కీడు (చెడు) యొక్క సృష్టి – హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ | నసీరుద్దీన్ జామిఈ

రచయిత: హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ (హఫిజహుల్లాహ్)
అనువాదం: నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

హాఫిజ్ అబ్దుల్ హసీబ్ ఉమ్రీ మదనీ రాసిన మరియు నసీరుద్దీన్ జామిఈ అనువదించిన ఒక వ్యాసంలో, మంచి చెడులతో సహా అన్ని వస్తువులకు సృష్టికర్త అల్లాహ్ యే అని వివరించబడింది, ఈ భావనకు ఖురాన్ మద్దతు ఇస్తుంది. సృష్టి వెనుక ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించడంలో విఫలం కావడం వల్లే ఈ నమ్మకం తరచుగా అపార్థానికి దారితీస్తుందని రచయిత పేర్కొన్నారు. చెడు అనేది దానికదే లేదా “సంపూర్ణ చెడు”గా సృష్టించబడలేదని, బదులుగా అది మానవాళికి పెట్టే అల్లాహ్ పరీక్షలో ఒక ఉన్నత ప్రయోజనం కోసం పనిచేస్తుందని ఈ రచన స్పష్టం చేస్తుంది. ఈ ప్రపంచం ఒక పరీక్షా స్థలం, ఇక్కడ పరీక్షకు అర్థం ఉండాలంటే స్వేచ్ఛా సంకల్పం చాలా అవసరం. ఈ స్వేచ్ఛ అల్లాహ్ యొక్క పరిపూర్ణ న్యాయం ద్వారా సమతుల్యం చేయబడింది, ప్రతి వ్యక్తి తన చర్యలకు ఈ లోకంలో గానీ లేదా పరలోకంలో గానీ జవాబుదారీగా ఉంటాడని ఇది నిర్ధారిస్తుంది. మానవ జ్ఞానం యొక్క పరిమితులను అంగీకరిస్తూ, అల్లాహ్ పరిపూర్ణ న్యాయం మరియు జ్ఞానంపై విశ్వాసం, అలాగే పరలోకంపై నమ్మకం, చెడు యొక్క ఉనికిని కూడా కలిగి ఉన్న అల్లహ్ విధి (తక్దీర్) అల్లాహ్ యొక్క సంపూర్ణ శక్తికి మరియు గొప్పతనానికి నిదర్శనమని అర్థం చేసుకోవడానికి అవసరమని రచయిత ముగించారు.

మేలు (మంచి) లాగే కీడు (చెడు) కు కూడా సృష్టికర్త అల్లాహ్ యే.

{اللَّهُ خَالِقُ كُلِّ شَيْءٍ}
(అల్లాహ్ ప్రతి వస్తువుకూ సృష్టికర్త). [అల్-జుమర్ 39:62]

అది ఇబ్లీస్ (షైతాన్) అయినా, వాడి దుశ్చర్యలైనా లేదా దాసుల చెడ్డ పనులైనా సరే, ఈ విశ్వంలో ప్రతిదీ అల్లాహ్ అనుమతితోనే జరుగుతుంది. అసలు సృణులను (జీవరాశులను) మరియు వారి కర్మలను సృష్టించింది కూడా అల్లాహ్ యే. (సూర సాఫ్ఫాత్ 37:96).

وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
“మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించిన వాడు అల్లాహ్‌యే కదా!” (సూర సాఫ్ఫాత్ 37:96).

ఈ సమస్య తరచుగా నాస్తికులలో, ఆ మాటకొస్తే చాలా మంది ముస్లింలలో కూడా అల్లాహ్ పట్ల అపార్థానికి (దురభిప్రాయానికి) కారణమవుతోంది. దీనికి ప్రధాన కారణం ఈ సృష్టి వెనుక దాగి ఉన్న అల్లాహ్ జ్ఞానాన్ని (హిక్మత్) గ్రహించలేకపోవడం లేదా మనుషుల అల్పజ్ఞానం మరియు అజ్ఞానం.

ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విషయం స్పష్టమవుతుంది:

అల్లాహు తఆలా కీడును (చెడును) సృష్టించాడు మరియు సృష్టిస్తూనే ఉంటాడు, అయితే వీటిలో ఏ కీడు కూడా “పూర్తిగా కీడు” (షర్రె మహజ్ / Pure Evil) కాదు.

