హజ్జ్ ఘనత – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

హజ్జ్ ఘనత
షేఖ్ సలీం జామిఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YE1Djv32h40 [50 నిముషాలు]

ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.

اَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్

గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు

ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.

చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.

కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్

హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్

అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.

దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:

بُنِيَ الْإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ
(బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్: షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వఅన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, వఇకామిస్సలాతి, వఈతాయిజ్జకాతి, వహజ్జు బైతిల్లాహి, వసౌమి రమదాన్)

ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.

ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.

ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.

ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.

ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.

అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.

ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.

హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:

الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ
(అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్)
స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.

అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.

రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.

ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.

ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

أَمَا عَلِمْتَ أَنَّ الْإِسْلَامَ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ، وَأَنَّ الْهِجْرَةَ تَهْدِمُ مَا كَانَ قَبْلَهَا، وَأَنَّ الْحَجَّ يَهْدِمُ مَا كَانَ قَبْلَهُ

“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.

ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.

మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.

అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:

أَدِيمُوا الْحَجَّ وَالْعُمْرَةَ فَإِنَّهُمَا يَنْفِيَانِ الْفَقْرَ وَالذُّنُوبَ كَمَا تَنْفِي الْكِيرُ خَبَثَ الْحَدِيدِ

మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.

అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:

أَيُّ الْعَمَلِ أَفْضَلُ
(అయ్యుల్ అమలి అఫ్దల్)
ఏ సత్కార్యము గొప్పది?

అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:

إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ
(ఈమాను బిల్లాహి వ రసూలిహి)
అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.

గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:

جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ
(జిహాదున్ ఫీ సబీలిల్లాహ్)
అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.

మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

حَجٌّ مَبْرُورٌ
(హజ్జున్ మబ్రూర్)
స్వీకరించబడిన హజ్.

అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.

అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:

لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ
(లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్)
మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]

మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ
(జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా)
వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.

అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.

అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:

الْغَازِي فِي سَبِيلِ اللَّهِ، وَالْحَاجُّ، وَالْمُعْتَمِرُ وَفْدُ اللَّهِ، دَعَاهُمْ فَأَجَابُوهُ وَسَأَلُوهُ فَأَعْطَاهُمْ

అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.

అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.

మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.

దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.

అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:

مَنْ خَرَجَ حَاجًّا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْحَاجِّ إِلَى يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ خَرَجَ مُعْتَمِرًا فَمَاتَ، كُتِبَ لَهُ أَجْرُ الْمُعْتَمِرِ إِلَى يَوْمِ الْقِيَامَةِ

ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)

అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:

اغْسِلُوهُ بِمَاءٍ وَسِدْرٍ، وَكَفِّنُوهُ فِي ثَوْبَيْهِ، وَلاَ تُخَمِّرُوا رَأْسَهُ، وَلاَ تُحَنِّطُوهُ، فَإِنَّهُ يُبْعَثُ يَوْمَ الْقِيَامَةِ مُلَبِّيًا

“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”

అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను

لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ
(లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్)
“ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”

అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.

ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.

ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,

“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.

ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.

మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.

ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.

కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.

అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.

హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:

స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:

مَنْ أَرَادَ الْحَجَّ فَلْيَتَعَجَّلْ، فَإِنَّهُ قَدْ يَمْرَضُ الْمَرِيضُ، وَتَضِلُّ الضَّالَّةُ، وَتَعْرِضُ الْحَاجَةُ
(మన్ అరాదల్ హజ్జ ఫల్ యతఅజ్జల్, ఫఇన్నహు ఖద్ యమ్రదుల్ మరీదు, వ తదిల్లుజ్జాలతు, వ త’అరిదుల్ హాజతు)

ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.

కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.

చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.

అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.

ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”

అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.

ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا
(యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,

ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:

وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ

అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?

అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.

అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:

فَلَا رَفَثَ وَلَا فُسُوقَ وَلَا جِدَالَ فِي الْحَجِّ
(ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల ఫిల్ హజ్జ్)
హజ్‌ దినాలలో – కామ క్రీడలకు, పాపకార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి.” (2:197)

ప్రవక్త వారు తెలియజేశారు:

مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ
(మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు)
“ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”

ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:

يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا
(యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ)
“ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”

ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:

لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ
(లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్)
“నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”

నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.

అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:

لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ
(లబ్బైక్ అన్ షుబ్రుమా)
“ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ
(హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా)
“ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”

కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.

అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.

ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:

نَعَمْ وَلَكِ أَجْرٌ
(నఅమ్ వలకి అజ్ర్)
“అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”

“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.

ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.

మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.

అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.

అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.

అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.

అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.

ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్

వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43235

హజ్జ్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/


సూరతు ఖురైష్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – నసీరుద్దీన్ జామిఈ

ఈ తఫ్సీర్ తయారు చేయడంలో మద్ధతు లభించినది:

1. షేఖ్ మఖ్సూదుల్ హసన్ ఫైజీ హఫిజహుల్లాహ్ వీడియో ద్వారా.
2. షేఖ్ అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ ద్వారా.
3. ప్రఖ్యాతిగాంచిన [ఇబ్ను కసీర్] ద్వారా.

الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله، أما بعد!

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ ۝ فَلْيَعْبُدُوا رَبَّ هَذَا الْبَيْتِ ۝ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآَمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు.

ఇది ‘సూరా ఖురైష్’ పేరుతో పిలువబడుతుంది. ఈ సూరా మొదటి ఆయత్ లోనే ‘ఖురైష్’ అనే పదం వచ్చింది. మరియు ప్రత్యేకంగా ఈ సూరా ‘ఖురైష్’ (మక్కాలోని తెగ) వారి గురించి అవతరించింది. అల్లాహ్ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విశ్వాసం తీసుకురావాలని మరియు వారు కాబా గృహం పట్ల గౌరవం చూపాలని ఖురైష్ లకు ఆదేశించాడు.

నిజానికి, ఈ పూర్తి సూరా ఖురైష్ గురించే అవతరించింది. ఇమామ్ బైహకీ (రహిమహుల్లాహ్) తన పుస్తకం ‘అల్-ఖిలాఫియాత్’ లో మరియు అల్లామా అల్బానీ (రహిమహుల్లాహ్) తన ‘అస్-సహీహా’ లో ఉల్లేఖించిన హదీసు ప్రకారం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

فَضَّلَ اللَّهُ قُرَيْشًا بِسَبْعِ خِلَالٍ: أَنِّي فِيهِمْ، وَأَنَّ النُّبُوَّةَ فِيهِمْ، وَالْحِجَابَةَ، وَالسِّقَايَةَ فِيهِمْ، وَأَنَّ اللَّهَ نَصَرَهُمْ عَلَى الْفِيلِ، وَأَنَّهُمْ عَبَدُوا اللَّهَ عَشْرَ سِنِينَ لَا يَعْبُدُهُ غَيْرُهُمْ، وَأَنَّ اللَّهَ أَنْزَلَ فِيهِمْ سُورَةً مِنَ الْقُرْآنِ

“అల్లాహ్ ఖురైష్ కు ఏడు ప్రత్యేకతలను ఇచ్చాడు, అవి మరే తెగకు ఇవ్వలేదు: నేను (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఖురైష్ వంశానికి చెందినవాడిని. వారిలో నుండే అల్లాహ్ ప్రవక్తలను ఎన్నుకున్నాడు. అల్లాహ్ తన పవిత్ర గృహం (బైతుల్లాహ్ – కాబా) సేవ కోసం, హాజీలకు నీరు త్రాగించడం కోసం వీరినే ఎంపిక చేశాడు. అల్లాహ్ ఏనుగుల సైన్యం (అసహబె ఫీల్) పై, అంటే అబ్రహా మరియు అతని సైన్యం పై, ఖురైష్ లకు అద్భుతమైన రీతిలో సహాయం చేశాడు (వారిని కాపాడాడు).ప్రవక్త పదవికి ముందు, పది సంవత్సరాల పాటు వీరు మాత్రమే అల్లాహ్ ను ఆరాధించేవారు, వీరితో పాటు వేరెవరూ లేరు. అల్లాహ్ వారి గౌరవార్థం ఒక పూర్తి సూరాను అవతరింపజేశాడు, అదే ‘సూరా ఖురైష్’. (అల్ ఖిలాఫియాత్: బైహఖీ 1517, సహీహా 1944).

ఈ సూరాలో అల్లాహ్ మక్కా వాసులకు, ప్రత్యేకంగా ఖురైష్ కు తన అనుగ్రహాలను గుర్తు చేశాడు. ఆ అనుగ్రహాలను అర్థం చేసుకోవడానికి, ఖురైష్ ల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) తన కుమారుడు ఇస్మాయిల్ (అలైహిస్సలాం) ను మక్కాలో వదిలినప్పుడు, అక్కడ బనూ జుర్హుమ్ అనే తెగ యెమెన్ నుండి వచ్చి వారితో పాటు స్థిరపడింది. హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) వారిలోనే వివాహం చేసుకున్నారు, అలా వారంతా కలిసిపోయారు.

కాలం గడిచేకొద్దీ, హజ్రత్ ఇస్మాయిల్ (అలైహిస్సలాం) మరియు హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) బోధనలు మరుగున పడిపోయాయి. వారిలో కుఫ్ర్ (అవిశ్వాసం) మరియు షిర్క్ (బహుదైవారాధన) తో పాటు అన్యాయం కూడా పెరిగిపోయింది. అల్లాహ్ కు అన్యాయం నచ్చదు. అల్లాహ్ [సూరా అల్-హజ్: 25]లో ఇలా తెలిపాడడు:

وَمَن يُرِدْ فِيهِ بِإِلْحَادٍ بِظُلْمٍ نُذِقْهُ مِنْ عَذَابٍ أَلِيمٍ

{మరియు ఎవరైతే ఇందులో (మక్కాలో) అన్యాయంతో కూడిన చెడును తలపెడతారో, వారికి మేము బాధాకరమైన శిక్షను రుచి చూపిస్తాము.}

వారిలో ఈ చెడులు పెరగడంతో, బనూ ఖుజా అనే మరో తెగ వచ్చి వారిపై దాడి చేసి, వారిని ఓడించి మక్కా నుండి తరిమికొట్టింది. జుర్హుమ్ తెగ వారు పారిపోతూ జమ్ జమ్ బావిని పూడ్చివేశారు. అలా మక్కా బనూ ఖుజా చేతిలోకి వెళ్ళింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముత్తాత ఖుసయ్ ఇబ్న్ కిలాబ్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ఖుసయ్ తన బలాన్ని కూడగట్టుకుని, బనూ ఖుజాను ఓడించి, మక్కాపై తిరిగి ఆధిపత్యం సాధించాడు. ఖురైష్ తెగ చెల్లాచెదురుగా ఉన్నప్పుడు, వారిని ఏకం చేసి మక్కాలో మళ్ళీ స్థిరపరిచాడు. అందుకే ఈ కలయికను ‘ఈలాఫ్‘ (ఐక్యమత్యం/అలవాటు చేయడం) అన్నారు. ‘ఈలాఫ్’ అంటే ఉల్ఫత్ (ప్రేమ/కలయిక) నుండి వచ్చింది. అంటే ఒకే ఆలోచన కలిగిన వారిని ఒక చోట చేర్చడం. అందుకే పుస్తకం వ్రాయడాన్ని ‘తాలీఫ్‘ అంటారు (విషయాలను ఒక చోట చేర్చడం).

