ఇస్లాంలో పవిత్ర మాసాలు, రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? [2 వీడియోలు & టెక్స్ట్]

మొదటి భాగం:

పార్ట్ 1: ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదు
https://www.youtube.com/watch?v=lDeA6oFXxIc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [28 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త రజబ్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇస్లామీయ క్యాలెండర్‌లోని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. ఈ పవిత్ర మాసాలలో అన్యాయానికి (జుల్మ్) పాల్పడటం తీవ్రంగా నిషేధించబడింది. పాపాలు చేయడం మరియు అల్లాహ్ ఆదేశాలను విస్మరించడం ద్వారా మనిషి తనకు తాను అన్యాయం చేసుకుంటాడని వక్త వివరిస్తారు. షిర్క్, అవిధేయత, మరియు ఇతరులను పీడించడం వంటివి ఆత్మపై చేసుకునే అన్యాయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. జీవితం అశాశ్వతమని, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని గుర్తు చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపం చెంది (తౌబా), అల్లాహ్ వైపునకు మరలాలని వక్త ఉద్భోదిస్తారు.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్]
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల రజబ్ నెల మొదలైపోయింది. ప్రత్యేకంగా రజబ్ నెల విషయంలో ఏదైనా ప్రసంగం అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మన ముస్లిం సోదర సోదరీమణులు రజబ్ నెలలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాత్రం తెలుపని కొన్ని కార్యాలు చేస్తున్నారు. వాటిని ఖండించడానికి రజబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రసంగం అవసరం ఉంటుంది.

ఒక విషయం గమనించండి, మనమందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం. మనమందరం అల్లాహ్ యొక్క దాసులమైనప్పుడు, అల్లాహ్ కు ఇష్టమైన విధంగానే మనం ఆయన దాస్యం చేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజమే కదా? ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఆయన దాస్యం, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అది చూపించడానికి అల్లాహ్ ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు ఒక ఆదర్శంగా పంపించారు. అందు గురించి మహాశయులారా, మనం ఏ కార్యం చేసినా కానీ దానికి అల్లాహ్ వైపు నుండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి సాక్ష్యాధారం, రుజువు, దలీల్ తప్పనిసరిగా అవసరం ఉంది.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, ఇది మంచి కార్యమే, ఇది చేయవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ వద్ద మనకు ఇష్టమైనటువంటి, మనకు మెచ్చినటువంటి పని స్వీకరించబడదు. అల్లాహ్ వద్ద ఏదైనా పని, ఏదైనా సత్కార్యం స్వీకరించబడడానికి అది అల్లాహ్ లేక ప్రవక్త ఆదేశపరంగా ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా ఉండడం తప్పనిసరి.

రజబ్ నెల దీనికి ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా గౌరవప్రదం ఉంటే, ఒకే ఒక విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ త’ఆలా తన ఇష్టానుసారం సంవత్సరంలో 12 నెలలు నిర్ణయించాడు. ఆ 12 నెలల్లో నాలుగు నెలలను గౌరవప్రదమైనవిగా ప్రస్తావించాడు. ఆ నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో రజబ్ కూడా ఒకటి ఉంది.

సూరె తౌబా ఆయత్ నంబర్ 36 లో అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.)”  (9:36)

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు ఉన్నాయి. ఫీ కితాబిల్లాహ్, ఈ విషయం అల్లాహ్ వద్ద ఉన్నటువంటి గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. ఎప్పటి నుండి ఉంది?

يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ
[యౌమ ఖలకస్సమావాతి వల్ అర్ద్]
ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన నాటి నుండి

భూమి ఆకాశాలను ఆయన సృష్టించినప్పటి నుండి ఈ నిర్ణయం, ఈ విషయం ఉంది.

مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ
[మిన్హా అర్బఅతున్ హురుమ్]
వాటిలో నాలుగు నెలలు పవిత్రమైనవి.

ఆ 12 మాసాల్లో నాలుగు నెలలు, నాలుగు మాసాలు హురుమ్ – నిషిద్ధమైనవి అన్న ఒక భావం వస్తుంది హురుమ్ కు, హురుమ్ అన్న దానికి మరో భావం ఇహ్తిరామ్, హుర్మత్, గౌరవప్రదమైనవి, ఎంతో గొప్పవి అన్నది కూడా భావం వస్తుంది.

ఆయత్ యొక్క ఈ భాగం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహ్ ఎప్పటి నుండి భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పటి నుండి నెలల సంఖ్య ఎంత? సంవత్సరంలో ఎన్ని నెలలు? 12 నెలలు. దీని ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎవరెవరి వద్ద వారు లెక్కలు చేసుకోవడానికి రోజుల సంఖ్య, నెలల సంఖ్య ఏది ఉన్నా గానీ అల్లాహ్ త’ఆలా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య సంవత్సరంలో 12 నెలలు. ఆ నెలల పేర్లు ఏమిటి? మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. మరో విషయం మనకు ఏం తెలిసిందంటే అల్లాహ్ వద్ద గ్రంథం ఏదైతే ఉందో, లౌహె మహ్ఫూజ్ అని దాన్ని అంటారు, అందులో కూడా ఈ విషయం రాసి ఉంది. మరియు నాలుగు నెలలను అల్లాహ్ త’ఆలా గౌరవప్రదమైనవిగా, నిషిద్ధమైనవిగా ప్రస్తావించాడు. ఆ తర్వాత చెప్పాడు:

ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ
[జాలికద్దీనుల్ ఖయ్యిమ్]
ఇదే సరైన ధర్మం. (9:36)

ఇదే సరైన ధర్మం అనడానికి భావం ఏంటంటే, కొందరు నెలల సంఖ్యలో ఏదైతే తారుమారు చేసుకున్నారో అది తప్పు విషయం. మరి ఎవరైతే కొన్ని నెలలను అల్లాహ్ నిషిద్ధపరిచినటువంటి నెలలను ధర్మసమ్మతంగా చేసుకొని, అల్లాహ్ నిషేధించిన కార్యాలు వాటిలో చేస్తూ ఏ తప్పుకైతే గురయ్యారో, అది వాస్తవం కాదు. అల్లాహ్ ఏ విషయం అయితే తెలుపుతున్నాడో అదే సరైన విషయం, అదే నిజమైన విషయం, అదే అసలైన ధర్మం. దీనికి భిన్నంగా, విరుద్ధంగా ఎవరికీ చేయడానికి అనుమతి లేదు. ఇందులో అల్లాహ్ త’ఆలా ఒక ప్రత్యేక ఆదేశం మనకు ఏమి ఇచ్చాడంటే:

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. (9:36)

ఇందులో మీరు ఏ మాత్రం అన్యాయం చేసుకోకండి. ఏ మాత్రం జుల్మ్ చేసుకోకండి.

ఇక సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి హదీస్ ఏమిటంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది,

“అల్లాహ్ త’ఆలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి స్థితిలో నెలల సంఖ్య ఎలా ఉండిందో, అలాగే ఇప్పుడు అదే స్థితిలో తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో నాలుగు నెలలు నిషిద్ధమైనవి. ఆ నాలుగు, మూడు నెలలు క్రమంగా ఉన్నాయి. జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. ఈ మూడు నెలలు కంటిన్యూగా, క్రమంగా ఉన్నాయి. మరియు ముదర్ వంశం లేక ముదర్ తెగ వారి యొక్క రజబ్, అది జమాదిల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలో ఉంది.”

ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రభవింపక ముందు మక్కావాసులు, ఆ కాలం నాటి ముష్రికులు, బహుదైవారాధకులు ఈ నాలుగు నెలలను గౌరవించేవారు. ఈ నాలుగింటిలో మూడు నెలలు క్రమంగా ఉన్నాయి కదా, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం.

అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దురాచారం, ఒక చెడ్డ అలవాటు, కొన్ని మహా ఘోరమైన పాపాల్లో ఒకటి ఏమిటి? ఇతరులపై అత్యాచారం చేయడం, ఇతర సొమ్మును లాక్కోవడం, దొంగతనాలు చేయడం. ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే వారు చేసేవారో, వారు ఈ నిషిద్ధ మాసాల్లో, గౌరవమనమైన నెలల్లో అలాంటి ఆ చెడు కార్యాల నుండి దూరం ఉండేవారు. విషయం అర్థమవుతుందా? అల్లాహ్ తో షిర్క్ చేసేవారు, ఇంకెన్నెన్నో తప్పు కార్యాలు, పాపాలు చేసేవారు. ప్రజలను పీడించేవారు, బలహీనుల హక్కులను కాజేసేవారు, ఎంతో దౌర్జన్యం, అత్యాచారాలు చేసేవారు. కానీ, ఈ మూడు నెలలు వారు ఎలాంటి దౌర్జన్యానికి, ఇతరులపై ఏ అత్యాచారం చేయకుండా, దొంగలించకుండా వారు శాంతిగా ఉండేది. కానీ మూడు నెలలు కంటిన్యూగా శాంతిపరంగా ఉండడం వారికి భరించలేని విషయమై, మరో చెడ్డ కార్యం ఏం చేశారో తెలుసా? జుల్ హిజ్జాలో హజ్ జరుగుతుంది. అందుగురించి జుల్ ఖాదా, జుల్ హిజ్జా ఈ రెండు మాసాలు గౌరవించేవారు.

కానీ ముహర్రం నెల గురించి ఏమనేవారు? ఈసారి ముహర్రం సఫర్ లో వస్తుంది, ఈ ముహర్రంని ఇప్పుడు మనం సఫర్ గా భావిద్దాము. సఫర్ నెల ఎప్పుడు ఉంది? రెండో నెల. ముహర్రం తర్వాత సఫర్ ఉంది కదా. వాళ్ళు ఏమనేవారు? సఫర్ ను ముహర్రం గా చేసుకుందాము, ఈ ముహర్రంను సఫర్ గా చేసుకుందాము. ఇప్పుడు ఈ ముహర్రం మాసాన్ని ఏదైతే సఫర్ గా వారు అనుకున్నారో, దొంగతనం చేసేవారు, లూటీ చేసేవారు, ఇంకా పాప కార్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో, దాన్ని ముహర్రంగా భావించారు కదా, అప్పుడు కొంచెం శాంతిగా ఉండేవారు. ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా ఉండడం వారికి కష్టతరంగా జరిగింది. అయితే అలాంటి విషయాన్ని కూడా అల్లాహ్ త’ఆలా ఖండించాడు. సూరె తౌబా ఆయత్ నంబర్ 37 లో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, కాలం తిరిగి తన అసలైన స్థితిలోకి, రూపంలోకి వచ్చింది అని ఏదైతే ప్రవక్త చెప్పారో, ఈ విషయం ఎప్పుడు చెప్పారు ప్రవక్త? తాను హజ్ ఏదైతే సంవత్సరంలో చేశారో ఆ సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో నెలల్లో ఎలాంటి తారుమారు లేకుండా, వెనక ముందు లేకుండా, అల్లాహ్ త’ఆలా సృష్టించినప్పటి స్థితిలో ఎట్లానైతే అసల్ స్థితిలో ఉండెనో, అదే స్థితిలో ఉండినది. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

మరో విషయం ఇందులో గౌరవించగలది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నాలుగు మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. వాటిలో మూడు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. నాలుగవది రజబ్. ఆ రజబ్ అని కేవలం చెప్పలేదు, ఏం చెప్పారు? రజబ్ ముదర్ అని చెప్పారు. ముదర్ ఒక తెగ పేరు. కబీలా అని అంటాం కదా. ప్రవక్త కాలంలో అప్పుడు ఇంకా ఎన్నో తెగలు ఉండేవి. జమాదుల్ ఆఖిరా తర్వాత రజబ్ ఉంది, రజబ్ తర్వాత షాబాన్. అయితే కొన్ని తెగలు ఈ రజబ్ ను రజబ్ గా భావించకుండా, రమదాన్ ను రజబ్ గా కొందరు అనేవారు. రమదాన్ మాసాన్ని ఏమనేవారు? ఎవరు? వేరే కొన్ని తెగల వాళ్ళు. కానీ ముదర్ తెగ ఏదైతే ఉండెనో, ఆ తెగ వారు రజబ్ నే రజబ్ గా నమ్మేవారు. రజబ్ ను ఒక గౌరవప్రదమైన, అల్లాహ్ నిషేధించిన ఒక మాసంగా వారు విశ్వసించేవారు. అందు గురించి ప్రజలందరికీ తెలియడానికి, వేరే ప్రజలు ఎవరైతే రమదాన్ ను రజబ్ గా చేసుకున్నారో ఆ రజబ్ కాదు, ముదర్ ఏ రజబ్ నైతే రజబ్ మాసంగా నమ్ముతున్నారో మరి ఏదైతే జమాదుల్ ఆఖిరా తర్వాత, షాబాన్ కంటే ముందు ఉందో ఆ రజబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశదీకరించారు, వివరించారు.

అయితే ఈ గౌరవప్రదమైన మాసంలో అల్లాహ్ త’ఆలా మనల్ని ఒక ముఖ్యమైన విషయం నుండి ఆపుతున్నాడు. అదేమిటి?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీరు ఈ గౌరవప్రదమైన మాసంలో జుల్మ్ చేయకండి, జుల్మ్ చేసుకోకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేసుకోకండి.

ఇక్కడ కొందరు ఇలాగ అడగవచ్చు, ఈ నాలుగు మాసాల్లోనే జుల్మ్ చేయరాదు, మిగతా మాసాల్లో చేయవచ్చా? అలా భావం కాదు. ప్రతిచోట అపోజిట్ భావాన్ని తీసుకోవద్దు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. మన సమాజంలో ఎవరైనా మస్జిద్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు అనుకోండి, మనలో ఒక మంచి వ్యక్తి ఏమంటాడు? అరె, ఏంట్రా, మస్జిద్ లో ఉండి అబద్ధం మాట్లాడుతున్నావా? అంటారా లేదా? అంటే భావం ఏంటి? మస్జిద్ బయట ఉండి అబద్ధం మాట్లాడవచ్చు అనే భావమా? కాదు. ఆ బయటి స్థలాని కంటే ఈ మస్జిద్ యొక్క స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక గౌరవం అనేది, ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. నువ్వు బయట చెప్పినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, ఏదీ ఏమీ నీవు ఆలోచించకుండా, కనీసం ఇప్పుడు నీవు అల్లాహ్ యొక్క గృహంలో ఉన్నావు, మస్జిద్ లో ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించి అబద్ధం ఎందుకు పలుకుతున్నావు? అక్కడ విషయం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అన్న భావం కాదు. మస్జిద్ లో ఉండి ఇంకా మనం చెడులకు, అన్ని రకాల పాపాలకు ఎక్కువగా దూరం ఉండాలి, దూరంగా ఉండాలి అన్నటువంటి భావం. అలాగే ప్రతి నెలలో, ప్రతి రోజు జుల్మ్ కు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారానికి దూరంగా ఉండాలి. కానీ ఈ నిషిద్ధ మాసాల్లో, ఈ నాలుగు మాసాల్లో ప్రత్యేకంగా దూరం ఉండాలి. ఇది అయితే తెలిసింది. కానీ జుల్మ్ అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో, ఆ జుల్మ్ అన్నదానికి భావం ఏంటి? మరి అల్లాహ్ త’ఆలా ఏమన్నాడు ఇక్కడ?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకోకండి.

మీ ఆత్మలపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా. ఎవరైనా తెలివిమంతుడు, బుద్ధి జ్ఞానం గలవాడు, తనకు తాను ఏదైనా అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడా? అందరూ ఇదే నిర్ణయంపై ఉన్నారు కదా. మరి అల్లాహ్ త’ఆలా అదే విషయం అంటున్నాడు, మీరు అంటున్నారు చేసుకోరు. మరి వారు చేసుకోకుంటే, అల్లాహ్ త’ఆలా ఎందుకు చేసుకోకండి అని అంటున్నాడు? వారు చేసుకుంటున్నారు గనుకనే అల్లాహ్ త’ఆలా చేసుకోకండి అని అంటున్నాడు. అంటే మన ఆత్మలపై మనం అన్యాయం ఎలా చేసుకుంటున్నాము? మన ఆత్మలపై మనం జుల్మ్ ఎలా చేస్తున్నాము? ఈ విషయం మనం గ్రహించాల్సింది.

ఈ విషయాన్ని మనం ఖురాన్, హదీస్ ఆధారంగా సరైన విధంలో అర్థం చేసుకుంటే, మన జీవితాల్లో వాస్తవానికి ఎంతో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఇమాం తబరీ రహమతుల్లా అలైహి చెప్పారు: “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్”, మీరు ఇందులో ప్రత్యేకంగా ఈ మాసాల్లో మీపై అన్యాయం చేసుకోకండి అంటే ఏమిటి? ఇర్తికాబుల్ మాసియా వ తర్కుత్తాఆ. జుల్మ్ దేన్నంటారు? ఇర్తికాబుల్ మాసియా – పాప కార్యానికి పాల్పడడం వ తర్కుత్తాఆ – అల్లాహ్ విధేయతను, పుణ్య కార్యాన్ని వదులుకోవడం. పాపానికి పాల్పడడం, పుణ్యాన్ని వదులుకోవడం, దీన్ని ఏమంటారు? జుల్మ్ అంటారు.

సామాన్యంగా మన సౌదీ దేశంలో ఉండి, జుల్మ్ అంటే ఏంటి అంటే, కఫీల్ మనకు మన జీతాలు ఇవ్వకపోవడం అని అనుకుంటాము. అది కూడా ఒక రకమైన జుల్మ్. కానీ అందులోనే జుల్మ్ బంధించిలేదు. జుల్మ్ యొక్క భావం కొంచెం విశాలంగా ఉంది. ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలైహి చెప్పారు, “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్ బిర్తికాబి జునూబ్”, మీరు పాపాలకు పాల్పడి అన్యాయం చేసుకోకండి.

