, విజయాలు సాధించారు, మతభ్రష్టులు (ముర్తద్దీన్‌ల)తో పోరాడారు మరియు జకాత్ నిరాకరించిన వారితో యుద్ధం చేశారు. ఖురాన్ ప్రతులను జమా చేయించారు.

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ రదియల్లాహు తాలా అన్హు హిజ్రీ 13వ సంవత్సరంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసుకు సమానంగా, 63 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఖిలాఫత్ రెండు సంవత్సరాలు మరియు కొన్ని నెలలు కొనసాగింది. అల్లాహ్ ఆయన పట్ల సంతోషించు గాక మరియు ఆయనకు ఉత్తమ ప్రతిఫలాన్ని ఇచ్చుగాక.

చివరగా, ఓ ముస్లిములారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల, ఆయన ధర్మబద్ధమైన ఖలీఫాల పట్ల ప్రేమను మనం మన పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. ఇది ధర్మంలో భాగం మరియు వారు ఆదర్శప్రాయులు.

كَانَ السَّلَفُ يُعَلِّمُونَ أَوْلَادَهُمْ حُبَّ أَبِي بَكْرٍ وَعُمَرَ كَمَا يُعَلِّمُونَ السُّورَةَ مِنَ الْقُرْآنِ

“సలఫె సాలిహీన్ తమ పిల్లలకు అబూబకర్ మరియు ఉమర్‌ల పట్ల ప్రేమను ఖురాన్ సూరాను నేర్పినట్లే నేర్పేవారు.” (మువత్తా మాలిక్ 1/255. షర్హు ఉసూలి ఏతిఖాది అహ్లిస్సున్నహ్ వల్ జమాఅహ్ 2325. 7/1313).

అల్లాహ్ మనకు మరియు మీకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల పట్ల ప్రేమను ప్రసాదించు గాక. ఆమీన్.

వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

[1] ‘అవ్వాహ్’ అన్న పదంలో ఈ క్రింది భావాలన్నీ ఇమిడి ఉన్నాయి:

ఎక్కువగా ప్రార్థించేవాడు/ప్రార్థనల్లో మునిగిపోయేవాడు: అల్లాహ్‌ను చాలా ఎక్కువగా స్మరించేవాడు, వినయంతో, దీనంగా ఆయనను ప్రార్థించేవాడు.

ఆయన దయను కోరేవాడు: అల్లాహ్‌ దయ కోసం తీవ్రంగా కోరుకునేవాడు.

పశ్చాత్తాపపడేవాడు: తన పాపాల పట్ల తీవ్రంగా పశ్చాత్తాపపడి, అల్లాహ్‌ను క్షమాపణ వేడుకునేవాడు.

దీనంగా, వినయంగా ఉండేవాడు: అల్లాహ్‌ పట్ల అమితమైన భయం, గౌరవం కలిగి, వినయంగా ప్రవర్తించేవాడు.

మంచివాడు/దయాగుణం కలవాడు: ఇతరుల పట్ల దయ, కరుణ కలిగి, వారికి సహాయం చేసేవాడు.

నిట్టూర్చేవాడు: అల్లాహ్‌ పట్ల తన ప్రేమ, భయం లేదా ఇతరుల పట్ల తన కరుణ వల్ల దీర్ఘంగా నిట్టూర్చేవాడు.

[2] ఖురాన్ సంకలన చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నప్పుడు ఖురాన్ వివిధ పద్ధతులలో వ్రాయబడింది. ఖురాన్ వచనాలు (ఆయత్‌లు) మరియు సూరాలు రాసిన కొన్ని వస్తువులు:

తోలు పత్రాలు (چرم): జంతువుల తోలుపై రాసినవి.
ఎముకలు (كتف): ఒంటె వంటి జంతువుల భుజం ఎముకలు లేదా ఇతర ఎముకలు.
తాటి ఆకులు (سعف النخيل): తాటి చెట్టు ఆకులపై రాసినవి.
రాతి పలకలు (حجارة): సన్నని, చదునైన రాళ్లపై రాసినవి.
కలప పలకలు (ألواح خشبية): చెక్క పలకలపై రాసినవి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత, యమామా యుద్ధంలో చాలా మంది ఖురాన్ హాఫిజ్‌లు (ఖురాన్‌ను కంఠస్థం చేసినవారు) మరణించారు. అప్పుడు ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) అబూబకర్ అస్-సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)కు ఖురాన్‌ను ఒకే గ్రంథంగా సంకలనం చేయాలని సూచించారు. అబూబకర్ (రదియల్లాహు అన్హు) జైద్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు)ను ఈ పనికి నియమించారు. జైద్, తన బృందంతో కలిసి, పైన పేర్కొన్న వివిధ వస్తువులపై వ్రాయబడిన ఖురాన్ వచనాలను సేకరించి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి, కనీసం ఇద్దరు సాక్షులతో ధృవీకరించిన తర్వాత, వాటిని ఒక క్రమంలో సంకలనం చేశారు. ఈ సంకలన పత్రాలను “సుహుఫ్” (పత్రాలు/పేజీలు) అని పిలిచేవారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42537

ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

తౌహీద్ (ఏక దైవారాధన) రక్షణ కవచం – జుమా ఖుత్బా [ఆడియో & టెక్స్ట్]

జుమా ఖుత్బా: తౌహీద్ రక్షణ కవచం
https://youtu.be/ywb7-3fUjCo [17 నిముషాలు]
ఖతీబ్ (అరబీ): షేఖ్ రాషిద్ బిన్ అబ్దుర్ రహ్మాన్ అల్ బిదాహ్
అనువాదకులు: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ.
స్థలం: జామె షేఖ్ ఇబ్ను ఉసైమీన్ . జుల్ఫీ, సఊది అరేబియ

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక విశ్వాసమైన తౌహీద్ (ఏకేశ్వరోపాసన) యొక్క ప్రాముఖ్యతను మరియు షిర్క్ (బహుదైవారాధన) యొక్క ప్రమాదాలను వివరిస్తుంది. తౌహీద్ అత్యున్నత ఆరాధన అని, షిర్క్ అత్యంత ఘోరమైన పాపమని వక్త నొక్కిచెప్పారు. తాయెత్తులు కట్టుకోవడం వంటి షిర్క్‌కు దారితీసే కార్యాలను నివారించాలని, అల్లాహ్ పట్ల ఎల్లప్పుడూ సద్భావన కలిగి ఉండాలని ఆయన ఉద్బోధించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తౌహీద్‌ను ఎలా కాపాడారో, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారో హుదైబియా చెట్టు ఉదంతం ద్వారా వివరించారు. మనల్ని మరియు మన కుటుంబాలను తౌహీద్‌పై స్థిరంగా ఉంచమని అల్లాహ్‌ను ప్రార్థించాలని, ఇస్లాం మరియు సున్నత్ అనే అనుగ్రహాలకు కృతజ్ఞతతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అస్సలాము అలైకుం వ’రహ్మతుల్లాహి వ’బరకాతుహు.

أَلْحَمْدُ لِلَّهِ الْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا
(అల్ హమ్దు’లిల్లాహిల్ ముతవహ్హిది బిల్ జలాలి బికమాలిల్ జమాలి త’అజీమన్ వ తక్బీరా)

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا
(అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహూ లా షరీక లహూ తఖ్దీరన్ వ తద్బీరా)

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا
(వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ లియకూన లిల్ ఆలమీన నజీరా)

صَلَّى اللَّهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ
(సల్లల్లాహు వ సల్లమ అలైహి తస్లీమన్ కసీరా, అమ్మా బ’అద్)

الْحَمْدُ لِلهِ اَلْمُتَوَحِّدِ بِالْجَلَالِ بِكَمَالِ الْجَمَالِ تَعْظِيمًا وَتَكْبِيرًا. أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا هُوَ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ تَقْدِيرًا وَتَدْبِيرًا، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ؛ لِيَكُونَ لِلْعَالَمِينَ نَذِيرًا، صَلَّى اَللهُ وَسَلَّمَ عَلَيْهِ تَسْلِيمًا كَثِيرًا، أَمَّا بَعْدُ:

నేను మీకూ, అలాగే నాకు కూడా అల్లాహ్‌ (సుబహనహు వ త’ఆలా) భయభీతిని కలిగి ఉండాలని బోధిస్తున్నాను. అల్లాహ్‌కు భయపడటానికి అత్యంత ముఖ్యమైన మార్గం తౌహీద్‌ను (అల్లాహ్‌ ఏకత్వాన్ని) స్థాపించడం, షిర్క్‌ను (ఆయనకు భాగస్వాములను కల్పించడాన్ని) నివారించడం. తౌహీద్‌ అన్ని ఆరాధనలలోకెల్లా గొప్పది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ వద్ద అత్యుత్తమ స్థానంలో ఉంటారు. షిర్క్‌ అన్ని పాపాలలోకెల్లా అత్యంత అసహ్యకరమైనది,  చెడ్డది, దాన్ని పాటించేవారు అల్లాహ్‌ నుండి అత్యంత దూరంలో ఉంటారు.

అవును, తౌహీద్‌ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇది దాసులపై అల్లాహ్‌కు ఉన్న హక్కు. వారి కోరికలు వారిని తౌహీద్ నుండి దూరం చేశాయి. కలహాలు, సంక్షోభాలు, రోగాలు వారిని ఆవరించాయి. వారిలో కొందరు తాయెత్తులు, కడియాల మాయలో పడి ఉన్నారు, వాటిని తమకు, తమ పిల్లలకు, తమ వాహనాలకు, తమ ఇళ్లకు కట్టుకుంటారు. అవి కీడును దూరం చేస్తాయని, కంటిదిష్టిని తొలగిస్తాయని, మంచిని తీసుకువస్తాయని వారు నమ్ముతారు. కానీ వారు ప్రవక్త ఆదేశాన్ని మరిచారా?

(مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ)
“ఎవరైతే తాయెత్తు కట్టుకుంటారో, వారు షిర్క్‌ చేసినట్లే.” (ముస్నద్ అహ్మద్ 17422. దీని సనద్ బలమైనది).

అల్లాహ్‌ ను కాకుండా వేరొకరిని ఆశ్రయించినా, వేరొకరిని ఆశించినా వారికి ఎంతటి వినాశనం! విశ్వాసులు స్వచ్ఛమైన దానిని త్రాగారు, కానీ అతను (షిర్క్ చేసే వాడు) కలుషితమైన దానిని త్రాగాడు. విశ్వాసులు ఒక్క ప్రభువును ఆరాధించారు, కానీ అతను పదిమంది ప్రభువులను ఆరాధించాడు:

(ءأَرْبَابٌ مُّتَّفَرّقُونَ خَيْرٌ أَمِ اللَّهُ الْوَاحِدُ الْقَهَّارُ)
అనేక మంది విభిన్న ప్రభువులు మేలా? లేక సర్వాధిక్యుడైన ఒక్క అల్లాహ్‌ మేలా? (మీరే చెప్పండి!)” (యూసుఫ్ 12:39).

ఇక మృతులను పూజించేవాడు ఎక్కడ, ఎన్నటికీ మరణించని జీవించియున్న అల్లాహ్ ని పూజించేవాడు ఎక్కడ?

(هَلْ يَسْتَوِيَانِ مَثَلاً الْحَمْدُ للَّهِ بَلْ أَكْثَرُهُمْ لاَ يَعْلَمُونَ)
మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు.” (నహ్ల్ 16:75).

అయినప్పటికీ, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో ఈ ప్రాథమిక భావాలను నాటాలి. అంటే తౌహీద్ ను ప్రేమించడం, ప్రోత్సహించడం, దానిని స్థాపించడం. షిర్క్ ను అసహ్యించుకోవడం, షిర్క్ ను వారించడం. ఇది ప్రాథమిక విషయం. వీటిని మనం మన భార్యా, పిల్లలు, మన బంధువులు, మన బాధ్యతలో ఉన్న వారి మనస్సులలో నాటాలి. వారిలో అల్లాహ్ పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల, నిషేధాల పట్ల గొప్ప గౌరవాన్ని పెంచాలి. ఆయన గొప్ప ఆజ్ఞ తౌహీద్. ఆయన గొప్ప నిషేధం షిర్క్. అల్లాహ్ జల్ల వ’ఉలా తన ప్రవక్తకు తౌహీద్‌ గురించి జ్ఞానం పొందమని ఆజ్ఞాపించాడు:

{فَاعْلَمْ أَنَّهُ لَا إِلَهَ إِلَّا اَللَّهُ}
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. ” (ముహమ్మద్ 47:19).

ఇక ప్రవక్తకే ఈ ఆదేశం అల్లాహ్ ఇచ్చినప్పుడు, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ.. కాబట్టి, మనకు ఇది మరింత ప్రాధాన్యమైన ఆజ్ఞ. అందుకే మనలో ఒకరు ఇలా అనడం అజ్ఞానం: “మేము తౌహీద్‌ను అర్థం చేసుకున్నాము, అయితే దానిని మన పాఠశాలల్లో, మసీదుల్లో ఎందుకు బోధిస్తూ ఉండాలి?” అంటారు కదా కొందరు ఇలా. ఇలా అనడం తప్పు విషయం. అల్లాహ్ నేర్చుకోమని ఏ విషయం అయితే చెబుతున్నాడో, దానిని ఇలా విస్మరించడమా?

ఓ విశ్వాసులారా: తౌహీద్‌ విషయాలలో విస్మరించబడిన వాటిలో ఒకటి అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన.

{الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ}
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించేవారు, వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి.” (ఫత్ హ్ 48:6).

ఎంత మంది ప్రజలు అసత్యం విజయం సాధించడాన్ని, సత్యం బలహీనపడడాన్ని చూసినప్పుడు, అసత్యం శాశ్వతంగా ఉన్నత స్థితిలో ఉంటుందని, సత్యం క్షీణిస్తుందని భావిస్తారు? ఇది అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధి, దురాలోచన, చెడు ఊహ. ఇది ఆయన స్వభావానికి, గుణాలకు తగనిది.

ఎంత మంది ప్రజలు తీవ్రమైన అనారోగ్యంతో లేదా పేదరికంతో బాధపడుతున్నప్పుడు అల్లాహ్‌ పట్ల దుర్బుద్ధిని కలిగి ఉంటారు, అల్లాహ్‌ వారి కష్టాలను దూరం చేయడని భావిస్తారు? ఇది నిస్సందేహంగా తౌహీద్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మీ పరిస్థితిని మీరే చూసుకోండి, మీ పట్ల ఎవరైనా చెడుగా భావిస్తే మీరు ఎంత కోపంగా ఉంటారు, దాన్ని ఎంత ఖండిస్తారు? మీరు ప్రతి లోపానికి అర్హులు, అలాంటిది మీ ప్రభువు పట్ల మీరు ఎలా దుర్బుద్ధి, దురాలోచన కలిగి ఉంటారు, ఆయన పరిపూర్ణ గుణాలన్నింటికీ అర్హుడు?

ఇమామ్ అల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్‌ రహిమహుల్లాహ్ రచించిన ‘కితాబుత్-తౌహీద్‌’లో ఒక అధ్యాయం ఉంది, దాని శీర్షిక:

حِمَايَةُ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ حِمَى التَّوْحِيدِ وَسَدِّهِ طُرُقَ الشِّرْكِ
(హిమాయతున్-నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ హిమత్-తౌహీద్ వ సద్దిహీ తురుఖష్-షిర్క్)
తౌహీద్‌ను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎలా రక్షించారు, షిర్క్‌కు దారితీసే మార్గాలను ఎలా మూసివేశారు.”

ఇందులో, ఆ ఇమామ్ ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) షిర్క్ కు దారి తీసే మార్గాలను మూసివేశారు, స్వయం ఆ మార్గాలు షిర్క్ కాకపోయినప్పటికీ, తౌహీద్ ను రక్షించడానికి ఇది ముందు జాగ్రత్త చర్యగా.

తౌహీద్‌ను రక్షించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ఒక చిన్న కథ తెలుసుకుందాము: హజ్రత్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: హుదైబియాలోని చెట్టు కింద ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో బైఅత్ చేసిన వారిలో ఒకరు ఆయన కూడా ఉన్నారు, ఆయన చెప్పారు: “బైఅత్ జరిగిన తర్వాత సంవత్సరం మేము ఆ చెట్టు దగ్గరి నుండి దాటిపోయాము, కాని మేము దానిని మరచిపోయి ఉంటిమి గనక దానిని కనుగొనలేకపోయాము.” (బుఖారీ 4162, 4163, ముస్లిం 1859).

ఈ హదీస్ వ్యాఖ్యానంలో ఇమామ్ నవవీ రహిమహుల్లాహ్ చెప్పారు, “దాని అదృశ్యం, అంటే అది కనబడకుండా ఉండడం, అల్లాహు త’ఆలా దయలో ఓ భాగం. అది కనిపించి ఉన్నట్లయితే, అజ్ఞానులు దానికి గొప్ప గౌరవం ఇస్తారన్న భయం ఉండేది”. (షర్హ్ ముస్లిం).

తరువాత హజ్రత్ ఉమర్‌ రజియల్లాహు అన్హు కాలంలో, ప్రజలు దాని పట్ల మరొకసారి ఫిత్నాలో పడ్డారు. అప్పుడు ఆయన దానిని నరికివేయమని ఆజ్ఞాపించారు, షిర్క్‌కు దారితీసే మార్గాన్ని మూసివేయడానికి; ఎందుకంటే వారు దాని కిందకు వెళ్లి నమాజ్ చేసేవారు. అయితే వారు ఫిత్నాలో పడతారని ఆయన భయపడ్డారు. (ఫత్హుల్ బారీ 7/448 ثُمَّ وَجَدْتُ عِنْد بن سَعْدٍ بِإِسْنَادٍ صَحِيحٍ عَنْ نَافِعٍ أَنَّ عُمَرَ بَلَغَهُ أَنَّ قَوْمًا يَأْتُونَ الشَّجَرَةَ فَيُصَلُّونَ عِنْدَهَا فَتَوَعَّدَهُمْ ثُمَّ أَمْرَ بِقَطْعِهَا فَقُطِعَتْ).

ఓ అల్లాహ్‌, మమ్మల్ని తౌహీద్‌పై జీవింపజేయి, తౌహీద్‌పై మరణింపజేయి, ప్రళయదినాన మమ్మల్ని తౌహీద్ పై లేపు. అస్తగ్ఫిరుల్లాహ లీ వ’లకుమ్ ఫ’స్తగ్ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్’రహీం.

الْحَمْدُ لِلهِ الَّذِيْ هَدَانَا لِنِعْمَةِ الْإِسْلَامِ وَالتَّوْحِيدِ وَالسُّنَّةِ الْبَيْضَاءِ، وَالصَلَاَةُ وَالسَلَاَمُ عَلَى إمَامِ الْحُنَفَاءِ، أَمَّا بَعْدُ:
అల్ హమ్దు’లిల్లాహిల్లజీ హదానా లిని’అమతిల్ ఇస్లామి వత్-తౌహీది వస్-సున్నతిల్ బైదా, వస్-సలాతు వస్-సలాము అలా ఇమామిల్ హునఫా, అమ్మా బ’అద్.

