మీలాదున్నబీ ఎలా చేయాలి? احتفال مولد النبيﷺ [వీడియో]

బిస్మిల్లాహ్

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జన్మదిన వేడుకలు, బర్త్ డే పార్టీలు, మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకొనుట ఇస్లామీయ కార్యమేనా? మనకంటే ఎంతో అధికంగా ప్రవక్తను ప్రేమించే సహాబాలు (ప్రవక్త సహచరులు) ఈ మీలాద్ చేశారా? ఇది చేయడం పుణ్యమైతే వారు ఎందుకు చేయలేదు? అది పుణ్యం కాకపోతే మరి మనం ఎందుకు చేయాలి? ఇంకా మరిన్ని వివరాలు, వాస్తవాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

[40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్) 
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia

ఈ ప్రసంగం ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టినరోజు (మీలాద్-ఉన్-నబీ) వేడుకల యొక్క వాస్తవికతను చర్చిస్తుంది. ఇస్లాం ఒక సంపూర్ణమైన మతమని, దానిలో కొత్త ఆచారాలకు, ప్రత్యేకంగా ఆరాధనల విషయంలో, స్థానం లేదని వక్త స్పష్టం చేస్తున్నారు. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో కేవలం రెండు పండుగలు (ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా) మాత్రమే ఉన్నాయని, మీలాద్ వేడుకలను పండుగగా జరుపుకోవడం ప్రవక్త మరియు ఆయన సహచరుల పద్ధతికి విరుద్ధమని వివరిస్తున్నారు. ఈ వేడుకను సమర్థించడానికి ఉపయోగించే వాదనలను విశ్లేషించి, వాటిలోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ, ఇది ఇస్లాంలోకి తరువాత చేర్చబడిన ఒక నూతన ఆచారం (బిద్అత్) అని, దీనిని పాటించడం పుణ్యకార్యం కాదని, పాపమని తేల్చిచెప్పారు. ఇస్లాం యొక్క మూల సూత్రాలను అనుసరించాలని, ఇతర మతాల వారిని అనుకరించరాదని ఆయన ముస్లింలకు హితవు పలికారు.

(الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ، نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ)
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబీయ్యినా ముహమ్మద్ వ ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బాద్. (సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)పై, ఆయన కుటుంబ సభ్యులు మరియు సహచరులందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక).

ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దీని యొక్క వాస్తవికత ఏమిటి? ఇస్లాంకు సంబంధించిన విషయమేనా ఇది, కాదా?

మహాశయులారా, మొట్టమొదటి విషయం మనం తెలుసుకోవలసినది, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) అని అల్లాహుతాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. అంటే ఏమిటి? “అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్” ( الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ) – ఈనాడు నేను మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను. “వ అత్మమ్తు అలైకుమ్ నిఅమతీ” (وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي) – మరియు నా అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం చేశాను. “వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా” (وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا) – మరియు మీ కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాను.

ఈనాడు మీ ధర్మాన్ని నేను సంపూర్ణం చేశాను అంటే ఏ నాడు అది? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానికి ఇంచుమించు ఒక 80-83 రోజుల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ అవతరింపజేయబడినది. అయితే, ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది అని ఏదైతే మనం అంటున్నామో, ఈ ఆయత్ దానికి ఒక ఆధారంగా, నిదర్శనంగా తెలుసుకున్నామో, దీని భావం ఏమిటి? ధర్మం పేరుతో ఇక ఏ విషయం కూడా మనం ఇందులో చేర్చలేము. ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి చెప్పినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి ముందు ఏ విషయం అయితే దీన్లో లేనిదో, అది ఇప్పుడు దీన్లో లెక్కించబడదు. ధర్మంలో లెక్కించబడదు. మరియు ధర్మంలో ఉన్న ఏ విషయాన్ని కూడా తీసివేయడానికి కూడా మనకు ఎలాంటి అర్హత లేదు.

రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ధర్మం సంపూర్ణమైనది అని అన్నదానికి భావం రెండు రకాలుగా. ఒకటి, ఇందులో అదనంగా మనం ఏదీ చేర్చలేము. అరే ఇది కూడా చాలా మంచిగా ఉంది కదా, దీన్ని కూడా ధర్మంగా భావిద్దాము, ఇది కూడా మనం ఆచరిద్దాము, ఇలా కూడా చేద్దాము, ఇది కూడా ధర్మంగా పుణ్యంగా ఉంటుంది మనకు, ఇలా చెప్పలేము మన ఇష్టానుసారం. అలాగే అల్లాహుతాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయాన్ని ధర్మంలో తెలిపారో, అందులో నుండి ఏ విషయాన్ని కూడా మనం మినహాయించలేము, తీసివేయలేము. ఆ అర్హత కూడా మనకు లేదు.

ఇంకా మహాశయులారా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన రెండవ విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం, ఇందులో అల్లాహ్ మనకు ఏది తెలిపాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏది తెలిపారో, అదే ధర్మం. దానినే మనం అనుసరించాలి. ఇది కాకుండా మన ఇష్టానుసారం ఏదైనా విషయాన్ని చేర్చుకోవడాన్ని, అనుసరించడాన్ని అల్లాహ్ ఖండించాడు. దీనికి సంబంధించిన ఎన్నో ఆయతులు ఉన్నాయి, కానీ ఉదాహరణకు సూరె జాథియాలోని ఆయత్ నంబర్ 18: “సుమ్మ జఅల్నాక అలా షరీఅతిమ్ మినల్ అమ్రి ఫత్తబిఅహా వలా తత్తబిఅ అహ్వా అల్లజీన లా యఅలమూన్” (ثُمَّ جَعَلْنَاكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ الْأَمْرِ فَاتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ لَا يَعْلَمُونَ). (మేము నిన్ను ధర్మానికి సంబంధించిన ఒక రాజబాటపై నిలబెట్టాము. అయితే నీవు దీనిని అనుసరించు. జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు). అల్లాహ్ పంపిన షరీఅత్, అల్లాహ్ పంపిన ధర్మం దానినే మనం అనుసరించాలి అని అల్లాహ్ మనకు ఆదేశిస్తున్నాడు.

అలాగే మహాశయులారా, మూడవ విషయం, ఇస్లాంలో పండుగలు, ఈద్ అని ఏదైతే మనం అంటామో, ఎన్ని ఉన్నాయి సంవత్సరానికి? రెండు మాత్రమే. ఒకటి ఈదుల్ అద్హా, ఇంకొకటి ఈదుల్ ఫితర్. ఈదుల్ ఫితర్, ఈదుల్ అద్హా ఈ రెండు మాత్రమే. సునన్ అబీ దావూద్ లోని సహీహ్ హదీస్, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు పండుగగా, ఈద్‌గా కొన్ని రెండు రోజులు జరుపుకునేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోకూడదు అని, వారిని ఆ రెండు రోజులను పండుగగా జరుపుకోవడాన్ని నిషేధించి, రద్దు చేసి, “ఖద్ అబ్దలకుముల్లాహు బిహిమా ఖైరమ్ మిన్హుమా” (قَدْ أَبْدَلَكُمُ اللَّهُ بِهِمَا خَيْرًا مِنْهُمَا). (అల్లాహుతాలా మీ కొరకు ఆ రెండు రోజుల కంటే మరీ ఉత్తమమైన వేరే రెండు రోజులు మీకు ప్రసాదించాడు, వాటిని మీరు పండుగగా జరుపుకోండి, ఈద్‌గా జరుపుకోండి అని తెలిపారు). ఆ రెండు ఏమిటి? ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్హా. ఈ విధంగా సంవత్సరంలో ఇక మూడవ ఈద్, మూడవ పండుగ ముస్లింలకు ఏదీ లేదు. మూడవ పండుగ, మూడవ ఈద్ ఏదైనా ఉండేది ఉంటే, అది వారంలో ఒకసారి జుమా రోజు. జుమా కూడా ఈదుల్ మూమినీన్ అని చెప్పడం జరిగింది.

ఇక మీలాదున్నబీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు, దానిని ఈద్ అని ఏదైతే ఈ రోజుల్లో అనడం జరుగుతుందో, ఈద్ మీలాదున్నబీ అని, ధర్మపరంగా దానిని ఈద్ అని అనడం కూడా తప్పు, అలాగే దానిని ఈద్‌గా జరుపుకోవడం కూడా తప్పు. ఒకవేళ ఎవరైనా, సరే మంచిది, దానికి ఈద్ అన్న పదం మేము తీసేస్తాము, మీలాదున్నబీ అని జరుపుకుంటాము అని అంటే, అది కూడా కుదరని పని.

కానీ ఇంతవరకే విషయం సరిపోదు. మరికొందరు ఒక రాంగ్ క్వశ్చన్, ఒక అడ్డ ప్రశ్న వేస్తారు. అదేమిటంటే, సరే మంచిది, ఈద్ అని దానికి పేరు పెట్టుకోము. మీలాదున్నబీ అన్న పేరుతో ఆ రోజును మేము గడుపుకోవడం, ఒక సంతోషంగా, సంతోషక దినంగా భావించి జరుపుకోవడం, ప్రజల్ని ఆ రోజు ఒకచోట జమా చేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర తెలపడం, ఇందులో ఏమిటి తప్పు? పాపం ఏమున్నది ఇందులో? ఇలా అడ్డంగా ప్రశ్నిస్తారు. అయితే, ఇందులో పాపం ఏమున్నదో, అది ఇప్పుడే తెలియజేస్తాను, కానీ దానికంటే ముందు ఒక విషయం మనం ఆలోచించాలి. అదేమిటి?

ఇది ఒకవేళ మంచి విషయం అని మనం భావించి చేస్తూ ఉండేది ఉంటే, నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్, ఈ యొక్క మంచి విషయం మనకు తెలపడం అల్లాహ్ మర్చిపోయాడా? నవూజుబిల్లాహ్, అస్తగఫిరుల్లాహ్. అల్లాహ్ ప్రవక్తకు తెలియజేశారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలపడం మర్చిపోయారా? అలా ఏమైనా ఉందా? గమనించండి. ఈ రోజు ఇందులో తప్పేమున్నది? మనం మంచి పనులే చేస్తాము కదా ఈ రోజుల్లో. అయితే, మనం మన ఇష్టానుసారం ఏ పనినైనా మంచిదిగా భావించి చేయడం, ఇది ధర్మం కాదు. ఇది అల్లాహ్‌కు ఇష్టమైన రీతిలో స్వీకరించబడదు. అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తెలిపిన విషయాన్నే మనం ఆచరించాలి.

ఇక నష్టం ఏమిటి? అందులో వేరే ఏ చెడు పని చేయకున్నా, మహా నష్టం ఇప్పుడే నేను మీకు తెలియజేసినట్లు, ఒకవేళ అది మంచి పని అని మనం చేస్తూ ఉంటే, ఆ మంచి పని విషయంలో అల్లాహ్ లేదా అల్లాహ్ యొక్క ప్రవక్త మర్చిపోయారా? ఇటువంటి ఒక పెద్ద అభాండం ఏర్పడుతుంది. రెండవ విషయం, ఒకవేళ ఇది చెడైతే ఏమీ కాదు, మంచి అని అని మనం చేసుకుంటూ ఉంటే, మనకంటే ఎక్కువగా ధర్మం పట్ల ప్రేమ కలిగిన సహాబాలు మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకంటే ఎక్కువగా ప్రేమించేవారు సహాబాలు. సహాబా కంటే ఎక్కువ మనం ప్రేమిస్తామా ప్రవక్తను? చెప్పండి. మనం ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నామా ప్రవక్తను లేక సహాబాలు ఎక్కువ ప్రేమించేవారా? సహాబాలు కదా. అయితే వారు మరి ఈ విషయం పాటించలేదు కదా?

ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రకాలు. అందుగురించి ఇమామ్ మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఒక సందర్భంలో ఏమి చెప్పారు? ఎవరైతే ఒక పని ఇస్లాంలో కొత్తగా ఏర్పాటు చేసి దానిని ఆచరిస్తాడో, అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఒక మహా అపనింద, ఒక పెద్ద అబద్ధాన్ని మోపుతున్నాడు. ఎందుకు? “ఇది మంచి కార్యం, ఇది సత్కార్యం, ఇది చాలా అల్లాహ్‌కు ఇష్టమైన పని” అని మనం అంటుంటే, అల్లాహుతాలా మర్చిపోయాడు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు తెలియజేయడం మర్చిపోయాడు అని ఈ విధంగా, “ఫఖద్ ఖాన రిసాలా” (فقد خان الرسالة) (సందేశాన్ని అందజేయడంలో మోసం చేశాడు). ప్రవక్త రిసాలత్, సందేశం అందజేయడంలో, నవూజుబిల్లాహ్, అమానత్ పాటించలేదు అన్నటువంటి ఒక పెద్ద అపనింద ప్రవక్తపై వస్తుంది. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇక, ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి. అర్థమయ్యాయి కదా? అయితే, ఇదే విషయాన్ని మరో రకంగా కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజుల్లో ఎందరో ముస్లిం సోదరులని మనం మీలాదున్నబీ జరుపుకుంటున్నది చూస్తూ ఉన్నాము. చూస్తున్నాము కదా? అచ్చా, మీలాదున్నబీ అంటే ఏంటో తెలుసా? మీలాదున్నబీ అన్న ఈ అరబీ పదానికి భావం ఏంటి? ప్రవక్త బర్త్‌డే. నబీ అంటే ప్రవక్త, మీలాద్ అంటే “ఉష్ మీలాద్ అంతా?” (وش ميلادك أنت؟) (నీ పుట్టినరోజు ఏది?). నీ జన్మదినం ఏది? నీ బర్త్‌డే ఏది? అని మనం సామాన్యంగా అరబీలో అడుగుతాము కదా.

అయితే మహాశయులారా, ఇస్లాంలో మనం మన బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ప్రవక్తల బర్త్‌డే జరుపుకోవడానికి అనుమతి లేదు, ఇంకా ఏ పుణ్యపురుషులు, మహాభక్తులు, ఔలియా అల్లాహ్, బుజుర్గ్ బాబా, అచ్చే అచ్చే లోగా, ఈ విధంగా ఎవరి ఏ బర్త్‌డేలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి అవకాశం ఉందా? లేదు. “అరే ఏం చేయమండి మేము? కేవలం ఆ రోజు మేము పుట్టిన దినం అని చాక్లెట్లు పంచుకుంటాము. ఆ రోజు మేము పుట్టిన దినము అని అందరం ఒకచోట జమా అయ్యి కేక్ తీసుకొచ్చి దాన్ని కోసి మేము అందరం కలిసి తింటాము. ఇందులో మేమేం హరామ్ కార్యం చేస్తున్నాము?” అని అంటారు. కానీ ఇది ఇస్లాంకు సంబంధించిన విషయం ఎంత మాత్రం కాదు.

ఇంకా మహాశయులారా, ఎందరో సోదరులు ఈద్-ఎ-మీలాదున్నబీ పాటిస్తున్నారు. కానీ వారి యొక్క ఈ మీలాదున్నబీ ఉత్సవాల విషయం మరియు వారు చెప్పే మాటలలో ఎన్నో రకాల వైరుధ్యం కనబడుతుంది. కాంట్రడిక్షన్. ఏ విధంగా? ఒక మౌల్వీ సాబ్ ప్రసంగం చేస్తూ ఏమన్నాడు? మనం తప్పకుండా మీలాదున్నబీ ఉత్సవాలు పాటిస్తూ ఉండాలి. దీనికి మనకు ఆధారాలు కూడా ఉన్నాయి, అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి దలీల్ ఉంది, ఆధారం ఉంది అని అంటే, ప్రజలు చాలా సంతోషపడిపోతారు కదా. ఏంటి ఆధారం అండి? సహీహ్ ముస్లిం షరీఫ్‌లో హదీస్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం ఉపవాసం ఉండేవారు. అయితే, ప్రవక్తా మీరు ఎందుకు ఉపవాసం ఉంటారు అని ప్రవక్తను ప్రశ్నించినప్పుడు, “జాక యౌమున్ వులిద్తు ఫీహి” (ذَاكَ يَوْمٌ وُلِدْتُ فِيهِ) (అది నేను జన్మించిన రోజు). నేను ఆ సోమవారం రోజున జన్మించాను గనుక నేను ఉపవాసం ఉంటున్నాను. చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు పాటిస్తూ ఉన్నారు. మనం కూడా పాటించడం చాలా మంచిది.

