బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం

586. హజ్రత్ అబూ మస్ వూద్ (రదియల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

ఒక ముస్లిం పుణ్యఫలాపేక్షతో తన కుటుంబసభ్యుల (శ్రేయస్సు) కోసం ధన వినియోగం చేస్తే, ఆ ధనం అతను చేసే దానమవుతుంది.

[సహీహ్ బుఖారీ : 69 వ ప్రకరణం – అన్నఫఖాత్, 15 వ అధ్యాయం – ఫజ్లిస్న దఖతి అలల్ ఆహ్లి]

జకాత్ ప్రకరణం – 14 వ అధ్యాయం – బంధువులకు దానం, తల్లిదండ్రులు, భార్యా పిల్లల కోసం ధనవ్యయం .మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం

533. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు ఒక స్త్రీ సమాధి మీద కూర్చొని ఏడుస్తుంటే, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అటుగా పోవడం జరిగింది. అపుడు ఆయన ఆ స్త్రీని చూసి “అల్లాహ్ కి భయపడి కాస్త సహనం వహించు” అని అన్నారు. దానికి ఆ స్త్రీ (ముఖం చిట్లించుకుంటూ) “మీ దారిన మీరు వెళ్ళండి, నన్ను నా మానాన వదిలెయ్యండి. నా మీద వచ్చిపడిన ఆపద మీ మీద రాలేదు. అందువల్ల మీరు (నా) బాధను అర్ధం చేసుకోలేరు” అని అన్నది.

తరువాత (కొందరు) ఆ స్త్రీకి ‘ఆయనగారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)’ అని తెలియజేశారు. అది విని ఆమె (పరుగుపరుగున) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికి వెళ్ళింది. చూస్తే ఆయన వాకిలి ముందు ఒక్క ద్వారపాలకుడు కూడా లేడు. సరే, ఆ మహిళ [దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను కలుసుకొని] “నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను (క్షమించండి)” అని అన్నది. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఆపద ప్రారంభంలో వహించే సహనమే (అసలు) సహనం”(*) అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం – జనాయేజ్, 32 వ అధ్యాయం – జియారతుల్ ఖుబూర్]

(*) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవచానానికి భావం ఏమిటంటే – నీ వన్న మాటలకు నువ్వు క్షమాపణ చెప్పుకోనవసరం లేదు. నేను స్వవిషయం గురించి ఎవరి మీద కోపగించుకోను. నా ఇష్టాఇష్టాలన్నీ ధైవప్రసన్నత కోసమే పరిమితం. కాకపోతే నువ్వు కష్ట సమయంలో సహనం వహించకుండా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టి నీకు దక్కే పుణ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇది నీ పొరపాటు. నా విషయంలో నీవు చేసిన పొరపాటు క్షమించబడింది. కాని ధైవధర్మం విషయంలోనే నీవు పొరబడ్డావు. ఆపద ప్రారభంలో సహనం వహించి ఉంటే పుణ్యం లభించి ఉండేది. నువ్వలా చేయలేకపోయావు.

జనాయెజ్ ప్రకరణం : 8 వ అధ్యాయం – ఆపద ప్రారంభంలో వహించే సహనమే సహనం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు

1812. హజ్రత్ అబ్దుల్లా బిన్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-

స్వర్గవాసులు స్వర్గంలో, నరకవాసులు నరకంలో ప్రవేశించిన తరువాత మరణాన్ని స్వర్గ నరకాల మధ్యకు తెచ్చి నిలబెట్టడం జరుగుతుంది. తరువాత దాన్ని కోసివేస్తారు. అప్పుడు ఒక ప్రకటనకర్త లేచి “స్వర్గవాసులారా! ఇక నుండి మరణం ఉండదు. నరకవాసులారా! ఇక నుండి మరణం ఉండదు” అని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసుల ఆనందం అవధులు దాటుతుంది; నరకవాసులు దుఃఖంతో మరింత కృంగిపోతారు.

[సహీహ్ బుఖారీ : 81 వ ప్రకరణం – అర్రిఖాఖ్, 51 వ అధ్యాయం – సిఫతిల్ జన్నతి వన్నార్]

స్వర్గ భాగ్యాల, స్వర్గవాసుల ప్రకరణం : 13 వ అధ్యాయం – స్వర్గానికి బలహీనులు, నరకానికి బలవంతులు పోతారు. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం

1675. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :-

నిజం మనిషిని పుణ్యకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పుణ్యకార్యాలు (అతడ్ని) స్వర్గానికి గొనిపోతాయి. ఎవరైనా ఎల్లప్పుడు నిజం చెబుతుంటే అది అతడ్ని ఎప్పుడో ఓ రోజు సిద్దీఖ్ (సత్యశీలుడి) గా మార్చివేస్తుంది. అబద్ధం మనిషిని పాపకార్యాల వైపుకు తీసుకుని వెళుతుంది. పాపకార్యాలు అతడ్ని నరకానికి చేర్చుతాయి. ఎవరైనా (ఎల్లప్పుడూ) అబద్ధమాడుతుంటే దానివల్ల అతడు ఎప్పుడో ఓ రోజు అల్లాహ్ దగ్గర అబద్దాలరాయుడిగా వ్రాయబడతాడు.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 69 వ అధ్యాయం – ఖౌలిల్లాహి తఅలా (యాఅయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ వకూనూ మాఅస్సాదిఖీన్)]