ఇస్లాం, తౌహీద్‌, స్పష్టమైన సున్నత్ అనే గొప్ప అనుగ్రహాలు ప్రసాదించిన అల్లాహ్‌కు స్తోత్రములు. తౌహీద్ పై స్థిరంగా ఉండి, అటూ ఇటూ తొంగని, వంగనివారి నాయకులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి, శుభాలు వర్షించుగాక. ఆమీన్. అమ్మాబాద్!

ఓ షిర్క్‌ను, దానిని పాటించేవారిని వదలి, తౌహీద్‌ను పాటించేవాడా, ఓ బిద్అత్‌ను, దానిని పాటించేవారిని వదలి సున్నత్‌ను పాటించేవాడా: నీవు తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌ మరియు సున్నత్ యొక్క అనుగ్రహాన్ని గమనిస్తున్నావా, దాని విలువను గ్రహిస్తున్నావా?

మన దేశంలో ఉన్న గొప్ప అనుగ్రహాన్ని నీవు గుర్తించావా (సౌదీయాలో జరిగిన ఖుత్బా, అందుకొరకే ఖతీబ్ చెప్పిన మాటలు అలాగే అనువదించడం జరిగింది), ఏంటి అది? అల్లాహ్ దయ వల్ల మనం మస్జిదులు, శ్మశాన వాటికలలోకి, ఖబ్రిస్తాన్ లలోకి ప్రవేశించినప్పుడు, షిర్క్ లేదా బిద్అత్ యొక్క ఏ చిహ్నాలను కూడా మనం చూడము. విగ్రహాలను పూజించకుండా, సాలిహీన్‌లను, సమాధి చేయబడిన వారిని, ఔలియాలను మధ్యవర్తులుగా చేసుకోవడం నుండి నిన్ను దూరంగా ఉంచిన అల్లాహ్‌ గొప్ప దయను నీవు గుర్తుకు తెచ్చుకున్నావా?

నీ మూడవ తండ్రి ఇబ్రహీం (అలైహిస్సలాం) చేసిన దుఆ నీవు చేస్తూ ఉన్నావా?
(మూడవ తండ్రి ఎందుకు అన్నారండీ? మనల్ని కన్న తండ్రి ఒక తండ్రి అయితే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తండ్రి లాంటి వారు కాదా? ధర్మమంతా ప్రేమగా నేర్పారు కదా).

{وَاجْنُبْنِي وَبَنِيَّ أَنْ نَعْبُدَ الْأَصْنَامَ رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِنَ النَّاسِ}
నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు, నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి” (ఇబ్రాహీం 14:35-36).

ఇబ్నుల్-ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “నేను ఒక రోజు మా స్నేహితులలో ఒకరిని సందర్శించాను – ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నారు – నేను ఆయనను దాని గురించి అడిగాను, ఆయన అన్నారు: అల్లాహ్ నాకు సున్నత్ ప్రసాదించాడు, దాని జ్ఞానం ప్రసాదించాడు. మరియు ప్రజలు ఏ సందేహాల్లో పడి ఉన్నారో, ఏ తప్పుడు నియమ నిర్ణయాల్లో ఉన్నారో, వాటి నుండి విముక్తిని కలిగించాడు. ఇలా కలిగించిన ఆ అల్లాహ్ ను నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ అనుగ్రహాలను నేను గుర్తు చేసుకుంటున్నాను. అది నన్ను సంతోష పెట్టింది, చివరికి నన్ను ఏడ్పించింది”. (మదారిజుస్సాలికీన్ 3/127).

فاللهم لَكَ الحَمْدُ عَلَى نِعْمَةِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ، بِبِلَادِ التَّوْحِيْدِ وَالسُّنَّةِ.
(అల్లాహుమ్మ లకల్ హమ్దు అలా ని’అమతిత్ తౌహీది వస్-సున్నతి ఫీ బిలాదిత్ తౌహీది వస్-సున్న)
ఓ అల్లాహ్‌, తౌహీద్‌, సున్నత్ దేశంలో తౌహీద్‌, సున్నత్ అనే గొప్ప అనుగ్రహానికి నీకే ప్రశంసలు, స్తోత్రములు.

اللَّهُمَّ ثَبِّتْنَا عَلَى ذَلِكَ إِلَى يَوْمِ نَلْقَاكَ
(అల్లాహుమ్మ సబ్బిత్నా అలా జాలిక ఇలా యౌమి నల్ఖాక)
ఓ అల్లాహ్! మేము నిన్ను కలిసే రోజు వరకు దానిపై మమ్మల్ని స్థిరపరచు.

وَعُمَّ بِالتَّوْحِيدِ وَالسُّنَّةِ أَوْطَانَ الْمُسْلِمِينَ
(వ’ఉమ్మ బిత్-తౌహీది వస్-సున్నతి అవ్తానల్ ముస్లిమీన్)
ముస్లింల దేశాలను తౌహీద్, సున్నత్ తో నింపు.

اللهم كَمَا هَدَيْتَنا لِلإِسْلاَمِ فلاَ تَنْزِعْهُ مِنّا حَتَّى تَتَوَفَّانا وَنحن مُسْلِمونَ.
(అల్లాహుమ్మ కమా హదైతనా లిల్ ఇస్లామి ఫలా తన్జి’అహు మిన్నా హత్తా తతవఫ్ఫానా వ నహ్ను ముస్లిమూన్)
ఓ అల్లాహ్‌, నీవు మమ్మల్ని ఇస్లాంపై నడిపించినట్లే, మేము ముస్లింలుగా మరణించే వరకు దానిని మమ్మల్నుండి దూరం చేయకు.

اللهم اجْعَلْنَا مِمَّنْ يَلْقَاكَ لَا يُشْرِكُ بِكَ شَيْئَاً.
(అల్లాహుమ్మ జ’అల్నా మిమ్మన్ యల్ఖాక లా యుష్రికు బిక షైఆ)
ఓ అల్లాహ్‌, నిన్ను కలిసేటప్పుడు నీకు ఏమీ భాగస్వామిగా చేయని వారిలో మమ్మల్ని చేర్చు.

اللَّهُمَّ اجْعَلْنَا أغَنْى خَلْقِكَ بكَ، وأفْقَرَ خَلْقِكَ إليْكَ.
(అల్లాహుమ్మ జ’అల్నా అగ్నా ఖల్ఖిక బిక వ అఫ్ఖర ఖల్ఖిక ఇలైక)
ఓ అల్లాహ్‌, నీ తప్ప నీ సృష్టిలో ఎవరి అవసరం లేకుండా చేయి, మరియు నీ సృష్టిలోకెల్లా నీ సన్నిధిలో అత్యంత పేదవారిగా ఉంచు.

اللَّهُمَّ إِنّا نَسْأَلُكَ النَّعِيمَ الْمُقِيمَ الَّذِي لَا يَحُولُ وَلَا يَزُولُ.
(అల్లాహుమ్మ ఇన్నా నస్అలుకన్-నయీమల్ ముఖీమల్లజీ లా యహూలు వలా యజూల్)
ఓ అల్లాహ్‌, ఎన్నటికీ మారకుండా, తొలగిపోకుండా ఉండే శాశ్వతమైన అనుగ్రహాలు మేము నిన్ను అడుగుతున్నాము.

اللهم وفِّقْ إِمَامَنَا خَادِمَ الحَرَمَينِ الشَّرِيْفَيْنِ، وَوَلِيَّ عَهْدِهِ لِمَا فِيْهِ عِزُّ الإِسْلامِ وَصَلاحُ المُسْلِمِيْنَ. وَارْحَمْ وَالِدَهُمُ الإِمَامَ المُؤَسِّسَ، وَالإِمَامَ المُجَدِّدَ.
(అల్లాహుమ్మ వఫ్ఫిఖ్ ఇమామనా ఖాదిమల్ హరమైనిష్-షరీఫైని వ వలియ్య అహదిహీ లిమా ఫీహి ఇజ్జుల్ ఇస్లామి వ సలాహుల్ ముస్లిమీన్, వర్’హమ్ వాలిదహుమల్ ఇమామల్ ముఅస్సిస వల్ ఇమామల్ ముజద్దిద్)
ఓ అల్లాహ్! మా నాయకుడు (అంటే రాజు), రెండు పవిత్ర మస్జిదుల సేవకుడు మరియు ఆయన యువరాజును ఇస్లాం గౌరవానికి, ముస్లింల శ్రేయస్సుకు దోహదపడే వాటికి మార్గనిర్దేశం చెయ్యి. వారి తండ్రి, వ్యవస్థాపక ఇమామ్ (మలిక్ అబ్దుల్ అజీజ్) మరియు పునరుద్ధరణ చేసిన ఇమామ్ (ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్) రహిమహుముల్లాహ్ పై నీవు దయ చూపు.

اللهم احْفَظْ أَمْنَنَا وَإيْمَانَنَا وَجُنُودَنَا وَحُدُوْدَنَا، وَمُقَدَّسَاتِنَا وَقُدْسَنَا.
(అల్లాహుమ్మ హ్ఫజ్ అమ్ననా వ ఈమాననా వ జునూదనా వ హుదూదనా వ ముఖద్దసాతినా వ ఖుద్సనా)
ఓ అల్లాహ్‌, మా భద్రతను, మా విశ్వాసాన్ని, మా సైనికులను, మా సరిహద్దులను, మా పవిత్ర స్థలాలను, మా బైతుల్ మఖ్దిస్ ను రక్షించు, కాపాడు.

