సహనం ప్రయోజనాలు – సలీం జామిఈ [వీడియో & టెక్స్ట్]

సహనం ప్రయోజనాలు
https://youtu.be/gxR-9kJ-B6g [45 నిముషాలు]
వక్త: షేఖ్ సలీం జామిఈ హఫిజహుల్లాహ్

ఈ ప్రసంగంలో, షేక్ సలీం జామిఈ గారు ఇస్లాంలో సహనం (సబ్ర్) యొక్క ప్రాముఖ్యత మరియు దాని ప్రయోజనాల గురించి వివరించారు. సహనం పాటించేవారికి పరలోకంలో స్వర్గం లభిస్తుందని, దైవదూతలు వారికి స్వాగతం పలుకుతారని ఖుర్ఆన్ ఆధారాలతో తెలిపారు. సహనం పాటించడం వల్ల అల్లాహ్ ప్రేమ, సహాయం లభిస్తాయని, వారికి అపరిమితమైన పుణ్యం ప్రసాదించబడుతుందని నొక్కిచెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని గొప్ప అనుగ్రహంగా అభివర్ణించారని గుర్తుచేశారు. నిషిద్ధ విషయాలను త్యజించడం, పేదరికం మరియు కష్ట సమయాలు, శత్రువును ఎదుర్కోవడం, దైవ మార్గంలో పిలుపునివ్వడం, ఆత్మీయులను కోల్పోవడం, మరియు వ్యాధి సోకినప్పుడు వంటి వివిధ సందర్భాలలో సహనం ఎలా పాటించాలో ఉదాహరణలతో సహా వివరించారు. సహనం అనేది విశ్వాసంలో తల లాంటిదని, దాని విలువెంతో గొప్పదని ఈ ప్రసంగం స్పష్టం చేస్తుంది.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వస్తోత్రాలు. (1:2)

وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
(వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహీ వ అస్ హాబిహీ అజ్మయీన్)

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్.

గౌరవనీయులైన ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం,

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఇంతకుముందు మీరు సహోదరుడు అబ్దుర్రహ్మాన్ గారి నోట వినే ఉన్నారు. నేటి మన ప్రసంగ అంశం సహనం ప్రయోజనాలు. సహనం వల్ల మనిషికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో ఈ ప్రసంగంలో మనము ఇన్ షా అల్లాహ్ ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో ఇన్ షా అల్లాహ్ కొన్ని ఉదాహరణలతో సహా కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము కాబట్టి నేను మీ అందరితో కోరే విషయం ఏమిటంటే, జాగ్రత్తగా, ఏకాగ్రతతో విషయాలన్నింటినీ గమనించి వినాలని కోరుతున్నాను. అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక.

మనం పండితుల నోట అనేకసార్లు పరలోకం గురించి ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. మానవులందరూ మరణించిన తర్వాత పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మానవులందరితో లెక్కింపు తీసుకున్న తర్వాత నరకవాసులేమో నరకానికి వెళ్ళిపోతారు, స్వర్గవాసులేమో స్వర్గానికి చేరుకుంటారు. అయితే స్వర్గవాసులు ఎప్పుడైతే స్వర్గానికి చేరుకుంటారో, వారు స్వర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ దైవదూతలు కొందరు ఆ స్వర్గవాసులకు ఆహ్వానం పలుకుతూ ఉంటారు. ఏమని పలుకుతూ ఉంటారు? దాని ప్రస్తావన అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖుర్ఆన్ గ్రంథంలోని 13వ అధ్యాయము 24వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు.

దైవదూతలు వారికి ఆహ్వానిస్తూ ఏమంటారంటే,

سَلَامٌ عَلَيْكُم بِمَا صَبَرْتُمْ ۚ فَنِعْمَ عُقْبَى الدَّارِ
(సలామున్ అలైకుం బిమా సబర్ తుం ఫ ని’అమ ఉఖ్బద్ దార్)

“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు. (13:24)

సలామున్ అలైకుం బిమా సబర్ తుం అనే వాక్యం మీద ఒకసారి ఆలోచిస్తే దాని అర్థం ఏమిటంటే, “మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక. మీకు లభించిన ఈ అంతిమ గృహం ఎంత మంచిది” అని వారు అంటారు. మిత్రులారా, మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడ చేరుకుంటున్నారు అని ఆ రోజు దైవదూతలు స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆహ్వానిస్తూ ఆ మాటలు అంటారు అంటే అర్థం ఏమిటండీ? ప్రపంచంలో దైవభక్తులు ఎంతో ఓపిక, సహనం కలిగి ఉంటారు కాబట్టి, వారు చూపించిన, ప్రదర్శించిన ఆ సహనం, ఓపిక వల్ల వారు అక్కడ స్వర్గానికి చేరుకుంటారు అని అర్థం మిత్రులారా.

అంతేకాదు, స్వర్గవాసులు స్వర్గంలో చేరిపోతారు కదా. స్వర్గవాసులు స్వర్గంలోకి చేరిపోయినప్పుడు వారిని ఉద్దేశించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో తెలుసా? అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటాడో ఆ విషయాన్ని ఖుర్ఆన్ గ్రంథము 23వ అధ్యాయము 111వ వాక్యంలో తెలియజేశాడు,

إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
(ఇన్నీ జజైతుహుముల్ యౌమ బిమా సబరూ అన్నహుం హుముల్ ఫాయిజూన్)

నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్‌ సెలవిస్తాడు).” (23:111)

అల్లాహు అక్బర్. అక్కడ దైవదూతలు కూడా ఏమంటున్నారంటే మీరు చూపించిన సహనానికి బదులుగా మీరు ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు, మీ మీద శాంతి కురియు గాక అని వారు స్వాగతిస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమని ప్రకటిస్తున్నారంటే, ఈ రోజు మీరు ఇక్కడికి చేరుకున్నారు, ఈ స్వర్గం నేను మీకు ఇచ్చాను అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు చూపించిన సహనానికి బదులుగా నేను ఈ స్వర్గం మీకు ఇచ్చాను అని అల్లాహ్ అంటున్నాడు.

అల్లాహు అక్బర్. ఈ రెండు మాటలు వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తుందండి? అంటే ప్రపంచంలో మనం ఎంతో ఓపికగా సహనం కలిగి ఉండాలన్న మాట. అలా ఉంటేనే మనము స్వర్గానికి చేరుకుంటామన్న మాట. అలా సహనం ఓపిక కలిగి ఉంటేనే రేపు దైవదూతలు మనకు స్వాగతిస్తారన్న మాట. కాబట్టి ఆ దృశ్యాన్ని ఒకసారి మనము మైండ్లో తెచ్చుకొని ఆలోచించుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు, బాధలు అన్నీ కూడా తేలికమైనవి, చిన్నవి, వీటన్నింటి మీద మనము సహనం కలిగి ఉంటే, ఓపిక కలిగి ఉంటే ఇన్ షా అల్లాహ్ రేపు మనము స్వర్గానికి చేరుకుంటాము, దైవదూతలు మాకు స్వాగతిస్తారు అన్న ఊహతోనే ఆ ఆలోచనతోనే ఆ నమ్మకంతోనే మనము ఈ జీవితం గడిపేయొచ్చు మిత్రులారా.

కాబట్టి సహనం ఇది చిన్న విషయం కాదు. సహనం పాటించడం వలన మనిషి స్వర్గానికి చేరుకుంటాడు, స్వర్గానికి చేర్చే ఒక ముఖ్యమైన సాధనం సహనం. కాబట్టి సహనం మామూలు విషయం కాదు మిత్రులారా. సహనం మామూలు విషయం కాదన్న విషయం కూడా ఇన్ షా అల్లాహ్ నా ప్రసంగంలో ముందు ముందు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సహనం వల్ల ఏంటి ప్రయోజనాలు? మనిషికి, భక్తునికి ప్రయోజనాలు ఏంటి అనేటివి మనము ఇన్ షా అల్లాహ్ తెలుసుకుందాం.

సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో, ఓపికను ప్రదర్శిస్తాడో, అలాంటి భక్తుణ్ణి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? దీనికి ఆధారము మూడవ అధ్యాయము 146వ వాక్యము. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తున్నాడు,

وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
(వల్లాహు యుహిబ్బుస్ సాబిరీన్)
సహనం వహించే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. (3:146)

అల్లాహ్ సహనశీలురులను ఇష్టపడతాడు. అల్లాహు అక్బర్. మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లాహ్ మనల్ని మెచ్చుకుంటాడు. ఇంతకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి? అల్లాహ్ మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము, అల్లాహ్ ఇష్టపడాలనే కదా మనము సత్కార్యాలు చేస్తాము. కాబట్టి ఇక్కడ మనము అల్లాహ్ మెప్పు పొందటానికి ఒక మంచి అవకాశము, మంచి సాధనము సహనం పాటించడం. ఎవరైతే సహనం పాటిస్తారో, అలాంటి భక్తుల్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు అని స్వయంగా ఖుర్ఆన్ లో మూడవ అధ్యాయము 146వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనము సహనం పాటించాలి.

సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాలలో ఒక ప్రయోజనం ఏమిటంటే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని ఇష్టపడతాడు.

అలాగే మరోక ప్రయోజనం ఏమిటంటే, ఎవరైతే సహనం పాటిస్తారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారికి తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం ఏమిటి? ఎనిమిదవ అధ్యాయము 46వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرُوا ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
(వస్బిరూ ఇన్నల్లాహ మ’అస్ సాబిరీన్)
సహన స్థయిర్యాలను పాటించండి. స్థయిర్యం కనబరచే వారికి అల్లాహ్‌ తోడుగా ఉంటాడు.” (8:46)

సహన స్థైర్యాలను పాటించండి, స్థైర్యం కనబరిచే వారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సహాయము, అల్లాహ్ మనకు తోడుగా ఉండటము, ఇదే కదా మనము కావాల్సింది. మనము అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటే ఎంతటి విషయాన్ని అయినా మనము ఓపికగా, ఎంతో తేలికగా మనము ఎదుర్కోవచ్చు. అల్లాహ్ మనకు తోడుగా ఉంటే ప్రపంచంలో మనము ఎవరితోనూ భయపడటానికి అవసరం ఉండదు అని అల్లాహ్ మనకు తోడు ఉంటే చాలు అని చాలా సందర్భాలలో అనుకుంటూ ఉంటాము కదండీ. అయితే అల్లాహ్ మనకు తోడుగా ఉండాలంటే మనము సహనం ప్రదర్శించాలి, ఓపిక ప్రదర్శించాలి. అలా సహనం కలిగి ఉండినట్లయితే అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడని ఎనిమిదవ అధ్యాయం 46వ వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి సహనం కలిగి ఉంటే మరొక ప్రయోజనం ఏమిటంటే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనకు తోడుగా ఉంటాడు.

అంతే కాదండి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో, ఓపికను ప్రదర్శిస్తారో, అలాంటి వారికి అపరిమిత పుణ్యము లభిస్తుంది. దీనికి ఆధారం ఏమిటండి? 39వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ
(ఇన్నమా యువఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్)
సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.” (39:10)

అల్లాహు అక్బర్. మనం రంజాన్ నెలలో ఉపవాసాల గురించి వింటూ వింటూ ఏమంటామంటే, ఉపవాసం ఉంటే భక్తునికి అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది అని వింటూ ఉంటాం కదా. అచ్చం అలాగే సహనం పాటిస్తే, ఓపికను ప్రదర్శిస్తే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా లెక్కలేనంత పుణ్యము అతనికి, ఆ భక్తునికి ప్రసాదిస్తాడు అని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు, 39వ అధ్యాయము, 10వ వాక్యం. కాబట్టి సహనం పాటించడం వలన మనిషికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు.

ఒక మనిషి ఒక మనిషికి లెక్కలేనంత సహాయం చేశాడు అంటే దాన్ని మనం అంచనా వేయలేకపోతూ ఉంటాం. అదే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇచ్చేస్తే, దాన్ని అసలు మనం అంచనా వేయగలమా? మన అంచనాలకు చాలా పైన ఉంటుంది ఆ విషయం. కాబట్టి సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తునికి లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది కూడా సహనం వలన మనిషికి కలిగే ఒక ప్రయోజనం.

అలాగే మిత్రులారా, ఎవరైతే సహనం పాటిస్తారో, వాళ్ళకి స్వర్గం దక్కుతుంది అని ఇప్పుడు మనము రెండు వాక్యాలు విని ఉన్నాం. ఒకటి, దైవదూతలు స్వాగతించేది. రెండవది, స్వయంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రకటించేది. దైవదూతలు కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు ఇక్కడికి చేరుకుంటున్నారు అని మీ మీద శాంతి కురియు గాక అని ఆహ్వానిస్తారు. ఆ వాక్యం ద్వారా కూడా స్పష్టమవుతుంది సహనం పాటిస్తే స్వర్గం లభిస్తుంది అని. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా మీరు చూపించిన సహనానికి బదులుగా ఈ రోజు నేను మీకు ఈ స్వర్గం ఇచ్చాను అని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా కూడా మనకు రూఢీ అవుతుంది అదేమిటంటే మనిషికి సహనం పాటించడం వలన స్వర్గం ప్రసాదించబడుతుంది.

మిత్రులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అపరిమితమైన పుణ్యం ప్రసాదిస్తాడు, స్వర్గం ప్రసాదిస్తాడు, ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సహనం మామూలు విషయం అని అనిపిస్తుందా? కాదు కదా.

