మార్గదర్శక ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) [పుస్తకం]

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
మార్గదర్శక ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) [డైరెక్ట్ PDF] [71పేజీలు]
మూలం : మౌలానా చిరాగ్ హసన్ హస్రత్ , అనువాదం : సుహైల్ అహ్మద్
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్
, హైదరాబాద్

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రియ సహచరుల గురించీ, ముఖ్యంగా మార్గదర్శక ఖలీఫాల (ఖులఫాయె రాషిదీన్) జీవిత చరిత్ర గురించి పుస్తకాలు ఎందుకు ప్రచురించటం లేదు? అని పాఠకులు చాలా కాలంగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఒనరుల కొరతవల్లనూ, ఇతరత్రా పనుల ఒత్తిడి మూలంగానూ పాఠకుల ఈ కోర్కెను ఇంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చాము. అల్లాహ్ కృప వల్ల గత నెలలోనే ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) జీవిత విశేషాలపై ఒక చిరుపుస్తకాన్ని వెలువరించాము.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణలో ఆరితేరిన సహాబీలు ఎంతో అదృష్టవంతులు. ప్రవక్తగారి ఒక్కొక్క పలుకును, ఒక్కొక్క సంజ్ఞను శిరసావహించి, ఒక్కో ఆచరణను తు.చ. తప్పకుండా అనుసరించిన సహాబీల జీవితాలను అధ్యయనం చేసిన కొద్దీ మన “విశ్వాసం” (ఈమాన్) బలపడుతుంది. ధర్మపథంలో ఆత్మస్థయిర్యం ఒనగూడుతుంది.

మీ ముందున్న ఈ చిరుపుస్తకం (ద్వితీయ ఖలీఫా హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు) కూడా మీ ధార్మిక పరిజ్ఞానంలో వృద్ధినొసగగలదని భావిస్తున్నాము. తెలుగు అనువాదకులు మిత్రులు సుహైల్ అహ్మద్ గారు గత ఐదారేండ్లుగా అల్ హఖ్ రెసిడెన్షియల్ స్కూలు (హైదరాబాద్)లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన మొదటిసారిగా ‘తర్జుమా’కు ఉపక్రమించారు. మున్ముందు వీరు మరిన్ని రచనలు, అనువాదాలు చేయగలరని ఆశిస్తూ.

– అజీజుర్రహ్మాన్ (డైరెక్టర్, అల్హఖ్ తెలుగు పబ్లికేషన్స్)

మక్కా నగరానికి నాయకత్వం వహించే ఖురైష్ తెగ పది శాఖలుగా చీలి ఉండేది. ఆ పది కుటుంబ పెద్దలపై వేర్వేరు బాధ్యతలు ఉండేవి. ఒకరు కాబా గృహ యాత్రీకులకు నీళ్ళందించేవారు. మరొకరు నేర విచారణ జరిపేవారు. అలాగే ఇంకొక కుటుంబం యుద్ధకాలంలో సైన్యాధిపత్య బాధ్యతలు స్వీకరించేది. ఈ పది కుటుంబాల్లో బనూ అదీ (అదీ కుటుంబం) కూడా ఒకటి. ఖురైష్ తెగవారు ఇతర తెగల వద్దకు రాయబారం పంపించదలచినప్పుడు, అదీ కుటుంబీకులకే ఈ కార్యబాధ్యతలు అప్పగించేవారు. ఈ అదీ కుటుంబానికి చెందినవారే హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు).

హజ్రత్ ఉమర్ (రజి) హిజ్రత్కు నలభై సంవత్సరాల ముందు జన్మించారు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా పదమూడు సంవత్సరాలు మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) కన్నా పదకొండు సంవత్సరాలు వయస్సులో చిన్నవారు. వీరి కుటుంబాలు సఫా మర్వా కొండ ప్రాంతాల నడుమ ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడ ఇక్కడే జన్మించారు. పెరిగి పెద్దవారయింది కూడా ఇక్కడే. ప్రాజ్ఞ వయసొచ్చేసరికి నాన్నగారు ఒంటెలు మేపే పనిని అప్పగించారు. ఒక అంగి వేసుకొని మక్కా సమీపంలోని మైదానంలో ఒంటెలు మేపేవారాయన. పని చేస్తూ అలసిపోయి విశ్రాంతి కోసం కొద్దిసేపు కూర్చొన్నప్పుడు తండ్రిగారి చేతి మొట్టికాయలు పడేవి.

ఆ రోజుల్లో, అరబ్బుల్లో వంశపారంపర్య జాబితాల కంఠస్థం ఒక తప్పనిసరి విద్యగా పరిగణించబడేది. కొందరికైతే వేరు వేరు తెగలకు చెందిన పుట్టుపూర్వోత్తరాలన్నీ జ్ఞాపకముండేవి. వీరు తమ తాత ముత్తాతల పేర్లతో పాటు తమ వంశస్థుల పేర్లనన్నింటినీ చకచకా చెప్పేవారు. హజ్రత్ ఉమర్ (రజి) వంశస్థులు కూడా ఈ అద్భుత విచిత్ర విద్యలో ఆరితేరినవారే. ఉమర్ గారు కూడా స్వయాన తన తండ్రి ఖత్తాబ్ నుండి ఈ విద్యను అభ్యసించారు. ఏకాగ్రచిత్తంతో పరిశ్రమించి నిష్ణాతులనిపించుకున్నారు. దీంతోపాటు ఆయన సైనిక విన్యాసాల్లోని మెళుకువలన్నింటిపై బాగా పట్టు సంపాదించారు. తృటిలో అశ్వంపై లంఘించి వాయువేగంతో దూసుకు పోతుంటే, (వేగంలో) వాహనానికి, వాహకుడికి మధ్య తారతమ్యం కానరాకుండా పోయేది.

మక్కాకు సమీపంలో ‘అక్కాజ్’ అనే విశాల మైదానముండేది. ప్రతి సంవత్సరం అక్కడ భారీ మేళాలు వెలిసేవి. కళాప్రవీణులందరూ అక్కడ గుమిగూడేవారు. ప్రదర్శనలు-విన్యాసాలు-ప్రతిఘటనల మధ్య ఈ మేళాలు అనంత వైభవంతో, అపార సౌందర్యాలతో ప్రేక్షకులనలరించేవి. యుద్ధవీరులు సైనిక విన్యాసాలు ప్రదర్శించేవారు.

కవిపుంగవులు తమ కవిత్వాల ద్వారా ప్రజల నీరాజనాలు పొందేవారు. గుర్రపుస్వారీ, బాణసంచా ఖడ్గపోరాటం మల్ల యుద్ధాల్లో పోటీలు జరిగేవి. హజ్రత్ ఉమర్ (రజి) కూడా “అక్కాజ్ మైదానంలో మల్ల యుద్ధ పోటీల్లో పాల్గొనేవారు. ఆయన అరబ్బులందరిలో ఎదురులేని పరాక్రమశాలిగా పేరు పొందారు. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా కవి కాకపోయినా కవిత్వంపై గల ఆసక్తి వల్ల ఎందరో కవుల కవిత్వాలను జ్ఞాపకముంచుకొనేవారు.

ఆజానుబాహులు. ఆయన పదిమందిలో నిల్చుంటే (గుర్రంపై కూర్చున్నట్లు) ఎత్తుగా కనిపించేవారు. ఆయన కంఠం కంచుకంఠం. హజ్ సమయంలో తన గుడారం నుండి ‘తక్బీర్’ పలికితే మస్జిద్ దాకా వినిపించేది. అనర్గళ ఉపన్యాసాల ద్వారా ప్రజల హృదయాలను ఆకట్టుకునే ప్రావీణ్యం గల వక్త ఆయన. ఆయన నైజంలో కోపం కించిత్ ఎక్కువ ఉండేది. ఆయనంటే అందరూ భయపడేవారు. ఖలీఫా అయిన తరువాత ఆయన మనస్సు కొంచెం మెత్తబడింది. అరబ్బుల్లో సాధారణంగా అన్ని తెగలు, ప్రధానంగా ఖురైష్ తెగ ముఖ్యవృత్తి వ్యాపారం. వ్యాపార నిమిత్తం కొందరు సిరియా ఈరాన్లలో పర్యటించగా, మరికొందరు భారత్-చైనాలకు పయనించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వ్యాపారం చేసేవారు. విద్యావంతులు తక్కువగా ఉండే ఆ కాలంలో, హజ్రత్ ఉమర్ (రజి) యుక్త వయస్సులోనే విద్యనభ్యసించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు, ఖురైష్ తెగలో ప్రతిభావంతులైన విద్యావంతుల సంఖ్య కేవలం పదిహేడు మాత్రమే!

హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) ఆఖరి సంతానమైన హజ్రత్ ఇస్మాయీల్ (అలైహిస్సలాం) వంశానికి చెందినది ఖురైష్ కుటుంబం. ఆరంభ దశలో వారు తమ మత పెద్దలనుసరించే మతాన్నే అవలంబించేవారు. వారి మత పెద్దలు నిఖిల జగతికి యజమాని అయిన అల్లాహ్ నే ఆరాధించేవారు. కాలం గడిచిన కొలదీ, వారందరూ సన్మార్గాన్ని వీడి అపమార్గాల్లో జీవనం గడపసాగారు. చివరకు దైవ ధిక్కార ధోరణికి కూడా ఒడిగట్టుతూ, సూర్యచంద్ర నక్షత్రాలను, రాయీరప్పలను ఆరాధ్యదైవాలుగా పూజించసాగారు. దైవభీతికి దూరమై, స్వేచ్ఛాజీవులై నిర్భయంగా జీవిస్తూ, అతిపవిత్రమైన కాబా గృహంలోనే మూడొందల అరవై విగ్రహాలను ప్రతిష్ఠించారు. వారినే ఆరాధ్య దైవాలుగా, ఆపద్బాంధువులుగా భావించి, పూజాపునస్కారాలు జరపసాగారు. మొక్కుబడులు తీర్చుకొనేవారు. అయితే ఆ అజ్ఞానయుగంలో విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఏకేశ్వరవాదాన్ని విశ్వసించే సజ్జనులు అప్పటికీ కొందరున్నారు. వారు హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం) మతాన్ని అవలంబించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) పినతండ్రి కుమారుడైన ‘జైద్ బిన్ నఫీల్’ కూడా వారిలో ఒకరు. ఆయన సాంగత్య ప్రభావం వల్ల బాల్యదశ నుండి హజ్రత్ ఉమర్ (రజి) చెవుల్లో ఏకేశ్వరనినాదాలు ప్రతిధ్వనింపసాగాయి. అయినప్పటికీ ఆయన తమ పూర్వీకుల మతంపైనే నిలకడగా ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తరువాత చాలాకాలం వరకు కూడా ఆయన ఇస్లాం స్వీకరించలేదు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు. ఆయన మక్కా నగర ప్రముఖులలో ఒకరుగా పరిగణింపబడేవారు. అదీ కుటుంబానికి అప్పగింపబడిన కార్యబాధ్యతలన్నీ హజ్రత్ ఉమర్ స్వయంగా నిర్వహించేవారు. ఖురైష్ నాయకులు వేరే తెగ వైపుకు రాయబారం పంపించదలచినప్పుడు, హజ్రత్ ఉమర్ (రజి)నే పంపించేవారు. ఎందుకంటే, ఆయన వాక్చాతుర్యం అటువంటిది. సంసార గొడవల్లో ఎప్పుడైనా ఇరువురి మధ్య కలహాలు రేగి, కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) పెద్దమనిషిగా తీర్పులు ఇచ్చేవారు. మక్కా నగరంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏకేశ్వర నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖులలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఉన్నారు. ఒకమారు ఆయన తన వద్ద బానిసరాలిగా ఉండే ‘లుబీనా’ ఇస్లాం స్వీకరించగా, ఆమెను శతవిధాలా దండించారు.

ఒకరోజు ఆయన మక్కానగర స్థితిగతులపై ఆలోచిస్తూ, మక్కానగరంలో రోజు-రోజుకూ విపరీతంగా ప్రబలుతున్న ఏకేశ్వర నినాదానికి మూలకారకుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని భావించి ఇంటి నుండి బయలుదేరారు. మార్గమధ్యంలో (అంతకు ముందే ఇస్లాం స్వీకరించిన) అదీ తెగసభ్యుడు ‘నయీమ్ బిన్ అబ్దుల్లా’ తారసపడ్డారు. కుశల ప్రశ్నలు వేశారు నయీమ్. హజ్రత్ ఉమర్ (రజి) ముఖకవళికలను గమనించిన నయీమ్ కు ప్రమాద సూచిక కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగారు నయీమ్. “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను హతమార్చడానికి” అని ఆవేశంతో సమాధానమిచ్చారు ఉమర్ . అందుకు నయీమ్ స్పందించి ‘ముందు నీ ఇంటి వ్యవహారం చక్కదిద్దుకో, స్వయంగా నీ అక్కా-బావలిద్దరూ ముస్లింలైపోయారు” అని చెప్పారు. అంతే! హజ్రత్ ఉమర్ (రజి) వెనుతిరిగారు. తిన్నగా సోదరి ఇంటికే వెళ్ళారు. ఆ సమయంలో వారిద్దరూ దివ్యఖురాన్ పారాయణంలో నిమగ్నులై ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) రాకను గమనించిన వారిద్దరూ దివ్యఖురాన్ పవిత్ర పుటలను దాచేశారు. ‘ఇందాక మీరు చదువుతున్నదేమిటి?’ అని నిప్పులు చెరుగుతూ అడిగారు ఉమర్. దానికి ఆ దంపతులిద్దరూ సమాధానమివ్వక మౌనం వహించారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “మీరిద్దరూ, మన పూర్వీకుల ధర్మాన్ని విడనాడారని నాకు తెలిసింది” అని అగ్రహోదగ్రులై బావను కొట్టసాగారు. సోదరి అడ్డుపడగా ఆమెను కూడా ఎడాపెడా బాదారు. ‘మా ప్రాణాలు పోయినా సరే, మేము ఇస్లాం నుండి వెనుదిరగడం అసంభవం” అని వారిద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పేశారు. రక్తంలో తడిసి ముద్దయిన సోదరిని చూచి, ఆయన ఆవేశం చల్లబడింది. ‘సరే….. మీరిందాకా చదివిందేమిటి? చూపించండి?” అన్నారు ఉమర్ (రజి). దివ్యఖురాన్ పుటలను కొన్నిటిని ఆయనకు చూపించారు ఆ దంపతులు. ఆయన కూడా దైవగ్రంధ పారాయణం మొదలెట్టారు. పఠిస్తున్న కొద్దీ ఆయన ముఖకవళికలలో మార్పు రాసాగింది. దైవగ్రంధ వచనాలలోని మాధుర్యాన్ని ఆయన ఆస్వాదించసాగారు. నెమ్మదిగా రాతిగుండె కరగడం మొదలెట్టింది. ఒక్కసారిగా ఆలోచనా సముద్రంలో మునిగిపోయారు. కొన్ని క్షణాల తరువాత అప్రయత్నంగా ఆయన నోట వెలువడిందొక నిర్ణయాత్మకమయిన వాక్యం! “నేను అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసిస్తున్నాను”.

అక్కడ నుండి నేరుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు బయలు దేరారు. తలుపు తట్టి లోనికి ప్రవేశానికై అనుమతికోరారు. ఖడ్గము చేతపట్టుకొని యున్న హజ్రత్ ఉమర్ (రజి)ను చూచిన సహచరులందరూ ఆందోళన చెందారు. అప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రియైన హజ్రత్ హమ్జా (రజి) అక్కడే ఉన్నారు. ఆయన కూడా మక్కా నగరంలో ఎన్నదగ్గ శూరుడు. “మంచి ఉద్దేశ్యంతో వస్తే సరి… లేదా… అతని ఖడ్గంతో అతన్నే వధిస్తాను!” అని హజ్రత్ హమ్డా (రజి) అందరికీ అభయమిచ్చారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి, ఉమర్ తో “నీ రాకలోని ఉద్దేశ్య మేమిటి?” అని నిదానంగా అడిగారు. అందుకు ఉమర్ (రజి) కంపిస్తూ “ఇస్లాం స్వీకరించడానికి వచ్చాను.” అని సమాధానమిచ్చారు. ఈ మాట విన్న ముస్లింలందరూ సంతోషంతో ‘అల్లాహు అక్బర్’ అంటూ మక్కా పర్వతాలన్నీ ప్రతిధ్వనించేలా తక్బీర్ పలికారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫైమూడు సంవత్సరాలు. ఆయన ఇస్లాం స్వీకారం మక్కాలో తీవ్ర సంచలనం సృష్టించింది. విరోధులందరూ ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పలు దిశల నుండి నిరసన ధ్వనులు మ్రోగసాగాయి. ఆయన నిర్ణయానికి మండి పడినప్పటికీ బంధుప్రీతి మూలంగా కొంతమంది ఆయన జోలికి రాలేకపోయారు. వారందరూ కేవలం నిరసనలు, నినాదాలతోనే తమ కోపాగ్నిని బహిర్గతం చేశారు. హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణ నాటికి మక్కాలో ముస్లింల సంఖ్య కేవలం నలభై మాత్రమే. వారు తమ తమ ఇండ్లల్లోనే నమాజ్ చేసేవారు. ‘కాబా’లో నమాజ్ చేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరణతో ముస్లింలందరూ నిర్భయంగా కాబాలో నమాజ్ చేయగలిగారు. వారినడ్డుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది.

హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించిన తరువాత ఏడు సంవత్సరాల వరకు మక్కాలోనే ఉన్నారు. ఆ కాలం విశ్వాసులకు వ్యధాభరితమైన కాలం. దైవ తిరస్కారులు (కాఫిర్లు) ముస్లింలను శతవిధాలుగా హింసించేవారు. చిత్రహింసలూ పెట్టేవారూ. మక్కానగర వీధులగుండా విశ్వాసులెవరైనా పోతూ ఉంటే వారిని పరిహసించేవారు. రాళ్ళు రువ్వి గాయపరచేవారు. ఇస్లాం స్వీకరించిన బానిసలను, దళిత జనులను అనుదినం వేధించడం మామూలే. అయితే, మక్కాలో ఇస్లాం స్వీకరించిన ప్రముఖులను, సర్దారులను కూడా ఖురైషులు వదలలేదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి అయిన అబూతాలిబ్ (హజ్రత్ అలీ తండ్రి) ఇస్లాం స్వీకరించనప్పటికీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను అన్ని విధాల ఆదుకునేవారు. ఆయన ప్రవర్తనను పరికించిన ఖురైషీయులు, ఆయనకు అల్టిమేటం ఇస్తూ, “మీ అబ్బాయిని మాకప్పగించండి, లేదా మాదారి నుండి వైదొలగండి” అని చెప్పేశారు. కాని ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడ్పడటం మానలేదు. పైగా ఆయన హషిమ్ కుటుంబీకులందరినీ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సహాయపడేలా ఒప్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు అబూతాలిబ్ అండదండలు ఉన్నంత వరకు వారితో సంబంధములన్నీ తెంపుకోవాలని ఖురైషీయులు నిశ్చయించారు. సంఘ బహిష్కారానికి సంబంధించిన పత్రాన్ని వ్రాయించి, దానిపై అందరి సంతకాలు తీసుకొని కాబా గృహం వద్ద దానిని వ్రేలాడదీశారు.

అబూతాలిబ్ కుటుంబ సభ్యులందరితో కలసి ఒక పర్వత లోయలో శరణు తీసుకున్నారు. అది ‘షేబే- అబీతాలిబ్’ లోయగా ప్రసిద్ది చెందింది. లోయ వాసులకు ఎలాంటి అన్నపానీయాలు సరఫరా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఖురైషీయులు. లోయల్లో అబీతాలిబ్ కుటుంబీకులందరూ దాదాపు మూడు సంవత్సరాలు ఆకులలములు తిని కడు దీనావస్థలో కాలం వెళ్ళబుచ్చేవారు. వారి పిల్లలు ఆకలిదప్పులకు తాళలేక అలమటిస్తూ ఉన్నా ఖురైష్ కరకు గుండెలు కరిగేవి కావు. వ్యధాభరితమైన ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండిన ముస్లింలు అవకాశం దొరికినప్పుడు చాటుగా తినుబండారాలు సరఫరా చేసేవారు. కాని అవి వారందరికీ సరిపోయేవి కావు. లోయవాసులు దయనీయస్థితిపై జాలి కలిగిన కొందరు బసూహాషిమ్ బంధువులు దైవగృహ ద్వారంపై వ్రేలాడదీసియున్న ఫర్మానాను చించివేశారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు సంవత్సరాల అతికఠినమైన సంఘబహిష్కార ఆంక్షల నుండి విముక్తి పొందిన కొద్దిరోజుల్లోనే మరో విషాదకర సంఘటన జరిగింది. పినతండ్రి అబూతాలిబ్ మరణించారు. వాలుగు రోజుల తరువాత ప్రవక్త సతీమణి హజ్రత్ ఖదీజా (రజి) కూడా ఊర్థ్వలోకాలకెళ్ళి పోయారు. అబూతాలిబ్ బ్రతికి ఉన్నంతకాలం ఖురైషీయులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జోలికి పోవడానికి సాహసించలేకపోయేవారు. వారెప్పుడైనా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు హాని కల్గించే యత్నం చేసినా, అబూతాలిబ్ అండదండల వలన వారి ఎత్తులు ఫలించేవి కావు. కాని అబూతాలిబ్ మరణంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కాపాడుతున్న తాలిబ్ రక్షాకవచము కూడా తొలగిపోయింది. ముస్లింలపై ఖురైషీయుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన తొమ్మిదవయేట అబూతాలిబ్ మరణించారు. అయితే మక్కాకు సుమారు రెండొందల మైళ్ళ దూరంలో ‘యస్ రిబ్’ అని పిలువబడే మదీనా పట్టణానికి ఇస్లాం పరిమళం సోకింది. స్వల్పకాల వ్యవధిలోనే అనేకులు ఇస్లాం స్వీకరించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాకు ఏతెంచాలని మదీనా ముస్లింలు కోరారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు బదులు సహాబీలను మదీనా వెళ్ళడానికి అనుమతించారు. మొదటి విడత ఐదుమంది మదీనా వెళ్ళారు. వారిలో హజ్రత్ బిలాల్ (రజి) ఒకరు. రెండవ విడత హజ్రత్ ఉమర్ (రజి) ఇరవై సహాబీలతో మదీనాకు ప్రస్థానం చేశారు. ఈ విధంగా దాదాపు ముస్లింలందరూ మదీనా వెళ్ళిన తరువాత, మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి)తో కలిసి మదీనాకు పయనించారు. అందరికన్నా చివర హజ్రత్ అలీ (రజి) మదీనాకు చేరారు. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనవద్ద ప్రజలు ఉంచిన అమానతులను సంబంధీకులకు అప్పగించే బాధ్యతను హజ్రత్ అలీ (రజి) గారిపై మోపారు.

ఆనాడు మదీనా పట్టణం చాలా చిన్నది. అందుచేత మహాజిరు లందరూ ఆ పట్టణానికి దాదాపు మూడు మైళ్ళ దూరంలో ఉన్న ‘ఖుబా’ ప్రాంతంలో నిలిచారు. హజ్రత్ ఉమర్ (రజి)కూడా అక్కడే బసచేశారు. కొన్ని రోజుల తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), హజ్రత్ అబూబకర్ (రజి) ఇద్దరూ కలసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రెండువారాల పాటు బసచేసి, ఒక ఆరాధనాలయాన్ని (మస్జిద్ ను) నిర్మించారు. తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా వెళ్ళిపోయారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘ఖుబా’లోనే ఉండిపోయారు. అటు మదీనాలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహాజిర్ల మరియు అన్సార్ల మధ్య సోదర ఒప్పందం చేయించారు. మదీనా ప్రజలు, తమతో మమేకమైన మక్కావాసికి, తమ సిరిసంపదలన్నింటిలో సగభాగం పంచిపెట్టారు. మదీనావాసుల్లో ప్రముఖుడైన (బనూసాలెమ్ తెగ సర్దారు) ‘ఉత్బాన్ బిన్ మాలిక్’ (రజి) ఖుబా నగరంలోనే ఉన్నారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) హజ్రత్ ఉమర్ (రజి)లు రెండ్రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరవటం మామూలుగా చేసుకున్నారు. మదీనా చేరిన తరువాత మస్జిదె నబవీలో నమాజీల సంఖ్య బాగా పెరగసాగింది. ముస్లింలకు సరైన సమయానికి నమాజుకు పిలిపించటానికి ఒక వ్యవస్థ అనేది ఉండాలని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తలంచారు. ఎందుకంటే సమయ నిర్ధారణ లేనందువలన కొందరు సమయానికన్నా ముందు, మరికొందరు ఆలస్యంగా నమాజుకు వచ్చేవారు. సరైన సమయం తెలియనందున కొందరు సామూహిక నమాజ్ కూడా చేయలేకపోయేవారు. క్రైస్తవుల వలే తాము కూడా శంఖమూది నమాజ్ వైపుకు పిలువవచ్చు అని కొందరు సలహా ఇచ్చారు. ఆ సమయంలో హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. శంఖమూది ప్రజలను నమాజ్ వైపు పిలవడానికి బదులుగా, ఒక వ్యక్తిని నియమించి అతనికి ఈ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆయన సలహా నచ్చింది. అప్పుడే, ఆయన మధుర కంఠస్వరం గల హజ్రత్ బిలాల్ (రజి)ను ఈ పని నిమిత్తం నియమించారు. అజాన్ ఇవ్వమని ఆదేశించారు. అప్పటి నుండీ ప్రజలకు దైవారాధన వైపుకు పిలవటానికి ఈ సులువైన ప్రభావవంతమైన విధానం ఆచరణలో ఉంది. ఇది ఒక విధంగా నమాజ్కు ఉపోద్ఘాతం వంటిది.

హిజ్రత్ అనంతరం ముస్లింలకు ఖురైష్ సుదీర్ఘ యుద్ధ పరంపరకు బీజం పడింది. ప్రారంభంలో ఇరువురి మధ్య చిన్నపాటి జగడాలు మాత్రమే జరిగేవి. హిజ్రత్ రెండవ సంవత్సరం బద్ర్ మైదానంలో సంభవించిన ధర్మసంగ్రామం, ఖురైషీయుల శక్తి ప్రాబల్యములన్నింటినీ నీరుగార్చింది. వంద స్వారీలు కలిగి, వేయిమంది సైనికులతో ఖురైషీయులు కయ్యానికి కాలుదువ్వారు. వారిని ప్రతిఘటించడానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కేవలం మూడొందల పదమూడు మంది యోధులతో సంగ్రామ స్ధలానికి చేరుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) పన్నెండు మందితో కలసి పాల్గొన్నారు. అందులో కొందరు ఆయన కుటుంబీకులు కాగా, మరికొందరు మిత్రవర్గానికి చెందినవారు. అల్లాహ్ ఈ యుద్ధంలో ముస్లింలకు అద్భుత విజయాన్ని ప్రసాదించాడు. శత్రుసైన్య ప్రముఖ నాయకుడైన అబూజహల్తో పాటు డెబ్బైమంది శత్రు సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. దాదాపు అంతేమంది బంధించబడ్డారు కూడా. విశ్వాసవర్గానికి చెందిన పద్నాలుగు మంది సైనికులు అమరగతి నొందారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో హజ్రత్ ఉమర్ (రజి) చేత హతమార్చబడిన ఖురైష్ ప్రధాన నాయకుడు ‘హజ్రత్ ఆసీ బిన్ హెషామ్’ వరుసకు ఆయన మామ అవుతాడు. విశ్వాసవర్గ వైపు నుండి వీరగతి పొందిన వారిలో హజ్రత్ ఉమర్ (రజి) బానిస ‘మహాబా’ కూడా ఉన్నాడు. ఖైదీలుగా బంధించబడిన వారిలో కొందరు ముస్లింల బంధువులు కూడా ఉన్నారు. ఖైదీలుగా బంధింపబడ్డ హజ్రత్ అబ్బాస్ (రజి), మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు పినతండ్రి మరియు హజ్రత్ హంజా (రజి)కు సోదరులు. హజ్రత్ అలీ (రజి) సోదరుడు హజ్రత్ అఖిల్ (రజి) కూడా ఖైదీలలో ఒకరు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైదీల పట్ల జరుపబోయే వ్యవహారం గురించి సహాబీలందరితో సమాలోచన జరిపారు. ‘ఖైదీలకు బంధవిముక్తి ప్రసాదించాలని’ హజ్రత్ అబూబకర్ (రజి) సలహా ఇచ్చారు. “ధర్మం విషయంలో అనుబంధం ఆత్మీయతలకు ఎలాంటి తావు లేకుండా, ఖైదీలందరినీ హతమార్చవలయునని” హజ్రత్ ఉమర్ (రజి) నిర్మొహమాటంగా తమ మనోసంకల్పాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఎవరి బంధువులను వారు తుదముట్టించాలనీ, హంజా (రజి) అబ్బాస్ ను, అలీ (రజి) అఖీల్ ని హత మార్చాలని కూడా ఆవేశపూరితంగా చెప్పారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రజి) సలహాను సమర్థిస్తూ ఖైదీలను విడుదల చేశారు.

రెండవ సంవత్సరం ఖురైషీయులు పెద్ద సైనిక బలగాలతో, బద్ర్ యుద్ధ ఒటమికి ప్రతీకారాన్ని తీర్చుకొనేందుకు వచ్చారు. వారి సైన్యంలో కవచాలు ధరించిన ఏడొందల సిపాయిలు ఉన్నారు. మరియు రెండొందల మంది స్వారీ అయి ఉన్నారు. మదీనా పట్టణానికి మూడు మైళ్ళ దూరంలో ‘ఉహద్’ పేరుతో విశాల మైదానమొకటి ఉంది. అక్కడే ముస్లింలకు- ఖురైషీయులకు మధ్య, యుద్ధం జరిగింది. ఇటు ముస్లింలు ఏడువందల సైనికులతో ప్రతిఘటనకు సన్నద్ధులయ్యారు. యుద్ధ మైదానంలో ముస్లిం సైనికుల వీరోచిత పోరాటానికి, శత్రుసైన్యం తొలుత ఖంగుతింది. ముఖ్యంగా హజ్రత్ హంజా (రజి), హజ్రత్ అలీ (రజి) మరియు హజ్రత్ అబూదజానా (రజి)లు ప్రత్యర్థులపై విరుచుకుపడి కలకలం రేపారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధం ప్రారంభంగాక ముందు యాభై మంది బాణ సంచారులను రక్షణార్థం ఉహద్ కొండలపై నియమించారు. ఖురైషీ సైనికులు యుద్ధ మైదానం విడిచి పారిపోవడం గమనించిన వీరు తమ స్థానాలను వదలి శత్రుసైన్యం వైపు పరిగెత్తారు. అటుకొండ ప్రాంతం వెనుక భాగంలో వేచి వున్న శత్రు సైన్యబలగమొకటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మెరుపుదాడికి దిగింది. పారిపోతున్న ఖురైషీ సైనికులు ఇదే అదనుగా వచ్చారు. అంతే!…. రణరంగ రూపురేఖలే మారిపోయాయి.

బద్ర్ సంగ్రామంలో, శత్రుసైన్య వీరులెందరినో హతమార్చిన హజ్రత్ హంజా (రజి) ఒక బానిస చేతిలో వీరగతి పొందారు. స్వయంగా ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. ఒక దశలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వదంతులు వాయువేగంతో వ్యాపించాయి. అది విన్న ముస్లింలు కొందరు నిస్పృహచెంది మదీనావైపుకు తిరోన్ముఖులయ్యారు. మరికొందరు ప్రత్యర్థులకు లొంగిపోయారు. ‘మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) లేని తమ జీవితం నిరర్థకమని తలంచి కొందరు ఆవేశంతో శత్రుసైన్యం వైపుకు దూసుకుపోయారు. యుద్ధ మైదానంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) రణరంగాన్ని వదలి వెళ్ళకపోయినా, ఖడ్గాన్ని పారేసి, ఇక బ్రతికి మాత్రం ప్రయోజనమేమిటని ఆలోచిస్తూ ఒక ప్రక్క కూర్చున్నారు. అంతలోనే సహాబీలలో ఒకరు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తీవ్ర మనస్థాపం చెందిన సహచరులు, ఆయన జీవించియున్నారని తెలియగానే, అమితానందంతో ఆయన చుట్టూ గుమిగూడారు. హజ్రత్ ఉమర్ (రజి) పట్టరానంత సంతోషంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను సమీపించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవించి ఉన్నారని తెలియగానే ఖురైషీయులు తిరిగి దాడి చేశారు. ముస్లింల ఎదురుదాడికి వారందరూ పలాయనం చిత్తగించారు. సరైన సమయం చూచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబీలందరితో ఒక కొండ పైభాగాన చేరుకున్నారు. అప్పుడు ఖురైషు నాయకుడొకడు అటువైపుకు వచ్చి “ప్రజలారా! మీలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉన్నారా?” అని ప్రశ్నించాడు. అందరూ మౌనం వహించారు. ఎవరూ సమాధానమివ్వలేదు మరియు రెండవసారి అతడు “మీలో, అబూబకర్ (రజి) మరియు ఉమర్ (రజి) బ్రతికియున్నారా?” అని గర్జించాడు. ఈసారి కూడా సమాధానం రాకపోవడంతో బహుశా వీరందరూ యుద్ధభూమిలో మరణించి ఉంటారని అబూసుఫియాన్ అన్నాడు. అప్పటి వరకూ నిశబ్దంగా ఉన్న ఉమర్ (రజి)కు ఓపిక నశించింది. ‘ఓ అల్లాహ్ విరోధీ! మేమంతా బ్రతికే ఉన్నామ”ని ఎలుగెత్తి ప్రకటించారు. “ఓ హబల్! (*) నీవు ఉన్నతుడవు” అని అబూ సుఫియాన్ అన్నాడు. దానికి సమాధానమివ్వమని దైవప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశించగా హజ్రత్ ఉమర్ (రజి) బిగ్గరగా చాటారు ‘అల్లాహ్ యే ఉన్నతుడు. సర్వాధికుడు!’

(*) ఖురైషులు కల్పించుకున్న ఆరాధ్య దైవాలలో ‘హబల్’ ఒకడు.

ఉహద్ యుద్ధంలో ముస్లింలపై ఖురైషీయులదే పైచేయి అయినప్పటికీ వారికి పరిపూర్ణ విజయం మాత్రం లభించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు మదీనాపై దాడి చేయ ప్రయత్నించలేదు. తమకు లభించిన ఈ విజయాన్నే గొప్పగా భావించి వెళ్ళిపోయారు.

కొన్ని రోజుల తరువాత యూదులు మరియు ముస్లింల మధ్య ఘర్షణలు తలెత్తాయి. మదీనాకు చెందిన యూదులు తమ ఒడంబడికకు కట్టుబడ లేదు. అనుదినం ఒక ఉపద్రవం సృష్టించేవారు. చివరకు వారు మదీనా నుండి బహిష్కరించబడ్డారు. మదీనా నుండి ప్రస్థానము చేసి వారు ఖైబర్ ప్రాంతంలో తిష్ఠవేశారు. ముస్లింలకు విరుద్ధంగా కొన్ని తెగలను ప్రేరేపించారు. ఖురైషీయులు ఇలాంటి సందర్భాల కోసమే ఎప్పటి నుంచో వేచి యున్నారు. యూదులు వారిని, ముస్లింలకు ప్రతికూలంగా సహాయం కోరగా, వారు పదివేలమంది సైనికులతో దండెత్తి వచ్చారు. అటు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో సమాలోచన జరిపి, మదీనా చుట్టూ కందకం త్రవ్వాలని నిశ్చయించారు. శత్రుసైన్యం నెలరోజుల పాటు మదీనాను ముట్టడించింది. అసలే ఆ రోజుల్లో మదీనాలో కరువు ఏర్పడి ఉంది. ఆహార ధాన్యాల కొరత వల్ల ముస్లింలు పస్తులుండేవారు. ఖుద్దుగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడేసి రోజులు ఆకలి బాధను సహించారు.

శత్రు సైనికులు అడపాదడపా కందకం దాటి దాడి చేసేవారు. అందువల్ల కందకం.వల్ల దాడి జరిపే శత్రు సైనికులనెదిరించడానికి సహాబాల సారధ్యంలో సైనిక బృందాలు నియమింపబడ్డాయి. హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా ఒక నిర్ణీత ప్రదేశం వద్ద కందకానికి కాపలా కాస్తున్నారు. ఆ స్థలంలో ఆయన పేర ఒక మస్జిద్ నిర్మింపబడింది. నేటికీ అది చిరస్మరణీయంగా మిగిలి ఉంది. ఈ యుద్ధ సందర్భంగా ఒకమారు శత్రు సైనిక వీరులు నలుగురు అగడ్త దాటి దండయాత్రకు దిగారు. వారిలో అరబ్బులందరిలో పరాక్రమశాలిగా వ్యవహరింపబడే ‘అమ్ర్ బిన్ అబ్దూ’ ఒకడు. అతడు ఏకంగా ‘నన్నెదిరించేవారెవరైనా ఉన్నారా?’ అని సవాలు విసిరాడు. ఇటునుండి హజ్రత్ అలీ (రజి) సమరానికి సిద్ధమై, పోరాడి అతన్ని కడతేర్చారు. మిగిలిన ముగ్గురూ హజ్రత్ అలీపై దాడి జరిపారు. కాని ఆయన ఖడ్గ విన్యాసం చూసి తోక ముడిచారు. పారిపోయే యత్నంలో ఒకడు కాలుజారి గోతిలో పడిపోయాడు. అతను కూడా హజ్రత్ అలీ (రజి)చే తుదముట్టించబడ్డాడు. ఒకవైపు ‘అమ్ర్ బిన్ అబ్దూ’ లాంటి పరాక్రమశాలి మరణం శత్రుసైన్యంలో కలకలం రేపగా మరోవైపు ఆ రాత్రి భయంకరమైన పెనుగాలులు వీచి, గుడారములన్నీ నేలకూలాయి. మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్టయింది అవిశ్వాసుల పరిస్థితి. బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చని తలంచి వచ్చినదారే వెళ్ళిపోయారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హిజ్రత్ ఆరవయేట దైవగృహాన్ని (కాబాను) సందర్శించాలనుకున్నారు. ఈ శుభయాత్రలో ఆయన వెంట పధ్నాలుగు వందల మంది సహాబాలు ఉన్నారు. యుద్ధ సమయం కానందున, వారు ఆయుధము లేమీ లేకుండానే వెళ్ళారు. మదీనా నుండి ఆరుమైళ్ళు ప్రయాణించిన పిదప హజ్రత్ ఉమర్ (రజి), ఈ విధంగా నిరాయుధులై ప్రయాణించటం సరికాదని సలహా ఇచ్చారు. ఆయన సలహా మేరకు ఆయుధాలు తెప్పించబడ్డాయి. మక్కాకు సమీపించక ముందే ఖురైషీయులు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారని వార్తలందాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను రాయబారిగా పంపాలనుకున్నారు. “మక్కాలో నాకు రక్షణ ఇవ్వగలవారు ఎవ్వరూ లేరు… పైగా ఖురైషీయులు నన్ను చంపాలని చూస్తున్నారు” అని హజ్రత్ ఉమర్ (రజి) అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపండి, ఎందుకంటే ఆయన కుటుంబీకులెందరో అక్కడ ఉన్నారు అని సలహా ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులతో హుదైబియా వద్ద విడిది చేసి, ఖురైషీయులతో సంప్రదింపుల నిమిత్తం హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పంపారు. అటు ఖురైషీయులు వారిని ఆపుకున్నారు. హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యగావింపబడ్డారన్న వార్తలు వాయు వేగంతో వ్యాపించాయి. “మన ప్రాణాల్నైనా ధారపోసి, హజ్రత్ ఉస్మాన్ (రజి) హత్యకు ప్రతీకారం తీర్చు కుంటాము” అని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలందరితో ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఈ ప్రతిజ్ఞ ఒక తుమ్మ చెట్టు క్రింద తీసుకొనబడింది. అందుకే దీనిని “బైతు- ష్షజర” అంటారు. ఇదిలా వుండగా తరువాత ఖురైషీయులు చర్చల నిమిత్తం ఒక రాయబారిని పంపారు. వారిరువురి మధ్య ఎన్నో వాగ్వివాదాల తర్జనభర్జనల తరువాత కొన్ని షరతులపై సయోధ్య కుదిరింది. దీని ప్రకారం ఆ సంవత్సరం ముస్లింలు మక్కాలో ప్రవేశించకూడదు. రాబోయే సంవత్సరం దైవగృహ దర్శనార్థం వచ్చి, కేవలం మూడు రోజులు విడిది చేసి వెళ్ళిపోవాలి. మక్కావాసులైన ముస్లింలను తమ వెంట తీసుకుపోరాదు. మక్కాలోని విశ్వాసులు, అవిశ్వాసులు ఎవరైనా మదీనా వెళ్ళితే మాత్రం వారిని తిప్పి పంపివేయాలి. మరయితే మక్కాకు ప్రస్థానం చేసి వచ్చే ముస్లింలను తిరిగి పంపడమనేది జరగదు.

ఒడంబడికలోని ఆఖరి నిబంధనను పరిశీలిస్తే, ముస్లింలు, ఒత్తిడికి తలొగ్గి రాజీపడ్డారని అవగతమౌతుంది. దీనిపై హజ్రత్ ఉమర్ (రజి) ఎంతో కలత చెందారు. “ఈ విధంగా తలొగ్గి సంధి కుదుర్చుకోవటం సమంజసం కాదని” ఆయన అబూబకర్ (రజి) ముందు వెల్లడించారు. మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ఏది చేసినా ముందుచూపుతోనే చేస్తారని హజ్రత్ అబూబకర్ (రజి) ఆయనకు నచ్చజెప్పారు. హజ్రత్ ఉమర్ (రజి) సంతృప్తి చెందలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద కెళ్ళి ‘మీరు నిజమైన ప్రవక్త కారా!’ అని ప్రశ్నించారు. “నిస్సందేహంగా, నేను నిజమైన దైవప్రవక్తనే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు. ‘మరలాంటప్పుడు ఈ అవమానాన్ని మనమెందుకు భరించాలి’. శత్రువులకు లొంగిపోయినట్లుగా సంధిచేసే అవసరమెందు కొచ్చింది’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘నేను ఎట్టి పరిస్థితుల్లోనూ దైవాజ్ఞను జవదాటలేను’ అని సమాధానమిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) తో తాను సంభాషించిన తీరును తలచుకొని జీవితాంతం బాధపడేవారు. పాపపరిహారంగా ఎన్నో ఉపవాసాలు కూడా పాటించారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. బానిసలెందరినో విముక్తుల్ని గావించారు. కానీ అప్పటికీ ఆయన మనస్సు కుదుటపడలేదు.

మహాప్రవక్త (నఅసం) హుదైబియా నుండి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ‘మేము, మీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము’ అని అల్లాహ్ సందేశం అవతరించింది. అప్పటి వరకూ హజ్రత్ ఉమర్ (రజి)కు ఒడంబడికపై మనశ్శాంతి కలుగలేదు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో, అ స్పష్టమైన విజయమేమిటి?’ అని అడిగారు. హుదైబియా ఒడంబడిక నిస్సందేహంగా ఇస్లాంకు లభించిన విజయమేనని కొన్నాళ్ళ తరువాత అందరికీ తెలిసింది. ఒడంబడిక అనంతరం అరేబియాలో ముస్లింలకు-ముస్లిమేతరులకు మధ్య సంబంధాలు మెరుగైనాయి. మక్కా మరియు ఇతర అరబ్బు ప్రాంతాల వారు మదీనాకు వచ్చి పోయేవారు. సంబంధాలు పరస్పరం మెరుగుపడటం వల్ల ప్రజలకు ముస్లింల ఆచరణా వ్యవహారశైలుల్ని గమనించే అవకాశం లభించింది. వారి హృదయాలు నెమ్మదిగా అల్లాహ్ సత్యధర్మం వైపుకు మొగ్గసాగాయి. ఒడంబడిక రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ రెండు సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య, లోగడ పద్దెనిమిది సంవత్సరాల్లో ఇస్లాం స్వీకరించిన వారికంటే అధికమే!

హుదైబియా ఒడంబడిక అనంతరం ఖైబర్ యుద్ధం జరిగింది. మదీనా నుండి బహిష్కరించబడిన యూదులు ఖైబర్ ప్రాంతంలో నివసించనారంభించారు. వీరు రోజుకొక ఉపద్రవం సృష్టించేవారు. కందక యుద్ధం కూడా వీరి మూలంగానే జరిగింది. ఖురైషీయులను ముస్లింలకు విరుద్ధంగా ప్రేరేపించింది కూడా యూదులే. కందక యుద్ధంలో ఓటమి చవి చూసిన తరువాత కూడా, వీరు తమ దుష్టకార్యకలాపాలను విడనాడలేదు. అందుచేత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ముస్లింలను యూదుల దుష్టపన్నాగాల నుండి ముక్తిని ప్రసాదించటానికై పదహారు వందల మంది సైనికులతో ఖైబర్ దిశగా ప్రయాణించారు. ఖైబర్ లో యూదులు పటిష్టమైన కోటలను నిర్మించారు. ఒక్కొక్కటిగా వాటినన్నింటినీ ముస్లింలు వశపరచుకున్నారు. కాని యూదుల ప్రముఖ యుద్ధవీరుడైన ‘మర్ హబ్’ అధీనంలో ఉన్న రెండు కోటలు మాత్రం ఇంకా జయింపబడలేదు. కోటను ముట్టడించమని హజ్రత్ ఉమర్ (రజి)కు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశమిచ్చారు.

కాని ఆయనకు విజయం లభించలేదు. రెండవసారి కూడా హజ్రత్ ఉమర్(రజి)ను పంపగా, ఈసారి కూడా సఫలీకృతులు కాలేకపోయారు. మూడవరోజు హజ్రత్ అలీ (రజి) ‘మర్ హబ్ ఓడించి కోటను వశపరచు కున్నారు. ‘మర్ హబ్’ మరణానంతరం యూదులు లొంగిపోయారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ భూమిని ముస్లింలకు పంచిపెట్టారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కూడా సస్యశ్యామలమైన కొంత భూమి లభించింది. దాన్ని ఆయన అల్లాహ్ మార్గంలో అంకితం చేశారు.

హుదైబియా ఒడంబడికను ఖురైషీయులు రెండేళ్ళ తరువాత ఉల్లంఘించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేలమంది సైనికులతో మక్కా వైపునకు పయనించారు. మార్గమధ్యంలో ఇతర తెగలు కూడా సైన్యంలోకి వచ్చి చేరాయి. మక్కాకు ఒక మైలు దూరంలో సైనిక బృందం విడిది చేసింది. కారుచీకటిని చీల్చడానికి సైనికులు మంటలు వేశారు. అనేక బృందాలు పెట్టిన వేర్వేరు మంటలతో ఎడారి ప్రాంతమంతా ఒక్కసారిగా జిగేలు మంది. మక్కా నుండి అబూసుఫ్యాన్ ఇద్దరు నాయకులతో పరిస్థితుల్ని సమీక్షించే నిమిత్తం బయలుదేరాడు. వెలుగుల్లో మునిగి తేలుతున్న ఇసుకపుడమిని వీక్షించి అబుసుఫియాన్ నివ్వెరపోయాడు. కాని అదే సమయంలో అతడు హజ్రత్ ఉమర్ (రజి) కంటపడ్డాడు. ఆయన అతని కథను కంచికి చేర్చాలనుకున్నారు. కాని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పినతండ్రి హజ్రత్ అబ్బాస్ (రజి) ఆయన్ను అడ్డుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరుపరచగా ఆయన అతనికి క్షమాభిక్ష ప్రసాదించారు.

మక్కావాసుల్లో పోరాట పటిమ ఇంకెక్కడిది? వారంతా తమ దురాగతాలకు గాను క్షమాభిక్ష కోరడానికి హాజరయ్యారు. వారి దుష్కర్మలన్నీ క్షమింపబడ్డాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రమాణాలు తీసుకునేప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) కూడా అక్కడే ఉన్నారు. స్త్రీల వంతు వచ్చినప్పుడు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఉమర్ (రజి)ను ప్రమాణాలు తీసుకోమన్నారు. స్త్రీలు హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం చేశారు.

మక్కా జయింపబడిన తరువాత హునైన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అప్పటి వరకూ ఇస్లాం స్వీకరించని రెండు బలమైన తెగలతో ముస్లింలు తలపడవలసి వచ్చింది. ఈ యుద్ధంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పాటు హజ్రత్ ఉమర్ (రజి) కూడా పాల్గొన్నారు. మరుసటి సంవత్సరం తబూక్ సంగ్రామం జరిగింది. రోమ్ మరియు సిరియా దేశాలకు చెందిన క్రైస్తవులు మదీనా పట్టణంపై దండయాత్ర జరపనున్నారని వార్తలు వ్యాపించటంతో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మార్గమధ్యంలోనే నిలువరించాలని నిర్ణయించారు. ఆ సంవత్సరం అరబ్బులో కరువు ఏర్పడింది. అయినప్పటికీ సహాబీలందరూ తమ స్థోమతకు మించి విరాళాలు, ఒంటెలు, గుర్రాలు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రజి) తన సంపదలో సగభాగాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో సమర్పించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులతో తబూక్ ను సమీపించారు. తీరా అక్కడకు వెళ్ళిన తరువాత క్రైస్తవులు దండయాత్ర జరపనున్నారన్న వార్త అసత్యమని తెలిసింది. ఈ సంఘటన జరిగిన ఒక ఏడాదికి ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేశారు. దీనినే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అంతిమ హజ్ యాత్ర’ అంటారు. ఈ సందర్భంలో కూడా హజ్రత్ ఉమర్ (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంటనే ఉన్నారు. ప్రియ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్ చేసి నేరుగా మదీనా చేరుకున్నారు. కొన్ని రోజుల తరువాత అస్వస్థతకు లోనయ్యారు. క్రమంగా ఆరోగ్యం క్షీణించసాగింది. ఈ అస్వస్థతతోనే తనువు చాలించారు అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన చివరి కాలంలో వ్యాధిగ్రస్తులై ఉన్నా నమాజు చదివించేవారు. దినదినం ఆరోగ్యం క్షీణించటం వల్ల నమాజ్ చదివించడం కష్టతరమైపోయింది. అంచేత ఆయన హజ్రత్ అబూబకర్ (రజి)ను నమాజ్ చేయించమని కోరారు. హజ్రత్ అబూబకర్ (రజ), హజ్రత్ ఉమర్(రజ)ను నమాజ్ చదివించమన్నారు. హజ్రత్ ఉమర్ (రజ) నిరాకరించారు. పైగా ‘నమాజ్ చదివించడానికి మీరే అన్ని విధాలుగా అర్హులు, కాబట్టి మీరే నమాజ్ చదివించండి’ అని సలహా ఇచ్చారు. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కొన్ని రోజులు అస్వస్థతకు లోనై ఉండి తుదకు ప్రభువు సన్నిధికి చేరుకున్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి మరణవార్తను హజ్రత్ ఉమర్ (రజి) విశ్వసించలేకపోయారు. కారుణ్యమూర్తి ఛాయ నిజంగానే ముస్లింలపై లేకుండా పోయిందా…? అని వాపోయారు. నలుదిశలా ప్రజలను ఆందోళనకర స్థితిలో చూసిన ఆయన ‘ప్రియప్రవక్త’ (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారని పలికిన వాని తల ఏకంగా ఖండిస్తాను’ అని ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ‘అల్లాహ్ త్వరలోనే ఆయన్ని బ్రతికిస్తాడు. ఆయన తిరస్కారులను, కపటులను శిక్షిస్తారు’ అని కూడా ప్రకటించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసం విన్న తరువాత ఆయన ఆవేశం చల్లారింది. ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారన్న వార్త సత్యమని ఆయనకు అర్ధమైంది. హఠాత్తుగా గుండెపై పిడుగు పడినట్లయింది. కాళ్ళక్రింద నేల కదలినట్లయింది. ఒక్కసారిగా మూర్చపోయిన వానిలా నేలపై పడి పోయారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. ఆయనకన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ ఆయన అగ్రశ్రేణి సహచరుల జాబితాలో పరిగణింపబడేవారు. కీలకమయిన సలహా సంప్రదింపులలో ఆయన పేరు ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) తరువాత హజ్రత్ ఉమర్ (రజి) పేరే సర్వత్రా వినవచ్చేది. ఆయన ప్రియప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సమీపబంధువులు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణులలో ఒకరైన హజ్రత్ హఫ్సా (రదియల్లాహు అన్హ) ఆయన పుత్రికే. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను ‘ఫారూఖ్‘ అని బిరుదిచ్చారు. (ఫారూఖ్ అంటే సత్యాసత్యాలను స్పష్టంగా వేరుపరచేవాడు అని అర్థం) అంచేత ‘ఫారూఖ్’ హజ్రత్ ఉమర్ (రజి) నామంలో మిళితమై హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రజి)గా వ్యవహరింపబడసాగింది.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ముస్లింలలో చీలిక వస్తుందన్న భయం పీడించింది. తమలో నుండే ఎవరినైనా ఖలీఫాగా నియమించాలన్న సంకల్పంతో అన్సార్లు ఒకవైపు సమావేశమయ్యారు. ఆ ఉత్కంఠభరిత వాతావరణంలో ముస్లింల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తకుండా హజ్రత్ ఉమర్ (రజి) అహర్నిశలూ కృషి చేశారు. ఆయన మరియు హజ్రత్ అబూబకర్ (రజి) కలిసి అన్సార్ (మదీనావాసులు) ల వద్దకు చేరుకున్నారు. అక్కడ హజ్రత్ అబూబకర్ (రజి) ఉపన్యాసమిస్తూ హజ్రత్ ఉమర్ (రజి) పేరును ఖలీఫాగా ప్రతిపాదించారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) ‘మీరుండగా నేనేవిధంగా ఖలీఫాగా కొనసాగుతాను’? అని సున్నితంగా తిరస్కరించారు. అంతేకాదు, హజ్రత్ అబూబకర్ (రజి)ను ఖలీఫాగా ఆమోదిస్తున్నట్లు ఆయన చేతిపై ప్రమాణాలు చేశారు. తరువాత ప్రజలందరూ ఆయన చేతిపై ప్రమాణం (బైత్) చేశారు.

ఖలీఫాగా హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సంభవించిన ముఖ్యసంఘటనలను ఎదుర్కొనటంలో హజ్రత్ ఉమర్ (రజి) సలహాలు కీలకపాత్ర వహించాయి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం అరబ్బులు అనేకులు “జకాత్” ఇవ్వడానికి నిరాకరించారు. కొందరైతే స్వయంగా తమను ప్రవక్తలుగా ప్రకటించుకున్నారు. మరి ఆ స్వకల్పిత ప్రవక్తల్ని అనేక తెగలు విశ్వసించాయి కూడా. జకాత్ ఇవ్వ నిరాకరించిన వారి పట్ల మృదువైఖరితో వ్యవహరించాలని సహాబాలు తమ మనోభావాల్ని వ్యక్తపరిచారు. హజ్రత్ ఉమర్ (రజి) కూడా వారితో ఏకీభవించారు. అయితే హజ్రత్ అబూబకర్ (రజి) ఖురాన్ ఆధారంగా జకాత్ ప్రాముఖ్యాన్ని విడమరచి చెప్పిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) కూడా ఆయనతో ఏకీభవించారు. ఖురాన్ ఆదేశాన్ని విన్నప్పుడల్లా హజ్రత్ ఉమర్ (రజి) తన స్వంత అభిప్రాయాలను ప్రక్కనపెట్టి, తక్షణం తలవంచేవారు. ఇది ఆయన విధేయతాభావానికి ఒక మచ్చుతునక మాత్రమే.

హజ్రత్ ఉమర్ (రజి) స్వభావంలో ఆవేశం అధికమనిపిస్తుంది. చిన్నపాటి మాటలపై కూడా ఆవేశపూరితులై ఖడ్గాన్నే లేవనెత్తేవారు. హజ్రత్ అబూబకర్ (రజి) కాలంలో కూడా ఆయన ప్రవర్తనావళిలో ఎలాంటి మార్పులు గోచరించలేదు. హజ్రత్ అబూబకర్ (రజి) అస్వస్థతకు లోనై ఉన్నప్పుడు హజ్రత్ ఉమర్ (రజి)ను ఖలీఫాగా నియమించాలనుకున్నారు. ‘ఖలీఫా నియమకానికి ఆయన అన్ని విధాలా అర్హులే’ కాని ఆయనలోని కరకుదనం మాత్రం వాంఛించదగినది కాదు” అని సలహాదారులు కొందరు సూచించారు. ప్రస్తుత ఖలీఫాయైన మీ ముందే ఆయన మా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తే, ఖలీఫాగా ఇంకా ఏం చేస్తారో అల్లాహ్ యెరుగు” అని అభిప్రాయపడ్డారు. దానికి అబూ బకర్(రజి) “నా మెతక వైఖరి కారణంగా ఆయన కఠినంగా ప్రవర్తించారు. ఖిలాఫత్ బాధ్యతలు గనక భుజాలపై పడితే మనసు దానంతట అదే మెత్తబడుతుంది” అని వారిని సముదాయించారు. నిజంగానే ఖలీఫాగా నియమింపబడిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి)లో ఆశించిన మార్పు వచ్చేసింది. అవును, బాధ్యత అటువంటిది మరి! అందునా అల్లాహ్ సమక్షంలో జవాబుదారుడినని భావించిన పరిపాలకుడాయె!!

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం లభించిన ఆరవయేట హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లాం స్వీకరించారు. అప్పుడాయన వయస్సు ముఫ్ఫైమూడు. ఖలీఫాగా నియమించబడే నాటికి ఆయన వయస్సు యాభైమూడు. ఆయన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచర్యంలో పద్దెనిమిది సంవత్సరములు గడిపారు. ముఖ్యమైన యుద్ధాలన్నింటిలోనూ పాల్గొని హేమాహేమీలను సైతం గడగడలాడించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఆయనకు అమితమైన ప్రేమ, గౌరవము, ఆదరాభిమానమూను. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఆయన ఎంతో ఆదరించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) సాధారణంగా బిగ్గరగా మాట్లాడేవారు. మహాప్రవక్త (సఅనం) సమక్షంలో హెచ్చుస్వరంతో మాట్లాడరాదని అల్లాహ్ ఆజ్ఞ అవతరించిన తరువాత, ఆయన చాలా నెమ్మదిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు ఆయన మాట్లాడేదేమిటో కూడా అర్థమయ్యేదికాదు.

హజ్రత్ఉ మర్ (రజి) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు పొడవాటి మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు, నిరాడంబర జీవి. మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. అప్పుడప్పుడు రొట్టెలను నెయ్యి, తేనె, మాంసం, మరియు పాలతో తినేవారు. ముతక దుస్తులు ధరించేవారు. ప్రయాణీకుల మాదిరిగా తలపై టోపీ ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడ అతుకులు కూడా ఉండేవి. ఒకమారు కూఫా నుండి కొందరు ఆయన్ని కలవడానికి వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) కోసం వారెంతో నిరీక్షించారు. చివరకు ఆయన ఆలస్యంగా వచ్చారు. వంటిపై ఉన్న దుస్తులను ఉతికి, ఆరవేసి మరల ధరించేందుకు ఇంత ఆలస్యమైందని అప్పుడు తెలిసింది.

హజ్రత్ ఉమర్ (రజి) తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ లో భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వంలేని దయామూర్తి. ఒకమారు ఆయన ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: “ఒకప్పుడు నేను దీనావస్థలో ఉండేవాణ్ణి. ప్రజలకు నీళ్ళు తోడి అందించేవాడిని. వారు ప్రతిఫలంగా నాకు ఖర్జూరపు పండ్లు ఇచ్చేవారు. దానితోనే నా జరుగుబాటు అయ్యేది”. ఉపన్యాసమిచ్చి ఆయన వేదిక దిగగానే, ఒక వ్యక్తి “ఇలాంటి మాటలు ఉపన్యాసం’లో వ్యక్తీకరించడం సమంజసం కాదు” అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ ‘ (రజి) “నా నైజంలో కించిత్ గర్వం తొంగిచూసింది. దాన్ని పారద్రోలటానికి నేను నా గతాన్ని నెమరువేసుకున్నాను” అని వివరణ ఇచ్చారాయన.

ఖలీఫాగా నియమింపబడక ముందు వ్యాపారమే ఆయన జీవనా ధారం. ఖలీఫాగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత భార్యాపిల్లల పోషణ కష్టతరమైపోయింది. ఈ విషయమై ఆయన సహచరులను పిలిచి సంప్రతించారు. “మీరు కూడా హజ్రత్ అబూబకర్ (రజి) మాదిరిగా అన్న పానీయాలు, వస్త్రధారణకవసరమైనంత ధనాన్ని కోశాగారం నుండి తీసుకోండి” అని హజ్రత్ అలీ (రజి) అన్నారు. ముస్లింలకు వారి శక్తియుక్తుల, ప్రతిభానైపుణ్యాల ఆధారంగా ఆయన ఉపకార వేతనాలను (భృతి) నిర్ధారించారు. ఉపకారవేతనాలను చెల్లించటంలో ముస్లింలు ఇస్లాంకు చేసిన సేవలను ఆధారంగా తీసుకొనేవారు. బద్ర్ సంగ్రామంలో పాల్గొన్నవారికి అధిక స్థాయిలో ఉపకారవేతనం ఉండేది. రెండవ స్థాయిలో ఉహద్ యుద్ధంలో పాల్గొన్నవారు ఉండేవారు. ఈ విధంగా అనేక భాగాలుగా చేసి ఆయన ఉపకారవేతనాలు చెల్లించారు. హజ్రత్ ఉమర్ (రజి) కంటే అధిక మొత్తంలో ఉపకారవేతనం పొందేవారు అనేకమంది ఉండేవారు.

మక్కానుండి హిజ్రత్ (వలస) చేసిన హజ్రత్ ఉమర్ (రజి), మదీనా పట్టణానికి మూడు మైళ్ళదూరంలో ఉన్న ఖుబా ప్రాంతంలో విడిదిచేశారు. హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ఆయన ధార్మిక సోదరుడు. హజ్రత్ ఉమర్ (రజి) రెండు రోజుల కొకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధిలో హాజరయ్యేవారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి తాను వెళ్ళలేని రోజు హజ్రత్ ఉత్బాన్ బిన్ మాలిక్ (రజి) ను పంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియమింపబడిన తరువాత మదీనాలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆయన నివాసం మస్జిదె నబవీ సమీపంలో ఉండేది. హజ్రత్ అబూబకర్ (రజి) ఖలీఫా (అల్లాహ్ ప్రతినిధి)గా ఉన్న కాలంలోనే, ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసుల నాయకుడు) అని వ్యవహరించేవారు. ఖిలాఫత్ నిర్వహణలో హజ్రత్ ఉమర్ (రజి), అబూబకర్ (రజి) కు పూర్తి సహాయసహకారాలు అందించేవారు. కఠిన నిర్ణయాలెప్పుడైనా తీసుకోదలచి నప్పుడు సహాబాలందరి సలహాలు తీసుకొనేవారు. ఈ సమాలోచనా సభలో, ప్రజల్లో పలుకుబడి గల నాయకులను పిలిపించేవారు. వారిలో వృద్ధులు, యువకులు మరియు మధ్యవయస్కులు కూడా ఉండేవారు. అవసరాని కనుగుణంగా ఈ సమావేశాలకు మహాజిర్ లు, అన్సార్ లు మరియు సైనికాధికారులను కూడా ఆహ్వానించేవారు. ఈ సలహా సంప్రదింపుల సమావేశం సాధారణంగా ‘మస్జిదె నబవీ’లో జరిగేది. సలహామండలి సభ్యులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, నిర్ద్వంద్వంగా సలహాలు ఇచ్చేవారు. ఖలీఫా స్వయంగా ఏదైనా తప్పిదానికి లోనైతే ఆయన్ని అభిశంసించే అధికారం ప్రజలకు ఉండేది. ఆయన మండలాధికారుల పనితీరును నిశితంగా పర్యవేక్షించేవారు. అధికారులెవరైనా తప్పుడు కార్యాలకు పాల్పడినట్లయితే వారిని ప్రజలందరి సమక్షంలో శిక్షించేవారు.

