ప్రవక్తలు ఎందుకు వచ్చారు? [వీడియో | టెక్స్ట్]

ప్రవక్తల రాక ఉద్దేశ్యం
https://youtu.be/e0k8L0QdnRk [12 నిముషాలు]
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

ఈ ప్రసంగంలో, ప్రవక్తల పంపకం యొక్క ఉద్దేశ్యం, వారి పాత్ర మరియు సందేశం గురించి వివరించబడింది. అల్లాహ్ తన ప్రవక్తలందరినీ శుభవార్త ఇచ్చేవారిగా మరియు హెచ్చరించే వారిగా పంపాడని, ఏకదైవారాధన వైపు ప్రజలను పిలవడానికి మరియు బహుదైవారాధన (షిర్క్) నుండి హెచ్చరించడానికి వారు వచ్చారని స్పష్టం చేయబడింది. మొట్టమొదటి ప్రవక్త నూహ్ (అలైహిస్సలాం) మరియు చివరి ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అని, వారి మధ్య వచ్చిన ప్రవక్తలందరి ప్రాథమిక సందేశం ఒక్కటేనని ఖురాన్ మరియు హదీసుల ఆధారాలతో వివరించబడింది. మానవులకు మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ చేసిన ఈ ఏర్పాటును అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పబడింది.

అల్హందులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు, 22వ పాఠం.

ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ చెప్పారు,

وَأَرْسَلَ اللَّهُ جَمِيعَ الرُّسُلِ مُبَشِّرِينَ وَمُنذِرِينَ
(వ అర్సలల్లాహు జమీఅర్రుసుల్ ముబష్షిరీన వ మున్దిరీన్)
అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ కూడా శుభవార్త ఇచ్చే వారిగా మరియు హెచ్చరించే వారిగా చేసి పంపాడు.

దలీల్ ఇప్పుడే ఇన్షా అల్లాహ్ మనం తెలుసుకుందాము, కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గమనించండి. అల్లాహు త’ఆలా మనపై ఎంత గొప్ప దయ చూపాడు! మనం మార్గభ్రష్టత్వంలో పడి ఉండకుండా, చనిపోయిన తర్వాత నరకంలో శిక్ష పొందకుండా, మన మేలు కొరకు అల్లాహు త’ఆలా ప్రవక్తల పరంపరను ఆదం అలైహిస్సలాం తర్వాత నుండి షిర్క్ మొదలయ్యాక నూహ్ అలైహిస్సలాంని ఆ తర్వాత ఇంకా ఎందరో ప్రవక్తలని పంపుతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పరంపరను అంతం చేశాడు.

అయితే ఆ ప్రవక్తలందరూ శుభవార్త ఇచ్చేవారు, హెచ్చరించేవారు. ఇక రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది, శుభవార్త ఏంటి అది? ఎవరి కొరకు? మూడో విషయం, హెచ్చరిక ఏమిటి? ఎవరి కొరకు?

శుభవార్త ఎవరైతే కేవలం అల్లాహ్ ను ఆరాధించి ప్రవక్తను అనుసరిస్తారో, ఇక ఇప్పుడు ప్రళయం వచ్చే వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, అలాంటి వారికి స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ యొక్క గొప్ప వరాలు, అనుగ్రహాల యొక్క శుభవార్త.

ఇక ఎవరైతే అల్లాహ్ ను ఆరాధించరో, అల్లాహ్ తో పాటు వేరే వారిని భాగస్వామిగా కలుపుతారో, ఎవరైతే ప్రవక్తల్ని వారి వారి కాలాలలో అనుసరించలేదో, ఇప్పుడు ప్రళయం వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించరో అలాంటి వారికి హెచ్చరిక. దేని గురించి? నరకం నుండి. ఇంకా వేరే భయంకరమైన శిక్షల నుండి.

అందుకొరకు ఈ పాఠంలోని ఈ మొదటి అంశం ద్వారా తెలిసేది ఏమిటంటే అల్లాహు త’ఆలా ప్రవక్తలందరినీ శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరిక చేసే వారిగా ఏదైతే పంపాడో మనం శుభవార్తను అందుకునే వారిలో చేరాలి.

ఇక ఈ మాటపై దలీల్ ఏమిటి? సూరతున్నిసా లోని ఈ ఆయత్.

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ
(రుసులమ్ ముబష్షిరీన వమున్దిరీన్)
మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము (4:165)

అల్లాహు త’ఆలా ప్రవక్తలని శుభవార్తనిచ్చేవారిగా, హెచ్చరించేవారిగా చేసి పంపాడు. ఎందుకు?

لِّئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ
(లిఅల్లా యకూన లిన్నాసి అలల్లాహి హుజ్జతుమ్ బ’అదర్రుసుల్)
ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహ్‌కు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజల వద్ద ఏ ఆధారమూ మిగలకూడదని (మేమిలా చేశాము) (4:165)

ప్రవక్తలను పంపిన తర్వాత ప్రజల వద్ద అల్లాహ్ కు వ్యతిరేకంగా ఏ ఒక్క సాకు మిగిలి ఉండకూడదు. వారి వద్ద ఏ ప్రమాణం మిగిలి ఉండకూడదు. అంటే ఏమిటి? రేపటి రోజు ప్రజలు వచ్చి ఎప్పుడైతే అల్లాహు త’ఆలా లెక్క తీసుకుంటాడో వారి మధ్యలో తీర్పు చేస్తాడో మరియు వారు వారి యొక్క షిర్క్, ఇంకా అవిధేయత కారణాల వల్ల ఏదైతే నరకంలో వెళ్తూ ఉంటారో, అప్పుడు వారు “ఓ అల్లాహ్! మమ్మల్ని ఎందుకు నరకంలో వేస్తున్నావు? నీవైతే మా హితోపదేశానికి, మమ్మల్ని మార్గం చూపడానికి, సన్మార్గం వైపునకు మాకు మార్గదర్శకత్వం చేయడానికి ఏ ప్రవక్తను పంపలేదు కదా, ఏ గ్రంథాన్ని అవతరింపజేయలేదు కదా” ఇలాంటి ఏ మాట చెప్పడానికి అవకాశం మిగిలి ఉండకూడదు. అందుకే అల్లాహు త’ఆలా ప్రవక్తలను పంపేసి స్వయం అల్లాహ్ ఒక హుజ్జత్, ఒక నిదర్శనం, వారిపై ఒక ప్రమాణం అల్లాహు త’ఆలా చేశాడు. ఇక ఎవరైతే సన్మార్గంపై ఉండరో, అల్లాహ్ యొక్క ఆరాధన మాత్రమే పాటించరో, ప్రవక్తల్ని అనుసరించరో దాని కారణంగా నరకంలో వెళితే ఇది అల్లాహ్ ది ఎంత మాత్రం తప్పు కాదు. అల్లాహ్ విషయంలో ఎలాంటి అన్యాయం చేశాడు అన్నటువంటి మాట మనం చెప్పలేము. ఎందుకంటే అల్లాహ్ వైపు నుండి మనం మార్గదర్శకత్వం పొందే సాధనాలన్నీ కూడా అల్లాహ్ యే ఏర్పాటు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి. కానీ మనం ఒకవేళ సన్మార్గంపై రాకుంటే అది మన తప్పు అవుతుంది.

ఇక ఈనాటి పాఠంలో ముఖ్యమైన మరొక అంశం ఏమిటంటే షిర్క్ గురించి హెచ్చరిస్తూ వచ్చిన మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం. త్వరపడకండి. ఏదైనా ఆశ్చర్యం కలుగుతుందా? ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఆయన నబీ కూడా. మేము విన్నాము మరి ఇప్పుడు మొట్టమొదటి ప్రవక్త నూహ్ అని అంటున్నారు అలైహిస్సలాతో వసలామ్. అయితే ఆదం అలైహిస్సలాం మొదటి ప్రవక్త ఇది మాట కరెక్టే, ఇందులో అనుమానం లేదు. కానీ ఆదం అలైహిస్సలాం చనిపోయిన తర్వాత సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఎలాంటి షిర్క్ లేకుండినది. ప్రజలు బహుదైవారాధనలో పడలేదు, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు. కాకపోతే కొన్ని వేరే తప్పులు ఉండినవి. కానీ షిర్క్ లాంటి పాపం నూహ్ అలైహిస్సలాం ఏ జాతిలో పుట్టారో, నూహ్ అలైహిస్సలాం పుట్టుక కంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ షిర్క్ ఎప్పుడైతే మొదలైనదో ఆ షిర్క్ ను ఖండించడానికి మళ్ళీ ప్రజలను ఏక దైవారాధన వైపునకు పిలవడానికి నూహ్ అలైహిస్సలాంను పంపడం జరిగింది. అందుకొరకే అవ్వలుర్రుసుల్, మొట్టమొదటి రసూల్ నూహ్ అలైహిస్సలాం అని ఖురాన్ ఆయత్ ద్వారా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల ద్వారా కూడా రుజువు అవుతుంది. ప్రవక్త హదీసుల్లో హదీసుష్షఫా’అ అని చాలా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఇక ఖురాన్ ఆయత్, సూరతున్నిసాలో:

إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ
(ఓ ముహమ్మద్‌!) మేము నూహ్‌ వైపుకు, అతని తరువాత వచ్చిన ప్రవక్తల వైపుకు వహీ పంపినట్లే (వాణిని అవతరింపజేసినట్లే) నీ వైపుకూ వహీ పంపాము. (నిసా 4:163).