اللهم يَا ذَا النِّعَمِ الَّتِيْ لا تُحْصَى عَدَدًا: نَسْأَلُكَ أَنْ تُصَلِّيَ وَتُسَلِّمَ عَلَى مُحَمَّدٍ أَبَدَاً.
(అల్లాహుమ్మ యా జన్ని’అమిల్లతీ లా తుహ్సా అదదా, నస్అలుక అన్ తుసల్లియ వ తుసల్లిమ అలా ముహమ్మదిన్ అబదా)
ఓ అల్లాహ్‌, లెక్క లేనన్ని అనుగ్రహాలు ప్రసాదించేవాడా: ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎల్లప్పుడూ శాంతిని, శుభాలను కురిపించమని మేము నిన్ను అడుగుతున్నాము.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42249

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర – షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ | నసీరుద్దీన్ జామిఈ [ఆడియో & టెక్స్ట్]

హజ్రత్ ఉమర్ రజియల్లాహు అన్హు సంక్షిప్త చరిత్ర
https://youtu.be/r_3VWYO4FHI [జుమా ఖుత్బా: 25 నిముషాలు]
షేఖ్ డా. అబ్దుల్ అజీజ్ అల్ ఉలైవీ (హఫిజహుల్లాహ్), జామె అల్ గన్నామ్, జుల్ఫీ, సఊదియ
అనువాదం: షేఖ్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త సహచరుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం వల్ల కలిగే ప్రాముఖ్యత, దానివల్ల విశ్వాసం ఎలా పెరుగుతుందో వివరించబడింది. ముఖ్యంగా, రెండవ ఖలీఫా అయిన హజ్రత్ ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క జీవిత చరిత్రపై దృష్టి సారించబడింది. ఆయన ఇస్లాం స్వీకరణ, ఆయన ధైర్యం, ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన శుభవార్తలు, ఆయన పరిపాలన, మరియు ఆయన అమరత్వం (షహాదత్) వంటి ముఖ్య ఘట్టాలను హదీసుల ఆధారాలతో వివరించారు. ఉమర్ (రదియల్లాహు త’ఆలా అన్హు) యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఖురాన్ ఆయతులు అవతరించిన సందర్భాలు, ఆయన జ్ఞానం, మరియు ఆయన నిరాడంబర జీవితం గురించి కూడా చర్చించబడింది. ఆయన జీవితం నుండి ముస్లింలు నేర్చుకోవలసిన పాఠాలను ఈ ప్రసంగం ఎత్తి చూపుతుంది.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు (4) – మరణానంతర జీవితం : పార్ట్ 45 [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు [4] – [మరణానంతర జీవితం – పార్ట్ 45]
https://www.youtube.com/watch?v=nMRENiqwyCw [21 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినాన మంచి పనుల త్రాసును తేలికగా చేసే వివిధ పాప కార్యాల గురించి వివరిస్తున్నారు. (3) ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట కంటే ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (4) అల్లాహ్ క్షమించడని ఇతరుల గురించి ప్రమాణం చేయడం, (5) అసర్ నమాజ్‌ను వదులుకోవడం, (6) ఏకాంతంలో అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడటం మరియు (7) సరైన కారణం లేకుండా కుక్కను పెంచడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ చర్యలు కొండలంత పుణ్యాలను కూడా నాశనం చేసి, వాటిని దుమ్ము ధూళి వలె మార్చేస్తాయని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో హెచ్చరించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీ నస్తఫా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో మూడవది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటపై, ఆయన ఆదేశంపై ఇతరుల ఆదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.

మహాశయులారా! ఇది కూడా మహా ఘోరమైన పాపం. దీనివల్ల మన పుణ్యాలన్నీ కూడా, సత్కార్యాల సత్ఫలితాలన్నీ కూడా నశించిపోయి, మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. సూరె హుజరాత్ ఆయత్ నెంబర్ ఒకటిలో అల్లాహు త’ఆలా విశ్వాసులందరికీ ఇచ్చిన ఆదేశం ఏమిటంటే,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లాహి వ రసూలిహి)
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను మించిపోకండి.  (49:1)

మనం విశ్వాసులం, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలను అనుసరిస్తూ ఉండాలి. కానీ వారి కంటే ముందుగా, ఆదేశం లభించక ముందే తన మన ఇష్టానుసారం ఏదైనా చేయడానికి, ఆదేశం వచ్చిన తర్వాత దాన్ని అనుసరించకుండా మన అభిప్రాయాలను మనం అనుసరించడానికి ఏమాత్రం అనుమతి మనకు లేదు.

ఆ తర్వాత సూరె హుజరాత్‌లోని ఆయత్ నెంబర్ రెండును గమనించండి. అందులో ఇవ్వబడిన హెచ్చరిక ద్వారా భయ కంపితులై, అలాంటి చేష్టలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మనం చేయాలి.

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلَا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్‌ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్‌హరూ లహూ బిల్ ఖౌలి కజహ్రి బఅదికుమ్ లి బఅదిన్ అన్ తహ్‌బత అఅమాలుకుమ్ వ అన్తుమ్ లా తష్ఉరూరున్)
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన (హెచ్చుగా) ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్ధమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు..” (49:2)

ఓ విశ్వాసులారా! ప్రవక్త మాట కంటే, ప్రవక్త స్వరం కంటే మీ స్వరం అనేది ఎత్తుగా ఉండకూడదు. మరియు మీరు పరస్పరం ఎలానైతే ఒకరు మరొకరిని పిలుచుకుంటారో అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ప్రవర్తించకండి. చివరికి మీరు, మీరు చేసే ఈ దుష్కార్యం వల్ల, మీరు ప్రవక్త స్వరంపై మీ స్వరాన్ని ఎత్తడం వల్ల, పరస్పరం మీరు ఎలా పిలుచుకుంటారో అలా ప్రవక్తను పిలవడం ద్వారా మీ సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. అది మీకు తెలియకుండానే జరగవచ్చు. అంటే మీ పాపాల, మీ ఈ పాపం వల్ల మీ సత్కార్యాలు నశించిపోతున్నాయి అన్న విషయం మీకు తెలియకుండానే ఇదంతా జరగవచ్చు. అల్లాహు అక్బర్. ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ప్రవక్త స్వరంపై మన స్వరాన్ని ఎత్తడం, ప్రవక్త మాటపై మన మాటను పెంచడం, పరస్పరం పిలుచుకున్నట్లు ప్రవక్తను పిలవడం, దీనివల్ల మనకు తెలియకుండానే మన సత్కార్యాలు వృధా అవుతున్నాయి అంటే, ఇక ఎవరైతే తెలిసి తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాన్ని విడనాడుతున్నారో, ప్రవక్త ఆదేశం ఒకటి ఉంది అంటే, తనకిష్టమైన నాయకుడు, తనకిష్టమైన ఇమామ్, తనకిష్టమైన పీర్, తనకిష్టమైన మౌల్వీ సాబ్, వారి యొక్క ఫత్వాలు ఇంకో రకంగా ఉంటే ప్రవక్తను వదిలేసి వారినే అనుసరిస్తున్నారో, వారి యొక్క సత్కార్యాలు వృధా కావా? అలాంటి వారు భయపడే అవసరం లేదా?

ఈ రోజుల్లో మనలోని ఎంతో మంది సోదరులు, ఒకవైపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం, మరోవైపు మన తాత ముత్తాతల విధానం, మన యొక్క దురాచారాలు, మన యొక్క గ్రామ చట్టాలు ఈ విధంగా ఉంటాయి. ప్రవక్తను వదిలేసి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారు ఏ నష్టంలో పడరు అని ఏదైనా మన దగ్గర జమానత్ ఉందా? అందు గురించి మనం ఈ ఆయతులు చదివిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో, అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు అని ప్రమాణం చేయడం. అల్లాహు అక్బర్. ఒకసారి ఈ హదీసును గ్రహించండి. హజ్రత్ జుందుబ్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక వ్యక్తి ఇలా అన్నాడు,

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ لِفُلَانٍ
(ఇన్నల్లాహ లా యగ్‌ఫిరు లి ఫులాన్)
నిశ్చయంగా అల్లాహ్ ఫలానా వ్యక్తిని క్షమించడు, మన్నించడు.

అప్పుడు అల్లాహు త’ఆలాకు చాలా కోపం వచ్చింది. అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఫలానా వ్యక్తిని నా అతనికి నా క్షమాపణ లభించదు అని, నా వైపు నుండి అతన్ని కరుణించడం జరగదు అని ప్రమాణాలు చేసేటువంటి అధికారం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? నిశ్చయంగా నేను ఫలానా వ్యక్తిని క్షమించాను మరియు ఇలాంటి ప్రమాణాలు చేసే వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేసాను. అల్లాహు అక్బర్. గమనించారా? ఎంత భయంకరమైన విషయమో.

అయితే మహాశయులారా, అల్లాహ్ యొక్క కరుణా కటాక్షాలను, మన్నింపు క్షమాపణలను మనం మన చేతిలో, మన అధికారంలో తీసుకోకూడదు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, “సోదరా! ఇలాంటి తప్పు చేసే వారిని అల్లాహ్ క్షమించడు అని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసే వారిని అల్లాహ్ శపిస్తాడని తెలియజేయడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ నరకంలో ప్రవేశింపజేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇలాంటి పాపం చేసేది ఉంటే అల్లాహ్ స్వర్గంలో పంపడం లేదు అని చెప్పడం జరిగింది.” ఇలాంటి బోధన మనం చేయాలి. కానీ, “నువ్వు ఈ తప్పు చేస్తున్నావా? నిన్ను అల్లాహ్ క్షమించనే క్షమించడు. అల్లాహ్ నీకు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకునే అధికారమే, అటువంటి భాగ్యమే ప్రసాదించడు.” ఇట్లాంటి ఆదేశాలు మనం జారీ చేయకూడదు. ఒకరిని అల్లాహ్ యొక్క క్షమాపణ పట్ల నిరాశకు గురి చేయకూడదు.