‘గస్సాన్’ తెగకు చెందిన రాకుమారుడు ‘జబలాబిన్ ఏహమ్’ ఆస్తీ అంతస్తులుగల వాడు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో అతడు మదీనా వచ్చి ఇస్లాం స్వీకరించాడు. ఒకరోజు అతడు కాబాగృహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పల్లెటూరి వ్యక్తి అతని దుప్పటిని త్రొక్కినాడు. ‘ఏహామ్’ ఆగ్రహోదగ్రుడై ఆ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటనపై హజ్రత్ ఉమర్ (రజి)కు ఫిర్యాదు అందింది. ఆయన ‘ఏహమ్’ను పిలిపించి ‘నీవు ఇతడికి చెంపదెబ్బ కొట్టావు, కాని ఇప్పుడు నీవు ఇతనిచేత చెంపదెబ్బ తినాలి’ అని అన్నారు. అప్పుడు ‘ఏహమ్” మా ఇద్దరి మధ్య భూమ్యాకాశాలంత తారతమ్యముంది అని అన్నాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “ధనిక పేదల మధ్య ఎలాంటి తారతమ్యాలకు ఇస్లాంలో తావులేదు. తప్పుచేసిన ప్రతి వ్యక్తీ శిక్షింపబడక తప్పదు” అని అన్నారు. ‘ఏహామ్’ ఆలోచించడానికి ఒకరాత్రి సమయం కావాలని విన్నవించుకున్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతని విన్నపాన్ని ఆమోదించారు. అతడు అర్థరాత్రి ఆ ప్రాంతం విడిచి పారిపోయాడు.

హజ్రత్ ఉమర్ (రజి) ముస్లింల విషయంలో చింతాగ్రస్థులై ఉండేవారు. వారిలో ఎవరికేదైనా నష్టం జరిగితే ఆయన మనస్సు బాధతో చివుక్కుమనేది. రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల పరిస్థితులను బేరీజు చేసేవారు. మదీనా పొలిమేరల్లో విడిదిచేసివున్న యాత్రీకుల స్థితిగతులను పర్యవేక్షించేవారు. ఒక సాధారణ సైనికుని మాదిరిగా రాత్రి మొత్తం గడిపేవారు. ఒకరాత్రి మదీనాకు కొంత దూరంలో ఒక గుడారంలో మండుటాగ్ని కనిపించింది. దగ్గరికి వెళ్ళిచూశారు. మంటకిరువైపులా నలుగురు పిల్లలు కూర్చుని ఉన్నారు. విషయమేమని అడగ్గా తన పిల్లలకు ఎన్నో రోజుల నుండి తినడానికి తిండి లేదనీ, కుండలో నీళ్ళు పోసి పొయ్యిమీదుంచాననీ ఒక స్త్రీ వివరించింది. అది విన్న వెంటనే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాకు వెళ్ళారు. నెయ్యి, మాంసం, పిండి, మరియు ఖర్జూరపు పండ్లు తెచ్చి ఆ ముందుంచారు. ఆమె పిండితో రొట్టెలు చేసి పిల్లలకు తినిపించింది. హజ్రత్ ఉమర్ (రజి) వెళ్తుండగా ఆమె ఆయన్ను పిలిచి “హజ్రత్ ఉమర్ (రజి) స్థానంలో మీరు ఖలీఫాగా ఉంటే బాగుండు!” అని అంది. ఆమె పలుకులు హజ్రత్ ఉమర్ (రజి) హృదయాంతరాళాన్ని కుదిపివేసాయి. మరునాడు ఆమెను దర్బారుకు పిలిపించి పెన్షన్ ఇప్పించారు.

ఖలీఫాగా నియామకం జరిగిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) విలాసవంతమయిన విశ్రాంతితో కూడిన జీవితానికి ఆమడ దూరంగా ఉండేవారు. తన వద్ద ఉన్న మొత్తం సమయాన్ని ఖిలాఫత్ కార్యకలాపాల పై వెచ్చించేవారు. మస్జిద్లో కూర్చున్నా సహచరులతో సలహా సంప్రతింపులు జరిపేవారు. రోమ్ మరియు ఈరాన్కు సైనిక బృందాలు పంపించమని మస్జిద్ లోనే ప్రతిపాదనలు వస్తున్నాయి. సైన్యాధికారులకు ఉపదేశాలు పంపబడుతున్నాయి. అధికారులపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించి మరీ లేచేవారు. నీటిబిందెలను భుజాలపై ఎత్తుకుని వితంతువులకు నీళ్ళందించేవారు. వారి దీవెనలు పొందేవారు. మస్జిదె నబవీలో ఐదు పర్యాయాలు నమాజు సారధ్యం వహించే బాధ్యత కూడా ఆయనపై ఉండేది. ఎలాంటి కార్యంలో నిమగ్నమై ఉన్నా నమాజ్ సమయానికి మస్జిద్ చేరుకొనేవారు. ఒకరోజు నమాజ్ చేయించి మస్జిద్ నుండి బయటకు రాగానే, ప్రజాధనం (బైతూల్ మాల్) నుండి ఒక ఒంటె పారి పోయిందని తెలిసింది. వెంటనే ఆయన దానిని వెదికేందుకు వెళ్ళిపోయారు. ఈ పనికోసం సేవకుడెవరినైనా పంపించవచ్చుగదా! అని ప్రజలు సలహా ఇవ్వగా ‘నేనే సేవకుణ్ణి’ అంటూ తన బాధ్యతలను గుర్తు చేసుకునేవారు. ఆ సమయంలో ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. పనిచేసి అలసిపోయినప్పుడు కటిక నేలపై మేను వాల్చేవారు. రాత్రి సమయాల్లో మస్జిదె నబవీలో ఇషా నమాజు చేయించాక, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు వెళ్ళేవారు. ఒక్కోసారి రాత్రంతా గస్తీలోనే గడిచిపోయేది.

ఆ కాలంలో అరబ్బు దేశానికిరువైపులా బలమైన సామ్రాజ్యాలు రెండు ఉన్నాయన్న అంశము గమనార్హం. ఒకవైపు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా వంటి మూడు ఖండాలలో విస్తరించియున్న రోము సామ్రాజ్యం ఉండగా, రెండవవైపు ఆసియా ఖండ అధిక భూభాగాన్ని ఆధీనంలో ఉంచుకున్న ఈరాన్ సామ్రాజ్యం ఉంది. ఈ రెండు సామ్రాజ్యాధిపతులు మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)జీవిత కాలంలోనే ముస్లింలతో కయ్యానికి కాలుదువ్వారు. హజ్రత్ అబూబకర్(రజి) హయాంలో అది యుద్ధ రూపాన్ని దాల్చింది. ఒకవైపు ముస్లింలు అనేక ప్రదేశాలనుండి ఈరానీయులను తరిమివేశారు. రెండవవైపు ముస్లింలు సిరియా, ఫాలస్తీనాలలో రోమన్ క్రైస్తవులను అంచెలంచలుగా ఓడించి పెద్ద భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. ‘యరమూక్’ యుద్ధం ముస్లింలకు క్రైస్తవులకు మధ్య జరిగిన యుద్ధాలలో పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) ఖిలాఫత్ చివరి కాలంలో ప్రారంభమైంది. యుద్ధం సమాప్తం కాకముంచే హజ్రత్ అబూబకర్ (రజి) మరణించారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈరాన్తో అనేక యుద్ధాలు జరిగాయి.

హజ్రత్ అబూబకర్(రజి) ఇరాఖైపై దండయాత్ర నిమిత్తం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)కు సైన్యం ఇచ్చి పంపారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్(రజి). మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులు. అగ్రశ్రేణి సైన్యాధిపతి. “మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ను, ‘సైఫుల్లా” అను బిరుదుతో సత్కరించారు. సైఫుల్లా అంటే అల్లాహ్ ఖడ్గం అని అర్థం.

ఈయన ఇరాక్లోని కొంత భాగాన్ని జయించారు. తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) ఆయన్ను సిరియా వైపుకు పంపి, ఆయన స్థానంలో ఇరాక్ మరియు అరేబియా సరిహద్దు ప్రాంతవాసియైన, అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించిన ‘ముసన్నా బిన్ హారిస్ (రజి) ను సైన్యాధిపతిగా నియమించారు. ముసన్నా వద్ద ఉన్న సైన్యం చాలా తక్కువ. అంచేత ఆయన ‘హీరా’ నగరాన్ని జయించిన తరువాత హజ్రత్ అబూబకర్ (రజి) సన్నిధిలో హాజరైనారు. హజ్రత్ ముసన్నా (రజి) హాజరైన రోజు హజ్రత్ అబూబకర్ (రజి) తీవ్ర జ్వరముతో బాధపడుతూ ఉన్నారు. అయినా హజ్రత్ ఉమర్ (రజి) ను పిలిచి ముసన్నా (రజి) సహాయార్థం సైన్యాన్ని పంపవలసిందిగా ఆదేశించారు. ఆ రోజు సాయంకాలమే ఆయన పరమపదించారు.

హజ్రత్ ఉమర్ (రజి) చేతిపై ప్రమాణం (బైత్) చేయటానికి మారుమూల ప్రదేశాల నుండి ప్రజలు వచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) వారికి ఇరాక్ పరిస్థితులను వివరించారు. ధర్మయుద్ధం (జిహాద్) కోసం వారిని ప్రేరేపించారు. మొట్టమొదటగా సఖీఫ్ తెగకు చెందిన ప్రముఖ నాయకుడు ఇరాఖ్ వెళ్ళి ఈరానీయులతో పోరాడటానికి సంసిద్ధత వ్యక్తపరచాడు. తరువాత ప్రజలందరూ సన్నద్ధులయ్యారు. హజ్రత్ ఉమర్ (రజి), అబూ ఉబైదా (రజి)ను సైన్యాధిపతిగా నియమించారు. వారు ఇస్లామీయ సైన్యం విడిది చేసియున్న ‘హీరా’ ప్రాంతానికి బయలుదేరారు.

ఆ రోజుల్లో ‘పూరాన్ దఖ్త్’ ఈరాన్ మహారాణి. ఆమె తమకు కలిగే పరాజయ పరంపరకు కలవరం చెంది ‘ఖురాసాన్’ గవర్నర్ పుత్రుడైన ‘రుస్తుమ్’ ను పిలిచి రక్షణశాఖామంత్రిగా నియమించింది. ‘రుస్తుమ్’ రణనీతిలో ఆరితేరిన వాడు. పరాక్రమశాలి కూడానూ. అతడు రాయబారులను పంపి ప్రముఖ సర్దారులందరినీ సమావేశపరచాడు. ముస్లింలకు విరుద్ధంగా పోరాడమని వారిని ప్రేరేపించాడు. ఫలితంగా ముస్లింలు హస్తగతం చేసుకొన్న కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. పలు ప్రాంతాలు ముస్లింల చేజారిపోయాయి. అయినప్పటికీ రణరంగంలో ముస్లింలు, ఈరానీయులతో తలపడినప్పుడు ముస్లింలదే పై చేయి అయింది. వారు అనేక ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకున్నారు. ఈ వార్తలు ‘రుస్తుమ్’ కు తెలిసిన వెంటనే అతడు, ఈరాన్ దేశ జాతీయ పతాకం ‘దుర్ ఫిష్ కాదియాని’ తీసుకున్నాడు. ప్రజలు ఈ జాతీయ పతాకాన్ని అమితంగా గౌరవించేవారు. చక్రవర్తి సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, ఈ జాతీయ జెండాపై బంగారం, వెండి, వజ్రాల వర్షం కురిపించేవారు. ఈ ధ్వజం చేబూనిన ప్రతీ యుద్ధం’లోనూ విజయం తమకే ప్రాప్తమవుతుందన్నది ఈరానీయుల దృఢ విశ్వాసం. “బహ్మన్” అనే ప్రముఖ నాయకుడికి ఈ పతాకమిచ్చి ముస్లింలతో సమరానికి పంపడం జరిగింది.

‘బహ్మన్’ నైలు నదీ తీరం చేరాడు. ఇటువైపు నుండి ‘హజ్రత్ అబూ ఉబైద్ సఖ్ ఫీ’ కూడా పయనించి నదికి రెండవ వైపు చేరుకున్నారు. నైలునదికి ఒక వైపున ముస్లింలు రెండవ వైపున ఈరానీయులు విడిదిచేశారు. ఇరుసైన్యాల మధ్య నదీ ప్రవాహం మాత్రమే అడ్డుగా ఉంది. “వీరు తీరం దాటి వస్తారా! లేక మేమే రావాలా?” అని బహ్మన్ ముస్లింలకు సందేశం పంపించాడు. ఈరానీయులనే నదీ దాటి రమ్మని సందేశం పంపమని ముసన్నా బిన్ హారిస్ మరియు ఇతర నాయకులు సలహా ఇచ్చారు. కాని ఔత్సాహికుడైన అబూఉబైదా (రజి) వారి సలహాను లెక్కచెయ్యక హడావిడిగా నదిపై వంతెన నిర్మించి సైన్యంతో సహా నదిని దాటేశాడు. చూడబోతే ఆవల వైపు యుద్ధ మైదానం మరీ ఇరుకుగా ఉంది. ముస్లిం సైనికులకు వెనక్కి తగ్గడానికి కూడా స్థలం లేదు. పైగా ఈరానీ సైన్యంలో ఏనుగులు అధికంగా ఉన్నాయి. మృదంగాలు, డప్పులు వాయిస్తూ ఈరానీ సైన్యం వడివడిగా ముందుకు కదులుతూ ఉంటే, నల్లమేఘాల్లా తమవైపు సమీపిస్తున్న ఏనుగులను చూసి ముస్లిం సైన్యంలోని గుర్రాలు బెదిరిపోయాయి. అబూఉబైదా (రజి) వెంటనే స్పందిస్తూ “ఏనుగులన్నింటినీ చుట్టు ముట్టి వాటి పగ్గాలను కోసేయమని” సైనికులను ఆదేశించాడు. ఒకప్పుడు భారతరాజు ఈరాన్ చక్రవర్తికి బహూకరించిన తెల్లటి ఏనుగు యుద్ధంలో ముందుకు దూసుకు పోసాగింది. అబూఉబైదా (రజి) ఆ ఏనుగుపై లంఘించి, ఒక వేటుతో దాని తొండాన్ని నేలకూల్చారు. గాయాలపాలైన ఏనుగు అదుపు తప్పి ఆగ్రహావేశాలతో అబూ ఉబైదాను పడవేసి, ఉదరభాగంపై కాలు వేసి నలిపివేసింది. అబూఉబైదా (రజి) అక్కడికక్కడే ‘కన్నుమూశారు. ఆయన సోదరుడు సైనిక ధ్వజాన్ని చేతపట్టుకున్నారు. తుదకు ఆయన కూడా హతులయ్యారు. అంతలో శత్రుసైనికుడు ముస్లింలు పారిపోకుండా వంతెనను కూల్చివేశాడు. యుద్ధ మైదనంతో బెదిరిపోయిన ఏనుగులు వీరవిహారం చేశాయి. మారణహోమం రేకెత్తించాయి. ఒక్క ముస్లిం సైనికుడు కూడా ప్రాణాలతో మిగులుతాడా అన్న ఆందోళన కలిగింది. ఈ పరిస్థితులను వీక్షించిన ‘ముసన్నా (రజి)’ వెంటనే సైనిక పగ్గాలు తన ఆధీనంలో తీసుకున్నారు. ఒక వంక వంతెన మరమ్మత్తుకు వెంటనే కొంత మందిని పంపారు. మరోవంక మిగిలిన సైన్యంతో ఈరానీ సైన్యాన్ని చుట్టుముట్టారు. ఎట్టకేలకు సైనికులు నది దాటటంలో సఫలమయ్యారు.. నది దాటిన పిదప సైనికులను గణించగా మొత్తం తొమ్మిది వేలమందిలో కేవలం మూడు వేల మంది మాత్రమే మిగిలి ఉన్నారు. నాలుగు వేల సైనికులు సమరభూమిలో స్వర్గసీమకు చేరుకున్నారు. దాదాపు రెండువేల మంది సైనికులు పారిపోయ్యారు. యుద్ధభూమి నుండి వెనుదిరిగిన సైనికులు సంవత్సరాల పాటు ముఖాలు చాటేసుకొని తిరిగారు. కొంతకాలం తరువాత వైలు నదీ తీరాన మరొకసారి యుద్ధం జరిగింది. అప్పుడు ‘మహరాన్’ ఈరానీ సైన్యానికాధిపత్యం వహించాడు. ముస్లిం సైన్యానికి ‘హజ్రత్ ముసన్నా బిప్ హారిస్ (రజి)’ సారథ్యం వహించారు ముసన్నా (రజి) నది దాటి యుద్ధం చేయడానికి బదులు ఈరానీయులనే నది దాటి రమ్మని కబురంపారు. ఈ యుద్ధంలో ఈరానీయులు పెద్ద సైనిక బలగాలతో రంగంలోకి దూకారు, మహాబీభత్సం సృష్టించిన ఈ యుద్ధంలో ముస్లింలదే పై చేయి అయింది.

పరాభవాన్ని మూటగట్టుకుని ఈరానీయులు తిరోగమించారన్న వార్తలు ఈరానీ రాజధాని ‘మదాయన్’ వరకు వ్యాపించాయి. అప్పుడు ఈరానీ నాయకులు, ఐశ్వర్యవంతులందరూ కలసి యువకిశోరుడైన ‘యజ్ద్ గిర్ద్’కు రాజ్యాధికారం కట్టబెట్టారు. అతడు రాజ్యాధికార బాధ్యతలు స్వీకరించగానే ఈరానీయులలో పోరాటపటిమ, పరాక్రమశక్తులు పదింతలు పెరిగాయి. తమ జాతి గౌరవాన్నీ నీలబెట్టుకొనేందుకు వారు రేయింబవళ్లు. యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. ఈ సంగతి తెలుసుకున్న హజ్రత్ ఉమర్ (రజి), హజ్రత్ ముసన్నా (రజి)కు అరబ్బు సరిహద్దు ప్రాంతాలకు తిరిగి రమ్మని సందేశం పంపారు తరువాత ఆయన కూడా సైనిక సమీకరణకు ఉపక్రమించారు. హజ్ కాలం కావటం వల్ల సులభంగా విశాల సైన్యం సమకూరింది. హజ్రత ఉమర్ (రజి) స్వయంగా ఈ సైన్యంతో బయలుదేరాలని సంకల్పించుకున్నారు. అయితే హజ్రత్ ఉమర్ (రజి) మదీనాలో ఉండడం చాలా అవసరమని సహచరులు సలహా ఇచ్చారు. చివరకు ‘హజ్రత్ సాద్ బిన్ వఖాస్’ (రజి)ను సైనికాధికారిగా నియమించి ఈరాన్ పంపారు. కాని హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ఈరాస్ చేరకముందే హజ్రత్ ముసన్నా (రజి) కన్ను మూశారు. వంతెన యుద్ధంలో ఆయనకు తగిలిన గాయాలు తిరగదోడాయి. కడకు ఆయన ఆ బాధతోనే తనువు చాలించారు.

హజ్రత్ సాద్ (రజి) ముప్ఫైవేల మంది సైనికులతో వచ్చారు. ఆయన్ని ప్రతిఘటించడానికి ‘రుస్తూమ్’ విశాలమైన సైన్యంతో ఎదురువచ్చాడు. అతని శిరస్సుపై దుర్ ఫిషే జాతీయ పతాకం రెపలాడుతూ ఉంది. అతని వెనుక పెద్ద పెద్ద సర్దారుల బృందం కూడా ఉంది. వారిలో ప్రముఖ నాయకుడైన ‘బహిమన్’ కూడా ఉన్నాడు ఇతడు వంతెన యుద్ధంలో ఈరానీ సైన్యాధిపతిగా ఉన్నాడు. “ఖాదసియా” మైదానంలో శత్రు సైన్యాలు ముఖా-ముఖి అయ్యాయి. ‘రుస్తుమ్’ భారీ సైన్యాన్ని వెంట బెట్టుకొని పచ్చినప్పటికీ యుద్ధాన్నారంభించడానికి సాహసించలేకపోయాడు. కారణం అంతకు ముందు ఎదురయిన చేదు అనుభవమే. అందుకేనేమో సంధి కోసం సన్నాహాలు ప్రారంభించాడు. చాలా రోజుల వరకు ఇరుపక్షాల తరపున రాయబారాలు నడిచాయి. అనశ్చితస్థితి నెలకొన్నది. కాని ఫలితం శూన్యం. ఇరువురి మధ్య ఒడంబడిక కుదరలేదు. యుద్ధ మేఘాలు ఆవరించాయి. సరిగ్గా అదే సమయంలో ‘సాద్ బిన్ వఖాస్’ (రజి)ను అనారోగ్యం చుట్టుముట్టింది. కనీసం రెండడుగులు ముందుకు వేసి నడవలేని స్థితిక ఆయన ఆరోగ్యం క్షీణించింది. అంచేత ఆయన (ముస్లింల అధీనంలో ఉన్న) ఒక కోటపై కూర్చొని ఉండేవారు. అక్కడి నుంచే సూచనలు ఒక కాగితంపై వ్రాసి రాయిలో చుట్టి కోటపైనుండి పడవేసేవారు. దాని ప్రకారమే సైన్యం తమ రణనీతిని రూపొందించుకునేది.

ఆ కాలపు యుద్ధ నియమ నిబంధనల ప్రకారం ఇరువైపుల నుండి సైనికులు ఒక్కక్కరూ మైదానంలో దిగేవారు. వారిద్దరి మధ్య చాలాసేపు పోరాటం జరిగేది. తరువాత రెండు సైన్యాలు యుద్ధానికి దిగేవి, ఖాదసియా మైదానంలో కూడా యుద్ధం ఇదే విధంగా జరిగింది. మొదట ఈరానీ సైన్యం నుండి యుద్ధవీరుడొకడు మైదానంలో దిగి, ప్రతిపక్ష సైనికుడిని యుద్ధానికి రమ్మని కవ్వించాడు. ముస్లిం సైన్యం నుండి జుబైద్ తెగ నాయకుడైన ఉమరి ఎన్ మాదీకర్బ్ (రజి) అతనితో తలపడ్డారు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. చివరకు అతడు నేలకొరిగాడు. ఇదే విధంగా చాలాసేపు ఇరువైపుల నుండి యుద్ధవీరులు ఒంటరి పోరాటం సాగించారు. తరువాత ఈరానీయులు సైన్యంతో సహా ముందుకురికారు. వారి ఏసుగులు స్వైర విహారం చేయసాగాయి. వాటిని చూచి ముస్లిం సైన్యపు గుర్రాలు బెదిరిపోయాయి. సాద్ బిన్ వఖాస్ (రజి) ఇస్లామి సైన్యం వైపు నల్లమేఘాల్లా దూసుకెళుతున్న ఏనుగులను నిరోధించమని ‘అసద్’ తెగ నాయకుడిని ఆదేశించారు. ఆయన బాణసంచారులను కొందరిని తీసుకొని పెనుతుఫాను సృష్టిస్తున్న మదపుటేనుగులను ఆపారు. ‘తమీమ్’ తెగకు చెందిన యోధులు గుర్రాల నుండి దిగి బాణాల వర్షం కురిపించారు. బీభత్సం సృష్టిస్తున్న ఈ యుద్ధ పరిణామాలు తలకముందే సూర్యుడు తలదాచుకున్నాడు. యుద్ధ మైదానమంతా అంథకారం అలముకుంది. సైన్యాలు తమ తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోయాయి.

రెండవ రోజు ఇంకా యుద్ధం మొదలవలేదు. అంతలోనే ఒక వైపు నుండి ధూళి లేపుతూ సైనిక బృందం ఒకటి దావడం అందరూ గమనించారు. సైనికుల ఖడ్గమొనలు, ఈటెలకొనలు కాంతి పరావర్తనం వలన నక్షత్రాల మాదిరిగా మెరుస్తూ కనిపించాయి. ఈరాన్ నుండి సైన్యం వచ్చిందని కొందరు భావించగా, మదీనా నుండి సైన్యం అడుగిడిందని మరికొందరు తలంచారు. వారందరూ ఈ ఊహాగానాల్లోనే నిమగ్నమై ఉండగా వార్తాహరులు కొందరు పరుగెత్తుకుంటూ వచ్చి “సిరియా ఇస్లామీ సైనిక నాయకుడైన ‘హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి) హాషియ్ లిన్ ఉత్ప(రజి) మరియు ఖాఖాన్ బిస్ అమ్ (రజి)’ సారధ్యంలో ఆరువేల సిపాయిలు తరలి వచ్చాయ”ని చెప్పారు. ‘ఖాఖాన్ బిన్ అమ్రి'(రజి) సమత స్థలానికి చేరిన ముందే నెంగినే యుద్ధంలో ఈరాని సైనికులకు నాయకత్వం వహించిన నాయకుడు ‘బహీమని’ ఆయనత పోరాటానికి దిగాడు. తనను ఎదురించే ప్రయత్నం చేసేవాడు ‘బహిమన్’ అని తెలిసిన ‘ఖాఖాన్ (రజ) అతనిపై విరుచుకుపడి ప్రత్యర్ధిని ఉక్కిది బిక్కిరి చేశాడు. ఖడ్గ పోరాటంలోని మెళకువలన్నింటిని ‘బహిమస్’ ప్రయోగించాడు. కాని ఆకస్మాత్తుగా అతనిపై పడిన ఒక్కవేటుకు చేయి తెగిపడింది. ఇటు ఇస్లామీ సైన్యం అల్లాహు అక్బర్’ అని నినాదాలు చేయసాగింది. యుద్ధమైదానమంతా ఈ నినాదాలతో మ్రోగిపోసాగింది. ఈధానీ సైనికుల గుండెల్లో దడ పెరిగింది. వారి ముఖాలపై విషాద ఛాయలు గోచరించసాగాయి. ఇరుసైన్యాల మధ్య భీకర యుద్ధం ప్రారంభమయింది. యుద్ధ మైదానంలో ఈరానీయుల ఏనుగులు గందరగోళాన్ని సృష్టించాయి. ఏనుగుల కోలాహలానికి గుఱ్ఱాలు బెదిరి అదుపు తప్పాయి. ‘ఖాఖాన్ బిస్ అమ్'(రజి) దీనికి విరుగుడు కని పెట్టారు. ఒంటె వీపులపై ఉయ్యాలను కట్టించి, నల్లటి ముసుగును దానికి తొడిగించాడు. ఒంటె వీపులపై ఉన్న విచిత్ర ఉయ్యాల వలన ఒంటెలు భయంకర విచిత్ర జంతువులుగా కనిపించాయి. వాటిని చూచి ఏనుగులు భయపడి చెల్లా చెదురైనాయి.

ఖాదసియా యుద్ధం మూడు రోజులపాటు జరిగింది. మూడవరోజు యుద్ధపు తుది ఘట్టం. ‘ఖాఖాన్’ (రజి) రాత్రిపూట కొంతమంది సైనికులను అడవిలో దాచి ఉంచారు. ఉదయం యుద్ధం ప్రారంభం కాగానే నందమంది సైనికుల బృందం ‘అల్లాహు అక్బర్’ నినాదాలు చేస్తూ రణరంగంలోకి దూకింది. సిరియానుండి మరో సైనిక పటాలం వచ్చిందని అందరూ తలంచారు. దైవ కృష్ణవలన ఆ రోజు ఏడొందల సైనికుల బలగమొకటి వచ్చింది. ఆ రోజు ఈరావీయులు తమ సైన్యానికిరువైపులా ఏనుగులను నిలబెట్టి ఉంచారు. ‘అమ్రూ మాది కర్స్ (రజి), ‘ఖాఖాన్ (రజి) మరియు ‘ఆసిమ్ ‘ (రజి) శరీరదారుడ్యంగల రెండు ఏనుగల వైపు గురిపెట్టారు. వాటిలో ఒకటి శ్వేతగజము కాగా రెండవది నలుపు రంగు ఏసుగు. హజ్రత్ ఆసిమ్ (రజి) తెల్ల ఏనుగుపై ఈటెతో దాడిచేసి, దాని రెండు కళ్ళూ పనికిరాకుండా చేశాడు. ‘ఖాఖాన్ (రజి)’ ఒక్క వేటుతో దాని తొండాన్ని సరికివేశాడు. నల్ల ఏనుగులు గాయాలపాలై ఫారిపోసాగాయి. వారు తమ ఇతర నాయకులతో కలసి ఇతర ఏనుగులపై కూడా దాడి జరిపారు యుద్ధభూమినుండి వాటినన్నింటినీ పారద్రోలారు. అదుపుతప్పి పరిగెత్తే గజగాములు అడ్డువచ్చిన వారినందరినీ తొక్కుకుంటూ వీరవిహారం చేశాయి.

అంతే! ఈరానీ సైన్యంలో కలకలం మొదలయింది. ఆ తరుణం లోనే సూర్యాస్తమయం జరిగింది. యుద్ధనిబంధనల ప్రకారం రెండు సైన్యాలు యుద్ధాన్ని ఆపి తమ స్థావరాలకు తిరిగి వెళ్ళిపోవాలి. కాని ముస్లింలు అటో- ఇటో తేల్చుకోవాలని శపథం చేసుకున్నారు. నడిరేయి చీకట్లో, చంద్రుని వెలుగునీడల మధ్య ఖర్గ విన్యాసాలు జరగసాగాయి. తన శిరస్సుపై ఈరానీ జాతీయ పతాకం తగిలించుకొనిన ‘రుస్తూమ్’ యుద్ధమైదానంలో ఉన్నంత వరకూ, ఈరానీయులు సమరభూమి నుండి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయరని ముస్లిం సైనికాధికారులకు తెలుసు. ఖాన్ బిన్ అమ్రూ(రజి)). ‘మాదీకర్స్ (రజి)’, ‘అష్తోత్ (రజి)’ మరియు ‘ఆసిమ్ (రజి)’లు అశ్వరూఢులై రుస్తుమ్ విడిదిచేసి ఉన్న దిశగా పయనించారు. ముస్లిం నాయకులు తనవైపుకే దూసుకురావడాన్ని గమనించిన ‘రుస్తూమ్’ అప్పటికప్పుడే ఖడ్గాన్ని తీసి పోరాటానికి సిద్ధం అయ్యాడు. క్షతగాత్రుడై ప్రాణభయంతో పలాయనం చిత్తగించాడు. దారిలో ఒక పెద్ద కాలువ వచ్చింది. ఎలాగయినా దాన్ని ఈదుకుంటూ అవతలివైపుకు చేరుకోవచ్చని ఆశించాడు. కాని హిలాల్ (రణి)’ అనే సిపాయి అతన్ని వెంబడించి అతని కథను కంచికి చేర్చారు.

‘రుస్తుమ్’ మరణంతో ఈరానీ సైన్యంలో ఆత్మ విశ్వాసం పదలి విషాదఛాయలు అలముకున్నాయి. వారు మానసికంగా కృంగిపోయారు. ముస్లిం సైనికులు వేల సంఖ్యలో ఈరానీ సైనికులను హతమార్చారు. విజయం ముస్లింలను వరించింది. ఇరాఖ్ లో ఈరానీయుల పెత్తవానికి చరమగీతం పాడబడింది. ఈరాన్ రాజధాని ‘మదాయన్’పై విజయం ఈ యుద్ధంలోని ప్రధాన ఘట్టం. ఈ ప్రదేశము దజీలా’ తీరాన ఉండేది. తురానీయులు దజలానటిపై గల వంతెనను కూల్చివేశారు. ఓడలను కాల్చివేశారు. ఈ పరిస్థితిని వీక్షించిన సాద్ బిస్ సఖాన్ (రజి) అగ్రహావేశంతో నదీప్రవాహాన్ని చీల్చుతూ గుర్రాన్ని నదిలో పరుగెత్తించారు. సైన్యాధిపతి శౌర్యం చూచిన మిగిలిన సైనికులు కూడా ఆయస్ను అనుసరించారు. ‘సాద్ బిన్ ఖాస్’ (రజి) సారథ్యంలో ముస్లిం సైన్యం సదీప్రవాహాన్ని చీల్చుకుంటూ వస్తున్న అపురూప దృశ్యం తిలకించిన శత్రుసైనికులు ఆశ్చర్యచకితులయ్యారు. మానవ మేధస్సుకు అందని ముస్లింల అపురూప విన్యాసాన్ని చూచిన ఈరానీయులు… వీరు మానవులు కారు… దయ్యాలు, భూతాలై ఉంటాయి. వీరితో యుద్ధం అసంభవం’ అని తలంచి యుద్ధమైదానం నుండి పారిపోయారు. ఇలా ఒక్క విజయంతో దాదాపు ఈధాన్ ప్రాంతాలన్నీ ముస్లింల వశమైనాయి. కాని ‘ఈరాన్’ ఇంకా మిగిలే ఉంది హజ్రత్ ఉమర్ (రజి) తరపునుండి ‘ఈరాస్’ పై దాడికి సంబంధించిన ఎలాంటి సంకేతం రానందున ముస్లింలు ఆగిపోయారు.

ముస్లింలు ఈరాస్పై దండెత్తినప్పుడు ఈరానీయుల్లో ఐకమత్యం అంతంత మాత్రమే. కాని అరబ్బులు సంఘటితంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముస్లింలతో పారాటం జరిపిన వారిలో ఈరానీయులు బలమైనవారు. వారిలో జాత్యాభిమానము అమితంగా ఉండేది. దానితోపాటు వారివద్ద యుద్ధ సామగ్రికి ఎలాంటి కొదువ లేకుండింది. యుద్ధపు టేనుగులు, గుర్రాలు వారి వద్ద అధికంగా ఉండేవి. ప్రత్యేకంగా ఏనుగులు విధ్వంసాన్ని సృష్టించేవి. అడ్డువచ్చిన వారందరినీ అని మసలి వేసేవి. పైగా ఏనుగుల నీవులపై లోహపు పల్లకీలు కట్టబడియుండేవి. వాటిలో బాణాసంచారులు కూర్చొని బాణాల వర్షం కురిపించేవారు. ఈ పల్లకీలు ఒక విధంగా చెప్పాలంటే సడిచే విధ్వంస వాహనాలు. ఇటు ఏనుగులు యుధ్ధమైదానంలో విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటే ఈరానీయులు యుద్ధంలో చెలరేగిపోయేవారు. వారికి విరుద్ధంగా ముస్లిం సైనికులు యుద్ధాల్లో ఖడ్గాలు మరియు ఈటెలు అధికంగా ఉపయోగించేవారు. గాయాలబారిన పడకుండా కొందరు చర్మపు కవచములు తొడిగేవారు. ముస్లిం సైనికులలో అధికులు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో పోరాడేవారు. ముస్లిం సైనికులు యుద్ధ భూమిలో నిరాయుధులై ఉన్నప్పటికీ, దైవకృపవలన వారు త్రుప్పుపట్టిన ఖడ్గాలతో, లోహపు ఈటెలను ముక్కలు, ముక్కలు గావించారు. ముస్లింలు ఉపయోగించే బాణాలు కూడా పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. వాస్తవమేమిటంటే…. ముస్లింలు సాధించిన విజయగాధలు సైనిక బలగాలు, ఆయుధ పరిమాణాలపై ఆధారపడిలేవు. కేవలం వారు విశ్వాస ప్రతిష్ఠ, దైవనిష్ఠల ద్వారానే విజయం సాధించారు. వారు మృత్యువుకు భయపడేవారు కాదు. అరచేతిలో ప్రాణముంచుకొని యుద్ధంలో దిగేవారు. పరిణామం తేల్చుకోవాల్సినప్పుడు గుర్రం వీపులపై నుండి దుమికి వీరోచితంగా పోరాడేవారు. వీరగతి ప్రాప్తికొరకు సైనిక బలగాలపై ఊడిపడి పంక్తులకు పంక్తులే నేలమట్టం చేసేవారు.

ప్రముఖ సేనాని ‘ముసన్నా బిన్ హారిస్ (రజి)’ ఇస్లాం స్వీకరణకు ముందు ఇలా అనేవారు. “ఒకప్పుడు పదిమంది అరబ్బు సైనికులు, ఒక్కో ఈరానీ సైనికుని ముందు నిలబడడానికి సాహసించే వారు కాదు…. కాని ఇప్పుడు పదిమంది ఈరానీ సైనికులకు ఒక అరబ్బు సైనికుడు చాలు”. అదీ ‘విశ్వాసం’ (ఈమాన్) ప్రసాదించిన బలం!

ఆఫ్రికా, ఆసియా, ఐరోపా ఖండ భూభాగాలను కలుపుకొని బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది రోమ్ సామ్రాజ్యం. ఆసియా ఖండంలోని సిరియా, పాలస్తీనా, సరిహద్దు ప్రాంతాలు ఈ సామ్రాజ్య అధీనంలో ఉండేవి. ఈజిప్ట్ మరియు ఆఫ్రికా ఖండ సరిహద్దు ప్రాంతాల అధిక భూభాగం కూడా రోమనుల అధీనంలోనే ఉండేది. ఇది కాకుండా ఐరోపా ఖండం కూడా రోమనుల ఆధీనంలోనే ఉండేది. రోమన్ క్రైస్తవులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవనకాలం నుండే పోరాటాలు ప్రారంభించారు. ప్రథమ ఖలీఫా హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రజి) హయాంలో ఈ పోరాటాలు తీవ్రరూపం దాల్చాయి. ముస్లింలు ఆ రాజ్యపు అధిక భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. రోమన్ క్రైస్తవులు, ముస్లింలకు మధ్య జరిగిన సమరాల్లో ‘యరమూక్’ యుద్ధం అతి పెద్దది. ఈ యుద్ధం హజ్రత్ అబూబకర్ (రజి) జీవితపు చివరి కాలంలో ప్రారంభమై ఆయన మరణాంతరం హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ముగిసింది. యరమూక్ యుద్ధంలో, రోమనులు రెండు లక్షల పైచిలుకు సైన్యంతో సన్నద్ధమై వచ్చారు. వారితో పోల్చినట్లయితే ముస్లిం సైన్యం కేవలం ఐదవ వంతు మాత్రమే అయినప్పటికీ యుద్ధ మైదానంలో ముస్లింలదే పై చేయి అయింది. రోమనుల శక్తియుక్తులన్నీ పటాపంచలై పోయాయి. ఇక మీదట వారు ముస్లింలకు వ్యతిరేకంగా విశాల సైన్యాన్ని సమకూర్చుకోటానికి సాహసించలేకపోయారు. హజ్రత్ అబూబకర్ (రజి) హయాంలో సిరియా ఇస్లామీ సైన్యాధిపత్య బాధ్యతలు ‘హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)’ అధీనంలో ఉండేవి. హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా ఎన్నికయిన తరువాత హజ్రత్ అబూఉబైదా బిన్ జర్రాహ్ (రజి)ను, ఖాలిద్ బిన్ వలీద్ (రజి) స్థానంలో సైన్యాధిపతిగా నియమించారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) ప్రతిభా నైపుణ్యం గల అగ్రశ్రేణి సైనికాధికారి. సమరభూమిలో శత్రు సైనికులను చిత్తు చేయడంలో ఆయన ఆరితేరిన దిట్ట. అయితే, ఆయన మితిమీరిన ఆవేశంతో ముస్లిం సైనికుల ప్రాణాలనిరకాటంలో పెడతారేమోనన్న ఆలోచన హజ్రత్ ఉమర్ (రజి)ను వెంటాడుతుండేది. హజ్రత్ అబూఉబైదా (రజి) ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన సహాబాలలో ఒకరు. పైగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు సన్నిహితులు కూడాను, ఆయన కనికర హృదయం గలవారు. ఆచితూచి అడుగువేసి ముస్లింల ప్రాణాలకు అపాయం కలుగకుండా యుద్ధ సన్నాహాలు చేసేవారు. హజ్రత్ అబూఉబైదా (రజి) ఎల్లప్పుడూ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)తో సంప్రదిస్తూ ఉండేవారు. యుద్ధ మైదానంలో సైనికులు మోహరించే స్థానం సులభంగా విజయం సాధించటానికి శత్రుసైన్యపు ఏ భాగంపై గురి పెట్టాలి – ఇత్యాది నిర్ణయాలన్నీయు ఖాలిద్ బిన్ వలీద్ తో సలహా సంప్రదింపులు జరిపిన తరువాతనే తీసుకోబడేవి.

యర మూక్ యుద్ధంలో ఈరానీయులను ఓడించిన తరువాత ముస్లింలు డెమాస్కస్ నగరం వైపు పురోగమించారు. ఆ ప్రాంతం మొత్తాన్నీ నలువైపుల నుండి ముట్టడించారు. ఒకరోజు ‘క్రైస్తవ సైన్యాధికారి ఇంట పుత్రుడు జన్మించాడన్న వార్త ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కు అందింది. ఈ సందర్భంలో నగర ప్రముఖులందరూ అతని భవనంలో విందు జరుపుకోవడానికి వచ్చారు. క్రైస్తవులు రక్షణార్థం తమ నగరం చుట్టూ కందకాలు త్రవ్వి వాటిని నీటితో నింపి యుంచేవారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) కందకాన్ని ఈదుకుంటూ పోయి త్రాడు సహాయంతో ప్రహరిగోడపై ఎక్కిపోయారు. లోనికి దుమికి నగర ప్రముఖ ప్రవేశద్వారాన్ని తెంచారు. అంతలోనే ఇస్లామీ సైన్యం మొత్తం నగరంలోనికి ప్రవేశించింది. అప్పటికి క్రైస్తవ సైన్యాధికారులు మత్తులో మునిగి కదలలేని స్థితిలో పడి ఉన్నారు. వారెవ్వరూ యుద్ధానికి సాహసించలేదు. కొద్దిసేపటికి వారు ‘శరణం’ ‘శరణం’ అన్న నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. ఈ విధంగా ముస్లింలు డెమాస్కస్ నగరాన్ని సులభంగా జయించగలిగారు. ‘డెమాస్కస్ ‘ తరువాత సిరియా దేశ ప్రముఖ నగరాలు ఒక్కొక్కటీ ముస్లింల అధీనంలోకి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో తీవ్ర ప్రతిఘటనలు కూడా జరిగాయి. ఈ యుద్ధాల్లో ‘అజ్ నాదీన్ ‘ యుద్ధం అత పెద్దది. ఈ ప్రాంతం క్రైస్తవ నాయకుల పట్టులో ఉండేది. పైగా అక్కడి నాయకుడు రణనీతిలో సాటిలేని మేటి. కాని ఈ యుద్ధంలో అతని ప్రతిభా నైపుణ్యాలేవీ పనికి రాకుండా పోయాయి. క్రైస్తవులకు ఘోర పరాజయం చవిచూడవలసి వచ్చింది. ఈ నగరాన్ని జయించిన తరువాత ముస్లిం సైనికులు ‘బైతుల్ మఖ్దిస్ ‘ను ముట్టడించారు.

ఈ నగరం దైవ ప్రవక్తల జీవిత విశేషాలకు నిలయం. యూదులు, క్రైస్తవుల మాదిరిగా ముస్లింలు కూడా ఈ నగరాన్ని పవిత్రమైనదిగా తలపోస్తారు. క్రైస్తవులు ‘బైతుల్ మఖ్దిస్’ను ముస్లింలకు అప్పగించటానికైతే అంగీకరించారు కాని, వారు హజ్రతీ ఉమర్ (రజి)ను స్వయంగా విచ్చేసి వాగ్దాన పత్రం పై సంతకం చేయాలని షరతు విధించారు.

హజ్రత్ ఉపుర్ (రజ) తన స్థానంలో హజ్రత్ అలీ (రజి)కి కార్యబాధ్యతలు అప్పగించి ‘బైతుల్ మఖ్దిస్’కు పయనించారు. ఆయన వెంట ఎలాంటి సైనిక బలగాలు లేవు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సాన్నిధ్యంలో జీవనం గడిపిన కొందరు వృద్ధ వయస్కులు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఆ చిన్నపాటి బృందాన్ని తిలకించడానికి ఆబాల గోపాలమంతా తరలి వచ్చింది. తమ చక్రవర్తుల దర్పాన్ని మందీ మార్బలాన్ని తిలకించే సిరియా ప్రజానీకం ఈ సాధారణ మానవ సమూహాన్ని చూచి ఆశ్చర్యపోయింది. స్వయంగా ఖలీఫా ఆధిపత్యం వహించే ఈ బృందంలో డప్పు వాయిద్యాలుగానీ, నర్తకీలుగానీ, భజనపరులుగానీ ఎవరూ లేకపోవడంతో సిరియా ప్రజానీకం నివ్వెరపోయింది. మరి అదే రోమన్ రాజులు ప్రయాణించేటప్పుడు రాజు వాహనానికి కిరువైపులా సైనిక సమూహాలు, ఖడ్గం చేతపట్టుకొని పట్టువస్త్రాలు ధరించినవారు ఒకవైపు ఉండగా, ఊరేగింపు ముందు భాగంలో ‘పిల్లలు జరగండి’. రాజు గారొస్తున్నారు. అని నివాదం చేసే నినాదకర్తలు మరియు వెనుక భాగంలో తినుభండారాలు, టెంటులను మొదలగు వాటిని మోసుకు వస్తున్న ఒంటెలు ఉండేవి. రాజ వాహనం తిష్టవేసిన ప్రదేశమంతా ఒక నగరంగా వెలసి పోయేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) సారధ్యంలో వచ్చినవారు ముతక దుస్తులు వేసుకొని ఉన్నారు. వాటిపై చర్మపు అతుకులు ఉన్నాయి. యాత్రీకులు ధరించే టాప్ ఒకరు ధరించి యుండగా, మరికొందరు తలపాగా కట్టుకొని ఉన్నారు. వస్త్రధారణరీత్యా వారిలో రాజెవరో, రైతెవరో తెలియని పరిస్థితి। వారు దిగినచోటనే గుడారములు కట్టారు. ముందుగా ‘వుజ’ చేసి ‘అజాన్’ ఇచ్చారు. నమాజ్ చేశారు. అనంతరం సంచుల నుండి తినుబండారాలు బయటకు తీసి సహపంక్తి భోజనం చేశారు. భోజనంలో పిండి. కొన్ని ఖర్జూరములు, జున్నుముక్కలు, మాంసం మొదలగునవి ఉన్నాయి. అన్న పానీయాలు పూర్తయిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత సంఘటనలు లేదా ప్రాపంచిక స్థితిగతులపై సింహావలోకనం జరిపారు. వారి ముఖాలు దేదిప్యమానంగా వెలిగిపోతున్నాయి అయితే వారి చూపుల్లో చూపులు కలిపే ధైర్యం ఎవరికీ లేదు. అదో అనిర్వచనీయమైన పరిస్థితి.

హజ్రత్ ఉమర్ (రజి) ‘బైతుల్ మఖ్దిస్’ చేరుకోగానే కొందరు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. వారు పట్టు వస్త్రములు ధరించి ఆకర్షణీయంగా ఉన్నారు. హజ్రత్ ఉమర్ (రజి)కు కోసం వచ్చింది. ‘మీరు పరాయి రాజ్యంలోకి రాగానే ఇక్కడి తళుకు బెళుకులకు ఆకర్షితులైపోయారా? అని మండిపడ్డారు. “ఆహాఁ అదికాదు. ఈ వస్త్రాల లోపల మేము కవచాలు ధరించి ఉన్నాము” అని వారు సమాధానమిచ్చారు. అప్పుడు గాని ఆయన కోపం చల్లారలేదు.

హజ్రత్ ఉమర్ (రజి) బైతుల్ మఖ్దిస్ లో అనేక రోజులు బస చేశారు. క్రైస్తవులను కలుసుకున్నారు. క్రైస్తవ ప్రార్ధనాలయాన్ని సందర్శించారు. వాగ్దాన పత్రంపై సంతకం చేశారు. ముస్లింలను కలిశారు. వారికి హితబోధ చేశారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఅజ్జన్ ‘హజ్రత్ బిలాల్ (రజి) ఆ సందర్భంలో అక్కడే ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానంతరం ఆయన ‘అజాన్’ ఇవ్వలేదు. ఆ రోజు ఆయన హజ్రత్ ఉమర్ (రజి) కోరికపై ‘అజాన్’ ఇచ్చారు. ఆయన మధురమైన కంఠం నుండి అజాన్ పదాలు జాలువారుతుంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితపు మధుర ఘడియలు గుర్తొచ్చి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. అక్కడ హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చదివారు. తరువాత కొందరు ముస్లింలు ఆ ప్రాంతంలో ఒక మస్జిదు నిర్మించారు. ఆ మస్జిదు హజ్రత్ ఉమర్ (రజి) పేరుతో నేటికీ చిరస్మరణీయంగా మిగిలి ఉంది.

ఆ ఈ సంఘటన జరిగిన రెండవ సంవత్సరం సిరియాలో భయంకర మహమ్మారి ప్రబలింది. ఈ వార్త విన్న హజ్రత్ ఉమర్ (రజి) ఆందోళన చెంది వెంటనే సిరియాకు బయలుదేరారు. అప్పటికే మహమ్మారి విస్తృతంగా వ్యాపించింది. అందువల్ల దానిని నిర్మూలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయారు. సిరియా ప్రయాణ సమయంలో ఆయన ఒంటరిగా వెళ్ళారు. ఆయన వెంట కేవలం ఒక బానిస మాత్రమే ఉన్నాడు. ఇద్దరికీ ఒకే ఒంటె ఉంది. దానిపై హజ్రత్ ఉమర్ (రజి) మరియు ఆ బానిస వంతుల వారీగా కూర్చునేవారు. సిరియా చేరేసరికి బానిస ఒంటె పై కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఒంటె పగ్గాలు పట్టుకుని ముందు నడుస్తున్నారు. అక్కడి అధికారులు, అనధికారులు ఈ దృశ్యం చూచి నివ్వెరపోయారు.

ఈ మహమ్మారి వలన ముస్లింలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయారు, అపారమైన ప్రాణనష్టం సంభవించింది. దాదాపు పదిహేను వేల ముస్లింలు మృత్యువాతన పడ్డారు. వారిలో హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రజి), హజ్రత్ అబూ ఉబైదా బిన్ జర్రాహ్ (రజి) కూడా ఉన్నారు. మరణానంతరం హజ్రత్ ఉమర్ (రజి) ఆయన ఆస్తిపాస్తులను వారి వారసులతో పంచిపెట్టారు. ప్రజల్లో జీతభత్యాలు, ఉపకారవేతనాలు పంచిపెట్టారు. ఈ కార్యసాధనకై ఆయనకు సిరియాలోని పలు ప్రాంతాలలో పర్యటించవలసి వచ్చింది.

అప్పుడు ఈజిప్ట్ దేశం కూడా రోమను సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉంది. ఖురైషీయులలో ప్రముఖులైన హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఇస్లాం స్వీకరణకు ముందు అక్కడే ఉండేవారు. అక్కడి పరిస్థితులపై ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆయన హజ్రత్ ఉమర్ (రజి)తో ఈజిప్ట్ పై దండయాత్రకు అనుమతివ్వమని కోరారు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి) అంగీకరించలేదు. కానీ హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) మరొకసారి అనుమతి కోరగా, ఆయన అనుమతించారు. కాని ఈజిప్ట్ చేరకముందు నా ఉత్తరం గనుక మీకు అందితే తక్షణం వెనక్కి తిరిగి రావాలి అని తాకీదు చేశారు. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి) ఈజిప్ట్కు చేరుకున్న తరువాత హజ్రత్ ఉమర్ (రజి) ఉత్తరం అందింది. అప్పటికే ఆయన ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతాన్ని దాటి యున్నారు. అంచేత ఆయన వెనుతిరగకుండా ముందుకు పయనించారు.

అమ్ర్ బిన్ ఆస్ (రజి) వెంట నాలుగువేల మంది సైనికులు ఉన్నారు. ఈజిప్ట్ అధినేత అయిన ‘మఖూఖష్’ భారీ సైన్యంతో ఆయన్ను ఎదిరించడానికి వచ్చారు. అనేకమార్లు పోరాటాలు జరిగాయి. అన్ని విధాలా ముస్లింలదే పై చేయి అయింది. చివరకు ‘మఖూఖష్’ ఒక కోటలో కూర్చొని యుధ్ధపుణ్యహం రచించసాగారు. ఈ కోట నైలునదీ తీరాన ఉంది. నదీ మార్గము నుండి కోటవాసులకు ఆహార సామగ్రి సరఫరా అయ్యేది. హజ్రత్ అమ్ర్ బిన్ ఆస్ (రజి), హజ్రత్ ఉమర్ (రజి)కు ఉత్తరం వ్రాసారు. ఆయన ప్రముఖ నాయకుడైన హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) సారథ్యంలో పదివేల సైన్యాన్ని పంపించారు. ఈ సైన్యం ఏడు నెలల వరకూ కోటను ముట్టడించింది. కాని కోటను జయించడంలో విఫలమయ్యింది. ఒకరోజు హజ్రత్ జుబైర్ బిన్ అవ్వామ్ (రజి) ఖడ్గం తీసుకొని వల త్రాడు సహాయంతో కోట ప్రహరీ గోడపై ఎక్కిపోయారు. కొందరు సహబాలు కూడా ఆయన్ను అనుసరించారు. వారి నినాదాలకు రోమన్ సైన్యం భయభ్రాంతులకు లోనయింది. ఒక్కసారిగా ముస్లిం సైన్యమంతా ‘అల్లాహు అక్బర్’ అని నివారం చేయగా, అది కోటలు బీటలు వారినట్లు ప్రతిధ్వనించింది. రోమన్ సైనికులు భయపడి పారిపోవటానికి మార్గం వెతకసాగారు. అంతలో హజ్రత్ జుబైర్ (రజి) గోడపై నుండి లోపలికి దూకి కోట ముఖద్వారాన్ని తెరిచారు. ముస్లిం సైన్యమంతయూ కోటలోకి జొరబడింది. క్రైస్తవ సైన్యం లొంగిపోయింది. ఈ విధంగా ముస్లింలు కోటను సునాయాసంగా జయించగలిగారు.

ఈ విజయానంతరం ముస్లింలు ‘అస్కందరియా’ (అలెగ్జాండ్రియా) పట్టణం వైపు పురోగమించారు. తీవ్ర ప్రతిఘటన తరువాత ఆ నగరం వశమయింది. దాంతో క్రైస్తవుల ప్రాబల్యం దాదాపు అంతరించింది. అనంతరం ఈజిప్ట్ ప్రధాన పట్టణాలన్నీ ముస్లింల హస్తగతమయ్యాయి.

హజ్రత్ ఉమర్ (రజి) పదిన్నర సంవత్సరాలు ఖలిఫాగా ఉన్నారు. పైన ప్రస్తావించిన యుద్ధాలన్నీ ఆయన హాయాంలోనే జరిగాయి. దాదాపు ఈరాన్ సామ్రాజ్యమంతా ముస్లింల అధీనంలోకి వచ్చేసింది. కాని రోమన్ సామ్రాజ్యపు కాంతభాగం మాత్రమే ముస్లింలు జయించగలిగారు. ఆసియా ఖండపు ఒక ప్రాంతం విడిచి ఐరోపాలో కూడా వారి పరిపాలన అనేక సంవత్సరాలు కొనసాగింది ఈరానీయులు అగ్నిని పూజించేవారు మరియు రోమన్లు, క్రైస్తవులు. కాని యుద్ధ మైదానంలో ఇరువురూ ఆరితేరినవారే రోమన్ సైన్యంలో ఏనుగులు ఉండని మాట వాస్తవమే. ఈరానీయులలో రోమన్లకన్నా జాత్యాభిమానం అధికంగా ఉండేది.

ప్రపంచంలో ఎందరో విజయధీరులు ఉన్నారు. కానీ ముస్లింల విజయపరంపర తీరే వేరు. వారు ఇతరుల మాదిరిగా నిస్సహాయులపై చేయి చేసుకోలేదు. పిల్లలు, వృద్ధుల జోలికి పోలేదు. తమను ఎదిరించడానికి వచ్చిన వారితోనే వారు యుద్ధం చేశారు. వెళ్ళిన చోటల్లా వారు చెట్లను, పంటపొలాలను నాశనం చేయలేదు. వెళ్ళిన ప్రతిచోటా వీరు తమదైన శైలిలో ఎదుటివారి మనస్సులను గెలుచుకున్నారు. యర్ మూక్ యుద్ధ సందర్భంలో ముస్లింలు సిరియా నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడు ‘అల్లాహ్ మిమ్మల్ని మళ్ళీ మా వైపు వంపుగాక’ అని విలపిస్తూ క్రైస్తవులు వీడ్కోలు చెప్పారు.

ఆనాడు ముస్లిమేతరులకు మతావలంబన విషయంలో పూర్తి స్వాతంత్ర్యం ఉండేది. వారు తమ మత సిద్ధాంతాల కనుగుణంగా ప్రార్థనలు జరిపేవారు. వారిని ఆపే సాహసం ఎవ్వరూ చేయలేకపోయేవారు. ముస్లింలు, ముస్లిమేతరులపై ఎలాంటి ఒత్తిడి తెచ్చినా శిక్షించబడేవారు. ఒకప్పుడు ఒక ముస్లిం, ఒక ముస్లిమేతరుడ్ని హతమార్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే హంతకుడిని వారి బంధువులకు అప్పగించారు. వాస్తవమేమిటంటే మహాప్రసక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన ప్రియ సహచరులు దైవభీతితో, బాధ్యతాయుత జీవసం గడిపేవారు. ముస్లింల ఈ సదాచార వైఖరికి ముస్లిమేతరులు ప్రభావితులై వారివైపు మొగ్గు చూపేవారు. వారు చేసిన సత్కార్యాలు, దైవపరాయణత, నిస్వార్ధగుణం మెందలను వాటిని చూసి ముస్లిమేతరులు ఇస్లాం స్వీకరించేవారు. ఇది కాకుండా యుద్ధ మైదానాల్లో నిరాయుధులైన ముస్లింలు హేమా హేమీలను పల్టీ కొట్టించిన తీరుసు చూచి ముస్లింల విజయాల వెనుక అల్లాహ్ హస్తం ఉందని నమ్మి కూడా అనేకులు ఇస్లాం స్వీకరించారు.

ఈ సంగ్రామాలన్నింటిలో హజ్రత్ ఉమర్ (రజి) స్వయంగా పాల్గొనకపోయినా, యుద్ధ సన్నాహాలు అన్నీ ఆయన నేతృత్వంలోనే జరిగాయి. ‘ఖాదసియా’ యుద్ధంలో హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ముస్లిం సేనాధిపతిగా వ్యవహరించినప్పటికీ హజ్రత్ ఉమర్ (రజి) మధీనాలో కూర్చొనే సంకేతాలు పంపేవారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని బేరీజు వేసేవారు. ఆయన వాయువేగంతో చూసుకువెళ్ళే అశ్వరూఢులు బలగమొకటి తయారు చేసి ఉంచారు. వారి ద్వారా ఆయనకు ఎప్పటికప్పుడు వార్తలందేవి.

హజ్రత్ ఉమర్ (రజి) సహాబాలతో సంప్రదించి రాజ్యపరిపాలన కొనసాగించేవారన్న విషయం ఇదివరకే వివరించబడింది. రాజ్యసంక్షేమం కోసం సలహామండలి తీసుకొనే కీలక నిర్ణయాలకు ‘మస్జిదె నబవీ’ వేదికగా ఉండేది. పరిపాలనా దక్షత గల వివేచనాపరులు మరియు విషయావగాహన గల సహాబాలు ఈ సలహామండలిలో సభ్యులు. సమావేశానికి అప్పుడప్పుడు సైనికాధికారులను కూడా పిలిపించేవారు. అవసరాన్ని బట్టి ఇది వరకు ఇస్లాం స్వీకరించిన ఈరాన్ దేశవాయకుడు ‘హర్ మ్ జాన్ ‘ ను సంప్రదింపుల నిమిత్తం కబురంపేవారు. హజ్రత్ ఉమర్ (రజి)కు స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం లేదు.

హజ్రత్ ఉమర్ (రజి) ఇస్లామీయ ప్రభుత్వాన్ని ఎనిమిది మండలాలుగా విభజించారు. ‘ఆహ్వాజ్’ మరియు ‘బహరైన్’లను కలిపి ఒక మండలము… ఇదే విధంగా సీస్తాన్, మక్రాన్ మరియు కిర్మాన్ లను కలిపి వేరొక మండలముగా చేశారు. ‘ఖిరాసాన్’ మరియు ‘తిబ్రీస్థాన్’లను వేరు- వేరు మండలాలుగా ఉంచారు. దక్షిణ ఈరాన్ ప్రాంతం కూడా వేరొక మండలంగా విభజింపబడింది. ఈజిప్ట్, సిరియా మరియు ఇరాఖ్ లను రెండు భాగాలుగా విభజించారు. మండలానికొక అధ్యక్షుడిని నియమించారు. ఈ మండలాధ్యక్షులు పరిపాలనా వ్యవహారాలతో పాటు ‘జుమా నమాజు’కు సారథ్యం కూడా వహించేవారు. ఇది వరకు మండలాధ్యక్షులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించేవారు. కాని హజ్రత్ ఉమర్ (రజి) పలు చోట్ల న్యాయస్థానాలు నిర్మించి న్యాయమూర్తులను వేరుగా నియమించారు. మండలాధ్యక్షులు సాధారణ జీవితాన్ని గడిపేవారు. అందరి మాదిరిగా వారు కూడా బజారుల్లో తిరిగేవారు. వారికెలాంటి సెక్యూరిటీ ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ వారిని సులభంగా కలనుకోగలిగేవారు. అధికారులెవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఋజువైతే వారిని అందరి సమక్షంలో శిక్షించేవారు. ప్రతి మండలంలో మండలాధ్యక్షులు వ్యాయమూర్తులతో పాటు ప్రధాన మున్షీ . పోలీసు అధికారి మరియు కోశాధికారి ఉండేవాడు. భూమి శిస్తు వసూలుకై ప్రత్యేక అధికారి నియామకం జరిగేది.

ఇరాఖ్ మండలం రెండు ప్రాంతాలుగా విభజింపబడి ఉండింది. ఒక ప్రాంతానికి ‘కూఫా’ మరొక ప్రాంతానికి ‘బస్రా’ రాజధానులుగా ఉండేవి. ఈ రెండు పట్టణాలు హజ్రత్ ఉమర్ (రణి) కాలంలో ఆవిర్భవించినవే. ‘దజ్లా’ నది పరివాహక ప్రాంత వాతావరణం అరబ్బులకు సానుకూలంగా ఉండేది కాదు. అందువల్ల హజ్రణ్ ఉమర్ (రజి) అరబ్బులకు అనుకూలంగా ఉండే ప్రాంతం కోసం అన్వేషించే వారు. చివరకు ‘ఫరాత్’ నది పరివాహక ప్రాంతపు పశ్చిమంలో ఇసుక ప్రాంతమొకటి లభించింది. దానికి ‘కూఫా’ అను నామకరణం చేశారు. ఈ పట్టణం సముద్ర తీర ప్రాంతంలో రాళ్ళూ, రప్పలతో కూడిన ఇసుకపుడమిపై వెలసినది. ఆ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేనందున ముస్లింలు ‘దజ్లా’ నది నుండి ఒక కాలువను త్రవ్వారు. ఫలితంగా మంచినీటి సమస్య దూరమైంది.