సహనం గొప్ప విషయం అని మనకు ఇవన్నీ ఈ ఉదాహరణల ద్వారా, ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అదే విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేసి ఉన్నారు. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,

وَمَا أُعْطِيَ أَحَدٌ عَطَاءً خَيْرًا وَأَوْسَعَ مِنَ الصَّبْرِ
(వమా ఊతియ అహదున్ అతఆన్ ఖైరన్ వ ఔసఆ మినస్సబ్ర్)
“సహనం కంటే ఉత్తమమైన మరియు విస్తృతమైన బహుమతి మరెవరికీ ఇవ్వబడలేదు.” (సహీహ్ అల్-బుఖారీ)

అంటే మనిషికి ఇవ్వబడిన అనుగ్రహాలలో పెద్ద అనుగ్రహం, గొప్ప అనుగ్రహం, విశాలవంతమైన అనుగ్రహం అది సహనం అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి మనిషికి ఎన్నో అనుగ్రహాలు దక్కుతాయి. కొందరికి మేధస్సు ఇవ్వబడుతుంది, కొందరికి కండబలం ఇవ్వబడుతుంది, కొందరికి వాక్ చాతుర్యం ఇవ్వబడుతుంది, మరికొందరికి డబ్బు ఇవ్వబడుతుంది, మరికొందరికి రకరకాల అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అవన్నీ మనం లెక్క చేయలేం. ప్రతి భక్తునికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రకరకాల అనుగ్రహాలు ఇస్తాడు. అయితే ఆ అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం సహనం, ఓపిక పాటించే గుణం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఓపిక ప్రదర్శించే గుణం ఇవ్వబడిందో, ఎవరికైతే సహనం పాటించే గుణం ఇవ్వబడిందో, వారు గొప్ప వరం అల్లాహ్ తరపున పొంది ఉన్నారనే విషయాన్ని ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం ద్వారా గ్రహించాలి.

అయితే మిత్రులారా, మరొకచోట ఖుర్ఆన్ గ్రంథం రెండవ అధ్యాయం 155 నుంచి 157 వాక్యాల వరకు మనము చూచినట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సహనం పాటించే వారికి మూడు శుభవార్తలు తెలియజేసి ఉన్నాడు. ఏమన్నాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా?

وَبَشِّرِ الصَّابِرِينَ. الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
(వబష్షిరిస్ సాబిరీన్. అల్లజీన ఇజా అసాబత్ హుం ముసీబతున్ ఖాలూ ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఉలాయిక అలైహిం సలవాతుమ్ మిర్ రబ్బిహిం వ రహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్)

ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.” (2:155-157)

ఈ సహన మూర్తులకు శుభవార్త ఇవ్వండి. ఎవరు వారు? వారికి ఏమైనా ఆపద వస్తే వారు ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, మేము కూడా అల్లాహ్ వైపు మరలవలసిందే, మేము కూడా అల్లాహ్ అల్లాహ్ వాళ్ళమే అని వారు అంటారు. వారి కొరకే వారి ప్రభువు తరపున అనుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వాక్యాలలో తెలియజేశాడు. అంటే ఇక్కడ మూడు అనుగ్రహాల ప్రస్తావన ఉంది గమనించారా? వారిపై ప్రభువు దయానుగ్రహాలు ఉంటాయి, అంటే వారి మీద అల్లాహ్ దయ చూపుతాడు. రెండవది, వారి మీద కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క కారుణ్యం వారి మీద వర్షిస్తుంది. సన్మార్గాన్ని పొందిన వారు కూడా వీరే, వారు సన్మార్గం మీద ఉంటారు. అల్లాహు అక్బర్.

అంటే సహనం పాటించే వారికి మూడు అనుగ్రహాల ప్రస్తావన ఒకేచోట అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రస్తావించాడు. వారి మీద అల్లాహ్ దయ ఉంటుంది, వారి మీద అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గంలో నడుచుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. కాబట్టి సహనం పాటించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి మిత్రులారా.

అందుకోసమే సహాబాలు ఈ సహనం గురించి ఏమనేవారంటే ముఖ్యంగా ఉమర్ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే, వజద్నా ఖైర ఐషినా బిస్సబ్ర్. మేము మా జీవితంలో ఉత్తమమైన రోజులు ఎప్పుడు చూశామంటే సహనం పాటించే రోజుల్లోనే చూశాము అని చెప్పేవారు. ఎప్పుడైతే మనము సహనం పాటించామో, ఆ రోజుల్లోనే మా జీవితంలోని ఉత్తమమైన రోజులు మేము చూశాము అన్నారు ఆయన. అల్లాహు అక్బర్. అంటే సహనం పాటిస్తూ జీవిస్తే జీవితంలోని మరుపురాని ఉత్తమమైన రోజులు అయిపోతాయి ఆ దినాలు, మిత్రులారా.

అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమనేవారంటే “అస్సబ్ రు మినల్ ఈమాని బి మంజిలతిర్ రాస్“. విశ్వాసంలో సహనం యొక్క స్థానం ఏమిటంటే మనిషి శరీరంలో తలకు ఉన్న స్థానం లాంటిది అన్నారు. తల లేకుండా ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందండీ? తల తీసేసి పక్కన పడేస్తే ఆ కాళ్ళకు, చేతులకు, ఆ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? ఎవరైనా ఆ దేహాన్ని గుర్తిస్తారా అసలు? గుర్తించరు, దానికి విలువ ఉండదు. తల లేని దేహానికి విలువ ఉండదు, అదే తల ఉన్న దేహానికి విలువ ఉంటుంది. అలాగే అలీ రజియల్లాహు త’ఆలా అన్హు వారు ఏమంటున్నారంటే సహనం కూడా విశ్వాసంలో తల లాంటిది. సహనం లేని విశ్వాసానికి విలువ ఉండదు. విశ్వాసంలో సహనం ఉంటే ఆ విశ్వాసానికి చాలా అంటే చాలా విలువ ఉంటుంది అని ఆయన చెప్పిన మాటలకు అర్థం మిత్రులారా.

కాబట్టి ఇప్పటివరకు మనము విన్న మాటలలో మనకు అర్థమైన విషయం ఏమిటంటే మిత్రులారా, సహనం ప్రదర్శిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇష్టపడతాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోడుగా ఉంటాడు, అపరిమితమైన పుణ్యం ఇవ్వబడుతుంది, స్వర్గం ఇవ్వబడుతుంది, ఉత్తమమైన అనుగ్రహాలు ఇవ్వబడతాయి. అలాగే అల్లాహ్ యొక్క దయ ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, వారు సన్మార్గం మీద ఉంటారు, వారి విశ్వాసానికి ఎంతో విలువ ఉంటుంది, మరియు సహనంతో జీవిస్తే వారు జీవించిన ఆ రోజులు మధుర క్షణాలుగా వారి జీవితంలో నిలిచిపోతాయి. ఇన్ని విషయాలు మనము సహనం గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకున్నాము.

అయితే మిత్రులారా, ఇప్పుడు సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించాలన్న విషయాన్ని తెలుసుకుందాం. సహనం ఎప్పుడెప్పుడు ప్రదర్శించవలసి ఉంటుంది? ఏ ఏ సందర్భాలలో మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది? అది కూడా ఇన్ షా అల్లాహ్ ఆధారాలతో తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా చెబుతాను, మొత్తం తొమ్మిది విషయాలు ఉన్నాయండి. ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ చెబుతాను, బాగా శ్రద్ధగా వినండి, గుర్తుంచుకోండి.

మొదటి విషయం ఏమిటంటే, నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. దీనికి మనం చూచినట్లయితే 79వ అధ్యాయము 40, 41 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
(వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహీ వనహన్ నఫ్స అనిల్ హవా ఫ ఇన్నల్ జన్నత హియల్ మ’అవా)

మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనస్సును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో అతని నివాసం స్వర్గమే అవుతుంది.” (79:40-41)

ఈ వాక్యం యొక్క అర్థము మరియు సారాంశం ఏమిటంటే మిత్రులారా, మనిషి యొక్క మనసులో షైతాను కూర్చొని చెడ్డ కోరికలు కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో సైతాను అనుమతి తీసుకొని మనిషి మనసులో ఒక చిన్న చోటు తీసుకొని అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చొని మనిషికి చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు అని మనము వేరే ప్రసంగాలలో విని ఉన్నాము కదండీ. కాబట్టి ఆ చెడు కోరికలు వచ్చినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనము సహనం ప్రదర్శించవలసి ఉంటుంది, ఏమని? అల్లాహ్ కు భయపడి ఈ పనులు చేయకూడదు, అల్లాహ్ నిషేధం చేశాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధం చేశారు. ఈ తప్పు చేస్తే, లేదంటే ఈ కోరికను నేను తీర్చుకుంటే రేపు నాకు ఇలాంటి శిక్షలు ఉంటాయి, రేపు నేను నష్టపోతాను. కాబట్టి రేపు శిక్షించబడకుండా ఉండటానికి, రేపు నష్టపోకుండా ఉండటానికి ఈ రోజు నా మనసును నేను కంట్రోల్ లో పెట్టుకుంటాను అని ఆ రోజు అతను ఒకవేళ సహనం ప్రదర్శించి, మనిషి తన మనసును కంట్రోల్ లో పెట్టుకొని, కోరికలను అదుపులో ఉంచుకుంటే అప్పుడు అతను ఎంతో సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. అలా చేస్తే రేపు ఇన్ షా అల్లాహ్ అతను శిక్షల నుండి రక్షించబడతాడు మరియు అతను సఫలీకృతుడైపోతాడు.

అయితే మిత్రులారా, ఆ కోరికలను అదుపులో పెట్టుకోవాలంటే మనిషికి సహనం కావాలి. ఎంతో పెద్ద సహనం అతనికి అవసరం అవుతుంది. మనం సమాజంలో నివసిస్తూ ఉన్నాం. మనం ఎక్కడైతే ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నామో, మన ఇరుపక్కల మనం చూస్తూ ఉంటాం. మన మిత్రులు కావచ్చు, మన పొరుగువారు కావచ్చు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అవన్నీ అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన పనులై ఉంటాయి. వారు చేస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు, ఎంతో పాపులారిటీ పొందుతూ ఉంటారు. కానీ ఒక భక్తుడు అతనికి కూడా షైతాను రెచ్చగొడతాడు, నువ్వు కూడా ఈ పని చేస్తే నీకు కూడా పాపులారిటీ వస్తుంది, నువ్వు కూడా ఇది చేస్తే నీకు కూడా ఆనందం కలుగుతుంది, నువ్వు కూడా ఇది చేస్తే నువ్వు కూడా సంతోషపడతావు అని అతనికి షైతాను రెచ్చగొడతాడు. కానీ అలా సైతాను మాటల్లోకి రాకుండా మనసుని అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకోవడానికి ఎంతో సహనం, ఓపిక అతనికి అవసరం అవుతుంది మిత్రులారా.

మొదటి విషయం నిషిద్ధ విషయాలను త్యజించేటప్పుడు సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. రెండో విషయం ఏమిటంటే, పేదరికం, గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ పుట్టించాడు. కొంతమందిని ధనవంతులు చేశాడు., మరికొంతమందిని మధ్య తరగతి వాళ్ళలాగా చేశాడు., మరికొంతమందిని పేదవారిలాగా చేశాడు.. అది ఆయన నిర్ణయం. అయితే ఎప్పుడైతే మనిషికి పేదరికం, గడ్డు పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు అతను ఎంతో ఓపిక, సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 75వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

أُولَٰئِكَ يُجْزَوْنَ الْغُرْفَةَ بِمَا صَبَرُوا وَيُلَقَّوْنَ فِيهَا تَحِيَّةً وَسَلَامًا
(ఉలాయిక యుజ్ జౌనల్ గుర్ ఫత బిమా సబరూ వ యులక్కౌన ఫీహా తహియ్యతన్ వ సలామా)
ఇలాంటి వారికే వారి సహన స్థైర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి.” (25:75)

మిత్రులారా, దీనికి నేను రెండు ఉదాహరణలు మీ అందరి ముందు ఉంచుతాను. గడ్డు పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా సహనం పాటించాలనేదానికి ఒక ఉదాహరణ, అలాగే పేదరికం మరియు గడ్డు పరిస్థితి రెండూ ఒకేసారి ఏర్పడితే ఎలా సహనం పాటించాలో అది ఒక ఉదాహరణ చెబుతాను చూడండి.

ముందుగా మనము యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి చూచినట్లయితే, యూసుఫ్ అలైహిస్సలాం వారు యాకూబ్ అలైహిస్సలాం వారి కుమారుడు. అదంతా కథ మనం ఈ రోజు చర్చించుకునే అవకాశం లేదు. యూసుఫ్ అలైహిస్సలాం వారిని వారి అన్నలు ఏం చేశారంటే తీసుకొని వెళ్లి బావిలో పడవేశారు. ఆయన చేసిన నేరం ఏమిటి? ఆయన ఏమైనా తప్పు చేశాడా? లేదు. చేయని నేరానికి అన్నలు తీసుకొని వెళ్లి ఆయనను బావిలో పడవేశారు. తర్వాత అక్కడి నుంచి కొంతమంది ఆయనను తీసుకొని వెళ్లి ఈజిప్ట్ నగరంలో అమ్మేశారు. బానిసగా మార్చబడ్డారు. కానీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దయతో రాజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ మళ్లీ పెద్దవారైన తర్వాత చేయని నేరానికి ఒక మహిళ ఆయన మీద నింద మోపి జైలుకు పంపించింది. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఆయన చేసిన నేరం ఏమిటండి? ఆయన జైలుకు వెళ్లారు కదా, కటకటాలకు వెనక్కి వెళ్లారు కదా, చేసిన నేరం ఏమిటి? ఏమీ చేయలేదు. చేయని నేరానికి మళ్లీ ఆయన జైలు జీవితం అనుభవించవలసి వచ్చింది. చూశారా? ఎంత గడ్డు పరిస్థితి చూడండి. అన్నలు తీసుకొని వెళ్లి బావిలో పడవేయటం ఏమిటి, తర్వాత మార్కెట్లో అమ్మివేయబడటం ఏమిటి, ఆ తర్వాత చేయని నేరానికి నింద మోపబడటం ఏమిటి, మరియు జైల్లో జీవితం గడపడం ఏమిటి. ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన ఏం చేశారండి? సహనం పాటించారు. ఆయన పాటించిన సహనానికి మూలంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇచ్చిన ఫలితం ఏమిటో చూశారు కదా? ఏ చోట అయితే ఆయన జైలు జీవితం గడిపారో, అదే చోట మళ్లీ ఆయన ఆర్థిక మంత్రి అయిపోయారు అల్హందులిల్లాహ్. ఎంతో గొప్ప పోస్ట్ ని, ఎంతో గొప్ప హోదాని అక్కడ ఆయన సంపాదించుకోగలిగారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు ఆ హోదాకు, ఆ స్థాయికి చేర్చారు. అంటే ఇక్కడ యూసుఫ్ అలైహిస్సలాం వారి సంఘటనలో మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, గడ్డు పరిస్థితులు, పేదరికము ఏర్పడినప్పుడు సహనం పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉన్నతమైన స్థానాలకు చేర్చుతాడు.

అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలోని బనీ ఇస్రాయీలు వారి పరిస్థితుల్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలండి. బనీ ఇస్రాయీలు వారు మూసా అలైహిస్సలాం వారు వచ్చే సమయానికి ఎలాంటి స్థితిలో ఉన్నారు? మనం ప్రసంగాలలో విని ఉన్నాం. ఫిరౌన్ అనే రాజు వారిని బానిసలుగా మార్చేసి రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు, ఆకలితో సరైన ఆహారం పెట్టకుండా హింసిస్తూ ఉన్నాడు. అంతే కాదు, వారి వంశంలో పుట్టిన మగబిడ్డలను వారి కళ్ళ ముందే చంపి వేయిస్తూ ఉన్నాడు. ఎలాంటి క్లిష్టమైన స్థితులు ఇవి? ఎలాంటి గడ్డు పరిస్థితులు ఇవి? ఒక వైపు ఏమో కడుపు నిండా ఆహారము లేదు, పైనుంచి వెట్టి చాకిరి చేయవలసి వస్తూ ఉంది, తర్వాత దెబ్బలు తినవలసి వస్తూ ఉంది, మాటలు పడాల్సి వస్తూ ఉంది, అంతేకాదు పుడుతున్న మగబిడ్డల్ని కళ్ళ ముందరే కోల్పోవలసి వస్తూ ఉంటుంది. పేదరికం, గడ్డు పరిస్థితి దీనికంటే ఇంకా హీనమైనది ఇంకోటి ఉంటుందా? అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మూసా అలైహిస్సలాం వారు ఏమనేవారో తెలుసా? ఇస్తఈనూ బిల్లాహి వస్బిరూ. మీరు సహనం పాటించండి, అల్లాహ్ సహాయం అర్థించండి. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా మీకు సహాయపడతాడు అని చెప్పేవారు. వారు అలాగే చేశారు. సహనం పాటించారు, అల్లాహ్ సహాయం కోరారు. చివరికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మూసా అలైహిస్సలాం వారితో పాటు బనీ ఇస్రాయీలు వారిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయేటట్టుగా అనుమతి ఇచ్చేశాడు. వెళ్తూ ఉంటే ముందర సముద్రం వచ్చింది. కథ మనమంతా విని ఉన్నాం. అల్లాహ్ ఆజ్ఞతో సముద్రంలో దారి తెరవబడింది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయీలు వారు ఆ సముద్రం మధ్యలో ఉన్న దారిలో నుండి అటువైపు గట్టుకు చేరుకున్నారు. అదే మార్గంలో ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయీలు వారిని హింసించాడో, పీడించాడో, కొట్టాడో, తిట్టాడో, వారి బిడ్డల్ని చంపించాడో, అతను అదే మార్గం నుండి వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు బాగా మధ్యలో వచ్చేసినప్పుడు మళ్లీ సముద్రం నీళ్లు కలిసిపోయాయి. చివరికి ఏమైందో తెలుసు కదండీ. ఫిరౌన్ బనీ ఇస్రాయీలు ప్రజల కళ్ళ ముందే సముద్ర నీటిలో మునిగి కుక్క చావు చచ్చాడు. చచ్చే ముందు ప్రాణభిక్ష పెట్టండయ్యా అని దీనంగా వేడుకున్నాడు. కానీ ప్రాణాలు దక్కలేదు. కుక్క చావు చచ్చాడు. చూశారా? అంటే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే, బనీ ఇస్రాయీలు ప్రజలు కూడా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు, పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు చెప్పినట్టుగా సహనం పాటించి, అల్లాహ్ సహాయం కోరారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని సహనం పాటించి మరియు అల్లాహ్ యొక్క సహాయం కోరిన కారణంగా ఆ పరిస్థితుల నుంచి గట్టు ఎక్కించాడు. అల్హందులిల్లాహ్.

కాబట్టి పేదరికం ఉన్నప్పుడు సహనం పాటించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నప్పుడు బిడ్డలు సహనం పాటించాలి. వారిని దూషించరాదు. ఇతరులను చూసి తల్లిదండ్రులను తక్కువగా అంచనా వేయరాదు. చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు వారు కోరుతున్న విషయాలు ఇప్పించట్లేదు అని తల్లిదండ్రులను తిడతారు, కొంతమంది అయితే ఇల్లు వదిలేసి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేయడం సమంజసము కాదు. సహనం పాటించాలి.

సరే, రెండు విషయాలు తెలుసుకున్నాము కదండీ. మూడో విషయం ఏమిటంటే, శత్రువుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. దీనికి ఆధారం రెండవ అధ్యాయం 250వ వాక్యం, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَلَمَّا بَرَزُوا لِجَالُوتَ وَجُنُودِهِ قَالُوا رَبَّنَا أَفْرِغْ عَلَيْنَا صَبْرًا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
(వలమ్మా బరజూ లిజాలూత వ జునూదిహీ ఖాలూ రబ్బనా అఫ్రిగ్ అలైనా సబ్రన్ వ సబ్బిత్ అఖ్దామనా వన్సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్)

వారు జాలూత్, అతని సైన్యంతో ముఖాముఖి అయినప్పుడు, “ప్రభూ! మాకు సహన స్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను ఇవ్వు. అవిశ్వాస జనులపై జరిగే పోరాటంలో మాకు తోడ్పడు.” అని ప్రార్ధించారు.” (2:250)

ఇది తాలూత్ మరియు జాలూత్ మధ్య జరిగిన యుద్ధం సంఘటన. ఈ సంఘటన గురించి మనం చర్చించుకుంటే చాలా సమయం అయిపోతుంది. ప్రవక్త దావూద్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని నాది ఒక ప్రసంగం ఉంది YouTube లో, అది మీరు వింటే అక్కడ దీని వివరణ మొత్తం అక్కడ ఉంది అండి. క్లుప్తంగా విషయం ఏమిటంటే, శత్రువు సైన్యంలో జాలూత్ అనేవాడు ఒకడు ఉండేవాడు, గొప్ప బలశీలి, బలవంతుడు. అయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడైతే తాలూత్ వారు వెళ్లారో, వీరి వద్ద విశ్వాసుల సైన్యము చాలా తక్కువ సంఖ్యలో ఉండేది. అవిశ్వాసుల సంఖ్య ఎక్కువగా ఉండేది. వారి వద్ద సైన్యం ఎక్కువగా ఉండేది, ఆయుధాలు కూడా ఎక్కువగా ఉండేవి. కానీ అల్లాహ్ దయవల్ల ఈ తక్కువ సంఖ్యలో ఉన్న విశ్వాసులు యుద్ధ మైదానంలో సహనం పాటించారు. కాబట్టి శత్రువును ఎదుర్కొన్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. విశ్వాసులు సంఖ్యలో తక్కువ ఉన్నప్పుడు, అవిశ్వాసులు సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పుడు భయపడరాదు. ఓపికగా సహనం ప్రదర్శించి అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయవలసి ఉంటుంది. ఇది మూడవ విషయం.

నాలుగో విషయం ఏమిటంటే, అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు. మిత్రులారా, ఈ విషయం ముఖ్యంగా ఎవరైతే ఫీల్డ్ లో వెళ్లి ప్రజలకు దైవ వాక్యాలు వినిపించే పని చేస్తూ ఉన్నారో, వారికి వర్తిస్తుంది. అల్లాహ్ వైపు పిలుపు ఇచ్చినప్పుడు ప్రజలు రకరకాలుగా మాట్లాడుతారు. అలా మాట్లాడినప్పుడు వారి మాటలతో గుండె భారం పెంచుకోకుండా ఓపిక, సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. ఖుర్ఆన్ గ్రంథం 16వ అధ్యాయము 127వ వాక్యాన్ని చూస్తే,

وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ
(వస్బిర్ వమా సబ్ రుక ఇల్లా బిల్లాహ్ వలా తహ్జన్ అలైహిం వలా తకు ఫీ జైకిమ్ మిమ్మా యమ్కురూన్)

ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు.” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేశారు.

అర్థం ఏమిటంటే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు. సహనం ప్రదర్శించు. నువ్వు చేస్తున్న పని దైవ వాక్యాలు ప్రజలకు వినిపించే పని. ఆ పని చేస్తున్నప్పుడు ప్రజలు నీ పట్ల కుట్రలు పన్నుతూ ఉన్నారు. వారు పన్నుతున్న కుట్రలకు నువ్వు దుఃఖించకు. సహనం ప్రదర్శించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేస్తూ ఉన్నాడు.

కాబట్టి ఇదే విషయం, ఇదే ఆదేశం మనకు వర్తిస్తుంది. మనము దేవుని విషయాలు, దేవుని వాక్యం ప్రజలకు వినిపించే ప్రయత్నం చేసినప్పుడు కుట్రలు పన్నే వాళ్ళు రకరకాలుగా కుట్రలు పన్నుతారు. అయితే మనము దుఃఖించకూడదు, అలాగే వెనకడుగు వేయకూడదు. సహనం పాటించాలి, అల్లాహ్ మార్గంలో ముందడుగు వేయాలి.

ఐదో విషయం ఏమిటంటే, వ్యతిరేకులు విమర్శించినప్పుడు కూడా చాలా సహనం ప్రదర్శించవలసి ఉంటుంది. మనం చెప్పే మాటలకు ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏకీభవించే వాళ్ళు మా మాటను వినేస్తారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే విమర్శలు చేస్తారు. అప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. 73వ అధ్యాయం, 10వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేశాడు,

وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
(వస్బిర్ అలా మా యఖూలూన వహ్జుర్ హుం హజ్రన్ జమీలా)
వారు చెప్పే మాటలపై ఓర్పు వహించు. హుందాగా వారి నుండి నిష్క్రమించు.” (73:10)

వారు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. వారి విమర్శించే విమర్శలను నువ్వు పట్టించుకోవద్దు. వారి విమర్శలపై ఓర్పు, సహనం పాటించు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తెలియజేసి ఉన్నాడు.

అలాగే ఆరో విషయం ఏమిటంటే, ఆత్మీయులను కోల్పోయినప్పుడు. అల్లాహు అక్బర్, ఇది గొప్ప విషయం అండి. మన కుటుంబంలో మన బిడ్డలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, అన్న, చెల్లెళ్ళు ఎవరైనా కావచ్చు, మన ఆత్మీయుల్ని ఎప్పుడైతే మనము కోల్పోతామో, అప్పుడు కూడా చాలా సహనం పాటించవలసి ఉంటుంది.

ఇది మామూలు విషయం కాదు. మన కుటుంబ సభ్యుల్లో, మన ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించారంటే అది పెద్ద ప్రాణ నష్టం. ఆ నష్టం ఎప్పుడైతే వాటిల్లుతుందో, మనిషి కుంగిపోతాడు, కదిలిపోతాడు. అయినా గానీ ఓపిక సహనం పాటించవలసి ఉంటుంది.

బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనాన్ని చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు,

మాలి అబ్ దిల్ మోమిని ఇందీ జజావున్ ఇజా కబస్తు సఫియ్యహు మిన్ అహ్లిద్దున్యా సుమ్మ హతసబహు ఇల్లల్ జన్నా.
విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ ప్రవక్త అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట తెలిపిన మాట ఏమిటంటే, విశ్వాసి అయిన నా దాసుని యొక్క ఆత్మీయులు ప్రపంచంలో నివసించు వారిలో ఒకరిని నేను తీసుకున్నప్పుడు అతను నాపై నమ్మకం ఉంచి సహనంగా ఉంటే అతని కొరకు నా వద్ద స్వర్గం తప్ప మరో బహుమతి లేదు. అల్లాహు అక్బర్. ఆత్మీయుల్లో ఎవరో ఒకరు మరణించినప్పుడు మనము సహనం ప్రదర్శిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమంటున్నాడంటే అతని ఆత్మీయుల్ని నిన్ను తీసుకున్నాను, అయినా అతను సహనం పాటించాడు కాబట్టి అతనికి నా వద్ద స్వర్గం తప్ప మరొక బహుమతి లేదు, నేను అతనికి స్వర్గమే ఇచ్చేస్తాను బహుమానంగా అని అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది, అలా పాటిస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ భక్తునికి బహుమానంగా స్వర్గం ఇస్తాడు.

అలాగే ఏడో విషయం ఏమిటంటే, ప్రజల మధ్య సంచరిస్తున్నప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఒక వ్యక్తి అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ప్రజల మధ్య నడుస్తూ ఉంటే అతని టోపీని చూసి గానీ, అతని గడ్డాన్ని చూసి గానీ, అతను ధరించిన జుబ్బాలను చూసి గానీ, లేదంటే ఏదో ఒక విషయాన్ని చూసి కొంతమంది వెక్కిరిస్తారు, లేదంటే హేళన చేస్తారు, రకరకాల ఎత్తిపొడిచే మాటలు మాట్లాడతారు. అయినా గానీ, నన్ను చూసి, నేను అమలు చేస్తున్న నా ఈ గడ్డాన్ని చూసి, లేదంటే నా బట్టలను చూసి, నా టోపీని చూసి వీరు నన్ను హేళన చేస్తున్నారు అని మనము కృంగిపోకూడదు, ఆ విషయాలను త్యజించకూడదు. సహనం పాటించవలసి ఉంటుంది. ప్రజల మధ్య ఉన్నప్పుడు లోకులు కాకులని విన్నారు కదా, ఆ విధంగా వాళ్ళు కావు కావు అంటారు. కానీ మనము సహనం పాటించాలి. ప్రజల మధ్య ఉండి, వారి మాటల మీద సహనం ప్రదర్శించినవాడు గొప్ప విశ్వాసి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.

ఎనిమిదో విషయం ఏమిటంటే, వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించుకుంటూ వస్తాడు. అయితే అకస్మాత్తుగా అతనికి ఒక వ్యాధి సోకుతుంది. ఆ వ్యాధి సోకిన తరువాత అతను ఎప్పుడైతే వైద్యం చేయించుకుంటాడో, అప్పటి నుండి అతని జీవితం తలకిందులైపోతుంది. డాక్టర్లు, వైద్యులు అతనికి ఇవి తినకూడదు, అవి తినకూడదు, అక్కడ కూర్చోకూడదు, అది ఎత్తకూడదు, అది మోయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని కొన్ని విషయాలు, కొన్ని ఆంక్షలు పెడతారు. అలా ఆంక్షలు పెట్టినప్పుడు అతని జీవితం మొత్తం తలకిందులైపోతుంది. అన్ని రోజులు అతను తోచింది తిన్నాడు, తోచినట్టు అతను నడుచుకున్నాడు. కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి అతను తోచింది తినలేడు, తోచినట్టు అతను ఏదీ చేయలేడు, క్రమశిక్షణతో అతను కొన్ని ఆంక్షలను పాటించవలసి వస్తూ ఉంటుంది. అలా జీవితం ఎప్పుడైతే తలకిందులైపోతుందో, అప్పుడు కూడా అతను సహనం పాటించవలసి ఉంటుంది.