అల్లాహు త’ఆలా ప్రవక్తల ప్రస్తావన కంటే ముందు నూహ్ అలైహిస్సలాం ప్రస్తావన తీసుకొచ్చారు.

ఇక సోదర మహాశయులారా, నూహ్ అలైహిస్సలాం మొట్టమొదటి ప్రవక్త. అంతిమ ప్రవక్త, చిట్టచివరి ప్రవక్త, ఖాతమున్నబియ్యీన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రేమగా, గౌరవంగా మన ప్రవక్త అంటాము, అంటే వేరే ఎవరి ప్రవక్త కాదు అన్నటువంటి భావం ఎంత మాత్రం కాదు. సర్వ మానవాళి వైపునకు ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు ప్రతి దేశంలో ఉన్న వారి కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కారుణ్య మూర్తి, ప్రవక్తగా చేసి పంపబడ్డారు.

అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ఖురాన్లో ఉంది.

وَلَٰكِن رَّسُولَ اللَّهِ وَخَاتَمَ النَّبِيِّينَ
(వలాకిర్ రసూలల్లాహి వ ఖాతమన్నబియ్యీన్)
అయితే, ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు ప్రవక్తల పరంపరకు అంతిమ ముద్ర. (33:40)

అలాగే అనేక సందర్భాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చెప్పారు: “లా నబియ్య బ’అదీ”, నా తర్వాత ఎవరూ కూడా ప్రవక్తగా రాలేరు. మీరేదో ఆశ్చర్యపడుతున్నట్లు ఉన్నది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా! మరి ఈసా అలైహిస్సలాం ప్రళయానికి కంటే ముందు వస్తారు కదా, ఆయన ప్రవక్త కదా! ఆయన ప్రవక్తగా ఉన్నారు ఇంతకుముందు. కానీ ఎప్పుడైతే ప్రళయానికి ముందు వస్తారో ప్రవక్త యొక్క హోదాలో రారు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతీ, ప్రవక్త ధర్మాన్ని, షరీయత్ను అనుసరించే వారే కాదు ప్రజలందరినీ కూడా అనుసరించే రీతిలో పాలన చేసే వారు. అందరిపై షరీయతె ఇస్లామియా అమలు చేసే వారిగా వస్తారు.

ఇక ప్రవక్తలందరి ప్రస్తావన వచ్చింది కదా! అయితే వారందరినీ మొదటి ప్రవక్త నుండి మొదలుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఎంతమంది ప్రవక్తలొచ్చారో వారందరి రాక అసలైన ఉద్దేశం ఏమిటి?

يَأْمُرُهُمْ بِعِبَادَةِ اللَّهِ وَحْدَهُ
(య’మురుహుమ్ బి ఇబాదతిల్లాహి వహ్ దహ్)
కేవలం అల్లాహ్ నే ఆరాధించమని ఆయన వారిని ఆదేశిస్తారు

وَيَنْهَاهُمْ عَنْ عِبَادَةِ الطَّاغُوتِ
(వ యన్హాహుమ్ అన్ ఇబాదతిత్తాఘూత్)
మరియు త్రాగూత్ (మిథ్యా దైవాల) ఆరాధన నుండి వారిని వారించేవారు.

ప్రతి ప్రవక్త తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ కు వ్యతిరేకంగా ఎవరెవరిని పూజించడం జరుగుతుందో, తాఘూత్ ల యొక్క ఇబాదత్ నుండి ఖండిస్తారు. ఇది ప్రవక్తల యొక్క రాక ముఖ్య ఉద్దేశం.

ఈ మాట, దీనికి ఆధారం సూరతున్నహ్ల్ ఆయత్ నంబర్ 36.

وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا
(వలఖద్ బ’అస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్రసూలా)
ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను పంపాము (16:36)

ఆ ప్రవక్త తమ జాతి వారికి:

أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ
(అని’బుదుల్లాహ వజ్తనిబుత్తాఘూత్)
అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించండి. త్రాగూత్ కు దూరంగా ఉండండి (16:36)

అని చాలా స్పష్టంగా చెప్పేవారు. అందుకొరకే సోదర మహాశయులారా, ఏ అల్లాహ్ పుట్టించాడో, పోషిస్తున్నాడో, ఈ సర్వ లోకాన్ని నడిపిస్తున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడు.

ఈనాటి పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాల సారాంశం ఏమిటంటే: అల్లాహ్ ప్రవక్తలను శుభవార్తను ఇచ్చే వారిగా, హెచ్చరించే వారిగా చేసి పంపాడు. మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, చిట్టచివరి ప్రవక్త, ప్రవక్తల పరంపరకు అంతిమ మరియు ప్రవక్తలందరికీ ఒక ముద్ర లాంటి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

మరియు ప్రవక్తలందరూ కూడా తమ జాతి వారికి ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని ఆదేశించేవారు. మిథ్యా దైవాలను, అల్లాహ్ తప్ప అందరి ఆరాధనలను, తాఘూత్ యొక్క పూజను వదులుకోవాలి అని స్పష్టంగా ఖండించేవారు.

తాఘూత్ అంటే ఏమిటి? దీని గురించి మరింత వివరంగా వచ్చే పాఠంలో తెలుసుకోబోతున్నాము. వచ్చే పాఠం వినడం మర్చిపోకండి, చాలా ముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. అల్లాహ్ మనందరికీ అల్లాహ్ ఆరాధనపై స్థిరత్వం ప్రసాదించుగాక. ఆమీన్.

واخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته
(వా ఆఖిరు ద’అవానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్).

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=41240

త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
ఇమాం ఇబ్ను బాజ్ రహిమహుల్లాహ్ ఈ పుస్తకం 100 సార్లు చదివించారు. దీని ద్వారా ఈ పుస్తకం యొక్క విలువను గమనించండి
https://teluguislam.net/2023/04/19/u3mnj/

హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది [వీడియో & టెక్స్ట్]

హిజ్రత్ (షిర్క్ ప్రాంతం నుండి, ఇస్లాం ప్రాంతానికి వలసపోవుట) ఈ ఉమ్మత్ పై విధిగా ఉంది
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ

https://youtu.be/GWB2_SlYVsw [14 నిముషాలు]

ముస్లిం ఉమ్మత్ పై హిజ్రత్ (వలస) అనేది ప్రళయం వరకు విధిగా ఉంది. షిర్క్ (బహుదైవారాధన) జరిగే ప్రదేశం నుండి ఇస్లాం ఉన్న ప్రదేశానికి వెళ్లడమే హిజ్రత్. తౌహీద్ (ఏకదైవారాధన) పై స్థిరంగా ఉండటం, కేవలం అల్లాహ్ ను ఆరాధించడం కష్టంగా లేదా అసాధ్యంగా ఉన్నప్పుడు, మరియు దాని కారణంగా హింసించబడుతున్నప్పుడు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టాలి. ఇది దేశం నుండి దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కూడా కావచ్చు. అయితే, స్వేచ్ఛగా ఇస్లాంను ఆచరించగలిగే మరియు ఇస్లాం గురించి ప్రచారం చేయగలిగే అవకాశం ఉన్న చోట హిజ్రత్ అవసరం లేదు. శక్తి ఉండి కూడా, ప్రపంచ ప్రయోజనాల కోసం హిజ్రత్ చేయని వారికి ఖుర్ఆన్ లో కఠినమైన హెచ్చరిక ఉంది. కానీ నిజంగా బలహీనులకు, మార్గం తెలియని వారికి మినహాయింపు ఉంది. హిజ్రత్ చేయని వాడు పాపాత్ముడు అవుతాడు కానీ అవిశ్వాసి కాడు. పశ్చాత్తాప ద్వారం మూసుకుపోయే వరకు (సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు) హిజ్రత్ కొనసాగుతుంది, కానీ వ్యక్తిగత పశ్చాత్తాపం మరణ ఘడియ రాకముందే చేయాలి.