హజ్రత్ ఉమర్ (రజి) ఖలీఫాగా నియుక్తులైన తరువాత అనేకచోట్ల కాలువలు నిర్మించారు. జలవనరులను సమకూర్చారు. బావులు, సత్రములు, ధర్మశాలలు, వసతి గృహములు నిర్మించారు. భూమిశిస్తు వసూలు చేయబడేది. కాని హజ్రత్ ఉమర్ (రజి) క్రొత్తగా మరొకసారి భూములను సర్వే చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రెవిన్యూ వ్యవస్థను పునర్నిర్మించారు. ప్రజాధనాన్ని (బైతుల్మాల్) నెలకొల్పారు. విద్యాలయాలు స్థాపించారు. సైనిక కాలనీలు నిర్మించారు. ప్రారంభదశలో సైనికుల జాబితా ఉండేది కాదు. వారికి సక్రమంగా జీతభత్యాలు కూడా లభించేవి కావు. హజ్రత్ ఉమర్ (రజి) సైనికుల జాబితాను రూపొందించి వారికి జీతభత్యాలను ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాలలో ఎనిమిది భద్రతాదళాలు ఎల్లప్పుడూ సహారా కాస్తుండేవి. వాటిలో అనేకమంది సైనికులు, నాలుగువేల అశ్వములు ఎల్లప్పుడూ సంగ్రామానికి సిద్ధంగా ఉండేవి. ఏటేటా సైన్యంలో ముప్పైవేలమంది సైనికులు చేరేవారు. యుద్ధ సమయాల్లో సైనిక బృందంతో పాటు వైద్య బృందం కూడా ఉండేది. సైన్యం రెండు భాగాలుగా విభజింపబడి ఉండేది. ఒకటి పాదచారులు బృందం కాగా రెండవది వాహన బృందం.

మూడు ప్రధాన ఆదాయపు శాఖలు ఉండేవి, ఒకటి భూమిశిస్తు, రెండవది జకాత్ (జకాత్ చెల్లించుట ప్రతి ముస్లిం విధి), ముస్లిమేతరుల నుండీ జకాత్ తీసుకోబడేది కాదు, కాని ఇరవై ఏడు సంవత్సరముల నుండి యాభై సంవత్సరములు గల వారికి కొంత మొత్తంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉండేది. దీని పేరు ‘జిజియా‘. వికలాంగులు మరియు వృద్ధుల నుండి జిజియా తీసుకోబడేది కాదు. నిజానికి ముస్లిమేతరుల నుండి ఈ పన్ను సైనిక సహాయార్థం తీసుకోబడేది. ముస్లిం సైన్యంలో సైనికులుగా చేరిన ముస్లిమేతరులకు ఈ పన్ను నుండి మినహాయింపు ఉండేది. ‘యర మూక్’ యుద్ధానికి ముందు ముస్లింలు తాము జయించిన ప్రాంతాలు వదిలి వెళ్ళేటప్పుడు వారు తాము వసూలు చేసిన జిజియా పన్ను పాలితులకు తిరిగి ఇచ్చారు. ‘మీ ధనమానాలను పరిరక్షించే స్థోమత లేనప్పుడు, మీ నుండి పన్ను ఎలా ఎలా తీసుకోగలము? అని వారు అన్నారు.

ముస్లింల చే జయింపబడిన ప్రాంతాల యందు నివసించే ముస్లిమేతర ప్రజా సమూహమును “జిమ్మీ“గా పిలువబడుతుంది. ‘జమ్మీ’లపై అత్యాచారం చేయటానికి ఏ విశ్వాసీ సాహసించ లేకపోయేవాడు. జమ్మీలతో ముస్లింల వ్యవహారసరళి ఒకే విధంగా ఉండేది. జిమ్మీలలో ఎవరైనా వృద్ధాప్యానికి చేరి అసరాలేని అభాగ్యులై జరుగుబాటు కష్టతరమైనప్పుడు వారికి ‘జిజియా’ నుండి పూర్తి మినహాయింపు ఇచ్చి, వారి జరుగుబాటుకై ‘బైతుల్మాల్’ నుండి ఉపకారవేతనములు చెల్లించటం జరిగేది. హజ్రత్ ఉమర్ (రజి) జిమ్మీలతో పాటు బానిసల విషయంలో కూడా చింతాగ్రస్తులై ఉండేవారు.

హజ్రత్ ఉమర్ (రజి) కాలంలో వ్యవసాయరంగం అభివృద్ధిపథంలో పయనించసాగింది. దీనికి కారణం వ్యవసాయరంగంలో శీఘ్రగతిన జరిగిన సంస్కరణలే. ఆయన అనేకచోట్ల కాలువలు త్రవ్వించారు. ‘దజ్లా’ మరియు ‘పరాత్’ నదులకు ఆనకట్టలు నిర్మించారు. ‘నైలు’ ‘భిల్ జిమ్’ నదుల మధ్య కాలువ త్రవ్వించారు. దాని వలన ఈజిప్ట్ నుండి ఆహారధాన్యాలు ఓడలలో అరబ్ దేశానికి చేరేవి. రాత్రి సమయాల్లో సహారా కోసం ప్రత్యేక పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఖైదీల నుంచడానికి కారాగారములు కట్టించారు. అరబ్బుల్లో కవిత్వాలు చర్చనీయాంశంగా ఉండేవి. వారిలో నక్షత్ర విద్యనభ్యసించే మోజు కూడా అధికంగా ఉండేది. రోమ్ మరియు ఈరాన్ ఆధిపత్యంలో ఉన్న అరబ్ రాజ్యాలకు చెందిన గాయకులు కవులకు, కవిత్వాలకు విపరీతమైన ఆదరణ ఇచ్చేవారు. వారి ఆదరాభిమానాల కారణంగా కవిత్వం, చరిత్ర మరియు నక్షత్ర విద్యలు ఖ్యాతి గడించాయి. కాని అరబ్బుల్లో విద్యాభ్యాసం తక్కువే. ప్రజలు కవితలను కంఠస్తం చేసుకునేవారు. ఈ పరంపర చాలాకాలం వరకు ఈ విధంగానే నడిచింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జన్మించినప్పుడు అరబ్బుల్లో అక్షరాస్యుల శాతం చాలా తక్కువ. బద్ర్ సంగ్రామంలో బందీలు గావింపబడిన ఖురైష్ సైనికులు పరిహారం (ఫిదియా) చెల్లించి బంధ విముక్తులయ్యారు. వారిలో పరిహారం చెల్లించలేని వారు కొందరు ఉన్నారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిలోని ఒక్కొక్కరు పదేసిమంది ముస్లింలకు విద్యబోధించి ముక్తిని పొందవచ్చని ఆదేశించారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించే నాటికి అరబ్బుల్లో అక్షరాస్యుల సంఖ్య పెరిగింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో ఈ అక్షరాస్యత తారస్థాయికి చేరింది. హజ్రత్ ఉమర్ (రజి) హయాంలో విద్యాలయాలు వెలిసాయి. ఉపాధ్యాయుల నియామకం జరిగింది. వారికి ప్రజాధనం (బైతుల్మాల్) నుండి జీతాలు లభించేవి.

హజ్రత్ ఉమర్ (రజి) అతి నిరాడంబరంగా జీవించేవారు, కానీ అయన ఖిలాఫత్ సమయంలో రోమ్ ఈరాన్ ప్రభావం వల్ల అరబ్బుల ఆచార ‘వ్యవహారాల్లో అనేక మార్పులు టోటు చేసుకున్నాయి. మొదటవారు అతి సామాన్యమైన ఇళ్లల్లో నివసించేవారు. హజ్రత్ ఉమర్ (రజి) ఖిలాఫత్ సమయంలో రోమ్ మరియు ఈరాన్లు జయింపబడిన పిదప వారు పక్కా ఇళ్లను నిర్మించసాగారు. అందులో రోమ్ మరియు ఈరాన్లో వాస్తుకళ ఉట్టిపడేది. ఒకప్పుడు అరబ్బులు దేహభాగమంతయూ కప్పబడి ఉండునట్లుగా (పాదాల వరకు) అంగి ధరించేవారు. దానిపై ఒక చర్మపు పట్టీ మరియు ఒంటె వెంట్రుకలతో చేయబడిన నగిషీ ఉండేది. కాని యుద్ధ సమయాల్లో మాత్రం వారు బిగుతైన దుస్తులు ధరించేవారు. పట్టణాల్లో అంగీ, లాగులు ధరించే సంప్రదాయం ండేది. ఈరాన్, రోమ్ రాజ్యాల వక్త్రధారణతో ప్రభావితులైన ప్రజలు ‘ఖుబా’ ధరించేవారు. ఇది పొడవైన చేతులు గల కోటు, తలపై తలపాగా ఒకటి ధరించేవారు. భుజాలు, మెడపై ఎండ తాపానికి లోనవకుండా రుమాలు వేసుకునేవారు. స్త్రీలు వివిధ డిజైనులు గల సరళ దుస్తులు ధరించేవారు. తలపై వోణీ కప్పుకునేవారు. బయటికి వెళ్ళేటప్పుడు శరీరమంతా కప్పబడి ఉండేలా తలపై నుండి దుప్పటి వేసుకునేవారు.

హజ్రత్ ఉమర్ (రజి), తన వలెనే ఇతరులు సాధారణ జీవన కూడా శైలినవలంబించాలని కాక్షించేవారు. ఆయన జీవించి ఉన్నంతకాలం ముస్లింలు సంప్రదాయబద్ధంగా వ్యవహరించేవారు. అరబ్బులు సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించేవారు కాదు. కాని మదీనాకు దూరంగా సిరియా, ఈజిప్ట్ దేశాల్లో నివసించేవారు కాలక్రమేణా ఆధునికతకు ప్రభావితులు కాసాగారు. అధికారులెవరైనాసరే అవధుల్ని అతిక్రమిస్తే మాత్రం హజ్రత్ ఉమర్ (రజి) వారిని కఠినంగా శిక్షించే వారు. ఒకప్పుడు ఈజిప్ట్ అధిపతియైన ‘అయాజ్ బిన్ ఘనమ్’ (రజి) పలుచటి వస్త్రాలు ధరిస్తారని, ఇంటి ముందు కాపలా దారుల్ని నియమించారని ఫిర్యాదు వచ్చింది. హజ్రత్ ఉమర్ (రజి) పరిశోధనార్ధం ‘ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)’ ను ఈజిప్ట్ పంపారు. ఈజిప్ట్ చేరిన ముసల్లమా (రజి) అయాజ్ను పలుచటి వస్త్రాలలో చూశారు. ఇంటిముందు కాపలాదారులు కూడా ఉన్నారు. అదే స్థితిలో ఆయన్ను మదీనా తీసుకెళ్ళారు. హజ్రత ఉమరి (రజి) ఆయన ఒంటిపై నుండి మెత్తని సన్నని వస్త్రాలు తీయించి, వెంట్రుకలతో చేయబడిన గరకు దళసరి వస్త్రాలు తొడిగించి, మేకలు మేపేందుకు అడవికి వెళ్ళమని ఆదేశించారు. ఈ శిక్ష ఫలితంగా ఆయాజ్ జీవితాంతం ఎన్నడూ పలుచని దుస్తులు ధరించలేదు.

హజ్రత్ సాద్ బిన్ వఖాస్ (రజి) ‘కూఫా’లో రాజభవనం ఒకటి నిర్మించారు. అందులో ఒక ‘దివాణం’ కూడా ఉండేది. హజ్రత్ ఉమర్ (రజి), ముహమ్మద్ బిన్ ముసల్లమా (రజి)ను దివాణాన్ని దహించమని ఆదేశించారు. ఖలీషా ఆదేశం పాటించబడింది. సాద్ బిన్ వఖాస్ (రజి) ఈ కార్యమంతటినీ మౌనంగా తిలకిస్తూ కూర్చున్నారు.

హజ్రత్ ఉమర్ (రజి) నిరాడంబర జీవితానికి ఇంతగా ప్రాధాన్యమివ్వటానికి అనేక కారణాలు ఉన్నాయి. విలాసవంతమైన జీవితంలో మునిగి తేలినవారు, ప్రాపంచిక వ్యామోహానికి లోనైపోయి సోమరులుగా మెలుగుతారు. కష్టాలకు ఎదురీదలేరు. ఇలాంటి వారే ఇతర జాతుల సంప్రదాయాలకు బానిసలౌతారు.

హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల పట్ల కఠిసంగా వ్యవహరించేవారు. కాని ఆయన తనపై, తన కుటుంబీకుల పట్ల అంతకన్నా ఎక్కువ కఠిన వైఖరి నవలంబించేవారు. ఆయన ఎల్లప్పుడూ దళసరి దుస్తులు ధరించేవారు. పైగా వాటికి అతుకులు ఉండేవి. ఆయన ముస్లింలకు ప్రతిభయే కొలమానంగా భావించి, దాని ప్రకారం ఉపకారవేతనాలు చెల్లించేవారు. ఆయన ప్రజాధనం (బైతుల్మాల్) నుండి రోజుకు కేవలం రెండు దిర్హమ్ లో మాత్రమే పొందేవారు. సిరియా జయింపబడిన తరువాత రోము రాజ్యాధినేతలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. ఒకప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) సతీమణి ‘ఉమ్మెకుల్సుమ్ (రజి) రోము రాణికి సుగంధ ద్రవ్యాలతో నిండిన సీసాలు కొన్నింటిని కానుకగా పంపించారు. రోము రాణి ఆ సీసాల నిండా వజ్రాలు నింపి తిరిగి పంపించింది. హజ్రత్ ఉమర్ (రజి)కు ఈ సంగతి తెలియగా ఆయన తన భార్యతో ‘నిస్సందేహంగా, నీవు పంపిన సుగంధ ద్రవ్యాలు నీవె… కాని వాటిని తీసుకెళ్ళినవాడు ప్రభుత్వ రాయబారి అంటూ వజ్రములన్నింటినీ ప్రజాధనములో జమచేయించారు. ఒకసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. తేనె సేవించమని వైద్యులు సలహాఇచ్చారు. హజ్రత్ ఉమర్ (రజి) మస్జిదుకు వచ్చి, ముస్లింలను సమావేశపరచి వారితో “మీరు అనుమతిస్తే ప్రజాధనాగారం నుండి కొంత తేనె తీసుకుంటాను” అని అడిగారు.

తాను చేసిన తప్పును తెలుసుకున్న వెంటనే ఆయన క్షమాపణ కోరుకునేవారు. ఒకప్పుడు ఒకరిని కొట్టడానికి కొరడా ఎత్తారు. కాని తాను మితిమీరానని తెలిసిన వెంటనే క్షమాపణ కోరుకున్నారు. అప్పుడప్పుడు ప్రజలు కూడా ఆయనపై ధ్వజమెత్తేవారు. యుద్ధ రంగంలో పోరాటానికెళ్ళిన సైనికుల ఇండ్లకు వెళ్ళి వారికి కావలసిన సామాన్లు సమకూర్చేవారు. సైనికుల ఉత్తరాలు వస్తే వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్ళి ఇచ్చేవారు. చదివి వినిపించే వారు కూడాను, అవసరమైతే అక్కడే ఇంటి అరుగుపై కూర్చుని ఉత్తరాలు వ్రాసిచ్చేవారు.

హజ్రత్ ఉమర్ (రజి) మరణానికి కొంతకాలం ముందు హజ్ చేశారు. ఆయన ‘జిల్ హజ్జ్’ నెలలో హజ్ ఆచారాలు నెరవేర్చి మదీనా చేరుకున్నారు. శుక్రవారం రోజు మస్జిదులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో ఆయన దైవ ప్రాతినిధ్యం (ఖలీఫా) పై కొన్ని అంశాలను వివరించారు. ఆయన తన వారసుని విషయంలో చింతాగ్రస్తులై ఉన్నట్లు ఆ ప్రసంగం ద్వారా వ్యక్తమయింది.

మదీనాలో అబూలూలూ ఫేరోజ్ అను ఒక పారసీక బానిస ఉన్నాడు. ఒకరోజు అతడు హజ్రత్ ఉమత్ (రజి)తో నేను పగలంతా శ్రమించి సంపాదించిన కొద్ది మొత్తంలోంచి, నా యజమాని రెండు దిర్హమ్ లు వసూలు చేసుకుంటాడు అని ఫిర్యాదు చేశాడు. అందుకు హజ్రత్ ఉమర్ (రజి), నీ వృత్తి ఏమిటి? అని అడిగారు. అతడు ‘నేను కుమ్మరిని మరియు నగిషి కూడా వేస్తాను అని సమాధానమిచ్చాడు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) “రెండు దిర్హమ్ లు నీ కోసం పెద్ద సొమ్ము కాదే!?” అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రజి) సమాధానంతో సంతృప్తిపడని అబూలూలూ ఫేరోజ్ మాటువేసి రెండవరోజు హజ్రత్ ఉమర్ (రజి) నమాజ్ చేస్తూ ఉండగా, ఆయనపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాడు. హజ్రత్ ఉమర్ (రజి) ఆ స్థితిలో కూడా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)ను తన స్థానంలో నిలబెట్టారు. ఇటు హజ్రత్ ఉమర్ (రజి) గాయాలతో కొట్టుమిట్టాడుతుంటే అటు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) నమాజు సారథ్యం వహించారు.

అబూలూలూ ఫేరోజ్ ఇంకొందరిని గాయపరిచాడు. పట్టుబడిన తరువాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. నమాజ్ పూర్తయిన తరువాత ప్రజలు హజ్రత్ ఉమర్ (రజి)ను ఇంటికి తీసుకెళ్ళారు. హజ్రత్ ఉమర్ (రజి) ‘తనపై హత్యాయత్నం చేసిన వాడెవడు?’ అని అడిగారు’ ప్రజలు అబూలూలూ ఫెరోజ్ పేరు చెప్పారు. తనపై హత్యాయత్నం చేసినవాడు ముస్లిం కానందుకు ఆయన అల్లాహ్ కు కృతజ్ఞతలు వెలిబుచ్చుకున్నారు. ఆయన తన పుత్రుడైన అబ్దుల్లా (రజి)ను పిలిచి, నేను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన సమాధి గావింపబడాలనుకుంటున్నాను. అందుకు హజ్రత్ అయిషా (రజి) అనుమతి తీసుకోండి’ అని సందేశము పంపారు. అందుకు హజ్రత్ ఆయిషా (రజి) ‘నేను ఈ స్థలాన్ని నా కోసం ప్రత్యేకించుకున్నాను. అయితే హజ్రత్ ఉమర్ (రజి)కు ప్రాధాన్యత ఇస్తున్నాను” అంటూ అనుమతి ఇచ్చారు.

హజ్రత్ ఉమర్ (రజి) తరువాత ఆయన వారసుడు ఎవరు? అన్న ఉత్కంఠభరితమయిన ప్రశ్న తలెత్తింది. ప్రజలందరూ వారసుడి నియామకానికై హజ్రత్ ఉమర్ (రజి)ను సంప్రదించగా, ఆయన హజ్రత్ అలీ(రజ), హజ్రత్ సాది బిన్ వఖాస్ (రజి), హజ్రత్ జుబైర్ (రజి), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్(రజి), హజ్రత్ ఉస్మాన్ (రజి) మరియు హజ్రత్ తల్హా (రజి)ల పేర్లు ప్రస్తావించి, ‘వీరిలో ఎవరినైనా ఖలీఫాగా నియమించుకోండి’ అని సూచించారు. శరీరమంతా గాయాలతో రక్తసిక్తమై విపరీత బాధ కలుగుతున్నా ఆయన ఆ సమయంలో కూడా జిమ్మీలను మరువలేదు. తన తరువాత రాబోయే ఖలీఫాను ఉద్దేశిస్తూ, “నా తరువాత ఖలీఫాగా ఎన్నికయ్యేవారు మన అధీనంలో ఉన్న ఇతర మతావలంబీకులందరినీ ఆదరించాలి. వారి యెడల సత్ప్రవర్తనతో మెలగాలి” అని శాసించారు.

గాయపడిన మూడవ రోజు హజ్రత్ ఉమర్ (రజి) పరమపదించారు. (జిల్ హిజ్జా 23వ తేదీ హిజ్రి 23వ సంవత్సరం లేదా క్రీ.శ. 644). అప్పటికి ఆయన వయస్సు 63 సంవత్సరములు. ఆయన పదిన్నర సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆయన కుటుంబం చాలా పెద్దది. ఆయనకు ప్రజాధనం (బైతుల మాల్) నుండి లభించే జీతభత్యాలు జరుగుబాటుకు సరిపడేవి కావు. మరణం నాటికి ఆయన ఎనభై ఆరువేల దిర్హమ్ లు బాకీ ఉన్నారు. ఈ అప్పును ఆయన ఇల్లు అమ్మి తీర్చడం జరిగింది.

హజ్రత్ ఉమర్ (రజి) సంతానంలో హజ్రత్ హఫ్సా(రజి), హజ్రత్ అబ్దుల్లా (రజి) మరియు హజ్రత్ ఉబైదుల్లా (రజి) మరియు హజ్రత్ ఆసిమ్ (రజి) లు ప్రముఖులు. హజ్రత్ హఫ్సా (రజి) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణి. హజ్రత్ అబ్దుల్లా (రజి) దైవభీతికలవారు, సదాచార సంపన్నులు, ధర్మజ్ఞాని కూడానూ. ఆయన అగ్రశ్రేణి సహాబీలలో ఒకరుగా పరిగణించ బడేవారు. ఆయన హజ్రత్ ఉమర్(రజి) తోపాటే ఇస్లాం స్వీకరించారు, మహాప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం)తో కలిసి ఎన్నో ధర్మయుద్ధాల్లో పాల్గొన్నారు. తన తండ్రి మాదిరిగా ఆయన కూడా సత్యవాది, నిరాడంబరజీవి. మక్కానగరాన్నేలి ప్రజలను హింసాకాండకు గురిచేసిన మక్క గవర్నర్ హజ్జాజ్ బిస్ యూసుఫ్ ఒకప్పుడు కాబాలో ప్రసంగిస్తున్నప్పుడు. హజ్రత్ అబ్దుల్లా (రజి) లేచి ‘ఇతడు అల్లాహ్ విరోధి. ఎందుకంటే ఇతడు దైవాభిమానులను హతమార్చాడు’ అని నిర్భయంగా విమర్శించారు. ఆసిమ్, ఉబైదుల్లాలు కూడా సమర్థులు, పేరుమోసిన వారే. హజ్రత్ ఉలైదుల్లా (రజి) పరాక్రమశాలి. ప్రముఖ యుద్ధ వీరుడు. ఆయన మూడవ కుసూరుడు హజ్రత్ ఆసిమ్ (రజి) సౌశీల్యవంతులు, పండితులు.

హజ్రత్ ఆసిమ్ (రజి) ఆజానుబాహులు, మంచికవి కూడా. కవులందరూ కవిత్వాలల్లేటప్పుడు అనవసర పదజాలాన్ని ఉపయోగించేవారు. కాని హజ్రత్ ఆసిమ్ (రజి) కవిత్వం దీనికి వ్యతిరేకం. ప్రపంచ ఖ్యాతి గాంచిన హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ (రహ్మలై) ఈయన మనుమడే. ఆయన తన రెండున్నరేళ్ళ స్వల్ప పరిపాలనా వ్యవధిలో సాధించిన విజయాలు, చేసిన ఘనకార్యాలు అనితరసాధ్యం. ప్రళయకాలం వరకూ ప్రజలు ఆయన్ని మరువలేరు.

హజ్రత్ ఉమర్ (జి) ఖిలాఫత్ కాలంలో ప్రవేశ పెట్టిన సంస్కరణలు మానవజాతికి ఎంతో మేలును చేకూర్చాయి. మేము వీటిని పెద్ద పెద్ద గ్రంధాల నుండి సేకరించి పొందు పరుచుచున్నాము.

  1. బైతుల్ మాల్ (ప్రజాధనం) స్థాపించబడింది.
  2. న్యాయస్థానాలు నెలకొల్పి న్యాయమూర్తులను నియమించారు.
  3. హిజ్రీ శకానికి నాందీ వాచనం పలికారు. ఇప్పటికీ ఇది అమలులో ఉంది.
  4. చక్రవర్తి కొరకు “అమీరుల్ మోమినీన్” (విశ్వాసుల నాయకుడు) అను బిరుదును ఇచ్చారు.
  5. సైనిక కార్యాలయాన్ని స్థాపించారు.
  6. ఇస్లామీయ సేవకులకు ఉపకార వేతనములు నిర్ధారించారు.
  7. కోశాధికారి కార్యాలయాన్ని స్థాపించారు..
  8. భూములను సర్వే చేయడానికి సరికొత్త విధానాలను రూపొందించారు.
  9. జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టారు.
  10. వ్యవసాయం కోసం కాలువలు త్రవ్వించారు.
  11. పెద్ద పెద్ద పట్టణాలను వసింప చేశారు..
  12. ఇస్లామీయ రాజ్యాలన్నింటినీ మండలాలుగా విభజించారు.
  13. సముద్రజీవుల (అంబర్ లాంటి చేపల)పై సుంకాన్ని విధించారు.
  14. తమతో పోటీపడే రాజ్యాలతో ఎగుమతి దిగుమతులను అనుమతించారు.
  15. ఖైదీల కోసం కారాగారాలను నిర్మించారు.
  16. కొరడా ఉపయోగాన్ని అమలులో తెచ్చారు.
  17. రాత్రి సమయాల్లో గస్తీ చేసి ప్రజల బాగోగులను తెలుసుకొనే శాసనాన్ని రూపొందించారు.
  18. ప్రజా సంక్షేమం కోసం పోలీసు వ్యవస్థమ స్థాపించారు.
  19. అనేక చోట్ల సైనిక కాలనీలను, బారకాసులను నిర్మించారు.
  20. గుర్రాలలో తారతమ్యం కొరకు గుర్తును నిర్ధారించారు.
  21. పరిస్థితుల మెరుగుదలకు వార్తాహరులను నియమించారు.
  22. మక్కానుండి మదీనా వరకు యాత్రికుల కోసం భవనాలు నిర్మించారు.
  23. నడిరోడ్డు పై పడి ఉన్న అభాగ్యుల, అనాధ బాలల పెంపకం కోసం ధర్మశాలలను స్థాపించారు.
  24. ప్రధాన పట్టణాలలో అతిథి గృహాలను నిర్మించారు.
  25. అరబ్బు దేశస్తులు (ముస్లిమేతరులయినా సరే) బానిసలుగా మెలగకూడదనే శాసనాన్నినిర్ధారించారు.
  26. పేద క్రైస్తవులు యూదుల కోసం ధర్మసత్రాలను స్థాపించారు.
  27. గ్రంథాలయాలను నిర్మించారు.
  28. ఉపాధ్యాయుల కోసం ఉపకారవేతనాలను నిర్ధారించారు.
  29. క్రమపద్ధతిలో దివ్యఖుర్ఆన్ సేకరణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
  30. రమజాన్ నెలలో సామూహిక తరావీహ్ నమాజును స్థాపించారు.
  31. మద్య సేవనం పై ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధించారు.
  32. వ్యాపార, వాణిజ్య గుర్రాలపై ‘జకాత్’ నిర్ధారించారు.
  33. వక్ఫ్ విధానాన్ని స్థాపించారు.
  34. మస్జిద్ ఉపన్యాస, ఉపదేశాల రివాజును ప్రారంభించారు.
  35. ఇమామ్, ముఅజ్జిన్ ల కోసం జీతాలను నిర్ధారించారు.
  36. రాత్రి సమయాల్లో మస్జిదులలో దీపాలను పెట్టించారు.
  37. కవితా గేయాల్లో స్త్రీ నామ స్మరణాన్ని నిషేధించారు.

పరిపాలకునిగా ఉంటూనే ఒక నౌకరుగా సేవలందించిన అధినేత ప్రపంచంలో ఎవరయినా ఉన్నారా? హజ్రత్ ఉమర్ (రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు మదీనా వీధుల్లో ఒంటరిగా తిరిగేవారు. చేతిలో కొరడా పట్టుకొని దారిలో శిక్షించదగిన నేరస్తులెవరైనా తారసపడితే వారిని తగిన విధంగా అక్కడికక్కడే శిక్షించేవారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా గస్తీ చేసేవారు. మదీనా మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా “ఆయన కొరడా, ఇతరుల ఖడ్గాలకంటే భయంకరమైనది” అని అనేవారు. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేసేటప్పుడు ఎదురయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సంఘటనలు హజ్రత్ ఉమర్ (రజి) బాధ్యతా భావనకు, సమర్థ పరిపాలనకు అద్దం పడతాయి. వాటిలో కొన్నింటిని పొందుపరచటం జరిగింది.

1) ఒకరోజు వర్తక బృంద మొకటి మదీనాకు వచ్చి పట్టణ పాలిమేరల్లో విడిది చేసింది. హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. విడిది చేసిన యాత్రకులను చూచి హజ్రత్ ఉమర్ (రజి) ‘ఈ వర్తక బృందానికి కాపలాగా ఈ రాత్రి ఇక్కడే ఉందామ’ని హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)తో అన్నారు. ఆ రాత్రి వారిద్దరూ కాపలా కాశారు. ‘తహజ్జుద్’ నమాజ్ కూడా అక్కడే చేశారు. ఆ రాత్రంతా ఒక పసివాడి ఏడుపు శబ్దం, దానికి ఆ పసివాడి తల్లి నిర్లక్ష్యం హజ్రత్ ఉమర్ (రజి)ను ఎంతో కలవరపరచాయి. కోపోద్రిక్తులైన హజ్రత్ ఉమర్ (రజి) ఆ తల్లిని గట్టిగా మందలించారు. హజ్రత్ ఉమర్ (రజి) మందలింపుతో సహనం కోల్పోయిన ఆ తల్లి ఆయనపై ఇలా శివమెత్తింది. “పసివాడిని పాల నుండి విడిపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. కానీ వాడు మారాం చేస్తున్నాడు”. ‘పసివాడి వయస్సెంత?’ అని హజ్రత్ ఉమర్ (రజి) ప్రశ్నించారు. ‘కొన్ని నెలలు మాత్రమే! సమాధానమిచ్చింది తల్లి. ‘ఇంత తొందరగా పాలు ఎందుకు విడిపిస్తున్నావు?’ అని హజ్రత్ ఉమర్ (రజి) తిరిగి అడిగారు. అప్పుడు ఆమె ‘హజ్రత్ ఉమర్ (రజి) పాలు విడిచిన పసిపిల్లలకు మాత్రమే జీవనభృతిని నిర్ధారించారు కదా’ అని అంది. పాలువిడిపించటంలో తొందరపడకు అని తల్లితో చెప్పి హజ్రత్ ఉమర్ (రజి) వెళ్ళిపోయారు. తరువాత ఆయన ‘ఫజ్ర్’ నమాజ్ కోసం అరుదెంచారు. నమాజ్ చదివిన తరువాత హజ్రత్ ఉమర్ (రజి) తనను తాను నిందించుకుంటూ ‘ఓ ఉమర్ ! నీకు మూడింది. ముక్కుపచ్చలారని పసికూనలెందరిని ఇప్పటి వరకు నీవు బలొగొన్నావో?!’ అని కన్నీరు మున్నీరై ఏడుస్తూ కూర్చున్నారు. తరువాత ఆయన “తల్లులెవరూ తమ పసిపాపలను పాలు విడిపించుటలో తొందరపడరాదు. ఇకనుండి పిల్లల జీవనభృతి వారి పుట్టుకతోనే ఇవ్వబడుతుంది” అని ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనను ఆయన రాష్ట్రాధికారులందరి వద్దకూ లిఖితపూర్వకంగా పంపించారు.

2) హజ్రత్ అనస్ (రజి) ఇలా వివరించారు: ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తున్నారు. ఒక జనపదుడి (పల్లెవాసి) గుడారం వద్దకు వెళ్ళారు. అతడు తన గుడారం ముందు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. హజ్రత్ ఉమర్ (రజి) అతన్ని పలకరించారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అంతలోనే గుడారంలోంచి బాధాకరమైన ఏడుపు శబ్దం వినపడింది. ‘గుడారంలో ఎవరున్నారు? ఆ అరుపులు శబ్దమేంటి?’ అని హజ్రత్ ఉమర్ (రజి)ఆ పల్లెవాసిని అడిగారు. ‘గుడారంలో ఒక స్త్రీ ఉందనీ పురిటి నొప్పులు భరించలేక ఏడుస్తోందని’ ఆ పల్లెవాసి సమాధానమిచ్చాడు. హజ్రత్ ఉమర్ (రజి) వెంటనే తన ఇంటికెళ్ళి తన భార్యయైన ఉమ్మె కుల్సుమ్(ర.అన్హ)ను పిలుచుకువచ్చారు. గుడారంలో మూలుగుతున్న స్త్రీ సహాయార్ధం ఆమెను గుడారంలోకి పంపారు. కొద్దిసేపటికి గుడారం నుండి ఉమ్మెకుల్సుమ్ (ర.అన) ‘ఓ అమీరుల్ మోమినీన్! అబ్బాయి పుట్టాడని మీ మిత్రునికి శుభవార్త అందజేయండి’ అని బిగ్గరగా చెప్పారు. ‘అమీరుల్ మోమినీన్’ అన్న పదం చెవిన పడగానే ఆ పల్లెవాసి భయంతో వణకసాగాడు. చేతులు జోడించి క్షమాపణ కోరసాగాడు. తరువాత హజ్రత్ ఉమర్ (రజి), ఫరవాలేదు. తెల్లవారాక వచ్చి పసిపిల్లవాడికి నిర్ధారించబడిన జీవనభృతిని తీసుకెళ్ళమని అతనితో అన్నారు.

3) ఒకసారి సిరియా నుండి తిరిగి వచ్చిన తరువాత హజ్రత్ ఉమర్(రజి) ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ఒంటరిగా వెళ్ళారు. మార్గంలో ఆయనకొక ముసలావిడ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె నుద్దేశ్యించి, ‘మీ పరిపాలకుడు ఎలాంటివాడు?’ అని అడిగారు. అందుకు ఆమె దురుసుగా సమాధానమిస్తూ ‘ఆయన ఖలీఫాగా నియుక్తులైనప్పటి నుండి నాకొక్కపైసా కూడా లభించలేదు’ అని అంది. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘బహుశా నీ గురించి హజ్రత్ ఉమర్ (రజి)కు తెలియదేమో…. నీవే ఆయనతో నీ పరిస్థితిని గురించి విన్నవించుకుంటే బాగుంటుందేమో!’ అని పరోక్షంగా అడిగారు. దానికి ఆ ముసలావిడ ‘ఆయన విశ్వాసులందరికీ నాయకుడు. రాజ్యంలో జరిగే ప్రతిసంఘటన పట్ల ఆయనకు అవగాహన ఉండాలి’ అని సూటిగా సమాధానమిచ్చింది. అది వినగానే ఆయన ‘నాకు’ హజ్రత్ ఉమర్ (రజి)పై జాలి కలుగుతుంది’ అని అన్నారు. ‘నీకు జరిగిన అన్యాయానికి, నీవెంత పరిహారం తీసుకుంటావు’? అని హజ్రత్ ఉమర్ (రజి) అడిగారు. అప్పుడు ఆమె ‘నాతో పరిహాసమాడకండి’ అని అంది. ‘అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) ‘నేను’ పరిహాసమాడట్లేదు’ అని అన్నారు. అంతలోనే హజ్రత్ అలీ (రజి), హజ్రత్ ఇబ్నె మసూద్ (రజి)లు అక్కడికి ఏతెంచి, ‘అస్సలాము అలైకుమ్ అమీరుల్ మోమినీన్’ అని పలికారు. అది విన్న వృద్ధురాలు ఒకేసారి ఆశ్చర్యచకితురాలైంది, మనసుపై పిడుగు పడినట్లయింది. సాక్షాత్తు అమీరుల్ మోమినీన్నే నిందించానన్న ఆవేదన ఆమెను తొలచి వేయసాగింది. హజ్రత్ ఉమర్ (రజి) ఆమె పట్ల జరిగిన అన్యాయానికి ప్రతిగా ఇరవై ఐదు బంగారు నాణెములు చెల్లిస్తున్నానని ఒక చర్మపు ముక్కపై వ్రాయించుకున్నారు. ఈ విషయంలో హజ్రత్ అలీ (రజి), హజ్రతి ఇబ్నె మసీద్ (రజ)లు సాక్షులుగా ఉన్నారు.

4) ఒకరోజు రాత్రి హజ్రత్ ఉమర్ (రజి) గస్తీ చేస్తూ ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లోనుంచి పాటలు వినవస్తున్నాయి. హజ్రత్ ఉమర్ (రజి) వెనకగోడ నుండి దూరి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి తోడుగా మందు ఉంది, మగువ కూడా ఉంది. అది చూచి ఆగ్రహోదగ్రులైన హజ్రత ఉమర్ (రజి), ‘ఓ ధర్మద్రోహి ! నీవు చేసే ఈ దుష్కార్యాన్ని అల్లాహ్ మరుగుపరుస్తాడను కుంటున్నావా?’ అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి హజ్రత్ ఉమర్ (రజి) తో, “ఓ ఖలీఫా! ఆవేశపడకండి. నేను కేవలం ఒక్క నేరాన్ని చేశాను. కాని మీరు మూడు నేరాలు చేశారు. ‘ఒకరి లోపాలను ఎంచకండి’ అని అల్లాహ్ అన్నాడు. కాని మీరు ఈ నియమాన్ని ఉల్లంఘించారు. ఇది మీ మొదటి నేరం. ‘ఇతరుల ఇంట్లో తలుపు ద్వారా లోనికి ప్రవేశించండి అని అల్లాహ్ చెప్పగా మీరు వెనకగోడ నుండి ఇంట్లోకి వచ్చారు. ఇది మీ రెండవ నేరం. ‘అనుమతి లేనిది ఎవరింట్లోనూ ప్రవేశించకండి’ అని అల్లాహుతాలా స్పష్టపరచగా మీరు నా అనుమతి లేనిదే ఇంట్లో ప్రవేశించారు. ఇది మీరు చేసిన మూడో నేరం”. ఇది విన్న హజ్రత్ ఉమర్ (రజి) నేను నిన్ను క్షమిస్తాను. దానికి ప్రతిఫలంగా నీవేమి ఇస్తావు?’ అని అడుగగా అతడు ‘ఇక ముందు ఇలాంటి చెడు పసుల జోలికిపోను’ అని హామీ ఇచ్చాడు.

5) అది రాత్రి సమయం.. ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటి వద్దకు చేరారు. ఆ ఇంట్లో ఎవరో సంభాషించుకుంటున్న వైనం ఆయన చెవిన పడింది. ఒక వృద్ద వయస్కురాలైన తల్లి, తన కూతురితో పాలలో నీళ్ళుకలపనుని పట్టుబట్టటం, పాలలో నీళ్ళు కలిపి అమ్మవద్దని ఖలీఫా ప్రకటించారు కదా! అని కూతురు సూటిగా బదులు పలకటం హజ్రత్ ఉమర్ (రజ) విన్నారు. ‘ఖలీఫా మనల్ని చూడవచ్చాడా ఏమిటి?’ త్వరగా నీళ్ళు కలుపు అని తల్లి పురమాయించింది. ‘పైకి విధేయత కనబరుస్తూ.., అంతరంగంలో అవిధేయతా భావంతో మెలగడం ఎంత మాత్రం సమంజసం కాదని కూతురు అంటోంది. ఆ బాలిక నిజాయితీని ఎంతగానో మెచ్చుకున్నారు హజ్రత్ ఉమర్ (రజి). ఆ ఇంటిని సులభంగా తెలుసుకునేందుకు ఆ ఇంటిపై గుర్తువేయమని తనతో ఉన్న సేవకునికి చెప్పారు. మరునాడు హజ్రత్ ఉమర్ (రజి) ఒక వ్యక్తిద్వారా ఆ అమ్మాయిని తన కుమారుడు హజ్రత్ ఆసిమ్ (రజి) కిచ్చి వివాహం జరిపించవలసిందిగా ఆ ఇంటికి సందేశం పంపారు. ఆ విధంగా ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నారు.

6) ఒకరాత్రి గస్తీ చేస్తూ హజ్రత్ ఉమర్ (రజి) ఒక ఇంటివద్దకు చేరారు. అచట ఒక స్త్రీ, ఆమె చుట్టూ కొందరు పిల్లలు కూర్చొని ఏడవటాన్ని ఆయన చూశారు. పొయ్యిపై ఉన్న ఒక పాత్రను కూడా ఆయన గమనించారు. పిల్లల రోదనకు గల కారణాలను హజ్రత్ ఉమర్ (రజి) దర్యాప్తు చేయగా, ‘ఆకలి బాధకు తాళలేక ఏడుస్తున్నారని’ తల్లి సమాధానం చెప్పింది. ‘పాత్రలో ఏముంది?’ అని హజ్రత్ ఉమర్ (రజి) అడుగగా కేవలం నీళ్ళుమాత్రమే ఉన్నాయి. వారిని బుజ్జగించేందుకు ఇలా చేసాను. ఏడుస్తూ… ఏడుస్తూ వారే పడుకుంటారు’ అని తల్లి సమాధానమిచ్చింది. తల్లి నిస్సహాయస్థితిని చూసిన హజ్రత్ ఉమర్(రజి) నయనాలు కన్నీరు మున్నీరై ప్రవహించసాగాయి. ఆయన వెంటనే ప్రజాధనాగారానికి వెళ్ళి పిండి, నెయ్యి, మాంసం, ఖర్జూరపు పండ్లు మరియు దుస్తులను కొన్నింటిని మూటకట్టి తన వీపుపై స్వయంగా మోసుకునివచ్చారు. తాను తెస్తానని ఒక బానిస అద్దుపడగా ‘వద్దూ… వారి గురించి నన్నే అడగటం జరుగుతుంది. నేనే జవాబు దారుణ్ణి’ అని చెప్పారు. ఆ మూటను ఇంటివద్ద చేర్చి, పాత్రల్లో పిండి మాంసం, ఖర్జూరపు పండ్లు మిళితంచేసి పొయ్యిపై పెట్టి, తానే స్వయంగా పొయ్యి రాజేశారు. మంటవల్ల ఏర్పడిన దట్టమైన పొగలు ఆయన గడ్డం నిండా వ్యాపించాయి. వంట అయ్యాక పిల్లలందరికీ తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయారు హజ్రత్ ఉమర్ రదియల్లాహు అన్హు.

7). ఒకసారి హజ్రత్ ఉమర్ (ర), హజ్రత్ జారూర్ (రజి) మస్జిద్ నుండి బయటకు వచ్చారు. వారికి దారిలో ఒక స్త్రీ తారసపడింది. హజ్రత్ ఉమర్ (రజి) వారికి సలాం చేశారు. ఆమె జవాబిచ్చింది. మరియు ఇలా అంది. “ఓ ఉమర్! ‘ఉక్కాజ్’ బజారులో ప్రజలు నిన్ను ‘ఉమైర్’ అని పిలవడం నాకు గుర్తుంది. తరువాత వారు నిన్ను ‘ఉమర్ ‘గా పిలుస్తున్నారు. ఇప్పుడు నీవు ‘అమీరుల్ మోమినీన్’ (విశ్వాసం నాయకుడు) అయ్యావు. అల్లాహ్ కు భయపడుతూ మెలగు”. ఆ మాటలు వినగానే తాను ఆమెపై మండిపడ్డానని హజ్రత్ జారూర్(రజి) అన్నారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) నాతో “ఈమెను గుర్తు పట్టావా ‘ఈమె సాధారణ స్త్రీ కాదు. ఈమె విన్నపం సప్తాకాశాలపై ఆమోదించబడింది. ఈమెయే హజ్రత్ ఖౌలా బిన్తె హకీమ్’ కనుక ఆమె హితబోధను నేను వినకతప్పదు” అని అన్నారు.

హజ్రత్ ఉమర్ (రజి అల్లాహు అన్హ హు) ఎత్తైన మనిషి. పెద్ద జనసమూహంలో ఎక్కడ నిలబడినా తొందరగా కనిపించే వారు. గోధుమ వర్ణంగల శరీరఛాయ, గుబురు మీసాలతో గాంభీర్యం ఉట్టిపడేలా ఉండేవారు. తల వెంట్రుకలు ముందు నుంచి లేచి ఉండేవి. ఆయన ఎదుట నిలబడటానికి అందరూ భయపడేవారు. అయినప్పటికీ ఆయన వినమ్రత, అణకువ గల సత్పురుషులు. నిరాడంబర జీవి, మితంగా భుజించేవారు. జల్లెడవేయని గోధుమ పిండితో చేయబడిన రొట్టెలను తినేవారు. ఒకప్పుడు అరబ్బు దేశంలో కరువు ఏర్పడినప్పుడు గోధుమపిండి లభించకపోవడంతో జొన్నరొట్టెలు తిన్నారు. ముతక దుస్తులు ధరించేవారు. ధరించిన దుస్తులలో అక్కడక్కడా అతుకులు కూడా ఉండేవి. తన పనులు స్వయంగా తానే చేసుకునేవారు. ఆయన ధర్మనిష్ఠతో, ధర్మపరాయణతతో జీవితం గడిపే మహాత్ములు. అయినప్పటికీ పరలోక ధ్యానంలో నిమగ్నులై ఉండేవారు. నమాజ్ చేసేటప్పుడు దైవభీతివలన మనస్సు కరిగి కన్నీరై ప్రవహించేది. అప్పుడప్పుడు ఆయన నమాజ్ భోరున ఏడ్చేవారు. ఆయన పైకి నిర్భయునిగా కనిపించినా, ఆయన రవ్వంత గర్వం కూడా లేని దయామూర్తి. (రజి అల్లాహు అన్హ హు)

**

[36 నిముషాలు]
వక్త:సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

70. తఫ్సీర్ సూరా అల్ మఆరిజ్ – Surah al Ma’aarij [వీడియోలు]

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 44 ఆయతులు ఉన్నాయి. ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, తీర్పుదినాల గురించి ఈ సూరా ముఖ్యంగా ప్రస్తావించింది. ఈ సూరాకు పెట్టిన పేరు ఇందులోని 3వ ఆయతులో వచ్చింది. తీర్పుదినం నాటి భయానక పరిస్థితులను ఈ సూరా అభివర్ణించింది. తుదితీర్పు జరుగుతుందనీ, లెక్కతీసుకునే రోజు భ్రమ ఎంతమాత్రం కాదనీ, సత్యతిరస్కారులను నాశనం చేసే సామర్ధ్యం అల్లాహ్కు ఉందనీ, వారి కన్నా ఉత్తమమైన ప్రజలను వారి స్థానంలో తీసుకొచ్చే శక్తి అల్లాహ్ కు ఉందని ఈ సూరా ప్రకటించింది. కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ సూరా తెలియజేసింది. తీర్పుదినం చాలా దూరంగా ఉన్నట్లు మనకు కనబడినా, అల్లాహ్ దృష్టిలో ఆ రోజు చాలా దగ్గరగా ఉంది.

ఈ సూరా అవిశ్వాసులను విమర్శిస్తూ, వారి అనుమానాలు నిష్ప్రయోజనకరమైనవనీ, ఎందుకంటే మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం అన్నది అనివార్యమనీ తెలిపింది. మరణించిన వారిని మళ్ళీ లేపే రోజున చనిపోయిన వారందరూ లేచి నిలబడుతారు. సత్యాన్ని తిరస్కరించినవారు, అవిశ్వాసులు తమ సమాధుల నుంచి పరుగు పరుగున కంగారు కంగారుగా వస్తారు. వారు పరాభవానికి, నైచ్యానికి గురయి ఉంటారు. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూరా అల్ మఆరిజ్ ) :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0tB6hJ9VudQ_BxkssJRtZ6

ఇస్లాం నైతిక విధానం | అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) [పుస్తకం]

ఇస్లాం నైతిక విధానం | అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) [పుస్తకం]

అల్లామా సయ్యిద్ సులైమాన్ నద్వి (రహిమహుల్లాహ్) గారి ‘సీరత్’ (మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మరియు సందేశం) గ్రంథాలలోని, ముఖ్యంగా నైతిక పర్వంలోని సారం ఆధారంగా ఈ పుస్తకం రచించబడింది

ఇస్లాం నైతిక విధానం – పార్ట్ 1 [PDF] [47 పేజీలు]
ఇస్లాం నైతిక విధానం – పార్ట్ 2 [PDF] [41 పేజీలు]

కూర్పు: మౌలానా ముహమ్మద్‌ తఖీయుద్దీన్‌
తెలుగు అనువాదం: ముహమ్మద్‌ అజీజుర్రహ్మాన్‌
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్

ముందుమాట

పుడమిపై కాలిడిన ప్రతి మనిషికీ ప్రపంచంలోని ప్రతి వస్తువుతో ఏదో ఒక స్థాయిలో, ఏదో ఒక విధమయిన సంబంధం తప్పక ఏర్పడి ఉంటుంది. ఈ సంబంధాల వల్ల పడే బాధ్యతను సక్రమంగా, సజావుగా నిర్వర్తించటమే సత్ప్రవర్తన. అదే ఉత్తమ నడవడిక! మనిషికి గాలి, నీరు, వెలుతురుతో సంబంధమున్నట్లే! పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు, సెలయేళ్లతో సంబంధమున్నట్లే పుడమిలోని ప్రాణులతో కూడా అతనికి అవినాభావ సంబంధముంటుంది. ఈ బాంధవ్యంలో అతని తల్లిదండ్రులు, ఆలుబిడ్డలు, ఆత్మీయులు అందరికన్నా ముందు పరుసలో నిలుస్తారు. ఇరుగు పొరుగు వారితో, ఊరు వారితో, ప్రాంతం వారితో, జాతి వారితో, దేశ వాసులతో అతనికి ప్రగాఢమైన సంబంధాలుంటాయి. ఆఖరికి తన పరిసరాలలో, తన ఆధినంలో వున్న పశుపక్ష్యాదులతో కూడా అతనికి సంబంధం ఉంటుంది. ఈ కారణంగా వాటి పట్ల తనకు గల బాధ్యతలను కూడా అతను నెరవేర్చవలసి ఉంటుంది.

ఈ బాధ్యతల నిర్వర్తన ఎంత సజావుగా సాగితే ప్రపంచంలో సుఖసంతోషాలు అంతే పుష్కలంగా ప్రాప్తిస్తాయి. అసలు నిజం చెప్పాలంటే లోకంలోని సుఖనంతోషాలు, శుభశ్రేయాలు, శాంతిభద్రతలు – ఇవన్నీ ‘సద్వ్యవహారం” మరియు ‘ఉత్తమ నడవడిక’తోనే ముడిపడి ఉన్నాయి. ఈ నైతిక నిథి ఎప్పుడు ఖాళీ అవుతున్నట్లు అనిపించినా ప్రభుత్వాలు, సామాజిక నంస్థలు తమ శక్తినీ, బలాన్నీ ఉపయోగించి ఈ మాంద్యాన్ని పూరించే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఒకవేళ ఆయా మానవ సముదాయాలే గనక ఎప్పటికప్పుడు తమ నైతిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో అవి సజావుగా పరిఢవిల్లేలా జాగ్రత్తపడితే ప్రభుత్వాల బలప్రయోగాలకు, చట్టపరమయిన ఆంక్షలకు గురి కావలసిన అగత్యం కూడా ఏర్పడదు.

అందుకే మనిషికి; తానవలంబించే మత ధర్మం నైతికంగా సంపూర్ణ మార్గదర్శకత్వం వహించాలి. దాని నైతిక ప్రబోధనల ప్రభావం అతనిపై ఎంత గట్టిగా పడాలంటే జీవితంలోని ఏ విభాగంలోనూ, ఏ దశలోనూ అతని అడుగులు తడబడ కూడదు.

చిట్టచివరి ధైవసందేశహరులైన ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ద్వారా ప్రవచించబడిన, క్రియాత్మకంగా ప్రవేశపెట్టబడిన నీతీ నియమాలను, షరీయత్‌ను మీ ముందున్న ఈ పుస్తకంలో విశదీకరించే వ్రయత్మం జరిగింది.

ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఇస్లాం నైతికతకు ఎంత ఎక్కువ ప్రాధాన్యతనిఛ్చిందో నేటి ముస్లింలు దినిని అంతే విస్మరిస్తున్నారు. మరికొన్ని చోట్లయితే వారు ఈ అంశాన్ని అసలు పట్టించుకోవటమే లేదు. జాతుల ఉత్తానంలో, సంస్కృతీ నాగరికతల ప్రగతీ వికాసాలలో నైతికతకు, సద్వర్తనకుగల ప్రాముఖ్యతను ముస్లింలు ఎంత త్వరితంగా గుర్తిస్తే అంతే మంచిది.

20వ శతాబ్దిలో భారత ఉపఖండంలో – ఉర్దూ భాష ద్వారా – ఇస్లామీయ సాహిత్య పురోభివ్యద్ధికి ఇతోధికంగా తోడ్పడిన విద్వాంసులలో అల్లామా సయ్యిద్‌ సులైమాన్‌ నద్వి (రహిమహుల్లాహ్) ఒకరు. ‘సీరత్‌‘ (మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం మరియు సందేశం) పై ఆయనకున్న అవగాహన అపారం. ‘సీరతున్నబీ‘ పేరుతో ఆయన గురువర్యులు అల్లామా షిబ్లీ నూమానీ (రహిమహుల్లాహ్) ప్రారంభించిన రచనను ఆయన తదనంతరం అల్లామా సులైమాన్‌ నద్వి (రహిమహుల్లాహ్) గారు పూర్తి చేశారు. 6 భాగాలుగా వెలువడిన ఈ రచన ఆయన పాండితీ ప్రకర్షకు అద్దం పడుతుంది. ఆ సీరత్‌ గ్రంథాలలోని, ముఖ్యంగా నైతిక పర్వంలోని సారాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న ‘అల్‌హఖ్‌ తెలుగు పబ్లికేషన్స్‌’ అభిలాషకు కార్యరూపమే మీ ముందున్న ‘ఇస్లాం నైతిక విధానం” (మొదటి భాగం). అల్లాహ్ చిత్తమయితే మరో రెండు భాగాలు కూడా త్వరలోనే వెలువడగలవని ఆశిస్తున్నాము. కారుణ్యప్రభువు ఈ చిరు కృషిని ఆమోదించి, దీనిని మా మన్నింపుకు దోహదపడే సాధనంగా చేయాలని ప్రార్థన. (ఆమీన్‌)

ప్రపంచంలోని మతాలన్నీ మౌలికంగా నైతికతపైనే ఆధారపడి ఉన్నాయనటంలో సందేహం లేదు. నైతికతను రక్షించడానికి వచ్చిన ప్రవక్తలు, సంస్కర్తలందరూ ఇచ్చిన శిక్షణ ఒక్కటే 1) సత్యం పలకటం మంచిది 2) అసత్యం చెప్పటం చెడు 3) న్యాయం వల్ల మేలు కలుగుతుంది 4) అన్యాయం వల్ల కీడు కలుగుతుంది. 5) దాన ధర్మాలు పుణ్యప్రదం 6) దొంగతనం దుర్మార్గం.

మరయితే మతం యొక్క ఇతర విభాగాల మాదిరిగానే ఈ నైతికతకు కూడా పరిపూర్ణత నివ్వడానికి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రభవించారు. ఆయన స్వయంగా ఇలా ప్రబోధించారు :-

“నేను ఉత్తమ నైతికతకు పరిపూర్ణత్వం ప్రసాదించడానికి పంపబడ్డాను.

తాను ప్రవక్తగా ప్రభవించిన రోజు నుంచే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధిని నిర్వర్తించసాగారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాలో ఉన్న కాలంలో ఈ నూతన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థితిగతులను దర్యాప్తు చేసే ఉద్దేశ్యంతో హజ్రత్ అబూజర్ (రదియల్లాహు అన్హు) తన సోదరుణ్ణి మక్కా నగరానికి పంపారు. ఆ సోదరుడు మక్కా నుండి తన ఊరికి తిరిగి వచ్చాక ఇచ్చిన సాక్ష్యం ఇది:

“ఆయన ప్రజలకు సత్ప్రవర్తన గురించి నొక్కి వక్కాణించడం నేను గమనించాను.”

మక్కాలోని కొంతమంది ముస్లిములు అబిసీనియా దేశానికి వలసపోయినప్పుడు అక్కడి నజాషీ చక్రవర్తి ముస్లిములను తన దర్బారుకు పిలిపించి ఇస్లాం గురించి వాకబు చేశాడు. ఆ సందర్భంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రియ సహచరుడైన హజ్రత్ జాఫర్ తయార్ (రదియల్లాహు అన్హు) ఇచ్చిన సమాధానంలోని కొన్ని వాక్యాలు ఇవి:

“ఓ చక్రవర్తీ! మేమొక అజ్ఞాన జాతిగా బ్రతికేవాళ్లం. విగ్రహాలను పూజించేవాళ్ళము. నిషిద్ధ జంతు మాంసాన్ని భక్షించే వాళ్ళము. వ్యభిచారానికి ఒడిగట్టే వాళ్ళము. పొరుగు వారిని వేధిస్తూ ఉండే వాళ్ళము. మాలో ప్రతి ఒక్కరూ సాటి సోదరుణ్ణి వేధిస్తూ ఉండేవాడు. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే వాడు. ఇలాంటి (నికృష్ణ) పరిస్థితుల్లో ఒక వ్యక్తి మా మధ్య జన్మించాడు….. మేము విగ్రహారాధనను మానుకోవాలనీ, సదా సత్యం పలకాలనీ, రక్తపాతాన్ని అరికట్టాలనీ, అనాధల సొమ్మును స్వాహా చేయరాదని, పొరుగు వారిని సుఖంగా ఉండనివ్వాలనీ, సౌశీల్యవంతులైన స్త్రీలకు అపనిందల కళంకం అంటగట్టరాదనీ ఆయన మాకు ఉపదేశించాడు.”

అలాగే రోము చక్రవర్తి దర్బారులో అబూ సుఫ్యాన్ ఇచ్చిన సాక్ష్యం గమనించదగ్గది. చూడబోతే అప్పటికింకా ఆయన ముస్లిం కాలేదు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సంస్కరణా సందేశం గురించి అబూ సుఫ్యాన్ ఎంతో క్లుప్తంగా వ్యక్తపరచిన అభిప్రాయం ఇది:

“ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ఏ కత్వం మరియు దైవారాధన సందేశం ఇవ్వటంతో పాటు సౌశీల్యాన్ని అలవర్చుకోవాలనీ, సత్యం పలకాలనీ, బంధువుల హక్కు నెరవేర్చాలనీ జనులకు శిక్షణనిస్తున్నారు.” (సహీహ్ బుఖారీ)

దివ్యఖుర్ఆన్లో సయితం అల్లాహ్ తన సందేశహరుని ప్రభవనంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని ప్రస్తావిస్తూ ఇలా మెచ్చుకున్నాడు:-

 يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ

“ఈ ప్రవక్త వారికి (ఈ నిరక్షరాస్యులైన జనులకు) ఆయన వాక్యాలను వినిపిస్తాడు. వారి ఆత్మశుద్ధి చేస్తాడు. ఇంకా వారికి గ్రంథ జ్ఞానాన్ని వొసగడంతో పాటు వివేకవంతమైన మాటలను నేర్పుతాడు.” (జుమా 62:2)

పై వచనంలో రెండు అతి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి వాటిలో ఒకటి : శుద్ధి చేయడం లేక సంస్కరించడం. (దీనినే ఖుర్ఆన్ ‘తజ్కియ’ గా పేర్కొన్నది. రెండవది: వివేకము.

1.తజ్కియ : ‘తజ్కియ’ అంటే పరిశుద్ధ పరచడం, వన్నె తేవటం, మలినాన్ని పారద్రోలడం అని అర్థం. అయితే ఖుర్ఆన్ ఈ పదాన్ని – మనిషి లోని మనసును అన్ని రకాల మలినాల నుండి, దుమ్ము ధూళి నుంచి ప్రక్షాళనం చేసి పరిశుభ్రంగా ఉంచే భావంలో ఉపయోగించింది. అంటే మనసనే అద్దానికి పట్టిన తుప్పును దూరం చేసి దాన్ని ఎంతో నిర్మలంగా, స్పష్టంగా ఉంచాలన్నదే దీని ప్రధానోద్దేశ్యం. ఆ మాటే మరో చోట ఇలా అనబడింది;

 وَنَفْسٍ وَمَا سَوَّاهَا فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا قَدْ أَفْلَحَ مَن زَكَّاهَا وَقَدْ خَابَ مَن دَسَّاهَا

“మానవాత్మసాక్షిగా ! ఆ ఆత్మను సంస్కరించి, ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసిన వాని సాక్షిగా! నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచి వేసినవాడు విఫలుడయ్యాడు.” (అష్ షమ్స్ 91 : 7 – 10)

మరోచోట ఇలా అనబడింది:

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ

“నిశ్చయంగా తనను పరిశుద్ధపరచుకున్న వాడు, తన ప్రభువు నామాన్ని స్మరించినవాడు, ఆపైన నమాజు చేసిన వాడు సాఫల్యం పొందాడు.” (అల్ ఆలా 87 : 14,15)

పైన ఉదహరించిన వచనాల ఆధారంగా దివ్యఖుర్ఆన్లో “తజ్కియ” అనే పదం ఏ భావంలో తీసుకోబడినదో స్పష్టంగా అవగతం అవుతోంది. మరి ఈ ‘ఆత్మశుద్ధి’కి ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇచ్చిన ప్రాధాన్యం అపారమైనది. అసలు మానవాత్మను మేల్కొల్పడం, దానిని అన్ని రకాల రుగ్మతలనుండి, మలినాల నుండి పరిశుభ్రంగా ఉంచి అతని గుణగణాలు, ఆచరణలు సవ్యంగా సజావుగా ఉండేటట్లు చూడడమే అంతిమ దైవప్రవక్త ప్రభవనం యొక్క అసలు ఉద్దేశ్యం అని కూడా దీని ద్వారా మనకు బోధపడుతుంది.

2. వివేకం: ఇక రెండవ ముఖ్యాంశం వివేకం. ఇది ఖుర్ఆన్లో ‘హిక్మత్’ గా పేర్కొనబడింది. దీని భావం చాలా విస్తృతమైనది. కాని ఇక్కడ నైతికతకు సంబంధించినంతవరకే తీసుకుంటే అల్లాహ్ ఆరాధన, తల్లిదండ్రుల యెడల గౌరవభావం, బంధువుల హక్కు, నిరుపేదలకు సాయం, అనాధల ఆదరణ, వాగ్దాన పాలన, కొలతలు తూనికల్లో సరిగ్గా వ్యవహరించడం, నేలపై నిక్కుతూ నడవకుండా జాగ్రత్తపడటం వంటి ఆదేశాలు ఖుర్ఆన్లో వచ్చినప్పుడు తక్షణమే ఆ తరువాయి వచనంలోనే ఈ విధంగా చెప్పబడింది:

“ఇవి వివేకంతో నిండిఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు వహీ ద్వారా తెలియజేశాడు.” (బనీ ఇస్రాయీల్-39)

అలాగే ‘లుక్మాన్’ సూరాలో- ‘హకీమ్ లుక్మాన్కు చేయబడిన ఉపదేశాన్ని గుర్తుచేస్తున్నప్పుడు.