దీనికి ఉదాహరణగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక మహిళకు ఒక వ్యాధి సోకింది. ఆవిడ స్పృహ కోల్పోయి దారిలో ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఆవిడ విన్నవించుకున్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఫలానా వ్యాధి ఉంది, ఆ వ్యాధి వల్ల నేను ఎక్కడంటే అక్కడ స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను కాబట్టి మీరు అల్లాహ్ తో దుఆ చేయండి, నా ఈ వ్యాధి తొలగిపోవాలని అల్లాహ్ ను ప్రార్థించండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఆవిడ కోరుకున్నారు.

అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిడ ముందర రెండు విషయాలు ఉంచారు. మొదటి విషయం ఏమిటంటే, చూడమ్మా నువ్వు సహనం పాటిస్తే ఈ వ్యాధి మీద నీకు స్వర్గం ఇవ్వబడుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే నువ్వు కోరినట్టుగానే నిన్ను దుఆ చేయమంటే నిన్ను దుఆ చేసేస్తాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ వ్యాధి తొలగించేస్తాడు. ఈ రెండు విషయాల్లో నీకు ఏది కావాలో కోరుకో అన్నారు. ఆవిడ ఏమన్నారో తెలుసా? ఓ దైవ ప్రవక్త, నేను సహనం పాటిస్తాను, నాకు స్వర్గమే కావాలి అన్నారు. అల్లాహు అక్బర్. సుబ్ హా నల్లాహ్. చూశారా మిత్రులారా? కాబట్టి వ్యాధి సోకినప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

అలాగే చివరి విషయం ఏమిటంటే, సేవ చేసేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. మానవ సేవ అండి, సేవ అంటే ధార్మిక సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, ఏ రకమైన సేవ అయినా సరే. సేవ చేసినప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది. ఎందుకు?

ఎందుకు అంటే మీరు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు ప్రజలు మీ మీద నోరు పారేసుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీదనే ఒక వ్యక్తి వెళ్లి మాట్లాడాడు. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంచే కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. ప్రజల మధ్య కొన్ని విషయాలు పంచుతూ ఉన్నారు. పంచుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి యా ముహమ్మద్ ఇ’దిల్, ఓ ముహమ్మద్ నువ్వు న్యాయంగా వ్యవహరించు అంటూ ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొహం ఎర్రబడిపోయింది. సహాబాలు చూసి గమనించేశారు. ప్రవక్త వారికి అంత కోపం వచ్చింది అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన కారుణ్యమూర్తి కదండీ, కోపం వచ్చినా గానీ కోపం ప్రదర్శించరు. ఆయన ప్రశాంతంగా మాట్లాడుతారు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేస్తారయ్యా అన్నారు. అల్లాహు అక్బర్. కాబట్టి సేవ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నప్పుడు కూడా ప్రజలు నోరు పారేసుకుంటారు. కాబట్టి విశ్వాసంగా, నిజాయితీగా మనము సేవ కార్యక్రమాలు, అది ధర్మ సేవ కావచ్చు, మానవ సేవ కావచ్చు, అలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు కూడా సహనం పాటించవలసి ఉంటుంది.

చివరిగా ధార్మిక పండితులు కొందరు ఏమన్నారంటే, సహనం మూడు రకాలు, అస్సబరు సలాసతు అన్వా. సబర్, సహనం మూడు రకాలు.

మొదటిది, అస్సబరు అలా అదాయిత్తాఅ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా యొక్క ఆదేశాలను పాటిస్తున్నప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

రెండవది, అస్సబరు అన్ ఇర్తికాబిల్ మాసియ. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిషేధించిన విషయాలను త్యజించేసేటప్పుడు సహనం పాటించవలసి ఉంటుంది.

మూడవది, అస్సబరు అలా అఖ్దారిల్లాహిల్ మూలిమా. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తుని మీద కొన్ని నిర్ణయాలు ఎప్పుడైతే చేసేస్తాడో, ఆ అల్లాహ్ నిర్ణయాలను కట్టుబడి ఉండేటప్పుడు కూడా మనిషి సహనం పాటించవలసి ఉంటుంది.

ఈ మూడు విషయాలు ధార్మిక పండితులు తెలియజేశారు. చూడటానికి మూడు విషయాలు కానీ దీని అర్థము, భావము చాలా విశాలమైనది, లోతైనది.

ఇంతటితో నా మాటను ముగిస్తూ నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఓపిక, సహనం అనే గుణం ప్రసాదించు గాక. మనందరికీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అల్లాహ్ ఆరాధనల్లో, అల్లాహ్ ఆదేశాలు పాటించే విషయంలో సహనం పాటించే గుణం ప్రసాదించు గాక. అలాగే పాప కార్యాల నుండి, అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించిన విషయాల నుండి దూరం ఉండేటప్పుడు కూడా అల్లాహ్ మనందరికీ సహనం ప్రసాదించు గాక.

అలాగే ప్రవక్త వారు తెలియజేసినట్టుగా అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలలో గొప్ప అనుగ్రహం సహనం, ఆ గొప్ప అనుగ్రహం సహనం అల్లాహ్ మనందరికీ ప్రసాదించు గాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించు గాక. నరకం మరియు సమాధి శిక్షల నుండి, ఇతర శిక్షల నుండి అల్లాహ్ మనందరినీ కాపాడు గాక. ఆమీన్.

وَ جَزَاكُمُ اللّٰهُ خَيْرًا
(వ జజాకుముల్లాహు ఖైరన్)

السَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=43525

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు [వీడియో | టెక్స్ట్]

అల్లాహ్ వ్రాసిన విధి వ్రాత పట్ల అయిష్టత, కోపం ప్రదర్శించకు
https://www.youtube.com/watch?v=pcIMF4mR90E [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]

ఈ ప్రసంగంలో, వక్త అల్లాహ్ యొక్క విధిరాత (ఖద్ర్) పట్ల అసంతృప్తి మరియు కోపాన్ని ప్రదర్శించడం తౌహీద్ (ఏకేశ్వరోపాసన)కు విరుద్ధమని, అది అవిశ్వాసం (కుఫ్ర్) వైపు నడిపించే ప్రమాదం ఉందని వివరిస్తారు. కష్టాలు మరియు ఆపదలు ఎదురైనప్పుడు, సహనం వహించడం, నాలుకను మరియు అవయవాలను అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. అల్లాహ్ తాను ప్రేమించిన వారిని పరీక్షిస్తాడని, గొప్ప బహుమతి గొప్ప పరీక్షతోనే వస్తుందని ఒక హదీసును ఉటంకిస్తారు. విధిరాత పట్ల సంతృప్తిగా ఉన్నవారికి అల్లాహ్ యొక్క ప్రసన్నత లభిస్తుందని, కోపగించుకున్న వారికి ఆయన ఆగ్రహం కలుగుతుందని ఆయన ముగిస్తారు.

అల్లాహ్ రాసిన విధిరాత (ఖద్ర్) పట్ల అయిష్టత, అసహ్యత మరియు కోపం ప్రదర్శించరాదు. అల్లాహ్ రాసినటువంటి ఖద్ర్, ఖదా. దాని పట్ల ఎప్పుడూ కూడా అయిష్టత, అసహ్యత, కోపం ప్రదర్శించరాదు. ఈ పాపంలోనైతే మనలో చాలా మంది పడిపోతున్నారు. అల్లాహ్ అందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

అల్లాహ్ నిర్ణయించిన దాని ప్రకారం ఏమైనా ఆపదలు వస్తే అయిష్టత, కోపం ప్రదర్శించుట ఇది సంపూర్ణ తౌహీద్‌కు విరుద్ధం. ఒక్కోసారి ఇదే స్థితిలో మనిషి ఏదైనా కుఫ్ర్ మాటలు, అవిశ్వాస పలుకులు పలికితే, లేదా కుఫ్ర్, అవిశ్వాసానికి సంబంధించిన ఏదైనా పని చేస్తే, ఈ చేష్ట అతని తౌహీద్ పునాదులను కదిలించి అతడు కుఫ్ర్‌లో పడిపోయే ప్రమాదం కూడా ఉంది.

మరి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది? నాకే అల్లాహ్ ఇట్లా రాయాల్నా? నా మీదనే ఈ ఆపద రాసి రావాల్సి ఉండేనా? అయ్యో నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడే నా భర్త చనిపోవాల్నా? ఏంటిది అల్లాహ్ యొక్క ఈ అన్యాయం? ఇలాంటి మాటలు ప్రజలు అంటూ ఉన్నారు ఈ రోజుల్లో. కొన్ని ప్రాంతాల్లోనైతే ఓ అల్లాహ్, నా భర్తే దొరికిండా నీకు తీసుకోవడానికి? ఇంకా ఎవరూ లేకుండినా? ఇట్లాంటి మాటలు కూడా కొందరు అన్నారు. ఇది చాలా పాపం, చాలా పాపం. మనల్ని తౌహీద్ నుండి, ఇస్లాం నుండి వైదొలగడానికి, ఇస్లాం నుండి దూరమైపోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

విధిరాతను అసహ్యించుకోకూడదు. తఖ్దీర్‌ను అయిష్టతతో లేదా ఏదైనా మన ద్వారా ఒక అసహ్యం ఏర్పడింది అన్నట్లుగా మనం ప్రదర్శించకూడదు. అల్లాహు త’ఆలా అందరి తఖ్దీర్ ముందే రాసి పెట్టాడు గనక, అతడు అలీమ్ మరియు హకీమ్. సర్వజ్ఞాని మరియు సర్వ వివేకవంతుడు. అల్లాహు త’ఆలా వివేకవంతుడు గనకనే అదృష్టాన్ని, తఖ్దీర్‌ని రాసిపెట్టాడు.

మనపై ఇహలోక పరంగా మనకు ఏదైనా ఆపద వచ్చింది. రోగ రూపంలో గానీ, లేదా మనకు సంబంధించిన దగ్గరి వారు చనిపోయే రూపంలో గానీ, ఇంకా ఏ రూపంలో ఏ ఆపద వచ్చిపడ్డా, విధిగా పాటించవలసిన విషయాలు ఏమిటంటే:

  1. నెంబర్ ఒకటి, కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా తనకు తాను సహనం వహించాలి.
  2. రెండవ విషయం, కోపం, అయిష్టత వ్యక్తపరచకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అల్లాహ్‌కు ఇష్టం లేని ఏ మాట నాలుక నుండి వెళ్లనివ్వకూడదు.
  3. మూడవది, తన శరీర అవయవాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. చెంపలు బాదుకోవడం, దుస్తులు చించుకోవడం, చింపేయడం, వెంట్రుకలు పీక్కోవడం, తలపై దుమ్మెత్తి పోసుకోవడం, ఇంకా ఇలాంటి ఏ పనులు కూడా చేయరాదు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసుపై శ్రద్ధ వహించండి. తిర్మిజిలోని సహీ హదీస్, 2396. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

عَنْ أَنَسٍ عَنِ النَّبِيِّ قَالَ: (إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلَاءِ وَإِنَّ اللهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلَاهُمْ فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ).

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారని అనస్ (రజియ ల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది. అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు సంతోషంగా మసలుకుంటారో వారికి అల్లాహ్ సంతృష్టి లభిస్తుంది. ఎవరు అయిష్టత, కోపానికి గురి అవుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి గురి అవుతాడు”. (తిర్మిజి/ ఫిస్సబ్రి వల్ బలా/ 2396).

إِنَّ عِظَمَ الْجَزَاءِ مَعَ عِظَمِ الْبَلاَءِ
(ఇన్న ఇ’జమల్ జజా’ఇ మ’అ ఇ’జమిల్ బలా’ఇ)
పరీక్ష ఎంత పెద్దగా ఉంటుందో అంతే గొప్ప పుణ్యఫలం ఉంటుంది.

గొప్ప పుణ్యం కావాలా? చాలా బ్రహ్మాండమైన పెద్ద సత్ఫలితం కావాలా నీకు? అయితే అంతే పెద్ద పరీక్షలు వస్తాయని కూడా నీవు నమ్ము.

మళ్ళీ తర్వాత ప్రవక్త ఏం చెప్పారో చూడండి:

وَإِنَّ اللَّهَ إِذَا أَحَبَّ قَوْمًا ابْتَلاَهُمْ
(వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ ఖౌమన్ ఇబ్తలాహుమ్)
మరియు నిశ్చయంగా అల్లాహ్ ఎవరినైతే ప్రేమిస్తాడో, వారిని పరీక్షకు గురిచేస్తాడు.

ఎల్లవేళలలో ఈ విషయాన్ని మదిలో ఫ్రెష్‌గా నాటుకుని ఉండే భాగ్యం ప్రసాదించు గాక. వేరే ఎల్లవేళలలో ఈ మదిలో ఈ విషయం ఉండదు గనక, ఏ చిన్న ఆపద వచ్చినా గానీ మనం తొందరగా కోపానికి గురవుతాం. ఇది నాకు ఆపద వచ్చిందంటే పళ్ళు కొరకడం, వెంట్రుకలు పీక్కోవడం, బట్టలు చింపుకోవడం, అల్లాహు అక్బర్ అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వు గాక.

ప్రవక్త ఏమంటున్నారో చూడండి, అల్లాహ్ ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షకు గురిచేస్తాడు. ఆ పరీక్షలో:

فَمَنْ رَضِيَ فَلَهُ الرِّضَا وَمَنْ سَخِطَ فَلَهُ السَّخَطُ
(ఫమన్ రదియ ఫలహుర్-రిదా, వ మన్ సఖిత ఫలహుస్-సఖత్)
ఎవరైతే సంతోషంగా ఉంటారో, అతనికి (అల్లాహ్ యొక్క) సంతృప్తి లభిస్తుంది, మరియు ఎవరైతే కోపానికి గురవుతాడో, అతనికి (అల్లాహ్ యొక్క) ఆగ్రహం కలుగుతుంది.