ఖురైష్ వారు ఒకే తెగ, ఒకే కుటుంబం కాబట్టి అల్లాహ్ వారిని మళ్ళీ ఏకం చేయడాన్ని ‘ఈలాఫ్’ అన్నాడు. ఇది అల్లాహ్ వారిపై చూపిన గొప్ప దయ. వారు మక్కా నుండి దూరమై, పరాయివారైపోయిన తర్వాత, అల్లాహ్ వారిని మళ్ళీ ఇక్కడ చేర్చాడు.

అల్లాహ్ ఈ సూరాలో ఇలా అంటున్నాడు:

ఇక్కడ ‘లి’ (لِ) అనే అక్షరానికి రెండు అర్థాలు ఉన్నాయి.

ఒక అర్థం: ఇది మునుపటి సూరా ‘అలమ్ తర కైఫ’ (సూరా ఫీల్) కు కొనసాగింపు. అందుకే కొంతమంది పారాయణంలో ‘బిస్మిల్లాహ్’ లేకుండా దీనిని చదువుతారు (అంటే రెండు సూరాలను కలిపి). అంటే అల్లాహ్ ఏనుగుల సైన్యాన్ని ఎందుకు నాశనం చేశాడంటే – ఖురైష్ లకు రక్షణ కల్పించి, వారిని ఏకం చేయడానికి.

రెండవ అర్థం: ‘ఆశ్చర్యం’ (తఅజ్జుబ్) వ్యక్తం చేయడం. అంటే ఖురైష్ ల పరిస్థితి చూసి ఆశ్చర్యం కలగాలి. అల్లాహ్ వారిని ఇంతగా కరుణించి, వారికి రక్షణ కల్పిస్తే, వారు అల్లాహ్ ను వదిలి విగ్రహాలను ఆరాధిస్తున్నారు.

ఇక్కడ మరొక విషయం ఉంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తాత హాషిమ్, ఖుసయ్ యొక్క మనవడు. ఇతను చాలా తెలివైనవాడు. అప్పట్లో మక్కా వాసులకు వ్యాపారం తప్ప వేరే ఆధారం లేదు. హాషిమ్ ఆలోచించి, వాణిజ్య యాత్రలను (Trade Journeys) ప్రారంభించాడు. అతను యెమెన్, ఇరాక్, సిరియా (షామ్), మరియు హబషా (ఇథియోపియా) రాజులతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. దీని వల్ల మక్కా వాసులు సురక్షితంగా వ్యాపారం చేసుకోగలిగారు.

సంవత్సరంలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉండేవి:

(1) శీతాకాలం (Winter): యెమెన్ వైపు వెళ్ళేవారు (ఎందుకంటే అక్కడ ఆ సమయంలో వాతావరణం వెచ్చగా ఉండేది).
(2) వేసవికాలం (Summer): సిరియా (షామ్) వైపు వెళ్ళేవారు (అక్కడ చల్లగా ఉండేది).

ఈ ప్రయాణాల ద్వారా మక్కా వాసులు ధనవంతులయ్యారు, వారి ఆకలి తీరింది. అల్లాహ్ వారిపై చేసిన ఈ ఉపకారాన్ని గుర్తు చేస్తున్నాడు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రహా (ఏనుగుల సైన్యం) మక్కాపై దాడి చేయడానికి వచ్చినప్పుడు, అల్లాహ్ అద్భుతమైన రీతిలో పక్షులతో వారిని నాశనం చేశాడు. దీంతో అరబ్బులందరిలో ఖురైష్ ల పట్ల గౌరవం పెరిగింది. “వీరు అల్లాహ్ ఇంటి రక్షకులు, అల్లాహ్ వీరికి సహాయం చేశాడు” అని అందరూ వీరిని గౌరవించేవారు. ఎంతగా అంటే, వీరి వాణిజ్య బిడారులు (Caravans) ఎక్కడికి వెళ్ళినా ఎవరూ వీరిని దోచుకునేవారు కాదు. మిగతా వారిని దారి దోపిడి దొంగలు దోచుకునేవారు, కానీ ఖురైష్ లను మాత్రం ఎవరూ ముట్టుకునేవారు కాదు. పైగా వీరి రక్షణ కోసం ఒప్పందాలు కూడా ఉండేవి.

అందుకే అల్లాహ్ అంటున్నాడు:

لِإِيلَافِ قُرَيْشٍ ۝ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ
ఖురైష్ లకు శీతాకాల మరియు వేసవికాల ప్రయాణాలు సులభం చేసి, వాటిని అలవాటు చేసినందుకు (వారు కృతజ్ఞత చూపాలి)

వారు ఈ ప్రయాణాలను ఎంత ధైర్యంగా, నిశ్చింతగా చేసేవారంటే, వారికి దారిలో ఎలాంటి భయం ఉండేది కాదు. అల్లాహ్ వారికి ఇచ్చిన ఈ భద్రత, ఈ ఐక్యత చూసి ఆశ్చర్యం కలుగుతుంది, అయినప్పటికీ వారు అల్లాహ్ ను ఆరాధించడం లేదు.

వారికి ఈ భద్రత రావడానికి కారణం ఈ ఇల్లు (కాబా). అల్లాహ్ మరో చోట [సూర అన్ కబూత్ 29:67]లో ఇలా తెలిపాడు:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు).

చుట్టూ ఉన్నవారిని దోచుకుంటున్నారు, చంపుతున్నారు, కానీ మక్కాలో ఉన్నవారికి మాత్రం పూర్తి రక్షణ ఉంది. అయినా వారు అసత్య దైవాలను నమ్ముతారా? అల్లాహ్ అనుగ్రహాన్ని కాదంటారా?

అల్లాహ్ ను వదలి ఇతరులను ఆరాధిస్తారా. చదవండి అల్లాహ్ ఆదేశం:

إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా (హరమ్) చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (నమ్ల్ 27:91) [ఇబ్ను కసీర్].

మక్కాలో ఏ పంటలు పండవు, ఏ పండ్ల తోటలు లేవు. అది రాళ్ళతో నిండిన లోయ (వాది గైరి జీ జరా). అయినా అక్కడ ప్రపంచంలోని అన్ని రకాల పండ్లు, ఆహార పదార్థాలు వస్తున్నాయి. అల్లాహ్ వారికి ఆకలి తీరుస్తున్నాడు.

చుట్టుపక్కల అందరూ భయంతో బ్రతుకుతుంటే, ఖురైష్ లకు మాత్రం అల్లాహ్ ఏ భయం లేకుండా చేశాడు. మక్కాలో ఉన్నప్పుడు భయం లేదు, బయట ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా భయం లేదు.

ముగింపు: దీని సారాంశం ఏమిటంటే, అల్లాహు తఆలా ఖురైష్ కు, మరియు మనందరికీ ఒక పాఠం నేర్పుతున్నాడు. అల్లాహ్ మనకు ఇచ్చిన రెండు గొప్ప వరాలు: 1. ఆకలి నుండి విముక్తి (ఆహారం), 2. భయం నుండి విముక్తి (శాంతి/భద్రత). ఎవరికైతే ఈ రెండు ఉన్నాయో, వారు అల్లాహ్ కు కృతజ్ఞతగా ఆయనను మాత్రమే ఆరాధించాలి.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక హదీసులో ఇలా అన్నారు:

مَنْ أَصْبَحَ مِنْكُمْ آمِنًا فِي سِرْبِهِ، مُعَافًى فِي جَسَدِهِ، عِنْدَهُ قُوتُ يَوْمِهِ، فَكَأَنَّمَا حِيزَتْ لَهُ الدُّنْيَا

మీలో ఎవరైతే ఉదయం లేచేసరికి తన కుటుంబంలో (లేదా తన గూటిలో) సురక్షితంగా ఉంటారో, శరీర ఆరోగ్యంతో ఉంటారో, మరియు ఆ రోజుకు సరిపడా ఆహారం వారి దగ్గర ఉంటుందో – వారికి ప్రపంచం మొత్తం ఇవ్వబడినట్లే. [సునన్ తిర్మిదీ: 2346. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ హసన్ అన్నారు].

కాబట్టి, మనకు ఆరోగ్యం, భద్రత, మరియు ఆహారం ఉన్నప్పుడు, మనం మన సమయాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. కేవలం ప్రపంచం వెనుక పరుగెత్తకూడదు. ఎవరైతే అల్లాహ్ ను ఆరాధిస్తారో, అల్లాహ్ వారికి ఇహలోకంలోనూ, పరలోకంలోనూ భద్రతను మరియు ఆహారాన్ని ప్రసాదిస్తాడు.

అల్లాహ్ మనందరికీ తన అనుగ్రహాలను గుర్తించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకు ఆకలి మరియు భయం నుండి రక్షణ కల్పించుగాక. ఆమీన్.

వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

* మౌలానా అబ్దుస్ సలాం భుట్వీ రహిమహుల్లాహ్ వారి తఫ్సీర్ లోని కొన్ని విషయాలు చదవండి:

మొదటి ఉపకారం ఏమిటంటే, వారి హృదయాలలో ప్రయాణం పట్ల ప్రేమను కలిగించాడు. వారికి చలికాలం ప్రయాణంలో గానీ, వేసవికాలం ప్రయాణంలో గానీ ఎలాంటి కష్టం అనిపించేది కాదు. మరియు ప్రపంచంలో ప్రయాణమే విజయానికి మార్గం. ఒకవేళ అల్లాహు తఆలా వారి హృదయాలను ప్రయాణానికి అలవాటు చేసి ఉండకపోతే, వారు కూడా తమ ఇళ్లలోనే కూర్చుని ఉండేవారు. ప్రయాణం వల్ల లభించే సిరిసంపదలు, అనుభవం, జ్ఞానం మరియు ప్రపంచంలోని ప్రజలతో, ప్రాంతాలతో ఏర్పడే పరిచయం వారికి ఎప్పటికీ లభించేవి కావు.

