సూరహ్ అల్ మసద్ (అల్ లహబ్), ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్ [వీడియో & టెక్స్ట్]

బిస్మిల్లాహ్

సూరహ్ మసద్ , ప్రతీ పదానికి అర్ధ భావాలు & తఫ్సీర్
https://youtu.be/uisEvhOnq3M [40 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో, వక్త ఖురాన్‌లోని 111వ అధ్యాయమైన సూరతుల్ మసద్ (దీనిని సూరతుల్ లహబ్ అని కూడా అంటారు) యొక్క వివరణాత్మక తఫ్సీర్‌ను అందిస్తారు. పదాల వారీగా అర్థాలను వివరించడంతో ప్రారంభించి, సూరా యొక్క పూర్తి అనువాదాన్ని అందిస్తారు. అబూ లహబ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పినతండ్రి, ఇస్లాం పట్ల తీవ్రమైన శత్రుత్వం వహించిన తీరును మరియు సఫా పర్వతంపై జరిగిన సంఘటన తర్వాత ఈ సూరా అవతరించిన సందర్భాన్ని వివరిస్తారు. అబూ లహబ్ మరియు అతని భార్య ఉమ్మె జమీల్ యొక్క గర్వం, వారి సంపద, మరియు వారు ఎదుర్కొన్న భయంకరమైన పర్యవసానాలను చారిత్రక ఆధారాలతో వివరిస్తారు. సత్యానికి మరియు ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వారికి, వారి సంపద, హోదా లేదా బంధుత్వం ఎలాంటి సహాయం చేయలేవని ఈ సూరా నుండి నేర్చుకోవలసిన గుణపాఠాలను వక్త నొక్కి చెబుతారు.

అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహ్ వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బా’ద అమ్మా బా’ద్.

సూరతుల్ మసద్, ఇది ఖుర్ఆన్ క్రమంలో 111వ సూరా. దీనికంటే ముందు సూరతున్నస్ర్ 110వ సూరా ఉంది, దీని తర్వాత సూరతుల్ ఇఖ్లాస్ 112వ సూరా.

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]
అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి, వాడు సైతం నాశనమైపోయాడు.

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
వాడి ధనం గానీ, వాడి సంపాదన గానీ వాడికి ఏ మాత్రం పనికిరాలేదు.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
త్వరలోనే వాడు భగభగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు.

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
[వమ్ర అతుహు హమ్మాలతల్ హతబ్]
ఇంకా అతని భార్య, పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది.

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఆమె మెడలో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, ముందు ముఖ్యమైన పదాల భావం, అర్థం తెలుసుకొని ఆ తర్వాత సరళమైన, సులభ భాషలో మనం అనువాదం తెలుసుకుందాము, ఆ తర్వాత దాని యొక్క వ్యాఖ్యానంలోకి వెళ్దాం.

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]
అబూ లహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి, వాడు సైతం నాశనమైపోయాడు.

تَبَّتْ
[తబ్బత్]
విరిగిపోయాయి / నష్టంలో పడిపోయాయి / నాశనమైపోయాయి

يَدَا
[యదా]
రెండు చేతులు

أَبِي لَهَبٍ
[అబీ లహబ్]
ఇది ఒక వ్యక్తి గురించి సూచిస్తుంది, అబూ లహబ్. అతను ఎవరు, ఏంటి విషయం తర్వాత తెలుసుకుందాము.

وَتَبَّ
[వతబ్]
వ అంటే మరియు, తబ్బ్ అంటే అతను నాశనమైపోయాడు.

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
మా అగ్నా – పనికిరాలేదు / ప్రయోజనం కలుగజేయలేదు. అన్హు – అతనికి. మాలుహు – అతని సంపద / అతని యొక్క ధనం. వమా కసబ్ – మరియు అతను సంపాదించినది.

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
సయస్లా – అతడు సమీపంలోనే ప్రవేశిస్తాడు. యస్లా అంటే ప్రవేశిస్తాడు. స అనే అక్షరం ఏదైతే వచ్చిందో, సమీపంలోనే, అతిదగ్గరలోనే అని అర్థం. నారన్ – అగ్నిలో. జాత లహబ్ – భగభగ మండేది.

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
[వమ్ర అతుహు హమ్మాలతల్ హతబ్]
వమ్ర అతుహు – మరియు అతని యొక్క భార్య. హమ్మాలతల్ హతబ్ – హమ్మాల్, సర్వసాధారణంగా మన ఏరియాలో స్టేషన్లలో, బస్టాండ్లలో ఈ పదం ఉపయోగపడుతుంది, కూలీలు అని హమ్మాల్ అని సామాన్లు మోసేవారు. హమ్మాలత్ – మోసుకుంటూ ఉండేది. అల్ హతబ్ – పుల్లలు, కట్టెలు.

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ
[ఫీ జీదిహా హబ్లుమ్ మిమ్ మసద్]
ఫీ జీదిహా – ఆమె మెడలో. హబ్లున్ – తాడు. మిమ్ మసద్ – మసద్ అంటే పేనినది, గట్టిగా దానిని పేని ఉంటుంది కదా, దానిని అంటారు.

అల్లాహ్ దయవల్ల మనం పదాల యొక్క విడివిడి భావం, అర్థం తెలుసుకున్నాము. ఇక ఒకసారి మనం సరళమైన, సులభకర భాషలో దీని యొక్క అనువాదం విని, ఆ తర్వాత వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, దీనికంటే ముందు ఖురాన్ క్రమంలో 110వ సూరా సూరతున్నస్ర్ ఉంది అని ఇంతకు ముందే నేను చెప్పాను. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏ విజయం, గొప్ప సహాయం అండజేశాడో దాని శుభవార్త ఉంది. కానీ వెంటనే 111వ ఈ సూరాలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మానికి విరోధులు ఎవరైతే ఉన్నారో, వారికి ఏ గతి పట్టిందో, ఇంకా ఎవరైతే ఇలాంటి విరోధంలో ఉంటారో, వారికి ఎలాంటి గతి పడుతుందో అది చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు ఏమి తెలుస్తుంది? సూరత్ లహబ్, సూరత్ మసద్ లేదా సూరత్ తబ్బత్ ఈ మూడు పేర్లతో ఈ సూరా ప్రఖ్యాతి గాంచి ఉంది.

ఖురాన్ లో ఎవరి పేరు అయినా తీసుకొని, అతడి నాశనం గురించి, అతడు నరకవాసి అని చెప్పబడిన ఏదైనా సూరా ఉంటే, ఈ ఒక్క సూరా మాత్రమే. ఇక మీరు గమనించండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ శత్రువుని పేరు తీసుకొని ఒక సూరా పేరు పెట్టి, ఒక ముకమ్మల్, సంపూర్ణ సూరా అల్లాహ్ అవతరింపజేశాడు అంటే, అతడు ఎంతటి విరోధానికి, శత్రుత్వానికి, కపటత్వానికి పూనుకొని ఉండెనో మనం అర్థం చేసుకోవచ్చు.

అలాగే, దీని ద్వారా మనం తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి సత్య ధర్మాన్ని అనుసరించకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్య ధర్మాన్ని నమ్మకుండా, ఆచరించకుండా, అందులో పుల్లలు వెతికేవాడు, దానికి విరోధం, కపటత్వం, శత్రుత్వం వహించేవాడు, దానికి విరుద్ధంగా ప్రయత్నాలు చేసేవాడు, తాను ఎంత డబ్బు, ధనం గలవాడైనా, ఎంతటి హోదా, అంతస్తు ఉన్నవాడైనా, ఇహలోకంలో అతనికి ఎంతటి పెద్ద స్థానం, పరపతి మరియు అతనికి ఎంత అతని యొక్క ఫాలోవర్స్ ఉన్నా గానీ, అతడు ఇస్లాంకు విరుద్ధంగా ఏదైతే వెళుతున్నాడో, దానికి కారణంగా అతనిపై వచ్చిపడే శిక్ష ఏదైతే ఉందో, ఆ శిక్ష నుండి అతన్ని తప్పించడానికి అతని ఏ ధనము పనికిరాదు, అతని ఏ సంపద పనికిరాదు, అతనికి ప్రజలో ఉన్నటువంటి పెద్ద హోదా, అంతస్తు ఏదీ కూడా పనికిరాదు, అతడు సర్వనాశనమైపోతాడు అన్నటువంటి హెచ్చరిక మనకు ఈ సూరాలో కనబడుతుంది.

ఇక రండి,

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ
[తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్]

ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ చెప్పినట్లు, ‘తబ్బత్ యదా అబీ లహబ్’ ఇది బద్వా (ఒక శాపం). ‘వతబ్’ ఇది ఒక సమాచారం. మొదటి పదంలో బద్వా ఉంది, శాపం ఉంది. రెండవ చిన్న పదం ‘వతబ్’ అందులో ఒక విషయం తెలియజేయబడుతుంది.

అయితే ఈ సూరాలో అబూ లహబ్ అని ఏదైతే ప్రస్తావన వచ్చిందో, ఎవడు అతడు? షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఈ సూరా ఇస్లాం సత్య ధర్మం అనడానికి, ఖురాన్ అల్లాహ్ వైపు నుండి వచ్చిన, ప్రళయం వరకు పొల్లుపోకుండా ఏ అక్షరంలో మార్పు లేకుండా సురక్షితంగా ఉంది అనడానికి ఒక గొప్ప మహిమ ఈ సూరా. ఈ విషయం ఇమాం ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ కూడా ప్రస్తావించారు.

అయితే షేఖ్ ఇబ్ను ఉథైమీన్ చెప్పారు, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి ముందే చనిపోయారు, మనందరికీ తెలిసిన విషయం. అయితే ప్రవక్త వారికి తొమ్మిది మంది బాబాయిలు – పెత్తండ్రులు, పినతండ్రులు. అర్థమైంది కదా? ప్రవక్త తండ్రి యొక్క సోదరులు తొమ్మిది మంది, ఎందుకంటే తాత అబ్దుల్ ముత్తలిబ్ కి పది మంది సంతానం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ అంకుల్స్, తండ్రి యొక్క సోదరుల్లో ఇస్లాం దృష్టిలో చూస్తే, మూడు రకాల వారు ఉన్నారు. షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లాహ్ చెప్తున్న మాట ఇది. పినతండ్రులు, పెత్తండ్రుల్లో మూడు రకాల వారు ఉన్నారు. ఒకరు ఎవరు? సంపూర్ణంగా ప్రవక్త వారికి సహాయం అందించారు, ఇస్లాం స్వీకరించారు. ఎవరు? హమ్జా మరియు అబ్బాస్ రదియల్లాహు అన్హుమ్. రెండో రకమైన వారు, ఇస్లాం స్వీకరించలేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంపూర్ణంగా సహాయపడ్డారు. ఎవరు? అబూ తాలిబ్. చివరి వరకు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ప్రయత్నం చేశారు. ఆయన కనీసం ఒక్కసారి మరణానికంటే ముందు, ఒక్కసారైనా కలిమా చదవాలి అని, కానీ చివరి పలుకులు అతనివి, “అలా మిల్లతి అబ్దిల్ ముత్తలిబ్” – నేను నా తాత ముత్తాతల ధర్మం పైనే ఉన్నాను అన్నట్లుగా చెప్పాడు. మూడో వారు ఎవరు? బద్ధ శత్రువుగా తేలాడు. అతడే ఈ అబూ లహబ్. అతని ప్రస్తావనే ఈ సూరాలో ఉంది.

సోదర మహాశయులారా, సోదరీమణులారా, అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సొంత బాబాయి అయినప్పటికీ, ఆ కాలంలో అరబ్బులు షిర్క్, కుఫ్ర్, బిద్అత్ ఇంకా ఎన్నో రకాల చెడుల్లో ఉన్నప్పటికీ, ఒక మంచి గుణం వారిలో ఏముండింది అంటే బంధుత్వాన్ని కాపాడుకునేవారు. బంధుత్వాన్ని తెంచుకునే వారు కాదు. బంధుత్వాన్ని కాపాడుకోవడం, బంధువులకు సహాయంగా నిలబడడం ఒక గొప్ప, ఉత్తమ గుణంగా భావించేవారు. అందుకే మనం చూస్తున్నాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రలో, ఇస్లాం ప్రచారం మొదలుపెట్టిన తర్వాత సుమారు ఒక ఏడు సంవత్సరాలు, ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? సామాజిక బహిష్కరణ (బాయ్‌కాట్) చేయడం జరుగుతుంది కదా? ముస్లింలు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించారో, ప్రవక్త మరియు ముస్లింలందరికీ వ్యతిరేకంగా ఒక సామాజిక బహిష్కరణ ఆనాటి కాలంలోని అవిశ్వాసులు, ముష్రికులు చేస్తారు. దానికి ఒక ఒప్పందం రాసుకొని కాబాలో కూడా పెడతారు. ఇళ్ల నుండి తరిమివేయడం జరుగుతుంది. వారు వెళ్లి గుట్టల్లో, కనుమల్లో శరణు తీసుకొని గడుపుతారు. ఆ సందర్భంలో మనం చూస్తున్నాము చరిత్రలో, బనూ హాషిం మరియు బనూ అబ్దుల్ ముత్తలిబ్, ఈ రెండు తెగల వారు ఎంతోమంది ఇస్లాం స్వీకరించనప్పటికీ, ప్రవక్త మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఏ బంధువులు ఇస్లాం స్వీకరించారో, ఏ ముస్లింలు అయితే ఉన్నారో, వారికి సపోర్ట్‌గా నిలిచి, వారికి తోడుగా ఉండి, వారు కూడా ఆ కనుమల్లోనే జీవితం గడిపారు.

నేను చెప్పదలచుకున్నది ఏమిటి అర్థమైందా మీకు? ఆనాటి కాలంలోని అరబ్బుల్లో ఒక ఉత్తమ గుణం బంధువులకు సహాయంగా, అండదండగా, తోడుగా ఉండడం. అలాంటి ఆ ఉత్తమ గుణాన్ని ఈ దుష్టుడు వదిలేసి, ప్రవక్తకు బద్ధ విరోధిగా, శత్రువుగా మారాడు. ముస్నద్ అహ్మద్ ఇంకా వేరే హదీథ్ గ్రంథాల్లో ఎన్నో హదీథులు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం యొక్క పిలుపు ఇస్తున్నప్పుడు, అతడు వ్యతిరేకంగా, ప్రవక్త వెనక వెనక తిరుగుతూ, “ఇతడు పిచ్చివాడయ్యాడు, ఇతని యొక్క మాట వినకండి” అని తప్పుడు ప్రచారం చేసేవాడు.

అయితే సోదర మహాశయులారా, ఈ సూరా ఎలాంటి సందర్భంలో అవతరించింది? అతను పేరు చెప్పి ఎందుకు ఇంతగా అతన్ని శపించడం జరిగింది? రండి, సహీహ్ బుఖారీలో హదీథ్ ఉంది 4972, అలాగే మరోచోట సందర్భంలో 1394, ఇంకా వేరే కొన్ని సందర్భాల్లో సహీహ్ బుఖారీలో కూడా ఉంది, ఇంకా వేరే హదీథుల్లో కూడా. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సూరతుష్ షుఅరాలో ఒక ఆయత్ అవతరింపజేశాడు:

وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
[వఅన్‌దిర్ అషీరతకల్ అఖ్రబీన్]
“నీ దగ్గరి బంధువులకు నీవు అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపెట్టు.”

అలాగే:

فَاصْدَعْ بِمَا تُؤْمَرُ
[ఫస్దఅ బిమా తుఅ్మర్]
“ఇక ఇప్పుడు నీవు బహిరంగంగా ధర్మ ప్రచారం చేయడం మొదలుపెట్టు.”

అప్పుడు ఆనాటి అలవాటు ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఎత్తైన ప్రదేశం, అంటే సఫా కొండపై ఎక్కి, “యా సబాహా!” అని పిలుపునిచ్చారు. ఇలాంటి పిలుపు యొక్క ఉద్దేశం ఏముంటుంది? ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంది, అందరిపై ఒక ప్రమాదం ఏదైనా వస్తుంది అన్నప్పుడు దాన్ని గమనించిన వారు అందరినీ హెచ్చరించడానికి ఇలా ఎత్తైన ప్రదేశంలో వెళ్లి పిలుపునిచ్చేవారు, గొంతెత్తి పెద్ద శబ్దంతో అరిచేవారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పద్ధతిని అనుసరించి, అంటే ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి మీరు. ప్రతి కాలంలో ఆనాటి కాలంలో పబ్లిసిటీ కొరకు ఉన్నటువంటి, ఆనాటి కాలంలో ఉన్నటువంటి మీడియా, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, వాటిని అవలంబించడం మన బాధ్యత. ఇది గమనిస్తూ వెళ్ళండి.

అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ వెళ్లి ఇలాంటి నినాదం వేసిన తర్వాత, అందరూ అక్కడ జమా అయ్యారు. ఎవరైతే తమ ఈ శబ్దం విని వెళ్లేటువంటి స్థితిలో లేడో, ఎవరినైనా కనీసం పంపేవాడు. వారిలోనే ఒకడు అబూ లహబ్ కూడా వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు తన యొక్క సత్యతను నిరూపించారు. ప్రవక్త చెప్పారు? “నేను ఇప్పుడు ఈ ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను. మీరు కొండ కింద ఇటువైపున ఉన్నారు. ఒకవేళ నేను చెప్పానంటే, అటువైపు నుండి ఒక సైన్యం ఉదయమో, సాయంకాలమో మీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది అని నేను చెప్పేది ఉంటే, మీరు నా మాటను నమ్ముతారా?” అందరూ ఏకంగా, ఏకధాటిగా, ఏకమాటతో అన్నారు: “ఎన్నడూ కూడా నీవు అబద్ధం చెప్పినట్లు మేము వినలేదు. కనుక నీ మాటను సత్యంగా నమ్ముతాము.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు:

فَإِنِّي نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَيْ عَذَابٍ شَدِيدٍ
[ఫఇన్నీ నదీరుల్ లకుమ్ బైన యదై అదాబిన్ షదీద్]
“మీ ముందు ఉన్నటువంటి ఘోరమైన, భయంకరమైన శిక్ష నుండి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఒకవేళ మీరు గనుక విగ్రహారాధన వదులుకోకుంటే, బహుదైవారాధన వదులుకోకుంటే, మనందరి ఏకైక సృష్టికర్త అల్లాహ్‌ను ఆరాధించకుంటే, మీరు ఈ శిక్షకు, విపత్తుకు గురి అవుతారు అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.

వెంటనే, అందరూ ముస్లింలు కాలేదు, బహుదైవారాధనను వదిలి ఏకదైవారాధన, తౌహీద్‌ను, అల్లాహ్ యొక్క ఆరాధనను స్వీకరించలేదు కానీ కనీసం మాట విన్నారు, మౌనం వహించారు. కానీ వారందరిలోకెల్లా ఈ ఒకే ఒక్క దుష్టుడు అందరి ముందు నిలబడి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై శాపనార్థాలు పెడుతూ, “అలి హాదా జమాతనా? తబ్బన్ లక్!” (నీవు నాశనమవు గాక! ఇందుకేనా మమ్మల్ని పోగు చేసినది? ఇక్కడకి పిలిచినది?) అని తన యొక్క ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాడు. అయితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఈ సూరత్, సూరతుల్ లహబ్ (మసద్) అవతరింపజేశాడు. “అబూ లహబ్ యొక్క చేతులు విరిగిపోవుగాక!” ఒకరి నాశనం గురించి, ఒకరి యొక్క నష్టం గురించి చెప్పదలచినప్పుడు, చేతులు విరిగిపోయాయి అన్నట్లుగా చెప్పడం ఇది ఒక సామెతగా ఉండింది. ‘తబ్బన్‘ అని అబూ లహబ్ ఏ పదాలైతే ఉపయోగించాడో, అవే పదాలతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇక్కడ అతన్ని సంబోధించాడు.

సోదర మహాశయులారా, అబూ లహబ్ యొక్క చెడు గుణం, అతని యొక్క శత్రుత్వం యొక్క సంఘటనలు చాలా ఉన్నాయి. సూరా అవతరణకు ఒక కారణంగా సహీహ్ బుఖారీలోని హదీథ్ మీ ముందు పెట్టడం జరిగింది. అబూ లహబ్ మరియు అతని యొక్క భార్య ఉమ్మె జమీల్, ఆమె పేరు అర్వా. ఇద్దరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎన్నో రకాలుగా బాధ కలిగిస్తూ ఉండేవారు. బాధ కలిగిస్తూ ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పొరుగులోనే ఉన్నాడు అతను. ప్రవక్త ఇల్లు మరియు అతని యొక్క ఇల్లు మధ్యలో కేవలం ఒక గోడ. ఆ అరబ్బులో ఉన్నటువంటి ఒక మంచి గుణం పొరుగువారిని కూడా పలకరించడం, వారి పట్ల మేలు చేయడం. అంతే కాదు అరబ్బులో ఉన్నటువంటి మరొక ఉత్తమ గుణం ఏమిటి? తండ్రి చనిపోయిన తన సోదరుని కొడుకును తన సంతానంగా భావించి, సంతానం మాదిరిగా చూసుకునేవారు. కానీ ఈ దుష్టుడు ఆ ఉత్తమ గుణాన్ని కూడా కోల్పోయి, స్వయం సోదరుడు అబ్దుల్లా యొక్క కొడుకు అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, పొరుగువాడు, నాకు దగ్గరివాడు అన్నటువంటి భావన కూడా లేకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దారిలో ముళ్లకంప వేయడం గానీ, పై నుండి ఏదైనా వస్తువులు పడవేసి బాధ కలిగించడం గానీ ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది కలిగించేవాడు.

అంతేకాదు, రెండో ఆయతులో గమనించండి:

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ
[మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్]
అతనికి అతని యొక్క ధనం, సొమ్ము గానీ, అతని సంపద గానీ ఏమీ ప్రయోజనం చేకూర్చలేదు.

సోదర మహాశయులారా, ఒకవేళ మనం గమనించామంటే ఇక్కడ కూడా, అల్లాహ్ త’ఆలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ అబూ లహబ్ అతని వద్ద చాలా ధనం ఉండింది మరియు అతడు పిసినారి కూడా. కానీ ఏమనేవాడు? నా ఇంత ధనం, నా యొక్క ఇంత డబ్బు, నేను ముహమ్మద్ కు వ్యతిరేకంగా నేను ఉపయోగిస్తాను. అతని యొక్క భార్య ఆమె మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. అవసరం పడితే నేను వీటిని అమ్మేసి, ముహమ్మద్ కు వ్యతిరేకంగా నేను సల్లల్లాహు అలైహి వసల్లం, ఉపయోగిస్తాను అని కూడా చెబుతూ ఉండేవారు వీరిద్దరూ.

అంతే కాదు, ఇందులో హెచ్చరిక మరో రకంగా చూస్తే, “వమా కసబ్” (అతను సంపాదించినది). సర్వసాధారణంగా ఇహలోకంలో మనం చూస్తాము, మనిషి అతడు సంపాదించిన డబ్బు, ధనం, సొమ్ము గానీ లేదా అతని యొక్క హోదా, అంతస్తు ఇంకా ఇలాంటివి ఏవైనా గానీ వాటి ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తాడు. అవి అతనికి ప్రయోజనం కలుగజేయాలనే చూస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే నరక శిక్ష నుండి విముక్తిని పొందరో, అలాంటి వారికి వారి యొక్క ధనం, వారి యొక్క సంపద అంతా కూడా మరింత వారి శిక్షను పెంచడానికే ఉపయోగపడుతుంది. వారి యొక్క శిక్ష మరింత ఎక్కువగా పెరగడానికే అది కారణమవుతుంది. అబూ లహబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా, ఇస్లాం ధర్మ వ్యాప్తికి వ్యతిరేకంగా ఇంత శత్రుత్వం వహించాడు. అతనికి సంతానం కూడా ఉండినది, సమాజంలో ఒక పలుకుబడి కూడా ఉండినది. కానీ అదంతా అతనికి ఏమైనా ప్రయోజనం కలుగజేసిందా? కలుగజేయలేదు.

అతడు భయపడి స్వయంగా బద్ర్ యుద్ధంలో పాల్గొనలేదు. అతనికి ఆస్ ఇబ్న్ వాఇల్ నుండి 4000 రావాల్సి ఉంది. ఇక అతడు ఇచ్చే స్థితిలో లేడు అని, నీవు ఆ డబ్బులకు బదులుగా, నీవు వెళ్లి అందులో పాల్గొను అని చెప్పాడు. అందులో అవిశ్వాసులు పరాజయానికి పాలయ్యారు, ఓడిపోయారు. ఆ ఓడిపోయిన బాధ కూడా అతనికి ఎంతగా కలిగిందంటే, ఆ తర్వాత అతను వారం పది రోజుల్లోనే నాశనమయ్యాడు. ఏ విధంగా? అతనికి ఒక భయంకరమైన అంటువ్యాధి సోకింది. ఆ అంటువ్యాధిలోనే అతడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత శరీరం కుళ్లిపోయి, కంపులేసింది. అతని యొక్క సంతానం కూడా దగ్గరికి వచ్చి, అతన్ని పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. కొన్ని చరిత్ర పుటల్లో ఉన్న ప్రకారం, కొందరు బానిసలకు కొంత డబ్బు ఇచ్చి, ఒక గొయ్యి తవ్వి కొన్ని కట్టెల సహాయంతో అతన్ని నెట్టేసి, ఆ గుంతలో పడవేయడం జరిగింది. తర్వాత మట్టి, రాళ్లు వేసి పూడ్చివేయడం జరిగింది. అంటే అతని యొక్క శవాన్ని కూడా స్వయం సంతానం దగ్గరికి వచ్చి ముట్టుకోలేనటువంటి స్థితి. ఒక భయంకరమైన అంటువ్యాధిలో చనిపోవడం, అవిశ్వాస స్థితిలో చనిపోవడం. ఆ సమయంలో కూడా అతని యొక్క ధనం, సొమ్ము, డబ్బు, సంపద ఏమీ కూడా అతనికి ప్రయోజనం కలుగజేయలేదు.

సోదర మహాశయులారా, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుత్ తౌబాలో కూడా చాలా స్పష్టంగా తెలిపి ఉన్నాడు. ఎవరైతే అల్లాహ్ యొక్క ధర్మానికి వ్యతిరేకంగా డబ్బు, ధనాన్ని, ఉన్నటువంటి పలుకుబడిని దుర్వినియోగం చేస్తాడో, సూరతుల్ అన్ఫాల్ ఆయత్ నంబర్ 36లో అల్లాహ్ తెలిపాడు:

إِنَّ الَّذِينَ كَفَرُوا يُنفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَن سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ
నిశ్చయంగా ఈ సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్‌ మార్గంలోకి రాకుండా అడ్డుకోవటానికి తమ సంపదలను ఖర్చు పెడుతున్నారు. వారు తమ సొమ్ములను ఇలా ఖర్చుపెడుతూనే ఉంటారు. అయితే ఆ సొమ్ములే వారి పాలిట దుఃఖదాయకంగా పరిణమిస్తాయి. ఆ తరువాత వారు ఓడిపోతారు. సత్యతిరస్కారులు నరకం వైపుకు ప్రోగు చేయబడతారు. (8:36)

ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టారో, వారు తమ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను అడ్డుకోవడానికి. పెట్టండి, ఖర్చు పెడుతూ ఉండండి. ఇది మీ కొరకు ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధ మరియు ఎంతో కుమిలిపోయేటువంటి పరిస్థితికి మిమ్మల్ని తీసుకువస్తుంది. అంతే కాదు, ఇహలోకంలో ఓడిపోతారు, పరాజయానికి పాలవుతారు. మరియు ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగడతారో, వారందరినీ కూడా నరకంలో త్రోసివేయడం జరుగుతుంది. ఈ విధంగా డబ్బు, ధనం అతనికి ఏ ప్రయోజనం కలుగజేయలేదు.

ఆ తర్వాత అల్లాహ్ తెలిపాడు:

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
[సయస్లా నారన్ జాత లహబ్]
“త్వరలోనే అతడు భగభగ మండేటువంటి నరకాగ్నికి ఆహుతి అవుతాడు.”

సోదర మహాశయులారా, ఈ సూరా ఖురాన్, ఇస్లాం ధర్మం సత్యం అన్నదానికి గొప్ప నిదర్శనం అని ఏదైతే చెప్పామో, గమనించండి. ఇక్కడ అతను నరకాగ్నిలో ప్రవేశిస్తాడు అని అతని బ్రతికి ఉన్న కాలంలోనే చెప్పడం జరిగింది. ఈ సూరా అవతరించిన తర్వాత సుమారు ఐదారు, ఏడు ఎనిమిది సంవత్సరాల వరకు అతడు బ్రతికి ఉన్నాడు కానీ, ఇస్లాం స్వీకరించలేదు. ఇస్లాం స్వీకరించేది ఉంటే, అతని గురించి చెప్పబడిన ఈ హెచ్చరిక తప్పు పోయేది. ఖురాన్ ఒక తప్పు అని, అసత్యం అని మాట వచ్చేది. ఆ భాగ్యం అతనికి కలగలేదు. ‘లహబ్‘ అగ్ని, జ్వాలను కూడా అంటారు.

అలాగే సోదర మహాశయులారా, అతడు అతని యొక్క అందచందాల రీత్యా అతని యొక్క ముఖం ఏదైతే మెరుస్తూ ఉండేదో దానికి గర్వంగా అతడు ‘అబూ లహబ్’ అన్నటువంటి బిరుదుకు చాలా సంతోషించేవాడు. అయితే, అతని యొక్క ఆ కుఫ్ర్, అవిశ్వాసం, సత్యానికి, సత్య ధర్మానికి శత్రుత్వం కారణంగా, అతని పేరు లాంటి పలుకులతోనే అల్లాహ్ అతనికి హెచ్చరిక ఇస్తున్నాడు, “నారన్ జాత లహబ్” – ‘లహబ్’ అంటే ఏంటి? నిప్పు, అగ్ని. అందులో అతడు త్వరలోనే ప్రవేశిస్తాడు అని ఇక్కడ హెచ్చరిక ఇవ్వడం జరిగింది.

అతడు ఒక్కడే కాదు,

وَامْرَأَتُهُ
[వమ్ర అతుహు]
“అతని భార్య కూడా.”

ఇక వినండి, ఎవరైతే చెడుకు తోడుపడతారో, చెడు నుండి అడ్డుకునేదానికి బదులుగా ఒకరికి బాధ కలిగించడంలో తోడుపడతారో, వారు అల్లాహ్ తో భయపడాలి. అబూ లహబ్ యొక్క భార్య ఏం చేసేది? ఇహలోకంలో ప్రవక్తకు వ్యతిరేకంగా, తన భర్తకు సహాయపడుతూ ఉండేది. అందుకొరకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆమె కూడా నరకంలో ప్రవేశిస్తుంది అని హెచ్చరిక ఇచ్చాడు.

حَمَّالَةَ الْحَطَبِ
[హమ్మాలతల్ హతబ్]

‘హమ్మాలతల్ హతబ్’ అనే పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో, దీనికి ఒకటి కంటే ఎక్కువ భావాలు ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్టే. ఒకటేమిటి? ఇహలోకంలో ముళ్లకంప, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారిలో వేస్తూ ఉండేది ఆమె. దాని గురించి చెప్పడం జరిగింది. ‘హమ్మాలతల్ హతబ్’ అన్నది ఒక సామెతగా కూడా అరబ్బులో వాడుతూ ఉండేవారు, దేని గురించి? ఎవరైతే చాడీలు చెప్తారో, పరోక్ష నిందలు చేస్తారో, ఆమె యొక్క అలవాటు ప్రవక్తకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండేది.

ఇక్కడ మరొక భావం ఏమిటంటే, అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఇంకా వేరే కొందరితో కూడా తఫ్సీర్లో వచ్చి ఉంది. ఇహలోకంలో ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు వ్యతిరేకంగా తన భర్తకు సహాయపడింది గనుక, నరకంలో ఉండి ఆమె యొక్క భర్త శిక్ష అధికం కావడానికి అక్కడ కూడా నరకంలోని కట్టెలు తీసుకువచ్చి ఇంకా అతనిపై వేస్తూ ఉంటుంది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ఇస్లాం వ్యాప్తి కొరకు, ఇస్లాం ధర్మ ప్రచారం కొరకు పరస్పరం చేదోడు వాదోడుగా ఒకరికి మరొకరు తోడుపడి సహాయం అందించే వారి పుణ్యాత్ముల్లో చేర్చుగాక.