ఒకవేళ ఇదే ప్రమాణాలు చేసుకుంటూ, నిన్ను ఎన్నటికీ అల్లాహ్ క్షమించడు అని అంటే, అల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతనికి అతను ఆగ్రహానికి గురై, ఇలాంటి వ్యక్తి యొక్క సర్వ సత్కార్యాలను వృధా చేసేస్తాడు. అల్లాహు అక్బర్. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

మహాశయులారా! త్రాసును తేలికగా చేసే పాపాల్లో, అసర్ నమాజ్‌ను వదులుకోవడం. అల్లాహు అక్బర్. అసర్ నమాజ్. అల్లాహ్ రేయింబవళ్ళలో, రాత్రి పగళ్ళలో ఐదు వేలల నమాజ్ మనపై విధిగావించాడు. ఐదు నమాజుల్లో ఒకటి మధ్యలో ఉన్న నమాజ్ అసర్ నమాజ్. ఎవరైతే అసర్ నమాజ్ వదిలేస్తారో వారి యొక్క సత్కార్యాలు వృధా అయిపోతాయి. శ్రద్ధ వహించండి ఈ హదీసుపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్‌ను విడనాడతారో వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి.

ఈ అసర్ నమాజ్ ఎంత ముఖ్యమైనదంటే,

حَافِظُوا عَلَى الصَّلَوَاتِ وَالصَّلَاةِ الْوُسْطَىٰ
(హాఫిజూ అలస్సలవాతి వస్సలాతిల్ వుస్తా)
“నమాజులను, ప్రత్యేకించి మధ్య నమాజును కాపాడండి.” (2:238)

అని అల్లాహు త’ఆలా ఖురాన్లో ఆదేశం ఇచ్చాడు. మీరు అన్ని నమాజులను పాబందీగా చేస్తూ ఉండండి. కానీ మధ్యలో ఉన్న నమాజు పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ఇందులో మధ్యలోని నమాజ్ అంటే అసర్ నమాజ్ అని ఎన్నో హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది.

అబూ ములైహ్ రహిమహుల్లాహ్ చెప్పారు, మేము ఒక సందర్భంలో, ఒక యుద్ధంలో ఉన్నాము. గమనించండి, యుద్ధంలో ఉన్నప్పుడు ఎంత మనిషి బిజీగా ఉంటాడో, అటువైపు శత్రువుల నుండి శత్రువుల బాణాలు, ఆయుధాలు మన మీదికి వచ్చి పడే, మన ప్రాణాలు పోయే అటువంటి భయం క్షణం క్షణం ఉంటుంది. అబూ ములైహ్ అంటున్నారు, మేము ఒక యుద్ధంలో హజ్రత్ బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు వెంట ఉన్నాము. అసర్ నమాజ్ సమయం ప్రవేశించింది. అప్పుడు బురైదా రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, అసర్ నమాజ్ మీరు చేసుకోండి. ఇందులో ఆలస్యం చేయకండి. ఎందుకంటే నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను,

مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ
(మన్ తరక సలాతల్ అస్ర్ ఫఖద్ హబిత అమలుహూ)
ఎవరైతే అసర్ నమాజ్ విడినాడారో, ఎవరైతే అసర్ నమాజ్ వదిలేశారో వారి యొక్క సర్వ సత్కార్యాలు వృధా అయిపోయాయి.

దీని గురించి మనల్ని భయకంపితులుగా చేసే హదీస్ కూడా ఉంది. సహీహ్ బుఖారీలోని హదీస్. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

الَّذِي تَفُوتُهُ صَلَاةُ الْعَصْرِ كَأَنَّمَا وُتِرَ أَهْلَهُ وَمَالَهُ
(అల్లజీ తఫూతుహూ సలాతుల్ అస్ర్ క అన్నమా వుతిర అహ్లహూ వ మాలహూ)
ఎవరి అసర్ నమాజ్ తప్పిపోయినదో, ఎవరైతే అసర్ నమాజ్ చేయలేకపోయారో వారు ఎలాంటి వారంటే వారి యొక్క సొమ్ము, ధనము, ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయినటువంటి వాడు.

ఎప్పుడైనా ఈ బాధ మనకు కలిగిందా ఒకసారి ఆలోచించండి. అటు నమాజ్ టైం అయింది, ఇటువైపున కొడుకుకు చాలా జ్వరం వచ్చింది అంటే, మనం నమాజ్‌ను వదులుకొని కొడుకును ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి అని కోరుకుంటాము. ఇక ఎవరి ఆస్తిపాస్తులు, ఆలు పిల్లలు అందరూ నశించిపోయారో అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అసర్ నమాజ్ కూడా తప్పిపోయినప్పుడు అంత బాధ మనకు కలిగిందా? ఎంత బాధనైతే మన ఆస్తిపాస్తులు, మన ఆలు పిల్లలు అందరూ నశించిపోయినప్పుడు కలుగుతుందో, అలాంటి బాధ ఏదైనా ఒక్క నమాజ్ మిస్ అయినప్పుడు మనకు కలిగిందా? అందు గురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర సత్కార్యాలన్నిటినీ కూడా వృధా చేసుకోకుండా నమాజ్ కాపాడుకుంటూ మనం ఇతర సత్కార్యాలను కూడా కాపాడుకోవాలి.

మన త్రాసు బరువును తగ్గించేసి, తేలికగా చేసే పాపాల్లో మరో భయంకరమైన పాపం, ఏకాంతంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడటం లేదు కదా అని భావించుకుంటూ ఉన్నప్పుడు, అల్లాహ్ నిషేధించిన కార్యాలకు పాల్పడడం. దీనివల్ల కూడా మన ఇతర సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఈ రోజుల్లో ఎంతమంది మన, మనలోని ఎంతమంది పరిస్థితి ఇలా గురై ఉంది. ఒక్కసారి ఈ హదీసును మీరు చాలా శ్రద్ధగా వినండి. దీనిని అర్థం చేసుకొని ఇందులో చూపబడిన నష్టాలకు దూరంగా ఉండేటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

హజ్రత్ సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు ఉల్లేఖించిన ఈ హదీస్, దీనిని మనం మన ఈ చెవులతోనే కాకుండా, హృదయంలో ఉన్నటువంటి చెవులతో శ్రద్ధగా విని ఉంటే, ఈ హదీస్ మనలోని నిద్రలో ఉన్న వారిని నిద్రలో నుండి మేల్కొలుపుతుంది. అశ్రద్ధలో ఉన్నవారి యొక్క అశ్రద్ధతనాన్ని దూరం చేసేస్తుంది. అంతటి భయంకరమైన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

لَأَعْلَمَنَّ أَقْوَامًا مِنْ أُمَّتِي يَأْتُونَ يَوْمَ الْقِيَامَةِ بِحَسَنَاتٍ أَمْثَالِ جِبَالِ تِهَامَةَ بِيضًا فَيَجْعَلُهَا اللَّهُ عَزَّ وَجَلَّ هَبَاءً مَنْثُورًا
(ల అ’లమన్న అఖ్‍వామన్ మిన్ ఉమ్మతీ య’తూన యౌమల్ ఖియామతి బి హసనాతిన్ అమ్సాల జిబాలి తిహామా బైదా ఫ యజ్అలుహల్లాహు అజ్జవజల్ల హబాఅన్ మన్సూరా)

నేను నా అనుచర సంఘంలోని కొందరిని గుర్తుపడతాను. వారు నాకు తెలుసు. వారు తిహామా నగరంలోని పర్వతాల మాదిరిగా సత్కార్యాలను తీసుకొని ప్రళయ దినాన హాజరవుతారు. (అరబ్బులో తిహామా కొండలు చాలా ఫేమస్. అలాంటి కొండల మాదిరిగా పుణ్యాలు చేసుకొని వస్తారు ప్రళయ దినాన.) కానీ అల్లాహు త’ఆలా వాటిని దుమ్ము ధూళి వలె చేసేస్తాడు.

ఈ భయంకరమైన విషయం విని సౌబాన్ రదియల్లాహు త’ఆలా అన్హు అడిగారు, “ప్రవక్తా, వారు ఎలాంటి వారు? వారి గుణం ఏమిటి? వారి గురించి ఏదైనా స్పష్టంగా తెలపండి. మాకు తెలియకుండానే మేము అలాంటి వారిలో కలిసిపోకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడతాము” అని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, “వారు మీ సోదరులే, మీ వంశం వారే. వారు రాత్రి వేళల్లో నిలబడి తహజ్జుద్ నమాజ్‌లు చేసే అటువంటి వారు. మీరు ఎలా తహజ్జుద్ నమాజ్ చేస్తున్నారో అలా వారు కూడా తహజ్జుద్ నమాజ్ చేసేవారు. కానీ ఒంటరిగా ఉండి అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడే అవకాశం దొరికితే, వాటికి దూరంగా ఉండడానికి బదులుగా ఆ నిషిద్ధ కార్యాలకు పాల్పడేవారు.”