ఇక మీరు ఖురాన్ ఆయతులను పరిశీలిస్తే, ఎప్పుడైతే ఒక మనిషి అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని వదులుకుంటున్నాడో, పాటించడం లేదో, లేక అల్లాహ్ త’ఆలా ఏ దుష్కార్యం నుండి వారించాడో, చేయవద్దు అని చెప్పాడో, దానికి పాల్పడుతున్నాడో, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఉదాహరణకు స్కూల్ లో ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని రాలేదు. అతనికి తెలుసు, నేను ఈ రోజు హోంవర్క్ ఇంట్లో చేయకుంటే రేపటి రోజు స్కూల్ లో వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను దండిస్తాడు, కొడతాడు, శిక్షిస్తాడు. తెలుసు విషయం. తెలిసి కూడా అతను హోంవర్క్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఏమైంది? టీచర్ శిక్షించాడు అతన్ని. అతడు స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నవాడు అయ్యాడా లేదా? ఎట్లా? అతనికి ఏ దెబ్బలైతే తగిలిందో టీచర్ వైపు నుండి, లేక ఏ శిక్ష అయితే టీచర్ వైపు నుండి అతనిపై పడిందో, అది ఎందువల్ల? ముందు నుండే అతడు అతనికి టీచర్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో హోంవర్క్ చేయాలని అది చేయనందుకు. ఈ విషయం ఈ సామెత, ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదా. అలాగే అల్లాహ్ త’ఆలా మనకు డైరెక్ట్ గా స్వయంగా ఖురాన్ ద్వారా గానీ, లేకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో, వాటిని పాటించకపోవడం, వేటి నుండి అల్లాహ్ త’ఆలా మనల్ని వారించాడో, ఇవి చేయకండి అని చెప్పాడో, వాటికి పాల్పడడం, ఇది మనపై మనం అన్యాయం చేసుకుంటున్నట్లు.

దీనికి ఖురాన్ సాక్ష్యం చూడండి సూరె బఖరా ఆయత్ నంబర్ 54.

إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ
[ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్ బిత్తిఖాజికుముల్ ఇజ్ల్]
మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.” (2:54)

ఇది మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ త’ఆలా తూర్ పర్వతం వైపునకు పిలిపించాడో, ఆయన అటు వెళ్లారు, ఇటు కొందరు ఒక ఆవు దూడను తయారు చేశారు, బంగారంతో తయారు చేసి అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో మూసా అల్లాహ్ పిలుస్తున్నాడు అని ఎక్కడికో వెళ్ళాడు. మీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీటిని మీరు పూజించండి అని చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చిన తర్వాత వారిపై చాలా కోపగించుకున్నాడు. చెప్పాడు, “ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్”, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు. “బిత్తిఖాజికుముల్ ఇజ్ల్”, ఈ దూడను ఒక దేవతగా చేసుకొని. మీకు ఆరాధ్య దైవంగా మీరు భావించి, మీపై అన్యాయం చేసుకున్నారు. ఇక ఈ ఆయత్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? షిర్క్ అతి గొప్ప, అతి భయంకరమైన, అతి చెడ్డ దౌర్జన్యం, అతి చెడ్డ జుల్మ్.

ఇంకా అలాగే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ కు కృతజ్ఞత, శుక్రియా చెప్పుకోకపోవడం, తెలుపుకోకపోవడం ఇది కూడా మహా దౌర్జన్యం, జుల్మ్ కింద లెక్కించబడుతుంది. మరి మూడు ఆయతుల తర్వాత, అదే బనీ ఇస్రాయిల్ పై అల్లాహ్ త’ఆలా వారికి ఏ వరాలైతే ప్రసాదించాడో, వారికి అల్లాహ్ త’ఆలా కారుణ్యాలు ఇచ్చాడో ప్రస్తావిస్తూ: “వ జల్లల్నా అలైకుముల్ గమామ్”, మేము మీపై మేఘాల ద్వారా నీడ కలిగించాము. “వ అన్జల్నా అలైకుముల్ మన్న వస్సల్వా”, మన్ మరియు సల్వా తినే మంచి పదార్థాలు మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు ఇచ్చుకుంటూ వచ్చాము. “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్”, మేము ప్రసాదించిన ఈ ఆహారాన్ని మీరు తినండి. కానీ ఏం చేశారు వాళ్ళు? కృతజ్ఞత చూపకుండా దానికి విరుద్ధంగా చేశారు. మూసా ప్రవక్త మాటను వినకుండా అవిధేయతకు పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ వమా జలమూనా”, అయితే వారు మాపై అన్యాయం చేయలేదు, మాపై జుల్మ్ చేయలేదు. “వలాకిన్ కానూ అన్ఫుసహుమ్ యజ్లిమూన్”, వారు తమ ఆత్మలపై మాత్రమే అన్యాయం చేసుకున్నారు.

ఎంత మంది మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే భార్య భర్తల జీవిత విషయంలో కూడా అల్లాహ్ త’ఆలా ఒక విషయాన్ని తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నట్లు అని అంటున్నాడు. కానీ సామాన్యంగా మనం ఈ విషయం గమనించము. నేనే పురుషుడిని, నేనే మగవాడిని, భార్య నాకు బానిస లాంటిది అన్నటువంటి తప్పుడు భావాల్లో పడి ఎంతో పీడిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవితాల్లో ప్రేమానురాగాలు తగ్గుతాయో, మందగిస్తాయో, మంచి విధంగా జీవించి ఉండరు, మంచి విధంగా తెగతెంపులు చేసుకోకుండా పీడిస్తూ ఉంటారు. ఇది మహా పాపకార్యం. సూరె బఖరా 231 ఆయత్ లో అల్లాహ్ చెప్తున్నాడు:

وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا
[వలా తుమ్సికూహున్న జిరారల్ లితఅతదూ]
“వారిని నష్టపరచాలనే దురుద్దేశంతో (ఇద్దత్ సమయంలో) ఆపకండి. (2:231)

వారికి ఏదైనా నష్టం చేకూర్చడానికి మీరు వారిని ఆపి ఉంచకండి. “లితఅతదూ”, వారిపై ఏదైనా దౌర్జన్యం చేయడానికి, వారిపై ఏదైనా అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. అంటే ఆపుకొని ఉంచకండి అంటే విడాకులు ఇవ్వడం లేదు, ఇటు మంచి విధంగా ప్రేమపూర్వకమైన జీవితం గడపడం లేదు. అల్లాహ్ ఏమంటున్నాడు?

وَمَن يَفْعَلْ ذَٰلِكَ
[వమయ్ యఫ్అల్ జాలిక]
ఎవరైతే ఇలా చేస్తారో,

అల్లాహ్ ఒక ఆదేశం ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు నష్టం చేకూర్చడానికి, అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. ఇక ఎవరైతే ఇలా చేస్తారో, “వమయ్ యఫ్అల్ జాలిక”, ఎవరైతే తమ భార్యలను వారిని పీడించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, నష్టం చేకూర్చడానికి ఆపుకొని ఉంటారో,

فَقَدْ ظَلَمَ نَفْسَهُ
[ఫఖద్ జలమ నఫ్సహ్]
అతను తనపై అన్యాయం చేసుకుంటున్నాడు, తనపై జుల్మ్ చేస్తున్నాడు. (2:231)

చూడడానికి అతడు ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి “జలమ నఫ్సహూ”, అతడు తనపై అన్యాయం చేసుకుంటున్నాడు. తనపై జుల్మ్ చేస్తున్నాడు.

ఇక ఈ అతడు తనపై ఎలా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఇలాంటి ఉదాహరణలు మన సమాజంలో ఎంతో, ఎన్నో మనకు కనబడతాయి. కానీ నేను చెప్పబోయే విషయం ఏంటి? ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క ఆజ్ఞను దాటుతాడో, అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడతాడో, అతడు వాస్తవానికి తనపై జుల్మ్ చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఈ విధంగా ఖురాన్ లో చూస్తూ పోతే ఎన్నో ఆయతులు మనకు కానవస్తాయి. కానీ సోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాల్లో, ఇంకా మిగతా 12 మాసాల్లో కూడా మనల్ని అన్ని రకాల జుల్మ్, అన్ని రకాల పాప కార్యాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరి వైపు నుండి ఏదైనా అన్యాయం, జుల్మ్ వారి తమ ఆత్మలపై జరిగితే ఏం చేయాలి? సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో చెప్పాడు:

وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا

[వమయ్ యఅమల్ సూఅన్ అవ్ యజ్లిమ్ నఫ్సహూ సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా]
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.” (4:110)

ఎవరైనా ఏదైనా పాప కార్యానికి పాల్పడితే, లేదా తన ఆత్మపై తాను జుల్మ్ చేసుకుంటే, ఆ తర్వాత స్వచ్ఛమైన రూపంలో అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, అల్లాహ్ ను క్షమించేవాడు, కరుణించేవాడు, మన్నించేవాడుగా పొందుతాడు.

అందు గురించి సోదరులారా, ఇకనైనా గమనించండి. జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా మనకు? ఏ మాత్రం తెలియదు. ఇంచుమించు నెల కాబోతుంది కావచ్చు. ఒక టైలర్, పెద్ద మనిషి ఇక్కడ చనిపోయి. సామాన్యంగా వచ్చాడు, భోజనం చేశాడు, హాయిగా స్నేహితులతో కూర్చున్నాడు, కొంత సేపట్లోనే నాకు ఛాతీలో చాలా నొప్పి కలుగుతుంది అని, కొంత సేపటి తర్వాత, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఇక నేను భరించలేను అన్నాడు. మిత్రులు బండిలో వేసుకొని వెళ్తున్నారు, హాస్పిటల్ చేరకముందే ఈ జీవితాన్ని వదిలేశాడు. మనలో కూడా ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇంకా మనం ఏ కలలు చూసుకుంటూ ఉన్నాము? ఇంకా ఎందుకు మనం పాప కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నాము? అల్లాహ్ ఆదేశాలకు దూరంగా, ఖురాన్ నుండి దూరంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు దూరంగా, నమాజులను వదులుకుంటూ, ఇంకా ఇతర పాప కార్యాల్లో మనం మునిగిపోతూ, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి జీవితం గడుపుతాము?

సోదరులారా, వాస్తవానికి ఏ ఒక్క మనిషి ఏ చిన్న పాపం చేసినా గానీ అతను తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. కానీ ఇకనైనా గుణపాఠం తెచ్చుకొని సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో అల్లాహ్ చెప్పినట్లుగా, వెంటనే మనం ఇస్తిగ్ఫార్, తౌబా, పశ్చాత్తాపం చెందుతూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పకుండా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు.

ఇక రజబ్ మాసంలో ఇంకా ఏ దురాచారాలు, ఏ బిదత్లైతే జరుగుతాయో, వాటి గురించి మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


రెండవ భాగం:



రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాలు)

రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=cNwTV9mjw1g [29 నిముషాలు]

ఈ ప్రసంగంలో, రజబ్ నెల యొక్క పవిత్రత మరియు ఆ నెలలో ముస్లింలు దూరంగా ఉండవలసిన పాపాల గురించి వివరించబడింది. అజ్మీర్ ఉర్సు, ప్రత్యేక నమాజులు (సలాతుర్ రగాఇబ్), ప్రత్యేక ఉపవాసాలు మరియు 27వ రాత్రి మేరాజ్ ఉత్సవాలు వంటివి ఇస్లాంలో లేని నూతన కల్పనలని (బిద్అత్) వక్త స్పష్టం చేశారు. అనంతరం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గగన ప్రయాణం (ఇస్రా మరియు మేరాజ్) యొక్క అద్భుత సంఘటనను వివరించారు. ఈ ప్రయాణం ఎందుకు జరిగింది, దాని సందర్భం, ప్రయాణంలో ఎదురైన అద్భుతాలు, వివిధ ప్రవక్తలతో సమావేశం, మరియు ఐదు పూటల నమాజ్ వంటి బహుమానాలు ఎలా లభించాయో వివరించారు. మేరాజ్ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన గుణపాఠం ఉత్సవాలు జరుపుకోవడం కాదని, అల్లాహ్ ప్రసాదించిన ఆదేశాలను, ముఖ్యంగా నమాజ్‌ను మన జీవితంలో ఆచరించడమని నొక్కిచెప్పారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా మరియు ఆయన సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఆ తర్వాత…

గతవారంలో మనం రజబ్ నెలలో అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? రజబ్ నెలతో పాటు మిగతా మూడు నెలలు, అంటే టోటల్ నాలుగు గౌరవప్రదమైన నెలలలో ప్రత్యేకంగా జుల్మ్ నుండి, అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యం వీటి నుండి దూరం ఉండాలన్న ఆదేశం అల్లాహ్ మనకిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అనండి, ఎంతోమంది ముస్లింలు ఈ రజబ్ నెలలో ఎన్నో దురాచారాలకు పాల్పడుతున్నారు.

ఉదాహరణకు, రజబ్ నెల మొదలైన వెంటనే, అజ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఒక సమాధికి ఎంతో గౌరవ స్థానం ఇచ్చి, దాని యొక్క దర్శనం, దాని యొక్క ఉర్స్, యాత్రలు చేయడం. వాస్తవానికి, సమాధిని ఇటుక సిమెంట్లతో కట్టి, దాని మీద గోపురాలు కట్టి, దానికి ఒక సమయం అని నిర్ణయించి ప్రజలు అక్కడికి రావడం, ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన కార్యం. అంతేకాకుండా మరో ఘోరమైన విషయం ఏమిటంటే, ఎందరో సామాన్య ప్రజలలో ఒక మాట చాలా ప్రబలి ఉంది. అదేమిటి? ధనవంతుల హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి బీదవాళ్లు ఏడుసార్లు అజ్మీర్‌కు వెళ్తే ఒక్కసారి హజ్ చేసినంత సమానం అని. ఇది కూడా మహా ఘోరమైన, పాపపు మాట. అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో సర్వ భూమిలోకెల్లా హజ్ అన్నది కేవలం మక్కా నగరంలో కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సయీ, ముజ್ದలిఫా, అరఫాత్, మినా ఈ ప్రాంతాల్లో నిలబడటం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి కార్యాలు చేయడం, ఇదే హజ్ కానీ, ఇది కాకుండా వేరే ఏదైనా సమాధి, వేరే ఏదైనా ప్రాంతం, ఏదైనా ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, దానికి హజ్ లాంటి పేరు పెట్టుకోవడం ఇది చాలా ఘోరమైన పాపం.

ఇంకా మరికొందరు ఈ రజబ్ నెలలోని మొదటి వారంలో గురువారం రాత్రి, శుక్రవారానికి ముందు ఒక ప్రత్యేక నమాజ్ చదువుతారు. సలాతుర్ రగాఇబ్ అని దాని పేరు. ఇలాంటి నమాజ్ చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ ఒక్క హదీసు, ఏ ఒక్క ఆదేశం లేదు. పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు సహాబా-ఎ-కిరామ్ మరియు ఆ తర్వాత కాలాలలో శ్రేష్ఠ కాలాలలో వచ్చినటువంటి ధర్మవేత్తలు, ధర్మ పండితులు ఇలాంటి నమాజ్ గురించి ఏ ఒక్క ఆదేశం లేదు అని స్పష్టం చేశారు.

ఇంకా మరికొందరు ప్రత్యేకంగా రజబ్ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. అయితే రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించినట్లు ప్రవక్త ద్వారా ఏ రుజువు లేదు. కాకపోతే, ఎవరైనా ప్రతీ నెలలో సోమవారం, గురువారం అల్లాహ్ వద్ద సర్వ మానవుల కార్యాలు లేపబడతాయి గనుక, ఇతర నెలలో ఉంటున్నట్లు ఈ నెలలో కూడా ఉపవాసాలు ఉండేది ఉంటే అభ్యంతరం లేదు. ప్రతీ నెలలో మూడు ఉపవాసాలు ఉన్నవారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు గనుక, ఎవరైనా రజబ్ నెలలో కూడా మూడు ఉపవాసాలు ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇతర రోజుల్లో కూడా వారు, ఇతర మాసాల్లో కూడా వారు ఉంటున్నారు గనుక. కానీ ప్రత్యేకంగా రజబ్ కు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండటం ప్రవక్తతో, సహాబాలతో రుజువు లేని విషయం.

అలాగే మరో దురాచారం ఈ రజబ్ నెలలో ఏమిటంటే, కొందరు 22వ తారీఖు నాడు రజబ్ కే కూండే అని చేస్తారు. అంటే ఓ ప్రత్యేకమైన కొన్ని వంటకాలు చేసి దానిపై ఫాతిహా, నియాజ్‌లు చేసి జాఫర్ సాదిక్ (రహ్మతుల్లాహి అలైహి) పేరు మీద మొక్కడమనండి, లేక ఆయన పేరు మీద నియాజ్ చేయడం అనండి. అయితే సోదరులారా, నియాజ్ అని ఏదైతే ఉర్దూలో అంటారో, మొక్కుకోవడం అని దానికి భావన వస్తుంది. అయితే ఇది కేవలం అల్లాహ్ గురించే చెల్లుతుంది. అల్లాహ్ కు కాకుండా ఇక వేరే ఎవరి గురించి ఇలాంటి నియాజ్‌లు చేయడం ధర్మ సమ్మతం కాదు. పోతే ఈ పద్ధతి, అంటే ఏదైనా ప్రత్యేక వంటకాలు చేసి, వాటి మీద కొన్ని సూరాలు చదివి ఊది నియాజ్‌లు చేయడం, ఇది ఈ నెలలో గాని, ఏ నెలలో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పద్ధతిని నేర్పలేదు. అందు గురించి ఇలాంటి దురాచారాల నుండి కూడా మనం దూరం ఉండాలి.