ప్రయాణానికి అలవాటు పడటమనే ఈ వరమే ఖురైషీలకు ఆ తర్వాత హిజ్రత్ (వలస) ప్రయాణంలో ఉపయోగపడింది. ఆ తర్వాత అవిశ్వాసులతో యుద్ధంలోనూ, దాని తర్వాత రోమ్ మరియు షామ్, ఇరాక్ మరియు పర్షియా, హింద్ మరియు సింధ్, ఈజిప్ట్ మరియు ఆఫ్రికా, ఇంకా తూర్పు పడమరల విజయాలలో కూడా ఉపయోగపడింది. వాస్తవం ఏమిటంటే, ముస్లిం జాతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడానికి మరియు గెలిచి నిలబడటానికి మొదటి అడుగు ఏమిటంటే, వారు ప్రయాణాలంటే భయపడకూడదు మరియు బయలుదేరే అవకాశం వచ్చినప్పుడు భూమిని పట్టుకుని (ఇక్కడే) ఉండిపోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాము, అవిశ్వాస జాతులే నేల, నీరు మరియు ఆకాశ మార్గ ప్రయాణాలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నాయి. ముస్లింలు చాలా వరకు ఈ పాఠాన్ని మర్చిపోయారు.

రెండవ ఉపకారం ఏమిటంటే, ఆ సమయంలో అరేబియా అంతటా తీవ్రమైన అశాంతి ఉండేది. ఎవరిపై ఎప్పుడు దాడి జరుగుతుందో, ఎవరిని చంపేస్తారో, లేదా ఎత్తుకెళ్తారో, లేదా ఆస్తిని దోచుకుంటారో మరియు స్త్రీలను, పిల్లలను బానిసలుగా చేసుకుంటారో ఎవరికీ తెలిసేది కాదు. ఇలాంటి పరిస్థితులలో కేవలం మక్కా వాసులకు మాత్రమే ఈ శాంతి (భద్రత) లభించింది, వారి వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అల్లాహ్ సెలవిచ్చినట్లుగా:

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు (దోచుకోబడుతున్నారు). [అన్ కబూత్ 29:67]

మూడవ ఉపకారం ఏమిటంటే, హరమ్ (మక్కా) వాసులైనందున వ్యాపార ప్రయాణాలలో ఎవరూ వారి బిడారు (కాఫిలా)ను దోచుకునేవారు కాదు. ప్రతి తెగ మరియు ప్రతి జాతి తమ ప్రాంతం గుండా వెళ్ళే వారి నుండి తీసుకునే పన్నులు వీరి నుండి తీసుకునేవారు కాదు. మరియు వీరిని ఎక్కడికి వెళ్ళకుండా ఆపేవారు కాదు.

నాలుగవది ఏమిటంటే, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హజ్ మరియు ఉమ్రా కోసం మక్కాకు వచ్చేవారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సరుకులు ఇక్కడికి చేరేవి. ఇవే కాకుండా, ఇబ్రహీం (అలైహిస్సలాం) ప్రార్థన ఫలితంగా అన్ని రకాల పండ్లు ఇక్కడికి చేరేవి. అల్లాహ్ సెలవిచ్చాడు:

أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا آمِنًا يُجْبَىٰ إِلَيْهِ ثَمَرَاتُ كُلِّ شَيْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

ఏమిటి? మేము వారికి సురక్షితమైన, పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా? అక్కడ వారికి అన్ని రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మావద్ద నుంచి సరఫరా చేయబడలేదా? కాని వారిలోని చాలా మంది (ఈ యదార్థాన్ని) తెలుసుకోరు. (ఖసస్ 28:57).

ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆ ప్రస్తావన సూర బఖర (2:126), సూర ఇబ్రాహీం (14:37)లో చూడవచ్చును. [mnj],

ఈ వ్యాపార ప్రయాణాలు మరియు మక్కా వ్యాపారానికి యజమానులైనందున ఖురైషీలు అత్యంత ధనవంతులుగా ఉండేవారు. మరియు హరమ్ యొక్క శుభం (బర్కత్) వల్ల శాంతి భద్రతలను కూడా పొంది ఉండేవారు. స్పష్టంగా ఈ వరాలన్నీ అల్లాహ్ ఇంటి బర్కత్ వల్లనే లభించాయి మరియు కేవలం ప్రభువు ప్రసాదించినవి మాత్రమే. అలాంటప్పుడు, ఈ వరాలన్నీ ఈ ఇంటి యజమాని ఇచ్చినప్పుడు, మీరు ఆ ఒక్కడినే ఎందుకు ఆరాధించరు? మరియు ఇతరులను ఆయనకు సాటిగా కల్పించి వారి ముందు ఎందుకు సాష్టాంగ (సజ్దా) పడుతున్నారు? వారి ఆస్థానాల వద్ద ఎందుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు మరియు కానుకలు సమర్పిస్తున్నారు?

* “లి ఈలాఫి ఖురైష్” (ఖురైషీల హృదయంలో ప్రేమను కలిగించినందువల్ల) ఒకవేళ ఈ ఇతర అసంఖ్యాకమైన వరాల కారణంగా వీరు ఒక్క అల్లాహు తఆలాను ఆరాధించకపోయినా, కనీసం ఈ ఇంటి ప్రభువు అయినందువల్లనైనా ఆయనను ఆరాధించాలి. ఏ ఇంటి బర్కత్ వల్లనైతే వారికి చలి మరియు వేసవిలో ప్రయాణించే అవకాశం, శాశ్వత శాంతి భద్రతలు మరియు సమృద్ధిగా ఉపాధి వరాలు లభిస్తున్నాయో.

ఏ ప్రదేశంలోనైనా శాంతి ఉండటం అల్లాహు తఆలా యొక్క చాలా గొప్ప వరం. మనం కూడా ఉపాధిలో విశాలత మరియు శాంతి లాంటి వరంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయననే ఆరాధించాలి. అల్లాహ్ కాని వారి ఆరాధన మరియు షిర్క్ (బహుదైవారాధన) నుండి దూరంగా ఉండాలి. షిర్క్ కేంద్రాలను నిర్మించడం మరియు అభివృద్ధి చేయడానికి బదులుగా, తౌహీద్ (ఏక దైవారాధన) కేంద్రాలను నిర్మించి, అభివృద్ధి చేయాలి. ఒకవేళ మనం అలా చేయకపోతే, ఉపాధిలో సంకుచితత్వం మరియు అశాంతి, కల్లోలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా.

దీనికి ఆధారం చూడండి సూరతున్ నహ్ల్ (16:112)లో:

وَضَرَبَ اللَّهُ مَثَلا قَرْيَةً كَانَتْ آمِنَةً مُطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِنْ كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّهِ فَأَذَاقَهَا اللَّهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ

అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. [ఇబ్ను కసీర్].

సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో & టెక్స్ట్]

సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) & సమాధుల వైపు నమాజ్ చెయ్యడం
https://youtu.be/mtb-SmruW8E [6 నిముషాలు]
షేఖ్ హబీబుర్రహ్మాన్ జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగంలో, సమాధుల చుట్టూ ప్రదక్షిణ (తవాఫ్) చేయడం మరియు వాటి వైపు తిరిగి నమాజ్ చేయడం ఇస్లాంలో నిషేధించబడినవని స్పష్టంగా వివరించబడింది. తవాఫ్ అనేది మక్కాలోని కాబతుల్లాహ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధన అని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో నొక్కి చెప్పబడింది. ప్రవక్తల సమాధులను ఆరాధనా స్థలాలుగా మార్చుకున్న వారిని అల్లాహ్ శపించాడని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాధిని పూజించే స్థలంగా మార్చవద్దని ప్రార్థించారని ఉల్లేఖించబడింది. ప్రవక్త యొక్క మస్జిద్ (మస్జిదె నబవి) ఎంతో పవిత్రమైనదైనప్పటికీ, దాని చుట్టూ కూడా తవాఫ్ చేయడానికి అనుమతి లేనప్పుడు, ఇతర సమాధులు లేదా దర్గాల చుట్టూ తిరగడం ఘోరమైన పాపం (షిర్క్) అవుతుందని హెచ్చరించబడింది. ముస్లింలు ఇలాంటి షిర్క్ మరియు బిద్అత్ (మతంలో నూతన కల్పనలు)లకు దూరంగా ఉండాలని ప్రసంగం ముగిసింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అదహు అమ్మా బ’అద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనం అనే ఈ 12వ ఎపిసోడ్లో, సమాధుల ప్రదక్షిణం చేయటం, దాని వాస్తవికత ఏమిటో తెలుసుకుందాం. సోదరులారా, మన సమాజంలో కొందరు అమాయకులు, అజ్ఞానం వల్లో అలాగే ఇస్లాం గురించి సరైన అవగాహనం లేనందువల్ల సమాధుల వద్ద పోయి పూజిస్తున్నారు, సమాధుల తవాఫ్ (ప్రదక్షిణం) చేస్తున్నారు.

ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తవాఫ్ తప్ప ఇతరుల తవాఫ్‌కి అనుమతి లేదు. అది ఎంత పవిత్రమైన స్థలమైనా సరే, కాబతుల్లాహ్ తప్ప మరేదానిని తవాఫ్ చేయకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు,

وَلْيَطَّوَّفُوا بِالْبَيْتِ الْعَتِيقِ
(వల్ యత్తవ్వఫూ బిల్ బైతిల్ అతీఖ్)
వారు ఆ ప్రాచీన గృహానికి (కాబతుల్లాహ్కు) ప్రదక్షిణ చేయాలి. (22:29)

అంటే ఆ కాబతుల్లాకి తవాఫ్ చేయాలి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఈ హదీస్ ఇబ్నె మాజాలో ఉంది, ఎవరైతే ఆ కాబతుల్లాకి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తాడో, తవాఫ్ చేస్తాడో, ఆ తర్వాత రెండు రకాత్ నమాజులు పాటిస్తాడో, ఆ వ్యక్తికి ఒక బానిసను విముక్తి ప్రసాదించే అంత పుణ్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయడం అది అధర్మము, అసత్యము, అది హరామ్ అవుతుంది. కొందరు మదీనాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వైపు తిరిగి ప్రార్థనలు చేస్తారు, వేడుకుంటారు, దుఆ చేస్తారు, నమాజ్ చేస్తారు, ఇది అధర్మం. ఈ విషయం గురించి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కఠినంగా ఖండించారు.

అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,

لَعَنَ اللَّهُ الْيَهُودَ وَالنَّصَارَى اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
(ల’అనల్లాహుల్ యహూద వన్ నసారా ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా)
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యూదుల పైన మరియు క్రైస్తవుల పైన శపించుగాక! ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులను సజ్దాగా(ఆరాధన స్థలాలు) చేసుకున్నారు. (ముత్తఫకున్ అలైహ్)

అంటే మస్జిద్ గా చేసుకున్నారు. అంటే సజ్దా అల్లాహ్ కోసమే చేయాలి. అది మనము నమాజ్ ఎక్కడ చేస్తాము? మస్జిద్ కి పోయి చేస్తాము. కాకపోతే యోధులు మరియు క్రైస్తవులు ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చేశారు, మస్జిదులుగా ఖరారు చేసుకున్నారు.

అలాగే అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,

اللَّهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا يُعْبَدُ
(అల్లాహుమ్మ లా తజ్’అల్ ఖబ్రీ వసనన్ యు’బద్)
ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చకు.