కీడు అనేది స్వతహాగా ఉద్దేశించబడినది కాదు, బదులుగా కీడు యొక్క సృష్టి “మరొక ప్రయోజనం కోసం” (మక్సూద్ లి-గైరిహి) చేయబడింది.

దీనినే ఇలా కూడా అంటారు:
“కీడు అనేది అల్లాహ్ యొక్క చర్యలలో (అఫ్ ఆల్) లేదు, అది ఆయన సృష్టించిన ఫలితాలలో (వస్తువులలో) ఉంది.”

అందుకే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు:

«وَالْخَيْرُ كُلُّهُ فِي يَدَيْكَ، وَالشَّرُّ لَيْسَ إِلَيْكَ»
(మేలు అంతా నీ చేతుల్లోనే ఉంది, మరియు కీడు నీ వైపు ఆపాదించబడదు). [సహీహ్ ముస్లిం: 771]

ఈ విశ్వం ఒక పరీక్షా కేంద్రం (దారుల్ ఇమ్ తిహాన్). ఇక్కడ ఇబ్లీస్ నుండి ఆదమ్ సంతానం వరకు అందరికీ స్వేచ్ఛ ఇవ్వబడింది ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరగాలి కాబట్టి. ఈ స్వేచ్ఛ (మినహాయింపు) లేకపోతే ఇక పరీక్ష ఏముంది?

{فَمَن شَاءَ فَلْيُؤْمِن وَمَن شَاءَ فَلْيَكْفُرْ}
(కాబట్టి కోరినవాడు విశ్వసించవచ్చు మరియు కోరినవాడు తిరస్కరించవచ్చు). [అల్-కహఫ్: 29]

అయితే అల్లాహు తఆలా యొక్క పరిపూర్ణ న్యాయం ఏమిటంటే ఆయన ప్రతి అణువుకు లెక్క తీసుకుంటాడు. అందుకే పై ఆయతులోని తర్వాత భాగం చదవండి:

{إِنَّا أَعْتَدْنَا لِلظَّالِمِينَ نَارًا أَحَاطَ بِهِمْ سُرَادِقُهَا}
(నిశ్చయంగా మేము (తిరస్కరించిన) దుర్మార్గుల కోసం నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాము, దాని మంటలు వారిని చుట్టుముడతాయి). [అల్-కహఫ్: 29]

మరియు ఇంకా ఇలా కూడా అన్నాడు:

{وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ}
(మరియు ఎవరైతే ఒక అణువంత కీడు చేస్తారో, వారు దానిని [దాని ఫలితాన్ని] చూసుకుంటారు). [అల్-జల్ జలా: 8]

ప్రతి చెడ్డ మనిషి తన చెడును మరియు ప్రతి దుర్మార్గుడు తన పర్యవసానాన్ని తప్పక చూడాల్సిందే. అది ఈ ప్రపంచంలో కర్మఫలం రూపంలోనైనా లేదా పరలోకంలో నరకం రూపంలోనైనా సరే.

పరలోకంపై నమ్మకం లేకుండా, కీడు సృష్టి వెనుక ఉన్న సర్వలోక ప్రభువు (రబ్బుల్ ఆలమీన్) యొక్క వివేకాన్ని (హిక్మత్) మరియు ఆయన న్యాయాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం.

పైన చెప్పబడిన విషయాలు కూడా మనిషికి ఇవ్వబడిన పరిమిత జ్ఞానం వెలుగులోనే ఉన్నాయి. లేకపోతే అల్లాహు తఆలా యొక్క అన్ని పనుల వెనుక ఉన్న పూర్తి వివేకాన్ని గ్రహించడం మనిషి సామర్థ్యానికి మించిన పని.

{وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِّنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ}
(మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానంలోని ఏ విషయాన్నీ వారు గ్రహించలేరు). [అల్-బఖరా: 255]

అయితే మనిషికి ఈ రెండు కచ్చితమైన సత్యాలు చెప్పబడ్డాయి:

  1. ఒకటి: {وَلَا يَظْلِمُ رَبُّكَ أَحَدًا}
    (మరియు నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు). [అల్-కహఫ్: 49]
  2. రెండు: {وَمَا رَبُّكَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ}
    (మరియు నీ ప్రభువు దాసులకు అన్యాయం చేసేవాడు కాడు). [ఫుస్సిలాత్: 46]

    మరియు ఇది కూడా:

    {إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ}
    (నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, సర్వజ్ఞుడు). [అల్-అన్ ఆమ్: 83]

ఈ కొన్ని వాస్తవాలను మనిషి పద్ధతిగా అర్థం చేసుకుంటే సందేహాలు తొలగిపోతాయి, పైగా అవి విశ్వాసం (ఈమాన్) పెరగడానికి కారణమవుతాయి.