కానీ అస్తగఫిరుల్లాహ్! వాస్తవంగా ఈ హదీస్ ముస్లిం షరీఫ్‌లో ఉన్నది వాస్తవమే. కానీ దీని ద్వారా మీలాదున్నబీ మనం చేసుకోవచ్చు అన్నదానికి ఏదైతే ఆధారం తీసుకుంటున్నారో, ఆ ఆధారం కుదరదు. ఎందుకు కుదరదు? గమనించండి. మొదటి విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు హదీస్ ప్రకారంగా? ఉపవాసం పాటించేవారు, రోజా రఖ్తే థే. ఉపవాసం పాటించేవారు. మరి ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నారు? మీలాదున్నబీ అని ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నారో, ఉపవాసమే పాటిస్తున్నారా కేవలం? విరుద్ధమా లేదా?

రెండో రకంగా చూసుకోండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మరి ఈద్ రోజున ఉపవాసం ఉండవచ్చా? వేరొక హదీస్‌లో ఉంది, అది కూడా సహీహ్ హదీస్. ఎవరైతే సహీహ్ బుఖారీ, ముస్లింలో వచ్చి ఉంది. ఎవరైతే పండుగ రోజు ఉపవాసం ఉంటారో, వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయులు. నాఫర్మానీ చేసేవాళ్ళు. అయితే ఇక చెప్పండి. ఈద్ అని అంటున్నారు, ప్రవక్త ఉపవాసం ఉండే ఆ హదీస్ ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. మరి ఈద్ రోజున, పండుగ రోజున ఉపవాసం ఉండరాదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, అస్తగఫిరుల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ప్రవక్త స్వయంగా పండుగ రోజు ఉపవాసం ఉండరాదు అని, పండుగ రోజు ఉపవాసం ఉన్నారా? ఇది మీలాదున్నబీ అని అంటున్నారు కదా.

ఇంకా మూడో రకంగా దీన్ని ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సోమవారం, అంటే సోమవారం సంవత్సరంలో ఒకసారి వస్తుందా? వారంలో ఒకసారి. అయితే వారంలో ఒకసారి వచ్చేదాన్ని, ఉపవాసం పాటించేదాన్ని వదిలేశారు, సంవత్సరంలో ఒకసారి ఈద్-ఎ-మీలాదున్నబీ అని జరుపుకుంటున్నారు. ఇది ఎక్కడ కుదురుతుంది? గమనించండి.

ఈ రకంగా చూసుకుంటూ పోతే, నాలుగో విషయం గమనించండి. అదేమిటి? సామాన్యంగా ఎవరైతే మీలాదున్నబీ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారో, సామాన్యంగా మీలాదున్నబీ ఉత్సవాలు ఎవరు జరుపుతారు? తమకు తాము మేము ముఖల్లిద్‌లం. ఏదైనా ఒక ఇమామ్‌ను పట్టుకోవాలి, ఏదైనా ఒక ఇమామ్ యొక్క తఖ్లీద్ తప్పకుండా చేయాలి, అని అంటూ ఉంటారు కదా. అలాంటివారే మరొక విషయం ఏమంటారు? వారిలోని పండితులు కూడా, అల్లాహ్ మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, వారిలోని పండితులు కూడా ఏమంటారు? మేము ఇజ్తిహాద్ చేయడానికి, ఖురాన్ హదీస్ ద్వారా విషయాలు గ్రహించడానికి, మన ముందు ఉన్న సమస్యలకు ఖురాన్ హదీస్ ద్వారా పరిష్కారం వెతకడానికి మాకు అనుమతి లేదు. మేము ఏ ఇమామ్ యొక్క తఖ్లీద్ పాటిస్తున్నామో, ఆ ఇమామ్ ఏం చెబితే అదే మేము చేయాలి. అయితే, అటువైపున తప్పకుండా తఖ్లీద్‌ను పాటించాలి అని అంటారు. ఇటు ఈద్-ఎ-మీలాదున్నబీ వచ్చినప్పుడు స్వయంగా వారే దలీల్‌లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు. మరి ఇమామ్‌ల విషయం చూస్తే, ఏ ఒక్క ఇమామ్ కూడా మీలాదున్నబీ చేయాలని చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? నమాజ్ విషయానికి వస్తే ఉదాహరణకు, ఎందుకు మీరు ఇలా నమాజ్ చేస్తున్నారు? ప్రవక్త యొక్క విధానం ఇది కదా అంటే, లేదు లేదు మేము ఫలానా ఇమామ్‌ను అనుసరిస్తాము. హమ్ ఫలా ఇమామ్ కే ముఖల్లిద్ హై. ఈ విధంగా అంటారు. ఇక మీలాదున్నబీ వచ్చే విషయం వచ్చేసరికి, స్వయంగా ఎన్నో దలీల్ ఆధారాలు వెతుకుతూ వెతుకుతూ వేటికి తీసుకొస్తారు. ఈ రకంగా కూడా…

ఇంకా మహాశయులారా, మరికొందరు ఏమంటారో తెలుసా? మీరు ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు, చేయవద్దు, చేయవద్దు అంటారు కదా. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి. అర్థమవుతుందా? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవద్దు అని ఎక్కడైనా దలీల్ ఉందా చూపించండి అని అంటారు. మరి వారితోనే ఈ ప్రశ్న అడిగితే, ఏమని? ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి. ఈద్-ఎ-మీలాదున్నబీ అన్న పదాలతో. ఎక్కడా లేదు హదీసులలో. సోమవారం రోజు ఉపవాసం ఉండేవారు ప్రవక్త. హదీస్ ఏదైతే వచ్చి ఉందో, దాని ద్వారా దలీల్ తీసుకుంటున్నారు. ఇంకా వేరే ఎలాంటి దలీల్‌లు నేను చూపిస్తాను ఇన్షా అల్లాహ్, అందులో కూడా భావం వారు తప్పుగా ఎలా తీసుకుంటున్నారో. అయితే, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ మాతోనే అడుగుతున్నారు. అప్పుడు మేమే అడిగినప్పుడు, ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించండి అంటే, వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ చేయవచ్చు అని ఎక్కడా దలీల్ లేదు.

ఇక మాట వచ్చింది గనుక ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. అదేమిటంటే, ఆరాధనలు, ఇబాదాత్, వీటిలో దలీల్, ఆధారం చేయడానికి ఉండాలి. ప్రవక్త ఇలా చేశారు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు అని చేయడానికి ఆధారం ఉండాలి. చేయకూడదు అన్నదానికి కాదు. మరియు ఏ విషయం చేయమని ఉందో, అది మాత్రమే మనం చేయాలి. ఏ విషయం ప్రస్తావన లేదో, దానిని చేయకూడదు. ఎందులో ఇది? ఇబాదాత్‌లో, ఆరాధనలలో. ఉదాహరణకు, ఉపవాసం, రోజా, మంచి విషయమేనా కాదా? అల్లాహ్‌కు చాలా ఇష్టమైన సత్కార్యం కదా. రమదాన్‌లో ఇది ఫర్జ్, విధి. ఎవరైనా ఒక మనిషి వచ్చి, ఎవరైనా ఒకరు వచ్చి, ఇస్లామీయ ప్రకారం నాలుగో నెల రబీఉల్ ఆఖర్. ఇందులో కూడా మనం ఇన్ని రోజులు ఉపవాసం ఉంటే మనకు ఇలాంటి లాభాలు అని చెప్తే, దానిని మనం ఒప్పుకోవచ్చా? ఎక్కడుంది ఆధారం చూపించు.

ఇప్పుడు ఆ మనిషి మళ్లీ, రబీఉల్ అవ్వల్‌లోని ఈ మాసంలో ఉపవాసాలు ఉండకండి అని ప్రవక్త ఎక్కడైనా చెప్పారా అని మనకు అడ్డ ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నయే తప్పు అక్కడ. అర్థమైందా? ఉదాహరణకు నమాజ్ విషయం తీసుకోండి. నమాజ్ విషయం. ఐదు పూటల నమాజ్‌లు విధి అని మనకు తెలుసు కదా. ఇవి కాకుండా ఫర్జ్ నమాజ్‌ల కంటే ముందు సున్నతులు, ఫర్జ్ నమాజ్‌ల కంటే తర్వాత సున్నతులు, నఫిల్ నమాజ్‌లు, ఇంకా వేరే చాష్త్, సలాతుల్ ఇస్తిస్కా వర్షం గురించి నమాజ్, సలాతుల్ కుసూఫ్ సూర్య గ్రహణ, చంద్ర గ్రహణ నమాజ్‌లు, జుమ్మా నమాజ్, ఈ విధంగా ఎన్నో రకాల నమాజ్‌లు ఉన్నాయి కదా. వాటన్ని వివరాలు వచ్చి ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి 15వ తారీఖు షాబాను రాత్రి ఎవరైనా 100 రకాతుల నమాజ్‌లు చేసి, ప్రతి ఒక్క రకాతులో 10, 10 సార్లు ఖుల్ హువల్లాహ్ చదవాలి సూరె ఫాతిహా తర్వాత అని ఈ విధంగా ఒక పద్ధతి మనకు నేర్పుతే, మనం ఏమడుగుతాము? నమాజ్ మంచి విషయమే. కానీ ఈ విధంగా ఒక తారీఖు ముకర్రర్ చేసి, ఒక పద్ధతి నిర్ణయించి నువ్వు ఏదైతే చెబుతున్నావో, దానికి ఏమిటి ఆధారం? ఆ, 15వ తారీఖు షాబానున ఈ రకంగా నమాజ్ చేయవద్దు అని ఎక్కడ దలీల్ ఉంది చూపించు అని అంటే? అతని ఆ ప్రశ్నయే అడ్డ ప్రశ్న, అలా అడగడమే తప్పు. ఇప్పుడు మాట అర్థమైంది కదా? ఇంతకంటే మరొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను ఇక ముందుకు వెళ్తాను. అదేమిటి?

ప్రతి రోజు మనం అజాన్ వింటున్నాము కదా? అజాన్ యొక్క చివరి పదాలు ఏంటి చెప్పండి? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్. సామాన్యంగా మనం వుజూ చేసుకున్న తర్వాత గాని, తషహుద్‌లో గాని, వేరే సందర్భాల్లో అవ్వల్ కలిమా తయ్యిబ్ ఏమంటాము తర్వాత? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మనం చిన్నప్పుడు వినేవాళ్ళం కదా, చదివేవాళ్ళం కదా. ఆరు కల్మాల యొక్క వాస్తవికత మరి ఎప్పుడైనా తెలియజేస్తాను ఏంటి అనేది. దానిలో ఉన్న బిద్అతులు ఏంటి అది మరి ఎప్పుడైనా తెలుసుకోండి. కానీ ఇక్కడ అవ్వల్ కలిమా తయ్యిబ్ అని మనలో చాలా ఫేమస్ ఉంది, చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వస్తాము. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కదా? ఇప్పుడు ఎవరైనా అజాన్ తర్వాత చివరిలో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, మంచిదేనా? ఎందుకు? మంచిది కాదు అని అంటున్నాము కదా మనం, ధర్మం కాదు అని అంటున్నాము కదా. అయితే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఈ పదం తప్పా? కాదు. ఇక్కడ ఏమంటాము మనం? ప్రవక్త ఇంతే మనకు నేర్పారు ఇక్కడ అజాన్‌లో. లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వేరే సందర్భాల్లో చదువుతాం మనం. వుజూ చేసిన తర్వాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహ్ అని చదువుతాము. తషహుద్‌లో ఉన్నప్పుడు కూడా మనము అవన్నీ ఎక్కడ చదువుతాము. ఎక్కడ ఏ విధంగా నేర్పారో అక్కడ అలా చదువుతాము. కానీ అజాన్ తర్వాత ఇక్కడ మనకు ఏం నేర్పబడింది? కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద చదివి అజాన్ ఆపేసేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి అడ్డ ప్రశ్న అడిగితే, అరే నేను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కూడా అంటానయ్యా. ఎక్కడైనా ఉందా హదీస్‌లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ చెప్పొద్దు అజాన్ చివరలో అని? అంటే ఏమంటాము? నీ ప్రశ్నయే తప్పు ఇక్కడ. అర్థమైంది కదా? ఆరాధనలలో ప్రవక్త ఎలా చేశారు, ఎలా చేయాలని చెప్పారు, ఎలా చేయాలని అనుమతించారు, లేదా అల్లాహ్ ఎలా మనకు ఆదేశించాడు, అలాగే చేయాలి. కానీ వివిధ జీవితంలోని విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఆమలాత్ అని దేనినైతే అనబడడం జరుగుతుందో, పెళ్లిళ్లు గాని, ఇంకా వ్యాపారాలు గాని, లావాదేవీలు గాని, ఇవన్నిటిలో, భోజనాలు తినే, త్రాగే విషయాల్లో, దుస్తులు ధరించే విషయాల్లో, ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో నహీ, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. పురుషులు చీలమండలానికి కిందిగా డ్రెస్ తొడుగకూడదు. భోజనం చేసేటప్పుడు ఆనుకొని, టేకా తీసుకొని తినకూడదు. ఈ విధంగా ఏ విషయాల నుండి మనల్ని నివారించడం జరిగిందో, వాటికి మనం దూరంగా ఉండాలి. అవి తప్ప మిగతావన్నీ కూడా హలాల్‌గా పరిగణించడం జరుగుతుంది. ఇంకా వేరే ఎన్నో ఆయతులు ఉన్నాయి, హదీసులు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే రండి ఇక.

చాలా దూరం వెళ్ళిపోలేదు. ఈద్-ఎ-మీలాదున్నబీ విషయం ఏదైతే ఉందో, దాని విషయంలో కూడా ఈద్-ఎ-మీలాదున్నబీ చేయకూడదు అని దలీల్ ఎక్కడుంది చూపించండి అని అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నయే తప్పు. ప్రవక్త ఎక్కడ చేశారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత 23 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆ తర్వాత సహాబాలు ఇంచుమించు 100 సంవత్సరాల వరకు ఉన్నారు. చివరి సహాబీ 110 లో చనిపోయారు. ఆ తర్వాత తాబయీన్ కాలం, ఆ తర్వాత తబఎ తాబయీన్ కాలం. సహీహ్ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారంగా, “ఖైరుల్ ఖురూని ఖర్నీ సుమ్మల్లజీన యలూనహుమ్ సుమ్మల్లజీన యలూనహుమ్” ( خَيْرُ الْقُرُونِ قَرْنِي ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ). (అనువాదం: నా కాలం, నా తర్వాత వచ్చే కాలం, ఆ తర్వాత వచ్చే కాలం, సర్వ కాలాల్లో అతి ఉత్తమమైన కాలాలు ఇవి మూడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు). అలాంటి ఉత్తమమైన కాలంలో ఈ బిద్అత్ లేనే లేదు.