సామాజిక మర్యాదల ప్రకరణం – 29 వ అధ్యాయం – అబద్ధం చెడ్డ విషయం, సత్యం మంచి విషయం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

జ్ఞానులు అంతరించిన కారణంగా అల్లాహ్ జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు

1712. హజ్రత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ బిన్ ఆస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు :-

అల్లాహ్ (ధర్మజ్ఞానాన్ని) ప్రజల హృదయాల నుండి తీసివేయడం ద్వారా దాన్ని పైకెత్తుకోడు, జ్ఞానులు (అంటే ధర్మవేత్త్లలు) అంతరించిన కారణంగా ఆయన జ్ఞానాన్ని పైకి లేపుకుంటాడు. ఈ విధంగా చివరికి ప్రపంచంలో ఒక్క ధర్మవేత్త కూడా మిగిలి ఉండడు. అప్పుడు ప్రజలు అజ్ఞానుల్ని (మూర్ఖుల్ని) నాయకులుగా చేసుకుంటారు. ధార్మిక విషయాలను గురించి వారినే అడుగుతారు. వారు తమకు ధర్మజ్ఞానం లేకపోయినా ఫత్వాలు (తీర్పులు) ఇస్తారు. ఈ విధంగా వారు స్వయంగా దారి తప్పడమే గాకుండా ఇతరుల్ని కూడా దారి తప్పిస్తారు.

[సహీహ్ బుఖారీ : 3 వ ప్రకరణం – ఇల్మ్, 34 వ అధ్యాయం – కైఫ యుఖ్బుజుల్ ఇల్మ్]

విద్యా విషయక ప్రకరణం : 5 వ అధ్యాయం – ప్రళయం సమీపంలో జ్ఞానకాంతి పోయి అజ్ఞానాంధకారం వస్తుంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత

1518. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక పని చేసి (తమ అనుచరులకు) ఆ పని చేయమనో లేక చేయరాదనో సెలవిచ్చారు. అప్పుడు కొందరు ఆ విషయానికి సంబంధించి ఇవ్వబడిన సౌకర్యాన్ని ఉపయోగించుకోలేదు. ఈ సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక ఉపన్యాసం ఇచ్చారు. అందులో మొదట అల్లాహ్ ఔన్నత్యాన్ని స్థుతించి, తరువాత ఇలా అన్నారు – “జనానికి ఏమయింది, నేను స్వయంగా చేస్తున్న పనులను మానేస్తున్నారే? దైవసాక్షిగా చెబుతున్నాను. అల్లాహ్ గురించి నాకు మీ అందరికంటే బాగా తెలుసు. మీ అందరిలోకి అల్లాహ్ కి ఎక్కువగా భయపడేది కూడా నేనే”.

[సహీహ్ బుఖారీ : 78 వ ప్రకరణం – అదబ్, 72 వ అధ్యాయం – మల్లమ్ యువాజిహిన్నాస యితాబ్]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 35 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జ్ఞానం, ఆయన దైవభీతి పరాయణత. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి

299. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రది అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

నాకు పూర్వం ఏ ధైవప్రవక్తకూ ప్రసాదించబడని ఐదు ప్రత్యేకతలు ప్రసాదించబడ్డాయి.

(1) నా గాంభీర్యానికి శత్రువులు ఒకనెల ప్రయాణపు దూరం నుండే భయపడి పోయేలా అల్లాహ్ నాకు సహాయం చేస్తున్నాడు.

(2) నా కోసం యావత్తు భూమండలం ప్రార్ధనా స్థలంగా, పరిశుద్ధ పరిచే వస్తువుగా చేయబడింది. అందువల్ల నా అనుచర సమాజంలోని ప్రతి వ్యక్తీ ఏ చోటున ఉంటే ఆ చోటునే వేళ అయినప్పుడు నమాజు చేసుకోవచ్చు.

(3) నా కోసం యుద్ధప్రాప్తి (మాలె గనీమత్) ను వాడుకోవడం ధర్మసమ్మతం చేయబడింది.

(4) ఇతర ధైవప్రవక్తలందరూ తమతమ జాతుల కోసం మాత్రమే ప్రత్యేకించబడగా, నేను యావత్తు మానవాళి కోసం ధైవప్రవక్తగా పంపబడ్డాను.

(5) నాకు (పరలోక తీర్పుదినాన సాధారణ) సిఫారసు (*) చేసే అధికారం ఇవ్వబడింది.

(*) ఇక్కడ సిఫారసు అంటే, హషర్ మైదానంలో మానవులంతా తీవ్ర ఆందోళనకు గురి అయినపుడు చేసే సాధారణ సిఫారసు అని అర్ధం. అప్పుడు ఇతర ప్రవక్తలందరూ ప్రజలను నిరాశపరుస్తారు. అయితే ఇతర సందర్భాలలో ప్రత్యేక సిఫారసు ప్రవక్తలు, సజ్జనులు కూడా చేస్తారు. లేదా ఇక్కడ సిఫారసు అంటే రద్దు కానటువంటి సిఫారసు కాని, అణుమాత్రం విశ్వాసమున్న వారికి సయితం ప్రయోజనం చేకూర్చే సిఫారసు గానీ అయి ఉంటుంది.