అంటే, ఓ అల్లాహ్, నేను చనిపోయిన తర్వాత నా సమాజంలో, నా ఉమ్మత్ లో కొంతమంది రావచ్చు, వచ్చి నా సమాధి వైపు తిరగవచ్చు, ప్రదక్షిణం చేయవచ్చు, కాకపోతే ఓ అల్లాహ్ నువ్వు నా సమాధిని ప్రార్థనాలయంగా మార్చవద్దు.

اشْتَدَّ غَضَبُ اللَّهِ عَلَى قَوْمٍ اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ
(ఇష్టద్ద గదబుల్లాహి అలా ఖౌమిన్ ఇత్తఖదూ ఖుబూర అంబియా’ఇహిమ్ మసాజిదా)

ఆ జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుంది, ఏ జాతి పైన?

ఏ జాతి వారు, ఏ వర్గం వారు ఎవరైతే ప్రవక్తల సమాధులను ప్రదక్షిణం చేస్తారో, ప్రవక్తల సమాధులను ఆరాధన స్థలంగా మార్చుకుంటారో, అటువంటి జాతి పైన అల్లాహ్ యొక్క క్రోధం కఠినంగా మారిపోతుందని” అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ లో తెలియజేశారు.

అభిమాన సోదరులారా, అలాగే సమాధుల వైపునకు ముఖాన్ని త్రిప్పి నమాజ్ చేయకూడదు. ఎటువైపు త్రిప్పి నమాజ్ చేయాలి? అది కేవలం కాబతుల్లాహ్ వైపు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా తెలియజేశాడు సూరతుల్ బఖరాలో,

فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ
(ఫవల్లి వజ్’హక షతరల్ మస్జిదిల్ హరామ్)
నీ ముఖాన్ని మస్జిదె హరామ్ వైపునకు త్రిప్పు. (2:144)

అభిమాన సోదరులారా, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, “మీరు సమాధుల పై గానీ, సమాధుల వైపునకు గానీ ముఖాలను త్రిప్పి నమాజు చేయకండి.”

అభిమాన సోదరులారా, ఇక్కడ గమనించే విషయం ఏమిటంటే, ఈ భూమండలంలో కాబతుల్లాహ్ తర్వాత, మస్జిదె హరామ్ తర్వాత పవిత్రమైన స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి మస్జిదె నబవి, రెండవది మస్జిదె అఖ్సా.

మస్జిదె హరామ్, మస్జిదె నబవి, మస్జిదె అఖ్సా – ఈ మూడు మస్జిదులకు నమాజ్ చేసే ఉద్దేశంతో ప్రయాణం చేయవచ్చు. మస్జిదె నబవిలో ఒక నమాజ్ చేస్తే వెయ్యి నమాజుల పుణ్యం అంత లభిస్తుంది. అంటే అది హరమ్ అది. ఏ విధంగా మస్జిదె హరామ్ హరమ్ కిందికి వస్తుందో, అలాగే మస్జిదె నబవి కూడా హరమ్ లో వస్తుంది. అయినప్పటికీ, ఆ మస్జిదె నబవి యొక్క ప్రదక్షిణం చేయటం కూడా ధర్మసమ్మతం కాదు, మరి మనం దర్గాలకు, దర్గాల వైపు తిరుగుతున్నాము, సమాధుల వైపు తిరుగుతున్నాము, బాబాలని, పీర్లని, ఔలియాలని… మన ప్రవక్త కంటే పెద్ద వలీ ఎవరండీ?

కాకపోతే ఈ కాబతుల్లా తవాఫ్ తప్ప, కాబతుల్లా ప్రదక్షిణం తప్ప ప్రపంచంలో, ఈ భూమండలంలో దేనిని ప్రదక్షిణం చేసినా అది అధర్మం అవుతుంది. ఈ విషయం గురించి ఎన్నో వందలాది హదీసులు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి, బిద్ఆ నుండి, ఖురాఫాతు నుండి కాపాడుగాక. ఇస్లాం పట్ల సరైన అవగాహనను అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.

వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43459

తౌహీద్ & షిర్క్:
https://teluguislam.net/tawheed-shirk/


మక్కా విశిష్టత [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

మక్కా విశిష్టత (Importance of Makkah)
https://youtu.be/TLNWmdSKxEk [43 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, మక్కా నగరం యొక్క ఇస్లామీయ ప్రాముఖ్యత, ఘనత మరియు పవిత్రత గురించి వివరించబడింది. అల్లాహ్ తన సృష్టిలో కొన్ని ప్రదేశాలకు, కాలాలకు మరియు వ్యక్తులకు ఇతరులపై ఘనతను ప్రసాదించాడని, ఇది ఆయన సంపూర్ణ వివేకం మరియు శక్తికి నిదర్శనమని ప్రసంగం మొదలవుతుంది. మక్కా అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశమని, అది మానవాళి కోసం నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధన గృహం (కాబా) ఉన్న నగరమని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేయబడింది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం చరిత్ర, ఆయన తన భార్య హాజర్ మరియు కుమారుడు ఇస్మాయిల్ ను ఆ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళడం, జమ్ జమ్ బావి ఆవిర్భావం మరియు మక్కా నగరం ఎలా ఏర్పడిందో వివరించబడింది. మక్కా యొక్క పవిత్రత (హరమ్), అక్కడ వర్తించే ప్రత్యేక నియమాలు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దానికున్న ప్రాముఖ్యత కూడా చర్చించబడ్డాయి. చివరగా, కాబా మరియు హజర్ అల్-అస్వద్ (నల్లరాయి) గురించి ఉన్న కొన్ని అపోహలను తొలగించి, వాటి వాస్తవ ఇస్లామీయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం ముగుస్తుంది.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి వహ్దహ్, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహ్, అమ్మా బ’అద్.

أَعُوذُ بِاللَّهِ السَّمِيعِ الْعَلِيمِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
శాపగ్రస్తుడైన షైతాను నుండి నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు.  (3:96-97)

సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా మనందరి ఏకైక సృష్టికర్త అయిన అల్లాహ్ కే శోభిస్తాయి. ఆయనే మనందరి ఏకైక, ఏ భాగస్వామి లేని నిజమైన ఆరాధ్యుడు. ఆ తర్వాత, లెక్కలేనన్ని సలాత్ సలాం, కరుణలు, శాంతులు ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త, దయామయ మహనీయ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై మరియు ఇతర ప్రవక్తలందరిపై కురియు గాక.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ప్రియ వీక్షకులారా! అల్లాహు త’ఆలా సర్వ సృష్టికర్త, సర్వ అధికారుడు, ఎలాంటి ఏ భాగస్వామి లేనివాడు. ఆయన కోరినది సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో ఎవరికి ఏ హోదా, అంతస్తు, ఎవరికి ఎలాంటి ప్రత్యేకత ఇవ్వాలో ఇస్తాడు. అందులో అతన్ని అడిగేవారు ఎవరూ లేరు.

لَا يُسْأَلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْأَلُونَ
ఆయన తన చేష్టలకు ఎవరికీ జవాబు చెప్పుకోవలసిన అవసరం లేదు, కాని వారే (మానవులే) జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. (21:23)

అల్లాహ్ చేసిన దానిలో అల్లాహ్ ను ప్రశ్నించేవాడు ఎవడూ లేడు.

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَاءُ وَيَخْتَارُ
నీ ప్రభువు తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు, తాను కోరిన వారిని ఎంపిక చేసుకుంటాడు.  (28:68)

అల్లాహు త’ఆలా కోరినది సృష్టిస్తాడు, యఖ్తార్, ఎన్నుకుంటాడు. అల్లాహు త’ఆలా ఈ విధంగా తన సృష్టిలో ఎన్నుకోవడంలో అద్వితీయుడు, అతనికి ఏ భాగస్వామి లేడు. అతడు ఒకరితో ఏదైనా సలహా, సంప్రదింపులు చేసి, వారి కోరికలను అనుసరించడానికి ఏదైనా లొంగిపోయి ఉంటాడు, న’ఊదు బిల్లాహ్, ఇలాంటి ప్రసక్తి ఏ మాత్రం లేదు. అయితే ఇలా అల్లాహు త’ఆలా అద్వితీయుడు కావడం, ఎన్నుకునే విషయంలో ఇది అతని యొక్క, అతని యొక్క రుబూబియ్యత్, ఆ అల్లాహ్ యొక్క సంపూర్ణ వివేకం మరియు అతడే సర్వశక్తిమంతుడు అన్నదానికి గొప్ప నిదర్శనం.

అయితే అల్లాహు త’ఆలా కొందరి ప్రజలను మరికొందరిపై, కొందరు ప్రవక్తలను మరికొందరి ప్రవక్తలపై, కొన్ని ప్రాంతాలను మరికొన్ని ప్రాంతాలపై, కొన్ని నెలలను మరికొన్ని నెలలపై, కొన్ని రోజులను మరికొన్ని రోజుల పై, కొన్ని రాత్రులను మరికొన్ని రాత్రులపై, కొన్ని సత్కార్యాలను మరికొన్ని సత్కార్యాలపై ఘనత ప్రసాదించాడు. సర్వ సృష్టిలో, అంటే అల్లాహ్ తప్ప సర్వమూ వాటిలన్నింటిలోకెల్లా, వాటన్నిటిలోకెల్లా అత్యుత్తములు, అతి గొప్పవారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విశ్వాసాల్లో, సత్కార్యాల్లో, అన్ని విషయాల్లో అతి గొప్ప ఘనత గలది తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్ మాత్రమే ఏ భాగస్వామి లేకుండా ఆరాధ్యనీయుడు అని నమ్మడం, విశ్వసించడం, అలా ఆచరించడం.

ఇస్లామీయ 12 నెలల్లో రమదాన్ మాసానికి చాలా గొప్ప ఘనత ఉంది. రాత్రుల్లో లైలతుల్ ఖద్ర్ కి చాలా గొప్ప ఘనత ఉంది. మరియు రోజుల్లో, పగల్లో యౌమున్నహర్, ఖుర్బానీ చేసేటటువంటి రోజు, ఈదుల్ అద్ హా అది చాలా గొప్ప ఘనత గల రోజు. అయితే ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అల్లాహ్ కు అత్యుత్తమ, అతి ప్రియమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే, మొట్టమొదటి స్థానంలో అది మక్కతుల్ ముకర్రమా.

మక్కతుల్ ముకర్రమా గురించి ఈ రోజు నేను జియోగ్రాఫికల్ పరంగా నేను మాట్లాడను. మక్కాకు అల్లాహు త’ఆలా ఈ రకంగా కూడా ఏ ఘనతలు ప్రసాదించి ఉన్నాడో దాని యొక్క వివరణలోకి వెళ్ళను. కానీ అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశం ఇది అని మనకు అంటే మక్కా అని ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు?