వాస్తవం ఏమిటంటే, సృష్టి లాగే, ఇంకా చెప్పాలంటే అంతకంటే గొప్పగా విధి (తక్దీర్) కూడా (దీనిలో ఒక భాగం లేదా అంశం కీడు యొక్క సృష్టి కూడా) సర్వలోక ప్రభువు యొక్క అద్భుత కళాఖండం. ఇది ఆయన ఉనికికి మించి, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన పరిపూర్ణ అధికారాన్ని మరియు ఆయన పరిపూర్ణ న్యాయాన్ని తెలిపే చాలా గొప్ప నిదర్శనం.

అల్లాహ్ (త’ఆలా) – మెయిన్ పేజీ
https://teluguislam.net/allah/

ప్రవక్త మూసా (అలైహిస్సలాం) & మార్గదర్శి ఖిజర్ (అలైహిస్సలాం) – ఖురాన్ కథామాలిక

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

فَانطَلَقَا حَتَّىٰ إِذَا رَكِبَا فِي السَّفِينَةِ خَرَقَهَا ۖ قَالَ أَخَرَقْتَهَا لِتُغْرِقَ أَهْلَهَا لَقَدْ جِئْتَ شَيْئًا إِمْرًا

మూసా, ఖిజర్ లు బయలు దేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగుల గొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరి ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు. (సూరా అల్ కహఫ్ 18: 71)

ఒ క రోజు, మూసా (అలైహిస్సలాం) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే ఒక ప్రభావవంతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం వారిపై తీవ్రమైన ప్రభావం వేసింది. ప్రజల్లో ఒక వ్యక్తి, “దైవప్రవక్తా! భూమిపై మీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. అల్లాహ్ తనకు మహత్యాలు ప్రదర్శించే శక్తి ఇచ్చాడు, తౌరాత్ గ్రంథాన్ని ప్రసాదించాడు కాబట్టి తానే అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలిగిన వాడినని భావిస్తూ మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తితో, “లేడు” అని జవాబిచ్చారు. కాని తెలుసుకోవలసినదంతా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరని, సంపూర్ణ జ్ఞానానికి ఒకే దైవప్రవక్త కేంద్రం కావడం కూడా జరగదని, ఒక వ్యక్తికి తెలియని విషయాలు తెలిసిన మరో వ్యక్తి ఎల్లప్పుడు ఉంటాడని అల్లాహ్ ఆయనకు తెలియజేశాడు. అప్పుడు మూసా (అలైహిస్సలాం) అల్లాహ్ తో, “ప్రభూ! ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు? నేను ఆయన్ను కలుసుకుని ఆయన నుంచి విద్య నేర్చు కోవాలని భావిస్తున్నాను” అన్నారు. ఆ వ్యక్తిని గుర్తించడానికి గుర్తు చెప్పమని కూడా అల్లాహ్ ను కోరారు.

అల్లాహ్ ఆయనకు మార్గం చూపుతూ, నీటితో నిండిన ఒక పాత్రలో ఓ చేపను తీసుకుని బయలుదేరాలని, ఆ చేప పాత్ర నుంచి మాయమైన ప్రదేశంలో ఆ వ్యక్తి కనబడతాడని చెప్పాడు. మూసా (అలైహిస్సలాం) ఆ వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆయన వెంట ఒక అనుచరుడు చేపవున్న నీటిపాత్రను పట్టుకుని రాసాగాడు. వారిద్దరు రెండు నదులు కలసిన సంగమ ప్రదేశానికి చేరు కున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకోవాలని భావించారు. మూసా (అలైహిస్సలాం) అక్కడ నిద్రలోకి జారుకున్నారు.