ఇహ్ సాన్ : ఇస్లాం ధర్మంలోని మూడవ మరియు అత్యున్నత స్థాయి [వీడియో & టెక్స్ట్]

ఇహ్సాన్ : ఇస్లాం ధర్మంలోని మూడవ మరియు అత్యున్నత స్థాయి
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
https://youtu.be/ITBncGgMwvY [16 నిముషాలు]

ఈ పాఠంలో, ఇస్లాం ధర్మంలోని మూడవ మరియు అత్యున్నత స్థాయి అయిన ‘ఇహ్సాన్’ గురించి వివరించబడింది. ఇహ్సాన్ యొక్క ఏకైక స్తంభం (రుకున్) మరియు దానికి ఖుర్ఆన్ మరియు హదీసుల నుండి ఆధారాలు (దలీల్) చర్చించబడ్డాయి. ఇహ్సాన్ అంటే అల్లాహ్‌ను చూస్తున్నట్లుగా ఆరాధించడం, లేదా కనీసం అల్లాహ్ తనను చూస్తున్నాడనే సంపూర్ణ నమ్మకంతో ప్రతి పనిని పరిపూర్ణంగా (perfection), చిత్తశుద్ధితో (sincerity) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానంలో చేయడం. ప్రతి ముస్లిం తన ఆరాధనలలో మరియు జీవితంలోని ప్రతి అంశంలో ఈ ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ప్రయత్నించాలని ఈ పాఠం నొక్కి చెబుతుంది.

అల్హమ్దులిల్లాహ్. ఉసూలె సలాస, త్రిసూత్రాలు. 16వ పాఠం. ఇహ్సాన్, దాని యొక్క రుకున్, ఒక మూలస్తంభం మరియు దాని యొక్క దలీల్, ఆధారాలు తెలుసుకుందాము. అయితే మీరు మరిచిపోలేదు కదా? ఇంతకుముందు 15 పాఠాలు విన్నారు కదా? మనం సమాధిలో ప్రశ్నించబడే అటువంటి మూడు ప్రశ్నల సమాధానాలు త్రి సూత్రాలు అన్న పేరుతో తెలుసుకుంటున్నాము వివరాలతో ఆధారాలతో.

ఇప్పుడు మనం రెండో ప్రశ్న అయినటువంటి మా దీనుకా నీ ధర్మం ఏది? అంటే నా ధర్మం ఇస్లాం అన్నటువంటి దానికి వివరణ ఆధారాలతో తెలుసుకుంటున్నాము. ఇస్లాం ధర్మం మూడు స్థానాలు ఉన్నాయి. మొదటి స్థానం ఇస్లాం, రెండవ స్థానం ఈమాన్, మూడవ స్థానం ఇహ్సాన్. ఇస్లాం గురించి ఇంతకుముందే తెలుసుకున్నాము, దాని అర్థం, దాని యొక్క భావం మరియు దాని యొక్క ఐదు రుకున్లు మూల స్తంభాలు. వాటి యొక్క ఆధారాలు కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత రెండవ స్థానం, ఈమాన్, విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకున్నాము. విశ్వాసం భాగాలు ఏమిటో తెలుసుకున్నాము. దాని యొక్క ఆధారాలు మరియు విశ్వాసం యొక్క ఆరు మూల సూత్రాలు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఇహ్సాన్ గురించి తెలుసుకుంటున్నాము.

తాగూత్ (الطَّاغُوتِ) & దాని యొక్క రకాలు [వీడియో & టెక్స్ట్]

తాగూత్ & దాని యొక్క రకాలు
త్రిసూత్రాలు| పుస్తకం & వీడియో పాఠాలు | నసీరుద్దీన్ జామి’ఈ
youtube.com/watch?v=rzm66iOZUwg [22 నిముషాలు]

ఈ పాఠంలో, వక్త ‘తాగూత్’ అనే విషయాన్ని వివరిస్తారు. అల్లాహ్‌ను కాకుండా ఆరాధించబడే ప్రతిదాన్ని ‘తాగూత్’ అంటారు. ప్రతి ఒక్కరూ తాగూత్‌ను తిరస్కరించి, అల్లాహ్‌ను మాత్రమే విశ్వసించాలని ఇస్లాం నిర్దేశిస్తుందని వక్త పేర్కొన్నారు. ఇమామ్ ఇబ్న్ అల్-ఖయ్యిమ్ నిర్వచనం ప్రకారం, ఆరాధన, విధేయత లేదా అనుసరణలో మానవుడు తన పరిధిని దాటడానికి కారణమయ్యేది తాగూత్. ఇమామ్ ముహమ్మద్ ఇబ్న్ అబ్ద్ అల్-వహాబ్ ప్రకారం, ఐదు ప్రధాన తాగూత్‌లు ఉన్నాయి: 1. ఇబ్లీస్ (సైతాన్), 2. తన ఆరాధన పట్ల సంతోషించేవాడు, 3. తనను ఆరాధించమని ప్రజలను పిలిచేవాడు, 4. అగోచర జ్ఞానం ఉందని చెప్పుకునేవాడు, 5. అల్లాహ్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తీర్పు చెప్పేవాడు. చివరగా, “ధర్మానికి శిరస్సు ఇస్లాం, దాని స్తంభం నమాజ్, మరియు దాని శిఖరం జిహాద్” అనే హదీస్‌తో వక్త పాఠాన్ని ముగించారు.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు : క్లుప్త వివరణ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

ప్రతి ఒక్కరూ అవశ్యంగా తెలుసుకోవలసిన మూడు ముఖ్య సూత్రా లేమిటి?

తమ పోషకుని (రబ్‌) తెలుసుకోవటం,
తన నిజధర్మమైన ఇస్లాంను తెలుసుకోవటం,
తన ప్రవక్తయగు హజ్రత్‌ ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను తెలుసుకోవటం.

ఉసూలె సలాస (త్రి సూత్రాలు) – సమాధిలో అడిగే మూడు ప్రశ్నలు
https://youtu.be/vuLWSYjuoOg [40: 47 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో మూడు ప్రాథమిక సూత్రాల గురించి వివరించబడింది, ఇవి సమాధిలో ప్రతి వ్యక్తిని అడగబడే మూడు ప్రశ్నలు: నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? మరియు నీ ప్రవక్త ఎవరు? మొదటి సూత్రం, ‘నీ ప్రభువు అల్లాహ్’, ఆయన సృష్టికర్త, పోషకుడు మరియు ఏకైక ఆరాధ్యుడు అని వివరిస్తుంది. రెండవ సూత్రం, ‘నీ ధర్మం ఇస్లాం’, ఇది అల్లాహ్ కు తౌహీద్ తో లొంగిపోవడం, విధేయత చూపడం మరియు షిర్క్ నుండి దూరంగా ఉండటం అని నిర్వచిస్తుంది. ఇస్లాం యొక్క ఐదు స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహ్సాన్ గురించి కూడా క్లుప్తంగా చెప్పబడింది. మూడవ సూత్రం, ‘నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం’, ఆయన వంశం, జీవితం, ప్రవక్త పదవి, మక్కా మరియు మదీనాలోని ఆయన దَదావా మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. ఈ సమాధానాలు కేవలం మాటలతో కాకుండా, ఆచరణ రూపంలో మన జీవితంలో ప్రతిబింబించినప్పుడే సమాధిలో చెప్పగలమని వక్త నొక్కిచెప్పారు.

అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.

అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్, నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్ బిహి అజ్మయీన్, అమ్మా బాద్.

సర్వ స్తోత్రములు కేవలం మనందరి సృష్టికర్త అయిన, అలాగే మన పోషకుడైన ఈ సర్వ విశ్వాన్ని నిర్వహిస్తున్న, నడుపుతున్న, మనందరి ఆరాధనలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ కు మాత్రమే చెల్లుతాయి, శోభిస్తాయి.

లెక్కలేనన్ని దరూదో సలాం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, అనేకానేక కరుణ శాంతులు చిట్టచివరి ప్రవక్త, దయామయ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కురియుగాక.

