దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్) – “అర్రహీఖుల్‌ మఖ్ తూమ్” పుస్తకం నుండి

బిస్మిల్లాహ్
మహాప్రవక్త ﷺ జీవిత చరిత్ర – అంతిమ హజ్ – సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/IrogXl0z-uY [42నిముషాలు]

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్జతుల్ విదా (చివరి హజ్)

దైవసందేశం అందించే కార్యం పరిపూర్తి అయింది. అల్లాహ్ ఏకత్వం, ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడన్న సత్యాన్ని ధృవీకరించడం మరియు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి దైవదౌత్యం పునాదులపై ఓ క్రొత్త సమాజ నిర్మాణ, రూపకల్పన అమల్లోనికి వచ్చేసింది. అంటే, ఇప్పుడు ఆ మహత్కార్యం పూర్తి అయిపోయింది కాబట్టి ఓ అదృశ్యవాణి మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి మనోఫలకంపై ఆయన ఈ ప్రపంచంలో జీవించి ఉండే కాలం దగ్గరపడుతుందనే సూచనలు ప్రస్ఫుటం చేయనారంభించింది. అందుకేనేమో మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)ను హిజ్రీ శకం 10లో యమన్ కు గవర్నరుగా చేసి పంపిస్తూ ఆ పదవికి సంబంధించిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు తోడు హజ్రత్ ముఆజ్ బిన్ జబల్ (రదియల్లాహు అన్హు)తో, “ఓ ముఆజ్! బహుశా నీవు నన్ను ఈ సంవత్సరం తరువాత మళ్ళీ కలుసుకోలేవు అని అనిపిస్తోంది! నా ఈ మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు నా సమాధిని మాత్రమే చూడగలవేమో!” అని చెప్పారు, హజ్రత్ ముఆజ్ (రదియల్లాహు అన్హు), దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఈ పలుకులు విన్నంతనే దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా రోదించడం కూడా జరిగింది.

అసలు యదార్థం ఏమిటంటే, అల్లాహ్ తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కు ఈ అదృశ్య వాణి ద్వారా ఇస్లామ్ ధర్మసందేశం వలన ఒనగూడిన సత్ఫలితాలేమిటో చూయించదలిచాడు. ఏ దైవసందేశ ప్రచారం కోసమైతే ఆయన అహర్నిశలు ఇరవై సంవత్సరాలకు పైన్నే కష్టాలను, కడగండ్లను అనుభవిస్తూ వచ్చారో దాని ఫలితం ఎంత మహోజ్వలంగా ఉందో కళ్ళారా చూసే భాగ్యాన్ని ప్రసాదించాడన్నమాట. ఇందుకు అల్లాహ్ ఓ సుముహూర్తాన్ని కూడా నిర్ణయించి, తద్వారా హజ్ సందర్భంలో మక్కా పరిసరాల్లో నివసించే అరబ్బు తెగల ప్రతినిధి వర్గాలను ఓ చోట సమావేశపరిచి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బోధించిన ధార్మిక విషయాల జ్ఞానాన్ని వారు సముపార్జించడానికి, ఏ అమానతు భారమైతే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) భుజస్కంధాలపై వేయబడిందో దాన్ని ఇప్పుడు వీరు మోయవలసి ఉంటుందని చెప్పడానికి, దైవసందేశాన్ని అందించడం, ముస్లిం సమాజానికి మేలు చేకూర్చే హక్కును సజావుగా నిర్వర్తించడంలో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎలాంటి లోటు రానివ్వకుండా ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించారని వారి నోటే సాక్ష్యం ఇప్పించవలసి ఉంది. ఈ దైవ నిర్ణయం ప్రకారమే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ చారిత్రాత్మకమైన ‘హజ్జె మబ్రూర్’ (దైవం మెచ్చిన హజ్) చేయవలసి ఉందని ప్రకటించగానే అరేబియా ద్వీపానికి చెందిన ముస్లిం జనసందోహం తండోపతండాలుగా వచ్చి ఆయన చుట్టూ చేరనారంభించింది. ప్రతి వ్యక్తీ, తాను మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వెళ్ళి ఆయన నాయకత్వంలో హజ్ చేయాలని పరితపించిపోతున్నాడు.[1] జిల్-ఖాదా నెల ఇంకా నాల్గు రోజులకు ముగుస్తుందనగా శనివారం రోజున దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ కోసం బయలుదేరారు.[2]

[1]. ఇది సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉన్న హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం. చూడండి, ప్రవక్త హజ్ అధ్యాయం – 1/394.

[2]. హాఫిజ్ ఇబ్నె హజర్ పరిశోధించి చెప్పిన విషయం ఇది. కొన్ని ఉల్లేఖనాల్లో జిల్ ఖాదా నెల ఇంకా అయిదు రోజులకు ముగుస్తుందనగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) బయలుదేరారనే అని వచ్చిన వివరాలను ఆయన సరిదిద్దారు. చూడండి, ఫత్ హుల్ బారి – 8/104.

తలపై నూనె వేసి మర్ధించుకొని దువ్వుకున్నారు. ‘తహ్బంద్’ (లుంగీ) కట్టుకొని మేనిపై దుప్పటి కట్టుకున్నారు. ఖుర్బానీ పశువుల మెడలలో పట్టెడలు వేసి జొహ్ర్ నమాజు చేసి హజ్ కోసం బయలుదేరారు. అస్ర్ నమాజుకు ముందే ‘జుల్ హులైఫా’ వాదీ (లోయ)లోనికి చేరుకుని అక్కడాగి రెండు రకాతుల ‘అస్ర్’ నమాజు చేశారు. గుడారాలు వేసుకొని రాత్రంతా అక్కడనే గడిపారు. తెల్లవారిన తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) సహాబా (రదియల్లాహు అన్హుమ్) (అనుచరగణం) ను సంబోధిస్తూ, “రాత్రి నా ప్రభువు వద్ద నుండి వచ్చేవాడు ఒకడొచ్చి నాతో, ఈ శుభమైన లోయలో నమాజు చేయమని, హజ్ లో ‘ఉమ్రా’ కూడా ఉందని ప్రకటించు అని చెప్పి వెళ్ళాడు” అని తెలిపారు.[3]

[3] ఇది హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) గారు ఉల్లేఖించినట్లు బుఖారీ గ్రంథంలో ఉంది. 1/207.

జొహ్ర్ నమాజుకు ముందే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘ఇహ్రామ్’ కోసం ‘గుస్ల్’ చేశారు. హజ్రత్ ఆయిషా (రదియల్లాహు అన్హా), ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) శరీరం మీదా, తలపైనా తన చేతులతో ‘జరీరా’తో కలిపిన కస్తూరి సువాసన గల పదార్థాన్ని, దాని తళుకు, గుబాళింపు ఆయన తల పాపిటలో, గెడ్డంలో కానవచ్చేటట్లు పులిమారు. అయితే ఆ సువాసనా పదార్థాన్ని ఆయన కడిగివేయకుండా అలాగే ఉంచేసుకున్నారు. ఆ తరువాత తహ్బంద్ కట్టుకొని, శరీరం పై ఓ దుప్పటిని కట్టుకొని “లబ్బైక్’ వాక్యాలను బిగ్గరగా పలికారు. బయటకు వచ్చి తన ‘కస్వా’ అనే ఆడ ఒంటె పై ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కూడా మరోసారి లబ్బైక్ పదాలను బిగ్గరగా పలికారు. అలా ఒంటెనెక్కి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) మైదానం వైపునకు వెళ్ళి అక్కడ కూడా లబ్బైక్ వాక్యాల్ని అందరికీ వినబడేటట్లు పలికారు.

ఆ తరువాత పయనమై ఓ వారం తరువాత ప్రొద్దుగ్రుంకే సమయానికి మక్కా దాపుకు చేరుకున్నారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘జీతువా’లో మకాం వేశారు. రాత్రి అక్కడనే గడిపి ఫజ్ర్ నమాజు తరువాత ‘గుస్ల్’ (స్నానం) చేసి ఉదయాన్నే మక్కాలో ప్రవేశించారు. అది హిజ్రి శక సంవత్సరం 10, జిల్ హిజ్జా మాసం 4వ తేది, ఆదివారం రోజు. ప్రయాణ కాలంలో మొత్తం ఎనిమిది రాత్రిళ్ళు గడిచాయి- సరాసరి ప్రయాణానికి పట్టేకాలం అదే- నేరుగా మస్జిదె హరామ్ (కాబా మస్జిద్)కు చేరి ఆయన మొదట దైవగృహం కాబా తవాఫ్ చేశారు. ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ ‘సయీ’ చేశారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్ మరియు ఉమ్రాలు రెంటికి సంబంధించిన ఇహ్రామ్ ఒకేసారి కట్టుకోవడం ‘హదీ’ (ఖుర్బానీ) పశువులను వెంట తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇహ్రామ్ వస్త్రాలను మాత్రం తీసివేయక అలానే ఉంచేసుకున్నారు. తవాఫ్ మరియు సయీ రెంటిని ముగించుకొని మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఎగువ మక్కాలో హజూన్ అనే ప్రదేశంలో విడిది చేశారు. అయితే, హజ్ తవాఫ్ తప్ప మరే తవాఫ్ ఆయన చేయలేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వెంట వచ్చిన ఏ సహాబాలైతే తమ వెంట ‘హదీ’ తీసుకురాలేకపోయారో, వారికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తమ ఇహ్రామ్ ను ఉమ్రా ఇహ్రామ్ గా మార్చుకొమ్మని, కాబా గృహం తవాఫ్ మరియు సఫా మర్వాల నడుమ ‘సయీ’ చేసిన తరువాత వాటిని తీసేసి పూర్తిగా ‘హలాల్ కమ్మని ఆదేశం ఇచ్చారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) స్వయంగా ఇహ్రామ్ దుస్తులను తీసివేసి హలాల్ కానందున సహాబాలు కొంత ఇరుకునబడ్డారు. అది చూసిన మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారితో, “నాకు ఇప్పుడు తెలిసిన విషయం ముందే తెలిసి ఉంటే నేనసలు హదీ తెచ్చేవాడినే కాదు. మీతోపాటే హలాల్ అయి ఉండేవాణ్ణి” అని అనగా సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఆయన ఆదేశాలను శిరసావహించారు. అంటే ఎవరి వద్ద హదీ పశువు లేదో వారు హలాల్ అయిపోయారు. (హలాల్ కావడం అంటే, ఇహ్రామ్ కట్టుకున్న తరువాత కొన్ని ధర్మసమ్మతమైన విషయాలు ఇహ్రామ్ వదలనంతవరకు హరామ్ అవుతాయి. ఇహ్రామ్ వదిలిన తరువాత తిరిగి అవి ధర్మసమ్మతం అయిపోతాయి అని అర్థం.)

ఎనిమిది జిల్ హిజ్జా తేదీన – తర్వియా రోజున – మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘మినా’కు వెళ్ళారు. అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జిల్ హిజ్జా తొమ్మిదవ తేదీ ఉదయం వరకు విడిది చేశారు. జొహ్ర్,అస్ర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజ్ర్ నమాజులు (అయిదు పూటలు) అక్కడనే చేశారు. సూర్యోదయం అయిన వరకు ఆగి ‘అరఫా’కు బయలుదేరారు. అక్కడికి చేరేటప్పటికే ఆయన కోసం ‘వాదియె నిమ్రా’లో గుడారం సిద్ధపరచబడి ఉంది. పగలంతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ గుడారం లోనే ఉండిపోయారు. సూర్యుడు పడమటి దిక్కుకు వాలిన తరువాత ఆయన ఆదేశం మేరకు కస్వా పై కజావా కట్టబడింది. దాని పైనెక్కి ‘బత్న్’ లోయలోనికి అరుదెంచారు. అప్పుడు ఆయన చుట్టూ ఒక లక్షా ఇరవై నాల్గు వేలు లేదా లక్షా నలభై నాల్గు వేల మంది చేరారు.

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నడుమన నిలుచొని ఓ సమగ్రమైన ప్రసంగం చేస్తూ ఇలా సెలవిచ్చారు:

“ప్రజలారా! నా మాటలను ఆలకించండి! ఎందుకంటే ఈ సంవత్సరం తరువాత ఈ ప్రదేశంలో మీరు నన్ను ఇంకెన్నడూ కలుసుకోలేరు.[4]

ఈ గడుస్తున్న నెల మరియు ఈ నగరం యొక్క పవిత్రతలా, మీ ప్రాణం, మీ సంపద కూడా పరస్పరం ఒకరిపై ఒకరికి అంతే పవిత్రమైనది, నిషిద్ధమైనది. బాగా వినండి! అజ్ఞాన కాలంనాటి ప్రతిదీ నా కాళ్ళ క్రింద నలిపివేయబడింది. అజ్ఞానకాలంలో జరిగిన హత్యల రక్తపరిహారం కూడా అంతం చేయబడింది. మనలో మొట్టమొదటి వ్యక్తి రక్తపరిహారం దేన్నయితే నేను అంతమొందిస్తున్నానో అది రబీయా బిన్ హారిస్ కుమారునిది – ఈ పిల్లవాణ్ణి బనూ సఅద్ పాలు త్రాగడానికి వదలినప్పుడు హుజైల్ వంశానికి చెందినవారు అతణ్ణి హతమార్చారు – అజ్ఞాన కాలం నాటి వడ్డీని కూడా అంతం చేసేస్తున్నాను. మన వడ్డీలో మొదటి ఏ వడ్డీనైతే నేను అంతం చేస్తున్నానో అది అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారి వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ అంతా లేనట్లే.

అయితే, స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి. ఎందుకంటే వారిని మీరు అల్లాహ్ అమానతుగా పొందినవారు. అల్లాహ్ వచనం ద్వారా మీ కోసం వారు ధర్మసమ్మతం అయినవారు. మీకు ఇష్టం కాని వారినెవరినీ వారు మీ పడకల పైకి రాకుండా ఉంచాలి. అది మీ హక్కు. వారే గనక అలా చేస్తే మీరు వారిని దండించవచ్చు. అయితే వారిని తీవ్రమైన దండనకు గురి చేయకూడదు. ప్రసిద్ధ రీతిలో వారికి తిండీ బట్టా అందించడం అనేది మీపై వారికి ఉన్న హక్కు.

ఇంకా, మీ కోసం దేన్నయితే వదిలి వెళుతున్నానో దాన్ని మీరు గనక దృఢంగా పట్టుకొని ఉంటే ఇక మీదట మీరు ఏమాత్రం మార్గాన్ని తప్పలేరు. అది అల్లాహ్ గ్రంథం.

ప్రజలారా! గుర్తుంచుకోండి! నా తరువాత మరే ప్రవక్త ఉండడు. అలాగే నా తరువాత మరే సమాజమూ లేదు. కాబట్టి మీరు మీ ప్రభువును ఆరాధించండి. అయిదు పూటలా నమాజు చేయండి. రమజాన్ మాసంలో రోజా వ్రతాన్ని పాటించండి. మనస్పూర్తిగా జకాత్ చెల్లించండి. మీ ప్రభువు గృహ (కాబా) హజ్ చేయండి మరియు మీ పాలకులను విధేయించండి. అలా చేస్తే మీ ప్రభువు యొక్క స్వర్గంలో ప్రవేశిస్తారు. [6]

ఇంకా, నా గురించి మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏమంటారు? దానికి సహాబా (రదియల్లాహు అన్హుమ్), “మీరు ధర్మాన్ని మాకు అందించారు, సందేశ ప్రచారం చేశారు. ఎంత మేలు చేయాలో అంత మేలు చేసి దాని హక్కును నిర్వర్తించారు” అన్నారు. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), తన చూపుడు వ్రేలిని ఆకాశం వైపునకు ఎత్తి దాన్ని ప్రజల వైపునకు వంచుతూ ‘ఓ అల్లాహ్ దీనికి నీవే సాక్షివి’ అని మూడు మార్లు పలికారు.[7]

[4] ఇబ్నె హిషామ్ -2/603
[5] సహీహ్ ముస్లిమ్ – ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)గారి హజ్ అధ్యాయం – 1/397.
[6] ఇబ్ను మాజా; ఇబ్ను అసాకర్; రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/263.

[7] సహీహ్ ముస్లిమ్ – 1/397

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి పలుకుల్ని రబీయా బిన్ ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉచ్ఛస్వరంతో ప్రజలకు వినిపించనారంభించారు.[8] ప్రసంగం పూర్తి చేసిన తరువాత అల్లాహ్ ఈ వాక్యాన్ని అవతరింపజేశాడు.

الْيَوْمَ أَكْمَلْتُ لَكُمْ دِينَكُمْ وَأَتْمَمْتُ عَلَيْكُمْ نِعْمَتِي وَرَضِيتُ لَكُمُ الْإِسْلَامَ دِينًا

అల్ యౌమ అక్-మల్తు లకుం దీనుకుమ్. వ అత్-మంతు అలైకుం నిఇమతీ వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా.”(5 : 3)

(ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. నాపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లామ్ ను మీ ధర్మంగా అంగీకరించాను.)

[8] ఇబ్నె హిషామ్ -2/605

[9]. బుఖారి, ఇబ్నె ఉమర్ గారి ఉల్లేఖనం. చూడండి, రహ్మతుల్ లిల్ ఆలమిన్-1/265

హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఈ ఆయత్ ను విన్నంతనే దుఃఖించనారంభించారు. మీరెందుకు రోదిస్తున్నారని అడుగగా, “పరిపూర్ణత తరువాత మిగిలేది లోపమే కదా!” అని బదులిచ్చారు ఆయన.[9]

ప్రసంగం తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) అజాన్ పలికి నమాజు కోసం ఇఖామత్ కూడా పలికారు. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జుహ్ర్ నమాజు చేయించారు. ఆ తరువాత హజ్రత్ బిలాల్ (రదియల్లాహు అన్హు) మరోసారి ఇఖామత్ పలుకగా దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అస్ర్ నమాజు కూడా చేయించారు. ఈ రెండు నమాజుల మధ్యకాలంలో మరే నమాజు చేయలేదు. ఆ తరువాత వాహనమెక్కి తాము విడిది చేసిన చోటికి వెళ్ళిపోయారు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం). తన ఒంటె కస్వా పొట్టను బండరాళ్ళ వైపునకు మళ్ళించి కూర్చోబెట్టారు. ‘జబ్లే ముషాత్’ (కాలినడకన వెళ్ళేవారి మార్గంలో ఉన్న మట్టి తిన్నె) ను ముందు ఉండేటట్లు చూసి తన ముఖాన్ని కాబాకు అభిముఖంగా చేసి అక్కడనే ఉండిపోయారు. ప్రొద్దుగ్రుంకుతూ, బాగా ఎరుపెక్కి అస్తమించే వరకు వేచి చూశారు.

సూర్యబింబం పూర్తిగా మటుమాయమైపోగానే హజ్రత్ ఉసామా (రదియల్లాహు అన్హు)ను తన ఒంటె పై వెనుక కూర్చోబెట్టుకొని బయలుదేరి ‘ముజ్ దల్ఫా’కు వచ్చేశారు. ముజ్ దల్ఫాలో మగ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒకే అజాన్ మరియు రెండు ఇఖామత్ లతో చేశారు. ఆ రెండు నమాజుల మధ్యలో ఎలాంటి నఫిల్ నమాజు చేయలేదు. ఉషోదయం వరకు అలా మేనువాల్చారు. తెల్లవారుతూ ఉండగా అజాన్ కాగానే ఇఖామత్ చెప్పి ఫజ్ర్ నమాజ్ చేశారు. పిదప కస్వాపై ఎక్కి ‘మష్ అరిల్ హరామ్’కు వెళ్ళిపోయారు. అక్కడ ఖిబ్లా దిశగా (కాబాభి ముఖంగా) నిలబడి దుఆ చేశారు. ఆయన ఏకత్వం, ఔన్నత్యం గురించి ప్రస్తుతించారు. అలా ఇక్కడా బాగా తెల్లవారిపోయిన వరకు అలా నిలబడి అల్లాహ్ ను ప్రస్తుతిస్తూనే ఉండిపోయారు. సూర్యోదయం అయ్యే ముందు ‘మినా’కు బయలుదేరారు. ఈసారి హజ్రత్ ఫజ్ల్ బిన్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు)ను తన వెనుకగా ఎక్కించుకోవడం జరిగింది. ‘బత్నే ముహస్సిర్’కు చేరగా తన వాహన వేగాన్ని కొంత పెంచి పరుగెత్తించారు.