ఇంకొందరు మనం చూస్తాము, 27వ రాత్రి జాగారం చేస్తారు, రాత్రి మేల్కొని ఉంటారు, మస్జిద్ లలో పెద్ద లైటింగ్‌లు చేస్తారు. ఆ మస్జిద్ లలో వచ్చి కొన్ని ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ పారాయణం, ఇంకా వేరే కొన్ని కార్యాలు చేసి ఆ రాత్రిని, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మేరాజ్ ఉన్-నబీ ఏదైతే ప్రాప్తమైందో, మేరాజ్. అంటే రాత్రి యొక్క అతి చిన్న సమయంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ త’ఆలా జిబ్రీల్ ద్వారా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లారు. అక్కడ స్వర్గం, నరకాలను దర్శించారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో మాట్లాడారు. మరియు తిరిగి వస్తూ వస్తూ ఐదు పూటల నమాజ్‌ల యొక్క గొప్ప బహుమానం కూడా తీసుకొచ్చారు.

ఇది వాస్తవమైన విషయం. దీనినే సామాన్యంగా తెలుగులో గగన ప్రయాణం అని అంటారు. ఈ గగన ప్రయాణం మన ప్రవక్తకు ప్రాప్తమైంది, ఇది నిజమైన విషయం. కానీ ఏ తారీఖు, ఏ నెల మరియు ఏ సంవత్సరంలో జరిగిందో ఎలాంటి సుబూత్, ఎలాంటి ఆధారం అనేది లేదు. కానీ మన కొందరు సోదరులు 27వ తారీఖు నాడు రాత్రి, అంటే 26 గడిచిన తర్వాత 27, 26 మధ్య రాత్రిలో జాగారం చేసి, ఇది గగన ప్రయాణం, జష్న్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని చేస్తారు. ఇలాంటి మేరాజ్-ఉన్-నబీ ఉత్సవాలు జరపడం కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం.

ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, గగన ప్రయాణం ప్రవక్తకు మేరాజ్ ప్రాప్తమైంది కానీ, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం అన్నది రుజువు లేదు. అయినా, ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస పోక ముందు, హిజ్రత్ చేయక ముందే ఇది జరిగింది అన్నటువంటి ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే ఈ గగన ప్రయాణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా మేరాజ్‌ను గుర్తు చేసుకొని ఆ రాత్రి జాగారం చేయడం లాంటి పనులు చేయలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న సామెత, లేదా అనండి ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇహలోకంలో మనం కొందరు పండితులను లేదా విద్వాంసులను, లేదా దేశం కొరకు ఏదైనా చాలా గొప్ప మేలు చేసిన వారికి, ఏదైనా సంస్థ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ వారిని గౌరవించి వారికి ఇతర దేశంలో టూర్ గురించి వెళ్లి అక్కడి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి రావడానికి అన్ని రకాల సౌకర్యాలు, టికెట్ ఖర్చులతో పాటు అక్కడ ఉండడానికి, హోటల్లో, అక్కడ తిరగడానికి, అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల ఖర్చు గిట్ల మొత్తం భరించి వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. విషయం అర్థమవుతుందా? సైన్సులో గాని, ఇంకా వేరే ఏదైనా విషయంలో గాని ఎవరైనా గొప్ప మేలు చేస్తే, వారిని సన్మానించడం, సన్మానిస్తూ వారు చేసిన ఆ మేలుకు ప్రభుత్వం గాని లేదా ఏదైనా సంస్థ గాని ఏం చేస్తుంది? మీరు ఫలానా దేశంలో టూర్ చేసి రండి అన్నటువంటి టికెట్లతో సహా అన్ని ఖర్చులతో సహా వారిని పంపుతుంది.

అలాంటి వ్యక్తి బయటికి పోయి వచ్చిన తర్వాత, అక్కడి నుండి కొన్ని విషయాలు, కొన్ని మంచి అనుభవాలు తీసుకొని వస్తాడు. అయితే, వచ్చిన తర్వాత తన ఇంటి వారికి లేదా తన దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మంచి విషయాల గురించి తెలియజేస్తాడు. ఉదాహరణకు ఎవరైనా జపాన్ వెళ్ళారనుకోండి. అక్కడ టెక్నాలజీ, వారి యొక్క దైనందిన జీవితంలో, డైలీ జీవితంలో ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే వారు ఫాలో అవుతున్నారో, వాటవన్నీ చాలా నచ్చి మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి విషయాలు పాటించాలి అని బోధ చేస్తాడు.

అయితే ఇప్పుడు ఆ మనిషి ఎవరికైతే ఒక సంస్థ లేక ప్రభుత్వం పంపిందో, ఉదాహరణకు అనుకోండి జపాన్‌కే పంపింది, ఏ తారీఖులో ఆయన అటు పోయి వచ్చాడో, ప్రతీ సంవత్సరం ఆ తారీఖున ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటే లాభం కలుగుతుందా? లేకుంటే అక్కడికి వెళ్లి వచ్చి అక్కడి నుండి తెచ్చిన అనుభవాలను అనుసరిస్తే లాభం కలుగుతుందా? అక్కడ తీసుకు… అక్కడి నుండి ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో, అక్కడి నుండి ఏ మంచి విషయాలు అయితే తీసుకొచ్చాడో, వాటిని ఆచరిస్తేనే లాభం కలుగుతుంది. అలాగే, మన ప్రవక్తకు, మన ప్రవక్తను అల్లాహ్ త’ఆలా ఆకాశాల్లోకి పిలిపించి అక్కడ ఏదైతే గొప్ప బహుమానాలు ప్రసాదించాడో అవి మనకు కూడా ఇచ్చారు. అయితే వాటిని మనం ఆచరిస్తేనే మనకు లాభం కలుగుతుంది కానీ, మా ప్రవక్త గారు ఫలానా తారీఖున గగన ప్రయాణం చేశారు అని కేవలం మనం సంతోషపడితే మనకు ఎలాంటి లాభాలు కలగవు.

అయితే సోదరులారా, మనం ఈ మేరాజ్-ఉన్-నబీ సంఘటనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎలాంటి సందర్భంలో మన ప్రవక్తకు మేరాజ్ గౌరవం ప్రాప్తమైంది? ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు ఏ ఏ విషయాలు లభించాయి? రండి సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

మక్కాలో మన ప్రవక్త గారు ఇస్లాం ధర్మ ప్రచారం మొదలుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా అవిశ్వాసుల వైపు నుండి కష్టాలు, బాధలు పెరుగుతూనే పోతున్నాయి. చివరికి ఎప్పుడైతే అబూ తాలిబ్ చనిపోయాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు చనిపోయారో ఆ తర్వాత మన ప్రవక్త వారిపై దౌర్జన్యాలు, హింసలు ఇంకా పెరిగిపోయాయి.

ఆ సందర్భంలో ప్రవక్త ఏం చేశారు? తాయిఫ్ నగరానికి వెళ్లారు. బహుశా అక్కడి వారు కొందరు ఇస్లాం స్వీకరిస్తారేమో కావచ్చు. కానీ అక్కడ కూడా వారికి, ప్రవక్త గారికి చాలా శారీరకంగా చాలా బాధించారు. అంతేకాకుండా తప్పుడు సమాధానాలు పలికి ప్రవక్త మనసును కూడా గాయపరిచారు. ప్రవక్త అదే బాధలో తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ గగన ప్రయాణం జరిగింది.

అయితే ఇందులో ఒకవైపు ప్రవక్తకు తృప్తిని ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధపడకండి, ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ గౌరవాన్ని గుర్తు చేసుకోకుంటే, మీకు అల్లాహ్ త’ఆలా ఎలాంటి స్థానం ఇచ్చాడో దాన్ని వారు గ్రహించకుంటే మీరు ఆకాశాల్లో రండి. ఆకాశంలో ఉన్న వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో, మీ యొక్క స్థానాన్ని ఎలా వారు గుర్తిస్తారో చూడండి అని ప్రవక్త గారికి ఒక నెమ్మది, తృప్తి, శాంతి, మనసులో ఏదైతే బాధ ఉందో దానికి మనశ్శాంతి కలిగించడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రయాణంలో ప్రవక్త గారికి ఇంకా ఎన్నో మహిమలు, ఎన్నో రకాల అద్భుతాలు కలిగాయి. ఒక్కొక్కటి వేసి మనం దాన్ని తెలుసుకుందాం.

ప్రవక్త గారి హార్ట్ ఆపరేషన్ ఈ గగన ప్రయాణం కంటే ముందు జరిగింది. అంతకు ముందు ఒకసారి నాలుగు సంవత్సరాల వయసులో కూడా జరిగింది. కానీ గగన ప్రయాణానికి ముందు కూడా ఒకసారి గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అనస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఛాతి మీద నేను ఆ ఆపరేషన్ చేసినటువంటి కుట్ల గుర్తులను కూడా చూశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో విశ్వాసం, వివేకాలు నింపబడ్డాయి. (సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది).

గాడిద కంటే కొంచెం పెద్దగా మరియు కంచర గాడిద కంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక వాహనంపై ప్రవక్తను ఎక్కించడం జరిగింది. దాని పేరు అరబీలో బురాఖ్. రాత్రిలోని అతి తక్కువ సమయంలో మక్కా నుండి ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఖ్దిస్. అక్కడ అల్లాహ్ త’ఆలా తన శక్తితో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మన ప్రవక్త ముహమ్మద్ కంటే ముందు వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరినీ అక్కడ జమా చేశాడు. ప్రవక్త గారు వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు.

అక్కడి నుండి, అంటే బైతుల్ మఖ్దిస్ నుండి, ప్రవక్త ఆకాశాల పైకి వెళ్లారు. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో హజ్రత్ ఈసా మరియు యహ్యా, మూడవ ఆకాశంలో యూసుఫ్, నాల్గవ ఆకాశంలో ఇద్రీస్, ఐదవ ఆకాశంలో హారూన్, ఆరవ ఆకాశంలో మూసా, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం (అలైహిముస్సలాతు వ తస్లీమ్). వీరందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు.

ఏడవ ఆకాశాలకు పైగా “సిద్రతుల్ ముంతహా” అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ఆ రేగు చెట్టు ఎంత పెద్దదంటే, దాని యొక్క పండు (రేగు పండు ఉంటుంది కదా) చాలా పెద్ద కడవల మాదిరిగా మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటుంది, అంత పెద్ద చెట్టు. దాని యొక్క వ్రేళ్ళు, ప్రతీ చెట్టుకు వ్రేళ్ళు ఉంటాయి కదా కింద, అవి ఆరవ ఆకాశంలో ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు ఏడవ ఆకాశంలో చేరుకుంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు జరిగాయి. దానికి దగ్గరే “జన్నతుల్ మఅవా” అన్న స్వర్గం ఉంది.

దైవదూతలు కొందరు ఎవరైతే రాస్తూ ఉంటారో అల్లాహ్ ఆదేశాలను, వారు రాస్తున్న కలముల చప్పుడు కూడా వినిబడుతుంది. ఆ సిద్రతుల్ ముంతహా, ఆ రేగు చెట్టు అక్కడే ప్రవక్త గారికి మూడు విషయాలు ఇవ్వడం జరిగాయి:

  1. 50 పూటల నమాజ్.
  2. సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతులు.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా విశ్వసించి ఆయనను ఆచరించే వారిలో షిర్క్ చేయని వారు ఎవరైతే ఉంటారో, వారి పెద్ద పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా మన్నిస్తాను అంటున్నాడు.

ఇదే రేగు చెట్టు వద్ద ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు సృష్టిలో చూశారు. అక్కడే ప్రవక్త గారు నాలుగు రకాల నదులను చూశారు.

ఆరవ విషయం, అక్కడే ప్రవక్త గారికి పాలు ఒక పళ్లెంలో, మరో పళ్లెంలో తేనె, మరో పళ్లెంలో మత్తు పదార్థం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త గారు పాలు తీసుకున్నారు.

ఏడవ ఆకాశంపై బైతుల్ మామూర్ అని ఉంది. ఇక్కడ మనకు భూమి మీద మక్కాలో కాబా ఎలా ఉంది, బైతుల్లాహ్, అక్కడ బైతుల్ మామూర్ అని ఉంది. ప్రతీ రోజు అందులో 70,000 దైవదూతలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ చేసిన దేవదూతకు మరోసారి అక్కడ నమాజ్ చేసే అవకాశం కలగదు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన మూసా అలైహిస్సలాంను కూడా చూశారు. మూసా అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఈసా అలైహిస్సలాం ఎలా ఉన్నారో ఆ விவரం కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇంకా నరకంపై ఒక దేవదూత ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అతని పేరు ఖురాన్‌లో మాలిక్ అని వచ్చి ఉంది. ప్రవక్త ఆయన్ని కూడా చూశారు, అతను ప్రవక్తకు సలాం కూడా చేశారు.

ఇదే ప్రయాణంలో ప్రవక్త గారు దజ్జాల్‌ను కూడా చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని దర్శించారు. ఆ స్వర్గంలో మంచి ముత్యాలు, పగడాలు, (హీరే, మోతీ అంటాం కదా) ముత్యాలు, పగడాలతో మంచి వారి యొక్క గృహాలు ఉన్నాయి. ఇంకా అక్కడి మట్టి కస్తూరి వంటి సువాసన ఉంటుంది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చాలా పెద్ద హౌజ్ (సరస్సు), స్వర్గపు నీళ్లు దొరుకుతుంది, దాన్ని కౌసర్ అంటారు, దాన్ని కూడా ప్రవక్త గారు చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల ఏ సమూహం నుండి దాటినా వారందరూ “ఓ ప్రవక్తా, మీ అనుచరులకు చెప్పండి వారు కప్పింగ్ (హిజామా) చేయాలి” అని. అరబీలో హిజామా అంటారు, ఉర్దూలో పఛ్నా లగ్వానా, సీంగీ లగ్వానా అంటారు. ఇంగ్లీషులో కప్పింగ్ థెరపీ అంటారు. అంటే ఏంటి? శరీరంలో కొన్ని ప్రాంతాల్లో చెడు రక్తం అనేది ఉంటుంది. దానికి ప్రత్యేక నిపుణులు ఉంటారు, దాన్ని ఒక ప్రత్యేక పద్ధతితో తీస్తారు. ఇది కూడా ఒక రకమైన మంచి చికిత్స. దీనివల్ల ఎన్నో రోగాలకు నివారణ కలుగుతుంది.

ఇదే ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి సువాసన పీల్చారు. ఇదేంటి సువాసన అని అడిగితే, ఫిరౌన్ కూతురుకు వెంట్రుకలను దువ్వెనతో దువ్వి వారి సేవ చేసే ఒక సేవకురాలు ఎవరైతే ఉండెనో, ఆమె, ఆమె సంతానం యొక్క ఇల్లు ఏదైతే ఉందో స్వర్గంలో, అక్కడి నుండి ఈ సువాసన వస్తుంది. ఆమె సంఘటన విన్నారు కదా ఇంతకుముందు? ఫిరౌన్ యొక్క కూతురికి ఒక ప్రత్యేక సేవకురాలు ఉండింది, ఆమె వెంట్రుకలను దువ్వడానికి. ఒకసారి చేతి నుండి దువ్వెన కింద పడిపోతుంది. బిస్మిల్లా అని ఎత్తుతుంది. ఫిరౌన్ కూతురు అడుగుతుంది, “ఎవరు అల్లాహ్? అంటే నా తండ్రియా, ఫిరౌనా?” ఆమె అంటుంది సేవకురాలు, “కాదు. నీ తండ్రికి మరియు నాకు ప్రభువు అయినటువంటి అల్లాహ్.” పోయి తండ్రికి చెప్తే, అతడు ఏం చేస్తాడు? ఒక చాలా పెద్ద డేగలో నూనె మసలబెట్టి, ఆమె పిల్లవాళ్ళను ముందు అందులో వేస్తాడు. తర్వాత ఆమెను కూడా అందులో వేసేస్తాడు. ఇలాంటి శిక్ష వారికి ఇవ్వబడుతుంది, కేవలం అల్లాహ్ ను విశ్వసించినందుకు. అయితే వారికి అల్లాహ్ త’ఆలా ఏదైతే గౌరవ స్థానం, గొప్ప గృహం ఇచ్చాడో స్వర్గంలో, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు.

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అనుచర సంఘానికి నా సలాం చెప్పండి. మరియు వారికి చెప్పండి, స్వర్గంలో ఉన్నటువంటి భూమి అది చాలా మంచి పంటనిస్తుంది. కానీ అక్కడ ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులో విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది.” ఏంటి అని అడిగితే:

سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ
(సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్)
అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.

అని చెప్పారు. మరొక హదీస్‌లో ఉంది:

لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
(లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)
పాపాల నుండి రక్షణ మరియు పుణ్యాలు చేసే శక్తి అల్లాహ్ ప్రసాదిస్తేనే లభిస్తాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొందరిని చూశారు నరకంలో, అక్కడ వారికి గోర్లు ఇత్తడి, రాగితో ఉన్నాయి. వారి గోళ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, రాగితో ఉన్నాయి. దాంతోనే వాళ్ళు తమకు తాము తమ ముఖాన్ని, తమ శరీరాన్ని ఇలా గీక్కుంటున్నారు. మొత్తం తోలంతా పడిపోతుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని అడిగినప్పుడు జిబ్రీల్ చెప్పారు, ఎవరైతే ఇతరుల మాంసాన్ని తినేవారో మరియు వారి అవమానం చేసేవారో అలాంటి వారికి. మాంసం తినడం అంటే ఇక్కడ వారి యొక్క చాడీలు చెప్పడం. గీబత్, చుగ్లీ, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, ఇంకా ఇతరుల అవమానం చేయడం.

ఇంకొందరిని చూశారు ప్రవక్త గారు, అగ్ని కత్తెరలతో వారి యొక్క పెదవులను కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే ఇతరులకు మంచి గురించి చెప్తుంటారో కానీ స్వయంగా దానిపై ఆచరించరో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది.

మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు గారు “సిద్దీఖ్” అన్న బిరుదు ఏదైతే పొందారో, ఇదే ప్రయాణం తర్వాత పొందారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త గారికి ఈ గగన ప్రయాణంలో ఏ ఏ విషయాలను దర్శించారో, వాటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సహీ హదీసుల ఆధారంగానే ఉన్నవి. పోతే ఇందులో ప్రత్యేకంగా నమాజ్ యొక్క విషయం, సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతుల విషయం, సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ లాంటివన్నీ విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ మీకు, మాకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ దయ కలిగితే మరెప్పుడైనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=8783

భార్యతో మలమార్గం ద్వారా సంభోగించడం | ఇస్లామీయ నిషిద్ధతలు [వీడియో| టెక్స్ట్ ]

ఈ ప్రసంగంలో, భార్యతో మల మార్గం ద్వారా సంభోగించడం ఇస్లాంలో ఘోరమైన పాపమని, దీనికి పాల్పడే వారిపై అల్లాహ్ శాపం ఉంటుందని హదీసుల ఆధారంగా వివరించబడింది. కొందరు భర్తలు తమ కోరికలను తీర్చుకోవడానికి ఖుర్ఆన్ ఆయతులను తప్పుగా అన్వయించి, భార్యలను మోసం చేయడం లేదా బెదిరించడం వంటివి చేస్తున్నారని ప్రస్తావించబడింది. ఈ దుశ్చర్యలకు కారణం అజ్ఞానం, వివాహానికి ముందున్న చెడు అలవాట్లు, మరియు పాశ్చాత్య సంస్కృతి, నీలి చిత్రాల ప్రభావం అని పేర్కొనబడింది. ఇస్లాం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, మలమూత్ర విసర్జన తర్వాత ఎడమ చేతితో శుభ్రపరుచుకోవాలని చెప్పిన ధర్మంలో, నోటితో మర్మాంగాలను తాకడం వంటివి ఎంతమాత్రం అనుమతించబడవని స్పష్టం చేయబడింది. వైవాహిక జీవితంలో ఇస్లామీయ హద్దులను పాటించి, పవిత్రంగా జీవించాలని, చెడు అలవాట్లను విడిచిపెట్టి పశ్చాత్తాపం చెందాలని ఉపదేశించబడింది.

కొందరు బలహీన విశ్వాసులు తమ భార్యలతో మల మార్గం ద్వారా సంభోగించడంలో వెనకాడరు. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుంది. ఇది ఘోర పాపాల్లో పరిగణించబడుతుందని బహుశా వారికి తెలియదేమో. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా శపించారో గుర్తుందా? అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్ వినండి:

مَلْعُونٌ مَنْ أَتَى امْرَأَتَهُ فِي دُبُرِهَا
(మల్’ఊనున్ మన్ అతా ఇమ్రఅతహూ ఫీ దుబురిహా)
తన భార్యతో మల మార్గం ద్వారా సంభోగించే వాడిపై శాపం కురియు గాక. (అబూ దావూద్ 2162 సహీహుల్ జామి 5865).

అల్లాహ్ అన్ని రకాల శాపనాల నుండి, శాపనాలకు గురి అయ్యే కార్యాల నుండి దూరం ఉంచు గాక.

అయితే సోదర మహాశయులారా, ఇంతకుముందే మనం ఒక హదీస్ చదివి ఉన్నాము, రుతుస్రావంలో కలిసే వారి గురించి. ఆ హదీస్ ఇక్కడ కూడా వస్తుంది. ఎందుకంటే అందులో కూడా వచ్చింది,

مَنْ أَتَى حَائِضًا أَوْ امْرَأَةً فِي دُبُرِهَا أَوْ كَاهِنًا فَقَدْ كَفَرَ بِمَا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ ﷺ

“రుతువుస్రావంలో ఉన్న భార్యతో సంభోగించువాడు, లేదా భార్యతో మల మార్గం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినదానిని తిరస్కరించినవాడగును“. (తిర్మిజి 135, సహీహుల్ జామి 5918).

సోదర మహాశయులారా, స్వాభావిక గుణం గల ఎందరో భార్యలు ఈ పద్ధతిని తిరస్కరిస్తారు. కానీ కొందరు భర్తలే విడాకులిస్తానని బెదిరిస్తారు. మల మార్గం ద్వారా వారు తమ కోరికను పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారు గమనించాలి, వారు రెండు రకాల పాపాలు, రెండు రకాల ఘోరమైన స్థితులకు గురవుతున్నారు. ఒకటి, శాపం వారిపై పడుతుంది. రెండవది, కుఫ్ర్ లో పడిపోతున్నారు వారు.

ఇక మరికొందరు భర్తలు ఎలా ఉన్నారంటే నవూజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్, ఖుర్ఆన్ ఆయత్ యొక్క భావం తప్పుగా చెప్తారు. అరే భర్త అయితే ఖుర్ఆన్ ఆయత్ చెప్తున్నాడు, తన తప్పుడు కోరికను పూర్తి చేసుకోవడానికి, మరి ఎవరైనా ఆలిమ్ ను అడుగుదామా, ఈ ఆయత్ యొక్క సరైన భావం ఏంటి అని అనుకుంటారు కొందరు స్త్రీలు. కానీ సిగ్గుపడి అడగలేరు. వారి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, శ్రద్ధ వహించండి. పండితులతో ప్రశ్నించి తెలుసుకోవడానికి సిగ్గుపడే తమ భార్యలను కొందరు భర్తలు మోసం చేసి మల మార్గం ద్వారా వారి కోరికను పూర్తి చేసుకునే విధానం యోగ్యమని ఖుర్ఆన్ యొక్క ఈ ఆయత్ చూపుతారు. ఏంటి ఆ ఆయత్?

[نِسَاؤُكُمْ حَرْثٌ لَكُمْ فَأْتُوا حَرْثَكُمْ أَنَّى شِئْتُمْ]
(నిసాఉకుమ్ హర్సుల్లకుమ్ ఫ’తూ హర్సకుమ్ అన్నా షి’తుమ్)
మీ భార్యలు మీకు పంటపొలాల (వంటివారు), కావున మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవచ్చు. (బఖర 2: 223).

మీరు కోరిన విధంగా మీ యొక్క భార్యలతో మీరు ఉండండి అన్నటువంటి విషయం దీన్ని ప్రస్తావించి, తమ ఆ నిషిద్ధ కార్యం చేయడానికి ఈ ఆయత్ ను దలీల్ గా తీసుకుంటారు. కానీ వారికి తెలిసి ఉండాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని విశదీకరిస్తాయి. అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పారు, భర్త తన భార్యతో సంభోగించడానికి ఆమె ముందు నుండి, ఆమె వెనుక నుండి ఎలా వచ్చినా సరే, కానీ సంతానం కలిగే దారి నుండే సంభోగించాలి.

అయితే మలము వచ్చే దారి నుండి సంతానం కలగదు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతటి ఘోర పాపానికి ఒడిగట్టే కారణాలు ఏమిటో తెలుసా? పవిత్ర దాంపత్య జీవితంలో కాలు మోపే ముందు అజ్ఞానపు దుశ్చేష్టలకు పాల్పడి ఉండడం. నిషిద్ధమైన, భిన్నమైన, అసాధారణ పద్ధతులకు వారు అలవాటు పడి ఉండడం. లేదా నీలి చిత్రాల్లోని, కొందరికి బ్లూ ఫిలిమ్స్ చూసేటటువంటి అలవాటు, ఇక పెళ్ళైన తర్వాత కూడా ఆ రోజుల్లో లేక ఆ సమయంలో కూడా చూస్తూ ఉండేటటువంటి కొన్ని సంఘటనలు వారి జ్ఞాపక శక్తిలో నాటుకుపోయాయో వాటిని వారు వదులుకోలేకపోతారు.

అయితే ఇలాంటి వారందరూ కూడా తమ దుశ్చేష్టలను మానుకోవాలి, చెడ్డ అలవాటులను వదులుకోవాలి. అల్లాహ్ తో స్వచ్ఛమైన తౌబా చేయాలి. వారు చేయరు గనక ఇంకింత అలాంటి పాపాల్లోనే కూరుకుపోతూ ఉంటారు.

మరొక ముఖ్య విషయం గమనించండి, భార్య భర్తలిద్దరూ ఏకమై, ఇష్టపడి ఈ దుష్కార్యం చేసుకున్నా అది నిషిద్ధమే అవుతుంది. ఏదైనా నిషిద్ధ కార్యం ఇష్టపడి చేసినంత మాత్రాన ధర్మసమ్మతం కాజాలదు.

సోదర మహాశయులారా, ఇక్కడి వరకు ఈనాటి పాఠాలు పూర్తిగా అయిపోయాయి. కానీ చివరిలో లేక ఈ రోజులో చదివినటువంటి పాఠాల్లో భార్య భర్తల విషయం గురించి ఎన్నో అంశాలు వచ్చినాయి గనక మరొక విషయం చాలా ముఖ్యమైనది మిగిలిపోతుంది. దాన్ని సంక్షిప్తంగా చెప్పేసి నేను నా పాఠాన్ని ముగించేస్తాను.

చివరి పాఠంలో మీరు ఒక విషయం విన్నారు కదా, కొందరు భర్తలు భార్యలకు మోసం చేసి ఖుర్ఆన్ ఆయతులతో తప్పుడు భావం చెప్పే ప్రయత్నం చేస్తారు. విన్నారు కదా? అలాగే మరికొందరు భర్తలు ఖుర్ఆన్ లోని మరొక ఆయత్:

هُنَّ لِبَاسٌ لَّكُمْ وَأَنتُمْ لِبَاسٌ لَّهُنَّ
(హున్న లిబాసుల్లకుమ్ వ అన్తుమ్ లిబాసుల్లహున్న)
వారు (భార్యలు) మీ కొరకు వస్త్రధారణ, మీరు వారి కొరకు వస్త్రధారణ. (2:187)

భార్యలు భర్తల కొరకు, భర్తలు భార్యల కొరకు వారి యొక్క వస్త్రధారణ, అని ఏదైతే ఆయత్ ఉందో, దీని ద్వారా భార్యలకు మోసం చేసి మరిన్ని చెడు అలవాట్లకు పాల్పడతారు. దుష్కార్యాలకు పాల్పడతారు. అదేంటి? కొందరు భర్తలు భార్యలకు బలవంతం చేస్తారు వారి మర్మాంగాన్ని తమ నోట్లో తీసుకోవాలని.

ఎందరో పురుషులు పరస్పరం కలుసుకొని, ప్రత్యేకంగా కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి యువకులు తమ యొక్క ఫ్రెండ్స్ తో తమ యొక్క భార్యల గురించి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు పురుషులు కూడా వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి.

భార్య భర్తలిద్దరూ కూడా ఒకరు మరొకరి మర్మాంగాన్ని నోట్లో తీసుకోవడం, ఇంకా వేరే ఇలాంటి ఏ పనులైనా గానీ, ఇవన్నీ కూడా తప్పుడు అలవాటులు. వాస్తవానికి ఈ కల్చర్ చాలా చెండాలమైనది. ఇస్లామీయ సంస్కృతి, కల్చర్ ఎంతమాత్రం కాదు. వెస్ట్రన్ కల్చర్ ఇది. వాస్తవంగా ఈ సమస్య సుమారు ఈనాటికి 20 సంవత్సరాల క్రితమే కొందరు చాలా అరుదుగా అడిగారు. అప్పుడే నేను ఆనాటి, అంటే 20 సంవత్సరాల క్రితమే అప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్న కొందరు ఉలమాలను అడిగితే, వారు ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి వాటికి కూడా పాల్పడతారా? వాస్తవానికి ఇది వెస్ట్రన్ నుండి వచ్చినదే. ఈ బ్లూ ఫిలిమ్ లు, ఇంకా వెస్ట్రన్ యొక్క నగ్న చిత్రాలు, ఫిలిమ్ లు అన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రబలిపోతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి చెడులను నేను సైంటిఫిక్ పరంగా తెలపడం లేదు. మీ బుద్ధి జ్ఞానాలకు అర్థమయ్యే రీతిలో, సులభమైన రీతిలో కొన్ని విషయాలు చెప్తున్నాను, గమనించండి. ఏ పవిత్రమైన, పరిశుభ్రమైన ఇస్లాం ధర్మం, ఎడమ చేతితోనే ఇస్తింజా చేయాలి, మలమూత్ర విసర్జన తర్వాత శుభ్రత అనేది కేవలం ఎడమ చెయ్యితో చేయాలి, కుడి చెయ్యిని కూడా తాకనివ్వకూడదు అని చెప్పిందో, అలాంటి ధర్మం నోట్లో తీసుకోవడానికి, నాకడానికి, ఆ ఇలాంటి ఇంకా చెడు వాటికి అనుమతి ఇస్తుందా? గమనించండి.

భార్య భర్తలు ఇద్దరు, వారి మధ్యలో ఏ పరదా లేదు అంటే ఇక వేరే ఏ హద్దులూ లేవు, ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలాంటి భావం తీసుకోవడం చాలా తప్పు. అందుకొరకే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉండాలి కానీ, ఎక్కడో ఒక ఆయత్, ఎక్కడో ఒక హదీస్ తీసుకొని, విని, తన ఇష్ట ప్రకారంగా దాన్ని ధర్మపరంగా అనుమతించినదే అని భావిస్తూ చేయడం ఇది మరీ చాలా ఘోరమైన పొరపాటు, ఘోరమైన తప్పు.

ఇక ఇలాంటి ఈ దుశ్చేష్టల వల్ల, నోట్లో తీసుకునే అటువంటి బలవంతాలు చేయడం ద్వారా ఏ ఏ రోగాలకు గురి అవుతున్నారో, వాటి గురించి నేను ఆ వివరణలోకి వెళ్ళను. ధర్మవేత్తలు కొందరు, డాక్టర్ల యొక్క సలహాలతో అవన్నీ వివరాలు కూడా తెలిపారు. సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, వీటన్నిటికీ దూరంగా ఉండండి, ధర్మంగా జీవించే ప్రయత్నం చేయండి. ఇస్లాం ధర్మం, ఇది ఎవరో కొందరు థింక్ ట్యాంకర్స్ లేదా పరిశోధన చేసిన ప్రయత్నాలు కావు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్, మనందరి కొరకు కారుణ్యమూర్తిగా చేసి పంపిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి సత్య ధర్మం. ప్రళయం వరకు వచ్చే అన్ని సమస్యలకు ఉత్తమ మంచి పరిష్కారం ఉంది. చివరికి వైవాహిక జీవితంలో, సామాజిక జీవితంలో, భార్య భర్తల జీవితంలో కూడా, ఇందులో ఏ నిషిద్ధతలు ఉన్నాయో, ఏ చెడులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడంలోనే మన జీవితాలు పరిశుభ్రంగా ఉంటాయి.

అల్లాహ్ త’ఆలా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అన్ని రకాల చెడుల నుండి దూరం ఉంచు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’వాన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహ్.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=7377

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
రెండవ అధ్యాయం – హదీసులు # 13– 24

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

పశ్చాత్తాపం (తౌబా) – యూట్యూబ్ ప్లే లిస్ట్ 
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV132qYigRnubXEJQLDjCdjk

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (హదీసు #13,14) (32 నిముషాలు)

భాగం 02 (హదీసు #15,16,17,18) (36 నిముషాలు)

భాగం 03 (హదీసు #19,20) (34 నిముషాలు)

భాగం 04 (హదీసు #21) (44 నిముషాలు)

భాగం 05 (హదీసు #22,23,24) (38 నిముషాలు) – చివరి భాగం


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
పశ్చాత్తాపం (తౌబా) [PDF]


హదీసులు మీ సౌకర్యం కోసం క్రింద ఇవ్వ బడ్డాయి:

విద్వాంసుల స్పష్టీకరణ : జరిగిపోయిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి, దాసుని పాపం అల్లాహ్‌కు మరియు ఆ దాసునికే పరిమితమై సాటి మానవుల హక్కుకి దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించబడటానికి మూడు షరతులు ఉన్నాయి.

  • ఒకటి : పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి.
  • రెండు : జరిగిపోయిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి,
  • మూడు : భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలా చేయనని గట్టిగా నిశ్చయించుకోవాలి.

ఈ మూడు నియమాల్లో ఏ ఒక్కటి లోపించినా అతని పశ్చాత్తాపం సరైనది కాదు.

ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడటానికి నాలుగు నిబంధనలున్నాయి.

  • పై మూడు నిబంధన లతో పాటు నాల్గవ నిబంధన ఏమిటంటే, అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. పరులనుండి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకొనివుంటే దాన్ని వాపసుచేయాలి. తోటి వ్యక్తులపై నీలాపనిందలు ఇత్యాదివి మోపి వున్నట్లయితే వారి శిక్షను తాను అనుభవించాలి లేదా క్షమాభిక్ష కోరి వారిని సంతోషపరచాలి. తోటి మనిషి వీపు వెనక చాడీలు చెప్పివుంటే అతణ్ణి నిర్దోషిగా నిలబెట్టాలి.

అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందటం మాత్రం తప్పనిసరి. ఏవో కొన్ని పాపాలపై మాత్రమే పశ్చాత్తాపపడితే అహ్లే సున్నత్‌ వారి దృష్టిలో ఆయా విషయాల్లో అతని పశ్చాత్తాపం సరైనదే గాని ఇతర పాపాలు మాత్రం ఇంకా అతనిపై మిగిలే వుంటాయి.

పాపాలపై పశ్చాత్తాపం అవసరమన్న విషయమై ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అనేక ఆధారాలున్నాయి. వాటిపై ముస్లిం సమాజ ఏకాభిప్రాయమూ ఉంది.

అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు : “ఓ విశ్వాసులారా! మీరంతా కలసి (పశ్చాత్తాప భావంతో) అల్లాహ్‌ వైపుకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు.” (నూర్‌ – ౩7)

మరోచోట అల్లాహ్‌ ఉపదేశిస్తున్నాడు : “మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపుకే మరలండి (పాపాల పశ్చాత్తాపపడండి).” (హూద్‌ – ౩)

ఇంకొకచోట ఇలా అంటున్నాడు : “విశ్వసించిన ఓ ప్రజలారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్‌ వైపుకు మరలండి.” (తహ్రీమ్‌ – 8)


13. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెబుతుండగా తాను విన్నానని హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) తెలిపారు:

“అల్లాహ్ సాక్షి! నేను రోజుకు డెబ్భైకన్నా ఎక్కువసార్లు మన్నింపు కోసం వేడుకుంటూ, పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉంటాను.” (బుఖారీ)

(సహీహ్ బుఖారీలోని ప్రార్ధనల ప్రకరణం.)

ముఖ్యాంశాలు:

1. ఈ హదీసులో నిత్యం పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని పురికొల్పడం జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అత్యంత పునీతులు. అల్లాహ్‌ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలను అన్నింటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలలో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమయిన పొరపాట్లు జరగవచ్చు. అలాంటి దైవప్రవక్తే రోజుకు డెబ్బైకన్నా ఎక్కువసార్లు పాపాల మన్నింపు కోసం వేడుకుంటుండగా పీకలదాకా పాపాల్లో మునిగివున్న మనం ఎలా ఉపేక్షించబడతాం!

2. నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపపడుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మనవల్ల దొర్లిపోయే తప్పిదాలు మన్నించబడతాయి. రాబోయే హదీసులో కూడా పశ్చాత్తాప భావన గురించే నొక్కి వక్కాణించబడింది.


14. హజ్రత్ అగర్ర్ బిన్‌ యసార్‌ ముజనీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“ప్రజలారా! పాపాలపై పశ్చాత్తాపభావంతో అల్లాహ్‌ వైపుకు మరలండి. మన్నింపు కోసం ఆయన్ను వేడుకోండి. నేను అల్లాహ్ సన్నిధిలో రోజుకు వందసార్లు పశ్చాత్తాప భావంతో కుంగి పోతూ ఉంటాను.”

(సహీహ్‌ ముస్లింలోని ధ్యాన ప్రకరణం)


15. దైవప్రవక్త సేవకులు, హజ్రత్‌ అబూ హంజా అనస్‌ బిన్‌ మాలిక్‌ అన్సారీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“తన దాసుడు పాపాలపై పశ్చాత్తాప పడినందుకు అల్లాహ్‌, ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకొని తిరిగి పొందిన వ్యక్తి కన్నా ఎక్కువగా సంతోషిస్తాడు.” (బుఖారీ – ముస్లిం)

ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది : ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిన్తున్నాడు. దానిపైనే అతని ఆహారసామగ్రి, నీరు ఉన్నాయి. (మార్గమధ్యంలో) ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. (వెతికి వేసారి) నిరాశతో తిరిగి వచ్చి ఓ చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాని ముక్కుతాడు పట్టుకొని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్పైపోయి “ఓ అల్లాహ్‌! నీవే నా దాసుడివి, నేనునీ ప్రభువును” అన్నాడు. సంతోషం పట్టలేక ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్‌ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా ఎక్కువగానే సంతోషిస్తాడు.

(సహీహ్‌ బుఖారీలోని ప్రార్థనల ప్రకరణం. సహీహ్‌ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకరణం)

ముఖ్యాంశాలు:

1.పై హదీసులో కూడా పశ్చాత్తాపం ప్రోత్సహించబడింది, దాని ప్రాముఖ్యత గురించి నొక్కి వక్కాణించటం జరిగింది.

2. దాసుల పశ్చాత్తాప భావం చూసి అల్లాహ్‌ అమితంగా సంతోషిస్తాడు.

3. అసంకల్పితంగా దొర్లిపోయే పారబాట్లను తప్పుపట్టడం జరగదు. మాటల్లో చేవ తీసుకురావటం కోసం విషయాన్ని ప్రమాణం చేసి మరీ చెప్పటం ధర్మసమ్మళమే.

5. విషయాన్ని బోధపరిచేందుకు ఉదాహరణలు కూడా ఇవ్వవచ్చు.


16. హజ్రత్‌ అబూ మూసా అబ్దుల్లాహ్‌ బిన్‌ ఖైస్‌ అష్‌అరీ (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ఉద్పోధించారు:

“పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్‌ రాత్రివేళ తన చేయిని చాపుతాడు. అలాగే రాత్రి వేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లాహ్‌ పగటిపూట తన చేయిని చాచి ఉంచుతాడు. (ఈ పరంపర) సూర్యుడు పడమటి దిక్కు నుండి ఉదయించేంతవరకూ (అంటే ప్రళయం వచ్చేంత వరకు) కొనసాగు తూనే ఉంటుంది.” (ముస్లిం)

ముఖ్యాంశాలు:

‘పై హదీసులో అల్లాహ్‌కు చేయి కూడా ఉంటుందనే గుణం గురించి వివరించడమైనది. అయితే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? దాన్ని ఆయన ఎలా చాపుతాడు? అనే విషయం వాస్తవిక స్వరూప స్వభావాల గురించి మనకు తెలియదు. దాన్ని మనం వివరించనూలేము. అయితే దాని వాస్తవిక స్వరూప స్వభావాలు తెలియకపోయినప్పటికీ ఊహాగానాలు, ఉపమానాలు ఇవ్వకుండా దానిపై విశ్వాసముంచటం అవసరం. ఈ హదీసు ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే, రేయింబవళ్ళలో ఎప్పుడైనా ఏదైనా తప్పిదం జరిగిపోతే ఏమాత్రం జాప్యం చేయకుండా మనిషి వెంటనే పశ్చాత్తాప భావంతో కుమిలిపోతూ దైవసన్నిధిలో మోకరిల్లాలి.


17. హజ్రత్‌ అబూ హురైరా (రది అల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రబోధించారు :

“సూర్యుడు పడమటి దిక్కు నుంచి ఉదయించక మునుపే తన పాపాలపై పశ్చాత్తాపం చెందే వాని పశ్చాత్తాపాన్ని అల్లాహ్‌ సమ్మతించి ఆమోదిస్తాడు.” (ముస్లిం)

(సహీహ్‌ ముస్లింలోని ధ్యానం, ప్రార్ధనల ప్రకరణం)

ముఖ్యాంశాలు: 

నిఘంటువు ప్రకారం “తౌబా” అంటే మరలటం అని అర్థం. మనిషి పాపం చేసినప్పుడు అల్లాహ్‌కు దూరమవుతాడు. తిరిగి “తౌబా” చేసుకున్నప్పుడు (పశ్చాత్తాప పడినప్పుడు), ఆయన వైపుకి మరలి ఆయన సాన్నిహిత్యం, ఆయన క్షమాభిక్ష కోసం పరితపిస్తాడు. ఈ మార్పును, ఈ మరలింపునే ‘తౌబా‘ (పశ్చాత్తాపం) అంటారు. అల్లాహ్‌ అతని వైపు దృష్టి సారిస్తాడంటే అతని పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడని భావం.


18. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రబోధించారని హజ్రత్‌ అబూ అబ్దుర్రహ్మాన్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ తెలియజేశారు:

“జీవితంలోని అంతిమ ఘడియలు దాపురించక ముందువరకూ అల్లాహ్‌ తన దాసుని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తూనే ఉంటాడు.”

ఈ హదీసును తిర్మిజీ ఉల్లేఖించి హసన్‌గా ఖరారు చేశారు. (సుననె తిర్మిజీలోని ప్రార్ధనల ప్రకరణంలో చరమ ఘడియలకంటే ముందు పశ్చాత్తాపం  ఆమోదించబడుతుందన్న అధ్యాయంలో ఈ హదీసు  ప్రస్తావించ బడింది)

ముఖ్యాంశాలు:

‘పై హదీసులో “గర్‌గరా” అనే పదం వాడబడింది. ఇది ఆత్మ శరీరాన్ని వదలి కంఠానికి చేరుకునేదానికి ధ్వన్యానుకరణం. అంటే జీవితపు చివరి శ్వాసలన్నమాట. ఈ హదీసును ‘హసన్‌’గా ఖరారు చేయడం జరిగిందంటే ఈ హదీసు పరంపరలో వైవిధ్యాలకు, లొసుగులకు తావులేదు గాని దీని ఉల్లేఖకులు సహీహ్‌ హదీసుల ఉల్లేఖకుల కంటే తక్కువ స్థాయికి చెందినవారని అర్ధం. హదీసువేత్తల దృష్టిలో సహీహ్‌ హదీసుల మాదిరిగా “హసన్‌” కోవకు చెందిన హదీసులు కూడా ఆచరించదగినవే.

అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం

1747. హజ్రత్ అబ్దుల్లా బి న్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు –

ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న పానీయాల సామాగ్రి ఉంటుంది. అతనా ప్రదేశంలో దిగి (ప్రయాణ బడలిక వల్ల) కాస్సేపు పడుకుంటాడు. కాని మేల్కొన్న తరువాత చూస్తే ఆ ఒంటె కన్పించక ఎక్కడికోపోతుంది. (అతను ఎంత వెతికినా అది కన్పించదు) చివరకి ఎండ తీవ్రమయిపోయి దప్పికతో అతను తల్లడిల్లిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఎదురయ్యే బాధలన్నీ అతనికి ఎదురయ్యాయి. అతను (తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి) ఇక లాభం లేదు, తాను తన విడిదికి చేరుకోవాలి అని భావించి ఆ ప్రదేశానికి తిరిగొస్తాడు. అలసిపోయి కాస్సేపు పడుకుంటాడు. మేల్కొన్న తరువాత తలపైకెత్తి చూస్తే అతని ఒంటె అతని ఎదురుగా నిలబడి ఉండటం కన్పిస్తుంది. దాన్ని చూసి అతను పరమానంద భరితుడవుతాడు. అయితే అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం ఈ బాటసారి చెందిన ఆనందానికి మించి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 80 వ ప్రకరణం – అధ్దావాత్, 4 వ అధ్యాయం – అత్తౌబా]

పశ్చాత్తాప ప్రకరణం : 1 వ అధ్యాయం – పశ్చాత్తాప ప్రేరణ, పశ్చాత్తాపం ద్వారా దైవప్రసన్నత
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

తౌబా (పశ్చాత్తాపం) [పుస్తకం]

repent-too-late

పశ్చాత్తాపం- Toubah – Repentence
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

[ఇక్కడ చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి]
[PDF] [మొబైల్ ఫ్రెండ్లీ బుక్] [34 పేజీలు]
[2 MB]

పశ్చాత్తాపం (తౌబా):రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

విషయ సూచిక :

క్రింది చాఫ్టర్లు PDF లింకులుగా ఇవ్వబడ్డాయి

  1. తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత [11p]
  2. తౌబా నిబంధనలు [3p]
  3. తౌబా విధానాలు [3p]
  4. సత్యమైన తౌబా [3p]
  5. తౌబా చేయుటకు సహాయపడే విషయాలు [3p]
  6. పాప పరిహారాలు [4p]
  7. ప్రశ్నోత్తరాలు [9p]
    1. పాపాలు చాలా ఎక్కువగా ఉంటే ఎలా తౌబా చేయాలి?
    2. స్నేహితులు అడుకున్నప్తుడు ఎలా తౌబా చేయాలి?
    3. స్నేహితులు అవమానపరుస్తారన్స్న భయంలో ఎలా తౌబా?
    4. తౌబా చేసిన తర్వత అదే తప్పు మళ్ళీ జరిగితే ఎలా?
    5. ఒక పాపం చేస్తూ వేరే పాపం నుండి తౌబా చేయవచ్చా?
    6. గతంలో తప్పిపోయిన నమాజు, ఉపవాసాలు… ఎలా?
    7. సొమ్ము దొంగతనం చేసిన ఉంటే ఎలా తౌబా చేయాలి?
    8. వ్యభిచారానికి పాల్యడిన వ్వక్తి ఎలా తౌబా చేయాలి?
    9. వివాహానికి ముందు జరిగిన తప్పు గురించి చెప్పాలా?
    10. పురుషులు పరస్పరం, స్త్రీలు పరస్పరం చెడుకు పాలడితే ఎలా?

ప్రియ సోదరా/సోదరీ ! ఒక తల్లి తన చంటి పిల్ల పట్ల చూపే ప్రేమకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అల్లాహ్ తన దాసుల పట్ల చూపుతాడు  అని గుర్తుంచుకో !! తన తౌబాలో  సత్యవంతుడైన వ్యక్తిని అల్లాహ్ తప్పక మన్నిస్తాడు. వ్యక్తిగతంగా తౌబా ద్వారం చివరి శ్వాస వరకు ఉంది. సామాన్యంగా ప్రళయానికి ముందు పశ్చిమ దిశ నుండి సూర్యోదయం అయ్యే వరకు ఉంది.

అల్లాహ్ మనందిరికీ క్షమాబిక్ష కోరుతూ, తౌబా చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించు గాక! అమీన్ !!

ఎవరైనా ఏదైనా పాపకార్యానికి పాల్పడటమో లేదా తనకు తాను అన్యాయం చేసుకోవడమో జరిగి ఆ తర్వాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే, అలాంటి వాడు అల్లాహ్ ను క్షమాశీలుడు, అపార కరుణాప్రదాతగా పొందగలడు. (నిసా 4: 110).

తౌబా (పశ్చాత్తాపం) ప్రాముఖ్యత

సర్వ స్తోత్రములు అల్లాహ్ కొరకే. కరుణ, శాంతి కురువుగాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై మరియు ఆయన అనుచరులపై.

ఒక వ్యక్తి ఇబ్రాహీం బిన్ అద్ హమ్ రహిమహుల్లాహ్ వద్దకు వచ్చి నేను పాపాలు చేసి స్వయంగా నాపైనే అన్యాయం చేసుకున్నాను. నాకేదైనా ఉపదేశం చేయండి అని విన్నవించుకున్నాడు. ఇబ్రాహీం చెప్పారుః “ఐదు విషయాలు నీవు పాటించగలిగితే పాపాల వల్ల నీకు నష్టం కలగదు (నీతో పాపం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది). అప్పుడు అవేమిటి? అని ఆ వ్యక్తి అడిగాడు. ఇబ్రాహీం ఇలా సమాధానం చెప్పారు:

ఇబ్రాహీం:  పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ ప్రసాదించే ఆహారం తినడం మానుకో.

ఆ వ్యక్తిః  ‘అయితే నేను ఎక్కడి నుండి తినాలి? ఈ ధర్తిపై ఉన్నదంతా అల్లాహ్ దే కదా?’

ఇబ్రాహీం: అల్లాహ్ ఇచ్చిన ఆహారం తిని, అల్లాహ్ అవిధేయతకు పాల్పడటం (పాపం చేయటం) న్యాయమేనా?

ఆ వ్యక్తిః  ‘కాదు’. ‘అయితే రెండవదేమిటి’?

ఇబ్రాహీం: నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ యొక్క భూమిపై నివసించకు.

ఆ వ్యక్తిః  ‘ఇది మొదటి దానికంటే మరీ కష్టమైనది, అయినా నేను ఎక్కడ ఉండాలి’?

ఇబ్రాహీం: అల్లాహ్ యొక్క భూమిపై ఉండి, దుష్కార్యానికి పాల్ప- డటం మంచిదేనా?

ఆ వ్యక్తిః  మంచిది కాదు. మూడవది ఏమిటో తెలుపండి.

ఇబ్రాహీం:     నీవు పాపం చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ చూడని ప్రాంతములోకి వెళ్ళు.

ఆ వ్యక్తిః  ఎక్కడికి వెళ్ళాలి? రహస్యబహిరంగాలన్నియూ ఆయనకు తెలుసు కదా!!

ఇబ్రాహీం:     నీవు అల్లాహ్ ప్రసాదించిన ఆహారం తింటూ, ఆయన ధర్తిపై నివసిస్తూ, ఆయన చూస్తూ ఉండగా పాపానికి ఒడిగడతావా?

ఆ వ్యక్తిః  అలా చేయను. అయితే నాల్గవది ఏమిటి?

ఇబ్రాహీం: ప్రాణంతీసే దూత వచ్చినప్పుడు “ఇప్పుడే నా ప్రాణం తీయకు, తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు నాకు వ్యవధి ఇవ్వు” అని చెప్పు.

ఆ వ్యక్తిః  అతడు నా మాట వినడు, నాకు వ్యవధి ఇవ్వడు కదా?

ఇబ్రాహీం:    తౌబా చేసి, సత్కార్యాలు చేయుటకు చావు నుండి తప్పించుకునే స్థోమత లేనివాడివి నీవు ఎలా పాపానికి ముందు అడుగు వేస్తావు?

ఆ వ్యక్తిః  సరే. ఐదవదేమిటి?

ఇబ్రాహీం:   నరకపాలకులు నిన్ను నరకంలోకి తీసుకుపోవటానికి వచ్చినప్పుడు నీవు వారి వెంట వెళ్ళకు.

ఆ వ్యక్తిః  వారు నన్ను వదలరు, నా అర్థింపును ఆలకించరు.

ఇబ్రాహీం: అలాంటప్పుడు నీకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది?

ఆ వ్యక్తిః  ఇక చాలండి. నేను అల్లాహ్ తో పశ్చాత్తాప భావంతో స్వచ్ఛమైన క్షమాపణ కోరుకుంటాను. (అంటే తౌబా, ఇస్తిగ్ఫార్ చేస్తాను).

 అల్లాహ్ విశ్వాసులందరికీ తౌబా ఆదేశమిచ్చాడుః

విశ్వాసులారా! మీరంత కలసి అల్లాహ్ వైపునకు మరలి క్షమా- భిక్షన వేడుకోండి. మీకు సాఫల్యం కలగవచ్చు[. (నూర్ 24: 31).