ఈ రోజు నా యొక్క అంశం ఉసూలు సలాస, త్రి సూత్రాలు. త్రి సూత్రాలు అని ఈ అంశం ఏదైతే ఇక్కడ నిర్ణయించడం జరిగిందో దాని గురించి ఒక చిన్న వివరణ మీకు ఇచ్చి డైరెక్ట్ నా అంశంలో నేను ప్రవేశిస్తాను. నేను కూడా ఇది ఒక ప్రసంగం కాదు, క్లాసులు గనుక, తరగతులు గనుక, నిదానంగా మెల్లిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ మీకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా, వివరంగా ఆధారాలతో, మంచి విధంగా బోధించే సద్భాగ్యం నాకు ప్రసాదించుగాక. వింటున్న మంచి విషయాలను గ్రహించి, వింటున్న మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే మరియు ఇతరులకు మనం ఆహ్వానించే అటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక.

త్రీ సూత్రములు, మూడు సూత్రాలు అని అంటే ఏమిటి అవి? నీ ప్రభువు ఎవరు? నీ ధర్మం ఏది? నీ ప్రవక్త ఎవరు? ఈ మూడు ప్రశ్నలు అనండి, ఇదే మూడు సూత్రాలు, మూడు ప్రశ్నలుగా మనతో సమాధిలో ప్రశ్నించబడనున్నాయి.

అయితే, ఎప్పుడైతే సమాధిలో ఈ ప్రశ్నలు మన ముందుకు వస్తాయో, అప్పుడు అక్కడ మనం వీటి యొక్క సమాధానం తయారు చేసుకోవాలంటే ఏ మాత్రం వీలుపడదు. అందుకే అల్లాహ్ యొక్క గొప్ప దయ, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకు ఆ ప్రశ్నలు ఇక్కడే తయారు చేసుకునే అటువంటి అవకాశం అల్లాహ్ మనకు ఇచ్చాడు. మరియు ఆ ప్రశ్నలకు నిజమైన సమాధానం ఏమిటో అది కూడా అల్లాహు త’ఆలా మనకు తెలియజేశాడు.

సునన్ అబీ దావూద్, హదీస్ నెంబర్ 4753. ఇందులో ఈ హదీస్ వచ్చి ఉంది. చాలా పొడవైన హదీస్. కానీ ఈ మూడు ప్రశ్నల యొక్క ప్రస్తావన ఈ హదీస్ లో వచ్చి ఉంది. ఎప్పుడైతే మనిషిని తీసుకువెళ్లి అతని బంధుమిత్రులందరూ కూడా సమాధిలో పెడతారో మరియు అక్కడ నుండి తిరిగి వస్తారో, ఆ తర్వాత అక్కడికి ఇద్దరు దూతలు వస్తారు, ఫయుజ్లిసానిహి, ఆ దూతలు అతన్ని కూర్చోబెడతారు. ఫయఖూలాని లహు, అతనితో ప్రశ్నిస్తారు.

مَنْ رَبُّكَ؟
(మన్ రబ్బుక?)
“నీ ప్రభువు ఎవరు?”

مَا دِينُكَ؟
(మా దీనుక్?)
“నీ ధర్మం ఏది?”

مَا هَذَا الرَّجُلُ الَّذِي بُعِثَ فِيكُمْ؟
(మా హాజర్ రజులుల్లదీ బుఇస ఫీకుమ్?)
“మీ వద్దకు పంపబడిన ఈ వ్యక్తి ఎవరు?”

విశ్వాసుడయైతే ఉంటే కరెక్ట్ సమాధానం ఇస్తాడు. నా ప్రభువు అల్లాహ్, నా యొక్క ధర్మం ఇస్లాం మరియు మా వైపునకు మా మార్గదర్శకత్వం కొరకు పంపబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని.

అయితే సోదర మహాశయులారా, ఈ మూడు ప్రశ్నలు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో వీటినే మూడు సూత్రాలుగా చెప్పడం జరిగింది. మరియు ఇహలోకంలో మనం ఈ మూడు ప్రశ్నల యొక్క, మూడు సూత్రాల యొక్క వివరణ, జవాబులు ఖురాన్ హదీస్ ఆధారంగా తెలుసుకొని వాటి ప్రకారంగా మనం ఆచరించడం, జీవించడం చాలా అవసరం.

అయితే సోదర మహాశయులారా, ఈ అంశంపై త్రీ సూత్రాలు అల్-ఉసూలుల్ సలాస అని ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ఒక చాలా చక్కని చిన్నటి పుస్తకం రాశారు. దాని యొక్క వివరణ తెలుగులో అల్ హందులిల్లాహ్ మా యూట్యూబ్ ఛానల్ పై కూడా ఉంది, జీడీకే నసీర్. ఇంకా వేరే కొందరు ఛానెల్ వారు కూడా తమ యొక్క ఛానెల్ లో కూడా వేసి ఉన్నారు. పూర్తి వివరణ అక్కడ వినవచ్చు మీరు. కానీ ఇప్పుడు ఇక్కడ నాకు కేవలం 35-40 నిమిషాల సమయం మాత్రమే ఉంది గనుక, ఇందులో కొన్ని ముఖ్య విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను.

సోదర మహాశయులారా, త్రీ సూత్రాలు అని ఇక్కడ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో మొదటి సూత్రం మన్ రబ్బుక్, నీ ప్రభువు ఎవరు? మనకు ఇప్పుడు జవాబు తెలిసింది గనుక మనం చాలా సులభంగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాము. నా యొక్క ప్రభువు అల్లాహ్ అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఈ మూడు ప్రశ్నల యొక్క సమాధానం ఆచరణ రూపంలో ఇహలోకంలో సిద్ధపరచుకొని లేకుంటే, చనిపోయిన తర్వాత మన సమాధిలో ఈ సమాధానం మనం చెప్పలేము. ఏదో మూడు ప్రశ్నల సమాధానాలు తెలిసిపోయాయి కదా, మన్ రబ్బుకా అంటే అల్లాహ్ అనాలి, మా దీనుక్ నీ ధర్మం ఏమిటి అంటే ఇస్లాం అనాలి, నీ ప్రవక్త ఎవరు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి, మూడే పదాలు ఉన్నాయి కదా? అల్లాహ్, ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత సులభం? చెప్పుకోవడానికి మూడే మూడు పదాలలో చాలా సులభమైన ఆన్సర్. ఇహలోకంలో ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు వింటే వచ్చేస్తుంది కావచ్చు. కానీ దీని ప్రకారంగా మన జీవితం గడవకపోతే, దీని ప్రకారంగా మన ఆచరణ లేకుంటే సమాధిలో మన నోటితో ఈ ఆన్సర్, జవాబు చెప్పడం కుదరదు. ఇది చాలా బాధాకర విషయం. అందుకొరకే సోదర మహాశయులారా, సోదరీమణులారా దాని యొక్క జవాబు వివరణగా ఏమిటి, ఎలా దాన్ని మనం సిద్ధపరచాలి అదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.

మన్ రబ్బుక్ అని ఎప్పుడైతే అనడం జరుగుతుందో, నీ ప్రభువు ఎవరు? మన సమాధానం అల్లాహ్ అనే ఉండాలి. కరెక్టే. కానీ ఎవరు అల్లాహ్? అల్లాహ్ ఎవరు అంటే, ఆయనే నన్ను ఈ సర్వ విశ్వాన్ని సృష్టించినవాడు. ఇక్కడ గమనించండి, రబ్ అన్న పదం ఉంది. సర్వసామాన్యంగా మన తెలుగు పుస్తకాల్లో అనువాదంలో పోషకుడు అని మనం తర్జుమా, అనువాదం చేస్తాము. కానీ ఇందులో చాలా వివరణతో కూడిన విషయాలు ఉన్నాయి. రబ్ అన్న పదానికి ఒక్క పోషకుడు అన్న పదం సరిపోదు. అయితే మన యొక్క రబ్ ఎవరు? ఎవరైతే నన్ను మరియు ఈ విశ్వంలో ఉన్న సర్వ సృష్టిని పుట్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి అందరి యొక్క వ్యవహారాలను నడుపుతున్నాడో ఆ అల్లాహ్ మాత్రమే.

