“ఎవరయితే విశ్వాసి యొక్క ఐహిక బాధల్లో ఏ బాధనయినా దూరం చేస్తాడో, అల్లాహ్ ప్రళయదినం నాడు అతని బాధల్లో నుండి ఏ బాధనయినా దూరం చేస్తాడు.”
”ఎవరయితే లేమికి గురైన వారి పట్ల సరళంగా వ్యవహరిస్తాడో అల్లాహ్ అతని ఇహపరాలను సులభతరం చేస్తాడు.”
“ఎవరయితే ఒక ముస్లింలోని లోపాన్ని కప్పిపుచ్చుతాడో అల్లాహ్ అతని లోపాన్ని ఇహపర లోకాలలో దాచివేస్తాడు.”
”దాసుడు సాటి సోదరునికి సహాయంగా ఉన్నంతవరకూ అల్లాహ్ అతనికి సహాయంగా ఉంటాడు.”
“ఎవరయినా జ్ఞానాన్వేషణలో ఏ బాటపైనయినా బయలుదేరితే అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.”
”ఎప్పుడయినా కొంతమంది అల్లాహ్ యొక్క ఏ గృహంలోనయినా అల్లాహ్ గ్రంథ పారాయణానికి సమావేశమైతే వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుముకుంటుంది. దైవదూతలు వారిని ఆవరిస్తారు. అల్లాహ్ వారిని (ఆ దాసులను) తన దగ్గరి దూతల ముందు స్మరిస్తాడు.”
“ఎవరి ఆచరణైతే అతన్ని వెనుక ఉంచేస్తుందో అతని పారంపర్యం అతన్ని ముందుకు పోనివ్వదు.” (ముస్లిం)
(1) ఈ గొప్ప హదీసులో ఏడు మానవీయ, నైతిక నియమాలు బోధించబడ్డాయి. మొదట, ”విశ్వాసి పడే బాధల్లో దేన్నయినా దూరం చేస్తే….” అని చెప్పబడింది.
దీని భావం ఏమిటి? ఏ విశ్వాసినైనా అవసరానికి ఆదుకోవడం, ఏ విధంగానైనా అతనికి లాభం చేకూర్చడం, ఏ ఆపదనుండైనా అతనికి విముక్తిని కలిగించటం; ఈ పనిని మనిషి తన ధనం ద్వారానో, తన శ్రమ ద్వారానో, తన పలుకుబడి ద్వారానో, తన జ్ఞానం ద్వారానో చేయవచ్చు. ఇటువంటి పరోపకారిని అల్లాహ్ మెచ్చుకుంటాడు. తీర్పు దినంనాడు అతని యాతనను తగ్గిస్తాడు. అయితే మనిషి తాను ఏ పరోపకారం చేసినా అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమే అతని ప్రధాన ఉద్దేశ్యమై ఉండాలి.
(2) “కష్టాల్లో ఉన్నవాని పట్ల సరళంగా వ్యవహరించటం” అంటే భావం, రుణగ్రస్తుడికి రుణం తీర్చేందుకు మరింత గడువు నివ్వటం లేదా అతని రుణాన్ని పాక్షికంగానో, పూర్తిగానో మాఫీ చేయటం. అలా చేసిన వానికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ మార్గాలు సుగమం చేస్తాడు. చేతిలో పైసలు లేని రుణగ్రస్తుడిని మన్నించివేయటం లేక గడువు నొసగటం అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలానికి మంచి సాధనంగా ఉపయోగపడుతుంది, అయితే రుణగ్రస్తుడు రుణాన్ని తీర్చే తాహతును కలిగి వుండి కూడా ఉద్దేశ్యపూర్వకంగా దాటవేస్తూ ఉంటే మాత్రం అతన్ని క్షమించి వదలి వేయటం పుణ్యంగా పరిణమించదు.
(3) ఇక మూడవది, లోపాలను దాచిపెట్టడం గురించి – లోపం లేదా లొసుగు శారీరకమైనదీ కావచ్చు. మానసికమైనదీ కావచ్చు, నైతిక సంబంధమైనదీ కావచ్చు. ఏ ముస్లింలోని శారీరక వైకల్యాన్నయినా అకారణంగా బహిర్గతం చేయటం అతనికి బాధ కలిగిస్తుంది. అతను మనస్తాపానికి గురవుతాడు. ఇక నైతిక సంబంధమైన లోపాలంటే వాటి గురించి ఎంతో వివరణ ఉంది. ఏ ముస్లిములోనైనా నైతికంగా ఏదైనా బలహీనత వుంటే, దానికతను మాటిమాటికీ ఒడిగట్టకుండా ఉంటే అట్టి పరిస్థితిలో అతని బలహీనత గురించి ప్రజల ముందుగాని, పాలకుల ముందుగాని చెప్పుకోరాదని ఉలమాల (విద్వాంసుల) అభిప్రాయం. ఎందుకంటే అలా చెప్పటం వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. పరాభవం పాలవుతాడు. భవిష్యత్తులో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అయితే ఎవరయినా అపరాధానికి, చెడు పనికి మాటిమాటికీ పాల్పడుతుంటే అతనికి నచ్చజెప్పాలి. నచ్చజెప్పినప్పటికీ అతనిలో దిద్దుబాటు కనబడకపోతే అప్పుడు అతని వ్యవహారాన్ని బాధ్యతాయుతులైన వారికి అప్పగించాలి. దానికిగాను అతనికి దండన లభించటం, అతనిలోని దుర్గుణాలను ప్రజలకు ఎరుకపరచటమే దీని ముఖ్యోద్దేశ్యం. అలా చేయటం వలన పరిసరాలలోని వారు అతని పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఒకవేళ అతనిలోని లోపాలను ఉద్దేశ్య పూర్వకంగా ఉపేక్షించి వదలివేస్తే పరోక్షంగా చెడుపనుల్లో అతన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. దుర్మార్గుడి దుర్గుణాలను బాహాటం చేయటం చాడీగా పరిగణించబడదు. పైగా దాన్ని బహిర్గతం చేయడం అవసరం. ఈ నేపథ్యంలో దైవప్రవక్త ఏమని ప్రబోధించారంటే, ”మీలో ఎవరయినా, ఎప్పుడయినా ఏదయినా చెడును చూస్తే దాన్ని మీ చేత్తో సంస్కరించండి, ఇది సాధ్యపడకపోతే మీ నోటిద్వారా ఆ పని చెయ్యండి. అదీ వీలుపడకపోతే మీ మనసులోనయినా దాన్ని చెడుగా భావించండి. ఇది మీ విశ్వాసానికి ఆఖరి మెట్టు.”
ఇక తరచూ చెడుకు పాల్పడని మొదటి వ్యక్తిలోని లోపాన్ని బహిర్గతం చేయకుండా ఉండటం ఎంత అవసరమో అతనిలోని లోపాన్ని అతనికి తెలిసి వచ్చేలా నచ్చజెప్పటం కూడా అంతే అవసరం. తద్వారా అతను మున్ముందు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. “
(4) “దాసుడు తన సోదరుని సహాయంలో ఉన్నంత వరకు …. ప్రతి ముస్లింకు మరో ముస్లిం నుండి సహాయం కోరే హక్కు ఉంది. ధార్మిక వ్యవహారాలలోనూ, ప్రపంచంలోని మరే సమంజసమయిన సహాయం పొందే విషయంలోనూ వీలయినంత వరకు అల్లాహ్ దీని గురించి ఆదేశించాడు –
”సత్కార్యాల్లో, భయభక్తుల విషయాల్లో ఒండొకరికి సహాయపడండి. చెడులు మరియు అన్యాయం విషయంలో మటుకు పరస్పరం సహకరించుకోబాకండి, అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.” (అల్ మాయిదా 5:2)
(5) “అల్లాహ్ అతని కోసం స్వర్గపు బాటను సుగమం చేస్తాడు.” – స్వర్గానికి దారి అంత సులభమైనది కాదు. అది కష్టాలు, అవరోధాలతో నిండి ఉంది. మనిషి స్వతహాగా సులభమైన దాన్నే కోరుకుంటాడు. అందుకేనేమో స్వర్గానికి గొనిపోయే మార్గంలో చాలా కొద్దిమంది నడుస్తుంటారు. అయితే సత్య ప్రధానమైన జ్ఞానాన్వేషణలో బయలుదేరిన వ్యక్తికై అల్లాహ్ స్వర్గపు బాటను సులభతరం. చేసివేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే జ్ఞానాన్వేషణకై బయలుదేరిన వ్యక్తి లక్ష్యమే స్వర్గానికి చేరుకోవటంగా ఉంటుంది. అతను ఆ లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలను కష్టంగా తలపోయడు. సంతోషంగా వాటిని సహిస్తాడు. మరోవైపు అల్లాహ్ తన అపార కృపతో, అతను కష్టాల బారిన పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రభువు అభీష్టమేదో దాసులకు తెలియపరచటం, ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని వారికి వివరించటం నిజమయిన జ్ఞానం. అటువంటి జ్ఞానుల గురించి అల్లాహ్ తన గ్రంథంలో ఇలా ప్రస్తావించాడు:
(ధర్మ) విద్యలోని సుగుణం ఏమంటే అది తన విద్యార్థి విశ్వాసాన్ని, భావనలను సంస్కరిస్తుంది. నైతికతను పెంపొందిస్తుంది. అతని జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అతనిలో సంస్కారాన్ని అలవరుస్తుంది. అతను పరలోక సాఫల్యమే తన లక్ష్యంగా ఎంచుకుంటాడు. దానికోసం ఏ త్యాగమయినా అతనికి తేలికగానే కనిపిస్తుంది.
(6) “వారిపై ప్రశాంతత అవతరిస్తుంది. ఇంకా వారిపై కారుణ్యం అలుము కుంటుంది….. “
ఇక్కడ ప్రశాంతత అంటే భావం హృదయాలు నెమ్మదిస్తాయనీ, మనస్థయిర్యం ప్రాప్తమవుతుందనీ, మస్జిద్ అల్లాహ్ గృహం. అందులో ఖుర్ఆన్ను అర్థం చేసుకోవడానికి సమకూడటం పుణ్యప్రదమయిన పని అని ఈ హదీసు ద్వారా సుబోధకమవుతోంది. అరబీ లిపి నెరిగిన ప్రతి వ్యక్తి ఖుర్ఆన్ను చూచి చదవగలడు. అయితే దివ్య ఖుర్ఆన్ను మృదుమధురంగా పఠించే పఠిత ఉంటే అతని ద్వారా ఖుర్ఆన్, వినాలి. దాన్ని అర్థం చేసుకునే, దానిపై యోచించే కృషి చేయటం శుభప్రదం. ఖుర్ఆన్ అవగాహనకై మస్జిద్ లో సమావేశమవటం సున్నత్ కూడా. “
(7) ”అతని పరంపర అతన్ని ముందుకు పోనివ్వదు..” – ఇది అత్యంత ముఖ్యమయిన విషయం. సంతానంపై, వంశ పారంపర్యంపై చెందే గర్వాన్ని, అహంకారాన్ని ఈ వాక్యం అంతం చేస్తుంది. ప్రతి వ్యక్తి ఆచరణ అతని స్వయానికే ఉపకరిస్తుంది. తండ్రి చేసుకున్న సదాచరణ అల్లాహ్ సమక్షంలో కేవలం తండ్రి స్థాయినే పెంచుతుంది. కొడుకుకు మాత్రం దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ప్రపంచంలో మాదిరిగా పరలోకంలో వ్యక్తికి ఆస్తిపాస్తులు, అంతస్తుల ద్వారా గౌరవం లభించదు. అక్కడ ప్రతి వ్యక్తికి ఆదరణ లభించినా, పరాభవం చేకూరినా అది అతని కర్మల్ని బట్టి ఉంటుంది. ప్రతి వ్యక్తి తాను చేసుకున్న కర్మలకు తనే బాధ్యుడు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో సెలవిచ్చాడు –
“మానవుడు దేనికోసం ప్రయత్నిస్తాడో అదే అతనికి ప్రాప్తమవుతుంది. ఇంకా అతని ప్రయత్నం త్వరలోనే తెలిసిపోతుంది. మరి అతనికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది.” (అన్నజమ్ 53: 39 – 41)
తేలిందేమంటే సదాచరణ చేయని వ్యక్తి అల్లాహ్ సమక్షంలో తన తాత ముత్తాతల పుణ్యకార్యాలను ఉదాహరించి తప్పుకోలేడు. తాత తండ్రుల మంచి పనుల మూలంగా అతనికి ఉన్నత స్థానం లభించబోదు.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం) రచన:సఫీ అహ్మద్ మదనీ అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి, మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.
అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి: అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం, ఆయన రుబూబియత్[2] పై విశ్వాసం, ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం. ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.
ఈ ఖుత్బాలో మనం అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం గురించి చర్చించుకుందాం.