జమ్రయె కుబ్రాకు వెళ్ళే మార్గాన్ని అనుసరించి అక్కడికి చేరుకున్నారు – ఆ కాలంలో అక్కడ ఓ చెట్టు ఉండేది. ‘జమ్రయె కుబ్రా’ ఆ చెట్టు పేరుతోనే గుర్తించబడేది. ఇదే కాకుండా జమ్రయె కుబ్రాను జమ్రయె అక్బా మరియు జమ్రయె ఊలాగా కూడా పిలుస్తారు – అక్కడికి చేరిన తరువాత మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జమ్రయె కుబ్రా పై ఏడు గులకరాళ్ళను విసిరారు. ఒక్కో గులకరాయి విసురుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్) అని పలికారు. అవి రెండు వ్రేళ్ళతో పట్టి విసరేటంత చిన్నవి. ఈ గులకరాళ్ళను ఆయన బత్నె వాదీలో నిలబడి విసిరారు.

ఆ తరువాత బలి స్థానానికి వెళ్ళి తన చేత్తో 63 ఒంటెల్ని జిబహ్ చేశారు. తక్కిన ఒంటెలను జిబహ్ చేయమని హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)కి అప్పగించారు. ఆయన మిగిలిపోయిన 37 ఒంటెల్ని జిబహ్ చేయడం జరిగింది. ఇలా ఖుర్బానీ ఇచ్చిన ఒంటెల సంఖ్య మొత్తం నూరు అయింది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు)ను కూడా తన హదీ (ఖుర్బానీ)లో చేర్చుకున్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆదేశం మేరకు ఆ ఖుర్బానీ ఒంటెల మాంసం నుండి ఒక్కో ముక్కను కోసి వండడం జరిగింది. మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరియు హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు) ఆ వండిన మాంసాన్ని కొంత భుజించి దాని పులుసును కూడా త్రాగారు.

ఖుర్బానీ అయిన తరువాత దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన ఒంటెనెక్కి మక్కాకు బయలుదేరారు. బైతుల్లాహ్ (కాబా గృహం) తవాఫ్ (ప్రదక్షిణ) చేశారు – దీన్ని తవాఫె ఇఫదః అంటారు – మక్కాలోనే జొహ్ర్ నమాజు చేశారు. పిదప (జమ్ జమ్ చెలమ) దగ్గర ఉన్న బనూ అబ్దుల్ ముత్తలిబ్ వారి దగ్గరకు వెళ్ళారు. వారు హాజీలకు జమ్ జమ్ నీరు త్రాగిస్తున్నారప్పుడు. వారిని చూసి మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం), “బనూ అబ్దుల్ ముత్తలిబ్! మీరు నీళ్ళు తోడుతూనే ఉండండి. నీరు త్రాగించే ఈ కార్యంలో ప్రజలు మిమ్మల్ని మించిపోతారనే భయమే లేకపోతే నేను కూడా మీతోపాటే వచ్చి నీళ్ళు తోడేవాణ్ణి” అని సెలవిచ్చారు – అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి అనుచరగణం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను నీళ్ళు తోడుతూ చూసి ప్రతివాడు ముందుకెళ్ళి నీటిని తోడడానికి ప్రయత్నం చేసేవాడు. ఇలా హాజీలకు నీరు త్రాగించే హోదా, గౌరవం ఏదైతే బనూ అబ్దుల్ ముత్తలిబ్ కు దక్కిందో, ఆ వ్యవస్థ కాస్తా ఛిన్నాభిన్నమైపోయేది అని అర్థం – బనూ అబ్దుల్ ముత్తలిబ్ జమ్ జమ్ బావి నుండి ఓ బొక్కెన నీటిని తోడి ఇవ్వగా మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) అందులో నుండి తనవితీరా నీరు త్రాగారు.” [10]

ఆ రోజు యౌమున్నహ్ర్. అంటే జిల్ హిజ్జా పదవ తేది. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆ రోజు ప్రొద్దెక్కిన తరువాత (చాష్త్ సమయం) ఓ ఖుత్బా (ప్రసంగం) ఇచ్చారు. ప్రసంగించేటప్పుడు ఆయన కంచర గాడిద (ఖచ్చర్) నెక్కి ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ప్రవచనాలను హజ్రత్ అలి (రదియల్లాహు అన్హు), సహాబా (రదియల్లాహు అన్హుమ్) లకు వినబడేటట్లు బిగ్గరగా చెబుతున్నారు. సహాబా( (రదియల్లాహు అన్హుమ్)లు ఆ సమయాన కొందరు నిలబడి, మరికొందరు కూర్చుని వింటూ ఉన్నారు.” [11] ప్రవక్త శ్రీ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఈ రోజు ప్రసంగం లోనూ, నిన్నటి ఎన్నో మాటలను వల్లించారు. సహీహ్ బుఖారి మరియు సహీహ్ ముస్లిమ్ గ్రంథాల్లో అబూ బక్ర్ (రదియల్లాహు అన్హు) గారి ఉల్లేఖనం ఉంది. ఆయన (రదియల్లాహు అన్హు), యౌమున్నహ్ర్ (పదవ జిల్ హిజ్జా) నాడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రసంగించారని చెప్పారు:

“కాలం పరిభ్రమిస్తూ, మళ్ళీ అల్లాహ్ భూమ్యాకాశాలు సృజించిన ఈ రోజుకు తిరిగివచ్చింది. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఈ పన్నెండు నెలల్లో నాల్గు నెలలు హరామ్ నెలలు. మూడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వచ్చేవి. అంటే జిల్ ఖాదా, జిల్ హిజ్జా మరియు ముహర్రం. ఇంకొకటి రజబె ముజర్. అది జమాదిల్ ఉఖ్రా మరియు షాబాన్ నెలలకు నడుమన ఉన్న నెల.”

ఇంకా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఇది ఏ మాసం?” అని అడిగారు. మేము జవాబుగా, “అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కే బాగా తెలుసు” అన్నాం. ఇది విన్న మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కొంచెం సేపు మౌనం పాటించారు. మేము, ఈ నెలకు ఆయన మరేదైనా పేరు పెట్టనున్నారేమో అని అనుకున్నాం. కాని ఆ తరువాత ఆయన తిరిగి, “ఇది జిల్ హిజ్జా మాసం కాదా?” అని అడిగారు. “అవును. ఎందుకు కాదు” అన్నాం మేము. ఆయన మళ్ళీ, “ఇది ఏ నగరం?” అని ప్రశ్నించారు. మేము, “అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు బాగా తెలుసు.” అని సమాధానమివ్వగా, ఆయన మళ్ళీ మౌనం వహించారు. మేము, ఆ మౌనాన్ని చూసి ఈ నగరానికి. మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగా, తమ మౌనాన్ని వీడి, “ఇది బల్దహ్ (మక్కా) కాదా?” అని ప్రశ్నిం చారు. “ఔను. తప్పకుండా” అని సమాధానమిచ్చాం మేము.

“సరే, ఈ రోజు ఏ రోజు?” అని అడిగారు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం).

“అల్లాహ్ కు, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం)కే బాగా తెలుసు” అన్నాం మేము.

మా సమాధానం విన్న ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తిరిగి మౌనం వహించారు. మౌనాన్ని చూసి, ఈ రోజుకు మరే పేరేదైనా పెడతారేమో అని అనుకుంటూ ఉండగానే ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఈ రోజు యౌమున్నహ్ర్ (ఖుర్బానీ రోజు అంటే జిల్ హిజ్జా పదవ తారీకు) కాదా?” అని అడిగారు.

“ఔను. ఎందుకు కాదు” అని అన్నాం మేము. అప్పుడాయన ఇలా సెలవిచ్చారు:

“సరే వినండి, మీ ఈ నగరం, మీ ఈ నెల మరియు మీ ఈ రోజు ఎలా నిషిద్ధం (హరాం) గావించబడిందో, అలానే మీ రక్తం, మీ సంపద, మీ మానం పరస్పరం ఒకరిపై ఒకరికి నిషిద్ధం గావించబడ్డాయి.

మీరు అతి త్వరలోనే మీ ప్రభువును చేరుకుంటారు. ఆయన మిమ్మల్ని మీ కర్మలను గురించి అడుగుతాడు. కాబట్టి చూడండి! నా తరువాత ఒకరి మెడలను మరొకరు నరుక్కునేలా ధర్మభ్రష్టులు కాకండి. నేను దైవసందేశాన్ని మీకు అందించి నా విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకున్నానా? చెప్పండి” అని అడిగారు.

సహాబాలందరూ ముక్తకంఠంతో ‘అవును’ అని పలికారు.

అప్పుడు ఆయన(సల్లల్లాహు అలైహి వ సల్లం), “ఓ అల్లాహ్! నీవే సాక్షి! అంటూ, ఎవరైతే ఇక్కడ హాజరుగా ఉన్నారో (ఈ మాటలను) హాజరుగా లేనివారికి అందించాలి. ఎందుకంటే, ఎవరికైతే (ఈ మాటలు) అందించడం జరుగుతుందో ప్రస్తుతం కొందరు (హాజరుగా) వినేవారికంటే నా ఈ మాటల పరమార్థాన్ని తెలుసుకోగలరు.” [12]

మరో ఉల్లేఖనంలో ఈ ఖుత్బాలో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా కూడా సెలవిచ్చి నట్లుంది:

“ఏ నేరం చేసినవాడైనా తనకు తాను తప్ప మరొకరికి నేరంచేయడనే విషయాన్ని గుర్తించండి (అంటే ఆ నేరం చేసినందుకు మరొకరు కాకుండా స్వయంగా తానే ఆ నేరం క్రింద పట్టుబడతాడని అర్థం). గుర్తుంచుకోండి! ఏ నేరగాడు అయినా తన కుమారుని పైగాని లేదా ఏ కుమారుడైనా తన తండ్రి పైగాని నేరం చేయడు (అంటే, తండ్రి చేసిన నేరానికి కుమారుణ్ణిగాని, కుమారుడు చేసిన నేరానికి తండ్రినిగాని పట్టుకోవడం జరగదు అని). జ్ఞాపకముంచుకోండి! షైతాన్ ఇప్పుడు, మీ ఈ నగరంలో ఎవ్వరూ అతణ్ణి పూజించేవారు లేరు గనుక నిరాశకు లోనైపోయాడు. ఏ కర్మలనైతే మీరు తుచ్ఛమైనవిగా నీచమైనవిగా తలుస్తున్నారో ఆ కర్మలలోనే అతణ్ణి మీరు విధేయించడం జరుగుతుంది. వాటి ద్వారానే అతడు సంతుష్టుడవుతూ ఉంటాడు.” [13] (అంటే ఎలాంటి ప్రాధాన్యత లేని విషయాల్లో వారు అతణ్ణి అనుసరిస్తారు అని అర్థం.)

[10] ముస్లిమ్- అధ్యాయం , ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి హజ్ – 1/397 – 400.
[11] అబూ దావూద్, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గారి ఖుత్బాల అధ్యాయం – 1/270.

[12] సహీహ్ బుఖారి- మినాలో చేసిన ఖుత్బా అధ్యాయం-1/234.
[13] తిర్మిజీ-2/38, 135; ఇబ్ను మాజా, కితాబుల్ హజ్ మిష్కాత్-1/234.

ఆ ప్రసంగం అయిన తరువాత ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) అయ్యామె తష్రీక్ (11, 12, 13 జిల్ హిజ్జా తేదీలు) లో మినాలోనే ఉండిపోయారు. ఈ మూడు రోజుల్లో ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హజ్ మనాసిక్’ను (హజ్ లో నిర్వర్తించవలసిన పనులను) కూడా ఆచరించారు. అదేకాకుండా ప్రజలకు ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను గురించి బోధిస్తూ దైవాన్ని ప్రస్తుతించారు. ఇబ్రాహీం (అలైహిస్సలాం) నిర్వహించిన ఖుర్బానీ ఆచారాన్ని నెలకొల్పుతూ షిర్క్ కు సంబంధించిన గురుతులన్నింటినీ నామరూపాల్లేకుండా చెరిపివేశారు. ‘అయ్యామె తష్రీక్’లో ఓ రోజు ప్రసంగించారు కూడా. ‘సునన్ అబూ దావూద్’ గ్రంథంలో ఉటంకించిన ఓ ఉల్లేఖనంలో, హజ్రత్ సరాఅ బిన్తె నిభాన్ (రదియల్లాహు అన్హా) గారి కథనం ఇలా ఉంది:

మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘రఊస్’[14] రోజున ఖుత్బానిస్తూ మాకు ఇలా బోధించారు: “ఈ దినం అయ్యామె తష్రీక్ లోని మధ్య రోజు” [15] అని అన్నారు.

నేటి ఖుత్బా కూడా నిన్నటి (యౌమున్నహ్ర్ ) ఖుత్బాలాంటిదే. ఇది నస్ర్ అధ్యాయం అవతరణ తరువాత ఇచ్చిన ఖుత్బా.

అయ్యామె తష్రీక్ అయిపోయిన తరువాత మరునాడు ‘యౌమున్నఫ్ర్’ అంటే 13 జిల్ హిజ్జా రోజున ప్రవక్త మహనీయులు (సల్లల్లాహు అలైహి వ సల్లం) మినా నుండి బయలు దేరారు. వాదియె అబ్తహాలో నివసించే ‘ఖైఫ్ బనీ కనానా’ వారి దగ్గర ఆగి సేద తీర్చుకున్నారు. మిగిలిన ఆ పగలు, రాత్రి కూడా అక్కడనే గడిపేశారు. అక్కడే జొహ్ర్, అస్ర్, మగ్రిబ్ , ఇషా నమాజులు చేశారు. అయితే ఇషా నమాజు తరువాత కొంచెం సేపు నిద్రించి లేచి మళ్ళీ బైతుల్లాహ్ కు బయలు దేరారు. అక్కడికి చేరి ‘తవాఫె విదా’ (కాబా గృహపు చివరి తవాఫ్) చేశారు.

ఇప్పుడిక హజ్ మనాసిక్ (హలో ఆచరించవలసిన ఆచారాలు) పూర్తి చేసుకొని తమ వాహనాన్ని మదీనా వైపునకు మరల్చి బయలుదేరారు. మదీనాకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునే ఉద్దేశ్యంతో కాకుండా, ఇప్పుడు అల్లాహ్ కోసం, అల్లాహ్ మార్గంలో తిరిగి ఓ క్రొత్త కృషికి నాంది పలకడానికే ఆ ప్రస్థానం. ” [16]

[16] హజ్జతుల్ విదా వివరాల కోసం ఈ గ్రంథాలను చూడండి: సహీ బుఖారి- కితాబుల్ మనాసిక్, సంపుటి 1, సంపుటి-2/631; సహీహ్ ముస్లిమ్ – బాబుల్ హజ్జతున్నబీ (సల్లల్లాహు అలైహి వ సల్లం), ఫత్ హుల్ బారి – సంపుటం 3, షరహ్ కితాబుల్ మనాసిక్ మరియు సంపుటం-8/103 – 110; ఇబ్నె హిషామ్ 2/601 – 605; జాదుల్ ముఆద్ 1/196, 218 – 240

ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

మహా ప్రవక్త జీవిత చరిత్ర: అర్రహీఖుల్‌ మఖ్ తూమ్ (పూర్తి పుస్తకం) – షేఖ్ సఫియుర్  రహ్మాన్ ముబారక్ ఫూరి [పుస్తకం]

సత్-సంకల్పం (హుస్నే-నియ్యత్): హజ్ పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[12:41 నిముషాలు]
ఈ వీడియో క్లిప్ క్రింది వీడియో నుండి తీసుకోబడింది:
హజ్ / ఉమ్రా పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదు సందర్శనం – షేఖ్ బిన్ బాజ్

ఈ వ్యాసం క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది:

హజ్, ఉమ్రహ్ & జియారహ్ – ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో
షేఖ్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లాహ్ బిన్ బాజ్ (రహిమహుల్లాహ్).
అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్, పునర్విమర్శ : షేక్ నజీర్ అహ్మద్

ఏడవ అధ్యాయం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదు సందర్శనం

హజ్ ప్రారంభం గాక ముందు లేదా హజ్ పూర్తయిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క మస్జిదును సందర్శించడం సున్నతు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فـِي مَسْجِـدِي هَذَا خَيْـرٌ مِنْ أَلـْفِ صَلاَةٍ فِـيْمـاَ سِـوَاهُ إِلاَّ الـْمَسْجِـدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా ఖైరున్ మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ

మస్జిదె హరమ్ (కాబా) లో తప్ప, ఇతర మస్జిదులలో చేసే ఒక నమాజు కంటే నా మస్జిదులో చేసే ఒక నమాజు వెయ్యి రెట్లు ఉత్తమమైనది.

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు  మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ  

నా ఈ మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప, ఇతర మస్జిదులలో నమాజు చేయడం కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. (ముస్లిం హదీథు గ్రంథం)

అబ్దుల్లాహు బిన్ జుబైర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِـدِي هَذَا أَفْـضَلُ مِنْ أَلْـفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِـدِ الْـحَـرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِـدِ الْـحَـرَامِ أَفْـضَلُ مِنْ مِائَـةٍ صَلاَةٍ فِـي مَسْجِـدِي هَـذَا

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదిల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతిన్ సలాతిన్ ఫీ మస్జిదీహదా

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు నా మస్జిదులో చేసే నమాజు కంటే వంద రెట్లు ఉత్తమమైనది.

జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించిన హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

صَلاَةٌ فِـي مَسْجِدِي هَذَا أَفْضَلُ مِنْ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ إِلاَّ الْـمَسْجِدَ الْـحَرَامَ، وَصَلاَةٌ فِـي الْـمَسْجِدِ الْـحَرَامِ أَفْضَلُ مِنْ مِائَةِ أَلْفِ صَلاَةٍ فِـيْمـاَ سِوَاهُ

సలాతున్ ఫీ మస్జిదీ హదా అఫ్జలు మిన్ అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు ఇల్లల్ మస్జిదల్ హరామ వ సలాతున్ ఫిల్ మస్జిదిల్ హరామి అఫ్జలు మిన్ మిఅతి అల్ఫి సలాతిన్ ఫీమా సివాహు 

నా మస్జిదులో నమాజు చేయడమనేది, మస్జిదె హరమ్ లో తప్ప ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే వెయ్యి రెట్లు ఉత్తమమైనది. మరియు మస్జిదె హరమ్ చేసే నమాజు ఇతర మస్జిదులలో చేసే నమాజు కంటే లక్ష రెట్లు ఉత్తమమైనది. (అహ్మద్ &ఇబ్నె మాజహ్)

దీని గురించి అనేక హదీథులు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించే యాత్రికులు ముందుగా తమ కుడికాలు మస్జిదుల లోపల పెట్టి, ఈ దుఆ చేసుకుంటూ మస్జిదులోనికి ప్రవేశించాలి:

بِسْمِ اللهِ وَالصَّلاَةُ وَالسَّلاَمُ عَلَى رَسُولِ اللهِ، أَعُوْذُ بِاللهِ الْعَظِيْمِ وَبِوَجْهِهِ الْكَرِيْمِ وَسُلْطَانِهِ الْقَدِيْمِ مِنْ الشَّيْطاَنِ الرَّجِيْمِ، اَللَّهُمَّ افْتَحْ لـِي أَبْوَابَ رَحْمَتِكَ

బిస్మిల్లాహి, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి, అఊదు బిల్లాహిల్ అజీమి వబి వజ్హిహిల్ కరీమి, వ సుల్తానిహిల్ ఖదీమి, మినష్షయితా నిర్రజీమి, అల్లాహుమ్మఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక.

అల్లాహ్ పేరుతో, అల్లాహ్ యొక్క ప్రవక్త పై శాంతి మరియు దీవెనలు కురుయుగాక. నన్ను షైతాను బారి నుండి కాపాడమని, అత్యంత పవిత్రమైన ముఖం, అత్యంత పురాతనమైన పరిపాలన మరియు అధికారం కలిగి ఉన్న అల్లాహ్ యొక్క శరణు కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్! నీ కరుణాకటాక్షాల ద్వారాలు నా కొరకు తెరుచు.

