మన ఆరాధనలు స్వీకరించబడాలంటే? – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

మన ఆరాధనలు స్వీకరించబడాలంటే?
హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://youtu.be/YUGJ4R5B-Ps [12 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఆరాధనలు (ఇబాదత్) అల్లాహ్ వద్ద స్వీకరించబడటానికి అవసరమైన మూడు ప్రాథమిక షరతులను వక్త వివరిస్తున్నారు. అవి: 1) అల్లాహ్ పై ప్రగాఢమైన మరియు స్థిరమైన విశ్వాసం (ఈమాన్) కలిగి ఉండటం, 2) చేసే ప్రతి పుణ్యకార్యంలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) పాటించడం, అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేయడం, ప్రజల మెప్పు లేదా ప్రదర్శన కోసం కాదు, మరియు 3) ప్రతి ఆరాధనను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన పద్ధతి (సున్నత్) ప్రకారమే ఆచరించడం. ఈ మూడు షరతులు లేకుండా చేసే కర్మలు స్వీకరించబడకుండా వృధా అయిపోయే ప్రమాదం ఉందని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేస్తున్నారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالْعَاقِبَةُ لِلْمُتَّقِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ أَمَّا بَعْدُ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్]

అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
[అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు]
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా, ఈరోజు మనం ఆరాధనలు స్వీకరింపబడాలంటే ఏమి చేయాలి, కండిషన్లు ఏమిటి తెలుసుకుందాం. మనం అల్లాహ్‌ను ఆరాధిస్తాము, అల్లాహ్ నే ఆరాధిస్తాము. నమాజులు నెలకొల్పుతాము, ముఖ్యంగా ఈ రమదాన్ మాసంలో ఇతర మాసాల కంటే కొంచెం ఎక్కువగానే మనము ఆరాధనలో ఉంటాము. నమాజుల ద్వారా, నఫిల్ నమాజులు, తరావీహ్ నమాజు, దానధర్మాలు, దుఆ, ఖురాన్ పారాయణం, ఇతరులకు సహాయం చేయటం ఈ విధంగా అనేక రకాల ఆరాధనలు చేస్తున్నాము. ఖురాన్ చదువుతున్నాం, నమాజులు పాటిస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ఖియాముల్ లైల్ చేస్తున్నాము. కాకపోతే మనము చేసే ఈ కర్మలు, మనము చేసే ఈ ఆరాధన స్వీకరించబడుతుందా? అల్లాహ్ స్వీకరిస్తున్నాడా? అల్లాహ్ ఇష్టపడుతున్నాడా మన ఆరాధనకి? ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి.

నేను చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా నమాజ్ ఏ విధంగా అయ్యి ఉండాలి? నేను ఉండే ఉపవాసం అల్లాహ్ స్వీకరించాలా అంటే నా ఉపవాసం ఏ విధంగా ఉండాలి? నేను చేసే ఖురాన్ పారాయణం అల్లాహ్ స్వీకరించాలి అంటే, నా ఖురాన్ యొక్క పారాయణం ఏ విధంగా ఉండాలి? నేను చేసే దానం, నేను చేసే ప్రతీ మంచి పని, ప్రతీ పుణ్యం, ప్రతీ సదాచరణ – నేను చేసేది, నేను దుఆ చేస్తున్నాను, నేను ఖురాన్ పారాయణం చేస్తున్నాను, తిలావత్ చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఏడ్చి ఏడ్చి దుఆ చేస్తున్నాను, ఖియాముల్ లైల్ చేస్తున్నాను, ఒకరికి సహాయం చేస్తున్నాను, పేదవారికి అన్నం పెడుతున్నాను, పేదవారికి దుస్తులు దానం చేస్తున్నాను, లేని వారికి ఆదుకుంటున్నాను, అంటే పలు విధాలుగా నేను అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాను.

కాకపోతే నా ఈ ఆరాధన అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా స్వీకరించాలా అంటే, దానికి మూడు కండిషన్లు ఉన్నాయి. అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలా, లేకపోతే మన కర్మలు వృధా అయిపోతాయి. మన ఆరాధనలు స్వీకరింపబడాలంటే ముఖ్యమైన మూడు కండిషన్లు మనం తెలుసుకోవాలి, మూడు విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ మూడు ఏమిటి? ఒకటి, అల్లాహ్ పై నమ్మకం. రెండవది, ఇఖ్లాస్ (చిత్తశుద్ధి). మూడవది, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం. ఈ మూడు విషయాలు ఉంటేనే మన ఆరాధన స్వీకరించబడుతుంది.

  • అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన నమ్మకం లేకుండా ఆరాధిస్తే ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • చిత్తశుద్ధి ఇఖ్లాస్. చిత్తశుద్ధి లేకుండా ఆరాధిస్తే, ప్రజల మెప్పు కోసం ఆరాధిస్తే, ప్రజలు పొగడాలని పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యకార్యం, ఆ సదాచరణ, ఆ ఆరాధన స్వీకరించబడదు.
  • అలాగే మనం చేసే సదాచరణ, మనం చేసే ఆరాధన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన విధానం పరంగా లేకపోతే అది రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు.

ఈ మూడు విషయాలు మనం జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, ఆ విధంగానే మన కర్మలు ఉండాలి.

మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన నమ్మకం. అల్లాహ్ పైన ప్రగాఢ విశ్వాసం. అల్లాహ్ మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు,

“ఇన్నల్లజీన ఆమనూ వ అమిలుస్సాలిహాతి కానత్ లహుం జన్నతుల్ ఫిర్దౌసి నుజులా”. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి, విశ్వసించి.. మొదటి కండిషన్ ఏమిటి? విశ్వాసం. విశ్వసించి, విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం తర్వాత సత్కార్యాలు చేసిన వారికి ఫిర్దౌస్ ఉద్యానవనాలు ఉంటాయి అని అన్నాడు.

అలాగే అల్లాహ్ సుబహాననుహు వతాలా సూరతుల్ అసర్ లో తెలియజేశాడు, వల్ అసర్, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, ఇల్లల్లజీన ఆమను వ అమిలుస్ సాలిహాత్. కాలం సాక్షిగా మానవులందరూ నష్టంలో ఉన్నారు, నాలుగు రకాల కోవకి చెందిన నాలుగు గుణాలు ఉండే వ్యక్తులు తప్ప అన్నాడు. అంటే విశ్వసించిన వారు, ఆ తర్వాత సత్కార్యాలు చేసేవారు, పరస్పరం సత్యం గురించి హితబోధ చేసుకునే వారు, సహనం వహించేవారు. అంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. 

ఇదే విషయం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

قُلْ آمَنْتُ بِاللَّهِ ثُمَّ اسْتَقِمْ
[కుల్ ఆమన్తు బిల్లాహి సుమ్మస్తకిమ్]
“నేను అల్లాహ్‌ను విశ్వసించాను” అని పలికి, దానిపై నిలకడగా ఉండు.

మేమందరము అల్లాహ్‌ని విశ్వసించాము అని అంటున్నాము, విశ్వసించాము కూడా. కాకపోతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే, అల్లాహ్‌ను నమ్ముతున్నాము, అల్లాహ్ ఆదేశాల పరంగా జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఏదైతే చేయమన్నాడో అవి చేయాలి, అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా దేనిని నిషిద్ధం చేశాడో దానికి దూరంగా ఉండాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాలు మనకి బోధించారో, చేయమన్నారో, ఆజ్ఞాపించారో అది మనము చేయాలి, ఆయన్ని అనుసరించాలి, విధేయత చూపాలి. ఏ విషయాల గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారో, నిషిద్ధం అన్నారో, అధర్మం అన్నారో వాటిని విడనాడాలి, దూరంగా ఉండాలి. సుమ్మస్తకిమ్ (స్థిరంగా ఉండు). అల్లాహ్‌ని విశ్వసించిన తర్వాత అల్లాహ్ పైన నమ్మకం కలిగిన తర్వాత దానిపై నిలకడగా ఉండాలి. అల్లాహ్‌ని విశ్వసిస్తున్నాం, నమాజ్ చేయటం లేదు. రమదాన్‌లో నమాజ్ చేస్తాము, రమదాన్ తర్వాత నమాజ్ చేయము. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా రమదాన్ మాసానికి ప్రభువు అయితే, రమదాన్ తర్వాత మాసాలకి అల్లాహ్ ప్రభువు కాదా?

ఆమన్తు బిల్లాహి (నేను అల్లాహ్‌ను విశ్వసించాను) అని చెప్పి, సుమ్మస్తకిమ్ (దాని మీద నిలకడగా ఉండు). అంటే మొదటి విషయం ఏమిటి? అల్లాహ్ పైన గట్టి నమ్మకం కలిగి ఉండాలి. మన విశ్వాసాలు, మన ఆచరణలు, మన ఆరాధనలు, మన కర్మలు, మన పుణ్యాలు అల్లాహ్ స్వీకరించాలంటే మొదటి విషయం అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం. ఆయన మాత్రమే సృష్టికర్త, ఆయన మాత్రమే పాలకుడు, ఆయన మాత్రమే పోషకుడు, ఆయన మాత్రమే సర్వ లోకాలను చూసుకునేవాడు, ఆయన మాత్రమే మన జీవన్మరణాలకు కారకుడు. ఆయన మీద, ఆయన ఏకత్వం మీద గట్టి నమ్మకం కలిగి ఉండటం. ఇది మొదటి విషయం.

రెండో విషయం ఇఖ్లాస్, చిత్తశుద్ధి. ఏ మంచి పని చేసినా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం చేయాలి, ప్రజల మెప్పు కోసం చేయకూడదు. నన్ను సమాజంలో పొగుడుతారు, నాకు పేరు వస్తుంది, అందరూ నాకు పొగుడుతారు ఈ ఉద్దేశంతో మంచి పని చేయకూడదు. ప్రదర్శనా బుద్ధి ఉండకూడదు, దీనికి రియా అంటారు. రియా గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే,

الرِّيَاءُ الشِّرْكُ الأَصْغَرُ
[అర్-రియా అష్-షిర్కుల్ అస్గర్]
రియా (ప్రదర్శనా బుద్ధి) అనేది చిన్న షిర్క్.

రియా (ప్రదర్శనా బుద్ధితో), నలుగురి మెప్పు కోసం, ప్రజల మెప్పు కోసం ఏదైనా మంచి పని చేస్తే అది షిర్క్ అవుతుంది. చిన్న షిర్క్ అవుతుంది అన్నారు. అంటే ప్రదర్శనా బుద్ధితో సదాచరణ చేస్తే అది సదాచరణ కాదు, అది షిర్క్ కిందికి వస్తుంది. కావున మనం ప్రజల మెప్పు కోసం అల్లాహ్‌ను ఆరాధించకూడదు. చిత్తశుద్ధితో, ఇఖ్లాస్‌తో మనము మంచి పని చేయాలి, ఆరాధించాలి.

మొదటి విషయం, అల్లాహ్ పైన ప్రగాఢ నమ్మకం, ఆయన ఏకత్వం పైన నమ్మకం, విశ్వాసం. రెండవది, చిత్తశుద్ధి, ఇఖ్లాస్. మూడో విషయం ఏమిటంటే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన పద్ధతి పరంగానే మన కర్మలు ఉండాలి. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా ఇలా తెలియజేశాడు:

وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟
[వమా ఆతాకుముర్ రసూలు ఫఖుజూహు వమా నహాకుమ్ అన్హు ఫన్తహూ]
“అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏది ఇస్తారో అది తీసుకోండి, ఆయన దేని నుంచి ఖండిస్తారో దానికి దూరంగా ఉండండి.” (59:7)

అంటే మనము నమాజ్ చేసినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం ఉండినా విధానం ప్రవక్త గారి విధానం అయ్యి ఉండాలి, ఉపవాసం పాటించినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం అయ్యి ఉండాలి, ఖియాముల్ లైల్ చేసినా ప్రవక్త గారి విధానం, దుఆ చేసినా ప్రవక్త గారి విధానం, దానధర్మాలు చేసినా ప్రవక్త గారి విధానం, ఖురాన్ పారాయణం చేసినా ప్రవక్త గారి విధానం. ప్రవక్త గారి విధానం లేకపోతే ఆ ఆరాధన రద్దు చేయబడుతుంది. ఈ విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

مَنْ أَحْدَثَ فِي أَمْرِنَا هَذَا مَا لَيْسَ مِنْهُ فَهُوَ رَدٌّ
[మన్ అహదస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్]
ఎవరైతే మా ఈ (ధార్మిక) విషయంలో లేని దాన్ని క్రొత్తగా కల్పిస్తారో, అది త్రోసిపుచ్చబడుతుంది (తిరస్కరించబడుతుంది).

మా ఆదేశాలకు అనుగుణంగా లేని పనులు త్రోసిపుచ్చబడతాయి, రద్దు చేయబడతాయి, క్యాన్సిల్ చేయబడతాయి. అభిమాన సోదరులారా, మనం చేసే ప్రతీ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా ఉండాలి. లేకపోతే అవి స్వీకరించబడవు. దుఆ చేస్తాము, ప్రవక్త గారి విధానం. నమాజ్ పాటిస్తాము, ప్రవక్త గారి విధానం. సహరీ ఆదాబులు, ప్రవక్త గారి విధానం. ఇఫ్తార్ గురించి, ప్రవక్త గారి విధానం. ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రవక్త గారి విధానం. ఎటువంటి సంకల్పం ఉండాలి, ప్రవక్త గారి విధానం. నమాజ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ప్రవక్త గారి విధానం. హజ్, ఉమ్రా చేయాలి, ప్రవక్త గారి విధానం. అమ్మానాన్నలను పోషించాలి, వారి మాట వినాలి, ప్రవక్త గారి ఆదేశాల పరంగానే. మనము ఏ పుణ్యం చేసినా, ఏ మంచి పని చేసినా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం పరంగానే ఉండాలి, లేకపోతే మనం చేసే కర్మలు వృధా అయిపోతాయి, స్వీకరించబడవు.

అభిమాన సోదరులారా, చివర్లో ఆ మూడు విషయాలు తెలుసుకుందాము, రిపీట్ చేస్తున్నాను. అల్లాహ్ పై నమ్మకం, చిత్తశుద్ధి (ఇఖ్లాస్), అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం. ఈ మూడు కండిషన్లు ఉంటే మన ఆరాధనలు, నమాజ్, ఉపవాసం, ఖియాముల్ లైల్, దుఆ, జిక్ర్, తిలావత్ ఇవన్నీ స్వీకరించబడతాయి.

అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరినీ ఈ కండిషన్లతో పాటు ఆరాధనలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మన ప్రతీ ఆరాధనలో అల్లాహ్ పై గట్టి నమ్మకాన్ని, ఇఖ్లాస్‌ని, ప్రవక్త గారి సున్నత్ విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హానహు వ త’ఆలా మనందరికీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
[వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్]
మనందరి చివరి ప్రార్థన, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43606

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ ను, ఆయన ప్రవక్త ﷺ ను మించి పోవటం
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి(హఫిజహుల్లాహ్)
https://youtu.be/omW0Jrb-7Xk [5 నిముషాలు]

ఈ ప్రసంగం ఇస్లాం యొక్క ప్రాథమిక సూత్రమైన విధేయతను చర్చిస్తుంది. ఒక విశ్వాసి, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన ఆదేశాల కంటే ఇతరుల—కుటుంబం, పండితులు లేదా తనతో సహా—మాటలకు లేదా అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చా అనే కేంద్ర ప్రశ్నను ఇది అన్వేషిస్తుంది. అలాంటి ప్రాధాన్యత అనుమతించబడదని వక్త ఖురాన్ (సూరా అల్-హుజురాత్ 49:1 మరియు సూరా అల్-మాయిదా 5:2) మరియు బుఖారీ, ముస్లింల నుండి ఒక హదీసును ఉటంకిస్తూ దృఢంగా స్థాపించారు. నిజమైన విశ్వాసానికి దైవిక ఆదేశాలకు సంపూర్ణ లొంగుబాటు అవసరమని, మరియు మతపరమైన విషయాలలో ఏదైనా విచలనం, జోడింపు లేదా స్వీయ-ఉత్పన్నమైన తీర్పు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కంటే “ముందుకు వెళ్ళడంగా” పరిగణించబడుతుందని దీని ముఖ్య సారాంశం. పుణ్యం మరియు ధర్మబద్ధమైన పనులలో సహకారం ప్రోత్సహించబడింది, కానీ పాపం మరియు అతిక్రమణ విషయాలలో ఖచ్చితంగా నిషేధించబడింది.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాఇ వల్ ముర్సలీన్, అమ్మా బాద్.

అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా? ఈ ప్రశ్నకి మనము ఈరోజు సమాధానం తెలుసుకుంటున్నాం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలపై మనం ఇతరులకు, ఆ ఇతరులు బంధువులు కావచ్చు, అమ్మానాన్న కావచ్చు, పండితులు కావచ్చు, ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వగలమా?ముమ్మాటికీ లేదు. మనము అల్లాహ్, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలపై ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వలేము.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో సూరతుల్ హుజురాత్, ఆయత్ నంబర్ ఒకటిలో ఇలా సెలవిచ్చాడు,

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُقَدِّمُوا بَيْنَ يَدَيِ اللَّهِ وَرَسُولِهِ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
(యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుఖద్దిమూ బైన యదయిల్లహి వ రసూలిహీ వత్తఖుల్లాహ, ఇన్నల్లాహ సమీవున్ అలీమ్)

విశ్వాసులారా, అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తము వినేవాడు, సర్వము ఎరిగినవాడు.” (49:1)

అంటే ధార్మిక విషయాలలో తమంతట తాముగా నిర్ణయాలు తీసుకోవటం గానీ, తమ ఆలోచనలకు పెద్ద పీట వేయటం గానీ చేయరాదు. దీనికి బదులు వారు అల్లాహ్ కు, దైవ ప్రవక్తకు విధేయత చూపాలి. తమ తరఫున ధర్మంలో హెచ్చుతగ్గులు చేయటం, సరికొత్త విషయాలను కల్పించటం వంటి పనులన్నీ దైవాన్ని, దైవ ప్రవక్తకు మించిపోవటంగా భావించబడతాయి.

అలాగే, ఖురాన్ మరియు హదీసులతో నిమిత్తం లేకుండా ధార్మిక తీర్పు ఇవ్వకూడదు. అలాగే ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్లామీయ షరీఅతుకు విరుద్ధంగా ఉందని తెలిస్తే, ఇక దాని కోసం ప్రాకులాడకూడదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆజ్ఞలను శిరోధార్యంగా భావించటమే ఒక విశ్వాసికి శోభాయమానం. తద్భిన్నంగా అతను ఇతరుల అభిప్రాయాలను కొలబద్దగా తీసుకుంటే తలవంపు తప్పదు అని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి.

దీనికి సారాంశం బుఖారీ మరియు ముస్లింలోని ఒక హదీస్ ఉంది. దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవిధేయతకు, అంటే అల్లాహ్ అవిధేయతకు దారి తీసే ఏ విషయంలోనూ ఎవరికీ విధేయత చూపకూడదు. అయితే మంచి విషయాలలో విధేయత చూపవచ్చు అన్నమాట. ఈ హదీస్ బుఖారీ మరియు ముస్లింలో ఉంది.

ఈ విషయాన్నే ఇంకో విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో సెలవిచ్చాడు,

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَلَا تَعَاوَنُوا عَلَى الْإِثْمِ وَلْعُدْوَانِ
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా, వలా తఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్)
సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి (5:2)

అంటే అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒకరికొకరుని తోడుపడుతూ ఉండండి, సహాయం చేస్తూ ఉండండి, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండండి, తోడుపడుతూ ఉండండి. పాప కార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే అల్లాహ్, ఆయన ప్రవక్త ఆదేశాలపై మనం ఇతరుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ప్రాధాన్యత అల్లాహ్ కి, ప్రాధాన్యత ఆయన ప్రవక్తకి మాత్రమే ఇవ్వాలి.

వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43614


(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు! – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

(నఫిల్) స్వచ్చంద దానాల రకాలు!
https://youtu.be/2WVvL9Ip-l4 [11 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, నఫిల్ సదకా (ఐచ్ఛిక దాతృత్వం) యొక్క వివిధ రూపాలను ఇస్లాంలో వివరించబడ్డాయి. సదకా కేవలం ధనంతో ఇచ్చేది మాత్రమే కాదని, ప్రతి మంచి పని ఒక సదకా అని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హదీస్ ద్వారా స్పష్టం చేయబడింది. చిరునవ్వుతో పలకరించడం, దారి చూపడం, అల్లాహ్ ను స్మరించడం (తస్బీహ్, తహమీద్, తక్బీర్), మంచిని ఆజ్ఞాపించడం, చెడు నుండి నివారించడం వంటివి కూడా సదకాగా పరిగణించబడతాయి. ఒక వ్యక్తి తన కుటుంబంపై ఖర్చు చేయడం కూడా సదకా అని చెప్పబడింది. చివరగా, వ్యక్తి మరణించిన తర్వాత కూడా పుణ్యం లభించే మూడు రకాల సదకాల గురించి వివరించబడింది: సదకా-ఎ-జారియా (నిరంతర దానధర్మం), ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం, మరియు తల్లిదండ్రుల కోసం ప్రార్థించే సజ్జనులైన సంతానం.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ، أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బ’అ దహు, అమ్మా బ’అద్)
నిశ్చయంగా, సర్వస్తోత్రాలు ఏకైకుడైన అల్లాహ్ కే శోభాయమానం. ఆయన తర్వాత ఏ ప్రవక్తా రారో, అట్టి ప్రవక్తపై అల్లాహ్ యొక్క కారుణ్యం మరియు శాంతి కురియుగాక. ఆ తర్వాత.

ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ సోదరులారా, మనం గత ఎపిసోడ్లలో జకాత్ గురించి తెలుసుకుందాం.

ఈరోజు, నఫిల్ సదకా రకాలు తెలుసుకుందాం. సదకా అంటే కేవలం ధనంతో, డబ్బుతో కూడుకున్నది మాత్రమే కాదు అని మనకు తెలుస్తుంది, బోధపడుతుంది, మనము ఖురాన్ మరియు హదీస్ గమనిస్తే. నఫిల్ సదకా చాలా రకాలు ఉన్నాయి. ధనంలో కూడా ఉన్నాయి, ధనం కాకపోయినా. ఉదాహరణకు, బుఖారీ, ముస్లింలో ఓ హదీస్ ఉంది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు:

كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ
(కుల్లు మ’అరూఫిన్ సదఖహ్)
ప్రతి మంచి పని ఒక సదకా (దానం).

మంచి పని ఏమిటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చిరునవ్వుతో మాట్లాడినా అది మంచి పని ఇస్లాం దృష్టిలో, అది కూడా సదకా. ఒక వ్యక్తికి దారి చూపినా సదకా, మంచి పని.

ఒక హదీస్ లో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తక్బీర్, తస్బీహ్, తహమీద్, తహ్లీల్ ఇవి కూడా సదకా అని చెప్పారు. అంటే, అల్లాహు అక్బర్ అని పలకటం, సుబ్ హానల్లాహ్ అని పఠించటం, అల్ హమ్దులిల్లాహ్ అని అనటం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పలకటం, అస్తగ్ ఫిరుల్లాహ్ అని చెప్పటం కూడా సదకా. అల్లాహు అక్బర్ ఒక సదకా. ఒక్కసారి సుబ్ హానల్లాహ్ అంటే ఒక సదకా. ఒక్కసారి అల్ హమ్దులిల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఒక్క సదకా. ఒక్కసారి అస్తగ్ ఫిరుల్లాహ్ అంటే ఒక్క సదకా.

ఇది సామాన్యంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ పలికినా, చెప్పినా మాట ఇది. కాకపోతే రమజాన్ మాసం ప్రత్యేకమైన మాసం. రమదాన్ మాసంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రతి పుణ్యానికి ఎన్నో రెట్లు పెంచి, అధికం చేసి అల్లాహ్ ప్రసాదిస్తాడు. కావున దీన్ని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ రమదాన్ మాసంలో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు. డబ్బు రూపంలో, బంగారం రూపంలో, వెండి రూపంలో, ధన రూపంలో, భూమి రూపంలో, వ్యాపార రూపంలో జకాత్ చెల్లించడానికి ప్రతి వ్యక్తి అర్హుడు కాకపోవచ్చు. కాకపోతే ఈ రూపాలలో, జిక్ర్ ద్వారా సదకా, దీనిని మనము మహాభాగ్యంగా భావించుకొని ఈ మాసంలో అత్యధికంగా మనము ఈ రకానికి సంబంధించిన సదకా చేసుకోవాలి.

అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

اَلأَمْرُ بِالْمَعْرُوفِ وَالنَّهْيُ عَنِ الْمُنْكَرِ صَدَقَةٌ
(అల్ అమ్ రు బిల్ మ’అరూఫ్ వ నహ్యు అనిల్ మున్కర్ సదఖహ్)
మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడు నుండి నివారించడం కూడా సదకా.

మంచిని ఆజ్ఞాపించటం, చెడుని ఆపటం కూడా సదకా. మంచి చేయమని చెప్పటం కూడా సదకా అవుతుంది. చెడుని ఆపటం కూడా సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు.

అభిమాన సోదరులారా, ఓ హదీస్ లో ఇలా ఉంది:

إِمَاطَتُكَ الْحَجَرَ وَالشَّوْكَ وَالْعَظْمَ عَنِ الطَّرِيقِ لَكَ صَدَقَةٌ
(ఇమాతతుకల్ హజర్ వష్షౌక్ వల్ అజ్మ్ అనిత్తరీఖి సదఖతున్ లక్)
దారి నుండి రాయిని, ముల్లును మరియు ఎముకను తొలగించడం నీ కోసం సదకా అవుతుంది.

దారి నుండి రాళ్లను, ఆ దారి నుండి ముళ్ళను, అలాగే ఎముకల్ని, దారి నుండి తొలగించడం నీ కోసం సదకా అవుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అంధులకి దారి చూపటం, అలాగే చెవిటి, మూగ వారికి విషయం బోధపరచడం కూడా సదకా అవుతుంది.

అలాగే ఏదైనా ప్రాణికి నీరు త్రాపించడం కూడా సదకా. కష్టాల్లో, అవసరాల్లో ఉన్న వారికి సహాయపడటం సదకా. చివరికి అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు:

نَفَقَةُ الرَّجُلِ عَلَى أَهْلِهِ صَدَقَةٌ
(నఫఖతుర్రజులి అలా అహ్లిహీ సదఖహ్)
ఒక వ్యక్తి తన కుటుంబంపై చేసే ఖర్చు కూడా సదకా.

వ్యక్తి తన ఇంటి వారిని, భార్యా పిల్లలను పోషించటం కూడా సదకా అన్నారు. సుబ్ హా నల్లాహ్. అల్లాహ్ ఆదేశానుసారం, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం ప్రకారం, ఆయన సున్నత్ ని అనుసరిస్తూ ఎవరైతే చిత్తశుద్ధితో, మంచి సంకల్పంతో దైవ ప్రసన్నత కోసం భార్యను పోషిస్తే, పిల్లల్ని పోషిస్తే, అది కూడా సదకా క్రిందకి లెక్కించబడుతుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అలాగే ఇంకో హదీస్ లో:
مَا مِنْ مُسْلِمٍ يَغْرِسُ غَرْسًا … إِلاَّ كَانَ مَا أُكِلَ مِنْهُ لَهُ صَدَقَةً
(మా మిన్ ముస్లిమిన్ యగ్రిసు గర్సన్ … ఇల్లా కాన మా ఉకిల మిన్హు లహూ సదఖహ్)
ఏ ముస్లిమైనా ఒక మొక్కను నాటితే… దాని నుండి తినబడిన ప్రతి దానికీ అతనికి సదకా పుణ్యం లభిస్తుంది.

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే ఒక చెట్టును నాటుతాడు. నాటిన తర్వాత, ఆ చెట్టు నుంచి ప్రయోజనం పొందే, లాభం పొందే ఆ ప్రతి వ్యక్తికి బదులుగా ఆ చెట్టు నాటిన వ్యక్తికి సదకా వస్తుంది. సదకా అంత పుణ్యం వస్తుంది. అంటే, ఏ వ్యక్తి అయితే చెట్టు నాటుతాడో, చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు ద్వారా కొందరు నీడ తీసుకుంటారు, నీడలో కూర్చుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. అది కూడా సదకా. ఆ చెట్టు ఫలం ఎవరైతే తింటారో అది కూడా సదకా క్రిందికి వస్తుంది.

అభిమాన సోదరులారా, అలాగే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, దారి నుండి హాని కలిపించే, ఇబ్బంది కలిగించే వస్తువును తొలగించటం కూడా సదకా క్రిందికి వస్తుంది అని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అభిమాన సోదరులారా, ఇక చివర్లో, మూడు రకాల సదకా ఉంది. అది వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మూడు రకాల సదకాలు ఉన్నాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు:

إِذَا مَاتَ ابْنُ آدَمَ انْقَطَعَ عَمَلُهُ إِلاَّ مِنْ ثَلاثٍ
(ఇదా మాత ఇబ్ను ఆదమ ఇన్ఖత’అ అమలుహు ఇల్లా మిన్ సలాస్)
ఆదం సంతతి వాడు (మానవుడు) మరణించినప్పుడు, అతని కర్మలు మూడు విషయాలు తప్ప ఆగిపోతాయి.

ఆదం సంతతికి చెందినవాడు అంటే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, చనిపోయిన తర్వాత కర్మలు అంతమైపోతాయి. ఇప్పుడు అతనికి పాపం, పుణ్యం అనేది ఉండదు, మనిషి చనిపోయాడు. చనిపోక ముందు వరకే కదా, పాపం చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, సదాచరణ చేస్తున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఇలా కర్మలు చేయటం అనేది చావు వరకు. చనిపోయిన తర్వాత ప్రతిఫలం మాత్రమే గాని, కర్మ అనేది ఉండదు.

ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, అతని అమల్ (కర్మ) ఇన్ఖతా అయిపోతుంది, కట్ అయిపోతుంది. మూడు విషయాలు తప్ప అన్నారు ప్రవక్త గారు, ఇది గమనించాల్సిన విషయం. మూడు విషయాలు తప్ప.

ఒకటి,

صَدَقَةٌ جَارِيَةٌ
(సదఖతున్ జారియహ్)
నిరంతరం కొనసాగే దానం (సదకా-ఎ-జారియా).

ఎటువంటి సదకా అంటే అది జారియాగా ఉండాలి, కంటిన్యూగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మస్జిద్ నిర్మించాడు. ఆ మస్జిద్ ఉన్నంతకాలం, ఆ మస్జిద్ లో నమాజ్ జరిగేంతకాలం ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మస్జిద్ నిర్మించడం, మద్రసా నిర్మించడం, వృక్షాలు నాటటం, బావి త్రవ్వించడం, ఈ విధంగా. దీనికి సదకా జారియా అంటారు. పుణ్యం లభిస్తూనే ఉంటుంది, అది ఉన్నంత వరకు.

రెండవది,

عِلْمٌ يُنْتَفَعُ بِهِ
(ఇల్మున్ యున్తఫ’ఉ బిహీ)
ప్రజలకు ఉపయోగపడే జ్ఞానం.

ప్రజలకు విద్యాబోధన చేయటం, విద్య నేర్పించటం, ప్రజలకు సన్మార్గం చూపే గ్రంథాలు రాయటం, విద్యార్థులను తయారు చేయటం. అంటే, జ్ఞానం అన్నమాట. ఏ వ్యక్తి అయితే జ్ఞానం వదిలిపోతాడో, విద్య వదిలిపోతాడో. అది చాలా రకాలుగా ఉండవచ్చు. ఒకటి, తన విద్యార్థులను వదిలి వెళ్ళాడు, నేర్పించి పోయాడు. ఖురాన్ ని, హదీస్ ని, అల్లాహ్ వాక్యాలను, ప్రవక్త గారి ప్రవచనాలను, దీన్ నేర్పించి పోయాడు. అతని శిష్యులు వేరే వారికి నేర్పుతారు, వారు వేరే వారికి నేర్పుతారు. ఈ చైన్ సాగుతూనే ఉంటుంది ప్రళయం వరకు. అప్పటి వరకు ఆ వ్యక్తికి పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి రాసిపోయాడు, కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివి చాలా మంది సన్మార్గం పొందుతున్నారు, మంచి విషయాలు నేర్చుకుంటున్నారు, పాపం నుంచి ఆగిపోతున్నారు. మరి ఆ పుస్తకం ఉన్నంతవరకు, ఆ పుస్తకాల ద్వారా నేర్చుకునే వారందరి వల్ల ఆ వ్యక్తికి పుణ్యం పోతూనే ఉంటుంది.

మూడవది,

وَلَدٌ صَالِحٌ يَدْعُو لَهُ
(వలదున్ సాలిహున్ యద్’ఊ లహూ)
అతని కోసం ప్రార్థించే సజ్జనుడైన సంతానం.