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క రుబూబియత్ పై విశ్వాసం అంటే ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే రబ్ అని, ఆయనకు సహవర్ధులు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరని విశ్వసించటం. రబ్ అంటే: ఆయనకు సృష్టించే శక్తి ఉంటుంది, ఆయనే ప్రతీ దానికి యజమాని, ఆయన ఆజ్ఞ మాత్రమే చెల్లుతుంది అంటే ఆయన ఆజ్ఞతో విశ్వ వ్యవహారాలు నిర్వహించ బడతాయి. ఆయన తప్ప మరో సృష్టికర్త లేడు, ఆయన తప్ప మరో యజమాని లేడు, ఆయన తప్ప ఆజ్ఞాపించేవాడు మరొకడు లేడు. సృష్టించడంలో తానే అద్వితీయుడు అల్లాహ్ చాలా స్పష్టంగా తెలిపాడు:
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ (వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ (సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్కే శోభిస్తాయి.) (ఫాతిర్:1)
ఓ విశ్వాసులారా! అల్లాహు తఆలా సృష్టించిన పూర్తి సృష్టిలో అన్నింటి కంటే గొప్పవి ఈ పది సృష్టితాలు: ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, రాత్రి, పగలు, మానవుడు, జంతువులు, వర్షము మరియు గాలులు. అల్లాహు తఆలా దివ్య ఖుర్ఆన్ లో అనేక చోట్ల తమ సృష్టి గురించి ప్రస్తావిస్తూ తమను తాము పొగుడుకున్నాడు, ప్రత్యేకంగా కొన్ని సూరాల ప్రారంభ ఆయతుల్లో. ఉదా: సూరతుల్ జాసియా లో ఇలా సెలవిచ్చాడు:
(హామీమ్ * ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేచనా పరుడైన అల్లాహ్ తరఫున జరిగింది * నిశ్చయంగా ఆకాశాలలో, భూమిలో విశ్వసించిన వారి కోసం ఎన్నో సూచనలున్నాయి. స్వయంగా మీ పుట్టుకలోనూ, ఆయన సర్వవ్యాప్తం చేసే జంతువుల పుట్టుకలోనూ నమ్మే జనుల కొరకు సూచనలున్నాయి * రేయింబవళ్ళ రాకపోకలలోనూ, అల్లాహ్ ఆకాశం నుంచి ఉపాధిని (వర్షం రూపంలో) కురిపించి, భూమిని చచ్చిన పిదప బ్రతికించటంలోనూ, వాయువుల మార్పులోనూ బుద్ధీజ్ఞానాలు గలవారికి పలు సూచనలున్నాయి.) (జాసియా:1-5).
యాజమాన్యంలో అల్లాహ్ ఏకైకుడని చెప్పడానికి గల ఆధారం, అల్లాహ్ యొక్క ఈ ఆదేశం:
(ఇంకా ఇలా చెప్పు: ”ప్రశంసలన్నీ అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. తన విశ్వ సామ్రాజ్యంలో ఆయనకు భాగస్వాములెవరూ లేరు. ఒకరి సహాయ సహకారాలపై ఆధారపడటానికి ఆయన ఏ మాత్రం బలహీనుడు కాడు. కాబట్టి నువ్వు ఆయన గొప్పదనాన్ని ఘనంగా కీర్తిస్తూ ఉండు.”) (ఇస్రా:111)
(ఈ అల్లాహ్యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.) (ఫాతిర్:13)
ఆజ్ఞాపించటంలో (మరియు విశ్వ వ్యవహారంలో) అల్లాహ్ ఒక్కడేనని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము.
أَلَا لَهُ الْخَلْقُ وَالْأَمْرُ (వినండి! సృష్టి ప్రక్రియ ఆయన స్వంతం. ఆజ్ఞాపన ఆయన సొత్తు.) (ఆరాఫ్:54)
మరో ఆధారం:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ (మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది). (నహ్ల్:40)
ఓ ముస్లిములారా! ఆజ్ఞలు రెండు రకాలు: 1. షరీఅత్ పరమైన ఆజ్ఞ. 2. విశ్వపరమైన ఆజ్ఞ. షరీఅత్ ఆజ్ఞల సంబంధం ధర్మశాస్త్రం మరియు ప్రవక్త తత్వాలతో ఉంటుంది. అయితే ఆ అల్లాహ్ ఒక్కడే తన వివేకముతో అవసరాలానుసారం ధార్మిక నియమ నిబంధనాలపై ఇవ్వాల్సిన ఆజ్ఞలు ఇస్తాడు, రద్దు చేయాల్సినవి రద్దు చేస్తాడు. ఆయనే మానవులకు వారి పరిస్థితులను సరిదిద్దే విధంగా తగిన షరీఅతును నియమించాడు మరియు ఆయన వద్ద స్వీకరించబడే ఆరాధనలను, ఆచరణలను చట్టబద్ధమైనవిగా చేసాడు. ఎందుకంటే ఆయనకు మానవుల పరిస్థితులు, వారి వ్యవహారాల గురించి తెలుసు మరియు ఆయన వారి పై కరుణించే కరుణామయుడు కూడాను.
అల్లాహ్ ఆజ్ఞ యొక్క రెండవ రకం విశ్వానికి సంబంధించినది. దీని సంబంధం విశ్వపరమైన వ్యవహారాలతో ఉంటుంది. కనుక మేఘాల కదలిక, వర్షాలు కురవడం, జీవన్మరణాలు, ఉపాధి మరియు సృష్టి, భూకంపాలు, ఆపదల తొలగింపు, విశ్వ సమాప్తం లాంటి అన్ని వ్యవహారాల ఆజ్ఞలు ఇచ్చేవాడు అల్లాహ్ ఒక్కడే. అందుకనే ఈ వ్యవహారాలలో అల్లాహ్ ఏ ఆజ్ఞ ఇచ్చినా అది జరిగే తీరుతుంది. దాని పై ఎవరూ ఆధిపత్యం పొందలేరు, దానిని ఎవరు తప్పించలేరు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَنْ نَقُولَ لَهُ كُنْ فَيَكُونُ (మేము దేన్నయినా చేయాలని సంకల్పించుకున్నప్పుడు ‘అయిపో’ అని అంటే చాలు, అది అయిపోతుంది.) (నహ్ల్:40)
అంటే ఏదైనా మేము జరపాలని అనుకుంటే కేవలం ఒకే ఒక్క మాట అంటాము, అదే: ‘కున్’ (అయిపో), అప్పుడు అది రెప్పపాటు సమయంలో జరిగిపోతుంది. అది జరగడానికి రెప్ప పాటు కూడా అలస్యం జరగదు.
సారాంశం ఏమిటంటే ఆజ్ఞలు రెండురకాలు: 1. విశ్వపరమైన ఆజ్ఞలు 2. ధర్మపరమైన ఆజ్ఞలు. దాని ప్రకారంగానే ప్రళయదినాన లెక్క తీసుకోవటం జరుగుతుంది.
అల్లాహ్ దాసుల్లారా! అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉండండి.
ఈ సృష్టిలో అల్లాహ్ యొక్క రుబూబియత్ను తిరస్కరించే వారు కూడా ఉన్నారా? అంటే లేరు, కానీ గర్వం ఎవరి తలకెక్కిందో వారు తిరస్కరిస్తారు కాని నిజమైన నమ్మకంతో కాదు. ఉదాహరణకు ఫిరాఔన్ తమ జాతి వారితో ఇలా అన్నాడు :
أَنَا رَبُّكُمُ الْأَعْلَى (”నేనే మీ సర్వోన్నత ప్రభువును”) (నాజిఆత్: 24)
ఇంకా ఇలా అన్నాడు :
يَا أَيُّهَا الْمَلَأُ مَا عَلِمْتُ لَكُمْ مِنْ إِلَهٍ غَيْرِي (“ఓ ప్రముఖులారా! నేను తప్ప మీకు మరో దేవుడున్నాడన్న సంగతి నాకు తెలీదు.) (అల్ ఖసస్:38)
కానీ వాడు తన విశ్వాసం వలన ఇలా అనలేదు గర్వం, దౌర్జన్యం చేసే తత్వం వలన ఇలా అన్నాడు. అల్లాహ్ ఆదేశం చదవండి:
وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا (నిజానికి వారి మనసులు (సత్యాన్ని) నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు.) (నమ్ల్:14)
అల్లాహ్ మీపై కరుణించుగాక! తెలుసుకోండి! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలోని అవిశ్వాసులు అల్లాహ్ యొక్క రుబూబియత్ను నమ్మేవారు. అంటే అల్లాహ్ యే సృష్టికర్త, ఉపాధి ప్రధాత, ఈ విశ్వాన్ని నడిపేవాడని విశ్వసించేవారు. అయినప్పటికీ వారు తమ ఆరాధనలో అల్లాహ్ తో పాటు విగ్రహాలను భాగస్వాములుగా చేసేవారు, వారి కోసం రకరకాల ఆరాధనలు చేసేవారు. ఉదా: దుఆ చేయడం, జంతుబలి ఇవ్వడం, మొక్కుబడులు చెల్లించటం మరియు సాష్టాంగ పడటం మొదలుగునవి. అందుకనే వారు తిరస్కారులు, అవిశ్వాసులయ్యారు. అల్లాహ్ యొక్క రుబూబియత్ను విశ్వసించినా వారికి ఎటువంటి లాభము చేకూరలేదు. ఎందుకంటే వారు తౌహీదె రుబూబియత్ను నమ్మడం వల్ల ఏ బాధ్యతలు ఉంటాయో వాటిని నమ్మలేదు; అదే తౌహీదే ఉలూహియత్. సర్వ ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమేనని విశ్వసించకుండా కేవలం రుబూబియత్ పై విశ్వాసం ఇస్లాంలో చేరడానికి సరిపోదు.
ప్రవక్త కాలంనాటి ముష్రికులు తౌహీదె రుబూబియత్ను మాత్రమే నమ్మేవారని అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో తెలిపాడు:
(“భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్వే” అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. “మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?” అని అడుగు. “సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్) పీఠానికి అధిపతి ఎవరు?” అని వారిని ప్రశ్నించు. “అల్లాహ్యే” అని వారు జవాబిస్తారు. “మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?” అని వారిని (నిలదీసి) అడుగు. సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో – ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు. “అల్లాహ్ మాత్రమే” అని వారు చెబుతారు. “మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.) (మూమినూన్:84-89)
అల్లాహ్ మీపై కరుణించుగాక!, తెలుసుకోండి! అల్లాహ్ మీకు ఒక గొప్ప సత్కార్యం గురించి ఆజ్ఞాపించాడు:
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అహ్ జాబ్:56).
ఓ అల్లాహ్ మా దేశాలలో భద్రతను ప్రసాదించు, మా నేతల వ్యవహారాన్ని సరిదిద్దు, సన్మార్గం చూపే మరియు సన్మార్గంపై నడిచే వారీగాచేయి.ఓ అల్లాహ్ మా పరిపాలకులకు నీ గ్రంధానికి కట్టుబడి ఆజ్ఞాపాలన చేసే భాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ మా పాపాలను మరియు మా ఆచరణలో ఏర్పడిన కొరతను క్షమించు.ఓ అల్లాహ్ మాకు ఈ ప్రపంచంలో పుణ్యాన్ని పరలోకంలో సాఫల్యాన్ని ప్రసాదించు, నరక శిక్షల నుండి మమ్మల్ని కాపాడు.
[1] ‘సుబ్ హానహు’ అంటే అన్ని లోపాలకు అతీతుడు. ‘తఆలా’ అంటే మహోన్నతుడు. [2]రుబూబియత్ అంటే పుట్టించడం, పోషించడం మరియు విశ్వ నిర్వహణ (నడపడం). [3]ఉలూహియత్ అంటే అన్ని రకాల ఆరాధనలు, భక్తిభావంతో చేసే పూజలు.