తన దాసుల్లో రెండు రకాలవారున్నారు అని అల్లాహ్ తెలిపాడుః

  • 1-పాపం జరిగిన వెంటనే తౌబా చేయువారు.
  • 2-తౌబా చేయకుండా, తమ అత్మలపై అన్యాయం చేయువారు.

తౌబా చేయనివారే అన్యాయం చేయువారు[. (హుజురాత్ 49:11).

మానవుడు ఎల్లప్పుడూ తౌబా అవసరం గలవాడు. ఎందుకనగ అతని నుండి ఏదో అపరాధం జరుగతూ ఉంటుంది. అయితే అపరాధుల్లో తౌబా చేయువారే మంచివారు.

తౌబా చేయడం వల్ల ఇహపరాల్లో అనేక లాభాలు 

  • మనిషి తౌబా చేసి తన ప్రభువుకు అత్యంత ప్రియుడు, సన్నిహితుడు అవుతాడు. (సూర బఖర 2: 222).
  • సాఫల్యానికి, మోక్షానికి మార్గం తౌబా. (సూర్ నూర్ 24: 31)
  • ఆ వ్యక్తి పట్ల అల్లాహ్ చాలా సంతొషిస్తాడు. (సహీ ముస్లిం 2675)
  • ఇహపరాల్లో సుఖసంతోషాలు ప్రాప్తమవుతాయి. (హూద్ 11: 3).
  • పాపాల ప్రక్షాళనం జరుగుతుంది. (జుమర్ 39: 53, తహ్రీమ్ 66: 8).
  • పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయి. (ఫుర్ఖాన్ 25: 70).
  • వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, సంతానం ఇంకా అనేక శుభాలు వర్థిల్లుతాయి మరియు శత్రువులపై బలం పుంజుకుంటారు. (హూద్ 11: 52, నూహ్ 71: 10 – 12).

అనేక మందికి గురి అయిన ఒక పీడ ఏమనగ, నిర్లక్ష్యం కారణంగా వారు రేయింబవళ్ళు పాపాలకు పాల్పడుతూ ఉంటారు, మరికొందరు పాపాన్ని అతిచిన్న చూపుతో చూస్తూ, దానిని అల్పమైనదిగా భావిస్తారు. దానిని ఏ మాత్రం లక్ష్య పెట్టరు.

కాని మన ప్రవక్త సహచరుల దృష్టిలో పాపం యొక్క భయం ఎలా ఉండెనో ఈ క్రింది హదీసు ద్వారా గమనించండిః

قَالَ عَبْدُ اللهِ بْنُ مَسْعُودٍ : إِنَّ الْمُؤْمِنَ يَرَى ذُنُوبَهُ كَأَنَّهُ قَاعِدٌ تَحْتَ جَبَلٍ يَخَافُ أَنْ يَقَعَ عَلَيْهِ وَإِنَّ الْفَاجِرَ يَرَى ذُنُوبَهُ كَذُبَابٍ مَرَّ عَلَى أَنْفِهِ. {قَالَ بِهِ هَكَذَا فَطَارَ}

ఇబ్నుమస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారుః నిశ్చయంగా విశ్వాసుడు తన పాపాలను ఎలా భావిస్తాడంటే అతడు ఓ పర్వతం క్రింద కూర్చొని ఉన్నాడు, అది అతనిపై అప్పుడో, ఇప్పుడో పడనుందని భయపడుతూ ఉంటాడు. దుర్మార్గుడు తన పాపాల్ని తన ముక్కుపై వాలిన ఒక ఈగ మాదిరిగా భావిస్తాడు, అతడు తన చెయితో ఇలా అంటాడు అది లేచిపోతుంది. (బుఖారి 6308. తిర్మిజి 2497).

జ్ఞానంగల విశ్వాసుడు పాపం చిన్నదేకదా అని చూడడు, పాపం యొక్క శిక్ష ఎంత భయంకరమైనదో, దానిని చూస్తాడు. అయినా మానవుడు నిరపరాధి కాడు, కనుక అల్లాహ్ అతని కొరకు తౌబా ద్వారం తెరచి ఉంచాడు. తౌబా చేయాలని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం శ్రద్ధగా చదవండిః

]ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

((التَّائِبُ مِنَ الذَّنْبِ كَمَنْ لاَ ذَنْبَ لَهُ))

“పాపం చేసిన తర్వాత (పశ్చాత్తాపపడి) తౌబా చేసే వ్యక్తి, ఏ మాత్రం పాపం లేని వ్యక్తిగా మారుతాడు”. (ఇబ్ను మాజ).

ఇంతే కాదు, అతడు తన తౌబాలో సత్యవంతుడైతే అల్లాహ్ అతని పాపాల్ని పుణ్యాల్లో మారుస్తాడు. చదవండి ఈ ఆదేశం:

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటివారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

ముస్లిం చేసే తప్పుల్లో అతి పెద్ద తప్పు; తౌబా చేయడంలో జాప్యం చేయడం.

 కొంతమంది ఓ తప్పు చేస్తారు. అలా ఒక నిషిద్ధ కార్యానికి పాల్పడ్డారని తెలిసి కూడా తౌబా చేయడంలో జాప్యం చేస్తారు. వాస్తవానికి మృత్యువు ఆసన్నమయ్యే కాలాన్ని మనిషి ఎరుగడు గనక పాపాల మన్నింపుకై తౌబా చేయడంలో తొందరపడుట తప్పనిసరి.

తనకు గుర్తున్నవి, గుర్తు లేనివి అన్ని రకాల పాపాల మన్నింపుకై అధికంగా తౌబా చేస్తూ, అల్లాహ్ వైపునకు మరలుట తప్పనిసరి. అలాగే పాపాలు ఎంత ఘోరమైనవి అయినా సరే, తౌబా చేయడంలో తొందరపడుట కూడా అనివార్యం. (కొందరు తౌబా చేయడంలో తొందరపడరు, లేనిపోని తుచ్ఛమైన భావనాలకు గురి అయి, మరింత ఆలస్యమే చేస్తూ పోతారు, అలాంటి వారు ఈ విషయం తెలుసుకోవాలి) ‘మీ ప్రభువుని నేనే, మీ పూజలకు అర్హుడిని నేనే’ అన్న వాదన కంటే ఘోరమైన కుఫ్ర్, అవిశ్వాసం, తిరస్కారం మరొకటి లేదు. ఇలాంటి వాదనయే ఫిర్ఔన్ చేశాడు. అతని మాట ఖుర్ఆనులో ఇలా పేర్కొనబడినదిః ]ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు[. (ఖసస్ 28: 38). మరోచోట అతని వాదన ఇలా వచ్చిందిః ]నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును[. (నాజిఆత్ 79: 24). అతను ఇంతటి ఘోరాతిఘోరమైన వాదనలు చేసినప్పటికీ, పరమప్రభువైన అల్లాహ్, ప్రవక్త మూసా అలైహిస్సలాంను అతని వైపునకు పంపుతూ ఇలా ఆదేశించాడుః

ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు, అతడు హద్దులు మీరాడు. అతనికి ఇలా బోధించుః పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే, నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా?[. (నాజిఆత్ 79: 17-19).

అతడు మూసా అలైహిస్సలాం మాటను స్వీకరించి, స్వచ్ఛమైన తౌబా గనక చేసి ఉంటే, అల్లాహ్ తప్పక అతడ్ని క్షమించేవాడు.

ఇది కూడా తెలుసుకో! ఎవరయినా ఒక పాపం నుండి తౌబా చేసిన తర్వాత మళ్ళీ అదే పాపానికి పాల్పడితే, మళ్ళీ తౌబా చేయాలి. తప్పు జరిగినప్పుడల్లా తౌబా చేస్తూ ఉండాలి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దు.

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله ﷺ يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

 కొంతమంది అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. అది వారి అపరాధాలు, పాపాలు అధికమైనందుకు, లేదా ఒకసారో, కొన్నిసార్లో తౌబా చేసి, తిరిగి అదే పాపానికి పాల్పడినందుకు, ఇక అల్లాహ్ క్షమించడు అని భావించి, మరింత పాపాల్లోనే ఇరుక్కు పోతారు. తౌబా చేయడం, అల్లాహ్ వైపు మరలడం మానేస్తారు. కాని వారు చేసే ఘోరమైన తప్పు ఇదే. ఎందుకనగా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందేది అవిశ్వాసులే. విశ్వాసులు నిరాశ నిస్పృహలను సంపూర్ణంగా వదలుకొని, అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించి, పాపాలను విడనాడి స్వచ్ఛమైన తౌబా చేయాలి. అల్లాహ్ ఆదేశాలను చాలా శ్రద్ధగా చదవండిః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి, నిశ్చయంగా, సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరు [. (జుమర్ 39: 53).

మరికొందరు కొన్ని రకాల పాపాల నుండి తౌబా చేయరు. దానికి కారణం: ప్రజల మాటల, వదంతుల భయంతో, లేదా తాను ఏ సమాజంలో జీవితం గడుపుతున్నాడో అందులో అతని ప్రతిష్ఠకు ముప్పు కలుగుతుందన్న భయంతో, లేదా తన ఉద్యోగం పోతుందన్న భయంతో. అయితే ఇలాంటి వారు ఈ విషయాలు తెలుసుకోవాలి, ఎప్పుడు వీటిని మరవవద్దుః చనిపోయిన తర్వాత సమాధిలో మరియు తన ప్రభువు సమక్షంలో హాజరైనప్పుడు తాను ఒంటరిగానే ఉంటాడు. చివరికి ప్రభువు అతడ్ని అతని ఆచరణ గురించి ప్రశ్నించినప్పుడు ఏ ఒక్కడూ అతని వెంట ఉండడు. ఆ కరుణామయుని భయంతో తౌబా చేయకుండా, ఇతరుల భయంతో ఇంకెన్నాళ్ళు పాపపుజీవితమే గడుపుతూ ఉందాము ఆలోచించండి.

మరికొందరు తౌబా చేయకపోవడానికి కారణం; ఎవరో అతని తౌబాకు అడ్డుపడుతున్నారని, లేదా ఎవరో దుష్చేష్టలను ఆకర్షవంతగా, సరైనవిగా చూపిస్తున్నారని. అయితే వారు కూడా అల్లాహ్ యందు అతనికి ఏ మాత్రం ఉపయోగపడరు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకవేళ అతను స్వచ్ఛమైన తౌబా చేసి, ఏదైనా దుష్కార్యాన్ని వదులుకుంటే, తప్పక అల్లాహ్ దానికి బదులుగా అతనికి ఏదైనా మేలైనదానిని నొసంగుతాడు.

 మరికొందరు తప్పుపై తప్పు చేస్తునే ఉంటారు. అలా చేయకండి అని బోధ చేసినప్పుడు ‘అల్లాహ్ క్షమించేవాడు’ అని బదులిస్తారు. ఇది మూర్ఖత్వం, పిచ్చివాదం. ఇలా షైతాన్ వారిని దుర్మార్గ వలలోనే చిక్కుకొని ఉండి, బయటకు రాకుండా చేస్తున్నడాని తెలుసుకోవాలి. అల్లాహ్ అపార కరుణాప్రదాత, క్షమించేవాడు అన్నది వాస్తవమే. కాని ఎవరి కొరకు అన్నది కూడా తెలుసుకోవాలి కదా! అయితే తెలుసుకోః పాపాలను వదలి, సత్కార్యాలు చేసేవారి కొరకు అల్లాహ్ కారుణ్యం చాలా సమీపంలో ఉంది. మంకుతనంతో దుష్కార్యాలకు పాల్పడేవారి కోసం కాదు. అల్లాహ్ ఆదేశాన్ని గమనించండిః

నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యం సజ్జనులకు సమీపంలోనే ఉంది[. (ఆరాఫ్ 7: 56).

 అల్లాహ్ కరుణించే, క్షమించేవాడు అయినప్పటికీ, దుష్టులను శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ ఈ ఆదేశం చదవండిః

నేను చాలా క్షమించేవాడిని, కరుణించేవాడిని అనీ మరియు దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధకరమైన శిక్షే అని నా దాసులకు తెలియజేయుము[. (ఆరాఫ్ 7: 56).

 సోదరులారా! తౌబా చేయక పోవడానికి లేదా చేయడంలో ఆలస్యం అవడానికి సంబంధించిన కొన్ని కారణాలు, వాటి పరి- ష్కారాలు  గత పేజిలలో తెలిపాము. క్రింద తౌబా నిబంధనలు తెలుసుకుందాము.

తౌబా నిబంధనలు

తౌబా నిబంధనలు అంటేః ఒక మనిషి ఏదైనా పాపం నుండి తౌబా చేస్తున్నప్పుడు, అతని తౌబాను అల్లాహ్ స్వీకరించాలంటే,  ఈ మూడు నిబంధనలు ఉన్నాయి. అప్పుడే అది నిజమైన తౌబా అగును. వాటిని ధర్మ వేత్తలు ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా సేకరించారు.

1- ఏ పాపం నుండి తౌబా చేస్తున్నాడో ఆ పాపాన్ని విడనాడాలి.

2- ఆ పాపం గుర్తుకు వచ్చినప్పుడల్లా సిగ్గుతో కుమిలిపోవాలి.

3-ఇక ముందు ఆ పాపం చేయకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి.

పాపం యొక్క సంబంధం మానవుని మరియు అతని ప్రభువు మధ్య ఉంటే, పై మూడు నిబంధనలు పాటించాలి. ఒకవేళ పాపం తోటి మానవుల హక్కులకు సంబంధించినదైతే, పై మూడిటితో పాటు ఈ నాల్గవది కూడా పాటించాలిః

4- ఎవరిపైనా ధన, మాన, ప్రాణ సంబంధమైన హక్కులో ఏదైనా అన్యాయం చేసి ఉంటే, అతని హక్కు అతనికి తిరిగి ఇవ్వాలి. లేదా అతనితో క్షమాపణ కోరుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

عَنْ أَبِي هُرَيْرَةَ  قَالَ: قَالَ رَسُولُ الله : مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ الْيَوْمَ قَبْلَ أَنْ لَا يَكُونَ دِينَارٌ وَلَا دِرْهَمٌ إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ وَإِنْ لَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారని అబూ హురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఎవరైనా తన సోదరుని మానమర్యాదలకు సంబంధించిన విషయంలోగాని లేదా మరే విషయంలోగాని ఏదైనా దౌర్జన్యానికి/ అన్యాయానికి పాల్పడి ఉంటే, దీనార్లుగాని, దిర్హములుగాని (డబ్బు, ధనాల ప్రయోజనం) ఉండని ఆ రోజు రాక ముందు, ఈ రోజే అతను (హక్కుదారుని హక్కు ఇచ్చేసి, లేదా అతని ద్వారా మాఫీ పొంది) ఆ పాపాన్ని ప్రక్షాళనం చేసుకోవాలి. (ఇలా చేయని పక్షంలో ఆ రోజు పాప ప్రక్షాళన పద్ధతి ఇలా ఉంటుందిః) దౌర్జన్యపరుని వద్ద సత్కార్యాలు ఉంటే, అతని దౌర్జన్యానికి సమానంగా సత్కార్యాలు అతని నుండి తీసుకొని (పీడుతులకు పంచడం జరుగుతుంది). ఒకవేళ అతని వద్ద సత్కార్యాలు లేకుంటే పీడుతుని పాపాలు తీసుకొని అతనిపైన మోపడం జరుగుతుంది”. (బుఖారి 2449).

ఏ బాధితుడైనా ఈ హదీసు తెలిసిన తర్వాత తన శక్తిమేర ప్రయత్నం చేసినప్పటికీ, తాను బాధించిన వ్యక్తిని కలుసుకోలేక, లేదా అతని హక్కు ఇవ్వలేక పోతే, ఈ స్థితిలో కేవలం అల్లాహ్ మన్నింపుకై ఆశించాలి. అల్లాహ్ మనందరిని తన కరుణ ఛాయలో తీసుకొని మన్నించుగాక.

హక్కుల్లో

 గత పేజిల్లో మాన, ప్రాణ, ధన సంబంధిత హక్కుల విషయం వచ్చింది గనక, వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం.

1-  ధనసంబంధిత హక్కుః ధనానికి సంబంధించిన హక్కు ఎలాగైనా హక్కుదారునికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదా అతడ్ని కలుసుకొని మాఫీ చేయించుకోవాలి. ఒకవేళ అతని చిరునామ తెలియక, లేదా సాధ్యమైనంత వరకు వెతికినప్పటికీ అతడ్ని పొందలేకపోతే, లేదా ధన పరిమాణం గుర్తు లేకుంటే, ఏదైనా ఒక పరిమాణం నిర్ణయించుకొని అతని తరఫున దానం చేయాలి.

ఒకటిః (ప్రాయశ్చితంగా, దౌర్జన్య ప్రమాణంలో) ఏదైనా ధనం కోర- వచ్చు. రెండవదిః దౌర్జన్య ప్రమాణంలో ప్రతీకారం తీసుకోవచ్చు. మూడవదిః మాఫీ చేయవచ్చు. ఒకవేళ హక్కుగల వ్యక్తి తెలియకుంటే అతని తరఫున దానం చేయాలి. అతని కొరకు దుఆ చేయాలి.

2- శారీర సంబంధిత హక్కుః శారీరకంగా ఎవరిపైనైనా ఏదైనా దౌర్జన్యం చేసి ఉంటే, దౌర్జన్యపరుడు పీడితునికి లొంగిపోవాలి. అతడు తన హక్కు ఈ క్రింది మూడు పద్ధతుల్లో ఏదో ఒక రకంగా తీసుకోవచ్చుః

3- మానమర్యాద హక్కుః ఇది ఎన్నో రకాలుగా ఉంటుందిః పరోక్షంగా నిందించుట, ఏదైనా అపనింద మోపుట, చాడీలు చెప్పుట, కలసిఉన్నవారి మధ్య విభేదాలు సృష్టించి వారిని విడదీయుట వగైరా. ఈ రకంగా ఎవరినైనా బాధించి ఉంటే, అతని వద్దకు వెళ్ళి మన్నింపు కోరుకోవాలి. శక్తానుసారం వారికి చేసిన కీడుకు బదులుగా మేలు చేయాలి. వారి కొరకు దుఆ చేయాలి.