వల్లాహి, ఇన్నకి లఖైరు అర్దిల్లాహ్, వ అహబ్బు అర్దిల్లాహి ఇలల్లాహ్.
అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ మక్కా, నీవు అల్లాహ్ భూమిలో అత్యంత ఖైర్, మేలు, శుభం ఉంది నీలో మరియు అల్లాహ్ కు, అల్లాహ్ యొక్క ఈ భూమిలో అత్యంత ప్రియమైన ప్రదేశం నీవు.

వలవ్ లా అన్నీ ఉఖ్రిజ్తు మిన్కి మా ఖరజ్తు.
నన్ను ఈ మక్కా నుండి వెలివేయడం జరిగింది, లేదా అంటే నేను మక్కా నుండి వెళ్లి మదీనాలో స్థావరం అక్కడ వలస చేసి అక్కడ ఉండటం అలా చేసేవాడిని కాదు.

అల్లాహు త’ఆలా ఈ మక్కా నగరం, దీని యొక్క ప్రమాణాలు చేసి ఉన్నాడు, లా ఉక్సిము బిహాదల్ బలద్ అని.

అల్లాహు త’ఆలా ఈ సర్వ భూమండలంపై తన ఆరాధనా కేంద్రంగా నిర్మించడానికి ఆదేశం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం మక్కాలో ఉంది. ఆ ఆయతులే నేను ఆరంభంలో చదివాను, సూరత్ ఆలి ఇమ్రాన్, సూర నెంబర్ 3, ఆయత్ నెంబర్ 95.

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ

నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. (3:96)

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో అబూ దర్ రదియల్లాహు త’ఆలా అన్హు ప్రశ్నించారు, అయ్యు మస్జిదిన్ వుది’అ ఫిల్ అర్ది అవ్వల్. ప్రప్రథమంగా ఈ భూమండలంపై నిర్మించబడినటువంటి మస్జిద్ ఏ మస్జిద్ అని అడిగినప్పుడు, అల్ మస్జిదుల్ హరాం. కాబతుల్లాహ్, దాని చుట్టూ ఉన్నటువంటి మస్జిద్-ఎ-హరాం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం లోని హదీస్.

సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం కంటే ముందు ఎందరో ప్రవక్తలు ఈ ప్రపంచంలో వచ్చారు. ఆదం అలైహిస్సలాం ఆది మానవులతో పాటు ప్రవక్త కూడా. ఆదం అలైహిస్సలాం తర్వాత ఇద్రీస్, షీత్ అలైహిస్సలాం లాంటి ప్రవక్తలు కూడా వచ్చారు. కానీ షిర్క్ ను ఖండిస్తూ, తౌహీద్ ను ధ్రువపరుస్తూ, తౌహీద్ వైపునకు ప్రజలను ఆహ్వానించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం. ఆ తర్వాత హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం ఎందరో వచ్చారు. మనకు కొన్ని ఉల్లేఖనాల ద్వారా వారు కూడా హజ్ చేశారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన తూఫాన్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే కాబతుల్లాహ్ ఉన్నదో దాని చుట్టుపక్కల ఆ మక్కా నగరం, ఆ కాబతుల్లాహ్ చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, ఆ పర్వతాలు ఉండినవి కానీ కాలాల తరబడి ఎవరూ కూడా అక్కడ వచ్చి నివసించేవారు కాదు.

అయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అతని యొక్క పనులలో ఎలాంటి హిక్మత్, ఔచిత్యాలు ఉంటాయో, ఎలాంటి వివేకాలు ఉంటాయో అన్నీ మనము గ్రహించలేము. కేవలం అల్లాహు త’ఆలా తన దయ కరుణతో తెలిపిన కొన్ని విషయాలు తప్ప.

అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య సారాతో ఏ సంతానము కలగలేదు. ఆ తర్వాత రెండో భార్య హాజర్ తో అల్లాహు త’ఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం లాంటి ఒక సుపుత్రున్ని ప్రసాదిస్తాడు. ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉంటాడు. అప్పుడు అల్లాహ్ యొక్క అనుమతితో ఇబ్రాహీం అలైహిస్సలాం పాలు త్రాగే బాలుడైన ఇస్మాయిల్ మరియు అతని యొక్క తల్లి హాజర్ ఇద్దరినీ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి వదిలేస్తారు. అదే విషయాన్ని స్వయంగా ఖురాన్ లో తెలిపాడు. స్వయంగా ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేస్తూ అంటున్నారు, ఇంద బైతికల్ ముహర్రమ్. ఓ ప్రభువా, నేను నా యొక్క భార్య మరియు కుమారున్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలాను. ఎక్కడ? గైరి జీ జర్’ఇన్. అక్కడ ఎలాంటి ఒక చెట్టు లేదు, ఒక మొక్క లేదు. మరియు అక్కడ నీటి యొక్క సౌకర్యం కూడా లేదు. కానీ అల్లాహు త’ఆలా చూడడానికి ఇలాంటి ఈ పరీక్ష పెట్టినా, ఇక ముందుకు ఇక్కడ ఈ నగరాన్ని ప్రజలు వచ్చి నివసించడానికి సౌలభ్యంగా ఉండడానికి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఏర్పాటు చేశాడు.

ఇక్కడ సహీ బుఖారీలో ఆ వివరణ ఏదైతే వచ్చి ఉందో, ఖురాన్ యొక్క తఫ్సీర్ మరియు సహీ బుఖారీలో వచ్చిన హదీసులు, వాస్తవంగా పూర్తి మనం వినాలి. అందులో తండ్రికి, భార్యకు, భర్తకు ప్రతి ఒక్కరికి మన సమాజంలోని ప్రతి ఒక్కరికి ఎన్నో గుణపాఠాలు ఉన్నాయి. గమనించండి. ఆ గుణపాఠాల గురించి ఇప్పుడు నేను వివరాలు ఇవ్వలేను ఎందుకంటే నా అంశం ఫద్లు మక్కా, మక్కా విశిష్టత ఉంది. కానీ అక్కడ చిన్న విషయం ఒకటి ఏం తెలియజేస్తున్నానంటే, హాజర్ అలైహస్సలాం తన కుమారుడు పాలు త్రాగే వాడు, ఏమైనా ఎదిగినటువంటి బాలుడు కాదు. తీసుకొని ఆ ప్రదేశంలో ఉండి ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇబ్రాహీం, ఎవరి ఆధారంగా మమ్మల్ని వదిలి వెళ్తున్నావు అని అంటే, అల్లాహ్ వైపున చూపిస్తే, ఆ తల్లి హాజర్ ఎంత గొప్ప మాట అంటుంది, ఎంతటి గొప్ప విశ్వాసం, అల్లాహ్ పై ఎలాంటి నమ్మకం, ఎలాంటి ప్రగాఢమైన బలమైన విశ్వాసమో గమనించండి. “అలాంటప్పుడు అల్లాహు త’ఆలా మమ్మల్ని వృధా చేయడు.” అక్కడి నుండి మొదలవుతుంది మక్కా నగరం. ఆ తర్వాత జుర్హుమ్ వంశానికి సంబంధించిన వారు వస్తారు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే మక్కాలో జన్మించారు. అక్కడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ రావడం ప్రారంభమైంది. సుమారు 53 సంవత్సరాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జీవించారు. ప్రవక్త పదవి పొందడానికి 40 సంవత్సరాలు ముందు, ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు. అక్కడే అనేక మంది గొప్ప సహాబాలు వచ్చారు. ఆ సహాబాల యొక్క ప్రస్తావన ముహాజిరీన్ అని, వస్సాబిఖూనల్ అవ్వలూన్ అని అల్లాహు త’ఆలా సూరతు తౌబాలో కూడా వారిని ప్రశంసిస్తూ ప్రస్తావించాడు.

అల్లాహు త’ఆలా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కా నుండే బైతుల్ మఖ్దిస్, బైతుల్ మఖ్దిస్ నుండి మళ్ళీ ఆకాశాల వైపునకు, గగన ప్రయాణం, ఇస్రా వ మి’రాజ్ జరిగినది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ నగరాన్ని చాలా ప్రేమించేవారు. బుఖారీ, ముస్లిం యొక్క హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చిన తర్వాత అక్కడ వారి యొక్క సహాబాలు, వారి యొక్క ఆరోగ్యాలు కొంచెం అనారోగ్యానికి గురి అవ్వడం, అక్కడి యొక్క వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం, ఆ సందర్భంలో ప్రవక్త దుఆ ఏం చేశారు? అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ మదీనత కమా హబ్బబ్త మక్కత అవ్ అషద్ద్. ఓ అల్లాహ్, మక్కా పట్ల ఎలాంటి ప్రేమ మాకు నీవు కలుగజేశావో, అలాంటిది అంతకంటే ఎక్కువ ప్రేమ నీవు మాకు మదీన విషయంలో కూడా… సోదర మహాశయులారా, సోదరీమణులారా, మనం మక్కా గురించి తెలుసుకుంటున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రేమించేవారని.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు ఈ మక్కా నగరం గురించి. ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన దుఆలను గమనించండి, మక్కా యొక్క విశిష్టతను మీరు గ్రహించండి. ఒక దుఆ చేశారు, సూరత్ ఇబ్రాహీం 37,

فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ
ఫజ్’అల్ అఫ్’ఇదతమ్ మినన్నాసి తహ్వీ ఇలైహిమ్.
కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి (14:37)

ఓ అల్లాహ్, ప్రజల యొక్క హృదయాలు, ప్రజల యొక్క హృదయాలు ఈ మక్కా వైపునకు తిరిగి రావాలి. మక్కా యొక్క ప్రేమ వారి హృదయాల్లో నాటుకోవాలి. అలాంటి భాగ్యం నీవు కలుగజేయి.

అంతేకాదు, సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ 126 లో తెలుస్తుంది, ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ చేశారు,

وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا
రబ్బిజ్’అల్ హాదా బలదన్ ఆమినా.
నా ప్రభూ! నీవు ఈ ప్రదేశాన్ని శాంతి నగరంగా చెయ్యి.  (2:126)

ఓ మా ప్రభువా, ఈ మక్కా నగరాన్ని నీవు అమ్న్ ఓ అమాన్, శాంతి నిలయంగా చేయు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా దానిని ఎలా శాంతి నిలయంగా చేశాడో గమనించండి.