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, మన చేతుల్లోని స్మార్ట్ ఫోన్స్, ఒక హాస్టల్లో ఉన్నవారు కూడా, ఒకచోట పనిచేసేవాళ్ళు కూడా, హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకున్నారు, పై నుండి దుప్పటి కప్పుకున్నారు. లోపలి నుండి స్మార్ట్ ఫోన్స్ ఆన్ చేసుకుంటూ, ఇష్టమైన చిత్రాలు చూసుకుంటూ, పాప కార్యాలు చూసుకుంటూ, పక్కన ఎవరూ కూడా వినడం లేదు, పక్కన ఉన్నవారు ఎవరూ చూడడం లేదు. ఈ విధంగా సామాన్యంగా ఈరోజు జరుగుతున్న ఇటువంటి పాపాలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని వారిలో ఒంటరి తనాల్లో కలుసుకోవడం, ఎవరు చూడడం లేదు కదా అని ప్రత్యేక కోడ్ వర్డ్లలో వారితోని మాట్లాడుకోవడం, ఇంకా ఇలాంటి ఎన్నో దుష్కార్యాలు ఈనాటి సమాజంలో ప్రబలిపోతూ ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా విషయం బయటికి వచ్చినా, దానిని ఏదో రకంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, అల్లాహు అక్బర్. మహాశయులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం చూపుగాక. ఇంతటి భయంకరమైన హదీస్ ఇది. చూడడానికి నమాజ్‌లు చేస్తూ ఉండడం, వేరే సత్కార్యాలు చేస్తూ ఉండడం, ఒక మంచివాడుగా ప్రజల్లో పేరు పొందడం, కానీ ఒంటరిగా ఉండి పాపాలు చేసే అవకాశం వస్తే, ఏమాత్రం జంకకుండా, వెనుక ఉండకుండా, అల్లాహ్‍తో భయపడకుండా అలాంటి నిషిద్ధ కార్యాలకు పాల్పడడం, ఇది మన సత్కార్యాలన్నిటినీ వృధా చేసేస్తుంది.

మహాశయులారా, మన సత్కార్యాలను వృధా చేసి మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఏడవది, కుక్కను పెంచడం. అల్లాహు అక్బర్. ఈ రోజుల్లో ఎందరో ముస్లింల ఇళ్లల్లో కూడా పెట్టీ అని, ఇంకా ఏదేదో పేర్లతో, రకరకాల, ఎంతో అందమైన ముద్దుగా ఉన్నటువంటి పేర్లతో కుక్కలను పిలుచుకుంటూ, పెంచుకుంటూ, వారిని తమ ఒడిలో తమ పిల్లల మాదిరిగా ఉంచుకుంటూ ఇలా వారిని పోషిస్తున్నారు.

ఈ రోజుల్లో ఎంతో మంది తమ సొంత పిల్లలను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లుగా కుక్కను పెంచుకుంటున్నారు. ఎంతో ముద్దు ముద్దు పేర్లతో వారిని పిలుచుకుంటూ, వారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుంటున్నారు. ఈ విధంగా మహాశయులారా, ముందే పుణ్యాలు, సత్కార్యాలు చాలా తక్కువగా మనకు ఉన్నాయి అంటే, ఇలాంటి పాప కార్యాల వల్ల మరింత మనం ప్రళయ దినాన నష్టపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,

مَنِ اتَّخَذَ كَلْبًا، إِلَّا كَلْبَ زَرْعٍ أَوْ غَنَمٍ أَوْ صَيْدٍ، يَنْقُصُ مِنْ أَجْرِهِ كُلَّ يَوْمٍ قِيرَاطٌ
(మనిత్తఖద కల్బన్ ఇల్లా కల్బ జర్ఇన్ అవ్ గనమిన్ అవ్ సైదిన్ యన్ఖుసు మిన్ అజ్రిహీ కుల్ల యౌమిన్ ఖీరాత్)
ఎవరైతే కుక్కను పెంచుతారో, వారి యొక్క పుణ్యాల్లో ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యాలు తగ్గుతూ ఉంటాయి.

ఒక ఖీరాత్ పుణ్యాలు అంటే ఎంతో తెలుసా? జనాజా నమాజ్‌కు సంబంధించిన విషయాల్లో మనం తెలుసుకున్నాము. ఒక ఖీరాత్ అంటే ఉహుద్ పర్వతానికి సమానం. రెండు ఖీరాత్‌లు అంటే రెండు ఉహుద్ పర్వతాలు లేదా రెండు పెద్ద పర్వతాలకు సమానం.

ప్రతి రోజూ ఒక ఖీరాత్ పుణ్యం తగ్గుతూ ఉంటుంది ఎవరైతే కుక్కను పెంచుతూ ఉంటారో. కానీ ఇందులో కేవలం మూడు రకాల కుక్కలను పెంచే అనుమతి ఉంది. ఆ కుక్కలు కూడా సాధ్యమైనంత వరకు మన ఇంటి ఆవరణలో ఉండకుండా బయట ఉంచే ప్రయత్నం చేయాలి. ఎలాంటి మూడు కుక్కలు? ఒకటి, మనం మన తోట రక్షణ కొరకు పెంచే కుక్క, అది తోటలోనే ఉండాలి, ఇంటి వద్ద ఉండకూడదు. మరొకటి, మేకల రక్షణ కొరకు మనం పెంచే కుక్క, అది మేకల వద్దనే ఉండాలి, మన ఇంట్లోనికి రానివ్వకూడదు. మూడవది, كَلْبَ صَيْدٍ (కల్బ సైదిన్) వేటాడడానికి, వేరే కొన్ని జంతువులను వేటాడడానికి వేట యొక్క శిక్షణ ఇవ్వబడిన కుక్కలు. సామాన్య కుక్కలు కూడా కాదు. వేట యొక్క శిక్షణ వారికి ఇవ్వబడాలి. అలాంటి కుక్కలు, అవి కూడా ఇంట్లోనికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి.

ఈ మూడు రకాల కుక్కలు పెంచడానికి అనుమతి ఉంది. ఈ మూడు ఉద్దేశాలు కాకుండా ఇంకా ఎవరైనా కుక్కను పెంచుతున్నారు అంటే ప్రతి రోజూ వారి యొక్క సత్కార్యాలలో నుండి ఒక ఖీరాత్ సత్కార్యాలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఎంత నష్టానికి గురి అయిపోతామో గమనించండి.

మరికొన్ని పాప కార్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా మన త్రాసు అనేది తేలికగా అయిపోతుంది. తరువాయి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

వ ఆఖిరు దఅవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41887

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట మరియు శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట [వీడియో| టెక్స్ట్]

సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట మరియు శ్మశానాన్నిమరుగుదొడ్డిగా ఉపయోగించుట
https://www.youtube.com/watch?v=o1GRywFZbF4 (10 నిముషాలు)
 ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హాఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, సమాధులతో (ఖబ్రిస్తాన్) ముస్లింలు పాటించవలసిన మర్యాదల గురించి వివరించబడింది. సమాధిపై కూర్చోవడం, దానిపై నడవడం, దానిని అగౌరవపరచడం తీవ్రమైన పాపాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. నిప్పుల మీద కూర్చోవడం ఒక సమాధిపై కూర్చోవడం కన్నా మేలని, కత్తి మీద నడవడం ఒక ముస్లిం సమాధిపై నడవడం కన్నా మేలని చెప్పిన హదీసులను ఉటంకించారు. సమాధుల స్థలాన్ని ఆక్రమించడం, వాటిని మరుగుదొడ్లుగా ఉపయోగించడం, చెత్త వేయడం వంటివి బహిరంగ బజారులో మర్మాంగాలను ప్రదర్శించి అవమానకరమైన పనులు చేయడం లాంటిదని హెచ్చరించారు. ముస్లిం మరణించిన తర్వాత కూడా వారి దేహానికి, వారి సమాధికి గౌరవం ఇవ్వడం తప్పనిసరి అని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.

సమాధిపై కూర్చుండుట, దానిపై నడుచుట, శ్మశానాన్ని మరుగుదొడ్డిగా ఉపయోగించుట – వీటన్నిటి నుండి చాలా భయంకరమైన నిషేధాలు వచ్చి ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారని అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు.

لَأَنْ يَجْلِسَ أَحَدُكُمْ عَلَى جَمْرَةٍ فَتُحْرِقَ ثِيَابَهُ فَتَخْلُصَ إِلَى جِلْدِهِ خَيْرٌ لَهُ مِنْ أَنْ يَجْلِسَ عَلَى قَبْرٍ
(లా యజ్లిస అహదుకుం అలా జమ్రతిన్ ఫతహ్రిక సియాబహు ఫతఖ్లుస ఇలా జిల్దిహి ఖైరున్ లహు మిన్ అన్ యజ్లిస అలా కబ్ర్)
“మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చొని, ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కల్గినప్పటికినీ అది సమాధి పై కూర్చునే దానికంటే మేలు”. (ముస్లిం 971).

మీలో ఒక వ్యక్తి, మీలో ఒక వ్యక్తి నిప్పులపై కూర్చుని ఆ నిప్పులు అతని బట్టలను కాల్చి దాని సెగ శరీరానికి కలిగినప్పటికిని, అర్థమవుతుందా? మీరు, మీలో ఎవరైనా ఒక వ్యక్తి నిప్పులపై కూర్చోవడం మంచిది. దాని వల్ల అతని బట్టలు కాలిపోయి దాని యొక్క సెగ, దాని యొక్క వేడి, ఆ కాల్చడం అనేది శరీరం వరకు చేరినా గానీ అది మంచిది, దేని నుండి? సమాధిపై కూర్చునే దాని కంటే. గమనించండి.

ఇది చెప్పే ధోరణి గమనించండి మీరు, అంటే మనం ఏదైనా అగ్నిపై, నిప్పులపై కూర్చుని అది మన బట్టల్ని, మన శరీరాన్ని కాల్చడం అంత పెద్ద నష్టం కాదు మన కొరకు, ఏదైనా సమాధి మీద కూర్చోవడంతో పోలిస్తే. అంత ఘోరమైన పాపం మరియు నష్టం అని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది.

