ఖుర్ఆన్ ప్రత్యేకతలు – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఖుర్ఆన్ ప్రత్యేకతలు
https://youtu.be/C-C0jePaXXc [33 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ఖుర్ఆన్ యొక్క అనేక గొప్ప ప్రత్యేకతలు మరియు ఘనతలు వివరించబడ్డాయి. ఇది అల్లాహ్ చే స్వయంగా ప్రళయం వరకు భద్రపరచబడిన, ఎలాంటి సందేహాలకు తావులేని ఏకైక గ్రంథమని నొక్కి చెప్పబడింది. ఖుర్ఆన్ పఠనం హృదయాలకు శాంతిని, మార్గదర్శకత్వాన్ని మరియు శారీరక, ఆత్మిక రోగాలకు స్వస్థతను ఇస్తుందని ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు తుఫైల్ (రదియల్లాహు అన్హు) వంటి వారి ఇస్లాం స్వీకరణ గాథలతో వివరించబడింది. ఖుర్ఆన్ పారాయణ ప్రతి అక్షరానికి పది పుణ్యాలను ఇస్తుందని, ఇది ఇహలోకంలోనే కాక, సమాధిలో మరియు పరలోకంలో కూడా తన సహచరుడికి రక్షణగా, సిఫారసుగా నిలిచి స్వర్గంలో ఉన్నత స్థానాలకు చేరుస్తుందని చెప్పబడింది.

అల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్త’ఈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను’మినుబిహి వ నతవక్కలు అలైహ్. వ న’ఊదుబిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యి’ఆతి అ’మాలినా. మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహ్, వ మై యుద్లిల్ ఫలా హాదియ లహ్.వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్. వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్. అర్సలహు బిల్ హఖ్ఖి బషీరవ్ వ నదీరా. అమ్మా బ’అద్

ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్. వ ఖైరల్ హద్యి హద్యి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా. వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అహ్, వ కుల్ల బిద్’అతిన్ దలాలహ్. వ కుల్ల దలాలతిన్ ఫిన్ నార్.

قَالَ اللهُ تَبَارَكَ وَتَعَالَى فِي الْقُرْآنِ الْمَجِيدِ
(ఖాలల్లాహు తబారక వ త’ఆలా ఫిల్ ఖుర్ఆనిల్ మజీద్)
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
(అ’ఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్)
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
(బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. (3:102)

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَاءً ۚ وَاتَّقُوا اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ وَالْأَرْحَامَ ۚ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا
మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో మీరు పరస్పరం మీకు కావలసిన వాటిని అడుగుతారో ఆ అల్లాహ్‌కు భయపడండి. బంధుత్వ సంబంధాల తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.(4:1)

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَقُولُوا قَوْلًا سَدِيدًا يُصْلِحْ لَكُمْ أَعْمَالَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు భయపడండి. మాట్లాడితే సూటిగా మాట్లాడండి (సత్యమే పలకండి). తద్వారా అల్లాహ్‌ మీ ఆచరణలను చక్కదిద్దుతాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఎవరయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత కనబరచాడో అతను గొప్ప విజయం సాధించాడు. (33:70-71)

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క విధానం ఏమిటంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు మార్గభ్రష్టత్వానికి గురైనప్పుడు మనుషుల్లోనే ఒక మనిషిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్తగా, బోధకునిగా ఎంచుకొని ఆ బోధకుని వద్దకు, ప్రవక్త వద్దకు దూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తమ వాక్యాలను పంపిస్తే ఆ దైవ వాక్యాలు అందుకున్న ఆ ప్రవక్త మానవులకు దైవ వాక్యాలు వినిపించేవారు.

ఆ విధంగా ప్రవక్త జీవించినంత కాలం దైవ వాక్యాలు వస్తూ ఉంటే, ఆ దైవ వాక్యాలన్నింటినీ ఒకచోట పొందుపరిచి, ఒక గ్రంథంలాగా, ఒక పుస్తకంలాగా తయారు చేసి ఉంచేవారు. అలా మనం చూచినట్లయితే చాలామంది ప్రవక్తలు ఈ ప్రపంచంలో వేర్వేరు సందర్భాలలో, వేర్వేరు ప్రదేశాలలో వచ్చారు. వారి వద్దకు దైవ గ్రంథాలు వచ్చాయి. అయితే ఆ పరంపరలో వచ్చిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పంపించిన అంతిమ గ్రంథం ఖుర్ఆన్ గ్రంథం.

అభిమాన సోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మనం ఇన్ షా అల్లాహ్ ఈ ఖుర్ఆన్ కు సంబంధించిన ప్రత్యేకతలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ లోని సూర బఖరా, రెండవ అధ్యాయం, 231వ వాక్యంలో తెలియజేశాడు, ఈ ఖుర్ఆన్ గ్రంథం ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహము. నిజమే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రజల కొరకు ఒక గొప్ప అనుగ్రహంగా పంపించాడు. అయితే ఈ గొప్ప అనుగ్రహానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? మనం అల్లాహ్ ను విశ్వసించే వాళ్ళము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించే వాళ్ళము, ఖుర్ఆన్ గ్రంథాన్ని తమ గ్రంథముగా భావించే వారమైన మనము ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ అల్లాహ్ పంపించిన అంతిమ గ్రంథము. ఇక ప్రళయం వరకు మరొక గ్రంథము రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథానికి కల్పించిన ఒక గొప్ప ఘనత, ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఖుర్ఆన్ గ్రంథము ప్రవక్త జీవిత కాలము నాటి నుండి ఇప్పటి వరకు కూడా సురక్షితంగానే ఉంది, ప్రళయం సంభవించినంత వరకు కూడా సురక్షితంగానే ఉంటుంది. ఇన్ షా అల్లాహ్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వయంగా ఈ గ్రంథానికి రక్షించే బాధ్యతను తీసుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని మనము ఖుర్ఆన్ లోని 15వ అధ్యాయం 9వ వాక్యంలో చూడవచ్చు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ
(ఇన్నా నహ్ను నజ్జల్ నజ్ జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్)
మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము.(15:9)

అనగా, మేమే ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేశాము మరియు మేమే దీనిని రక్షిస్తాము అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వాక్యంలో తెలియజేసి ఉన్నాడు. అభిమాన సోదరులారా, ఒక్క విషయం తెలుసుకోవలసిన ఉంది. అదేమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలం నుండి కూడా ఇప్పటి వరకు రక్షిస్తూ వస్తున్నాడు, ప్రళయం వరకు కూడా రక్షిస్తాడు. ఎలా రక్షిస్తున్నాడో కూడా చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుస్తక రూపంలో కూడా దాన్ని రక్షిస్తూ ఉన్నాడు, మానవుల హృదయాలలో కూడా దానిని సురక్షితంగా ఉంచి ఉన్నాడు.

ఈ రోజు మనం కువైట్ లో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, ఇండియాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా, అమెరికాలో ఉన్న గ్రంథాన్ని తీసుకున్నా ఏ దేశంలో ఉన్న గ్రంథాన్ని మనం చూచినా పూర్తి ఖుర్ఆన్ ఒకేలాగా ఉంటుంది. ఒక దేశంలో ఒకలాంటి ఖుర్ఆన్, మరో దేశంలో మరోలాంటి ఖుర్ఆన్ మీకు కనిపించదు. ప్రపంచ నలుమూలలా మీరు ఎక్కడికి వెళ్లి చూసినా ఒకే రకమైన ఖుర్ఆన్ దొరుకుతుంది.

అలాగే, ఖుర్ఆన్ కి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలా రక్షిస్తున్నాడో చూడండి. ఈ రోజు ఇప్పటికి ఇప్పుడే ప్రపంచంలో ఉన్న పూర్తి ఖుర్ఆన్ గ్రంథాలన్నిటినీ తీసుకుని వెళ్లి సముద్రంలో పడివేసినా, మళ్లీ రేపు ఈ సమయానికల్లా ప్రతి దేశంలో ఉన్న హాఫిజ్ లు, ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ఉన్నారో, వాళ్ళందరూ వారి వారి దేశాలలో మళ్లీ ఖుర్ఆన్ ను రచించుకోగలరు. ఎందుకంటే ఖుర్ఆన్ ని ప్రారంభం నుండి చివరి వరకు, అల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి ఖుల్ అ’ఊదు బిరబ్బిన్ నాస్ సూరా వరకు కూడా కంఠస్థం చేసిన హాఫిజ్ లు ప్రతి దేశంలో ఉన్నారు. అల్ హమ్దులిల్లాహ్. ఏడు సంవత్సరాల అబ్బాయి, అమ్మాయి కూడా ఖుర్ఆన్ ని కంఠస్థం చేసినవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు.

అభిమాన సోదరులారా, ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజల హృదయాలలో ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అలాగే గ్రంథ రూపంలో కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గ్రంథాన్ని సురక్షితంగా ఉంచి ఉన్నాడు. అదే మనం ఖుర్ఆన్ గ్రంథాన్ని వదిలేసి మరొక గ్రంథాన్ని చూచినట్లయితే, ఆ గ్రంథములోని ఒక్క చాప్టర్ నేడు ప్రపంచంలో నుంచి అదృశ్యం చేసేస్తే ఆ చాప్టర్ ని మళ్ళీ రచించుకోవడానికి వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. ఎందుకంటే ఖుర్ఆన్ తప్ప వేరే గ్రంథాన్ని కంఠస్థం చేసినవాళ్లు ఎవరూ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనే లేరు. కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత, ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

అలాగే ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఖుర్ఆన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అనేక విషయాలను ప్రస్తావించి ఉన్నాడు. ఖుర్ఆన్ లో ప్రస్తావించబడి ఉన్న విషయాలలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఇది తప్పు అని నిరూపించడానికి ఎవరికీ ఆస్కారము లేదు. ప్రవక్త వారి జీవితకాలం నుండి నేటి వరకు కూడా ఎవరూ ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలను తప్పు అని నిరూపించలేకపోయారు. ప్రళయం వరకు కూడా ఇన్ షా అల్లాహ్ నిరూపించలేరు. ఎందుకంటే ఇది నిజమైన ప్రభువు అల్లాహ్ యొక్క వాక్యము కాబట్టి, ఇందులో ఉన్న ఏ ఒక్క వాక్యాన్ని కూడా ఎవరూ తప్పు అని నిరూపించలేరు. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరా, రెండవ అధ్యాయం, రెండవ వాక్యంలో తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ الْكِتَابُ لَا رَيْبَ ۛ فِيهِ
(దాలికల్ కితాబు లా రైబ ఫీహ్)
“ఇది అల్లాహ్ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహం లేదు.” (2:2)

ఈ గ్రంథంలో ఎంతమాత్రం సందేహము లేదు. అదే విషయాన్ని మనం వేరే గ్రంథాలలో చూచినట్లయితే అభిమాన సోదరులారా, పరస్పర విరుద్ధమైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకచోట దేవుడు ఒక్కడు అంటే, ఒకచోట దేవుడు ఇద్దరు, ముగ్గురు అని చెప్పబడి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధమైన విషయాలు వేరే గ్రంథాలలో కనిపిస్తాయి. కానీ ఖుర్ఆన్ ఎలాంటి సందేహాలు లేని సురక్షితమైన గ్రంథము.

అలాగే అభిమాన సోదరులారా, ఈ ఖుర్ఆన్ గ్రంథానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. సాధారణంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మామూలు విషయాల మీద ప్రమాణం చేయడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా గొప్ప ఘనుడు కాబట్టి, ఆయన గొప్ప గొప్ప విషయాల మీదనే ప్రమాణం చేస్తాడు, సాధారణమైన విషయాల మీద ప్రమాణం చేయడు. అలా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథం మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనము చూచినట్లయితే సూర యాసీన్, 36వ అధ్యాయము, రెండవ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు:

يس وَالْقُرْآنِ الْحَكِيمِ
(యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్)
“యాసీన్. వివేకంతో నిండిన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!” (36:1-2) అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ మీద ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖుర్ఆన్ ప్రజలకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వానికి గురై ఉన్నారో, ఎవరైతే అవిశ్వాస అంధకారంలో జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఈ ఖుర్ఆన్ రుజు మార్గాన్ని చూపిస్తుంది, మార్గదర్శకత్వాన్ని చూపిస్తుంది. ఖుర్ఆన్ చదివిన వాళ్ళు చాలామంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కూడా మార్గాన్ని పొందారు. నేడు కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి చాలామంది అంధకారం నుండి బయటికి వస్తున్నారు, రుజు మార్గాన్ని పొందుతూ ఉన్నారు. ఇలాంటి చాలా ఉదాహరణలు మనకు ప్రవక్త జీవిత కాలం నుండి నేటి వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఒకటి రెండు ఇన్ షా అల్లాహ్ ఉదాహరణలు నేను మీ ముందర ఉంచదలుచుకున్నాను.

ఒక ఉదాహరణ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో తుఫైల్ బిన్ అమర్, దౌస్ తెగకు చెందిన ఒక వ్యక్తి మక్కాకు వచ్చారు. ఆనాడు మక్కాలో నివసిస్తున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరోధులైనవారు కొంతమంది తుఫైల్ గారికి ఏమన్నారంటే, “చూడయ్యా, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, అతని పేరు ముహమ్మద్.” విరోధులు కదా, అందుకే ఇలా చెప్తున్నారు. “అతని మాటలు నువ్వు వినకు. ఎందుకంటే అతని మాటలు నీవు వింటే నీ మీద అతని మంత్రజాలం వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అతని మాటల్లో పడిపోతావు. నీ తల్లిదండ్రులకు, నీ ఊరి వారికి దూరం అయిపోతావు. కాబట్టి అతని మాటలు నువ్వు వినకు. అతనితో నువ్వు దూరంగా ఉండు. నీ మంచి కొరకు చెప్తున్నామయ్యా” అన్నారు.

వారి మాటలని నిజమని నమ్మేసిన ఆ తుఫైల్ బిన్ అమర్ దౌసీ, ముహమ్మద్ వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే అనుకోకుండా ఒకసారి మక్కాలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, ప్రవక్త వారు ఏదో ఒక మూలన ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆ శబ్దాన్ని నెమ్మదిగా వినేశారు. అప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన తట్టింది. అదేమిటంటే, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, మంచి చెడును బాగా గ్రహించగల శక్తి ఉన్నవాడిని. నేను ముహమ్మద్ గారి మాటలు కూడా విని చూస్తాను. మంచిదైతే మంచిదనుకుంటాను, మంచిది కాకపోతే చెడ్డదనిపిస్తే దాన్ని వదిలేస్తాను. అంతగా అతనితో భయపడిపోవాల్సిన అవసరం ఏముంది? అలా అనుకొని ఆయన ముహమ్మద్ వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఆయన దగ్గరికి వెళ్లి, ఆయన చదువుతున్న గ్రంథాన్ని, చదివి వినిపించమని కోరగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించారు.

ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి వినిపించిన తర్వాత వెంటనే అక్కడికక్కడే తుఫైల్ గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, “ఓ ముహమ్మద్ గారు, మీరు పఠిస్తున్న ఈ పలుకులు ఇవి మంత్ర తంత్రాలు కావు. అలాగే కవిత్వము కూడా ఇది ఎప్పటికీ కాజాలదు. మీరు ఏదో గొప్ప వాక్యాలు పలుకుతున్నారు. నిశ్చయంగా ఇది దేవుని వాక్యమే అవుతుంది కానీ ప్రజల వాక్యాలు కానే కాజాలవు. నేను సాక్ష్యం ఇస్తున్నాను మీరు ప్రవక్త అని. నేను సాక్ష్యం ఇస్తున్నాను అల్లాహ్ యే దేవుడు అని” అని అక్కడే సాక్ష్యం ఇచ్చి ఇస్లాంలో చేరిపోయారు. చూశారా అభిమాన సోదరులారా.

అలాగే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు జమ్మాద్ అజ్దీ. ఆయనకు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విరోధులు, శత్రువులు ఏమని చెప్పారంటే, “ఏమయ్యా, నీ స్నేహితుడు ముహమ్మద్ ఉన్నాడు కదా, అతనికి పిచ్చి పట్టిందయ్యా. ఏదేదో వాగేస్తున్నాడు. నీకు ఏదో మంత్ర తంత్రాలు వచ్చు కదా. పోయి అతనికి వైద్యం చేయించవచ్చు కదా. నీ స్నేహితుడు కదా, నీ స్నేహితుడికి మంచి బాగోగులు నువ్వు చూసుకోవాలి కదా” అని శత్రువులు చెప్పగా ఆయన నిజమే అని నమ్మాడు. నిజమే అని నమ్మి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్నేహం ఉంది కాబట్టి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్లి ఏమన్నారంటే, “ఏమండీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు నా స్నేహితులు కాబట్టి మీ మంచి కోరి నేను ఒక విషయాన్ని మీ ముందర ఉంచుతున్నాను. అదేమిటంటే మీకు పిచ్చి పట్టిందని నాకు కొంతమంది చెప్పారు. నాకు వైద్యం చేయడం వచ్చు. కాబట్టి నేను మీకు వైద్యం చేయాలనుకుంటున్నాను. మీరు వైద్యం చేయించుకోండి” అన్నారు.

దానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, “అయ్యా, నేను ఏ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు నన్ను మాంత్రికుడు అని, పిచ్చివాడు అని అంటున్నారో ఆ మాటలు కొన్ని నేను నీకు కూడా వినిపిస్తాను. నువ్వు విను. విన్న తర్వాత నువ్వే నిర్ణయించుకో. నేను చెప్తున్నది పిచ్చివాని మాటలా, మంత్ర తంత్రాలా, ఏంటి అనేది నువ్వు విని ఆ తర్వాత నిర్ణయించు” అని చెప్పారు. “సరే చెప్పండి ఓ ప్రవక్త” అని చెప్పగా అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ లోని రెండు చిన్న సూరాలు వినిపించారు. సూర ఇఖ్లాస్, సూర ఫలఖ్. రెండు చిన్న సూరాలు వినిపించగానే, అక్కడికక్కడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేయి పట్టుకొని ఏమన్నాడంటే, “నేను కవుల నోటి నుండి కవిత్వాన్ని విని ఉన్నాను. నేను మాంత్రికుల నోటి నుండి మంత్ర తంత్రాలు విని నేర్చుకొని ఉన్నాను. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది మంత్రము కాదు. నేను సాక్ష్యం పలుకుతున్నాను మీరు చదివింది ఇది కవిత్వము కాదు. ఇది దేవుని మాట. ఎందుకంటే ఇది కవిత్వానికి అతీతము, ఇది మంత్ర తంత్రాలకు అతీతమైన పలుకులు” అని అప్పటికప్పుడే ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేయి పట్టుకొని అల్లాహ్ యే ప్రభువు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త అని సాక్ష్యం పలికి ఇస్లాం స్వీకరించారు.

చూశారా అభిమాన సోదరులారా, అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ అంధకారంలో ఉన్నవారికి మార్గదర్శకత్వం చూపిస్తుంది. ఎవరైతే మార్గభ్రష్టత్వంలో ఉన్నారో వారందరికీ రుజు మార్గం తీసుకువస్తుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని హిదాయత్ అనగా మార్గదర్శకత్వంగా చేసి పంపించాడు. ఇది ఖుర్ఆన్ యొక్క ఘనత.

అలాగే, మనం ఖుర్ఆన్ కు సంబంధించిన మరొక ప్రత్యేకత చూచినట్లయితే, ఖుర్ఆన్ ద్వారా హృదయాలు నెమ్మదిస్తాయి. కఠిన వైఖరి ఉన్నవారి హృదయాలు కూడా మెత్తబడిపోతాయి. వారి శరీర రోమాలు నిలిచి నిలబడిపోతాయి ఖుర్ఆన్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే గనుక. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో మక్కాలో ఒక గొప్ప యువకుడు ఉండేవాడు. చాలా ధైర్యశాలి. బలవంతుడు కూడా. అతనికి ఎదుర్కోవాలంటే మక్కా వాసులు వణికిపోతారు. అలాంటి ధైర్యవంతుడు, అలాంటి శక్తిమంతుడు. ఆయన ఎవరో కాదు, ఆయన పేరే ఉమర్.

ఆయన ఇస్లాం స్వీకరించక పూర్వం ప్రజల మాటలు వింటూ ఉండేవాడు. ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విరుద్ధంగా ఏవేవో చెప్తా ఉంటే అది నిజమని నమ్మేవాడు. అయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో కాబతుల్లా వద్ద ఖుర్ఆన్ గ్రంథం పఠిస్తూ ఉంటే అనుకోకుండా ఒకరోజు వినేశాడు. నచ్చింది. ప్రజలు చూస్తే ఆయన మంచివాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు. ఈయన చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి విన్న ఖుర్ఆన్ గ్రంథము ఆయనకు నచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎవరి మాట నిజమని నమ్మాలి? ప్రవక్త వారి మాట నిజమని నమ్మాలా? లేదా మక్కా పెద్దలు చెప్తున్న మాటలు నిజమని నమ్మాలా? అయోమయంలో పడిపోయాడు, కన్ఫ్యూజన్.

చివరికి ఆ కన్ఫ్యూజన్ ఎంత ఎక్కువైపోయిందంటే, ఇదంతా ముహమ్మద్ వల్లే కదా జరుగుతా ఉండేది, కాబట్టి ముహమ్మద్ నే లేకుండా చేసేస్తే ఈ కన్ఫ్యూజనే ఉండదు అని అలా అనుకొని ఆయన కత్తి పట్టుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చంపడానికి బయలుదేరిపోయాడు. దారి మధ్యలో ఒక వ్యక్తి చూసుకున్నాడు. ఆయన అర్థం చేసుకున్నాడు, ఈ రోజు ఉమర్ బయలుదేరాడు, ఎవరికో ఒకరికి ఈ రోజు ప్రాణం తీసేస్తాడు అని. వెంటనే ఆయన ఏమన్నారంటే, “ఓ ఉమర్, ఎక్కడికి వెళ్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉమర్ వారు ఉన్న ఉద్దేశాన్ని వ్యక్తపరిచేసాడు. “ఈ ముహమ్మద్ వల్ల నేను అయోమయంలో పడిపోయి ఉన్నాను కాబట్టి, సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాను” అని చెప్పేసాడు.

అప్పుడు ఆయన అన్నారు, “అయ్యా, ముహమ్మద్ విషయం తర్వాత. ముందు నీ చెల్లెలు, నీ బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు. ముహమ్మద్ మాటల్లో వచ్చేసారు. ముందు వాళ్ళ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. వాళ్ళ గురించి ముందు నువ్వు తెలుసుకో” అన్నారు. ముందే కోపంలో ఉన్నారు. వారి ఇంటివారు, సొంత వాళ్ళ చెల్లెలు, బావ ఇద్దరు ఇస్లాం స్వీకరించేశారు అన్న విషయాన్ని తెలుసుకోగా, అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయిపోయింది. మరింత కోపం ఎక్కువైపోయింది. కోపం ఎక్కువైపోయేసరికి చక్కగా అక్కడి నుండి చెల్లి ఇంటికి వెళ్ళాడు.

దూరం నుంచి ఉమర్ వస్తున్న విషయాన్ని గ్రహించిన వారి చెల్లి వెంటనే ఖుర్ఆన్ చదువుతూ ఉండింది, కొన్ని పత్రాలు తీసుకుని. అవి బంద్ చేసేసి ఒకచోట దాచి పెట్టేసింది. ఆ తర్వాత వెళ్లి తలుపు తీయగా ఉమర్ వారు కోపంతో ప్రశ్నిస్తున్నారు. “నేను వచ్చే ముందు విన్నాను, చప్పుడు విన్నాను నేను. మీరు ఏదో చదువుతా ఉన్నారు. ఏంటి అది?” అని ప్రశ్నించాడు. “నేను వినింది నిజమేనా? మీరు ముహమ్మద్ మాటల్ని నమ్ముతున్నారంట కదా. తాత ముత్తాతల ధర్మాన్ని, మార్గాన్ని వదిలేశారంట కదా. నిజమేనా?” అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆవిడ అంది, “లేదు లేదు” అని ఏదో రకంగా ఆయనను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన వినే స్థితిలో లేడు. చెల్లెలు మాట తడబడుతూ ఉంటే, “ఆ నేను వినింది నిజమే” అని నమ్మేసి వెంటనే చెల్లెల్ని, బావని ఇద్దరినీ చితకబాదేశాడు. ఎంతగా కొట్టారంటే చెల్లి తలకు గాయమై రక్తం ప్రవహించింది. వెంటనే చెల్లి ఏమనింది అంటే, “ఓ ఉమర్, నువ్వు వినింది నిజమే. మేము ముహమ్మద్ వారు తీసుకువచ్చిన ధర్మాన్ని స్వీకరించాము. అల్లాహ్ యే ప్రభువు అని నమ్మేసాము. తాత ముత్తాతల మార్గాన్ని వదిలేసాము. నువ్వు చంపుతావో, ఏమి చేస్తావో చేసుకో. ఇప్పుడు మేము మాత్రం ముహమ్మద్ తీసుకుని వచ్చిన ధర్మాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో వదలమంటే వదలము. ఏం చేస్తావో చేసుకో” అని.

అంత కఠినంగా చెల్లెలు మాట్లాడేసరికి ఉమర్ వారు ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు, “అమ్మా, నీకు అంత ప్రభావితం చేసిన ఆ వాక్యాలు ఏమిటో, నాకు కూడా కొంచెం వినిపించు చూద్దాం” అన్నాడు. అప్పుడు చెల్లెలు అన్నారు, “లేదయ్యా, ముందు వెళ్లి నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత వినిపిస్తాను.” వెళ్లి స్నానం చేసి వచ్చారు. ఆ తర్వాత ఉమర్ గారి చెల్లెలు వద్ద ఉన్న కొన్ని పత్రాలు అతనికి ఇవ్వగా, ఉమర్ ఆ పత్రాలను తీసుకుని చదివారు. చదివిన తర్వాత ఎంతగా ఆయన హృదయం నెమ్మబడిపోయిందంటే, కొద్ది నిమిషాల క్రితం ముహమ్మద్ వారిని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఆ వ్యక్తి, ఆ పత్రాలలో ఉన్న దేవుని వాక్యాలు చదివిన తర్వాత ఆయన హృదయం ఎంత మెత్తబడిపోయిందంటే, “సుబ్ హా నల్లాహ్! ఎంత మంచి పలుకులు ఇందులో ఉన్నాయి! ముహమ్మద్ వారు ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ముహమ్మద్ వారు తీసుకువచ్చిన మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు.

చూశారా. అభిమాన సోదరులారా, ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లిపోయారు. చూసిన వాళ్ళు కంగారుపడిపోయారు, ఉమర్ వచ్చేసాడు ఏం చేసేస్తాడో ఏమో అని. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో వెళ్లి, “ఓ దైవ ప్రవక్త, నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను. అల్లాహ్ యే ప్రభువు, మీరు అల్లాహ్ పంపించిన అంతిమ ప్రవక్త” అని సాక్ష్యం ఇస్తున్నాను అని చెప్పగా అక్కడ ఉన్న సహాబాలందరూ “అల్లాహు అక్బర్” అని బిగ్గరగా పలికారు. అంటే ఈ ఉదాహరణ ద్వారా తెలిసివచ్చే విషయం ఏమిటంటే, ఖుర్ఆన్ లో ఎలాంటి శక్తి అల్లాహ్ పెట్టి ఉన్నాడంటే కఠిన మనస్తత్వం కలిగిన వారి మనసు కూడా నెమ్మదిగా మారిపోతుంది. హృదయాలు నెమ్మదిస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

అలాగే అభిమాన సోదరులారా, ఖుర్ఆన్ కు ఉన్న మరొక గొప్ప విశిష్టత, అలాగే ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ గ్రంథాన్ని చదవడానికి తీసుకుని వ్యక్తి ప్రారంభిస్తే, ఒక్కొక్క అక్షరానికి బదులుగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ వ్యక్తికి పదేసి పుణ్యాలు ప్రసాదిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరించి మళ్లీ చెప్పారు, “ఎవరైనా ఒక వ్యక్తి అలిఫ్ లామ్ మీమ్ అని చదివితే అవి మూడు అక్షరాలు అవుతాయి. అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము, మీమ్ ఒక అక్షరము. అలిఫ్ లామ్ మీమ్ అని చదవగానే ఆ వ్యక్తికి మూడు అక్షరాలు చదివిన పుణ్యం, అనగా ముప్పై పుణ్యాలు అతనికి లభిస్తాయి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఆ ప్రకారంగా ఖుర్ఆన్ పూర్తి గ్రంథాన్ని చదివితే ఎన్ని పుణ్యాలు మనిషికి లభిస్తాయి ఆలోచించండి. ఇలా పుణ్యాలు లభించే మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఇంతటి విశిష్టత కలిగిన మరొక గ్రంథం ఏదైనా ఉందా? ఏ గ్రంథానికైనా ఇలాంటి ఘనత ఉందా అభిమాన సోదరులారా? లేదు, కాబట్టి ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత.

అలాగే, ఖుర్ఆన్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. ఎలాంటి స్వస్థత అండి? మనిషి మనసులో కొన్ని రోగాలు ఉంటాయి, మనిషి శరీరానికి సంబంధించిన కొన్ని రోగాలు ఉంటాయి. మనిషి మనసులో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు, మనిషి శరీరంలో ఉన్న రోగాలకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరులారా. మనసులో అహంకారం ఉంటుంది, మనసులో అసూయ ఉంటుంది, మనసులో కుళ్ళు ఉంటుంది. ఇలా చాలా రోగాలు ఉంటాయి. ఖుర్ఆన్ ద్వారా ఈ రోగాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారో వాళ్ళ మనసులో నుంచి అహంకారం తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి అసూయ తొలగిపోతుంది, వాళ్ళ మనసులో నుంచి కుళ్ళు అనేది తొలగిపోతుంది. ఇలా మనసులో ఉన్న రోగాలన్నీ తొలగిపోతాయి, స్వస్థతని ఇస్తుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం. అలాగే శరీరానికి సంబంధించిన చాలా వ్యాధులకు కూడా ఈ ఖుర్ఆన్ ద్వారా స్వస్థత పొందవచ్చు అభిమాన సోదరులారా.

అలాగే ఈ ఖుర్ఆన్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఖుర్ఆన్ ఇది ఎలాంటి గ్రంథం అంటే మానవుని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది అది కూడా ఇందులో చెప్పబడింది. ప్రళయం వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఏమేమి జరగబోతుంది, ప్రళయం సంభవించిన తర్వాత పరలోకంలో ఏమి జరుగుతుంది, ఇవన్నీ విషయాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ కూడా ఈ ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు, “మనిషికి లాభం చేకూర్చే విద్యలన్నీ ఖుర్ఆన్ లో ఉన్నాయని మీరు చెప్తున్నారు, సరే గానీ, సైన్స్ కూడా ఖుర్ఆన్ లో ఉందా?” అని మీరు ప్రశ్నించవచ్చు అభిమాన సోదరులారా. ఉంది. సైన్స్ కి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. వైద్యానికి సంబంధించిన విషయాలు కూడా ఖుర్ఆన్ లో ఉన్నాయి. ఆ విధంగా చూసుకునిపోతే చాలా విషయాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించే వాళ్ళ అవసరం ఉంది. ఉన్నారా ఎవరైనా గుర్తించేవాళ్లు అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది, “రండి, నాలో ఉన్నాయి చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా, రండి చదివి అర్థం చేసుకోండి. గ్రహించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రండి చదివి గ్రహించండి” అని ఖుర్ఆన్ పిలుపునిస్తుంది. గ్రహించాల్సిన అవసరం ఉంది అభిమాన సోదరులారా. మనిషికి మేలు చేసే విద్యలన్నీ ఈ ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్నాయి. ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనం.

అలాగే, పరలోకంలో కూడా ఈ ఖుర్ఆన్ గ్రంథము ద్వారా మనిషికి ఎంతో లబ్ధి జరుగుతుంది, లాభం జరుగుతుంది. అది కూడా ఇన్ షా అల్లాహ్ రెండు మూడు విషయాలు చెప్పేసి నా మాటను ముగిస్తాను, సమయం ఎక్కువ పోతుంది. పరలోకంలో మనిషికి ఖుర్ఆన్ ద్వారా ఎలాంటి లాభం వస్తుందంటే అభిమాన సోదరులారా, మరణించిన తర్వాత ముందుగా మనిషి ఎక్కడికి వెళ్తాడండి? సమాధి లోకానికి వెళ్తాడు. సమాధి లోకంలో వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి అక్కడ ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మూడు ప్రశ్నలు ఉంటాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే నీ ప్రభువు ఎవరు? నీ ప్రవక్త ఎవరు? రెండవ ప్రశ్న. నీ ధర్మం ఏమిటి? మూడవ ప్రశ్న.

ఎవరైతే ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివి నా ప్రభువు అల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, నా ధర్మము ఇస్లాం అని గ్రహించి ఉంటాడో, నా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని గ్రహించి ఉంటాడో, అతను ఆ సమాధి లోకంలో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తాడు. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న రూపంలో దూతలు అతనికి ఏమని ప్రశ్నిస్తారంటే, “నీ ప్రభువు అల్లాహ్ అని, నీ ధర్మం ఇస్లాం అని, నీ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ అని నీకు ఎలా తెలిసింది?” అని నాలుగవ ప్రశ్న సమాధి లోకంలో దూతలు అడుగుతారు. అప్పుడు మనిషి అక్కడ అంటాడు, “నేను దైవ గ్రంథమైన ఖుర్ఆన్ ని చదివి ఈ విషయాలు తెలుసుకున్నాను, నమ్మాను, ఆ ప్రకారంగా నడుచుకున్నాను” అంటాడట. అప్పుడు దూతలు అతనికి శుభవార్త వినిపిస్తారట, “నీ జీవితం శుభము కలుగుగాక, నీ రాకడ నీకు శుభము కలుగుగాక. నీవు విశ్వసించింది వాస్తవమే, నువ్వు నడుచుకునింది కూడా వాస్తవమైన మార్గమే. ఇదిగో చూడు, నీకు త్వరలోనే లెక్కింపు జరిగిన తర్వాత స్వర్గంలో ఫలానా చోట నీవు సుఖంగా ఉంటావు, నీ గమ్యస్థానాన్ని నువ్వు చూచుకో” అని దూతలు అతనికి చూపించేస్తారట. అతను సంతోషపడిపోతాడు అభిమాన సోదరులారా.

చూశారా? సమాధి లోకంలో పరీక్షలో నెగ్గాలంటే ఈ ఖుర్ఆన్ గ్రంథము ఉపయోగపడుతుంది. అలాగే మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సమాధిలో మనిషిని పూడ్చివేసిన తర్వాత దూతలు అతని తల వైపు నుంచి వస్తారట. దూతలు ఎప్పుడైతే అతని తల వైపు నుంచి వస్తారో, ఖుర్ఆన్ గ్రంథం వెళ్లి వారికి ఎదురుగా నిలబడి చెబుతుందట, “ఈ వ్యక్తి ప్రపంచంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివిన వాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పేస్తుందట. అల్లాహు అక్బర్. చూశారా.