—
రచన : మాజిద్ బిన్ సూలైమాన్ అర్రస్సీ జుబైల్ పట్టణం, సౌదీ ఆరేబియ అనువాదం: అబ్దుల్లాహ్ జామయి
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అనస్ బిన్ మాలిక్ (రజి అల్లాహు అన్హు) ఉల్లేఖనం ఇలా ఉంది ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రవచించారు: “స్వర్గం కష్టాలతో చుట్టుముట్టబడి ఉంది మరియు నరకాగ్ని ప్రలోభాలతో చుట్టుముట్టబడి ఉంది..” (ముస్లిం)
తాత్పర్యం
పై హదీసు భావాన్ని గ్రహించాలంటే హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసును పరిశీలించవలసి ఉంది. అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రకారం, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రవచనం ఇలా ఉంది :
అల్లాహ్ స్వర్గ నరకాలను నిర్మించిన తరువాత (తన దూత అయిన) జిబ్రయీల్ను స్వర్గం వైపునకు పంపాడు. ”దాన్ని చూసిరండి, నేను దాని నివాసుల కోసం, దాన్ని రూపొందించాను” అని అల్లాహ్ (జిబ్రయీల్తో) అన్నాడు. జిబ్రయీల్ స్వర్గం వద్దకు వచ్చారు. స్వర్గాన్ని, అందులో నివసించే వారి కొరకు అల్లాహ్ తరఫున సమకూర్చబడిన సామగ్రిని తిలకించారు. తరువాత ఆయన (అల్లాహ్) వైపునకు మరలారు. “(ప్రభూ!) నీ గౌరవ ప్రపత్తుల సాక్షిగా! దాన్ని గురించి ఎవరు విన్నా సరే తప్పకుండా అందులోకే ప్రవేశిస్తారు.” అప్పుడు అల్లాహ్ ఆజ్ఞతో అది ఇక్కట్లతో చుట్టుముట్టబడింది. తరువాత ఆదేశించాడు “అందులో ప్రవేశించదలిచే వారికై నేను ఏమేం (సృష్టించి) ఉంచానో వెళ్ళి చూడండి.” జిబ్రయీల్ (అలైహిస్సలాం) దాని వైపునకు వెళ్ళిచూస్తే, అది ఇక్కట్లతో చుట్టుముట్టబడి ఉంది. జిబ్రయీల్ మరలివచ్చారు. “(ప్రభూ!) నీ గౌరవం సాక్షిగా! అందులో ఎవరూ ప్రవేశించలేరేమోనని నాకు అనుమానంగా ఉంది” అని విన్నవించుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఆదేశమయ్యింది: ”వెళ్ళి నరకాన్ని చూడండి. అందులో ఉండేవారి కొరకు నేను ఏం సిద్ధం చేసి ఉంచానో చూడండి”. వెళ్ళి చూస్తే, అందులో తీవ్రమైన నిప్పు సెగలు కానవచ్చాయి. (జిబ్రయీల్) మరలి వచ్చి విన్నవించుకున్నారు : “(ప్రభూ!) నీ గౌరవోన్నతుల సాక్షిగా! ఎవరు దాన్ని గురించి విన్నా అందులోకి పోరు.” అప్పుడు దైవాజ్ఞతో అది సుఖభోగాలతో చుట్టుముట్టబడింది. ఆజ్ఞ అయ్యింది : “దాని వైపునకు వెళ్ళి చూడండి” అని. అప్పుడు నరకం వైపునకు వెళ్ళిచూసి ఇలా అన్నారు – ”(ప్రభూ!) నీ గౌరవాదరణల సాక్షిగా చెబుతున్నాను. ఎవరూ దీని బారిన పడకుండా ఉండలేరు, అందులోనే పడిపోతారని నాకు అనుమానంగా ఉంది.” (తిర్మిజ)
“స్వర్గాన్ని ఇక్కట్లతో చుట్టుముట్టడం జరిగింది.” – అంటే శాశ్వత సుఖాలకు నిలయమయిన స్వర్గంలో స్థానం సంపాదించటం కొరకు కొన్ని విధ్యుక్త ధర్మాలను విధిగా నిర్వర్తించాలని అల్లాహ్ నిర్ధారించాడు. అలాగే కొన్ని రకాల పనులకు, విషయ లాలసకు దూరంగా ఉండాలని కూడా అల్లాహ్ నిర్ణయించాడు. అల్లాహ్ నిర్ణయించిన విధ్యుక్త ధర్మాలను సక్రమంగా పాటించడం, ఆయన పోవద్దన్న వాటి జోలికి పోకుండా మనోవాంఛలను అణచుకోవటం మనిషికి కాస్త శ్రమగానే ఉంటుంది. దీన్నే కష్టాలతో, ఇక్కట్లతో పోల్చటం జరిగింది.
“నరకాన్ని సుఖవిలాసాలతో చుట్టుముట్టడం జరిగింది.” అంటే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించి జాలీగా గడపటం, అల్లాహ్ హరామ్ (నిషేధించిన) చేసిన సొమ్ము తినటం, విషయ లాలసలో (భౌతిక కోరికలలో) లీనమవటం మనిషికి ఎంతో సులభసాధ్యం. పైగా ఈ మార్గంలో పడిన మనిషి తింటూ, త్రాగుతూ, అనుభవిస్తూ మస్తుగా ఉంటాడు. కాని పర్యవసానం – అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించిన కారణంగా భయంకరంగా ఉంటుంది. నరకం సుఖ విలాసాలతో చుట్టుముట్టడం జరిగిందనే దానికి భావం ఇదే.
పై చర్చ ద్వారా తేలిందేమంటే మనిషి స్వర్గంలో చేరటం అతి సులువయిన విషయం కాదు. నిరంతరం సాధన చేయకుండా కష్టాలను సహించకుండా, బాధలను భరించకుండా మహోన్నత లక్ష్యం ప్రాప్తం కాదు. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు :
ఏమిటీ, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకింకా ఎదురు కానేలేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చిపడ్డాయి. వారు ఎంతగా కుదిపి వేయబడ్డారంటే, (ఆ ధాటికి తాళలేక) “ఇంతకీ దైవసహాయం ఎప్పుడొస్తుంది?” అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. “వినండి! దైవ సహాయం సమీపంలోనే ఉంది” (అని వారిని ఓదార్చటం జరిగింది).(అల్ బఖర 2:214)
ఇకపోతే, అల్లాహ్ హరామ్ (నిషిద్ధం) గా ఖరారు చేసిన వస్తువులు! పైకి అవి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతమైనవిగా అగుపిస్తాయి. వాటిలో ఎంతో ఆనందాను భూతి ఉంటుంది. ఆ తళుకు బెళుకుల, రంగు రంగుల లోకంలో మనిషి తన నిజ స్థానాన్ని, తన జీవన పరమార్థాన్ని కూడా విస్మరించి వాటికి దాసోహం అంటాడు. కాని ఆ రసాస్వాదన క్షణికమైనది. ఆ తరువాత ఎదర ఉన్నదంతా చీకటే. అప్పటి వరకు తన పాలిట ఎంతో తియ్యనైనదిగా, మధురమైనవిగా అగుపించినవన్నీ తరువాత అతని యెడల విషపూరితమైనవిగా పరిణమిస్తాయి. అల్లాహ్ ప్రబోధం :
“ప్రాపంచిక జీవితమైతే కేవలం మోసపుచ్చే సామగ్రి మాత్రమే.” (హదీద్ 57 : 20)
మహాప్రవక్త గారి ప్రవచనంపై ఉలమాలు చేసిన వ్యాఖ్యను ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా ఉటంకించారు :
ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)ఎంత గొప్ప దృష్టాంతం పేర్కొన్నారు! ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం)నోట వెలువడ్డ శుభప్రదమైన వాక్కుల భావం ఏమంటే, ప్రజలు కష్టాలను సహించనంత వరకూ స్వర్గంలో చేరలేరు. కాగా, విలాసాల వైపునకు పరుగులు తీస్తూ మనిషి నరకంలో పడిపోతాడు. స్వర్గం కష్టాల, బాధల మధ్య దాగి ఉంటుంది. అయితే నరకాగ్ని విలాసాలతో కప్పబడి ఉంటుంది. ముసుగు తీసి చూసిన వాడు యదార్థాన్ని గ్రహిస్తాడు. బాధల బరువును సహనంతో మోస్తూ స్వర్గపు పరదాను ఎత్తినవాడు స్వర్గంలో తప్పక ప్రవేశిస్తాడు. రుచులు మరుగుతూ, ఇహలోక సుఖాలను జుర్రుకుంటూ ధర్మమార్గాన్ని మరచినవాడు, కడకు నరకాన్నే చవిచూస్తాడు. అదే అతని గమ్యస్థానం. అక్కణ్ణుంచి అతను తిరిగి రాలేడు.
ఒక్క అల్లాహ్ నే విశ్వసిస్తూ, ఆయన్నే సేవిస్తూ ఆయన మార్గంలో నిరంతరం పాటుపడుతూ, చెడుల నుంచి తనను రక్షించుకుంటూ జీవితం గడపటం, క్రోధాన్ని జయించటం, క్షమాగుణాన్ని అలవరచుకోవటం, దానధర్మాలు చేయటం, తనకు అపకారం తలపెట్టేవారికి సయితం ఉపకారం చేయటం, మనో వాంఛలను అదుపులో పెట్టుకోవటం, సహన స్థయిర్యాలను కలిగి ఉండటం- ఇవన్నీ స్వర్గపు బాటలోని కష్టాలే. స్వర్గం కోరుకుంటున్న వారు అవసరమైతే వీటిని ఆహ్వానించి, భరించవలసిందే.
అయితే సుఖాలు, విలాసాలు అధర్మమని కాదు – వాటిలో ధర్మసమ్మతమైనవి కూడా ఉంటాయి. అయితే మనోవాంఛలకు ఒకసారి దాసుడైపోయిన మనిషి, ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా కోర్కెలు తీరకపోతే అడ్డమైన గడ్డినల్లా కరచి వాటిని పొందాలని ప్రయత్నిస్తాడు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. మితిమీరిన ఈ కోర్కెల మూలంగా అతని ఆంతర్యంలో కాఠిన్యం తిష్ఠవేస్తుంది. మనసులో మలినం పేరుకుంటుంది. దైవదాస్య భావం, దైవ విధేయతా భావం పట్ల అలసత్వం లేక వైముఖ్యం ప్రదర్శిస్తాడు. కోర్కెల గుఱ్ఱాలను పోషించడానికి రేయింబవళ్ళు సంపాదనా యత్నంలోనే ఉండిపోతాడు.
ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం ఏమిటంటే, స్వర్గ నరకాలు సృజించబడి ఉన్నాయి. అవి ఎక్కడో ఒకచోట నెలకొని ఉన్నాయి. మేరాజ్ రాత్రిన ప్రవక్త మహనీయులు స్వర్గ నరకాలను చూసి వచ్చారు.
ఈ హదీసు ద్వారా బోధపడే మరో విషయం; ఈ ప్రపంచం కేవలం సుఖాస్వాదనలకు నిలయం కాదు. ఈ లోకంలో ఏ సుఖమయినా, మరే ఆనందమయినా – అది ధర్మ సమ్మతంగా లభిస్తే, దాన్ని అల్లాహ్ అనుగ్రహంగా భావించి పొందవచ్చు. ఇలాంటి సుఖాలు పరలోక సాఫల్యానికి ఎలాంటి అవరోధం కాజాలవు.
అల్లాహ్ ఆజ్ఞలను పాలిస్తూ, ఆయన మోపిన విధ్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూ ఆయన వద్దన్న వాటి జోలికి పోకుండా గడపటం సాధారణ విషయం కాదు. నిజానికి అదొక పెద్ద పరీక్ష, మహాయజ్ఞం. అయితే చిత్తశుద్ధితో అల్లాహ్ మార్గాన పయనించాలని నిశ్చయించుకున్న వాని కోసం, అల్లాహ్ తన మార్గాన్ని సులభతరం చేస్తాడు. అంటే అల్లాహ్ కు భయపడుతూ, అల్లాహ్ మార్గంలో ఖర్చుచేస్తూ ప్రవక్తలను విశ్వసిస్తూ మంచిపనులు చేసిన వారికి అల్లాహ్ స్వర్గంలో సులువుగా ప్రవేశం కల్పిస్తాడు.
హరామ్ నుండి మనిషి తనను కాపాడుకోవటం మొదట్లో కాస్త కష్టంగా కనిపిస్తుంది. కాని అతను స్థిర చిత్తంతో, ఓపికతో ధర్మ మార్గానికి కట్టుబడి ఉంటే రాను రాను అతను ఎంత కాలితే అంతే కుందనంలా, మేలిమి బంగారంలా మెరిసిపోతాడు. క్రమక్రమంగా చెడులంటే, హరామ్ వస్తువులంటే అతను అసహ్యించుకోసాగుతాడు. ఇక అప్పుడతను చెడుల బారిన పడకుండా, వాటికి దూరంగా ఉండటం ఎంతో సులువు. ప్రవక్త సహచరుల నుద్దేశించి ఇలా సెలవియ్యబడింది :
“ఆయన మీ మనసుల్లో అవిశ్వాసం, అపసవ్యత, అవిధేయత పట్ల ఏహ్యభావాన్ని కలుగజేశాడు. ఇటువంటి వారే అల్లాహ్ కరుణానుగ్రహాలకు నోచుకున్నారు.” (అల్ హుజురాత్ 49 : 7)
పై విషయాల సారాంశం ఏమిటంటే, మానవుడు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ అతను స్వర్గపు బాటపై నడవాలి. ధర్మసమ్మతం కాని, నరకానికి గొనిపోయే ఎన్ని సుఖభోగాలు తారసపడినా వాటి వలలో చిక్కకుండా తనను రక్షించుకోవాలి.
పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం) రచన:సఫీ అహ్మద్ మదనీ అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్ ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
1) ఇస్రా వ మేరాజ్ ప్రాముఖ్యత 2) ఇస్రా వ మేరాజ్ తారీఖు 3) ఇస్రా వ మేరాజ్ లోని సంఘటనలు 4) ఇస్రా వ మేరాజ్ ఉద్దేశ్యము
ఇస్లామీయ సోదరులారా!
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు అల్లాహ్ ఎన్నో అద్భుతాలను ప్రసాదించాడు. వాటిలో ఒక ముఖ్యమైన అద్భుతం – ఇస్రా వ మేరాజ్. ఈ అద్భుతంలో రెండు ముఖ్యమైన భాగాలు వున్నాయి. ఒక భాగం – ఇస్రా అని పిలువబడే ‘మస్జిదుల్ హరామ్’ నుండి ‘మస్జిదె అఖ్సా’ వరకు సాగిన ప్రయాణానికి సంబంధించినది. ఇక రెండవ భాగం – ‘మస్జిదె అఖ్సా’ నుండి ఆకాశాల కన్నా పైకి, అల్లాహ్ కోరుకున్నంత వరకు సాగిన ప్రయాణం. దీనిలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు స్వర్గనరకాలతో పాటు, ఎన్నో అల్లాహ్ సూచనలు చూపించడం జరిగింది, ఎన్నో ప్రవక్తలను పరిచయం చేయడం జరిగింది మరియు ఐదు పూటల నమాజ్ విధి (ఫర్జ్) గా చేయబడ్డాయి – దీనినే ‘మేరాజ్‘ అని పిలుస్తారు.
మేరాజ్ సంఘటన గురించి అహ్లుస్సున్నహ్ వల్ జమాఅత్ విశ్వాస మేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మెలకువగావున్న స్థితిలో, శరీర సమేతంగా తనకు ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగింది. అంతేగానీ, నిద్రలో, ఆత్మరూపంలో కాదు.