అందుగురించి మహాశయులారా, ఇది మంచి కార్యమే కదా, ఎందుకు చేయకూడదు? ఇలాంటి ప్రశ్నల్లో మనం పడే అవసరం లేదు. ప్రవక్త గారు చేశారా? సహాబాలు చేశారా? సహాబాలను అనుసరించినవారైనటువంటి తాబయీన్‌లు చేశారా? ఈ విషయం మనం చూడాలి. మరొక విచిత్రమైన విషయం, అదేమిటంటే కాంట్రడిక్షన్. ఎవరైతే సామాన్యంగా మీలాదున్నబీ జరుపుకుంటూ ఉంటారో, ఏ తారీఖున జరుపుకుంటారు? తారీఖు తెలియదా? 12 రబీఉల్ అవ్వల్. కదా? అయితే ఈ తారీఖు అని మనం ఏదైతే అంటామో, డేట్, ఇవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఎప్పటి నుండి? భూమి, ఆకాశాలు, సూర్య, చంద్రులు అప్పటి నుండి, అవును కదా? “ఇన్న ఇద్దతష్షుహూరి ఇందల్లాహి ఇస్నా అషర షహ్రన్ ఫీ కితాబిల్లాహ్” సూరె తౌబా లోని ఆయత్. అయితే, మీలాదున్నబీ జరుపుకునే వాళ్లలో అధికులు, ఇంచుమించు అందరూ ప్రవక్త గారి గురించి ఒక మాట వారి వద్ద ఏమున్నదంటే, నవూజుబిల్లాహ్ అస్తగఫిరుల్లాహ్, ఒక హదీస్ అని వారు అంటారు కానీ హదీస్ కాదు అది. “అవ్వలు మా ఖలఖల్లాహు నూరీ” (أَوَّلُ مَا خَلَقَ اللَّهُ نُورِي) (అనువాదం: అల్లాహ్ సృష్టించిన వాటిలో మొదటిది నా జ్యోతి). ప్రప్రథమంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నూర్‌ను అల్లాహుతాలా పుట్టించాడు, ఆ తర్వాతనే ఈ లోకమంతా పుట్టించబడింది అని. మొట్టమొదటిసారిగా, తొలిసారిగా, ప్రప్రథమంగా ఎవరిని పుట్టించడం జరిగింది అంటారు వాళ్ళు? సహీహ్ హదీస్ లేదు దానికి కానీ వారు చెప్పే ప్రకారంగా ఎవరిని పుట్టించడం జరిగింది? ప్రవక్త గారి నూర్‌ను. అంటే వారి ప్రకారంగా ప్రవక్త అందరికంటే మొదటిసారిగా పుట్టించబడ్డారు. అయితే మీ విశ్వాస ప్రకారం ప్రవక్త పుట్టినప్పుడు సూర్య చంద్రులు లేవు, భూమి ఆకాశాలు లేవు, పగలు రాత్రి అనేదే లేదు, డేట్ అన్నదే లేదు. మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎందుకు మళ్ళీ బర్త్‌డేలు జరుపుకుంటున్నారు? అర్థమైందా? అర్థమైందా లేదా విషయం? మీ విశ్వాస ప్రకారం అందరికంటే ముందు ఎవరు పుట్టారు? ప్రవక్త, ప్రవక్త యొక్క నూర్. అప్పుడు సూర్య చంద్రులు, ఈ నక్షత్రాలు, ఈ లోకమే లేదు. మరి ఈ తారీఖు అన్న విషయం, డేట్ అన్న విషయం భూమి ఆకాశాలు పుట్టి, సూర్య చంద్రులు తర్వాత కదా? రాత్రి, పగలు ద్వారా మనకు డేట్స్ అనేది ఏర్పడతాయి. ఈ విధంగా వారి మాటయే వారికి విరుద్ధంగా ఉంది.

మరొక విచిత్రమైన విషయం. ఒక మౌల్వీ సాబ్ చాలా పుస్తకం రాశారు, మీలాదున్నబీ చేయవచ్చు అని రుజువు చేయడానికి. స్వయంగా ఆయన ఒకచోట ఏం రాశాడో తెలుసా? ఒక్కచోట రాయలేదు, ఒక హెడ్డింగ్, ఒక సైడ్ హెడ్డింగ్ అని ఏదైతే అంటారో. ఖులఫాయే రాషిదీన్ మరియు సహాబాల కాలంలో మీలాదున్నబీ జరుపుకోకపోవడానికి కారణాలు. అంటే, సహాబాల కాలంలో మీలాదున్నబీ జరగలేదు అని ఒప్పుకుంటున్నారు. కానీ ఇక తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? కొన్ని కారణాలు తెలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే వారు ఒప్పుకుంటున్నారో సహాబాలు కూడా దీనిని చేయలేదు అని, అంటే ఇక ఖురాన్ హదీస్‌లో లేనట్లే కదా. మళ్ళీ మీలాదున్నబీ జరుపుకోవడానికి ఆ ఆయత్ కూడా ఉన్నది, ఫలానా ఆయత్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది, ఫలానా హదీస్ ఉన్నది అని అంటే, ఈ రోజు ఈ హదీసులు, ఈ ఆయతులతోనైతే మీరు దలీల్ చూపుతున్నారో, ఆ ఆయతులు, ఆ హదీసులు సహాబాలకు తెలియలేదా? మరి తెలిస్తే వారెందుకు జరుపుకోలేదు? గమనించండి.

మరియు మన ఏ సోదరులైతే మీలాదున్నబీ జరుపుకుంటున్నారో, వారు ఈ విషయాలపై గ్రహించాలి, ఆలోచించాలి. సూరె యూనుస్ ఆయత్ నంబర్ 57, 58 ద్వారా మీలాదున్నబీ చేయవచ్చు అన్నటువంటి ఒక ఆధారం, సాకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. గమనించండి కొంచెం. “కుల్ బి ఫద్లిల్లాహి వ బిరహ్మతిహి, ఫబిజాలిక ఫల్ యఫ్రహూ” (قُلْ بِفَضْلِ اللَّهِ وَبِرَحْمَتِهِ فَبِذَٰلِكَ فَلْيَفْرَحُوا). బి ఫద్లిల్లాహి, అల్లాహ్ యొక్క దయ, వ రహ్మతిహి, అల్లాహ్ యొక్క కారుణ్యం. అల్లాహ్ యొక్క దయ మరియు కారుణ్యం మీకు లభించినది అంటే, మీరు సంతోషించండి. ఖురాన్ యొక్క ఆయత్ యొక్క భావం, తర్జుమా. కానీ ఉర్దూలో అల్లాహ్ కా ఫజ్ల్ ఔర్ ఉస్కి రహ్మత్ జబ్ యే పాయే తో వో ఖుష్ హో జాయే. సంబరపడాలి, సంతోషించాలి. దాంట్లో కొంచెం పదం ఏలుపు… పెంచుతారు. ఖుషీ మనాయో. ఖుష్ హో జావో, ఖుషీ మనాయో. సంతోషించండి, సంబరపడండి. సంతోషాలను, మీ సంబరాలను ఒక ఉత్సవంగా జరుపుకోండి. ఈ రెండిటిలో తేడా ఉందా లేదా? ఒక నిమిషం.

అయితే ఇది 58వ ఆయత్. కానీ ఈ అల్లాహ్ యొక్క దయ, ఈ అల్లాహ్ యొక్క కారుణ్యం, అల్లాహ్ దేని గురించి చెప్తున్నాడు? ఏంటిది అది? అయితే 57వ ఆయత్‌లో ఉంది. “యా అయ్యుహన్నాసు కద్ జాఅత్కుమ్ మౌఇజతుమ్ మిర్రబ్బికుమ్” (يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَتْكُم مَّوْعِظَةٌ مِّن رَّبِّكُمْ). ఖురాన్ గురించి. అంటే ఈ ఖురాన్ గ్రంథం అల్లాహ్ యొక్క గొప్ప దయ, అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యం. ఇది రావడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి రోగాలు దూరమైపోయినాయి, మీలో ఉన్నటువంటి పరస్పరం కోపాలు, ద్వేషాలు ఇవన్నీ దూరమయ్యాయి, షిర్క్, బిద్అతులు ఇవన్నీ దూరమైపోయాయి, విశ్వాస మార్గం మీకు లభించినది, మీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలు కూడా దూరమైపోయి మీరు సన్మార్గం వైపునకు వచ్చారు. ఖురాన్ అల్లాహ్ యొక్క గొప్ప దయ, గొప్ప కారుణ్యం. ఇది వచ్చినప్పుడు మీరు దీనిని సంతోషించాలి. అయితే ఏమంటారో తెలుసా? ఖురాన్ అవతరించినప్పుడు అల్లాహ్ దీనిని ఒక గొప్ప కారుణ్యం, గొప్ప దయ అని తెలిపి సంతోషపడాలి, సంతోషించాలి, ఉత్సవాలు జరుపుకోవాలి అని ఏదైతే మనకు అల్లాహ్ తెలుపుతున్నాడో, ఈ ఖురాన్ ఎవరి ద్వారా వచ్చింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త పుట్టిన రోజును మనం ఎంత గొప్పగా జరుపుకోవాలి, మీరే ఆలోచించండి. ఓ నిజంగానే చాలా గొప్ప విషయం అని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ మళ్ళీ ప్రశ్న, అదేంటి? ఈ ఆయత్ ఎవరిపై అవతరించింది? ఈ రోజు మనపై అవతరించిందా? మీలాదున్నబీ జరుపుకునే వాళ్ళ మీద అవతరించిందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించింది. మరి ప్రవక్త ఇలాంటి మీలాదున్నబీ జరుపుకోవాలి అని ఈ ఆయత్ ద్వారా ఎక్కడైనా చెప్పారా? మరి ఈ విషయం సహాబాలకు బోధపడలేదా? ఈ రోజు ఈ భావం తీసుకోవడానికి ఎక్కడ మనకు హక్కు ఉన్నది?

మరియు ఖురాన్ హదీసులను మనం పరిశీలిస్తే, అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పుట్టుకను కేవలం గొప్ప కారుణ్యంగా చెప్పలేదు అల్లాహుతాలా. ఏ రోజు ప్రవక్తకు ప్రవక్త పదవి లభించినదో, ఏ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ లభించినదో, దానిని అల్లాహుతాలా ఒక గొప్ప కారుణ్యంగా చెబుతున్నాడు. సూరె ఆలి ఇమ్రాన్‌లో “లఖద్ మన్నల్లాహు అలల్ ముఅమినీన ఇజ్ బఅస ఫీహిమ్” ( لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ). అల్లాహుతాలా విశ్వాసులపై ఎంతో అనుగ్రహించాడు. “ఇజ్ బఅస ఫీహిమ్” ( إِذْ بَعَثَ فِيهِمْ) (వారిలో ఒక ప్రవక్తను పంపినప్పుడు). ఎలా? వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకొని వారి మధ్య ఒక సందేశ దూతగా అల్లాహుతాలా పంపాడు. ఆ సందేశ దూత ఖురాన్ ఆయతులను పఠిస్తారు వారి మధ్యలో. మరియు వారిని శుభ్రపరుస్తారు. చక్కదిద్దుతారు. వారికి ఖురాన్, హదీసులను నేర్పుతారు. గమనించండి. ఖురాన్, హదీసులను నేర్పడం, అల్లాహ్ ఆయతులను పఠించడం, ప్రజలను షిర్క్, దుర్మార్గం, బిద్అత్, అన్ని రకాల చెడుల నుండి మంచి వైపునకు తీసుకురావడం, దీనిని ఒక గొప్ప అనుగ్రహంగా ప్రస్తావిస్తున్నారు. మరి ఇంతకుముందు మనం ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే విన్నామో, అందులో మరొక విషయం కూడా ఉన్నది. అదేమిటి?

ప్రవక్తా, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈ సోమవారం రోజున అని అడిగినప్పుడు, ఇదే రోజు నేను పుట్టాను, జన్మించాను. “వ బుఇస్తు” ( وَبُعِثْتُ). మరియు అదే రోజు నాకు ప్రవక్త పదవి లభించినది. ప్రవక్త పదవి లభించినది. అయితే ఈ ప్రవక్త పదవి లభించడం, ప్రవక్తకు ప్రవక్త పదవి లభించి మనకు ఏ సన్మార్గం అయితే లభించినదో, ఇది చాలా గొప్ప విషయం.

అందుగురించి సోదరులారా, ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, గ్రహిస్తూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి. చివరికి ఒక సంక్షిప్తంగా, ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం మీలాదున్నబీకి సంబంధించిన ఒక తెలుగులో ఒక టాపిక్, ఒక ప్రసంగం చేశాను. అందులో ఈ బిద్అత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది కూడా వివరంగా తెలిపాను, తెలియజేశాను. కానీ మన అఖండ భారత్‌లో అంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇదంతా విడిపోక ముందు, సంగతి గురించి అప్పుడు తొలిసారిగా మన ఏరియాలో, భారతదేశంలో ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, ఆ జులూస్ 5 జులై 1933లో స్టార్ట్ అయింది అని, ఈ మీలాదున్నబీ యొక్క జులూస్ ఏదైతే వెళ్తుందో, అది 5 జులై 1933లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ పరిపాలన అక్కడ జరుగుతుంది. వారి నుండి దీని గురించి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకొని వారు కొందరు దీనిని చేశారు. దీనిని ఇలా జరుపుకోవడానికి కారణం ముఖ్యంగా ఏంటో తెలుసా? పండితులు కాదు దీనిని స్టార్ట్ చేసిన వారు.

క్రైస్తవులు, ఇంకా వేరే మతస్తులు వారి మత పెద్దల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. జరుపుకుంటూ ఉంటారు కదా? క్రిస్మస్ అని కానీ, గాంధీ జయంతి అని కానీ, ఇంకా అంబేద్కర్ గారు జన్మించిన జన్మదినం గాని, ఇంకా వేరే ఎన్నో రకాలుగా ఎందరో పెద్దలు, మహానుభావుల జన్మదిన వేడుకలు జరుగుతూ ఉంటాయి. అయితే వాళ్ళందరూ వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నప్పుడు, మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారు ఎవరు? వారి యొక్క జన్మదిన వేడుకలు మనం ఎందుకు జరుపుకోకూడదు? మనం ఆ రోజున ఎందుకు జులూస్ తీయకూడదు? ఇలాంటి ఆలోచన వారిలో వచ్చి, ఇలాంటి ఒక బిద్అత్‌కు వారు ఒక పునాది నాటారు. అప్పటి నుండి ఇది మొదలైంది ఈ ఏరియాలో. మరి ఇక్కడ మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసును గ్రహించాలి. “మన్ తషబ్బహ బి కౌమిన్ ఫహువ మిన్హుమ్” (مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ). (ఎవరైతే ఇతర జాతుల, ఇతర మతస్తుల, ఇతర ధర్మాలను అనుసరించే వారి యొక్క పోలికను అవలంబిస్తాడో, వారి గతి వారితోనే అయిపోతుంది). అల్లాహు అక్బర్ అస్తగఫిరుల్లాహ్. ఇది ఇష్టమేనా మనలో ఎవరికైనా?

అల్లాహ్ ఏమంటున్నాడు మనకు? “వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” (وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ). (మీకు చావు వచ్చినా కానీ ఇస్లాంపై, కల్మా చదువుతూ, ఇస్లాం ప్రకారంగా మీ చావు రావాలి). అంటే, చచ్చేవరకు మీరు ఇస్లాంపై జీవించాలి. అందుగురించి, బర్త్‌డేలు జరుపుకోవడం, అది ప్రవక్త బర్త్‌డే గాని, స్వయంగా మన బర్త్‌డేలు గాని, ఇంకా వేరే ఏ విషయాలు కానీ, ఇస్లాంకు వీటికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఇందులో మనకు పుణ్యం లభించదు, పాపం అవుతుంది. అల్లాహ్ ఇలాంటి బిద్అతుల నుండి, దురాచారాల నుండి మనందరినీ కూడా కాపాడుగాక.

జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఇంకా చదవండి:

దైవప్రవక్తపై దురూద్‌, సలాం పంపే ఆదేశం షరీయత్‌ బద్ధమైనది – డా. సాలెహ్ అల్ ఫౌజాన్

బిస్మిల్లాహ్

masjid nabawi

అల్లాహ్‌ తన షరీయత్‌లో తన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) యెడల ముస్లింలు నెరవేర్చవలసిన బాధ్యతలను విశదీకరించాడు. వాటిలో ఒకటి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌ సలాంలు పంపటం.

అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో ఈ విధంగా ఆదేశించాడు :

إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దురూద్‌ పంపండి. అత్యధికంగా సలాములు (కూడా) పంపుతూ ఉండండి. (అల్‌ అహ్‌జాబ్‌ : 56)

ఇమామ్‌ బుఖారీ గారు అబుల్‌ ఆలియాతో ఇలా అన్నారు :

అల్లాహ్‌ దురూద్‌ పంపించటమంటే అర్థం, ఆయన తన దూతల ముందు తన ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను మెచ్చుకుంటాడు. దైవదూతలు దురూద్‌ పంపటమంటే భావం వారు “దుఆ” చేస్తారు. మనుషులు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు దురూద్‌ పంపటమంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) మన్నింపు కొరకు, కారుణ్యం కొరకు అల్లాహ్‌ను అర్థించటం అన్నమాట.”