ఇతర మస్జిదులలో ప్రవేశించేటపుడు దుఆ చేసే విధంగానే ఇక్కడ కూడా దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహ అలైహి వసల్లం) మస్జిదులో ప్రవేశించేటపుడు చేయవలసిన ప్రత్యేక దుఆ ఏమీ లేదు.

మస్జిదులో ప్రవేశించిన తర్వాత, రెండు రకాతుల తహయ్యతుల్ మస్జిదు నమాజు చేయాలి. ఇహపరలోకాలలో మేలైన విషయాలు ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకోవలెను. ఒకవేళ ఈ రెండు రకాతుల నమాజును మస్జిదులోని రౌధతుల్ జన్నహ్ (స్వర్గవనం) అనే ప్రాంతంలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వస్లలం ఇలా తెలిపారు:

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ
మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి
నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

నమాజు చేసిన తర్వాత, ప్రవక్త (సల్లల్లాహు అలైహ వసల్లం) కు మరియు ఆయన యొక్క ఇద్దరు సహచరులు అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)లకు సలాము చేయవలెను. గౌరవ పూర్వకంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వైపు తిరిగి నిలబడి, తక్కువ స్వరంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఇలా అభివాదం చేయవలెను.        

أَلسَّلاَمُ عَلَيـْكَ يَا رَسُولُ اللهِ وَرَحْـمَـةُ اللهِ وَبَـرَكَاتَـهُ
అస్సలము అలైక యా రసూలుల్లాహ్, వ రహ్మతుల్లాహి వ బరకాతహు
ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, మరియు అల్లాహ్ యొక్క దయాదాక్షిణ్యాలు  మరియు శుభాశీస్సులూను.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఒక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పలుకులను అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారు:

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ
మామిన్ అహదిన్ యుసల్లిము అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్ద అలైహి స్సలామ
ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు జవాబిచ్చేవరకు అల్లాహ్ నా ఆత్మను నా శరీరంలోనికి పంపుతాడు.

తన సలాములో ఎవరైనా క్రింది పదాలను పలికితే ఎలాంటి దోషమూ లేదు:

أَلسَّلاَمُ عَلَيْكَ يَا نَبِيَ الله، أَلسَّلاَمُ عَلَيْكَ يَا خِيْـرَةَ اللهِ مِنْ خَلْـقِـهِ، أَلسَّلاَمُ عَلَيـْكَ يَا سَيِّـدَ الْـمُرْسَلِيْـنْ وَإِمَامَ الْـمُتَّـقِيْنْ، أَشْهَدُ أَنَّـكَ قَدْ بَلَّغْتِ الرَّسَالَـةَ وَأَدَّيْتَ الْأَمَانَـةَ، وَنَـصَحَتَ الْأُمَّـةَ، وَجَاهَدْتَ فِي اللهِ حَقَّ جِهَادِهِ

అస్సలాము అలైక యా నబీయల్లాహ్, అస్సలాము అలైక యా ఖీరతల్లాహి మిన్ ఖల్ఖిహి , అస్సలాము అలైక యా సయ్యదల్ ముర్సలీన్ వ ఇమామల్ ముత్తఖీన్, అష్హదు అన్నక ఖద్ బలగతిర్రసాలత, వ అద్దయితల్ అమానత, వ నసహతల్ ఉమ్మత, వ జాహదత ఫీ అల్లాహి హఖ్ఖ జిహాదిహి.

మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! మీ పై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క సృష్టిలోని ఉత్తముడా! నీపై శాంతి కురుయుగాక, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తల మరియు సజ్జనుల  నాయకుడా! మీరు మీ సందేశాన్ని అందజేసారని, మీకు అప్పజెప్పబడిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చారని, సమాజానికి మార్గదర్శకత్వం వహించారని, అల్లాహ్ మార్గంలో పూర్తిగా ప్రయాస పడినారని మరియు శ్రమించారని  నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రవర్తనలో, నడతలో ఈ ఉత్తమ గుణగణాలన్నీ ఉండినాయి. ప్రతి ఒక్కరూ ఆయనపై దీవెనలు పంపటాన్ని, ఆయన కొరకు దుఆ చేయటాన్ని షరిఅహ్ పూర్తిగా సమర్ధించింది. అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఇలా ఉంది:

يَا أَ يُّـهَا الَّذِيـْنَ آمَـنـُوا صَلُّوا عَلَيْـهِ وَسَلِّـمُـوا تَـسْلِـيـمـًا
యా అయ్యుహలాదీన ఆమనూ సల్లూ అలైహి వసల్లిమూ తస్లీమన్
ఓ విశ్వాసులారా! ఆయనపై దీవెనలు పంపండి మరియు ఆయనపై ఇస్లామీయ పద్ధతిలో సలాములు పంపండి. 33:56

ఆ తర్వాత అబూ బకర్ (రదియల్లాహు అన్హు) మరియు ఉమర్ (రదియల్లాహు అన్హు)లపై సలాములు పంపి, అక్కడి నుండి ముందుకు కదల వలెను.

 لَعَـنَ رَسُولُ اللهِ صَلَّى الله عَلَيْـهِ وَ سَلَّمَ زُوَّارَاتِ الْـقُـبُـوْرِ مِنَ النِّساَءِ، وَالْـمُـتَّـخِـذِيْـنَ عَلَيْـهاَ الْـمسَاجِدَ وَالسُّرُجَ

లఅన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వ సల్లమ జువ్వరాతిల్ ఖుబూరి మిన్నన్నిసాయి వల్ ముత్తఖిదీన అలైహాల్ మసాజిద  వస్సురుజ  

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధిని సందర్శించే అనుమతిని షరిఅహ్ పురుషులకు మాత్రమే ఇచ్చింది. సమాధుల సందర్శించే అనుమతి మహిళలకు ఇవ్వబడలేదు. అలా షరిఅహ్ కు వ్యతిరేకంగా తమ ఇష్టానుసారం సమాధులను సందర్శించే మహిళలను, సమాధులపై మస్జిదులు నిర్మించేవారిని మరియు అక్కడ దీపాలు వెలిగించేవారిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శపించి ఉన్నారు.

ఒకవేళ ఎవరైనా మస్జిదె నబవీ లోపల నమాజు చేయాలని, దుఆలు చేయాలనే సంకల్పంతో మదీనా సందర్శిస్తే, షరిఅహ్ సమర్ధించి ఉండటం వలన అలా చేయడం పూర్తిగా సరైనదే. పై హదీథులో కూడా మేము దీనిని గుర్తించాము. సందర్శకుడు ఐదు పూటలా మస్జిదె నబవీలోనే నమాజులు చేయవలెను మరియు వీలయినంత ఎక్కువగా అల్లాహ్ ను స్మరించవలెను, దుఆలు చేయవలెను మరియు నఫిల్ నమాజులు చేయవలెను. ఈ క్రింది హదీథును మేము ఇంతకు ముందు ఉదహరించి ఉన్నాము,

مَا بَـيـْنَ بَـيـْتِـي وَمِـنْـبَـرِي رَوْضَـةٌ مِـنْ رِيَـاضِ الْـجَـنَّـةِ

మా బైన బైతీ వ మిన్బరీ రౌదతున్ మిన్ రియాదిల్ జన్నతి

నా ఇంటికీ మరియు నా ప్రసంగ స్థానానికీ మధ్య స్వర్గంలోని ఒక ఉద్యానవనం ఉంది.

తప్పనిసరి ఐదు ఫర్ద్ చేసేటపుడు, మీరు వీలయినంత వరకు ముందు వరుసలో నిలబడటానికి ప్రయత్నించవలెను, ముందు పంక్తిని పొడిగింపులో మీకు చోటు దొరికినా దానిని వదలకూడదు. ముందు వరుసలో నమాజు చేయటం గురించి క్రింది ప్రామాణిక హదీథు సూచిస్తున్నది.

لَوْ يَعْلَمُ النَّاسَ مَا فِـي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَـمْ يَـجِدُوْا إِلاَّ أَنْ يَسْتَـهِمُـوْا عَلَيْهِ لاَسْتَهَمُوْا عَلَيْـهِ

లౌ యఅలమున్నాస మాఫీ న్నిదాయి వ సఫ్ఫిల్ అవ్వలి థుమ్మ లమ్ యజిదూ ఇల్లా అన్ యస్తహిమూ అలైహి అస్తహమూ అలైహి 

ఒకవేళ అదాన్ పిలుపునివ్వడంలో మరియు ముందు వరుసలో నిలబడి నమాజు చేయడంలో ఉన్న పుణ్యాల గురించి తెలిసి ఉండి, వారికి గనక వాటిలో స్థానం లభించకపోతే, వాటిని పొందుట కొరకు ప్రజలు లాటరీ వేయవలసి వచ్చినా, తప్పకుండా వారు లాటరీ వేస్తారు.

మరో హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

تَـقَـدِّمُـوْا فَأْتَـمُّـوا بـِي وَلْـيَـأْتَـمَّ بِكـُمْ مَنْ بَعْدَكُمْ، وَلاَ يَزَالُ الرَّجُلَ يَـتَـأَخَّـرُّ عَنِ الصَّلاَةِ حَتَّى يُـؤَخِّـرَهُ الله

తఖద్దిమూ ఫఅతమ్మూబీ వల్ యఅతమ్మ బికుమ్ మన్ బఅదకుమ్ వలా యజాలుర్రజుల యతఅఖ్ఖర్రు అనిస్సలాతి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ్

ముందుకు కదలండి మరియు నన్ను అనుసరించండి. మరియు ఎవరైతే మీ వెనుక ఉన్నారో, వారు మిమ్ముల్ని అనుసరించాలి. అల్లాహ్ అతనిని వెనుక వదిలి వేయునంత వరకు ఆ వ్యక్తి నమాజును అందుకోవటంలో వెనుకబడి ఉంటాడు. ముస్లిం హదీథు గ్రంథం.

అబూ దావూద్ హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన ఆయెషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖనలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు:

لاَ يَزَالُ الرَّجُلُ يَتَأَخَّرْ عَنِ الصَّفِّ الْـمُقَدِّمِ حَتـَّى يُؤَخِّرَهُ اللهََ فِي النَّارِ

లా యజాలుర్రజులు యతఅఖ్ఖర్ అనిస్సఫ్ఫిల్ ముఖద్దమి హత్త యుఅఖ్ఖిరహుల్లాహ ఫిన్నారి 

అల్లాహ్ ఆ వ్యక్తిని నరకానికి  పంపే వరకు, (ఫర్ద్ నమాజులో) ముందు వరుస అందుకోవటంలో అతను వెనుకబడే ఉంటాడు.

ఒక ప్రామాణిక హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు ఇలా బోధించారు:

أَلاَ تَصُفُّوْنَ كَمـَا تَـصُفُّ الْـمَلَائِكَـةُ عِـنْدَ رَبِّـهَا قَالُوْا يَا رَسُولُ الله وَكَـيْفَ تَـصُفُّ الْـمَلاَئِكَـةُ عِـنْـدَ رَبِّـهاَ؟ قَالَ يُـتِـمُّوْنَ الصُّفُوْفَ الْأَوَّلَ وَيَـتَـرَاصُّوْنَ فِـي الصَّفِّ

అలా తసుఫ్ఫూన కమా తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద  రబ్బిహా ఖాలూ యా రసూలుల్లాహ్ వ కైఫ తసుఫ్ఫుల్ మలాయికతు ఇంద రబ్బిహా ఖాల యుతిమ్మూనస్సుఫూఫల్ అవ్వల వ యతరస్సూన ఫీస్సఫ్ఫి

తమ ప్రభువు ఎదురుగా దైవదూతలు పంక్తులలో నిలబడినట్లు, మీరు ఎందుకని పంక్తులలో నిలబడరు. దైవదూతలు ఎలాంటి పంక్తులను ఏర్పరుచుకున్నారని సహచరులు ప్రశ్నించగా, ఆయనిలా జవాబిచ్చారు: వారు ముందుగా మొదటి పంక్తిని పూర్తి చేసారు మరియు పంక్తులలో వారు ఒకరిని ఆనుకొని మరొకరు నిలబడినారు.  (ముస్లిం హదీథు గ్రంథం).

మస్జిదె నబవీ మరియు ఇతర మస్జిదులకు వెళ్ళడం గురించి మామూలుగా అనేక హదీథులు ఉన్నాయి. కుడివైపు పంక్తిలో నిలబడిమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రతి ఒక్కరికీ చెప్పేవారు. అప్పటి మస్జిదె నబవీలోని కుడి వైపు పంక్తి, రౌధతుల్ జన్నహ్ ప్రాంతానికి బయట ఉండేదనే విషయం అందరికీ తెలిసినదే. కాబట్టి సామూహిక నమాజును ముందు వరుసలో, పంక్తి యొక్క కుడివైపున నిలబడి చేయటమనేది రౌధతుల్ జన్నహ్ ప్రాంతంలో నిలబడి నమాజు చేయడం కంటే ఉత్తమమైనదనే ఇక్కడ ముఖ్యంగా గ్రహించదగినది. ఎవరైనా ఇలాంటి ఇతర హదీథులను కూడా పరిశీలిస్తే, పై విషయాన్ని సులభంగా తెలుసుకుంటారు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి యొక్క గ్రిల్ ను స్పర్శించడం లేదా ముద్దాడటం లేదా దాని చుట్టూ తవాఫ్ చేయడం లాంటివి అనుమతించబడలేదు. ఇలాంటి ఆచారం గురించి ముందు తరం సజ్జనులలో నుండి ఎవ్వరూ తెలుపలేదు. ఇలా చేయడమనేది ఒక హీనమైన కల్పితాచారం. తమ అవసరాలు పూర్తి చేయమని లేదా తమ కష్టాలు తొలగించమని లేదా తమ అనారోగ్యాన్ని నయం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ను ఎవరైనా వేడుకోవడమనేది ధర్మబద్ధం కాదు. అయితే వీటన్నింటి కోసం తప్పనిసరిగా వారు కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకోవలసి ఉంది. మృతులను వేడుకోవడమనేది అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం మరియు ఇతరులను ఆరాధించడమే అవుతుంది. ఈ క్రింది రెండు ముఖ్య అంశాలపై ఇస్లాం ఆధారపడి ఉంది:

  1. అల్లాహ్ ఏకైకుడు, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు మరియు ఆయనకెవ్వరూ సాటి లేరు. కేవలం ఆయన మాత్రమే ఆరాధింపబడాలి.
  2. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించి ఆరాధనలు జరగాలి.

ఇస్లామీయ ధర్మం యొక్క క్రింది మూలవచనపు అసలు అర్థం ఇదే.

شَهَادَةً أَنْ لاَّ إِلَهَ إِلاَّ اللهِ وَأَنَّ مُـحَمَّداً رَسُوْلُ الله

షహాదతన్ అల్లా ఇలాహ ఇల్లల్లాహి  వ అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్

ఆరాధింపబడే వారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప అని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.

అలాగే, అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనే నేరుగా వేడుకోవడమనేది ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే ప్రార్థింపబడే హక్కు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది.

قُـلْ ِلِله الشَّـفَـاعَـةُ جَـمِـيـعًا
ఖుల్ లిల్లాహిష్షఫాఅతు  జమీఅన్
(ఓ ప్రవక్తా) చెప్పు, సిఫారసులన్నీ అల్లాహ్ కే చెందుతాయి. 39:44

అయితే, క్రింది విధంగా వేడుకోవచ్చు.

أَللَّهُمَّ شَفَّعِ فِـي نَـبِـيُّكَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي مَلاَئِكَـتِـكَ وَعِبَادِكَ الْـمُؤمِـنِـيْـنَ، أَللَّهُمَّ شَفَّعِ فِـي أَفَرَاطِـي

అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ నబియ్యుక, అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ మలాయికతిక, వ ఇబాదతికల్ మోమినీన. అల్లాహుమ్మ షఫ్ఫఇ ఫీ అఫరాతీ.

ఓ అల్లాహ్! నీ ప్రవక్త నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! నీ దైవదూతలు మరియు నిన్ను విశ్వసించినవారు నా కొరకు సిఫారసు చేసేలా చేయి. ఓ అల్లాహ్! చనిపోయిన నా సంతానం నా కొరకు సిఫారసు చేసేలా చేయి.

అయితే, మృతులను సిఫారసు చేయుట కొరకు లేదా వారినే నేరుగా వేడుకోకూడదు – వారు అల్లాహ్ యొక్క సందేశహరులైనా, ప్రవక్తలైనా లేదా పుణ్యపురుషులైన అవులియాలైనా సరే. ఇలా చేయటానికి షరిఅహ్ అనుమతి లేదు. మృతుని గురించిన వాస్తవం ఏమిటంటే, షరిఅహ్ లో మినహాయించబడిన ఆచరణులు తప్ప, అతని ఇతర ఆచరణలన్నీ సమాప్తమై పోతాయి. సహీహ్ ముస్లింలో నమోదు చేయబడిన అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖన:

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

إِذَا مَاتَ ابْنَ آدَمَ أَنْقَطَعَ عَمَلَهُ إِلاَّ مِنْ ثَلاَثٍ: صَدْقَةٍ جَارِيَـةٍ، أَوْ عِلْمٍ يُـنـْتَـفَـعُ بِـهِ،  أَوْ وَلَـدٍ صَالِـحٍ يَـدْعُـوْ لَـهُ

ఇదా మాతబ్న ఆదమ అంఖతఅ అమలహు ఇల్లా మిన్ థలాతిన్  సదఖతిన్ జారియతిన్ అవ్ ఇల్మిన్ యుంతఫఉ బిహి అవ్ వలదిన్ సాలిహిన్ యద్ఊ లహు 

ఎపుడైతే ఆదం సంతానంలో ఎవరైనా చనిపోతారో, ఈ మూడు తప్ప అతని ఇతర ఆచరణలు సమాప్తమైపోతాయి: నిరంతరాయంగా కొనసాగుతున్న అతని దానం, ఇతరులకు ప్రయోజనం కలిగిస్తున్న అతని జ్ఞానం, దైవభీతిపరులైన సంతానం చేసే అతని కొరకు చేసే దుఆలు.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవిత కాలంలో తన కొరకు అల్లాహ్ ను ప్రార్థించమని ఆయనను వేడుకోవడం అన్ని విధాలా సరైన మంచి పనే. అలాగే అంతిమ దినాన కూడా ఆయనను నేరుగా వేడుకోవడం సరైన పనే, ఎందుకంటే ఆనాడు సిఫారసు చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వబడుతుంది. ఆనాడు తనను సిఫారసు చేయమని అడిగిన వారి కొరకు ఆయన అల్లాహ్ ను ప్రార్థించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రపంచంలో మరణించిన తర్వాత ఆయనకు ఆ శక్తి లేదు. ఇది కేవలం ఆయన కొరకు మాత్రమే ప్రత్యేకం కాదు. మీతో పాటు సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికిది వర్తిస్తుంది. ప్రాణంతో ఉన్న తన తోటి సోదరులతో తన కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేయమని అంటే అల్లాహ్ ను ప్రార్థించమని అడగటం ధర్మసమ్మతమైనదే. తీర్పుదినం నాడు ఎవ్వరూ అల్లాహ్ అనుమతి లేకుండా సిఫారసు చేయలేరు. దీని గురించి అల్లాహ్ యొక్క స్పష్టమైన ప్రకటన ఇలా ఉంది.        

مَـنْ ذَا الَّـذِي يَـشْـفَـعُ عِـنْـدَهُ إِلاَّ بِـإِذْنِـهِ
మందల్లదీ యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇద్నిహి
ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేయగలిగేది ఎవరు?