ఆ తర్వాత దూతలు అతని కుడి వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తారట. అప్పుడు మానవుడు ప్రపంచంలో చేసిన దానధర్మాలు అక్కడికి వచ్చి, “మీరు ఎక్కడికి వస్తూ ఉన్నది? ఈ భక్తుడు ప్రపంచంలో దానధర్మాలు చేసేవాడు కాబట్టి, మీకు ఇక్కడ మార్గము లేదు వెనక్కి వెళ్లిపోండి” అని దానధర్మాలు వచ్చి అక్కడ ఎదురు నిలబడిపోతాయి. ఆ తర్వాత దూతలు ఆ వ్యక్తి యొక్క కాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రపంచంలో అతను నమాజ్ చదవటానికి ఇంటి నుండి మస్జిద్ వరకు వస్తూ, వెళ్తూ, వస్తూ, వెళ్తూ ఉన్నాడు కదా, ఆ నడవడిక వచ్చి అక్కడ నిలబడిపోయి దూతలతో అంటుందట, “మీరు ఎక్కడికి వస్తున్నది? ఈ భక్తుడు ప్రపంచంలో ఈ కాళ్ళతోనే నడిచి నమాజ్ కు వెళ్లి నమాజ్ ఆచరించేవాడు కాబట్టి మీకు ఇక్కడ మార్గం లేదు, వెనక్కి వెళ్లిపోండి” అని చెప్పి ఎదురు నిలబడిపోతుందట. చూశారా అభిమాన సోదరులారా. సమాధి లోకంలో భక్తునికి ఉపయోగపడుతుంది ఈ ఖుర్ఆన్ గ్రంథం.

ఇక పరలోకంలో ఎప్పుడైతే యుగాంతం సంభవించిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రజలందరినీ మళ్లీ లేపి అక్కడ లెక్కింపు తీసుకుని ఉంటాడు కదా, దాన్ని హషర్ మైదానం అంటారు, పరలోకం అంటారు. ఆ పరలోకంలో లెక్కింపు జరిగేటప్పుడు కొంతమంది వ్యక్తులు ఆ లెక్కింపులో ఫెయిల్ అయిపోతారు. ఇరుక్కుపోతారు ప్రశ్న జవాబులు చెప్పలేక. అలాంటి స్థితిలో తల్లి గానీ, తండ్రి గానీ, స్నేహితుడు గానీ, సోదరి గానీ, భార్య గానీ, బిడ్డలు గానీ ఎవరూ ఆ రోజు వచ్చి ఆదుకునేవారు ఉండరు. అతను ఇరుక్కుపోతాడు లెక్కింపులో. కంగారుపడిపోతూ ఉంటే, ఖుర్ఆన్ గ్రంథం వస్తుంది అతనికి స్నేహితునిగా, ఆదుకునేవానిగా. ఆ ఖుర్ఆన్ గ్రంథం వచ్చి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో సిఫారసు చేస్తుంది. “ఓ అల్లాహ్, ఈ భక్తుడు ప్రపంచంలో ఖుర్ఆన్ చదివేవాడు కాబట్టి ఇతని విషయంలో నేను సిఫారసు చేస్తున్నాను. ఇతనిని మన్నించి నీవు స్వర్గానికి పంపించు” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాతో ఈ ఖుర్ఆన్ గ్రంథము ఆ భక్తుని కోసం సిఫారసు చేస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ఖుర్ఆన్ యొక్క సిఫారసును అంగీకరించి ఆ భక్తునికి స్వర్గంలోకి పంపించేస్తాడట.

చూశారా అభిమాన సోదరులారా. ఎవరూ పనికిరాని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం మనిషికి, భక్తునికి పనికి వస్తుంది. ఎవరూ రక్షించలేని ఆ రోజులో ఖుర్ఆన్ గ్రంథం వచ్చి ఆ మనిషికి, ఆ భక్తునికి రక్షిస్తుంది. అంతటితోనే మాట పూర్తి కాలేదు అభిమాన సోదరులారా.

మరొక విషయం ఏమిటంటే, స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునితో అంటారట, ఏమని అంటాడో తెలుసా? “ఓ భక్తుడా, నీవు ప్రపంచంలో ఎలాగైతే ఖుర్ఆన్ గ్రంథాన్ని చదివేవాడివో, ఇక్కడ కూడా స్వర్గంలో ఖుర్ఆన్ గ్రంథాన్ని చదువుతూ ఈ స్వర్గం యొక్క స్థాయిల్ని నువ్వు ఎక్కుతూ వెళ్తూ ఉండు, ఎక్కుతూ వెళ్తూ ఉండు. ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం పూర్తి అవుతుందో అప్పటివరకు నువ్వు ఎంత పైకి ఎక్కగలవో ఎక్కు. అక్కడ, ఎక్కడైతే నీ ఖుర్ఆన్ పారాయణం ఆగిపోతుందో అదే నీ స్థానము” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటిస్తాడు. చూశారా. ఈ ఖుర్ఆన్ గ్రంథము రేపు స్వర్గంలో ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఇది ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత అభిమాన సోదరులారా.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ షా అల్లాహ్ మరిన్ని విషయాలు వేరే జుమా ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చివరిగా నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, “ఓ అల్లాహ్, ఖుర్ఆన్ గ్రంథం యొక్క ప్రత్యేకతలని అర్థం చేసుకుని ఖుర్ఆన్ గ్రంథాన్ని గౌరవిస్తూ, ఖుర్ఆన్ లో ఉన్న వాక్యాలని అర్థం చేసుకుంటూ చదివే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అల్లాహ్, ప్రతిరోజు ఖుర్ఆన్ గ్రంథాన్ని పఠించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఓ అల్లాహ్, ఖుర్ఆన్ ద్వారా ప్రపంచంలో కూడా మాకు గౌరవాన్ని ప్రసాదించు, పరలోకంలో కూడా మాకు స్వర్గం ప్రసాదించు.” ఆమీన్.

అఖూలు ఖౌలీ హాదా వస్తగ్ఫిరుల్లాహ లీ వలకుమ్ వలిసాఇరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=25451

ఖుర్ఆన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

అత్యంత పెద్ద నేరం, పాపం? – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

అత్యంత పెద్ద నేరం, పాపం?
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/0m0vDeE36Cw [21 నిముషాలు]

ఈ ప్రసంగంలో షిర్క్ (బహుదైవారాధన) ఇస్లాంలో అత్యంత ఘోరమైన పాపం మరియు నేరం అనే అంశంపై దృష్టి సారించారు. సాధారణంగా ప్రజలు హత్య లేదా అత్యాచారం వంటి నేరాలను అతిపెద్దవిగా భావిస్తారని, కానీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం, అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించడమే (షిర్క్) అన్నింటికన్నా పెద్ద పాపమని వక్త వివరిస్తారు. షిర్క్ యొక్క తీవ్రమైన పరిణామాలను, అంటే చేసిన మంచి పనులన్నీ వృధా కావడం, స్వర్గం నిషేధించబడటం మరియు నరకంలో శాశ్వత శిక్ష వంటి వాటిని ఖురాన్ ఆయతుల ద్వారా ఉటంకిస్తారు. ఇంకా, షిర్క్ రెండు రకాలుగా ఉంటుందని వివరిస్తారు: షిర్క్-ఎ-అక్బర్ (పెద్ద షిర్క్), ఇది ఇస్లాం నుండి బహిష్కరిస్తుంది, మరియు షిర్క్-ఎ-అస్గర్ (చిన్న షిర్క్). చిన్న షిర్క్‌లో అల్లాహ్ తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయడం, తాయెత్తులు కట్టడం, మరియు రియా (ప్రదర్శన కోసం ఆరాధనలు చేయడం) వంటివి ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా తెలియజేస్తారు. ప్రతి ముస్లిం ఈ ఘోరమైన పాపం నుండి దూరంగా ఉండాలని, తన ఆరాధనలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయాలని వక్త ప్రబోధిస్తారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي
[రబ్బిష్రహ్ లీ సద్రీ, వ యస్సిర్ లీ అమ్ రీ, వహ్ లుల్ ఉఖ్ దతమ్ మిల్ లిసానీ, యఫ్ ఖహూ ఖౌలీ]
(ఓ నా ప్రభూ! నా హృదయాన్ని నా కొరకు విశాలపరచు. నా కార్యాన్ని నాకు సులభతరం చెయ్యి. నా నాలుకలోని ముడిని విప్పు. ప్రజలు నా మాటను సులభంగా అర్థం చేసుకునేటట్లు చెయ్యి.) (20:25-28)

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు ఇస్లామీయ సోదరులారా! ఈనాటి నా జుమా ప్రసంగ అంశం, షిర్క్ ఒక పెద్ద నేరం.

అభిమాన సోదరులారా, సాధారణంగా నేరాలన్నింటిలో పెద్ద నేరం ఏమిటి? పాపాలన్నింటిలో పెద్ద పాపం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, ధర్మజ్ఞానము లేని వారు లేదా అంతంత మాత్రమే ధర్మజ్ఞానం ఉన్నవారు నేరాలన్నింటిలో పెద్ద నేరం అంటే, ప్రజల ప్రాణాలు హరించటం పెద్ద నేరం అని సమాధానం ఇస్తారు. మరి కొంతమంది అయితే అమ్మాయిలపై బలాత్కారాలు చేయటం, అత్యాచారాలు చేయటం పెద్ద నేరం అండి అని కొంతమంది సమాధానం ఇస్తారు. అలాగే మరికొంతమంది ప్రజల సొమ్ము దోచేయటం, లూటీలు చేయటం పెద్ద నేరం అండి అని ఈ విధంగా రకరకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు.

నిజం ఏమిటంటే, ఇవన్నీ పెద్ద నేరాలే. కానీ వీటన్నింటికంటే కూడా ఒక పెద్ద నేరం ఉంది. అది బలాత్కారాలు చేయడం కంటే కూడా పెద్ద నేరము, లూటీలు దోపిడీలు చేయటం కంటే కూడా పెద్ద నేరము, ప్రజల ప్రాణాలు హరించటము కంటే కూడా పెద్ద నేరము. ఆ నేరం గురించి మాత్రము ఎక్కువ మందికి తెలియదు, చాలా తక్కువ మంది మాత్రమే ఆ దాని గురించి తెలుసుకొని ఉన్నారు. ఆ అంత పెద్ద నేరం ఏమిటి ఆ పెద్ద నేరం అంటే అభిమాన సోదరులారా, షిర్క్! బహుదైవారాధన. అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పించటం. ఇది పాపాలన్నింటిలో, నేరాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము.

అరే! అది అంత పెద్ద పాపం అని మీరు ఎలా చెప్పగలరండీ అని మీరు ప్రశ్నిస్తారేమో? ఇది నా మాట కాదు. నేను నా తరఫున ప్రకటిస్తున్న విషయము కాదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షిర్క్ బహుదైవారాధన పెద్ద నేరము అని పాపాలన్నింటిలో నేరాలన్నింటిలో పెద్ద నేరము అని ప్రకటించి ఉన్నారు.

మనం చూసినట్లయితే, సూరా లుఖ్మాన్‌లోని 13వ వాక్యంలో ఈ విధంగా అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు:

إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ
[ఇన్నష్షిర్క ల జుల్మున్ అజీమ్]
నిస్సందేహంగా అల్లాహ్‌కు భాగస్వాముల్ని కల్పించటం (షిర్క్‌ చేయటం) ఘోరమైన అన్యాయం (31:13)

అలాగే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు. యా రసూలల్లాహ్, అయ్యు జంబి అక్బరు ఇందల్లాహ్? అల్లాహ్ దృష్టిలో పెద్ద నేరము ఏమిటి? అల్లాహ్ దృష్టిలో పెద్ద పాపము ఏమిటి? అని ఆ వ్యక్తి ప్రశ్నించగా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. నీకు పుట్టించిన ప్రభువైన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తో ఇతరులను సాటి కల్పించడం, సహవర్తులుగా నిలబెట్టడం, ఇది నేరాలన్నింటిలో, పాపాలన్నింటిలో పెద్ద నేరము, పెద్ద పాపము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి సమాధానం ఇచ్చారు.

అలాగే మరొక సందర్భంలో శిష్యుల వద్ద ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రశ్నించారు. ఏమన్నారంటే, అలా ఉనబ్బిఉకుం బి అక్బరిల్ కబాయిర్? ఏమండీ నేను మీకు పాపాలలోనే పెద్ద పాపము, ఘోరాలలోనే పెద్ద ఘోరము, నేరాలలోనే పెద్ద నేరము దాని గురించి మీకు తెలుపనా అని తెలియజేశారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అన్నారు, బలా యా రసూలల్లాహ్. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తప్పనిసరిగా దాని గురించి మాకు మీరు తెలియజేయండి అనగా, అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటిగా ప్రస్తావించిన విషయం ఏమిటంటే, అల్ ఇష్రాకు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టటం, ఇది పెద్ద పాపాలలోనే పెద్ద పాపము, పెద్ద నేరము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ప్రకటించారు.

అలాగే మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజానికి ఏడు ప్రాణాంతకమైన విషయాల గురించి హెచ్చరించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇజ్తనిబుస్ సబ్అల్ మూబిఖత్. ఏడు ప్రాణాంతకమైన విషయాల నుండి మీరు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నారు. ఆ ఏడు విషయాలు ఏమిటంటే అందులోని మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అష్షిర్కు బిల్లాహ్. అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా నిలబెట్టడం, షిర్క్ చేయటం, ఇది ఏడు ప్రాణాంతకమైన పాపాలలో మొదటి పాపము అన్నారు.

అభిమాన సోదరులారా! అటు అల్లాహ్ వాక్యము ద్వారా, ఇటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకుల ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టంగా అర్థమైపోయింది, అది ఏమిటంటే షిర్క్ చేయటం, బహుదైవారాధన చేయటం, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించటం, ఇది ఘోరమైన నేరం, పెద్ద పాపము అని స్పష్టమయ్యింది.

ఇక రండి, ఈ షిర్క్ చేస్తే, ఈ పాపానికి ఎవరైనా ఒడిగడితే అతనికి జరిగే పరిణామం ఏమిటి? అతనికి జరిగే నష్టం ఏమిటి? అది కూడా మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు గ్రంథాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

షిర్క్ చేసే వ్యక్తికి కలిగే ఒక నష్టం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆ వ్యక్తికి స్వర్గం నుండి దూరంగా ఉంచేస్తాడు. ఎవరైతే షిర్క్‌కు పాల్పడతారో వారి కోసము స్వర్గం నిషేధించబడుతుంది. వారి నివాసం నరకమైపోతుంది. మనం చూసినట్లయితే ఖురాన్‌లోని సూరా మాయిదా 72వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

إِنَّهُ مَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
ఎవడు అల్లాహ్‌కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి. అతని నివాసం నరకాగ్ని. దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు. (5:72)

అలాగే అభిమాన సోదరులారా, షిర్క్ చేసే వానికి కలిగే మరొక నష్టం ఏమిటంటే, అతని సత్కార్యాలు అన్నీ, అతని కర్మలన్నీ, అతని పుణ్యాలు అన్నీ తుడిచివేయబడతాయి. ఖురాన్‌లోని సూరా జుమర్ 65వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హెచ్చరిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు:

وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)

అల్లాహు అక్బర్. స్వయంగా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడు, ఒకవేళ నీవు గనుక షిర్క్‌కు పాల్పడినట్లయితే, నీ కర్మలన్నీ వృధా చేయబడతాయి అని అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఆయనకే, అంత గొప్ప వ్యక్తికే అంత గొప్ప మహా ప్రవక్తకే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాకీదు చేస్తున్నాడంటే, మీలాంటి, నాలాంటి, మనలాంటి సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.

కాబట్టి ఇదే విషయము ఖురాన్‌లోని సూరా అన్ఆమ్ 88వ వాక్యంలో మనం చూచినట్లయితే అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా అక్కడ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు:

ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి. (6:88)

ఇక్కడ అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా కొంతమంది ప్రవక్తల ప్రస్తావన చేసి చివరికి ఏమంటున్నారంటే, ఇలాంటి ప్రవక్తలు కూడా ఒకవేళ షిర్క్‌కు పాల్పడినట్లయితే, బహుదైవారాధనకు గురైనట్లయితే, అల్లాహ్‌తో ఇతరులను సాటి కల్పించినట్లయితే, వారి సత్కార్యాలన్నీ వృధా అయిపోతాయి అంటున్నాడు. కాబట్టి దీని ద్వారా మనకు ఒక విషయం మాత్రము స్పష్టమవుతుంది, అదేమిటంటే అభిమాన సోదరులారా, ఏ వ్యక్తి అయితే షిర్క్ చేస్తాడో, ఏ వ్యక్తి అయితే అల్లాహ్‌తో ఇతరులను సహవర్తులుగా, సాటిగా నిలబెడతాడో, అతని సత్కార్యాలు అన్నీ అతని కర్మలన్నీ వృధా చేయబడతాయి.

అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ విషయం మనము జీవితంలో ప్రతివేళ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అదేమిటంటే సూరా నిసాలోని 48వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు:

إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ
తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్‌ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)

అంటే తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని షిర్క్‌ను అల్లాహ్ సుతరాము క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. అంటే షిర్క్ తప్ప ఇతర పాపాలు మనిషి చేసి ఉంటే అల్లాహ్ తలిస్తే వాటిని క్షమించగలడేమో గానీ, షిర్క్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా క్షమించడు అని ఈ వాక్యంలో స్పష్టంగా మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి, అభిమాన సోదరులారా, షిర్క్ పెద్ద నేరము అని, షిర్క్ క్షమించరాని నేరము అని, షిర్క్ వల్ల మనిషి స్వర్గానికి దూరమైపోతాడు, నరకానికి చేరుకుంటాడని, అతని కర్మలన్నీ వృధా చేయబడతాయని ఇంతవరకు విన్న విషయాలలో మనము అర్థం చేసుకున్నాము.

ఇక రండి, షిర్క్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది అదేమిటంటే, షిర్క్ రెండు రకాలు అభిమాన సోదరులారా. ఒకటి షిర్కె అక్బర్, రెండవది షిర్కె అస్గర్. షిర్కె అక్బర్ అంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా, అల్లాహ్ దగ్గర చేయవలసిన కార్యాలు అల్లాహ్ వద్ద కాకుండా ఇతరుల వద్ద చేస్తే, అల్లాహ్‌కు ఇతరులను సాటి కల్పిస్తే అది షిర్కె అక్బర్ అవుతుంది. మరి షిర్కె అస్గర్ అంటే ఏమిటి? అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు.