పై సూక్తి ద్వారా మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) స్థాయి, అంతస్తు ఎంత గొప్పదో అర్ధమవుతోంది. ఊర్ధ్వ లోకాలలో అల్లాహ్ తన సమీప దూతల ముందు ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను ప్రశంసించాడు. దైవదూతలు కూడా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ఉన్నత స్థానాల కోసం ప్రార్థిస్తున్నారు. భూలోకవాసులు కూడా ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) కారుణ్యం కొరకు ప్రార్థించవలసిందిగా అల్లాహ్ ఆదేశించాడు – ఆ విధంగా ఊర్థ్వలోకాల వారు, భూలోక వాసులు కూడా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)ను శ్లాఘించటంలో ఏకమవ్వాలన్నది అల్లాహ్ అభిమతం. ఎంతటి ఉన్నత స్థానం!

సల్లిమూ తస్లీమా” అంటే ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఇస్లామీయ అభివాదం పంపమని అర్థం. కాబట్టి ఎవరయినా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు దురూద్‌ పంపదలచినపుడు దురూద్‌తో పాటు సలామ్‌ని కూడా పంపాలి. కేవలం ఒక్క దానితో సరిపెట్టుకోకూడదు. కేవలం “సల్లల్లాహు అలైహి” అని అనరాదు. కేవలం ‘“అలైహిస్సలాంఅని కూడా అనరాదు. ఎందుకంటే రెండింటినీ ఒకేసారి పలకాలన్నది దైవాజ్ఞ.

ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌ పంపమని ఎన్నో చోట్ల నొక్కి చెప్పబడింది. కొన్ని చోట్ల తప్పనిసరి (వాజిబ్‌) అని అనబడితే, కొన్నిచోట్ల అలా చేయటం అభిలషణీయం (ముస్తహబ్‌) అనీ, సున్నతె ముఅక్కదా అని కూడా వక్కాణించబడింది.

అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్‌ (రహిమహుల్లాహ్) తన పుస్తకం “జలాఅల్‌ అఫ్‌హామ్‌” లో 41 చోట్ల, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌, సలాంలను పంపటం మస్నూన్‌ (సున్నత్‌) అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా అన్నారు :

“మొదటి చోట : అన్నిటికన్నా ముఖ్యమైన, గట్టిగా నొక్కి వక్కాణించబడిన చోటు నమాజ్‌ – నమాజ్‌లోని చివరి తషహ్హుద్‌ (చివరి ఖాయిదా)లో దురూద్‌ పంపాలి. ఈ విషయంలో ముస్లిములందరి మధ్యా ఏకాభిప్రాయం ఉంది. కాని ఇక్కడ అది వాజిబ్‌ (తప్పనిసరి) అనే విషయంలో మటుకు భేదాభిప్రాయం ఉంది.” (జలాయిల్‌ అఫ్‌హామ్‌ – పేజీ : 222, 223).

తరువాత ఆయన దురూద్‌ పంపవలసిన సందర్భాలేవో (ప్రసంగాల)లో జుమా ప్రసంగం, పండుగల ప్రసంగం, ఇస్తిస్ఖ ప్రసంగం, ముఅజ్జిన్‌ అజాన్‌ పలుకులకు సమాధానం పలికినప్పుడు, మస్జిద్లో ప్రవేశించినప్పుడు, మస్జిద్ నుండి వెడలినప్పుడు, ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రస్తావన వచ్చినప్పుడు. ఆ తరువాత అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్‌ (రహిమహుల్లాహ్) ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌ పంపటం వల్ల కలిగే సత్ఫలితాలను, ప్రయోజనాలను విశదీకరించారు. ఈ సందర్భంగా ఆయన 40 ప్రయోజనాలను ప్రస్తావించారు. (జిలాఉల్‌ అఫ్‌హామ్‌ – పేజీ : 302)

వాటిలో కొన్ని ప్రయోజనాలివి :

1. ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌ పంపటమంటే అల్లాహ్‌ ఆదేశపాలన చేయటమే.

2. ఒకసారి దురూద్‌ పంపిన వానిపై అల్లాహ్‌ తరఫున పది కారుణ్యాలు అవతరి స్తాయి (ముస్లిం).

3. ‘దుఆ ప్రారంభంలో దురూద్‌ పంపటం వల్ల ఆ దుఆ స్వీకారయోగ్యమయ్యే అవకాశాలు పెరిగిపోతాయి.

4. దురూద్‌ పంపటంతో పాటు ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం)కు ప్రశంసాత్మకమయిన స్థానం కూడా ప్రసాదించమని వేడుకున్నట్లయితే, ఆ వ్యక్తి ఆయన (సల్లలాహు అలైహి వ సల్లం) సిఫారసుకు హక్కుదారుడై పోతాడు.

5. దురూద్‌ (పంపటం) పాపాల మన్నింపునకు సాధనం.

6. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దురూద్‌, సలామ్‌లు పంపిన వ్యక్తి దానికి జవాబుగా ప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వారి ‘ప్రతిసలాం’కు హక్కుదారుడై పోతాడు.

మహాప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)పై దైవ కారుణ్యం మరియు శాంతి వర్షించుగాక!


ఇది అఖీదా-తౌహీద్ (దేవుని ఏకత్వం) – డా. సాలెహ్ అల్ ఫౌజాన్ [పుస్తకం] నుండి తీసుకోబడింది (పేజీలు 185-186)

హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ వృత్తాంతం

బిస్మిల్లాహ్

10వ అధ్యాయం – హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)పై నిందారోపణ

1763. విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హాా)తనపై అపవాదు వేసిన వారి మాటలను గురించి ఇలా తెలియజేశారు :-

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి నిర్ణయించుకుంటే, తమ భార్యలను గురించి చీటి వేసి, అందులో ఎవరి పేరు వస్తే ఆమెను తమ వెంట తీసికెళ్ళేవారు. ఒక యుద్ధ [1] సందర్భంగా దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) మాలో ఎవరిని తమ వెంట తీసికెళ్ళాలనే విషయమయి చీటీ వేశారు. ఆ చీటీలో నా పేరు వచ్చింది. అప్పుడు నేను ఆయన వెంట బయలుదేరాను. ఈ సంఘటన పరదా ఆదేశం అవతరించిన తరువాత జరిగింది. అందువల్ల నన్ను ఒంటె మీద అంబారీలో కూర్చోబెట్టారు. ఒంటె మీది నుంచి దిగవలసి వచ్చినప్పుడు నన్ను అంబారీలో ఉంచే క్రిందికి దించేవారు. సరే మేము బయలుదేరాము. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఆ యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో మేము మదీనా పట్టణానికి కొన్ని మైళ్ళ దూరంలో ఒక ప్రదేశానికి చేరుకునేటప్పటికి చీకటి పడింది. ఆ రాత్రికి అక్కడ విడిది చేయాలని ప్రకటించబడింది.

నేనీ ప్రకటన విని (ఒంటె మీది నుంచి నా అంబారీని దించిన తరువాత) సహజ అవసరార్ధం సైన్యాలకు కాస్త దూరంగా బహిర్భూమికి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను నా అంబారీ దగ్గరకు తిరిగొచ్చి కంఠం దగ్గర చేయి పెట్టి చూసుకుంటే నా ముత్యాల హారం కన్పించలేదు. అది తెగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించి వెనక్కి వెళ్ళి వెతకడం ప్రారంభించాను. ఇలా వెతుక్కోవడంలో ఆలస్యమయిపోయింది. ఈలోగా నా అంబారీ ఎత్తే వాళ్ళు నేను అంబారీలో కూర్చొని ఉన్నాననుకొని దాన్ని ఎత్తి నా ఒంటె మీద పెట్టారు. ఆ రోజుల్లో మేము స్రీలము అన్నం తక్కువగా తినడం వల్ల బక్కగా ఉండేవాళ్ళము. ఎముకల మీద మాంసమే ఉండేది కాదు. అందువల్ల వారు నా అంబారీ ఎత్తి పెట్టేటప్పుడు బరువును అంచనా వేయలేకపోయారు. అదీగాక నేను నవ యౌవనంలో ఉండిన బాలికను. ఆ తరువాత వారు ఒంటెను లేపి వెళ్ళిపోయారు. నేను నా కంఠహారం వెతుక్కొని తిరిగి వచ్చేటప్పటికి సైన్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అక్కడ పిలిచేవారు గాని, కేక వేస్తే జవాబిచ్చేవారు గాని ఎవరూ లేరు. నేను అంబారీలో కన్పించకపోతే వాళ్ళే నా దగ్గరకు తిరిగొస్తారని తలచి నేను సైన్యం విడిది చేసిన ప్రదేశంలోనే కూర్చున్నాను.

కాస్సేపటికి నాకు నిద్ర వచ్చి పడుకున్నాను. హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ సలమి  జక్వానీ  (రది అల్లాహు అన్హాు)సైన్యాలకు వెనకాలగా నడచి వస్తున్నారు. ఆయన మరునాడు ఉదయం నేను నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఎవరో పడుకున్నారని తలచి ఆయన సమీపానికి వచ్చి చూశారు. ఆయన లోగడ పరదా ఆదేశం రాక పూర్వం నన్ను చూసి ఉండటం వల్ల, దగ్గరికొచ్చి చూడగానే నన్ను గుర్తుపట్టి “ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజివూన్‌” అన్నారు. ఈ అలికిడికి నేను కళ్ళు తెరిచాను. ఆయన్ని చూసి వెంటనే ఓణీతో నా ముఖాన్ని కప్పుకున్నాను. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. మేము ఒకరితోనొకరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నేనాయన నోట “ఇన్నాలిల్లాహి” అనే మాట తప్ప మరేదీ వినలేదు. ఆ తరువాత ఆయన ఒంటె (దిగి దాని)ని నేల మీద కూర్చోబెట్టారు. నేను లేచి దాని మీద ఎక్కి కూర్చున్నాను. ఆయన ఒంటె ముక్కుతాడు పట్టుకొని ముందుకు నడిచారు. ఈ విధంగా మేము ఎండ పెటపెటలాడే (మిట్ట మధ్యాహ్నం) వేళకు సైన్యాలు విడిది చేసిన చోటుకు చేరుకున్నాము. (ఈ మాత్రం సంఘటనకే) వారు (నా మీద అపవాదు వేసి) నాశనమయ్యారు. ఈ అపవాదును లేపడంలో అబ్దుల్లా బిన్‌ ఉబై ప్రధాన పాత్ర వహించాడు.

ఈ హదీసును ఉల్లేఖించిన వారిలో ఒకరైన హజ్రత్‌ ఉర్వా (రహిమహుల్లాహ్) ఇలా తెలియజేస్తున్నారు:- అతని (అంటే అబ్దుల్లా బిన్‌ ఉబై) సమావేశంలో ఈ అపవాదును గురించి బాహాటంగా చర్చ జరిగింది. రకరకాల మాటలు కల్పించబడ్డాయి. అతను వారిని సమర్ధిస్తూ వారు చెప్పే ప్రతి మాటనూ శ్రద్ధగా వింటూ విషయం మరింత తీవ్రరూపం దాల్చేలా (దానికి మిర్చీ మసాలా రాసి) మాట్లాడేవాడు. అపవాదు లేపిన వారిలో హస్సాన్‌ బిన్‌ సాబిత్ (రది అల్లాహు అన్హాు), మిస్తహ్‌ బిన్‌ ఉసాసా (రది అల్లాహు అన్హాు),హమ్నా బిన్త్ జహష్‌ (రది అల్లాహు అన్హా)ల పేర్లు మాత్రమే నాకు తెలుసు. వీరే కాకుండా మరికొందరు కూడా ఉన్నారు. వారి [2] పేర్లు నాకు తెలియదు. కాకపోతే దివ్య ఖుర్‌ఆన్‌లో “ఈ అపవాదును మీలోనే ఒక ముఠా లేపింది” (24:11) అనే సూక్తిని బట్టి వారొక ముఠాకు చెందిన వారని మాత్రం నాకు తెలుసు. ఆ ముఠాలో ప్రధాన సూత్రధారి అబ్దుల్లా బిన్‌ ఉబయ్యె. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తన ముందు ఎవరైనా హజ్రత్ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)ని మాత్రం నిందిస్తే సహించేవారు కాదు. “నా తల్లిదండ్రులు, నా గౌరవ ప్రతిష్టలు ముహమ్మద్‌ మహనీయు (సల్లలాహు అలైహి వ సల్లం)ని గౌరవ ప్రతిష్టల పరిరక్షణకై సమర్పితం. అందులోనే నా గౌరవం ఇమిడి ఉంది – అనే కవిత హస్సానే కదా చెప్పింది” అని అంటారు ఆమె. హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)(తమ కథనాన్ని) కొనసాగిస్తూ ఇలా తెలియజేస్తున్నారు :-

ఆ తరువాత మేము మదీనాలో ప్రవేశించాము. మదీనా తిరిగొచ్చిన తరువాత నేను ఓ నెల రోజుల దాకా జబ్బుపడ్డాను. అపవాదు లేపిన వారి మాటలు విని ప్రజలు పరి పరి విధాలా చెప్పుకునేవారు. కాని నాకా సంగతే తెలియదు. అయితే నేను ఇది వరకు జబ్బు పడినప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా పట్ల కనబరిచే ప్రేమ, సానుభూతుల్ని ఇప్పుడు జబ్బు పడి ఉన్నప్పుడు కనబరచకపోవడం గమనించి నాక్కొంచెం అనుమానం వచ్చేది. నేనీ జబ్బుపడి ఉన్న రోజుల్లో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా దగ్గరికి వచ్చి సలాం మాత్రం చేసేవారు. (నా ఆరోగ్యం గురించి నన్నడగకుండా) “ఈవిడకు ఎలా ఉంది?” అని (ఇంట్లో ఉండే ఇతర సభ్యుల్ని) అడిగేవారు. ఈ ధోరణి మాత్రమే నాక్కాస్త అనుమానం కలిగించేది (ఆయన నా మీద అలిగారేమోనని). అంతకు మించి నాకు అపవాదు గురించి బొత్తిగా తెలియదు.