“మరి మేము లుక్మాన్కు వివేకంతో నిండి ఉన్న విషయాలను బోధించాము.”

అని పరమ ప్రభువు సెలవిచ్చాడు. మరి వివేకంతో నిండి వున్న ఆ విషయాలలో వరుసగా ఏం వచ్చాయో చూడండి:

1. అల్లాహ్ కు భాగస్వామిగా ఎవరినీ నిలబెట్టకు.
2. తల్లిదండ్రుల యెడల దయార్ద్రతతో మెలగు.
3. నమాజును స్థాపించు.
4. మంచి గురించి ప్రజలకు ప్రేరేపించు.
5. చెడుల నుండి ఆపు.
6. కష్టాల్లో ఉన్నప్పుడు సంయమనం పాటించు.
7. వైముఖ్య ధోరణి ప్రదర్శించకు.
8. నేలపై నిక్కుతూ నడవకు.
9. నెమ్మదిగా (మర్యాదపూర్వకంగా) మాట్లాడు.

పై విషయాలన్నీ సహజంగా మంచి విషయాలనీ, మానవ శ్రేయాన్ని ఉద్దేశించినవనీ అన్ని జాతులు, అన్ని మతాలు ఒప్పుకుంటాయి. మరి ఇటువంటి నీతివంతమైన విషయాలను ఖుర్ఆన్ “హిక్మత్” – వివేకవంతమైన విషయాలుగా ప్రకటించింది.

పై వివరాల ద్వారా తెలిసేదేమిటంటే ఇస్లాంలో ఆరాధనలకు, ఇతర అల్లాహ్ ఆదేశాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో నైతికతకు కూడా దాదాపు అంతటి ప్రాముఖ్యం ఉంది. దివ్యఖుర్ఆన్లోని హజ్ సూరాలో చూడండి:

“ఓ విశ్వాసులారా! రుకూ చేయండి. సజా చేయండి. మీ ప్రభువుకు దాస్యం చేయండి. మంచి పనులు చెయ్యండి. తద్వారా మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది.” (అల్ హజ్ : 77)

మనిషి అల్లాహ్ ను విశ్వసించిన మీదట అతను చేయవలసిన రెండు అతిముఖ్యమైన పనులున్నాయి. వాటిల్లో ఒకటి దైవారాధన. రెండవది : సత్ప్రవర్తన. ఇవి రెండూ ‘విశ్వాసి’ యొక్క రెండు భుజాల వంటివి. మొదటిది సృష్టికర్త హక్కు (ఆరాధన) అయితే రెండవది సృష్టితాల హక్కు (సత్ప్రవర్తన). ఈ రెండింటి సముదాయమే ఇస్లాం.

మరో రకంగా చూస్తే ఇస్లాంలో ‘అఖ్ లాఖ్’ (సత్ప్రవర్తన)కు ఆరాధనలకన్నా అధికంగా ప్రాధాన్యత ఉందేమోననిపిస్తుంది. సాటి మానవులతో వ్యవహారానికి, సంబంధాలకు గల మరో పేరే నైతికత లేక మంచి నడవడిక కదా! కాగా; ఆరాధన అల్లాహ్ హక్కు మరి అల్లాహ్ అపార కరుణామయుడు. పరమ కృపాశీలుడు. ఆయన దయాదాక్షిణ్యాల ద్వారాలు కేవలం మంచి వారికే పరిమితం కావు. షిర్క్ మరియు కుఫ్ర్ మినహా మరే ఇతర అపరాధాన్నయినా ఆయన తలచుకుంటే తన ప్రణాళికానుసారం క్షమించగలడు. కాని సాటి మానవుల హక్కును నెరవేర్చటంలో లోటు కనబరిస్తే, లేదా సాటి మానవుల హక్కును కాజేస్తే మటుకు క్షమాభిక్ష పెట్టే అధికారం అల్లాహ్ తన చేతుల్లో పెట్టుకోలేదు. ఈ అధికారాన్ని అల్లాహ్ అన్యాయానికి, వేధింపుకు గురైన బాధిత దాసులకే వదిలేశాడు. మరి అపార కరుణామయుడైన అల్లాహ్ క్షమాభిక్ష పెట్టినట్లుగా బాధిత మానవులు తమను బాధించిన వారిని క్షమిస్తారని ఎవరూ ఆశ పెట్టుకోలేరు. అందుకే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారేమని ప్రబోధించారంటే:

“ఎవరయినా ఒక సోదరుడు మరో సోదరుణ్ణి వేధించి ఉంటే అతను ఈ లోకంలోనే ఆ బాధిత సోదరుడి నుంచి క్షమాభిక్ష పొందాలి. లేకుంటే అక్కడ (పరలోకంలో) మూల్యం చెల్లించడానికి ఎవరి దగ్గరా దిర్హమ్లుగానీ, దీనార్లు గానీ ఉండవు. అక్కడ ఉండేవల్లా కర్మలు మాత్రమే. బాధ పెట్టిన వాని సత్కర్మలు బాధితుని ఖాతాలో వేయబడతాయి. ఒకవేళ బాధించిన వ్యక్తి వద్ద సత్కర్మలు లేకుంటే బాధితుని ఖాతాలోని దుష్కర్మలు అతనికి వడ్డించబడతాయి.” (సహీహ్ బుఖారీ)

హదీసుల ప్రకారం – ఈమాన్ (విశ్వాసం) తరువాత పేర్కొన దగ్గ ఇస్లాం నాలుగు ప్రధాన స్తంభాలు 1) నమాజ్, 2) రోజా, 3) జకాత్ మరియు 4) హజ్. ఈ నాలుగు స్తంభాలపైనే ‘ఇస్లాం’ అనే కట్టడం నిలబడి ఉంది. మరి ఇస్లాం యొక్క ఈ కట్టడంలో ‘ఉత్తమ నైతికత’కు స్థానం ఇవ్వబడలేదా? అన్న సందేహం ఈ సందర్భంగా కొందరిలో కలగవచ్చు. సదవగాహన లేని ప్రసంగాల వల్లనూ, మిడిమిడి జ్ఞానంతో కూడిన రచనల వల్లనూ ఇలాంటి సందేహాలకు మరింత బలం చేకూరే ప్రమాదం కూడా ఉంది. కాని వాస్తవానికి మనిషిలోని నీతి బాహ్యతను దూరం చేసి అతనిలో సత్ప్రవర్తనని పెంపొందించటం కూడా ఆరాధనల ప్రధాన ఉద్దేశ్యాలలో ఒక ఉద్దేశమన్న సంగతిని ఇక్కడ మరువరాదు. దివ్యఖుర్ఆన్ అనేక చోట్ల ఈ దృక్పథం స్పష్టంగా చాటబడింది. ఉదాహరణకు నమాజ్ మనిషిని సిగ్గుమాలిన విషయాల నుండి దూరంగా ఉంచుతుందనే వచనం ఉండనే ఉంది. కాగా; ఉపవాసం (రోజా) మనిషిలో దైవభీతి (తఖ్వా)ని సృజిస్తుందని ఉపదేశించబడింది. ఇక జకాత్ వ్యవస్థనే తీసుకోండి – అది మనిషిలో నిరుపేదల పట్ల సానుభూతిని, అగత్యపరుల యెడల సహకార భావాన్ని పెంపొందిస్తుంది. హజ్ కూడా అనేక విధాలుగా మనలో ఉత్తమ నైతికపు భావాలను పెంపొందించి సంస్కరణా సరణికి బాట వేస్తుంది. సంఘీభావాన్ని పెంపొందిస్తుంది.

పై వివరాల వల్ల తేటతెల్లమయ్యేదేమంటే ఇస్లాం యొక్క ఈ నాలుగు ప్రధాన స్థంభాల పేర్లు వేర్వేరు అయినప్పటికీ వాటి మౌలిక ఉద్దేశ్యాలలో నైతిక శిక్షణా రహస్యం కూడా ఇమిడి ఉంది. ఒకవేళ ఈ ఆరాధనల (నమాజ్, రోజా, జకాత్, హజ్) ద్వారా మనిషిలో ఆధ్యాత్మిక, నైతిక విలువలు తొణకిసలాడకపోతే అతను ఈ అల్లాహ్ ఆదేశాలను మనస్ఫూర్తిగా పాటించలేదన్న మాట! అతను కేవలం వాటిని నోటితో ఉచ్చరించి చేతులు దులుపుకున్నాడన్న మాట!! అంటే ఈ ఆరాధనల సారాన్ని అతను ఏ మాత్రం గ్రహంచలేదు. అతని ఉపమానం కాయలు కాయని వృక్షం వంటిది. అతని ఉదాహరణ సువాసన లేని పుష్పం వంటిది; ఆత్మలేని హృదయం వంటిది.

ప్రముఖ ఇస్లామీయ తత్వవేత్త ఇమామ్ గజాలీ (రహిమహుల్లాహ్) “ఇహ్యాయె ఉలూమ్”లో ఇలా వ్రాశారు:

“తన స్మరణ కొరకు నమాజ్న నెలకొల్పమని అల్లాహ్ సెలవిచ్చాడు. ఇంకా, ‘మరుపుకు గురయ్యేవారు కాకండి’ అని కూడా సెలవిచ్చాడు. నిషా స్థితిలో ఉన్నప్పుడు – మీరు ఏం పలుకుతున్నారో మీకు సయితం అర్థం కాని స్థితిలో-నమాజ్ చేయకండి అని సెలవీయబడింది. అనేక మంది నమాజీలు, తాము మద్యం సేవించకపోయినప్పటికీ – వారు నమాజ్ చేస్తున్నప్పుడు వారేం పలుకుతారో వారికే అర్థంకాదు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఏమని ఉపదేశించారంటే; ‘ఏ వ్యక్తయినా ప్రాపంచిక విషయాల వైపుకు ధ్యానం మళ్ళించకుండా కేవలం రెండు రకతుల నమాజు చేసినా అల్లాహ్ అతని పాపాలను క్షమిస్తాడు’. ఇంకా ఆయన ఇలా ఉపదేశించారు- ‘దీనావస్థతకు, అశక్తతకు, బాధాతప్త మనసుకు, తహతహకు మరో పేరే నమాజ్! చేతులు కట్టుకున్న మీదట ‘ఓ నా దేవా!!’ అన్న భయభక్తుల భావం తొణకిసలాడేలా చేయండి. ఎవరయితే ఈ దైన్య స్థితిని సృజించలేడో అతని నమాజ్ లోపభూయిష్ట మైనదవుతుంది. పూర్వపు గ్రంథాలలో ఉంది అల్లాహ్ ఏమని అంటున్నాడంటే, “నేను ప్రతి ఒక్కరి నమాజును స్వీకరించను. నా గొప్పదనం ముందు లొంగిపోయి, నా దాసుల ముందు బడాయి చాటకుండా ఉండేవారి మరియు నా ప్రసన్నత కొరకు ఆకలిగొన్న నిరాధారజీవులకు అన్నం పెట్టే వారి నమాజును మాత్రమే నేను స్వీకరిస్తాను.” (ఈ నేపథ్యంలో) మహాప్రవక్త ఇలా ప్రబోధించారు: “నమాజ్ విధిగా చేయబడింది ఇందుకోసమే. దీని కొరకే హజ్ క్రియలు కూడా రూపొందించ బడ్డాయి. అల్లాహ్ నామస్మరణ చేయాలన్నదే వీటి ఉద్దేశ్యం.” మరలాంటప్పుడు ఈ ప్రధాన ఉద్దేశమే మనసులో జనించకపోతే అల్లాహ్ ధ్యానానికి విలువేముంటుంది? హదీసులో ఉంది – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా ప్రబోధించారు: “ఎవరి నమాజు అయితే అతన్ని చెడుగు నుండి, నీతి మాలిన తనం నుండి ఆపలేదో అలాంటి నమాజ్ అతన్ని అల్లాహ్ నుండి మరింత దూరం చేసివేస్తుంది.”

ఇలాంటి హెచ్చరికతో కూడిన ఆదేశాలే ఉపవాసం (రోజా) విషయంలో కూడా వచ్చాయి. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “ఏ వ్యక్తయితే ఉపవాస ముండి కూడా అబద్దం చెప్పడాన్ని, మోసం చేయడాన్ని మానుకోడో అలాంటి ఆకలి దప్పులతో బాధపడే మనిషి అల్లాహ్ కు అక్కరలేదు.” (సహీహ్ బుఖారీ)

ఆరాధనల యొక్క ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి మనిషిలో ఉత్తమ నైతికతను సృజించటం అని ఈ ప్రబోధనల వల్ల అవగతమవుతోంది.

ఈమాన్ (విశ్వాసం) మనిషి అంతరంగంతో ముడిపడి ఉన్న విషయం. ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని నోటితో ఖరారు చేస్తాడు. కాని అతని మనోగతం గురించి ఎవరికి తెలుసు? అయితే అతని ‘విశ్వాసం’ అతనిలో సృజించే మంచి గుణానికి ఆనవాలు వంటిదని అంటారు. అందుకే దివ్యఖుర్ఆన్లోని మోమినూన్ సూరాలో విశ్వాసుల గుణగణాలను గురించి చెబుతున్నప్పుడు ఆరాధనలతోపాటు వారి సత్ప్రవర్తనను కూడా ప్రస్తావించటం జరిగింది.

“తమ నమాజులో వినమ్రతను పాటించే, అపసవ్యమైన విషయాల పట్ల విముఖత చూపే, జకాతు ఇస్తూ ఉండే, తమ మర్మాంగాలను పరిరక్షించుకునే…… తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే, తమ నమాజులను పరిరక్షించుకునే విశ్వాసులు (మోమిన్లు) నిశ్చయంగా సాఫల్యం పొందారు.” (మోమినూన్ : 1 – 9)

పై వచనాలలో విశ్వసించిన వారి సాఫల్యానికి నమాజుతోపాటు దోహదకారి కాగల గుణాలలో ప్రముఖమైనవి ఏవో చూడండి:

1) సంస్కారవంతమైన జీవితం గడపటం (అంటే, అపసవ్యమైన విషయాలకు దూరంగా మసలుకోవటం)
2) దాతృత్వ స్వభావాన్ని వంటబట్టించుకోవటం (జకాత్ను ఇస్తూ ఉండటం)
3) సౌశీల్యాన్ని, పారిశుద్ధ్యాన్ని అలవరచుకోవటం.
4) వాగ్దానానికి కట్టుబడి ఉండటం.

ఇస్లాం పరిభాషలో మనిషి మనోమయ భావానికి నామాంతరమే ‘తఖ్వా’- మస్త సత్కార్యాలకు ప్రేరక శక్తిగా పనిచేసేదే ‘తఖ్వా’. ‘తఖ్వా’ గల ప్రజలలో ఉండే లక్షణాలు క్రింది విధంగా ఉంటాయని ఇస్లాం విపులీకరించింది: –


لَّيْسَ الْبِرَّ أَن تُوَلُّوا وُجُوهَكُمْ قِبَلَ الْمَشْرِقِ وَالْمَغْرِبِ وَلَٰكِنَّ الْبِرَّ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَالْمَلَائِكَةِ وَالْكِتَابِ وَالنَّبِيِّينَ وَآتَى الْمَالَ عَلَىٰ حُبِّهِ ذَوِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينَ وَابْنَ السَّبِيلِ وَالسَّائِلِينَ وَفِي الرِّقَابِ وَأَقَامَ الصَّلَاةَ وَآتَى الزَّكَاةَ وَالْمُوفُونَ بِعَهْدِهِمْ إِذَا عَاهَدُوا ۖ وَالصَّابِرِينَ فِي الْبَأْسَاءِ وَالضَّرَّاءِ وَحِينَ الْبَأْسِ ۗ أُولَٰئِكَ الَّذِينَ صَدَقُوا ۖ وَأُولَٰئِكَ هُمُ الْمُتَّقُونَ

మీరు మీ ముఖాలను తూర్పు దిక్కుకో, పడమర దిక్కుకో తిప్పటమే సదాచరణ కాదు. సదాచరణ అంటే వాస్తవానికి అల్లాహ్‌ను, అంతిమ దినాన్నీ, దైవదూతలనూ, దైవగ్రంథాన్నీ, దైవ ప్రవక్తలనూ విశ్వసించటం. ధనప్రీతి ఉన్నప్పటికీ సమీప బంధువులకు, అనాధలకు, అగత్యపరులకు, బాటసారులకు, యాచించే వారికి (ధనాన్ని) ఇవ్వటం, బానిసలకు విముక్తి నొసగటం, నమాజును నెలకొల్పటం, జకాతును చెల్లిస్తూ ఉండటం, ఇచ్చిన మాటను నిలుపుకోవటం, లేమిలో కష్టకాలంలో, యుద్ధ సమయాలలో సహన స్థయిర్యాలను కనబరచటం- ఇవన్నీ కలిగి వున్నవారే వాస్తవానికి సత్యమూర్తులు. భయభక్తులు కలవారు కూడా వీరే.(అల్ బఖర 2:177)

పై ఆయతు ద్వారా తేటతెల్లమయ్యిందేమిటంటే మనిషి తనలోని భయభక్తుల మూలంగా ఏ విధంగానయితే విశ్వాసంపైన, సన్మార్గంపైన నిలకడ కలిగి ఉంటాడో అదే విధంగా అతడు దాతృగుణం కలవాడుగా రాణిస్తాడు, ఇచ్చిన మాటను నిలుపుకుంటాడు. కష్టకాలంలో ఓరిమిని, నిగ్రహాన్ని కనబరుస్తాడు. ఇది ‘తఖ్వా’ (భయభక్తుల) యొక్క అనివార్య పరిణామం అన్నమాట!

ఇస్లాంలో మంచి గుణం కలవారే అల్లాహ్ సన్నిధిలో ఇష్టకరమైన, ఆదరణీయులైన దాసులుగా పరిగణించబడ్డారు. అటువంటి సద్గుణ సంపన్నుల లక్షణాలు కొన్ని ఫుర్కాన్ సూరాలో ప్రత్యేకంగా ప్రస్తుతించబడ్డాయి.

“దయామయుడైన అల్లాహ్ (సిసలైన) దాసులు ఎవరంటే, వారు భూమిపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో వాదనకు దిగినపుడు ‘మీకో సలాం’ అని అంటారు. ఇంకా, తమ ప్రభువు సన్నిధిలో (ప్రార్థనలో) సాష్టాంగపడి మరియు నిలబడి రాత్రులు గడుపుతారు. ఇంకా వారిలా వేడుకుంటూ ఉంటారు – ‘ఓ మా ప్రభూ! నరకయాతన నుండి మమ్ముల్ని కాపాడు. దాని శిక్ష భరించశక్యం కానిది. ఇంకా అది ఎంతో దుర్భరమైన నివాసం, అతి చెడ్డ ప్రదేశం! ఖర్చుపెట్టవలసి వచ్చినప్పుడు అటు దుబారా గానూ ఖర్చుపెట్టక, ఇటు మరీ లోభత్వాన్నీ ప్రదర్శించక రెండు అతి వాదాలకు నడుమ మధ్యే మార్గాన్ని అవలంబిస్తారు. వారు అల్లాహ్ తో పాటు మరో దైవాన్ని మొరపెట్టుకోరు. అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినీ అన్యాయంగా హతమార్చరు. వ్యభిచారానికి ఒడిగట్టారు. ఇలాంటి పనులకు పాల్పడిన వాడు పాపఫలం పొంది తీర్తాడు…. ఇంకా (దయామయుడైన అల్లాహ్ నిజమైన దాసులెవరంటే వారు అబద్దానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా అపసవ్యమైన వాటి మీదుగా పోవటం జరిగితే ఎంతో హుందాగా – ఉదాత్తుల మాదిరిగా – నిష్క్రమిస్తారు. ఇంకా తమ ప్రభువు సూచనలను గురించి వారికి వినిపించినపుడు వారు అంధులుగా, బధిరులుగా ఉండిపోరు వారిలా ప్రార్ధిస్తూ ఉంటారు -‘ఓ ప్రభూ! మా ఆలుబిడ్డల ద్వారా కంటి చలువను ప్రసాదించు. ఇంకా మమ్ముల్ని సద్వర్తనుల సారధిగా చేయి”. (అల్ ఫుర్కాన్ 25: 63 – 74).

చూశారా!

ఒక్క ఈమాన్’లో ఎన్ని సుగుణాలు అంతర్లీనమై ఉన్నాయో!!

మన్నింపుల వైఖరిని అవలంబించటం, సమతూకం పాటించటం, రక్త పాతాన్ని సృష్టించకుండా జాగ్రత్తపడటం, అక్రమ సంబంధాలకు ఆమడదూరాన ఉండటం, మోసపూరిత వ్యవహారాలలో భాగస్వాములు కాకుండా జాగ్రత్త వహించటం వంటి ఉత్తమ నైతికపు విలువలు ఇందులో అంతర్లీనమై ఉన్నాయి మరి!

అల్లాహ్ దృష్టిలో ప్రియతములు, ప్రసన్నులు అయిన దాసులు సుగుణాలు ఇలా ఉంటాయి:-

فَمَا أُوتِيتُم مِّن شَيْءٍ فَمَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ وَالَّذِينَ يَجْتَنِبُونَ كَبَائِرَ الْإِثْمِ وَالْفَوَاحِشَ وَإِذَا مَا غَضِبُوا هُمْ يَغْفِرُونَ وَالَّذِينَ اسْتَجَابُوا لِرَبِّهِمْ وَأَقَامُوا الصَّلَاةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ وَالَّذِينَ إِذَا أَصَابَهُمُ الْبَغْيُ هُمْ يَنتَصِرُونَ وَجَزَاءُ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُ عَلَى اللَّهِ ۚ إِنَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ وَلَمَنِ انتَصَرَ بَعْدَ ظُلْمِهِ فَأُولَٰئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ إِنَّمَا السَّبِيلُ عَلَى الَّذِينَ يَظْلِمُونَ النَّاسَ وَيَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ ۚ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنْ عَزْمِ الْأُمُورِ

1.”మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు (తాత్కాలిక) సంపద మాత్రమే. అల్లాహ్‌ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వితమైనది. విశ్వసించి, కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది. (మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే) వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు (కూడా) క్షమిస్తారు.ఇంకా, వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి (ప్రతి) పని పరస్పర సలహా సంప్రతింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి (మా పేరున) ఖర్చుపెడతారు.తమపై దౌర్జన్యం జరిగినప్పుడు, ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు.అపకారానికి బదులు అటువంటి అపకారమే. కాని ఎవరయినా (ప్రత్యర్థిని) క్షమించి, సయోధ్యకు వస్తే అతనికి పుణ్య ఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ దుర్మార్గులను ప్రేమించడు.తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా (సరిసమానంగా) ప్రతీకారం తీర్చుకుంటే, అలాంటి వారిపై (నిందలు మోపే) మార్గమేదీ లేదు.ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి, అకారణంగా భువిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే (నిందార్హులుగా నిలబెట్టే) మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.మరెవడయినా సహనం వహించి, క్షమాభిక్షపెడితే, నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో (ఒకటిగా) పరిగణించబడుతుంది”. (షూరా 42 : 36 – 43)

2. “మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.వారు కలిమిలోనూ, లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”.(ఆలి ఇమ్రాన్ 3: 133, 134)

3. “అల్లాహ్ ప్రీతికోసం నిరుపేదలకు, అనాధులకు, ఖైదీలకు అన్నం పెడుతుంటారు..” (దహర్ 76: 8)

పై ఆయతుల, ఇలాంటివే మరికొన్ని ఖుర్ఆన్ వాక్యాల తాత్పర్యాన్ని కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు స్వయంగా విడమరచి చెప్పారు. ఈ తాత్పర్యమంతా హదీసు రూపంలో సురక్షితంగా ఉంది. ఆ హదీసులనే గనక ఓసారి నెమరు వేసుకుంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఉపదేశాలలో నైతిక శిక్షణకు ఎంత ప్రాముఖ్యం ఉందో అర్థం అవుతుంది.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తరచూ నమాజ్ సందర్భంగా చేసే దుఆ (వేడుకోలు)లో ఈ వాక్యం ముఖ్యమైనది:

“ఓ అల్లాహ్! నీవు నన్ను అత్యుత్తమ నడవడి వైపుకు దర్శకత్వం వహించు. నీవు తప్ప మరొకరెవరూ ఉత్తమ నడవడి వైపుకు మార్గం చూపలేరు. దుర్గుణాలను నా నుండి మళ్ళించు. నీవు తప్ప వేరొకరెవరూ వీటిని (ఈ దుర్గణాలను) నా వైపు నుంచి మళ్ళించలేరు.” (ముస్లిం : నమాజ్లో ‘దుఆ’ల అధ్యాయం)

ఒక దైవప్రవక్త, తాను అల్లాహ్ ప్రార్థనలో నిమగ్నుడై ఉండి – అల్లాహ్ కు అత్యంత సామీప్యంలో ఉన్న తరుణంలో – దీనంగా కోరుకుంటున్న కోర్కెల్లో ఒక కోరిక “మంచి నడవడిక”. ఈ ఒక్క మాట చాలు ఇస్లాంలో మంచి నడవడికకు గల ప్రాముఖ్యాన్ని అంచనా వేయడానికి.

వాస్తవానికి ఇస్లాంలో ఈమాన్ (విశ్వాసము)ను మించిన వస్తువేదీ లేదు. కాని ఆ విశ్వాసానికి కూడా సంపూర్ణత చేకూరేది మంచి నడవడిక (హుస్నే అఖ్ లాఖ్) ద్వారానే.

“ముస్లిములలో ఎవరి నడవడిక అందరికన్నా ఉత్తమంగా ఉందో అతని విశ్వాసమే పరిపూర్ణమైనది.”

పై హదీసు తిర్మిజీ ఇబ్నె హంబల్, అబూదావూద్ లలో ఉంది. దీన్నిబట్టి అవగతమయ్యిందేమిటంటే, ఇస్లాంలో విశ్వాస పరిపూర్ణతకు ప్రమాణం ఏదైనా ఉందంటే అది మంచి నడవడిక మాత్రమే. ‘మంచి నడవడిక’ అనే ఈ పండు ద్వారానే ‘విశ్వాసమనే’ మహా వృక్షం గుర్తించబడుతుంది,

ఇస్లాంలో నమాజ్ మరియు ఉపవాసం వంటి ఆరాధనలకు గల ప్రాముఖ్యం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కోసారి మంచి నడవడిక సయితం వాటి సరసన నిలబడగలుగుతుంది. ఉదాహరణకు ఒక హదీసులో ఇలా ఉంది :

“మానవుడు పగలంతా ఉపవాసం పాటించడం వల్ల, రాత్రంతా ప్రార్ధనలో నిమగ్నుడై ఉండటం వల్ల పొందగలిగే ఉన్నతిని మంచి నడవడిక ద్వారా పొందగలుగుతాడు.”

పై హదీసు ద్వారా తేటతెల్లమయ్యేదేమిటంటే రాత్రంతా నఫిల్ ఆరాధనల ద్వారా, పగలంతా నఫిల్ ఉపవాసాల ద్వారా మనిషికి ప్రాప్తమయ్యే ధర్మనిష్ఠ సత్ప్రవర్తన మూలంగానూ సిద్ధిస్తుంది. పైగా ‘మంచి నడవడి’ అనే ఈ ప్రమాణ నికషం (గీటురాయి) ద్వారా ప్రజల్లో ఉత్తములెవరో – అధములెవరో నిర్ధారించడానికి వీలవుతుంది. క్రింది హదీసులో ఏమనబడిందో చూడండి.

“మీలో ఎవరి నడవడిక మంచిదో అతడే మీలో అందరికన్నా ఉత్తముడు”.

మరొక హదీసులో ఇలా ఉంది –

“(ప్రళయ దినపు) త్రాసులో మంచి నడవడిక కన్నా బరువైన వస్తువేదీ ఉండదు. మంచి నడవడిక గల వాడు తన మంచి నడపడి మూలంగా నిరంతరం నమాజ్ రోజాలు పాటించే వ్యక్తి స్థాయికి చేరుకుంటాడు.” (తిర్మిజీ)

సద్గుణ సంపన్నులైన వ్యక్తులు అల్లాహ్ కే కాదు, దైవ ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) కు కూడా ప్రియతములవుతారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఈ విషయాన్ని తెలియ జేశారు:

“మీలోని మృదు స్వభావి నాకు అందరికన్నా ప్రియతముడు, స్థాయిరీత్యా అందరికన్నా సన్నిహితుడు అవుతాడు. మీలో దుష్ప్రవర్తన గలవారు నా దృష్టిలో అయిష్టకరమైన వారు. ప్రళయదినాన ఇలాంటి వారు వాకు చాలా దూరమైపోతారు.”

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కాలంలో పరస్పర విరుద్ధ వైఖరి గల ఇద్దరు మహిళలుండేవారు. వారిలో ఒకామె రాత్రంతా నమాజులో లీనమై ఉండేది. పగటిపూట ఉపవాస వ్రతాలు పాటించేది. విస్తృతంగా దాన ధర్మాలు చేసేది. కాని ఆమె తన నోటి దురుసుతనం వల్ల ఇరుగు పొరుగు వారిని ప్రశాంతంగా బ్రతకనిచ్చేది కాదు. రెండవ మహిళ కేవలం ఫర్జ్ నమాజులు చేసేది. పేదవారికి కొన్ని బట్టలు మాత్రం పంచేది. అంతే. కాని ఎవరి మనసునూ నొప్పించేది కాదు.

ఈ ఇరువురు మహిళల గురించి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను ప్రశ్నించగా మొదటి మహిళ గురించి ప్రవక్త వారు వ్యాఖ్యానిస్తూ, “ఆమెలో ఎలాంటి మంచీ లేదు. పైగా ఆమె తన దుష్ప్రవర్తనకు గాను (శిక్షను) అనుభవిస్తుంది” అని పలికారు. రెండవ మహిళ గురించి అభిప్రాయపడుతూ, “ఆమె స్వర్గంలో స్థానం సంపాదిస్తుంది” అని అన్నారు. ఇద్దరు మహిళల ప్రవర్తన గురించి ఇస్లాం ప్రవక్త వెల్లడించిన రెండు విభిన్న పరిణామాలే ఇస్లాంలో నైతికత లేక నడవడికకు గల విశేష ప్రాముఖ్యాన్ని చాటి చెబుతున్నాయి.

హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రదియల్లాహు అన్హు) ప్రకారం – ఒకసారి ఒక పల్లెటూరి వ్యక్తి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి, తనను, స్వర్గానికి గొనిపోయే పనుల గురించి ఉపదేశించమని ప్రాధేయపడగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ఉపదేశించారు:

“మనిషిని బానిసత్వం నుండి స్వేచ్ఛ నొసగు. మనిషి మెడను రుణ భారం నుండి విడిపించు. దుర్మార్గుడైన బంధువును చేయిపట్టుకుని నిలువరించు. ఒకవేళ నీవు ఇది చేయలేని పక్షంలో ఆకలిగొన్న వానికి అన్నం పెట్టు. దప్పికతో బాధపడే వాని దాహం తీర్చు. మంచి గురించి (ఇతరులకు) ప్రబోధించు. చెడు నుండి ఆపు. ఒకవేళ ఈ పని కూడా చేయలేకుంటే (కనీసం) మంచి మాట తప్ప మరోదాన్ని నీ నోట రానివ్వకు.”

పై హదీసు నైతికౌన్నత్యాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఆలోచించండి!

ఇంత వరకూ ఉదహరించిన హదీసులే గాక మరి కొన్ని హదీసులు ఉన్నాయి. అవి ఈమాన్ (విశ్వాసం) వాంఛించే అనివార్యమైన ప్రత్యేకతలు అని అనబడతాయి. వాటి హెచ్చుతగ్గులను బట్టి మనిషిలోని విశ్వాసం యొక్క హెచ్చు తగ్గులను బేరీజు వేసుకోవచ్చు. మన మనసులో ఉన్న ‘విశ్వాసం’ మన ఇంటి లోని దీపం వంటిది. మరి ఆ దీపం విరజిమ్మే వెలుగును బట్టే దాని నాణ్యత ఎటు వంటిదో తెలుస్తుంది కదా! ఈ నేపథ్యంలో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు :

1. ఈమాన్ (విశ్వాసం) శాఖలు డెబ్బయికి మించి ఉన్నాయి. వాటిలో వ్రీడ (లజ్జ – బిడియం) ఒకటి.

2. ఈమాన్ కు ఎన్నో శాఖలున్నాయి. వాటిలో ‘అల్లాహ్ ఏకత్వం’ (తౌహీద్) గురించి చేసే ప్రకటన అన్నిటికీ మించినది. కాగా; దారిలో పడివున్న ఏదైనా బాధాకరమైన వస్తువును మీరు తొలగిస్తే అది ఈమాన్ యొక్క అన్నిటికన్నా తక్కువ స్థాయి సదాచరణ అనిపించుకుంటుంది.

3. ఎవరిలోనయితే మూడు విషయాలున్నాయో అతడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు. మొదటిది: అతనికి అల్లాహ్ మరియు దైవ ప్రవక్త అందరికన్నా ప్రియతములై ఉండాలి. రెండవది: అతడు కేవలం అల్లాహ్ మెప్పుకై ఇతరులను ప్రేమించే వాడై ఉండాలి. మూడవది: విశ్వసించిన మీదట తిరిగి తిరస్కార వైఖరికి ఒడిగట్టడం పట్ల అతనికి కలిగే బాధ అగ్నికి ఆహుతి అవటం వల్ల కలిగే బాధలాంటిదై ఉండాలి.

4. ఎవరిలోనయితే ఈ క్రింది మూడు విషయాలున్నాయో అతడు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాడు.(1) సత్యం ముందు వాదులాటకు దిగకుండా జాగ్రత్త పడాలి. (2) కష్టాలు వచ్చిపడినా అబద్దం చెప్పకుండా ఉండాలి. (3) (దైవికంగా) ఎదురైనదేదీ తొలగిపోదని దృఢంగా విశ్వసించాలి.

5. మూడు అంశాలు ఈమాన్ లో అంతర్భాగాలు : ఒకటి: లేమిలో సయితం అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం.రెండు : లోకంలో శాంతినీ, సౌమరస్యాన్ని వ్యాపింపజేయటం.మూడు: వ్యవహారం తన కాడికి వచ్చినప్పుడు సయితం న్యాయ సమ్మతంగా మసలడం.

6. మీలో ఎవరయినా సరే తన స్వయం కొరకు ఇష్టపడేదే తన సాటి సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకూ సంపూర్ణ విశ్వాసి కాలేడు.

7. ఎవరి నోటి ద్వారా, చేయి ద్వారా సాటి ముస్లిం సురక్షితంగా ఉండగలడో అతడే (సిసలయిన) ముస్లిం. మరే వ్యక్తి ప్రవర్తన అయితే జనులు తనను అమితంగా నమ్మి ఆఖరికి తమ ధన ప్రాణాలను సయితం తన చెప్పుచేతుల్లో అప్పగించడానికి సంసిద్ధమయ్యే స్థితికి చేరుస్తుందో అతడే (సిసలయిన) విశ్వాసి.

8. ఒక వ్యక్తి వచ్చి, ‘ఓ దైవ ప్రవక్తా (సల్లల్లాహు అలైహి వసల్లం)! ఏ ఇస్లాం అన్నిటికన్నా శ్రేష్టమైనది?’ అని ప్రశ్నించగా,“(ఆకలిగొన్నవారికి) అన్నం పెట్టడం, తెలిసిన వారికీ, తెలియని వారికీ – ప్రతి ఒక్కరికీ – శాంతి నొసగే ప్రార్ధన చేయటం (సలాం చేయటం).

9. ఒక వ్యక్తి వచ్చి, “ ఓ దైవప్రవక్తా! ఇస్లాం అంటే అసలేమిటి?” అని ప్రశ్నిస్తాడు. “మంచి మాట పలకటం. (ఆకలిగొన్న వారికి) అన్నం పెట్టడం” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) జవాబిచ్చారు. “మరి ఈమాన్ అంటే ఏమిటీ?” అని అడగ్గా, “సంయమనం పాటించడం, నైతిక శౌర్యాన్ని చూపడం” అని మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు.

10. మోమిన్ (విశ్వాసి) అయినవాడు ఎవరినీ ఎగతాళి చేయడం గానీ, ధూత్కరించడం గానీ, దూషించడం గానీ, చెడు అనడం గానీ చేయడు.

11. ప్రతి ముస్లిం సాటి ముస్లింకు సోదరుడవుతాడు. కనుక అతనికి అన్యాయం చేయడం గానీ, అతన్ని తిట్టడం గానీ చేయకూడదు. ఎవరైతే తన సోదరుని సహాయమై నిమగ్నుడవుతాడో అతని సహాయంలో అల్లాహ్ నిమగ్నుడవుతాడు. మరెవరయితే తోటి ముస్లింకు ఎదురైన ఆపదను తొలగిస్తాడో అతనిపై వచ్చి పడిన ఆపదను అల్లాహ్ తొలగిస్తాడు.

12. ‘ప్రజల చేత నిజాయితీ పరుడని భావించబడిన వాడే మోమిన్. తన నోటి ద్వారా, చేతి ద్వారా జనులకు రక్షణ నివ్వగలిగిన వాడే ముస్లిం. చెడును విడిచి పెట్టినవాడే సిసలయిన ముహాజిర్. ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా చెబుతున్నాను- ఎవరయినా తన కోపతాపాల బారి నుండి పొరుగువారికి రక్షణ నివ్వనంతవరకూ స్వర్గానికి పోలేడు.’

13. విశ్వాసి అయినవాడు తన అతిథికి మర్యాద చేయాలి.

14. అవిశ్వాసి (కపటి, మునాఫిక్) అయినవాడి ఆనవాళ్ళు మూడు. (1) వాడు పలికితే అసత్యమే పలుకుతాడు. (2) వాగ్దానానికి విరుద్ధంగా చేస్తాడు. (3) తన దగ్గర భద్రపరచబడిన (అప్పగింత) సొమ్మును తన స్వయం కోసం వాడుకుంటాడు.

పై హదీసుల్లోని ఒక్కొక్క హదీసును శ్రద్ధగా గమనిస్తే ఇస్లాం మరియు ఈమాన్ యొక్క నైతిక భావన ఎంత ఉన్నతమైనదో బోధపడుతుంది.

నైతిక విషయాలకు సంబంధించి ఇస్లాం ఖరారు చేసిన మరో విశేషమేమిటంటే, మనిషి వాటిని నెరవేర్చేటప్పుడు అవి అల్లాహ్ ఆదేశాలని భావించి మరీ నెరవేర్చాలి.

ఒక బాటసారిని ఆదుకోవడాన్ని గానీ, ఒక రోగగ్రస్తుని సేవ చేయడాన్ని గానీ – అది అల్లాహ్ ఆజ్ఞగా తలపోసి మరీ చేయాలి. మరి ఆ సేవలో నిమగ్నుడైన వాని అంతరాత్మ సయితం ఆ మేరకు ప్రబోధించాలి. నఖశిఖ పర్యంతం అతడు ఆ పని కొరకు చిత్తశుద్ధితో సమాయత్తం కావాలి. ఆ పని చేస్తున్నందుకు అతని మనసు సంతోషంతో పులకించాలి. ఇలాంటి సత్కార్యాలకుగాను తాను కేటాయిస్తున్న సమయంలో ఒక పెద్ద మానవ సమూహానికి మేలు కలుగుతుందన్న అనుభూతికి అతను లోనుకావాలి. చెప్పవచ్చిందేమిటంటే, మంచి విషయంలో అతని మనోవాక్కాయ కర్మలు ఎంత ఎక్కువగా సామరస్యం చెందుతాయో అంతే ఎక్కువగా అతని ఆధ్యాత్మికత పరిణతి చెందుతుంది. ఒకవేళ ఆ సామరస్యం గనక వాటి మధ్య సన్నగిల్లినట్లయితే అతని ఆధ్యాత్మికతలో, విశ్వాస స్థితిలో ఎక్కడో ఏదో వెలితి ఉందన్న మాట!

ఒక సత్కార్యాన్ని మనం అల్లాహ్ ఆజ్ఞ అని తలపోసి చేయడానికైతే చేస్తున్నాము. కాని మన మనస్సాక్షి దాన్ని సత్కార్యంగా తలపోయటం లేదు, పైగా మన బుద్ధి దానికి విరుద్ధంగా మనకు మార్గం చూపుతోందనుకోండి- దాని అర్థం ఏమిటీ ? అంటే- అది నిజంగా అల్లాహ్ ఆదేశం అయి ఉంటుందనే విషయంలో మనకింకా నమ్మకం కుదరలేదన్న మాట!

ఇస్లాంలో సత్ప్రవర్తన కూడా ఇతర ధార్మిక విధుల మాదిరిగా ఇబాదత్ (ఆరాధన) క్రిందికే వస్తుంది గనక దీని ఉద్దేశ్యం కూడా అన్ని రకాల ప్రాపంచిక, మానసిక, స్వార్థప్రయోజనాలకు అతీతంగా – స్వచ్ఛంగా – ఉండాలి. ఒకవేళ పరిస్థితి తద్భిన్నంగా ఉంటే ఈ పనులలో ఎలాంటి పుణ్యం లేనట్లే లెక్క. పైగా స్వార్థబుద్ధితో కూడిన మంచి పనులు ఆరాధన కోవలోకి రానేరావు. ధార్మిక వ్యవహారాల సంగతి అటుంచండి, ఆఖరికి ప్రాపంచిక వ్యవహారాలు కూడా అంతే. ప్రాపంచిక విషయాలయినా సరే వాటిలో చిత్తశుద్ధి ఎంత అధికంగా ఉంటే వాటి విలువ అంతే అధికమవుతుంది. ఉదాహరణకు ఒక అతిథిని తీసుకోండి. మనం అతన్ని అతిగా మర్యాద చేస్తాం. అతనికి లెక్కలేనన్ని వంటకాలు వడ్డిస్తాం. కాని ఆ ఆతిథ్యంలో నిష్కల్మషమైన ప్రేమ లేదు. పైగా అతన్నుండి ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నామనో, లేక మన బడాయిని చాటుకోవడానికి అలా చేస్తున్నామనో ఆ అతిథికి అర్థమైపోయిందనుకోండి- అటువంటి అతిథి మర్యాదకు ఆ వ్యక్తి దృష్టిలో ఎలాంటి విలువా ఉండదు. కాని దానికి బదులు అతిథికి ప్రేమతో, నిస్వార్థ మనసుతో సాదాసీదా భోజనం వడ్డించినా చాలు. అది అతని దృష్టిలో ఎంతో విలువను సంతరించుకుంటుంది. ప్రాపంచిక విషయాలలోనే చిత్తశుద్ధి ఇంత ఎక్కువ ప్రభావం చూపుతున్నప్పుడు ధార్మిక విషయాలలో అది ఇంకెంత ప్రభావం చూపగలదో ఆలోచించండి!?

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు తన ఉపదేశాలలో సంకల్పాన్ని- అంటే మనిషి అంతరంగాన్ని ప్రతి మంచి పనికీ, చెడు పనికీ మూలాధారంగా ఖరారు చేశారు. ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మరింత విపులంగా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎవరినో రేజీకటిలో తన ఇంటికి రమ్మని మరీ మరీ కోరాడు. అలా ఆహ్వానించడంలో అతని అంతరార్థం వేరుగా ఉంది. దారిలో బందిపోట్లు అతన్ని చంపేస్తారులే లేక అతన్ని చితక తంతారులే అన్న ఉద్దేశ్యంతో పిలిచాడతను. కాని కాకతాళీయంగా ఆహ్వానితుడు చీకటిలో దారి తప్పి మరో దారిన నడవసాగాడు. ఆ దారిలో అతనికి నాణాల సంచి దొరికింది. పరిణామం రీత్యా ఈ నడక అతనికి లాభదాయకం కాగలిగినా ఆహ్వానించిన వ్యక్తి సంకల్పం మాత్రం మంచిది కాదనటంలో ఇప్పటికీ ఎలాంటి సందేహం లేదు. మరి అతను రాత్రి పూట ఆ వ్యక్తిని ఆహ్వానించి అతనికి మేలు చేశాడని కూడా అనజాలము. కాని ఒక వ్యక్తి అతన్ని రేజీకటిలో నిజంగా మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఆహ్వానించాడనుకోండి. అయితే ఆహ్వానించబడినవాడు యాదృచ్ఛికంగా మార్గమధ్యంలో ఏ నూతిలోనో, గోతిలోనో పడి చనిపోయినా అట్టి పరిస్థితిలో ఆహ్వానించిన వాడు పాపికాలేడు. చనిపోయిన వాని ప్రయాణం పరిణామం దృష్ట్యా హానికరమైనంత మాత్రాన ఆ దోషం ఆహ్వానకుని మీద వేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు వ్యక్తి వలే ఈ వ్యక్తి సంకల్పంలో ఎలాంటి దోషం లేదు.

మరో ఉదాహరణ: ఒక వ్యక్తి దారిలో నడుస్తున్నాడు. అతనికి ఒక స్త్రీ కనిపించింది. ఆమె పరాయి స్త్రీ అనుకుని చెడు సంకల్పంతో ఆమెను వెంటాడాడు. కాని వాస్తవానికి ఆమె అతని భార్యేనని తీరా దగ్గరి కెళ్ళాక తెలిసింది. మరొక పరిస్థితిలో అతను తన భార్య అని తలపోసి పరాయి స్త్రీ పై చేయి వేశాడు. అటువంటప్పుడు మొదటి స్థితిలో అతని మనసు పాపభూయిష్టమై పోయింది. కాని రెండవ స్థితిలో అతను నిర్దోషి అన్నది సుస్పష్టమే.

నమాజ్ ను మించిన పుణ్యకార్యం ఏముందో చెప్పండి! కాని అది కూడా బడాయి కోసమో, ప్రదర్శనా భావంతోనో చేస్తే దానివల్ల పుణ్యఫలం చేకూరే బదులు అది వృధా ప్రయాసే అయిపోతుంది. అలాగే మీరు ఒక వికలాంగునికి సహాయం చేయబోయి జనులు మిమ్మల్ని ఒక దాతగా పొగడాలని కాంక్షిస్తే మీ సహాయం పుణ్యకార్యంగా పరిగణించబడదు.

 وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا

“ప్రాపంచిక ప్రతిఫలం పొందే ఉద్దేశంతో పనిచేసే వాడికి మేము ప్రపంచాన్నుండే ఇస్తాము. పరలోక ప్రతి ఫలాపేక్షతో పనిచేసేవాడు పరలోక ప్రతి ఫలాన్ని పొందుతాడు.” (ఆలి ఇమ్రాన్ 3 : 145)

బడాయి కోసం చేసే సత్కార్యాలు నిరర్ధకమని, బూడిదలో పోసే పన్నీరు వంటివని మరోచోట స్పష్టం చేయబడింది –

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تُبْطِلُوا صَدَقَاتِكُم بِالْمَنِّ وَالْأَذَىٰ كَالَّذِي يُنفِقُ مَالَهُ رِئَاءَ النَّاسِ وَلَا يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ

ఓ విశ్వాసులారా! తన ధనాన్ని పరుల మెప్పుకోసం ఖర్చుచేస్తూ, అల్లాహ్‌ను గానీ, అంతిమదినాన్ని గానీ విశ్వసించని వ్యక్తి మాదిరిగా మీరు మీ ఉపకారాన్ని చాటుకుని, (గ్రహీతల) మనస్సులను నొప్పించి మీ దానధర్మాలను వృధా చేసుకోకండి.” (అల్ బఖర 2 : 263)

ఇలాంటి ఉదాహరణలు ఖుర్ఆన్ లో మరెన్నో ఉన్నాయి. వీటికి తాత్పర్యంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఎంతో క్లుప్తంగా (కాని ఎంతో సమగ్రంగా) ఇలా ప్రవచించారు:

“ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్”
(మనిషి ఆచరణలన్నీ అతని సంకల్పాన్ని బట్టి ఉంటాయి).

అందునా నైతికత అనే చర్చనీయాంశంలో సంకల్పం ఎనలేని ప్రాముఖ్యం సంతరించుకుంటుంది. సంకల్పంలో గనక దోషం వచ్చేస్తే ఎంత గొప్ప కార్యమైనా నైతికత యొక్క పరిధి నుండి బహిష్కృతం అయిపోతుంది.

పై వివరాల వెలుగులో నైతికత అనేది మనసుతో ముడిపడిన అంశం అని తేలుతుంది. మరి ఆ మనసు యొక్క అంతర్గత స్థితి చక్కబడటానికి గాను విశ్వాసానికి మనిషి కట్టుబడటం అనివార్యం. అదేమంటే ఒకానొక శక్తి ఉందనీ, అది మన మనసులోని ఒక్కో మూలను ఒక్కో కోణం నుంచి తరచి చూస్తోందనీ, మనం జన సమూహంలో ఉన్నా, ఏకాంతంలో ఉన్నా, చీకటిలో ఉన్నా, వెలుతురులో ఉన్నా ఆ శక్తి సూక్ష్మ దృష్టితో గుండెల్లోని లోతుల్లోకి పోయి చూస్తోందన్న దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ప్రపంచంలోని జాతులన్నీ కేవలం శరీరంపైనే హుకుం జారీ చేస్తాయి. కాని ఆ అద్వితీయ శక్తిమంతుడు మనసులపై హుకుం జారీ చేస్తాడని నమ్మాలి. మనం మన కర్మలన్నింటికీగాను ఆయన సమక్షంలో సమాధానం ఇచ్చుకోవాల్సి ఉందనీ, మన కర్మల ఆధారంగా బహుమానమో లేక శిక్షయో లభించే రోజు తప్పక రానున్నదని కూడా నమ్మాలి. ఈ భావన మనసులో గట్టిగా నాటుకు పోనంత వరకూ అతని సత్ప్రవర్తన అతనికే మాత్రం ప్రయోజనకరం కాజాలదు. అందుకే అల్లాహ్ మరియు మరణాంతర జీవితంపై విశ్వాసం ప్రతి సత్కర్మకు మూలం అని ఇస్లాంలో స్పష్టం చేయబడింది.

وَالَّذِينَ كَفَرُوا أَعْمَالُهُمْ كَسَرَابٍ بِقِيعَةٍ يَحْسَبُهُ الظَّمْآنُ مَاءً حَتَّىٰ إِذَا جَاءَهُ لَمْ يَجِدْهُ شَيْئًا

“(అల్లాహ్ ను, అంతిమ దినాన్ని) తిరస్కరించిన వారి కర్మల ఉపమానం ఎండమావి వంటిది. తప్పిక గొన్నవాడు దాన్ని చూసి నీరు అనుకున్నాడు. కాని తీరా అక్కడకు చేరినాక ఏమీ పొందలేక పోయాడు.” (నూర్ 24 : 39)

ఈ లక్ష్యమే (అల్లాహ్ ఏకత్వం మరియు మరణానంతర జీవితంపై విశ్వాసం) మనకు అంధకారంలో కాంతిరేఖగా పనిచేస్తుంది. ఇదే గనక లేకుంటే అన్ని వైపులా చీకటే! మనం చేసే ఏ పనికీ ఒక ఆశయం, ఒక లక్ష్యం లేకుండా పోతుంది :

(అల్లాహ్ ను, ప్రళయ దినాన్ని త్రోసిపుచ్చేవారి కర్మల ఉపమానం చీకటి క్రమ్ముకున్న సముద్రం వంటిది. దానిపై అలలు ఆవరించి ఉన్నాయి. ఆ (చీకటి) అలపై మరో అల. దానిపైన కారు మబ్బు క్రమ్మి ఉంది. చీకట్లు ఒక దానిపై ఒకటి అలుముకున్నాయి. మనిషి తన చేతిని బయటికి తీస్తే దాన్ని చూడనైనా లేడు. అల్లాహ్ ఎవరికి తన వెలుగును ప్రసాదించడో అతనికి మరే వెలుగూ లభించదు.” (నూర్ – 40)

ప్రతి పనికీ ఒక ఆశయం, ఒక ప్రేరణ తప్పక ఉంటుంది. ఉండాలి. అలాగే ఒక ఆగోచర శక్తి, సూక్ష్మ దృష్టితో తన గుండెల్లోని ఒక్కో అణువును గమనిస్తున్నాడనీ, తాను చేసే ప్రతి చిన్న పనికీ ఆయన ఎదుట నిలబడి జవాబు ఇవ్వవలసి ఉందని దృఢంగా విశ్వసించిన నాడు మనిషి మనసులో చిత్తశుద్ధి వచ్చేస్తుంది. ప్రాపంచిక స్వార్ధ ప్రయోజనాల నుండి అతని మనసు పరిశుభ్రమవుతుంది. నిస్వార్థ భావంతో అతను ముందడుగు వేస్తూ నైతికంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతాడు.

ఇస్లాం ప్రకారం కర్మలకు ఉద్దేశ్యం అవసరం. పైగా ఆ ఉద్దేశ్యం సదుద్దేశ్యమై ఉండటం అనివార్యం. మనిషి చేసే ఏ పని కూడా ఉద్దేశ్యం లేకుండా ఉండదని నీతి శాస్త్రజ్ఞులు అంటారు. అయితే ఈ ఉద్దేశ్యం ఏమై ఉండాలనే దానిపై వారు ఇంత వరకు ఏకీభవించలేక పోయారు. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ కాలం నుంచి నేటి వరకు డజన్ల కొద్దీ సిద్ధాంతాలు ఆవిర్భవించాయి. కాని యదార్థ రహస్యం ఇంతవరకూ ఛేదించబడలేదు.

నైతికత యొక్క ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? అనే విషయంతో ఇస్లాంకు అంతగా ఆసక్తి లేదు. ఉద్దేశ్యం ఏమై ఉండాలి? అనే దాని గురించే అది నొక్కి చెబుతుంది. వాస్తవానికి మనం చేసే పనికి అనేక చిన్న పెద్ద ఉద్దేశ్యాలుండవచ్చు. మసం మార్గ మధ్యంలో ఒక ముసలివాని భుజాలపై ఉన్న బరువుము దించి మన మీద వేసుకుంటాం.ఆ ముసలి వాణ్ణి సాదరంగా అతని ఇంటికి చేరుస్తాము. మనం చేసిన ఈ పనికి ఉద్దేశ్యమేమై ఉంటుంది?

(అ) ఆ ముసలివాడు సంతోషించి ఇంటికి చేరిన మీదట ప్రతి ఫలం ఇస్తాడని మనం అనుకుని ఉండవచ్చు.

(ఆ) మన ఈ త్యాగశీలాన్ని చూసి జనులు మెచ్చుకుంటారనీ, ప్రజా ప్రాతినిధ్యపు హోదా ఏదైనా మనకు కట్టబెడతారని కూడా మనం ఆశించి ఉండవచ్చు.

(a) లేదా దారిలో తారసపడే వారంతా మనల్ని చూసి సజ్జనుడుగా, ధార్మికునిగా ప్రశంసిస్తారని కూడా మనం తలపోసి ఉండవచ్చు.

(ఈ) లేదా ఈ రోజు యువకులమైన మనం ముసలివారి పట్ల ఆదరణతో మెలిగితే రేపు యువకులు తమ యెడల ఆదరణతో మెలగుతారని ఊహించి ఉండవచ్చు.

(ఉ) కొంత మంది ఇలాంటి పనుల పట్ల ఎంతో మక్కువ కలిగి ఉంటారు. ఇలాంటి సహాయ కార్యాలు చేసినప్పుడు వారి అంతరంగం ఆనందంతో పులకిస్తుంది.

(ఊ) మరి కొంతమంది వృద్ధులను అలాంటి స్థితిలో చూసి జాలిపడి వారిని ఆదుకుంటారు.

చెప్పవచ్చిందేమిటంటే ఒక్క పని వెనుక ఇలాంటి ఉద్దేశ్యాలు అనేకం ఉంటాయి. ఈ విభిన్న ఉద్దేశ్యాలే పని కొరకు ప్రజలకు ప్రేరణనిస్తాయి.

అయితే పైన పేర్కొనబడిన రకరకాల ఉద్దేశ్యాల జాబితాను మరోసారి పరికించి చూడండి. క్రమంగా ఆ ఉద్దేశ్యాలు క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళుతున్నాయి. ఎవరి ఉద్దేశ్యం స్వార్థప్రయోజనాల నుండి ఏ మేరకు అతీతంగా ఉందో ఆ మేరకే అది ఉన్నతం, ఆదరణీయం కాగలుగుతుంది. ఏదైనా ఆర్థిక, శారీరక ప్రతిఫలాన్ని ఆపేక్షించి మంచి పని చేస్తే అది అన్నిటికన్నా తక్కువ స్థాయి ఆశయం అవుతుంది. ఆ తరువాత కీర్తి ప్రతిష్ఠల్ని ఆశించి సత్కార్యం చేస్తే అతని ఆశయం కూడా అధఃస్థితిలోనే ఉంటుంది. అయితే మొదటి దాని కన్నా ఇది కొంత మేలైనది. ఆ తరువాత ఆత్మతృప్తి కోసం, అంతరాత్మను ఓదార్చటం కోసం సత్కార్యం చేసేవారి వంతు వస్తుంది. వీరి ఉద్దేశ్యం మంచిదే అయినా ఇందులోనూ స్వప్రయోజనం, ప్రాపంచిక వ్యామోహం అంతర్లీనమై ఉంది. ఒక మనిషి తోటి సోదరుని యెడల ఎంత ఆప్యాయంగా మెలగినా అతను ఒలకబోసే ఆప్యాయత వెనుక ఫలానా స్వార్థం దాగి ఉందని తెలిసినట్లయితే ఆ సోదరుని దృష్టిలో ఆ ఆప్యాయతకు గల విలువ తగ్గిపోతుంది. ఇది ఎంతో సహజమైన విషయం.

మనిషి మనోమయ భావాలు, భావనలకు మరో పేరు ఇది. దీని మూలంగానే మనిషి మంచీ-చెడుల మధ్య విచక్షణను పాటించగలుగుతాడు. దీని మూలంగానే అతని హృదయపు లోతుల్లో నుంచి తాను మంచి కొరకు సమాయత్తం కావాలనే ఘోష పుట్టుకు వస్తుంది. దిక్కులేని నిరుపేదను చూసినప్పుడు అతని పట్ల ప్రతి వ్యక్తిలో సహజంగానే జాలి కలుగుతుంది. హంతకుడు, కిరాతుకుని పట్ల ప్రతి వ్యక్తిలో సహజంగానే ద్వేషం పుట్టుకు వస్తుంది. ఈ సహజ శక్తి ప్రతి వ్యక్తి అంతరంగంలో ప్రోది చేయబడి ఉంది. ప్రతి మంచి లేక చెడు పని చేసే సమయంలో అతని మనసు పొరల నుంచి ప్రశంస లేక విమర్శల వాణి అతనికి తప్పక వినిపిస్తుంది. అయితే చెడు సహచర్యం, చెడు శిక్షణ మరియు నకారాత్మక భావాల ప్రతాపం వల్ల అంతర్ వాణి ప్రభావ రహితం కూడా అయిపోతుంది. ఈ కారణంగానే ప్రతి చెడు పనిని చేసే ముందు మనిషి జంకుతాడు. భయపడతాడు, అతని కాళ్ళు చేతులు వణుకుతాయి. చెడు కార్యపు తలంపుతో అతని మనసంతా కకావికలమవుతుంది. ఒక్కోసారి అతను సిగ్గుతో కుమిలిపోతాడు. పశ్చాత్తాప భావంతో కృంగిపోతాడు. చేసిన పాపాన్ని తలచుకున్నప్పుడల్లా అతని నుదుటి పై చెమట బిందువులు ఏర్పడతాయి. కాని అతడు మాటి మాటికీ అంతరాత్మ ప్రబోధాన్ని బలవంతంగా నొక్కి వేయ సాగితే అది క్రమక్రమంగా అణగారిపోతుంది. క్రమంగా అతనిలోని పశ్చాత్తాప భావం కూడా పటాపంచలైపోతుంది.

ఈ ప్రభావాలు దేని పరిణామం? ఇస్లాం నైతిక సూత్రాల ఆధారంగా దీనికి సమాధానమేమంటే- అల్లాహ్ మంచీ చెడులకు సంబంధించి ప్రతి మనిషిలో ప్రోది చేసిన సహజ శక్తుల పరిణామమే ఇది. దివ్య ఖుర్ఆన్లో ఉంది:

وَنَفْسٍ وَمَا سَوَّاهَا فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَاهَا
“మానవాత్మ సాక్షిగా! ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను తెలియజేసిన వాని సాక్షిగా!!” (అష్ షమ్స్ 19 : 7-8)

అదే అంతరాత్మ!

ఇక, మనం చెడు వైపునకు మొగ్గు చూపినప్పుడల్లా ‘నీవు చేయబోయేది చెడు’ అని హెచ్చరించి మనల్ని అప్రమత్తుల్ని చేసేది “నఫ్సె లవ్వామ” (నిందించే మనసు, మధనపడే మనసు) గా ఇస్లాంలో ఖరారు చేయబడింది. ఇది కూడా మన హృదయంలో ఉంది.

بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ
“మానవుడు ఎన్ని సాకులు చెప్పినా స్వయంగా అతనికి తనను గురించి బాగా తెలుసు.” (అల్ ఖియామహ్ 75 : 14, 15)

నవాస్ బిన్ సమాన్ అన్సారీ (రదియల్లాహు అన్హు) అనే ఒక సహాబి (సహచరుడు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా పాప పుణ్యాలు వాస్తవికతను అర్థం చేసుకునే ఉద్దేశ్యంతో మదీనాలో ఒక ఏడాది కాలం పాటు మకాం వేశారు. ఆఖరికి ఆయన ఒకసారి ఆ విషయమై ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “సత్ప్రవర్తనే పుణ్యం. దేని విషయంలో నీ మనసు మధనపడుతుందో, నీవు చేసిన ఏ పని గురించి ప్రజలు తెలుసుకోవటాన్ని నీవు ఇష్టపడవో అది చెడు (పాపం) అని తెలుసుకో” అని ఉపదేశించారు.

అలాగే వాబిస బిన్ మాబద్ (రదియల్లాహు అన్హు) అనే మరొక సహాబి మంచీ చెడుల వాస్తవికతను తెలుసుకోగోరి అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి విచ్చేశారు. ఆ సమయంలో నలువైపులా ప్రవక్త గారి ప్రియ శిష్యులు గుమిగూడి ఉన్నారు. వాబిస గారు అత్యుత్సాహంతో, అమితాసక్తితో అందరినీ ప్రక్కకు తోసేస్తూ ముందుకు దూసుకు పోసాగారు. ప్రజలు ఆయన్ని ఆపబోయినా ఆగకుండా ఆయన ముందుకు తోసుకుపోయారు. ఆయన ఆత్రుతను గమనించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం), “వాబిస! దగ్గరికి రండి” అని చెప్పారు. ఆయన దగ్గరకెళ్ళి కూర్చోగానే “వాబిస! మీరు ఎందుకు విచ్చేశారో నేను చెప్పనా? లేక మీరు చెబుతారా?!” అని ప్రశ్నించారు. “తమరే చెప్పండి” అని కోరారు. “వాబిస! మీరు మంచీ చెడుల వాస్తవికతను గురించి నా ద్వారా తెలుసు కోదలిచారు. ఔనా?” అని ప్రవక్తగారు పలకగా “నిజమే ఓ దైవప్రవక్తా!” అని ఆ సహాబి ధృవీకరించారు. ఆ పైన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ఉపదేశించారు:

“ఓ వాబిస! నీ అంతరంగాన్ని అడుగు. నీ మనస్సాక్షిని సంప్రదించి సమాధానం పొందు. దేనివల్ల నీ హృదయం మరియు నీ మనసు కుదుట పడతాయో అది మంచిదని గ్రహించు. మరి దేనివల్ల నీ హృదయం అశాంతికి లోనవుతుందో, దేని మూలంగా నీ మనసు కలత చెందుతుందో అది చెడు అని తెలుసుకో, ఒకవేళ ఆ పని సమంజసమే అని ప్రజలు నిన్ను ప్రోత్సహించినప్పటికీ (అది చెడు సుమా!)” (మస్నద్ బిన్ హంబల్)

ఈ నైతిక కోణానికే ప్రజలు “అంతరాత్మ ప్రబోధం” అని నామకరణం చేశారు.