ఇక్కడ శ్రద్ధ వహించండి నా మాటపై, ప్రతి బుద్ధిమంతునికి వెంటనే మనసులో వచ్చే విషయం ఏంటి? ఎవరైతే నీకు ఉపకారం చేస్తున్నాడో, నీ పట్ల మేలు చేస్తున్నాడో అతనికి నీవు కృతజ్ఞతాభావంతో మెలుగుతావు. ఏ అల్లాహ్ అయితే సృష్టించాడో, పోషిస్తున్నాడో మరియు జీవన్ మరణాలు ప్రసాదించి మన వ్యవహారాలన్నిటినీ నడుపుతున్నాడో అంతకంటే మేలు చేసేవాడు, అంతకంటే గొప్ప మనకు ఉపకారాలు చేసేవాడు ఇంకెవరు ఉంటారు? ఎవరూ ఉండరు. అందుకొరకే వహువ మ’బూదీ లైసలీ మ’బూదున్ సివా. ఆ అల్లాహ్ తప్ప నా ఆరాధ్యుడు ఇంకా వేరే ఎవరూ కాజాలడు. అర్థమైందా విషయం? దీనికి దలీల్, ఖురాన్ మీరు తెరిస్తేనే, ఓపెన్ చేస్తేనే బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్ తర్వాత ఏముంది?

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్)
ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు,1:2)

గమనించండి. అల్ హందు, సర్వ స్తోత్రములు, అన్ని రకాల పొగడ్తలు ఎవరికీ? లిల్లాహి, కేవలం అల్లాహ్ కొరకు. ఎందుకు? రబ్బిల్ ఆలమీన్. ఆ అల్లాహ్ యే ఈ సర్వ లోకాలకు ప్రభువు.

రబ్ అన్న ఇక్కడ పదానికి ప్రభువు అని మనం ఏదైతే చేశామో తెలుగులో, ఇంతకుముందు నేను చెప్పినట్లు, పుట్టించువాడు, పోషించువాడు మరియు జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సర్వ వ్యవహారాలను నడిపించేవాడు, ఇవన్నీ భావాలు ప్రభువు అన్న యొక్క అర్థంలో వచ్చేస్తాయి. ఇక్కడ గమనించండి, అల్లాహ్ తప్ప ప్రతీదీ కూడా ఆలం, ప్రపంచం, లోకం. మరియు ఈ లోకంలో ఒకడిని నేను. అందుకని కేవలం అల్లాహ్ యే నా ప్రభువు, ఆ అల్లాహ్ యే నా యొక్క నిజమైన ఆరాధ్యుడు.

అల్లాహ్ యే నా ప్రభువు అని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలా సులభమైన విషయం. రాత్రి పగళ్లు, సూర్య చంద్రులు మరియు భూమి ఆకాశాలు, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా మనకు చెప్పకనే చెబుతుంది, మనందరి ప్రభువు కేవలం అల్లాహ్ మాత్రమే అని. ఉదాహరణకు చదవండి సూరత్ ఫుస్సిలత్, దాని యొక్క మరో పేరు హామీమ్ అస్-సజ్దా, ఆయత్ నెంబర్ 37.

وَمِنْ آيَاتِهِ اللَّيْلُ وَالنَّهَارُ وَالشَّمْسُ وَالْقَمَرُ ۚ لَا تَسْجُدُوا لِلشَّمْسِ وَلَا لِلْقَمَرِ وَاسْجُدُوا لِلَّهِ الَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ
రేయింబవళ్లూ, సూర్యచంద్రులు కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. మీరు సూర్యునికిగానీ, చంద్రునికిగానీ సాష్టాంగప్రణామం (సజ్దా) చేయకండి. నిజంగా మీరు అల్లాహ్‌ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్‌ ముందు సాష్టాంగపడండి. (41:37)

అల్లాహ్ యొక్క సూచనలలో, అల్లాహ్ యే సర్వశక్తిమంతుడు, ఆయన ఏకైక ఆరాధ్యుడు అన్నదానికి ఎన్నో సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఇవి కూడా. ఏంటి? రాత్రి, పగలు, సూర్యుడు, చంద్రుడు. మీరు సూర్యునికి సాష్టాంగం చేయకండి, సజ్దా చేయకండి. చంద్రునికి సజ్దా చేయకండి. వీటన్నిటినీ సృష్టించిన నిజ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయనకే మీరు సజ్దా చేయండి. నిజంగా, వాస్తవంగా మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించే వారైతే.

ఇక ఎవరైతే మేము సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము, మీరు మేము అందరము ఆరాధించేది కేవలం ఒక్క దేవున్నే అన్నటువంటి మాటలు పలుకులు ఎవరైతే పలుకుతారో, వారితోని అడగండి. మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారు సూర్యుణ్ణి పుట్టించారా? చంద్రుణ్ణి పుట్టించారా? ఈ రాత్రి పగలును పుట్టించారా? అలాగే అల్లాహు త’ఆలా సూరతుల్ అ’రాఫ్, సూర నెంబర్ 7, ఆయత్ నెంబర్ 54 లో తెలిపాడు:

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ
నిస్సందేహంగా అల్లాహ్‌యే మీ ప్రభువు. ఆయన ఆకాశాలను, భూమిని ఆరు రోజులలో సృష్టించాడు.  (7:54)

నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్ మాత్రమే. ఆయనే భూమ్యాకాశాలను కేవలం ఆరు రోజుల్లో పుట్టించాడు.

సోదర మహాశయులారా, ఈ విధంగా మనం చూస్తూ పోతే ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి. ఖురాన్ ఆరంభంలో, సూరతుల్ ఫాతిహా తర్వాత సూరతుల్ బఖర, అందులోని మూడో రుకూ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో, సూరే బఖర, ఆయత్ నెంబర్ 21, 22 లో మొట్టమొదటి ఆదేశం అల్లాహ్ ఏదైతే ఇచ్చాడో, ఖురాన్ ప్రారంభంలో మొట్టమొదటి ఆదేశం ఇదే ఆదేశం ఇచ్చాడు. ఏంటి? మీరందరూ మీ నిజ ప్రభువైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అంతేకాదు, ప్రతి బుద్ధిమంతునికి అర్థమయ్యే విధంగా ఎంతో సులభంగా ఆ అల్లాహ్ యొక్క గుణగణాలను, ఆయనే ఆరాధనకు ఏకైక అర్హుడు అన్నటువంటి కొన్ని నిదర్శనాలు కూడా అక్కడ చూపాడు. ఒకసారి ఆ ఆయతులు విని ఇంకా ముందుకు వెళ్దాము మనం.

يَا أَيُّهَا النَّاسُ اعْبُدُوا رَبَّكُمُ الَّذِي خَلَقَكُمْ وَالَّذِينَ مِن قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُونَ
ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి- తద్వారానే మీరు (పాపాల నుండి) సురక్షితంగా ఉంటారు. (2:21)

ఓ ప్రజలారా! గమనించండి. మీరు ఏదైతే శ్రద్ధగా ఈ పాఠం వింటున్నారో కదా, ఆయత్ నెంబర్లు ఏదైతే చెబుతున్నానో, రాస్తున్నారో కదా, మీరు మీ ముస్లిమేతర సోదరులకు, ఎవరైతే స్త్రీలు వింటున్నారో మీరు ముస్లిమేతర స్త్రీలకు ఈ ఆయతులు తిలావత్ కూడా చేసి వినిపించండి. వాటి యొక్క భావాన్ని కూడా వారికి వివరించి చెప్పండి. ప్రత్యేకంగా ఈ రెండు ఆయతులు మీరు యాడ్ చేసుకుంటే కూడా సరిపోతుంది, తౌహీద్ యొక్క దావత్ ఇవ్వడానికి.

మొట్టమొదటి విషయం ఇక్కడ గమనించండి, ఈ ఒక్క మొదటి పదంలోనే యా అయ్యుహన్నాస్ మనకు ఖురాన్ యొక్క సత్యం, ఖురాన్ ప్రజలందరికీ అన్న విషయం చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఓ ప్రజలారా! అంటే ఈ ఖురాన్ ముస్లింలకు మాత్రమే కాదు, అరబ్బులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎక్కడ ఎవరు జీవిస్తున్నారో ప్రతి ఒక్కరి కొరకు వచ్చింది. ఏమంటున్నాడు అల్లాహ్? ఉ’బుదూ రబ్బకుమ్, మీ ప్రభువును మాత్రమే మీరు ఆరాధించండి. ఎవరు ప్రభువు? అల్లదీ ఖలఖకుమ్, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో, వల్ లదీన మిన్ ఖబ్లికుమ్, మీకంటే ముందు గడిచిన వారిని సృష్టించాడో, ల’అల్లకుమ్ తత్తఖూన్, ఈ విధంగా మీరు భయభీతి కలిగిన వారిలో చేరగలుగుతారు. ఈ విధంగా మీరు తమకు తాము నరకం నుండి రక్షించుకోగలుగుతారు. ఇక ఆ నిజ ప్రభువు యొక్క ఒక గుణం చెప్పడం జరిగింది, ఆయన మిమ్మల్ని మీకంటే పూర్వీకులను పుట్టించాడు అని. ఇంకా ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మరికొన్ని విషయాలు కూడా అల్లాహ్ తెలిపాడు. ఏమని తెలిపాడు?

الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ فِرَاشًا وَالسَّمَاءَ بِنَاءً وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ فَلَا تَجْعَلُوا لِلَّهِ أَندَادًا وَأَنتُمْ تَعْلَمُونَ
ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు, ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి. (2:22)

ఆ అల్లాహ్ యే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు మరియు ఆకాశం నుండి ధారాపాతంగా మీ కొరకు వర్షాన్ని కురిపించాడు. ఈ వర్షం ద్వారా, ఈ నీటి ద్వారా భూమి నుండి మీ కొరకు మంచి మంచి పంటలు, ఫలాలు పండించాడు. ఇలాంటి అల్లాహ్ ను, అల్లాహ్ యొక్క ఈ గొప్ప సూచనలను మీరు తెలుసుకొన్న తర్వాత ఈ విధంగా అల్లాహ్ కు పాటు వేరే భాగస్వాములను ఏమాత్రం కల్పించకండి.

అల్లాహ్ యొక్క పరిచయం ఎంత స్పష్టంగా ఉందో గమనించండి. ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఏ ఒక పెద్ద వివరణ, దీని గురించో పెద్ద ఫిలాసఫర్ లాంటి వారు లేదా పెద్ద తత్వవేత్తలు డిగ్రీలు సంపాదించడం ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఎంతో సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అయితే ఇమామ్ ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ఇవన్నిటిని సృష్టించిన సృష్టికర్తయే మనందరి ఆరాధనలకు నిజమైన ఆరాధ్యుడు.

ఇక ఆరాధనలో సోదరులారా ఎన్నో విషయాలు వస్తాయి. ఇస్లాం, ఈమాన్, ఇహసాన్, దుఆ, భయభీతి, ఆశ, భరోసా, నమ్మకం, అలాగే భయపడడం, ఇంకా మనం కష్టంలో ఉన్నప్పుడు కేవలం అతనితో మాత్రమే సహాయం కోరడం, అర్ధించడం, శరణు వేడుకోవడం, జిబహ్ చేయడం, ఇంకా మొక్కుబడులు ఇంకా ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి. ఒకవేళ సంక్షిప్తంగా ఓ రెండు మాటల్లో చెప్పాలంటే హృదయ సంబంధమైన, నాలుక సంబంధమైన, శరీర సంబంధమైన, ధన సంబంధమైన ఎన్నో రకాల ఆరాధనలు ప్రతిదీ కూడా కేవలం అల్లాహ్ కు మాత్రమే చేయాలి. ఆరాధన యొక్క కొన్ని రకాలు ఇప్పుడు నేను మీకు ఏదైతే తెలిపాను వాటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ నుండి మరియు హదీస్ నుండి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. కానీ సమయం సరిపోదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు మా యొక్క వివరణతో కూడిన మీరు వీడియోలు, ఆడియోలు తప్పకుండా వినండి. అక్కడ వివరణ తెలుస్తుంది.

ఇక రండి, రెండో మూల సూత్రం, ఇస్లాం. సోదర మహాశయులారా, సోదర మహాశయులారా, అల్లాహ్ ను మనం తెలుసుకున్నాము. ఇక అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి. అయితే ఆ అల్లాహు త’ఆలా మన జీవన విధానం కొరకు ఇస్లాం ధర్మాన్ని మనకు ప్రవక్తల ద్వారా పంపుతూ వచ్చాడు. అయితే మొదటి ప్రవక్త, ప్రథమ ప్రవక్త, తొలి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం ధర్మాన్నే బోధించారు. కానీ ఆ ప్రవక్తలు చనిపోయిన తర్వాత వారిని అనుసరించే వారిలో కాలం గడిచిన కొద్దీ వారు మార్పులు చేసుకుంటూ ఎన్నో రకాల మంచి విషయాలను అందులో నుండి తీసేసి తమ ఇష్టానుసారం అందులో చేర్పులు చేసుకున్నారు. అయితే అల్లాహు త’ఆలా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణంగావించాడు. దీనిని కాపాడే బాధ్యత కూడా తీసుకున్నాడు. అందుకొరకే ఎన్ని కొత్త వర్గాలు పుట్టుకొచ్చినా గాని, ఇస్లాంలో ఎన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేసినా గాని, స్వయంగా ఇస్లాం యొక్క శత్రువులు ఇందులో ఎలాంటి జోక్యం చేసుకొని సరియైన ఇస్లాం నుండి ముస్లింలను, ప్రజలను దూరం చేయడానికి ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏమీ సఫలీకృతం కాజాలవు. ఎందుకంటే స్వయంగా అల్లాహ్ ఈ సత్య ధర్మమైన ఇస్లాం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సంపూర్ణం చేశాడో, దాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకుని ఉన్నాడు.

అయితే ఇక రండి, ఇస్లాం అన్న దానికి భావం ఏంటి? అల్ ఇస్లాం హువల్ ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్, వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, వల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. మూడు విషయాలు ఇందులో వచ్చాయి గమనించండి. మనం ఏకత్వం, తౌహీద్ ద్వారా అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ. ఆయనకు మాత్రమే విధేయత పాటించుట. ఇచ్చిన ఆదేశాలను పాటించాలి, వారించిన విషయాలకు దూరం ఉండాలి. వల్ ఇన్ఖియాదు లహు బిత్తాఅ, ఆయన యొక్క విధేయత పాటించుట, మాట వినుట, ఆజ్ఞ పాలన చేయుట. మూడోది ఏమిటి? తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్. షిర్క్ మరియు షిర్క్ చేసేవారితో తమకు తాము ఏ సంబంధం లేనట్లుగా దూరంగా ఉండుట.

స్లాం యొక్క ఇక్కడ చిన్నపాటి డెఫినిషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి కొంత వివరణ కూడా మీరు తెలుసుకోండి లేదా అంటే మరికొందరు మిస్అండర్స్టాండింగ్, తప్పుడు అర్థాలు తీసుకొని మనపై బురద చల్లే అటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు. ఏంటి అది? ఇస్తిస్లాము లిల్లాహి బిత్తౌహీద్. కేవలం అల్లాహ్ కు మాత్రమే లొంగిపోవుట. ఎందుకు? ఇప్పటివరకే మనం తెలుసుకున్నాము, ఆయనే మన నిజ ఆరాధ్యుడు. ఈ లొంగిపోవుట అనేది ఎలా ఉండాలి? తౌహీద్ తో ఉండాలి, ఏకత్వంతో ఉండాలి. ఇంకా వేరే ఎవరి వైపునకు మనం లొంగిపోవడానికి ఏ అవకాశం ఉండదు. హా, నేను అల్లాహ్ ను నమ్ముకున్నాను, నా హృదయంలో అల్లాహ్ తప్ప ఎవడు లేడు, నోటితో ఇలా చెప్పుకుంటే సరిపోదు, ఇన్ఖియాద్. అంటే ఏమిటి? ఇన్ఖియాద్ లహు బిత్తాఅ. అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పూర్తిగా పాటించడం. ఏ విషయాల నుండి వారించాడో వాటికి దూరంగా ఉండడం. ఈ రెండిటితో పాటు మూడవది, అల్ బరాఅతు మినష్షిర్కి వ అహ్లిహి. తౌహీద్ కు వ్యతిరేకమైనది షిర్క్, బహుదైవారాధన, అల్లాహ్ తో పాటు ఇతరులను భాగస్వామిగా చేయడం. ఈ షిర్క్ కు పూర్తిగా దూరం ఉండాలి. షిర్క్ తో ఏ సంబంధం లేకుండా ఉండాలి.