నేను జబ్బు నుండి కొంచెం కోలుకున్న తరువాత ఓ రోజు ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)తో కలసి “మనాసా” ప్రదేశానికి బయలుదేరాను. ఇది మా స్త్రీల బహిర్భూమి. మేమక్కడికి రాత్రి వేళల్లో మాత్రమే వెళ్ళొస్తుంటాము. ఇది మా ఇండ్ల దగ్గర మరుగుదొడ్లు నిర్మించబడని నాటి సంగతి. ప్రాచీన అరబ్బుల అలవాటు ప్రకారం మేము బహిర్భూమి కోసం (ఊరి బయట చెట్టు చేమలుండే) అడవి ప్రదేశానికి వెళ్ళేవారము. ఆనాడు ఇండ్ల సమీపంలో మరుగుదొడ్లు నిర్మించడాన్ని జనం అసహ్యించుకునేవారు. ఉమ్మె మిస్తహ్‌ (అంటే మిస్తహ్‌ తల్లి) అబూరహమ్‌ బిన్‌ ముత్తలిబ్‌ బిన్‌ అబ్దుమునాఫ్‌ గారి కుమార్తె. ఆమె తల్లి బిన్తె సఖర్‌ బిన్తె ఆమిర్‌ (మా నాన్న) హజ్రత్‌ అబూబకర్‌ (రది అల్లాహు అన్హాు)కు పినతల్లి అవుతుంది. నేను ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)ఆ తరువాత బహిర్భూమి నుండి ఇంటికి తిరుగు ముఖం పట్టాము. దారిలో ఉమ్మె మిస్తహ్‌ (రది అల్లాహు అన్హా)కాలు దుప్పటిలో ఇరుక్కుపోయి ఆమె తూలి పడిపోయింది. అప్పుడామె (అప్రయత్నంగా) “మిస్తహ్‌ పాడుగాను!” అని అన్నది. నేను (విషయం అర్ధం గాక) “నువ్వు చాలా దారుణమైన మాటన్నావు. బద్ర్‌ యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని నిందిస్తున్నావా నువ్వు?” అని అడిగాను. దానికామె “పిచ్చి పిల్లా! అతనేమన్నాడో నీకేమైనా తెలుసా?” అని అన్నది. నేను “ఎమన్నాడేమిటి?” అని అడిగాను. అప్పుడామె నాపై అపనింద వేసిన వారు ఎలాంటి మాటలు కల్పించి ప్రచారం చేస్తున్నారో తెలియజేసింది. ముందే జబ్బు పడి ఉన్న నేను ఈ మాటలు వినడంతో నా జబ్బు మరింత ఎక్కువైపోయింది. నేను ఇంటికి చేరుకునేటప్పటికి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వచ్చి ఉన్నారు. నన్ను చూసి ఆయన సలాం చేశారు. ఆ తరువాత “ఈవిడ పరిస్థితి ఎలా ఉంది?” అని అడిగారు (ఇంట్లోని ఇతర సభ్యులతో). నేనాయనతో “నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతిస్తారా?” అని అన్నాను. ఈ అనుమతి అడగడంలో నా ఉద్దేశ్యం, నా తల్లిదండ్రుల ఇంటికెళ్ళి ఈ వదంతి గురించి నిజానిజాలు తెలుసుకోవాలన్నదే. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నాకు పుట్టింటికి వెళ్ళేందుకు అనుమతిచ్చారు. నేను (వెళ్ళి మా అమ్మతో “అమ్మా! జనం ఏమిటి ఇలా చెప్పుకుంటున్నారు?” అని అడిగాను. దానికామె సమాధానమిస్తూ “అమ్మా! బాధపడకు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. సాధారణంగా ఎవరికైనా అందమైన భార్య ఉండి అతనామెను బాగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆమె సవతులు ఆమెలో ఎదో ఒక లోపాన్ని ఎత్తి చూపుతూనే ఉంటారు. ఇది సహజం” అని అన్నది. నేనీ మాట విని “సుబ్‌హానల్లాహ్‌! (ఆశ్చర్యార్ధక పదం) ఇప్పుడు మరికొందరు కూడా ఇలాంటి అభూత కల్పనలకు పాల్పడుతున్నారా?” అని అన్నాను. ఆ రాత్రంతా నా కంటిమీద కునుకే లేదు. తెల్లారే దాకా ఏడుస్తూనే ఉండిపోయాను. తెల్లవారిన తరువాత కూడా నా కన్నీరు ఆగలేదు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) దివ్యావిష్కృతి (వహీ) అవతరణలో ఆలస్యమయినందున హజ్రత్‌ అలీ బిన్‌ అబూ తాలిబ్‌ (రది అల్లాహు అన్హాు), హజ్రత్‌ ఉసామా బిన్‌ జైద్‌ (రది అల్లాహు అన్హాు)లను పిలిపించి, ఆయన తమ భార్య నుండి (అంటే నా నుండి) విడిపోయే విషయమయి వారిద్దర్నీ సంప్రదించారు. అప్పుడు హజ్రత్‌ ఉసామా (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీ  భార్యామణిని మీ నుండి వేరు చేయకండి. ఆమెలో మేము మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. అయితే హజ్రత్‌ అలీ మాట్లాడుతూ “దైవప్రవక్తా! అల్లాహ్ మీకు ఎలాంటి ఇబ్బందీ పెట్టలేదు. ఆయిషా (రది అల్లాహు అన్హా)యే గాకుండా (లోకంలో) చాలా మంది స్త్రీలున్నారు. మీరామె సేవకురాలిని అడిగి చూడండి, ఆమె వాస్తవమేమిటో చెబుతుంది” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (నా సేవకురాలు) హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)ను పిలిపించి “బరీరా! నీకు ఆయిషా (రది అల్లాహు అన్హా) పట్ల అనుమానం కలిగించే సంఘటన ఎదైనా జరిగినట్లు నువ్వు చూశావా?” అని అడిగారు. హజ్రత్‌ బరీరా (రది అల్లాహు అన్హా)సమాధానమిస్తూ “మీకు సత్యధర్మమిచ్చి పంపిన శక్తి స్వరూపుని సాక్షి! హజ్రత్ ఆయిషా (రది అల్లాహు అన్హా)లో నాకు అనుమానం కలిగించే ఎలాంటి చెడు విషయం నేనింతవరకు చూడలేదు. కాకపోతే ఆమె ఇంకా చిన్నపిల్లే అయినందున, ఇంట్లో పిండి కొట్టి ఉంచితే దాన్ని (నిర్లక్ష్యంగా) వదిలేసి నిద్రపోతుంది. ఈలోగా మేక వచ్చి దాన్ని కాస్తా తినిపోతుంది” అని అన్నది.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ఈ మాటలు విన్న తరువాత ఆ రోజే (మస్జిద్లో) వేదిక ఎక్కి (కపట విశ్వాసి) అబ్దుల్లా బిన్‌ ఉబైని శిక్షించే విషయం గురించి ప్రజలను అడిగారు. ఆయన ప్రజలను సంబోధిస్తూ ఇలా అన్నారు: “(సోదర) ముస్లింలారా! నా భార్యపై అపనింద మోపి నన్ను, నా కుటుంబాన్ని బాధించిన వ్యక్తిపై నా తరపున ప్రతీకారం తీర్చుకునేవారు ఎవరైనా ఉన్నారా? అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను నా భార్యలలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు. అపవాదు మోపబడిన ఆ వ్యక్తిలో కూడా నేనింతవరకు ఎలాంటి చెడు చూడలేదు. అతను నా ఇంటికి ఎప్పుడొచ్చినా నేనింట ఉన్నప్పుడే వచ్చేవాడు. నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పలికిన ఈ మాటలు విని బనీ అబ్దుల్ అష్‌హల్‌ ఉప తెగకు చెందిన హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)లేచి “దైవప్రవక్తా! నేను మీ తరపున ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ వ్యక్తి ఔస్‌ తెగవాడై ఉంటే నేను స్వయంగా అతడ్ని హతమారుస్తాను. ఒకవేళ అతను మా సోదర తెగ ఖజ్‌రజ్ కు చెందిన వాడయితే అతడి గురించి మీరు ఆజ్ఞాపించండి, మేము మీ  ఆజ్ఞను పాటిస్తాము” అని అన్నారు. ఈ మాట విని ఖజ్రజ్‌ తెగ నాయకుడు హజ్రత్  సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)లేచి నిలబడ్డారు. ఆయన హజ్రత్‌ హస్సాన్‌ బిన్‌ సాబిత్‌ (రది అల్లాహు అన్హాు)తల్లికి వరుసకు సోదరుడవుతారు. (అంటే ఆమె పిన తండ్రి కొడుకు). ఆయన సాధారణంగా మంచి మనిషే. కాని సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)మాటలు విన్న తరువాత ఆయనలో అజ్ఞాన కాలంనాటి జాతీయ దురభిమానం పెల్లుబికింది. దాంతో ఆయన (ఉద్రేక పూరితుడయి) “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నీవు అబద్ధమాడుతున్నావు. నీవతడ్ని హతమార్చవు, హతమార్చలేవు కూడా. అతను గనక నీ తెగవాడయి ఉంటే, అతను చంపబడటానికి నీవు ఎన్నటికీ కోరవు” అని అన్నారు హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)తో.

హజ్రత్‌ సాద్‌ బిన్‌ ముఆజ్‌ (రది అల్లాహు అన్హాు)పిన తండ్రి కొడుకు హజ్రత్‌ ఉసైద్‌ బిన్‌ హజీర్‌ (రది అల్లాహు అన్హాు)ఈ మాట విని (దిగ్గున) లేచి నిలబడ్డారు. ఆయన సాద్‌ బిన్‌ ఉబాదా (రది అల్లాహు అన్హాు)ని సంబోధిస్తూ “నిత్య జీవుడయిన ప్రభువు సాక్షి! నువ్వొట్టి అబద్దాల రాయుడివి. మేమతడ్ని తప్పకుండా సంహరిస్తాం. నువ్వు కపట విశ్వాసిలా ఉన్నావు. అందుకే నువ్వు కపట విశ్వాసుల కొమ్ముకాస్తున్నావు అని అన్నారు.” ఈ సంభాషణ పెద్ద వివాదానికి దారి తీసింది. ఔస్‌, ఖజ్రజ్ రెండు తెగలు పరస్పరం భగ్గుమన్నాయి. కొట్లాటకు సిద్దమయ్యాయి. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) వేదికపై నిలబడి ఉభయ తెగల వారికీ మాటి మాటికి సర్ది చెబుతూ వారిని శాంతపరచడానికి ప్రయత్నించారు. చివరికి ఎలాగో అందరూ శాంతించారు. గొడవ సద్దుమణిగింది. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కూడా మౌనంగా ఉండిపోయారు. నేనా రోజంతా ఏడుస్తూనే  ఉండిపోయాను. కంటి మీద కునుకు కూడా రాలేదు.

నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉన్నారు. నేనిలా ఒక పగలు, రెండు రాత్రులు నిరంతరాయంగా దుఃఖిస్తూ ఉన్నాను. కన్నీరు ఆగలేదు. నిద్ర కూడా పట్టలేదు. ఏడ్చి ఏడ్చి నా గుండె పగిలి పోతుందా అన్పించింది. కాస్సేపటికి ఒక స్త్రీ వచ్చి లోపల ప్రవేశించడానికి అనుమతి అడిగింది. నేనామెకు అనుమతిచ్చాను. ఆమె కూడా నాతోపాటు కూర్చొని ఏడ్వసాగింది. మేమా స్థితిలో ఉన్నప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) (మా ఇంటికి) వచ్చారు. ఆయన సలాం చేసి కూర్చున్నారు. నా మీద అపనింద మోపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఆయన నా దగ్గర కూర్చోలేదు. ఒక నెల గడచిపోయినా అపనింద విషయంలో ఆయనపై ఎలాంటి దివ్యావిష్కృతి (వహీ) అవతరించలేదు.

ఆయన కూర్చొని ముందుగా షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. ఆ తరువాత ఇలా అన్నారు : “ఆయిషా! నీ గురించి నేనీ మాట విన్నాను. నీవు ఏ పాపమెరగని దానివయితే త్వరలోనే అల్లాహ్ నీ పాతివ్రత్యాన్ని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ నీ వల్ల ఎదైనా తప్పు జరిగి ఉంటే, పశ్చాత్తాప హృదయంతో అల్లాహ్ ముందు క్షమాపణ వేడుకో. దాసుడు తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకుంటే, అల్లాహ్ అతని పాపాన్ని (తప్పకుండా) క్షమిస్తాడు.”

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ సంభాషణ ముగించగానే నా కన్నీటి ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ తరువాత నా కళ్ళ నుంచి ఒక్క కన్నీటి బిందువు కూడా రాలలేదు. నేను మా నాన్నగారి వైపుకు తిరిగి “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) చెప్పిన దానికి నా తరఫున మీరు సమాధానం ఇవ్వండి” అని అన్నాను. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)మాట్లాడుతూ “(అమ్మాయ్‌!) అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ విషయంలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఏమని సమాధానమివ్వాలో నాకేమో అర్ధం కావడం లేదు” అని అన్నారు. ఆ తరువాత నేను మా అమ్మతో “(అమ్మా!) దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు నువ్వయినా సమాధానమివ్వు” అని అన్నాను. కాని మా అమ్మ కూడా “దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు ఎం సమాధానమివ్వాలో నాకేమో తోచడంలేదు” అని అన్నది.

ఆ తరువాత నేను మాట్లాడటం మొదలెట్టాను. అప్పటికి నేను పెద్దగా వయసు లేని బాలికను. ఖుర్‌ఆన్‌ కూడా నేనెక్కువగా పఠించలేదు. అయినానేను మాట్లాడటానికి ఉపక్రమించాను. “మీరీ (అపనింద) మాటను బాగా విని ఉండటం వల్ల అది మీ అందరి హృదయాల్లో తిష్టవేసింది. అందరూ దీన్ని నిజమని భావిస్తున్నారు. అలాంటప్పుడు నేను ఏ పాపమెరుగని దాననంటే మీకు నమ్మకం కలగదు. ఒకవేళ నేను తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకుంటే మీరు వెంటనే నమ్ముతారు. కాని నేను ఎలాంటి పాపానికీ ఎంత మాత్రం పాల్పడలేదు. ఆ సంగతి అల్లాహ్ కి  తెలుసు. అందువల్ల అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి, మీ పరిస్థితి హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) పరిస్థితిలా ఉంది. ఈ స్థితిలో నేను హజ్రత్‌ యాఖూబ్‌ (అలైహిస్సలాం) అన్న మాటనే అంటాను. “ఇప్పుడు నేను ఉత్తమ రీతిలో సహనం వహిస్తాను. మీరు కల్పించి చెబుతున్న దాని గురించి నేనిక అల్లాహ్ ను  మాత్రమే సహాయం అర్ధించాలి’ (యూసుఫ్‌-18) అని అన్నారు ఆమె.”

…… ఇలా మాట్లాడిన తరువాత నేను పడక మీదికెళ్ళి పక్కకు తిరిగి పడుకున్నాను. నేను ఏ పాపమెరగని అమాయకురాలినని అల్లాహ్ కి  బాగా తెలుసు. అందువల్ల ఆయన నా పాతివ్రత్యాన్ని తప్పకుండా బహిర్గతం చేస్తాడని నాకు గట్టి నమ్మకం ఉండింది. అయితే అల్లాహ్ నా ఈ వ్యవహారంలో (ప్రళయం దాకా) నిత్యం పఠించబడేలా దివ్య వచనాలను అవతరింపజేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు. నా వ్యవహారంలో అల్లాహ్ ప్రత్యేకంగా (దివ్య)వాణిని అవతరింపజేయడానికి నేనంతటి గొప్పదానిని కూడా కాను. కాని దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) కలలో అలాంటిదేదైనా కన్పిస్తుందని మాత్రం నాకు నమ్మకముండింది.

అయితే దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) తమ స్థానం నుండి లేవకుండా అలాగే కూర్చున్నారు. అటు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరూ లేచి బయటకు వెళ్ళలేదు. (ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే మట్టి బొమ్మల్లా కూర్చుండిపోయారు). అంతలో దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పై ‘దివ్యావిష్కృతి’ (వహీ) అవతరించింది. దివ్యావిష్కతి సమయంలో ఎర్పడే అనిర్వచనీయమైన బాధ ఆయన్ని క్రమ్ముకుంది. దైవవాణి మోపిన భారం వల్ల తీవ్రమైన చలిలో సయితం ఆయన శరీరం నుండి చెమట బిందువులు రాలసాగాయి. కాస్సేపటికి ఈ పరిస్థితి దూరమయింది. అప్పుడు దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) పెదవులపై దరహాసం తొణికిసలాడింది. ఆయన నోట వెలువడిన మొట్టమొదటి వాక్యం (చూడండి). “ఆయిషా! అల్లాహ్  నీ పాతివ్రత్యాన్ని ధృవపరిచాడు” అని అన్నారు ఆయన.

మా అమ్మ ఈ మాట వినగానే “ఇక లే. లేచి దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం)కు కృతజ్ఞతలు చెప్పుకో” అని అన్నది. నేను (తల అడ్డంగా తిప్పుతూ) “నేను లేవను. అల్లాహ్ సాక్షి! పరమోన్నతుడయిన నా ప్రభువుకు తప్ప మరెవరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకోను” అని అన్నాను – దివ్యావిష్కృతి ద్వారా నూర్‌ సూరాలోని ఈ సూక్తులు వెలువడ్డాయి :

“ఈ అపవాదును మీలోనే ఒక వర్గం లేవదీసింది. (జరిగిందేదో జరిగింది, కాని) దీన్ని మీరు (మీ విషయంలో) చెడుగా భావించకండి. ఇది మీకు (ఒకందుకు) మంచిదే. ఇందులో ఎవరు ఎంత పాత్ర వహించారో ఆ మేరకు వారు పాపాన్ని మూటగట్టుకున్నట్లే. ఈ వ్యవహారం గురించి అత్యధిక బాధ్యతను నెత్తిమీద వేసుకున్న ప్రధాన పాత్రధారికి మాత్రం కఠినాతి కఠినమైన శిక్ష కాచుకొని ఉంది.” (11)

“ఈ నిందారోపణను వినగానే విశ్వాసులైన స్త్రీ పురుషులు అనుమానానికి లోనుకాకుండా సహృదయంతో ఎందుకు ఉండలేదు? మీరు అప్పటికప్పుడు ఇది పూర్తిగా నిరాధారమైన అపనింద అని ఎందుకు ఖండించలేదు? వారు (తమ నిందారోపణను నిరూపించుకోవడానికి) నలుగురు సాక్షులను ఎందుకు తీసుకురాలేదు? వారు సాక్ష్యం తీసుకురాలేదు. (తీసుకు రాలేరు కూడా, కనుక) అల్లాహ్ దృష్టిలో వారే పచ్చి అబద్దాలరాయుళ్ళు. (12, 13).

