నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి

335. హజ్రత్ అబ్దుల్లా బిన్ బహీనా (రధి అల్లాహు అన్హు) కధనం :-

(ఓ రోజు) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక నమాజులో రెండు రకాతులు పఠించిన తరువాత లేచి నిల్చున్నారు. ‘ఖాయిదాయె ఊలా’ ప్రకారం కూర్చోవడం మరచిపోయారు. అనుచరులు కూడా ఆయనతో పాటు పైకి లేచారు. నమాజు పూర్తయి ‘సలాం’ చేయడానికి మేము ఎదురుచూస్తున్న తరుణంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ‘అల్లాహు అక్బర్’ అంటూ కూర్చునే రెండు సార్లు సజ్దా చేశారు. ఆ తరువాత కుడి ఎడమల వైపు సలాం చేశారు.

[సహీహ్ బుఖారీ : 22 వ ప్రకరణం – సహూ, 15 వ అధ్యాయం – మాజాఅ ఫిస్సహూ….]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 19 వ అధ్యాయం – నమాజులో మరచిపోవటం, సహూ సజ్దా చేయటం గురించి. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం

311. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

మొదట్లో మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజు చేస్తుంటే ఆయనకు సలాం చేసే వాళ్ళము. నమాజు స్థితిలోనే ఆయన మాకు ప్రతి సలాం పలికేవారు. అయితే మేము (అబిసీనియా రాజు) నజాషీ దగ్గర నుండి (వలస వెళ్లి) తిరిగి వచ్చిన తరువాత మేము దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు (నమాజు స్థితిలో) సలాం చేస్తే, ఆయన మాకు సమాధానమివ్వలేదు. (నమాజు ముగిసిన తరువాత) “నమాజు చేస్తున్నప్పుడు మనిషికి ఏకాగ్రత చాలా అవసరం” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 21 వ ప్రకరణం – అల్ అమలు ఫిస్సలాత్, 2 వ అధ్యాయం – మాయున్హా మినల్ కలామి ఫిస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 7 వ అధ్యాయం – నమాజు స్థితిలో మాట్లాడటం నిషిద్ధం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది

613. హజ్రత్ హకీం బిన్ హిజామ్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

క్రింది చేయి కంటే పైచేయి శ్రేష్టమైనది. మొదట మీ పోషణలో ఉన్న వారికి దానం చేయండి. దానమిచ్చిన తరువాత కూడా మనిషి ధనవంతుడిగా ఉండిపోతే అలాంటి వ్యక్తి చేసే దానమే ఎంతో శ్రేష్టమైనది. (దానం) అర్ధించడం మానుకున్న వ్యక్తికి అల్లాహ్ దేవురించే అవమానం నుండి కాపాడుతాడు. దాన స్వీకారాన్ని లక్ష్యపెట్టకుండా మసలుకునే వారికి అల్లాహ్ కలిమిని ప్రసాదిస్తాడు.

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 18 వ అధ్యాయం – లా సదఖత ఇల్లా అన్ జహ్ రిగ్నీ]

జకాత్ ప్రకరణం – 32వ అధ్యాయం – ఇచ్చే చేయి ఎప్పుడూ పైనే, పుచ్చుకునే చేయి ఎప్పుడూ క్రిందనే. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

The Upper Hand is better then the Lower Hand and Imaam Sufyaan ath-Thawree on the Filth of the People

ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు

167. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రెండు సమాధుల మధ్య నుంచి నడుస్తూ “ఈ రెండు సమాధుల వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షకు పెద్ద కారణం ఏదీ లేదు. వారిద్దరిలో ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు. అంతే” అని తెలియజేశారు. తరువాత ఆయన ఓ పచ్చటి మండ తీసుకుని, దాన్ని మధ్యకు చీల్చి రెండు భాగాలు చేశారు. ఆ రెండింటిని ఆ రెండు సమాధులపై నాటారు.

అనుచరులు అది చూసి “దైవప్రవక్తా! మీరిలా ఎందుకు చేశారు” అని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఇలా చేయడం వల్ల ఈ మండలు ఎండిపోనంత వరకు వీరి (సమాధి) శిక్ష కొంత వరకు తగ్గిపోవచ్చని భావిస్తున్నాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 56 వ అధ్యాయం -మాజా అఫీ గస్లిల్ బౌల్]

శుచి, శుభ్రతల ప్రకరణం – 34 వ అధ్యాయం – మూత్రం ఆశుద్దత కు దూరంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

[సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు]

ముఖ్యాంశాలు :

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబందించిన సామూహిక నమాజులకు హాజరు కావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతివంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగి పోయినా, చీకటి వల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులగానే పరిగణించ బడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన అల్లాహ్ తరుఫు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడినది.

189 వ అధ్యాయం – మస్జిదులకు కాలి నడకన వెళ్ళటం – హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

http://wp.me/p2lYyT-fA

Related Links:

 

జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి

494. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు

467. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రది యల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

“ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించడంతో పాటు, వాటిని దైవమార్గంలో వినియోగించే సద్బుద్ధి కూడా ప్రసాదించబడిన వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ విజ్ఞతా వివేకాలు ప్రసాదించగా, వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విజ్ఞతావివేకాలను ఇతరులకు కూడా బోధిస్తూ ఉండే వ్యక్తి.”

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – ఇల్మ్, వ అధ్యాయం – అల్ ఇగ్గిబాతి ఫిల్ ఇల్మివల్ హిక్మత్]

47 వ అధ్యాయం – ఖుర్ఆన్ విద్య నేర్చుకొని ఇతరులకు నేర్పే వ్యక్తి ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మస్జిద్ లో రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యనిదే కూర్చోరాదు

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 25 వ అధ్యాయం – మాజాఅ ఫిత్తత్వా మస్నామస్నా]

జుమా ప్రకరణం – 14 వ అధ్యాయం – జుమా ప్రసంగం సమయంలో ‘తహ్యతుల్ ఉజూ’ నమాజ్ చేయవలెను . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష

బిస్మిల్లాహ్

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.  [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]

అధ్యాయం : 37 – వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష
పసిడిపూలు – అంశాల వారీగా ఖుర్ఆన్ వ్యాఖ్యాల సంకలనం
సంకలనం : రచన అనువాద విభాగం, శాంతి మార్గం పబ్లికేషన్స్

ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి

348. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-  “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-  ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్