తల్లిదండ్రుల మన్నింపు కొరకు ప్రార్థించే సదాచార సంపన్నులైన సంతానాన్ని వదిలి వెళ్ళటం. అంటే అమ్మ నాన్న కోసం దుఆ చేసే సంతానం. మరి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ ఎప్పుడు చేస్తారండీ? వారికి మనము ఆ విధంగా తయారు చేయాలి, నేర్పించాలి. వారికి దీన్ నేర్పించాలి, హలాల్ నేర్పించాలి, హరాం అంటే ఏమిటో తెలియజేయాలి, ఖురాన్ నేర్పించాలి, ఇస్లాం అంటే ఏమిటో వారికి నేర్పించాలి. వారికి మనము నేర్పిస్తే, అటువంటి సంతానం అమ్మ నాన్న కోసం దుఆ చేస్తూ ఉంటుంది. ఆ సంతానం దుఆ చేస్తూ ఉంటే, దాని పుణ్యం అమ్మ నాన్న చనిపోయినా కూడా పుణ్యం పోతూనే ఉంటుంది. ఈ మూడు రకాల సదకాలు మనిషి మరణం తర్వాత కూడా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. సదకా జారియా, రెండవది ఇల్మ్, మూడవది సంతానం.

అభిమాన సోదరులారా, రమదాన్ కి సంబంధించిన మరెన్నో విషయాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.

وَصَلَّى اللهُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ
(వ సల్లల్లాహు అలా నబియ్యినా ముహమ్మద్, వ అలా ఆలిహి వ సహ్ బిహీ అజ్ మ’ఈన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43591

దైవప్రవక్త ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడం!  – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

దైవప్రవక్త ముహమ్మద్ ﷺ పై దరూద్ పంపడం!
https://youtu.be/fmFOIVupMt8 [11 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించడం యొక్క విశిష్టత మరియు ప్రాముఖ్యత వివరించబడింది. దరూద్ అంటే ఏమిటి, అల్లాహ్, దైవదూతలు మరియు విశ్వాసులు పంపే దరూద్ మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టం చేయబడింది. దరూద్ పఠించడం వల్ల కలిగే అపారమైన పుణ్యాలు, పాపాల క్షమాపణ, ఉన్నత స్థాయిలు మరియు ప్రళయ దినాన ప్రవక్త సిఫారసుకు అర్హులు కావడం వంటి ప్రయోజనాలు హదీసుల వెలుగులో చర్చించబడ్డాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున అధికంగా దరూద్ పంపాలని ప్రోత్సహించబడింది. ప్రవక్త పేరు విన్న తర్వాత కూడా దరూద్ పంపని వారిని ప్రవక్త శపించినట్లుగా హెచ్చరించబడింది. చివరగా, నమాజులో పఠించే ‘దరూద్ ఇబ్రాహీం’ యొక్క పదాలను నేర్పిస్తూ, దానిని ఎక్కువగా పఠించాలని ఉపదేశించబడింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ అదహు, అమ్మా బ అద్.

ప్రియ వీక్షకులారా! కారుణ్య వర్షి రమజాన్ అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

అభిమాన సోదరులారా! ఈరోజు మనం ఇన్ షా అల్లాహ్ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించటం గురించి తెలుసుకుందాం. అంటే దరూద్ విశిష్టత అని అర్థం. దరూద్ యొక్క విశిష్టత ఏమిటి? కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం.

అభిమాన సోదరులారా! దరూద్ విశిష్టత కొరకు ఈ ఒక్క ఆయత్ మనకి సరిపోతుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ అహ్జాబ్ లో తెలియజేశాడు.

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا
(ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్నబి, యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లూ అలైహి వ సల్లిమూ తస్లీమా)

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)

ఓ విశ్వాసులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం అల్లాహ్ దరూద్ పంపుతాడు. దైవదూతలు దరూద్ పంపుతారు ప్రవక్త పైన. ఓ విశ్వాసులారా మీరు కూడా దరూద్ సలాం పంపించండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అంటే ఈ ఆయత్ లో ప్రవక్త పైన దరూద్ అల్లాహ్ పంపుతాడు, దైవదూతలు పంపుతారు, మీరు కూడా పంపండి విశ్వాసులారా అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు.

మరి దరూద్ అంటే ఏమిటి? దరూద్ అరబీలో సలాత్ అంటారు. అంటే, ఈ ఆయత్ లో, అల్లాహ్ దరూద్ పంపుతాడు అంటే, కారుణ్య వర్షం కురిపిస్తాడు అని అర్థం. అల్లాహ్ ప్రవక్త పైన దరూద్ పంపుతాడు అంటే, కారుణ్య వర్షం కురిపించటం అని. దైవదూతలు దరూద్ పంపుతారు అంటే, మన్నింపు కోసం, ఉన్నత సోపానాల కోసం ప్రార్థిస్తారన్నమాట. ఇది దైవదూతల దరూద్ అంటే. విశ్వాసుల దరూద్ అంటే, శ్రేయస్సు కోసం దుఆ చేయటం అని అర్థం.

ఈ దరూద్ గురించి ముస్లిం షరీఫ్ లో ఒక హదీస్ ఉంది.

مَنْ صَلَّى عَلَيَّ صَلَاةً صَلَّى اللَّهُ عَلَيْهِ بِهَا عَشْرًا
“మన్ సల్ల అలయ్య సలాతన్, సల్లల్లాహు అలైహి బిహా అషరన్”
నాపై దరూద్ పఠించిన వ్యక్తి మీద అల్లాహ్ పది కారుణ్యాలు కురిపిస్తాడు.

ఎవరైతే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపుతారో, ఆ వ్యక్తికి అల్లాహ్ పది కారుణ్యాలు కురిపిస్తాడు.

ఇంకో హదీస్ లో ఉంది,

مَنْ صَلَّى عَلَىَّ وَاحِدَةً صَلَّى اللَّهُ عَلَيْهِ عَشْرَ صَلَوَاتٍ وَحُطَّتْ عَنْهُ عَشْرُ خَطِيئَاتٍ وَرُفِعَتْ لَهُ عَشْرُ دَرَجَاتٍ
“మన్ సల్ల అలయ్య వాహిదతన్ సల్లల్లాహు అలైహి అషర సలవాత్, వహుత్త అన్హు అషర ఖతీయ్యాత్, వ రఫ అషర దరజాత్”.

“ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఒక్కసారి దరూద్ పంపుతాడో, ఒక్కసారి, దరూద్ పంపుతాడో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని పైన పది సార్లు కారుణ్యం పంపుతాడు, కురిపిస్తాడు. అలాగే అతని పది పాపాలు మన్నిస్తాడు. అలాగే అతని పది దరజాత్ (స్థాయి) పెంచుతాడు.”

ఇది దరూద్ యొక్క విశిష్టత. ఒక్కసారి దరూద్ పంపితే అల్లాహ్ మనపై పది కారుణ్యాలు కురిపిస్తాడు, అల్లాహ్ మన పది పాపాలు మన్నిస్తాడు, అల్లాహ్ మన పది స్థాయిలని పరలోకంలో పెంచుతాడు.

అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఇలా తెలియజేశారు,

أَوْلَى النَّاسِ بِي يَوْمَ الْقِيَامَةِ أَكْثَرُهُمْ عَلَيَّ صَلاَةً
“అవ్లన్నాసి బీ యౌమల్ ఖియామా, అక్సరుహుం అలయ్య సలాత్”.
ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ పంపుతారో వారు అత్యంత చేరువులో ఉంటారు ప్రవక్త గారికి.

ప్రళయ దినాన అత్యంత చేరువులో ఉండే వారు ఎవరు? ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అత్యంత చేరువులో ఉంటారు. ఎవరంటే ఎవరైతే అత్యధికంగా ప్రవక్త పైన దరూద్ పంపుతారో. ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎక్కువగా దరూద్ పంపుతారో వారు అత్యంత చేరువులో ఉంటారు ప్రవక్త గారికి. దానికి అర్థం ఏమిటి? అంతిమ ప్రవక్త సిఫారసుకి హక్కుదారులు అవుతారు అని అర్థం. ఎంత ఎక్కువగా దరూద్ పంపుతామో, ఆ వ్యక్తి అంత ఎక్కువగా పరలోకంలో సిఫారసుకి హక్కుదారుడు అవుతారని అర్థం.

అలాగే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు,

إِنَّ مِنْ أَفْضَلِ أَيَّامِكُمْ يَوْمَ الْجُمُعَةِ فَأَكْثِرُوا عَلَىَّ مِنَ الصَّلاَةِ فِيهِ فَإِنَّ صَلاَتَكُمْ مَعْرُوضَةٌ عَلَىَّ
“ఇన్న మిన్ అఫ్జలి అయామికుం యౌమల్ జుమా ఫ అక్సిరూ అలయ్య మినస్సలాతి ఫీహి ఫ ఇన్న సలాతకుం మ అరూదతున్ అలయ్య””.

“వారానికి ఏడు రోజుల్లో ఉన్నతమైన, శ్రేష్ఠమైన రోజు యౌముల్ జుమా, జుమా రోజు. కావున ఓ ప్రజలారా మీరు ఆ రోజు అత్యధికంగా నాకు దరూద్ పంపించండి. ఎందుకంటే మీరు పంపించే దరూద్ నా పైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చేర్పిస్తాడు.”

అభిమాన సోదరులారా! ఎవరికి ఇష్టం ఉండదు ప్రవక్త గారు సిఫారసు చేయాలని? కోరుకుంటాము. ప్రార్థిస్తూ ఉంటాము. ఓ అల్లాహ్, రేపు ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు నాకు పొందాలి అని దుఆ చేస్తూ ఉంటాము. “నా పై దరూద్ పంపండి, దరూద్ పఠించండి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తారో వారు నా సిఫారసుకి హక్కుదారులు అవుతారు” అని ప్రవక్త గారు అంటున్నారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసుకి హక్కుదారులు అవ్వాలంటే మనం అత్యధికంగా దరూద్ పఠిస్తూ ఉండాలి.

అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు,

رَغِمَ أَنْفُ رَجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ
“రగిమ అన్ఫు రజులిన్ జుకిర్తు ఇందహు ఫలమ్ యుసల్లి అలయ్య”
ఏ వ్యక్తి దగ్గర నా ప్రస్తావన వస్తుందో, నా ప్రస్తావన విని కూడా నా పైన దరూద్ పఠించడో, దరూద్ పంపడో, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక”

అంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, “రగిమ అన్ఫు రజులిన్”, అల్లాహ్ ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అన్నారు. ఏ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక? ఏ వ్యక్తి దగ్గర నా ప్రస్తావన వస్తుందో, నా ప్రస్తావన విని కూడా నా పైన దరూద్ పఠించడో, దరూద్ పంపడో, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అని శపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ ముక్కుకి మన్ను తగులుగాక అంటే అర్థం ఏమిటి? అవమానం, పరాభవం పాలుగాక అని అర్థం. అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని, ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా ప్రవక్త పైన దరూద్ పంపకపోతే వారు శాపగ్రస్తులు అవుతారు.

అలాగే మనము చాలాసార్లు విని ఉంటాము. ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ పైన ఎక్కేటప్పుడు తొలి మెట్టు పైన ఆమీన్, రెండవ సారి ఆమీన్, మూడోసారి ఆమీన్ అన్నారు. అది ఏమిటి? ప్రతీ ఆమీన్ కి ఒక సందర్భం ఉంది, ఒక సంఘటన ఉంది. ఒకటి ఏమిటి దాంట్లో? జిబ్రయీల్ దైవదూత శపిస్తున్నారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట విని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని, ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఆయన పైన దరూద్ పంపడో, వాడు నరకంలో పోవుగాక అని జిబ్రయీల్ దైవదూత ఈ దుఆ చేస్తే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అన్నారు. దీంతో అర్థమవుతుంది దరూద్ విశిష్టత.

అభిమాన సోదరులారా! చివర్లో ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, అది ఏమిటంటే, దరూద్ ఎలా పంపాలి? దరూద్ పలుకులు ఏమిటి అని సహాబాలు అడిగారు. ఓ ప్రవక్తా, మేము నమాజులో సలాం చేసే పద్ధతి మాకు తెలుసు కాబట్టి మేము సలాం చేస్తున్నాము. మేము అంటున్నాం నమాజులో, అత్తహియ్యాత్ లో. అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహమతుల్లాహి వ బరకాతుహు అని సలాం పంపుతున్నాము. కానీ ఈ దరూద్ ఎలా పంపాలి? దరూద్ వచనాలు ఏమిటి అని అడిగితే, అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పలుకులు నేర్పించారు.

اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا صَلَّيْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ كَمَا بَارَكْتَ عَلَى إِبْرَاهِيمَ وَعَلَى آلِ إِبْرَاهِيمَ إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ

అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్.

ఇవి దరూద్ పలుకులు. ఇవి కొన్ని పదాల హెచ్చుతగ్గులతో అనేక పదాలతో హదీస్ పుస్తకాలలో ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ పేరు పొందిన, ఫేమస్ అయిన పదాలు ఇవి.

ఈ దరూద్ ని మనం నమాజులో కూడా చదువుతాము అత్తహియ్యాత్ లో. అందుకు మనము అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అత్యధికంగా దరూద్ పంపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజు అత్యధికంగా పఠించాలి. ఈ మాసాన్ని మహా భాగ్యంగా భావించుకుని అనేక సార్లు, అత్యధికంగా దరూద్ పంపిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తామో, అంత ఎక్కువగా ఛాన్స్ ఉంది ప్రవక్త గారి సిఫారసు పొందటానికి. అల్లాహ్ కారుణ్యం పొందటానికి. అల్లాహ్ కారుణ్యం పొందటానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది.

చివర్లో అల్లాహ్ తో ప్రార్థిస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అత్యధికంగా దరూద్ పఠించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయన పైన దరూద్ పంపించి అల్లాహ్ యొక్క కారుణ్యానికి, అంతిమ దైవ ప్రవక్త యొక్క సిఫారసుకి హక్కుదారులు అయ్యేవారిలో అల్లాహ్ మనల్ని చేర్పించుగాక, ఆమీన్.

వ ఆఖిరు ద అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43363

విశ్వాసుల మధ్య స్నేహం – షేక్ హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]

విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి?
https://youtu.be/VIPOLPgJOa4 [8 నిముషాలు]
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగం ఇస్లాంలో విశ్వాసుల మధ్య స్నేహం యొక్క భావనను వివరిస్తుంది. ఈ స్నేహం ఏకేశ్వరోపాసన (తౌహీద్) కోసం పరస్పర ప్రేమ మరియు సహకారంపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. వక్త సూరా అత్-తౌబా, 71వ ఆయతును ఉటంకిస్తూ, విశ్వాసులను మంచిని ఆజ్ఞాపించే, చెడును నిషేధించే, నమాజ్ స్థాపించే, జకాత్ ఇచ్చే, మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపే పరస్పర మిత్రులుగా వర్ణించారు. ఇంకా, ఈ బంధాన్ని వివరించడానికి రెండు హదీసులు సమర్పించబడ్డాయి: మొదటిది విశ్వాసులను ఒక గోడలోని ఇటుకలతో పోలుస్తుంది, ప్రతి ఒక్కటి మరొకదాన్ని బలపరుస్తుంది, రెండవది విశ్వాసుల సమాజాన్ని సమిష్టిగా నొప్పిని అనుభవించే ఒకే శరీరంతో పోలుస్తుంది. విశ్వాసులు ఒకరికొకరు బలం, మద్దతు మరియు కరుణకు మూలంగా ఉండాలనేది ప్రధాన సందేశం.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్.

ఆత్మీయ సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈరోజు మనం విశ్వాసులతో స్నేహం అంటే ఏమిటి? అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం.

విశ్వాసులతో స్నేహం అంటే, మువహ్హిదీన్‌లను అనగా ఏక దైవారాధకులైన విశ్వాసులను ప్రేమించడం, వారితో సహకరించడం అన్నమాట.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరత్ తౌబా, ఆయత్ 71లో ఇలా సెలవిచ్చాడు.

وَالْمُؤْمِنُونَ وَالْمُؤْمِنَاتُ بَعْضُهُمْ أَوْلِيَاءُ بَعْضٍ ۚ يَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَيُطِيعُونَ اللَّهَ وَرَسُولَهُ ۚ أُولَٰئِكَ سَيَرْحَمُهُمُ اللَّهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ

విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారంతా ఒండొకరికి మిత్రులుగా (సహాయకులుగా, చేదోడు వాదోడుగా) ఉంటారు. వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు. చెడుల నుంచి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్‌ను చెల్లిస్తారు. అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు. అల్లాహ్‌ అతిత్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే. నిస్సందేహంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, వివేచనాశీలి.(9:71)

ఈ ఆయతులో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా విశ్వాసుల సద్గుణాల ప్రస్తావన చేశాడు. విశ్వాసుల యొక్క సద్గుణాలను ప్రస్తావించాడు. మొదటి సద్గుణం ఏమిటంటే వారు, అంటే విశ్వాసులు, పురుషులైనా, స్త్రీలైనా, విశ్వాసులు, విశ్వాసులైన పురుషులు, విశ్వాసులైన స్త్రీలు, వారు పరస్పరం స్నేహితులుగా మసులుకుంటారు. ఒండొకరికి సహాయ సహకారాలు అందించుకుంటారు. సుఖదుఃఖాలలో పాలుపంచుకుంటారు అన్నమాట.

మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు.

الْمُؤْمِنُ لِلْمُؤْمِنِ كَالْبُنْيَانِ يَشُدُّ بَعْضُهُ بَعْضًا
(అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్, యషుద్దు బ’అదుహు బా’దా)
ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక, ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. (బుఖారీ మరియు ముస్లిం)

అంటే ఒక విశ్వాసి, సాటి విశ్వాసికి గోడ లాంటివాడు. ఆ గోడలోని ఒక ఇటుక ఇంకో ఇటుకకు పుష్టినిస్తుంది. సుబ్ హా నల్లాహ్! అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విశ్వాసికి మరో విశ్వాసికి మధ్య ఉండే సంబంధాన్ని ఈ హదీసులో వివరించారు. అల్ ముఅమిను లిల్ ముఅమిని కల్ బున్యాన్. కట్టడం లాంటివాడు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి కట్టడం లాంటివాడు, గోడ లాంటివాడు. ఎందుకంటే ఒక గోడలో ఒక ఇటుక, ఇంకో ఇటుకకు బలం ఇస్తుంది, పుష్టినిస్తుంది. విశ్వాసులు కూడా పరస్పరం అలాగే ఉంటారు, ఉండాలి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించిన మాట. అలాగే, అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో హదీసులో ఇలా సెలవిచ్చారు.

مَثَلُ الْمُؤْمِنِينَ فِي تَوَادِّهِمْ وَتَرَاحُمِهِمْ وَتَعَاطُفِهِمْ مَثَلُ الْجَسَدِ إِذَا اشْتَكَى مِنْهُ عُضْوٌ تَدَاعَى لَهُ سَائِرُ الْجَسَدِ بِالسَّهَرِ وَالْحُمَّى

(మసలుల్ ముఅమినీన ఫీ తవాద్దిహిమ్ వ తరాహుమిహిమ్ వ త’ఆతుఫిహిమ్ మసలుల్ జసద్, ఇజష్ తకా మిన్హు ఉద్వున్ తదాఆ లహూ సాయిరుల్ జసది బిస్సహరి వల్ హుమ్మా)

పరస్పర ప్రేమానురాగాలను పంచుకోవటంలో, ఒండొకరిపై దయ చూపటంలోనూ, విశ్వాసుల (ముఅమినీన్‌ల) ఉపమానం ఒక శరీరం లాంటిది. శరీరంలోని ఏదైనా ఒక అవయవం బాధకు గురైనప్పుడు, మొత్తం శరీరానికి నొప్పి కలుగుతుంది. శరీరమంతా వ్యాకులతకు లోనవుతుంది. (ముస్లిం)

ఈ హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రేమానురాగాల విషయంలో, దయ చూపే విషయంలో ఒండొకరికి ఒకరు సహాయం చేసుకునే విషయంలో, చేదోడు వాదోడుగా ఉండే విషయంలో, పరస్పరం కలిసిమెలిసి ఉండే విషయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ ఒక శరీరం లాంటి వారు. శరీరంలోని ఒక భాగానికి బాధ అయితే, మొత్తం శరీరం బాధపడుతుంది. అదే ఉపమానం ఒక విశ్వాసిది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు.

అత్మీయ సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ నిజమైన విశ్వాసిగా జీవించే సద్బుద్ధిని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మరిన్ని వివరాలు ఇన్ షా అల్లాహ్ వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43226


అధర్మమైన వసీలా (అల్లాహ్ సామీప్యాన్ని పొందే సాధనం) – హబీబుర్ రహ్మాన్ జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

అధర్మమైన సమ్మతమైన వసీలా
https://youtu.be/mh_RqyUcea4 [13 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామి’ఈ(హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ‘వసీలా’ (అల్లాహ్‌కు సాన్నిహిత్యం కోరే సాధనం) అనే భావనను వివరిస్తున్నారు. ధర్మ సమ్మతమైన మరియు అధర్మమైన వసీలాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు. ధర్మబద్ధమైన మార్గం కేవలం ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ద్వారానే నిర్దేశించబడిందని నొక్కిచెప్పారు. ముఖ్యంగా, మరణించిన వారి ద్వారా, వారు ప్రవక్తలు లేదా పుణ్యాత్ములు అయినప్పటికీ, సహాయం కోరడం లేదా దుఆ చేయడం నిషిద్ధమని వివరించారు. ఆరాధన “ఎవరి కోసం” మరియు “ఎలా” అనే ఇబ్నె తైమియా సూత్రాన్ని ఉటంకించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) కాలంలో కరువు ఏర్పడినప్పుడు, వర్షం కోసం దుఆ చేయడానికి మరణించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కాకుండా, జీవించి ఉన్న ప్రవక్త పినతండ్రి అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను వసీలాగా చేసుకున్న చారిత్రక ఉదాహరణను అందించారు. దీని ద్వారా జీవించి ఉన్న పుణ్యాత్ముల ద్వారా మధ్యవర్తిత్వం కోరవచ్చని, కానీ మృతుల ద్వారా కాదని స్పష్టం చేశారు. అలాగే, ‘ఇస్తిఆనత్’ (ప్రాపంచిక విషయాలలో అనుమతించబడిన సహాయం) మరియు ‘ఇస్తిగాసా’ (కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల విషయాలలో సహాయం కోరడం) మధ్య తేడాను వివరిస్తూ, రెండోది అల్లాహ్ యేతరుల నుండి కోరడం హరామ్ అని తేల్చిచెప్పారు.

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالْعَاقِبَةُ لِلْمُتَّقِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِيْنَ، وَمَنْ تَبِعَهُمْ بِإِحْسَانٍ إِلَى يَوْمِ الدِّيْنِ، أَمَّا بَعْدُ.

(అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, వ మన్ తబిఅహుమ్ బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్, అమ్మా బాద్.)

సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు. అంతిమ విజయం దైవభీతిపరులకే. ప్రవక్తల నాయకులు, దైవసందేశహరులందరిపై మరియు ప్రళయదినం వరకు వారిని సన్మార్గంలో అనుసరించేవారిపై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురుపించుగాక. ఆ తర్వాత…

అభిమాన సోదరులారా! ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమములోకి మీ అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

అభిమాన సోదరులారా! గత ఎపిసోడ్లో మనం ధర్మ సమ్మతమైన వసీలా గురించి తెలుసుకున్నాం. అవి తప్ప వేరే ఇతర పద్ధతుల ద్వారా ఆశ్రయం పొందటం అది అధర్మమైన వసీలా అవుతుంది.

ప్రియ సోదరులారా! అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన రుజుమార్గం కొరకు, సత్యమార్గం కొరకు ఒక మార్గాన్ని, ఒక దారిని, ఒక గీటురాయిని తెలియజేశాడు, చూపించాడు. సత్యం ఏమిటి? అసత్యం ఏమిటి? న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? స్వర్గానికి పోయే దారి ఏమిటి? నరకానికి పోయే దారి ఏమిటి? మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అంతిమ గ్రంథం, దివ్య గ్రంథం ఖురాన్ మజీద్ ని అవతరింపజేశాడు. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు, ప్రవచనాలు. ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసులలో మన జీవన విధానం, ఈ లోకంలో, ప్రపంచంలో, ఇహంలో మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, అల్లాహ్ ను ఎలా వేడుకోవాలి, ఎలా వేడుకోకూడదు, ఇవన్నీ మనకు తెలియజేయడం జరిగింది ఖురాన్ లో మరియు హదీస్ లో.

అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తప్ప ఇతర మార్గం ఎన్నుకుంటే, అది మన బుద్ధికి, మన తెలివికి సరైనది అని అనిపించినా, అది ఖురాన్ పరంగా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విధానం పరంగా లేకపోతే, అది ధర్మ సమ్మతం కాదు అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి.

అందుకే షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియా రహ్మతుల్లాహి అలై ఒక చక్కని సూత్రం చెప్పారు. అది ఏమిటంటే:

مَنْ تَعْبُدُ؟ كَيْفَ تَعْبُدُ؟
(మన్ త’అబుద్? కైఫ త’అబుద్?)
ఎవరిని ఆరాధించాలి? ఆ ఆరాధన ఎలా చేయాలి?

ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎవరి కొరకు? కైఫ త’అబుద్, ఆ ఆరాధన ఎలా చేయాలి? సూటిగా చెప్పాలంటే, ఆరాధన, ఇబాదత్ ఎవరి కోసం? ఆ ఇబాదత్ ఎలా చేయాలి? రెండే రెండు విషయాలు. దీనికి సూటిగా చెప్పాలంటే చక్కని సమాధానం: ఆరాధన కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆ ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధానం ప్రకారమే.

అభిమాన సోదరులారా! కావున ఈ ధర్మ సమ్మతం కాని విషయాలలో, ధర్మ సమ్మతం కాని వసీలాలలో ఉదాహరణకు ఒకటి ఏమిటి? మృతులను దుఆ చేయమని కోరటం. మృతులను, పరమపదించిన వారిని దుఆ చేయమని కోరటం, వారిని వసీలాగా తీసుకోవటం, వాస్తాగా తీసుకోవటం, ఇది ఇస్లాంలో అధర్మం అని మనం తెలుసుకోవాలి.

అది ఎవరైనా సరే, పుణ్య పురుషులు కావచ్చు, ఔలియాలు కావచ్చు, అలాగే దైవ ప్రవక్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే, మరణించిన వారి సహాయం కోరటం, వారి వసీలాను కోరటం, వారి వసీలా ద్వారా దుఆ చేయటం ఇది ఇస్లాంలో సమ్మతం కాదు. ఎందుకంటే, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు – ఇది ప్రామాణికమైన హదీస్, అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది, సహీహ్ హదీస్ ఇది, ప్రామాణికమైన హదీస్ ఇది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు, ముఆవియా బిన్ అబూ సుఫ్యాన్ రదియల్లాహు అన్హులు వారు గానీ, ఇతర సహాబాలు గానీ, తాబయీన్లు గానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత వారి ద్వారా దుఆ చేయలేదు, వారి వసీలా తీసుకోలేదు. ఇది ముఖ్యమైన విషయం, గమనించాల్సిన విషయం ఇది. మనకంటే ఎక్కువ జ్ఞానం గలవారు, మనకంటే ఎక్కువ ఖురాన్, హదీస్ తెలిసినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌కు భయపడేవారు, మనకంటే ఎక్కువ దైవభీతి కలిగినవారు, మనకంటే ఎక్కువ అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనకంటే ఎక్కువ ధర్మ జ్ఞానం కలిగినవారు, సహాబాలు, తాబయీన్లు, ధర్మ పండితులు, ముహద్దసీన్లు, వారు కరువు కాటకాలు వచ్చినప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను వసీలాగా తీసుకున్నారా? తీసుకోలేదు.

ఇంకా, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దుఆ చేసేవారు. పోయి, “ఓ దైవ ప్రవక్త! కరువు వచ్చింది, వర్షం లేదు, నీరు వలన మనుషులు, జంతువులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ దైవ ప్రవక్త, దుఆ చేయండి” అని కోరేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసేవారు. ఇది మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం.

కాకపోతే, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత సహాబాలు, ఆ తర్వాత కాలానికి చెందిన వారు, వారెవరైనా ప్రవక్తల, మృతుల, చనిపోయిన పుణ్యాత్ముల వసీలా తీసుకునేవారా? కాదు. ఒక హదీస్ ఇలా ఉంటుంది.

ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు త’ఆలా అన్హు యొక్క వేడుక: “ఓ అల్లాహ్! గతంలో మేము మా ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము, నీవు వర్షం కురిపించి మా కరువు తీర్చే వాడివి. ఇప్పుడు మేము మా ప్రవక్త బాబాయి గారిని ఆశ్రయించి నిన్ను ప్రార్థిస్తున్నాము. కనుక మాపై వర్షం కురిపించు” అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ప్రార్థించేవారు.

దీంట్లో స్పష్టంగా ఏముంది? స్పష్టంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తెలియజేస్తున్నారు. “ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నంత వరకు ప్రవక్త ద్వారా నిన్ను అర్థించే వారము.” అంటే ఇప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేరు కాబట్టి, పరమపదించారు కాబట్టి, ఇప్పుడు మనము ప్రవక్త గారి బాబాయి అయిన, పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అన్హు గారిని ఆశ్రయించి, అబ్బాస్ గారి ద్వారా నిన్ను వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే అప్పుడు అబ్బాస్ రదియల్లాహు త’ఆలా అన్హు బ్రతికి ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం.

అంటే దీని సారాంశం ఏమిటి అభిమాన సోదరులారా? అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నంత వరకు సహాబాలు ప్రవక్త ద్వారా ప్రార్థించేవారు. ఆయన పరమపదించిన తర్వాత కరువు వస్తే, ప్రవక్తగారి పినతండ్రి అబ్బాస్ రదియల్లాహు అన్హు ద్వారా దుఆ చేసేవారు. దీనితో అర్థం ఏమైందంటే, చనిపోయిన వారి ద్వారా దుఆ చేయకూడదు. వారిని వసీలాగా తీసుకోకూడదు. ఎవరైతే పుణ్యాత్ములు, దైవభీతిపరులు, తఖ్వా గలవారు బ్రతికి ఉన్నారో, వారి ద్వారా దుఆ చేయవచ్చుమని మనకు అర్థమవుతుంది.

అలాగే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తు, వేరే ఇతరుల అంతస్తులను వసీలాగా కూడా చేసుకోకూడదు. ప్రవక్త గారి అంతస్తును, ఇతర వారి అంతస్తులను కూడా ఆసరాగా చేసుకోకూడదు, వసీలాగా చేసుకోకూడదు. ఒక్క హదీస్ ఉంది, ఆ హదీస్ కి కొందరు ఆధారంగా తీసుకుంటారు, అది సమంజసం కాదు. ఆ హదీస్ ఏమిటంటే:

“ఇదా సఅల్తుముల్లాహ ఫస్ అలూహు బిజాహీ, ఫ ఇన్న జాహీ ఇందల్లాహి అజీమ్”.

ఈ హదీస్, దీని అర్థం ఏమిటి? “మీరు అల్లాహ్ ను అడిగితే నా హోదాను, అంతస్తులను ఆసరాగా చేసుకుని అడగండి, ఎందుకంటే నా స్థాయి చాలా గొప్పది” అని ఇది ఆ ఒక ఉల్లేఖనం ఉంది. ఇది కాల్పనిక హదీస్, ‘మౌజూ’, ‘మన్ ఘడత్’. ఇది కాల్పనిక హదీస్, సత్యం లేశమైనా దీంట్లో లేదు అని గ్రహించాలి. ఈ హదీస్‌ను ఆధారంగా తీసుకోవటం కరెక్ట్ కాదు, సమ్మతం కాదు, న్యాయం కాదు. ఎందుకంటే ఇది ‘మౌజూ’, ‘మన్ ఘడత్’ హదీస్ ఇది.

అలాగే, సృష్టితాలలో ఏ ఒక్కరి అస్తిత్వాన్నైనా ఆధారంగా చేసుకోవటం ధర్మ సమ్మతం కాదు. ఎందుకంటే, ఎటువంటి ఆధారాలు ఖురాన్ లో గానీ, ప్రామాణికమైన హదీసులలో గానీ లేవు.

అభిమాన సోదరులారా! అలాగే సృష్టితాలను సహాయం చేయమని కోరటం రెండు రకాలు. ఒకటి ఇస్తిఆనత్, ఇది సమ్మతమే. ఇస్తిఆనత్ అంటే ఏమిటి? ఏదైనీ వ్యవహారములో సహాయం కోరటం. ఉదాహరణకు స్నేహితులు, అమ్మ నాన్న, భార్య, భర్త, సంతానము, పిల్లలు… బ్రతికి ఉన్నారు, వారితో మనం జీవిస్తున్నాము, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, ఇచ్చు పుచ్చుకోవటం. ఇది సమ్మతమే. ఇంకా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో ఇలా తెలియజేశాడు:

وَتَعَاوَنُوا عَلَى الْبِرِّ وَالتَّقْوَى
(వ తఆవనూ అలల్ బిర్రి వత్తఖ్వా)
పుణ్యకార్యాలలో, దైవభీతితో కూడిన విషయాలలో పరస్పరం సహకరించుకోండి. (సూరె మాయిదా: 2)

ఒకరి సహాయం కోరటము, “నాకు ఈ పని చేసి పెట్టండి, ఫలానా వస్తువు తీసుకొని రండి, ఇది వారికి ఇచ్చివేయండి”, అంటే ఇది ఇస్తిఆనత్. పరస్పరం ఇటువంటి విషయాలలో సహాయం చేసుకోవచ్చు. ఇది దాంట్లో రాదు.