“మీ మీద ఇహపరలోకాల్లో అల్లాహ్ అనుగ్రహం, ఆయన కరుణాకటాక్షాలే గనక లేకపోయి ఉంటే, మీరు ఏ (నిరాధారమైన) మాటల్లో పడిపోయారో వాటి పర్యవసానంగా మీపై ఓ ఘోరమైన విపత్తు వచ్చిపడేదే. ఈ అసత్యారోపణ (ఎంత చెడ్డ విషయమో కాస్త మీరే ఆలోచించండి అది) మీ మధ్య ఒకరి నుంచి మరొకరికి (కార్చిచ్చులా) వ్యాపిస్తూ పోయింది. మీకు వాస్తవం ఎమిటో తెలియని విషయం మీనోట వెలువడసాగింది. మీరు దాన్ని సాధారణ విషయమని భావిస్తూ ఉండేవారు. కాని అల్లాహ్ దృష్టిలో ఇది చాలా తీవ్రమైన విషయం. (14-15)

“ఈ విషయం వినగానే “ఇలాంటి మాటలు పలకడం మనకు తగదు, అల్లాహ్ పరిశుద్దుడు. ఇది పూర్తిగా నీలాపనింద అని మీరు ఎందుకు అనలేదు? మీరు విశ్వాసులే అయితే ఇక ముందు ఎన్నటికీ ఇలాంటి పనులకు పాల్పడకూడదని అల్లాహ్ మీకు ఉపదేశిస్తున్నాడు. (మీరు విషయాన్ని అర్ధం చేసుకోవడానికి) అల్లాహ్ మీకు తన బోధనలను విడమరచి తెలియజేస్తున్నాడు. ఆయన సర్వం తెలిసిన వాడు, ఎంతో వివేకవంతుడు.” (16-18)

‘“విశ్వసించినవారి మధ్య అశ్లీల విషయాలు వ్యాపించాలని కోరుకునేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ వ్యధాభరితమైన శిక్షకు అర్హులవుతారు. (అశ్లీలం సమాజం మీద ఎంత దుష్ప్రభావం వేస్తుందో) అల్లాహ్ కి తెలుసు; మీకు తెలియదు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలు గనక లేకపోయి ఉంటే, అల్లాహ్ వాత్సల్యమూర్తి, దయామయుడు అయి ఉండకపోతే (మీ మధ్య వ్యాపింపజేయబడిన ఈ విషయం దారుణమైన పరిణామాలకు దారి తీసి ఉండేది). (19, 20)

“కనుక విశ్వాసులారా! షైతాన్‌ అడుగుజాడల్లో నడవకండి. వాడు తనను అనుసరించే వారికి చెడు, అశ్లీలతలను గురించే ఆదేశిస్తాడు. మీ మీద అల్లాహ్ అనుగ్రహం, ఆయన కారుణ్య కటాక్షాలే గనక లేకపోతే మీలో ఏ ఒక్కడూ పరిశుద్ధుడు కాలేడు. అయితే అల్లాహ్ తాను కోరిన వ్యక్తిని పరిశుద్ధం చేస్తాడు. ఆయన సర్వం వినేవాడు. సమస్తం ఎరిగిన వాడు.” (21)

“మీలోని ఉదార స్వభావులు, (ఆర్థిక) స్తోమత కలిగినవారు. (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్ మార్గంలో ఇల్లు వాకిలి వదలి వలస వచ్చిన వారికి సహాయం చేయము అని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, ఉదారంగా వ్యవహరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి, దయామయుడు.” (22)

“శీలవంతులయిన అమాయక ముస్లిం మహిళలపై లేనిపోని అపనిందలు మోపేవారు ఇటు ప్రపంచంలోనూ, అటు పరలోకంలోనూ శాపగ్రస్తులవుతారు. వారి కోసం కఠినాతి కఠిన శిక్ష ఉంది.” (23)

“ఇలా అపనిందలు మోపేవారు, స్వయంగా తమ నోళ్ళు, తమ కాళ్ళు చేతులే తమ అకృత్యాలను గురించి (తమకు వ్యతిరేకంగా) సాక్ష్యమిచ్చే రోజు ఒకటి వస్తుందన్న సంగతి మరచిపోకూడదు. ఆ రోజు అల్లాహ్ వారి కర్మలను బట్టి వారికి పూర్తి ప్రతిఫలాన్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది వారికి అల్లాహ్ యే సత్యమని, అల్లాహ్ యే నిజాన్ని నిజం చేసి చూపేవాడని.” (24, 25)

అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకొరకు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీల కొరకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషుల కొరకు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీల కొరకు యోగ్యులు. జనం చెప్పుకునే (తప్పుడు) మాటల నుండి వారు పరిశుద్ధులు, పవిత్రులు. వారి కోసం మన్నింపు, ఉదారమైన ఉపాధి ఉన్నాయి.” (26)

(దివ్య ఖుర్‌ఆన్‌ – 24:11-26)

ఈ సూక్తుల్ని అల్లాహ్ నా పవిత్రత, పాతివ్రత్యాలను గురించి అవతరింపజేశాడు. (మా నాన్న) హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(తమ నిరుపేద బంధువయిన;) మిస్తహ్‌ బిన్‌ అసాసా (రది అల్లాహు అన్హాు)కు ధన సహాయం చేస్తుండేవారు. అయితే (నా మీద వచ్చిపడిన అపనిందలో ఆయన కూడా భాగం పంచుకోవడం వల్ల) ఆయన (ఆగ్రహం వెలిబుచ్చుతూ) “అల్లాహ్ సాక్షి! (నా కుమార్తె) ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)అన్న మాటలకు (నా హృదయం తూట్లు పడింది) నేనిక నుండి అతని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టను ‘ అని అన్నారు. ఆయనలా అన్నందుకు అల్లాహ్ ఈ సూక్తిని అవతరింపజేశాడు : “మీలో దయానుగ్రహం పొందినవారు, (ఆర్థిక) స్తోమత కలిగిన వారు (ఈ అపనిందలో పాలు పంచుకున్న) తమ బంధువులకు, నిరుపేదలకు, ఇల్లు వాకిలి వదలి అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన వారికి సహాయం చేయబోమని ప్రతిన బూనకూడదు. వారిని క్షమించాలి, వారి పట్ల ఉదారంగా మసలుకోవాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ ఎంతో క్షమాశీలి. దయామయుడు.” (24:22) ఈ సూక్తి అవతరించిన తరువాత హజ్రత్‌ అబూ బకర్‌ (రది అల్లాహు అన్హాు)(మనసు మార్చుకొని) “ అల్లాహ్ సాక్షి! అల్లాహ్ నన్ను క్షమించాలనే నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి నేనీ సహాయాన్ని ఎన్నటికీ నిలిపి వేయను” అని అన్నారు. ఆయన మిస్తహ్‌ (రది అల్లాహు అన్హాు)కు ఇది వరకు ఎంత ధన సహాయం అంద చేస్తుండేవారో ఆ సహాయాన్ని తిరిగి అందజేయడం (ప్రారంభించారు.

దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా వ్యవహారం గురించి (విశ్వాసుల మాతృమూర్తి) హజ్రత్‌ జైనబ్‌ బిన్తె జహష్‌ (రది అల్లాహు అన్హా)ని కూడా విచారించారు. “ఈ విషయంలో నీకేమయినా తెలుసా?” అన్నారు ఆయన. దానికామె “దైవప్రవక్తా! నేను నా కళ్ళు చెవుల విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకుంటాను. (చూడకుండా, వినకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడను ). అల్లాహ్ సాక్షి! నేనామెలో మంచితనం తప్ప మరేదీ చూడలేదు” అని అన్నారు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) భార్యలలో ఒక్క జైనబ్‌ (రది అల్లాహు అన్హా) మాత్రమే నాకు పోటీగా నిలిచే స్రీ. (అయినప్పటికీ ఆమె ఈ వ్యవహారంలో సవతి అసూయ ప్రదర్శించకుండా న్యాయంగా మాట్లాడారు) ఆమెలోని భక్తి పరాయణత వల్ల అల్లాహ్ ఆమెను (ఈ రొంపి నుండి) కాపాడాడు. అయితే హజ్రత్‌ జైనబ్‌ (రది అల్లాహు అన్హా)ను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ మాట్లాడే ఆమె సోదరి మాత్రం అపవాదు లేపిన వారితో చేరి నాశనమయిపోయింది.

అపవాదు వ్యవహారంలోకి, నాతో పాటు ఈడ్చబడిన ఆ వ్యక్తి [3] అన్న పలుకులు కూడా ఎంతో గమనార్హమైనవి. ఆయన “అల్లాహ్ మాత్రమే పరిశుద్దుడు, పవిత్రుడు. కాని నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఈ రోజు వరకు నేను ఏనాడూ ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నారు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారని హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)తెలిపారు.

(సహీహ్‌ బుఖారీ:- 64వ ప్రకరణం – మగాజీ, 34వ అధ్యాయం – హదీసిల్‌ ఇఫ్క్‌)

1764. హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా)కథనం :- నా మీద లేనిపోని అపనింద మోపబడినప్పుడు నాకా సంగతే తెలియదు. దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) ప్రసంగించడానికి (వేదికపై) నిలబడ్డారు. మొదట ఆయన షహాదత్‌ కలిమా (సాక్ష్య వచనం) పఠించారు. తరువాత అల్లాహ్ ని ఆయన ఔన్నత్యానికి తగిన విధంగా స్తుతించారు. ఆ తరువాత ఇలా అన్నారు. “నా భార్య మీద అపనింద మోపిన వ్యక్తిని గురించి మీరు నాకేదయినా సలహా ఇవ్వండి. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నా కుటుంబ నభ్యులను గురించి ఎలాంటి చెడు విషయం కూడా ఎన్నడూ నా దృష్టికి రాలేదు. నా భార్యతో పాటు ఈ అపనిందలో ఇరికించబడిన వ్యక్తి గురించి కూడా నేనెప్పుడూ చెడు విషయం వినలేదు. అతను నా ఇంటికి నేను లేనప్పుడు ఎన్నడూ రాలేదు. నేనెప్పుడైనా ప్రయాణమయి ఎక్కడికైనా వెళ్తే అతను కూడా నాతో పాటే ఉండేవాడు.”

హజ్రత్‌ ఆయిషా (రది అల్లాహు అన్హా )కథనం :- దైవప్రవక్త (సల్లలాహు అలైహి వ సల్లం) నా యింటికి వచ్చి నా గురించి నా సేవకురాలిని విచారించారు. దానికి ఆమె సమాధానమిస్తూ “ఎంత మాత్రం లేదు. నేను ఆయిషా (రది అల్లాహు అన్హా)లో ఏనాడూ ఎలాంటి చెడునూ చూడలేదు. కాకపోతే ఆమె (అప్పుడప్పుడు) ఆదమరచి నిద్ర పోతుంది, అప్పుడు మేక వచ్చి పిండి తినిపోతుంది’ అని అన్నది. నా ఈ  సేవకురాలిని ప్రవక్త అనుచరులలో కొందరు గదమాయించారు, కోపగించుకున్నారు. అయినప్పటికీ ఆమె “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. స్వర్ణకారుణికి మేలిమి బంగారం గురించి ఏం తెలుసో ఆయిషా (రది అల్లాహు అన్హా)ను గురించి కూడా నాకు అదే తెలుసు. (అంతకు మించి మరేమో తెలియదు)” అని అన్నది. ఈ అపవాదులో నాతోపాటు ఇరికించబడిన వ్యక్తికి అపవాదు సంగతి తెలిసినపుడు “అల్లాహ్ పరిశుద్ధుడు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. నేనీ రోజు వరకు ఏ (పర) స్త్రీ వలువ విప్పలేదు” అని అన్నాడు. ఈయన ఆ తరువాత కొన్నాళ్ళకు అల్లాహ్ మార్గంలో పోరాడుతూ అమరగతులయ్యారు.

(సహీహ్‌ బుఖారీ:- 65వ ప్రకరణం – తఫ్సీర్‌, 24వ సూరా – నూర్‌, 11వ అధ్యాయం – ఇన్నల్లజీన యుహిబ్బూన అన్తషీ అల్‌ ఫాహిషతు ఫిల్లజీన ఆమనూ)

Footnotes:

[1] | ఒక యుద్ధం అంటే ఇక్కడ “బనీ ముస్తలిఖ్‌ యుద్ధం” అని అర్థం. దీన్నే ‘మురసీ యుద్ధం” అని కూడా అంటారు. (సంకలనకర్త)

[2] | ఇక్కడ మూలభాషలో ప్రయోగించిన ‘ఉస్బా’ అనేపదానికి పది నుండి నలభై మంది వ్యక్తుల ముఠా అని అర్ధం వస్తుంది (సంకలనకర్త)

[3] ఈ వ్యక్తి పేరు హజ్రత్‌ సఫ్వాన్‌ బిన్‌ ముఅత్తల్‌ (రది అల్లాహు అన్హాు)- (సంకలనకర్త)


ఇది మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్) (Al-Lulu-wal-Marjaan) లో పశ్చాత్తాప ప్రకరణం నుండి తీసుకోబడింది.

“ముహమ్మదుర్ రసూలుల్లాహ్” అంటే అర్ధం ఏమిటి? [వీడియో & టెక్స్ట్]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=yZS2dByYpu8
Video Courtesy: Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

أَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِيْنَ، وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِيْنَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِيْنَ، أَمَّا بَعْدُ.
(సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. మరియు ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ (స) పైన, ఆయన కుటుంబ సభ్యులపైన మరియు ఆయన సహచరులందరిపైన శాంతి మరియు శుభాలు వర్షించుగాక.)

సోదర మహాశయులారా! “విశ్వాస మూల సూత్రాలు అనే ఈ ముఖ్య శీర్షికలో, అల్లాహ్ యొక్క దయవల్ల ఇప్పటివరకు మనం తౌహీద్, అల్లాహ్ ఏకత్వం విషయంలో, తౌహీద్ అంటే ఏమిటి? అందులో ముఖ్యమైన మూడు లేదా నాలుగు భాగాలు ఏవైతే మనం అర్థం చేసుకోవడానికి విభజించి తెలుసుకున్నామో.

రెండవ పాఠంలో, తౌహీద్, కలిమ-ఎ-తౌహీద్ لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్ – అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) యొక్క నిజమైన భావం ఏమిటి? అందులో ఉన్న రెండు ముఖ్యమైన రుకున్‌లు, అంటే మూల సూత్రాలు నఫీ (نفي – తిరస్కరించుట) వ ఇస్బాత్ (إثبات – అంగీకరించుట), నిరాకరించుట మరియు అంగీకరించుట, వీటి గురించి ఇంకా لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) యొక్క గొప్ప ఘనత ఏమిటి అనేది కూడా తెలుసుకున్నాము.

ఇక మూడవ పాఠంలో, لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) కు ఏడు షరతులు అందులో ఉన్నాయి. వాటిలో ప్రతీ ఒక్కటినీ మనం నమ్మడం, అర్థం చేసుకోవడం, దాని ప్రకారంగా ఆచరించడం తప్పనిసరి. ఆ ఏడు షరతులు కూడా తెలుసుకున్నాము. సంక్షిప్తంగా ఏమిటవి? ఇల్మ్ (علم – జ్ఞానం), యఖీన్ (يقين – దృఢ విశ్వాసం), కబూల్ (قبول – అంగీకారం), ఇన్ఖియాద్ (انقياد – విధేయత), ఇంకా సిద్ఖ్ (صدق – సత్యసంధత), మహబ్బత్ (محبة – ప్రేమ), ఇఖ్లాస్ (إخلاص – నిష్కల్మషత్వం). ఏడు కదా! అయితే ఎవరైనా ఈ విషయాలు ఇంకా అర్థం కాకుంటే, వెనుక పాఠాలు వినాలి అని నేను కోరుతున్నాను. అల్లాహ్ యొక్క దయవల్ల YouTube ఛానల్‌లో ‘Z Dawah’ లేదా ‘JDK Naseer’ అనే ఛానల్‌లో వెళ్లి వాటిని పొందవచ్చు.