ఇమామ్ తహావీ రహిమహుల్లాహ్ ఇలా పేర్కొన్నారు : మేరాజ్ అనేది సత్యం. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను మెలకువ స్థితిలో, శరీర సమేతంగా సంచరింపజేయడం జరిగింది మరియు ఆకాశాల వరకూ, ఇంకా వాటికన్నా పైకి అల్లాహ్ కోరుకున్నంత వరకు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అల్లాహ్ తాను కోరుకున్నట్లుగా ఆయనను గౌరవించి, తాను కోరుకున్న దానిని ఆయనకు ‘వహీ’ చేశాడు.
“తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదుల్ హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు తీసుకునిపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే మేమతనికి మా (శక్తి సామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు.” (బనీ ఇస్రాయీల్ 17:1)
ఈ ఆయత్ ‘సుబ్ హాన’ అన్న పదంతో అల్లాహ్ ప్రారంభించాడు. దీని శాబ్దిక అర్థం ఏమిటంటే – ఆయన (అల్లాహ్) అన్ని లోపాలకు అతీతుడు. కానీ, అరబ్బీ భాషలో దీనిని ‘ఆశ్చర్యాన్ని‘ వెలిబుచ్చే సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా అల్లాహ్ శక్తిసామర్థ్యాలకు గాను ఆశ్చర్యం ప్రకటించబడుతోంది – ఆ శక్తిసామర్థ్యాలు ఏమిటంటే – అల్లాహ్ తన దాసుణ్ణి, ఆ రోజుల్లో 40 రేయింబవళ్ళలో పూర్తి చేయగలిగే ప్రయాణాన్ని రాత్రికి రాత్రే పూర్తి చేయించాడు. దీనిని వెల్లడించిన శైలి కూడా – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మెలకువతో, శరీర సమేతంగా మేరాజ్ చేయించడం జరిగిందని నిరూపిస్తోంది. ఎందుకంటే – ఒకవేళ నిద్ర స్థితిలో, ఆత్మరూపంలో ఈ ప్రయాణం జరిగి వుంటే, దాని కోసం ‘సుబ్ హాన’ పదాన్ని ఉపయోగించి ఆశ్చర్యం ప్రకటించాల్సిన అవసరం వుండేది కాదు.
ఇదేగాక, అల్లాహ్ దీనిలో అబ్ద్ (దాసుడు) పదాన్ని వాడాడు. అంటే ఆయన దాసుణ్ణి సంచారం గావించాడు. ఈ పదం కూడా ఆత్మ, శరీరం – రెండింటినీ కలిపి వాడబడుతుంది. కేవలం ఆత్మ కోసం కాదు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు కలలో కాకుండా మెలకువతో శరీర సమేతంగా మేరాజ్ యాత్ర చేయించి గౌరవించడం జరిగిందనడానికి ఇది రెండవ ఆధారం.
ఇక దీని మూడవ ఆధారం ఏమిటంటే – ఒకవేళ ‘ఇస్రా వ మేరాజ్’ సంఘటన కలలో జరిగివుంటే, మరి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన కలను జనాలకు వివరించినప్పుడు వారు దానిని (నమ్మకుండా) తిరస్కరించేవారు కాదు. కనుక మక్కా అవిశ్వాసుల తిరస్కరణ ద్వారా మనకు తెలిసిందేమిటంటే – దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో తన కలను వివరించలేదు, వారితో స్పష్టంగా తనకు మెలకువ స్థితిలో, శరీర సమేతంగా ‘ఇస్రా వ మేరాజ్’ చేయించడం జరిగిందని చెప్పారు.అందుకే వారు- మక్కా నుండి ఏలియా (బైతుల్ మఖ్దిస్)కు మేము 40 రేయింబవళ్ళలో పూర్తి చేసే యాత్రను ఈయన రాత్రికి రాత్రే అక్కడికెళ్ళి తిరిగి వచ్చేశారు! అని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను పరిహసించారు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఓ ముస్లింలారా! అల్లాహ్ యొక్క భయాన్ని ఆయన దైవభీతిని కలిగి ఉండండి, ఆయనకు విధేయత చూపండి, అవిధేయత నుంచి దూరంగా ఉండండి. మరియు తెలుసుకోండి! నమాజ్ అతి ఉన్నతమైన ఆచరణలలో ఒకటి. అల్లాహ్ ఇతర ఆరాధనల కంటే ఎక్కువగా దీనికి ఎంతో ప్రాముఖ్యతను ప్రసాదించాడు. నమాజ్ యొక్క ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; అల్లాహ్ దీనిని ఆకాశాలలో విధి గావించాడు ఇది చూడడానికి 5 నమాజులే కానీ పుణ్యఫలం పరంగా 50 నమాజుల పుణ్యఫలం లభిస్తుంది. నమాజ్ ద్వారా పాప ప్రక్షాళన జరుగుతుంది, నమాజ్ కొరకు మస్జిద్ వైపు వెళ్లడం మరియు తిరిగి రావడం కూడా ఆరాధనలోని భాగమే, అదే విధంగా దీని ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే; ఈ నమాజు కొరకు పరిశుభ్రత పొందడం తప్పనిసరి.
ఓ విశ్వాసులారా! నమాజ్ యొక్క ఈ ప్రాధాన్యత దృష్ట్యా అల్లాహ్ దీని కొరకు త్వరపడమని ఆదేశిస్తున్నాడు, మరియు దీనికి సంబంధించి గొప్ప ప్రతిఫలాన్ని పెట్టాడు. అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “పురుషుల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది మొదటి పంక్తి. అత్యంత హీనమైనది చివరి పంక్తి. స్త్రీల పంక్తుల్లో అత్యంత శ్రేష్ఠమైనది చివరి పంక్తి. అత్యంత హీనమైనది మొదటి పంక్తి”. (ముస్లిం)
అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు”. (ముస్లిం)
అబూహురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: “అజాన్ చెప్పటానికి, తొలి పంక్తిలో చేరటానికి ఎంతటి ఘనత ఉందో ప్రజలకు తెలిస్తే, దానిని పొందటానికి పరస్పరం లాటరీ వేసుకోవటం తప్ప గత్యంతరం లేదని భావిస్తే, వారు తప్పకుండా లాటరీ వేసుకుంటారు. మరియు నమాజ్ కొరకు త్వరపడడం వల్ల లభించే పుణ్యఫలం ఎంతో తెలిస్తే వారు ఒకరిని మించి ఒకరు పోటీపడతారు. అదేవిధంగా ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సామూహికంగా చేయడంలో ఎంత పుణ్యముందో ప్రజలకు తెలిస్తే వాటి కోసం మోకాళ్ళు ఈడ్చుకుంటూ నడవవలసి వచ్చిన సరే వారు తప్పకుండా వస్తారు.” (బుఖారీ-ముస్లిం)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఈ హదీసులో(ما في النداء) దీని అర్థం అజాన్ ఇచ్చే వారికి లభించే అటువంటి పుణ్యఫలం మరియు “ یستهموا” దీని అర్థం లాటరీ వేయడం మరియు” تهجير ” దీని అర్థం త్వరపడటం మరియు” عتمة” దీని అర్థం ఇషా నమాజ్.
బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిస్సందేహంగా అల్లాహ్ తొలి పంక్తుల్లో ఉండేవారిపై కారుణ్యాన్ని కురిపిస్తాడు. మరియు దైవదూతలు వారి పాప క్షమాపణ కొరకు దువా చేస్తారు”. (అబూ దావుద్)
ప్రవక్త వారి ఈ ఆదేశంలో దైవదూతలు వారి కొరకు దువాలు చేస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే దైవదూతలు మొదటి పంక్తిలో ఉండే వారి కొరకు పుణ్యం మరియు క్షమాపణ యొక్క దువా చేస్తారు ఎందుకంటే అరబ్బీలో సలాహ్ అంటే దుఆ అని అర్థం కూడా వస్తుంది.
ఇర్బాజ్ బిన్ సారియ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మొదటి పంక్తి వారి కొరకు మూడుసార్లు మరియు రెండవ పంక్తి వారి కొరకు ఒకసారి మగ్ ఫిరత్ (పాప క్షమాపణ) దుఆ చేసేవారు.(నసాయి)
అబూ సయీద్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) కథనం: తన సహచరులు వెనుక (పంక్తుల్లో) ఉండిపోవటం చూసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మందలిస్తూ, “ముందుకు రండి, మీరు నన్ను అనుసరించండి. మీ తర్వాత వచ్చిన వారు మిమ్మల్ని అనుసరిస్తారు. (జాగ్రత్త!) ప్రజలు గనక ఎప్పుడూ వెనకే ఉంటే అల్లాహ్ కూడా వారిని వెనకబాటు తనానికి గురిచేస్తాడు” అని అన్నారు. (ముస్లిం)
ఆయిషా (రదియల్లాహు అన్హ) కథనం ప్రకారం మహా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తెలియజేశారు; “ఎవరైతే మొదటి పంక్తులకు దూరంగా ఉంటారో అల్లాహ్ తఆల వారిని తన కారుణ్యానికి కూడా దూరంగా ఉంచుతాడు”.(అబూ దావుద్)
అల్లాహ్ ఖురాన్ యొక్క శుభాలను మన జీవితాలలో వర్షింప చేయుగాక, ఆయన వివేకంతో కూడిన సూచనల ద్వారా హితబోధ పొందే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. మీరు కూడా అల్లాహ్ ను క్షమాపణ వేడుకోండి. నిశ్చయంగా ఆయన తౌబా (పశ్చాత్తాపం) చెందే వారిని తప్పక మన్నిస్తాడు.
రెండవ ఖుత్బా
స్తోత్రం మరియు దరూద్ తరువాత
మీరు తెలుసుకోండి! అల్లాహ్ మీపై కనికరించు గాక! ఇస్లాంలో నమాజుకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది, ఇంత గొప్ప ప్రాధాన్యత మరి యే ఇతర ఆరాధనకు లేదు. ఇస్లాం యొక్క ముఖ్య మూల స్తంభాలలో ఒకటి. ఇది లేకుండా ధర్మం స్థిరంగా ఉండలేదు.
ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు; “ఏమిటి నేను మీకు ధర్మం యొక్క అసలు మరియు దాని మూల స్తంభం మరియు దాని యొక్క శిఖరం గురించి తెలియజేయనా?” అప్పుడు నేను ఇలా అన్నాను, ఎందుకు కాదు మహా ప్రవక్తా! తెలియజేయండి. ప్రవక్త వారు ఇలా అన్నారు: “ధర్మం యొక్క అసలు ఇస్లాం, దాని మూల స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం అల్లాహ్ మార్గంలో పోరాడటం”. (తిర్మిజి)
దాసుడు మరియు అల్లాహ్ మధ్య ఇది సంభాషణకు ఒక సాధన, ఎందుకంటే నమాజులో అల్లాహ్ యొక్క పొగడ్త, ఆయన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరుగుతుంది. నమాజ్ ఆరాధన హృదయం, నాలుక మరియు శరీర అవయవాల పై ఆధారపడి ఉంది ఉదాహరణకు అల్లాహ్ యొక్క పొగడ్త, దువా చేయడం, ఖురాన్ పఠించడం, అల్లాహ్ ను స్తుతించడం, తక్బీర్ చెప్పడం, మరియు శరీర అవయవాలతో ఏకాగ్రచిత్తంతో ఆచరించడం మరియు రుకూ, సజ్దా చేయడం మరియు అందులో వినయ వినమ్రతలు కనబరుస్తూ తమ చూపుని కిందికి వాల్చుకొని అల్లాహ్ ముందు తలవంచి నిల్చోవడం.
إنَّ الصَّلَوَةَ تَنْهَى عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). (29:45)
షేఖ్ సాది (రహిమహుల్లాహ్) పై ఆయత్ యొక్క వివరణలో ఇలా తెలియజేస్తున్నారు:- నమాజ్ యొక్క ఒక లక్ష్యం దాని కంటే గొప్పది అనగా హృదయం మరియు నాలుక మరియు శరీరంతో అల్లాహ్ యొక్క స్మరణ చేయడం. ఎందుకంటే అల్లాహ్ తన దాసులను దాని కొరకే పుట్టించాడు, దాసులవైపు నుంచి చేసేటువంటి ఆరాధనలలో అతి గొప్ప ఆరాధన నమాజ్. నమాజులో తప్ప మనిషి యొక్క శరీర అవయవాల ద్యారా ఇలాంటి ఆరాధన జరగదు. అందుకే అల్లాహ్ అంటున్నాడు (وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ) అల్లాహ్ స్మరణ అన్నింటి కంటే గొప్పది.
ఈ విషయాన్ని కూడా తెలుసుకోండి, అల్లాహ్ మీపై కరుణించుగాక! అల్లాహ్ మీకు ఒక పెద్ద ఆచరణకై అజ్ఞాపించి ఉన్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ ఇలా అన్నాడు.
నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (అల్ అహ్ జాబ్ 33:56)
ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై నీ కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆయన ఖలీఫాలు, తాబయీనులను పూర్తి చిత్తశుద్దితో అనుసరించే వారిని ఇష్టపడు, ప్రేమించు. ఓ అల్లాహ్! ఇస్లాం మరియు ముస్లింలకు గౌరవ మర్యాదలు ప్రసాదించు. షిర్క్, ముష్రిక్ లను అవమానబరుచు. నీవు మరియు నీ ధర్మం అయిన ఇస్లాంకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని సర్వ నాశనం చేయి. మరియు ఏకేశ్వరోపశకులకు నీ సహాయాన్ని అందించు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
وَمَآ أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍۢ فَإِنَّ ٱللَّهَ يَعْلَمُهُۥ “మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు“. (2: బఖర: 270).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు: “అల్లాహ్ కు విధేయత చూపాలని మొక్కుబడి చేసిన వ్యక్తి విధేయత చూపాలి. కాని ఎవరు అల్లాహ్ కు అవిధేయత చూపాలని మొక్కుబడి చేస్తాడో అతడు అవిధేయత చూపకూడదు”. (బుఖారి).