ఇక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క స్థితి గురించి మనం ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఆయన యొక్క ప్రస్తుత స్థితి ఒక ప్రత్యేకమైన స్థితి. అది ఈ ప్రపంచంలో ఆయన సజీవంగా ఉన్నప్పటి స్థితికి మరియు అంతిమ దినం నాటి స్థితికి భిన్నమైనది. చనిపోయిన వ్యక్తి ఏ పనీ చేయలేడు. ఈ ప్రపంచంలో జీవించి ఉన్నపుడు అతను చేసిన పనులే అతనికి ప్రతిఫలాన్ని అందజేస్తాయి – షరిఅహ్ లో మినహాయించబడిన ప్రత్యేక పనులు తప్ప. మృతులను వేడుకోవడమనేది షరిఅహ్ మినహాయించిన పనులలో లేదు. కాబట్టి దానిని ఈ ప్రత్యేక తరగతికి చెందిన పనిగా పరిగణించలేము. నిస్సందేహంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన బరజఖ్ జీవితంలో సజీవంగా ఉన్నారు. ఆయన ఉన్న స్థితి ఒక షహీద్ యొక్క మరణానంతర స్థితి కంటే ఎంతో ఘనమైనది. అయితే ఇది చనిపోయే ముందు జీవించే ఈ ప్రాపంచిక జీవితం కంటే మరియు తీర్పుదినం తర్వాత రాబోయే జీవితం కంటే భిన్నమైనది. బరజఖ్ అంటే సమాధి జీవితం యొక్క స్వభావం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,   

مَا مِنْ أَحَدٍ يُسَلِّمُ عَلَـيَّ إِلاَّ رَدَّ اللهُ عَلَـَّي رُوْحِـي حَـتَّـى أَرُدَّ عَـلَيْـهِ السَّلاَمَ

మా మిన్ అహదిన్ యుసల్లిమూ అలయ్య ఇల్లా రద్దల్లాహు అలయ్య రూహీ హత్త అరుద్దఅలైహిస్సల్లామ

ఎవరైనా నా పై సలాములు పంపినపుడు, అతని సలాముకు బదులిచ్చే వరకు అల్లాహ్ నా శరీరంలోనికి నా ఆత్మను పునః ప్రవేశింపజేస్తాడు.

పై హదీథు ఆధారంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చనిపోయారని, ఆయన ఆత్మ ఆయన శరీరం నుండి విడిగా ఉంటుంది మరియు సలాము చేయబడినపుడు మాత్రమే అది ఆయన శరీరంలోనికి ప్రవేశింపజేయబడుతుందనేది స్పష్టమవుతున్నది. ఆయన మరణం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతులలో తెలుపబడిన వాదనలు అందరికీ తెలిసినవే. ఉలేమాల వద్ద ఇది ఎలాంటి అనుమానాలు లేని విషయం. అయితే ఆయన యొక్క బరజఖ్ జీవితానికి మరణమనేది ఆటంకం కాదు. షహీదుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఖుర్ఆన్ లో దీని గురించి ఇలా స్పష్టం చేయబడింది:

وَلا تَـحْسَـبَنَّ الَّـذِيـنَ قُـتِـلُوا فِي سَبِـيـلِ اللهِ أَمْـوَاتًا بَلْ أَحْيَاءٌ عِـنْـدَ رَبِّـهِمْ يُـرْزَقُـونَ

వలా తహ్సబన్నల్లదీన ఖుతిలూ ఫీ సబీలిల్లాహి అంవాతన్ బల్ అహ్యాఉన్ ఇంద రబ్బిహిం యుర్జఖూన

మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడినారో, వారిని ఎప్పుడూ మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. వారికి తమ ప్రభువు వద్ద  ఆహారం ఇవ్వబడుతున్నది. 3:169

ఇది షిర్క్ (అల్లాహ్ కు సాటి కల్పించడం) వైపు పిలిచే వారు, అల్లాహ్ ను వదిలి మృతులను ఆరాధించేవారు తికమకపెట్టే ఒక ముఖ్యమైన విషయం కావటం వలన దీనిని మేము వివరంగా చర్చించినాము. షరిఅహ్ కు వ్యతిరేకమైన వాటన్నింటి నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద తమ స్వరం పెంచే వారి చర్యలు మరియు చాలా ఎక్కువ సేపు వరకు అక్కడే నిలిచిపోయే వారి చర్యలు షరిఅహ్ కు విరుద్ధమైనవి. ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్ద ఆయన కంటే హెచ్చు స్వరంతో మాట్లాడవద్దని అల్లాహ్ ప్రజలకు ఆదేశించినాడు. అలాగే తమలో తాము మాట్లాడుకునే విధంగా ఆయనతో హెచ్చు స్వరంలో మాట్లాడకూడదని కూడా అల్లాహ్  ఆజ్ఞాపించినాడు. అంతేగాక, ఆయనతో ప్రజలు తక్కువ స్వరంలో మాట్లాడాలని ఆదేశించబడింది. ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది:   

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لا تَرْفَعُوا أَصْوَاتَكُمْ فَوْقَ صَوْتِ النَّبِيِّ وَلا تَجْهَرُوا لَهُ بِالْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَنْ تَحْبَطَ أَعْمَالُكُمْ وَأَنْتُمْ لا تَشْعُرُونَ * إِنَّ الَّذِينَ يَغُضُّونَ أَصْوَاتَهُمْ عِنْدَ رَسُولِ اللَّهِ أُولَئِكَ الَّذِينَ امْتَحَنَ اللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَى لَهُمْ مَغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ

యాఅయ్యుహల్లదీన్ ఆమనూ లా తర్ఫఊ అస్వాతకుమ్ ఫౌఖ సౌతిన్నబియ్యి వలా తజ్ హరూ లహు బిల్ఖౌలి కజహ్రి బఅదికుమ్ లిబఅదిన్ అన్ తహ్బత అమాలుకుమ్ వ అంతుమ్ లా తష్ఉరూన  ఇన్నల్లదీన యగుద్దూన అస్వాతహుమ్ ఇంద రసూలిల్లాహి ఉలాయికల్లదీన అంతహనల్లాహ ఖులూబహుమ్ లిత్తఖ్వా లహుమ్మగ్ఫిరతున్ వ అజ్రున్ అజీమున్

ఓ విశ్వసించిన ప్రజలారా! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వరం కంటే ఎక్కువగా మీ స్వరాన్ని పెంచి గానీ, మీలో మీరు బిగ్గరగా మాట్లాడుకునేటట్లుగా ఆయనతో బిగ్గరగా గానీ మాట్లాడవద్దు. అలా చేస్తే మీరు గ్రహించకుండానే, మీ ఆచరణలకు ప్రతిఫలం ఏమీ లేకుండా పోతుంది. నిశ్చయంగా, అల్లాహ్ యొక్క ప్రవక్త సమక్షంలో తక్కువ స్వరంతో మాట్లాడే వారి హృదయాలు, అల్లాహ్ యొక్క ధర్మనిష్ఠ పరీక్షలో నిగ్గుతేలుతాయి. అలాంటి వారి కొరకే మన్నింపు మరియు ఘనమైన ప్రతిఫలం ఉంది. 49:2,3.

అంతేగాక, ఆయన సమాధి వద్ద ఎక్కువ సేపు నిలబడటం వలన, రద్దీ మరియు సందడి బాగా పెరిగి పోతుంది. పైగా ఇలా చేయడం పై ఖుర్ఆన్ వచనాలకు విరుద్ధంగా చేసినట్లవుతుంది కూడా. ఒక ముస్లిం కొరకు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అత్యంత ఆదరణీయులు. ఆయన సన్నిధిలో షరిఅహ్ కు వ్యతిరేకమైన అలాంటి చర్యలు చేయడమనేది గర్హణీయమైన విషయం. అలాగే, ఆయన సమాధి వద్ద నిలబడినపుడు లేదా సమాధికి ఎదురుగా నిలబడినపుడు రెండు చేతులు పైకెత్తి దుఆలు చేయడమనేది కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరుల, తాబయీన్ ల మరియు పూర్వం గతించిన పుణ్యపురుషుల ఆచారానికి వ్యతిరేకం. అలా చేయడం ఒక కల్పితాచారం మాత్రమే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

عَلَيْكُمْ بِسُنَّـتِـي وَسُنَّـةِ الْـخُلَفاَءِ الرَّاشِدِيْنَ الْـمَهْدِيِيِّنَ مِنْ بَعَدِي، تَـمَسَّكُوْا بِـهَا وَعَضُّوْا عَلَيْهَا بِالنَّوَاجِذِ، وَإِيَّاكُمْ وَمُـحْدَثَاتِ الْأُمُوْرِ، فَإِنَّ كُلَّ مُـحْدَثَـةٍ بِدْعَـةٌ وَكُلَّ بِدْعَـةٌ ضَلاَلَـةٌ

అలైకుమ్ బిసున్నతీ వ సున్నతిల్ ఖుల్ఫాఇర్రాషిదీనల్మహ్దియ్యిన మిన్ బఅదీ తమస్సకూ బిహా వ అద్దూ అలైహా బిన్నవాజిది వ ఇయ్యాకుమ్ వ ముహ్దథాతిల్ ఉమూరి ఫ ఇన్న కుల్లి ముహ్దథతిన్ బిద్అతున్ వ కుల్ల బిద్అతున్ దలాలతున్ 

నా మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. నా తర్వాత సన్మార్గంలో నడిచే ఖలీఫాల మార్గాన్ని గట్టిగా పట్టుకోండి. దానినే అంటిపెట్టుకుని ఉండండి మరియు మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి. నూతన కల్పితాలకు దూరంగా ఉండండి. కొత్తగా కనిపెట్టబడిన ఏ విషయమైనా నూతన కల్పితమే అవుతుంది మరియు అది మార్గభ్రష్టత్వానికి దారి తీస్తుంది.

ఇంకా ఆయనిలా అన్నారు,

مَنْ أَحْدَثَ فِـي أَمْرِنَا هَذَا مَا لَـيْـسَ مِـنْـهُ فَـهُـوَ رَدٌّ

మన్ అహ్దథ ఫీ అమ్రినా హదా మాలైస మిన్హు ఫహువ రద్దున్  

మా విషయంలో లేని విషయాన్ని ఎవరైనా కొత్తగా కల్పిస్తే, అది తిరస్కరించబడుతుంది.

ఒకసారి అలీ బిన్ హుసైన్ జైనుల్ ఆబిదీన్ ఎవరో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాధి వద్ద నిలబడి ప్రార్థించడాన్ని చూసారు. వెంటనే ఆయన అతడిని ఆపి, దానిని ఆయన తన తండ్రి నుండి నేర్చుకున్నానని, మరియు ఆయన తండ్రి దానిని తాత అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా నేర్చుకున్నారని పలికారు,

لاَ تَـتَّـخِذُوْا قَبَرِي عِيْداً وَلاَ بُـيُـوتَـكُمْ قُـبُـوْرًا، وَصَلُّوْا عَلَـيَّ فَإِنَّ تَسْلِيْمَكُمْ يَـبْلُغُـنِـيْ أَيْـنَمـَا كُنْـتُـمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న తస్లీమకుమ్ యబ్లుగునీ  అయ్ నమా కుంతుమ్    

నా సమాధిని సందర్శనా స్థలంగా చేయవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు (ఇళ్ళలో నమాజు చేయకుండా ఉండవద్దు). మరియు నాపై దరూద్ పంపుతూ ఉండండి. ఎందుకంటే మీరెక్కడ నుండి పంపినా, మీ సలాము నాకు చేరుతుంది.

అలాగే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపేటపుడు కొందరు కుడి చేతిని తమ గుండెకు ఎడమవైపు ఉంచుతారు. ఆయనపై సలాము పంపేటపుడు లేదా ఎవరైనా రాజు, నాయకుడికి సలాము చేసేటపుడు ఈ భంగిమలో నిలబడటం ధర్మబద్ధం కాదు. ఎందుకంటే, ఇలా చేయడంలో చూపే వినయం, అణుకువ, నమ్రత మరియు సమర్పణలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి.

ఈ విషయాన్ని గొప్ప ఉలేమాల ప్రామాణిక అభిప్రాయాల ఆధారంగా హాఫిజ్ ఇబ్నె హజర్ చర్చించారు. దీనిపై దృష్టి కేంద్రీకరించినా వారెవరికైనా ఇది స్పష్టమవుతుంది. అయితే అతను అల్లాహ్ కు అంగీకారమైన ముందుతరం పుణ్యపురుషుల మార్గాన్ని అనుసరించాలనే సంకల్పం ఉన్నవాడై ఉండాలి. పక్షపాతంలో, స్వార్థంతో కూడిన కోరికలలో మరియు గుడ్డిగా అనుకరించడంలో, సజ్జనుల మార్గానికి విరుద్ధంగా పోవడంలో మునిగిపోయిన వారి దుర్గతిని అల్లాహ్ త్వరలోనే నిర్ణయిస్తాడు. అల్లాహ్, మాకూ మరియు వారికీ సన్మార్గం చూపు గాక. ప్రతి దానిపై సత్యానికే ప్రాధాన్యత నిచ్చేటట్లు చేయుగాక. అలాగే దూరంగా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వైపు తిరిగి నిలబడి, సలాము కొరకు లేదా దుఆ కొరకు తమ పెదాలను కదిపే వారు కూడా మతభ్రష్ఠుల కోవలోనికే వస్తారు. ధర్మంలో ఇలాంటి నూతన పోకడలు కల్పించడం ఒక విశ్వాసికి తగదు. ఎందుకంటే అలా చేయడానికి అల్లాహ్ అనుమతి నివ్వలేదు. అలా చేయడమనేది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ప్రేమ చూపడం క్రిందికైతే రాదు గానీ, అల్లాహ్ ఆజ్ఞలను దాటి హద్దు మీరిపోవడం క్రిందికి మాత్రం తప్పక వస్తుంది. ఇలాంటి వాటిని ఖండిస్తూ, తర్వాతి తరాల సంస్కరణ కూడా ముందు తరాల సంస్కరణ మాదిరిగానే జరగాలని ఇమాం మలిక్ అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మార్గాన్ని మరియు సన్మార్గంలో నడిచిన ఖలీఫాల మార్గాన్ని, సహాబాల మార్గాన్ని మరియు తాబయీనుల మార్గాన్ని అనుసరించే, ముందు తరాల ప్రజలు తమను తాము సంస్కరించుకున్నారు. తర్వాత తరం ప్రజలకు కూడా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పద్ధతిని అనుసరించటంలోనే ఋజుమార్గం కనబడుతుంది. ఇలా చేయడం ద్వారా మాత్రమే వారి సంస్కరణ సరిగ్గా జరుగుతుంది. తమ సంక్షేమాన్ని పదిలం చేసుకునేందుకు మరియు ఇహపర లోకాలలో సాఫల్యం సాధించేందుకు, అలా చేసే శక్తిని అల్లాహ్ ముస్లింలకు ప్రసాదించుగాక.

మస్జిదె నబవీని సందర్శించడమనేది తప్పనిసరి హజ్ ఆచరణ క్రిందికి రాదు:

హెచ్చరిక: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడమనేది ఫర్ద్ (తప్పనిసరి) కాదు మరియు హజ్ నియమాలలోనికీ రాదు. ఇది కొందరి ప్రజల అపోహ మాత్రమే. అయితే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి సమీపానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు చేరుకున్నవారు, మస్జిదె నబవీని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడం ఉత్తమం. అయితే, మదీనహ్ నగరానికి దూరంగా నివసించే ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించే సంకల్పంతో ప్రయాణించడం ధర్మబద్ధం కాదు. కానీ, మస్జిదె నబవీని సందర్శించే సంకల్పంతో అలా ప్రయాణించ వచ్చు. మదీనహ్ నగరంలోనికి చేరుకున్న తర్వాత వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని మరియు సహాబాల సమాధులను సందర్శించాలి. సహీహ్ బుఖారీ మరీయు ముస్లిం హదీథు గ్రంథాలు రెండింటిలోనూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది:

لاَ تُـشَـدُّ الرِّحَالُ إِلاَّ إِلَى ثَـلاَ ثَـةِ مَسَاجِـدَ: أَلْـمَسْجِدِ الْـحَـرَامِ، وَمَسْجِـدِي هَـذَا، وَالْـمَسْجِـدِ الْأَ قْـصَى

లాతుషద్దుర్రిహాల ఇల్లా ఇలా థలాథతి మసాజిద అల్ మస్జిదిల్ హరామి వ మస్జిదీ హదా వల్ మస్జిదిల్ అఖ్సా

ఈ మూడు మస్జిదులను సందర్శించడం కొరకు మాత్రమే ఎవరైనా ధార్మిక ప్రయాణం చేయవచ్చు: మస్జిద్ అల్ హరామ్ (కఅబహ్ మస్జిద్), నా మస్జిద్ (మస్జిదె నబవీ) మరియు మస్జిద్ అల్ అఖ్సా.

ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని లేదా ఎవరైనా ఇతరుల సమాధిని సందర్శించుట ధర్మసమ్మతమైనదైతే, తప్పకుండా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సమాజాన్ని అలా చేయమని ఆదేశించి ఉండేవారు. ఎందుకంటే వారి గురించి ఆయన చాలా సద్భావంతో ఉండేవారు, అల్లాహ్ కు ఎక్కువగా భయపడేవారు మరియు అల్లాహ్ గురించి బాగా ఎరిగిన ఉండినారు. తనకివ్వబడిన ప్రవక్త బాధ్యతను ఆయన పూర్తిగా నిర్వహించినారు. సమాజాన్ని ప్రతి మంచితనం వైపు దారి చూపినారు మరియు ప్రతి చెడు నుండి హెచ్చరించినారు. పై మూడింటిని సందర్శించడానికి చేసే ప్రయాణం తప్ప ఇతర మస్జిదులను సందర్శించడానికి చేసే ప్రయాణాన్ని ఆయన నిషేధించినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు,

لاَ تَـتَّـخِذُوا قَبَرِي عِيْداً، وَلاَ بُـيُـوتَـكُمْ قُبُـوراً، وَصَلُّوا عَلَـيَّ فَإِنَّ صَلاَتِـكُمْ تَبْلُغُـنِـي حَيْثُ كُـنْـتُمْ

లాతత్తఖిదూ ఖబరీ ఇయ్ దన్ వలా బుయూతకుమ్ ఖుబూరన్ వ సల్లూ అలయ్య ఫఇన్న సలాతికుమ్  యబ్లుగునీ  హైథు  కుంతుమ్ 

నా సమాధిని తిరునాళ్ళ ప్రాంతంగా మార్చవద్దు. మీ ఇళ్ళను స్మశాన స్థలంగా మార్చవద్దు. నా పై దరూద్ పంపండి. మీరెక్కడ నుండి దరూద్ పంపినా, అది నాకు చేర్చబడుతుంది.

ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ ఆచరణయే అని సమర్ధించుకోవడానికి, దానిని యాత్రా స్థలంగా మార్చడం మరియు హద్దు మీరి ఆదరించడం జరగవచ్చని ఆయన భయపడి ఉండవచ్చు. ప్రస్తుత కాలంలో ఆయన భయపడినట్లుగానే అనేక మంది ప్రజలు ఆయన సమాధిని దర్శించడమనేది షరిఅహ్ లోని భాగమేనని నమ్ముతూ, దారి తప్పిపోతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని దర్శించుట షరిఅహ్ లోని భాగమనే తమ అభిప్రాయానికి సమర్ధనగా వారు పేర్కొనే హదీథులు ఉల్లేఖకుల పరంపర విషయంలో బలహీనమైనవే గాక, అవన్నీ కల్పితమైనవి కూడా. ప్రఖ్యాత హదీథు పండితులు దర్ఖుత్నీ, బైహఖీ మరియు హాఫిద్ ఇబ్నె హజర్ మొదలైన వారు ఆ హదీథుల బలహీనత గురించి హెచ్చరించారు. కాబట్టి అలాంటి బలహీనమైన హదీథులను మూడు మస్జిదులను సందర్శించడానికి తప్ప, ఏ సంకల్పంతోనైనా సరే చేసే ఇతర సందర్శన ప్రయాణాలు నిషేధించబడినాయనే ప్రామాణిక హదీథుకు వ్యతిరేకంగా పేర్కొనడమనేది అస్సలు చేయకూడదు. అలాంటి అసత్య హదీథులను గుర్తించి, దారి తప్పిపోకుండా తమను తాము కాపాడుకొనుట కొరకు పాఠకులు వాటిని తెలుసుకొనుట అవసరమని భావిస్తూ, అలాంటి కొన్నింటిని క్రింద పేర్కొంటున్నాము.

ఎవరైతే హజ్ చేస్తారో మరియు నన్ను సందర్శించరో, అలాంటి వారు నా విషయంలో తప్పు చేసారు – అసత్య హదీథు.

నా మరణం తర్వాత ఎవరైతే నన్ను దర్శిస్తారో, వారు నా జీవితంలో నన్ను దర్శించినట్లే – అసత్య హదీథు.