ఇందులోనే మరో అంశం ఉంది. షిర్క్ తో కూడా మన సంబంధం లేకుండా ఉండాలి, వ అహ్లిహి, షిర్క్ చేసేవారితో కూడా. ఈ పదంతో కొందరు తప్పుడు భావాలు తీసుకుంటారు, అందుకొరకే కొంచెం గమనించండి. ఏంటి గమనించే విషయం? షిర్క్ విషయాలలో, షిర్క్ పనులలో మనం ముష్రికులకు, బహుదైవారాధనలో బహుదైవారాధకులకు మనం ఎలాంటి తోడ్పాటు, సహాయం అందించలేము. ఎందుకంటే ఇది తప్పు. తప్పును తప్పు చెప్పకుండా మనం అభినందిస్తున్నాము, శుభకాంక్షలు తెలియజేస్తున్నాము అంటే ఆ తప్పును నిజం అని ఒప్పుకున్నట్లు మనం. అది తప్పు అని నోటితో చెప్పినప్పటికీ, తప్పు కాదు అని మనం మన ఆచరణ ద్వారా మనం ప్రదర్శిస్తున్నట్లు అవుతుంది. అందుకొరకు ఇక్కడ చాలా జాగ్రత్త పడాలి. అయితే, మరో విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఎవరైతే ముస్లిమేతరులుగా ఉన్నారో, ఎవరైతే బహుదైవారాధన చేస్తున్నారో, ముస్లింలు అయి ఉండి కూడా, ప్రతి ఒక్కరితో షిర్క్ పనులలో మనం ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి. కానీ అదే ఇస్లాం బోధిస్తున్న మరో గొప్ప విషయం ఏమిటంటే, షిర్క్ విషయంలో వారికి ఏ సహాయం చేయకండి, వారికి ఏ శుభాభినందనలు తెలుపకండి, వారికి ఎలాంటి కంగ్రాట్యులేషన్స్ తెలిపి వారిని ప్రోత్సహించకండి. కానీ మానవరీత్యా వారితో మానవత్వంగా మసులుకొని, వారికి షిర్క్ యొక్క నష్టాలను తెలియజేస్తూ ఉండండి, తౌహీద్ యొక్క బర్కత్ లను, శుభాలను స్పష్టపరుస్తూ ఉండండి, షిర్క్ నుండి ఆగిపోవాలి అని, తౌహీద్ వైపునకు రావాలి అని ప్రేమగా ఆహ్వానిస్తూ ఉండండి. ఇంతటి గొప్ప మంచి శిక్షణ కూడా ఇస్లాం ఇచ్చి ఉంది. 28వ ఖాండంలో మనకు దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆయతులు ఉన్నాయి, సూరే మాయిదాలో కూడా ఉన్నాయి, ఇంకా వేరే ఎన్నో సందర్భాల్లో ఉన్నాయి.

సోదర మహాశయులారా, ఇస్లాం యొక్క నిర్వచనం, దాని యొక్క చిన్న వివరణ ఏదైతే మనం విన్నామో, ఇక రండి దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మూడో సూత్రం గురించి తెలుసుకుందాము.

ఇస్లాం అని మనం అన్నప్పుడు ఇందులో ఇస్లాం యొక్క ఐదు అర్కాన్లు వచ్చేస్తాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, ఐదు పూటల నమాజు స్థాపించడం, విధిదానం జకాతు చెల్లించడం, రమదాన్ ఉపవాసాలు పాటించడం, శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే ఈ ఐదిటిలో మూడు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం, నమాజు పాటించడం మరియు ఉపవాసం ఉండడం ప్రతి బీదవానిపై విధిగా ఉంది. ఇక ఎవరికి ఎలాంటి కొన్ని ఆరోగ్యపరంగా ఏమైనా ఆటంకాలు వస్తాయో వాటికి తగిన సులభతరాలు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది, ఆ వివరాలు వేరే సందర్భంలో. ఇక విధిదానం జకాత్ అన్నది ఎవరైతే సంపాదన సంపాదిస్తున్నారో, ఎవరైతే తమ యొక్క అవసరాలు తీర్చిన తర్వాత ఇంకా ఎక్కువగా డబ్బు ఉందో, అయితే నిర్ణీత పరిమాణంలో, నిర్ణీత కొన్ని విషయాలలో, నిర్ణీత ప్రజలకు ఇవ్వవలసిన హక్కు జకాత్. ఇక హజ్ కూడా శక్తి ఉన్నవారిపై మాత్రమే విధిగా ఉంది. వీటన్నిటికీ కూడా దలీల్ ఖురాన్ లో హదీస్ లో చాలా స్పష్టంగా ఉన్నాయి. హదీసే జిబ్రీల్ మన ముందు ఎంతో స్పష్టంగా ఉంది. కానీ ఆ దలీల్ అన్నీ కూడా ఇప్పుడు తెలియజేయడానికి, చదివి మీ ముందు వినిపించడానికి అవకాశం కాదు. అవకాశం లేదు, సమయం సరిపోదు.

ఇస్లాంలో మరో ముఖ్యమైన విషయం, ఈమాన్. ఈమాన్ అంటే ఇందులో ఆరు మూల సూత్రాలు వస్తాయి. అల్లాహ్ ను విశ్వసించడం, దైవదూతలను విశ్వసించడం, ప్రవక్తలను విశ్వసించడం, గ్రంథాలను విశ్వసించడం, పరలోకాన్ని విశ్వసించడం మరియు మంచి చెడు తక్దీర్, అదృష్టాన్ని, విధిరాతను విశ్వసించడం.

ఇక ఇందులో మరొకటి వస్తుంది, దానినే ఇహ్సాన్ అని అంటారు. ఏమిటి అది? మనం ఏ పని, ఏ సత్కార్యం, ఏ ఆరాధన చేస్తున్నా గానీ, మనం ఏ చెడు నుండి దూరం ఉంటున్నా గానీ, ఎలా చేయాలి, ఎలా మనం ఆ సత్కార్యంలో నిమగ్నులై ఉండాలి? మన ముందు అల్లాహ్ ఉన్నాడు, మనం కళ్లారా అల్లాహ్ ను చూస్తూ ఉన్నాము, అటువంటి విధేయత భావంతో. ఒకవేళ ఇలాంటి భావం రాకుంటే మనసులో, ఇది మాత్రం తప్పకుండా మనం విశ్వసించాలి, అల్లాహ్ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు, పర్యవేక్షిస్తూ ఉన్నాడు, ఏ క్షణం కూడా అల్లాహ్ యొక్క వినడం, చూడడం, జ్ఞానం నుండి మనం దూరం లేము. రాత్రిలో అయినా, పట్టపగలు మట్టమధ్యాహ్నం అయినా గాని, అమావాస్య చీకట్లోనైనా వెలుతురులోనైనా, ఒంటరిగా ఉన్నా, ప్రజల మధ్యలో ఉన్నా, అల్లాహ్ మనల్ని ఎల్లవేళల్లో చూస్తూ ఉన్నాడు, అల్లాహ్ యొక్క దృష్టి నుండి మనం ఏ మాత్రం తప్పించుకోలేము.

ఇస్లాం అంటే ఏమిటి అన్న దానికి ఈ సంక్షిప్త వివరణ కూడా మనం మన మిత్రులకు మనం తెలుపవచ్చు. అయితే సోదర మహాశయులారా, ఈమాన్, ఇహసాన్, ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు, ఈమాన్ యొక్క ఆరు మూల సూత్రాలు మరియు ఇహసాన్ దీని గురించి కూడా మనం తెలుసుకున్నాము. వీటిలో ప్రతి ఒక్క దానికి ఖురాన్ లో, హదీస్ లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి.

మూడో సూత్రం, నీ ప్రవక్త ఎవరు? ఇదే మూడవ ప్రశ్న కూడా సమాధిలో. అయితే మనం మన ప్రవక్తను తెలుసుకొని ఉండడం కూడా తప్పనిసరి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సంక్షిప్తంగా వారి యొక్క వంశం ఏమిటి? ముహమ్మద్ బిన్… ఇక్కడ మనం సర్వసామాన్యంగా అరబీలో బిన్ అని అంటాము కదా, కొడుకు అని భావం. అయితే పైకి వెళ్తూ ఉంటారు ఇందులో అరబీలో. ముహమ్మద్ బిన్, ఎవరి కొడుకు ముహమ్మద్? అబ్దుల్లా. అబ్దుల్లా ఎవరి కొడుకు? అబ్దుల్ ముత్తలిబ్. అబ్దుల్ ముత్తలిబ్ ఎవరి కొడుకు? హాషిమ్. హాషిమ్ ఎవరి కొడుకు? ఈ విధంగా. ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ వంశానికి చెందినవారు. ఖురైష్ అరబ్బులోని వారు. అరబ్బులు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సంతానంలోని వారు. ఈ విధంగా సోదర మహాశయులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ వంశ పరంపర ఇబ్రాహీం వరకు, మళ్ళీ అక్కడ నుండి ఆదం అలైహిస్సలాం వరకు చేరుతుంది.