మొదట్లో మనిషి తన అంతరాత్మ ప్రబోధానికి వ్యతిరేకంగా ఏదేని మాట పలికితే నిర్మలమైన, స్వచ్ఛమైన అతని మనోఫలకంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది. ఆవేశం చల్లారిన తరువాత అతడు పశ్చాత్తాపం చెంది అల్లాహ్ ను క్షమాపణ కోరుకుంటే, జరిగిన తప్పుపై బాధపడితే ఆ మచ్చ చెరిగిపోతుంది. అయితే ఆ పాపానికే అతడు పదేపదే పాల్పడసాగితే ఆ మచ్చ పెరిగి పెద్దదవసాగుతుంది. క్రమక్రమంగా అది హృదయాన్నంతటినీ ఆవరించి అన్ని రకాల మంచి భావాల నుండి అతణ్ణి దూరం చేసివేస్తుంది. ఈ భావాన్నే కారుణ్యమూర్తి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఈ విధంగా ఉపదేశించారు:

“దాసుడు ఏదైనా పాపానికి ఒడిగట్టినపుడు అతని హృదయంపై కళంకమనే నల్లని బిందువు ఏర్పడుతుంది. మరి అతడు గనక దాన్నుండి వేర్పడి క్షమాపణకై దైవాన్ని అర్ధిస్తే, పశ్చాత్తాపం చెందితే అతని హృదయం నిర్మలమవుతుంది. అతను గనక మళ్లీ అదే అపరాధానికి పాల్పడితే ఆ మచ్చ పెరగసాగుతుంది. ఆఖరికి అది హృదయాన్నంతటినీ ఆవరిస్తుంది.” (జామె తిర్మిజి)

ఆ తర్వాత ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు “హృదయానికి పట్టిన తుప్పు అంటే ఇదే.” దాని ప్రస్తావన క్రింది వచనంలో ఉంది –

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
“ఎన్నటికీ కాదు, అసలు వారి దుష్కార్యాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది.” (ముతఫ్ఫిఫీన్ 83 :14)

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఒక ఉపమానం ద్వారా ఈ విషయాన్ని విశదీకరించారు. ఒక తిన్నని మార్గం ఉంది. అది గమ్యస్థానానికి చేరుస్తుంది. ఆ మార్గానికి అటు వైపున, ఇటు వైపున కూడా రెండు గోడలు ఉన్నాయి. ఆ రెండు గోడల్లోనూ కొన్ని తలుపులు తెరుచుకుని ఉన్నాయిగాని వాటిపై తెరలు ఉన్నాయి. తిన్నని మార్గం ఆఖరి అంచు నుండి ప్రకటన గావించే వాడొకడు మార్గంపై తిన్నగా నడవమనీ అటూ ఇటూ పోవద్దనీ ప్రకటిస్తున్నాడు. ఆ సమయంలో దారిలో పోతున్న దైవదాసుడు కుడి ఎడమల్లో ఉన్న ద్వారాలకు వేలాడుతున్న తెరలను ఎత్తి చూడదలిచాడు. అప్పుడు పై నుండి ఒక ప్రకటన వెలువడింది – “జాగ్రత్త ! పరదాను ఎత్తకు. ఎత్తావంటే జారి పడిపోతావు” అని! అనంతరం ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: “ఈ (తిన్నని) మార్గమే ఇస్లాం. ప్రక్కనున్న ఈ ద్వారాలు అల్లాహ్ నిషేధించినవి. ఈ పరదాలు వాటి చివరి హద్దులు వంటివి. తిన్నని మార్గం ఆఖరి అంచు నుంచి పిలిచేదే ఖుర్ఆన్. కాగా; పై నుండి పిలుపు నిచ్చేవాడు ‘ప్రతి మోమిన్ హృదయంలో ఉన్న అల్లాహ్ తరఫు బోధకుడు’ అన్న మాట!” (మిష్కాత్)

ఎంత చక్కని ఉపమానమిది! ఎంత గొప్ప తత్వవేత్త అయినా, మరెంత గొప్ప నీతి శాస్త్రజ్ఞుడైనా మనస్సాక్షి గురించి ఇంతకన్నా చక్కగా వివరించగలడా?!

ఇస్లాంలో ప్రతి మంచి పని (సత్కార్యం) యొక్క ఉద్దేశ్యం మరియు లక్ష్యం ఒక్కటే. అదే అల్లాహ్ మెప్పు! ఒక నిజమయిన ముస్లిం నిరంతరం పాటుపడవలసింది దీని కొరకే. అతను చేసే పనికి ఇది తప్ప మరో ఉద్దేశ్య ముండకూడదు. నైతిక సూత్రానికి – ఇస్లామీయ నైతికతకు మధ్యగల వ్యత్యాసం ప్రస్ఫుటం అయ్యేది ఇక్కడే.

మానవ నైతికతకు ‘ఉద్దేశ్యం’ ఏమై ఉండాలి? అని నీతి శాస్త్రజ్ఞులు మల్లగుల్లాలు పడుతుండగా, మానవుడు “ఫలానా వస్తువు”ను తన నైతికత యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా పెట్టుకోవాలని దైవ ప్రవక్తలు ప్రబోధిస్తారు. మనిషి దగ్గర ఉండే రెండు ప్రధాన జీవన సాధనాలు ధన ప్రాణాలు. ఈ రెంటినీ అల్లాహ్ మార్గంలో వెచ్చించటమే త్యాగం మరియు సత్కార్యం. కాగా; ఒక విశ్వాసి ‘ప్రాణం’ గురించి ఇలా చెప్పబడింది:

وَمِنَ النَّاسِ مَن يَشْرِي نَفْسَهُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ

“మరో వైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందడానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అటువంటి తన దాసుణ్ణి అల్లాహ్ అమితంగా ప్రేమిస్తాడు”. (అల్ బఖర 2: 207)

ఆ తరువాత ‘ధనం’ గురించి ఇలా సెలవీయబడింది:

وَمَثَلُ الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُمُ ابْتِغَاءَ مَرْضَاتِ اللَّهِ وَتَثْبِيتًا مِّنْ أَنفُسِهِمْ كَمَثَلِ جَنَّةٍ بِرَبْوَةٍ أَصَابَهَا وَابِلٌ فَآتَتْ أُكُلَهَا ضِعْفَيْنِ فَإِن لَّمْ يُصِبْهَا وَابِلٌ فَطَلٌّ

“తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లులు పడినా అదే దానికి చాలు.” (అల్ బఖర 2 : 265)

వేరొక సూరాలో మరింత స్పష్టంగా చెప్పబడింది:

الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ

“(ఎందుకంటే) అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు. పోనీ, అతనెవరికైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే, అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయె. (అయినాసరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు).మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు.” (అల్ లైల్ 92 : 18-20)

ఈ వచనాల సారాంశాన్ని, తాత్పర్యాన్ని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అనేక హదీసులు ద్వారా విశదీకరించారు. ఒక వ్యక్తి వచ్చి, “ఓ దైవప్రవక్తా! విజయ ధనం కోసం ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొంటాడు. మరొక వ్యక్తి గొప్ప యోధునిగా గుర్తింపు పొందే సంకల్పంతో యుద్ధానికి వస్తాడు. ఇంకొక వ్యక్తి జనుల మన్నన పొందే ఉద్దేశ్యంతో కదన రంగానికి కదలి వస్తాడు. మరి వీరిలో వాస్తవానికి అల్లాహ్ మార్గంలో పోరాడిన యోధుడు ఎవరు?” అని ప్రశ్నించగా “అల్లాహ్ వాక్కు ఉన్నతికై పోరాడేవాడు మాత్రమే సిసలయిన యోధుడు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు.

వేరొక సందర్భంలో అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు – “గుర్రాలను కట్టి ఉంచటం ఒకరికి పుణ్యప్రదం కాగా, మరొకరికి ఆసరా అవుతుంది. ఇంకొకరికి అది పాపంగా పరిణమిస్తుంది. అదెలాగో తెలుసా! అల్లాహ్ మార్గంలో ఉపయోగించే ఉద్దేశ్యంతో గుర్రాన్ని కట్టి ఉంచితే అది పుణ్యప్రదం కాగలదు. అట్టి పరిస్థితిలో ఆ గుర్రం మేత మేసినా, నీరు త్రాగినా దాని పుణ్య ఫలం సయితం యజమానికి లభిస్తుంది. అవసరార్ధం గుర్రం ఉంచే వానికి అది అండగా ఉంటుంది. ఎందుకంటే అల్లాహ్ తనకు సిరిసంపదలను ప్రసాదించిన తరువాత తనకు అవసరం పడిన వస్తువుకై ఇతరుల్ని దేవురించే స్థితి ఏర్పడరాదన్న ఉద్దేశ్యంతో అతడు ఆ గుర్రాన్ని పోషిస్తున్నాడు. పైగా ఆ గుర్రంతో ధర్మసమ్మతంగా పని చేయించుకుంటున్నాడు. దాని హక్కును నెరవేరుస్తున్నాడు. ఆ విధంగా అతడు తన మర్యాద మంటగలసిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇక గుర్రాల పెంపకం పాప ప్రదంగా పరిణమించే దెవరికో తెలుసా?! ఎవడు గర్వాతిశయంతో, డాబు దర్పం కోసం వాటిని పోషిస్తాడో వాడి పాలిట అది పాపంగా పరిణమిస్తుంది.” (సహీహ్ బుఖారీ – కితాబుల్ జిహాద్)

ఈ శిక్షణా పర్వంలో అన్నిటికన్నా ప్రభావ పూరితమైన వృత్తాంతం ఇంకొకటి ఉంది. హజ్రత్ అబూహురైరా (రజియల్లాహు అన్ను) ఉల్లేఖించిన ఈ వృత్తాంతం తిర్మిజీ గ్రంథంలో విపులంగా పొందుపరచబడింది. దీనిని ఉల్లేఖిస్తూ హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) మూడుసార్లు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సంఘటనను విని హజ్రత్ ముఆవియ (ర.అ) దుఃఖంతో విలపించారు. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రవచించారని హజ్రత్ అబూహురైర (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి మరీ ఉల్లేఖించిన ఆ వృత్తాంతం ఇలా ఉంది –

ప్రళయ దినమున అల్లాహ్ ప్రజల తీర్పు చేయడానికి సిద్ధమయినపుడు ప్రతి మానవ సమాజం (ఉమ్మత్) మోకాళ్ళు నేలకానించి కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో అందరికన్నా ముందు దివ్య ఖుర్ఆన్ను అధ్యయనం చేసిన పండితులు, ధర్మయుద్ధం (జిహాద్)లో అమరగతులయిన వారు, శ్రీమంతులు హాజరు పరచబడాలని ఆజ్ఞాపించబడుతుంది. ఆ తరువాత ప్రళయదిన అధినేత అయిన అల్లాహ్ పండితుణ్ణి ఉద్దేశించి, “నేను నీకు పైగంబరుపై అవతరించినదంతా నేర్పాను కదా! నీవు దీనిని ఏ మేరకు ఆచరణలో పెట్టావు?” అని ప్రశ్నిస్తాడు. దానికతడు “ఓ అల్లాహ్! నేను రేయింబవళ్ళు నమాజ్లో ఖుర్ఆన్ పారాయణం చేసేవాణ్ణి” అని వివరణ ఇచ్చుకుంటాడు. “నీవు అబద్ధమాడుతున్నావు.” అని అల్లాహ్ అంటాడు. “ఇతను చెప్పేది నిజం కాద”ని మరో వైపు నుంచి దైవదూతలు కూడా సాక్ష్యమిస్తారు. “ప్రజలు నిన్ను గొప్ప విద్వాంసునిగా, ఖుర్ఆన్ పరితునిగా పొగడాలన్న ఉద్దేశ్యంతోనే నీవు అలా చేసేవాడివి. నీవు ఆశించింది ప్రపంచ జీవితంలోనే నీకు దక్కింది.” అని తీర్పు దినపు యజమాని తరఫున చెప్పబడుతుంది.

ఆ పైన అల్లాహ్ ధనవంతుణ్ణి ఉద్దేశ్యించి “నేను నీ కొరకు ప్రపంచాన్ని ఎంతో విస్తృతపరచాను. ఎవరి ముందూ చేయిచాచి అర్ధించవలసిన స్థితి ఏర్పడకుండా (కలిమిని) అనుగ్రహించాను. ఔనా?” అనంటాడు. “నిస్సందేహంగా నీవు నాకు ఇదంతా అనుగ్రహించావు” అని ఆ ధనవంతుడు ఒప్పుకుంటాడు. “మరి నేను అనుగ్రహించిన దానిని ఏం చేశావు?” అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. “నేను హక్కుదారులకు హక్కు ఇచ్చాను, దాన ధర్మాలు చేశాను (నీ ప్రసన్నత కోసమే ఇదంతా చేశాను)” అని అతను విన్నవించుకుంటాడు. “నీవు చెప్పేది నిజం కాదు” అని అల్లాహ్ అంటాడు. దైవదూతలు కూడా ఆ ధనవంతుని మాటలు అబద్ధాలని ధృవీకరిస్తారు. “జనులు నిన్ను ధర్మదాతగా కీర్తించాలన్న కోరికతోనే నీవు ఇదంతా చేసేవాడివి. నువ్వు కోరుకున్న కీర్తి ఇహలోకంలోనే నీకు లభించింది” అని తీర్పు ఇస్తాడు తీర్పు దినపు యజమాని.

అనంతరం ధర్మయుద్ధంలో అమరగతి నొందిన యోధుడు హాజరు పరచబడతాడు. “నీవు ఎలా చంపబడ్డావు?” ప్రభువు ప్రశ్నిస్తాడు. “ప్రభూ! నీ మార్గంలో పోరాడవలసిందిగా నీవు ఇచ్చిన ఆదేశాన్ని శిరసావహిస్తూ నేను యుద్ధరంగంలో అడుగుపెట్టాను. అమరగతి నొందే దాకా పోరాడాను” అని అతను సమాధానమిస్తాడు. “నీవు చెప్పేది అబద్ధం” అని అల్లాహ్ అంటాడు. “అతను చెప్పేది నిజం కాదని” దైవదూతలు కూడా సాక్ష్యమిస్తారు. “లోకం నిన్ను గొప్ప యోధునిగా, శూరునిగా పొగడాలన్న సంకల్పంతోనే నువ్వు ఈ పని చేశావు. ప్రపంచంలోనే నీకీ కీర్తి ప్రతిష్ఠలు ప్రాప్తించాయి” అని తీర్పు ఇవ్వబడుతుంది.

మరి అందరికన్నా ముందు నరకంలో పడవేయబడేది ఈ ముగ్గురు వ్యక్తులే అని మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పారు. (తిర్మిజీ)

ఈ హదీసును విని హజ్రత్ ముఆవియా (రదియల్లాహు అన్హు) చాలా సేపు ఎక్కి ఎక్కి ఏడ్చారు. తరువాత గద్గద స్వరంతో ఇలా అన్నారు: “అల్లాహ్ మరియు దైవప్రవక్త సత్యసంధులు.” ఈ హదీసుకు సమర్ధింపుగా ఆయన దివ్య ఖుర్ఆన్ లోని ఈ వచనాలను పఠించారు.

مَن كَانَ يُرِيدُ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَالَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ أُولَٰئِكَ الَّذِينَ لَيْسَ لَهُمْ فِي الْآخِرَةِ إِلَّا النَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا فِيهَا وَبَاطِلٌ مَّا كَانُوا يَعْمَلُونَ

“ఎవరయితే ప్రాపంచిక జీవితం పట్ల, దాని అందచందాల పట్ల వ్యామోహితులవుతున్నారో అలాంటి వారికి వారి కర్మలను (వాటి ఫలితాన్ని) మేము ఇక్కడే పూర్తిగా ఇచ్చేస్తాము. ఇక్కడ (ప్రపంచంలో) వారికి ఏ లోటూ జరగదు.అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి.” (హూద్ 11: 15, 16)

మన నీతీ నడవడికలయినా, సత్కర్మలయినా – వాటి అసలు లక్ష్యం అల్లాహ్ ప్రసన్నతను చూరగొనడమై ఉండాలి గానీ, స్వార్ధ ప్రియత్వమై ఉండరాదు. స్వార్థమే పరమార్థమైనపుడు అందులో పుణ్యఫలం దెబ్బతినే ప్రమాదముంటుంది. అల్లాహ్ మెప్పును ఆశించి ఒక మంచి పనిని చేసినపుడు పరలోకంలో పుణ్యఫలం ఎలాగూ లభిస్తుంది. అయితే ఇహలోకంలో కూడా ఆ మంచి పని మూలంగా మన గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడిస్తే అల్లాహ్ తరఫున దీన్ని అడ్వాన్సు కానుకగా భావించాలి. ఇస్లాం యొక్క ఈ నైతిక శిక్షణ మనిషిని ఇటువంటి సంకుచిత, స్వార్థ స్థితి నుంచి వెలికితీసి నిస్వార్థత, నిజాయితీ తత్పరతల ఉన్నతికి చేరుస్తుంది.

ఈ విధంగా సెలవీయబడింది:

(1) “మీరు ఏది ఖర్చు చేసినా అల్లాహ్ కొరకు తప్ప మరోదాని కొరకు కాదని తెలుసుకోండి.” (అల్ బఖర: 37 వరకూ)

(2) “ఒకరు చేసిన మేలుకు బదులు తీర్చుకునే ఉద్దేశ్యంతో కాదు, మహోన్న తుడైన ప్రభువు ప్రసన్నతను చూరగొనడం కోసం మాత్రమే అతడు ఈ పని చేస్తున్నాడు.” (అల్ లైల్ -19,20)

నైతిక ఆజ్ఞల పరిపూర్తి, హక్కుల చెల్లింపు గురించి తాకీదు చేస్తూ ఇలా సెలవీయబడింది:

(3) “కనుక (ఓ విశ్వాసీ!) బంధువునకు అతని హక్కును ఇచ్చివేయి. పేదవానికి, బాటసారికీ (వారి హక్కులను ఇచ్చివేయి. అల్లాహ్ ప్రసన్న తను కోరుకునేవారికి ఈ పద్ధతి ఉత్తమమైనది. సాఫల్యం పొందేవారు వారే.” (రూమ్-38)

మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా నైతిక సూత్రాలకు పరిపూర్ణత చేకూరిందన్నది తిరుగులేని సత్యం. అంతకుమునుపు ఉన్న మతాలలో ఈ పరిపక్వత కానరాదు. “తౌరాత్ లోని నైతిక శిక్షణలో రాజదర్పం తొణికిస లాడుతుంది. అందులో ఒక సూత్రంగానీ, ఒక ఉద్దేశ్యంగానీ, పరమార్థంగానీ స్పష్టంగా ద్యోతకమవుతున్నట్టు కనిపించదు. ఇక బైబిల్ విషయానికి వస్తే అందులో అందమైన అక్షరాల కూర్పు తప్ప, నైతిక ఆదేశాల మూలసూత్రమనేదేదీ నెలకొన్నట్టు కానరాదు. అయినప్పటికీ క్రైస్తవ మతంలో కొన్ని సూత్రాలున్నాయనేది మాత్రం నిర్వివాదాంశం. అయితే వాటికి గల పునాదులు చాలా బలహీనమైనవి. వాటిలో ఒకటి మానవసృష్టికి సంబంధించినది.

మానవ సృష్టి ఖుద్దుగా పాపంతో కూడుకున్నదని క్రైస్తవ మతం అంటుంది, దాని ప్రకారం మానవుడు జన్మతః పాపి. ఎందుకంటే అతని తల్లిదండ్రులైన ఆదం హవ్వాలు పాపానికి ఒడిగట్టారు. ఈ పాపం వారసత్వంగా ప్రతి మనిషికీ సంక్రమిస్తూ వస్తోంది. దీన్నుండి తనను రక్షించుకోవటం ఏ ఒక్కరి తరమూ కాదు. ఈ విషయంలో క్రైస్తవ నమ్మకం ఎంత వరకూ పోయిందంటే పుట్టిన ఏ శిశువైనా సరే “బాప్టిజం” పుచ్చుకునే దాకా పరిశుద్ధత నొందలేడు. దానికి ముందు ఒక క్రైస్తవుని శిశువు చనిపోయినా సరే. అతడు ఆకాశ సామ్రాజ్యహద్దుల్లోకి ప్రవేశించజాలడు. పైగా అతడు నరకంలోకి నెట్టివేయబడతాడు. ఎందుకంటే ఏసుక్రీస్తు పేరుతో అతడు “మోక్షం” పొందలేదు.

అయితే ఇస్లాం సిద్ధాంతం దీనికి పూర్తిగా భిన్నమైనది. దాని దృష్టిలో తౌహీద్ (అల్లాహ్ ఏకత్వం) ఎంతో ముఖ్యమైనది. ఇస్లాం ప్రకారం మనిషి పుట్టుకరీత్యానే – స్వాభావికంగానే అల్లాహ్ విధేయుడుగా ఏకేశ్వరోపాసిగా ఉంటాడు. ‘అలస్తు బిరబ్బికుమ్’ (నేను నీ ప్రభువును కానా?) అని అల్లాహ్ ప్రశ్నించినప్పుడు ‘ఖాలూ బలా’ (ఎందుకు కావు?!) అని అతనన్నాడు. అంటే ఉన్నతుడైన ప్రభువును అతడు అంగీకరించాడు. అతని ఈ ‘అంగీకారం’ అతని నిర్దోషిత్వాన్ని నిరూపిస్తోంది. కాగా, పుట్టుకకు ముందు మనిషి మనోఫలకంపైన అల్లాహ్ సువర్ణాక్షరాలతో లిఖించిన ఈ వాగ్దానాన్ని మానవుడు స్పృహలోకి వచ్చిన తరువాత మరింత మెరిసిపోయేలా చేయటమో, చెరిపి వేయటమో చేస్తాడు. ఈ నేపథ్యంలోనే అల్లాహ్ ఇలా అంటున్నాడు!

  1. “మేము మానవుణ్ణి అద్భుతమయిన ఆకృతిలో సృజించాము.” (అత్తీన్ -4)
  2. మరోచోట ఇలా అనబడింది:
    “ఆయనే నిన్ను సృజించాడు. మరి నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు. నిన్ను సమపాళ్ళలో మలిచాడు. మరి తానుకోరిన రూపంలో నిన్ను రూపొందిం చాడు.” (ఇన్ఫితార్ -7,8)

ఈ వచనం ఇన్ఫితార్ సూరాలోనిది. ఇందులో ప్రళయదినం గురించి, మనిషికి లభించే శిక్షా బహుమానాల గురించి చెప్పబడింది. ఆ తరువాత పై ఆయత్ వచ్చింది. ఈ ఆయిల్లోని ‘ఫ అదలక్’ అనే పదానికి మేము “సమ పాళ్ళలో మలిచాడు” అని అనువదించాము, అంటే ఒక మనిషి మనుగడకు ఏ ఏ శక్తి యుక్తులు అవసరమవుతాయో అవన్నీ అతనిలో పొందుపరచబడ్డాయని భావం. ఇతర ఆయతులలో ఈ భావం మరింత స్పష్టంగా చెప్పబడింది.

“ఓ (ప్రవక్తా!) మహోన్నతుడగు నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. ఆయన (విశ్వాన్ని) సృష్టించాడు. (దానిని) తీర్చిదిద్దాడు. మరి అన్ని రకాల అంచనాలను నిర్ధారించాడు. ఆపై మార్గదర్శకత్వం వహించాడు.” (అల్ ఆలా: 1 – 3)

మార్గదర్శకత్వం వహించటం – అంటే మనిషికి సన్మార్గమేదో ఎరుకపరచటం – అనేది మనిషి స్వభావంలోనే జన్మతః ఉంది. ఇతర శక్తియుక్తులు పుట్టుకతో వచ్చినట్లే సన్మార్గాన్ని కనుగొనే తెలివితేటలు కూడా అతనిలో ఇమిడి ఉన్నాయన్న మాట!

“మేము మానవుణ్ణి పరీక్షించే నిమిత్తం అతన్ని ఒక మిశ్రమ వీర్యపు బిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతన్ని వినే వాడుగా, చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం చూపాము. మరి సన్మార్గుడవటమైనా, దుర్మార్గుడవటమైనా అతనిపైనే ఆధారపడి ఉంది.” (అదహ్ర్-23)

అంటే అతనికి కావలసిన సన్మార్గ దర్శకత్వం ఏనాడో ఇవ్వబడిందన్న మాట! ఇక లోకజ్ఞానం వచ్చిన మీదట – సన్మార్గాన్ని అవలంబించి అల్లాహ్ కు కృతజ్ఞుడుగా మెలగాలో, మార్గ విహీనతకు గురై చేసిన మేలును మరచిన వాడుగా జీవించాలో అతడే నిర్ధారించుకోవాలి. ఆ మాటే షమ్స్ సూరాలో మరింత సూటిగా చెప్పడం జరిగింది:

“మానవాత్మ సాక్షిగా! ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచీ చెడులను దానికి తెలియజేసిన వాని సాక్షిగా!! నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు. దానిని అణచి వేసిన వాడు విఫలుడయ్యాడు.” (అష్షమ్స్: 7-10).

మొత్తం మీద తేలిందేమంటే ఇస్లాం శిక్షణ ప్రకారం మానవ నైజం జన్మతః పాపాల పుట్టగా చిత్రీకరించబడలేదు. పైగా అతని నైజంలో సన్మార్గం మరియు విచక్షణా జ్ఞానం నూరిపోయబడి ఉంది. అందుకే ఈ విధంగా వక్కాణించబడింది:

“కనుక ఏకాగ్ర చిత్తంతో మీ ముఖాన్ని ఈ ధర్మం దిశలో స్థిరంగా ఉంచండి. ఇకపోతే అల్లాహ్ స్వభావం; దేని ప్రాతిపదికపై ఆయన మానవులను సృజించాడో (దానిపై నిలకడగా ఉండండి. అల్లాహ్ సృష్టి ప్రక్రియ మార్చనలవి కానిది. ఇదే సరైన ధర్మం. కాని చాలా మందికి తెలియదు.” (అర్ రూమ్ – 30)

ఇంతకీ ఆ సరైన ధర్మం ఏది? అంటే అదే ఇస్లాం. అది చూపే మార్గమే రుజుమార్గం. దాని మౌలికాంశం అల్లాహ్ ఏకత్వం (తౌహీద్). ఈ దివ్య వచనానికి సారాంశంగా మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

“ప్రతి పిల్లవాడు సహజ ధర్మంపైనే జన్మిస్తాడు. ఆపైన అతని తల్లిదండ్రులు అతన్ని యూదునిగానో, క్రైస్తవునిగానో, జొరాస్ట్రియన్ గానో చేసేస్తారు” (సహీహ్ బుఖారీ, ముస్లిం).

ఏ విధంగానయితే ఒక జంతువు పిల్ల యధాస్థితిలో పుడుతుందో, దాని చెవి తెగి ఉండదో అదే విధంగా మానవ శిశువు కూడా తన సహజ స్వరూపంలో, సిసలైన నైజంపై పుడుతుంది.

ఈ అంశాన్ని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు మరో విధంగా కూడా విడమరచి చెప్పారు. మానవుల పుట్టుకకు మునుపు అల్లాహ్ మానవాత్మలతో “అలస్తు బిరబ్బికుమ్” (నేను మీ ప్రభువును కానా?) అని అడిగాడు. దానికి మానవాత్మలు ముక్త కంఠంతో ‘బలా?’ (ఎందుక్కావు? నిస్సందేహంగా నీవే మా ప్రభువువి) అని సమాధానమిచ్చాయి. మానవుడు అల్లాహ్ తో చేసిన ఈ ‘బాస’ను ఖుర్ఆన్ పదే పదే జ్ఞాపకం చేసింది. పైగా మనిషిని అప్రమత్తుణ్ణి చేస్తూ ఇలా అన్నది : “చూడు, షైతాన్ నీ తండ్రి ఆదమ్ ను పెడత్రోవ పట్టించాడు. జాగ్రత్త! నీవు అతని (మాయ) మాటల్లో పడకు సుమా!!”

ఈ ఉపదేశాలను బట్టి స్పష్టంగా అవగతమయ్యేదేమిటంటే, మానవుడు తన సిసలైన నైజం దృష్ట్యా సాత్వికుడు, అమాయకుడు, నిష్కళంక స్వభావిగా జన్మిస్తాడు. అతడు పుట్టుకతోనే తన పితామహుని వారసత్వ పాపభారాన్ని తన వీపుపై మోసుకుని రాడు. దీని గురించి ఖుర్ఆన్ నిర్ద్వంద్వంగా తీర్పు ఇచ్చేసింది:

“పాపభారం మోసేవాడెవడూ మరొకరి పాపభారం మోయడు.” (ఫాతిర్ -18)

“ప్రతి ప్రాణీ తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంది.” (తూర్-21)

ఈ వచనానికి తాత్పర్యంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు:

“తండ్రి చేసిన అపరాధానికి కొడుకుగానీ, కొడుకు చేసిన పాపానికి తండ్రిగానీ బాధ్యులు కారు. (ఎవరి పాపం వారి నెత్తిమీదే వేయబడుతుంది) (సునన్ ఇబ్నె మాజ)

ఇక పునర్జన్మ, పరకాయ ప్రవేశం లాంటి విశ్వాసాలతో జనసామాన్యం లోకి వచ్చిన మతాలు కూడా మానవ జన్మను ఒక విధంగా పాపఫలంగానే అభివర్ణించాయి. ఆ మతాలు మనిషి యొక్క ప్రతి పుట్టుకను, ప్రతి జీవితాన్ని ప్రతి జన్మను పూర్వజన్మతో ముడిపెట్టి మానవుని వీపుపై మోయలేనంత బరువును వేసాయి. అంటే ఏ మనిషైనా జీవిత కాలంలో కష్ట నష్టాల్ని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తే పూర్వజన్మలో అది అతడు చేసుకున్న పాపాల ఫలితంగా భావించాయి.

ఈ పూర్వ రంగంలో ఆలోచించినప్పుడు మనిషి పుట్టుకరీత్యా నిష్కళంక స్వభావి, ఏ పాపం ఎరుగని సాత్వికుడు అన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రబోధనం శోక సంతప్త ప్రపంచాన్ని ఓదార్చే శుభవార్త అని అనటంలో సందేహమే లేదు. ఎందుకంటారేమో, అభం, శుభం తెలీని ఒక పసికందును పట్టుకొని, ‘నీవు పాపిష్టివి, నీ పుట్టుకే పాపభూయిష్టమైనది. కాబట్టి నీవు నరక నివాసివి’ అనే దౌర్జన్యకరమైన మాటలకు ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ప్రబోధనలు అతీతమైనవి. పైగా లోకజ్ఞానం, బుద్ధి వివేకాలు, విచక్షణా జ్ఞానం అబ్బని ప్రతి చంటి పిల్లవాడు నిర్దోషి, అమాయకుడు అన్నది ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి శిక్షణలో ఒక ముఖ్యాంశం. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి ఇలా అన్నారు:

“అల్లాహ్ కలము పిల్లవాడు మంచీ చెడుల విచక్షణను తెలుసుకునే ప్రాజ్ఞ వయస్సుకు చేరే దాకా ఆ పిల్లవాని నుండి (అంటే అతని దుష్కర్మలు లిఖించటం నుండి) లేపబడింది.” (సహీహ్ బుఖారీ)

బాలవనములోని ఈ లేత (మానవ) మొగ్గలు వికసించకమునుపే వాడిపోయిన పక్షంలో ఇస్లాం దృష్టిలో వారు స్వర్గంలోని పూలు అవుతాయి. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ప్రవచించారు: “ఏ ముస్లిం పిల్లలు బాల్యంలో చనిపోతారో వారు అల్లాహ్ దర్బారులో తమ తల్లిదండ్రుల యెడల కరుణగా, క్షమా సాధనంగా తోడ్పడతారు. వారిని స్వర్గానికి గొనిపోతారు.” (సహీహ్ ముస్లిం)

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పాలు త్రాగే చంటి పిల్లవాడు చనిపోయి నప్పుడు, “ఇతను స్వర్గంలోకి పోయి స్వర్గవాసులైన మాతల పాలు త్రాగుతాడు.” అని ఆయన సెలవిచ్చారు. (ఇబ్నెమాజ)

అవిశ్వాసులు, బహుదైవారాధకులు పసిపిల్లల పరిణామం గురించి ఆయన్ని (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రశ్నించగా, “వారి వ్యవహారం అల్లాహ్ కే ఎరుక (సహీహ్ ముస్లిం) అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అన్నారు. అయితే వేరొక సందర్భంగా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విషయాన్ని కూడా విపులీకరించారు ఒకసారి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కలలో హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)ను చూచారు. ఆయన స్వర్గంలో కూర్చొని ఉన్నారు. ఆయన చుట్టూ చిన్న పిల్లల సమూహం ఉంది. “వారంతా పసితనంలోనే – సహజ ధర్మంపై చనిపోయిన పిల్లలు” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు తెలిపారు. “ఓ దైవ ప్రవక్తా! మరి బహుదైవారాధకుల పిల్లల సంగతేమిటీ?” అని సహచరులు ప్రశ్నించగా “బహుదైవారాధకుల పసిపిల్లలు కూడా స్వర్గవాసులే” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిచ్చారు.

ఒకసారి ప్రవక్త ప్రియ సహచరుని శిశువు చనిపోయింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ధర్మపత్ని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఈ వార్తను విని, ‘ఓ దైవప్రవక్తా! ఆ శిశువు ధన్యజీవి. ఆ పసికందు స్వర్గంలోని పక్షులలో ఓ పక్షిగా చేరిపోయింది. ఆమె ఏ పాపమూ ఎరుగదు. పాపం చేసే కాలాన్ని కూడా పొందలేదు కదూ!’ అనన్నారు. దానికి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆయిషా! అల్లాహ్ స్వర్గం కొరకు కొందరిని, నరకం కొరకు కొందరినీ పుట్టించాడు.” అని బదులిచ్చారు. (సహీహ్ ముస్లిం)

ఆలోచించండి!

క్రైస్తవ మతం ఒక వైపు ‘బాప్టిజం’ పుచ్చుకోకుండా చనిపోయిన చిన్న పిల్లలను నరకంలోకి నెట్టివేస్తుండగా – రెండవ వైపు ఇస్లాం ఆ అన్నెం పున్నెం తెలీని అమాయక బాలల కొరకు స్వర్గ ద్వారాలు తెరుస్తోంది. పైగా అలాంటి చిన్నారి బాలల కోసం అంత్యక్రియలలో ఈ విధంగా ప్రార్థించమని ఆదేశించ బడింది: “అల్లాహ్! ఇతన్ని (ఈ పసికందును) నా కొరకు మునుముందు ఉపయోగపడే నిధిగా చేయి. ఇతన్ని నా కొరకు సిఫార్సు చేసే వానిగా, నీ కొలువులో ఇతని సిఫార్సు స్వీకారయోగ్యం అయ్యేలా చేయి.”

“సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ నూ, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయ పూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడే ధనాన్ని బంధువుల కొరకూ, అనాధల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, యాచించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చేయడానికీ వ్యయ పరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించే వారూ, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటంలో స్థయిర్యం చూపేవారూ సన్మార్గులు. వాస్తవంగా అల్లాహ్ యెడల భయభక్తులు గలవారు వీరే.” (దివ్యఖుర్ఆన్- అల్ బఖర 177)

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో

గ్రీకు తత్వవేత్తలలో రెండు కోవలకు చెందినవారున్నారు. ఒక కోవకు చెందినవారు ట్రాజెడీ ఫిలాసఫర్లుగా ప్రసిద్ధిచెందగా రెండవ కోవకు చెందిన వారు కామెడీ ఫిలాసఫర్లుగా పేరు మోశారు. మొదటి కోవకు చెందిన వారి ధోరణి ఎలా ఉంటుందంటే, ఏ విషయాన్ని వారి ముందుకు తీసుకు వచ్చినాసరే నిరాశా నిస్పృహలతో కూడిన ఫలితాలనే అన్వేషిస్తారు. వారికి ఈ ప్రపంచమంతా అంధకార బంధురంగా కానవస్తుంది. ఇక రెండవ కోవకు చెందిన తత్వవేత్తలు దీనికి పూర్తిగా విరుద్ధం. వారంతా సంబరాల రాంబాబులే. ఈ లోకంలో ఆడుతూ పాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ బ్రతకమనటం తప్ప మరొకటేదీ వారికి పట్టదు, గిట్టదు. మొదటి కోవకు చెందినవారు మౌనంగా ఉండమనీ, జీవితంలో జీవచ్ఛవంలా ఉండాలనీ, ఇదే ఈ లోకపు ఆఖరి మజిలీ అని అంటారు. రెండో కోవకు చెందినవారు – “తినండి, త్రాగండి, ఖుషీఖుషీగా ఉండండి, రేపటి గురించి చింతించకండి” అని అంటారు.

వాస్తవానికి నైతికత దృష్ట్యా ఈ రెండు వాదాలూ సంస్కరించదగినవే. మొదటి సిద్ధాంతంపై గనక నమ్మకముంచితే మనిషి శక్తియుక్తులన్నీ నిరర్ధకమైనట్లే. ఇక రెండవ సిద్ధాంతంపై నమ్మకం గలవాడు ఈ ప్రపంచపు ఆటపాటల్లో, విలాసాలలో మునిగిపోతాడు, మంచీ-చెడుల మధ్య ఉండవలసిన తేడా అతనికి తెలియకుండా పోతుంది. ఇస్లాం శిక్షణ యొక్క రహదారి ఈ రెండు కుడిఎడమల అపవాదాల మధ్యనుంచి వస్తుంది. అది ఒకవైపు ప్రపంచం క్షణభంగురమనే విషయాన్ని పదేపదే జ్ఞాపకం చేసి మనిషి మనసును అప్రమత్తత నుంచి రక్షిస్తూనే రెండవ వైపు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందరాదని చెబుతుంది. చివరి ఘడియ వరకూ అల్లాహ్ పై ఆధారపడి జీవించే శిక్షణనిస్తుంది. ఇస్లాం శాసనాంగం ప్రకారం అల్లాహ్ పట్ల నైరాశ్యానికి లోనవటం అవిశ్వాసానికి ఆనవాలు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అది ఒక ముస్లింను నిరాశా నిస్పృహల లోయల్లోకి నెట్టి వేయదు. దివ్యఖుర్ఆన్ లో హజ్రత్ ఇబ్రాహీం (అలైహిస్సలాం)కు దైవదూత ద్వారా ఇలా ఉపదేశించబడింది.

“(ఓ ఇబ్రాహీమ్!) మీరు నిరాశ చెందిన వారిలో చేరకండి.” (అల్ హిజ్ర్ -55)

హజ్రత్ యాఖూబ్ (అలైహిస్సలాం) తన కుమారులకు హజ్రత్ యూసుఫ్ ను గురించి దర్యాప్తు చేయమని చెబుతూ ఇలా ఉపదేశించారు:

“(ఓ నా కుమారులారా!) అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు.” (యూసుఫ్-87)

పాపపంకిలంలో కూరుకుపోయిన మానవ సముదాయాన్ని (ముహమ్మద్ అనుచర సమాజాన్ని) ఉద్దేశించి ప్రేమానురాగాలతో వెలుపరిస్తున్న ప్రకటనను చూడండి –

“మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలనూ క్షమిస్తాడు.” (జుమర్ – 53)

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు సదా హదీసులలో మనిషిని ఆశాపూరితమయిన జీవితం గడపాలని తాకీదు చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు – “నేను నా దాసుని ఊహకు సమీపంగా ఉంటాను అని అల్లాహ్ సెలవిచ్చాడు”. (జామె తిర్మిజీ). అంటే మనిషి నా గురించి ఎలా ఊహించుకుంటే అలాగే జరుగుతుంది అని భావం. ఈ విషయంలో ఇస్లాం విశ్వాసానికి క్రింది ఆయత్ దర్పణం వంటిది:

“(ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా) ఎవడయితే విధేయుడో, రాత్రి ఘడియలలో (నమాజు చేస్తూ) నిలబడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో?!” (జుమర్ – 9)

అంటే; అతని హృదయంలో రెండు రకాల భావనలు ఉన్నాయి. పాపభీతి మరియు అల్లాహ్ సమక్షంలో సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉందన్న భావంతోపాటు అల్లాహ్ కారుణ్యం తనకు అండగా ఉంటుందన్న కొండంత ఆశ కూడా ఉంది. ఒకవైపు అల్లాహ్ ఆగ్రహానికి భయపడుతూ మరోవైపు అల్లాహ్ కారుణ్యంపై ఆశ పెట్టుకోవటం ఇదే ఇస్లాం బోధన. ఈ బాధ్యతా భావన అతన్ని మరుపుకు, అలసత్వానికీ లోను కానివ్వదు. విశృంఖలత్వానికి దారితీయనివ్వదు. అలాగే ఈ ఆశావహ దృక్పథం అతన్ని నిస్పృహలోకి నెట్టివేయదు. దుఃఖానికి, ఖేదానికి గురి కానీయదు. అందుకే ఒక ముస్లిం మనసు నిత్యం దుష్పరిణామం పట్ల భీతిచెందుతూ ఆశతో నిండి ఉంటుంది. ఈ విషయాన్నే సూచిస్తూ దివ్యఖుర్ఆన్ విశ్వాసులనుద్దేశించి ఇలా అంటోంది –

“అల్లాహ్ నుండి అవిశ్వాసులు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు.” (నిసా – 104)

ఆపద సమయాలలో ఒక విశ్వానికీ- అవిశ్వానికీ ఆంతర్యంలో ఉత్పన్నమయ్యే భావాల మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే మరి. అవిశ్వాసి తానెంచుకున్న ప్రతి పనినుండీ, ప్రతి ఆచరణ నుండి ప్రాపంచిక ప్రయోజనాలను ఆశిస్తాడు. అవి గనక అతనికి లభ్యం కాకపోతే నిరాశకు గురవుతాడు. అతని మనసు వ్యాకులత చెందుతుంది. భౌతిక విజయాన్నే సిసలయిన విజయంగా భావించటం మూలంగా అతని మనసు బాధపడిందన్నమాట. కాని ఒక విశ్వాసికి (మోమిన్ కి) ప్రాపంచిక విజయాలు ప్రాప్తించకపోయినా, గోచరమయిన ప్రయోజనాలు చేకూరకపోయినా అతను కలత చెందడు. అతనికి మనసు ప్రశాంతంగా, ప్రఫుల్లంగానే ఉంటుంది. ఎందుకంటే అతను సత్కార్యం చేశాడు. తన సత్కార్యానికి ప్రతిఫలం ఇక్కడ లభించకపోయినా అక్కడయినా తప్పక లభిస్తుంది. ప్రాపంచిక విజయం చేకూరకపోతే పోనీ, అల్లాహ్ ప్రసన్నత మరియు పుణ్యఫలం మాత్రం తప్పక లభిస్తాయి. ఈ విశ్వాసమే ఒక ముస్లింను సదాచరణ చేసే సమయంలో అతని మనసును కుదుటపరచి, సాహసవంతునిగా తీర్చి దిద్దుతుంది. అతనిలో చిత్తశుద్ధిని నూరిపోస్తుంది. ఏ మానవ సమాజంలో నయినా సరే మనిషి ఆలోచన ఈ దిశలో సాగినపుడు అక్కడ వైఫల్యాలు, నైరాశ్యాల నేపథ్యంలో ఆత్మహత్యలు జరగవు. ఉరేసుకుని చావటం, రైలు పట్టాలపై పడుకుని ప్రాణత్యాగం చేయటం, నిద్రమాత్రలు మింగి మృత్యువు ఒడిలోకి జారుకోవటం లాంటి సంఘటనలు దేనికి నిదర్శనాలు? ఇవన్నీ నిరాశా నిస్పృహలకు, ఓర్వలేనితనానికి ప్రతీకలు కావా? కాని అల్లాహ్ పై, పరలోకంపై దృఢ విశ్వాసం గల ముస్లింలో చరమ ఘడియ వరకూ ఆత్మహత్యా భావన ఏర్పడదు. అల్లాహ్ కృపవల్ల ఆఖరి క్షణం వరకూ అతనిలోని ఆశ అవిసిపోదు. అతడు ధనవంతుడయినా నిరుపేద అయినా, ఆరోగ్యవంతుడయినా, రోగగ్రస్తుడయినా, సంతాన ప్రాప్తిరస్తుడయినా – సంతానహీనుడైనా, సఫలీకృతుడయినా – విఫలుడయినా సర్వకాల సర్వావస్థల్లో అతడు ధైర్యంగా ఉంటాడు. ఆశాజీవిగా ఉంటాడు. ఆపదల్లో, అస్వస్థతలో, లేమిలో అతడు ఓరిమి వహిస్తూ అల్లాహ్ కారుణ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నైరాశ్యానికి తన మతంలో చోటులేదనీ, నైరాశ్యం అవిశ్వాసానికి తార్కాణమని భావిస్తాడు. తన కర్మకు ప్రతిఫలం ఇక్కడ లభించకపోయినా, అక్కడయినా తప్పక లభిస్తుందనీ, ఇది అల్లాహ్ వాగ్దానమని గట్టిగా నమ్ముతాడు. అతని ప్రభువు అతనికి ఈ విధమయిన వాగ్దానం చేసి ఉన్నాడు.

“మీలోని ఎవరి శ్రమనూ నేను వృథాగా పోనివ్వను.” (ఆలి ఇమ్రాన్ – 195)

మానవుల పరస్పర సంబంధ బాంధవ్యాల్లో, వ్యవహారాల్లో సౌమనస్యం, సదవగాహన, నమ్మకం లాంటి వాటిని అమలులో పెట్టడమే వాస్తవానికి నైతికత లేక సత్ప్రవర్తన. లేదా ఒండొకరిపై ఉన్న హక్కులు-బాధ్యతలను నెరవేర్చటమే సత్ప్రవర్తన అనుకుందాం. నైతికత యొక్క ఈ వాస్తవికతనుబట్టి అర్థమయ్యే దేమిటంటే మానవ సముదాయాల మధ్య సంబంధ బాంధవ్యాల ఉనికి ఉన్నప్పుడే నైతికతా ఉనికి కూడా ఉంటుంది. సన్యాసత్వం, బైరాగితనం, బ్రహ్మచర్యం వల్ల నైతికత మనుగడ సాగించజాలదు. ఏకాంత జీవితం గడపటం, ప్రజాజీవితంతో సంబంధాలను త్రెంచుకోవటం, సంఘజీవితంతో వేర్పడటం, బంధుత్వసంబంధాలను త్రెంచుకోవటం, సంసార జంఝాటాలతో తెగతెంపులు చేసుకోవటం లాంటి పోకడల మూలంగా “నైతికత” అనేదే ఉపయోగంలోకి రాదు. వచ్చినా అంతంతమాత్రంగానే వస్తుంది.

ఈ అంశంపై కొంత చర్చ అవసరం. ఎందుకంటే “భవబంధాలను త్రెంచుకుని ఏకాంత కుహరాల్లో జీవితం గడిపిన మనిషి మతావలంబనలో నికార్సుగా నెగ్గుకు రాగలిగాడు” అనే వాదన ఒకటి ఉంది. ఇస్లాంకు పూర్వం సన్యాసులు, బైరాగులు ఈ సూత్రంపైనే జీవితం గడిపేవారు. వారు మరియు వారి అనుయాయులు సయితం ఈ పద్ధతిని తమ సాత్వికతకు, సదాచరణకు సోపానంగా తలపోసేవారు. కాని యదార్థానికి ఆయా వ్యక్తులుగానీ, ఇజాలుగానీ సాధారణంగా ఈ పోకడను అనుసరించటంలోని ఉద్దేశం వేరే ఉంది. తాము ప్రజా జీవితానికి అల్లంత దూరాన ఉండటం మూలంగా సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకత లభిస్తుందనీ, రాజులు చక్రవర్తుల పట్ల మాదిరిగా ప్రజలకు తమపట్ల కూడా ఒక విధమయిన భయము భక్తి కలుగుతాయనీ, ఆ విధంగా సమాజంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవచ్చుననీ ఈ ‘సన్యాసులు’ ఆశించేవారు. మరోవైపు తమ జీవితాన్ని తెరచాటున ఉంచుకుని బూటకపు పవిత్రతను, బూటకపు సాత్వికతను సంతరించుకోవచ్చు. ఇంకోవైపు ఈ ఏకాంత జీవితాన్ని ఆసరాగా పెట్టుకుని బంధుమిత్ర సంబంధాలనుండీ, హక్కులు, బాధ్యతల నుండి తప్పించుకోవచ్చు. ముక్తసరిగా చెప్పాలంటే ఇది ఒక విధమయిన పలాయన వాదం. అందుకే ఇస్లాం తన నైతిక సూత్రాలలో సన్యాసత్వం, బ్రహ్మచర్య, వైరాగ్య జీవితాన్ని ప్రోత్సహించలేదు. దైవప్రవక్త పదవి లభించిన తరువాత మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) 23 సంవత్సరాల పూర్తి కాలంలో ప్రజా బాహుళ్యంలోనే ఉండి, వారి మధ్యలోనే జీవితం గడిపి జీవిత సమస్యలను పరిష్కరించారు. ధర్మ ఖలీఫాల (రదియల్లాహు అన్హుమ్) జీవన విధానం కూడా ఇదే. ఏ కొద్ది మందినో మినహాయిస్తే ప్రవక్త ప్రియసహచరులందరి విధానం కూడా ఇదే. దివ్య ఖుర్ఆన్ చూపే మార్గం కూడా ఇదే. ఖుర్ఆన్ ఆది నుండీ అంతం వరకూ నిరంతర జీవన పోరాటాన్ని, మానవ సముదాయాల పట్ల సత్ప్రవర్తననే నొక్కి చెప్పింది. బ్రహ్మచర్యాన్నిగానీ, ఏకాంత వాసాన్నిగానీ, సన్యాసత్వాన్నిగానీ ప్రోత్సహించే ఒక్క వచనం కూడా దివ్యఖుర్ఆన్ లేదు.

సామాజిక హక్కులుగానీ, బాధ్యతలుగానీ సంఘంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సజావుగా నెరవేర్చబడతాయి. సంఘ జీవితంతో సంబంధం త్రెంచుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు. జనవాసాలకు కోసుల దూరంలో నిర్మానుష్య ప్రాంతాలలో, కొండల్లో కోనల్లో తపస్సు చేసుకునేవారు సామాజిక ఇక్కట్లను దూరం చేయగలరా? జాతులు నైతిక పతనానికి లోనుకాకుండా వాళ్లు చూసుకోగలరా? అంతదూరాన ఉంటూ అభాగ్యజీవులను ఆదుకోగలుగుతారా? అనాధల సంరక్షకులుగా ఉండగలుగుతారా? ప్రజాసేవకు సంబంధించిన ఏ చిన్న విభాగాన్నయినా వారు పర్యవేక్షించగలుగుతారా? వారు ప్రజలను మార్గ విహీనత, మార్గభ్రష్టతల నుండి ఆపగలుగుతారా? అంతెందుకు, వారు తమ స్వహస్తాలతో ఉపాధిని సంపాదించి బ్రతకగలుగుతారా? వాళ్లు ప్రజలకు సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించగలుగుతారా? ప్రజలను మంచి వైపుకు ఆహ్వానించి, చెడునుండి వారించే విధిని నిర్వర్తించగలుగుతారా? మరి చూడబోతే నైతికపరమయిన సదాచరణలను నెరవేర్చే చక్కని అవకాశాలు దొరకేది ఈ సందర్భాలలోనే. పవిత్ర ఖుర్ఆన్లో ఇలా ఉపదేశించబడింది:

“విశ్వాసులారా! మీరు మిమ్మల్నీ, మీ ఆలుబిడ్డలనూ నరకాగ్నినుండి కాపాడుకోండి”. (అత్ తహ్రీమ్ – 6)

అంటే మానవుడు కేవలం తన్ను తాను అగ్నిగుండం నుండి కాపాడు కుంటే సరిపోదు, తనతోపాటు ఇతరుల్ని కూడా అగ్ని గుండం నుండి కాపాడ వలసిన బాధ్యత అతనిపై ఉంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సమస్త ముస్లిముల నుద్దేశించి స్పష్టంగా ఇలా ఉద్బోధించారు. “కుల్లుకుమ్ రాయిన్ వ కుల్లుకుమ్ మస్ వూలిన్ అన్ రయీత” (మీలో ప్రతి ఒక్కరూ రెండోవాని విషయంలో బాధ్యులు మరియు పర్యవేక్షకులు. అతని పర్యవేక్షణలో ఉన్న వారందరి గురించీ అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది.) నాయకుడు తన నాయకత్వంలో ఉన్న ప్రజలకు కావలివాడు. పురుషుడు తన కుటుంబ సభ్యులకు బాధ్యుడు. భార్య తన భర్త ఇంటికి పర్యవేక్షకురాలు. (సహీహ్ బుఖారీ)

సామూహిక విపత్తులు వచ్చిపడినపుడు అవి పాపం చేయని నిర్దోషులను కూడా వదలిపెట్టవు. ఈ దావానలం లోపలున్న వారిని బయటవున్న వారినందరినీ కాల్చి భస్మీపటలం చేసివేస్తుంది. అందుకే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)పై అవతరించిన ‘వహీ’ ఈ కోణాన్ని కూడా బహిర్గతం చేసేసింది.

“ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు.” (అన్ ఫాల్ -25)

పైపెచ్చు ఈ దావానలం దోషులను, నిర్దోషులనూ, విధేయులను, అవిధేయులను – అందరినీ చుట్టుముట్టేస్తుంది. సమాజం సమస్త పాపాలకు బాధ్యతవహించగా, పాపాలు తమ కళ్ల ముందరే జరుగుతున్నప్పటికీ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ సందేశ ప్రధాన బాధ్యతను విస్మరించిన పుణ్యాత్ములు కూడా దీని వాతన పడతారు. దివ్యఖుర్ఆన్ తెలియపరచబడిన శనివారం వాళ్ల గాథ మనందరికీ కనువిప్పు లాంటిది. ఆ గాథలో పాపాలు చెయ్యనివారినీ – సందేశ ప్రచార బాధ్యతను విస్మరించిన వారినీ కూడా పాపాత్ములలో చేర్చటం జరిగింది.

వాస్తవానికి ఈ ప్రపంచం కార్యక్షేత్రం, నిరంతర కృషికీ, పోరాటానికి పెట్టింది పేరు. ఇందులో మనుషులంతా పరస్పర సహకారంతో తమతమ గమ్యం వైపుకు సాగిపోతున్నారు. మార్గంలో అందరితో కలిసి పోతున్నప్పుడు నిశ్చయంగా ఎన్నో అడ్డంకులు, బాధలుంటాయి. ప్రతి ఒక్కరూ ఇతరుల బాధలను, వారి సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగవలసి ఉంటుంది. కాబట్టి తన సొసైటీలోని కష్టాలకు తాళలేక, కలవరం చెంది, కేవలం తన బరువును మాత్రమే తనపై వేసుకుని ముందుకు సాగిపోవాలనుకునేవాడు మగధీరుడు కాడు; వాడు వట్టి పిరికిపంద అనబడతాడు. అంతిమ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు:

“జనులతో కలసి మెలసి ఉండని వానికంటే, వారి తరఫున ఎదురయ్యే కష్టాలపై ఓర్పు వహించని వానికంటే జనులతో కలసి మెలసి ఉండే, వారి తరఫున ఎదురయ్యే కష్టాలపై ఓర్పు వహించే ముస్లిం ఎంతో ఉత్తముడు.” (బైహఖీ, తిర్మిజీ)

ఏకాంతవాసానికీ, సంఘంతో తెగతెంపులు చేసుకోవడానికి ఒకే ఒక పరిస్థితిలో మాత్రమే అనుమతించబడుతుంది – అదెప్పుడు అంటే – ఆ సంఘ పెద్ద ఒక నీతి నియమాన్ని పాటించనంత చెడ్డవాడై ఉండాలి. సమాజంలో కలహాలు, కలతల దావానలం ఆర్పడానికి వీలులేనంతగా ప్రబలిపోయి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో మంచిని ప్రేమించేవారు ఆ అగ్నిని ఆర్పి పరిస్థితిని అదుపులోనికి తీసుకురాగలిగే శక్తి బలం తమవద్ద లేదనుకుంటే అప్పుడు వారు ఆ సముదాయం నుండి వేరు కావచ్చు. ఉపద్రవాలు ప్రబలినపుడు సంఘాన్ని వదలి పెట్టే హదీసు ఇలాంటి పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుంది, అంతేగాని ప్రతి చిన్న విషయానికీ కాదు. బలవంతుడైన ప్రతి ముస్లిం ఇలాంటి పరిస్థితిలో దైవధర్మ ప్రచారం చేసి, మంచిని ప్రబోధించే విధిని నెరవేర్చి సమాజాన్ని రక్షించే పూర్తి ప్రయత్నం చేయాలి. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు లోకానికి అందించిన విధానం ఇదే! పెద్ద పెద్ద సహాబా (ప్రవక్త ప్రియసహచరులు) సయితం తమతమ కార్యపరిధుల్లో ఉండి ఈ విధానాన్నే అవలంబించారు.

ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు. “చెడును తన చేత్తో ఆపటం, నిర్మూలించటం ప్రతి ముస్లిం విద్యుక్త ధర్మం. ఒకవేళ చేత్తో నిర్మూలించలేకపోతే నోటితో నిర్మూలించాలి. ఇదీ సాధ్యం కాకపోతే మనసులోనయినా దాన్ని చెడుగా భావించాలి. ఇది విశ్వాసం (ఈమాన్) యొక్క అత్యంత బలహీన స్థితి”, (సహీహ్ ముస్లిం-కితాబుల్ ఈమాన్)

ఇస్లాం యొక్క ఈ నైతిక సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుంటే మరో నైతిక సూత్రం కూడా దానంతట అదే మన ముందుకు వచ్చేస్తుంది. అదేమంటే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) శిక్షణానుసారం సంఘంలోని వ్యక్తులపై వారి స్థోమతకు తగ్గట్టుగా – సంఘంలోని ఇతర వ్యక్తుల్ని పర్యవేక్షించే బాధ్యత కూడా మోపబడుతుంది. ఈ నైతిక బాధ్యతకు షరియత్ పెట్టిన పేరే “అమ్ర్ బిల్ మారూఫ్ వ నహీ అనిల్ మున్కర్” (మంచి గురించి ఉపదేశించటం, చెడు విషయాల నుండి వారించటం). దీనిని దివ్య ఖుర్ఆన్ ముస్లింల విశిష్ట గుణంగా అభివర్ణించింది:

  1. “ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపటానికీ, వారి సంస్కరణకూ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు నుండి ఆపుతారు.” (ఆలి ఇమ్రాన్ – 110)
  2. “విశ్వాసులైన పురుషులూ, విశ్వాసులైన స్త్రీలూ – వారందరూ ఒకరి కొకరు సహచరులు. వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చెయ్యవద్దు అని నిరోధిస్తారు.” ప్రత్యేకంగా ఇలా ఆజ్ఞాపించబడింది (అత్ తౌబా-71)
  3. “మంచిని ఆజ్ఞాపించు. చెడు పనుల నుండి నిరోధించు.” (లుక్మాన్ – 17)
  4. ముస్లింల దైనందిన జీవన పరిస్థితి ఈ విధంగా ఉంటుంది – “వారు సత్యం, స్థయిర్యం గురించి ఒండొకరికి ఉపదేశిస్తూ ఉంటారు.” (అల్ అస్ర్)
  5. “వారు పరస్పరం సహన స్థయిర్యాల గురించి, దయా దాక్షిణ్యాలతో మెలగటం గురించి ఒండొకరికి తాకీదు చేసుకుంటూ ఉంటారు.” (బలద్ – 17)

ఇది ఎంతగొప్ప శిక్షణ అంటే – ప్రపంచంలోని మతాలన్నింటిలోనూ – ఇస్లాం యొక్క నైతిక పర్యవేక్షణా విధానాన్ని స్పష్టంగా వేరుచేసి చూపిస్తోంది. మనోనిబ్బరం, గుండె ధైర్యంగల వ్యక్తులు సొసైటీ స్వభావ స్వరూపాలను బేరీజువేస్తూ, సంఘ పెద్దలలో పొడసూపే చెడుగును ఎత్తిచూపుతూ ఉండాలనీ, ఇది వారి విద్యుక్త ధర్మమనీ ఇస్లాం నొక్కి వక్కాణిస్తోంది.

తౌరాత్లో “నేను నా సోదరునికి కావలివాడినా?” అన్న పలుకు ఒకటి ఉంది. క్రైస్తవ మతంలో కూడా ఇదొక ముఖ్య నీతిసూత్రంగా మారిపోయింది. ఈ నీతి సూత్రమే పాశ్చాత్య ప్రపంచంలో “వ్యక్తి స్వాతంత్య్ర పునరుద్ధరణ”గా రూపుదాల్చి చట్టపరమయిన అంశంగా ఉత్పన్నమయింది. అయితే ఇందుకు భిన్నంగా ఇస్లామీయ శాసనాంగంలో ప్రతి వ్యక్తీ తన సోదరునిపై కావలి వానిగానే ఉంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు నిర్దిష్టంగా ఈ ప్రకటన చేశారు: “కుల్లుకుమ్ రాయిన్. వ కుల్లుకుమ్ మస్ ఊలిన్ అన్ రయీత” (మీలో ప్రతి ఒక్కడూ రెండోవాని విషయంలో బాధ్యుడు. అతని పర్యవేక్షణలో ఉన్న వారందరి గురించీ అతన్ని ప్రశ్నించటం జరుగుతుంది). ప్రజలను మంచి వైపుకు దారిచూపే, చెడులనుండి ఆపే బాధ్యతను దివ్యఖుర్ఆన్ ముస్లింలపై అనివార్యంగా ఖరారు చేసింది. దీని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే సొసైటీలో లజ్జావ్రీడలు పరిఢవిల్లాలి. సంఘంపట్ల, సామాజిక కట్టుబాట్ల పట్ల ప్రజల్లో భయముండాలి. సమాజంలో సత్ప్రవర్తనకు ఆదరణ లభించాలి. దాంతోపాటు సమాజంలోని ప్రతివ్యక్తీ తనతోటి సోదరుణ్ణి మార్గవిహీనత యొక్క చీకట్లనుండి వెలికితీసి సన్మార్గపు వెలుగులో వేసే బాధ్యతను తనపై వేసుకోవాలి.