ఈనాటి పాఠంలో మనం అల్లాహ్ యొక్క దయవల్ల కలిమ-ఎ-షహాదత్ (كلمة الشهادة), పవిత్ర వచనం యొక్క సాక్ష్యం మనం ఏదైతే పలుకుతామో అందులో ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి కదా! ఒకటి لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్), రెండవది محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్). ఆరాధనలకు అర్హులు కేవలం అల్లాహ్ మాత్రమే అని నమ్ముతాము. ఇది لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో ఉంది. ఇక రెండవది, محمد رسول الله (ముహమ్మదుర్ రసూలుల్లాహ్).

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం అంటామో, సామాన్యంగా వుజూ చేసిన తర్వాత أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అనాలి. ఏంటి లాభం? స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి. ఎవరైతే వుజూ చేసిన తర్వాత ఈ చిన్న దుఆ చదువుతారో అని మనకు సహీహ్ ముస్లిం షరీఫ్‌లో ఈ శుభవార్త ఉంది. అలాగే అత్తహియ్యాత్ మనం చదువుతాము కదా, అందులో కూడా أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ (అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ) అత్తహియ్యాత్‌లో. మరి ఈ అత్తహియ్యాత్ ప్రతీ నమాజ్‌లోని తషహ్హుద్‌లో, ప్రత్యేకంగా చివరి తషహ్హుద్, ఏ తషహ్హుద్‌లోనైతే మనం సలాం తింపుతామో, అందులో చదవడం నమాజ్ యొక్క రుకున్, నమాజ్ యొక్క పిల్లర్ లాంటి భాగం అని కూడా పండితులు ఏకీభవించారు. అయితే గమనించండి, మనం మాటిమాటికీ ఏదైతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం కూడా పలుకుతూ ఉంటామో, దాని యొక్క నిజమైన భావం తెలుసుకోవడం కూడా చాలా అవసరం.

హృదయంతో మరియు నోటితో, మనసా వాచా ఆయన అల్లాహ్ యొక్క సత్య ప్రవక్త అని సాక్ష్యం పలుకుతూ, ఆయన అల్లాహ్ యొక్క దాసుడు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు అని నమ్మాలి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని అంటే, ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసులు మరియు సర్వ మానవాళి వైపునకు ప్రవక్తగా పంపబడిన వారు. ముఖ్యంగా ఈ రెండు విషయాలు. ఇక ఈ రెండు విషయాలు నమ్ముతున్నప్పుడు అందులో మరికొన్ని వివరాలు ఉంటాయి, వాటిని కొంచెం మనం అర్థం చేసుకుందాం.

అయితే ఇందులో ధర్మ పండితులు, ప్రత్యేకంగా ఉలమాయె అఖీదా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని మనం పలుకుతున్నాము, సాక్ష్యం పలుకుతున్నాము, నమ్ముతున్నాము అంటే అందులో నాలుగు విషయాలు వస్తాయి అని చెప్పారు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ను విశ్వసించడంలో ఎన్ని విషయాలు? నాలుగు విషయాలు.

మొదటి విషయం, ఆయన మనకు ఏ ఆదేశం ఇచ్చారో విధేయత చూపాలి, అంటే ఆజ్ఞాపాలన చేయాలి. طَاعَتُهُ فِيمَا أَمَرَ (తాఅతుహూ ఫీమా అమర్). ప్రవక్త ఏ ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని మనం పాటించాలి. అర్థమైందా? ఉదాహరణకు మీరు హదీసులు చదువుతూ ఉన్నప్పుడు, “ఆమురుకుం బి సబ్అ” (నేను ఏడు విషయాల గురించి మీకు ఆదేశిస్తున్నాను) అని సహీ బుఖారీలో వచ్చింది. అల్లాహ్‌ను తప్ప ఇంకా వేరే ఎవరినీ కూడా మీరు ఆరాధించకండి, ఐదు పూటల నమాజు పాబందీగా చేయండి, ఈ విధంగా. ఇంకా వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ప్రవక్త ఇచ్చిన ప్రతీ ఆదేశాన్ని ఏం చేయాలి? విధేయత చూపాలి. ఆజ్ఞాపాలన చేయాలి.

రెండవ విషయం, تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ ఏ విషయాలు మనకు తెలిపారో వాటన్నింటినీ మనం సత్యంగా నమ్మాలి. గత కాలాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు తెలిపారు. తర్వాత కాలంలో రానున్న కొన్ని సంఘటనల గురించి మనకు తెలియజేశారు. ప్రత్యేకంగా ప్రళయానికి కంటే ముందు కొన్ని సూచనలు సంభవిస్తాయి అని కూడా తెలిపారు. అరే, అంత పాత కాలం నాటి విషయాలు ఎలా చెప్పారు? అరే ఇలా కూడా జరుగుతుందా? అరే ప్రళయానికి కంటే ముందు ఇట్లా అవుతుందా? ఇలాంటి సందేహాల్లో మనం పడకూడదు. ప్రవక్త చెప్పిన మాట నూటికి నూరు శాతం సత్యం. అందులో అనుమానానికి, దాన్ని మనం తిరస్కరించడానికి, అబద్ధం అన్నటువంటి అందులో ఏ సంశయం లేనే లేదు. تَصْدِيقُهُ فِيمَا أَخْبَرَ (తస్దీఖుహూ ఫీమా అఖ్బర్). ప్రవక్త తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి. నూహ్ (అలైహిస్సలాం) ఎన్ని సంవత్సరాలు జీవించారో, వాటికి సంబంధించిన కొన్ని విషయాలు, ప్రవక్త ఇబ్రాహీంకు సంబంధించిన విషయాలు, ప్రవక్త మూసా, ఈసా (అలైహిముస్సలాతు వత్తస్లీమ్) కు సంబంధించిన కొన్ని విషయాలు, ఇంకా బనీ ఇస్రాయీల్‌లో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రవక్త మనకు తెలిపారు. వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? సత్యంగా నమ్మాలి. ప్రళయానికి కంటే ముందు దజ్జాల్ వస్తాడు, మహదీ వస్తాడు, ఈసా (అలైహిస్సలాం) వస్తారు, అలాగే దాబ్బతుల్ అర్ద్ అనే ఒక జంతువు వస్తుంది. అలాగే ప్రళయానికి కంటే ముందు సూర్యుడు, ప్రతిరోజూ ఎటునుండి ఉదయిస్తున్నాడు? తూర్పు నుండి, ప్రళయం రోజు పడమర నుండి. అల్లాహు అక్బర్! అది అలా ఎలా జరుగుతుంది, ప్రతిరోజూ మనం ఇట్లా చూస్తున్నాము కదా, ప్రళయానికి కంటే ముందు అట్లా ఎట్లా జరుగుతుంది అని సందేహం వహించడానికి అవకాశం లేదు. ప్రవక్త తెలిపారు, ఇలా జరిగి తీరుతుంది.

ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం నమ్ముతామో, అందులో ఎన్ని విషయాలు ఉన్నాయని చెప్పాను? మొదటి విషయం, ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, విధేయత చూపాలి, ఆజ్ఞాపాలన. రెండవది, ఆయన ఏ ఏ విషయాలు తెలిపారో అవన్నీ సత్యం అని నమ్మాలి.

మూడవది, اجْتِنَابُ مَا نَهَى عَنْهُ وَزَجَرَ (ఇజ్తినాబు మా నహా అన్హు వ జజర్). ఆయన ఏ విషయాల నుండి మనల్ని హెచ్చరించారో, వారించారో, నిషేధించారో, “ఇది చేయకండి” అని చెప్పారో వాటికి మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రులకు అవిధేయత చూపకండి, చేతబడి చేయకండి, జూదం ఆడకండి, వ్యభిచారం చేయకండి, షిర్క్ పనులు చేయకండి, గడ్డాలు కత్తిరించకండి. ఈ విధంగా ఏ ఏ నిషేధాలు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మనకు నిషేధించి ఉన్నారో, ఖండించి ఉన్నారో, వారించి ఉన్నారో, వాటన్నిటినీ మనం వాటికి దూరంగా ఉండాలి.

నాల్గవ విషయం, وَأَلَّا يُعْبَدَ اللَّهُ إِلَّا بِمَا شَرَعَ (వ అల్లా యూ’బదల్లాహు ఇల్లా బిమా షర’అ). ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఏ విధంగా ఆరాధించారో, అదే విధంగా మనం కూడా ఆరాధించాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్‌ను ఎలా ఆరాధించాలో, మనము కూడా అలాగే ఆరాధించాలి. నమాజ్ విషయంలో గానీ, ఉపవాసాల విషయాలలో గానీ, జకాత్, హజ్ విషయాలలో గానీ, వివాహ విషయాలలో గానీ, ప్రవక్త యొక్క నడవడిక గానీ, అందుకొరకే అల్లాహ్ ఏం చెప్పాడు? لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ (లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనహ్ – నిశ్చయంగా మీ కొరకు అల్లాహ్ ప్రవక్తలో ఒక ఉత్తమ ఆదర్శం ఉంది). ప్రవక్త మీకు ఒక మంచి ఆదర్శం. మీరు ఆయన ఆదర్శాన్ని పాటించాలి.

ఇక ఈ నాలుగు విషయాలు ఏదైతే నేను చెప్పానో, ప్రతి ఒక్క దానికి ఖురాన్‌లో, హదీస్‌లో ఎన్నో దలీల్‌లు ఉన్నాయి. కానీ టైం మనకు సరిపడదు గనుక సంక్షిప్తంగా చెబుతున్నాను. విషయం అర్థమైంది కదా! మనం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నమ్ముతున్నాము అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి అందులో? నాలుగు విషయాలు. మరొకసారి మీకు గుర్తుండడానికి: ఆయన ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి, ఆయన తెలిపిన విషయాలను సత్యంగా నమ్మాలి, ఆయన ఏ విషయాల నుండి మనల్ని నిషేధించారో, ఖండించారో, వారించారో వాటికి దూరంగా ఉండాలి, ఆయన అల్లాహ్‌ను ఎలా ఆరాధించారో అలాగే మనం ఆరాధించాలి.

అయితే సోదర మహాశయులారా, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఏదైతే మనం పలుకుతున్నామో, ఇందులో కూడా ముఖ్యమైన రెండు రుకున్‌లు ఉన్నాయి. రెండు మూల సూత్రాలు ఉన్నాయి. لا إله إلا الله (లా ఇలాహ ఇల్లల్లాహ్) లో రెండు మూల సూత్రాలు ఉన్నాయి అని చెప్పాము కదా, ఒకటి నఫీ, మరొకటి ఇస్బాత్. ఇందులో రెండు మూల సూత్రాలు ఉన్నాయి. ఒకటి ‘అబ్ద్’ (عَبْد), మరొకటి ‘రసూల్’ (رَسُول). ‘అబ్ద్’ అంటే దాసుడు. అంటే ఏంటి? ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన అబ్దుల్లాహ్ యొక్క కుమారుడు. అబ్దుల్లాహ్ మరియు ఆమిన. ఆయన యొక్క వంశ పరంపర ఏమిటి? ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ వంశ పరంపరంగా ఇబ్రాహీం (అలైహిస్సలాం) యొక్క పెద్ద కుమారుడైన ఇస్మాయీల్ (అలైహిస్సలాం) సంతతిలో వస్తారు. మరియు ఇబ్రాహీం (అలైహిస్సలాం), ఆదం (అలైహిస్సలాం) సంతతిలోని వారు. ఈ విధంగా, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) మనలాంటి ఒక మనిషి. అల్లాహ్ యొక్క దాసుడు. కానీ కొంచెం జాగ్రత్త. మనలాంటి మనిషి అన్న ఈ పదం ఏదైతే ఉపయోగించానో, ఇక్కడ భావాన్ని తెలుసుకోవాలి. లేదా అంటే మళ్ళీ కొందరు మనల్ని పెడత్రోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది.

మనలాంటి మనిషి అని ఎప్పుడైతే మనం మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గురించి అంటామో, అక్కడ దాని భావం ఏమిటి? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, మనం ఎలాగైతే ఆదం యొక్క సంతతియో, మనకు ఎలాగైతే ఆకలి, దాహము కలిగినప్పుడు తినడం, త్రాగడం, అవసరాలు తీర్చుకోవడం, పడుకోవడం, నిద్ర రావడం, ఏదైనా దెబ్బ తగిలిందంటే నొప్పి కలగడం, బాధ కలగడం, ఇలాంటి మానవ సహజ అవసరాలు ఏవైతే ఉన్నాయో, అలాంటి అవసరాలే ప్రవక్తకు ఉండినవి. ఆయన వేరే ఏ సృష్టి కాదు, మానవ సృష్టిలోనే మనలాంటి ఒక వ్యక్తి. కానీ, సర్వ మానవాళిలోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తర్వాత అందరికంటే గొప్పవారు. అర్థమైందా? కేవలం మానవుల్లోనే కాదు, జిన్నాతులో, మిగతా ఈ సృష్టి అంతటి, అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేదైతే ఉందో, ప్రతి దానిలో కెల్లా అత్యంత గౌరవనీయులు, అత్యంత అల్లాహ్‌కు ప్రియులు, అత్యంత గొప్పవారు, ఎక్కువ ఘనత గలవారు ఎవరు? మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). ప్రవక్త ముహమ్మద్ మనలాంటి మనిషి అంటే, నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా, సమానత్వంగా చేస్తున్నాము, మనకు ఈక్వల్‌గా చేస్తున్నాము, అలాంటి భావం రానే రాకూడదు. మనలాంటి మనిషి అంటే ఏంటి ఇక్కడ భావం? మనం ఎలాగైతే తల్లిదండ్రులతో పుట్టామో, ఆయన కూడా అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు. మానవ జన్మ ఎత్తినవారు. మానవ అవసరాలు సహజంగా ఏవైతే ఉంటాయో తినడం, త్రాగడం, పడుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, సంతానం కలగడం, మార్కెట్‌కు వెళ్లడం, అవసరం ఉన్న సామాను కొనుక్కొని రావడం, ఈ విధంగా ఈ పనులు ఏదైతే మనం మానవులం చేసుకుంటామో, అలాంటి అవసరాలు కలిగిన ఒక వ్యక్తే. కానీ, ఆయన స్థానానికి ఎవరూ చేరుకోలేరు. ఈ లోకంలోనే మొత్తం అల్లాహ్ తర్వాత ఆయనకంటే గొప్ప ఇంకా వేరే ఎవరూ కూడా లేరు.

అబ్ద్. దీని గురించి ఖురాన్‌లో ఎన్నో పదాలు ఉన్నాయి. అబ్ద్ అన్న పదం ఖురాన్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ స్టార్టింగ్‌లో వచ్చింది. సూరహ్ కహఫ్ యొక్క చివరిలో కూడా వచ్చింది. సూరహ్ ఫుర్ఖాన్ యొక్క స్టార్టింగ్‌లో కూడా వచ్చింది. ఇంకా ఎన్నో సూరాలలో అబ్ద్ అంటే దాసుడు. అలాగే మానవుడు, మనిషి అన్న పదం కూడా, బషర్ (بشر), మనిషి అంటే బషర్ అని అరబీలో అంటారు, ఈ పదం కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి ఉపయోగపడింది.

