ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు

167. హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి రెండు సమాధుల మధ్య నుంచి నడుస్తూ “ఈ రెండు సమాధుల వాసులు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షకు పెద్ద కారణం ఏదీ లేదు. వారిద్దరిలో ఒకడు మూత్రం (చుక్కలు) వంటిపై పడకుండా జాగ్రత్త వహించేవాడు కాదు. రెండవ వ్యక్తి చాడీలు చెబుతూ తిరుగుతుండే వాడు. అంతే” అని తెలియజేశారు. తరువాత ఆయన ఓ పచ్చటి మండ తీసుకుని, దాన్ని మధ్యకు చీల్చి రెండు భాగాలు చేశారు. ఆ రెండింటిని ఆ రెండు సమాధులపై నాటారు.

అనుచరులు అది చూసి “దైవప్రవక్తా! మీరిలా ఎందుకు చేశారు” అని అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఇలా చేయడం వల్ల ఈ మండలు ఎండిపోనంత వరకు వీరి (సమాధి) శిక్ష కొంత వరకు తగ్గిపోవచ్చని భావిస్తున్నాను” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 4 వ ప్రకరణం – వుజూ, 56 వ అధ్యాయం -మాజా అఫీ గస్లిల్ బౌల్]

శుచి, శుభ్రతల ప్రకరణం – 34 వ అధ్యాయం – మూత్రం ఆశుద్దత కు దూరంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి

1058. హజ్రత్ బురైదా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు :

చీకట్లలో మస్జిదులకు నడిచి వెళ్ళే వారికి ప్రళయ దినాన సంపూర్ణ వెలుగు లభిస్తుందనే శుభవార్తను అందించండి.

[సుననె అబూదావూద్ లోని నమాజు ప్రకరణం – సుననె తిర్మిజీ లోని నమాజ్ అధ్యాయాలు]

ముఖ్యాంశాలు :

చీకట్లలో మస్జిదులకు వెళ్ళటమంటే ఫజ్ర్ మరియు ఇషాకు సంబందించిన సామూహిక నమాజులకు హాజరు కావటం అని భావం. నేటి ఆధునిక యుగంలో నగరవీధులు కాంతివంతమైన విద్యుద్దీపాలతో ఎంతగా వెలిగి పోయినా, చీకటి వల్ల కలిగే భయాందోళనలను ఎవరూ తొలగించలేరని గ్రహించాలి. అందుకే ఫజ్ర్ మరియు ఇషా నమాజులు నేటికీ చీకట్లో చేయబడే నమాజులగానే పరిగణించ బడతాయి. వాటిని నెరవేర్చే అదృష్టవంతులకు ప్రళయదినాన అల్లాహ్ తరుఫు నుండి పరిపూర్ణమైన వెలుగు లభిస్తుందనే శుభవార్త ఇవ్వబడినది.

189 వ అధ్యాయం – మస్జిదులకు కాలి నడకన వెళ్ళటం – హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

http://wp.me/p2lYyT-fA

Related Links:

 

జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి

494. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :-

“శుక్రవారం రోజు ఇమామ్ జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు గనక మీ (ప్రక్కన కూర్చున్న) సహచరునితో ‘నిశ్శబ్దంగా’ ఉండు అని అంటే మీరొక పనికిమాలిన పనికి పాల్పడినవారవుతారు.”

[సహీహ్ బుఖారీ : 11 వ ప్రకరణం – జుమా, 36 వ అధ్యాయం – అల్ ఇన్సాతి యౌముల్ జుమా వల్ ఇమాము యఖ్తుబ్]

జుమా ప్రకరణం – 3 వ అధ్యాయం – జుమా ప్రసంగం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు

467. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ వూద్ (రది యల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేశారు :-

“ఇద్దరు తప్ప మరెవరి పట్లా అసూయ చెందటం ధర్మసమ్మతం కాదు. ఒకరు, అల్లాహ్ సిరిసంపదలు అనుగ్రహించడంతో పాటు, వాటిని దైవమార్గంలో వినియోగించే సద్బుద్ధి కూడా ప్రసాదించబడిన వ్యక్తి. రెండోవాడు, అల్లాహ్ విజ్ఞతా వివేకాలు ప్రసాదించగా, వాటి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ, ఆ విజ్ఞతావివేకాలను ఇతరులకు కూడా బోధిస్తూ ఉండే వ్యక్తి.”