దివ్య ఖుర్ఆన్లో అల్లాహ్ ఇస్రాయీల్ సంతతికి సంబంధించిన ఒక గాథను విశదీకరించాడు. ఇస్రాయీల్ సంతతికోసం శనివారంనాడు ఏ రకమైన ప్రాపంచిక వ్యవహారంగానీ, వ్యాపారంగానీ చేయటం హరామ్ (నిషిద్ధం) గావించ బడింది. బనీ ఇస్రాయీల్ కు చెందిన ఒక తెగ సముద్ర తీర ప్రాంతంలో నివసించేది. వారు ఏదో ఒక సాకు చెప్పి శనివారం నాడు చేపలు పట్టుకునేవారు. (అదేమిటోగాని ఆ రోజే చేపలు అధికంగా లభించేవి. అంటే అది వారి పాలిట ఒక పరీక్షగా మారిందన్నమాట!) ఆ జనవాసంలో మూడు వర్గాల వారుండేవారు. ఒక వర్గం బహిరంగంగా అల్లాహ్ ఆజ్ఞల్ని ఉల్లంఘించి నిర్భయంగా పాపకార్యాలు చేసేది. రెండో వర్గం వారు చెడులనుండి ప్రజలను నిరోధించే వారు. అల్లాహ్ ఆజ్ఞల్ని ధిక్కరించరాదని జనులకు ఉపదేశించేవారు. మూడో వర్గానికి చెందిన వారు పాప కార్యాలకైతే పాల్పడేవారు కారు గాని పాపాల నుండి ప్రజలను ఆపేవారు కూడా కాదు. పైగా చెడులనుండి వారించే వారి నుద్దేశించి, “ఇలాంటి మూర్ఖుల్ని ఉపదేశించి ప్రయోజనమేమిటీ? వారు చేసే అపరాధానికిగాను అల్లాహ్ ఏదో ఒకనాడు వాళ్లని శిక్షించకపోతాడా ఏమి?” అని అనేవారు. కాని ఆ బస్తీపై అల్లాహ్ శిక్ష అవతరించగా, చెడుల నుండి నిరోధించే రెండోవర్గం మాత్రమే సురక్షితంగా ఉండగలిగింది. మొదటి వర్గం వారునూ, మూడవ వర్గం వారునూ వినాశానికి గురయ్యారు. మొదటి వర్గం తమ పాపాల కారణంగా నాశనమవగా, మూడవ వర్గం ధర్మసందేశ బాధ్యతను విస్మరించిన కారణంగా శిక్షించబడింది. ఆరాఫ్ సూరాలోని 20వ రుకూలో ఈ వృత్తాంతం వచ్చింది. ఆఖరిలో ఇలా అనబడింది –

“వారిలోని ఒక వర్గం వార్డు మరొక వర్గం వారితో ఇలా అన్నారు: ‘మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు – అల్లాహ్ నాశనం చేయనున్న వారికి లేక కఠినంగా శిక్షించనున్న వారికి?’ వారు ఇలా సమాధానం చెప్పారు: ‘మేము మీ ప్రభువు ముందు క్షమింపబడటానికి ఒక కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము.’ చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధలను పూర్తిగా విస్మరించినప్పుడు, మేము చెడునుండి ప్రజలను వారించేవారిని రక్షించాము. దుర్మార్గులైన ఇతరు లందరినీ వారి అవిధేయతల కారణంగా కఠిన శిక్షకు గురిచేశాము.” (అల్ ఆరాఫ్: 164,165)

ఇస్లాం దృష్టిలో తోటి సోదరులను జారిపడకుండా ఆపటం, జారిపడే వారిని చేయూతనిచ్చి నిలపటం ఎంత ముఖ్యమో ఈ గాథ చెబుతోంది. ఈ నైతిక బాధ్యతను నెరవేర్చకపోతే కలిగే దుష్పరిణామం ఎటువంటిదో కూడా బోధపడుతోంది. అయితే హితబోధ చేసిన తరువాత సాటి సోదరుని బాధ్యత తీరిపోతుంది. బలవంతం చేయటం అతని విధికాదు. ఆఖరికి ప్రవక్తలు కూడా తమ జాతి వారిని బలవంతంగా ఒప్పించరు.

“ప్రవక్త పని సందేశాన్ని అందించటం వరకే.” (అల్ మాయిద, నూర్)

ఈ బాధ్యత గనక నెరవేరిందంటే, అతని తలపై ఉన్న భారం దిగిపోయినట్లే. అందుకే అల్ మాయిద సూరాలో ఈ విధంగా ఉపదేశించబడింది:

“విశ్వాసులారా! మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు గనక స్వయంగా సన్మార్గంలో ఉంటే, ఇతరులు మార్గభ్రష్టులైనప్పటికీ మీకు ఎంత మాత్రం హాని కలగదు.” (అల్ మాయిద:105)

హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ పవిత్ర వచనాన్ని పఠించిన పిదప జనులనుద్దేశించి ఇలా అన్నారు:

“ఈ ఆయతులోని బాహ్య అర్థం మిమ్మల్ని మోసంలో పడవేయరాదు సుమా! మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పగా నేను విన్నాను. (ఆయన ఏమని ప్రవచించారంటే), దుర్మార్గుడు దుర్మార్గానికి పాల్పడుతుండగా ప్రజలు చూచి కూడా అతని రెండు చేతుల్ని పట్టుకోకపోతే బహుశా వారందరూ శిక్షకు గురికావచ్చు.”

ఈ ఆయతు సారాంశమేమిటని మరో సహాబీ అబూ షాలబ (రదియల్లాహు అన్హు)ను ప్రశ్నించగా ఆయన ఇలా జవాబిచ్చారు:

“మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని ఈ ఆయతు గురించి అడగ్గా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు: ‘ముమ్మాటికీ కాదు. పరస్పరం మంచిని చేయమని ఆజ్ఞాపించండి. చెడు నుండి ఒండొకరిని ఆపండి. అయితే పేరాశ, పిసినారితనాలకు విధేయత కనబరుస్తున్నప్పుడు, మనో వాంఛలకు బానిసలైనప్పుడు, ధర్మంపై ప్రపంచానికి ప్రాధాన్యత నిస్తున్నప్పుడు, ప్రతి ఒక్కడూ తన అభిప్రాయమే సరైనదని విర్రవీగినప్పుడు ప్రజలను వదలిపెట్టి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీ తరువాత ఒక కాలం రానున్నది. అప్పుడు (దైవధర్మంపై) నిలకడ కనబరచడం అగ్ని జ్వాలను చేత్తో పట్టుకోవటం వంటిదే.” (తిర్మిజీ)

ఇస్లాం యొక్క ఈ బోధనలు “నేను నా సోదరునికి కావలి వాడినా?” అన్న లోప భూయిష్ట సిద్ధాంతాన్ని రద్దుపరచాయి. యదార్ధమేమిటంటే నైతిక ఉపదేశాలను సమాజం తన చెప్పుచేతల్లో తీసుకోనంత వరకూ అవి సురక్షితంగా, స్వచ్ఛంగా ఉండజాలవు. జాతుల రీతులు, ఆచార సంప్రదాయాలు ఈ నియమాలపైన్నే నెలకొని ఉన్నాయి. మరో గమనార్హ విషయమేమిటంటే నైతిక వ్యవహారాలు పైకి ఒక వ్యక్తి యొక్క ప్రైవేటు లేక స్వంత విషయాలుగా కాన వస్తాయి. వాటి లాభం లేక నష్టం కూడా ఆ వ్యక్తి అవలంబనతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే కాస్త నిశితంగా చూస్తే, మరి కాస్త లోతుగా ఆలోచిస్తే వాటి పరిణామాలు యావత్తు సమాజాన్ని ప్రభావితం చేస్తాయనీ, ఒకరి నుండి రెండో వ్యక్తి వరకు, రెండో వ్యక్తి నుండి మూడో వ్యక్తి వరకు ఇలా సమాజమంతా వాటి ప్రభావానికి గురవుతుందన్న సంగతి బోధపడుతుంది.

ఇంకొక విషయమేమిటంటే ఆ చెడుల చెడుగు చాలా స్వల్ప విషయంగా తోస్తుంది. ప్రజలు దానిని చాలా చిన్న విషయంగా తలపోసి ఊరుకుంటారు. వీటిని నిరోధించక పోయినట్లయితే క్రమక్రమంగా ఈ విష ప్రభావం సొసైటీ నంతటినీ ఆవహిస్తుంది. ఆఖరికి జన సామాన్యం ఈ చెడులను చెడుగా భావించటానికి కూడా జంకుతారు. ఫలితంగా కొన్నాళ్ళకు యావత్తు జాతి నైతిక స్వభావమే మారిపోతుంది. (భ్రష్టుపట్టి పోతుంది) ఆ జాతి తన ఉన్నత ప్రమాణం నుంచి పడిపోతుంది. ఒకసారి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒక సమావేశంలో తన ప్రియసహచరులనుద్దేశ్యించి ప్రబోధించారు. ‘బనీ ఇస్రాయీల్లో నైతిక పతనం ఇలాగే మొదలయింది. ఆ సంతతిలో చెడులు ప్రబలిన తొలి రోజుల్లో వారి పండితులు ఆ చెడుల నుండి వారించారు. కాని ఆ చెడులను జన సామాన్యం వదలలేకపోయింది. అయినప్పటికీ (ఆ పండితులు) వారితో కలసి కూర్చోవటం, తిరగటం, తినటం అన్నీ చేసేవారు. సహవాస దోషంతో వాళ్లు కూడా ప్రజల మాదిరిగానే తయారయ్యారు. అల్లాహ్ దావూద్ (అలైహిస్సలాం) మరియు ఈసా (అలైహిస్సలాం)ల ద్వారా ఆ జాతిని ధూత్కరించాడు”. ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒదిగి కూర్చున్నారు. తరువాత ఇలా చెప్పారు: “కాదు. మీరు దుర్మార్గుని చేయిపట్టు కోనంతవరకూ, సత్యం వైపుకు అతన్ని వంచనంతవరకూ” (జామె తిర్మిజీ)

ఇదీ ఈ అంశం క్రింద మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు చేసిన హితబోధ.

అయితే మంచిని గురించి ఆజ్ఞాపించే, చెడులనుండి వారించే ఈ బాధ్యత ప్రతి సాధారణ వ్యక్తిదీ పామరునిదీ కాదు. దీని అవగాహన లేనివారు కూడా దీనిని తమపై వేసుకుంటే అది ఉపద్రవానికి దారితీసే ఆస్కారముంది. స్వయంగా ఈ చెడులకు దూరంగా ఉన్నవారే తొలుత ఈ బాధ్యతను స్వీకరించవలసి ఉంటుంది. దివ్య ఖుర్ఆన్ సెలవీయబడింది –

“సన్మార్గాన్ని అవలంబించమని మీరు ఇతరులకైతే ఉపదేశిస్తారు కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటీ?” – (అల్ బఖర 44)

అలాగే ఉపదేశం చేసేటప్పుడు ఎంతో ఓర్పుతో, నేర్పుతో మృదుత్వంతో చేయటం కూడా ఎంతో అవసరం. స్వయంగా దైవ సందేశహరులైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని ఉద్దేశించి ఇలా తాకీదు చేయబడింది –

‘ప్రవక్తా! నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో, చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమమయిన రీతిలో వాదించు.” (అన్ నహ్ల్ – 125)

దైవ ప్రవక్తలయిన హజ్రత్ మూసా, హజ్రత్ హారూన్ (అలైహిముస్సలాం) లను దైవధిక్కారి అయిన ఫిర్ ఔన్ చక్రవర్తి వద్దకు పంపిస్తున్నప్పుడు అల్లాహ్ చేసిన ఉపదేశం ఏమిటో చూడండి –

“మీరిరువురూ వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి”. (తాహా -44)

వేరొక చోట ఈ విధంగా హితబోధ చేయబడింది –

“వారికి నచ్చజెప్పు. వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధచేయి.” (అన్ నిసా – 63)

ప్రజలు మంకుతనానికి పోకుండా, హఠం చేయకుండా ఉండగలందులకే ఇన్ని విధాలుగా జాగ్రత్తపడటం జరిగింది. ఈ ముందు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే మంచి వ్యాప్తి చెందే బదులు చెడులు పెచ్చరిల్లే ప్రమాదముంది.

“అమ్ర్ బిల్ మారూఫ్ నహీ అనిల్ మున్కర్” అసలు ఉద్దేశ్యం సమాజాన్ని సంస్కరించటం, సంఘ సభ్యుల నైతికతను పరిరక్షించటం. అంతేగాని ఇతరులు వ్యక్తిగత విషయాలలోకి తలదూర్చి, కూపీలు తీసి రచ్చకీడ్వటం కాదు. ఇలా కూపీలు తీయడాన్ని ఇస్లాం నిషేధించింది. ఒక ముస్లిం ఇంట్లో జొరబడి అతని అంతర్గత విషయాలను బయటకి రాబట్టే అధికారం అనుమతి మరో ముస్లింకు ఎంతమాత్రం లేదు.

ఈ రకమయిన సంస్కరణా విధానం వల్ల కక్షలు, కార్పణ్యాల ద్వారం తెరుచుకుంటుంది. దీనివల్ల ఏ వ్యక్తీ తన ఇంట్లో, సయితం సురక్షితంగా ఉండ లేడు. దీని వారింపులోని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే ఏ వ్యక్తయినా తన ఇంటి నాలుగు గోడల మధ్య దాక్కుని ఏదయినా చెడు పని చేస్తే దాని దుష్ప్రభావం కేవలం అతనొక్కనికే పరిమితం అవుతుంది. ఆ ప్రభావం సమాజంపై పడదు. అందుచేత సమాజానికి అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు. అందులో ఉన్న మరో పరమార్థం ఏమిటంటే, ఏ వ్యక్తయినా తన ఇంట్లో కూర్చొని రహస్యంగా పాపం చేస్తున్నాడంటే దాని అర్థం ఇప్పటికీ అతనిలో లజ్జావ్రీడలున్నా యన్నమాట! ఈ లజ్జా గుణమే మునుముందు అతనిలో పరివర్తనను తీసుకు రావచ్చు. కాని ప్రజలు చాటుమాటుగా అతణ్ణి వెంటాడసాగారనుకోండి, అతను బెదిరిపోవచ్చు లేదా అతడు మొండి వాడుగా మారిపోవచ్చు. అతనిలో పరివర్తనకు దోహదపడే మంచి గుణం కాస్తా మటుమాయమై పోవచ్చు. ఒకరి ఇంట్లో లేక గదిలో అకస్మాత్తుగా ప్రవేశించడాన్ని ఇస్లాం నిషేధించడంలోని మర్మాలలో ఇది కూడా ఒకటి.

ఈ సందర్భంగా విస్మరించరాని విషయాలలో మరొకటి ఏమిటంటే లోపమున్న వ్యక్తి గురించి చాడీలు చెప్పరాదు. అంటే అతని పరోక్షంలో అతని లోపాలను ఎత్తి చూపరాదు. ఇది సంస్కరణా సరణి అనిపించుకోదు. సంస్కరణకు నడుం బిగించిన వ్యక్తి తన గురించి ఇతరుల ముందు ఈ విధంగా చెప్పుకుంటున్నాడని అతనికి తెలిస్తే సంస్కర్త పట్ల అతనిలో వ్యతిరేక భావన ఏర్పడవచ్చు. అదే గనక జరిగితే ఇక అతన్ని బాగుపరచే అవకాశాలన్నీ మృగ్యమై పోతాయి. అందుకే అతిగా అనుమానించటం, పరోక్ష నిందకు పాల్పడటం వంటివి ఇస్లాంలో నిషేధించబడ్డాయి. ఈ విధంగా సెలవీయబడింది –

“విశ్వాసులారా! అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూఢచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరయినా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను.” (అల్ హుజురాత్ – 12)

వీపు వెనుక ఒకరి గురించి చెడుగా చెప్పటం మృతకళేబరం మాంసాన్ని కొరికి తినటం వంటిదే. ఏ విధంగానయితే మృతుడు తన శరీరాన్ని భక్షకుల బారినుండి రక్షించుకోలేడో అదే విధంగా పరోక్ష నిందకు గురయ్యే వ్యక్తి కూడా తనపై వేయబడే నిందలకు జవాబు ఇవ్వలేడు. అందుకే పరోక్షనింద (చాడీలు)ను అత్యంత అసహ్యకరమైన చేష్టతో పోల్చటం జరిగింది. పరోక్షనింద ప్రబలిన చోట మంచిని పెంపొందించే కార్యక్రమం ముందడుగు వేయజాలదు. అంతేకాదు, పరోక్ష నిందకు గురైన వ్యక్తి సంస్కరణ కూడా దీనివల్ల సాధ్యం కాదు. పైగా నిందాస్త్రాలను ప్రయోగించే వ్యక్తి యొక్క నైతిక దివాలాకోరుతనం బట్టబయలవుతుంది. అందుకే అంతిమ దైవ సందేశహరుల వారు (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉపదేశించారు. “మీరు గనక ప్రజల తప్పులను ఎంచుతూ వెనుకబడ్డారంటే వారిని సర్వనాశనం చేసేస్తారు (జాగ్రత్త).” (సునన్ అబూదావూద్)

ఆలోచించండి!

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నైతిక ప్రబోధనలలో నైతికతకు సంబంధించిన ఎన్నెన్ని సున్నిత పరమార్థాలు నిబిడీకృతమై ఉన్నాయో కాస్త యోచించండి!

మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రభవనానికి పూర్వం యూద, క్రైస్తవాల కాలం గడచింది. ఈ రెండు మతాలలోని వైపరీత్యాలను సరిచేసే ఒక మధ్యస్థ మతం కోసం ప్రపంచం ఎదురుచూడసాగింది. ప్రపంచం యొక్క ఈ అవసరాన్ని తీర్చడానికే ఇస్లాం ఆవిర్భవించింది.

ఇక ‘సమత్వం’-సమతూకం’ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ వస్తువే విశ్వ వ్యవస్థను నిలబెట్టి ఉంది. దయ, ఉపకారం, మృదుత్వమనే అంశాల మేళవింపు ఈ ‘సమతూకానికి’ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఇస్లాంకు పూర్వం మత రాజకీయం యొక్క ఈ రెండు అంశాలు వేర్వేరుగా ఉండేవి. ఫలితంగా అంత వరకూ విశ్వవ్యవస్థ అసంపూర్ణంగా ఉండేది.

దైవప్రవక్త హజ్రత్ మూసా (అలైహిస్సలాం) గారి షరీఅత్ న్యాయబద్ధ మైనది. అయితే అందులో ఉపకారం, క్షమ వంటి నైతిక గుణాలు చాలా అరుదు.[1] అలాగే హజ్రత్ ఈసా (ఏసుక్రీస్తు) మూర్తీభవించిన కారుణ్యంగా ఏతెంచారు. కాని ఆయన షరియత్లో న్యాయాన్ని, సమతూకాన్ని నెలకొల్పే గుణం బహుకొద్దిగా ఉంది.[2] హజ్రత్ మూసా (అలైహిస్సలాం) షరియత్ ప్రపంచం కొరకు న్యాయం ధర్మాల నిబంధనలను నెలకొల్పగా, వాటికి ప్రతిగా హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) తన నైతిక ప్రబోధనలను ఈ మాటల్లో ప్రకటించారు :

“కన్నుకు బదులు కన్ననీ, పన్నుకు బదులు పన్ననీ మీరు విని ఉంటారు.[3] కాని నేను మీకు ఉపదేశిస్తున్నాను – చెడును చెడుతో ఎదుర్కొనకండి. పైగా మీ కుడి చెంపపై కొడితే మరో ఎడమ చెంపను అతనికి ఇవ్వండి. ఎవరయినా మీతో జగడానికి దిగి మీ చొక్కా పట్టుకుంటే దుప్పటిని కూడా అతనికి ఇచ్చి వేయండి. ఎవరైనా ఒక కోసు దూరం మీ వెంటవస్తే మీరు అతని వెంట రెండు కోసులు నడచివెళ్లండి. మిమ్మల్ని అడిగే వారికి మీరు ఇవ్వండి. మీనుండి రుణాన్ని ఆశించిన వారిని మీరు (లేదని) వాపసు చేయకండి.”

“మీ మిత్రుల్ని ప్రేమించాలనీ, మీ శత్రువుల పట్ల వైర వైఖరి ననుసరించాలనీ చెప్పగా మీరు విని ఉంటారు. అయితే మీ శత్రువులను ప్రేమించాలని నేను మీకు తాకీదు చేస్తున్నాను.” (మత్తయి – 5వ అధ్యాయం)

హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)కు పూర్వం ఈ ప్రపంచంలో నడచిన శాసనం ఏదంటే అది హజ్రత్ మూసా (అలైహిస్సలాం) తెచ్చిన శాసనమే. ఈ శాసనం పూర్తిగా న్యాయబద్ధమైనది. అయితే ఆ తర్వాత ఈ ప్రపంచం హజ్రత్ ఈసా (అలైహిస్సలాం) నోట వెలువడిన నీతిబోధను విన్నది. శిరసావహించింది. ఈ నీతి బోధ ఆసాంతం దాక్షిణ్యంతో, పరోపకారభావంతో కూడుకున్నది. అయితే ఇస్లాం ఒకవైపు న్యాయాన్నీ, మరోవైపు పరోపకారాన్ని కూడా మేళవిస్తూ ప్రాపంచిక పరిపాలనా వ్యవస్థకు పరిణతినీ, పరిపక్వతనూ ప్రసాదించింది.

“న్యాయం చెయ్యండి, ఉపకారం చెయ్యండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు.” (అన్ నహ్ల్-90)

మూసా, ఈసాల వేర్వేరు విధానాలను సమ్మిళితం చేసి సమతౌల్యాన్ని సాధించే సైద్ధాంతికమయిన ఆదేశం ఇది.

న్యాయం, ఉపకారాల నిజ భావనను అర్థం చేసుకునేందుకు ఇక్కడ కొంత వివరణ అవసరం. చట్టం లేక శాసనం అనేది వాస్తవానికి ‘అదల్’ పై ఆధారపడి ఉంది. ‘అదల్‘ అంటే సమత్వం, సమతూకం అని అసలు అర్థం. ఎవరయినా ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే అతని పట్ల కూడా సరిగ్గా అదే విధమయిన వ్యవహారం చేస్తే అది ‘అదల్’ అవుతుంది. కాగా అటువంటి వ్యక్తిని వదలివేయటం, క్షమాభిక్ష పెట్టడం, మన్నింపుల వైఖరిని అవలంబించటం – ఇది ‘ఇహ్సాన్’ (ఉపకారం). ఇస్లాంలో ఈ రెంటికీ వేర్వేరు అంతస్థులు ఉన్నాయి. న్యాయవ్యవస్థను ఆయన ఒక సంఘానికో, లేక ఒక ప్రభుత్వానికో ఇచ్చాడు. ఇది ఒక వ్యక్తి పని ఎంత మాత్రం కాదు. అయితే ‘ఇహ్సాన్’ (ఉపకారం) అవేది వ్యక్తులందరి చేతుల్లో ఉంటుంది. ఇది కేవలం వ్యక్తిగత వ్యవహారం. సమాజమయినా, ప్రభుత్వమయినా న్యాయ వ్యవస్థపైనే నెలకొంటుంది. దీనిని గనక రూపుమాపితే సమాజం మరియు ప్రభుత్వం యొక్క పునాదులే కదలిపోతాయి. అదే గనక జరిగితే వ్యక్తుల ధన మాన ప్రాణాల రక్షణకు ఇక గ్యారంటీ ఇచ్చేవారే ఉండరు. కనుక న్యాయ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టడం అరాచకానికీ, అవ్యవస్థకు ద్వారం తెరవటం వంటిదే. కాని సెయింట్ పాల్ ఈ పనే చేసి క్రైస్తవ జగతి ముందు సరికొత్త పోకడను ప్రవేశపెట్టాడు. తౌరాత్లోని న్యాయశాసనాన్ని సమూలంగా రూపుమాపాడు. న్యాయ శాసనం లేకుండా కేవలం నీతి సూత్రాల భరోసాపై భూమండలంలోని ఏ ఒక్క ద్వీపంలో కూడా శాంతిభద్రతలు నెలకొల్పడంగానీ, సామాజిక రుగ్మతలను నిరోధించటంగానీ సాధ్యపడలేదు. స్వయంగా క్రైస్తవ రాజ్యాల చరిత్రే దీనికి ప్రబల సాక్షి!

గమనార్హమైన మరో విషయం ఏమిటంటే ఒక వ్యక్తి సమాజంలోని ఒక సభ్యునిపై అత్యాచారానికి పాల్పడితే ఆ పాపం యదార్థానికి అతనొక్కనిదే కాదు; యావత్తు సామాజిక వ్యవస్థకు అది వర్తిస్తుంది. మొదటిసారి అత్యాచారానికే అతన్ని నిలదీసి మెడలు వంచకపోతే అతను మలిసారి కూడా మరింత నిర్భయంగా చెలరేగి అదే పాపానికి ఒడిగట్టవచ్చు. మరో వ్యక్తి జీవితంతో కూడా అతడు ఆడుకోవచ్చు. అందుచేత తనను బాధ పెట్టిన దుర్మార్గునికి క్షమించి వదలిపెట్టే పూర్తి అధికారం బాధితునికి లేదు. ఎందుకంటే ఆ బాధిత వ్యక్తి ఈ విధంగా దుర్మార్గుని పట్ల మంచి వ్యవహారం చేసి సమాజంలోని వేలాది మందికి పరోక్షంగా కీడు కలిగిస్తున్నాడు. అందుకే నీతీ నియమాలను న్యాయశాసనాల స్థానంలో ప్రవేశపెట్టేముందు లోతుగా ఆలోచించి, ఆచితూచి అడుగువేయవలసి ఉంటుంది. ముహమ్మద్ వారి(సల్లల్లాహు అలైహి వసల్లం) గారి షరీయత్లో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోబడ్డాయి. ఎందుకంటే అది ప్రపంచానికి శాశ్విత ప్రాతిపదికన అందజేయబడిన శాసనమాయె!

మరి ప్రపంచంలో మనుషులంతా ఒకే విధంగా ఉండరు. స్వభావాలు, ప్రవృత్తులు వేర్వేరుగా ఉంటాయి. కొందరు సాధు స్వభావులు, మృదుమనస్కులు, సహనశీలురు అయి ఉంటారు. క్షమాభిక్ష పెట్టడం, సడలింపుల వైఖరిని అవలంబించటం, ప్రతీకారం తీర్చుకోకపోవటం – ఇలాంటి వారికి సులువే. కాని సొసైటీలో మరికొందరు ఆవేశపరులు, ఆగ్రహోదగ్రులు, కఠిన మనస్కులు, పట్టుదల గలవారు కూడా ఉంటారు. ప్రతీకారం కోసం వారు పరితపిస్తూ ఉంటారు. ప్రతీకారానికి మించి కూడా ఆశిస్తూ ఉంటారు. అటువంటి వారిని ‘దెబ్బకు దెబ్బ’ సరిపోతుందని నచ్చజెప్పి, అంతకు మించిన చర్యకు ఒడిగట్టకుండా ఆపగలిగితే చాలు. అందుచేత యావత్తు ప్రపంచాన్ని సంస్కరించడానికి వచ్చిన విశ్వజనీన షరీయత్లో అదల్ (న్యాయం) మరియు ఇహ్సాన్ (ఉపకారం) – రెండింటి మేళవింపు ఎంతో అవసరం.

పైన పేర్కొనబడిన వాక్యాల సారాంశం ఏమిటంటే, ప్రపంచంలో శాంతిభద్రతల్ని పరిరక్షించడానికి, న్యాయం ధర్మాలను నెలకొల్పడానికీ, అశాంతి అలజడులను, సామాజిక రుగ్మతలను నివారించడానికి రెండు వస్తువుల అవసరం ఎంతైనా ఉంది. అవే 1) శాసనం 2) నీతి. ఈ రెండింటి మౌలిక ఉద్దేశ్యం ఒక్కటే అయినప్పటికీ వాటి లక్ష్యసాధనకై గల మార్గాలు వేర్వేరు. ఆ రెండింటినీ విడదీసి ఒక్కొక్క దాన్నీ తరచిచూస్తే ప్రతి దానిలో ఏదో ఒక కోణం నుంచి ఎంతోకొంత వెలితి కనిపిస్తుంది. ఆ వెలితి రెండవ దాని ద్వారా పూడుతుంది. శాసనం (చట్టం) చెడునయితే ఆపగలుగుతుందిగానీ, ఆ చెడుకు సంబంధించి మనిషిలోని మనసులో ఏహ్యభావాన్ని సృజించే ఆధ్యాత్మిక ప్రక్రియను మాత్రం కొనసాగించజాలదు. కాగా; నైతిక విధానాన్ని అవలంబించే విషయమై ప్రతి వ్యక్తినీ బలాత్కరించజాలము. అంచేత నీతి సూత్రాల ద్వారా సమాజంలో చట్టాలను అమలు చేయటం, రుగ్మతలను రూపుమాపటం సాధ్యం కాదు. తౌరాత్ కేవలం శాసనాంగం కాగా, బైబిల్ కేవలం నైతిక విధానం. అందుకే ఇవి రెండూ వేర్వేరుగా ఉండి శాంతిభద్రతలను, న్యాయశాసనాలను నెలకొల్పడంలో, అరాచకం అవ్యవస్థలను నిర్మూలించటంలో సఫలీకృతం కాలేకపోయాయి. అయితే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తెచ్చిన షరియత్ న్యాయంతో పాటు ఉపకారభావాన్నీ, శాసనంతో పాటు నైతికతను కూడా సంతరించుకుంది. అదే దాని విశిష్టత. అది న్యాయశాసనం మరియు నీతి – రెండింటి మధ్య ఉండవలసినంత దూరాన్ని ఉంచి వాటి హద్దులను నిర్ధారించింది. అది తన షరీఅత్ గ్రంథంలో చట్టాన్ని చట్టముండవలసిన స్థానంలో, నైతికతను నైతికత ఉండవలసిన స్థానంలో ఉంచి మానవతను పరిపూర్ణ స్థితికి చేర్చింది.

ఒకరి నుండి ఇంకొకరికి సోకే ఈ చెడుల మహమ్మారిని అరికట్టే అంశాన్ని ఇస్లాం చట్టానికి లోబడి ఉండేటట్లు చేసింది. ఉదాహరణకు మానవ హత్య, దొంగతనం, వ్యభిచారం, అభాండాలు మోపటం మొదలగు చెడుగులు. ఇలాంటి అపరాధాలకు గాను దివ్య ఖుర్ఆన్ శిక్షలను నిర్ధారించింది. ఈ శిక్షలు ఇస్లామీయ ప్రభుత్వం తరఫున విధించ బడవచ్చు. మరే విషయాలయితే మనిషి వ్యక్తిగతంతో ముడిపడి ఉంటాయో వాటిని అది నైతిక పరిధుల్లో ఉంచింది. ఉదాహరణకు : అసత్యం పలుకకుండా ఉండటం, దయ చూపటం, పేదలకు సహాయ పడటం ఇత్యాదివి. ఈ విధంగా షరీయతె ముహమ్మదీ (సల్లల్లాహు అలైహి వసల్లం) అటు శాసనానికీ ఇటు నీతికీ సంగమం వంటిది.

ఇంకొక విధంగా కూడా ఇస్లాం చట్టం మరియు నీతి యొక్క సమ్మిశ్రమము. అదెలాగంటే చట్టరీత్యా అది ప్రతి బాధిత వ్యక్తికీ, హక్కుదారునికీ ప్రతీకారం తీర్చుకునే లేక క్షమాభిక్ష పెట్టే స్వేచ్ఛనొసగింది. అతను గనక తలిస్తే తౌరాత్ ఆదేశానుసారం ప్రతీకారమూ తీర్చుకోవచ్చు; అలా గాకుండా మేలు చేయదలచి బైబిల్ అనుసారం దుర్మార్గుణ్ణి క్షమించి వదలివేయనూ వచ్చు. అంటే అపకారానికి బదులు ఎదుటి వ్యక్తికి ఉపకారం చేయవచ్చు. ఈ సమగ్ర శిక్షణ అటు ప్రభుత్వ శాసన వ్యవస్థను, ఇటు వ్యక్తి నైతిక రీతినీ రెంటినీ తమతమ స్థానాలలో నెలకొని ఉండే అవకాశం కల్పిస్తుంది. అందుకే అది మానవ జాతుల రక్షణ, ప్రగతీ వికాసాలకు సంబంధించిన పూర్తి హామీనిస్తుంది. అది న్యాయ శాసనాల ఆధారంగా న్యాయాన్ని ధర్మాన్ని స్థాపించడానికి గట్టి చర్యలు తీసుకునే శక్తిని కలిగి ఉండటంతో పాటు, నీతీ నడవడికల ద్వారా ప్రజల ఆధ్యాత్మిక వికాసానికి కూడా తోడ్పాటునిస్తుంది. అది యూదుల షరీయతు మాదిరిగా మృతశరీరమూ కాదు, క్రైస్తవుల ఉపదేశాల మాదిరిగా స్పందన లేని ఆత్మ కూడా కాదు. పైగా అది శరీరం మరియు ఆత్మల కలయిక. భావాలు భావనలతో కూడుకున్న నిండు ఆకారం.

మూసా, ఈసా, ముహమ్మద్ ల నైతిక ప్రబోధనలలో పరస్పరం ఉన్న సున్నిత వ్యత్యాసానికి కారణం ఈ శాసనం మరియు నీతి వేర్పాటు పర్యవసానమే. ఇస్లామీయ చట్టాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది వ్యతిరేకులు, ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధనలలో నైతిక స్ఫూర్తి లేదని విమర్శించారు. కాని ఈ విమర్శకులు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి చట్టాలతోపాటు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి నైతిక ప్రబోధనలను కూడా ముందు పెట్టుకుని చూస్తే వారి సందేహాలకు ఆస్కారమే ఉండేది కాదు. తేలిందేమంటే ‘తౌరాత్’ యొక్క న్యాయసూత్రం ప్రతీకారభావంపై ఆధారపడి ఉంది. అది ఇలా ఆదేశిస్తోంది –

“….. కనుక మనిషిని వధించిన వాడు వధించబడతాడు. మరెవరయినా తన పొరుగు వారికి బాధకలిగిస్తే చేసిన దాన్ని అనుభవిస్తాడు. విరగ్గొట్టిన దానికి బదులు విరగ్గొట్టడమే. కన్నుకు బదులు కన్నే. పన్నుకు బదులు పన్నే”

బైబిల్ ప్రబోధన ఆసాంతం క్షమతో కూడుకున్నది. యుక్తితో కూడిన దాని ఉపదేశం ఇలా సాగుతుంది –

“కన్నుకు బదులు కన్ననీ, పన్నుకు బదులు పన్ననీ చేసిన ఉపదేశాన్ని మీరు విని ఉన్నారు. అయితే దుర్మార్గుణ్ణి ప్రతిఘటించరాదనీ, కుడి చెంపపై కొడితే రెండవ వైపు చెంప అతనికి సమర్పించాలని నేను మీకు ఉపదేశిస్తున్నాను. (మత్తయి: 5-38)

అయితే ఆపాదమస్తకం ఆధ్యాత్మికత, నైతికతతో కూడుకున్న ఈ విధానంపై ప్రపంచ వ్యవస్థ ఒక్కగానొక్క రోజుకూడా నడవజాలదు. ఏ క్రైస్తవ జాతిగానీ, క్రైస్తవ రాజ్యంగానీ, ఏనాడయినా ఈ కారుణ్య ఉపదేశంపై అమలు చేసిందా? అంటే ‘లేద’నే జవాబు వస్తుంది. అదే మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అందజేసిన విధానం క్షమాపణతో పాటు న్యాయసమ్మతమైన ప్రతీకారంతో కూడా కూడుకుని ఉంది. చట్టంతోపాటు నీతి నియమాన్ని కూడా పుణికి పుచ్చుకుని ఉంది. అందులోని న్యాయం చట్టరూపంలో ప్రతిపాదించ బడగా, ఉపకారం ‘నైతిక విధానం’గా ప్రపంచానికి ప్రవేశపెట్టబడింది. ఇస్లాంలోని ఆదేశాలన్నింటి లోనూ ఈ రెండు సిద్ధాంతాలు పాదరసంలా ప్రవహిస్తున్నాయి. ఈ చర్చనీయాంశం క్రింద తౌరాత్, బైబిల్ లోని ఆదేశాలు ఏ విధంగానయితే పైన పేర్కొనబడ్డాయో అదేవిధంగా మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ద్వారా లోకానికి అందజేయబడిన ప్రబోధనలను కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాము.

“విశ్వసించిన ప్రజలారా! హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడింది. హత్య చేసిన వ్యక్తి స్వతంత్రుడయితే, ఆ స్వతంత్రుణ్ణి శిక్షించాలి. బానిస అయితే ఆ బానిసనే వధించాలి. స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి.” (అల్ బఖర: 178)

ఇదయితే ప్రతీకార న్యాయానికి సంబంధించిన శాసనం. ఆ తరువాత వెంటనే నైతిక ఉపదేశం కూడా వస్తుంది.

“ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే, న్యాయ సమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్త ధనాన్ని ఉత్తమరీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం; కారుణ్యం. దీని తరువాత కూడా ఈ హద్దులను అతిక్రమించే వారు ఘోర శిక్షకు గురవుతారు.” (అల్ బఖర – 178)

పై వచనంలో గల ఔదార్యంపై కాస్త ఆలోచించండి. హంతకునికీ హతుని వారసులకు మధ్య బద్ద వైరం ఉన్నప్పటికీ కనికార వైఖరిని ప్రదర్శించే ఉద్దేశ్యంతో హంతకుణ్ణి హతుని వారసులు సోదరునిగా సంబోధించటం జరిగింది. తౌరాత్ గ్రంథంలో హంతకునికి క్షమాభిక్ష పెట్టే అధికరణ లేనందున (ఖుర్ఆన్లో) క్షమాపణను ఒక సౌలభ్యంగా, కారుణ్యంగా అభివర్ణించటం జరిగింది. హంతకునికి “మేలు” గురించి జ్ఞాపకం చెయ్యటం జరిగింది. హతుని వారసులకు క్షమాభిక్ష యొక్క గొప్పదనం గురించి ఉపదేశించటం జరిగింది. రక్తపరిహారం పుచ్చుకున్న పిదప కూడా ప్రతీకారం తీర్చుకుంటే ఘోరశిక్షకు గురయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించటం జరిగింది. ఇస్లాం యొక్క ఈ ఆజ్ఞ ఒకవైపు తౌరాత్ బైబిల్ గ్రంథాలలోని శాసనాలను, నీతీనియామాలను, మరోవైపు ప్రతీకారం మరియు మన్నింపులను ఎంత చక్కగా మేళవించిందో చూడండి!

ఈ సమగ్ర స్వరూపాన్నే దివ్యఖుర్ఆన్ వేరొకచోట ఈ విధంగా బహిర్గతం చేసింది. –

“మరియు తౌరాతు గ్రంథంలో మేము యూదుల కొరకు ఈ ఆజ్ఞను వ్రాశాము: ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను – ఇలా సమస్త గాయాల కొరకు సమానమయిన ప్రతీకారం. కాని ఎవరయినా ప్రతీకారం చెయ్యకుండా క్షమిస్తే, అది అతనికి కఫ్ఫారా (పాపపరిహారం) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే దుర్మార్గులు. ఈ ప్రవక్తల తరువాత మేము మర్యమ్ కుమారుడైన ఈసాను పంపాము. ఆయన తన కాలంలో ఉన్నటువంటి తౌరాతు గ్రంథంలోని విషయాన్ని ధృవీకరించేవాడు. మేము ఆయనకు ఇంజీలు (బైబిలు)ను ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతి ఉండేవి. అది కూడా ఆ కాలంలో ఉన్న తౌరాతులోని దానిని ధృవీక రించేది. అల్లాహ్ యందు భక్తి శ్రద్ధలు కల వారికి అది మార్గ దర్శకం. అంతేకాదు, హితోపదేశం కూడా.” (అల్ మాయిద – 45, 46)

ఇవి తీవ్రమయిన పాపాలకు సంబంధించిన క్రిమినల్ చట్టాలు మరియు నైతిక ఆదేశాలు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా ఇస్లాం ఇంతటి సమగ్రమైన దృక్పథాన్నే కలిగి ఉంది. సెలవీయబడింది –

“కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే (వడ్డీని విడిచిపెట్టకపోతే) మీ పై అల్లాహ్ తరఫు నుండి ఆయన ప్రవక్త తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడయినా మీరు పశ్చాత్తాప పడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కుదారులవుతారు.” (అల్ బఖర – 279)

పైన పేర్కొనబడిన వచనంలో శాసనం (చట్టం) ఉంది. ఇక నైతిక కోణాన్ని చూడండి –

“మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే, ఆ బాకీని అతనికి దానం చెయ్యండి (వదలిపెట్టండి). అది మీకు ఎక్కువ శ్రేయస్కరం.” (అల్ బఖర – 280)

పాక్షిక సాపేక్షిక విషయాలను అలా పక్కన పెడితే సూత్రప్రాయంగా కూడా ఈ సమగ్రతను ఇలా నెలకొల్పటం జరిగింది –

“ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకుంటే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం తీర్చుకోండి. కాని మీరు సహనం చూపితే, అది నిశ్చయంగా సహనం చూపే వారికే మంచిది.” (అన్ నహ్ల్-126)

ఇదే భావం మరొక చోట ఈ విధంగా వివరించబడింది:

“తమపై దౌర్జన్యం జరిగినప్పుడు వారు దానిని ఎదుర్కొంటారు. చెడుకు ప్రతిక్రియ అదే రకమయిన చెడు. కాని ఎవడయినా క్షమించి రాజీపడితే దానికి ప్రతిఫలం ఇవ్వటం అల్లాహ్ బాధ్యత. అల్లాహ్ దుర్మార్గులను ఇష్టపడడు. తమకు అపకారం జరిగినప్పుడు ఎవరయినా ప్రతీకారం తీర్చుకుంటే వారిని నిందించటానికి వీలులేదు. అసలు నిందార్హులు ఇతరులకు అన్యాయం చేసేవారే; భూమిపై అన్యాయంగా దౌర్జన్యాలు చేసేవారే. అటువంటి వారికి వ్యధాభరితమయిన శిక్షపడుతుంది. అయితే ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని.” (అష్ షూరా : 39-43)

పై వచనాలలోని మొదటి వచనం సారాంశమేమంటే; ముస్లింలు తమంతటతామై దౌర్జన్యానికి ఒడిగట్టడంలో ఎన్నడూ ముందంజవేయకూడదు. అయితే ఎవరయినా వారిపై దౌర్జన్యానికి దిగివస్తే, వారికి అన్యాయం జరిగిన మేరకు వారు బదులు తీర్చుకోవచ్చు. చట్టరీత్యా ఇది ఏమాత్రం దోషం కాదు. తౌరాత్ లో చెప్పబడింది కూడా ఇదే. కాని ఏ ముస్లిమయినా విశాల హృదయంతో ఆ అన్యాయాన్ని క్షమించివేస్తే, క్షమించివేయటమే కాదు, పెద్ద మనసుతో ఆ దుర్మార్గుడికి పొసగమేలు చేసి పొమ్మంటే అల్లాహ్ అతని యెడల ప్రసన్నుడవుతాడు. అతనికి పుణ్యం లభిస్తుంది.

చెప్పవచ్చిందేమంటే ‘క్షమాభిక్ష‘ లేక ‘ప్రతీకారం‘ ఈ రెంటిలో ఏదో ఒక దానిని మాత్రమే అవలంబించటమనేది లోకంలోని భౌతిక మరియు ఆధ్యాత్మిక వ్యవస్థలలో గల ఒక లోపం. శిక్ష లేక ప్రతీకారం సిద్దాంతం గనక లేకపోతే సామాజిక వ్యవస్థే నెలకొనజాలదు. రాజ్యంలో శాంతిభద్రతలు కూడా స్థాపించబడవు. ప్రజా సముదాయాలను చెడులకు దూరంగా ఉంచటం కూడా సాధ్యం కాదు. అలాగే ‘క్షమాపణ’ సూత్రం కూడా అవశ్యమే. అది లేని పక్షంలో ఆధ్యాత్మిక వికాసం, ఆత్మశుద్ధి, నైతికోద్ధరణ వంటి వాటికి అర్థమే ఉండదు. మరి చూడబోతే ఒక నిజ ధర్మం కోరుకునేది ఇలాంటి వాటినే కదా! కాబట్టి వీటిలో (క్షమ-ప్రతీకారం) ఏదో ఒకదానిని తీసుకుని రెండవదానిని విడనాడటమంటే ప్రాపంచిక వ్యవస్థను అసంపూర్ణంగా ఉంచటం లేక సగం స్వీకరించి మిగతా సగాన్ని వదలిపెట్టడం వంటిదే.

అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఒక విశిష్టమయిన శిక్షణను, అపూర్వమయిన శిక్షాస్మృతిని తీసుకువచ్చారు. దాని దృష్టి మానవ వ్యవస్థనంతటినీ పరివేష్టించి ఉంది. అది ‘శిక్ష’ మరియు ప్రతీకారాన్ని ప్రభుత్వానికీ లేదా సామూహిక వ్యవస్థకు అప్పగించింది. దాన్ని జారీచేయటంలో ఎలాంటి దాక్షిణ్యానికీ, రాయితీకి ఆస్కారముండరాదనీ అందులో చిన్నవారు, పెద్దవారనీ, ధనికులనీ- పేదలనీ, తన వారనీ – పరాయివారనీ ఎలాంటి తారతమ్యాలు హెచ్చుతగ్గులు చూపకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలనీ గట్టిగా తాకీదు చేసి మరీ ఈ బాధ్యతను అప్పగించింది. ప్రభుత్వం మరియు సామాజిక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఇలా ఉండటం అవసరం.

రెండవ వైపు క్షమాభిక్ష ఉంది. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని ఇనుమడిస్తుంది. అంతేకాదు, మనిషిని మహామనీషిగా మలుస్తుంది. కనుక ‘క్షమాపణ’ను వ్యక్తి ఇష్టాయిష్టాలకు వదలిపెట్టింది. అతని ఆత్మశుద్ధికీ, ఆధ్యాత్మిక వికాసానికి, నైతిక పరాకాష్ఠకు ఈ స్వేచ్ఛ నొసగటం ఎంతో అవసరమాయె.

కాగా; సామూహిక వ్యవస్థను సంస్కరించడానికి రాజ్యం లేక ప్రభుత్వం శిక్షల్ని విధించేటప్పుడు నిర్దిష్టంగా, సూటిగా వ్యవహరించవలసి ఉంటుంది. అక్కడ కనికారం లేక మానవత్వం పేర ప్రభుత్వం ఊగిసలాటకు లోనవుతే వ్యవస్థకు తీవ్రమయిన హాని కలుగవచ్చు. అందుకే ఈ సందర్భంగా ఇలా ఆదేశించబడింది:

“మీరు అల్లాహ్ పై, అంతిమ దినంపై విశ్వాసం ఉన్న వారే అయితే, వారి మీద కనికరం చూపే తలంపు అల్లాహ్ ప్రసాదించిన ధర్మ (నిర్వహణ) విషయంలో మిమ్మల్ని అడ్డుకోరాదు.” (అన్ నూర్ 2)

అంటే ఈ అపరాధానికిగాను ప్రళయ దినాన అల్లాహ్ వద్ద నిర్ధారితమయివున్న శిక్ష ఇంతకన్నా తీవ్రమయినది. కనుక ఈ అపరాధానికిగాను ప్రపంచంలోనే శిక్ష విధించటం ఒక విధంగా పాపాత్ముడైన తమ సోదరునికి ఉపకారం చేయటం వంటిదే. అందుకే ఈ శిక్ష విధించటంలో ఎలాంటి మీమాంస, మెతకదనం పనికిరాదు.

అలాగే ఒక శిక్షను విధించేటప్పుడు నిమ్నోన్నత భేదభావాలకు, ధనిక-బీద తారతమ్యాలకు ఏ మాత్రం తావుండరాదు. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలో మదీనాలో మర్యాదస్తురాలైన ఒక ముస్లిం మహిళ దొంగతనం చేస్తూ పట్టుబడింది. ఏ విధంగానయినా ఆమెకు శిక్షపడకుండా ఉంటే బావుండునని ఖురైషులు భావించారు. ఆ మేరకు వారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు సిఫార్సులు కూడా పంపారు. దానికి సమాధానంగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు: “ప్రజలారా! మీకు పూర్వం జాతులవారు ఈ కారణంగానే నాశనమయ్యారు. ఎవరైనా కులీనుడు దొంగతనం చేస్తే వారతన్ని వదిలేసేవారు. సాధారణ మనిషి ఆ తప్పు చేస్తే అతన్ని పట్టుకుని శిక్షించేవారు. అల్లాహ్ సాక్షి! ఒకవేళ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కుమార్తె ఫాతిమా దొంగతవానికి పాల్పడి వున్నా నేనామె హస్తాన్ని ఖండించే శిక్షనే విధించేవాణ్ణి. ” (సహీహ్ బుఖారీ)

సామూహిక వ్యవహారంలో ఇంత నిర్దిష్టంగా వ్యవహరించిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన స్వంత విషయంలో మాత్రం సతతం మన్నింపుల వైఖరినే అవలంబించారు. తనపై కక్షగట్టిన వారెవరిపై ఎన్నడూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతీకారం తీర్చుకోలేదు అనీ, ఎవరయినా అల్లాహ్ ఆదేశాలలో దేనినయినా ఉల్లంఘిస్తే మాత్రం (చట్టరీత్యా) వారిని శిక్ష విధించటం జరిగిందని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా) తెలిపారు. (సహీహ్ బుఖారీ)

ఇదీ ఆయన ఆచరణ. ఇక ప్రబోధనల విషయానికి వద్దాం. హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా అంటున్నారు: “ప్రతీకారం కోరుతూ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో వివాదాన్ని నివేదించుకున్న వారెపరినీ నేను చూడలేదు. కాకపోతే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మన్నింపుల గురించి జనులకు ‘సలహా’ ఇస్తుండేవారు.” (అబూదావూద్, నిసాయి) అంటే ప్రతీకారం తీర్చుకోకుండా పూర్తిగా క్షమాభిక్ష పెట్టవలసిందిగా లేక కొంత నష్టపరిహారంగానీ, జరిమానా గానీ తీసుకొని నిందితుణ్ణి వదలిపెట్టాలని సూచించేవారు. చిన్నచిన్న తగాదాలకు, తప్పులకు సంబంధించి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులను, “పరస్పరం మన్నింపుల వైఖరిని అవలంబించండి. (గొడవను నా దాకా రానీయకండి). విషయం నా వరకూ వచ్చిందంటే శిక్ష పడితీరుతుంది” (అబూదాపూద్) అని తాకీదు చేసేవారు. అంటే వివాదాన్ని ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన తరువాత విచారణ జరిపి శిక్ష విధించటం అనివార్యమనీ, అలా జరిగినప్పుడే ప్రభుత్వ శాసనాల పట్ల ప్రజల హృదయాల్లో భయముంటుందని భావం. నిజమే మరి.

ఆ కాలంలో ఒకసారి ఒకాయన దుప్పటికప్పుకుని నిద్రపోతుండగా, ఒక వ్యక్తి వచ్చి నెమ్మదిగా ఆ దుప్పటిని తీసేసుకున్నాడు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి న్యాయ స్థానంలో కేసు నివేదించుకోబడింది. దొంగ హస్తాన్ని ఖండించే శిక్షను ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) విధించారు. కేసుపెట్టిన వ్యక్తి (దుప్పటి యజమాని)కి అతనిపై దయకలిగింది. “దైవప్రవక్తా! కేవలం 30 దిర్హముల దుప్పటికోసమని ఒక మనిషి చేతినే నరికివేస్తారా? నేనీ దుప్పటిని ఈ వ్యక్తికి అప్పుగా అమ్మివేస్తున్నాను. ఇతన్ని వదలిపెట్టండి.” అని అతను విన్నవించుకున్నాడు. “కేసు నా దాకా రాకముందే ఈ పని ఎందుకు చేయలేదు” అని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మందలించారు. (అబూదావూద్ – కితాబుల్ హుదూద్)

ఈ రకంగా చూచినపుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి శాసనాంగం ప్రస్తుత ప్రభుత్వాల చట్టాలకన్నా ఎంతో మృదువుగా, న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా ఉందనవచ్చు. అయితే “సర్వసాధారణ మన్నింపుల వైఖరి”కి సంబంధించిన నైతిక శిక్షణా పరిధి ఇస్లాంలో ఇంతకన్నా విస్తృతంగా ఉంది సుమా!

క్షమించమనటం తేలికే. కాని క్షమించటం అంత తేలికైన పనికాదు. తీవ్ర శిక్షకు గురికావలసినవాడు చేతికి చిక్కినప్పుడు అతనిపట్ల మంచి వ్యవహారం చేయడానికి చాలా పెద్దమనసు ఉండాలి. ఆవేశాన్ని అణచుకోవాలి. కోపాన్ని దిగమ్రింగాలి. ఉత్తమ సహనాన్ని స్వంతం చేసుకోవాలి. అప్పుడే క్షమాభిక్ష సాధ్యమవుతుంది. అయితే ఇస్లాం అత్యంత కఠినమయిన, దుర్గమమయిన ఈ మార్గాన్ని కూడా అలవోకగా అధిగమించింది. ఇస్లాంలో బహుదైవారాధన ఎంత అవాంఛనీయమైన విషయంగా పరిగణించబడిందో అందరికీ ఎరుకే. అల్లాహ్ ఏకత్వం, అల్లాహ్ ఔన్నత్యం గురించి అది ఎంత దృఢమైన, తిరుగులేని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందో కూడా ప్రపంచానికి తెలిసిందే. అయినప్పటికీ “మీరు బహుదైవోపాసకుల విగ్రహాలను దూషించకండి” అని ముస్లిములను గట్టిగా తాకీదు చేయటం విశేషం. దివ్యఖుర్ఆన్ ఈ విధంగా సెలవీయ బడింది:

“(ముస్లిములారా!) వారు అల్లాహ్ ను కాదని వేడుకునే ఇతరులను దూషించకండి. ఎందుకంటే, వారు షిర్కు కంటే ఇంకా ముందుకు పోయి అజ్ఞానం చేత అల్లాహ్ ను దూషిస్తారేమో” (అల్ అన్ ఆమ్-108)

ఇస్లాంలోని సహన భావానికి ఇదొక మచ్చుతునక!

ఇక ముష్రిక్కుల, దైవతిరస్కారుల ఆగడాలను దూషణలను భరించే విషయమై స్వయంగా ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు చేయబడే తాకీదును కూడా గమనించండి:

“ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు. ఒకవేళ ఎప్పుడైనా షైతాను నిన్ను ఉసిగొల్పితే అల్లాహ్ శరణు వేడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు.” (అల్ ఆరాఫ్ – 200)

ప్రశాంత పరిస్థితిలో మన్నింపుల వైఖరినవలంబించటం సులువే. కాని ఆగ్రహావేశాల స్థితిలో కూడా మనిషి అదుపు తప్పకుండా – తనను తాను నిగ్ర హించుకోవటం ఎంతో అవసరం. మహా ప్రవక్త ప్రియసహచరుల గుణగణాలను గురించి ప్రస్తుతిస్తూ అల్లాహ్ ఇలా కితాబు ఇచ్చాడు.

“మరియు కోపం వచ్చినపుడు కూడా వారు క్షమించివేస్తారు.” (అష్ షూరా – 38)

సజ్జనులైన దాసుల వ్యవహారశైలిని కొనియాడుతూ, కోపాన్ని దిగ మ్రింగటం, క్షమించటం అల్లాహ్ ప్రీతిని పొందే సాధనమని చెప్పటం జరిగింది:

“వారు కోపాన్ని దిగమ్రింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు – ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్ కు ఎంతో ఇష్టం.” (అలి ఇమ్రాన్ – 134)

పగతీర్చుకునే అవకాశం, శక్తి ఉండి కూడా శత్రువును క్షమించి వదలి పెట్టడమే అసలు సాహసోపేతమయిన కార్యం ఈ నేపథ్యంలో ఇలా చెప్ప బడింది –

“కాని ఎవరయినా సహనంతో వ్యవహరిస్తే, క్షమించివేస్తే, అది పెద్ద సాహసంతో, దృఢ సంకల్పంతో కూడుకున్న పని.” (అష్ షూరా – 43)

మంచిని పెంచే, చెడులను నిర్మూలించే ప్రయత్నంలో ఒక ముస్లిం అన్ని రకాల బాధలను భరించాలి. ఈ భరింపు కూడా పెద్ద సాహసానికి, ఆత్మస్థయిర్యానికి ప్రతీక. విజ్ఞులైన లుక్మాన్ తన కుమారునికి చేసిన ఉపదేశంలో ఇది కూడా భాగమే.

“(కుమారా!) మంచిని ఆజ్ఞాపించు. చెడు పనుల నుండి నిరోధించు. ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు.” (లుఖ్మాన్ – 17)

అవిశ్వాసులు, బహుదైవోపాసకుల దూషణలను సహించటం, వాళ్ళ తరఫున సృష్టించబడిన ఆగడాలను భరించటం కూడా మొక్కవోని సాహసానికి నిదర్శనమే –

“ఈ పరిస్థితులలో మీరు గనక సహనంతో, భయభక్తులతో నిలకడగా ఉంటే, ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కార్యం.” (ఆలి ఇమ్రాన్ – 187)

పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వచనాలన్నింటిలోనూ ఓర్పు, సహనం, నిగ్రహం, క్షమ, కనికారం వంటి వాటిని పెద్ద సాహసంతో కూడిన విషయాలుగా, ఉన్నత నైతిక ప్రమాణాలుగా, అల్లాహ్ ప్రసన్నతను బడసే సాధనాలుగా అభివర్ణించటం జరిగింది. ముస్లింలు ఈ విధానాన్ని అవలంబించవలసిందిగా పిలుపు నివ్వటం జరిగింది. మరికాస్త ముందుకు పోయి చూస్తే, శత్రువులను కూడా క్షమించి వదలిపెట్టవలసినదిగా విశ్వాసులను ఆజ్ఞాపించిన విషయం మనకు కానవస్తుంది.

“ప్రవక్తా! విశ్వాసులతో ఇలా అను: ‘అల్లాహ్ తరఫునుండి చెడ్డ రోజులు వస్తాయని భయపడని వారి చేష్టలను క్షమించండి.” (అల్ జాసియ – 14)

అల్లాహ్ తరఫునుండి చెడ్డ రోజులు వస్తాయని భయపడని వారు ఎవరై ఉంటారు? అవిశ్వాసులు, బహుదైవారాధకులే వారు. అటువంటి వారి పట్ల ఇస్లాం ఎంతగా విసుగు చెందిందో కూడా మీకు తెలుసు. అయినప్పటికీ వ్యవహారం దగ్గరకొచ్చేసరికి వాళ్లను క్షమించాలనీ, వారి తప్పులను మన్నించాలనీ ముస్లింలకు తాకీదు చేయటం గమనార్హం. ఇంతకన్నా ఇస్లాం తరఫున వర్షించాల్సిన ఔదార్యం ఇంకేముంటుంది. అల్లాహ్ ముస్లింలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మన్నింపుల వైఖరిని, క్షమాపణను తన ప్రత్యేక గుణంగా చెప్పుకుని, దానిని అవలంబించే ప్రేరణ ఇస్తున్నాడు.

“మీరు బహిరంగంగానూ, చాటుగానూ మేలే చేస్తూ పోతే లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ (గుణం కూడా ఇదే, ఆయన) క్షమించేవాడు”. (అన్ నిసా – 149)

పాపాత్ములను, అపరాధులను క్షమించటం అల్లాహ్ గుణం అయినప్పుడు దాసులలో కూడా అల్లాహ్ ఈ గుణం తొణకిసలాడుతుండాలి. అల్లాహ్ ఐతే అన్ని రకాలుగా శక్తియుక్తులు గలవాడు. ఆయనకు ఎవరి అక్కరాలేదు. అయినప్పటికీ ఆయన తన దాసులపై జాలిచూపుతూ, విశాల హృదయంతో వారిని మన్నిస్తూనే పోతున్నాడు. మరి మనిషినే చూడండి – అతని శక్తి పరిమితమైనది, అతనికున్న స్వేచ్ఛాధికారం షరతులతో కూడుకున్నది. అతని అశక్తత, నిస్సహాయస్థితి కూడా విదితమే. అతడు అనుక్షణం అల్లాహ్ దయాదాక్షిణ్యాలపై, క్షమపై ఆధారపడి ఉన్నాడు. కనుక అతడు కూడా సాటి జనులను క్షమించటం అలవాటు చేసుకోవాలి. క్రింది ఆయతు ద్వారా ఈ భావమే వ్యక్తమవుతోంది.

“(మీరు) వారిని క్షమించాలి, వారిని (తప్పులను) ఉపేక్షించాలి. మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే, ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను.” (అన్ నూర్ – 22)

అంటే; మీరు ఇతరుల్ని క్షమిస్తే అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాడు. సర్వ సాధారణమయిన మన్నింపులకు సంబంధించి ఇందులో ఎంత గొప్ప ప్రేరణ, ప్రోద్బలం ఇవ్వబడిందో ఆలోచించండి!

క్షమాపణ, ఉపేక్షల తరువాత అంతకన్నా ముఖ్యమయిన ప్రబోధన అపకారికి ఉపకారము చేయాలన్నది. ఎవరయినా తమకు కీడుచేస్తే అతన్ని మన్నించటమేగాక, వీలయినంతవరకు అతనికి మేలు చేయాలి. వైర వైఖరిని అవలంబిస్తున్న వారికి స్నేహ హస్తం అందించాలి. ఈ దివ్యప్రబోధనలపై ఆచరించే వారిని అల్లాహ్ సహనమూర్తులుగా, ధన్యజీవులుగా అభివర్ణించాడు. ఇది బద్ద శత్రువులను ప్రాణ మిత్రులుగా మలచుకునే విధానం అని కూడా అల్లాహ్ తెలియజేశాడు.

“(ప్రవక్తా!) మంచీ, చెడూ ఒకటి కావు, నీవు చెడును శ్రేష్ఠమయిన మంచి ద్వారా తొలగించు. అప్పుడు నీ పట్ల శత్రుభావం కలవాడు నీకు ప్రాణ స్నేహితుడై పోవటాన్ని నీవు గమనిస్తావు. ఈ సుగుణ యోగం సహనశీలురకు తప్ప మరెవరికీ లభ్యంకాదు. ఈ స్థానం మహా అదృష్ట వంతులకు తప్ప మరెవరికీ దక్కదు.” (హామీమ్ అస్ సజ్జాహ్ – 34, 35)

ఈ గొప్ప ప్రబోధనను ఆస్వాదించిన వారిని అల్లాహ్ “మహా అదృష్ట వంతులు”గా అభివర్ణించాడంటే దీనికున్న ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతుంది. అవిశ్వాసులు, బహుదైవారాధకుల దూషణలకు రెచ్చిపోరాదని కూడా మరోచోట ఉద్బోధించడమైనది. ఎందుకంటే ధర్మావలంబనలో ఆవేశానికిలోనై అనుచితమయిన చర్యకు ఒడిగట్టడం వాస్తవానికి షైతాన్ చేష్ట. అలాంటి పరిస్థితి ఎప్పుడయినా ఎదురయినట్లయితే, ‘షైతాన్ మాయోపాయం నుండి కాపాడమనీ, కోపాన్ని దిగమ్రింగే సంయమనాన్ని ప్రసాదించమనీ దైవాన్ని ప్రార్థించాలి.