కొందరు శవాన్ని ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు సమాధులపై నడుస్తారు. ఒక్కోసారి చెప్పులతో వాటిని త్రొక్కుకుంటూ వెళ్తారు. ముస్లిం శవం యొక్క గౌరవాన్ని కొంచెం కూడా పట్టించుకోరు. ఇది పెద్ద పాపం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితలన్ని చేశారు. ఈ హదీద్ వినే కంటే ముందు, ఇప్పుడు ఏ హదీద్ అయితే మనం విన్నామో, సహీహ్ ముస్లిం, 971 హదీస్, చూస్తున్నారు కదా? మీ బట్టలు కాలిపోయి మీరు మీ శరీరానికి కూడా ఆ అగ్ని చేరే అటువంటి పరిస్థితి ఎదురవ్వడం అది మంచిది కానీ, సమాధిపై కూర్చోవడం. ఇది మహా ఘోరమైన పాపం.

ఈ కూర్చోవడం, ఈ రోజుల్లో ఎవరైనా పెద్దవారు చనిపోయారని సమాధిని ఒక పెద్ద మజార్‌గా, దర్బార్‌గా, దానిపై గోపురాలు, దానిపై గుంబదులు కట్టి అక్కడ ముజావరీ చేయడానికి ఏదైతే కూర్చుంటారో, ఇది కూడా అందులోనే వస్తుంది, అని కొందరు ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు.

ఇక మీరు కింద సమాధుల పై నడవడం, సమాధులపై చెప్పులతో నడవడం ప్రస్తావన ఏదైతే వచ్చిందో ఇది కూడా చాలా ఘోరమైన పాపం. కానీ సమాధుల్లో అనవసరమైన చెట్లు, ముళ్ల కంపలు ఉండి, మనం ఎవరైనా ఒక విశ్వాసిని అక్కడ ఖననం చేయడానికి వెళ్ళినప్పుడు మన కాళ్లకు ముల్లు గుచ్చుకుంటాయి అనుకుంటే చెప్పులు వేసుకొని ఖబరిస్తాన్‌లో, శ్మశాన వాటికలో వెళ్ళవచ్చు. శ్రద్ధగా వినండి. వెళ్ళవచ్చు. కానీ సమాధిపై మన కాలు పడకుండా. సమాధుల మధ్యలో దారి ఉంటుంది కదా, ఆ దారిలో నడవడం అంత పెద్ద పాపం కాదు. కానీ మన కాళ్ళ కింద సమాధి రాకుండా, లేదా ఫలానా సమాధి ఉంది అని తెలిసి కూడా, అయ్యే, లోపల ఓ మనిషి ఉన్నాడా, లోపట ఓ రెండు ఫీట్లు, నాలుగు ఫీట్ల లోపట ఉన్నాడు, అతనికి ఏమైనా అవుతుందా? ఈ విధంగా కొందరు అనుకొని ఏదైతే సమాధులను కూడా తొక్కుకుంటూ, వాటిపై నడుచుకుంటూ వెళ్తారో, కొందరు కొన్ని సందర్భాల్లో అక్కడ ఖననం చేయడం ఆలస్యం జరిగితే, కొందరు సమాధిపై కూర్చుంటారు. అలా సమాధిపై కూర్చోకూడదు. పక్కన సమాధి లేని చోట ఎవరైనా పెద్ద మనిషి వచ్చారు స్మశాన వాటికకు, లేదా ఇంకా ఎవరైనా ఏదైనా కాళ్ళల్లో నొప్పి బాధ ఉన్నవారు వచ్చారు. అయితే ఏదైనా చిన్న కుర్చీ వేసి అక్కడ కొన్ని క్షణాలు కూర్చోబెట్టడం పాపం కాదు. కానీ అది ఎక్కడ ఉండాలి? ఎగ్జాక్ట్లీ సమాధిపై ఉండకూడదు. శవాన్ని ఎక్కడైతే పాతి పెట్టడం జరిగిందో, ఖననం చేయడం జరిగిందో ఆ ఖబ్ర్ మీద కూర్చోవడం గానీ, నడవడం గానీ, కాళ్లతో తొక్కడం గానీ ఇలాంటివి ఏదీ చేయకూడదు. ఎందుకు? ముస్లిం శవం కూడా గౌరవం, మర్యాదకు అర్హత కలిగి ఉన్నది.

لَأَنْ أَمْشِيَ عَلَى جَمْرَةٍ أَوْ سَيْفٍ أَوْ أَخْصِفَ نَعْلِي بِرِجْلِي أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَمْشِيَ عَلَى قَبْرِ مُسْلِمٍ
(ల అన్ అమ్షియ అలా జమ్రతిన్, అవ్ సైఫిన్, అవ్ అఖ్సిఫ నాలి బిరిజ్లి, అహబ్బు ఇలయ్య మిన్ అన్ అమ్షియ అలా కబ్రి ముస్లిం)
“నిప్పులపై, లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పు ను పాదంతో సహా కుట్టుకొనుట ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది”. (ఇబ్ను మాజ 1567, సహీహుల్ జామి 5038).

శ్రద్ధగా వినండి. షేక్ అల్బానీ రహమహుల్లాహ్ సహీహుల్ జామేలో ప్రస్తావించారు 5038, ఇబ్ను మాజాలోని హదీస్ 1567. నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై అది కొచ్చగా ఏదైతే ఉంటుందో కదా దేని ద్వారానైతే కోయడం జరుగుతుందో, నిప్పులపై లేక ఖడ్గం యొక్క చురుకుదనంపై నడుచుట, లేక నా చెప్పును నా పాదంతో సహా కుట్టుకొనుట. అయితే పాదంతో సహా చెప్పును కుట్టేస్తే ఏం జరుగుతుంది? ఒక పెద్ద సూదిని కాళ్ళల్లో గుచ్చినటువంటి అవస్థ, బాధ కలుగుతుంది కదా. ఇదంతా కూడా ఒక ముస్లిం సమాధిపై నడుచుట కంటే ఇష్టమైనది. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? అంటే ఒక ముస్లిం సమాధిపై నడుచుట, ఆ, ఈ పనులు ఏవైతే మనకు బాధాకరంగా ఏర్పడతాయో, నష్టం ఇందులో జరుగుతుంది అని ఏర్పడుతుందో, నిప్పుల మీద నడవడం అంటే ఏదైనా సులభతరమా? మళ్ళీ చాలా పదునుగా ఉన్నటువంటి కత్తి మీద కాలు పెట్టి నడవడం అంటే? చెప్పు, ఉదాహరణకు దాని యొక్క గూడ తెగింది లేదా చెప్పు దాని యొక్క ఏదైనా పక్క మనం నడవడం కష్టమవుతుంది, చెప్పును పాదాన్ని కలిపి కుట్టేయడం. ఎంత ఇబ్బందికర విషయం! కానీ ఇక్కడ ప్రవక్త వారు ఏం చెబుతున్నారు? అంతకంటే ఎక్కువ నష్టం దేని ద్వారా? సమాధిపై నడవడం. అల్లాహు అక్బర్.

ప్రతి బుద్ధిమంతుడు ఆలోచించదగ్గ విషయం, సమాధులపై కూర్చుండుట, నడుచుట ఇంత పెద్ద పాపమైనప్పుడు, శ్మశాన భూమిని, ఖబరిస్తాన్‌ని ఆక్రమించుకొని దానిపై కమర్షియల్ లేక రెసిడెన్షియల్ స్కీమ్ ల ప్లాన్‌లు వేయుట ఎంత ఘోరమైన పాపమో ఆలోచించండి.

మరికొందరు దురదృష్టవంతులు శ్మశాన గోడలు కూడా దాటి తమ కాలకృత్యాలు తీర్చుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇంటింటికీ టాయిలెట్ లాంటి సౌకర్యాల ఏర్పాటు జరిగిన తర్వాత తక్కువైంది కానీ అంతకుముందు, ఖబరిస్తాన్‌ని ఒక కాలకృత్యాలు తీర్చుకునే స్థలంగా మార్చుకునేవారు. కానీ దీని గురించి హదీస్ ఎంత కఠినంగా ఉందో గమనించండి, ఇబ్ను మాజా 1567:

وَمَا أُبَالِي أَوَسْطَ الْقُبُورِ قَضَيْتُ حَاجَتِي أَوْ وَسْطَ السُّوقِ
(వమా ఉబాలీ అవసతల్ కుబూరి కదైతు హాజతీ అవ్ వసతస్ సూక్)
“కాలకృత్యాలు శ్మశానంలో తీర్చుకొనుట, లేక నడి బజారులో తీర్చుకొ నుట రెండూ సమానమే”. (ఇబ్ను మాజ 1567).

అంటే ఏమిటి దీని అర్థం ఏంటి? నడి బజారులో తమ మర్మాంగాన్ని తెరిచి అవసరం తీర్చుకొనుట ఎంత అశ్లీలమో, చెడో, శ్మశానంలో చేయుట కూడా అంతే అశ్లీలం, అంతే చెడు.