షిర్కె అస్గర్ రెండు రకాలు. చిన్న షిర్క్ రెండు రకాలు. ఒకటి బహిర్గతంగా కనిపించే షిర్క్, రెండవది కనిపించకుండా రహస్యంగా ఉండే షిర్క్.

బహిర్గతంగా కనిపించే చిన్న షిర్క్ ఏమిటి అంటే అభిమాన సోదరులారా, ఒకటి అల్లాహ్‌ను కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేయటం. అల్లాహ్‌ను వదిలేసి ఇతరుల మీద ప్రమాణం చేయటం. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా సందర్భంలో ఏదైనా ఒక మాట స్పష్టంగా ప్రజలకు నమ్మ జెప్పాలంటే చాలామంది ఏమంటుంటారంటే, నా తల్లి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా తల్లి సాక్షిగా, నా బిడ్డల మీద నేను ప్రమాణం చేస్తున్నాను, నా బిడ్డల సాక్షిగా, నేను నడుపుతున్న బండి మీద నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ బండి సాక్షిగా అని రకరకాల విషయాల మీద వాళ్లు ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే అభిమాన సోదరులారా, ఇలా చేయటం ధర్మ సమ్మతము కాదు. ఒకవేళ మనిషికి ప్రమాణం చేయటం తప్పనిసరి అయితే అతను కేవలం అల్లాహ్ పేరు మీద మాత్రమే ప్రమాణం చేయాలే గానీ ఇతరుల పేరు మీద ప్రమాణం చేయకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరుల పేరు మీద ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి కూడా షిర్క్ చేసినట్లు అవుతుంది, చిన్న షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పలుకులు వినండి, ఆయన తెలియజేశారు: మన్ హలఫ బిగైరిల్లాహి ఫఖద్ కఫర ఔ అష్రక. ఎవరైతే అల్లాహ్ కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేస్తాడో అతను కుఫ్రుకు పాల్పడినట్లు లేదా షిర్క్‌కు పాల్పడినట్లు.

అలాగే అభిమాన సోదరులారా, చిన్న షిర్క్ యొక్క కనిపించే రెండో విషయం ఏమిటంటే, తాయెత్తులు వేలాడదీయటం. చాలామంది చేతుల్లో, మెడలలో, నడుము మీద, కాళ్ళ మీద తాయెత్తులు కట్టుకొని ఉంటారు. అభిమాన సోదరులారా, తాయెత్తులు కట్టటము కూడా ధర్మ సమ్మతము కాదు, నిషేధమైన కార్యము. ఎవరైనా వ్యక్తి తాయెత్తులు కట్టినట్లయితే అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది, అతను కూడా చిన్న షిర్క్ చేసినట్లు అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లఖ తమీమతన్ ఫఖద్ అష్రక. ఎవరైతే తాయెత్తులు కట్టాడో అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లే.

ఇది చిన్న షిర్క్‌లో బహిర్గతంగా కనిపించే షిర్క్.

ఇక రండి అభిమాన సోదరులారా, చిన్న షిర్క్‌లో కనిపించకుండా రహస్యంగా ఉండే ఒక షిర్క్ ఉంది, అదేమిటంటే రియా అని తెలుగులో అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసే సత్కార్యాలు అని తెలుగులో అంటారు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను ఎక్కువగా ఈ షిర్కె అస్గర్ గురించి భయపడుతూ ఉన్నాను అన్నారు. శిష్యులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త, ఈ చిన్న షిర్క్ అంటే ఏమిటండీ, దీని గురించి మీరు కంగారు పడుతున్నారు అని ప్రశ్నించగా అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన పలుకులు వినండి, అఖ్వఫు మా అఖాఫు అలైకుం అష్షిర్కుల్ అస్గర్. ఖాలూ యా రసూలల్లాహ్ వమష్షిర్కుల్ అస్గర్? ఖాల అర్రియా. అంటే మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ చిన్న షిర్క్ గురించి భయమేస్తుంది. దైవ ప్రవక్త ఆ షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, ప్రదర్శనా బుద్ధితో పని చేయటం.

అభిమాన సోదరులారా, ఒక వ్యక్తి నమాజు చేస్తున్నాడు, ఉపవాసాలు పాటిస్తున్నాడు, దానధర్మాలు చేస్తున్నాడు, జకాతు చెల్లిస్తున్నాడు, ఉమ్రా హజ్జులు ఆచరిస్తున్నాడు, అయితే అతను అల్లాహ్ ప్రసన్నత కోసం ఈ విషయాలన్నీ చేయట్లేదు గానీ ప్రజల దృష్టిలో నేను ఉత్తముడ్ని, భక్తుడ్ని అని నాకు పేరు ప్రతిష్టలు రావాలి అనే బుద్ధితో ఆ సంకల్పంతో అతను ఈ విషయాలు చేస్తే దీనినే రియా అంటారు, ప్రదర్శనా బుద్ధితో చేసిన సత్కార్యాలు అంటారు. ఇలా చేస్తే అభిమాన సోదరులారా, షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది. ఎందుకంటే సత్కార్యాలు, ఆరాధనలు కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే చేయాలి గానీ ప్రదర్శనా బుద్ధితో చేయరాదు. ఎవరైనా ప్రదర్శనా బుద్ధితో చేస్తున్నట్టే అతను అల్లాహ్ ప్రసన్నత కోరుకోవట్లేదు గానీ ప్రజల ప్రసన్నత కోరుకుంటున్నాడు కాబట్టి అతను కూడా షిర్క్‌కు పాల్పడినట్లు అవుతుంది అభిమాన సోదరులారా.

అయితే మన బాధ్యత ఏమిటి? ఇప్పటివరకు మనం షిర్క్ గొప్ప షిర్క్ పెద్ద నేరమని తెలుసుకున్నాము. షిర్క్ రెండు రకాలు, షిర్క్ పెద్దది ఒకటి, చిన్నది ఒకటి అని తెలుసుకున్నాము. అలాగే పెద్ద షిర్క్‌కి, చిన్న షిర్క్‌కి ఉన్న తేడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. అదేమిటంటే అభిమాన సోదరులారా, పెద్ద షిర్క్ చేసిన వారికి నరకశిక్ష విధించబడుతుంది, వారు స్వర్గం నుంచి దూరమైపోతారు, వారి సత్కార్యాలన్నీ వృధా చేయబడతాయి. అయితే చిన్న షిర్క్‌కు పాల్పడిన వారి సత్కార్యాలు మాత్రం వృధా చేయబడవు, వారికి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా తాత్కాలిక శిక్షలు వేసి మళ్లీ శిక్షలు ముగిసిన తర్వాత స్వర్గానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రదర్శనా బుద్ధితో ఏ ఏ సత్కార్యాలు ఆరాధనలు వారు చేసి ఉంటారో కేవలం ఆ సత్కార్యాలు, ఆ ఆరాధనలు మాత్రమే వృధా చేయబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా, ఒక భక్తునిగా మనందరి బాధ్యత ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము షిర్క్‌కి పాల్పడకూడదు. అందుకోసమే మనం చూచినట్లయితే గొప్ప గొప్ప భక్తులు ఎవరైతే గతించారో, వారు మరణించే ముందు వారి సంతానాన్ని పిలిచి షిర్క్‌కు పాల్పడవద్దు అని తాకీదు చేసి మరీ మరణించారు.

ఖురాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ప్రస్తావించి ఉన్నాడు. సూరా లుక్మాన్‌లో లుక్మాన్ అలైహిస్సలాం ఆయన కుమారుని పిలిచి ఏమంటున్నారంటే, “ఓ కుమారా, నీవు షిర్క్‌కు పాల్పడవద్దు. ఎందుకంటే షిర్క్ పెద్ద నేరము, ఘోరమైన పాపము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీవు షిర్క్‌కు పాల్పడవద్దు” అని తెలియజేశారు.

అదేవిధంగా ప్రవక్తలు, ఇతర గొప్ప గొప్ప భక్తులు వారి సంతానానికి, అనుచర సమాజానికి తెలియజేసిన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అల్లాహ్‌ను వదిలి ఇతరులను ఆరాధించకండి, అల్లాహ్‌కు ఇతరులను సహవర్తులుగా సాటిగా కల్పించకండి, మీకు నిలువునా చీల్చేసేసినా సరే, మీకు సజీవంగా దహనం చేసేసినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బహుదైవారాధన, షిర్క్ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అని తెలియజేసి ఉన్నారు.

కాబట్టి అభిమాన సోదరులారా, మనందరి బాధ్యత ఏమిటంటే మనం కేవలం అల్లాహ్‌నే ఆరాధించాలి, అల్లాహ్ మీదే నమ్మకం ఉంచాలి, ఆయన ప్రసన్నత కోసం మాత్రమే సత్కార్యాలు చేయాలి. అల్లాహ్‌తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ షిర్క్ నుండి కాపాడి, అల్లాహ్ ప్రసన్నత కోసం అల్లాహ్ ఆరాధనలు చేయడానికి మల్లా మనందరికీ భాగ్యము కల్పించు గాక.

అఖూలు ఖౌలి హాజా అస్తగ్ ఫిరుల్లాహ్ లీ వలకుం వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17133

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

దైవభీతితో కన్నీరు పెట్టడం – సలీం జామి’ఈ [ఆడియో & టెక్స్ట్]

దైవ భీతితో కన్నీరు పెట్టడం (The Excellence Of Weeping Out Of The Fear Of Allah)
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/NNoAU3lUlAs [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, దైవ భీతితో కన్నీరు కార్చడం అనే అంశంపై లోతైన వివరణ ఇవ్వబడింది. మానవునికి అల్లాహ్ నవ్వు మరియు ఏడుపు రెండింటినీ ప్రసాదించాడని ఖురాన్ ఆయతుతో ప్రసంగం ప్రారంభమవుతుంది. మానసిక నిపుణుల ప్రకారం, శారీరక గాయం, ప్రియమైనవారిని కోల్పోవడం, ఆనందం, మోసం మరియు డబ్బు కోసం వంటి వివిధ కారణాల వల్ల మానవులు ఏడుస్తారని వివరించబడింది. అయితే, అసలు ప్రాముఖ్యత దైవ భీతితో కార్చే కన్నీరుకే ఉందని స్పష్టం చేయబడింది. అల్లాహ్ భయంతో ఏడ్చే వ్యక్తి నరకంలోకి ప్రవేశించడం అసాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులను ఉటంకించారు. తీర్పు దినాన అల్లాహ్ సింహాసనం నీడలో చోటు పొందే ఏడు రకాల వ్యక్తులలో, ఏకాంతంలో అల్లాహ్ ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి కూడా ఒకరని చెప్పబడింది. అల్లాహ్ భయంతో కన్నీరు కార్చిన కళ్ళను నరకాగ్ని తాకదని, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ కు అత్యంత ప్రియమైనదని వివరించబడింది. దైవదూతలు (మీకాయీల్ అలైహిస్సలాం), ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు సహాబాల (ఉస్మాన్, ముఆద్, హసన్, అబూ హురైరా రదియల్లాహు అన్హుమ్) జీవితాల నుండి దైవ భీతితో వారు ఏ విధంగా కన్నీరు కార్చేవారో ఉదాహరణలతో వివరించబడింది. మన హృదయాలు కఠినంగా మారిపోయాయని, మరణాన్ని, సమాధిని స్మరించుకుంటూ, అనారోగ్యులను మరియు స్మశానాలను సందర్శిస్తూ, మన హృదయాలను మృదువుగా చేసుకుని అల్లాహ్ భయంతో కన్నీరు కార్చాలని ప్రసంగం ముగుస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై ఎల్లవేళలా వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ధార్మిక పండితులు, పెద్దలు మరియు అభిమాన సోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో దైవ భీతితో కన్నీరు పెట్టడం అనే అంశంపై ఇన్షా అల్లాహ్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా, మానవున్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సృష్టించాడు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఈ శరీరం ఒక హార్డ్వేర్ (hardware) అయితే, ఈ శరీరం లోపల అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనిషికి కొన్ని సాఫ్ట్వేర్ (software) లాంటి విషయాలను కూడా అమర్చాడు. మనం చూచినట్లయితే ఈ శరీరం కలిగిన మనిషికి బాధ కలుగుతుంది. ఈ శరీరం కలిగి ఉన్న మనిషికి సంతోషం కూడా కలుగుతుంది. మనిషికి ఆకలి వేస్తుంది, మనిషికి దాహం వేస్తుంది, మనిషి నవ్వుతాడు, మనిషి ఏడుస్తాడు. ఈ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ శరీరంలో ఎన్నో విషయాలను పొందుపరిచి ఉన్నాడు. ఈరోజు మనం దైవ భీతితో మనిషి కన్నీరు కారుస్తాడు కదా, దాని గురించి ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాం.

వాస్తవానికి మనం చూచినట్లయితే మనిషికి నవ్వించడం నేర్పించింది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. అలాగే మనిషికి బాధపడి కన్నీరు పెట్టడం నేర్పించింది కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాయే. ఖురాన్ లో మనం చూచినట్లయితే, సూర నజ్మ్ 43వ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ విధంగా తెలియజేశాడు:

وَأَنَّهُ هُوَ أَضْحَكَ وَأَبْكَىٰ
(వ అన్నహూ హువ అద్’హక వ అబ్కా)
మరి ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. (53:43)

అభిమాన సోదరులారా, మానసిక వైద్య నిపుణులు కొన్ని విషయాలు తెలియజేశారు. అవేమిటంటే, మనిషి ఎన్నో కారణాల వల్ల బాధపడి కన్నీరు కారుస్తాడంట. మనిషి కన్నీరు కార్చడానికి చాలా కారణాలు ఉన్నాయి అని మానసిక వైద్య నిపుణులు తెలియజేశారు. ఒక కారణం ఏమిటంటే, మనిషికి ఏదైనా గాయమైతే, ఆ బాధను ఓర్వలేక అతను కన్నీరు కారుస్తాడంట. అలాగే మనిషి ఎవరైనా దూరమైపోతుంటే, ఎవరినైతే అతను అభిమానించాడో, ప్రేమించాడో, వారు దూరమైపోతుంటే ఆ బాధ వల్ల కూడా మనిషి కన్నీరు కారుస్తాడట.

అలాగే, మనిషికి అనుకోకుండా ఒక పెద్ద సంతోషం కలిగితే, అప్పుడు కూడా పట్టరాని సంతోషంలో మనిషి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయంట. దానినే మనము ఆనంద భాష్పాలని కూడా అంటూ ఉంటాం. అలాగే అభిమాన సోదరులారా, కొంతమంది ఇతరులను మోసం చేయడానికి కూడా కన్నీరు కారుస్తారు. ముసలి కన్నీరు అని మనము అప్పుడప్పుడు సామెత పలుకుతూ ఉంటాం.

అలాగే, కొంతమంది అయితే డబ్బు తీసుకుని మరీ ఏడుస్తారట, కన్నీరు కారుస్తారట. దానిని ఇస్లామీయ పరిభాషలో నౌహా (శోకం) చేయడం అంటారు, మాతం చేయడం అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి మరణించినచో, ఆ వ్యక్తి శవం వద్ద ఏడవడానికి కూలీ మీద కొంతమంది వచ్చి ఏడుస్తారు. ఇది ఇస్లాంలో నిషేధం. మనిషి మరణించిన తర్వాత అతని బంధువులైనా సరే, ఇతర వ్యక్తులైనా సరే అతని వద్ద వచ్చి నౌహా చేయడం, బిగ్గరగా కేకలు పెడుతూ ఏడ్చడం ఇస్లాంలో నిషేధం చేయబడింది.

అలాగే, దైవ భీతితో కూడా మనిషి కన్నీరు కారుస్తాడట. రండి ఇన్షా అల్లాహ్, ఈనాటి జుమా ప్రసంగంలో ఈ అంశం మీదే ఇన్షా అల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల వెలుగులో మరియు సహాబాల జీవితాలకి సంబంధించిన విషయాలతో తెలిసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు.

لَا يَلِجُ النَّارَ رَجُلٌ بَكَى مِنْ خَشْيَةِ اللَّهِ حَتَّى يَعُودَ اللَّبَنُ فِي الضَّرْعِ
“లా యలిజున్నార రజులున్ బకా మిన్ ఖశియతిల్లాహి హత్తా యఊదల్లబను ఫిద్దర్రా”
దీని అర్థం ఏమిటంటే “జంతువు పొదుగు నుండి పాలు పిండేసిన తర్వాత ఆ పాలు మళ్లీ ఆ జంతువు పొదుగులోకి తిరిగి వెళ్లిపోవడం ఎలాగైతే అసంభవమో దైవభీతితో కన్నీరు కార్చిన వ్యక్తి కూడా నరకంలో వెళ్లటం అసంభవం” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అల్లాహు అక్బర్ (ٱللَّٰهُ أَكْبَرُ)! దైవ భీతితో మానవుడు, భక్తుడు ఒక్కసారి ప్రపంచంలో కన్నీరు పెడితే ఆ వ్యక్తి నరకంలో వెళ్లడం, ఆ వ్యక్తి నరక ప్రవేశం చేయడం అసంభవం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు అభిమాన సోదరులారా!

మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు మంది అదృష్టవంతుల గురించి తెలియజేశారు. రేపు పరలోకంలో లెక్కింపు రోజున సూర్యుడు చాలా సమీపంలో ఉంటాడు. ఆ రోజు ఎలాంటి నీడ ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క సింహాసనం, అర్ష్ యొక్క నీడ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ప్రజలు వేడికి తపిస్తూ అల్లాడుతూ ఉంటారు. ఆ రోజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన సింహాసనం యొక్క నీడలోకి ఏడు రకాల మనుషులను తీసుకుంటాడు. ఆ ఏడు రకాల మనుషులలో ఒక రకమైన మనిషి ఎవడంటే

(وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ).
“వరజులున్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాదత్ ఐనాహు”

ఏకాంతంలో ఉన్నప్పుడు భక్తుడు, మానవుడు అల్లాహ్ ను తలుచుకొని అల్లాహ్ ను గుర్తు చేసుకొని కన్నీరు కార్చితే అలాంటి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు పరలోకంలో లెక్కింపు రోజున ఆ మహ్షర్ మైదానంలో తన సింహాసనం నీడలోకి తీసుకుంటాడట.

మరో ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. “రెండు రకాల కళ్లు ఉన్నాయి. ఆ రెండు రకాల కళ్లు ఎప్పటికీ నరకాగ్నిని చూడవు. నరకాగ్ని ఆ కళ్లకు కాల్చదు అన్నారు“. ఎవరు ఆ రెండు రకాల కళ్లు? నరకాగ్నిని చూడవట. నరకాగ్ని ఆ కళ్లను కాల్చదట. ఎవరు ఆ రెండు రకాల కళ్లు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

(عَيْنٌ بَكَتْ مِنْ خَشْيَةِ اللهِ، وَعَيْنٌ بَاتَتْ تَحْرُسُ فِي سَبِيلِ اللهِ).
“ఐనన్ బకత్ మిన్ ఖశియతిల్లాహ్ వ ఐనున్ బాతత్ తహ్రుసు ఫీ సబీలిల్లాహ్”

ఒక రకమైన కళ్లు ఎవరివి అంటే ఏ వ్యక్తి అయితే అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు పెట్టాడో ఆ వ్యక్తి కళ్లకి నరకము తాకదు. నరకాగ్ని ఆ కళ్లకు ముట్టుకోదు. అలాగే పూర్వం యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు జరిగే సమయంలో రాత్రి పూట యుద్ధం ముగిసిన తరువాత సైనికులందరూ పడుకుని ఉంటే ఆ సైనికులకి కొంతమంది వ్యక్తులు కాపలా కాసేవారు. వాళ్ల ప్రాణానికి రక్షణగా వాళ్లు రాత్రి మొత్తం జాగారము చేసి కాపలా కాసేవారు. అలా దైవ మార్గంలో రాత్రి మొత్తం జాగారం చేసి కాపలా కాసిన ఆ కళ్లకు కూడా రేపు నరకపు అగ్ని ముట్టుకోదు, నరకము ఆ కళ్లకు కాల్చదు అన్నారు.

రండి అభిమాన సోదరులారా, మరొక ఉల్లేఖనంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాట చెప్పి ఉన్నారో చూడండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకి రెండు రకాల చుక్కలు చాలా ప్రియమైనవి అట. అలాగే రెండు గుర్తులు కూడా అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి అట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

“రెండు చుక్కలు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి.” ఒక చుక్క ఏమిటంటే, “అల్లాహ్ ను తలచుకుని భక్తుడు ఎప్పుడైతే కళ్ళ నుంచి కన్నీరు కారుస్తాడో, ఆ కన్నీటి చుక్క అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.” అలాగే, “దైవ ధర్మ రక్షణ కొరకు ఎప్పుడైతే మానవుడు వెళ్లి శత్రువుని ఎదుర్కొంటాడో, ఆ ఎదుర్కొనే సమయంలో అతని శరీరానికి గాయమై, అతని శరీరం నుండి రక్తపు చుక్క కారుతుంది కదండీ, ఆ చుక్క కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు చాలా ప్రియమైనది.”

ఇక రెండు గుర్తుల గురించి కూడా తెలియజేశారు. “రెండు రకాల గుర్తులు అల్లాహ్ కు చాలా ప్రియమైనవి. అవేమిటంటే, ఒక గుర్తు, “అల్లాహ్ ధర్మ రక్షణ కొరకు పోరాటం చేస్తున్నప్పుడు అతని శరీరానికి ఎక్కడైనా గాయం అవుతుంది. ఆ గాయం మానిన తర్వాత అక్కడ అలాగే గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది.” రెండవ గుర్తు ఏమిటంటే, “అల్లాహ్ విధించిన ఒక విధిని పాటిస్తూ ఉన్నప్పుడు అతని శరీరం మీద గుర్తు పడిపోతుంది. ఆ గుర్తు కూడా అల్లాహ్ కు చాలా ప్రియమైనది.”

దీనికి ఉదాహరణగా మనం చూచినట్లయితే, ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తూ ఉంటాడు. నమాజ్ చేయడం విధి, తప్పనిసరి. అల్లాహ్ తరపు నుంచి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతీ ముస్లిం మీద నమాజ్ చేయడం తప్పనిసరి చేశాడు, విధి చేశాడు. మరి ఒక ముస్లిం, ఒక దైవ భక్తుడు నమాజ్ ఆచరిస్తూ ఉంటే, అతని నుదుట మీద గుర్తు పడిపోతుంది, అతని మోకాళ్ళ మీద గుర్తు పడిపోతాది. ఇలా దైవం విధించిన ఒక విధిని ఆచరిస్తున్నప్పుడు అతని శరీరం మీద ఏదైనా గుర్తు పడిపోయిందంటే, ఆ గుర్తు అల్లాహ్ కు చాలా ఇష్టమైనది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.

అలాగే రండి అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఏమనేవారంటే “ల అన్ అద్మఅ మిన్ ఖష్యతిల్లాహ్ అహబ్బు ఇలయ్య మిన్ అన్ అతసద్దక బి అల్ఫి దీనార్” (لَأَنْ أَدْمَعَ مِنْ خَشْيَةِ اللَّهِ أَحَبُّ إِلَيَّ مِنْ أَنْ أَتَصَدَّقَ بِأَلْفِ دِينَارٍ). అల్ఫి దీనార్ అంటే మనందరికీ తెలుసు. వెయ్యి దీనార్లు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు. “నేను అల్లాహ్ మార్గంలో వెయ్యి దీనార్లు దానం చేయడము కంటే కూడా అల్లాహ్ ను తలుచుకొని ఒక్కసారి కన్నీరు పెట్టడం నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది” అన్నారు. అంటే నేను అల్లాహ్ ను తలుచుకొని ఏడవటం, అల్లాహ్ ను తలుచుకొని కన్నీరు కార్చడం దైవమార్గంలో వెయ్యి దీనార్లు ఖర్చు చేయటం కంటే నాకు ఇష్టం అన్నారు.

ఇక రండి అభిమాన సోదరులారా, అల్లాహ్ ను తలచుకుని, అల్లాహ్ భీతితో ప్రవక్తలు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, దూతలు ఏ విధంగా వణికిపోయేవారో, దైవ భక్తులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు ఏ విధంగా కన్నీరు పెట్టేవారో, అవి కూడా ఇన్షా అల్లాహ్ కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముందుగా దైవ దూతల గురించి తెలుసుకుందాం. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారితో మీకాయీల్ అలైహిస్సలాం వారి గురించి ప్రశ్నించారు. మీకాయీల్ అలైహిస్సలాం నలుగురు పెద్ద దైవ దూతలలో ఒక దైవదూత. ఆ దైవదూత గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే “మాలి లా అరా మీకాయీల దాహికన్ ఖత్తూ?” (مَا لِي لَا أَرَى مِيكَائِيلَ ضَاحِكًا قَطُّ؟). ఓ జిబ్రయీల్ అలైహిస్సలాం! ఏమిటండి నేను ఎప్పుడూ కూడా మీకాయీల్ని చిరునవ్వు నవ్వుతూ కూడా నేను చూడలేదు. ఆయన ఒక్కసారి కూడా నాకు చిరునవ్వు నవ్వుతూ కనిపించట్లేదు. ఎందుకలా అని అడిగాను. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు “మా దహిక మీకాయీలు ముంజు ఖులికతిన్నార్” (مَا ضَحِكَ مِيكَائِيلُ مُنْذُ خُلِقَتِ النَّارُ). ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నరకాన్ని సృష్టించిన తర్వాత నుంచి మీకాయీల్ అలైహిస్సలాం ఒక్కసారి కూడా నవ్వలేదు అన్నారు.అభిమాన సోదరులారా, దైవదూతలు ఒక్క తప్పు కూడా వారితో దొర్లదు. అయినా గానీ నరకం సృష్టించబడిన తర్వాత వాళ్ళు నవ్వడమే మానేశారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో ఎప్పుడైతే అల్లాహ్ ను కలిసి మాట్లాడటానికి వెళ్లారో ఆ రోజు జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఆయన గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, “వ జిబ్రయీలు కల్ హిల్సిల్ బాలి మిన్ ఖశియతిల్లాహ్” (وَجِبْرِيلُ كَالْحِلْسِ الْبَالِي مِنْ خَشْيَةِ اللَّهِ). మెరాజ్ యాత్రలో నేను చూశాను. దూతలకు రారాజు, దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మలయే ఆలాలో పరుపులాగా అల్లాహ్ కు భయపడి నేలకు ఆనిపోయారు. అభిమాన సోదరులారా! దూతల నాయకుడు అల్లాహ్ ను తలుచుకొని, అల్లాహ్ భక్తితో, అల్లాహ్ భీతితో నేల మీద పరుపు లాగా పడిపోయి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్లారా వారిని చూశారు.

ఇక రండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి కూడా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు నమాజు చేయడానికి నిలబడ్డారు. నమాజు చదువుతున్నారు. నమాజులోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఎంతగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవభీతితో కన్నీరు కారుస్తున్నారంటే చూసిన వాళ్లు ఆయన గురించి చెప్పారు, “వలి జౌఫిహీ అజీజున్ క అజీజిల్ మిర్జలి మినల్ బుకా'” (وَلِجَوْفِهِ أَزِيزٌ كَأَزِيزِ الْمِرْجَلِ مِنَ الْبُكَاءِ). ఎలాగైతే పొయ్యి మీద పెట్టిన ఒక కుండలో నీళ్లు బాగా వేడెక్కిన తర్వాత ఖత్ ఖత్ ఖత్ అని ఎలా శబ్దం వస్తుందో ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుకు నిలబడి అల్లాహ్ ను తలుచుకొని లోలోపలే కన్నీరు కారుస్తున్నారు, బాధపడి ఏడుస్తున్నారు అభిమాన సోదరులారా!

అలాగే ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేశారు. ఒక రోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కోసం నిలబడ్డారు. నమాజులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవటం మొదలెట్టారు. ఎంతగా ఏడ్చారంటే వారి గడ్డం తడిసిపోయింది. అయినా ఏడుపు ఆపట్లేదు. మళ్లీ ఏడుస్తున్నారు. ఆయన తొడిగిన బట్టలు కూడా నానిపోయాయి. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చేస్తున్నారో ఆ భూమి కూడా తడిసిపోయింది. ఫజర్ అజాన్ ఇచ్చే సమయం వచ్చేసింది. బిలాల్ రదియల్లాహు అన్హు మస్జిద్లో అజాన్ ఇవ్వటానికి వచ్చి చూస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏడుస్తున్నారు. అది చూసిన బిలాల్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అన్నారు, “ఓ దైవ ప్రవక్తా, అల్లాహ్ మీ పాపాలన్నింటినీ మన్నించేశాడు కదా? అయినా కూడా మీరు ఈ విధంగా ఏడవడం ఏంటి?” అని అడిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అఫలా అకూను అబ్దన్ శకూరా?” (أَفَلَا أَكُونُ عَبْدًا شَكُورًا؟). నేను దైవానికి కృతజ్ఞుడు చేసి తెలుసుకునే భక్తుని కావద్దా? అందుకోసమే దైవానికి కృతజ్ఞత, కృతజ్ఞతలు తెలుపుకునే భక్తుడు అవ్వటానికి ఏడుస్తున్నాను అన్నారు.

అభిమాన సోదరులారా! మన పరిస్థితి ఏమిటి? దైవదూతలు ఏడుస్తున్నారు. దూతల నాయకుడు జిబ్రయీల్ అలైహిస్సలాం వారు ఏడుస్తున్నారు. దైవప్రవక్తలు ఏడుస్తున్నారు. దైవ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు కారుస్తున్నారు. మన పరిస్థితి ఏమిటి అభిమాన సోదరులారా?

ఇక రండి. మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు చేతులు ఎత్తి ఏడవడం ప్రారంభిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే జిబ్రయీల్ అలైహిస్సలాం వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు పంపించేశారు. జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఓ దైవప్రవక్త మీరు కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నన్ను మీ వద్దకు పంపించాడు చెప్పండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా అభిమాన సోదరులారా? ఎంత అదృష్టవంతులమో మనము ఒకసారి ఆలోచించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రయీల్ అలైహిస్సలాం వారు వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే “అల్లాహుమ్మ ఉమ్మతీ, ఉమ్మతీ!” (اللَّهُمَّ أُمَّتِي أُمَّتِي!). ఓ అల్లాహ్! నా అనుచర సమాజాన్ని తలుచుకొని ఏడుస్తున్నాను. నా అనుచర సమాజం ఏమైపోతుందో అని తలుచుకొని ఏడుస్తున్నాను అన్నారు. అప్పుడు జిబ్రయీల్ అలైహిస్సలాం మళ్లీ అల్లాహ్ సన్నిధికి వెళ్లి తెలియజేయగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త అందజేశాడు. అదేమిటంటే “ఇన్నా సనుర్దీక ఫీ ఉమ్మతిక వలా నసూఉక” (إِنَّا سَنُرْضِيكَ فِي أُمَّتِكَ وَلَا نَسُوءُكَ). ఓ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ అనుచరుల విషయంలో మేము మీకు సంతృప్తి చెందేలా చేస్తాము. మీకు అసంతృప్తి అయ్యేలాగా చేయము అని చెప్పేశారు. అల్లాహు అక్బర్! అలాంటి ప్రవక్తకి మనము అనుచరులమైనందుకు మనము ఎంతో అదృష్టవంతులమని భావించాలి అభిమాన సోదరులారా!

ఇక రండి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల గురించి కూడా తెలుసుకుందాం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలాగే శిష్యులందరూ కూర్చుని ఉంటే శిష్యుల ముందర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఆ ఉపన్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే, “ఏమండీ నాకు స్వర్గం చూపబడింది. నాకు నరకము కూడా చూపబడింది. నేను చూసిన విషయాలు గనక మీరు చూసినట్లయితే మీరు నవ్వడం మానేసి ఏడవడం ప్రారంభించేస్తారు” అన్నారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులందరూ తల మీద బట్ట వేసుకొని ముక్కు పట్టుకొని ఏడవడం ప్రారంభించేశారు అభిమాన సోదరులారా!

అలాగే హానీ, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారి యొక్క బానిస ,ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి గురించి ఆయన తెలియజేశారు. అదేమిటంటే ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వెళుతూ వెళుతూ స్మశానం దగ్గర ఆగిపోయి ఏడవడం ప్రారంభించేవారు. ఎంతగా కన్నీరు కార్చేవారంటే ఆయన గడ్డం మొత్తం తడిచిపోయేది. అది చూసిన ఆయన బానిస ఆయన వద్దకు వచ్చి ఏమని అడిగేవాడంటే, “ఏమండీ మీ దగ్గర స్వర్గం గురించి చర్చించబడినప్పుడు మీరు కన్నీరు కార్చరు. అలాగే మీ దగ్గర నరకం గురించి తెలియజేయబడినప్పుడు కూడా మీరు ఈ విధంగా కన్నీరు కార్చరు. కానీ స్మశానాన్ని, సమాధులను చూసి మీరు ఈ విధంగా కన్నీరు కారుస్తారు. కారణం ఏమిటి?” అని ఆయన అడిగినప్పుడు ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు వారు తెలియజేసిన విషయం ఏమిటంటే, “ఇన్నల్ ఖబర అవ్వలు మంజిలిన్ మిన్ మనాజిలిల్ ఆఖిరహ్. ఫఇన్ నజా మిన్హు ఫమా బాఅదహు ఐసర్, వఇల్లం యంజ్ మిన్హు ఫమా బాఅదహు అషద్దు మిన్హు” (إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ). నేను సమాధిని చూసి ఎందుకు ఏడుస్తున్నాను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. పరలోక ప్రయాణంలో సమాధి మొదటి స్టేజీ లాంటిది. ఇక్కడ ఏ వ్యక్తి అయితే పాస్ అయిపోతాడో అతను తర్వాత స్టేజీలలో కూడా పాస్ అయిపోతాడు. ఈ ఫస్ట్ స్టేజీలోనే ఏ వ్యక్తి అయితే ఇరుక్కుపోతాడో, నష్టపోతాడో ఆ తర్వాత వచ్చే స్టేజీలన్నీ కూడా అతనికి చాలా భయంకరమైనవిగా మారిపోతాయి. కాబట్టి నా మొదటి స్టేజీలో నా పరిస్థితి ఎలా ఉంటుందో అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పేవారు.

అలాగే ముఆజ్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వెళ్లి ఏమండీ మీరు కన్నీరు కారుస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “స్వర్గానికి వెళ్ళే వాళ్ల సమూహం ఏదో అల్లాహ్ కు బాగా తెలుసు. నరకానికి వెళ్లే సమూహం ఏదో అది కూడా అల్లాహ్ కు బాగా తెలుసు. నేను స్వర్గానికి వెళ్లే సమూహంలో ఉన్నానా లేదా నరకానికి వెళ్లే సమూహంలో ఉన్నానా? అది తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు.

అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు హసన్ రదియల్లాహు తాలా అన్హు ఏడుస్తూ ఉంటే కన్నీరు కారుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఆయనను అడిగారు, “ఎందుకయ్యా మీరు ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు?” అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “నేను ప్రళయదినాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తలుచుకుంటే నన్ను కూడా నరకంలో వేసేస్తాడు. అతనికి ఎలాంటి పర్వా లేకుండా పోతుంది. నేను ఎవరు, ఏంటి అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు ఏమి అవసరం ఉండదు. ఆయన తలుచుకుంటే నన్ను కూడా నరకంలో పడవేయగలడు కాబట్టి అది తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ప్రజలు వెళ్లి ఏమయ్యా ఏడుస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు. “నేను మరణిస్తానేమో, ఈ ప్రపంచాన్ని నేను వదిలేసి వెళ్లిపోతున్నాను కదా అని నేను బాధపడట్లేదు. నేను బాధపడుతున్న విషయం ఏమిటంటే ఇక నా ప్రయాణం చాలా పెద్దదిగా ఉంది. కానీ అంత పెద్ద ప్రయాణంలో నేను సంపాదించుకుంది చాలా తక్కువ. ఇంత తక్కువ మొత్తంతో నేను అంత పెద్ద ప్రయాణాన్ని ఎలా చేయగలను అని తలుచుకొని నేను ఏడుస్తున్నాను” అన్నారు.

అలాగే అభిమాన సోదరులారా! అబ్దుల్లాహ్ ఇబ్నె రవాహా సతీమణి ఒడిలో పడుకొని ఉన్నారు. అక్కడే కన్నీరు కార్చడం మొదలెట్టేశారు. ఆయనను చూసి ఆయన భార్య కూడా కన్నీరు కార్చడం మొదలెట్టేసింది. ఆ తర్వాత ఏమయ్యా ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని ఆయనతో అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే “రేపు ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్లాలనుకునే ప్రతి వ్యక్తి నరకం మీద ఉంచిన పుల్సిరాత్ ని దాటుకుని స్వర్గానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు నేను పుల్సిరాత్ దాటుకుని స్వర్గానికి వెళ్తానా లేదా అని తలుచుకొని బాధపడుతున్నాను అన్నారు. ప్రతి వ్యక్తి ఆ మార్గం ద్వారానే దాటుకోవాల్సి ఉంటుంది. నరకాన్ని దాటుకోవాలంటే ఆ మార్గం మీద నుంచి నడిచి వెళ్ళాలి. ఆ తర్వాత మళ్లీ స్వర్గ ప్రవేశం ఉంటుంది. ఆ మార్గాన్ని నేను దాటుకోగలనా లేదా అని తలుచుకొని నేను కన్నీరు కారుస్తున్నాను” అన్నారు అభిమాన సోదరులారా.

ఈ విధంగా చూస్తే చాలామంది గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరిలో ఒక్క విషయం చెప్పేసి నా మాట ముగిస్తున్నాను. అదేమిటంటే అభిమాన సోదరులారా! అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతము కాదు. ఈ జీవితాన్ని స్వస్తి పలికి అల్లాహ్ పిలుపు రాగానే ప్రపంచాన్ని వదిలేసి మనం వెళ్లిపోవాలి. మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, కుటుంబ సభ్యులు మూడు రోజులు కన్నీరు కార్చుకుంటారు. మళ్లీ వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమైపోతారు. ప్రయాణం చేయాల్సింది ఒంటరిగా మనమే. అక్కడ మనకు కాపాడాల్సింది ఒక అల్లాహ్ మాత్రమే. కాబట్టి అల్లాహ్ ను తలుచుకొని ప్రతి భక్తుడు కన్నీరు కార్చాలి. అల్లాహ్ తో క్షమాపణ వేడుకోవాలి.

కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే మన హృదయాలు నల్ల రాయి లాగా గట్టిగా మారిపోయాయి. కారణం ఏమిటంటే మనలో దైవభీతి లేదు. ప్రపంచ వ్యామోహంలో పడిపోయి ఉన్నాం. డబ్బు డబ్బు, ఆస్తి ఆస్తి, బంగారు నగలూ అని చెప్పేసి దాని వెనకాల పరిగెడుతున్నాం అభిమాన సోదరులారా. ఇది శాశ్వతము కాదు. చావును తలుచుకోండి. సమాధిని తలుచుకోండి. నరకాన్ని తలుచుకోండి. పుల్సిరాత్ని తలుచుకోండి. లెక్కింపు రోజుని తలుచుకోండి. ఇది ఎంత ఎక్కువగా తలుచుకుంటే అంతగా హృదయం మెత్తబడుతుంది. అప్పుడు భక్తుడు దైవ భక్తితో, దైవ భీతితో కన్నీరు కారుస్తాడు. వీలైతే వ్యాధిగ్రస్తుల వద్దకు వెళుతూ వస్తూ ఉండండి. అప్పుడు కూడా మనసులు, హృదయాలు మెత్తబడతాయి. వీలైతే స్మశానానికి వెళుతూ వస్తూ ఉండండి. సమాధుల్ని చూసినప్పుడు కూడా హృదయాలు మెత్తబడతాయి.

కాబట్టి అభిమాన సోదరులారా! ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా హృదయం, మెత్తని హృదయాన్ని ప్రసాదించి, దైవభీతితో కన్నీరు కార్చేలాగా, అల్లాహ్ తో చేసిన పాపాలకి క్షమాపణ కోరుతూ ఉండేలాగా సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక.

أَقُولُ قَوْلِي هَٰذَا وَأَسْتَغْفِرُ اللَّهَ لِي وَلَكُمْ وَلِسَائِرِ الْمُسْلِمِينَ فَاسْتَغْفِرُوهُ ۚ إِنَّهُ هُوَ الْغَفُورُ الرَّحِيمُ
(అఖూలు ఖౌలీ హాజా వ అస్తగ్ ఫిరుల్లాహ లీ వలకుమ్ వలి సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ ఫిరూహు ఇన్నహూ హువల్ గఫూరుర్ రహీమ్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=16913


ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7


సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర – సలీం జామిఈ [ఆడియో, టెక్స్ట్]

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జీవిత చరిత్ర
https://youtu.be/6wNGPCoz60I [30 నిముషాలు]
సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ జుమా ప్రసంగంలో వక్త, ప్రముఖ సహచరుడు హజ్రత్ సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) గారి జీవిత చరిత్ర మరియు సత్యం కోసం వారు చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వివరించారు. అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అత్యున్నత వరమైన ‘ఇస్లాం’ విలువను వివరిస్తూ, సల్మాన్ ఫార్సీ (రజియల్లాహు అన్హు) పర్షియాలో అగ్ని ఆరాధకుడిగా ఉండి, సత్యధర్మాన్ని అన్వేషిస్తూ క్రైస్తవ మత గురువుల వద్దకు చేరి, చివరికి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి రాక గురించి తెలుసుకున్న తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు. బానిసత్వాన్ని అనుభవించి, మదీనాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని కలుసుకొని, ప్రవక్తత సూచనలను (సదఖాను తినకపోవడం, బహుమానాన్ని స్వీకరించడం, ప్రవక్తతా ముద్ర) స్వయంగా పరీక్షించి ఇస్లాంను స్వీకరించిన వైనాన్ని, ఆ తర్వాత తన స్వేచ్ఛ కోసం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చేసిన అద్భుత సహకారాన్ని ఈ ప్రసంగం వివరిస్తుంది.

ప్రశంసలన్నీ, పొగడ్తలన్నీ సర్వ లోకాల సృష్టికర్త పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పరలోక దినానికి యజమాని, మహోన్నత పీఠానికి అధిపతి, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి.

ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక, ఆమీన్.

గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా! ఈనాటి జుమా ప్రసంగంలో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! మానవునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రపంచంలో ఎన్నో అనుగ్రహాలను ప్రసాదించాడు. అల్లాహ్ మానవులకిచ్చిన అనుగ్రహాలను లెక్కచేయలేనన్నివి ఉన్నాయి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు. నిజమే, అయితే అల్లాహ్ మానవులకు ప్రసాదించిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం ఏది అంటే, అది దైవ ధర్మ ఆచరణ.

అభిమాన సోదరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి, మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వారిగా పుట్టించాడు, ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇది ఎంత గొప్ప వరమో ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేశాడు:

إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ
[ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం]
నిశ్చయంగా అల్లాహ్ వద్ద ధర్మం (ఒక్క) ఇస్లాం మాత్రమే. (3:19)

మరోచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్పష్టంగా తెలియజేశాడు:

وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
[వమన్ యబ్ తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్ బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్]
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు. (3:85)

కావున అభిమాన సోదరులారా! మనం ముస్లింలుగా, ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఏ చిన్న కార్యము చేస్తున్నా, ఏ పెద్ద కార్యము చేస్తున్నా దానికి రేపు ఇన్షా అల్లాహ్ విలువ ఉంటుంది. అయితే ఈ ఇస్లాం ధర్మాన్ని మనం ఎలా పొందాము? అల్లాహ్ దయవల్ల ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కృషి లేకుండా, ఎలాంటి కష్టము లేకుండా, ఎలాంటి బాధ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ అనుగ్రహాన్ని అలాగే బహుమానంగా ఉచితంగా ఇచ్చేశాడు.

అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మందికి ఈ ఇస్లాం ధర్మ స్వీకరణ భాగ్యం ఉచితంగా దొరకలేదు. వారు ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి, ఈ ఇస్లాం ధర్మాన్ని ఆచరించడానికి ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పరీక్షల్నీ ఎదుర్కొన్నారు అభిమాన సోదరులారా. అలా అల్లాహ్ ను అర్థం చేసుకోవడానికి, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి కష్టపడిన, పరీక్షలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు. రండి, ఈనాడు ఆ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు గారి యొక్క జీవిత చరిత్రను ఇన్షా అల్లాహ్ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇరాన్ దేశానికి చెందిన అస్బహాన్ నగరంలో పుట్టారు. వారి తండ్రి ఆ నగరానికి ఒక గురువు, మత గురువు, పెద్ద. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు పుట్టినప్పటి నుండి తండ్రి వద్దనే మత విషయాలు నేర్చుకున్నారు. ఆ రోజుల్లో ‘మజూసీ’ ధర్మాన్ని అక్కడ సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆచరించారు. మజూసీ ధర్మంలో ప్రజలు అగ్నిని పూజించేవారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి తండ్రి కూడా అగ్నిని పూజించేవాడు, తన కుమారుణ్ణి కూడా అగ్నిని పూజించేటట్టుగా నేర్పించాడు.

చివరికి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి తండ్రి అగ్ని పూజ కొరకు ఎంతగా పరిమితం చేసేసాడంటే, ఎలాగైతే ఒక మహిళను ఇంట్లోనే ఉంచేస్తారో ఆ విధంగా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా వారి తండ్రి అగ్ని వద్దనే ఒక కుటుంబ.. ఒక ఇంటిలోనే ఉంచేశాడు. బయటి ప్రపంచం గురించి ఆయనకు ఎక్కువగా తెలియదు.

అయితే అభిమాన సోదరులారా, ఒకరోజు ఏదో ఒక ముఖ్య.. ఒక ముఖ్యమైన పని మీద తండ్రి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని బయటకు పంపించారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బయట ప్రపంచం గురించి ఎక్కువగా తెలియని వారు, ఆ పని మీద బయటకు వెళ్ళారు. వీధుల్లో నుంచి వెళుతూ ఉంటే ఒకచోట చర్చి ఉండింది, ఆ చర్చి లోపల నుంచి శబ్దాలు వస్తుండటాన్ని ఆయన గమనించారు. ఆ శబ్దాన్ని గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఏముందో చూద్దామని లోపలికి ప్రవేశించారు. వెళ్లి చూస్తే అక్కడ ప్రజలందరూ కలిసి పూజ చేస్తున్నారు. ఆయనకు చాలా నచ్చింది. నచ్చిన కారణంగా ఆయన అక్కడే చూస్తూ కూర్చుండిపోయాడు. సమయం గడిచిపోయింది. చీకటి అయిపోయింది కానీ ఆయన వచ్చిన పనిని మర్చిపోయాడు.

తర్వాత తండ్రి, సల్మాన్ ఫార్సీ వెళ్లి ఇంతవరకు రాలేదే అని వెతకటానికి వేరే మనుషుల్ని పంపించాడు. రాత్రి అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు తిరిగి నాన్న దగ్గరికి వెళ్ళారు. అప్పుడు నాన్నగారు సల్మాన్.. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి మీద కోపగించుకున్నారు. “నేను నీకు పంపించిన పని ఏమిటి? నువ్వు ఇంతవరకు ఎక్కడున్నావు? త్వరగా ఎందుకు రాలేదు? నువ్వు రాని కారణంగా ఇక్కడ అగ్ని ఆరిపోయింది. ఇక్కడ అగ్ని ఆరిపోకూడదు, ఆరిపోకుండా చూసుకోవలసిన బాధ్యత నీది” అని కోపగించుకున్నప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు నాన్నగారితో అన్నారు: “నాన్నగారు, ఈరోజు నేను ఒక వింత విషయాన్ని చూశాను, అది నాకు చాలా నచ్చింది. ఒకచోట నేను కొంతమందిని చూశాను, వారు దేవుణ్ణి మరో రకంగా పూజిస్తున్నారు, వారి పూజా పద్ధతి నాకు చాలా నచ్చిందండి” అన్నారు.

అప్పుడు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. “అరే! నీవు, నీ తండ్రులు, నీ తాతలు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో ఆ ధర్మము నువ్వు చూసిన వారి ధర్మము కంటే గొప్పది రా, దీన్నే నువ్వు ఆచరించాలి” అన్నారు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అన్నారు: “లేదండి నాన్నగారు, మనం చేసేది నాకు నచ్చట్లేదు. మన చేతులతో మనము కాల్చిన అగ్నిని మళ్ళీ మనం పూజించడం ఏందండి? కొద్దిసేపు మనము అక్కడ కట్టెలు వేయకపోతే ఆ అగ్ని చల్లారిపోతుంది. దాన్ని మనము దేవుడని పూజించడం ఇది నాకు నచ్చలేదండి. చర్చిలో వాళ్ళు చేస్తున్న విషయం నాకు చాలా నచ్చిందండి, అదే నాకు మంచిదనిపిస్తోందండి” అన్నారు.

నాన్నగారికి విషయం అర్థమైపోయింది. బిడ్డ చేయి జారిపోతున్నాడని గమనించిన నాన్నగారు వెంటనే సంకెళ్లు వేసేసి ఆయనకు ఇంటిలోనే బంధించేశారు. బంధించేసిన తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తి ద్వారా ఆ క్రైస్తవుల వద్దకు సందేశాన్ని పంపించారు. “ఏమండీ! మీరు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తున్నారో, ఈ ధర్మం ఎక్కడ పుట్టింది? ఈ ధర్మం యొక్క పునాదులు ఎక్కడున్నాయి? ఆ ప్రదేశం గురించి నాకు తెలియజేయండి” అన్నారు. ఆ వ్యక్తి అక్కడినుండి సమాధానం తీసుకొచ్చాడు, “ఈ ధర్మము ‘షామ’లో (అంటే షామ్ అంటే: ఫలస్తీన్, లబ్నాన్, జోర్డాన్ [ఉర్దున్] మరియు సిరియా.. ఈ పూర్తి భాగాన్ని ఆ రోజుల్లో ‘షామ్’ అనేవారు, తర్వాత దాన్ని నాలుగు ముక్కలుగా విభజించేశారు), ఆ షామ్.. ఆ షామ్ దేశంలో ఆ ధర్మం పుట్టింది, దాని యొక్క పునాదులు అక్కడే ఉన్నాయి” అని సమాధానం వచ్చింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారన్నారు: “ఎవరైనా ఆ దేశస్తులు మన దేశానికి వస్తే నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఈ షామ్ దేశము నుండి ఈ ఇరాన్ దేశానికి వ్యాపారం నిమిత్తం వచ్చారు. అప్పుడు కొంతమంది వెళ్లి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, “మీరు కోరుకున్నట్లుగానే షామ్ దేశస్తులు కొంతమంది వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు, మీరు వారితో కలవాలంటే కలవచ్చు” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు ఏమన్నారంటే: “నేను ఇప్పుడు రాలేను, కలవలేను. వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం చేసేటప్పుడు నాకు కబురు పంపించండి” అన్నారు.

అలాగే వాళ్ళు తిరిగి మళ్ళీ వారి దేశానికి వెళుతున్నప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి కబురు పంపించగా, ఆయన ఏదో ఒకలాగా సంకెళ్లను తుంచుకుని వారితో పాటు కలిసి ఆ ఇరాన్ దేశము నుండి షామ్ దేశానికి ఆ వ్యాపారానికి వచ్చిన వ్యక్తులతో పాటు కలిసి వెళ్లిపోయారు. షామ్ వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలతో చర్చించారు, “ఇక్కడ గొప్ప భక్తుడు అంటే ఎవరు? ఉత్తమమైన వ్యక్తి అంటే ఎవరు? వాని గురించి నాకు చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్లి శిష్యరికం చేరుకోవాలనుకుంటున్నాను” అన్నారు. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటే, ఆ చర్చిలో ఉన్న ఒక ఫాదర్ గురించి ఆయనకు తెలియజేయగా, ఆయన వెంటనే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్లి: “అయ్యా, నేను ఫలానా దేశస్తుణ్ణి, నాకు అక్కడ ఉన్న విషయాలు నచ్చక మీ ధర్మాన్ని నేను ఇష్టపడి వచ్చాను కాబట్టి, నేను మీ దగ్గర శిష్యునిగా చేరాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అని అడగ్గా, అతను “సరే బాబు నా దగ్గర నీవు శిష్యునిగా ఉండు” అని ఉంచుకున్నాడు.

ఆయన దగ్గర ఉండి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన నేర్పిన విధంగానే ధార్మిక విషయాలు నేర్చుకుని ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఆ పాదరి.. ఆ ఫాదర్ వద్ద ఒక చెడు అలవాటు ఉండేది, అది ఆయనకు నచ్చలేదు. ఆ అలవాటు ఏంటంటే, ఆయన ప్రజలకు దానధర్మాలు చేయండి అని చెప్పి బోధించేవాడు. ఆయన మాటలు విని ప్రజలు దానధర్మాలు తీసుకొని వచ్చి ఆయన చేతికి ఇస్తే, ఆ దానధర్మాల సొమ్ముని తీసుకొని వెళ్లి పేదలకు పంచకుండా అతను ప్రోగు చేసుకుని దాచుకునేవాడు. అది సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి నచ్చలేదు.