[సహీహ్ బుఖారీ : వ ప్రకరణం – ఇల్మ్, వ అధ్యాయం – అల్ ఇగ్గిబాతి ఫిల్ ఇల్మివల్ హిక్మత్]

47 వ అధ్యాయం – ఖుర్ఆన్ విద్య నేర్చుకొని ఇతరులకు నేర్పే వ్యక్తి ఔన్నత్యం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

మస్జిద్ లో రెండు రకాతులు (నఫిల్) నమాజు చెయ్యనిదే కూర్చోరాదు

503. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఒకసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం ఇస్తూ “ఇమామ్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు” లేక ఉపన్యాసం ఇవ్వడానికి ఉపక్రమించినప్పుడు ఎవరైనా వస్తే అతను (ముందుగా) రెండు రకాతులు (నఫిల్) నమాజు చేయాలి” అని అన్నారు.(*)

[సహీహ్ బుఖారీ : 19 వ ప్రకరణం – తహజ్జుద్, 25 వ అధ్యాయం – మాజాఅ ఫిత్తత్వా మస్నామస్నా]

జుమా ప్రకరణం – 14 వ అధ్యాయం – జుమా ప్రసంగం సమయంలో ‘తహ్యతుల్ ఉజూ’ నమాజ్ చేయవలెను . మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష

బిస్మిల్లాహ్

(తీర్పు దినం రోజు) వడ్డీ సొమ్ము తినేవారు షైతాను పట్టటంవల్ల ఉన్మాది అయిన వాని లాగానే నిలబడతారు. వారికీ దుర్గతి పట్టడానికి కారణం “వ్యాపారం కూడా వడ్డీలాంటిదే కదా!” అని వారు అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం చేసి, వడ్డీని నిషేధించాడు. కనుక ఎవరు తన ప్రభువు వద్ద నుంచి వచ్చిన హితబోధను విని వడ్డీని మానుకున్నాడో, అతను గతంలో పుచ్చుకున్నదేదో పుచ్చుకున్నాడు. అతని వ్యవహారం దైవాధీనం. ఇకమీదట కూడా దీనికి పాల్పడినవారే నరకవాసులు. వారు కలకాలం అందులో పడి ఉంటారు.  [అల్ బఖర – 2 : 275 ]

అల్లాహ్ వడ్డీని హరింపజేస్తాడు. దానధర్మాలను పెంచుతాడు. మేలును మరిచేవారిని, పాపిష్టులను అల్లాహ్ సుతరామూ ప్రేమించడు.విశ్వసించి (సున్నత్ ప్రకారం) సత్కార్యాలు చేసేవారికి, నమాజులను నెలకొల్పేవారికి, జకాత్ ను చెల్లించేవారికి తమ ప్రభువు వద్ద పుణ్యఫలం ఉంది. వారికెలాంటి భయంగానీ, చీకూ చింతగానీ ఉండవు.

ఓ విశ్వసించినవారలారా! అల్లాహ్ కు భయపడండి. మీరు నికార్సయిన విశ్వాసులే అయినట్లయితే మిగిలిఉన్న వడ్డీని విడిచి పెట్టండి. ఒకవేళ మీరు గనక అలా చేయనట్లయితే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధానికి సిద్ధంకండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపం చెందితే మీ అసలు సొమ్ము మీకే ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేయకూడదు. మీకు కూడా అన్యాయం జరగకూడదు. ఒకవేళ రుణగ్రస్తుడు ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకూ అతనికి గడువు ఇవ్వాలి. లేదా మన్నించి దానంగా వదిలి పెట్టండి. మీరే గనక తెలుసుకోగలిగితే ఇది మీకొరకు శ్రేయోదాయకం.[అల్ బఖర – 2 : 276 – 280 ]

అధ్యాయం : 37 – వడ్డీరహిత ఆర్ధిక వ్యవస్థ అల్లాహ్ ఆకాంక్ష
పసిడిపూలు – అంశాల వారీగా ఖుర్ఆన్ వ్యాఖ్యాల సంకలనం
సంకలనం : రచన అనువాద విభాగం, శాంతి మార్గం పబ్లికేషన్స్

ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి

348. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-

ఓ రోజు కొందరు పేదప్రజలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వచ్చి “దైవప్రవక్తా! ధనికులు తమ సిరిసంపదల మూలంగా గొప్పగొప్ప హొదా, అంతస్తులు, శాశ్వత సౌఖ్యాలు పొందగలుగుతున్నారు. వారు మాలాగా నమాజులు కూడా చేస్తున్నారు, ఉపవాసాలు కూడా పాటిస్తున్నారు, పైగా డబ్బున్నందున హజ్, ఉమ్రా ఆచారాలు కూడా పాటిస్తున్నారు. జిహాద్ (ధర్మపోరాటం) కూడా చేస్తున్నారు. దానధర్మాలు కూడా చేస్తున్నారు” అని అన్నారు.

అది విని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :-  “సరే, నేను మీకో విషయం తెలియజేయనా? దాన్ని గనక మీరు మీ దినచర్యగా చేసుకుంటే, మిమ్మల్ని మించిపోయిన వాళ్ళతో మీరు సమానులయిపోతారు. ఆ తరువాత మీతో మరెవరూ పోటీ ఉండరు. ఈ పద్ధతి అనుసరించే వాడుతప్ప మీరే అందరికంటే శ్రేష్ఠులయి పోతారు. ఆ విషయం ఏమిటంటే, ప్రతి నమాజు తరువాత, ‘సుబహానల్లాహ్’ అని, ‘అలహందులిల్లాహ్’ అని, ‘అల్లాహు అక్బర్’ అని ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించండి”.