సృష్టితాల సహాయంలో రెండవది ఏమిటి? ఇస్తిగాసా. ఇస్తిగాసా అంటే, అల్లాహ్ మాత్రమే చేయగలిగే పనులను, అల్లాహ్ మాత్రమే చేయగలిగే విషయాలను మృతులను కోరటం. ఏ పని అయితే అల్లాహ్ మాత్రమే చేస్తాడో, ఏది అయితే అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమో, అటువంటివి సృష్టితాలతో కోరటం, ఇది కూడా అధర్మం కిందకి వస్తుంది. కేవలం అల్లాహ్‌కు సాధ్యమైన విషయాల కొరకు, బ్రతికి ఉన్న వారిని అర్థించటం ఇది కూడా ధర్మ సమ్మతం కాదు.

అభిమాన సోదరులారా! నా ఈ ప్రసంగానికి సారాంశం ఏమిటంటే, వసీలా రెండు రకాలు: ధర్మ సమ్మతం – గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రెండవది అధర్మమైన వసీలా, అంటే మృతులను దుఆ చేయమని కోరటం, దైవ ప్రవక్త అంతస్తు లేదా ఇతరుల, పుణ్యాత్ముల అంతస్తులను వసీలాగా చేసుకోవటం, చనిపోయిన వారిని సహాయం కోరటం, ఇవన్నీ అధర్మమైన వసీలా. ఇది ఇస్లాం ధర్మంలో ముమ్మాటికీ కరెక్ట్ కాదు, నిషిద్ధము, ఇది తప్పు, అధర్మం, అన్యాయం, పాపం.

ఇక సహాయం వస్తే ఇది రెండు రకాలు. ఇస్తిఆనత్, పరస్పరం సహాయం చేసుకోవటం, వ్యవహారంలో ఏమైనా వస్తువులలో, లావాదేవీల్లో, తినే తాగే విషయాలలో ఇది ధర్మ సమ్మతమే. కాకపోతే ఇస్తిగాసా, ఏదైతే అల్లాహ్ మాత్రమే చేయగలుగుతాడో, కేవలం అల్లాహ్‌కు మాత్రమే సాధ్యమైన విషయాల కొరకు సృష్టితలతో కోరటం, ఇది అధర్మమైన వసీలాగా పరిగణిస్తుంది.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల పరంగా జీవించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
“సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు” అన్నదే మా చివరి మాట. మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43148

వసీలా , తవస్సుల్

తౌహీద్ & షిర్క్ (మెయిన్ పేజీ):
https://teluguislam.net/tawheed-shirk/


ఇస్లాంలో మస్జిదుల స్థానం – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో , టెక్స్ట్ ]

ఇస్లాం లో మస్జిదుల స్థానం
వక్త: షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=gNBBOGOFaVM [26 నిముషాలు]

ఈ ప్రసంగంలో, ఇస్లాంలో మస్జిద్ (మసీదు) యొక్క ఉన్నతమైన స్థానం మరియు ప్రాముఖ్యత గురించి వివరించబడింది. మస్జిద్ కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదని, అది విశ్వాసం, శాంతి, ఐక్యత మరియు విద్యకు కేంద్రమని వక్త నొక్కిచెప్పారు. మస్జిద్ లు ఇస్లామీయ కోటలని, అక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచమంతటా వ్యాపించిందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) కాలంలో, సహాబాలు మస్జిద్ ను ఒక విశ్వవిద్యాలయంగా, శిక్షణా కేంద్రంగా ఎలా ఉపయోగించుకున్నారో ఉదాహరణలతో వివరించారు. అబూ హురైరా (ర) వంటి సహాబాలు మస్జిద్ లోనే ఉంటూ జ్ఞానాన్ని ఎలా సంపాదించారో పేర్కొన్నారు. మస్జిద్ లను నిర్మించడం, వాటిని ఆబాద్ (సజీవంగా) చేయడం, మరియు వాటి పట్ల గౌరవం చూపడం యొక్క పుణ్యఫలాలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో విశదీకరించారు. చివరగా, మస్జిద్ లో ప్రవేశించేటప్పుడు, ఉన్నప్పుడు మరియు బయటకు వెళ్ళేటప్పుడు పాటించవలసిన నియమాలు, మర్యాదల గురించి ప్రస్తావించారు.


مَنْ يَهْدِهِ اللهُ فَلَا مُضِلَّ لَهُ وَمَنْ يُضْلِلْ فَلَا هَادِيَ لَهُ
[మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహూ వమన్ యుద్లిల్ ఫలా హాదియ లహూ]
ఎవరికైతే అల్లాహ్ మార్గదర్శకత్వం చూపాడో అతన్ని ఎవరూ త్రోవ తప్పించలేరు. మరియు ఎవరినైతే అల్లాహ్ త్రోవ తప్పించాడో అతనికి ఎవరూ మార్గదర్శకత్వం చూపలేరు.

وَأَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ
[వ అష్ హదు అల్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరీక లహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు.

وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ]
మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త.

أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللهِ وَخَيْرَ الْهَدْيِ هَدْيُ مُحَمَّدٍ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ
[అమ్మా బ’అదు ఫ ఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహి వ ఖైరల్ హద్యి హద్యు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం]
ఇక విషయానికొస్తే, నిశ్చయంగా అన్ని మాటలలో ఉత్తమమైన మాట అల్లాహ్ గ్రంథం. మరియు అన్ని మార్గాలలో ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం.

وَشَرَّ الْأُمُورِ مُحْدَثَاتُهَا وَكُلَّ مُحْدَثَةٍ بِدْعَةٌ وَكُلَّ بِدْعَةٍ ضَلَالَةٌ وَكُلَّ ضَلَالَةٍ فِي النَّارِ
[వ షర్రల్ ఉమూరి ముహ్దసాతుహా వ కుల్ల ముహ్దసతిన్ బిద్’అతున్ వ కుల్ల బిద్’అతిన్ దలాలతున్ వ కుల్ల దలాలతిన్ ఫిన్నార్]
మరియు అన్ని విషయాలలో చెడ్డవి కొత్తగా కల్పించబడినవి. మరియు ప్రతీ కొత్తగా కల్పించబడినది బిద్’అత్. మరియు ప్రతీ బిద్’అత్ మార్గభ్రష్టత్వం. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వం నరకానికి దారితీస్తుంది.

సర్వ స్తోత్రాలు, అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన, పాలకుడైన అల్లాహ్ కే శోభిస్తాయి. అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయు గాక.

అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షా అల్లాహ్, ఇస్లాంలో మస్జిదుల స్థానం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు.

మస్జిద్ కి గౌరవప్రదమైన, ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉంది. ఇది ఈమాన్ మరియు శాంతికి మూలం. ప్రార్థనలు జరుపుకునే ప్రదేశం. ఇక్కడ ప్రార్థనలు స్వీకరించబడతాయి. ఉమ్మతి యొక్క ఐక్యతకు ఇదొక శీర్షిక. హిదాయత్, మంచితనం, స్థిరత్వానికి చిహ్నం. శాస్త్రీయపరమైన, ఆచరణాత్మకమైన, ఆధ్యాత్మికమైన గృహం మస్జిద్.

ఇది ధృడమైన శిక్షణా కేంద్రం. ఈ కేంద్రం నుంచే ఏమీ తెలియని ప్రజలు, గొర్రెలు మేపే సహాబాలు, ప్రపంచ ప్రతినిధులుగా తయారయ్యారు. దీని ఆధారంగానే రాగ ద్వేషాలలో రగిలే ప్రజలు ప్రేమానురాగాలకు ప్రతిరూపాలయ్యారు. ఈ కేంద్రం నుంచే సహాబాలు ఆ తరువాత వారు దీన్, దునియా, పరలోకం యొక్క శాస్త్రాలలో అత్యంత ప్రముఖులు, పట్టభద్రులయ్యారు.

ఇదొక పాఠశాల. దీనిలో విశ్వాసాల శిక్షణ జరుగుతుంది. హృదయాలు ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడతాయి. గొప్ప నాయకులు తయారవుతారు. ఇది ఒక న్యాయ వ్యవస్థ మరియు ఫత్వాలను జారీ చేసే ఓ మండలి. ఆశ్రయం లేని వారికి ఇదొక ఆశ్రయం. దాని మిహరాబు నుంచి అల్లాహ్ యొక్క స్పష్టమైన ఆయతులు పఠించబడతాయి. దీని మింబర్ నుంచి ప్రభావంతమైన ఖుత్బాలు, ఉపన్యాసాలు ఇవ్వబడతాయి.

మస్జిద్ అంటే కేవలం ఆరాధన ఆలయం మాత్రమే కాదు. వాస్తవానికి, మస్జిదులు ఇస్లామీయ కోటలు, ఇస్లాం ధర్మం కేంద్రాలు. ఇక్కడి నుండే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిద్ల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం చెందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది.

అభిమాన సోదరులారా, ఇక్కడ ముస్లింలందరూ తమ తమ భేదాలన్నీ కట్టిపెట్టి పాలు నీళ్ళల్లా కలిసిపోతారు. అల్పుడు, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, నల్లవాడు, తెల్లవాడు అనే భేద భావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు. అటువంటి స్థలం, కేంద్రం మస్జిద్.

మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, “మీరు ఒక వ్యక్తిని మస్జిద్ కు వస్తూ పోతూ ఉండగా చూస్తే అతని విశ్వాసం గురించి సాక్ష్యం ఇవ్వండి” అన్నారు. ఇది మస్జిద్ యొక్క మహత్యం.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలో మస్జిద్ గురించి ఏమన్నాడు?

فِي بُيُوتٍ أَذِنَ اللَّهُ أَن تُرْفَعَ وَيُذْكَرَ فِيهَا اسْمُهُ يُسَبِّحُ لَهُ فِيهَا بِالْغُدُوِّ وَالْآصَالِ
(ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు, (24:36)

ఇక్కడ గృహాలు అంటే మస్జిద్. అంటే అర్థమేమిటి? విశ్వాసులు, అల్లాహ్ విధేయులు ఉదయం సాయంత్రం మస్జిదులలో అల్లాహ్ ప్రీతి కోసం నమాజులు చేస్తారు, కడు దీనంగా అల్లాహ్ ను వేడుకుంటారు.

అలాగే,

رِجَالٌ لَّا تُلْهِيهِمْ تِجَارَةٌ وَلَا بَيْعٌ عَن ذِكْرِ اللَّهِ وَإِقَامِ الصَّلَاةِ وَإِيتَاءِ الزَّكَاةِ ۙ يَخَافُونَ يَوْمًا تَتَقَلَّبُ فِيهِ الْقُلُوبُ وَالْأَبْصَارُ
(కొందరు) పురుషులు. వర్తకంగానీ, క్రయవిక్రయాలుగానీ అల్లాహ్‌ నామస్మరణ, నమాజు స్థాపన, జకాత్‌ చెల్లింపు విషయంలో వారిని పరధ్యానానికి లోను చేయలేవు. ఏ రోజున హృదయాలు తలక్రిందులై, కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడుతూ ఉంటారు.(24:37)

ఈ ఆయత్ యొక్క అర్థాన్ని మనం గమనించాలి. కొంతమంది ఎలా ఉంటారు? వారిని వారి వర్తకం గానీ, వ్యాపారం, క్రయ విక్రయాలు గానీ అల్లాహ్ నామ స్మరణ, నమాజు స్థాపన, జకాత్ చెల్లింపు విషయంలో పరధ్యానానికి లోను చేయలేవు. అంటే మనిషి చేసే వ్యాపారాలు, క్రయ విక్రయాలు, ఉద్యోగాలు అతని జీవితంలో వస్తూ పోయే సమస్యలు, బాధ్యతలు ఇవన్నీ ఆ విశ్వాసిని, ఆ వ్యక్తుల్ని మస్జిద్ కి పోయి జమాత్ తో నమాజ్ చేయటం లేదా జిక్ర్ చేయటం, అల్లాహ్ ను ఆరాధించటం, జకాత్ ఇవ్వటం వీటిని వారి జీవన సమస్యలు ఆపలేవు. ఎందుకు? ఏ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోతాయో దానికి వారు భయపడతారు. అంటే ప్రళయం గురించి, అల్లాహ్ శిక్ష గురించి వారు భయపడతారు.

لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا عَمِلُوا وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
తమ సత్కార్యాలకు అల్లాహ్‌ ఉత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి, అల్లాహ్‌ తన కృపతో మరింత అధికంగా వొసగటానికి (వారు ఈ విధంగా మసలుకుంటారు). అల్లాహ్‌ తాను తలచిన వారికి లెక్క లేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు.(24:38)

అభిమాన సోదరులారా, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ గురించి ఇంకా ఇలా సెలవిచ్చారు,

وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلاَّ نَزَلَتْ عَلَيْهِمُ السَّكِينَةُ وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ وَحَفَّتْهُمُ الْمَلاَئِكَةُ وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ
[వ మజ్ తమ’అ ఖౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్, యత్లూన కితాబల్లాహ్, వ యతదారసూనహూ బైనహుమ్, ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనతు, వ గషియతుహుముర్ రహ్మతు, వ హఫ్ఫత్ హుముల్ మలాఇకతు, వ దకరహుముల్లాహు ఫీమన్ ఇందహ్]

అల్లాహ్ గృహాలలోని ఏదైనా ఒక గృహంలో కొంతమంది గుమికూడి దైవ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, దాని గురించి పరస్పరం చర్చించుకుంటూ ఉంటే, అల్లాహ్ తరపున నుండి వారి మీద ప్రశాంతత, సకీనత్, ఆవరిస్తుంది. అలాగే రహ్మత్, దైవ కారుణ్యం వారిని కమ్ముకుంటుంది. అలాగే దైవదూతలు వారిని చుట్టుముడతారు. అలాగే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన ఆస్థానములోని అంటే దైవదూతల మధ్య వారిని పరిచయం చేస్తాడు” (ముస్లిం)

ఇది ఎవరైతే మస్జిద్ లో ఖురాన్ పఠిస్తారో, ఖురాన్ నేర్చుకుంటారో, ఖురాన్ గురించి చర్చించుకుంటారో, దీన్ గురించి నేర్చుకుంటారో, నేర్పుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ గొప్ప ప్రతిఫలం ఇస్తున్నాడు. ఈ ఆయత్ లో నాలుగు విషయాలు ఉన్నాయి. ఒకటి వారి జీవితాలలో వారికి ప్రశాంతత. ఇది డబ్బుతో కొనలేము. ప్రశాంతత ఇది విలువైన, గొప్ప వరం ఇది. రెండవది ఏమిటి? కారుణ్యం. అల్లాహ్ కరుణ లేకపోతే మన జీవితం దుర్భరమైపోతుంది. ఇహము పోతుంది పరము పోతుంది. మూడవది ఏమిటి? దైవదూతలు ప్రేమిస్తారు. నాలుగవది ఏమిటి? సకల లోకాలకు సృష్టికర్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రబ్బుల్ ఆలమీన్ ఆయన దైవ దూతల మధ్య వారి పరిచయం చేస్తాడు. ఎంత అదృష్టవంతులు వారు.

ఇంకా అల్లాహ్ యే ఇలా సెలవిచ్చాడు, మస్జిద్ లను ఆబాద్ చేయాలి. అంటే మస్జిద్ లు ఆబాద్ చేయటం అంటే ఏమిటి? మస్జిద్ లు నిర్మించాలి. య’అముర్ అంటే మస్జిద్ ను ఆబాద్ చేయటం, మస్జిద్ ని నిర్మించటం. దానికి అసలు అర్థం ఏమిటి స్వయంగా అల్లాహ్ సెలవిచ్చాడు.

إِنَّمَا يَعْمُرُ مَسَاجِدَ اللَّهِ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَلَمْ يَخْشَ إِلَّا اللَّهَ ۖ فَعَسَىٰ أُولَٰئِكَ أَن يَكُونُوا مِنَ الْمُهْتَدِينَ
అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ విశ్వసిస్తూ, నమాజులను నెలకొల్పుతూ, జకాత్‌ను విధిగా చెల్లిస్తూ, అల్లాహ్‌కు తప్ప వేరొకరికి భయపడనివారు మాత్రమే అల్లాహ్‌ మస్జిదుల నిర్వహణకు తగినవారు. సన్మార్గ భాగ్యం పొందినవారు వీరేనని ఆశించవచ్చు.(9:18)

అంటే మస్జిదుల నిర్వహణకి తగిన వారు, మస్జిదులను ఆబాద్ చేసే వారు ఎవరు? ఈ గుణాలు అల్లాహ్ సెలవిచ్చాడు. అంటే సన్మార్గ భాగ్యం పొందిన వారు కూడా వీళ్ళే అని అల్లాహ్ అంటున్నాడు. అంటే ఈ ఆయత్ లో మస్జిదులను ఆబాద్ చేసే వారి గుణాలు అల్లాహ్ తెలియజేశాడు.