ఇంతకుముందు నేను తెలిపినట్లు, ఆమె యొక్క మెడలో చాలా ఖరీదైన నగలు ఉండేవి. వాటిని ఎంతో గర్వంగా చెప్పుకుంటూ తిరిగేది, ఇవి అమ్మి నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు వ్యతిరేకంగా డబ్బులు ఉపయోగిస్తాను అని. అలాంటి మాట మరియు పదంతోనే, నగలు వేసుకొని ఒక తప్పుడు విషయంలో నీవు ఏదైతే గర్వపడుతున్నావో, నీ ఆ మెడలో నరకాగ్నిలోని ఒక పేనిన మంచి త్రాడు, గట్టిగా, బలమైన ఒక త్రాడు నీ మెడలో ఉంటుంది అని ఈ విధంగా ఆమెను అవమానపరచడం కూడా జరిగింది.

సోదర మహాశయులారా, వీటన్నిటి ద్వారా మనకు తెలిసిన అసలైన బోధ ఏమిటో మీరు గ్రహించారు కదా? మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని, ధర్మాన్ని దానికి ప్రాధాన్యత ఇచ్చి, దానికి గౌరవం ఇచ్చి, దానికి తోడుపడే ప్రయత్నం చేయాలి కానీ వ్యతిరేకించే ప్రయత్నం చేయకూడదు. మరొక విషయం ఇక్కడ తెలిసింది మనకు ఈ సూరత్ ద్వారా, ఇస్లాంలో బంధుత్వం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది కానీ, ఒకవేళ వారు అవిశ్వాసులయ్యేది ఉంటే ఇహలోకంలో మానవ రీత్యా వారితో సత్సంబంధాలు ఉన్నా గానీ, వారి యొక్క అవిశ్వాస కారణంగా వారు ప్రళయ దినాన ఏ మాత్రం ఎవరికీ ప్రయోజనం కలుగజేయలేరు. అలాగే అవిశ్వాసంపై ఉన్నవారికి ఇహలోకంలో ఏదైనా లాభం చేకూరుస్తారో కానీ, పరలోకంలో విశ్వాసులు కూడా తమ అవిశ్వాసులైన బంధువులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేరు. ఈ భావంలో ఖురాన్ లో ఎన్నో ఆయతులు ఉన్నాయి.

ఈ సూరత్ మరియు ఆయతుల ద్వారా మనకు తెలిసిన మరొక బోధన ఏమిటంటే, మనిషి డబ్బు, ధనం, సంపాదన మరియు ఈ లోకంలో సంపాదించినటువంటి వేరే హోదా, అంతస్తులు, పలుకుబడి వీటన్నిటి గర్వంలో పడి సత్యాన్ని త్రోసిపుచ్చకూడదు. వీటి గర్వంలో పడి సత్యాన్ని తిరస్కరించకూడదు. దీని ద్వారా మనకు బోధపడుతున్న మరొక విషయం ఏమిటంటే, ఈ లోకంలో ఏదైనా పాపం చేస్తున్నప్పుడు, శిక్ష వచ్చి పడడంలో ఆలస్యం అయితే, శిక్ష రాదు అని అనుకోకూడదు. అబూ లహబ్ బ్రతికి ఉన్నాడు కొన్ని సంవత్సరాలు. వెంటనే శిక్ష పడలేదు కానీ, అతనికి ఈ శిక్ష అనేది ఖాయం, దానికి అతడు ఆహుతి అవుతాడు.

అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ మన చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ అన్ని రకాల మేళ్లు ప్రసాదించి, అన్ని రకాల ఆపదల నుండి, కీడుల నుండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనల్ని కాపాడుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

చూడండి, అబూ లహబ్ యొక్క అసలు పేరు అబ్దుల్ ఉజ్జా. ‘అబూ’ అని అంటే తండ్రి అన్న భావం వస్తుంది కానీ, అరబీ భాష ప్రకారంగా ‘అబూ’ మరియు ‘ఉమ్’ తండ్రి, తల్లి కాకుండా వేరే పదాలతో ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో, అక్కడ వేరే భావాలు కూడా వస్తాయి. ఇక్కడ అసలు ఉద్దేశం, ఇది అతని యొక్క ఒక బిరుదుగా చాలా ప్రఖ్యాతి గాంచిపోయింది.

జజాకుముల్లాహు ఖైరా. సుబ్ హా నకల్లాహుమ్మ వబిహందిక అష్హదు అల్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వఅతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఖురాన్ మెయిన్ పేజీ:
https://teluguislam.net/quran/

సత్కార్య వనాలు: ధర్మ ప్రచారం, శిక్షణ

బిస్మిల్లాహ్

సత్కార్య వనాలుతొమ్మిదవ వనం
అంశాల నుండి : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

నవ వనం – ప్రచారం, శిక్షణ

అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే అందమైన తోట మరొకటి ఉండదు; రకరకాల ఫలాలు, ప్రభావితం చేసే పుష్పాలు, ఈ తోట దర్శనానికి వచ్చిన వాడు అలసిపోడు, దాని చెలమలు అంతం కావు. దాని ఛాయ ఎడతెగనిది. దాని ఊటలు లెక్కలేనివి. అందులో తన హృదయం, నోరు మరి ఆలోచనలతో పనితీసుకునువాడే విజయవంతుడు. తేనెటీగ మాదిరిగా; అది విసుగు, అలసట అంటే తెలియదు. రకారకాల రసాన్ని పీల్చుకుంటూ తేనె తయారు చేస్తుంది. ఈ (ప్రచార, శిక్షణ) తోటలో పని చేసేవాడు ప్రతిఫలం పొందుతాడు. దాని కోతకు సిద్ధమయ్యేవాడు లాభం మరియు సంతోషం పొందుతాడు.

ఒక మంచి మాట ద్వారా నీవు బోధన ఆరంభించు. ఎందుకనగా మంచి మాట ఒక సదకా (సత్కార్యం). ఒక చిరునవ్వు ద్వారా ప్రచారం ఆరంభించు. నీ తోటి సోదరునితో నీవు మందహాసముతో మాట్లాడడం కూడా సత్కార్యం. నీ ఉత్తమ నడవడిక ద్వారా నీవు ప్రచారకుడివయిపో. నీవు నీ ధనంతో ప్రజల్ని ఆకట్టుకోలేవు. నీ సద్వర్తనతో ఆకట్టుకోగలుగుతావు.

సోదరా! ప్రవక్తగారి ఒక వచనం అయినా సరే ఇతరుల వరకు చేరవేయి. నీ ప్రేమికుల గుండెల్లో ప్రవక్తి గారి ఒక సంప్రదాయ ప్రేమను కలిగించు. వారి హృదయాలను వారి ప్రభువు విధేయతతో అలంకరించు. వివేకము మరియు మంచి ఉపదేశం ద్వారా వారిని పిలువు. దూరం చేసే మాటలు, కఠోర పద్ధతి విడనాడు.

[فَبِمَا رَحْمَةٍ مِنَ اللهِ لِنْتَ لَهُمْ وَلَوْ كُنْتَ فَظًّا غَلِيظَ القَلْبِ لَانْفَضُّوا مِنْ حَوْلِكَ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الأَمْرِ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللهِ إِنَّ اللهَ يُحِبُّ المُتَوَكِّلِينَ] {آل عمران:159}

(ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అనంత కరుణ వల్లనే నీవు వారిపట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కశుడవు కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టు పక్కల నుండి దూరంగా పోయేవారు. (ఆలి ఇమ్రాన్ 3: 159).

నీ పట్ల తప్పు చేసిన వాడిని క్షమించి పిలుపునిచ్చావని ఆశించు. పాపంలో మునిగి ఉన్న నీ సోదరునికి సహాయం చేసి నీ చేత అతని సన్మార్గానికి మార్గం సుగమం చేయి. రుజుమార్గం నుండి దూరమైన ప్రతి ఒక్కరి పట్ల వాత్సల్య కాంతి ద్వారా నీ కళ్ళను ప్రకాశవంతం చేసుకో చివిరికి నీవు ఎవరెవరి కోసం సన్మార్గం కోరుతున్నావో వారికి ఈ కాంతి లభిస్తుంది.

నీ పొరుగువానికి ఒక క్యాసెట్ బహుకరించి, లేదా నీ మిత్రునికి ఓ పుస్తకం పంపి, ఇస్లాం వైపు స్వచ్ఛముగా పిలిచి అల్లాహ్ అతనికి సధ్బాగ్యం ప్రసాదించుగాక అని ఆశిస్తూ కూడా నీవు ప్రచారకునివి కావచ్చు.

నీకు ప్రసాదించబడిన సర్వ శక్తులను, ఉపాయాలను ఉపయోగించి ప్రచారకునివి కావచ్చు. నీవు కాలు మోపిన ప్రతి చోట శుభం కలగజేసేవానివిగా అయిపో. అడ్డంకులుంటాయని భ్రమ పడకు. చిన్నవాటిని మహా పెద్దగా భావించి (భయం చెందకు). విద్యావంతులు, గొప్ప ప్రచారకులతో సంప్రదించి నీ ప్రచారం ఆరభించు. ఇలా నీ ప్రచారం పరిపూర్ణజ్ఞానం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది.

ادْعُ إِلَى سَبِيلِ رَبِّكَ بِالحِكْمَةِ وَالمَوْعِظَةِ الحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِي هِيَ أَحْسَنُ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالمُهْتَدِينَ {النحل:125}

నీ ప్రభువు మార్గం వైపునకు పిలువు, వివేకంతో, చక్కని హితబోధతో. ఉత్తమోత్తమ రీతిలో వారితో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు; ఆయన మార్గం నుండి తప్పిపోయినవాడు ఎవడో, రుజు మార్గంపై ఉన్నవాడూ ఎవడో. (నహ్ల్ 16: 125).

నీ బాధ్యత సందేశం అందజెయ్యడమే.

وَمَا عَلَينَا إِلَّا الْبَلَاغُ الْـمُبِين. {يس 17}
స్పష్టమైన రీతిలో సందేశాన్ని అందజేయడమే మా బాధ్యత (యాసీన్ 36: 17).

హృదయాలకు మార్గం చూపే బాధ్యత, తాలాలు పడి ఉన్నవాటిలో తాను కోరేవారివి విప్పే బాధ్యత కూడా అల్లాహ్ దే.

ذَلِكَ هُدَى اللهِ يَهْدِي بِهِ مَنْ يَشَاءُ وَمَنْ يُضْلِلِ اللهُ فَمَا لَهُ مِنْ هَادٍ] {الزُّمر:23}
ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు. (జుమర్ 39: 23).

నీ ప్రచారం ఫలించినది, దాని ఫలితంగా పండిన ఫలాలు చూసి సంతోషపడు. నీవు పొందే ప్రతి విజయాన్ని నీ కొరకు వేచి చూస్తున్న, నీ అడుగులు పడటానికి ఎదురుచూస్తున్న మరో విజయానికి మెట్టుగా ఉంచి ముందుకెదుగు.

ప్రవక్త ﷺ తమ జాతి వారి సన్మార్గంతో ఎంత సంతోషించారు? కాదు, అనారోగ్య యూదుని పిల్లవాని సన్మార్గంతో ప్రవక్త ﷺ చాలా సంతోషించారు. ఆ సంఘటనను అనస్ ( రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖించారుః

(كَانَ غُلَامٌ يَهُودِيٌّ يَخْدُمُ النَّبِيَّ ﷺ فَمَرِضَ فَأَتَاهُ النَّبِيُّ ﷺ يَعُودُهُ فَقَعَدَ عِنْدَ رَأْسِهِ فَقَالَ لَهُ أَسْلِمْ فَنَظَرَ إِلَى أَبِيهِ وَهُوَ عِنْدَهُ فَقَالَ لَهُ أَطِعْ أَبَا الْقَاسِمِ ﷺ فَأَسْلَمَ فَخَرَجَ النَّبِيُّ ﷺ وَهُوَ يَقُولُ الْحَمْدُ لِلَّهِ الَّذِي أَنْقَذَهُ مِنْ النَّارِ)

ఒక యూద బాలుడు ప్రవక్త సేవ చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతని ఆరోగ్యం చెడిపోయింది. అతడ్ని పరామర్శించడానికి ప్రవక్త ﷺ వచ్చి, అతని తలాపున కూర్చున్నారు. కొంతసేపటికి “నీవు ఇస్లాం స్వీకరించు” అని అతనితో అన్నారు. అప్పుడు అతడు అక్కడే ఉన్న తన తండ్రి వైపు చూశాడు. దానికి అతను నీవు అబుల్ ఖాసిం ﷺ (అంటే ప్రవక్త) మాటను అనుసరించు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఇస్లాం స్వీకరించాడు. (ఆ తర్వాత కొంత సేపటికి ఆ బాలుడు చనిపోయాడు. అప్పుడు ప్రవక్త) “అల్ హందులిల్లాహ్! అల్లాహ్ ఇతడిని నరకం నుండి కాపాడాడు” అన్నారు. (బుఖారి 1356).

తలతలలాడే ప్రవక్త మాటలను శ్రద్ధగా విను, అతిఉత్తమ, అతిఉన్నతమైన ప్రచారకులు (అంటే ప్రవక్త) తాను తయ్యారు చేసిన ప్రచారకుల్లో చిత్తశుద్ధిగల ఒకరైనా అలీ బిన్ అబీ తాలిబ్ ( రదియల్లాహు అన్హు) కు ఖైబర్ రోజున ఇలా చెప్పారు:

(ادْعُهُمْ إِلَى الْإِسْلَامِ وَأَخْبِرْهُمْ بِمَا يَجِبُ عَلَيْهِمْ فَوَالله لَأَنْ يُهْدَى بِكَ رَجُلٌ وَاحِدٌ خَيْرٌ لَكَ مِنْ حُمْرِ النَّعَمِ)

“వారిని ఇస్లాం వైపునకు పిలువు. వారిపై విధిగా ఉన్న విషయాల్ని వారికి తెలియజేయి. అల్లాహ్ సాక్షిగా! నీ ద్వారా ఒక్క మనిషికి కూడా సన్మార్గం ప్రాప్తమయ్యిందంటే అది నీకు మేలు జాతికి చెందిన ఎర్ర ఒంటెల కంటే ఎంతో ఉత్తమం”. (బుఖారి 2942).

ప్రచార కార్యం ద్వారా లేదా ఎవరికైనా ఒక ధర్మ విషయం నేర్పడం ద్వారా నీవెన్ని పుణ్యాలు పొందుతావు లెక్కించలేవు. నీవు ఇచ్చిన పిలుపు ప్రకారం ఆచరించే వారు, నీవు నేర్పిన విద్యకు క్రియరూపం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారో అంతే పుణ్యం నీకు లభిస్తుంది. వారి పుణ్యాల్లో ఏలాంటి కొరత జరగదు. అల్లాహ్ గొప్ప దయగలవాడు.

ప్రచార కార్యం నీ నుండి, నీ ఇల్లాలు పిల్లలతో, నీ దగ్గరివారితో ఆరంభం చేయి. బహుశా అల్లాహ్ నీ శ్రమలో శుభం కలుగు జేయుగాక. నీ సత్కార్యాన్ని అంగీకరించుగాక. ఆయన చాలా దాతృత్వ, ఉదార గుణం గలవాడు.