ఫలహుర్-రిదా. ఎవరైతే సంతోషంగా మసులుకుంటారో, అతనికి అల్లాహ్ యొక్క సంతృప్తి లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అల్లాహ్ నీ పట్ల సంతృప్తి చెంది ఉండాలి, నిన్ను చూసి సంతోషపడాలి, అంటే ఏం చేయాలి? ఏ పెద్ద కష్టం వచ్చినా గానీ మూడు రకాలు ఏవైతే చూపించబడ్డాయో, ఆ మూడు పద్ధతులను అవలంబించాలి మరియు అన్ని రకాల చెడులకు దూరం ఉండాలి.

కానీ ముసీబత్, కష్టం, ఆపద వచ్చినప్పుడు వమన్ సఖిత ఫలహుస్-సఖత్, ఒకవేళ కోపానికి గురి అయ్యాడంటే అతడు కూడా అల్లాహ్ ఆగ్రహానికి గురైపోతాడు. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ మనందరినీ క్షమించు గాక. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తఖ్దీర్‌పై సంతోషంగా ఉండి, అల్లాహ్ మనకు అన్ని రకాల మేళ్లు చేసే భాగ్యం ప్రసాదించు గాక.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41278

తఖ్దీర్ (విధి వ్రాత):
https://teluguislam.net/qadr-taqdeer-vidhi-rata/

ధర్మపరమైన నిషేధాలు [పుస్తకం & వీడియో పాఠాలు]
https://teluguislam.net/2011/03/23/prohibitions-in-sharia-telugu-islam/

ధార్మిక విద్యార్జనలో సహనం ప్రాముఖ్యత [వీడియో]

బిస్మిల్లాహ్

[48:46నిముషాలు]
షేఖ్ డా. సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

ధర్మ జ్ఞానం (మెయిన్ పేజీ)
https://teluguislam.net/others/ilm-knowledge/

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 11: ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం [వీడియో]

బిస్మిల్లాహ్

[20:33 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి జుహ్ద్, వస్త్రాధారణ, న్యాయం సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [20:33 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ద్

జుహ్ద్ అన్న పదం ఏదైనా వస్తువును త్యజించడం అన్న భావంలో వస్తుంది. ఈ నిర్వచనం వాస్తవ రూపంలో ఎవరిపై ఫిట్ అవుతుందంటే; ఐహిక సుఖాలనూ, భోగభాగ్యాలనూ పొంది, అయిష్టతతో వాటిని వదులుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరికన్నా ఎక్కువ జుహ్ద్ గలవారు. ప్రపంచం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఉన్నప్పటికీ, ఆయన సర్వ సృష్టిలో అల్లాహ్ కు అతి ప్రియులు అయినప్పటికీ, అల్లాహ్ తలిచితే ఆయన కోరుకున్నంత ధనం, వరాలు ఆయనకు ప్రసాదిం- చేవాడు. అయినప్పటికీ ఆయన అందరికన్నా తక్కువ ప్రపంచ వ్యామోహం గలవారు. ఎంత లభించిందో అంతలోనే సరిపుచ్చుకొని, శ్రమతో కూడిన జీవితం పట్ల సంతృప్తి పడేవారు.

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ తన తఫ్సీరులో ఖైసమ ఉల్లేఖనం ప్రస్తావించారు: “నీవు కోరితే ఇంతకు ముందు ఏ ప్రవక్తకు లభించనంత భూకోశాలు, వాటి బీగములు ప్రసాదిస్తాము. ఇవన్నీ నీ తర్వాత ఎవరికీ దొరకవు. ఇవన్నీ నీకు లభించినప్పుడు అల్లాహ్ వద్ద నీకు గల గౌరవ స్థానాల్లో ఏ కొరతా కలగదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పబడింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: “ఇవన్నియూ నా కొరకు పరలోకంలో ఉండనీవండి“. (సూర అల్ ఫుర్ఖాన్ 25:10).

ఇక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, ఆయన ఆర్థిక విషయం మరీ విచిత్రమైనది. అబూ జర్ర్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: మదీనలో ఒకసారి నేను ప్రవక్త వెంట రాతినేల మీద నడుస్తూ ఉండగా మాకు ఎదురుగా ఉహుద్ పర్వతం వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పారుః “అబూ జర్ర్! నా దగ్గర ఉహుద్ పర్వతమంత బంగారం ఉండి, మూడు రాత్రులు గడిచినంత కాలంలో అప్పు తీర్చడానికి ఉంచుకునే కొంత బంగారం తప్ప అది నా దగ్గర ఉండిపోవడం నాకిష్టం లేదు. నేనా సంపదను అల్లాహ్ దాసుల కోసం ఇలా అలా ఖర్చు చేస్తాను అని కుడి, ఎడమ, వెనకా సైగ చేశారు”. మరో సందర్భంలో ఇలా అన్నారు: “నాకు ఈ ప్రపంచంతో ఏమిటి ప్రేమ/ సంబంధం? నేను ఈ లోకంలో ఒక బాటసారి లాంటి వాడిని, ప్రయాణిస్తూ, ఓ చెట్టు క్రింద మజిలి చేసి కొంత సేపట్లో అలసట దూరమయ్యాక ఆ స్థలాన్ని వదలి వెళ్ళిపోతాడు“.

ప్రవక్త తిండి మరియు వస్త్రాధారణ

తిండి విషయం: నెల, రెండు నెలలు ఒక్కోసారి మూడు నెలలు గడిసేవి, అయినా ఇంటి పోయిలో మంటనే ఉండకపోయేది. అప్పుడు వారి ఆహార పదార్థం ఖర్జూరం మరియు నీళ్ళు మాత్రమే ఉండేవి. ఒక్కోసారి దినమంతా తిండి లేక మెలికలు పడేవారు. అయినా కడుపు నింపుకోటానికి ఏమీ దొరక్క పోయేది. అధిక శాతం ఆయన యవధాన్యాల రొట్టె తినేవారు. ఆయన ఎప్పుడైనా పలచని రొట్టెలు తిన్న ప్రస్తావనే రాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడైన అనస్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ప్రవక్త గారు అతిథులున్న సందర్భంలో తప్ప పగలు, సాయంకాలం రెండు పూటల భోజనం రొట్టె మరియు మాంసంతో ఎప్పుడూ తినలేదు.

ఆయన దుస్తుల విషయం కూడా పైన పేర్కొనబడిన స్థితికి భిన్నంగా ఏమీ లేకుండింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం బట్టల విషయంలో ఆడంబరం కనబరచేవారు కారు. ఇందులో కూడా జుహ్ద్ పాటించేవారని స్వయంగా సహచరులు సాక్ష్యం పలికారు. ఎక్కువ దరగల బట్టలు ధరించే శక్తి ఉన్నప్పటికీ అలా ధరించలేదు. ఆయన వస్త్రాల గురించి ప్రస్తావిస్తూ ఒక సహచరుడు ఇలా చెప్పాడుః నేనో విషయం మాట్లాడుటకు ప్రవక్త వద్దకు వచ్చాను. ఆయన కూర్చుండి ఉన్నారు. ఆయన మందమైన కాటన్ లుంగీ కట్టుకొని ఉన్నారు.

అబూ బుర్దా రజియల్లాహు అన్హు ఒకసారి విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళారు. ఆమె మాసిక వేసియున్న, మందమైన ఓ గుడ్డ మరియు లుంగీ చూపిస్తూ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం వీడిపోయేటప్పుడు ఈ రెండు బట్టలు ధరించి ఉండిరి అని చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు చెప్పారు: నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో నడుస్తూ ఉండగా ఆయనపై నజ్రాన్ లో తయారైనా మందపు అంచుల శాలువ ఉండినది.

ప్రపంచాన్ని వీడి పోయేటప్పుడు ఏ డబ్బు (దిర్హమ్, దినార్), బానిస, బానిసరాళు మరే వస్తువూ విడిచిపోలేదు. కేవలం ఒక తెల్లటి కంచర గాడిద, ఆయుధం మరియు ఒక భూమి తప్ప, అది కూడా దానం చేశారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా తెలిపారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయిన రోజు నా అల్మారాలో ఏదైనా ప్రాణి తినగల ఓ వస్తువు అంటూ లేకుండింది. కేవలం కొన్ని బార్లీ గింజలు (యవ ధాన్యాలు) తప్ప. ప్రవక్త చనిపోయినప్పుడు ఆయన ఒక కవచం యవధాన్యాలకు బదులుగా ఒక యూదుని వద్ద కుదువకు ఉండినది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయం

న్యాయం విషయానికొస్తే, ఆయన తమ ప్రభువు పట్ల న్యాయంగా వ్యవహరించేవారు. తమ ఆత్మ పట్ల న్యాయంగా ప్రవర్తించేవారు. తమ సతీమణులతో న్యాయంగా జీవించేవారు. దగ్గరివారు, దూరపువారు, స్నేహితులు, తన వాళ్ళు, విరోధులు చివరికి గర్వంగల శత్రువులతో కూడా ఆయన న్యాయాన్ని పాటించేవారు. ఎవరైనా ఆయన్ను ఉపేక్షించినా, ఆయన హక్కును కొందరు అర్థం చేసుకోకున్నంత మాత్రానా ఆయన న్యాయాన్ని వదులుకునేవారు కారు. ఆయన ఎక్కడా, ఏ స్థితిలో ఉన్నా న్యాయం ఆయనకు తోడుగా ఉండేది. ఆయన సహచరుల మధ్య తారతమ్యాలను అసహ్యించుకునేవారు. అందరి పట్ల సమానత్వం, న్యాయాన్ని కోరేవారు. ఆయన స్వయంగా వారిలాగా కష్టాన్ని భరించే వారు. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు: బద్ర్ యుధ్ధం రోజున ఒంటెలు తక్కువ ఉండడం వల్ల ప్రతి ముగ్రురికి ఒక ఒంటె వచ్చింది. అయితే అబూ లుబాబ మరియు అలీ బిన్ అబీ తాలిబ్ తో మూడువారో ప్రవక్త ఉండిరి. నడిచే వంతు ప్రవక్తది వచ్చినప్పుడు ప్రవక్తా! మీరు స్వారీ చేయండి మేము నడిచి వెళ్తాము అంటే ప్రవక్త వినిపించుకునేవారు కారు. ఆయన ఇలా చెప్పేవారు: “మీరు నా కంటే ఎక్కువ శక్తి గలవారు కారు. నేను కూడా మీలాగ పుణ్యం సంపాదించుకోవాలని కోరేవాణ్ణి“.

ఒకసారి ఉసైద్ బిన్ హూజైర్ రజియల్లాహు అన్హు తన జాతివారితో జోకులేసుకుంటూ నవ్వుతుండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన నడుములో పుల్ల గుచ్చారు, వెంటనే ఉసైద్ అన్నాడు: ప్రవక్తా! మీరు నాకు నొప్పి కలిగించారు. నేను మీతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాను. ప్రవక్త చెప్పారు: సరే తీర్చుకో, ఉసైద్ అన్నాడు: ఇప్పుడు మీ శరీరంపై చొక్కా ఉంది, మీరు నాకు పుల్ల గుచ్చినప్పుడు నాపై చొక్కా లేకుండింది, అప్పుడు ప్రవక్త తమ నడుము నుండి చొక్కా లేపారు, ఇదే అదృష్టం అనుకున్న ఉసైద్ నడుము మరియు పక్కల మధ్య చుంబించుకోసాగాడు. మళ్ళీ చెప్పాడు: ప్రవక్తా! నేను కోరింది ఇదే.

అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమించుట, లేదా న్యాయంగా ప్రజల్లో వాటిని అమలు పరుచుటలో ఏ మాత్రం జాప్యం చేయుట ఇష్టపడేవారు కారు. అపరాధి ఆయన దగ్గరివాడు, బంధువుడైన సరే. మఖ్జూమియ వంశానికి చెందిన ఒక స్త్రీ దొంగతనం చేసినప్పుడు ఆమెపై అల్లాహ్ విధించిన హద్దు చెల్లవద్దని ఉసామా రజియల్లాహు అన్హుని సిఫారసు కొరకు ప్రవక్త వద్దకు పంపారు. ప్రవక్త అతని సిఫారసు అంగీకరించలేదు. అప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన నుడివి పలికారు: “ఓ ప్రజలారా! మీకంటే ముందు గతించిన వారు వినాశనానికి గురి అయ్యే కారణం ఏమిటంటే వారిలో దొంగతనం చేసే వ్యక్తి ఉన్నత వంశీయడయితే అతన్ని శిక్షించకుండానే వదిలేసేవారు. అదే బడుగు వర్గం వాడయితే శిక్షించేవారు. అల్లాహ్ సాక్షిగా! “ముహమ్మద్ కూతురు ఫాతిమ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతుల్ని నరికేవాన్ని“.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ప్రవక్త ﷺ గారి జీవిత చరిత్ర (సీరత్) పాఠాలు 10: ప్రవక్త ﷺ వారి ఓపిక, సహనాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[18:05 నిముషాలు]

ప్రవక్త ﷺ వారి ఓపిక సహనాలు

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [18:05 నిముషాలు]

ముహమ్మద్ (సల్లలాహు అలైహి వ సల్లం) అంతిమ ప్రవక్త [పుస్తకం] నుండి :

ప్రవక్త ﷺ ఓపిక, సహనం

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓపిక గురించి ఏమి చెప్పగలం?!! వాస్తవానికి ఆయన పూర్తి జీవితమే ఓపిక, సహనాలతో, శ్రమ, కష్టాలతో కూడియుంది. ఆయనపై తొలి వహీ (దివ్యవాణి) అవతరించినప్పటి నుండి (ఇస్లాం ప్రచార) మార్గంలో ఆయన ఏమేమి ఏదురుకోబోతున్నారో ప్రవక్త అయిన మొదటి క్షణం, మొదటిసారి దైవదూతను కలుసుకున్న తర్వాత నుండే స్వభావికంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ఖదీజా (రదియల్లాహు అన్హా) ఆయన్ను వరఖా బిన్ నౌఫల్ వద్దకు తీసుకెళ్ళింది. వరఖా చెప్పాడు: “నీ జాతి వారు నిన్ను నీ దేశం నుండి బహిష్కరించినప్పుడు నేను బ్రతికుంటే ఎంత బావుండేది”. అప్పుడు ప్రవక్త ఆశ్చర్యంగా అడిగారు: “ఏమీ నా జాతివారు నన్ను దేశం నుండి బహిష్కరిస్తారా”. అతడన్నాడు: “అవును. నీవు తెచ్చినటువంటి సందేశం తెచ్చిన ప్రతీవారూ తరిమివేయబడ్డారు”. అయితే ఇలా ముందు నుండే కష్టాలను, బాధలను, కుట్రలను మరియు శత్రుత్వాన్ని భరించే అలవాటు తనకు తాను అలవర్చుకున్నారు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఓపిక, సహనాలు స్పష్టంగా ఏర్పడే చిత్రాల్లో; ఎల్లప్పుడూ ఆయనతో ఎగితాళి చేయడం, ఆయనను పరిహసించడం. ఆయన అల్లాహ్ సందేశం ప్రజలకు అందజేస్తున్నప్పుడు, మక్కాలో తమ జాతి, వంశం వారి వైపున భరించిన శారీరక చిత్రహింసలు.