తౌబా విధానాలు

పాపాల్లో కొన్ని మహాఘోరమైన పాపాలున్నాయి. వాటికి పాల్పడినవారు ఎలా తౌబా చేయాలి అన్న విషయమే క్రింది భాగంలో తెలుసుకోబుతున్నాము. అయితే చాలా శ్రద్ధగా చదవండి, ఇతరులకు ప్రయోజనం కలగజేయండి.

1- హంతకుని తౌబాః ఉద్ధేశపూర్వకంగా ఎవరినైనా చంపిన వ్యక్తిపై మూడు రకాల హక్కులుంటాయి.

ఒకటి: అల్లాహ్ కు సంబంధించిన హక్కుః అంటే సత్యమైన తౌబా చేయాలి. ఇందులో పైన తెలిపిన మూడు/నాలుగు నిబంధనలు వస్తాయి.

రెండవది: హతుని వారసుల హక్కుః హంతకుడు వారికి లొంగిపోవాలి. వారు ఇతడి నుండి మూడిట్లో ఏదైనా ఒక రకంగా తమ హక్కు తీసుకుంటారు. A: ప్రాయశ్చితంగా అతని నుండి ధనం తీసుకుంటారు. లేదా B: అతడ్ని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు. లేదా C: అతడ్ని మన్నించి వదలుతారు.

మూడవది: హతుని హక్కుః ఈ హక్కు అతనికి ఇహలోకంలో ఇవ్వరాదు.

అందుకని హంతకుడు తన తౌబాలో సత్యవంతుడై, తనకు తాను హతునివారసులకు అప్పగిస్తే, అల్లాహ్ అతని ఆ అపరాధాన్ని మన్నిస్తాడు. హతునికి ప్రళయదినాన మేలైన ప్రతిఫలం నొసంగుతాడు.

2-  వడ్డీ తినే, తీసుకునే వారి తౌబాః వడ్డీ తీసుకొనుట, తినుట నిషిద్ధం అని తెలిసిన తర్వాత, తౌబా చేయు వ్యక్తి, వడ్డీ తీసుకోవడం మరియు తినడం మానుకోవాలి. ఇక ఎప్పుడూ తీసుకోకుండా, తినకుండా ఉండడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి. ఇంతకు ముందు ఏదైతే తిన్నాడో, తీసుకున్నాడో అది గుర్తుకు వచ్చినప్పుడు ‘ఛీ’ అని సిగ్గు చెందాలి. ఈ విషయాల్ని పాటించినప్పుడే అతని తౌబా నిజమగును. అతను వడ్డీ ద్వారా సంపాదించిన ధనం గురించి పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నవి. అయితే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా, షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ సఅదీ మరియు ఇబ్ను ఉసైమీన్ రహిమహుముల్లాహ్ ఇలా చెప్పారుః

తౌబా చేయటానికి ముందు తీసుకున్న వడ్డీ అతనిదే అయి యుంటుంది. అతను దానిని తన ఏ అవసరాలకైనా సరే ఉపయోగించ వచ్చును. అందులో ఏలాంటి అభ్యంతరం లేదు. ఏ వడ్డీ సొమ్ము వచ్చేది ఉందో దానిని తీసుకోకుండా అసలు సొమ్ము మాత్రమే తీసుకోవాలి. దీనికి ఆధారం అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:

అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు, వడ్డీని నిషిద్ధం (హరాం) చేశాడు. కనుక తన ప్రభువు యొక్క ఈ హితబోధ అందిన వ్యక్తి, ఇక ముందు వడ్డీ తినడం త్యజిస్తే, పూర్వం జరిగిందేదో జరిగింది, దాని పరిష్కారం అల్లాహ్ చూసుకుంటాడు[. (బఖర 2: 275).

సత్యమైన తౌబా

చెడును వదులుకునేవారు సామాన్యంగా ఏదైనా కారణంగానే వదులుకుంటారు. కాని తన తౌబా అంగీకరించబడాలి అని కాంక్షించే వ్యక్తి, అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే తౌబా చేయుట తప్పనిసరి.

ఎవరైనా తన పాపం, తన ప్రఖ్యాతిలో మరియు ఉద్యోగంలో అడ్డు పడుతుందన్న భయంతో పాపాన్ని విడనాడితే అది తౌబా అనబడదు.

ఎవరు తన ఆరోగ్యం చెడిపోతుందని లేదా (ఏయిడ్స్) లాంటి వ్యాదికి గురి కావలసి వస్తుందన్న భయంతో ఏదైనా దుష్చేష్టను వదులుకుంటే అది తౌబా అనబడదు.

ఎవరైతే దొంగతనం చేసే శక్తి లేనందుకు, పోలీసు, లేదా కాపలాదారుని భయానికి దొంగతనం మానుకుంటే అది తౌబా కాదు.

డబ్బు లేనందుకు మత్తు సేవించడం, మాధకద్రవ్యాలు వాడటం మానుకుంటే అది తౌబా అనబడదు.

తన మనస్ఫూర్తిగా కాకుండా, వేరే ఏదైనా కారణం వల్ల, ఉదాహరణకు తప్పు చేసే శక్తి లేనందుకు తప్పు చేయకుంటే అది తౌబా అనబడదు.

తౌబా చేయు వ్యక్తి మొదట తప్పు యొక్క చెడును గోచరించాలి. ఉదాహరణకుః స్వచ్ఛమైన తౌబా చేసే వ్యక్తి, జిరిగిన ఆ తప్పును తలచి తృప్తి చెందడం, సంతోషించడం అసంభవం, లేక భవిష్యత్తులో తిరిగి చేయాలని కాంక్షించడం కూడా అసంభవం.

అదే విధంగా ఏ చెడు నుండి తౌబా చేశాడో, ఆ చెడుకు తోడ్పడే సాధనాలన్నిటికీ దూరంగా ఉండడం తప్పనిసరి. ఉదాహరణకుః మత్తు సేవించడం, సినిమాలు చూడడం నిషిద్ధం అని తెలిసిన తర్వాత, వాటి నుండి తౌబా చేసిన వ్యక్తి మత్తు మరియు సినిమాలకు సంబంధించిన పరికరాలన్నిటికి దూరంగా ఉండాలి. అవి ఉన్న ప్రాంతంలో వెళ్ళ కూడదు. స్నేహితుల్లో వాటికి బానిస అయినవారి నుండి దూరం ఉండాలి.

 అనేక మంది చెడు పనులకు అలవాటు పడేది చెడు స్నేహితుల ద్వారానే. అయితే ఇక్కడ చెడు స్నేహితులను వదలుకోవడం కష్టంగా ఏర్పడినప్పుడు ప్రళయదినాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇక్కడి దుష్మిత్రులు అక్కడ పరస్పరం శత్రువులవుతారు, శపించుకుంటారు. (చూడండి సూర జుఖ్రుఫ్ 43: 67: الْأَخِلَّاءُ يَوْمَئِذٍ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا الْمُتَّقِينَ ఆ రోజు (ప్రాణ) మిత్రులు కూడా ఒకరికొకరు  శత్రువులై పోతారు – అయితే దైవభక్తి పరాయణులు మాత్రం అలా ప్రవర్తించరు). అందుకే తౌబా చేసిన వ్యక్తి తన పాత స్నేహితులను, సత్కార్యాల వైపునకు ఆహ్వానించే ప్రయత్నం చేయాలి. అలా చేయలేకపోతే వారికి దూరంగానే ఉండాలి.

 తౌబా చేసిన వారిలో కొందరు తన పాత మిత్రులను సత్కార్యం వైపునకు పిలిచే సాకుతో మళ్ళీ వారితోనే కలసిపోవటానికి షైతాన్ ప్రేరేపిస్తాడు. స్వయంగా వారు కొత్తగా సత్కార్య మార్గాన్ని అవలంబించారు గనక, తమ మిత్రులపై మంచి ప్రభావం చూపలేకపోతారు. ఇలా ఇది పాత పాపానికి పాల్పడడానికి కారణం అవుతుంది. అందుకు అతను వారికి బదులుగా మంచి మిత్రుల్ని ఎన్నుకోవాలి. వారు అతని మంచికై తోడ్పడతారు, సన్మార్గంపై ఉండడానికి బలాన్నిస్తారు.

తౌబా చేయుటకు సహాయపడే విషయాలు

1- సంకల్పశుద్ధి, స్వచ్ఛత అల్లాహ్ కొరకే ఉండాలి:- పాపం వదలడానికి ఇది ప్రయోజనకరమైన ఆధారం. దాసుడు తన ప్రభువు కొరకే చిత్తశుద్ధి చూపినప్పుడు, పశ్చాత్తాపపడి, క్షమాభిక్షలో సత్యవంతుడైనప్పుడు అల్లాహ్ ఆ విషయంలో అతనికి సహాయపడతాడు. తౌబా చేయడానికి అతడ్ని అడ్డగించే వాటిని అతని నుండి దూరంగా ఉంచుతాడు.

2- మనుస్సును నిర్బంధించుటః- ఒక వ్యక్తి పాపం చేయకుండా తన మనస్సును నిర్బంధించాడంటే అల్లాహ్ అతనికి సహాయపడతాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

మా కొరకు తీవ్ర ప్రయత్నం చేసేవారికి మేము మా మార్గాలను చూపుతాము[. (అన్కబూత్ 29: 69).

3- పరలోక ధ్యాసః- అల్పమైన ఇహలోకాన్ని, అతిత్వరలో నశించే ఈ ప్రపంచాన్ని తలచి, విధేయులకు పరలోకంలో సిద్ధంగా ఉన్న భోగభాగ్యలు, అవిధేయుల గురించి ఉన్న కఠిన శిక్షను తలచుకుంటూ ఉంటే అపరాధానికి గురి కాకుండా ఉండడానికి ఇది ముఖ్యమైన అడ్డుగా నిలుస్తుంది.

4-ప్రయోజనకరమైన వాటిలో కార్యమగ్నుడై, ఒంటరితనం, తీరిక లేకుండా ఉండుటః- పాపాల్లో పడటానికి ముఖ్య కారణం తీరిక. ఇహపరాల్లో లాభం చేకుర్చేవాటిలో మనిషి నిమగ్నుడై ఉంటే, దుర్మార్గం చేయడానికి తీరిక పొందడు.

5-ఉద్రేకానికి గురి చేసే విషయాలకు, పాపాన్ని గుర్తు చేసే వాటికి దూరంగా ఉండాలిః- పాపానికి గురిచేసే కారణాల్ని ప్రేరేపించే వాటికి, సినిమాలకు, పాటలకు, అశ్లీల రచణలకు, నీతిబాహ్యమైన మ్యాగ్జిన్స్ (పత్రికల)కు ఇలా దుర్వాంఛల్ని ఉత్తేజ పరిచే వాటికి దూరంగా ఉండాలి.

6-సజ్జనులకు దగ్గరగా, దుర్జణులకు దూరంగా ఉండాలిః- సజ్జనుల తోడు మంచి చేయుటకు సహాయపడుతుంది, పుణ్యాత్ములను అనుసరిం- చాలని ప్రోత్సహిస్తుంది, దుర్మార్గానికి, చెడుకు అడ్డుపడుతుంది.

7-దుఆః- మహాప్రయోజనకరమైన చికిత్స ఇది. దుఆ విశ్వాసుల ఆయుధం. అవసరాలు తీర్చే బలమైన హేతువు. అల్లాహ్ ఆదేశాలను చదవండిః

నీ ప్రభువు ఇలా అంటున్నాడుః నన్ను ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను[. (మోమిన్ 40: 60).

విలపిస్తూ, గోప్యంగానూ మీ ప్రభువును వేడుకోండి. [. (ఆరాఫ్ 7:55).

నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి. నన్ను విశ్వసించాలి. ఇలా వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది[. (బఖర 2: 186).

పాప పరిహారాలు

అల్లాహ్ తన దాసులపై విధించిన ప్రార్థనల్లో తన గొప్ప దయ, కరుణతో కొన్నిటిని చిన్నపాపాల పరిహారానికి సాధనంగా చేశాడు. వాటిలో కొన్ని ఈ క్రిందివిః

1-విధిగా ఉన్న ఐదు పూటల నమాజులు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهْرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ مِنْهُ كُلَّ يَوْمٍ خَمْسَ مَرَّاتٍ هَلْ يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالُوا لَا يَبْقَى مِنْ دَرَنِهِ شَيْءٌ قَالَ فَذَلِكَ مَثَلُ الصَّلَوَاتِ الْخَمْسِ يَمْحُو اللهُ بِهِنَّ الْخَطَايَا

“మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అతను అందులో ప్రతి రోజు ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే, అతని శరీరంపై మురికి ఉంటుందా”? అని ప్రవక్త అడిగారు. దానికి సహచరులు చెప్పారుః ఎలాంటి మురికి మిగిలి ఉండదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారుః “ఐదు పూటల నమాజు సంగతి కూడా ఇలాంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు”. (ముస్లిం 667, బుఖారి 528).

2-జుమా నమాజు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ تَوَضَّأَ فَأَحْسَنَ الْوُضُوءَ ثُمَّ أَتَى الْجُمُعَةَ فَاسْتَمَعَ وَأَنْصَتَ غُفِرَ لَهُ مَا بَيْنَهُ وَبَيْنَ الْجُمُعَةِ وَزِيَادَةُ ثَلَاثَةِ أَيَّامٍ

“ఎవరైనా చక్కగా వుజూ చేసుకొని, జుమా నమాజు కొరకు వచ్చి, అత్యంత శ్రద్ధతో, నిశ్శబ్దంగా జుమా ప్రసంగం వింటే, వెనకటి జుమా నుండి ఈ జుమా వరకు, అదనంగా మూడు రోజుల పాపాల మన్నింపు జరుగుతుంది. (ముస్లిం 857).

3- రమజాను ఉపవాసాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ

“ఎవరు సంపూర్ణ విశ్వాసం మరియు పుణ్యాన్ని ఆశించి రమజాను ఉపవాసాలు పాటించాడో అతని పూర్వ పాపాలు క్షమించబడతాయి”. (బుఖారి 38, ముస్లిం 760).

4- హజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَنْ حَجَّ هَذَا الْبَيْتَ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ

“ఏలాంటి వాంఛలకు లోనవకుండా, అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లఘించకుండా కాబా గృహం యొక్క హజ్ చేసిన వ్యక్తి, అదే రోజు పుట్టినవానిలా హజ్ నుండి తిరిగి వస్తాడు”. (బుఖారి 1820, ముస్లిం 1350).

5- అరఫా (జిల్ హిజ్జ మాసం యొక్క 9వ) రోజు ఉపవాసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

صَومُ يَومِ عَرَفَةَ يُكَفِّرُ السَّنَةَ الْمَاضِيَةَ وَالْبَاقِيَة

“అరఫా రోజు యొక్క ఉపవాసము గడిసిన ఒక సంవత్సరం మరియు వచ్చే ఒక సంవత్సర పాపాలన్నిటిని తుడిచివేస్తుంది”. (ముస్లిం 1162).

6- రోగాలు, కష్టాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం:

مَا يُصِيبُ الْمُسلِمَ مِنْ نَصَبٍ، وَلاَ وَصَبٍ، وَلاَ هَمٍّ، وَلاَ حُزنٍ، وَلاَ أَذًى، وَلاَ غَمٍّ حَتَّى الشَّوْكَةِ يُشَاكُّهَا إِلاَّ كَفَّرَ اللهُ بِهَا مِن خَطَايَاه

“ముస్లింకు అలసట, అవస్త, చింత, వ్యాకులత, బాధ మరియు దుఃఖం ఏదీ కలిగినా, చివరికి ఒక ముళ్ళు గుచ్చుకున్నా అల్లాహ్ దాని కారణంగా అతని పాపాలను తుడిచివేస్తాడు”. (బుఖారి 5642, ముస్లిం 2573).

మరో చోట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారుః

مَنْ يُرِدِ اللهُ بِهِ خَيْرًا يُصِبْ مِنْهُ

“అల్లాహ్ ఎవరికి మేలు చేయగొరుతాడో, అతనిని పరీక్షిస్తాడు”. (బుఖారి 5645).

7- ఇస్తిగ్ఫార్ (అంటే అస్తగ్‘ఫిఅల్లాహ్ అని పలకడం): అధికంగా పాపాల్ని మన్నించే కారణాలలో ఇది అతి ముఖ్యమైనది. చదవండి అల్లాహ్ ఆదేశం:

ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉన్నంత వరకు వారిని శిక్షించడం అనేది అల్లాహ్ సాంప్రదాయం కాదు[. (అన్ఫాల్ 8: 33).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారుః

طُوبَى لِمَنْ وَجَدَ فِي صَحِيفَتِهِ اسْتِغْفَاراً كَثِيرًا

“ఎవరి కర్మపత్రంలో ఎక్కువగా క్షమాభిక్షలుంటాయో వారికి శుభవార్త”. (ఇబ్ను మాజ 3818).

ప్రశ్నోత్తరాలు

1- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాపాలు చాలా ఉన్నాయి. నేను గతంలో చేసిన పాపాలన్నిటినీ అల్లాహ్ మన్నిస్తాడో లేదో తెలియదు?

జవాబుః అల్లాహ్ ఇలా ఆదేశించాడుః

ఓ ప్రవక్తా! ఇలా అనుః తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత[. (జుమర్ 39: 53).

