అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు! [వీడియో & టెక్స్ట్]

అల్లాహ్ కారుణ్య చాయలోకి ఆ ఏడుగురు!
https://youtu.be/Fp0v2wzd9M0 [13 నిముషాలు]
షేక్ హబీబుర్రహ్మాన్ జామయి (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, ప్రళయ దినం యొక్క భయంకరమైన స్వభావం గురించి మరియు ఆ కఠినమైన రోజున అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో (అర్ష్ నీడలో) ఆశ్రయం పొందే ఏడుగురు వ్యక్తుల గురించి వివరించబడింది. ఆ రోజు యొక్క తీవ్రత ఖుర్ఆన్ ఆయతుల ద్వారా వర్ణించబడింది. ఆ ఏడుగురు అదృష్టవంతులు: 1. న్యాయమైన పాలకుడు, 2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు, 3. హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి, 4. అల్లాహ్ కొరకు ఒకరినొకరు ప్రేమించుకుని, ఆయన కొరకే కలిసి, ఆయన కొరకే విడిపోయే ఇద్దరు వ్యక్తులు, 5. ఉన్నతమైన మరియు అందమైన స్త్రీ పాపానికి ఆహ్వానించినప్పుడు “నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పే వ్యక్తి, 6. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా గోప్యంగా దానం చేసే వ్యక్తి, 7. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించుకుని కన్నీరు కార్చే వ్యక్తి.

إِنَّ الْحَمْدَ لِلَّهِ وَحْدَهُ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى مَنْ لَا نَبِيَّ بَعْدَهُ أَمَّا بَعْدُ
(ఇన్నల్ హమ్దలిల్లాహి వహ్ద, వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బ’అద, అమ్మా బ’అద్)

అభిమాన సోదరులారా! కారుణ్య వర్షిణి రమదాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను.

أَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّٰهِ وَبَرَكَاتُهُ
(అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు)

ఈరోజు మనం ప్రళయ భీభత్సం, ఆ రోజున అల్లాహ్ కారుణ్య ఛాయలో ఉంచబడే ఆ ఏడుగురి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

ప్రియ వీక్షకుల్లారా! ప్రళయం అనేది ఒక భయంకరమైన విషయం. అది చాలా కఠినమైన రోజు. ఆ రోజు సర్వాధిపతి అయిన అల్లాహ్ సమక్షములో ప్రతి ఒక్కరూ హాజరు కావలసి ఉన్నది. ఆ విషయం గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ముతఫ్ఫిఫీన్‌లో ఇలా తెలియజేశాడు,

لِيَوْمٍ عَظِيمٍ
(లి యౌమిన్ అజీమ్)
ఒక మహాదినాన… (83:5)

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ
(యౌమ యఖూమున్నాసు లి రబ్బిల్ ఆలమీన్)
ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. (83:6)

ప్రజలందరూ సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సమక్షంలో హాజరుపడతారు. ఆ ప్రళయం గురించి, ఆ రోజు ఏ విధంగా భయంకరమైనదిగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుంది, ప్రజలు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, శారీరక స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి భయాందోళనలకు గురిఅయి ఉంటారు అనేది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క కఠినత గురించి సూరతుల్ హజ్‌లో తెలియజేశాడు.

يَا أَيُّهَا النَّاسُ اتَّقُوا رَبَّكُمْ
(యా అయ్యుహన్నాసుత్తఖూ రబ్బకుమ్)
ఓ ప్రజలారా! మీ ప్రభువుకు భయపడండి. (22:1)

إِنَّ زَلْزَلَةَ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ
(ఇన్న జల్ జలతస్సా’అతి షై ఉన్ అజీమ్)
నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహా (భీకర) విషయం.(22:1)

يَوْمَ تَرَوْنَهَا تَذْهَلُ كُلُّ مُرْضِعَةٍ عَمَّا أَرْضَعَتْ
(యౌమ తరౌనహా తద్ హలు కుల్లు ముర్ది’అతిన్ అమ్మా అర్ద’అత్)
ఆనాడు మీరు దాన్ని చూస్తారు… పాలుపట్టే ప్రతి తల్లీ పాలు త్రాగే తన పసికందును మరచిపోతుంది. (22:2)

وَتَضَعُ كُلُّ ذَاتِ حَمْلٍ حَمْلَهَا
(వ తద’ఉ కుల్లు దాతి హమ్లిన్ హమ్లహా)
గర్భవతుల గర్భాలూ పడిపోతాయి. (22:2)