ఆయన నిద్రపోతున్నప్పుడు, నీటి పాత్రలోని చేప ఎగిరి నదిలో దూకడాన్ని ఆయన అనుచరుడు చూశాడు. కాని అతడు ఈ సంఘటన గురించి మూసా (అలైహిస్సలాం)కు చెప్పడం మరచిపోయాడు. మూసా (అలైహిస్సలాం) లేచిన తర్వాత ఇద్దరూ ప్రయాణం కొనసాగించారు. వారు బాగా అలసిపోయారు, చాలా ఆకలితో ఉన్నారు. మూసా(అలైహిస్సలాం) తన అనుచరునితో ఆహారం గురించి అడిగారు. అప్పుడు అనుచరునికి నీటి పాత్రలోని చేప నదిలో దూకి వెళ్ళిపోయిన విషయం గుర్తుకువచ్చింది. ఆ విషయాన్ని మూసా (అలైహిస్సలాం)కు తెలియజేశాడు. మూసా (అలైహిస్సలాం), “అర్రర్రె.. మనం వెదుకుతున్న ప్రదేశం అదే” అన్నారు. వారు త్వరత్వరగా వెనక్కి వచ్చారు. రెండు నదులు కలసిన ప్రదేశానికి, చేప నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ముఖం సగ భాగాన్ని ఒక వస్త్రం కప్పిఉంది. ఆయనే ఖిజర్ (అలైహిస్సలాం)… మార్గదర్శి!

మూసా (అలైహిస్సలాం) ఆయనకు అభివాదం చేశారు. “అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక!)” అన్నారు. ఆ వ్యక్తి తన ముఖంపై ఉన్న వస్త్రాన్ని తప్పించి వారిని చూశారు. “మీరు నాకు శాంతి కలగాలని అభివాదం చేశారు. కాని ఈ దేశంలో శాంతి ఉందా? అసలు మీరెవరు?” అని ప్రశ్నించారు. మూసా (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను ఇస్రాయీల్ వారి ప్రవక్తను” అన్నారు. ఆ వ్యక్తి తిరిగి, “మీకు బోధనలు ఎవరు చేశారు? ఎవరు మిమ్మల్ని ఇక్కడకు పంపించారు?” అనడిగారు. మూసా (అలైహిస్సలాం) జరిగిన విషయాన్ని ఆయనకు వివరించారు. చాలా మర్యాదగా, “నేను మీతో రావచ్చా.. ఆ విధంగా మీరు మీ వద్ద ఉన్న జ్ఞానాన్ని నాకు బోధించగలరు. మిమ్మల్ని కలవడానికి నేను చాలా ప్రయాసపడి ఇక్కడకు వచ్చాను. నేను మీకు అవిధేయత చూపను” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు జవాబిస్తూ, “మీరు నన్ను భరిస్తారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అనేక విచిత్రమైన విషయాలను చూడవచ్చు. చాలా విచిత్రమైన వాటిని చూసి మీరు నన్ను విమర్శించకుండా ఉండలేరు. ఎందుకంటే మీ అవగాహన పరిమితమైనది. అందువల్ల మీరు వాదనకు దిగుతారు” అన్నారు. మూసా (అలైహిస్సలాం) చాలా నిజాయితీగా, “అల్లాహ్ తలిస్తే… నేను సహనంతో ఉంటాను. మీ పట్ల అవిధేయత చూపను” అన్నారు. చివరకు ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంట తీసుకువెళ్లడానికి అంగీకరిస్తూ ఒక షరతు పెట్టారు. తాను ఏం చేసినా ప్రశ్నించరాదని అన్నారు. మూసా (అలైహిస్సలాం) తన అనుచరుడిని వెనక్కు పంపి తాను ఖిజర్ (అలైహిస్సలాం)తో పాటు బయలుదేరారు.

వారు ఒక నది వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఒక పడవలోకి ఎక్కారు. ఆ పడవ యజమాని వారిద్దరి పట్ల ఒక విధమైన అభిమానాన్ని చూపించాడు. వారిద్దరిని అభిమానంగా పడవలోకి ఆహ్వానించాడు. పడవలోకి ఎక్కిన తర్వాత ఖిజర్ (అలైహిస్సలాం) చాలా వింతగా వ్యవహరించారు. పడవ ప్రక్కల బిగించి ఉన్న కొన్ని చెక్కలను పీకిపారేశారు. దాని వల్ల పడవకు ఒకవైపు పెద్ద రంధ్రంలా ఏర్పడింది. ఈ విచిత్ర ప్రవర్తనను చూసి నిర్ఘాంతపోయిన మూసా (అలైహిస్సలాం), “అరె, ఎందుకు పడవను నాశనం చేస్తున్నారు? మన పట్ల అభిమానంగా ఆహ్వానించిన పడవ యజమానికి ఇదా మనం ఇచ్చే ప్రతిఫలం? పైగా మనమంతా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని మీరు గ్రహించడం లేదా? మీరు చేసిన పని చాలా అనుచితమైనది” అన్నారు.