 హదీసె ఖుదుసీలో ఇలా ఉందిః

عَنْ أَنَسٍ  قَالَ: سَمِعْتُ رَسُولَ الله  يَقُولُ: قَال اللهُ تَعَالى: ((يَا ابنَ آدَمَ! إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ! إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الْأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيئًا لَأَتَيتُكَ بِقُرَابِهَا مَغْفِرَة )) رواه الترمذي

సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడని ప్రవక్త సల్లల్లాహు అలై- హి వసల్లం చెప్పగా నేను విన్నాను అని అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః “ఓ ఆదం పుత్రుడా! నీవు నన్ను అర్థిస్తూ, నాపై ఆశ ఉంచినంత కాలం నేను నిన్ను మన్నిస్తూ ఉంటాను, నీవు మాటిమాటికి (పాపం మరియు తౌబాలు) చేస్తూ ఉన్నా సరే, నేను పట్టించుకోను. ఓ ఆదం పుత్రుడా! నీ పాపాలు (అధిక సంఖ్యలో) చేరి నింగిని అందుకున్నా సరే నేను పట్టించుకోను, నువ్వు గనక నాతో క్షమాభిక్ష కోరితే నేను తప్పక క్షమిస్తాను. ఓ ఆదం పుత్రుడా! నీవు ఎవ్వరినీ నాకు భాగస్వామిగా (షిర్క్) చేయకుండా, ఇతర పాపాలు భూమి నిండా తీసుకొని నా వద్దకు వస్తే, నేను అంతే పరిమాణంలోని మన్నింపుతో  నేను నిన్ను కలుసుకుంటాను”. (తిర్మిజి 2669).

అంతేకాదు, తన దాసుల కొరకు అల్లాహ్ కారుణ్యం మరీ విశాలమైనది. ఎవరు తమ తౌబాలో సత్యవంతుడయి తేలుతాడో అల్లాహ్, గతంలో వారితో జరిగిన పాపాలన్నిటినీ పుణ్యాల్లో మారుస్తాడు. అల్లాహ్ ఆదేశం చదవండిః

ఎవడు పశ్చాత్తాపపడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాల్లో మార్చుతాడు. అల్లాహ్ క్షమాశీలుడు, అపారకరుణప్రదాత[. (ఫుర్ఖాన్ 25: 70).

 అందుకు, పాపాలు ఎన్నీ ఉన్నా, ఎంతటి ఘోరమైనవైనా ఏ మాత్రం నిరాశ చెందకుండా తొందరగా తౌబా చేయుటకు ముందడుగు వేయాలి.

2- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటాను. కాని నా దుష్ట స్నేహితులు నన్ను తౌబా చేయనివ్వడం లేదు. ఇందుకు నా బలహీనత, నీరసం కూడా తోడ్పడుతుంది. అయితే నేను ఏమి చేయాలి?

జవాబుః తౌబా విషయంలో ఓపిక మరియు నిలకడ అవసరం ఎంతైనా ఉంటుంది. తన తౌబాలో మనిషి ఎంతవరకు సత్యత చూపుతున్నాడో తెలియడానికి ఇది ఓ పరీక్ష. అందుకు వారిని అనుసరించకుండా, జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇలాంటి వారి విషయమే అల్లాహ్ ఎంత చక్కగా తెలిపాడో గమనించుః

కనుక నీవు సహనం వహించు, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. విశ్వసించనివారు నిన్ను చులకన భావంతో చూడ- కూడదు సుమా! (అంటే నీవు వారి మాటలకు ఏమాత్రం లొంగి- పోకూడదు)[. (రూమ్ 30: 60).

దుష్ట స్నేహితులు అతడ్ని తమ వైపు మలుపుకోటానికి నానారకాల ప్రయత్నాలు చేస్తారన్నది తౌబా చేసే వ్యక్తి తెలుసుకోవాలి. కాని ఎప్పుడైతే వారు అతని సత్యత మరియు ధర్మంపై బలమైన నిలకడ చూస్తారో అతడ్ని వదిలేస్తారు.

3- ప్రశ్నః నేను తౌబా చేయాలనుకుంటున్నాను. కాని నా పాత స్నేహితులు నన్ను నలుగురిలో అవమాన పరుస్తారని బెదిరిస్తున్నారు. వారి వద్ద నా పాత ఫోటోలు, కొన్ని నిధర్శనాలున్నాయి. నా ప్రఖ్యాతి మట్టిలో కలుస్తుందని నాకు భయం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితిలో నేనేమి చేయాలి?

జవాబుః ముందు షైతాన్ మిత్రులతో సమరం చేయాల్సి ఉంటుంది. షైతాన్ జిత్తులు ఎంతో బలహీనమైనవని కూడా తెలుసుకోవాలి. ఒకవేళ నీవు వారికి మొగ్గు చూపావంటే వారు మరిన్ని రుజువులు నీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తారు అని కూడా తెలుసుకో. ఈ విధంగా మొదటికీ, చివరికి నీవు నష్టపోతావు. కాని నీవు అల్లాహ్ పై గట్టి నమ్మకం కలిగి ఉండు. “హస్బియల్లాహు వ నిఅమల్ వకీల్” (నాకు అల్లాహ్ యే చాలు ఆయనే శ్రేష్ఠుడైన కార్యసాధకుడు) అని చదువుతూ ఉండు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరితోనైనా భయం చెందినప్పుడు ఈ దుఆ చదివేవారు.

اللَّهُمَّ إِنَّا نَجْعَلُكَ فِي نُحُورِهِمْ، وَنَعُوذُ بِكَ مِنْ شُرُورِهِم

“అల్లాహుమ్మ ఇన్నా నజ్అలుక ఫీ నుహూరిహిమ్ వ నఊజు బిక మిన్ షురూరిహిమ్”.

(ఓ అల్లాహ్ మేము నిన్ను వారి ఎదుట అడ్డుగా చేస్తున్నాము. వారి కీడు నుండి నీ శరణు కోరుతున్నాము).

వాస్తవంగా ఇది కఠిన సందర్భం. కాని అల్లాహ్ కూడా భయభక్తులు గలవారికి తోడుగా ఉన్నాడు. ఆయన వారిని అవమాన పరచడు. భక్తులకు అల్లాహ్ సహాయంగా ఉన్న ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ గాధ చదువుః

మర్సద్ బిన్ అబీ మర్సద్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల్లో ఒకరు. ఆయన, మదీనాకు వలసపోయే శక్తిలేని ముస్లిములను మక్కా నుండి మదీనా చేర్పించేవారు. మక్కాలో ఆయనకు ఇస్లాంకు ముందు పరిచయమున్న ఒక అభిసారిక ఉండేది. ఆమె పేరు ‘అనాఖ్’. ఆయన, మక్కాలో ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని మదీనా చేర్పిస్తానని మాట ఇచ్చి ఉండెను. తర్వాత సంఘటన ఆయన నోటే విందాము/ చదువుదాముః నేను మక్కా నగరానికి వచ్చి, పౌర్ణమి రాత్రిలో ఒక గోడ ఛాయలో నిల్చున్నాను. అనాఖ్ నన్ను దూరం నుండే చూసి, దగ్గరికి వచ్చి, నన్ను గుర్తు పట్టి ‘వచ్చేసెయి, ఈ రాత్రి మనం కలసి ఆనందంగా గడుపుకుందాము’ అని అంది. “అనాఖ్! అల్లాహ్ వ్యభిచారాన్ని నిషేధించాడు” అని నేను బదులిచ్చాను. ఇది విన్న వెంటనే అనాఖ్ ‘ఓ ప్రజలారా! ఈ వ్యక్తి మీ ఖైదీలను విడిపించుకు వెళ్తున్నాడు’ అని బిగ్గరగా అరిచింది. అప్పుడే ఎనిమిది మంది నా వెంట పడ్డారు. నేను పరిగెత్తి ఒక గుహలో ప్రనేశించాను. వారు గుహ వరకు వచ్చి నాపైనే, అంటే; గుహ ముఖంద్వారం వద్ద నిల్చున్నారు. కాని అల్లాహ్ వారిని అంధులుగా చేశాడు. వారు నన్ను చూడలేకపోయారు. చివరికి వారు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మాటిచ్చిన నా స్నేహితుని వద్దకు వెళ్ళి అతడ్ని మదీనా చేర్పించాను.

ఈ విధంగా అల్లాహ్, విశ్వాసులను, తౌబా చేసేవారిని కాపాడతాడు.

ఒకవేళ నీవు భయపడే విషయమే గనక బయటపడి, నీవు నీ విషయం స్పష్టం చేయవలసిన అవసరం వచ్చినప్పుడు, నీ నిర్ణయాన్ని ఎదుటివారి ముందు స్పష్టం చేయి, నీవు చేసిన దానిని ఒప్పుకుంటూ ‘అవును, నేను అపరాధునిగా ఉంటిని, కాని అల్లాహ్ వైపునకు మరలి నేను తౌబా చేశాను’ అని నిక్కచ్చిగా చెప్పేసెయి. అసలు అవమానం, ఇది కాదు. ప్రళయదినాన అల్లాహ్ సమక్షంలో, దైవదూతల, జిన్నాతుల మరియు సర్వమానవుల ముందు కలిగే అవమానమే అసలు అవమానము.

4- ప్రశ్నః నేను ఒక తప్పు చేసిన తర్వాత తౌబా చేస్తాను. నా మనుస్సు అదుపులో ఉండలేక అదే తప్పు మళ్ళీ జరిగితే, నేను ముందు చేసిన తౌబా వ్యర్థం అయిపోయి, మొదటి తప్పుతో పాటు తర్వాత తప్పు కూడా నా పత్రంలో ఉంటుందా?

జవాబుః ఒక తప్పు చేసిన తర్వాత నీవు తౌబా చేసినచో అల్లాహ్ ఆ తప్పును మన్నిస్తాడు. తర్వాత అదే తప్పు మళ్ళీ చేసినచో, కొత్తగా తప్పు చేసినట్లు లిఖించబడుతుంది. అందుకు మళ్ళీ తౌబా చేయాల్సి ఉంటుంది. కాని మొదటి తప్పు తన కర్మ పత్రంలో ఉండదు.

5-ప్రశ్నః నేను ఒక పాపంలో మంకుతనం వహిస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుందా?

జవాబుః ఒక పాపం చేస్తూ మరో పాపం నుండి తౌబా చేస్తే ఈ తౌబా అంగీకరించబడుతుంది. కాని రెండు పాపాలు ఒకే రకమైనవి కాకూడదు. ఉదాహరణకుః వడ్డీ తినే, తీసుకునే వ్యక్తి ఇక నుండి వడ్డీ వ్యవహారానికి దూరంగా ఉంటానని తౌబా చేస్తున్నప్పుడు, అతను మత్తు సేవించేవాడు కూడా ఉండి, దీనిని నుండి తౌబా చేయకుంటే, వడ్డీ గురించి చేసిన తౌబా నిజమగును, అది అంగీకరించబడును. కాని ఒక వ్యక్తి ఇక నుండి మత్తు సేవించనని తౌబా చేసి, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ అలవాటు మానుకోకుంటే, లేదా ఒక స్త్రీతో వ్యభిచారానికి పాల్పడి తౌబా చేస్తూ, మరో స్త్రీతో వ్యభిచారానికి ఒడిగడితే ఇలాంటి తౌబా అనేది అంగీకరించబడదు.

6- ప్రశ్నః నేను గతంలో నమాజ్, ఉపవాసం, జకాత్ మొదలయిన కొన్ని విధులను పాటించలేదు. అందుకు నేనేమి చేయాలి?

జవాబుః వదిలివేసిన నమాజులు తిరిగి చేయాలని (అంటే ఖజా) ఏమీ లేదు. కాని స్వచ్ఛమైన తౌబా చేయాలి. ఇక ముందు చాలా శ్రద్ధగా నమాజులను కాపాడాలి. ఎక్కువగా క్షమాపణ కోరుతూ ఉండాలి. అలాంటప్పుడు అల్లాహ్ తప్పక మన్నించవచ్చు.

ఉపవాసాలు వదిలిన వ్యక్తి, ఉపవాసాలు ఉండలేకపోయిన రోజుల్లో ముస్లింగానే ఉంటే ప్రతి ఒక్క ఉపవాసానికి బదులుగా ఒక్కో నిరుపేదకు కడుపునిండా అన్నం పెట్టాలి. జకాత్ ఇవ్వలేకపోయిన ముస్లిం, గత ఎన్ని సంవత్సరాల జకాత్ ఇవ్వలేకపోయాడో అన్ని సంవత్సరాల జకాత్ లెక్కేసుకోని ఒకేసారి చెల్లించాలి.

7-ప్రశ్నః నేను కొంతమందికి సంబంధించిన సొమ్ము దొంగలించాను. ఆ తర్వాత తౌబా చేశాను. కాని నాకు వారి చిరునామాలు తెలియవు. అలాంటప్పుడు నేనేమీ చేయాలి?

జవాబుః పూర్తి ప్రయత్నాలు చేసి వారి చిరునామాలు కనుగొనాలి. వారి చిరునామాలు లభ్యమవుతే వారి నుండి దొంగలించిన సొమ్ము వారికి అప్పగించాలి. సొమ్ము ఎవరిదో ఆ వ్యక్తి చనిపోయినచో, ఆ సొమ్ము అతని వారసులకు ఇవ్వాలి. తగిన ప్రయత్నం చేసి వారిని వెతికినప్పటికీ వారు తెలియకుంటే వారి తరఫున, వారికి దాని పుణ్యం లభించే సంకల్పంతో దానం చేయాలి. వారు అవిశ్వాసులైనా సరే. వారికి దాని ప్రతిఫలం అల్లాహ్ ఇహములోనే ఇస్తాడు. పరలోకంలో ఇవ్వడు.

8-ప్రశ్నః నేను వ్యభిచారానికి పాల్పడ్డాను. నేను ఎలా తౌబా చేయాలి. ఆ స్త్రీ గర్భిణి అయితే ఆ సంతానం నాకే చెందుతుందా?

జవాబుః స్త్రీ యొక్క ఇష్టం, అంగీకారంతో చేసిన వ్యభిచారానికి నీపై కేవలం తౌబా విధిగా ఉండును. సంతానం అక్రమ సంబంధ ఫలితమైనందకు నీది కాదు. అతని ఖర్చులు ఇచ్చే బాధ్యత కూడా నీపై ఉండదు. ఇలాంటి సంతానం అతని తల్లితోనే ఉండును.

ఈ విషయాన్ని కప్పి ఉంచడానికి ఆ స్త్రీతో వివాహం కూడా చేయకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి మరియు ఆ స్త్రీ ఇద్దరూ స్వచ్ఛంగా తౌబా చేస్తే, ఆ వ్యక్తి ఆమెతో వివాహం చేసుకోవచ్చును. కాని మొదటి అక్రమ సంబంధం వల్ల ఆమెకు గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే.

 ఒకవేళ అత్యాచారం, బలవంతంతో వ్యభిచారం జరిపి ఉంటే, ఆమెపై చేసిన అత్యాచారానికి బదులుగా, అతడు ఆమెకు ఆమె తోటి సోదరీమనులు తమ వివాహంలో పొందిన మహర్ కు సమానంగా ధనం ఇవ్వాలి. స్వచ్ఛమైన తౌబా చేయాలి. అతడు ఉన్న ప్రాంతంలో ఇస్లామీయ చట్టం అమలులో ఉండి, అతని వ్యవహారం చట్టం దృష్టిలోకి వస్తే ధర్మప్రకారంగా అతనిపై “హద్” (వ్యభిచార శిక్ష) విధింపబడును.

9-ప్రశ్నః ఒక మంచి వ్యక్తితో నా వివాహం జరిగింది. వివాహానికి ముందు అల్లాహ్ ఇష్టపడని కొన్ని సంఘటనలకు నేను గురయ్యాను. ఇప్పుడు నేనేమి చేయాలి?

జవాబుః స్వచ్ఛమైన తౌబా చేయి. గతంలో జరిగిన విషయాలు నీ భర్తకు తెలియజేయుట నీపై అవశ్యకత ఏమీ లేదు. అందుకు నీవు కుండ బద్దలు గొట్టి సంసారం పాడు చేసుకోకు.

10- ప్రశ్నః గుదమైధనం (సోడోమీ) లాంటి పాపానికి గురైన వ్యక్తి తౌబా చేయునప్పుడు ఏ విధులు వర్తిస్తాయి?

జవాబుః ఆ దుష్చర్యకు పాల్పడిన ఇద్దరూ స్వచ్ఛమైన తౌబా చేయాలి.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడిన లూత్ అలైహిస్సలాం జాతివారిపై అల్లాహ్ ఎలాంటి విపత్తు కుర్పించాడో అతనికి తెలియదా?

  • వారి చూపులను తీసుకొని వారిని అంధులుగా చేశాడు.
  • వారిపై పేలుడు వదిలాడు.
  • వారి ఆ నగరాన్ని తల్లక్రిందులుగా చేశాడు
  • దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్ళను ఎడతెగకుండా కుర్పించాడు. ఇలా వారందరినీ నాశనము చేశాడు.

ఇలాంటి దుష్చర్యకు పాల్పడ్డవారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారుః

مَنْ وَجَدْتُمُوهُ يَعْمَلُ عَمَلَ قَوْمِ لُوطٍ فَاقْتُلُوا الْفَاعِلَ وَالْمَفْعُولَ بِهِ

“లూత్ అలైహిస్సలాం జాతివారు పాల్పడిన లాంటి దుష్చర్యకు పాల్పడినవారిని మీరు చూసినట్లయితే ఆ ఇద్దరినీ నరికి వేయండి”. (అబూ దావూద్ 4462, తిర్మిజి 1456, ఇబ్ను మాజ 2561).

ఇలాంటి దుష్కార్యానికి పాల్పడినవారు స్వచ్ఛమైన తౌబా చేయుట విధిగా ఉంది. అల్లాహ్ తో అధికంగా క్షమాభిక్ష కోరుట కూడా తప్పనిసరి.