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :-  ఆ తరువాత (వీటి సంఖ్య విషయమయి) మాలో విబేధాలు వచ్చాయి. కొందరు సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్ అనే మాటలు ముఫ్ఫై మూడుసార్లు చొప్పున స్మరించాలని, అల్లాహు అక్బర్ అనే మాటను ముఫ్ఫై నాలుగుసార్లు స్మరించాలని అన్నారు. అందువల్ల నేను ఈ విషయం గురించి మరోసారి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అడిగాను. అప్పుడాయన “సుబహానల్లాహ్, అలహందులిల్లాహ్, అల్లాహు అక్బర్ అనే మాటలలో ప్రతిదాన్ని ముఫ్ఫై మూడుసార్లు పఠించండి” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 115 వ అధ్యాయం – అజ్జిక్రి బాదస్సలాత్]

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 26 వ అధ్యాయం – నమాజు తరువాత ఏ ధ్యానం అభిలషణీయం
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజులో ఏఏ కీడు నుండి అల్లాహ్ శరణు కోరాలి?

344. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నమాజులో తషహ్హుద్ తరువాత ఇలా దుఆ (ప్రార్ధన) చేస్తూ ఉంటే నేను విన్నాను.

అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి వ అవూజుబిక మిన్ ఫిత్నతిల్ మహ్యాయి వ ఫిత్నతిల్ మమాతి. అల్లాహుమ్మ ఇన్నీ అఅవూజుబిక మినల్ మాసమి వల్ మగ్రమ్.

“దేవా! నేను సమాధి యాతన నుండి నీ శరణు కోరుతున్నాను. ‘మసీహిద్దజ్జాల్’ ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను. జీవన్మ(*)రణాల పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను. దేవా! పాపాల్లో పడివేసే పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. రుణగ్రస్తుడిని అయ్యే దుస్థితి నుండి నీ శరణు కోరుతున్నాను.”

ఒక వ్యక్తి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో మాట్లాడుతూ “దైవప్రవక్తా! మీరు రుణగ్రస్త స్థితి నుండి కూడా అంత ఎక్కువగా శరణు కోరుతున్నారెందుకు?” అని అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ “ఎందుకంటే మనిషి అప్పుల పాలయితే అసత్యమాడతాడు. వాగ్దాన భంగానికి పాల్పడతాడు” అని అన్నారు.

[సహీహ్ బుఖారీ : 10 వ ప్రకరణం – అజాన్, 149 వ అధ్యాయం – అద్దుఆవు ఖబ్లస్సలాం ]

(*) ‘జీవిత’ పరీక్ష అంటే, మానవ జీవితంలో ఎదురయ్యే పరీక్షలన్నీ అని అర్ధం. ఉదాహరణకు – పనికిమాలిన విషయాల్లో చిక్కుకు పోవడం, మనోవాంఛలకు బలయిపోవడం మొదలైనవి. మరణ పరీక్ష అంటే, మనిషి మరణ ఘడియల్లో దైవానుగ్రహం పట్ల నిరాశ చెందడం, సద్వచనం (కలిమా) పలకలేక పోవడం, ఇస్లాం వ్యతిరేక విషయాలు మాట్లాడటం ఇత్యాదివి. రుణగ్రస్తుడవడం అంటే, అధర్మ కార్యాలు లేక అనవసరమైన పనుల కోసం చేసే అప్పు అన్నమాట. లేదా అప్పుతీర్చే సద్బుద్ధి లేకపోవడం. నిజమైన అవసరాల నిమిత్తం అప్పు తీసుకోవడంలో తప్పులేదు. అయితే దాంతో పాటు అప్పు తీర్చే స్తోమత కూడా ఉండాలి. ఈ దుఆ (వేడుకోలు) మొదటి భాగం దేవుని హక్కులకు, రెండవభాగం దాసుల హక్కులకు సంభందించినది.

ప్రార్ధనా స్థలాల ప్రకరణం – 25 వ అధ్యాయం – నమాజులో ఏఏ కీడు నుండి దేవుని శరణు కోరాలి?
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు

283. హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహ్మతుల్లాహి అలై) కధనం :-

హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్లి ఒక వస్తువుని ఆసరాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ) చూశాడు. కాని హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు.

ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరికు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకు, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు :-

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు : “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి. అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.”

[సహీహ్ బుఖారీ : 8 వ ప్రకరణం – సలాత్, 100 వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మ మ్మర్ర బైనయదైహి]

నమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు

1502. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :-

రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు. అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు. కాని దైవాజ్ఞల పట్ల అపచారం జరిగితే మాత్రం ఆయన తప్పకుండా ప్రతీకారం తీర్చుకునేవారు.

[సహీహ్ బుఖారీ : 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ]

ఘనతా విశిష్ఠతల ప్రకరణం : 20 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సొంత వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోరు
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్