ఇక్కడ మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశ పరంపరం విన్నాం కదా ఇప్పుడు మనం. అంటే ఆయన ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలోని వారు. ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆ కారణంగా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క బిషారత్, భవిష్య సూచనకు జవాబుగా వచ్చారు.

ఆయన మానవుడు, అంటే తల్లిదండ్రులతో పుట్టారు. మానవ అవసరాలు తినడం, త్రాగడం, పడుకోవడం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకోవడం, మానవ అవసరాలు ఎలా ఉంటాయో అలాంటి అవసరాలు కలిగిన వారు అని భావం ఇక్కడ మానవుడు అంటే. కానీ కేవలం మానవుల్లోనే కాదు, సర్వ సృష్టిలో అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఏదేది ఉందో ప్రతి దానిటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే మించిన గొప్పవారు, ఘనత గలవారు వేరే ఎవరూ లేరు.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో జన్మించారు. మక్కాలో జన్మించిన తర్వాత సుమారు 40 సంవత్సరాల వరకు అక్కడే గడిపారు. 40 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించింది. ప్రవక్త పదవి అనేది ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ అనే ఈ ఆయతుల ద్వారా, సూరత్ అలఖ్ లోని మొదటి ఐదు ఆయతులు. వీటి ద్వారా ప్రవక్త పదవి లభించింది. మరియు యా అయ్యుహల్ ముద్దస్సిర్ అని ఆ తర్వాత సూరా అవతరించింది. దాని ద్వారా రిసాలత్, ఇక మీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి అన్నటువంటి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త పదవి లభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో 13 సంవత్సరాలు జీవించారు. అంటే పుట్టిన తర్వాత 53 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల వయసులో ప్రవక్త పదవి లభించింది. తర్వాత 13 సంవత్సరాలు అల్లాహ్ వైపునకు ప్రజలను పిలుస్తూ ఉన్నారు. దీనికి దలీల్ సూరతుల్ ముద్దస్సిర్ (సూరా నెంబర్ 74) లోని మొదటి ఏడు ఆయతులు చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

ఇక సోదర మహాశయులారా, మక్కాలో దావత్ ఇస్తూ ఇస్తూ 13 సంవత్సరాలు గడిపారు. చాలా తక్కువ మంది ఇస్లాం స్వీకరించారు. అక్కడ వ్యతిరేకత అనేది మొదలైంది మరియు ఎన్నో రకాల ఆటంకాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ ఓపిక, సహనాలతో దావత్ లో నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడైతే మదీనా వాసులు కొందరు ఇస్లాం స్వీకరించి అక్కడికి ఆహ్వానించారో, అటు అల్లాహ్ వైపు నుండి కూడా ఆదేశం వచ్చిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజరత్ చేశారు, మదీనా వైపునకు వలస పోయారు. మదీనా వలస పోయిన తర్వాత సోదర మహాశయులారా, అక్కడ 10 సంవత్సరాలు జీవించారు. దీనికి సంబంధించిన ఖురాన్ ఆయతులు మరియు స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు ఎన్నో ఉన్నాయి.

దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటంటే, మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ చేస్తూ అక్కడ మనం ఏదైనా ఆటంకాలు, ఇబ్బందులకు గురి అవుతే, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడంలో మనకు ఏదైనా అక్కడ సమస్య ఎదురవుతే, ఎక్కడికి వెళ్లి మనం అల్లాహ్ యొక్క ఆరాధన స్వతంత్రంగా చేయగలుగుతామో, అక్కడికి వలస వెళ్లడంలో చాలా చాలా గొప్ప పుణ్యాలు ఉన్నాయి. ఆ పుణ్యాల గురించి స్వయంగా అల్లాహు త’ఆలా ఖురాన్ లో ఎన్నో ఆయతులు అవతరింపజేశాడు. సూరత్ అన్-నిసా, ఆయత్ నెంబర్ 97 నుండి 99 వరకు చదివారంటే ఇందులో కూడా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి.అయితే ఈ వలస అనేది ప్రళయ దినం వరకు ఉంది.

ఇక మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10 సంవత్సరాలు అక్కడ ఉండి దావత్ చేస్తూ, అవసరం పడ్డది యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు చేస్తూ ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారు. 10వ సంవత్సరం హజ్ కూడా చేశారు. లక్ష కంటే పైగా సహాబాలు ప్రవక్త వెంట హజ్ చేశారు. 10 సంవత్సరాలు పూర్తిగా నిండాక 11వ సంవత్సరం, ఏంటి 11వ సంవత్సరం? ఇటు మదీనా వచ్చాక 11వ సంవత్సరం. అప్పటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 63 సంవత్సరాలు పూర్తిగా నిండినవి. అప్పుడు ప్రవక్త వారు మరణించారు. కానీ ప్రవక్త మరణించేకి ముందే అల్లాహు త’ఆలా ఈ ధర్మాన్ని సంపూర్ణం చేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا
(అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ వ అత్మమ్తు అలైకుమ్ ని’మతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా)
ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. (5:3)

అని సూరతుల్ మాయిదాలో ఆయత్ అవతరించింది. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరణించారు.

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ
(ఇన్నక మయ్యితువ్ వ ఇన్నహుమ్ మయ్యితూన్)
నిశ్చయంగా (ఏదో ఒకనాడు) నీకూ చావు వస్తుంది. వారికీ చావు వస్తుంది.(సూరత్ అజ్-జుమర్ 39:30)

నీవు కూడా చనిపోతావు, వారందరూ కూడా చనిపోతారు అని ప్రవక్త మరణానికి ముందే ఆయత్ అవతరింపజేయబడింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ఆయత్ కూడా అవతరించింది:

مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
(మిన్హా ఖలఖ్నాకుమ్ వ ఫీహా ను’ఈదుకుమ్ వ మిన్హా నుఖ్రిజుకుమ్ తారతన్ ఉఖ్రా)
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.(సూరత్ తాహా, 20:55)

ఈ మట్టిలో నుండే మిమ్మల్ని పుట్టించాము. తిరిగి ఇందులోకి మీరు వెళ్తారు, సమాధి చేయబడతారు. మరియు ప్రళయ దినాన ఇక్కడి నుండే మరోసారి మిమ్మల్ని లేపడం జరుగుతుంది.

సోదర మహాశయులారా, ఈ విధంగా ఈ మూడు సూత్రాల యొక్క సంక్షిప్త వివరణ మనం ఈనాటి పాఠంలో తెలుసుకున్నాము. ఇంతటితో నా సమయం కూడా ముగించింది. అందుకొరకు మనం ఇంకా ఎక్కువ వివరాలు తెలుసుకోలేము. కానీ ఇంతకుముందు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ పూర్తి అంశం మూల సూత్రాలకు సంబంధించింది, త్రీ సూత్రాలకు సంబంధించి మా యూట్యూబ్ జీడీకే నసీర్ లో ఇంకా వేరే యూట్యూబ్ ఛానెల్ లో కూడా పాఠాలు ఉన్నాయి. శ్రద్ధగా విని మన యొక్క విశ్వాసాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఈ మూడు సూత్రాలు చూడడానికి సమాధానం మూడే పదాల్లో ఉన్నాయి. అల్లాహ్, ఇస్లాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అల్లాహ్ ను ఆరాధించకుంటే, ఇస్లాం ప్రకారంగా జీవించకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం విధేయత పాటించకుంటే, సమాధిలో మనకు ఈ మూడు పదాలు పలకడానికి వీలు కాదు.

అల్లాహు త’ఆలా ఈ మూడు సూత్రాల గురించి ఏదైతే తెలుసుకున్నామో, ఇందులోని మంచి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితం సరిదిద్దుకునే అటువంటి సద్భాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.

وآخر دعوانا أن الحمد لله رب العالمين، والسلام عليكم ورحمة الله وبركاته.

ఇతర ముఖ్యమైన పోస్టులు

త్రి సూత్రాలు (మూడు మౌలిక సూత్రాలు) – ఉసూల్ అత్ తలాత [ఆడియో & పుస్తకం]
ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://teluguislam.net/2023/04/19/u3mnj/