అదే విధంగా, శ్మశానంలో చెత్తాచెదారం వేయువారు కూడా, ప్రత్యేకంగా ప్రహారీ గోడలు లేని శ్మశానాల్లో లేదా గోడలు చిన్నగా ఉన్నచోట, తీసుకొచ్చి ఎత్తి అటు పడేస్తారు. ఇలాంటి వారందరిపై ఇలాంటి హెచ్చరికలే వర్తిస్తాయి అన్న విషయం వారు గమనించాలి. మరియు శ్మశాన స్థలాన్ని, ఖబరిస్తాన్ యొక్క స్థలాన్ని ఆక్రమించుకునే ఎన్నో వార్తలు ఇప్పటికీ వస్తూ ఉంటాయి. అలాంటి వారికి ఈ హదీసులు వినిపించాలి.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41790

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

ఖుర్ఆన్ హక్కులు: ఖుర్ఆన్ పై విశ్వాసం 
Rights of the Quran: Belief in the Quran
https://www.youtube.com/watch?v=oJlAj6X5D2I [9 నిముషాలు]
హబీబుర్రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 

ఈ ప్రసంగం ఇస్లాంలో పవిత్ర ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. వక్త ఖురాన్‌ను ఒక దైవిక గ్రంథంగా మరియు కేవలం ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే కాకుండా, యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథంగా పరిచయం చేస్తున్నారు. ఇది అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటిగా చెప్పబడింది. విశ్వాసులపై ఖురాన్‌కు ఉన్న హక్కులు ఈ ప్రసంగం యొక్క ప్రధాన అంశం, ప్రత్యేకించి మొదటి హక్కు అయిన దానిపై పూర్తి మరియు అచంచలమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటంపై దృష్టి పెడుతుంది. ఈ విశ్వాసం, ఖురాన్ అల్లాహ్ యొక్క కల్తీ లేని వాక్యమని, జిబ్రయీల్ దూత ద్వారా అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిందని నమ్మడాన్ని కలిగి ఉంటుంది. అంతేకాక, అల్లాహ్ స్వయంగా ఖురాన్‌ను ఎలాంటి మార్పుల నుండి అయినా సంరక్షిస్తానని హామీ ఇచ్చాడని, ఆ వాగ్దానం 1400 సంవత్సరాలకు పైగా నిజమని నిరూపించబడిందని ఈ ప్రసంగం నొక్కి చెబుతుంది.


إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు)
وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ
(వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ అ దహు)
أَمَّا بَعْدُ
(అమ్మా బ అద్)

అభిమాన సోదరులారా, కారుణ్య కడలి, రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం ఖుర్ఆన్ హక్కులలోని ఒక హక్కు గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మౌలిక విశ్వాసాలకి ముఖ్యమైన ఆధారాలలో ఖుర్ఆన్ గ్రంథం ప్రధానమైనది. ఈ గ్రంథం పూర్తిగా దివ్య సందేశం. ఈ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వం.

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు తన దాసులపై అమితమైన ప్రేమ. అందుకే అసంఖ్యాకమైన తన వరాలను వారిపై కురిపించాడు.ఆ వరాలలో, అంటే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనపైన కురిపించిన వరాలలో అత్యంత మహోన్నత వరం దివ్య ఖుర్ఆన్. ఈ గ్రంథం సులభమైనది. స్వార్థపరులు ఎంత ప్రయత్నించినా మార్పులు చేర్పులకు సాధ్యం కాని విధంగా పంపబడిన గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

మానవులు మరచిపోయిన ధర్మాన్ని పునర్జీవింపజేయడానికే ఖుర్ఆన్ అవతరించింది. ఖుర్ఆన్ గ్రంథం ఏదో ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. దీనిపై అధికార పెత్తనాలు చెలాయించే హక్కు ఏ వర్గానికీ లేదు. ఇది మనుషులందరి ఉమ్మడి సొత్తు. ఇది మానవులందరికీ మార్గదర్శకం. కనుక ఖుర్ఆన్ గ్రంథాన్ని అనుసరించేవారు తమ నిజ ప్రభువు ఆజ్ఞలను అనుసరిస్తున్నట్లే.ఇది క్లుప్తంగా నేను ఖుర్ఆన్ యొక్క పరిచయం చేశాను

మనపై ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. ఖుర్ఆన్ కొన్ని హక్కులు కలిగి ఉంది. అవేమిటో మనం తెలుసుకుందాం. కానీ ఖుర్ఆన్ యొక్క హక్కులలో ఈరోజు మనం మొదటి హక్కు, అనగా ఖుర్ఆన్ పై విశ్వాసం గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. మిగతావి తర్వాత తెలుసుకుందాం.

ఖుర్ఆన్ యొక్క మొదటి హక్కు ఏమిటంటే, ఖుర్ఆన్ పై విశ్వాసం. మనపై ఖుర్ఆన్ కు గల మొదటి హక్కు, దానిని మనం విశ్వసించాలి. మనస్ఫూర్తిగా నమ్మి, అంగీకరించి విశ్వసించాలి. ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఈ గ్రంథం, ఈ ఖుర్ఆన్ గ్రంథం, జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిందని నోటితో అంగీకరించి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మి, తన వాక్కాయ కర్మలతో ఆచరించాలి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా సెలవిచ్చాడు.

وَإِنَّهُ لَتَنزِيلُ رَبِّ الْعَالَمِينَ
(వ ఇన్నహు ల తన్జీలు రబ్బిల్ ఆలమీన్)
نَزَلَ بِهِ الرُّوحُ الْأَمِينُ
(నజల బిహిర్ రూహుల్ అమీన్)
عَلَىٰ قَلْبِكَ لِتَكُونَ مِنَ الْمُنذِرِينَ
(అలా ఖల్బిక లితకూన మినల్ మున్దిరీన్)
بِلِسَانٍ عَرَبِيٍّ مُّبِينٍ
(బి లిసానిన్ అరబియ్యిమ్ ముబీన్)

నిశ్చయంగా ఇది (ఈ ఖుర్‌ఆన్‌) సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. (ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది.(ఇది) సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. (అష్-షుఅరా 26:192-195)

దీని సారాంశం ఏమిటి? అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. జిబ్రయీల్ దైవదూత ద్వారా ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఖుర్ఆన్ వచ్చింది. సర్వ మానవుల కొరకు ఖుర్ఆన్ గ్రంథం వచ్చింది.

అభిమాన సోదరులారా, అంటే ఈ గ్రంథం ముమ్మాటికీ సర్వలోక ప్రభువైన అల్లాహ్ తరఫున పంపబడిన గ్రంథం. దీన్ని విశ్వసనీయుడైన దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని వచ్చారు. మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. సర్వ లోకాల, సర్వ మానవుల సన్మార్గం కోసం ఖుర్ఆన్ గ్రంథం అవతరింపబడినది.

ఖుర్ఆన్ ను విశ్వసించడం అంటే ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులు జరగలేదు, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా సురక్షితంగా ఉందని నమ్మాలి. ఖుర్ఆన్ గ్రంథంలో ఎటువంటి మార్పులు జరగలేదు, జరగవు కూడా. సురక్షితంగా ఉందని నమ్మాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్జిక్ర వ ఇన్నా లహూ లహాఫిజూన్)
నిశ్చయంగా ఈ హితోపదేశాన్ని (ఖుర్‌ఆన్‌ను) మేమే అవతరింపజేశాము. మరి మేమే దీనిని పరిరక్షిస్తాము. (అల్-హిజ్ర్ 15:9)

మేము ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము. కావున దివ్య ఖుర్ఆన్ స్వార్థపరుల కుయుక్తుల నుండి, అలాగే ప్రక్షిప్తాల బారి నుండి, మార్పులు చేర్పుల నుంచి కాపాడి స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను మేము స్వయంగా తీసుకున్నామని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా సెలవిచ్చాడు.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా చెప్పిన ఈ వాక్కు, ఈ ఆయత్ సత్యమని గత 1442 సంవత్సరాలుగా రూఢి అవుతూనే ఉంది.

సూరహ్ బఖరాలోనే రెండవ ఆయత్:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ ۛ هُدًى لِّلْمُتَّقِينَ
(జాలికల్ కితాబు లా రైబ ఫీహి, హుదల్ లిల్ ముత్తఖీన్)
ఈ గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు. భయభక్తులు కలవారికి ఇది సన్మార్గం చూపుతుంది. (అల్-బఖర 2:2)

అభిమాన సోదరులారా, సారాంశం ఏమనగా ఖుర్ఆన్ అల్లాహ్ పంపిన గ్రంథం. ఖుర్ఆన్ జిబ్రయీల్ దైవదూత ద్వారా పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన గ్రంథం. ఖుర్ఆన్ సర్వమానవులకు సన్మార్గం చూపటానికి పంపబడిన గ్రంథం. ఖుర్ఆన్ ఒక జాతికో, ఒక వర్గానికో చెందినది ఎంత మాత్రం కాదు. ఇది మానవులందరి ఉమ్మడి సొత్తు. అలాగే ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరించింది. ఖుర్ఆన్ లో ఎటువంటి మార్పులకి, చేర్పులకి తావు లేదు. మార్పులు చేర్పులు జరగలేదు, జరగవు. దానిని కాపాడే బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నాడు.

కావున, ఖుర్ఆన్ యొక్క హక్కులలో, మనపై ఖుర్ఆన్ కు గల హక్కులలో మొదటి హక్కు ఏమిటి? ఖుర్ఆన్ ను విశ్వసించడం. దానిని మనము విశ్వసించాలి. కేవలం విశ్వసిస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా విశ్వసించటమే కాకుండా ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. అవి ఇన్ షా అల్లాహ్ మనం వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

వ ఆఖిరు ద అ వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ
https://youtu.be/ztbp2wtF5do [6 min]

ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్‌కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

‎اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

‎قُرْآن كَلَامُ الله
(ఖురాన్ కలాముల్లాహ్)
ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.

ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.

అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.

జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.

అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్‌లో ఇలా తెలియజేశాడు:

‎تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ
(తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్)
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది. (39:1)

ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:

‎شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ
రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)

రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.

ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

‎وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

‎وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.