ముఖ్యాంశాలు:
1. మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయాలి. 2. మొక్కుబడి ఇబాదత్ (ఆరాధన) అని తెలిసింది, దాన్ని ఇతరుల కొరకు చేయుట షిర్క్. 3. పాపకార్యానికి, అవిధేయతకు మొక్కుబడి చేస్తే దాన్ని పూర్తి చేయకూడదు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నిటి కంటే ఉత్తమమైన మాట అల్లాహ్ మాట, మరియు అందరి కంటే ఉత్తమమైన పద్ధతి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి. అన్నిటి కంటే నీచమైనది ఇస్లాంలో కొత్తగా సృష్టించబడినవి. మరియు ఇస్లాంలో కొత్తగా సృష్టించబడిన ప్రతీ కార్యము బిద్అత్ క్రిందికే వస్తుంది. మరియు ప్రతీ బిద్అత్ మార్గభ్రష్టత్వము. మరియు ప్రతీ మార్గభ్రష్టత్వము నరకంలోకి తీసుకువెళ్ళేదే.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండండి. ఆయనను అనుసరించండి మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండండి.
అల్లాహ్ పై విశ్వాసం కొరకు నాలుగు విషయాలపై విశ్వాసం తప్పనిసరి అని తెలుసుకోండి: (1) అల్లాహ్ సుబ్ హానహు వతఆలా[1] యొక్క ఉనికి పై విశ్వాసం, (2) ఆయన రుబూబియత్[2] అనే విషయం పై విశ్వాసం, (3) ఆయన ఉలూహియత్[3] పై విశ్వాసం. (4) ఆయన శుభ నామములు, ఉత్తమ గుణాలపై విశ్వాసం.
ఈ ఖుత్బాలో మనము కేవలం ఆయన ఉనికి, అస్ధిత్వం పై విశ్వాసం (ఈమాన్) గురించి చర్చించుకుందాము.
అల్లాహ్ సుబ్ హానహు వతఆలా ఉనికి పై విశ్వాసం కొరకు (నాలుగు రకాల) ఆధారాలున్నాయి: (1) సహజ స్వభావికమైనవి, (2) హేతు బద్ధమైనవి, (3) ధర్మపరమైనవి మరియు (4) ఇంద్రియజ్ఞాన పరమైనవి.
[1] సహజ స్వభావము అల్లాహ్ ఉనికిని నిరూపిస్తుంది అనే విషయానికొస్తే, ప్రతి సృష్టి ఎవరి నుండి ఏ నేర్పు, శిక్షణ మరియు ముందు ఆలోచన లేకుండా తన సృష్టికర్తను విశ్వసించే సహజగుణం పైనే పుడుతుంది. దివ్య ఖర్ఆన్ లో ఈ ఆయతు దీనికి ఆధారము.
(నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారిని వారికే సాక్షులుగా పెట్టి “నేను మీ ప్రభువును కానా” అని అడిగినప్పుడు “ఎందుకు కావు? (నువ్వే మా ప్రభువు) ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నాం” అని వారు చెప్పారు.) (అల్ ఆరాఫ్:172)
మానవుడి సహజ స్వభావములో అల్లాహ్ అస్థిత్వము పై విశ్వాసము ఉందని చెప్పడానికి ఈ ఆయతు ఆధారము. ఇక ఏదైనా బయటి ప్రభావం వల్లనే ఈ సహజ గుణం నుండి వైదొలగిపోతాడు. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతీ పిల్లవాడు సహజ స్వభావము పైనే పుట్టించబడతాడు. కాని వాడి తల్లిదండ్రులు వాడిని యూదుడిగా, క్రైస్తవుడిగా, మజూసీ (అగ్నిపూజారి)గే మార్చి వేస్తారు[4].
దీని వల్లే మానవుడికి ఏదైనా నష్టం జరిగినప్పుడు తమ సహజ స్వభావ ప్రకారంగా (తమ భాషలో) “ఓ అల్లాహ్” అని అరుస్తాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అవిశ్వాసులు కూడా అల్లాహ్ ఉనికిని విశ్వసించేవారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(మిమ్మల్ని పుట్టించినదెవరని నువ్వు గనక వారిని అడిగితే “అల్లాహ్” అని వారు తప్పకుండా అంటారు.) (లుఖ్మాన్:25).
ఈ విషయంలో అనేక ఆయతులున్నాయి.
[2] ఇక హేతుబద్ధమైన రీతిలో అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే వాస్తవం ఏమిటంటే ముందు మరియు తరువాత వచ్చే జీవులన్నింటిని సృష్టించినవాడు ఒకడు తప్పకుండా ఉన్నాడు, ఆ సృష్టికర్తయే వీటన్నింటినీ సృష్టించాడు. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను ఉనికిలోకి తెచ్చుకోవడం అసాధ్యం. అస్థిత్వం లేనిది తనను తాను సృష్టించుకోలేదు’
అదే విధంగా సృష్టితాలు ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి రావటం, రెండు కారణాల వలన అసాధ్యం.
మొదటి కారణము: ఉనికిలో ఉన్న ప్రతీదానిని ఉనికిలోకి తెచ్చేవాడు ఒకడు ఉండటం తప్పనిసరి, దీనిని బుద్ది మరియు షరీఅత్ (ఇస్లాం ధర్మశాస్త్రం) రెండూ నిరూపిస్తున్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా? ) (అల్ తూర్:35)
రెండవ కారణం: అద్భుతమైన వ్యవస్థలో, పరస్పర సామరస్యముతో ఈ సృష్టి ఉనికిలోకి రావడం, ఎటువంటి ఢీ మరియు ఘర్షణ లేకుండా వాటి కారణాలు మరియు కారకుల మధ్య మరియు స్వయం సృష్టితాల్లో ఉన్న పరస్పర గాఢమైన సంబంధం ఏ సృష్టికర్త లేకుండా అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చేసాయి అన్న మాటని పూర్తిగా తిరస్కరిస్తున్నాయి, ఎందుకుంటే అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చినది అస్తవ్యస్తంగా ఉంటుంది, అలాంటప్పుడు తన మనుగడ మరియు అభివృద్ధిలో ఈవిధమైన అద్భుత నిర్వాహణను కలిగి ఎలా ఉంటుంది? ఇప్పుడు శ్రద్ధగా అల్లాహ్ యొక్క మాటను వినండి.
(చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుని తరం కాదు, పగటిని మించి పోవటం రాత్రి వల్ల కాదు. అవన్నీ (తమ తమ నిర్ధారిత) కక్ష్యల్లో తేలియాడుతున్నాయి.) (యాసీన్:40)
ఒక పల్లెవాసితో నువ్వు నీ ప్రభువుని ఎలా గుర్తించావు అని అడిగితే అతను ఇలా సమాధానం ఇచ్చాడు: పేడను బట్టి జంతువును గుర్తించవచ్చు, అడుగు జాడలు ప్రయాణికుడిని నిరూపిస్తాయి. అలాంటప్పుడు నక్షత్రాలతో అలంకరించబడిన ఆకాశం, విశాలమైన మార్గాలు గల భూమి, అలలు ఆడించే సముద్రం విని మరియు చూసే సృష్టికర్తను నిరూపించటం లేదా?
అల్లాహ్ యొక్క అద్భుతమైన సృష్టిరాసుల్లో ఒకటి దోమ. అల్లాహు తఆలా అందులో కూడా అనేక వివేకాలను సమకూర్చి ఉంచాడు, అల్లాహ్ దానిలో జ్ఞాపక శక్తి, గుర్తించే, గమనించే శక్తి, తాకే, చూసే మరియు వాసన పీల్చే శక్తులను మరియు ఆహార ప్రవేశ మార్గం అమర్చాడు. కడుపు, నరాలు, మెదడు మరియు ఎముకలను నియమించాడు. సరియైన అంచనా వేసి మార్గం చూపాడో మరియ ఏ వస్తువును అనవసరంగా సృష్టించలేదో ఆయన పరమ పవిత్రుడు, సర్వలోపాలకు అతీతుడు.
يا من يرى مدَّ البعوض جناحها ویری مناط عروقها في نحرها ویری خرير الدم في أوداجها ويرى وصول غذى الجنين ببطنها ویری مكان الوطء من أقدامها ويرى ويسمع حِس ما هو دونها امنن علي بتوبة تمحو بها
في ظلمة الليل البهيم الأليل والمخ من تلك العظام النحَّل متنقلا من مفصل في مفصل في ظلمة الأحشا بغير تمقَّل في سيرها وحثيثها المستعجل في قاع بحر مظلم متهوّل ما كان مني في الزمان الأول
చిమ్మని చికిటిలో దోమ విప్పే రెక్కను చూసే ఓ అల్లాహ్! ఆ దోమ మెడలో ఉన్న నరాల సంగమాన్ని చూసేవాడా! మరియు దాని సన్నని ఎముకలపై ఉన్న మాంసాన్ని చూసేవాడా! దాని నరాలలో ఉన్న రక్తము, శరీర ఒక భాగము నుండి మరో భాగానికి చేరే రక్త ప్రవాహాన్ని చూసేవాడా! దోమ కడుపులో పోషించబడుతున్న పిండాన్ని, ప్రేగుల చీకటి లోంచి ఎటువంటి శ్రమ లేకుండా చూసేవాడా! అది నడుస్తున్నప్పుడు, వేగంగా పరిగెత్తేటప్పుడు దాని అడుగు జాడలను చూసేవాడా! చిమ్మని చీకటి మరియు భయంకరమైన సమద్రము లోతులో ఉన్న అతి సూక్షమైన జీవులను చూసేవాడా! నా తౌబా స్వీకరించు మరియు నా పూర్వ పాపాలన్నింటినీ క్షమించు.
సారాంశం ఏమిటంటే ఈ సృష్టితాలు తమను తాము సృష్టించుకోలేనప్పుడు మరియు అవి అకస్మాత్తుగా ఉనికిలోకి రాలేనప్పుడు దీనీ అర్థం: వీటిని సృష్టించిన సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనే అల్లాహ్!.
అల్లాహు తఆలా ఈ హేతుబద్ధమైన మరియు ఖచ్చితమైన ఆధారాన్ని సూరే తూర్ లో ఇలా ప్రస్తావించాడు:
(ఏమిటి వీరు సృష్టికర్త ఎవరూ లేకుండానే వారంతట వారే పుట్టుకు వచ్చారా? లేక వారే స్వయంగా సృష్టి కర్తలా?) (అల్ తూర్:35).
అంటే వారూ ఏ సృష్టికర్త లేకుండా పుట్టలేదు మరియు వారు స్వయాన్నీ సృష్టించుకోలేదు, అలాంటప్పుడు వారి సృష్టికర్త అల్లాహు తబారక వతఆలా అని స్పష్టమయింది.
అందుకనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరె తూర్ పఠిస్తుండగా జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు వింటున్నప్పుడు ప్రవక్త ఇదే ఆయత్ వద్దకు చేరుకున్నప్పుడు జుబైర్ బిన్ ముత్ఇమ్ రజియల్లాహు అన్హు అప్పుడు అవిశ్వాసి, కాని ఇలా అన్నారు:“నా గుండె ఆగిపోతుందేమొ అనిపించింది. అప్పుడే మొదటి సారిగా నా మనసులో ఇస్లాం చోటుచేసుకుంది”[6].
(అల్లాహ్ నాపై, మీ పై ఖుర్ఆన్ శుభాలను అవతరింపజేయుగాకా! నాకూ, మీకూ అందులో ఉన్న వివేకము, లాభము ద్వారా ప్రయోజనం చేకూర్చుగాక! నేను నా మాటను ముగిస్తాను. మరియు నా కొరకు, మీ కొరకు క్షమాపణ కోరుతున్నాను మీరు కూడా కోరండి. నిస్సందేహంగా అల్లాహ్ చాలా క్షమించేవాడూ మరియు కరుణించేవాడూ)
రెండవ ఖుత్బా
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్! అమ్మాబాద్.
[3] ఓ ముస్లిముల్లారా! అల్లాహ్ ఉనికి పై షరీఅత్ పరమైన అధారాల విషయానికొస్తే ఆకాశ గ్రంధాలన్నియూ అల్లాహ్ ఉనికిని నిరూపిస్తాయి? ఎందుకంటే ఈ గ్రంధాలు జీవులకు ఇహ పరలోకాల ప్రయోజనాలు చేకూర్చే ఆదేశాలతో అవతరించాయి. కావున ఈ గ్రంధాలు వివేకవంతుడైన, జీవుల లాభ, ప్రయోజనాల జ్ఞానమున్న ప్రభువు తరఫున అవతరించబడ్డాయి అని నిరూపిస్తున్నాయి. అందులో ఉన్న విశ్వ సమాచారాన్ని ప్రస్తుత పరిస్థితులు ధృవీకరిస్తున్నాయి, ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం అన్ని వస్తువులను సృష్టించగల సమర్ధత ఉన్న ప్రభువు తరపున అవతరించబడ్డాయని ఇవి (దైవ గ్రంధాలు) నిరూపిస్తున్నాయి.