సూరత్ అన్ కబూత్ ఆయత్ నెంబర్ 67 లో చెప్పాడు,

أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ

ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. (29:67)

వారు గమనించడం లేదా? మేము హరమ్ ని ఎంత శాంతి నిలయంగా చేశాము, ఎంత ప్రశాంతతమయిన ప్రదేశంగా చేశాము, ఈ మక్కా చుట్టుపక్కల ఉన్నవారు దొంగతనాలు, దోపిడీలు, లూటీలు ఇంకా కిడ్నాప్ లు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మక్కా వారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. ఈ సూరత్ అన్ కబూత్ లో ఉన్నటువంటి ఆయత్ మీరు ఒకవేళ వినకుంటే, చిన్న సూరా మీకు కూడా గుర్తు ఉంది కదా,

لِإِيلَافِ قُرَيْشٍ إِيلَافِهِمْ رِحْلَةَ الشِّتَاءِ وَالصَّيْفِ فَلْيَعْبُدُوا رَبَّ هَٰذَا الْبَيْتِ الَّذِي أَطْعَمَهُم مِّن جُوعٍ وَآمَنَهُم مِّنْ خَوْفٍ

ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, (అంటే) చలికాలపు, ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ (కాబా) గృహం యెక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలిగొన్నప్పుడు అన్నం పెట్టాడు. భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. (106:1-4)

చుట్టుపక్కన మక్కా నగరానికి చుట్టుపక్కన ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనలో జీవితాలు గడుపుతూ ఉంటారు. కానీ మక్కాలో ఉండే వారు, అల్లాహు త’ఆలా వారికి ఎంతటి గొప్ప ప్రశాంతత, అమ్న్ ఓ అమాన్ ప్రసాదించాడు. ఇమాం ఖుర్తుబి రహిమహుల్లాహ్ తమ తఫ్సీర్ లో తెలియజేశారు, ఇన్న మక్కత లమ్ తజల్ హరమన్ ఆమినన్ మినల్ జబాబిరతి వ మినజ్ జలాజిల్. అల్లాహు త’ఆలా మక్కాను చాలా కాపాడాడు. అక్కడ ఎంతటి గొప్ప శాంతి ప్రసాదించాడంటే ఇంతటి వరకు, ఇప్పటి వరకు ఏ దుర్జన్యపరుడైన రాజు వశపరచుకోలేకపోయాడు మరియు అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి భూకంపాలు కూడా రాలేదు.

అల్లాహు త’ఆలా సూరత్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97 లో ఈ ఆయత్ ఏదైతే స్టార్టింగ్ లో తిలావత్ చేయబడిందో, అక్కడ ఈ అమ్న్ ఓ అమాన్, ప్రశాంతత, శాంతి గురించి ఎంత గొప్ప విషయం చెప్పాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఎవరైతే ఈ మక్కా నగరం, మస్జిదుల్ హరాం, ఇందులో ప్రవేశిస్తాడో అతనికి శాంతియే శాంతి ఉంది.

కనుక చూడండి, అల్లాహు త’ఆలా ఇక్కడ ఈ మక్కా నగరానికి ఇంతటి గౌరవం ఏదైతే ప్రసాదించాడో అది ఎప్పటి నుండి? ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాలం నుండి కాదండి. ఎప్పటి నుండి? అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించాడో అప్పటి నుండి. సహీ బుఖారీ లోని హదీస్, ఇన్నల్లాహ హర్రమ మక్కత యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. ఫహియ హరామున్ బి హురామిల్లాహి ఇలా యౌమిల్ ఖియామా. అల్లాహు త’ఆలా భూమ్యాకాశాలను పుట్టించినప్పటి నుండి మక్కాకు ఒక ప్రత్యేక గౌరవం ప్రసాదించాడు. అల్లాహు త’ఆలా ఈ గౌరవాన్ని ప్రళయ దినం నాటికి ఉంచుతానని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు.

అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కొరకు ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ఏ కొన్ని క్షణాల గురించి అయితే అనుమతి ఇవ్వడం జరిగిందో, ఆ విషయాన్ని కూడా మనం గమనించామంటే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇక్కడ ఏ రక్తపాతం గురించి అనుమతి లేకుండినది, ప్రళయం వరకు కూడా లేదు అని.

అంతేకాదు సోదర మహాశయులారా, ఇబ్రాహీం అలైహిస్సలాం దాని చుట్టుపక్క ప్రాంతాలకు ఎన్నో కిలోమీటర్ల వరకు ప్రశాంతత ఉండాలని అల్లాహు త’ఆలా తో దుఆ ఏదైతే చేశారో, సహీ బుఖారీ, సహీ ముస్లిం లో వచ్చి ఉంది, ఇన్న ఇబ్రాహీమ హర్రమ మక్కా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడి ప్రశాంతత గురించి ఇచ్చిన బోధనల్లో, సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన ఈ హదీస్ కూడా చాలా ప్రాముఖ్యత గలది. లా యహిల్లూ లిమ్ రి’ఇన్ యు’మిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అన్ యస్ఫిక బిహా దమా. అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి కూడా అక్కడ రక్తం ప్రవహింప చేయడు, రక్తపాతానికి ఒడిగట్టడు. అంతేకాదు, సహీ ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ ను గమనించండి, లా యహిల్లూ లి అహదికుమ్ అన్ యహ్మిల బి మక్కత అస్సిలాహ్. మీరు మక్కాలో నడుస్తున్నప్పుడు ఎలాంటి ఆయుధాలు ధరించి అక్కడ నడవడం ఇది సమంజసం కాదు.

అంతేకాదండి, అల్లాహు అక్బర్, మక్కాకు అల్లాహు త’ఆలా ప్రసాదించినటువంటి విశిష్టత కేవలం మానవులకే కాదు, అక్కడి యొక్క ఆ ప్రాంతానికి, అక్కడ వచ్చే, తిరిగే అటువంటి పక్షులకు, అక్కడ పెరిగే అటువంటి వృక్షాలకు, ఇంకా ఎవరి నుండి ఏదైనా వస్తువు తప్పిపోయి పడిపోతే దానికి కూడా ఎంతటి మర్యాద అనండి, గౌరవం అనండి, ఎంతటి రెస్పెక్ట్ ఉందో మనకు సహీ హదీసుల్లో తెలుస్తుంది.

సహీ బుఖారీ మరియు ముస్లిం లో వచ్చిన హదీస్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్కడి వృక్షాలను నరికేయరాదు. అక్కడ వేట, షికారీ చేయరాదు. మరియు ఎవరికైనా ఏదైనా పడిపోయిన వస్తువు దొరికినా, దానిని అతను ఎత్తుకోకూడదు. ఎవరైనా దాన్ని తీసుకున్నాడంటే, సంవత్సరం అయినా గానీ తన వద్ద ఉంచి, భద్రంగా అది ఎవరిది అని వెతుకుతూ ఉండి, అతని వరకు చేర్పించే ప్రయత్నం చేయాలి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా?

అందు గురించే, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ సందర్భంలో, ఏ సందర్భంలో అండి? ప్రవక్త ఏదైతే హజ్ చేశారో, లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట ఉన్నారో, అందులో హ్యూమానిటీ కి సంబంధించిన, మానవత్వానికి సంబంధించిన గొప్ప నియమ, నిబంధనలు, సూత్రాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే తెలిపారో, ఒక్కసారి ఈ హదీస్ ను గమనించండి. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం లో వచ్చిన హదీస్,

ఇన్న దిమా అకుమ్, వ అమ్వాలకుమ్, వ అ’రాదకుమ్, అలైకుమ్ హరామున్, క హుర్మతి యౌమికుమ్ హాదా, ఫీ బలదికుమ్ హాదా, ఫీ షహ్రికుమ్ హాదా.

ప్రజలారా, ఈ మక్కా నగరం ఎంత గౌరవ, మర్యాద గల ప్రదేశమో తెలుసు కదా? ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నామో, జిల్ హిజ్జా నెల, ఇది కూడా ఎంతటి గౌరవ, ప్రాముఖ్యత గల నెలనో తెలుసు కదా? మరియు ఈ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫాలో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు కూడా ఎంతటి గౌరవప్రదమైన రోజో తెలుసు కదా? ఇక గౌరవప్రదమైన రోజు, గౌరవప్రదమైన నెల, గౌరవప్రదమైన ప్రదేశంలో ఉండి, వీటన్నింటిని గుర్తిస్తూ నేను చెబుతున్నాను శ్రద్ధగా వినండి. మీ యొక్క రక్తం అంటే మీ యొక్క ప్రాణం, మీ యొక్క ధనం, మీ యొక్క పరువు, మానాలు కూడా చాలా గౌరవమైనవి, విలువ గలవి. వాటిని ఎవరూ కూడా అక్రమంగా దాడి చేయడం, ఒకరిని నరికేయడం, హత్య చేయడం, ఒకరి ధనం పై అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేయడం, ఒకరి యొక్క మానవ పరువులో ఏదైనా జోక్యం చేసుకోవడం, హరాం, ఎంతమాత్రం కూడా దీనికి అనుమతి లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఒక వ్యక్తిని తిట్టకూడదు, ఒక వ్యక్తిని హత్య చేయకూడదు, ఒకరి సామాను, ఒకరి యొక్క వస్తువులను దొంగలించకూడదు అన్న విషయాన్ని ప్రవక్త, క బలదికుమ్ హాదా, మీ యొక్క ఈ బలద్, ఈ నగరం యొక్క గౌరవం ఎలా ఉందో అంతకంటే గొప్పగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తు చేస్తున్నారు.

అందుకొరకే, ముస్లిమేతరులలో ఉన్నటువంటి మరొక అపోహ ఏమిటంటే, ఈ కాబతుల్లాహ్, న’ఊదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అసల్ ఒక విగ్రహాల గృహం అని. అయితే హదీస్ తో దీనిని వారు నిరూపించే ప్రయత్నం చేస్తారు, ఫతహ్-ఎ-మక్కా సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విగ్రహాలను అయితే పడేశారో, దానిని తీసుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క విగ్రహాలు, వాటిని ప్రస్తావిస్తారు. కానీ మనం ఒకవేళ నిజంగా చూస్తే, ఖురాన్ ఆయతులు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మానవ చరిత్ర, ఏ చరిత్రనైతే భద్రంగా ఉందో దానిలో తెలుస్తున్న విషయం ఏమిటి? మొట్టమొదటి మానవుడు ఆది మానవుడు, ఆదం అలైహిస్సలాం, వారి యొక్క సంతానం కాలాల తరబడి షిర్క్ కు పాల్పడలేదు.

كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً
మానవులందరూ ఒకే ఒక సమాజంగా ఉండేవారు. (2:213)

ఒకే ఒక ధర్మం, ఏకదైవారాధనపై అందరూ నిలిచి ఉన్నారు. ఎంతవరకు? ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు చెప్పారు, వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువగా. ఆ తర్వాత మెల్లి మెల్లిగా వారిలో షిర్క్ అనేది పాకింది. దానిని ఖండించడానికే ప్రవక్తలను పంపడం జరిగింది. కాబతుల్లాహ్, దీని యొక్క పునాది తౌహీద్ పై, ఏకదైవారాధనపై ఉండినది. అమర్ బిన్ లుహై మొట్టమొదటి చెడ్డ వ్యక్తి, అందుకొరకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని నరకంలో చూసినట్లు కూడా హదీస్ లో తెలియపరిచారు. అతడు మొట్టమొదటిసారిగా షిర్క్ కు పునాది వేశాడు. దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు, షిర్క్ నుండి పరిశుభ్రం చేశారు కాబా గృహాన్ని. కానీ ఇది వాస్తవానికి విగ్రహాలయం మాత్రం కాదు. సోదర మహాశయులారా, చివరిలో సూరతుల్ నమ్ల్ ఆయత్ 91 ద్వారా మన యొక్క ఈ నాటి ప్రసంగాన్ని సమాప్తం చేద్దాము.

أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ إِنَّمَا أُمِرْتُ أَنْ أَعْبُدَ رَبَّ هَٰذِهِ الْبَلْدَةِ الَّذِي حَرَّمَهَا وَلَهُ كُلُّ شَيْءٍ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ

నేను ఈ నగరం (మక్కా) ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్ర మైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. (27:91)

నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ నగరం యొక్క ప్రభువుని ఆరాధించాలి అని. ఆయనే ఈ నగరానికి చాలా గొప్ప గౌరవప్రదమైన స్థానం కలుగజేశాడు. అతనికే సర్వాధికారం ఉంది, సర్వ సర్వమూ అతని యొక్క ఆధీనంలో ఉంది. మరియు నేను విధేయులలో, ముస్లింలలో ఉండాలి, అయి ఉండాలి అని కూడా నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది.

అయితే ఈ ఆయత్ ను చివరిలో ప్రస్తావించడానికి ముఖ్య కారణం ఏంటి? మనం ఎప్పుడైనా అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని, అది ప్రాంతానికి సంబంధించినా, ఏ వ్యక్తికి సంబంధించినా, ఏదైనా నెలకు సంబంధించినా, ఏదైనా కార్యానికి సంబంధించినా ప్రస్తావిస్తున్నప్పుడు దాని యొక్క గొప్పతనం, దాని యొక్క గౌరవంలో మనం అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మర్చిపోకూడదు. మనం వాస్తవంగా అల్లాహ్ ను గౌరవిస్తున్నాము. అందుకొరకే అల్ హుబ్బు ఫిల్లాహ్ వల్ బుగ్దు ఫిల్లాహ్. అల్లాహ్ ఏ ఏ విషయాలను ప్రేమిస్తాడో వాటన్నిటినీ ప్రేమించడం. అల్లాహ్ ఏ ఏ విషయాలను ద్వేషిస్తాడో వాటన్నిటినీ ద్వేషించడం మన విశ్వాసంలోని ఒక ముఖ్యమైన భాగం. అర్థమైంది కదా?

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో నేను దుఆ చేస్తున్నాను. ఈ మక్కా విశిష్టత గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో దాని యొక్క గౌరవాన్ని కాపాడే అటువంటి భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. దీని విషయంలో ఎవరు ఏ తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారో అల్లాహ్ వారికి హిదాయత్ ప్రసాదించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17091

హజ్, ఉమ్రా – మెయిన్ పేజీ
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

జుల్ హిజ్జ, ఉమ్రా, హజ్జ్, బక్రీద్యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3__K6T_yH5Pl8xzP3FBHqf

సీరత్ పాఠాలు 1: శుభ జననం, ఏనుగుల సంఘటన [వీడియో]

బిస్మిల్లాహ్

[16:36 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [16:36 నిముషాలు]

ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభ జననానికి ముందు అరబ్ ద్వీపకల్పం యొక్క మత, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను వివరిస్తుంది. బహుదేవతారాధన, అజ్ఞానం మరియు అన్యాయం ప్రబలంగా ఉన్న ఆ కాలాన్ని ఇది విశ్లేషిస్తుంది. ప్రవక్త గారి తండ్రి అయిన అబ్దుల్లా మరియు ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లను ‘ఇబ్నుద్-దబీహైన్’ (బలి ఇవ్వబడిన ఇద్దరి కుమారుడు) అని ఎందుకు అంటారో చారిత్రక సంఘటనలతో వివరిస్తుంది. అబ్దుల్ ముత్తలిబ్ మొక్కుబడి, అబ్దుల్లా వివాహం, ఆయన మరణం, మరియు చివరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జననం గురించి చర్చిస్తుంది. ప్రవక్త జననానికి కొద్ది కాలం ముందు జరిగిన ‘ఏనుగుల సంఘటన’ (ఆముల్ ఫీల్) గురించి కూడా ఇది వివరంగా తెలియజేస్తుంది, దీనిలో అబ్రహా మరియు అతని సైన్యం కాబాగృహాన్ని కూల్చివేయడానికి వచ్చి అల్లాహ్ యొక్క అద్భుత శక్తి ద్వారా ఎలా నాశనమయ్యారో వివరిస్తుంది.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక)

اَلْحَمْدُ لِلّٰهِ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى رَسُوْلِ اللّٰهِ، أَمَّا بَعْدُ
(అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్, అమ్మా బాద్)
(సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే. అల్లాహ్ యొక్క ప్రవక్తపై శాంతి మరియు శుభాలు కలుగుగాక. ఆ తర్వాత…)

సీరత్ పాఠాలు. మొదటి పాఠం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జననానికి పూర్వపు అరబ్ స్థితి.

సోదర సోదరీమణులారా! అల్లాహ్ తర్వాత ఈ సర్వ సృష్టిలో అత్యంత శ్రేష్ఠులైన, సర్వ మానవాళి కొరకు కారుణ్య మూర్తిగా, ఆదర్శ మూర్తిగా పంపబడినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభ జీవిత చరిత్ర మనం తెలుసుకోబోతున్నాము. ఇన్ షా అల్లాహ్ (అల్లాహ్ తలిస్తే), చిన్న చిన్న పాఠాలు మనం వింటూ ఉందాము. చివరి వరకు మీరు ప్రతి ఎపిసోడ్ పూర్తి శ్రద్ధాభక్తులతో విని, ఒక ఆదర్శవంతమైన, మంచి జీవితం గడపడానికి ఉత్తమ గుణపాఠాలు పొందుతారని ఆశిస్తున్నాను.

ఈనాటి మొదటి పాఠంలో మనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు అరబ్ యొక్క స్థితిగతులు ఎలా ఉండినవి తెలుసుకుందాము.

అరబ్బులు ఏకదైవారాధనను వదులుకొని బహుదేవతారాధన మీదనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల, వారి ఆ కాలాన్ని అజ్ఞాన కాలం అని చెప్పడం జరిగింది. అరబ్బులు ఏ విగ్రహాలనైతే పూజించేవారో, వాటిలో ప్రఖ్యాతి గాంచినవి లాత్ (اللَّات), ఉజ్జా (الْعُزَّى), మనాత్ (مَنَاة) మరియు హుబుల్ (هُبَل). అయితే వారిలో కొంతమంది యూదుల మతాన్ని, క్రైస్తవ మతాన్ని అవలంబించిన వారు కూడా ఉండిరి. అలాగే కొందరు పార్శీలు, అగ్ని పూజారులు కూడా ఉండిరి. బహు తక్కువ మంది బహుదేవతారాధనకు అతీతమైన, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సవ్యమైన, సన్మార్గమైన సత్య ధర్మంపై కూడా ఉండిరి.

ఇక వారి ఆర్థిక జీవితం, ఎడారి వాసుల (అనాగరికుల) పూర్తి ఆధారం పశు సంపద, వాటిని మేపుటయే ఉండింది. నాగరికతలో ఉన్నవారు వ్యవసాయం మరియు వ్యాపారంపై ఆధారపడి ఉండిరి. ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి కొంచెం ముందు, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతరు ప్రవక్తలైతే వచ్చారో వారందరూ తీసుకువచ్చిన ధర్మం ఒకే ఒక సత్యమైన ధర్మం ఇస్లాం. కాకపోతే, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు కాలంలో ఆ సత్యమైన ధర్మం ఇస్లాం యొక్క రూపు మాపేశారు. దానిని దాని అసలు రూపంలో తెలుపుతూ సంపూర్ణం చేయడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపడం జరిగింది. అయితే ఇస్లాం ధర్మజ్యోతి ప్రకాశించేకి ముందు, ఈ జ్యోతిని తీసుకువచ్చినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుభ జననానికి ముందు, మక్కా అరబ్ ద్వీపంలో ఒక గొప్ప వ్యాపార కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా పేరు దాల్చింది. తాయిఫ్ మరియు మదీనా లాంటి కొన్ని నగరాల్లో మంచి నాగరికత ఉండినది.

ఇక వారి సామాజిక వ్యవస్థను చూసుకుంటే, చాలా బాధాకరంగా ఉండినది. అన్యాయం విపరీతంగా వ్యాపించి, బలహీనులకు ఏ హక్కు లేకుండా ఉండింది. ఆడబిడ్డలను కొందరు సజీవ సమాధి చేసేవారు. మానభంగాలకు పాల్పడేవారు. బలహీనుల హక్కులను బలవంతుడు కాజేసేవాడు. హద్దు లేకుండా భార్యలను ఉంచుకోవడం సర్వసామాన్యమైపోయి ఉండినది. వ్యభిచారం కూడా కొన్ని తెగలలో విచ్చలవిడిగా మొదలైపోయింది. తుచ్ఛమైన కారణాలపై సంవత్సరాల తరబడి అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకప్పుడు ఒకే తెగకు సంబంధించిన సంతానంలో కూడా కొంత కాలం వరకు యుద్ధం జరుగుతూ ఉండేది. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి ముందు ఉన్నటువంటి ధార్మిక, ఆర్థిక మరియు సామాజిక వ్యవస్థ యొక్క సంక్షిప్త రూపం.

ఇక రండి మనం తెలుసుకుందాము ఇబ్నుద్-దబీహైన్ (ابْنُ الذَّبِيحَيْنِ) గురించి. అంటే ఏమిటి? ఇబ్న్ (ابْن) అంటే కుమారుడు, దబీహైన్ (الذَّبِيحَيْنِ) అంటే బలి చేయబడటానికి సిద్ధమైనటువంటి ఇద్దరు వ్యక్తులు. ఒకరైతే తెలుసు కదా? ఇస్మాయీల్ దబీహుల్లాహ్ (إِسْمَاعِيلُ ذَبِيحُ اللهِ) అని చాలా ఫేమస్. ఇబ్రాహీం అలైహిస్సలాం వృద్ధాప్యంలో చేరినప్పుడు మొట్టమొదటి సంతానం ఇస్మాయీల్ ప్రసాదించబడ్డారు. అయితే ఎప్పుడైతే ఇస్మాయీల్ తండ్రి వేలు పట్టుకొని, తండ్రితో పాటు పరిగెత్తే అటువంటి వయసుకు చేరుకున్నాడో, “నీ ఏకైక సంతానాన్ని నీవు జిబహ్ (ذِبْح – బలి) చేయమని” అల్లాహు తఆలా స్వప్నంలో చూపాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశం మేరకు సిద్ధమయ్యారు, కానీ అల్లాహు తఆలా ఒక పొట్టేలును పంపించేశాడు. ఇస్మాయీల్ కు బదులుగా దానిని జిబహ్ చేయడం జరిగింది. ఈ సంఘటన చాలా ఫేమస్. మరి రెండవ దబీహ్ (ذَبِيح – బలి ఇవ్వబడినవాడు) ఎవరు? అదే విషయం ఇప్పుడు మనం వినబోతున్నాము.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తాత అబ్దుల్ ముత్తలిబ్, అధిక ధనం, అధిక సంతానం వల్ల ఖురైషులు అతన్ని చాలా గౌరవించేవారు. ఒకప్పుడు అబ్దుల్ ముత్తలిబ్, “అల్లాహ్ గనక నాకు పది మంది మగ సంతానం ప్రసాదిస్తే వారిలో ఒకరిని నేను జిబహ్ చేస్తాను, బలిదానం ఇస్తాను” అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. పది మగ సంతానం కలిగారు అతనికి. వారిలోనే ఒకరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తండ్రి అబ్దుల్లా.