మొదటి గుణం ఏమిటి? వారు అల్లాహ్ ను విశ్వసిస్తారు. అల్లాహ్ పట్ల దృఢమైన, నిజమైన, వాస్తవమైన విశ్వాసం కలిగి ఉంటారు. రెండవది ఏమిటి? వారు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. ఒక రోజు నేను చనిపోవాల్సిందే, ఈ ప్రపంచం అంతం అవ్వాల్సిందే, చనిపోయిన తరువాత అల్లాహ్ కు లెక్క చూపించాల్సిందే, లెక్కల గడియ వస్తుంది, తీర్పు దినం వస్తుంది, ఆ అంతిమ దినం పట్ల విశ్వసిస్తాడు రెండవది. మూడవది ఏమిటి? నమాజులు చేస్తారు, నమాజులు పాటిస్తారు. నాలుగోది జకాత్ విధిగా చెల్లిస్తారు. ఐదవది ఏమిటి? అల్లాహ్ కు మాత్రమే భయపడతారు. ఇది గమనించాల్సిన విషయం ఇది. జీవితం, ప్రాపంచిక జీవితం యొక్క ప్రేమలో పడిపోయి చాలామంది అల్లాహ్ కు తప్ప ప్రతి ఒక్కరితో భయపడుతున్నారు. మనలో చాలా మంది జీవితం ఇలా అయిపోయింది ప్రతిదానికి భయపడటం అల్లాహ్ కు తప్ప. అల్లాహ్ ఏమంటున్నాడు? అల్లాహ్ కు మాత్రమే భయపడండి, వేరే వారితో భయపడకండి. మస్జిద్ ను ఆబాద్ చేసేవారు ఎవరు? నాలుగవ వారు అల్లాహ్ ను మాత్రమే భయపడతారు. వ లమ్ యఖ్ష ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప ఎవ్వరికీ భయపడరు.

ఈ గుణాలు కలిగిన వారికి అల్లాహ్ ఏమంటున్నాడు? య’అమురు మసాజిదల్లాహ్. వీళ్లే మసాజిద్ లను ఆబాద్ చేసేవారు, నిర్వహణకు తగిన వారు. ఇంకా చివరి వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడు? ఫ’అసా ఉలాఇక అన్ యకూనూ మినల్ ముహ్తదీన్. సన్మార్గ భాగ్యం, హిదాయత్ ప్రసాదించబడిన వారు వీరేనని ఆశించవచ్చు. ఇది అసలైన అర్థం మస్జిదులను ఆబాద్ చేయటం అంటే.

ఇక అభిమాన సోదరులారా, ఇప్పుడు వరకు మనం మస్జిద్ గురించి, మస్జిద్ స్థానం గురించి, మస్జిద్ నిర్వహణ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మన జీవన విధానం అలా ఉందా? మస్జిదుల విషయంలో. మస్జిదులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి? వాస్తవంగా మస్జిదులను మనం ఆబాద్ చేస్తున్నామా? మస్జిదులకు సంబంధించిన ఆదాబులు పాటిస్తున్నామా? మస్జిదుల హక్కులు పూర్తి చేస్తున్నామా? మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

ను వేరే విషయానికి వస్తున్నాను, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు,

مَنْ بَنَى مَسْجِدًا لِلَّهِ بَنَى اللَّهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ
“మన్ బనా లిల్లాహి మస్జిదన్, బనల్లాహు లహూ బైతన్ ఫిల్ జన్నహ్.”
ఎవరైనా అల్లాహ్ కోసం మస్జిద్ ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.

ఇక్కడ ఒక ప్రశ్న మనసులో రావచ్చు, ప్రతి ఒక్కరికీ ఒక మస్జిద్ నిర్మించే స్తోమత ఉంటుందా? ఆర్థికపరంగా. ఇన్నమల్ అ’అమాలు బిన్నియ్యాత్. కర్మల పరంగా అల్లాహ్ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కర్మలు సంకల్పాలపై ఆధారపడి ఉన్నాయి. అందుకు ప్రతి వ్యక్తికి ఈ స్తోమత ఉండదు. కానీ ప్రతి వ్యక్తి మస్జిద్ నిర్మాణంలో పాలు పంచుకొనవచ్చు, తన శక్తి ప్రకారం.

అలాగే, మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు,

أَحَبُّ الْبِلَادِ إِلَى اللَّهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللَّهِ أَسْوَاقُهَا
“అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబ్గదుల్ బిలాది ఇలల్లాహి అస్వాకుహా.”
అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత ప్రీతికరమైన, శ్రేయస్కరమైన చోటు మస్జిద్. అలాగే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలలో కెల్లా అత్యంత హానికరమైన చోటు బజారు

ఈ హదీస్ మనం మనసులో ఉంచుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మన మస్జిదులు అలా ఉన్నాయా? అత్యంత శ్రేష్టకరమైన, పవిత్రమైన, ప్రీతికరమైన ఉన్నాయా? అల్లాహ్ దృష్టిలో ఉంది, అల్లాహ్ అంటున్నాడు అన్నిటికంటే శ్రేష్టమైన, శ్రేయస్కరమైన, ప్రీతికరమైన, పవిత్రమైన చోటు, స్థలం, కేంద్రం మస్జిద్ అని. కానీ ఇప్పుడు మన మస్జిదులు గీబత్ కి కేంద్రం, చాడీలకి కేంద్రం, ఖియానత్ కి కేంద్రం, లావాదేవీలకి కేంద్రం, రాజకీయాలకు కేంద్రం, ఇలా మారిపోయినాయి. కానీ అత్యంత హానికరమైన, మంచిది కాని స్థలం బజారు. కానీ మనము సహాబాలు, తాబయీన్లు, మన పూర్వీకుల జీవితాలు మనము వారి చరిత్ర చదివితే, వారు బజార్లను, అస్వాఖ్ లను, మస్జిదులుగా మార్చేసేవారు. వారి జీవన విధానం అలా ఉండేది. కొంతమంది సహాబాలు బజార్ కి సోదరులు, ముస్లిములు, తెలిసిన వారు, తెలియని వారు, ఇరుగు పొరుగు వారు కనపడతారేమో, సలాం చెప్దామన్న ఉద్దేశంతో పోయేవారు. అంటే మన పూర్వీకులు హానికరమైన స్థలాన్ని పవిత్రంగా చేసేసారు, అనగా మస్జిద్ గా చేసేసారు, పవిత్రంగా చేసేసేవారు. ఇప్పుడు మనం మస్జిద్ ని సూఖ్ లాగా, బజార్ లాగా చేసేస్తున్నాము. ఈ విషయంలో మనము పరిశీలించాలి, జాగ్రత్తగా ఉండాలి.

అభిమాన సోదరులారా, అలాగే రేపు ప్రళయ దినాన – ఈ హదీస్ మనందరం ఎన్నోసార్లు విన్నాము,

 سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لاَ ظِلَّ إِلاَّ ظِلُّهُ
సబ్’అతున్ యుదిల్లుహుముల్లాహు ఫీ దిల్లిహీ యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహ్
రేపు ప్రళయ దినాన ఏడు రకాల వ్యక్తులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తన నీడను ప్రసాదిస్తాడు. ఆ రోజు అల్లాహ్ నీడ తప్ప ఏ నీడా ఉండదు.

ఆ ఏడు రకాల వ్యక్తులలో ఒకరు ఎవరు?

رَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
రజులున్ ఖల్బుహూ ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్.
ఏ వ్యక్తి యొక్క హృదయం, ఏ వ్యక్తి యొక్క మనసు మస్జిద్ లో ఉంటుందో, అంటే వారి మనసు మస్జిద్ లోకి నిమగ్నులై ఉంటాయి.

ఇది మస్జిద్ అంటే.

అలాగే, మనిషి తన ఇంట్లో లేక వీధిలో చేసే నమాజ్ కన్నా జమాఅత్ తో చేసే నమాజుకు పాతిక రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని హదీస్ లో ఉంది. ఈ విధంగా ఎక్కువ రెట్లు పుణ్యం లభించడానికి కారణం ఏమిటంటే, మనిషి చక్కగా వుజూ చేసుకొని, కేవలం నమాజు చేసే ఉద్దేశ్యంతో వెళ్తుంటే, ఆ సమయంలో అతను వేసే ప్రతి అడుగుకు అల్లాహ్ ఒక్కొక్కటి చొప్పున అతని అంతస్తులను పెంచుతాడు. అంతే కాదు, అతని వల్ల జరిగే పాపాలను కూడా ఒక్కొక్కటిగా తుడిచి పెట్టేస్తాడు. అతను నమాజ్ చేస్తూ వుజూతో ఉన్నంత వరకు దైవదూతలు అతని మీద శాంతి కురవాలని ప్రార్థిస్తూ, ఓ అల్లాహ్ ఇతనిపై శాంతి కురిపించు, ఓ అల్లాహ్ ఇతన్ని కనికరించు అని అంటూ ఉంటారు.

మస్జిద్ లో ప్రవేశించిన తర్వాత జమాత్ నమాజు కోసం అతను ఎంతసేపు నిరీక్షిస్తాడో, ఎదురు చూస్తూ ఉంటాడో, అంతసేపు అతను నమాజులో ఉన్నట్లుగానే పరిగణించబడతాడు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి అరగంట ముందు మస్జిద్ కి పోయాడు, ఇరవై నిమిషాల ముందు మస్జిద్ కి పోయాడు, నమాజ్ కోసం వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు జమాత్ కోసం, అంటే ఈ ఎంత సేపు అతను ఎదురు చూస్తున్నాడో అంత సేపు అతను ఎక్కడ ఉన్నాడు? నమాజ్ లోనే ఉన్నాడు. నమాజ్ చేస్తున్నాడు. ఆ విధంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

ఈ విధంగా మస్జిద్, మస్జిద్ స్థానం, మరియు మన పూర్వీకులు దాని గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనము సహాబాల, తాబయీన్ ల చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఉదాహరణగా ఒక్క విషయం చెబుతున్నాను. అన్నిటికంటే అత్యధికంగా హదీసులు చెప్పిన వారు, రివాయత్ చేసిన వారు, అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. ఆయన పాఠశాల ఏది? మస్జిద్. ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏది? మస్జిద్. ఆయనకి తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకసారి ఆయన వారి రోషం ఎటువంటిది అంటే అవసరం ఉన్నా కూడా చెయ్యి చాపేవారు కాదు. రెండు మూడు రోజులు అయిపోయింది, అన్నం తినలేదు. అడగటానికి బుద్ధి పుట్టటం లేదు. ఆయన మస్జిద్ బయట వీధిలో ఏ ఉద్దేశంతో పోయారు? సహాబాలు కనపడతారు, వారికి సలాం చెప్తే నన్ను చూసి, నా ముఖాన్ని చూసి వారు అర్థం చేసుకుంటారు అని ఉద్దేశంతో వీధిలో పోయి నిలబడితే అబూబకర్ రదియల్లాహు అన్హు వచ్చారు. ఇది నేను పూర్తి వివరంగా చెప్పదలచలేదు సమయం లేదు. అబూబకర్ కి ఆయన సలాం చెప్తే అబూబకర్ రదియల్లాహు అన్హు వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఆయన బాధపడ్డారు మనసులో. ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ వచ్చారు రదియల్లాహు అన్హు. ఆయన కూడా వఅలైకుం సలాం చెప్పి ముందుకు సాగిపోయారు. ఈయన మనసులో కుమిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. నా ముఖం వారు గమనించలేదా? నన్ను వారు పట్టించుకోవటం లేదా? అని చెప్పి. ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. చిరునవ్వుతో వఅలైకుం సలాం చెప్పి తోడుగా తీసుకుపోయారు. తీసుకుని పోయి ఇంట్లో ఏముంది అని అడిగితే కొంచెం పాలు ఉంది. అబూ హురైరా మనసులో సంతోషం. పండగ మనసులో. ఈరోజు నాకు పండగ, పాలు దక్కింది అని చెప్పి. అప్పుడు మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ అబూ హురైరా, ఇంకా మస్జిద్ లో ఎంత మంది ఉన్నారు అని అడిగారు. అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసులో కొంచెం పాలు, ప్రవక్త గారు ఇలా అడుగుతున్నారు ఇంత మంది వచ్చేస్తే నాకు ఏం మిగులుతుంది అని మనసులో బాధ. పోయి పిలుచుకొని రా. దాదాపు ఒక 20, 30 మంది వచ్చారు. ఇప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు ఓకే అల్హందులిల్లాహ్ కొంచెమైనా సరే వస్తుంది అనుకున్నారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హుతో, అందరికీ పంచు అని చెప్పారు. అప్పుడు అబూ హురైరా రదియల్లాహు అన్హు మనసు, అందరికీ నేను పంచాలా? అంటే లాస్ట్ లో ఎవరు తాగాలి నేను. మిగులుతుందా మిగలదా? ఆ తర్వాత అందరికీ పంచారు. అందరూ కడుపు నిండా తాగారు. ఓ అబూ హురైరా, ఇంకా ఎవరున్నారు? ఓ ప్రవక్త నేను మీరు ఇద్దరే ఉన్నాం ప్రవక్త అంటే, నువ్వు తాగు అని చెప్పారు. అబూ హురైరా తాగారు. ప్రవక్రా నేను తాగేసాను. ఇంకోసారి తాగు. ఇంకోసారి తాగు. మూడు సార్లు తాగారు. నాలుగోసారి, దైవప్రవక్త ఇంకా ఇంకోసారి తాగండి అంటే, ఓ దైవప్రవక్త, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇప్పుడు తాగలేను. ఆ తర్వాత ప్రవక్త గారు తాగారు. ఇది మోజిజా (మహిమ) . చెప్పటం ఏమిటంటే అటువంటి సహాబీ, ఇల్లు లేని సహాబీ, గృహం లేని సహాబీ, ఆర్థిక పరంగా ఏమీ లేని సహాబీ, వారి విశ్వవిద్యాలయం మస్జిద్, వారి పాఠశాల మస్జిద్, వారి శిక్షణా కేంద్రం మస్జిద్. అందరికంటే అత్యధికంగా హదీసులు రివాయత్ చేశారు అబూ హురైరా రదియల్లాహు త’ఆలా అన్హు. అంత పేదరికంలో ఒకసారి ప్రవక్త గారు వరాన్ని ప్రసాదించారు. ఏం కోరుకుంటావు కోరుకో అని. అప్పుడు ఆయన జ్ఞానాన్ని కోరుకున్నారు. మెమరీ శక్తిని కోరుకున్నారు. ప్రపంచాన్ని కోరుకోలే, ఇల్లుని కోరుకోలే, ధనాన్ని కోరుకోలే. ఇల్లు లేదు ఉండటానికి, దుస్తులు లేవు. అటువంటి స్థితిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇమాముల్ అంబియా, ఎన్నో వందల గొర్రెలు దానం చేసిన వారు. అడిగిన వారికి ఇచ్చేసేవారు. అటువంటి ఇమామ్-ఏ-కాయినాత్ అడుగుతున్నారు, ఓ అబూ హురైరా ఏం కావాలా అని చెప్పి. దానికి అబూ హురైరా, ఆ పేదవాడు ఏం కోరుకున్నారు? జ్ఞానం కోరారు, ఇల్మ్ కోరారు, జ్ఞాపక శక్తి కోరారు. అందుకోసమే ఆయన ఏమి రాసినా, ఏమి విన్నా ఆయన మనసులో అలాగే ఉండిపోయేది. అందరికంటే ఎక్కువగా హదీసులు ఆయనే రివాయత్ చేశారు.

కావున అభిమాన సోదరులారా సమయం అయిపోయింది, మస్జిద్ కి సంబంధించిన కొన్ని ఆదాబులు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి.