కొద్ది రోజుల తర్వాత అతని మరణం సంభవించింది. మరణం సంభవించక ముందు అతను దాచుకున్న సొమ్ము గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఒక్క సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి మాత్రమే తెలుసు. అతను మరణించిన తర్వాత ప్రజలందరూ ప్రోగయితే, అప్పుడు సల్మాన్ రజియల్లాహు అన్హు వారందరి ముందర కుండబద్దలు కొట్టేశారు. అదేమన్నారంటే: “అయ్యా, ఎవరినైతే మీరు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారో, అతని యొక్క లక్షణం ఏమిటంటే మీరు ఇచ్చే సొమ్ముని ఆయన దాచుకున్నాడు. రండి చూపిస్తాను” అని చెప్పేసి ఆయన దాచుకున్న సొమ్ము మొత్తాన్ని చూపించేశారు. అప్పుడు ప్రజలకు పట్టరాని కోపం వచ్చింది. “ఎవరినైతే మేము గొప్ప వ్యక్తి అనుకున్నామో అతను ఇలాంటి మూర్ఖుడా” అని చెప్పి చాలా కోపగించుకున్నారు.

సరే, ఆ తర్వాత అతని స్థానంలో మరొక ఫాదర్ ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఫాదర్ చాలా గొప్ప వ్యక్తి, చాలా భక్తుడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద శిష్యునిగా ఉండి దైవభక్తి, అలాగే దైవ ఆరాధనలో నిమగ్నమైపోయారు. రోజులు గడిచాయి. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ ఫాదర్ వద్ద చాలా విషయాలు నేర్చుకున్నారు, ఆ ఫాదర్ ని చాలా ఇష్టపడ్డారు. అతనిలో ఎలాంటి తప్పులు ఆయన గమనించలేదు.

చివరికి కొద్ది రోజుల తర్వాత ఆయన మరణం సంభవించినప్పుడు, మరణానికి ముందు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అతని వద్ద వెళ్లి: “ఏమండీ, నేను ఫలానా దేశస్తుడిని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు మరణిస్తున్నారు, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి? దైవ ధర్మ ఆచరణ చేయాలి? మీరు చెప్పిన వ్యక్తి వద్ద నేను వెళతాను, ఎవరి దగ్గర వెళ్లాలో చెప్పండి” అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే: “చూడు నాయనా! నీవు ఒక మంచి వ్యక్తివి అనిపిస్తున్నావు కాబట్టి, నాలాంటి వ్యక్తి నీకు ఈ నగరంలో దొరకడు. నీవు ‘మోసుల్’ అనే నగరానికి వెళ్ళిపో, అక్కడ ఫలానా పేరు చెప్పు, ఆ వ్యక్తి వద్ద వెళ్లి నీవు శిష్యరికం చేయి, అతను కూడా మంచి వ్యక్తి” అన్నారు.

చూడండి, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు మళ్లీ అక్కడి నుండి మోసుల్ నగరానికి వెళ్ళారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్నారు, ఆయన దగ్గర వెళ్లి జరిగిన విషయాలన్నీ చెప్పి: “అయ్యా, నాకు ఫలానా వ్యక్తి మీ వద్దకు పంపించాడు. నేను మీ వద్ద వచ్చి దైవ విషయాలు, దైవ భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను, అనుమతి ఉందా?” అంటే ఆయన సంతోషంగా పిలుచుకున్నాడు. అతని వద్ద శిష్యరికం చేశారు. అతను కూడా చాలా గొప్ప భక్తుడు. అతని వద్ద కూడా సల్మాన్ రజియల్లాహు అన్హు కొద్ది రోజులు శిష్యరికం చేసిన తర్వాత, చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎలాంటి పరీక్షలకు గురి చేస్తున్నాడో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి, కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తికి కూడా మరణం సంభవించింది. మరణానికి ముందు ఆ వ్యక్తితో సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు జరిగిన విషయం అంతా చెప్పారు. “అయ్యా నేను ఇరాన్ దేశస్తుడిని, అక్కడి నుంచి మళ్ళీ షామ్ వచ్చాను, షామ్ నుంచి ఫలానా వ్యక్తి నాకు మీ దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీరు కూడా మరణిస్తున్నారు, నేను దైవ విషయాలు భక్తి విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్లి ఈ విషయాలు నేర్చుకోవాలి?” అని అడగ్గా, ఆయన ఏం చెప్పారంటే: “‘నసీబైన్’ అనే ఒక నగరం ఉంది, ఆ నగరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లండి, అతనికంటే గొప్ప వ్యక్తి నా దృష్టిలో ఎవడూ లేడు” అన్నారు.

మళ్ళీ నసీబైన్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోతూ ఉంటే ఆయన దగ్గర కూడా: “అయ్యా, మీ తర్వాత నేను ఎవరి దగ్గర వెళ్ళాలి?” అంటే, అప్పుడు ఆయన చెప్పాడు: “‘అమ్మూరియా’ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడికి వెళ్లండి” అన్నారు. సరే అమ్మూరియా ప్రదేశానికి వెళ్ళారు, అక్కడ శిష్యరికం చేశారు. ఆయన కూడా చనిపోయే సమయం వచ్చింది. అల్లాహు అక్బర్! ఎన్ని చోట్ల చూడండి.. ఇరాన్ నుండి సిరియాకు, సిరియా నుండి మళ్ళీ మోసుల్ కు, మోసుల్ నుండి నసీబైన్ కు, నసీబైన్ నుండి మళ్ళీ అమ్మూరియాకు. ఇన్ని చోట్ల తిరుగుతున్నారు ఎవరి కోసమండి? డబ్బు కోసమా? ధనం కోసమా? ఆస్తి కోసమా? కేవలం భక్తి కోసం ఇన్ని చోట్ల తిరుగుతున్నారు అభిమాన సోదరులారా.

అమ్మూరియాలో వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడున్న ఫాదర్ మరణించేటప్పుడు: “అయ్యా, నేను తిరుగుతూనే ఉన్నాను, మీ తర్వాత ఇక నేను ఎక్కడికి వెళ్లాలో చెప్పండి” అని చెప్పగా, అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. గమనించండి అభిమాన సోదరులారా, ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది విషయం. ఆయన ఏం చెప్పాడంటే: “నాయనా, నేడు ప్రపంచంలో పరిస్థితుల్ని చూస్తూ ఉంటే చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అనిపిస్తుంది. చివరి ప్రవక్త గురించి నాకు తెలిసిన జ్ఞానం ఏమిటంటే, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు.” ఎవరు చెప్తున్నారండి? ఒక చర్చికి గురువైన ఫాదర్ గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? వారి శిష్యునికే చెప్తున్నారు. ఏమంటున్నారంటే: “చివరి ప్రవక్త వచ్చే సమయం వచ్చేసింది అని నాకు అనిపిస్తుంది, అతను అరబ్బు దేశస్తుడై ఉంటాడు” – మొదటి విషయం.

రెండవ విషయం ఏమిటంటే: “అతను పుట్టిన నగరము నుండి ప్రయాణము చేసి, రెండు పర్వతాల మధ్య ఒక నగరం ఉంటుంది, ఆ నగరంలో ఖర్జూర చెట్లు ఉంటాయి, ఆ నగరానికి వలస ప్రయాణం చేస్తాడు.” రెండు విషయాలు. మూడో విషయం ఏమిటంటే: “అతను ‘సదఖ’ (దానధర్మాలు) తినడు.” నాలుగో విషయం ఏమిటంటే: “‘హదియా’ – బహుమానంగా ఇచ్చిన విషయాలను తీసుకుంటాడు, తింటాడు.” ఐదవ విషయం ఏమిటంటే: “అతని రెండు భుజాల మధ్య అల్లాహ్ తరపు నుంచి ఒక స్టాంప్ ఉంటుంది, దాన్నే ‘మొహ్రె నబువత్’ (ప్రవక్త పదవికి సూచనగా) ఒక స్టాంప్ లాంటిది ఉంటుంది” అన్నారు. ఈ ఐదు సూచనలు చెప్పాడు ఆయన.

అయితే అభిమాన సోదరులారా! సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు అమ్మూరియాలో ఉన్నప్పుడు కొంచెం కష్టపడి కొన్ని ఆవులను కూడా సంపాదించుకొని పెంచుకున్నారు. ఇక వెయిట్ చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి ఎవరైనా వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత కొంతమంది అరబ్బు దేశస్తులు ఆ ప్రదేశానికి వ్యాపారానికి వెళ్లారు. అప్పుడు ఆయన వెంటనే వారి దగ్గరికి వెళ్లి: “ఏమండీ నేను కూడా మీతో పాటు అరబ్బు దేశానికి వచ్చేస్తాను. కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఆవులన్నీ మీకు ఇచ్చేస్తాను. దయచేసి నన్ను మీరు మీతో పాటు అరబ్బు దేశానికి తీసుకెళ్లండి” అని విన్నవించుకున్నారు.

అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి విన్నపాన్ని తీసుకున్న వాళ్ళు, ఆవులని తీసుకొని, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని కూడా తీసుకొని అక్కడి నుంచి తిరిగి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు మోసం చేశారు. ఆవులని లాక్కున్నారు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని మదీనాకి సమీపంలో ‘వాది అల్ ఖురా’ (ఇప్పుడు అది మదీనాలో కలిసిపోయింది, ఆ రోజుల్లో వాది అల్ ఖురా) అనే చోట తీసుకొని వచ్చి ఒక యూదుని చేతికి బానిసగా అమ్మేశారు. “అయ్యో నేను బానిసను కాదు” అని ఆయన మొత్తుకున్నా బలవంతంగా ఆయనను అమ్మేశారు.

అయితే ఆ యూదుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారిని తన వద్ద బానిసగా, ఖర్జూరపు తోటకు కాపలాదారిగా ఉంచుకున్నాడు. ఆయన అక్కడ ఉంటూనే రెండు పర్వతాల మధ్య కనిపిస్తున్న ఖర్జూర చెట్ల మధ్య కనిపిస్తున్న నగరాన్ని చూసుకున్నాడు. “అరే! నా గురువుగారు చెప్పిన నగరం లాగే ఈ నగరం కనిపిస్తా ఉంది” అని ఆయన మనసులో ఒక తపన, కోరిక కలిగింది. ఇక ప్రవక్త కోసం ఆయన తపిస్తున్నారు. ఆయన చెప్పినట్టుగా ప్రవక్త ఈ ప్రదేశానికే వస్తాడు అనే ఆలోచనలో ఆయన తపిస్తూ ఉన్నాడు.

మరి కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ యూదుడు ఏం చేశాడంటే, మదీనా నగరంలో ఉండే ఒక బంధువుకి అతనిని అమ్మేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఇక మదీనా నగరంలోనే ‘బనూ ఖురైజా’ అనే చోటికి వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది, ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, రెండు పర్వతాల మధ్య ఈ నగరం ఉంది. ఇక ప్రవక్త రావడమే తరువాయి. “ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? ప్రవక్త గారు ఎప్పుడు వస్తారు? నా కోరిక ఎప్పుడు తీరుతుంది?” అని చెప్పి ఆయన ఎదురుచూస్తున్నారు, తపిస్తూ ఉన్నారు అభిమాన సోదరులారా.

రోజులు గడిచాయి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత, 13 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆయనను చంపాలని ప్రయత్నం చేశారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త వారికి మక్కా నుండి మదీనాకు వెళ్లిపోమని ఆదేశించినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వెళుతూ వెళుతూ ముందు ఎక్కడ దిగారండి? ‘ఖుబా’లో దిగారు.

ఖుబాలో దిగినప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఖర్జూరపు చెట్టు మీద నిలబడి ఉంటే, ఆయన యజమాని వద్ద ఒక బంధువు వచ్చి: “ఏమండీ! మీకు తెలుసా? కొంతమంది ఖుబాకు వెళుతున్నారు. అక్కడ ఎవడో మక్కా నుంచి ఒకడు వచ్చాడంట. ఆయన గురించి అందరూ ‘ప్రవక్త ప్రవక్త’ అని చెప్పుకుంటున్నారు” అని చెప్పేశాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చెవులు ఆ మాట పడగానే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. ఎంతగా ఆయన సంతోషించాడంటే, ఇక కళ్ళు తిరిగి పడిపోతారేమో అని అనిపించింది. ఆ తర్వాత “ఏమైంది? ఎవరు? ఎవరు?” అని చెప్పేసి దగ్గరికి వచ్చి అడగ్గానే, యజమాని కోపంతో, “బానిస నువ్వయ్యి మా మధ్యలో వస్తావా? మా మాటల్లో మాట కలుపుతావా?” అని చెప్పేసి గట్టిగా గుద్దాడు. “వెళ్లి పని చూసుకో” అన్నాడు.

సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు సాయంత్రం వరకు వేచి చూసి, ఆయన దగ్గర ఉన్న కొద్ది మొత్తం తినే పదార్థాన్ని తీసుకొని, ఖుబాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్న చోటికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన ఎలా పరీక్షిస్తున్నారో చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చేసి, ఆ తినే పదార్థాన్ని ఆయన చేతికి ఇస్తూ ఏమంటున్నారంటే: “అయ్యా, మీరు గొప్ప భక్తుల్లాగా అనిపిస్తున్నారు. మీతో పాటు ఉన్న మీ శిష్యులు కూడా చాలా ఆకలితో ఉన్నట్టు అనిపిస్తోంది. కాబట్టి ఇది నా తరపు నుంచి ‘సదఖ’ – తీసుకోండి” అన్నారు.

‘సదఖ తీసుకోండి’ అని చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని శిష్యులకు ఇచ్చేశారు. శిష్యులు తిన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినలేదు. అది గమనించిన సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు కన్ఫర్మ్ చేసుకున్నారు, “ఆ! ఈయన సదఖ తినట్లేదు.” ఒక విషయం కన్ఫర్మ్ అయిపోయింది.

మళ్ళీ ఇంటికి వెళ్లారు. కొద్ది రోజుల తర్వాత ఆయన దగ్గర ఉన్న మరీ కొన్ని పదార్థాలను తీసుకొని.. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉంటే మళ్ళీ మదీనాకు వెళ్లారు. మదీనాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శిష్యులతో పాటు కూర్చొని ఉంటే, “అయ్యా, ఇది నా తరపు నుండి ‘హదియా’ – బహుమానం” అని చెప్పారు. చెప్పగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొని, తానూ తిన్నారు, శిష్యులకు తినిపించారు. రెండో విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సదఖ తినట్లేదు, హదియా తింటున్నారు.

ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక జనాజా వెంబడి వెళుతూ ఉంటే, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆయన వెంటవెంట వెళ్లి అటు ఇటు అటు ఇటు ఎదురుచూస్తున్నారు. “ఎప్పుడెప్పుడు ఆయన బట్ట జారుతుంది, ఆ రెండు భుజాల మధ్య ఉన్న ఆ గుర్తుని నేను చూడాలి” అని వెనక వెనకే వెనక వెనకే ఆయన కదులుతూ ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గమనించేశారు. ఇతను వెనుక నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వెంటనే బట్టను అక్కడి నుంచి పక్కకు జరపగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపు మీద ఉన్న ఆ ముద్రను చూసి సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ముద్దు పెట్టుకొని: “ఓ దైవ ప్రవక్త! నేను మీకోసం ఇంతగా తపించాను, ఫలానా దేశం నుండి ప్రయాణం చేశాను, ఫలానా ఫలానా ఫలానా చోటికి నేను తిరిగాను, మీకోసం ఎదురు చూశాను, చివరికి బానిసగా మారిపోయాను, ఇక్కడ నన్ను బానిసగా చేసేసారు, మీకోసం నేను ఎదురుచూస్తున్నాను ఓ దైవ ప్రవక్త” అని చెప్పేసి ఏడ్చారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: “ఓ సల్మాన్! వెనుక నుండి ముందుకు రా” అని చెప్పి, ముందర కూర్చోబెట్టి జరిగిన పూర్తి కథను విన్నారు.

ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ తో అన్నారు: “ఓ సల్మాన్! నీవు ఒక మంచి సమయాన్ని చూసుకొని, నీ యజమానితో ‘నేను పరిహారం చెల్లించేస్తాను నన్ను స్వతంత్రుడ్ని చేసేయ్’ అని అడుగు. అతను ఏం కోరతాడో అది ఇచ్చేద్దాం” అన్నారు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వెళ్లారు. సమయం కోసం ఎదురుచూశారు. సమయం కోసం ఎదురుచూసిన తర్వాత ఒకరోజు యజమానితో చెప్పారు: “అయ్యా, మీకు ఏం కావాలో చెప్పండి నేను చెల్లించేస్తాను, నాకు మాత్రం విముక్తుడిని చేసేయండి ఈ బానిస నుండి” అన్నాడు.

అప్పుడు ఆయన ఏమన్నాడంటే: “నాకు మూడు వందలు లేదా ఐదు వందల ఖర్జూరపు చెట్లు నాటి ఇవ్వు. ఆ తర్వాత 400 ల బంగారు నాణాలు ఇవ్వు” అని షరతు పెట్టాడు. సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి: “ఓ దైవ ప్రవక్త! నా యజమాని ఈ విధంగా షరతు పెట్టాడండి” అని చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలతో అన్నారు: “ఏమండీ! మీ సోదరుడిని ఆదుకోండి” అన్నారు. అప్పుడు సహాబాలందరూ కలిసి, ఒక్కొక్కరు 10 చెట్లు, 20 చెట్లు, 30 చెట్లు, 40 చెట్లు.. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఎవరికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని ఖర్జూరపు చెట్లు తీసుకొని వెళ్లి అక్కడ 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశారు.

నాటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు, అదేమిటంటే: “గుంతలు తవ్వండి. నాటే ముందు నన్ను పిలవండి, నేను వచ్చి ప్రారంభిస్తాను” అన్నారు. గుంతలు తవ్వారు. ఖర్జూరపు చెట్లు సిద్ధంగా ఉంచారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పిలవగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్లి అక్కడ ‘బిస్మిల్లాహ్’ అని చెప్పి ఖర్జూరపు చెట్లు నాటడం ప్రారంభించిన తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు చెప్పారు: “అక్కడ నాటిన 500 ల చెట్లలో ఏ ఒక్క చెట్టు కూడా మరణించలేదు, అన్నీ బ్రతుక్కున్నాయి.” అన్నీ బ్రతికిన తర్వాత, యజమానితో: “ఏమండీ మీరు చెప్పినట్లుగానే 500 ల ఖర్జూరపు చెట్లు నాటేశాము, ఇక బంగారు నాణాలు మాత్రమే ఇవ్వవలసి ఉంది.”

కొద్ది రోజుల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి కొంచం బంగారం వచ్చింది. ఆ బంగారాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారి చేతికి ఇచ్చి: “ఓ సల్మాన్! ఇది తీసుకొని వెళ్లి నిను యజమానికి ఇచ్చేయ్” అన్నారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ఆ బంగారాన్ని తీసుకొని వెళ్లి యజమానికి ఇవ్వగా, అతను తూచాడు. తూచితే 400 ల బంగారు నాణాలకు సమానంగా అది ఉండింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారికి అతను బానిసత్వం నుండి విముక్తిని ఇస్తూ స్వతంత్రుడ్ని చేసేసాడు.

అభిమాన సోదరులారా! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తర్వాత బదర్ సంగ్రామం జరిగింది, అప్పుడు సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు అందులో పాల్గొనలేదు, ఎందుకంటే ఆయన బానిసగా ఉన్నారు. ఆ తర్వాత ఉహద్ సంగ్రామం జరిగింది, ఆ సంగ్రామంలో కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు వారు పాల్గొనలేదు. కారణం ఏమిటంటే ఆయన బానిసగా అక్కడ ఉండిపోయారు.

ఆ తర్వాత ఐదవ సంవత్సరంలో ఎప్పుడైతే మక్కా వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరియు ముస్లింలను ఇస్లాం ధర్మాన్ని అణచివేయాలని వచ్చారో, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పేద పరిస్థితి, ఆపైన కరువు. ఈ రెండు విషయాల వల్ల మళ్లీ శత్రువును ఎదుర్కోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉండింది కాబట్టి, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలను కూర్చోబెట్టి: “ఏమి చేయాలి? ఎలా శత్రువుని ఎదుర్కోవాలి?” అని ప్రశ్నించినప్పుడు, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. అదేమిటంటే: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మదీనాకు నలువైపుల నుండి కందకాన్ని తవ్వేద్దాం. మా దేశంలో, ఇరాన్ లో ఇలాగే చేస్తాం” అన్నారు.

అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయన ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, సహాబాలకు ఆదేశించారు, అక్కడ కందకం తవ్వేశారు. అయితే అభిమాన సోదరులారా, సమయం ఎక్కువైపోయింది. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి చేరుకున్న తర్వాత, సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద శిష్యునిగా ఉండి, ఎంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇష్టపడ్డారు, అభిమాన పడ్డారు. దైవ ధర్మాన్ని బాగా నేర్చుకున్నారు. అల్లాహ్ ఆరాధన నేర్చుకుని, అల్లాహ్ మార్గంలో ఆయన ప్రతిచోట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సహకరించారు.

ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందర ఆయన అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీరు కందకంలో ఒకచోట గొడ్డలితో కొడుతూ ఉంటే అక్కడ తెల్లటి మెరుపు నేను చూశాను, అదేంటి?” అని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “దాన్ని నువ్వు చూశావా?” అంటే సల్మాన్ ఫార్సీ, “అవునండి నేను చూశాను” అన్నారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: “ఆ మెరుపులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నాకు ఇరాన్ మరియు ఇరాన్ లో ఉన్న నగరాలన్నింటిని చూపించాడు. ఆ నగరాలన్నింటి చోట నా ధర్మము చేరిపోతుంది” అన్నారు. అల్లాహు అక్బర్!

అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఆ మాట విన్న తర్వాత సల్మాన్ ఫార్సీ అన్నారు: “ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం! అక్కడ దైవ ధర్మం చేరే సమయానికి నేను కూడా అందులో పాల్గొనాలనే దువా చేయండి” అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కోసం దువా చేశారు. అలాగే సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు బ్రతికి ఉండగానే ఆయన దేశానికి ఇస్లాం ధర్మం చేరిపోయింది.

ఆ తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు అన్హు దైవాన్ని ఆరాధిస్తూ, దైవ ధర్మ సేవ కొరకు పోరాడుతూ ఆయన ఈ ప్రపంచం నుంచి తనువు చాలించారు. అల్లాహ్ తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ మనందరికీ ఇస్లాం ధర్మం మీద నిలకడగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు ఇస్లాం ఆచరించే మార్గంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా, సులభంగా ఇస్లాం ధర్మాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. పరీక్షల్లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మమ్మల్ని నెగ్గించుగాక.

అకూలు కౌలి హాజా, అస్తగ్ఫిరుల్లాహ లి వలకుమ్ వ లిసాయరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్.


సహాబా (రదియల్లాహు అన్హుమ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1KN6AyXdv30x30ykoVkyVt

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం [ఆడియో, టెక్స్ట్]

జుమా రోజు స్నానం చేయడం, సువాసన పూసుకోవడం ధర్మం
https://youtu.be/S94_5Yq3hOA [8 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జుమా రోజు ఆచరించాల్సిన పలు సున్నతుల గురించి వివరించారు. ముఖ్యంగా, జుమా రోజు స్నానం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కొన్ని హదీసుల ప్రకారం ఇది ప్రతి ప్రౌఢ వయస్సుకు చేరిన వ్యక్తిపై విధిగా (వాజిబ్) ఉండగా, మరికొన్ని హదీసుల ప్రకారం ఇది అత్యంత ఉత్తమమైన (అఫ్దల్) చర్య. స్నానంతో పాటు, శుభ్రమైన దుస్తులు ధరించడం, అందుబాటులో ఉన్న సువాసన లేదా నూనె రాసుకోవడం, మస్జిద్‌కు తొందరగా వెళ్లడం, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా దొరికిన చోట కూర్చోవడం, మరియు ఇమామ్ ప్రసంగాన్ని (ఖుత్బా) శ్రద్ధగా, మౌనంగా వినడం వంటివి కూడా వివరించబడ్డాయి. ఈ నియమాలను పాటించిన వ్యక్తి యొక్క ఒక జుమా నుండి మరో జుమా మధ్య జరిగిన పాపాలు మరియు అదనంగా మరో మూడు రోజుల పాపాలు క్షమించబడతాయని శుభవార్త ఇవ్వబడింది.

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్.

జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సూక్తులు, హదీసుల తెలుగు అనువాదం మనం వింటూ ఉన్నాము. ఇప్పుడు జుమా రోజు స్నానం చేసే ఆదేశంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన హదీసులు విందాము.

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ ـ رضى الله عنهما ـ أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ إِذَا جَاءَ أَحَدُكُمُ الْجُمُعَةَ فَلْيَغْتَسِلْ ‏”‌‏
అన్ అబ్దుల్లా హిబ్ని ఉమర రదియల్లాహు అన్హు అన్న రసూలల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “ఇదా జాఅ అహదుకుముల్ జుముఅత ఫల్ యగ్తసిల్”.
(అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: “మీలో ఎవరు జుమాకు హాజరవుతున్నారో, వారు స్నానం చేయాలి”.)
(సహీహ్ బుఖారీ 877, సహీహ్ ముస్లిం 844)

عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ ـ رضى الله عنه ـ عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ ‏ “‏ الْغُسْلُ يَوْمَ الْجُمُعَةِ وَاجِبٌ عَلَى كُلِّ مُحْتَلِمٍ ‏”‌‏
అన్ అబీ సయీదినిల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు అనిన్నబియ్యి సల్లల్లాహు అలైహి వసల్లమ ఖాల, “అల్ గుస్లు యౌమల్ జుముఅతి వాజిబున్ అలా కుల్లి ముహ్తలిం”.
(అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు స్నానం చేయడం, ప్రాజ్ఞ వయస్సుకు చేరిన ప్రతి ఒక్కరిపై విధిగా ఉంది”.) (సహీహ్ బుఖారీ 858, సహీహ్ ముస్లిం 846)

عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ، قَالَ قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم ‏ “‏ مَنْ تَوَضَّأَ يَوْمَ الْجُمُعَةِ فَبِهَا وَنِعْمَتْ وَمَنِ اغْتَسَلَ فَالْغُسْلُ أَفْضَلُ ‏”‏
అన్ సమురతబ్ని జుందుబిన్ రదియల్లాహు అన్హు ఖాల ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ యౌమల్ జుముఅతి ఫబిహా వనిఅమత్, వ మనిగ్తసల ఫహువ అఫ్దల్”.

(సముర బిన్ జుందుబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే జుమా రోజు వుదూ చేసుకున్నారో, చాలా మంచి పని చేశాడు అతను. మరెవరైతే స్నానం చేశారో, ఈ స్నానం చేయడం అన్నది చాలా ఉత్తమం”.) (అబూ దావూద్ 354, తిర్మిది 497, నిసాయి 1379, దారిమి 1581. ఇది హసన్ కోవకు చెందిన హదీస్).

عَنْ أَبِي هُرَيْرَةَ، أَنَّ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم قَالَ مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَدَنَا وَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلاَثَةِ أَيَّامٍ وَمَنْ مَسَّ الْحَصَى فَقَدْ لَغَا

అన్ అబీ హురైరత రదియల్లాహు అన్హు ఖాల్, ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, “మన్ తవద్దఅ ఫ అహ్సనల్ వుదూఅ సుమ్మ అతల్ జుముఅత ఫదనా వస్తమఅ వఅన్సత గుఫిర లహు మాబైనహు వబైనల్ జుముఅ వజియాదతు సలాసతి అయ్యామ్, వమన్ మస్సల్ హసా ఫఖద్ లగా”.

(అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఎవరైతే మంచి రీతిలో, ఉత్తమ రీతిలో ప్రవక్త చెప్పినట్లు, చూపినట్లు వుదూ చేశారో, మళ్ళీ జుమాకు హాజరయ్యాడో, మొదటి పంక్తులలో ఇమామ్‌కు చాలా దగ్గరగా కూర్చొని జుమా ప్రసంగం (ఖుత్బా) చాలా శ్రద్ధగా, మౌనంగా విన్నాడో, అలాంటి వ్యక్తికి రెండు జుమాల మధ్యలో, అంటే మొత్తం ఏడు రోజులు, ఇంకా అదనంగా మూడు రోజులు, అంటే మొత్తం పది రోజుల పాపాలు మన్నించబడతాయి. అయితే ఎవరైతే ఈ జుమా ఖుత్బా ప్రసంగం సందర్భంలో కంకర రాళ్లు కూడా ముట్టుకుంటాడో, అతని యొక్క జుమా పుణ్యమంతా కూడా వృధా అయిపోతుంది”.) (అబూ దావూద్ 1050, తిర్మిది 498. హదీస్ సహీహ్).

ఈ నాలుగు హదీసులలో మనకు తెలిసిన సారాంశం ఏమిటంటే, జుమా రోజు స్నానం చేయడం చాలా ఉత్తమమైన విషయం. సహీహ్ బుఖారీ, ముస్లిం హదీసుల ఆధారంగా కొందరు విధి అని కూడా అంటారు, ‘వాజిబున్’ అన్న పదం వచ్చింది గనక. కానీ అబూ దావూద్, తిర్మిది, నసాయి ఇంకా వేరే హదీసు గ్రంథాలలో వచ్చిన హదీసు ఆధారంగా ‘అఫ్దల్’ అన్న పదం వచ్చింది గనుక, విధి కాదు. కానీ మనిషికి అవకాశం ఉండి, సౌకర్యాలు ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం వదలకూడదు.

మరొక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, సామాన్యంగా మనం జుమా రోజు స్నానం చేసినప్పుడు పరిశుభ్రత కొరకు, స్నానం చేయాలి, ఈ రోజు జుమా అన్నటువంటి ఆలోచనలు, ఇరాదా, నియ్యతులు ఉంటాయి. కానీ వీటితో పాటు అతి ముఖ్యమైనది, జుమా రోజు స్నానం చేయడం విధి లేదా అతి ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు గనక, ప్రవక్త ఈ ఆదేశాన్ని మనం పాటిస్తున్నాము అన్నటువంటి నియ్యత్ మనసులో ఉండేది ఉంటే, ఈ స్నానం చేయడం ద్వారా కూడా మనకు పుణ్యాలు లభిస్తాయి. ఈ విషయం మనకు నాలుగో హదీసులో కూడా చాలా స్పష్టంగా తెలిసింది. అల్లాహు తఆలా దీనికి బదులుగా ఇంకా వీటితో పాటు మరికొన్ని పుణ్య కార్యాలు ఏదైతే తెలుపబడ్డాయో, తొందరగా రావడం, ముందు పంక్తుల్లో కూర్చోవడం, ఎలాంటి వృధా కార్యకలాపాలు చేయకుండా ఉండడం, శ్రద్ధగా ఖుత్బా వినడం, వీటి ద్వారా అల్లాహు తఆలా పది రోజుల పాపాలు మన్నిస్తాడు.

ఇక జుమా రోజు సువాసన పూసుకోవడం కూడా ఒక పుణ్య కార్యం. అయితే, దీనికి సంబంధించిన ఒక హదీసు విందాము.

عَنْ سَلْمَانَ الْفَارِسِيِّ، قَالَ قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم ‏ “‏ لاَ يَغْتَسِلُ رَجُلٌ يَوْمَ الْجُمُعَةِ، وَيَتَطَهَّرُ مَا اسْتَطَاعَ مِنْ طُهْرٍ، وَيَدَّهِنُ مِنْ دُهْنِهِ، أَوْ يَمَسُّ مِنْ طِيبِ بَيْتِهِ، ثُمَّ يَخْرُجُ فَلاَ يُفَرِّقُ بَيْنَ اثْنَيْنِ، ثُمَّ يُصَلِّي مَا كُتِبَ لَهُ، ثُمَّ يُنْصِتُ إِذَا تَكَلَّمَ الإِمَامُ، إِلاَّ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ الأُخْرَى ‏”‌‏

అన్ సల్మానల్ ఫారిసీ రదియల్లాహు అన్హు ఖాల్, ఖాలన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం, “లా యగ్తసిలు రజులున్ యౌమల్ జుముఅ, వ యతతహ్హరు మస్తతాఅ మిన్ తుహ్రిన్, వ యద్దహిను మిన్ దుహ్నిహి, అవ్ యమస్సు మిన్ తీబి బైతిహి, సుమ్మ యఖ్రుజు ఫలా యుఫర్రిఖు బైనస్నైన్, సుమ్మ యుసల్లీ మా కుతిబ లహు, సుమ్మ యున్సితు ఇదా తకల్లమల్ ఇమాము, ఇల్లా గుఫిర లహు మా బైనహు వబైనల్ జుముఅతిల్ ఉఖ్రా”.

సల్మాన్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: “జుమా రోజు ఎవరైతే స్నానం చేస్తారో, మంచి విధంగా తన శక్తి ప్రకారం పరిశుభ్రత పాటిస్తాడో, మంచి దుస్తులు ధరించుకుంటాడో మరియు తన వద్ద ఉన్నటువంటి నూనె తలకు పూసుకుంటాడో మరియు అలాగే ఇంట్లో ఉన్న సువాసన కూడా పూసుకుంటాడో, ఇంకా మస్జిద్‌కు వెళ్లి మస్జిద్లో ఇద్దరి మధ్యలో విడదీయకుండా, ఎక్కడ అతనికి స్థలం దొరికిందో అక్కడ, అల్లాహ్ అతని అదృష్టంలో రాసినన్ని రకాతుల నమాజులు చేస్తాడో, మళ్ళీ ఇమామ్ ప్రసంగం ఇచ్చినప్పుడు, జుమా ఖుత్బా ఇచ్చినప్పుడు శ్రద్ధగా, మౌనంగా ఖుత్బా వింటాడో, అల్లాహు తఆలా ఈ జుమా నుండి వచ్చే జుమా వరకు ఈ మధ్యలో జరిగిన అతని పాపాలను మన్నిస్తాడు”. (సహీహ్ బుఖారీ 883).

ఈ హదీసులో తెలిపినటువంటి జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి ఎంత గొప్ప శుభవార్త ఇవ్వడం జరిగిందో గమనించండి. కానీ ఈ శుభవార్త ఎవరి కొరకు ఉంది? ఈ హదీసులో తెలుపబడినటువంటి ఈ జుమాకు సంబంధించిన ప్రత్యేక కార్యాలు చేసిన వారికి.

అల్లాహ్ మనందరికీ జుమా యొక్క ఘనతను దృష్టిలో ఉంచుకొని, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో జుమా కోసం సంసిద్ధతలు, తయారీలు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక. ఆ రోజు చదవవలసిన సూర కహఫ్ ఇంకా వేరే పుణ్య కార్యాలు చేసేటువంటి సద్భాగ్యం కూడా ప్రసాదించు గాక. ఆమీన్.

జుము’ఆ (శుక్రవారం) రోజున మన బాధ్యతలు, పుణ్య మార్గాలు.
ఇక్కడ ఆడియో వీడియో ఆర్టికల్స్ పొందుతారు ఇన్ షా అల్లాహ్. తప్పక ఈ పేజీని దర్శించండి, ఫార్వర్డ్ చేయండి
https://teluguislam.net/five-pillars/salah-namaz-prayer/friday/