ఇదే విధంగా ఖుర్ఆన్ యొక్క పరస్పర సామరస్యము, అందులో పరస్పర విభేధాలు లేకపోవటం, దాని ఒక భాగం మరో భాగాన్ని ధృవీకరించడం వివేకవంతుడు, జ్ఞానవంతుడైన అల్లాహ్ తరుఫు నుండి వచ్చిందని చెప్పటానికి ఇది ఖచ్చితమైన ఆధారము. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు.
(ఏమిటి వారు ఖుర్ఆన్ గురించి యోచన చేయరా? ఒక వేళ ఇది గనక అల్లాహ్ తరఫున కాక ఇంకొకరి తరఫున వచ్చి ఉంటే అందులో వారికీ ఎంతో వైరుధ్యం కనపడేది.) (అల్ నిసా:82).
ఏ ప్రభువైతే ఖుర్ఆన్ ద్వారా మాట్లాడాడో ఆ ప్రభువు యొక్క ఉనికిని నిరూపించే ఆధారము ఆయనే అల్లాహ్.
[4] ఇక ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ అస్థిత్వాన్ని నిరూపించే విషయానికొస్తే, ఈ విషయం రెండు రకాలుగా నిరూపించవచ్చును.
మొదటి రకం: అల్లాహు తఆలా తనను పిలిచే వారి పిలుపును వినటం, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయటమనేది మనము వింటూ, చూస్తూ ఉంటాం. ఇది అల్లాహ్ ఉనికిని నిరూపించే ధృఢమైన ఆధారము ఎందుకంటే దుఆ స్వీకరించబడటము ద్వారా ఆయనను పిలిచే పిలుపును వినే మరియు చేసే దుఆను స్వీకరించేవాడు ఒకడు ఉన్నాడని తెలుస్తుంది. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
(సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు అల్లాహ్ మీ మొరను ఆలకించాడు కూడా). (అల్ అన్ ఫాల్:9).
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఒక వ్యక్తి జుమా రోజు మింబర్ కి ఎదురుగా ఉన్న తలుపు నుండి మస్జిదె నబవీలోకి వచ్చాడు, మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, అతను ప్రవక్తకు ఎదురుగా నిలబడి అన్నాడు: వర్షాలు కురవక జంతువులు చనిపోయాయి, మార్గాలు మూత పడిపోయాయి, కావున మీరు వర్షాల కొరకు అల్లాహ్ తో దుఆ చేయండి, ఇది విన్న వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (దుఆ కొరకు) చేతులు ఎత్తి:
ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు, ఓ అల్లాహ్ మాకు నీరు (వర్షం) కురిపించు.
అనస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా! ఆకాశంలో దూర దూరం వరకు మేఘాలుగానీ, మేఘపు ముక్కగానీ లేదా మరే విషయం (అంటే వర్షానికి చిహ్నంగా గాలి మొదలుగునవి) ఇంకా మా మధ్య మరియు సల్అ కొండ మధ్య మబ్బు ఉన్నా కనిపించకపోవటానికి ఏ ఇల్లు కూడా లేదు, కొండ వెనుక నుండి ఢాలుకి సమానమైన మేఘాలు వస్తూ కనిపించాయి, ఆకాశానికి మధ్యలో చేరాయి, నలువైపులా క్రమ్ముకున్నాయి, వర్షం కురవటం మొదలైపోయింది, అల్లాహ్ సాక్షిగా! ఒక వారము వరకు మేము సూర్యుడ్ని చూడలేదు, తర్వాత జుమా రోజున ఆ/ఓ వ్యక్తి అదే తలుపు నుండి లోపలికి వచ్చాడు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బా ఇస్తున్నారు, ఆ వ్యక్తి నిలబడి మాట్లాడుతూ ఓ ప్రవక్తా! వర్షం ఎక్కువగా కురవడం వల్ల సంపద నాశనం అయిపోయింది, మార్గాలు మూతపడిపోయాయి, వర్షాలు ఆగిపోవాలని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు మహాప్రవక్త చేతులెత్తి ఇలా దుఆ చేసారు:
ఓ అల్లాహ్! మాపై కాకుండా, మా చుట్టు ప్రక్కన వర్షం కురిపించు, దిబ్బల పై, పర్వతాలపై, కొండలపై, లోయల్లో మరియు తోటల్లో.
ఈ దుఆ తరువాత వర్షం ఆగిపోయింది, మేము ఎండలో బయటకు వచ్చాము.
ఎవరు స్వచ్ఛ మనస్సుతో అల్లాహ్ వైపునకు మరళి, దుఆ స్వీకరించబడే సాధనాలతో అల్లాహ్ ను అల్లాహ్ తో దుఆ చేస్తే, (అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడని, స్వీకరిస్తున్నాడని) ఈ రోజు కూడా దుఆ స్వీకరించబడే సందర్భాలను, అద్భుతాలు చూడవచ్చు.
ఇంద్రియ జ్ఞానం అల్లాహ్ ఉనికిని నిరూపించే రెండో రకం: ప్రవక్తలకు అల్లాహ్ ఇచ్చిన అద్భుతాలు. వాటిని ప్రజలు చూస్తూ వింటూ, ఉంటారు. ఇవి కూడా ప్రవక్తులను పంపిన అల్లాహ్ ఉనికిని నిరూపించే ఖచ్చిత ఆధారాలు. ఎందుకంటే ఇవి మానవుడితో సాధ్యమయ్యేవి కావు. అల్లాహ్ ప్రవక్తలకు మద్దతు పలుకుతూ వారికి (ఈ అద్భుతాలు) ప్రసాదిస్తాడు.
ఉదాహరణకు: మూసా అలైహిస్సలాం వారికి ప్రసాదించిన అద్భుతం: ఎప్పుడైతే అల్లాహ్ మూసా అలైహిస్సలాంకి తన లాఠీను సముద్రంపై కొట్టమని ఆజ్ఞాపించాడో, అప్పుడు ఆయన కొట్టారు, దాని వలన పన్నెండు పొడి మార్గాలు ఏర్పడి వారి ముందు నీరు కొండ మాదిరిగా నిలబడింది.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ ఉనికిని విశ్వసించాలని సహజస్వభావము మరియు ఇంద్రియ జ్ఞానం నిరూపిస్తున్నాయి కాబట్టి ప్రవక్తలు తమ జాతి వారితో ఇలా అన్నారు:
(నిశ్చయంగా అల్లాహ్, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై సలాత్ (దరూద్) పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా ఆయనపై దరూద్ పంపండి, అత్యధికంగా ఆయనపై సలాములు పంపండి.) (అల్ అహ్ జాబ్:56).
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
రజబ్ మాసంలో ఒక బిద్అత్ ‘సలాతుర్రగాయిబ్’ పేరుతో ప్రజల్లో ప్రసిద్ధిగాంచి వుంది. ప్రజలు తమ వైపు నుంచి సృష్టించి, దానిని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ఆపాదించిన దీని స్వరూపాన్ని ముందు మీకు వివరిస్తాం. తదుపరి దీని గురించి ముహద్దిసీన్ (హదీసువేత్తలు)ల అభిప్రాయాలు మీ ముందుంచుతాం.
‘సలాతుర్రగాయిబ్’ గురించి వివరించబడే హదీసులో మొదట్లో ఇలా వుంది. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: రజబ్ అల్లాహ్ మాసం, షాబాన్ నా మాసం మరియు రమజాన్ నా ఉమ్మత్ మాసం. తదుపరి, ఆ హదీసులో రజబ్ మాసపు కొన్ని విశిష్ఠతలు చెప్పబడిన తర్వాత దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారని ఆయన వైపునకు కొన్ని విషయాలు ఆపాదించబడ్డాయి. అవేమిటంటే – ఏ వ్యక్తి అయినా రజబ్ మాసపు మొదటి గురువారం నాడు ఉపవాసముండి, శుక్రవారం రాత్రి మగ్రిబ్, ఇషాల మధ్య రెండు, రెండు రకాతుల చొప్పున 12 రకాత్లు -ప్రతి రకాతులో ఫాతిహా సూరా తర్వాత మూడు సార్లు ఖద్ర్ సూరా, 12 సార్లు ఇఖ్లాస్ సూరా- చదివి, నమాజు పూర్తయిన తర్వాత 70సార్లు ‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదున్నబీ ఉల్ ఉమ్మీ వ అలా ఆలిహి’ అని దరూద్ పఠించి, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళి 70 సార్లు – ‘సుబ్బూహు ఖుద్దూసు రబ్బుల్ మలాయికతి వర్రూహు’ అని పఠించి, తదుపరి తలపై కెత్తి ‘రబ్బిగ్ఫర్ వర్హమ్ వతజావజ్ అమ్మా తాలమ్ ఇన్నక అన్తల్ అజీజుల్ అజీమ్’ అని 70 సార్లు ప్రార్థించి, తదుపరి రెండవ సజ్జాలోకి వెళ్ళి ఇలానే చేసి, ఆ తర్వాత అతను అల్లాహ్ ను ఏది కోరినా అది ప్రసాదించబడుతుంది.
ఈ కాల్పనిక, తప్పుడు హదీసు గురించి హదీసువేత్తల వివరణలు ఇలా వున్నాయి :
1) ఇబ్నుల్ జౌజి రహిమహుల్లాహ్ ఈ హదీసును ‘అల్ మౌజుఆత్’ నందు పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు: ఈ హదీసు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పేరుతో (క్రొత్తగా) సృష్టించబడింది. అబద్ధాలకోరుగా పేరుగాంచిన ‘ఇబ్నె జహజమ్’ ను దీని వెనుక కుట్రదారుడుగా హదీసు వేత్తలు ఖరారు చేశారు. నేను, మా షేఖ్ అబ్దుల్ వహ్హాబ్ అల్ హాఫిజ్ నోటితో విన్నదేమిటంటే – దీని ఉల్లేఖకులు అపరిచితులు. స్వయంగా నేను కూడా ఎన్నో గ్రంథాలను తిరగేసాను, కానీ వీరి గురించి నాకు ఏ మాత్రం సమాచారం దొరకలేదు. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం- 438 పేజి)
ఇమామ్ జహబీ, ఇబ్నుల్ జౌజి మాటలకు అదనంగా ఈ మాట కూడా జోడించి పేర్కొన్నారు: “ఈ హదీసును ఉల్లేఖించినవారు బహుశా పుట్టనే లేదేమో!” (తల్ ఖీస్ అల్ మౌజుఆత్ : 247వ పేజి)
అలాగే, ఇబ్నుల్ జౌజి ‘అస్సలాతుల్ అర్ ఫియ’ గురించి కాల్పనిక హదీసును పేర్కొని ఆ తర్వాత ఇలా వివరించారు:
ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అవడంలో ఏమాత్రం అనుమానం లేదు. దీనిలోని చాలా మంది ఉల్లేఖకులు అపరిచితులు (మజ్ హూల్) మరియు కొందరైతే అతి బలహీన ఉల్లేఖకులు. ఈ స్థితిలో ఈ హదీసును దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా ఉల్లేఖించడం అసంభవం. మేము ఎంతో మందిని ఈ నమాజును చదువుతుండగా చూశాం. తక్కువ వ్యవధి కల్గిన రాత్రుళ్ళలో వీరు ఈ నమాజును చదివి నిద్రపోతారు. దీనితో వీరి ఫజర్ నమాజు నెరవేరదు. పైగా, మసీదులకు చెందిన అజ్ఞాన ఇమాములు, ఈ నమాజును మరియు ఇలాగే ‘సలాతుర్రగాయిబ్’ ను కేవలం ప్రజలను సమీకరించడానికి మరియు దీని ద్వారా ప్రత్యేక హెూదా పొందడానికి సాధనంగా చేసుకున్నారు. కథలు చెప్పేవారు సైతం తమ సమూహాల్లో ఈ నమాజును గురించే వివరిస్తూ వుంటారు. వాస్తవానికి ఇవన్నీ సత్యానికి చాలా దూరంగా వున్నాయి. (అల్ మౌజుఆత్ : 2వ సంపుటం, 440-443 పేజీలు)
2) ఇబ్నె రజబ్ ఇలా పేర్కొన్నారు: రజబ్ మాసంలో మొదటి శుక్రవారం రాత్రి చదివే ‘సలాతుర్రగాయిబ్’ గురించి ఉల్లేఖించబడ్డ హదీసులన్నీ కాల్పనిక, తప్పుడు హదీసులు. మెజారిటీ ఉలమాల దృష్టిలో ఇది నాల్గవ శతాబ్దం తర్వాత ఉద్భవించిన ఒక బిద్అత్. (లతాయిఫుల్ మారిఫ్ ఫీమాలిమవాసిముల్ ఆమ్ మినల్ వజాయిఫ్-123 పేజి)
3) ఇమామ్ నవవీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’గా పేరు గాంచి, రజబ్ నెల మొదటి రాత్రి మగ్రిబ్ – ఇషా ల మధ్య 12 రకాతులుగా చదవబడే నమాజు మరియు షాబాన్ నెల 15వ రాత్రి 100 రకాతులుగా చదవబడే నమాజ్ – ఈ రెండు నమాజులు ఎంతో నీచమైన బిద్అత్. కనుక ‘ఖువ్వతుల్ ఖులూబ్’ మరియు ‘ఇహ్యా ఉలూమిద్దీన్’ లాంటి గ్రంథాల్లో వీటి వివరణ చూసి మోసానికి గురికావద్దు. అంతేగాక, వాటికి సంబంధించి ఉల్లేఖించబడ్డ హదీసులను చూసి మోసపోవద్దు. ఎందుకంటే – అవన్నీ పూర్తిగా అసత్యం గనుక, (అల్ మజ్ఞ్ముఅ లిన్నవవీ : 3వ సంపుటం, 379పేజీ)
4) ముహమ్మద్ బిన్ తాహిర్ అల్ హిందీ ఇలా పేర్కొన్నారు: ‘సలాతుర్రగాయిబ్’ ఏమాత్రం సందేహం లేని కాల్పనిక, అసత్య ఆచరణ. (తజ్కిరతుల్ మౌజుఆత్: 44వ పేజీ)
5) ఇమామ్ షౌకానీ ఇలా వివరించారు: ఈ హదీసును కాల్పనిక తప్పుడు హదీసని నిర్దారించడంలో హదీసువేత్తలందరూ ఏకీభవించారు. ఇది కాల్పనికమవడంలో హదీసు విషయ పరిజ్ఞానం స్వల్పంగా వున్న వారికి సైతం ఏమాత్రం సందేహం లేదు. ఫీరోజాబాదీ మరియు మఖ్ దిసీలు కూడా – హదీసువేత్తలందరి దృష్టిలో ఈ హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు అని స్పష్టం చేశారు.