ఒకటి, దుఆ చేస్తూ సలాం చెబుతూ మస్జిద్ లోకి ప్రవేశించాలి (అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్). రాని వారు నేర్చుకోవాలి. తహియ్యతుల్ మస్జిద్ చేసుకోవాలి పోయిన తర్వాత. అలాగే ఉల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు, ఇంకా ఏ పదార్థాల వల్ల తినటం వల్ల నోటిలో దుర్వాసన వస్తుందో వాటిని తిని రాకూడదు. ఒకవేళ తిన్న యెడల బ్రష్ చేసుకొని ముఖంలో ఎటువంటి దుర్వాసన లేకుండా చూసుకొని ఆ తర్వాత మస్జిద్ కి రావాలి. ఎందుకంటే ప్రవక్తగారు సెలవిచ్చారు, దేని వల్ల మనిషి బాధపడతాడో, దేని వల్లకి మనిషికి కష్టం కలుగుతుందో, దైవదూతలు కూడా బాధపడతారు అని చెప్పారు. అలాగే మస్జిద్ ను పరిశుభ్రంగా ఉంచాలి, నిశ్శబ్దంగా కూర్చొని భయభక్తులు గలవారై అల్లాహ్ స్మరణ చేయాలి. ప్రశాంతంగా కూర్చోవాలి. గోల చేయడం, పరిహాసాలాడటం, లావాదేవీలు జరపటం, మస్జిద్ ని అగౌరవపరిచినట్లు అవుతుంది. మస్జిద్ ను వచ్చిపోయే మార్గంగా చేసుకోకూడదు. ప్రవేశించాక నమాజ్ చేయడమో, పారాయణం చేయడమో, జిక్ర్ చేయడమో, ఆరాధించడం చేయాలే గానీ, ఇదే మస్జిద్ కి హక్కు. అలాగే మస్జిద్ నుంచి పోయేటప్పుడు అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫద్లిక్ అనే దుఆ చేసుకుంటూ పోవాలి.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.


ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42432

మానవుల కర్మల నమోదు | మరణానంతర జీవితం : పార్ట్ 48 | [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

మానవుల కర్మల నమోదు  – [మరణానంతర జీవితం – పార్ట్ 48]
https://www.youtube.com/watch?v=MoutOVAU1zA [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ప్రళయ దినం (యౌమ్ అల్-ఖియామా) మరియు మానవుల కర్మలను నమోదు చేసే వ్యవస్థ గురించి వివరిస్తున్నారు. ప్రతి వ్యక్తితో ఇద్దరు దైవదూతలు (కిరామన్ కాతిబీన్) ఉంటారని, వారు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని, మరియు వారి మనస్సులోని గట్టి సంకల్పాలను కూడా నమోదు చేస్తారని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో స్పష్టం చేశారు. ఈ దైవదూతలు అత్యంత విశ్వసనీయులని, ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా రాస్తారని తెలిపారు. మంచి చేయాలనే సంకల్పానికి కూడా పుణ్యం లభిస్తుందని, కానీ చెడు చేయాలనే గట్టి నిశ్చయానికి కూడా పాపం నమోదు చేయబడుతుందని ప్రవక్త బోధనల ద్వారా వివరించారు. కర్మల నమోదు కేవలం మనతో ఉండే ఇద్దరు దూతలతోనే పరిమితం కాదని, జుమా నమాజ్ హాజరు లేదా ప్రత్యేక ప్రార్థనల వంటి సందర్భాలలో ఇతర దైవదూతలు కూడా నమోదు చేస్తారని ఉదాహరణలతో పేర్కొన్నారు. చివరగా, మన కర్మలన్నీ నమోదు చేయబడుతున్నాయనే భయంతో జాగ్రత్తగా జీవించాలని, మంచి పనుల వైపు మొగ్గుచూపి, చెడుకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి కఫా, వస్సలాతు వస్సలాము అలా ఇబాదిల్లజీనస్తఫా, అమ్మాబాద్.. ఋజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.

మహాశయులారా! ప్రళయ దినం. ఆ మహా భయంకరమైన దినం. ఏ రోజైతే మనం సమాధుల నుండి లేపబడి, ఎక్కడెక్కడా ఎవరు ఏ స్థితిలో చనిపోయారో వారందరినీ కూడా సమీకరించి ఒక మహా మైదానంలో పోగు చేయడం జరుగుతుంది. అక్కడ చాలా దీర్ఘకాలం అది ఉంటుంది. అక్కడి ఒక రోజు ఇహలోకపు 50 వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది. అక్కడ ప్రతి ప్రాణి పట్ల న్యాయం జరుగుతుంది. ఎవరికీ ఏ అణువంత అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు ఆ రోజు తనను తాను తప్ప మరెవరి గురించి ఆలోచించడు.

ఆ దీర్ఘకాలమున పాపాల వల్ల మరియు సూర్యుడు కేవలం ఒక మైల్ దూరాన ఉండి, అక్కడి ఏ గాంభీర్య పరిస్థితి ఉంటుందో దానిని అతి త్వరలో దాటిపోవాలని మనిషి ఎంతో ఆలోచిస్తాడు. కానీ ఎక్కడికీ పరుగెత్తి వెళ్ళలేడు. అక్కడి ఘట్టాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం ప్రతి మనిషి ఇహలోకంలో తాను చేస్తున్న కర్మలు ఏదైతే రాయబడుతున్నాయో ఆ కర్మ పత్రాలు తన కుడి చేతిలో లేదా తన ఎడమ చేతిలో – అల్లాహ్ దీని నుండి మనందరినీ కాపాడుగాక – తీసుకోవలసింది ఉంటుంది. ఇది కూడా ఒక చాలా భయంకర స్థితి, ఎంతో ఆవేదన మరియు బాధతో కూడిన ఆ సమయం. దాని గురించే ఇన్ షా అల్లాహ్, ఈరోజు మరియు తర్వాత వచ్చే కార్యక్రమాలలో మనం కొన్ని సత్యాలు తెలుసుకుంటాము. చాలా శ్రద్ధగా విని మనలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మనలోని ప్రతి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నాను.

అయితే మహాశయులారా! ఇహలోకంలో మనం పుట్టిన తర్వాత మనలోని ప్రతి ఒక్కరితో ఇద్దరు దైవదూతలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, చివరికి మనం ఏదైనా గట్టి నిర్ణయం మనసులో చేసుకుంటే అది కూడా రాయడానికి సిద్ధమై ఉన్నారు.

إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
(ఇది యతలక్కల్ ముతలక్కియాని అనిల్ యమీని వనిష్షిమాలి క’యీద్)
ఒకడు కుడివైపున, మరొకడు ఎడమవైపున కూర్చొని వ్రాసేవారు వ్రాస్తున్నప్పటి స్థితిని (జ్ఞాపకం చేసుకో). (50:17)

కుడి వైపున అటు ఎడమ వైపున సిద్ధంగా ఉండి మనిషితో జరిగే ప్రతి కార్యం రాయడానికి దైవదూతలు హాజరై ఉన్నారు. ఆ సందర్భంలో మన ఈ జీవితంలో మనం చేసినది ప్రతి ఒక్కటి రాయబడుతుంది. ఏ ఒక్క విషయం కూడా దైవదూతలు వదలకుండా రాస్తూ ఉంటారు. సత్కార్యాలైతే, సద్వచనాలైతే, మంచి ఆలోచనలైతే కుడి వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. ఒకవేళ దుష్కర్మలు, దుశ్చేష్టలు మరియు చెడు సంభాషణ, ఇంకా చెడు ఆలోచన ఇవన్నీ ఎడమ వైపున ఉన్న దైవదూత రాస్తూ ఉంటాడు. అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఖురాన్లో అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.

అయితే, మన ఈ కర్మలు రాయబడుతున్నాయి అనడానికి అల్లాహు త’ఆలా ఖురాన్లో ఎన్నో సాక్ష్యాధారాలు మనకు తెలిపాడు. ఎన్నో నిదర్శనాలు మనకు తెలిపాడు. ఆ నిదర్శనాలను, అంటే ఆ ఖురాన్ ఆయతులను, మనం గ్రహించి వాటిపై దృష్టి వహించి పారాయణం చేస్తే మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి. కొన్ని సందర్భాల్లో ఆయతులు మనకు దైవదూతలు రాస్తున్నారు అని స్పష్టంగా కనబడతాయి. ఉదాహరణకు:

وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ كِرَامًا كَاتِبِينَ
(వ ఇన్న అలైకుమ్ లహాఫిజీన్. కిరామన్ కాతిబీన్)
నిశ్చయంగా మీపై పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. వారు గౌరవనీయులైన వ్రాతగాళ్ళు. (82:10-11)

మీపై నిఘా వేసి, మీ రక్షణలో దైవదూతలు ఉన్నారు, గౌరవనీయులైన లేఖకులు వారు.

మరికొన్ని సందర్భాల్లో ఖురాన్లో ఆ దైవదూతలు నిఘా వేసి మరియు వారు సంసిద్ధంగా ఉండి మనిషి నోట వెళ్ళే ప్రతి మాట వెళ్ళడానికి ఆలస్యం కాకముందే తొందరగానే దానిని రాసుకుంటారు అని కూడా తెలపడం జరిగింది.

మరికొన్ని సందర్భాల్లో మానవులు చేసే కర్మలన్నీ కూడా స్వయంగా అల్లాహు త’ఆలా రాస్తాడు అన్నట్లు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరికొన్ని సందర్భాలలో ఎవరో ఉన్నారు రాసేవారు. వారు రాస్తున్నారు మీరు చేసే కర్మలను. వారెవరు? పేరు చెప్పి అక్కడ మనకు ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. ఈ విధంగా వివిధ రకాలు ఏదైతే అవలంబించడం జరిగిందో ఈ లేఖకుల పట్ల, మన కర్మలు నోట్ చేయడం జరుగుతున్నాయి అని ఒక భయం మనిషిలో ఏర్పడి ప్రతి మాట మాట్లాడే ముందు, ప్రతి కర్మ చేసే ముందు, ప్రతి ఆలోచన ఆలోచించే ముందు మనిషి దానిని నిర్ధారణ చేసుకోవాలి. ఇది చేయవచ్చా, చేయకూడదా? యోగ్యమా, కాదా? ధర్మసమ్మతమా, అక్రమ మార్గమా? అన్న విషయాలు తెలుసుకోవాలి.

కొన్ని సందర్భాల్లో మేము స్వయంగా రాస్తున్నాము అని అల్లాహ్ ఏదైతే తెలిపాడో, దీనివల్ల అల్లాహ్ యొక్క భయం ప్రజల్లో మరింత ఎక్కువ పెరగాలని కూడా, ఉదాహరణకు, యూదులు అల్లాహ్ పట్ల ఎన్నో దుర్భాషలాడేవారు. ఒక సందర్భంలో వారు, “మేము ఎక్కువ ధనవంతులం, అల్లాహ్ యే పేదవాడు” అన్నటువంటి మాటలు మాట్లాడారు. అల్లాహు త’ఆలా ఆ సందర్భంలో ఖురాన్ ఆయత్ ను అవతరింపజేసి:

لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا
‘అల్లాహ్‌ పేదవాడు, మేము ధనవంతులం’ అని పలికిన వారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి మాటను మేము వ్రాసి పెడ్తాము. (3:181)

ఎవరైతే మేము ధనవంతులము మరియు అల్లాహ్ నిరుపేద, బీదవాడు అని అన్నారో, వారి మాటలను అల్లాహు త’ఆలా విన్నాడు. మేము వారు చెప్పే మాటలు రాస్తూ ఉన్నాము.

మరికొన్ని సందర్భాల్లో మా లేఖకులైన దైవదూతలు రాస్తున్నారు అన్న విషయం అల్లాహు త’ఆలా ఏదైతే తెలిపాడో, అయితే ఆ దైవదూతలు ఎల్లవేళల్లో వారి వెంటే ఉన్నారు అన్నటువంటి భయం వారిలో కలగాలి అని అల్లాహు త’ఆలా ఈ విధంగా ఆ విషయాన్ని తెలియపరిచాడు.

أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَاهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
(అమ్ యహ్సబూన అన్నా లా నస్మ’ఉ సిర్రహుమ్ వ నజ్వాహుమ్, బలా వరుసులునా లదైహిమ్ యక్తుబూన్)
ఏమిటి, వారు తమ రహస్యాలను, తమ గుసగుసలను మేము వినలేమని అనుకుంటున్నారా? ఎందుకు వినం? పైగా మా దూతలు వారి వద్దనే ఉంటూ అన్నీ వ్రాస్తున్నారు. (43:80)

ఏమీ? వారు రహస్యంగా, గుప్తంగా మరియు వారు గుసగుసలాడుకునే ఆ గుసగుసలాట మాకు ఏ మాత్రం తెలియదు అని భావిస్తున్నారా? ఇక్కడ గమనించండి, సిర్రహుమ్. సిర్ అంటే రహస్యంగా మాట్లాడుకునే విషయాలు. నజ్వాహుమ్ అంటే ఒకరి చెవిలో ఒకరు ఏ గుసగుసలాటనైతే జరుపుకుంటారో వాటిని అంటారు. అయితే అల్లాహ్ ఏమంటున్నాడు? ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా మాట్లాడుకునే విషయాలు, ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాట జరుపుకునే ఈ సంఘటనలు, విషయాలన్నీ కూడా మాకు తెలియవు, మా జ్ఞాన పరిధిలో రావు అని వారు భావిస్తున్నారా? అలా భావించనవసరం లేదు. బలా! వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. ఎందుకు లేదు? మేము వారి రహస్యాలు వింటాము. మేము వారి గుసగుసలను కూడా తెలిసి ఉన్నాము. అంతేకాదు, వరుసులునా లదైహిమ్ యక్తుబూన్. మా దైవదూతలు ఉన్నారు. వారి వద్దనే ఉన్నారు. వారు రాస్తూనే ఉన్నారు.

ఈ ఆయతులన్నింటిలో మనకు బోధపడే విషయాలు ఏమిటో వాటిని మనం తెలుసుకోవాలి. ఆ బోధపడే విషయాలు ఏమిటో మనం తెలుసుకునే ముందు, కొన్ని సందర్భాల్లో రాసేవారు ఎవరో పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు అని ఏదైతే అల్లాహ్ చెప్పాడో, ఆ ఆయతులను కూడా మనం విందాము.

మహాశయులారా! కొన్ని సందర్భాలలో అల్లాహు త’ఆలా ఆ రాసేవారు ఎవరో వారి పేరు చెప్పకుండా రాసేవారు ఉన్నారు, రాస్తున్నారు, వారు చేసే చేష్టలు లిఖించబడుతున్నాయి అన్నట్లుగా తెలియజేస్తాడు. ఉదాహరణకు ఈ ఆయత్ చూడండి:

وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَٰنِ إِنَاثًا ۚ أَشَهِدُوا خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ
(వ జ’అలుల్ మలాఇకతల్లజీన హుమ్ ఇబాదుర్రహ్మాని ఇనాసా, అషహిదూ ఖల్కహుమ్, సతుక్తుబు షహాదతుహుమ్ వ యుస్’అలూన్)
వారు కరుణామయుని దాసులైన దైవదూతలను స్త్రీలుగా ఖరారు చేశారు. ఏమయ్యా! వారి పుట్టుకను వీరు కళ్ళారా చూశారా? వారి సాక్ష్యం వ్రాసి పెట్టబడుతుంది. వారిని ప్రశ్నించటం జరుగుతుంది. (43:19)

వారు అంటే బహుదైవారాధకులు, రహ్మాన్ అయిన అల్లాహ్ యొక్క దాసులు, దైవదూతలు ఎవరైతే ఉన్నారో వారిని అల్లాహ్ కు కుమార్తెలుగా చేశారు. వారు స్త్రీలుగా, దేవతలుగా భావించి వారు పూజిస్తున్నారు. అషహిదూ ఖల్కహుమ్? ఆ బహుదైవారాధకులు అల్లాహు త’ఆలా ఆ దైవదూతల్ని సృష్టించే సందర్భంలో అక్కడ వారు హాజరై ఉన్నారా? వారు సాక్షులుగా ఉన్నారా? సతుక్తుబు షహాదతుహుమ్. అలా ఏమైనా ఉంటే, వారి యొక్క ఆ సాక్ష్యం అనేది లిఖించబడుతుంది. వ యుస్’అలూన్. మరియు వారిని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అంటే లిఖించడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిఖించేవారు ఎవరో? దైవదూతలు. కానీ ఈ పద్ధతి ఎందుకు అవలంబించడం జరిగిందంటే, మానవుల్లో, ఆఁ ఉన్నారు, లిఖించేవారు ఉన్నారు అన్నటువంటి భయం కలగాలి.

అలాగే సత్కార్యాల విషయంలో కూడా సత్కార్యాలు చేసేవారు, మా సత్కార్యాలు వృధా అవుతున్నాయి అని భయపడే అవసరం లేదు.

إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ
(ఇల్లా కుతిబ లహుమ్ బిహీ అమలున్ సాలిహున్)
వారి తరఫున ఒక సత్కార్యం వ్రాయబడకుండా ఉండదు. (9:121)

అని సూరె తౌబాలో శుభవార్త ఇవ్వడం జరిగింది. వారు అల్లాహ్ మార్గంలో వెళ్ళినప్పుడు, ఏ దారిన నడిచినా, ఏ లోయలో దిగినా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఆకలితో దప్పులతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వారికి కుతిబ లహుమ్ బిహి అమలున్ సాలిహ్. వారు కష్టపడే ప్రతి కష్టానికి, ప్రతి అడుగుకు బదులుగా పుణ్యం అనేది రాయడం జరుగుతుంది. రాయబడుతుంది. అలాగే మరో సందర్భంలో, వారు ఏ కొంచెం దానం చేసినా అది లిఖించబడుతుంది అని చెప్పడం జరిగింది.

ఈ విధంగా మహాశయులారా, ఇహలోకంలో ఏ స్థితిలో ఉన్నా మనం, ఒక పెద్ద సమూహంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, రాత్రిలో ఉన్నా, పగలులో ఉన్నా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యువకులైనా ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు మాట్లాడే మాట, వారు చేసే చేష్టలు, వారు చేసే కర్మలు మరియు ఆలోచించే వారి యొక్క ఊహాగానాలు కూడా, ఆలోచనలను కూడా వ్రాయడం జరుగుతుంది.

మహాశయులారా! ఇదే విషయాన్ని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు. అల్లాహు త’ఆలా మానవులు చేసే కర్మల గురించి ఒక నిర్ణయం చేసి ఉంచాడు. అదేమిటంటే:

ఇదా హమ్మ అబ్దీ బి హసనతిన్. నా దాసుడు ఒక మంచి కార్యం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నిశ్చయానికి, బలమైన సంకల్పానికి వారు పూనుకున్నప్పుడు, ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా వారికి ఆదేశిస్తాడు. ఎప్పుడైతే వారు ఆ నిశ్చయించుకున్న, సంకల్పించుకున్న పుణ్యాన్ని ఆచరణ రూపంలో చేస్తారో వారికి ఆ సత్కార్యానికి బదులుగా ఒకటి నుండి పది వరకు, పది నుండి 700 వరకు, అంతకంటే ఎక్కువగా అల్లాహు త’ఆలా తలచిన వారికి పుణ్యాలు వ్రాయమని ఆదేశిస్తాడు.

అదే ఒకవేళ ఎవరైనా ఒక చెడు చేయాలని ఆలోచిస్తే, అల్లాహు త’ఆలా ఇప్పుడే ఏమీ రాయకండి అని వారిని పాపం గురించి లిఖించడం నుండి ఆపేస్తాడు. ఎప్పుడైతే మనిషి ఆ చెడు ఊహను, ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొస్తాడో, అతనికి అతని కర్మ పత్రంలో ఒక పాపం రాయండి అని చెప్తాడు. ఒకవేళ అతను దానిని ఆచరించకుండా ఆ చెడు ఆలోచనను వదులుకుంటే, అతడు చెడు ఆలోచనను వదులుకున్నాడు గనుక అతనికి ఒక పుణ్యం రాయండి అని అల్లాహు త’ఆలా ఆదేశిస్తాడు.

ఈ విధంగా అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ తలచి ఉన్నాడో గమనించండి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, కేవలం ఆలోచించుకోవడం, ఊహాగానాల వరకు ఉండడం అది వేరే విషయం. ఎవరైనా చెడు గురించి బలమైన రూపంలో సంకల్పించుకొని, దానికి సంబంధించిన సాధనాలు, అవసరాలు, కారణాలు సమకూరినప్పుడు, అవన్నీ కూడా అతనికి యోగ్యమైనప్పుడు, అతని ఆధీనంలో వచ్చినప్పుడు, తప్పకుండా అది చేస్తాడు ఆ పాపం అని పూనుకుంటే, అలాంటి గట్టి సంకల్పం కూడా కొన్ని సందర్భాల్లో రాయడం జరుగుతుంది.

ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచ విషయాన్ని ఒక సామెతగా తెలిపారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ లోని హదీస్ ఇది.

ఇక్కడ మీరు గమనించారా? మనిషి వద్ద సౌకర్యాలు ఉంటే, వాటిని ఉపయోగించి పాపంలో దూకిపోతాను అని ఏదైతే నిశ్చయించుకుంటాడో, బలమైన సంకల్పం చేస్తాడో, దానివల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనిషికి పాపం రాయబడుతుంది. అందుగురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే ఏ కర్మ కూడా, మనం చేసే ఏ పని కూడా, మనం మాట్లాడే ఏ మాట కూడా వృధా అవ్వడం లేదు. అది ఎక్కడో గాలిలో ఎగిరిపోతుంది అని మనం భావించకూడదు. అవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ప్రళయ దినాన ఎప్పుడైతే మనం అల్లాహ్ వద్ద హాజరవుతామో, అక్కడ వీటన్నిటినీ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

మహాశయులారా! ఇంతవరకు తెలుసుకున్న విషయాలు, వాటిలో ఏ ఏ ఆధారాలైతే మన ముందుకు వచ్చాయో, వాటి ద్వారా మనకు బోధపడిన విషయాలు ఏమిటంటే:

(1) మనలోని ప్రతి వ్యక్తి వెంట ఇద్దరు దైవదూతలు కనీసం ఉన్నారు. వారు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ, మనం ఊహించే ప్రతి ఊహ, వీటన్నిటినీ కూడా రాస్తూ ఉంటారు.

(2) రెండో విషయం, ఆ దైవదూతలు స్వచ్ఛతనీయులు, విశ్వసనీయులు. వారు ఎలాంటి అపహరణకు గురి కారు. వారికి మనుషుల్లో ఎవరు కూడా ఇతను నా వారు, అతను నా వాడు కాదు, ఇతను నాకు స్నేహితుడు, అతడు నాకు శత్రువు అన్నటువంటి ఏ భావాలు వారికి ఉండవు. ఎవరి పట్ల కూడా ఏ మాత్రం రియాయితీ లేకుండా, ఎలాంటి మినహాయింపు లేకుండా, ఎవరి పట్ల ఏ ప్రేమానుభావాలు చూపి వారు చేసే కర్మలు రాయకుండా, లేదా ఇంకెవరి పట్లనైనా ద్వేషం, కోపం, శత్రుత్వం చూపి వారు చేయనిది కూడా వారు చేశారు అన్నట్టుగా రాయడం, ఇలా ఎంతమాత్రం జరగదు. వారు విశ్వసనీయులు, స్వచ్ఛవంతులు. వారు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నారు. మానవులు ఎంత చేస్తారో, ఏం మాట్లాడతారో అది మాత్రమే రాస్తారు. ఎక్కువ కూడా రాయరు, రాయకుండా ఉండరు.

(3) మరో గమనార్హమైన విషయం ఏమిటంటే, ఆ దైవదూతలకు ఏ విషయమూ కూడా తెలియకుండా ఉండదు. మనం నిద్రలో ఉన్నా, మనం మేల్కొని ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గానీ, వారికి మనం చేసే ప్రతీది తెలుసు. ఏ ఒక్క విషయం కూడా వారికి దాగి ఉండదు.

ఈ విషయం మనకు మరింత స్పష్టంగా బోధపడాలని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో వివిధ సందర్భాల్లో, ఎన్నో ఉదాహరణల ద్వారా కూడా మనకు తెలియపరిచారు.

అయితే, మన కర్మ పత్రాల్లో మనతో ఉన్న దైవదూతలు రాసే విషయాలే కాకుండా, వేరే కొన్ని సందర్భాల్లో కూడా కొందరు దైవదూతలు ఉంటారు. ఉదాహరణకు, జుమా నమాజ్, శుక్రవారం రోజున జుమా నమాజ్ కంటే ముందు కొందరు దైవదూతలు ప్రతి జుమా మస్జిద్ కు వస్తారు. అక్కడ ఎవరెవరు ఎంత ముందు మస్జిద్ కు వస్తూ ఉన్నారో వారి పేర్లు వారు రాసుకుంటూ ఉంటారు. మరి ఎవరైతే అజాన్ తర్వాత వస్తారో వారి హాజరు ఆ దైవదూతల యొక్క రిజిస్టర్ లో ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇమామ్ మెంబర్ పై ఖుత్బా ఇవ్వడానికి ఎక్కుతాడో మరియు అటు ముఅద్దిన్ అజాన్ ప్రారంభం చేస్తాడో, దైవదూతలు తమ రిజిస్టర్ లన్నిటినీ కూడా మూసుకొని ఖుత్బా వినడానికి హాజరవుతారు.

అంతేకాకుండా, మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నమాజ్ లో “హమ్దన్ కసీరన్ తయ్యిబమ్ ముబారకన్ ఫీహ్” అని పలికాడు. నమాజ్ అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “నీవు పలికిన ఈ పదాలను రాసుకోవడానికి 30 కంటే ఎక్కువ మంది దైవదూతలు నేను ముందు రాయాలంటే నేను ముందు రాయాలి అని ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు” అని తెలిపారు.

ఈ విధంగా మహాశయులారా! ఇక్కడ మనకు మరొక విషయం కూడా బోధపడింది. అదేమిటంటే మన వెంట ఉన్న దైవదూతలే కాకుండా, వేరే వేరే సందర్భాల్లో, వివిధ సమయాల్లో కొందరు దైవదూతలు కొన్ని విషయాలు మంచివి కానీ చెడువి కానీ రాస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మంచి విషయాల్లో ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి, చెడు వాటి నుండి మనం దూరం ఉండాలి.

అయితే, ఈ కర్మలు ఏవైతే రాయబడుతున్నాయో, మనం ఆ ప్రళయ దినాన ఎక్కడైతే హాజరవుతామో, అక్కడ ఈ కర్మ పత్రాలన్నీ తెరవడం జరుగుతుంది. దాని యొక్క వివరాలు ఇన్ షా అల్లాహ్, తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41712

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]
మరణానంతర జీవితం [పుస్తకం]

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ [వీడియో | టెక్స్ట్]

పవిత్ర ఖుర్ఆన్ పరిచయం – హబీబుర్రహ్మాన్ జామిఈ
https://youtu.be/ztbp2wtF5do [6 min]

ఈ ప్రసంగంలో ఖురాన్ గురించి వివరించబడింది. ఖురాన్ అంటే అల్లాహ్ వాక్యం, యావత్ మానవాళికి మార్గదర్శకం, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం అని నిర్వచించబడింది. ఇది అల్లాహ్ తరఫున జిబ్రయీల్ దూత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడింది. ‘ఖురాన్’ అనే పదానికి ‘ఎక్కువగా పఠించబడేది’ అని అర్థం. రమజాన్ మాసంలో ఖురాన్ అవతరణ ప్రారంభమైందని, అందుకే ఈ మాసానికి, ఖురాన్‌కు మధ్య బలమైన సంబంధం ఉందని సూరహ్ బఖర మరియు సూరహ్ జుమర్ వాక్యాల ఆధారంగా వివరించబడింది.

ఇన్నల్ హమ్ దలిల్లాహి వహ్ దహు, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అద అమ్మా బ’అద్.
అభిమాన సోదరులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

‎اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ
(అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రియ వీక్షకులారా! ఈరోజు మనం ఖురాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

‎قُرْآن كَلَامُ الله
(ఖురాన్ కలాముల్లాహ్)
ఖురాన్, అల్లాహ్ యొక్క వాక్కు.

ఖురాన్ అల్లాహ్ వాక్యం. ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకం. ఖురాన్ సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనం. ఖురాన్ అల్లాహ్ గ్రంథం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ఖురాన్ గ్రంథాన్ని జిబ్రయీల్ దూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై సర్వ మానవుల కొరకు అవతరింపజేశాడు.

అభిమాన సోదరులారా! ఈ ఖురాన్ గ్రంథం ధర్మ పండితులు రాసుకున్న పుస్తకం కాదు. ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన స్వయంగా చెప్పిన మాటలు కావు. ఖురాన్ గ్రంథం అల్లాహ్ వాక్యం.

జిబ్రయీల్ దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. ఎవరికోసం అవతరింపజేశాడు? సర్వమానవుల సన్మార్గం కొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అవతరింపజేశాడు.

అలాగే ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై 23 సంవత్సరాల వ్యవధిలో అవతరింపజేయబడినది. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వయసు 63 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి లభించింది. అంటే, 63 సంవత్సరాలలో 40 తీసేస్తే మిగిలింది 23 సంవత్సరాలు. 13 సంవత్సరాలు మక్కాలో, 10 సంవత్సరాలు మదీనాలో. ఈ 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఖురాన్ అనే పదానికి శాబ్దిక అర్థం, ఎక్కువగా పఠించబడేది. ప్రపంచంలోనే ఎక్కువగా చదవబడే, పఠించబడే గ్రంథం ఖురాన్.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుజ్ జుమర్‌లో ఇలా తెలియజేశాడు:

‎تَنْزِيْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِيْزِ الْحَكِيْمِ
(తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్)
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడైన, వివేకవంతుడైన అల్లాహ్‌ తరఫున జరిగింది. (39:1)

ఈ ఖురాన్ ఎవరి తరఫున జరిగింది? అల్లాహ్ తరఫున. ఈ గ్రంథావతరణ, ‘తన్ జీలుల్ కితాబి మినల్లాహిల్ అజీజిల్ హకీమ్‘ – ఈ గ్రంథావతరణ సర్వాధికుడైన, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.

అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర బఖరాలో ఇలా తెలియజేశాడు, సూరా నెంబర్ రెండు:

‎شَهْرُ رَمَضَانَ الَّذِيْٓ اُنْزِلَ فِيْهِ الْقُرْاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الْهُدٰى وَالْفُرْقَانِ
రమజాను నెల – మానవులందరికీ మార్గదర్శకమైన ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల అది. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. (2:185)

రమదాన్ నెల, ఖురాన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికీ మార్గదర్శకం, అందులో సన్మార్గంతో పాటు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. అంటే, రమజాన్ ఖురాన్ అవతరింపజేయబడిన నెల, అంటే రమజాన్ మాసంలో ఖురాన్ అవతరింపజేయబడినది.

ఇంతకుముందు ఒక మాట విన్నాం, 23 సంవత్సరాల వ్యవధిలో ఖురాన్ వచ్చింది, మరి ఇది రమజాన్ నెలలో ఖురాన్ అవతరించింది అంటే, దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏమిటి? అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రమజాన్ మాసంలో తొలి ఆకాశంలో బైతుల్ ఇజ్జత్ అనే ప్రదేశంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పూర్తి ఖురాన్ రమజాన్ మాసంలోనే పెట్టాడు. అక్కడ నుండి ఈ భూమండలంలోకి అవసరానుసారం, సందర్భం ప్రకారం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వాక్యాలు పంపిస్తూ ఉన్నాడు. రెండో అర్థం, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జబల్ నూర్, హిరా గుహలో ఉన్నప్పుడు మొదటి దైవవాణి, ఖురాన్ అవతరణ ప్రారంభం అయ్యింది రమజాన్ మాసంలో.

ఈ విధంగా ఖురాన్ ప్రారంభం అయ్యింది అది రమజాన్ మాసంలోనే. కావున ఈ రమజాన్ మాసం, ఖురాన్ మాసం. అభిమాన సోదరులారా, ఇన్ షా అల్లాహ్, ఖురాన్ గురించి మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు.

‎وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
మా ఆఖరి మాట ఇదే, సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వస్తోత్రాలు.

‎وَالسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ
(వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)
మీపై కూడా అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక.

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం [మరణానంతర జీవితం – పార్ట్ 20] [ఆడియో, టెక్స్ట్]

మరణానంతర జీవితం [ఆడియో సీరీస్] [30 గంటలు] [91 భాగాలు]

ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం
https://www.youtube.com/watch?v=75Sw5ptc_50
[మరణానంతర జీవితం – పార్ట్ 20] [21 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాద. అమ్మా బాద్.

రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక: ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం.

త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిన జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి.

ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా వ్రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరహ్ కహఫ్ లో తెలియజేశాడు.

وَوُضِعَ الْكِتَابُ
కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది.

فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ
అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయ కంపితులై వాటిలో ఉన్న, వ్రాయబడిన ఆ విషయాలన్నింటినీ చూసి భయకంపితులై పోతారు.

وَيَقُولُونَ
మరియు అంటారు:

يَا وَيْلَتَنَا مَالِ هَٰذَا الْكِتَابِ
మా పాడుగాను, ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం.

لَا يُغَادِرُ صَغِيرَةً وَلَا كَبِيرَةً
ఏ చిన్న దానిని గానీ, ఏ పెద్ద దానిని గానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో వ్రాయబడింది.

إِلَّا أَحْصَاهَا
ప్రతీ ఒక్కటి అందులో చేర్చడం జరిగింది.

وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا
వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు.

وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا
నీ ప్రభువు ఎవరిపై కూడా ఏ మాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు.