స్త్రీ సుగంధం (సెంట్) పూసుకొని బైటికి వెళ్ళుట [వీడియో| టెక్స్ట్]

https://youtu.be/kfJHzMYHTnE [7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

ఈ ప్రసంగంలో, ఒక స్త్రీ సుగంధం పూసుకుని బయటికి వెళ్లడం ఇస్లాంలో తీవ్రంగా పరిగణించబడే పాపమని హెచ్చరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ప్రకారం, పురుషులు తన సువాసనను ఆఘ్రాణించాలని బయటికి వెళ్లే స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడుతుందని చెప్పబడింది. ఇంట్లో సుగంధం పూసుకున్న స్త్రీ మస్జిద్ వంటి పవిత్ర స్థలానికి వెళ్లాలనుకున్నా సరే, బయటికి వెళ్లే ముందు తప్పనిసరిగా జనాబత్ స్నానం (సంపూర్ణ స్నానం) చేయాలని, లేకపోతే ఆమె నమాజ్ అంగీకరించబడదని స్పష్టం చేయబడింది. ఆధునిక కాలంలో వివాహాలు, పండుగలు, బజార్లకు, చివరకు రమదాన్‌లో తరావీహ్ నమాజ్‌కు కూడా మహిళలు బలమైన పరిమళాలను ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేయబడింది. ఈ చర్యల యొక్క తీవ్రతను అర్థం చేసుకుని, పురుషులు తమ కుటుంబంలోని స్త్రీలకు మార్గనిర్దేశం చేయాలని మరియు స్త్రీలు స్వయంగా ఈ నిషిద్ధతలకు దూరంగా ఉండాలని ఉపదేశించబడింది.

స్త్రీ సుగంధం పూసుకొని బయటికి వెళ్లుట

నేను ఆఫీసులో జాబ్ చేస్తున్నానండీ. నేను ఫలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాను, ఫలానా ఫ్యాక్టరీలో పెద్ద మంచి పోస్ట్ ఉంది నాది. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను కనీసం ఏదైనా సువాసన పూసుకోకుంటే ఎలా? నేను ఇప్పుడు ఫంక్షన్లో వెళ్లాలి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి కదా. శ్రద్ధగా వినండి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో కఠినంగా హెచ్చరించినప్పటికీ స్త్రీలు సువాసనలు పూసుకొని ఇంటి బయటికి వెళ్లుట, పురుషుల ముందు నుండి దాటుట ఈ కాలంలో చాలా ప్రబలిపోతుంది. ప్రవక్త వారి ఆదేశం ఏంటి?

أَيُّمَا امْرَأَةٍ اسْتَعْطَرَتْ ثُمَّ مَرَّتْ عَلَى الْقَوْمِ لِيَجِدُوا رِيحَهَا فَهِيَ زَانِيَةٌ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఆమె సువాసన పురుషులు ఆఘ్రాణించాలని వారి ముందు నుండి దాటుతుందో ఆమె వ్యభిచారిణి “ (ముస్నద్‌ అహ్మద్‌ 4/418, సహీహుల్‌ జామి 105).

అవూదుబిల్లాహ్, అవూదుబిల్లాహ్. వింటున్నారా? చూస్తున్నారా?

కొందరు స్త్రీలు నిర్లక్ష్యపు భావనతో దీనిని చాలా చిన్న విషయం అనుకొని డ్రైవర్, సేల్స్‌మేన్ మరియు పాఠశాలల వాచ్‌మేన్‌ల ముందు నుండి వెళ్తారు, అయితే సువాసన పూసుకున్న స్త్రీ బయటికి వెళ్లదలచినప్పుడు, ఆ బయటికి వెళ్లడం మస్జిద్ లాంటి పవిత్ర స్థలానికైనా సరే, అర్థమవుతుందా?

ఒక స్త్రీ సువాసన పూసుకొని ఉంది, ఇంట్లో ఉంది. కొంతసేపటి తరవాత అచానక్, యేకాయేక్యిగా బయటికి వెళ్లాలనిపించింది ఏదైనా పని మీద గానీ, లేదా జుమా నమాజ్ సమయం అయితుంది లేదా జుమా ఈరోజు మస్జిద్లో ఏదో పెద్ద ఆలిమ్ వచ్చి ప్రసంగిస్తున్నారు, అక్కడ స్త్రీలకు కూడా పర్దా ఏర్పాటు ఉంది, అయితే మస్జిద్కు వెళ్లాలనుకుంటుంది. ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని ఉన్నదో, ఆ తర్వాత ఆమె బయటికి వెళ్లాలనుకుంటుందో, చివరికి ఆమె మస్జిదుకు వెళ్లాలి అని కోరినా, అక్కడికి వెళ్లేకి ముందు, బయటికి వెళ్లేకి ముందు గుస్లే జనాబత్ చెయ్యాలి. గుస్లే జనాబత్ అంటే పెద్దవారికి తెలిసిన విషయమే. స్వప్న స్థలనం వల్ల లేదా భార్యాభర్తలు కలుసుకోవడం వల్ల ఏ స్థితిలో మనిషి ఉంటాడో దానిని జనాబత్, అశుద్ధత, నాపాకీ అంటారు. దాని వల్ల స్నానం చేయడం విధి అవుతుంది. దానికి స్నానం ఎలా చేయాలి? ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ రీతిలో స్నానం చేయనంతవరకు ఆమె బయటికి వెళ్లకూడదు. కఠినంగా దీని గురించి ఆదేశం వచ్చింది. శ్రద్ధగా వినండి.

أَيُّمَا امْرَأَةٍ تَطَيَّبَتْ ثُمَّ خَرَجَتْ إِلَى الْمَسْجِدِ لِيُوجَدَ رِيحُهَا لَمْ يُقْبَلْ مِنْهَا صَلَاةٌ حَتَّى تَغْتَسِلَ اغْتِسَالَهَا مِنْ الْجَنَابَةِ
“ఏ స్త్రీ అయితే సువాసన పూసుకొని అక్కడ ఉన్నవారు ఆమె సువాసన ఆఘ్రాణించాలని మస్టిద్‌ వస్తుందో, ఆమె జనాబత్‌ వల్ల చేసే విధంగా స్నానం చేసిరానంత వరకు ఆమె నమాజు అంగీకరింపబడదు”. (ముస్నద్‌ అహ్మద్‌ 2/444, సహీహుల్‌ జామి 2703).

అల్లాహు అక్బర్. నమాజ్ ఎందువల్ల అంగీకరింపబడదు? ఎవరైనా స్త్రీ సువాసన పూసుకొని బయటికి వస్తుంది, పురుషులు ఉంటారు, వారు కూడా ఆ సువాసన పీలుస్తారు, ఇవన్నీ తెలిసి కూడా, స్త్రీ వాటి నుండి జాగ్రత్తపడి రాకుంటే ఎంత భయంకరమైన విషయమో గమనించండి.

ఈ రోజుల్లో స్త్రీలు ఉపయోగించే సుగంధాలు ఏవైతే కొన్ని రకాలు తెలపడం జరుగుతున్నాయో, ఈ సుగంధాల విషయంలో ఇక అల్లాహ్ తోనే మొరపెట్టుకోవాలి. అల్లాహ్, మా ఈ స్త్రీలకు హిదాయత్ ఇవ్వు అని ఇలా దుఆ చేసుకోవాలి. ఆయనే మనకు మార్గం చూపువాడు. ఎందుకనగా, ఈనాటి స్త్రీలు పెళ్లిళ్లలో, ఉత్సవాల్లో వెళ్లేముందు ఉపయోగించే సాంబ్రాణి ధూపములు, అదేవిధంగా బజారుల్లో, వాహనాల్లో అందరూ ఏకమై కలిసేచోట, చివరికి రమదాన్ మాసంలో తరావీహ్‌ల కొరకు ఏదైతే మస్జిదులో వస్తారో, ఇతర రోజుల్లో మస్జిదులో వెళ్లేటప్పుడు కూడా చాలా సేపటి వరకు మరియు దూరం వరకు ఆఘ్రాణించగల, పీల్చబడే అటువంటి సుగంధములు వాడుతూ ఉంటారు. అయితే ఈ సందర్భాలు ఏవైతే ఇప్పుడు తెలపబడ్డాయో, ఇలాంటి సందర్భాల్లో అలాంటి సువాసనలు వాడడం నిషిద్ధం అని వారు తెలుసుకోవడం లేదు.

ధర్మపరంగా స్త్రీలు ఉపయోగించవలసిన పరిమళాలు ఎలా ఉండాలి? వాటి రంగు కానరావాలి. కానరావాలి అంటే పర పురుషులకు కాదు. ఇంట్లో ఉన్న స్త్రీలకు లేదా భర్తకు. కానీ సువాసన రాకూడదు. అల్లాహ్, మాలోని కొందరు మూర్ఖ ప్రజలు చేసిన తప్పుల వల్ల మాలోని పుణ్యాత్ములను శిక్షించకు, మా అందరికీ సన్మార్గం ప్రసాదించు ఓ అల్లాహ్. ఆమీన్.

విషయం అర్థమైందా? మనం మన స్త్రీలను జాగ్రత్తలో, వారి యొక్క అన్ని రకాల పరువు మానాలు భద్రంగా ఉండేందుకు, వారి యొక్క విశ్వాసం కూడా బలంగా ఉండేందుకు, ఇలాంటి నిషిద్ధతలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం మనం పురుషులము, భర్తలము చేయాలి, తండ్రులము చేయాలి. మరియు స్త్రీలు కూడా స్వయంగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, భర్తలు గానీ, తండ్రులు గానీ, సోదరులు గానీ మాటిమాటికి చెప్పే అటువంటి పరిస్థితి రానివ్వకూడదు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=5314

ఇస్లామీయ  నిషిద్ధతలు మరియు జాగ్రత్తలు [పుస్తకం]

వుజూ విధానం (బుక్ & ఆడియో, టెక్స్ట్)

wudhu-steps

[ఇక్కడ చదవండి] [ఇక్కడ బుక్ డౌన్లోడ్ చేసుకోండి[ఆడియో వినండి
వక్త :- ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ

ఈ ఆడియో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధానంలో ‘వుదూ’ (శుద్ధి) ఎలా చేసుకోవాలో వివరిస్తుంది. మొదటగా, ఆదేశించబడిన రీతిలో వుదూ మరియు నమాజు చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాన్ని, అంటే పూర్వ పాపాలు మన్నించబడతాయని హదీసుల ద్వారా తెలియజేశారు. వుదూ చేయడానికి గల ముఖ్య గమనికలైన సంకల్పం (నియ్యత్), వరుస క్రమం, నీటి ఆదా మరియు ఒక అవయవం ఆరకముందే మరొకటి కడగడం (కంటిన్యూటీ) గురించి వివరించారు. అనంతరం బిస్మిల్లాహ్ తో మొదలుపెట్టి కాళ్లు కడగడం వరకు వుదూ యొక్క పూర్తి పద్ధతిని స్టెప్-బై-స్టెప్ గా విపులకరించారు. చివరగా, వుదూ తర్వాత చదవాల్సిన దుఆ మరియు దాని వల్ల స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయనే శుభవార్తను తెలియజేశారు.

السلام عليكم ورحمة الله وبركاته، حامدا ومصليا أما بعد
[అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, హామిదన్ వ ముసల్లియన్ అమ్మ బాద్]

వుదూ విధానం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుదూ చేశారో, అలాగే వుదూ చేయడం తప్పనిసరి. ప్రవక్త ఆదేశం:

مَنْ تَوَضَّأَ كَمَا أُمِرَ وَصَلَّى كَمَا أُمِرَ غُفِرَ لَهُ مَا قَدَّمَ مِنْ عَمَلٍ
[మన్ తవద్దఅ కమా ఉమిర వసల్ల కమా ఉమిర, ఘుఫిర లహు మా ఖద్దమ మిన్ అమల్]

ఎవరు ఆదేశించబడిన రీతిలో వుదూ చేసి, ఎవరు ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో, అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. (సునన్ నసాయి: 144, ఇబ్నె మాజా: 1396).

మరో ఉల్లేఖనంలో ఉంది:

مَنْ تَوَضَّأَ نَحْوَ وُضُوئِي هَذَا
[మన్ తవద్దఅ నహ్వ వుదూఈ హాజా]
ఎవరు నా ఈ పద్ధతిలో వుదూ చేస్తారో (సహీహ్ బుఖారీ: 159).