“ఓ ప్రవక్తా! చెడును ఉత్తమమయిన పద్ధతిద్వారా నివారించు. ఏ విషయాలను వారు నీ గురించి కల్పిస్తున్నారో, అవి మాకు బాగా తెలుసు. ఇలా ప్రార్థించు; ‘ప్రభూ! షైతానుల ప్రేరణల నుండి నేను నిన్ను శరణువేడుకుంటున్నాను. నా ప్రభూ! అవి నా వద్దకు అసలు రాకుండేటట్లు నిన్ను శరణువేడుకుంటున్నాను” (అల్ మూమినూన్ – 96-98)

వేరొక చోట అల్లాహ్ నమాజ్, దాన ధర్మాలు, సహనం మరియు మన్నింపులను ప్రస్తావించి, వాటికి బదులుగా స్వర్గం లభిస్తుందని వాగ్దానం చేశాడు. అయితే ఈ సత్కార్యాలన్నింటిలోకీ ‘సహనాన్ని’ రెండేసి సార్లు ప్రస్తావించి, ముఖ్యంగా దీని మూలంగానే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పటం గమనార్హం. ఇదిగో చూడండి:

“వారి వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరపరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు. తమ ప్రభువునకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్కతీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు. తమ ప్రభువు ప్రసన్నతకోసం సహనంతో వ్యవహరిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా, రహస్యంగా ఖర్చుచేస్తారు. చెడును మంచి ద్వారా పారద్రోలుతారు. పరలోక గృహం వారి కొరకే ఉన్నది. అంటే, వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు. వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు.” (అర్రాద్ : 19 – 28)

వారితో ఇలా అనబడుతుంది:

“మీపై శాంతి వర్షించుగాక! ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం వల్ల ఈ రోజు మీరు దీనికి అర్హులయ్యారు.” (అర్రాద్ – 24)

చూశారుగా, స్వర్గసుఖాల శుభవార్త అందించే ఈ శుభసమయాన నమాజ్ ప్రస్తావనగానీ, దాన ధర్మాలు ప్రస్తావనగానీ, దైవభీతి ప్రస్తావనగానీ రాలేదు. కేవలం ఇది ‘సహనానికి’ ప్రతిఫలంగా లభించిన బహుమానమని నొక్కి పలకబడింది. పై ఆయతుల ద్వారా మన దృష్టికి వచ్చే మరో ముఖ్య విషయం ‘చెడు’ను ‘మంచి’ ద్వారా పారద్రోలటం. ఇది కూడా ఎంత గొప్ప సత్కార్యమంటే దీనిని సమాజ్ మరియు దానధర్మాలతో కలిపి ప్రస్తావించటం జరిగింది.

ఇంకొక వచనంలో తమ జాతివారి ఎత్తిపొడుపులను ఆవేదనా భరిత మయిన మాటలను విని, వాటిని సహిస్తూ ఉండే నవ ముస్లిం యూదులను కొనియాడుతూ ఇలా సెలవీయబడింది:

“తాము చూపిన స్థయిర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని రెండుసార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు. మేము వారికి ఇచ్చిన జీవనోపాధినుండి ఖర్చుపెడతారు. వారు ఎప్పుడైనా అసహ్యకరమయిన మాటను వింటే, ఇలా అంటూ దూరంగా జరిగి పోతారు: ‘మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మీకు శాంతి కలుగుగాక! మేము అజ్ఞాసుల పద్ధతుల్ని అవలంబించదలచుకోలేదు.” (అల్ ఖసస్ – 54, 55)

ఈ పచనాలలోని ఒక్కో ముక్కను గురించి యోచనచేయండి. వారు చెడును మంచితో నివారించడమేగాక, పారదర్శక వైఖరిని ప్రదర్శించడమేగాక, వేధించేవాళ్లకోసం దీవెనల వర్షం కురిపిస్తున్నారు.

సహీహ్ బుఖారీలో ఉంది. మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రబోధించారు : “ఉపకారానికి బదులు ఉపకారం చేసేవాడు ఆత్మీయత యొక్క హక్కును నెరవేర్చినట్టు కాదు. దుర్వ్యవహారానికి బదులుగా సద్వ్యవహారం చేసేవాడే వాస్తవానికి ఆత్మీయతా హక్కును నెరవేర్చాడు”.

ఒకసారి ఒక వ్యక్తి వచ్చి, “ఓ దైవ ప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారి యెడల సద్వ్యవహారం చేస్తాను. కాని వారు నా యెడల దుర్వ్యవహారం చేస్తున్నారు. నేను వారికి మేలు కలిగిస్తున్నాను, కాని వారు నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారి పట్ల మృదు వైఖరి నవలంబిస్తుండగా వారు నా పట్ల కరకుగా ప్రవర్తిస్తున్నారు” అని విన్నవించు కున్నాడు. దీనికి సమాధానంగా ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీవు చెప్పేదే నిజమయితే, నీవు వాళ్ల నోటిలో మట్టి నింపుతున్నావు. అంటే సత్కార్యం అనే ముద్దతో నీవు వాళ్ల నోళ్లు మూయిస్తున్నావు. నీవు నీ ఈ వైఖరిపై నిలకడగా ఉన్నంతకాలం అల్లాహ్ సహాయం నీ పక్షాన ఉంటుంది.” (సహీహ్ ముస్లిం)

హుజైఫా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ప్రబోధించారు: “జనులు మీకు మేలు చేకూర్చినట్లయితే మేము కూడా మేలు చేకూరుస్తామని, దౌర్జన్యం చేస్తే మేము కూడా అలాగే చేస్తామని మీరంటారు. ఇది సరికాదు. మిమ్మల్ని మీరు శాంతపరచుకోండి, నెమ్మదించండి. జనులు మీకు మేలు చేకూరిస్తే మీరు వారికి మేలు చేకూర్చండి. ఒకవేళ వారు కీడు కలిగించినా సరే మీరు వారికి అన్యాయం చేయకండి.” (జామె తిర్మిజీ)

ఇస్లాం మరియు ముస్లింలకు తమ మోసపూరిత పథకాల ద్వారా, బూటకపు వాగ్దానాల ద్వారా, వంచనా పూరితమయిన ఒడంబడికలద్వారా, దగాకోరు సంధుల ద్వారా మోసం చేసే వారి గురించి కూడా నుహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఈ ఆదేశం ఇవ్వబడింది:

“అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో ఈ లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ (వారు ఈ స్థితికి దిగజారి పోయినప్పుడు, వారు ఏ దుర్మార్గాలు చేసినా, అది పూర్తిగా అనుకున్నదే) కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లాహ్ ప్రేమిస్తాడు.” (అల్ మాయిద – 13)

ఆలోచించవలసిన విషయమిది! ఇటువంటి దగుల్బాజీ జనాన్ని క్షమించి, వాళ్ల తప్పుల్ని చూచీ చూడనట్లుగా ఉపేక్షించటం ఇస్లాంలో చాలా గొప్ప సత్కార్యంగా పేర్కొనబడింది. ఇటువంటి సత్కార్యం చేసే ఉదార స్వభావుల్ని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడన్న శుభవార్త కూడా ఇవ్వబడింది.

ఈ తఫ్సీలన్నిటి ద్వారా ఇస్లాం మరియు ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రబోధనలు ఈ నైతిక అధ్యాయం క్రింద ఎంత ప్రాధాన్యతతో కూడుకున్నవో, మరెంత సమగ్రతను సంతరించుకున్నవో సుబోధకమవుతోంది.

సామాజిక హక్కులుగానీ, బాధ్యతలుగానీ సంఘంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సజావుగా నెరవేర్చబడతాయి. సంఘ జీవితంతో సంబంధం త్రెంచుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు. జనవాసాలకు కోసుల దూరంలో నిర్మా నుష్య ప్రాంతాలలో, కొండల్లో కోనల్లో తపస్సు చేసుకునేవారు సామాజిక ఇక్కట్లను దూరం చేయగలరా? జాతులు నైతిక పతనానికి లోనుకాకుండా వాళ్లు చూసుకో గలరా? అంతదూరాన ఉంటూ అభాగ్య జీవులను ఆదుకోగలుగుతారా? అనాధల సంరక్షకులుగా ఉండగలుగుతారా? ప్రజాసేవకు సంబంధించిన ఏ చిన్న విభాగాన్నయినా వారు పర్యవేక్షించగలుగుతారా? వారు ప్రజలను మార్గవిహీనత, మార్గభ్రష్టతల నుండి ఆపగలుగు తారా? అంతెందుకు, వారు తమ స్వహస్తాలతో ఉపాధిని సంపాదించి బ్రతకగలుగుతారా? వాళ్లు ప్రజలకు సన్మార్గం వైపుకు దర్శకత్వం వహించగలుగుతారా? ప్రజలను మంచి వైపుకు ఆహ్వానించి, చెడునుండి వారించే విధిని నిర్వర్తించ గలుగుతారా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల ప్రేమ | కలామే హిక్మత్ (వివేక వచనం)

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచించారని హజ్రత్ అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: “మనిషికి తన భార్యాబిడ్డల కంటే, తన సొంత సొమ్ముకంటే, తన వారికంటే ఎక్కువగా నేను ప్రియమైనవాడ్ని కానంతవరకూ అతను విశ్వాసి (మోమిన్) కాలేడు.” (ముస్లిం)

ఈ హదీసులో ”విశ్వాసం” యొక్క ఉన్నతమయిన స్థితి వివరించబడింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నతస్థితికి విశ్వాసం చేరుకోవాలి. అంటే మనం మన స్వయంపై దైవప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు మన ప్రాణం కన్నా దైవప్రవక్త ప్రాణమే ప్రీతికరం కాగలగాలి. ఒకసారి హజ్రత్ ఉమర్ మహాప్రవక్తను ఉద్దేశించి, “ఓ దైవప్రవక్తా! నా ప్రాణం తప్ప మిగతా అన్ని విషయాలకన్నా మీరే నాకు ప్రియమైన వారు” అని అన్నారు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), ”లేదు, ఎవరి అధీనంలో నా ప్రాణం ఉందో అతని సాక్షిగా చెబుతున్నాను – నేను మీకు మీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రియతమం కానంత వరకూ మీరు విశ్వాసి కాలేరు” అని పలికారు. ఉమర్ (రజిఅన్ అన్నారు. “ఇప్పుడు నాకు మీరు నిశ్చయంగా నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రీతికరమైన వారు.” దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం), “అయితే ఉమర్! ఇప్పుడు మీరు విశ్వాసులు” అన్నారు. (బుఖారి)

సహచరులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల అమితమయిన ప్రేమాభిమానం కలిగి ఉండేవారు. చారిత్రక గ్రంథాలు, హదీసు గ్రంథాలే దీనికి నిదర్శనం. హిజ్రత్ సందర్భంగా హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్తకు చేసిన సేవలను గురించి ప్రఖ్యాత చరిత్రకారులు, హదీసువేత్త అయిన ఇబ్నె కసీర్ (రహిమహుల్లాహ్) ఇలా వ్రాశారు : దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ ఇద్దరూ రాత్రిపూట సూర్ గుహలో చేరారు. అయితే అబూబకర్ గుహలోకి మొదట ప్రవేశించారు. దైవప్రవక్తకు కీడు కలిగించే మృగం గాని, పాముగాని గుహలో ఉండవచ్చునేమోనన్న భయంతో అబూబకర్ తొలుత తానే గుహలో ప్రవేశించారు.”

మరో ఉల్లేఖనం ఏమని ఉందంటే; ఆ గుహకు ఎన్నో కన్నాలు ఉన్నాయి. అబూబకర్ ఆ కన్నాలను మూసివేశారు. ఒక కన్నాన్ని మూసివేయటానికి వీలుపడకపోతే తన కాలిని దానికి అడ్డుగా పెట్టారు. కన్నం లోపలినుంచి విషపు పురుగులు కాటేయసాగాయి. బాధతో ఆయన కళ్ళనుంచి అశ్రువులు రాలాయి. అయినా ఆయన కాలు తీయలేదు.

ప్రవక్త యెడల ప్రేమ కలిగి ఉండాలంటే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరించాలి. ఎవరయినా, తనకు ప్రవక్త యెడల అమితమయిన ప్రేమ ఉందని చాటుకుంటూ ప్రవక్త సంప్రదాయాన్ని (సున్నత్ను) అవలంబించకపోతే, అతను అసత్యవాది, బూటకపు అనుయాయి అనిపించుకుంటాడు. అల్లాహ్ సెలవిచ్చాడు:

“మేము అల్లాహ్ ను మరియు ప్రవక్తను విశ్వసించామని, విధేయతను స్వీకరించామని వారంటారు. ఆ తరువాత వారిలో ఒక వర్గం విధేయత పట్ల విముఖత చూపుతుంది. ఇటువంటి వారు విశ్వాసులు కారు.” (అన్నూర్ : 47)

విధేయతా మార్గం నుండి వైముఖ్యం ప్రదర్శించిన వారిని విశ్వాస పరిధుల నుండి వేరుచేస్తూ పై ఆయత్ అవతరించింది. మనసులో ఎంత అధికంగా విశ్వాసం ఉంటే అంతే అధికంగా విధేయతా భావం ఉంటుంది.

చెప్పుకోవటానికయితే చాలామంది తమకు ప్రవక్తయెడల అపార గౌరవం, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటారు. అయితే వారి మాటలు ‘విధేయత’ అనే గీటురాయిపై పరికించబడతాయి. ఒకవేళ వారి ఆచరణ ప్రవక్త ఆచరణకు భిన్నంగా ఉంటే వారు చెప్పేదంతా బూటకం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే, నిష్కల్మషమైన విధేయతా భావం ఉంటే అది ఆచరణ ద్వారా తప్పకుండా వ్యక్తమవుతుంది.

”(ఓ ప్రవక్తా!) వారితో అనండి, ‘ఒకవేళ మీరు అల్లాహ్ యెడల ప్రేమ కలిగి ఉంటే నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ అపరాధాలను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, ఎంతగానో కరుణించేవాడు కూడాను.” (ఆలి ఇమ్రాన్ : 31)

హాపిజ్ ఇబ్నె హజర్ ఇలా అన్నారు :

ప్రవక్తలందరిపట్ల ప్రేమ కలిగి ఉండటం విశ్వాసానికి ప్రతీక. అయితే మనం అందరికన్నా ఎక్కువ ప్రేమ మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యెడల కలిగి ఉండాలి :

ఇమామ్ ఖతాబి ఇలా అంటున్నారు:

ఇక్కడ ప్రేమ అంటే భావం లాంఛన ప్రాయమయిన ప్రేమ కాదు హృదయ పూర్వకమయిన ప్రేమ. మహాప్రవక్త ఏమని ఉపదేశించారంటే, మీరు నా అనుసరణలో మీ మనోకాంక్షల్ని జయించనంతవరకు, నా సంతోషానికి మీ సుఖసంతోషాలపై ప్రాధాన్యత ఇవ్వనంతవరకూ – ఒకవేళ మీకు నష్టం కలిగినాసరే, చివరకు మీరు అమరగతి నొందవలసి వచ్చినా సరే – మీరు నా సంతోషం కొరకు పాటుపడనంతవరకూ మీకు నాపై గల ప్రేమ ధృవీకరించబడదు.

ఖాజీ అయాజ్ మరియు ఇబ్నె బతాల్ తదితరులు ఇలా అభిప్రాయపడ్డారు : ప్రేమ మూడు రకాలు :

(1) గౌరవనీయమయిన ప్రేమ. ఇది తండ్రిపట్ల ఉంటుంది.
(2) అవ్యాజానురాగాలతో కూడిన ప్రేమ. ఇది సంతానంపై ఉంటుంది.
(3) స్వాభావికమయిన ప్రేమ. ఇది ఒక మనిషికి మరో మనిషిపై సాధారణంగా ఉంటుంది.

ఈ హదీసులో మహాప్రవక్త అన్ని రకాల ప్రేమలను ప్రస్తుతించారు.

ఈ హదీసు ఆలోచన, యోచనల వైపు దృష్టిని మరలిస్తుంది. ఎందుకంటే మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి ద్వారా ప్రాప్తమయ్యే మహత్పూర్వకమయిన ప్రయోజనాలకు మూలం ఆలోచన మరియు యోచనలే. ప్రవక్త సహచరులు ఏ విషయంపైనయినా ఎంతో సావధానంగా ఆలోచించేవారు. ప్రతి విషయాన్ని తరచి చూసేవారు. అందుచేత వారి విశ్వాసం ఎంతో దృఢమయ్యింది. ఈ హదీసు ద్వారా ముస్లిమైన ప్రతి ఒక్కరికీ లభించే సందేశం ఏమంటే సకల ప్రేమలకన్నా ప్రవక్త యెడల ప్రేమకు అతను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో తాను ఏ స్థాయిలో నున్నది అతను సతతం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.

పుస్తకం నుండి :కలామే హిక్మత్ – 1 (వివేక వచనం)
రచన:సఫీ అహ్మద్ మదనీ
అనువాదం: ముహమ్మద్ అజీజుర్ రహ్మాన్
ప్రకాశకులు:జమీ అతే అహ్ లె హదీస్,ఆంధ్రప్రదేశ్

మార్గదర్శక ఖలీఫా హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) [పుస్తకం]

Screenshot

క్రింది లింక్ నొక్కి పూర్తి పుస్తకం చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి
మార్గదర్శక ఖలీఫా హజ్రత్అబూ బక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు)
 [డైరెక్ట్ PDF] [47 పేజీలు]
అల్ హఖ్ తెలుగు పబ్లికేషన్స్

హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రాణస్నేహితులు. ఇస్లాం స్వీకరించక పూర్వం ఆయన పేరు అబ్దుల్ కాబ్. ఇస్లాం స్వీకరించాక మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనకు అబ్దుల్లాహ్ అని నామకరణం చేశారు. అబూ బకర్ అనేది ఆయన పేరు కాదు. అది ఆయన మారు పేరు. కాని ఆయన తన మారు పేరుతోనే ప్రసిద్ధిగాంచారు.

ఖురైష్ ఓ పెద్ద తెగ. అది మక్కా మరియు దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో శాఖోపశాఖలుగా వ్యాపించి ఉండేది. అందులోని ఓ శాఖ బనీ తమీమ్, హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) బనీ తమీమ్ కు చెందినవారు. ఆయన తండ్రిపేరు ఉస్మాన్, మారు పేరు అబూ ఖహాఫా.

ఆ రోజుల్లో తేదీలను నిర్ధారించే పద్ధతి ఏదీ ఉండేది కాదు. ఖురైషులు ఏదైనా విశిష్టమైన సంఘటన ద్వారా పుట్టిన మరియు మరణించిన తేదీలను లెక్కకట్టేవారు. సంవత్సరాలు కూడా ఇలాగే నిర్ధారించబడేవి. ప్రజలు ప్రముఖమైన సంఘటనల ద్వారా తేదీలను లెక్కించేవారు. ఈ విధంగా సంవత్సరాలు నిర్ధారించబడేవి. ఆ రోజుల్లో ఖురైషులు ‘ఫీల్‘ సంఘటన ద్వారా తేదీలను నిర్ధారించేవారు. అరబీ భాషలో ‘ఫీల్’ అంటే ఏనుగు అని అర్థం. ఓ నీగ్రో రాజు (అబ్రహా) ఏనుగులను తీసుకొని అల్లాహ్ గృహమయిన కాబాను పడగొట్టడానికి మక్కా నగరంపైకి దండెత్తి వచ్చాడు. కాని మక్కా చేరుకోగానే అతని సైన్యం మరియు ఏనుగులపై అల్లాహ్ ఆగ్రహం విరుచుకుపడింది. వారందరూ నాశనమయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈ సంఘటన జరిగిన రెండున్నర సంవత్సరాలకు జన్మించారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కన్నా వయస్సులో రెండు సంవత్సరాలు చిన్నవారు.

ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ గౌరవనీయులైన వ్యక్తిగా పరిగణింపబడేవారు. ఖురైష్ మరియు ఇతర అరబ్ తెగలు స్వతంత్రంగా ఉండేవి. వారిని ఎవరూ శాసించే వారు కాదు. కాని వారు తమ ప్రాంతపు అవసరాలకనుగుణంగా వివిధ పనులను వివిధ తెగలకు అప్పగించారు. ఖురైషీయులలో పది పెద్ద పెద్ద శాఖలుండేవి. ప్రతి శాఖకు ఓ పని అప్పగించబడేది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వీరందరూ పరస్పరం సంప్రదించుకునేవారు. బనీ హాషిమ్ అంటే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వంశస్థులు. వారు హజ్ సమయంలో యాత్రీకులకు నీరు త్రాసేవారు. బనూ ఉమయ్యా వారి దగ్గర ఖురేషీ ధ్వజం ఉండేది. ఆ వంశపు నాయకుడు యుద్ధ సమయంలో ధ్వజం ఎత్తుకొని సైన్యానికి ముందుండేవాడు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వంశం న్యాయ శాఖను పర్యవేక్షించేది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వంశస్థులు సివిల్ మరియు క్రిమినల్ కేసులను విచారించి తీర్పిచ్చేవారు. ఏదైనా వ్యాజ్యంలో తీర్పివ్వడం కష్టమైతే ప్రజలను సమావేశపరచి సంప్రదించేవారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వృత్తి వ్యాపారం. ఆయన సిరియా మరియు యమన్ నుండి బట్టలుకొని తెచ్చి మక్కాలో అమ్మేవారు. వర్తకం నిమిత్తం మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు ఆయన వయస్సు 18 సంవత్సరాలు. తరువాత వర్తకం నిమిత్తం ఆయన ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. వర్తకం మూలంగా అరేబియాలోని పలు ప్రాంతాల ప్రజలు ఆయన్ని గుర్తించేవారు. మంచితనం, నిజాయితీ మూలంగా ఆయన్ని ప్రజలు గౌరవించేవారు.

ఆనాడు అరబ్బుల్లో అనేక దుర్గుణాలు ఉండేవి. పబ్లిక్ గా తాగి తందనాలాడేవారు. జూదం, మట్కా వారి హాబీలు. కొన్ని అరబ్బు తెగలైతే దారిన పోయేవారిని దోచుకున్నది గాక తమ ఈ చెడు చేష్టపై గర్వ పడేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మొదట్నుంచీ ధర్మ పరాయణులు, దైవభీతి గలవారు. ఆయన కష్టపడి, చెమటోడ్చి తన జీవన భృతిని సంపాదించేవారు. బీదవారికి, అగత్యపరులకు సహాయపడేవారు. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన ఎన్నడూ మద్యం సేవించలేదు. ఇస్లాం స్వీకరించాక ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. పూర్వం ఆయన కవితలు చెప్పేవారు. ఆయన్ని మంచి కవుల్లో ఒకరిగా లెక్కించేవారు. ఇస్లాం స్వీకరించాక కవితలు చెప్పడం కూడా మానేశారు.

మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు 40 సంవత్సరాల వయస్సులో దైవ దౌత్యం లభించింది. ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) వయసు 38 సంవత్సరాలు. అప్పట్లో ఆయన వ్యాపారం బావుంది. వ్యాపార నిమిత్తం తరచూ ఆయన సిరియా, యమన్ దేశాలకు వెళ్ళేవారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారితో ఆయనకు చాలా కాలంగా పరిచయమైతే ఉంది గాని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తగా నియుక్తులవడానికి ఒక సంవత్సరం మునుపు నుండి వారిరువురి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు రావడం మొదలెట్టారు. ఓసారి అబూబకర్ (రదియల్లాహు అన్హు) సిరియా నుండి తిరిగి రాగానే అబూతాలిబ్ గారి అనాథ భాతృజుడు తనను ప్రవక్తగా ప్రకటించుకున్నాడని ప్రజలన్నారు.

వెంటనే హజ్రత్ అబూబకర్(రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఇస్లాం స్వీకరించమని కోరిన వెంటనే ఆయన ఇస్లాం స్వీకరించారు.

అలా ఇస్లాం స్వీకరించిన పురుషులలో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ప్రథములు. స్త్రీలలో ఇస్లాం స్వీకరించిన మొదటి మహిళ హజ్రత్ ఖదీజా (రదియల్లాహు అన్హ), పురుషుల్లో హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు), పిల్లల్లో హజ్రత్ అలీ(రదియల్లాహు అన్హు)మరియు బానిసల్లో హజ్రత్ జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వీరు నలుగురూ ఒకే కాలంలో ఇస్లాం స్వీకరించారు. వీరిలో అందరికంటే ముందు హజ్రత్ ఖదీజా(రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించారు. మిగిలిన ముగ్గురిలో ఎవరు ముందు ఇస్లాం స్వీకరించారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. చాలా కాలం వరకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు ఇస్లాం స్వీకరించలేదు. ఆయన తండ్రి అబూఖహాఫ కొడుకు ఇస్లాం స్వీకరించిన 21 సంవత్సరాలకు అంటే మక్కా విజయ సందర్భంలో, 90 ఏళ్ళ వయస్సులో ఇస్లాం స్వీకరించారు.

అనేక మంది మక్కా వాసులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వెంటవచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో ఇస్లాం స్వీకరించారు. వారిలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ జుబైర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ తల్హా(రదియల్లాహు అన్హు), హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) లాంటి వారున్నారు. వీరంతా సత్య ధర్మం కోసం ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కఠిన పరీక్షల్లో నెగ్గుకువచ్చారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇస్లాం స్వీకరించే నాటికి ఆయన వద్ద నలభై వేల దిర్హములు ఉండేవి. అందులో నుంచి కేవలం ఐదు వేల దిర్హములు తన కోసం ఉంచుకుని మిగిలినదంతా ఇస్లాం (దైవధర్మం) కోసం అర్పించారాయన.

ఇస్లాం స్వీకరించిన వారిని అవిశ్వాసులు వేధించేవారు. స్వతంత్రులు మరియు పెద్ద కుటుంబాలకు చెందిన విశ్వాసులపై చెయ్యి చేసుకునే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. కాని విశ్వాస భాగ్యాన్ని పొందిన బానిసలపై కష్టాల కొండలు విరుచుకుపడేవి. అలాంటి బాధితులలో ఓ నీగ్రో బానిస కూడా ఉన్నారు. ఆయన పేరు హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు). ఆయన హృదయాన్ని ఇస్లాం జ్యోతిర్మయం చేసింది. ఆయన యజమాని ఆయన్ని కొడుతూ కొడుతూ అలసిపోతే, మిట్టమధ్యాహ్నం కాలుచున్న ఇసుకపై ఆయన్ని నగ్నంగా పడుకోబెట్టి గుండెపై బండపెట్టేవాడు. కాని ఆయన ఈ పరిస్థితిలో కూడా ‘అహద్ అహద్’ (అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే) అని అనేవారు. దీనిపై ఆయన యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ ఆయన్ని తుంటరి బాలురకు అప్పగించేవాడు. వారు ఆయన మెడలో త్రాడు వేసి లాక్కెళ్ళేవారు. అప్పుడు మక్కా వీధులు, ‘అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ ఒక్కడే’ అన్న నినాదాలతో ప్రతిధ్వనించేవి. ఈ వేధింపులను చూడలేక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఈ విధంగా ఇస్లాం స్వీకరించిన ఏడుగురు బానిసలకు అబూబకర్ (రదియల్లాహు అన్హు) స్వాతంత్ర్యం ప్రసాదించారు. ఇది చూసి ఆయన తండ్రి అబూ ఖహాఫా “నీకు బానిసలు కొనాలనే అంత ఇదిగా ఉంటే మంచి దేహదారుఢ్యం గల వారిని కొనాల్సింది. వారు నీ అవసరానికి పని కొచ్చేవారు. రెండడుగులు కూడా సరిగా నడవలేని ఈ బలహీనులైన బానిసలను ఎందుకు కొన్నావు?” అని అన్నారు. “ఈ పని నేను ఎలాంటి లాభాన్ని ఆశించి చేయలేదు. ఇది నేను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే చేశాను.” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు).

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చేత విముక్తి పొందిన బానిస హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) ఎంత గొప్ప వారంటే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు)ను ‘ఓ మా సర్దార్!’ అని అనేవారు: ఓ సారి హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) గారి ప్రస్తావన వస్తే హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మా నాయకులు. ఎందుకంటే ఆయన మా నాయకునికి (హజ్రత్ బిలాల్ రదియల్లాహు అన్హుకు) స్వాతంత్ర్యం ప్రసాదించారు.”

మొదటి మూడు సంవత్సరాలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మప్రచారం బహిరంగంగా చేయలేదు. ఇస్లాం నిశ్శబ్దంగానే విస్తరించ సాగింది. చాలా మంది ఇస్లాం స్వీకరించారు. నాలుగవ ఏట నుండి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మ ప్రచారం బహిరంగంగా చేయసాగారు. దీనిపై ప్రజలు ఆగ్రహం చెంది విశ్వాసులపై కఠినంగా వ్యవహరించసాగారు. ఆ కాలంలో ఓ రోజు ఖురైష్ పెద్దలందరూ కాబా గృహంలో సమావేశమై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి మాట్లాడసాగారు. అదే సమయంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఒకతను లేచి ” మా దేవుళ్లను కించపరచేది నీవేనా?” అని అడిగారు. “నిస్సందేహంగా నేనే” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని అవిశ్వాసులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పై విరుచుకుపడ్డారు. అంతలో ఎవరో వచ్చి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో మీ స్నేహితుడిని కాపాడండి అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరుగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. అవిశ్వాసులను తోసుకుంటూ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకుని “కడు శోచనీయం! మీరు ఈయన్ని ‘తన ప్రభువు అల్లాహ్’ అని అన్నంత మాత్రానికే కొడుతున్నారా.” అని ఆవేశంతో ప్రశ్నించారు.

ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం అవిశ్వాసులకు నచ్చలేదు. అందరూ ఆయనపై విరుచుకుపడి తల పగిలేలా కొట్టారు. అవిశ్వాసుల అత్యాచారాలు నానాటికీ పెరిగి పోయి ఈ విధంగా బ్రతుకు గగనమై పోగా చాలా మంది విశ్వాసులు అబీసీనియాకు వలస వెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని విడిచి వెళ్లడానికి హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారి మనసొప్పలేదు. కాని విధిలేక ఆయన కూడా యమన్ దారిన అబిసీనియాకు వలస వెళ్లారు. దారిలో ఐదు చోట్ల ఇబ్నుల్ రగ్నా అనే వ్యక్తిని కలిశారు. ఎక్కడికి వెళుతున్నారు? అని అతను అడిగాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జవాబిస్తూ “నా దేశస్థులు నన్ను తరిమేశారు. అందువలన నేను వేరే దేశానికెళ్ళి అల్లాహ్ ఆరాధన చేయాలనుకుంటున్నాను” అని అన్నారు.

“మీ లాంటి అతిధి మర్యాద చేసేవారిని, బీదలు – అగత్యపరులను ఆదుకునే వారిని మక్కా నుండి ఎలా తీసివేస్తారు. మీ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పదండి, మక్కా వెళదాం. అక్కడే అల్లాహ్ ఆరాధన చేయండి” అని అన్నాడు ఇబ్నుల్ రగ్న. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను తీసుకొని వచ్చి ఖురైష్ నాయకులతో మాట్లాడాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అల్లాహ్ ఆరాధన చేయదలిస్తే ఇంట్లోనే చేసుకోవాలి అనే షరతుపై వారు ఇబ్నుల్ రగ్న మాటను ఒప్పుకున్నారు.

ఇబ్నుల్ రగ్నా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు” అని అన్నాడు. కొన్ని రోజుల వరకూ ఆయన ఇంట్లోనే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం చేయసాగారు. ఆ తరువాత ఆయన తన ఇంటి సరిహద్దులోనే ఓ మస్జిద్ నిర్మించారు. అక్కడే నమాజ్ చేయడం, ఖుర్ఆన్ చదవడం మొదలెట్టారు. ఆయన మృదు స్వభావులు కావడం చేత ఖుర్ఆన్ పారాయణం చేసేటప్పుడు దాని ప్రభావం వల్ల ఏడ్వనారంభించే వారు. ఆయన ఏడుపు శబ్దం విని దారిన పోయే ప్రజలు ఆగి వినసాగారు. వారిలో స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవారు. స్త్రీలు మరియు పిల్లలు ఎక్కడ విశ్వాసులయిపోతారో అని ఖురైషులు భయపడసాగారు. ఇబుల్ రగ్నాకు ఫిర్యాదు కూడా చేశారు. అతను హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దగ్గర కొచ్చి జరిగినదంతా వివరించాడు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఇక నీవు నా బాధ్యత తీసుకోకు. నన్ను నా అల్లాహ్ పై వదిలిపెట్టు” అని అన్నారు..

మక్కా నుండి 200 మైళ్ళ దూరంలో మదీనా అనే పురము ఉంది. ఆ రోజుల్లో దాన్ని ‘యస్రిబ్‘ అనేవారు. అక్కడి వారు కొందరు మక్కా వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను కలిశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) నోట దివ్య ఖుర్ఆన్ వచనాలు విన్నారు. మదీనా వెళ్ళి ఇతరులతో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ప్రస్తావించారు. ఇలా మొదటి సంవత్సరం ఆరుగురు, రెండో సంవత్సరం పన్నెండు మంది, మూడో సంవత్సరం డెబ్భై రెండు మంది మదీనా నుండి మక్కాకు వచ్చి ముస్లిములయ్యారు. వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను మదీనాకు రమ్మని ఆహ్వానించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా వెళ్ళలేదు గాని సహచరులు (సహాబా)కు అనుమతినిచ్చారు. వారు (సహాబా) ఒక్కొక్కరూ మదీనా వెళ్ళసాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా మదీనా వెళ్ళడానికి అనుమతి అడిగారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను ఆపుతూ ఇలా అన్నారు-“నీవు కాస్త ఆగు. బహుశా అల్లాహ్ ఆదేశం ప్రకారం నేను కూడా మదీనా వెళ్ళవచ్చు”. అప్పటి నుండే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మదీనా వెళ్ళడానికి సన్నాహాలు చేయసాగారు. తన ఒంటెలకు తుమ్మ ఆకులు తినిపించసాగారు.

ఓ రోజు మధ్యాహ్నం అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తమ ఇంట్లో కూర్చుని ఉండగా ఒకతను వచ్చి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని తెలియజేశాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో అంతకు ముందెన్నడూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటికి రాలేదు. ఏదో అత్యవసర పనిమీదే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సమయంలో ఇక్కడకు వస్తున్నారని ఊహించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ప్రవేశించగానే “ఇక్కడున్న ఇతరులను బయటకు పంపండి” అని అన్నారు. “ఇక్కడ పరాయి వారెవరూ లేరు. నా ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “నాకు హిజ్రత్ చేసే (వలసవెళ్ళే) అనుమతి లభించింది” అని సెలవిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). “నాకు కూడా మీతో పాటు వలస వెళ్ళే అనుమతి ఉందా?” అని ప్రశ్నించారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె అస్మా (రదియల్లాహు అన్హ) ప్రయాణ ఏర్పాట్లు చేశారు. భోజనం కట్టారు, తోలుసంచిలో నీళ్ళు నింపారు. చీకటి పడగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెంట బెట్టుకొని ఎవరికీ తెలీకుండా ఒంటెలపై బయలుదేరి నూర్ గుహ వద్దకు చేరుకున్నారు. వారిద్దరూ మూడు రోజులు ఆ కొండ గుహలోనే గడిపారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎక్కడున్నారో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంటి వారికి తప్ప మరెవరికీ తెలియదు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమారులు అబ్దుల్లాహ్ సాయంత్రం కొండ గుహకు చేరుకొని రాత్రి అక్కడే గడిపేవారు. ఉదయం పూట మక్కా చేరుకొని ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి ఏమంటున్నారో వినేవారు. ఈ రహస్యం ఎరిగిన ఇంకో వ్యక్తి పూర్వం ఓ బానిస. అతని పేరు ఆమిర్ బిన్ ఫహీరహ్. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయన్ని కొని విముక్తి కలిగించారు. పగలంతా ఆయన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఒంటెను మేపేవారు. రాత్రి పూట ఎవరికీ కనబడకుండా దాన్ని గుహ ద్వారం వద్ద తీసుకొచ్చి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)కు దాని పాలు త్రాగించేవారు. తెల్లవారక ముందే దాన్ని బహు దూరంగా తోలుకెళ్ళేవారు.

ఖురైషులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు బద్ద విరోధులైపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కా నుండి సురక్షితంగా బయటపడటం వారు సహించలేకపోయారు. అందువల్ల వారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదకడానికి తమ మనుషుల్ని హుటాహుటిన నలువైపులా పంపారు. స్వయంగా అబూ జహల్ మరియు ఇతర ఖురైషీ నాయకులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను వెదుకుతూ అటూ ఇటూ తిరిగారు. ఓ సారి అయితే వీరు నూర్ గుహ వద్దకు రానే వచ్చారు. కాని వారు ఎలాంటి ఏమరుపాటుకు గురయ్యారంటే బయటినుండే వెళ్ళిపోయారు. వారి అడుగుల చప్పుడు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఎంతో కలవరం చెందారు. కానీ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధైర్యంతో ఇలా అన్నారు: “భయపడకండి. అల్లాహ్ మనతో ఉన్నాడు.”

నాలుగో రోజు గుహనుండి బయటకు వచ్చి ఒంటెలపై ప్రయాణం సాగించారు. ఇలా మధ్యాహ్నం వరకు ప్రయాణించారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తి మీదికొచ్చాక విశ్రాంతి కొరకు ఆగారు. ఆ ఎడారిలో చెట్టు ఎక్కడుంటుంది? ఓ రాతి కనుమ అంచున నీడ కనిపించింది. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నీడ ఉన్న చోటును శుభ్రపరిచారు. అక్కడ తోలు దుప్పటి పరచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో “ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను కాపలా కాస్తాను” అని అభ్యర్థించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిద్రపోయారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నేలను శుభ్రపరచసాగారు. కాని శత్రుభయం ఆయన్ని వెంటాడసాగింది. ఖురైషులు ఎక్కడ వెంటాడుతున్నారో అని నలువైపులా చూడసాగారు. ఇంతలో ఓ గొర్రెల కాపరి గొర్రెలను తోలుకు వస్తూ కనిపించాడు. అతను దగ్గరి కొచ్చాక పాలున్నాయా అని అడిగారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అతను ఔనన్నాడు. మేక పొదుగు శుభ్రపరచి ఓ గిన్నెలో పాలు పితికాడు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తోలు సంచిలోని నీళ్ళు అందులో కాస్త కలిపారు. అంతలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మేల్కొన్నారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) పాలు త్రాగి ‘ఇక వెళదామా!’ అని అడిగారు, ‘కాస్సేపట్లో బయలుదేరదాం’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). సూర్య తాపం తగ్గాక వారిద్దరూ తమ ప్రయాణం కొనసాగించారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పట్టిచ్చిన వారికి ఖురైషులు బహుమతి ప్రకటించారు. గుర్రాలపై, ఒంటెలపై వెళ్ళి చాలా మంది దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను వెదక సాగారు. తమ తెగలో అత్యంత పరాక్రమశాలిగా పేరు పొందిన సురఖా అనే వ్యక్తి కొందరు వ్యక్తులు తీరంవెంబడి వెళ్ళడం గమనించాడు. వారే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన మిత్రులు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)లు అయి ఉంటారని భావించాడు. వెంటనే సాయుధుడై గుర్రంపై స్వారీ అయ్యాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరికి చేరుకోగానే గుర్రం కాళ్లు రెండూ నేలలోకి దిగబడిపోయాయి. సురాఖా క్రింద పడిపోయాడు. మళ్ళీ గుర్రంపై ఎక్కి ఈటెను గురిపెట్టి వారిని వెంబడించసాగాడు. కాని గుర్రం కాళ్ళు మళ్లీ భూమిలో కూరుకుపోయాయి. ఇలాంటి పుణ్యాత్ములను బంధించే ప్రయత్నం చేస్తున్నందుకే తనకీ శాస్త్రి జరుగుతోందని తలిచాడు. వెంటనే దీనంగా క్షమాపణ వేడుకొని వెనుతిరిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని వెదుకుతూ వస్తున్న కొందరు దారిలో అతన్ని కలిస్తే వారితో “మీరు ఇటువైపు ఎందుకు వెళుతున్నారు? నేను ఇప్పటి దాకా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను వెదికాను. బహుశా వారు మరో వైపు వెళ్ళి ఉంటారు. మదీనా వైపు మాత్రం పోలేదు” అని అన్నాడు.

ఇటు మదీనాలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. పెందలాడే ప్రజలు పట్టణం బయటికొచ్చి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) కోసం ఎదురుచూసి, ఎండ తీవ్రయమ్యాక వెనుతిరిగేవారు. ఓ రోజు ఇలాగే చాలా సేపు ఎదురు చూసి వెనుతిరుగుతున్న సమయంలో ఒకతను దూరం నుంచే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి “ఎవరికోసం మీరు నిరీక్షిస్తున్నారో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వస్తున్నారు” అని అరిచాడు. ఇది విని అందరూ ఆగిపోయారు. క్షణాల్లో ఈ విషయం అందరికీ తెలిసి పోయింది. తహతహ లాడుతూ ప్రజలందరూ తమ ఇండ్ల నుండి బయటికొచ్చారు.

అప్పటికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వయస్సు 49 సంవత్సరాల 6 నెలలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సులో ఆయన కన్నా రెండున్నర సంవత్సరాలు పెద్దవారు, అంటే అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వయస్సు 52 సంవత్సరాలు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గడ్డం, తలవెంట్రుకలు నల్లగా ఉండేవి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం, తల వెంట్రుకలు అప్పటికే చాలా వరకు నెరసిపోయాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపార నిమిత్తం మదీనా వస్తూ పోతూ ఉండటం వల్ల ప్రజలు ఆయన్ని సునాయాసంగా గుర్తుపట్టారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటి బయటకు చాలా తక్కువగా వెళ్ళేవారు, అందువల్ల ప్రజలు ఆయన్ని గుర్తు పట్టలేక పోయారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో రావడం చూసి అందరు ఆయనే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అయి ఉంటారని ఊహించారు. మరికొందరు సందిగ్ధంలో పడిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖారవిందంపై పడుతున్న ఎండకు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నీడ పట్టడానికి ప్రయత్నించినప్పుడు అందరి అనుమానాలు దూరమైపోయాయి.

మదీనా నుండి మూడు మైళ్ళ దూరంలో ఖుబా అనే ప్రాంతం ‘ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడే పధ్నాలుగు రోజులు ఆగారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓ మస్జిదుకు పునాది వేసి పదిహేనో రోజు అక్కడి నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు. తమ ఇల్లూ వాకిలి వదిలి మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన వారిని ‘ముహాజిరీన్‘ అని అంటారు. అలాగే మదీనాలో వారిని ఆదుకొన్న వారిని ‘అన్సార్లు‘ గా వ్యవహరిస్తారు. అన్సార్లు అంటే సహాయపడిన వారు అని అర్థం. ముహాజరుల వద్ద తలదాచుకునేందుకు చోటులేదు, కొందరికైతే అవిశ్వాసులు ఏమీ తెచ్చుకోనివ్వలేదు. మదీనా చేరాక దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముహాజిర్లను, అన్సార్లను సమావేశపరచి వారిలో ఇద్దరిని అనగా ఓ అన్సార్ ను, ఓ ముహాజిర్ ను పిలిచి “ఈ రోజు నుండి మీరిద్దరూ సోదరులు” అని అనసాగారు. అన్సారులు ప్రదర్శించిన సోదర భావాన్ని అనుబంధాన్ని సొంత సోదరులు కూడా చూపలేరు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఖారిజా బిన్ జైద్ అన్సారి గారిని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సోదరునిగా చేశారు. ఆయన మదీనాలోని సుఖ్ అనే పేటలో నివసించేవారు. మొదట హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అక్కడే ఉండసాగారు. భార్యాపిల్లలను పిలుచుకున్నారు. వారు మదీనా వచ్చినప్పుడు వారి దగ్గర ఐదువేల దిర్హమ్ లు ఉండేవి. ఆ డబ్బుతో ఆయన మదీనాలో వ్యాపారం మొదలెట్టారు. అల్లాహ్ ఆయన వర్తకంలో సమృద్ధి నొసగాడు. ఆయన మరియు ఆయన వంశం వారు నిశ్చింతగా జీవితాన్ని గడపసాగారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనాలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఏడు నెలలు ఉన్నారు. ఆ ఇంటికి దగ్గరలోనే భూమి కొని మస్జిదు నిర్మించారు. వలసపోయి వచ్చిన అనుచరుల (సహాబాల) ఇండ్లు చాలావరకు ఆ మస్జిద్కు చుట్టు ప్రక్కల్లోనే నిర్మించబడ్డాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయాన మస్జిద్కు ఆనుకుని ఉన్న ఏడు కుటీరాలలో ఉండేవారు. పొరుగునే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ఇల్లుండేది. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సుఖ్ లోని నివాసంలోనే ఎక్కువగా ఉండేవారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తర్వాత పూర్తిగా ఈ నివాసానికి తరలి వచ్చేశారు.

మస్జిద్ మరియు దాని ఇరు ప్రక్కల గల ఇళ్ళు పచ్చి ఇటుకతో నిర్మితమైనవి. ఖర్జూరపు బొద్దులు, ఆకులతో నిర్మితమైన కప్పు. ఆ కప్పు ఎత్తు చాలా తక్కువ. నిలబడి చేయి చాపితే కప్పు తగిలేది.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తల్లిదండ్రులు అప్పటికి ముస్లిములు (విశ్వాసులు) కాలేదు. అందువల్ల వారు మక్కాలోనే ఉండిపోయారు. పెద్ద కుమారుడు అబ్దుర్రహ్మాన్ మరియు ఆయన తల్లి కూడా ఇస్లాం స్వీకరించకపోవడం వల్ల మక్కాలోనే ఉండిపోయారు. కాని రెండవ కుమారులైన అబ్దుల్లాహ్ మరియు ఇద్దరు పుత్రికలు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). హజ్రత్ ఆయిషా(రదియల్లాహు అన్హ) ఇస్లాం స్వీకరించి మదీనా వచ్చేశారు.

మదీనాలో స్థిరపడుతుండగానే ఖురైషులతో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ముందు చిన్న చిన్న పోరాటాలు, ఆ తరువాత పెద్ద యుద్ధాలు అనేకం జరిగాయి. ఆ యుద్ధాలలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కూడా పాల్గొన్నారు. మొదటి యుద్ధం ఎలా జరిగిందంటే మక్కా సర్దారులలో ఒకడైన అబూ సుఫ్యాన్ సిరియా నుండి వర్తక సామగ్రి తీసుకొని వస్తున్నాడని విశ్వాసులకు సమాచారం అందింది. వారు అతణ్ణి ఆపడానికి ప్రయత్నించారు. సహాయం కోసం అబూ సుఫ్యాన్ తన దూతను మక్కాకు పంపాడు. సమాచారం అందగానే ఖురైషులు వెయ్యిమంది సైనికులను మదీనాపై దండయాత్రకై పంపారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా మూడు వందల పదమూడు మంది యోధులను వెంటబెట్టుకొని మదీనా నుండి బయలుదేరారు. మదీనా నుండి కాస్త దూరంలో బద్ర్ అనే ఓ చిన్న పల్లెటూరు ఉంది. రెండు సేనలూ అక్కడ ముఖాముఖి అయ్యాయి.

మదీనా నుండి బయలుదేరే ముందు దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులందరినీ సమాలోచన కొరకు ఒకచోట సమావేశపరచారు. అందరి కంటే ముందు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉద్వేగంతో ఉపన్యసించారు. దాని తరువాత అన్సారులలో నుండి సాద్ బిన్ ముఆజ్ లేచి “అల్లాహ్ సాక్షి! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశిస్తే మేము సముద్రంలో దూకడానికయినా సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. ముస్లిములు (విశ్వాసులు) బద్ర్ వైపు బయలుదేరారు. పూర్తి సైన్యంలో రెండే రెండు గుర్రాలు. ఎవరి వద్దనూ సరైన ఆయుధాలు లేవు. తుప్పుపట్టిన ఖడ్గాలు, పాతబడిన ఒరలు. ప్రవక్త ప్రియసహచరులు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూర్చోడానికి రణభూమిలోని ఓ మూలన పందిరి వేశారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కాపలా కాయసాగారు. యుద్ధం ప్రారంభమయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా యుద్ధంలో పాల్గొన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కుడివైపు ఉన్న సైనికుల అధికారిగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉండగా, ఎడమవైపు సైనికులకు హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) అజమాయిషీ చేశారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) కుమారులు అబ్దుర్రహ్మాన్ అప్పటికి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. దైవ తిరస్కారుల సైన్యంతో పాటు యుద్ధానికి వచ్చారు. అబ్దుర్రహ్మాన్ చాలా కాలం తరువాత ఇస్లాం స్వీకరించారు. వారు ఓ రోజు తమ తండ్రిగారితో “బద్ర్ యుద్ధంలో మీరు ఓ సారి నా ఖడ్గం క్రిందికి వచ్చారు, కాని నేను మీపై ఖడ్గం ఝుళిపించలేదు” అని అన్నారు. దానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) – “కాని నీవే గనక నా ఖడ్గం క్రిందికి వచ్చి ఉంటే మటుకు నేను నిన్ను విడిచి పెట్టేవాడ్ని కాను” అని అన్నారు. వాస్తవానికి బద్ర్ యుద్ధం ధర్మానికి- అధర్మానికీ మధ్య జరిగిన కీలకమయిన పోరు. కొడుకు తండ్రి ముందు ఖడ్గం తీసుకొని నిలబడ్డాడు, సోదరులు ఒకరికి విరుద్ధంగా మరొకరు పోరాడసాగారు. అల్లాహ్ కృప వల్ల విశ్వాసులకు విజయం లభించింది. ఇస్లాంకు బద్ద విరోధి అయిన అబూ జహల్ తో సహా అవిశ్వాసుల అనేక మంది నాయకులు ఈ యుద్ధంలో మరణించారు.

బద్ర్ యుద్ధానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఖురైషులు మరుసటి సంవత్సరమే మూడు వేల మంది సైనికులను వెంట బెట్టుకొని మదీనా పై దండెత్తి వచ్చారు. మదీనా దగ్గర ఉహద్ అనే ఓ పర్వతం ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏడు వందల మంది ముస్లిం యోధులను వెంటబెట్టుకొని అవిశ్వాసులను ఆ పర్వతం వద్దనే ప్రతిఘటించారు. ఉహద్ పర్వతం ముస్లిం సైనిక దళానికి వెనుక ఉంది. అవిశ్వాసులు వెనుక నుండి దాడి చేయకుండా ఉండేందుకు యాభై మంది విలుకాండ్రులను పర్వతపు కనుమపై నియమించటం జరిగింది. ఈ యుద్ధం ఆ పర్వతం పేరుతోనే ‘ఉహద్ యుద్ధం’ గా ప్రసిద్ధి చెందింది.

మొదట్లో ఉహద్ యుద్ధంలో కూడా విశ్వాసులదే పై చేయి అయింది. అవిశ్వాసులు పరాజయం పాలవసాగారు. కాని పర్వతపు లోయ వద్ద మొహరించబడిన విలకాండ్రు పెద్ద పొరపాటు చేశారు. ఖురైషులను వెంబడించడానికి వారు తమ స్థానాల్ని వదిలారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శత్రుసైనికుల జట్టు అటు వైపు నుంచి మెరుపు దాడి చేసింది. పరాక్రమశాలి అయిన దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చిన్నాన హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ఈ పోరాటంలో అబిసీనియా బానిస చేతిలో అమరగతి నొందారు. స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కూడా గాయపడ్డారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ మధ్య కనిపించకపోవడం వల్ల విశ్వాసుల నమ్మకం సడలింది. ఇలాంటి సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అందరికన్నా ముందు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో హాజరయ్యారు. ఆ తరువాత ఇతర అనుచరులు కూడా హాజరయ్యారు. విశ్వాసులు పంక్తులు సరిచేసుకొని యుద్ధానికి మళ్ళీ తయారవసాగారు. కాని అవిశ్వాసులకు మరోసారి విశ్వాసుల్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది. వారు ఆ కాస్త విజయానికే తృప్తి చెంది వెనుదిరిగారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పెద్దకుమారులైన అబ్దుర్రహ్మాన్ విశ్వాసులకు వ్యతిరేకంగా ఈ పోరాటంలో కూడా పాల్గొన్నారు. రణరంగంలో నాకు వ్యతిరేకంగా ఎవరొస్తారని ఆయన అరచినప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖడ్గం చేతబూని బయలుదేరారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన్ని ఆపారు.

ఉహద్ తర్వాత సుప్రసిద్ధ కందక యుద్ధం జరిగింది. ఖురైషులు పదివేల మంది సైనికులతో మదీనాపై యుద్ధానికి వచ్చారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మదీనా చుట్టూ గోతి తవ్వించారు. దీన్నే కందకం లేక అగడ్త అని అంటారు. అందుకే ఈ యుద్ధాన్ని కందక యుద్ధం అంటారు. శత్రువులు నెల రోజులపాటు మదీనాను ముట్టడించి ఉన్నారు. అడపాదడపా దాడులు కూడా చేశారు. కాని ప్రతి సారీ ఓటమి చవిచూశారు. ఈ పోరాటంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఓ సైనిక దళాన్ని వెంటబెట్టుకొని కందకాన్ని రక్షించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నియమించిన స్థానంలో ఓ మస్జిద్ నిర్మితమైంది. అది మస్జిదె సిద్దీఖ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ మస్జిదు అక్కడ లేదు.

ఖైబర్ యుద్ధం మరియు హుదైబియా ఒప్పందం సమయంలో కూడా హజ్రత్-అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తోడుగా ఉన్నారు. హుదైబియా ఒప్పందం ఎలా జరిగిందంటే- వలస వెళ్ళిన ఆరో సంవత్సరం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉమ్రా సంకల్పం చేశారు. ఈ ప్రయాణంలో 1400 మంది సహచరులు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు. యుద్ధం చేసే ఆలోచన లేనందువల్ల ఆయుధాలు వెంట బెట్టుకుని వెళ్ల లేదు. ఖురైషులకు ఈ సంగతి తెలియగానే కలవరపడి ప్రతిఘటనకు సిద్ధమవసాగారు. ఇటు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మక్కాకు కొంత దూరాన గల ‘హుదైబియా’ అనే ప్రాంతం వద్ద ఆగిపోయారు. ఖురైషుల తరపు నుంచి మాట్లాడటానికి ఒక దూత వచ్చాడు. అతనెంతో అసభ్యంగా మాట్లాడాడు. ఈ సంభాషణ వల్ల ఎలాంటి ఫలితమూ లేకపోయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దూతగా హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు)ను మక్కా పంపారు. ఖురైషులు ఆయన్ని బంధించారు. అంతలోనే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) అమరగతి నొందారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఈ వార్త విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తీవ్రంగా కలత చెందారు. ఓ తుమ్మ వృక్షం క్రింద కూర్చొని విశ్వాసుల చేత ‘హజ్రత్ ఉస్మాన్’ (రదియల్లాహు అన్హు) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మేము మా ప్రాణాలను అర్పిస్తాం’ అన్న ప్రతిజ్ఞ చేయించారు.

ముస్లింలు దాడికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకొని ఖురైషులు ఈ సంవత్సరం తిరిగి వెళ్ళిపోండి, వచ్చే సంవత్సరం ఉమ్రా చేయండి అన్న సందేశాన్ని పంపించారు. హుదైబియాలో ఇద్దరి మధ్య ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడికలోని షరతులను బట్టి అవిశ్వాసులు తమ పంతంలో నెగ్గారని పైకి స్పష్టమయ్యేది. సంధి షరతులు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను వ్యాకులతకు లోను చేశాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు బిగ్గరగా మాట్లాడారు. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను కలిసి అదే మాట ఆయనతో కూడా అన్నారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మాటను ఎట్టి పరిస్థితిలోనూ జవదాటేవారు కాదు. కించిత్ సందేహం కూడా కలిగేదికాదు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మాటలు విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు. “ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త. అల్లాహ్ ఆయనకు తోడ్పడతాడు. మీరు ఆయనను వెన్నంటి ఉండండి. ఆయన్నే అనుసరించండి. అల్లాహ్ సాక్షి! ఆయన సత్యం పై ఉన్నారు.”

హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) హృదయం విశ్వాసపు గనిలాంటిది. అల్లాహ్ మార్గంలో ఆయన అడుగు ఎన్నడూ తొట్రు పడలేదు. ఇస్లాం వాస్తవికత గురించి ఆయన మనసులో ఎన్నడూ లేశమయినా అనుమానం రాలేదు. ఈ సుగుణం వల్లనే ఆయనకు ‘సిద్దీఖ్‘ అనే బిరుదు లభించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) హుదైబియా ఒప్పందం సమయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముందు హెచ్చుస్వరంతో మాట్లాడారు కాని దాన్ని తలచుకుని జీవితాంతం పశ్చాత్తాపం చెందారు. పరిహారంగా ఉపవాసాలు పాటించారు, దానాలు చేశారు, తరచూ అల్లాహ్ ను దీనంగా ఆ అపరాధానికి గాను క్షమాపణ వేడుకునే వారు. దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మూడు రోజులు హుదైబియాలో ఉన్నారు. నాలుగో రోజు తిరిగి వెళుతున్నప్పుడు దారిలో “మేము నీకు విజయాన్ని ప్రసాదించాము” అన్న ‘వహీ’ అవతరించింది. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇది విజయమా?” అని ప్రశ్నించారు. “ఔను” అని జవాబిచ్చారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). ఇది విని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) సంతృప్తి చెందారు. వాస్తవానికి హుదైబియా ఒప్పందం ఖురైషులు విజయం కాదు, విశ్వాసుల విజయం అని తరువాతి సంఘటనలు నిరూపించాయి. ఎందుకంటే ఈ ఒడంబడిక ద్వారా విశ్వాసులకు, అవిశ్వాసులకు మధ్య సత్సంబంధాలు, సదవగాహన పెంపొందాయి. దీని మూలంగా ఇస్లాం స్వీకరించడానికి అప్పటి వరకూ సంకోచిస్తున్న అనేక మంది ఇస్లాం స్వీకరించారు.

హుదైబియా నుండి తిరిగొచ్చాక యూదుల బెడదను వదిలించుకునే నిమిత్తం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఖైబర్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అనేక యూదుల కోటలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటీ ముస్లింల వశమైనాయి. మరుసటి సంవత్సరం ఖురైషులు హుదైబియా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పదివేల మంది సైనికులతో మక్కా వైపుకు వచ్చారు. ఖురైషులకు వారిని ఎదుర్కొనే ధైర్యం లేకపోయింది. శరణు కోరగా అందరినీ క్షమించారు కారుణ్యమూర్తి (సల్లల్లాహు అలైహి వసల్లం). హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తన తండ్రి అబూ ఖుహాఫాను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమక్షంలో తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన తండ్రి గారి వయసు 90 సంవత్సరాలు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)తో “పెద్ద మనిషిని ఎందుకు కష్టపెట్టావు? ఆయన్ని ఇంటి వద్దనే ఉంచితే నేనే స్వయంగా వచ్చి కలిసే వాడిని” అని అన్నారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఓ దైవప్రవక్తా! ఆయనే మీ వద్దకు రావాలి” అని అన్నారు. అబూ ఖుహాఫా సద్వచనం (కలిమా) పలికి విశ్వాసులైపోయారు.

మక్కా విజయం తరువాత ఖురైషుల పొగరు అణగిపోయింది. కాని కొన్ని ఇతర తెగలు కయ్యానికి సిద్ధంగా ఉన్నాయి. హునైన్ లోయలో వారితో తలపడడం జరిగింది. విశ్వాసుల సైన్యంలో మక్కా వాసులు కూడా చేరారు. శత్రువుల విలుకాండ్రు వదిలిన బాణాలకు వీరు (మక్కా వాసులు) పరుగెత్తసాగారు. వీరు పరుగెత్తడం చూసి సైన్యంలోని మిగతావారు కలవరం చెందారు. ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు), హజ్రత్ అలీ (రదియల్లాహు అన్హు) మరియు ఇతర సన్నిహిత సహచరులు (సహాబా) తప్ప అందరూ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను విడిచి పారిపోయారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కుడివైపు తిరిగి “ఓ అన్సారులారా!” అని పిలిచారు. “మేము సిద్ధంగా ఉన్నాము” అని జవాబు వచ్చింది. తరువాత ఎడమవైపు తిరిగి పిలిచారు. అటువైపు నుండి కూడా మేమూ సిద్ధమే” అనే జవాబు వచ్చింది. ఇలా విశ్వాసులందరూ శత్రువులపై ఒక్కసారిగా విరుచుకు పడగానే వారు ఓటమి పాలయ్యారు.

ఆ రోజుల్లో ఇతర రాజ్యాలు కూడా ముస్లిములతో కయ్యానికి కాలుదువ్వాయి. క్రైస్తవుల ఆధీనంలో గల సిరియా వాటిల్లో అందరికన్నా ముందు ఉండేది. మక్కా విజయానికి పూర్వం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) క్రైస్తవులను ఎదిరించడానికి సైన్యాన్ని పంపారు. ఈ చిన్న పాటి సైన్యం లక్ష మందితో కూడిన క్రైస్తవుల భారీ సైన్యంతో మువత్తా అనే ప్రదేశంలో తలపడింది. అందరి కన్నా ముందు ఇస్లాం స్వీకరించిన వారిలో ఒకరైన జైద్ బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు), దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నన కుమారులైన జాఫర్ తయార్ (రదియల్లాహు అన్హు) లాంటి సహచరులు (సహాబా) ఈ పోరాటంలో అమరగతి నొందారు. మక్కా విజయం తరువాత క్రైస్తవులు మదీనాపై మళ్ళీ దాడి చేయజూస్తున్నారని తెలిసింది. వారిని మదీనా దాకా రానీయటం ఉచితంకాదని తలచి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యుద్ధ సన్నాహాలు మొదలెట్టారు. కాని ఆ సంవత్సరం అరేబియాలో దుర్భిక్షం సంభవించింది. విశ్వాసులందరూ తమ తమ స్థోమతకు తగ్గట్టుగా ఒంటెలు, గుర్రాలు, నగదును తెచ్చి ఇచ్చారు. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ నలభై వేల దిర్హం లు సమర్పించారు. హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) వంద గుర్రాలు, తొమ్మిది వందల ఒంటెలు, ఒక వెయ్యి దీనార్లు సమర్పించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) తన వంతు సామగ్రి తీసుకు వచ్చినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనతో “ఉమర్ ! భార్యా పిల్లల కోసం ఏమి ఉంచావు?” అని అడిగారు. దానికి హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) “ఇంట్లో ఉన్న దాంట్లో నుంచి సగం తీసుకువచ్చాను” అని జవాబిచ్చారు. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇంట్లో ఉన్నదంతా తీసుకు వచ్చేశారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అబూ బకర్! భార్యా పిల్లల కోసం ఏం వదలిపెట్టావు?” అని అడిగారు. “అల్లాహ్ మరియు దైవప్రవక్తను” అని జవాబిచ్చారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇదీ ఈ ‘సిద్దీఖ్’ విశిష్ఠత!