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 56 వ అధ్యాయం – ఖౌలిన్నబియ్యి …. జు ఇలత్ లియల్ అర్జుకుల్లాహ మస్జిదన్ వ తహూర]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1 – సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం

1739. హజ్రత్ అలీ (రధి అల్లాహు అన్హు) కధనం :-

హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) తిరగలి విసరి విసరి వ్యాధిగ్రస్తులయ్యారు. (అంటే ఆమె చేతులకు కాయలు కాశాయి). ఓసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దగ్గరకు కొందరు (యుద్ధ) ఖైదీలు వచ్చారు. అది తెలిసి హజ్రత్ ఫాతిమా (రధి అల్లాహు అన్హ) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంటికెళ్లారు. కాని ఆయన లేరు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) మాత్రమే వున్నారు. అందుచేత ఫాతిమా (రధి అల్లాహు అన్హ) ఆమెనే కలుసుకొని విషయం తెలియజేశారు. ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చారు. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) ఆయనకు ఫాతిమా (రధి అల్లాహు అన్హ) వచ్చి పోయిన సంగతి తెలియజేశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము మా పడకలపై పడుకొని ఉన్నాము. నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను చూసి లేవడానికి ప్రయత్నించాను. కాని ఆయన నన్ను అలాగే పడుకొని ఉండమని చెప్పి మా ఇద్దరి మధ్య కూర్చున్నారు. అప్పుడు ఆయన దివ్యపాదాల చల్లదనం నా గుండెలకు తాకింది. ఆయన ఇలా అన్నారు,

“(ఫాతిమా!) నీవు నన్నడిగిన దానికంటే ఎంతో మేలయినది నీకు చెప్పనా? నీవు పడుకోవటానికి పడక మీదికి చేరినపుడు 34 సార్లు అల్లాహు అక్బర్ అనీ, 33 సార్లు సుబ్ హానల్లాహ్ అనీ, 33 సార్లు అల్ హమ్దులిల్లాహ్ అనీ పఠిస్తూ ఉండు. ఈ స్మరణ నీ కోసం సేవకుడి కంటే ఎంతో శ్రేష్ఠమైన సంపద.”

[సహీహ్ బుఖారీ :- 62 వ ప్రకరణం – ఫజాయిలి అస్ హాబిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం), 9 వ అధ్యాయం – మనాఖిబ్ అలీ బిన్ అబీతాలిబ్ అల్ ఖురషీ – రజి]

ప్రాయశ్చిత్త ప్రకరణం : 19 వ అధ్యాయం – ఉదయం, రాత్రి పడుకునేటప్పుడు అల్లాహ్ పవిత్రతను కొనియాడటం. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2 . సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను

అబూ హురైరా రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:

“అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు:

“ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నాకొరకు. నేను దాని ప్రతిఫలం నొసంగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి. ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన (అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”

[బుఖారీ మరియు ముస్లిం హదీథ్ గ్రంథాలు]

http://teluguislam.net

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది [వీడియో]

రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది
https://youtu.be/VhoL0sQNgaY [4 నిముషాలు]
వక్త : ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

786. హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధియల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక అన్సార్ స్త్రీ తో మాట్లాడుతూ

“హజ్ కోసం మాతో పాటు బయలుదేరడానికి నీకు ఏ విషయం అడ్డు వచ్చింది?” అని అడిగారు. దానికామె ఇలా అన్నారు “మా దగ్గర నీళ్ళు మోసే ఒంటెలు రెండు ఉన్నాయి. వాటిలో ఒక దానిపై అబూఫులాన్, ఆయన కొడుకు (అంటే తన భర్త, తన కొడుకు) ఎక్కి (హజ్ చేయడానికి మక్కా) వెళ్ళారు. రెండవ దాన్ని మేము నీళ్ళు మోయడానికి వాడుకుంటున్నాము. “దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ మాట విని “సరే, నువ్వు రమజాన్ నెలలో ఉమ్రా నిర్వహించు. రమజాన్ లో నిర్వహించే ఉమ్రాకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 26 వ ప్రకరణం – ఉమ్రా, 4 వ అధ్యాయం – ఉమ్రతి ఫీరమజాన్]

(*) రమజాన్ నెలలో ఉమ్రా చేస్తే హజ్ విధి నిర్వహించినట్లు దీని అర్ధం కాదు. ఉమ్రా సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి మాత్రమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతిశయోక్తిగా ఇలా అన్నారని తైబీ (రహిమహుల్లా) అభిప్రాయపడ్డారు.

హజ్ ప్రకరణం – 36 వ అధ్యాయం – రమజాన్ నెలలో చేసే ఉమ్రా అత్యంత పుణ్యప్రదం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్