  1. వుదూ నియ్యత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియ్యత్.
  2. రెండవ గమనిక: వుదూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు.
  3. మూడవ గమనిక: వుదూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దుబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి.
  4. నాలుగవ గమనిక: వుదూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు.

వుదూ పద్ధతి ఇలా ఉంది:

ప్రారంభంలో “బిస్మిల్లాహ్” అనాలి.

తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి (ఫిగర్స్ చూడండి).

మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి, ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నుదుటి మొదటి భాగం నుండి గడ్డం కింది వరకు. ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి. అయితే గడ్డాన్ని షేవ్ చేయడం గాని, కట్ చేయడం గాని ప్రవక్త విధానానికి వ్యతిరేకం.

ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి. వేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు. ముందు కుడి చెయ్యి తర్వాత ఎడమ చెయ్యి.

ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి. అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడ వరకు తీసుకెళ్లి, మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి.

ఒకసారి రెండు చెవుల మసాహ్ చేయాలి. అంటే రెండు చూపుడు వేళ్లతో చెవి లోపలి భాగాన్ని, బొటన వేలితో పై భాగాన్ని స్పర్శించాలి.

ఆ తర్వాత రెండు కాళ్లు వేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి. ముందు కుడి కాలు తర్వాత ఎడమ కాలు.

చివరిలో ఈ దుఆ చదవాలి:

أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ
[అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు]

వుదూ చేసిన తర్వాత ఎవరైతే ఈ దుఆ చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువబడతాయి. అల్లాహు అక్బర్! ఎంత గొప్ప అదృష్టం అండి. ఈ దుఆ ప్రస్తావన సహీహ్ ముస్లిం షరీఫ్ లో వచ్చి ఉంది (హదీథ్ నెంబర్: 234).

ఈ పూర్తి వుదూ విధానం ఏదైతే మీరు విన్నారో సహీహ్ బుఖారీ (హదీథ్ నెంబర్: 159) మరియు అబూ దావూద్ (హదీథ్ నెంబర్: 108) లో ఉన్నది.

అల్లాహ్ యే ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వుదూ చేసే అటువంటి సద్భాగ్యం ప్రసాదించు గాక.

وآخِرُ دَعْوانا أَنِ الْحَمْدُ لِلَّهِ، وَالسَّلامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللهِ وَبَرَكاتُهُ.
[వ ఆఖిరు దావానా అనిల్ హం దులిల్లాహి, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు]

సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక

382. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)  ఈవిధంగా అన్నారు :-

నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షం! కట్టెలు సమీకరించమని, అజాన్ ఇవ్వమని ఆజ్ఞాపించి, నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి (సామూహిక నమాజులో పాల్గొనని) వారి దగ్గరకు వెళ్లి వారి ఇండ్లను తగలబెడదామని నేను (ఎన్నోసార్లు) అనుకున్నాను. నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆశక్తి స్వరూపుని సాక్షం! ఇషా నమాజు చేస్తే ఓ పెద్ద మాంసపు ముక్కగాని లేదా శ్రేష్టమైన రెండు మేక కాళ్ళు గాని లభిస్తాయని తెలిస్తే వారు తప్పకుండా ఇషా నమాజు చేయడానికి (మస్జిదుకు) వచ్చేవారు”.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 29 వ అధ్యాయం – వజూబి సలాతిల్ జమాఅత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 42 వ అధ్యాయం – సామూహిక నమాజు ప్రాముఖ్యం, దీనిని పోగొట్టుకున్న వారికి హెచ్చరిక. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-

(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి

494. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మస్జిద్ లో రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యనిదే కూర్చోరాదు

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 25 వ అధ్యాయం – మాజాఅ ఫిత్తత్వా మస్నామస్నా]

జుమా ప్రకరణం – 14 వ అధ్యాయం – జుమా ప్రసంగం సమయంలో ‘తహ్యతుల్ ఉజూ’ నమాజ్ చేయవలెను . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి

348. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-  “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-  ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?

344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.

అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.

“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]

(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు

283. హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహ్మతుల్లాహి అలై) కధనం :-

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్లి ఒక వస్తువుని ఆసరాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ) చూశాడు. కాని హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు.

ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరికు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకు, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు : “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి. అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.”

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 100 వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మ మ్మర్ర బైనయదైహి]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్