ఎవరైతే నన్ను మరియు నా పూర్వీకులైన ఇబ్రాహీంను ఒకే సంవత్సరంలో దర్శిస్తారో, అల్లాహ్ ప్రమాణంగా వారికి స్వర్గం లభిస్తుందని గ్యారంటీ ఇస్తున్నాను – అసత్య హదీథు

ఎవరైతే నా సమాధిని దర్శిస్తారో, వారి పై నా సిఫారసు తప్పని సరై పోతుంది – అసత్య హదీథు.

అలాంటి హదీథులకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వరకు చేర్చే సరైన జాడ ఉండదు. హాఫిద్ ఇబ్నె హజర్ పరిశోధన ప్రకారం అలాంటి వాటి ఉల్లేఖకుల పరంపర కల్పితమైనది. హాఫిద్ ఉఖైలీ ఇలా పలికారు, “అలాంటి ఏ హదీథు ప్రామాణిక మైనది కాదు”. ఇబ్నె తైమియా అభిప్రాయం ప్రకారం అలాంటి హదీథులు అక్రమంగా కల్పించబడినవే. మీ జ్ఞానం కోసం మరియు సంరక్షణ కోసం కల్పిత హదీథుల గురించి ఇక్కడి వరకు ఇవ్వబడిన సమాచారం సరిపోతుందని భావిస్తున్నాము. ఒకవేళ పై వాటిలో ఏ హదీథైనా ప్రామాణికమైనదై ఉండినట్లయితే, మన కంటే ముందు సహాబాలు దానిని ఆచరించి ఉండేవారే మరియు అలా చేయమని సమాజానికి కూడా దారి చూపి ఉండేవారే. ఎందుకంటే ప్రవక్తల తర్వాత అంతటి ఉత్తములైన ప్రజలు సహాబాలే కదా. మరియు అల్లాహ్ విధించిన హద్దుల గురించి వారు బాగా ఎరిగినవారు. అల్లాహ్ తన దాసులకు ఆదేశించిన షరిఅహ్ గురించి వారికి చాలా బాగా తెలుసు. అల్లాహ్ గురించి మరియు అల్లాహ్ దాసుల గురించి వారు చాలా ఎక్కువ చిత్తశుద్ధి కలిగి ఉండినారు. పై వాటి గురించి వారి నుండి ఎలాంటి వ్యాఖ్యానం లేదు కాబట్టి, ఇవన్నీ అసత్యమైన హదీథులని మనం గ్రహించవచ్చు. ఒకవేళ ఏదైనా హదీథు ప్రామాణికమైనదైతే, దానికి సంబంధించిన షరిఅహ్ నియమం ఆచరణలో ఉండేది. పై హదీథులు అసత్యమైనవి లేదా కల్పితమైనవనే తుది నిర్ణయాన్ని ఇది ధృవీకరిస్తున్నది. అన్నీ ఎరిగిన అల్లాహ్ యే మహోన్నతుడు, లోపాలకు అతీతుడు, ఘనమైన వాడు.

ఖుబాఅ మస్జిదును మరియు జన్నతుల్ బఖీని దర్శించడం ఉత్తమం:

మదీనహ్ దర్శించే ప్రజలు ఖుబా మస్జిదును దర్శించడం మరియు దానిలో నమాజు చేయడం ఉత్తమం. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి కాలి నడకన, ఒక్కోసారి సవారీపై ఈ మస్జిదును దర్శించేవారు మరియు అందులో రెండు రకాతుల నమాజు చేసేవారు. బుఖారీ మరియు ముస్లిం హదీథు గ్రంథాలు

సహల్ బిన్ హనీఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు,

مَنْ تَـطَهَّـرَ فِـي بَـيْـتِـهِ ثُـمَّ أَتَـى مَسْجِـدَ قُـبَاءَ فَصَلَّى فِـيْـهِ صَلاَةً كَانَ لَـهُ كَـأَجْـرِ عُـمْـرَةٍ

మన్ తతహ్హర ఫీ బైతిహి థుమ్మ ఆతా మస్జిద ఖుబాఅ ఫసల్ల ఫీహి సలాతన్ కాన లహు కఅజ్రి ఉమ్రతిన్

ఎవరైతే ఇంటిలో వుదూ చేసి, తర్వాత ఖుబాఅ మస్జిదుకు వెళ్ళి, అందులో నమాజు చేస్తారో, అలాంటి వారికి ఉమ్రహ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. (అహ్మద్, నసాయి, ఇబ్నె మాజా మరియు హాకిమ్)

అలాగే, జన్నతుల్ బఖీ (స్మశానం) దర్శించడం, షహీదుల సమాధులను దర్శించడం మరియు హంజా రదియల్లాహు అన్హు సమాధిని దర్శించడం కూడా సున్నతులోనివే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని దర్శించేవారు మరియు వారి కొరకు ప్రార్థించేవారు. దీని గురించిన హదీథు ఇలా ఉంది:

زُوْرُوْا الْـقُـبُـورَ فَـإِ نَّـهَا تُـذَكِّـرُكُمْ اَلْآخِـرَةَ

జూరుల్ ఖుబూర ఫఇన్నహా తుదక్కిరుకుమ్ అల్ ఆఖిరత

స్మశానాల్ని దర్శించండి. ఎందుకంటే అవి మీకు పరలోకం గురించి జ్ఞాపకం చేస్తాయి. ముస్లిం హదీథు.

సమాధులను దర్శించేటపుడు, క్రింది విధంగా పలుకమని ఆయన తన సహచరులకు బోధించారు,

أَلسَّلاَمُ عَلَيْكُمْ أَهْلٌ الدِّيَارْ مِنَ الْـمُؤمِـنِـيْـنَ وَالْـمُسْلِـمِيْنْ وَإِنَّا إِنْ شَاءَ الله بِكُمْ لاَحِقُوْنَ، نَسْأَلُ اللهَ لَنَا وَلَكُمْ الْـعَافِـيَـةٌ

అస్సలాము అలైకుమ్ అహలుద్దియార్  మినల్ మోమినీన్ వల్ ముస్లిమీన్. వ అనా ఇన్ షాఅ అల్లాహ్ బికుమ్ లాహిఖూన్. నస్అలుల్లాహ లనా వ లకుమ్ అల్ ఆఫియహ్.

మోమినుల మరియు ముస్లిముల ప్రాంతంలో ఉన్న నివాసితులారా, అస్సలాము అలైకుమ్. అల్లాహ్ తలిచినపుడు, నేను కూడా మీతో చేరబోతున్నాను. నా కొరకు మరియు మీకొరకు మేలు ప్రసాదించమని నేను అల్లాహ్ ను వేడుకుంటున్నాను. (ముస్లిం హదీథు గ్రంథం)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనహ్ లోని స్మశానం దగ్గర నుండి వెళ్తున్నపుడు, దాని వైపు తిరిగి ఇలా పలికారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథు అత్తిర్మిథీ హదీథు గ్రంథంలో ఇలా నమోదు చేయబడింది:

أَلسَّلاَمُ عَلَـيْكُمْ يَا أَهْلُ الْـقُـبُـورْ يَـغْـفِـرَ اللهُ لَـنَـا وَلَـكُـمْ أَنْـتُـمْ سَلَـفَـنَا وَنَـحْنُ بِالْأَ ثَـرْ

అస్సలాము అలైకుమ్ యా అహలుల్ ఖుబూర్, యగ్ఫిరల్లాహు లనా వ లకుమ్, అంతుమ్ సలఫనా వ నహ్ను బిల్అథర్

సమాధులలో ఉన్న వారలారా! అస్సలాము అలైకుమ్. మమ్ముల్ని మరియు మిమ్ముల్ని అల్లాహ్ క్షమించు గాక. మీరు మా కంటే ముందు వెళ్ళిపోయారు మరియు మేము మీ వెనుక వస్తున్నాము.

ఈ హదీథుల ద్వారా మనం నేర్చుకునేదేమిటంటే సమాధులను సందర్శించమనే షరిఅహ్ ఆదేశం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దాని ద్వారా మనం మరణానంతర జీవితం గురించి గుర్తు చేసుకోవాలని.

మృతులతో ఉత్తమంగా వ్యవహరించే, వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపించమని వేడుకునే మరియు వారి కొరకు మరిన్ని దుఆలు చేసే అవకాశాల్ని ఈ సమాధి సందర్శనం కల్పిస్తున్నది.

అయితే, మృతులను వేడుకోవడానికి సమాధులను సందర్శించడం, అక్కడ కూర్చోవడం, తమ అవసరాలు తీర్చమని మృతులను అర్థించడం, రోగుల స్వస్థత కొరకు వారి సహాయాన్ని కోరటం, వారి ద్వారా లేదా వారి స్థాయి ద్వారా అల్లాహ్ ను వేడుకోవడం మొదలైనవి నిషేధించబడినాయి. ఎందుకంటే అలా చేయడం షిర్క్ క్రిందకి వస్తుంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అలా చేయడానికి అనుమతించ లేదు. అంతేగాక ముందుతరం సజ్జనులు కూడా అలా చేయలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించిన ఘోరమైన చెడు పనులలో అదొకటి. ఆయన పలుకులు:

زُوْرُوْا الْـقُـبُـورَ وَلاَ تَـقُـوْلُـوْا هُـجْـراً

జూరుల్ ఖుబూర వలా తఖూలు హుజ్ రన్

సమాధులను దర్శించండం, కానీ చెడు పలుకులు పలుకవద్దు.

ఈ పనులన్నింటిలోనూ కామన్ గా ఉన్న విషయం ఏమిటంటే ఇవి కొత్తగా కనిపెట్టబడిన నూతన కల్పితాలు. అయితే అవి వేర్వేరు స్థాయిలో ఉన్నాయి. వాటిలో కొన్ని పూర్తిగా దారి తప్పిన నూతన కల్పితాలే అయినా ఇంకా షిర్క్ స్థాయికి చేరుకోలేదు. ఉదాహరణకు, సమాధుల వద్ద నిలబడి అల్లాహ్ ను ప్రార్థించడం, మృతుల అంతస్తును పేర్కొంటూ ప్రార్థించడం మొదలైనవి. వాటిలో కొన్ని షిర్క్ అక్బర్ క్రిందికి వస్తాయి, ఉదాహరణకు – మృతులను వేడుకోవడం మరియు వారి సహాయాన్ని అర్థించడం.

ఈ విషయాల గురించి మేము ఇంతకు ముందు వివరంగా చర్చించాము. కాబట్టి వీటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించే శక్తిని ప్రసాదించమని మరియు సరైన దారి చూపమని మనం అల్లాహ్ ను ప్రార్థించాలి. కేవలం అల్లాహ్ మాత్రమే మనకు సన్మార్గాన్ని అనుసరించే శక్తిని ప్రసాదించగలడు. అల్లాహ్ తప్ప, నిజమైన వేరే ఆరాధ్యుడు, ప్రభువు ఎవ్వరూ లేరు.

ఇది ఈ చిరు పుస్తకం యొక్క అంతిమ చివరి విషయం.

وَالْـحَمْـدُ للهِ أَ وَّلاً وَآخِراً، وَصَلَّى اللهُ وَسَلَّمَ عَلَى عَبْـدُهُ وَرَسُـولُـهُ وَخَـيْـرَتِـهُ مِنْ خَـلَـقَـهُ مُـحَـمَّـدٍ وَعَلَى آلِـهِ وَأَصْحَابِـهِ وَمَـنْ تَـبَـعَـهُمْ بِـإِحْـسَانِ إِلَى يَـوْمُ الـدِّيْـنَ

వల్ హందులిల్లాహి అవ్వలన్ వ ఆఖిరన్. సల్లల్లాహు అలైహి వసల్లం అలా అబ్దుహు, వ రసూలుహు, వ ఖైరతిహు మిన్ ఖలఖహు ముహమ్మదిన్ వ ఆలా ఆలిహి, వ అస్హాబిహి, వ మన్ తబఅహుమ్ బిఇహ్సాని ఇలా యౌముద్దీన్.

ఆరంభంలో మరియు అంతంలో సకల స్తోత్రములు అల్లాహ్ కే. అల్లాహ్ దాసుడు, ప్రవక్త మరియు సృష్టితాలలో అత్యుత్తములూ అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన సహచరులపై, అంతిమ దినం వరకు మంచితనంలో వారిని అనుసరించేవారిపై అల్లాహ్ యొక్క కరుణ కురియుగాక.  

నిలకడగా ఆయన ధర్మాన్ని అనుసరించేలా అల్లాహ్ మనకు సహాయపడుగాక. ఆయనను వ్యతిరేకించడం నుండి మమ్ముల్ని కాపాడుగాక. నిశ్చయంగా ఆయన చాలా ఉదారవంతుడు మరియు మహోన్నతుడూను.

హజ్ / ఉమ్రా పుణ్యానికి సమానమైన సత్కార్యాలు [వీడియో]

బిస్మిల్లాహ్

[49:12 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా

ఇక్కడ పిడిఎఫ్ (pdf) డౌన్లోడ్ చేసుకోండి
https://teluguislam.net/wp-content/uploads/2022/02/good-deeds-having-hajj-umrah-reward.pdf


ఉమ్రా & హజ్జ్
https://teluguislam.net/five-pillars/umrah-hajj-telugu-islam/

ఖురాన్ వ్యాఖ్యానం (తఫ్సీర్): సూరా బకరా: ఆయత్ 189 – 193 [వీడియో]

బిస్మిల్లాహ్

[40 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
Dawah and Foreigners Guidance Office, Zulfi, Saudi Arabia.

ఇక్కడ ఆడియో వినండి లేదా డౌన్లోడ్ చేసుకోండి [40 నిముషాలు]

అహ్సనుల్ బయాన్ నుండి:

2:189  يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

(ఓ ప్రవక్తా!) ప్రజలు నిన్ను నెలవంకలను గురించి ప్రశ్నిస్తున్నారు కదూ! ఇది ప్రజల (ఆరాధనల) వేళలను, హజ్‌ కాలాన్ని నిర్ధారించటానికి (జరిగిన ఏర్పాటు) అని నువ్వు వారికి సమాధానం ఇవ్వు. (ఇహ్రామ్‌ స్థితిలో) మీరు మీ ఇళ్ళల్లోకి వెనుక వైపు నుంచి రావటం సత్కార్యం కాదు. అల్లాహ్‌ పట్ల భయభక్తులు కలిగి వున్నవాడిదే అసలు సత్కార్యం. మీరు మీ ఇండ్లల్లోకి వాకిళ్ళ నుండే ప్రవేశించండి. సాఫల్యం పొందగలందులకుగాను అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.

2:190  وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ

మీతో పోరాడే వారితో మీరు కూడా దైవమార్గంలో పోరాడండి. కాని మితిమీరకండి. మితిమీరి పోయేవారిని అల్లాహ్‌ ఇష్టపడడు.

2:191  وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ

వారు ఎక్కడ ఎదురైనా మీరు వారితో తలపడండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి వారు తరిమికొట్టారో, అక్కడి నుంచి మీరు కూడా వారిని తరిమికొట్టండి. ఫిత్నా (కుఫ్ర్‌, షిర్క్‌, పీడన) అనేది చంపటం కన్నా తీవ్రమైనది. ‘మస్జిదె హరామ్‌’ వద్ద వారు మీతో యుద్ధం చేయనంతవరకూ మీరూ వారితో పోరాడకండి. వారు గనక మిమ్మల్ని హతమార్చడానికి ప్రయత్నిస్తే మీరు కూడా దీటైన జవాబు ఇవ్వండి. అవిశ్వాసులకు సరైన సమాధానం ఇదే.

2:192  فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ

ఒకవేళ వారు గనక (తమ దమన నీతిని) మానుకుంటే నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు.

2:193  وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ

పీడన (ఫిత్నా) సమసిపోనంతవరకూ, దైవధర్మానిది పైచేయి కానంతవరకూ వారితో పోరాడుతూనే ఉండండి. ఒకవేళ వారు యుద్ధాన్ని విరమిస్తే (మీరూ విరమించండి). మెడలు వంచ వలసింది దౌర్జన్యపరులవే.

ఇతరములు:

ఇస్లాంలో పవిత్ర మాసాలు, రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? [2 వీడియోలు & టెక్స్ట్]

మొదటి భాగం:

పార్ట్ 1: ఇస్లాం లో పవిత్ర మాసాల విషయం, వాటి ప్రాముఖ్యత, మరియు వాటిలో జుల్మ్ (అన్యాయం) చేసుకోకూడదు
https://www.youtube.com/watch?v=lDeA6oFXxIc
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) [28 నిముషాలు]

ఈ ప్రసంగంలో, వక్త రజబ్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇది ఇస్లామీయ క్యాలెండర్‌లోని నాలుగు పవిత్ర మాసాలలో ఒకటి అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టం చేయబడింది. ఈ పవిత్ర మాసాలలో అన్యాయానికి (జుల్మ్) పాల్పడటం తీవ్రంగా నిషేధించబడింది. పాపాలు చేయడం మరియు అల్లాహ్ ఆదేశాలను విస్మరించడం ద్వారా మనిషి తనకు తాను అన్యాయం చేసుకుంటాడని వక్త వివరిస్తారు. షిర్క్, అవిధేయత, మరియు ఇతరులను పీడించడం వంటివి ఆత్మపై చేసుకునే అన్యాయానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. జీవితం అశాశ్వతమని, ఎప్పుడైనా మరణం సంభవించవచ్చని గుర్తు చేస్తూ, పాపాలకు పశ్చాత్తాపం చెంది (తౌబా), అల్లాహ్ వైపునకు మరలాలని వక్త ఉద్భోదిస్తారు.

بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ
[బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్]
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో.

అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ ఆలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్ అమ్మా బాద్.

మహాశయులారా! ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం ఏడవ నెల రజబ్ నెల మొదలైపోయింది. ప్రత్యేకంగా రజబ్ నెల విషయంలో ఏదైనా ప్రసంగం అవసరం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది మన ముస్లిం సోదర సోదరీమణులు రజబ్ నెలలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మాత్రం తెలుపని కొన్ని కార్యాలు చేస్తున్నారు. వాటిని ఖండించడానికి రజబ్ విషయంలో ప్రత్యేకంగా ప్రసంగం అవసరం ఉంటుంది.

ఒక విషయం గమనించండి, మనమందరం ఎవరి దాసులం? అల్లాహ్ దాసులం. మనమందరం అల్లాహ్ యొక్క దాసులమైనప్పుడు, అల్లాహ్ కు ఇష్టమైన విధంగానే మనం ఆయన దాస్యం చేయాలి, ఆయనను ఆరాధించాలి. నిజమే కదా? ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ ఆయన దాస్యం, ఆయన ఆరాధన ఎలా చేయాలి, అది చూపించడానికి అల్లాహ్ ఏం చేశాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనకు ఒక ఆదర్శంగా పంపించారు. అందు గురించి మహాశయులారా, మనం ఏ కార్యం చేసినా కానీ దానికి అల్లాహ్ వైపు నుండి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి సాక్ష్యాధారం, రుజువు, దలీల్ తప్పనిసరిగా అవసరం ఉంది.

సామాన్యంగా ఈ రోజుల్లో ఎంతోమంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, ఇది మంచి కార్యమే, ఇది చేయవచ్చు అన్నటువంటి భ్రమలో పడి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ వద్ద మనకు ఇష్టమైనటువంటి, మనకు మెచ్చినటువంటి పని స్వీకరించబడదు. అల్లాహ్ వద్ద ఏదైనా పని, ఏదైనా సత్కార్యం స్వీకరించబడడానికి అది అల్లాహ్ లేక ప్రవక్త ఆదేశపరంగా ఉండాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన పద్ధతి ప్రకారంగా ఉండడం తప్పనిసరి.

రజబ్ నెల దీనికి ఏదైనా ప్రత్యేకత ఉంటే, ఏదైనా గౌరవప్రదం ఉంటే, ఒకే ఒక విషయం ఉంది. అదేమిటి? అల్లాహ్ త’ఆలా తన ఇష్టానుసారం సంవత్సరంలో 12 నెలలు నిర్ణయించాడు. ఆ 12 నెలల్లో నాలుగు నెలలను గౌరవప్రదమైనవిగా ప్రస్తావించాడు. ఆ నాలుగు గౌరవప్రదమైన మాసాల్లో రజబ్ కూడా ఒకటి ఉంది.