అందులో ఒక సంఘటన సహీ బుఖారిలో ఇలా వచ్చి ఉంది: ప్రవక్తపై ముష్రికులు పెట్టిన చిత్రహింసల్లో ఘోరాతిఘోరమైనదేమిటి? అని ఉర్వా బిన్ జుబైర్, అబ్దుల్లాహ్ బిన్ అమ్ర బిన్ ఆస్ ని అడిగాడు. అతడు చెప్పాడు: ఒకసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిజ్ర్ [1] లో నమాజు చేస్తుండగా ఉఖ్బా బిన్ అబూ ముఈత్ వచ్చాడు. తన వద్ద ఉన్న దుప్పటిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెడలో వేసి గొంతును మెలివేశాడు. అందువల్ల ఆయన గొంతు బాగా బిగుసుకు పోయింది. అంతలో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ వచ్చి ఉఖ్బా భుజాన్ని పట్టి తోసేసారు. మళ్ళీ ఖుర్ఆనులోని ఈ ఆయతు చదివారు:

(ఒక వ్యక్తి తన ప్రభువు అల్లాహ్ అని అన్నంత మాత్రాన మీరు అతణ్ణి హతమారుస్తారా?). (ఘాఫిర్ 28)

[1] అది కాబా గృహానికి ఆనుకొనియున్న స్థలం. సుమారు ఏడు ఫిట్ల గోడ ఎత్తి యుంటుంది. ఖురైషుల వద్ద హలాల్ సంపద సరిపోనందుకు దాన్ని కాబా గృహంలో కలుపుకో లేకపోయారు. అయితే అది కాబాలోని భాగమే.

ఒక రోజు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాబా వద్ద నమాజు చేస్తున్నారు. అబూ జహల్ , వాని మిత్రులు కాబా ప్రాంగణంలో కూర్చొని యున్నారు. అబూ జహల్ మాట్లాడుతూ: ఫలానా ఇంట్లో ఈ రోజు ఒంటెను కోశారు, ఎవరు పోయి దాని పొట్ట, జీర్ణాశయం మరియు ప్రేగులను తీసుకువచ్చి, ముహమ్మద్ సజ్దాలో పోయినప్పుడు అతని వీపు మీద వేస్తాడు అని పురిగొల్పాడు. వారిలోని పరమ దుర్మార్గుడొకడు (ఉఖ్బా బిన్ అబూ ముఈత్) దిగ్గున లేచాడు. దాన్ని తీసుకొచ్చి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలో పోగానే ఆయన భుజాల మధ్య వీపుపై పెట్టేశాడు. ఇక అవిశ్వాసులు ఒకరిపై ఒకరు పడిపోతూ విరగబడి నవ్వసాగారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సజ్దాలోనే ఉండిపోయారు. తల పైకి లేపలేక పోయారు. చివరికి ఆయన కూతురు ఫాతిమా (రజియల్లాహు అన్హా) వచ్చింది. వీపుపై నుండి దాన్ని తొలగించింది.

వీటి కంటే మరీ ఘోరమైనది మానసిక బాధ. ఇందుకు కూడా వారు వెనక ఉండలేదు. అందుకే ఆయన ఇచ్చే సందేశాన్ని నిరాకరిస్తూ, తిరస్కరిస్తూ ఆయన పై అపనిందలు మోపేవారు, ఆయన జ్యోతిష్యుడు, పిచ్చివాడు, మాంత్రికుడు అని పేర్లు పెట్టేవారు, ఆయన తీసుకువచ్చిన ఆయతులు పూర్వకాలపు కట్టుకథలు అని అనేవారు. ఒకసారి అబూ జహల్ ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీ వద్ద నుండి వచ్చిన సత్యం, ధర్మం ఇదేనయితే ఆకాశం నుండి మాపై రాళ్ళ వర్షం కురిపించు. లేదా బాధకర మైన శిక్ష పంపించు.”

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానించుటకు వారి సమూహాల్లో, బజారుల్లో వెళ్ళినప్పుడు పినతండ్రి అబూ లహబ్ వెనకనే వచ్చి, ఇతను అబద్ధికుడు. ఇతని మాటను మీరు నిజపరచవద్దు అని చెప్పేవాడు. అతని భార్య ఉమ్మె జమీల్ ముళ్ళ కంప ఏరుకొచ్చి ప్రవక్త నడిచే దారిలో వేస్తుండేది.

బాధాలు, కష్టాలు పరా కాష్ఠకు చేరిన వేళ ఒకటుంది. అది ప్రవక్త సల్లల్లా హు అలైహి వసల్లం మరియు ఆయన్ను విశ్వసించినవారు మూడు సంవత్సరాల వరకు షిఅబె అబూ తాలిబ్ లో బంధీలుగా అయిన వేళ. ఆ రోజుల్లో ఆకలిని భరించలేక ఆకులు తిన వలసి వచ్చేది. ఇంకా ఆయన తమ పవిత్ర సతీమణి ఖదీజ రజియల్లాహు అన్హాను కోల్పోయిన సందర్భంలో మరింత బాధకు గురి అయ్యారు. ఆమె కష్ట రోజుల్లో తృప్తినిస్తూ, తగిన సహాయసహకారాలు అందించేది.

ఆ తర్వాత ఆయనకు అండదండగా నిలిచిన, ఆయన్ను పోషించిన పినతండ్రి మరణం, అతను అవిశ్వాస స్థితిలో చనిపోవడం ప్రవక్తను మరింత కుదిపి వేసింది. ఆయన్ను సంహరించే ఖురైషుల యత్నాలు విఫలమయ్యాయి. ప్రవక్త స్వదేశం వదిలేసి పరదేశానికి వలసపోయారు. మదీనాలో ఓపిక, సహనాల మరో క్రొత్త కాలం, శ్రమ, ప్రయాస, కష్టాలతో కూడిన జీవితం మొదలయింది. చివరికి ఆకలిగొన్నారు. బీదవారయ్యారు. తమ కడుపుపై రాళ్ళు కట్టు కొన్నారు. ఒకసారి ప్రవక్త — ఇలా చెప్పారు: “అల్లాహ్ విషయంలో నేను బెదిరింపబడినంత మరెవరూ బెదిరింప బడలేదు. అల్లాహ్ విషయంలో నేను గురి అయిన చిత్రహింసలకు మరెవరూ గురికాలేదు. 30 రేయింబవళ్ళు గడిసినా మా పరిస్థితి ఎలా ఉండిందంటే నా వద్ద, మరియు బిలాల్ (రదియల్లాహు అన్హు) వద్ద ఒక ప్రాణి తినగల ఏ వస్తువూ లేకుండింది. కేవలం బిలాల్ చంకలో దాచిపెట్టినంత ఓ వస్తువు మాత్రం“.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మానవ గౌరవాల్లో కూడా శత్రువులు జోక్యం చేసుకున్నారు. మునాఫిఖుల మరియు అజ్ఞాన అరబ్బుల తరఫున ఎన్నో రకాల బాధలకు గురి అయ్యారు. సహీ బుఖారిలో అబ్దుల్లాహ్ బిన్ మఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విజయ ధనం పంపిణీ చేశారు. అన్సారులోని ఒక వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా! ముహమ్మద్ ఈ రకమైన పంపిణి ద్వారా అల్లాహ్ సంతృష్టి కోరలేదు” అని అన్నాడు. ఇబ్ను మఊద్ (రదియల్లాహు అన్హు) ఈ విషయం ప్రవక్తకు తెలిపారు. అప్పుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “అల్లాహ్, ప్రవక్త మూసాను కరుగించుగాకా! ఆయన ఇంతకంటే ఎక్కువ బాధలకు గురయ్యారు. అయినా ఓపిక వహించారు“.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓరిమి కనబరచిన సందర్భాల్లో ఒకటి ఆయన సంతానం చనిపోయిన రోజు. ఆయనకు ఏడుగురు సంతానం. కొద్ది సంవత్సరాల్లో ఒకరెనుకొకరు మరణించారు. కేవలం ఫాతిమ (రజియల్లాహు అన్హా) మిగిలారు. అయినా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనస్తాపం చెందలేదు. అలసటకు గురి కాలేదు, కాని ఓరిమి కనబరచారు. ఆయన కుమారులైన ఇబ్రాహీం చనిపోయిన రోజు ఆయన ఇలా తెలిపారు: “కళ్ళు తప్పకుండా అశ్రుపూరితలవుతాయి. మనస్సు కూడా బాధపడుతుంది. అయితే మా ప్రభువుకు ప్రీతికరమైన మాటలే నా నోట వెలువడుతాయి. ఇబ్రాహీమా! నీ ఎడబాటు మమ్మల్ని శోకసముద్రంలో ముంచేసింది“.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు, సహనం కేవలం కష్టాల, ఆపదల పైనే కాదు, అల్లాహ్ ఆయనకు ఇచ్చే ఆదేశాల విధేయతలో కూడా ఉండింది. అల్లాహ్ ఆరాధన, విధేయతలో ఆయన కఠోరమైన శ్రమపడేవారు. ఎక్కువ సేపు నమాజులో నిలబడినందుకు ఒక్కోసారి కాళ్ళు వాచిపోయేవి. ఉపవాసాలు, అల్లాహ్ స్మరణలు ఇతర ఆరాధనలు చాలా చేసేవారు. మీరెందుకు ఇంత శ్రమ పడుతున్నారని అడిగినప్పుడు, “నేను అల్లాహ్ కృతజ్ఞత చేసే దాసుణ్ణి కాకూడదా” అని అనేవారు.

సీరత్ ముందు పాఠాలు :

ఇతరములు: 

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బకరా: ఆయత్ 153 – 167 [వీడియో]

బిస్మిల్లాహ్

[52:08 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [52:08 నిముషాలు]

అహ్సనుల్ బయాన్ నుండి:

153 يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ إِنَّ اللَّهَ مَعَ الصَّابِرِينَ
ఓ విశ్వాసులారా! సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్‌ సహనం పాటించేవారికి తోడుగా ఉంటాడు.

2:154 وَلَا تَقُولُوا لِمَن يُقْتَلُ فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتٌ ۚ بَلْ أَحْيَاءٌ وَلَٰكِن لَّا تَشْعُرُونَ
అల్లాహ్‌ మార్గంలో చంపబడినవారిని మృతులు అని అనకండి. వారు బ్రతికే ఉన్నారు. కాని ఆ విషయం మీకు అర్థం కాదు.

2:155 وَلَنَبْلُوَنَّكُم بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ وَالْأَنفُسِ وَالثَّمَرَاتِ ۗ وَبَشِّرِ الصَّابِرِينَ
మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము – భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి.

2:156 الَّذِينَ إِذَا أَصَابَتْهُم مُّصِيبَةٌ قَالُوا إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ
వారికెప్పుడు ఏ ఆపద వచ్చిపడినా, “మేము ఖుద్దుగా అల్లాహ్‌కు చెందినవారము, మేము మరలిపోవలసింది కూడా ఆయన వద్దకే కదా!” అని అంటారు.

2:157 أُولَٰئِكَ عَلَيْهِمْ صَلَوَاتٌ مِّن رَّبِّهِمْ وَرَحْمَةٌ ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُهْتَدُونَ
వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గాన్ని పొందినవారు కూడా వీరే.

2:158 إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ ۖ فَمَنْ حَجَّ الْبَيْتَ أَوِ اعْتَمَرَ فَلَا جُنَاحَ عَلَيْهِ أَن يَطَّوَّفَ بِهِمَا ۚ وَمَن تَطَوَّعَ خَيْرًا فَإِنَّ اللَّهَ شَاكِرٌ عَلِيمٌ
నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్‌ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్‌ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు.

2:159 إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلْنَا مِنَ الْبَيِّنَاتِ وَالْهُدَىٰ مِن بَعْدِ مَا بَيَّنَّاهُ لِلنَّاسِ فِي الْكِتَابِ ۙ أُولَٰئِكَ يَلْعَنُهُمُ اللَّهُ وَيَلْعَنُهُمُ اللَّاعِنُونَ
మేము అవతరింపజేసిన నిదర్శనాలను మరియు సన్మార్గాన్ని ప్రజల కొరకు గ్రంథంలో విశదపరచిన తరువాత కూడా వాటిని దాచిపెట్టే వారిని అల్లాహ్‌ శపిస్తాడు. ఇంకా, వేరే శపించే వారు కూడా వారిని శపిస్తారు.

2:160 إِلَّا الَّذِينَ تَابُوا وَأَصْلَحُوا وَبَيَّنُوا فَأُولَٰئِكَ أَتُوبُ عَلَيْهِمْ ۚ وَأَنَا التَّوَّابُ الرَّحِيمُ
అయితే పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సంస్కరించుకుని, సత్యాన్ని బహిర్గతం చేసిన వారి పశ్చాత్తాపాన్ని నేను స్వీకరిస్తాను (వారి తప్పును మన్నిస్తాను). నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాణ్ణి, అపారంగా కనికరించేవాణ్ణి.

2:161 إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ أُولَٰئِكَ عَلَيْهِمْ لَعْنَةُ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి, అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లాహ్‌ మరియు ఆయన దూతల, ఇంకా జనులందరి శాపం పడుతుంది.

2:162 خَالِدِينَ فِيهَا ۖ لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం గానీ, వారికి కొంత విడుపు ఇవ్వటంగానీ జరగదు.