6) మౌలానా అబ్దుల్ హై లక్నోవీ ఇలా పేర్కొన్నారు: సలాతుర్రగాయిబ్ కు సంబంధించిన హదీసు ఒక కాల్పనిక, తప్పుడు హదీసు. ఈ విషయంలో హదీసువేత్తలందరూ లేదా మెజారిటీ హదీసు వేత్తల మధ్య ఏకాభిప్రాయం వుంది. కనుక, దీనిని వ్యతిరేకించే వారిని ఏ మాత్రం నమ్మలేం. వారెవరైనా కావచ్చు. (అల్ ఆసారుల్ మర్ ఫ్యూ అ : 74వ పేజీ)
వీరితోపాటు సుయూతీ, ఇబ్నె ఇరాక్ మరియు అల్ కర్మి మొ॥వారు కూడా దీనిని మౌజుఆత్ (కాల్పనికమైనవి)లో చేర్చారు. (అల్ లఆలి అల్ మస్నూఅ : 2వ సంపుటం, 47వ పేజి, తనజిహుష్షరియ : 2వ సంపుటం, 90వ పేజీ, అల్ ఫవాయెదుల్ మౌజుఅ: 72 పేజీ)
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నా సహచరులను తిట్టబాకండి. నా సహచరులను తిట్టబాకండి. ఎవరి అధీనంలోనా ప్రాణముందో ఆయన సాక్షిగా చెబుతున్నాను – ఒకవేళ మీలో ఎవరయినా ఉహద్ అంత బంగారం ఖర్చు పెట్టినాసరే వీరి (అంటే సహాబాలు ఖర్చుచేసిన) అర్థ సేరు కాదు కదా కనీసం పావు సేరు ధాన్యానికి సమానమయిన పుణ్యఫలం కూడా పొందలేరు.” (ముస్లిం)
అబూసయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ప్రకారం ఖాలిద్ బిన్ వలీద్ – అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మధ్య ఒకసారి అభిప్రాయభేదం తలెత్తింది. అప్పుడు ఖాలిద్ బిన్ వలీద్ ఆవేశంలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ను దుర్గాషలాడారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై హదీసును పలికారు.
”ఉహద్” ఒక పర్వతం పేరు. ప్రాచీన కాలంలో అది మదీనాకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే అది ప్రస్తుతం మదీనా నగరంలో ఒక వీధిగా ఉంది. ఈ పర్వతానికి ఆనుకునే ఆనాడు మహా సంగ్రామం జరిగింది. అది ఉహద్ సంగ్రామంగా చరిత్ర ప్రసిద్ధిచెందింది.
అర్థ సేరు అనేపదం హదీసులోని ‘మద్ద్‘ అనే పదానికి మారుగా వ్రాయడం జరిగింది. “మద్” అనేది ధాన్యం కొలిచే డబ్బా లాంటిది. అది ఇంచుమించు అర్థ సేరుకు సమానం.
అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి తొలితొలి సహచరులలోని వారు. అల్లాహ్ ఆయనకు పుష్కలమయిన ధనరాసుల్ని ఒసగాడు. అయితే ఆయన ఆ ధనరాసులను అల్లాహ్ మార్గంలో విరివిగా ఖర్చు చేశారు. హిజ్రీ 33లో మదీనాలో తనువు చాలించారు.
ఖాలిద్ బిన్ వలీద్ కూడా మహాప్రవక్త సహచరులలోని వారే. అయితే ఆయన ప్రారంభంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు వ్యతిరేకంగా నిలబడి పోరాడినవారు. ఆతరువాత హిజ్రీ 8వ యేట సత్యాన్ని గ్రహించి ఇస్లాం స్వీకరించారు. ఇక ఆ తరువాత ఆయన ఇస్లాం వ్యాప్తికై తన శక్తులన్నింటినీ ధారపోశారు. ఆయన్ని ఏ సైనిక పటాలానికి కమాండర్ గా నియమించినా విజయమే లభించేది. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ హిజ్రీ 21 యేట కాలధర్మం చెందారు.
పై హదీసులో సహాబాల స్థానం, వారి త్యాగాలు ప్రముఖంగా ప్రస్తుతించబడ్డాయి.విశ్వాస స్థితిలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూచి, ఆయన వెంట ఉన్నవారిని, విశ్వాసస్థితి లోనే మరణించిన వారిని సహాబాలు అంటారు.
ఇమామ్ నవవి ఇలా అంటున్నారు:- “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులంతా ఆదరణీయులే. నమ్మకస్తులే. ‘ఒకవేళ వారు ఉపద్రవానికి గురయినా కాకపోయినా’ దీని భావం ఏమంటే వారిలో ఎవరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పలుకులను ఉల్లేఖించినా అవి ప్రామాణికంగానే పరిగణించబడతాయి. వారి ఉల్లేఖనాలపై సంశయాలకు తావులేదు.
హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అంటున్నారు: ”మహాప్రవక్త సున్నత్ ని అనుసరించే వారందరిలో సహాబాలు నమ్మకస్తులన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఎవరో కొద్దిమంది బిద్అతీలు (కొత్తపుంతలు తొక్కేవారు) మాత్రమే దీంతో విభేదిస్తారు.”
కాజీ అయాజ్ ఇలా అన్నారు – “ఈ హదీసు ద్వారా సహాబాలంతా, తదనంతర అనుయాయులకన్నా శ్రేష్ఠులు అన్న విషయం స్పష్టమవుతోంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రత్యక్ష సహచరులు తొలి దశ నుంచీ కష్టకాలంలో ఆదుకున్నారు. తమ ఇళ్ళల్లో ఉన్నదంతా అల్లాహ్ మార్గంలో అర్పించారు. ఎల్లప్పుడూ మహాప్రవక్తను వెన్నంటి ఉండేవారు. ఈ భాగ్యం తరువాతి వారికి లభించలేదు. జిహాద్ విషయంలోనయినా, విధేయత విషయంలోనయినా సహాబాల తరువాతే ఇతరుల స్థానం. సర్వోన్నత ప్రభువు ఇలా సెలవిచ్చాడు –
“మీలో (మక్కా) విజయానంతరం ఖర్చుపెట్టిన వారు మరియు పోరాడినవారు, (మక్కా) విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, పోరాడినవారితో సమానులు కాజాలరు. వారు ఉన్నత శ్రేణికి చెందినవారు.”
అదీగాక వారి హృదయాలలో ప్రేమానురాగాలు, దయాభావం, సంకల్పశుద్ధి, అణకువ, వినమ్రత, అల్లాహ్ మార్గంలో పోరాటపటిమ విరివిగా ఉండేవి. ఒక్క క్షణమే కానివ్వుగాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలసి గడపటమే వేరు. ఆ మధుర క్షణాలతో సరితూగగల ఆచరణ ఇంకేది కాగలదు!? ఎవరెంత ప్రయత్నించినా ఆ స్థాయికి చేరుకోలేరు. అది కేవలం అల్లాహ్ కృప మాత్రమే. అల్లాహ్ కోరిన వారికే అది దక్కింది. కాజీ అయాజ్ ఇలా అభిప్రాయపడ్డారు : “ఈ ఉన్నతస్థానం, మహాప్రవక్త వెంట సుదీర్ఘకాలం గడిపిన, దైవమార్గంలో విరివిగా ఖర్చుచేసిన, ధర్మపోరాటం చేసిన, హిజ్రత్ చేసిన వారికే వర్తిస్తుందని పలువురు హదీసువేత్తలు అంటున్నారు. అంతేగాని మహాప్రవక్తను కేవలం ఒకసారి చూసినవారికో, లేక మక్కా విజయానంతరం విశ్వసించిన వారికో ఆ ఉన్నత స్థానం లభించదు. ఎందుకంటే వారికి అల్లాహ్ మార్గంలో హిజ్రత్ ని, ప్రారంభంలో విశ్వసించిన ముస్లిములకు సహాయపడే అవకాశం గాని రాలేదు.”
ఈ అభిప్రాయంకన్నా, మహాప్రవక్తను విశ్వాసస్థితిలో చూసిన వారంతా సహాబాలుగానే పరిగణించబడతారన్న అభిప్రాయమే నిర్వివాదాంశంగా తోస్తుంది.
ఈ హదీసు మహాప్రవక్త ప్రియ సహచరుల త్యాగాల సాగరంలో ఒక బిందువు మాత్రమే. దైవగ్రంథమైన ఖుర్ఆన్లోనూ, మహాప్రవక్త పలుకులలోనూ సహాబాల స్థానం అత్యున్నతమైందని చెప్పబడింది.
“(ఈ విజయప్రాప్తి) ఆ బీద ముహాజిర్లకే చెందాలి. ఎవరయితే తమ ఇళ్ళూ, వాకిలి మరియు ఆస్తిపాస్తులకు నోచుకోకుండా తీసివేయబడ్డారో, వీరు అల్లాహ్ కృపను, ఆయన ప్రసన్నతను కోరుకుంటారు. అల్లాహ్ మరియు ప్రవక్త మద్దతుకై సన్నద్ధులై ఉంటారు. వీరే సన్మార్గగాములు. ఇంకా, ఈ ముహాజిర్లు వలస రాకపూర్వం విశ్వసించి ‘దారుల్ హిజ్రత్’ (యస్రిబ్ లేదా మదీనా) లో వేచివున్న వారికి కూడా (ఈ విజయ ప్రాప్తిచెందాలి). వీరు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. ఏది వారికి ఇచ్చినా దాని గురించి మనసులోనే పెట్టుకోరు. తమకేదయినా అవసరం ఉన్నప్పటికీ తమ స్వయంపై ఇతరులకే ప్రాధాన్యతనిస్తారు. యధార్థానికి తమ మనసులోని సంకుచితత్వానికి దూరంగా మసలుకున్నవారే సాఫల్యం పొందుతారు.” (అల్ హష్ర్ : 8, 9)
పై రెండు ఆయత్లలో అల్లాహ్ అన్సార్లను, ముహాజిర్లను సాఫల్యం పొందిన వారుగా పేర్కొన్నాడు. ఈ విధంగా ఎన్నో ఆయత్లలో మహాప్రవక్త ప్రియ సహచరులు కొనియాడబడ్డారు. తరువాత వచ్చిన అనుయాయులు ఈ సహాబాల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, వారి కోసం అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలని తాకీదు చేయడంజరిగింది. హష్ర్ సూరాలోనే పదవ ఆయత్లో చూడండి –
”వీరి తరువాత వచ్చిన వారు ఇలా వేడుకుంటారు – “ఓ మా ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన సోదరులందరినీ క్షమించు! విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎటువంటి కాపట్యాన్నీ ఉంచబాకు. మా ప్రభూ! నువ్వెంతో దయామయుడవు, కృపాకరుడవు.” (అల్ హష్ర్ : 10)
తమకు పూర్వం విశ్వసించిన వారి మన్నింపునకై ప్రార్థించటం విశ్వాసుల సుగుణానికి తార్కాణమని పై ఆయత్ ద్వారా రూఢీ అవుతోంది. వారి యెడల ఎటువంటి కాపట్యాన్నిగాని, దురుద్దేశ్యాన్ని గాని వారు సహించరు.
మహాప్రవక్త ప్రియ సహచరులలో ఎవరినయినాసరే నోటికొచ్చినట్లు మాట్లాడే వారిని గురించి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) అర్వ బిన్ జుబైర్ తో ఇలా అన్నారు: “ఓ నా సోదరి కుమారా! సహాబాల మన్నింపునకై వేడుకుంటూ ఉండమని వీరికి ఆదేశించబడింది. కాని వీళ్ళు వారిని దుర్భాషలాడారు.” (ముస్లిం)
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధించారు – “అత్యుత్తమమైన కాలం నాది. ఆపైన నా తరువాతది. ఆపైన దాని తరువాతది.” (బుఖారి)
ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు – “మహాప్రవక్త వారి సహచరులను దూషించకండి. వారు మహాప్రవక్తతో గడిపిన ఒక్క క్షణం మీ యొక్క 40 యేళ్ళ ఆచరణకన్నా శ్రేష్ఠమైనది.”
”కొంతమంది, దైవప్రవక్త సహచరులను, ఆఖరికి అబూబకర్, ఉమర్లను కూడా పరుషంగా మాట్లాడుతున్నారు” అని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) తో చెప్పగా, “అందులో ఆశ్చర్య పడాల్సింది ఏముంది? వారి ఆచరణ సమాప్తమయింది. అయితే వారికి లభించేపుణ్యఫలం సమాప్తం కారాదని అల్లాహ్ నిర్ణయించాడు” అని ఆమె బదులిచ్చారు. ఈ పలుకులను జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు. దీని భావం ఏమిటంటే, దుర్భాషలాడిన, చాడీలు చెప్పిన వారి సత్కార్యాలు కీర్తిశేషులయిన ఆ మహనీయుల ఖాతాలో జమ అవుతాయి. ఆ విధంగా వారు చనిపోయినప్పటికీ ప్రతిఫలాన్ని పొందుతూనే ఉన్నారు.
ప్రముఖ హదీసు వేత్త అబూజర్ అత (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు : “ఎవరయినా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరులలో ఎవరినయినా అగౌరవపరుస్తూ మాట్లాడటం మీరు చూస్తే అతను ధర్మభ్రష్టుడని తెలుసుకోండి. ఎందుకంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సత్యసంధులు. ఖుర్ఆన్ సత్యబద్ధమైనది. అటువంటి ఖుర్ఆన్ ను, మహాప్రవక్త సంప్రదాయాన్ని మన దాకా అందజేసినవారే సహాబాలు. ఖుర్ఆన్ మరియు సున్నత్ ను మనకందజేసిన సహాబాలు నమ్మకస్తులు కారని వారు చెప్పదలుస్తున్నారు. ఆ విధంగా ఖుర్ఆన్ హదీసులు మిథ్య అని నిరూపించదలుస్తున్నారు. ఇటువంటి వారంతా ధర్మ విరోధులు, ధర్మ భ్రష్టులు.”
మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియసహచరుల విషయంలో అహ్లె సున్నత్ వల్ జమాఅత్ పంథా సమతూకంతో కూడినది. అది వారి స్థానం నుండి వారిని మరీ ఎత్తి దైవంతో సరితూగే స్థానమూ కల్పించదు. అలా అని వారిని అవహేళనచేసే విధంగానూ దిగజార్చదు. అందుకే అహ్లె సున్నత్లు మధ్యస్థ విధానాన్ని అవలంబిస్తారు. వారు అందరినీ ప్రేమిస్తారు. న్యాయంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ఇస్తారు. వారి అంతస్తును మరింత పైకి ఎత్తనూ ఎత్తరు. వారి హక్కుల్ని నెరవేర్చటంలో లోటూ రానివ్వరు. మహాప్రవక్త సహచరుల ప్రశంసలో వారి నోళ్ళు తడిగా ఉంటాయి. వారి పట్ల ప్రేమతో వారి హృదయాలు నిండిపోతాయి.
సహాబాల మధ్య ఎప్పుడయినా, ఏదయినా విభేదం గాని, వివాదం గాని తలెత్తితే అది కేవలం ‘ఇజ్తెహాద్ ‘ షరీఅత్ అన్వయింపు కారణంగానే తలెత్తేది. ఎవరు ఇజ్తెహాద్ లో కరెక్టుగా ఉంటే వారికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరెవరి ఇజ్తెహాద్ లో లోపం ఉంటుందో వారికి ఒకే వంతు ప్రతిఫలం లభిస్తుంది. సహాబాలు మానవాతీతులు కారు. వారూ మానవులే. వారి ద్వారా కూడా పొరపాట్లు జరగవచ్చు. జరిగేవికూడా. అంతమాత్రాన అసాధారణమయిన వారి త్యాగాలు, సుగుణాలు మరుగున పడజాలవు. వారి సత్కర్మలు తదనంతర అనుయాయుల సత్కార్యాల కంటే అధికం. అలాగే వారి పొరపాట్లు వారి తరువాతి వారి పొరబాట్లకన్నా బహుస్వల్పం. అదీగాక, అల్లాహ్ వారిని మన్నించాడు. వారితో ప్రసన్నుడైనాడు.
తావీ (రహిమహుల్లాహ్) గారు “అఖీద అహ్లుల్ సున్నత్ లో ” ఇలా రాస్తున్నారు : “మనమంతా మహాప్రవక్త ప్రియ సహచరులను ప్రేమిస్తున్నాము. వారిలో ఎవరి ప్రేమ పట్ల కూడా వైపరీత్యానికి పోము. ఇంకా వారిలో ఏ ఒక్కరితోనో సంబంధాన్ని త్రెంచుకోవటమూ లేదు. ఎవరు సహాబాల పట్ల కపటత్వం ప్రదర్శించారో వారిపట్ల మేముకూడా అలాగే వ్యవహరిస్తాము. మేము మటుకు వానిని మంచి పదాలతోనే స్మరిస్తాము. వారిపట్ల ప్రేమ ఉంటేనే ధర్మం (దీన్) పట్ల ప్రేమ, విశ్వాసం ఉన్నట్లు లెక్క. వారిపట్ల గనక వైరభావం ఉంటే అది కుఫ్ర్ (తిరస్కారం)కు, కాపట్యానికి, తలపొగరుతనానికి ఆనవాలు అవుతుంది.”
ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ (రహిమహుల్లాహ్) ఏమంటున్నారో చూడండి: “సహాబా (రదియల్లాహు అన్హు)లందరి సుగుణాలను స్మరించడం, వారిలోని పరస్పర విభేదాల గురించి చర్చకు తావీయకుండా ఉండిపోవటం సంప్రదాయం (సున్నత్). ప్రవక్త సహచరుల్లో ఏ ఒక్కరినయినా సరే దూషించినవాడు మార్గవిహీనుడే. సహాబాల పట్లప్రేమ కలిగి ఉండటం సున్నత్. వారి కోసం అల్లాహ్ ను వేడుకోవటం అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటమే. ఇంకా వారి మార్గాన్ని అనుసరిస్తే అది మోక్షానికి వారధి వంటిది. వారి పాద చిహ్నాలలో నడుచుకోవటం ఔన్నత్యానికి సోపానం.”
సహాబాలలోని తప్పులను చర్చించే, లేదా వారిలో ఎవరినయినా అవమానపరచే అనుమతి ఎవరికీ లేదు. అలా చేసిన వారిని కాలపు రాజ్యాధికారి విధిగా శిక్షించవలసి ఉంటుంది. అటువంటి వారిని మన్నించి వదలివేయటం సబబు కాదు. వారిని శిక్షించాలి, ఆపైన వారిచేత పశ్చాత్తాపం ప్రకటించాలి. పశ్చాత్తాపపడితే సరి. లేకపోతే వారికి మళ్ళీ శిక్ష విధించాలి. వారు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడేవరకూ నిర్బంధంలో పెట్టాలి.
అబూ సయీద్ ఖుదరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీసు ప్రకారం సహాబాలలో అంతస్తులున్నట్లు నిర్ధారణ అవుతోంది. వారిలో వివిధ కోవలున్నట్లు కూడా విదితమవుతోంది. విజయానికి పూర్వం అల్లాహ్ మార్గంలో తమ ధనంతో, ప్రాణాలతో పోరాడిన వారికి విజయం తరువాత పోరాడిన వారు సాటి రాలేరని అల్లాహ్ స్వయంగా “పేర్కొన్నాడు.
“మీలో ఎవరయితే విజయం తరువాత ఖర్చు చేశారో, పోరాడారో వారు ఎప్పటికీ విజయానికి పూర్వం ఖర్చుచేసిన, పోరాడిన వారితో సమానులు కాలేరు.”
ఇక్కడ “విజయం” అనే పదం హుదైబియా ఒడంబడిక నేపధ్యంలో ఉంది. హుదైబియా ఒప్పందం తరువాత చేసిన త్యాగాల కంటే హుదైబియా ఒప్పందానికి ముందుచేసిన త్యాగాలు ఇంకా విలువైనవని తెలుస్తోంది. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు)ని ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) పరుషంగా మాట్లాడినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారించటమే గాక అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ ను తన సన్నిహితునిగా పేర్కొన్నారు. ఎందుకంటే అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ తొలి రోజుల్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ చివర్లో ఇస్లాం స్వీకరించారు. ఖాలిద్ బిన్ వలీద్ అంతటి వారే అబ్దుర్రహ్మాన్ బిన్ఔఫ్ (రదియల్లాహు అన్హు)కు సాటి రాలేనపుడు ఆ తరువాతి అనుయాయుల్లో మాత్రం సహాబాలతో సరిపడే వారెవరుంటారు?
హదీసు ద్వారా బోధపడిందేమంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రియ సహచరులంతా మనకు గౌరవనీయులు, ఆదర్శప్రాయులు, కనుక వారి పొరపొచ్చాలను వెతుకుతూ ఉండటం, వాటిని సాగదీయటం వాంఛనీయం కాదు. అది అమర్యాద, అవిజ్ఞత అనిపించుకుంటుంది. మనం ఎంతసేపటికీ వారి సత్కార్యాలనే మార్గపు కాగడాలుగా ఎంచుకోవాలి. వారిలోని లోటుపాట్లను విస్మరించాలి. వారి స్థాయిని మనలో ఎవరూ అందుకోలేరని తెలుసుకోవాలి. వారి అపారమైన సుగుణాల ముందు వారి లోటుపాట్లు దేనికీ పనికిరావు. అనుయాయుల్లో ఎవరయినా సరే వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం అమర్యాదకరంగానే పరిగణించబడుతుంది. మనం చేయవలసిందల్లా వారి శ్రేయాన్ని అభిలషిస్తూ ప్రార్థించటం, వారి జీవితాల ద్వారా గుణపాఠం గరపుతూ ఉండటమే.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
“నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దగ్గర – అల్లాహ్ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజు నుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతోంది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి). ఇదే సరైన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి.” (తౌబా: 36)
అంటే మొదట్నుంచి అల్లాహ్ దృష్టిలో మాసాల సంఖ్య పన్నెండు. అందులో నాలుగు నెలలు నిషేధిత మాసాలు.
ఈ నాలుగు నిషిద్ధ మాసాలు ఏవి?
దీని వివరణ మనకు సహీహ్ బుఖారీ లోని ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అబూ బక్ర (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఒక సం॥ పన్నెండు నెలలు కలిగి వుంది. వీటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి. వీటిలో మూడేమో ఒకదాని తర్వాత మరొకటి వచ్చేవి. అవేమంటే – జిల్ ఖాదా, జిల్ హిజ్జ మరియు ముహర్రం. ఇక నాల్గవది జమాదిస్సానీ మరియు షాబాన్ నెలల మధ్య వచ్చే రజబ్ -ఏ-ముజిర్.” (బుఖారీ – తౌబా సూరహ్ తఫ్సీర్)
ఈ హదీసులో రజబ్ మాసాన్ని ‘ముజిర్’ తెగతో జోడించి చెప్పబడింది. కారణం ఏమిటంటే ఇతర తెగల కన్నా ఈ తెగ రజబ్ మాసాన్ని ఎక్కువగా గౌరవిస్తూ మితి మీరి ప్రవర్తించేది.
ప్రియులారా! ఇంతకు ముందు పేర్కొన్న – నాలుగు నిషిద్ధ మాసాలను గూర్చి తెలిపే తౌబా సూరాలోని ఆయతును అల్లాహ్ వివరించాక (ప్రత్యేకంగా) “మీపై మీరు దౌర్జన్యం చేసుకోకండి” అని ఆజ్ఞాపించాడు.
దౌర్జన్యం విషయానికొస్తే అది సం॥ పొడుగునా, ఎల్లవేళలా వారించ బడింది. కానీ, ఈ నాలుగు మాసాల్లో – వాటి గౌరవాన్ని, పవిత్రతను దృష్టిలో వుంచుకొని అల్లాహ్ ప్రత్యేకంగా, ‘దౌర్జన్యం చేసుకోకండి’ అని వారించాడు.
ఇక్కడ “దౌర్జన్యం” అంటే అర్థం ఏమిటి? ఒక అర్థం ఏమిటంటే – ఈ మాసాల్లో యుద్ధాలు, ఒకర్నొకరు చంపుకోడాలు చేయకండి అని. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
”నిషిద్ధ మాసాల్లో యుద్ధం చెయ్యటం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు వారికిలా చెప్పు – ఈ మాసాలలో యుద్ధం చెయ్యటం మహాపరాధం.” (బఖర : 217)
అజ్ఞాన కాలంలో కూడా ప్రజలు ఈ నాలుగు మాసాల నిషేధాన్ని గుర్తించి వాటిలో యుద్ధాలు, గొడవలకు స్వస్తి పలికేవారు. అరబ్బీభాషలో ‘రజబ్’ అన్న పదం ‘తర్జీబ్‘ నుండి వచ్చింది. దీని అర్థం ‘గౌరవించడం‘ అని కూడా. ఈ మాసాన్ని ‘రజబ్’ అని పిలవడానికి కారణం అరబ్బులు ఈ మాసాన్ని గౌరవించేవారు. ఈ మాసంలో విగ్రహాల పేరు మీద జంతువులు బలి ఇచ్చేవారు. ఈ ఆచారాన్ని ‘అతీరా’ అని పిలిచేవారు. తదుపరి ఇస్లాం వచ్చాక అది కూడా వీటి గౌరవాన్ని, పవిత్రతను యధావిధిగా వుంచి వీటిలో గొడవ పడడాన్ని పెద్దపాపంగా ఖరారు చేసింది. కానీ, రజబ్ మాసంలో తలపెట్టే ‘అతీరా’ కార్యాన్ని పూర్తిగా నిషేధించింది.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.