ఖిజర్ (అలైహిస్సలాం) ఆయనకు తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. మూసా (అలైహిస్సలాం)కు వెంటనే తాను చేసిన పొరపాటు గుర్తుకువచ్చింది. ఆయన్ను క్షమాపణలు కోరుకున్నారు. “నా మతిమరుపుకు కోపం తెచ్చుకోవద్దు, నా బలహీనత విషయంలో కఠినంగా వ్యవహరించవద్దు. మీతో రాకుండా నివారించవద్దు. నేను నా మాటకు కట్టుబడి ఉండడానికి ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తాను” అన్నారు. అందుకు అంగీకరించి ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను వెంటతీసుకుని బయలుదేరారు.

దారిలో వారికి ఒక పిల్లవాడు తన మిత్రులతో ఆడుకుంటూ కనబడ్డాడు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆ పిల్లవాడిని మిత్రబృందం నుంచి వేరు చేసి ఒక ప్రక్కకు తీసుకు వెళ్ళి హతమార్చారు. ఈ అఘాయిత్యం చూసి మూసా (అలైహిస్సలాం) నిర్ఘాంతపోయారు. “మీరు ఒక అమాయక పిల్లవాడిని చంపేశారు. ఇది నిజంగా అమానుషం” అని అరిచారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన వైపు తీక్షణంగా చూసి తమ మధ్య కుదిరిన అంగీకారాన్ని గుర్తుచేశారు. తన పనులను మరోసారి ప్రశ్నిస్తే ఇక తనతో రావడం ఉండదని హెచ్చరించారు. మూసా (అలైహిస్సలాం) మళ్ళీ క్షమాపణ కోరుకున్నారు. “నేను మరోసారి ఈ పొరపాటు చేస్తే నన్ను మీ వెంట రాకుండా చేయండి” అన్నారు. ఖిజర్ (అలైహిస్సలాం) ఆయన్ను మన్నించారు.

వారిద్దరు ఒక గ్రామానికి చేరుకున్నారు. అక్కడి గ్రామస్తులతో వారు ఆశ్రయాన్ని, ఆహారాన్ని కోరారు. కాని పిసినారి ప్రజలు వారికి ఏదీ ఇవ్వలేదు. అందువల్ల వాళ్ళిద్దరూ అలాగే ప్రయాణం కొనసాగించవలసి వచ్చింది. వారిద్దరూ వెడుతున్నప్పుడు ఒక చోట ఒక గోడ కూలడానికి సిద్ధంగా ఉండడాన్ని వాళ్ళు చూశారు. వెంటనే ఖిజర్ (అలైహిస్సలాం) ఆ గోడను మరమ్మత్తు చేయడానికి పూను కున్నారు. ఇది చూసిన మూసా (అలైహిస్సలాం) ఉండబట్టలేక, “మీరు భలే విచిత్రమైన మనిషి. ఈ స్వార్థపరుల పట్ల మీరు సానుభూతి చూపుతున్నారు. పైగా మీరు చేస్తున్న కష్టానికి ప్రతిఫలం కూడా కోరడం లేదు. మనం చేసిన కష్టానికి వారి నుంచి ప్రతిఫలం తీసుకుని మన ప్రయాణానికి కొద్దిగా ఆహారాన్ని సమకూర్చుకో గలిగే వాళ్ళం” అన్నారు. తన పనులకు తగిన వివరణ ఇచ్చే వరకు వాటిని మూసా (అలైహిస్సలాం) భరించలేరని ఖిజర్ (అలైహిస్సలాం)కు అర్థమయ్యింది. “ఇక చాలు… ఇక మనం ఎవరి దారి వారు వేరవ్వడం మంచిది. మీకు సహనం లేదు. అయితే మనం వేరయ్యే ముందు నేను చేసిన పనులకు కారణాలు వివరిస్తాను” అన్నారు. మూసా సిగ్గుపడుతూ తల వంచుకున్నారు.