2:163 وَإِلَٰهُكُمْ إِلَٰهٌ وَاحِدٌ ۖ لَّا إِلَٰهَ إِلَّا هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు.

2:164 إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَالْفُلْكِ الَّتِي تَجْرِي فِي الْبَحْرِ بِمَا يَنفَعُ النَّاسَ وَمَا أَنزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِن مَّاءٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَابَّةٍ وَتَصْرِيفِ الرِّيَاحِ وَالسَّحَابِ الْمُسَخَّرِ بَيْنَ السَّمَاءِ وَالْأَرْضِ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ
భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ళ (నిరంతర) మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లాహ్‌ వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింపజేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమ్యాకాశాల మధ్య (దేవుని) నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు (దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) ఎన్నో సూచనలున్నాయి.

2:165 وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُمْ كَحُبِّ اللَّهِ ۖ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِّلَّهِ ۗ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ
కాని అల్లాహ్‌ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి, అల్లాహ్‌ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించినవారు అల్లాహ్‌ను అంతకంటే ప్రగాఢంగా (అధికంగా) ప్రేమిస్తారు. సర్వశక్తులూ అల్లాహ్‌ అధీనంలోనే ఉన్నాయనీ, అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యదార్థాన్ని ముష్రిక్కులు, అల్లాహ్‌ విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు, ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది! (తెలుసుకుంటే వారు ఈ షిర్క్‌ పాపానికి ఒడిగట్టరు).

2:166 إِذْ تَبَرَّأَ الَّذِينَ اتُّبِعُوا مِنَ الَّذِينَ اتَّبَعُوا وَرَأَوُا الْعَذَابَ وَتَقَطَّعَتْ بِهِمُ الْأَسْبَابُ
ఆ సమయంలో, వీళ్ళచేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.

2:167 وَقَالَ الَّذِينَ اتَّبَعُوا لَوْ أَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّأَ مِنْهُمْ كَمَا تَبَرَّءُوا مِنَّا ۗ كَذَٰلِكَ يُرِيهِمُ اللَّهُ أَعْمَالَهُمْ حَسَرَاتٍ عَلَيْهِمْ ۖ وَمَا هُم بِخَارِجِينَ مِنَ النَّارِ
అప్పుడు (కనువిప్పు కలిగిన) అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు (ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరిపట్ల విసుగును ప్రదర్శించేవారం.” ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్‌ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినాసరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం.

ఇతరములు:

విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం – ఇమామ్ అస్-సాదీ

బిస్మిల్లాహ్

35 వ అధ్యాయం
విధివ్రాత పై సహనం వహించుట కూడా అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం
అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్ – ఇమామ్ అస్-సాదీ
The famous commentary of Shaykh as-Sa’di of the book Kitab at-Tawhid of Muhammad ibn Abdul Wahhab.


అల్లాహ్ ఆదేశం: “ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు” (తగాబున్‌ 64:11).

పై ఆయతులో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు అనేది “అల్‌ ఖమ” ఇలా ప్రస్తావించారు: “అతనిపై ఏదైనా ఆపద వస్తే, అది అల్లాహ్ తరఫు నుండి అని  అతను తెలుసుకొని, సంతోషిస్తాడు, మనఃపూర్వకంగా ఒప్పుకుంటాడు”.

అబు హురైరా (రది అల్లాహు అన్హు) కథనం, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “కుఫ్ర్ కు (సత్యతిరస్కారానికి) సంబంధించిన రెండు గుణాలు ప్రజల్లో ఉన్నాయి. ఒకటి: ఒకరి వంశపరంపరను నిందించుట. రెండవది: చనిపోయినవారిపై శోకము చేయుట”.

అబ్దుల్లా బిన్‌ మస్ ఊద్‌ (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపదేశించారు: “చెంపలను బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ అజ్ఞాన కాలపు అరుపులు పలుకులు పలికేవాడు మన (సంప్రదాయము అనుసరించే) వాడుకాడు”. (బుఖారి,ముస్లిం).

అనసు (రది అల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారు: “అల్లాహ్ ఏ మానవునికి మేలు చేయగోరుతాడో, అతని పాపాలకు బదులు శిక్ష ఇహలోకంలోనే తొందరగా ఇచ్చేస్తాడు. ఏ మానవునికి మేలు చేయగోరడో, అతని పాపాలకు బదులు శిక్షను ప్రళయం వరకు వేచి ఉంచి అక్కడ ఇస్తాడు”. (తిర్మిజి).

మరో సారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు: “పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో ప్రతిఫలం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అల్లాహ్ ఏ సమాజం, సంఘాన్ని ప్రేమస్తాడో, దానిని పరీక్షకు గురి చేస్తాడు. ఎవరు దానిని సహనంతో (సహిస్తారో), వారిని అల్లాహ్ ఇష్టపడుతాడు.ఎవరు అసహనము చూపుతారో, అల్లాహ్ వారిపై ఆగ్రహస్తాడు”. (తిర్మిజి).

ముఖ్యాంశాలు:

1. తగాబున్‌ ఆయతు యొక్క భావం.

2. సహనం అల్లాహ్ పై విశ్వాసంలో ఒక భాగం.

3. వంశపరంపర లోని లోపాలను ఎంచుట మంచిది కాదు.

4.చెంపలు బాదుకుంటూ, దుస్తులు చించుకుంటూ, అజ్ఞానకాలపు పలుకులు పలికేవాని గురించి కఠినంగా హెచ్చరించబడింది.

5. అల్లాహ్ మేలు కోరిన వ్యక్తి లక్షణం తెలిసింది.

6. అల్లాహ్ మేలు కోరని వ్యక్తి లక్షణం తెలిసింది.

7. అల్లాహ్  ప్రేమించిన వ్యక్తి చిహ్నం.

8. పరీక్ష ఆపదపై అసంతృప్తి వ్యక్తం చేయుట నిషిద్ధం.

9. వాటిపై సహనం వహించుట వలన పుణ్యం లభిస్తుంది.

తాత్పర్యం: (అల్లామా అల్ సాదీ) 

ఓపికతో అల్లాహ్ కు విధేయులగుట, పాపం నుండి దూరంగా ఉండి సహనం వహించుట – ఇవి రెండూ విశ్వాసంలో లెక్కించబడుతాయి. అంతే కాదు అవి దాని పునాది. దాని భాగాలే. అల్లాహ్ ప్రేమించేవాటిని, ఆయనకు ఇష్టమున్న, ఆయన సన్నిధిలో చేర్పించేవాటిని ఓపికతో (ఆచరించుట), ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండి సహనం వహించుటయే విశ్వాసం.

ఇస్లాం పునాది మూడు సూత్రాల పై ఉంది.

  1. అల్లాహ్ , ఆయన ప్రవక్త తెలిపిన వాటిని సత్యం అని నమ్ముట.
  2. అల్లాహ్ , ఆయన ప్రవక్త ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించుట.
  3. అల్లాహ్ , ఆయన ప్రవక్త నిషేధించినవాటి నుండి దూరంగా ఉండుట.

అల్లాహ్ వ్రాసిన విధివ్రాత బాధాకరమైనప్పటికి దానిపై ఓపిక వహించుట ఇందులోనే వస్తుంది. కాని దాన్ని తెలుసుకొనుట, ఆచరించుట చాలా అవసరం కాబట్టి దానిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.

ఆపద, కష్టం అల్లాహ్ తరఫు నుండియే వస్తుంది అని, అల్లాహ్ దాన్ని నిర్ణయించడంలో సంపూర్ణ వివేచణాపరుడని, దానిని మానవునిపై నిర్ణయించడం కూడా ఆయన సంపూర్ణ వరమేనని తెలుసుకున్న వ్యక్తి అల్లాహ్ వ్రాసిన విధివ్రాతతో సంతోషించి, దాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకొని, అసంతృప్తికరమైన వాటిపై అల్లాహ్ సన్నిధానం కోరుతూ, పుణ్యాన్ని ఆశిస్తూ, ఆయన శిక్షతో భయపడుతూ మరియు సత్ప్రవర్తన అవలంబించే సమయం వచ్చిందని భావిస్తూ సహనం వహించాలి. అప్పుడు అతని హృదయానికి తృప్తి  శాంతి కలుగుతుంది. అతని విశ్వాసం, ఏకత్వంలో బలం వస్తుంది.


నుండిఏకత్వపు బాటకు సత్యమైన మాట (అల్ ఖవ్లుల్ సదీద్ షర్హ్ కితాబ్ అత్ తౌహీద్)  – ఇమామ్ అస్-సాదీ [పుస్తకం]  

బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం)[ఆడియో]

బిస్మిల్లాహ్
బాలుడు మరియు రాజు కథ (కందకాలవాళ్ళ వృత్తాంతం) [ఆడియో]
https://youtu.be/w-allzUZM6E [25 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇక్కడ వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి (25 నిముషాలు)

ఈ ఆడియో సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]– 5 వ పార్ట్ నుండి తీసుకోబడింది. ఈ కథ సహీహ్ హదీసులో వచ్చింది మరియు ఖురాన్ లో సూరతుల్ బురూజ్ లో ప్రస్తావించ బడింది 


హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు – హదీసు # 30

ఈ ఆడియో వివరించిన హదీసు క్రింద చదవండి :

30. హజ్రత్ సుహైబ్‌ (రది అల్లాహు అన్హు) కథనం : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనం:

“పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని దగ్గర ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు బాగా ముసలివాడై పోయిన తరువాత (ఒకనాడు) రాజుతో “నేనిక ముసలివాణ్ణయిపోయాను. నాకు ఒక బాలుణ్ణి అప్పగిస్తే నేనతనికి మాంత్రిక విద్యలన్నీ నేర్పిస్తాను” అన్నాడు. దానికి రాజు సరేనని ఒక బాలుణ్ణి అతని వద్దకు పంపాడు. మాంత్రికుడు ఆ బాలునికి మాంత్రికవిద్యను నేర్పేవాడు. అయితే ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళే దారిలో ఒక మతగురువు నివాసం ఉండేది. ఆ బాలుడు మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా (దారిలో కొంత సేపు) మత గురువు దగ్గర కూడా కూర్చొనేవాడు. ఆ విధంగా అతను ఆ గురువు మాటలకు ప్రభావితుడయ్యాడు. దాంతో అతను మాంత్రికుని వద్దకు వెళ్ళినప్పుడల్లా దారిలో మత గురువు దగ్గర కూడా కూర్చోవడం ప్రారంభించాడు. (రావడంలో ఆలస్యమవుతున్నందుకు) మాంత్రికుడు బాలుణ్ణి కొట్టేవాడు. అతను ఈ విషయం మతగురువుకి తెలియజేశాడు. అది విని ఆయన, “మాంత్రికుడు నిన్ను కొడతాడని భయం వేస్తే ఇంట్లో (పనుంటే) ఆగమన్నారని చెప్పు. అలాగే ఆలన్యమెందుకయిందని ఇంట్లో నిలదీస్తే మాంత్రికుడు ఆగమన్నాడని చెప్పు” అని అన్నాడు.

అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ బాలుడు తను వెళ్ళే దారిలో ఒక పెద్ద మృగాన్ని చూశాడు. అది మనుషుల రాక పోకలకు అడ్డంకిగా నిల్చుంది. అప్పుడా బాలుడు ఈ రోజు మాంత్రికుడు గొప్పవాడో లేక మతగురువు గొప్పవాడో తేలిపోవాలని మనసులో అనుకున్నాడు, అతను చేతిలో ఒక రాయి తీసుకొని “ఓ అల్లాహ్‌! మతగురువు చేస్తున్న పని నీ దృష్టిలో మాంత్రికుని పని కన్నా ప్రీతికరమైనదైతే. (ఈ రాయితో) మృగాన్ని చంపెయ్యి. మనుషులు తమ దారిన తాము వెళ్ళిపోతారు” అని వేడుకొని రాయిని మృగంపైకి విసిరేశాడు. ఆ దెబ్బకు మృగం చచ్చిపోయింది. దాంతో ప్రజలు (నిర్భయంగా) ఆ దారిగుండా రాకపోకలు సాగించారు. ఆ తరువాత అతను మతగురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అది విని మతగురువు “నాయనా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడివి అయ్యావు. (దైవభక్తి, విద్యాపరంగా) నువ్వు ఏ స్థాయికి చేరుకున్నావో నాకర్థమయ్యింది. త్వరలోనే నీకు పరీక్షలు ఎదురౌతాయి. (అయితే ఒక విషయం మాత్రం గుర్తుం చుకో) ఆ పరీక్షా సమయం ఆసన్నమయినప్పుడు నా గురించి ఎవరికీ చెప్పకు సుమా!” అని హితవు పలికాడు.

ఈ బాలుడు పుట్టు గుడ్డివారిని కుష్టు రోగులను కూడా (దైవ సహాయంతో) నయం చేసేవాడు. అన్ని రకాల రోగాలకూ చికిత్సలు చేసేవాడు. రాజ దర్చారులోని ఒకతనికి కంటిచూపు పోయింది. అతను ఈ బాలుణ్ణి గురించి విని ఎన్నో కానుకలు వెంటబెట్టుకొని వచ్చి ఆ బాలునితో “నువ్వు గనక నాకు నయం చేస్తే నేను తీసుకువచ్చిన ఈ కానుకలన్నీ నీకే” అన్నాడు. దానికి ఆ అబ్బాయి “నేనెవరికీ నయం చేయలేను. నయం చేసేది కేవలం అల్లాహ్‌ మాత్రమే. నువ్వు కూడా అల్లాహ్‌ను విశ్వసిస్తే, నేను నీ కోసం దుఆ చేస్తాను (నీ వ్యాధి నయమయిపోతుంది)” అని చెప్పాడు. ఆ బాలుని మాటలు విని ఆ వ్యక్తి అల్లాహ్‌ను విశ్వసించాడు. అల్లాహ్‌ అతనికి నయం చేశాడు.

ఆ తరువాత అతను రాజు దగ్గరికి వెళ్ళి మునుపటిలాగే అతని ముందు కూర్చున్నాడు. రాజు అతన్ని చూసి “నీకు తిరిగి దృష్టి ఎలా వచ్చింది?” అనడిగాడు. దానికతను “నా ప్రభువు నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాడు” అని సమాధాన మిచ్చాడు. అందుకు రాజు “ఏమిటి? నేనుగాక నీకు వేరే ప్రభువు ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “నాకూ నీకూ ప్రభువు అల్లాహ్‌ (మాత్రమే)” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దాంతో రాజు (కోపోద్రిక్తుడై) అతన్ని బంధించి శిక్షించసాగాడు. ఆఖరికి అతను ఆ బాలుని గురించి రాజుకి చెప్పేశాడు.

బాలుణ్ణి రాజు దర్చారుకి తీసుకురావడం జరిగింది. “నువ్వు పుట్టుకతో అంధులైనవారిని, కుష్టు రోగుల్ని కూడా నయం చేస్తున్నావట. ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నావట. ఇంద్రజాలంలో అంతటి నైపుణ్యం వచ్చిందా నీకు!” అని రాజు ఆ బాలుణ్ణి ప్రశ్నించాడు. దానికా బాలుడు “నేను ఎవరికీ నయం చేయలేను. నయం చేసే వాడు అల్లాహ్‌ మాత్రమే” అని సమా ధానమిచ్చాడు. బాలుని సమాధానం విని రాజు అతన్ని కూడా బంధించి యాతన పెట్టసాగాడు. చివరికి ఆ బాలుడు మతగురువు గురించి చెప్పేశాడు.

మతగురువుని కూడా (రాజు దర్బారులో) నిలబెట్టడం జరిగింది. తన ధర్మం నుండి మరలిపొమ్మని ఆయనకు చెప్పబడింది. కాని ఆయన అందుకు నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించాడు. దాన్ని గురువు నడినెత్తిన ఉంచి ఆయన శిరస్సును కోయటం జరిగింది. దాంతో ఆయన తలకాయ రెండు ముక్కలై పోయింది.

ఆ తరువాత రాజ దర్బారు లోని వ్యక్తిని తీసుకువచ్చారు. అతన్ని కూడా తన ధర్మం నుండి మరలి పొమ్మని ఆదేశించడం జరిగింది. ఆ వ్యక్తి కూడా నిరాకరించాడు. అతని తల పాపటిలో రంపం పెట్టి కోయడంతో అతని తల కూడా రెండు ముక్కలైంది.

ఆ తరువాత బాలుణ్ణి పట్టుకొని తీసుకు వచ్చారు. తన ధర్మం నుండి తిరిగిపోవాలని అతన్ని కూడా ఆదేశించడం జరిగింది. కాని అ బాలుడు కూడా ససేమిరా అన్నాడు. రాజు ఆ పసివాణ్ణి తన ప్రధాన భటులకు అప్పగించి “ఇతన్ని ఫలానా పర్వత శిఖరం పైకి తీసుకెళ్ళండి. ఇతను తన ధర్మం విడిచిపెడితే సరి; లేకపోతే అక్కణ్ణుంచి క్రిందికి తోసెయ్యండి” అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ పిల్లవాడి తీసుకొని కొండపైకెక్కారు. అక్కడ ఆ బాలుడు, “దేవా! ఎలాగైనాసరే (నీయిష్ట ప్రకారం) వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు అండగా ఉండు” అని వేడుకున్నాడు. దాంతో ఆ కొండ కంపించసాగింది. ఆ ప్రకంపనకు వాళ్ళందరూ క్రిందపడి పోయారు. ఆ పిల్లవాడు తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు. రాజు అతణ్ణి చూసి (ఆశ్చర్యపోతూ) “నీ వెంటవెళ్ళిన వారు ఏమైపోయారు? (వాళ్లు నిన్ను క్రిందికి తోసెయ్యలేదా?)” అని అడిగాడు. దానికి ఆ బాలుడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు తోడ్పడ్డాడని” సమాధాన మిచ్చాడు.

రాజు కోపం చల్లారలేదు. ఆ పిల్లవాడిని ఇంకొంతమందికి అప్పజెప్పి “ఇతన్ని పడవ ఎక్కించుకొని సముద్రంలోకి తీసుకెళ్ళండి. వీడు తన ధర్మం నుండి మరలి పోతే సరి; లేకపోతే నడి సముద్రంలోకి విసరివేయండి” అని ఆజ్ఞాపించాడు. (రాజు ఆజ్ఞానుసారం) భటులు ఆ పిల్ల వాడిని తీసుకెళ్ళారు. అతను పడవలో కూర్చొని “దేవా! ఎలాగైనాసరే వీళ్లకు వ్యతిరేకంగా నీవు నాకు రక్షణ కల్పించు” అని వేడుకున్నాడు. దాంతో పడవ తలక్రిందులయింది. తోడు వచ్చిన వారంతా మునిగిపోయారు.

తిరిగి ఆ పిల్లవాడు రాజు దగ్గరికి చేరు కున్నాడు. రాజు అతన్ని చూసి “వాళ్ళు ఏమైపోయారు?” అని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు “వారికి ప్రతిగా అల్లాహ్‌ నాకు సహాయపడ్డాడు” అని జవాబిచ్చాడు. ఇంకా ఆ బాలుడు ఇలా అన్నాడు: “నేను చెప్పే పద్ధతి అనుసరించనంతవరకు నువ్వు నన్ను చంపలేవు.” ఆ పద్ధతి ఏమిటని రాజు అడిగాడు. అప్పుడు పిల్లవాడు చెప్పాడు : “ప్రజలందరినీ ఒక ఖాళీ ప్రదేశంలో హాజరుపరచు. నన్ను ఉరికంబం ఎక్కించి నా అంబులపొది నుండి ఒక బాణం తీసుకో. అ తరువాత బాణాన్ని వింటి తంతువుపై వుంచి ఈ మాటలు (ఈ పిల్లవాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో అని) చెప్పి బాణాన్ని నాపైకి ప్రయోగించు. అలా చేస్తే నువ్వు నన్ను చంపడంలో సఫలీకృతుడవుతావు.”

రాజు (పిల్లవాడు చెప్పినట్లే) ప్రజలందరినీ ఒక పెద్ద స్థలంలో సమీకరించాడు. ఉరితీయడం కోసం పిల్లవాడిని ఊరి కొయ్యల మీదకు ఎక్కించాడు. అతని అంబులపొది నుండి ఒక బాణం తీసి, దాన్ని వింటి తంతువుపై ఉంచి “బిస్మిల్లాహి రబ్బిల్‌ గులామి (ఈ పిల్ల వాని ప్రభువైన అల్లాహ్‌ నామముతో)” అంటూ బాణాన్ని వదలిపెట్టాడు. బాణం వచ్చి అ పిల్లవాని కణతకు తగిలింది. ఆ పిల్లవాడు కణతను పట్టుకొని నేలకొరి గాడు.

జరిగినది చూసిన ప్రజలంతా “మేము ఈ బాలుని ప్రభువును విశ్వసించాము” అని నినదించసాగారు. కొంతమంది రాజువద్దకు వెళ్ళి “ప్రభూ! ఇన్నాళ్ళు తమరు జరగకూడదని భీతిల్లినదే జరిగిపోయింది. మీరు భయపడిన విపత్తు వచ్చిపడింది. ప్రజలంతా అల్లాహ్‌ను విశ్వసిస్తున్నారు” అని రాజుకు వార్తనందజేశారు. అది విని రాజు వెంటనే తోవల ప్రక్కల్లో కందకాలు త్రవ్వమని ఆదేశించాడు. రాజు ఆదేశానుసారం కందకాలు త్రవ్వబడ్డాయి. వాటిలో మంటలు రగిలించారు. తాము విశ్వసించిన ధర్మాన్ని వదలని ప్రజలను అందులోకి విసరి వేయమని లేదా ఆ మంటల్లోకి దూకెయ్యమని వారితో చెప్పండని రాజు (తన భటులను) ఆజ్ఞాపించాడు. వారు (రాజాజ్ఞను శిరసావహించి) అలాగే చేశారు. (ఈ దారుణమారణ హోమం జరుగుతుండగా) ఒక స్త్రీ తన చేతుల్లో ఓ పసివాడిని మోసుకొని అక్కడికి వచ్చింది. అయితే మంటల్లో దూకటానికి తటపటాయిస్తుండగా ఆమె చేతు ల్లోని పసికందు “అమ్మా! సహనం వహించు. నిస్సందేహంగా నువ్వు సత్యంపై ఉన్నావు” అంటూ మంటల్లో దూకేయమని తల్లిని పురికొల్పాడు. (ముస్లిం)

ముఖ్యాంశాలు:

1.పై హదీసు ద్వారా కలిగే అతి ముఖ్యమైన గుణపాఠం ఏమిటంటే ధర్మావలంబనలో ఎదురయ్యే కష్టాలు, కడగండ్లను సహన స్థయిర్యాలతో ఎదుర్కోవాలి. అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలర్చించడానికి కూడా వెనుకాడరాదు.

2. అల్లాహ్ ప్రియదాసుల (వలీల) మహిమలు వాస్తవమే. అల్లాహ్ తన వివేచనతో తన యిష్టప్రకారం వాటి అవసరాన్ని గుర్తిస్తే తన దాసుల ద్వారా వాటిని ఉనికిలోకి తెస్తాడు.

3. ఈ హదీసు ద్వారా ఖుర్‌ఆన్‌ యొక్క సత్యబోధనా ప్రశస్తి ఇనుమడిస్తోంది. రేయింబవళ్ళ తెరల మరుగునపడి కాలం చేత విస్మరించబడిన అతి ముఖ్యమైన చారిత్రక ఘట్టాలను కళ్లకు కట్టినట్టు వివరించే దైవగ్రంథ హితబోధనామృతానికి ఇది అద్దం పడుతోంది.

4. హదీసు లేకుండా ఖురాన్‌ను వ్యాఖ్యానించడం, విశదీకరించడం సాధ్యం కాదు. హదీసులో కందకం వాళ్ళ గాధ వివరించబడనట్లయితే దివ్య ఖురాన్‌లో చెప్పబడిన ‘అస్‌హాబుల్‌ ఉఖ్‌దూద్‌‘ (కందకాలవాళ్ళ) వృత్తాంత వాస్తవికత ఏమిటో మనకు అర్ధం అయ్యేది కాదు. ఖురాన్‌ సూక్తుల్లోని ఈ సూక్ష్మతను, సమగ్రతను హదీసు విశదపరచింది.

5. ఇటువంటి గాధలు సత్య సందేశ ప్రధాతలకు స్ఫూర్తినీ, స్థయిర్యాన్నీ అందజేస్తాయి.


ఇతర కధలు:
https://teluguislam.net/category/stories-kadhalu/

సహనం, ఓర్పు – రియాదుస్ సాలిహీన్ [ఆడియో సిరీస్]

బిస్మిల్లాహ్

హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి
మూడవ అధ్యాయం – సహనం , ఓర్పు
హదీసులు # 25 – 52

రియాదుస్సాలిహీన్ (హదీసు కిరణాలు) [అన్నీ వీడియో పాఠాలు]
https://teluguislam.net/2021/01/28/riyad-us-saliheen-hadeeth-lessons

సహనం, ఓర్పు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3RjoZaSlju7cCMlRuCMNco

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia


క్రింద ఇచ్చిన లింకుల మీద క్లిక్ చేసి ఆడియో వినండి:

భాగం 01 (ఖుర్’ఆన్ అయతులు)  (29 నిముషాలు)

భాగం 02 (హదీసు #25) (34 నిముషాలు)

భాగం 03 (హదీసు #26,27) (29 నిముషాలు)

భాగం 04 (హదీసు #28,29) (25 నిముషాలు)

భాగం 05 (హదీసు #30) (25 నిముషాలు)

భాగం 06 (హదీసు #31 – 35) (29 నిముషాలు)

భాగం 07 (హదీసు #36 – 40) (25 నిముషాలు)

భాగం 08 (హదీసు #41) (36 నిముషాలు)

భాగం 09 (హదీసు #42,43) (27 నిముషాలు)

భాగం 10 (హదీసు #44) (27 నిముషాలు)

భాగం 11 (హదీసు #45-49) (23 నిముషాలు)

భాగం 12 (హదీసు #50-53) (36:22 నిముషాలు)


హదీసులు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి చదవండి:
సహనం , ఓర్పు [PDF]

సహనం, తృప్తి, నిరపేక్షాభావం అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకండి

26. హజ్రత్‌ అబూ సయీద్‌ సాద్‌ బిన్‌ సినాన్‌ ఖుద్రీ (రది అల్లాహు అన్హు ) కథనం :

కొంత మంది అన్సారులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను యాచించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారడిగింది ఇచ్చారు. వాళ్ళు మళ్ళీ యాచించారు. అప్పుడు కూడా ఆయన వారికి (ఎంతోకొంత) ఇచ్చారు. ఆఖరికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) దగ్గర ఉన్నదంతా అయిపోయింది. తన చేతిలో ఉన్నదంతా అయిపోయిన తరువాత ఆయన వారితో ఇలా అన్నారు:

నా వద్దకు ఏ కొంత ధనమొచ్చినా నేను దాన్ని నిల్వ చేసి ఉంచుకోను. ఎవడైతే యాచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడో అల్లాహ్‌ అతన్ని కాపాడుతాడు. నిరపేక్షాభావం అలవరచుకోవాలనుకున్న వ్యక్తిని అల్లాహ్‌ నిరపేక్షాపరునిగా చేస్తాడు. సహనం కోరే వ్యక్తికి అల్లాహ్‌ సహనం వహించే సద్బుద్దిని ప్రసాదిస్తాడు. మనిషికి ఇవ్వబడిన కానుకల్లో ఓర్పును మించిన మేలైన, విశాలమైన కానుక మరొకటి లేదు. “

(బుఖారీ – ముస్లిం). (సహీహ్ బుఖారీలోని జకాత్‌ ప్రకరణం. సహీహ్ ముస్లింలోని జకాత్‌ ప్రకరణం)

ముఖ్యాంశాలు:

ఈ హదీసులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి దాతృత్వం, ఉదాత్త గుణం, హృదయ విశాలత మరియు ఉన్నత నైతికపు విలువలను గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేగాకుండా సహనం, తృప్తి, నిరపేక్షాభావం మొదలగు సుగుణాలను అలవరచుకొని పరుల ముందు చేయి చాపకుండా ఆత్మ గౌరవంతో బతకాలని కూడా ఈ హదీసులో చెప్పబడింది.

నుండిసహనం , ఓర్పు –  హదీసు కిరణాలు (రియాదుస్ సాలిహీన్ ) – ఇమామ్ నవవి (Riyadh-us-Saaliheen)