ఆ సైనిక దళంలో ముఫ్ఫైవేల మంది సైనికులు ఉన్నారు. విశ్వాసులు అంతకు ముందెన్నడూ అంత పెద్ద సైనిక దళాన్ని తయారు చేయలేదు. సైనిక దళం ఏర్పాట్లన్నీ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి అప్పగించడం జరిగింది. ఆ సైన్యానికి సేనాధిపతి స్వయంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం). సిరియా పొలిమేరల్లో “తబూక్” అనే పురము ఉంది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అక్కడి దాకా వెళ్ళి తిరిగి వచ్చేశారు. క్రైస్తవులు పోరాటానికి రాలేదు. తబూక్ నుండి తిరగొచ్చాక హజ్ సమయం సమీపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కు వెళ్ళలేదు కాని మూడు వందల మందితో కూడిన ఓ బృందాన్ని మక్కాకు పంపారు. ఆ హజ్ యాత్రీకుల సమూహానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సారథిగా నియమించ బడ్డారు. మరుసటి సంవత్సరం (అనగా హిజ్రత్ చేసిన 10వ సంవత్సరం) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా హజ్ కొరకు వెళ్ళారు. ఇది “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్)గా ప్రసిద్ధి చెందింది. ఇది మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి చివరి హజ్. ఈ ప్రయాణంలో కూడా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెంట ఉన్నారు.

అంతిమ హజ్ యాత్ర నుండి తిరిగొచ్చాక అంటే హిజ్రత్ చేసిన పదకొండవ సంవత్సరం సఫర్ మాసంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అస్వస్థతకు లోనయ్యారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి కుమార్తె హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సతీమణి. వ్యాధిగ్రస్తులైన కాలంలో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి కుటీరంలో ఉండేవారు. మొదట్లో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) గారే నమాజ్ చేయించేవారు. కాని జబ్బు పెరిగాక హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు)ను నమాజ్ చేయించమని అన్నారు. ఆ రోజు నుంచి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. ఓ రోజు జబ్బు కాస్త నయమనిపిస్తే సహచరుల సహాయంతో మస్జిదుకు వచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నమాజ్ చేయించసాగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన దగ్గర కూర్చున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వెనక్కి జరగబోయారు. కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జరగవద్దని సైగ చేశారు.

ఓ రోజు ముస్లింలు ఉదయం పూట నమాజు కోసం నిలబడుతుండగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి గది తెర లేవడం కనిపించింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా నమాజు చేయించటానికి వస్తారేమో అని భావించి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) తన స్థానం నుండి జరిగారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)ను, తన స్థానంలో వెళ్ళి నమాజు చేయించమని సైగ చేశారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) నమాజు మొదలెట్టగానే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తెర దించివేశారు. ఆ రోజు సాయంత్రానికి కాస్త ముందు ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) అంతిమ శ్వాస వదిలారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సుఖ్ (ఓ ప్రాంతం) లో కూడా ఓ ఇల్లు ఉండేది. కొద్ది సేపటి కోసం ఆ రోజు ఆయన అక్కడి కెళ్ళారు. తిరిగొచ్చాక మస్జిద్ నుండి నేరుగా హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరాని కెళ్ళారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) భౌతికకాయంపై దుప్పటి కప్పబడి ఉంది. దాన్ని జరిపి ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ముఖాన్ని చుంబించారు. తరువాత దు:ఖిస్తూ “నా తల్లిదండ్రుల్ని మీకు అర్పింతుగాక! మీ జీవితం మరియు మరణం రెండూ పవిత్రమైనవి. మీకు రావలసిన మృత్యువు వచ్చేసింది. ఇక మీకు ఎన్నడూ మరణం అన్నది ఉండదు” అని అన్నారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణవార్త విని ముస్లిములందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. సర్వత్రా కాస్సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారంటే సహచరులకు (సహాబా) నమ్మకం కలగలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని ఎవరయినా అంటే వాడి తల నరికేస్తానని చెబుతూ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) చేతిలో ఖడ్గం పట్టుకొని ఆవేశంతో సంచరించ సాగారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కుటీరం నుండి మస్జిదులోకి ప్రవేశించినప్పుడు హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ప్రమాణం చేసి ప్రజలతో ఇలా అంటున్నారు: “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించలేదు. తొందర్లోనే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) లేచి కపట విశ్వాసులను శిక్షిస్తారు”. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అయన్నుద్దేశించి ‘కూర్చొండి’ అని అన్నారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)ను చుట్టుముట్టి ఉన్న ప్రజలందరూ హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వద్దకు చేరుకున్నారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వారితో ఇలా అన్నారు: “ప్రజలారా! మీరు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ను పూజించేవారైతే ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణించారని తెలుసుకోండి (ఇన్నా లిల్లాహివ ఇన్నా ఇలైహి రాజిపూన్). “అల్లాహ్ ను ఆరాధించేవారైతే అల్లాహ్ జీవించి ఉన్నాడని తెలుసుకోండి. అల్లాహ్ ఎన్నడూ మరణించడు.” తరువాత, ‘ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) దైవప్రవక్త మాత్రమే. ఆయన కన్నా ముందు ఎందరో ప్రవక్తలు గతించారు’ అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు. ఇది విన్న తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘మరణం పట్ల హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు)కు విశ్వాసం కలిగింది. కాని ఈ ఆఘాతానికి తట్టుకోలేక మూర్ఛపోయి క్రిందపడి పోయారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణం తరువాత అన్సారులందరూ ఓ ప్రదేశంలో గుమికూడి-విశ్వాసులు నాయకునిగా ఎవరిని ఎన్నుకోవాలి? అనే విషయంపై చర్చించుకోవటం మొదలెట్టారు? ఈ విషయం తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మరియు మరో ప్రముఖులైన సహాబి (ప్రవక్త అనుచరులు) హజ్రత్ ఉబైదా బిన్ జర్రాహ్ (రదియల్లాహు అన్హు)లను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ముస్లిముల్లో నాయకత్వ సమస్యపై చీలిక ఏర్పడే ప్రమాదం కానవచ్చింది. కాని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఈ సమస్యను చాలా తెలివిగా పరిష్కరిస్తూ ‘ఉమర్ ను గానీ, అబూ ఉబైదాను గాని తమ నాయకునిగా ఎన్నుకోండి’ అని సూచించారు. కాని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ముందుకొచ్చి “మేము మిమ్మల్నే మా నాయకునిగా ఎన్నుకుంటాం” అని ప్రమాణం చేశారు. తరువాత ఇతరులు కూడా ముందుకు వచ్చి ప్రమాణం చేశారు. ఈ విధంగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) విశ్వాసుల నాయకునిగా అంటే ఖలీఫాగా ఎన్నుకోబడ్డారు.

సుమారు 61 సంవత్సరాల వయస్సులో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఖలీఫా (ప్రతినిధి)గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన బక్క పలుచగా ఉండేవారు. తెలుపు రంగు, వంగిన నడుము, కళ్లు కాస్త లోపలికిపోయి ఉండేవి. వంకీలు తిరిగిన జుత్తు. తల ముందలి భాగంలో వెంట్రుకలు ఉండేవి కావు. మదీనా వచ్చినప్పుడే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి గడ్డం పాక్షికంగా నెరసిపోయింది. కాని మదీనా వచ్చాక ఆయన నెరసిన వెంట్రుకలకు రంగు వేయడం మొదలెట్టారు. దాని మూలంగా ఆయన గడ్డం ఎర్రగా మారింది. స్వతహాగా ఆయన మితభాషి. ఏది చెప్పినా చాలా ఆలోచించి చెప్పేవారు. చాలా మృదు స్వభావి. ఇస్లాం స్వీకరించక పూర్వం కూడా ఆయన దానశీలిగా, ఉపకారిగా, దైవ పరాయణులుగా ఖ్యాతి చెందారు.

ఖిలాఫత్ బాధ్యతలకు పూర్వం హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) వ్యాపారం చేసేవారు. దుప్పట్లను భుజాలపై మోసుకెళ్ళి బజారులో అమ్మేవారు. ఖలీఫా అయ్యాక కూడా ఇదే పద్ధతిని పాటించేవారు. కాని పరిపాలనా బాధ్యతల వల్ల వ్యాపారం చేయడం కష్టతరం అవగా సహాబా (అనుచరులు) ఆయన కోసం ఉపకారవేతనాన్ని నిర్ణయించారు. ఆ ఉపకార వేతనం కూడా చాలా కొద్దిగా ఉండేది. తన సంసారం నడపగలిగేటంతటి కొద్ది సొమ్ము మాత్రమే ఆయనకు లభించేది. ఓ సారి ఆయన సతీమణి మిఠాయి తినిపించమని కోరారు. తన వద్ద ఏమీ లేదని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). అప్పుడు ఆయన భార్య రోజువారి ఖర్చులో నుంచి కొంత సొమ్ము కూడబెట్టడం మొదలెట్టారు. కాస్త పెద్ద మొత్తం జమ అయ్యాక మిఠాయి తీసుకు రమ్మని ఆయనకిచ్చారు. “నా అవసరానికి మించిన వేతనం నాకు లభిస్తుందని దీని ద్వారా వెల్లడవుతుంది” అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). కూడబెట్టబడిన ఆ ధనాన్ని ప్రభుత్వ నిధిలో జమచేసి తన వేతనాన్ని తగ్గించారు.

ఖలీఫా అవక మునుపు మదీనా సమీపంలో గల సుఖ్ అనే చిన్న ప్రాంతంలో నివసించేవారు. సుఖ్ లోని ఆయన ఇల్లు ఒంటె రోమాలు కంబళ్ళతో నిర్మించబడిన ఓ చిన్న గుడారం ఖలీఫా అయ్యాక కూడా ఆరు నెలల దాకా ఆ ఇంట్లోనే నివసించారు. ఆ తరువాత మస్జిద్ నబవీ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదు) లోని ఓ గదిలోకి వచ్చేశారు.

మానవత్వం, పరోపకారగుణం ఆయనలో నిండి ఉండేవి. వితంతువుల, అనాథల బాగోగులు చూసేవారు. తన పనుల్ని పక్కనబెట్టి రోగులను పరామర్శించడానికి వెళ్ళేవారు. రేయింబవళ్ళు వారి సేవలో నిమగ్నులయిపోయేవారు. సుఖ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లలు ఆయన్ని ‘బాబా బాబా’ అని పిలిచేవారు. బాలికలు మేకల పాలు పితకమంటే పాలు పితికేవారు. అవసరమైతే వారి మేకలను మేపుకొచ్చేవారు.

ఏ మాట అయినా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూ ఉండకుండా చూసుకునేవారు. ఏ నిర్ణయమైనా ఖుర్ఆన్ ప్రకారమే చేసే వారు. ఏ విషయం గురించి అయినా ఖుర్ఆన్లో స్పష్టమైన ఆదేశం లేని పక్షంలో ఆ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ఆదేశించారు? అని ప్రజలను అడిగేవారు. ఏదేని విషయంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశం కూడా లభించని పక్షంలో సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సమావేశపరచి వారితో సంప్రదించి వారిచ్చిన సలహాపై అమలుచేసేవారు. ఆయన ఆదేశించినదేదీ ఖుర్ఆన్, హదీసులకు విరుద్ధంగా ఉండేది కాదు. సహాబా (రదియల్లాహు అన్హుమ్)ను సంప్రదించకుండా ఆయన ఏనాడూ తన స్వంత నిర్ణయం గైకొనేవారు కాదు.

చాలా క్లిష్టమయిన పరిస్థితుల్లో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పరిపాలనా బాధ్యతల్ని స్వీకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలోనే సిరియాతో యుద్ధాలు మొదలయ్యాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్ని రోజుల ముందు సిరియాపై దండెత్తడానికి సైన్యాన్ని పంపదలిచారు. ఆ సైనిక దళానికి నవయువకులైన ఉసామా బిన్ జైద్ (రదియల్లాహు అన్హు) గారిని సేనాపతిగా నియమించారు. ఆ సైనిక దళం మదీనా పాలిమేరలు దాటక ముందే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పరమపదించారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి కొన్నాళ్ళ క్రిందటే ఇస్లాం స్వీకరించిన కొన్ని తెగలు ఇస్లాం పట్ల విముఖులయ్యాయనీ, కొన్ని తెగలు జకాత్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని సమాచారం అందింది. అదే సమయంలో రాజ్యాధికారాన్ని కాంక్షించే కొందరు దుర్మార్గులు తమను ప్రవక్తగా ప్రకటించుకుని అనేక తెగలను మార్గభ్రష్టతకు లోను చేయసాగారు. పరిస్థితులు ఈ స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది సహాబా (ప్రవక్త అనుచరులు) “మదీనాపై దాడి జరిగిన పక్షంలో సులువుగా ఎదుర్కొనేందుకుగాను ఉసామా (రదియల్లాహు అన్హు)ను సిరియాకు పంపించకుండా ఉండటం మంచిద”ని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహా ఇచ్చారు. అప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సిరియాపై దండెత్తడానికి పంపదలచిన సైన్యాన్ని నేనెలా ఆపగలను?” అని జవాబిచ్చారు.

ఆ సమయంలో హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు) గారి వయసు 17 సంవత్సరాలు. అందువల్ల కొందరు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో “సరే, సైన్యాన్ని సిరియా పంపదలిస్తే, పంపండి. కాని, ఉసామా (రదియల్లాహు అన్హు)కు బదులు అనుభవజ్ఞులైన వారెవరినైనా సేనాపతిగా నియమించండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మండి పడుతూ “మీరెలాంటి మాట మాట్లాడుతున్నారు? దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేనాపతిగా నియమించిన వ్యక్తిని ఎవరు తీయగలరు?” అని అన్నారు. హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు)లోని విధేయతాభావానికి, రుజువర్తనకు ఇది ఓ ప్రబల తార్కాణం.

ఉసామా (రదియల్లాహు అన్హు) ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఆయన్ని వదిలి పెట్టడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చాలా దూరం వెళ్ళారు. ఉసామా (రదియల్లాహు అన్హు) గుర్రంపై కూర్చుని ఉండగా హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆయనతో పాటు కాలి నడకన వెళ్ళసాగారు. “మీరైనా గుర్రంపై ఎక్కండి లేదా నన్నయినా మీతో పాటు కాలినడకన రానివ్వండి” అని అన్నారు ఉసామా (రదియల్లాహు అన్హు), ‘నేను గుర్రం ఎక్కనూ, నిన్ను గుర్రం నుండి దిగనివ్వను’ అని అన్నారు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు). ఇస్లామీయ (విశ్వాసుల) సైన్యానికి వీడ్కోలు పలుకుతూ హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! కాస్త ఆగండి… నేను మీకు కొన్ని ఉపదేశాలు చేయదలిచాను. వాటిని బాగా అర్థం చేసుకోండి. నమ్మక ద్రోహం చేయకండి. సొమ్మును స్వాహా చేయకండి. విశ్వాస ఘాతుకానికి పాల్పడకండి. యుద్ధంలో శత్రువుల శరీరావయవాలు కోయకండి. వృద్ధులపై, పిల్లలపై, స్త్రీలపై చేయి చేసుకోకండి. ఫలమిచ్చే వృక్షాలను కోయకండి. ప్రపంచాన్ని విడిచి ధ్యానంలో నిమగ్నులయి ఉన్న ఇతర మతస్థుల జోలికి వెళ్ళకండి.”

ఈ సైన్యం సిరియా సరిహద్దుల్లో అనేక దాడులుచేసి విశ్వాసులు పరాక్రమాన్ని క్రైస్తవులను చాటి తిరిగొచ్చింది. కాని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దుల్లో పోరాడుతున్న సమయంలోనే మదీనా సమీపంలో గల ఇస్లాంను (విశ్వాసం) తిరస్కరించిన అనేక తెగలు మదీనాపై దాడి చేశాయి. ఈ తెగల ప్రజలు ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయారు. “మేము నమాజ్ చేస్తాము, రోజా పాటిస్తాము కాని జకాత్ ఇవ్వము” అని మొండికేశారు. ఆ సమయంలో చాలా మంది సహాబా (అనుచరులు) “నజద్ మరియు యమన్ లోని అనేక తెగలు ఇస్లాంను విడిచిపెడుతున్న దృష్ట్యా వారితో కాస్త సడలింపుల వైఖరిని అవలంబించండి” అని హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) గారికి సలహాఇచ్చారు. కాని ఆయన ససేమిరా అన్నారు. “ధర్మంలో హెచ్చుతగ్గులు చేసే అధికారం ఎవరికీ లేదు. వీరు జకాత్ చెల్లించనంత వరకూ నేను వారితో పోరాడుతూనే ఉంటాను. మీరు నాకు తోడ్పడక పోయినా సరే, నేను ఒంటరిగా వీరితో పోరాడుతాను. నాలో ప్రాణం ఉన్నంతవరకూ నేను పోరాడుతూనే ఉంటాను” అని చెప్పి మదీనా నుండి బయలుదేరారు. బదర్ మరియు హునైన్ యుద్ధాలలో పాల్గొన్న ప్రముఖ సహాబా (అనుచరులు) అందరూ ఆయనకు తోడుగా వచ్చారు. రెండు మూడు పెద్ద దాడులు జరిగాయి. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆ తలబిరుసులను ఓడించి ధర్మాన్ని రక్షించారు. తరువాత మదీనా తిరిగొచ్చి పదకొండు మంది సర్దారులకు సైన్యాలనిచ్చి సంక్షోభం గల ప్రాంతాలకు పంపారు. వాస్తవానికి అది ఇస్లాంకు సంక్లిష్ట సమయం. మదీనాలోని సైన్యాన్ని తీసుకొని ఉసామా (రదియల్లాహు అన్హు) సిరియా సరిహద్దువైపు వెళ్ళగా మదీనాలో మిగిలిపోయిన ఆ కొద్ది మంది ముహాజిరులు మరియు అన్సారులతో శత్రువులను ఎదుర్కోవడం చాలా కష్టం. కాని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి ధైర్యం చూడండి- ఆ కొద్ది సైన్యంతోనే ఆయన యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఆ సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) శత్రువుల ఒత్తిడికి తలఒగ్గి వారికి జకాత్ (ఇస్లామీయ ధర్మపు ఓ మూలస్తంభం) నుండి మినహాయింపు ఇస్తే ధర్మంలో ప్రతి రోజు తూట్లు పడుతుండేవి. కొందరు ఉపవాసం పాటించము అని, మరికొందరు తాము నమాజు చేయము అని అనడం ప్రారంభించేవారు. అల్లాహ్ పాటించమని ఆదేశించిన వాటిని నేను ఎలా మినహాయించగలను అని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) సూటిగా అనేవారు. ఆయన గారు కనబరచిన ధైర్యం మరియు పట్టుదల వల్ల తిరుగుబాటు ధోరణులు అణగారిపోయాయి. దీని ద్వారా దైవధర్మంలో ఎలాంటి హెచ్చుతగ్గులకు తావులేదని అందరికీ సుస్పష్టం అయిపోయింది.

అరబ్ తెగలలో బనీ తమీమ్ ఓ సుప్రసిద్ధ తెగ. ఆ తెగ నాయకులు కూడా జకాత్ చెల్లించడానికి నిరాకరించారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సైఫుల్లాహ్ (దైవఖడ్గం) అని బిరుదునిచ్చిన హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) వారిపై దాడికెళ్ళారు. బనీ తమీమ్ వారికి ఇది తెలియగానే భయపడి వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పోరాడటానికి సిద్ధపడిన కొందరు యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు.

అరేబియాకు దక్షిణాన గల యమన్ లో ముసైలిమా అనే వ్యక్తి ఉండేవాడు. వాడు ఓ సరికొత్త ఉపద్రవాన్ని సృష్టించాడు. తాను దైవప్రవక్తనని అతను చెప్పేవాడు. ఎక్కడెక్కడినుంచో అరువు తెచ్చుకున్న కొన్ని వాక్యాలను ప్రజలకు వినిపించి ఇది తనపై అవతరించిన ‘దైవవాణి’ అని అనేవాడు. నిజమైన విశ్వాసులు ఇలాంటి దుర్మార్గుల మాటలకు మోసపోయే వారు కాదు. కాని అప్పుడప్పుడే ఇస్లాం స్వీకరించి ఇంకా ఇస్లాం గురించి అంతగా అవగాహన లేని కొన్ని తెగలు మాత్రం అతని వలలో పడ్డాయి.

వాస్తవానికి ఆ సమయంలో తిరుగుబాటు చేసినవారు అనగా ముసైలిమా మరియు ఇతర బూటకపు ప్రవక్తలను విశ్వసించిన వారు లేదా జకాత్ చెల్లించడానికి నిరాకరించినవారు ఇస్లాం స్వీకరించి కొన్నాళ్ళే అయింది. ఇస్లాం బోధనలు వారి మనస్సుల్లో ఇంకా వేళ్లూనుకోలేదు.

ఆ రోజుల్లో సజాహ్ అనే స్త్రీ కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకుంది. ఆమె తన తెగ ప్రజలను వెంట బెట్టుకొని మదీనాపై దాడికై బయలుదేరింది. దారిలో ముసైలిమా సైన్యంతో యుద్ధం జరిగింది. ముసైలిమా జిత్తుల మారి. యుద్ధంలో సజాహ్ సైన్యాన్ని ఓడించడం కష్టం అని గ్రహించిన వెంటనే ఆమెపై ప్రేమ వల పన్ని ఆమెను పెండ్లాడాడు. ఈ విధంగా ఆమె సైన్యపు చాలా భాగాన్ని తన వైపుకు లాక్కున్నాడు. దీని వల్ల అతని బలం పెరిగిపోయింది. ముస్లిం సైన్యం ఒకానొక ముట్టడిలో అనుకోని విధంగా ముసైలిమా సైన్యం చేతిలో ఓటమిపాలైంది. దాంతో ముసైలిమా మరింతగా పేట్రేగిపోయాడు. అతని వద్ద నలభైవేల మంది సైనికులు పోగయ్యారు.

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరణానికి పూర్వం అస్వద్ అనే ఓ యమన్ సర్దారు తాను ప్రవక్తనని ప్రకటించుకుని మరో వివాదాన్ని సృష్టించాడు. కాని ఓ వ్యక్తి అతణ్ణి హత్య చేశాడు. కొన్నాళ్ళ తర్వాత బనీ అసద్ నాయకుడైన తలైహా పెద్ద ఉపద్రవాన్ని సృష్టించాడు. ఇతను కూడా తాను ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. చాలా మంది అతణ్ణి విశ్వసించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారు హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్(రదియల్లాహు అన్హు)కు సైన్యాన్నిచ్చి తలైహా వద్దకు పంపారు. అతను ఓటమిపాలయ్యాడు. ఏళ్ళ తరబడి అటూ ఇటూ తిరిగాడు. తలదాచుకోవడానికి ఎక్కడా చోటు దొరకకపోవడం చేత చివరికి మదీనా చేరి ఇస్లాం స్వీకరించాడు. ఈ తలైహా బహు పరాక్రమాశాలి. సిరియా మరియు ఈరాన్ యుద్ధాలలో అతను తన పరాక్రమంతో ఇస్లాంకు తోడ్పడ్డాడు.

తలైహాను ఓడించాక హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ ముసైలిమాతో యుద్ధానికి సంకల్పించారు. యమామా అనే ప్రదేశంలో ఉఖబా అనే గ్రామం ఉంది. రెండు సైన్యాలూ అక్కడ ఎదురయ్యాయి. ముసైలిమా వద్ద నలభై వేల మంది సైనికులున్నారు. స్వయంగా అతను మధ్యలో ఉండి పేరుగాంచిన సైనికులను తనకు ఇరువైపుల మోహరించాడు. ఇస్లామీయ సైన్యాన్ని అతని సైన్యాలతో పోలిస్తే ఏవిధంగానూ సరిపోదు. యుద్ధం ప్రారంభంలో ముసైలిమా సైనికుల దాడికి విశ్వాసులు బెదిరిపోయారు. విశ్వాసులు వెనక్కి జరుగుతూ జరుగుతూ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) గుడారం దాకా చేరుకున్నారు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరులైన హజ్రత్ ఖైస్ బిన్ సాబిత్ (రదియల్లాహు అన్హు) మరియు జైద్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) విశ్వాసులను “ఓ విశ్వాసులారా! ఎక్కడికెళ్తున్నారు?” అంటూ రోషం తెప్పించారు. వారు స్వయంగా యుద్ధం చేస్తూ వీరమరణం పొందారు. వారి ధైర్యాన్ని చూసి ముస్లిం సైన్యంలో ఉత్తేజం కలిగింది. వారు ఇరువైపుల నుండి శత్రుసైన్యంపై విరుచుకుపడ్డారు. దీంతో ముసైలిమా సైనిక పంక్తుల్లో కలకలం రేగింది.

ముసైలిమా సైన్యానికి వెనుక వైపు ఓ పెద్ద తోట ఉంది. విశ్వాసులు శత్రు సైన్యాన్ని తరుముకుంటూ ఆ తోట దాకా తీసుకెళ్ళారు. చేసేదేమి లేక ముసైలిమా తన సైన్యాన్ని తోటలోకి తీసుకెళ్ళి తోట తలుపులు మూసేసుకున్నాడు. హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గొప్ప పరాక్రమశాలి. ఆయన సోదరులైన హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) జీవితాంతం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సేవ చేశారు. తత్కారణంగా హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) గారికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో హాజరయ్యే అవకాశం తరచూ లభించేది. అందువల్ల ప్రజలందరూ ఆయన్ని గౌరవించేవారు. ముసైలిమా తోట తలుపుల్ని మూసేసుకోవడంతో హజ్రత్ బరా బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) తనను గోడపైకి ఎక్కించమని తన సహచరులతో అన్నారు. గోడ పైకి చేరుకొని లోపల దూకారు. శత్రుసైన్యం ఓ వైపు బాణాల వర్షం కురిపిస్తున్నా దూసుకుపోయి తలుపులు తెరిచారు. వెంటనే ఇస్లామీయ సైన్యం తోట లోపల ప్రవేశించింది. లోపల భీకర పోరు జరిగింది. ముసైలిమా సైన్యానికి మధ్యలో నిలబడి సైనికులను ఉత్తేజపరచసాగాడు. తన సైన్యం ఓటమి పాలవడం చూసి “ప్రస్తుతం ప్రాణాల్ని రక్షించుకుందాం. తరువాత చూసుకోవచ్చు” అని మనసులో భావించాడు. ఉహద్ యుద్ధంలో దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిన్నాన్న హజ్రత్ హమ్జా (రదియల్లాహు అన్హు) ను హతమార్చిన అబిసీనియా బానిస వహ్షీ ముసైలిమాను వెదకసాగాడు. ముసైలిమా పారిపోయే ప్రయత్నంలో ఉండగానే వహ్షీ అతనిపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ముసైలిమా కథ కంచికి చేరింది.

అతని సహచరులు పరుగెత్తి దగ్గరలోని కోటలలో దాక్కున్నారు. కాని చివరికి దారిలేక ఆయుధాలను పడవేసి ప్రాణాలను కాపాడుకున్నారు.

తిరుగుబాటుదారుల అహంకారం అణచడానికి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) పదకొండు సైనిక జట్లను పంపారు. జకాత్ ఇవ్వడానికి నిరాకరించిన అనేక తెగలకు ఆ సైన్యం బుద్ధి చెప్పింది. తమ తమ ప్రాంతాలలో తమ రాజ్యాన్ని ఏర్పాటు చేయదలుస్తున్న వేర్పాటు వాదుల ప్రయత్నాలను కూడా విఫలం చేశారు. వారిలో అందరికంటే పెద్ద సమూహం ముసైలిమాది, పెద్ద యుద్ధం యమామా యుద్ధం. తమ జీవితాన్ని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సేవలో గడిపిన, దివ్య ఖుర్ఆన్ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) ఈ యుద్ధంలో అమరగతినొందారు.

దివ్యఖుర్ఆన్ దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోనే వ్రాయబడింది. కాని కొన్ని అధ్యాయాలు కాగితంపై, కొన్ని తోలుపై, కొన్ని ఖర్జూరపు ఆకులపై, కొన్ని రాళ్లపై లిఖించబడ్డాయి. దివ్య ఖుర్ఆన్ ను కంఠస్థం చేసిన అనేక మంది ప్రవక్త సహచరులు (సహాబా) రదియల్లాహు అన్హుమ్ – అమరగతినొందడం చూసి హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దివ్యఖుర్ఆన్ ను ఓ చోట వ్రాయించుకున్నారు. ఆ తరువాత పూర్తి ఖుర్ఆన్ కంఠస్థం చేసిన వారిని పిలిపించి వ్రాయించబడిన ఆ ఖుర్ఆన్లోని భాగాలను సరిపోల్చుకుని ఎక్కడా తప్పులు దొర్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

అరేబియాలో కల్లోలం సృష్టించిన సమూహాలను అణచివేసే పని తొమ్మిది, పది నెలల్లో ముగిసింది. తరువాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) రోమ్ మరియు ఈరాన్తో యుద్ధ సంకల్పం చేశారు. ఆ రెండు సామ్రాజ్యాల సరిహద్దులు అరేబియాకు ఆనుకుని ఉండేవి. రోము చాలా పెద్ద సామ్రాజ్యం. అది ఆసియా, ఐరోపా, ఆఫ్రికా లాంటి మూడు ఖండాలలో విస్తరించి ఉండేది. ఆసియాలో సిరియా, పాలస్తీనా, ఆఫ్రికాలో ఈజిప్టుతో పాటు ఉత్తర ఆఫ్రికాలోని పెద్ద ప్రాంతం రోము అధీనంలో ఉండేది. ఈరాన్ కూడా చాలా బలోపేతమైన రాజ్యం. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ఆ రెండు సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. ఓ సారి ఈరానీయులు పెద్దదాడి చేసి సిరియా, పాలస్తీనా ప్రాంతాలను దాటుకుంటూ జెరూసలేం వరకూ చేరుకున్నారు. ప్రతీకారంగా కొన్నేళ్ళ తరువాత రోమనులు ఈరానుపై దాడి చేసి ఇస్ఫహాన్ (జోర్డాన్) ను నాశనం చేసి విజయ దుందుభి మ్రోగిస్తూ వెనుదిరిగారు.

తమ జీవితపు చివరి దశలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చుట్టు ప్రక్కల గల రాజ్యాల రాజులకు ఉత్తరాల ద్వారా ఇస్లాం సందేశాన్ని అందజేశారు. ఈరాన్ రాజు ఖుస్రో పర్వేజ్ రాజ్యాధికారపు అహంకారంలో ఆ ఉత్తరాన్ని చించేసి, మదీనావెళ్ళి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను బంధించి తీసుకు రావలసిందిగా తన గవర్నరును ఆజ్ఞాపించాడు. కాని అల్లాహ్ లీల చూడండి! అటు అతను ఈ అపరాధం చేసిన కొన్నాళ్ళకే ఇటు అతని కొడుకు అధికార దాహంతో తండ్రిని హతమార్చాడు. ఆ తరువాత ఈరానీయులు తమ అంత: కలహాలలో ఇరుక్కుపోయారు. ఇక వారికి అరబ్బులపై దాడి చేసే తీరికే లేకపోయింది. అవకాశం దొరకగానే వారు తప్పకుండా తమపై దాడి చేస్తారని ముస్లిముల మనసులో మెదిలేది. ఇక రోమనులతో యుద్ధం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హయాంలోనే ప్రారంభమయింది. రోమనులు మదీనాపై దండెత్తి వస్తున్నారనే పుకార్లు పదేపదే వినవచ్చేవి. ఆ రోజుల్లో ఈరాన్ రాజు తరఫున హుర్మజ్ అనే వ్యక్తి ఇరాఖ్ ను గవర్నరుగా పాలించేవాడు. ఇతను అరబ్బులకు బద్ద విరోధి. ఇరాఖ్ సరిహద్దుల్లో గల అరబ్బుతెగల పై అతను నిరంతరం దౌర్జన్యం చేసేవాడు. అతనీ గురించి తెలియగానే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఇరాఖ్ పై దాడికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)ను పంపించాలనుకున్నారు. తక్షణం ఇరాఖైపై దాడి చేయాలన్న హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఆదేశం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు)కి యమామాలోనే లభించింది. అప్పటికే ఈరానీయులతో ముస్లింలు అనేక యుద్ధాలు చేసి ఉన్నారు. వాటిలో అన్నిటికంటే పెద్దది ‘సలాసిల్ యుద్ధం‘ అంటే ‘సంకెళ్ళ పోరాటం’ అని అర్థం. ఈ యుద్ధంలో హుర్మజ్ పెద్ద పెద్ద యోధులు గల ఓ సైనిక జట్టును యుద్ధభూమి నుండి పారిపోకుండా సంకెళ్ళతో బంధించాడు. ఈ యుద్ధం నజ్మా అనే ప్రాంతం దగ్గర జరిగింది. ఈరానీయులు ముస్లిముల కంటే చాలా అధికంగా ఉన్నారు. యావత్తు ఈరాన్లో తన శౌర్యపు ముద్ర వేసిన హుర్మజ్ స్వయంగా తన సైన్యానికి నాయకత్వం వహించాడు. వాస్తవానికి అతను ఇరాఖ్ గవర్నర్ అయినప్పటికీ రాజులా కిరీటాన్ని ధరించేవాడు. అతని కిరీటం లక్ష రూపాయల వ్యయంతో తయారయింది. అందులో కళ్ళు మిరుమిట్లు గొలిపే రత్నాలు పొదగబడి ఉండేవి.

రెండు సైన్యాలూ పంక్తులు సరిదిద్దుకుని యుద్ధానికి సిద్ధ మయ్యాయి. అంతలో స్వయంగా హుర్మజ్ గుర్రంపై యుద్ధరంగానికి వచ్చి ప్రాణులను చంపితే ఏం లాభం? ముస్లిముల నాయకుడు నాతో స్వయంగా పోరాడితే యుద్ధ నిర్ణయం జరిగిపోతుంది” అని సవాలు విసిరాడు. అటు నుండి హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) స్వయంగా అతనితో పోరాడటానికి సిద్ధమయ్యారు. కాని హుర్మజ్ మనసులో దురుద్దేశ్యం ఉంది. విశ్వాసులు నాయకునిది పైచేయి అయిన పక్షంలో అతనిపై విరుచుకు పడటానికి కొందరిని అతడు కనబడకుండా దాచి ఉంచాడు. నాయకులిద్దరూ ముఖాముఖి అవగానే హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గంతో హుర్మజ్ పై దాడిచేశారు. ఆయన ఖడ్గం హుర్మజ్ ఇనుప కవచం పై పడి వేరయిపోయింది. ఈసారి హుర్మజ్ హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) పై ఖడ్గం ఝళిపించాడు.

హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఇనుప కవచం తొడగని పక్షంలో ఆ దాడికి ప్రాణాలు కోల్పోయేవారేమో! హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) ఖడ్గాన్ని విసిరేసి హుర్మాజ్ నడుం పట్టి అతణ్ణి పైకెత్తారు. ఇది చూసి దాగి ఉన్న అతని సైనికులు బయటకొచ్చారు. ఇటు నుండి బనీ తమీమ్ యొక్క ప్రసిద్ధ అశ్వరూఢుడయిన ఖాఖా బిన్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) కు మద్దతుగా రంగ ప్రవేశం చేసి ఈరానీ సైనికులను నిలువరించారు. హజ్రత్ ఖాలిద్ (రదియల్లాహు అన్హు) అదను చూసి హుర్మజ్ ను నేలపై వేసి కొట్టారు. అతని శిరస్సును ఖండించి యుద్ధ రంగంలో విసిరేశారు. ఇది చూసి ఈరానీయులు ధైర్యసాహసాలు నీరుగారిపోయాయి. అయినా వారి నాయకులు మాత్రం వారిని ప్రేరేపిస్తూ నగారాలు వాయించుతూ ముస్లింలపై దాడి చేశారు. కొంతసేపు భీకర యుద్ధం జరిగింది. చివరికి ఈరానీయులు పారిపోయారు.

ఇరాఖ్ సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ఇస్లాం స్వీకరించిన ముసన్నా బిన్ హారిస్ పెద్ద ధనికుడు. ఆయన ఈ యుద్ధాల్లో వీరోచితంగా పోరాడాడు. యుద్ధ రంగం నుండి పారిపోతున్న ఈరానీయులను వెంటాడటానికి హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ముసన్నాను పంపారు. హుర్మజ్ కు కుమ్మక్కుగా వస్తున్న ఈరానీ సైనిక దళం ముసన్నాను అడ్డుకుంది. ఈ సమాచారం అందగానే ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని తీసుకొని అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఈరానీయులు అపజయం పాలయ్యారు. విశ్వాసులకు విజయం లభించింది.

ఈ పరాజయ పరంపర గురించి విని ఇరానీ నాయకులు అరబ్బులతో పోరాడటానికి అరబ్బు సైన్యాన్నే పంపాలని తలచారు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. క్రైస్తవ మతాన్ని ఆచరించే కొన్ని అరబ్బు తెగలు ఈరానీయుల పాలనలో ఉండేవి. వారిని సమీకరించి ఓ సైన్యం తయారు చేయబడింది. ఓ ఈరానీ నాయకుడు దానికి సేనాపతిగా నియమించబడ్డాడు. ఆ ప్రాంతపు రెండు నదులు దజ్లా మరియు ఫరాత్ -కలిసే చోట రెండు సైన్యాలూ ముఖాముఖీ అయ్యాయి. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఓ భాగాన్ని స్వయంగా తానే తీసుకొని ముందుకెళ్ళారు. మిగతా రెండు భాగాలకు ముసన్నా బిన్ హారిస్ మరియు ఖాఖా బిన్ అమ్ర్ ను నాయకులుగా నియమించి అక్కడే వదిలారు. యుద్ధం భీకరరూపం దాల్చిన సమయంలో ముసన్నా ఉల్లాసభరితమయిన సైనికులను తీసుకొని కుడివైపు నుండి ఈరానీయులపై విరుచుకుపడ్డారు. ఈ దెబ్బతో ఈరానీయులు ఓటమి అంచుకు చేరుకున్నారు. కాని నాయకులు ప్రోత్సహించి వారిని సంభాళించారు. అంతలోనే ఖాఖా బిన్ అమ్ర్ తన సైన్యంతో ఈరానీయులపై ఎడమవైపు నుంచి మెరుపు దాడి చేశారు. దీంతో ఈరానీయుల ఆశలు అడియాసలయ్యాయి. ఇరానీయులు ఎవరిపై అపారమయిన నమ్మకంతో యుద్ధానికి వచ్చారో వారే- క్రైస్తవ అరబ్బులే రణరంగం వదిలి పారిపోయారు.

ఇలాంటి అనేక చిన్న పెద్ద యుద్ధాల అనంతరం హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) ‘హీర’ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యుద్ధాలలో జోన్ నదీ యుద్ధం అతి పెద్దది. దీంట్లో ఈరానీయులు శక్తి నంతటినీ కూడదీసుకుని పోరాడారు, కాని ఇక్కడా పరాభవమే మిగిలింది. వారి సైనికులు వేల సంఖ్యలో మరణించారు. ‘హీర’ పాత నగరం చాలా అందంగా ఉండేది. వాస్తవానికి అది ఇరానీయుల అధీనంలో గల ఓ అరబ్బు రాజ్యానికి రాజధాని. ‘హీర’ యొక్క ఓ అరబ్బు రాజు ఫరాత్ నదీ తీరాన ఓ బ్రహ్మాండమైన భవనాన్ని నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో రోమ్ మరియు ఈరాన్ కళాకారుల వాస్తు కళానైపుణ్యం ఉట్టి పడ్డుతుంది. దీని నిర్మాణంలో ‘హీర’ రాజు తన సర్వస్వాన్ని వెచ్చించాడు. ప్రస్తుతం అక్కడ ‘కూఫా’ అనే పట్టణం ఉంది. హీర పాత నగరం ఇక్కడ్నుంచి సుమారు మూడు మైళ్ళ దూరంలో ఉండేది. హీర రాజులు వంశపారం పర్యంగా అరబ్బులైనప్పటికీ క్రైస్తవమతాన్ని పాటించేవారు. వీరు అగ్నిపూజారులైన ఈరానీ రాజులకు పన్ను చెల్లించేవారు.

కొన్నాళ్ళ తర్వాత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఈరాన్ ని జయించే పనిని ముసన్నా బిన్ హారిస్కు వదిలి సిరియా వెళ్ళమని హజ్రత్ ఖాలీద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారికి ఆజ్ఞాపించారు. ఎందుకంటే అక్కడ క్రైస్తవులు చాలా బలం కూడగట్టుకున్నారు. దాని తరువాత ఈరాన్లో అనేక పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి. ఆ యుద్దాల్లో అగ్ని పూజారులైన ఈరానీయుల వెన్ను విరిగింది. చివరికి ఈరాన్ ముస్లింల వశమయ్యింది. కాని ఈ సంఘటనలు హజ్రత్ అబూబకర్ (రదియల్లాహు అన్హు) తర్వాత కాలం- అనగా హజ్రత్ ఉమర్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హు) హయాంలో సంభవించాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించడం సబబుకాదు.

హిజ్రీ పదమూడవ సంవత్సరం జమాది ఉల్ ఆఖిర్ నెల ఏడవ తేదీన హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) అస్వస్థతకు గురయ్యారు. చల్లని గాలులు వీస్తున్న సమయంలో హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) చన్నీళ్ల స్నానం చేశారు. చలి వల్ల జ్వరం వచ్చింది. పదిహేను రోజుల దాకా జ్వరం పట్టి పీడించింది. ఆయన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) మస్జిదులో నమాజ్ చేయించసాగారు. ఆయన పొరుగునే హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఉండేవారు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జబ్బు పడ్డ కాలంలో హజ్రత్ ఉస్మాన్ (రదియల్లాహు అన్హు) ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉండేవారు.

జబ్బు తీవ్రతరమైనప్పుడు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారికి తన ఉత్తరాధికారిగా నియమించాలనే ఆలోచన కలిగింది. తన స్థానంలో హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని ఖలీఫాగా నియమించాలని ఆయన నిర్ణయించారు. సహాబా (అనుచరుల) ను సంప్రదించారు. మీ ఎంపిక సరైనదని కొందరంటే, హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారికి ఆవేశం ఎక్కువ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇది విని హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) “ఉత్తరాధికారపు బాధ్యత భుజస్కంధాలపై పడగానే ఆయన మారిపోతారు. నాకు కోపం వచ్చినప్పుడు ఆయన నన్ను శాంతపరుస్తారు. ఏదైనా విషయంలో నేను మెత్తగా వ్యవహరిస్తే ఆయన నన్ను కఠినంగా వ్యవహరించమని సలహా ఇచ్చేవారు. ఇది నా అనుభవం ”అని అన్నారు.

హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రదియల్లాహు అన్హు) గారి స్థానంలో ఇరాఖ్ సైన్యానికి సేనాధిపతిగా నియుక్తులైన హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు) మదీనా చేరుకున్న రోజు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి జీవితపు ఆఖరి రోజు, ఆయన్ని పిలిపించి ఇరాఖ్ స్థితిగతుల గురించి వాకబు చేశారు. “ఈరాన్ రాజు కొత్త సైన్యాన్ని పంపాడు. నా వద్ద చాలా కొద్ది సైన్యం ఉంది “అని అన్నారు. హజ్రత్ ముసన్నా బిన్ హారిస్ (రదియల్లాహు అన్హు). వెంటనే హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారిని పిలిపించి “నా ప్రాణం ఉదయం పోతే సాయంత్రానికల్లా, రాత్రి పోతే ఉదయానికల్లా ముసన్నాకు సైనిక సహాయం చెయ్యండి ” అని అన్నారు.

వ్యాధిగ్రస్తులైన కాలంలో ఓ రోజు “బైతుల్ మాల్ (కోశాగారము) నుండి నాకు ఇప్పటి వరకు మొత్తం ఎంత వేతనం లభించింది?” అని అడిగారు. లెక్క గట్టి ఆరు వేల దిర్హములు (పదిహేను వందల రూపాయలు) అని తెలియ జేయబడింది. “నా భూమి అమ్మి ఈ సొమ్మును వాపసు చేయండి” అని అన్నారు. ఆ తరువాత మళ్ళీ ‘నేను ఖలీఫాగా నియుక్తుణ్ణయ్యాక నా సిరిసంపదల్లో ఎంత వృద్ధి జరిగింది?’ అని అడిగారు. “ఏముందీ? ఓ అబిసీనియా బానిస ఉన్నాడు. అతడు విశ్వాసుల ఖడ్గాలకు పట్టిన తుప్పును వదిలిస్తాడు. ఇంట్లో పనులు చేస్తాడు. నీళ్ళు తేవడానికి ఉపయోగించే ఓ ఒంటె ఉంది. రూపాయి పావలా ఖరీదు చేసే ఓ దుప్పటి ఉంది” అని అన్నారు ఇంటివారు. “నా మరణం తర్వాత ఈ మూడింటినీ హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు పంపేయండి” అని అన్నారు. మరణానికి ముందు ప్రియపుత్రిక హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి నుద్దేశ్యించి “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కఫన్ (అంత్యక్రియల వస్త్రము)లో ఎన్ని వస్త్రాలు వాడారు” అని అడిగారు. “మూడు వస్త్రాలు” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “నా కఫన్ (శవవస్త్రము)లో కూడా మూడు వస్త్రాలే ఉండాలి. నేను ప్రస్తుతం వాడుతున్న ఈ రెండు దుప్పట్లు. వీటిని కాస్త ఉతికించండి. ఒక వస్త్రం కొత్తది తీసుకోండి” అని అన్నారు. ఇది విని హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) “నాన్నగారూ! మీ అంత్యక్రియల కోసం కొత్త వస్త్రం కూడా కొనలేనంత దీన స్థితిలో ఉన్నామా మనం?” అని అడిగారు. అది కాదమ్మా! “చనిపోయే వారికన్నా జీవించి ఉన్న వారికి కొత్త బట్టల అవసరం ఎక్కువ”అని అన్నారు. తరువాత మళ్ళీ “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ రోజు మరణించారు?” అని అడిగారు. “సోమవారం” అని జవాబిచ్చారు హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ). “ఈ రోజు సోమవారం. నేను కూడా ఈ రోజే మరణిస్తానని ఆశిస్తున్నాను. నా సమాధి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఉండేలా చూడండి” అని అన్నారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) జుమాది ఉల్ ఆఖిర్ నెల 22వ తేదీన మగ్రిబ్ మరియు ఇషా మధ్య సమయంలో మరణించారు. హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) జనాజా నమాజ్ చేయించారు. అదే రోజు రాత్రి హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) గారి గదిలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి ప్రక్కన ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఖలీఫాగా 2 సంవత్సరాల, 3 నెలల, 11 రోజులు పరిపాలించారు.

మరణించేనాటికి ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు గలరు. పెద్ద కొడుకు అబ్దుర్రహ్మాన్. ఆయన చాలా కాలం వరకు ఇస్లాం స్వీకరించక అవిశ్వాసుల పక్షాన విశ్వాసులతో పోరాడారు. రెండో కొడుకు అబ్దుల్లాహ్. ఆయన ఇస్లాంకు ఎంతో సేవ చేశారు. హిజ్రత్ సందర్భంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) నూర్ గుహలో ఉన్నప్పుడు ఆయన ఉదయం పూట మక్కాలో గడిపి ఖురైషులు ఎత్తుగడల గురించి తెలుసుకొని రాత్రి వేళ సూర్ గుహకు చేరుకునేవారు. తాయఫ్ యుద్ధంలో ఆయన కాలికి బాణం తగిలి గాయం అయింది. ఆ బాధతో ఆయన మరణించారు. మూడవ కుమారుడు ముహమ్మద్. ఆయన మదీనాలో జన్మించారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి పెద్ద కుమార్తె పేరు హజ్రత్ అస్మా (రదియల్లాహు అన్హ). ఆమె పెళ్ళి చాలా మర్యాదస్తులైన సహాబి (అనుచరులు) జుబైర్ బిన్ అవామ్ (రదియల్లాహు అన్హు) గారితో జరిగింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సతీమణులలో ఒకరైన హజ్రత్ ఆయిషా సిద్దీఖా (రదియల్లాహు అన్హ) ఆయన గారి రెండవ పుత్రిక. మూడవ కుమార్తె పేరు ఉమ్మెకుల్సుమ్ (రదియల్లాహు అన్హు). అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) గారికి సంతానం కలుగలేదు. అందుచేత హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి వంశపరంపర అబ్దుర్రహ్మాన్ (రదియల్లాహు అన్హు) మరియు ముహమ్మద్ (రదియల్లాహు అన్హు) గారి సంతానం ద్వారా కొనసాగింది.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)తో పరిచయం అయిన కాలంలో ఇంకా మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు దైవదౌత్యం అందలేదు. “అల్లాహ్ నన్ను తన ప్రవక్తగా ఎన్నుకొని, ప్రజలకు హితబోధచేసే పనిని అప్పగించాడు” అని దైవప్రవక్త హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారితో అనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా “మీరు దైవప్రవక్తగా ఎన్నుకో బడ్డారనే విషయాన్ని ” నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు. ఆయన వృద్ధాప్యంలో ఖలీఫా అయ్యారు. ఆ సమయంలో ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కాని ప్రజలు జకాత్ ఇవ్వడానికి నిరాకరించి, అరబ్బులోని 24 తెగలు యుద్ధానికి సయితం సన్నద్ధమైనప్పుడు ఆయన చూపిన ధైర్యసాహసాలకు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సహాబా (ప్రవక్త సహచరులు)లలో కొందరు – ‘ఎవరైతే జకాత్ ఇవ్వడానికి నిరాకరించారో వారిని జకాత్ నుండి మినహాయించండి’ అని సలహా ఇచ్చారు. హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) దానికి సుతరామూ ఒప్పుకోలేదు. “ఒకవేళ మీరు వారితో యుద్ధం చేయక పోయినా నేను ఒక్కడినే వారితో పోరాడుతాను” అని తేల్చి చెప్పారు. ఆ తరువాత సహచరులను వెంట బెట్టుకుని మదీనా నుండి బయలుదేరారు. మదీనాపై దాడి చేయడానికి పెద్ద పెద్ద సైన్యాలతో వచ్చిన వారందరినీ వరుసగా ఓడిస్తూ పోయారు.

హజ్రత్ అబూ బకర్ (రదియల్లాహు అన్హు) గారి హృదయం విశ్వాస (ఈమాన్) గని లాంటిది. ఆయన మనస్సు అల్లాహ్ ప్రేమతో, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రేమతో నిండి ఉండేది. ఆయన కేవలం రెండు సంవత్సరాల కన్నా కాస్త ఎక్కువ కాలం ఖలీఫాగా ఉన్నారు. అయితేనేం, దశాబ్దాలలో సయితం నెరవేర్చలేని ఘనకార్యాలు ఆ స్వల్ప వ్యవధిలోనే చాలా సమర్ధవంతంగా నిర్వహించారు హజ్రత్ అబూ బకర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు).

కారుణ్య ప్రభువు ఆయనతో ప్రసన్నుడవుగాక!

(సమాప్తం)

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రదియల్లాహు అన్హు) అంతిమ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు ప్రాణ స్నేహితులు. తాను నమ్మిన ధర్మం కోసం సర్వస్వాన్ని ధారబోసిన త్యాగశీలి. మితభాషి, మృదుస్వభావి, అల్లాహ్ కు భయపడి ప్రజలకు నాయకత్వం వహించిన ప్రప్రథమ మార్గదర్శక ఖలీఫా. మానవత్వం, పరోపకార భావం ఆయనలో మెండుగా ఉండేవి. అనాథల, అగత్యపరుల పట్ల అమితమైన జాలి చూపేవారు. రోగుల పరామర్శ, బాధితుల సేవ అంటే ఆయనకెంతో ఇష్టం. స్వతహాగా మృదుస్వభావి అయినప్పటికీ ధర్మాదేశాలను ప్రవేశపెట్టే విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరించేవారు. అబూబక్ర్ బ్రతికి ఉండగా ధర్మావలంబనలో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉండబోదని సూటిగా చెప్పారు. ఏ విషయమైనా ఖుర్ఆన్ కు కాస్త అటూ ఇటూగా ఉంటే సహించేవారుకారు. ఏ నిర్ణయం గైకొన్నా దివ్య ఖుర్ఆన్ ప్రకారమే గైకొనేవారు. తన పరిపాలనా కాలంలో “జకాత్”ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన వారి మెడలు వంచి, ధర్మాన్ని రక్షించిన ధర్మ ఖలీఫా ఆయన. -రదియల్లాహు అన్హు –

ఇస్లాం తెలుగు పుస్తకాలు (Telugu Islamic Books) డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ:
https://teluguislam.net/?p=4259

71. తఫ్సీర్ సూరా నూహ్ – Tafsir Surah Nuh [వీడియోలు]

సూరా పరిచయం:

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో 28 ఆయతులు ఉన్నాయి. సత్యతిరస్కారులను నాశనం చేసే శక్తిసామర్ధ్యాలు అల్లాహ్ కు ఉన్నాయని ఈ సూరా హెచ్చరించింది. మొదటి ఆయత్లో ‘నూహ్’ అన్న ప్రస్తావన వచ్చింది. ఈ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ సూరా ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) కథతో ప్రారంభమయ్యింది. ఆయన తన జాతి ప్రజలకు హెచ్చరిక చేయడానికి అల్లాహ్ తరఫున పంపబడ్డారు. బాధాకరమైన శిక్ష గురించి హెచ్చరించడానికి, అల్లాహ్ పట్ల భయభక్తులతో జీవితం గడపమని బోధించడానికి ఆయన వచ్చారు. అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని, ఆయనను మాత్రమే క్షమాభిక్ష అర్ధించాలని ఆయన బోధించారు. నూహ్ (అలైహిస్సలాం) తన ప్రయత్నాలలో అనుసరించిన పద్ధతుల గురించి, ఆయన సంఘర్షణ గురించి ఇందులో వివరించడం జరిగింది. నూహ్ (అలైహిస్సలాం) రాత్రింబవళ్లు తన జాతి ప్రజలకు హితబోధ చేసారు. వారితో వ్యక్తిగతంగాను, సాముదాయికంగానూ మాట్లాడారు. అల్లాహ్ ను విశ్వసించాలని, బహుదైవారాధన మానుకోవాలని బోధించారు. అల్లాహ్ క్షమాశీలం గురించి వారికి తెలియజేసారు. వారు నిజాయితిగా పశ్చాత్తాపపడితే లభించే అల్లాహ్ అనుగ్రహాల గురించి వారికి తెలిపారు. అల్లాహ్ కు భాగస్వాములను కల్పించడాన్ని మానుకోవాలని వారికి బోధించారు. అల్లాహ్ శక్తిసామర్ధ్యాల గురించి వారికి వివరించారు.

నూహ్ (అలైహిస్సలాం) ఎదుర్కొన్న వేధింపుల గురించి కూడా ఈ సూరా ప్రస్తావించింది. ప్రజలు ఆయనకు దూరంగా పారిపోయారు. ఆయన చెప్పే మాటలు వినకుండా ఉండడానికి తమ చెవుల్లో వేళ్ళు పెట్టుకునేవారు. ఆయన కంట బడకుండా ఉండడానికి ముసుగులు వేసుకునేవారు. అధికారం, సంపద ఉన్న వారిని మాత్రమే వారు అనుసరించే వారు. నూహ్ (అలైహిస్సలాం)ను, ఆయన అనుచరులను వదిలించుకోవడానికి వారు కుట్రలు పన్నారు. వారు తమ దుర్మార్గాలను, అల్లాహ్ కు భాగస్వాములను కల్పించే మహాపరాధాన్ని చేస్తూ పోయారు. వారి సత్యతిరస్కారానికి, వారి చెడులకు పర్యవసానంగా వారిని మహా వరదలో ముంచేయడం జరిగింది. పరలోకంలో వారు నరకంలో నెట్టబడుతారు.

[అహ్సనుల్ బయాన్ – తెలుగు అనువాదం & వ్యాఖ్యానం]

86. తఫ్సీర్ సూర అత్తారిఖ్ (Tafsir Surah at-Tariq) [వీడియో]

అత్ తారిఖ్ (ప్రభాత నక్షత్రం) సూరా పరిచయం

ఈ సూరా మక్కా కాలానికి చెందినది. ఇందులో మొత్తం 17 ఆయతులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించిన విషయాలు ప్రళయం, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, దైవవాణి అవతరించడం. మొదటి ఆయతులో వచ్చిన ‘తారిఖ్’ ( ప్రభాత నక్షత్రం) అన్న ప్రస్తావననే ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. మనిషిని ఏ విధంగా వీర్య ద్రవం నుంచి సృష్టించింది తెలుపుతూ అల్లాహ్ మరణించిన ప్రతి ఒక్కరిని తీర్పుదినం రోజున మళ్ళీ లేపి నిలబెట్టగలడని, ఆ రోజున యావత్తు మానవాళి తుది తీర్పు కోసం అల్లాహ్ ముందు హాజరవుతుందని చెప్పడం జరిగింది. ఆ రోజున ప్రతిఒక్కరి మంచి లేదా చెడు పనులు బట్టబయలవుతాయి. దివ్యఖుర్ఆన్ అల్లాహ్ పంపిన సత్యమనీ, ఇది మంచిని చెడు నుంచి వేరు చేస్తుందనీ, ఇవి వ్యర్ధమైన ప్రసంగాలు కావని నొక్కి చెప్పింది.

యూట్యూబ్ ప్లే లిస్ట్ (తఫ్సీర్ సూరత్ అత్తారిఖ్ ) :
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV09wO7Wzqes1UNDUaDRX8Nw

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]

ప్రవక్త ముహమ్మద్ ﷺ జీవిత చరిత్ర (సీరత్ ) తెలుసుకోవడం ఎందుకు అవసరం? [వీడియో ]
https://youtu.be/cXBur4cYoZE [37:50 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

1.4 విశ్వాస ప్రకరణం | మహా ప్రవక్త మహితోక్తులు

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) .  
విశ్వాస ప్రకరణం [PDF]

5 – حديث أبي هُرَيْرَةَ قال كان النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بارزًا يومًا للناسِ فأَتاه رجلٌ فقال: ما الإيمان قال: الإيمان أن تؤمنَ بالله وملائكتِهِ وبلقائِهِ وبرسلِهِ وتؤمَن بالبعثِ قال: ما الإسلامُ قال: الإسلامُ أن تعبدَ اللهَ ولا تشركَ به وتقيمَ الصلاةَ وتؤدِّيَ الزكاةَ المفروضةَ وتصومَ رمضانَ قال: ما الإحسان قال: أن تعبدَ الله كأنك تراهُ، فإِن لم تكن تراه فإِنه يراك قال: متى الساعةُ قال: ما المسئولُ عنها بأَعْلَم مِنَ السائل، وسأُخبرُكَ عن أشراطِها؛ إِذا وَلَدَتِ الأَمَةُ رَبَّهَا، وَإِذا تطاولَ رُعاةُ الإبِلِ البَهْمُ في البنيان، في خمسٍ لا يعلمهنَّ إِلاَّ الله ثم تلا النبيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ (إِنَّ الله عنده علم الساعة) الآية: ثم أدبر فقال: رُدُّوه فلم يَرَوْا شيئاً فقال: هذا جبريل جاءَ يُعَلِّمُ الناسَ دينَهم
__________
أخرجه البخاري في: 2 كتاب الإيمان: 37 باب سؤال جبريل النبي صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عن الإيمان والإسلام

5. హజ్రత్ అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం :- ఒక రోజు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రజలతో సమావేశమయి ఉండగా, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి “దైవప్రవక్తా! విశ్వాసం అంటే ఏమిటి?” అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధానమిస్తూ “విశ్వాసం ఉంటే నీవు అల్లాహ్ ను, దైవ దూతలను, దైవప్రవక్తలను, (పరలోకంలో) అల్లాహ్ ముందు హాజరు కావలసి ఉంటుందన్న విషయాన్ని, (మరణానంతరం మానవులు) తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి” అని అన్నారు.

“మరి ఇస్లాం అంటే ఏమిటి?” అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు. “ఇస్లాం అంటే (1) నీవు అల్లాహ్ ను మాత్రమే (దేవుని గా భావించి) ఆరాధించాలి. (దైవత్వంలో) మరెవరినీ ఆయనకు సహవర్తులుగా చేయకూడదు. (2) నమాజు (ప్రార్ధనా) వ్యవస్థను నెలగొల్పాలి. (3) జకాత్ (పేదల ఆర్థిక హక్కు)ను విధిగా నెరవేర్చాలి. (4) రమజాన్ నెల ఉపవాసాలు పాటించాలి” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“ఇహ్సాన్ అంటే ఏమిటి?” ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నించాడు. “ఇహ్సాన్ అంటే, నీవు అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు (అత్యంత భయభక్తులతో) ఆయన్ని ఆరాధించాలి. నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆయన మాత్రం నిన్ను తప్పకుండా చూస్తున్నాడు. (అన్న యదార్ధాన్ని గుర్తుంచుకో)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

“దైవప్రవక్తా! మరి ప్రళయం ఎప్పుడొస్తుంది?” మరో ప్రశ్న అడిగాడు ఆ వ్యక్తి. ప్రళయం గురించి ప్రశ్నించేవాడికన్నా సమాధానమిచ్చేవాడికి ఎక్కువేమీ తెలియదు. కాకపోతే ప్రళయ సంభవం గురించి నేను కొన్ని సూచనలు తెలియజేస్తాను. అప్పుడు దాసి తన యజమానిని కంటుంది. (అనాగరికులుగా ఉన్న) పశువుల కాపర్లు పెద్ద పెద్ద భవంతులు కట్టడంలో ఒకర్నొకరు పోటీపడతారు. ఆ ఐదు అగోచర విషయాల్లో ప్రళయం ఒకటి. దాని సంగతి అల్లాహ్ కి తప్ప మరెవ్వరికీ తెలియదు,” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

ఆ తరువాత ఆయన ఆ గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు. తల్లుల గర్భాలలో పెరుగుతున్న దేమిటో ఆయనే ఎరుగు. తాను రేపటి రోజున ఏమి సంపాదించనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. ఏ భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో ఏ వ్యక్తి ఎరుగడు (లుక్మాన్ – 34)” అన్న ఖుర్ఆన్ సూక్తిని పఠించారు.

ఈ సంభాషణ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘ఆ వ్యక్తిని పిలవండి’ అన్నారు. కాని కొందరు సహచరులు వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కన్పించలేదు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (అసలు విషయం బయట పెడ్తూ) “ఆ వ్యక్తి (ఎవరో కాదు) జిబ్రయీల్ (దైవదూత). ఈ విధంగా ఆయన ప్రజలకు వారి ధర్మం గురించి చెప్పడానికి వచ్చారు” అని అన్నారు.

[బుఖారీ; 2వ ప్రకరణం – విశ్వాసం, 37వ అధ్యాయం – జిబ్రయీల్…]

ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఉపదేశం, ముఖ్యంగా 40 సం. దాటిన ప్రతి ఒక్క విశ్వాసికి [ఆడియో ]

ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన ఉపదేశం, ముఖ్యంగా 40 సం. దాటిన ప్రతి ఒక్క విశ్వాసికి
https://youtu.be/nWrwm6_2jLQ [13 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)