وَتَرَى النَّاسَ سُكَارَىٰ وَمَا هُم بِسُكَارَىٰ وَلَٰكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ
(వ తరన్నాస సుకారా వమాహుమ్ బి సుకారా వలాకిన్న అదాబల్లాహి షదీద్)
ప్రజలు మైకంలో తూలుతున్నట్లు నీకు కనిపిస్తారు. వాస్తవానికి వారు మైకంలో ఉండరు. అయితే అల్లాహ్‌ (తరఫున వచ్చిపడిన) విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. (22:2)

ఈ ఆయత్‌లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయం యొక్క భయంకరమైన ఆ స్థితిని తెలియపరిచాడు. అంటే, ఆ రోజు ఎటువంటి భయంకరమైన రోజు అంటే తల్లి తన బిడ్డను, పాలు తాగే బిడ్డను, పసికందును మరిచిపోతుంది అంటే ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది. అలాగే గర్భిణి యొక్క గర్భం పోతుంది అంటే ఆ భయం ఏ విధంగా ఉంటుంది. మానవులు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు అంటే వారు ఏమైనా మద్యం సేవించారా? లేదు. కానీ ఆ భయం వలన వారి స్థితి, వారి ముఖాలు, వారి శరీరం ఎలా ఉంటుంది అంటే వారు మత్తులో ఉన్నారు అనిపిస్తుంది కానీ, వాస్తవానికి వారు మత్తులో ఉండరు, అల్లాహ్ యొక్క శిక్ష చాలా కఠినమైనది.

అభిమాన సోదరులారా, అటువంటి ప్రళయం రోజు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఈ పర్వతాలను ఎగరేస్తాడు. గుట్టలు, వృక్షాలు, చెట్లు, భవనాలు, ఇళ్లు ఏవీ ఉండవు. మరి నీడ? నీడ ఉండదు. ఈరోజు మనం ఒక మంచి ఇంట్లో ఉంటూ, కరెంట్ ఉంటూ, కేవలం ఫ్యాన్ ఉంటే సరిపోవటం లేదు, ఏసీ కావాలి. కాకపోతే ఆ రోజు ఇల్లు లేదు. ఎటువంటి నీడా ఉండదు. అల్లాహ్ కారుణ్య నీడ తప్ప. అల్లాహ్ అర్ష్ నీడ తప్ప. ఏ నీడా ఉండదు. మరి ఆ నీడ, అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయలో ఎవరు ఉంటారు? ఆ నీడ ఎవరికి దక్కుతుంది? అనే విషయం గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో సెలవిచ్చారు. అది బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఉంది.

سَبْعَةٌ يُظِلُّهُمُ اللَّهُ فِي ظِلِّهِ يَوْمَ لا ظِلَّ إِلا ظِلُّهُ
(సబ్’అతున్ యుదిల్లు హుముల్లాహు ఫీ దిల్లిహి యౌమ లా దిల్లా ఇల్లా దిల్లుహు)
ఆ రోజున, ఆయన నీడ తప్ప మరే నీడ లేని రోజున ఏడు రకాల మనుషులకు అల్లాహ్ తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.

కేవలం ఏడు రకాల కోవకు చెందిన వారు మాత్రమే ప్రళయ దినాన, ఆ భయంకర రోజున, ఎటువంటి నీడ ఉండదు అల్లాహ్ నీడ తప్ప, ఆ అల్లాహ్ యొక్క నీడలో ఏడు రకాల మనుషులకు ఆ నీడ దక్కుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరు? తెలుసుకుందాం.

  1. న్యాయమైన పాలకుడు

    إِمَامٌ عَادِلٌ
    (ఇమామున్ ఆదిలున్)
    న్యాయం చేసే నాయకుడు

    న్యాయం చేసే పరిపాలకుడు, న్యాయం చేసే నాయకుడు. దేశానికి నాయకుడు కావచ్చు, రాజు కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ తన తమ పరిధిలో ఇది వర్తిస్తుంది న్యాయం చేసేది. అమ్మ, తల్లి అనేది తన పరిధిలో, నాన్న అనేవాడు తన పరిధిలో, ప్రిన్సిపాల్ తన పరిధిలో, యాజమాన్యం తన పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఈ దీనికి వర్తిస్తారు, న్యాయం చేసేవారు. న్యాయం చేసే వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. మొదటి వారు.
  2. అల్లాహ్ ఆరాధనలో యవ్వనాన్ని గడిపిన యువకుడు

    وَشَابٌّ نَشَأَ فِي عِبَادَةِ اللَّهِ تَعَالَى
    (వ షాబ్బున్ నష’అ ఫీ ఇబాదతిల్లాహి త’ఆలా)
    యవ్వనంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపే యువకుడు.