అల్లాహ్ వైపు పిలుపుకు సంబంధించిన ఓ సత్కార్య సంఘటన శ్రద్ధగా చదువు. ఎవరితో ఈ సంఘటన జరిగిందో స్వయంగా అతడే చెప్పాడు. అతను ఇటాలీ దేశానికి సంబంధించిన అల్ బర్తో ఓ. పచ్చీని (Alberto O. Pacini).:- నాకు సత్య ధర్మం వైపునకు సన్మార్గం చూపిన అల్లాహ్ కే అనేకానేక స్తోత్రములు. అంతకు మునుపు నేను నాస్తికునిగా, విలాసవంతమైన జీవితం గడుపుతూ మనోవాంఛల పూజ చేసేవాడిని. జీవితం అంటే డబ్బు, పైసా అని. సంపాదనే పరమార్థం అని భావిస్తూ ఉండేవాడిని. ఆకాశ ధర్మాలన్నిటితో విసుగెత్తి పోయి ఉంటిని. ప్రథమ స్థానంలో ఇస్లామే ఉండినది. ఎందుకనగా మా సమాజంలో దానిని చరిత్రలోనే అతి చెడ్డ ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిములు అంటే మా మధిలో విగ్రహాలను పూజించేవారు, సహజీవన చేయలేనివారు, ఏదో కొన్ని అగోచరాలను నమ్ముతూ వాటి ద్వారానే తమ సమస్యల పరిష్కారాన్ని కోరువారు. రక్తపిపాసులు, గర్వులు, కపటులు మరియు ఇతరులతో ప్రేమపూర్వకమైన వాతవరణంలో జీవితం గడిపే గుణం లేనివారు అని అనుకునేవాడిని. ఇస్లాంకు వ్యతిరేకమైన ఈ వాతావరణంలో నేను పెరిగాను. కాని అల్లాహ్ నా కొరకు మార్గదర్శకత్వం వ్రాసాడు, అది కూడా సంపాదన కొరకై ఇటాలీ వలస వచ్చిన ఓ ముస్లిం యువకుని ద్వారా. ఏ ఉద్దేశ్యం లేకుండానే నేను అతడిని కలిశాను. ఒక రాత్రి నేను చాలా సేపటి వరకు ఒక బార్ లో రాత్రి గడిపి తిరిగి వస్తున్నాను. మత్తు కారణంగా పూర్తి స్పృహ తప్పి ఉన్నాను. రోడ్ మీద నడుస్తూ వస్తున్నాను నాకు ఏదీ తెలియకుండా ఉంది పరిస్థితి. అకస్మాత్తుగా వేగంగా వస్తున్న ఓ కార్ నన్ను ఢీకొంది. నేలకు ఒరిగాను. నా రక్తంలోనే తేలాడుతుండగా, అప్పుడే ఆ ముస్లిం యువకుడు తారసపడి నా తొలి చికిత్సకు ప్రయత్నం చేశాడు. పోలీస్ కు ఖబరు ఇచ్చాడు. నేను కోలుకునే వరకు నన్ను చూసుకుంటూ నా సేవలో ఉన్నాడు. ఇదంతా నాకు చేసిన వ్యక్తి ఒక ముస్లిం అని నేను నమ్మలేక పోయాను. అప్పుడు నేను అతనికి దగ్గరయ్యాను. అతని ధర్మం యొక్క మూల విషయాలు తెలుపమని కోరాను. దేని గురించి ఆదేశిస్తుంది, దేని గురించి నివారిస్తుందో చెప్పుమన్నాను. అలాగే ఇతర మతాల గురించి నీ ధర్మ అభిప్రాయమేమిటి? ఈ విధంగా ఇస్లాం గురించి తెలుసుకొని, ఆ యువకుని సద్పర్తన వల్ల అతనితో ఉండసాగాను. చివరికి పూర్తి నమ్మకం కలిగింది; నేను అజ్ఞానంలో ఉండి నా ముఖంపై దుమ్ము రాసుకుంటుంటినీ అని, ఇస్లామే సత్యధర్మమని. వాస్తవానికి అల్లాహ్ చెప్పింది నిజమేననిః

وَمَنْ يَبْتَغِ غَيْرَ الإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الآَخِرَةِ مِنَ الخَاسِرِينَ {آل عمران:85}

ఎవడైనా ఈ విధేయతా విధానాన్ని (ఇస్లాం) కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే, ఆ మార్గం ఎంతమాత్రం ఆమోదించ బడదు. అతడు పరలోకంలో విఫలుడౌతాడు, నష్టపోతాడు. (ఆలి ఇమ్రాన్ 3: 85).

అప్పుడు నేను ఇస్లాం స్వీకరించాను.


ఈ పోస్ట్ క్రింది పుస్తకం నుండి తీసుకోబడింది. క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పూర్తి పుస్తకం చదవండి.

  • సత్కార్య వనాలు (Hadayiq)
    అంశాల నుండి
     : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, జుల్ఫీ (Zulfi, Saudi Arabia)
    అనువాదం : అబూ అనస్ ముహమ్మద్ నసీరుద్దీన్ (Abu Anas Muhammad Naseeruddeen)

ఇతర లింకులు:

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి” – సలీం జామి’ఈ [వీడియో & టెక్స్ట్]

ఉజైర్ (అలైహిస్సలాం) జీవిత చరిత్ర – “మరణించిన 100 సంవత్సరాలకు మళ్ళీ బతికిన వ్యక్తి”
https://youtu.be/D1oAzBvsApU [32 నిముషాలు]
వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ఈ ప్రసంగంలో వక్త, బనీ ఇస్రాయీల్ ప్రవక్తలలో ఒకరైన ఉజైర్ (అలైహిస్సలాం) గారి అద్భుతమైన జీవిత చరిత్రను వివరించారు. ముఖ్యంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనకు మరణం ఇచ్చి 100 సంవత్సరాల తర్వాత తిరిగి ఎలా బ్రతికించారో, ఆ సమయంలో జరిగిన చారిత్రక పరిణామాలు (బాబిలోనియా రాజు నెబుకద్ నెజర్ ద్వారా జెరూసలేం నాశనం, తౌరాత్ గ్రంథం దహనం, యూదుల బానిసత్వం మరియు విడుదల) గురించి చర్చించారు. ఉజైర్ (అలైహిస్సలాం) నాశనమైన నగరాన్ని చూసి ఆశ్చర్యపోవడం, అల్లాహ్ ఆయనను 100 సంవత్సరాలు మృతునిగా ఉంచి తిరిగి లేపడం, ఆయన ఆహారం చెడిపోకుండా ఉండటం మరియు గాడిద ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోవడం వంటి దృష్టాంతాలను ఖురాన్ వాక్యాల (సూర బఖరా 2:259) ద్వారా వివరించారు. అలాగే, యూదులు ఉజైర్ (అలైహిస్సలాం) ను దైవ కుమారుడిగా భావించి చేసిన మార్గభ్రష్టత్వాన్ని ఖండిస్తూ (సూర తౌబా 9:30), మరణానంతర జీవితం, పునరుత్థానం, మరియు అల్లాహ్ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలని ఈ ప్రసంగం ద్వారా బోధించారు.

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى أَشْرَفِ الْأَنْبِيَاءِ وَالْمُرْسَلِينَ نَبِيِّنَا مُحَمَّدٍ وَعَلَى آلِهِ وَأَصْحَابِهِ أَجْمَعِينَ
[అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్ హాబిహి అజ్మయీన్]

అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్య మూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్.

సోదర సోదరీమణులారా! మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

ఈనాటి ప్రసంగంలో మనము ఒక ప్రవక్త గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణం ఇచ్చి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించాడు. ఎవరండీ ఆయన? ఆశ్చర్యకరంగా ఉంది కదా వింటూ ఉంటే. ఆయన మరెవరో కాదు ఆయనే ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారు.

ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన ఖురాన్ గ్రంథంలో రెండు సూరాలలో వచ్చి ఉంది. ఒకటి సూర బఖరా రెండవ సూరా, రెండవది సూర తౌబా తొమ్మిదవ సూరా. ఈ రెండు సూరాలలో ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం వారి ప్రస్తావన వచ్చి ఉంది. ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తలలో ఒక ప్రవక్త.

ఆయన బనీ ఇస్రాయీల్ ప్రజల వద్దకు పంపించబడే సరికి, బనీ ఇస్రాయీల్ ప్రజల్లోని అధిక శాతం ప్రజలు కనుమరుగైపోయారు లేదా బానిసత్వానికి గురైపోయారు. అల్-ఖుద్స్ నగరంలో, పాలస్తీనా దేశంలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే బనీ ఇస్రాయీల్ వారు మిగిలి ఉన్నారు. అంతే కాదండీ, వారు నివసిస్తున్న పట్టణము కూడా నేలమట్టం అయిపోయింది. వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ కూడా నేలమట్టం అయిపోయింది. అలా ఎందుకు జరిగిందంటే, దాన్ని తెలుసుకోవడానికి బనీ ఇస్రాయీల్ వారి క్లుప్తమైన చరిత్ర మనము దృష్టిలో ఉంచుకోవాలి.

సులైమాన్ అలైహిస్సలాం వారి మరణానంతరం పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి సంతానంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయం కలిగింది. వారు ఎంతో పటిష్టంగా ఉన్న వారి సామ్రాజ్యాన్ని రెండు ముక్కలు చేసుకున్నారు. ఒక తమ్ముడు సగ భాగాన్ని, మరో తమ్ముడు సగ భాగాన్ని పంచుకొని, ఒక భాగానికి ‘ఇస్రాయీల్ రాజ్యం‘ అని పేరు పెట్టుకున్నారు, దానికి సామరియా రాజధాని అయ్యింది. మరో భాగానికి ‘యహూదా రాజ్యం’ అని పేరు పెట్టుకున్నారు, దానికి యెరూషలేము రాజధాని అయ్యింది.

అయితే ఆ తర్వాత ఇస్రాయీల్ లో ఉన్న బనీ ఇస్రాయీల్ ప్రజలు తొందరగా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు. విగ్రహారాధనకు పాల్పడ్డారు, ‘బాల్‘ అనే విగ్రహాన్ని ఆరాధించారు. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడికి ప్రవక్తల్ని పంపించాడు. హిజ్కీల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఇలియాస్ అలైహిస్సలాం వారు వచ్చారు, అల్-యస అలైహిస్సలాం వారు వచ్చారు. ప్రవక్తలు వచ్చి వారికి చక్కదిద్దేటట్టు ప్రయత్నం చేసినా, దైవ వాక్యాలు బోధించినా, అల్లాహ్ వైపు పిలిచినా, వారు మాత్రము పాపాలను వదలలేదు, విగ్రహారాధనను కూడా వదలలేదు, మార్గభ్రష్టులుగానే మిగిలిపోయారు.

చివరికి ఏమైందంటే, పక్కనే ఉంటున్న ఆషూరీయులు వచ్చి ఇస్రాయీల్ సామ్రాజ్యం మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యాన్ని వశపరుచుకున్నారు. ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు రెండు భాగాలుగా విడిపోయి ఉన్న ఆ రెండు రాజ్యాలలో నుంచి ఒక రాజ్యము ఆషూరీయుల చేతికి వెళ్ళిపోయింది.

అయితే ఆశూరీయులు మిగిలిన రెండవ భూభాగాన్ని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినా వారి పప్పులు ఉడకలేదు. ఎందుకంటే ఇక్కడ దైవభీతి మిగిలి ఉండింది కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచాక ఇక్కడ పరిస్థితులు కూడా మళ్ళీ మారిపోయాయి. ఇక్కడ ప్రజలు కూడా మార్గభ్రష్టత్వానికి గురైపోయారు, పాపాల్లో మునిగిపోయారు. అలాంటప్పుడు ఇరాక్ దేశము నుండి, బాబిలోనియా నుండి నెబుకద్ నెజరు (అరబ్బీలో ‘బుఖ్తె నసర్‘) అనే రాజు సైన్యాన్ని తీసుకొని వచ్చి యహూదా దేశం మీద, రాజ్యం మీద దాడి చేశాడు. యుద్ధం ప్రకటించి బనీ ఇస్రాయీల్ వారిని ఊచకోత కోశాడు. అలాగే బనీ ఇస్రాయీల్ వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటంతో పాటు, వారు ఎంతగానో పవిత్రంగా భావించే బైతుల్ మఖ్దిస్ ని కూడా నేలమట్టం చేసేశాడు. వారు ఎంతో గౌరవంగా చదువుకునే, ఆచరించుకునే పవిత్రమైన గ్రంథం తౌరాత్ ని కూడా అతను కాల్చేశాడు.

బనీ ఇస్రాయీల్ ప్రజల్ని అయితే ముందు చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా హతమార్చాడు. తర్వాత ఎవరెవరైతే పనికొస్తారు అని అతను భావించాడో వారిని బానిసలుగా ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి తీసుకెళ్లిపోయాడు. ఎవరితో అయితే నాకు అవసరం లేదులే వీళ్ళతో అని అనుకున్నాడో, అలాంటి వారిని మాత్రము అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే మిత్రులారా! ఆ ప్రకారంగా బనీ ఇస్రాయీల్ ప్రజలు, ముందు ఇస్రాయీల్ సామ్రాజ్యాన్ని ఆషూరీయుల చేతికి అప్పగించాల్సి వచ్చింది, యహూదా సామ్రాజ్యాన్ని నెబుకద్ నెజరు రాజుకి అప్పగించాల్సి వచ్చింది

ఆ ప్రకారంగా వారి రెండు రాజ్యాలు కూడా రెండు వేరు వేరు శత్రువులు లాక్కున్నారు. అలాగే జయించి వశపరచుకున్నారు. మళ్ళీ బనీ ఇస్రాయీల్ ప్రజలు పరాభవానికి గురి అయ్యి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు. ఎంతో కొంతమంది మాత్రమే అక్కడ మిగిలిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో, పట్టణము కూల్చబడి ఉంది, పుణ్యక్షేత్రము కూల్చబడి ఉంది, ప్రజలు కూడా చెల్లాచెదురైపోయి ఉన్నారు, బానిసలుగా మార్చబడి ఉన్నారు, ఎంతో కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. అలాంటి స్థితిలో ఉజైర్ అలైహిస్సలాం వారు వచ్చారు.

ఆయన మామూలుగా పొలం వద్ద పని కోసము గాడిద మీద కూర్చొని బయలుదేరి వెళ్లారు. వెళ్లి అక్కడ పొలం పనులన్నీ ముగించుకొని కొన్ని ద్రాక్ష పండ్లు, అలాగే అత్తి పండ్లు తీసుకొని మళ్ళీ అదే గాడిద మీద కూర్చొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. వస్తూ వస్తూ ఒకచోట లోయలోకి ప్రవేశించి కాసేపు నీడలో సేద తీరుదాము అని ఒక గోడ నీడలో లేదా ఒక చెట్టు నీడలో ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తూ, ఆయన వద్ద ఉన్న గాడిదను ఒకచోట కట్టేశారు.

తర్వాత నీడలో కూర్చొని ఆయన వద్ద ఉన్న ద్రాక్ష పండ్లను ముందుగా ఒక పాత్రలో పిండారు. ఆ ద్రాక్ష రసంలో కొన్ని రొట్టె ముక్కలు నాన్చడానికి ఉంచారు. ఆ రొట్టెలు నానే వరకు ఆయన గోడను లేదా చెట్టుని అలా వీపుతో ఆనుకొని, కంటి ముందర కనిపిస్తున్న దృశ్యాలను చూడసాగారు. ముందర పాడుబడిపోయిన పట్టణము, కూల్చబడిన పట్టణము, కూల్చబడిన పుణ్యక్షేత్రము అవి దర్శనమిస్తున్నాయి. అవి చూస్తూ ఉంటే, ఊహించని రీతిలో, అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది. ఏంటి ఆ మాట అంటే:

أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا
[అన్నా యుహ్ యీ హాజిహిల్లాహు బాద మౌతిహా]
దీని చావు తర్వాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు? (ఖుర్ఆన్, 2:259)

అంటే ఈ నగరం మొత్తం పాడుబడిపోయింది కదా, మళ్ళీ ప్రజల జీవనంతో ఈ నగరం కళకళలాడాలంటే ఇది సాధ్యమవుతుందా? అని ఆశ్చర్యం వ్యక్తపరిచారు. అనుమానం వ్యక్తపరచలేదు, ఇది ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఉజైర్ అలైహిస్సలాం వారు గొప్ప దైవభీతిపరులు, గ్రంథ జ్ఞానము కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అల్లాహ్ తో ఇది సాధ్యమేనా అని అనుమానము, సందేహము ఎప్పుడూ వ్యక్తపరచరు. అల్లాహ్ శక్తి మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆశ్చర్యం వ్యక్తపరిచారు – ఇది ఎప్పుడు అవుతుంది? ఎలా అవుతుంది? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా? అనేటట్టుగా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వెంటనే ఆయన ఏ స్థితిలో అయితే నీడలో అలా వీపు ఆంచుకొని కూర్చొని ఉన్నారో, అదే స్థితిలో ఆయనకు మరణం ఇచ్చేశాడు. ఎన్ని సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు అంటే, వంద సంవత్సరాల వరకు ఆయన అదే స్థితిలో ఉన్నారు.

فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ
[ఫ అమాతహుల్లాహు మిఅత ఆమిన్]
“అల్లాహ్ అతన్ని నూరేళ్ళ వరకు మరణ స్థితిలో ఉంచాడు.” (ఖుర్ఆన్, 2:259)

ఖురాన్ లో నూరేళ్ళ వరకు ఆయనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అదే స్థితిలో ఉంచాడు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

అయితే 100 సంవత్సరాలు ఆయన అదే స్థితిలో ఉన్నారు కదా, మరి ఈ 100 సంవత్సరాలలో ఏమి జరిగిందంటే చాలా ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఏమి జరిగిందంటే, నెబుకద్ నెజరు బనీ ఇస్రాయీల్ వారి మీద దాడి చేసి, పుణ్యక్షేత్రం కూల్చేసి, గ్రంథము కాల్చేసి, బనీ ఇస్రాయీల్ వారిని పురుషుల్ని అలాగే మహిళల్ని బానిసలుగా మార్చి ఇరాక్ దేశానికి, బాబిలోనియా పట్టణానికి పట్టుకెళ్లిపోయాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే…

పక్కనే ఉన్న పార్షియా దేశం (ఇరాన్ దేశం అని మనం అంటున్నాం కదా), ఆ పార్షియా దేశానికి చెందిన రాజు ఇరాక్ దేశం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం చేసి ఇరాక్ దేశాన్ని జయించేశాడు. ఇరాక్ దేశము ఇప్పుడు పార్షియా దేశ రాజు చేతికి వచ్చేసింది. ఆ పార్షియా దేశము (అనగా ఇరాన్ దేశపు రాజు) ఇరాక్ దేశాన్ని కూడా జయించిన తర్వాత, అక్కడ బానిసలుగా నివసిస్తున్న యూదులను స్వతంత్రులుగా చేసేసి, “మీరు మీ సొంతూరికి, అనగా పాలస్తీనా దేశానికి, అల్-ఖుద్స్ నగరానికి తిరిగి వెళ్లిపోండి” అని అనుమతి ఇచ్చేశాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 50-60 సంవత్సరాల తర్వాత ఆ రాజు ద్వారా బనీ ఇస్రాయీల్ ప్రజలకి మళ్ళీ బానిసత్వం నుండి స్వతంత్రం లభించింది. అప్పుడు వారందరూ కూడా స్వతంత్రులై బాబిలోనియా పట్టణాన్ని వదిలేసి, మళ్ళీ పాలస్తీనాలో ఉన్న అల్-ఖుద్స్ నగరానికి పయనమయ్యారు. అయితే ఈ 50-60 సంవత్సరాలలో వారు భాష మర్చిపోయారు, సంప్రదాయాలు మర్చిపోయారు, ధర్మ ఆదేశాలు కూడా చాలా శాతము మర్చిపోయారు. సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ మళ్ళీ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా కూల్చివేయబడిన ఆ పట్టణము, నగరము మళ్ళీ ప్రజల నివాసంతో కళకళలాడటం ప్రారంభించింది. ఇలా వంద సంవత్సరాల లోపు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్న తర్వాత, అప్పుడు రెండవసారి మళ్ళీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఉజైర్ అలైహిస్సలాం వారికి మళ్ళీ బ్రతికించాడు.

చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఆయన మరణించే సమయానికి ఆయన వయస్సు 40 సంవత్సరాలు ఉండింది. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రతికించబడుతున్నప్పుడు కూడా ఆయన 40 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా, అదే శక్తితో, అదే శరీరంతో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆయనను మళ్ళీ బ్రతికించాడు.

దూత వచ్చాడు. దూత వచ్చి ఆయనను లేపి:

قَالَ كَمْ لَبِثْتَ
[ఖాల కమ్ లబిస్త]
“నీవు ఎంత కాలం ఈ స్థితిలో ఉన్నావు?” అని అడిగాడు. (ఖుర్ఆన్, 2:259)

ఉజైర్ అలైహిస్సలాం వారు లేచి ముందు అటూ ఇటూ చూశారు. చూస్తే గాడిద కనిపించట్లేదు. గాడిద బంధించిన చోట పాడుబడిపోయిన ఎముకలు కనిపిస్తున్నాయి. 100 సంవత్సరాలు గడిచిన విషయం ఆయనకు తెలియదు. ఈ 100 సంవత్సరాలలో గాడిద చనిపోయింది, ఎముకలు కూడా పాడుబడిపోయాయి, కొన్ని పాడుబడిన ఎముకలు కనిపిస్తున్నాయి. పక్కనే ఉంచబడిన ద్రాక్ష రసంలో ఉంచబడిన రొట్టె ముక్కలు, అవి మాత్రము తాజాగా అలాగే ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఆహారాన్ని చూస్తూ ఉంటే, ఇప్పుడే కొద్దిసేపు ఏమో నేను అలా పడుకొని లేచానేమో అనిపిస్తూ ఉంది. గాడిదను చూస్తూ ఉంటే అసలు గాడిద కనిపించట్లేదు. కాబట్టి వెంటనే ఆయన ఏమన్నారంటే:

لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ
[లబిస్తు యౌమన్ ఔ బాద యౌమ్]
“ఒక రోజు లేదా ఒక రోజులో కొంత భాగం మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను” అని చెప్పారు. (ఖుర్ఆన్, 2:259)

ఆహారాన్ని చూసి ఆయన ఆ విధంగా అనుమానించారు. అయితే దూత వచ్చి:

بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ
[బల్ లబిస్త మిఅత ఆమ్]
“కాదు, నీవు ఈ స్థితిలో వంద సంవత్సరాలు ఉన్నావయ్యా” (ఖుర్ఆన్, 2:259)

అని చెప్పి, “చూడండి మీ గాడిద మరణించి ఎముకలు ఎముకలైపోయింది. మీ కళ్ళ ముందరే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానిని మళ్ళీ బ్రతికిస్తాడు చూడండి” అని చెప్పగానే, అల్లాహ్ నామంతో పిలవగానే ముందు ఎముకలు తయారయ్యాయి. ఎముకలు జోడించబడ్డాయి. ఆ ఎముకల మీద మాంసము జోడించబడింది. ఆ తర్వాత దానికి ప్రాణము వేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఉజైర్ అలైహిస్సలాం వారి కళ్ళ ముందరే ఎముకలుగా మారిపోయిన ఆ గాడిద మళ్ళీ జీవించింది. అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు అదంతా కళ్ళారా చూసి వెంటనే ఈ విధంగా పలికారు:

قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
[ఖాల ఆలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్]
“అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని ఉజైర్ అన్నారు. (ఖుర్ఆన్, 2:259)

ఈ ప్రస్తావన మొత్తము ఖురాన్ గ్రంథము రెండవ అధ్యాయము 259వ వాక్యంలో వివరంగా తెలుపబడి ఉంది.

సరే, 100 సంవత్సరాల తర్వాత ఆయన బ్రతికారు, పట్టణం ప్రజలతో కళకళలాడుతూ ఉంది, పట్టణం పూర్తిగా మళ్ళీ నిర్మించబడి ఉంది, పుణ్యక్షేత్రము కూడా మళ్ళీ నిర్మించబడి ఉంది. గాడిద మీద కూర్చొని ఆయన పట్టణానికి వెళ్లారు.

పట్టణానికి వెళ్ళినప్పుడు చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, ఆయన మరణించేటప్పుడు ఆయన ఇంటిలో ఒక సేవకురాలు ఉండేది, అప్పుడు ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు. ఇప్పుడు ఈయన 100 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారంటే ఆవిడ వయస్సు ఎంత అయి ఉంటుందండి? 20 + 100, కలిపితే 120 సంవత్సరాలకు చేరుకొని ఉంది. ఆవిడ పూర్తిగా ముసలావిడగా మారిపోయి, వృద్ధాప్యానికి గురయ్యి, కంటిచూపు దూరమైపోయింది, కాళ్ళు కూడా పడిపోయి ఉన్నాయి. ఆవిడ ఒక మంచానికే పరిమితమైపోయి ఉంది.

ఆవిడ వద్దకు ముందు ఉజైర్ అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్లి “అమ్మా నేను ఉజైర్ ని” అంటే, ‘ఉజైర్’ అన్న పేరు వినగానే ఆవిడ బోరున ఏడ్చేసింది. “ఎన్నో సంవత్సరాల క్రితము మా యజమాని ఉండేవారు” అని ఏడుస్తూ ఉంటే, “అమ్మా నేనే మీ యజమాని ఉజైర్ ని” అని చెప్పారు. అప్పుడు ఆ మహిళ, “అరె! 100 సంవత్సరాల తర్వాత వచ్చి మీరు నా యజమాని అంటున్నారు, ఎలాగండి నేను నమ్మేది? ఉజైర్ గొప్ప భక్తుడు. ఆయన ప్రార్థన చేస్తే, దుఆ చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తప్పనిసరిగా ఆమోదించేవాడు. మీరు ఉజైర్ అయితే, నాకు కంటిచూపు మళ్ళీ రావాలని, అలాగే చచ్చుబడిపోయిన నా కాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా మారాలని దుఆ చేయండి” అని కోరారు.

ఉజైర్ అలైహిస్సలాం వారు దుఆ చేశారు. దుఆ చేయగా ఆవిడకు కంటిచూపు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తిరిగి ఇచ్చేశాడు, ఆవిడ కాళ్ళు కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ నయం చేసేశాడు. అప్పుడు ఆవిడ లేచి, ఉజైర్ అలైహిస్సలాం వారిని చూసి, చెయ్యి పట్టుకొని, “నేను సాక్ష్యం ఇస్తున్నాను ఈయనే ఉజైర్ అలైహిస్సలాం” అని సాక్ష్యం ఇచ్చారు.

తర్వాత “రండయ్యా మీ ఇంటిని చూపిస్తాను, మీ కుటుంబీకుల్ని చూపిస్తాను” అని ఉజైర్ అలైహిస్సలాం వారిని వెంటబెట్టుకొని ఉజైర్ అలైహిస్సలాం వారి ఇంటికి వెళితే, అప్పుడు కుటుంబ సభ్యులలో ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారులు ఉన్నారు. వారి వయస్సు కూడా 100 దాటిపోతూ ఉంది. ఉజైర్ అలైహిస్సలాం వారిని ఇంటి బయట నిలబెట్టి, ఆవిడ ఇంటిలోనికి ప్రవేశించి ఉజైర్ అలైహిస్సలాం వారి కుమారుల వద్దకు వెళ్లి, “మీ నాన్నగారు వచ్చారు” అంటే వారందరూ షాక్ అయ్యారు. అవాక్కయిపోయారు. “అదేమిటి 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కనుమరుగైపోయిన మా తండ్రి ఇప్పుడు తిరిగి వచ్చారా ఇంటికి?” అని వారు షాక్ అయిపోతూ ఉంటే, “అవునండీ, చూడండి నాకు కంటిచూపు ఉండేది కాదు, నాకు కాళ్ళు కూడా చచ్చుబడిపోయి ఉండేవి. కానీ ఆయన వచ్చి ప్రార్థన చేయగా నాకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కంటిచూపు ఇచ్చాడు, కాళ్ళను నయం చేశాడు. నేను మళ్ళీ ఆరోగ్యంగా తిరగగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చూడండి బయట ఉన్నారు” అని చెప్పగానే, వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించగా, ముందుగా కుమారులు ఆశ్చర్యపడ్డారు.

సందేహం వ్యక్తపరుస్తూ ఒక కుమారుడు ఏమన్నాడంటే, “చూడండి మా నాన్నగారికి భుజం పక్కన మచ్చ లాంటి ఒక గుర్తు ఉండేది, అది ఉందేమో చూడండి” అన్నారు. ఉజైర్ అలైహిస్సలాం వారు బట్టలు కొంచెం పక్కకు జరిపి చూపియగా, అక్కడ నిజంగానే ఆ మచ్చ లాంటి గుర్తు కనిపించింది. అప్పుడు కుటుంబ సభ్యులు ఉజైర్ అలైహిస్సలాం వారిని “ఈయనే మా తండ్రి” అని గ్రహించారు.

అయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము ఉజైర్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా 40 సంవత్సరాల వ్యక్తి లాగే సిద్ధం చేశాడు. వారి కుమారులు మాత్రము 100 సంవత్సరాలు చేరుకున్న వృద్ధుల్లా కనిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలా సంఘటన జరిగిన తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు మళ్ళీ నగరంలోకి వచ్చారు, నగర ప్రజల్ని ప్రోగు చేశారు. ప్రోగు చేసి “ఎవరెవరికి తౌరాత్ గ్రంథంలోని వాక్యాలు కంఠస్థమై ఉన్నాయో, ఎన్ని కంఠస్థమై ఉంటే వారు వచ్చి నాకు వినిపించండి” అని పిలుపునిచ్చారు. ఎవరెవరికి ఎన్ని వాక్యాలు కంఠస్థం చేయబడి ఉన్నాయో వారందరూ వచ్చి ఉజైర్ అలైహిస్సలాం వారికి వారు కంఠస్థం చేసిన ఆ తౌరాత్ గ్రంథంలోని దైవ వాక్యాలు వినిపించారు.

అప్పుడు ఉజైర్ అలైహిస్సలాం వారు ఒక చెట్టు నీడలో కూర్చొని, ఇతర వ్యక్తుల నోట విన్న వాక్యాలు, ఆయన స్వయంగా కంఠస్థం చేసిన వాక్యాలు అన్నీ కూడా మళ్ళీ రచించారు. ఆ ప్రకారంగా మళ్ళీ తౌరాత్ గ్రంథం (నెబుకద్ నెజరు రాజు దాన్ని కాల్చేసి వెళ్లిపోయాడని చెప్పాము కదా), ఆ కాలిపోయి కనుమరుగైపోయిన తౌరాత్ గ్రంథంలోని వాక్యాలను, ఎవరెవరు ఎంత కంఠస్థం చేసి ఉన్నారో అన్ని వాక్యాలు మళ్ళీ తిరిగి ఉజైర్ అలైహిస్సలాం వారు రచించారు. రచించి ప్రజలకు గ్రంథము ఇవ్వడంతో పాటు ఆ గ్రంథంలోని వాక్యాలు, వాటి సారాంశము ప్రజలకు బోధించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఉజైర్ అలైహిస్సలాం వారు ఎన్ని సంవత్సరాలు జీవించారు అంటే, చరిత్రలో ప్రామాణికమైన ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. ఆయన మాత్రము మరణించారు. ఎప్పుడు మరణించారు? ఎన్ని సంవత్సరాల వయసులో మరణించారు? ఏ విధంగా ఆయన మరణం సంభవించింది? అన్న వివరాలు మాత్రము ప్రామాణికమైన ఆధారాలలో మనకు ఎక్కడా దొరకలేదు. అయితే ఆయన సమాధి మాత్రము ‘డమస్కస్’ నగరంలో నేటికీ ఉంది అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఆయన మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితుల్ని మనం చూసినట్లయితే, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారం, ఉజైర్ అలైహిస్సలాం వారు జీవించినన్ని రోజులు ప్రజలు ఆయనను ఒక బోధకునిగా గౌరవించారు. ఆయన మరణించిన తర్వాత… ఆయన 100 సంవత్సరాలు మరణించి మళ్ళీ జీవించారన్న ఒక అభిప్రాయం ఉండేది, ఆయన దుఆతో ప్రజల సమస్యలు తీరాయని మరొక అభిప్రాయం ఉండేది, అలాగే ఆయన గ్రంథాన్ని రచించి ప్రజలకు వినిపించారు, ఇచ్చారు అనే మరో అభిప్రాయం ఉండింది. ఇలా అనేక అభిప్రాయాల కారణంగా ఉజైర్ అలైహిస్సలాం వారి గౌరవంలో బనీ ఇస్రాయీల్ ప్రజలు హద్దు మీరిపోయారు. ఆ గౌరవంలో, అభిమానంలో ఏకంగా ఉజైర్ అలైహిస్సలాం వారిని “దైవ కుమారుడు” అని చెప్పటం ప్రారంభించారు. తర్వాత అదే వారి విశ్వాసంగా మారిపోయింది, “ఉజైర్ దైవ కుమారుడు” అని నమ్మటం ప్రారంభించారు. వారి ఈ నమ్మకం సరికాదు అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం, 30వ వాక్యంలో స్పష్టంగా ఖండించి ఉన్నాడు.

وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్ అల్లాహ్ కుమారుడు” అని యూదులు అంటున్నారు. “మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడు” అని క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకులలోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక! సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారో చూడండి. (ఖుర్ఆన్, 9:30)

అంటే ఈ వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు నమ్ముతున్న నమ్మకాన్ని ఖండిస్తూ, ఇది నిజము కాదు, వారు కల్పించుకున్న కల్పితాలు మాత్రమే, వారి నోటి మాటలు మాత్రమే అని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

ఉజైర్ అలైహిస్సలాం వారి గురించి ఒక హదీసులో పరోక్షంగా ప్రస్తావన వచ్చి ఉంది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలో ఒక హదీసు ఉందండి. ఆ హదీసు ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:

‘పూర్వము ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన వెళుతూ ఉంటే ఒకచోట కూర్చున్నప్పుడు, ఆయనకు ఒక చీమ కరిచింది. చీమ కరిచినప్పుడు ఆయన కోపగించుకొని, కోపంతో చీమ పుట్టను త్రవ్వేసి, ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశారు.వెంటనే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ ప్రవక్త వద్దకు వహీ (దైవవాణి) పంపించాడు. ‘నీకు హాని కలిగించింది, నీకు కుట్టింది ఒక చీమ కదా. నీకు కోపం ఉంటే ఒక చీమను చంపుకోవాలి. కానీ, పూర్తి పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేయటము, కాల్చేయటం ఏమిటి?’ అని ఒక ఉల్లేఖనంలో ఉంది.

మరో ఉల్లేఖనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది: ‘నీకు ఒక్క చీమ కుట్టిందన్న సాకుతో, నీవు ఆ పుట్టలో ఉన్న చీమలన్నింటినీ దహనం చేసేశావు. వాస్తవానికి ఆ సమూహము అల్లాహ్ ను స్మరించేది (తస్బీహ్ చేసేది). అల్లాహ్ ను స్మరించే ఒక సమూహాన్ని ఒక్క చీమ కుట్టిన కారణంగా నీవు దహనం చేశావేమిటి?’ అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆక్షేపించాడు.’

మరి ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అంటే ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు మరియు హసన్ బస్రీ రహిమహుల్లా వారు ఏమంటున్నారు అంటే, ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఆ ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం అని తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఉజైర్ అలైహిస్సలాం ఏ కాలానికి చెందిన వారు అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము, సులైమాన్ అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం వీరిద్దరి మధ్యలో వచ్చిన ప్రవక్త. అలాగే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారు అంటే, ఉజైర్ అలైహిస్సలాం వారు ప్రవక్త కాదు, ఆయన గొప్ప భక్తుడు, గ్రంథ జ్ఞాని అని అంటున్నారు. అసలు విషయం అల్లాహ్ కు తెలుసు.

ఇది ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర. ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనము గ్రహించాల్సిన పాఠాలు ఏమిటి అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకొని మాటను ముగిస్తాను.

1. అల్లాహ్ మృతులను తిరిగి బ్రతికించగలడు:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏమిటంటే, మృతులను మళ్ళీ బ్రతికించేవాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అన్న విషయం ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు స్పష్టంగా తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు 100 సంవత్సరాల కోసము మరణించి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో జీవించబడ్డారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. చూసారా? మొదటిసారి ప్రాణం పోసిన ఆయన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా, ఆయనకు 100 సంవత్సరాల కోసం మరణం ఇచ్చి, 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకు బ్రతికించి ప్రాణం పోసి నిలబెట్టాడు. కాబట్టి మానవులను మళ్ళీ పుట్టించగల శక్తి అల్లాహ్ కు ఉంది అని ఈ ఉజైర్ అలైహిస్సలాం వారి ద్వారా మనకు స్పష్టం చేయబడింది.

ఖురాన్ గ్రంథం 36వ అధ్యాయం, 78-79 వాక్యాలలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు.

قَالَ مَن يُحْيِي الْعِظَامَ وَهِيَ رَمِيمٌ * قُلْ يُحْيِيهَا الَّذِي أَنشَأَهَا أَوَّلَ مَرَّةٍ ۖ وَهُوَ بِكُلِّ خَلْقٍ عَلِيمٌ

“కుళ్లి కృశించి పోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు (మానవుడు) సవాలు విసురుతున్నాడు. వారికి సమాధానం ఇవ్వు, “వాటిని తొలిసారి సృష్టించినవాడే మలిసారి కూడా బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు.” (ఖుర్ఆన్, 36:78-79)

తొలిసారి పుట్టించిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మలిసారి కూడా పుట్టించగలుగుతాడు, ఆయనకు అలా చేయటం చాలా సులభం అని తెలుపబడటం జరిగింది. ఖురాన్ లో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇబ్రహీం అలైహిస్సలాం వారు అల్లాహ్ తో, “నీవు మరణించిన వారిని మళ్ళీ ఎలా బ్రతికిస్తావు?” అని అడిగినప్పుడు, పక్షుల్ని తీసుకొని వాటి ఎముకల్ని అటూ ఇటూ పడవేయ్యండి, తర్వాత అల్లాహ్ పేరుతో పిలవండి, అవి మళ్ళీ బ్రతికి వస్తాయి అని చెప్పగా, ఆయన అలాగే చేశారు. అల్లాహ్ పేరుతో పిలవగానే ఎముకలుగా మార్చబడిన ఆ పక్షులు మళ్ళీ పక్షుల్లాగా జీవించి ఎగురుకుంటూ ఆయన వద్దకు వచ్చాయి.

అలాగే హిజ్కీల్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 35 వేల మంది లోయలో మరణించారు. ప్రవక్త కళ్ళ ముందరే మళ్ళీ వారు బ్రతికించబడ్డారు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో, ఇంచు మించు 70 మంది బనీ ఇస్రాయీల్ తెగకు చెందిన నాయకులు పర్వతం మీద మరణించారు. తర్వాత మూసా అలైహిస్సలాం దుఆతో వాళ్ళు మళ్ళీ బ్రతికించబడ్డారు.

ఈ విధంగా ఖురాన్ లో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారు, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడతారు అన్న కొన్ని ఉదాహరణలు తెలియజేసి ఉన్నాడు. అలాగే గుహవాసులు, ‘అస్ హాబుల్ కహఫ్’ అని మనం అంటూ ఉంటాం. వారిని కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ముందు మరణం ప్రసాదించి, తర్వాత మళ్ళీ జీవించేలాగా చేశాడు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు.

ఆ ఉదాహరణల ద్వారా మనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు అని స్పష్టంగా, ఉదహరించి మరీ నిజమైన ఆధారాలతో తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి విశ్వాసి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరణించిన వారిని మళ్ళీ లేపగలుగుతాడు, మళ్ళీ బ్రతికించగలుగుతాడు అని నమ్మాలి, విశ్వసించాలి.

2. సమాజ సంస్కరణ బాధ్యత:

ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం గ్రహించాల్సిన మరొక విషయం, సమాజ సంస్కరణకు కృషి చేయాలి. ఉజైర్ అలైహిస్సలాం వారు రెండవసారి లేపబడినప్పుడు, ప్రజల వద్దకు వెళ్లి దైవ వాక్యాలు రచించి, ప్రజలకు అందజేయడంతో పాటు బోధించారు. సమాజాన్ని సంస్కరించారు, ప్రజలను సంస్కరించారు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజాన్ని సంస్కరించడానికి కృషి చేయాలి. చూడండి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజమైన మనకు “ఉత్తమ సమాజం” అని బిరుదు ఇస్తూ, “మీరు మంచిని బోధిస్తారు, చెడును నిర్మూలిస్తారు” అని బాధ్యత ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి సమాజ సంస్కరణ కోసము కృషి చేయాలన్న విషయం ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి.

3. మరణానంతర జీవితం:

మరణానంతరం జీవితం ఉంది అన్న విషయం కూడా ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనకు తెలుపబడింది. ఉజైర్ అలైహిస్సలాం వారు మరణించారు, మళ్ళీ బ్రతికించబడ్డారు. అదే విధంగా పుట్టిన తర్వాత మరణించిన ప్రతి మనిషిని పరలోకంలో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ బ్రతికిస్తాడు. అక్కడ లెక్కింపు ఉంటుంది, చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ లెక్క తీసుకొని స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు. మరణానంతర జీవితం ఉంది అని స్పష్టపరచడానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇలా ప్రజలకు కొన్ని ఉదాహరణలు ప్రపంచంలోనే చూపించి ఉన్నాడు. మరణించిన వాడు మరణించాడు, ఇక మట్టిలో కలిసిపోయాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు అని భ్రమించే వారికి, చూడండి మరణించిన వారిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మళ్ళీ లేపుతాడు అని ఇక్కడ కొంతమందిని లేపి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చూపించి ఉన్నాడు కాబట్టి, ఆ ప్రకారంగా మరణానంతర మరొక జీవితం ఉంది అన్న విషయం ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రతి విశ్వాసి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

4. సృష్టి యావత్తు అల్లాహ్ ను స్తుతిస్తుంది:

అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి. చీమల గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఏమన్నారంటే, “అవి అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. అల్లాహ్ ను స్తుతించే చీమలని మీరు దహనం చేసేసారు ఏమిటి?” అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అక్కడ ఆ ప్రవక్తను నిలదీశాడు అంటే, చీమలు సైతం అల్లాహ్ ను స్తుతిస్తూ ఉన్నాయి. ఉత్తమ జీవులైన మానవులు మరీ ఎక్కువగా అల్లాహ్ ను స్తుతిస్తూ ఉండాలి, అల్లాహ్ ను స్మరిస్తూ ఉండాలి.

ఖురాన్ గ్రంథం 62వ అధ్యాయం, 1వ వాక్యంలో అల్లాహ్ ఈ విధంగా తెలియజేశాడు:

يُسَبِّحُ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ
[యుసబ్బిహు లిల్లాహి మాఫిస్ సమావాతి వమా ఫిల్ అర్జ్]
“భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాయి.” (ఖుర్ఆన్, 62:1)

భూమి ఆకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్ ను స్తుతిస్తూ ఉంది, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంది, అల్లాహ్ ను స్మరిస్తూ ఉంది. కాబట్టి మానవులు కూడా అల్లాహ్ ను స్తుతిస్తూ, అల్లాహ్ ను స్మరిస్తూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండాలి. ఎవరైతే అల్లాహ్ ను స్తుతిస్తారో వారు ఇహపర సాఫల్యాలు మరియు అనుగ్రహాలు పొందుతారన్న విషయం కూడా తెలియజేయడం జరిగింది.

5. అగ్నితో శిక్షించే అధికారం:

చివర్లో ఒక విషయం ఏమిటంటే, అగ్నితో శిక్షించే అధికారం అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఆయన (పూర్వం ఒక ప్రవక్త) చీమ కుట్టింది అని చీమలను కాల్చేశాడు. కాల్చేస్తే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా “ఎందుకు వారిని కాల్చింది? కుట్టింది ఒక చీమే కదా. ఆ ఒక చీమని కావాలంటే మీరు చంపుకోవాలి గాని, మొత్తం చీమలను దహనం చేశారు ఏమిటి?” అని నిలదీశాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారు అంటే:

“నిశ్చయంగా, అగ్నితో శిక్షించే అధికారం అగ్నిని సృష్టించిన ప్రభువు (అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా) కు మాత్రమే ఉంది” అన్నారు. (అబూ దావూద్). మరొక ఉల్లేఖనంలో, “అగ్నితో శిక్షించే అధికారం ఎవ్వరికీ లేదు అల్లాహ్ కు తప్ప” అన్నారు (బుఖారీ). అంటే అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ అగ్నితో శిక్షించే అధికారం లేదు.

ఇవి ఉజైర్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు బోధపడిన కొన్ని విషయాలు. నేను అల్లాహ్ తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మిమ్మల్ని అందరినీ అన్న విన్న విషయాల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు.

[క్రింది విషయం ఖురాన్ కథామాలిక అనే పుస్తకం నుండి తీసుకోబడింది]

2:259 أَوْ كَالَّذِي مَرَّ عَلَىٰ قَرْيَةٍ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحْيِي هَٰذِهِ اللَّهُ بَعْدَ مَوْتِهَا ۖ فَأَمَاتَهُ اللَّهُ مِائَةَ عَامٍ ثُمَّ بَعَثَهُ ۖ قَالَ كَمْ لَبِثْتَ ۖ قَالَ لَبِثْتُ يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ ۖ قَالَ بَل لَّبِثْتَ مِائَةَ عَامٍ فَانظُرْ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمْ يَتَسَنَّهْ ۖ وَانظُرْ إِلَىٰ حِمَارِكَ وَلِنَجْعَلَكَ آيَةً لِّلنَّاسِ ۖ وَانظُرْ إِلَى الْعِظَامِ كَيْفَ نُنشِزُهَا ثُمَّ نَكْسُوهَا لَحْمًا ۚ فَلَمَّا تَبَيَّنَ لَهُ قَالَ أَعْلَمُ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

ఉజైర్ (అలైహిస్సలాం)
(వందేళ్ళు నిద్రపోయిన మనిషి)
(500-400 క్రీ.పూ.)

ఉజైర్ (అలైహిస్సలాం) తన తోటలోకి ప్రవేశించి అక్కడి ప్రకృతి సౌందర్యానికి మ్రాన్పడి అలాగే కాసేపు నిలబడి పోయారు. పచ్చగా కళకళలాడే చెట్లు, వాటిపై ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మపైకి కిలకిలరావాలతో ఎగిరే పక్షులు, విసనకర్రల్లాంటి చెట్ల ఆకుల నుంచి వీస్తున్న స్వచ్ఛమైన పిల్లతెమ్మరలు ఆస్వాదిస్తూ తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు. అలా చాలా సేపు నిలబడిపోయారు. చెట్ల కొమ్మలు నోరూరించే పండ్ల భారంతో క్రిందికి వంగిపోయి ఉన్నాయి. ఆయన తన బుట్టను తీసుకుని అందులో రకరకాల పండ్లు కోసుకున్నారు. ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు. దాని పై కూర్చుని వెళ్ళిపోయారు.

దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి, ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు. గాడిద దారితప్పి తనను ఎటో తీసుకు పోవడాన్ని ఆయన గుర్తించలేదు. ఆలోచనల నుంచి బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడుపడిన ఊరిలో ఉన్నారు. నేలపై మానవుల కంకాళాలు, జంతువుల అస్థిపంజరాలు చెల్లాచెదరుగా పడఉన్నాయి. వారంతా గతించిన కాలాల ప్రజలని, వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించారు.

ఆయన గాడిదపై నుంచి క్రిందికి దిగారు. గాడిదపై ఉన్న బరువును క్రిందికి దించి, ఒక కూలిపోయిన గోడకు అనుకుని కూర్చున్నారు. ఆ ఊరి ప్రజలకు ఏమయ్యిందో అని ఆలోచించసాగారు. ఆయనకు మరణానంతర జీవితం గురించి ఆలోచన వచ్చింది. మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు? ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనల్లో మునిగి అలాగే కునికిపాట్లు పడుతూ నిద్రలోకి జారిపోయారు.

అలా రోజులు గడచపోయాయి, నెలలు గతించాయి. సంవత్సరాలు కాల గర్భంలో కలసపోయాయి. ఉజైర్ (అలైహిస్సలాం) నిద్రలోనే ఉన్నారు. ఈ సుదీర్ఘకాలంలో ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, పిల్లల పిల్లలు ఇలా తరాలు గడచిపోయాయి. జాతులు అంతరించాయి. కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి.

అల్లాహ్ తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. సాధారణ విశ్వాసికి ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించక పోయినా అతను తన విధులను నిర్వర్తించవలసి ఉంటుంది. కాని దేవుని సందేశ హరులైన ప్రవక్తలకు వారి విధుల నిర్వహణలో, దేవుని సందేశం ప్రజలకు అంద జేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం. అందుకుగాను జీవితానికి సంబంధించిన లోతయిన వాస్తవాలను తెలుసుకోవలసిన అవసరం కూడా వారికి ఉంటుంది. అందుకే ప్రవక్తల వద్దకు దైవదూతలు వచ్చేవారు. స్వర్గనరకాలు, భూమ్యాకాశాలు, మరణానంతరం జీవితం వగైరా వాస్తవాలను వారికి చూపించడం జరిగేది.

ఉజైర్ (అలైహిస్సలాం) తన దీర్ఘనిద్ర నుంచి మేల్కొన్నారు. అల్లాహ్ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయ్యింది. ఆయన నిద్ర పోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఒక దైవదూత ఆయన ముందు ప్రత్యక్ష మయ్యాడు. ఉజైర్తో దైవదూత, “ఎంతకాలం నిద్రపోయానని భావిస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఉజైర్ (అలైహిస్సలాం) జవాబిస్తూ, “నేను రోజులో చాలా భాగం నిద్ర పోయి ఉంటాను” అన్నారు. దైవదూత ఆయన్ని చూస్తూ, “కాదు, నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు. చూడు! నీ పండ్లు అప్పుడు ఎంత తాజాగా ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే తాజాగా ఉన్నాయి. నీ త్రాగునీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. కాని నీ గాడిదను చూడు, కేవలం దాని అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు.. అల్లాహ్ మహత్యాన్ని చూడు..మరణించిన వారిని మళ్ళీ ఆయన ఎలా బతికిస్తాడో అర్థం చేసుకో.. దీన్ని నీ ప్రభువు తరపు నుంచి నిదర్శ నంగా భావించు. నీ మనస్సులో ఉన్న అనుమానాలన్నీ తొలగించుకో” అన్నాడు.

ఉజైర్ (అలైహిస్సలాం) చూస్తుండగానే గాడిద అస్థిపంజరంపై మాంసం కండరాలు చోటు చేసుకున్నాయి. గాడిద మళ్ళీ సజీవంగా లేచి నిలబడింది. ఆయన ఆశ్చర్యంగా, “అల్లాహ్ ఏమైనా చేయగల శక్తి కలిగినవాడని నేనిప్పుడు దృఢంగా నమ్ముతున్నాను” అన్నారు.

ఉజైరు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా మారిపోయాయి. తన ఇంటిని వెదకడానికి చాలా సమయం పట్టింది. చివరకు ఇంటికి చేరుకుంటే అక్కడ ఆయనకు ఒక వృద్ధ మహిళ కనబడింది. ఆమె కళ్ళు కనబడడం లేదు. కాని ఆమె జ్ఞాపకశక్తి చాలా బలంగా ఉంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెను గుర్తించారు. తాను ఇల్లు వదలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్నపిల్ల. ఆయన ఆమెతో, “ఇది ఉజైర్ ఇల్లేనా” అని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇస్తూ, “అవును” అంది. ఆమె దుఃఖంతో, “ఉజైర్ ఇల్లు వదలి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాలై పోయాయి. ఆ తర్వాత ఎవరికీ ఆయన ఎక్కడికెళ్ళిందీ తెలియరాలేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారు. చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు” అంది. ఉజైర్ (అలైహిస్సలాం) ఆమెతో, “నేనే ఉజైర్. అల్లాహ్ అభీష్టం వల్ల నేను చాలా కాలం నిద్ర పోయాను. అల్లాహ్ నన్ను వంద సంవత్సరాల తర్వాత నిద్ర లేపాడు” అన్నారు.

ఈ మాటలు విని ఆ వృద్ధమహిళ చాలా ఆశ్చర్యపోయింది. కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత, “ఉజైర్ (అలైహిస్సలాం) చాలా ధర్మాత్ముడు. అల్లాహ్ ఆయన ప్రార్థనలను వినేవాడు. ఆయన రోగుల స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారీ వారికి ఆరోగ్యం చేకూరేది. కాబట్టి, నువ్వు ఉజైర్అ యితే అయితే నా ఆరోగ్యం కోసం, నా కంటిచూపు కోసం అల్లాహ్ ను ప్రార్థించు” అని అడిగింది.

ఉజైర్ (అలైహిస్సలాం) అల్లాహ్ ను వేడుకున్నారు. అల్లాహ్ ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు. ఆ వృద్ధమహిళకు ఆరోగ్యం చేకూరింది. ఆమె కంటిచూపు మళ్ళీ వచ్చింది. ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది. ఉజైర్ పిల్లలు, మనుమలు, మనుమల పిల్లలు అందరూ పరుగున వచ్చారు. యువకునిగా కనబడుతున్న ఉజైర్ని చూసి ఆయన తమకు తాతగారని వారు నమ్మలేకపోయారు. “ఇది నిజమా!” అని గుసగుసలాడు కోసాగారు. ప్రస్తుతం ముసలివాడై పోయిన ఉజైర్ కొడుకు ఒకరు “నా తండ్రికి భుజంపై ఒక పుట్టుమచ్చ ఉండేది. మా అందరికీ ఆ పుట్టుమచ్చ గురించి బాగా తెలుసు. మీరు ఆయనే అయితే ఆ పుట్టుమచ్చ చూపించండి” అని ప్రశ్నించాడు. ఉజైర్ తన భుజంపై ఉన్న పుట్టుమచ్చను చూపించారు. అయినా వారికి సంతృప్తి కలగలేదు. మరో కుమారుడు, “జెరుసలేమ్ను బుఖ్స్సర్ ఆక్రమించుకుని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు. అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రిగారు కూడా ఒకరు. మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి” అనడిగాడు. ఉజైర్ తౌరాత్ మొత్తం పఠించి వినిపించారు. ఆయన స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు. నిజంగా ఉజైర్ (అలైహిస్సలాం) తిరిగి వచ్చారని వారికి అప్పటికి నమ్మకం కలిగింది. అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు. ఆనంద భాష్పాలు రాల్చారు.

ఆ పిదప యూదులు, “అల్లాహ్ ఉజైర్ను మళ్ళీ బ్రతికించాడు. కాబట్టి ఆయన తప్పక అల్లాహ్ కుమారుడై ఉండాలి” అనడం ప్రారంభించారు. (చదవండి దివ్యఖుర్ఆన్: 9:30, 2:259)

9:30 وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُم بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِن قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ

“ఉజైర్‌ అల్లాహ్‌ కుమారుడు” అని యూదులంటున్నారు. “మసీహ్‌ (ఏసు క్రీస్తు) అల్లాహ్‌ కుమారుడు” అని నసారా (క్రైస్తవులు) అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళూ అనుకరిస్తున్నారు. అల్లాహ్‌ వారిని నాశనం చేయుగాక! (సత్యం నుండి) వారెలా తిరిగిపోతున్నారు!?

సాధారణంగా మనిషి కళ్ళకు కనబడే వాటిని పట్టించుకోకుండా తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉజైర్ తిరిగి రావడం అల్లాహ్ చూపించిన మహత్యంగా గ్రహించే బదులు యూదులు ఆయన్ను దేవుని కుమారునిగా పిలువడం ప్రారంభించారు.

ఈ పోస్ట్ లింక్ :
https://teluguislam.net/?p=17430

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు [వీడియో]

బిస్మిల్లాహ్

మొదటి భాగం ఇక్కడ వినండి :
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర
: https://youtu.be/DftBKf6r4MA

జకరియ్యా (అలైహిస్సలాం) జీవిత పాఠాలు – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) [వీడియో]

బిస్మిల్లాహ్
జకరియ్యా & యహ్యా (అలైహిమస్సలాం) జీవిత చరిత్ర (Seerah of Zakariyyah & Yahya alaihimassalam) త్ర – వక్త: ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్)

ప్రవక్తల జీవిత చరిత్ర (యూట్యూబ్ ప్లే లిస్ట్)
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV2_iYX30U89yPwY5LPGtir8

ప్రవక్తలు (మెయిన్ పేజీ)
https://teluguislam.net/prophets/

ముహమ్మద్ సలీం జామి’ఈ (హఫిజహుల్లాహ్) – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV0B6tOQhDiqrHO4E3Ou_IL7

ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? [వీడియో]

బిస్మిల్లాహ్
ప్రస్తుత కాలంలో షరియత్ (ధర్మ శాస్త్రం)లో మార్పులు సాధ్యమేనా? – షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)
https://youtu.be/Y55gGxIgxeM

[63 నిముషాలు]
షేఖ్. డా సఈద్ అహ్మద్ మదనీ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర [వీడియో]

బిస్మిల్లాహ్
సహాబియ్యాత్ – షిఫా బిన్త్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హా) జీవిత చరిత్ర – వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

[38 నిముషాలు]
వక్త: హబీబుర్ రహ్మాన్ జామిఈ (హఫిజహుల్లాహ్)

సీరతే సహాబియ్యాత్ – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3cUt4NimP4PNSWLjHO3sXM

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – సద్వర్తన, ఉత్తమ నడవడిక (Good Character) [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 D నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – సద్వర్తన, ఉత్తమ నడవడిక
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[6 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(6) సద్వర్తన, ఉత్తమ నడవడిక

ప్రవక్త ﷺ చెప్పగా విన్నానంటూ ఆయిషా (రదియల్లాహు అన్హా)ఉల్లేఖించారు:

إِنَّ الْـمُؤْمِنَ لَيُدْرِكُ بِحُسْنِ خُلُقِهِ دَرَجَاتِ قَائِمِ اللَّيْلِ، صَائِمِ النَّهَارِ

“నిశ్చయంగా విశ్వాసుడు తన ఉత్తమ నడవడిక ద్వారా రాత్రంతా ఆరాధన చేసే, పగలంతా ఉపవాసముండే వారి స్థానాలకు చేరుకుంటాడు”.

(ముస్నద్ అహ్మద్ పదాలు 24355, అబూదావూద్ 4798, అల్బానీ సహీహుల్ జామి 1620లో సహీ అన్నారు).

దీని వ్యాఖ్యానంలో అబుత్తయ్యిబ్ షమ్సుల్ హఖ్ అజీమాబాదీ (రహిమహుల్లాహ్) ఔనుల్ మఅ’బూద్ లో ఇలా చెప్పారుః

ఉత్తమ నడవడిక గల వ్యక్తికి ఇంతటి గొప్ప ఘనత ఎందుకు ఇవ్వబడిదంటే; ‘సాయిమ్’ (ఉపవాసం ఉండేవాడు), ‘ఖాయిమ్’ (రాత్రి నమాజు చేసేవాడు), తమ మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు, కాని ఉత్తమ నడవడిక అవలంబించే వ్యక్తి విభిన్న తత్వాలు, గుణాలు గల ప్రజలతో పోరాడుతూ ఉంటాడు అందుకే అతను సాయిమ్, ఖాయిమ్ ల స్థానాలను అందుకుంటాడు. ఇలా వారు స్థానంలో సమానులవుతారు, ఒకప్పుడు వీరే ఎక్కువ స్థానం పొందుతారు.

(ఔనుల్ మఅ’బూద్ షర్హు సునన్ అబీ దావూద్ 13/ 154, హదీసు నంబర్ 4798).

ప్రజలతో మంచి విధంగా వ్యవహరించడం, వారికి ఏ కష్టం కలిగించకుండా ఉండడమే ఉత్తమ నడవడిక, సద్వర్తన.

నిశ్చయంగా మనిషికి విశ్వాసం తర్వాత సద్వర్తన కంటే ఉత్తమమైన మరే విషయం ఇవ్వబడలేదు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ ప్రభువుతో ఉత్తమ నడవడిక ప్రసాదించమని అర్థించేవారు. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)అలైహి వసల్లం అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాక ఇలా చదివేవారు:

إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لله رَبِّ الْعَالَمِينَ لَا شَرِيكَ لَهُ، وَبِذَلِكَ أُمِرْتُ وَأَنَا مِنَ الْـمُسْلِمِينَ. اللَّهُمَّ اهْدِنِي لِأَحْسَنِ الْأَعْمَالِ وَأَحْسَنِ الْأَخْلَاقِ لَا يَهْدِي لِأَحْسَنِهَا إِلَّا أَنْتَ، وَقِنِي سَيِّئَ الْأَعْمَالِ وَسَيِّئَ الْأَخْلَاقِ لَا يَقِي سَيِّئَهَا إِلَّا أَنْتَ

ఇన్న సలాతీ వ నుసుకీ వ మహ్ యాయ వ మమాతీ లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, లాషరీక లహూ వ బిజాలిక ఉమిర్తు వ అన మినల్ ముస్లిమీన్, అల్లాహుమ్మహ్ దినీ లిఅహ్సనిల్ అఅ’మాలి వ అహ్సనిల్ అఖ్లాక్, లా యహ్ దీ లి అహ్సనిహా ఇల్లా అంత, వ ఖినీ సయ్యిఅల్ అఅమాలి వ సయ్యిఅల్ అఖ్లాక్, లా యఖీ సయ్యిఅహా ఇల్లా అంత.

(భావం: నిశ్చయంగా నా నమాజ్, నా ఖుర్బానీ (బలిదానం), నా జీవన్మరణాలు సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే, ఆయనకు ఎవడూ భాగస్వామి లేడు. ఈ ఆదేశమే నాకు ఇవ్వబడినది, నేను ముస్లిములోని వాడిని. ఓ అల్లాహ్! నాకు సత్పవర్తన మరియు సదాచరణ వైపునకు మార్గదర్శకత్వం చేయు, వాటి వైపునకు మార్గదర్శకత్వం చూపేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు. నన్ను దుష్పవర్త మరియు దుష్కార్యాల నుండి కాపాడు. నన్ను వాటి నుండి కాపాడేవాడు నీ తప్ప ఎవ్వడూ లేడు).

(ముస్లిం 771, తిర్మిజి 3421, నిసాయి 897 హదీసు పదాలు).

అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అద్దంలో చూసినప్పుడల్లా ఇలాగే దుఆ చేసేవారు. ఇబ్ను మస్ఊద్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః ప్రవక్త ﷺ అద్దంలో చూసినప్పుడల్లా ఇలా అనేవారుః

اللَّهُمَّ كَمَا حَسَّنْتَ خَلْقِي فَحَسِّنْ خُلُقِي

అల్లాహుమ్మ కమా హస్సన్ త ఖల్కీ హస్సిన్ ఖులుకీ

“ఓ అల్లాహ్! నీవు నా సృష్టిని (ఆకారాన్ని) సరిదిద్దినట్లు నా నడవడికను కూడా సరిదిద్దు”.

(ఇబ్ను హిబ్బాన్ 959, అహ్మద్ 1/ 403, అబూ యాలా 5075, తయాలిసి 374, తబ్రానీ ఫిద్దుఆ 368, అఖ్లాఖున్నబీః అబుష్షేఖ్ అల్ అస్బహానీ 493, సహీహుల్ జామిః అల్బానీ 1307).

సద్వర్తన గల వ్యక్తి ప్రజల్లో ప్రవక్తకు అతిప్రియుడైనవాడు మరియు ప్రళయదినాన ఆయనకు సమీపాన కూర్చుండేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారని జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారుః

إِنَّ مِنْ أَحَبِّكُمْ إِلَيَّ وَأَقْرَبِكُمْ مِنِّي مَجْلِسًا يَوْمَ القِيَامَةِ أَحَاسِنَكُمْ أَخْلَاقًا

“నిశ్చయంగా మీలో నాకు అతి ప్రియమైనవాడు మరియు ప్రళయదినాన మీలో నాకు అతి సమీపంగా కూర్చుండేవాడు మీలో అందరికన్నా ఉత్తమ నడవడిక గలవాడు”.

(తిర్మిజి 2018, తబ్రానీ కబీర్ 10424, అదబుల్ ముఫ్రద్: బుఖారీ 272, అల్బానీ సహీహుత్తర్గబ్ 2649లో సహీ అన్నారు).

అల్లాహ్ ఉత్తమ నడవడిక గల వ్యక్తికి, సత్ఫలితార్థం మరియు గౌరవార్థం ఉన్నతస్వర్గంలో ఒక కోట (మంచి ఇల్లు) ప్రసాదిస్తాడు. ప్రవక్త ﷺ సెలవిచ్చారని అబూ ఉమామ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారు:

أَنَا زَعِيمٌ بِبَيْتٍ فِي رَبَضِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْمِرَاءَ وَإِنْ كَانَ مُحِقًّا، وَبِبَيْتٍ فِي وَسَطِ الْجَنَّةِ لِمَنْ تَرَكَ الْكَذِبَ وَإِنْ كَانَ مَازِحًا وَبِبَيْتٍ فِي أَعْلَى الْجَنَّةِ لِمَنْ حَسَّنَ خُلُقَهُ

“నేను బాధ్యత వహిస్తున్నాను స్వర్గం పరిసరాల్లో ఒక గృహం ఇప్పించాడానికి ఎవరైతే ధర్మం తన వైపు ఉన్నప్పటికి వివాదాన్ని విడనాడుతాడో మరియు స్వర్గం మధ్యలో ఒక గృహం ఇప్పంచడానికి ఎవరైతే పరిహాసానికైనా అబద్ధం పలకనివానికి. ఇంకా స్వర్గంలో ఎత్తైన ప్రదేశంలో ఒక గృహం ఇప్పించడానికి ఎవరైతే తమ నడవడికను సరిదిద్దుకుంటారో”.

(అబూదావూద్ పదాలు 4800, బైహఖీ 20965, షేఖ్ అల్బానీ సహీహుల్ జామి 1464లో హసన్ అన్నారు).

నీ ఉత్తమ నడవడిక అనేది నీకు దూర సంబంధికులైన వారి వరకే పరిమితమయి, నీ దగ్గరి సంబంధికులను మరచిపోవడం సమంజసం కాదు. అది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబికులకు వ్యాపించి ఉండాలి. కొందరు ప్రజల పట్ల ఉల్లాసంగా, విశాల హృదయం మరియు సద్వర్తనతో ఉంటారు, అదే వారి భార్య పిల్లలతో వాటికి భిన్నంగా ఉంటారు.

తహజ్జుద్‌ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 C నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[5 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(5) రాత్రి సూర బఖరలోని చివరి రెండు ఆయతుల పఠనం

2:285  آمَنَ الرَّسُولُ بِمَا أُنزِلَ إِلَيْهِ مِن رَّبِّهِ وَالْمُؤْمِنُونَ ۚ كُلٌّ آمَنَ بِاللَّهِ وَمَلَائِكَتِهِ وَكُتُبِهِ وَرُسُلِهِ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّن رُّسُلِهِ ۚ وَقَالُوا سَمِعْنَا وَأَطَعْنَا ۖ غُفْرَانَكَ رَبَّنَا وَإِلَيْكَ الْمَصِيرُ

ఆమనర్రసూలు బిమా ఉన్‌జిల ఇలైహి మిర్రబ్బీహీ్‌ వల్‌ మువ్ మి నూన్‌ కుల్లున్‌ ఆమన బిల్లాహి వమలాయికతిహీ వకుతుబిహీ వరుసులిహ్‌ లా నుఫర్రిఖు బైన అహది మ్మిర్రుసులిహ్‌ వఖాలూ సమిఅ్ నా వఅతఅ్ నా గుఫ్‌రానక రబ్బనా వ ఇలైకల్‌ మసీర్‌

తన ప్రభువు తరఫున అవతరింపజేయబడిన దానిని ప్రవక్త విశ్వసించాడు. దాన్ని విశ్వాసులు కూడా (సత్యమని నమ్మారు). వారంతా అల్లాహ్‌ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. “మేము ఆయన (పంపిన) ప్రవక్తల మధ్య ఎలాంటి విచక్షణను, భేదభావాన్నీ పాటించము” (అని వారు చెబుతారు). “మేము విన్నాము. విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే” అని అంటారు.

2:286  لَا يُكَلِّفُ اللَّهُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۚ لَهَا مَا كَسَبَتْ وَعَلَيْهَا مَا اكْتَسَبَتْ ۗ رَبَّنَا لَا تُؤَاخِذْنَا إِن نَّسِينَا أَوْ أَخْطَأْنَا ۚ رَبَّنَا وَلَا تَحْمِلْ عَلَيْنَا إِصْرًا كَمَا حَمَلْتَهُ عَلَى الَّذِينَ مِن قَبْلِنَا ۚ رَبَّنَا وَلَا تُحَمِّلْنَا مَا لَا طَاقَةَ لَنَا بِهِ ۖ وَاعْفُ عَنَّا وَاغْفِرْ لَنَا وَارْحَمْنَا ۚ أَنتَ مَوْلَانَا فَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ

లాయుకల్లిఫుల్లాహు నఫ్‌ సన్‌ ఇల్లా వుస్‌ అహా లహా మా కసబత్‌ వ అలైహా మక్‌తసబత్‌ రబ్బనా లాతు ఆఖిజ్‌నా ఇన్నసీనా అవ్‌ అఖ్‌తానా రబ్బనా వలా తహ్‌మిల్‌ అలైనా ఇస్‌రన్‌ కమా హమల్‌ తహూ అలల్లజీన మిన్‌ ఖబ్‌లినా రబ్బనా వలా తుహమ్మిల్‌నా మాలా తాఖతలనా బిహ్‌ వఅ్ ఫు అన్నా వగ్‌ఫిర్‌ లనా వర్‌హమ్‌నా అంత మౌలానా ఫన్‌సుర్‌నా అలల్ ఖౌమిల్‌ కాఫిరీన్‌

అల్లాహ్‌ ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయడు. అది ఏ పుణ్యాన్ని సంపాదించినా దానికే లభిస్తుంది. మరి అది ఏ పాపాన్ని మూటగట్టుకున్నా దాని ఫలితాన్ని అది చవి చూస్తుంది. (ఇలా ప్రార్థిస్తూ ఉండండి): “ఓ మా ప్రభూ! మేము మరచిపోయినా, లేక మేము పొరబడినా మమ్మల్ని నిలదీయకు. మా ప్రభూ! మాకు పూర్వం గతించిన వారిపై వేసినటువంటి భారాన్ని మాపై వేయకు. మా ప్రభూ! మేము మోయలేనటువంటి బరువును మాపై మోపకు. మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవే మా సంరక్షకుడవు. అందుచేత అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.”

ప్రవక్త ﷺ ఇలా తెలిపారని అబూ మస్ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِالْآيَتَيْنِ مِنْ آخِرِ سُورَةِ البَقَرَةِ فِي لَيْلَةٍ كَفَتَاهُ
“ఎవరు రాత్రి వేళ సూర బఖరలోని చివరి రెండు ఆయతులు పఠిస్తారో అతనికి అవే చాలు”.
(బుఖారి 5010 పదాలు, ముస్లిం 807).

ఇమాం నవవీ (రహిమహుల్లాహ్) చెప్పారుః అవి సరిపోతాయి అంటే తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి అని భావం. షైతాన్ నుండి, ఆపదల నుండి రక్షణకై అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా కావచ్చు. (సహీ ముస్లిం షర్హ్ నవవీ 6/ 340, హ.న. 807)

ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) పై అభిప్రాయాలకు/ భావాలకు మద్దతు ఇస్తూ ఇలా చెప్పారుః దీనిపై నేను ఇలా అంటానుః పైన పేర్కొనబడిన భావాలన్నియు సరియైనవి కావచ్చు. – అల్లాహ్ యే అందరికంటే ఎక్కువ తెలిసినవాడు- కాని మొదటి భావం గురించి మరో స్పష్టమైన ఉల్లేఖనం ఉంది, అది ఆసిం ద్వారా, అల్ ఖమాతో, ఆయన అబూ మస్ఊద్ తో, ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) చెప్పినట్లు తెలిపారు.

مَن قَرَأخَاتِمة الْبَقَرَةِ أَجْزَأَتْ عَنْهُ قِيَامَ لَيْلَةٍ
“ఎవరు సూర బఖరలోని చివరి ఆయతులు పఠిస్తారో అవి అతని వైపు నుండి తహజ్జుద్ కు బదులుగా సరిపోతాయి”.
(ఫత్హుల్ బారీ బిషర్హి సహీహిల్ బుఖారిః ఇబ్ను హజ్ర్ అస్ఖలానీ 8/ 673, హ.న. 5010).

ఈ రెండు ఆయతుల పారాయణం చాలా సులువైన విషయం, అనేక మంది వాటిని కంఠస్తం చేసి ఉంటారు అల్ హందులిల్లాహ్. ముస్లిం వ్యక్తి ప్రతి రాత్రి వాటిని క్రమం తప్పకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇవి సులువుగా ఉన్నాయని కేవలం వీటినే పట్టుకొని, తహజ్జుద్ కు ఉన్నటువంటి పుణ్యం గల ఇతర సత్కార్యాలను వదలకూడదు. ఎందుకనగా విశ్వాసి సాధ్యమైనంత వరకు ఎక్కువ పుణ్యాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఏ సత్కార్యం అంగీకరించబడుతుందనేది కూడా అతనికి తెలియదు.

అబ్దుల్లాహ్ బిన్ ఉమైర్ (రహిమహుల్లాహ్) చెప్పారుః అల్లాహ్ విధేయతకు సంబంధించిన విషయాల్లో, ఏదో అతి నీచమైన పని చేస్తున్నట్లుగా అతి సులువైన విషయాలతోనే సరిపుచ్చుకోకు. అలా కాకుండా ఎంతో ఆనందంతో, సంపూర్ణ కాంక్షతో కఠోరంగా శ్రమించే ప్రయత్నం చేయి. (హిల్యతుల్ ఔలియా…: అబూ నుఐమ్ 3/ 354).

తహజ్జుద్‌ కు సరిసమానమైన సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్:
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV1yihDY9sySKSVkKwefBXfS

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం [ఆడియో]

బిస్మిల్లాహ్

మరణాంతర జీవితం – పార్ట్ 26 B నుండి తీసుకోబడింది
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

తహజ్జుద్‌ పుణ్యానికి సరిసమానమైన సత్కార్యాలు – రాత్రి వేళ 100 ఆయతులు పారాయణం
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

[7 నిముషాలు]
వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)

(4) రాత్రి వేళ వంద ఆయతులు పారాయణం

ప్రవక్త ﷺ ప్రవచించారని తమీమ్ అద్దారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ قَرَأَ بِمِائَةِ آيَةٍ فِي لَيْلَةٍ، كُتِبَ لَهُ قُنُوتُ لَيْلَةٍ

“ఎవరు ఒక రాత్రిలో వంద ఆయతుల పారాయణం చేస్తారో అతనికి రాత్రంతా తహజ్జుద్ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”.

(అహ్మద్ –అల్ ఫత్ హుర్రబ్బానీ- 8/11, దార్మీ 3450, అల్బానీ సహీహుల్ జామి 6468 లో సహీ అన్నారు).

వంద ఆయతుల పారాయణం చాలా సులువు, నీ సమయంలో నుండి కేవలం పది నిమిషాల పాటు మాత్రమే గడుస్తుంది. నీ వద్ద సమయం మరీ తక్కువగా ఉంటే, ఈ ఘనతను పొందాలనుకుంటే సూర సాఫ్ఫాత్ (సూర నం. 37), లేదా సూర ఖలమ్ (68) మరియు సూర హాఖ్ఖా (69) పారాయణం చేయవచ్చు.

ఒకవేళ ఈ వంద ఆయతుల పారాయణం రాత్రి వేళ తప్పిపోతే ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పారాయణం చేయు, ఇందులో బద్ధకం వహించకు, ఇన్ షా అల్లాహ్ నీవు దాని పుణ్యం పొందగలవు. ఎలా అనగా ప్రవక్త ﷺ ఇలా శుభవార్త ఇచ్చారని హజ్రత్ ఉమర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించారుః

مَنْ نَامَ عَنْ حِزْبِهِ، أَوْ عَنْ شَيْءٍ مِنْهُ، فَقَرَأَهُ فِيمَا بَيْنَ صَلَاةِ الْفَجْرِ، وَصَلَاةِ الظُّهْرِ، كُتِبَ لَهُ كَأَنَّمَا قَرَأَهُ مِنَ اللَّيْلِ

“ఎవరైనా తాను రోజువారీగా పారాయణం చేసే ఖుర్ఆనులోని కొంత ప్రత్యేక భాగం, లేదా ఏదైనా వేరే ఆరాధన చేయలేక నిద్రపోతే, మళ్ళీ దానిని ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య పూర్తి చేసుకుంటే అతనికి రాత్రివేళ చేసినంత పుణ్యం లిఖించబడుతుంది”. (ముస్లిం 747).

ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) గారి ఈ ఉల్లేఖనం యొక్క వ్యాఖ్యానంలో ముబారక్ పూరి (రహిమహుల్లాహ్) ఇలా చెప్పారుః

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే రాత్రిపూట (నమాజ్, ఖుర్ఆన్ పారాయణం లాంటి) ఏదైనా సత్కార్యం చేయుట, మరియు నిద్ర వల్ల లేదా మరే కారణంగా తప్పిపోతే ‘ఖజా’ చేయుట ధర్మసమ్మతమైనది. ఫజ్ర్ మరియు జొహ్ర్ నమాజుల మధ్య దానిని చేసినవాడు రాత్రి చేసినవానితో సమానం.

ముస్లిం (746), తిర్మిజి (445) మొదలైనవాటిలో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా ద్వారా రుజువైన విషయం ఏమిటంటేః నిద్ర లేదా ఏదైనా అవస్త కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తహజ్జుద్ నమాజ్ చేయలేకపోతే పగటి పూట పన్నెండు రకాతులు చేసేవారు.

(తొహ్ఫతుల్ అహ్వజీ షర్హ్ జామి తిర్మిజిః ముబారక్ పూరీ 3/ 185, హ.న. 851).

బహుశా ఈ హదీసు ప్రతి రోజు ఖుర్ఆనులో ఓ ప్రత్యేక భాగ పారాయణం ఉండాలని, ప్రత్యేకంగా రాత్రి వేళ అని నిన్ను ప్రోత్సహిస్తుంది. ఏమీ! మనము అశ్రద్ధవహుల్లో లిఖించబడకుండా ఉండుటకు రాత్రి కనీసం పది ఆయతులైనా పారాయణం చేయాలని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రోత్సహించిన విషయం మీకు తెలియదా?

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారని అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారుః

مَنْ قَامَ بِعَشْرِ آيَاتٍ لَمْ يُكْتَبْ مِنَ الغَافِلِينَ، وَمَنْ قَامَ بِمِائَةِ آيَةٍ كُتِبَ مِنَ القَانِتِينَ، وَمَنْ قَامَ بِأَلْفِ آيَةٍ كُتِبَ مِنَ المُقَنْطِرِينَ

“పది ఆయతులతో తహజ్జుద్ చేయువారు అలక్ష్యపరుల్లో వ్రాయబడరు. మరెవరయితే వంద ఆయతులతో తహజ్జుద్ చేస్తాడో వినయ విధేయుల్లో వ్రాయబడుతాడు. ఇంకా ఎవరయితే వెయ్యి ఆయతులతో తహజ్జుద్ చేస్తారో ‘ముఖంతిరీన్’లో వ్రాయబడుతాడు”. (ముఖంతిరీన్ అన్న పదం ఖింతార్ నుండి వచ్చింది. ఖింతార్ భావం పై హదీసులో చూడండి).

(అబూదావూద్ 1398, ఇబ్ను హిబ్బాన్ 2572, ఇబ్ను ఖుజైమా 1144, అల్బానీ సహీహుత్తర్గీబ్ 639లో హసన్, సహీ అని అన్నారు).

ఇకనైనా మనం ఖుర్ఆన్ పారాయణం చేయడానికి అడుగు ముందుకు వేద్దామా? మన ఖుర్ఆన్ సంపూర్ణం చేయడమనేది కేవలం రమజాను వరకే పరిమితమయి ఉండకూడదు, సంవత్సరమెల్లా ఉండాలి. తహజ్జుద్ పుణ్యం పొందుటకు ప్రతి రోజు వంద ఆయతుల పారాయణ కాంక్ష అనేది అల్లాహ్ గ్రంథాన్ని బలంగా పట్టుకొని ఉండడానికి శుభప్రదమైన అవకాశం కావచ్చు.

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు [పుస్తకం & ముందు వీడియో పాఠాలు ]
https://teluguislam.net/books/deeds-heavy-meezan

త్రాసు(మీజాన్)ను బరువు చేసే సత్కార్యాలు – యూట్యూబ్ ప్లే లిస్ట్
https://bit.ly/3xYzpbN

మరణానంతర జీవితం – యూట్యూబ్ – ప్లే లిస్ట్
https://www.youtube.com/playlist?list=PLw5IiDSnUeV3hWrEGNnzcmMZV3PtDByJH