ఇక రెండవ రుకున్, రసూల్. రసూల్. అంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ ఆయన్ని ప్రళయం వచ్చే వరకు సర్వ మానవాళి వైపునకు, సర్వ దేశాల, ఈ మొత్తం సృష్టిలో ఉన్న ప్రజల వైపునకు ఆయన్ని ప్రవక్తగా, సందేశహరులుగా, సందేశాన్ని అందజేసే వారులుగా, ఆచరించి చూపే వారులుగా, స్వర్గం వైపునకు పిలిచే వారిగా, నరకం గురించి హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

ఈ రెండిటినీ మనం తప్పకుండా నమ్మాలి మరియు ఈ ప్రకారంగానే మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సూరత్ సబా, అలాగే సూరహ్ అంబియా, ఇంకా ఎన్నో సూరాలలో, అలాగే సూరతుల్ అన్ఆమ్‌లో కూడా, సూరతుల్ ఆరాఫ్‌లో కూడా ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వ మానవాళి వైపునకు అల్లాహ్ యొక్క కారుణ్య మూర్తి, అల్లాహ్ యొక్క సందేశం అందజేసే ప్రవక్త అని చాలా స్పష్టంగా చెప్పబడినది.

ఈ రెండు గుణాలను మనం నమ్ముతాము కదా, లాభం ఏమిటి? ఈ రెండు ఉత్తమ గుణాలు, ఈ రెండు ఉత్తమ రుకున్‌లు, మూల సూత్రాలు, అబ్ద్ మరియు రసూల్, ప్రవక్త విషయంలో నమ్మడం తప్పనిసరి. ఎందుకు? ఇలా నమ్మడం ద్వారా ఆయన హక్కులో కొందరు ఏదైతే అతిశయోక్తి లేదా ఆయన హక్కును తగ్గించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఆ రెండు రకాల వారికి ఇందులో సరైన సమాధానం ఉంది.

ప్రజల్లో కొందరు ఇలా ఉన్నారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని మనిషే కాదు అని అంటున్నారు. ఆయన వేరే ఒక సృష్టి అని అంటున్నారు. అది కూడా తప్పు విషయం. మరికొందరు ఆయన ఒక మనిషి, అబ్దుల్లాహ్, ఆమినాకు పుట్టినవారు అని నమ్ముతున్నారు, కానీ ప్రవక్త అని నమ్మడం లేదు, తిరస్కరిస్తున్నారు. అయితే మరొక వైపు ఏమున్నది? ఆయన్ని ప్రవక్తగా నమ్మి ఆయన హక్కులో చాలా అతిశయోక్తితో ప్రవర్తించి, ఆయన్ని అల్లాహ్ యొక్క స్థానానికి లేపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కేవలం అల్లాహ్‌తో అడిగేటువంటి కొన్ని దుఆలు, కేవలం అల్లాహ్‌తో మాత్రమే ప్రశ్నించేటువంటి కొన్ని విషయాలు, “ఓ అల్లాహ్ మాకు సంతానం కలిగించు”, “ఓ అల్లాహ్ మాకు మా రోగాన్ని దూరం చేసి ఆరోగ్యం ప్రసాదించు”, “ఓ అల్లాహ్ మా యొక్క కష్టాలను దూరం చెయ్యి” – ఇట్లాంటివి ఏవైతే కొన్ని దుఆలు ప్రత్యేకంగా కేవలం అల్లాహ్‌తో మాత్రమే అడగవలసినవి ఉంటవియో, అవి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో అడుగుతున్నారు. మాకేం అవసరం ఉన్నా గానీ ప్రవక్త యొక్క దర్బార్ మీదికి వెళ్ళాము, ప్రవక్త యొక్క రౌదా వద్దకు వెళ్ళాము, అక్కడ మా అవసరాలు అన్నీ తీరిపోతాయి అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఉన్నారు. తప్పు విషయం. ఆయన ప్రవక్త, సర్వ మానవుల్లో కెల్లా ఎంతో ఉత్తమమైన వారు. కానీ ఆయన అల్లాహ్‌ను ఆరాధించేవారు, మనం కూడా అల్లాహ్‌నే ఆరాధించాలి, ఆయన్ని ఆరాధించకూడదు.

మరికొందరు మన ముస్లిములలో ఎలా ఉన్నారు? ఆయన్ని ప్రవక్తగా అని నమ్ముతూ ఎంతో గౌరవం, ఆయనకు గౌరవం ఇస్తున్నట్లుగా చెబుతారు. కానీ ఇతరుల ఇమాములను, ఇతరుల ముర్షిద్‌లను, వేరే కొందరు పీర్‌లను నమ్మి, ప్రవక్త కంటే ఎక్కువగా వారికి స్థానం కల్పిస్తారు. ఇది కూడా ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని చదవడానికి వ్యతిరేకం అవుతుంది సోదర మహాశయులారా.

విషయం అర్థమైంది కదా! ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఎన్ని విషయాలు వస్తాయి? ఏమేమిటి? ఇచ్చిన ఆదేశాన్ని పాటించడం, చెప్పిన ప్రతి మాటను సత్యంగా నమ్మడం, నిషేధించిన వాటికి దూరంగా ఉండడం, ఆయన ఎలా అల్లాహ్‌ను ఆరాధించారో అలా అల్లాహ్‌ను ఆరాధించడం. ఇందులో రెండు రుకున్‌లు ఉన్నాయి, మూల సూత్రాలు ఉన్నాయి: ఒకటి అబ్ద్, రెండవది రసూల్. ఈ రెండిటినీ నమ్మడం ద్వారా ఎవరైతే ప్రవక్తను ఆయన స్థానానికి దించి తగ్గించారో వారికి కూడా ఇందులో జవాబు ఉంది, మరి ఎవరైతే ప్రవక్తను నమ్మినట్లుగా చెప్పి ఇతరులను ప్రవక్తకు పైగా, ప్రవక్త యొక్క మాటకు వ్యతిరేకంగా ఇతరుల మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, ప్రవక్త యొక్క పద్ధతి, సున్నత్‌కు వ్యతిరేకంగా ఇతరుల యొక్క ఫత్వాలను, ఇతరుల యొక్క మాటలకు ప్రాధాన్యతనిస్తున్నారు, అలాంటి వారికి కూడా ఇందులో జవాబు ఉన్నది.

అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి గురించి మనం ఏదైతే సాక్ష్యం పలుకుతున్నామో, అందులో ఈ విషయాలను తెలుసుకొని ఈ ప్రకారంగా సాక్ష్యం పలికేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

పుస్తకం మరియు మిగతా వీడియో భాగాలు కోసం క్రింద క్లిక్ చెయ్యండి
విశ్వాస మూల సూత్రాలు (Aqeedah)

ఇతరములు:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పై దరూద్ కు సంభందించిన హదీసులు [ఆడియో]

[4 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

33:56 إِنَّ اللَّهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి. (33:56)


పూర్తి దరూద్ షరీఫ్:

“అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”


చిన్న దరూద్ షరీఫ్ : అల్లాహుమ్మ సల్లి వ సల్లిమ్ వ బారిక్ అలా ముహమ్మద్


అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“మీ ఇళ్ళను సమాధులు చేయకండి మరియు నా సమాధిని పండగ లేదా జాతర ప్రదేశం చేయకండి. నాపై దరూద్ పంపండి; మీరు ఎక్కడ ఉన్ననూ మీ దరూద్ నాకు చేరుతుంది.” 

[సునన్ అబూ దావూద్ : 2042; అల్ అల్బానీ దీన్ని ధృవీకరించారు.]


అబూ బకర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“నాపై దరూద్ ఎక్కువగా పంపండి, అల్లాహ్ నా సమాధి వద్ద ఒక దూతను నియమిస్తాడు. నా ఉమ్మత్ లోని వారు ఎవరైనా నాపై దరూద్ పంపినప్పుడు, ఆ దైవదూత నాతో ఇలా అంటారు: ‘ఓ ముహమ్మద్! ఫలానా వ్యక్తి మీపై, ఫలానా సమయంలో దరూద్ పంపాడు.”’ 

[అల్ దైలమీ – షేక్ అల్ అల్బానీ గారు అల్ సహీహా 1530 లో దీన్ని ‘హసన్ లీ ఘైరిహి’ అని అన్నారు]


అబ్దుల్లా ఇబ్న్ మసూద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“అల్లాహ్ నియమించిన దైవదూతలు భూమి మీద తిరిగుతుంటారు. వారు నా ఉమ్మత్ వారు నాపై పంపిన సలాం (దరూద్)ను నాకు చేరవేస్తారు.” 

[సునన్ అన్ నసాయి 1282, దీన్నీ అల్ అల్బానీ గారు సహీహ్ అని ధృవీకరించారు]


అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“నా పేరు విని కూడా నాపై దరూద్ (దుఆ) పంపని వాడి ముక్కు మట్టిలో కొట్టుకుపోగాక.” 

[సునన్ అత్ తిర్మిజి (3545), షేక్ అల్ అల్బాని గారు దీన్ని ‘హసన్ సహీ’ అన్నారు] 


అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“అతని సమక్షంలో నా పేరు ఉచ్చరించబడిననూ, నాపై దరూద్ పంపని వాడు అందరిలోకెల్లా అత్యంత పిసినారి.” 

[సునన్ అత్ తిర్మిజి (3546), షేక్ అల్ అల్బానీ గారు దీన్ని ‘సహీహ్’ అని ధృవీకరించారు]


అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:

“ముఅజ్జిన్ (అజాన్ ఇచ్చేవాడు) పలికింది వినగానే దాన్ని పునరావృతం చేయండి, ఆ తరువాత నాపై దరూద్ పంపండి, నాపై దరూద్ పంపిన వారికి అల్లాహ్ తరఫున పది శుభాలు లభిస్తాయి; అల్లాహ్ తో నాకోసం వసీలా కోరండి, ఇది స్వర్గంలోని ఒక హోదా, ఇది అల్లాహ్ దాసుల్లో ఒకరికి మాత్రమే లభిస్తుంది, అది నేనే కావాలని నా ఆశ. నాకు వసీలా దొరకాలని కోరేవారికి నేను సిఫారసు చేస్తాను.” 

[సహీహ్ ముస్లిం 384]


ముఅజ్జిన్ పలికినట్లు పలికి ప్రవక్త ఫై దరూదు చదవటం

respoding to Adhan and sending darood on prophet

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?

111. హజ్రత్ మస్రూఖ్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను విశ్వాసుల మాతృమూర్తి హజ్రత్ ఆయిషాను (రధి అల్లాహు అన్హ) – 

“అమ్మా! దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును (ప్రత్యక్షంగా) చూశారా?” అని అడిగాను. దానికి ఆమె ఇలా అన్నారు : “నీ మాటలు విని నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి. నీకు తెలుసా? ఈ మూడు విషయాలను గురించి మీలో ఎవరైనా తన వైపు నుంచి ఏదైనా అంటే అతను అబద్ధాలకోరుగా పరిగణించబడతాడు :

(1) “ఎవరి చూపులూ ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులనూ అందుకోగలడు.”  [దివ్యఖుర్ఆన్ – 6 : 103]
“అల్లాహ్ ఏ మానవునితోనూ ప్రత్యక్షంగా సంభాషించడు. మానవ మాత్రుడికి అది సాధ్యమయ్యే పనికాదు. అల్లాహ్ తన మాటను వహీ ద్వారానో లేక తెరవెనుక నుంచో మాత్రమే మానవునికి చేరవేస్తాడు.”  [దివ్యఖుర్ఆన్ – 42 :51]

(2) అలాగే రేపు జరగబోయే విషయాలేవో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు తెలుసనేవాడు కూడా అబద్దాల కోరే. ఈ సందర్భంలో హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “రేపు తాను ఏం చేయనున్నాడో ఏ మానవునికీ తెలియదు.” [దివ్యఖుర్ఆన్ – 31 : 34 ]

(3) అదే విధంగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) (ధర్మానికి సంబంధించిన) ఏదైనా విషయం రహస్యంగా ఉంచారని అనేవాడు కూడా అబద్దాలరాయుడే. దీన్ని గురించి హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఈ సూక్తిని ఉదహరించారు – “ప్రవక్తా! నీ ప్రభువు నుండి నీపై అవతరించే బోధనలను ప్రజలకు అందజేస్తూ ఉండు. ఒకవేళ నీవలా చేయకపోతే దౌత్య బాధ్యతను నెరవేర్చని వాడవుతావు.”  [దివ్యఖుర్ఆన్ – 5 : 67]

కనుక అసలు విషయం ఏమిటంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం) ను అతని నిజ స్వరూపంలో రెండుసార్లు చూశారు.”

[సహీహ్ బుఖారీ : 65 వ ప్రకరణం – అత్తఫ్సీర్, 53 వ సూరా – అన్నజ్మ్ – 1 వ అధ్యాయం – హద్ధసనా యహ్యా]

విశ్వాస ప్రకరణం – 75 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువును దర్శించారా?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

క్రైస్తవుని కపట చేష్టలు

1772. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒక వ్యక్తి పూర్వం క్రైస్తవుడు, ఆ తరువాత ముస్లిం అయ్యాడు. అతను బఖరా, ఆలి ఇమ్రాన్ సూరాలు నేర్చుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కార్యదర్శి అయ్యాడు. అయితే కొన్నాళ్ళకు అతను మళ్ళీ క్రైస్తవుడయిపోయి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు నేను వ్రాసిచ్చిన విషయాలు మాత్రమే తెలుసు (అంతకు మించి మరేమీ తెలియదు)” అని (నలుగురితో) చెప్పడం మొదలెట్టాడు. తరువాత కొంతకాలానికి అతను చనిపోయాడు. క్రైస్తవులు అతని శవాన్ని సమాధి చేశారు. కాని మరునాడు ఉదయం వెళ్లి చూస్తే అతని శవాన్ని భూమి బయటికి విసరి పారేసింది. అప్పుడా క్రైస్తవులు “ఇది ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం),  ఆయన అనుచరులు చేసిన పనే. మా ఈ మనిషి వాళ్ళను వదలిపెట్టి వచ్చాడు గనక వారే ఇతని సమాధిని త్రవ్వి ఉంటారు” అని అనుకున్నారు. ఆ తరువాత వారు మరోచోట వీలైనంత లోతుగా గొయ్యి త్రవ్వి అందులో ఆ శవాన్నితిరిగి  పూడ్చి పెట్టారు. అయితే ఆ మరునాడు ఉదయం వెళ్లి చూస్తే (మళ్ళీ అదే దృశ్యం) భూమి అతని శవాన్ని బయటికి విసిరి పారేసింది. అప్పుడు వారికి అర్ధమయింది – ఇది మానవుల పని కాదని (ఇతరులకు గుణపాఠం కోసం ఇతనికి దేవుడు శిక్షిస్తున్నాడని). అందువల్ల వారతని శవాన్ని అలాగే పడి ఉండనిచ్చి వెళ్ళిపోయారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 25 వ అధ్యాయం – అలామాతిన్నుబువ్వతి ఫిల్ ఇస్లాం]

కపట విశ్వాసుల ప్రకరణం – కపట చేష్టలు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత

1518. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక పని చేసి (తమ అనుచరులకు) ఆ పని చేయమనో లేక చేయరాదనో సెలవిచ్చారు. అప్పుడు కొందరు ఆ విషయానికి సంబంధించి ఇవ్వబడిన సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో మొదట అల్లాహ్ ఔన్నత్యాన్ని స్థుతించి, తరువాత ఇలా అన్నారు – “జనానికి ఏమయింది, నేను స్వయంగా చేస్తున్న పనులను మానేస్తున్నారే? దైవసాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ గురించి నాకు మీ అందరికంటే బాగా తెలుసు. మీ అందరిలోకి అల్లాహ్ కి ఎక్కువగా భయపడేది కూడా నేనే”.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 72 వ అధ్యాయం – మల్లమ్ యువాజిహిన్నాస యితాబ్]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 35 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి.

(1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు.

(2) నా కోసం యావత్తు భూమండలం ప్రార్ధనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తీ ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళ అయినప్పుడు నమాజు చేసుకోవచ్చు.

(3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది.

(4) ఇతర ధైవప్రవక్తలందరూ తమతమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం ధైవప్రవక్తగా పంపబడ్డాను.

(5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు (*) చేసే అధికారం ఇవ్వబడింది.

(*) ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్ధం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫారసు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫారసు అంటే రద్దు కానటువంటి సిఫారసు కాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫారసు గానీ అయి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 56 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి …. జు ఇలత్ లియల్ అర్జుకుల్లాహ మస్జిదన్ వ తహూర]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 – సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్