అబ్దుల్ ముత్తలిబ్ తన మొక్కుబడిని పూర్తి చేయడానికి తన పది మంది సంతానంలో పాచిక చీటీ వేశారు. వారిలో అబ్దుల్లా యొక్క పేరు వచ్చింది. ఇక అబ్దుల్లాను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఖురైషులు అడ్డుకున్నారు. “ఇలా జిబహ్ చేయకూడదు, బలిదానం ఇవ్వకూడదు” అని. తర్వాత కాలాల్లో ఇదే ఒక ఆచారంగా మారిపోతే ఎంత ప్రమాదం అన్నటువంటి భయాందోళనకు గురి అయ్యారు. అయితే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అబ్దుల్లాకు బదులుగా పది ఒంటెలను నిర్ణయించి, వారి మధ్యలో చీటీ వెయ్యాలి. మరియు ఒంటెలను అబ్దుల్లాకు బదులుగా జిబహ్ చేయాలి. చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. అయితే వారు పది ఒంటెలను ఇంకా పెంచి ఇరవై చేశారు. మళ్ళీ చీటీ వేశారు, మళ్ళీ అబ్దుల్లా పేరు వచ్చింది. ఈ విధంగా ప్రతిసారీ అబ్దుల్లా పేరు వస్తుంది, పది ఒంటెలను పెంచుతూ పోయారు. ఎప్పుడైతే అబ్దుల్లా ఒకవైపు మరియు వంద ఒంటెలు ఒకవైపు పూర్తి అయ్యాయో, అప్పుడు ఒంటెల పేరు మీద చీటీ వెళ్ళింది. అయితే అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెలను జిబహ్ చేయడం జరిగింది. ఈ విధంగా జిబహ్ నుండి, బలిదానం నుండి అబ్దుల్లాను తప్పించడం జరిగింది. అందుకొరకే ఈ రెండవ వ్యక్తి జిబహ్ కు సిద్ధమైన తర్వాత కూడా తప్పించబడిన వారు. మరియు ఈయనకి బదులుగా జంతువును బలిదానం ఇవ్వడం ఏదైతే జరిగిందో, ఈ రకంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటు అబ్దుల్లా కుమారుడు మరియు వీరి యొక్క వంశంలోనే ఇస్మాయీల్ అలైహిస్సలాం వస్తారు. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్… ఈ విధంగా పూర్తి వంశావళి.

అబ్దుల్ ముత్తలిబ్ కు మొదటి నుండే అతని సంతానంలో అబ్దుల్లా తన హృదయానికి అతి చేరువుగా ఉండి, ఎక్కువ ప్రేమగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఈ బలిదానం యొక్క సంఘటన తర్వాత మరింత చాలా దగ్గరయ్యారు, ఇంకా అధికంగా అతన్ని ప్రేమించగలిగారు. అబ్దుల్లా యువకుడై, పెళ్ళీడుకు వచ్చిన తర్వాత, పెళ్ళి వయస్సుకు చేరిన తర్వాత, అబ్దుల్ ముత్తలిబ్, జొహ్రా వంశానికి చెందినటువంటి ఒక మంచి అమ్మాయి, ఆమినా బిన్తె వహబ్ ను ఎన్నుకొని అబ్దుల్లాతో వివాహం చేసేశారు.

అబ్దుల్లా తన భార్య ఆమినాతో ఆనందమైన వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆమినా మూడు నెలల గర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మోస్తూ ఉండగా, అబ్దుల్లా ఒక వ్యాపార బృందంతో సిరియా వైపునకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే మదీనాలో వారి యొక్క మేనమామలు ఉంటారు. అందుకని బనీ నజ్జార్ లోని వారి మేనమామల దగ్గర అక్కడ ఆగిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడే వారు చనిపోయారు. మదీనాలోనే వారిని ఖననం చేయడం, సమాధి చేయడం జరిగింది.

ఇటు ఆమినాకు నెలలు నిండినవి. సోమవారం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆమినా జన్మనిచ్చింది. అయితే నెల మరియు తారీఖు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేకపోయింది. అయినా, తొమ్మిదవ తారీఖు, రబీఉల్ అవ్వల్ (رَبِيع ٱلْأَوَّل) యొక్క మాసం అని పరిశోధనలో తేలింది. ఎందుకంటే సోమవారం అన్న విషయం ఖచ్చితమైనది. అయితే ఈ రోజుల్లో పన్నెండవ రబీఉల్ అవ్వల్ అని కూడా చాలా ప్రఖ్యాతి గాంచింది. మరో ఉల్లేఖనం రమదాన్ ముబారక్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా, క్రీస్తు శకం ప్రకారం 571 అన్న విషయం ఖచ్చితం.

అదే సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ (عَامُ الْفِيلِ) అని అంటారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జననానికి కేవలం 50 రోజుల ముందు ఏనుగుల సంఘటన జరిగింది. అదేమిటి? అదే ఇప్పుడు మనం విందాము.

నజ్జాషీ అను రాజు యొక్క గవర్నర్ యమన్ లో ఉండేవాడు. అతని పేరు అబ్రహా. అతడు అరబ్బులను చూశాడు, వారు హజ్ చేయడానికి మక్కా వస్తున్నారు. అయితే అతడు సన్ఆ (صَنْعَاء) (యమన్ లోని ప్రస్తుత క్యాపిటల్) అక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాడు. అరబ్బులందరూ కూడా హజ్ చేయడానికి ఇక్కడికి రావాలి అన్నటువంటి కోరిక అతనిది. అప్పట్లోనే అక్కడ అరబ్బుకు సంబంధించిన కినానా తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఈ విషయం తెలిసి ఒక సమయంలో వెళ్లి ఆ చర్చి గోడలను మలినం చేసేసాడు. ఈ విషయం అబ్రహాకు తెలిసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. చాలా కోపానికి వచ్చి ఒక పెద్ద సైన్యం సిద్ధపరిచాడు. మక్కాలో ఉన్న కా’బా గృహాన్ని (నవూదుబిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్) ధ్వంసం చేద్దామని, కూలగొడదామన్న యొక్క దురుద్దేశంతో 60,000 సైన్యంతో బయలుదేరాడు. తొమ్మిది ఏనుగులను కూడా వెంట తీసుకున్నాడు. అతి పెద్ద ఏనుగుపై స్వయం తాను ప్రయాణమయ్యాడు.

మక్కాకు సమీపంలో చేరుకొని అక్కడ తన సైన్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. పూర్తి సంసిద్ధతలు, సంసిద్ధతలన్నీ కూడా పూర్తయ్యాక, ఇక తన ఏనుగును కా’బా వైపునకు ముఖం చేసి లేపాడు. కానీ అది ముమ్మాటికీ లేవకుండా కూలబడిపోయింది. ఎప్పుడైతే కా’బా దిశకు కాకుండా వేరే దిశలో దాన్ని లేపుతున్నారో, పరుగెడుతుంది. కానీ అదే ఎప్పుడైతే దాని ముఖం కా’బా వైపునకు చేస్తారో, అక్కడే కూలబడిపోతుంది. వారు ఈ ప్రయత్నాల్లోనే ఉండగా, అల్లాహు తఆలా గుంపులు గుంపులుగా పక్షులను పంపాడు. నరకంలో కాల్చబడినటువంటి శనగ గింజంత పరిమాణంలో మూడు మూడు రాళ్లు ప్రతి పక్షి వెంట. ఒకటి వారి చుంచువులో, రెండు వాళ్ళ పంజాలలో. ఎవరిపై ఆ రాళ్లు పడుతున్నాయో, వాడు అక్కడే ముక్కలు ముక్కలు అయ్యేవాడు. ఈ విధంగా సైన్యం పరుగులు తీసింది. కొందరు అటు, కొందరు ఇటు పరుగెత్తుతూ దారిలో నాశనం అవుతూ పోయారు.

కానీ అల్లాహు తఆలా అబ్రహా పై ఎలాంటి శిక్ష పంపాడంటే, అతని వేళ్లు ఊడిపోతూ ఉండేవి. అతడు కూడా పరుగెత్తాడు, చివరికి సన్ఆ చేరుకునేసరికి అతని రోగం మరీ ముదిరిపోయి, అక్కడ చేరుకున్న వెంటనే అతడు కూడా నాశనమైపోయాడు. ఇక ఇటు ఖురైషులు, ఎప్పుడైతే అబ్రహా తన సైన్యంతో, (నవూదుబిల్లాహ్) కా’బా గృహాన్ని పడగొట్టడానికి వస్తున్నారని తెలిసిందో, వీళ్ళందరూ కూడా పర్వతాల్లో, లోయల్లో తమను తాము రక్షించుకోవడానికి పరుగెత్తారు. ఎప్పుడైతే వారికి తెలిసిందో, అబ్రహా అతని యొక్క సైన్యంపై అల్లాహ్ యొక్క ఈ విపత్తు కురిసింది అని, శాంతిగా, క్షేమంగా తిరిగి తమ ఇండ్లల్లోకి వచ్చారు.

ఈ విధంగా ఇది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శుభ జననం కంటే 50 రోజుల ముందు జరిగిన సంఘటన. అందుకొరకే ఆ సంవత్సరాన్ని ఆముల్ ఫీల్ – ఏనుగుల సంవత్సరం అని అనడం జరిగింది. ఈ విధంగా మనం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ జీవిత చరిత్రలోని మొదటి ఘట్టం పూర్తిగా విన్నాము. ఇంకా మిగతా ఎన్నో ఇలాంటి ఎపిసోడ్స్ వినడం మర్చిపోకండి.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’వానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
(మా చివరి ప్రార్థన సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక.)

ఇతరములు: 

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం):

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ 

మహా ప్రవక్త జీవిత చరిత్ర పాఠాలు [15 వీడియోలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
మొత్తం వీడియోల వ్యవధి: దాదాపు 70 నిముషాలు

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో]
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్