    ఏ యువకుడైతే తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపాడో, అటువంటి యువకులకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో ఉంచుతాడు. వృద్ధాప్యంలో మనిషికి కోరికలు ఎక్కువగా ఉండవు, ఎముకలు బలహీనమైపోతాయి, దాదాపు ఆ వయసులో ఎక్కువ కాంక్షలు ఉండవు కాబట్టి అది ఏదీ గొప్పతనం కాదు వృద్ధాప్యంలో ఎక్కువగా పుణ్యాలు చేయటము. మంచి విషయమే, అది గొప్ప విషయం కాదు యువకులతో పోల్చుకుంటే. అందుకు ప్రత్యేకంగా యువకుల గురించి అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, యవ్వనాన్ని అల్లాహ్ మార్గంలో, యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడపాలి. అటువంటి యువకులకు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయ దక్కుతుంది.
  3. హృదయం మస్జిద్‌లకు అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి

    وَرَجُلٌ قَلْبُهُ مُعَلَّقٌ فِي الْمَسَاجِدِ
    (వ రజులున్ ఖల్బుహు ము’అల్లఖున్ ఫిల్ మసాజిద్)
    మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి.

    మనసంతా మస్జిద్‌లోనే ఉండే వ్యక్తి అంటే దానికి అర్థము, పనులు, ఉద్యోగాలు వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మస్జిద్‌లోనే ఉండిపోవాలా అని కాదు. మనసంతా మస్జిద్‌లోనే ఉండే మనిషి అంటే, వ్యాపారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ మనసు మాత్రం ఒక నమాజ్ తర్వాత ఇంకో నమాజ్ గురించి ఆలోచనలో ఉంటుంది. మనసు ఏముంటుంది? అసర్ నమాజ్ ఎప్పుడు అవుతుంది? అసర్ నమాజ్ చేసుకుంటే మగ్రిబ్ నమాజ్ సమయం గురించి, మగ్రిబ్ అయిపోతే ఇషా గురించి. ఈ విధంగా ఒక నమాజ్ అయిన తర్వాత ఇంకో నమాజ్ గురించి ఎదురు చూస్తాడు. మనసులో అదే ఆలోచన ఉంటుంది. ఇది దానికి అర్థం, మనసంతా మస్జిద్‌లో ఉండే మనిషి.
  4. అల్లాహ్ కొరకు ప్రేమించుకునే ఇద్దరు వ్యక్తులు

    وَرَجُلانِ تَحَابَّا فِي اللَّهِ اجْتَمَعَا عَلَيْهِ وَتَفَرَّقَا عَلَيْهِ
    (రజులాని తహాబ్బా ఫిల్లాహిజ్తమ’ఆ అలైహి వ తఫర్రఖా అలైهِ)
    ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే, పరస్పరం కలుసుకుంటే అల్లాహ్ కోసమే కలుసుకుంటారు. వారిద్దరూ విడిపోతే అల్లాహ్ కోసమే విడిపోతారు.

    అంటే స్వార్థం ఉండదు. స్వార్థం లేకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం. కలిసినా అల్లాహ్ ప్రసన్నత, విడిపోయినా అల్లాహ్ ప్రసన్నత.
  5. పాపానికి ఆహ్వానిస్తే తిరస్కరించే వ్యక్తి

    అందం, అంతస్తు గల స్త్రీ చెడు వైపుకి ఆహ్వానిస్తే:

    إِنِّي أَخَافُ اللَّهَ رَبَّ الْعَالَمِينَ
    (ఇన్నీ అఖఫుల్లాహ రబ్బల్ ఆలమీన్)
    “నేను సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్‌కు భయపడుతున్నాను” అని చెప్పేవాడు.

    ఈ చెడు కార్యానికి పాల్పడను, వ్యభిచారం చేయను, నాకు అల్లాహ్ భయం ఉంది అని చెప్పేవాడు. ఇంత అవకాశం వచ్చాక, అందం, అంతస్తు రెండూ ఉన్న స్త్రీ, ఒకవైపు అందం ఉంది, ఇంకోవైపు అంతస్తు ఉంది, అటువంటి స్త్రీ స్వయంగా ఆహ్వానిస్తుంది చెడు వైపుకి. అటువంటి సమయంలో, “ఇన్నీ అఖాఫుల్లాహ్, నేను అల్లాహ్‌కు భయపడుతున్నాను” అనే చెప్పే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.
  6. గోప్యంగా దానం చేసే వ్యక్తి

    رَجُلٌ تَصَدَّقَ بِصَدَقَةٍ فَأَخْفَاهَا حَتَّى لا تَعْلَمَ شِمَالُهُ مَا تُنْفِقُ يَمِينُهُ
    (రజులున్ తసద్దఖ బి సదఖతిన్ ఫ అఖ్ఫాహా హత్తా లా త’అలమ షిమాలుహు మా తున్ఫిఖు యమీనుహు)
    గోప్యంగా దానం చేసేవాడు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియదు.

    అంత రహస్యంగా, గోప్యంగా దానం చేసే వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు. కారుణ్య ఛాయ దక్కుతుంది. అంటే, ప్రదర్శనా బుద్ధితో కాకుండా, ప్రజల మెప్పు కోసం కాకుండా, కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే దానం చేసే వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రళయ దినాన తన నీడను ప్రసాదిస్తాడు.
  7. ఏకాంతంలో అల్లాహ్‌ను స్మరించి ఏడ్చే వ్యక్తి

    وَرَجُلٌ ذَكَرَ اللَّهَ خَالِيًا فَفَاضَتْ عَيْنَاهُ
    (రజులున్ దకరల్లాహ ఖాలియన్ ఫ ఫాదత్ ఐనాహు)
    ఏకాంతములో అల్లాహ్‌ను గుర్తు చేసుకుని కన్నీరు కార్చే వ్యక్తి.

    ఏకాంతంలో ఉన్నారు, అతను ఎవరికీ చూడటం లేదు, ఎవరూ అతనికీ చూడటం లేదు, ఆ స్థితే లేదు. ఏకాంతంలో ఉన్నాడు, అల్లాహ్ గుర్తుకు వచ్చాడు. అల్లాహ్ శిక్ష గుర్తుకు వచ్చింది, అల్లాహ్ వరాలు గుర్తుకు వచ్చాయి, తన వాస్తవం ఏమిటో తెలుసుకున్నాడు, కుమిలిపోతూ ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అటువంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా రేపు ప్రళయ దినాన తన కారుణ్య ఛాయలో నీడను ప్రసాదిస్తాడు.

ప్రియ వీక్షకుల్లారా, చివర్లో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ మనల్ని ప్రళయ దినాన ఈ ఏడుగురిలో మనకి కూడా చేర్పించు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్.

وَآخِرُ دَعْوَانَا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
(వ ఆఖిరు ద’అవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్)

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=42341

పరలోక విశ్వాసం – 2 : ప్రళయం, దాని సూచనలు & తీర్పుదిన విశేషాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[29:27 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా
పుస్తక మూలం: పరలోకం (Aakhir)

1- శాశ్వతంగా ఉండుటకు అల్లాహ్ ఈ లోకాన్ని సృష్టించలేదు. ఒక రోజు రానుంది అంతం కానుంది. ఆ రోజే “ఖియామత్” రోజు. ఏలాంటి సందేహం లేని యదార్థం అది. అల్లాహ్ ఆదేశం:

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَّا رَيْبَ فِيهَا

పునరుత్తాన దినము రానున్నది, అందెట్టి సందేహం లేదు“. (హజ్ 22: 7).

మరో చోట ఇలా చెప్పాడు:

وَقَالَ الَّذِينَ كَفَرُوا لَا تَأْتِينَا السَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّي لَتَأْتِيَنَّكُمْ

మాకు ప్రళయ కాలం రాదు అని అవిశ్వాసులు పలుకుదురు. నీవు చెప్పు ఎందుకు రాదు అది తప్పక మీకు వచ్చును“. (సబా 34: 3).

ప్రళయ దినం సమీపములోనే ఉంది. దాన్ని అల్లాహ్ ఇలా తెలిపాడు:

[اقْتَرَبَتِ السَّاعَةُ ] {القمر:1}

తీర్పు కాలం సమీపించినది“. (ఖమర్ 54: 1).

మరో చోట:

اقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِي غَفْلَةٍ مُّعْرِضُونَ – 21:1

ప్రజలకు తీర్పు కాలం సమీపించినది. వారు అజాగ్రత్తలో పడి విముఖులై యున్నారు“. (అంబియా 21:1)

ఆ సమీపం అనేది మన అంచనా ప్రకారం లేదు. మానవులు దాన్ని తెలుసుకోలేరు. కాలము గడిసిన ప్రకారం అది కేవలం అల్లాహ్ కే తెలుసు.

ప్రళయదిన విషయం అగోచరమైనది. అది కేవలం అల్లాహ్ కే తెలుసు. ఆ విషయాన్ని ఆయన తన సృష్టిలో ఎవరికి తెలుపలేదు. అల్లాహ్ చెప్పెను:

يَسْأَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ اللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَرِيبًا – 33:63

ప్రజలు ప్రళయకాలమును గూర్చి నిన్ను అడుగుచున్నారు. దాని విషయం అల్లాహ్ కే తెలియును అని ఓ ప్రవక్తా! పలుకుము. దాని విషయం నీకేమీ తెలుసు? ప్రళయకాలం సమీపములోనే కావచ్చు“. (అహ్ జాబ్ 33: 63).

ప్రవక్త దానికి ముందు వచ్చే సూచనలు సూచించారు. అందులో కొన్ని క్రింద తెలుపబడుచున్నవిః

అందులో ఒకటి: మసీహుద్దజ్జాల్ రానున్నాడు. అతని రాకతో ఘోరమైన అరాచకం ప్రభలిపోతుంది. అల్లాహ్ అతనికి ఇచ్చిన శక్తితో విచిత్ర కార్యక్రమాలు ప్రజలకు చూపిస్తాడు. అందుచేత అనేక మంది మోసబోతారు. ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే అది వర్షం కురిపిస్తుంది. అతని ఆజ్ఞతో అప్పటికప్పుడే మొక్కలు మొలు స్తాయి. మృతుడ్ని జీవింపజేస్తాడు. తదితర వింతలు చూపిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: అతడు ఒంటి కన్ను వాడు. అతడు స్వర్గం నరకం లాంటి రెండు విషయాలు చూపిస్తాడు అతడు స్వర్గం అని చెప్పేది నరకం, అతడు నరకం అని చెప్పేది స్వర్గం. అతడు 40 రోజులు నివసిస్తాడు.ఒక రోజు ఒక సంవత్సరముగా, ఒక రోజు ఒక నెలగా, ఒక రోజు ఒక వారముగా ఉండును. మిగిత రోజులు సామాన్య రోజులుగా ఉండును. అతడు మక్కా, మదీనా తప్ప ప్రతి దేశం తిరుగును.

ప్రళయదిన సూచనల్లో రెండవది: ఈసా దిమిష్క్ (Damascus) (ఇది ఈనాడు సీరియా దేశం యొక్క రాజధాని) తూర్పున తెల్లని స్థంబం (మీనార్) నుండి ఫజ్ర్ నమాజ్ సమయంలో దిగి వచ్చును. సామూహికంగా (జమాఅత్ తో) ఫజ్ర్ నమాజ్ చేసుకొని దజ్జాల్ ను వెతికి సంహరించుదురు.

ప్రళయదిన సూచనల్లో మూడవది: పశ్చిమ దిశ నుండి సూర్యోదయమగును. అది చూసి భయకంపితులై అనేక మంది (ఇస్లామే సత్యమని) విశ్వసించుదురు. కాని ఆ సమయాన ఏమి లాభముండదు. తదితర ఎన్నో సూచనలున్నాయి.

2- ఈ భూమిపై కేవలం దుర్మార్గులు, దుష్టులు మిగిలి ఉన్నపుడు ప్రళయం సంభవించును. అది ఏ విధంగనగాః ప్రళయానికి ముందు ఒక మందమారుతమైన గాలి వీస్తుంది దానితో విశ్వాసులు చనిపోతారు. ఇక అల్లాహ్ సృష్టంతటిని చంపి ప్రపంచాన్ని నశింపజేయాలనుకున్నప్పుడు “సూర్” (పెద్ద శంకు) ఊదుటకు దానికి నియమింపబడిన దూతకు ఆజ్ఞ ఇస్తాడు. దాన్ని విన్న ప్రజలందరు సొమ్మసిల్లి పోతారు. అదే విషయం అల్లాహ్ ఈ వాక్యంలో తెలిపాడు:

وَنُفِخَ فِي الصُّورِ فَصَعِقَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ

“సూరు” (శంకు) ఊదబడును. కావున ఆకాశములలోను భూమిలోనున్న వారందరు సొమ్మసిల్లి పోవుదురు. కాని అల్లాహ్ కోరినవారు సొమ్మసిల్లరు. (జుమర్ 39: 68).

అది శుక్రవారము రోజగును. ఆ తర్వాత దైవదూతలు కూడా చనిపోయి పరమ పవిత్రుడైన అల్లాహ్ తప్ప ఎవరూ ఉండరు.

3- సమాధులలో ప్రవక్తల, ధర్మయుద్ధంలో మరణించిన అమర వీరుల తప్ప అందరి దేహములను మట్టి తినేస్తుంది. కాని వెన్నె ముకలో గల ఒక బీజము అట్లే మిగిలి యుంటుంది. అల్లాహ్ ప్రజలందరికి పునఃర్జన్మ ఇవ్వాలని కోరినపుడు శంకు ఊదుటకు నిర్ణయించబడిన దూత ఇస్రాఫీల్ ను ముందు జీవింపజేయును. అతను శంకు ఊదును. మానవులందరు తొలిసారి (తల్లి గర్భం నుండి) వచ్చిన తీరు నగ్నముగా, ఖత్న (సున్నతీలు) చేయ బడకుండా సమాధుల నుండి లేచి వచ్చుదురు. అల్లాహ్ ఆదేశం:

وَنُفِخَ فِي الصُّورِ فَإِذَا هُم مِّنَ الْأَجْدَاثِ إِلَىٰ رَبِّهِمْ يَنسِلُونَ – 36:51

సూరు ఊదబడును. అప్పుడే వారు తమ సమాధుల నుండి లేచి తమ ప్రభువు వద్దకు పరుగిడుదురు“. (యాసీన్ 36: 51).

يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ

ఆ దినమున వారు సమాధుల నుండి లేచి ఒక గుర్తునకు పరిగెత్తి పోవునట్లు పరుగెత్తి పోవుదురు. అప్పుడు వారి కన్నులు క్రిందుగా నుండును. వారిపై అవమానము క్రమ్ముకొను చుండును. ఇదే వారితో వాగ్దానము చేయబడుచున్న దినము“. (మఆరిజ్ 70: 43,44).

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం ప్రకారం, అందరికన్నా ముందు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భూమి నుండి వెలికి వస్తారు. అందరూ మహ్షర్ మైదానము వైపు పరిగెత్తుతారు. అది చాలా విస్తీర్ణము మరియు విశాలమైన భూమి. అవిశ్వాసులు తలక్రిందులైన ముఖముతో వస్తారు. ఈ విషయము విన్న సహచరులు తలక్రిందులైన ముఖముతో ఎలా వస్తారు? అని ప్రశ్నించారు. కాళ్ళతో నడిపించు శక్తి గలవాడు ముఖముతో కూడా నడిపించును” అని మహాప్రవక్త సమాధానమిచ్చారు”. (ముస్లిం 2806). అల్లాహ్ మాటను తిరస్కరించిన వారు గ్రుడ్డివానిగా లేపబడుతారు. సూర్యుడు చాలా దగ్గరుంటాడు. ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం చెమటలో మునిగి యుంటారు. కొందరు చీలమండల వరకు, మరి కొందరు నడుము వరకు, కొందరు పూర్తిగా మునిగి యుంటారు. కొందరికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. ప్రవక్త చెప్పారు: ఏడు రకాల (గుణము గల) వారికి అల్లాహ్ ఆ నాడు తన నీడలో స్థానమిస్తాడు. ఆ నాడు తన నీడ తప్ప మరే నీడ ఉండదు. 1. న్యాయశీలుడైన పాలకునికి. 2. యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో మరియు ఆయన విధేయతలో గడిపిన యువకునికి. 3. మస్జిద్ లోనే తన మనుస్సు లగ్నం చేసుకున్న వ్యక్తికి. 4. కేవలం అల్లాహ్ అభీష్టాన్ని పొందుటకు ప్రేమాభిమానాలు గల ఇద్దరు వ్యక్తులు వారు అల్లాహ్ కొరకే కలుసు కుంటారు. అల్లాహ్ కొరకే వేరు అవుతారు. 5. ఉన్నత వంశీయురాలైన, అందమైన స్త్రీ దుష్టక్రియకు అహ్యానిస్తే కేవలం అల్లాహ్ భయముతో తిరస్కరించిన వ్యక్తికి. 6. కుడి చెయ్యి దానం చేసినదేమిటో ఎడమ చెయ్యికి తెలియనంత రహస్యంగా దానా దర్మాలు చేసే వ్యక్తికి. 7. ఏకాంతములో అల్లాహ్ ధ్యానం చేస్తుండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి“. (బుఖారి 1423, మస్లిం 1031). ఇది పురుషులకే ప్రత్యేకం కాదు. స్త్రీలకు తమ కర్మల ప్రకారం లెక్క జరుగును. సత్కార్యములు గలవారికి మంచి ఫలితము, దుష్కార్యములు గలవారికి చెడు ఫలితము లభించును. మరియు వారికి పురుషులకు లభించినట్లు పూర్తి తీర్పు మరియు ప్రతిఫలము లభించును.

ప్రజలందరికి ఆ నాడు దాహము ఎక్కువగును. 50 వేల సంవత్సరాల ప్రమాణం గల ఒక రో జు అది. కాని విశ్వాసునికి అది ఫర్జ్ నమాజ్ చేసినంత సమయముగా అతి వేగంగా గడిసి పోవును. ఆ తరువాత విశ్వాసులు ప్రవక్తకు నొసంగబడిన “హౌజె కౌసర్” వద్దకు వచ్చి కౌసర్ నీరు త్రాగుదురు. (అది గౌరవము గల చాలా గొప్ప బహుమానము. అది అల్లాహ్ మన ప్రవక్తకే ప్రత్యేకించును. ప్రళయ దినాన ఆయన అనుచరులు అందు నుండి త్రాగుదురు. కౌసర్ నీరు పాలకన్నా తెలుపుగా, తేనేకన్నా తీపుగా మరియు కస్తూరి కన్నా ఎక్కువ సువాసన ఉండును. ఆకాశతారలకన్నా ఎక్కువ పాత్రలు అచ్చట ఉండును. ఒక్కసారి త్రాగిన వారికి మరెప్పుడూ దాహమవదు).

మహ్షర్ మైదానములో ప్రజలు తీర్పు కొరకు చాలా కాలము నిలుచుండి వారు తమ తీర్పు, లెక్క కొరకు ఎదురు చూచుదురు. అచ్చటి బాధలు మరియు ఎండతాపాన్ని భరించలేక దైవసన్నిధిలో తమ గురించి సిఫారసు చేయువారి కోసం వెతుకుతూ ఆదం వద్దకు వస్తే ఆయన నాతో కాదనగా నూహ్ వద్దకు వస్తారు. ఆయన కూడా మన్నించమంటారు. తర్వాత ఇబ్రాహీం, తర్వాత మూసా, తర్వాత ఈసా వద్దకు వస్తే వారు కూడా మాతో కాదని విన్నవించుకుంటారు. అప్పుడు ప్రవక్త వద్దకు వస్తే నేను దీనికి అర్హతగల వాన్నని ఆయన అల్లాహ్ అర్ష్ క్రింద సజ్దా చేసి అల్లాహ్ స్తోత్రములు పఠించి సిఫారసు చేయు అనుమతి కోరుతారు. అప్పుడు అల్లాహ్ “ఓ ముహమ్మద్ తలెత్తు నీ కోరిక తీర్చగలను అడుగు, సిఫారసు చెయ్యి స్వీకరించ బడును” అని లెక్క తీర్పు కొరకు అనుమతిస్తాడు. ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీల (అనుచరుల) తీర్పు అగును.

మానవుని కర్మల్లో మొదటి లెక్క నమాజ్ గురించి అగును. అందులో నెగ్గినవారి కర్మలను మాత్రమే చూడబడును. నెగ్గనివారి కర్మలు రద్దు చేయబడును. అదే విధముగా ఐదు విషయాలు గురించి ప్రశ్నించబడును. 1. నీ జీవిత కాలాన్ని ఏ కార్యాల్లో గడిపావు? 2. నీ యౌవ్వనాన్ని ఏ కార్యాల్లో కృశింపజేశావు? 3,4. ధనం ఎలా సంపాదించావు? ఎలా ఖర్చు చేశావు? 5. తెలుసుకున్న విషయాలపై ఎంత వరకు ఆచరించావు?. అతని దాసుల మధ్య జరిగే తీర్పులో మొదటిది అన్యాయంగా రక్తాలు చిందించిన వారి తీర్పు. అప్పుడు నష్టపరిహారాన్ని కట్టించుటకు సత్కర్యాలు లేక దుష్టకార్యాలు తప్ప మరేమీ ఉండవు. ఈ విధంగా పీడుతులకు అన్యాయము చేసినవాని సత్కార్యాలు పంచి పెట్టబడును. ఇతని సత్కార్యాలు అయిపోయి ఇంకా పీడితులు మిగిలి ఉంటె వారి పాపాలు అతనిపై వేయబడును.

నరకముపై వంతెన వేయబడును. (ఆ వంతెన వెంట్రుకకన్నా సన్నగా ఖడ్గం కన్నా వాడిగా ఉండును). ప్రతి ఒకరు తమ కర్మల ప్రకారం దానిపై దాటుదురు. కొందరు కనురెప్ప కొట్టినంతలో, కొందరు గాలి తీరు, కొందరు గుఱ్ఱపు రౌతు తీరు, కొందరు ప్రాకుచు పోవుదురు. దానికి కొండ్లుండును. అవి ప్రజలను నరకములో పడవేయును. అందులో పడువారు అవిశ్వాసులు మరియు విశ్వాసి అయినా పాపాత్ములు. అవిశ్వాసులు శాశ్వతంగా అందులో ఉందురు. కాని విశ్వాసులైన పాపాత్ములు అల్లాహ్ కోరినన్ని రోజులు శిక్ష పడిన తర్వాత స్వర్గానికి పంపబడుదురు. అల్లాహ్ తనిష్టపడిన ప్రవక్తలకు, మహాభక్తులకు తౌహీద్ సాక్ష్యమిచ్చిన పాపాత్ముల సిఫారసు చేయు అనుమతి ఇచ్చి, వీరి సిఫారసుతో వారిని నరకము నుంచి తీసి స్వర్గములో చేర్పించును. వంతెన దాటిన తర్వాత -స్వర్గానికి అర్హులైన వారు- నరకము స్వర్గము మధ్యలో ఆగి యుందురు. వారి పరస్పర అన్యాయాల తీర్పు వారు హృదయాల కల్ముషాలను దూరము చేసిన తర్వాత వారు స్వర్గములో చేరుదురు. స్వర్గస్తులు స్వర్గ ములో నరకవాసులు నరకంలో చేరిన పిదప వారి ముందు, వారు చూస్తుండగా మృత్యువును పొట్టేలు రూపంలో స్వర్గనరక ముల మధ్య జిబహ్ చేయ(కోయ) బడును. మళ్ళీ ఓ స్వర్గవాసులారా! శాశ్వతంగా ఉండండి మరణం లేదు. ఓ నరకవాసులారా! మీకూ శాశ్వతం మరణం లేదు అని అనబడును. ఒక వేళ ఎవరైనా సంతోషంతో చనిపోతే స్వర్గవాసులు అంతులేని సంతోషంతో చనిపోతారు. మరియు ఎవరైనా బాధ, చింతతో చనిపోతే నరకవాసులు చనిపోతారు.

పరలోకం (The Hereafter) మెయిన్ పేజీ : https://teluguislam.net/hereafter/

ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన వీడియో పాఠాలు :

ప్రళయదినాన ఆ పశువులు ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి

576. హజ్రత్ అబూజర్ గిఫ్ఫారి (రధి అల్లాహు అన్హు) కధనం :-

నేను (ఓసారి) దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సన్నిధికి వెళ్తే సరిగ్గా అదే సమయంలో ఆయన “నా ప్రాణం ఎవరి అధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్షి!” అంటూ లేక “తాను తప్ప వేరే ఆరాధ్యుడు లేనటువంటి శక్తి స్వరూపుని సాక్షి” అంటూ లేక మొత్తం మీద ఆయన ఏదో ఓ రకంగా ప్రమాణం చేస్తూ ఇలా అన్నారు. “ఒంటెలు, ఆవులు లేదా మేకలు కలిగి వున్న వ్యక్తి వాటి హక్కు (అంటే జకాత్) గనక నెరవేర్చకపోతే ప్రళయదినాన ఆ పశువులు బాగా పెరిగి బలసిపోయేలా చేసి తీసుకురాబడతాయి. తర్వాత అవి ఒకదాని తరువాత మరొకటి వరుసగా ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి కాళ్ళతో తోక్కివేస్తాయి. చివరి పశువు కూడా పొడిచి, తొక్కి వేసిన తరువాత తిరిగి మొదటి పశువు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ యాతన యావత్తు మానవులను గురించి (పరలోక) తీర్పు ముగిసే దాకా కొనసాగుతుంది.”

[సహీహ్ బుఖారీ : 24 వ ప్రకరణం – జకాత్, 43 వ అధ్యాయం – జకాతిల్ బఖర]

జకాత్ ప్రకరణం : 8 వ అధ్యాయం – జకాత్ చెల్లించని వారు కఠినాతి కఠిన శిక్ష చవి చూడవలసి వస్తుంది
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth

బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు

1366. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హ) కధనం :-

నేనొక దిండు (లేక తలగడ) కొన్నాను. దాని మీద బొమ్మలు వేసి ఉన్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) బయటి నుంచి వచ్చి దాన్ని చూడగానే తలుపు దగ్గరే ఆగిపోయారు. ఇంట్లోకి ప్రవేశించలేదు. నేనాయన ముఖంలో ఆగ్రహ చిహ్నాలు చూసి ‘దైవప్రవక్తా! నేను అల్లాహ్ ముందు, ఆయన ప్రవక్త ముందు పశ్చాత్తాపపడుతున్నాను (క్షమాపణ కోరుకుంటున్నాను). నేను చేసిన తప్పేమిటో సెలవియ్యండి” అని అన్నాను.

దానికి ఆయన “ఈ దిండేమిటి?” అని అడిగారు. “ఈ దిండు మీరు ఆనుకొని కూర్చుంటారన్న ఉద్దేశ్యంతో కొన్నాను” అని చెప్పాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)

“బొమ్మలను వేసే (తయారు చేసే) వాడ్ని అల్లాహ్ ప్రళయదినాన శిక్షిస్తాడు. ‘నీవు సృష్టించిన దీనికి ప్రాణం పొయ్యి అంటాడు అల్లాహ్ అతనితో (అతనా పని చేయలేడు)” అని అన్నారు. ఆ తరువాత “బొమ్మలు ఉండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు” అని చెప్పారు ఆయన.

[సహీహ్ బుఖారీ : 34 వ ప్రకరణం – అల్ బుయూ, 40 వ అధ్యాయం – అత్తిజారతి ఫీమా యుక్రహు లుబ్సుహూ లిర్రిజాలి వన్నిసా]

వస్త్రధారణ, అలంకరణల ప్రకరణం : 26 వ అధ్యాయం – కుక్క, (ప్రాణుల) చిత్రాలుండే ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు.
మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-2
సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

Read English Version of this Hadeeth