1. నేను నష్టపరచిన పడవను కిరాయికి నడుపుకుని ఆ పడవ యజమాని, అతని భార్య బ్రతుకుతున్నారు. నేను ఆ పడవను ఎందుకు నష్టపరిచానంటే, వారి రాజు పడవలను స్వాధీనం చేసుకుని పెద్ద నౌకాదళాన్ని తయారు చేయాలని చూస్తున్నాడు. ఈ పడవను నష్టపరచడం వల్ల దీన్ని చూసినా కూడా పనికిరానిదిగా భావించి రాజు దాన్ని వదలివేస్తాడు. మూసా! నేను చేసిన పని చూడడానికి బాధ్యత లేని పనిగా కనబడినా… నేను నిజానికి ఆ పడవను కాపాడడానికి, పడవ యజమానిపై సానుభూతితో చేసిన పని.

2. నేను చంపిన పిల్లవాడి తల్లిదండ్రులు నిజమైన విశ్వాసులు. కాని ఆ పిల్లవాడిలో ఉన్న దుర్మార్గం గురించి నాకు తెలిసింది. కన్నకొడుకు కాబట్టి ఆ తల్లి దండ్రులు అతడి దుర్మార్గాన్ని భరిస్తారు. కాని, చివరకు వాడి దుర్మార్గాలు ఆ తల్లిదండ్రులను కూడా ప్రభావితం చేస్తాయని నేను గ్రహించాను. అతడిని చంపి నేను వారి విశ్వాసాన్ని కాపాడాను. అల్లాహ్ వారికి మంచి సంతానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

3. నేను ఆ గోడను నిర్మించినది స్వార్థపరులైన గ్రామస్తుల కోసం కాదు, ఆ గోడ ఇద్దరు అనాధలైన బాలలది. ఆ గోడ క్రింద గుప్తనిధి ఉందని అల్లాహ్ నాకు తెలియజేశాడు. ఆ పిల్లల తండ్రి పుణ్యాత్ముడు, దానధర్మాలు చేసేవాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆ గుప్తనిధి రహస్యంగా ఉండడం చాలా అవసరం. వారు పెద్దయిన తర్వాత అల్లాహ్ వారికి ఆ నిధిని చూపిస్తాడు. ఆ గోడ పడిపోతే స్వార్థపరులైన గ్రామస్తులు ఆ నిధిని దోచుకుంటారు. కాబట్టి నేను చేసిన ప్రతీ పని నా ప్రభువు కారుణ్యం వల్ల చేసిన పని. నేను ఏ పనీ నా స్వంతంగా చేయలేదు. ఈ మాటలు చెప్పి ఖిజర్ (అలైహిస్సలాం) వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

(చదవండి దివ్యఖుర్ఆన్: 18:60-82)

జ్ఞానం పొందిన వ్యక్తి తానొక్కడే కాదన్న విషయం తెలిసిన వెంటనే మూసా (అలైహిస్సలాం) మరింత జ్ఞానం సంపాదించడానికి కష్టసాధ్యమైన ప్రయాణానికి పూనుకున్నారు. జ్ఞానం సులభసాధ్యంగా లభించేది కాదు. జీవితంలో విజయం సాధించాలంటే మనిషి కష్టపడి పనిచేయవలసి ఉంటుంది.

అల్లాహ్ ఆదేశాల మర్మాలన్నింటినీ మనం అర్థం చేసుకోలేము. మనకు తప్పుగా కనబడుతున్న విషయం నిజానికి ఒక అనుగ్రహం కావచ్చు. “తాను చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు”.

సూరతుల్ కహఫ్ తఫ్సీర్: ఆయతులు 60 – 82 : మూసా & ఖిజరు యొక్క వృత్తాంతము [5 వీడియోలు]
https://teluguislam.net/2020/12/26/tafseer-suratul-kahf-18/

సూరతుల్ కహఫ్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) – మెయిన్ పేజీ. (అన్నీ పాఠాల కోసం)
https://teluguislam.net/tafsir-kahf/

ఖురాన్ మెయిన్ పేజీ
https://teluguislam.net/quran