సూరె తౌబా ఆయత్ నంబర్ 36 లో అల్లాహ్ త’ఆలా చెప్పాడు:

إِنَّ عِدَّةَ الشُّهُورِ عِندَ اللَّهِ اثْنَا عَشَرَ شَهْرًا فِي كِتَابِ اللَّهِ يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్‌ దగ్గర – అల్లాహ్‌ గ్రంథంలో పన్నెండు మాత్రమే. ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన రోజునుంచీ (ఈ లెక్క ఇలాగే సాగుతున్నది). వాటిలో నాలుగు మాసాలు నిషిద్ధమైనవి (గౌరవప్రదమైనవి.)”  (9:36)

నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ వద్ద పన్నెండు నెలలు ఉన్నాయి. ఫీ కితాబిల్లాహ్, ఈ విషయం అల్లాహ్ వద్ద ఉన్నటువంటి గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. ఎప్పటి నుండి ఉంది?

يَوْمَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ
[యౌమ ఖలకస్సమావాతి వల్ అర్ద్]
ఆయన ఆకాశాలను, భూమిని సృష్టించిన నాటి నుండి

భూమి ఆకాశాలను ఆయన సృష్టించినప్పటి నుండి ఈ నిర్ణయం, ఈ విషయం ఉంది.

مِنْهَا أَرْبَعَةٌ حُرُمٌ
[మిన్హా అర్బఅతున్ హురుమ్]
వాటిలో నాలుగు నెలలు పవిత్రమైనవి.

ఆ 12 మాసాల్లో నాలుగు నెలలు, నాలుగు మాసాలు హురుమ్ – నిషిద్ధమైనవి అన్న ఒక భావం వస్తుంది హురుమ్ కు, హురుమ్ అన్న దానికి మరో భావం ఇహ్తిరామ్, హుర్మత్, గౌరవప్రదమైనవి, ఎంతో గొప్పవి అన్నది కూడా భావం వస్తుంది.

ఆయత్ యొక్క ఈ భాగం ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, అల్లాహ్ ఎప్పటి నుండి భూమి ఆకాశాలను సృష్టించాడో అప్పటి నుండి నెలల సంఖ్య ఎంత? సంవత్సరంలో ఎన్ని నెలలు? 12 నెలలు. దీని ద్వారా మనకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఎవరెవరి వద్ద వారు లెక్కలు చేసుకోవడానికి రోజుల సంఖ్య, నెలల సంఖ్య ఏది ఉన్నా గానీ అల్లాహ్ త’ఆలా నిర్ణయించినటువంటి నెలల సంఖ్య సంవత్సరంలో 12 నెలలు. ఆ నెలల పేర్లు ఏమిటి? మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సహీ బుఖారీ, సహీ ముస్లింలోని హదీసుల్లో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. మరో విషయం మనకు ఏం తెలిసిందంటే అల్లాహ్ వద్ద గ్రంథం ఏదైతే ఉందో, లౌహె మహ్ఫూజ్ అని దాన్ని అంటారు, అందులో కూడా ఈ విషయం రాసి ఉంది. మరియు నాలుగు నెలలను అల్లాహ్ త’ఆలా గౌరవప్రదమైనవిగా, నిషిద్ధమైనవిగా ప్రస్తావించాడు. ఆ తర్వాత చెప్పాడు:

ذَٰلِكَ الدِّينُ الْقَيِّمُ
[జాలికద్దీనుల్ ఖయ్యిమ్]
ఇదే సరైన ధర్మం. (9:36)

ఇదే సరైన ధర్మం అనడానికి భావం ఏంటంటే, కొందరు నెలల సంఖ్యలో ఏదైతే తారుమారు చేసుకున్నారో అది తప్పు విషయం. మరి ఎవరైతే కొన్ని నెలలను అల్లాహ్ నిషిద్ధపరిచినటువంటి నెలలను ధర్మసమ్మతంగా చేసుకొని, అల్లాహ్ నిషేధించిన కార్యాలు వాటిలో చేస్తూ ఏ తప్పుకైతే గురయ్యారో, అది వాస్తవం కాదు. అల్లాహ్ ఏ విషయం అయితే తెలుపుతున్నాడో అదే సరైన విషయం, అదే నిజమైన విషయం, అదే అసలైన ధర్మం. దీనికి భిన్నంగా, విరుద్ధంగా ఎవరికీ చేయడానికి అనుమతి లేదు. ఇందులో అల్లాహ్ త’ఆలా ఒక ప్రత్యేక ఆదేశం మనకు ఏమి ఇచ్చాడంటే:

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోకండి. (9:36)

ఇందులో మీరు ఏ మాత్రం అన్యాయం చేసుకోకండి. ఏ మాత్రం జుల్మ్ చేసుకోకండి.

ఇక సోదరులారా, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినటువంటి హదీస్ ఏమిటంటే, సహీ బుఖారీ, సహీ ముస్లింలో ఉంది,

“అల్లాహ్ త’ఆలా భూమి ఆకాశాలను పుట్టించినప్పటి స్థితిలో నెలల సంఖ్య ఎలా ఉండిందో, అలాగే ఇప్పుడు అదే స్థితిలో తిరిగి వచ్చింది. సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. ఆ 12 నెలల్లో నాలుగు నెలలు నిషిద్ధమైనవి. ఆ నాలుగు, మూడు నెలలు క్రమంగా ఉన్నాయి. జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. ఈ మూడు నెలలు కంటిన్యూగా, క్రమంగా ఉన్నాయి. మరియు ముదర్ వంశం లేక ముదర్ తెగ వారి యొక్క రజబ్, అది జమాదిల్ ఆఖిరా మరియు షాబాన్ మధ్యలో ఉంది.”

ఇక్కడ ఈ హదీసులో కొన్ని విషయాలు మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా ప్రభవింపక ముందు మక్కావాసులు, ఆ కాలం నాటి ముష్రికులు, బహుదైవారాధకులు ఈ నాలుగు నెలలను గౌరవించేవారు. ఈ నాలుగింటిలో మూడు నెలలు క్రమంగా ఉన్నాయి కదా, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం.

అయితే ఆ కాలంలో ఉన్నటువంటి ఒక దురాచారం, ఒక చెడ్డ అలవాటు, కొన్ని మహా ఘోరమైన పాపాల్లో ఒకటి ఏమిటి? ఇతరులపై అత్యాచారం చేయడం, ఇతర సొమ్మును లాక్కోవడం, దొంగతనాలు చేయడం. ఇటువంటి దౌర్జన్యాలు ఏదైతే వారు చేసేవారో, వారు ఈ నిషిద్ధ మాసాల్లో, గౌరవమనమైన నెలల్లో అలాంటి ఆ చెడు కార్యాల నుండి దూరం ఉండేవారు. విషయం అర్థమవుతుందా? అల్లాహ్ తో షిర్క్ చేసేవారు, ఇంకెన్నెన్నో తప్పు కార్యాలు, పాపాలు చేసేవారు. ప్రజలను పీడించేవారు, బలహీనుల హక్కులను కాజేసేవారు, ఎంతో దౌర్జన్యం, అత్యాచారాలు చేసేవారు. కానీ, ఈ మూడు నెలలు వారు ఎలాంటి దౌర్జన్యానికి, ఇతరులపై ఏ అత్యాచారం చేయకుండా, దొంగలించకుండా వారు శాంతిగా ఉండేది. కానీ మూడు నెలలు కంటిన్యూగా శాంతిపరంగా ఉండడం వారికి భరించలేని విషయమై, మరో చెడ్డ కార్యం ఏం చేశారో తెలుసా? జుల్ హిజ్జాలో హజ్ జరుగుతుంది. అందుగురించి జుల్ ఖాదా, జుల్ హిజ్జా ఈ రెండు మాసాలు గౌరవించేవారు.

కానీ ముహర్రం నెల గురించి ఏమనేవారు? ఈసారి ముహర్రం సఫర్ లో వస్తుంది, ఈ ముహర్రంని ఇప్పుడు మనం సఫర్ గా భావిద్దాము. సఫర్ నెల ఎప్పుడు ఉంది? రెండో నెల. ముహర్రం తర్వాత సఫర్ ఉంది కదా. వాళ్ళు ఏమనేవారు? సఫర్ ను ముహర్రం గా చేసుకుందాము, ఈ ముహర్రంను సఫర్ గా చేసుకుందాము. ఇప్పుడు ఈ ముహర్రం మాసాన్ని ఏదైతే సఫర్ గా వారు అనుకున్నారో, దొంగతనం చేసేవారు, లూటీ చేసేవారు, ఇంకా పాప కార్యాలకు పాల్పడేవారు. ఆ తర్వాత నెల ఏదైతే ఉందో, దాన్ని ముహర్రంగా భావించారు కదా, అప్పుడు కొంచెం శాంతిగా ఉండేవారు. ఎందుకంటే మూడు నెలలు కంటిన్యూగా ఉండడం వారికి కష్టతరంగా జరిగింది. అయితే అలాంటి విషయాన్ని కూడా అల్లాహ్ త’ఆలా ఖండించాడు. సూరె తౌబా ఆయత్ నంబర్ 37 లో ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే చెప్పారో, కాలం తిరిగి తన అసలైన స్థితిలోకి, రూపంలోకి వచ్చింది అని ఏదైతే ప్రవక్త చెప్పారో, ఈ విషయం ఎప్పుడు చెప్పారు ప్రవక్త? తాను హజ్ ఏదైతే సంవత్సరంలో చేశారో ఆ సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో నెలల్లో ఎలాంటి తారుమారు లేకుండా, వెనక ముందు లేకుండా, అల్లాహ్ త’ఆలా సృష్టించినప్పటి స్థితిలో ఎట్లానైతే అసల్ స్థితిలో ఉండెనో, అదే స్థితిలో ఉండినది. అదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు.

మరో విషయం ఇందులో గౌరవించగలది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నాలుగు మాసాలు నిషిద్ధమైనవి, గౌరవప్రదమైనవి. వాటిలో మూడు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం. నాలుగవది రజబ్. ఆ రజబ్ అని కేవలం చెప్పలేదు, ఏం చెప్పారు? రజబ్ ముదర్ అని చెప్పారు. ముదర్ ఒక తెగ పేరు. కబీలా అని అంటాం కదా. ప్రవక్త కాలంలో అప్పుడు ఇంకా ఎన్నో తెగలు ఉండేవి. జమాదుల్ ఆఖిరా తర్వాత రజబ్ ఉంది, రజబ్ తర్వాత షాబాన్. అయితే కొన్ని తెగలు ఈ రజబ్ ను రజబ్ గా భావించకుండా, రమదాన్ ను రజబ్ గా కొందరు అనేవారు. రమదాన్ మాసాన్ని ఏమనేవారు? ఎవరు? వేరే కొన్ని తెగల వాళ్ళు. కానీ ముదర్ తెగ ఏదైతే ఉండెనో, ఆ తెగ వారు రజబ్ నే రజబ్ గా నమ్మేవారు. రజబ్ ను ఒక గౌరవప్రదమైన, అల్లాహ్ నిషేధించిన ఒక మాసంగా వారు విశ్వసించేవారు. అందు గురించి ప్రజలందరికీ తెలియడానికి, వేరే ప్రజలు ఎవరైతే రమదాన్ ను రజబ్ గా చేసుకున్నారో ఆ రజబ్ కాదు, ముదర్ ఏ రజబ్ నైతే రజబ్ మాసంగా నమ్ముతున్నారో మరి ఏదైతే జమాదుల్ ఆఖిరా తర్వాత, షాబాన్ కంటే ముందు ఉందో ఆ రజబ్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశదీకరించారు, వివరించారు.

అయితే ఈ గౌరవప్రదమైన మాసంలో అల్లాహ్ త’ఆలా మనల్ని ఒక ముఖ్యమైన విషయం నుండి ఆపుతున్నాడు. అదేమిటి?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీరు ఈ గౌరవప్రదమైన మాసంలో జుల్మ్ చేయకండి, జుల్మ్ చేసుకోకండి, అన్యాయం చేయకండి, అన్యాయం చేసుకోకండి.

ఇక్కడ కొందరు ఇలాగ అడగవచ్చు, ఈ నాలుగు మాసాల్లోనే జుల్మ్ చేయరాదు, మిగతా మాసాల్లో చేయవచ్చా? అలా భావం కాదు. ప్రతిచోట అపోజిట్ భావాన్ని తీసుకోవద్దు. దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. మన సమాజంలో ఎవరైనా మస్జిద్ లో కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు అనుకోండి, మనలో ఒక మంచి వ్యక్తి ఏమంటాడు? అరె, ఏంట్రా, మస్జిద్ లో ఉండి అబద్ధం మాట్లాడుతున్నావా? అంటారా లేదా? అంటే భావం ఏంటి? మస్జిద్ బయట ఉండి అబద్ధం మాట్లాడవచ్చు అనే భావమా? కాదు. ఆ బయటి స్థలాని కంటే ఈ మస్జిద్ యొక్క స్థలం ఏదైతే ఉందో దీనికి ఒక గౌరవం అనేది, ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. నువ్వు బయట చెప్పినప్పుడు, అబద్ధం పలికినప్పుడు, ఏదీ ఏమీ నీవు ఆలోచించకుండా, కనీసం ఇప్పుడు నీవు అల్లాహ్ యొక్క గృహంలో ఉన్నావు, మస్జిద్ లో ఉన్నావు. ఈ విషయాన్ని గ్రహించి అబద్ధం ఎందుకు పలుకుతున్నావు? అక్కడ విషయం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అన్న భావం కాదు. మస్జిద్ లో ఉండి ఇంకా మనం చెడులకు, అన్ని రకాల పాపాలకు ఎక్కువగా దూరం ఉండాలి, దూరంగా ఉండాలి అన్నటువంటి భావం. అలాగే ప్రతి నెలలో, ప్రతి రోజు జుల్మ్ కు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అత్యాచారానికి దూరంగా ఉండాలి. కానీ ఈ నిషిద్ధ మాసాల్లో, ఈ నాలుగు మాసాల్లో ప్రత్యేకంగా దూరం ఉండాలి. ఇది అయితే తెలిసింది. కానీ జుల్మ్ అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో, ఆ జుల్మ్ అన్నదానికి భావం ఏంటి? మరి అల్లాహ్ త’ఆలా ఏమన్నాడు ఇక్కడ?

فَلَا تَظْلِمُوا فِيهِنَّ أَنفُسَكُمْ
[ఫలా తజ్లిమూ ఫీ హిన్న అన్ఫుసకుమ్]
మీ ఆత్మలపై మీరు అన్యాయం చేసుకోకండి.

మీ ఆత్మలపై మీరు దౌర్జన్యం చేసుకోకండి అని అంటున్నాడు అల్లాహ్ త’ఆలా. ఎవరైనా తెలివిమంతుడు, బుద్ధి జ్ఞానం గలవాడు, తనకు తాను ఏదైనా అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడా? అందరూ ఇదే నిర్ణయంపై ఉన్నారు కదా. మరి అల్లాహ్ త’ఆలా అదే విషయం అంటున్నాడు, మీరు అంటున్నారు చేసుకోరు. మరి వారు చేసుకోకుంటే, అల్లాహ్ త’ఆలా ఎందుకు చేసుకోకండి అని అంటున్నాడు? వారు చేసుకుంటున్నారు గనుకనే అల్లాహ్ త’ఆలా చేసుకోకండి అని అంటున్నాడు. అంటే మన ఆత్మలపై మనం అన్యాయం ఎలా చేసుకుంటున్నాము? మన ఆత్మలపై మనం జుల్మ్ ఎలా చేస్తున్నాము? ఈ విషయం మనం గ్రహించాల్సింది.

ఈ విషయాన్ని మనం ఖురాన్, హదీస్ ఆధారంగా సరైన విధంలో అర్థం చేసుకుంటే, మన జీవితాల్లో వాస్తవానికి ఎంతో గొప్ప మార్పు వచ్చేస్తుంది. ఇమాం తబరీ రహమతుల్లా అలైహి చెప్పారు: “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్”, మీరు ఇందులో ప్రత్యేకంగా ఈ మాసాల్లో మీపై అన్యాయం చేసుకోకండి అంటే ఏమిటి? ఇర్తికాబుల్ మాసియా వ తర్కుత్తాఆ. జుల్మ్ దేన్నంటారు? ఇర్తికాబుల్ మాసియా – పాప కార్యానికి పాల్పడడం వ తర్కుత్తాఆ – అల్లాహ్ విధేయతను, పుణ్య కార్యాన్ని వదులుకోవడం. పాపానికి పాల్పడడం, పుణ్యాన్ని వదులుకోవడం, దీన్ని ఏమంటారు? జుల్మ్ అంటారు.

సామాన్యంగా మన సౌదీ దేశంలో ఉండి, జుల్మ్ అంటే ఏంటి అంటే, కఫీల్ మనకు మన జీతాలు ఇవ్వకపోవడం అని అనుకుంటాము. అది కూడా ఒక రకమైన జుల్మ్. కానీ అందులోనే జుల్మ్ బంధించిలేదు. జుల్మ్ యొక్క భావం కొంచెం విశాలంగా ఉంది. ఇమాం కుర్తుబీ రహమతుల్లా అలైహి చెప్పారు, “లా తజ్లిమూ ఫీహిన్న అన్ఫుసకుమ్ బిర్తికాబి జునూబ్”, మీరు పాపాలకు పాల్పడి అన్యాయం చేసుకోకండి.

ఇక మీరు ఖురాన్ ఆయతులను పరిశీలిస్తే, ఎప్పుడైతే ఒక మనిషి అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని వదులుకుంటున్నాడో, పాటించడం లేదో, లేక అల్లాహ్ త’ఆలా ఏ దుష్కార్యం నుండి వారించాడో, చేయవద్దు అని చెప్పాడో, దానికి పాల్పడుతున్నాడో, అతడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఉదాహరణకు స్కూల్ లో ఒక స్టూడెంట్ హోంవర్క్ చేసుకొని రాలేదు. అతనికి తెలుసు, నేను ఈ రోజు హోంవర్క్ ఇంట్లో చేయకుంటే రేపటి రోజు స్కూల్ లో వెళ్ళిన తర్వాత టీచర్ నన్ను దండిస్తాడు, కొడతాడు, శిక్షిస్తాడు. తెలుసు విషయం. తెలిసి కూడా అతను హోంవర్క్ చేయలేదు. వెళ్ళిన తర్వాత ఏమైంది? టీచర్ శిక్షించాడు అతన్ని. అతడు స్వయంగా తనపై అన్యాయం చేసుకున్నవాడు అయ్యాడా లేదా? ఎట్లా? అతనికి ఏ దెబ్బలైతే తగిలిందో టీచర్ వైపు నుండి, లేక ఏ శిక్ష అయితే టీచర్ వైపు నుండి అతనిపై పడిందో, అది ఎందువల్ల? ముందు నుండే అతడు అతనికి టీచర్ ఏదైతే ఆదేశం ఇచ్చాడో హోంవర్క్ చేయాలని అది చేయనందుకు. ఈ విషయం ఈ సామెత, ఈ ఉదాహరణ అర్థమవుతుంది కదా. అలాగే అల్లాహ్ త’ఆలా మనకు డైరెక్ట్ గా స్వయంగా ఖురాన్ ద్వారా గానీ, లేకుంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా గానీ ఏ ఆదేశాలు అయితే ఇచ్చాడో, వాటిని పాటించకపోవడం, వేటి నుండి అల్లాహ్ త’ఆలా మనల్ని వారించాడో, ఇవి చేయకండి అని చెప్పాడో, వాటికి పాల్పడడం, ఇది మనపై మనం అన్యాయం చేసుకుంటున్నట్లు.

దీనికి ఖురాన్ సాక్ష్యం చూడండి సూరె బఖరా ఆయత్ నంబర్ 54.

إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ
[ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్ బిత్తిఖాజికుముల్ ఇజ్ల్]
మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు.” (2:54)

ఇది మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయిల్ వారితో చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ త’ఆలా తూర్ పర్వతం వైపునకు పిలిపించాడో, ఆయన అటు వెళ్లారు, ఇటు కొందరు ఒక ఆవు దూడను తయారు చేశారు, బంగారంతో తయారు చేసి అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు? ఇదిగో మూసా అల్లాహ్ పిలుస్తున్నాడు అని ఎక్కడికో వెళ్ళాడు. మీ దేవుడు ఇక్కడ ఉన్నాడు, వీటిని మీరు పూజించండి అని చెప్పాడు, అస్తగ్ఫిరుల్లాహ్. మూసా అలైహిస్సలాం తిరిగి వచ్చిన తర్వాత వారిపై చాలా కోపగించుకున్నాడు. చెప్పాడు, “ఇన్నకుమ్ జలమ్తుమ్ అన్ఫుసకుమ్”, మీరు మీ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు. “బిత్తిఖాజికుముల్ ఇజ్ల్”, ఈ దూడను ఒక దేవతగా చేసుకొని. మీకు ఆరాధ్య దైవంగా మీరు భావించి, మీపై అన్యాయం చేసుకున్నారు. ఇక ఈ ఆయత్ ద్వారా మనకు ఏం తెలుస్తుంది? షిర్క్ అతి గొప్ప, అతి భయంకరమైన, అతి చెడ్డ దౌర్జన్యం, అతి చెడ్డ జుల్మ్.

ఇంకా అలాగే సోదరులారా, అల్లాహ్ ఇచ్చిన ఆదేశాన్ని పాటించకపోవడం, అల్లాహ్ కు కృతజ్ఞత, శుక్రియా చెప్పుకోకపోవడం, తెలుపుకోకపోవడం ఇది కూడా మహా దౌర్జన్యం, జుల్మ్ కింద లెక్కించబడుతుంది. మరి మూడు ఆయతుల తర్వాత, అదే బనీ ఇస్రాయిల్ పై అల్లాహ్ త’ఆలా వారికి ఏ వరాలైతే ప్రసాదించాడో, వారికి అల్లాహ్ త’ఆలా కారుణ్యాలు ఇచ్చాడో ప్రస్తావిస్తూ: “వ జల్లల్నా అలైకుముల్ గమామ్”, మేము మీపై మేఘాల ద్వారా నీడ కలిగించాము. “వ అన్జల్నా అలైకుముల్ మన్న వస్సల్వా”, మన్ మరియు సల్వా తినే మంచి పదార్థాలు మీకు ఎలాంటి కష్టం లేకుండా మీకు ఇచ్చుకుంటూ వచ్చాము. “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్”, మేము ప్రసాదించిన ఈ ఆహారాన్ని మీరు తినండి. కానీ ఏం చేశారు వాళ్ళు? కృతజ్ఞత చూపకుండా దానికి విరుద్ధంగా చేశారు. మూసా ప్రవక్త మాటను వినకుండా అవిధేయతకు పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, “కులు మిన్ తయ్యిబాతి మా రజక్నాకుమ్ వమా జలమూనా”, అయితే వారు మాపై అన్యాయం చేయలేదు, మాపై జుల్మ్ చేయలేదు. “వలాకిన్ కానూ అన్ఫుసహుమ్ యజ్లిమూన్”, వారు తమ ఆత్మలపై మాత్రమే అన్యాయం చేసుకున్నారు.

ఎంత మంది మీలో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే భార్య భర్తల జీవిత విషయంలో కూడా అల్లాహ్ త’ఆలా ఒక విషయాన్ని తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నట్లు అని అంటున్నాడు. కానీ సామాన్యంగా మనం ఈ విషయం గమనించము. నేనే పురుషుడిని, నేనే మగవాడిని, భార్య నాకు బానిస లాంటిది అన్నటువంటి తప్పుడు భావాల్లో పడి ఎంతో పీడిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవితాల్లో ప్రేమానురాగాలు తగ్గుతాయో, మందగిస్తాయో, మంచి విధంగా జీవించి ఉండరు, మంచి విధంగా తెగతెంపులు చేసుకోకుండా పీడిస్తూ ఉంటారు. ఇది మహా పాపకార్యం. సూరె బఖరా 231 ఆయత్ లో అల్లాహ్ చెప్తున్నాడు:

وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا
[వలా తుమ్సికూహున్న జిరారల్ లితఅతదూ]
“వారిని నష్టపరచాలనే దురుద్దేశంతో (ఇద్దత్ సమయంలో) ఆపకండి. (2:231)

వారికి ఏదైనా నష్టం చేకూర్చడానికి మీరు వారిని ఆపి ఉంచకండి. “లితఅతదూ”, వారిపై ఏదైనా దౌర్జన్యం చేయడానికి, వారిపై ఏదైనా అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. అంటే ఆపుకొని ఉంచకండి అంటే విడాకులు ఇవ్వడం లేదు, ఇటు మంచి విధంగా ప్రేమపూర్వకమైన జీవితం గడపడం లేదు. అల్లాహ్ ఏమంటున్నాడు?

وَمَن يَفْعَلْ ذَٰلِكَ
[వమయ్ యఫ్అల్ జాలిక]
ఎవరైతే ఇలా చేస్తారో,

అల్లాహ్ ఒక ఆదేశం ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు నష్టం చేకూర్చడానికి, అన్యాయం చేయడానికి మీరు వారిని ఆపుకొని ఉంచకండి. ఇక ఎవరైతే ఇలా చేస్తారో, “వమయ్ యఫ్అల్ జాలిక”, ఎవరైతే తమ భార్యలను వారిని పీడించడానికి, వారిపై అన్యాయం చేయడానికి, నష్టం చేకూర్చడానికి ఆపుకొని ఉంటారో,

فَقَدْ ظَلَمَ نَفْسَهُ
[ఫఖద్ జలమ నఫ్సహ్]
అతను తనపై అన్యాయం చేసుకుంటున్నాడు, తనపై జుల్మ్ చేస్తున్నాడు. (2:231)

చూడడానికి అతడు ఆమెపై దౌర్జన్యం చేస్తున్నాడు, కానీ వాస్తవానికి “జలమ నఫ్సహూ”, అతడు తనపై అన్యాయం చేసుకుంటున్నాడు. తనపై జుల్మ్ చేస్తున్నాడు.

ఇక ఈ అతడు తనపై ఎలా అన్యాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వివరించడానికి ఎంతో సమయం అవసరం. ఇలాంటి ఉదాహరణలు మన సమాజంలో ఎంతో, ఎన్నో మనకు కనబడతాయి. కానీ నేను చెప్పబోయే విషయం ఏంటి? ఎప్పుడైతే మనిషి అల్లాహ్ యొక్క ఆజ్ఞను దాటుతాడో, అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్పడతాడో, అతడు వాస్తవానికి తనపై జుల్మ్ చేసుకున్నవాడు అవుతున్నాడు.

ఈ విధంగా ఖురాన్ లో చూస్తూ పోతే ఎన్నో ఆయతులు మనకు కానవస్తాయి. కానీ సోదరులారా, గమనించవలసిన విషయం ఏంటంటే అల్లాహ్ త’ఆలా ప్రత్యేకంగా ఈ నాలుగు మాసాల్లో, ఇంకా మిగతా 12 మాసాల్లో కూడా మనల్ని అన్ని రకాల జుల్మ్, అన్ని రకాల పాప కార్యాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరి వైపు నుండి ఏదైనా అన్యాయం, జుల్మ్ వారి తమ ఆత్మలపై జరిగితే ఏం చేయాలి? సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో చెప్పాడు:

وَمَن يَعْمَلْ سُوءًا أَوْ يَظْلِمْ نَفْسَهُ ثُمَّ يَسْتَغْفِرِ اللَّهَ يَجِدِ اللَّهَ غَفُورًا رَّحِيمًا

[వమయ్ యఅమల్ సూఅన్ అవ్ యజ్లిమ్ నఫ్సహూ సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ యజిదిల్లాహ గఫూరర్ రహీమా]
ఎవరయినా దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్‌ను అర్థిస్తే, అతడు అల్లాహ్‌ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు.” (4:110)

ఎవరైనా ఏదైనా పాప కార్యానికి పాల్పడితే, లేదా తన ఆత్మపై తాను జుల్మ్ చేసుకుంటే, ఆ తర్వాత స్వచ్ఛమైన రూపంలో అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటే, అల్లాహ్ ను క్షమించేవాడు, కరుణించేవాడు, మన్నించేవాడుగా పొందుతాడు.

అందు గురించి సోదరులారా, ఇకనైనా గమనించండి. జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలుసా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలుసా మనకు? ఏ మాత్రం తెలియదు. ఇంచుమించు నెల కాబోతుంది కావచ్చు. ఒక టైలర్, పెద్ద మనిషి ఇక్కడ చనిపోయి. సామాన్యంగా వచ్చాడు, భోజనం చేశాడు, హాయిగా స్నేహితులతో కూర్చున్నాడు, కొంత సేపట్లోనే నాకు ఛాతీలో చాలా నొప్పి కలుగుతుంది అని, కొంత సేపటి తర్వాత, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళండి, ఇక నేను భరించలేను అన్నాడు. మిత్రులు బండిలో వేసుకొని వెళ్తున్నారు, హాస్పిటల్ చేరకముందే ఈ జీవితాన్ని వదిలేశాడు. మనలో కూడా ఎవరికి ఎప్పుడు చావు వస్తుందో తెలియదు. ఇంకా మనం ఏ కలలు చూసుకుంటూ ఉన్నాము? ఇంకా ఎందుకు మనం పాప కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నాము? అల్లాహ్ ఆదేశాలకు దూరంగా, ఖురాన్ నుండి దూరంగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశాలకు దూరంగా, నమాజులను వదులుకుంటూ, ఇంకా ఇతర పాప కార్యాల్లో మనం మునిగిపోతూ, ఇంకెన్ని రోజులు మనం ఇలాంటి జీవితం గడుపుతాము?

సోదరులారా, వాస్తవానికి ఏ ఒక్క మనిషి ఏ చిన్న పాపం చేసినా గానీ అతను తనపై అన్యాయం చేసుకున్నవాడు అవుతాడు. కానీ ఇకనైనా గుణపాఠం తెచ్చుకొని సూరె నిసా ఆయత్ నంబర్ 110 లో అల్లాహ్ చెప్పినట్లుగా, వెంటనే మనం ఇస్తిగ్ఫార్, తౌబా, పశ్చాత్తాపం చెందుతూ అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పకుండా అల్లాహ్ త’ఆలా క్షమిస్తాడు.

ఇక రజబ్ మాసంలో ఇంకా ఏ దురాచారాలు, ఏ బిదత్లైతే జరుగుతాయో, వాటి గురించి మనం వచ్చే వారంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా, వస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.


రెండవ భాగం:



రజబ్ మాసంలో జరిగే బిద్’అత్ (దురాచారాలు)

రజబ్ మాసంలో ఒక ముస్లిం ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? 
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)
https://www.youtube.com/watch?v=cNwTV9mjw1g [29 నిముషాలు]

ఈ ప్రసంగంలో, రజబ్ నెల యొక్క పవిత్రత మరియు ఆ నెలలో ముస్లింలు దూరంగా ఉండవలసిన పాపాల గురించి వివరించబడింది. అజ్మీర్ ఉర్సు, ప్రత్యేక నమాజులు (సలాతుర్ రగాఇబ్), ప్రత్యేక ఉపవాసాలు మరియు 27వ రాత్రి మేరాజ్ ఉత్సవాలు వంటివి ఇస్లాంలో లేని నూతన కల్పనలని (బిద్అత్) వక్త స్పష్టం చేశారు. అనంతరం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గగన ప్రయాణం (ఇస్రా మరియు మేరాజ్) యొక్క అద్భుత సంఘటనను వివరించారు. ఈ ప్రయాణం ఎందుకు జరిగింది, దాని సందర్భం, ప్రయాణంలో ఎదురైన అద్భుతాలు, వివిధ ప్రవక్తలతో సమావేశం, మరియు ఐదు పూటల నమాజ్ వంటి బహుమానాలు ఎలా లభించాయో వివరించారు. మేరాజ్ నుండి మనం నేర్చుకోవలసిన అసలైన గుణపాఠం ఉత్సవాలు జరుపుకోవడం కాదని, అల్లాహ్ ప్రసాదించిన ఆదేశాలను, ముఖ్యంగా నమాజ్‌ను మన జీవితంలో ఆచరించడమని నొక్కిచెప్పారు.

أَلْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَصَحْبِهِ أَجْمَعِينَ، أَمَّا بَعْدُ
(అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మయీన్, అమ్మా బఅద్)
సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే సర్వ స్తోత్రాలు. ప్రవక్తల నాయకుడైన మన ప్రవక్త ముహమ్మద్ పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా మరియు ఆయన సహచరులందరిపైనా అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యం వర్షించుగాక. ఆ తర్వాత…

గతవారంలో మనం రజబ్ నెలలో అల్లాహ్ మనకు ఇచ్చిన ఆదేశం ఏంటి? రజబ్ నెలతో పాటు మిగతా మూడు నెలలు, అంటే టోటల్ నాలుగు గౌరవప్రదమైన నెలలలో ప్రత్యేకంగా జుల్మ్ నుండి, అన్యాయం, అత్యాచారం, దౌర్జన్యం వీటి నుండి దూరం ఉండాలన్న ఆదేశం అల్లాహ్ మనకిచ్చాడు. అయితే దురదృష్టవశాత్తు అనండి, ఎంతోమంది ముస్లింలు ఈ రజబ్ నెలలో ఎన్నో దురాచారాలకు పాల్పడుతున్నారు.

ఉదాహరణకు, రజబ్ నెల మొదలైన వెంటనే, అజ్మీర్ అన్న ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఉన్న ఒక సమాధికి ఎంతో గౌరవ స్థానం ఇచ్చి, దాని యొక్క దర్శనం, దాని యొక్క ఉర్స్, యాత్రలు చేయడం. వాస్తవానికి, సమాధిని ఇటుక సిమెంట్లతో కట్టి, దాని మీద గోపురాలు కట్టి, దానికి ఒక సమయం అని నిర్ణయించి ప్రజలు అక్కడికి రావడం, ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన కార్యం. అంతేకాకుండా మరో ఘోరమైన విషయం ఏమిటంటే, ఎందరో సామాన్య ప్రజలలో ఒక మాట చాలా ప్రబలి ఉంది. అదేమిటి? ధనవంతుల హజ్ మక్కాలో అవుతుంది, మాలాంటి బీదవాళ్లు ఏడుసార్లు అజ్మీర్‌కు వెళ్తే ఒక్కసారి హజ్ చేసినంత సమానం అని. ఇది కూడా మహా ఘోరమైన, పాపపు మాట. అల్లాహ్ త’ఆలా ఇహలోకంలో సర్వ భూమిలోకెల్లా హజ్ అన్నది కేవలం మక్కా నగరంలో కాబతుల్లా యొక్క తవాఫ్, సఫా మర్వా యొక్క సయీ, ముజ್ದలిఫా, అరఫాత్, మినా ఈ ప్రాంతాల్లో నిలబడటం, అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసినటువంటి కార్యాలు చేయడం, ఇదే హజ్ కానీ, ఇది కాకుండా వేరే ఏదైనా సమాధి, వేరే ఏదైనా ప్రాంతం, ఏదైనా ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చి, దానికి హజ్ లాంటి పేరు పెట్టుకోవడం ఇది చాలా ఘోరమైన పాపం.

ఇంకా మరికొందరు ఈ రజబ్ నెలలోని మొదటి వారంలో గురువారం రాత్రి, శుక్రవారానికి ముందు ఒక ప్రత్యేక నమాజ్ చదువుతారు. సలాతుర్ రగాఇబ్ అని దాని పేరు. ఇలాంటి నమాజ్ చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ ఒక్క హదీసు, ఏ ఒక్క ఆదేశం లేదు. పోతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు సహాబా-ఎ-కిరామ్ మరియు ఆ తర్వాత కాలాలలో శ్రేష్ఠ కాలాలలో వచ్చినటువంటి ధర్మవేత్తలు, ధర్మ పండితులు ఇలాంటి నమాజ్ గురించి ఏ ఒక్క ఆదేశం లేదు అని స్పష్టం చేశారు.

ఇంకా మరికొందరు ప్రత్యేకంగా రజబ్ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. అయితే రజబ్ నెలలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించినట్లు ప్రవక్త ద్వారా ఏ రుజువు లేదు. కాకపోతే, ఎవరైనా ప్రతీ నెలలో సోమవారం, గురువారం అల్లాహ్ వద్ద సర్వ మానవుల కార్యాలు లేపబడతాయి గనుక, ఇతర నెలలో ఉంటున్నట్లు ఈ నెలలో కూడా ఉపవాసాలు ఉండేది ఉంటే అభ్యంతరం లేదు. ప్రతీ నెలలో మూడు ఉపవాసాలు ఉన్నవారికి సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు గనుక, ఎవరైనా రజబ్ నెలలో కూడా మూడు ఉపవాసాలు ఉండేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఇతర రోజుల్లో కూడా వారు, ఇతర మాసాల్లో కూడా వారు ఉంటున్నారు గనుక. కానీ ప్రత్యేకంగా రజబ్ కు ఏదైనా ప్రాధాన్యత ఇస్తూ ఉపవాసం ఉండటం ప్రవక్తతో, సహాబాలతో రుజువు లేని విషయం.

అలాగే మరో దురాచారం ఈ రజబ్ నెలలో ఏమిటంటే, కొందరు 22వ తారీఖు నాడు రజబ్ కే కూండే అని చేస్తారు. అంటే ఓ ప్రత్యేకమైన కొన్ని వంటకాలు చేసి దానిపై ఫాతిహా, నియాజ్‌లు చేసి జాఫర్ సాదిక్ (రహ్మతుల్లాహి అలైహి) పేరు మీద మొక్కడమనండి, లేక ఆయన పేరు మీద నియాజ్ చేయడం అనండి. అయితే సోదరులారా, నియాజ్ అని ఏదైతే ఉర్దూలో అంటారో, మొక్కుకోవడం అని దానికి భావన వస్తుంది. అయితే ఇది కేవలం అల్లాహ్ గురించే చెల్లుతుంది. అల్లాహ్ కు కాకుండా ఇక వేరే ఎవరి గురించి ఇలాంటి నియాజ్‌లు చేయడం ధర్మ సమ్మతం కాదు. పోతే ఈ పద్ధతి, అంటే ఏదైనా ప్రత్యేక వంటకాలు చేసి, వాటి మీద కొన్ని సూరాలు చదివి ఊది నియాజ్‌లు చేయడం, ఇది ఈ నెలలో గాని, ఏ నెలలో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఈ పద్ధతిని నేర్పలేదు. అందు గురించి ఇలాంటి దురాచారాల నుండి కూడా మనం దూరం ఉండాలి.

ఇంకొందరు మనం చూస్తాము, 27వ రాత్రి జాగారం చేస్తారు, రాత్రి మేల్కొని ఉంటారు, మస్జిద్ లలో పెద్ద లైటింగ్‌లు చేస్తారు. ఆ మస్జిద్ లలో వచ్చి కొన్ని ప్రార్థనలు, నమాజులు, ఖురాన్ పారాయణం, ఇంకా వేరే కొన్ని కార్యాలు చేసి ఆ రాత్రిని, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు మేరాజ్ ఉన్-నబీ ఏదైతే ప్రాప్తమైందో, మేరాజ్. అంటే రాత్రి యొక్క అతి చిన్న సమయంలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ త’ఆలా జిబ్రీల్ ద్వారా మక్కా నుండి బైతుల్ మఖ్దిస్ వరకు తీసుకెళ్లారు. అక్కడ నుండి ఏడు ఆకాశాల పైకి వెళ్లారు. అక్కడ స్వర్గం, నరకాలను దర్శించారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్‌తో మాట్లాడారు. మరియు తిరిగి వస్తూ వస్తూ ఐదు పూటల నమాజ్‌ల యొక్క గొప్ప బహుమానం కూడా తీసుకొచ్చారు.

ఇది వాస్తవమైన విషయం. దీనినే సామాన్యంగా తెలుగులో గగన ప్రయాణం అని అంటారు. ఈ గగన ప్రయాణం మన ప్రవక్తకు ప్రాప్తమైంది, ఇది నిజమైన విషయం. కానీ ఏ తారీఖు, ఏ నెల మరియు ఏ సంవత్సరంలో జరిగిందో ఎలాంటి సుబూత్, ఎలాంటి ఆధారం అనేది లేదు. కానీ మన కొందరు సోదరులు 27వ తారీఖు నాడు రాత్రి, అంటే 26 గడిచిన తర్వాత 27, 26 మధ్య రాత్రిలో జాగారం చేసి, ఇది గగన ప్రయాణం, జష్న్-ఎ-మేరాజ్-ఉన్-నబీ అని చేస్తారు. ఇలాంటి మేరాజ్-ఉన్-నబీ ఉత్సవాలు జరపడం కూడా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకం.

ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు, గగన ప్రయాణం ప్రవక్తకు మేరాజ్ ప్రాప్తమైంది కానీ, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం అన్నది రుజువు లేదు. అయినా, ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస పోక ముందు, హిజ్రత్ చేయక ముందే ఇది జరిగింది అన్నటువంటి ఏకాభిప్రాయం కలిగి ఉంది. అయితే ఈ గగన ప్రయాణం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పది సంవత్సరాలు మదీనాలో ఉన్నారు. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా మేరాజ్‌ను గుర్తు చేసుకొని ఆ రాత్రి జాగారం చేయడం లాంటి పనులు చేయలేదు.

అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది. దీన్ని ఒక చిన్న సామెత, లేదా అనండి ఉదాహరణ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇహలోకంలో మనం కొందరు పండితులను లేదా విద్వాంసులను, లేదా దేశం కొరకు ఏదైనా చాలా గొప్ప మేలు చేసిన వారికి, ఏదైనా సంస్థ గానీ లేకుంటే ప్రభుత్వం గానీ వారిని గౌరవించి వారికి ఇతర దేశంలో టూర్ గురించి వెళ్లి అక్కడి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి రావడానికి అన్ని రకాల సౌకర్యాలు, టికెట్ ఖర్చులతో పాటు అక్కడ ఉండడానికి, హోటల్లో, అక్కడ తిరగడానికి, అక్కడ ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజుల ఖర్చు గిట్ల మొత్తం భరించి వారిని గౌరవిస్తారు, వారిని సన్మానిస్తారు. విషయం అర్థమవుతుందా? సైన్సులో గాని, ఇంకా వేరే ఏదైనా విషయంలో గాని ఎవరైనా గొప్ప మేలు చేస్తే, వారిని సన్మానించడం, సన్మానిస్తూ వారు చేసిన ఆ మేలుకు ప్రభుత్వం గాని లేదా ఏదైనా సంస్థ గాని ఏం చేస్తుంది? మీరు ఫలానా దేశంలో టూర్ చేసి రండి అన్నటువంటి టికెట్లతో సహా అన్ని ఖర్చులతో సహా వారిని పంపుతుంది.

అలాంటి వ్యక్తి బయటికి పోయి వచ్చిన తర్వాత, అక్కడి నుండి కొన్ని విషయాలు, కొన్ని మంచి అనుభవాలు తీసుకొని వస్తాడు. అయితే, వచ్చిన తర్వాత తన ఇంటి వారికి లేదా తన దేశ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి మంచి విషయాల గురించి తెలియజేస్తాడు. ఉదాహరణకు ఎవరైనా జపాన్ వెళ్ళారనుకోండి. అక్కడ టెక్నాలజీ, వారి యొక్క దైనందిన జీవితంలో, డైలీ జీవితంలో ఒక సిస్టమేటిక్‌గా ఏదైతే వారు ఫాలో అవుతున్నారో, వాటవన్నీ చాలా నచ్చి మన భారతదేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే అలాంటి మంచి విషయాలు పాటించాలి అని బోధ చేస్తాడు.

అయితే ఇప్పుడు ఆ మనిషి ఎవరికైతే ఒక సంస్థ లేక ప్రభుత్వం పంపిందో, ఉదాహరణకు అనుకోండి జపాన్‌కే పంపింది, ఏ తారీఖులో ఆయన అటు పోయి వచ్చాడో, ప్రతీ సంవత్సరం ఆ తారీఖున ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటే లాభం కలుగుతుందా? లేకుంటే అక్కడికి వెళ్లి వచ్చి అక్కడి నుండి తెచ్చిన అనుభవాలను అనుసరిస్తే లాభం కలుగుతుందా? అక్కడ తీసుకు… అక్కడి నుండి ఏదైతే అనుభవాలు తీసుకొచ్చాడో, అక్కడి నుండి ఏ మంచి విషయాలు అయితే తీసుకొచ్చాడో, వాటిని ఆచరిస్తేనే లాభం కలుగుతుంది. అలాగే, మన ప్రవక్తకు, మన ప్రవక్తను అల్లాహ్ త’ఆలా ఆకాశాల్లోకి పిలిపించి అక్కడ ఏదైతే గొప్ప బహుమానాలు ప్రసాదించాడో అవి మనకు కూడా ఇచ్చారు. అయితే వాటిని మనం ఆచరిస్తేనే మనకు లాభం కలుగుతుంది కానీ, మా ప్రవక్త గారు ఫలానా తారీఖున గగన ప్రయాణం చేశారు అని కేవలం మనం సంతోషపడితే మనకు ఎలాంటి లాభాలు కలగవు.

అయితే సోదరులారా, మనం ఈ మేరాజ్-ఉన్-నబీ సంఘటనలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎలాంటి సందర్భంలో మన ప్రవక్తకు మేరాజ్ గౌరవం ప్రాప్తమైంది? ఈ మేరాజ్ ప్రయాణంలో ప్రవక్తకు ఏ ఏ విషయాలు లభించాయి? రండి సంక్షిప్తంగా ఆ విషయాలు తెలుసుకుందాం.

మక్కాలో మన ప్రవక్త గారు ఇస్లాం ధర్మ ప్రచారం మొదలుపెట్టి ఇంచుమించు 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా అవిశ్వాసుల వైపు నుండి కష్టాలు, బాధలు పెరుగుతూనే పోతున్నాయి. చివరికి ఎప్పుడైతే అబూ తాలిబ్ చనిపోయాడో మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి హజ్రత్ ఖదీజా రదియల్లాహు అన్హా గారు చనిపోయారో ఆ తర్వాత మన ప్రవక్త వారిపై దౌర్జన్యాలు, హింసలు ఇంకా పెరిగిపోయాయి.

ఆ సందర్భంలో ప్రవక్త ఏం చేశారు? తాయిఫ్ నగరానికి వెళ్లారు. బహుశా అక్కడి వారు కొందరు ఇస్లాం స్వీకరిస్తారేమో కావచ్చు. కానీ అక్కడ కూడా వారికి, ప్రవక్త గారికి చాలా శారీరకంగా చాలా బాధించారు. అంతేకాకుండా తప్పుడు సమాధానాలు పలికి ప్రవక్త మనసును కూడా గాయపరిచారు. ప్రవక్త అదే బాధలో తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఈ గగన ప్రయాణం జరిగింది.

అయితే ఇందులో ఒకవైపు ప్రవక్తకు తృప్తిని ఇవ్వడం జరుగుతుంది. మీరు బాధపడకండి, ఈ భూమిలో ఉన్న ప్రజలు మీ గౌరవాన్ని గుర్తు చేసుకోకుంటే, మీకు అల్లాహ్ త’ఆలా ఎలాంటి స్థానం ఇచ్చాడో దాన్ని వారు గ్రహించకుంటే మీరు ఆకాశాల్లో రండి. ఆకాశంలో ఉన్న వారు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో, మీ యొక్క స్థానాన్ని ఎలా వారు గుర్తిస్తారో చూడండి అని ప్రవక్త గారికి ఒక నెమ్మది, తృప్తి, శాంతి, మనసులో ఏదైతే బాధ ఉందో దానికి మనశ్శాంతి కలిగించడం జరిగింది. దాంతోపాటు ఇదే ప్రయాణంలో ప్రవక్త గారికి ఇంకా ఎన్నో మహిమలు, ఎన్నో రకాల అద్భుతాలు కలిగాయి. ఒక్కొక్కటి వేసి మనం దాన్ని తెలుసుకుందాం.

ప్రవక్త గారి హార్ట్ ఆపరేషన్ ఈ గగన ప్రయాణం కంటే ముందు జరిగింది. అంతకు ముందు ఒకసారి నాలుగు సంవత్సరాల వయసులో కూడా జరిగింది. కానీ గగన ప్రయాణానికి ముందు కూడా ఒకసారి గుండె ఆపరేషన్ చేయడం జరిగింది. అనస్ రదియల్లాహు అన్హు చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఛాతి మీద నేను ఆ ఆపరేషన్ చేసినటువంటి కుట్ల గుర్తులను కూడా చూశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో విశ్వాసం, వివేకాలు నింపబడ్డాయి. (సహీహ్ బుఖారీలో ఈ హదీస్ ఉంది).

గాడిద కంటే కొంచెం పెద్దగా మరియు కంచర గాడిద కంటే కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక వాహనంపై ప్రవక్తను ఎక్కించడం జరిగింది. దాని పేరు అరబీలో బురాఖ్. రాత్రిలోని అతి తక్కువ సమయంలో మక్కా నుండి ఎక్కడికి వెళ్లారు? బైతుల్ మఖ్దిస్. అక్కడ అల్లాహ్ త’ఆలా తన శక్తితో ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని మన ప్రవక్త ముహమ్మద్ కంటే ముందు వరకు ఎందరు ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరినీ అక్కడ జమా చేశాడు. ప్రవక్త గారు వారందరికీ రెండు రకాతుల నమాజ్ చేయించారు.

అక్కడి నుండి, అంటే బైతుల్ మఖ్దిస్ నుండి, ప్రవక్త ఆకాశాల పైకి వెళ్లారు. మొదటి ఆకాశంలో ఆదం అలైహిస్సలాం, రెండవ ఆకాశంలో హజ్రత్ ఈసా మరియు యహ్యా, మూడవ ఆకాశంలో యూసుఫ్, నాల్గవ ఆకాశంలో ఇద్రీస్, ఐదవ ఆకాశంలో హారూన్, ఆరవ ఆకాశంలో మూసా, ఏడవ ఆకాశంలో ఇబ్రాహీం (అలైహిముస్సలాతు వ తస్లీమ్). వీరందరితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుసుకున్నారు.

ఏడవ ఆకాశాలకు పైగా “సిద్రతుల్ ముంతహా” అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక రేగు చెట్టు ఉంది. ఆ రేగు చెట్టు ఎంత పెద్దదంటే, దాని యొక్క పండు (రేగు పండు ఉంటుంది కదా) చాలా పెద్ద కడవల మాదిరిగా మరియు దాని యొక్క ఆకు ఏనుగు చెవుల మాదిరిగా ఉంటుంది, అంత పెద్ద చెట్టు. దాని యొక్క వ్రేళ్ళు, ప్రతీ చెట్టుకు వ్రేళ్ళు ఉంటాయి కదా కింద, అవి ఆరవ ఆకాశంలో ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు ఏడవ ఆకాశంలో చేరుకుంటాయి. అక్కడే ఎన్నో అద్భుతాలు, ఎన్నో విషయాలు జరిగాయి. దానికి దగ్గరే “జన్నతుల్ మఅవా” అన్న స్వర్గం ఉంది.

దైవదూతలు కొందరు ఎవరైతే రాస్తూ ఉంటారో అల్లాహ్ ఆదేశాలను, వారు రాస్తున్న కలముల చప్పుడు కూడా వినిబడుతుంది. ఆ సిద్రతుల్ ముంతహా, ఆ రేగు చెట్టు అక్కడే ప్రవక్త గారికి మూడు విషయాలు ఇవ్వడం జరిగాయి:

  1. 50 పూటల నమాజ్.
  2. సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతులు.
  3. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నిజంగా విశ్వసించి ఆయనను ఆచరించే వారిలో షిర్క్ చేయని వారు ఎవరైతే ఉంటారో, వారి పెద్ద పాపాలను కూడా అల్లాహ్ త’ఆలా మన్నిస్తాను అంటున్నాడు.

ఇదే రేగు చెట్టు వద్ద ప్రవక్త గారు జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు సృష్టిలో చూశారు. అక్కడే ప్రవక్త గారు నాలుగు రకాల నదులను చూశారు.

ఆరవ విషయం, అక్కడే ప్రవక్త గారికి పాలు ఒక పళ్లెంలో, మరో పళ్లెంలో తేనె, మరో పళ్లెంలో మత్తు పదార్థం ఇవ్వడం జరిగింది. అయితే ప్రవక్త గారు పాలు తీసుకున్నారు.

ఏడవ ఆకాశంపై బైతుల్ మామూర్ అని ఉంది. ఇక్కడ మనకు భూమి మీద మక్కాలో కాబా ఎలా ఉంది, బైతుల్లాహ్, అక్కడ బైతుల్ మామూర్ అని ఉంది. ప్రతీ రోజు అందులో 70,000 దైవదూతలు నమాజ్ చేస్తారు. ఒకసారి నమాజ్ చేసిన దేవదూతకు మరోసారి అక్కడ నమాజ్ చేసే అవకాశం కలగదు.

ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన మూసా అలైహిస్సలాంను కూడా చూశారు. మూసా అలైహిస్సలాం ఎలా ఉన్నారు, ఈసా అలైహిస్సలాం ఎలా ఉన్నారో ఆ விவரం కూడా ప్రవక్త గారు చెప్పారు. ఇంకా నరకంపై ఒక దేవదూత ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అతని పేరు ఖురాన్‌లో మాలిక్ అని వచ్చి ఉంది. ప్రవక్త ఆయన్ని కూడా చూశారు, అతను ప్రవక్తకు సలాం కూడా చేశారు.

ఇదే ప్రయాణంలో ప్రవక్త గారు దజ్జాల్‌ను కూడా చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని దర్శించారు. ఆ స్వర్గంలో మంచి ముత్యాలు, పగడాలు, (హీరే, మోతీ అంటాం కదా) ముత్యాలు, పగడాలతో మంచి వారి యొక్క గృహాలు ఉన్నాయి. ఇంకా అక్కడి మట్టి కస్తూరి వంటి సువాసన ఉంటుంది. స్వర్గంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక చాలా పెద్ద హౌజ్ (సరస్సు), స్వర్గపు నీళ్లు దొరుకుతుంది, దాన్ని కౌసర్ అంటారు, దాన్ని కూడా ప్రవక్త గారు చూశారు.

ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతల ఏ సమూహం నుండి దాటినా వారందరూ “ఓ ప్రవక్తా, మీ అనుచరులకు చెప్పండి వారు కప్పింగ్ (హిజామా) చేయాలి” అని. అరబీలో హిజామా అంటారు, ఉర్దూలో పఛ్నా లగ్వానా, సీంగీ లగ్వానా అంటారు. ఇంగ్లీషులో కప్పింగ్ థెరపీ అంటారు. అంటే ఏంటి? శరీరంలో కొన్ని ప్రాంతాల్లో చెడు రక్తం అనేది ఉంటుంది. దానికి ప్రత్యేక నిపుణులు ఉంటారు, దాన్ని ఒక ప్రత్యేక పద్ధతితో తీస్తారు. ఇది కూడా ఒక రకమైన మంచి చికిత్స. దీనివల్ల ఎన్నో రోగాలకు నివారణ కలుగుతుంది.

ఇదే ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మంచి సువాసన పీల్చారు. ఇదేంటి సువాసన అని అడిగితే, ఫిరౌన్ కూతురుకు వెంట్రుకలను దువ్వెనతో దువ్వి వారి సేవ చేసే ఒక సేవకురాలు ఎవరైతే ఉండెనో, ఆమె, ఆమె సంతానం యొక్క ఇల్లు ఏదైతే ఉందో స్వర్గంలో, అక్కడి నుండి ఈ సువాసన వస్తుంది. ఆమె సంఘటన విన్నారు కదా ఇంతకుముందు? ఫిరౌన్ యొక్క కూతురికి ఒక ప్రత్యేక సేవకురాలు ఉండింది, ఆమె వెంట్రుకలను దువ్వడానికి. ఒకసారి చేతి నుండి దువ్వెన కింద పడిపోతుంది. బిస్మిల్లా అని ఎత్తుతుంది. ఫిరౌన్ కూతురు అడుగుతుంది, “ఎవరు అల్లాహ్? అంటే నా తండ్రియా, ఫిరౌనా?” ఆమె అంటుంది సేవకురాలు, “కాదు. నీ తండ్రికి మరియు నాకు ప్రభువు అయినటువంటి అల్లాహ్.” పోయి తండ్రికి చెప్తే, అతడు ఏం చేస్తాడు? ఒక చాలా పెద్ద డేగలో నూనె మసలబెట్టి, ఆమె పిల్లవాళ్ళను ముందు అందులో వేస్తాడు. తర్వాత ఆమెను కూడా అందులో వేసేస్తాడు. ఇలాంటి శిక్ష వారికి ఇవ్వబడుతుంది, కేవలం అల్లాహ్ ను విశ్వసించినందుకు. అయితే వారికి అల్లాహ్ త’ఆలా ఏదైతే గౌరవ స్థానం, గొప్ప గృహం ఇచ్చాడో స్వర్గంలో, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు.

హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంతో కలిసినప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చెప్పారు, “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ అనుచర సంఘానికి నా సలాం చెప్పండి. మరియు వారికి చెప్పండి, స్వర్గంలో ఉన్నటువంటి భూమి అది చాలా మంచి పంటనిస్తుంది. కానీ అక్కడ ఆ భూమి ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందులో విత్తనాలు వేయాల్సిన అవసరం ఉంది.” ఏంటి అని అడిగితే:

سُبْحَانَ اللَّهِ، وَالْحَمْدُ لِلَّهِ، وَلَا إِلَهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ
(సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్)
అల్లాహ్ పవిత్రుడు, సర్వ స్తోత్రాలు అల్లాహ్ కే, అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు మరియు అల్లాహ్ గొప్పవాడు.

అని చెప్పారు. మరొక హదీస్‌లో ఉంది:

لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ
(లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్)
పాపాల నుండి రక్షణ మరియు పుణ్యాలు చేసే శక్తి అల్లాహ్ ప్రసాదిస్తేనే లభిస్తాయి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకొందరిని చూశారు నరకంలో, అక్కడ వారికి గోర్లు ఇత్తడి, రాగితో ఉన్నాయి. వారి గోళ్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, రాగితో ఉన్నాయి. దాంతోనే వాళ్ళు తమకు తాము తమ ముఖాన్ని, తమ శరీరాన్ని ఇలా గీక్కుంటున్నారు. మొత్తం తోలంతా పడిపోతుంది. ఈ శిక్ష ఎవరికి జరుగుతుంది అని అడిగినప్పుడు జిబ్రీల్ చెప్పారు, ఎవరైతే ఇతరుల మాంసాన్ని తినేవారో మరియు వారి అవమానం చేసేవారో అలాంటి వారికి. మాంసం తినడం అంటే ఇక్కడ వారి యొక్క చాడీలు చెప్పడం. గీబత్, చుగ్లీ, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, ఇంకా ఇతరుల అవమానం చేయడం.

ఇంకొందరిని చూశారు ప్రవక్త గారు, అగ్ని కత్తెరలతో వారి యొక్క పెదవులను కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి శిక్ష అంటే, ఎవరైతే ఇతరులకు మంచి గురించి చెప్తుంటారో కానీ స్వయంగా దానిపై ఆచరించరో అలాంటి వారికి శిక్ష జరుగుతుంది.

మరియు హజ్రత్ అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు గారు “సిద్దీఖ్” అన్న బిరుదు ఏదైతే పొందారో, ఇదే ప్రయాణం తర్వాత పొందారు. సోదరులారా, ఈ విధంగా ప్రవక్త గారికి ఈ గగన ప్రయాణంలో ఏ ఏ విషయాలను దర్శించారో, వాటి కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సహీ హదీసుల ఆధారంగానే ఉన్నవి. పోతే ఇందులో ప్రత్యేకంగా నమాజ్ యొక్క విషయం, సూరహ్ బఖరాలోని చివరి రెండు ఆయతుల విషయం, సుబ్ హా నల్లాహ్, వల్ హందులిల్లాహ్, వ లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ లాంటివన్నీ విషయాలు మనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ మీకు, మాకు మనందరికీ సద్భాగ్యం ప్రసాదించు గాక. అల్లాహ్ దయ కలిగితే మరెప్పుడైనా దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=8783

హజ్ పద్దతి, విధానం – طريقة الحج [వీడియో]

బిస్మిల్లాహ్

[44 నిముషాలు]

వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఫారెనర్స్ ఇస్లామిక్ గైడెన్స్ ఆఫీసు, జుల్ఫీ, సౌదీ అరేబియా


ఇతరములు: